• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Author Archives: raomk

పశ్చిమ దేశాల తీరు : ఒకవైపు కార్మికవర్గంపై దాడి మరోవైపు రష్యాతో లడాయి !

08 Wednesday Oct 2025

Posted by raomk in Current Affairs, Economics, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Another Cold war, Cold War, Donald trump, Europe workers struggle, Putin warns US, Tomahawk missiles, Ukraine, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు

నాటో కూటమితో చేతులు కలిపి తమ మీద చేస్తున్న కుట్రకు ప్రతిక్రియగా ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య బుధవారం నాడు 1,322వ రోజులో ప్రవేశించింది. పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఐరోపా అంతటా దోపిడీకి గురౌతున్న కార్మికుల సమ్మెలు ఒక వైపు, మరోవైపు రష్యాను దెబ్బతీసేందుకు అమెరికాతో కలసి పాలకవర్గాల కుట్రలు కనిపిస్తున్నాయి. తమ మీద దాడులు చేసేందుకు అమెరికా గనుక తోమహాక్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తే సంబంధాలు నాశనం అవుతాయని రష్యన్‌ అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ అమెరికానుద్దేశించి చెప్పాడు. నిజానికి ఇది ట్రంప్‌కే కాదు, కయ్యానికి ఎగదోస్తున్న యావత్‌ ఐరోపా ధనిక దేశాలకు చేసిన హెచ్చరిక. ఆ ప్రకటన మరుసటి రోజు డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్లు అడిగిన ప్రశ్నలపై స్పందించాడు.” నేనూ కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాను, ఆ పోరు మరింతగా పెరగాలని కోరుకోవటం లేదు ” అన్నాడు. పశ్చిమ దేశాలతో మరో ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నట్లు తమ మీద చేస్తున్న ఆరోపణను రష్యా తోసిపుచ్చింది. తమ మీద దాడులు చేసేందుకు, మిలటరీ ఖర్చు పెంచేందుకు నెపాన్ని తమ మీద నెట్టాలని ఐరోపా యూనియన్‌, నాటో కూటమి దేశాలు లేని పోని కథలను వ్యాపింప చేస్తున్నాయని గత ప్రచ్చన్న యుద్దంతో పోల్చటాన్ని అంగీకరించటం లేదని రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా ఝకరోవా గత వారంలో స్పష్టం చేశారు.క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్‌ మాట్లాడుతూ ఐరోపా అంతటా ఇటీవల కనిపించిన డ్రోన్లకు రష్యా కారణమని నిందించటానికి ఎలాంటి హేతుబద్దత లేదన్నాడు.డ్రోన్ల వెనుక రష్యా ఉందని భావిస్తున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్య తరువాత ఐరోపాలోని అనేక మంది రాజకీయవేత్తలు అన్నింటికీ రష్యా కారణమని నిందిస్తున్నారన్నాడు.

క్యూబన్‌ క్షిపణుల సంక్షోభం 1962 తరువాత రష్యా మరియు పశ్చిమ దేశాల మధ్య ఉక్రెయిన్‌ సంక్షోభ రూపంలో తలెత్తిన ఘర్షణ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో తీవ్రమైనది,అతి పెద్దది. తాము ఇప్పటికే మరో రూపంలో ఉన్న ఘర్షణలో ఉన్నామని, అదేమాత్రం ప్రచ్చన్న యుద్ధం కాదు ఇప్పటికే ఇక్కడ మంటలు ఉన్నాయని మరియ ఝకరోవా చెప్పారు. అలాస్కా భేటీ తరువాత శాంతి అవకాశాలు ఆవిరవుతున్నట్లు జరిగే పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తమ అజెండాను అమలు జరిపేందుకు పశ్చిమ దేశాలు సరికొత్త ప్రచారదాడిని మొదలు పెట్టాయి. తమ గగనతలాన్ని అతిక్రమిస్తున్నందంటూ వివిధ దేశాలు ఒక పథకం చేస్తున్న ప్రచారాన్ని రష్యా తిరస్కరించినప్పటికీ గోబెల్స్‌ ప్రచారం సాగుతున్నది. ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా మెల్ల మెల్లగా కొత్త ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది.దానికి పోటీగా పశ్చిమ దేశాల గగనతల అతిక్రమణ కతలను ముందుకు తెచ్చాయి. ఆ పేరుతో మిలిటరీ బడ్జెట్‌లను పెంచేందుకు, సంక్షేమ పథకాలకు కోత విధించేందుకు పూనుకున్నారు. తమకు వ్యతిరేకంగా నాటో కూటమి కుట్రపన్నిందని పుతిన్‌ ఉక్రెయిన్‌ సంక్షోభ ప్రారంభానికి ముందు నుంచీ చెబుతున్నాడు.సోవియట్‌ పతనమైన 1991లో నాటో కూటమిని తూర్పు వైపు విస్తరించబోమని చెప్పి దాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించాయి. రష్యా సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్‌, జార్జియా వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మాస్కో వ్యవహారాలను నియంత్రించేందుకు చూశాయని అదే తమ మిలిటరీ చర్యకు కారణమని, అలాంటి కుట్రకు స్వస్థి పలికితే వెంటనే దాడులను నిలిపివేస్తామని పదే పదే చెబుతున్నాడు.

రష్యా చెబుతున్న అంశాలను విననట్లు నటిస్తున్న పశ్చిమ దేశాలు తీవ్రమైన ఆంక్షలను ప్రకటించి దిగ్బంధనం కావించేందుకు చూసినప్పటికీ వాటన్నింటిని మాస్కో ఇప్పటి వరకు అధిగమించింది. మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు అందించి దాడులు చేయించాయి.ఫలితం లేకపోవటంతో ఇప్పుడు మాస్కోతో సహా రష్యాలోని ఐరోపా ప్రాంతాలన్నింటిపైనా దాడులు చేయగల రెండున్నరవేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే తమ తోమహాక్‌ క్షిపణులను అందచేయాలని అమెరికా చూస్తున్నది. అనేక ఐరోపా దేశాలు వాటిని అడుగుతున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వారం రోజుల క్రితం ప్రకటించాడు.నేరుగా ఉక్రెయిన్‌కు అందిస్తే విమర్శలపాలు కావాల్సి వస్తుందనే భయంతో ఇతర దేశాలకు విక్రయించి అక్కడి నుంచి మళ్లించాలన్నది ఎత్తుగడ. అయితే జెలెనెస్కీ సేనలకు వాటిని అందచేసినప్పటికీ ఉపయోగించే సామర్ధ్యం లేదు. ఆ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. ఆ క్షిపణులు తమ దగ్గర ఉంటే పుతిన్‌పై వత్తిడి పెంచటానికి తోడ్పడతాయని అన్నాడు. అందుకే అదే జరిగితే పశ్చిమ దేశాలతో సంబంధాల విచ్చిన్నానికి దారితీస్తుందని పుతిన్‌ హెచ్చరించాడు. ఇవ్వాలా లేదా అన్నది అమెరికా తేల్చుకోవాల్సి ఉంది. ఇస్తామంటే ఎలాంటి స్పందనలు వస్తాయో తెలుసుకొనేందుకు వాన్స్‌ ద్వారా ట్రంప్‌ మాట్లాడించాడు. రష్యా ఇంథన మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్‌కు అందచేసేందుకు వాషింగ్టన్‌ నిర్ణయించిందని, వాటిని ధ్వంసం చేయాలంటే దీర్ఘశ్రేణి క్షిపణులు అవసరమౌతాయని వాటిని ఇవ్వటమా లేదా అన్న గుంజాటనలో ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది.

అమెరికన్లు ప్రత్యక్షంగా పాల్గ్గొంటే తప్ప తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించటం అసాధ్యమని, అదే జరిగితే ఉద్రిక్తలు నూతన దశకు చేరతాయని పుతిన్‌ గతవారంలో హెచ్చరించాడు. అలాంటి క్షిపణులను ఇచ్చేది లేదని గతంలో ట్రంప్‌ ప్రకటించాడు. అయితే ఉక్రెయిన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి కెయిత్‌ కెల్లాగ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రష్యా మీద దీర్ఘశ్రేణి లక్ష్యాలపై దాడులను చేసే స్థితిలో ఉక్రెయిన్‌ ఉందని ట్రంప్‌ సూచన ప్రాయంగా చెప్పినట్లు తెలిపాడు.తన పాటలకు అనుగుణ్యంగా పుతిన్‌ నృత్యం చేయటం లేదనే ఉక్రోషంతో ఈ విపరీత చర్య గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పవచ్చు. పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి ఎప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అమెరికా మీడియా క్సియోస్‌తో మాట్లాడిన జెలెనెస్కీ తాము కూడా రష్యా ఏది చేస్తే ప్రతిక్రియగా అదే చేస్తామన్నాడు.తమ ఇంథన వనరులపై పుతిన్‌ సేనలు దాడి చేస్తే తాము కూడా అదే చేస్తామన్నాడు.కెయిత్‌ కెలోగ్‌ ఒక మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ ఇప్పటికే రష్యాలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్ష్యాలపై దాడులకు కీవ్‌ను అనుమతిస్తున్నట్లు చెప్పాడని తెలిపాడు. సురక్షిత ప్రాంతాలనేవి లేవని అన్నాడు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు నిలిపివేయాలని కోరుతున్న శక్తులపై ఇటీవల గెలిచిన చెక్‌ అధ్యక్షుడు పీటర్‌ పావెల్‌ మాట్లాడుతూ సరఫరా కొనసాగించాల్సిందే అన్నాడు. తగ్గించినా, నిలిపివేసినా మనకు మనమే హాని చేసుకున్నట్లని వ్యాఖ్యానించాడు. 650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల మీద దాడులు చేయగల డ్రోన్‌ క్షిపణి వ్యవస్థలను తాము స్వంతంగా తయారు చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ చెప్పింది, అది నిజమో కాదో తెలియదు గానీ నిజమైతే దాని వెనుక నాటో దేశాల హస్తం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అంతే ఫ్లెమింగో పేరుతో తాము మూడువేల కిలోమీటర్ల దూరం ప్రయణించే క్షిపణిని తయారు చేసినట్లు కూడా కీవ్‌ చెప్పుకుంది. అంటే పశ్చిమదేశాల ఆయుధాలకు ఉక్రెయిన్‌ ముద్రవేసి రష్యా మీద దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పవచ్చు.బహుశా వీటిని గమనించే పుతిన్‌ చేసిన తాజా హెచ్చరిక పరమార్ధం.

మరోవైపున ఐరోపా అంతటా ఇటీవల జరుగుతున్న వివిధ రంగాల సమ్మెలను గమనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నెలలో అనేక దేశాల్లో విమానాశ్రయాల సిబ్బంది సమ్మెకు పిలుపులు ఇచ్చారు. అందువలన ప్రయాణీకులు ఒకటికి రెండుసార్లు తమ విమానాలు నడిచేదీ లేనిదీ తనిఖీ చేసుకోవాలని ఆ రంగానికి చెందిన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పని పరిస్థితులు, వేతన పెంపుదల వంటి అంశాలు ప్రధానంగా సమ్మెలకు పురికొల్పుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల సమ్మెలు, ఇతర రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి స్పెయిన్‌లోని అనేక విమానాశ్రయాలలో సిబ్బంది ఆందోళన కారణంగా అనేక విమానాలు నిలిచిపోయాయి. ప్రతి బుధ,శుక్ర, శనివారాల్లో విమానాలు దిగేందుకు పని చేసే సిబ్బంది ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు సమ్మెలు చేస్తున్నారు, ఈ ఆందోళన డిసెంబరు 31వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఫ్రాన్సులో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ నియమించిన ఏడవ ప్రధాని లికోర్ను రాజీనామా చేశాడు. సెప్టెంబరు 9న పదవీ బాధ్యతలు స్వీకరించి కేవలం 26 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ఏలుబడిలో ఉన్న వ్యక్తిగా చరిత్రకెక్కాడు. అంతకు ముందు బడ్జెట్లో కోతలను ప్రతిపాదించిన ఫ్రాంకోయిస్‌ బేయరు నాటకీయంగా గద్దె దిగాల్సి వచ్చింది.కేవలం రెండు సంవత్సరాల్లోనే ఐదుగురు ప్రధానులను నియమించారు. పోర్చుగల్‌లో వచ్చే జనవరి వరకు ప్రకటించిన 71 రోజుల ఆందోళన పిలుపును కోర్టు ఆదేశాల కారణంగా వెనక్కు తీసుకున్నారు. కనీస సిబ్బంది విధుల్లో ఉండాల్సిందే అని కోర్టు ఆదేశించింది. ఇది సమ్మెహక్కుపై నిజమైన దాడి అని కార్మిక సంఘం విమర్శించింది. ఇటలీ రవాణా రంగంలో అనేక అంశాలపై ఒప్పందాలకు రావటంలో విఫలం కావటంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. దీనికి తోడు గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను నిరసిస్తూ జరిగిన సాధారణ సమ్మెకు కార్మికులు మద్దతు ప్రకటించి లక్షలాది మంది ప్రదర్శనల్లో పాల్గన్నారు. చాలీ చాలని వేతనాలతో బతుకులీడుస్తున్నామని స్వంత ఇల్లు కొనుగోలు చేసేందుకు అవసరమైన రీతిలో తమవేతనాలను పెంచాలని బ్రిటన్‌లో రైల్‌,మారిటైమ్‌ మరియు ట్రాన్ప్‌పోర్ట్‌ (ఆర్‌ఎంటి) యూనియన్‌ ప్రచార ఆందోళన నిర్వహిస్తున్నది.వేతన పెంపుదలను కోరుతూ రెండు రోజుల పాటు సమ్మె జరపాలని ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ (టిఎఫ్‌ఎల్‌) పిలుపు ఇవ్వగా 4.5శాతం పెంపుదలకు అంగీకరించటంతో ఆందోళన విరమించారు. కార్మికవర్గం జరుపుతున్న సమ్మెలకు వ్యతిరేకంగా మీడియాలో ఉన్న యాజమాన్య అనుకూల వ్యాఖ్యాతలు వక్రీకరణలతో విశ్లేషణలు రాస్తున్నారు. స్వంత ఇల్లు కొనుగోలు బ్రిటన్‌లో ఒక హక్కుగా లేదన్నది వాటిలో ఒకటి. బ్రిటన్‌లో 1947 నుంచి ప్రతి ఏటా రైల్వే కార్మికులు సమ్మెలు చేస్తున్నారంటూ ఒక వ్యాఖ్యాత ఉక్రోషం వెలిబుచ్చాడు.బడ్జెట్‌లోటు ఏర్పడినపుడల్లా ఫ్రాన్సులో ఆ భారాన్ని కార్మికవర్గం మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో జిడిపిలో ఐదుశాతం ఉన్నపుడు 1995లో జరిగిన ఆందోళనల్లో ఇరవై లక్షల మంది రోడ్ల మీదకు వచ్చారు. నాటి ప్రధాని అలైన్‌ జుపే అంతకు ముందు ప్రతిపాదించిన అనేక పొదుపు చర్యలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అధ్యక్షుడు మక్రాన్‌ 2023లో ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 64 సంవత్సరాలకు పెంచి పెన్షన్‌ బిల్లును తగ్గించేందుకు చూశాడు.ఇప్పుడు మరో మితవాద ప్రధాని లీకొర్ను అదే విధానాలతో ఇంటిదారి పట్టాడు.ఐరోపా పాలకవర్గ సంక్షోభం, దానికి కార్మికవర్గం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనకు ఇది ఒక సాక్ష్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పసిడి ధర ఐదేండ్లలో మూడు రెట్లు పెరుగుదల ? ప్రపంచ అప్పుకు దీనికి సంబంధం ఉందా !

01 Wednesday Oct 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, GLOBAL DEBT SURGE, Gold Price Record, India debt matters, Narendra Modi Failures, World Debt, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ప్రపంచ రుణం 338 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌(ఐఐఎఫ్‌) సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.(ఎవరికైనా ఆసక్తి ఉండి యుఎస్‌ డెబిట్‌ క్లాక్‌ డాట్‌ ఓఆర్‌జి వెబ్‌సైట్‌లోకి వెళితే ప్రతి క్షణం ఏ దేశానికి ఎంత అప్పు పెరుగుతున్నదో చూడవచ్చు.) మన జిడిపి నాలుగు లక్షల కోట్ల డాలర్లు, ప్రపంచ రుణం మాత్రం ప్రతి నెలా సగటున 3.4లక్షల కోట్ల డాలర్లు పెరుగుతున్నది.ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబరు నాటికి మరో 20లక్షల కోట్ల డాలర్ల మేర ప్రపంచ రుణం పెరగనుంది. ఇలా పెరుగుతున్న అప్పులతో జనాలకు తిప్పలు కూడా అధికం అవుతున్నాయి. అమెరికా కరెన్సీ డాలరు ఈ ఏడాది జనవరి నుంచి 9.75శాతం పతనమైంది. అందువలన రుణం బాగా పెరిగినట్లు కనిపిస్తోందని కొంత మంది భాష్యం చెబుతున్నారు. కరోనా వచ్చిన 2020లో ఈ మాదిరి భారీ పెరుగుదల ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకున్నా పెరగటం ఆందోళన కలిగిస్తున్నది. కుటుంబాలకు అప్పులు పెరిగితే ఏమౌతుంది. దానికి తగిన రాబడి లేకపోతే వాటిని తీర్చేందుకు కొన్ని కుటుంబ అవసరాలను తగ్గించుకొని రుణ చెల్లింపులకు కొంత మొత్తాన్ని మళ్లించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు అయినా చేస్తున్నది అదే. ఉదాహరణకు ప్రపంచంలో అత్యధికంగా అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లు. దానికి ఏటా చెల్లిస్తున్న వడ్డీ,అసలు మొత్తం 1.157లక్షల కోట్ల డాలర్లు. కొత్తగా తీసుకొనే అప్పులో సగానికి పైగా రుణ చెల్లింపులకే పోతున్నది.

అప్పులు పెరిగే కొద్దీ చేసిన వాగ్దానాలకు, అమలు చేస్తున్న పథకాలకు ఏదో ఒక సాకుతో కోత పెడతున్నారు.నిజానికి సామాన్యులకు ఏం జరుగుతున్నదో కూడా తెలియటం లేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులను చూద్దాం. మన దేశ మొత్తం అప్పు 2025 మార్చి నాటికి రు.181,74,284 కోట్లు దీన్ని 2026 మార్చి నాటికి రు.196,78,772 కోట్లకు పెంచుతామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. శాశ్వత ఆస్తుల కల్పనకు మూలధన పెట్టుబడిగా పెట్టాలి లేదా సంక్షేమానికి కేటాయించాలి.అప్పు తెస్తామన్న రు.15.69లక్షల కోట్లలో వడ్డీలు, అసలు చెల్లించేందుకు రు. 12.76లక్షల కోట్లు కేటాయించారు.2024-25 బడ్జెట్‌లో సబ్సిడీలకు రు.4.28లక్షల కోట్లు కేటాయించి పదకొండువేల కోట్లు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో రు.4.26వేల కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం మీద గతేడాది కేటాయింపులతో పోలిస్తే 0.4శాతం తగ్గించారు. నూతన ఉపాధి కల్పన పధకానికి గతేడాది పదివేల కోట్లు కేటాయించి 6,800 కోట్లు ఖర్చు చేసి వర్తమాన కేటాయింపుల్లో 20వేల కోట్లు చూపి 194శాతం అదనం అని గొప్పలు చెప్పారు.గ్రామీణ ప్రాంతాలకు మంచినీటిని అందచేసే జలజీవన్‌ పథకానికి 70వేల కోట్లు కేటాయించి చేసిన ఖర్చు చేసిన కేవలం 22.693వేల కోట్లు మాత్రమే. ఈ ఏడాది 67వేల కోట్లు కేటాయించి చూశారా 195 శాతం పెంచామంటూ ఊదరగొడుతున్నారు. వీటన్నింటినీ నిజంగా ఖర్చు చేస్తారా అన్నది చూడాలి. ఎరువుల సబ్సిడీగా 2023-24లో రు.1.88 వేల కోట్లు ఖర్చు చేసిన సర్కార్‌ ఈ ఏడాది దాన్ని 1.67లక్షల కోట్లకు కోత పెట్టింది. ఈ కారణంగానే అవసరమైన మేరకు యూరియా ఇతర ఎరువులను దిగుమతి చేసుకోకుండా డబ్బు మిగుల్చుకొని రైతాంగాన్ని ఇక్కట్ల పాలు చేసింది. కార్పొరేట్‌ పన్ను తగ్గించిన కారణంగా గతేడాది లక్ష కోట్ల మేరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కోత పడింది. ఇవన్నీ చూసినపుడు పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు, కార్పొరేట్లకు రాయితీల కొనసాగింపు, కోట్లాది మంది రైతాంగానికి, ఇతరులకు సబ్సిడీల కోత స్పష్టంగా కనిపిస్తున్నది.

