• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

చిన్న దేశం – పెద్ద సందేశం : మాల్దీవుల ఎన్నికల్లో ” విజేత చైనా ” !

24 Wednesday Apr 2024

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

#Anti China, BJP, Maldives, Maldives Parliamentary Election 2024, Mohamed Muizzu, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఆదివారం ఏప్రిల్‌ 19, 2024న జరిగిన మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో విజేత చైనా అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక శీర్షిక పెట్టింది. దాదాపు అన్ని పత్రికలూ చైనా అనుకూల పార్టీ సూపర్‌ మెజారిటీ సాధించినట్లు నివేదించాయి.పీపుల్స్‌ మజ్లిస్‌ (పార్లమెంటు)లోని 93 స్థానాలకు గాను పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(పిఎన్‌సి), దాన్ని బలపరుస్తున్న వారికి 75, భారత అనుకూల మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి 15 స్థానాలు వచ్చినట్లు వార్తా సంస్థలు తెలిపాయి.పోటీచేసిన మహిళలు ముగ్గురూ విజేతలు కాగా వారు అధికార పార్టీకి చెందినవారే. మొత్తం 368 మంది పోటీ చేశారు. వారిలో 130 మంది స్వతంత్రులు కాగా మిగిలిన వారు ఏడు రాజకీయ పార్టీలకు చెందిన వారు. ఈ ఎన్నికల పర్యవసానాల గురించి సహజంగానే విశ్లేషణలు మొదలయ్యాయి.2019లో జరిగిన ఎన్నికల్లో మాల్దీవుల డెమోక్రటిక్‌ పార్టీ 45.83 శాతం ఓట్లతో 87 స్థానాలకు గాను 65 తెచ్చుకుంది. ఆ ఎన్నికల నాటికి నూతన పార్టీగా పిఎన్‌సి 6.63శాతం ఓట్లు, మూడు సీట్లు తెచ్చుకుంది.గతేడాది సెప్టెంబరు 9న జరిగిన ఎన్నికల్లో ఎవరికీ అవసరమైన 50శాతంపైగా మెజారిటీ రాకపోవటంతో 30న జరిగిన తుది దఫా ఎన్నికల్లో ఈ పార్టీ నేత మహమ్మద్‌ ముయిజ్జు 54.04శాతం ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, నవంబరు 17న బాధ్యతలను స్వీకరించాడు.


అధ్యక్ష ఎన్నికలు, తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది.చిన్నదైనా పెద్దదైనా ఏ దేశంలోనూ విదేశాలతో సంబంధాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. చైనా – భారత్‌ మధ్య పోటీగా ఇక్కడ జరిగాయి. అందుకే అసలు విజేత చైనా అన్నట్లుగా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ” అధ్యక్ష ఎన్నికలు తమ పౌరుల దేశ భక్తికి ఒక ప్రతిబింబమని, మా ఇరుగు పొరుగు వారు, భాగస్వాములు తమ స్వాతంత్య్రం, సర్వసత్తాకతను పూర్తిగా గౌరవించాలని ఇచ్చిన ఒక పిలుపు ” అని పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.పార్లమెంటు ఎన్నికలు మరింత తీవ్రంగా జరిగాయి. చైనా బిఆర్‌ఐ పధకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వంలో గృహశాఖ మంత్రిగా ముయిజ్జు పని చేశాడు. తాను అధికారానికి వస్తే రెండు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతానని ఎంతో ముందుగానే ప్రకటించాడు.చెప్పినట్లుగానే భిన్నమైన రీతిలో వ్యవహరిస్తున్నాడు.గతంలో మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా తొలి విదేశీ పర్యటన భారత్‌తోనే ప్రారంభమయ్యేది. అలాంటిది ముయిజ్జు తొలుత టర్కీ, తరువాత యుఏయి, చైనా పర్యటించాడు.2019లో మనదేశంతో కుదుర్చుకున్న జలవాతావరణ(హైడ్రాలజీ) పరిశీలన పధకం నుంచి మాల్దీవులు వైదొలిగింది. అక్కడ ఉన్న కొద్ది మంది మన సైనికులను కూడా దశలవారీ మే 10వ తేదీలో వెనక్కు వెళ్లాలని కోరింది. రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. బ్రిటీష్‌ ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం,హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. తమ విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు చేశాం తప్ప ఎవరివైపూ మొగ్గటం లేదని ముయిజ్జు ప్రకటించాడు.


మాల్దీవుల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను గయూమ్‌ కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్‌ స్పందించింది, ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో కుట్రను విఫలం చేసి అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి. తరువాత జరిగిన పరిణామాల్లో దీవుల ఆర్థిక సమస్యలను, పౌరుల జీవితాలను మెరుగుపరచటంలో పాలకుల వైఫల్యం కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. సరిగ్గా అదే సమయంలో చైనా తన బిఆర్‌ఐ పధకాన్ని ముందుకు తెచ్చింది. ఐఎంఎఫ్‌, ప్రపంచబాంక్‌, అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాదిరి కఠినమైనవి కాకుండా సాధారణ షరతులతో ప్రాజెక్టులకు చైనా రుణాలు ఇచ్చింది. దాంతో 2013లో అధికారానికి వచ్చిన అబ్దుల్లా యామిన్‌ చైనాతో సంబంధాలను పెంచుకున్నాడు.2018లో గెలిచిన ఇబ్రహీం సాలి భారత్‌కు పెద్ద పీట అనే విధానంతో మన దేశానికి సన్నిహితంగా భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాడు. అది ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి( భారత్‌ అవుట్‌) ” అనే నినాదమిచ్చాయి. మనదేశం అనుసరించిన కొన్ని విధానాలు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యంతో జనంలో ఉన్న భారత వ్యతిరేక మనోభావాలు కూడా దీనికి దోహదం చేశాయి. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక మాజీ అధ్యక్షుడు నషీద్‌ మద్దతు ఉందని జనం భావించారు. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు అతగాడు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది.


మాల్దీవుల విదేశాంగ విధానంలో వచ్చిన మార్పులో చైనా వైపు మొగ్గుదల మననేతలకు సహజంగానే రుచించలేదు.ఒక స్వతంత్ర దేశం, అందునా కీలక ప్రాంతంలో ఉన్నందున దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్దరించుకొనేందుకు, కనీసం మరింత దిగజారకుండా చూసుకొనేందుకు ప్రయత్నించటం రాజనీతిజ్ఞుల లక్షణం.ఏ కారణంగానైనా దూరంగా జరిగినా, వైరం పెరిగినా ప్రత్యర్థుల ఆర్థిక మూలాను దెబ్బతీయటం ఒక ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది.వాణిజ్య యుద్దాలు, దిగుమతులు, ఎగుమతులు, సాంకేతిక పరిజ్ఞానం అందచేత, పెట్టుబడులపై నిషేధాలు వాటిలో భాగమే. ఒక దేశం, దేశనేతలను కించపరిస్తే ఎవరూ సహించాల్సిన అవసరం లేదు. అధికారికంగా నిరసన తెలపటం అనేక ఉదంతాల్లో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో మన ప్రధాని నరేంద్రమోడీని అవమానించినందుకుగాను మాల్దీవులకు తగిన బుద్ది చెప్పాలని, అందుకు మన విహార యాత్రీకులు అక్కడికి వెళ్లటం మానుకోవాలని మన దేశంలోని వారు సామాజిక మాధ్యమంలో పిలుపులు ఇచ్చారు. ఒక విమానయాన సంస్థ నిరవధికంగా ప్రయాణాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. మోడీ, భారత్‌ను సామాజిక మాధ్యమంలో కించపరుస్తూ వ్యాఖ్యానించినందుకు మల్షా షరీఫ్‌, మరియం షిహునా, అబ్దుల్లా మఝూన్‌ మజీద్‌ అనే ముగ్గురు ఉప మంత్రులను అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు సస్పెండ్‌ చేశారు. మోడీని వారు హాస్యగాడు, ఉగ్రవాది, ఇజ్రాయెల్‌ తొత్తు అని, మన దేశంలో పరిశుభ్రత తక్కువ అని పేర్కొన్నారు.అరేబియా సముద్రంలోని మన లక్షద్వీప్‌లో విహార యాత్రలను ప్రోత్సహించేందుకు గాను మోడీ ఒక బీచ్‌లో కూర్చున్న వీడియోను పోస్టు చేసిన తరువాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.తమ దేశానికి యాత్రీకులు రాకుండా చేసేందుకే ఇలా చేశారని అక్కడి కొందరు భావించారు. ప్రధానిని కించపరచటం గురించి మాలే లోని మన రాయబారి అక్కడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మాల్దీవుల ప్రతిపక్ష నేతలు అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం పెడతామనేవరకు వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలను తాము గమనించామని, అవి వారి వ్యక్తిగతం తప్ప అధికారిక వైఖరి కాదని అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. జరిగినదాని మీద అధ్యక్షుడు ముయిజ్జు విచారణకు ఆదేశించారని రాయిటర్స్‌ పేర్కొన్నది. కారణాలు ఏమైనప్పటికీ మనదేశం నుంచి మాల్దీవులకు వెళుతున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అక్కడి ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది జనవరి-మార్చి మాసాల మధ్య మన దేశం నుంచి 56,208 మంది మాల్దీవులకు వెళితే ఈ ఏడాది 34,847కు (38శాతం) తగ్గింది. అదే చైనా నుంచి వచ్చిన వారు 17,691 నుంచి 67,399 (281శాతం) పెరిగారు. అక్కడకు విదేశాల నుంచి వచ్చేవారిలో చైనా వాటా పది నుంచి అగ్రస్థానానికి చేరగా, మనదేశం మూడు నుంచి ఆరవ స్థానానికి తగ్గింది.


అధ్యక్షుడు ముయిజ్జు అనుసరిస్తున్న విధానాలతో విబేధించిన ప్రతిపక్షం పార్లమెంటులో తనకు ఉన్న మెజారిటీని ఆధారం చేసుకొని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించేందుకు కూడా చూసింది. తాజా ఎన్నికల్లో అధికార పక్షం నాలుగింట మూడువంతులకు పైగా స్థానాలు సాధించటంతో అలాంటి ముప్పు తొలగటమే గాక అధ్యక్షుడికి మరింత పట్టుదొరికింది. జనవరిలో చైనా పర్యటన జరిపిన ముయిజ్జు అనేక ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను జనం బలపరిచినట్లు ఫలితాలు స్పష్టం చేశాయి. ఇంతవరకు మనదేశ పర్యటనకు రాలేదు. మాల్దీవులకు భారత్‌ స్నేహ హస్తం చాచేందుకు విముఖత చూపితే చైనాపై మరింతగా ఆధారపడతారని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మాల్దీవులకు పర్యాటకులు వెళ్ల వద్దని అధికారికంగా మన ప్రభుత్వం చెప్పకపోయినా జరిగిన పరిణామాలను చూస్తే నష్టం జరిగిందన్నది స్పష్టం. దూరమౌతున్న ఇరుగు పొరుగు దేశాలను మరింత దూరం చేయచూస్తున్న మత విద్వేషకులు ఎలాగూ మారరు. దేశం ఏమైనా వారికి పట్టదు. హనైమధూ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌తో సహా అనేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు మనదేశం పెట్టుబడులు ఉన్నాయి. వాటికి ఎలాంటి ముప్పు రాదు.మాల్దీవు ఎన్నికల్లో చైనా-భారత్‌లతో సంబంధాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంత మాత్రాన వెల్లడైన తీర్పును ఆ ఒక్క అంశానికే ఆపాదించటం, మనదేశానికి వ్యతిరేకంగా పరిగణించాల్సిన అవసరం లేదు. అభివృద్ది పథకాలకు పెట్టుబడులు కావాలని కోరినపుడు అనేక పశ్చిమ దేశాలు అక్కడ హక్కులకు భంగం కలిగించే పాలకులు ఉన్నారంటూ నిరాకరించాయి. ఆ సమయంలో చైనా ముందుకు వచ్చింది. హక్కులు, పాలన అనేది ఆయాదేశాల అంతర్గత వ్యవహారాలు, వాటికి పెట్టుబడులను ముడిపెడితే రాజకీయ పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది చెప్పలేము..

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేదలకు మొండిచేయి ! మన్మోహన్‌ ధారాళంగా అప్పులిస్తే నరేంద్రమోడీ ఉదారంగా లక్షల కోట్లు రద్దు !! ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా !!!

21 Sunday Apr 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Freebies, loans written off, Narendra Modi Failures, NPA;s, Politics Of Freebies, wilful defaulters


ఎం కోటేశ్వరరావు


పేదరికం, పేదల గురించి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చర్చ జరుగుతోంది. ” ఒక్క దెబ్బతో పేదరికాన్ని మాయం చేస్తానని రాహుల్‌ గాంధీ చెబుతున్నారు. ఇంతకాలం ఈ మహా మంత్రగాడు ఎక్కడున్నారు ” ఇది ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్న.ఈ మంత్రాన్ని ఎక్కడ నుంచి నేర్చుకున్నారు, పేదలను అవమానించటం కాదా అని కూడా అన్నారు. ఒక్క దెబ్బతో పేదరికం పోతుందని తాను చెప్పలేదని గట్టి ప్రయత్నం చేయాలని మాత్రమే అన్నట్లు రాహుల్‌ గాంధీ వివరణ. దేశంలో దారిద్య్రం ఉండటానికి కారణం కొంత మంది ఎంపిక చేసుకున్న వ్యక్తులకు నరేంద్రమోడీ సంపదలను కట్టబెట్టటమే అన్నారు. నరేంద్రమోడీ చెబుతున్నట్లుగా 2030నాటికి ప్రపంచంలో మూడవ పెద్దదిగా మనదేశం అవతరించినప్పటికీ జనం పేదరికంలోనే ఉంటారని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పారు. ఇప్పటి వరకు చేసింది ట్రైలర్‌ మాత్రమేనని అసలు సినిమా ముందు చూపుతా, పక్కా, నన్ను నమ్మండి అంటున్నారు నరేంద్రమోడీ. అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని పేదరికంలో జనాభా ఉన్నారని యుపిఏ సర్కార్‌ ఆహార భద్రతా పధకాన్ని తెచ్చింది.2011-12 వినియోగ సమాచారం ఆధారంగా గ్రామీణ ప్రాంత జనాభాలో 75శాతం, పట్టణాలలో 50శాతం మందికి కుటుంబానికి నెలకు 35కిలోల వంతున, వ్యక్తులుగా నెలకు ఐదు కిలోల చొప్పున ఇవ్వాలని పేదల్లో పేదలను గుర్తించి అంత్యోదయ అన్న యోజన కింద నాడు 81.34 కోట్ల మంది అర్హులని, వారిలో 80 కోట్ల మందిని గుర్తించి సబ్సిడీ ఆహార ధాన్యాల పధకాన్ని అమలు చేస్తున్నారు. వచ్చే ఐదు సంవత్సరాలలో 80 కోట్ల మందికి పూర్తి ఉచితంగా ఐదేసి కిలోల వంతున అందచేస్తామని నరేంద్రమోడీ ప్రకటించారు. దీని అర్ధం ఏమిటి ? దారిద్య్రం నుంచి బయటపడని వారు, లేదా బయటపడవేసిన వారు కూడా అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని, మరో ఐదేండ్లు తమ అచ్చేదిన్‌ పాలనలో అలాగే ఉంటారని, పని కల్పించలేమని చేతులెత్తేయటమే కదా !


మనదేశ బహుముఖ దారిద్య్రం గురించి 2023లో వెల్లడించిన నివేదిక ప్రకారం 2015-16లో దేశంలో 24.85 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉంటే 2019-21 నాటికి 14.96శాతానికి అంటే 13 కోట్ల 56లక్షల 61వేల 35 మందిని ఎగువకు తెచ్చినట్లు చెప్పారు. నరేంద్రమోడీ ఏలుబడిలో 2001 అక్టోబరు 7 నుంచి 2014 మే 22 వరకు గుజరాత్‌ ఉంది. అంతకు ముందు ఆరు సంవత్సరాలు కూడా బిజెపి పాలనలోనే ఉంది. దేశానికి నమూనాగా పేర్కొన్న గుజరాత్‌లో 2015-16 నాటికి పేదరికం 18.47శాతం ఉంది. కమ్యూనిస్టులు అభివృద్ధికి దూరంగా ఉంచారన్న కేరళలో 0.7శాతమే ఉంది. పైన చెప్పుకున్న వ్యవధిలో దేశంలో 24.85శాతం దారిద్య్రాన్ని 14.96శాతానికి తగ్గించామని చంకలు కొట్టుకుంటున్న నరేంద్రమోడీ రెండింజన్ల గుజరాత్‌లో ఆ దామాషా ప్రకారం తగ్గించటంలో ఎందుకు విఫలమైనట్లు ? 18.47శాతంగా ఉన్న వారిని 11.66శాతానికి ఎందుకు పరిమితం చేశారు ? పోషకాహారం లేని వారు బీహార్‌లో 2019-21లో 42.2శాతం, రెండవదిగా ఉన్న జార్ఖండ్‌లో 40.32, మూడవదిగా ఉన్న గుజరాత్‌లో 38.09శాతం ఉన్నట్లు సదరు నివేదిక వెల్లడించింది. గుజరాత్‌ జనాభాలో 2.44శాతానికి ఇప్పటికీ విద్యుత్‌, 23.3శాతానికి ఇండ్లు,11.37శాతానికి ఎలాంటి ఆస్తులు,4.4శాతానికి బాంకు ఖాతాలు లేవు. దేశంలో సగటున ఆరేండ్ల లోపు పిల్లల్లో 67.1, మహిళల్లో 15-49 ఏండ్ల మధ్యవయస్సుల వారిలో 57శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గుజరాత్‌లో దేశ సగటుకు మించి పిల్లల్లో 79.7, మహిళల్లో 65.1శాతం ఉన్నారు.దీనికి నరేంద్రమోడీ, ఆయనను పొగిడేవారు తలలెక్కడ పెట్టుకుంటారు.


