• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CPI(M)

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం : చైనా పేర్లు ఎందుకు మార్చుతున్నది, అమెరికా ఆడుతున్న నాటకం ఏమిటి ?

13 Saturday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, #India-China border, Aksai Chin, Arunachal pradesh, BJP, China, Chinese Names, Indo-China, Indo-China standoff, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఇరుగు పొరుగుదేశాలతో వివాదాలు ఉన్నపుడు అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.బిజెపి నేతలు, వారిని నడిపించే సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు నిరంతరం తమకు అనుకూలంగా ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. ఉదాహరణకు గతంలో భారత్‌-శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చాతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు. దాన్ని డిఎంకె, కాంగ్రెస్‌ మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు బిజెపి ఎన్నికల సందర్భంగా ముందుకు తెచ్చింది. ఆ దీవిని వెనక్కు తీసుకొనేందుకు పదేండ్ల పాటు అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ఏమైనా చేశారా ? పోనీ ఇప్పుడేదైనా కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారా అంటే అదీ లేదు. ఇదే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎవరివో నిర్ధారణగాని ప్రాంతాలపై బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకున్నారు. 2015లో కుదుర్చుకున్న అవగాహన మేరకు 17,160 ఎకరాల విస్తీర్ణం ఉన్న లంకలు, ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు అప్పగించి,7,110 ఎకరాలను మనదేశం తీసుకున్నది. దీని గురించి మాత్రం బిజెపి, మోడీ మాట్లాడరు. కచ్చాతీవు గురించి తమను విమర్శించినందుకు కాంగ్రెస్‌ ఈ అంశాన్ని ప్రస్తావించి ఈ నిర్వాకం సంగతేమిటని నిలదీసింది. ఈ రెండు ఉదంతాలు చెబుతున్న పాఠమేమిటి ? ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇరుగు పొరుగుదేశాలతో ఇచ్చిపుచ్చుకొనే పద్దతిలో వివాదాలను పరిష్కారం చేసుకోవాలనే కదా ?


ఇక మరొక పొరుగుదేశమైన చైనా వ్యతిరేకతను కాషాయదళాలు రెచ్చగొడుతూనే ఉన్నప్పటికీ కీలక సమయాల్లో నరేంద్రమోడీ ఆచితూచి మాట్లాడుతున్నారు.కొత్తగా మన భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు అని గాల్వన్‌ ఉదంత సమయంలో చేసిన ప్రకటన వాటిలో ఒకటి. తాజాగా అమెరికా పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడిన అంశాలు ఆలోచింపచేసేవిగా ఉన్నట్లు చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి నరేంద్రమోడీ మృదుస్వరంతో మాట్లాడినట్లుందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ప్రారంభవాక్యాలతోనే తన విశ్లేషణ ప్రారంభించింది.మోడీ అశక్తత, పిరికితనం కనిపించిందని, గాల్వన్‌ ఉదంతంలో ప్రాణాలు అర్పించిన వారికి అవమానకరంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్ణించింది. ఇంతకీ నరేంద్రమోడీ ఏం చెప్పారు ? సరిహద్దుల్లో దీర్ఘకాలంగా సాగుతున్న పరిస్థితి మీద తక్షణమే మాట్లాడుకోవాల్సి ఉందని, తద్వారా రెండు దేశాల మధ్య ఉన్న అసాధారణతను వెనక్కు నెట్టవచ్చని, స్థిరమైన,శాంతియుత సంబంధాలు కేవలం రెండు దేశాలకే కాదు మొత్తం ప్రాంతానికి ముఖ్యమని నరేంద్రమోడీ చెప్పారు. దౌత్య రంగం, మిలిటరీ అధికారులు అప్పుడప్పుడూ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు మృదువుగా కొన్ని సార్లు కఠినంగా ఉన్నాయని, అయితే మోడీ నేరుగా చెప్పిన మాటలు ప్రత్యేకించి స్పష్టమైన వైఖరి వెల్లడించటం అసాధారణం, సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకున్నారని, సానుకూల సంకేతాలు పంపారని గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. భారత్‌-చైనా సంబంధాలను బలహీనపరచాలని చూస్తున్న అమెరికాలో కొందరికి మోడీ మాటలు అంత వినసొంపుగా ఉండకపోవచ్చని కూడా చైనా పత్రిక పేర్కొన్నది.రెండు దేశాలను ఘర్షణ దిశగా తీసుకుపోవాలని అమెరికా చూస్తున్నదని కూడా చెప్పింది.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా లిపిలో-టిబెటన్‌ పేర్లు ఖరారు చేస్తూ మూడవ జాబితాను ఇటీవల చైనా విడుదల చేసింది.అరుణాచల్‌ను టిబెట్‌లోని జాంగ్‌నాన్‌ ప్రాంతంగా చైనా పరిగణిస్తున్నది. ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరోదగ్గర లైటు వెలిగినట్లుగా అంతర్జాతీయ రాజకీయాల్లో దాదాపు అన్ని సందర్భాల్లో లైటు వెలగటమే కనిపిస్తుంది గానీ స్విచ్‌ ఎక్కడుంది, ఎవరు, ఎందుకు వేశారన్నది అంతగా తెలియదు. జపాన్‌ తదితర దేశాల ప్రతినిధులు పరిశీలకులుగా అమెరికా, ఇతరదేశాలతో కలసి పశ్చిమబెంగాల్లోని కలైకుండ వైమానిక స్థావరంలో ఏప్రిల్‌ 11-23వ తేదీలలో మనదేశం వైమానిక యుద్ధ విన్యాసాలు జరపటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హెచ్చరిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పేర్ల జాబితాను చైనా విడుదల చేసిందని డిప్లొమాట్‌ పత్రిక సంపాదకులలో ఒకరైన సుధా రామచంద్రన్‌ పేర్కొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా వాదిస్తున్నది. అందువల్లనే సందర్భం వచ్చినపుడల్లా తమ ప్రాంతమే అని చైనా బహిరంగంగా చెబుతున్నది.ఇప్పుడు జరుగుతున్న విన్యాసాలను చైనా తీవ్రంగా పరిగణిస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఆధునిక యుద్ద విమానాలు, ఇతర వ్యవస్థలను రప్పించి తరంగశక్తి తొలి దశ పేరుతో ఆగస్టులో మరోసారి తొలిసారిగా విన్యాసాలు జరపనున్నారు. ఈ విన్యాసాలలో చైనా, రష్యాలను వ్యతిరేకించేదేశాలే భాగస్వాములుగా ఉన్నాయి.అమెరికా, జర్మనీ,ఫ్రాన్స్‌,ఆస్ట్రేలియా తదితర దేశాల వైమానిక దళాలు పాల్గొంటాయి. సహజంగానే ఇలాంటి విన్యాసాలు తనను ఉద్దేశించి జరుపుతున్నట్లు భావించే ఏ దేశమైనా తనదైన శైలిలో స్పందిస్తుంది.


చైనా తాజాగా ప్రకటించిన 30 పేర్ల గురించి గతంలో మాదిరే మనదేశం స్పందించింది.మన ప్రాంతాలకు మరొక దేశం తన పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారి ప్రాంతాలవుతాయా, వాస్తవాలను మారుస్తాయా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.మనదేశంలో మీడియా మరోసారి తీవ్రంగా స్పందించింది. రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు టీవీ ఛానళ్లు చూశాయి.రెండవ సారి 2017లో పేర్లు పెట్టిన వాటిలో రెండు నివాసిత ప్రాంతాలు, ఐదు పర్వతాలు, రెండు నదులు, మరో రెండు ప్రాంతాలు ఉన్నాయి. మరో 15 ప్రాంతాలకు 2021లో చైనా పేర్లు పెట్టింది.తమవి అని చెప్పుకుంటున్న వివాదాస్పద ప్రాంతాలకు ఏ దేశమైనా తన పేర్లు పెట్టుకోవటం కొత్తదేమీ కాదు. ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారు చిన్‌ ప్రాంతం ఉంది. అది మనదే అని మన ప్రభుత్వం చెబుతుంది. దాన్ని లడఖ్‌ ప్రాంతంలోని లే జిల్లాగా పిలుస్తారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ మీద ఉన్న వివాదం కూడా అలాంటిదే. దాన్ని చైనా వారు జింగ్‌నాన్‌ అనే పేరుతో వ్యవహరిస్తారు.మన పురాణాల్లో మానస సరోవరంగా పిలిచే సరస్సు చైనాలోని టిబెట్‌లో ఉంది. అక్కడ దాని పేరు మాపాంగ్‌ యంగ్‌.


రెండు దేశాల మధ్య లడఖ్‌, అరుణాచల్‌ ప్రాంతాలపై వివాదం ఉంది. దాన్ని బ్రిటీష్‌ వారు సృష్టించారు.మన దేశం బ్రిటీష్‌ వారి నుంచి 1947లో స్వాతంత్య్రం పొందింది. మనదేశం మాదిరి చైనాను బ్రిటన్‌ పూర్తిగా ఆక్రమించలేకపోయింది. వివిధ ప్రాంతాలలోని యుద్ధ ప్రభువులు బలంగా ఉండటంతో అమెరికాతో సహా ఐరోపా దేశాలన్నీ తమకు కావాల్సిన వాణిజ్యం మీద వివిధ ఒప్పందాలను చేసుకున్నాయి తప్ప వారి పాలనను రుద్దలేకపోయాయి. అయితే చైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. నదులు, రేవులు, వాణిజ్యాలపై అనేక హక్కులను పొందారు. హంకాంగ్‌ దీవులను 99 సంవత్సరాలకు బ్రిటీష్‌ వారు కౌలుకు తీసుకున్నారు. అలాగే మకావో దీవులను పోర్సుగీసు వారు కౌలుకు తీసుకున్నారు. పేరుకు దేశం క్వింగ్‌ రాజరిక పాలనలో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీద అదుపులేదు. యుద్ద ప్రభువులు పెత్తనం చెలాయించేవారు. వారి మధ్య ఉన్న విబేధాలను విదేశాలు ఉపయోగించుకున్నాయి. ఈ నేపధ్యంలో ఎనిమిది దేశాల కూటమి క్వింగ్‌ వంశ రాజు మీద అనేక ఒప్పందాలను రుద్దింది.దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిమాదిరి చేశారు. దాంతో దేశభక్తులు రాజరికాన్ని కూలదోసి రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్యమం సాగించిన ఫలితంగా 1911లో చైనా రాజరికం నుంచి రిపబ్లిక్‌గా మారింది. మనకు జాతిపితగా మహాత్మాగాంధీ ఎలాగో చైనాలో సన్‌ ఏట్‌ సేన్‌ దానికి నాయకత్వం వహించాడు. అధికారం వచ్చిన తరువాత యుద్ధ ప్రభువులు కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించకుండా తిరుగుబాటు, కుట్రలకు పాల్పడ్డారు.1949లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాతే ఒకే ప్రభుత్వ ఏలుబడిలోకి చైనా వచ్చింది. సామంత రాజ్యంగా ఉన్న టిబెట్‌ను రెచ్చగొట్టి స్వతంత్రదేశంగా మార్చి తమ స్థావరంగా చేసుకోవాలని చూసిన బ్రిటన్‌, తరువాత అమెరికా జరిపిన కుట్రల కారణంగా టిబెట్‌ పాలకుడిగా ఉన్న దలైలామా తిరుగుబాటు,మనదేశానికి పారిపోయి రావటం తెలిసిందే.


మన ప్రభుత్వ సాయంతో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాసంలో ఉన్న 88 సంవత్సరాల పద్నాలుగవ దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతం టిబెట్‌లో అంతర్భాగమే అని 2003లో చెప్పాడు. తరువాత వైఖరి మార్చుకున్నాడు.బ్రిటీష్‌ అధికారి మెక్‌మోహన్‌ గీసిన సరిహద్దు రేఖ ప్రకారం భారత్‌లో అంతర్భాగమే అని మాట మార్చాడు. మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దుగా 1914లోనే బ్రిటన్‌-టిబెట్‌ గుర్తించాయనే వాదనను ముందుకు తెచ్చాడు. అయితే ఆ ఒప్పందాన్ని చైనా ప్రభుత్వం అంగీకరిస్తేనే అమల్లోకి వస్తుందనే అంశం ఉంది. సదరు ఒప్పందాన్ని చైనా గుర్తించలేదు. ఒక సామంత ప్రాంతానికి విదేశాలతో ఒప్పందం చేసుకొనే హక్కులేదు.ఆక్సారుచిన్‌ ప్రాంతాన్ని కూడా బ్రిటీష్‌ అధికారులు నిర్దిష్టంగా గుర్తించకపోవటంతో అది కూడా వివాదాస్పద ప్రాంతంగా మారింది. వారి గీతలు ఎలా ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చేనాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ మన పాలనలో, ఆక్సారుచిన్‌ చైనా ఏలుబడిలో ఉంది. మనం దీని గురించి అడిగితే వారు దాని సంగతేమిటని ప్రస్తావిస్తున్నారు.1962లో రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినపుడు చైనా సైన్యాలు అరుణాచల్‌ను దాటి నేటి అసోంలోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. తరువాత వెనక్కుపోయి, వాస్తవాధీనరేఖకు అవతల గతంలో మాదిరే ఉన్నాయి. తమ మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు మనదేశం ఆశ్రయం ఇవ్వటాన్ని చైనా వ్యతిరేకిస్తున్నది.2017లో దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లో వారం రోజుల పర్యటనను చైనా వ్యతిరేకించింది. అతడిని ఆపకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని చైనా పత్రికల్లో వార్తలు వచ్చాయి. దలైలామా పర్యటన తరువాత తొలిసారిగా కొన్ని ప్రాంతాలకు తమ పేర్లను చైనా ప్రకటించింది. ఆ తరువాతే 73రోజుల పాటు డోక్లామ్‌ ప్రతిష్ఠంభన కొనసాగింది.తరువాత 2021లో మరోసారి కొన్ని ప్రాంతాలకు పేర్లు ప్రకటించింది.


టిబెట్‌ను చైనా అంతర్భాగమని మనదేశం గుర్తించింది, కానీ అదే సమయంలో మానవతాకారణాలను సాకుగా చూపి తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం కల్పించటం,ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. రెండు దేశాల మధ్య తెగని వివాదాల్లో ఇదొకటి.తమ వ్యతిరేకశక్తులకు భారత్‌ ఆశ్రయమిస్తున్నదని చైనా విమర్శిస్తున్నది.చైనాతో ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో ఉన్ననేతలు(తరువాత వారు సిపిఎంగా ఏర్పడ్డారు) కొందరు 1962లో కోరినందుకు వారిని దేశద్రోహులుగా, చైనా ఏజంట్లుగా చిత్రించి జైలుపాలు చేశారు. తరువాత అదే కాంగ్రెస్‌ పాలకులు చైనాతో వివాదాన్ని కొనసాగిస్తూనే సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నారు.వర్తమానంలో నరేంద్రమోడీ గత ప్రధానులెవరూ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీలు జరిపి రికార్డు సృష్టించారు.గాల్వన్‌లోయ ఉదంతాలకు ముందు ఇరుదేశాల నేతలు కలసి ఉయ్యాలలూగటాన్ని ఊహాన్‌, మహాబలిపురం నగరాల్లో చూశాము.ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వెనుక భారత్‌ భుజం మీద తుపాకి పెట్టి అమెరికన్లు తమను కాల్చాలని చూస్తున్నట్లు చైనా అనుమానిస్తుండటం ఒక కారణం. అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగంగా తాము గుర్తిస్తున్నట్లు 2024 మార్చినెల తొమ్మిదవ తేదీన అమెరికా ఒక ప్రకటన చేసింది. వివాదాన్ని పెంచటానికి గాకపోతే ఇరుదేశాలకు సంబంధించిన అంశాల మీద దానికి సంబంధం ఏమిటి ? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును భారత్‌ అంతర్భాగంగా గుర్తిస్తున్నట్లు అమెరికా ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఎందుకని ? అదే అమెరికా ఆడుతున్న రాజకీయం,అలా ప్రకటిస్తే పాకిస్తాన్‌ ఎక్కడ చైనాకు మరింత దగ్గర అవుతుందేమో అన్నదే దాని భయం.మన స్వతంత్ర విదేశాంగ విధానం ప్రకారం వివాదాలను పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా వలలో చిక్కుకొని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దన్నదే అనేక మంది చెబుతున్నమాట.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ రాజకీయం : అన్న కాంగ్రెస్‌, ఇడి భయంతో చెల్లి బిజెపి ! సిపిఎం వైపు ముస్లిం ఓటర్ల మొగ్గు !!