నరేంద్రమోడీ మిత్రుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్నది కూడా ఇదే. వివిధ దేశాల వస్తువుల మీద దిగుమతి పన్నులు వేసి రానున్న పది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర లోటుబడ్జెట్‌ను తగ్గించుకోవాలని చూస్తున్నాడు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ పన్నుల మొత్తాన్ని చెల్లించాల్సింది సామాన్య పౌరులే గనుక తన అసమర్ధతను జనం మీద రుద్దుతున్నట్లే. నరేంద్రమోడీ చేస్తున్నది కూడా అదే మన అవసరాల్లో 80శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాం.దాని ఉత్పత్తులైన పెట్రోలు, డీజిలుపై సెస్‌, ఇతర పన్నుల భారాన్ని పెంచారు. మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. ఏటా లక్షా 73వేల కోట్ల మేర జనం నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధర పీపాకు 20డాలర్లు తగ్గినా ఒక్క పైసా కూడా వినియోగదారులకు ధరలు తగ్గించలేదు. రష్యా నుంచి చౌకధరలకు ముడి చమురు దిగుమతి చేసుకొని లాభాలకు ఐరోపా దేశాలకు ఉత్పత్తులను అమ్మిస్తున్నారు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023-24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. అందుకే అభివృద్ధి కోసం రుణాలు చేస్తున్నామని రాజకీయ నేతలు చెప్పే మాటలు బూటకం అని చెప్పాల్సి వస్తోంది.

కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలు కూడా నానాటికీ రుణ ఊబిలో కూరుకుపోతున్నాయి. అవి కూడా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నాయి.హిమచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పద్నాలుగు రకాల సబ్సిడీలను క్రమబద్దీకరించే పేరుతో కోత పెట్టేందుకు కసరత్తు చేస్తున్నది.మహారాష్ట్రలో రెండింజన్ల పాలన ఉంది. రాష్ట్ర రుణ భారం 9.25లక్షల కోట్లకు పెరగనుంది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి లడకీ బహిన్‌ పధకానికి రు.46వేల కోట్లు కేటాయించారు. తాజాగా దాన్ని రు.36వేల కోట్లకు కోత పెట్టారు.వృద్ధులకు యాత్రల సబ్సిడీ కొత్త కేటాయింపులు లేవు. మరో రెండింజన్ల పాలన రాష్ట్రం మధ్య ప్రదేశ్‌. అక్కడ ప్రాధమిక పాఠశాల విద్యకు ఈ ఏడాది రు.15,509 కోట్ల నుంచి రు.11,837 కోట్లకు కుదించారు. మహిళలకు ఉచిత బస్‌ పథకాన్ని ప్రకటించిన కర్ణాటక సర్కార్‌ 15శాతం బస్‌ ఛార్జీలను పెంచింది.

ఒక్క చైనా తప్ప రుణ భారం పెరిగిన ప్రపంచ దేశాలన్నింటా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నారు. అందుకే అనేక చోట్ల వలస వచ్చిన వారు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారంటూ మితవాద శక్తులు జనాలను రెచ్చగొడుతున్నాయి.జి 7 దేశాలతో పాటు చైనా రుణభారం గణనీయంగా పెరుగుతున్నట్లు ఐఐఎఫ్‌ నివేదిక పేర్కొన్నది.అమెరికా వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం జపాన్‌ పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం కలిగి ఉంది. ఇది జిడిపికి 293శాతం ఎక్కువ. ఇంత రుణం కలిగిన జపాన్‌ అమెరికాకు లక్ష కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అదే విధంగా జిడిపిలో 86.7శాతం 16లక్షల కోట్ల రుణం ఉన్న చైనా మరోవైపున అమెరికాకు 750 బిలియన్‌డాలర్ల రుణం ఇచ్చింది. ఇతర దేశాలలో సూడాన్‌ రుణం జిడిపికి 252 శాతం ఉంది. నిరంతరం అంతర్యుద్ధాలతో సూడాన్‌ అప్పు పెరిగింది. జపాన్‌లో కార్పొరేట్లకు ఉద్దీపన పథకాలు, వృద్ధుల సంఖ్య పెరగటం కారణాలుగా చెబుతున్నారు. సింగపూర్‌ 175, బహరెయిన్‌ 141, ఇటలీ 137 అమెరికా 123శాతం రుణభారంతో ఉన్నాయి. ధనిక దేశాలు ఇలా ఉండటానికి కారణంగా కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలే ప్రధాన కారణం. ధనిక దేశాలకు సగటున 110, వర్దమాన దేశాలకు 74శాతం రుణభారం ఉంది. ధనిక దేశాల కంటే వర్ధమానదేశాల రుణ భారం వేగంగా పెరగటం ఆందోళన కలిగిస్తోందని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది.గతంలో యుద్ధ సమయాల్లోనే దేశాలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొనేవి. 1980దశకం నుంచి అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు రుణాలు తీసుకోవటం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే అప్పులు పెరుగుతున్నాయి అభివృద్ధి దిగజారుతున్నది, అనేక ధనిక దేశాల అనుభవం ఇదే. అంటే అభివృద్ధికి అప్పులు అనేది పూర్తిగా నిజం కాదు. అనేక దేశాలు రుణాలు తీసుకోవటమే కాదు ఇస్తున్నాయి. ఉదాహరణకు పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం ఉన్న జపాన్‌ అమెరికాకు లక్ష కోట్లతో సహా ఇతర దేశాలన్నింటికీ ఇస్తున్న రుణం 2024 నవంబరు నాటికి 4.18 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.ఇలాగే ఇతర దేశాలు కూడా ఇస్తున్నాయి. అందువలన ఇలాంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే నిఖరంగా ఎంత అప్పు అన్నది తేలుతుంది. మన జిడిపి చాలా తక్కువే అయినప్పటికీ 216, చైనా 750 బిలియన్‌ డాలర్లు అమెరికాకు అప్పు ఇచ్చాయి. కరీబియన్‌ సముద్రంలో కేమన్‌ దీవుల జనాభా 90వేలకు అటూ ఇటూ, అది అమెరికాకు ఇచ్చిన అప్పు 2024లో 423 బిలియన్‌ డాలర్లు. అదెలా అంటే అదొక పన్నుల స్వర్గం, అక్కడ డబ్బుదాచుకుంటే ఎవరూ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో పన్నులు ఎగవేసిన పెద్దల నల్లధనం మొత్తం ఇలాంటి చోట్లకు చేర్చి అక్కడి నుంచి ఏ దేశానికైనా రుణాలు ఇచ్చి బ్లాక్‌ను వైట్‌గా మార్చుకుంటారు. అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లలో అక్కడి ఫెడరల్‌ రిజర్వు ప్రభుత్వం జారీచేసిన రుణబాండ్లను ఆరులక్షల డాలర్లమేర కొనుగోలు చేసింది, అంటే అప్పు ఇచ్చింది. మన కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం 196లక్షల కోట్లలో 190లక్షల కోట్లు అంతర్గత రుణాలే. అంటే మన బాంకులు, ఉద్యోగులు, ద్రవ్య సంస్థలు ఇచ్చిన అప్పులే అవి. వడ్డీ రాబడి కోసం ఇదంతా జరుగుతున్నది. ఇతర దేశాల మాదిరి జిడిపిలో మన రుణం 93శాతం, దానికి మించి పెరిగితే ఇబ్బందులు వస్తాయి.

ఒక వైపు అప్పులు పెరుగుతుంటే మరోవైపు ప్రపంచ మార్కెట్లో బంగారం ధర దూసుకుపోతోంది.ఈ రెండింటికీ సంబంధం ఉంది అంటున్నారు. గత చరిత్ర ఇదే చెబుతోంది.రుణాలు పెరిగే కొద్దీ కరెన్సీ విలువలు కూడా పడిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే దేశాలూ, వ్యక్తులూ కూడా బంగారం కొనుగోళ్లు సురక్షితం అని భావిస్తున్నారు.మొదటి ప్రపంచ యుద్ధంలో అప్పులపాలైన జర్మనీ తీర్చేందుకు 1920దశకంలో విపరీతంగా నోట్లను ముద్రించింది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి నోట్లు దేనికీ పనికిరాకుండా పోయాయి. జనాలు కరెన్సీ నోట్లను గోడలకు కాగితాల మాదిరి అంటించి నిరసన తెలిపారు. సంక్షోభాలకు బీమా వంటిది బంగారం అని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో రిజర్వు ఆస్తులలో బంగారానిది రెండవ స్థానం.ప్రపంచ ధనిక దేశాల్లో 2008లో తలెత్తిన ద్రవ్య సంక్షోభంతో ఉద్దీపన పథకాలు అమలు జరిపిన కారణంగా ప్రపంచ రుణం 2007 నుంచి 2009 కాలంలో 20శాతం పెరిగి 178లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బంగారం ఔన్సు(28.35గ్రాములు) ధర 869 డాలర్ల నుంచి 1,224 డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచ రుణం ముందే చెప్పుకున్నట్లు 338లక్షల కోట్లడాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సు ధర 3,800 డాలర్లుగా ఉన్నది త్వరలో 4,800 డాలర్లకు పెరగవచ్చని జోశ్యం చెబుతున్నారు. ఐరోపాలో 2011-2012లో తలెత్తిన రుణ సంక్షోభ సమయంలో మదుపుదార్లకు యూరో మీద విశ్వాసం తగ్గి బంగారంవైపు మొగ్గు చూపటంతో 2011 సెప్టెంబరులో 1,920 డాలర్లకు పెరిగింది. జపాన్‌లో 2020-21 సంవత్సరాలలో రుణ భారం 266శాతానికి పెరగటంతో మదుపుదార్లు బంగారం కొనుగోలుకు ఎగబడటంతో కరెన్సీ విలువలో ధర 18శాతం పెరిగింది.2024లో అమెరికా ఐపి పెట్టేవరకు వచ్చి బయటపడింది.రుణం 34లక్షల కోట్ల డాలర్లు దాటింది.దాంతో బంగారం ధర 2,100 డాలర్లకు పెరిగింది. ఏడాది కాలంలోనే 3,800 డాలర్లకు చేరిందంటే సంక్షోభం మరింత ముదురుతున్నట్లు మదుపుదార్లు భావిస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచ రుణం జిడిపిలో 95శాతం ఉంది, 2030 నాటికి అది వందశాతానికి చేరవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అంటే సామాన్యులకు ముప్పు మూడినట్లే ! మరి బంగారం ధర సంగతి ? జోశ్యాలను చూస్తే సామాన్యులు దానివైపు చూడనవసరం లేదనట్లుగా ఉన్నాయి. అక్టోబరు ఒకటవ తేదీన ఔన్సు ధర 3,875 డాలర్లకు చేరింది.1999లో కనిష్ట ధర 252 డాలర్లు. డిసెంబరు ఆఖరుకు 4,036 డాలర్ల వరకు పెరగవచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. కొందరైతే 4,289 డాలర్లకు చేరవచ్చన్నారు.వచ్చే ఏడాది(2026) ఆఖరుకు 5,488 డాలర్లు, 2027-30 మధ్య 5,479 నుంచి 7,956 డాలర్ల మధ్య ధర ఉండవచ్చని కొందరు చెబుతుంటే 2030 నాటికి 11,330 డాలర్లకు పెరగవచ్చని మరికొందరు. కొనుగోలు చేయాలా వద్దా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన సోమరులారా చావండి – సోషలిజానికి సై అంటున్న నెత్తురు మండే, శక్తులు నిండే అమెరికా యువత !

28 Sunday Sep 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Anti Trump, capitalism or socialism, communism, Donald trump, Joe McCarthy', Kamala Harris, Leftist Zohran Mamdani, Socialism

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో ఉన్న మీడియా, కొంత మంది ప్రముఖ వ్యాఖ్యాతలు తెలిసిగానీ తెలియకగానీ, వ్యతిరేక భావంతో, వక్రీకరించి సోషలిజం, కమ్యూనిజాల గురించి తెగ ప్రచారం చేస్తున్నారు. యువత వామపక్ష భావాలవైపు మళ్లకుండా ఉండాలంటే ఇదే దారి అని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ” ట్రంప్‌ సోషలిస్టా ? మీడియా అలా ఆలోచిస్తున్నది ” అనే శీర్షికతో ట్రిల్‌ అనే మాగజైన్‌ సెప్టెంబరు 26న ఒక విశ్లేషణ రాసింది. దాని సారాంశం ఇలా ఉంది. మీడియా, కొంత మంది ప్రముఖులు ట్రంప్‌ చర్యలను కొన్నింటిని వర్ణించేందుకు సోషలిస్టు అనే పదాన్ని వినియోగించినట్లు, ఆ పదం సరైనదేనా అంటూ వర్ణన సాగింది. గతనెలలో అట్లాంటిక్‌ పత్రిక ప్రచురించిన ఒక వ్యాసానికి ” ట్రంప్‌ మితవాద సోషలిజం ” అనే శీర్షిక పెట్టింది. ప్రైవేటు రంగంలో ఉన్న మీడియా, విశ్వవిద్యాలయాలు, న్యాయ కంపెనీల పట్ల ట్రంప్‌ నిరంకుశ పోకడలను ప్రత్యేకంగా ప్రస్తావించి ఆట్లాంటిక్‌ పత్రిక విశ్లేషణ రాసింది. ఈ పూర్వరంగంలో అనేక ప్రసారాల్లో, ప్రముఖులు కూడా ట్రంప్‌ జోక్యాల మీద అలాంటి వర్ణనలు చేస్తున్నారు.వారిలో కాలిఫోర్నియా డెమోక్రటిక్‌ గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ ఒకడు. రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ రాండ్‌ పాల్‌ కూడా సోషలిజం వైపుగా ఒక అడుగు వేసినట్లు ట్రంప్‌ గురించి వ్యాఖ్యానించాడు. ఫార్యూన్‌ పత్రిక ” మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ -అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలపండి) కార్యక్రమం మార్క్సిస్టుగా ఇంకా చెప్పాలంటే పెరిగి మావోయిస్టుగా ” ఉన్నట్లు పేర్కొన్నది. ఇక న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికైతే పెట్టుబడిదారీ విధానం మీద దాడి అంటూ ట్రంప్‌ చర్యలను వర్ణించింది.అధ్యక్షుడిని కామ్రేడ్‌ అని వర్ణించింది. ఇంటెల్‌ కంపెనీలో పదిశాతం వాటాలను ప్రభుత్వం తీసుకోవటాన్ని సోషలిజంగా వ్యాఖ్యాత పేర్కొన్నాడు.

సోమవారం నాడు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ” మనం ఒక కమ్యూనిస్టు నియంత ” తో వ్యహరిస్తున్నాం అని చెప్పారు. ” నూట ఏడు రోజుల జ్ఞాపకాలు ” అనే పేరుతో రాసిన సంకలనాన్ని ఆమె విడుదల చేశారు. ట్రంప్‌ రెండవ ఏలుబడి ఎలా ఉంటుందో ఆమె జోశ్యం చెప్పారు. ప్రైవేటు రంగం అణగిమణిగి ఉంటుందని తాను అనుకోవటం లేదని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఒక టీవీలో మాట్లాడుతూ పరిశ్రమలో అగ్రగణ్యులు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉంటారని ఆశించానని, వారు మౌనంగా ఉన్నారని చెప్పారు. ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ విధానాన్ని నిలబెడుతుంది, పెట్టుబడిదారీ విధానం ప్రజాస్వామ్యంలో వర్ధిల్లుతుంది అన్నారు. గత ఏడాది తాను ట్రంప్‌ను ఒక క్రూరుడు అని వర్ణించానని ఇప్పుడు అతనితోనే పని చేస్తున్నామని చెప్పారు. మన ప్రజాస్వామ్యాన్ని కమ్యూనిస్టు నియంతలతో పోలిస్తే మనం ఇప్పుడు నియంత ట్రంప్‌తోనే వ్యవహరిస్తున్నామన్నారు.కార్పొరేట్‌ శక్తులు ట్రంప్‌ బెదిరింపులకు భయపడి నోరు విప్పటం లేదని చెప్పారు.

అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో, వక్రీకరించటంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు దొందూ దొందే. ఈ రెండు పార్టీలను అనుసరించే మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించినట్లుగా వ్యవహరిస్తున్నాయి. వారెంతగా రెచ్చగొట్టినా అక్కడ జరుగుతున్నదానిని చూస్తే ఎముకలు కుళ్లిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండీ అంటూ మహాకవి శ్రీశ్రీ యువతరానికి ఆహ్వానం పలికాడు. ఇటీవలి కాలంలో అమెరికాలో జడ్‌ జనరేషన్‌ సోషలిజం, కమ్యూనిజం పట్ల సానుకూలతను వ్యక్తం చేయటాన్ని చూస్తే సోషలిస్టు జగన్నాధ రధ చక్రాలను అడ్డుకోవటం శత్రువుల వల్లకాదన్నది స్పష్టం.పెట్టుబడిదారీ విధాన కుంభస్థలం వంటి న్యూయార్క్‌ నగరంలో నవంబరులో జరిగే మేయర్‌ ఎన్నికలో డెమోక్రటిక్‌ సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ తాజా సర్వేల ప్రకారం 45శాతం ఓట్లతో ముగ్గురు ప్రత్యర్ధులకంటే ఎంతో ముందున్నాడు. సమీప ప్రత్యర్ధి, డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటు నేత మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమో 25శాతం దగ్గరే ఉన్నాడు. అదే పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ కూడా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు.న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డెమోక్రటిక్‌ సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీకి ఓటు వేయాలని కోరుతూ న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ కాథీ హౌచుల్‌ ప్రకటన చేయటంతో డోనాల్డ్‌ ట్రంప్‌ చిందులు తొక్కాడు. గత కొద్ది నెలలుగా తాను మేయర్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకోనంటూ గవర్నర్‌ దూరంగా ఉండి ఆకస్మికంగా మద్దతు ప్రకటించింది. దాంతో కేంద్రం ఇచ్చే నిధులు నిలివేస్తానని ట్రంప్‌ బెదిరించాడు.కరుడు గట్టిన కమ్యూనిస్టుకు గవర్నర్‌ మద్దతు ప్రకటించాడంటూ వ్యాఖ్యానించాడు.అదెలా జరుగుతుంది, వాషింగ్టన్‌ (ఫెడరల్‌ ప్రభుత్వం) పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తున్నదని పేర్కొన్నాడు.మమ్దానీ ఎన్నికైతే పోలీసు యంత్రాంగానికి నిధుల కోత పెడతాడని, పౌరులకు రక్షణ ఉండదని వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దారుణాలను వ్యతిరేకించటం, పాలస్తీనియన్లకు మద్దతు ప్రకటించటాన్ని ట్రంప్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు. ధనికుల మీద పన్నులు పెంచుతానంటూ చేసిన వాగ్దానంతో ధనికులుగా ఉన్నవారు ఎలాగైనా ఓడించాలని పెద్ద ఎత్తున డబ్బు సంచులతో రంగంలోకి దిగారు. ఆ పన్నులతో నగర పౌరులకు ఉచిత బస్‌ ప్రయాణం, పిల్లల సంరక్షణ కేంద్రాలు, కార్పొరేషన్‌ తరఫున చౌకధరలకు సరకులను అందించే దుకాణాలను ప్రారంభిస్తానని, అద్దెలను పెంచకుండా చూస్తానని కూడా మమ్దానీ చెప్పాడు.

గతంలో సోషలిజం విఫమైంది అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరగింది. ఇప్పుడు సోషలిజం విఫలమైంది అనే భావన రోజు రోజుకూ పెరుగుతున్నది. ఇటీవల కాటో, యు గవ్‌ సంస్థలు జరిపిన సర్వేలో అమెరికా సమాజంలో మార్పులు కనిపించాయి. విద్యా సంస్థలు, మీడియాలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం యువత మీద పెద్దగా కనిపించటం లేదని చెప్పవచ్చు. మొత్తంగా సోషలిజం పట్ల 43, కమ్యూనిజం పట్ల 14శాతం, 18-29 ఏండ్ల మధ్య వయస్సువారిలో సోషలిజం పట్ల 62శాతం, కమ్యూనిజం పట్ల 34శాతం మంది సానుకూల వైఖరిని వెల్లడించారు. అమెరికా సమాజంలో 18-29 సంవత్సరాల వయస్సు వారు 5.2కోట్ల మంది ఉన్నారు, అంటే 3.2 కోట్ల మంది సోషలిజం పట్ల సానుకూలతను ప్రదర్శించినట్లు అయితే సోషలిజం అంటే ఏమిటో నిర్వచించలేదు గనుక స్పష్టత లేదని కొందరు భాష్యం చెబుతున్నారు. కొంత మంది అలా ఉన్నప్పటికీ సైద్దాంతిక చర్చ జరుగుతున్నది గనుక తెలుసుకోవటం అసాధ్యమేమీ కాదు.డెమోక్రటిక్‌ పార్టీలో 66శాతం మంది సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నారని కూడా సర్వేలు వెల్లడించాయి. అసలు విషయం ఏమంటే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇది పెద్ద దెబ్బ.సోషలిజానికి అనుకూలమా కాదా అనేదాని కంటే పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందని గ్రహించటం కూడా పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. డోనాల్డ్‌ ట్రంప్‌ మరియు సోషలిజం గురించి వ్యంగ్యంగా ఉక్రోషంతో మీడియా ఏమి రాసినప్పటికీ అసలు సోషలిజం అంటే ఏమిటి అని తెలుసుకొనేవైపు యువతను నెడుతుండటం ఒక విధంగా మంచి పరిణామమే.