నరేంద్రమోడీ ధరించే సూటు ధర రు.పదిలక్షలు. సాధారణ జనాల మాదిరి సంవత్సరాల తరబడి వేసుకుంటారా లేక తరచుగా మార్చివేస్తారో తెలియదు. 2016లో మోడీ ధరించిన ఒక సూట్‌ను వేలం వేస్తే సూరత్‌లోని ఒక ” పేదవాడు ” రు.4.3 కోట్లకు దక్కించుకున్నాడు. దాన్ని అహమ్మదాబాద్‌లోని జేడ్‌ బ్లూ అనే వస్త్రదుకాణ సంస్థలో కుట్టారని విలువ పది లక్షలని తేలింది. అప్పటి నుంచి మోడీ అంత ఖరీదుగల దుస్తులు ధరిస్తారని ప్రచారంలోకి వచ్చింది. పేద కుటుంబం నుంచి వచ్చిన మోడీకి తన ప్రభుత్వం 60,80 ఏండ్లు దాటిన దారిద్య్రరేఖ దిగువన ఉన్న పేదలకు ఇస్తున్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల మొత్తం తెలియదా ! లేక తన పాలనలో కనీసం కోడి గుడ్డంత బంగారం కూడా లేని పేదలు ఉండరన్న ధీమా కావచ్చు. యుపిఏ పాలనలో నిర్ణయించిన నెల పెన్షన్‌ రు.200,500 మాత్రమే ఇప్పటికీ నరేంద్రమోడీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడువేలు, తెలంగాణాలో రెండు వేలు, కేరళలో రు.1,600 ఇస్తున్నారంటే కేంద్రం ఇస్తున్న మొత్తాలకు అక్కడి ప్రభుత్వాలు తమ బడ్జెట్ల నుంచి అదనంగా జతచేసి ఇస్తున్నాయి. బిజెపి పాలనలోని మహారాష్ట్రలో రెండువందలకు మరో నాలుగు వందలు కలిపి ఇస్తున్నారు. వికీ పీడియా సమాచారం ప్రకారం వృద్ధాప్య పెన్షన్లు అసోంలో 200-500, బీహార్‌ 400-500, గుజరాత్‌లో 750-1000, మధ్య ప్రదేశ్‌ 600-800, రాజస్తాన్‌లో 750-1000 ఇస్తున్నారు. పదేండ్ల అచ్చేదిన్‌ పాలనలో ధరల పెరుగుదలకు అనుగుణంగా ఒక్క పైసా కూడా పెంచేందుకు మహానుభావుడు నరేంద్రమోడీకి చేతులు రాలేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బిజెపి నేతలు రోడ్లు వేశాం, రేవులను అభివృద్ధి చేశాం అంటారు తప్ప పెన్షన్లు పెంచాం అనే మాట చెప్పరు..


పెన్షన్లు పెంచే ప్రతిపాదనేదీ లేదని 2023 డిసెంబరు ఆరవ తేదీన ఒక ప్రశ్నకు ( నం.429) కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. తాము ఇస్తున్న పెన్షన్‌ మొత్తాన్ని కూడా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని, కేంద్ర వాటా గురించి కూడా చెప్పాలని బిజెపి పెద్దలు కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దానికి తమకేమీ అభ్యంతరం లేదని, ఎవరెంత ఇస్తున్నారో జనానికి తెలియటం అవసరమేనని విజయన్‌ చెప్పారు. పెన్షన్‌ పధకాలకు 2021, 2022 ఆర్థిక సంవత్సరాలకు కేరళకు చెల్లించాల్సి 573 కోట్లను కేంద్రం నిలిపివేసినట్లు పైన పేర్కొన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో వివరాలు చెబుతున్నాయి. పేదల పెన్షన్ల పట్ల ఇంత కఠినంగా ఉన్న మోడీ కావాలని రుణాలు ఎగవేసిన వారి పట్ల ఎంతో ఉదారంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో అడ్డగోలుగా రుణాలు ఇచ్చారని ఎదురుదాడి ఒకటి. వారి ఏలుబడిలో ఇస్తే తన పాలనలో వాటిని వసూలు చేయకూడదని ఎవరైనా అడ్డుపడ్డారా ? ఒక్క ముక్కలో చెప్పాలంటే యుపిఏ హయాంలో బాధ్యతారహితంగా కార్పొరేట్లకు అప్పులిస్తే మోడీ హయాంలో ఎగవేసిన వాటిని రద్దు చేసి వారి సేవలో తరించారు. అంతిమంగా జనం జేబులు గుల్ల. ఉచితాలకు తాను వ్యతిరేకం అని చెబుతున్న మోడీ కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ బాంకుల రుణాలను ఉదారంగా ఎలా రద్దు చేశారు ? ఇది ఖజానాను దెబ్బతీయదా ? రిజర్వుబాంకు సమాచారం ఆధారంగా బాంకుల్లో నిరర్ధక(బడా బాబులు ఎగవేసిన) ఆస్తులుగా పేర్కొన్న కొన్ని వివరాలు దిగువ చూడవచ్చు. అంకెలు రు.లక్షల కోట్లు.


పాలన××కాలం×××××× మొత్తం వాణిజ్య బాంకులు ×××××× ప్రభుత్వ రంగ బాంకులు
పాలన××××కాలం××××× ఎన్‌పిఏ ×× వసూలు×× రద్దు ×× ఎన్‌పిఏ ×× వసూలు×× రద్దు
యుపిఏ 1× 2004-09×× 1.55 ×× 1.39 ××0.08 ×× 1.08 ×× 1.12 ×× 0.02
యుపిఏ 2× 2009-14×× 5.76 ×× 3.24 ×× 0.55 ×× 4.80 ×× 2.64 ×× 0.32
మోడీ 1× 2014-19 ×× 19.79 ×× 5.99 ×× 6.40 ××15.90 ×× 4.52 ×× 5.05
మోడీ 2× 2019-21 ×× 7.79 ×× 2.74 ×× 4.46 ×× 5.17 ×× 1.74 ×× 3.12


ఈ అంకెలు వెల్లడిస్తున్నదేమిటి ? యుపిఏ పదేండ్లలో నిరర్దక ఆస్తులుగా తేలిన ప్రతి వంద రూపాయల్లో వసూలు రు.63.34 ఉండగా రద్దు చేసినది రు.8.62 కాగా, మోడీ ఏలుబడి 2014 నుంచి 2021వరకు వందకు వసూలు రు.31.65 కాగా రద్దు చేసిన మొత్తం రు.39.38. మొత్తం వాణిజ్య బాంకుల్లో రద్దు చేసిన మొత్తాలు 10.86 లక్షల కోట్లు కాగా వాటిలో ప్రభుత్వ బాంకుల వాటా 8.17లక్షల కోట్లు ఉంది. నరేంద్రమోడీ 2016లో ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంకరప్టసీ బోర్డు(ఐబిసి) అంటే దివాలా మరియు అప్పులు తీర్చలేని వారి కోసం ఏర్పాటు చేశారు.2022 జూన్‌ వరకు ఈ సంస్థకు నివేదించిన దానిలో ఆమోదించిన మొత్తాల విలువ రు.7.67లక్షల కోట్లు. దీనికి గాను వసూలు చేసింది 2.25లక్షల కోట్లు(30.6శాతం) మాత్రమే.దీన్ని జనం భాషలో చెప్పాలంటే ప్రతి లక్ష కోట్లకు బాంకులకు అయిన క్షవరం రు.67,000 కోట్లు.2014-15 నుంచి 2023 మార్చి నెల వరకు తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రద్దు చేసిన రుణాల మొత్తం రు.14లక్షల 56వేల 226 కోట్లని కేంద్ర మంత్రి గతేడాది ఆగస్టులో లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో చెప్పారు.కాగా వసూలు చేసిన మొత్తం రు.7లక్షల 40వేల, 968కోట్లని కూడా వెల్లడించారు.ఇదంతా మోడినోమిక్స్‌లో భాగమే. నేను తినను ఇతరులను తిననివ్వను, ప్రతి పైసాకూ జవాబుదారీగా ఉంటానని చెప్పిన నరేంద్రమోడీ ఎవడబ్బ సొమ్మని లక్షల కోట్లు రద్దు చేసినట్లు రామచంద్రా ? స్వతంత్ర భారత చరిత్రలో ఏకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగిన ఇంతకంటే పెద్ద కుంభకోణం ఏముంది. అప్పనంగా రద్దు చేస్తే కార్పొరేట్లు కుంభకోణానికి పాల్పడాల్సిన అవసరం ఏముంది ? పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయితేనేం. కొల్లగొడుతున్నది జనం సొమ్మేగా ! ఇంతగా సహకరిస్తున్నారు గనుకనే మూడో సారి కూడా మోడీనే రావాలని వేల కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల రూపంలో సమర్పించారు. తమ చేతుల్లో ఉన్న మీడియా ద్వారా ఊదరగొడుతున్నారు. ఏ టీవీ ఛానల్లో అయినా ఈ తీరు తెన్నుల గురించి చర్చలను ఎవరైనా చూశారా ?


మోడీ పాలనలో బాంకుల అవినీతి వెల్లడైనా మీడియాకు పెద్దగా పట్టదు. తొలి ఎనిమిది సంవత్సరాల పాలనలో బాంకుల్లో జరిగిన అవినీతి కారణంగా మూడు లక్షల కోట్లు గల్లంతు కాగా వాటిలో ప్రభుత్వ రంగబాంకుల్లోనే 2.15లక్షల కోట్లు ఉంది, మూడు లక్షల కోట్లకు గాను తిరిగి వసూలు చేసింది కేవలం 33,646 కోట్లని 2021-22 సంవత్సరం వరకు ఆర్‌బిఐ ఇచ్చిన సమాచారహక్కు సమాధానంలో చెప్పింది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం రు. 3.4లక్షల కోట్లు ప్రభుత్వ రంగబాంకులకు ఇచ్చి వాటిని నిలబెట్టింది. ఇదంతా జనం సొమ్ము కాదా ? 2008లో 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపు సక్రమంగా వేలం వేయని కారణంగా రు.1.76లక్షల కోట్ల మేర నష్టం జరిగిందన్న కాగ్‌ నివేదిక దేశంలో ఎంత సంచలనం కలిగించిందో, కాంగ్రెస్‌ను అధికారం నుంచి తొలగించేందుకు ఎలా తోడ్పడిందో తెలిసిందే. ఆ మొత్తం ఊహాజనితం, కేటాయింపు సక్రమంగా లేదు తప్ప అవినీతి జరగలేదని తరువాత కోర్టు ఆ కేసును కొట్టివేసింది.కానీ బాంకు రుణాల రద్దు అలాంటిది కాదు. వాస్తవం. ఒక సినిమాలో హీరోయిన్‌ రష్మిక మీకు అర్ధమౌతోందా అన్న ఊతపదాన్ని ఈ సందర్భంగా జనాలకు గుర్తు చేయాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ రాజకీయం : నరేంద్రమోడీ, రాహుల్‌ గాంధీ దిగజారుడు – పినరయి విజయన్‌ హుందాతనం !!

18 Thursday Apr 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, STATES NEWS

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Pinarayi Vijayan, BJP, Kerala LDF, Kerala UDF, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఇతర ముఖ్యమంత్రులను వేటాడుతున్నట్లుగా బిజెపి కేరళ సిఎం పినరయి విజయన్‌ వెంట ఎందుకు పడటం లేదంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వయనాడు నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ప్రశ్నించారు. కాషాయ పార్టీని విమర్శించే దమ్ము సిపిఎంకు ఉందా అంటూ మాట్లాడారు.ఎల్‌డిఎఫ్‌-బిజెపి కుమ్మక్కై తమను దెబ్బతీసేందుకు చూస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎల్‌డిఎఫ్‌-యుడిఎఫ్‌ మధ్య సంకుల సమరం సాగుతున్న కేరళలో గతంలో మాదిరి తమకు సీట్లు రావని భావిస్తున్న కాంగ్రెస్‌ ముందుగానే సాకులు వెతుకుతున్నట్లు ఈ ప్రచారం వెల్లడిస్తున్నది.నిజానికి సిపిఎంను దెబ్బతీసేందుకు గతంలో కాంగ్రెస్‌-బిజెపి అనేక చోట్ల కుమ్మక్కైన చరిత్ర ఆ పార్టీలకు ఉందని సిపిఎం అనేక సార్లు చెప్పింది. తమను విమర్శిస్తున్నంత తీవ్రంగా బిజెపిని వామపక్షాలు విమర్శించటం లేదని యుడిఎఫ్‌ ఆరోపిస్తోంది. ఇద్దరు మాజీ సిఎంల బిడ్డలు బిజెపిలో చేరి కాంగ్రెస్‌ను సవాలు చేస్తుంటే, అనేక మంది అటువైపు తొంగి చూస్తుంటే వారికి సమాధానం చెప్పలేని స్థానిక కాంగ్రెస్‌ నేతలు, రాహుల్‌ గాంధీ బిజెపిని వదలి సిపిఎం మీద ఎందుకు విరుచుకుపడుతున్నట్లు ? బిజెపి అభ్యర్ధిగా తన కుమారుడు పోటీ చేస్తున్నచోట కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్లటానికి మాజీ సిఎం ఎకె ఆంటోని ఆరోగ్యం బాగులేదని సాకు చెప్పారు. బిజెపిని గట్టిగా విమర్శిస్తే ఎవరి మీద ఏ ఇడి,ఐటి, సిబిఐని వదులుతారో అని కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు.మాజీ సిఎం కరుణాకరన్‌ కుమార్తె పద్మజ ఆ కారణంగానే బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే.


” ఎవరైనా బిజెపిని విమర్శిస్తే వారు సిబిఐ, ఇడి,సభ్యత్వాల రద్దు, ఆస్తుల స్వాధీనాలతో ఎదురుదాడి చేస్తారని నాకు తెలుసు.ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే కేరళ సిఎం మీద బిజెపి ఎందుకు దాడి చేయటం లేదు. ఎందుకు ఆయన సంపదలను స్వాధీనం చేసుకోలేదు, ఎందుకు సిఎం పదవిని లాగివేయలేదు, కోర్టు కేసులు ఎందుకు పెట్టలేదు, ఇడి ద్వారా ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పటికే ఇద్దరు సిఎంలు జైల్లో ఉన్నతరువాత కూడా ఎందుకు అలా చేయలేదు ” అని బిజెపిని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. మతి తప్పి రాజకీయంగా దిగజారి మాట్లాడటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.” ఇరవై నాలుగు గంటలూ తనను విమర్శిస్తున్న కేరళ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న బిజెపిని ఎందుకు విమర్శించటం లేదు, కొద్ది సమయమైనా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, నరేంద్రమోడీని విమర్శించాలి కదా ” అని రాహుల్‌ ప్రశ్నించారు.రాహుల్‌ గాంధీ ఈ స్థాయికి దిగజారి ఎందుకు మాట్లాడారన్నది ప్రశ్న.పినరయి విజయన్‌ మీద తప్పుడు కేసులు పెట్టాలని మోడీకి సలహా ఇస్తున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు.


కేరళ ఎన్నికలలో సిఏఏ, ఉమ్మడి పౌరస్మృతి అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌ సిఏఏ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చేందుకు తిరస్కరించింది. ఈ రెండు అంశాలను ఎందుకు విస్మరిస్తున్నదని గురువారం నాడు మలప్పురం విలేకర్ల సమావేశంలో, అంతకు ముందు కూడా సిఎం పినరయి విజయన్‌ విమర్శించారు. సిఏఏ గురించి కాంగ్రెస్‌ న్యాయపత్రలో ప్రస్తావన లేదని చివరికి దీన్ని అమెరికా కూడా విమర్శించినా కాంగ్రెస్‌ మౌనంగా ఉందన్నారు. బిజెపిని సిపిఎం గట్టిగా విమర్శించటం లేదన్న కాంగ్రెస్‌ ఆరోపణ గురించి మాట్లాడుతూ ఈ అంశంలో తమకు కాంగ్రెస్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదన్నారు. సిఏఏ వ్యతిరేక నిరసనల్లో ఎంత మంది కాంగ్రెస్‌ వారి మీద కేసులు నమోదయ్యాయో రాహుల్‌ గాంధీ చెప్పగలరా అని విజయన్‌ సవాల్‌ విసిరారు. సిఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షంతో కలసి కేరళ ప్రభుత్వం నిరసన తలపెడితే చివరిక్షణంలో కాంగ్రెస్‌ వెనక్కు తగ్గిందని, బహుశా అగ్రనేతల నుంచి వచ్చిన ఆదేశాల వల్ల కావచ్చని సిఎం అన్నారు.( జమ్మూలోని కథువాలో ఎనిమిదేండ్ల బాలిక మీద అత్యాచారం హత్య చేసిన ఉదంతం దేశంలో తీవ్ర సంచలన కలిగించిన సంగతి తెలిసిందే.) కథువా ఉదంతంలో నిందితులకు మద్దతుగా ప్రదర్శనలు చేసినవారిలో ఒకడైన బిజెపి నేత చౌదరి లాల్‌ సింగ్‌ను స్వయంగా రాహుల్‌ గాంధీ గత నెలలో కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి ఇప్పుడు ఉధంపూర్‌ లోక్‌సభ అభ్యర్ధిగా నిలిపారని విజయన్‌ విమర్శించారు. సంఘపరివార్‌ను వ్యతిరేకించటంలో కాంగ్రెస్‌ గట్టి వైఖరి తీసుకోవటం లేదన్నారు. ఎన్నికల బాండ్ల కుంభకోణంలో బిజెపి ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్‌ రు.1,952 కోట్లు తీసుకొన్నదని అలాంటి పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఎన్నికల బాండ్ల గురించి లూటీ అంటూ కబుర్లు చెబుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విమర్శించారు.వాటికి వ్యతిరేకంగా సిపిఎం కేసు వేసిన అంశాన్ని గుర్తు చేశారు.


