• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: AP NEWS

జగన్‌ పోయే…బాబు వచ్చే…విద్యుత్‌ బిల్లు మోత ఢాం ఢాం ? 2029లో పొంచి ఉన్న గండం ! మద్యం గురించి విజయసాయి రెడ్డి ఏం చెప్పారు !!

20 Sunday Apr 2025

Posted by raomk in AP NEWS, BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, TDP, Ycp

≈ Leave a comment

Tags

AP Power Bills, CHANDRABABU, Jana Sena, Narendra Modi Failures, pavan kalyan, YS jagan

ఎం కోటేశ్వరరావు


కొద్ది రోజుల క్రితం వైఎస్‌ జగన్‌ కుటుంబానికి చెందిన సాక్షి పత్రిక విద్యుత్‌ బిల్లుల పెరుగుదల గురించి ఒక వార్త ఇచ్చింది. దాన్లో ఉన్న వ్యాఖ్యలను పక్కన పెడితే అంకెల సమాచారం పక్కా వాస్తవం. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాయని చెబుతున్న మీడియా వాటి మీద చర్చలు పెట్టింది, తెలుగుదేశం ప్రతినిధులు విద్యుత్‌ బిల్లుల పెరుగుదలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, అది గత ప్రభుత్వ పాపమే అంటూ నానా యాగీ చేస్తున్నారు.ఇక్కడ మహాకవి శ్రీశ్రీ కవితను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోక తప్పటం లేదు.
జెంఘిజ్‌ ఖాన్‌, తామర్లేన్‌
నాదిర్షా, ఘజనీ, ఘోరీ
సికిందరో ఎవడైతేనేం
ఒక్కొక్కడూ మహాహంతకుడు
అన్నట్లుగా సిఎంగా వైఎస్‌ జగన్‌, చంద్రబాబు నాయుడు ఎవరైతేనేం ? జనానికి వాచిపోతోంది. జగన్‌ వైసిపి కార్యకర్తలకు, ఓటర్లకు మినహాయింపు ఇచ్చింది లేదు, చంద్రబాబు మూడు పార్టీల వారికీ ఒరగబెడుతున్నదీ లేదు. పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు సేమ్‌ టు సేమ్‌ (అంతా ఒకటే ) జగన్‌ పాలన ఐదు సంవత్సరాల్లో విద్యుత్‌ బిల్లులు మోతమోగించారు, బాదుడే బాదుడు అని ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అండ్‌ కో అధికారానికి వచ్చిన ఏడాది కాలంలోనే రు.15,485 కోట్ల మేర విద్యుత్‌ భారాన్ని 2026 ఆఖరు వరకు వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించి బాదుడే బాదుడు ప్రారంభించింది.
వైకింగులు, శ్వేతహూణులు
సిథియన్లు, పారశీకులు
పిండారీలు, థగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన
అన్నాడు శ్రీశ్రీ. అదే మాదిరి కొందరి వ్యవహారం ఉంది. గతం, వర్తమాన భారాలకు కారకుల గురించి వారి మద్దతుదారులైన మీడియా సంస్థలు, జర్నలిస్టులు గతంలో చేసిందీ, ఇప్పుడు చేస్తున్నదీ అదే. వారికి బిల్లులు ఎంత పెరిగినా మౌనంగా కట్టేయటం తప్ప చెప్పుకోలేని దుస్థితి. జనంతో ఆడుకుంటున్నారు.


మేం విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు కదా అంటున్నారు మూడు పార్టీల చెట్టుకింది ప్లీడర్లు. పెంచారని ఎవరన్నారు, చార్జీల బదులు మా జేబులను గుల్లచేసే బిల్లులు పెంచారుగా అని కదా ప్రజానీకం మొత్తుకుంటున్నది. పళ్లూడగొట్టటానికి ఇనుప సుత్తి అయితేనే బంగారుదైతేనేం. ఆ పాపం మాదికాదు జగన్‌మోహనరెడ్డిదే అంటున్నారు, అది నిజం. 20142019 కాలంలో చంద్రబాబు నాయుడు చేసింది కూడా అదే. విద్యుత్‌ గురించి మాట్లాడుకుంటున్నాం గనుక ఆ రంగంలో జగన్‌ ముగ్గురు పిల్లల్ని కన్నారు. ఒక పిల్ల వినియోగదారులకు స్మార్టు మీటర్లు, రెండవది చంద్రబాబే చెప్పినట్లు రానున్న పాతిక సంవత్సరాల్లో లక్షకోట్ల రూపాయల భారం మోపే సెకీ ఒప్పందం. మూడవది కొరత సమయాల్లో విద్యుత్‌ కొనుగోలు(ఇప్పుడు వస్తున్న అదనపు బిల్లులు). వీటిలో మొదటి ఇద్దరు పిల్లలు ఓకే, మూడోదానితో మాకు సంబంధం లేదని తెలుగుదేశం అంటే కుదురుతుందా ! మూడూ అక్రమ సంతానమనే కదా గతంలో చెప్పింది. ఇప్పుడు మూడోదాని భారం మీరే మోయాలంటూ జనం మీదకు వెంటనే వదిలారు. నిజానికి మిగతా ఇద్దరి భారాన్ని కూడా మోసేది జనమే. తేడా ఏమిటి అంటే వాటిని తరువాత వదులుతారు, తక్షణం భారం పడదు అంతే ! స్మార్ట్‌ మీటర్లను పగలగొట్టమని పిలుపు ఇచ్చిన వారు ఇప్పుడెందుకు వాటిని పెడుతున్నారు అంటే కరెంటు ఎంత కాలింది లెక్కలు తేలాలి కదా అని తెలుగుదేశం వారు టీకా తాత్పర్యం చెబుతున్నారు. నరేంద్రమోడీ, ఆ పెద్ద మనిషి రుద్దిన స్మార్ట్‌ మీటర్లను పెట్టేందుకు అంగీకరించిన జగన్మోహన్‌రెడ్డి కూడా చెప్పింది అదే కదా. మరి తెలుగుదేశం చెప్పేదానికి తేడా ఏమిటి అంటే అది చిల్లి కాదు తూటు అంటున్నారు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయండి అంటే, దాన్ని రద్దు చేస్తే పెట్టుబడులు పెట్టేవారికి విశ్వాసం దెబ్బతింటుంది అందుకే కొనసాగిస్తాం అన్నారు. ఎవరో పెట్టుబడి పెడతారంటూ రాష్ట్ర జనం మీద లక్షకోట్లు భారం మోపటానికి ఏం నాటకం ఆడుతున్నారు ! నిజానికి సెకీ వప్పందంతో రాష్ట్రానికి కొత్తగా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాదు.గతంలోనే కుదిరాయి. అదానీ వంటి వారి నుంచి కొనుగోలు చేసే సెకీ ఆ విద్యుత్‌ను రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని సరఫరా చేస్తుంది. దానికి డబ్బు చెల్లించాలి, అంతకు మించి వచ్చే పెట్టుబడులేమిటో 40 సంవత్సరాల అనుభవం ఉన్న సిఎంచంద్రబాబు నాయుడిని, వేల పుస్తకాలు చదివిన డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌లను చెప్పమనండి. మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు మేం నందంటే నంది పందంటే పంది అంటారని ఆ పార్టీల నేతలు అనుకోవచ్చు, కొంత మంది రచ్బబండల దగ్గర అదే వాదించి ఇంటికి వెళ్లిన తరువాత బిల్లులను చూసినపుడు గొల్లుమంటారు తప్ప బయటకు చెప్పుకోలేరు. కానీ మిగతావారు అంత అమాయకంగా లేరు.

విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌గా పని చేసిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి వీరాభిమాని, జగన్‌ హయాలో చేసిన కొనుగోళ్లకు సంబంధించి ఎంత వసూలు చేయాలో అప్పుడు నిర్ణయించకుండా తమనేత చంద్రబాబు అధికారానికి వచ్చిన తరువాత కావాలనే ఖరారు చేశారన్నది మరొక తర్కం. అదనపు విద్యుత్‌ కొనుగోలు విధిగా కమిషన్‌ అనుమతి తీసుకోవాలి. అలా కొన్నదాని ఖర్చు గురించి కమిషన్‌ విచారణ జరిపిన తరువాతే కదా నిర్ణయించేది, ఎప్పుడైనా తెలుగుదేశం,జనసేన, బిజెపి నేతలు వాటికి వ్యతిరేకంగా కమిషన్‌ ముందు వ్యతిరేకించారా ? ప్రకటనలు చేశారేమో తప్ప కమిషన్‌ ముందు వామపక్షాల వారి మాదిరి వ్యతిరేకంగా వాదించినట్లు కనపడదు, లేదూ మేం కూడా వ్యతిరేకించాం,వాదించాం అంటే కాసేపు అంగీకరిద్దాం, కమిషన్‌ చేసిన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయకుండా ఎందుకు అమలు చేస్తున్నట్లు ?అవసరం లేకపోయినా విద్యుత్‌ కొనుగోలు చేశారు అన్నది మరొక వాదన. విద్యుత్‌ గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవారు అలా మాట్లాడరు. కరెంటు నిల్వ ఉండదు, ఎంత ఉత్పత్తి అయితే అంతా వినియోగం కావాల్సిందే, తగ్గితే ఉత్పత్తిని తగ్గిస్తారు, సరఫరా తగ్గిస్తారు తప్ప అదనంగా కొని రోడ్లపక్కనో చెరువుల్లోనే పోయరు. అదనంగా బిల్లులు వసూలు చేయాలని కమిషనే చెప్పింది అన్నది మరొక వాదన. ఉత్పత్తి, చాలకపోతే అదనంగా కొనుగోలు చేసేది విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, జనాలకు అందించేది పంపిణీ సంస్థలు. ఈ రెండూ ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయి. పెట్టుబడి, రాబడి మధ్యవచ్చే తేడాను తేల్చి ఆ మొత్తాన్ని ఆయా సంస్థలకు చెల్లించాలని యజమాని అయిన ప్రభుత్వానికి విద్యుత్‌ కమిషన్‌ చెబుతుంది తప్ప ఎలా వసూలు చేయాలో చెప్పదు, ఒకవేళ చెప్పినా వసూలు చేయాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయించాలి. వ్యవసాయానికి, మరికొందరికి సబ్సిడీ లేదా ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని ప్రభుత్వాలు చెబుతాయి. అందుకయ్యే ఖర్చును బడ్జెట్‌ నుంచి చెల్లిస్తున్నారు. ఇప్పుడు సర్దుబాటు, మరొక పేరుతో వడ్డిస్తున్న మొత్తాలను తేల్చిన తరువాత ప్రభుత్వమే సబ్సిడీగా చెల్లించవచ్చు లేదా వినియోగదారులనుంచి వసూలు చేయవచ్చు. చంద్రబాబుపవన్‌ కల్యాణ్‌ రెండో పద్దతినే ఎంచుకుని బాదుడే బాదుడు ప్రారంభించారు.ఎందుకంటే స్వంత పార్టీల వారు అడగరు, ప్రతిపక్షం అడిగితే ఎదురుదాడికి దిగుతారు. ఇప్పుడు వసూలు చేస్తున్నదిగాక 202425ఆర్థిక సంవత్సరంలో జగన్‌మోహనరెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరి పాలనా కాలంలో కొనుగోలు చేసిన కరంట్‌కు ఎన్నివేల కోట్ల రూపాయలు జనం మీద మోపుతారో ఇంకా ఖరారు కాలేదు. రెగ్యులేటరీ కమిషన్‌ గత చైర్మన్‌ కావాలనే ఆలశ్యం చేసి జగన్మోహరెడ్డి పాలనా కాలంలో ఖరారు చేయలేదని చెబుతున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు కొత్త చైర్మన్‌తో ఎంత త్వరగా ఖరారు చేయిస్తారో తెలియదు, చేస్తే మాత్రం వెంటనే బాదుడు మొదలు పెడతారు.

ఇదిగాక కనిపించని మరొక భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుంది. అదానీ కంపెనీ ద్వారా బిగించే 59,21,344 స్మార్ట్‌ మీటర్ల బిగింపు పూర్తి అయిన తరువాత రెండు రకాల చార్జీలు ఉంటాయి. వేసవి కాలంలో కూరగాయలు తక్కువగా పండుతాయి గనుక రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వేసవిలో ఉక్క పోతకు తట్టుకోలేక ఫాన్లు, ఎసిలు వేసుకున్నపుడు కాలే కరంటు ధర ఎక్కువగా, మిగతా సమయాల్లో మామూలుగా ఉంటుంది. ఈ మీటర్లు బిగించిన తరువాత సెల్‌ఫోన్లకు ముందుగానే డబ్బు చెల్లించినట్లుగా విద్యుత్‌ను కూడా ముందుగానే డబ్బు చెల్లించాలి. ఉదాహరణకు ఇప్పుడు నెలకు రెండు వందల రూపాయల బిల్లు ఇప్పుడు వస్తుందనుకోండి. దాన్ని వాడుకున్న తరువాత ఒకేసారి చెల్లించాలి, లేకుంటే ఫీజులు పీకి వేస్తారు. స్మార్ట్‌ మీటర్లు వచ్చిన తరువాత ఫీజులు పీకేవారు ఉండరు.వారు లేకపోతే పక్కింటి వారి ముందు మన పరువూ పోదు. ముందే కరెంటును కొనుక్కోవాలి. మన దగ్గర సమయానికి ఎంత డబ్బు ఉంటే అంత మేరకు కరంటు కొనుక్కోవచ్చు, అది అయిపోగానే సరఫరా ఆగిపోతుంది, తిరిగి కావాలంటే డబ్బు చెల్లించాలి. ఇక రెండు రకాల చార్జీలు ఎలా ఉంటాయంటే. చలికాలంలో వంద రూపాయలు చెల్లిస్తే నెల రోజుల పాటు కరంటు ఉంటుంది. అదే వేసవిలో పగలు ఫాన్లు,ఎసిలు వేసుకుంటే ఒక రేటు, పొలాలు, ఉద్యోగాలకు వెళ్లినపుడు వేసుకుంటే ఒక రేటుతో పదిహేను లేదా ఇరవై రోజులకే వస్తుంది. భవిష్యత్‌లో చంద్రబాబుపవన్‌ కల్యాణ్‌ ఇచ్చే మహత్తర కానుక ఇది.దీనికే టైమ్‌ ఆఫ్‌ డే (రోజులో కరంటు కాల్చే సమయ) అనే స్మార్ట్‌ (ముద్దు ) పేరు పెట్టారు. చీకటి పడగానే ఇంట్లో లైట్లన్నీ వేసుకోవటం ఉండదు,ఎక్కడ కూర్చుంటే అక్కడే వేసుకోవాలి.ఎవరన్నా రాత్రిపూట వస్తే లైట్లు వేయాల్సి వస్తే ఇప్పుడెందుకు వచ్చార్రాబాబూ అనుకుంటాం. ఇంకా ఇలాంటివే రానున్న నాలుగేండ్లలో ఎన్ని స్మార్టు విధానాలను ముందుకు తెస్తారో చూద్దాం ! 2000 సంవత్సరంలో విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా చంద్రబాబు సర్కార్‌ మీద జనం పెద్ద ఎత్తున ఉద్యమించటం, బషీర్‌బాగ్‌ కాల్పుల ఉదంతం, అది కూడా 2004లో తెలుగుదేశం ఓటమికి ఒక ప్రధాన కారణం కావటం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు 2029 ఎన్నికల నాటికి ఒక గండంగా మారటం ఖాయం, జనం స్మార్ట్‌గా పాఠం చెబుతారు !


జగన్‌మోహనరెడ్డి పాలనా కాలంలో మద్యం కుంభకోణం జరిగిందని, దాని మీద కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని విచారణకు పిలిపించగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎంత సేపు ప్రశ్నించినా తనకేమీ తెలియదని కసిరెడ్డి రాజశేఖరరెడ్డికే అంతా తెలుసని అతన్ని విచారించాలని సిట్‌కు ఉచిత సలహా ఇచ్చారు. ఒకవేళ అతను ఏదైనా చెబితే దానికి సాక్ష్యాలు ఉండాలి కదా అని వైసిపి అంటోంది. ఇక అసలైన సూత్రధారిగా చెబుతున్న రాజ్‌శేఖర రెడ్డి అజ్ఞాతం నుంచి ఒక ఆడియో పంపి ఆ కుంభకోణం గురించి తనకేమీ తెలియదని, తనపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డి సంగతి బయటపెడతానంటూ దానిలో పేర్కొన్నారు. మొత్తం మీద దీన్లో తేల్చేదేమిటో తెలియదు గానీ సిట్‌ దర్యాప్తు పూర్తి చేసి కేసు నమోదు చేసిన తరువాత మనీలాండరింగ్‌ గురించి ఇడి రంగంలోకి దిగుతుందని చెబుతున్నారు. మొత్తం మీద జనం సూపర్‌ సిక్స్‌ గురించి ఆలోచించకుండా ఇలాంటి విచారణ కబుర్లతో కాలక్షేపం చేసేందుకు బాగా పనికి వస్తుందని చెప్పవచ్చు ! పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి కుంభకోణ మొత్తం ఇప్పటికే తగ్గిపోయింది, చివరికి సున్నాగా తేలుతుందా, కూటమి ప్రభుత్వానికి చివరికి ఆయాసమే మిగులుతుందా ? డబ్బు కొట్టేయలేదని ఎవరూ చెప్పటం లేదు, ఎందుకంటే ప్రతి కుంభకోణం స్మార్డ్‌గా జరిగే రోజులివి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

లడ్డు రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టికాయలు : లీకు వీరుడు చంద్రబాబు పప్పులో కాలేశారా ?

