• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Europe

విమానాల వీడియోతో అమెరికా కూటమికి దడపుట్టించిన చైనా ! ఫైటర్‌ జెట్స్‌లో మనమెక్కడ !!

10 Friday Jan 2025

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

China tests sixth-gen jet, IAF, Narendra Modi Failures, sixth-gen stealth jets, Tejas

ఎం కోటేశ్వరరావు


2024 డిసెంబరు చివరి వారంలో చైనా ఎగురవేసిన రెండు విమానాల వీడియోను చూసి అమెరికా, దాని అనుంగు దేశాలకు దడమొదలైందా ? మీడియాలో వస్తున్న విశ్లేషణలు, వివరాలను చూస్తుంటే అలాగే అనిపిస్తున్నది. చైనా కమ్యూనిస్టు విప్లవ సారధి మావో జెడాంగ్‌ 131వ జన్మదినం డిసెంబరు 26వ తేదీన రెండు తయారీ కేంద్రాల నుంచి ఆకాశంలో విహరించిన రెండు విమానాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రతి దేశం స్వంత విమానాలను అవి పౌర లేదా యుద్ధ అవసరాల కోసం తయారు చేసుకోవటం కొత్తేమీ కాదు గానీ చైనా గురించి ఎందుకింత ఆందోళన.స్టెల్త్‌ బాంబర్ల తరగతికి చెందినవి చెబుతున్న ఆధునిక విమానాలు ఏ దేశం దగ్గర ఎన్ని ఉన్నాయన్నది రహస్యమే.ఐదు, ఆరు తరాలకు చెందిన వాటిని స్టెల్త్‌ బాంబర్లు అని పిలుస్తున్నారు. ఇవి ఇతర దేశాలకు రాడార్లకు దొరక్కుండా( రెండో కంటికి తెలియకుండా) ఎగిరి శత్రువును దెబ్బతీసేంత వేగం, సామర్ధ్యం కలిగినవి. ఫోర్బ్స్‌ వెబ్‌సైట్‌ నాలుగు సంవత్సరాల క్రితం వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 2020 డిసెంబరు నాటికి ఏరకం విమానాలు ఏ దేశం దగ్గర ఎన్ని ఉనాయో పేర్కొంటూ ఒక జాబితాను ఇచ్చింది. దాని ప్రకారం అమెరికా 540, చైనా 41,నార్వే 22, ఇజ్రాయెల్‌ 18, ఆస్ట్రేలియా 16, బ్రిటన్‌ 15, జపాన్‌ 12, ఇటలీ 11, దక్షిణ కొరియా 11, రష్యా వద్ద పది చొప్పున ఉన్నాయి.రాడార్లను తప్పించుకొని ప్రయాణించే నాలుగు రకాలను చైనా రూపొందిస్తున్నదని కూడా ఆ వార్త పేర్కొన్నది. ఈ నాలుగేండ్లలో వాటి సంఖ్య కచ్చితంగా పెరిగి ఉంటుంది. మిలిటరీలో అమెరికా ఇప్పటికీ ఎదురులేని శక్తి అన్నది నిస్సందేహం. ఆ బలాన్ని చూపి ప్రపంచాన్ని తన అదుపులో పెట్టుకోవాలని చూస్తున్న మాట కూడా తెలిసిందే. ఇంతకీ చైనాను చూసి ఎందుకు కంగారు పడుతున్నట్లు ? ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదవ తరం యుద్ధ విమానాలే ఉన్నాయి. అమెరికా తయారు చేసిన ఆరవ తరం విమానం 2020లో గగనతలంలో ఎగిరినప్పటికీ దాని గురించి వివరాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. తాజాగా చైనాలోని చెంగడు, షెన్‌యాంగ్‌ విమాన తయారీ కేంద్రాల నుంచి రెండు కొత్త విమానాలు ఆకాశంలో కనిపించగా వాటికి రక్షణగా ఐదవ తరం జె20 ఫైటర్‌ విమానం తిరిగింది. ఆ దృశ్యాలు తప్ప అంతకు మించి వివరాలేమీ ప్రపంచానికి వెల్లడి కాలేదు. ఆయితే ఆ రంగంలో నిపుణులైన వారు ఆ విమానాలను చూస్తే ఆరవతరానికి చెందిన లక్షణాలను కలిగి ఉన్నాయని చెప్పారు.

2024 చివరిలో ఫ్లైట్‌ గ్లోబల్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 161 దేశాలకు చెందిన సాయుధ దళాల్లో 52,642 విమానాలు ఉన్నాయి. ఇవి అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 759 తక్కువ. ఆఫ్రికా ఖండంలో 4,230, మధ్య ప్రాచ్యంలో 4,595, రష్యా కామన్‌వెల్త్‌ దేశాల్లో 5,124, ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో 14,583, ఉత్తర అమెరికాలో 13,339,ఐరోపాలో 7,760, లాటిన్‌ అమెరికాలో 2,956 ఉన్నాయి.దేశాల వారీ చూస్తే అమెరికాలో 13,043(ప్రపంచంలో25శాతం), రష్యా 4,292(8శాతం), చైనా 3,309(6),భారత్‌ 2,229(4), దక్షిణ కొరియా 1,592(3), జపాన్‌ 1,443(3),పాకిస్థాన్‌ 1,399(3) కలిగి ఉన్నాయి. అమెరికాతో పోలిస్తే చైనా దగ్గర ఉన్న మిలిటరీ విమానాలు ఎక్కడా సరితూగవు. చిత్రం ఏమిటంటే అమెరికాతో సహా నాటో దేశాలు ఇస్తున్న మద్దతు చూసి కేవలం 324 మిలిటరీ విమానాలు మాత్రమే కలిగి ఉన్న ఉక్రెయిన్‌ నాలుగువేలకు పైగా ఉన్న రష్యాను ఓడిస్తామని ప్రపంచాన్ని నమ్మింప చూస్తున్నది. రష్యాను చూసి నాటోలోని 23దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ను జిడిపిలో రెండుశాతం అంతకు మించి ఖర్చు చేసేందుకు పూనుకున్నాయి.


చైనా ప్రదర్శించిన రెండు విమానాలు పరీక్ష కోసం ఉద్దేశించినవిగా చెబుతున్నారు. దానిలో తేలే ఫలితాలను బట్టి ప్రమాణాలను నిర్ధారించిన తరువాత మార్పులు చేర్పులతో రంగంలోకి దించుతారు. ఇది అన్ని దేశాలలో జరిగే ప్రక్రియే. అమెరికా ఐదవతరం ఎఫ్‌22, ఎఫ్‌35 రకాలకు ధీటుగా చైనా ఉన్నదని అందరూ అంగీకరిస్తున్నారు.మనదేశం అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌(ఎఎంసిఏ) రూపకల్పన దశలో ఉంది.ఎగుమతుల కోసం చైనా తయారు చేసిన జె35 రకం 40 స్టెల్త్‌ బాంబర్లను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్‌ నిర్ణయించింది.చైనాలో ఐదవతరం చెంగుడు జె20 రకం పని చేస్తుండగా షెన్‌యాంగ్‌ ఎఫ్‌సి31 రకం త్వరలో సేనలో చేరనుంది. ఈ సమాచార పూర్వరంగంలోనే ఆరవ తరం విమానాన్ని చైనా పరీక్షించినట్లు భావిస్తున్నారు.దాన్లో మూడు ఇంజన్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆధునిక విమానాల్లో అలాంటి ఏర్పాటు లేని కారణంగా ప్రత్యేకత సంతరించుకుంది.ఇప్పటికిప్పుడు దాన్ని నిర్ధారించుకొనే అవకాశం లేదు.రెండో విమానం పైలట్లతో పని చేస్తుందా లేక మానవరహితంగా లక్ష్యాన్ని చేరేవిధంగా రూపొందించారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

అమెరికా 2020 సెప్టెంబరు 14న తాను ఆరవ తరం యుద్ధ విమానాన్ని రూపొందించినట్లు ప్రకటించటమే గాక ఒక విమానాన్ని ఎగురవేసింది. దాని వివరాలు ఇప్పటికీ రహస్యమే. 2022లో అమెరికా వైమానిక దళ విశ్రాంత జనరల్‌ మార్క్‌ డి కెలీ చైనా ఆరవతరం విమానాల గురించి హెచ్చరించాడు. సాంకేతికపరమైన తేడాను వేగంగా తగ్గిస్తున్నదంటూ ఆందోళన వెల్లడిరచాడు.1997లో అమెరికా ఐదవతరం స్టెల్త్‌ ఫైటర్‌ ఎఫ్‌22 రాప్టర్‌ను తొలిసారిగా ఆవిష్కరించారు. దానికి ధీటైన చైనా జె20 పద్నాలుగు సంవత్సరాల తరువాత 2011లో ఉనికిలోకి వచ్చింది.దీనితో పోల్చుకుంటే అమెరికా 2020లో ఆరవతరాన్ని ఆవిష్కరించిన నాలుగు సంవత్సరాలకే 2024లో చైనా తన విమానాలను ప్రదర్శించింది. దీన్ని బట్టి చైనా సాంకేతిక పరిజ్ఞానం ఇంత వేగంగా ఉందా అని ప్రపంచం ఆశ్చర్యపోతున్నది. గతంలో చైనా సాధించినట్లు ప్రకటించిన అనేక విజయాలను తొలుత అంతా ప్రచారం తప్ప నిజం కాదని కొట్టిపడవేసిన వారు తరువాత వాస్తవమే అని తెలిసి అవాక్కయ్యారు. ఇప్పుడు ఆరవతరం విమానాల గురించి కూడా అదే డోలాయమానంలో ఉన్నారు.దీని గురించి చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నూతన సంవత్సరాది సందర్భంగా చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తూర్పు కమాండ్‌ ఒక సంగీత వీడియోను విడుదల చేసింది. దానిలో నూతన జెట్‌ బొమ్మలను చేర్చి అనధికారికంగా వాస్తవమే అని సంకేతమిచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.వివిధ దేశాలకు చెందిన విశ్లేషకులు భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీర్ఘశ్రేణి, అత్యంత వేగంగా ప్రయాణించగల, శత్రు విమానాలను అడ్డుకోగలిగిన రష్యా మిగ్‌31 మాదిరి ఉన్నాయని, దానికంటే 45 టన్నుల బరువును మించి మోయగలవని, 400కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను దెబ్బతీయగలవని, ధ్వని కంటే నాలుగురెట్లు వేగంగా ప్రయాణిస్తాయని ఇలా రకరకాలుగా చెబుతున్నారు. ప్రపంచంలో పరిణామాలు ఇలా ఉంటే మన దేశ పరిస్థితి ఏమిటి ?


పెట్రోలు, డీజిలు మీద విపరీతమైన సెస్సుల భారం మోపి ఏటా లక్షల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే గతం కంటే మోడీ సర్కార్‌ మిలిటరీ ఖర్చు ఎక్కువగా చేస్తున్నది, దానికి అవసరమైన మొత్తాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి. సెస్‌ అంటే ఏ అవసరాల కోసం విధిస్తే దానికి మాత్రమే ఖర్చు చేయాలి, కానీ మోడీ సర్కార్‌ విధించిన వాటిలో రక్షణ లేదు. కాంగ్రెస్‌ దేశ రక్షణను నిర్లక్ష్యం చేసిందని ఇప్పటికీ ఆరోపిస్తుంటారు. మన వైమానిక దళ అధిపతి ఏపి సింగ్‌ సుబ్రతో ముఖర్జీ 21వ సెమినార్‌లో మాట్లాడుతూ చెప్పిన మాటలు గమనించదగినవి.2010లో తేజ రకం యుద్ధ విమానాల ఒప్పందం ప్రకారం ఇప్పటికీ వాటిని పూర్తిగా సరఫరా చేయలేదని, మరోవైపున చైనా ఆరవతరం జెట్‌ను పరీక్షించిందని, చైనా నుంచి పాకిస్థాన్‌ ఐదవ తరం యుద్ధ విమానాలను రానున్న రెండు సంవత్సరాలలో కొనుగోలు చేయనున్నదని చెప్పారు. తేలిక రకం 40 తేజ విమానాలు కావాలని 200910లో ఆర్డరు పెడితే ఇంతవరకు పూర్తిగా రాలేదన్నారు. 1984లో విమానానికి రూపకల్పన జరిగిందని పదిహేడేండ్ల తరువాత మొదటి తేజా 2001లో ఎగిరిందని పదిహేను సంవత్సరాల తరువాత 2016లో మిలిటరీలో ప్రవేశపెట్టినట్లు, ఇది 2024, ఇంతవరకు తొలి 40 విమానాలను అందచేయలేదని, ఇదీ మన ఉత్పాదక సామర్ధ్యమని సింగ్‌ చెప్పారు. చైనాను గమనిస్తే ఎన్ని విమానాలను అది తయారు చేసిందని కాదు, ఎంతో వేగంగా సాంకేతికంగా ముందుకు పోతున్నదని నూతన తరం యుద్ధ విమానాలను బయటకు తీసుకురావటాన్ని ఇటీవల చూశామని ఎయిర్‌ ఛీఫ్‌ మార్షల్‌ అన్నారు. పాతబడిన మిగ్‌ 21 విమానాల స్థానంలో తేలిక రకం(ఎల్‌సిఏ) విమానాలను స్వంతంగా రూపొందించేందుకు 1980దశకంలో నిర్ణయించారు. ఒక ఇంజను కలిగిన నాలుగవ తరం తేజ విమానాలను స్వంతంగా తయారు చేస్తున్నాము. వాటిని మెరుగుపరచి తేజా ఎంకె1, తేజా ఎంకె1ఏ రకాలను రూపొందించాము. ఈ రంగంలో పురోగతిని వేగవంతం చేసేందుకు పదేండ్లలో మోడీ సర్కార్‌ చేసిందేమిటన్నది ప్రశ్న.

అమెరికా, చైనాలు ఆరవతరంలో ప్రవేశిస్తే మన దేశం వద్ద ఫ్రాన్సు నుంచి దిగుమతి చేసుకున్న దసాల్ట్‌ రాఫెల్‌ విమానమే ఆధునికమైనది, అది 4.5వ తరానికి చెందినదిగా పరిగణిస్తున్నారు. చురుకుగా పనిచేసే వైమానిక యూనిట్లు 42 ఉండాలని నిర్ణయించగా ప్రస్తుతం 31 మాత్రమే ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ నివేదికలో వెల్లడిరచారు. ఒక్కొక్క యూనిట్‌లో రెండు అంతకు మించి యుద్ధ విమానాలు ఉంటాయి. ప్రస్తుతం 83 తేలిక రకం తేజా విమానాల కోసం వాయుసేన ఒప్పందాలు చేసుకుంది, మరో 97కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది.వచ్చే దశాబ్దిలో ఐదవ తరం తేజా ఎంకె2 విమానాలు సిద్దం అవుతాయని భావిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న మిరేజ్‌ 2000, మిగ్‌29, జాగ్వార్‌ విమానాలున్నాయి, ఐదవతరం తేజా వస్తే మరింత ఆధునికం అవుతుంది. వీటిని అభివృద్ధి చేసేందుకు గత ఏడాది మార్చి నెలలో మాత్రమే కేంద్రం అనుమతించిందనే వార్తలను చూస్తే కబుర్లు చెప్పినంతగా ఆచరణ గడపదాటటం లేదన్నది వాస్తవం.పరస్పరం విశ్వాసం లేమి, మిత్రులుగా పైకి కనిపించే వారే కుట్రలు జరుపుతున్న పూర్వరంగంలో ప్రతిదేశం తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది. ఈపూర్వరంగంలో మన రక్షణ రంగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు,ప్రచారానికే పరిమితం కాకుండా నిర్థిష్ట కార్యాచరణను రూపొందించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికన్‌ డాలరుకు ఎసరు వస్తోందా ! డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు అర్ధమేమిటి !!

04 Wednesday Dec 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

america first, anti china, BRICS nations, China, dedollarization, Donald trump, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


తమ కరెన్సీ డాలరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీతో వాణిజ్యం జరిపేందుకు బ్రిక్స్‌ కూటమి దేశాలు పూనుకుంటే వందశాతం పన్ను విధిస్తామని జనవరి 20న పదవీ బాధ్యతలు చేపట్టనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు.బ్రిక్స్‌ దేశాలని, వేరే కరెన్సీ అని చెప్పినప్పటికీ స్థానిక కరెన్సీలతో లావాదేవీలు జరిపే అన్ని దేశాలకూ వర్తింపచేస్తామనే హెచ్చరిక దీని వెనుక ఉంది.ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌,ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యుఏయి) ఉన్నాయి.మరో 34 దేశాలు చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. వాటిని నిరుత్సాహపరిచేందుకు కూడా ట్రంప్‌ ఈ ప్రకటన చేశాడు. నిజానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మార్చి నెలలోనే దీని గురించి చెప్పాడు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ దువ్వూరు సుబ్బారావు వంటి వారు ట్రంప్‌ మాటలు ఊకదంపుడేనా, నిజంగా అమలు జరుగుతాయా, అమెరికా చట్టాలు అందుకు అనుమతిస్తాయా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చైనా వస్తువుల మీద పదిశాతం, కెనడా, మెక్సికోల నుంచి వచ్చే వాటి మీద 25శాతం పన్ను విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చర్యకు ప్రతిచర్య ఉంటుంది, అది ఏ రూపంలో అన్నది చూడాల్సిఉంది.


మొదటి ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచ మారకపు కరెన్సీగా బ్రిటీష్‌ పౌండు ఉన్నది.1920దశకం నుంచి డాలరు క్రమంగా పెరిగి పౌండ్‌ను వెనక్కు నెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధ ముగింపులో ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్థల ఏర్పాటు తరువాత పూర్తిగా డాలరు పెత్తనం ప్రారంభమైంది. గతంలో ఒక ఔన్సు(28.35 గ్రాములు) బంగారం 35 డాలర్లకు సమానమైనదిగా మారకపు విలువ నిర్ణయించారు. 2024 డిసెంబరు రెండవ తేదీన ఒక ఔన్సు బంగారం ధర 2,626 డాలర్లు ఉంది. 1971లో డాలరుబంగారం బంధాన్ని తెంచిన తరువాత డాలరుకు ఎదురులేకుండా పోయింది. దాన్ని అడ్డుకొనేందుకు ఐరోపా ధనికదేశాలు యూరో కరెన్సీని ముందుకు తెచ్చినా డాలరుకు ప్రత్యామ్నాయం కాలేకపోయింది. గత పదిహేను సంవత్సరాలుగా డాలరు ప్రభావం క్రమంగా తగ్గుతోంది.రాజకీయంగా తమ పెత్తనానికి ఎదురు దెబ్బలు తగులుతున్న పూర్వరంగంలో ఆర్థికంగా నిలిచి ప్రపంచ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని అమెరికా చూస్తున్నది, అదే ట్రంప్‌ అజెండా, దానికి అనుగుణంగా ప్రకటనలు ఉన్నాయి.అయితే అది జరిగేనా ?