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె వీణ నిర్వహిస్తున్న ఒక కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు ఒక కేసు నమోదైంది.దానిలో నిజానిజాలను ఆరోపించిన వారు వెల్లడించాలి, దాన్ని కోర్టు విచారించి తీర్పు చెప్పాలి. కానీ ఈ లోగానే దీన్ని రాజకీయం చేసేందుకు కాంగ్రెస్‌,బిజెపి చూస్తున్నాయి. మీడియా కూడా విజయన్‌న్ను రెచ్చగొట్టేందుకు చేయని యత్నం లేదు.” ఎన్నికల సమయం గనుక సిఎంను ఇబ్బంది పెట్టటం, మౌనంగా ఉండేట్లు చూడటం నరేంద్రమోడీ ఎత్తుగడ. కానీ సిఎం సవాలుగా తీసుకున్నారు.తన మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తారని పినరయికి తెలుసు. కానీ పార్టీకోసం ఆయన సహించారు ” అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడొకరు చెప్పినట్లు మళయాల మనోరమ పత్రిక రాసింది. తన కుమార్తె కంపెనీ మీద వచ్చిన ఆరోపణల గురించి త్రిసూరులో జరిపిన విలేకర్ల సమావేశంలో విజయన్‌ ఇచ్చిన సమాధానాలు విమర్శకుల నోటికి తాళం వేయటమే కాదు, ఆయన హుందాతనాన్ని వెల్లడిస్తున్నాయి.” ఒక కంపెనీ నుంచి సేవలు పొందినందుకు మరొక కంపెనీ ఇచ్చిన ఫీజు అంశమది. దాన్లో రహస్యమేమీ లేదు. అదంతా బాంకు ఖాతాల ద్వారానే జరిగింది.కంపెనీ దాఖలు చేసిన ఆదాయపన్ను పత్రాల్లో కూడా అది ప్రతిబింబించింది. దేశంలో కొత్త అంశమేమంటే పారదర్శకంగా జరిగిన లావాదేవీలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చని నూతన సంప్రదాయాన్ని ప్రవేశ పెట్టారు. దాని గురించి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు ” అన్నారు. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలు, చెప్పుకున్న గొప్పలను విలేకర్లు ప్రస్తావించగా వాటికి ఇచ్చిన సమాధానాలను చూద్దాం.


నరేంద్రమోడీ: డిపాజిటర్ల (కరువన్నూరు సహకార బాంకు) డబ్బు తిరిగి ఇచ్చినట్లు సిఎం అవాస్తవం చెబుతున్నారు.బాంకు నుంచి స్వాధీనం చేసుకున్న రు. 90 కోట్ల మొత్తాన్ని డిపాజిటర్లకు తిరిగి ఇవ్వటానికి అవకాశం ఉందా లేదా అని నేను ఇప్పటికే మాట్లాడాను.
విజయన్‌ : కరువన్నూరు డిపాజిటర్లకు రు.117 కోట్ల వరకు చెల్లించారు.డిపాజిటర్లు కోరితే ఇంకా ఇవ్వటానికి బాంకు సిద్ధంగా ఉంది.బిజెపి కోరుకుంటున్నట్లుగా బాంకు కుప్పకూలిపోలేదు.అది సాధారణ లావాదేవీలు నడుపుతున్నది.
నరేంద్రమోడీ : త్రిసూరు జిల్లా సిపిఎం కార్యదర్శికి వంద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.
విజయన్‌: స్థానిక శాఖల నుంచి జిల్లా కమిటీ కార్యాలయం వరకు జిల్లా అంతటా స్థలాలు, ఆఫీసులు ఉన్నాయి.వాటినే సిపిఎం జిల్లా కార్యదర్శి ఆస్తులని ప్రధాని చెప్పారు. ఇలాంటి అభాండాలు సిపిఎం వంటి పార్టీని దెబ్బతీయలేవు.
నరేంద్రమోడీ : సిపిఎం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది.
విజయన్‌: గత పది సంవత్సరాలలో బిజెపి నాయకత్వంలోని కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి.తాజా అంశానికి వస్తే ఎన్నికల బాండ్ల కుంభకోణం. దీనికి అనేక కోణాలు ఉన్నాయి.ఇంత పెద్ద అవినీతి అసాధారణ రాజకీయ సంస్కృతిలో భాగం.
నరేంద్రమోడీ : పేదలకు మూడు కోట్ల ఇళ్లు మోడీ హామీ.
విజయన్‌ : 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని 2019 ఎన్నికల ప్రణాళికలో బిజెపి చెప్పింది. ఈ హామీ ఏమైంది ? 2024 ప్రణాళికలో దీని గురించి మౌనం దాల్చారు. ఇక్కడ కేరళ పని తీరును చూడవచ్చు. ఇల్లులేని వారు ఎవరూ ఉండకూడదు అన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు దగ్గరగా ఉన్నాం. ఇప్పటికే 4.56 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి. మరో 1.52లక్షల ఇళ్ల పని పురోగతిలో ఉంది.
నరేంద్రమోడీ : సాధించిన విజయాలుగా చెప్పుకొనేందుకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. కేంద్ర పధకాలనే తన గొప్పలుగా చెప్పుకొంటోంది.
విజయన్‌ : గృహ నిర్మాణంలో కేంద్ర పాత్ర ఏమిటో విశ్లేషిద్దాం.పిఎంఏవై(గ్రామీణ) పధకం కింద 33,517 ఇళ్లకు ఒక్కోదానికి రు.72,000 మంజూరు చేసింది.పిఎంఏవై(పట్టణ) పధకం కింద ఒక్కోదానికి రు.1.5లక్షల చొప్పున 83,261 ఇళ్లకు మంజూరు చేసింది. కేరళ లైఫ్‌ మిషన్‌ పధకం కింద ఇప్పటికి దాదాపు ఐదు లక్షల ఇండ్లకు గాను రు.17,490 కోట్లు ఖర్చు చేశాము. వీటిలో కేంద్రం నుంచి వచ్చింది కేవలం రు.2,081 కోట్లు, మొత్తంలో కేవలం 11.9శాతం మాత్రమే.


కేరళ లోక్‌సభ ఎన్నికలు ఈనెల 26న జరగనున్నాయి.దేశమంతటా ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్న కాషాయ దళాలు కేరళలో క్రైస్తవుల ఓట్ల కోసం చర్చీల చుట్టూ తిరుగుతున్నాయి.లవ్‌ జీహాద్‌ పేరుతో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నాయి. 2019లో జరిగిన ఎన్నికలలో శబరిమల వివాదం మీద కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు.వ్రతం చెడ్డా భంగపడ్డారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమికి 48.48శాతం, 96,29,030 ఓట్లు, 19 సీట్లు వచ్చాయి. ఎల్‌డిఎఫ్‌ కూటమికి 36.29శాతం, 71,56,387 ఓట్లు, ఒక సీటు వచ్చింది. బిజెపి కూటమికి 15.64శాతం, 31,71,792 ఓట్లు వచ్చాయి. తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు 1,05,55, 516 ఓట్లు(45.43శాతం), కాంగ్రెస్‌ కూటమికి 81,96,813 ఓట్లు(39.47శాతం) రాగా బిజెపి కూటమి ఓట్లు 23,54,468(12.41శాతం) వచ్చాయి. నరేంద్రమోడీ రెండవసారి మరింత బలంగా అధికారానికి వచ్చారని, తమ బలం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లతో కింగ్‌ మేకర్‌గా మారి తాము అధికారానికి వస్తున్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంది. అంతకు ముందు ఉన్న ఒక్కసీటూ పోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2.55శాతం, 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే 3.23శాతం ఓట్లు కోల్పోయింది. ఈ సారి మరోసారి ఓటర్లను మభ్య పెట్టేందుకు పూనుకుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుక్క కాటుకు చెప్పుదెబ్బ : కేరళ స్టోరీకి పోటీగా మణిపూర్‌ చిత్రం !

14 Sunday Apr 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), kerala 2024 loksabha elections, Kerala BJP vote Share, Kerala LDF, Kerala UDF, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కేరళలో ఈనెల 26న జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన విజయం కొనసాగింపుగా పైచేయి సాధించాలని సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ చూస్తుండగా 2019 పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన సీట్లను నిలుపుకోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ కూటమి ప్రయత్నిస్తోంది. ఏదో ఒక సీటు సాధించి రాష్ట్రంలో తమకూ స్థానం ఉందని పరువు నిలుపుకొనేందుకు బిజెపి చూస్తోంది. జనసంఘం తరువాత బిజెపిగా ఉన్న పార్టీకి గతంలో ఒకసారి ఒక అసెంబ్లీ స్థానం రావటం తప్ప కేరళ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభ ద్వారా కేరళ బిజెపి నేతలు ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఒక స్థానాన్ని కూడా కోల్పోయింది. ఈ ఎన్నికలలో అనూహ్యంగా కేరళ స్టోరీ పేరుతో వచ్చిన ఒక సినిమాను సంఘపరివార్‌ ప్రోద్బలంతో క్రైస్తవ మతాధికారులు ప్రదర్శిస్తున్నారు. లవ్‌ జీహాద్‌ పేరుతో కాషాయ దళాలు ముందుకు తెచ్చిన కుట్ర సిద్దాంతంతో కూడా కూడిన ఊహాజనిత చిత్రమే అది.ముస్లిం యువకులు హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన యువతులకు వలపు వలవేసి మతమార్పిడికి చూస్తున్నారన్నదే ఆ చిత్ర కథ. ఇటీవల బిజెపి వైపు మొగ్గిన కొందరు క్రైస్తవ మతపెద్దలు తమ మతానికి చెందిన యువతులను హెచ్చరించే పేరుతో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీన్ని దూరదర్శన్‌లో కూడా ఇటీవల ప్రదర్శించారు. దీంతో ఎంత మంది బిజెపికి ఓటు వేస్తారో తెలియదు. దీనివెనుక ఉన్నవారు ఊహించని విధంగా అదే క్రైస్తవ మతానికి చెందిన వారు మణిపూర్‌లో క్రైస్తవ గిరిజనుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాల ఉదంతాలతో రూపొందించిన ” అణచివేతకు గురైనవారి ఆక్రందన ”( క్రై ఆఫ్‌ ద అప్రెస్‌డ్‌) పేరుతో రూపొందించిన ఒక డాక్యుమెంటరీని పోటీగా ప్రదర్శిస్తున్నారు. కేరళలో 18శాతం మంది క్రైస్తవమతాన్ని అవలంభించే జనం ఉన్నారు. ముస్లింలు 26.6శాతం ఉన్నారు. మణిపూర్‌లో కుకీ తదితర గిరిజనుల మీద దాడులు జరుగుతున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించి బాధితులకు ఊరటగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అక్కడ అధికారంలో ఉన్న బిజెపి హిందూమతానికి చెందిన మెయితీలకు మద్దతుగా ఉందనే విమర్శలు ఉన్నాయి.


కమ్యూనిజం, కమ్యూనిస్టు పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసి కేరళలో మెజారిటీ క్రైస్తవుల ఓట్లు పొందటంలో గతంలో కాంగ్రెస్‌ ఎత్తుగడలు పారాయి. తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అనేక చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు బిజెపి కూడా రంగంలోకి దిగి వారిని సంతుష్టీకరించేందుకు చర్చీల చుట్టూ చక్కర్లు కొడుతున్నది.కేరళ స్టోరీ చిత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నది. అర్‌ఎస్‌ఎస్‌ అజెండాలో భాగంగానే అధికారాన్ని దుర్వినియోగం చేసి దూరదర్శన్‌లో కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రదర్శించినట్లు సిపిఎం, కాంగ్రెస్‌ రెండూ విమర్శించాయి.తమకేమీ సంబంధం లేదని బిజెపి బుకాయించింది. ఓట్ల కోసం కమలనాధులు దేనికైనా సిద్దపడుతున్నారు. కేరళలో 2019లో ఇరవై స్థానాలకు గాను కేవలం ఒక్కచోటే సిపిఎం గెలిచింది. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఎల్‌డిఎఫ్‌ సమర్ధించింది. దానికి తోడు కేంద్రంలో రెండవసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్‌ మాత్రమే అని జనం నమ్మటం, వయనాడు నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌ గాంధీ గెలిస్తే ప్రధాని అవుతారన్న ప్రచారం కాంగ్రెస్‌ గెలుపుకు దోహదం చేశాయి. తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శబరిమల వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదు. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ కూడా భాగస్వాములుగా ఉండటంతో ఎవరు గెలిచినా బిజెపిని వ్యతిరేకించే వారే గనుక గతంలో మాదిరి బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ముస్లింలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం లేదని, ఎవరు గట్టిగా నిలబడతారని భావించే వారికి ఓటు వేయనున్నారని సాధారణంగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే ప్రముఖ పత్రిక మళయాళ మనోరమ ఒక సమీక్షలో పేర్కొన్నది.


ముందే చెప్పినట్లు 2019లో జరిగిన ఎన్నికలలో శబరిమల వివాదం మీద కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమికి (48.48శాతం) 96,29,030 ఓట్లు, 19 సీట్లు వచ్చాయి. ఎల్‌డిఎఫ్‌ కూటమికి (36.29శాతం) 71,56,387 ఓట్లు, ఒక సీటు వచ్చింది. బిజెపి కూటమికి (15.64శాతం) 31,71,792 ఓట్లు వచ్చాయి. తరువాత రెండు సంవత్సరాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు 1,05,55, 516 ఓట్లు(45.43శాతం), కాంగ్రెస్‌ కూటమికి 81,96,813 ఓట్లు(39.47శాతం) రాగా బిజెపి కూటమి ఓట్లు 23,54,468(12.41శాతం) వచ్చాయి. నరేంద్రమోడీ రెండవసారి మరింత బలంగా అధికారానికి వచ్చారని, తమ బలం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లతో తాము అధికారానికి వస్తున్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంది. అంతకు ముందు ఉన్న ఒక్క సీటూ పోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2.55శాతం, 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే 3.23శాతం ఓట్లు కోల్పోయింది. ఇప్పుడు ఐదు సీట్లు తెచ్చుకుంటామని, పదేండ్లలో రాష్ట్రంలో అధికారానికి వస్తామని బిజెపి నేత ప్రకాష్‌ జవదేకర్‌ చెబుతున్నారు. గతంలో నరేంద్రమోడీ పలుకుబడి, శబరిమల వివాదంపై రెచ్చగొట్టుడు దానికేమీ లాభించలేదు.


శైలజా టీచర్‌పై ముగ్గురు శైలజల పోటీ ! సిఏఏ ప్రస్తావనకు భయపడిన కాంగ్రెస్‌ !!
కేరళ లోక్‌సభ ఎన్నికలు మొత్తంగా ఆసక్తి కలిగిస్తున్నప్పటికీ సిపిఎం అభ్యర్ధిగా వడకర స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎంఎల్‌ఏ కె కె శైలజ టీచర్‌ మీద అదే పేరు గలిగిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున పాలక్కాడ్‌ ఎంఎల్‌ఏ షఫీ పరంబి రంగంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల ఎల్‌డిఎఫ్‌ ప్రతినిధులు గెలిచారు. కన్నూరు లోక్‌సభ పరిధిలోని మట్టనూర్‌ అసెంబ్లీ నుంచి కెకె శైలజ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 61వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద సిఏఏ(చట్టం)ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో దాని ఊసెత్తలేదు. ప్రశ్నించిన విలేకర్లతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్‌ ఇంకేదైనా ప్రశ్న ఉండే అడగండని సమాధానాన్ని దాటవేశారు. పిసిసి తాత్కాలిక అధ్యక్షుడు ఎంఎం హసన్‌ మాట్లాడుతూ మేము అ చట్టాన్ని రద్దు చేయాలని ఆసక్తితో ఉన్నాం అయితే సిపిఎంను మెప్పించేందుకు దాన్ని మానిఫెస్టోలో చేర్చాల్సిన అవసరం లేదు. మార్క్సిస్టులు చెప్పినట్లు మానిఫెస్టోను రాయాల్సిన అవసరం లేదన్నారు.


కుక్కలా మొరుగుతున్నారని తండ్రిని తూలనాడిన కొడుకు !
పత్తానంతిట్ట నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు ఓడిపోవటం ఖాయమని, అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ గెలుస్తుందని కేరళ మాజీ సిఎం ఏకె ఆంటోనీ చెప్పారు.కుటుంబం-రాజకీయాలు వేరు వేరని తాను తొలి నుంచి చెబుతున్నానని తన పిల్లల గురించి ఎక్కువగా అడగవద్దని అన్నారు. కాంగ్రెస్‌ నేతల పిల్లలు బిజెపిలో చేరటం తప్పిదమన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా పత్తానంతిట్ట ప్రచారానికి వెళ్లటం లేదని అన్నారు. కేరళలో శబరిమల సమస్య ముగియటంతో బిజెపి స్వర్ణయుగం ముగిసిందని అన్నారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై కుమారుడు అనిల్‌ ఆంటోనీ స్పందిస్తూ గాంధీ కుటుంబం కోసం నిలబడుతున్నవారిని చూసి విచారిస్తున్నానని, కాలం చెల్లిన నేతలు మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారని, చంద్రుడిని చూసి కుక్కలు మొరిగినట్లుగా ఈ నేతలు ప్రవర్తిస్తున్నారని అన్నారు. తండ్రి పట్ల అనిల్‌ అంటోనీ కాస్త మర్యాదను చూపాలని తిరువనంతపురం కాంగ్రెస్‌ అభ్యర్ధి శశిధరూర్‌ సలహా ఇచ్చారు. బిజెపి నేతల భాషతో తాను పోటీపడలేనన్నారు.


బిజెపి ప్రచార తీరు ఇదా !
వయనాడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిగా సిపిఐ జాతీయ మహిళానేత అన్నీ రాజా బరిలో ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు.తాను గెలిస్తే నియోజకవర్గంలోని సుల్తాన్‌ బాతరీ పేరును గణపతి వట్టం అని మారుస్తానని ప్రచారం చేస్తున్నారు. టిప్పు సుల్తాన్‌ ఈ ప్రాంతంలోని ఒక పాడుపడిన జైన ఆలయంలో తన ఫిరంగులను ఉంచి బ్రిటీష్‌ వారి మీద యుద్ధం చేశాడు. దాంతో బ్రిటీష్‌ వారు ఆ ప్రాంతాన్ని సుల్తాన్‌ బ్యాటరీ అని పిలిచారని తరువాత అదే సుల్తాన్‌ బాతరీగా మారిందని చెబుతున్నారు. అక్కడ ఒక చిన్న గణపతి ఆలయం ఉందని, అందువలన గణపతి వట్టం అని కూడా పిలిచారని కొందరు చెబుతారు. ఇది టిప్పు సుల్తాన్‌ ప్రాంతం కాదు గనుక గణపతివట్టంగా పేరు మార్చాలని బిజెపి నేత చెప్పారు. ఎన్నికల్లో చెప్పుకొనేందుకు ఏమీలేక బిజెపి జోకులు పేలుస్తోందని కాంగ్రెస్‌ నేతలు కొందరు అపహాస్యం చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం : చైనా పేర్లు ఎందుకు మార్చుతున్నది, అమెరికా ఆడుతున్న నాటకం ఏమిటి ?

