• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: sfi

తప్పుడు సెక్షన్లతో అణచివేతలో నరేంద్రమోడీ – డోనాల్డ్‌ ట్రంప్‌ ఇద్దరూ ఇద్దరే : ఇక్కడ ఎస్‌ఎఫ్‌ఐ శివానందన్‌ – అక్కడ మహమ్మద్‌ ఖలీల్‌ !

19 Wednesday Mar 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

anti BJP, Anti communist, ANTI NATIONAL, Anti War, BJP, Donald trump, JD Vance, Mahmoud Khalil, Narendra Modi Failures, Ramadas Prini Sivanandan, sfi, US Green Card


ఎం కోటేశ్వరరావు


ఇప్పటివరకైతే భారత్‌, అమెరికా రెండూ పెద్ద ప్రజాస్వామిక దేశాలే ఎవరూ కాదనటం లేదు. కానీ ఆచరణ చూస్తే నిరంకుశత్వానికి దారితీస్తున్నట్లుగా వ్యవహరించటం ఆందోళన కలిగిస్తోంది.వ్యవస్థలను దిగజారుస్తున్నారు, కొత్త అర్ధాలు చెబుతున్నారు, పాలకులను విమర్శించటాన్ని దేశద్రోహంగా చిత్రిస్తూ బ్రిటీష్‌ వలస పాలకులను గుర్తుకు తెస్తున్నారు. మన గతం గురించి మరచిపోయిన వారికి దాన్ని గుర్తు చేయటం కూడా ఒకందుకు మంచిదేనేమో ? ఏదీ ఊరికే రాదు అన్నట్లుగా మన స్వేచ్చ, స్వాతంత్య్రాలు ఊరికే రాలేదు అని కొందరైనా తెలుసుకుంటారు.రెండు చోట్లా చట్టాలు, నిబంధనలకు వక్రభాష్యాలు చెప్పి భావ ప్రకటన, నిరసన తెలిపే హక్కును హరించే ఉదంతాల గురించి చెప్పుకోవటం దేశ వ్యతిరేకతగా పరిగణించినా ఆశ్చర్యం లేదు, రోజులిలా ఉన్నాయి, ఏం జరిగినా ఎదుర్కోక తప్పదు మరి. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) అభివృద్ధి అధ్యయనాల విభాగంలో పిహెచ్‌డి చేస్తున్న రామదాస్‌ ప్రిని శివానందన్‌ అనే పరిశోధకుడిని సంస్థ సస్పెండ్‌ చేసింది. ఎందుకటా ! న్యూఢల్లీిలో విద్యార్ధులు భారత్‌ను రక్షించండి`బిజెపిని తిరస్కరించండి అనే నినాదంతో పార్లమెంట్‌వద్దకు ప్రదర్శన నిర్వహించారని, దానిలో భాగస్వామి కావటం జాతి వ్యతిరేకతకిందకు వస్తుందని కారణం చెప్పింది.కేరళలో దళిత సామాజిక తరగతికి చెందిన ఈ యువకుడు ముంబైలో చదువుతూ మహారాష్ట్ర ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు.


టిస్‌ చెప్పిన సాకులు లేదా కారణాలను చూస్తే ఎవరూ కూడా ప్రభుత్వాల విధానాల మీద నిరసనలు, అసమ్మతి తెలపటానికి వీల్లేదు. ఎందుకంటే ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద ఆర్థికంగానో, సేవాపరంగానో ప్రతివారూ లబ్దిదారులే, అలాంటపుడు ఎవరూ ఏ ప్రభుత్వాన్నీ విమర్శించకూడదు, భజన మాత్రమే చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని ఢల్లీిలో జరిగిన ప్రదర్శనలో విమర్శించారు, దాన్లో పాల్గొన్నందున శివానందన్‌ జాతి వ్యతిరేకి అనటమే కాదు అతని మీద చర్యలు తీసుకొనేందుకు దర్యాప్తు సంస్థలు ముందుకు రావాలని కూడా టిస్‌ కోరింది. న్యాయవ్యవస్థ ఇంకా ఉనికిలో ఉంది గనుక తన సస్పెన్షన్‌ చెల్లదని ప్రకటించాలని కోరుతూ అతను బోంబే హైకోర్టుకు వెళ్లాడు. ఎంఎం సత్తాయి, ఎఎస్‌ చందూర్కర్‌ డివిజన్‌ బెంచ్‌ అతని పిటీషన్ను కొట్టివేస్తూ టిస్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నట్లు శివానందన్‌ చెప్పాడు. ఇది వ్యక్తిగత సమస్య కాదని మొత్తం విద్యార్ధి సమాజం మీద ప్రభావితం చూపనున్నందని అన్నాడు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఫెలోషిప్‌ పొందుతున్న కారణంగా రాజకీయ పరమైన కార్యకలాపాల్లో పాల్గ్గొంటే చర్యలు తప్పవని, సంస్థలో ఉన్నపుడు రాజకీయ అభిప్రాయాలకు దూరంగా ఉండాలని కోర్టు పేర్కొన్నది. ఒక టెలికాం ఉద్యోగి యువకుడిగా ఉన్నపుడు ఒక యువజన సంఘ సమావేశంలో పాల్గొన్నందున ఉద్యోగం నుంచి తొలగించితే ఆ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అతను పాల్గొన్నది నిషేధిత సంస్థ కాదు, యువకులు యువజన సంఘాల సమావేశాల్లో గాక మరిదేనిలో పాలుపంచుకోవాలని ప్రశ్నిస్తూ ఉద్యోగం నుంచి తొలగించటాన్ని తప్పు పడుతూ జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. తరువాత ఉద్యోగిగా ఆ యువకుడు ఉద్యోగ విరమణ చేసేవరకు టెలికాం ఉద్యోగుల యూనియన్లో కూడా చురుకుగా పని చేశారు.


కోర్టు పేర్కొన్న అంశాలు సరైనవి కాదని, ఒక విద్యార్ధి అర్హత పరీక్షలో పాసైనపుడు ఫెలోషిప్‌ ఒక హక్కు తప్ప దయాధర్మం కాదని, పరిశోధక విద్యార్థికి ఫెలోషిప్‌ ఇవ్వటం తనంతటతాను బతకటానికి అవసరమైన ఉద్యోగ సంపాదన కోసం కాదని, జాతి నిర్మాణ క్రమంలో తోడ్పడేందుకు ఇచ్చే మొత్తమని శివానందన్‌ చెప్పాడు. ఏ విద్యా సంస్థ అయినా జారీచేసే సర్క్యులర్‌ కంటే రాజ్యాంగం ఎంతో ముఖ్యమైనదని తాను భావిస్తున్నానని, రాజ్యాంగ హక్కును వినియోగించుకున్నందుకు తనను శిక్షించారని అన్నాడు. టిస్‌ లేదా ఏ విశ్వవిద్యాలయం జారీచేసే నిబంధనలు, సర్క్యులర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదని, విద్యా సంస్థలు నిష్పాక్షికంగా ఉండాలని, ఒక తరహా రాజకీయాలకు ఒక విశ్వవిద్యాలయం తనను తాను ఎలా అనుంబంధించుకుంటుదని ప్రశ్నించాడు.