మొత్తంగా సమాజంలో 14 శాతం, 18-29 ఏండ్ల యువతలో 34శాతం మంది కమ్యూనిజం పట్ల సానుకూలత వ్యక్తం చేయటాన్ని జీర్ణించుకోలేని వారు కమ్యూనిజం పని చేయదని యువతరం తెలుసుకోవాలంటూ విశ్లేషణలు రాస్తున్నారు. పాత చింతకాయ పచ్చడి జాడీల దుమ్ముదులుపుతున్నారు. సోషలిజం పని చేయకపోతే వివిధ రంగాలలో కమ్యూనిస్టు చైనా నేడు అమెరికాను సవాలు చేసే స్థితికి ఎలా ఎదిగిందన్నదానికి సమాధానం చెప్పటం లేదు.ఆస్ట్రేలియాలోని లేబర్‌ పార్టీ నిజానికి ఒక బూర్జువా పార్టీ తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం అధికారంలో ఉంది. దాని పోకడ నయా కమ్యూనిజం వైపు ఉన్నదంటూ వ్యతిరేకులు ధ్వజమెత్తుతున్నారు. వారు చూపుతున్న కారణాలేమిటంటే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుపుతున్నదన్నది ఒకటి. స్వేచ్చ తక్కువగా ఉండే విధానాలను అనుసరిస్తున్నదని, ఆ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోలేకపోతున్నదని, ప్రధాని ఆల్బనీస్‌ రాజకీయ జీవితం ప్రారంభ దినాల్లో కమ్యూనిస్టు ఉద్యమంతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాడని, కమ్యూనిస్టులను పొగిడాడని, కొంత మంది లేబర్‌ పార్టీ నేతలకు చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని, చైనా బిల్డింగ్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలసి భోజనం చేశారని, గతంలో ఆల్బనీస్‌ పొరుగున ఉన్న విక్టోరియా రాష్ట్ర మాజీ ప్రధాని డేనియల్‌ ఆండ్రూస్‌ చైనాను చూసి కరోన సమయంలో కఠిన నిబంధనలను అమలు జరిపాడని, చైనా మిలిటరీ పరేడ్‌కు వెళ్లాడని, రెండవసారి గెలిచిన తరువాత షీ జింపింగ్‌తో భేటీ కోసం ఆల్బనీస్‌ ఆరు రోజుల పాటు జరిపిన చైనా పర్యటన అనుమానాస్పదంగా ఉందంటూ ఒక వ్యాఖ్యాత తన చౌకబారు తనాన్ని వెల్లడించుకున్నాడు.

సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఐరోపా, ఇతర అనేక దేశాల్లో ఇలాంటి వక్రీకరణలు నిత్యకృత్యం. అగ్రభాగాన ఉన్న అమెరికాలో న్యూయార్క్‌, మినియపోలిస్‌ పట్టణ మేయర్లకు జరిగే ఎన్నికలలో డెమోక్రటిక్‌ సోషలిస్టులు జోహ్రాన్‌ మమ్దానీ, ఓమా ఫతే పోటీ చేస్తున్నారు. వారు ఓడినా, గెలిచినా అమెరికాలో పెనుమార్పులు ఇప్పటికిప్పుడు జరగవు. అయినప్పటికీ పాలకవర్గం భయపడుతున్నది. అందుకే సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్దాంతాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచార దాడికి మరోసారి పూనుకున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి పెట్టింది పేరైన జో మెకార్ధీ తిరిగి రావాల్సిన అవసరం ఉందని కొందరు పిలుపు ఇచ్చారంటేనే మితవాదశక్తులు బెంబేలెత్తుతున్నట్లు స్పష్టం అవుతున్నది. అందుకే కమ్యూనిస్టులు, ఇతర పురోగామి శక్తులు నయా మెకార్థిజాన్ని ఎదుర్కోవటంలో గతంలో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వకూడదని నిర్ణయించాయి.దాన్లో భాగంగా మధనం జరుపుతున్నాయి.ట్రంప్‌ పోకడలు మెకార్థీని పోలి ఉన్నట్లు చెబుతున్నారు.1950 దశకంలో జో మెకార్థీ ఒక రిపబ్లికన్‌ సెనెటర్‌. అబద్దాలు చెప్పటంలో పేరుమోసిన వాడు.ఒక నిచ్చెన మీద నుంచి పడిపోయినపుడు తగిలిన గాయం తాను యుద్ధంలో పాల్గొన్నపుడు అయిందని జనాన్ని నమ్మించాడు. ఒక గొప్ప ప్రజాస్వామ్యం(నిజానికి అదొక భ్రమ) నాశనం అయిందంటే దానికి కారణం అంతర్గత శక్తులు తప్ప వెలుపలి నుంచి వచ్చిన ముప్పు కాదని అనేక మంది ప్రముఖులు చెప్పారు. ఇప్పుడు అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ అండ్‌ కో నుంచే అది జరుగుతున్నది. నాడు మెకార్థి చేసిన ప్రచారం ఏమంటే విద్రోహులైన కమ్యూనిస్టులు విదేశాంగశాఖలో ప్రవేశించారని 205 మంది జాబితా తన దగ్గర ఉందని చెప్పాడు. అయితే దాన్నెపుడూ బహిర్గతపరచలేదు. తరువాత జరిపిన విచారణలో మెకార్థీ చెప్పినవన్నీ అసత్యాలని తేలింది. ఆ సమయంలో హాలీవుడ్‌తో సహా అనేక రంగాలలో పురోగామి భావాలు కలిగిన అనేక మందికి కమ్యూనిస్టు ముద్రవేసి ఎంతో హానికలిగించారు. ఇప్పుడూ అదే జరుగుతోంది, గిట్టని ప్రత్యర్ధులపై ఆ పేరుతో దాడి చేస్తున్నారు.మీడియాలో ట్రంప్‌ను,అతగాడి విధానాలను విమర్శించే వారిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.హత్యకు గురైన ట్రంప్‌ అనుయాయి పచ్చి మితవాది చార్లీ కిర్క్‌ గురించి చేసిన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టును తొలగించారు, లేకపోతే ప్రసార అనుమతులను రద్దు చేస్తామని ట్రంప్‌ యంత్రాంగం బెదిరించింది. పాలస్తీనాకు మద్దతు ప్రకటించటం, ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని నిరసించటాన్ని సహించలేని యంత్రాంగం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 160 మంది విద్యార్థుల పేర్లను ప్రభుత్వానికి అందచేసింది. అందుకే మెకార్థీ చచ్చినా మెకార్థీయిజం పురుడు పోసుకుంటున్నదని చెబుతున్నారు.అయితే రోజులు మారాయి. జడ్‌ జనరేషన్‌ 66శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారన్న అంశాన్ని విస్మరిస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని మూసిపెట్టటం ఎలా అసాధ్యమో భావజాలాన్ని అణిచిపెట్టటం కూడా అంతే !. శీఎ.aబ06:41

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇది కదా కమ్యూనిస్టుల ముందు చూపు – మేథోవలస- తిరిగి రాకపై దశాబ్దాలనాడే చైనా ముందు జాగ్రత్త !

24 Wednesday Sep 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

BJP, Brain drain and Gain, China, china communist party, Donald trump, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

రానున్న రోజుల్లో తమ దేశానికి హెచ్‌ 1 బి వీసా మీద వచ్చే వారు లక్ష డాలర్లు(88 లక్షలరూపాయలు) చెల్లించాల్సి ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయం భారతీయులను విస్మయానికి గురిచేసింది. అనేక మంది డాలర్‌ కలలు కల్లలైనట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయానికి ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా కార్పొరేట్లు తెచ్చే వత్తిడికి లొంగి సవరించుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ప్రపంచ వ్యాపితంగా మేథోవలస-తిరిగి రాకల గురించి మధనం ప్రారంభమైంది.ట్రంప్‌ నిర్ణయం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది మరికొంత స్పష్టత వచ్చిన తరువాతనే చెప్పుకోవటం మంచిది. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని వ్యాఖ్యలు, పత్రికా శీర్షికలు, వాటి వెనుక ఉన్న అంశాల గురించి చూద్దాం. అమెరికా లక్షల డాలర్ల ఫీజు కేవలం ఒక చెడ్డ విధానమేగాక చైనాకు వ్యూహాత్మక బహుమతి అంటూ ఒక బడా ఆంగ్ల పత్రికలో విశ్లేషణ ప్రారంభమైంది. హ్రస్వదృష్టితో ఉన్న అమెరికా వైఖరి కేవలం చైనా సాంకేతిక ప్రగతి పెరగటానికే తోడ్పడుతుందని కూడా వ్యాఖ్యాత వాపోయారు. విలువైన సంపదలను వెండి పళ్లెంలో పెట్టి చైనాకు అప్పగిస్తున్నారంటూ మరొకరు. ఎవరు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూసినపుడు అమెరికా, ఇతర ధనిక దేశాల విధాన నిర్ణేతలు, మేథావులు అనుసరించిన విధానాలు, అడ్డుకోవటాలు జనచైనా ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయన్నది జగమెరిగిన సత్యం. చైనా గురించి ఈ మాటలు చెబుతున్నవారు ట్రంప్‌ నిర్ణయం భారత్‌కు బహుమతి అని ఎందుకు చెప్పలేకపోయారు ? అత్తారింటికి దారేది సినిమాలో పదిలక్షల రూపాయల సూట్‌కేసును పవన్‌ కల్యాణ్‌ బహుమతిగా ఇస్తే దాన్ని తీసుకు వెళ్లిన ఆలీ తాళం రావటం లేదంటూ తిరిగి వచ్చిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆకస్మికంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని స్థితిలో పదకొండేండ్ల మోడీ పాలన మనదేశాన్ని ఉంచిందని భావించాలా ? ఎందుకంటే ఏది జరిగినా మోడీ కారణంగానే అంటున్నారు గనుక ఇలా వ్యాఖ్యానించాల్సి వస్తోంది.

ప్రతిభావంతులకు చైనా,బ్రిటన్‌ వల అన్నది ఒక ప్రముఖ తెలుగు పత్రిక శీర్షిక. అమెరికా అడ్డుకుంటే ప్రతిభను వృధా కానివ్వాలా ? ఆ పని మనమెందుకు చేయటం లేదని ప్రశ్నించాల్సిన వారు ఇతర దేశాల గురించి అలాంటి పదజాలంతో కించపరుస్తూ వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కె వీసాల జారీతో చైనా ఎంతో చురుకుగా ప్రపంచంలోని స్టెమ్‌ (సైన్సు,టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత) మేథావులను ఆకర్షిస్తున్నదని ట్రంప్‌ ప్రకటన తరువాత వార్తలు వెలువడ్డాయి. నిజానికి చైనా నిర్ణయం ఎంతో ముందుగానే తీసుకున్నది. మన మీడియా, అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ మన పాలకులు చైనా చర్యలను గుర్తించలేదు, అసలు ప్రయత్నం కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు.మనం లేకపోతే అమెరికాకు గడవదు అని మనజబ్బలు మనం చరుచుకున్నాం తప్ప అసలు వారెందుకు ప్రపంచమంతటి నుంచీ మేథావంతులను ఆకర్షిస్తున్నారు, తేడా వచ్చి ఆకస్మికంగా అడ్డుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటి అని 2047 విజన్‌ గురించి చెబుతున్న నరేంద్రమోడీ గానీ, అంతకు ముందే విజన్లను ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గానీ ఎప్పుడైనా ఆలోచించారా ? కాక మీద ఉన్నపుడే ఇనుము మీద దెబ్బలు వేసి అవసరానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఇప్పుడు యువత కూడా ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. అమెరికాగాకపోతే ఆస్ట్రేలియా, అదిగాక పోతే ఆఫ్రికా అన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. సంచార తెగమాదిరి ఎక్కడికో అక్కడికి పోవటం తప్ప మన దేశం పురోగమించటం గురించి, గౌరవ ప్రదమైన ఉపాధి గురించి ఎందుకు ఆలోచించరు ?

అమెరికా వ్యూహాత్మకంగా స్వయంగా చేసిన తప్పిదం అంటున్నారు సరే, దాంతో మనకు పోయేదేమీ లేదు, మనం ఎందుకు వ్యూహాత్మకంగా ఆలోచించలేదు అని కదా పాఠాలు తీసుకోవాల్సింది. చైనా కె వీసా ఎంతో స్మార్ట్‌గా, వ్యూహాత్మకంగా, నిర్దాక్షిణ్యమైన అవకాశవాదంతో ( రూత్‌లెస్లీ ఆపర్చ్యునిస్టిక్‌) ఉందని కూడా ఉక్రోషం వెలిబుచ్చారు. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకొనేందుకు చైనాలోని ఏదో ఒక కంపెనీ ఇచ్చే అవకాశంతో పని లేదు. అనుభం కూడా అవసరం లేదు. వారు కోరిన అర్హతలు ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతిభావంతులను ఆకర్షించటం ఇప్పుడే ప్రారంభం కాలేదు. వేయి ప్రతిభల పథకం(టిటిపి) పేరుతో చైనా 2008 నుంచే ఆకర్షించటం ప్రారంభించింది. అయితే చైనా మీద ఉన్న తప్పుడు ప్రచారం, అమెరికాతో పోలిస్తే దక్కే ప్రతిఫలం తక్కువగా ఉండటం, కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వం అనే వ్యతిరేక భావనలు ఇలా అనేక అంశాలు చైనా వైపు చూడటానికి యువతను అడ్డుకున్నాయి. అది కూడా చాపకింద నీరులా తన పథకాన్ని అమలు జరిపింది తప్పహడావుడి చేయలేదు. ఇప్పుడు చైనా సాధిస్తున్న పురోగతి, ఇతర దేశాల్లో విధిస్తున్న ఆంక్షలు, జాత్యహంకారం వంటి వివక్ష ఇతర సమస్యల కారణంగా గతంలో మాదిరి అడ్డుకొనే అవకాశాలు పరిమితం. అనేక మంది వైద్య విద్యకోసం చైనా వెళ్లిన సంగతి తెలిసిందే.

మన దేశానికి ట్రంప్‌ మంచి అవకాశాన్ని కల్పించాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన విధాన నిర్ణేతలు, పాలకుల చేతుల్లో ఉంది. సేవారంగంలో మన యువత ముందంజలో ఉంది.మొత్తంగా చూసినపుడు సాధించాల్సింది ఇంకా ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది. ప్రపంచంలో పరిశోధన మరియు అభివృద్ధి మీద చేస్తున్న ఖర్చు వంద రూపాయలు అనుకుంటే మనం చేస్తున్నది కేవలం రు.2.90 మాత్రమే. అదే అమెరికా 24.8, చైనా 22.80 ఖర్చు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ప్రపంచంలో నవకల్పనలకు పేటెంట్‌ హక్కులు లభిస్తున్నాయి. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 2023లో చైనా అత్యధికంగా 16,19,268 దరఖాస్తులు సమర్పించగా 7,98,347 మంజూరయ్యాయి. రెండవ స్థానంలో ఉన్న అమెరికా 5,94,340కి గాను 3,20,410 పొందింది. మన విషయానికి వస్తే ఐదవ స్థానంలో 70,068 మాత్రమే సమర్పించి 30,490 పొందాము. మూడవ స్థానంలో ఉన్న జపాన్‌ 2,89,530కి గాను 2,01,420, నాలుగవది దక్షిణ కొరియా 2,37,633కు గాను 1,35,180 పొందాయి. ఏదైనా పిండికొద్దీ రొట్టె.గడచిన పదకొండు సంవత్సరాలుగా అంతకు ముందు కూడా పరిశోధన, అభివృద్ధికి మనదేశం చేసిన ఖర్చు పెరగలేదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తే ఇలాగే ఉంటుంది.పోనీ వాటినైనా వెలికి తీస్తారా అంటే అదీ చేయరు. పడక కుర్చీ కబుర్లు చెబుతుంటారు. యుద్ద ప్రాతిపదికన కొన్ని సంవత్సరాల పాటు అవసరమైన నిధులు కేటాయించి ప్రోత్సహిస్తే మనం కనీసం మూడవ స్థానానికి చేరుకుంటాం.ఈ అవకాశాన్ని మోడీ సర్కార్‌ సద్వినియోగం చేస్తుందా ? చౌకబారు రాజకీయాల మీదనే కేంద్రీకరిస్తుందా ? కొంత మంది అంచనా వేస్తున్నట్లు రానున్న రోజుల్లో ప్రావీణ్యం అసలైన శక్తిగా ముందుకు రానుంది. దీన్ని చైనా ఎప్పుడో గుర్తించింది, అమెరికా ఇప్పుడు నేర్చుకుంటున్నది, మరి మనం ? అవు సైన్సును నమ్ముకుంటే గోమూత్రం, పేడ దగ్గరే ఉండిపోతాం. వార్షిక ప్రపంచ రాంకింగ్‌లను చూసినపుడు చైనా విద్యా సంస్థల పురోగతి స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పటికీ చైనాను గుడ్డిగా వ్యతిరేకించే వారు అది అనుకరించేది తప్ప నవకల్పనలు చేసేది కాదని వాదిస్తారు. వారిని అలాగే ఉండనిద్దాం, వాస్తవాలను చూద్దాం. అమెరికాకు చెందిన న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ నివేదికలో 105 దేశాలకు చెందిన 2,250 ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ సంవత్సరం బీజింగ్‌లోని సిన్హువా విశ్వవిద్యాలయం ప్రపంచ రాంకుల్లో పదకొండవ స్థానం పొందింది. పెకింగ్‌, ఝెజియాంగ్‌ 25,45వ స్థానాల్లో ఉన్నాయి. 2018లో సిన్హువా, పెకింగ్‌ 50, 68 స్థానాలతో తొలి వందలో ఉన్నాయి.ఈ ఏడాది వాటి సంఖ్య పదిహేనుకు చేరింది.చైనాలో అమలు జరిపిన కరోనా ఆంక్షలు, అంతకు ముందే 2018లో ట్రంప్‌ తొలి పాలనా కాలంలో ప్రారంభమైన అమెరికా వేధింపులు పెరగటంతో 2019-20లో 3,72,532గా అమెరికాలో చదివిన చైనా విద్యార్థుల సంఖ్య 2023-24లో 2,77,398కి తగ్గింది. దీంతో ఇప్పుడు మన దేశం మొదటి స్థానంలోకి వెళ్లింది.

ఇప్పటి వరకు చైనా నుంచి అమెరికాకు మేథోవలస జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి రావటం ప్రారంభమైంది. దీనికి అక్కడ పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు పెరగటంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులో చైనాను విస్మరించలేని స్థితికి చేరుకోవటం, అక్కడ కూడా అనేక స్టార్టప్‌లు ప్రారంభించటానికి ప్రభుత్వం అవకాశం కల్పించటం వంటి కారణాలు దీనికి దోహదంచేస్తున్నాయి.2035 నాటికి ప్రపంచ అగ్రస్థానంలో సాంకేతిక రంగాన్ని నిలబెట్టేందుకు చైనా పూనుకుంది. అందుకు అవసరమైన పెట్టుబడిలో అమెరికాతో పోటీపడుతోంది.ఓయిసిడి సంస్థ సమాచారం ప్రకారం పదేండ్ల క్రితం అమెరికా చేసిన పరిశోధన ఖర్చులో 72శాతం చేసిన చైనా 2023నాటికి 780 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 96శాతానికి చేరుకుంది. పరిశోధన ఉత్పత్తిలో 2017లోనే అమెరికాను అధిగమించింది. డీప్‌ సీక్‌ సంచలనం తెలిసిందే. దానిలో పనిచేసిన వారందరూ చైనా యువకులే.కొంత మందికి ఎక్కడా పని చేసిన అనుభవం కూడా లేదు. దీనితో పాటు ఝజియాంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాడ్యుయేట్లు డీప్‌ రోబోటిక్స్‌లో ప్రావీణ్యం పొందారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ప్రమాదకరమైన హై ఓల్టేజి సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తున్నారు. సిలికాన్‌ వాలీతో పోటీ పడేట్లుగా చైనా ప్రోత్సహిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞాన ఎగుమతులపై అమెరికా విధించిన నిషేధాలను సవాలుగా తీసుకుంది.అవకాశాలను అందిపుచ్చుకోవటంలో చైనాను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 1970దశకంలో అనివార్యమైన స్థితిలో ఐరాస భద్రతా మండలిలో కమ్యూనిస్టు చైనాను అసలైన శాశ్వత ప్రతినిధిగా అమెరికా గుర్తించాల్సి వచ్చింది.

