• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: September 2023

భారత – కెనడా కలహంపై పశ్చిమ దేశాల్లో ఆందోళన ఎందుకు, చైనా ఏమంటోంది !

27 Wednesday Sep 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Europe, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Canada, Canada-India row, China, Hardeep Singh Nijjar, Joe Biden, Justin Trudeau, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే పంజాబ్‌ వేర్పాటువాద, ఉగ్రవాది హత్య ప్రస్తుతం భారత్‌-కెనడా మధ్య సంబంధాలు దిగజారటానికి దారి తీసింది. నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ సెప్టెంబరు 18న పార్లమెంటులో చేసిన ఆరోపణను మనదేశం తిరస్కరించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేవంది. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు అక్కడ విద్యాభ్యాసం, ఉపాధికోసం వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ వివాదం తమ చైనా వ్యతిరేక ఎత్తుగడలు, సమీకరణలకు ఎక్కడ దెబ్బతగులుతుందో అన్న భయం అమెరికా కూటమి దేశాల్లో వెల్లడి అవుతోంది. భౌగోళిక రాజకీయాల మీద చూపే ప్రభావమే కాదు, భారత్‌కు ఆగ్రహం కలిగిస్తే దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళన కూడా వాటిలో ఉంది. చైనా మీద ఆధారపడకుండా భారత్‌ను ప్రత్యామ్నాయ వస్తు ఎగుమతి దేశంగా మార్చేందుకు సాయం చేస్తామని, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకుంటామని చేస్తున్న ప్రకటనలు తెలిసినవే. చేసిన ఆరోపణను కెనడా వెనక్కు తీసుకోవాలని మనదేశం డిమాండ్‌ చేస్తోంది. ఉగ్రవాదులకు కెనడా సురక్షిత స్వర్గంగా ఉందని వర్ణించింది. మూడునెలల పరిశోధన తరువాత భారత హస్తం ఉందని నిర్ధారించుకున్నామని కెనడా అంటోంది. ఈ ఆరోపణను ఉపసంహరించుకుంటే తప్ప మనదేశం వెనక్కు తగ్గదు, అదే జరిగితే కెనడా అభాసుపాలవుతుంది కనుక వెనక్కు తగ్గే అవకాశాలు తక్కువ. ఇది చినికి చినికి గాలివానగా మారితే జరిగే పర్యవసానాల గురించి ఆందోళన చెందుతున్న జి 7 కూటమిలో పెద్దన్న అమెరికా, ఇతర దేశాలు ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించాయి.


ఈ ఏడాది జూన్‌ 18న కెనడా వాంకోవర్‌ సమీపంలోని సురే అనే చోట ఒక గురుద్వారా వెలుపల హత్యకు గురైన నిజ్జర్‌ 1977లో పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించాడు.పంజాబ్‌లో తీవ్రవాదులపై 1995లో చర్యలను ముమ్మరం చేయటంతో 1997లో నిజ్జర్‌ నకిలీ పాస్‌పోర్టుతో కెనడా పారిపోయాడు. అక్కడ తప్పుడు సమాచారం వెల్లడికావటంతో కేసులు, వివాదాల తరువాత 2007లో కెనడా పౌరసత్వం ఇచ్చారు. ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నాయని, ఒక వేర్పాటువాది, నేరగాడు అని అతన్ని అరెస్టు చేసి అప్పగించాలని గతంలో మనదేశం కెనడాను కోరింది. దాన్ని అది ఖాతరు చేయలేదు. స్వేచ్చగా తిరగనిస్తున్నది. అతడు ఒక మానవహక్కుల కార్యకర్త, శాంతియుత పద్దతుల్లో సిక్కు దేశం ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్లు అతని మద్దతుదార్లు వాదిస్తారు. తమ దేశంలో భావ ప్రకటన స్వేచ్చ ఉందని అందువలన అతను మాట్లాడేదానితో తమకు సంబంధం లేదని కెనడా వాదించింది. అతను 2019లో సురే గురుద్వారా నేతగా మారాడు.2020లో ఖలిస్తాన్‌ ప్రజాభిప్రాయ సేకరణలో, వేర్పాటువాదాన్ని సమర్ధిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అతని హత్యకేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.


నిజ్జర్‌కు ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే మిలిటెంట్‌ గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని భారత్‌ చేసిన వినతి మేరకు 2014లో ఇంటర్‌ పోల్‌ అరెస్టు వారంటు జారీ చేసింది. అతడు 2013-14లో పాకిస్తాన్‌ వెళ్లాడని అక్కడ పాక్‌ ఐఎస్‌ఐ చేర్చుకున్న బబ్బర్‌ ఖాల్సా అనే సంస్థకు చెందిన జగతార్‌ సింగ్‌ తారాను కలిశాడని మన ప్రభుత్వం పేర్కొన్నది. అతని మీద నిఘా పెట్టాలని 2015లో కేంద్ర ప్రభుత్వం కోరింది. తరువాత రెండోసారి కూడా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.తన మీద భారత ప్రభుత్వం చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, రాజకీయపరమైనవని నిజ్జర్‌ 2016లో కెనడా ప్రధానికి లేఖ రాశాడు. అతగాడు అనేక హత్యలకు కారకుడని, తమకు కావాల్సిన ముఖ్యులలో ఒకడని 2018లో కేంద్రం కెనడాకు తెలిపింది. పంజాబ్‌ను విముక్తి చేసి ఖలిస్తాన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రచారానికి నిజ్జర్‌ మద్దతు తెలిపాడు.2020లో మన ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ ఏడాది మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమం వెనుక అతడు ఉన్నాడని ఆరోపించి కేసులు కూడా దాఖలు చేసింది. పంజాబ్‌లోని ఒక హిందూ పూజారిని హత్య చేసేందుకు కుట్ర పన్ని లక్ష రూపాయల బహుమతి ప్రకటించాడని 2022లో ఎన్‌ఐఏ పేర్కొన్నది.


కెనడా రాజకీయాల్లో సిక్కులు ఒక ప్రభావిత శక్తిగా ఉన్నారు. పంజాబ్‌ తరువాత ప్రపంచంలో సిక్కు సామాజిక తరగతి ఎక్కువగా ఉన్నది కెనడాలోనే, అక్కడ జనాభాలో 2.1శాతం ఉన్నారు. ముప్పై మందితో కూడిన జస్టిన్‌ ట్రుడేవ్‌ మంత్రివర్గంలో నలుగురు సిక్కులు మంత్రులుగా ఉన్నారు. ఈ కారణంగా నిజ్జర్‌ మరణానికి బాధ్యులను తేల్చాలన్న డిమాండ్‌ సహజంగానే అక్కడ ముందుకు వచ్చింది. అందువలన మరొకదారి లేని పరిస్థితిలో అంతర్జాతీయ కర్తవ్యం సంగతి తరువాత ముందు తన ప్రభుత్వం గురించి చూసుకోవాలని హత్య గురించి ట్రుడేవ్‌ పార్లమెంటులో మాట్లాడాల్సి వచ్చింది. జూన్‌ మొదటి వారంలో మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు కెనడా మద్దతు ఇవ్వటం రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదని విమర్శించారు. ఆ తరువాత నిజ్జర్‌ హత్య జరిగింది. ఢిల్లీలో జరిగిన జి 20 కూటమి సమావేశాలకు జస్టిన్‌ ట్రుడేవ్‌ వచ్చినప్పటికీ ఇతర దేశాధినేతలతో మాదిరి ఫ్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక చర్చలు జరపలేదు. అంతే కాదు కెనడాలో ఉగ్రవాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఇటీవలి కాలంలో జరిగిన ఉదంతాల గురించి మోడీ కెనడా దృష్టికి తేగా, ప్రతిగా కెనడా కూడా మనదేశం మీద ఆరోపణలు చేసిందని వెల్లడైంది. తిరుగు ప్రయాణంలో ట్రుడేవ్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడగా ప్రత్యామ్నాయంగా విమానం ఏర్పాటు చేస్తామని మన దేశం ప్రతిపాదించినా రెండు రోజులు వేచి ఉండి తన విమానంలోనే వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవని ఈ ఉదంతం వెల్లడించింది. ఆ తరువాతే పార్లమెంటులో మన దేశం మీద ఆరోపణ చేశాడు. ఈ అంశాన్ని తాము భారత్‌కు ఎంతో ముందుగానే తెలిపామని ట్రడేవ్‌ చెబుతుండగా ఎలాంటి సమాచారం లేదని మన అధికారులు అంటున్నారు.


ఈ వివాదంలో పశ్చిమ దేశాల వైఖరిని చూస్తే మన దేశాన్ని ఖండించ లేదుగానీ విచారణ జరగాలి అని మాట్లాడుతున్నాయి. మీడియాలో వచ్చిన వార్తలను బట్టి కెనడా ప్రధాని బహిరంగంగా మన దేశం మీద ఆరోపణ చేయటానికి ముందే ” ఐదు కళ్ల గూఢచార యంత్రాంగం ” లో భాగస్వాములుగా ఉన్న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ అధికారులకు కెనడా నిజ్జర్‌ హత్యలో మన దేశ ప్రమేయం గురించి వెల్లడించటమే గాక ఒక సంయుక్త ప్రకటనలో ఖండించాలని ప్రతిపాదించగా మిగిలిన దేశాలు నష్టదాయకమంటూ తిరస్కరించినట్లు వెల్లడైంది. తమకు ముందుగానే చెప్పినట్లు కెనడాలోని అమెరికా రాయబారి డేవిడ్‌ కోహెన్‌ నిర్ధారించాడు. విదేశాల్లో హత్యలను సహించరాదని, తాము కెనడాను కేవలం సంప్రదించటం లేదని దర్యాప్తులో భాగస్వాములవుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పాడు. భారత్‌కూడా దర్యాప్తులో భాగస్వామి కావాలని అమెరికా కోరింది. ఆరోపణలు ఆందోళనకరమైనవని, తాను భారత దేశం వద్ద ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిణి పెనీ వాంగ్‌ చెప్పింది. ఆరోపణలు తీవ్రమైనవని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లవర్లీ, వస్తున్న వార్తులు నిజమే అయితే తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తమ భాగస్వాములతో సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నట్లు న్యూజిలాండ్‌ విదేశాంగ మంత్రి నానియా మహుతా అన్న వ్యాఖ్యలు కెనడాకు అనుకూలంగా చేసినట్లు స్పష్టమౌతున్నాయి.


పంజాబ్‌, కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు, తీవ్రవాద దుశ్చర్యలకు పాల్పడిన అనేక మందికి అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు ఆశ్రయం ఇచ్చిన సంగతి తెలిసిందే. పక్కనే ఉన్న శ్రీలంకలో ఉగ్రవాదులు సైతం పశ్చిమ దేశాల్లోనే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదుల అడ్డా, శిక్షణా కేంద్రం అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా అమెరికా, ఇతర ఐరోపా దేశాల కుట్రలో భాగంగానే జరిగింది. కెనడా ప్రధాని ఏమి చెప్పినప్పటికీ ఖలిస్తాన్‌ త్రీవ్రవాదుల అడ్డాగా ఆ దేశం మారింది. ప్రపంచంలో ఇతర దేశాల మీద దాడులు చేసేందుకు ఉగ్రవాదుల ఏరివేత అని సాకులు చెప్పే పశ్చిమ దేశాలు తమ సంరక్షణలో ఉన్నవారి గురించి పల్లెత్తు మాట మాట్లాడవు. ఇప్పుడు పశ్చిమ దేశాల ఆందోళన అంతా కెనడాలో ఆశ్రయం పొంది మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రవాదుల ఏరివేత, అదుపు గురించి కాదు. కెనడా – భారత్‌ మధ్య వివాదం ముదిరితే చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను నిలపాలన్న తమ ఎత్తుగడ ఎక్కడ విఫలమౌతుందో అన్న భయమే ఎక్కువ కనిపిస్తోంది. పశ్చిమ దేశాల నుంచి వెలువడుతున్న అన్ని వ్యాఖ్యానాల్లో బహిరంగంగానే దీని గురించి ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ దేశాల ఇండో-పసిఫిక్‌ ఎత్తుగడలో కెనడా కూడా ఒక ప్రధాన భాగస్వామే. మన దేశంలో నిరంకుశ పోకడలు, మానవహక్కులకు భంగం కలుగుతున్నదంటూ అమెరికాలోని అనేక సంస్థలు ఒకవైపు నిరంతరం ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద వత్తిడి పెంచుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు 75 మంది ఎంపీలు మోడీ ప్రసంగాన్ని బహిష్కరించారు. అధ్యక్షుడు జో బైడెన్‌ వారి ప్రచారాన్ని అనుమతించి చోద్యం చూశాడు. మౌనంగా ఉన్నాడు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలబెట్టాలన్న ఎత్తుగడలో భాగమే అది. అదే ఎంపీలు చైనా గురించి చేసిన ఆరోపణల మీద అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఎలా స్పందిస్తున్నదీ చూస్తున్నాము.


పశ్చిమ దేశాలు కట్టగట్టుకొని మౌనం పాటిస్తున్నాయని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నట్లు భారత్‌-కెనడా వివాదం గురించి చైనా మీడియా స్పందించింది. తమ వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ను తీసుకుపోవాలని చూస్తున్నాయి గనుక కెనడా మిత్ర దేశాలు మౌనంగా ఉన్నాయి తప్ప తమ మిత్రులు కాకుంటే వెంటనే ఖండనలకు దిగేవని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. తమ ప్రయోజనాలు లేకపోతే పశ్చిమ దేశాలు నీతి సూత్రాలు, నిబంధనలు వల్లించి ఉండేవని, భారత మానవహక్కుల సమస్యల గురించి కళ్లు మూసుకున్నట్లు పేర్కొన్నది. మనదేశం చైనాను ఎలా చూస్తున్నదో చైనా కూడా మనలను అలాగే చూస్తుంది, మరోవైపు కెనడాతో దాని సంబంధాలు సజావుగా లేవు. ఇప్పుడు తలెత్తిన వివాదాన్ని వారెలా చూస్తున్నారన్నది సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. చైనా అధికారికంగా మాట్లాడకపోయినప్పటికీ అధికారిక పత్రికల్లో వస్తున్న వ్యాఖ్యల ద్వారా వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. ఈ వివాదంతో తమ వ్యూహం నుంచి భారత్‌ ఎక్కడ వైదొలుగుతుందో అన్న భయం పశ్చిమ దేశాల్లో ఉంటే, పశ్చిమ దేశాలు – భారత్‌ మధ్య దూరం పెరగాలని సహజంగానే చైనా కోరుకుంటుంది. కెనడా ఒక దేశంగా ఉన్నప్పటికీ అది అమెరికాలో 51వ రాష్ట్రం మాదిరి ఉంటుందని చైనా భావిస్తున్నది. అందుకే భారత్‌ పట్ల అమెరికా మోసకారి తనం, ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని, వివాదం మరింత ముదిరితే గందరగోళానికి గురికానుందని చైనా గ్లోబల్‌ టైమ్స్‌లో ప్రచురితమైన విశ్లేషణలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాల వలసవాద వైఖరి భారత్‌ను సమాన స్థాయిలో చూస్తూ సహకరించేందుకు ముందుకు రావటం అసాధ్యమని బీజింగ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అన్నాడు. అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ ప్రవర్తించే కెనడా గతంలో చైనా మీద కాలు దువ్విందని ఇప్పుడు అమెరికా ప్రేరేపణతో భారత్‌ను రెచ్చగొడుతున్నదని చైనా వెబ్‌సైట్‌ ఒక విశ్లేషణలో రాసింది. మరికొందరు విశ్లేషకులు భారత్‌ పెద్ద ఇబ్బందుల్లో పడిందని పేర్కొన్నారు.


అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ తమకు భారత్‌ ఎంతో కీలకమైన దేశంగానే ఉంటుందని, అది ఒక్క దక్షిణాసియా ప్రాంతానికే కాదు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి కూడా అని చెప్పాడు. అమెరికాకు ఇది కలవరం కలిగించేదే, దానికి విశాల ప్రయోజనాలు ఉన్నాయి, ట్రుడేవ్‌ ఆరోపణలు గనుక నిజమే అయితే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రజాస్వామ్యానికి కట్టుబడి లేదన్నది అర్ధం, ఇదే విధానాన్ని పుతిన్‌ కూడా అనుసరించాడు అని కెనడాలోని టొరొంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ బోత్‌వెల్‌ అన్నాడు. తన శత్రువులను రష్యాలోపల, వెలుపల బ్రిటన్‌తో సహా ఇతర దేశాల్లో పుతిన్‌ చంపించాడని అన్నాడు. కరవ మంటే కప్పకు కోపం- విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా ప్రస్తుతం పశ్చిమ దేశాల పరిస్థితి ఉంది.చివరకు ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహిళా రిజర్వేషన్లపై నరేంద్రమోడీ టక్కు టమారాలు : పదేండ్లు పట్టించుకోలేదు, 2034 తరువాతే అమలు !

25 Monday Sep 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Women

≈ Leave a comment

Tags

BJP, Delimitation Commission of India, Narendra Modi, Narendra Modi Failures, women reservation bill 2023


ఎం కోటేశ్వరరావు


నాటకీయ పరిణామాల మధ్య నరేంద్రమోడీ సర్కార్‌ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్ట సభల్లో 33శాతం మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని అమలుకు బాటపడుతుంది. ఏ అసెంబ్లీ, లోక్‌సభ సెగ్మెంట్లలోని ఓటర్లలో పురుషులు ఎందరు, మహిళలు ఎందరు అనే వివరాలు ఇప్పటికే ఉన్నాయి గనుక కొందరు ఆ స్థానాలను ఉటంకిస్తూ అవన్నీ మహిళలకు రిజర్వు చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అసలు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే 2029 నాటికి అని మరికొందరు 2034 లేదా ఆ తరువాతే అని భాష్యం చెబుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరిగేదీ, ఎక్కడ ఎన్ని సీట్లు తగ్గేది కూడా కొన్ని అంకెలను కూడా ఉటంకిస్తున్నారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం రిజర్వేషన్లు పదిహేను సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. షెడ్యూలు కులాలు, తరగతులకు నిర్ధేశించిన సీట్లలో కూడా మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. వెనుబడిన తరగతుల మహిళకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఆమోదించిన బిల్లు చట్టమై ఎప్పటికి అమల్లోకి వస్తుంది, అసలు ఏం జరగబోతోంది ?


రాజ్యసభలో 2010లోనే ఆమోదం పొందిన రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందితే సరిపోతుంది. యుపిఏ ఏలుబడిలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీల వ్యతిరేకత లేదా అభ్యంతరాల కారణంగా అది లోక్‌సభలోకి రాలేదు. తమకు పూర్తి మెజారిటీ వస్తే దాన్ని తక్షణమే ఆమోదిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. 2014లో, 2019లో అవసరమైన మెజారిటీ, సగానికంటే ఎక్కువ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే ఉన్నందున ఆ బిల్లు ఆమోదానికి ఆటంకం లేదు, అయినప్పటికీ తొమ్మిదేండ్లుగా దాని ప్రస్తావన, అసలు చొరవే చూపలేదు. నిజానికి అధికారానికి వచ్చిన వెంటనే ఆమోదం పొంది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లలోనే మహిళల కోటా అమలు జరిపేందుకు పునర్విభజనతో నిమిత్తం లేకుండా అవసరమైన రాజ్యాంగ సవరణ చేసి ఉంటే అమల్లోకి వచ్చి ఉండేది. చిత్తశుద్ది ముఖ్యం, అది లేదు కనుకనే విమర్శలు. కారణాలు, ఉద్దేశ్యాలు ఏమైనప్పటికీ ముందు రోజు కాబినెట్‌లో ఆమోదించి మరుసటి రోజు లోక్‌సభలో, తరువాత రాజ్యసభలో ఆమోదానికి పెట్టారు.లోక్‌సభలో ఇద్దరున్న మజ్లిస్‌ మినహా మిగిలిన పార్టీలేవీ వ్యతిరేకంగా ఓటు వేయలేదు, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఈ పరిణామాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో, జనానికి ఏం చెబుతుందో, ఓటర్లు ఎలా స్వీకరిస్తారో చూద్దాం.


ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ? పదేండ్లకు ఒకసారి జరిగే జన గణన తరువాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన నిర్ణయం. దీన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేసే కమిషన్‌కు ఒక విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఉంటారు. దాని నిర్ణయాన్ని ఆమోదించటం తప్ప ఏ కోర్టులోనూ సవాలు చేసే అవకాశం లేదు. ఆ మేరకు 1952, 1963, 1973లో జరిగాయి.1973 తరువాత పాతికేండ్ల పాటు ఆ ప్రక్రియను స్థంభింప చేస్తూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేశారు. ఆ మేరకు 2002లో మరో పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తరువాత మరో పాతికేండ్లపాటు 2026వరకు అదే సంఖ్యను కొనసాగించాలని కూడా నిర్ణయించారు. తొలి లోక్‌సభలో 494 నియోజకవర్గాలుండగా, తరువాత పది సంవత్సరాలకు 522కు పెంచారు. మరో పది సంవత్సరాల తరువాత 542కు పెంచారు. ఆప్రక్రియ తరువాత సిక్కిం మనదేశంలో విలీనం కావటంతో మరొక స్థానాన్ని దానికి కేటాయించటంతో 543 అయ్యాయి. వీటిలో పదమూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి 2026వరకు ఆ సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు. మధ్యలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలలో కొన్ని ప్రాంతాలూ, అసెంబ్లీ సెగ్మెంట్లు అటూ ఇటూ అయ్యాయి. కొన్ని నియోజవర్గాలు రద్దు, కొన్ని కొత్తవి వచ్చాయి. తెలంగాణాలో జనాభా పెరగటంతో ఆంధ్రప్రాంతంలో సీట్లు తగ్గాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తరువాత ఎక్కడ ఉన్న సీట్లు అక్కడే ఉన్నాయి.రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణా సీట్లను 119 నుంచి 153కు, ఆంధ్ర ప్రదేశ్‌లో 175ను 225కు పెంచుతామని వాగ్దానం చేసినందున 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియలో భాగంగా అవి అమల్లోకి వస్తాయి.


2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. గడువు ప్రకారం వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి వుంది. అందువలన జనగణన జరుగుతుందా, మరుసటి ఏడాదికి వాయిదా పడుతుందా అన్నది ప్రస్తుతానికి ఊహాగానమే. 2026లోపు జనగణన జరుగుతుందనే భావనతో తరువాత జరిగే పునర్విభజన ప్రకారం 2029లోక్‌ సభ ఎన్నికలు, గడువు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33శాతం కేటాయించాల్సి ఉంటుందని అందువలన 2029లో అమలు జరుగుతాయని కొందరు భాష్యం చెబుతున్నారు. ఇక పార్లమెంటు ఆమోదించిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియకు ఆ తరువాత జరిగే అంటే 2031లో జరిగే జనగణన ప్రాతిపదికన జరగాల్సి ఉంటుంది. 2021లో జరగాల్సిన జనగణన 2024 లేదా 2025లో జరిగితే పదేండ్లు గడవకుండానే మరోగణన 2031లో జరుపుతారా లేక పదేండ్లు అంటే 2034 లేదా 2035లో జరుపుతారా అన్నది తెలియదు. ఒక వేళ అదే జరిగితే ఆ తరువాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అందుకే కపిల్‌ సిబల్‌ వంటి న్యాయకోవిదులు 2034కు ముందు అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. రెండవది పునర్విభజన ప్రక్రియకు నిర్ణీత కాలవ్యవధి లేదు.


అనేక రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాలను సక్రమంగా అమలు జరపకపోవటం, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లను కేటాయిస్తున్నందున ఎక్కువ సీట్లు పొందేందుకు జనాభా అదుపును పట్టించుకోవటం లేదనే అభిప్రాయం ఉంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా 1976లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాలలో ఎలాంటి మార్పులు చేయకూడని నిబంధనను సవరించారు. తరువాత జనాభా స్థిరీకరణ అవుతుందనే అంచనాతో మరోసారి 84వ రాజ్యాంగసవరణ ద్వారా 2026వరకు సీట్ల సంఖ్యలో మార్పులేకుండా నిర్ణయించారు. 2002లో ఏర్పాటు చేసిన కమిషన్‌ 1991 జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్ధీకరణ చేపట్టాలని నిర్ణయించారు.కమిషన్‌ పని చేపట్టిన తరువాత 2003లో 87వ రాజ్యాంగసవరణ ద్వారా 2001జనాభా ప్రాతిపదికను నిర్ణయించటంతో తిరిగి నూతన ప్రక్రియను చేపట్టాల్సి వచ్చింది, 2008వరకు పూర్తి కాలేదు. జమ్మూ-కాశ్మీర్‌లో జనగణన జరగలేదు గనుక దీన్నుంచి మినహాయించారు, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ జనాభా లెక్కల్లో తేడాలు ఉన్నందున కోర్టు వివాదాల కారణంగా అక్కడ జరగలేదు. 2009 సాధారణ ఎన్నికల నాటికి 543కు గాను 499చోట్ల పునర్వ్యస్థీకరణ జరిగింది. పన్ను ఆదాయ పంపిణీకి పదిహేనవ ఆర్థిక సంఘం ఎంచుకున్న జనాభా ప్రాతిపదికతో ఎక్కువ మొత్తాలను జమ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు తక్కువ మొత్తాలను పొందుతూ వివక్షకు గురవుతున్నాయి.అంతకు ముందు 1971 జనాభా ప్రాతికగా ఉన్న కేటాయింపులను 2011కు మార్చటంతో పెద్ద తేడా వచ్చింది. దేశ జనాభాలో 18శాతం ఉన్న రాష్ట్రాలు జిడిపిలో 35శాతం సమకూర్చుతున్నాయి. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉండాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. కానీ 2003లో చేసిన సవరణతో ఎవరు ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చు. అలాంటి వారు ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారా ? అక్కడి సమస్యలను పట్టించుకుంటారా ? వచ్చే పునర్విభజనలో పాత జనాభా పద్దతినే ఆమోదిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గటం ఖాయం.

పాత విధానాన్ని అనుసరిస్తే పునర్యవస్థీకరణ తరువాత ఇప్పుడున్న 543 సీట్లు( ఇద్దరు ఆంగ్లోఇండియన్‌ల నామినేషన్‌ రద్దు చేశారు గనుక 541 ఉంటాయి) 848కి పెరుగుతాయని కొందరి జోశ్యం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సూచించినట్లుగా గతంలో నిర్ణయించిన దాని కంటే జనాభా రెట్టింపైనందున సీట్ల పెరుగుదల వెయ్యి ఉండవచ్చనేది ఒక వాదన.మరో అంచనా ప్రకారం 753 ఉంటాయి. తదుపరి పునర్యవస్థీకరణ సంవత్సరాన్ని ముందే ఖరారు చేసినందున ఏ ప్రాతిపదికన జరిగేదీ కమిషన్‌ నియామక సమయంలోనే తెలుస్తుంది. దాన్ని బట్టే ఎన్ని సీట్లు అన్నది ఖరారు అవుతుంది. అప్పటి వరకు వెలువడే సంఖ్యలన్నీ ఊహాగానాలే. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81 ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అన్నది ఖరారు కావాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, కొన్ని చోట్ల తగ్గుదల కారణంగా ఆ సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. రాజ్యాంగం ప్రారంభంలో లోక్‌సభ సీట్లు 500గా ఖరారు చేసింది. తరువాత రాష్ట్రాల పునర్విభజన, ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రాతిపదికన సీట్లను పెంచారు.1971 జనాభా ప్రాతిపదికనే ఇప్పటికీ సీట్ల సంఖ్య కొనసాగటం సహేతుకం కాదని పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలన్నది ఒక అభిప్రాయం.ఉదాహరణకు దాని ప్రకారం 2001 జనాభా ప్రాతిపదికన ఉత్తర ప్రదేశ్‌కు ఏడు సీట్లు పెంచాలి, తమిళనాడుకు ఏడు తగ్గించాలి, అదే 2011లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లకు 22 అదనంగా కేటాయించాలి, అదే ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణా, కేరళ, తమిళనాడుకు 17 సీట్లు తగ్గించాలి.2021(ఎప్పుడు జరిగితే అప్పుడు) జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల సీట్లు ఇంకా తగ్గవచ్చు.2019లో జచేసిన ఒక విశ్లేషణ ప్రకారం ఉత్తర భారత్‌కు 32 సీట్లు పెరుగుతాయి, దక్షిణ భారత్‌కు 24 తగ్గుతాయి. కుటుంబ నియంత్రణ పద్దతులను జయప్రదంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అన్నది వినిపిస్తున్నమాట.కార్నెగీ సంస్థ విశ్లేషణ మేరకు 2031 జనాభా ప్రకారమైతే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రెండు రాష్ట్రాలకే 21 సీట్లు అదనంగా పెరిగితే, తమిళనాడు, కేరళకు కలిపి 16 తగ్గుతాయి. మొత్తం సీట్లు 848కి పెరిగితే ఒక్క ఉత్తర ప్రదేశ్‌కే 143, కేరళకు 20 ఉంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటక బిజెపి టిక్కెట్‌ మోసం కేసు : పోలీసు కస్టడీలో పక్కా హిందూత్వ వాదులు !

23 Saturday Sep 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Women, Women

≈ Leave a comment

Tags

BJP, Chaitra Kundapura, G M Abhinava Halaveerappajja, Karnataka BJP ticket promise case, RSS, VHP


ఎం కోటేశ్వరరావు


ఆమె మూడు పదులు నిండకుండానే అన్ని విధాలుగా పేరు మోసిన కట్టర్‌ హిందూత్వ వాది. అతడు తన మఠం, కాషాయ దుస్తులతో మోసానికి పాల్పడిన మరో కట్టర్‌. వీరితో చేతులు కలిపిన మరో నలుగురితో కలసి వారు ఇప్పుడు బెంగలూరు పోలీసు కస్టడీలో ఉన్నారు. కర్ణాటకలో పక్కా హిందూత్వ వాదులుగా జనంలో ప్రాచుర్యం పొందిన వారు. ఇప్పుడు పక్కా మోసకారులుగా పోలీసుల చేతికి చిక్కారు. సంవత్సరాల తరబడి వారిని ఉపయోగించుకున్న బిజెపి, ఇతర హిందూత్వ సంస్థలు ఇప్పుడు వారితో తమకేమీ సంబంధం లేదని నమ్మబలుకుతున్నాయి. ఉద్రేక, ఉన్మాద ఉపన్యాసాలు చేసి రెచ్చగొట్టటంలో పేరు మోసిన హిందూత్వ నేతగా పేరున్న చైత్ర కుందాపుర, శ్రీ హలస్వామి మహాసంస్థాన్‌మఠ అధిపతి అభినవ హలస్వామి, వారితో చేతులు కలిపిన బిజెపి యువమోర్చ నేతలు, ఇతరులు ఈ కేసులో ఉన్నారు. అధికారంలో ఉన్న పెద్దలతో తమకు ఉన్న సంబంధాలను ఉపయోగించి నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో పోటీకి టిక్కెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు కొట్టేసేవారి గురించి బయటకు తెలిసేది తక్కువ. ఎందుకంటే చెప్పుకుంటే పరువుపోతుందని అనేక మంది తేలుకుట్టిన దొంగల మాదిరి కిమ్మనరు. కర్ణాటకలో ఇప్పుడు బిజెపి టిక్కెట్ల కుంభకోణం వెల్లడి కావటంతో ఆ పార్టీ ఇప్పుడు ఇరుకున పడింది.తమకేమీ సంబంధం లేదని పార్టీ నేతలు చెబుతుండగా, అగ్రనేతల ప్రమేయం ఉందని కేసుల్లో అరెస్టయిన వారు అంటున్నారు. బిజెపిలో టిక్కెట్లు ఎలా సంపాదించుకొనే అవకాశం ఉందో ఈ మోసం వెల్లడిస్తున్నది.


ఇంతకీ జరిగిందేమిటంటే బిజెపి టికెట్‌ వస్తే దాంతో గెలిచి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించవచ్చనే దురాశతో గోవిందబాబు పూజారి అనే వ్యాపారవేత్త పైన చెప్పుకున్న మోసగాళ్ల ముఠాకు ఐదు కోట్లు సమర్పించుకున్నట్లు సెప్టెంబరు ఎనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ప్రధాన నిందితుల్లో చైత్ర కుందాపుర, ఆమె అనుచరులను పోలీసు అరెస్టు చేశారు.ఈ వార్త తెలియగానే మరో ప్రధాన నిందితుడు అభినవ హలస్వామి కాషాయ దుస్తులు పక్కన పడేసి మారు వేషంలో తప్పించుకున్నాడు. టీ షర్టు, షార్టు (లాగు కంటే ఎక్కువ, పాంట్స్‌ కంటే తక్కువ పొడవు) వేసుకొని పారిపోతుండగా ఒడిషా పోలీసులు పట్టుకున్నారు. ఉడిపి జిల్లాలోని బైందూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తనకు బిజెపి టిక్కెట్‌ ఇస్తామంటూ డబ్బు తీసుకొని మోసం చేశారని గోవిందబాబు పూజారి అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని, కేంద్ర హౌం మంత్రి కార్యాలయం,ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో తమకు ఉన్న సంబంధాల గురించి చెప్పి డబ్బు వసూలు చేశారన్నది వారి మీద మోపిన నేరం. తనకు ఒకరిని పరిచయం చేసి అతగాడు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అని చెప్పారని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీకి నిధులు అవసరమంటూ చెప్పటంతో అతగాడికి మూడు కోట్లు, మరో రెండు కోట్లు చైత్ర అనుచరులకు చెల్లించినట్లు పూజారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బు తీసుకున్నప్పటి నుంచి వారంతా తప్పించుకుంటున్నారని తెలిపాడు.


అనేక రాష్ట్రాలలో ఇలాంటి మోసగాళ్లు ఎందరో ఉన్నారు. కర్ణాటకలో 2020లో బెంగలూరు పోలీసులు స్వామి అలియాస్‌ సేవాలాల్‌ అనే జ్యోతిష్కుడు యువరాజ్‌ రామదాస్‌ను అరెస్టు చేశారు.అతగాడు 2014 నుంచి 2020వరకు అనేక మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక గవర్నర్‌, ఒక కేంద్ర మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడితో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు చెప్పేవాడు.2015లో జౌళిశాఖ కేంద్ర మంత్రిగా ఉన్న సంతోష్‌ గాంగవార్‌కు శ్రీకాళహస్తికి చెందిన కోలా ఆనందకుమార్‌ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. కేంద్ర సిల్క్‌బోర్డు చైర్మన్‌ పదవి ఇప్పిస్తానంటూ ఒకటిన్నర కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఈ స్వామికి ఒక ప్రముఖ బిజెపి నేత తనను పరిచయం చేసినట్లు, తన దగ్గర డబ్బు తీసుకున్న తరువాత పదవీ లేదు, స్వామి ముఖంచాటేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆనందకుమార్‌ పేర్కొన్నారు. సదరు స్వామి ఒక ఎంపీని తిరిగి నామినేట్‌ చేయిస్తానని ఇరవై కోట్లు, కర్ణాటక హైకోర్టు మాజీ మహిళా జడ్జికి గవర్నర్‌ పదవి ఇప్పిస్తానంటూ ఎనిమిదిన్నర కోట్లు కోట్లు వసూలు చేశాడు. బిఎస్‌ ఇంద్ర కళ అనే ఆ మాజీ జడ్జి నగదు రూపంలో నాలుగున్నర కోట్లు, ఆర్‌టిజిఎస్‌ ద్వారా రు.3.77 కోట్లు చెల్లించారు. ఆమెను ఢిల్లీ తీసుకువెళ్లి కొంత మంది బిజెపి అగ్రనేతలను పరిచయం చేశారట.ఆమె 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తులుగా ఎలాంటి వారు ఎంపిక అవుతున్నారు, గవర్నర్‌ పదవులను కొనుక్కోవటం ఎంత సులభంగా ఉంటుందో డబ్బు, పలుకుబడి కలవారి ప్రయత్నాల గురించి ఈ ఉదంతం వెల్లడించింది.బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో ఉన్న పలుకుబడితో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించమని ఒక డాక్టర్‌ 30లక్షలు సమర్పించుకున్నారట.2019లో స్వామి తనను పది కోట్లకు మోసం చేసినట్లు శశికాంత్‌ బంద్రే అనే వాణిజ్యవేత్త ఫిర్యాదు చేసిన తరువాత పైన పేర్కొన్న మోసాలన్నీ వెలుగులోకి వచ్చాయి.


ఇక హిందూత్వ నాయకురాలు చైత్ర కుందాపూర్‌, ఆమె గాంగ్‌ మోసం చేసిన తీరు గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోసగాళ్ల ముఠాలో స్వామీజీతో పాటు కబాబ్‌లు తయారు చేసి అమ్ముకొనే వ్యక్తి , ఒక క్షురకుడు ఉన్నారు.తమ సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ప్రధాని కార్యాలయంలో తనకు పెద్ద తలకాయలు ఎందరో తెలుసని చైత్ర ప్రచారం చేసుకుంది. 2022లో వ్యాపారవేత్త పూజారికి ప్రసాద్‌ బైదూర్‌ అనే వ్యక్తిని పరిచయం చేసి అతను బిజెపి కార్యకర్త అని చెప్పారు. చైత్ర తలచుకుంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఏదైనా సాధించగలదని అతను పూజారిని నమ్మించాడు. అది బాగా పని చేసిందని గ్రహించిన తరువాత ఆ ముఠా గగన్‌ కదూర్‌, రమేష్‌ నాయక్‌ అనే వారిని పరిచయం చేశారు. రమేష్‌ తన పేరును దాచి తాను చిక్‌మగళూరుకు చెందిన విశ్వనాధ్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతనని గత 45 ఏండ్లుగా పని చేస్తున్నట్లు నమ్మించాడు. తరువాత బెంగలూరులోని ధనికులు నివాసం ఉండే ప్రాంతంలో చెన్నా నాయక్‌ అనే అతన్ని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడని పరిచయం చేశారు. ఒక పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు పొందిన 110 సంవత్సరాల తిమ్మక్క కుమారుడు ఉమేష్‌తో గగన్‌ కదూర్‌కు పరిచయం ఉంది. ఆమెకు వయసు పైబడటంతో కాబినెట్‌ స్థాయి కల్పించి ఒక కారు కూడా ఇచ్చారు.ఉమేష్‌ను ఒప్పించి ఆ కారులో చెన్నానాయక్‌, ఇతర ముఠా పూజారిని కలిశారు. అధికారిక కారును చూసి నిజంగానే పలుకుబడి కలిగిన వారని పూజారి నమ్మాడు. టిక్కెట్‌ కనుక రాకపోతే ఇచ్చిన సొమ్ము పూర్తిగా తిరిగి ఇస్తామని రమేష్‌ నాయక్‌ నమ్మబలికాడు. మూడు రోజుల్లో 50 లక్షలు, తరువాత మూడు కోట్ల మేర వసూలు చేశారు. ఆ సొమ్ములో ఒకటిన్నర కోట్లు అభినవ హలశ్రీ స్వామి అనే మఠాధిపతికి చెల్లించినట్లు పూజారి పేర్కొన్నాడు.2022 జూలై ఏడు నుంచి 2023 జనవరి 16 వరకు మొత్తం ఐదు కోట్లు సమర్పించుకున్నాడు.