పార్లమెంట్‌కు ప్రదర్శన బానర్‌ కింద భారత్‌ను రక్షించండి, బిజెపిని తిరస్కరించండి అనే నినాదంతో తాను ప్రదర్శనలో పాల్గొంటే తాను పట్టుకున్న ప్లకార్డు మీద టిస్‌ పేరు ఉన్నట్లు అధికారులు ఆరోపించారచెప్పాడు. ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ ఫోరమ్‌(పిఎస్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శిగా ప్రదర్శనలో పాల్గొన్నాను తప్ప టిస్‌ ప్రతినిధిగా కాదని అన్నాడు. తనను సస్పెండ్‌ చేసిన టిస్‌ కమిటీ, హైకోర్టు ముందు కూడా తాను ఇదే చెప్పానన్నాడు. శివానందన్‌ 2015లో టిస్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌గా చేరి తరువాత అక్కడే ఎంఫిల్‌ పూర్తి చేసి పరిశోధక విద్యార్థిగా నమోదయ్యాడు. టిస్‌ గతంలో ఒక ప్రజాస్వామిక సంస్థగా కనీసం నటించేదని ఇటీవలి సంవత్సరాలలో విద్యార్ధులు చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకు అనుమతించటం లేదని చెప్పాడు. అయోధ్యలో రామాలయ ప్రారంభాన్ని ఒక జాతీయ కార్యక్రమంగా చేపట్టినపుడు జాతీయ అవార్డు పొందిన ఆనంద పట్వర్ధన్‌ డాక్యుమెంటరీ ‘‘ రామ్‌ కె నామ్‌ (రాముడి పేరుతో ) ’’ ను అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రదర్శించారని తాను ఆ సమయంలో ప్రమాదంలో గాయపడి ప్రదర్శనకు రాలేకపోయానని, అయితే బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా జరిగిన దుర్మార్గమైన వాస్తవాలను తెలుసుకొనేందుకు అందరూ చూడాలని కోరుతూ తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమంలో వెల్లడిరచగా దాన్ని కూడా దేశ వ్యతిరేక చర్యగా టిస్‌ తన మీదకు మళ్లించిందని పేర్కొన్నాడు. కేంద్రం నుంచి 50శాతం పైగా నిధులు పొందుతున్న సంస్థలన్నింటిని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత టిస్‌లో అనేక పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కడ పది మంది విద్యార్దులు కూర్చుంటే, చివరకు తమ గ్రూపు ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు ఒక చోట చేరినా సంస్థను అస్థిరపరిచేందుకు చూస్తున్నారంటూ చెదరగొట్టటం జరుగుతోందన్నాడు.శివానందాన్ని హెచ్చరిస్తూ అనేక సార్లు తప్పుడు నోటీసులు జారీ చేసింది. భగత్‌ సింగ్‌ స్మారక ఉపన్యాసం చేసేందుకు పిలిచిన అతిధులను వివాదాస్పద ప్రసంగీకులు అనే సాకుతో వారి పేర్లు లేకుండా ఇచ్చిన నోటీసు అలాంటి వాటిలో ఒకటి. సదరు వివాదాస్పద అతిధులు ఎవరంటే మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌, ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌, జెఎన్‌యు మాజీ ప్రొఫెసర్‌, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ మాజీ సంపాదకుడు గోపాల్‌ గురు. గతేడాది టిస్‌ విద్యార్ధి సంఘ ఎన్నికలను రద్దు చేసింది, ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ ఫోరమ్‌ను నిషేధించింది. విద్యార్థులు ఆందోళన చేయటంతో వెనక్కు తీసుకుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే టిస్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదు, కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్‌ తీసుకొనే వారు బిజెపి రాజకీయాలను విమర్శించకూడదంటే నేను అంగీకరించను, దేశంలో ఉండాలంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బిజెపి సభ్యత్వం తీసుకోవటానికి లేదా సానుభూతిపరునిగా ఉండటానికి నన్ను బలవంతం చేయలేరని శివానందన్‌ చెప్పాడు.

అమెరికాలో ఏం జరుగుతోంది !
మహమ్మద్‌ ఖలీల్‌ అమెరికా పౌరసత్వం కలిగిన సిరియా దేశస్థుడు. అతని మీద చట్ట ఉల్లంఘనకు పాల్పడిన కేసులేవీ లేవు. అతన్ని బలవంతంగా సిరియా పంపేందుకు ట్రంప్‌ యంత్రాంగం చూస్తోంది. ఖలీల్‌ చేసిన నేరం ఏమిటో తెలుసా ? గాజాలో పాలస్తీనియన్లపై మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండిస్తూ కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్ధుల నిరసనకు నాయకత్వం వహించటమే. వాక్‌, సభా స్వాతంత్య్రాలు విలసిల్లుతుంటాయని భావించే దేశంలో ఇది జరిగింది. అతని భార్య ఎనిమిది నెలల గర్భవతి, అరెస్టు చేసిన ఖలీల్‌ గ్రీన్‌కార్డును రద్దు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం అతనుండే న్యూయార్క్‌ రాష్ట్రం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లూసియానాలోని ఒక నిర్బంధ శిబిరానికి తరలించి తన మానవత్వ ముఖాన్ని ప్రదర్శించుకుంది. ఈ ఉదంతం తరువాత గ్రీన్‌ కార్డు ఉన్నంత మాత్రాన ఎవరూ అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు ఉన్నట్లు కాదని ఉపాధ్యక్షుడు జెడివాన్స్‌ ప్రకటించాడు. అంటే ప్రభుత్వం తలచుకుంటే ఎప్పుడైనా రద్దు చేయవచ్చనే బెదిరింపు దీని వెనుక ఉంది. పాలస్తీనియన్లకు మద్దతుగా విద్యార్ధులు ఆందోళనకు దిగినపుడు స్థానికులా, వలస వచ్చినవారా అనే తేడా లేకుండా అందరూ నిరసనల్లో పాల్గొన్నారు. దీన్ని నాటి బైడెన్‌ సర్కార్‌ నేటి ట్రంప్‌ జమానా కూడా సహించటం లేదు. గాజాలో మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ నిస్సిగ్గుగా మద్దతు ఇస్తూ మానవహక్కుల పరిరక్షణ గురించి ప్రపంచానికి సూక్తులు వల్లిస్తారు.


పాలస్తీనియన్లకు మద్దతు పలికిన మహమ్మద్‌ ఖలీల్‌ మీద 1952 నాటి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టంలోని సెక్షన్లను మోపటాన్ని బట్టి ట్రంప్‌ అసలు రూపం వెల్లడైంది. వలస వచ్చే వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడైనా లేదా అనుంబంధం ఉన్నప్పటికీ వీసాలను తిరస్కరించటానికి లేదా అనర్హులుగా ప్రకటింటానికి ఆ చట్టం వీలు కల్పిస్తుంది. ఒకవేళ అమెరికా వచ్చినప్పటికీ తిరిగి పంపే అధికారం ప్రభుత్వానికి ఉంది. కమ్యూనిజానికి సంబంధించిన సాహిత్యాన్ని రాసినా, ముద్రించినా, తెలిసి కూడా పంపిణీ చేసినప్పటికీ తిప్పి పంపే అధికారం ఉంది. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నప్పటికీ అలాంటి చర్యలు తీసుకోవచ్చు. ఉదారవాదులనే పేరున్న ప్రతిపక్ష డెమోక్రాట్లలో కొందరు ఖలీల్‌ అరెస్టు, గ్రీన్‌కార్డు రద్దును మాట మాత్రంగా ఖండిరచినప్పటికీ తమ పాలిత న్యూయార్క్‌ రాష్ట్రవాసి అరెస్టు గురించి నిరసన వ్యక్తం చేయలేదు. అమెరికాలో గాడిద పార్టీ, ఏనుగు పార్టీ ఏదైనా ఒక్కటే అనేందుకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు.కమ్యూనిస్టు వ్యతిరేకత, అమెరికా విదేశాంగ విధానాలపై విమర్శను రెండు పార్టీలూ సహించవు.


2023లో డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక ప్రతిజ్ఞ చేశాడు. అదేమంటే అమెరికా విధానాలను విమర్శించే విదేశీయులు, క్రైస్తవులను ద్వేషించే కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, సోషలిస్టులు ఎవరినీ అమెరికాలోకి అడుగుపెట్టనివ్వం దీనికి గాను 1952 నాటి చట్టాన్ని వినియోగిస్తాం,దేశీయంగా పెరిగన కమ్యూనిస్టులు, మార్క్సిస్టులను అదుపు చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పాడు. ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినపుడు అమెరికాను సోషలిస్టు దేశంగా మారనిచ్చే సమస్యేలేదని ప్రకటించటాన్ని అత్యధిక డెమోక్రాట్లు హర్షించారు. అయితే చరిత్రను చూస్తే కమ్యూనిస్టుల రాకను నిషేధించే చట్టం ఉన్నప్పటికీ పూర్తిగా నిరోధించటం గానీ, అమెరికాలో సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం గానీ చేయలేకపోయారన్నది వాస్తవం. మన దేశానికి చెందిన కష్మా సావంత్‌ వంటి వారు అనేక మంది అమెరికా వెళ్లి వామపక్ష వాదులుగా మారిన సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపేందుకు చూసిన ప్రబుద్దుల సంగతి తెలిసిందే, భావజాలమూ అంతే, ఎవరూ ఆపలేరు, ఎంతగా అడ్డుకుంటే అంతే వేగంతో విస్తరిస్తుందన్నది చరిత్ర చెప్పిన సత్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళలో రాష్ట్రపతి పాలన బెదిరింపు -రెచ్చగొడుతున్న గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ !

18 Monday Dec 2023

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Arif Mohammed Khan, BJP, CPI(M), Pinarai Vijayan, RSS, sfi, SFI Protest


ఎం కోటేశ్వరరావు


కేరళలో రాజ్యాంగ యంత్రం విఫలమౌతోందంటూ కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది రాష్ట్రంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేస్తానని బహిరంగంగా బెదిరించటం తప్పమరొకటి కాదని భావిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రపతి పాలనకు నాలుగు ప్రధాన కారణాలతో గవర్నర్లు సిఫార్సు చేస్తారు, వాటిలో రాజ్యాంగబద్ద యంత్రాంగం విఫలమైందన్నది ఒకటి. తనకు వ్యతిరేకంగా కాలికట్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన బానర్లను తొలగించాలని గవర్నర్‌ పోలీసులను ఆదేశించి ఒక వివాహానికి వెళ్లారు. తిరిగి ఏడు గంటలకు వచ్చిన సమయంలో బానర్లు అలాగే ఉండటాన్ని చూసి గవర్నర్‌ ఆగ్రహించారు. సిగ్గులేని జనాలు అంటూ పోలీసుల మీద నోరుపారవేసుకున్నారు.ఆగ్రహంతో అటూ ఇటూ తిరుగుతూ ఎస్‌ఎఫ్‌ఐ విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్నది, వారు బానర్లు కడుతుంటే మీరు చూస్తున్నారు అంటూ చిందులు వేశారు.కాలికట్‌ విశ్వవిద్యాలయంలో తనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బానర్లను వైస్‌ ఛాన్సలర్‌ ఎలా ఆమోదించారో సంజాయిషీ అడగాలని గవర్నర్‌ రాజభవన్‌ కార్యదర్శిని ఫోన్లో ఆదేశించారు. తరువాత బానర్లను తొలగించారు. ఈ పరిణామం తరువాత రాజభవన్‌ ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే బ్యానర్లను ఏర్పాటు చేశారని, అది గవర్నర్‌ను అవమానించటమేనని, దీన్ని గవర్నర్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు దానిలో పేర్కొన్నారు. తన మీద కుట్ర జరిగిందని, ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా బానర్ల ఏర్పాటు జరగదని, కావాలని ముఖ్యమంత్రి చేయిస్తున్న ఇలాంటి చర్యలు రాజ్యాంగ యంత్రాంగం విఫలం కావటానికి దారి తీస్తుందని హెచ్చరించింది. కాగా తెల్లవారే సరికి వందలాది బానర్లను ఏర్పాటు చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది. గవర్నర్‌కు మద్దతుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బానర్‌ను విద్యార్ధులు తగులబెట్టారు.