డాలరుకు ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తేవాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా 2023లో ప్రతిపాదించాడు. అంతకు ముందు నుంచే దీని గురించి చర్చ ఉంది. డాలరును ఉపయోగించవద్దని ఏ దేశం మీద కూడా వత్తిడి తేవద్దని, బ్రిక్స్‌ మద్దతు ఇచ్చే కరెన్సీలో చెల్లింపులు పెరగాలని, దుర్బలత్వాలను తగ్గించుకోవాలని లూలా అన్నాడు. తనకు నచ్చని దేశాల మీద డాలరును అమెరికా ఆయుధంగా ఉపయోగిస్తున్నది. ఇరాన్‌తో లావాదేవీలపై అమెరికా నిషేధం విధించిన కారణంగా మనదేశం అక్కడి నుంచి చమురుకొనుగోలు నిలిపివేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభానికి రష్యా ఒక్కదాన్నే బాధ్యురాలిగా చేస్తూ దాని మీద కూడ అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు మన ప్రభుత్వం ఇతర కరెన్సీలతో కొనుగోలు చేయాల్సి వచ్చింది.మరోవైపు మన కరెన్సీని అంగీకరించే విధంగా 23 దేశాలతో ఇప్పటికే అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే. రూపాయితో లావాదేవీలు జరిగితే ఎగుమతి, దిగుమతిదార్లకు కరెన్సీ మారకపు విలువ హెచ్చు తగ్గుల ముప్పు ఉండదు. మన విదేశీ వాణిజ్యంలో మూడోవంతు ఈ దేశాలతోనే జరుగుతున్నది.అమెరికాతో ఉన్న రాజకీయ బంధం, డాలరుతో తెగతెంపులు చేసుకోవటం పూర్తిగా ఇష్టం లేని కారణంగా మనదేశం ఇరకాటవస్థలో ఉంది.తామెన్నడూ డాలరును దెబ్బతీసేందుకు లక్ష్యంగా చేసుకోలేదని మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చెప్పారు. కొన్ని సందర్భాలలో తమ వాణిజ్య భాగస్వాములకు డాలర్లు ఉండటం లేదని, ఆ కారణంగా ప్రత్యామ్నాయాలను చూస్తున్నాం తప్ప ఎలాంటి దురుద్ధేశ్యాలు లేవని చెప్పారు.చైనాతో మన వాణిజ్యం లోటులో ఉండగా అమెరికాతో మిగులులో ఉంది. ఈ కారణంగానే దానితో సంబంధాల విషయంలో మనదేశం ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉమ్మడి కరెన్సీ పథకాలకు దూరంగా ఉంటోంది. కొన్ని లావాదేవీల్లో డాలర్లకు ఆటంకాలు ఉన్నందున స్థానిక కరెన్సీలతో ఏర్పాట్లు చేసుకుంటున్నది.డాలరుతో తెగతెంపులు చేసుకొనేందుకు, తద్వారా అమెరికా మార్కెట్‌ను కోల్పోయేందుకు మనదేశంలోని ఐటి, దాని అనుబంధ, సేవారంగాలలో, ఔషధ, వస్త్ర పరిశ్రమల కార్పొరేట్లు అంగీకరించే అవకాశం లేదు.

కార్పొరేట్‌ శక్తులు పశ్చిమదేశాల మార్కెట్‌ మీద కేంద్రీకరించిన కారణం కూడా విస్మరించరానిదే.మనదేశం డాలర్‌ పెట్టుబడులను ఆశిస్తున్నందున దాన్ని దెబ్బతీసేందుకు ముందుకు పోదన్నది అభిప్రాయం. బ్రిక్స్‌ కూటమి జిడిపిలో 70శాతం వాటా చైనాదే. ప్రత్యామ్నాయ కరెన్సీ రూపొందితే దానిలో ఆధిపత్యం ఉండే అవకాశం ఉంది, రాజకీయంగా దాన్ని ఎదుర్కోవాలని కోరుతున్న మనదేశంలోని చైనా వ్యతిరేకశక్తులు అంగీకరించే అవకాశం కూడా లేదు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలరుకు బదులు మరొక కరెన్సీని వినియోగించే అవకాశం లేదని, ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే అమెరికాకు వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది, బ్రిక్స్‌ దేశాలు డాలరుకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుండటాన్ని మేము గమనించటం ముగిసిందని, అద్బుతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో తమ వస్తువులను అమ్ముకోవటానికి స్వస్థి పలకాల్సి ఉంటుందని ట్రంప్‌ బెదిరించాడు. ప్రస్తుతం డాలర్‌దే ఆధిపత్యమైనా అన్ని దేశాలూ తమ విదేశీమారక ద్రవ్యంలో ఒక్క డాలరు మీదే ఆధారపడటం లేదు. ఇతర కరెన్సీలను కూడా నిల్వచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఎటుబోయి ఎటువస్తుందో అన్నట్లుగా బంగారం నిల్వలను కూడా పెంచుకుంటున్నాయి.ఇరాన్‌, రష్యా దేశాలపై ఆంక్షలు విధించి తన స్వంత చట్టాలను రుద్దుతోంది. దానిలో భాగంగా అంతర్జాతీయ అంతర బ్యాంకుల ద్రవ్య లావాదేవీల టెలికమ్యూనికేషన్‌ సమాజ (స్విఫ్ట్‌) వ్యవస్థ నుంచి వాటిని ఏకపక్షంగా తొలగించింది. రేపు తనకు నచ్చని లేదా లొంగని ఏ దేశం మీదనైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవచ్చుగనుక గత కొద్ది సంవత్సరాలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కరెన్సీల గురించి ఆలోచిస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాలు ప్రపంచ వాణిజ్యంలో 23శాతం కలిగి ఉన్నాయి. ఇవి నూతన కరెన్సీని సృష్టించటం లేదా డాలరును పక్కన పెట్టే మరొక కరెన్సీకి మద్దతు ఇవ్వబోమని తమకు హామీ ఇవ్వాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశాడు. మహావృక్షం వంటి డాలరుకు బదులు మరొక పిలక కోసం ప్రయత్నించినా ఫలితం ఉండదన్నాడు. సార్వభౌత్వం కలిగిన ఏ దేశమూ ఇలాంటి హామీ ఇవ్వదు. అమెరికా నాయకత్వంలోని జి7 కూటమిని ఎదుర్కోవాలంటే బ్రెజిల్‌,రష్యా,భారత్‌,చైనా చేతులు కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గోల్డ్‌మన్‌ శాచస్‌ ప్రధాన ఆర్థికవేత్త జిమ్‌ ఓ నెయిల్‌ 2001లో ప్రతిపాదించాడు. తరువాత అది నిజంగానే 2011లో ఉనికిలోకి వచ్చింది. డాలరును తాము ఏకపక్షంగా తిరస్కరించటం లేదని, డాలరు లావాదేవీలపై పరిమితులు విధిస్తున్నందున ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి వస్తోందని ఆంక్షలకు గురైన రష్యా అధినేత పుతిన్‌ ఇటీవల జరిగిన కజాన్‌ బ్రిక్స్‌ సమావేశాల్లో చెప్పాడు. ఇప్పటికే ఈ కూటమి ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్‌ బాంక్‌(ఎన్‌డిబి)ని మరింతగా విస్తరించాలని కూడా నిర్ణయించారు.

ప్రస్తుతం అమెరికా ఖండాల్లో వాణిజ్యంలో 96శాతం, ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో 74, ఇతర చోట్ల 74శాతం డాలరు వినియోగంలో ఉంది. ఐరోపాలో మాత్రం 66శాతం యూరో ఆక్రమించింది. ప్రపంచ దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో 60శాతం డాలర్ల రూపంలో, మిగిలింది ఇతర కరెన్సీలు, బంగారం రూపంలో ఉంటుంది. ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 1960దశకంలో ప్రపంచ జిడిపిలో అమెరికా వాటా 40శాతం కాగా 2023లో 26శాతానికి పడిపోయింది.చైనాను చూస్తే 2000 సంవత్సరంలో 3.6శాతంగా ఉన్నది 16.9శాతానికి పెరిగింది. మన జిడిపి ఇదే కాలంలో 1.4 నుంచి 3.4శాతానికి మాత్రమే పెరిగింది. దేశాల రిజర్వుబ్యాంకులు తమ వద్ద నిల్వ ఉంచుకొనే విదేశీ కరెన్సీలలో డాలరు వాటా 2002లో 70శాతం ఉండగా 2024 మార్చి ఆఖరులో 59శాతం ఉంది. ఇదే సమయంలో యూరో, ఎన్‌, పౌండ్‌ తప్ప ఇతర కరెన్సీల వాటా 1.8 నుంచి 10.9శాతానికి పెరిగింది. అనేక దేశాలు డాలరును క్రమంగా వదిలించుకుంటున్నాయి. ఎప్పుడు ఎలాంటి అస్థిరతకు గురికావాల్సి వస్తుందో అన్న భయంతో ఇటీవలి కాలంలో బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచుతున్నాయి.దేశాల రిజర్వుబాంకులు 2010లో 79.15 టన్నుల బంగారం కొనుగోలు చేయగా 2015లో 579.6 టన్నులు, 2023లో 1,037.1టన్ను కొనుగోలు చేశాయి. మన విషయానికి వస్తే ఆర్‌బిఐ ప్రతినెలా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నది.జనవరి నుంచి 43 టన్నులు కొనుగోలు చేయగా మొత్తం నిల్వ 846 టన్నులకు పెరిగింది. చైనా రిజర్వుబాంకు వద్ద అక్టోబరు ఆఖరులో 2,264 టన్నుల బంగారం ఉంది. గతేడాది అన్ని దేశాల కేంద్ర బాంకులు కొనుగోలు చేసిన 1,037 టన్నుల్లో 30శాతం చైనా పీపుల్స్‌ బాంకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది అంతకు మించి కొనుగోలు చేయనున్నట్లు జనవరిమార్చినెలల్లో లావాదేవీలు వెల్లడిరచాయి. ఎందుకు ఈ విధంగా కొనుగోలు చేస్తున్నదంటే డాలరుకు ప్రత్యామ్నాయంగా కరెన్సీని ముందుకు తెచ్చేందుకే అని పరిశీలకులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయా దేశాల్లో విదేశీమారక నిల్వల్లో పోర్చుగల్‌లో బంగారం వాటా 72శాతం, అమెరికా 70,జర్మనీ 69, ఫ్రాన్సు 67, ఇటలీ 66, నెదర్లాండ్స్‌ 58, టర్కీ 30, రష్యా 26శాతం భారత్‌ 9, చైనా నాలుగుశాతం మాత్రమే కలిగి ఉన్నాయి. శాతం రీత్యా చూస్తే మనం ఎగువన ఉన్నప్పటికీ విలువలో చూస్తే చైనాతో ఎంత తేడా ఉందో పైన పేర్కొన్న అంకెలు వెల్లడిస్తాయి.

మొత్తంగా బ్రిక్స్‌ దేశాల మీద ట్రంప్‌ దాడి ఉన్నప్పటికీ కేంద్రీకరణ అంతా చైనా మీదనే అన్నది స్పష్టం.అక్కడి మార్కెట్‌లో తన వస్తువుల విక్రయాలకే ఈ వత్తిడి. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ దాడి తీవ్రత పెరగవచ్చని ఊహించిన చైనా ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు గత ఆరు సంవత్సరాలుగా ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నది. దాని అమ్ముల పొదిలో కూడా అమెరికాను దెబ్బతీసే కొన్నిఅస్త్రాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఉదాహరణకు చైనా వద్ద అమెరికా తీసుకున్న రుణం 734 బిలియన్‌ డాలర్లు ఉంది.2017 నుంచి క్రమంగా ఈ మొత్తాలను తగ్గిస్తున్నది. దాన్ని ఇతర దేశాలకు చైనా విక్రయిస్తే ప్రపంచ మార్కెట్ల మీద ప్రతికూల ప్రభావం, అమెరికా బాండ్ల మీద వచ్చే రాబడి తగ్గి ఆకర్షణ కోల్పోతుంది. తన దగ్గర ఉన్న 3.38లక్షల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వదిలించుకుంటే చైనాకూ సమస్యలు వస్తాయి.అమెరికాను దెబ్బతీయాలంటే తన కరెన్సీ యువాన్‌ విలువ తగ్గింపు ఒక ఆయుధం. దానితో లాభంనష్టం రెండూ ఉన్నాయి. సెమీకండక్టర్లు, విద్యుత్‌ బాటరీలకు ఉపయోగించే అరుదైన ఖనిజాల ఎగుమతులు నిలిపివేయవచ్చు. తమ మార్కెట్లో ఆపిల్‌, టెస్లా వంటి అమెరికా కార్పొరేట్‌ కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించి దెబ్బతీయవచ్చు.అయితే వాటిని ప్రయోగిస్తుందా లేదా అన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమదేశాలు వద్దు – మాతృదేశమే ముద్దు అంటున్న చైనా విద్యాధికులు !

06 Wednesday Nov 2024

Posted by raomk in Asia, CHINA, COUNTRIES, Current Affairs, Europe, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, China AI, China education power, GenAI Patents, Narendra Modi Failures, STEM PhDs, WIPO, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

అంతరిక్ష రంగంలో అమెరికాకు ధీటుగా 2050నాటికి అగ్రదేశంగా మారేందుకు చైనా మూడు దశల ప్రణాళికలు రూపొందించింది.వివిధ గ్రహాల గురించి పరిశోధన, ఒక అంతర్జాతీయ లూనార్‌ పరిశోధనా కేంద్ర నిర్మాణం వంటివి దీనిలో ఉన్నాయి.చంద్రుడి మీదకు 2030నాటికి వ్యోమగాములను పంపే లక్ష్యం కూడా ఉంది. ఆర్థికంగా చైనా ఇబ్బందుల్లో ఉందని చెబుతున్నవారే ఈ పరిశోధనలకు భారీ మొత్తాలను ఎలా ఖర్చు పెడుతున్నదంటూ ఆశ్చర్యపోతున్నారు. దేశ చరిత్రను చూసినపుడు లక్ష్యాలను ప్రకటించిన నిర్ణీత కాలంలో పూర్తిచేసిన చరిత్ర ఉందని కూడా అంటున్నారు. తొలిసారిగా చంద్రుడికి ఆవలి వైపున రోవర్‌ను దించిన చైనా ఘనత తెలిసిందే.అంతరిక్ష లక్ష్యాల రోడ్‌ మాప్‌ను కేంద్ర కాబినెట్‌ స్థాయి కార్యాలయం పర్యవేక్షించనుంది.2028 నుంచి 2035వరకు మానవులను పంపే కార్యక్రమాలతో పాటు చంద్రుడిపై పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.మూడవ దశలో 30మిషన్‌లను ప్రయోగిస్తారు.ఐరోపా స్పేస్‌ ఏజన్సీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తారు.తమ అంతరిక్ష పరిశోధన ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉందని, ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు చైనా అధికారులు చెప్పారు.

పశ్చిమ దేశాల్లో పరిశోధనలు చేయటం, చేతి నిండా సంపాదించటం ఎంతో మంది కనేకల. అది తప్పేం కాదు. స్వదేశంలో తమ మేథకు పదును పెట్టే అవకాశాలు, దానికి తగిన ప్రతిఫలం పొందే పరిస్థితి లేనపుడు ఎవరైనా ఇదే విధంగా ఆలోచిస్తారు. గతంలో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడి సంపాదించిన వారిని చూస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రపంచమంతటా ఇలాంటి ‘‘ డాలరు కలలు ’’ కనేవారు ఉన్నారు. దీన్నే మరో విధంగా మేథోవలస అనేవారు. ధనికదేశాలన్నీ ఇలాంటి వలసలను ప్రోత్సహించి సొమ్ము చేసుకున్నాయి. చైనా తాజాగా వెల్లడిరచిన సర్వే సమాచారం ప్రకారం ‘‘స్టెమ్‌’’ (సైన్సు,టెక్నాలజీ,ఇంజనీరింగ్‌,గణిత శాస్త్రాలకు పెట్టిన పొట్టి పేరు) పరిశోధనకు(పిహెచ్‌డి) విదేశాలకు వెళ్లిన చైనీయులలో 80శాతం మంది తిరిగి వస్తున్నారట. 1987లో కేవలం ఐదుశాతమే ఉండగా 2007లో 30.6శాతం నుంచి ఇప్పుడు 80శాతానికి చేరారు. ధనికదేశాల్లో అకడమిక్‌ అవకాశాల కోసం ఇప్పటికీ పెద్ద ఎత్తున పోటీ ఉంది.ఎందుకు చైనీయుల్లో ఇలాంటి మార్పు అని చూస్తే ప్రపంచ భూ భౌతికఆర్థిక శక్తిగా చైనా ఎదగటం తప్ప మరొక కారణం లేదు. స్టెమ్‌ గ్రాడ్యుయేట్లకు చైనాలో అవకాశాలు, ఆర్థిక ప్రతిఫలాలు కూడా ఏటేటా పెరుగుతున్నాయి.అయితే విదేశాల్లో ఇంకా ఆకర్షణ కొనసాగుతూ ఉంటే వలసలు మరోసారి కొనసాగవని చెప్పలేము.చైనాలో పెరుగుతున్న ఆర్థిక లబ్దితో పాటు, ఒకే బిడ్డ అన్న విధానం అమల్లోకి వచ్చిన తరువాత పుట్టిన తరానికి చెందిన వారు వృద్ద తలిదండ్రులను చూసుకోవాల్సిన కుటుంబ సంబంధాలు కూడా పరిశోధకులు తిరిగి రావటం వెనుక కారణాలుగా తేలాయి.పశ్చిమదేశాల్లో సంపాదించిన దానికి దగ్గరగా చైనాలో కూడా ఉండటంతో తిరిగి వచ్చేవారి వేగం పెరుగుతున్నది.


చైనాలో విద్య, పరిశోధనలకు పెద్ద పీటవేస్తున్న కారణంగా అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌(జన్‌ఏఐ) పేటెంట్లకు దరఖాస్తున్నట్లు ప్రపంచ పేటెంట్‌ సంస్థ(డబ్ల్యుఐపిఓ) తాజా సమాచారం వెల్లడిస్తున్నది. ఈ రంగంలో అగ్రశ్రేణిలో ఉన్న అమెరికా, దక్షిణ కొరియా,జపాన్‌, భారత్‌ను చైనా అధిగమించింది. 2023తో ముగిసిన దశాబ్దిలో దాఖలైన 54వేల దరఖాస్తుల్లో నాలుగోవంతు గతేడాదిలోనే ఉన్నాయి.చైనా నుంచి 201423 సంవత్సరాలలో 38వేల దరఖాస్తులు వచ్చాయి.వేగంగా దూసుకువస్తున్న కృత్రిమ మేథ సాంకేతిక పరిజ్ఞానం ఆటతీరునే మార్చివేయనుంది. ఇదే కాలంలో 54వేల పేటెంట్‌ దరఖాస్తులతో పాటు 75వేల శాస్త్రీయ పత్రాల ప్రచురణ కూడా చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో జారీచేసిన అన్ని రకాల పేటెంట్లలో ఏఐ వాటా కేవలం ఆరుశాతమే. పది అగ్రశ్రేణి సంస్థలలో టెన్‌సెంట్‌(2,074, పింగ్‌ యాన్‌ ఇన్సూరెన్స్‌(1,564), బైడు(1,234), చైనీస్‌ సైన్స్‌ అకాడమీ(607), అలీబాబా (571) శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ (468),ఆల్ఫాబెట్‌(443), బైట్‌డాన్స్‌(418), మైక్రోసాఫ్ట్‌ 377 ఉన్నాయి. మొత్తం దేశాల వారీ చూస్తే చైనా 38,210, అమెరికా 6,276, దక్షిణ కొరియా 4,155, జపాన్‌ 3,409, భారత్‌ 1,350 ఉన్నాయి. రంగాల వారీగా ఇమేజ్‌, వీడియో డేటా, 17,996,టెక్స్ట్‌ 13,494, మాటలు లేదా సంగీతం 13,480 ఉన్నాయి.విదేశాల్లో చదివి భారత్‌కు తిరిగి వచ్చే విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలు ఉండటం లేదని కెనడా విద్యాసంస్థ ఎం స్క్వేర్‌ మీడియా (ఎంఎస్‌ఎం) తన సర్వేలో తేలినట్లు 2023 ఫిబ్రవరిలో ప్రకటించింది. విదేశీ డిగ్రీల గుర్తింపుతో సహా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని తెలిపింది. 2022లో 7.7లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు.201519 మధ్య విదేశాల్లో చదువుకొని స్వదేశం తిరిగి వచ్చిన వారిలో 22శాతం మాత్రమే ఉపాధి పొందినట్లు తేలింది. విదేశీ డిగ్రీలు, డిప్లొమాలకు భారత్‌లో గుర్తింపు లేకపోవటం ఒక ప్రధాన సమస్య.