బిజెపి అభ్యర్ధులను ప్రకటించటానికి కొద్ది రోజుల ముందు కాశ్మీరులోని ఒక ఆసుపత్రిలో ఆర్‌ఎస్‌ఎస్‌నేత విశ్వనాధ్‌ మరణించినట్లు గగన్‌ కదూర్‌ చెప్పాడు. అనుమానం వచ్చిన పూజారి విచారించగా అసలు ఆ పేరుగల వ్యక్తి లేడని తేలింది.దాంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయటంతో మోసగాళ్ల ముఠా తప్పించుకు తిరిగింది.చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అరెస్టు చేశారు. సెప్టెంబరు పన్నెండు నుంచి హలశ్రీ స్వామి పరారీలో ఉండి పందొమ్మిదవ తేదీ రాత్రి ఒడిషా పోలీసులకు చిక్కాడు. ఇంతకీ రమేష్‌ నాయక్‌ చిక్‌మగలూర్‌లోని ఒక క్షురకుడు అని తేలింది. చెన్నానాయక్‌ బెంగలూర్‌ కెఆర్‌ పురంలో వీధుల్లో కబాబ్‌లు అమ్ముతాడని పోలీసులు గుర్తించారు. పూజారి నుంచి కొట్టేసిన సొమ్ములో భారీ మొత్తాని చైత్ర నొక్కేసింది. కుందాపురలోని ఒక సహకార బాంకులో రు.1.8 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లు, రు.65లక్షలు పెట్టి బంగారు నగలు కొన్నట్లు, మరో రు.40లక్షలను ఒక బంధువు సాయంతో శ్రీరామ్‌ బాంక్‌లో డిపాజిట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరొక బాంకులాకర్‌ నుంచి రు.23లక్షల బంగారు బిస్కట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక నలభై లక్షలు వెచ్చింది చైత్ర తనకు కొత్త ఇంటి నిర్మాణంతో పాటు తన సోదరి ఇంటిని 15లక్షలతో మరమ్మతు చేయించినట్లు, పన్నెండు లక్షలతో కియా కారు కొన్నట్లు తేలింది. గగన్‌ కదూర్‌ వివాహానికి రు.35లక్షలు ఖర్చు చేసి పది లక్షలతో కొత్త కారు కొన్నారు, రమేష్‌ నాయక్‌ రు.1.5లక్షలు, చెన్నా నాయక్‌కు రు.93వేలు ఇచ్చారు. తమ ముఠాలోని ఆరుగురు మూడు కోట్లు తీసుకున్నట్లు చైత్ర పోలీసులకు వెల్లడించింది. స్వామీజిని అరెస్టు చేస్తే దీని వెనుక ఉన్న పెద్దల గురించి తెలుస్తుందని కూడా చెప్పిందని పోలీసులు చెప్పారు.ఆమెను ప్రశ్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకేమీ కాలేదని తరువాత తేలింది. బిజెపి నేత ఒకరు ఈ ముఠావెనుక ఉన్నట్లు రాష్ట్ర మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్‌ ఆరోపించారు. కొంత మందికి టిక్కెట్లు రాకపోవటంతో ఇలాంటి మోసాలన్నీ వెలుగు చూస్తున్నాయని మాజీ సిఎం, బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీష్‌ షెట్టార్‌ అన్నారు.రియలెస్టేట్‌ బిజినెస్‌లో ఉన్నవారికి టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు. అరెస్టు చేసిన వారెవరూ అసలు తమకు తెలియదని బిజెపి నేతలు చెబుతున్నారు.ఈ కేసులో ఇప్పటి వరకు 80శాతం కొట్టేసిన సొమ్ము ఆచూకీ దొరికినట్లు పోలీసులు చెప్పారు.


ఒకటిన్నర కోట్లు తీసుకున్న హలశ్రీ స్వామి తప్పించుకోగా అతని కారు డ్రైవర్‌ పోలీసులకు దొరికాడు. సెప్టెంబరు ఎనిమిదవ తేదీన గోవింద పూజారి కేసు దాఖలు చేశారు. పన్నెండవ తేదీన చైత్రను ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు. అది తెలిసిన స్వామి ఆ రోజు హాజరు కావాల్సిన ఒక కార్యక్రమానికి వెళ్ల కుండా తప్పించుకున్నాడు. మైసూరు పారిపోయే ముందు నాలుగు కొత్త సిమ్‌ కార్డులు, నాలుగు కొత్త ఫోన్లు కొన్నాడట, పారిపోతున్నపుడు కారు నంబరు ప్లేటును తొలగించారు, తరువాత కారును ఒక బంధువు ఇంట్లో ఉంచి, కర్ణాటక నుంచి తప్పించుకున్నాడు. భువనేశ్వర్‌ నుంచి బుద్ధ గయకు రైలులో వెళుతుండగా కటక్‌ వద్ద పోలీసులకు దొరికాడు. మైసూరు నుంచి హైదరాబాద్‌, పూరీ, కోణార్క్‌ వెళ్లి అక్కడి నుంచి వారణాసి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికాడు. గోవింద పూజారి నుంచి తీసుకున్న సొమ్ముతో వ్యవసాయ భూమి కొనుగోలు, ఒక పెట్రోలు బంకులో పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు.


విద్యార్ధినిగా ఉండగా ఎబివిపిలో పని చేసిన చైత్ర కొన్ని పత్రికల్లో జర్నలిస్టుగా, స్పందన అనే టీవీలో యాంకర్‌గా పని చేసింది. హిందూత్వ కార్యకర్తగా మైనారిటీల మీద రెచ్చగొట్టే ప్రసంగాలతో అనేక పాత్రల్లో కనిపించిన చైత్ర 2018లో ఉడిపి పట్టణంలో కాంగ్రెస్‌ మీద ధ్వజమెత్తి వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రులు కూడా ఆమెను ఆకాశానికి ఎత్తారు. ముస్లింల మీద విద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకు ఆమె మీద కేసులు కూడా నమోదు చేశారు.ఈ ఉపన్యాసాలకు భజరంగ్‌దళ్‌, విశ్వహిందూపరిషత్‌ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, సభలు, సమావేశాలే వేదికలు.2021లో ఒక సభలో ముస్లింలు, క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరవై మూడు శాతం ఉన్న మీకే ఇంత అహం ఉంటే 70శాతంగా ఉన్న హిందువులకు ఎంత ఉండాలి ?ఇదే మీకు చివరి హెచ్చరిక, మీరు గనుక లౌ జీహాద్‌ను మానుకుంటేనే మీరు బతికి ఉంటారు, 70శాతం హిందువులు 23శాతం మందిని మార్చాలని అనుకుంటే, లౌ జీహాద్‌కుపూనుకుంటే రెండు రోజులు చాలు మీ ఇండ్లలో ఒక్క బుర్కా కూడా కనిపించదు. మేము ప్రతి ముస్లిం యువతి నుదుటి మీద తిలకం దిద్దుతాం అని రెచ్చగొడుతూ మాట్లాడారు. ఆమె గత ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేశారు. శ్రీరామ్‌ సేన నేత ప్రమోద్‌ ముతాలిక్‌తో కలసి వేదికలను పంచుకున్నది. రెచ్చగొట్టే ప్రసంగాలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందును కలుబుర్గి జిల్లాలో అలంద్‌ తాలుకాలో వారం రోజుల పాటు తిరగ కుండా జిల్లా కలెక్టర్‌ ఈ ఏడాది ప్రారంభంలో నిషేధం విధించారు. 2018లో సర్పపూజ్‌ ఎలా చేయాలనే అంశంపై గొడవ పడి గురుప్రసాద్‌ పంజా అనే హిందూ జాగరణ్‌ వేదిక కార్యకర్తమీద చేయి చేసుకున్న కేసులో అరెస్టయింది.


అవివాహిత అయిన చైత్ర కుందాపుర మీద ఉడిపిలో బిజెపి కార్యకర్త సుధీన్‌ ఒక కేసు దాఖలు చేశాడు. తన కోసం ఒక దుకాణాన్ని కట్టిస్తానని చెప్పి ఆమె ఐదు లక్షలు తీసుకున్నదని, అది చేయకపోగా సొమ్ము వాపసు అడిగితే అత్యాచారం చేసినట్లు కేసు పెడతానని , హత్య చేయిస్తానని బెదిరించినట్లు పేర్కొన్నాడు. బిజెపి టిక్కెట్‌ పేరుతో సొమ్ము తీసుకున్న వ్యాపారి పూజారిని కూడా బెదిరించినట్లు వెల్లడైంది. అరెస్టుకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఒక లేఖ రాసి అతని వాణిజ్య లావాదేవీల మీద విచారణ జరపాలని, దర్యాప్తుకు తాను సహకరిస్తానని పేర్కొన్నది. తాను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి గోవిందబాబు పూజారి తెలుసునని, బిజెపి టిక్కెట్‌ కోసం చూశాడని, తాను ఒక ప్రైవేటు కంపెనీలో పని చేసినపుడు అతని అక్రమ లావాదేవీల గురించి తెలుసుకున్నట్లు రాసింది. అతని అక్రమాలను బయట పెట్టేందుకు అతనితో సంబంధాల్లో ఉండి సమాచారం సేకరించినట్లు చెప్పుకుంది. చిత్రం ఏమిటంటే సదరు పూజారికి ఎంఎల్‌ఏ టిక్కెట్‌ రాకున్నా, ఎన్నికలకు ముందు బిజెపి వెనుకబడిన తరగతుల మోర్చా కార్యదర్శి పదవిని బహుకరించారు. ఏ నియోజకవర్గంలో టికెట్‌ను ఆశించాడో అదే చోట బిజెపి అభ్యర్ధికి ప్రచారం చేశాడు. అనేక మంది నేతలతో సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఒక గుర్తింపు పొందాడు. అధికారం వచ్చిన తరువాత ఆ సొమ్మును ఏదో విధంగా రాబట్టుకోవచ్చని భావించి ఉండాలి. బిజెపి ఓడిపోవటం, పార్టీ పదవి ఉన్నా ప్రయోజనం లేదని గ్రహించిన తరువాత తన సొమ్ము తనకు ఇచ్చివేయాలని డిమాండ్‌ చేయటంతో అసలు కథ బట్టబయలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేద దేశాలకు అనుగుణంగా నిబంధనలను మారుద్దాం – జి 77+చైనా కూటమి పిలుపు

20 Wednesday Sep 2023

Posted by raomk in Africa, CHINA, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, G77+China, G77+China summit 2023, Global South, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రతి ఏడాది సెప్టెంబరు పదహారవ తేదీని ” పేద దేశాల శాస్త్ర, సాంకేతిక, నవీకరణ దినం ” గా పాటించాలని 2023 సెప్టెంబరు 15-16 తేదీలలో క్యూబా రాజధాని హవానాలో జరిగిన జి 77+చైనా సభ పిలుపునిచ్చింది.నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, సామర్ధ్యాలు, పరిస్థితులకు సంబంధించి ప్రస్తుతం అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల మధ్య తీవ్ర అసమానతలు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సభ ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. దానికి నిదర్శనంగా కరోనా వాక్సిన్లను ఉదహరించారు.వర్తమాన సంవత్సరంలో కూటమి అధ్యక్ష స్థానంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు మియల్‌ డియాజ్‌ కానెల్‌ మాట్లాడుతూ కేవలం పది దేశాలు 90శాతం పేటెంట్లు, డిజిటల్‌ పరిజ్ఞాన ఎగుమతుల్లో 70శాతం కలిగి ఉన్నాయని చెప్పారు. సమాన అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక వ్యవస్థ ఏర్పడాలంటే అభివృద్ధి చెందిన దేశాల సాంకేతిక పెత్తనం కొనసాగితే కుదరదని అన్నాడు. అందువలన పేద, వర్ధమాన దేశాల మధ్య ఈ రంగంలో మరింత సహకారం అవసరమని, అందుకే ఆట నిబంధనలను మార్చేందుకు పేద దేశాలు ముందుకు రావాలని చెప్పాడు.ధనిక దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రపంచాన్ని తీసుకుపోతున్నాయి, పేద దేశాలు ఆట నిబంధనలను మార్చాల్సిన తరుణం వచ్చిందన్నాడు.ప్రపంచంలో ప్రస్తుత బహుముఖ సంక్షోభంలో పేద దేశాలు బాధితులని, అసమాన వాణిజ్యం ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమని అన్నాడు.హవానా సభ ఆమోదించిన తీర్మానంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సమూలంగా సంస్కరించాలి.ప్రపంచ విధానాల రూపకల్పన, నిర్ణయాల సంస్థలలో మరింత సమన్వయంతో పాటు వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం పెరగాలి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, నవకల్పనలు ఈ దేశాలకు అందుబాటులోకి వచ్చే విధంగా విధానాల రూపకల్పన జరగాలి. డిజిటల్‌ గుత్తాధిపత్యం, అనుచిత పద్దతులకు జి 77 వ్యతిరేకం. డిజిటల్‌ అసమానతలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. వర్ధమాన దేశాల మీద ఆంక్షలు, ఆర్ధికపరమైన బలవంతాలను ఈ కూటమి వ్యతిరేకిస్తుంది. ఇవి అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించటమే గాక సామాజిక, ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటున్నాయి.


జాత్యహంకారానికి వ్యతిరేకంగా, నిరాయుధీకరణ, నూతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలతో 1964 జూన్‌ 15న ఆంక్టాడ్‌లో ఐరాస ప్రధాన కేంద్రంగా 77 దేశాల కూటమి ఏర్పడింది. దాని నుంచి రెండు ప్రారంభ దేశాలు తప్పుకోగా తరువాత కాలంలో మరో 60దేశాలు చేరాయి. చైనాను తమ సభ్యురాలిగా ఆ కూటమి పరిగణిస్తున్నది. అయితే చైనా మాత్రం తాను సభ్యురాలిని కాదని, కూటమికి అన్ని విధాలుగా సహకరిస్తానని ప్రకటించింది. అన్ని సమావేశాల నిర్ణయాలు, అమలులో భాగస్వామిగా ఉంది. అందువలన సాంకేతికంగా ఇప్పుడు 134 దేశాలే ఉన్నప్పటికీ చైనాను కలుపుకొని పోయేందుకు గాను అది జరిపే సమావేశాలు, చేసేప్రకటనల్లో జి 77+చైనాగా వ్యవహరిస్తున్నారు. జనాభాలోనూ, ఐరాస దేశాల్లో ఎక్కువ సంఖ్యలోనూ ఈ కూటమిలో ఉన్నాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్‌ అందరికోసం పని చేసే ప్రపంచం కోసం పోరాడాలని పిలుపునిచ్చాడు. ఇటీవలి దశాబ్దాలలో పేద దేశాలు కోట్లాది మందిని దారిద్య్రం నుంచి వెలుపలికి తెచ్చినప్పటికీ ఇప్పుడవి పెరుగుతున్న దారిద్య్రం, ఆకాశానికి అంటుతున్న ధరలు, ఆకలి, పెరుగుతున్న రుణభారం, వాతావరణ నాశనం వంటి అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని చెప్పాడు. ప్రపంచ వ్యవస్థలు, చట్రాలు పేద దేశాలను దెబ్బతీశాయి, ముగింపు ఏమిటో స్పష్టమే, దేశాలను అభివృద్ధి చేయటంలో ప్రపంచం విఫలమౌతున్నదని స్పష్టం చేశాడు. ఈ మాటలు ధనిక దేశాలను అభిశంసించటం తప్ప మరొకటి కాదు. పర్యావరణ న్యాయం జరగాలంటే ఆర్థిక న్యాయం జరగాలి, వాగ్దానం చేసినట్లుగా ధనిక దేశాలు అందుకోసం వంద బిలియన్‌ డాలర్లను విడుదల చేయాలి, 2025 నాటికి రెట్టింపు నిధులు ఇవ్వాలి, 2027నాటికి ప్రకృతి వైపరీత్యాల గురించి ప్రతి ఒక్క పౌరుడినీ ముందుగానే హెచ్చరించి రక్షణ కల్పించాలన్నాడు. నిరంతర అభివృద్ధి(ఎస్‌డిజి) లక్ష్యాల సాధనకు ఏటా 500బిలియన్‌ డాలర్లు సమకూర్చాలి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో తద్వారా అభివృద్ధి, వాతావరణ పరిరక్షణ కార్యాచరణకు పూనుకోవాలన్నాడు.


తన మిలిటరీ బలాన్ని చూపి అదిరించి బెదిరించి ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు అమెరికా, దాని కూటమిలోని దేశాలు చూస్తున్నాయి. తమకు నచ్చని, తమ బాటలో నడవని దేశాల మీద ఉగ్రవాదం మీద పోరు, మరొక సాకుతో దాడులు, అక్రమణలకు, ఆంక్షల విధింపు వంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి. ఐఎంఎఫ్‌,ప్రపంచబాంకు వంటి ధనికదేశాల పెత్తనంలోని సంస్థలతో పాటు ధనిక దేశాలు ఇచ్చే రుణాలకు అనేక షరతులు విధిస్తాయి, వడ్డీ రేటు కూడా ఎక్కువే. అదే చైనా ఇచ్చే రుణాలు తక్కువ వడ్డీతో పాటు సాధారణం తప్ప ఐఎంఫ్‌ మాదిరి షరతులేమీ ఉండవు. ఉదాహరణకు శ్రీలంక, పాకిస్తాన్‌ వంటి దేశాలకు ఐఎంఎఫ్‌ ఇచ్చిన రుణాలకు ప్రైవేటీకరణ, పన్నుల పెంపు, అన్నింటినీ ప్రైవేటు రంగానికి అప్పగించాలన్న షరతులతో దేశ ఆర్ధిక విధానాల్లో చేయాల్సిన మార్పుల వంటివి ఉన్నాయి. చైనా రుణాలకు సాధారణ హామీ తప్ప మరొక షరతులేదు. ఈ కారణంగానే అనేక పేద, వర్ధమాన దేశాలు చైనా రుణాల కోసం చూస్తున్నాయి. ప్రస్తుతం 160 దేశాలు రుణాలు తీసుకున్నాయి. వాటిలో 150 దేశాల్లో చైనా బిఆర్‌ఐలో పెట్టుబడులు కూడా పొందుతున్నాయి. గడచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ బలాబలాల్లో స్పష్టమైన మార్పు జరుగుతోంది. పేద దేశాల మధ్య వాసి, రాసి పరంగా సహకారం పెరుగుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం వర్ధమాన దేశాలు ప్రపంచ జిడిపిలో 24శాతం సమకూర్చితే ఇప్పుడు నలభై శాతానికి పెరిగింది.


ఏ కూటమి సమావేశాలు కూడా రాజకీయాలకు అతీతంగా ఉండవు అన్నది గమనించాలి. బహుముఖ సంక్షోభంలో పేద దేశాలు బాధితులు గనుక ధనిక దేశాలకు వ్యతిరేకంగా సంఘటితం కావాలన్నది ఈ సమావేశాల్లో ముందుకు వచ్చిన అంశం. పేద దేశాలు ఈ పరిస్థితిని ఇంకేమాత్రం భరించే స్థితిలో లేనందున ధైర్యవంతమైన చర్యలకు పూనుకోవాలని వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో పిలుపునిచ్చారు. క్యూబా మీద ఆరుదశాబ్దాలుగా అమలు జరుపుతున్న ఆంక్షలు నేరపూరితమైనవని వర్ణించాడు. అమెరికా అనుచిత ఆంక్షలకు బలౌతున్నదేశాల్లో వెనెజులా కూడా ఒకటి అన్నది తెలిసిందే. నికరాగువా అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా మాట్లాడుతూ గత రెండు శతాబ్దాలుగా శత్రువు ఒకటే మనందరికీ తెలుసు, అదే అమెరికా అన్నాడు.పర్యావరణానికి హాని కలిగించే బొగ్గు, చమురు కర్బన ఉద్గారాలతో నిమిత్తం లేని ఆర్థిక వ్యవస్థ కావాలని కొలంబియా అధ్యక్షుడు గుస్తావ్‌ పెట్రో కోరాడు. వర్తమాన వాతావరణ మార్పుల కారణంగా 300 కోట్ల మంది నెలవులు తప్పుతారని, సారవంతమైన భూములు ఎండిపోతాయని, ఆహార సంక్షోభం ఏర్పడుతుందని, ప్రజాస్వామ్యం లేని పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించాడు. రష్యా-ఉక్రెయిన్‌ పోరు మీద ఒక వైఖరి అనుసరిస్తున్నదేశాలు ఇజ్రాయెల్‌-పాలస్తీనా మీద భిన్నవైఖరిని అనుసరిస్తున్నాయని పశ్చిమ దేశాల మీద ధ్వజమెత్తాడు.
హవానా సమావేశాల్లో 30 మంది వరకు దేశాధినేతలు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ జి-20 సమావేశాల్లో ఆఫ్రికా యూనియన్ను సభ్యురాలిగా చేర్చటంలో ప్రముఖ పాత్ర పోషించి పేద దేశాల ఛాంపియన్‌గా నిలిచినట్లు, వాటి వాణిగా ఉన్నట్లు చెప్పుకున్న ప్రధాని నరేంద్రమోడీ మొత్తం పేద, వర్ధమాన దేశాలతో కూడిన జి 77 సమావేశాలకు ఒక దేశాధినేతగా హాజరు కావాల్సి ఉంది. కనీసం విదేశాంగ మంత్రి జై శంకర్‌నైనా పంపాల్సి ఉండగా మొక్కుబడిగా ఒక అధికారిని పంపటం ఈ కూటమి దేశాల్లో మన గురించి ఎలాంటి అభిప్రాయాలకు తావిస్తుందో వేరే చెప్పనవసరం లేదు. ఈ నెల పద్దెనిమిది నుంచి 22వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల కారణంగా మంత్రి హాజరు కావటం లేదని ప్రకటించారు. హవానా సమావేశాలు 15,16 తేదీల్లో ముగిశాయి. పద్దెనిమిదవ తేదీన పార్లమెంటులో జరిగిందేమీ లేదు. పార్లమెంటులో ప్రతిపక్షాలతో సంప్రదింపులు, ఇతర అవసరాల కోసం పార్లమెంటరీ శాఖ మంత్రి ఉన్నారు. విదేశాంగ మంత్రి చేసేదేమీ లేదు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకావటానికి తగినంత సమయం ఉన్నప్పటికీ వెళ్లకపోవటానికి కారణం ఏమిటి ?