13 Saturday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, #India-China border, Aksai Chin, Arunachal pradesh, BJP, China, Chinese Names, Indo-China, Indo-China standoff, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఇరుగు పొరుగుదేశాలతో వివాదాలు ఉన్నపుడు అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.బిజెపి నేతలు, వారిని నడిపించే సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు నిరంతరం తమకు అనుకూలంగా ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. ఉదాహరణకు గతంలో భారత్‌-శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చాతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు. దాన్ని డిఎంకె, కాంగ్రెస్‌ మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు బిజెపి ఎన్నికల సందర్భంగా ముందుకు తెచ్చింది. ఆ దీవిని వెనక్కు తీసుకొనేందుకు పదేండ్ల పాటు అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ఏమైనా చేశారా ? పోనీ ఇప్పుడేదైనా కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారా అంటే అదీ లేదు. ఇదే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎవరివో నిర్ధారణగాని ప్రాంతాలపై బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకున్నారు. 2015లో కుదుర్చుకున్న అవగాహన మేరకు 17,160 ఎకరాల విస్తీర్ణం ఉన్న లంకలు, ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు అప్పగించి,7,110 ఎకరాలను మనదేశం తీసుకున్నది. దీని గురించి మాత్రం బిజెపి, మోడీ మాట్లాడరు. కచ్చాతీవు గురించి తమను విమర్శించినందుకు కాంగ్రెస్‌ ఈ అంశాన్ని ప్రస్తావించి ఈ నిర్వాకం సంగతేమిటని నిలదీసింది. ఈ రెండు ఉదంతాలు చెబుతున్న పాఠమేమిటి ? ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇరుగు పొరుగుదేశాలతో ఇచ్చిపుచ్చుకొనే పద్దతిలో వివాదాలను పరిష్కారం చేసుకోవాలనే కదా ?


ఇక మరొక పొరుగుదేశమైన చైనా వ్యతిరేకతను కాషాయదళాలు రెచ్చగొడుతూనే ఉన్నప్పటికీ కీలక సమయాల్లో నరేంద్రమోడీ ఆచితూచి మాట్లాడుతున్నారు.కొత్తగా మన భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు అని గాల్వన్‌ ఉదంత సమయంలో చేసిన ప్రకటన వాటిలో ఒకటి. తాజాగా అమెరికా పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడిన అంశాలు ఆలోచింపచేసేవిగా ఉన్నట్లు చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి నరేంద్రమోడీ మృదుస్వరంతో మాట్లాడినట్లుందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ప్రారంభవాక్యాలతోనే తన విశ్లేషణ ప్రారంభించింది.మోడీ అశక్తత, పిరికితనం కనిపించిందని, గాల్వన్‌ ఉదంతంలో ప్రాణాలు అర్పించిన వారికి అవమానకరంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్ణించింది. ఇంతకీ నరేంద్రమోడీ ఏం చెప్పారు ? సరిహద్దుల్లో దీర్ఘకాలంగా సాగుతున్న పరిస్థితి మీద తక్షణమే మాట్లాడుకోవాల్సి ఉందని, తద్వారా రెండు దేశాల మధ్య ఉన్న అసాధారణతను వెనక్కు నెట్టవచ్చని, స్థిరమైన,శాంతియుత సంబంధాలు కేవలం రెండు దేశాలకే కాదు మొత్తం ప్రాంతానికి ముఖ్యమని నరేంద్రమోడీ చెప్పారు. దౌత్య రంగం, మిలిటరీ అధికారులు అప్పుడప్పుడూ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు మృదువుగా కొన్ని సార్లు కఠినంగా ఉన్నాయని, అయితే మోడీ నేరుగా చెప్పిన మాటలు ప్రత్యేకించి స్పష్టమైన వైఖరి వెల్లడించటం అసాధారణం, సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకున్నారని, సానుకూల సంకేతాలు పంపారని గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. భారత్‌-చైనా సంబంధాలను బలహీనపరచాలని చూస్తున్న అమెరికాలో కొందరికి మోడీ మాటలు అంత వినసొంపుగా ఉండకపోవచ్చని కూడా చైనా పత్రిక పేర్కొన్నది.రెండు దేశాలను ఘర్షణ దిశగా తీసుకుపోవాలని అమెరికా చూస్తున్నదని కూడా చెప్పింది.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా లిపిలో-టిబెటన్‌ పేర్లు ఖరారు చేస్తూ మూడవ జాబితాను ఇటీవల చైనా విడుదల చేసింది.అరుణాచల్‌ను టిబెట్‌లోని జాంగ్‌నాన్‌ ప్రాంతంగా చైనా పరిగణిస్తున్నది. ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరోదగ్గర లైటు వెలిగినట్లుగా అంతర్జాతీయ రాజకీయాల్లో దాదాపు అన్ని సందర్భాల్లో లైటు వెలగటమే కనిపిస్తుంది గానీ స్విచ్‌ ఎక్కడుంది, ఎవరు, ఎందుకు వేశారన్నది అంతగా తెలియదు. జపాన్‌ తదితర దేశాల ప్రతినిధులు పరిశీలకులుగా అమెరికా, ఇతరదేశాలతో కలసి పశ్చిమబెంగాల్లోని కలైకుండ వైమానిక స్థావరంలో ఏప్రిల్‌ 11-23వ తేదీలలో మనదేశం వైమానిక యుద్ధ విన్యాసాలు జరపటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హెచ్చరిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పేర్ల జాబితాను చైనా విడుదల చేసిందని డిప్లొమాట్‌ పత్రిక సంపాదకులలో ఒకరైన సుధా రామచంద్రన్‌ పేర్కొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా వాదిస్తున్నది. అందువల్లనే సందర్భం వచ్చినపుడల్లా తమ ప్రాంతమే అని చైనా బహిరంగంగా చెబుతున్నది.ఇప్పుడు జరుగుతున్న విన్యాసాలను చైనా తీవ్రంగా పరిగణిస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఆధునిక యుద్ద విమానాలు, ఇతర వ్యవస్థలను రప్పించి తరంగశక్తి తొలి దశ పేరుతో ఆగస్టులో మరోసారి తొలిసారిగా విన్యాసాలు జరపనున్నారు. ఈ విన్యాసాలలో చైనా, రష్యాలను వ్యతిరేకించేదేశాలే భాగస్వాములుగా ఉన్నాయి.అమెరికా, జర్మనీ,ఫ్రాన్స్‌,ఆస్ట్రేలియా తదితర దేశాల వైమానిక దళాలు పాల్గొంటాయి. సహజంగానే ఇలాంటి విన్యాసాలు తనను ఉద్దేశించి జరుపుతున్నట్లు భావించే ఏ దేశమైనా తనదైన శైలిలో స్పందిస్తుంది.


చైనా తాజాగా ప్రకటించిన 30 పేర్ల గురించి గతంలో మాదిరే మనదేశం స్పందించింది.మన ప్రాంతాలకు మరొక దేశం తన పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారి ప్రాంతాలవుతాయా, వాస్తవాలను మారుస్తాయా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.మనదేశంలో మీడియా మరోసారి తీవ్రంగా స్పందించింది. రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు టీవీ ఛానళ్లు చూశాయి.రెండవ సారి 2017లో పేర్లు పెట్టిన వాటిలో రెండు నివాసిత ప్రాంతాలు, ఐదు పర్వతాలు, రెండు నదులు, మరో రెండు ప్రాంతాలు ఉన్నాయి. మరో 15 ప్రాంతాలకు 2021లో చైనా పేర్లు పెట్టింది.తమవి అని చెప్పుకుంటున్న వివాదాస్పద ప్రాంతాలకు ఏ దేశమైనా తన పేర్లు పెట్టుకోవటం కొత్తదేమీ కాదు. ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారు చిన్‌ ప్రాంతం ఉంది. అది మనదే అని మన ప్రభుత్వం చెబుతుంది. దాన్ని లడఖ్‌ ప్రాంతంలోని లే జిల్లాగా పిలుస్తారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ మీద ఉన్న వివాదం కూడా అలాంటిదే. దాన్ని చైనా వారు జింగ్‌నాన్‌ అనే పేరుతో వ్యవహరిస్తారు.మన పురాణాల్లో మానస సరోవరంగా పిలిచే సరస్సు చైనాలోని టిబెట్‌లో ఉంది. అక్కడ దాని పేరు మాపాంగ్‌ యంగ్‌.


రెండు దేశాల మధ్య లడఖ్‌, అరుణాచల్‌ ప్రాంతాలపై వివాదం ఉంది. దాన్ని బ్రిటీష్‌ వారు సృష్టించారు.మన దేశం బ్రిటీష్‌ వారి నుంచి 1947లో స్వాతంత్య్రం పొందింది. మనదేశం మాదిరి చైనాను బ్రిటన్‌ పూర్తిగా ఆక్రమించలేకపోయింది. వివిధ ప్రాంతాలలోని యుద్ధ ప్రభువులు బలంగా ఉండటంతో అమెరికాతో సహా ఐరోపా దేశాలన్నీ తమకు కావాల్సిన వాణిజ్యం మీద వివిధ ఒప్పందాలను చేసుకున్నాయి తప్ప వారి పాలనను రుద్దలేకపోయాయి. అయితే చైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. నదులు, రేవులు, వాణిజ్యాలపై అనేక హక్కులను పొందారు. హంకాంగ్‌ దీవులను 99 సంవత్సరాలకు బ్రిటీష్‌ వారు కౌలుకు తీసుకున్నారు. అలాగే మకావో దీవులను పోర్సుగీసు వారు కౌలుకు తీసుకున్నారు. పేరుకు దేశం క్వింగ్‌ రాజరిక పాలనలో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీద అదుపులేదు. యుద్ద ప్రభువులు పెత్తనం చెలాయించేవారు. వారి మధ్య ఉన్న విబేధాలను విదేశాలు ఉపయోగించుకున్నాయి. ఈ నేపధ్యంలో ఎనిమిది దేశాల కూటమి క్వింగ్‌ వంశ రాజు మీద అనేక ఒప్పందాలను రుద్దింది.దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిమాదిరి చేశారు. దాంతో దేశభక్తులు రాజరికాన్ని కూలదోసి రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్యమం సాగించిన ఫలితంగా 1911లో చైనా రాజరికం నుంచి రిపబ్లిక్‌గా మారింది. మనకు జాతిపితగా మహాత్మాగాంధీ ఎలాగో చైనాలో సన్‌ ఏట్‌ సేన్‌ దానికి నాయకత్వం వహించాడు. అధికారం వచ్చిన తరువాత యుద్ధ ప్రభువులు కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించకుండా తిరుగుబాటు, కుట్రలకు పాల్పడ్డారు.1949లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాతే ఒకే ప్రభుత్వ ఏలుబడిలోకి చైనా వచ్చింది. సామంత రాజ్యంగా ఉన్న టిబెట్‌ను రెచ్చగొట్టి స్వతంత్రదేశంగా మార్చి తమ స్థావరంగా చేసుకోవాలని చూసిన బ్రిటన్‌, తరువాత అమెరికా జరిపిన కుట్రల కారణంగా టిబెట్‌ పాలకుడిగా ఉన్న దలైలామా తిరుగుబాటు,మనదేశానికి పారిపోయి రావటం తెలిసిందే.


మన ప్రభుత్వ సాయంతో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాసంలో ఉన్న 88 సంవత్సరాల పద్నాలుగవ దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతం టిబెట్‌లో అంతర్భాగమే అని 2003లో చెప్పాడు. తరువాత వైఖరి మార్చుకున్నాడు.బ్రిటీష్‌ అధికారి మెక్‌మోహన్‌ గీసిన సరిహద్దు రేఖ ప్రకారం భారత్‌లో అంతర్భాగమే అని మాట మార్చాడు. మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దుగా 1914లోనే బ్రిటన్‌-టిబెట్‌ గుర్తించాయనే వాదనను ముందుకు తెచ్చాడు. అయితే ఆ ఒప్పందాన్ని చైనా ప్రభుత్వం అంగీకరిస్తేనే అమల్లోకి వస్తుందనే అంశం ఉంది. సదరు ఒప్పందాన్ని చైనా గుర్తించలేదు. ఒక సామంత ప్రాంతానికి విదేశాలతో ఒప్పందం చేసుకొనే హక్కులేదు.ఆక్సారుచిన్‌ ప్రాంతాన్ని కూడా బ్రిటీష్‌ అధికారులు నిర్దిష్టంగా గుర్తించకపోవటంతో అది కూడా వివాదాస్పద ప్రాంతంగా మారింది. వారి గీతలు ఎలా ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చేనాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ మన పాలనలో, ఆక్సారుచిన్‌ చైనా ఏలుబడిలో ఉంది. మనం దీని గురించి అడిగితే వారు దాని సంగతేమిటని ప్రస్తావిస్తున్నారు.1962లో రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినపుడు చైనా సైన్యాలు అరుణాచల్‌ను దాటి నేటి అసోంలోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. తరువాత వెనక్కుపోయి, వాస్తవాధీనరేఖకు అవతల గతంలో మాదిరే ఉన్నాయి. తమ మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు మనదేశం ఆశ్రయం ఇవ్వటాన్ని చైనా వ్యతిరేకిస్తున్నది.2017లో దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లో వారం రోజుల పర్యటనను చైనా వ్యతిరేకించింది. అతడిని ఆపకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని చైనా పత్రికల్లో వార్తలు వచ్చాయి. దలైలామా పర్యటన తరువాత తొలిసారిగా కొన్ని ప్రాంతాలకు తమ పేర్లను చైనా ప్రకటించింది. ఆ తరువాతే 73రోజుల పాటు డోక్లామ్‌ ప్రతిష్ఠంభన కొనసాగింది.తరువాత 2021లో మరోసారి కొన్ని ప్రాంతాలకు పేర్లు ప్రకటించింది.


టిబెట్‌ను చైనా అంతర్భాగమని మనదేశం గుర్తించింది, కానీ అదే సమయంలో మానవతాకారణాలను సాకుగా చూపి తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం కల్పించటం,ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. రెండు దేశాల మధ్య తెగని వివాదాల్లో ఇదొకటి.తమ వ్యతిరేకశక్తులకు భారత్‌ ఆశ్రయమిస్తున్నదని చైనా విమర్శిస్తున్నది.చైనాతో ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో ఉన్ననేతలు(తరువాత వారు సిపిఎంగా ఏర్పడ్డారు) కొందరు 1962లో కోరినందుకు వారిని దేశద్రోహులుగా, చైనా ఏజంట్లుగా చిత్రించి జైలుపాలు చేశారు. తరువాత అదే కాంగ్రెస్‌ పాలకులు చైనాతో వివాదాన్ని కొనసాగిస్తూనే సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నారు.వర్తమానంలో నరేంద్రమోడీ గత ప్రధానులెవరూ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీలు జరిపి రికార్డు సృష్టించారు.గాల్వన్‌లోయ ఉదంతాలకు ముందు ఇరుదేశాల నేతలు కలసి ఉయ్యాలలూగటాన్ని ఊహాన్‌, మహాబలిపురం నగరాల్లో చూశాము.ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వెనుక భారత్‌ భుజం మీద తుపాకి పెట్టి అమెరికన్లు తమను కాల్చాలని చూస్తున్నట్లు చైనా అనుమానిస్తుండటం ఒక కారణం. అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగంగా తాము గుర్తిస్తున్నట్లు 2024 మార్చినెల తొమ్మిదవ తేదీన అమెరికా ఒక ప్రకటన చేసింది. వివాదాన్ని పెంచటానికి గాకపోతే ఇరుదేశాలకు సంబంధించిన అంశాల మీద దానికి సంబంధం ఏమిటి ? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును భారత్‌ అంతర్భాగంగా గుర్తిస్తున్నట్లు అమెరికా ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఎందుకని ? అదే అమెరికా ఆడుతున్న రాజకీయం,అలా ప్రకటిస్తే పాకిస్తాన్‌ ఎక్కడ చైనాకు మరింత దగ్గర అవుతుందేమో అన్నదే దాని భయం.మన స్వతంత్ర విదేశాంగ విధానం ప్రకారం వివాదాలను పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా వలలో చిక్కుకొని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దన్నదే అనేక మంది చెబుతున్నమాట.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆరు నెలల ఇజ్రాయెల్‌ మారణకాండ ! పాలస్థీనియన్ల ప్రతిఘటన !!

10 Wednesday Apr 2024

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Hamas Israel, Israel’s Gaza Onslaught, Joe Biden, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


2023 అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో యూదు దురహంకారులు జరుపుతున్న మారణకాండ, దానికి పాలస్థీనియన్ల ప్రతిఘటనకు ఆరు నెలలు దాటింది. అమెరికా, ఇతర పశ్చిమదేశాల దన్ను చూసుకొని గాజాలో సాగిస్తున్న హత్యలు, విధ్వంస కాండ ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియదు.ఈ దారుణాన్ని నివారించలేని పనికిమాలిన సంస్థగా ఐరాస పేరుతెచ్చుకుంది.ఎన్ని కబుర్లు చెప్పినా ఆచరణకు వచ్చేసరికి న్యాయం వైపు ఎవరు నిలిచారో, అన్యాయం, అక్రమాలను ఎవరు సమర్ధిస్తున్నారో లోకానికి వెల్లడైంది.ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు మద్దతు ఇస్తున్న జర్మనీపై అత్యవసరంగా ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ కోర్టులో వామపక్ష నేత డేనియల్‌ ఓర్టేగా అధ్యక్షుడిగా ఉన్న లాటిన్‌ అమెరికాలోని నికరాగువా దాఖలు చేసిన పిటీషన్‌పై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. మారణకాండకు మద్దతు ఇవ్వటమేగాక పాలస్థీనా నిర్వాసితులకు సాయం చేస్తున్న ఐరాస సంస్థకు జర్మనీ నిధులను నిలిపివేసిందని కూడా నికరాగువా పేర్కొన్నది. తక్షణమే గాజాలో దాడులను విరమించాలని, యుద్ధం, నేరాలకు జవాబుదారీ ఎవరో తేల్చాలని తాజాగా ఐరాస మానవహక్కుల మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే ఓటింగ్‌ నుంచి మనదేశం, మరోపన్నెండు తప్పుకున్నాయి.చైనాతో సహా 28 దేశాలు అనుకూలంగా, అమెరికాతో పాటు మరో ఆరు వ్యతిరేకంగా ఓటు వేశాయి. విశ్వగురువులం కదా ! మనం ఎటున్నట్లు ? మానవహక్కుల రక్షణకా భక్షణకా ? బేటీపడావో బేటీ బచావో అని చెప్పిన పెద్దలకు గాజాలో మరణిస్తున్నవారిలో 70శాతం మంది పిల్లలు, మహిళలు ఉన్న సంగతి తెలియదా ? ఈ దారుణాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను నిలదీసేందుకు ఎందుకు నోరు రావటం లేదు ? ముస్లిం వ్యతిరేకత తప్ప ఎవరిని సంతుష్టీకరించేందుకు ఈ వైఖరి ?