02 Wednesday Oct 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, TDP, Ycp

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Narendra Modi, Pawan kalyan, Tirupati Laddu Controversy, YS jagan

ఎం కోటేశ్వరరావు


లడ్డు కల్తీ ఉదంతంలో దోషులుగా ఎవరు తేలతారో, ఏ శిక్షలు అనుభవిస్తారో ఆ భగవంతుడికే ఎరుక. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారవుతుందా అన్నది ఒక అనుమానం. కానీ తిరుమల శ్రీనివాసుడితో నిమిత్తం లేకుండా సుప్రీం కోర్టులో దాఖలైన పలు కేసులు, ఈ వివాదం నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. కల్తీ గురించి దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వ వేసిన సిట్‌ సరిపోతుందా లేక మరొక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అవసరమో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలంటూ అక్టోబరు మూడవ తేదికి కోర్టు వాయిదా వేసింది. కేంద్రం ఏమి చెబుతుందో కోర్టు ఏమి నిర్ణయిస్తుందో తెలియదు. అయితే అప్పటి వరకు సిట్‌ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ డిజిపి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. నిజానికి సిట్‌ దర్యాప్తు నిలిపివేయాలని కోర్టు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే నష్టనివారణ చర్యగా కనిపిస్తున్నది. లడ్డూలలో వాడే నేతిలో కల్తీ ఉందంటూనే దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఇచ్చిన నివేదికలో ఎన్‌డిడిబి లాబ్‌ తన జాగ్రత్తలు తాను తీసుకుంది. దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా మార్చి జగన్మోహన్‌ రెడ్డిని మరింతగా దెబ్బతీయవచ్చని ఎవరైనా సలహా ఇచ్చారో లేక తనంతట తానే నిర్ణయం తీసుకున్నారో తెలియదుగానీ లాబ్‌ నివేదికను బహిర్గతం చేసి చంద్రబాబు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. దాని గురించి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెల్లడిరచిన అభిప్రాయాలు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని ఇరకాటంలోకి నెట్టాయి. లడ్డూలో కల్తీకి పరిహారంగా లడ్డు పోటు, ఇతర ప్రాంతాలను ఆలయం శుద్ది చేసింది. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఏకంగా తానేమీ తక్కువ కాదన్నట్లు పదకొండు రోజుల దీక్ష పేరుతో చేసిన హడావుడి చూశాము. కల్తీ గురించి సిట్‌ వేసినపుడు దాని నివేదిక రాకుండా ముందుగానే ఉన్నట్లు కల్తీ గురించి సిఎం ఎలా ప్రకటిస్తారు ? అంటే మీకే స్పష్టత లేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కోట్లాది మంది మనోభావాల మీద ప్రభావం చూపే అంశాలను నిర్ధారించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మాట్లాడటం సరికాదని, దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని కూడా వ్యాఖ్యానించింది. అనేక కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు తీర్పుల్లో కనిపించవు. ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియదు.


నెయ్యి కల్తీ నివేదిక గురించి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరువాత ప్రతికూల స్పందనలు రావటంతో కొంత మంది కొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. అసలు చంద్రబాబు నివేదికను బయటపెట్టాలనుకోలేదని, వందరోజుల పాలన సందర్భంగా ఎంఎల్‌ఏతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఎన్‌డిడిబి నివేదికను యథాలాపంగా ప్రస్తావించారని చెబుతున్నారు. దాన్ని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి సవాలు చేయటంతో అనివార్యంగా తెలుగుదేశం పార్టీ సదరు నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని సమర్ధించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి లీకు వీరుడు అనే మారు పేరు ఉంది. అనేక అంశాలను కావాలనే వేరే మార్గంలో బయటపెట్టించి స్పందనను బట్టి దాన్ని వాడుకోవటం అలవాటు. గతంలో ప్రపంచ బ్యాంకు పధకాలను అమలు చేసే క్రమంలో వాటికి జనం మద్దతు కూడగట్టటం కోసం ఏ శాఖలో ఎంత అవినీతి ఉందో అనే సర్వేలు చేయించి వాటిని మీడియాకు అందచేసిన తీరు జనం మరచిపోయినా అది వాస్తవం. ఇప్పుడు లడ్డూ కల్తీలో ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. ఇప్పుడు ఒకవేళ సుప్రీం కోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించితే దాని మీద స్పందన ఎలా ఉంటుందో తెలియదు. అలాగాక ఇప్పుడు వేసిన సిట్‌ను కొనసాగిస్తే ముందే కల్తీ గురించి సిఎం చెప్పిన తరువాత దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వటం తప్ప వేరే ఏముంటుందని జనం భావిస్తారు. ఒకవేళ సిబిఐ విచారణ జరిపితే మూడు పార్టీల కూటమికి అనుకూలంగా దాని నివేదిక ఉంటుందని కూడా అదే జనం భావిస్తారు. విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది.


దేశ రాజకీయాల మీద చంద్రబాబు చూపిన ప్రభావం గురించి గతంలో ఎన్నో చెప్పుకున్నాం, ఇప్పుడు పలు దేవాలయాల్లో ప్రసాదాల మీద కూడా ‘‘ ప్రభావం ’’ చూపారని వార్తలు. అదేమిటంటే భక్తులు ప్రసాదాల పట్ల ముఖ్యంగా లడ్డుపట్ల అనుమానంగా చూస్తున్నారట. మీడియాలో వచ్చిన వివరాలను బట్టి బయటి సంస్థలు సరఫరా చేసే ప్రసాదాల మీద పూర్తి నిషేధం విధించాలని అయోధ్యలోని రామజన్మ భూమి దేవాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ డిమాండ్‌ చేశారు. తయారీ, పంపిణీలో మార్పులు తేవాలని, ఆలయ పూజారుల పర్యవేక్షణలో తయారు చేయాలని కోరారు. దేవాలయాల్లో వినియోగిస్తున్న నెయ్యి స్వచ్చత పట్ల ఆందోళన వెల్లడిరచారు. నైవేద్యాలలో కల్తీ ద్వారా దేవాలయాలను అపవిత్రం చేయాలన్న అంతర్జాతీయ కుట్ర ఉందని ఆరోపించారు.వాణిజ్య పద్దతిలో తయారు చేసే తీపి పదార్ధాల బదులు పండ్లు, పూల వంటి సహజ వస్తువులతో ప్రసాదాలను తయారు చేయాలని మధుర లోని ధర్మ రక్ష సంఫ్‌ు ప్రకటించింది. సంస్థ జాతీయ అధ్యక్షుడు సౌరవ్‌ గౌర్‌ మాట్లాడుతూ ప్రసాదాల తయారీలో మార్పులు తేవాలని, తిరిగి సాంప్రదాయ పద్దతులకు మరలాలని సంస్థలు, మత నేతలలో ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. సంగం నగరంగా పిలుస్తున్న ప్రయాగ్‌ రాజ్‌ (గతంలో అలహాబాదు) అలోప్‌ శంకరిదేవి, బడే హనుమాన్‌, మంకమేశ్వర వంటి వాటితో సహా అనేక దేవాలయాల్లో భక్తులు తెచ్చే స్వీట్లు తదితర పదార్ధాలను అర్పణలకు అనుమతించకుండా నిషేధించారు. లలితా దేవి ఆలయ ప్రధాన పూజారి శివమూర్తి మిశ్రా మాట్లాడుతూ భక్తులు కేవలం కొబ్బరి కాయలు, పండ్లు, ఎండిన పండ్లు మాత్రమే తేవాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వెల్లడిరచారు.స్వీట్ల స్వచ్చత నిరూపితమయ్యే వరకు వాటిని దేవాలయాల్లో అనుమతించకూడదని లక్నోలోని మంకమేశ్వర దేవాలయ మహంత్‌ శ్రీధరానంద బ్రహ్మచారి జీ మహరాజ్‌ చెప్పారు. వెలుపలి నుంచి భక్తుల ప్రసాదాలు, సీట్లను అనుమతించేది లేదని అలోప్‌ శంకరీదేవి దేవాలయ ప్రధాన పూజారి, శ్రీ పంచాయతీ అఖారా మహానిర్వాణి కార్యదర్శి యమునా పూరీ మహరాజ్‌ ప్రకటించారు. సంగం తీరంలోని బడే హనుమాన్‌ మహంత్‌ బల్బీర్‌ జి మహరాజ్‌ మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణ నిర్మాణం పూర్తయిన తరువాత లడ్డుపేడ ప్రసాదాలను యాజమాన్యమే తయారు చేయనుందన్నారు.పక్కా హిందూత్వవాది యోగి పాలనలోనే పరిస్థితి ఇలా ఉంది.మధ్య ప్రదేశ్‌లోని సేహోర్‌లోని ప్రముఖ వింధ్యవాసినీ బీజాసన్‌ దేవీ దేవాలయ ప్రాంగణంలో స్వయం సహాయక బృందం విక్రయిస్తున్న లడ్డుల విక్రయాన్ని నిలిపివేయాలని ట్రస్టు సభ్యులు జిల్లా కలెక్టకర్‌కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. లడ్లు వాసన వస్తున్నాయని, రుచిలో తేడా ఉందని భక్తులు చెబుతున్నారని ట్రస్ట్‌ చైర్మన్‌ మహేష్‌ ఉపాధ్యాయ చెప్పారు. ఈ దేవాలయం భోపాల్‌కు 70కిలో మీటర్ల దూరంలో ఉంది.అయితే తాను సదరు స్వయం సహాయక బృందంతో మాట్లాడానని సమస్య పరిష్కారమైందని కలెక్టర్‌ చెప్పారు.

మన దేశంలో ప్రసాదాల గురించి భక్తులు అనుమానించటం కొత్తేమీ కాదు. వాటిని సరఫరా చేసే వారు లేదా తయారీకి ఉపయోగించే సరకులు కల్తీ లేదా నాసిరకంగా ఉంటున్నాయని గతంలో అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. నెయ్యి కల్తీ గురించి నాటి కలకత్తాలో వచ్చిన ఆరోపణల గురించి స్పెక్టేటర్‌ అనే పత్రిక 1886 సెప్టెంబరు 25వ తేదీ సంచికలో రాసింది. ఒక చట్టాన్ని చేయాలని భక్తులు కోరినట్లు దానిలో పేర్కొన్నది. నెయ్యిలో పంది, ఆవు కొవ్వు, ఇతర జంతువుల మాంసాలలో ఉన్న కొవ్వు కల్తీ జరుగుతున్నట్లు విశ్లేషణలో పేర్కొన్నది. తరువాత కలకత్తాలో నెయ్యి వ్యాపారం చేసే మార్వాడీలు నెయ్యిలో కల్తీ చేస్తున్న కారణంగా ఒక నాటికి బెంగాలీ జాతే అంతరించి పోతుందంటూ 1917లో ఒక పత్రికలో వచ్చిన వార్త ఆందోళనకు దారితీసింది.దాంతో మార్వాడీ అసోసియేషన్‌ నెయ్యి గోడవున్ల వద్దకు వెళ్లి 67నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా కేవలం ఏడు మాత్రమే స్వచ్చంగా ఉన్నట్లు తేలింది. దాంతో వేలాది మంది కలకత్తా బ్రాహ్మలు హుగ్లీ నది(బెంగాల్లో గంగానది పేరు) తీరాన హోమాలు చేసి కల్తీ నెయ్యి ఆరగించినందుకు ప్రాయచిత్తం, శరీరాలను శుద్ది చేసుకున్నారు. దాంతో మార్వాడీ అసోసియేషన్‌ కల్తీ చేసిన వారిని గుర్తించి వారి వద్దనుంచి జరిమానాల రూపంలో రు.75వేలు వసూలు చేసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనంలో గడ్డి భూములను కొనుగోలు చేసినట్లు ప్రకటించటంతో బ్రాహ్మలు శాంతించారట. అందువలన దేశంలో నెయ్యి కల్తీ వివాదం తిరుపతితోనే ప్రారంభమైందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే వ్యాపారంలాభం ఉంటుందో అక్కడ అవినీతి కూడా తోడుగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. వ్యాపారం చేస్తూ కల్తీ చేసేవారు, వినియోగించేవారు కూడా హిందువులే, ఎక్కడన్నా ఇతర మతాలకు చెందిన వారు కూడా ఉంటే ఉండవచ్చు. నెయ్యి అంటే ఒక్క ఆవు, గేదె(బర్రె) పాలనుంచే కాదు, గొర్రెలు, మేకలు, ఒంటె పాల నుంచి కూడా తయారు చేస్తారు. శాస్త్రీయ పరీక్షలు అందుబాటులో లేని కాలంలో నెయ్యిని చేతిలో వేసుకొని నలపటం, వాసన చూడటం ద్వారా కల్తీ జరిగిందీ లేనిదీ చెప్పేవారటు. శాస్త్రీయ పరీక్షలు వచ్చిన తరువాత కూడా అనుసరించే పద్దతులను బట్టి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల తాజా వివాదంలో ఎన్‌డిడిబి అనుసరించిన పద్దతి గురించి నివేదికలో పేర్కొన్నది, దానితో పాటు ఫలితాల గురించి షరతులు వర్తిస్తాయంటూ కొన్ని సార్లు నివేదికలు తప్పుగా రావచ్చని కూడా చెప్పింది. అందుకే మరొక ప్రయోగశాలలో కూడా పరీక్ష చేయించకుండా చంద్రబాబు నాయుడు తొందరపడి నిర్దారణకు వచ్చి బహిర్గత పరిచారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.ఆ చర్య కోట్లాది మంది భక్తుల మనోభావాల మీద ప్రభావం చూపింది. ఎక్కడ ఎన్ని పరీక్షలు జరిపినా నెయ్యి స్వచ్చత గురించి ఏ లాబ్‌లోనూ ఫలితాలు ఒకే విధంగా ఉండవు అని కూడా చెబుతున్నారు. ఆవులు, గేదెలకు పెట్టే మేతను బట్టి కూడా ఫలితాలు భిన్నంగా ఉంటాయి.


బిజెపి బీఫ్‌ రాజకీయం గురించి తెలిసిందే.2014ఎన్నికల్లో దాని ప్రచార అస్త్రాల్లో అదొకటి.ఆవు, ఎద్దు,దున్నపోతులు, గేదెల మాంసాన్ని బీఫ్‌ అంటారు. దీని ఎగుమతులకు వ్యతిరేకంగా నాటి యుపిఏ ప్రభుత్వం మీద నరేంద్రమోడీ ఉత్తరాదిన ఎన్నికల్లో ప్రచారం చేశారు. చిత్రం ఏమిటంటే అధికారానికి వచ్చిన తరువాత వాటి ఎగుమతులకు అనుమతి ఇచ్చారు. ఏటేటా పెరుగుతున్నట్లు ఎగుమతి గణాంకాలు చెబుతున్నాయి. 2023 వివరాల ప్రకారం బ్రెజిల్‌ తరువాత రెండవ స్థానంలో ఉన్న అమెరికాను పక్కకు నెట్టి మనదేశం ఎగబాకింది.బ్రెజిల్‌ అన్నిరకాల బీఫ్‌ను 30.12 లక్షల టన్నులు, దున్న, గేదె మాంసాన్ని భారత్‌ 14.75లక్షల టన్నులు ఎగుమతి చేసింది. తమ కారణంగా చీమలకు సైతం హాని కలగకూడదంటూ జైన మునులు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తారు. కానీ అనేక మంది ఆ మతానికి చెందిన వారు బీఫ్‌ ఎగుమతిదార్లుగా ఉన్నారు.ఒక సందర్భంలో స్వయంగా నరేంద్రమోడీయే ఆ విషయాన్ని చెప్పారు. మాంస ఎగుమతి ఒక సామాజిక తరగతికి మాత్రమే పరిమితమని చెప్పటం వాస్తవం కాదు, జైన్‌ సామాజిక తరగతికి చెందిన అనేక మంది నా స్నేహితులు ఆ వ్యాపారంలో ఉన్నారు, ఏదో ఒక సామాజిక తరగతికి ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దంటూ మాట్లాడారు. మన పురాణాలు, నమ్మకాల ప్రకారం ప్రతి జంతువు ఏదో ఒక దేవుడితో ముడిపడి ఉంది.గోవధను కొందరు వ్యతిరేకిస్తారు. గోమూత్రం తాగటం పవిత్రంగా భావిస్తారు. దున్నపోతు యుముడి వాహనం, అయినా వాటిని వధించి ఎగుమతులు చేస్తారు. ఎలుక వినాయకుడి వాహనం అంటారు, కానీ అది కనిపిస్తే చంపేయాలని చూస్తారు.(ఇలా చెబుతున్నానంటే నష్టదాయకమైన ఎలుకలను చంపకుండా వదలివేయమని నా ఉద్దేశ్యం కాదు) మొత్తం మీద నెయ్యి కల్తీ గురించి వచ్చే నివేదికలు ఏ ఒక్కటీ ఒకే విధంగా ఉండదని మాత్రం కొందరు నిపుణులు చెబుతున్నారు. అందువలన ముందే చెప్పుకున్నట్లు తిరుపతి లడ్డు కల్తీ వివాదం ఎలా ముగుస్తుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేంద్ర తుపాను సాయ జాడలేదు ! బిజెపి మరో అన్యాయం !! మచిలీపట్నం రిఫైనరీ ఉత్తర ప్రదేశ్‌లో ఏర్పాటు ?