దశాబ్దాల తరబడి అమెరికా, దాని మిత్ర దేశాల అన్ని రకాల దిగ్బంధనానికి గురి అవుతున్న క్యూబా జి 77కు ఆతిధ్యం ఇస్తున్నది. ఇది సహజంగానే అమెరికాకు ఇష్టం ఉండదు.లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంతంలోని అనేక దేశాలను అమెరికాకు వ్యతిరేకంగా కూడగట్టటంలో క్యూబా కీలకపాత్ర పోషిస్తున్నది. ఆ ప్రాంత దేశాలతో చైనా సంబంధాలు, పలుకుబడి కూడా పెరుగుతున్నది. ఆగస్టు 21న సెంట్రల్‌ అమెరికన్‌ పార్లమెంటు సమావేశం ఆమోదించిన తీర్మానంలో చైనాను శాశ్వత పరిశీలక దేశంగా ఆమోదిస్తూ అంతకు ముందు ఆ స్థానంలో ఉన్న చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు ఇచ్చిన హౌదాను రద్దు చేసింది. చైనా-లాటిన్‌ అమెరికా దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 18శాతం పెరుగుతూ 2022నాటికి 485.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. ఆ కూటమిలోని దేశాలు అమెరికా, ఇతర ధనిక దేశాల పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నాయి.రష్యా -ఉక్రెయిన్‌ వివాదంలో అమెరికాకు వంతపాడేందుకు నిరాకరించాయి.మరోవైపున చైనా సహకారాన్ని దెబ్బతీసేందుకు పేద దేశాల మధ్య విభజనకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. పేద దేశాల ఛాంపియన్‌ భారత్‌ అని చెబుతున్నది.చైనాను వర్ధమాన దేశంగా గుర్తించకూడదంటూ ఏకంగా అమెరికా పార్లమెంటులో ఒక తీర్మానాన్నే చేశారు. చైనా ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా తలసరి జిడిపి, ఆదాయం కూడా వర్ధమాన దేశాల స్థాయిలోనే ఉంది. వర్ధమానదేశంగా గుర్తిస్తే కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది, వాటిని ఎగవేసేందుకే తిరస్కరణ అన్నది స్పష్టం. ఇటీవలి కాలంలో చైనాను ఎంతగా దెబ్బతీయాలని చూస్తే అంతగా అమెరికా, దాని మిత్రదేశాలు విఫలం, చైనా ముందుకు పోవటం చూస్తున్నదే. అన్నింటినీ మించి పూర్తి సభ్యురాలు కాకున్నా చైనాకు కూటమిలో పెద్ద పీట వేయటం, అమెరికా వ్యతిరేక విమర్శలకు వేదికగా ఉన్న చోట భారత్‌ ప్రేక్షకురాలిగా ఉండటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు సుతరామూ ఇష్టం ఉండదు. బహుశా విదేశాంగ మంత్రి గైరు హాజరుకు బయటకు వెల్లడించలేని అసలు కారణం ఇదే కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంతన్నాడింతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు : పదేండ్ల నరేంద్రమోడీ పాలనలో ఎగుమతులు తగ్గాయన్న ప్రపంచ బాంక్‌ !

16 Saturday Sep 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, 10 years Narendra Modi, BJP, China, Donald trump, India Exports, India Imports, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు మనల్ని నిలదీస్తారు. అంతే కాదు ప్రపంచ దేశాల్లో 2022 సౌదీ అరేబియా తప్ప జి-20 దేశాల్లో 6.7శాతంతో మన దేశమే అగ్రస్థానంలో ఉంది. మరి అలాంటపుడు మన దిగుమతులు కూడా ఎందుకు తగ్గినట్లు ? తాజాగా వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్‌ బరత్వాల్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు మన ఎగుమతులు 11.9శాతం తగ్గి 172.95 బిలియన్‌ డాలర్లుండగా మన దిగుమతులు 12శాతం తగ్గి 271.83 బి.డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే మన వాణిజ్య లోటు 112.85 నుంచి 98.88 బి.డాలర్లకు తగ్గింది. అంటే పద్నాలుగు బిలియన్‌ డాలర్ల మేర మన విదేశీమారక ద్రవ్యం మిగిలింది. కానీ సెప్టెంబరు 16వ తేదీ సమాచారం ప్రకారం గడచిన పదకొండు వారాలలో ఐదు బిలియన్‌ డాలర్లు తగ్గి మన నిల్వలు 593,9బి.డాలర్లకు చేరాయి. మన దిగుమతులు గతేడాది మాదిరిగా ఉంటే వాటి పరిస్థితి ఇంకా దిగజారి ఉండేది.

అంతన్నాడింతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు, హస్కన్నడు బుస్కన్నాడే గంగరాజు అంటూ సాగే జానపద గీతంలో మాదిరి పదేండ్ల నుంచి ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన కబుర్లేమిటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
గుజరాత్‌ తరహాలో దేశమంతటినీ అభివృద్ధి చేస్తామన్నారు. నల్లధనాన్ని వెలికి తీసి ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామని చెప్పారు. ఎగుమతులతో చైనాను వెనక్కు నెట్టేసేందుకు గాను మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత పధకాలను ప్రకటించారు. గంగరాజు మురిపించిన మాదిరి కబుర్లు తప్ప పరిస్థితి ఇంకా దిగజారింది తప్ప మెరుగుపడలేదు. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్ప కేంద్రం ప్రకటించిన ఆర్ధిక విధానాలనే రాష్ట్రాలు అమలు జరుపుతున్నాయి.మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలోనే కొనసాగుతున్నాయి. గ్లోబల్‌ ఫైనాన్స్‌ అనే పత్రికలో 2023 జూన్‌ ఎనిమిదవ తేదీన ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2022 వరకు ఐదు సంవత్సరాల కాలంలో మన సగటు వృద్ధి రేటు 4.1శాతం కాగా, దిగజారిందీ, తీవ్ర ఆర్థిక సమస్యలతో ఉందని చెబుతున్న చైనాలో 5.5 శాతం ఉంది. వికీపీడియా సమాచారం ప్రకారం 2022లో ఎగుమతులలో ప్రధమ స్థానంలో ఉన్న చైనా వస్తు, సేవల విలువ 3,71,582.7 కోట్ల డాలర్లు కాగా, అమెరికా 3,01,185.9 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మనదేశం 76,771.7 కోట్లతో పదవ స్థానంలో ఉంది. పదిహేనవదిగా ఉన్న హాంకాంగ్‌ ఎగుమతుల విలువ 69,829.3 కోట్ల డాలర్లు. చైనా తన ఉత్పత్తులు కొన్నింటిని హాంకాంగ్‌ పేరుతో ఎగుమతి చేస్తున్న సంగతి బహిరంగమే. ప్రపంచ జిడిపిలో దేశాన్ని నరేంద్రమోడీ ఐదవ స్థానంలోకి తీసుకుపోయినట్లు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నవారు ఎగుమతుల్లో ఎందుకు తీసుకుపోలేదన్నది ప్రశ్న. ప్రపంచబాంకు విశ్లేషణ ((https://data.worldbank.org/indicator/NE.EXP.GNFS.ZS?locations=IN ) )ప్రకారం 2004లో యుపిఏ అధికారంలోకి వచ్చినపుడు మన జిడిపిలో వస్తు, సేవల ఎగుమతుల విలువ 17.9 శాతం కాగా 2013 నాటికి 25.3కు పెరిగింది. మరుసటి ఏడు 23శాతంగా ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత అది క్రమంగా తగ్గుతూ 2019లో 18.7కు దిగజారింది. తరువాత 2022లో 22.4శాతం ఉంది.1960 నుంచి 1990 వరకు మన జిడిపిలో ఎగుమతుల విలువ 4.5 నుంచి 7.1శాతం మధ్య ఉంది. నూతన ఆర్థిక సంస్కరణల పేరుతో ఆర్ధిక విధానాల్లో మార్పుల తరువాత అది 1998 నాటికి 11 శాతానికి చేరింది. బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పాయి అధికారంలో ఉన్న 1998-2004కాలంలో పైన చెప్పుక్నుట్లు 17.9శాతానికి పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలోనే తొలిసారిగా పదేండ్ల కాలంలో పతనమైంది. ఎగుమతులను పెంచేందుకు ప్రతి దేశమూ చర్యలు తీసుకుంటున్నపుడు మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నవాటిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక నిర్దిష్ట విధానం, నిలకడ, స్పష్టత లేని, సరైనవి కాని విధానాలను అమలు జరిపినపుడు అవి జయప్రదం కావు. మన దేశంలో జరిగిందీ, జరుగుతున్నదీ అదే. జనానికి ఏం చెప్పారు, ఆచరణలో ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న.


చైనాతో సరిహద్దు ఉన్న గాల్వన్‌ లోయలో 2020లో జరిగిన ఉదంతంలో మన సైనికుల మీద చైనా మిలిటరీ దాడి చేసి చంపినదానికి ప్రతీకారం అంటూ నాడు చైనా యాప్‌ల మీద నిషేధం, చైనా నుంచి పెట్టుబడులు రాకుండా ఆంక్షల విధింపు హడావుడి చేసిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. దాంతో అనేక మంది చైనా ఉత్పత్తులు బహిష్కరిస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందని, నరేంద్రమోడీ అందుకు సమర్ధులని ప్రచార ఆర్భాటం చేశారు. జనాల మనోభావాలను సంతుష్టీకరించి చైనాను దెబ్బతీసిన మొనగాడిగా నరేంద్రమోడీ కనిపించిన సంగతి తెలిసిందే.యాప్‌లు, పెట్టుబడులు మన రక్షణను దెబ్బతీస్తాయని చెబితేే జనమంతా నిజమే కామోసు అనుకున్నారు. మోడీ మీద ఉన్న భ్రమ అలాంటిది. సరిహద్దు వివాదం, 1962లో యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాలూ వివాదాలకు దౌత్య సంబంధాలకు, వాణిజ్యానికి ముడిపెట్టకూడదన్న అవగాహనకు వచ్చాయి. దాని ఫలితం, పర్యవసానమే నరేంద్రమోడీ- షీ జింపింగ్‌ ఇద్దరూ కలసి ఊహాన్‌-మహాబలిపురాల్లో ఉయ్యాలలూగేందుకు దోహదం చేసింది. గాల్వన్‌ ఉదంతాలు తీవ్ర విచారకరమైనవి. కానీ వాటికి-వాణిజ్యానికి లంకెపెట్టి హడావుడి చేసిన పెద్దలు ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా తమ మాటలను తామే దిగమింగి పెద్ద ప్రచారం లేకుండా చైనా సంస్థలకు తిరిగి స్వాగతం పలుకుతున్నారు. ఇది రక్షణకు ముప్పులేదని అంగీకరించటమే కదా ! మన దేశంతో సరిహద్దులు కలిగి ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయించింది. చైనా మినహా మిగిలిన దేశాలన్నీ మన నుంచి పెట్టుబడులను తీసుకొనేవే తప్ప పెట్టుబడులు పెట్టే సత్తా వాటికి లేదన్నది తెలిసిందే. అందుకే ఆ నిబంధన చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. కానీ సూటిగా ఆ మాట చెప్పే ధైర్యం మోడీ సర్కార్‌కు లేదు. కొండంత ప్రతికూల రాగం తీసి కీచు గొంతుతో మాట్లాడుతున్నట్లు ఇప్పుడు దారి తెరిచారు.


మన దేశంలో షియోమీ ఫోన్లను సరఫరా చేసే డిక్సన్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో సెల్‌ ఫోన్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు పోతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ తెలిపింది. నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో రానున్న మూడు సంవత్సరాల్లో మూడు లక్షల చదరపు అడుగుల్లో స్మార్ట్‌ ఫోన్ల యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు, వచ్చే నెలలో ప్రారంభించనట్లు వార్తలో పేర్కొన్నారు. ఇదే విధంగా మన దేశంలోని అప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థకు బ్లూటూత్‌ నెక్‌బాండ్‌ ఇయర్‌ ఫోన్ల తయారీ కాంట్రాక్టును కూడా అదే కంపెనీ అప్పగించింది. ఇటీవలి కాలంలో షియోమీ కంపెనీ మీద విధించిన ఆంక్షలు, ఇతర కారణాలతో మన దేశంలో దాని ఉత్పత్తుల విక్రయం తగ్గింది. ఈ ఒప్పందాలతో ఆటంకాలను అధిగమించి తిరిగి మార్కెట్‌ వాటాను పెంచుకోవచ్చని భావిస్తున్నారు.చట్టబద్దంగా, మన చట్టాలకు అనుగుణంగా పని చేసే చైనాతో సహా ఏ దేశానికి చెందిన ఏ సంస్థనైనా అనుమతిస్తామని ఐటి, ఎలక్ట్రానిక్స్‌ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనా సరఫరా వ్యవస్థ నుంచి వైదొలగాలని అమెరికా, ఇతర ఐరోపా దేశాల గీతానికి మన దేశం కోరస్‌గా గొంతు కలిపింది. అయితే చైనా మీద ఆధారపడకుండా మనుగడ కష్టమని గడచిన మూడు సంవత్సరాల అనుభవతత్వం బోధపడటం, మన దేశంలోని కార్పొరేట్‌ సంస్థల వత్తిడి, ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ముందుకు రాకపోవటం, చైనా నుంచి కంపెనీలు వియత్నాంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పూనుకోవటం వంటి పరిణామాలతో చైనా కంపెనీల గురించి కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందన్నది స్పష్టం. తన వైఖరిని సమర్ధించుకొనేందుకు మనదేశ కంపెనీలకు 51శాతం వాటా ఉండాలన్న నిబంధన విధించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు 2022 డిసెంబరులోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు మీడియాకు లీకులు వదిలారు. గాల్వన్‌ ఉదంతాల తరువాత విధించిన ఆంక్షల ప్రకారం 2020-21లో చైనా నుంచి వచ్చిన 58 ఎఫ్‌డిఐ ప్రతిపాదనలను, మరుసటి ఏడాది మరో 33 ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది.సంయుక్త రంగంలో విద్యుత్‌ వాహనాల తయారీకి వంద కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామన్న చైనా బివైడి కంపెనీ ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. అయినప్పటికీ ఆ ప్రతిపాదన కూడా ఇంకా పరిశీలనలోనే ఉందని చెబుతున్నారు.2023 మార్చి 21 నాటికి చైనా లేదా హాంకాంగ్‌ నుంచి వచ్చిన 54 పెట్టుబడి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు తెలిపారు.


ప్రతి దేశం తన స్వంత పరిశ్రమలు, వాణిజ్యాన్ని కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నది. దానికి మనదేశం కూడా మినహాయింపు కాదు. నరేంద్రమోడీ సర్కారు కూడా ఆర్ధిక ఆయుధాలను ప్రయోగించి పరీక్షిస్తున్నది.చైనా విషయంలో అవి పని చేయటం లేదన్నది గత పది సంవత్సరాల అనుభవం చెబుతున్నది. చైనా నుంచి మన దిగుమతులు దాదాపు రెట్టింపు కావటమే దానికి నిదర్శనం. అదే మాదిరి మన ఎగుమతులు పెరగలేదు. ఐఎంఎఫ్‌ సమాచారం ప్రకారం రెండు దేశాల మధ్య 2022లో 117 బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగితే చైనా నుంచి దిగుమతుల వాటా 87శాతం ఉంది. మన దేశం నుంచి రొయ్యలు, పీతల వంటి సముద్ర ఉత్పత్తులు, పత్తి, గ్రానైట్‌, వజ్రాల వంటి వాటిని ఎగుమతి చేస్తుంటే చైనా నుంచి ఎలక్ట్రానిక్‌ చిప్స్‌,ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు, ఔషధాల తయారీకి అవసరమైన పదార్ధాలను దిగుమతి చేసుకుంటున్నాము. మన ఉత్పత్తుల ఎగుమతి నిలిపివేసినా చైనా వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కానీ చైనా నుంచి మనం తెచ్చుకుంటున్న వస్తువులను అంత తక్కువ ధరలకు మరేదేశమూ ఇవ్వని కారణంగానే మరో మార్గం లేకౖ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అనుమతించకపోతే కార్పొరేట్ల ఆగ్రహానికి మోడీ గురికావాల్సి వస్తుంది.


ఇక మనదేశం తీసుకుంటున్న రక్షణాత్మక చర్యల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆగస్టు మొదటి వారంలో అంబానీ కంపెనీ జియో లాప్‌టాప్‌లు,టాబ్‌లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. అంతకు ముందు అదే కంపెనీ వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకొని మార్కెట్‌ చేసింది. ఇప్పుడు విడిభాగాలను దిగుమతి చేసుకొని ఇక్కడ అసెంబ్లింగ్‌ చేస్తూ తన పేరు పెట్టుకుంది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాప్‌టాప్‌ల దిగుమతులపై ఆంక్షలు విధించి అవసరమైన వారు అనుమతి తీసుకోవాలంటూ నిబంధన విధించింది.ఇంతకాలం లేని అనుమతులు ఇప్పుడెందుకు ? ఇది ఎవరికోసమో చెప్పనవసరం లేదు. 2018లో అమెరికా అధినేతగా ఉన్న ట్రంప్‌ చైనా వస్తువుల మీద దిగుమతి పన్ను విధిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీశాడు. అదే ఏడాది మన కేంద్ర ప్రభుత్వం చైనా ఫోన్ల దిగుమతులను అడ్డుకొనేందుకు ఇరవైశాతం పన్ను విధించింది. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా బొమ్మలపై అప్పటికే ఉన్న దిగుమతి పన్నును 60, తరువాత 2021లో 70శాతానికి పెంచింది.షియోమీ, బిబికె ఎలక్ట్రానిక్స్‌ చెల్లించాల్సినదాని కంటే తక్కువ పన్ను చెల్లించినట్లు ఆరోపించి ఆ సంస్థల మీద దాడులు చేశారు. మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఉత్పాదక ఎగుమతి బోనస్‌గా చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం 33 బిలియన్‌ డాలర్లను పక్కన పెట్టి ఒక పధకాన్ని రూపొందించింది. అందుకోసం పద్నాలుగు రంగాలను గుర్తించింది, వాటిలో ఎక్కువగా చైనా కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతున్నది. చివరకు ఇప్పుడు ఆ చైనా కంపెనీల పెట్టుబడులకే అనుమతులు ఇచ్చి ఉత్పత్తులు చేయించేందుకు, సబ్సిడీలు ఇచ్చి ఎగుమతు చేయించేందుకు పూనుకుంది. స్థానిక కంపెనీలతో కలసి సంయుక్త సంస్థలను ఏర్పాటు చేయాలనే షరతు విధించింది. గతంలో నిషేధం విధించిన షి ఇన్‌ కంపెనీ మన అంబానీ రిలయన్స్‌తో ఒప్పందం చేసుకోవటంతో కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతించింది. ఎందుకు అంటే సదరు కంపెనీ ఇప్పుడు సింగపూర్‌లో ఉందని చెబుతున్నారు. ఎక్కడున్నా అది చైనా కంపెనీయే, లాభాలు వెళ్లేది చైనాకే కదా ! గతేడాది మన దేశం దిగుమతి చేసుకున్న ఉక్కు ఉత్పత్తుల్లో జూన్‌ నెలలో చైనా నుంచి 26.1, వియత్నాం నుంచి ఒకశాతం ఉండగా ఈ ఏడాది జూన్‌ నాటికి అవి 37.1, 4.8 శాతాలకు పెరిగాయి. చైనా ఉక్కు ఉత్పత్తుల దిగుమతి కారణంగా తమకు నష్టం జరుగుతోందని అందువలన వాటి మీద సబ్సిడీ వ్యతిరేక పన్ను విధించాలని మన ఉత్పత్తిదారులు చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే తిరస్కరించింది. దానికి తగిన ఆధారాలు లేవంది. ఇది చైనాను ప్రసన్నం చేసుకొనే చర్యగా ఆ రంగానికి చెందినవారు భావిస్తున్నారు. రాజకీయం, వివాదాస్పదం చేయటం, తిరిగి అదే చైనాకు అనుమతులు ఇవ్వటమెందుకు అంటే లేకుంటే కార్పొరేట్ల లాభాలకు గండి పడుతుంది, అప్పుడు వాటి కన్నెర్రకు గురి కావాల్సి వస్తుంది, చివరికి అధికారానికే ఎసరు వస్తుంది గనుక, కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జి 20 ఢిల్లీ శిఖరాగ్ర సభ : రష్యాను ఖండించకుండా పశ్చిమ దేశాలు ఎందుకు దిగి వచ్చాయి !