ప్రపంచ ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకున్న చైనా తన సత్తాను ఇతర రంగాలకూ విస్తరిస్తున్నది.2035 నాటికి అగ్రశ్రేణి విద్యాశక్తిగా మారేందుకు పథకాలను రూపొందించింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన విద్యాకేంద్రంగా మారేందుకు చూస్తున్నట్లు చైనా విద్యామంత్రి హువెయ్‌ జిన్‌పెంగ్‌ ఇటీవల ప్రకటించాడు.సైన్సు, ఇంజనీరింగ్‌ రంగాలలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సంయుక్త డిగ్రీకోర్సులతో సహా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పాడు. అనేక ఇబ్బందులు, సవాళ్లు ఉన్నప్పటికీ అధ్యక్షుడు షీ జింపింగ్‌ మార్గదర్శకత్వంలో రూపొందించిన ప్రణాళికను అమలు జరపనున్నట్లు వెల్లడిరచాడు. పెద్ద విద్యాశక్తిగా ఉన్న స్థితి నుంచి బలమైన శక్తిగా మారేందుకు 2010లో నిర్ణయించామని, తాజా లక్ష్యాన్ని 2020లోనే ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆచరణలో పెట్టినట్లు జిన్‌ పెంగ్‌ చెప్పాడు.ఆర్థికంగా కొన్ని సమస్యలున్నప్పటికీ విద్యారంగ పథకాలను కొనసాగించాల్సిందేనని షీ జింపింగ్‌ నిర్దేశించాడు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ సమాచారం 2024 ప్రకారం 207 దేశాల విద్యారంగ సమాచారాన్ని విశ్లేషించగా చైనా 13వ రాంక్‌లో ఉండగా భారత్‌ 101. మనకంటే ఎగువన శ్రీలంక 61,నేపాల్‌ 56, దిగువన మయన్మార్‌ 109, బంగ్లాదేశ్‌ 122,పాకిస్తాన్‌ 136 స్థానాలలో ఉన్నాయి. విద్యార్థుల్లో 1823 సంవత్సరాల వయస్సు వారిలో ఉన్నత విద్యకు వెళ్లే వారు ప్రస్తుతం చైనాలో(జిఇఆర్‌) 60శాతం దాటారు, ఇది ఉన్నత మధ్యతరగతి ఆదాయ దేశాలకు సమానం. 2012లో ఇది 30శాతం మాత్రమే ఉండేది. అందరికీ ఉన్నత విద్యలో చైనా ప్రపంచ స్థాయికి ఎదిగింది. రానున్న ఐదు సంవత్సరాల్లో అమెరికా నుంచి 50వేలు, ఫ్రాన్సునుంచి మూడు సంవత్సరాలల్లో పదివేల మంది విద్యార్థులను మార్పిడి కార్యక్రమం కింద ఆహ్వానించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలుగా మారేట్లు చైనా చూస్తున్నది. అక్కడ జరిగే పరిశోధన ఫలితాలను ఉత్పత్తి, సేవారంగాలలో వినియోగించే విధంగా వాణిజ్య స్థాయిలో విక్రయించేందుకు కూడా ప్రోత్సహిస్తున్నది తద్వారా ప్రభుత్వం కేటాయించే నిధులతో పాటు అదనంగా వచ్చే ఆదాయంతో మరింతగా పరిశోధకులను ప్రోత్సహించేందుకు వీలుకలుగుతుంది.ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం అమల్లో వచ్చే ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించటం, నవీకరించే పరిశోధలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.ఫలితంగా ఈ పరిశోధనల విలువ 201923కాలంలో 150 నుంచి 290 కోట్ల డాలర్లకు పెరిగింది.దీనికి అనుగుణంగానే వార్షిక నివేదికలను విడుదల చేసే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల సంఖ్య 3,447 నుంచి 4,028కి పెరిగింది. మార్కెట్లో తమ పరిశోధన ఫలితాలను అందచేసేందుకు చేసుకున్న ఒప్పందాలు కూడా 3,34 నుంచి 6.4లక్షలకు పెరిగాయి. వీటిలో 60శాతం స్థానిక సంస్థలవే కావటంతో ప్రాంతీయ అభివృద్ధికి ఎక్కువగా దోహదం చేస్తున్నాయన్నది స్పష్టం.


చైనా విద్యను కూడా ఎగుమతి చేయాలని చూస్తున్నది.దీనిలో భాగంగా అనేక దేశాలలో ఇంటర్నేషనల్‌ స్కూళ్ల స్థాపనకు పూనుకుంది. చైనీయులు అనేక దేశాల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు.వారి కుటుంబాలు తిరిగి రావాలంటే చైనా విద్య అవసరం ఎంతో ఉంది.చైనా స్కూళ్లలో ఏ పాఠ్యాంశాలనైతే బోధిస్తున్నారో వాటి నకలుతో దుబాయ్‌లో 500 చైనా కుటుంబాల విద్యార్థులతో స్కూలు నడుస్తున్నది. రానున్న రోజుల్లో అనేక దేశాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. దుబాయ్‌లో ప్రయోగాత్మకంగా 2020 నుంచి నడుస్తున్నది. అమెరికా,బ్రిటన్‌తో సహా 45 దేశాలలో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశాలను చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ తన దౌత్యవేత్తలను కోరింది. ప్రపంచంలో కోటి మంది చైనీయులు ఆ దేశానికి చెందిన కంపెనీలలో పనిచేస్తున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత స్థానికులతో అలాంటి వారి పిల్లలు పోటీపడలేకపోతున్నారు. అందువలన చైనా భాష, సిలబస్‌తో ఆ లోపాన్ని అధిగమించేందుకు స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇతర దేశాల వారిని కూడా ఈ స్కూళ్లకు ఆకర్షించేలక్ష్యం కూడా దీని వెనుక ఉంది. ఉదాహరణకు విదేశాల్లో నడిపే ఫ్రెంచి స్కూళ్లలో కేవలం నలభైశాతం మందే ఆ దేశానికి చెందిన వారుంటుండగా మిగతావారందరూ ఇతర దేశీయులే. అమెరికన్‌ స్కూళ్లలో పరిస్థితి కూడా ఇదే. చైనాలో కొన్ని ప్రైవేటు సంస్థలు స్కూళ్లను నడుపుతున్నాయి. ఇవి విదేశాల్లో కూడా చైనా స్కూళ్లను ప్రారంభిస్తే ప్రభుత్వం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్నికలకు ముందే కెనడా ప్రధానికి ఉద్వాసన ? విశ్వగురువు ఇప్పటికైనా కళ్లు తెరిచేనా !

25 Friday Oct 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

anti india, Donald trump, Joe Biden, Justin Trudeau, khalistan, Narendra Modi, war on terrorism

ఎం కోటేశ్వరరావు


అక్టోబరు నెల మధ్య నుంచి జరుగుతున్న పరిణామాలతో భారత్‌కెనడా సంబంధాలు తీవ్ర వత్తిడికి గురవుతున్నాయి. అమెరికా, దాన్ని అనుసరించే దేశాలన్నీ మన మీద కత్తిగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో కెనడా పాలకపక్షంలో కొందరు ఎంపీలు ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ 2024 అక్టోబరు 28లోగా పదవి నుంచి తప్పు కోవాలని, మరోసారి ఎన్నికల గోదాలో దిగవద్దని 153 మంది పాలక పార్టీ ఎంపీల్లో 24 మంది డిమాండ్‌ చేసినట్లు కెనడా బ్రాడ్‌కాస్ట్‌ కార్పొరేషన్‌ వార్తను ప్రసారం చేసింది. ఇది ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. అంతకు ముందు పరస్పరం కొందరు దౌత్యవేత్తల బహిష్కరణ మిగిలిన సిబ్బందిపై నిఘావంటి ప్రకటనలతో ఇరుదేశాల మధ్య దౌత్య యుద్దం, ప్రచారదాడి జరుగుతోంది. ఇది రాసిన సమయానికి 270కిపైగా భారత విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసులకు బాంబు బెదిరింపులు రావటం ఆందోళన కలిగించే పరిణామం. గురువారం ఒక్కరోజే 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఇలాంటి పరిస్థితిని మనం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఏ విమానం ఎక్కితే బాంబు ఉన్నట్లు సమాచారం వస్తుందో తెలియని డోలాయమానంలోకి ప్రయాణీకులను నెట్టి భయాన్ని సృష్టించమే ఈ ఉదంతాల వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడగా కనిపిస్తోంది. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నడిపితే, ఏదైనా విమానంలో నిజంగా బాంబుపెడితే జరిగే ఘోరాన్ని తలచుకోవాలంటేనే వణుకుపుడుతోంది. దేశం 1980 దశకం నాటి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పరిస్థితులకు వెళుతోందా అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడకూడదు. అలా పరిగణిస్తే దాన్ని నివారించే బాధ్యత, పోలీసు, ఇతర భద్రతా వ్యవస్థలపై పడుతుంది. అలాంటి సంస్థలు ప్రపంచ వ్యాపితంగా అనుసరించిన దగ్గరి దారి ఏమంటే జనం మీద దాడికి దిగటం. కిరాయికి లేదా ప్రత్యేక ముఠాలను రూపొందించి ఉగ్రవాదులు, ఇతర దేశవ్యతిరేకులను మట్టుబెట్టించటం. ఇది ఒక విధంగా అధికారిక ఉగ్రదళం వంటిదే. ఉగ్రవాదులు తలెత్తకుండా ఉండాలంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, అవాంఛనీయ చర్యలకు పాల్పడినపుడు అవసరమైతే ఆయుధ ప్రయోగం చేయవచ్చు.మన కళ్ల ముందే పాలస్తీనా దేశాన్ని విభజించి యూదుల మాతృభూమి పేరుతో ఇజ్రాయెల్‌ ఏర్పాటు జరిగింది.ఉనికిలో ఉన్న పాలస్తీనా అదృశ్యమైంది. దాని పునరుద్దరణకు ఏడు దశాబ్దాలుగా పోరాటం సాగుతున్నది.యావత్‌ పాలస్తీనియన్లు దానిలో పాల్గొంటున్నారు.వారిని కూడా ఉగ్రవాదులుగా అమెరికా చిత్రిస్తున్నది. ప్రపంచంలో వేర్వేరు కారణాలతో అనేక చోట్ల ఆందోళనలు సాగుతున్నాయి. ఈ పూర్వరంగంలో ఖలిస్తాన్‌ ఏర్పాటు అన్న భావనను మెజారిటీ సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో సమర్ధించిన వారందరూ ఉగ్రవాదులు కాదు, దానికోసం ఆయుధాలు చేపట్టి, అవాంఛనీయ చర్యలకు పాల్పడిన వారు మాత్రమే తీవ్రవాదులు.

మనదేశంలో నాగాలాండ్‌, మిజోరాం, కాశ్మీరు, పంజాబ్‌ వేర్పాటు వాదం తలెత్తింది. ఆయుధాలు రంగంలోకి వచ్చాయి. వాటన్నింటికీ అమెరికా, కెనడా,బ్రిటన్‌, వంటి పశ్చిమదేశాలు మద్దతు ఇస్తున్నాయి, ఆ శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఒక్క మనదేశమే కాదు శ్రీలంక వేర్పాటు వాదుల వెనుక, అనేక దేశాల్లో రకరకాల పేర్లతో ఉన్న శక్తులకు మద్దతు ఇస్తున్నదీ ఈ దేశాలే. దాని వెనుక తమను వ్యతిరేకించేదేశాలను అస్తిరపరచటం లేదా విచ్చిన్నం చేసే సామ్రాజ్యవాదులు ఎత్తుగడ ఉంది, దానికి ఉగ్రవాదం ఒక ఆయుధం. కొన్ని సందర్భాలలో ఉగ్రవాద చర్యలు నిలిచిపోయాయంటే దాని అర్ధం తెరవెనుక పశ్చిమదేశాలకు అనుకూలమైన పరిణామాలు జరిగినట్లే లెక్క. తిరిగి ప్రారంభమయ్యాయంటే పూర్తిగా తమకు లొంగలేదని అవి కథనడిపిస్తున్నట్లే. లేకుంటే ఆకస్మికంగా గత పదిరోజులుగా మాత్రమే మన విమానాలకు బాంబుల బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి ? అవి ఐరోపా ఖండ దేశాల నుంచే ఎలా వస్తున్నట్లు . ప్రపంచ ఉగ్రవాదుల అణచివేతకు తాయత్తు కట్టుకొని బరిలోకి దిగామని చెబుతున్న అమెరికా, కెనడా వంటి దేశాలు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఎందుకు కల్పిస్తున్నట్లు, వారికి పౌరసత్వం ఎందుకు ఇస్తున్నాయి. పంజాబీలందరూ ఖలీస్తానీవాదులు కాదు, ఉగ్రవాదులూ కాదు. మనదేశాన్ని లొంగతీసుకోవాలని కోరుకొనే పశ్చిమదేశాలకు మేకపిల్లతోడేలు కథ మాదిరి ఏదో ఒకసాకుతో ఉగ్రశక్తులను రెచ్చగొట్టేందుకు అవకాశాలున్నాయనేది కెనడా ఉదంతం వెల్లడిస్తోంది.


అమెరికాకెనడా రెండు దేశాల్లోనూ పౌరసత్వం ఉన్న మనదేశానికి చెందిన గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని హత్య చేసేందుకు చేసిన కుట్రలో మన గూఢచారి వికాస్‌ యాదవ్‌ ఉన్నట్లు అమెరికా కోర్టు ప్రకటించించింది. దాంతో యాదవ్‌ మీద అరెస్టు వారంట్‌ జారీచేసి ఎఫ్‌బిఐ జాబితాలో అత్యంత కీలక వాంఛనీయ వ్యక్తిగా బహిరంగంగా ప్రకటించారు. ఇలా మన పౌరుడి గురించి ప్రకటించటం ఇదే మొదటిసారి. అమెరికా మనకు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నదని నరేంద్రమోడీ గతంలో అనేకసార్లు గొప్పగా చెప్పారు. తమ అవసరాల రీత్యా డోనాల్డ్‌ ట్రంప్‌ పలు సందర్భాలలో నరేంద్రమోడీని పొగడ్తల వర్షంతో ముంచెతారు. చెట్టపట్టాలు వేసుకు తిరిగాడు, భారత దేశ పిత అంటూ కితాబులిచ్చాడు. జో బైడెన్‌ తక్కువ తిన్నాడా ‘‘ మోడీజీ మీరు నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టారు. నా కంటే మా దేశంలో మీ పలుకుబడి ఎక్కువగా ఉంది. మీతో కలసి భోంచేసేందుకు దేశమంతటి నుంచి ఎందరో ఎదురు చూస్తున్నారు. ఉన్న సీట్లన్నీ అయిపోయాయి. నేనేదో మిమ్మల్ని ఆటపట్టిస్తున్నా అనుకోవద్దు, ఇది నిజం, కావాలంటే నా బృందాన్ని అడగండి, రోజూఎన్నో ఫోన్లు వస్తున్నాయి నాకు.’’ గతేడాది మే నెలలో చైనాకు వ్యతిరేకంగా జరిగిన క్వాడ్‌(చతుష్టయ) సమావేశానికి ముందు మోడీని మునగ చెట్టు ఎక్కిస్తూ జోబైడెన్‌ పలుకులివి. వీటితో అనేక మంది అమెరికా అధినేతలనే మనకాళ్ల వద్దకు తెచ్చిన మొనగాడిగా నరేంద్రమోడీని పొగిడారు. రాముడు సీతను కోరినట్లుగా ఇప్పుడు దర్యాప్తుకు సహకరించి ఎలాంటి నేరం చేయలేదని నిరూపించుకోండి అంటూ నరేంద్రమోడీని అగ్నిపరీక్షకు పూనుకోవాలంటున్నా పశ్చిమదేశాలు.మరో ఖలిస్తానీ ఉగ్రవాది హరదీప్‌ నిజ్జర్‌ను 2023లో కెనడాలో హత్య చేశారు. దానిలో కూడా భారత అధికారుల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. నిర్దిష్ట చట్టబద్ద ఆధారాలు లేవంటూనే తమ దగ్గర ‘‘ ఐదు కళ్ల ’’ నిఘా సమాచారం ఉందని చెబుతోంది. దాన్ని నిర్వహిస్తున్న దేశాలు కూడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ గతేడాది కాలంగా వత్తిడి తెస్తున్నాయి. అమెరికా ఎలా కావాలంటే అలా నివేదికలు తయారు చేస్తే మిగిలిన దేశాలన్నీ సంతకాలు చేస్తాయన్నది తెలిసిందే. నిజానికి వాటి వద్ద ఎలాంటి సమాచారమూ లేదని వార్తలు.

ఇటీవలి కాలంలో విదేశాల్లో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు, మరికొందరు వ్యక్తులు హత్యలకు గురవుతున్నారు. మనకు వ్యతిరేకంగా ఎవడైనా పని చేస్తూ వారికి ఇదే గతి, చూడండి మన తడాఖా, ఎలా లేపేస్తున్నామో అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్న సంగతి, ఆ ఘనతను ఎవరికి ఆపాదిస్తున్నదీ తెలిసిందే.మన సీనియర్‌ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలకు ఇద్దరు ముగ్గురు చొప్పున ఖలిస్తానీ ఉగ్రవాదులను లేపేసేందుకు యాదవ్‌ అనే అతన్ని కేంద్ర కాబినెట్‌ సచివాలయం కింద నేరుగా కిరాయికి పని చేసేందుకు ‘‘రా’’ నియమించిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు యాదవ్‌ ప్రభుత్వానికి పనిచేయటం లేదని విదేశాంగశాఖ ప్రకటించటం ద్వారా నియామకం వాస్తవమే అని అంగీకరించినట్లయింది. ఇప్పుడు వచ్చిన ఆరోపణలపై మన ప్రభుత్వమే విచారణ జరుపుతుందా లేక అమెరికా దర్యాప్తు సంస్థలకు అతన్ని అప్పగిస్తుందా అన్నది తెలియదు. ఏది జరిగినా పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది ఊహించలేము. విదేశాలలో ఉన్న తమ వ్యతిరేకశక్తులను మట్టుపెట్టేందుకు సిఐఏ,మొసాద్‌, ఐఎస్‌ఐల కిందపనిచేసే హంతక దళాలను ఆయా ప్రభుత్వాలు నియమించటం, వాటి దుర్మార్గాల గురించి మనకు తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం వినియోగించిన దాఖలాలు లేవు.ఇదొక ప్రమాదకరమైన క్రీడ.