08 Sunday Sep 2024

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP

≈ Leave a comment

Tags

BJP, BPCL, CHANDRABABU, Narendra Modi Failures, Oil refinery in Andhra Pradesh, Oil refinery in Machilipatnam, ONGC, petrochem complex in Andhra


ఎం కోటేశ్వరరావు


పది రోజులుగా బుడమేరు వరదతో విలవిల్లాడుతున్న విజయవాడ, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాల రైతాంగం కేంద్రం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక సార్లు కేంద్రానికి వివరించారు. అయినా ఇంతవరకు వరద సాయం గురించి ఎలాంటి ప్రకటనలూ లేవు. లెక్కలు డొక్కలు తరువాత చూసుకుందాం ముందుగా కొంత సాయం అందిస్తామన్న భరోసా కూడా వెలువడలేదు.కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ రాకను చంద్రబాబు నాయుడి ఘనతగా కొందరు వర్ణించారు. మంచిదే అంతకంటే కావాల్సిందేముంది ? పర్యటనలు కాదు కదా కావాల్సింది ఫలితాలు. మంత్రిగారు వచ్చారు చూశారు వెళ్లారు తప్ప కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అనేక చోట్ల రైతులు అరటి, పసుపు, వరి, కూరగాయల పంటలను పూర్తిగా నష్టపోయినట్లు శివరాజ్‌ సింగ్‌ విలేకర్లతో చెప్పారు. గత ప్రభుత్వం కేంద్ర ఫసల్‌ బీమా పధకాన్ని వినియోగించుకోలేదని, ప్రీమియం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్లుందని కూడా అన్నారు. విపత్తుల సహాయ నిధి(ఎస్‌డిఆర్‌ఎఫ్‌) రు.3,448 కోట్లు రాష్ట్రం దగ్గర ఉందని తక్షణ సాయం కింద దానిని వినియోగించుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చి వెళ్లారు. కొందరు దీన్నే కేంద్రం ఇచ్చిన సాయంగా వర్ణించటంతో అబ్బే అలాంటిదేం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాల్సి వచ్చింది. ఆ నిధి రాజ్యాంగబద్దంగా రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చేదే, ప్రతి రాష్ట్రానికి కేటాయిస్తారు, తెలంగాణాలో అలాంటి నిధి గురించి కేంద్ర మంత్రులు సెలవిచ్చారు. అది కాదు, కేంద్రం ప్రత్యేకంగా జాతీయ విపత్తుగా పరిగణించి ఇచ్చే మొత్తం సంగతేమిటన్నది ప్రశ్న. ఫసల్‌ బీమా సంగతి తరువాత. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక నష్ట అంచనాగా రు.6,880 కోట్లని కేంద్రానికి నివేదించి సాయాన్ని కోరింది. మొత్తం రెండు లక్షల ఇండ్లు మునిగిపోయి దెబ్బతినట్లు అంచనా.ఆదివారం నాటికి మరణించిన వారి సంఖ్య 45కు చేరింది. సోమవారం నుంచి వరద నష్ట అంచనా ప్రారంభం అవుతుందని ఆదివారం నాడు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు.


ఇదిలా ఉండగా మచిలీపట్నంలో ఏర్పాటు కానుందని ఊరించిన చమురుశుద్ది కర్మాగారం వట్టి కబుర్లేనా అన్న అనుమానం కలుగుతోంది. ఒక రిఫైనరీని ఉత్తర ప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు జాతీయ పత్రికలలో వార్తలు వచ్చాయి.‘‘ ఆంధ్రప్రదేశ్‌కు చమురు శుద్ది,పెట్రోకెమికల్‌ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సమ్మతి సాధించిన చంద్రబాబు ’’ అనే శీర్షికతో 2024జూలై 11న బిజినెస్‌ వరల్డ్‌ పత్రిక వార్త రాసింది. దాని సారాంశం ఇలా ఉంది.‘‘ అరవైవేల కోట్ల రూపాయలతో చమురుశుద్ది మరియు పెట్రోకెమికల్‌ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించటంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవంతమయ్యారు. దీని సాధ్యాసాధ్యాల గురించి చర్చించేందుకు భారత పెట్రోలియం కార్పొరేషన్‌(బిపిసిఎల్‌) సీనియర్‌ అధికారులతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు.జూలై 23వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌లో చమురుశుద్ధి కేంద్ర ఏర్పాటు ప్రకటన చేయటమే తరువాయి. చంద్రబాబుబిపిసిఎల్‌ అధికారుల సమావేశంలో రిఫైనరీ ఏర్పాటుకు శ్రీకాకుళం, మచిలీపట్నం, రామయపట్నాలలో గల అవకాశాల గురించి పరిశీలించారు. జూలై 23వ తేదీన బడ్జెట్‌లో ప్రకటించేంతవరకు ఎక్కడ అన్నదాన్ని వెల్లడిరచరు. అధికారులు దీని గురించి మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జూలై 10న చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో ఇలా రాశారు ‘‘ వ్యూహాత్మకంగా దేశంలోని తూర్పు తీరంలో ఉన్న మా రాష్ట్రంలో పెట్రోకెమికల్స్‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నేను భారత పెట్రోలియం కార్పొరేషన్‌ చైర్మన్‌ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రృష్ణ కుమార్‌ నాయకత్వంలోని ప్రతినిధులను(ఎగువ చిత్రం)కలుసుకున్నాను. అరవై నుంచి డెబ్బయి వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌లో అయిల్‌ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాము.తొంభై రోజులలో సాధ్యా సాధ్యాల నివేదిక కావాలని నేను కోరాను.ఈ ప్రాజెక్టుకు సుమారు ఐదువేల ఎకరాల భూమి కావాల్సి ఉంటుంది.ఎలాంటి తలనొప్పులు లేకుండా దాన్ని సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది ’’ అని పేర్కొన్నారు. ఈ పరిణామం చంద్రబాబు నాయుడికి పెద్ద విజయం ’’ అని ఆ పత్రిక రాసింది. ఇతర పత్రికలు కూడా ఇలాగే రాశాయి. బిపిసిఎల్‌ చమురుశుద్ది కర్మాగారం మచిలీపట్నం రూపురేఖలనే మార్చివేస్తుందని గనులు, ఎక్సయిజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పినట్లు జూలై 14న దక్కన్‌ క్రానికల్‌ పత్రిక రాసింది. ఈ సందర్భంగా కాకినాడ దగ్గర బిపిసిఎల్‌ రిఫైనరీ ఏర్పాటు గురించి కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తమ ప్రాంతంలో అంటే తమ ప్రాంతంలో ఏర్పాటు చేయించేందుకు ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఎంపీలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇద్దరూ జనసేనకు చెందిన వారే గనుక ఎక్కడ వచ్చినా ఆ ఘనత ఆ పార్టీ ఖాతాలోనే పడుతుందని, ఎక్కడో అక్కడ రావటం ముఖ్యమని చెప్పారు. అయితే జూలై 23వ తేదీ, కేంద్ర బడ్జెట్‌ రానూ వచ్చింది, ఆమోదమూ పొందింది. రిఫైనరీ ఏర్పాటు గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎందుకు చేయలేదో ఏ పార్టీ నేతా ఎక్కడా ప్రస్తావించినట్లు కనపడదు. ఈ లోగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌-పూర్వపు అలహాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు బ్లూమ్‌బెర్గ్‌(మీడియా) వార్త రాసింది.ఓఎన్‌జిసి`బిపిసిఎల్‌ సంయుక్త భాగస్వామ్యంలో 70వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు దాని గురించి బాగా తెలిసిన నలుగురు వ్యక్తులు చెప్పినట్లు అది తెలిపింది. ప్రయాగరాజ్‌లో బిపిసిఎల్‌కు భూమి కూడా ఉన్నట్లు పేర్కొన్నది. ఆ వార్తలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు గురించి కూడా బిపిసిఎల్‌ పరిశీలిస్తున్నట్లు ఆ నలుగురిలో ఇద్దరు చెప్పినట్లు తెలిపింది. ఆ రాష్ట్రం ఇవ్వచూపిన ప్రోత్సాహకాలు, ఏర్పాటు అవకాశాల గురించి సలహా ఇచ్చేందుకు అమెరికాలోని ఒక కంపెనీని కూడా బిపిసిఎల్‌ నియమించినట్లు కూడా బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది.ఇ మెయిల్స్‌ ద్వారా ఓఎన్‌జిసి, బిపిసిఎల్‌ ప్రతినిధుల స్పందన కోరగా వారి నుంచి వెంటనే ఏమీ రాలేదని పేర్కొన్నది.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. ఎన్‌డిఏ కూటమికి ఘనవిజయం లభించింది. ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి 2019లో 80కి గాను తెచ్చుకున్న 64 సీట్లలో 2024లో 30 సీట్లు, పదిశాతం ఓట్లూ పోగొట్టుకుంది. చివరికి ఆయోధ్యలో ఓడిపోయింది, వారణాసిలో నరేంద్రమోడీ మెజారిటీ గణనీయంగా తగ్గింది. మోడీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇప్పటికే పరువు పోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యోగి నాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుందనే వాతావరణం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. బహుశా ఈ కారణంగానే ఉత్తర ప్రదేశ్‌లో రిఫైనరీ నెలకొల్పాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకే కంపెనీ అంత భారీ మొత్తాల పెట్టుబడితో రెండు చోట్ల రిఫైనరీలను పెట్టే అవకాశం ఉందా ? నరేంద్రమోడీ, బిజెపికి లోక్‌సభలో ఏడోవంతు సీట్లున్న ఉత్తర ప్రదేశ్‌ను నిలుపుకోవటం ముఖ్యం అన్నది తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఎంత చేసినా తెలుగుదేశానికి తోక పార్టీగా ఉండటం తప్ప ఇప్పటికిప్పుడు స్వంతంగా ఎదిగే అవకాశాలు లేవన్నది స్పష్టం.రిఫైనరీ గురించి ఇంకా అంతిమ నిర్ణయం జరగలేదు గనుక చంద్రబాబు వెంటనే అప్రమత్తమై రాష్ట్రానికి తీసుకువస్తారా ? తన పలుకుబడిని వినియోగిస్తారా ? పెద్ద పరీక్షే మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎస్‌సి,ఎస్‌టి వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు : కేంద్ర సర్వీసులు, ఓబిసి మాటేమిటి ? ఇరకాటంలో నరేంద్రమోడీ !

03 Saturday Aug 2024

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, tdp, TDP, Telangana

≈ Leave a comment

Tags

BJP, Caste Reservation, CHANDRABABU, Narendra Modi Failures, OBC sub-categorisation, Revanth Reddy, Rohini Commission, SC/ST sub-quota, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


దళితులు, గిరిజనుల్లో సామాజిక న్యాయం జరిగేందుకు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్లలో ఆయా తరగతుల వర్గీకరణ జరిపి వాటాలను నిర్ణయించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు దశాబ్దాలుగా నడుస్తున్న ఒక అంకానికి తెరదించింది.మరో దానికి నాంది పలికింది.దీని కోసం ఎదురు చూసిన వారు ఆనందంతో ఉండగా వ్యతిరేకించిన వారు విచారంలో మునిగిపోయారు. ఈ రెండు భావనలూ వాస్తవమే అయినా తాత్కాలికమే.అంటరానితనంతో సహా మొత్తంగా జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం జరపాలని కోరుకుంటున్నవారి ప్రయత్నాలకు కాస్త ఇబ్బందే. ప్రతి అస్తిత్వ భావన ఎంతో కొంత చెరపు చేస్తుంది. రాష్ట్రాలలో వర్గీకరణ గురించి ఒక స్పష్టత వచ్చింది. మరి కేరద్ర సర్వీసులు, ప్రభుత్వరంగ సంస్థలు, బాంకులు, ఎల్‌ఐసి వంటి ఆర్థిక, విత్త సంస్థలలో దళితులు, గిరిజనులతో పాటు ఓబిసి వర్గీకరణ మాటేమిటి అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. అభివృద్ధి జరగాలంటే రెండు ఇంజన్ల పాలన ఉండాలన్న నినాదాన్ని ముందుకు తెచ్చిన పెద్దలు కేంద్రం గురించి కొన్ని రాష్ట్రాలలో వర్గీకరణ ఘనత మాదే అంటున్నారు, కొన్ని చోట్ల మౌనంగా ఉంటున్నారు, తమ ముందున్న అంశాల గురించి మాట్లాడరేం ? వర్గీకరణ సమస్యను ముందుకు తెచ్చిన వారు కూడా రాష్ట్రాల గురించి తప్ప కేంద్ర అంశాన్ని ప్రస్తావించకపోవటం వెనుక ఉన్న కారణం ఏమిటి ?


నిచ్చెన మెట్ల సమాజం మనది. అసమానతలు, దారిద్య్రం, ఉపాధి రంగాలలో నెలకొన్న దుస్థితికి ఎక్కడా లేని అంటరానితనం అనే సామాజిక వివక్ష కారణంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఉపశమనం తప్ప శాశ్వత నివారణ కాదు. వాటిని కూడా కొంత మందే పొందుతున్నారు అన్న అసంతృప్తి నుంచి ముందుకు వచ్చిందే వర్గీకరణ. అది న్యాయసమ్మతమే కనుక ఎక్కువ మంది ఆమోదం పొందింది. గతంలో సంస్థానాధీశులు, జమిందార్లు, భూస్వాములు భూమి వదులుకొనేందుకు సిద్దం కాలేదు. అలాగే రిజర్వేషన్ల వలన లబ్దిపొందిన కొన్ని తరాలు కూడా అదే కోవకు చేరి వర్గీకరణను వ్యతిరేకించిన ఫలితమే కోర్టుల జోక్యం. ఇవి చిన్నయ్య-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వివాదంలో వర్గీకరణ చెల్లదని 2004లో సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌ ఇచ్చిన తీర్పును చెల్లదని, పంజాబ్‌, హర్యానా హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సమీక్షించి వర్గీకరణ సబబే అని తాజాగా ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6-1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా సదరు వర్గీకరణ ఎలా ఉండాలో కూడా న్యాయమూర్తులు చెప్పారు. రాష్ట్రాలు వాటిని ఎలా తమ చట్టాలలో పొందుపరుస్తాయో చూడాల్సి ఉంది. అవి కోర్టుల సమీక్షకు లోబడి ఉండాలని, రాజకీయ దుర్వినియోగం చేయకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. గతంలో క్రీమీ లేయర్‌ (మెరుగైన ఆర్థిక స్థితి) ఓబిసిలకు మాత్రమే వర్తింప చేశారని ఇప్పుడు ఎస్‌సి, ఎస్‌టిలకూ అమలు చేయవచ్చని కూడా పేర్కొన్నది. దళితుల ఉపకులాలైన వాల్మీకులు, మజాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు అమలు జరపాలన్న ఆ రాష్ట్ర చట్టాన్ని 2004 సుప్రీం కోర్టు తీర్పు ప్రాతిపదికన 2010లో పంజాబ్‌-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. దళితులంటే అందరూ ఒకటే అని వారిని విడదీయ కూడదని చెప్పింది. తాజా తీర్పు ఆ వైఖరి తప్పు అని పంజాబ్‌లో చేసిన చట్టం సరైనదే అని చెప్పింది. ఇప్పటి వరకు ఈ అంశాన్ని ఉపయోగించుకొని రాజకీయ పక్షాలు లబ్ది పొందేందుకు చూసినందున పార్టీలపై కచ్చితంగా ఈ తీర్పు ప్రభావం పడనుంది, అదెలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. ప్రతిదాన్నీ రాజకీయం చేసేందుకు చూస్తున్న తరుణమిది.


దళితుల వర్గీకరణ డిమాండ్‌ అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు.కులాల పేర్లు ప్రస్తావించకూడదని అనుకున్నప్పటికీ సందర్భవశాత్తూ తప్పటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాదిగ సామాజిక తరగతి వర్గీకరణను కోరుతుండగా, పంజాబ్‌లో అదే తరగతి వ్యతిరేకిస్తున్నది. రిజర్వేషన్ల వలన లబ్దిపొందిన కొన్ని కులాల వారు తమకు అవకాశాలు తగ్గిపోయాయనే భావనతో వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు.ఇది మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు కాదు. వర్గీకరణ అనుకూల, వ్యతిరేక భావనలకు పంజాబులో నాంది పలికారు. అకాలీదళ్‌ తన పలుకుబడిని పెంచుకొనేందుకు దళితుల్లో వెనుకబడిన వాల్మీకులు, మజాబీ సిక్కులకు అన్యాయం జరిగిందంటూ వారిని సమీకరించేందుకు పూనుకుంది.దాన్ని ఎదుర్కొనేందుకు 1975 మే ఐదున కాంగ్రెస్‌ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్న జ్ఞానీ జైల్‌ సింగ్‌ రిజర్వేషన్ల తురుపుముక్కను ప్రయోగించారు.ప్రభుత్వ శాఖలలో వీలైన మేరకు ఈ రెండు సామాజిక తరగతుల వారికి 50శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని ఆదేశించారు.దీంతో అప్పటికే గణనీయంగా లబ్దిపొందిన మాదిగ సామాజిక తరగతి అవకాశాలు తగ్గిపోయాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పంజాబ్‌ జనాభాలో 32శాతం మంది దళితులు ఉన్నారు.రాష్ట్రం వర్గీకరణ అమలు చేస్తున్నప్పటికీ వాల్మీకులు, మజబీల పరిస్థితి పెద్దగా మెరుగుపడిందేమీ లేదు.వర్గీకరణ లేని కారణంగా కేంద్ర సర్వీసులలో వారు తగిన ప్రాతినిధ్యం పొందలేకపోయారు. 2004 ఆంధ్రప్రదేశ్‌ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అక్కడ కూడా సదరు అంశాన్ని సవాలు చేశారు. హైకోర్టు వర్గీకరణను రద్దు చేసింది. అక్కడి పరిస్థితి గురించి 2007లో వర్గీకరణ సమస్య మీద ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 105 మంది ఐఎఎస్‌లలో పంజాబు దళితుల్లో 42శాతం మంది ఉన్న వాల్మీకులు, మజాబీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆది ధర్మీస్‌గా పిలిచే సామాజిక తరగతి తోలు వృత్తిలో ఉన్న దళితులు ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన స్థితిలో ఉన్నారు. కారణం బ్రిటీష్‌ భారత సైన్యంలో ఉన్న వారికి అవసరమైన బూట్ల తయారీలో వారు నిమగం కావటంతో దానికి పరిమితంగానైనా చదువు సంధ్యలు అవసరం కావటం, ఆర్థిక స్థితి మెరుగై రిజర్వేషన్‌ అవకాశాలను కూడా ఎక్కువగా అందిపుచ్చుకున్నారు. వ్యవసాయ కార్మికులుగా, పట్టణాలలో పారిశుధ్య కార్మికులుగా ఉన్న దళితులకు చదువుతో అవసరం లేకపోయింది. హర్యానాలో 1994లో దళితులను ఏ-బి తరగతులుగా విభజించి తోలు వృత్తి చేసేవారికి 50శాతం ఇతరులకు మిగతా సగం రిజర్వేషన్లు కల్పించారు.తోలు వృత్తి చేసేవారు ఎక్కువగా లబ్ది పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ గురించి అధ్యయనం చేసిన ఉషా మెహ్రా కమిషన్‌ 2008 నివేదిక నాలుగు ఉపతరగతులుగా రిజర్వేషన్లు అమలు జరపాలని సిఫార్సు చేసింది. దళితుల్లో ముందున్న మాలలు ఐఎఎస్‌, ఐపిఎస్‌ ఎంపికల్లో 76, 86శాతం మంది ఉండగా మాదిగలు 23, 13శాతాల చొప్పున ఉన్నట్లు పేర్కొన్నది.దళిత జనాభాలో మాలలు 41శాతం కాగా మాదిగలు 49శాతం ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో దాదాపు ఇలాంటి పరిస్థితి ఉన్నది.