” మీ క్రూరమైన నోటిని మూసుకోమని మేమూ చెప్పగలం…. కానీ గవర్నర్‌ పదవికి గౌరవం ఇస్తున్నాం గనుక ఆ మాట అనటం లేదు.” అని కేరళ టూరిజం శాఖ మంత్రి పిఏ మహమ్మద్‌ రియాజ్‌ ఆదివారం నాడు చెప్పారు. శనివారం నాడు కాలికట్‌ విశ్వవిద్యాలయ సందర్శనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కన్నూరు రక్తసిక్త చరిత్ర గురించి తనకు తెలుసునంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సమాధానంగా పత్తానంతిట్ట జిల్లా కొన్నిలో జరిగిన నవకేరళ సదస్సులో రియాజ్‌ స్పందించారు. ఇటీవల గవర్నర్‌ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పూనుకున్న తీరు మీద గవర్నర్‌ వెళ్లిన ప్రతి చోటా విద్యార్ధులు, యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని మరింతగా రెచ్చగొట్టే విధంగా గవర్నర్‌ మాట్లాడుతున్నారు.నవ కేరళ సదస్సులతో రాష్ట్ర సిఎం, మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సులతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఆ సదస్సులను కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు బహిష్కరిస్తున్నారు. గవర్నర్‌ రాజభవన్ను బిజెపి భవన్‌గా మార్చటమే కాదు, ఆ పార్టీ నేతల భాషను కూడా ఉపయోగిస్తున్నారు. మూడు రోజుల కాలికట్‌ పర్యటనకు వచ్చిన గవర్నర్‌కు శనివారం సాయంత్రం నిరసన ఎదురైంది. అంతకు ఐదు రోజుల ముందు నిరసన సందర్భంగా ముఖ్యమంత్రి విజయన్‌ తనపై దాడి చేయించేందుకు పూనుకున్నారని గవర్నర్‌ ఆరోపించారు.


ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల నిరసనల మధ్య కాలికట్‌ విశ్వవిద్యాలయానికి వచ్చిన గవర్నర్‌ శనివారం నాడు మాట్లాడుతూ వారు కోతుల వంటి వారు. వాటిని చూసి మనం భయపడితే అవి మన వెంటపడతాయి. నేను ఆ విధంగా పారిపోను, నన్ను ఏ విధంగానూ వేధించలేరు, నన్నెవరూ భయపెట్టలేరు.కానీ ముఖ్యమంత్రి అలా చేస్తున్నారు, ఎందుకంటే కన్నూరు నుంచి వచ్చారు గనుక, కన్నూరుకు రక్త చరిత్ర ఉంది, అక్కడ ఒకరినొకరు చంపుకుంటున్నారని అన్నారు. గవర్నర్‌ సంఘపరివార్‌ పనిముట్టుగా పని చేస్తున్నారని, విద్యా రంగాన్ని కాషాయీకరణ చేస్తున్నారని వివిధ సందర్భాలలో విజయన్‌ విమర్శిస్తున్నారు. సంఘపరివార్‌కు చెందిన వారిని తన అధికారంతో విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో చేరుస్తున్నారని చెబుతున్నారు. గవర్నర్‌ మతిమాలిన మాటలతో ఎస్‌ఎఫ్‌ఐ నిరసనకారులను రెచ్చగొడుతున్నారని విజయన్‌ విమర్శించారు. కాలికట్‌ విశ్వవిద్యాలయంలో సంఘీ ఛాన్సలర్‌ వెనక్కు పో అంటూ హిందీలో ” సంఘీ ఛాన్సలర్‌ వాపస్‌ జావో – ఎస్‌ఎఫ్‌ఐ ” అన్న ఒక బానర్‌ను ఏర్పాటు చేశారు. దీని గురించి విలేకరుల ప్రశ్నకు స్పందనగా అవును నేను కాషాయమయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఏ రాష్ట్రంలోనూ లేనన్ని దేవాయలయాలు కేరళలో ఉన్నాయి. అవి కాషాయ చిహ్నాలు కావా, దమ్ముంటే వాటిని తొలగించండి అన్నారు. అవును నేను కాషాయీకరణకు పూనుకున్నాను. పురాతన భారత సంస్కృతి రక్షకురాలు కేరళ. పురాతన ఆలయాలు, పురాతన నృత్య రీతులను మీరు ఉత్తర ప్రదేశ్‌లో చూడలేరు, బీహార్‌లో చూడలేరు. వాటిని కేరళలోనే మీరు చూస్తారు.కేరళలో ప్రతిదీ కాషాయమయమే.పురాణాల ప్రకారం కంటికి ఆహ్లాదంగా కనిపించే రంగు కాషాయమే అని చెబుతున్నా. ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని నియమిస్తున్నానని అనటానికి వారెవరు ? వివిధ మార్గాల ద్వారా తన వద్దకు వచ్చిన పేర్ల నుంచి కొందరిని సిఫార్సు చేశాను. అది నా విచక్షణ అధికారానికి సంబంధించిన అంశం. వారికి నేనెందుకు సమాధానం చెప్పాలి, రాష్ట్రపతికి తప్ప ఎవరికీ జవాబు చెప్పాల్సినపని లేదు.వారు క్రిమినల్స్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కిరాయికి ఏర్పాటు చేశారు. ఇలా ఎందుకు చేశారంటే అతను కన్నూరు నుంచి వచ్చారు. కన్నూరుకు రక్తసిక్త చరిత్ర ఉందని నాకు తెలుసు, అక్కడ ఒకరిని ఒకరు చంపుకుంటారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి దారి మళ్లించాలని సిఎం కోరుకుంటున్నారు. రాష్ట్రంలో సంపదలను సృష్టించకుండా సంక్షేమ పధకాలను ప్రకటిస్తున్నారు, డబ్బంతా విదేశాల నుంచి వస్తున్నది. అన్నారు.


సిఫార్సులను పక్కన పెట్టి తమను కాకుండా గవర్నర్‌ తమ కంటే తక్కువ అర్హతలు కలవారిని కేరళ విశ్వవిద్యాలయ సెనెట్‌కు నలుగురు విద్యార్ధులను నియమించినట్లు దాఖలైన పిటీషన్‌ స్వీకరించి నియామకాల మీద హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. విశ్వవిద్యాలయం సిఫార్సు చేసిన ఇద్దరు విద్యార్ధులను పక్కన పెట్టి గవర్నర్‌ తన ఇష్టం వచ్చిన వారిని నియమించారు. ఆదివారం నాడు పత్తానంతిట్ట జిల్లాలో నవకేరళ సదస్సు సందర్భంగా సిఎం పినరయి విజయన్‌ విలేకర్లతో మాట్లాడుతూ గవర్నర్‌ మతిమాలిన చర్యల ద్వారా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. గవర్నర్‌ చర్యలు నిరసనలకు పురికొల్పుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నిరసన తెలుపుతున్నది.వారి మీద గవర్నర్‌ తీవ్ర పదజాలాన్ని వినియోగించారు.చురుకైన రాజకీయాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి వారిని రక్తం మరిగిన నేరగాళ్లు అని ఎలా మాట్లాడారో నాకు ఆశ్చర్యం వేస్తున్నది. ఇది మతిమాలిన చర్య. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వారు ఇలాంటి దిగజారుడు పదజాలంతో మాట్లాడకూడదు. ఖాన్‌ గారు ఈ రాష్ట్ర గవర్నర్‌ అని మరిచిపోయినట్లున్నది. తన చర్యల ద్వారా రాష్ట్రంలో శాంతిని విచ్చిన్నం చేసేందుకు కావాలనే మాట్లాడుతున్నారని గతంలో కూడా నేను చెప్పాను. ప్రతి సమస్య మీద గరిష్టంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు ” అని విజయన్‌ చెప్పారు.