కెనడాను మనం ఎంతగా కౌగిలించుకున్నా గతంలో ఎన్నడూ అది మిత్రదేశంగా చూడలేదు. దాన్ని కాదని మనల్ని ఎన్నడూ అమెరికా విశ్వాసంలోకి తీసుకోలేదు.ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్‌ ట్రుడేవ్‌ తండ్రి కూడా గతంలో ప్రధానిగా పనిచేశాడు. రెండు దేశాల మధ్య తాజా వివాదానికి 2018లో జరిగిన ఉదంతం నాంది అని చెప్పవచ్చు. కెనడాలో ఏడు లక్షల 70వేల మంది సిక్కులు ఉన్నారు. జనాభాలో వారి 2.1శాతమే అయినప్పటికీ అక్కడి రాజకీయాల్లో ఎంతో పలుకుబడి కలిగిన వారు. 2018లో ప్రధాని ట్రుడేవ్‌ మనదేశానికి రానున్న సందర్భంగా అతగాడి కార్యాలయం మనదేశానికి చెందిన వారితో సహా 423 మంది పేర్లతో ఒక అతిధుల జాబితాను రూపొందించి వారిని ఆహ్వానించాలని ఆదేశించింది. వారిలో జస్పాల్‌ సింగ్‌ అత్వాల్‌ అనే నేరగాడు ఒకడు.1986లో పంజాబ్‌ మంత్రిగా ఉన్న అకాలీ నేత మల్కాయిత్‌ సింగ్‌ సిద్దు మీద కెనడాలో హత్యాయత్నం జరిగింది. శిక్షపడిన వారిలో అత్వాల్‌ ఒకడు.ట్రుడేవ్‌ సతీమణి సోఫీతో ముంబైలో ఫొటోకూడా దిగాడు. దాంతో వివాదం చెలరేగి తదుపరి ఢల్లీి కార్యక్రమానికి ఆహ్వానాన్ని రద్దు చేశారు.2023 జూన్‌ 18 కెనడా నగరం వాంకోవర్‌ శివారు సురే గురుద్వారా దగ్గర హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే కెనడా పౌరుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మన గూఢచారులే ఆ పని చేసినట్లు అప్పటి నుంచి కెనడా ఆరోపిస్తోంది.తరువాత మనదేశంలో వాణిజ్య చర్చలను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబరు నుంచి మనపౌరులకు వీసాల నిలిపివేత, దౌత్యవేత్తల బహిష్కరణ వంటి పనులు చేస్తున్నది.మనదేశం కూడా ప్రతి చర్యలు తీసుకుంది.తాజాగా అది మరింత ముదిరింది.

తాజా పరిణామాలపై మీడియాలో అనేక భాష్యాలు వెలువడుతున్నాయి. వాటిలో ఒకటేమంటే అమిత్‌ షా,అజిత్‌ దోవల్‌ను కెనడా లక్ష్యం చేసుకున్నదట.దీని అర్ధం నరేంద్రమోడీని, అన్నింటికంటే మించి దేశాన్ని సహిస్తున్నట్లా ? అమెరికా, కెనడా వాటిని అనుసరించే ధనికదేశాలన్నీ మొత్తంగా మన దేశాన్నే లక్ష్యంగా చేసుకున్నాయి.దానిలో భాగంగా పెద్ద గేమ్‌ ఆడుతున్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తుల కార్యకలాపాలు తీవ్ర ఆందోళనకరమేగాక దేశ భద్రత మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని సిపిఐ(ఎం) వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందని ప్రకటించింది.ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని లారెన్స్‌ విష్ణోయ్‌ ముఠా పాత్రతో సహా అన్ని అంశాల మీద ప్రభుత్వం వ్యవహరించాలని కోరింది. మనదేశం పశ్చిమదేశాలతో ప్రస్తుతం ముద్దులాటదెబ్బలాటలాడుతున్నదని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమదేశాలకు లొంగటం లేదు, చైనా విషయంలో కొన్ని సార్లు అనుకూలంగా మరికొన్ని సార్లు వాటి వాంఛలకు భిన్నంగా వెళుతున్నది. మొత్తంగా చూసినపుడు తమకు తాన తందాన అనటం లేదనే ఉక్రోషం పశ్చిమదేశాల్లో నానాటికీ పెరిగిపోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికైనా కళ్లు తెరిచి గతంలో మాదిరి అలీన విధానాన్ని అనుసరించి దేశస్వతంత్ర వైఖరిని ప్రదర్శించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాజాలో మారణకాండకు ఏడాది : ఆయుధాలతో ఇజ్రాయెల్‌,తప్పుడు వార్తలతో మీడియా దాడి !

09 Wednesday Oct 2024

Posted by raomk in Asia, COUNTRIES, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

fake news, Hamas Israel, Israel genocide, Joe Biden, media bias, media credibility, Netanyahu, Palestinians, Propaganda War, Western media propaganda


ఎం కోటేశ్వరరావు


తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలన్న లోకోక్తి తెలిసిందే. వర్తమాన ప్రపంచంలో అలా జరుగుతోందా ? నూటికి నూరుశాతం లేదు. పక్షపాత తీర్పులు, వైఖరులే వెల్లడౌతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమై అక్టోబరు ఏడవ తేదీతో ఏడాది గడిచింది. ప్రపంచ ప్రధాన స్రవంతి మీడియా ఇజ్రాయెల్‌ మీద హమస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడికి సంవత్సరం నిండిరది అంటోంది. హమస్‌దాడిని ఎవరూ సమర్ధించటం లేదు. ఐక్యరాజ్య సమితి 1948లో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసిన తరువాత అప్పటి వరకు ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. ఏదో ఒకసాకుతో దానికి కేటాయించిన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవటంతో పాటు వేలాది మందిని చంపి, లక్షల మందికి నిలువనీడ లేకుండా చేస్తూ పాలస్తీనా దేశం ఏర్పడకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికాతో సహా పశ్చిమదేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న బృందాలలో హమస్‌ ఒకటి. దాని దాడులు గత ఏడాదే ప్రారంభం కాలేదు. కానీ అది చేసిన దాడి సాకుతో గాజాలో ఏడాది కాలంగా మారణకాండ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 42వేల మందిని చంపారు.పదివేల మంది జాడ తెలియటం లేదు, లక్ష మంది వరకు గాయపడ్డారు.లక్షలాది ఇండ్లను నేలమట్టం గావించారు. గాజాలోని 23లక్షల మందిని ఇండ్ల నుంచి వీధుల్లోకి నెట్టారు. మారణకాండ ఇంకా కొనసాగుతోంది. వెస్ట్‌బాంక్‌ ప్రాంతానికి విస్తరించారు. ఇదంతా ఎందుకు అంటే హమస్‌ జరిపిన దాడిలో 815 మంది సాధారణ పౌరులతో సహా 1,195 మంది ఇజ్రాయెలీలు మరణించారు, ఆ సందర్భంగా కొందరు విదేశీయులతో సహా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు, వారిలో కొందరిని విడుదల చేశారు, మరికొందరు మరణించగా మరో 95 మంది హమస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారం అని చెబుతున్నారు. ఏ రీత్యా చూసినా ఇజ్రాయెల్‌ చర్య గర్హనీయం, అంతర్జాతీయ న్యాయస్థానంలో యుద్ధ నేరాల కింద దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలి.


ఈ దారుణకాండ గురించి ప్రపంచ మీడియా వార్తలు ఇస్తున్న తీరు కూడా సభ్యసమాజం ఆమోదించేదిగా లేదు. అంతర్జాతీయ వార్తా సంస్థలన్నీ పశ్చిమ దేశాలకే చెందినవి కావటంతో అవి అందచేసిన తప్పుడు సమాచారాన్నే వాస్తవాలుగా చెబుతున్నారు. అయితే తప్పుడు, వక్రీకరణ, కుహనా వార్తలను ఇవ్వటం కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రపంచం మీద ప్రచారదాడి జరుగుతున్నది. గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ తీవ్రత అక్కడి నుంచి వార్తలు పంపుతున్న పశ్చిమదేశాల విలేకర్లలో ఎక్కడా కానరాదు. ప్రపంచానికి వారు అందచేస్తున్నవి తప్ప ప్రత్యామ్నాయ సంస్థలు లేవు. గాజాలో మరణించిన, గాయపడిన వారిలో నూటికి 80శాతం మంది నిరాయధులైన మహిళలు, పిల్లలే ఎందుకు ఉన్నారో ఏ మీడియా అయినా చెబుతోందా? హమస్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో చూడండి అంటూ అందచేస్తున్న వీడియోలలో ఒక శాతమైనా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు సంబంధించి లేవంటే అతిశయోక్తి కాదు. వైమానికదాడులు, టాంకుల ఫిరంగి గుళ్లకు 128 మంది జర్నలిస్టులు మరణించగా వారిలో 123 మంది పాలస్తీనియన్లు, ఇద్దరు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్‌ ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. ఏకపక్షంగా జరుగుతున్న మారణకాండకు ఇది ఒక నిదర్శనం.ఎక్కడో ఏసి గదుల్లో కూర్చొని కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు సృష్టిస్తున్నదెవరో, యుద్ధరంగంలో ప్రాణాలకు తెగించి వాస్తవాలను నివేదించేందుకు పని చేస్తున్నదెవరో అర్ధం అవుతోంది. మేము సైతం అన్నట్లుగా సాధారణ పౌరులతో పాటు పాలస్తీనా జర్నలిస్టులు పని చేస్తున్నారు, ప్రాణాలర్పిస్తున్నారు.


ఇజ్రాయెల్‌ మిలిటరీ, ప్రభుత్వ పెద్దలు అందిస్తున్న సమాచారాన్ని స్వయంగా చూసినట్లు పశ్చిమదేశాల విలేకర్లు, సంస్థలు చిత్రిస్తున్నాయి. ఐరోపాలో అతి పెద్ద మీడియా సంస్థ జర్మన్‌ యాక్సెల్‌ స్ప్రింగర్‌ అప్‌డే అనే ఒక యాప్‌ను రూపొందించింది. ఇజ్రాయెల్‌ ప్రతినిధులు చెప్పే కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలస్తీనీయుల మరణాలను తగ్గించి చూపాలని తన సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు దాని అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైందని ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. అంతేకాదు మరీ తప్పనిసరైతే తప్ప పాలస్తీనియన్ల గురించి ప్రస్తావించవద్దని అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కూడా తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. యజమానులే అలాంటి వైఖరి తీసుకున్నతరువాత నిజం రాసినా, చూపినా అవి పాఠకులు, వీక్షకుల వద్దకు చేరుకోవు అన్నది మీడియాలో పని చేసేవారందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే హమస్‌ను ఒక రాక్షసిగా, దాన్ని మట్టుపెట్టేందుకు పూనుకున్న అపరశక్తిగా, బాధిత దేశంగా ఇజ్రాయెల్‌ను చిత్రించారు. సెంటర్‌ ఫర్‌ మీడియా మోనిటరింగ్‌ ( మీడియా పరిశీలక కేంద్రం) అనే సంస్థ అంతర్జాతీయ మీడియా ఛానల్స్‌ ప్రసారం చేసిన లక్షా 80వేల వీడియోలు,బ్రిటీష్‌ మీడియా సంస్థలు రాసిన 26వేల వ్యాసాలను వడగట్టి తేల్చింది కూడా ఇదే. అక్టోబరు ఏడు నుంచి జరుగుతున్నదాడులకు ముందు కూడా మీడియా తీరు ఇలాగే ఉంది, పాలస్తీనా కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించించటం తెలిసిందే. ఇటలీ మీడియా 2019`21 సంవత్సరాల తీరుతెన్నులను ఐరోపా సమాఖ్య నిధులతో ఒక పరిశోధన చేశారు. మూడు పత్రికలను పరిశీలించగా అంతర్జాతీయ వార్తలలో 32శాతం ఇజ్రాయెల్‌ ప్రధాని, నరహంతకుడు నెతన్యాహు చుట్టూ తిరిగాయని తేలింది. గతేడాది కాలంగా సాగిస్తున్న మారణకాండ ఇటాలియన్‌ మీడియాకు పట్టలేదు. ‘‘ గాజా నుంచి రాకెట్ల ప్రయోగం, గాజా నుంచి 430 రాకెట్లతో దాడి, ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది ’’ ఇలాంటి శీర్షికలతో జనాన్ని తప్పుదారి పట్టించారు. దాని దుర్మార్గాలను సమర్ధించారు.


హమస్‌ దాడిచేసి 40 మంది పసిపిల్లల గొంతు కోసిందంటూ ఇజ్రాయెల్‌ అల్లిన అవాస్తవ కథనాన్ని యావత్‌ ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండిస్తూ మాట్లాడాడు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు నిర్ధారణ చేసుకుంటే మంచిది లేకుంటే పరువు పోతుంది ముసలోడా అంటూ అతగాడి సిబ్బంది తరువాత జాగ్రత్త చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ కట్టుకథ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూనే ఉంది, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు దాన్ని ఉదహరిస్తూనే ఉన్నారు. ముస్లింలు జీహాద్‌ ప్రకటించారు, ప్రపంచ మొత్తాన్ని కబళించేందుకు పూనుకున్నారు, తమ జనాభా సంఖ్యను పెంచుతున్నారు అంటూ సాగిస్తున్న అనేక కుట్ర కథనాలతో దశాబ్దాల తరబడి జరుపుతున్న గోబెల్స్‌ ప్రచారాన్ని బుర్రలకు ఎక్కించుకున్నవారిని ఇలాంటివి వెంటనే ఆకర్షిస్తాయి. అదేగనుక వాస్తవమైతే ఇజ్రాయెల్‌ చుట్టూ ఉన్నది ముస్లిం దేశాలే, అవన్నీ ఒక్కసారిగా దండెత్తి ఉంటే ఈ పాటికి అది అదృశ్యమై ఉండేది, పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా అష్టకష్టాలు పడి ఉండేవారు కాదు. కానీ అలా జరగలేదే ! అలాంటిది ముస్లింలు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తారంటే నమ్మేవారికి బుర్రల్లో పదార్ధం లేదన్నది స్పష్టం.ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టాడన్న నాటి జార్జి డబ్లు బుష్‌, మీడియా ప్రచారాన్ని అమెరికాతో పాటు అనేక దేశాల్లో జనం నమ్మారు. తరువాత అది వాస్తవం కాదని అదే అమెరికా అంగీకరించాల్సి వచ్చింది. పాలకులతో పాటు మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయింది.


అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలను నిజంగా ఒక్కరిని చంపినా ఖండిరచాల్సిందే. ఆగస్టు 15నాటికి గాజాలో 42వేల మందిని ఇజ్రాయెల్‌ చంపితే వారిలో 17వేల మందికి పైగా పిల్లలు, పదకొండువేల మంది మహిళలు ఉన్నారు. ఏ పశ్చిమదేశాల మీడియా సంస్థలైనా దీన్ని గురించి ఎన్ని వార్తలను ఇచ్చాయి. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తరువాత కూడా ఇంకా హమస్‌ గురించే అవి చెబుతున్నాయి.నలభై రెండువేల మందిని చంపి దాదాపు ఒక లక్ష మందిని గాయపరచి, పదివేల మందిని అదృశ్యం కావించిన యూదు దురహంకారులు పాలస్తీనియన్లను తిప్పికొట్టేందుకు చేసిన పనిగా అందమైన మాటలతో పచ్చి దుర్మార్గాన్ని పశ్చిమదేశాలు వర్ణిస్తున్నాయి. బిబిసి తీరును పరిశీలిస్తే గతేడాది అక్టోబరు 10 నుంచి డిసెంబరు రెండవ తేదీ వరకు 23సార్లు హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీలపై మారణకాండ జరిపారని వర్ణిస్తే ఒక్కసారే పాలస్తీనియన్ల మీద మారణకాండ పద ప్రయోగం జరిగిందని తేలింది. అంటే దొంగే దొంగని అరచినట్లుగా బిబిసి తీరు ఉంది. ఈ తీరుకు నిరసనగా 2023 అక్టోబరులోనే ఇద్దరు ఆ సంస్థ జర్నలిస్టులు రాజీనామా చేశారు. గాజాపై దాడిని ఖండిస్తూ వెయ్యి మంది అమెరికా జర్నలిస్టులతో పాటు సంతకం చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజైన్‌ ఎడిటర్‌ జాజ్‌ హగ్స్‌ మీద యాజమాన్యం వత్తిడి తేవటంతో రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ జాబితానుంచి పేరు తొలగించాలని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విలేకరిని యాజమాన్యం ఆదేశించింది. ఇలా లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వంటి అనేక పత్రికలు, మాగజైన్లు కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వత్తిడి చేసి అనేక మంది జర్నలిస్టులను తొలగించటం, నోరు మూయించటం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డాయి. పాలస్తీనియన్ల మీద తప్పుడు వార్తలు ఒక ఎత్తయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే ప్రముఖ అమెరికా పత్రిక రాసిన ఒక ఆధారం లేని వార్త కారణంగా గాజాలో నిరాశ్రయులకు అందాల్సిన 45 కోట్ల డాలర్ల సాయం నిలిచిపోయింది. గాజాలో ఐరాస నిర్వహిస్తున్న శిబిరంలో పనిచేస్తున్న పన్నెండు మంది సిబ్బందికి హమస్‌తో సంబంధాలు ఉన్నాయని, వారంతా దాడుల్లో పాల్గ్గొన్నారని ఆ పత్రిక కేవలం ఇజ్రాయెల్‌ కట్టుకథనే తనదిగా రాసింది.నిజానికి దానికి ఎలాంటి ఆధారాలు లేవు.అమెరికా సిఎన్‌ఎన్‌, బ్రిటన్‌ బిబిసిలో పని చేస్తూ గాజా పరిణామాలపై వార్తలు ఇచ్చిన పది మంది విలేకర్లు ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరితో పనిచేసినట్లు వెల్లడిరచారు.న్యూస్‌ రూముల్లో ఉన్న సీనియర్లు జోక్యం చేసుకొని ఇజ్రాయెల్‌ చేసిన దుర్మార్గాలను తక్కువ చేసి చూపాలని వత్తిడి చేసినట్లు వెల్లడిరచారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన చిత్రం ద్వారా బిబిసి భాషలో పాలస్తీనీయన్ల మీద వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టారో జరిపిన ఒక పరిశీలన వచ్చింది. అదే మంటే మారణకాండకు గురైనట్లు 23సార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి మాత్రమే పాలస్తీనా పేరును ప్రస్తావించారు. ఊచకోతకు గురైనట్లు ఇరవైసార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి కూడా పాలస్తీనా పేరు రాలేదు.


తమ పత్రికలు ఎన్ని తప్పుడు కథనాలు, అవాస్తవాలు రాసినా అమెరికా యువత ముఖ్యంగా విద్యార్థులు పాలస్తీనా అనుకూల వైఖరి తీసుకోవటం గమనించాల్సిన అంశం. వారు మీడియా కతలను నమ్మటం లేదన్నది వాస్తవం. ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నదని నమ్మిన కారణంగానే ఈ పరిణామం. ఇది అక్కడి పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రచారదాడి ఎదురు తిరిగితే వారి పునాదులను కదలించే కదన శక్తిగా యువత మారుతుంది.ప్రపంచ ప్రఖ్యాతిగాంచి పర్యావరణ ఉద్యమ కార్యకర్త 21 సంవత్సరాల స్వీడిష్‌ యువతి గ్రేటా థన్‌బెర్గ్‌ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు కోపెన్‌హాగన్‌ నగరంలో అరెస్టు చేశారు. మీడియా కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది.యువతలో వచ్చిన ఈ మార్పును కూడా మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒకసారి నీవు బాధితుడవైనందుకు గాను ఇతరుల మీద నిరంతరం దాడి కొనసాగిస్తానంటే కుదరదు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి గాజాలో పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు పాల్పడుతున్నది. పశ్చిమ దేశాల మీడియా దానికి మద్దతు ఇస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ తీరు ఇలాగే ఉంటే …… మనదగ్గరా శ్రీలంక, బంగ్లాదేశ్‌ పరిణామాలు పునరావృతం !