దళితులు, వెనుకబడిన తరగతులలో కొందరు అన్యాయానికి, విస్మరణకు గురౌతున్నారంటూ బిజెపి వారిని తన ఓటుబాంకుగా మార్చుకొనేందుకు పావులు కదిపింది. దానిలో భాగంగానే ఒబిసిల వర్గీకరణ పరిశీలనకు 2017లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. తన నివేదికను 2023జూలై 31న రాష్ట్రపతికి అందచేసింది. నరేంద్రమోడీ ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు.దానిలో ఉన్న అంశాలు వెల్లడైనా, కేంద్ర ప్రభుత్వం వాటి గురించి అభిప్రాయం వెల్లడించినా లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే రాజకీయ కారణంతో ఆ నివేదికను అటకెక్కించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎందుకు తెప్పించుకోలేదన్నది ప్రశ్న. రాజకీయ కారణాలతోనే కమిషన్‌ గడువును పదమూడు సార్లు పొడిగించారు. ఏడాది గడుస్తున్నా దేశ ప్రధమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఎందుకు కేంద్రానికి పంపలేదు, ఎంతకాలం తన దగ్గర ఉంచుకుంటారన్నది ఆసక్తి కలిగించే అంశం. ఆ నివేదికను కేంద్రం తిరస్కరిస్తే వేరు, ఆమోదిస్తే పార్లమెంటుకు సమర్పించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి.వేగంగా పనిచేస్తామని చెప్పుకుంటున్న నరేంద్రమోడీకి ఇది ఒక సవాలే. నివేదికలోని అంశాలపై మీడియాలో తిరుగుతున్న లీకు సమాచారం ప్రకారం ఓబిసిలలో ఐదు నుంచి ఆరువేల ఉపతరగతులు ఉన్నారని, వారి జనాభాలో కేవలం ఒకశాతంగా ఉన్న 40 కులాలవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో 50శాతం మేరకు రిజర్వేషన్‌ లబ్దిపొందుతున్నట్లు తేలిందట. ఈ నివేదికను తెరవటం అంటే వెంటనే వచ్చే అంశం వెనుకబడిన తరగుతుల జన గణన. దాన్ని రాష్ట్రాలు చేపట్టవచ్చునని బిజెపి తప్పించుకుంటున్నది, ఇంతవరకు ఆ పార్టీ పాలిత రాష్ట్రాలు బుల్డోజర్లు, మత విభజన మీద చూపుతున్న శ్రద్దలో నూరోవంతు కూడా అందుకు చొరవచూపలేదు. దాన్ని బట్టే ఆ పార్టీ చిత్తశుద్ది వెల్లడైంది, ఒక రాష్ట్రంలో బిసిగా ఉన్న వారు మరొక రాష్ట్రంలో ఓసిగానో, కొన్ని చోట్ల దళితులు, గిరిజనులుగానో ఉన్న ఉదంతాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అందువలన రాష్ట్రాలు తీసిన జనాభా లెక్కలను కేంద్రం ఆమోదిస్తుందా అన్నది ప్రశ్న. కేంద్రమే నిర్వహించినా అదే సమస్య ఎదురు కావచ్చు, రెండవది జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం నిర్ణయించాలనే డిమాండ్‌కు దారి తీసే అవకాశం కూడా ఉంది.1953లో ఏర్పాటు చేసిన కాకా కలేల్‌కర్‌ తొలి కమిషన్‌ బిసిలను వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరుగతులు అనే రెండుగా వర్గీకరించాలని సిఫార్సు చేసింది. మండల్‌ కమిషన్‌లోని సభ్యుడైన ఎల్‌ఆర్‌ నాయక్‌ అణచివేతకు గురైన బిసిలు, మధ్యస్థంగా ఉన్నవారు అనే రెండు ఉపతరగతులుగా విభజించాలని ప్రతిపాదించారు. రోహిణీ కమిషన్‌ నిర్దిష్టంగా ఏమి చెప్పిందో తెలియదు.


చరిత్ర, ఆచరణను చూసినపుడు ఒకే సామాజిక తరగతిగా భావించబడుతున్న కొన్ని కులాల గుంపులో అన్నీ ఒకటిగా లేవన్నది తెలిసిందే.సాధారణ తరగతిగా పరిగణిస్తున్న బ్రాహ్మలలో అధికార వ్యవస్థతో సంబంధాలు కలిగి ఉన్న వారికి-పూజా పునస్కారాలకు పరిమితమైన వారికి ఎంత తేడా ఉన్నదో చూస్తున్నాము. అదే విధంగా మరికొన్ని ఇతర తరగతుల్లో ఆస్తిపాస్తులు ఉన్నవారికి లేని వారికీ చివరికి ఒకే కులంలో ఉన్నవారిలో గల తేడా ఏమిటో తెలిసిందే.దళితులు, గిరిజనుల్లో కూడా అంతే.వర్గీకరణను వ్యతిరేకించేవారు, అనుకూలించే వారు గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న వాదనలు తెలిసినవే. ఇప్పుడు వాటికి తెరపడింది. వర్గీకరణ జరిపినా ఈ తరగతులకు పూర్తిగా సామాజిక న్యాయం అమలు కాదు. సుప్రీం తీర్పును అమలు జరిపేందుకు అవసరమైన సమాచారాన్ని. సాక్ష్యాలను సేకరించకుండా తొందరపడి చేస్తే కోర్టు లిటిగేషన్లో చిక్కుకోవచ్చు.జనాభా లెక్కలు, ఇతర అంశాలను నవీకరించాల్సి ఉంది. దీనికి మానవ వనరులు, నిధులు కూడా అవసరమే. అందువలన వెంటనే అమలు జరపటం సాధ్యమా కాదా అన్నది కూడా చూడాల్సి ఉంది.ఓబిసి వర్గీకరణ, కేంద్ర సర్వీసుల్లో దళితులు, గిరిజనుల వర్గీకరణను బిజెపి అమలు చేస్తుందా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోలవరంలో మునిగి తేలుతున్న చంద్రబాబు : బీహార్‌కు అధిక కేటాయింపుల వెనుక అసలు కథేంటి ?

26 Friday Jul 2024

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, tdp, TDP

≈ Leave a comment

Tags

Amaravathi capital, BJP, BJP-JDU, CHANDRABABU, Narendra Modi, Nirmala Sitaraman stimulus package, Nithish Kumar


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికార యంత్రాంగం సహకరించటం లేదా ? ఆర్థిక ఇబ్బందుల ఆత్రంతో చేయాల్సింది చేయటం లేదా ? రాజకీయంగా నరేంద్రమోడీ చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారా ? మొత్తం మీద ఏదో జరుగుతోంది. నీతి ఆయోగ్‌ సమావేశాలకు వెళ్లిన సందర్భంగా మరోసారి సిఎం కేంద్ర మంత్రులను కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్‌ పెట్టక ముందు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పర్యటన జరిపి అనేక అంశాలను కేంద్రానికి నివేదించారు. ఎన్నికలకు ముందు బిజెపి పెద్దలు చెప్పింది ఒకటి తరువాత చేస్తున్నది ఒకటి అన్న సంగతి అమరావతికి అప్పు ఇప్పిస్తామనటంలోనే వెల్లడైంది. బయటకు చెప్పుకోలేక చంద్రబాబు అదియును మంచిదే అన్నారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి మాత్రమే తెలుసు. కేంద్రం ఇచ్చేదేమిటో చంద్రబాబుకు ముందే తెలుసు గనుకనే వచ్చేదేమీ ఉండదని బడ్జెట్‌ను రెండునెలలు వాయిదా వేసుకున్నారు. బడ్జెట్‌ కేటాయింపులు చూసిన తరువాత అది వాస్తవమని తేలింది. అసలేమీలేని దానికంటే పదే పదే రాష్ట్రం పేరును ప్రస్తావించటాన్ని చూసి కడుపు నింపుకున్న వారు కొందరు ఉన్నారు. అమరావతికి గ్రాంటు బదులు అప్పు ఇప్పిస్తామంటే పండగ చేసుకున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామంటే ఆహా ఓహౌ అన్నారు. కానీ ఆకస్మికంగా ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు పోలవరం గురించి చర్చించి ఒక తీర్మానాన్ని ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. బడ్జెట్‌కు ముందు జరిగిన కాబినెట్‌లో ఆ తీర్మానాన్ని ఎందుకు చేయలేదు ? దాని అవసరం గురించి అధికార యంత్రాంగం తప్పుదారి పట్టించిందా ? ఇంతకూ ఏమిటా తీర్మానం ?


పోలవరం ప్రాజక్టు డయాఫ్రం వాల్‌ 2020వరదల్లో దెబ్బతిన్నది. ఏది జరిగినా అందుకయ్యే ఖర్చును భరించాల్సింది కేంద్రమే. దేవుడు చేసిన దానికి మా బాధ్యత లేదంటే కుదరదు. అది జాతీయ ప్రాజెక్టు, ఖర్చంతా భరించేందుకు ఎప్పుడో అంగీకరించారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని జూలై మూడున నిపుణుల సమక్షంలో కేంద్ర జలసంఘం చైర్మన్‌ కుశ్చిందర్‌ ఓహ్రా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దానికి అవసరమైన నిధులు ఇవ్వటమే తరువాయి, అంచనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే తన నిపుణులను పంపవచ్చు లేదా రాష్ట్రం పంపిన వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేయవచ్చు. డిపిఆర్‌లో లేని కొత్త అంశమైతే అర్ధం చేసుకోవచ్చు, అలాకానపుడు ముద్ద ముద్దకు గోవిందా గోవిందా లేదా బిస్మిల్లా బిస్మిల్లా అనాల్సిన అవసరం ఏమిటి ? దీనికి గాను ఆకస్మికంగా మంత్రి వర్గ సమావేశం, తీర్మానంతో పనేమిటి ? కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి రు.900 కోట్లు కేటాయించాలని, తొలిదశ సవరించిన అంచనా రు.30,437 కోట్లకు గాను ఇంకా రు.12,157 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ముందుస్తుగా మంజూరు చేయాలని మంత్రివర్గ తీర్మానంలో పేర్కొన్నారు. సాంకేతికంగా అలాంటి తీర్మానం అవసరం అయితే బడ్జెట్‌కు ముందే కేంద్రానికి పంపివుంటే నిర్మలా సీతారామన్‌ కేటాయించి ఉండేవారు కదా ! ఎందుకు పంపలేదు ? అధికార యంత్రాంగానికి తెలియదా ? ఇప్పుడు బడ్జెట్‌ను సవరించి కేటాయిస్తారా ? లోగుట్టు పెరుమాళ్లకెరుక !


తమ ప్రభుత్వ హయాంలోనే డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరినా అనుమతి రానందున తామేమీ చేయలేకపోయినట్లు వైసిపి నేతలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చర్చల్లో చెప్పారు. అంతకు ముందు కేంద్ర నిర్వాకాన్ని గురించి జగన్‌ మోహనరెడ్డి లేదా పార్టీ పెద్దలు ఎవరూ ఎక్కడా చెప్పిన, లేదా అనుమతికి కేంద్రం మీద వత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. గురువారం నాడు రాష్ట్రమంత్రి వర్గం ఆకస్మిక సమావేశం జరిపి తీర్మానం చేసిన వార్తతో పాటు శుక్రవారం నాడు సాక్షి పత్రిక కొన్ని విషయాలను ప్రస్తావించింది. దాని కథనం ప్రకారం ” దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ప్రతిపాదన మేరకు 2022 మార్చి నాలుగవ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదించారు.వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి మేరకు తొలిదశ పూర్తి చేయడానికి రు.10,911 కోట్లు, డయాఫ్రం వాల్‌ పునరుద్దరణ, మరమ్మతులకు రు.2వేల కోట్లు వెరసి రు.12,911 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్‌ ఐదున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నోట్‌ జారీచేశారు. ఆ నిధులు విడుదల చేయాలంటే కేంద్ర కాబినెట్‌ ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే 2016 సెప్టెంబరు ఆరున పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకొనే క్రమంలో 2013-14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 2014 ఏప్రిల్‌ ఒకటి నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయం అంటే రు.15,667.90 కోట్లు ఇవ్వాలని 2017 మార్చి 15న కేంద్రకాబినెట్‌నిర్ణయించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రు.15,146.28 కోట్లు విడుదల చేసింది.దీనికి తోడు రు.12,157.52 కోట్లు విడుదల చేయాలంటే 2017 మార్చి 15న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కాబినెట్‌ మారుస్తూ తీర్మానం చేయాలి. ఈ మేరకు కేంద్రజలశక్తి శాఖ ఈ ఏడాది మార్చి ఆరున కేంద్ర కాబినెట్‌కు ప్రతిపాదన పంపింది.”


అయితే అప్పటికే ఎన్‌డిఏలో చేరిన టిడిపి అధినేత చంద్రబాబు ఆ నిధులు ఇస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ పెద్దల చెవుల్లో ఊదారని, దాంతో కేంద్రం పక్కన పెట్టిందని కూడా సాక్షి కథనం ఆరోపించింది. రు.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపిన అంశాన్ని చంద్రబాబు కాబినెట్‌ సమావేశం గుర్తు చేసిందని ఆంధ్రజ్యోతి వార్తలో పేర్కొన్నారు. అదే నిజమైతే మిగిలిన మొత్తం రు.12,157కోట్లు విడుదల చేయాలంటూ ఆకస్మికంగా రాష్ట్ర కాబినెట్‌ తీర్మానించాల్సిన అవసరం ఏమిటి అన్నది ప్రశ్న. దీనిపై కేంద్ర ప్రభుత్వం అదే మాదిరి చంద్రబాబు నాయుడు కూడా వాస్తవాలేమిటో జనానికి వెల్లడించాలి. తాజాగా పోలవరంపై విడుదల చేసి శ్వేత పత్రంలో సవరించిన ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం ఆమోదించినట్లు చెప్పలేదు. 2013-14 సంవత్సర సిఫార్సులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.ఇక 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాలను 2019 ఫిబ్రవరి 11న చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండగానే టెక్నికల్‌ అసిస్టెన్స్‌ కమిటీ రు.55,657 కోట్లకు ఆమోదం తెలిపింది. దానికి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఒకవేళ రు.30వేల కోట్లకు ఆమోదం తెలిపితే విడుదల కోసం ప్రత్యేకంగా తీర్మానంతో పనిలేదు. తరువాత పెరిగిన ధరల ఖర్చు సంగతేమిటి ? నీతి అయోగ్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు చేసేది ఉంటుందా ? ప్రతిపాదనలను సవరించేందుకు కేంద్రం అంగీకరిస్తుందా ? అదే జరిగితే మిగతా రాష్ట్రాలు చేస్తున్న వత్తిడి మరింత పెరగదా ? చూద్దాం ఏం జరుగుతుందో !


కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అప్పు ఇప్పిస్తామని చెప్పి బీహార్‌కు పెద్ద మొత్తంలో పథకాలకు నిధులు ఇస్తామని ప్రకటించింది. ఎందుకిలా చేసింది ? ఏమిటీ వివక్ష ? ఆ రాష్ట్రానికి మొత్తం 62వేల కోట్ల రూపాయల విలువగల పథకాలను ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. వీటిలో రోడ్లు, వంతెనలకు రు.26వేల కోట్లు, 2,400 మెగావాట్ల నూతన విద్యుత్‌ కేంద్రంతో సహా విద్యుత్‌ ప్రాజెక్టులకు రు.21,400 కోట్లు, వరదల నిరోధంతో సహా సాగునీటి పథకాలకు రు.11,500 కోట్లు, ఇవిగాక మెడికల్‌ కాలేజీలు, విమానాశ్రయాలు, క్రీడలకు మౌలిక సదుపాయాలు, దేవాలయాల టూరిజం పాకేజ్‌లు ఉన్నాయి. వీటిని బీహార్‌కు ఇచ్చినందుకు ఎవరూ తప్పుపట్టటం లేదు. అయితే ఒక్కసారిగా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారన్నది ప్రశ్న. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి-జెడియు కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది సీట్లతో పాటు దాదాపు తొమ్మిదిశాతం ఓట్లను కూడా కోల్పోయింది. నరేంద్రమోడీకి ఎదురులేదని భావించిన నితీష్‌ కుమార్‌ అంచనా తప్పింది, బిజెపి స్వంతంగా మెజారిటీని సాధించలేకపోయింది. మోడీ, బిజెపి బలహీనత వెల్లడైనందున దాని ప్రభావం వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడుతుంది. పలుకుబడి ఇంకా దిగజారక ముందే జాగ్రత్త పడేందుకు ముందస్తు ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. ఈ కేటాయింపులను చూస్తే ఈ ఏడాది మహారాష్ట్ర, హర్యానాలతో కలిపి జరుపుతారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ రాష్ట్రాలలో కూడా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు తగిలాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగితే బీహార్‌ను వదులు కోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో తిరిగి తనకే సిఎం కుర్చీ కావాలని అడిగే అవకాశాలు నితీష్‌కుమార్‌కు సన్నగిల్లుతున్నాయి. లోక్‌సభ ఓటింగ్‌ వివరాల ప్రకారం ఆర్‌జెడి తరువాత బీహార్‌లో బిజెపి పెద్ద పార్టీ, అది అక్కడ నిలవాలంటే జెడియు నితీష్‌ కుమార్‌ అవసరం ఉంది.