దాని కొనసాగింపుగా చైనా ప్రారంభించిన సంస్కరణలను సొమ్ము చేసుకోవాలని అమెరికా భావించింది. తాత్కాలిక లాభాలను అమెరికన్లు చూస్తే దీర్ఘకాలిక లక్ష్యంతో సంస్కరణలను చైనా తలపెట్టింది.1978 వరకు అమెరికా ఉన్నత విద్యా సంస్థలలో చైనీయులకు ప్రవేశం లేదు. సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకొనే ప్రక్రియలో భాగంగా అమెరికా సైన్సు సలహాదారు ఫ్రాంక్‌ ప్రెస్‌ బీజింగ్‌ సందర్శనకు వచ్చాడు. అక్కడి నుంచి నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు ఫోన్‌ చేసి తమ విద్యార్థులు ఐదువేల మందిని అమెరికా విద్య కోసం పంపేందుకు ఆసక్తితో ఉన్నట్లు చైనా చెప్పిందని, ఏం చేయమంటారని అడిగాడు. ఐదువేలేం ఖర్మ లక్ష మందిని పంపవచ్చని వారికి చెప్పండని కార్టర్‌ సమాధానమిచ్చాడట. అలా వెళ్లిన లక్షలాది మంది చైనా విద్యార్ధులు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏటా 15 బిలియన్‌ డాలర్ల లబ్ది కలించారు.ఆ విధంగా అమెరికా మేథోవలసను ప్రోత్సహించి ఎంతోలబ్ది పొందింది. అక్కడి మార్కో పోలో అనే మేథో సంస్థ ప్రపంచ కృత్రిమే మేథ సర్వే చేసింది. అమెరికాలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధకుల్లో 37శాతం మంది అమెరికన్లు కాగా చైనీయులు 38శాతం ఉన్నట్లు తేలింది.చాట్‌ జిపిటి 4 ప్రాజెక్టులో కీలకమైన సేవలు అందించిన వారిలో 20శాతం మంది చైనీయులే. వీటన్నింటిని చూసిన తరువాత భయపడిన అమెరికన్లు పొమ్మనకుండా చైనీయులకు పొగ పెట్టారు. మా దేశంలో చదువుకొనేందుకు రావచ్చు గానీ స్టెమ్‌ కోర్సుల బదులు, మావవ, సామాజిక శాస్త్రాలను ఎంచుకోవాలని వత్తిడి తెస్తున్నది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన కోర్సులో ప్రవేశాన్ని పరిమితం చేసింది. అందుకే చైనీయులు వేలాది మంది స్వదేశం బాట పట్టి అమెరికాకు పాఠం చెప్పేందుకు పూనుకున్నారు. మోడీ సర్కార్‌ మనవారికి అలాంటి అవకాశాలను కల్పిస్తుందా అన్న శేష ప్రశ్న !

Share this:

  • Tweet
  • More
Like Loading...

యువతకు పట్టని దోపిడీ : జిఎస్‌టి తగ్గింపు సరే ముడి చమురు ధర పతనమైనా పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించరేం !

21 Sunday Sep 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

#Fuel Prices India, BJP, Fossil Fuel, Fuel Price in India, Fuel tax hike in India, GST on Fuel, Narendra Modi Failures, youth indifference

ఎం కోటేశ్వరరావు

ఈనెల 22 నుంచి నవరాత్రి కానుకగా తగ్గించే జిఎస్‌టి స్లాబులతో మీరు నేరుగా స్వర్గానికి భారతీయ పుష్పక విమానంలో పైసా ఖర్చు లేకుండా వెళ్లి రావచ్చన్నట్లుగా నరేంద్రమోడీ బొమ్మతో ప్రచారాన్ని ఊదరగొడుతున్నారు. అక్టోబరు లేదా నవంబరులో జరిగే బీహార్‌, తరువాత జరగాల్సిన మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్వరంగంలో ఈ ప్రచారం మోతమోగుతున్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులు పొందుతూ నరేంద్రమోడీ బొమ్మ పెట్టటం లేదంటూ బిజెపి నేతలు విమర్శలు చేస్తారు .ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు. పన్నెండు, 28శాతం పన్ను విధించే శ్లాబులను రద్దు చేసి ఐదు, పద్దెనిమిది శాతంతో పండగ చేసుకోవాలని చెబుతున్నవారు ఒక్క మోడీ బొమ్మనేే ఎందుకు పెడుతున్నట్లు ? జిఎస్‌టి తగ్గింపు నష్టాన్ని కేంద్రం రాష్ట్రాలకు బదలాయిస్తే మోడీ చిత్రం పెట్టుకున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ అలా కాదే, సగం నష్టాన్ని భరించేది రాష్ట్రాలు,ఎనిమిది వేల కోట్ల నష్టమని చంద్రబాబు ఇంజన్‌ ధ్వనులు చేస్తోంది, ఆ పేరుతో దేనికి కోత పెడతారో అది వేరే అంశం. జిఎస్‌టి తగ్గింపు ఖ్యాతి మొత్తం మోడీ ఖాతాలో వేస్తున్నారు. వీటినే చావు తెలివి తేటలు అంటారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం 2018లో జిఎస్‌టి ద్వారా వచ్చిన రాబడి రు.11,77,380 కోట్లు. సగటున నెలకు రు.98వేల కోట్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల పెరుగుదల, కొన్ని వస్తువుల మీద పన్ను పెరుగుదల వంటి కారణాలు కూడా తోడై 2024లో రు.20,12,720 కోట్లకు అంటే సగటున రు.183వేల కోట్లకు పెరిగింది.

ఇంత భారీ మొత్తంలో పన్ను రాబడి పెరుగుదల మోడీ సర్కార్‌ ఘనత అని చెబుతారు. నిజం ఏమిటి ? వినియోగం, పదేండ్లలో జనాభా 127 కోట్ల నుంచి 146 కోట్లకు చేరింది. పదేండ్లలో ద్రవ్యోల్బణం ఏటా సగటున 5.94శాతం చొప్పున పదేండ్లలో 59.4శాతం మొత్తంగా పెరిగింది. దీనికి తోడు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను కూడా పెంచాయి. వీటన్నింటి కారణంగా జిఎస్‌టి కూడా ఆ మేరకు పెరిగింది. పన్ను ఎగవేతలను అరికట్టామన్నారు, నిజం ఏమిటో జనానికి తెలుసు ! జిఎస్‌టి తగ్గింపును దుకాణాల వారు ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు వార్తలు వచ్చాయి. దీపావళి నాటికి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సంస్కరణలను అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 15 ఎర్రకోట ప్రసంగంలో చెప్పారు. వివరాలు తెలియకుండానే జనం పండగ చేసుకుంటారని మీడియా పెద్ద ప్రచారం చేసింది. అమెరికా పన్నుల దాడి, రానున్న బీహార్‌ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని రాయిటర్స్‌ ఇచ్చిన వార్తకు కొన్ని పత్రికలు శీర్షికలు పెట్టాయి. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఓట్ల లాభం లేకుండా నరేంద్రమోడీ దేన్నీ తలపెట్టరు అని వేరే చెప్పనవసరం లేదు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు జిఎస్‌టి ప్రతిపాదనను బిజెపి వ్యతిరేకించింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2017 నుంచి అమలు చేసి తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నది.

ఏ కారుకు ఎంత, ఏ మోటార్‌ సైకిలుకు ఎంత, ఇలా పన్ను భారం తగ్గే వాటి గురించి ఇప్పటికే కంపెనీలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. గిరాకీ గిడసబారి లాభాల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ఎక్కువగా కొనుగోలు చేసే విలాస వస్తువులపై 28 నుంచి 18శాతానికి పన్నుల తగ్గింపు వారికి ఊరటనిచ్చే మాట నిజం. పన్నెండు పన్ను జాబితాలో ఉన్నవాటిని ఐదుశాతానికి తగ్గించారు.గత లావాదేవీలపై జరిపిన విశ్లేషణ క్రిసిల్‌ నివేదిక ప్రకారం ప్రతి వంద రూపాయల జిఎస్‌టి రాబడిలో ఐదుశాతం ఉన్న వస్తువుల ద్వారా ఏడు రూపాయలు, పన్నెండు శాతం ఉన్నవాటితో ఐదు నుంచి ఆరు రూపాయలు, పద్దెనిమిదిశాతం వాటితో 70 నుంచి 75, విలాసవస్తువుల జాబితాలో ఉన్న 28శాతం నుంచి 13 నుంచి 15 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ముందే చెప్పుకున్నట్లు 28,12శాతాలు ఉండవు. అందువలన ప్రామాణిక పన్నుశ్లాబ్‌ నుంచి ఎంత అనేది కొద్ది నెలల తరువాత గానీ వెల్లడి కాదు. తాజా మార్పులు, ఆదాయపన్ను మినహాయింపులు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణతో మొత్తం నాలుగున్నరలక్షల కోట్ల రూపాయల మేర జనంలో కొనుగోలు శక్తి పెరిగేందుకు అవసరమైన సొమ్ము చేరుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టాలు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని ఊరడిస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాత్రూముల్లో తప్ప బహిరంగంగా ఏడవటానికి కూడా అవకాశం లేదు, ఎవరి బాధలు వారివి.

జిఎస్‌టి తగ్గింపు వలన వస్తువుల ధరలు తగ్గి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు తప్ప కొనుగోలు శక్తి పెరగదు.డెలాయిట్‌ కంపెనీ చేసిన విశ్లేషణ ప్రకారం గత ఐదు సంవత్సరాలలో నిజవేతనాల పెరుగుదల మైనస్‌ 0.4 నుంచి ప్లస్‌ 3.9శాతం వరకు ఉందని పేర్కొన్నది. పైన చెప్పుకున్నట్లు సగటు ద్రవ్యోల్బణం 5.94 శాతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే నిజవేతనాలు ఎలా తగ్గిపోయాయో, పెరుగుదల ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇన్‌ డాట్‌ ఐకాలిక్యులేటర్‌ డాట్‌ కామ్‌ విశ్లేషణ ప్రకారం 2014లో రు.5,765.94 రూపాయల వేతనం ఇప్పుడు పదివేలకు సమానం.ఈ మొత్తంలో పన్నులు, ఇతర కోతలు పోను ఇంటికి తీసుకుపోయిన మొత్తం రు.4,793 కాగా ఇప్పుడు పదివేల రూపాయలు వస్తే చేతికి అందుతున్నది రు.8,222గా ఉంది. అందువలన తట్టలతో డబ్బు తీసుకుపోయి బుట్టలతో సరకులు కొనుగోలు చేసే రోజుల వైపు పయనిస్తున్నామని చెప్పుకుంటే అతిశయోక్తి కాదు. అత్యంత ధనిక దేశం అమెరికాలో జిఎస్‌టి లేదు. అమ్మకపు పన్ను మాత్రమే ఉంది. వివిధ రాష్ట్రాలలో కనిష్టంగా నాలుగు శాతం నుంచి పన్నెండు శాతం వరకు మాత్రమే ఉన్నాయి. మన పొరుగునే ఉన్న చైనాలో ప్రామాణిక జిఎస్‌టి శ్లాబ్‌ 13శాతం మాత్రమే, ఇదిగాక తొమ్మిది, ఆరుశాతం శ్లాబులు ఉన్నాయి. క్రిసిల్‌ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి నష్టం పెద్ద లెక్కలోనిది కాదు. అందువలన నూతన శ్లాబులు మీ జీవితాన్నే మార్చివేస్తుందన్న ప్రచారంలో నిజాలు కొద్ది నెలల తరువాత మాత్రమే వెల్లడవుతాయి.

ఉక్రెయిన్‌ – రష్యా పోరు మనదేశం, చైనాలకు ఎంతో మేలు చేస్తున్నది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యన్‌ చమురు రాయితీ ధరలకు వస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మిగులుతున్నది. విపరీతంగా పెంచిన చమురు సెస్‌లను రద్దు చేస్తే వస్తుకొనుగోలు ఇంకా పెరుగుతుంది.సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉన్న యువత ఇలాంటి విషయాల మీద ఎందుకు కేంద్రీకరించటం లేదు ? జిఎస్‌టి తగ్గింపు ఏ మేరకు జనాలకు ఉపశమనం కలిగించినా మంచిదే. కానీ చమురు భారం సంగతేమిటి ? దాన్ని జిఎస్‌టిలో ఎందుకు చేర్చరు ? రాష్ట్రాల మీద నెపం వేస్తున్నారు.ఎందుకు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి ? వాటికి ఉన్న ఆదాయవనరులలో అమ్మకపు పన్ను రద్దుచేసి జిఎస్‌టి తెచ్చారు. నష్టం వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం పరిహారం చెల్లించింది. అదే విధంగా చమురు మీద వేస్తున్న వాట్‌ బదులు జిఎస్‌టికి మార్చి అదే విధంగా పరిహారాన్ని కేంద్రం ఎందుకు చెల్లించకూడదు ? అలా చెల్లిస్తే ఏ రాష్ట్రమైనా వ్యతిరేకత తెలుపుతుందా ? పోనీ వినియోగదారుల పట్ల ఏమైనా నిజాయితీగా ఉందా అంటే అదీ లేదు. దరిద్రం ఏమిటంటే దాని గురించి అడిగేవారేలేకపోయారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా చమురు ధరలను సవరిస్తామని ఒక విధానాన్ని అమలు జరిపిన ప్రభుత్వం 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి నిలిపివేసింది. అప్పటి నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధర పడిపోయినా, రష్యా నుంచి రాయితీ ధరకు కొనుగోలు చేసినా ఆ మేరకు వినియోగదారుడికి తగ్గించలేదు. ప్రభుత్వమే అలా జనాల జేబులు కొట్టివేస్తున్నపుడు తగ్గించిన జిఎస్‌టి పన్ను మొత్తాలను ప్రయివేటు కంపెనీలు బదలాయిస్తాయంటే నమ్మేదెలా ? ధరల పెంపుదల మీద ప్రభుత్వానికి నియంత్రణ లేదు.

2023వ సంవత్సరంలో మన చమురు దిగుమతి బిల్లు రు. 16,82,475కోట్లు, అది 2024లో రు.14,80,232 కోట్లకు తగ్గింది. అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు, అయినప్పటికీ ఒక్క పైసా కూడా డీజిలు, పెట్రోలు ధరలు తగ్గించలేదు. సామాజిక మాధ్యమాల మీద కొన్ని ఆంక్షలు పెట్టినందుకే నేపాల్‌ యువత ఎలా స్పందించిందో చూశాము.మనవారికి ఎందుకు పట్టటం లేదు. ఇవేమీ తెలియని అంశాలు కాదే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మనం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర.93.15 డాలర్లు. నాడు నిర్ణయించిన ధరలే నేడు అమలు జరుగుతున్నాయి. అయిల్‌ ప్రైస్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం 2025 జనవరి 17న మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా ధర 84.1డాలర్లు కాగా సెప్టెంబరు 18న 69.9 డాలర్లకు తగ్గింది. అయినా ఎందుకు ధరలు తగ్గించలేదు, ఎవరైనా సమాధానం చెప్పేవారున్నారా ? ఒక పీపా ముడిచమురు ధర పది డాలర్లు తగ్గితే దిగుమతి బిల్లులో లక్షా పదివేల కోట్లు మిగులుతాయి. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ధర 62 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. మన అవసరాల్లో 2025 జూలై నెలలో 31శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాము. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వేసిన గణాంకాల ప్రకారం 2022 నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 1,260 కోట్ల డాలర్లు అంటే మన రూపాయల్లో లక్షా పదివేల కోట్లు మనదేశానికి మిగిలింది. గతంలో భారీ మొత్తాల్లో సెస్‌ విధించినపుడు ఒకసారి యుపిఏ ప్రభుత్వం చేసిన అప్పు తీర్చటానికి అని చెప్పారు. మరోసారి కరోనా వాక్సిన్‌ ఉచితంగా వేశారంటే డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారనుకుంటున్నారు అని బుకాయించారు. ఇంకోసారి మనదేశ రక్షణకు అవసరమైన మిలిటరీ ఖర్చుల కోసం అని మరో కత చెప్పారు. ఒక వేళ నిజంగా వాక్సిన్‌ పేరుతో విధించి ఉంటే అవసరం తీరింది గనుక ఆ మొత్తాన్ని ఎందుకు రద్దు చేయలేదు ? కేంద్ర ప్రభుత్వ సంస్థ కంప్ట్రోలర్‌ మరియు ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తాజా నివేదిక ప్రకారం 2023-24 నాటికి విద్య, వైద్యం, రోడ్లు, వ్యవసాయం,స్వచ్చ భారత్‌, చమురు పరిశ్రమ అభివృద్ది పేరుతో వసూలు చేస్తున్న సెస్‌ మొత్తాలను ఆ రంగాలకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే రు.3.69లక్షల కోట్ల మొత్తాన్ని వాటికి బదలాయించకుండా ఇతర అవసరాలకు మళ్లించినట్లు కాగ్‌ పేర్కొన్నది. సర్‌ఛార్జి, సెస్‌లో ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు బదలాయించదు.

అసలు మనం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధర ఎంత దాన్నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులైన డీజిలు, పెట్రోలుకు ఎంత పడుతున్నది, ఎంత వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో 2025 జూన్‌ నెలలో ఉన్న ధరల ప్రకారం లీటరు పెట్రోలు రు.100గా ఉంది.దానిలో చమురుశుద్ధి కేంద్రాలు డీలర్ల వద్ద వసూలు చేసేది రు.45, కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్‌, సెస్‌ల మొత్తం రు.32.90, ఢిల్లీ ప్రభుత్వం 30శాతం చొప్పున వ్యాట్‌ రు.23.25, డీలర్లకు ఇచ్చే కమిషన్‌ రు.1.85, అంటే అసలు ధర కంటే పన్నుల వాయింపు 56.20 ఉంది.అదే డీజిలు మీద 51.3శాతం పన్నులున్నాయి. ఇతర రాష్ట్రాలు కొన్నింటిలో ఇంకా ఎక్కువ మొత్తం వ్యాట్‌ ఉంది. బిజెపి లేదా దాన్ని భుజాన మోస్తున్న తెలుగుదేశం, జనసేన,వైసిపి వంటి పార్టీలు ఎలా సమర్ధించుకుంటాయి. ఐరోపా దేశాల్లో పన్నుల మొత్తాలు 70శాతం వరకు ఉన్నాయి కదా అని ఎవరైనా అనవచ్చు. అవన్నీ ధనిక దేశాలు, వాటికీ మనకు పోలిక ఎక్కడ ? ప్రతిదానికీ మనవారు పోలుస్తున్న చైనాలో 2015 నుంచి పెట్రోలు లీటరు మీద 1.52 చైనా యువాన్‌లు(రు.18.84),డీజిలు మీద 1.2(రు.14.87) విధిస్తున్నారు. మన దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం, రాష్ట్రాలు చమురు మీద వసూలు చేసిన మొత్తం రు.7.5లక్షల కోట్లు. ఇంత మొత్తం భారం మోపుతున్నప్పటికీ దాన్ని తగ్గించేందుకు మన దేశీయ ఉత్పత్తిని పెంచటం ఒక మార్గం. గడచిన పదేండ్లలో అంతకు ముందున్న దానికంటే ఉత్పత్తి తగ్గిందని చెప్పుకోవాలంటే పాలకులకు ఉండదు గానీ మనకు సిగ్గు వేస్తున్నది. యువత వీటిని ఎందుకు పట్టించుకోవటం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కళ్లుండీ చూడలేని కబోదులా, రక్త పిపాసులా – గాజాపై అమెరికా ఆరవసారి వీటో !

20 Saturday Sep 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Gaza Deaths, Global Sumud Flotilla, Israel genocide, UNSC Failures, US’s sixth veto

ఎం కోటేశ్వరరావు

2023 అక్టోబరు 7వ తేదీ నుంచి పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయెల్‌ ఊచకోతలో మరణించిన వారి సంఖ్య 65వేలు దాటింది. వీరిలో 70శాతం మంది అన్నెంపున్నెం ఎరగని పిల్లలు, వారి సంరక్షణ చూస్తున్న తల్లులే ఉన్నారు. లక్షలాది మంది గాయపడ్డారు, వేలాది మంది జాడ తెలియటం లేదు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, నిర్వాసితుల గుడారాలు, మానవతా పూర్వక సాయం చేస్తున్న కేంద్రాలు ఒకటేమిటి, ఏదో ఒక సాకుతో నిత్యం ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులకు గురవుతున్నాయి. యాసిలెడ్‌ అనే ఒక సంస్థ తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం గాజాలో ఇజ్రాయెల్‌ చేసిన ప్రతి పదహారు హత్యలలో బలైంది 15 మంది సామాన్య పౌరులే అని తేలింది.ఈ ఏడాది మార్చినెల 18 తరువాత తాము 2,100 మంది సాయుధులను మట్టుబెట్టామని ఇజ్రాయెల్‌ చెప్పింది. తమ సమాచారం ప్రకారం 1,100 మందికి మించి లేరని సర్వే చేసిన సంస్థ పేర్కొన్నది. ఇదే కాలంలో 16వేల మంది పౌరులను చంపారు. ఇటీవలి కాలంలో నివాస ప్రాంతాల విధ్వంసం కూడా విపరీతంగా పెరిగింది. మార్చి నెలకు ముందు 15 నెలల కాలంలో భవనాల కూల్చివేతలు, దాడులు 698 జరిగితే, గడచిన ఆరునెలల్లోనే 500 ఉదంతాలు ఉన్నాయి. హమస్‌ను అదుపు చేయలేకపోయామనే ఉక్రోషంతో ఇజ్రాయెల్‌ ఎంతకు తెగిస్తున్నదో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా త్రివిధ దళాలు ప్రారంభించిన భీకరదాడులతో లక్షలాది మందిని తరిమివేస్తున్నారు. దిక్కుతోచని జనం తమ ప్రాంతాల నుంచి కకావికలౌతున్నారు.పదాతి దళాలు, వారికి మద్దతుగా యుద్ధ టాంకులు, వీటితో పాటు యుద్ద విమానాలు, హెలికాప్టర్లను రంగంలోకి దించి గాజాలో ఉన్న నివాస ప్రాంతాలపై పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతున్నది. దీంతో కాలినడకన, బండ్లు, దొరికిన వాహనాలతో లక్షలాది మంది గాజా దక్షిణం, ఇతర చోట్లకు వెళుతున్నారు, ఎక్కడ సురక్షిత ప్రాంతం దొరుకుతుందా అని చూస్తున్నారు. ఎక్కడ ఆగితే అక్కడ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనా మరో ప్రాంతమైన పశ్చిమగట్టులో గ్రామాలు, పౌరుల మీద కూడా ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు జరుపుతున్నది. ఈ దారుణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ భద్రతా మండలిలో గురువారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 15కు గాను 14 సభ్యదేశాలు బలపరచగా అమెరికా వీటో చేసి అడ్డుకుంది. గాజా మారణకాండపై ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా వీటో హక్కుతో అడ్డుకోవటం ఇది ఆరవసారి.

గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నట్లు తొలిసారి ఐరాస ప్రకటించింది. అయితే ఆ బృందం వాస్తవాలను పట్టించుకోలేదని, హమస్‌కు మద్దతుగా వ్యవహరించిందంటూ భద్రతా మండలిలో అమెరికా ధ్వజమెత్తింది. అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఇలాంటి తప్పుడు నివేదికలు ఇస్తున్న కారణంగానే తాము ఆ సంస్థ నుంచి తప్పుకున్నట్లు సమర్ధించుకుంది.ఐరాస మానవహక్కుల కమిషన్‌ గాజాలో మారణకాండ జరుగుతున్నదని చెప్పటం తప్పుడు ప్రచారమని అమెరికా మధ్య ప్రాచ్య ఉపరాయబారి మోర్గాన్‌ ఆర్టగస్‌ ఆరోపించింది.మానవహక్కుల కమిషన్‌ నివేదిక అంతా అవాస్తవాలతో నిండి ఉందని, హమస్‌కు లబ్ది చేకూర్చేదిగా ఉందని ఆమె ఆరోపించింది. ఎలాంటి ఆధారాలను చూపకుండా ఇలాంటి నివేదికలను రూపొందించటమంటే తన నిబంధనలను తానే ఉల్లంఘించినట్లు ఐరాసపై ఆమె ఆరోపించింది. యూదు వ్యతిరేక వేధింపులుగా వర్ణించింది.ఇజ్రాయెల్‌ ఆత్మరక్షణ హక్కును తీర్మానం గుర్తించలేదని, హమస్‌ చర్యలను ఖండించలేదని ఆరోపించింది.

సాధారణంగా భద్రతామండలి సమావేశాల్లో ఆయాదేశాల ప్రతినిధులు మాట్లాడిన తరువాత సమావేశాలు ముగుస్తాయి. కానీ గురువారం నాడు ఒకసారి మాట్లాడిన తరువాత సభ్యులు ఆగ్రహంతో రెండోసారి ప్రసంగించటం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌ దుర్మార్గంపై వెల్లడైన ఆగ్రహం, రెండు శిబిరాలుగా దేశాలు చీలిపోవటాన్ని ఇది సూచించింది.గాజాలో మారణకాండను నిలిపివేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించిన పది దేశాల్లో అల్జీరియా ఒక్కటే అరబ్బు దేశం. గాజాలో జరుపుతున్న దుర్మార్గాలను ఖండించటంతో పాటు, దాడులను ఆపాలని, అక్కడ కరువు విలయతాండవం చేస్తున్నదని, దాడులను మరింతగా విస్తరించేందుకు ఇజ్రాయెల్‌ పూనుకున్నదని తీర్మానంలో పేర్కొన్నారు.ఇజ్రాయెల్‌ ప్రతినిధి మాట్లాడిన తరువాత తిరిగి తనకు అవకాశం ఇవ్వాలని ఆ దేశప్రతినిధితో పాటు డెన్మార్క్‌ ప్రతినిధి కూడా కోరగా ఇజ్రాయెల్‌ వక్త కూడా అదే చేశారు. అల్జీరియాకు అంత ఆగ్రహం ఎందుకని ఎదురుదాడికి దిగాడు. ఇజ్రాయెల్‌ జైళ్లలో నిర్బంధించిన పదివేల మంది పాలస్తీనియన్లను చిత్రహింసలు పెడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.ఏ అంతర్జాతీయ సంస్థనూ పరిశీలించేందుకు అనుమతించటం లేదు. వారిని ఏ ఆరోపణలతో నిర్బంధించిందీ కూడా చెప్పటం లేదు.భద్రతా మండలిలో అమెరికా తమకు నైతికంగా మద్దతు ఇచ్చినందుకు ఇజ్రాయెల్‌ కృతజ్ఞతలు తెలిపింది. భద్రతా మండలి సభ్యులు అల్జీరియా, హమస్‌ ప్రభావానికి లోనైనట్లు రాయబారి డానన్‌ ఆరోపించాడు. గాజాలో ఉన్న తమ బందీలను విడిపించుకొనేందుకు, హమస్‌ను దెబ్బతీసేందుకే దాడులు చేస్తున్నామని చెప్పుకున్నాడు.. అమెరికా చర్యతో పాలస్తీనియన్లు తీవ్ర ఆశాభంగం చెందారని ఐరాస రాయబారి రియాద్‌ మన్సూర్‌ పేర్కొన్నాడు. గాజా నుంచి వెలువడుతున్న దృశ్యాలను చూస్తుంటే కడుపు తరుక్కు పోతున్నదని ప్రతివారినీ కదిలిస్తున్నాయని చెప్పాడు. పసిపిల్లలు ఆకలితో మరణిస్తున్నారు, ఇజ్రాయెల్‌ మిలిటరీ భవనాల మీద నుంచి పౌరుల తలల మీద కాల్పులు జరుపుతున్నది. సామూహికంగా హత్యలు చేస్తున్నారని చెప్పాడు.

భద్రతా మండలి తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతున్న సమయంలోనే గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది.సాయుధ సంస్థ హిజబుల్లానేతలు, మిలిటియాను మట్టుపెట్టేందుకే ఈ దుర్మార్గం అన్నది తెలిసిందే. గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ మిలిటరీ 4,500 సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు లెబనాన్‌ మిలిటరీ ప్రకటించింది. గతేడాది నవంబరులో కుదిరిన ఒప్పందం ప్రకారం హిజబుల్లా సాయుధుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని, అక్కడ పాతిన మందుపాతరలను తొలగించేందుకు కంపూచియా, చైనా నిపుణులను అనుమతించాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్‌ పదే పదే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నది. అందువలన ఆ రెండు చర్యలూ అమలు జరగటం లేదు. ఒప్పందంలో మధ్యవర్తులుగా ఉన్న అమెరికా, ఫ్రెంచి నేతలు తమ మిత్రదేశాన్ని అంకెకు తెచ్చి ఒప్పందం అమలుకు పూనుకోవాలని లెబనాన్‌ ప్రధాని నవాఫ్‌ సలామ్‌ డిమాండ్‌ చేశాడు.ఒక్క దక్షిణ లెబనాన్‌ మీదనేగాక యావత్‌ దేశం మీద దాడులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చిన అమెరికా ఎక్కడా కనిపించటం లేదు. అసలు లెబనాన్‌లో ప్రభుత్వమే లేదని అందువలన ఆ పేరుతో తాము ఆయుధాలను విసర్జించేది లేదని హిజబుల్లా చెబుతున్నది, ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులు తమ వైఖరి సరైనదే అని నిర్ధారిస్తున్నట్లు కూడా అది పేర్కొన్నది. దోహా మీద ఇజ్రాయెల్‌ దాడులు జరిపిన తరువాత తన అనుయాయి అయిన కతార్‌ మీద దాడులను అమెరికా నివారించలేకపోయిందని అలాంటిది లెబనాన్ను ఎలా రక్షిస్తుందని హిజబులా ప్రశ్నించింది. భద్రతా మండలిలో అమెరికా వీటో చేయటాన్ని హమస్‌ తీవ్రంగా ఖండించింది.మారణకాండపట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నది. తీర్మానం ప్రవేశపెట్టిన పదిదేశాలను ప్రశంసించింది.

భావ ప్రకటనా స్వేచ్చ గురించి గొప్పలు చెప్పే బ్రిటన్‌ పాలకులు గాజాలో జరుగుతున్న మారణకాండ గురించి అక్కడి పౌరులు, పాలస్తీనా మద్దతుదారులు వాట్సాప్‌లో సమాచారం, సందేశాలు పంపిన వారి మీద కూడా ప్రభుత్వం దాడులు చేస్తున్నదని విమర్శలు వచ్చాయి. గాజాలో జరుపుతున్న దుర్మార్గాలకు నిరసనగా ఇజ్రాయెల్‌ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు, ఇజ్రాయెలీ క్లబ్‌ సభ్యులు పాల్గొనే క్రీడలను బహిష్కరించాలని ఐరోపా వ్యాపితంగా ఉన్న ఫుట్‌బాల్‌ ఫెడరేషన్లు, మాజీ ఆటగాండ్లు, ఇతరులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు.ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేయటాన్ని ఇటలీ రేవు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో రావెన్న రేవుకు వచ్చిన రెండు ట్రక్కులను కార్మికులతో పాటు ఇతరులు అడ్డుకున్నారు. తన వినతి మేరకు ఆయుధాలతో ఉన్న లారీలను అంగీకరించేందుకు రేవు అధికారులు తిరస్కరించినట్లు నగర మేయర్‌ ప్రకటించాడు. ఇలాంటి ప్రతిఘటనే ఫ్రాన్సు, స్వీడన్‌, గ్రీస్‌ కార్మికులు కూడా చేపట్టారు. అయితే ఇటలీ రేవుకు వచ్చిన ఆయుధాలు ఎక్కడి నుంచి తరలించిందీ తెలియలేదు. ఇజ్రాయెల్‌తో అన్ని రకాల వాణిజ్య, ఇతర సంబంధాలను నిలిపివేయాలని కోరుతూ ప్రధాని జార్జియా మెలోనీపై వత్తిడి తెచ్చేందుకు ఇటలీలో అతి పెద్ద కార్మిక సంఘమైన సిజిఐఎల్‌ సెప్టెంబరు 22న సగం రోజు సమ్మె చేసేందుకు పిలుపునిచ్చింది. ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. పాలస్తీనియన్లపై సాగిస్తున్న మారణకాండకు నిరసనగా ఎమెన్‌లోని హౌతీ సాయుధులు ఇజ్రాయెల్‌పై బలమైన క్షిపణిదాడి చేసి రాజధాని టెలిఅవీవ్‌లోని మిలిటరీ లక్ష్యాలను దెబ్బతీసినట్లు ప్రకటించారు. అయితే డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంది.ఇజ్రాయెల్‌ మీద ఆంక్షల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని అయితే గాజాలో జరుగుతున్నదానిని మారణకాండగా తాము పిలిచేది లేదని జర్మనీ ప్రకటించింది. అక్టోబరులో జరిగే ఐరోపా సమాఖ్యలో ఆంక్షల విషయాన్ని పరిశీలిస్తామని ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ చెప్పాడు. అయితే తాను సాధించుకున్న లక్ష్యాల దామాషాలో దాని చర్యలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పాడు. వాటిని మారణకాండగా వర్ణించలేమన్నాడు. అక్కడ జరుగుతున్నది మారణకాండ అని ఐరాస కమిషన్‌ వ్యాఖ్యానించిన తరువాత జర్మనీ స్పందన ఇది.పాలస్తీనాకు రాజ్యహౌదా అన్నది ఇప్పుడు చర్చ కాదన్నాడు.

ఇజ్రాయెల్‌ దాడులు పెరగటంతో నగర జీవ నాడులు కుప్పకూలుతున్నాయని ఐరాస మావతాపూర్వక సహాయ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.గడచిన ఐదు రోజుల్లో పదకొండువేల మంది తలదాచుకుంటున్న గృహాలను కూల్చివేశారని, ఇప్పటి వరకు మొత్తం పదిలక్షల మంది నెలవులు తప్పినట్లు ఆదివారం నాటి నుంచే 56వేల మంది నిరాశ్రయులైనట్లు తెలిపింది.ప్రతి రోజూ సహాయ సంస్థలు 5.6లక్షల ఆహార పొట్లాలను అందిస్తున్నాయని, ఇజ్రాయెల్‌ ఒక పథకం ప్రకారం ఈ ఏర్పాట్లను దెబ్బతీస్తున్నదని కొన్ని ఆహార పదార్దాలతో పాటు కొన్ని ప్రాంతాలకు సరఫరాను అడ్డుకుంటున్నదని పేర్కొన్నది. గాజా దిగ్బంధనాన్ని నిరసిస్తూ అక్కడ చిక్కుకు పోయిన పౌరులకు సాయం అందించేందుకు 44 దేశాలకు చెందిన యాభైకి పైగా చిన్న చిన్న పడవలతో గ్లోబల్‌ సముద్‌ ఫ్లోటిలా పేరుతో ఒక సమూహం గాజావైపు ప్రయాణిస్తున్నది. దానిలో వైద్యులు, సాంకేతిక నిపుణులు, సంఘసేవకులు ఉన్నారు. దాన్ని అడ్డుకొనేందుకు ఇజ్రాయెల్‌ పూనుకుంది. ఉగ్రవాదులకు సాయపడేందుకు అనేక మంది ఆ పడవల్లో వస్తున్నట్లు ఆరోపించింది, ఆ ముసుగులో గతంలో మాదిరి దాడి చేసి నిర్భందించేందుకు పూనుకుంది.ఇలాంటి పడవల్లో వెళ్లి సాయం అందించటం పెద్ద విషయం గాకపోయినా ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని లోకానికి వెల్లడించేందుకు, వత్తిడి తెచ్చేందుకు 2010 నుంచి సాగుతున్నది. గతంలో హండాలా, మాడలీన్‌ నౌకలతో వెళ్లినపుడు ఇజ్రాయెల్‌ డ్రోన్లతో దాడి చేసింది.నౌకలలో ఉన్నవారిని నిర్బంధించింది.వారిపై దాడి చేయటంతో పాటు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నది, వేరే ప్రాంతాలకు బలవంతంగా తరలించింది.ఈ సారి ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడనుందో తెలియదు, యావత్‌ సభ్య సమాజం ఇజ్రాయెల్‌, దానికి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న అమెరికా దుర్మార్గాన్ని ఖండించాల్సి, ఎదిరించాల్సిన అవసరం ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా పచ్చి మితవాది చార్లీ కిర్క్‌ హత్య – భారత్‌ సాంస్కృతిక ఫాసిస్టులపై సామాజిక మాధ్యమ స్పందనమేటి ?

16 Tuesday Sep 2025

Posted by raomk in BJP, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

BJP, Charlie Kirk, Donald trump, Far Right, Fascists, Indian cultural Fascists, Kirk Assassination, Nazis, RSS

ఎం కోటేశ్వరరావు

అమెరికా జనాభా 35 కోట్లు, తుపాకులు 50 కోట్లు, పెద్ద వారి దగ్గర సగటున 1.93 ఉన్నట్లు అంచనా. వాటిలో ఒక దానికి మూడుపదుల వయస్సున్న ఒక విశ్లేషకుడు, విద్వేష మితవాద ప్రచారకుడు చార్లీ కిర్క్‌ బలయ్యాడు. రోజుకు అమెరికాలో సగటున 131 మంది తుపాకులకు సమిధలవుతున్నారు. అలాంటి స్వేచ్చా గడ్డ మీద గుండెమీద చేయి వేసుకొని రోడ్ల మీదకు రావాలంటే రాజకీయ నేతలు భయపడుతున్నారు. భిన్న భావజాలం కలిగినవారి చేతుల్లో బలయ్యే స్థితి అమెరికాలో ఉంది. కిర్క్‌ హత్యపై అమెరికా, భారత్‌తో సహా యావత్‌ ప్రపంచ మీడియా గుండెలు బాదుకొంటోంది. అతడిని రెండు పదుల వయస్సు దాటిన టేలర్‌ రాబిన్సన్‌ అనే యువకుడు సెప్టెంబరు పదవ తేదీన కాల్చి చంపాడు. 31 ఏండ్ల కిర్క్‌ తన మిత్రుడు అంటూ 79 ఏండ్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందనతో పెద్ద ప్రచారం, చర్చ జరుగుతున్నది.ఈ నెల 21 కిర్క్‌ అంత్య క్రియలకు డోనాల్డ్‌ ట్రంప్‌ హాజరు కానున్నాడు. దేశవ్యాపితంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆదేశించాడు. ఇంత జరుగుతున్న తరువాత మితవాద శక్తులకు వాటికి మద్దతు ఇచ్చే మీడియా పెద్దలకు ఒంటి మీద దుస్తులు నిలుస్తాయా ? అందులోనూ మితవాద, కార్పొరేట్‌, పురోగామి భావాల వ్యతిరేక మీడియా ప్రపంచ వ్యాపితంగా రెచ్చిపోతున్న రోజులివి. అనేక మీడియా సంస్థలలో ని చేస్తున్న జర్నలిస్టులు కిర్క్‌ హత్య మీద స్పందించిన తీరు నచ్చని యాజమాన్యాలు ఉద్యోగాల నుంచి తొలగించేందుకు పూనుకున్నాయి.

అమెజాన్‌ కంపెనీ యజమాని జెఫ్‌ బెజోస్‌ నడిపే వాషింగ్టన్‌ పోస్టు పత్రికలో కరేన్‌ అటియా అనే ఆఫ్రో అమెరికన్‌ మహిళా జర్నలిస్టును యాజమాన్యం ఎలాంటి కారణం చెప్పకుండానే ఉద్యోగం నుంచి తొలగించింది. ఆమె అమెరికాలో రాజకీయ హింసను అరికట్టటం గురించి కబుర్లు చెప్పటం తప్ప చిత్తశుద్దితో నివారణకు తీసుకున్న చర్యలేమీ లేవని, పేరు పెట్టకుండా కిర్క్‌ను పరోక్షంగా విమర్శించినందుకు యాజమాన్యం ఈ చర్యకు పాల్పడింది. అనేక మంది జర్నలిస్టులపై ఇతర సంస్థలు సస్పెన్షన్‌ లేదా తొలగింపుకు పాల్పడినట్లు పెన్‌ అనే జర్నలిస్టుల సంస్థ పేర్కొన్నది. కిర్క్‌ హత్యతో సంబరాలు చేసుకున్న విదేశీయుల వీసాలను రద్దు చేస్తామని ట్రంప్‌ బృందం హెచ్చరించింది. వామపక్ష తీవ్రవాదులే హత్యకు కారకులను వారి అంతు చూస్తామని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ బెదిరింపులకు దిగాడు. కిర్క్‌ హత్యకేసులో అనుమానితుడిని పట్టుకోక ముందే అదుపులోకి తీసుకున్నట్లు, తరువాత కొద్ది సేపటికే విడుదల చేసినట్లు భారతీయ సంతతికి చెందిన ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ చేసిన ప్రకటనపై దుమారం రేగింది. అతనా పదవికి పనికి రాడని తొలగించాలని కొందరు డిమాండ్‌ చేశారు. మరి కొందరు సమర్ధించారు.ముందుగా ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. ఏ భావజాలానికి చెందిన వారినైనా వ్యక్తిగతంగా హత్య కావించటం సమర్థించ కూడదు. అది భావదారిద్య్రం, సరకులేని బాపతు చేసే పని. యావత్‌ ప్రపంచంలో మితవాదం మీద భావజాల పోరు ఈనాటిది కాదు. పురోగామి శక్తులు అన్ని విధాలుగా సన్నద్దంగానే ఉన్నాయి. కిర్క్‌ను రాబిన్సన్‌ ఉద్రేకంతో చంపినట్లు కనిపిస్తున్నది. అయితే రాబిన్సన్‌ వామపక్ష భావజాలంవైపు ఆకర్షితుడు అయినందునే హత్య చేసినట్లు చిత్రించేందుకు చూస్తున్నారు. దానిలో భాగంగానే ఇటీవలి కాలంలో అతను వామపక్ష భావజాలం వైపు మొగ్గుతున్నట్లు కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పినట్లు అటావా రిపబ్లికన్‌ గవర్నర్‌ స్పెన్సర్‌ కాక్స్‌ ఒక టీవీలో ఆరోపించాడు. చంపటానికి ముందు రాబిన్సన్‌ ఒక నోట్‌ కూడా రాశాడని పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద వామపక్ష శక్తుల మీద దాడి చేసేందుకు ఈ ఉదంతాన్ని వినియోగించుకొనేందుకు చూస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తున్నది.