15 Sunday Sep 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, China, edible oil import tax, farm crisis, Farmers, Fuel prices freezing, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన సైనికచర్య, ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వ కూల్చివేత వంటి పరిణామాలు ,కుట్రలు సంభవిస్తాయంటూ నరేంద్రమోడీని బలపరిచే శక్తులు కొన్ని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే వాటి నేపధ్యం వేరే కావచ్చుగానీ జనంపై మోపుతున్న భారాలు అన్ని రంగాలలో వెల్లడౌతున్న వైఫల్యాన్ని చూస్తే మన దేశంలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు పునరావృతం అవుతాయా అని ఆలోచించాల్సి వస్తోంది. దానికి వేరే దేశాలు కుట్రలే చేయనవసరం లేదు. హసీనా స్వయంకృతాన్ని ఆమెను వ్యతిరేకించే అమెరికా, బంగ్లా ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి. అయితే చరిత్ర పునరావృతం కావచ్చుగానీ ఒకే విధంగా ఉండదు. ఎవరూ ఊహించలేరు.


తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు, ఓట్ల కోసం ఎంతకైనా కొన్ని రాజకీయ పార్టీలు తెగిస్తున్న రోజులివి.2024 సెప్టెంబరు 14 నుంచి అమల్లోకి వచ్చేలా మనం దిగుమతి చేసుకుంటున్న ఖాద్య తైలాలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున దిగుమతి సుంకాలను విధించింది.ముడి(శుద్ధి చేయని) పామ్‌, సోయా,సన్‌ఫ్లవర్‌ దిగుమతి ధరలపై ఇప్పుడున్న 5.5శాతం పన్ను మొత్తాన్ని 27.5శాతానికి పెంచింది. వీటికి ఇప్పటికే ఉన్న సెస్‌లు అదనంగా పెరుగుతాయి. ఇది సగటు ధర, అదే శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు పువ్వు ఆయిల్‌ దిగుమతి చేసుకుంటే ఇప్పుడున్న 13.75 నుంచి 35.75కు పెరుగుతుంది. ఉదాహరణకు ఒక లీటరు వంద రూపాయలకు దిగుమతి చేసుకుంటే ఇప్పుడు రు.113.75 చెల్లిస్తున్నాము. పెంచిన పన్నుతో అది రు.135.75కు అవుతుంది. ఇది మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుందని వేరే చెప్పనవరం లేదు. మనదేశం ఖాద్యతైలాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఏటా వంద కిలోలు దిగుమతి చేసుకుంటే మన వాటా 20కిలోలకు పైగా ఉంది. ఈ కారణంగానే మన ప్రభుత్వం అనుసరించే వైఖరి ఒక విధంగా ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నది. దిగుమతి సుంకం పెంచగానే చికాగో మార్కెట్‌లో సోయా ధర రెండుశాతం పతనమైంది.లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వినియోగదారులను ఉద్దరించేందుకు దిగుమతి సుంకాలు తగ్గించినట్లు చెప్పిన మోడీ సర్కార్‌ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో రైతుల ఓట్ల కోసం అవే సుంకాలను పెంచుతూ నిర్ణయించింది.ఏది చేసినా ఓట్లకోసమే అంటే కొందరు తమ మనోభావాలను గాయపరుచుకోవచ్చుగానీ వాస్తవం.


హర్యానాలో బాస్మతి రకం వరిని సాగు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పతనం అక్కడి రైతుల మీద కూడా పడిరది. బాస్మతి బియ్యాన్ని టన్నుకు 1200 డాలర్లకు తగ్గకుండా ఎగుమతి చేయాలని నిర్ణయించారు. తరువాత దాన్ని 950డాలర్లకు తగ్గించారు. పక్కనే ఉన్న పాకిస్తాన్‌ అంతకంటే తక్కువ ధరకే ఎగుమతి చేస్తున్నందున మన బియ్యాన్ని కొనేవారు లేకుండా పోవటంతో మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని పది స్థానాల్లో బిజెపి ఐదింటిని పోగొట్టుకుంది. రైతులు ఆగ్రహంతో ఉన్నట్లు తేలటంతో ఇప్పుడు కనీస ఎగుమతి ధరల విధానాన్ని ఎత్తివేసింది. పోయిన ఖాతాదారులు తిరిగి వస్తారా, ఇది రైతులకు మేలు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.అదే విధంగా మహారాష్ట్రలో కూడా బిజెపి చావుదెబ్బతిన్నది, దానికి ఉల్లిరైతుల ఆగ్రహం అని తేలింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కన్నీరు తెప్పించిన ఉల్లిధరలను తగ్గించేందుకు ఎగుమతులపై ఆంక్షలు, కనీస ఎగుమతి ధర టన్నుకు 550 డాలర్లు ఉండాలని నిర్ణయించింది. ఇప్పుడు వాటిని రద్దు చేసింది. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. మహారాష్ట్రలో సోయా సాగు కూడా ఎక్కువే. దానికి కేంద్రం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రు.4,892 కంటే మార్కెట్‌లో రు.4,500 నుంచి 600 వరకు మాత్రమే పలుకుతోంది.దీంతో రైతుల్లో తలెత్తిన అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికల మీద పడకుండా మోడీ సర్కార్‌ సోయా మీద దిగుమతి పన్ను పెంచి కొంతమేరకైనా మార్కెట్లో ధరలు పెరుగుతాయనే ఆశతో ఈ చర్య తీసుకుంది.


ఇటు రైతులుఅటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలనటంలో మరోమాట లేదు. అందుకు తీసుకొనే చర్యలను సమర్దించవచ్చు. కానీ గత పది సంవత్సరాల్లో ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.మధ్యలో మార్కెటింగ్‌ రంగంలో ఉన్న వాణిజ్యవేత్తలకే లబ్ది చేకూరింది.మన దేశ అవసరాలలో మూడిరట రెండువంతుల ఖాద్యతైలాలను దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్నాం. నూనెగింజలను ఉత్పత్తి చేసే రైతాంగానికి అవసరమైన గిట్టుబాటు ధర ఉండటం లేదు. అనేక దేశాల్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికదిగుబడి వంగడాలను రూపొందించి ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. అది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకూ మేలు. నరేంద్రమోడీ 2001 నుంచి 2014వరకు గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు అక్కడ గణనీయంగా సాగుచేసే వేరుశనగ దిగుబడి పెంచేందుకు అవసరమైన వంగడాలను రూపొందించలేదు, పదేండ్లు ప్రధానిగా ఉన్నా చేసిందేమీ లేదు. 2022 గణాకాల(అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డాటా వెబ్‌సైట్‌ ) మేరకు అమెరికాలో హెక్టారుకు వేరుశనగ నాలుగున్నరటన్నుల దిగుబడి ఉండగా, చైనాలో 4.13టన్నులు, అదే మనదేశంలో 1.78 టన్నులు మాత్రమే. మొత్తంగా నూనె గింజల దిగుబడి కూడా ఇదే మాదిరి ఉంది గడచిన పదకొండు సంవత్సరాల సగటు 1.22 టన్నులు మాత్రమే. ఎందుకీ దుస్థితి, దీనికి బాధ్యులెవరు ? జవహర్‌లాల్‌ నెహ్రూయే కారణం అంటారా ? నూనె గింజల సాగు గిట్టుబాటు కాని కారణంగానే రైతులు అటువైపు మొగ్గు చూపటం లేదు. పదేండ్లలో మన కరెన్సీ రూపాయి విలువ పతనం కారణంగా అధిక మొత్తాలను చెల్లించి దిగుమతి చేసుకోవటంతో వినియోగదారులకు ధరలు మండుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం 201314లో దేశ అవసరాల్లో 48.1శాతంగా ఉన్న దేశీయ ఉత్పత్తి 202223 నాటికి 42.92శాతానికి పడిపోయినట్లు అంచనా. దీనికి కారకులెవరు ? మెజారిటీ రాష్ట్రాలలో అధికారం మాదే, అభివృద్ధికి రెండిరజన్ల పాలన కావాలని చెబుతున్న బిజెపి ఏం చెబుతుంది? ఎంతకాలమీ పరిస్థితి, ఈ వైఫల్యాన్ని సహించాల్సిందేనా ? 2047నాటికి వికసిత భారత్‌ అనే కబుర్లతో కడుపు నిండుతుందా ? మన దేశంలో కొంత మంది వైద్యులు, వైద్యుల కంటే తమకే ఎక్కువ తెలుసు అన్నట్లుగా కబుర్లు చెప్పేవారు తయారై వంటల్లో నూనెలను తగ్గించండి వీలైతే పూర్తిగా మానుకోండి అని చెప్పటం తెలిసిందే. ఇటీవల యూట్యూబర్లు ఇలాంటి సలహాలు ఇవ్వటంలో అందరినీ మించిపోయారు. ఆరోగ్యపరంగా సమస్యలున్నవారికి అలాంటి సలహాలు ఇవ్వటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో తలసరి వంటనూనెల కిలోల వాడకాన్ని చూద్దాం. జనాభా రీత్యా మొత్తం వాడకంలో మనదేశం చైనా తరువాత రెండవ స్ధానంలో ఉండవచ్చుగానీ తలసరిలో ఎక్కడో ఉన్నాం.

దేశం——–2010-2012–2022-22---2032 ప్రపంచం- --14.36 ---16.00 --16.60 పేదదేశాలు---07.13---06.97---07.79 భారత్‌----- 09.85---09.87---10.95 ఇండోనేషియా-05.55---10.32---12.24 లాటిన్‌అమెరికా06.95---17.61---18.18 ఐరోపా----- 18.55---24.10---21.73 చైనా------ 20.37---26.02---27.24 అమెరికా----36.63---40.26---36.76

మన దేశంలో కరోనాకు ముందు ఉన్న స్థాయికి వంట నూనెల డిమాండ్‌ పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.అనేక దేశాలతో పోల్చితే మన వినియోగం తక్కువగా ఉన్నపుడే పరిస్థితి కొనబోతే కొరివి అమ్మబోతే అడవిగా ఉంది. అన్నింటికీ పోల్చుతున్న చైనా స్థాయికి చేరితే దిగుమతి చేసుకొనేందుకు మన దగ్గర అవసరమైన డాలర్లు ఉంటాయా ? మూడు దశాబ్దాల కాలంలో వినియోగంలో పెద్ద మార్పు ఉండదనేది గత,వర్తమాన, భవిష్యత్‌ అంచనాలు తెలుపుతున్నాయి. ఇండోనేషియా తన అవసరాలను గమనంలో ఉంచుకొని పామ్‌ ఆయిల్‌ ఎగుమతులపై గతంలోనే కొన్ని ఆంక్షలు విధించింది. రానున్న సంవత్సరాల్లో దాని వినియోగం పెరగనుందనే అంచనాలు వాస్తవ రూపం దాల్చితే మన దిగుమతులు మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోంది. పోటీతో పాటు మన దిగుమతి అవకాశాలు తగ్గితే సోయా ఆయిల్‌ ఎగుమతి దేశాలు కూడా ధరలు పెంచే అవకాశాలు లేకపోలేదు. మన మొత్తం దిగుమతుల్లో పామాయిల్‌ వాటా 60శాతం.

దిగుమతి చేసుకొనే ఖాద్య తైలాల మీద పన్నులు పెంచితే రైతాంగాన్ని ఆదుకోవచ్చని చెప్పటం వంచన తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అది వాస్తవ రూపం దాల్చలేదు, సాగు పెద్దగా పెరగలేదు. నిజంగా మేలు చేయాలంటే ఇతర మార్గాలను ఆలోచించాలి. మార్చినెలతో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో రు.2.37లక్షల కోట్ల మేర జిఎస్‌టిని ఎగవేసినట్లు అధికార యంత్రాంగం తేల్చింది.అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఇది రెట్టింపు. మొత్తమే కాదు కేసులు కూడా పెరిగాయి.ముంబై, పూనే, గురుగ్రామ్‌, ఢల్లీి, హైదరాబాద్‌ కేంద్రాలుగా ఈ ఎగవేతను కనుగొన్నారు. మూడోవంతు రు.71వేల కోట్లు ఒక్క ముంబైలోనే ఉంది. అక్కడ రెండిరజన్ల పాలనే సాగుతోంది.లావాదేవీలేమీ లేకుండానే ఇన్‌పుట్‌ టాక్సు క్రెడిట్‌ పేరుతో కొట్టేసిన మొత్తం 20శాతం ఉంది. పన్ను ఎగవేతలను అరికట్టే పేరుతో 2017లో జిఎస్‌టిని తీసుకువచ్చారు.అంతకు ముందు ఎగవేత రు.7,879 కోట్లు కాగా తరువాత ఇంతింతై వటుడిరతై అన్నట్లుగా తాజాగా రు.2.37లక్షల కోట్లకు చేరుకుంది. ప్రతిపక్ష పార్టీల నేతలు, తమను వ్యతిరేకించేవారి మీద సిబిఐ,ఐటి,ఇడి దాడులను సాగిస్తున్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎగవేస్తుంటే ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? దీన్ని అరికడితే రైతాంగానికి అదనంగా చెల్లించవచ్చు, ఖాద్య తైలాల మీద దిగుమతి సుంకం విధించకపోతే వినియోగదారులనూ ఆదుకున్నట్లు అవుతుందా లేదా ? ఖాద్య తైలాల సంవత్సరం నవంబరు నుంచి అక్టోబరు వరకు ఉంటుంది.భారత సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ సమాచారం ప్రకారం 201314 నుంచి 202223తో పోల్చితే పదేండ్లలో నూనెల దిగుమతులు 116 లక్షల టన్నుల నుంచి 165లక్షల టన్నులకు పెరిగితే మోడీ ప్రభుత్వ నిర్వాకంతో రూపాయి విలువ తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కారణంగా ఖర్చు రు.60,750 కోట్ల నుంచి రు.1,38,424 కోట్లకు పెరిగింది. దీనికి తగ్గట్లుగా వినియోగదారుల రాబడి పెరిగిందా ? పోనీ సాగు విస్తీర్ణం పెరిగిందా అంటే లేదు.201112లో 263లక్షల హెక్టార్లలో సాగు చేయగా 202223లో 301లక్షలకు మాత్రమే చేరింది.మన అవసరాలకు ఇదేమాత్రం చాలదు.

గత రెండు సంవత్సరాలుగా పెట్రోలు, డీజిలు ధరలు పెంచలేదు చూడండి అంటూ బిజెపి నేతలు గొప్పలు చెప్పుకుంటారు. కానీ అసలు సంగతేమిటి ? గతంలో ప్రకటించి అమలు జరిపిన విధానం ప్రకారం గణనీయంగా ధరలను తగ్గించాల్సి ఉండగా పాతవాటినే కొనసాగించి మన జేబులను కొల్లగొడుతున్నారు. 202223 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసినపుడు మనదేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా ధర 93.15 డాలర్లు కాగా 202324లో అది 82.58కి తగ్గింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు 15వరకు సగటు ధర81.92 డాలర్లు ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన మేరకు ఎందుకు ధరలు తగ్గించటం లేదంటే అన్నింటికీ జవాబుదారీ అని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ ఎన్నడైనా దేశ పౌరులకు తన మన్‌కీ బాత్‌లో చెప్పారా ? ఎందుకు నోరు విప్పటం లేదో ఎవరైనా చెబుతారా ? వంటనూనెల వ్యాపారంలో అదానీ, పెట్రోలియం ఉత్పత్తులలో అంబానీ వంటి కంపెనీలు ఉండగా వాటికి లబ్ది చేకూరేవిధంగా మన ఎగుమతిదిగుమతి విధానాలు ఉన్నాయి తప్ప రైతులు, వినియోగదారులు పట్టలేదు. 1970దశకం ప్రారంభంలో ముంబైలో చిన్నగా ప్రారంభమైన ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళన క్రమంగా గుజరాత్‌, బీహార్‌ తదితర ప్రాంతాలకు విస్తరించటం, జయప్రకాష్‌ నారాయణ్‌ రంగ ప్రవేశం, ఇందిరాగాంధీ ఎన్నికల కేసులో ఓటమి, అత్యవసరపరిస్థితి విధింపు, ఆ సమయంలోనే జనతా పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి వంటి పరిణామాలు తెలిసినవే.గతంలో లాటిన్‌ అమెరికా, ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి చోట్ల ఏండ్ల తరబడి హృదయ సామ్రాట్టులుగా అభిమానం చూరగొన్న నాయకులనే జనం చివరికి తరిమికొట్టటాన్ని చూశాము. భారాలు పెరిగి జీవనం దుర్భరమైతే ఎక్కడైనా అలాంటి పరిణామాలు జరగవచ్చు. దానికి మనదేశం అతీతమేమీ కాదు. అయితే చరిత్ర ఏ రూపంలో ఎలా పునరావృతం అవుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. అన్నీ అనూహ్యంగా జరిగినవే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐదేండ్లలో ఎంత మార్పు ! సోషలిజం పట్ల ఆస్ట్రేలియా యువత సానుకూలత !!