అదే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మీద బిజెపి ఆధారపడాల్సి ఉంది. అక్కడ పెద్ద పార్టీగా ఎదిగే అవకాశాలు లేవు. అందువలన నితీష్‌ కుమార్‌ కంటే తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు బిజెపి బీహార్‌ మీద వరాల వాన కురిపించింది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి, ఎక్కువ సాయం చేస్తే అది తెలుగుదేశం, జనసేనకే రాజకీయ లబ్దితప్ప బిజెపికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. తెలుగుదేశం పార్టీ తాను తప్ప మరొక పార్టీని ఎదగనివ్వదు. అయినా ఇంకా ఐదు సంవత్సరాల వరకు జనంతో సంబంధం ఉండదు, అడిగేవారు ఎవరూ ఉండరు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలు గనుక నోటికి తాళం వేసుకుంటాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తమకే అధికారం కట్టబెట్టాలని అడగాలంటే తెలుగుదేశం బలపడకూడదు.దానికి తోకగా ఎంతకాలం ఉండాలి. అప్పులు ఇప్పిస్తామనటం అంటే పొమ్మనకుండా పొగపెట్టటమే. పోలవరానికి పెరిగిన అంచనాను ఆలశ్యం చేస్తే అది పూర్తిగాక విమర్శలను ఎదుర్కోవాల్సింది చంద్రబాబే. బహుశా ఈ తర్కంతో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసేందుకు కూడా వెనకాడటం లేదా ? ఏమో దేన్నీ కాదనలేం !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు : అమరావతి రుణం, కేంద్ర సాయంపై శ్వేతపత్రం ప్రకటిస్తారా ?

25 Thursday Jul 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, STATES NEWS, TDP

≈ Leave a comment

Tags

Amaravati capital, Andhra Pradesh Budget 2019-20, BJP, CHANDRABABU, Narendra Modi Failures, nirmala sita raman


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో లేదా ఇతర చోట్ల ఏ ఇద్దరు తెలుగు వారు కలిసినా, రచ్చబండల మీద జరిగిన,కానసాగుతున్న చర్చ ఒక్కటే. అది రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం గురించే, ప్రత్యేకించి రాజధాని అమరావతి పట్టణ అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన పదిహేనువేల కోట్ల రూపాయలు రుణమా లేక దానమా (ఆంగ్లంలో గ్రాంట్‌ అంటే తెలుగులో దానం ) అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కొన్ని మీడియా సంస్థల వార్తల్లో, చర్చల సందర్భంగా తెలుగుదేశం నాయకత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రతినిధులు దానమే అంటే, కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి ఐదేండ్లపాటు ఏటా పదిహేనువేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినందున పండగ చేసుకోవాలని చెప్పారు.కాదన్నవారి మీద మండిపడ్డారు. కొందరైతే విదేశీ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం 90శాతం భరిస్తుందని, కేవలం పదిశాతమే రాష్ట్రం పెట్టుకోవాలని చెప్పారు. అంటే పదమూడున్నరవేల కోట్లు కేంద్రమే భరిస్తుందని, పదిహేను వందల కోట్లు రాష్ట్రం పెట్టుకోవాలన్నది వారి వాదన. అదే నిజమనుకున్నా రాష్ట్రానికి కొంత మేలే. రాష్ట్రం కోరుతున్నది తన మీద భారం మోపని సాయం. కేంద్ర మంత్రి చెప్పిన పదాలకు అర్ధం రుణం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఉన్న రెండు ఇంజన్ల డ్రైవర్లు ఏది నిజమో చెబితే జనం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సినపని లేదు.చెప్పటానికి సిద్దంగా ఉన్నారా ?


దీని గురించి స్పష్టంగా చెప్పకుండా చంద్రబాబు నాయుడు తన పరువును, నరేంద్రమోడీ పరువును కాపాడేందుకు పూనుకున్నారు. గతంలో కేంద్రం ప్రత్యేక హౌదా బదులు పాకేజ్‌ ఇస్తామంటే అదే గొప్పదని చెప్పారు. బిజెపితో బంధం తెగిన తరువాత మాట మార్చారు. ఇప్పుడు ఎలాగైతేనేం డబ్బులు వస్తున్నాయిగా అంటున్నారు.తరువాత ఏమంటారో భవిష్యత్‌కే వదలివేద్దాం.తనదైన శైలిలో చెప్పిందేమిటి ? ” నిధులు ఎక్కడి నుంచి ఎలా వస్తేనేం రాష్ట్రం అభివృద్ది చెందుతుంది.కేంద్రం ముందు ఆంధ్రప్రదేశ్‌ ఉంచిన ప్రతిపాదనల్లో అత్యధికాన్ని ఆమోదించింది. రాజధానికి వచ్చే నిధులతో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, దీంతో పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. వాగ్దానం చేసిన నిధులతో రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభమౌతుంది.విదేశీ సంస్థల నుంచి రుణాల రూపంలో వచ్చినప్పటికీ వాటిని 20-30 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వివిధ సంస్థల నుంచి వచ్చే రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. రాజధాని సహాయ రూపంలో కొన్ని కేంద్ర గ్రాంటులు వస్తాయి.వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ ఖండ్‌ తరహా సాయం వచ్చే అవకాశం ఉంది.ఈ పాకేజ్‌లో పారిశ్రామిక సబ్సిడీలు కూడా ఉంటాయి.” అన్నారు చంద్రబాబు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తరువాత విలేకర్లతో నిర్మలా సీతారామన్‌ మాట్లాడిన అంశాలు గందరగోళంగా ఉన్నాయి. ” రాజధాని నిర్మాణానికి ఈ ఏడాదే ప్రపంచ బాంకు నుంచి 15వేల కోట్ల రుణం తీసుకుంటాం.ఇందులో రాష్ట్రం వాటాను కూడా భరించాలి.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం తన వాటాను చెల్లించగలదా లేదా కేంద్రమే గ్రాంటు ఇస్తుందా అన్న విషయాలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం ” అని నిర్మలమ్మ చెప్పారు. ప్రపంచబ్యాంకు నుంచి కేంద్రం రుణం తీసుకుంటే దానిలో రాష్ట్రం భరించాల్సిదేమిటి ? ఇచ్చేది రాష్ట్రానికే అయినపుడు రాష్ట్ర వాటా ఏమిటి ? దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రాజెక్టుల రుణాలు తీసుకోవటం కొత్తేమీ కాదు. అవి రాష్ట్రాల్లో అమలు జరిగినా కేంద్రం హామీ ఇవ్వాల్సి ఉంటుంది.నేరుగా రాష్ట్రాలు తీసుకొనేందుకు వీలులేదు. అలా ఇచ్చే రుణాలలో కొన్నింటిలో కొంత గ్రాంటు కూడా వుంటుంది. బాటా కంపెనీ చెప్పుల ధరలు, వెయ్యో, రెండువేలో కాకుండా రు.999, 1,999 మాదిరి ఉంటాయి. వినియోగదారుని మానసిక స్థితిని సొమ్ముచేసుకొనే వాణిజ్య చిట్కా ఇది. అలాగే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రుణాలకు అనేక షరతులు ఉంటాయి. వాటికి వ్యతిరేకత తలెత్తకుండా ఉండేందుకు అవిచ్చే రుణాల్లో కొంత భాగాన్ని గ్రాంటుగా ఇస్తాయి. చేదు మాత్రను మింగించేందుకు వాటికి పంచదార పూత పూయటం వంటిదే ఇది. రుణ షరతులను వ్యతిరేకించేవారి నోరు మూయించేందుకు గ్రాంటు భాగాన్ని జనానికి చూపుతారు. అమరావతి స్వయం పోషక నగరమని, దాని నిధులతోనే నిర్మాణం జరుపుతామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆర్థిక మంత్రి విదేశీ సంస్థల నుంచి అప్పుతీసుకుంటామంటున్నారు. ఒక వేళ అదే వాస్తవం అనుకుంటే ఆ అప్పును ఎవరు తీర్చాలి ? కేంద్రం అంటే దేశం మొత్తం కదా ! ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేసే అప్పును దేశం మొత్తం ఎందుకు భరించాలి ? మా రాజధానులను కూడా నవీకరిస్తాం, ప్రపంచ స్థాయి నగరాలుగా చేస్తాం అప్పుచేసి మాకూ నిధులు ఇవ్వాలి అంటే కేంద్రం అంగీకరిస్తుందా ? విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకోవాలంటే ముందుగా ఆ సంస్థలకు ప్రాజెక్టు వివరాలను సమర్పించాలి. పర్యావరణం,వాటి అమలుతో నష్టపోయేవారెవరైనా ఉన్నారా, ఉంటే వారికి పరిహారం ఎలా చెల్లించాలి? తీసుకున్న అప్పులను ఎలా తీరుస్తారు? అందుకుగాను మీదగ్గర ఉన్న ఆదాయవనరులు ఏమిటి ? లేకపోతే ఎలా రాబడతారు ? ఇలా అనేక అంశాలను పరిశీలించి షరతులతో కూడిన రుణాలను మంజూరు చేస్తాయి. ఆదాయాన్ని ఎలా రాబట్టాలో కూడా వినియోగదారుల ఛార్జీల వంటి సూచనల రూపంలో షరతులు విధిస్తాయి. మనం సాధారణంగా బాంకులకు అలా వెళ్లి ఇలా అప్పుతెచ్చుకున్నంత సులభంగా విదేశీ సంస్థల అప్పు ఉండదు. అయినప్పటికీ ఇంకా వర్తమాన ఆర్థిక సంవత్సరంలోనే విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకొని ఇస్తామంటూ నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బహుశా నరేంద్రమోడీగారిని విశ్వగురువుగా, నేతగా ప్రచారం చేస్తున్నారు గనుక అలాంటి నిబంధనలను పక్కన పెట్టే ప్రత్యేక వెసులు బాటు, వివరాలేమీ లేకుండానే ముందుగానే ఇచ్చే అవకాశం ఉందేమో తెలియదు. ఇంతవరకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌)ను కేంద్రానికి సమర్పించినట్లు చంద్రబాబు నాయుడు ఎక్కడా ప్రకటించలేదు, లీకులు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు అమరావతి కోసం విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. వినియోగదారుల దగ్గర రుసుములు వసూలు చేసే షరతులతో ముందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం మారటం, అమరావతిని వదలివేయటంతో కథకంచికి చేరింది. ఒక వేళ ఇప్పుడు మరోసారి ప్రయత్నించాలన్నా, పెరిగిన ధరలకు అనుగుణ్యంగా డిపిఆర్‌ను సమర్పించాలి. అలాంటి ప్రక్రియ ఇంతవరకు లేనందున పదిహేనువేల కోట్లు వెంటనే ఎలా వస్తాయన్నది ప్రశ్న.


ఇలాంటి ప్రశ్నలు, సందేహాలను ఎవరైనా లేవనెత్తితే రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవటం లేదనో, వైసిపి కండువా కప్పుకున్నారనో ఎన్‌డిఏ కూటమి ఎదురుదాడికి దిగవచ్చు.గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నిస్తే వైసిపి వారు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. వాటిని వదలి వేద్దాం.హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికలో 2024 జూలై 18న న్యూఢిల్లీ ప్రతినిధి రాసిన విశ్లేషణ ప్రకారం ”రాష్ట్ర పునర్‌నిర్మాణానికి ” కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల సాయం కావాలని చంద్రబాబు నాయుడు కోరారు. అందుకోసం ప్రధాని నరేంద్రమోడీ, అరడజను మంది కేంద్ర మంత్రులు, పదహారవ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియాను కలిశారు. నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరణాత్మక పత్రాన్ని కూడా అందచేశారు.కేంద్రం ఎందుకు సాయం చేయాలో కూడా వివరించారు.వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి జిడిపిలో మూడుశాతం నిబంధనను సడలిస్తూ 0.5శాతం పెంచాలని, అమరావతి నిర్మాణానికి రు.50వేల కోట్ల సాయం ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు పన్నెండువేల కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే దుగ్గరాజపట్నం రేవు నిర్మాణం, రాష్ట్ర మూలధన పెట్టుబడికి ప్రత్యేక పధకం కింద సాయం,బుందేల్‌ ఖండ్‌ పాకేజ్‌ మాదిరి వెనుకబడిన ప్రాంతాలకు సాయాన్ని, చమురుశుద్ధి కర్మాగారాల ఏర్పాటును కూడా కోరారు.కీలకమైన కేంద్ర మంత్రి పదవులు,లోక్‌సభ ఉపసభాపతి పదవిని కూడా కోరకుండా ఆర్థిక సాయం మీదే కేంద్రీకరించినట్లు కూడా బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ” ఆంధ్రప్రదేశ్‌కు నిర్మల మద్దతు, కానీ నాయుడు కోరిన దానికి చాలా తక్కువ ” అనే శీర్షికతో అదే బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. దానిలోని అంశాల సారం ఇలా ఉంది. కేంద్ర సాయాన్ని ఆశిస్తూ బడ్జెట్‌లో ఏం కేటాయిస్తారో చూసేందుకు గాను చంద్రబాబు రాష్ట్రబడ్జెట్‌ ప్రవేశపెట్టటాన్ని వాయిదా వేసుకున్నారు. స్థానికంగా వనరులను పెంచేందుకు మార్గాలు వెతకాల్సి ఉంటుంది, పదిహేనవ ఆర్థిక సంఘం సూచనను అనుసరిస్తే రాష్ట్ర ప్రభుత్వం పన్నేతర రాబడులను పెంచుకోవాల్సి ఉంది.కేేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక పాకేజ్‌ లేదా ప్రత్యేక హౌదా ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతానికి బడ్జెట్‌ పెట్టకుండా సమయాన్ని తీసుకుంది.అయితే చంద్రబాబు లక్ష్యం అంత తేలిక కాదు.రాష్ట్ర ఆదాయంతో పోల్చితే వడ్డీ చెల్లింపులు గణనీయంగా ఎక్కువగా ఉన్నందున ఆర్థిక పునర్‌నిర్మాణం కోసం ఎంతో ఎంతో చేయాల్సి ఉందని పేర్కొన్నారు.


బడ్జెట్‌ కేటాయింపులను పరిశీలించేపేరుతో కొద్ది రోజులు కాలయాపన చేయవచ్చు. కేంద్రం నుంచి ఆశించిన సాయం, దాని గురించి తెలుగుదేశం పార్టీ, జనసేన జనంలో పెద్ద ఎత్తున ఆశలు కలిగించాయి.సూపర్‌సిక్స్‌ పేరుతో చేసిన వాగ్దానాలను బిజెపి ఆమోదించి ఉంటే ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో దాని పేరు కూడా ఉండేది.ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం గురించి 2014-19 మధ్య బిజెపితో కలసి కాపురం చేసినంత కాలం చంద్రబాబు నాయుడు సానుకూలంగా మాట్లాడారు తప్ప జనాలకు వివరాలు చెప్పలేదు. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్న తరువాతే గళమెత్తి, ఢిల్లీలో నిరసనలు, తరువాత 2019ఎన్నికలకు ముందు శ్వేత పత్రాలను ప్రకటించారు. జనం వాటిని నమ్మలేదు.చిత్తుగా ఓడించారు.వైసిపిని గెలిపించారు. ఆ పార్టీ అనుసరించిన వైఖరితో విసిగిపోయి చారిత్మ్రాక స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని గెలిపించారు. రాష్ట్రం ఉన్న స్థితి గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాదిరి గుండెలు బాదుకుంటే, వైసిపి మీద విమర్శలను గుప్పిస్తే కుదరదు. కేంద్ర సాయం గురించి తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలంటే అధికారానికి వచ్చిన తరువాత కేంద్రాన్ని ఏ ఏ రంగాలలో ఎంత సాయం చేయాలని కోరారు, తాజా బడ్జెట్‌లో వాటిలో ఏమేరకు వచ్చింది అనే అంశాలను జనానికి అర్దమయ్యే రీతిలో ఒక శ్వేతపత్రం ద్వారా ప్రకటించి పరిస్థితిని వివరించాలి. అందుకు చంద్రబాబు సిద్దపడతారా ?
హొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పలుకుబడి, ప్రతిష్ట, నరేంద్రమోడీ చిత్తశుద్ధికి పోలవరం ఒక పెద్ద సవాలు !

30 Sunday Jun 2024

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP, Uncategorized, Ycp

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Janasena, Narendra Modi Failures, Pawan kalyan, Polavaram Irrigation Project, YS jagan


ఎం కోటేశ్వరరావు


రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఒకటి. అప్పులు చేయటంలో నరేంద్రమోడీ అంతకు ముందున్న ప్రధానుల రికార్డులను తునాతునకలు చేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది. వర్తమానంలో మరో 16-17లక్షల కోట్లు అప్పు చేయనున్నారు. అందువలన పోలవరానికి నిధుల సమస్య ఉండదని, చంద్రబాబు అడగాలే గానీ ఎంత కావాలంటే అంత ఇస్తారని అందరూ భావిస్తున్నారు.అది సాకారం కావాలని కోరుకుందాం. గడచిన పది సంవత్సరాలలో జరిగిన పోలవరం ప్రాజక్టు నిర్మాణం-సంభవించిన నష్టం, ప్రస్తుత పరిస్థితి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్‌ 28న శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి చెప్పాయి. పునరుద్దరణే కాదు, సంక్షేమ పధకాలను మరింతగా అమలు చేస్తామని వాగ్దానం చేశాయి. అలవిగాని హామీలు ఇచ్చిన తెలంగాణా కాంగ్రెస్‌ వాటిని ఎలా అమలు చేయనుందో చెప్పాలని ఆ రాష్ట్ర బిజెపి డిమాండ్‌ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మీ కూటమి కూడా అంతకంటే ఎక్కువే వాగ్దానాలు చేసింది, వాటి సంగతేమిటంటే ఆ ఎన్నికల ప్రణాళికతో బిజెపికి సంబంధం లేదని నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఆంధ్రప్రదేశ్‌ బిజెపి నేతలకు కంటిచూపే తప్ప నోటమాట ఉండటం లేదు. మరీ గట్టిగా అడిగితే చంద్రబాబుకు ఉన్న అనుభవంతో అన్నింటినీ అమలు చేస్తారంటూ ఆయన మీద నెడుతున్నారు. ఇక్కడ పోలవరం ప్రాజక్టు శ్వేత పత్రంలోని అంశాలను చూద్దాం.