కన్నూరు చరిత్ర మీద నిందలు వేసిన గవర్నర్‌ వ్యాఖ్యల గురించి మంత్రి రియాజ్‌ మాట్లాడుతూ ” కన్నూరు చరిత్ర అంత చెడ్డదా ?వలస పాలకులకు వ్యతిరేకంగా కన్నూరు గడ్డ మీద పోరాడిన అనేక మంది అమరజీవులయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కన్నూరు ముఖ్య పాత్రను పోషించింది. కన్నూరు, కేరళ పట్ల గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు అంత కోపమెందుకు ? 1970 డిసెంబరులో ఆర్‌ఎస్‌ఎస్‌ మతహింసాకాండ వ్యాప్తికి కన్నూరులోని తలసెరిని ఎంచుకుందని గౌరవనీయ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తెలుసుకోవాలి. వారు ఒక మసీదు మీద డాడికి యత్నించారు. మసీదును కాపాడేందుకు ఇతర కమ్యూనిస్టులతో కలసి యుకె కున్హిరామన్‌ ప్రయత్నించారు. మలబార్‌ ముస్లిం బిడ్డ అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ వారు దాడి చేశారు. ఆ ప్రాంతంలో కొట్లాటలను నివారించేందుకు ఎర్రజెండా కట్టుకున్న ఒక నల్లరంగు జీపు తిరుగుతూ శాంతిని పాటించాలని ప్రచారం చేసింది. శాంతికోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామని దానిలో ఉన్నవారు చెప్పారు. ఆ జీపు ముందుభాగంలో కూర్చున్న ఒక యువకుడే నేటి ముఖ్యమంత్రి విజయన్‌. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కన్నూరు చరిత్రను తెలుసుకోవాలి. కన్నూరు, కేరళ చరిత్రను వక్రీకరిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పద్దతుల్లో ముఖ్యమంత్రిని, ఆయన జిల్లాను అవమానపరుస్తున్నారు.” అని రియాజ్‌ చెప్పారు. తాము ఆందోళనను విరమించటం లేదని మలప్పురం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది. అయితే గవర్నర్‌ పాల్గొనే ప్రైవేటు కార్యక్రమాల వద్ద ఎలాంటి నిరసన తెలపటం లేదని స్పష్టం చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?

26 Thursday Jan 2023

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

“India: The Modi Question”, block out on BBC documentary, Defiant Indian students, DYFI, Explosive BBC documentary, Jamia Millia Islamia, Prime Minister Narendra Modi, sfi


ఎం కోటేశ్వరరావు


పట్టించుకోవాల్సినంత గొప్పది కాదు , వదిలేయండి అంటూనే మోడీపై బిబిసి డాక్యుమెంటరీలను దేశమంతటా ప్రదర్శించే విధంగా, చూసేట్లు విద్యార్థులను, ఇతరులను కేంద్ర ప్రభుత్వం పురికొల్పిందా ? సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ చర్య వికటించిందా ? కుర్రకారును రెచ్చగొట్టిందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తే అలాగే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనానికి అండుబాటులో ఉంచకూడదని మన ప్రజాస్వామిక సర్కార్‌ భావిస్తే అనేక దేశాల్లో జరిగిన మాదిరి ఏ రూపంలో బహిరంగ ప్రదర్శనలు చేసినా నిషేధం విధించటం తప్ప మరొక మార్గం లేదు, చివరికి అంతపనీ చేస్తుందా ? అనేక ప్రశ్నలు, సందేహాలు. బిబిసి డాక్యుమెంటరీలో నరేంద్రమోడీ పాత్ర గురించి చిత్రించిన తీరును తాను అంగీకరించటం లేదని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ప్రకటించటం తప్ప రెండవ భాగ ప్రసార నిలిపివేతకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపున తమకసలు అలాంటి డాక్యుమెంటరీ ఒకటి ఉందని తెలియదంటూ అమెరికా చేతులు దులుపుకుంది. అనేక దేశాల్లో ప్రతికూల స్పందన వెల్లడైంది. నరేంద్రమోడీని విశ్వనేతగా పరిగణిస్తున్న ఏ ఇతర దేశమూ దీని గురించి స్పందించినట్లు వార్తలు లేవు.మొత్తం మీద గాలికి పోతున్నదాన్ని పట్టుకొని నెత్తి మీద పెట్టుకున్నట్లయింది.


గుజరాత్‌ మారణకాండపై ” భారత్‌ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్‌) అనే శీర్షికతో బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని అందుబాటులో లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్‌, ట్విటర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని ఖాతరు చేయకుండా రెండవ, చివరి భాగాన్ని మంగళవారం రాత్రి బిబిసి ప్రసారం చేసింది. ఈ భాగంలో 2019లో నరేంద్రమోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత జరిగిన పరిణామాల గురించి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటిదాని నిబంధనలే దీనికి వర్తిస్తాయి గనుక సామాజిక మాధ్యమంలో చూడలేము. ఇతర మార్గాల్లో సంపాదించి దేశమంతటా ప్రదర్శిస్తామని విద్యార్థులు ప్రకటించటం, మొదటి భాగం అనుభవం చూసిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రయివేటుగా బృందాలలో ప్రదర్శనలను నిషేధిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.ఒకవేళ నిషేధించినా వ్యక్తిగతంగా సెల్‌ఫోన్లు, కంప్యూటర్లలో చూడవచ్చు. జనవరి 26వ తేదీన రిపబ్లిక్‌ దినోత్సవం ఉన్నందున ఆలోగా నిషేధానికి పూనుకుంటే ప్రపంచమంతటా అది మరింతగా ప్రచారం పొందుతుంది, కనుక తరువాత చేస్తారా ? అసలే వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు, జరిగిన రచ్చ చాలు, ఇంతటితో ముగిద్దామని అనుకుంటారా ?


చర్యకు ప్రతి చర్య ఉంటుందన్నది సైన్సు చెప్పిన అంశం. అది ఏ విధంగా ఉంటుందన్నది వేరే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యకు ప్రతిగా సదరు డాక్యుమెంటరీలో ఏముందో చూడాల్సిందే అంటూ దేశమంతటా విద్యార్థులు పూనుకున్నారు. ఆ మేరకు అనేక చోట్ల పూనుకున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం అడ్డుకుంటున్నారు. చూశాము అంటే ఏదో ఒక వైఖరిని వెల్లడించాలి గనుక తప్పించుకొనేందుకు ” అవునా, మా భాగస్వామి, గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ మీద బిబిసి ఒక డాక్యుమెంటరీ నిర్మించిందా, మాకు తెలియదే ” అన్నట్లుగా అమెరికా పెద్ద అమాయకురాలి ఫోజు పెట్టింది. రష్యా,చైనాతో ఉన్న వైరంలో వాటిని దెబ్బతీసేందుకు భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకోవాలని చూస్తున్న అమెరికా ఈ వివాదంలో తలదూర్చేందుకు సిద్దంగా లేదు. అందుకే విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ను విలేకర్లు బిబిసి డాక్యుమెంటరీ గురించి అడగ్గా మీరు చెబుతున్న దాని గురించి నాకు తెలియదు గానీ అమెరికా-భారత్‌ రెండూ సచేతన ప్రజాస్వామ్యాలు, సంబంధాలు వృద్ది పొందటానికి పరస్పరం పంచుకొనే విలువల గురించి మాత్రం బాగా తెలుసు అన్నాడు. భారత్‌తో అమెరికా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం సడలకుండా చూసుకోవటంలో రాజకీయ,ఆర్థిక,ప్రత్యేకించి వ్యక్తిగతమైన సంబంధాలు కూడా కీలకమని పేర్కొన్నాడు. ఆ ఒక్కటీ తప్ప అన్నట్లుగా బిబిసి పేర్కొన్నదానిని ఖండించటం గానీ, నరేంద్రమోడీకి మద్దతుగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇది పుండుమీద కారం చల్లటం వంటిదే. చూసిన తరువాత చెబుతామంటే ఒకతీరు. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెలుసుకోగలిగిన అమెరికాకు భారత్‌లో సంచలనం కలిగించిన మోడీ డాక్యుమెంటరీ వివాదం గురించి తెలియదంటే ఎవరూ నమ్మరు. మోడీ నిలదీసే స్థితిలో లేరు గనుక నటించి అమెరికా ప్రతినిధి తప్పుకున్నాడు. ఏదో ఒక రూపంలో దొంగచాటుగా నైనా చూసేందుకు మోడీ మద్దతుదారులను కూడా పురికొల్పిన ఈ వివాదం ఇలాంటి మలుపు తిరుగుతుందని ప్రధాని సలహాదారులు, వ్యూహకర్తలు ఊహించని పరిణామం ఇది.