మన దేశంలో ఒక నరేంద్ర దబోల్కర్‌, ఒక గోవింద పన్సారే, ఒక కలుబుర్గి, ఒక గౌరీ లంకేష్‌ ఇలా అనేక మంది పురోగామి, హేతువాదులు, కుల, మతత్వ వ్యతిరేకులను హిందూత్వశక్తులు సంవత్సరాల తరబడి కాపుగాచి చంపినపుడు మన మీడియాలో పెద్దగా స్పందన లేదు. పచ్చి మితవాది చార్లీ కిర్క్‌ వయస్సు, అనుభవంతో పోల్చితే పైన చెప్పుకున్నవారందరూ మేథావులు. మన దేశంలో ”సాంస్కృతిక ఫాసిస్టులు ” గా తయారైన వారు ముందుకు తెచ్చిన హిందూత్వ భావజాలానికి గురైనవారి చేతిలో వారు బలయ్యారు. కిర్క్‌ను హత్య చేసిన రాబిన్సన్‌ 33 గంటల్లోగానే అరెస్టు అయ్యాడు. ఇదే మనదేశంలో పైన పేర్కొన్నవారి హత్యా ఉదంతాలలో ఎంత కాలం తరువాత అరెస్టులు చేశారో, కేసులు ఏమైందీ తెలిసిందే. ఉదాహరణకు గౌరీ లంకేష్‌ కేసులో నిందితులపై ఇంతవరకు విచారణే పూర్తి కాలేదు. అయినప్పటికీ వారిలో కొందరిని హీరోలుగా సన్మానించిన సంగతి తెలిసిందే. గౌరీ లంకేష్‌ కేసులో 18 మంది నిందితులు కాగా ఒక్కడు మినహా అందరూ అరెస్టయ్యారు, బెయిలు మీద దర్జాగా తిరుగుతున్నారు. వికాస్‌ పాటిల్‌ అనేవాడిని ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టుకోలేకపోయారు.ది న్యూస్‌ మినిట్‌ అనే వెబ్‌సైట్‌ వార్త 2024 అక్టోబరు 13 ప్రకారం నిందితుల్లో పరశురామ్‌ వాగ్మారే, మనోహర్‌ యదవే అనే వారిని సంఘపరివార్‌, శ్రీరామ్‌ సేన కార్యకర్తలు విజయపురాలో సన్మానించారు. అదే నెల 9వ తేదీన కోర్టు బెయిల్‌ మంజూరు చేయగానే 11న సన్మాన సభ. వార్తా భారతి అనే పత్రిక రాసిన మేరకు నిందితులు విజయపురాలోని కాళికా దేవి ఆలయంలో పూజ చేశారు, తరువాత శివాజీ విగ్రహానికి పూల మాలలు వేశారు. .

గౌరీ లంకేష్‌ ఒక జర్నలిస్టు, పురోగామి వాది. అలాగే చార్లీ కిర్క్‌ పచ్చి మితవాది, మీడియా రంగంలోనే ఉన్నాడు. తీవ్రవాద భావాలతో ఉన్న వామపక్ష వాదులు అద్భుతమైన చార్లీ కిర్క్‌ వంటి అమెరికన్లను నాజీలు, ఫాసిస్టులు, సామూహిక హత్యలు చేసేవారు, నేరగాండ్లుగా వర్ణిస్తున్నట్లు ట్రంప్‌ ఆరోపించాడు. అమెరికాలో ఏం జరుగుతోంది ? ఎవరు ఎవరిని చంపుతున్నారు. యాంటీ డిఫమేషన్‌ లీగ్‌ అనే సంస్థ పదేండ్ల నాటి పరిణామాల గురించి 2022లో ఒక అధ్యయనం జరిపింది.మూడింట రెండువంతులకు పైగా హత్యలు మితవాదులు చేసినవే అని తేలింది. మనదేశంలో మితవాద భావజాలాన్ని, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని జాతివ్యతిరేకులు,తుకడే తుకడే గాంగ్‌, కుహనా లౌకికవాదులు, అర్బన్‌ నక్సల్స్‌ అంటూ ముద్రవేసినట్లుగానే అమెరికాలో కూడా తీవ్రవాద వామపక్ష వాదులని, మరొకటిగా చిత్రించి వాళ్లను చంపినా ఫరవాలేదన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. చంపివేస్తున్నారు. న్యూయార్క్‌ మేయర్‌ పదవికి పోటీ చేస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోహ్రాన్‌ మమదానీ తాను కమ్యూనిస్టును కాదని పదే పదే చెప్పినా డోనాల్డ్‌ ట్రంప్‌ పక్కా కమ్యూనిస్టు అంటూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. జోహ్రాన్‌ డెమోక్రటిక్‌ సోషలిస్టు గనుక అలా అన్నాడని అనుకుందాం. జో బైడెన్‌ గెస్టపో పాలన కొనసాగిస్తున్నాడని ట్రంప్‌ ఆరోపించాడు. గెస్టపో అంటే హిట్లర్‌ నాజీ పాలనలో ప్రత్యర్ధులను మట్టుపెట్టే రహస్య పోలీసు దళం. అలాంటపుడు జో బైడెన్‌ ఫాసిస్టు అయినట్లా ? మనదేశంలో మత, కుల దురహంకారాలు ఉన్నట్లే అమెరికాలో జాత్యంహకారం ఉంది.

చార్లీ కార్క్‌ హత్య జరిగింది ఎక్కడ ? మితవాదుల అడ్డాగా ఉన్న అటా వ్యాలీ విశ్వవిద్మాయలయంలో , తుపాకి సంస్కృతి ఎక్కడ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతున్నదంటే మితవాదులు ఎక్కువగా ఉన్న రెడ్‌ రాష్ట్రాలలో అన్నది జగమెరిగిన సత్యం.2021లో ట్రంప్‌కు మెజారిటీ వచ్చిన పదింటిలో ఎనిమిది రాష్ట్రాలలో తలసరి తుపాకి మరణాలు లక్షకు 33.9 ఉన్నాయి. డెమోక్రాట్లు బలంగా ఉన్న మసాచుసెట్స్‌లో 3.4గా ఉంది. సామూహిక తుపాకి హత్యలు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయంటే మితవాదులు ఎక్కువగా ఉన్న చిన్న పట్టణాల్లో ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. రిపబ్లికన్ల తుపాకి విధానాలు వారినే బలితీసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు.తుపాకి హింసాకాండను అరికట్టేందుకు కేటాయించిన బడ్జెట్‌లో ఈ ఏడాది ట్రంప్‌ యంత్రాంగం 15.8 కోట్ల డాలర్ల కోత పెట్టింది. మితవాదుల పట్ల అమెరికాలో ఎంత వ్యతిరేకత ఉందంటే కార్క్‌ హత్య వార్త వెలువడగానే కొందరు సైనికులు పండగ చేసుకున్నారని వార్తలు రాగా వారి సంగతి చూడాలంటూ రక్షణ మంత్రి హెగసేత్‌ ఆదేశించాడు. సామాజిక మాధ్యమంలో సాయుధ దళాలకు చెందిన వారితో సహా ఉద్యోగులు, టీచర్లు, ప్రొఫెసర్లు ఇంకా అనేక మంది హర్షం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారంటే చార్లీ కిర్క్‌ మీద ఉన్న ఆగ్రహానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవటం, అనుకరించటం ఈ రోజుల్లో ఎంతో సులభం.ప్రజలకు దూరమైన పాలకుల మీద శ్రీలంక జనం తిరుగుబాటు చేసిన తీరును బంగ్లాదేశ్‌లో అనుకరించారు, తాజాగా నేపాల్‌లో చూశాము. అదే విధంగా భావజాల రంగంలో కూడా అదే జరుగుతున్నదా ? అమెరికాలో చార్లీ కిర్క్‌ ఒక మితవాది, జాత్యహంకారి, అలాంటి వారు అన్ని రంగాలలో కోకొల్లలుగా ఉన్నారు. అతగాడిని చంపివేస్తే అనేక మంది పండగ చేసుకున్నారు. దాన్ని చూసిన తరువాత మనదేశంలో మితవాద జర్నలిస్టులు, లాయర్లు, ఇతర ప్రభావకులుగా పరిగణిస్తున్న ఆర్నాబ్‌ గోస్వామి, శాయి దీపక్‌, ఆనంద రంగనాధన్‌, వివేక్‌ అగ్నిహౌత్రి, అభిజిత్‌ అయ్యర్‌ మిశ్రా, స్మితా ప్రకాష్‌, మయూఖ్‌ రంజన్‌లకు అదే గతి పడుతుందనే పోస్టులు సామాజిక మాధ్యమంలో కొన్ని వచ్చాయి. అపహాస్యం చేస్తూ జోకులు కూడా వేశారు. అయితే వాటిని వామపక్ష శక్తులు, ఉదారవాదుల కలగా వర్ణిస్తూ కమ్యూనిస్టు వ్యతిరేకులు బురదచల్లేందుకు పూనుకున్నారు.నిజానికి అలాంటి పోస్టులను ఏ కమ్యూనిస్టూ, పురోగామి వాదీ కూడా సమర్ధించరు. పైన పేర్కొన్నవారు ఏ విధంగారెచ్చగొడుతూ మాట్లాడతారో, ఎలాంటి తిరోగామి భావ జాలాన్ని వ్యాపింపచేస్తున్నారో అందరికీ తెలుసు. వారి తీరు కమ్యూనిస్టులు కానివారికి కూడా ఆగ్రహం తెప్పిస్తున్నదంటే అతిశయోక్తి కాదు.పోస్టులు పెట్టిన వారికి ఎలాంటి భావజాలంతోనైనా సంబంధం ఉందోలేదో కూడా తెలియదు.మనదేశంలో మితవాద భావజాలానికి ధీటుగా సమాధానం చెప్పలేని దుస్థితిలో పురోగామి వాదులు లేరు.రాబిన్సన్‌ ఉపయోగించిన బుల్లెట్‌ మీద రేరు ఫాసిస్టు కాచుకో అని, మరోదాని మీద ఇటాలియన్‌ ఫాసిస్టు వ్యతిరేక పాటలోని ఒక చరణం రాసిి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అది నిజం కావచ్చు కల్పితమూ కావచ్చు. అమెరికాలో ఫాసిస్టు వ్యతిరేక భావజాలం పెరుగుతున్నందున రాబిన్సన్‌ కూడా స్పందించి ఉండవచ్చు.

ఐరోపా, అమెరికాలో ఇటీవలి కాలంలో పచ్చి మితవాదులు, వారిని వ్యతిరేకించేవారి సమీకరణలు పెరుగుతున్నాయి. దీనికి ఒక ప్రధాన కారణం ఆర్థికంగా ఆయా దేశాలు అనేక సమస్యలను ఎదుర్కోవటం. ఇలాంటి పరిస్థితి ఉన్నపుడు మూఢభక్తి, మితవాద భావనలు పెరగటానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు లండన్‌లో వేలాది మంది వలసకార్మికులకు వ్యతిరేకంగా మితవాద శక్తుల పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనలో b్గన్నారు. అనేక దేశాల్లో ఎన్నికల్లో ఇదొక ప్రధాన సమస్యగా మారుతున్నది. డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక వైపు విదేశీ వస్తువుల మీద దిగుమతి పన్నులు వేస్తూ మరోవైపు విదేశీ కార్మికులు, విద్యార్థుల మీద తీవ్రమైన ఆంక్షలు పెట్టటం, అమెరికా నుంచి పంపివేసేందుకు ప్రయత్నించటాన్ని మనం చూస్తున్నాం. మనదేశంలో నరేంద్రమోడీ తన విధానాలను వ్యతిరేకించే వారందరికీ దేశద్రోహులని ఎలా ముద్రవేస్తున్నారో అమెరికాలో మితవాదులను వ్యతిరేకించే శక్తులను వామపక్షం, తీవ్రవాదవామపక్షం, కమ్యూనిస్టులుగా చిత్రించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనికి శ్వేజాతిదురహంకారం, ఆఫ్రో అమెరికన్ల పట్ల వివక్ష, ముస్లిం వ్యతిరేకత వంటివి తోడవుతున్నాయి. పాలస్తీనా విమోచన కోరుతున్న శక్తులకు, ఇజ్రాయెల్‌ మారణకాండకు వ్యతిరేకంగా విద్యార్ధులు ఉద్యమిస్తే ఆయా విద్యా సంస్థల మీద ట్రంప్‌ కక్ష తీర్చుకుంటున్నాడు. ఒక చిన్న ఉదంతం కూడా పెద్ద పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. యువతలో గూడుకట్టుకున్న అసంతృప్తి సాధారణంగా ప్రదర్శనలు ధర్నాల రూపంలో ప్రదర్శితమౌతుంది. కానీ నేపాల్‌లో అలాంటి సూచనలేమీ లేకుండానే కేవలం సామాజిక మాధ్యమాల మీద ఆంక్షలు విధించటాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున వీధుల్లోకి రావటం బహుశా ప్రపంచంలో ఇదే మొదటి సారి.వారి వెనుక విదేశీశక్తులున్నాయనే మాట వినిపిస్తున్నప్పటికీ బయటకు కనిపించింది సామాజిక మాధ్యమాల అదుపుపై నిరసనే అన్నది వాస్తవం.మనదేశంలో సాంస్కృతిక సారధుల పేరుతో సంఘపరివార్‌కు చెందిన వారు ఎలా తయారువుతున్నారో అమెరికాలో చార్లీ కిర్క్‌ కూడా యుక్త వయస్సు నుంచే మితవాదభావజాల సైనికుడిగా తయారయ్యాడు. ఫాక్స్‌ న్యూస్‌ వంటి మీడియా సంస్థలు అలాంటి వారిని వామపక్ష భావజాలంపై దాడికి వినియోగించాయి.మన దేశంలో కూడా అలాంటి ధోరణులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అందుకే కిర్క్‌ హత్య తరువాత అలాంటి శక్తుల మీద సామాజిక మాధ్యమంలో అలాంటి వారికీ అదే గతి పడుతుంది లేదా పట్టాలని స్పందించారు, వీటి నుంచి అందరూ గుణపాఠాలు తీసుకోవాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరీబియన్‌ ప్రాంతంలో చిచ్చు : వెనెజులా మిలిటరీ విన్యాసాలు, దాడులకు అమెరికా సన్నాహం !

12 Friday Sep 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Chavez, Donald trump, Nicolás Maduro, US boat attack, Venezuela, venezuelan chavista


ఎం కోటేశ్వరరావు


మాదక ద్రవ్యాల ముఠాలను అరికట్టే సాకుతో వామపక్ష పాలనలో ఉన్న వెనెజులాపై దాడులు చేసేందుకు అమెరికా సన్నాహాలు చేసింది. ఏ క్షణమైనా విరుచుకుపడవచ్చని వార్తలు వస్తున్నాయి. అధ్యక్షుడు మదురోను గద్దె దింపటం తమ లక్ష్యం కాదని చెబుతున్నప్పటికీ ఎవరూ నమ్మటం లేదు. అమెరికా దుర్మార్గాన్ని ప్రతిఘటించేందుకు సరిహద్దులో మదురో కూడా మిలిటరీని మోహరించి గురువారం నాడు త్రివిధ దళాలతో విన్యాసాలు నిర్వహించారు. వెనెజులా భూభాగంలో ఉన్న మాదకద్రవ్యాల మాఫియాలపై మిలిటరీ దాడులు చేస్తారా అన్న విలేకరి ప్రశ్నకు మీరే చూస్తారుగా అంటూ ట్రంప్‌ చెప్పటాన్ని బట్టి అమెరికా ఆంతర్యం స్పష్టంగా కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం కరీబియన్‌ సముద్రంలో ఒక పడవపై దాడి అమెరికా మిలిటరీ దాడి చేసి పదకొండు మందిని చంపివేసింది.వారికి మదురోకు సంబంధాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నద్ని అ బోటులో ఉన్నవారెవరికీ అమెరికా చెప్పే మాదక ద్రవ్యాల ముఠాతో ఎలాంటి సంబంధాలు లేవని మదురో సర్కార్‌ ప్రకటించింది. తమ కుటుంబ సభ్యులు కనిపించటం లేదని బంధువులు చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నది.తొలుత ఆ ఉదంతం కృత్రిమ మేథతో సృష్టించిన వీడియో అని మదురో పేర్కొన్నారు. వెనెజులా నుంచి వచ్చిన ఆ మోటార్‌ బోట్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు స్వయంగా ట్రంప్‌ కత చెప్పాడు. ఆ ముఠా అమెరికాలో హింసాత్మక చర్యలకు, మాదక ద్రవ్యాల వ్యాప్తి, సామూహిక హత్యలు, అమ్మాయిల అక్రమరవాణాకు పాల్పడుతున్నదని ఆరోపించాడు. ఆ తరువాత పోర్టారికోకు పది ఎఫ్‌ 35 రకం యుద్ధ విమానాలను అమెరికా తరలించింది. తప్పుడు సాకులతో అమెరికా దాడులకు పూనుకున్నదని మదురో శుక్రవారం నాడు చెప్పారు. మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి ఇరాక్‌ మీద దాడులు చేసినట్లుగానే తమపై అమెరికా దుర్మార్గానికి పాల్పడేందుకు పూనుకున్నదన్నాడు. అనేక దేశాలతో పోల్చితే తమ దేశం ద్వారా రవాణా అవుతున్న మాదకద్రవ్యాలు స్పల్పమని చెప్పాడు. అమెరికన్లు వెనక్కు తిరిగి పోలేని చోటికి చేరుకుంటున్నారని హెచ్చరించారు. మదురోను అరెస్టు చేసేందుకు వీలు కలిగే సమాచారం ఇచ్చిన వారికి ఐదు కోట్ల డాలర్లు ఇస్తామని ఆగస్టు నెలలో అమెరికా ప్రకటించిన అంశం తెలిసిందే.1998లో హ్యూగో ఛావెజ్‌ నాయకత్వంలో వామపక్షాలు అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలను కూలదోసేందుకు మితవాద నేతలకు అనేక రకాలుగా అమెరికా సాయం చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. విధించిన ఆంక్షలు పనిచేయటం లేదు. ఇప్పుడు మాదకద్రవ్యాల పేరుతో మరోకుట్రకు తెరలేపారు.


కరీబియన్‌ అంతర్జాతీయ జలాల్లో ఉన్న పడవను ఆపేందుకు, ప్రాణాలతో దాన్లో ఉన్నవారిని పట్టుకొనేందుకు అమెరికా మిలిటరీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.నేరుగా కాల్పులు జరిపి చంపివేయటం ద్వారా తాను తలచుకొంటే ఏ దేశంపై అయినా యుద్ధాన్ని ప్రకటిస్తామని, ఎవరినైనా మట్టుబెడతామనే బెదిరింపు సందేశాన్ని ఆప్రాంత దేశాలకు పంపినట్లయింది.తమకు పూర్తి అధికారాలు, సత్తా ఉందని ఈ ఉదంతంపై విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించాడు. పడవపై దాడి ఉదంతానికి ఒక రోజు ముందు మదురో మాట్లాడుతూ అమెరికన్లు అవాస్తవాలు చెబుతున్నారని వారు వెనెజులా చమురు, గ్యాస్‌ను ఉచితంగా దోచుకొనేందుకు వస్తున్నారని అందుకోసం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతారని హెచ్చరించాడు. 1898లో స్పెయిన్‌తో యుద్దాలకు తప్పుడు ప్రచారం చేశారని, 1964లో వియత్నాంపై దాడికి టోంకిన్‌ గల్ప్‌ కల్పిత ఉదంతాన్ని, 2003 ఇరాక్‌పై మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేశారని అన్నాడు.మోనికా లెవెన్సీతో తన అక్రమ సంబంధ ఉదంతం నుంచి అమెరికన్లను పక్కదారి పట్టించేందుకు నాటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ సూడాన్‌ మీద దాడి చేయించాడని ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అలాంటి కుంభకోణంలో జెఫ్రి ఎప్‌స్టెయిన్‌ ఫైళ్లలో కూరుకుపోయాడని అన్నాడు.


తన ప్రత్యర్ధులైన ఇరాన్‌,లెబనాన్‌,హుతీ, హిజబుల్లా, హమస్‌ అగ్రనేతలను ఒక ప్రకారం మట్టుబెడుతున్న క్రమంలో ఇజ్రాయెల్‌ తాజాగా ఎమెన్‌ ప్రధాని, మంత్రులను హతమార్చటాన్ని చూశాము. ఈ దుర్మార్గాలన్నింటికీ అమెరికా, ఇతర పశ్చిమదేశాల సంపూర్ణ మద్దతు ఉంది. లాటిన్‌ అమెరికాలో వామపక్ష నేతలు అమెరికాకు కొరకరాని కొయ్యలుగా మారిన పూర్వరంగంలలో వారిని హతమార్చేందుకు అమెరికా చూస్తున్నది, దాని లక్ష్యంగా మదురో ఉన్నాడని వేరే చెప్పనవసరం లేదు.అమెరికా గద్దెపై ఎవరున్నా అదే చేస్తున్నారు. రెండవసారి అధికారానికి వచ్చిన మరుసటి రోజే విదేశీ ఉగ్రవాద సంస్థలను మాదకద్రవ్యాల మాఫియాలుగా చిత్రిస్తూ ట్రంప్‌ ఉత్తరువులు జారీ చేశాడు. ఆ ముసుగులో వెనెజులా సమీపానికి మిలిటరీని దించుతున్నాడు.ఇతర దేశాల్లో జోక్యం చేసుకొనేందుకు మిలిటరీకి అధికారమిస్తూ రహస్య ఉత్తరువులు ఇచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. వెనెజులా చమురు కొనుగోలు చేయవద్దని, దాన్ని రవాణా చేయవద్దంటూ ఆంక్షలు విధించింది. ట్రంప్‌కు చిత్తశుద్ధి ఉంటే అమెరికాలో విచ్చలవిడిగా దొరుకున్న మాదకద్రవ్యాలు, వాటిని సరఫరా చేసే వారి మీద కేంద్రీకరించాలి. ఒక అంచనా ప్రకారం అమెరికాలో 200 నుంచి 750బిలియన్‌ డాలర్ల మేరకు మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతుంటే ప్రాణావసరమైన ఔషధాల లావాదేవీలు 600 బిలియన్‌ డాలర్లు, చమురు లావాదేవీల విలువ 400 బి.డాలర్లు మాత్రమే అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. మరోమాటలో చెప్పాలంటే ప్రపంచంలో మాదక ద్రవ్యాలను అత్యధికంగా వినియోగిస్తున్న, వాటి తయారీకి అవసరమైన ఔషధ సంబంధిత రసాయనాలు, ఆయుధాలను ప్రపంచానికి ఎక్కువగా సరఫరా చేస్తున్నది అమెరికా అన్నది నమ్మలేని నిజం. ఈ అక్రమలావాదేవీల్లో అమెరికాలోని బడా బాంకులు, కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయి. అమెరికన్‌ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇదంతా సాగుతుందా ? తన విధానాలు, కార్పొరేట్ల దోపిడీని ప్రశ్నించకుండా యువతను మత్తులో ముంచే ఎత్తుగడ కూడా దీని వెనుక ఉందన్నది స్పష్టం. ఐరాస 2025 ప్రపంచ మాదకద్రవ్యాల నివేదికలో వెనెజులా గురించి చేసిన ప్రస్తావన చాలా పరిమితంగా ఉంది. అక్కడ మాదక ద్రవ్యాల సాగు లేదా తయారీ దాదాపు లేదని పేర్కొన్నది.