13 Wednesday Sep 2023

Posted by raomk in Africa, BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, G 20, G20 Delhi summit, Joe Biden, Narendra Modi, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో జి 20 దేశాల 2023 శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఒక సభ్య దేశ ఆతిధ్యంలో సమావేశాలు జరుగుతాయి. గత ఏడాది ఇండోనేషియాలో జరగ్గా వచ్చే ఏడాది బ్రెజిల్‌ వేదిక కానుంది. మరుసటి ఏడాది దక్షిణాఫ్రికాలో జరుగుతుంది, కాగా 2026లో జరగాల్సిన సభకు అమెరికా వేదిక కావటాన్ని చైనా ప్రశ్నించినప్పటికీ చివరికి అంగీకరించింది. ప్రతి సమావేశం తరువాత విడుదల చేసే సంయుక్త ప్రకటన విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తినప్పటికీ చివరికి విడుదల చేశారు. ఈ కూటమిలోని కొన్ని దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర విబేధాలు, పరస్పర అనుమానాలు తదితర కారణాల వలన చైనా అధినేత షీ జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హాజరు కాలేదు. దీని గురించి ఎవరికి తోచిన ఊహాగానాలను వారుచేశారు తప్ప అధికారికంగా సదరు దేశాల నుంచి ఎలాంటి ప్రకటనలూ విడుదల కాలేదు. చైనా తరఫున ప్రధాని లీ చియాంగ్‌, రష్యా నుంచి విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావరోవ్‌ ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించారు. ఈ కూటమిలో ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వం ఇవ్వటంతో ఇప్పటి నుంచి అది జి21గా మారింది. దీనిలో 19 దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా,ఇండోనేషియా, రష్యా, చైనా, అర్జెంటీనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, మెక్సికో, కెనడా, బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌, టర్కీ, ఇటలీ, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా ఉన్నాయి. ఆఫ్రికా యూనియన్‌, ఐరోపా యూనియన్‌ పూర్తి సభ్యత్వం గల సంస్థలు, ఐరాసతో సహా కొన్ని శాశ్వత ఆహ్వానితుల జాబితా ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తినపుడు ఒక పరిష్కార మార్గంగా ఈ కూటమి ఏర్పాటుకు 1999లో జి7 దేశాల కూటమి ఆలోచన చేసింది. 2008లో ధనిక దేశాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తినపుడు ప్రతి ఏటా శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.


ఈ కూటమిలో ఇప్పటి వరకు ఆహ్వానితురాలిగా ఉన్న ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వ హౌదా కల్పిస్తూ ఢిల్లీ సభ ఆమోదం తెలిపింది. దీనికి కారకులం తామంటే తామని మన దేశంతో పాటు రష్యా, చైనాలు కూడా ప్రకటించుకున్నాయి.ఈ చర్య ద్వారా పేద దేశాల గొంతుక వినిపించేందుకు అవకాశం వచ్చిందన్నది స్పష్టం. సభ్యత్వం ఇచ్చిన ఖ్యాతిని ఎవరి ఖాతాలో వేసుకోవటం అన్నది ముఖ్యం కాదు. వాటికి తోడ్పడుతున్నది ఎవరు అన్నదే గీటురాయి. దాన్ని పరిశీలించినపుడు ఇటీవలి కాలంలో ఆఫ్రికా ఖండంలో రష్యా, చైనా సాయంతో పాటు వాటి పలుకుబడి కూడా పెరుగుతోందన్నది అందరికీ తెలిసిందే. న్యూఢిల్లీ సభ జరిగిన తీరుతెన్నులు, పర్యవసానాలు, ఫలితాల గురించి సమీక్షలు వెలువడుతున్నాయి. తీసుకున్న నిర్ణయాలపై నవంబరు నెలలో వీడియో కాన్ఫరెన్సుద్వారా సమీక్ష జరుపుతారు. ఆమోదించాల్సిన తీర్మానాలు, నిర్ణయాల మీద ఏకాభిప్రాయం సాధించే బాధ్యత ఆతిధ్య దేశం కలిగి ఉంటుంది. అందుకు అనుగుణ్యంగానే దాన్ని మన దేశం కూడా నిర్వహించింది.ఐరాస తీర్మానాలు, పారిస్‌ ఒప్పందాల వంటి వాటినే అంగీకరించకుండా, అమలు జరపకుండా ఠలాయిస్తున్న దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి.నిర్ణయాలను స్వచ్చందంగా అమలు జరపటం తప్ప విధి కాదు. కొన్ని స్పందనలు, కొన్ని అభిప్రాయాలకు భిన్నంగా దేశాలు వ్యవహరిస్తున్న తీరు తెన్నుల గురించి స్థూలంగా చూద్దాం. ఈ సమావేశాలను తన రాజకీయ ప్రయోజనాలకు నరేంద్రమోడీ ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం మనదేశంలో ఇప్పటికే ఉంది. సభ జరిగిన తీరు మీద బిజెపి, నరేంద్రమోడీ మద్దతుదారుల స్పందన కూడా దానికి అనుగుణంగానే ఉంది.


పశ్చిమాసియాలో ప్రముఖ మీడియా సంస్థ ” అల్‌ జజీరా ” లో రాసిన ఒక విశ్లేషణ ఇలా ప్రారంభమైంది.” నరేంద్రమోడీ మోము, భారత దౌత్య మహత్తు(లేదా వివేకము) ప్రదర్శితమైంది.కానీ భారత భిన్నత్వ ప్రదర్శనకు అవకాశాన్ని నిరాకరించారు.భారత్‌ 140 కోట్ల జనాభా ఉన్న దేశం. కానీ సమావేశ రోజుల్లో రాజధాని నగరంలో ఎక్కడ చూసినా కేవలం ఒక ముఖమే కనిపించింది. జి 20 కూటమి నేతలకు ఆతిధ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్రమోడీదే అది. కేవలం విమానాశ్రయం వద్దనే కాదు, సభకోసం ఇటీవల జరిపిన నిర్మాణం వరకు చూస్తే ప్రతి రోడ్డు, కొన్ని చోట్ల ప్రతి కొన్ని అడుగులకు, ఎక్కువ చోట్ల రెండుకార్ల పొడవునా ఒక వ్యక్తి ప్రదర్శన మాత్రమే కనిపించింది. దౌత్య ఆడంబర ప్రదర్శనలో మోడీ హీరో కాగా మధ్య ఢిల్లీలో సభ నిర్వహణ ప్రాంతానికి సమీపంలోని విదేశీరాయబార కార్యాలయాలు, హౌటళ్ల వద్ద సంచరించే కోతులను భయపెట్టేందుకు వాటి బొమ్మలతో కూడిన భారీ కటౌట్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సభ జరిగిన చోట వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతీకగా ఉన్న మోడీ బొమ్మలు ఎక్కువగా కనిపించాయి. ప్రగతి మైదాన్‌గా పిలుస్తున్న ప్రాంతంలో కొత్త సభా భవనాన్ని నిర్మించి దానికి భారత మండపం అని పేరు పెట్టారు. దీంతో లౌకిక ముద్ర నుంచి దూరంగా జరిగినట్లయింది. హిందూ దేవాలయాల్లో ముందు వసారాలను మండపం అని పిలుస్తారు. ” ఈ విశ్లేషణలో వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు.


శిఖరాగ్ర సభ ఒక రోజు ముందే సంయుక్త ప్రకటనను ఆమోదించింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్‌ అని దానిలో పిలుపునిచ్చారు. ఈ సుభాషితంతో ఎవరికీ ఇబ్బంది లేదు, అభినందనీయమే. దానికి కట్టుబడి ఉన్నది ఎవరన్నదే ప్రశ్న. ఇది యుద్ధాలకు తగిన యుగం కాదు అన్నది ప్రకటనలోని ఒక అంశం. ఈ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్ల మీద ఈ కూటమిలోని దేశాలు దురాక్రమణలకు పాల్పడిన చరిత్ర, అనేక దేశాల మీద దాడులకు ఉగ్రవాదులను,కిరాయి మూకలను ఉసిగొల్పుతున్న తీరు తెలిసిందే. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోసిందీ, రష్యా ప్రాదేశిక భద్రత మీద ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆయుధాలను సరిహద్దుల్లోకి చేర్చటం ప్రారంభించిన తరువాతే పుతిన్‌ సైనిక చర్యకు పాల్పడినదాన్ని ప్రపంచం చూసింది. దాన్ని పరిష్కరించాల్సిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు తమ ఆయుధ సంపత్తిని అందిస్తూ ప్రోత్సహిస్తూ మరోవైపు సుద్దులు చెప్పటం హాస్యాస్పదం. తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని ఐరాస గుర్తించింది. దాన్ని విలీనం చేసుకొనే హక్కు చైనాకు ఉంది. దానికి తగిన సమయం రాలేదంటూ తైవాన్‌కు ఆయుధాలు ఇస్తూ చైనా మీద దాడికి ఉసిగొల్పుతున్న దేశాల నిజాయితీ ఏమిటన్నది ప్రశ్న. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో చైనా ఇంతవరకు ఏ దేశ నౌకనూ అడ్డుకున్న దాఖలా లేదు.


న్యూఢిల్లీ ప్రకటనలో పేర్కొన్న లక్ష్యానికి భిన్నంగా ప్రపంచంలో పరిణామాలు జరుగుతున్నాయి. అణ్వాయుధాల వినియోగం గురించి ప్రకటన హెచ్చరించింది. కానీ తానుగా వాటిని వినియోగించబోనని ప్రకటించేందుకు ఇంతవరకు అమెరికా అంగీకరించ లేదు. అణ్వాయుధాలను మోసుకుపోయే ఆధునిక క్షిపణులు, విమానాలను రోజు రోజుకూ మెరుగుపరుస్తోంది. ఐరాస నిబంధనావళి ప్రకారం ఏ దేశమూ బలప్రయోగం చేయకూడదని పేర్కొన్నది. దీని మీద కూటమి దేశాలు రాజీపడినట్లు ఉక్రెయిన్‌ మండిపడింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడతామని రష్యా కూడా అంగీకరించిందని అందుకే దిగి వచ్చి సంతకం చేసిందని కొందరు పశ్చిమ దేశాల వారు వక్రీకరించారు. వాస్తవానికి పశ్చిమ దేశాల వలలో చిక్కుకొని నాటోలో చేరి తమ ప్రాదేశిక భద్రతకు ముప్పు తలపెట్టినందున ఉక్రెయిన్ను దారికి తెచ్చేందుకు సైనిక చర్య జరుపుతున్నాం తప్ప దాన్ని ఆక్రమించుకొనే లక్ష్యం లేదని రష్యా ప్రారంభం నుంచీ చెబుతున్నది. రష్యా,ఉక్రెయిన్ల నుంచి ఆహారం, ధాన్యాలు, ఎరువుల సరఫరాను పునరుద్దరించాలని, ఎగుమతి దిగుమతులను అడ్డుకోరాదని, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కూడా జి21 కూటమి కోరింది. టర్కీ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించి తమను దెబ్బతీస్తున్న కారణంగానే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ కారణంగా అనేక పేద దేశాలు అధిక ధరలకు ఇతర దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితికి పశ్చిమ దేశాలే కారణం. రైతులు విదేశాలకు సైతం ఎగుమతులు చేసుకొని లబ్దిపొందవచ్చంటూ మూడు సాగు చట్టాలను రైతుల మీద రుద్దినపుడు కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ జి20 అధ్యక్ష స్థానంలో ఉన్నపుడే గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లి ఎగుమతులను కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.


ఢిల్లీ సమావేశానికి షీ జింపింగ్‌ హాజరు కాకపోవటం గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.గతంలో జరిగిన ఇలాంటి శిఖరాగ్ర సమావేశాలకు కొన్ని దేశాల నేతలు రాకపోవటం తెలిసిందే. కానీ జింపింగ్‌ రాలేదంటే దాని వెనుక బలమైన కారణాలేమీ లేవంటే ఎవరూ నమ్మరు, తప్పుకుండా ఉండి ఉంటాయి. చతుష్టయ కూటమి(క్వాడ్‌) అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియా కూటమి తనకు వ్యతిరేకమే అని చైనా భావిస్తున్నది. ఈ కూటమి నేతలను వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవ అతిధులుగా పిలవాలని మన ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీలో ఒక గదిలో చైనా ప్రధాని ఉండగా మరొక పక్క గదిలో జో బైడెన్‌-నరేంద్రమోడీ సమావేశమై క్వాడ్‌ పటిష్టత గురించి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్చా నౌకారవాణా గురించి చర్చలు జరిపారు. ఇవి చైనాను రెచ్చగొట్టేవే అన్నది స్పష్టం. వీటికంటే ముందే చైనా రూపొందించిన ప్రపంచ పటంలో మన భూభాగాలను కొన్నింటిని మినహాయించటం, దాని మీద వివాదం చెలరేగిన సంగతీ తెలిసిందే. గతేడాది ఇండోనేషియా నగరమైన బాలిలో జరిగిన సమావేశ ప్రకటనలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తూ చేర్చిన పేరా వివాదాస్పదమైంది. రాజీమార్గంగా చివరకు ఎక్కువ మంది సభ్యులు ఖండించారని, పరిస్థితి మీద ఇతరులు భిన్నమైన వైఖరులను వెల్లడించారని పేర్కొన్నారు. మొత్తం మీద ఖండన దానిలో కనిపించింది. ఆ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సుద్వారా మాట్లాడిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కూటమిని జి20 బదులు జి19 అని సంబోధించటం(రష్యాను గుర్తించకుండా) కూడా రచ్చకు దారి తీసింది. సమావేశం జరుగుతుండగా పోలాండ్‌లో క్షిపణి పేలుడు జరిగింది. వాస్తవాలు నిర్ధారించుకోకుండానే దానికి రష్యా కారణమని ఆరోపించటం, సభలో ఉన్న జి7, నాటో కూటమి దేశాల నేతలు అక్కడే విడిగా సమావేశం కావటం, వాటన్నింటికంటే ముందే రష్యా ప్రతినిధి వర్గ నేత లావరోవ్‌తో ఫొటో దిగేందుకు అనేక మంది నేతలు తిరస్కరించటంతో అసలు బాలిలో పాల్గన్నవారి కుటుంబ చిత్రమే లేకుండా పోయింది. తరువాత జరిగిన అనేక పరిణామాలు చైనా, రష్యాలతో అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల సంబంధాలు మరింతగా దిగజారాయే తప్ప మెరుగుపడలేదు. బాలిలో షీ జింపింగ్‌-జో బైడెన్‌ భేటీ జరిగింది, సంబంధాలను, మాటా మంతిని పునరుద్దరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన వెలువడింది. కానీ ఆ వెంటనే అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నానీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పంతంతో తైవాన్‌ వెళ్లటం తెలిసిందే. తరువాత అమెరికా సర్కార్‌ మరింతగా మిలిటరీ సాయాన్ని ప్రకటించింది. ఈ పూర్వరంగంలో వెళ్లకపోవటమే మంచిదని షీ జింపింగ్‌, పుతిన్‌ భావించి ఉండాలి.సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి బాలి ప్రకటనలో ఉన్న పదజాలానికి భిన్నంగా రష్యా పేరు లేకుండా యుద్ధం కారణంగా జనం పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే పేర్కొన్నారు. ఇది పశ్చిమ దేశాలకు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. బాలిలో మాదిరి ఖండిస్తే చైనా, రష్యా అంగీకరించకపోతే అసలు ప్రకటనే వెలువడి ఉండేది కాదు. అది జరిగితే తాము బలపరస్తున్న నరేంద్రమోడీ ప్రతిష్టకు భంగం అని భావించి పశ్చిమ దేశాలు అయిష్టంగానే రష్యా మిలిటరీ చర్య ప్రస్తావన లేకుండా అంగీకరించినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టుగా ఎలన్‌ మస్క్‌ కుమార్తె, కసితో భావజాలాన్ని అడ్డుకొనేందుకే ట్విటర్‌ కొనుగోలు !

09 Saturday Sep 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, COUNTRIES, Current Affairs, Europe, Germany, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ 2 Comments

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, communist, Elon Musk, Elon Musk daughter, Karl Marx, RSS


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిజం భావజాల వ్యాప్తిని అరికట్టేందుకు తొలుత ఐరోపాను ఆవరించిన భూతంగా నిందించారు. కారల్‌ మార్క్స్‌ను జర్మనీ, బెల్జియంల నుంచి వెళ్లగొట్టారు. తొలి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తరువాత కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు అమెరికా ఇతర ధనిక దేశాలు ప్రచ్చన్న యుద్ద్ధం సాగించాయి. అనేక దేశాల్లో కుట్రలు చేశాయి. అలెండీ వంటి వారిని హత్య చేశాయి. మిలిటరీ నియంతలను గద్దెలపై కూర్చో పెట్టాయి. సైనిక కూటములను ఏర్పాటు చేశాయి. వియత్నాం, లావోస్‌, కంపూచియా, ఉత్తర కొరియాలపై భౌతిక దాడులకు పాల్పడి భంగపడ్డాయి. విధిలేని స్థితిలో వియత్నాం నుంచి అమెరికన్లు బతుకు జీవుడా అంటూ పారిపోయారు.కమ్యూనిజం అంతమే తమ పంతం అని ప్రకటించిన అమెరికా గడ్డమీదే ప్రపంచ ధనికుడైన ఎలన్‌ మస్క్‌ కుమార్తె కమ్యూనిస్టుగా మారింది. అక్కడే లక్షలాది మంది యువత నేడు అక్కడ అవును మేము సోషలిస్టులం, కమ్యూనిస్టులం అంటూ ముందుకు వస్తున్నారు.


తన కుమార్తె కమ్యూనిస్టుగా మారిందన్న ఉక్రోషం, కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి ఒక వేదికగా ఉన్నందున నిరోధించేందుకు ఏకంగా సామాజిక మాధ్యమం ట్విటర్‌నే కొనుగోలు చేసినట్లు త్వరలో వెలువడనున్న ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రలో వెల్లడించారు. ఎలన్‌ మస్క్‌ 2000 నుంచి 2016వరకు మూడు వివాహాలు చేసుకొని ముగ్గురికీ విడాకులు ఇచ్చాడు, తరువాత 2018 నుంచి 2021వరకు ఒకామెతో సహజీవనం చేశాడు. ఇప్పుడెలా ఊరేగుతున్నాడో తెలవదు. పది మంది పిల్లల్ని కన్నాడు. వారిలో ఒకడైన గ్జేవియర్‌ అలెగ్జాండర్క్‌ మస్క్‌ 2004లో పుట్టాడు. 2022 జూన్‌లో కాలిఫోర్నియా కోర్టుకు సమర్పించిన ఒక వినతిలో తన పేరును వివియన్‌ జెనా విల్సన్‌ అని మార్చుకొనేందుకు అంగీకరించాలని, తాను యువతిగా లింగమార్పిడి చేయించుకున్నట్లు పేర్కొన్నాడు. తన తండ్రి ఎలన్‌ మస్క్‌తో గానీ, అతని ఆస్తిపాస్తులతో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని క్రటించాడు.2021లో లింగమార్పిడి జరిగింది.