06 Friday Sep 2024

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Readers News Service, USA, WAR

≈ Leave a comment

Tags

capitalism or socialism, communism, Failure of Capitalism, Gen Z Flirts With Socialism, Socialism, Young Americans socialism, Young Australians- socialism


ఎం కోటేశ్వరరావు


అక్కడేమీ ప్రభావితం చేసే విధంగా కమ్యూనిస్టు పార్టీ లేదు, పురోగామి ఉద్యమాలూ లేవు. వాటి పట్ల వ్యతిరేకత ఉన్న పాలకవర్గం, మీడియాదే ఆధిపత్యం. కమ్యూనిస్టులు కూడా కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లు నడుపుతున్నప్పటికీ వాటి ప్రభావం పరిమితమే. అయినా ఆస్ట్రేలియాలో యువత సోషలిజం పట్ల సానుకూలత చూపుతున్నట్లు తాజా సర్వే వెల్లడిరచింది.అభివృద్ధి చెందినట్లు చెబుతున్న దేశాలన్నింటా జనం ప్రత్యేకించి యువత పెట్టుబడిదారీ వ్యవస్థపట్ల విముఖత చూపుతున్నారు. 2024 జూన్‌ 24న యు గవ్‌ అనే సంస్థ ఆస్ట్రేలియాలో జరిపిన సర్వేలో 1824 ఏండ్ల మధ్య యువతలో 53శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత చూపగా తటస్థంగా 25శాతం, పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలత వెల్లడిరచిన వారు 22శాతం ఉన్నట్లు తేలింది. అదే మొత్తం అన్ని వయసుల వారిలో అలాంటి అభిప్రాయాలు వెల్లడిరచిన వారు 274231శాతాల చొప్పున ఉన్నారు. 2019 అక్టోబరులో యుగవ్‌ ప్రశ్నలకు 28శాతం మంది ఆస్ట్రేలియన్లు తమకు సోషలిజం అంటే ఏమిటో తెలియదని చెప్పగా 13శాతం మంది ఆ వ్యవస్థ కలుపుగోలుతనంతో ఉంటుందని చెప్పారు.సోషలిజాన్ని నిర్వచించమని అడిగిన ప్రశ్నకు అమెరికా యువత 60శాతం మంది సరైన సమాధానం చెప్పగా ఆస్ట్రేలియన్లు 30శాతమే ఉన్నారు. అలాంటి యువత 2024లో 53శాతం మంది సానుకూలత చూపటాన్ని గమనించాలి. దీని అర్ధం వారందరికీ సోషలిజం అంటే పూర్తిగా తెలిసిందని కాదు. సోషలిజం అంటేనే అణచివేత అని భావించిన స్థితి నుంచి బయటపడి ‘‘ సోషలిజం ’’ తాము జీవిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ కంటే మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయం ఏర్పరుచుకోవటాన్ని ఇక్కడ గమనించాల్సిన, ఆహ్వానించాల్సిన అంశంగా చూడాలి. వీరి శాతం ఏటేటా పెరుగుతున్నది. యుగవ్‌ 2019 అక్టోబరులో ‘‘ కమ్యూనిజం బాధితులు ’’ పేరుతో ఏర్పడిన ఒక సంస్థ తరఫున అమెరికా, ఆస్ట్రేలియాల్లో సర్వే చేసింది.యువతలో సోషలిజం అంటే సమ్మతి లేదా ఆదరణ పెరుగుతున్నదని ఆ సర్వేలో తేలినట్లు ప్రకటించింది. ఇదంతా ఎప్పుడు ? సోషలిజంలో అణచివేస్తారు,భావ ప్రకటన స్వేచ్చ ఉండదు, భవిష్యత్‌ లేదు, అది విఫలమైంది అని ప్రచారం పెద్ద ఎత్తున జరుపుతున్న తరుణంలోనే అన్నది గమనించాలి.ప్రచ్చన్న యుద్ధం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన పరిణామాలను చూసిన పాత తరం వారిలో ఉన్న వ్యతిరేక భావం యువతరంలో లేదని ఆ సర్వేలో తేలింది.ఇప్పుడు కమ్యూనిజానికి వ్యతిరేకంగా తక్కువ ప్రచారం జరుగుతోందా ? కానే కాదు, ఏ మాత్రం తగ్గలేదు. తాజా సర్వే జరిగిన నేపధ్యాన్ని చూస్తే అనేక దేశాల్లో యువత సోషలిజం గురించి అధ్యయనం చేయటంతో పాటు నయా ఫాసిస్టు, మితవాద శక్తులు తమ సమస్యలకు పరిష్కారం చూపగలవేమో అన్న భ్రమలతో అటువైపు కూడా మొగ్గుతున్నారు. ఫ్రాన్సులో, తాజాగా జర్మనీలోని తూర్పు ప్రాంతంలో జరిగిన ఒక రాష్ట్ర ఎన్నికల్లో పచ్చిమితవాదులు పెద్దపార్టీగా అవతరించారు. జీవన ఖర్చు పెరగటం, గృహ సంక్షోభం ఆస్ట్రేలియన్‌ యువతను సోషలిజం గురించి ఆలోచింప చేస్తున్నదని తేలింది.జనాభాలో 1834 ఏండ్ల వయస్సువారిలో 41శాతం మంది సోషలిజాన్ని సమర్ధించగా, 35కు పైబడిన వారిలో 21శాతం మంది ఉన్నారు,అదే వయసులో ఉన్నవారు పెట్టుబడిదారీ విధానాన్ని 34శాతమే సమర్ధించినట్లు విశ్లేషణలో తేలింది. యువత సోషలిజం వైపు ఎందుకు మొగ్గుతున్నారన్న ప్రశ్నకు యుగవ్‌ డైరెక్టర్‌ పాల్‌ స్మిత్‌ మాట్లాడుతూ యువతరం ఎంతో భిన్నమైన ఆర్థిక పరిస్థితిని చవిచూస్తున్నారని, 2008 ద్రవ్య సంక్షోభం తరువాత శ్రామికశక్తిలో చేరిన యువత అసంతృప్తికి లోనై సోషలిజం వైపు మొగ్గుతున్నట్లు చెప్పాడు. పెద్ద తరాలు మంచివేతనాలతో కూడిన జీవితాలను గడపగా యువతకు అలాంటి హామీ లేదని, విద్య, గృహాలకు ఎక్కువగా చెల్లిస్తున్నారని అన్నాడు. ఒక స్థిరమైన ఉపాధి లేకపోవటం, తాత్కాలిక పనివారిని తీసుకొనే వాతావరణం ఎక్కువగా ఉండటంతో వారసత్వంగా వచ్చినవి ఉంటే తప్ప అద్దె ఇండ్లలో నివసించలేని స్థితి ఏర్పడిరది. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. గాజా వంటి చోట్ల జరుగుతున్న దారుణాలను సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నవారు పెట్టుబడిదారీ విధానం యుద్ధాలను ప్రోత్సహించటం ఎందుకని ప్రశ్నలు సంధించటం పెరిగింది.ఆస్ట్రేలియాలో పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు 64శాతం మంది సోషలిజాన్ని అభిమానించగా, లేబర్‌ పార్టీ 31, సంకీర్ణ కూటమి మద్దతుదార్లలో కేవలం 12శాతమే ఉన్నారు. కార్పొరేట్ల లాభాల కంటే జనం ప్రయోజనాలు,భూగోళాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు పెరుగుతున్నారు.


యువతలో ఎందుకీ మార్పు ? కమ్యూనిజం విఫలమైందని ప్రచారం జరిగిన చోటే పెట్టుబడిదారీ విఫలమైందని ఆ విధాన గట్టి సమర్ధకుడైన థామస్‌ పికెట్టి వంటి వారు సాధికారికంగా స్పష్టం చేసిన తరువాత యువత ఆలోచించకుండా ఎలా ఉంటుంది ? సోషలిస్టు చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులనే నిత్యం వాడుతున్నపుడు ఆ వస్తువులను మన దేశంలో ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం అని ఎక్కడికక్కడ యువత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు లేరు. 19952010 మధ్య జన్మించిన వారిని జడ్‌ తరం అని పిలుస్తున్నారు. వీరిని సోషలిజం(ఆకర్షిస్తున్నదని) కవ్విస్తున్నదని కొందరు వర్ణించారు.ముఖ్యంగా అమెరికాలో ఈ ధోరణి కనిపిస్తోంది.అనేక మంది మేం సోషలిస్టులం అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకవైపు అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. అయితే అక్కడ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు యువతను ఆలోచింపచేస్తున్నాయి. కమ్యూనిజం, సోషలిజం గురించి వక్రీకరణలు కొనసాగుతున్నప్పటికీ టీచర్లు బోధిస్తున్న అంశాలలో డెన్మార్క్‌, నార్వే వంటి చోట్ల స్కాండినేవియన్‌ సోషలిజం గురించి చెబుతున్న అంశాలు వారిని ఆకర్షిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. అమెరికా కంటే అక్కడి పరిస్థితి మెరుగ్గా ఉన్నందున అలాంటి సోషలిజాన్ని ఎందుకు అమలు చేయకూడదనే ప్రశ్నకు సరైన సమాధానం వారికి దొరకటం లేదు. అయితే ఆ దేశాల్లో ఉన్న జనాభా మొత్తం కూడా అమెరికాలో ఒక రాష్ట్రంలో ఉన్నవారికి సమానమని 30 కోట్ల మందికి సోషలిజాన్ని అమలు చేయటం, దీర్ఘకాలం కొనసాగించటం సాధ్యం కాదని మాత్రమే చెప్పటం వారికి సంతృప్తిని కలిగించటం లేదు. ఆయా దేశాల జిడిపితో పోలిస్తే అమెరికా జిడిపి ఎక్కువగా ఉన్నపుడు ఎందుకు సాధ్యం కాదు ? చైనాలో సంస్కరణల పేరుతో అమలు చేస్తున్నది అమెరికాలో మాదిరి పెట్టుబడిదారీ విధానమే అని అని నమ్మించేందుకు అక్కడి మేథావులు ప్రయత్నించారు. అదేగనుక వాస్తవమైతే మిగతా జర్మనీ,బ్రిటన్‌, జపాన్‌ వంటి దేశాలతో మిత్ర సంబంధాలను కొనసాగిస్తూ చైనాను వ్యవస్థాపరమైన శత్రువుగా మరోవైపు పాలకవర్గం చూడటాన్ని యువతరం గమనిస్తున్నది.మొత్తం మీద చెప్పాలంటే సోషలిజం గురించి ఆసక్తి కనపరుస్తున్న యువతను దారి మళ్లించేందుకు అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు నానా పాట్లు పడుతున్నారు.వారి జీవితానుభవం నుంచే అలాంటి ఆసక్తి కలుగుతున్నదని సామాజిక మాధ్యమం, మీడియా తప్పుదారి పట్టిస్తున్నదని, వ్యక్తిగత స్వార్ధం యువతలో పెరిగిందని, దేశం ఏమైనా ఫర్వాలేదన్నట్లుగా తయారవుతున్నారని పెడబబ్బలు పెడుతున్నారు. దీనికి తమను తామే నిందించుకోవాలంటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కావాలన్న డిమాండ్‌కు యువత మద్దతు ఇవ్వటానికి మేథావుల సైద్దాంతిక బోధన కారణం కాదని, పెరుగుతున్న ఖర్చు, బీమా సౌకర్యం లేకపోవటమే అంటున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లుగానే వాస్తవాలు, జీవిత అనుభవాల నుంచి పక్కదారి పట్టించాలంటే కుదరదు. అనేక దేశాల్లో ఇప్పుడు సోషలిజాన్ని యువత కోరుకోవటానికి పెట్టుబడిదారీ వ్యవస్థలలో వారి కలలు కల్లలు కావటమే కారణం. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారంతో జనాల బుర్రలు నిండటం తప్ప కడుపు నిండదని తేలిపోయింది. అమెరికా, ఐరోపా దేశాలలో సోషలిజం పట్ల పెరుగుతున్న ఆదరణను అడ్డుకొనేందుకు ప్రత్నామ్నాయంగా స్కాండినేవియన్‌ దేశాలలో అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలనే సోషలిజంగా చిత్రించి కమ్యూనిస్టులు చెప్పే వర్గరహిత సోషలిజం, కమ్యూనిజాలవైపు మళ్లకుండా చూశారు. ఇప్పుడు అమెరికాలో, ఇతర చోట్ల పెట్టుబడిదారీ వ్యవస్థలో తమ బతుకులు మెరుగుపడవు అని అర్ధం చేసుకున్నవారు కమ్యూనిస్టు సోషలిజం లేకపోతే పోనివ్వండి కనీసం ‘‘ స్కాండినేవియన్‌ సోషలిజం’’ ‘‘ ప్రజాస్వామిక సోషలిజం ’’ కావాలని, అమలు జరపాలని యువత కోరుతున్నది. సోషలిస్టు భావన కమ్యూనిస్టులతోనే ప్రారంభమైందని ఎవరైనా అనుకుంటే పొరపాటు.సమాజంలో దోపిడీ, అణచివేతలను సహించని అనేక మంది వాటిని వ్యతిరేకించారు, అవిలేని సమాజం కావాలని కోరుకున్నారు. ఉదాహరణకు ఎంతో ఘనమైనదిగా ఉందని చెప్పే మన సమాజంలో గతంలో అందరూ సుఖసంతోషాలతో ఉండి ఉంటే సర్వేజనా సుఖినోభవంతు అనే భావనే వచ్చి ఉండేది కాదు. అదీ సోషలిస్టు భావనే ! కారల్‌ మార్క్స్‌ఫెడరిక్‌ ఎంగెల్స్‌ ముందుకు తెచ్చిన శాస్త్రీయ సోషలిజం, కమ్యూనిజం సిద్దాంతాలకు ముందు ఊహాజనిత సోషలిస్టులు ఉన్నారు.అఫ్‌కోర్సు ఇప్పటికీ అలాంటి వారు లేకపోలేదు.కారల్‌ మార్క్స్‌`ఫెడరిక్‌ ఎంగెల్స్‌ చెప్పిన సోషలిజం ఊహ తప్ప ఎక్కడా అమలు జరగలేదని, ఆచరణ సాధ్యం కాదని చెప్పేవారు ఉన్నారు. అయినా యువత సోషలిజాన్ని ఎందుకు కోరకుంటున్నది ?


మిగతా ఐరోపా, అమెరికాలతో పోలిస్తే స్కాండినేవియన్‌ దేశాలలో సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత మెరుగ్గా ఉంది. అందువలన కమ్యూనిస్టులు చెప్పే సోషలిజాన్ని కాసేపు పక్కన పెడితే ఆ విధానాలనైనా ఎందుకు అమలు జరపరనే డిమాండ్‌ అమెరికాలో ముందుకు వస్తున్నది.కరోనాకు ముందు స్కాండినేవియన్‌ దేశాలలోని డెన్మార్క్‌ జిడిపిలో ప్రభుత్వ ఖర్చు 49.7శాతం ఉండగా, స్వీడన్‌లో 49.1శాతం కాగా అమెరికాలో 38.5శాతమే ఉంది.ట్రేడిరగ్‌ ఎకనమిక్స్‌ తాజా సమాచారం 2023 డిసెంబరు ప్రకారం యూరో ప్రాంతంలో ఖర్చు 49.9శాతం కాగా అమెరికాలో 34.38శాతం, మనదేశంలో 14.92శాతం ఉంది.అందరికీ సమాన అవకాశాలు అని చెప్పే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక అంతరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పెట్టుబడిదారీ మేథావులు చెప్పిన ఊటసిద్దాంతం ప్రకారం సంపదలు ఎగువ నుంచి దిగువకు ప్రవహించలేదు. ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. అందువలన ఒకశాతం ఎగువ ధనికుల మీద అధిక పన్నులు విధించి పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలనే ప్రశ్నకు 66శాతం మంది అమెరికన్లు మద్దతు ఇచ్చారు.ఎగువ పదిశాతం మంది మీద పెంచాలనే వారు 54శాతం ఉండగా అందరి మీద పన్ను పెంచాలనే ప్రశ్నకు 37శాతమే మద్దతు ఇచ్చారు. దోపిడీ ప్రారంభమైపుడే దానికి గురైనవారు సోషలిజం కావాలంటూ ముందుకు వచ్చి ఉద్యమించలేదు. అనేక ఉద్యమాలు, వాటితో వచ్చిన సంస్కరణలు కూడా దోపిడీని నిర్మూలించని కారణంగానే శాస్త్రీయ సోషలిస్టు సిద్దాంత ప్రతిపాదన ఆచరణ సాధ్యంగా ఉంటుందని జనం నమ్మారు,దానికోసం ఉద్యమించారు.ఆచరణలో దానికి తగిలింది ఎదురుదెబ్బలే తప్ప మరొకటి కాదు. అందువలన కమ్యూనిస్టులు చెప్పే సోషలిజానికి బదులు ఇతర సోషలిజం కోసం ముందుకు వచ్చేవారిని ఆహ్వానిద్దాం. మితవాదం, మతవాదం వైపు వెళ్లేదానితో పోల్చితే ఇదెంతో ఆరోగ్యకర పరిణామమే కదా ! దానికి ఉండే పరిమితులను అర్ధం చేసుకున్న తరువాత వారు కూడా అంతిమంగా శాస్త్రీయ సోషలిస్టు సమాజ నిర్మాణానికే మద్దతు ఇస్తారు. దోపిడీ రహిత సమాజానికి ఎవరైనా వేరే పేరు పెడదాం అంటారా పెట్టనివ్వండి. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి.పేరులో ఏముంది పెన్నిది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ఉక్రెయిన్‌ పర్యటన, కాషాయ దళ అతిశయోక్తులు,గాలి తీసిన జెలెనెస్కీ !

29 Thursday Aug 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, Hindutva nationalism, Joe Biden, Narendra Modi Failures, Propaganda, RSS, Ukraine crisis, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