కరీబియన్‌ ప్రాంతంలో అమెరికా మిలిటరీ మోహరింపు వెనుక బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. చైనాలోని తియాన్‌జిన్‌లో జరిగిన చారిత్మ్రాక షాంఘై సహకారం సంస్థ 25వ సమావేశంలో షీ జింపింగ్‌, నరేంద్రమోడీ, పుతిన్‌ కలయిక అమెరికా విధాన నిర్ణేతలకు వణుకుపుట్టించింది. వెంటనే గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్‌ నాలుగు రోజుల తరువాత భారత్‌ను చైనాకు కోల్పోయినట్లు ఉక్రోషంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం ముగిసిన వారం రోజుల్లోనే బ్రిక్స్‌ సమావేశాన్ని ట్రంప్‌ జీర్ణించుకోలేకపోయాడు. వెనెజులా పేరుతో కరీబియన్‌ సముద్రంలో ఉద్రిక్తతలకు తెరతీశాడు. సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్సుద్వారా బ్రిక్స్‌ సదస్సును బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా ప్రారంభించాడు. కరీబియన్‌ ప్రాంతంలో అమెరికా యుద్ద నావలు ఉద్రిక్తతకు కారణం అవుతున్నాయని చెప్పాడు. వెనెజులా మీద దాడికి సన్నాహాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నదన్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు బ్రిక్స్‌ సమావేశానికి డుమ్మాకొట్టిన ప్రధాని నరేంద్రమోడీ విదేశాంగ మంత్రి జై శంకర్‌ను పంపారు. చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం మరింతగా పెరగాలని పిలుపునిచ్చాడు.


ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల తయారీ అక్రమరవాణా సమస్యలు ఉన్నాయి. ఒక దేశం మీదకు యుద్ధ సన్నాహాల మాదిరి కరీబియన్‌ సముద్రంలో అమెరికా యుద్ద నావలను దించింది. వాటిలో నాలుగున్నరవేల మంది మెరైన్లు, నావికులను మోసుకువెళ్లే నౌక, నియంత్రిత క్షిపణులను ప్రయోగించే మూడు డెస్ట్రాయర్లు ఇతర నౌకలు, మరోచోట పది యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇది వెనెజులాను బెదిరించేందుకు, దాడి చేసేందుకు అన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్కడా అమెరికా ప్రత్యక్ష దాడుల్లో పాల్గొన్న ఉదంతాలులేవు. ఇతర దేశాలతో దాడులు చేయించటం, వాటికి ఆయుధాలు విక్రయించి లబ్దిపొందే విధానాన్ని అనుసరిస్తున్నది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో మరోమారు విజయం సాధించిన నికొలస్‌ మదురో ప్రభుత్వాన్ని అమెరికా ఇంతవరకు గుర్తించలేదు.తాము బలపరిచిన ప్రతిపక్ష అభ్యర్థి గోన్‌జాలెజ్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు అమెరికా చెప్పుకుంది. అమెరికా గనుక దాడులకు పాల్పడితే తాము ప్రతిఘటించేందుకు సిద్దంగా ఉన్నామని, మిలిటరీతో పాటు లక్షలాది మంది పౌరులను దించుతామని మదురో హెచ్చరించాడు. దాదాపు ఇరవై ఐదువేల మంది సైనికులను కొలంబియా సరిహద్దులకు, చమురు శుద్ది కర్మాగారాలు ఉన్న ప్రాంతాలకు, సముద్రతీరానికి తరలించటమే గాక దేశవ్యాపితంగా డ్రోన్లు ఎగురవేయటంపై ఆంక్షలు విధించాడు. తమ జలాల్లో నౌకా దళం పహారా కాస్తుందని రక్షణ మంత్రి ప్రకటించాడు.ప్రస్తుతం మిలిటరీలో లక్షా 23వేల మంది సైనికులు ఉన్నారు. వీరు గాక మరో రెండులక్షల ఇరవైవేల మంది ప్రజాసాయుధులు ఉన్నట్లు మదురో ప్రకటించాడు. దేశంలో అమెరికా వ్యతిరేక భావనలను ముందుకు తేవటంతో పాటు పరిసర దేశాల మద్దతు పొందేందుకు వెనెజులా నాయకత్వం పూనుకుంది.

గతంలో మిత్రదేశంగా ఉన్న సమయంలో వెనెజులాకు అమెరికా నాలుగవ తరం ఎఫ్‌ 16 యుద్ద విమానాలను సరఫరా చేసింది. ఇప్పుడు వాటితోనే కరీబియన్‌ సముద్రంలో ఉన్న అమెరికా యుద్ధ నావల చుట్టూ చక్కర్లు కొట్టించారు. నియంతల పాలనా కాలంలో చమురు నిల్వలపై కన్ను, కమ్యూనిజాన్ని విస్తరించకుండా చూసేందుకు వెనెజులా ఆ ప్రాంతంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో అమెరికా యుద్ధ విమానాలను అందచేసింది. అయితే అనూహ్యంగా ఛావెజ్‌ రంగంలోకి రావటంతో వెనెజులా బద్దశత్రువుగా మారింది. ఛావెజ్‌ అధికారానికి వచ్చిన తరువాత చైనా, రష్యాలతో మిలిటరీ సంబంధాలను పెట్టుకున్నాడు. ఒక దశలో తమపై విధించిన ఆంక్షలకు ప్రతిగా ఎఫ్‌16 విమానాలను ఇరాన్‌కు విక్రయిస్తామని ఛావెజ్‌ అమెరికన్లను హెచ్చరించాడు.2013 నుంచి నికోలస్‌ మదురో అధికారంలో కొనసాగుతూ చావెజ్‌ బాటను అనుసరిస్తున్నాడు. కరీబియన్‌ సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగున్నరవేల మందితో వెనెజులాను స్వాధీనం చేసుకోవటం లేదా దాడి చేసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.అమెరికా దాడులకు గురైన ఇతర దేశాలకు భిన్నంగా ప్రజాసాయుధులను కూడా వెనెజులా దింపే అవకాశం ఉంది. ఇరుగు పొరుగులాటిన్‌ అమెరికా దేశాలలో ఎక్కువ భాగం అమెరికా చర్యను ఖండిరచాయి. అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా చైనా చమురు దిగుమతి చేసుకోవటమే గాక వెనెజులాలో చమురు వెలికితీసేందుకు కూడా ముందుకు వచ్చింది. చైనా నుంచి మిలిటరీ జెట్లను కొనుగోలు చేసేందుకు మదురో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అయినప్పటికీ అమెరికా మిలిటరీ శక్తితో పోలిస్తే వెనెజులా బలం ఒక లెక్కలోనిది కాదు. దాని బలం, బలగం మదురోకు మద్దతు ఇస్తున్న జనం, ఇరుగు పొరుగుదేశాల సంఫీుభావమే !
 
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెవిలో పూలు : పాకిస్థాన్‌ ప్రాజెక్టుల నుంచి చైనా తప్పుకుందా, కాషాయ దళాలు, మీడియా కథనాల్లో నిజమెంత !

07 Sunday Sep 2025

Posted by raomk in Africa, BJP, CHINA, Congress, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BRI, China, CPEC, Narendra Modi Failures, pakistan, RSS, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


‘‘ పాకిస్థాన్‌ 60 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నడవా ప్రాజెక్టు నుంచి వైదొలిగిన చైనా, నిధుల కోసం ఎడిబిని ఆశ్రయించిన ఇస్లామాబాద్‌ ’’ ఇది కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.ఇదే అర్ధం వచ్చేవి మరికొన్నింటిలో వున్నాయి. దీనికి కాషాయ దళం చెప్పిన భాష్యం మచ్చుకు ఒకటి ఇలా ఉంది. ‘‘ భారత జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కనెక్టివిటీని మోడీజీ వ్యతిరేకించిన తరువాత (సిపిఇసి ప్రాజెక్టులో స్పష్టంగా సూచించడం) చైనా పాకిస్తాన్‌ యొక్క 60 బిలియన్‌ డాలర్స్‌ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఇది భారతదేశానికి దౌత్యపరంగా అతిగొప్ప విజయం, పాక్‌కు చావు దెబ్బ ’’ అని పేర్కొన్నారు. ఇది నిజమా ? మొదటి అవాస్తవం ఏమిటంటే నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగాక ముందే దానికి నాంది పలికిన 2013లోనే నాటి యుపిఏ ప్రభుత్వం ఈ పథకానికి అభ్యంతర తెలుపుతూ వ్యతిరేకించింది. ఎందుకు ? పాక్‌ ఆక్రమిత్‌ కాశ్మీరులో భాగమైన గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంలో 600 కిలోమీటర్ల పొడవున పాకిస్థాన్‌ మరియు చైనా నడవా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు మరియు రైలు మార్గ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు సాగుతుంది. అది చైనాలోని షింజియాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం నుంచి మొదలై మూడువేల కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్‌ అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్‌ రేవు వరకు ఉంటుంది. గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంపై మనదేశం హక్కును వదులుకోలేదు గనుక ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని మన ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయినప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు.2014లో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సర్కార్‌ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సందర్భాలలో నిరసన తెలుపుతూనే ఉంది. వాస్తవం ఇది కాగా, కొత్తగా మోడీ వ్యతిరేకత తెలిపినట్లు దానికి తలొగ్గి ప్రాజెక్టు నుంచి చైనా వైదొలిగినట్లు చెప్పటం జనాల చెవుల్లో పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.


నిజానికి మన్మోహన్‌ సింగ్‌ గానీ, నరేంద్రమోడీ గానీ ఈ సమస్య మీద పెద్దగా చేసిందేమీ లేదు. వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇద్దరూ చైనాతో ఇతర సంబంధాలను కొనసాగించారు. షాంఘై సహకార సంస్థలో మనదేశం 2005 నుంచి పరిశీలకురాలిగా 2014వరకు ఉంది. ఆ ఏడాది మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. మనదేశమూ, పాకిస్థాన్‌ రెండూ 2017లో ఒకేసారి సభ్యత్వం పొందాయి. అప్పుడు సిపిఇసి నడవాను ఒక సమస్యగా మోడీ ముందుకు తేలేదు. నరేంద్రమోడీ హయాంలో 2020 గాల్వన్‌లోయ ఉదంతాల ముందుకు వరకు చైనాతో సంబంధాలు మరింత ముందుకు పోయాయి.ఐదేండ్ల తరువాత తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) 25వ వార్షిక సమావేశాలకు నరేంద్రమోడీతో పాటు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా హాజరయ్యారు. మోడీ వెంటనే తిరిగి రాగా సెప్టెంబరు మూడున జపాన్‌పై రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా సాధించిన విజయం 80వ వార్షికోత్సవ మిలిటరీ పరేడ్‌లో ఒక అతిధిగా షరీఫ్‌ పాల్గొన్నారు.ఆ ఉత్సవానికి నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాలేదు. ఎస్‌సిఓ సమావేశాలలో సిపిఇసి గురించి అభ్యంతరాలు తెలిపినట్లుగానీ, చైనా నేతలతో మాట్లాడినట్లుగానీ ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాలేదు. కానీ కొద్ది రోజుల తరువాత మీడియాలో వచ్చిన కథనాలను పట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ తనదైన శైలిలో రాసింది. ఆరు రోజులు పాటు చైనాలో ఉన్నప్పటికీ షెహబాజ్‌ షరీఫ్‌ సిపిఇసికి రెండవ దశ పెట్టుబడుల విషయంలో విఫలమయ్యారు.పరిమితమైన అవగాహన ఒప్పందాలు మాత్రమే చేసుకున్నారు.పెద్ద పెట్టుబడులేమీ లేవు. సిపిఇసి 2.0 ప్రారంభమైనట్లు షెహబాజ్‌ ఏకపక్షంగా ప్రకటించారు తప్ప చైనా వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు.పరేడ్‌లో చైనా అధ్యక్షుడు తనతో పాటు పుతిన్‌, ఉత్తర కొరియా కిమ్‌ను తప్ప షెహబాజ్‌ను పట్టించుకోలేదు.పుతిన్‌తో సంభాషించినపుడు చెవులకు ఫోన్లను కూడా షరీఫ్‌ సరిగా అమర్చుకోలేకపోయారంటూ రాసింది. పాకిస్థాన్‌తో సిపిఇసి పెట్టుబడుల నుంచి వెనక్కు తగ్గినట్లు చైనా అధికారిక ప్రకటనను ఆర్గనైజర్‌ లేదా కథనాలు రాసిన ఇతర పత్రికలు చూపగలవా ?

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎటుతిప్పి ఎటురాసినా కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఇవ్వటం లేదని చైనా చెప్పిందని, గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు తగ్గిందని, ఆ మొత్తాన్ని ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు (ఏడిబి) నుంచి తీసుకోవాలని పాక్‌ నిర్ణయించిందని రాశాయి. పదే పదే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకుంటున్న పాకిస్థాన్‌కు తాము ఇచ్చిన రుణాలను చెల్లించే సత్తాదానికి ఉందా అనే అనుమానాలు చైనాకు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక స్నేహితుడి కోసం మరొకర్ని వదులుకోలేమని ఇటీవల పాక్‌ ఆర్మీ ప్రధాన అధికారి అసిమ్‌ మునీర్‌ చెప్పాడని, దాంతో చైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదన్నట్లుగా వర్ణించారు. ఇదే సమయంలో 8.5 బిలియన్‌ డాలర్లను వివిధ పథకాలకు చైనా అందించేందుకు పాక్‌ ప్రధానితో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు. రెండు బిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు తిరస్కరించిన చైనా కొత్తగా 8.5బి.డాలర్లు ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినట్లు ? ఈ మొత్తాన్ని సిపిఇసి 2.0లో ఐదు కొత్త కారిడార్లు, అదే విధంగా ఇతర రంగాలలో వినియోగించనున్నట్లు ప్రముఖ పాక్‌ పత్రిక డాన్‌ రాసిందని మనదేశ వార్తా సంస్థ పిటిఐ పేర్కొన్నది. తొలిసారిగా పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఒక సంస్థ సిపిఇసిలో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిందని కూడా వార్తల్లో రాశారు.చైనాకు లాభదాయకం కాని వాటిలో అదెందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? సమాధానం ఉండదు.


నిజానికి ఇలాంటి కథనాలు రావటం ఇదే కొత్త కాదు. 2024 జూన్‌ 11న బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక రాసిన కథనానికి ‘‘ సిపిఇసి 2.0లేదు, భారీ పెట్టుబడులు లేవని పాకిస్థాన్‌కు చెప్పకనే చెప్పింది ’’ అనే శీర్షిక పెట్టింది. ఐదు రోజుల పర్యటన జరిపిన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పర్యటనకు ముందు ఇస్లామాబాద్‌ అధికారులు సిపిఇసి మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళతారని చెప్పారని అయితే ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, పాక్‌ ఆశల మీద చైనా నీళ్లు చల్లిందని, పరిమిత లబ్దితోనే తిరిగి వెళ్లినట్లు నికీ ఆసియా రాసిందని దాన్లో పేర్కొన్నారు. ఏడాది క్రితం మోడీ చైనా వెళ్లలేదు, దానితో సాధారణ సంబంధాల స్థితి కూడా లేదు, అప్పుడెందుకు చైనా అలా వ్యవహరించిందో మీడియా ‘‘ వంట ’’ వారు, కాషాయ దళాలు చెప్పగలవా ? ‘‘పాకిస్థాన్‌ : ఎందుకు చైనా సిపిఇసి ప్రాజెక్టులు నిలిపివేసింది ?’’ అనే శీర్షికతో ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ (ఒఆర్‌ఎఫ్‌) వెబ్‌సైట్‌లో 2020 నవంబరు 25వ తేదీన అయిజాజ్‌ వానీ రాసిన విశ్లేషణను ప్రచురించింది. అప్పుడు గాల్వన్‌లోయ ఉదంతాలతో చైనాతో మనదేశం వైరంలో ఉంది తప్ప మిత్రదేశంగా లేదు కదా, ఆ నాడే అలా ఎందుకు రాయాల్సి వచ్చినట్లు ? నరేంద్రమోడీ నిరసన లేదా పలుకుబడి ఏమైనట్లు ? అప్పటికే కొన్ని అంశాలను నిలిపివేసినట్లు అయిజాజ్‌ వానీ రాశారు. పాకిస్థాన్‌లో మాంద్యం, అవినీతి,బెలూచిస్తాన్‌ ఇతర తిరుగుబాట్లు వంటి అంశాలతో అనేక ప్రాజక్టులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.


సిపిఇసి అవకాశాన్ని పాకిస్థాన్‌ వృధా కావించిందని, మద్దతు గురించి చైనా పునరాలోచనలో పడిరదని సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయ మాజీ ఫ్రొఫెసర్‌ సజ్దాద్‌ అష్రాఫ్‌ 2025 మే రెండవ తేదీన రాశారు. పదేండ్ల తరువాత పాకిస్థాన్‌ అసమర్ధత, రాజకీయ అవకతవకల వంటి కారణాలతో అనేక కీలక ప్రాజెక్టులు ఆలశ్యం,వాయిదా పడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం.2015 ఏప్రిల్‌ 20న షీ జింపింగ్‌ ఇస్లామాబాద్‌లో ఎంతో అట్టహాసంగా ప్రాజెక్టును ప్రారంభించారు. పదేండ్ల తరువాత తలపెట్టిన 90 పథకాల్లో 38 పూర్తి కాగా మరో 23 నిర్మాణంలో ఉన్నాయి. మూడోవంతును ఇంతవరకు ముట్టుకోలేదు. దీనికి బాధ్యత పరిమితంగా చైనాది కాగా ఎక్కువగా ఇస్లామాబాద్‌దే ఉంది. అత్యంత కీలకమైన ప్రత్యేకించి సెజ్‌లు, పారిశ్రామికవాడలు పూర్తికాలేదు. దీనికి పాకిస్థాన్‌ రాజకీయ నేతలు, ఆసక్తి కనపరచని, సమన్వయం లేని ఉన్నతాధికారులదే బాధ్యత. వీటికి కేటాయించిన వనరులను ఆర్థికంగా పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ ఉండని లాహార్‌ మెట్రో రైలు ప్రాజక్టుకు మళ్లించారు. ఇలాంటి వాటికి తోడు 2021 నుంచి ప్రాజెక్టులలో పని చేస్తున్న చైనా సిబ్బందికి రక్షణ కల్పించటంలో తీవ్ర పరిస్థితి ఏర్పడిరది. అప్పటి నుంచి 14దాడులు జరగ్గా 20 మంది మరణించారు, 34 మంది గాయపడ్డారు. వీటిలో ఎక్కువ భాగం బెలూచిస్తాన్‌లో జరిగాయి. దౌత్యపరంగా ఇప్పటికీ సిపిఇసికి చైనా మద్దతు ఉన్నప్పటికీ 2023 తరువాత కొత్త పెట్టుబడుల పట్ల వెనక్కి తగ్గుతున్నది.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ(బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌) పెట్టుబడి పథకాన్ని ప్రారంభం నుంచి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వాటి ఆధ్వర్యాన నడిచే ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌, గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ గుండా రోడ్డు, రైలు మార్గాల నిర్మాణాన్ని కారణంగా చూపినప్పటికీ మనదేశం కూడా దానికి వ్యతిరేకమే అనే చెప్పాలి. పాకిస్థాన్‌లో రాజకీయ, ఇతర కారణాలతో అక్కడి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. బెలూచిస్తాన్‌లోని ఉగ్రవాద శక్తులు చైనా జాతీయుల మీద చేసిన దాడుల వెనుక బిఆర్‌ఐని వ్యతిరేకించే దేశాలు ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యలు, వాటి పరిణామాలు, పర్యవసానాల గురించి చైనాకు తెలిసినప్పటికీ ఎందుకు చేపట్టిందన్నది ప్రశ్న. ప్రపంచ ఫ్యాక్టరీగా తయారైన తరువాత దాని ఎగుమతులు, దిగుమతులు తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో యూరేషియా, ఆఫ్రికా దేశాలకు చేరేందుకు గల మార్గాలను అన్వేషించినపుడు సిపిఇసి ముందుకు వచ్చింది. దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి ద్వారా రవాణా కంటే పశ్చిమ చైనాలోని షిజియాంగ్‌(ఉఘిర్‌) స్వయంపాలిత ప్రాంతం నుంచి పాక్‌ అరేబియా సముద్రరేవు పట్టణం గద్వార్‌ వరకు రవాణా సదుపాయాల ఏర్పాటు లాభదాయకమని భావించింది. చరిత్రలో ఇంగ్లీష్‌ ఛానల్‌ ప్రాంతంలో బ్రిటన్‌ మరియు ఫ్రాన్సును కలుపుతూ ఏర్పాటు చేసిన భూగర్భ రైల్వే టన్నెల్‌, పనామా, సూయజ్‌ కాలవల తవ్వకం అలా జరిగిందే. ప్రస్తుత పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 51 ఒప్పందాల ద్వారా 46 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రారంభించారు. ఇప్పుడు అది 65 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని అంచనా. మధ్యలో కరోనా, ఇతర సమస్యలతో అనుకున్నంత వేగంగా పూర్తి కావటం లేదు. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌ నుంచి 60 బిలియన్‌ డాలర్ల ప్రాజక్టు నుంచి చైనా వైదొలిగిందని రాస్తే జనం నమ్మాలా ? ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా శాశ్వతంగా ఉంటుందని భావించి మనదేశం అక్కడ మూడు బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. మనకు కూడా చెప్పకుండా అమెరికన్లు 2021లో అక్కడి నుంచి బతుకుజీవుడా మమ్మల్ని ప్రాణాలతో పోనిస్తే చాలంటూ ఆయుధాలు, రవాణా వాహనాల వంటి వాటన్నింటినీ వదిలి కాలికి బుద్ది చెప్పటాన్ని చూశాము. అప్పటి నుంచి మనదేశం తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా తెరవెనుక వారితో మంతనాలు జరుపుతూ పెట్టుబడులను రాబట్టుకొనేందుకు చూస్తున్న సంగతి బహిరంగ రహస్యం. వదలివేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు. జూలై మొదటి వారంలో తాలిబాన్‌ సర్కార్‌ను గుర్తించిన ఏకైక దేశం రష్యా. దానితో మనకున్న సంబంధాలను ఉపయోగిస్తామని వేరే చెప్పనవసరం లేదు. అలాంటిది 60 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను అర్ధంతరంగా పాకిస్థాన్‌కు వదలి వట్టి చేతులతో చైనా తిరిగి వెళుతుందని మీడియాలో కొందరు రాస్తే, నరేంద్రమోడీ అభ్యంతరంతోనే ఆపని చేసిందని కాషాయదళాలు జనాన్ని నమ్మించేందుకు చూడటం నిజంగానే దుస్సాహసం. జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరని వారికి చెప్పకతప్పదు !