” మోడీ డాక్యుమెంటరీని అడ్డుకొనేందుకు భారత్‌ ప్రయత్నిస్తుండగా దాన్ని చూసేందుకు పోరాడుతున్న విద్యార్థులు ” అనే శీర్షికతో అమెరికాలోని అగ్రశ్రేణి పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషణ రాసింది. ” మోడీ మీద బిబిసి డాక్యుమెంటరీని మరింతగా ప్రదర్శించేందుకు పూనుకున్న తిరుగుబాటు విద్యార్థులు ” అనే శీర్షికతో అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ఇచ్చిన వార్త ప్రపంచమంతటా అందుబాటులోకి వచ్చింది. ఇంత జరిగినా ఇంటా బయటా కూడా మా ఇంట్లో వారు మోడీకి వ్యతిరేకంగా ఏది చూపినా చూడొద్దన్నారు గనుక చూడం, రాసేవాటిని చదవటం తప్పన్నారు గనుక మేం చదవం అనే నాన్నగారి తాతగారి భావాలకు దాసులైన వారు తప్ప ఇతరులు చూడకుండా ఉంటారా ? ఇంత జరిగాక కూడా అమెరికా వారు కళ్లు మూసుకుంటారా ? అసలేమీ మాట్లాడరా ? ఒక వేళ తప్పు పడితే అమెరికా ప్రవచించే ప్రజాస్వామిక, భావప్రకటనా స్వేచ్చ గురించి కొత్త చర్చ మొదలౌతుంది. ఆ తలనొప్పిని వారు ఎందుకు తెచ్చుకుంటారు ! కేంద్ర ప్రభుత్వం తనకున్న ఎమర్జన్సీ అధికారాలతో సదరు డాక్యుమెంటరీని అందుబాటులోకి తెచ్చే సామాజిక మాధ్యమాల ఇంటర్నెట్‌ లింకులను తెంపింది తప్ప ప్రదర్శించటాన్ని, చూడటాన్ని నిషేధించలేదు.


నిషేధించకున్నా ఢిల్లీలోని జెఎన్‌యు అధికారులు నరేంద్రమోడీ మెప్పు పొందేందుకుగాను కుంటిసాకులు చూపి విద్యార్ధి సంఘం హాలులో ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు. మంగళవారం రాత్రి గేట్లు మూసివేసి ప్రాంగణంలో విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌ను నిలిపివేసి ప్రదర్శన జరగకుండా అడ్డుకొనేందుకు చూశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపలేరు అన్నట్లుగా విద్యార్థులు ప్రాంగణంలోని ఒక కెఫ్టేరియాలో గుమికూడి తమ సెల్‌ఫోన్లు,లాప్‌టాప్‌లలో చూసి పంతం నెగ్గించుకున్నారు. అలా చూస్తున్నవారి మీద చీకటిలో పక్కనే ఉన్న పొదలమాటు నుంచి రాళ్లతో దాడి చేసిన వారిలో ఇద్దరిని పట్టుకొన్నారు, వారు ఎబివిపికి చెందినవారిగా గుర్తించారు. అంతకు ముందు అధికారుల తీరుకు నిరసన తెలిపారు. రాళ్ల దాడి తరువాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి దాడి చేసిన వారి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు, విద్యార్థి సంఘ అధ్యక్షురాలు అయిషి ఘోష్‌ చెప్పారు. అధికారులు ఒక ప్రదర్శనను అడ్డుకోవచ్చు, మేం వందల ప్రదర్శనలకు పూనుకుంటాం అన్నారు. కాశ్మీరీ ఫైల్స్‌ వంటి సినిమాలను ప్రదర్శించినపుడు వద్దనే సలహాలు అధికారుల నుంచి రాలేదని,తొలిసారిగా ఇప్పుడు వచ్చినట్లు ఆమె చెప్పారు. అంతకు ముందురోజు ప్రదర్శనకు ముందుగా అనుమతి తీసుకోలేదని, అనుమతి లేకుండా ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఏ నిబంధన ప్రకారం అనుమతి తీసుకోవాలో చెప్పాలంటూ విద్యార్ధి సంఘం ప్రశ్నించింది. వైస్‌ ఛాన్సలర్‌ శాంతిశ్రీ పండిట్‌, రెక్టర్‌ సతీష్‌ చంద్రగానీ అందుబాటులోకి రాలేదని, తనకు మాట్లాడే అధికారం లేదని డిప్యూటీ రిజిస్ట్రార్‌ రవి కాంత్‌ సిన్హా అన్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. కాంపస్‌లో మూడో వంతు ప్రాంతానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన వైఫల్యం తప్ప కావాలని నిలిపివేసింది కాదని విసి, రిజిస్ట్రార్‌ తమకు నివేదించారని విద్యామంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పినట్లు కూడా పేర్కొన్నది.


ఢిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయ అధికారులు కూడా ప్రదర్శనను అనుమతించేది లేదని మంగళవారం నాడు ప్రకటించారు. పోలీసులను రంగంలోకి దించి ఎవరూ గుమికూడ కుండా అడ్డుకున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఎలాగైనా చూడాలనే ఆసక్తిని పెంచుతున్నారని, ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటున్నారని విద్యార్థులు చెప్పారు. బుధవారం నాడు అనేక మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలతో సహా 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పిటిఐ పేర్కొన్నది. ప్రాంగణమంతటా సాయుధ బలగాలను మోహరించారు. చండీఘర్‌లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో ప్రదర్శనను మధ్యలో నిలిపివేశారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శన గురించి ఫిర్యాదు చేసినట్లు ఏబివిపి ప్రకటించింది.


దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని పిలుపునిచ్చినట్లు ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిస్వాస్‌ వెల్లడించినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. అసమ్మతి గళాన్ని ఎవరూ నిరోధించలేరని చెప్పారు. కేరళలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ పిలుపు మేరకు అనేక కాలేజీలు, వెలుపల మంగళవారం నాడు మోడీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. రాష్ట్రంలో ఈ చిత్ర ప్రదర్శనకు కాంగ్రెస్‌తో సహా అనేక పార్టీలు, సంస్థలు పోటా పోటీగా పిలుపునిచ్చాయి. దీన్ని నిరసిస్తూ బిజెపి మద్దతుదార్లు ప్రదర్శనలు చేశారు.చిత్ర ప్రదర్శన దేశద్రోహమని వర్ణించి నిరోధించేందుకు సిఎం పూనుకోవాలని కోరారు. దేశ ఐక్యత, సమగ్రతలకు భంగకరమని రాష్ట్ర బిజెపి నేత, కేంద్ర మంత్రి మురళీధరన్‌ ఈమేరకు ప్రకటనలు చేశారు. ఇలాంటి ప్రదర్శనలు, ఆరోపణలు మరింత పెరిగితే డాక్యుమెంటరీని చూడటం దేశభక్తిగా భావించే అవకాశం ఉంది. బిజెపితో తనకు తీవ్ర విబేధాలు ఉన్నప్పటికీ చిత్ర ప్రదర్శనకు అంగీకరించటంలేదని కాంగ్రెస్‌ నేత, మాజీ సిఎం ఏకె ఆంటోనీ కుమారుడు అనిల్‌ ప్రకటించటం గమనించాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎంతగా మూసిపెట్టాలనుకుంటే అంతగా బహిరంగంగా ప్రదర్శిస్తామని, ఒక్క కేరళలోనే గాక దేశమంతటా ఆపని చేస్తామని రాష్ట్ర డివైఎఫ్‌ఐ నేత వికె సనోజ్‌ విలేకర్లతో చెప్పారు. దీనిలో దేశ వ్యతిరేకత ఏమీ లేదని, ఉద్రిక్తతలను సృష్టించేందుకు కాదని అన్నారు. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రదర్శిస్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రకటించింది. మొత్తం మీద దేశమంతటా ఇదొక ప్రధాన అంశంగా మారేతీరు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కంటి చూపుతో కాషాయ తాలిబాన్లపై విరుచుకుపడ్డ హీరో దీపిక !

10 Friday Jan 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ABVP, Aishe Ghosh, Deepika Padukone, JNU violence, JNUSU President, saffron taliban, sfi, sound of silence