‘‘ నిజం…మోడీ ది ఉక్కు దౌత్యం…ఉక్రెయిన్‌ వ్యూహాత్మక పరిశ్రమల మంత్రి క్యమిషిన్‌…మోడీ ముప్ఫై గంటల అసాధారణ దౌత్య ప్రక్రియ…పోలాండ్‌ సరిహద్దు పట్టణం జెమిసిల్‌ నుంచి ఉక్రెయిన్‌ కివీవ్‌ కు 700 కిలోమీటర్లు ప్రయాణం…మొత్తం యుద్ధ ప్రమాద ప్రాంతమే….పది గంటలు రానూ… పది గంటలు పోనూ… అక్కడో పది గంటలు…యూరోప్‌..అమెరికా…మరో ప్రక్క రష్యా అసాధారణ ఉత్కంఠ మధ్య..చూపులన్నీ ఈ ఉక్కు మనిషి పైనే…రైల్‌ ఫోర్స్‌ వన్‌…మహా గట్టి రైలు…కదులుతున్న దుర్భేద్యమైన రైలు…దాన్ని అనుసరిస్తూ… రాడార్లు…సైనిక విమానాలు…అంటే ఒక రకంగా మూడు రోజుల పా టు…యుద్ధం ఆగిపోయినట్టే…అక్కడ మాదే విజయం..ఇక్కడ మాదే పై చేయి అంటూ ప్రస్తుతం రష్యా ఉక్రైన్లు ఉత్తుత్తి ప్రకటనలు…పోలాండ్‌..ఒకప్పటి వార్సా సంధికి ప్రసిద్ధి…ఏదో చెప్పాల్సినవి అన్నీ మోడీకి చెప్పేసుకున్నామన్న సంతృప్తి నాటోకి…ప్రపంచానికి తమ బాధ ఆగ్రహం మోడీయే అర్థం చేయించగలుగుతారన్న ఆశ ఉక్రెయిన్దీ….ఒక్కసారిగా పెరిగిపోయిన భారత్‌ ప్రసిద్ధి చూసి…అసూయా ద్వేషాలతో రగిలిపోతున్న ఆయుధ వ్యాపార లాబీలు…భారత్‌ ఆంతరంగిక వైఫల్యాలను ఎత్తి చూపడానికి మనకి ఇక్కడొక రాహువును వదిలిపెట్టారు…ఆటలో ఆటం బాంబు…సరే ఏదేమైనా రష్యా ఆయిల్‌ ఇస్తూనే ఉంటుంది…మన ద్వారా యూరోప్‌ కొంటూనే ఉంటుంది…మన డబ్బులు…మన ఆయిల్‌ రిజర్వులు పెరుగుతూనే ఉంటాయి…ఇది ఒక రకంగా యుద్ధ ఆర్థిక దౌత్యం…శ్రావణ్‌ శుక్రవారం మహాలక్ష్మి అనుగ్రహం…ఇలాంటి విన్యాసాలు కేవలం శక్తిమంతమైన దేశాలు మాత్రమే…తెలివైన దేశాలు మాత్రమే చెయ్యగలుగుతాయి…ఇప్పుడు భారత్‌ అంటే….భారత్‌ అంతే…మీ ఏడుపులే మన ఎదుగుదల…ఈ సమయంలో ఎవరెవరు ఏడుస్తారో చూస్తే చాలు…మనకు అర్థం అయిపోతుంది…రైలు ప్రయాణ సమయంలోనే …శత్రువును గమనించు…! అక్కడా…ఇక్కడా కూడా! జైహింద్‌ ’’
ఆగస్టు నెలాఖరులో నరేంద్రమోడీ ఉక్రెయిన్‌ పర్యటన గురించి ఆకాశానికి ఎత్తుతూ వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో పేరు లేకుండా ఎప్పటి మాదిరే కాషాయ మరుగుజ్జులు పెట్టిన పోస్టు పూర్తి పాఠమది. అలాగే జరిగిందా ? ఎవరేమంటున్నారు, నిజం ఏమిటి ? ఉక్రెయిన్‌ వివాదంలో భారత్‌ తటస్థంగా ఉంది. జూలై నెలలో మోడీ మాస్కో వెళ్లి వ్లదిమిర్‌ పుతిన్ను ఆలింగనం చేసుకున్నారు. దాన్ని తప్పుపట్టిన ఉక్రెయిన్‌ అధినేత జెలెనెస్కీ ఆగస్టు 23న మోడీ తమదేశాన్ని సందర్శించినపుడు అదే చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో పేరు మోసిన రక్త పిపాసి నేరగాడిని మాస్కోలో కౌగలించుకుంది అని నాడు జెలెనెస్కీ ఎక్స్‌ చేశాడు. అదే వ్యక్తిని తాను కూడా కౌగలించుకోవటం ఏమిటి ? అదే నోటితో మోడీ జరిపిన తమ దేశ పర్యటన చరిత్రను సృష్టించిందని కూడా చెప్పాడు. ఆలింగనాల దౌత్యంలో ఎవరూ తక్కువ తినలేదు. మాస్కో వెళ్లినపుడు పశ్చిమదేశాలన్నీ మోడీని దుమ్మెత్తిపోశాయి. అది ఊహించిందే, వాటి ఆగ్రహాున్ని చల్లార్చి సంతుష్టీకరించేందుకు ఉక్రెయిన్‌ వెళ్లారు. కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. అనుమానాలు, సందేహాలు వెల్లడిస్తూ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉక్రెయినుకు సౌహార్ద్రత ప్రకటించటం కంటేతన ప్రయోజనాలకే పెద్ద పీటవేసిందని ఆరోపించిన వారు కూడా ఉన్నారు.
తొలిరోజుల్లో టర్కీ ఒక ప్రయత్నం చేసింది తప్ప భారత్‌ లేదా మోడీని వివాదంలో మధ్యవర్తిగా ఎన్నడూ రష్యా పరిగణించలేదు. మనదేశం ఎన్నడూ అలా ప్రకటించుకోలేదు. తమ అతిధిగా వచ్చిన మోడీని జెలెనెస్కీ అవమానించటమే కాదు, ఇరకాటంలో పెట్టాడు. మోడీ స్వదేశానికి తిరుగు ప్రయాణమైన తరువాత కనీస దౌత్య మర్యాదలను కూడా పాటించకుండా వ్యవహరించాడు. జూన్‌ నెలలో స్విడ్జర్లాండ్‌లో ఒక శాంతి సమావేశం జరిగింది. దానికి రష్యాను అసలు ఆహ్వానించలేదు, చైనా వెళ్లలేదు, భారత్‌తో సహా పదమూడు దేశాలు హాజరైనప్పటికీ ఆ సమావేశం విడుదల చేసిన ప్రకటన మీద సంతకం చేయలేదు. భారత్‌ మరో శాంతి సమావేశం జరిపితే ఆహ్వానిస్తాం గానీ అది జరగటానికి ముందు భారత్‌ స్విస్‌ ప్రకటన మీద సంతకం చేయాలని జెలెనెస్కీ షరతు పెట్టాడు. మనదేశ వైఖరి తెలిసి కూడా విలేకర్లతో అలా మాట్లాడటం చౌకబారు తనం తప్ప మరొకటి . కాదు, పైగా జెలెనెస్కీ ఆహ్వానం మీదనే మోడీ వెళ్లారు. స్వాగతం చాలా మోటుగా లేదా వికారంగా పలికినట్లు బిబిసి వర్ణించింది. ‘‘విశ్వగురువు’’ కు ఇది అవమానమా ? ఘనతా ?
‘‘ పేద దేశాలు రెండవ శాంతి సమావేశం జరిపితే మంచిదని నేను నిజంగా నమ్ముతున్నాను. సౌదీ అరేబియా,కతార్‌,టర్కీ వంటి దేశాలు ఉన్నాయి. భారత్‌లో మనం అలాంటి సమావేశం నిర్వహించవచ్చని నేను నరేంద్రమోడీతో చెప్పాను. అది పెద్ద దేశం, అతిపెద్ద ప్రజాస్వామికదేశం. స్విస్‌ శాంతి సభ ప్రకటనపై సంతకం చేసిన దేశంలోనే సభ జరగాలి.అయితే నేను నిర్మొహమాటంగా చెప్పదలచుకున్నాను. ఈ షరతు కేవలం భారత్‌కు మాత్రమే కాదు. రెండవ సభ జరపాలని సానుకూలంగా కోరుకుంటున్న ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుంది. శాంతి (స్విడ్జర్లాండ్‌) సమావేశ ప్రకటనపై ఇప్పటికీ సంతకం చేయని ఏ దేశంలో కూడా జరపటానికి మాకు కుదరదు ’’ అని మోడీ భారత్‌కు తిరుగు ప్రయాణమైన తరువాత భారతీయ విలేకర్ల సమావేశంలో జెలెనెస్కీ చెప్పినట్లు కీవ్‌ ఇండిపెండెంట్‌ అనే పత్రిక రాసింది.రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ దాని యుద్ధ ఆర్థికానికి భారత్‌ సాయపడుతున్నదని జెలెనెస్కీ చెప్పాడు. మోడీ రష్యా పర్యటన జరిపిన రోజే తమ అతిపెద్దదైన పిల్లల ఆసుపత్రి మీద దాడి జరిపిన పుతిన్‌కు నరేంద్రమోడీ అంటే గౌరవం లేదని వెల్లడి కాలేదా అంటూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మీరు గనుక చమురు దిగుమతులు నిలిపివేస్తే పుతిన్‌కు పెద్ద సవాలు ఎదురౌతుంది.మోడీ శాంతిని కోరుకుంటున్నారు తప్ప పుతిన్‌ కాదన్నాడు. జెలెనెస్కీ విలేకర్ల సమావేశంలో మొరటుగా మాట్లాడాడు. అంతర్గతంగా మాట్లాడాల్సిన వాటిని విలేకర్ల ముందు చెప్పాడు.
మోడీ రష్యా పర్యటనపై విమర్శలకు దిగిన ఉక్రెయిన్‌, అమెరికాల ఆగ్రహాన్ని తగ్గించే నష్ట నివారణ చర్యగా ఉక్రెయిన్‌ పర్యటన జరిగిందని, శాంతికి కట్టుబడి ఉన్న భారత్‌కు, దానితో రష్యా సంబంధాలకు ఒక సవాలుగా ఈ పర్యటన మారిందన్న ఒక విశ్లేషకుడి వ్యాఖ్యను చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఉటంకించింది. స్విస్‌ ప్రకటనపై మనదేశం సంతకం చేయకపోతే అమెరికాకు, చేస్తే రష్యాకు ఆగ్రహం కలుగుతుంది.ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరి పరిస్థితి ఉంది. రష్యా కురుస్కు ప్రాంతంపై ఉక్రెయిన్‌ దాడి చేసినందున చర్చలకు అవకాశం లేదని పుతిన్‌ ప్రకటించిన తరువాత మోడీ జరిపి కీవ్‌ పర్యటన శాంతికి దోహదం చేస్తుందా ? అసలు ఎవరైనా వినిపించుకుంటారా ? తాము మధ్యవర్తి పాత్రను పోషించాలని కోరుకోవటం లేదని, ఉక్రెయిన్‌`రష్యా కోరితే వర్తమానాలను పరస్పరం తెలియ చేస్తామని భారత అధికారులు చెప్పినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. పశ్చిమ దేశాలలో రష్యా ఒంటరిపాటైతే ఆసియాలో భారత ప్రత్యర్ధిగా ఉన్న చైనాకు మరింత దగ్గర అవుతుందని, అలా కాకుండా ఉండాలంటే యుద్ధానికి ఒక పరిష్కారం అవసరమని భారత్‌ భావిస్తోందని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థంగా ఉన్న చైనా శాంతి ప్రతిపాదన చేసింది. జెలెనెస్కీ నుంచి దాని మీద ఎలాంటి స్పందన లేదు.మన వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదనా లేదు.
తన పర్యటన తరువాత నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మరుసటి రోజు వ్లదిమిర్‌ పుతిన్‌కు ఉక్రెయిన్‌తో జరిపిన చర్చల గురించి వివరించినట్లు ఒక ఎక్స్‌ ద్వారా తెలిపారు. వివాదానికి శాంతియుత ముగింపు పలకాలంటే చర్చలు, దౌత్య పద్దతుల్లో చిత్తశుద్దితో నిమగ్నం కావాలని మోడీ చెప్పినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ కురుస్కు ప్రాంతం మీద ఉక్రెయిన్‌ దాడి చేసిన తరువాత పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. రెండు దేశాల మధ్య పరిస్థితి విషమించటం తప్ప మెరుగుపడే అవకాశాలు లేవు.పరిస్థితి ఇలా ఉండగా అతిశయోక్తులతో కూడిన ఊరూ పేరూ లేని ప్రకటనలు, ప్రచారాలను నమ్మేంత అమాయకంగా వాట్సాప్‌ జనాలు ఉన్నారని భావించటం తప్ప మరొకటి కాదు ! పోలాండ్‌, ఉక్రెయిన్‌ పర్యటన జరిగింది రెండు రోజులైతే మూడు రోజులు యుద్ధం ఆగిపోయిందని చెప్పటాన్ని బట్టి మా ఊరి మిరియాలు తాటికాయలంత ఉంటాయి దొరా అన్నట్లు ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా-రష్యాలను మరింత దగ్గర చేసిన జి7 కూటమి !

19 Wednesday Jun 2024

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Environment, Europe, Germany, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, China, G7 Apulia, Joe Biden, Narendra Modi Failures, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఇటలీలోని అపూలియాలో 2024 జూన్‌ 13-15 తేదీలలో జరిగిన జి7 50వ శిఖరాగ్ర వార్షిక సమావేశ తీరుతెన్నులు, పరిణామాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతున్నది. ఈ సమావేశాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రధాని నరేంద్రమోడీతో సహా పన్నెండు దేశాధినేతలను,ఆఫ్రికా యూనియన్‌ ప్రతినిధిని ఆహ్వానించారు. ఇలాంటి వేదికలన్నింటా పూసల్లో దారంలా ప్రపంచ దేశాల బలాబలాల సమీకరణ లక్ష్యం ఉంటుంది. ధనికదేశాలు తమకు సవాలు విసురుతున్న చైనా, రష్యాలను దెబ్బతీసేందుకుగాను వర్దమాన,పేద దేశాలను తమ వైపు తిప్పుకొనేందుకు అపూలియాలో గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం ఏమిటన్నది ప్రశ్నార్ధకమే. అనేక అంశాల మీద ఈ కూటమి ఒక ప్రకటన చేసినప్పటికీ దానిలో ప్రధానమైన వాటిని చూద్దాం. ఆతిధ్యం ఇచ్చిన దేశం తనకు నచ్చిన, తాను మెచ్చిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు అల్జీరియా, అర్జెంటీనా,బ్రెజిల్‌,భారత్‌,జోర్డాన్‌, కెన్యా, మారిటేనియా, ఆఫ్రికన్‌ యూనియన్‌,ట్యునీసియా, టర్కీ,యునైటెడ్‌ అరబ్‌ఎమిరేట్స్‌,ఉక్రెయిన్‌, వాటికన్‌ నగరం నుంచి అధిపతులు వచ్చారు. ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా, రష్యా దేశాలకు ఆహ్వానం లేనప్పటికీ మూడు రోజుల సమావేశాలు వాటి నామజపంతోనే ముగిశాయంటే అతిశయోక్తి కాదు. సమావేశ ప్రకటనలో 28 సందర్భాలలో చైనా పేరును ప్రతికూలంగా ప్రస్తావించారంటే దాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీని అర్ధం ఘర్షణకు సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.గతేడాది జపాన్‌-ఒసాకాలో జరిగిన కూటమి ప్రకటనలో 20సార్లు ప్రస్తావించారు.ప్రస్తుతం ధనికదేశాల కూటమికి చైనాను ఢకొీనే సత్తా ఉందా అన్నది ప్రశ్న. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం చైనా అని నెపం నెట్టేందుకు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.


అసలు జి 7 కూటమి, ఎందుకు ఎలా ఉనికిలోకి వచ్చిందీ చూద్దాం. అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తూ ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. ఆ పర్యవసానంతో పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 1975లో నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో తొలి సమావేశం జరిగింది. అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు వచ్చారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న పూర్వపు తన క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి రష్యాను తొలగించటంతో తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. శిఖరాగ్ర సమావేశాలకు ఎవరు ఆతిధ్యం ఇస్తే తదుపరి సమావేశం వరకు ఏడాది పాటాదేశాధినేత అధ్యక్ష స్థానంలో ఉంటారు.ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ లేరు. సమావేశాల్లో ఐరాసతో సహా వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. అపూలియా సభలో ఉక్రెయిన్‌, వాతావరణ సంక్షోభాలు, సైబర్‌ భద్రతకు ముప్పు, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం, మానవహక్కుల హరింపు, అవసరాలకు మించి అదనంగా ఉత్పత్తి చేస్తూ విద్యుత్‌ వాహనాలను ప్రపంచం మీద కుమ్మరిస్తున్నదంటూ చైనా మీద దుమ్మెత్తి పోశారు. రష్యాకు ఆయుధాలను సరఫరా చేయకపోయినా, వాటి ఉత్పత్తికి అవసరమైన వాటిని అందిస్తున్నదంటూ విధించిన ఆంక్షలకు ఆమోదం తెలిపింది. ప్రతికూల చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగింది.


ఈ సమావేశాలకు హాజరైన నేతలందరి పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నారు. అయినా లేస్తే మనుషలం కాదన్నట్లుగా ఫోజు పెట్టారు.చైనాను దెబ్బతీసేందుకు మిత్రదేశాలను అమెరికా ఎలా కూడగడుతున్నదో తనను తాను రక్షించుకొనేందుకు బీజింగ్‌ కూడా అదే చేయనుందని వేరే చెప్పనవసరం లేదు. ” ఆరుగురు అసమర్ధులు మరియు జార్జియా మెలోనీ 2024 జి7 తరగతిలో కూడిక ” అన్న శీర్షికతో పొలిటికో పత్రిక ఒక బలహీన సమావేశం అంటూ విశ్లేషణ రాసింది. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీలు బలపడటంతో ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ ఏకంగా పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాడు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా అంతకు ముందే అదేపని చేశాడు. జర్మనీ ఛాన్సలర్‌ షఉల్జ్‌ కూడా చావు దెబ్బతిన్నాడు, ఎప్పుడైనా అదేపని చేయవచ్చు. తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ”వెర్రి(క్రేజీ)” పదవి నుంచి తప్పుకోనున్నట్లు బహిరంగంగానే ప్రకటించాడు.జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా పలుకుబడి అధ్వాన్నంగా ఉంది. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్‌ తిరిగి అధికారానికి రావటం అనుమానంగానే ఉంది. ఇలాంటి వాటన్నింటినీ మూసిపెట్టేందుకు రష్యాతో పాటు చైనాను కూడా బూచిగా చూపేందుకు కసరత్తు చేశారు.


ఉక్రెయిన్‌-రష్యా వివాదం ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. అయితే దాన్ని పరిష్కరించటానికి బదులు మరింత ఎగదోసేదిగా కనిపించింది. ఈ సమావేశం ఫలితాలు, పర్యవసానాల విషయానికి వస్తే ఇప్పటికే దగ్గరైన చైనా-రష్యాలను మరింత దగ్గరగా చేసేందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు.ఉక్రెయిన్‌ యుద్ధంలో చైనా ఆయుధాలను రష్యాకు సరఫరా చేయటం లేదు, కానీ వాటిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్ధ్యాన్ని సమకూరుస్తున్నది, కాబట్టి నిజానికి అది రష్యాకు సాయం చేయటమే అని జో బైడెన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. రష్యా యుద్ధ యంత్రాంగ రక్షకురాలిగా చిత్రించటం తప్ప వేరు కాదు.గత కొద్ది సంవత్సరాలుగా చైనా మీద సాగిస్తున్న విమర్శ మరింత పదును తేలింది. గత రెండు సమావేశాల్లో చైనా పాత్ర గురించి దాదాపు లేవనెత్తలేదని, ఉక్రెయిన్‌పై వ్లదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాన్ని పేల్చుతారన్న భయాలు తలెత్తినపుడు షీ జింపింగ్‌ అంతదాకా పోనివ్వని నియంత్రణశక్తిగా భావించారని, ఈసారి దానికి భిన్నంగా సమావేశ ప్రకటన ప్రారంభమైందని న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది.రష్యా యుద్ధ యంత్రాంగానికి వస్తు సరఫరా చేస్తున్న చైనా, మూడవ పక్షదేశాల సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం కొనసాగిస్తామని ప్రకటనలో పేర్కొన్నట్లు ఉటంకించింది. గత సమావేశాల్లో వాతావరణ ప్రతికూల మార్పులను అడ్డుకొనేందుకు,ఉగ్రవాదం, అణ్వాయుధ నిరోధం కోసం చైనాతో చేతులు కలుపుతామంటూ మాట్లాడిన ధనికదేశాలు ఇప్పుడు శత్రువుగా చూస్తున్నాయంటే ఆ సమస్యల పట్ల వాటి చిత్తశుద్ది ఏమిటో స్వయంగా వెల్లడించుకున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ షీ జింపింగ్‌ చైనా ఆధిపత్య లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అపూలియా అంతరంగిక సమావేశంలో అభిప్రాయపడినట్లు అమెరికా అధికారి ఒకరు విలేకర్లతో చెప్పాడు. ఉక్రెయిన్‌ వివాదంలో చైనా పాత్ర గురించి షీ జింపింగ్‌ వైఖరిలో గత ఏడాది కాలంలో మార్పు వచ్చినట్లు అమెరికా ప్రచారం చేస్తున్నది.రష్యాతో అవధులు లేని భాగస్వామ్యంగా ప్రకటించినప్పటి నుంచి అది ప్రారంభమైందని ఆరోపిస్తోంది. స్విడ్జర్లాండ్‌లో పశ్చిమదేశాలు నిర్వహించిన ఉక్రెయిన్‌ శాంతి సదస్సులో పాల్గొనవద్దని దేశాలను నిరుత్సాహపరచిందని కూడా ఆరోపించింది. చిత్రం ఏమిటంటే ఈ సమావేశంలో భాగస్వామిగా ఉన్న మనదేశం సమావేశ ప్రకటనను ఆమోదించటానికి తిరస్కరించింది. దీని వెనుక కూడా చైనా హస్తం ఉందని చెప్పగలరా ?


అవసరానికి మించి చైనా ఉత్పత్తులు చేస్తున్నదనే ప్రచారం పెద్ద ఎత్తున పశ్చిమదేశాలు చేస్తున్నాయి. ఇటలీ సభలో కూడా ఇది ఒక ప్రధాన అజెండాగా ఉంది. పెట్టుబడిదారీ విధాన సూత్రం ప్రకారం అవసరానికి మించి ఉత్పత్తి చేస్తే కొనేవారు లేక సంక్షోభానికి దారితీస్తుంది. ఈ కనీస ఇంగితం చైనా నాయకత్వానికి లేదని భావిస్తున్నారా ? చైనా ఉత్పత్తులు, సరఫరా గొలుసు మీద ఆధారపడకూడదని, విడగొట్టుకోవాలని చెబుతున్నవారిని ఎవరూ బలవంతంగా ఆపలేదే. వస్తు తయారీకి ధనిక దేశాల వద్ద పెట్టుబడులు లేవా, సాంకేతిక పరిజ్ఞానం లేదా, పని చేసే కార్మికులు లేరా ? చైనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నది అనుకుంటే ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేయవచ్చు. అమెరికా, ఐరోపా యూనియన్‌ కూడా చైనా ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను పెంచి రక్షణాత్మక చర్యలు తీసుకొని కూడా గగ్గోలు పెడుతున్నాయి. తమ బలహీనతలను కప్పిపుచ్చుకొనేందుకు తమమీద నిందలు వేస్తున్నట్లు చైనా విమర్శిస్తున్నది.