గాజాలో జరుగుతున్నదేమిటి ? తమ మాతృదేశ పునరుద్దరణ జరగాలన్న పాలస్థీనియన్ల అణచివేత తప్ప మరొకటి కాదు. ఎవరు చేస్తున్నారు ? సామ్రాజ్యవాదుల మద్దతుతో వారి చేతిలో పావుగా ఉన్న ఇజ్రాయెల్‌, అంటే సామ్రాజ్యవాదులే దాడి కారకులు.చరిత్రలో వారు చేసిన దాడులన్నీ దారుణాలుగా నమోదయ్యాయి. అందుకు అత్యంత దుర్మార్గ ఉదాహరణ 1968 మార్చి 15వ తేదీన వియత్నాంలోని మై లాయి ఊచకోత. విలియం కాలే అనే అధికారి ఉత్తరువుల మేరకు ఎర్నెస్ట్‌ మెదీనా అనే అమెరికన్‌ కెప్టెన్‌ కదులుతున్న ప్రతిదాన్నీ అంతం చేయమని ఆదేశాలు జారీ చేస్తే అమెరికా సైనికులు ఐదు వందల మందిని చంపివేశారు. ఇప్పుడు గాజాలో జరుగుతున్నదానికి దానికి తేడా ఏమైనా ఉందా ? ఆసుపత్రులు, స్కూళ్లు, నిర్వాసితుల కేంద్రాలు, సహాయ శిబిరాలు, అన్నదానం చేస్తున్నవారు ఎవరు కనిపించినా హతమార్చాలని నెతన్యాహు ఆదేశాలు జారీ చేస్తే ఇజ్రాయెల్‌ సైనికులు అమలు చేస్తున్నారు. గత ఆరునెలల్లో 33,482(ఏప్రిల్‌ 10వ తేదీ నాటికి) మందిని చంపివేశారు. మరో విధంగా చెప్పాలంటే గాజాలోని ప్రతి 70 మందికి ఒకరిని, రోజుకు 180మందిని చంపారు. వీరుగాక 75,815 మందిని, రోజుకు 400 మందిని, ప్రతి 30 మందిలో ఒకరిని గాయపరిచారు. విధ్వంసమైన భవనాల గురించి చెప్పనవసరం లేదు. ఇరవై రెండు లక్షల మంది జనాభాలో 19లక్షల మంది నిరాశ్రయులు కావటం లేదా నెలవులు తప్పారంటే ప్రభావితం కాని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా అన్ని రకాల ఆయుధాలను అందించటమే కాదు, ఎర్ర సముద్రంలోకి తన యుద్ధ నావలను దింపి బాసటగా నిలుస్తున్నది. ఆ ప్రాంత దేశాలు జోక్యం చేసుకోకుండా బెదిరిస్తున్నది.


సామ్రాజ్యవాదుల వర్తమాన రక్త చరిత్రలో విస్మరించరాని దుర్మార్గమిది. కొందరు సైనికులు చేసిన దారుణం కాదిది, వ్యవస్థాపూర్వకమైనది. ఎవరికి ఏది నేర్పితే దాన్నే పాటిస్తారు.ఇజ్రాయెల్‌ రక్షణ దళాల్లో ప్రతి యువకుడు కొంతకాలం విధిగా పని చేయాలి. ఆదేశించిన దుర్మార్గాలను అమలు చేయాలి.తిరస్కరిస్తే ఏం చేస్తారు ? ప్రజాస్వామిక హక్కని వదలి వేయరు. విదేశాల్లో ఉన్న ఒక యువ ఇజ్రాయెలీ కమ్యూనిస్టు ఈ దళాల్లో చేరేందుకు తిరస్కరించాడు. గాజా మారణకాండను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొని అరెస్టయ్యాడనే కారణాన్ని చూపి అతని పౌరసత్వాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలోకి రావటాన్ని నిషేధించింది.రాజ్య అణచివేత, మిలటరీ విధానాలను నిరసించాలని, అణచివేతను వ్యతిరేకించాలని సోదర ఇజ్రాయెలీలకు అతను రాసిన లేఖలో పేర్కొన్నాడు. మధ్య ప్రాచ్య సోషలిస్టు ఫెడరేషన్‌లో భాగంగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా సోషలిస్టు ఫెడరేషన్‌ ఏర్పాటు జరిగినపుడే ఈ ప్రాంతంలోని జనాలందరూ సుఖంగా ఉంటారని పేర్కొన్నాడు. గాజాలో మారణకాండను విమర్శించినందుకు ఇజ్రాయెల్‌ పార్లమెంటులోని కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు ఒఫెర్‌ కాసిఫ్‌ను 2023 అక్టోబర్‌ 18న 45 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తూ పార్లమెంటరీ నైతిక నియమాల కమిటీ తీర్మానించింది. అయినప్పటికీ ఖాతరు చేయని ఒఫెర్‌ అంతర్జాతీయ కోర్టులో దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసును సమర్దిస్తూ ఒక పిటీషన్‌పై సంతకం చేశాడనే సాకు చూపి ఏకంగా పార్లమెంటు సభ్యత్వాన్నే రద్దు చేసేందుకు పూనుకున్నారు.దానిలో భాగంగా 85 మంది ఎంపీలతో తీర్మానాన్ని ప్రతిపాదించారు.దాన్ని పార్లమెంటరీ కమిటీ జనవరి 30న 14-2 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. దక్షిణాఫ్రికా చర్య కుట్ర అని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సాయుధపోరాటాన్ని సమర్ధించటమేనని వర్ణించింది. ఫిబ్రవరి 19న పార్లమెంటులో ఓటింగ్‌ జరగ్గా అది వీగిపోయింది. నూట ఇరవై మంది సభ్యులకు గాను పదకొండు మంది వ్యతిరేకంగా, 24 మంది ఓటింగ్‌కు దూరంగా ఉండగా 85 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఒక సభ్యుడిని తొలగించాలంటే 90 మంది మద్దతు అవసరం. దేశంలో ఎవరూ వ్యతిరేకంగా ఉండకూడదనే దుర్మార్గం తప్ప దీని వెనుక మరొకటి లేదు.పార్లమెంటులోని ఇతర వామపక్ష వాదులకూ ఇదే జరుగుతుందని హెచ్చరించటమే.


ఆరునెలల మారణకాండ తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే గాజా సర్వనాశనమైంది. అక్కడ బతికి ఉన్నవారు తిరిగి సాధారణ జీవితాలను ప్రారంభించే అవకాశం ఉంటుందా ? ఇంకా ఎందరిని బలితీసుకుంటారనే ప్రశ్నలకు ఇప్పటికైతే సమాధానాలు లేవు. రంజాన్‌ మాసం తరువాత మరింత పెద్ద ఎత్తున దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్‌ సన్నాహాలు జరుపుతున్నట్లు వార్తలు. అది ఒక్క గాజాకే పరిమితం అవుతుందా లేక మొత్తం మధ్య ప్రాచ్య దేశాలకు విస్తరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. గాజాలో మరణించిన వారందరూ హమస్‌ సాయుధులే అన్నట్లుగా ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్‌ చూస్తున్నది. ఒప్పందం ప్రకారం కొందరు బందీలను విడిపించుకోవటం తప్ప హమస్‌ వద్ద ఉన్న ఇతర బందీల జాడను కూడా తెలుసుకోలేకపోయింది. చీమ చిటుక్కుమన్నా కనుగొనే నిఘా వ్యవస్థను ఏమార్చి హమస్‌ సాయుధులు సరిహద్దులోని ఇజ్రాయెల్‌ ప్రాంతంపై ఎలా దాడి చేశారన్నది ఇప్పటికీ వీడని రహస్యంగానే ఉండిపోయింది. దాడులు, హత్యాకాండతో పాలస్థీనియన్లను లొంగదీసుకోలేమని గ్రహించిన ఇజ్రాయెల్‌ వారిని రోగాలు, ఆకలితో మాడ్చి చంపేందుకు పూనుకున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. గాజా మారణకాండను ఎలా ఆపాలన్నదాని కంటే అది కొనసాగితే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌ భవితవ్యం ఎలా ఉండనున్నదో అంటూ అనేక మంది విశ్లేషణల్లో నిమగమయ్యారంటే వారి చర్మం ఎంత మందంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు. కొందరైతే హమస్‌ చేసిన దుర్మార్గాలంటూ ఇంకా చిలవలు పలవలుగా వర్ణిస్తూ గాజాలో జరుపుతున్నదారుణాలను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.


గత ఆరునెలల్లో జరిగిన పరిణామాల్లో ఎమెన్‌పై అమెరికా నేరుగా యుద్ధానికి దిగటం ఒక ముఖ్యాంశం.ఇది కూడా ఇజ్రాయెల్‌ సంబంధిత పరిణామాల్లోనే జరుగుతోంది. ఉగ్రవాదంపై పోరు ముసుగులో గతంలో సౌదీ అరేబియా ద్వారా దాడులు చేయించింది. అమెరికాలో తయారైన విమానాలతో అక్కడి నుంచే వచ్చిన బాంబులతో జరిపించిన దాడిలో వేలాది మంది యెమెనీలు మరణించారు. ఇరాన్‌తో సయోధ్య కుదరటంతో సౌదీ నిలిపివేసింది.ఇప్పుడు నేరుగా అమెరికా ఆ పని చేస్తున్నది. ఎమెన్‌ అంతర్యుద్ధంలో రాజధానితో సహా ఉత్తర ఎమెన్‌పై పైచేయి సాధించిన హౌతీలు లేదా అన్సరల్లా సాయుధులు గాజా మారణకాండకు నిరసనగా ఎర్ర సముద్రం ద్వారా ఇజ్రాయెల్‌ వైపు వెళ్లే నౌకల మీద దాడులను జరుపుతున్నారు. దానికి ప్రతిగా నౌకల రక్షణ పేరుతో అమెరికా రంగంలోకి దిగి ప్రతిదాడులు చేస్తున్నది.సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించి హిందూ మహాసముద్రంలోకి రాకపోకలు సాగించే నౌకల రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. అవి ఆఫ్రికా ఖండంలోని గుడ్‌హౌప్‌ ఆగ్రంను చుట్టి వస్తున్నాయి. దాంతో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎర్ర సముద్రం నుండి ఏడెన్‌ జలసంధి ద్వారా అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలోకి నౌకలు ప్రవేశించే కీలక ప్రాంతం బాబ్‌ అల్‌ మాండెబ్‌. ఈ కారణంగా ఎమెన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని సామ్రాజ్యవాదులు ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఆసియలోని ఎమెన్‌కు ఎదురుగా ఆఫ్రికా ఖండంలోని జిబౌటీ ఉంది. ఈ కారణంగానే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అన్నట్లుగా అక్కడ అనేక దేశాలు తమ మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి.


గాజా మారణకాండ నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు సామ్రాజ్యవాదం మార్గాలను వెతుకుతున్నది. మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాకు వివాదాన్ని విస్తరించేందుకు అమెరికా చూస్తున్నది.ఇరాన్ను ఒంటరిపాటు చేసేందుకు దీర్ఘకాలంగా అనుసరిస్తున్న ఎత్తుగడలకు ఎదురుదెబ్బ తగిలింది.చైనా చొరవతో ఉప్పు నిప్పుగా ఉన్న సౌదీ అరేబియా-ఇరాన్‌ సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నాయి. సౌదీ-ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య కుదర్చాలని అమెరికా ఎంతగా చూసినా కుదరలేదు. పాలస్థీనా స్వతంత్రదేశం ఏర్పడే వరకు సాధారణ సంబంధాలు కుదరవని సౌదీ స్పష్టం చేసింది. గాజాపై దాడులతో అది మరింత వెనక్కు పోయింది. కీలకమైన మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని తన చేతుల్లో ఉంచుకోవాలన్న ప్రయత్నాన్ని అమెరికా కొనసాగిస్తూనే ఉంది.ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా నాటో కూటమిని ఏర్పాటు చేసినట్లే ఇరాన్ను దెబ్బతీసేందుకు అలాంటి మరోకూటమి ఏర్పాటు చేయాలని, దానిలో ఇజ్రాయెల్‌కు కీలకపాత్ర ఉండేట్లు చూడాలన్నది లక్ష్యం. అమెరికా, ఇజ్రాయెల్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసి కూడా సౌదీ అరేబియా నేతలు ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకోవటం అమెరికా ఊహించినట్లు కనపడదు. ఇరాన్‌కు మద్దతుగా చైనా, రష్యా నిలవటం మరొక కొత్త పరిణామం. ఉక్రెయిన్‌ వివాదం, గాజా మారణకాండ దాన్ని మరింత పటిష్టం చేసిందని చెప్పవచ్చు. కొందరైతే ఈ కూటమితో అమెరికా ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నదనే వర్ణిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ బడాయి : ట్రైలర్‌కే పదేండ్లా ! అసలు సినిమా చూస్తామా ?

10 Wednesday Apr 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

10 years Narendra Modi, BJP, India GDP, India percapita GDP, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


గడిచిన పది సంవత్సరాల్లో మీరు చూసింది కేవలం ట్రైలరే మరోసారి ఎన్నుకుంటే అసలు సినిమా ముందు చూపిస్తా అని ప్రధాని నరేంద్రమోడీ రాజస్థాన్‌లోని చురు పట్టణంలో జరిగిన ఎన్నికల సభలో చెప్పారు. అంతకు ముందు ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటులో మాట్లాడుతూ దేశ జిడిపి 11వ స్థానంలో ఉన్నందుకు కాంగ్రెస్‌ ఉత్సవాలు చేసుకుంది. కానీ ఈ రోజు ఐదవ స్థానానికి చేరుకుంది. కాంగ్రెస్‌ దిగ్భ్రాంతిలో ఉంది. ఈ విజయం సాధించాలంటే కాంగ్రెస్‌కు వంద ఏండ్లు పడుతుంది అని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ జిడిపిని ఒక విజయంగా గొప్పలు చెప్పుకుంటోంది. అయితే దాన్ని చూసి జనం ఎక్కడా సంబరాలు చేసుకోవటం లేదు. కొన్ని ట్రైలర్లను చూసి సినిమాకు వెళ్లినా, శీర్షికలను చూసి యూ ట్యూబ్‌ చూసినా ఆశాభంగం తప్ప మరొకటి మిగలదు.


నరేంద్రమోడీ ట్రైలర్లలో ఒకటైన జిడిపి సంగతి చూద్దాం. వివిధ సంస్థలు ప్రకటించే గణాంకాల్లో తేడాలు ఉండే అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి. అయితే స్వల్పతేడాలున్నా ధోరణుల్లో పెద్ద తేడా లేదు. 2004లో ప్రపంచ జిడిపిలో భారత్‌ 12వ స్థానంలో ఉంది, 2014లో ఐఎంఎఫ్‌, ప్రపంచ బాంకు విశ్లేషణల ప్రకారం తొమ్మిది, 2015,16లో ఏడు,2017లో ఆరు, 2018లో ఏడవదిగా ఉంది. తరువాత ఐదవ స్థానానికి చేరింది. యుపిఏ లేదా కాంగ్రెస్‌ జిడిపిని ఒక విజయంగా చెప్పలేదు. 2004లో మన తలసరి జిడిపి మాక్రోట్రెండ్స్‌ విశ్లేషణ ప్రకారం 624 డాలర్లు, 2013లో 1,438 డాలర్లు, అంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అది నరేంద్రమోడీ ఏలుబడిలో 2022నాటికి 2,389కి పెరిగింది.రెట్టింపు కంటే చాలా తక్కువ అని ఎవరైనా చెబుతారు. మన కంటే దిగజారిన వారితో పోల్చుకొని మన స్థానం పెరిగిందని సంబరపడుతున్నారు. ప్రతిదానికీ చైనాతో పోల్చుకుంటున్నపుడు దీన్ని కూడా దానితోనే చూపాలి కదా.ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం 2014లో చైనాలో 7,636 డాలర్లున్న తలసరి జిడిపి 2022 నాటికి 12,720కి పెరిగితే అదే కాలంలో మన దగ్గర 1,560 నుంచి 2,380కు మాత్రమే పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) సమాచారం ప్రకారం 2023లో ప్రపంచ తలసరి జిడిపి 13,330 డాలర్లు. అంతకంటే ఎక్కువగా 65దేశాల్లో ఉంది. ప్రపంచ జిడిపిలో మనం ఐదవ స్థానంలో ఉంటే తలసరి జిడిపిలో 138లో ఉంది. దీని గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు ? ప్రపంచ జిడిపిలో 32వదిగా ఉన్న బంగ్లాదేశ్‌ తలసరిలో మనకంటే ఎగువన 137వదిగా ఉంది. చైనా రెండు, 71వ స్థానాల్లో ఉన్నాయి. కనుక జిడిపి గురించి నరేంద్రమోడీ గొప్పలు చెప్పుకోవాల్సింది ఏముంది ?