. 

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిందూత్వ బాటలో బ్యాంక్‌ మేనేజర్‌ – పెద్ద కూర నిషేధంపై బెఫి నిరసన ! బిజెపి ఎంఎల్‌సిపై గోరక్షకుల దాడి !!

05 Friday Sep 2025

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

beef, Beef eating in Vedas, BEFI, BJP, Cow vigilantes, Food Ban, Food- A Symbol Of Identity, Gau Rakshaks, Politicisation of Beef, RSS


ఎం కోటేశ్వరరావు


ఆహార వ్యవహారాల్లో జోక్యం అంటే ఫలాన తినకూడదు అని ఆంక్షలు పెట్టటం వ్యక్తిగత స్వేచ్చలో మితిమీరిన జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు. ఆహారం, ఆహార్యం కొన్ని సమూహాలకు అస్థిత్వ సూచికలుగా ఉన్నాయి. పెద్ద కూర, దీన్ని ఆంగ్లంలో బీఫ్‌ , అచ్చతెలుగులో గొడ్డు మాంసం అంటారు. తక్కువ ఖర్చుతో జనాలకు అవసరమైన ఎక్కువ ప్రొటీన్లు అందచేసే ఆహారం ఇది. ఇటీవలి కాలంలో హిందూత్వశక్తులు, సనాతనులుగా ముద్రవేసుకున్నవారు దీని మీద పెద్ద రాద్దాంతం, దాడులు, హత్యలకూ పాల్పడటాన్ని చూశాం. మేం శాకాహారులం మా మనోభావాలను గాయపరచవద్దు అనేవారు తయారయ్యారు. మాంసాహారులకు కూడా మనోభావాలు ఉంటాయి. తాజాగా కేరళలోని కోచ్చి నగరంలో కెనరా బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయానికి బీహార్‌ నుంచి అశ్వనీ కుమార్‌ అనే మేనేజర్‌ బదిలీ మీద వచ్చారు. అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా బ్యాంకు క్యాంటీన్‌లో పెద్ద కూర కూడా వారంలో కొన్ని రోజులు అందుబాటులో ఉండేది. ఆ పెద్దమనిషి రాగానే ఆహార జాబితా నుంచి దాన్ని తొలగించి నిషేధం విధించారు.ఎందుకంటే నేను తినను అని చెప్పారట. నాకు దక్కనిది ఎవరికీ దక్క కూడదు అనే సినిమా మాటలు బాగా వంటబట్టి ఉంటాయి. దేశంలో అనేక ప్రాంతాలలో ఇలాంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపిన సంగతి తెలియనంత అమాయకంగా సదరు అధికారి ఉంటారని అనుకోలేం. ఉద్యోగులు ప్రశ్నించిన తరువాత అయినా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉంటే ఆ పెద్దమనిషి ఇప్పుడు మీడియాకు ఎక్కి ఉండేవారు కాదు. విధిలేని స్థితిలో బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫి) నాయకత్వంలో సిబ్బంది నిరసన తెలుపుతూ బ్యాంకు ప్రాంగణంలో పెద్ద కూర, పరోటాల పండగచేసి నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏ ఆహారం తీసుకోవాలన్నది వ్యక్తిగత ఎంపిక అంశమని, కొన్నింటి మీద నిషేధం విధించటం రాజ్యాంగహక్కులను ఉల్లంఘించటమే అని స్పష్టం చేశారు. బ్యాంకు అధికారి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక ఉన్నతాధికారి ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా ఇతరులు ఆహార అలవాట్లను ఎందుకు మార్చుకోవాలని వారు ప్రశ్నించారు. మాంసాహారం తినాలని తామెవరినీ బలవంతం చేయటం లేదని బెఫి నేత చెప్పారు.


మాంసం, చేపలు, గుడ్లు తినరాదంటూ బలవంతం చేయటాన్ని బ్రాహ్మణీయ జాతీయవాదం(భావజాలం) అంటున్నారు. అనేక మంది బ్రాహ్మలు మాంసాహారాన్ని తింటారన్నది అందరికీ తెలిసిందే. తిరోగామి జాతీయవాదం ఏ రంగంలో, ఏ సమస్యపై తలెత్తినా దాన్ని వ్యతిరేకించాల్సిందే. మన దేశంలో ఆవును పూజించటానికి, గొడ్డు మాంసం తినటానికి లంకె పెడుతున్న కారణంగా తలెత్తిన భావజాల ఘర్షణను భౌతిక దాడులకు తీసుకుపోయేందుకు కొన్ని శక్తులు పనిగట్టుకు పనిచేస్తున్నాయి. బిజెపి పాలిత ఒడిషా రాష్ట్రంలో ఇద్దరు దళితులు చచ్చిన ఆవు కళేబరం నుంచి చర్మాన్ని వేరు చేయటాన్ని చూసిన కొందరు గోవధకు పాల్పడ్డారంటూ వారి మీద దాడి చేయగా ఒక వ్యక్తి మరణించాడు. ఉన్మాదాన్ని ఎలా ఎక్కించారో చూస్తున్నాం. దళితుల మీద దాడులకు ఆవునొక సాకుగా కూడా చూపిన ఉదంతాలు ఉన్నాయి. తమ ఇంట ఆవు చనిపోతే దాన్ని పూడ్చిపెట్టేందుకు ఏ సనాతనవాదీ ముందుకు రారు. ఇదీ గోవుల మీద ప్రేమ బండారం. చివరకు ఆ దళితులే కావాలి. సాంస్కృతిక గురుపీఠాల సృష్టికి ఆహారం ఒక ఉత్ప్రేక్షగా( ప్రస్తుతాన్ని అప్రస్తుతమైనదిగా మార్చటం) మారి చివరకు అవమానించేందుకు దారితీస్తున్నదని ప్రముఖ మేథావి, జెఎన్‌యు ప్రొఫెసర్‌ గోపాల్‌ గురు చెప్పారు. నైతిక పోలీసుల మాదిరి ఇలాంటి గురుపీఠాలు సాంస్కృతిక పోలీసులుగా బ్రాహ్మణ భావజాలాన్ని రుద్దే నిరంకుశ శక్తులుగా మారుతున్నాయి. వాటి ప్రభావానికి లోనైన కారణంగానే కెనరా బాంక్‌ కొచ్చి మేనేజర్‌ వంటి వారు తమ అధికార స్థానాలను ఉపయోగించుకొని నిషేధాలకు దిగటం సహించరానిది. నిజానికి సదరు మేనేజరుకు హిందూత్వ సంస్థలతో సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు. లేనప్పటికీ వాటి ప్రభాంతో తెలియకుండనే హిందూత్వ అజెండాను అమలు జరిపే ఒక పరికరంగా మారటాన్ని గమనించాలి. ఇలాంటి చర్యలకు ప్రతిఘటన తప్పదు. చిత్రం ఏమిటంటే దేశంలో 81శాతం మంది మాంసాహారులు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెప్పగా 39శాతం శాకాహారులని కొన్ని సర్వేలు చెప్పాయి. ఒకటి మాత్రం వాస్తవం, ఏ విధంగా చూసినా మాంసాహారులే అత్యధికంగా ఉన్నప్పటికీ మైనారిటీలుగా ఉన్న శాకాహారులు తమ అలవాట్లను మెజారిటీ మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. గోవధ గురించి దేశంలో ఎంతో చర్చ జరిగిన తరువాత దాని గురించి రాష్ట్రాలకు నిర్ణయాన్ని వదలివేస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్‌ 48లో పేర్కొన్నారు. దాన్ని విధి గాక ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. కొన్ని రాష్ట్రాలలో బిజెపి తన హిందూత్వ అజెండాలో భాగంగా గోవధ నిషేధ చట్టాలు చేసింది. అది కొత్త సమస్యలను ముందుకు తెస్తున్నది.


దోపిడీకి అవకాశం కల్పించే, సామాజిక పరంగా వివక్షాపూరితమైన మనువాదాన్ని సమర్ధించే శక్తులు ఇటీవలి కాలంలో రూటు మార్చి చిల్లి కాదు తూటు అన్నట్లుగా సనాతనం పేరుతో రాజకీయం చేస్తున్నాయి.అధునాతన కాలంలో సనాతనాన్ని పాటించటం ఎలా సాధ్యమో వారు చెప్పలేరు. రెండవది వేదకాలం గొప్పతనం గురించి ఒక వైపు చెబుతారు. పోనీ ఆ కాలానికి వెళ్లగలమా ? వేదకాలం గురించి చెప్పేవారు రెండో వైపున గోవధ నిషేధం గురించి మాట్లాడతారు. ఇది రెండిరటికీ పొసగని అంశం అని ఎంత మందికి తెలుసు? ఆవును పవిత్రంగా చిత్రించేవారు వేదకాలంలో ఆవు మాంసం తినటం గురించి ఎందుకు మాట్లాడరు ? వేదాలుగానీ, శాస్త్రాలు గానీ చరిత్రలు కావు.వాటిలో అనేక పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. కారణం ఎవరికి తోచిన వాటిని వారు రాసి వాటిలో చేర్చారు. ఎవరి వాదనలకు అనువుగా ఉన్నవాటిని వారు ఉటంకిస్తూ జనాలను మభ్య పెడుతున్నారు. యజ్ఞయాగాదులలో ఆవు పాలు, పెరుగు, నెయ్యి లేకుండా నేడు గడవటం లేదు. వేదాలతో సమానమైనదిగా భావించే శతపథ బ్రాహ్మణంలో యాజ్జవల్క్యుడు తాను బాగా ఉడికించిన పెద్దకూరను తింటానని చెప్పినట్లుగా ఉంది. దేవతల చక్రవర్తిగా పరిగణించే దేవేంద్రుడు ఎద్దుమాంస వడ్డన గురించి చెప్పాడు. వేదకాలంలో పూజారులకు ఆవులను ఇవ్వాలని లేకుంటే కనీసం ఆవు మాంసమైనా అందచేసే సాంప్రదాయం ఉన్నట్లు రాతలను బట్టి తెలిసిందే. కొంత కాలం తరువాత ఆవు వలన ఉపయోగం ఉందని గ్రహించి దాన్ని చంపకూడదని భావించారు. ఆ మాట చెబితే వినే పరిస్థితి లేకపోవటంతో ఆవు గురించి అభూత కల్పనలు, పవిత్రతను అంటగట్టి నిరోధించేందుకు కావాల్సిన వాటినన్నింటినీ చేర్చారన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ క్రమంలో ప్రతి జంతువుకు పవిత్రతను ఆపాదించి పురాణాల్లో రాయటం కనిపిస్తుంది. కానీ వాటిని వధించి తినటానికి ఉన్న అనుమతి ఆవుకు ఎందుకు నిరాకరిస్తున్నారన్నదే ప్రశ్న. దీన్ని లేవనెత్తితే అనేక మంది తమ మనోభావాలను స్వయంగా గాయపరుచుకుంటున్నారు. రాజకీయ నేతలు ఒకే ప్రకటనకు విరుద్ధ భాష్యాలు చెప్పినట్లుగా పురాణాలు, వేదాలలోని వాటికీ ఈ మధ్య తమకు అనుకూలమైన అర్ధాలు, భాష్యాలు చెప్పటాన్ని చూస్తున్నాము. చెప్పుకోనివ్వండి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ధర్మరక్షకుల పేరుతో సంఘటితం అవుతున్నవారు అంగీకరించనివారి మీద బలవంతంగా రుద్దే గూండాయిజం ఏమాత్రం సహించరానిది.


ఊరకుక్కల కాట్లకు బలవుతున్న పిల్లలు, పెద్దల గురించి తెలిసిందే. ఇప్పుడు వాటికి తోడు యజమానులు పట్టించుకోకుండా వీధుల్లోకి వదలివేస్తున్న ఆవులు కూడా సమస్యగా మారుతున్నాయి. సనాతనులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఉదయం లేవగానే రోడ్ల మీద తిరుగుతున్న వాటన్నింటినీ తమ ఇండ్లకు చేర్చుకొని ఆదరిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎందుకు ఆపని చేయటం లేదు. ఇటీవల ఢల్లీి ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా ఒక ఫ్లై ఓవర్‌ మీదకు ఆవులు రావటంతో ఆకస్మికంగా డ్రైవర్‌ బ్రేకులు వేసి వాహనాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.చిత్రం ఏమిటంటే ఆమె కూడా ఒక సనాతన వాదే, ఆవులు వెళ్లేంత వరకు వాహనం దిగి చూశారు తప్ప సిబ్బందిని ఆదేశించి వాటన్నింటిని తన ఇంటికో, కార్యాలయానికో తోలుకు రమ్మని చెప్పలేదు. దేశంలో 50లక్షలకు పైగా ఆవులను రోడ్ల మీద వదలివేసినట్లు అంచనా, నిజానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. యోగి ఆదిత్యనాధ్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి పక్కా సనాతనవాదులు అత్యధిక రాష్ట్రాల్లో పాలకులుగా ఉన్న ఈ దేశంలో అలా బాధ్యతా రహితంగా వదలివేయటం ఏమిటి ! ఉత్తర ప్రదేశ్‌లోనే పన్నెండున్నర లక్షలు ఉన్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. బిజెపి పాలిత మహారాష్ట్రలో గోశాలల్లో ఉన్న ఒక్కో ఆవుకు రోజుకు రు.50 చెల్లిస్తున్న ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌గా నెలకు ఇస్తున్న మొత్తం రు.1,500 అంటే ఆవుతో సమానం.బీహార్‌లో రు.400గా ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ మొత్తాన్ని ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2025జూన్‌లో నితీష్‌ కుమార్‌ సర్కార్‌ రు.1,100కు పెంచింది. అత్యంత మానవీయ కోణం ఉన్న ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని సర్కార్‌ జాతీయ సామాజిక సహాయ పథకం కింద మన్మోహన్‌ సింగ్‌ హయాంలో నిర్ణయించిన రు.200, రు.500మొత్తాలనే ఇప్పటికీ మంజూరు చేస్తున్నది. ఈ మాత్రానికే తమ వాటా ఎంత ఉందో లబ్దిదారులకు తెలపాలని కేరళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాము ఇస్తున్న రు.1,600లలో ఎవరి వాటా ఎంతో చెప్పటానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని అక్కడి వామపక్ష ప్రభుత్వం చురక అంటించింది.

గో సంరక్షణ చట్టాలతో వట్టిపోయిన ఆవులను మేపటం రైతాంగానికి భారంగా మారుతున్నది. గతంలో వాటిని అమ్మివేస్తే వధశాలలకు తరలించేవారు. ఇప్పుడు ఆమ్ముకోవచ్చుగానీ కొనేవారెవరు ? మహారాష్ట్రలో ఉన్న జంతు సంరక్షణ చట్టాన్ని సవరించటం లేదా రద్దు చేయాలని ఏకంగా అక్కడి బిజెపి ఎంఎల్‌సి, మాజీ మంత్రి సదాశివ ఖోట్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అందుకుగాను మండిపడిన కాషాయదళాలు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేయటమే కాదు దాడులకు పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు నిరసన కూడా తెలిపారు. సతారా జిల్లాలో కొందరు రైతులు తమ గేదెలను విక్రయించారు.వారికి డబ్బు చేతికి అందక ముందే గోరక్షకులమంటూ కొందరు వచ్చి వాటిని బలవంతంగా పూనే తరలించారు. రైతులు కోర్టుకు ఎక్కటంతో వారి పశువులను వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది. అయితే వాటికోసం ఒక గోశాలకు వెళ్లగా అవి కనిపించలేదు. రైతులతో పాటు ఎంఎల్‌సి అక్కడ ఉండగా గోరక్షకులమంటూ వచ్చిన వారు తన మీద దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సదాశివ ఖోట్‌ చెప్పారు. మహారాష్ట్రలో వట్టిపోయిన ఆవులు, గేదెలను విక్రయించటానికి వీల్లేకపోవటంతో రైతాంగానికి అవి భారంగా మారాయి. షేత్కారి రైతు సంఘ నేత శరద్‌ జోషి, మరికొందరు ఎప్పటి నుంచో చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాను మూడు దశాబ్దాలుగా రైతుల సమస్యల మీద పని చేస్తున్నానని గోరక్షకులుగా చెప్పుకుంటున్నవారు కనీసం ఒక్కసారైనా పాలు పితికిన వారు కాదని ఎంఎల్‌సి విమర్శించారు. గత కొద్ది వారాలుగా సాంప్రదాయకంగా పశువ్యాపారం చేస్తున్నవారు గోరక్షకుల పేరుతో ఉన్నవారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.వారికి సదాశివ ఖోట్‌ మద్దతు ప్రకటించారు. వట్టిపోయిన పశువులకు నెలకు తొమ్మిదివేల రూపాయల వంతున మేతకు ఖర్చు చేస్తే రైతులకు వచ్చేదేమీ ఉండదని అందువలన వాటిని అమ్ముకోవటం మినహా మరొక మార్గం లేదని, అయితే గోరక్షకులమంటూ బయలుదేరిన వారు ఆ లావాదేవీలను అడ్డుకుంటున్నారని, రైతాంగానికి నష్టం కలిగిస్తున్నారని చెప్పారు.హిందూత్వ నేత మిలింద్‌ ఎక్బోటే ఒక ప్రకటన చేస్తూ ఎంఎల్‌సి పశువులను వధించేవారి తరఫున మాట్లాడుతున్నారని, రాజకీయాలనుంచి గెంటివేయాలని డిమాండ్‌ చేశారు. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కూడా పశువధ చేసే వారికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. అనేక రాష్ట్రాలలో పశువధ, వ్యాపారం వృత్తిగా ఖురేషీ అనే ముస్లిం తెగకు చెందిన వారు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని కూడా ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.మహారాష్ట్రలో వట్టిపోయిన పశువుల సమస్య ముందుకు రావటం ఇదే మొదటి సారి కాదు. నిజానికి ఇది ఒక్క ఆ రాష్ట్రానిదే కాదు, పశువధ నిషేధం ఉన్న ప్రతి చోటా గోరక్షకుల పేరుతో రైతాంగాన్ని దెబ్బతీసే శక్తులు పేట్రేగిపోతాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d