తన కుమారుడు లింగ మార్పిడి చేయించున్నదాని కంటే స్కూల్లో వామపక్ష భావజాలానికి ప్రభావితుడు కావటం ఎలన్‌ మస్క్‌కు ఆగ్రహం తెప్పించింది. పచ్చి మితవాది అయిన మస్క్‌ తన కుమార్తెను కమ్యూనిస్టుగా వర్ణించాడు.కాలిఫోర్నియాలోని ఒక స్కూల్లో ఏడాదికి 50వేల డాలర్ల ఫీజు చెల్లించి చదివిస్తుండగా కమ్యూనిస్టు భావజాల వైరస్‌కు గురైందని, తన పట్ల కుమార్తె వైఖరి మారటానికి కొంత వరకు క్రాస్‌రోడ్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు స్కూలు పురోగామి విధానాలు కూడా కారణమని ఆరోపించాడు. తన కుమార్తె సోషలిజాన్ని అధిగమించి ధనవంతులందరూ దుష్టులని భావించే పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారిందని చెప్పాడు. తొలి రోజుల్లో ఉదారవాద భావాలతో కొడుకు లేదా కుమార్తె ఉన్నట్లు సరిపెట్టుకున్న తరువాత తెగతెంపులు చేసుకున్నాడు. అంతే కాదు, దీనంతటికీ కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి వేదికగా ఉపయోగపడుతున్న ట్విటర్‌ కూడా తన బిడ్డ వంటి అనేక మందిని కమ్యూనిస్టులుగా మార్చుతున్నదని, ట్విటర్‌ వేదికగా ఆ భావజాలం రోజు రోజుకు పెరుగుతున్నదని భావించాడు.అది ప్రజాస్వామ్యం, స్వేచ్చా భావ ప్రకటనకు ముప్పుగా మారిందని, దాని విధానాలను మార్చేందుకు ఏకంగా 44 బిలియన్‌ డాలర్లతో ఆ సంస్థను కొనుగోలు చేశాడు. అంటే పురోగామి భావాలను అడ్డుకొని మితవాద ప్రచారానికి దాన్ని వేదికగా మార్చనున్నాడన్నది స్పష్టం. దానికి అనుగుణంగానే గత యాజమాన్యం రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి పచ్చి మితవాదుల ఖాతాలన్నింటినీ పునరుద్దరించాడు. ట్విటర్‌ పేరు ఎక్స్‌గా మార్చాడు. వాల్టర్‌ ఇసాక్‌సన్‌ రాసిన ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రను సెప్టెంబరు 12న మార్కెట్‌కు విడుదల చేయనున్నారు. దాని గురించి ఆసక్తి కలిగించేందుకు కొన్ని భాగాలను మీడియాకు విడుదల చేశారు.


ఎలన్‌ మస్క్‌ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద భావజాలం ఉన్న వారు అమెరికాలో తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఒక బంతిని ఎదురుగా ఉన్న గోడవైపు ఎంత గట్టిగా విసిరితే అంతే వేగంతో తిరిగి మనవైపు వస్తుంది. భావజాలం కూడా అంతే. దేన్నయినా అణచివేయాలని చూస్తే అంతేవేగంతో విస్తరిస్తుంది. కొత్త రాతియుగం నుంచి చైనా నేత షీ జింపింగ్‌ వరకు కమ్యూనిజం చరిత్ర పేరుతో జర్నలిస్టు పాల్‌ మాసన్‌ రాస్తున్న పుస్తకం 2026లో విడుదల కానుంది. ఒక భావం, ఒక ఉద్యమం, ఒక పాలన వరకు ఎలా పరిణమించిందీ దానిలో ఉంటుందని చెబుతున్నారు. పురాతన, మధ్యయుగాలలో సంభవించిన తిరుగుబాట్ల నుంచి కమ్యూనిస్టులు ఈ భావ చరిత్రను గుర్తించారు. పందొమ్మిదవ శతాబ్ది పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాల పెరుగుదలతోనే ఈ కధ ముగియలేదు అన్నాడు పాల్‌ మాసన్‌. ” పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యాలు గిడసబారాయి, తమ మీద తమకే విశ్వాసం లేకుండా ఉన్నాయి. వాతావరణం గురించి పెరుగుతున్న ఆందోళన విప్లవాత్మక ఆర్థిక సమాధానాలను డిమాండ్‌ చేస్తున్నది. ప్రపంచ పేద దేశాల్లోని కోట్లాది మంది జనం దృష్టిలో చైనా ముందుకు తెచ్చిన అధికారతత్వ(ఇది రచయిత పదజాలం కాదు), రాజ్య నేతృత్వంలోని అభివృద్ధి ప్రత్నామ్నాయ నమూనాగా చూస్తున్నారు. ఇరవై సంవత్సరాల క్రితం కమ్యూనిజం అంతాన్ని చూశామని అనుకున్నాం.. ఈ రోజు ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీయే.ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. కావున ప్రచ్చన్న యుద్ధంలో భావజాల విజేతలు సెలవు తీసుకుంటూ రాసిన ఉద్గ్రంధాలన్నిటినీ భిన్నమైన చరిత్రగా చూడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాను. ఇప్పటికీ అనేక మంది ఆర్థిక పురోగతి సాధనకు స్వేచ్చకోసం ఎందుకు సిద్దం అవుతున్నారో అర్ధం చేసుకోవటానికి తోడ్పడుతుంది.” అని పాల్‌ మాసన్‌ చెప్పాడు.


అమెరికా స్కూళ్లలో విద్యార్ధులు కమ్యూనిస్టులుగా మారుతున్నారని గుండెలు బాదుకుంటున్నది ఒక్క ఎలన్‌ మస్క్‌ మాత్రమే కాదు. అనేక మంది మితవాద రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.అమెరికా స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు చైనా సంస్థలతో పరిశోధనా ప్రాజక్టులలో భాగస్వాములు కావటాన్ని నిషేధించాలని సెనెటర్‌ జేమ్స్‌ లాంక్‌ఫోర్డ్‌ డిమాండ్‌ చేశాడు. అంతర్జాతీయంగానే కాదు, అమెరికా గడ్డ మీద కూడా దేశాన్ని చైనా సవాలు చేస్తున్నదని, విద్యా సంస్థలలో పాతుకుపోతున్నదని ఒక ప్రకటనలో తాజాగా ఆరోపించాడు. అమెరికా పరిశోధనలను తస్కరిస్తున్నదని, రాజకీయంగా విద్యార్థులు, బోధకులు, వారి కుటుంబాల మీద ప్రభావం చూపుతున్నదని చెప్పుకున్నాడు. అమెరికాలో తన ప్రతిష్టను పెంచేందుకు అనేక పధకాలను రూపొందించిందని, వాటి ద్వారా గూఢచర్యం జరుపుతున్నదని ఆరోపించాడు. ఆగస్టు 27న చైనాతో పరిశోధన ఒప్పందం ముగిసినప్పటికీ జో బైడెన్‌ సర్కార్‌ మరో ఆరునెలలు పొడిగించిందని వాపోయాడు.
కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం అమెరికా పక్కనే ఉన్న మెక్సికోకు కూడా పాకింది. పాఠ్యపుస్తకాలకు కమ్యూనిస్టు వైరస్‌ సోకిందంటూ కొన్ని చోట్ల క్రైస్తవ మత బృందాలు తలిదండ్రుల పేరుతో కొందరిని సమీకరించి పుస్తకాలను తగులబెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పుస్తకాల్లో లైంగిక విజ్ఞానం, లింగసమానత్వం వంటి అంశాలు ఉన్నాయన్నది వారి ఆరోపణ. వాటి పంపిణీ నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ పుస్తకాల్లో మార్క్సిస్టు-కమ్యూనిస్టు సిద్దాంతాలను చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారవేసింది. పాఠ్య అంశాలను టీచర్లు, నిపుణులు రూపొందించినట్లు పేర్కొన్నది.


అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర శాసనసభలో రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మరియ ఎలివిరా సాలాజార్‌ ఒక బిల్లును ప్రవేశపెట్టారు.దానిలో కమ్యూనిజం, నిరంకుశత్వాలను ఒకే గాటన కడుతూ వాటివలన సంభవించే నష్టాలను విద్యార్ధులకుచెప్పాలని పేర్కొన్నారు. అమెరికా యువత కమ్యూనిస్టుల పాలనలో జరిగిన నేరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కమ్యూనిజం బాధితుల ఫౌండేషన్‌కు పాఠాలను రూపొందించే బాధ్యత అప్పగించాలని ప్రతిపాదించారు. గతంలో కూడా సాలాజార్‌ ఇదే బిల్లును ప్రవేశపెట్టగా దాన్ని చర్చించక ముందే మురిగిపోయింది. ఈ బిల్లును ప్రతిపాదించినపుడు అధికారంలో డెమోక్రాట్లు ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్లు ఉన్నందున తిరిగి ప్రవేశపెట్టారు.క్యూబా, కొరియా, వియత్నాం తదితర దేశాల నుంచి పారిపోయి వచ్చిన కమ్యూనిస్టువ్యతిరేకులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.


కమ్యూనిస్టు వ్యతిరేక వైరస్‌ ఒక్క అమెరికా, ఐరోపాల్లోనే కాదు మనదేశంలో కూడా ఉంది. ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌ విశ్వవిద్యాలయం ఎంఎ చరిత్ర విద్యార్ధుల సిలబస్‌లో అధ్యయనం చేయాల్సిన అంశాల్లో బిజెపి, రామజన్మభూమిని చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించింది. నూతన విద్యా విధానంలో భాగంగా సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇదే విశ్వవిద్యాలయం గతంలో బిఏ విద్యార్ధులకు ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి పాఠాన్ని సిలబస్‌లో చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమం, పార్టీల గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఆసక్తి కలగాలేగానీ పాఠ్యపుస్తకాలు, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లతో పనేముంది. అవేవీ లేనపుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందలేదా ? కమ్యూనిస్టు సిద్దాంతాలకు సంబంధించిన పుస్తకాలను బ్రిటీష్‌వారు, ఇతర సామ్రాజ్యవాదులు,అనేక దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించినపుడు జనం వాటిని సంపాదించుకోలేదా అధ్యయనం చేయలేదా ? ఈ చరిత్ర తెలిసి కూడా ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము. ఐరోపాలో చేనేత రంగంలో మరమగ్గాలు వచ్చినపుడు తమ వృత్తిని అవి దెబ్బతీస్తున్నాయని ఆగ్రహించిన కార్మికులు వాటిని ధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించి కొన్ని చోట్ల ఆపని చేశారు. సమస్య యంత్రాలది కాదు, వాటిని ధ్వంసం చేస్తే యాంత్రీకరణ ఆగదు. అదే విధంగా భూస్వాములను అంతం చేస్తే భూస్వామిక వ్యవస్థ రద్దవుతుందని నమ్మి ఆ పని చేసిన వారి సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నది ఎంత వాస్తవమో నిషేధాలద్వారా ఒక భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం కూడా సాధ్యం కాదన్నది కూడా అంతే నిజం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన అగ్ని క్షిపణులు చైనాను భయపెడతాయా ? పరిజ్ఞానంలో ఏ దేశం ఎక్కడుంది ?

06 Wednesday Sep 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Agni V, BJP, China, Missile technology, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


చైనాను చంద్రయాన్‌-3 విజయవంతం కావటంతో యావత్‌ దేశం మన ఇస్రో శాస్త్రవేత్తలను వేనోళ్ల కొనియాడుతున్నది. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరొక దారి అన్న సామెత తెలిసిందే.మన ఇస్రో విజయాన్ని కూడా మతకళ్లతో చూసే బాపతు రెచ్చిపోతున్నది. మన దేశంలో మిసైల్‌ మహిళగా పేరు తెచ్చుకున్న కేరళకు చెందిన టెసీ థామస్‌ గురించి సామాజిక మాధ్యమంలో తాజాగా ఒక పోస్టును పెట్టారు.యునైటెడ్‌ బ్రాహ్మిన్స్‌ ఫ్రెండ్స్‌(ఆల్‌ ఇండియన్‌ బ్రాహ్మిన్‌ కమ్యూనిటీస్‌)కు చెందిన ఒకరు పెట్టిన ఆ పోస్టులో ఉన్న అంశం ఏమంటే అగ్ని క్షిపణి రూపకర్త టెసీ థామస్‌ అనీ ఆమె నుదుట బొట్టు, దాని మీద చిన్న గంధపు గీత ఉందని రాశారు. ఆమె క్రిస్టియన్‌ అయినప్పటికీ హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు చెప్పటం దీని లక్ష్యం. క్షిపణి రూపకర్తలలో ప్రముఖురాలు ఆమె అనటంలో ఎవరికీ పేచీ లేదు. అందరూ అభినందించాల్సిన అంశమే. బిజెపి ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన కంగన రనౌత్‌ చంద్రయాన్‌-3 విజయం గురించి స్పందించారు. అందరికీ ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభ పాటవాలు కనిపిస్తే ఆమె వేరే విధంగా చూశారు. మహిళా శాస్త్రవేత్తలు ఉన్న ఒక ఫోటోను తన ఇనస్టాగ్రామ్‌లో పోస్టు చేసి వారంతా బిందీ, సింధూరాలు, తాళిడబొట్లు ధరించి ఉన్నారని, ఉన్నత ఆలోచనలు, సాధారణ జీవితాల భారతీయతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలా చెప్పటం ద్వారా బొట్టు లేనివారు కాదని ఆమె జనాలకు సందేశం ఇవ్వదలచుకున్నారు. దాని తరువాతే టెసీ థామస్‌ బొట్టు, చందనం గురించి బ్రాహ్మణ సంఘాలు పోస్టు పెట్టాయి. రెండవ అంశం ఏమంటే 145 కోట్ల చైనీయుల గుండెల్లో భయం పుట్టించిన మహిళ అని చెప్పారు. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అణువార్‌ హెడ్‌తో చైనాలోని ఏ ప్రదేశాన్నైనా ఖచ్చితత్వంతో ఢకొీట్టగల అగ్ని-5 క్షిపణి రూపకర్త టెసీ థామస్‌ అని రాశారు.(ఆమె క్రిస్టియన్‌ అయినప్పటికీ బ్రాహ్మణ క్రైస్తవురాలని, అందుకే బ్రాహ్మణ సంఘాలు ఆమె గురించి రాసినట్లు సామాజిక మాధ్యమంలో కొందరు స్పందించారు ) ఆ క్షిపణిని 2018లోనే పరీక్షించారు, మిలిటరీకి అందచేశారు, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి ?


అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అని చెప్పిన వారే ఇప్పుడు శాస్త్రవేత్తలకు మతం, కులం ఆపాదించుతున్న తీరును చూస్తున్నాం.వారిలో ఎవరైనా బొట్టు పెట్టుకోలేదో దేశవ్యతిరేక మతాల ముద్రవేస్తారు. వాటిని పక్కన పెడితే చంద్రయాన్‌ విజయం, అగ్ని క్షిపణితో మన మిలిటరీ సామర్ధ్యం పెరుగుతుందన్నది స్పష్టం. కానీ చైనీయులకు భయం పుట్టించిందని చెప్పటం అవసరమా ? అసలది నిజమా ? అతిశయోక్తులు మాత్రమే. అంతరిక్ష ప్రయోగాల్లో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, క్షిపణుల రంగంలోనూ అదే పరిస్థితి. తాజా సమాచారం ప్రకారం జూలై రెండవ వారంలో గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌(జిఎఫ్‌పి) అనే సంస్థ మిలిటరీ బల రాంకులు-2023 ప్రకారం శక్తివంతమైన పది దేశాల్లో వరుసగా అమెరికా, రష్యా, చైనా, భారత్‌,బ్రిటన్‌, దక్షిణ కొరియా,పాకిస్థాన్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ ఉన్నాయి. నూటనలభై దేశాలలో అత్యంత బలహీనమైన దేశాల మిలిటరీలో భూటాన్‌ తొలి స్థానంలో ఉంది. ఈ రాంకులు ప్రతి ఏడాదీ మారుతుంటాయి. గతేడాది తొలి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాల్లో ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. గతేడాది ఎనిమిదో స్థానంలో ఉన్న బ్రిటన్‌ తాజాగా ఐదవ స్థానంలోకి వచ్చింది. పాకిస్థాన్‌ తొలిసారిగా మొదటి పదిలో ఏడవ స్థానం పొందింది. ఇక ఈ రాంకులు ఇచ్చేందుకు అన్ని దేశాలు అంగీకరించిన ఒక ప్రామాణిక సంస్థ ఏదీ లేదు.


ఉదాహరణకు ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వచ్చిన వార్తల ప్రకారం అమెరికాకు చెందిన ఫెయిర్‌ బృందం రాంకులను యుఎస్‌ న్యూస్‌ ప్రకటించింది. దాని ప్రకారం అత్యంత శక్తివంతమైన మిలిటరీలో చైనాకు రెండవ, భారత్‌కు 14స్థానం ఇచ్చారు. వీటిని తయారు చేసింది అమెరికా సంస్థలు, అక్కడి ఆయుధ తయారీదారుల హస్తం దీని వెనుక ఉన్నట్లు కనిపిస్తున్నది. చైనాతో పోల్చితే భారత్‌ ఎంతో వెనుకబడి ఉంది కనుక ఆయుధాలను మరింతగా కొనాలని వత్తిడి తెచ్చే ఎత్తుగడ ఉందన్నది స్పష్టం. ఎందుకంటే అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు వెంట తన ఆధీనంలోని భూ భాగంలో గతంలో ఎప్పుడో నిర్మించిన గృహాల స్థానంలో చైనా కొత్తవాటిని నిర్మిస్తే ఇంకే ముంది అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా వారు గ్రామాలను నిర్మిస్తున్నట్లు మన దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు అమెరికా సంస్థలు చూసిన సంగతి తెలిసిందే.మన దేశం ప్రపంచంలో అన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో పదకొండుశాతం వాటాతో ప్రధమ స్థానం కలిగి ఉండగా చైనా 4.6శాతమే కలిగి ఉంది. అంటే ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడటం తక్కువగా ఉంది. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ సంస్థ పేర్కొన్న సమాచారం ప్రకారం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న చైనా-భారత్‌ మిలిటరీ బలాల పోలిక దిగువ విధంగా ఉంది.
అంశం ××××××× చైనా ××××× భారత్‌
రాంకు ××××××× 3 ××××× 4
అందుబాటులో జనం ××76,16,91,468×× 65,31,29,600
మిలిటరీకి అర్హులు ××62,48,69,113×× 51,55,55,492
ఏటా మిలిటరీవయస్సు వారు××1,97,47,552 ×× 2,36,23,837
రక్షణ బడ్జెట్‌, బి.డాలర్లు ×× 230 ×× 50.2
విమానాలు ×× 3,284 ×× 2,210
యుద్ద విమానాలు ×× 1,199 ×× 577
హెలికాప్టర్లు ×× 913 ×× 807
విమానాశ్రయాలు ×× 507 ×× 346
యుద్ద టాంకులు ×× 4,950 ×× 4,614
యుద్ద నౌకలు ×× 730 ×× 295
వి.వాహకనౌకలు ×× 3 ×× 2
హెలికాప్టర్‌ నౌకలు ×× 3 ×× 0
జలాంతర్గాములు ×× 78 ×× 18
డెస్ట్రాయర్లు ×× 50 ×× 11
రేవులు ×× 22 ×× 13
స్వయంచలిత ఆర్టిలరీ ×× 2,720 ×× 100
రాకెట్‌ ఆర్టిలరీ ×××××× 3,140 ×× 960
సాయుధ శకటాలు ×× 14,130 ××× 8,600


భారత్‌ వద్ద మిగ్‌-21 రకం 107, మిగ్‌-29 రకం 66 ఉన్నాయి. చైనా వద్ద స్వంత తయారీ జె-11 రకం 442, జె-7 రకం 388, జె-18 రకం 96, యస్‌యు-30 రకం 121 ఉన్నాయి. బహుముఖ పాత్ర పోషించే యుద్ద విమానాలు మన దేశం దగ్గర సుఖోరు -30 రకం 272, మిరేజ్‌ 49, మిగ్‌ – 29 రకం 36, రాఫెల్‌ 26, తేజస్వి 22, కమోవ్‌ 14 మొత్తం 393 ఉన్నాయి. అదే చైనా వద్ద అన్ని రకాలు కలసి 1,130 ఉన్నాయి. మన దగ్గర మిలిటరీ డ్రోన్లు 12 ఉండగా, చైనా వద్ద 151ఉన్నాయి. రాఫెల్‌ 4.5 తరం విమానాలను మనం కొనుగోలు చేయగా, దాని కంటే మెరుగైన స్వంత తయారీ 5వ తరం జె-20 విమానాలు చైనా వద్ద ఉన్నాయి.మిలిటరీ ఆయుధాలకు సంబంధించి ప్రపంచ సంస్థలు చెప్పే అంకెలు కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ మిలిటరీ బలాబలాల ధోరణులు తెలుసుకొనేందుకు ఉపయోగపడతాయి.వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ 2023 అంచనా ప్రకారం చైనా వద్ద 350, పాకిస్థాన్‌ దగ్గర 165, మనదగ్గర 156 అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలను ఉపయోగించబోమని భారత్‌-చైనా ప్రకటించాయి. అందువలన ఎవరి దగ్గర ఎంత ఎక్కువ దూరం ప్రయాణించే క్షిపణులు ఉన్నప్పటికీ వాటితో అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం లేదు. ఎవరైనా దాన్ని ఉల్లంఘించి అణుదాడులకు పాల్పడితే ఎవరూ మిగలరు. అందువలన మన అగ్ని క్షిపణిని చూసి చైనా వారు గానీ వారి వద్ద 12 నుంచి 15వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే డిఎఫ్‌-41క్షిపణులను చూసి మన జనం భయపడుతున్నారా అంటే లేదు.మన అణుక్షిపణి పరిధి ఏడువేల కిలోమీటర్లని మన శాస్త్రవేత్తలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మన దేశంతో సహా అన్ని దేశాలూ అలాంటివి మరింత వేగంతో, ఎక్కువ దూరం ప్రయాణించేందుకు నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉంటాయి. ది కంట్రీస్‌ ఆఫ్‌ డాట్‌ కామ్‌ ఆగస్టు ఎనిమిదిన వెల్లడించిన సమాచారం ప్రకారం 2023లో క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో వున్న పది దేశాల వరుస ఇలా ఉంది. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, భారత్‌, ఇజ్రాయెల్‌, పాకిస్థాన్‌, ఇరాన్‌, ఉత్తర కొరియా ఉన్నాయి.మన పొరుగునే ఉన్న పాకిస్థాన్‌ ఇప్పటికే 2,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఘౌరీ, షాహిన్‌ క్షిపణులను కలిగి ఉంది, వాటిని ఇంకా విస్తరించే పరిశోధనలో ఉంది. దాని దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అంత మాత్రాన భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. మనకు పాక్‌, చైనా ఎంత దూరమో, మనం కూడా వాటికి అంతేదూరంలో ఉన్నాము.