10 Sunday Mar 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

#Kerala Election scene, #Kerala Politics, BJP, CPI()M, Kerala CPI(M), Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


కేరళలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రసవత్తర రాజకీయం మొదలైంది. కాంగ్రెస్‌ గతంలో సాధించిన సీట్లను నిలుపుకోవాలని చూస్తున్నది. సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కొనసాగించి లోక్‌సభ సీట్లును గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓట్ల కోసం కమలనాధులు దేనికైనా సిద్దపడుతున్నారు. కేరళలో 2019లో ఇరవై స్థానాలకు గాను కేవలం ఒక్కచోటే సిపిఎం గెలిచింది. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఎన్నికలకు ముందు శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఎల్‌డిఎఫ్‌ సమర్ధించింది. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంది, సుప్రీం కోర్టులో పునర్విచారణ జరుగుతోంది. దానికి తోడు కేంద్రంలో రెండవసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్‌ మాత్రమే అని జనం నమ్మటం కాంగ్రెస్‌ గెలుపుకు దోహదం చేశాయి. తరువాత జరిగిన ఎన్నికల్లో, ఇప్పుడు శబరిమల వివాదం ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని తేలిపోయింది. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ కూడా భాగస్వాములుగా ఉండటంతో ఎవరు గెలిచినా బిజెపిని వ్యతిరేకించే వారే గనుక గతంలో మాదిరి బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ముస్లింలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం లేదని సాధారణంగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే ప్రముఖ పత్రిక మళయాళ మనోరమ తాజాగా ఒక సమీక్షలో పేర్కొన్నది. దానిలోని కొన్ని ముఖ్య అంశాల సారం దిగువ విధంగా ఉంది.


గత ఎన్నికల అనంతరం సిఎస్‌డిఎస్‌ జరిపిన సర్వేలో మూడింట రెండువంతుల మంది ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటువేసినట్లు వెల్లడైంది. గతం కంటే నరేంద్రమోడీ అధికారంలోకి రాగూడదన్న భావన ముస్లింలలో పెరిగినప్పటికీ గుడ్డిగా కాంగ్రెస్‌వైపు మొగ్గే ధోరణిలో లేరు. మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ వంటి చోట్ల బిజెపి కంటే కాంగ్రెస్‌ ఎక్కువ హిందూత్వను అనుసరించటం ముస్లిం సామాజిక తరగతిని ఆశాభంగానికి గురి చేసింది. రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాబోవటం లేదని చెప్పేందుకు కాంగ్రెస్‌ ఆలశ్యం చేయటం కూడా వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్‌ మీద తొలుగుతున్న భ్రమలతో పాటు విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా సిపిఎంను చూస్తున్నారు. ” కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరే అవకాశం కోసం వేచి చూస్తున్నారు.వారు ఉన్నత రాజకీయ లక్ష్యాలనేమీ ప్రకటించటం లేదు.వారికి కేవలం అధికారం మాత్రమే ప్రధానంగా ఉంది ” అని రచయిత, ఒక పరిశోధనా సంస్థ అధ్యక్షుడు ముజిబ్‌ రహమాన్‌ కినలూర్‌ చెప్పారు. ” అలాంటి వలస కేరళలో కూడా కనిపిస్తోంది.ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని, ఇప్పుడు కరుణాకరన్‌ కుమార్తె పద్మజ బిజెపిలో చేరారు.ఎవరైనా కాంగ్రెస్‌ ఎంపీని నమ్మాలంటే ఎంతో కష్టంగా మారుతోంది” అని కూడా ముజిబ్‌ చెప్పారు. ”బిజెపిని ఎదుర్కొనే అవకాశం సిపిఎంకు లేదని మాకు తెలుసు, కానీ కాంగ్రెస్‌కు ఉంది.ఇప్పుడు రెండు పార్టీలూ ఇండియా కూటమిలో ఉన్నాయి. అందువలన ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిని ఎంచుకుంటే తేడా ఏముంటుంది.” అని ఇస్లామిక్‌ పండితుడు, రచయిత అష్రాఫ్‌ కడక్కల్‌ ప్రశ్నించారు.” ఈ సారి ప్రతి ముస్లిం ఒక అభ్యర్ధి లౌకిక వైఖరినే చూస్తారు.పార్లమెంటులో గట్టిగా లౌకికవాదాన్ని ఎవరు గట్టిగా రక్షణకు నిలబడతారు, ఉదాహరణకు జాన్‌ బ్రిట్టాస్‌(సిపిఎం రాజ్యసభ సభ్యుడు) వంటి వారిని ఎంచుకుంటారు ” అని కూడా చెప్పారు.లౌకివాద పరీక్షలో కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌, ఆర్‌ఎస్‌పి ఎంపీ ఎన్‌కే ప్రేమ చంద్రన్‌ ఫెయిల్‌ అయ్యారు. హమస్‌ను ఉగ్రవాద సంస్థ అని శశిధరూర్‌ వర్ణించారు.పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ మారణకాండను గట్టిగా ఖండించలేదు. దీంతో పాలస్తీనా సంఘీభావ సభల్లో పాల్గొనే వారి జాబితా నుంచి ముస్లిం సంస్థలు శశిధరూర్‌ పేరును తొలగించాయి. ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కావటంతో ప్రేమచంద్రన్‌పై అపనమ్మకం ఏర్పడింది.


శుక్రవారాల్లో నమాజు తరువాత మసీదుల్లో చేసే ప్రసంగాల్లో ఎల్‌డిఎఫ్‌ను విమర్శించాలని ముస్లింలీగు కోరుతున్నది. మసీదుల్లో రాజకీయ విమర్శలు చేయకూడదని సమస్త కేరళ జమాయతుల్లా చెప్పింది.ముస్లిం లీగ్‌ చేస్తున్న రాజకీయాలు సమస్తలోని ఒక వర్గాన్ని ఆశాభంగానికి గురిచేశాయి.వారు ఈసారి ఎల్‌డిఎఫ్‌ను ఎంచుకోవచ్చు.లీగ్‌ నేతల తీరుతెన్నులను విమర్శించినందుకే పార్టీ నేత కెఎస్‌ హంసను బహిష్కరించారు. ఇప్పుడు సిపిఎం తన అభ్యర్ధిగా హంసను పొన్నాని బరిలో నిలిపింది.అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి నిరసన తెలపాల్సిన అవసరం లేదని, అక్కడ మసీదు నిర్మాణం కూడా చేయనున్నందున లౌకికవాదం మరింత బలపడుతుందని ముస్లింలీగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సాదిక్‌ అలీ తంగల్‌ చేసిన వ్యాఖ్యలను లీగ్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.జ్ఞానవాపి మసీదు కూడా కావాలని సంఘపరివార్‌ కోరుతున్నందున అలా ఎలా మాట్లాడతారని సమస్త నేత ప్రశ్నించారు.తిరువాన్కూర్‌ సెంట్రల్‌ ప్రాంతంలో 2016 ఎల్‌డిఎఫ్‌కు ముస్లింలు 25శాతం మంది మద్దతు ఇవ్వగా 2021లో అది 50శాతానికి పెరిగింది.ఎక్కడైతే బిజెపి పోటీ ఇస్తుందని అనుకుంటారో అక్కడ ఓడించేవారిని చూసి ఎంచుకుంటారు.


కాంగ్రెస్‌ నేత బొమ్మతో బిజెపి ప్రచారం !
కేరళలో జగమెరిగిన కాంగ్రెస్‌ నేత, మాజీ సిఎం కరుణాకరన్‌. ఆయన కుమార్తె పద్మజ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరగానే బిజెపి పెద్దలు కాషాయ జెండాపై కరుణాకరన్‌ బొమ్మను ముద్రించి ప్రచారానికి దిగారు. తన తండ్రి కాంగ్రెస్‌ ఆస్తి అని త్రిసూర్‌ లోకసభ కాంగ్రెస్‌ అభ్యర్ధి కె మురళీధరన్‌ ప్రకటించారు. నిలంబూర్‌లో నరేంద్రమోడీ, కరుణాకరన్‌, పద్మజ బొమ్మలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్య తీసుకోకపోవటంతో వారు వాటిని చించివేశారు. రాష్ట్రంలో మొత్తం 20లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న 16చోట్ల అభ్యర్ధులను ఖరారు చేసింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కె కరుణాకరన్‌, ఎకె ఆంటోనీ. ఇద్దరూ కాంగ్రెస్‌ ప్రముఖులే. గతంలో ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని బిజెపిలో చేరగా,ప్రస్తుతం ఆ పార్టీ తరఫున పత్తానంతిట్ట లోక్‌సభ బరిలో దిగారు. అక్కడ సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ పోటీ చేస్తున్నారు. పద్మజ వేణుగోపాల్‌ వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ మీద ఆమె పోటీ చేయనున్నట్లు నిర్దారణగాని వార్తలు వచ్చాయి. దేశవ్యాపితంగా ఈ పోటీని సంచలనాత్మకం కావించేందుకు బిజెపి ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె సోదరుడు, ప్రస్తుతం వడకర ఎంపీగా ఉన్న మురళీధరన్‌ త్రిసూర్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు ఆకస్మికంగా మార్పును ప్రకటించారు.
కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరటంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. ఈ రోజు కాంగ్రెస్‌లో ఉన్న నేతలు రేపుదానిలో ఉంటారన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. బిజెపిలో చేరతానని గతంలో పిసిసి అధ్యక్షుడు సుధాకరన్‌ స్వయంగా చెప్పారు. ఇద్దరు ప్రముఖుల పిల్లలు బిజెపిలో చేరారు. ఇంకా ఎంత మంది చేరతారో తెలియదు. కాంగ్రెస్‌ తరఫున ఎంపీలుగా గెలిచినప్పటికీ వారు పార్టీలో కొనసాగుతారన్న ఎలాంటి హామీ లేదన్నారు.ఇంకా ఎంత మంది కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరతారో మీరే చూస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విలేకర్లతో అన్నారు. అనేక మంది ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారని, మొత్తంగా బిజెపిలో చేరరన్న గ్యారంటీ ఏముందన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వందల మంది మాజీ ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ముగ్గురు పిసిసి అధ్యక్షులు బిజెపిలో చేరారని చెప్పారు.


సురేష్‌ గోపికి కోపమొచ్చింది ! ఓట్ల కోసం ఎన్ని తిప్పలో !!
ఈ సారి ఎలాగైనా విజయం సాధిస్తాననే ధీమాతో త్రిసూర్‌లో పోటీకి దిగిన సినీనటుడు సురేష్‌ గోపికి శనివారం నాడు కోపమొచ్చింది. ఒక గిరిజన కాలనీలో ప్రచారానికి వచ్చిన గోపికి కొంత మంది మహిళా వలంటీర్లు తప్ప ఓటర్లు కనిపించలేదు.దాంతో కారుదిగకుండానే వలంటీర్లు కూడా తగినంత మంది లేనపుడు ఇక్కడ పోటీ చేయటం ఎందుకు తిరువనంతపురం వెళ్లి అక్కడ కేంద్రమంత్రి చంద్రశేఖర్‌కు ప్రచారం చేస్తా అంటూ మండిపడినట్లు మీడియా పేర్కొన్నది. ఇంకా నామినేషన్‌ కూడా దాఖలు చేయలేదు గుర్తుపెట్టుకోండి అంటూ ఆగ్రహించారు. దాంతో కార్యకర్తలు ఇక ముందు ఇలా జరగకుండా చూస్తామంటూ క్షమాపణలు చెప్పారట. అక్కడ సోదరుడికి వ్యతిరేకంగా చెల్లి పద్మజ బిజెపి తరఫున ప్రచారం చేయనున్నట్లు వార్తలు. బిజెపిని మూడవ స్థానంలోకి నెడతామని మురళీధరన్‌, కాంగ్రెస్‌నే ఆ చోటులో ఉంచుతామని సురేష్‌ గోపి ప్రకటించారు. ఓట్ల కోసం ఈ పెద్దమనిషి నానా తిప్పలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది ప్రముఖుల సమక్షంలో తన కుమార్తె వివాహాన్ని గురువాయూర్‌ శ్రీకృష్ణ దేవాలయంలో నిర్వహించారు. దానికి రెండు రోజుల ముందు త్రిసూర్‌లోని ఒక చర్చిలో మేరీమాతకు ఒక బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించుకున్నారు. అయితే అది బంగారు పూత పూసిన రాగిదనే విమర్శలు రావటంతో వివాదాస్పదమైంది. దానిలో బంగారం ఎంత ఉందో పరీక్షించి చెప్పాలని చర్చి అధికారులను కాంగ్రెస్‌ కోరింది. ఐదు సవర్ల బంగారంతో దాన్ని చేసినట్లు కంసాలి చెప్పారు. తాను ఇచ్చినదానిలో సగం బంగారాన్ని కంసాలి తనకు తిరిగి ఇచ్చారని, 18కారట్ల బంగారంతో కిరీటాన్ని తయారు చేసినట్లు, తాను గెలిస్తే మరో పదిలక్షల విలువగల బంగారాన్ని మేరి మాతకు కానుకగా ఇస్తానని సురేష్‌ గోపి వివరణ ఇచ్చారు. ఎల్‌డిఎఫ్‌ తరఫున సిపిఐ అక్కడ పోటీ చేస్తున్నది.అక్కడ టిఎన్‌ ప్రతాన్‌ తమ అభ్యర్ధి అని కాంగ్రెస్‌ ఎన్నో రోజుల ముందుగానే అనధికారికంగా ప్రకటించింది. దాంతో గోడరాతలతో పాటు మూడున్నరలక్ష వాల్‌పోస్టర్లను కూడా ప్రతాపన్‌ ముద్రించారు. ఇప్పుడు అవన్నీ వృధా అయ్యాయి.


ఇడి దెబ్బకు బిజెపిలోకి ఫిరాయింపు !
పద్మజా వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి బిజెపిలో చేరటానికి కారణం ఆమె భర్త డాక్టర్‌ వేణుగోపాల్‌ను ఇడి అధికారులు ప్రశ్నించటమేఅని కాంగ్రెస్‌ నాయకురాలు బిందు కృష్జ చెప్పారు. ఆమె ఎప్పటి నుంచో తమతో మాట్లాడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ అన్నారు. తన సోదరితో అన్ని బంధాలను తెంచుకున్నానని, ఆమె చేరికతో బిజెపికి ఒక్క పైసా కూడా ఉపయోగం ఉండదని మురళీధరన్‌ మీడియాతో చెప్పారు.తన తండ్రి ఆత్మ ఆమెను క్షమించదన్నారు.ఆమె ఫిరాయింపు వెనుక తమ కుటుంబంతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న మాజీ డిజిపి లోక్‌నాధ్‌ బెహరా ఉన్నారని, అతను ప్రధాని నరేంద్రమోడీ, పినరయి విజయన్‌కూ సన్నిహితుడే అన్నారు. పత్తానం తిట్టలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ నేత ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని ఓట్లకోసం శివరాత్రి నాడు శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకున్నారు. తన పార్టీ జనపక్షంను బిజెపిలో విలీనం చేసిన పిసి జార్జి ఆ సీటును ఆశించి భంగపడ్డారు.కేరళ రాజకీయాల గురించి అనిల్‌ ఆంటోనికి అనుభవం లేదని అక్కడ ఓడిపోతారని ప్రకటించారు. దాంతో బిజెపి నాయకత్వం నష్టనివారణకు పూనుకొని అనిల్‌తో కలిపి శివాలయానికి పంపింది. అక్కడ జార్జి స్వయంగా అనిల్‌ నుదుట తిలకాన్ని దిద్దిన వీడియో వైరల్‌గా మారింది. పోటీకి దిగాలన్న తన కలను సిఎం పినరయి విజయన్‌, బిజెపి మిత్రపక్షం బిడిజెఎస్‌ నేత తుషార్‌ వెల్లపల్లి వమ్ముచేశారని పిసి జార్జి ఆరోపించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యువరైతును బలితీసుకున్న బిజెపి సర్కార్‌ – రైతు ఉద్యమ భవిష్యత్‌ ఏమిటి !