Image result for deepika padukone ,jnuఎం కోటేశ్వరరావు
దేశంలో ఒక్కొక్క ఉదంతం జరిగిన ప్రతిసారీ తామే పక్షంలో ఉండాలో తేల్చుకోవాలంటూ జనాన్ని కాషాయ తాలిబాన్లు ముందుకు తోస్తున్నారు. కాంగ్రెస్‌ తన ఐదు దశాబ్దాల పాలనలో చేయలేని ఈ సమీకరణ క్రమాన్ని గత ఐదు సంవత్సరాలలో వీరు వేగంగా ముందుకు తెచ్చారు. ఆ గట్టునుండాలో ఈ గట్టునుండాలో తేల్చుకోవాల్సింది ఇంక జనమే. అలాంటి తాజా ఉదంతం జనవరి ఐదవ తేదీ రాత్రి మూడు గంటల పాటు ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ముసుగులు ధరించిన కొందరు యువతులతో సహా గూండాలు విద్యార్ధులు, ప్రొఫెసర్ల మీద జరిపిన దాడి.
ఒక సినిమాలో ప్రముఖ హీరో బాలకృష్ణ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న మాటలు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. సుప్రసిద్ధ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ ఇప్పుడు ఒక్క దేశంలోనే కాదు,సకల భాషల్లోనూ, ప్రపంచంలోనూ ఉన్న కాషాయ తాలిబాన్లు, వారి సమర్ధకులమీద ‘కంటి చూపు’తో విరుచుకుపడ్డారు. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా భరించలేనిదిగా మారుతుంది. దీపికా పదుకోన్‌ చేసింది అదే. దాడికి గురైన వారిని మౌనంగా పరామర్శచేశారు తప్ప దాడి చేసిన వారి గురించి ఆ సమయంలో పల్లెత్తు మాట అనలేదు. అయినా సరే దాన్ని కూడా భరించలేని కాషాయ మూకలకు గంగవెర్రులెత్తి సామాజిక , సాంప్రదాయ మాధ్యమాల్లో ఆమెపై ధ్వజమెత్తుతున్నారు. ఆమె నిర్మించి, నటించిన ‘ఛపాక్‌’ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేశద్రోహులకు, దేశాన్ని ముక్కలు ముక్కలు(తుకడే తుకడే) చేసే గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినట్లు చిత్రించి నోరు మూయించేందుకు చూస్తున్నారు.
బేటీ బచావో బేటీ పఢావో అని ప్రధాని నరేంద్రమోడీ నాలుగేండ్ల క్రితం పిలుపునిచ్చినపుడు ఎందరో మంచి పని చేశారని అనుకున్నారు. ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అని దాని అర్ధం. జామియా మిలియా విశ్వవిద్యాలయంలో పోలీసులే స్వయంగా అనుమతి లేకుండా దూరి ఆడమగ తేడా లేకుండా దాడులు చేశారు. ఆ తీరు మీద తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తన అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించి దాడులు చేశారని వైస్‌ ఛాన్సలర్‌ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో జెఎన్‌యు విశ్వవిద్యాలయంలో సరికొత్త దాడులకు తెరతీశారు. జామియా విద్యార్దులు సిఎఎ లేదా ఎన్‌ఆర్‌సి సమస్య మీద నిరసన తెలిపారు, అది వారి హక్కు, లేదా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు దేశద్రోహం కనుక పోలీసులు దాడి చేశారని కాసేపు అనుకుందాం. జెఎన్‌యులో అలాంటి ఆందోళన లేదే !
దాదాపు 50మంది ప్రొఫెసర్లు, 200 మంది విద్యార్దులు గత రెండు నెలలుగా చేస్తున్న ఫీజులు, ఇతర ఛార్జీల పెంపుదల ఆందోళన గురించి ఒక చోట చర్చించుకుంటుండగా వారి మీద, హాస్టల్‌ గదుల్లో వున్నవారి మీద జై శ్రీరామ్‌, తదితర నినాదాలతో మూడు గంటల పాటు కొందరు యువతులతో సహా 50 మందికిపైగా ముసుగులు ధరించిన గూండాలు ఎంపిక చేసుకున్న విద్యార్ధుల మీద హాస్టళ్లపైనా దాడులు చేశారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వచ్చిన వైద్యులను అడ్డుకున్నారు. దాడి సమయంలో వీధి లైట్లను ఆర్పివేశారు. ఒక పధకం ప్రకారం జరిగిన ఈ దాడిలో 36 మంది గాయపడ్డారు. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు, ఎబివిపితో కుమ్మక్కయి ముసుగులతో వచ్చిన గూండాలు చదువుకుంటున్న ఆడపిల్లల మీద ఎలా దాడులు చేశారో చూసిన దేశం నివ్వెరపోయింది. ఎటు తిరిగి ఎటు చూసినా వాటి వెనుక ఉన్నది నరేంద్రమోడీ అనుచర గళం, అధికార యంత్రాంగం కావటాన్ని ఆయన అభిమానులు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి బిజెపి అగ్రనేత మురళీ మనోహర్‌ జోషి కూడా విసి జగదీష్‌ కుమార్‌(తెలుగువాడే అని చెప్పుకొనేందుకు చాలా మంది సిగ్గుపడుతున్నారు) రాజీనామా చేయాలని చెప్పాల్సి వచ్చింది. దాడులకు గురయిన వారి గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఇతరుల గురించి ఎందుకు ప్రకటనలు చేయరంటూ ఆయన ఎదురుదాడులకు దిగారు. దుండగులు విశ్వవిద్యాలయాన్ని ఆక్రమించి దాడులు చేస్తుంటే అసలు విసి ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తూ రాజీనామా చేయాలని అందరూ డిమాండ్‌ చేస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఎదురుదాడులు, దాడులకు గురైన వారి మీదనే తప్పుడు కేసులు పెట్టించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయుధాలు ధరించి ముసుగులు వేసుకున్నవారిలో తమ వారున్నట్లు ఎబివిపి నేతలు అంగీకరించారు. వారి దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు జెఎన్‌యుకు రావటమే దీపికా పదుకోన్‌ చేసిన ‘ నేరం, ఘోరం ‘. నిందితులపై ఇంతవరకు చర్యలు లేవు.
ఈ తరహాదాడి మన దేశంలో ఇదే ప్రధమం. దాడులలో తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శించేందుకు విశ్వవిద్యాలయానికి వచ్చిన దీపిక ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే తన సానుభూతి, మద్దతు ప్రకటించి వెళ్లారు. ఈ వార్త బయటకు రాగానే కాషాయ తాలిబాన్లు సామాజిక మాధ్యమంలో రెచ్చిపోయారు. ఆమె తాజా చిత్రం ‘ఛపాక్‌’ను బహిష్కరించాలని, దేశ ద్రోహులతో చేతులు కలిపారంటూ ఏకత, శీలము, సంస్కారం, సంస్కృతి, మహిళలకు ఇవ్వాల్సిన మర్యాదల గురించి నిత్యం ప్రవచనాలు చెప్పేవారు వాటన్నింటినీ తీసి గట్టున పెట్టి నోరు బట్టని విధంగా ఆమెపై దాడి ప్రారంభించారు. తమ అసహ్య రూపాన్ని మరోసారి స్వయంగా బహిర్గతపరచుకున్నారు.
ముంబైలో మరికొందరు బాలీవుడ్‌ నటీ నటులు దాడులను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌లు ఖండించారు. వారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయని పెద్దలు దాడికి గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లిన బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ చర్యను తప్పు పడుతూ దేశద్రోహి అని నిందలు వేస్తున్నారు. ముసుగులు వేసుకున్న దుండగులు తాము లక్ష్యంగా చేసుకున్న చేసిన వారి మీద మాత్రమే దాడులు చేశారు. ముసుగుల్లేని బిజెపి నేతలు కూడా ఎంపిక చేసిన వారి మీద మాత్రమే విరుచుకుపడుతున్నారు. వారికీ వీరికీ ఒక్క ముసుగులు తప్ప తేడా ఏముంది?

Image result for deepika padukone ,jnu
జనవరి పదవ తేదీన విడుదల కానున్న తన చిత్ర ప్రచారం కోసం దీపిక ఈ ఉదంతాన్ని వినియోగించుకున్నారని నిందించిన వారు లేకపోలేదు. బహుశా వారికి ఎన్నికల కోసం ఉగ్రవాదుల దాడులను ఉపయోగించుకున్న రాజకీయ పార్టీలు గుర్తుకు వచ్చి ఉంటాయి. కొన్ని రాజకీయ పార్టీలు రంగంలో ఉన్నపుడు మాత్రమే ఉగ్రవాదదాడులు జరుగుతాయని నమ్మే వారి గురించి తెలిసిందే. కాషాయ తాలిబాన్ల దాడి తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు కొందరు కాషాయ జర్నలిస్టులు దీపిక చర్యను దాడులను సమర్ధించేవారితో పాటు దాడులకు గురైన వారు కూడా విమర్శించారని చిత్రించారు. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండటాన్ని ఐషి ఘోష్‌ తప్పుపట్టినట్లుగా వ్యాఖ్యానించారు. పేరెన్నికగన్న బాలీవుడ్‌ బాద్‌షాలు కాషాయ తాలిబాన్ల నోటి దురుసుకు భయపడి అనేక అంశాల మీద నోరెత్తని స్ధితిని చూస్తున్నాము. బతికిన చేపలు ఏటికి ఎదురీదుతాయి, చచ్చిన చేపలు వాలునపడి కొట్టుకుపోతాయి. ఆమె చిత్ర ప్రచారం కోసమే అయితే ఇంకా అనేక మార్గాలున్నాయి. దీపిక మీద దాడులు జరగటం కొత్తేమీ కాదు. గతంలో పద్మావత్‌ సినిమా సందర్భంగా అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ వారు, సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూసే శక్తులన్నీ ఆమెమీద ఎలాంటి ప్రచారం చేసిందీ, భౌతికంగా దాడులు చేసేందుకు యత్నించిన తీరు చూశాము. బహుశా ఇది కూడా ఆమెను ప్రేరేపించి ఉంటుందని భావించవచ్చు. రెండు రోజుల తరువాత ఆజ్‌తక్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిన తన జెఎన్‌యు పర్యటన గురించి నోరు విప్పారు.
విద్యార్ధుల మీద హింస తనను బాధించిందని, పద్మావత్‌ సినిమా సందర్భంగా తాను ఇదే పరిస్ధితిని ఎదుర్కొన్నానని, ఇలాంటివి సర్వసాధారణంగా మారకూడదని తాను ఆశాభావంతో ఉన్నట్లు దీపిక చెప్పారు. ” నేను చెప్పదలచుకున్నది ఏమంటే రెండు సంవత్సరాల క్రితం పద్మావత్‌ విడుదల సందర్భంగా నేను ఇదే చెప్పాను. ఈ రోజు నేను చూస్తున్నది నాకు ఎంతో బాధ కలిగించింది. ఇది సర్వసాధారణ అంశంగా మారకూడదని నేను ఆశిస్తున్నాను. నాకు భయమూ విచారమూ కలిగింది. మన దేశపునాది ఇది కాదు. జరుగుతున్న వాటి పట్ల నాకు ఆగ్రహంగా ఉంది, అయితే ఎలాంటి చర్య తీసుకోకపోవటం అది మరింతదారుణం ‘ అన్నారు.