ప్రపంచ జిడిపిలో చైనా వాటా 2014లో 13.1శాతం ఉండగా 2023లో 17.86కు పెరిగింది. త్వరలో చైనాను అధిగమిస్తామని చెబుతున్న నరేంద్రమోడీ ఏలుబడిలో ముక్కుతూ మూలుగుతూ 2.6 నుంచి 3.37శాతానికి మాత్రమే అంటే ఒకశాతం కూడా పెరగలేదు. ఈ మాత్రానికే ఇది ట్రైలర్‌ అంటున్నారు.అసలు సినిమా ప్రారంభమే కాలేదని, జనం చూసేదేమీ ఉండదని ఈ తీరు వెల్లడించటం లేదా ! ఈ మధ్య కాలంలో కొందరు పడకకుర్చీ మేథావులు చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది గనుక మనదేశం దాని స్థానాన్ని ఆక్రమించనుందనే కబుర్లు చెబుతున్నారు. మనదేశం అందరితో పోటీపడాలని, ఆరోగ్యకరమైన పోటీతో అధిగమించాలని కోరుకోవటం వేరు, మనం ఎగువన ఉండాలంటే మిగతావారు దిగువకు తగ్గాలని కోరుకోవటం విడ్డూరం, మన పూర్వీకులు మనకు చెప్పిన సుగుణమిదా ! గత పాతిక సంవత్సరాలలో దేశంలో రోడ్లు, రేవుల వంటి మౌలిక సదుపాయాలను వృద్ధి చేశారు. ఏ బిజెపి నేతను కదిలించినా పాడిందే పాడరా అన్నట్లు మనకు చెప్పేది ఇదే. సంస్కరణలు, వాటిలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చైనాలో కూడా ఇదే మాదిరి చేశారు. అనేక మంది అక్కడి మాదిరే ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందని, మరో పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని ఆశించారు, ఆహ్వానించారు. కానీ అదేమీ జరగలేదు. చైనాలో ఉత్పత్తులతో పాటే వాటి రవాణా వేగంగా జరగటానికి మౌలిక సదుపాయాలను కల్పించారు. మన దేశంలో చూడండి మేము వేసిన రోడ్లు, రేవులు అని బిజెపి నేతలు చెప్పుకొనేందుకు తప్ప జనానికి ఉపాధిని పెంచే పారిశ్రామిక ఉత్పత్తి పెరగకపోగా గత పదేండ్లలో జిడిపిలో దాని వాటా తగ్గిపోయింది. గత పాలకుల ఏలుబడిలో ప్రారంభమైన ఉపాధి రహిత పరిశ్రమలు, సేవారంగాలు మరింతగా విస్తరించాయి. రవాణా చేసేందుకు రోడ్లు, రేవులు ఉన్నా సరకులు లేవు.డిజిటల్‌ చెల్లింపుల రంగంలో గణనీయ పురోగతి ఉంది తప్ప రాబడులు పెరగటం లేదు.


సేవారంగంలో పని చేసేందుకు అవసరమైన ఐటి నిపుణులు గణణీయంగా పెరిగారు.దీనికిగాను ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వటం తప్ప పెట్టుబడులేమీ పెట్టలేదు. ప్రభుత్వరంగంలో సంస్థలేవీ రాలేదు.ఈ రంగంలో ఎగుమతుల వల్లనే మన పరిస్థితి మెరుగుపడింది తప్ప పారిశ్రామిక రంగ వృద్ది వలన కాదు. పారిశ్రామిక రంగంలో మాదిరి సేవారంగంలో కూడా మనవారిని చౌకగా వినియోగించుకొనేందుకు అనేక విదేశీ కంపెనీలు ఇక్కడకు వాలిపోయాయి. జెపి మోర్గాన్‌, గోల్డ్‌మాన్‌ శాచస్‌, అమెజాన్‌, తదితర విదేశీ కంపెనీలు వేలాది మందిని నియమించుకుంటున్నాయి.చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లు సంవత్సరాల నుంచి చెబుతున్నారు. కొన్ని వస్తున్నమాట నిజం. అవి మనదేశంలో ఉత్పత్తిని పెంచుతున్నాయా ? ఉపాధి కల్పిస్తున్నాయా ? రెండూ లేవు. స్టాక్‌ మార్కెట్‌, రుణ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. జనవరి చివరి నాటికి అలాంటి పెట్టుబడులు రు.1.43 లక్షల కోట్లు వచ్చినట్లు, అంతకు ముందు ఏడాది అదే కాలంలో రు.91,460 కోట్లు వచ్చినట్లు వివరాలు వెల్లడించాయి. ఇలాంటి వాటికోసం మన పాలకులు చూస్తున్నారు తప్ప ఉత్పత్తికి, తద్వారా ఉపాధి పెరుగుదలకు అవసరమైన పెట్టుబడుల గురించి శ్రద్దలేదు. స్టాక్‌ మార్కెట్లు, రుణాలలో విదేశీ పెట్టుబడులు ఎంత పెరిగితే అంతగా అది చైనా, మనదేశం మరొకటైనా లాభాలను తరలించుకుపోతే నష్టం తప్ప లాభం ఉండదు. నైపుణ్యాలతో పెద్దగా పనిలేని వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతులు చేయటంలో ప్రస్తుతం చైనా వాటా ప్రపంచంలో 40శాతం ఉండగా మనవాటా మూడు శాతానికి అటూ ఇటూగా ఉంది. రానున్న దశాబ్దంలో ఇది 5 నుంచి పదిశాతం వరకు పెరగవచ్చని కొందరి అంచనా. ఇదే సమయంలో చైనా అలాంటి ఎగుమతులను తగ్గించి అధిక నైపుణ్యం గల వస్తువులవైపు కేంద్రీకరిస్తున్నది. అక్కడ వేతనాల పెరుగుదల వంటి కారణంగా కొందరు మనవైపు చూస్తున్న మాట నిజం.దీన్నే బూతద్దంలో చూపి చైనా స్థానంలో మనదేశం ఉంటుందని చెబుతున్నారు. కానీ ప్రచారం చేస్తున్నదానికి అనుగుణంగా మనదేశంలో అలాంటి మార్పులు కనిపించటం లేదని, దానికి విధానపరమైన లోపాలే కారణమని అనేక మంది చెబుతున్నారు.మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చినప్పటికీ ఎన్ని విదేశీ సంస్థలు తమ కార్యకలాపాలను మనదేశంలో విస్తరించాయన్నది సమస్య. 2023లో వెల్లడైన లెక్కల ప్రకారం ప్రపంచ వస్తూత్పత్తిలో చైనా 28.4, అమెరికా 16.6, జపాన్‌ 7.5, జర్మనీ 5.8 శాతాల చొప్పున మొత్తం 58.3శాతం నాలుగుదేశాలే చేస్తున్నాయి. మనం 3.3శాతంతో ఉన్నాం. 2010లో మొదటి స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కు నెట్టి చైనా ముందుకు వచ్చింది. అదే ఏడాది తొమ్మిదవ స్థానంలో ఉన్న మనదేశం 2014లో ఆరవ స్థానానికి వచ్చింది. గుజరాత్‌ నమూనా అని మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి ఎన్ని కబుర్లు చెప్పినా మోడీ ఏలుబడిలో పదేండ్లు గడచినా ఐదవ స్థానంలో మాత్రమే ఉంది.


విదేశాల్లో దేశ ప్రతిష్టను పెంచానని, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించానని మోడీ చెప్పుకుంటారు.2004లో మనదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4.3బిలియన్‌ డాలర్ల నుంచి 2014 నాటికి 36బిలియన్లకు పెరిగాయి. మోడీ ఏలుబడిలో గరిష్టంగా 84.8బి.డాలర్లకు పెరిగి 2023లో 70.9బి.డాలర్లకు తగ్గాయి. గత పదేండ్లు, అంతకు ముందు పెరుగుదల రేటు ఎంత ? ఈ కాలంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే వస్త్ర రంగంలో ఎగుమతులు తగ్గాయి. కొత్త ప్రాజెక్టులు పెట్టి ముప్పు ఎదుర్కోవటం కంటే ఉన్న కంపెనీల వాటాల మీద పెట్టుబడి పెట్టటం లాభసాటిగా ఉంది కనుక విదేశీ పెట్టుబడిదారులు స్టాక్‌ మార్కెట్‌ వైపు చూస్తున్నారు. స్థానిక పరిశ్రమలకు రక్షణ కల్పిస్తున్న కారణంగా విదేశీ కంపెనీలు పెద్దగా ఉత్పత్తి రంగంలో ఆసక్తి చూపటం లేదు. సెల్‌ఫోన్ల వంటి రాయితీలు ఉన్న వాటికే వస్తున్నారు. లాప్‌టాప్‌ల దిగుమతులపై పరిమితులు విధించి తరువాత నిబంధనలను నీరుగార్చారు. దాని వలన జరిగిందేమిటి ? ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని స్థితిలో స్థానిక పెట్టుబడిదారులు, విదేశీయులూ ముందుకు రావటం లేదు.చైనాలో ఇలాంటి అనిశ్చితికు తావులేదు గనుకనే విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఒక నిర్దిష్ట వ్యవధి వరకు విధానాల్లో మార్పులు ఉండవని చెబుతున్నారు. ఉదాహరణకు బ్రిటీష్‌, పోర్చుగీసు వారి కౌలు గడువు తీరిన తరువాత హాంకాంగ్‌, మకావో దీవులను నేరుగా ప్రధాన భూభాగం చైనాలో విలీనం చేసుకోవచ్చు.కాని దాని వలన కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ గనుక ఆ ప్రాంతాల్లో ఉన్న పెట్టుబడులు, సేవారంగం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఒకే దేశం – రెండు వ్యవస్థలనే విధానాన్ని ప్రకటించింది. దాని ప్రకారం 50 ఏండ్లు అంటే 2049వరకు ఆ రెండు దీవుల్లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగిస్తామనే నిర్దిష్ట హామీ ఇచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కంగనా రనౌత్‌ అతి తెలివి – నరేంద్రమోడీకి అపర సృష్టికర్తల అవార్డు !

07 Sunday Apr 2024

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Kangana ranaut, Kangana's controversial statement, Narendra Modi Failures, National Creators Award, Subhash Chandra Bose


ఎం కోటేశ్వరరావు


బిజెపి తరఫున హిమచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సినీ నటి పద్మశ్రీ కంగన రనౌత్‌ ఒక టీవి ఇంటర్వ్యూలో సుభాష్‌ చంద్రబోస్‌ను భారత ప్రధమ ప్రధానిగా వర్ణించారు. దీని మీద విమర్శలు, పరిహాసాలు వెల్లడయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం రాకముందు ప్రవాసంలో అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ప్రభుత్వాన్ని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సింగపూర్‌లో ఏర్పాటు చేశారు, ప్రధానిగా ప్రకటించుకున్నారు గనుక నేను అలా చెప్పాను తప్పేముంది అంటూ ఆమె ఎదురుదాడికి దిగారు. దాన్ని అర్ధం చేసుకోవచ్చు. ” నాకొక సంగతి చెప్పండి, మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రధమ ప్రధాని సుభాస్‌ చంద్రబోస్‌ ఎక్కిడికి వెళ్లారు ” అని ఇంటర్వ్యూలో విలేకరిని కంగన ప్రశ్నించటమే ఆమె తెలివితేటలను వెల్లడించింది. సదరు విలేకరి ఆమె చెప్పిందాన్ని సరిచేసేందుకు ప్రయత్నించగా ” మీరు నాకేమీ చెప్పవద్దు. ఆయన ఎక్కిడికి వెళ్లారో ఈ రోజు స్పష్టం చేయాలి ” అని మరోసారి అతి తెలివిని ప్రదర్శించారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే సుభాష్‌ చంద్రబోస్‌ 1945 ఆగస్టు 18న నాడు జపాన్‌ ఆక్రమణలో ఉన్న చైనాలోని తైవాన్‌ దీవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన సంగతి ఆమెకు తెలిసి ఉంటే స్వాతంత్య్రం వచ్చినపుడు ఎక్కడికి వెళ్లారనే ప్రశ్న ఆమె నోటి వెంట వచ్చి ఉండేది కాదు.బోస్‌ను ప్రధమ ప్రధానిగా వర్ణించినందుకు విమర్శించిన వారి మీద విరుచుకుపడ్డారు. భారతీయ కళలను, గతాన్ని ప్రతిబింబించే ఖజురహౌ, ఎల్లోరా శిల్పాలు, అజంతా చిత్రాలు, అనేక దేవాలయాల మీద ఉన్న బూతుబొమ్మల, వాత్సాయన కామసూత్రాల ఒరవడిలో ఒళ్లుదాచుకోకుండా సినిమాల్లో నటించి ఆ సంప్రదాయాలను ముందుకు తీసుకుపోయిన అనుభవం ఆమెకుంది. నటనా నిష్ణాతుల్లో ఒకరు కావచ్చు గానీ తనకు అన్నీ తెలుసు అనుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.


తన తెలివితేటలను ప్రశ్నించేవారు తన సినిమా ”ఎమర్జన్సీ” ని చూడాలని సలహా ఇచ్చారు.” ప్రధమ భారత ప్రధాని గురించి నాకు జ్ఞానదానం చేస్తున్నవారు ముందుగా దీన్ని(సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవాస ప్రభుత్వ ప్రకటన వార్త) చదవాలి. కొత్తగా తెలుసుకొనే వారికి కొంత సాధారణ పరిజ్ఞానం వస్తుంది. కొద్దిగా చదువు సంధ్యలు నేర్చుకోవాలని నాకు చెబుతున్న మేథావులందరూ తప్పక తెలుసుకోవాల్సిందేమంటే నేనే రాసి, నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జన్సీ అనే సినిమా గురించి తెలుసుకోవాలి. అది ప్రాధమికంగా నెహ్రూ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఆడాళ్లకు ఏమీ తెలియదని చెప్పేందుకు చూసే మగబుద్దిని చూపకండి ” అని ఎదురుదాడికి దిగారు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు 2024 మార్చినెల ఎనిమిదవ తేదీన ప్రధాని నరేంద్రమోడీ జాతీయ సృష్టికర్తల అవార్డులను(నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డ్స్‌) ఇరవై రంగాల్లో 23 మందికి ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో అసాధారణమైన ప్రతిభ చూపిన వారిని సత్కరించే పేరుతో తొలిసారిగా వీటిని ఇచ్చారు. కంగన చెప్పిన మాటలు ఈ అవార్డులకు ముందే వెలువడి ఉంటే బహుశా ఆమెను కూడా తిమ్మిని బమ్మిని చేసే చరిత్ర సృష్టికర్త లేదా ప్రభావితురాలు అంటూ అవార్డుతో సత్కరించి ఉండేవారు. ఎందుకంటే గతంలో ఆమె నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాతే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని సెలవిచ్చారు. అంతేనా నోబెల్‌ బహుమతి పోటీదారుగా నరేంద్రమోడీ ఉన్నారని ఏడాది క్రితం వచ్చిన ఒక తప్పుడు వార్తను ఆమె తాజాగా ఎక్స్‌లో పోస్టు చేశారు. అందువలన తొలి భారత ప్రధానిగా నెహ్రూను ఆమె అంగీకరించే ప్రశ్నే లేదు.


2001 నుంచి 2014వరకు గుజరాత్‌ సిఎం, తరువాత పదేండ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీకి దేశంలో అసాధారణ ప్రతిభను గుర్తించాలనే ఆలోచన ఇప్పటి వరకు ఎందుకు తట్టలేదు అనే ప్రశ్న దేశద్రోహం కనుక ఎవరూ వేయకూడదు. పోనీ ఈ ప్రతిభావంతులు దేశంలో ఆకలిని తగ్గించేందుకు, దేశ, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని అటే పట్టి ఇట్టే తెచ్చే చిట్కాలను కనిపెట్టినందుకో, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్న మోడీ వాగ్దానాన్ని అమలు జరిపేందుకు దగ్గరదారిని చూపినందుకో, అచ్చేదిన్‌ ఎలా తేవాలో వెల్లడించినందుకో అవార్డులను అందుకున్నారా అంటే కాదు. మరి వీరి ప్రతిభ ఏమిటి ? బూమ్‌లైవ్‌ డాట్‌ కామ్‌ అనే పోర్టల్‌ ఈ అవార్డుల గురించి కొన్ని విశ్లేషణలను వెల్లడించింది.అవార్డు గ్రహీతలలో 60శాతం మంది హిందూమతం, బిజెపి నేతలను కలవటం లేదా పాలకపార్టీ విధానాలు లేదా భావజాలాన్ని బలపరిచిన వారు, సృష్టించిన వాటి స్వభావం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తటస్థుల పేరుతో బిజెపి చెబుతున్నదాన్ని జనంలోకి తీసుకుపోవటమే అవార్డులకు అర్హత. వాటి ప్రదాన సభలో నరేంద్రమోడీ అసలు విషయం చెప్పేశారు. ” రానున్న కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ సభను ఏర్పాటు చేసినట్లు మీరు భావించవద్దు, ఎన్నికలకు ఈ అవార్డులకు సంబంధం లేదు ” అని ” స్పష్టంగా ” చెప్పారు. ఈ మాటలు చెబుతుండగా ఎదురుగా ఉన్న జనం మీకు నాలుగు వందల సీట్లు అంటూ నినాదాలు చేశారు. ” అవకాశం వుంటే వచ్చే శివరాత్రి లేదా మరొక తేదీన ఇలాంటి కార్యక్రమాన్ని నేను మాత్రమే నిర్వహిస్తానని మీకు హామీ ఇస్తున్నా ” అని కూడా మోడీ చెప్పారు.
కేవలం ఆరు రోజుల్లోనే ప్రభుత్వం రు. 2.4కోట్లు సామాజిక మాధ్యమాలపై వెచ్చించి మోడీని పొగిడించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధీనంలోని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ మార్చి పది నుంచి 16వ తేదీ వరకు (ఎన్నికల ప్రకటన ) గూగుల్‌లో వీడియో ప్రకటనలకు ఖర్చు చేసింది. ఒక వీడియోలో జనం మోడీ మోడీ అని నినాదాలిస్తుండగా మోడీ అవార్డులను ప్రదానం చేస్తుంటారు.” అతను ఉన్న ధోరణులను అనుసరించి పోవటంలేదు, అతనే ఒక ధోరణి సృష్టికర్త ” అంటూ నేపధ్యంలో మోడీ గురించి యాంకర్‌ వ్యాఖ్యలు ఉన్నాయి. జయా కిషోరీ అనే ఆమె ”బహుముఖ ప్రజ్ఞాశాలి” అని పొగిడితే టెక్నికల్‌ గురూజీగా సామాజిక మాధ్యమాల్లో పేరున్న గౌరవ్‌ చౌదరి మేక్‌ ఇన్‌ ఇండియా చొరవ మోడీదే అని పొగిడారు. బహుశా అది ఘోరంగా విఫలమైన పధకం అని తెలియదో లేక తెలిసినా పోయేదేముంది అని అన్నారో చెప్పలేము. మైథిలీ ఠాకూర్‌ అనే 23 ఏండ్ల గాయని ”ఎంవిపి” అన్నారు. క్రీడల్లో మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్‌ అని ఉపయోగించే పదాన్ని వాడారు. బహుశా రాజకీయ అటగాడని అర్ధమేమో ! అవార్డులు రాకపోయినా నామినేట్‌ అయిన కొందరు ఇలాంటి అవార్డులు ఇస్తున్నందుకు అంటూ మోడీని ఆకాశానికి ఎత్తారు. సామాజిక మాధ్యమంలో పేరు పొందిన వారిని ప్రభుత్వ ప్రచారానికి వాడుకోవటం అన్ని చోట్లా జరుగుతున్నదే.