21 Wednesday Feb 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Farmers matter, #Farmers Protest, BJP, Haryana polic, Narendra Modi Failures, SKM


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 13న ప్రారంభమైన రైతు ఉద్యమంలో బుధవారం నాడు 24ఏండ్ల సుభకరణ్‌ సింగ్‌ ప్రాణాలర్పించాడు. హర్యానా పోలీసులు రైతుల మీద జరిపిన దమనకాండలో అనేక మంది గాయపడ్డారు.కనౌరీ ప్రాంతం నుంచి తమ ఆసుపత్రికి వచ్చిన ముగ్గురిలో ఒకరు మరణించినట్లు పాటియాలలోని రాజీంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్‌ హెచ్‌ఎస్‌ రేఖీ విలేకర్లతో చెప్పారు. తమ దగ్గర అలాంటి సమాచారం లేదని పోలీసులు బుకాయించారు. పోలీసుల దమనకాండ నేపధ్యంలో రెండు రోజుల పాటు ఢిల్లీ చలో ప్రదర్శన నిలిపివేసినట్లు రైతు సంఘాల ప్రతినిధి సర్వన్‌ సింగ్‌ పాంధెర్‌ ప్రకటించారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం నాడు వెల్లడిస్తామని తెలిపారు. బుధవారం నాడు పంజాబ్‌-హర్యాన సరిహద్దులోని రెండు ప్రాంతాలలో ప్రదర్శకుల మీద పోలీసులు విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు గాయపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మిర్చి కలిపిన ఎండుగడ్డిని తగులబెట్టి దానితో రైతులు తమ మీద దాడి చేసినట్లు పోలీసులు ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో కొన్ని చోట్ల ట్రాక్టర్లతో ప్రదర్శనలు జరిపారు.


అంతకు ముందు జరిగిన పరిణామాలలో మూడు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ఐదేండ్ల పాటు కొనుగోలు చేస్తామని, మిగతా వాటి కనీస మద్దతు ధర గురించి ఎలాంటి హామీ ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రతిపాదన తమకు ఆమోదం కాదని ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఢిల్లీకి ప్రదర్శనగా వెళతామని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా( రాజకీయ రహితం-ఎస్‌కెఎం-ఎన్‌పి) నేతలు ప్రకటించారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో దాదాపు పద్నాలుగువేల మంది రైతులు గత కొద్ది రోజులుగా తిష్టవేశారు.పన్నెండు వందల ట్రాక్టర్లు-ట్రాలీలు, పది మినీ బస్సులు, ఇతర వాహనాలతో రైతులు పదమూడవ తేదీ నుంచి అక్కడే ఉన్నారు వారిని 200కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ చేరుకునేందుకు ముందుకు సాగనివ్వకుండా హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు అడ్డుకుంటున్నారు. చర్చలు విఫలమైనందున బుధవారం నుంచి ఢిల్లీ చలో పిలుపుతో ముందుకు సాగుతామని ఎస్‌కెఎం-ఎన్‌పి నేతలు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను రాజధానిలోకి రానివ్వకూడదని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఢిల్లీ పోలీసులకు గట్టి ఆదేశాలను జారీ చేశారు. మరోవైపున ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న బిజెపి సర్కార్‌ కూడా రోడ్లను మూసివేసి అన్నదాతలను అడ్డుకొనేందుకు పూనుకుంది. తాము ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు రైతులు భారీ యంత్రాలతో వస్తున్నట్లు, ఇది నేరపూరితమని హర్యానా పోలీసులు ఆరోపించారు.ఢిల్లీ వైపు వచ్చేందుకు పూనుకున్న రైతుల మీద హర్యానా పోలీసులు డ్రోన్లతో బాష్పవాయు గోళాలను విసిరారు. దీంతో షంభు సరిహద్దు ఉద్రిక్తంగా మారింది. జెసిబిలు, క్రేన్లు, పొక్లెయిన్లను రైతులకు సరఫరా చేయవద్దని యజమానులను హెచ్చరించారు. ఈ నేపధ్యంలో రైతుల ఉద్యమం ఏమౌతుంది, రానున్న ఎన్నికలలో బిజెపి, దాని మిత్ర పక్షాల మీద ఆందోళన ప్రభావం ఎలా ఉంటుంది అన్న చర్చ మొదలైంది.


గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రభుత్వ తాజా చర్చలలో భాగస్వామి కాదు. అయినప్పటికీ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తున్నామని, రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు, ఎన్‌డిఏ ఎంపీల ఇండ్ల ముందు నిరసన తెలపాలన్న తమ పిలుపుతో ముందుకు పోతామని ప్రకటించింది. గతంలో అనేక రాష్ట్రాలలో రాజకీయాలతో నిమిత్తం లేని రైతు సంఘాల పేరుతో అనేక మంది సంస్థలను ఏర్పాటు చేసి రైతులను సమీకరించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు కూడా ఉన్నారు. దాని కొనసాగింపుగానే 2020-21లో ఆందోళనలో భాగస్వాములుగా ఉన్న కొందరు ఎస్‌కెం నుంచి విడగొట్టుకొని తాజా ఆందోళనకు పిలుపు ఇచ్చారు. గత ఆందోళనకు దూరంగా ఉన్న కొన్ని సంస్థలు కూడా ఇప్పుడు వారితో కలిశాయి. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు దేశ శత్రువులను ఎదుర్కొనే పద్దతిలో రైతులను అడ్డుకొనేందుకు సన్నద్దం అవుతున్నది, మరోవైపు చర్చల పేరుతో లోక్‌సభ ఎన్నికల ప్రకటన జరిగే వరకు కాలయాపన ఎత్తుగడలకు పూనుకుంది. రైతుల మీద తప్పుడు ప్రచారం సరేసరి.


మూడు రకాల పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని రానున్న ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీనిని రైతు సంఘాలు తిరస్కరించాయి.ఢిల్లీ చలో కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించాయి.ఎస్‌కెఎం-ఎన్‌పి నేత జగజిత్‌ సింగ్‌ దలేవాల్‌ సోమవారం నాడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రు.1.75లక్షల కోట్లతో పామాయిల్‌ దిగుమతి చేసుకుంటున్నదని, ఈ మొత్తాన్ని చమురు గింజల సాగుదార్లకు ఇస్తే వారికి ప్రయోజనం ఉంటుందన్నారు.ప్రభుత్వం చేసిన ప్రతిపాదన పంటల మార్పిడి చేసే రైతులకు మాత్రమే లబ్ది చేకూర్చుతుందన్నారు. తమ డిమాండ్లను ఆమోదించటం లేదా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అంగీకరించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల దమనకాండలో పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో 400 మంది రైతులు గాయపడ్డారని దలేవాల్‌ చెప్పారు. సుప్రీం కోర్టు దీని మీద స్వయంగా చర్య తీసుకోవాలని కోరారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు ఝామువరకు జరిగిన చర్చలలో రైతులు అంగీకారం తెలిపిన అంశాల మీద మరుసటి రోజు మాట మార్చినట్లు చర్చలలో భాగస్వాములైన వర్గాలు చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒక సమీక్షలో పేర్కొన్నది.ఇప్పుడు ఆందోళనకు పిలుపుఇచ్చిన వారు నిజంగా అంగీకరించారా లేక వారి మీద చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా ఇలాంటి వార్తలను వ్యాపింపచేస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది.

ప్రభుత్వం జరుపుతున్న చర్చల తీరు గురించి గతంలో ఆందోళనకు నాయకత్వం వహించిన వారిలో ఒకరైన హన్నన్‌ మొల్లా ఆదివారం నాడు మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దులో జరుపుతున్న ఆందోళన తమ పిలుపు మేరకు జరుగుతున్నది కాదని గతంలో తమ నుంచి వేరుపడిన కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారు కూడా తమ పేరునే ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఆదివారం రాత్రి జరిగిన నాలుగవ విడత చర్చల గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత ఆందోళన సందర్భంగా పదకొండుసార్లు చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం లేదన్నారు.ఈ పదకొండు దఫాల చర్చలకు 42 మందిని కేంద్రం పిలిచిందని, వారిలో ఇద్దరిని విడదీసిందని, ఇప్పుడు ఆ ఇద్దరితో మాట్లాడుతూ 40 మందిని విస్మరించిందని చెప్పారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఏదో ఒక లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నదని అన్నారు. అయితే దీని అర్ధం ఇప్పుడు రైతు సంఘాలు ముందుకు తెచ్చిన డిమాండ్లను తాము వ్యతిరేకించటం లేదని, వాటిని వెంటనే అమలు జరపాలని హన్నన్‌ మొల్లా చెప్పారు. కనీస మద్దతు ధరలు, వరి, గోధుమ గడ్డి తగులబెట్టటం గురించి చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా బుధవారం నాడు చెప్పారు. రైతులను అణచేందుకు చూడవద్దని రైతు నేత సర్వన్‌ సింగ్‌ పాంధెర్‌ బుధవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. రైతులే మోడీని ప్రధానిని చేశారని, వారిని విస్మరిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు క్షమించరని అన్నారు. మీరు మమ్మల్ని చంపవచ్చు కానీ రైతులను అణచవద్దని ప్రభుత్వానికి చెప్పామని, కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తూ ప్రధాని ఒక ప్రకటన చేసి ఆందోళనకు తెరదించాలని అన్నారు.హర్యానా గ్రామాలలో పారా మిలిటరీని దించారని, తామేం నేరం చేశామని ప్రశ్నించారు. భద్రతా దళాలు తమను ఇలా అణచివేస్తాయని కలలో కూడా ఊహించలేదన్నారు. రాజ్యాంగాన్ని రక్షించి శాంతియుతంగా ఢిల్లీ చేరేందుకు తమను అనుమతించాలన్నారు. ఇది తమహక్కు అని స్పష్టం చేశారు. తమ ఉద్దేశ్యం గొడవలు సృష్టించటం కాదని, నవంబరు ఏడవ తేదీ నుంచి ఢిల్లీ వచ్చేందుకు కార్యక్రమాన్ని రూపొందించామని ప్రభుత్వానికి తగిన సమయం లేదని అనటం నిర్లక్ష్యం చేసేందుకు చూడటమే అని జగజిత్‌ సింగ్‌ దలేవాల్‌ అన్నారు. బారికేడ్లతో తమను ఆపటం సరైంది కాదన్నారు.


ఎవరైనా డిమాండ్లను నీరుగార్చినా, ఏదో ఒకసాకుతో వెనక్కు తగ్గినా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఈ అంశంపై చర్చ జరగటం అనివార్యం.రైతులకు రాజకీయాలు వద్దనటం, ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రచారం చేయటమే ఒక రాజకీయం, వారిని తప్పుదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. ఏ రైతు సంఘం ముందుకు తెస్తున్న డిమాండ్లైనా వ్యవసాయానికి సంబంధించినవే తప్ప వేరు కాదు. వ్యవసాయంతో సహా అన్ని అంశాల మీద విధానాలను రూపొందించేది పార్టీల తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభలే. ప్రతి పార్టీకి చెందిన వారు ఏదో ఒక రైతు సంఘంలో పని చేయటం తెలిసిందే. అందువలన తమకు మేలు చేసే వారెవరో కీడు చేసే వారెవరూ రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు రోడ్లపై మేకులు – నేడు రైతులను బందెల దొడ్లో పెట్టాలన్న కేంద్రం ! వీపులు పగలగొట్టి అడ్డుకోవాలన్న పోలీసు బాస్‌ !!

13 Tuesday Feb 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Farmers Protest, #support farmers, 2024 Farmers Protest, BJP, Farmers in Delhi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మరోసారి రైతులు ఢిల్లీబాట పట్టారు.వారిని ఎట్టి పరిస్థితిలోనూ నగరంలో ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు బిజెపి సర్కార్‌ పూనుకుంది. అనేక చోట్ల రైతుల మీద బాష్పవాయువు, లాఠీ ఛార్జీ జరిపారు, అడుగడుగునా హర్యానా బిజెపి ప్రభుత్వం ఆటంకాలు కల్పించింది. ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే మార్గాలలో కూడా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఆందోళనకు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎన్‌పి-రాజకీయ రహిత) పిలుపు నిచ్చింది. గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి విడిపోయిన వారు, గత ఆందోళనకు దూరంగా ఉన్న కొని సంఘాలు తాజా ఆందోళనకు పిలుపునిచ్చాయి. గతంలో రైతులు ఢిల్లీలో ప్రవేశించి తమ డిమాండ్ల మీద నిరసన తెలుపకుండా అడ్డుకొనేందుకు రోడ్ల మీద మేకులు, కాంక్రీటు దిమ్మలను ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ తీరు తెలిసిందే.ఇప్పుడు ఢిల్లీలో ఉన్న బవనా స్టేడియంను బందెల దొడ్డిగా మార్చి రైతులను అందులో నిర్బంధించేందుకు అవకాశమివ్వాలని మంగళవారం నాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. రైతుల ఆందోళన వలన రోడ్లు, రైలు ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగుతాయి గనుక రైతుల మీద చర్యలు తీసుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అరవింద్‌ సేత్‌ అనే లాయరు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు..రైతులు న్యూసెన్సు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు బలవంతంగా నగరంలోకి అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను కోరింది. ఇలాంటి వారు అదే రైతులకు కనీస మద్దతు ధరల కోసం వేసిన కమిటీ నివేదికను వెంటనే ఇప్పించి రైతులు ఆందోళనకు దిగకుండా చూడాలని కేంద్రం మీద ఎలాంటి వాజ్యాలు ఇంతవరకు దాఖలు చేయలేదు.నోరులేని రైతులను అడ్డుకొనేందుకు పూనుకున్నారు. రైతులు వినకుండా దురుసుగా ముందుకు వస్తే పోలీసులు చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదని, మనం కూడా అదే పద్దతిలో ఉండాలని లేకపోతే వారిని అపలేమని ఢిల్లీ శాంతి భద్రతల స్పెషల్‌ పోలీసు కమిషనర్‌ రవీంద్ర యాదవ్‌ ఢిల్లీ శివార్లలోని శింఘు సరిహద్దులో పోలీసులతో మైకులద్వారా ప్రకటించారు.మనం ఆత్మరక్షణలో పడనవసరం లేదు, బాష్పవాయువు వదలండి, లాఠీలను ప్రయోగించండి, ఇది ఒక రోజంతా జరగవచ్చు అని కూడా చెప్పారని మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఇచ్చిన వార్తలో పేర్కొన్నది. ఎవరైనా అలసిపోతే వారి స్థానంలో వేరొక బృందం వస్తుందని, ఎట్టి పరిస్థితిలోనూ రైతులను నగరంలోకి అనుమతించవద్దని కూడా చెప్పినట్లు తెలిపింది.


రైౖతుల డిమాండ్లు న్యాయబద్దమైనవని అందువలన స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర కోరికను తాము అంగీకరించేది లేదని ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులతో చర్చించి పరిష్కరించాలని కోరింది. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్దమైన హక్కు ప్రతి పౌరుడికీ ఉన్నదని అందువలన రైతులను అరెస్టు చేయటం సరైంది కాదని ఢిల్లీ హౌం మంత్రి కైలాష్‌ గెహలట్‌ చెప్పారు. ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల మీద నిరసన తెలిపేందుకు మంగళవారం నాడు ఢిల్లీ వస్తున్న రైతులను అనేక చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్‌ నుంచి వస్తున్న వారి మీద హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు లాఠీ చార్జి చేశారు. రైతులు అన్నదాతలు, వారి పట్ల ఈ విధంగా ప్రవర్తించటం పుండు మీద కారం చల్లినట్లే, స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగస్వాములం కాలేమని కైలాష్‌ గెహలట్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.2021లో రైతుల ఆందోళన సందర్భంగా కూడా అదే స్టేడియంను జైలుగా మార్చాలని కోరిన నాటి కేంద్ర ప్రభుత్వ కోరికను అప్పుడు కూడా ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ తిరస్కరించింది.