గోదావరి నదిపై రాజమండ్రి కాటన్‌ బారేజ్‌కు ఎగువన 42కిలో మీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లా రామయ్య పేట సమీపంలో బహుళార్ధసాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం జాతీయ హౌదా ఇవ్వక ముందే దీనికి అనుమతులతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని పనులు జరిగాయి. సముద్ర మట్టానికి 45.72 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మిస్తే 194.6టిఎంసిల నీటిని నిలువ చేయవచ్చని అంచనా. ఈ నీటితో 3.2లక్షల ఎకరాలు కుడి, నాలుగు లక్షల ఎకరాలకు ఎడమ కాలువ ప్రాంతంలో కొత్తగా సాగునీరు, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలోని 23.5లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణ, 80టిఎంసి నీటిని ప్రకాశం బారేజ్‌కు ఎగువన కృష్ణా నదికి మళ్లింపు, 960మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలు, పరిసరాల్లో ఉన్న జనావాసాలకు 23.44 టీఎంసీల నీటి సరఫరా, కాలువలు వెళ్లే ప్రాంతాలలోని 540 గ్రామాలకు మంచి నీటి సరఫరా కలుగుతుంది. అందుకే దీన్ని జీవనాడిగా పరిగణిస్తున్నారు. పైన చెప్పుకున్న 80టిఎంసిల మళ్లింపు జలాలు వాడుకున్నందుకు గాను కృష్ణా నదీ జలాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ వాటా తగ్గుతుంది. ఈ నీటిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు 45,కర్ణాటకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసిలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణా విడిపోయినందున దానికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంది.పోలవరంపై బ్రిటీష్‌ వారి హయాంలో తొలిసారిగా 1941లో ప్రతిపాదన రాగా 1942-44 సంవత్సరాలలో ప్రాధమిక పరిశీలన జరిగింది. ఆనకట్ట ఎత్తు 170 నుంచి 208 అడుగులు ఉంటే 340 నుంచి 700 టిఎంసిల వరకు నీటిని నిల్వచేయవచ్చని చెప్పారు.ఇపుడు అంత ఎత్తుకు ఎగువ రాష్ట్రాలు అంగీకరించే ప్రసక్తే లేదు గనుక ఆ ప్రతిపాదన చరిత్రగా మిగిలింది. ప్రస్తుతం 150 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రంలో ఉన్న సంగతులు, వాటిని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రానున్న ఐదేండ్లలో సాకారం గురించి, ఇతర అంశాల గురించి చెప్పుకుందాం.
ఒక ప్రధాన సమస్య కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించినపుడే మొదలైంది, అదే పునరావాసం.ముందే చెప్పుకున్నట్లుగా ప్రాజక్టు నిర్మాణం ముందే ప్రారంభమైన కారణంగాగా 2014 ఏప్రిల్‌ ఒకటి నుంచి అప్పటి అంచనా ప్రకారం నీటి పారుదల(ఆనకట్ట, కాలువలు) నిమిత్తమయ్యే ఖర్చు నూటికి నూరుశాతం భరిస్తామని కేంద్రం చెప్పింది. దానిలో ప్రధానమైన ముంపు బాధితుల పునరావాసం, విద్యుత్‌ ప్రాజక్టు ఖర్చు లేదు. విద్యుత్‌ ప్రాజక్టుకు అయ్యే వ్యవయం రు.4,560 కోట్లే గనుక తామే భరిస్తామని నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించింది. పునరావాసానికి అయ్యే ఖర్చు తామే భరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితి శాతాల గురించి శ్వేత పత్రంలో దిగువ విధంగా పేర్కొన్నారు.
అంశం×××× 2019 మే××× 2024 మే
సివిల్‌ పని ×× 71.93 ××× 75.77
హెడ్‌ వర్క్స్‌ × 65.67 ××× 72.63
కాంక్రీటు ×× 91.14 ××× 92.75
ఎల్‌ఎంసి ×× 70.99 ××× 73.07
పునరావాసం× 18.66 ××× 22.55
ఖర్చురు.కోట్లు×16493.18××21489.71


దీని ప్రకారం రానున్న రోజుల్లో ప్రధానమైన సమస్యగా పునరావాసం ముందుకు రానుంది.ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసిన తరువాత రిజర్యాయర్లో మునిగే ప్రాంతం, అక్కడి వారి పునరావాసం గురించి మాట్లాడకుండా శ్వేత పత్రంలోనూ, విడిగా చంద్రబాబు నాయుడు అశ్వద్ధామ కుంజరహ అన్నట్లుగా గత ఐదేండ్ల జగన్‌మోహన రెడ్డి పాలనలో జరిగిన తప్పిదాల గురించే పెద్ద ఎత్తున చర్చలోకి తీసుకువస్తున్నారు. శ్వేత పత్రంలో పునరావాసం గురించి ప్రస్తావించినప్పటికీ అందుకు అవసరమైన మొత్తాలను కేంద్రం నుంచి తెస్తారా, రాష్ట్రమే భరిస్తుందా అన్న ప్రస్తావన లేదా వివరణ లేదు.మొదటి దశ అంటే ఆనకట్ట ఎత్తు 41.15 మీటర్లు లేదా 130 అడుగుల వరకు నిర్మిస్తే లక్షా 98 ఎకరాల భూసేకరణకు గాను 83,659 ఎకరాలను స్వాధీనం చేసుకోగా మిగిలిన మొత్తాన్ని 2025 జనవరి నాటికి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలోని 38,060కు గాను 12,797 కుటుంబాలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారిని 2026 మార్చి నాటికి తరలిస్తారు. రెండవ దశ 150 అడుగుల ఎత్తుకు ఆనకట్ట నిర్మాణం జరిపితే మునిగే మరో 67,665 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 29,465ఎకరాలను స్వాధీనం చేసుకోగా మిగతా ప్రాంతాన్ని రెండవ దశలో చేపడతారు. ఈ ప్రాంతంలో 2017-18 సంవత్సరంలో చేసిన సర్వే ప్రకారం 1,06,006 కుటుంబాలను తరలించాల్సి ఉంటుంది.అయితే సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం 96,660 కుటుంబాలను మాత్రమే గుర్తించారు. ఈ లెక్క ప్రకారమైనా రెండు దశల్లో ఇప్పటికి తరలించిన 12,797పోను మరో 83,863 కుటుంబాలను ఇంకా తరలించాల్సి ఉంది. తొలి సర్వే ప్రకారమైతే 93,209 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. దీనికి గాను తొలి దశ భూసేకరణ-పునరావాసానికి రు.7,116, రెండవ దశకు రు.18,801 కోట్లు, మొత్తం రు.25.917 కోట్లు కావాల్సి ఉన్నట్లు శ్వేత పత్రం తెలిపింది. ఇతర వ్యయం పెరిగినట్లే దీనికి కూడా కచ్చితంగా పెరుగుతుంది. ఈ మొత్తం రు.35వేల కోట్ల వరకు ఉండవచ్చని చెబుతున్నారు.దీని గురించి శ్వేత పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు. బాధితులకు చెల్లించాల్సిన మొత్తాల గురించి కూడా ఒక స్పష్టత లేదు.


ప్రాజెక్టు పూర్తి చేయటం, నీటి విడుదల గురించి గతంలో, ప్రస్తుతం తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాల సిఎంలు చెప్పిన కబుర్లు మొదటి దశ గురించే అన్నది గమనించాలి.ఏజన్సీని మార్చకుండా, పథకం ప్రకారం పనులు జరిగి ఉంటే 2020 నాటికే నీటిని సరఫరా చేసి ఉండేవారని చెప్పారు, తరువాత వాయిదాలు వేసి 2023జూన్‌కు పొడిగించారు, ఇప్పుడు మరో ఏడాది గడచింది. ఇది ఎప్పుడు పూర్తవుతుందంటే సిఎం చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు అని చెబుతున్నారు.కుడి, ఎడమ కాలవల్లో మిగతా భాగాలు పూర్తి కావాలి. పంట కాలువల తవ్వకం ఇంతవరకు చేపట్టలేదు. అందువలన రెండవ దశ ఎప్పటికి అన్నది అసలు చర్చకే రాలేదు. ఇక ప్రాజెక్టు వ్యయం ఇబ్బడి ముబ్బడి అయింది. దాన్ని ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు.గతంలో నిర్మాణ వ్యయానికి సంబంధించిన వివరాలు దిగువ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కోట్ల రూపాయల్లో అని గమనించాలి.టిఏసి-టెక్నికల్‌ అసిస్టెస్స్‌ కమిటి, సిడబ్ల్యుసి-కేంద్ర జల కమిషన్‌, ఆర్‌సిసి-సవరించిన ధరల కమిటీ
అంశం ××××××××× 2010-11××××××2013-14××××××××2017-18
అంశం ××××××××× టిఏసి ××× టిఏసి × సిడబ్ల్యుసి × ఆర్‌సిసి × సిడబ్ల్యుసి
నీటిపారుదల ×××××× 12,944 ×××24,467 × 26,158ి × 43,165 × 51,096
విద్యుత్‌ ఉత్పత్తి×××××× 3,716 ××× 4,561 × 4,561ి × 4,561 × 4,561
మొత్తం ఖర్చు ×××××× 16,010 ×××29,028 × 30.719 × 47,725 × 55,657


పైన పేర్కొన్న వివరాలలో 2013-14 సంవత్సర సిఫార్సులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.ఇక 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాలను 2019 ఫిబ్రవరి 11న చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండగానే టెక్నికల్‌ అసిస్టెన్స్‌ కమిటీ రు.55,657 కోట్లకు ఆమోదం తెలిపింది. జగన్‌మోహన రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అనేక సార్లు మోడీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందటానికి ఏం చేసిందీ తెలియదు. లేఖలు రాశారా, కేంద్రం ఏం సమాధానమిచ్చిందీ తెలియదు. ఆమోదం లభించలేదని తాజా శ్వేతపత్రం తెలిపింది. ఈ అంచనా సవరణ జరిగి ఆరు సంవత్సరాలైంది. అప్పటి నుంచి ధరలు మరింత పెరిగాయి.పైన పేర్కొన్నట్లుగా కేవలం మూడు సంవత్సరాల్లోనే వ్యయం 30 నుంచి 55వేల కోట్లకు పెరిగితే తరువాత ఆరు సంవత్సరాల్లో పెరుగుదల అంచనా వేయాల్సి ఉంది. ఆరేండ్ల నాటి దానికే మోడీ సర్కార్‌ ఆమోదం తెలపలేదు, ఇప్పుడు తాజా అంచనాలు ఇంకా వేయలేదు, వాటికి ఎప్పుడు ఆమోదం లభించేదీ అగమ్యగోచరమే.

అందువలన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడి వర్తమాన హయాంలో మొదటి దశ పూర్తి కావటం కూడా ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పవచ్చు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే అదేమీ అసాధ్యం కాదు. ఎన్నికలకు ముందు పోలవరం బాధితుల పునరావాసానికి అయ్యే 30వేల కోట్లను విరాళాల ద్వారా సేకరించి ఇవ్వవచ్చని దానికి గాను తన వంతు వాటాగా కోటి రూపాయలు ఇస్తానని పవన్‌ కల్యాణ్‌ ఒక సందర్భంగా చెప్పారు.దేశ విదేశాల్లో చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌కు ఎంతో పలుకుబడి ఉందని చెబుతున్నారు గనుక కేంద్రం ఇవ్వకపోతే ఆమొత్తాన్ని వారు సేకరించి బాధితులకు న్యాయం చేయాలి. కావాల్సింది పునరావాసం తప్ప నిధులు ఎక్కడి నుంచి తెచ్చారన్నదానితో బాధితులకు సంబంధం ఉండదు.పోలవరం సత్వర నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు, పునరావాస ఖర్చు భరింపుకు ఆమోదం పొందటం కోసం చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ తమ ప్రతిష్ట, పలుకుబడిని ఉపయోగించగలరని జనం గట్టిగా నమ్ముతున్నారు.అయితే ఆంధ్రప్రదేశ్‌ పట్ల బిజెపి చిత్తశుద్దితో ఉన్నదా అన్న అనుమానాలు ఇప్పటికీ జనంలో ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రణాళికకు అది దూరంగా ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలు సర్దుకుపోయాయి. వాగ్దానాలకే ముందుకు రాని బిజెపి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తారా ? చంద్రబాబు చెప్పినట్లు ఏపి అంటే అమరావతి, పోలవరం కాదు. అవి రెండు ప్రధాన సమస్యలు మాత్రమే. మొత్తం రాష్ట్ర సమగ్రవృద్దికి పని చేస్తున్నారనే అభిప్రాయం జనంలో కలగకపోతే రాజకీయంగా పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి రాజకీయం : తెదే, వైసిపి అసంబద్ద వాదనలు, అంకెలతో వంచన !

30 Saturday Mar 2024

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP, Ycp

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, Andhra Pradesh Elections 2024, Andhrapradesh, AP CM YS Jagan, CHANDRABABU


ఎం కోటేశ్వరరావు


గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌ సర్వనాశనమైందని తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి చెబుతోంది. అంతే కాదు, తమ పాలనలో వచ్చిన అనేక పరిశ్రమలు రాష్ట్రం వదలివెళ్లినట్లు కూడా ఆరోపిస్తున్నారు. దానికి పోటీగా వైసిపి తనదైన శైలిలో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నది. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఊదరగొడుతున్నది. ఉదాహరణకు జిఎస్‌డిపిలో దేశంలో రాష్ట్రాన్ని ఒకటవ స్థానంలో నిలబెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. చెప్పేవారికి లేకున్నా వినేవారికి వివేకం ఉండాలంటారు.వర్తమాన ఆర్థిక సంవత్సరం 2023-24 మార్చినెల 31తో ముగుస్తుంది. వెంటనే గణాంకాలు ఖరారు కావు. వివిధ రాష్ట్రాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో పేర్కొన్న అంచనాల ప్రకారం కొన్ని సూచికలను వెలువరించారు. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి 14.49లక్షల కోట్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది. తరువాత తెలంగాణా. మొదటి ఏడింటిలో మహారాష్ట్ర 38.79,తమిళనాడు 28.3, గుజరాత్‌ 25.62, కర్ణాటక 25, ఉత్తర ప్రదేశ్‌ 24.39,పశ్చిమ బెంగాల్‌ 17.19, రాజస్థాన్‌ 15.7లక్షల కోట్లతో ఉన్నాయి. ఇక తలసరి జిడిపిలో 2022-23 సంవత్సరంలో అగ్రస్థానంలో 5.19లక్షలతో సిక్కిం, 4.72లక్షలతో గోవా రెండవదిగా ఉంది. పెద్ద రాష్ట్రాలలో 3.08లక్షలతో తెలంగాణా ప్రధమ, 3.01తో కర్ణాటక,2.96తో హర్యానా, 2.73తో తమిళనాడు, 2.72తో ఢిల్లీ, 2.41తో గుజరాత్‌, 2.33తో ఉత్తరాఖండ్‌, కేరళ, 2.24తో మహారాష్ట్ర,2.22తో హిమచల్‌ ప్రదేశ్‌, 2.19తో ఆంధ్రప్రదేశ్‌ పదకొండవ స్థానంలో ఉంది. ఇక వైసిపి చెప్పుకుంటున్న ఒకటవ స్థానం సంగతేమిటి అంటే ప్రతి ఏటా జిఎస్‌డిపి వృద్ది రేటు ప్రతి రాష్ట్రంలోనూ మారుతూ ఉంటుంది.2021-22లో వృద్ధి రేటులో స్థిర ధరల్లో 11.43శాతంతో మొదటి స్థానంలో ఉంది అని తేల్చారు గనుక, దాన్నే మొత్తం జిడిపిలో మొదటి స్థానంగా చెబుతూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. జిడిపి అంటే అంబానీ,అదానీ సంపదలతో పాటు అట్టడుగు బడుగు జీవులకు వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకొని వేసే మొత్తం, తలసరి అంటే దాన్ని జనాభాతో భాగించగా వచ్చేది. అందుకే తెలంగాణా జిడిపిలో మనకంటే తక్కువగా ఉన్నప్పటికీ జనాభా తక్కువ గనుక దేశంలో పెద్ద రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది. జిడిపిలో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉన్నప్పటికిటీ తలసరిలో తొమ్మిదవదిగా ఉంది.ఈ సూచికలతో జనానికి ఒరిగేదేమీ ఉండదు.తెలుగుదేశం పార్టీ కూడా తన ఐదు సంవత్సరాల పాలనలో వృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంది.2013-14లో రాష్ట్ర జిడిపి వృద్ది రేటు ఏడుశాతంగా ఉన్నదానిని 2017-18 నాటికి 11.2శాతానికి పెంచినట్లు అంకెల్లో చూపింది.


తెలుగుదేశం వారు తమ ఏలుబడిలో విశాఖను ఐటి హబ్‌గా మార్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఇదొక అతిశయోక్తి. హైదరాబాద్‌లో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు నాయుడే కారణమనే ప్రచారం గురించి తెలిసిందే. అలాంటి నేత ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఐటి పరిశ్రమలను ఆకర్షించలేకపోయారో ఎవరూ చెప్పరు. పెట్టుబడుల ఆకర్షణల పేరుతో సమావేశాల ఆర్భాటాలు చేయటం వేరు, ఆచరణలో పెట్టుబడులు రావటం వేరు. ఐటి రంగాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి బండారం బయటపడుతుంది. దీని అర్ధం వైసిపి అభివృద్ధి చేసిందని కాదు. దొందూ దొందే.ఐటి అంటే మారుపేరు చంద్రబాబు అని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు గనుక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది.కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటి సాంకేతిక మంత్రిత్వశాఖ సమాచారం ఆధారంగా 2021-22 సంవత్సర వివరాలతో రూపొందించిన ఎగువ మాప్‌ ఐటి ఎగుమతుల్లో ఏ రాష్ట్రం ఎక్కడుందో వెల్లడిస్తున్నది. ఎవరైనా అది వాస్తవం కాదని అంటే వాస్తవం ఏమిటో వెల్లడించాలి. పొరుగున ఉన్న ఒడిషా ఐదువేల కోట్ల రూపాయల మేర ఎగుమతి చేస్తే ఆంధ్రప్రదేశ్‌ వెయ్యి కోట్లుగా ఉంది. తరువాతి సంవత్సరాల్లో మొత్తంగా ఎగుమతులు పెరిగినందున ఆమేరకు అంకెలు మారవచ్చు తప్ప ధోరణిలో పెద్ద తేడా ఉండదు. ఆ ఏడాది రు.11.59లక్షల కోట్ల మేర ఎగుమతి చేస్తే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాల నుంచే రు.9.72లక్షల కోట్లు ఉంది. ఉపాధి కూడా దీనికి అనుగుణంగానే ఉంటుంది. ఐటి ఉద్యోగాలంటే బెంగలూరు,పూనే,హైదరాబాద్‌, చెన్నయిని చూస్తున్నారు తప్ప విశాఖ, విజయవాడ అని ఎవరైనా అంటారా ? 2023 మార్చి నాటికి దేశంలో 54లక్షల మంది ఐటి, ఐటి అనుబంధ సేవారంగంలో పని చేస్తున్నారు. పరోక్షంగా మరో కోటి మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నవారు ఎందరు ? ఎన్నికలు వస్తున్నాయి గనుక అంకెలతో ఆడుకుంటూ జనాన్ని మభ్యపెడుతున్నారు తస్మాత్‌ జాగ్రత్త అని చెప్పాల్సి వస్తోంది. రెండు పార్టీలూ పోలీసు యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మలచుకొని ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలు, న్యాయమైన డిమాండ్లపై ఆందోళనలను అణచేందుకే చూశాయి. మాట తప్పి మడమ తిప్పిన వారే. ఎవరూ తక్కువ తినలేదు.


ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా తెలుగుదేశం, వైసిపి పాలన ఉంది. కొన్ని వివరాలను చూద్దాం. ఉదాహరణకు అప్పుల గురించి ఆరోపణలు-ప్రత్యారోపణలు చోటుచేసుకుంటున్నారు.కాపిటల్‌ అంటే కాపిటల్‌ పెట్టుబడి,రుణాలు, వడ్డీ చెల్లింలులు రు.కోట్లలో.రెండు పార్టీల పాలనలో మచ్చుకు రెండేసి సంవత్సరాల వివరాలు.ఈ అంకెలకు పిఆర్‌ఎస్‌ సంస్థ విశ్లేషణలు ఆధారం.
ఏడాది××× రుణాలు ×× వడ్డీ చెల్లింపు××రుణ చెల్లింపు×× కాపిటల్‌
2016-17×59,923 ×× 11,697 ×× 34,776 ×× 50,520
2017-18×30,500 ×× 14,783 ×× 8,009 ×× 40,792(బడ్జెట్‌)
2021-22×53,524 ×× 22,165 ×× 15,503 ×× 16,373
2022-23× 64,978 ×× 25,288 ×× 16,291 ×× 16,847
రాష్ట్రంలో శాశ్వత సంపదలు, వాటి ద్వారా సేవలు, ఉపాధి సృష్టికి చేసే ఖర్చును మూలధన లేదా కాపిటల్‌ అంటారు. రెండు పార్టీల పాలనలోనూ ఇది దిగజారింది తప్ప ప్రాధాన్యత లేదు. పిఆర్‌ఎస్‌ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం రెండు పార్టీలూ బడ్జెట్లలో భారీ మొత్తాలను ప్రకటించి ఏడాది చివరికి కోత పెట్టటంలో దొందూ దొందే. తెలుగుదేశం పార్టీ చివరి రెండు సంవత్సరాలలో ప్రతిపాదిత మొత్తాలలో 39,30శాతాల చొప్పున, వైసిపి మొదటి నాలుగు సంవత్సరాలలో 82,37,48,45శాతాల చొప్పున కోతలు పెట్టింది.
తెలుగుదేశం పార్టీ చివరి మూడు సంవత్సరాలలో రాష్ట్ర రుణ భారం జిఎస్‌డిపిలో సగటున ఏటా 28.6శాతం ఉంటే, వైసిపి ఐదు సంవత్సరాల పాలనలో 32.74శాతం ఉంది. వీటికి ప్రభుత్వం హామీగా ఉండి కార్పొరేషన్లు, ఇతర సంస్థల ద్వారా చేసిన అప్పులు, ప్రభుత్వ సంస్థలు తీసుకున్న అప్పులు అదనం.ఉదాహరణకు 2022 మార్చి 31నాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు రు.1,38,875 కోట్లు వీటిలో విద్యుత్‌ సంస్థల వాటా రు.38,473 కోట్లు. జిఎస్‌డిపిలో ఇలాంటి మొత్తాలు 2021-22లో పన్నెండు శాతం ఉంది. అంటే ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకొనే అప్పులకు ఇది అదనం. తెలుగుదేశం పాలనలో చివరి నాలుగు సంవత్సరాలలో ఇతర రాష్ట్రాల కేటాయింపులతో పోల్చితే విద్యారంగంలో తక్కువ, వైద్య రంగంలో సమంగా, గ్రామీణాభివృద్ధి రంగంలో ఎక్కువగా ఉంది.వైసిపి పాలనలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయనే విమర్శ పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.2022-23లో అన్ని రాష్ట్రాలలో సగటున రోడ్లు, భవనాలకు 4.5శాతం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహనరెడ్డి సర్కార్‌ 2021-22లో 0.9, మరుసటి ఏడాది 0.8శాతం మాత్రమే కేటాయించింది.తీవ్ర విమర్శల తరువాత 2023-24లో 1.8శాతంగా ప్రతిపాదించింది, ఆచరణలో ఎంత ఖర్చు చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది. వైసిపి ప్రభుత్వం అనేక కీలక రంగాలను అలక్ష్యం చేసింది. ఆర్థిక మంత్రి భారీ మొత్తాలు కేటాయించినట్లు చూపటం తప్ప కోతల సంగతి తరువాత చెప్పలేదు. ఉదాహరణకు 2021-22 బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తాలలో అమలులో వివిధ శాఖలకు పెట్టిన కోతలను చూస్తే అభివృద్ది బండారం బయటపడుతుంది.రోడ్లు, భవనాలకు 55,గృహనిర్మాణం 54,నీటిసరఫరా, పారిశుధ్యం 46,సాగు నీరు 45,పట్టణాభివృద్ధి 42,వ్యవసాయం 40, సాంఘిక సంక్షేమం 39, గ్రామీణాభివృద్ది 34,ఆరోగ్యం, ఎస్‌సి,ఎస్‌టి,బిసి సంక్షేమశాఖలలో 20శాతాల చొప్పున కోత పెట్టారు. సంక్షేమ పథకాలు అమలు జరిపినంత మాత్రాన సరిపోదు.వాటినెవరూ వ్యతిరేకించటం లేదు. వివిధ శాఖలకు ప్రతిపాదించిన కేటాయింపులను కోత ఎందుకు పెట్టారో, తెచ్చిన అప్పులను దేనికి వెచ్చించారన్నది జనం అడుగుతున్న ప్రశ్న.


మోయలేని అప్పుల భారం గురించి ఒకవైపు చెబుతున్న తెలుగుదేశం కూటమి తాము అధికారానికి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింతగా పెంచి అమలు చేస్తామని ఆశచూపుతున్నాయి. ఇప్పటికే ఉన్న అప్పులతో కొత్త అప్పులు చేసే అవకాశాలు లేవు. కేంద్రం రుద్దిన విద్యుత్‌ సంస్కరణలు అమలు జరుపుతున్నందుకు అన్ని రాష్ట్రాలకు అనుమతించి జిఎస్‌డిపిలో 3.5శాతం పరిమితిని మించి మరో అరశాతం వైసిపి సర్కార్‌ ఉపయోగించుకుంది. వ్యవసాయానికి విద్యుత్‌ మీటర్లు బిగించే షరతును ఇందుకోసం అంగీకరించింది.పక్కనే ఉన్న తెలంగాణాలో అక్కడి ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రాలతో అప్పుల భారం ఎంత పెరిగిందో స్పష్టమైంది. కొత్త ప్రభుత్వం గత మూడునెలలుగా కొత్త అప్పులు తీసుకుంటే తప్ప గడవని స్థితి.ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన పరిస్థితి మీద శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప వాస్తవాలు వెల్లడికావు. ఎవరు అధికారానికి వచ్చినా కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేమిటి అన్నది ప్రశ్న.జనం మీద పన్నుల భారాన్ని విపరీతంగా మోపటం ఒకటి లేదా అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలకు ఏదో ఒకసాకుతో కోత పెట్టటం మినహా మరో మార్గం కనిపించటం లేదు. అందుకే పోటీ చేస్తున్న పార్టీలు నిర్ధిష్ట ప్రతిపాదనలతో ప్రణాళికలను ప్రకటిస్తే వాటి బండారం బయట పడుతుంది. ముందు మాకు తెలియలేదు, ఖజానాలో పైసా లేదని తెలంగాణాలో కాంగ్రెస్‌ చెప్పిన మాదిరి నాలుక మడతవేస్తే పరిస్థితి ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌లో కంపుకొడుతున్న అవకాశవాదం – దివాలా కోరు, అసంబద్ద వాదనలు !

11 Sunday Feb 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Religious Intolarence, tdp, TDP, Ycp

≈ Leave a comment

Tags

Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, jana sena party, Narendra Modi Failures, pavan kalyan, tdp, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రకటన నాటికి ఏవైనా అనూహ్య మలుపులు తిరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో తెలుగుదేశం-జనసేన-బిజెపి ఒక కూటమిగా, వైసిపి విడిగా, ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌,వామపక్షాలు,ఇతర కొన్ని పార్టీలు, శక్తులు ఒక కూటమిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి పట్ల జనం ఎలా స్పందిస్తారన్నది ఎత్తులు, పొత్తులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత, ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మూడు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలు నోటాకంటే తక్కువ ఓట్లున్న బిజెపి చుట్టూ తిరగటం అనేక మందికి జీర్ణం కావటం లేదు. వైసిపి విషయానికి వస్తే తన సంక్షేమ పధకాలను చూసి ఓటేయమంటోంది. ఇప్పుడున్న వాటిని మరింత మెరుగుపరుస్తామని, కొత్త వాటిని అమలు చేస్తామని తెలుగుదేశం-జనసేన చెబుతున్నాయి. తమ కూటమి కేంద్రంలో అధికారానికి వస్తే ప్రత్యేక హౌదా అమలు చేస్తుందని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయని చెబుతున్న బిజెపి ఏం చెబుతుందో చూడాలి. వివిధ పార్టీలు, కొన్ని శక్తులూ ముందుకు తెచ్చిన కొన్ని దివాలాకోరు, అసంబద్ద వాదనల గురించి చూద్దాం.


అధికార వైసిపిని ఓడించేందుకు బిజెపితో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం-జనసేన కూటమికి తగిన మద్దతు ఉందని, బిజెపితో పొత్తును తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారని అంటూనే విధిలేని పరిస్థితిలో బిజెపితో చేతులు కలపక తప్పదు అని చేదు మాత్రను మింగించేందుకు చూస్తున్నారు. ఎందుకటా ? వచ్చే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రం, ఎన్నికల కమిషన్‌ సహకారం అవసరం గనుక బిజెపితో దోస్తీ అవసరమట.ఎన్నికలను సక్రమంగా జరపటం ఎన్నికల కమిషన్‌ విధి. దాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే బిజెపిని భుజాల మీద ఎక్కించుకొని మోయాలని చెప్పటమే. గత ఐదు సంవత్సరాలలో ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాల గురించి తెలుగుదేశం, జనసేన, ా బిజెపి లేవనెత్తిన అంశాలను ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబును బిజెపి పెద్దలు పిలవగానే సిద్దం సుమతీ అన్నట్లు వెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పొలో మంటూ ఢిల్లీ యాత్ర చేశారు. మరికొన్ని శాలువాల ఖర్చు దండగ. ఎందుకయ్యా అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగటానికని వైసిపి పెద్దల వివరణ. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన చివరి(ఓట్‌ఆన్‌ఎకౌంట్‌) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వైసిపి కూడా ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌తో సరిపుచ్చింది. ఇప్పుడు నిధుల గురించి అడిగితే పట్టించుకొనేదెవరు ? పక్కా రాజకీయ యాత్ర మాత్రమే. గత ఐదేండ్లుగా అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి ఆదుకున్నట్లుగానే రానున్న రోజుల్లో కూడా విధేయులుగా ఉంటామని, తెలుగుదేశాన్ని నమ్మవద్దని చెప్పేందుకు తప్ప ఢిల్లీ పర్యటన వెనుక మరొక కారణం కనిపించటం లేదు.


నరేంద్రమోడీ ఎంతో బలంగా ఉన్నారని అందువలన కేంద్రాన్ని ఎదిరించి చేసేదేమీ లేదని పిరికిమందు నూరిపోస్తున్న వారిని ఏమనాలి. అలాంటపుడు ఆ బిజెపి మందలోనే చేరిపోవచ్చు, వేర్వేరు పార్టీల దుకాణాలు ఎందుకు ! బతికిన చేప ఎదురీదుతుంది చచ్చిన చేప వాలునబడి కొట్టుకుపోతుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కూడా రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని మనం ఎదిరించలేమంటూ దాని మోచేతి నీళ్లు తాగుదామని చెప్పిన వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఫలితంతో నిమిత్తం లేకుండా చేయాల్సింది చేశామా లేదా అన్నదే గీటురాయి. కేంద్రంలో ఉన్న పాలకులు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంటే, అనుచిత పద్దతులకు పాల్పడుతుంటే రాష్ట్రాల హక్కులు, ప్రజల కోసం పోరాడాలి, మెడలు వంచాలి తప్ప మోకాళ్ల మీద కూర్చుంటే కనికరిస్తారా ? ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చివేసినపుడు ఆ నాటి తిరుగులేని బలమైన కాంగ్రెస్‌కు తెలుగుదేశం లొంగిపోయి మీ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పలేదు, జనాన్ని వీధుల్లోకి సమీకరించి ఆందోళన చేసి పునరుద్దరణ జరిపించుకున్న చరిత్రను తెలుగుదేశం మరిచినా జనం మరిచిపోతారా ?


నాదెండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబాటు చేయించి ఎన్‌టి రామారావు సర్కార్‌ను కూలదోయించింది కాంగ్రెస్‌ పార్టీ. నేడు బిజెపి వివిధ రాష్ట్రాలలో అంతకంటే తక్కువ చేస్తున్నదా ? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సయోధ్యతో ఉండాలని కాంగ్రెస్‌కు ఏనాడైనా తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా ? మరి ఇప్పుడెందుకు ఆ పేరుతో బిజెపిని మోసేందుకు సాకులు వెతుకుతున్నట్లు ? తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది అని చెప్పవచ్చు, బిజెపి చేసిందేమిటి ? తెలుగుదేశం రాజ్యసభ పక్షం మొత్తాన్ని తనలోనే విలీనం చేసుకుంది కదా ! వాజ్‌పాయి సర్కారుకు తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. స్పీకరు పదవి(జిఎంసి బాలయోగి)ని కూడా తీసుకుంది. నాడు రాష్ట్రానికి కేంద్రం నుంచి శాశ్వతంగా గుర్తుపెట్టుకోదగిన పెట్టుబడులు గానీ, మరొకటి గానీ ఏమీ రాలేదు. దేశం వెలిగిపోతోంది అంటూ బిజెపితో కలిసి పోటీ చేసి 2004 ఎన్నికల్లో ఓడిన తరువాత తిరిగి బిజెపితో చేతులు కలిపేది లేదని తెలుగుదేశం ప్రకటించిన అంశాన్ని మరచిపోలేము. పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 2014లో తిరిగి అదే బిజెపితో చేతులు కలిపి ఎన్నికల్లో నెగ్గారు. పోనీ అప్పుడేమైనా సాధించారా అంటే ఏమీ లేదని అందరికీ తెలిసిందే. ప్రత్యేక హౌదా లేదని నరేంద్రమోడీ అడ్డం తిరిగితే సరే అన్నారు, దాని బదులు ప్రత్యేక పాకేజీ అంటే మహాభాగ్యం జీహుజూర్‌ అంటూ తల ఊపారు. చివరికి దానికి కూడా మొండి చేయి చూపితే బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు.2019 ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఎంతటి తీవ్ర విమర్శలు చేసుకున్నారో తెలిసిందే.


ఇప్పుడు అవన్నీ విస్మరించి రాష్ట్రం కోసం జనాన్ని కూడా మరచిపొమ్మంటున్నారు. తాము నందంటే నంది పందంటే పంది అనాలని చెబుతున్నారు. పోనీ ఇప్పుడు బిజెపి పెద్దలు విభజన హామీల అమలు గురించి, రాష్ట్రానికి చేయాల్సిన వాటి గురించి మారుమనసు పుచ్చుకున్నారా అంటే దుర్భిణివేసి చూసినా కనిపించటం లేదు. రేపు బిజెపి తిరిగి కేంద్రంలో అధికారానికి వస్తుందో రాదో తెలియదు, వచ్చినా గత పది సంవత్సరాల ఆచరణను బట్టి రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేదా దానికి సమానమైన ప్రత్యేక పాకేజీ ఇచ్చే సమస్యే లేదు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌ గురించి తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎందుకో తెలుగుదేశం పెద్దలు చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొద్ది వారాల ముందు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రకటనను కేంద్రం వెలువరించింది. పోనీ దాన్నయినా నోటిఫికేషన్‌ ఇచ్చి ఏర్పాటు చేసిందా అంటే అదీ లేదు. మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదు అని చెబుతున్నారు. కేంద్రం ఎప్పుడైనా భూమి ఎందుకు ఇవ్వరు అని రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చిందా?ఇస్తామని చెప్పిన భూమిని స్వీకరించేందుకు ముందుకు రాకుండా వంకలు చెబుతున్నది. జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు విశాఖలో రైల్వేలకు అసలు భవనాలే దొరకవా ? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తప్ప అసలు భూమే లేదా ? విశాఖ డివిజన్ను రద్దు చేయాలని నిర్ణయించారు, అక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తరువాత తీరికగా భూమి తీసుకొని కొత్త భవనాలు నిర్మించుకోవచ్చు, అదీ చేయలేదు. నాటకాలాడుతున్న అలాంటి బిజెపిని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చని చెబితే జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ?