చైనా మీద వ్యతిరేకతను పెంచేందుకు చేయని తప్పుడు ప్రచారం లేదు. అవసరమైనపుడు అమెరికా, ఐరోపా దేశాలలోని అన్నిరకాల వ్యవస్థలను పనిచేయకుండా చేసేందుకు వాటిలో కంప్యూటర్‌ వైరస్‌లను పెట్టి సిద్ధంగా ఉంచిందని అమెరికా ఆరోపించింది. దీనికి ” ఓల్ట్‌ టైఫూన్‌ ” అనే పేరు పెట్టారు. దీని ప్రకారం విద్యుత్‌,నీరు,రేవుల వంటి వ్యవస్థలను అమెరికా, దాని మిత్రదేశాలలో పనిచేయకుండా చేసేందుకు చైనా ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించి సదరు వ్యవస్థలలో ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. ఐటి, అన్ని రకాల సాంకేతిక రంగాలలో తమకు మించిన వారు లేరని విర్రవీగుతున్న పశ్చిమదేశాలు తమ వ్యవస్థలకు రక్షణ ఏర్పాట్లు చేసుకోలేనంత అసమర్ధంగా ఉన్నాయా ? అంటే ఎవరూ నమ్మరు, చైనాను బూచిగా చూపి జనంలో దిగజారుతున్న తమ పలుకుబడిని నిలుపుకొనేందుకు, ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఒక మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. ఒకవేళ బలవంతంగా తైవాన్‌ విలీనానికి చైనా పూనుకుంటే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను పేల్చివేస్తామని అమెరికా బెదిరించిన సంగతి తెలిసిందే. అందువలన ఒక వేళ నిజంగా చైనా అలాంటి వైరస్‌ను చొప్పించిందంటే దెబ్బకు దెబ్బ తీసే జాగ్రత్త అని అర్ధం చేసుకోవాలి.
ఇక అపూలియా సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ హాజరైపుడు ఫొటో తీసుకొనేందుకు హాజరైన నేతలందరూ చుట్టుముట్టారని, నేతల మధ్యలో మోడీ ఉండటమే దానికి నిదర్శనం అన్నట్లు సమావేశ గ్రూపు ఫొటోను చూపి కొంత మంది చౌకబారు ప్రచారం చేస్తున్నారు. ఐదుసార్లు ఈ సమావేశాలకు మోడీ వెళ్లారన్నది మరొకటి. యుపిఏ పదేండ్ల కాలంలో మన్మోహన్‌ సింగ్‌ కూడా ఐదుసార్లు హాజరయ్యారు.(2006 సెంట్‌పీటర్స్‌బర్గ్‌ సమావేశానికి మనదేశం నుంచి తీసుకువెళ్లిన జర్నలిస్టుల బృందంలో ఈ రచయిత కూడా ఒకరు ) భారత్‌ ఈ కూటమి సభ్యదేశంగా చేరనుందనే భావం కల్పిస్తూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ఏ ఒక్కదేశమూ ఈ గ్రూపును విస్తరించే ప్రతిపాదనలు ముందుకు తేలేదు. ఒకవేళ విస్తరించినా మనదేశాన్ని చేర్చుకుంటారన్నది సందేహమే. ఆ గ్రూపులోని ఐదు దేశాల జిడిపి కంటే మనది ఎక్కువగా ఉన్నది తప్ప ధనికదేశ వర్గీకరణకు ఎంతో దూరంలో ఉంది. యాభై ఏండ్లుగా ఉన్న ఆ బృందం ప్రపంచ పరిణామాలను నియంత్రించటంలో నానాటికీ బలహీనపడుతున్న తరుణంలో మనదేశం చేరినంత మాత్రాన మన జనానికి ఒరిగేదేమిటి ? ఒకవేళ నిజంగా చేరితే చైనా, రష్యాలతో ఒక శత్రుకూటమిగా మనదేశం కూడా లడాయికి దిగటమే. అటువంటి దుస్సాహసానికి నరేంద్రమోడీ పాల్పడతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐరోపా పార్లమెంటు ఎన్నికలు : పెరిగిన నాజీ, ఫాసిస్టుల ముప్పు !

12 Wednesday Jun 2024

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, WAR

≈ Leave a comment

Tags

emmanuel macron, EU, EU elections 2024, European People’s Party (EPP), Far Right, Giorgia Meloni, Olaf Scholz, Ursula von der Leyen


ఎం కోటేశ్వరరావు


ఐరోపా యూనియన్‌లోని 27దేశాలలో జూన్‌ ఆరు నుంచి తొమ్మిదవ తేదీవరకు జరిగిన యూనియన్‌ పదవ పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అందోళనకర సూచనలు వెలువడ్డాయి. అధికారికంగా ఫలితాల పూర్తి ప్రకటన వెలువడలేదు, నాలుగు దేశాల్లో లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి అందిన సమాచారం, ఫలితాల తీరుతెన్నుల ప్రకారం నయా నాజీ, ఫాసిస్టు, పచ్చి మితవాద శక్తులు బలం పుంజుకున్నాయి. ఈ పరిణామం ఐరోపా విధానాలనే తీవ్రంగా ప్రభావితం చేసేదిగా ఉంది. వివిధ దేశాలలో పాలక పార్టీలు, కూటములకు ఎదురుదెబ్బలు తగిలాయి.ఐరోపా సమాఖ్య వైఖరిలో వచ్చే మార్పులు, చేర్పుల గురించి చర్చ ప్రారంభమైంది ఐరోపా సమాఖ్యకు ఒక స్థంభం వంటి ఫ్రాన్సు మీద పిడుగులా పడి ఇంకా రెండు సంవత్సరాల గడువు ఉన్న పార్లమెంటురద్దుకు దారితీసింది.పాలకపక్షం ఘోరంగా దెబ్బతినటంలో పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరపనున్నట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ వెంటనే ప్రకటించాడు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉన్నా, ప్రధాని, మంత్రులు వేరే పార్టీకి చెందినవారైనా, అధ్యక్షుడికే సర్వాధికారాలు ఉంటాయి. 2027లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో మక్రాన్‌ పోటీ చేసేందుకు నిబంధనలు అంగీకరించవు . జర్మనీ ప్రతిపక్షం మధ్యంతర ఎన్నికలకు డిమాండ్‌ చేసింది. అధికార త్రిపక్ష సంకీర్ణ కూటమికి ఎదురు దెబ్బ తగిలినా ఎన్నికలకు వెళ్లేది లేదని ప్రకటించింది.


పార్లమెంటులోని మొత్తం 720స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మెజారిటీ 361 సాధించిన కూటమి ఎంచుకున్న నేత ఐరోపా కమిషన్‌ అధ్యక్ష పదవిని అధిష్టిస్తారు. కమిషన్‌ విధానాలను ఐరోపా పార్లమెంటు రూపొందిస్తుంది. ప్రతి దేశానికి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. గత ఎన్నికల్లో 751 స్థానాలుండగా 27 సీట్లున్న బ్రిటన్‌ ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగినందున వాటిని ఇతర దేశాలకు కేటాయించినప్పటికీ తరువాత వాటికి ఉపఎన్నికలు జరగలేదు. తరువాత 46 స్థానాలను రద్దు చేశారు. తాజా ఎన్నికలకు ముందు ఆమోదించిన విధానం ప్రకారం 705 నుంచి 720కి స్థానాలను పెంచారు. జర్మనీలో 96,ఫ్రాన్స్‌81, ఇటలీ 76 స్థానాలతో అగ్రభాగాన ఉన్నాయి. మాల్టా, సైప్రస్‌, లక్జెంబర్గ్‌ దేశాలలో తక్కువగా ఆరేసి స్థానాల చొప్పున ఉన్నాయి. ఏ దేశానికి ఆదేశం ఎంచుకున్న పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటులో ఒక పక్షాన్ని గుర్తించాలంటే ఏడు దేశాలలో పోటీచేసి కనీసం 23 స్థానాలను తెచ్చుకోవాల్సి ఉంది. ఆ నిబంధనకు అనుగుణంగా లేని వాటిని గుర్తింపులేని పార్టీలుగా పరిగణిస్తారు.ఈ ఎన్నికల్లో కేవలం 51శాతం మాత్రమే ఓటర్లు పాల్గొన్నట్లు తొలి వార్తలు తెలిపాయి. గరిష్టంగా బెల్జియంలో 89.2, లక్జెంబర్గ్‌లో 82.3శాతం పోలు కాగా క్రోషియాలో అత్యల్పంగా కేవలం 21.3శాతమే ఓటర్లు పాల్గొని ఒక రికార్డు సృష్టించారు. కొన్ని దేశాలలో ఈ సందర్భంగానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించారు.


ఈ ఎన్నికలలో ప్రస్తుతం సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్న ఉర్సులా వాండరె లెయన్‌ నాయకత్వంలోని యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీ(ఇపిపి) 191సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. పచ్చి మితవాదులను అధికారంలోకి రాకుండా నిరోధించగలమని ఆమె చెప్పింది. మరోసారి ఆమె సమాఖ్య అధ్యక్ష స్థానం కోసం పోటీలో ఉన్నారు. ఐరోపా రాజకీయ పరిభాషలో ఇపిపిని మధ్యేవాద మితవాద పార్టీగా పరిగణిస్తారు. ఫ్రాన్సులో మేరీనె లీపెన్‌ నాయకత్వంలోని పచ్చిమితవాద ఐడెంటిటీ(ఉనికి)-డెమోక్రసీ(ప్రజాస్వామ్య) పార్టీ(ఐడి)కి 57 వచ్చాయి. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ నాయకత్వంలోని యూరోపియన్‌ కన్సర్వేటివ్‌, రిఫార్మిస్టు(ఇసిఆర్‌) పార్టీకి 71 వచ్చాయి. ఈ మూడు పక్షాలూ గతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాయి. సోషలిస్టు మరియు డెమోక్రాట్స్‌ కూటమి(ఎస్‌డి) రెండవ పెద్ద పక్షంగా 135 సీట్లు తెచ్చుకుంది. గుర్తింపు పొందని చిన్న పక్షాలు 95 గెలుచుకున్నాయి.గ్రీన్స్‌ పార్టీ 53,రెన్యూ(పునరుద్దరణ) యూరోప్‌(ఆర్‌ఇ) 83, ఐరోపా వామపక్ష పార్టీ 35 సీట్లు తెచ్చుకుంది. గత ఎన్నికల్లో ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండెర్‌ లెయాన్‌ అభ్యర్థిత్వాన్ని సమర్ధించి గెలిపించిన పార్టీలు తాజా ఎన్నికల్లో 720కి గాను 402 స్థానాలను తెచ్చుకున్నట్లు వెల్లడైంది. అందువలన ఆమె తిరిగి మరోసారి అదే పదవిలో కొనసాగవచ్చు. ఆమె గనుక పచ్చిమితవాద పార్టీల మద్దతుకోసం ప్రయత్నిస్తే తాము దూరంగా ఉంటామని, ఉదారవాద, మితవాద పార్టీల ప్రతినిధులు హెచ్చరించారు. ఆమె బలహీన పడిన గ్రీన్స్‌, ఇటలీ మితవాది మెలోనీ పార్టీ మద్దతు కోరవచ్చని కొందరు విశ్లేషకులు జోశ్యం చెప్పారు.హంగరీలో జాతీయవాద నేత విక్టర్‌ ఒర్బాన్‌ పార్టీ బలం తగ్గినా 44శాతం తెచ్చుకుంది.ఇటలీలో మితవాద ప్రధాని మెలోనీ పార్టీ 30శాతం తెచ్చుకుంది.


ఫ్రెంచి పార్లమెంటును ఆకస్మికంగా రద్దు చేయటంతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ రాజకీయాలకు తెరలేచింది. ఈనెల 30,జూలై ఏడున ఎన్నికలు జరగనున్నాయి. పదహారవ తేదీలోగా అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటన వెలువడిన వెంటనే ఐడి పార్టీ నాయకురాలు మేరీనే లీపెన్‌ దేశ పౌరులు ఈ ఎన్నికల్లో కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో ఆమె పార్టీ 31.5శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో ఉంది. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన జీన్‌ మారీ లీపెన్‌ కుమార్తె మేరీనే కాగా మనుమరాలు మరియో మార్చెల్‌ ఆమెతో వేరుపడి రికగ్నిట్‌ పేరుతో మరో పచ్చిమితవాద పార్టీని ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో మేనత్త మీద ఎలాంటి విమర్శలూ చేయలేదు, మితవాదులందరూ కలవాల్సిన అవసరం గతం కంటే నేడు ఎక్కువగా ఉందంటూ ఎన్నికల ఫలితాల తరువాత మరియో వ్యాఖ్యానించింది. వ్యతిరేకులు, పోటీదార్లకు తేడా ఉంది అన్నారు.అయితే ఇప్పటికే మార్చెల్‌తో మేరీ లీపెన్‌ ప్రతినిధి జోర్డాన్‌ బార్‌డెలా సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. మక్రాన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించే మితవాద పార్టీలు మేరీ లీపెన్‌, మార్చెల్‌తో కలిసే అవకాశాలు ఉన్నాయి. వివిధ పార్టీలలో చీలికలు తెచ్చి తనవైపు తిప్పుకొనేందుకు మక్రాన్‌ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు. అతగాడి అధ్యక్ష పదవీకాలం 2027వరకు ఉంది. పార్లమెంటులో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంటే ఇబ్బంది కనుక వాటిని అడ్డుకొనేందుకు సర్వశక్తులూ వడ్డాలని చూస్తున్నాడు. సోషలిస్టులు, గ్రీన్స్‌, మరికొన్ని వామపక్ష పార్టీలు కూడా కూటమిగా ఏర్పడేందుకు చూస్తున్నాయి. ఐరోపా యూనియన్‌ ఎన్నికలలో సోషలిస్టు పార్టీ(పిఎస్‌)కు 14శాతం ఓట్లు వచ్చాయి.కొన్ని సర్వేల ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో మక్రాన్‌ నాయకత్వంలోని రినయసాన్స్‌ పార్టీ(ఆర్‌ఎన్‌) సగం స్థానాలను కోల్పోనున్నట్లు వెల్లడైంది.


జర్మనీలో పాలక కూటమిలోని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌పిడి) 13.9శాతం ఓట్లు తెచ్చుకొని మూడవ స్థానంలో ఉంది. పచ్చిమితవాద పార్టీ ఏఎఫ్‌డి 16శాతం తెచ్చుకొని చరిత్ర సృష్టించింది. ప్రతిపక్ష క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌-క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ కూటమి 30శాతం తెచ్చుకొని ప్రధమ స్థానంలో ఉంది.తూర్పు జర్మనీ ప్రాంతంలో ఎఎఫ్‌డి అగ్రస్థానంలో ఉంది. సంకీర్ణ కూటమిలోని సోషల్‌ డెమోక్రాట్స్‌(ఎస్‌పిడి), పర్యావరణ గ్రీన్స్‌,ఫ్రీ డెమోక్రాట్స్‌ పార్టీలు వరుసగా 13.9 -11.9-5.2శాతాల చొప్పున తెచ్చుకొని చావు దెబ్బతిన్నాయి.దీంతో వెంటనే ఎన్నికలు జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది.నాలుగింట మూడు వంతుల మంది జనం కూటమి పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ బెర్లిన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చినందున మామూలుగా తమపని తాము చేసే అవకాశాలు ఉండకపోవచ్చని అన్నాడు. వచ్చే జాతీయ ఎన్నికల్లో ఓటర్ల అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తామన్నాడు.నూటముప్ఫై సంవత్సరాల చరిత్రలో ఇంత తక్కువగా ఎస్‌పిడి ఎన్నడూ ఓట్లు తెచ్చుకోలేదు. ప్రత్యామ్నాయ జర్మనీ (ఎఎఫ్‌డి) ఈ ఎన్నికలలో తెచ్చుకున్న ఓట్లతో సుస్థిరం కావటాన్ని అడ్డుకుంటామని, వెనక్కు కొడతామని అన్నాడు. జర్మనీలో, ఐరోపా అంతటా సంప్రదాయ ప్రజాస్వామిక పార్టీలు ఇప్పటికీ మెజారిటీగా ఉన్నాయని అన్నాడు. ప్రతిపక్షం కోరినట్లుగా మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, గడువు ప్రకారమే జరుగుతాయని షుల్జ్‌ ప్రతినిధి స్టెఫెన్‌ ó చెప్పాడు. జాతీయవాదం,విద్వేష ప్రమాదాలను జనం మరచిపోరాదని జర్మనీ అధ్యక్షుడు (మన రాష్ట్రపతి మాదిరి) ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిమెయిర్‌ హెచ్చరించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీల మారణకాండకు బలైనవారి గౌరవార్ధం ప్రాన్సులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీలు ఎదగటాన్ని ప్రస్తావించి జర్మనీలో నేషనల్‌ సోషలిస్టులు(హిట్లర్‌ నాజీ పార్టీ) సాగించిన అత్యాచారాలను గుర్తు చేశాడు.


ఉక్రెయిన్‌ సంక్షోభం, గాజాలో జరుగుతున్న పరిణామాలు,ఐరోపా అంతటా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం వంటి అంశాలన్నింటి కారణంగా మరింత భద్రత కావాలని ఓటర్లు కోరుకున్నారని, దాని మీద పచ్చి మితవాదులు వాగ్దానం చేశారని, ఈ ఎన్నికలు జాతీయ నాయకుల మీద జరిగిన ప్రజాభిప్రాయవెల్లడి అని ఐరోపా సమాఖ్య విదేశీ సంబంధాల డిప్యూటీ డైరెక్టర్‌ వెసెలా టెక్నర్‌నెవా అన్నారు.ఐరోపాలో ఫాసిస్టు, నాజీ, పచ్చి మితవాద శక్తులు పుంజుకోవటమే కాదు, తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న ధోరణి కనిపిస్తున్నది. అయితే ఈ ఎన్నికల్లో అనేక మంది ఊహించిన మాదిరి అవి ఎక్కువ బలాన్ని పెంచుకోలేదు. మూడోవంతు సీట్లు తెచ్చుకోవటం రానున్న ముప్పును వెల్లడిస్తున్నది.ఇప్పటివరకు అనేక కారణాలతో వివిధ దేశాల్లోని ఈ శక్తుల మధ్య ఐక్యత లేదు, అసంఘటితంగా కూడా ఉన్నాయి.ఎవరికి వారుగానే పని చేస్తున్నారు. మితవాదులు, పచ్చిమితవాదులకు స్వల్పతేడాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న పూర్వరంగంలో పార్లమెంట్‌లో ఈ శక్తులు కలిస్తే పరిణామాలు ఎలా ఉండేదీ చెప్పలేము. ఒక వేళ అదే జరిగితే వాటిని వ్యతిరేకించే వారందరూ ఒక కూటమిగా ఏర్పడవచ్చు, వారితో వామపక్షాలు కూడా చేతులు కలిపే అవకాశం లేకపోలేదు.పచ్చిమితవాద శక్తులు బలం పుంజుకోవటం వలన పర్యావరణ,వలసలు, ఉక్రెయిన్‌కు సాయంతో సహా విదేశాంగ విధానంలో మార్పుల కోసం పట్టుపట్టవచ్చు, వేగంగా నిర్ణయాలు తీసుకోవటాన్ని అడ్డుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d