ఇటీవలనే ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన సూచించిన పద్దతిలో రైతాంగానికి కనీస మద్దతు ధరలు ప్రకటించేందుకు, వాటికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నది.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం మినహా రైతులు ఏమైనా కోరుకోవచ్చని ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన సందర్భంగా బిజెపి నేతలు చెప్పారు. విధిలేని పరిస్థితిలో ప్రధాని నరేంద్రమోడీ దేశానికి క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు, కనీస మద్దతు ధరల గురించి సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు ఆరునెలల తరువాత 2022 జూలై 18న 26 మందితో కమిటీని ప్రకటించారు.దానిలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు, మూడు సాగు చట్టాలను రూపొందించిన పెద్దలే ఉన్నందున తామా కమిటీని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. తరువాత ఆ కమిటీ ఏం చేస్తున్నదో, ఏం చెబుతుందో తెలియదు.
తమ ప్రభుత్వ హయాంలో 2014-15లో ఏ గ్రేడ్‌ వరి మద్దతు ధర రు.1,400 నుంచి 2023-24లో రు.2,203కు అంటే రు 803 పెంచినట్లు మోడీ సర్కార్‌ చెప్పుకున్నది.సగటున వార్షిక పెంపుదల 5.7శాతం. అంతకు ముందు కాంగ్రెస్‌ ఏలుబడిలో 2004-05 రు.590 నుంచి రు.1,400కు పెరిగింది. రు.810 పెరిగింది. దీన్ని సగటు వార్షిక పెరుగుదలలో చూస్తే 14శాతం ఉంది. పొడవు పింజ పత్తి ధర రు.1,760 నుంచి కాంగ్రెస్‌ ఏలుబడిలో రు.4,050 పెరిగింది. నిఖర పెరుగుదల రు.2,290 వార్షిక సగటు 13శాతం, అదే నరేంద్రమోడీ కాలంలో రు.4050 నుంచి రు.7,020కి పెంచారు.నిఖర పెరుగుదల రు.2,970 కాగా వార్షిక సగటు 7.3శాతమే. దీని అర్ధం కాంగ్రెస్‌ రైతులను ఏదో ఉద్దరించిందని చెప్పటం కాదు, పెరిగిన సాగు ఖర్చులతో పోలిస్తే అది కూడా తక్కువే. దానితో పోలిస్తే మంచి రోజులను తెచ్చి అమృత కాలంగా మార్చి రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ పాలనలో మరింత దిగజారింది అని చెప్పేందుకే ఈ పోలిక.ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వార్షిక ద్రవ్యోల్బణ ప్రాతిపదికన నామమాత్రంగా పెంచుతున్నారు తప్ప సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదు.


కేంద్రం ఏర్పాటు చేసిన ఆ కమిటీ పరిధి ఏమిటి ? ఏ అంశాలను అది పరిశీలిస్తుందో వివరించాలని రైతు ఉద్యమం నడిపిన సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. అందువలన ఆ కమిటీలో ఉండి చేసేదేమీ లేదు గనుక ప్రతినిధుల పేర్లను ప్రతిపాదించటం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ చైర్మన్‌ ఎవరంటే రైతులు తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రచించిన వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ అగర్వాల్‌. ఆ చట్టాలను ఎలా రూపొందించాలో సలహా ఇచ్చిన రమేష్‌ చాంద్‌ నీతిఅయోగ్‌ సభ్యులు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించకూడదని చెప్పిన ఆర్థికవేత్తలను నిపుణుల పేరుతో చేర్చారు. ప్రభుత్వ ప్రతినిధులు సరేసరి, వీరుగాక రైతుల ఆందోళనను వ్యతిరేకించిన ఐదు సంఘపరివార్‌ సంఘాలకు చెందిన వారిని చేర్చారు. ఆందోళనకు నాయకత్వం వహించిన వారిని మూడు పేర్లు ఇవ్వాలని కోరారు. మూడు సాగు చట్టాలను అమలు జరపకుండా 2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేయటం కుదరదని నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ రైతుల ఆందోళన సమయంలో చెప్పారు.ఇటీవలి కాలంలో ఎక్కడా దాని గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడటం లేదు.


తాజాగా ఢిల్లీ చలో ఆందోళనకు పిలుపు ఇచ్చి ఎస్‌కెఎం(ఎన్‌పి), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ముందుకు తెచ్చిన డిమాండ్లు పాతవే.ఎవరు పిలుపునిచ్చినా సమర్ధించాల్సినవే.పంజాబ్‌ నుంచి వస్తున్న రైతులు ఢిల్లీ చేరకుండా హర్యానా పోలీసులు పంజాబ్‌ సరిహద్దులోని పాటియాలా సమీపంలోని షాంభు వద్ద అడ్డుకున్నారు. రైతుల మీద బాష్పవాయు ప్రయోగం చేశారు. కనౌరీ వద్ద లాఠీ ఛార్జి చేశారు.అనేక చోట్ల రోడ్ల మీద పోలీసులు కల్పించిన ఆటంకాలను పక్కకు తొలగించి రైతులు ముందుకు వస్తున్నారని వార్తలు. చర్చలు జరపాలి తప్ప ఢిల్లీ వెళ్ల వద్దని హర్యానా హౌంమంత్రి అనిల్‌ విజి రైతులకు సలహా ఇచ్చారు.రెండుసార్లు కేంద్ర మంత్రులు ఇక్కడకు వచ్చారు. రైతులు వారితో మాట్లాడలేదంటే దీని వెనుక ఏదో దురుద్దేశ్యం ఉందని ఆరోపిస్తూ రాష్ట్రంలోకి రానిచ్చేది లేదని అన్నారు. కనీస మద్దతు ధరలకు అనేక మందితో చర్చలు జరపాల్సి ఉందని, రైతులు కూడా మాట్లాడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా చెప్పారు. మంగళవారం నాడు ఢిల్లీకి దారితీసే అనేక మార్గాలలో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.నగరంలో అనేక మెట్రో స్టేషన్లను మూసివేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌లో కంపుకొడుతున్న అవకాశవాదం – దివాలా కోరు, అసంబద్ద వాదనలు !

11 Sunday Feb 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Religious Intolarence, tdp, TDP, Ycp

≈ Leave a comment

Tags

Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, jana sena party, Narendra Modi Failures, pavan kalyan, tdp, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రకటన నాటికి ఏవైనా అనూహ్య మలుపులు తిరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో తెలుగుదేశం-జనసేన-బిజెపి ఒక కూటమిగా, వైసిపి విడిగా, ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌,వామపక్షాలు,ఇతర కొన్ని పార్టీలు, శక్తులు ఒక కూటమిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి పట్ల జనం ఎలా స్పందిస్తారన్నది ఎత్తులు, పొత్తులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత, ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మూడు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలు నోటాకంటే తక్కువ ఓట్లున్న బిజెపి చుట్టూ తిరగటం అనేక మందికి జీర్ణం కావటం లేదు. వైసిపి విషయానికి వస్తే తన సంక్షేమ పధకాలను చూసి ఓటేయమంటోంది. ఇప్పుడున్న వాటిని మరింత మెరుగుపరుస్తామని, కొత్త వాటిని అమలు చేస్తామని తెలుగుదేశం-జనసేన చెబుతున్నాయి. తమ కూటమి కేంద్రంలో అధికారానికి వస్తే ప్రత్యేక హౌదా అమలు చేస్తుందని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయని చెబుతున్న బిజెపి ఏం చెబుతుందో చూడాలి. వివిధ పార్టీలు, కొన్ని శక్తులూ ముందుకు తెచ్చిన కొన్ని దివాలాకోరు, అసంబద్ద వాదనల గురించి చూద్దాం.


అధికార వైసిపిని ఓడించేందుకు బిజెపితో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం-జనసేన కూటమికి తగిన మద్దతు ఉందని, బిజెపితో పొత్తును తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారని అంటూనే విధిలేని పరిస్థితిలో బిజెపితో చేతులు కలపక తప్పదు అని చేదు మాత్రను మింగించేందుకు చూస్తున్నారు. ఎందుకటా ? వచ్చే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రం, ఎన్నికల కమిషన్‌ సహకారం అవసరం గనుక బిజెపితో దోస్తీ అవసరమట.ఎన్నికలను సక్రమంగా జరపటం ఎన్నికల కమిషన్‌ విధి. దాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే బిజెపిని భుజాల మీద ఎక్కించుకొని మోయాలని చెప్పటమే. గత ఐదు సంవత్సరాలలో ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాల గురించి తెలుగుదేశం, జనసేన, ా బిజెపి లేవనెత్తిన అంశాలను ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబును బిజెపి పెద్దలు పిలవగానే సిద్దం సుమతీ అన్నట్లు వెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పొలో మంటూ ఢిల్లీ యాత్ర చేశారు. మరికొన్ని శాలువాల ఖర్చు దండగ. ఎందుకయ్యా అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగటానికని వైసిపి పెద్దల వివరణ. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన చివరి(ఓట్‌ఆన్‌ఎకౌంట్‌) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వైసిపి కూడా ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌తో సరిపుచ్చింది. ఇప్పుడు నిధుల గురించి అడిగితే పట్టించుకొనేదెవరు ? పక్కా రాజకీయ యాత్ర మాత్రమే. గత ఐదేండ్లుగా అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి ఆదుకున్నట్లుగానే రానున్న రోజుల్లో కూడా విధేయులుగా ఉంటామని, తెలుగుదేశాన్ని నమ్మవద్దని చెప్పేందుకు తప్ప ఢిల్లీ పర్యటన వెనుక మరొక కారణం కనిపించటం లేదు.


నరేంద్రమోడీ ఎంతో బలంగా ఉన్నారని అందువలన కేంద్రాన్ని ఎదిరించి చేసేదేమీ లేదని పిరికిమందు నూరిపోస్తున్న వారిని ఏమనాలి. అలాంటపుడు ఆ బిజెపి మందలోనే చేరిపోవచ్చు, వేర్వేరు పార్టీల దుకాణాలు ఎందుకు ! బతికిన చేప ఎదురీదుతుంది చచ్చిన చేప వాలునబడి కొట్టుకుపోతుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కూడా రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని మనం ఎదిరించలేమంటూ దాని మోచేతి నీళ్లు తాగుదామని చెప్పిన వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఫలితంతో నిమిత్తం లేకుండా చేయాల్సింది చేశామా లేదా అన్నదే గీటురాయి. కేంద్రంలో ఉన్న పాలకులు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంటే, అనుచిత పద్దతులకు పాల్పడుతుంటే రాష్ట్రాల హక్కులు, ప్రజల కోసం పోరాడాలి, మెడలు వంచాలి తప్ప మోకాళ్ల మీద కూర్చుంటే కనికరిస్తారా ? ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చివేసినపుడు ఆ నాటి తిరుగులేని బలమైన కాంగ్రెస్‌కు తెలుగుదేశం లొంగిపోయి మీ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పలేదు, జనాన్ని వీధుల్లోకి సమీకరించి ఆందోళన చేసి పునరుద్దరణ జరిపించుకున్న చరిత్రను తెలుగుదేశం మరిచినా జనం మరిచిపోతారా ?


నాదెండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబాటు చేయించి ఎన్‌టి రామారావు సర్కార్‌ను కూలదోయించింది కాంగ్రెస్‌ పార్టీ. నేడు బిజెపి వివిధ రాష్ట్రాలలో అంతకంటే తక్కువ చేస్తున్నదా ? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సయోధ్యతో ఉండాలని కాంగ్రెస్‌కు ఏనాడైనా తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా ? మరి ఇప్పుడెందుకు ఆ పేరుతో బిజెపిని మోసేందుకు సాకులు వెతుకుతున్నట్లు ? తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది అని చెప్పవచ్చు, బిజెపి చేసిందేమిటి ? తెలుగుదేశం రాజ్యసభ పక్షం మొత్తాన్ని తనలోనే విలీనం చేసుకుంది కదా ! వాజ్‌పాయి సర్కారుకు తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. స్పీకరు పదవి(జిఎంసి బాలయోగి)ని కూడా తీసుకుంది. నాడు రాష్ట్రానికి కేంద్రం నుంచి శాశ్వతంగా గుర్తుపెట్టుకోదగిన పెట్టుబడులు గానీ, మరొకటి గానీ ఏమీ రాలేదు. దేశం వెలిగిపోతోంది అంటూ బిజెపితో కలిసి పోటీ చేసి 2004 ఎన్నికల్లో ఓడిన తరువాత తిరిగి బిజెపితో చేతులు కలిపేది లేదని తెలుగుదేశం ప్రకటించిన అంశాన్ని మరచిపోలేము. పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 2014లో తిరిగి అదే బిజెపితో చేతులు కలిపి ఎన్నికల్లో నెగ్గారు. పోనీ అప్పుడేమైనా సాధించారా అంటే ఏమీ లేదని అందరికీ తెలిసిందే. ప్రత్యేక హౌదా లేదని నరేంద్రమోడీ అడ్డం తిరిగితే సరే అన్నారు, దాని బదులు ప్రత్యేక పాకేజీ అంటే మహాభాగ్యం జీహుజూర్‌ అంటూ తల ఊపారు. చివరికి దానికి కూడా మొండి చేయి చూపితే బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు.2019 ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఎంతటి తీవ్ర విమర్శలు చేసుకున్నారో తెలిసిందే.


ఇప్పుడు అవన్నీ విస్మరించి రాష్ట్రం కోసం జనాన్ని కూడా మరచిపొమ్మంటున్నారు. తాము నందంటే నంది పందంటే పంది అనాలని చెబుతున్నారు. పోనీ ఇప్పుడు బిజెపి పెద్దలు విభజన హామీల అమలు గురించి, రాష్ట్రానికి చేయాల్సిన వాటి గురించి మారుమనసు పుచ్చుకున్నారా అంటే దుర్భిణివేసి చూసినా కనిపించటం లేదు. రేపు బిజెపి తిరిగి కేంద్రంలో అధికారానికి వస్తుందో రాదో తెలియదు, వచ్చినా గత పది సంవత్సరాల ఆచరణను బట్టి రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేదా దానికి సమానమైన ప్రత్యేక పాకేజీ ఇచ్చే సమస్యే లేదు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌ గురించి తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎందుకో తెలుగుదేశం పెద్దలు చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొద్ది వారాల ముందు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రకటనను కేంద్రం వెలువరించింది. పోనీ దాన్నయినా నోటిఫికేషన్‌ ఇచ్చి ఏర్పాటు చేసిందా అంటే అదీ లేదు. మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదు అని చెబుతున్నారు. కేంద్రం ఎప్పుడైనా భూమి ఎందుకు ఇవ్వరు అని రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చిందా?ఇస్తామని చెప్పిన భూమిని స్వీకరించేందుకు ముందుకు రాకుండా వంకలు చెబుతున్నది. జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు విశాఖలో రైల్వేలకు అసలు భవనాలే దొరకవా ? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తప్ప అసలు భూమే లేదా ? విశాఖ డివిజన్ను రద్దు చేయాలని నిర్ణయించారు, అక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తరువాత తీరికగా భూమి తీసుకొని కొత్త భవనాలు నిర్మించుకోవచ్చు, అదీ చేయలేదు. నాటకాలాడుతున్న అలాంటి బిజెపిని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చని చెబితే జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ?


తోలువలవటం, తాటతీయటమే తన కార్యాచరణ అని ప్రకటించుకున్న జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని చెబుతున్నారు, అది మంచిదే. కానీ పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ప్రతిసారీ ఉక్కును తుక్కుకింద అమ్మివేస్తామని చెబుతూనే ఉన్నా నోటికి తాళం వేసుకున్నారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక హౌదా గురించి మాట్లాడిన ఆ పెద్ద మనిషి తరువాత దాన్ని మరిచిపోయి తనకు అధికారం లేదు గనుక అడగటం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నోటికి తాళం వేసుకున్నారు. ఆ డిమాండ్‌ను వదులుకున్న తెలుగుదేశంతో చేతులు కలిపి రాష్ట్రాన్ని బాగుచేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక హౌదా గురించి మరిచి పొమ్మని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం తమ విధానమని పదే పదే చెబుతున్న బిజెపిని బలపరచి రేపు ఒక వేళ అధికారానికి వచ్చినా బిజెపి విధానాలను తెలుగుదేశం-జనసేన కూటమి మార్చగలదా ? ప్రకటించిన రైల్వేజోన్‌ గురించి కూడా అడగలేని వారు రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామని అంటేే నమ్మేదెలా ? పన్నులలో వాటాలు, కేంద్రం అమలు జరిపే పథకాలను నుంచి కొన్ని రాష్ట్రాలను మినహాయించే అవకాశమే లేదు. కొన్ని నిధులకు సంబంధించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నమాట నిజం. అలాంటి సందర్భాలలో వత్తిడి తేవాలి, పోరాడాలి లేకుంటే కేరళ మాదిరి సుప్రీం కోర్టును ఆశ్రయించాలి తప్ప లొంగుబాటు మార్గం కాదు. అందులోనూ ఆత్మగౌరవ నినాదం ముందుకు తెచ్చిన వారికి, ప్రశ్నించటం తమ డిఎన్‌ఏలోనే ఉందని చెప్పుకొనే వారికి అసలు తగనిపని.


వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, టీచర్ల మీద అణచివేత చర్యలకు పాల్పడుతున్నది, అనేక భారాలను మోపిన మాటనిజం. ఆ ప్రభుత్వాన్ని మార్చాలన్న వాంఛను తప్పు పట్టాల్సిన పనిలేదు.రాజధాని మార్పుతో సహా అనేక అంశాలలో బిజెపి నాటకాన్ని ఇంతకాలం జనం చూశారు.వైసిపికి అండదండగా ఉన్న అంశం తెలిసిందే. ఏనాడూ దాని విధానాలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేవు. తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు వైసిపిని ప్రోత్సహించింది, తిరిగి అధికారంలోకి వస్తుందని, తనకు విధేయురాలిగా ఉంటుందని ఇంతకాలం భావించిన కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. రోడ్డుమాప్‌ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ కోరినా పూచికపుల్ల కింద తీసిపారవేసింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు గణనీయంగా తగ్గనున్నట్లు బిజెపి పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాల్లో వైసిపికి అవకాశాల్లేవని నిర్ధారించుకున్న తరువాత సరిగ్గా ఎన్నికల ముంగిట బిజెపి తన వైఖరి మార్చుకొని తెలుగుదేశానికి స్వాగతం పలుకుతోంది తప్ప వేరు కాదు.


బిజెపి తన మత అజెండాను ముందుకు తీసుకువస్తున్నది.సిఏఏను అమలు జరుపుతామని ఇప్పుడు ప్రకటించటం దానిలో భాగమే. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమకు మియాల(అసోంలో ముస్లింలను అలా పిలుస్తారు) ఓట్లు అవసరం లేదన్నారు. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా బిజెపి అగ్రనేత జగదీశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని ప్రకటించారు.అలాంటి మాటలే ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్పగలరా ? మణిపూర్‌లో గిరిజనుల మీద, వారి చర్చీల మీద దాడులు జరుగుతుంటే, మహిళలను నగంగా తిప్పితే ఇంతవరకు ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి వారికి ఎలాంటి భరోసా కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ బిజెపితో సర్దుబాటు చేసుకుంటే ఈ అంశాలన్నింటికీ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళకు అవమానం, పదవికి అగౌరవం :75 సెకండ్లలో ప్రసంగం పూర్తి చేసిన గవర్నర్‌ సరికొత్త రికార్డు !

25 Thursday Jan 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

#Kerala CPI(M), #Pinarayi Vijayan, Arif Mohammed Khan, kerala Assembly, Kerala Governor


ఎం కోటేశ్వరరావు


పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా గవర్నర్లలో కాషాయ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తీరే వేరుగా ఉంది. అనితర సాధ్యమైన కొత్త చరిత్రను జనవరి 25 గురువారం నాడు సృష్టించారు. సరిగ్గా గణతంత్ర దినానికి ఒక రోజు ముందు రాజ్యాంగాన్ని, వ్యవస్థలను అపహాస్యం చేశారనే విమర్శలకు తావిచ్చారు. కేరళ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సాంప్రదాయబద్దంగా గవర్నర్‌ చేయాల్సిన ప్రసంగాన్ని కేవలం 75 సెకండ్లలో ముగించి వెళ్లిపోయారు. 1982 జనవరి 29న నాటి గవర్నర్‌ జ్యోతి వెంకటాచలం కేవలం ఆరు నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించిన రికార్డును ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ బద్దలు కొట్టారు. స్పీకర్‌ ఎఎన్‌ షంషీర్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గవర్నర్‌కు వీడ్కోలు కూడా రెండు నిమిషాల్లో ముగిసింది.అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌కు సిఎం పుష్పగుచ్చం అందచేసి స్వాగతం పలికినపుడు ముఖం పక్కకు పెట్టుకొని దాన్ని అందుకున్నారు. తరువాత ప్రసంగం ప్రారంభానికి ముందు సభ్యులను ఉద్దేశించి సంబోధించే మర్యాదను కూడా పాటించకుండా 62పేజీలు, 136 పేరాల ప్రసంగంలో చివరి పేరాను చదివి ముగించినట్లు మళయాల మనోరమ పేర్కొన్నది. నా ప్రభుత్వం అనే పదాలను ఉచ్చరించకుండా దాటవేసేందుకు ఇలా చేసినట్లు పేర్కొన్నది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్లు చేసే ప్రసంగాలను ఆయా ప్రభుత్వాల విధాన పత్రాలుగా పరిగణిస్తారన్నది తెలిసిందే. వాటిలో సాధించిన వాటితో పాటు రానున్న రోజుల్లో కేంద్రీకరించే అంశాలను కూడా వెల్లడిస్తారు. మంత్రివర్గం పంపిన ప్రసంగ పాఠం మీద ఎలాంటి అభ్యంతరాలు వెల్లడించకుండా వెంటనే ఆమోదం తెలపటం అనేక మందికి ఆశ్చర్యం కలిగించింది. వివాదాలకు తెరదించేందుకు సానుకూల సూచికగా ఇలా చేశారేమో అనుకున్నారు. అయితే ప్రసంగించిన తీరును ఎవరూ ఊహించలేదు.


ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌ 9.02కి ప్రసంగం ముగించి 9.04కల్లా అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. సభను ఉద్దేశించి ప్రసంగించటం తనకు సంతోషంగా ఉందనే ముక్కతో ప్రారంభించి చివరి పేరాను చదువుతున్నట్లు ప్రకటించి వెంటనే ముగించి వెళ్లిపోయారు.వెలుపల వేచి ఉన్న మీడియాకు ఒక నమస్కారం చేసి కారెక్కారు. అసెంబ్లీకి రావటం, ప్రసంగం చదవటం, జాతీయ గీతాలాపాన, వెళ్లిపోవటం అంతా నాలుగు ఐదు నిమిషాల్లోపే పూర్తయింది. గవర్నర్‌ చదివిన చివరి పేరాలో ఇలా ఉంది.” మన గొప్ప వారసత్వం భవనాలు లేదా కీర్తి స్థంభాలలో కాదు, విలువకట్టలేని భారత రాజ్యాంగం, కాలంతో నిమిత్తం లేని ప్రజాస్వామ్య విలువలు,లౌకికవాదం, సమాఖ్యవాదం,సామాజిక న్యాయం పట్ల మనం చూపే గౌరవం, మర్యాదలలో ఉంది. సహకార సమాఖ్యవాద సారమే ఇంతకాలం భారత్‌ను ఐక్యంగా, బలంగా ఉంచింది.దీన్ని దిగజారకుండా చూడటమే మన మహత్తర కర్తవ్యం. సుందరమైన, భిన్నత్వం కలిగిన దేశంలో భాగస్వాములుగా మనం కలసి కట్టుగా సమగ్ర అభివృద్ధి, సమున్నతంగా ముందుకు తీసుకుపోయే విధంగా దేశ చిత్రాన్ని రూపొందించాల్సి ఉంది. మన దారిలో ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిగమించాలి ” ఈ పేరాలో ఎక్కడా నా ప్రభుత్వం అనే పదం లేదు. అందుకే గవర్నర్‌ ఈ మాత్రమైనా చదివి ఉంటారన్నది స్పష్టం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. సమాఖ్యవాదం పట్ల గౌరవ, మర్యాదలను చూపాలని చెప్పిన గవర్నర్‌ వ్యవహరించిన తీరు అందుకు అనుగుణంగా ఉందా లేదా అన్నది ఎవరికి వారు నిర్ధారణకు రావచ్చు. క్లుప్తంగా ముగించటం ద్వారా గవర్నర్‌ తన అసంతృప్తిని వెల్లడించారని రాష్ట్ర బిజెపి వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను తీవ్రంగా అవమానించినట్లు ఆరోపించింది. గవర్నర్‌ చర్యతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు వర్ణించింది.


గవర్నర్‌ వ్యవహరించిన తీరు రాష్ట్రాన్ని అవమానించటమే అని ప్రతిపక్ష యుడిఎఫ్‌ నేత వి సతీశన్‌ విమర్శించారు. ప్రతిపక్ష ఉపనాయకుడు, ముస్లింలీగ్‌ నేత కున్హాలికుట్టి మాట్లాడుతూ తాము గవర్నర్‌ రావటాన్ని రాకెట్‌ మాదిరి వెళ్లిపోవటాన్ని చూసి ఆశ్చర్యపోయామని, కనీసం ప్రతిపక్ష సభ్యులవైపు కూడా చూడలేదని, ఇది అసెంబ్లీని అవమానించటమే అన్నారు. గవర్నర్‌ చర్యను పట్టించుకోవద్దని, నిరసనల వంటివి తెలపవద్దని అసెంబ్లీ ముగిసిన తరువాత ఎల్‌డిఎఫ్‌ ఎంఎల్‌ఏల సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సమావేశం తరువాత రాష్ట్ర న్యాయ, పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్‌ మాట్లాడుతూ గవర్నర్‌ ” రాజ్యాంగబద్ద విధి ” నిర్వహించారని చెప్పారు. మంత్రివర్గం రూపొందించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్‌ ఆమోదించారు. మొదటి చివరి పేరాలను చదివినప్పటికీ మొత్తం చదివినట్లే పరిగణించబడుతుంది, అసెంబ్లీ రికార్డుల్లో అదే నమోదౌతుంది. గవర్నర్‌ పూర్తి పాఠాన్ని ఎందుకు చదవలేదో తెలియదు, చదవలేకపోయారా ఇంకేమైనా కారణాలున్నదీ తెలియదని రాజీవ్‌ చెప్పారు. గవర్నర్‌ ఇలా ముగించారంటే బహుశా ఆయనకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమోనని రాష్ట్ర మంత్రి సాజీ చెరియన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్‌గా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదంతో మీడియాకు ఎక్కుతూనే ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసిన భాగాన్ని అసెంబ్లీలో చదివేందుకు తిరస్కరించి వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల విద్యార్థులను తూలనాడి వారి నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్నారు. బహుశా ఆ ఉక్రోషాన్ని ఈ రూపంలో తీర్చుకొని ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తన మీద దాడికి ఎస్‌ఎఫ్‌ఐ గూండాలను, డబ్బిచ్చి నేరగాండ్లను ఉసిగొల్పినట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ తీరుకు నిరసనగా ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ విద్యార్ధులు నిరసన తెలుపుతున్నారు. గవర్నరు ప్రసంగాన్ని అసెంబ్లీ మీడియాకు విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఆదాయవనరుగా లాటరీలు, మద్యం వుండటం సిగ్గుగా ఉందని గతంలో గవర్నర్‌ ఆరోపించారు. గురువారం నాటి గవర్నర్‌ ప్రసంగంలో దాని గురించి వివరణ ఉంది. రాష్ట్ర పన్ను రాబడిలో మద్యం ద్వారా వస్తున్న మొత్తం కేవలం 3.7శాతమేనని, కొన్ని రాష్ట్రాలలో గరిష్టంగా 22శాతం వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ధాన్య రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాలుకు రు.2,820 కనీస మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపింది.


గవర్నర్‌గా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ స్వతంత్రంగా వ్యవహరించటం లేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్‌ నారిమన్‌ చేసిన వ్యాఖ్య మీద గవర్నర్‌ విరుచుకుపడ్డారు. డిసెంబరు నెలలో ముంబైలో జరిగిన ఒక సభలో రోహింటన్‌ మాట్లాడుతూ గవర్నర్లుగా స్వతంత్రంగా వ్యవహరించే వారిని మాత్రమే పదవుల్లో నియమించాలని సుప్రీం కోర్టు చెప్పే రోజుకోసం తాను వేచి చూస్తున్నట్లు చెప్పారు.” ఈ రోజు మనకు కనిపిస్తున్నటు వంటి వారిని నియమించకూడదు,ఉదాహరణకు ఈ రోజు కేరళలో ఉన్నటువంటి వారిని ” అన్నారు. బుధవారం నాడు చెన్నరులో జరిగిన ఒక సభలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ రోహింటన్‌ స్వలాభంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.రోహింటన్‌ తండ్రి సీనియర్‌ న్యాయవాది పాలీ ఎస్‌ నారిమన్‌, ఆయన సహాయకులు కేవలం సలహా చెప్పినందుకే కేరళ ప్రభుత్వం నుంచి రు.40లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల గవర్నర్ల మీద ఎలాంటి వ్యాఖ్య చేయకుండా తననే ఎంచుకోవటానికి తండ్రి నుంచి సలహాలు తీసుకోవటాన్ని అంగీకరించకపోవటమే అని చెప్పుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయోధ్య రామాలయ వివాదం : ఎరక్కపోయి ఇరుక్కున్న గాయని చిత్ర ! శంకరాచార్యలపై కేంద్ర మంత్రి ధ్వజం !!

17 Wednesday Jan 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

#ks Chithra, #Pinarayi Vijayan, BJP, Kerala CPI(M), Narayan Rane, Narendra Modi, Ram temple, Ram Temple politics, RSS, Sanatan Hindu Dharma, sankaracharya, shiva sena, Singer Chitra


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగేవరకు దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు వివాదాలు కూడా కొనసాగేట్లున్నాయి. మతాన్ని, విశ్వాసాలను పాటించేవారు మౌనంగా ఉండగా ఓట్ల కోసం రాముడిని ముందుకు తెచ్చిన రాజకీయ కుహనా హిందూత్వవాదులదే పైచేయి కావటం ప్రత్యేకత. తెలిసిగానీ తెలియకగానీ చేసిన ప్రకటనలతో సుప్రసిద్ద గాయని చిత్ర తాజాగా సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. జనవరి 22న విగ్రహ ప్రతిష్ట జరిగే 12.20ని సమయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ సంకీర్తన జరపాలని, జ్యోతులను వెలిగించాలని, లోకసమస్తా సుఖినోభవంతు అంటూ గాయని చిత్ర సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు, విడుదల చేసిన వీడియోలో కోరారు.దీని మీద అనేక మంది అనుకూలంగానూ వ్యతిరేకంగానూ స్పందించారు. బిజెపి నేతలు కేరళ ప్రభుత్వం మీద, కమ్యూనిస్టుల మీద దాడికి ఉపయోగించుకున్నారు. వామపక్ష పాలిత రాష్ట్రంలో అసహనానికి ఇది నిదర్శనమంటూ ఆరోపించారు. సామాజిక మాధ్యమం మీద కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి గానీ ఎలాంటి నియంత్రణ, అధికారం లేదు. వామపక్షాలు, పురోగామి భావాలకు వ్యతిరేకంగా సంఘపరివార్‌, బిజెపి నేతల స్పందనలు అదే సామాజిక మీడియా, సంప్రదాయ మీడియాలో చోటు చేసుకుంటున్నాయంటే అసహనం, వ్యతిరేకత ఉంటే కుదిరేదా ? తన మీద వచ్చిన విమర్శలు లేదా ప్రశంసల గురించి గానీ ఇది రాస్తున్న సమయానికి చిత్ర వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.