అవార్డులు పొందిన 23 మందిలో వారు సృష్టించిన అంశాల ఇతివృత్తాల గురించి డీకోడ్‌ పేరుతో బూమ్‌లైవ్‌ విశ్లేషించింది. వారిలో పదిహేను మంది సృష్టి మతపరమైన, బిజెపినేతలతో భేటీలు, బిజెపి విధానాలు, భావజాలాన్ని సమర్దించేవిగా ఉన్నట్లు పేర్కొన్నది.వారిలో ఏడుగురు హిందూయిజానికి సంబంధించిన అంశాలమీదే చురుకుగా ఉంటారని తేలింది. వారిలో ఒకరైన రణవీర్‌ అలహాబాదియా (బీర్‌ బిసెప్స్‌) నిరంతరం బిజెపి అజెండాలోని మత అంశాలనే పోస్టు చేస్తుంటాడు.శివుడు ఎవరు, శ్రీరామ ప్రభు, హనుమాన్‌జీ, సీతా మాత, రామాయణ పాఠాలు వంటివి వాటిలో ఉంటాయి.హిందూ దేవతలు, మతపరమైన భజనలు, గీతాలను ఆలపించే జయా కిషోరీ అనే ఆమెను ” ఉత్తమ సామాజిక మార్పు సృష్టికర్త ” అవార్డుకు ఎంపిక చేశారు. ఆమె జనవరి 22న అయోధ్యలో కాషాయ దుస్తులు ధరించి రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగాలు చేశారు. హిందూమతానికి సంబంధించిన పాటలు పాడే, వీడియోలు చేసే మైథిలీ ఠాకూర్‌ను సాంస్కృతిక రాయబారి అవార్డుకు, అలాంటి వాటినే సృష్టిస్తున్న జాహ్నవీ సింగ్‌ను వారసత్వ సంస్కృతి ప్రతీక అవార్డుకు ఎంపిక చేశారు. వేద సిద్దాంతం అనే పేరుతో హిందూమత, సనాతన ధర్మ తదితర పోస్టులు పెట్టే అర్దిమాన్‌ వంటి వారిని అవార్డులు వరించాయి. ఇక టెక్నికల్‌ గురూజీగా పేరున్న గౌరవ్‌ చౌదరి వంటి మరో ఆరుగురికి బిజెపి నేతలతో భేటీ జరిపిన పూర్వరంగంలో అవార్డులు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను పొగిడుతూ కార్యక్రమాలను రూపొందించిన వారు సరేసరి. ఒక ఎఫ్‌ఎం రేడియో జాకీగా ఉన్న రౌనక్‌ అవార్డులు పొందిన వారిలో ఒకరు. అతగాడు చేసిందల్లా ఒకటే. జి20 సమావేశాల సందర్భంగా ” భారత్‌ : ద బాస్‌ ” అనే పేరుతో ఒక వీడియోను పోస్టు చేశాడు. ఆ సమావేశాలను నిర్వహించినందుకు భారతీయులు ఎంతో గర్వపడుతున్నారని పేర్కొన్నాడు. మరో వీడియో ” ఇండియా బనేగా భారత్‌( భారత్‌గా మారనున్న ఇండియా) ” అనేదాన్ని చేసినందుకు అవార్డు ఇచ్చారు.వీటి గురించి బిజెపి నేతలు ఎంత గొప్పగా చెప్పుకున్నదీ తెలిసిందే.


సామాజిక మాధ్యమాల్లో బహుళ ప్రచారం పొందిన వారిని రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వినియోగించుకోవటం ఇటీవలి కాలంలో రోజు రోజుకూ పెరుగుతున్నది.టీవీ యాంకర్లను రాజకీయ పార్టీల సభలకు రప్పించటం తెలిసిందే.ఈ నేపధ్యంలో బిజెపి అలాంటి వారిని అవార్డులు మరోపేరుతో మరింత ప్రచారం కల్పించి వారికి డిమాండ్‌ను పెంచటంతో పాటు తన ప్రచారానికి ఉచితంగా వాడుకొనేందుకు చూస్తున్నదన్నది స్పష్టం. వీరికి రాజకీయాలు, విధానాల గురించి అంతగా ప్రవేశం లేకున్నా పార్టీలు రాసి ఇచ్చిన అంశాలను తమవిగా చెప్పుకుంటూ జనాలను ప్రభావితం చేసేందుకు చూస్తారు.జనాలను ప్రభావితం చేసే ఇతివృత్తాల సృష్టికర్తలు, ప్రభావితులుగా ఉన్నవారికి అవార్డులు ఇచ్చిన నరేంద్రమోడీ అలాంటి వారి నేతగా టీమ్‌ అవార్డు పొందటానికి అర్హులని ఈ సందర్భంగా అంగీకరించకతప్పదు. ఆ అవార్డులో కథలు చెప్పటంలో నైపుణ్యం వున్నవారికి కూడా ఒక అవార్డు ఉంది. గత పది సంవత్సరాలుగా చెప్పిన మాట చెప్పకుండా జనాలకు కొత్త కతలు చెప్పటంలో నరేంద్రమోడీ అందరికంటే ఎంతో ఎత్తున ఉన్నారు.దేశంలో 46కోట్లకు పైగా యూట్యూబ్‌ ఖాతాదార్లు ఉన్నారని అంచనా. అందువలన దానిలో వెల్లడించే సమాచారంతో ఓటర్లను పెద్ద ఎత్తున ప్రభావితం చేయవచ్చని బిజెపి భావిస్తున్నది. పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నది. దానికి అనుగుణంగానే ఈ అవార్డుల పేరుతో ఆ రంగంలో పేరున్న వారందరినీ తనవైపు ఆకర్షించేందుకు పూనుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు, వాటిని చూసి సంస్థలు ఆశ్రయిస్తే ఈ ప్రభావితులుకు డబ్బేడబ్బు.స్టాటిస్టా అనే సంస్థ 2023లో ఒక విశ్లేషణ వెల్లడించింది. 2022నాటికి మనదేశంలో ఈ ప్రభావితుల మార్కెట్‌ విలువ పన్నెండు వందల కోట్ల రూపాయలని 2026 నాటికి 2,800 కోట్లకు పెరగనుందని పేర్కొన్నది. జనానికి ఎలా చెప్పాలో అన్న నేర్పరితనం వీరి దగ్గర ఉంటుంది తప్ప వీరి ప్రభావానికి పరిమితులు ఉన్నాయని హెచ్చరించింది. ప్రభావితులు, సృష్టికర్తలు రెండు రకాలు. 2007లో నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు ప్రముఖ జర్నలిస్టు కరణ్‌థాపర్‌ ఇంటర్వ్యూ ప్రారంభించిన మూడు నిమిషాల్లోనే సూటిగా సమాధానాలు చెప్పలేక మంచినీళ్లు తాగి అకస్మాత్తుగా ముగించి లేచిపోయిన మోడీ ఉదంతం తెలిసిందే. ఇలాంటి వారు ఉన్నారనే బహుశా ప్రధానిగా ఇంతవరకు ఒక్కసారి కూడా మోడీ విలేకర్ల సమావేశం పెట్టలేదు. అప్పటి నుంచి రెండవ తరగతి సానుకూల ప్రశ్నలతో ఇంటర్వ్యూలు జరిపే వారితో మాత్రమే మోడీ మాట్లాడుతున్నారు.ఎందుకంటే వారు ముందే ప్రశ్నలు పంపుతారు. అంతకు మించి అడగరు. సృష్టికర్తల అవార్డులు పొందిన వారు కూడా సానుకూల తరగతికి చెందిన వారే అన్నది వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌ను ముంచెత్తనున్న విద్యుత్‌ వాహనాలు – చైనా మీద మోడీ సర్కార్‌కు ఎక్కడలేని ప్రేమ ఎందుకబ్బా !

04 Thursday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices

≈ Leave a comment

Tags

BJP, China, China imports to India, Chinese E vehicles, Chinese investment, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


సరిహద్దు సమస్యల గురించి మాతో రహస్యంగా భారత్‌ లోతైన చర్చలు జరుపుతున్నదని, మరోవైపు విదేశాంగ మంత్రి రాజీపడేది లేదని ప్రకటిస్తారని, ఇదంతా నెపం మా మీద నెట్టేందుకు, బేరమాడేందుకు చేస్తున్న ట్రిక్కు అని చైనా విదేశాంగశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. గత నెలలో బీజింగ్‌లో రెండు దేశాల ప్రతినిధులు సరిహద్దు వివాదాల గురించి 29వ దఫా చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దులో సాంప్రదాయ పద్దతిలో బలగాలను మోహరించితేనే సాధ్యమని చర్చల అనంతరం మలేషియా భారతజాతీయుల సమావేశంలో జై శంకర్‌ చెప్పారు. సరిహద్దు సమస్యపై రాజీపడేది లేదన్నారు. భారత్‌లో జరగనున్న ఎన్నికల్లో లబ్దిపొందేందుకే జైశంకర్‌ ఇంత గట్టిగా మాడ్లాడారని చైనా విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదానికి బాధ్యత చైనాదే అని ప్రపంచానికి చెప్పే యత్నం కూడా దీనిలో ఉందన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌ అంతర్భాగంగా తాము ఎన్నడూ గుర్తించలేదని, మరోసారి దాన్ని గురించి ప్రస్తావించటం కూడా ఎన్నికల కోసమే అని విమర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనా జాంగ్‌నాన్‌ అని పిలుస్తున్నది, పురాతన కాలం నుంచి అది చైనా ప్రాంతమే అని వాదిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన సమయానికి అది మనదేశ అంతర్భాగంగా ఉంది.అదే విధంగా మనదని చెబుతున్న ఆక్సారుచిన్‌ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. ఇది రెండు దేశాల మధ్య తెగని సరిహద్దు వివాదంగా కొనసాగుతున్నది. పరస్పరం చొరబడకుండా వాస్తవాధీన రేఖకు అటూ రెండు దేశాలూ కాపలా కాస్తుంటాయి.ఉద్రిక్తతలు తలెత్తినపుడు మిలిటరీని మోహరిస్తున్నాయి. లడక్‌ ప్రాంతంలోని గాల్వన్‌ లోయ 2020 ఉదంతం తరువాత మోహరించిన మిలిటరీలు కొనసాగుతున్నాయి. వాటి ఉపసంహరణ గురించి చర్చలు జరుగుతున్నా కొత్త వివాదం తలెత్తలేదు తప్ప పూర్వపు స్థితి నెలకొనలేదు.


ఒక వైపు మనదేశంలోని సంఘపరివార్‌, ఇతర కొన్ని శక్తులు చైనా వ్యతిరేకతను నిరంతరం రెచ్చగొడుతూ ప్రచారం చేస్తుంటాయి. మరోవైపు అదే చైనా నుంచి మన దేశం రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకుంటున్నది. గత రికార్డులను నరేంద్రమోడీ బద్దలు కొట్టారు.ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గతేడాది అదే నెలలతో పోలిస్తే 15.8శాతం తమతో వాణిజ్యం పెరిగిందని చైనా కస్టమ్స్‌ శాఖ ప్రకటించింది. తూర్పు చైనాలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న షియాంగ్‌సు రాష్ట్రం నుంచి బ్రెజిల్‌,భారత్‌,రష్యా, దక్షిణాఫ్రికా దేశాలతో గతేడాదితో పోలిస్తే 2024జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 36శాతం పెరిగి 14.4బిలియన్‌ డాలర్లకు చేరిందని వెల్లడించారు.షియాంగ్‌షు రాష్ట్రం నుంచి ప్రధానంగా విద్యుత్‌ వాహనాలు, వాటిలో వినియోగించే లిథియమ్‌ అయాన్‌ బాటరీలు, ఫొటోవోల్టాయిక్‌ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.పైన పేర్కొన్న నాలుగుదేశాలతో పాటు చైనాను కలిపి బ్రిక్స్‌ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి దీనిలో సౌదీ అరేబియా, ఈజిప్టు,ఇరాన్‌, యుఏయి. ఇథియోపియా కూడా చేరటంతో దీన్ని బ్రిక్స్‌ ప్లస్‌ అని పిలుస్తున్నారు. ఒక వైపు చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, మనదగ్గర నుంచే మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియాలో భాగంగా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసే అవకాశం వచ్చిందని మీడియా ఊదరగొడుతున్నది. మరోవైపు మనదేశం చైనా, ఐరోపా సమాఖ్య మీద ఆధారపడటం పెరుగుతున్నదని తాజాగా ఐరాస సంస్థ ” అంక్టాడ్‌ ” ప్రకటించింది.
మనదేశం అందించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ కరోనా తరువాత, రష్యా-ఉక్రెయిన్‌ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి చైనా, ఐరోపా సమాఖ్యపై భారత్‌ ఆధారపడటం 1.2శాతం పెరిగిందని, సౌదీ అరేబియాపై 0.6శాతం తగ్గిందని పేర్కొన్నది. భారత్‌లో ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం(పిఎల్‌ఐ) అమలు, చైనా నుంచి వస్తున్న దిగుమతులపై నాణ్యతా ప్రమాణాల ఉత్తరువుల పేరుతో పరిమితులను విధించిన తరువాత కూడా భారత్‌ ఆధారపడటం పెరిగింది. గడచిన రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ వాణిజ్యం స్థిరంగా ఉండటం, రాజకీయాల ప్రాతిపదికన వాణిజ్యం పెరిగినప్పటికీ చైనా మీద ఆధారపడటం ఎక్కువైంది. చైనాపై ఆధారపడటాన్ని 2023లో అమెరికా 1.2శాతం తగ్గించుకుంటే మనదేశం పెంచుకుంది. ఈ కాలంలోనే చైనాపై ఆధారపడిన రష్యా వాణిజ్యం 7.1శాతం పెరగ్గా, ఐరోపా మీద 5.3శాతం తగ్గింది.2022 నుంచి ప్రపంచ వస్తు వ్యాపారం క్రమంగా తగ్గుతున్నది, సేవల లావాదేవీలు పెరుగుతున్నాయి. పొద్దున లేస్తే చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న కారణంగా చైనాతో పెంచుకుంటున్న వాణిజ్య లావాదేవీల గురించి చెప్పుకొనేందుకు మన మీడియా సిగ్గుపడుతున్నదని చెప్పవచ్చు. మన ఆర్థిక సంవత్సరపు లెక్కలను మన అధికారులు వెల్లడిస్తే చైనా జనవరి నుంచి డిసెంబరు ప్రాతిపదిక వార్షిక లెక్కలు ప్రకటిస్తుంది. అందువలన రెండుదేశాల లెక్కల్లో తేడాలు కనిపిస్తాయి.చైనా నుంచి జనవరిలో వస్తువులు ఎగుమతి జరిగి అవి మనదేశానికి వచ్చే సరికి ఒకటి రెండు నెలలు పడుతుంది. ఇది లెక్కల్లో తేడాలకు ఒక కారణం.


మనదేశ వాణిజ్య శాఖ సమాచారం ప్రకారం 2021-22 నుంచి 2023-24వరకు మూడు సంవత్సరాలలో 95.266 నుంచి 99.389 బిలియన్‌ డాలర్లకు చైనాతో వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో చైనా వెల్లడించిన సమాచారం ప్రకారం 110.361 నుంచి 116.953 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా లెక్కలు తప్పు మనం అంతగా దిగుమతులు చేసుకోలేదు అని కొందరు వాదించవచ్చు. అంకెల్లో తేడాలున్నా చైనా నుంచి దిగుమతులు పెరిగాయన్నది స్పష్టం.లేకపోతే కొంత మంది చెబుతున్నట్లు దిగుమతి చేసుకున్న వస్తువుల విలువను తగ్గించి లేదా పెంచి చూపుతున్నట్లు వార్తలు. దాన్ని నిర్ధారించుకోవటం కష్టమేమీ కాదు. కొన్ని వస్తువులు చైనా బదులు హాంకాంగ్‌ నుంచి వచ్చినట్లుగా మనదేశం నమోదు చేస్తే చైనా నుంచి తక్కువ మొత్తాలు కనిపించవచ్చు. మనదేశం చైనాతో పోటీ పడాల్సిన అవసరం ఉందని, కానీ నిర్లక్ష్యం చేశారని, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ సూరత్‌లో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మేకిన్‌, మేడిన్‌ ఇండియా అని పిలుపులు ఎన్ని ఇచ్చినా పారిశ్రామిక వస్తుఉత్పత్తి పెద్దగా పెరగటం లేదు.2010 నుంచి 2022వరకు ఉన్న వివరాల ప్రకారం వార్షిక సగటు జిడిపిలో పారిశ్రామిక రంగం వాటా 14.92శాతం ఉంది.స్టాటిస్టా అందించిన వివరాల ప్రకారం 2010లో 17శాతం ఉన్నది 2022నాటికి 13కు తగ్గింది. చైనాలో 2013 నుంచి 2023వరకు వార్షిక సగటు 40శాతం కాగా, 2013లో 44.2 నుంచి 2023లో 38.3శాతానికి తగ్గింది. దీన్ని బట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా చైనాను వెనక్కునెట్టటం మరో పదేండ్లు పదవిలో ఉన్నా నరేంద్రమోడీ వల్లకాదని అనుభవం తేల్చింది. అందువలన జైశంకర్‌ చెబుతున్న మాటలు మోడీని మునగచెట్టు ఎక్కించటానికి మాత్రమే పనికివస్తాయి.