విద్యార్ధులను దీపిక పరామర్శించిన వార్త తెలియగానే బిజెపి నేత తేజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ట్వీట్‌ చేస్తూ తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ మరియు అఫ్జల్‌ గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినందుకు దీపికా పదుకొనే చిత్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. అనురాగ్‌ కాశ్యప్‌, తాప్సీ, విశాల్‌ భరద్వాజ్‌, అలీ ఫజల్‌, రిచా చద్దా, అనుభవ్‌ సిన్హా, జోయా అక్తర్‌, దియా మీర్జా, సౌరవ్‌ శుక్లా, సుధీర్‌ మిశ్రా, రాహుల్‌ బోస్‌, స్వానంద కిర్కరే, షబనా ఆజ్మీ వంటి వారు దాడులను నిరసిస్తూ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Image result for deepika padukone ,jnu
పులి తన చారలను దాచుకొనేందుకు ఆవు మేకప్‌ వేసుకున్నంత మాత్రాన దాని స్వభావాన్ని దాచుకోగలుగుతుందా ? ఒక కేంద్ర మంత్రి జవదేవకర్‌ ఛపాక్‌ సినిమాను బహిష్కరించాలనటాన్ని తాను అంగీకరించనని చెబుతారు, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాత్రం దేశాన్ని విధ్వంసం చేసే వారితో దీపిక పదుకోన్‌ నిలిచిందని దాడి చేస్తారు. దేశంలో కాషాయ దళాలను అనుసరించే వారు, వారిని గుడ్డిగా నమ్మిన జనం చెవుల్లో పూలు పెట్టుకున్నారు తప్ప అందరూ పెట్టుకోలేదని మంత్రులకు అర్ధం కావటం లేదు. ఎవరైనా ఏదైనా వార్త చదివితే తాము ఎవరికి మద్దతు ఇచ్చేందుకు పోతున్నామో తెలుసుకోవాలని స్మృతి గారు సెలవిచ్చారు. మరి ఈ దాడిని ఖండించిన కేంద్ర మంత్రులకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుందో లేదో ఆమె చెప్పాలి. వారిని కూడా దేశద్రోహులు అంటారా, ఒక వార్త వినగానే తాము ఎవరిని ఖండిస్తున్నామో తెలుసుకోవాలని వారికి చెబుతారా ? జెఎన్‌యులో ముసుగులు వేసుకొని గూండాయిజానికి పాల్పడింది ఎబివిపి వారే అని కొందరు, పోలీసులే ముసుగులతో దాడి చేశారని, బయటి వ్యక్తులను రప్పించి ముసుగులు తగిలించి ఎబివిపి వారు దగ్గరుండి కొట్టించారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముసుగుల్లో వచ్చి దాడి చేసింది తామే అని హిందూ రక్షక దళం పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఎటు తిప్పి ఎటు చూసినా కాషాయ తాలిబాన్లు, వారికి మద్దతుగా ఉన్న పోలీసులు ఈ దాడికి బాధ్యులు అన్నది స్పష్టం. ఈ దుండగాన్ని ఖండిస్తూ పారిశ్రామికవేత్తలు ఆనంద మహింద్రా, కిరణ్‌ షా మజుందార్‌, హర్షా మారివాలా కూడా ఖండించారు.

Image result for deepika padukone ,jnu
మన దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా అనేక మంది మేథావులు నిరసన తెలిపారు. ఈ రోజు జెఎన్‌యులోని విద్యార్ధులను, వారికి మద్దతు తెలిపిన వారినీ పాలకపార్టీ పెద్దలు దేశ ద్రోహులుగా చిత్రిస్తోంది. ఇదొక ప్రమాదకర పోకడ, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం పాలకపార్టీకి భజన చేయకపోవటమే దేశద్రోహమా ? బ్రిటీష్‌ తెల్లజాతి పాలకులు కూడా అదే చేశారు. తమను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించారు. అలాంటి వారిని సాగనంపిన జాతి మనది. మరి ఈ కాషాయ నల్లజాతి పాలకులు బ్రిటీష్‌ వారి చెప్పుల్లో కాళ్లు దూర్చి అణచివేతకు పూనుకుంటే, తమతో ఏకీభవించని వారిని దేశద్రోహులుగా పరిగణిస్తే ఏమి చేయాలి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబ్బ ! అపర ‘దేశ భక్తుల’కు దిమ్మ తిరిగే భలే తీర్పు చెప్పారు కదా !!

30 Friday Sep 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, fitting tribute to Rohit Vemula, HCU, Rohith Vemula, sfi, so called 'nationalists", University of Hyderabad (UoH), UoH, Vemula Rohit

ఎం కోటేశ్వరరావు

   రోహిత్‌ వేముల ఆత్మహత్య నేపధ్యంలో సెప్టెంబరు 28న జరిగిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ ఎన్నికలలో సంఘపరివార్‌ శక్తులు, వారికి వంత పాడిన మీడియా చిత్రించిన ‘దేశద్రోహులు’ ఘన విజయం సాధించారు. అపర’ దేశ భక్తులు ‘గా చెప్పుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ, ప్రసార మాధ్యమాల నీరాజనాలు అందుకున్న ఏబివిపి అభ్యర్ధులు అన్ని స్ధానాలలో పరాజయం పాలయ్యారు. ఢిల్లీలోని లోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కూడా ఇదే ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక పరిణామం లేదా వుదంతంపై ఎవరైనా మైనారిటీ అయినా మెజారిటీ అయినా భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం, అలాంటి వారికి చెప్పే అవకాశం ఇవ్వాలన్న ప్రజాస్వామిక డిమాండ్‌ను బలపరిచే వారిని కూడా దేశద్రోహులుగా చిత్రిస్తున్న నిరంకుశ, ఫాసిస్టు ధోరణులు వ్యక్తమౌతున్నాయి. దేశమంతటినీ ఆకర్షించిన ఈ రెండు విశ్వవిద్యాలయాల విద్యార్ధుల ఆందోళనల పూర్వరంగంలో వచ్చిన ఈ ఫలితాల తరువాత అయినా భిన్నాభి ప్రాయం వ్యక్తం చేసే వారిని దేశద్రోహులుగా చిత్రించటం, వేధించటం మానుకుంటారా ?

     మానుకోరు అని గట్టిగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఆ రెండు విశ్వవిద్యాలయాల సమస్య కాదు. అంతకంటే లోతైనది. విద్యారంగంలో మనువాద భావజాలాన్ని రుద్దాలన్న తీవ్ర ప్రయత్నంతో పాటు వామపక్ష, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని అడ్డుకోవాలన్న అంతకంటే తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది. అందుకు నిదర్శనం హర్యానా కేంద్రీయ విశ్వవిద్యాలయ వుదంతం. మహాశ్వేతాదేవి రాజకీయ అభిప్రాయాలు, వైఖరితో అందరూ ఏకీభవించాలని లేదు. ఆమె రచనలలోని వస్తువుతో కూడా ఎవరైనా విబేధించవచ్చు. ప్రముఖ రచయిత్రులలో ఒకరు అన్న అభిప్రాయంతో మాత్రం విబేధించాల్సిన అవసరం లేదు.ఆమె రాసిన ‘ద్రౌపది’ కథ ఆధారంగా రూపొందించిన ఒక నాటికను హర్యానా విశ్వవిద్యాలయంలోని ఆంగ్లం మరియు విదేశీ భాషల విభాగం వారు ప్రదర్శించారు. జూలై 28న మరణించిన మహాశ్వేతాదేవి సంస్మరణగా సెప్టెంబరు 21న ఆ విభాగంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్నేహస్థ రూపొందించిన నాటికను ప్రదర్శించారు. ఆ నాటిక ప్రదర్శన తరువాత దేశంలో కాశ్మీర్‌తో సహా అనేక రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లు, గిరిజన యువతులపై జరుగుతున్న అత్యాచారాలు, సైనికుల అనుచిత చర్యల వివరాలను డాక్టర్‌ స్నేహస్ధ చదివి వినిపించారు. ఈ విషయం స్ధానిక పత్రికలలో వార్తగా వచ్చింది.1970 దశకంలో ఒక ఆదివాసీ మహిళ ప్రత్యేక పోలీసుల కస్టడీలో అత్యాచారానికి గురి కావటం కథాంశం. గిరిజనోద్యమ నాయకుల గురించి వివరాలు వెల్లడించాలని పోలీసులు కోరితే నిరాకరించిన యువతిపై అత్యాచారం జరిపి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించటం. దీనిలో సైనికుల గౌరవానికి భంగం కలిగించేలా వుందంటూ కొందరు మాజీ సైనికులు అభ్యంతరం చెప్పారు, వెంటనే ఎబివిపి, మరో విద్యార్ధి సంస్ధ ఇండియన్‌ నేషనల్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశాయి. నాటికలో పల్గొన్నవారిపై చర్య తీసుకోవాలని విశ్వవిద్యాలయం ముందు నిరసన తెలిపారు. ఒక సంఘర్ష సమితిని ఏర్పాటు చేసి ఛాన్సలర్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ప్రతిదానిని సంచలనాత్మకం చేసేందుకు ఎదురు చూసే మీడియా దీన్ని కూడా జెఎన్‌యు వుదంతంతో పోల్చి నాటికను ప్రదర్శించిన వారికి ‘జాతి వ్యతిరేకం’ ముద్ర తగిలించింది.