భావ వ్యక్తీకరణ హక్కులో భాగంగా ఇతరుల హక్కులకు భంగం కలుగకుండా ఏమైనా చెప్పవచ్చు. ఆ రీత్యా చూసినపుడు చిత్ర తన భావాన్ని వ్యక్తం చేశారు. అయితే అదే భావ వ్యక్తీకరణలో భాగంగా ఒకరి భావాలను మరొకరు విమర్శించే హక్కు కూడా మన రాజ్యాంగం కల్పించింది. అఫ్‌కోర్సు దానికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. నూరుపూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా భావజాల చర్చ జరగాల్సిందే. చిత్రను సమర్ధించిన వారు కొందరైతే అలాంటి సందేశం ద్వారా రాజకీయ వైఖరులను తీసుకున్నారని మరికొందరు విమర్శించారు. ” చిత్రకు భావ ప్రకటనా స్వేచ్చ ఉంది, ఆమె నచ్చిన వైపు నిలిచే స్వేచ్చ కూడా ఉంది.ఆమె తన ఇంట్లో రామ భజన చేయవచ్చు, దీపాలను వెలిగించుకోవచ్చు. మారణకాండకు, జాత్యంహంకారానికి దారితీసే ఒక కారణాన్ని అమాయకంగా ఉత్సవంగా జరుపుకోవటంలో హానికరమైనది కనిపించకపోవచ్చుగానీ అది వాస్తవానికి అది ఎంతో బాధాకర అనుభవం అని రచయిత్రి ఇందూ మీనన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో చిత్ర తీరును విమర్శించారు. జనాల రక్తం, వలసలు, వారి బాధలు పట్టకుండా మీరు రామ భజన చేస్తున్నారు.రాముడు లేదా విష్ణువు రాబోవటం లేదు. మీరు ఐదులక్షల దీపాలను వెలిగించినప్పటికీ మీ బుర్ర వెలుగుతో నిండదు. మీ కంఠం కారణంగానే మిమ్మల్ని నైటింగేల్‌(పశ్చిమ దేశాల్లో కోకిల వంటి మధురంగా కూసే పక్షి) అని భావించారు, కానీ మీరు నకిలీ నైటింగేల్‌ అని రుజువైంది అని ఇందూ మీనన్‌ తీవ్రంగా విమర్శించారు.చరిత్రను విస్మరించి ప్రతివారూ సుఖంగా ఉండాలని చెప్పేవారి అమాయకత్వం ఇక్కడ ముఖ్యమైనదని గాయకుడు సూరజ్‌ సంతోష్‌ అన్నారు.మసీదును కూల్చివేసి దేవాలయాన్ని కట్టిన చరిత్రను చిత్ర కావాలనే మరచినట్లు విమర్శించారు. ప్రముఖ గాయకుడు జి వేణుగోపాల్‌ ఒక వైపు చిత్రకు మద్దతు ఇస్తూనే ఆమె ప్రకటనలపట్ల ఏవైనా విబేధాలుంటే విమర్శించేవారు ఆమెను క్షమించాలని వ్యాఖ్యానించారు. ఆమె కేవలం భక్తిభావంతో చెప్పారే తప్ప రాజకీయ కోణం తెలియదని అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని, మనకోసం వేలాది పాటలు పాడిందని అన్నారు. క్షమించాల్సినంత తప్పేమి చేసిందని కొందరు వ్యాఖ్యానించారు.గాయని చిత్ర గతాన్ని చూసినపుడు ఎలాంటి వివాదాలలో చిక్కుకోలేదు. వివాదాస్పద వ్యాఖ్యలూ చేసిన చరిత్ర లేదు.ప్రతిదాన్నీ రాజకీయం గావిస్తున్న వర్తమానంలో ప్రజాజీవనంలో ఉన్న ప్రముఖులు తాము చేసే ప్రకటనల పట్ల తగిన జాగరూకత పాటించాలని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


సుప్రీం కోర్టే ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.విశ్వాసం ఉన్నవారు అయోధ్య రామాలయానికి వెళ్లవచ్చు, లేనివారు వెళ్లకపోవచ్చు, గాయని చిత్ర ప్రకటనను వివాదాస్పదం కావించాల్సిన అవసరం ఏముంది, తమ అభిప్రాయాలను ఎవరైనా వెల్లడించుకోవచ్చని సిపిఎం నేత, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ వ్యాఖ్యానించారు.కేరళ ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ మాట్లాడుతూ భౌతిక దాడులు చేయలేనపుడు సామాజిక మాధ్యమాల ద్వారా దాడి చేయటం ఫాసిజం అన్నారు. మనం చిత్ర వైఖరితో అంగీకరించకపోవచ్చు, ఆమె వైఖరిని ఆమెను వెలిబుచ్చనివ్వండి, ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుంది, ఎవరైనా అంతకు ముందు చెప్పని వాటి గురించి మాట్లాడటాన్ని ప్రశ్నించవచ్చు అన్నారు. సనాతన ధర్మాన్ని నమ్ముతున్న కారణంగానే గాయని చిత్ర మీద విమర్శలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. వామపక్ష-జీహాదీ వాతావరణంలో ఉన్నవారే దాడులు చేస్తున్నారన్నారు.ఈ విమర్శలు చేస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. పినరయి విజయన్‌ పాలనలో హిందువులు తోటి వారితో తమ విశ్వాసాలను పంచుకొనే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌ దీని మీద మౌనంగా ఉందని ఎక్స్‌లో ఆరోపించారు. కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ విలేకర్లతో మాట్లాడుతూ అయోధ్యను అవకాశంగా తీసుకొని హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. వామపక్షం, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అసహనానికి ఒక ఉదాహరణ చిత్ర మీద చేస్తున్న విమర్శలని జాతీయ మహిళాకమిషన్‌ సభ్యురాలు, బిజెపి నేత కుషఉ్బ ఆరోపించారు.


మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి నారాయణ రాణే శంకరాచార్యల మీద ధ్వజమెత్తటాన్ని కుషఉ్బ వంటి వారు ఎలా వర్ణిస్తారు.నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, ఇతర మతాల వారిని పక్కన పెడితే హిందూమతాన్ని నమ్మేవారు, పాటించేవారికి నలుగురు శంకరాచార్యలు పూజనీయులు ! ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ ఏదో ఒక సమయంలో వారి పాదాలవద్ద చేరి ఆశీస్సులు పొందిన వారే. రామాలయ ప్రతిష్ట మీద వారు మాట్లాడినదాన్ని ఇప్పుడు ఎందుకు సవాలు చేస్తున్నట్లు ? హిందూ ధర్మానికి మీరేమి చేశారని గతంలో ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదన్నది కీలక అంశం. శంకరాచార్యులను అవమానించినందుకు గాను కేంద్ర మంత్రి రాణేను పదవి, పార్టీ నుంచి తొలగించాలని శివసేన నేత ఉద్దావ్‌ థాకరే డిమాండ్‌ చేశారు. బిజెపి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కోరారు. రాణేకు వ్యతిరేకంగా ఆదివారం నాడు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అంతకు ముందు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మంత్రి రాణే విలేకర్లతో మాట్లాడుతూ శంకరాచార్యలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని రాజకీయ కోణం నుంచి చూస్తున్నారని ఆరోపించారు. ఇంతవరకు ఏ ఒక్కరూ ఏమీ చేయలేదని, ప్రధాని మోడీ, బిజెపి బాధ్యతను తీసుకొని రామాలయాన్ని నిర్మించిందని, దాన్ని వారు ఆశీర్వదించాలా లేక విమర్శించాలా ? ఆలయాన్ని రాజకీయాలకోసం కాదు మతం కోసం నిర్మించాము, రాముడు మా దేవుడు.హిందూమతం కోసం తామేమీ చేసిందీ శంకరాచార్యలు చెప్పాలని రాణే డిమాండ్‌ చేశారు. శంకరాచార్యలు రాకపోవటానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా కారకులే అని శివసేన విమర్శించింది. వారు రాకపోతేనే మీ బొమ్మలు కనిపిస్తాయి, వస్తే వారి చిత్రాలనే పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నది.రామాలయాన్ని కూల్చి బాబరీ మసీదును కట్టారని ఇంతకాలం సంఘపరివారం ఆరోపించింది.కానీ పూర్తికాని రామాలయాన్ని ఎన్నికల కోసం ముందే ప్రారంభించారన్న విమర్శలు ఇప్పుడు చరిత్రకెక్కాయి. ఇది వాస్తవం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మలుపు తిరిగిన రామాలయ వివాదం : నలుగురు శంకరాచార్యలూ దూరం ! వారి డిఎన్‌ఏల గురించి బిజెపి ప్రశ్నిస్తుందా !!

12 Friday Jan 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Adi Shankara, BJP, Narendra Modi, Ram Temple row, RSS, Sanatan Hindu Dharma, shankaracharyas


ఎం కోటేశ్వరరావు


మొన్న సిపిఎం నేత సీతారాం ఏచూరి, నిన్న కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ అయోధ్య రామాలయ ప్రతిష్టకు రావటం లేదని చెప్పగానే బిజెపి నేతలు అసలు వారి డిఎన్‌ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందంటూ ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రచారదాడి చేస్తున్నారు. రధయాత్ర నిర్వహించిన ఎల్‌కె అద్వానీని ఆ ఛాయలకే రావద్దని చెప్పిన పెద్దలు ఓటు బాంకు రాజకీయం గాకపోతే వారి డిఎన్‌ఏ గురించి ముందే తెలిసినపుడు అసలు ఆహ్వానాలు పంపటం ఎందుకు ? కమ్యూనిస్టులు దేవాలయాలు, మసీదులు, చర్చ్‌ల ప్రారంభాలకు రారని అందరికీ తెలుసు.వారు లేదా కాంగ్రెస్‌ నేతలు గానీ బిజెపి మత రాజకీయాలను విమర్శించటం ఇప్పుడు కొత్తగా చేసింది కాదు. హిందూమతానికి భాష్యకారులుగా, పీఠాధిపతులుగా ఉన్న నలుగురు శంకారాచార్యలూ అయోధ్య వెళ్లటం లేదన్న సమాచారం ఇది రాసిన సమయానికి ఉంది. చివరి నిమిషంలో వారు మనసు మార్చుకుంటారో లేక ఏం చేస్తారు అన్నది పెద్ద సమస్య కాదు. పూరీ శంకరాచార్య నిశ్శలానంద, ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌ మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద తాము రావటం లేదని తమ కారణాలను వివరిస్తూ చెప్పారు. ద్వారకా పీఠం అధిపతి స్వామి సదానంద సరస్వతి, శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్ధ రామాలయ ప్రతిష్టకు ఆశీర్వచనాలు చెప్పారే తప్ప వస్తున్నదీ లేనిదీ ఇంతవరకు ప్రకటించలేదు. ఆలయ నిర్మాణం పూర్తి కానందున నలుగురమూ అయోధ్య వెళ్లటం లేదని అవిముక్తేశ్వరానంద చెప్పిన మాటల మీద వారు మౌనంగా ఉన్నారు. అందరి తరఫున మాట్లాడేందుకు అనుమతించలేదని ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదు. హిందూ శాస్త్రాలకు వ్యతిరేకంగా అసంపూర్తి నిర్మాణంలో ఉన్న దేవాలయాన్ని ప్రారంభించటం తగదని అవిముక్తేశ్వరానంద ఎక్స్‌లో ఒక ప్రకటన చేశారు. తమ చర్యలను మోడీ వ్యతిరేకమైనవిగా చూడరాదని, శాస్త్ర వ్యతిరేకులుగా మారటం ఇష్టం లేకనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మేమెందుకు వెళ్లటం లేదు ? మాకు ద్వేషం ఉండి కాదు. శాస్త్ర విధిని పాటించటం, పాటించేట్లు చూడటం శంకరాచార్యుల బాధ్యత, ఇక్కడ శాస్త్ర విధిని విస్మరించారు, ఆలయ నిర్మాణం ఇంకా పూర్తిగాక ముందే ప్రాణ ప్రతిష్టకు పూనుకోవటం ఇక్కడ పెద్ద సమస్య, దీన్ని మేం చెబితే మమ్మల్ని మోడీ వ్యతిరేకులని పిలుస్తున్నారు, ఇక్కడ మోడీ వ్యతిరేకత ఏముంది అని అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. రామాలయాన్ని రాజకీయం చేస్తున్నారని రాజకీయ పార్టీలు చెబితే, శాస్త్రవిరుద్దమని శంకరాచార్యలు భావిస్తున్నారు. రాజకీయ నేతల డిఎన్‌ఏల గురించి ధ్వజమెత్తుతున్న బిజెపి శంకరాచార్యల డిఎన్‌ఏల గురించి ప్రశ్నించగలదా ? వారిని అనుసరించే వారి మనోభావాలను గాయపరచి తట్టుకోగలదా ?


” మోడీ గారు విగ్రహాన్ని తాకి ప్రారంభోత్సవం చేస్తుంటే నేను అక్కడ ఉండి చేసేదేమిటి ?నేను లేచి నిలబడి చప్పట్లు కొట్టాలా ? నాకు పదవి అవసరం లేదు, ఇప్పటికే నేను పెద్ద స్థితిలో ఉన్నాను, నాకు పేరు అవసరం లేదు. శంకరాచార్యలు అక్కడికి వెళ్లి చేసేదేమిటి ఇది అహంకారం కాదు, నేనున్న స్థానపు గౌరవం గురించి నాకు తెలుసు, అందుకే నేను అక్కడికి వెళ్లటం లేదు, నాకు ఆహ్వానం వచ్చింది, దానిలో నాతో పాటు ఒకరిని తీసుకురావచ్చు అని ఉంది, నాతో పాటు ఒకరిని నేనెందుకు తీసుకుపోవాలి ” అని ఒక వీడియోలో స్వామి నిశ్చలానంద ప్రశ్నించారు. మత వ్యవహారాల్లో మోడీ జోక్యం చేసుకుంటున్నారని, తనకు అయోధ్య అంటే వ్యతిరేకత లేదని కూడా చెప్పారు. విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్‌(రామాలయ నిర్మాణ, నిర్వహణ) ప్రధాన కార్యదర్శి చంపత్‌ రారు అమర్‌ ఉజాలా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామాలయం వైష్టవులకు చెందిన రామానంద సాంప్రదాయానికి చెందింది తప్ప సన్యాసులది లేదా శైవులదీ కాదు అని చెప్పారు.ఆది శంకరుడు శైవుడు, ఆయన స్థాపించిన నాలుగు శంకరమఠాధిపతులూ శైవులే, అయితే వారు విష్ణుమూర్తిని కూడా అంగీకరిస్తారు.శైవుల అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ధ్వని చంపత్‌ రారులో వినిపించింది.రారు ప్రకటన తరువాత అవిముక్తేశ్వరానంద స్పందించారు.” ధర్మశాస్త్రాల ప్రకారమే జరగాలని మేమూ, జనం కూడా కోరుకుంటున్నారు. రాముడు మనకు చెప్పిన పాప పుణ్యాలేమిటో మనకు తెలిసినవే. రామాలయ ప్రతిష్టకు రావటం లేదన్న మా నిర్ణయం ఏమిటో బహిర్గతమైంది. అక్కడకు శంకరాచార్యలు రానవసరం లేదని చంపత్‌ రారు చెబుతున్నారు, ఎందుకంటే ఆ స్థలం రామానంద సంప్రదాయానికి చెందినది అంటున్నారు. ఇక్కడ సమస్య ఏమంటే రామాలయం వైష్ణవులదే అయితే చంపత్‌ రారు అక్కడెందుకు ఉన్నారు ? నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా, పూర్వపు అయోధ్య సంస్థానం, రామాలయ ట్రస్టీ రాజా సాహెబ్‌ అక్కడ ఎందుకు ఉన్నట్లు ? వారు రాజీనామా చేసి రామానంద సంప్రదాయ ప్రతినిధులకు ఆలయాన్ని ప్రతిష్టాపనకు ముందే అప్పగించాలి.ప్రతిష్టను రాజకీయం చేశారు, మతాధిపతులను కావాలనే పక్కన పెట్టారు, ఆలయం రామానంద సంప్రదాయవాదులదే అయితే వారు విరాళాలు తీసుకొనే ముందే ఆ ముక్క చెప్పాలి. ఆ సమయంలో మీరు మా నుంచి కూడా విరాళాలు పొందారు.అలయం శంకరాచార్యులది కాదంటే మీరు మానుంచి విరాళాలను ఎందుకు స్వీకరించినట్లు? అని అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. రామానంద పరంపరలో నిర్మోహీ అఖారా మతపరమైన చిహ్నం, సుప్రీం కోర్టు తీర్పు రాకముందు అక్కడ పూజలు నిర్వహిస్తున్న సంస్థ అది, దానికే ఆ బాధ్యతను కూడా మరోసారి అప్పగించాలి, మీరు మరింత మంది పూజారులను ఎందుకు నియమిస్తున్నారు, పూజ బాధ్యతను రామానంద సాంప్రదాయం ప్రకారం నిర్మోహి అఖారాకు అప్పగించాలి, దాన్ని మేము ఆమోదిస్తాము, దీంతో నలుగురు శంకరాచార్యలూ సంతోషిస్తారు అని కూడా ముక్తేశ్వరానంద అన్నారు.