ఒకరు బాంబులు విసురుతుంటే రెండోవారు గులాబ్‌ జాములు అందిస్తూ స్పందించేంత ఉత్తములు ఈ రోజుల్లో ఎవరూ ఉండరు. అలా ఉండాలన్నా ఉండనివ్వరు. శత్రుదేశాల ఉపగ్రహాల మీద దాడి చేసేందుకు అవసరమైన ఆయుధాలను చైనా రూపొందిస్తున్నట్లు, ఇతర దేశాల ఉప గ్రహాలను అదుపులోకి తెచ్చే సత్తా ఉన్నదని సిఐఏ నివేదించినట్లు బహిర్గతమైన అమెరికా గూఢచార, ఇతర కీలక పత్రాల్లో ఉంది.చైనా ఆయుధాల గురించి సిఐఏ పత్రాలను ఉటంకిస్తూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రికలో పేర్కొన్నారు. స్టాక్‌హౌమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) విడుదల చేసిన 2022 వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. అంతరిక్షం, సైబర్‌ రంగాలలో అమెరికా ముందున్నది. తాజాగా చంద్రయాన్‌ -3 విజయం, ఇతర ఉపగ్రహాల ప్రయోగాలతో మన దేశం కూడా ధీటుగా ఉండేందుకు అవకాశాలు పెరుగుతున్నాయి. సైబర్‌ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్‌గా ఉంది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల సమాచారం గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. దాని ద్వారా మనతో సహా ఏ దేశ సమాచారాన్నైనా అమెరికా తెలుసుకోవచ్చు. దీని మాతృసంస్థ ఎలాన్‌ మస్క్‌ అధిపతిగా ఉన్న స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ ఇప్పటి వరకు 3,580 చిన్న ఉపగ్రహాలను పంపి 53 దేశాలకు సమాచారాన్ని అందచేస్తున్నది, వాటిని పన్నెండువేలకు పెంచాలని కూడా చూస్తున్నది. అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి ఇదొక నిదర్శనం.


అమెరికా, అది ఎగదోస్తున్న దేశాలు ఇటీవలి కాలంలో మిలిటరీ ఖర్చు పెంచటం, కొత్త కూటములను కడుతుండటంతో మన దేశం, చైనా కూడా తన ఖర్చును పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం మూడవ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్‌ 24వదిగా ఉంది. ఏ దేశమైనా మిలిటరీ ఖర్చును పెంచి అది జనాల మీద భారం,జీవితాలు మెరుగుపడే అవకాశం లేదన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ఉగ్రవాదం కారణంగా పక్కనే ఉన్న శ్రీలంక తన వనరులన్నింటినీ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు గాను మిలిటరీని విపరీతంగా పెంచింది. ఉగ్రవాదులను నిర్మూలించినా వెంటనే దాని మిలిటరీ ఖర్చు వెంటనే తగ్గదని తేలింది.మనతో గిల్లికజ్జాలు పెట్టుకొనే పాకిస్తాన్‌ తలసరి ఖర్చు మనకంటే ఎక్కువే. అది ఇప్పుడు ఆర్థికంగా ఎంత దివాళా తీసిందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నదో చూస్తున్నదే. మన దేశంలో ఉన్న కొంత మంది చైనాను బూచిగా చూపి మిలిటరీ బడ్జెట్‌ను గణనీయంగా పెంచాలని చెప్పటం వెనుక అమెరికా మిలిటరీ కార్పొరేట్‌ లాబీ ఉందన్నది స్పష్టం.మన జిడిపితో పోలిస్తే చైనా ఐదురెట్లు ఎక్కువ.అందువలన దానితో మిలిటరీ ఖర్చులో మనం పోటీ పడాలంటే వనరులన్నింటినీ మళ్లించాల్సి ఉంటుంది. అది జరిగితే ఆర్థికవృద్ది కుంటుపడుతుంది.అలాగని మన రక్షణ ఏర్పాట్లను నిర్లక్ష్యం చేయనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సనాతన ధర్మంపై పోరుకు అంబేద్కర్‌ మారుపేరు : వ్యాఖ్యల నుంచి తగ్గేది లేదన్న ఉదయనిధి స్టాలిన్‌ !

05 Tuesday Sep 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

# Anti Sanatan Dhrma, #Hindutva, #Udhayanidhi Stalin, Anti Hindu, BJP, DMK, Dravida, Eradicate Sanatan Dharma, INDIA, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


” మన సమాజానికి సనాతన ధర్మం ఒక మలేరియా, డెంగీ వంటిది, దాన్ని వ్యతిరేకించటం కాదు, రూపుమాపాలి ” అని శనివారం నాడు తమిళనాడు పురోగామి రచయితలు మరియు కళాకారుల అసోసియేషన్‌ సభలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వెల్లడించిన అభిప్రాయం దేశంలో దుమారం రేపింది.ఇది హిందూ వ్యతిరేక వైఖరి, సనాతన ధర్మాన్ని పాటించే వారిని ఊచకోత కోయాలని పిలుపు ఇచ్చారంటూ బిజెపి చిత్రించింది. మాట్లాడే స్వేచ్చ పార్టీల కుందని కాంగ్రెస్‌ చెప్పగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ తప్పుపట్టింది. చెన్నయి సభ సందర్భంగా నిర్వాహకులు ” సమతా ధర్మ నిర్మూలన ” అనే అంశంపై చర్చను పెట్టారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటం గాక నిర్మూలించాలని నిర్వాహకులు పేరు పెట్టినందున వారిని అభినందిస్తున్నానని ఉదయనిధి స్టాలిన్‌ అన్నారు.” కొన్ని అంశాలను మనం నిర్మూలించాలే తప్ప దోమలు, డెంగీ, కరోనా, మలేరియా వంటి వాటిని కేవలం వ్యతిరేకించలేం, నిర్మూలించాలి. సనాతన ధర్మం కూడా ఇలాంటిదే.వ్యతిరేకించటంగాక నిర్మూలించటం అన్నది మన తొలి లక్ష్యంగా ఉండాలి అన్నారు. సనాతనం జనాన్ని కులపరంగా చీల్చిందని చెప్పారు. అది సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం తప్ప మరింకేమీ కాదన్నారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలో ఒకదానిలో అన్నింటా మనం గెలవాలి. సనాతనం ఓడాలి, ద్రావిడం గెలవాలి అన్నారు. ప్రతిదాన్నీ ప్రశ్నించేందుకే కమ్యూనిస్టు, ద్రవిడ ఉద్యమం పుట్టిందని అన్నారు.


సనాతన ధర్మాన్ని రూపుమాపాలి అని చెప్పిన తన మాటలను బిజెపి వక్రీకరించిందని రద్దు లేదా రూపు మాపాలి అంటే అర్ధం సనాతన ధర్మాన్ని పాటించేవారిని అంతం చేయాలని కాదని ఉదయనిధి స్పష్టం చేశారు. తన వైఖరిని పదే పదే వెల్లడిస్తానని, సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించానని, దాని మీద ఎన్నికేసులు దాఖలైనా ఎదుర్కొంటానని ఆది, సోమవారాలలో పునరుద్ఘాటించారు. కొంత మంది తీరు పిల్లచేష్టల మాదిరి ఉందంటూ ద్రావిడవాదాన్ని రద్దుచేయాలి అని చెప్పినవారి మాటలకు అర్ధం డ్రావిడులను అంతం చేయాలనా, కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారు అంటే కాంగ్రెస్‌ వారిని చంపాలనా అని ప్రశ్నించారు. సనాతన అంటే దేన్నీ మార్చకూడదు, దానిలో చెప్పినవన్నీ శాశ్వతంగా ఉంటాయని అర్ధం అని ఉదయనిధి చెప్పారు. అదిఆద్యంత రహితమైనది, దాన్ని మార్చలేము, ఎవరూ దాన్ని ప్రశ్నించకూడదన్నదే దాని అర్ధం,కుల ప్రాతిపదికన సనాతనం జనాన్ని చీల్చింది అన్నారు.


సనాతన ధర్మ పునరుద్దరణ కోసమే పుట్టామని చెబుతున్న హిందూత్వశక్తులు రెచ్చిపోతున్న తరుణమిది. ఆ ధర్మం పేరుతో కోట్లాది మందిని అంటరానివారిగా, విద్య, వ్యక్తిత్వాలకూ దూరం చేసిన భావజాలం మీద అంబేద్కర్‌ , వామపక్ష, పురోగామి, హేతువాదులు నిరంతరం పోరాడారు. దాన్ని కొనసాగించటం కోసం నేడు కోట్లాది మంది అంబేద్కర్‌లు తయారు కావాల్సిన అవసరం వచ్చింది.ఇది భావజాల పోరు. దానిలో భాగంగానే ఉదయనిధి స్టాలిన్‌ వదిలిన ఒక వాగ్బాణం దెబ్బకు విలవిల్లాడుతున్న వారు దాన్ని చిలవలు పలవలుగా మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఉదయనిధి స్టాలిన్‌ తల నరికిన వారికి పది కోట్ల రూపాయల బహుమతి ఇస్తానని అయోధ్య తపస్వి ఛావనికి చెందిన మహంత పరమహంస దాస్‌ పిలుపు నిచ్చారు. గత రెండు వేల సంవత్సరాలలో అనేక మతాలు వచ్చి అంతరించాయని సనాతన ధర్మం మాత్రమే మిగిలి ఉందని అన్నారు. దాన్ని ఎవరైనా నాశనం చేయాలని చూస్తే అంతు చూస్తామని అన్నారు. ఉదయనిధిని చంపివేస్తే తాను కోటి రూపాయలు ఇస్తానని బిజెపి నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ నేత దిలీపాచారి ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు మత ఉగ్రవాదం తప్ప మరొకటి కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కొన్ని చోట్ల కొందరు కేసులు దాఖలు చేశారు.


” భగవద్గీతలో ప్రవచించిన హిందూ సామాజిక తత్వాన్ని నేను తిరస్కరిస్తాను.అది సాంఖ్య తత్వశాస్త్రంలోని త్రిగుణాల ప్రాతిపదికన ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఇది కపిలుడి తత్వశాస్త్రానికి క్రూరమైన వక్రీకరణ రూపం, అది హిందూ సామాజిక జీవన న్యాయంలో అంతరాలతో కూడిన అసమాన కుల వ్యవస్థను తయారు చేసింది. సహపంక్తి భోజనాలు లేదా అక్కడక్కడా జరిగే కులాంతర వివాహాల వలన కులం అంతరించదు. కులం ఒక మానసిక స్థితి, అది బుర్రకు పట్టిన వ్యాధి. ఈ వ్యాధికి హిందూ మతబోధనలే మూలకారణం. మనం కులతత్వాన్ని , అస్పృశ్యతను పాటిస్తున్నాం.హిందూమతం ద్వారా వాటిని చేసేందుకు ఆజ్ఞాపితులమయ్యాము.పచ్చి చేదును తీపిగా మార్చలేము. దేని రుచినైనా మార్చగలము.కానీ విషాన్ని అమృతంగా మార్చలేము.మానవులు శాశ్వతం కాదు. భావజాలం కూడా అంతే.మొక్కలకు నిరంతరం నీటిని అందించటం ఎంత అవసరమో ఒక భావజాలానికి ప్రచారం కూడా అంతే అవసరం, లేకుంటే రెండూ చచ్చిపోతాయి.నేను చివరిగా చెప్పేదేమంటే జనాలను మీరు చైతన్యపరచండి, పోరు సాగించండి, సంఘటితపరచండి, మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి.మన పోరు సంపద కోసమో లేదా అధికారం కోసమో కాదు. స్వేచ్చకోసం, ఇది మానవ వ్యక్తిత్వ పునరుద్దరణ పోరు. ” ఇవి వివిధ సందర్భాలలో మహనీయుడు బిఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన మాటలు, చేసిన దిశానిర్దేశం.


ఉదయనిధి స్టాలిన్‌ చేసి వ్యాఖ్యల మీద సహజంగానే బిజెపి, దాన్ని అనుసరించేవారు మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విరుచుకుపడుతున్నారు. వర్తమాన పరిస్థితుల్లో అదేమీ అనూహ్యమైంది కాదు. శాంతి, సహనాల గురించి రోజూ సుభాషితాలు చెప్పే వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సనాతన ధర్మ ప్రబోధకులు, దాన్ని అమలు చేయాలని చూసే వారిని గట్టిగా విమర్శిస్తే వారు మరింత రెచ్చిపోతారు, జనం అర్ధం చేసుకోకపోతే మనకే నష్టం అని చెప్పేవారు మంచి ఉద్దేశంతోనే చెబుతున్నారు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవటం తప్ప భావజాల పోరును పక్కన పెడితే మరింతగా రెచ్చిపోతారు. దేశంలో చివరికి ఏ గల్లీ సిల్లీ స్వామీజీని కదలించినా చెప్పేవి ధర్మం కోసం దేశం, సనాతనం, హిందూత్వ పరిరక్షణ, ముస్లింలుక, కైస్తవులు దేశానికి ముప్పుగా మారారు అనే కబుర్లే కదా ! ఉదయనిధి స్టాలిన్‌ వంటి వారు మాట్లాడినందునే వారంతా రెచ్చిపోతున్నారా ? లేదు, ఒక అజెండా ప్రకారమే వారు మాట్లాడుతున్నారు, వామపక్ష, పురోగామి వాదులతో పాటు ఉదయనిధి మాదిరి మాట్లాడేవారు ఇతర పార్టీలలో ఇప్పుడు ఎందరున్నారు అన్నది ప్రశ్న. సనాతవాదుల మారణకాండకు పిలుపునిచ్చినట్లు అతని మాటలను వక్రీకరించిన బిజెపి తీరు దేశం చూస్తున్నది. ఒక భావజాలాన్ని మరొక భావజాలం కలిగిన వారు విమర్శించటం ప్రజాస్వామిక లక్షణం. అనేక అంశాల మీద తర్కం జరిగినట్లు మన ప్రాచీన భారత చరిత్ర కూడా చెబుతున్నది. హిందూత్వ, సనాతనం మీద విమర్శలు చేస్తే అవి ఆ శక్తులకే ఉపయోగపడతాయని, జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలని కొందరు సనాతన ధర్మ వ్యతిరేకులు కూడా మాట్లాడుతున్నారు.

అసలు కమ్యూనిస్టులు, ఇతర పురోగామి వాదులు గతంలో గట్టిగా పోరాడని కారణంగానే మతశక్తులు పేట్రేగిపోయారని చెప్పేవారు కూడ మనకు తగులుతారు.కానీ అసలు కారణం అది కాదు, స్వాంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉండటమేగాక ద్రోహం చేసిన శక్తులు మహాత్ముడిని హతమార్చిన తరువాత వాటిమీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా మేం మారాం అని ఇచ్చిన లేఖను తీసుకొని కొనసాగనిచ్చిన వారు అసలు దోషులు అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ ప్రపంచవ్యాపితంగా మితవాద పిచ్చిమొక్కలు పెరగటానికి అనువైన వాతావరణం ఏర్పడిందని గ్రహిస్తే వాటిని పీకివేసేందుకు చేయాల్సిన కార్యాచరణకు ముందుకు వస్తారు. పర్యవసానాల గురించి తెలియకుండానే దేశంలో అనేక మంది మితవాదుల పట్ల ఒక సానుకూల వైఖరితో ఉన్నారు, మేథావులుగా ఉన్నవారు కొందరు మతశక్తుల చంకనెక్కుతున్నారు.చాలా మంది మౌనంగా ఉంటున్నారు. అంబేద్కర్‌ చెప్పినట్లు ఉదాసీనత లేదా తటస్థవాదం అత్యంత ప్రతికూల చెడు వ్యాధిగా జనాన్ని ప్రభావితం చేస్తుంది.” చెడ్డవారి అణచివేత, దుర్మార్గం కంటే మంచి వారి మౌనం చివరికి విషాదంగా మారుతుంది. మౌనం ఒకనాటికి నమ్మక ద్రోహంగా పరిణమిస్తుంది ” అని మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ జూనియర్‌ చెప్పిన అంశాన్ని అందరూ గుర్తించాల్సిన తరుణం వచ్చింది.