చైనా నుంచి వచ్చే పెట్టుబడులను నిరుత్సాహపరచాలని గతంలో తీసుకున్న నిర్నయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. విద్యుత్‌ వాహనాల తయారీలో మనదేశంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి స్థానికంగా ఉత్పత్తి చేస్తే చైనాతో సహా ఏ కంపెనీలనైనా అనుమతిస్తామని మన అధికారులు వెల్లడించారు. అలాంటి కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించే వరకు దిగుమతి చేసుకొనే వాహనాలపై ఇప్పుడున్న 70-100శాతం పన్ను మొత్తాన్ని 15శాతానికి తగ్గిస్తున్నట్లు కూడా ప్రకటించింది. టిక్‌టాక్‌ యాప్‌తో మన సమాచారం అంతా చైనా సంగ్రహిస్తుందని నిషేధించిన పెద్దలు ఇప్పుడు చైనా పెట్టుబడితో ఫ్యాక్టరీలు పెట్టటాన్ని ఎలా అనుమతిస్తున్నట్లు ? చైనా మీద ప్రేమతో లేదా నరేంద్రమోడీ మారుమనసు పొంది కాదు. కార్పొరేట్ల వత్తిడే కారణం ! 2022-23లో మన దేశం 20.3బిలియన్‌ డాలర్ల మేరకు ఆటో విడిభాగాలను దిగుమతి చేసుకుంటే వాటిలో 30శాతం చైనా నుంచే ఉన్నాయి. రానున్నది విద్యుత్‌ వాహనాల యుగం. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. స్థానికంగా వాటిని తయారు చేసే కంపెనీలకు చైనా విడిభాగాలు అవసరం. తమ పెట్టుబడులను అడ్డుకుంటామంటే చైనా ఊరుకుంటుందా ? ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది. విద్యుత్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీల ఉత్పత్తిలో 75శాతంతో చైనా ముందుంది.వాహనతయారీ ఖర్చులో 40శాతం బ్యాటరీలదే. ప్రస్తుతం ప్రపంచ విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా 50శాతం వాటా కలిగి ఉంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో భారత రోడ్లపై తిరిగే ప్రయాణ,వాణిజ్య విద్యుత్‌ వాహనాల్లో ప్రతి మూడింటిలో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కలిగినవే ఉత్పత్తి చేయనున్నాయని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆమేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందువలన అనివార్యమై కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులు, వాహనాలకు అనుమతి ఇచ్చింది.వాటిలో ఒకటైన బ్రిటన్‌కు చెందిన ఎంజి మోటార్స్‌ ఇండియా ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అనేక చైనా కంపెనీలు రంగ ప్రవేశం చేయనున్నాయి.దీంతో చైనా నుంచి విడిభాగాల దిగుమతులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి.టెస్లా, విన్‌ఫాస్ట్‌ వంటి ఇతర దేశాల కంపెనీలు కూడా చైనా వాహనాలతో పోటీ పడేందుకు చూస్తున్నాయి. దీని వలన మన వినియోగదారులకు మేలు జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు.


గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు. తరువాత జాబితాను 270కి పెంచారు. షీ ఇన్‌ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదని రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు. ఇప్పుడు విద్యుత్‌ వాహనాలు,పెట్టుబడులకు గేట్లు తెరిచారు.కార్పొరేట్లు రంగంలోకి దిగితే నరేంద్రమోడీ తనమాటలను తానే దిగమింగుతారు. కాషాయమార్కు దేశభక్తి మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సాగుకు ముందుకు రాని యువత – ఐరోపా రైతాంగ ఆందోళన కారణాలేమిటి !

03 Wednesday Apr 2024

Posted by raomk in BJP, Current Affairs, Economics, Environment, Europe, Farmers, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Farmers matter, #Farmers’ protest, EU wide farmers Protest, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.ప్రపంచమంతటా పొలాల్లో పని చేసేందుకు యువత ముందుకు రావటం లేదు.వ్యవసాయమే వృత్తిగా ఉన్న వారిని వివాహం చేసుకొనేందుకు కొన్ని చోట్ల యువతులు సుముఖత చూపటం లేదు. పర్యావరణం పేరుతో అనేక నిబంధనలు, సబ్సిడీల కోతలతో పాటు, చౌకగా ఉత్పత్తుల దిగుమతులతో సాగు గిట్టుబాటు కావటం లేదు. అనేక దేశాలు, ఐరోపా పార్లమెంట్‌కు ఎన్నికల సంవత్సరమిది. మమ్మల్ని నానా కష్టాలు పెడుతున్న మీరు మమ్మల్ని ఎలా ఓటు అడుగుతారో, మా జీవితాలను ఫణంగా పెట్టి పాలన ఎలా సాగిస్తారో చూస్తామంటూ అనేక దేశాల్లో గ్రామీణులు ఆందోళన బాట పట్టారు. ఎక్కడైనా వ్యవసాయం ఒక్కటే, అందరూ రైతులే అయితే, ఒక్కో దేశంలో ఒక్కో సమస్య ముందుకు వస్తున్నది. రైతులను ఉద్యమాల్లోకి ముందుకు తెస్తున్నది. మార్కెట్‌ యార్డులతో నిమిత్తం లేకుండా ఎక్కడబడితే అక్కడ అమ్ముకొనేందుకు, నేరుగా ఎగుమతులు చేసుకొని భారీ మొత్తంలో రాబడి పొందేందుకు మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు గతంలో నరేంద్రమోడీ రైతాంగాన్ని నమ్మించేందుకు చూసి, భంగపడి క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గారు.ప్రభుత్వం బాధ్యతలనుంచి తప్పుకొని ప్రయివేటు శక్తులకు అప్పగిస్తే ఏం జరుగుతుంది ?


స్పెయిన్‌ అనుభవమే తీసుకుందాం. అక్కడ మార్కెట్‌ యార్డులు లేవు. ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఐరోపాలో జరుగుతున్న ఆందోళనలో స్పెయిన్‌ రైతులు ముందున్నారని పత్రికల్లో విశ్లేషణలు వచ్చాయి. టోకు సూపర్‌మార్కెట్ల యజమానులు రైతాంగానికి సరసమైన చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అక్కడ చట్టం ఉంది. దాన్ని అమలు జరిపేనాధుడు లేకపోవటంతో రైతులు పోరుబాట పట్టారు. మన దేశంలో కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళన సాగుతున్న సంగతి తెలిసిందే. వినియోగదారులకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, తమ ఉత్పత్తులకు ధర రావటం లేదని, ఇతర దేశాల నుంచి పోటీ, 2012 నుంచి 2022 మధ్య కాలంలో దిగుమతులు ఎనభైశాతం పెరిగినట్లు స్పెయిన్‌ రైతులు చెబుతున్నారు.2023 జూన్‌-సెప్టెంబరు మాసాల మధ్య అంతకు ముందు ఏడాది వచ్చిన సగటు ధరలకంటే రైతుల ఉత్పత్తుల ధరలు తొమ్మిదిశాతం తగ్గినట్లు తేలింది.మరోవైపున సాగు ఖర్చుల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ పేరుతో అమలు జరుపుతున్న నిబంధనలు, నియంత్రణ, చౌకధరలకు దిగుమతులతో తీవ్రమైన విదేశీ పోటీని అక్కడి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నది.దేశీయ రైతుల మీద నిబంధనలను గట్టిగా అమలు జరుపుతున్న పాలకులు కార్పొరేట్‌ కంపెనీల దిగుమతుల మీద ఉన్నవాటిని చూసీ చూడనట్లు వదలివేస్తున్నారు.
ఐరోపా పారిశ్రామిక, సేవారంగ కార్పొరేట్ల నుంచి వస్తున్న వత్తిడిని తక్కువ అంచనా వేయకూడదు.ఐరోపా సమాఖ్య దేశాల జిడిపిలో వ్యవసాయ రంగం నుంచి వస్తున్నది కేవలం 1.4శాతం, ఉపాధి కల్పిస్తున్నది 4.2శాతం మందికి మాత్రమే కాగా సమాఖ్య బడ్జెట్‌లో వ్యవసాయ రంగం 30శాతం పొందుతున్నదని కొందరు లెక్కలు చెబుతున్నారు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే అంతకంటే తక్కువ ఖర్చుతో దిగుమతులు చేసుకొని కడుపునింపుకోవచ్చు, ఇక్కడ సాగు ఎందుకు అని ప్రశ్నించటమే.1960లో స్పెయిన్‌ జిడిపిలో వ్యవసాయ వాటా 23.5శాతం కాగా 2022 నాటికి 2.6శాతానికి, ఉపాధి 39 నుంచి 3.6శాతానికి తగ్గింది. నియంత ఫ్రాంకో పాలనలో మార్కెట్‌ ఎకానమీకి మారిన తరువాత జరిగిన పరిణామమిది.పారిశ్రామిక రంగ జిడిపి వాటా కూడా ఇదే కాలంలో .30.8 నుంచి 17.4శాతానికి తగ్గగా సేవారంగం 41.7 నుంచి 74.6శాతానికి పెరిగింది.ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో 11.3శాతం మందికి ఉపాధి దొరుకుతుండగా సేవారంగంలో 78.2శాతం ఉన్నారు. దేశంలో తొమ్మిది లక్షల కమతాలుండగా 6.6లక్షల యజమానులు ఏదో ఒక రూపంలో ఐరోపా సమాఖ్య సాయం పొందుతున్నారు. గతేడాది నలభైశాతం ప్రాంతంలో తీవ్రమైన కరవు ఏర్పడింది. తొంభైలక్షల మంది జనాభా మీద ఏదో ఒక నియంత్రణ అమల్లో ఉంది. తెలుగు ప్రాంతాల్లో వేరుశనగ నూనె వంటలకు వాడినట్లుగా స్పెయిన్‌లో ఆలివ్‌ నూనె వినియోగిస్తారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గి లీటరు ధర ఐదు నుంచి 14యూరోలకు పెరిగింది. దుకాణాల్లో దొంగతనాలు చేసే వస్తువుగా మారింది.


రైతుల ఆందోళన కారణంగా స్థానిక ప్రభుత్వాలు, ఐరోపా సమాఖ్య కొన్ని నిబంధనలను సడలించింది, మరికొన్నింటిని వాయిదా వేసినప్పటికీ మెడమీద కత్తిలా వేలాడుతూనే ఉన్నాయి.వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి పర్యావరణానికి హానికలిగించే వాయువుల విడుదలను 2040 నాటికి తగ్గించేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. మీథేన్‌, నైట్రోజన్‌ తదితర వాయువులను 30శాతం తగ్గించాలన్నది ఒకటి.ఓజోన్‌ పొరను దెబ్బతీసే వాయువులు వ్యవసాయ రంగం నుంచి 14.2శాతం వెలువడుతున్నాయని 2050 నాటికి వాటిని సున్నాకు తగ్గించాలన్నది మరొక లక్ష్యం. ఇందుకోసం నిబంధనల జారీ, వాటి అమలుతో రైతాంగం ఆందోళనబాట పట్టారు.మన మీద కూడా దాని ప్రభావం కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదు పంటలకు ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధరకు హామీ ఇస్తామని చెబుతూ పంటల మార్పిడి విధానం అనుసరించిన రైతులకే అది వర్తిస్తుందనే షరతు పెట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ మీద రష్యా దాడులు జరుపుతోంది గనుక అక్కడి నుంచి ఎలాంటి దిగుమతి పన్నులు లేకుండా 2025 జూన్‌ వరకు వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చని ఐరోపా సమాఖ్య అనుమతి ఇచ్చింది. రష్యాను త్వరలోనే ఓడిస్తామని మా ఆర్థిక మంత్రి చెబితే నిజమే అని నమ్మాం, ఇప్పుడు అలాంటి సూచనలేమీ కనిపించటం లేదు, అదే యుద్దం ఇప్పుడు మమ్మల్ని నాశనం చేస్తోందని ఫ్రెంచి రైతులు చెబుతున్నారు.


ఐరోపా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ఆధారం చేసుకొని అనేక దేశాల్లో మితవాద శక్తులు జనాల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకుంటున్నాయి. జూన్‌లో జరిగే ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఈ శక్తులు బలం పుంజుకుంటాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అనేక చోట్ల స్థానిక ఎన్నికల్లో అలాంటి ధోరణి వెల్లడైంది. పోర్చుగల్‌ ఎన్నికల్లో చెగా అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 7.2శాతం ఓట్లను 18.1కి పెంచుకుంది. స్పెయిన్‌ రైతుల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ఓక్స్‌ అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 24 పార్లమెంటు సీట్లను గతేడాది 33కు పెంచుకుంది. అనేక రాష్ట్రాలలో రైతుల ఓట్లు పార్టీల తలరాతలను మార్చివేస్తున్నాయి. అనేక దేశాల్లో లాటిన్‌ అమెరికా దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాన పార్టీలన్నీ ముందుకు వచ్చాయి. రైతుల ఆందోళన కారణంగా ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.జూన్‌లో జరిగే ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ డిసెంబరులో సంతకం చేయాల్సిన ఒక ఒప్పందాన్ని వాయిదా వేయటానికి కారణం అక్కడి రైతుల ఆందోళనే. అదే విధంగా రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకంపై ఆంక్షలు విధించే బిల్లును కూడా వెనక్కు తీసుకున్నాడు. ఇలా తాత్కాలికంగా వెనక్కు తగ్గినా ఎన్నికల తరువాత ముందుకు పోతారని భావిస్తున్నారు. తమకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని కర్ణాటక బిజెపి ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే ప్రకటించిన సంగతి తెలిసిందే. నరేంద్రమోడీ మరోసారి అధికారానికి వస్తే గతంలో వెనక్కు తీసుకున్న మూడు సాగు చట్టాలను మరో రూపంలో తిరిగి ప్రవేశపెడతారనే భావం కార్పొరేట్లలో ఆశలు రేపుతోంది. అందుకే మద్దతు ఇస్తున్నారు. అనేక దేశాల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాల నుంచి మనదేశంలో జరుగుతున్నదానిని వేరు చేసి చూడలేము.ప్రపంచీకరణ యుగంలో ప్రతి రంగంలోనూ విడదీయరాని బంధం ఉంటుంది.


లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రచారానికి అనుమతి లేదంటూ పంజాబ్‌లోని అనేక గ్రామాలలో పోస్టర్లు వెలువడినట్లు జాతీయ పత్రికలు వెల్లడించాయి.” మీరు మమ్మల్ని ఢిల్లీలో ప్రవేశించనివ్వలేదు గనుక మీ నేతలను గ్రామాల్లోకి రానివ్వం ” అని పోస్టర్లలో హెచ్చరించారు. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే రద్దు చేసిన సాగు చట్టాలను మరో రూపంలో ప్రవేశపెడతారని పంజాబ్‌లో జరుగుతున్న రైతుల సభల్లో హెచ్చరిస్తున్నారు. ఇటీవలనే కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి ఫిరాయించిన సునీల్‌ జక్కర్‌ మార్చినెల 24న భటిండాలో తలపెట్టిన బిజెపి మహౌత్సవ్‌ సభ రైతుల నిరసన కారణంగా రద్దు చేసుకున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది.ఇలాంటి నిరసనలే అనేక గ్రామాల్లో వెల్లడౌతున్నాయి. రైతుల ఆందోళన పట్ల బిజెపి వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం, ఎన్‌డిఏ నుంచి అకాలీదళ్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీతో సర్దుబాటు చేసుకొనేందుకు చూసిన బిజెపి భంగపడింది. రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే బిజెపితో చేతులు కలిపేందుకు ఆ పార్టీ భయపడిందని చెప్పవచ్చు.” బిజెపి బండారాన్ని బయటపెట్టండి, బిజెపిని వ్యతిరేకించండి, బిజెపిని శిక్షించండి ” అంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రచారం చేస్తున్నది.


మనదేశంలో రైతు కుటుంబాలలో యువకులకు వివాహాలు ఒక సమస్యగా మారుతున్న పరిణామాన్ని చూస్తున్నాం. ఐరోపా, అమెరికాల్లో కూడా వ్యవసాయం చేసేందుకు యువకులు ముందుకు రావటం లేదు.ఫ్రాన్సులో రైతుల సగటు వయస్సు 50 సంవత్సరాలుగా ఉందని, అనేక కుటుంబాల్లో సాగును కొనసాగించే వారు కనిపించటం లేదని విశ్లేషణలు వెలువడ్డాయి. యాంత్రీకరణతో పనిచేసే జనాభా తగ్గి అనేక చోట్ల గ్రామాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.ఫ్రెంచి ఆహార, వ్యవసాయ, పర్యావరణ జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం 18శాతం మంది రైతులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు, మరో 25శాతం మంది చావ బతకలేని స్థితిలో ఉన్నారు.పర్యావరణం పేరుతో సాగుకు ఆటంకం కలిగించటం పట్ల రైతులు ఆగ్రహం వెల్లడిస్తున్నారు.నాలుగుశాతం సాగు భూమిలో సాగు చేయకుండా చెట్ల పెంపకానికి వదలివేయాలన్నది ఒక నిబంధన పెట్టారు. ఇతర నిబంధనల కారణంగా సబ్సిడీలకు కోత పెడుతున్నారు. ఐరోపాలో పర్యావరణ పరిరక్షణ పేరుతో ఏర్పడిన పార్టీల సమావేశాల మీద రైతులు దాడులకు దిగుతున్నారు. జర్మనీలో అదే జరిగింది. బెర్లిన్‌ సమపంలో రోడ్లపై ఎరువుల మడ్డిని కుమ్మరించటంతో అనేక కార్లు ఒకదానినొకటి ఢకొీన్నాయి.ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ఐరోపా దేశాల్లో ఇంథన, విద్యుత్‌ ధరలు విపరీతంగా పెరిగాయి.ఫ్రాన్స్‌లో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ ఖర్చు అంతకు ముందుతో పోలిస్తే గతేడాది రెట్టింపైంది. ఎరువుల ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఐరోపా వ్యవసాయ విధానమే అక్కడి రైతులను ఆందోళనలకు పురికొల్పుతున్నది. పోలాండ్‌లో కార్మికుల వేతన రేట్లు చాలా తక్కువ, దానికి తోడు చౌకగా కోళ్లను పెంచి ఇతర దేశాల మార్కెట్లలో కుమ్మరించటంతో ఫ్రాన్స్‌ వంటి చోట్ల కోళ్ల రైతులకు గిట్టుబాటు కావటం లేదు.ఉక్రెయిన్లో వేతనాలు మరీ తక్కువ. దాంతో అక్కడి నుంచి చౌక ధరలకు దిగుమతులు విపరీతంగా పెరిగాయి. అది రైతుల్లో అసంతృప్తికి దారితీయటంతో పంచదార, కోడి మాంస దిగుమతులపై ఐరోపా సమాఖ్య కొన్ని ఆంక్షలను విధించక తప్పలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d