రామాలయ నిర్మాణాన్ని ఓట్లకోసం బిజెపి ఉపయోగిస్తున్నదని లోకం కోడై కూస్తున్నది. వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో రామాలయాన్ని ప్రభావితం చేసేందుకు ఐదువేల మంది చొప్పున ప్రతి నియోజకవర్గంలో నియమించాలని బిజెపి పధకం వేసినట్లు ఒక బిజెపి నేత చెప్పినట్లు ది ప్రింట్‌ న్యూస్‌ పోర్టల్‌ తన విశ్లేషణలో పేర్కొన్నది. రానున్న మూడు మాసాలలో దేశమంతటి నుంచి రెండున్నర కోట్ల మందికి రామదర్శనం ఏర్పాటు చేసి హిందూ ఓటు బాంకును ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు కూడా తెలిపింది. అయోధ్యను సందర్శించిన వారు తమ అనుభవాలను ఇతరులకు తెలియచేస్తారని బిజెపి ఎంపీ ప్రదీప్‌ చౌదరి చెప్పినట్లు ప్రింట్‌ రాసింది. రామాలయ ప్రతిష్ట రాజకీయం తప్ప సనాతనం కాదని అయోధ్యలోని మహంతులు కొందరు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించే ప్రాణ ప్రతిష్ట కార్యాక్రమాన్ని వారణాసికి చెందిన లక్ష్మీకాంత దీక్షిత్‌ నిర్వహిస్తున్నారు. దీపావళి ఉత్సవానికి మమ్మల్ని ఆహ్వానించారు ఇప్పుడెందుకు పిలవలేదని మహంత్‌ భానుదాస్‌ ప్రశ్నించారు. విమర్శలు చేసిన శంకరాచార్యలను సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున మోడీ అభిమానులుగా ఉన్న వారు చీల్చి చెండాడుతున్నారు. వారు ఎప్పుడైనా రామాలయం కోసం ఎప్పుడైనా ఆందోళన చేశారా అని ప్రశ్నిస్తున్నారు.శంకరాచార్యులను అనుసరించే వారి మనోభావాలను వారు తీవ్రంగా గాయపరుస్తున్నారు.మొత్తం మీద రాముడిని మరోసారి వివాదాస్పదం కావించారు. వీధుల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయోధ్య రామాలయ రాజకీయం : అద్వానీని రావద్దన్నారు ! పిలిచినా వెళ్లేది లేదన్నారు పూరీ శంకరాచార్య !!

08 Monday Jan 2024

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

AYODHYA, BJP, Narendra Modi, Ram Temple politics, RSS, Swami Nischalananda Saraswati


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావటం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.దీని మీద మోడీ భక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నారు. వస్తే ఎంత రాకపోతే ఎంత అసలు రామాలయం కోసం పూరీ శంకరాచార్య ఏం చేశారంటూ నిలదీస్తున్నారు.రధయాత్ర నిర్వహించి, బాబరీ మసీదు కూల్చివేత కేసులను ఎదుర్కొన్న ఎల్‌కె అద్వానీకి ఆహ్వానం ఇస్తూనే అసలు కార్యక్రమానికి రావద్దని చెప్పినట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిత్రం ఏమిటంటే రామాలయంతో ఎలాంటి సంబంధంలేని, బాబరీ మసీదు కూల్చివేతను ఖండించిన సీతారాం ఏచూరి, ఇతర పార్టీల నేతలనూ ఆహ్వానించారు గానీ రావద్దని చెప్పలేదు. హాజరు కావటం లేదని చెప్పిన వారి మీద ప్రచారదాడులు చేస్తున్నారు. అద్వానీ(96), మురళీమనోహర్‌ జోషి(90) ఏండ్ల పెద్దవారు గనుక వారు వచ్చి ఇబ్బంది పడతారని అందువల్లనే రావద్దని చెప్పామని విమర్శలు చెలరేగిన తరువాత వివరణ ఇచ్చుకున్నారు. తరువాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా విశ్వహిందూపరిషత్‌ నేతలు ఆహ్వానించినట్లు ప్రకటించారు. కానీ మాజీ ప్రధాని దేవెగౌడకూ 90 ఏండ్లే అయినప్పటికీ ఆయన వయసు రీత్యా రావద్దని నిర్వాహకులు చెప్పలేదు.ఎందుకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత దేవెగౌడ-కుమారస్వామి పార్టీ జెడిఎస్‌ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపితో జట్టుకట్టాలని నిర్ణయించింది. అందుకే అయోధ్య రామాలయ రాజకీయం రంజుగా నడుస్తోంది అని చెప్పాల్సి వస్తోంది. ఈ మాట అంటే కొందరు మనోభావాలను ముందుకు తెచ్చుకొని బాధపడితే చేసేదేమీ లేదు. వయసు రీత్యా కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ శుభ కార్యాలు జరిగినపుడు ఆహ్వానం పలకటం, వారు రాలేమని చెప్పినపుడు వీలు చూసుకొని రావాలని ఆకాంక్ష వెలిబుచ్చటం మన భారతీయ సంప్రదాయం. కానీ దాన్ని తుంగలో తొక్కి రావద్దని మేమే చెప్పామని నిర్వాహకులు చెప్పటాన్ని ఏ సంప్రదాయం అంటారో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.రధయాత్ర పేరుతో బిజెపి నేత ఎల్‌కె అద్వానీ నిర్వహించిన కార్యక్రమం అది సృష్టించిన వినాశకర, అవాంఛనీయ ఉదంతాల గురించి తెలిసిందే. వారు వస్తారా లేదా స్పందన ఏమిటో చూడాల్సి ఉంది. ఒక వేళ వారు నిజంగా రాగలిగినా రానిచ్చేవారా అన్న సందేహాలు కూడా వారిని వద్దన్న తరువాత జనంలో తలెత్తాయి. తనదారిని సుగమం చేసుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన వెంటనే అద్వానీ, ఎంఎ జోషి వంటి వారితో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అది ఇంతవరకు ఒక్కసారి కూడా సమావేశమైన సమాచారంగానీ, ఇచ్చిన మార్గదర్శనం గురించి గానీ ఎవరికీ తెలియదు. గుడులకు పరిమితం కావాల్సిన రాముడిని ఓట్ల కోసం వీధుల్లోకి తెచ్చారు.


ఆది శంకరాచార్య ఏర్పాటు చేసిన నాలుగు పీఠాల్లో పూరీలోని గోవర్ధన మఠం ఒకటి. దాని అధిపతిగా ఉన్న స్వామి నిశ్చలానంద సరస్వతి(80)కి కూడా రామాలయ నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దాన్ని తిరస్కరించినట్లు స్వామి చెప్పారు, గతవారంలో ఒక టీవీ ఛానల్‌తో, అదే విధంగా మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన ఒక సనాతన ధర్మ సభకు హాజరైనపుడు విలేకర్లతో మాట్లాడారు. తనకు పంపిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒక వేళ హాజరు కావాలని అనుకుంటే తోడుగా గరిష్టంగా ఒకరిని మాత్రమే తెచ్చుకోవాలని దానిలో పేర్కొన్నట్లు చెబుతూ ఒక్కరు కాదు వందమందిని అనుమతించినా ఆ రోజు తాను వెళ్లేది లేదని నిశ్చలానంద చెప్పారు. గతంలో కూడా వెళ్లానని భవిష్యత్‌లో కూడా అయోధ్య వెళ్లి రాముడిని సందర్శిస్తానని అన్నారు. రాముడి విగ్రహాన్ని శాస్త్ర విధి ప్రకారం ఏర్పాటు చేయాలని ఇప్పుడు అలా జరగటం లేదన్నారు. తమ మఠపరిధి ప్రయాగ వరకు ఉందని అయినప్పటికీ తమ సలహా, మార్గదర్శనం కానీ కోరలేదని చెప్పారు. ఈ పరిణామాల గురించి ” నేను ఏ మాత్రం ఆశాభంగం చెందలేదు. ఇతర హిందూ సనాతనుల మాదిరి సంతోషంగా ఉన్నాను. ప్రత్యేకించి ప్రస్తుత ప్రధాని ఒక లౌకికవాదిగా కనిపించేందుకు తాపత్రయపడటం లేదు.విగ్రహారాధన, హిందూత్వ అంశాలలో అతనెంతో ధైర్యశాలి, వాటి పట్ల గర్వపడతారు. తనను ఒక లౌకికవాదిగా ప్రదర్శించుకొనేందుకు అతనేమీ పిరికివాడు కాదు.అయితే ఒక శంకరాచార్యగా నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి ? మోడీగారు విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే చప్పట్లు కొట్టి పొగడాలా ? అని ప్రశ్నించారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే ముందు తనను నరేంద్రమోడీ ఎలా కలిశారో నిశ్చలానంద గుర్తు చేసుకున్నారు.కరోనాకు ముందు యోగి ఆదిత్యనాధ్‌ ఏడాదికి రెండు మూడు సార్లు కలిసేవారు. విశ్వహిందూ పరిషత్‌ మాజీ అధ్యక్షుడు దివంగత అశోక్‌ సింఘాల్‌ కనీసం 70సార్లు కలిశారని చెప్పారు.తీర్థస్థలాలను అభివృద్ధి పేరుతో భోగస్థలాలుగా మార్చుతున్నారు,టూరిజం కేంద్రాలుగా చేస్తున్నారని అన్నారు. ఇదే అంశంపై సోమవారం నాడు మరోసారి నిశ్చలానంద తన వ్యతిరేకతను వెల్లడించారు. చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయపూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 17న ఒడిషా ప్రభుత్వం ప్రారంభించనున్న శ్రీమందిర్‌ పరికర్మ ప్రకల్ప పధకం గురించి స్పందించారు.పుణ్య స్థలాలను విహార కేంద్రాలుగా మార్చటం అంటే వాటిని విలాస కేంద్రాలుగా మార్చటమే అన్నారు.హౌటళ్ల వారు, రవాణా రంగంలో ఉన్నవారు లబ్ది పొందుతారు తప్ప ఆ కేంద్రాలకు ఉన్న ప్రత్యేకత తగ్గుతుందన్నారు.ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని అయితే వెళ్లాలా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. రామాలయ ప్రతిష్టాపన గురించి చేసిన వ్యాఖ్యల మీద నిశ్చలానందపై కాషాయ మరుగుజ్జు దళాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నాయి.


సిఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 టీవీ ఛానల్‌తో 30 నిమిషాలు మాట్లాడిన శంకరాచార్య రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేటపుడు క్రతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.చాతుర్వర్ణ వ్యవస్థకు భగవద్గీతలోని కృష్ణుడి బోధనల్లోనే మూలాలు ఉన్నాయి.గుణము, చర్యలను బట్టి నాలుగు వర్ణాలుగా సమాజాన్ని వర్గీకరించారు.ఇది పుట్టుకను బట్టి అని చెప్పటంగాక చేసే పనులు, వాటి స్వభావాన్ని వర్ణాలు ఉంటాయి.పశ్చిమ దేశాల్లో కూడా వర్ణ వ్యవస్థ మాదిరే విద్య, ఆర్థికం, రక్షణ, సేవా రంగాలు ఉన్నాయి.ఇప్పుడు వర్తమాన సమాజంలో పోలీసుల లేదా ప్రధానులు ఏలాంటి పాత్రను పోషించారో వర్ణ వ్యవస్థలో కూ ఎవరికి వారు తమ స్థితిని బట్టి సమతూకాన్ని నిర్వహించారు. శివపురాణంలో వివిధ రకాల బ్రాహ్మలు ఉన్నారని ఒక కుటుంబంలో పుట్టినంత మాత్రాన్నే బ్రాహ్మలుకాదన్నారు.ఒక బ్రాహ్మడు వ్యాపారం చేస్తే వైశ్య బ్రాహ్మణ అని పిలవాలి, పురాతన గ్రంధాలలో చెప్పిన వాటిని అచరిస్తేనే ఒకబ్రాహ్మడిని బ్రాహ్మడిగా పరిగణించాలి అన్నారు.


ఏసుక్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్త పూర్వీకులు సనాతన హిందువులే అని స్వామీజి గతేడాది సెలవిచ్చారు(ఫిబ్రవరి 1, 2023 ఓపి ఇండియా పోర్టల్‌) అమెరికా ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారని అది రుజువైందని నిశ్చలానంద చెప్పారు. వారు క్రైస్తవం, ఇస్లాం స్వీకరించే ముందు హిందువులే అన్నారు. ఏసు క్రీస్తు పది సంవత్సరాలు భారత్‌లో ఉన్నారని దాన్ని ఎక్కడా పేర్కొనలేదన్నారు. పూరీలో మూడు సంత్సరాలు ఉన్నారని క్రీస్తు వైష్ణవుడని హిందూ క్రతువులన్నీ చేసినట్లు చెప్పారు. ఏసు క్రీస్తుకంటే ముందే హిందూయిజం ఉందని అందువలన ఆయన పూర్వీకులు హిందువులే అన్నది స్వామి వారి అభిప్రాయమని ఎన్నోసార్లు చెప్పారని, పూరీ మఠ ప్రజా సంబంధాల అధికారి మాతృదత్తా చెప్పారు. ప్రభుత్వాలకు మఠాలు, దేవాలయాల మీద అదుపు ఉండకూడదని, ప్రతి మూలను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అనుసరిస్తున్నారంటూ తన మీద వచ్చిన విమర్శలు నిశ్చలానంద ఖండించారు, నేను అనుసరించటం లేదు, కావాలంటే వారే నా వెనుక నడవొచ్చు,ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ నాముందు బాలగోపాలుడి మాదిరి కూర్చుంటారని అన్నారు.


రామాలయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్న బిజెపి ఒడిషాలో అక్కడి సిఎం నవీన్‌ పట్నాయక్‌ శ్రీమందిర్‌ పరిక్రమ రధాల ద్వారా ఎన్నికల రాజకీయం చేస్తున్నారని బిజెపి నేత పృధ్వీరాజ్‌ హరిచందన్‌ ఆరోపించారు. జగన్నాధ సంస్కృతిని రూపుమాపేందుకు కుట్ర జరుగుతోందని, తన మాజీ ప్రయివేటు కార్యదర్శి ద్వారా ఒరియా పౌరుల మీద దక్షిణ భారత సంస్కృతిని బలవంతంగా రుద్దేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు.దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.శ్రీమందిర్‌ పధకం ఒక రాజకీయ నాటకమని, ఎన్నికల ముందు తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు తలపెట్టారని, 160 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును బిజెడి తన ఎన్నికల ప్రచారానికి వినియోగించటం గర్హనీయమైన చర్య అన్నారు. బిజెపి నేతల విమర్శలను బిజెడి నేత, ఎంఎల్‌ఏ పద్మనాభ బెహరా తిప్పికొట్టారు. మనమంతా జగన్నాధుని పిల్లలం, మనంగాకపోతే భగవంతుడి పేరును ఎవరు తీసుకుంటారు, దీని గురించి మాట్లాడేందుకేమీ లేదు, రాజకీయం అసలే లేదన్నారు. భువనేశ్వర్‌ నగరంలోని అరవై ఏడు వార్డుల్లో శ్రీమందిర్‌ పరిక్రమ పధకంలోని రధాలను రెండు రోజుల పాటు తిప్పుతారు. ప్రతి ఇంటి నుంచి ఆకు వక్కలను, ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ పధకంలో భాగంగా పూరీలోని జగన్నాధ ఆలయ పరిసరాలలో రధయాత్ర వేగంగా కదలటాన్ని సులభతరం చేసేందుకు, తొక్కిడి లేకుండా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జగన్నాధ దేవాలయం చుట్టూ 75 మీటర్ల పరిధిలో ఉన్న కట్టడాలను తొలగించేందుకు యాత్రకు అవసరమైన పద్దతుల్లో తీర్చిదిద్దేందుకు అవసరమైన భూ,భవనాలను సేకరించారు. జనాలకు అవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు, సామాన్లు భద్రపరుచుకొనే గదులతో పాటు భద్రతకు అవసరమైన కేంద్రాల వంటివి ఈ పధకంలో ఏర్పాటు చేశారు. దీన్ని బిజెపి రాజకీయం చేస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ క్మిస్మస్‌ విందు రాజకీయం – కేరళ మంత్రి వ్యాఖ్య టీకప్పులో తుపాను !