    భావ ప్రకటనా స్వేచ్చను కాపాడాల్సిన,సమర్ధించాల్సిన విశ్వవిద్యాలయ అధికారులలో ఒకరైన రిజిస్ట్రారు సెప్టెంబరు 22వ తేదీన కొన్ని బృందాలు తెలుపుతున్న అభ్యంతరాలను వుటంకిస్తూ ర్‌ స్నేహస్థ సైన్యానికి వ్యతిరేకంగా చేసినట్లు చెబుతున్న ఆరోపణపై రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ ఒక లేఖ రాశారు.దీనిపై దర్యాప్తు చేసేందుకంటూ వైస్‌ ఛాన్సలర్‌ ఒక ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం కూడా విడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిటీష్‌ వారు 1876లోనే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా నాటకాలు ప్రదర్శిస్తే వాటిని సెన్సార్‌ లేదా నిషేధించేందుకు నాటక ప్రదర్శనల చట్టం చేశారు. ఇన్నేండ్ల తరువాత విశ్వవిద్యాలయ అధికారుల తీరు చూస్తే అదే చట్టం ఇంకా అమలులో వున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం ఒక్కటే ఇక్కడ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు అధికారులుగా వుండటం తప్ప వేరు కాదు. రోహిత్‌ వేముల ఆత్మహత్య సందర్భంగా సంతాపం తెలుపుతూ కొంత మంది విద్యార్ధు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టగా ఈ విశ్వవిద్యాలయంలోని ఏబివిపి సభ్యులు వారిపై దాడి చేశారు, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

     ద్రౌపది నాటిక విషయానికి వస్తే జెఎన్‌యు, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాదిరి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రచారం చేసేందుకే ఒక పెద్ద కుట్రలో భాగంగా మారుమూల గ్రామీణ ప్రాంతంలో వున్న ఈ విశ్వవిద్యాలయంలో నాటికను ప్రదర్శించారని హర్యానా ఏబివిపి నేత ప్రమోద్‌ శాస్త్రి ఆరోపించారు. విశ్వవిద్యాలయాలు శాస్త్రవిషయాలు, పరిశోధనల కోసం ఏర్పాటు అయ్యాయని అలాంటి చోట ప్రతి అంశంపై చర్చలు జరపవచ్చని నాటికను రూపొందించిన స్నేహస్ధ సమర్ధించారు.ఆమె రాసిన నాటిక ప్రదర్శనకు అధికార యంత్రాంగం అనుమతించిందని, దానిలో చేసిన విమర్శకు ఎవరైనా సైనికుల మనోభావాలు గాయపడి వుంటే క్షమించాలని ఆ వివాదానికి స్వస్థిపలికేందుకు ప్రయత్నించారు. అయితే యురిలో సైనిక శిబిరంపై పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు జరిపిన దాడి, సైనికుల మరణం నేపధ్యంలో ఎబివిపి దీనిని సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించింది.

    ఢిల్లీ విశ్వవిద్యాలయ కాలేజీ లెక్చరర్‌ షైకత్‌ ఘోష్‌ హర్యానా విశ్వవిద్యాలయ వుదంతం గురించి వ్యాఖ్యానిస్తూ రెండు సంవత్సరాల క్రితం సంఘపరివార్‌ భావజాలాన్ని విమర్శిస్తూ తన దర్శకత్వంలో ‘వెల్‌కం టు మెషిన్‌ ‘ అనే నాటిక ప్రదర్శనను రెండు సంవత్సరాల క్రితం ఏబివిపి అడ్డుకున్నదని భావ ప్రకటనా స్వేచ్చను ఆటంకపరచటంలో భాగ మే ఇదన్నారు.

    ప్రజా వుద్యమాల అణచివేతలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరపటంలో పోలీసులు, పారా మిలిటరీ, సైనికుల తీరు తెన్నుల గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా ఎందరో మానవతులను నిజాం పోలీసులు, రజాకార్లతో పాటు మలబార్‌ స్షెషల్‌ పోలీసులు, మిలిటరీ జరిపిన దారుణాలు చరిత్రలో నమోదయ్యే వున్నాయి. తరువాత కాలంలో కూడా అనేక వుద్యమాలు, ఆందోళనలు, పోరాటాల సందర్భంగా ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయి. వీటిని గురించి చెప్పటమంటే మొత్తం సైన్యం, పారామిలిటరీ, పోలీసులు అలాంటి వారని నిందించటం లేదా వారి సేవలను కించపరచటం కాదు. ప్రపంచంలో ప్రతిదేశంలో ప్రజా వుద్యమాలు, తిరుగుబాట్లను అణచటంలో పాలకవర్గానికి అత్యాచారం ఒక ఆయుధం. దానిని ప్రయోగించటంలో భారత పాలకవర్గమేమీ తక్కువ తినలేదు.

      చివరగా ఒక్క మాట ! ‘రోహిత్‌ చనిపోతే నేను వెళ్లలేదు… రకరకాల నేతలు పరామర్శకు వచ్చారు, నేను వెళ్లటం మంచిదా కాదా అన్న మీమాంసలో మౌనంగా వుండాల్సి వచ్చింది. ఏ సిఎం కూడా ఇలా జరగాలని కోరుకోడు’ :తమ పార్టీ అధికారానికి వస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కెసిఆర్‌  మాటలివి.

     అబ్బ ! భలే తెలివిగా చెప్పిండు కదా !! అని అప్పుడు ఆయన భక్తులెందరో ప్రశంసించారు. ఇప్పుడా రోహిత్‌ వేముల ఆత్మార్పణ అజెండాపైనే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బుధవారం నాడు జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో రోహిత్‌ వేముల అసలు దళితుడే కాదు, బిసి అంటూ సమస్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన సంఘపరివార్‌ శక్తులను మట్టి కరిపించి అక్కడి విద్యార్ధులు తిరుగులేని తీర్పు చెప్పారు. రోహిత్‌కు తగిన నివాళి ఇది. ఇప్పుడైనా రోహిత్‌ వేముల మరణం గురించి కెసిఆర్‌కు మీ మాంస తీరిందా? ఇంకా కొనసాగుతోందా? కొత్తది తలెత్తిందా ? అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా పాడు పొట్టకు అన్నమే వేతామురా , పోయినోడు ఎలాగూ పోయాడు, కేంద్రంలో బతికి వున్నవారితో తగాదా ఎందుకు ? పోనందుకు విమర్శలు ఎలాగూ రానే వచ్చాయి. నిండా మునిగిన వాడికి చలేమిటి ? అనుకుంటున్నారా !

     రోహిత్‌ మరణానికి కారకడని విద్యార్ధులు వేలెత్తి చూపుతున్న వైస్‌ ఛాన్సలర్‌, అతగాడిపై ఎస్‌సిఎస్‌టి అత్యాచారాల చట్టం కింద పెట్టిన కేసుపై ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటానికి…. తస్సాదియ్యా ఇంకా పెద్దమ్మలా పట్టుకున్న మీ మాంస కొనసాగటమే కారణం కదా !

    నిజమే వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు మీద విద్యార్ధులు ఎస్‌ఎసిఎస్‌టి చట్టం కింద పెట్టిన కేసులో ముందుకు పోతే నరేంద్రమోడీతో ఒక పంచాయతీ, పోకపోతే విద్యార్ధులతో మరొక పంచాయతీ. మధ్యమానేరు నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ ఇళ్లు కట్టిస్తానని తెలియక వాగ్దానం చేశాను కనుక క్షమించమని ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పారు. రేపు మిగతా విషయాలలో కూడా ఇలాగే చెప్పి క్షమించమంటారేమో ? పాలకుల తెలివి తేటలకు కొదవలేదు, తవ్వినకొద్దీ వస్తూనే వుంటాయి ! పాలితులకే వెంటనే లైటు వెలగటం లేదా !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d