ఒక మతభావజాలం సమాజ పురోగమనానికి ఆటంకం కలిగినపుడు మరో తత్వశాస్త్రం ముందుకు వచ్చి కొత్త మతాల ఆవిర్భావానికి కారణం అన్నది ప్రతి మత చరిత్ర చెబుతున్నది. మన దేశంలో వేదమతం లేదా సనాతన ధర్మం 50 బ్రహ్మ సంవత్సరాల పాటు కొనసాగిందని చెప్పేవారు ఉన్నారు. ఒక్కో బ్రహ్మ సంవత్సరానికి 3.1104 లక్షల కోట్ల మానవ సంవత్సరాలు అంటే సనాతన ధర్మం 155.52లక్షల కోట్ల సంవత్సరాలు సాగిందని నమ్మింప చూస్తారు. దీనికి ఎలాంటి ఆధారం లేదు.వేద మతం మీద తిరుగుబాటుగా లేదా కొత్త ఆలోచనల నుంచి వచ్చినవే బుద్ద, జైన, అనేక సారూప్యతలు కలిగిన వివిధ హిందూ మతాలు. ఈ కాలంలోనే చార్వాకులు లేదా లోకాయతులుగా పిలిచిన భారత తొలి భౌతికవాదులు తమ తత్వశాస్త్రాన్ని ముందుకు తెచ్చినట్లు వారికి వ్యతిరేకంగా వెలువడిన రచనలను బట్టి తెలుస్తున్నది. పరలోకం లేదా మరణానంతర లోకం లేదన్న వాదనలను ముందుకు తెచ్చిన చార్వాకులను అవి ఉన్నాయని చెప్పే మతశక్తులు భౌతికంగా అంతమొందించటంతో పాటు వారి రచనలను కూడా ధ్వంసం చేసినట్లు చెబుతారు. చివరకు తమతో విబేధించిన బౌద్ద, జౌన మతాలను కూడా మన దేశంలో అణచివేసిన చరిత్ర మనకు తెలిసిందే. గతంలో శైవు- వైష్ణవ మతాలను అనుసరించిన వారు మతోన్మాదంతో కొట్టుకుచచ్చినా తరువాత కాలంలో రాజీపడ్డారు. ఇప్పుడు కూడా నిఖార్సయిన శైవులుగా చెప్పుకొనేవారు వైష్ణవాలయాలను, వైష్ణవమత పరిరక్షకులమని అంటున్నవారు శివాలయాలను సందర్శించరు. ఇలాంటి వారంతా ఇప్పుడు హిందూత్వశక్తులుగా, హిందూమత పరిరక్షకులుగా ఫోజు పెడుతున్నారు. ఈ రోజు హిందూమతం అంటే సనాతనకు ప్రతిరూపంగా ముందుకు తెస్తున్నందున ఉదయనిధి స్టాలిన్‌ వంటి వారు విమర్శలు చేస్తున్నారు. సనాతన, హిందూత్వ లేదా హిందూ అనేది ఒక జీవన విధంగా చెబుతూ సామాన్యుల చేత తమ చేదు మాత్ర మింగించేందుకు మతశక్తులు చూస్తున్నాయి. అలాంటి జీవన విధానానికి తిరిగి వెళ్లాలని ప్రబోధిస్తున్నవారు సమాజాన్ని వెనక్కు నడపాలని చూసే వారు తప్ప మరొకరు కాదు. ఎందుకంటే భారత్‌లో ఏనాడూ జనమందరి జీవన విధానం ఒక్కటిగా లేదు. అన్ని కులాలది ఒకటే జీవన విధానం కాదు. సామాజిక న్యాయం లేదు. జీవన విధానమే అసలైన అంశం అయితే హిందూ మతానికి ముప్పు వచ్చిందని ఎందుకు ప్రచారం చేస్తున్నట్లు ? తమ మతం, జీవన విధానాలను ఎంచుకొనే స్వేచ్చ జనానికి సంబంధించిన అంశం.


ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మ విధానం మీద విమర్శ చేయగానే బిజెపి నేతలు ధ్వజమెత్తారు. సనాతను వ్యతిరేకించటం కాదు నిర్మూలించాలని పిలుపునిచ్చారంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న దేశంలోని 80శాతం మందిని ఊచకోత కోయాలని పిలుపు నివ్వటమే అని బిజెపి ఐటి విభాగ నేత అమిత్‌ మాలవీయ ఆరోపించారు. దీనికి ముంబైలో సమావేశమైన ఇండియా కూటమి నేతలు అంగీకరించినట్లేనా అని బిజెపి ప్రశ్నించింది. ఇదంతా మెజారిటీగా ఉన్న హిందువులతో ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. తమిళనాడు బిజెపి నేత నారాయణ తిరుపతి ధ్వజమెత్తారు. డిఎంకె ఒక కాన్సర్‌ వంటిది దానికి సనాతన ధర్మ సూత్రాలతో చికిత్స చేయాలన్నారు. డిఎంకెకు ఇలాంటివి కాత్త కాదు. వారికి చెడు అంశాలు మంచివిగా మంచివి చెడుగా కనిపిస్తాయి. సనాతనం ఆద్యంతరహితమైనది, డిఎంకె ఒక మత పార్టీ, అది ముస్లింలు, క్రైస్తవుల ఓట్ల మీద బతుకుతున్నది అన్నారు.(తమిళనాడులో హిందువుల జనాభా 88శాతం వరకు ఉన్నదని లెక్కలు చెబుతున్నాయి) క్రైస్తవ మిషినరీల నుంచి అరువుతెచ్చుకున్న భావజాలంతో ఉదయనిధి స్టాలిన్‌ చిలుకపలుకులు వల్లించినట్లు బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై వర్ణించారు. రాష్ట్ర జిఎస్‌డిపి కంటే ఎక్కువగా గోపాలపురం కుటుంబం(స్టాలిన్‌ కుటుంబం నివాసం ఉండే ప్రాంతం పేరు) సంపదలను పోగేసుకుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని బిజెపి ఎంపీ సుధాంశు త్రివేది అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ భిన్న స్వరాలను వినిపించింది. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించగా, జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ మాట్లాడుతూ ప్రతి పార్టీకి అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉందని అన్నారు. తమ పార్టీ అన్ని మతాల మనోభావాలను గౌరవిస్తుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ టిఎంసి ప్రతినిధి విమర్శించారు. ఇండియా కూటమిలోని ఒక భాగస్వామి పార్టీ నుంచి వెలువడిన వ్యాఖ్యలపై కూటమి అభిప్రాయం ఏమిటని బిజెపి ప్రశ్నించింది. మౌనంగా ఉండటం ద్వారా సనాతనవాదుల ఊచకోత పిలుపును కాంగ్రెస్‌ సమర్ధించినట్లయిందని బిజెపి నేత అమిత్‌ మాలవీయ ఆరోపించారు. కాంగ్రెస్‌, డిఎంకె ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నదని కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. రాజస్థాన్‌ ఎన్నికల సభలో మాట్లాడుతూ మోడీ గెలిస్తే సనాతన గెలిచినట్లు కాంగ్రెస్‌ చెబుతోంది, లష్కరే తోయబా కంటే హిందూ సంస్థలు ప్రమాదకరమైనవని రాహుల్‌ గాంధీ చెప్పారని షా ఆరోపించారు. ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలతో దేశంలో తిరోగామి సనాతన ధర్మం గురించి చర్చ జరుగుతున్నది. ఇది కొందరి కళ్లు తెరిపించినా మంచిదే. సనాతన ధర్మం కొనసాగాలని చెప్పేవారి వాదనలేమిటో, వ్యతిరేకించేవారి కారణాలేమిటో జనం తెలుసుకొనేందుకు ఒక అవకాశం వచ్చింది.నూరుపూవులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా భావజాల పోరు సాగాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికల చర్చ : మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ కమిటీ ఏర్పాటు !

01 Friday Sep 2023

Posted by raomk in Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

'Ram Nath Kovind committee, BJP, Narendra Modi, Narendra Modi Failures, one nation one election


ఎం కోటేశ్వరరావు


సెప్టెంబరు 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకో పార్టీలకూ, జనానికి తెలవదు. ఆ ప్రకటనతో పాటు ఒకేసారి పార్లమెంట్‌-అసెంబ్లీల ఎన్నికలు జరిపే అంశం గురించి నివేదిక ఇవ్వాలని మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దీంతో జమిలి ఎన్నికల కోసం అవసరమైన బిల్లు, రాజ్యాంగ సవరణల కోసమే ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలన్న చర్చ దేశంలో ప్రారంభమైంది. ఊరకరారు మహాత్ములు అన్నట్లు నరేంద్రమోడీ నాయకత్వం ఏది చేసినా బిజెపికి, తాను, తన ఆశ్రితుల లబ్ది చూస్తారు అన్నది తెలిసిందే. గత శతాబ్దిలోనే ముందుకు వచ్చింది ఒకేసారి ఎన్నికల అంశం. ఇది సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు తిరస్కరించినప్పటికీ 2014 నుంచీ ఒకే దేశం-ఒకే ఎన్నికలంటూ వదలకుండా చెబుతున్నారు.విడివిడిగా ఎన్నికలు జరగటం వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం గనుక ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్చించాలని వాదనలు చేస్తారు.


స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967వరకు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆకాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం తెలిసిందే. దాని ఫలితమే 1969లో కొన్ని అసెంబ్లీల రద్దు, తరువాత ముందుగానే 1970లోపార్లమెంట్‌ రద్దు, 1971 ప్రారంభంలో ఎన్నికలు అన్న విషయం తెలిసిందే. ఒక దేశవృద్ది రేటు ఒకేసారి ఎన్నికలు జరపటం, ఎన్నికల ఖర్చు తగ్గింపు మీద, ఆ సమయంలో ప్రవర్తనా నియమావళి మీద ఆధారపడదు. చివరకు దేశం కోసం ధర్మం కోసం అనే పేరుతో ఈ వాదన అసలు ఎన్నికలే వద్దు అనేదాకా పోతుంది. ఆయా దేశాల జిడిపిలు, ఆదాయాలతో పోల్చితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాల ఖర్చు నామమాత్రమే. పార్టీలు పెట్టే ఖర్చే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటోంది. దాని నివారణకు ఒకేసారి ఎన్నికలు పరిష్కారం కాదు.2019లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు ఖర్చుచేసిన మొత్తాలతో సహా అరవైవేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేశారు. ఇది పోటీచేసిన అభ్యర్ధులు ఇచ్చిన సమాచారం మేరకు అంచనా తప్ప, వాస్తవ ఖర్చు దాని కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. చీటికి మాటికి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పధకాల అమలు నిలిచిపోతుందన్నది ఒక పెద్ద తప్పుడు ప్రచారం. ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టే కొత్త కార్యక్రమాల ప్రకటనలను నివారించటం తప్ప వాటితో నిమిత్తం లేకుండా ముందే ప్రారంభమై సాగే పధకాల అమలు నిలిపివేత ఉండదు. రైలు మార్గాల నిర్మాణం, విద్యుదీకరణ, ప్రభుత్వ గృహాలు, రోడ్ల నిర్మాణం, పెన్షన్ల చెల్లింపు, చౌకదుకాణాల్లో వస్తువుల సరఫరా వంటివి ఏవీ ఆగటం లేదే.గతంలో గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి పధకం పనులకు విడుదల చేయాల్సిన నిధులకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఆ విషయాన్ని మీడియాలో ఎక్కడా వెల్లడించకూడదని షరతు పెట్టింది.


కొన్నిదేశాల్లో ఒకేసారి జాతీయ, ప్రాంతీయ, స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ విధంగా చేసి ఖర్చును ఆదాచేయటం వల్ల అవి అభివృద్ధి సాధించినట్లు ఎక్కడా రుజువు లేదు. ఉదాహరణకు అమెరికాలో 1962-2019 మధ్య 57 ఏండ్లలో 26 సంవత్సరాలు తిరోగమన, 16 సంవత్సరాలు ఒక శాతంలోపు, ఐదు సంవత్సరాలు ఒకటి-రెండు శాతం మధ్య వృద్ది నమోదైంది.అమెరికాలో ఎన్నికల ప్రకటన నుంచి పోలింగ్‌ రోజువరకు మన దేశంలో మాదిరి ప్రవర్తనా నియమావళితో నిమిత్తం లేకుండా అనేక చర్యలు తీసుకోవటాన్ని చూశాము. అక్కడ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు, ప్రవర్తనా నియమావళి లేదు. అయినా అక్కడ వృద్ధి రేటు ఎక్కువ సంవత్సరాలు దిగజారింది. కొన్ని లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాలలో నిర్ణీత కాలం వరకు చట్ట సభలు రద్దు కావు, ప్రభుత్వాలు మారుతుంటాయి. అలాంటి దేశాలూ అభివృద్ది సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో కూడా ఇలా ఐదేండ్ల పాటు పార్లమెంటు, అసెంబ్లీలు రద్దు కాకుండా రాజ్యాంగ సవరణ చేస్తే ఇప్పుడున్న లోపభూయిష్టమైన పార్టీల ఫిరాయింపు చట్టం అవసరం కూడా ఉండదు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే అది కూలిపోయి కొత్త ప్రభుత్వం వస్తుంది. సభ్యత్వాలు రద్దు కావు, అంటే ప్రజాప్రతినిధులను ఎవరు ఎక్కువ మందిని సమీకరిస్తే అది డబ్బుద్వారా లేదా కండబలం ద్వారా కావచ్చు అధికారం వారికే ఉంటుంది. కొన్ని దేశాల్లో జరుగుతోంది అదే. ధనస్వామ్యం తప్ప ప్రజాస్వామ్య జాడ ఉండదు.


నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకే సారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్దిల్లేవిధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్దతి ఎన్నికల సంస్కరణలు కావాలి. ప్రజాస్వామ్య కబుర్లు చెప్పే అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టరల్‌ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు. అందువలన దేశం మొత్తంలో ఓట్లు తక్కువ తెచ్చుకున్నా కొన్ని రాష్ట్రాలలో వచ్చిన మెజారిటీ ఆధారంగా ఎలక్టరల్‌ కాలేజీలో పైచేయి సాధించి 2016లో అధ్యక్ష పదవిని డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారు. దామాషా ప్రాతినిధ్య విధానంలో మైనారిటీ ఓట్లకూ ప్రాతినిధ్యం ఉంటుంది. డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ గెలుస్తారో లేదో తెలియదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు, వ్యక్తులు డబ్బున్నవారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే దామాషా ప్రాతినిధ్య విధానం గురించి వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు.


తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగుతుందని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పధకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్‌ పేరుతో అజాగళ స్థనం వంటి అధికారాలు లేని సంస్థను ఏర్పాటు చేసిన పెద్దలు గద్దె మీద ఉండగా దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, జనాన్ని తప్పుదారి పట్టించే వ్యవహారమే.ఒకేసారి అన్నింటికీ ఎన్నికలు అనేది ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం. ఫెడరల్‌ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్దం. ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారి తీస్తుంది. ఫెడరల్‌ వ్యవస్థను కూలదోసి యూనిటరీకి మళ్లేందుకే బిజెపి ఈ ప్రతిపాదనను పదే పదే ముందుకు తెస్తున్నదనిపిస్తున్నది.1983లో తొలిసారి ఎన్నికల కమిషన్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. వాజ్‌పేయి హయాంలో 1999లో లా కమిషన్‌ ద్వారా ఈ ప్రతిపాదనన తెచ్చారు. తరువాత యుపిఏ పాలనలో దాని ప్రస్తావన లేదు. నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చి,బిజెపికి మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం వచ్చినపుడు 2016లో నీతి ఆయోగ్‌ ద్వారా ముందుకు తెచ్చారు.2018లో లా కమిషన్‌ ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని చెప్పింది. నరేంద్రమోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన వెంటనే మరోసారి చర్చకు తెచ్చారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో కూడా చర్చ సాగించారు. నిర్మాణాత్మక అవిశ్వాసం పేరుతో మరొక ప్రతిపాదనను లా కమిషన్‌ ద్వారా ముందుకు తెచ్చారు. ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టటానికి ముందు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సభ విశ్వాసం పొందాలని చెప్పారు.2022లో నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అందుకు గాను రాజ్యాంగ సవరణ జరపాలని చెప్పారు. అదే ఏడాది డిసెంబరులో లా కమిషన్‌ అన్ని రాజకీయ పార్టీలు, మేథావులు, అధికారులు తమ సూచనలు పంపాలని కోరింది. ఇపుడు రామనాధ్‌ కోవింద్‌ నాయకత్వంలో ఒక కమిటీని వేసి మరోసారి మోడీ సర్కార్‌ ముందుకు తెచ్చింది.వివరాలు తెలియదు.


ఐడిఎఫ్‌సి అనే ఒక సంస్ధ 1999 నుంచి 2014వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమాచారాన్ని విశ్లేషించింది. ఒకేసారి జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఓటర్లు ఒకే పార్టీని ఎంచుకొనేందుకు 77శాతం అవకాశాలుంటాయని పేర్కొన్నది. ఐఐఎం అహమ్మదాబాద్‌ డైరెక్టర్‌గా ఉన్న జగదీప్‌ ఛోకర్‌ జరిపిన విశ్లేషణ కూడా దీన్నే చెప్పింది. 1989 నుంచి ఒకేసారి జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 24 ఉదంతాలలో ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో దాదాపు ఒకే విధమైన శాతాలలో ఓట్లు పొందాయి. కేవలం ఏడు సందర్భాలలో మాత్రమే ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఈ కారణంగానే గతంలో కాంగ్రెస్‌ మాదిరి ప్రస్తుతం దేశవ్యాపితంగా ఉన్న బిజెపి ఒకేసారి ఎన్నికలు జరిగితే తనకు ఉపయోగమని, ఉన్న అధికారాన్ని మరింతగా సుస్ధిరపరచుకోవచ్చని, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే అవకాశాలను తగ్గిస్తాయని భావిస్తున్నది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సింది ఉంది. అదే జరిగితే రాష్ట్రాలలో, కేంద్రంలో ఏ కారణాలతో అయినా ప్రభుత్వాలు కూలిపోతే నిర్ణీత వ్యవధి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంది. దాని అర్ధం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని అధికారమే పరోక్షంగా ఉంటుంది. లేదా ముందే చెప్పుకున్నట్లు అవకాశవాదంతో ఏర్పడే కూటములకు అధికారాన్ని అప్పగించాల్సి వస్తుంది.


కరోనా ప్రభావం గురించి దేశమంతా ఆందోళన చెందుతోంటే దాన్ని పక్కన పెట్టి ప్రధాని కార్యాలయం స్దానిక సంస్ధలతో సహా అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా తయారీ సాధ్యా సాధ్యాల గురించి చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలా చేయాలంటే ముందుగా ఆర్టికల్‌ 243కె, 243జడ్‌, ఏ లకు సవరణలు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది.ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అంతకు ముందున్న స్థితికి అభివృద్ది రేటు పెరగటం గురించి ఎవరికీ విశ్వాసం లేదు. దిగజారిన వృద్ది పునాది మీద పెరుగుదలను చూపి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. దేశ అభివృద్ది, ప్రయోజనాల గురించి తమకు తప్ప మరొకరికి పట్టవని, దేశభక్తి ఇతరులకు లేనట్లుగా, దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నట్లు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక పధకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే 101వసారి నిజంగా మారుతుందని సూత్రీకరణ చేసిన జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ తరహా ప్రచారం ఇది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఉన్న మెజారిటీ, దేన్నయినా బలపరిచే ఇతర పార్టీలు కూడా ఉన్నందున ఒక్క రోజులోనే కాశ్మీర్‌ రాష్ట్రాన్నే రద్దుచేసినట్లు ఒకేసారి ఎన్నికల కోసం జనాభిప్రాయాన్ని తోసిపుచ్చి రాజ్యాంగ సవరణలు చేయటం నరేంద్రమోడీకి ఒక పెద్ద సమస్య కాదు. అలాంటి పరిణామం జరిగినా ఆశ్చర్యం లేదు.రాజ్యాంగాన్ని మార్చకుండానే తూట్లు పొడిచేందుకు వీలైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఫెడరల్‌ అంటూనే అధ్యక్ష తరహా పాలనకు వీలు కల్పించేదే ఒకే సారి ఎన్నికలు అనే భావన.అలాంటి అధికార కేంద్రీకరణ ఉంటేనే సంస్కరణల వేగం పేరుతో దేశ సంపదలను ఆశ్రితులకు అప్పగించేందుకు, కార్మికుల, రైతాంగ హక్కులను హరించి వేసేందుకు అవకాశం ఉంటుంది. స్వేచ్చను హరించుతున్న పాత చట్టాలను రద్దు చేయాలన్నది ఒక ప్రజాస్వామిక డిమాండ్‌. దాన్ని అమలు చేసే పేరుతో మరింత కఠినమైన చట్టాలను రూపొందించేందుకు పూనుకున్నారు. కార్మిక చట్టాలను క్రోడీకరించే పేరుతో కార్మికుల హక్కులకు ఎసరు పెట్టారు. రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే యత్నాన్ని రైతాంగం విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ ఆ కత్తి మెడమీద వేలాడుతూనే ఉంది. ఇండియా కూటమి రూపంలో ముందుకు వచ్చిన పార్టీలు బిజెపి ముక్త భారత్‌కు పిలుపునిచ్చి ముందుకు పోతుండటంతో నరేంద్రమోడీ నాయకత్వానికి భయం పట్టుకుంది.అందుకే జనం దృష్టిని మళ్లించేందుకు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారని అనేక మంది భావిస్తున్నారు. వాటిలో భాగంగానే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్నారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d