05 Friday Jan 2024

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

a storm in a tea cup, BJP, CPI()M, Narendra Modi, Pinarayi Vijayan, Saji Cherian, wine and cake christmas politics


ఎం కోటేశ్వరరావు


క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవ పూజార్లకు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో విందు ఇచ్చారు. దానిలో పాల్గొన్న బిషప్పులు మణిపూర్‌లో తమ సామాజిక తరగతికి చెందిన వారి మీద జరుగుతున్నదాడుల గురించి ప్రధానితో ప్రస్తావించలేదని కేరళ మంత్రి సాజి చెరియన్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.జనవరి మూడున కేరళ సిఎం పినరయి విజయన్‌ ఇచ్చిన క్రిస్మస్‌ విందుకు చెరియన్‌ వ్యాఖ్యలను తప్పుపట్టిన బిషప్పుల కౌన్సిల్‌ నేత క్లిమిస్‌తో సహా అనేక మంది హాజరయ్యారు. అంతకు ముందు చెరియన్‌ తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో ఆ వివాదం ముగిసింది. ఈ విందుకు గవర్నర్‌ మహమ్మద్‌ ఆరిఫ్‌ ఖాన్‌ హాజరు కాలేదు. సిఎం ఆహ్వానించని కారణంగానే రాలేదని వచ్చిన వార్తలపై గవర్నర్‌ స్పందించారు. కావాలంటే రాజభవన్‌కు వచ్చి తనిఖీ చేసుకోవచ్చు, నేను ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించానో మీరు శోధించవచ్చు, ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నలు అడగవచ్చు అన్నారు. ప్రధాని విందు వివాదం గురించి చూద్దాం. న్యూ ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఇచ్చిన క్రిస్మస్‌ విందుకు ఆహ్వానం అందగానే కొందరు బిషప్పులకు వెంట్రుకలు నిక్కబొడుచుకొని అక్కడ అందించిన పండ్లరసాలు, ద్రాక్ష రసాలు, కేకుల మీద చూపిన శ్రద్ద తమ స్వంత సామాజిక తరగతి మీద మణిపూర్‌లో జరిగిన హింసను మరిచిపోయారని, వారికది ఒక సమస్యగా కనిపించలేదని కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెరియన్‌ ఒక సభలో అన్నారు. చెరియన్‌ సిపిఎం నేత, క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారు. దాని మీద కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌(కెసిబిసి) అధ్యక్షుడు కార్డినల్‌ మార్‌ బెసిలియోస్‌ క్లిమిస్‌ మండిపడుతూ మంత్రి మాటలను ఉపసంహరించుకొనేంత వరకు తాము ప్రభుత్వానికి సహకరించేది లేదని ప్రకటించారు. వివాదాన్ని పొడిగించకుండా ఉండేందుకు తాను చేసిన విమర్శలో వెంట్రుకలు నిక్కపొడుచుకోవటం, కేకులు, డ్రాక్ష రసం పదాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే మణిపూర్‌ హింసాకాండపై క్రైస్తవ మతాధికారులు స్పందించలేదన్న విమర్శకు కట్టుబడి ఉన్నట్లు చెరియన్‌ స్పష్టం చేశారు. కెసిబిసి ప్రతినిధి ఫాదర్‌ జాకబ్‌ పాలకపిలి మాట్లాడుతూ దేశానికి క్రైస్తవులు చేసిన సేవల గురించి చర్చించేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశమని పేర్కొన్నారు.మణిపూర్‌ జనాభాలో 41శాతాల చొప్పున క్రైస్తవులు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఎనిమిదిశాతంపైగా ఉన్నారు. అక్కడ గతేడాది మే 3వ తేదీన ప్రారంభమైన మెయితీ-గిరిజన ఘర్షణలు వందలాది మంది ప్రాణాలు తీశాయి. వేలాది ఇండ్లు, వందలాది ప్రార్ధనా మందిరాలను ధ్వంసమయ్యాయి. దాదాపు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. గిరిజన మహిళలను ఇద్దరిని వివస్త్రలను గావించి రోడ్ల మీద తిప్పిన దుర్మార్గం వెలుగులోకి వచ్చిన తరువాత ప్రధాని మొక్కుబడిగా ఖండించారు తప్ప ఇంత వరకు ఆ రాష్ట్రానికి వెళ్లి భరోసా కల్పించేందుకు పూనుకోలేదు..


మణిపూర్‌ ఉదంతాల గురించి మౌనంగా ఉండటంపై కేరళ క్రైస్తవ మత పత్రికల్లోనే తీవ్ర విమర్శలు చాలా నెలల క్రితమే వచ్చాయి. ఈ పూర్వరంగంలోనే మంత్రి చెరియన్‌ మాట్లాడారు. కేరళలో ఓటు బాంకు ఏర్పాటు చేసుకొనే ఎత్తుగడతో క్రైస్తవ మతాధికారులను ప్రసన్నం చేసుకొనేందుకు బిజెపి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది.లౌ జీహాద్‌ పేరుతో హిందూ, క్రైస్తవ యువతులను కూడా ఆకర్షించి మతమార్పిడికి పూనుకుంటున్నారని క్రైస్తవుల-ముస్లింల మధ్య విబేధాలు సృష్టించే విధంగా బిజెపి నేతలు గతంలో కొందరు వ్యాఖ్యానించారు. క్రైస్తవులు దేశానికి చేసిన సేవ గురించి చర్చించేందుకు ప్రధాని విందు ఏర్పాటు చేసినట్లు చెప్పటమే విచిత్రం.సంఘపరివార్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఏర్పాటు చేసిన బిజెపి, ఇతర అనేక సంస్థలు క్రైస్తవ మిషనరీల గురించి, ప్రలోభాలతో మతమార్పిడులు చేస్తున్నారంటూ నిత్యం చేస్తున్న ప్రచారం, ఆ పేరుతో చేస్తున్న దాడుల గురించి తెలిసిందే. వాటిని నివారించటం గురించి ప్రధాని నరేంద్రమోడీ గడచిన పది సంవత్సరాల్లో ఎలాంటి సమావేశాల ఏర్పాటు లేదా ప్రయత్నాలుగానీ కనిపించవు.
2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ముస్లింలు, క్రైస్తవులు అభద్రతా భావానికి గురయ్యారు.భారత్‌లో ఇతర మతాల్లో ఉన్నప్పటికీ వారంతా గతంలో హిందువులే అన్న ప్రచారాన్ని తీవ్రం చేయటంతో పాటు ఘర్‌వాపసీ పేరుతో ఇతర మతాల వారిని తిరిగి హిందువులుగా మార్చే పేరుతో పెద్ద హడావుడి చేశారు. దానికి స్పందన రాలేదు. గుజరాత్‌లో జరిపిన మారణకాండను నివారించటంలో విఫలమైన నరేంద్రమోడీ తమ దేశంలో అడుగుపెట్టకూడదంటూ 2005 అమెరికా అనుమతి నిరాకరించింది. తరువాత అదే అమెరికా మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత ఆహ్వానం పలికింది. 2014 అక్టోబరు, 2015 జనవరిలో నరేంద్రమోడీతో భేటీ అయినపుడు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా,మత స్వేచ్చపై అమెరికా కమిషన్‌ కూడా భారత్‌లో మతస్వేచ్చకు భంగం కలుగుతున్నదని, మైనారిటీ మతాల వారి మీద దాడులు జరుపుతున్నట్లు విమర్శలు చేసింది. భారత్‌లో కనిపిస్తున్న అసహనాన్ని మహాత్మాగాంధీ చూసి ఉంటే దిగ్భ్రాంతికి గురై ఉండేవాడని బరాక్‌ ఒబామా వ్యాఖ్యానించాడు. ఈ పూర్వరంగంలో అమెరికాను సంతుష్టీకరించేందుకు, ప్రపంచంలో తన ప్రతిష్టకు కలిగిన మచ్చను కనిపించకుండా చేసుకొనేందుకు నరేంద్రమోడీ చూశారు. తమ ప్రభుత్వం ఎలాంటి వత్తిడీ, ప్రభావం లేకుండా పౌరులు ఏ మతాన్నైనా అనుసరించటానికి, లేదా నిలుపుకోవటానికి స్వేచ్చను అన్ని విధాలుగా పరిరక్షిస్తుందని, మెజారిటీ లేదా మైనారిటీ మతాలకు చెందిన వారు ఎవరైనా ఇతరుల మీద విద్వేషాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా రెచ్చగొట్టినప్పటికీ సహించదని పార్లమెంటులో చెప్పాల్సి వచ్చింది. విదేశాల వారిని ఆకట్టుకొనేందుకు ఈ ముక్కలను ఆంగ్లంలో చెప్పారని కొందరు వ్యాఖ్యానించారు. ఈ మాత్రం మాట్లాడటాన్ని కూడా సహించలేని హిందూ జాతీయవాదులు ” లౌకిక నరేంద్రమోడీ ” అంటూ ఎద్దేవా చేశారని వాషింగ్టన్‌ పోస్టు, గార్డియన్‌ పత్రికలు రాశాయి. క్రైస్తవ మతాధికారులతో సమావేశాన్ని కూడా మోడీ నిర్వహించారు.


నరేంద్రమోడీ చేసిన ప్రకటన ఇంకా చెవుల్లో వినిపిస్తుండగానే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌ భగవత్‌ మదర్‌ తెరెసాను విమర్శిస్తూ తన గణాన్ని సంతృప్తి పరచేందుకు చూశారు. మిషనరీలు తమ సాయం కోరి వచ్చిన వారిని మతం మారాలని కోరినట్లు ఆరోపించారు.ఆమె సేవలు మంచివే కావచ్చు, కానీ వాటిని వినియోగించుకున్న వారిని క్రైస్తవులుగా మార్చే లక్ష్యంతో చేశారని అన్నారు. ప్రభుత్వేతర సంస్థలు కూడా సేవలు చేస్తాయి అవి మదర్‌ తెరేసా వంటివి కాదు అన్నారు. అంతకు ముందు మతపరమైన మైనారిటీలను అపహరణకు గురైన వస్తువులుగా వర్ణిస్తూ నా వస్తువులను నేను తిరిగి పొందుతా అన్నారు. మదర్‌ తెరేసాపై మోహన్‌ భగవత్‌ మాటలతో తీవ్ర విమర్శలు రావటంతో తమ నేత మాటలను మీడియా వక్రీకరించిందంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. విదేశీ నిధులతో క్రైస్తవ మిషనరీలు, సంస్థలు మత మార్పిడికి పాల్పడుతున్నాయంటూ చేస్తున్న ప్రచారం ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. క్రైస్తవం మన దేశానికి రెండువేల సంవత్సరాల నాడే వచ్చింది. రెండు వందల సంవత్సరాల బ్రిటీష్‌ పాలన, తరువాత కూడా చూస్తే ప్రస్తుతం దేశంలో క్రైస్తవుల సంఖ్య కేవలం 2.3శాతమే. అంటరానితనం వంటి తీవ్ర వివక్ష కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారారు. ఆ సమస్యతో నిమిత్తం లేని వారు ఆర్థిక, ఇతర ప్రయోజనాల కోసం క్రైస్తవం పుచ్చుకున్నారు. మొఘల్‌ పాలనా కాలంలో కూడా జరిగింది అదే. రిజర్వేషన్ల కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారనప్పటికీ దేవాలయాలకు బదులు చర్చ్‌లకు వెళ్లి క్రీస్తును పూజిస్తున్నారన్నది హిందూత్వవాదుల దుగ్ద.


గతంలో జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలసి అహమ్మదాబాద్‌లో ఒక పురాతన మసీదును మోడీ సందర్శించారు. సందర్శన వేరు, చర్చిలో మాదిరి పూజా క్రతువులో భాగంగా కొవ్వొత్తి వెలిగించినట్లుగా మసీదులో ఎక్కడా చూడలేదు.విదేశాలకు వెళ్లినపుడు అబూదాబీలో మోడీ మసీదును సందర్శించారు. ఇవన్నీ ఇస్లామిక్‌, క్రైస్తవ దేశాల పాలకుల మెప్పు పొందేందుకే అన్నది స్పష్టం. గతేడాది ఈస్టర్‌ పండగనాడు మోడీ చర్చికి వెళ్లటానికి ముందు క్రైస్తవుల మీద అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ ముంబైలో పదివేల మంది ప్రదర్శన చేశారు.” ఈస్టర్‌ పండగ రోజు కెథడ్రల్‌ చర్చిని సందర్శించాలన్న వాంఛను ప్రధాని మోడీ వెలిబుచ్చారు. మేము ఏర్పాటు చేశాము. దీని మీద స్పందన ఏమిటని అనేక మంది జర్నలిస్టులు ఎందుకు అడుగుతున్నారో తెలియటం లేదని ” అన్న ఢిల్లీ ఆర్చిబిషప్‌ అనిల్‌ కౌటో అంతకు మించి మాట్లాడేందుకు తిరస్కరించారు.ప్రధాని కోరితే కుదరదని చెప్పలేం అని ఫరీదాబాద్‌ సిరో మలబార్‌ చర్చి అధిపతి కురియకోస్‌ భరణికులనగార అన్నారు. ప్రధాని చర్చిలో ఉండగా మూడు స్తోత్రాలను ఆలపించాము, రైసెన్‌ క్రీస్టు విగ్రహం ముందు కొవ్వొత్తిని కూడా వెలిగించారని చెప్పారు.అరగంటపాటు అక్కడే ఉన్న మోడీ ప్రాంగణంలో ఒక మొక్క నాటారు.ముంబైలో క్రైస్తవుల ప్రదర్శన నిర్వాహకులలో ఒకరైన డోల్ఫీ డి సౌజా మాట్లాడుతూ నరేంద్రమోడీ చర్చికి రావటానికి మాకెలాంటి సమస్య లేదు. స్వాగతిస్తాం, కానీ మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత క్రైస్తవుల మీద హింసాకాండ పెరిగింది, దాడులకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి మోడీ నిరాకరిస్తున్నారు, అదే మాకు ఆందోళన కలిగిస్తోంది అని కూడా డి సౌజా చెప్పారు.అలాంటి ప్రధాని మణిపూర్‌ గురించి మౌనంగా ఉండటాన్ని ఎందుకు ప్రశ్నించలేదనే కేరళ మంత్రి తప్పుపట్టారు.


ఈస్టర్‌ పండుగ రోజున బిజెపి నేతలు కేరళలో పదివేల చర్చ్‌లు, క్రైస్తవుల ఇండ్లను సందర్శించి వారిని సంతుష్టీకరించేందుకు, ఓటు బాంకుగా మార్చుకునేందుకు చూశారు. ఈస్టర్‌ రోజున ఆడించిన నాటకమిదని కేరళకు చెందిన కురియకోస్‌ భరణికులనగార విమర్శించారు. కేరళలో సిరో మలబార్‌ చర్చ్‌ ఆర్చిబిషప్‌ కార్డినల్‌ జార్జి అలెంచెరీ నరేంద్రమోడీని ప్రశంసించినట్లు, దేశంలో క్రైస్తవులు అభద్రతతో లేరని చెప్పినట్లు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. దేశంలో ఆందోళనకరంగా ఉన్న వాస్తవం కార్డినల్‌ అలెంచెరీ మాటల్లో ప్రతిబింబించలేదని కేరళలో ప్రచురితమయే సత్యదీపమ్‌ అనే కాథలిక్‌ పత్రిక సంపాదకుడు ఫాదర్‌ పాల్‌ తెలక్కాట్‌ వ్యాఖ్యానించారు. మోడీ పాలనను ప్రశంసించటం క్రైస్తవులకు విభ్రాంతి కలిగించిందని కూడా అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మిజోరం వెళ్లలేదు. మణిపూర్‌ తగులబడుతుంటే రాని ప్రధాని తగుదునమ్మా అంటూ పక్కనే ఉన్న మిజోరంలో ఓట్ల కోసం వచ్చారనే విమర్శను మూటగట్టుకోవాల్సి వస్తుందనే కారణం తప్ప మరొకటి కాదు. లోక్‌సభ ఎన్నికల పూర్వరంగంలో నరేంద్రమోడీ క్రిస్మస్‌ రాజకీయం చేశారు. ఈ పూర్వరంగంలో ప్రధాని విందుకు వెళ్లిన బిషప్పులు మణిపూర్‌లో జరుగుతున్న ఉదంతాలను పట్టించుకోలేదని కేరళ మంత్రి సాజీ చెరియన్‌ చేసిన వ్యాఖ్యలను చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d