తోలువలవటం, తాటతీయటమే తన కార్యాచరణ అని ప్రకటించుకున్న జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని చెబుతున్నారు, అది మంచిదే. కానీ పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ప్రతిసారీ ఉక్కును తుక్కుకింద అమ్మివేస్తామని చెబుతూనే ఉన్నా నోటికి తాళం వేసుకున్నారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక హౌదా గురించి మాట్లాడిన ఆ పెద్ద మనిషి తరువాత దాన్ని మరిచిపోయి తనకు అధికారం లేదు గనుక అడగటం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నోటికి తాళం వేసుకున్నారు. ఆ డిమాండ్‌ను వదులుకున్న తెలుగుదేశంతో చేతులు కలిపి రాష్ట్రాన్ని బాగుచేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక హౌదా గురించి మరిచి పొమ్మని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం తమ విధానమని పదే పదే చెబుతున్న బిజెపిని బలపరచి రేపు ఒక వేళ అధికారానికి వచ్చినా బిజెపి విధానాలను తెలుగుదేశం-జనసేన కూటమి మార్చగలదా ? ప్రకటించిన రైల్వేజోన్‌ గురించి కూడా అడగలేని వారు రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామని అంటేే నమ్మేదెలా ? పన్నులలో వాటాలు, కేంద్రం అమలు జరిపే పథకాలను నుంచి కొన్ని రాష్ట్రాలను మినహాయించే అవకాశమే లేదు. కొన్ని నిధులకు సంబంధించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నమాట నిజం. అలాంటి సందర్భాలలో వత్తిడి తేవాలి, పోరాడాలి లేకుంటే కేరళ మాదిరి సుప్రీం కోర్టును ఆశ్రయించాలి తప్ప లొంగుబాటు మార్గం కాదు. అందులోనూ ఆత్మగౌరవ నినాదం ముందుకు తెచ్చిన వారికి, ప్రశ్నించటం తమ డిఎన్‌ఏలోనే ఉందని చెప్పుకొనే వారికి అసలు తగనిపని.


వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, టీచర్ల మీద అణచివేత చర్యలకు పాల్పడుతున్నది, అనేక భారాలను మోపిన మాటనిజం. ఆ ప్రభుత్వాన్ని మార్చాలన్న వాంఛను తప్పు పట్టాల్సిన పనిలేదు.రాజధాని మార్పుతో సహా అనేక అంశాలలో బిజెపి నాటకాన్ని ఇంతకాలం జనం చూశారు.వైసిపికి అండదండగా ఉన్న అంశం తెలిసిందే. ఏనాడూ దాని విధానాలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేవు. తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు వైసిపిని ప్రోత్సహించింది, తిరిగి అధికారంలోకి వస్తుందని, తనకు విధేయురాలిగా ఉంటుందని ఇంతకాలం భావించిన కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. రోడ్డుమాప్‌ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ కోరినా పూచికపుల్ల కింద తీసిపారవేసింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు గణనీయంగా తగ్గనున్నట్లు బిజెపి పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాల్లో వైసిపికి అవకాశాల్లేవని నిర్ధారించుకున్న తరువాత సరిగ్గా ఎన్నికల ముంగిట బిజెపి తన వైఖరి మార్చుకొని తెలుగుదేశానికి స్వాగతం పలుకుతోంది తప్ప వేరు కాదు.


బిజెపి తన మత అజెండాను ముందుకు తీసుకువస్తున్నది.సిఏఏను అమలు జరుపుతామని ఇప్పుడు ప్రకటించటం దానిలో భాగమే. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమకు మియాల(అసోంలో ముస్లింలను అలా పిలుస్తారు) ఓట్లు అవసరం లేదన్నారు. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా బిజెపి అగ్రనేత జగదీశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని ప్రకటించారు.అలాంటి మాటలే ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్పగలరా ? మణిపూర్‌లో గిరిజనుల మీద, వారి చర్చీల మీద దాడులు జరుగుతుంటే, మహిళలను నగంగా తిప్పితే ఇంతవరకు ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి వారికి ఎలాంటి భరోసా కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ బిజెపితో సర్దుబాటు చేసుకుంటే ఈ అంశాలన్నింటికీ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెల్లెలు షర్మిల రాజకీయం : వసుదేవుడి స్థితిలో అన్న వైఎస్‌ జగన్మోహనరెడ్డి ?

01 Monday Jan 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, BRS, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, tdp, TDP, Telangana, Ycp

≈ Leave a comment

Tags

#YS Sharmila, ANDHRA PRADESH, Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


కాంగ్రెస్‌లో చేరవద్దు, అన్నతో చేతులు కలిపి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగాలని, అక్కడ ఉన్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయిస్తామని సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెల్లెలు షర్మిలకు రాయబారం పంపినట్లు, ఆమె తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమా కాదా అన్నది పెద్దగా ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. అన్నతో కలిస్తే లేదా లడాయికి దిగితే జరిగే పరిణామాలు, పర్యవసానాలు ఏమిటన్నదే చర్చ. నిజానికి షర్మిల కాంగ్రెస్‌లో చేరటం తెలంగాణా ఎన్నికలకు ముందే ఖరారైంది. ఆమె ఎక్కడ తన నూతన ప్రస్థానాన్ని ప్రారంభిస్తే పార్టీకి ప్రయోజనం అన్న తర్జనభర్జనల తరువాత చివరికి ఆంధ్రప్రదేశ్‌ను కార్యస్థానంగా ఎంచుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. ఇది వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఊహించని పరిణామేమీ కాదు. తెలంగాణాలో తిరిగి బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని వేసుకున్న లెక్కల పరీక్షలో జగన్‌ తప్పారు. అతని ధీమా గురించి ఎరిగిన వైసిపి అభిమానులు తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ విజయం మీద ధీమాతో పెద్ద మొత్తంలో పందాలు కాసి చేతులు కాల్చుకున్నారు.సోదరి కాంగ్రెస్‌ ప్రవేశం గురించి ఆ ఎన్నికలకు ముందు తరువాత అంచనాల్లో మార్పులతో జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు పూనుకున్నారని చెబుతున్నారు. తల్లీ, చెల్లిని ఇంటి నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి గెంటివేశారన్న విమర్శలకు జగన్మోహనరెడ్డి గానీ, వైసిపి నేతల వద్దగానీ సరైన, సమర్ధనీయమైన సమాధానం లేదు. షర్మిలను ఇంటికి ఆహ్వానించటం అంటే తల్లిని కూడా చేరదీయటమే అవుతుందని, తమ మీద ఉన్న విమర్శలకు సమాధానం చెప్పినట్లు అవుతుందని వైసిపి నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.తమ నేత అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారని, చిప్పకూడు తిన్నారని తెలుగుదేశం, జనసేన ఇతర పార్టీలు, మీడియా చేస్తున్న దాడిని తక్కువ చేసేందుకు, మీ నేత కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు, అదే చిప్పకూడు తిన్నారు అని తమ గణాలకు ఒక ఆయుధం ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడిని కేసులతో జైలుకు పంపారన్న విమర్శలు, ఆ ఉదంతాన్ని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. షర్మిలను దగ్గరకు తీయటం జరుగుతుందా ?


రాజకీయాల్లో ఏదీ అనూహ్యం కాదు, ఎవరు ఎప్పుడు దేనికి ఎవరితో చేతులు కలుపుతారో ఊహించలేము.నారా లోకేష్‌కు క్రిస్మస్‌ బహుమతి పంపిన షర్మిల తీరును సాధారణ అంశంగా కొట్టివేయలేము. ఊహాగానాల్లో ఉన్న అంశం ప్రకారం షర్మిల తన అన్న జగన్మోహనరెడ్డితో కలిస్తే జరిగేదేమిటి ? అన్న చేసిన అన్యాయానికి ఎంత లబ్దిపొంది చేతులు కలిపారు అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే అన్నా-చెల్లెళ్లు ఒకటైతే తెరవెనుక షర్మిలకు జరిగే లాభం ఏమిటో వెల్లడికాదు కానీ తెరముందు జగన్‌కు అది పెద్ద నష్టానికి దారి తీస్తుంది. ఓట్ల పరంగా షర్మిల తెచ్చేదేమీ ఉండదు. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందన్న లోకోక్తి తెలిసిందే. అయితే పురాణాల్లో అది ఒక మహత్తర కార్యం కోసం అలా చేశారని సమర్దిస్తారు. కానీ షర్మిల కోసం జగన్‌ తలవంచినా, ఒక అడుగువెనక్కు తగ్గినా సమర్థన జనానికి ఎక్కదు. ఓడిపోయే పరిస్థితి వచ్చింది కనుకనే అలా చేస్తున్నారని అనుకోవటం ఖాయం. అదే జరిగితే వైసిపి శ్రేణుల్లో జగన్‌ మీద ఉన్న విశ్వాసం మరింతగా సన్నగిల్లుతుంది, డొల్లతనం బయటపడుతుంది, ఓటర్ల మీద ప్రతికూల ప్రభావంతో మరింత నష్టం జరుగుతుంది. తమకు ఎవరితో పనిలేదని ఇంతకాలం చేసిన ప్రచారానికి ఎదురుదెబ్బ. అలాగాక రాయబారం లేదా బేరాన్ని షర్మిల తిరస్కరించినట్లు వచ్చిన వార్తలు నిజమే అయితే అది కూడా జగన్‌కు ఎదురుదెబ్బే. వ్రతం చెడ్డా ఫలం దక్కని స్థితి. దాన్ని కూడా జగన్‌ బలహీనతగానే ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చేస్తాయి. ఎలా జరిగినా అన్నను చెల్లెలు ఇరకాటంలోకి నెట్టినట్లే. బహుశా జగన్‌ లేదా సలహాదారులు దీన్ని ఊహించి ఉండరు.


2024 ఎలా ఉంటుందో తెలియదు గానీ 2023 వైఎస్‌ జగన్‌కు నిద్రలేని రాత్రులతో వీడ్కోలు పలికిందని చెప్పవచ్చు. మరోవైపు తెలుగుదేశ-జనసేన కూటమికి ఆశావహ సూచనలతో 2024 స్వాగతం పలికింది.అయితే బిజెపితో తెలుగుదేశం సయోధ్యకు పూనుకున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే ఆ సంతోషం తాత్కాలికమే కావచ్చు.నాలుగు లోక్‌సభ, పన్నెండు అసెంబ్లీ స్థానాల కోసం బిజెపి బేరమాడుతున్నట్లు చెబుతున్నారు. ఒప్పందం కుదురుతుందా లేదా ప్రచారమేనా, ఎన్ని సీట్లు కొనుక్కుంటారు అన్నది పక్కన పెడితే వచ్చే పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. 2004లో బిజెపితో చేతులు కలిపి చేతులు కాల్చుకున్న చంద్రబాబు నాయుడు పదేండ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.2014లో బిజెపితో ముడివేసుకొని ఐదేండ్లూ కాపురం చేయకుండానే ఎవరిదారి వారు చూసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు చేసిన విమర్శలకు ఫలితాల తరువాత మోడీ, ఇడి, ఐటి, సిబిఐలను చూసి తెలుగుదేశం నోటికి తాళం వేసుకుంది. ఇప్పుడు వైసిపిని ఓడించటమనే ఏకైక అజండా తప్ప బిజెపి- తెలుగుదేశం కలవటానికి మరొక కారణం లేదు. అధికార యావతప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని జనం భావిస్తారు. తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని కర్ణాటకలో బిజెపి నేతలు స్వయంగా ప్రకటించారు. రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల తీరుతెన్నులు చూసినపుడు మైనారిటీలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు ఓటుచేసినట్లు స్పష్టమైంది. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించింది వైఎస్‌ జగన్మోహరెడ్డి అయితే వెనుక నుంచి ప్రోత్సహించింది లేదా మీ ఇష్టం అన్నట్లు వ్యవహరించింది బిజెపి అని తెలుగుదేశం శ్రేణులు భావించాయి. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపటాన్ని ఎంతవరకు జీర్ణించుకుంటాయి ?ప్రస్తుతం తెలుగుదేశం కూటమి, వైసిపి మధ్య నువ్వానేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాంటపుడు వచ్చే-పోయే ప్రతి ఓటుకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణా, రాజస్థాన్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికార మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే.


అధికారమే పరమావధిగా ఉన్న రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులూ ఎవరూ ఉండరు.ఇప్పటి వరకు తెరవెనుక వైసిపి మద్దతుదారుగా ఉన్న బిజెపి ఒక్కసారిగా తెరముందు తెలుగుదేశంతో చేతులు కలిపితే షర్మిల చేరిన కాంగ్రెస్‌తో జగన్మోహనరెడ్డి చేతులు కలిపే అవకాశాన్ని కొట్టిపారవేయలేము. ఇప్పుడు అది ఊహాజనితమే కావచ్చు. జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదని, కేసులు బనాయించిందన్న దుగ్దతప్ప కాంగ్రెస్‌తో వైసిపికి ఇతర పంచాయితీ ఏముంది. తన సత్తాఏమిటో జగన్‌ నిరూపించుకున్నందున అతనితో కలిసేందుకు కాంగ్రెస్‌కూ ఇబ్బంది ఉండదు. దానికి పార్టీ పునరుద్దరణ ముఖ్యం తప్ప మరొకటి కాదు. పాత సంవత్సరం తెలుగుదేశానికి ఒక పీడకల అని చెప్పాలి. చంద్రబాబునే అరెస్టు చేయించిన జగన్మోహనరెడ్డి తమ మీద కేంద్రీకరిస్తే ఏమిటన్న ఆందోళన తెలుగుదేశ శ్రేణుల్లో తలెత్తిందన్నది కాదనలేని వాస్తవం. ఒక విధంగా చంద్రబాబు నాయుడి మీద బనాయించిన కేసు, రిమాండ్‌కు పంపటం తెలుగుదేశం కార్యకర్తల్లో ఇంతకంటే ఏం చేస్తారు అన్న తెగింపును కూడా తెచ్చింది. బెయిలు వచ్చిన తరువాత వారిలో చలి వదిలింది..


మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధి చేస్తామనే పేరుతో వైసిపి ఆడిన క్రీడ వికటించింది.వట్టిస్తరి మంచినీళ్లు అన్నట్లుగా అభివృద్దీ లేదు, దానికి రోడ్‌మాపూ లేదు. అమరావతిని గాలికి వదలివేశారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రకరకాల ఆందోళనలను, న్యాయపోరాటాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద, గత ఒప్పందాలను విస్మరించటం మీద కేసులు దాఖలు చేశారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని అన్న ప్రచారం అక్కడ భూ దందాలకు తెరలేపేందుకే అన్న సంగతిని ఆ ప్రాంత వాసులు ఇప్పటికే గుర్తించారు.ముహూర్తాలు ఎన్నో చెప్పారు. చివరికి 2023 నవంబరు 22న జారీచేసిన ఉత్తరువులో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పధకాల సమీక్షల నిమిత్తం ముఖ్యమంత్రి, శాఖాధిపతుల క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానిలో ఎక్కడా కార్యనిర్వాహక రాజధాని అనే పదం లేదు. చివరికి కోర్టులో కేసు దాఖలు కావటంతో అది కూడా ఆగిపోయింది. ఇది జగన్‌కు ఊహించని దెబ్బ. కోర్టు కేసు ఇప్పట్లో తేలే అవకాశాలు లేవు. ఈ లోగా ఎన్నికల షెడ్యూలు ప్రకటన రానుంది. కాళేశ్వరాన్ని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్న బిఆర్‌ఎస్‌ ఆశలను మేడిగడ్డ బారేజ్‌ పిల్లర్ల కుంగుబాటు ఎలా దెబ్బతీసిందో చూశాము. వైసిపికి మూడు రాజధానుల అంశం కూడా అలాంటిదే. ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసేందుకు మాత్రమే పనికి వస్తుంది తప్ప జనాన్ని మెప్పించేది కాదు.


జగన్మోహనరెడ్డికి 2023 మిగిల్చిన మరో ఆశాభంగం స్కిల్‌డెవలప్‌మెంట్‌, ఇతర కేసులు. తెలుగుదేశం పార్టీ నేతలను ప్రత్యేకించి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌లను వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు లేదా కనీసం ఎన్నికల తేదీ వరకు జైలుకు పంపి ప్రచారానికి దూరం చేయటం, అంతకంటే ముఖ్యంగా అగ్రనేతలకే ఏ గతి పట్టిందో చూడండి అని తెలుగుదేశం శ్రేణులను భయపెట్టేందుకు చూశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈకేసుల్లో సిఐడి వ్యవహరించిన తీరు ఊహించినదానికంటే ముందుగానే జనసేనను తెలుగుదేశానికి మరింతదగ్గర కావించింది. చంద్రబాబు నాయుడిపై బనాయించిన కేసు బలం, తమ ప్రభుత్వం గురించి గొప్పగా ఊహించుకున్న వైసిపి శ్రేణులు పైకి చెప్పుకోలేని విధంగా తీవ్ర ఆశాభంగం చెందాయి. నాలుగేండ్లు మౌనంగా ఉండి 2023 చివరిలో చంద్రబాబును ముద్దాయిగా చేర్చటం విఫల రాజకీయ వ్యూహంలో భాగమే. బెయిలు రాదు అనుకున్న చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావటమే కాదు, రాజకీయ ప్రచారం చేసుకొనేందుకు కూడా కోర్టు అనుమతించింది. మంత్రులు, ఎంఎల్‌ఏల పని తీరు మీద అటు జనంలోనూ ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉన్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వచ్చాయి. ఎంఎల్‌ఏలు, ఎంపీలను వదిలించుకొనేందుకు, వీలుగాకపోతే బదిలీలు చేసేందుకు జగన్‌ పూనుకున్నారు. పొమ్మనకుండా పొగపెట్టినట్లు ముందుగానే భారీ మొత్తంలో నిధి సమర్పించుకోవాలని చెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. వైసిపికి 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని ఇంటలిజెన్స్‌ ఇచ్చిన నివేదిక పేర్కొన్నట్లు చెబుతున్నారు. అధికారానికి కావాల్సిన సంఖ్య 88, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వైసిపి మునిగిపోయే నావ మాదిరి ఉంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రక్షించటం కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d