• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Others

లడ్డు రాజకీయం : సనాతనవాదిగా పవన్‌ కల్యాణ్‌ – కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడినదాంట్లో తప్పేంటి ?

28 Saturday Sep 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, CHANDRABABU, Narendra Modi Failures, Pawan kalyan, Prakash Raj, RSS, Tirupati Laddu Controversy, YS jagan


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది ? మాజీ సిఎం జగన్‌ మోహనరెడ్డిని ఇరుకున పెట్టాలని చూసిన చంద్రబాబు నాయుడు చివరకు తిరుమల పర్యటనను తీవ్ర వివాదాస్పదం గావించి మొత్తం మీద జగన్‌ నెత్తిన పాలుపోశారనే చెప్పాలి. పోలీస్‌ సెక్షన్‌ 30 తదితర ఆంక్షల పేరుతో ఆటంక పరచకుండా అనుమతించి ఉంటే పరమతాలకు చెందిన వారందరి మాదిరే జగన్‌ కూడా ఆలయసంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు రిజిస్టర్‌లో సంతకం చేసేవారా లేదా అనేది తేలిపోయి ఉండేది.చేయకపోతే అభ్యంతరం తెలిపి ఉంటే బంతి జగన్‌ కోర్టులో ఉండేది. అలాంటి అవకాశం లేకుండా వ్యవహరించటంతో జగన్‌ వ్యతిరేకులందరూ ఒక రకంగా నీరుగారిపోయారు. అయితే దీని మీద ఎవరి భాష్యం వారు చెప్పుకుంటున్నారు గనుక జనం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఇకనైనా లడ్డు రాజకీయానికి తెరదించి రాష్ట్ర సమస్యల మీద కేంద్రీకరించాలి.


చంద్రబాబు నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల వెంకటేశ్వరుడి దర్శనాన్ని చేసుకొని ప్రార్ధిస్తానని ప్రకటించిన వైఎస్‌ జగన్‌మోహన రెడ్డిని పరోక్షంగా ప్రభుత్వం అడ్డుకుంది. అంతకు ముందు తెలుగుదేశం, జనసేన, బిజెపి, వారి కనుసన్నలలో పనిచేసే సంస్థలు, వ్యక్తులు స్వామి దర్శనం చేసుకోవాలంటే ఆచారాలను మన్నిస్తూ దేవస్థాన రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందేనని, తలనీలాలు సమర్పించుకోవాల్సిందేనని ప్రకటించాయి. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి పాపానికి పాల్పడ్డారని దానికి ప్రాయచిత్తంగా సెప్టెంబరు 28 తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో పూజలు చేయాలని క్రైస్తవమతావలంబకుడిగా అందరికీ తెలిసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. మరోసారి శుక్రవారం నాడు మీడియా సమావేశంలో కూడా అదే చెప్పారు. తాను నాలుగు గోడల మధ్య బైబిలు చదువుతానని, బయట అన్ని మతాలను పాటిస్తానని, తనది మానవమతమని ఏం కావాలంటే అది రాసుకోవచ్చని కూడా చెప్పారు. తమ ప్రభుత్వం జగన్‌కు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని, తిరుమల పర్యటనను అడ్డుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అన్యమతస్తులెవరైనా ఆలయ రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందే అన్నారు. ఇప్పుడు లడ్డు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తులో తేలేదేమిటి, జరిగిందని చెబుతున్న లడ్డు నెయ్యి కల్తీ ఎప్పటికి నిర్ధారణ అయ్యేను, నిందితులుగా ఎవరిని తేల్చేను, ఏ శిక్షలు పడేను అన్నది భక్తులు నమ్మే ఆ భగవంతుడికే తెలియాలి. లడ్డు పరిణామాలతో అనేక ముఖ్య సమస్యలు జనం అజెండానుంచి మాయమయ్యాయి. ముఖ్యంగా ఇటీవలి వరదల్లో సంభవించిన భారీ నష్టానికి కేంద్రం నుంచి వరదలా సాయం వస్తుందని ఆశలు రేకెత్తించిన వారికి కనీసం మబ్బులు కూడా కనిపించటం లేదు.


తిరుమల దేవుడి మహిమల సంగతి తెలియదు.అఫ్‌ కోర్స్‌ నిజంగా మహిమే ఉంటే తన లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంటే పట్టించుకోకపోవటమేమిటి, దాని పేరుతో రాజకీయం చేస్తుంటే ఉపేక్షించటం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరూ మనోభావాలను గాయపరుచుకోనవసరం లేదు. దేవుడి లడ్డులో కల్తీ నెయ్యి దగ్గర ప్రారంభమైన వివాదం మలుపులు తిరుగుతూ మతం, సనాతన ధర్మ పరిరక్షణ వైపు పయనిస్తోంది. అనేక మంది నిజరూపాలను బహిర్గతం చేస్తోంది. మతం పేరుతో రాజకీయం, ఓటు బాంకులను ఏర్పాటు చేసుకొనే పార్టీల జాబితాలో బిజెపితో పాటు తెలుగుదేశం, జనసేన కూడా పోటీ పడుతోందన్నది తేలిపోయింది. అయితే దేశంలో మతరాజకీయాలు చేసే వారి గురించి జనం కళ్లు తెరుస్తున్న స్థితిలో ఆంధ్రులు అలాంటి తిరోగమన రాజకీయ వలలో పడతారా ? తిరుమల లేదా మరొక మతకేంద్రం కావచ్చు, మతేతరులు వాటిని సందర్శించాలని అనుకున్నపుడు అక్కడి ఆచారాలను గౌరవిస్తున్నట్లు అంగీకరించాలన్న నిబంధనలు, ఆచారాలు ఉన్నాయి. శుక్రవారం నాటి విలేకర్ల సమావేశంలో తాను వాటిని పాటించనని లేదా పాటిస్తానని గానీ జగన్‌ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోసారి తిరుపతి వెళతానని కూడా చెప్పలేదు.


లడ్డు కల్తీ సంగతి విచారణ తరువాత ఏదో ఒకటి తేలుతుంది. కానీ ఈ వివాదం తెచ్చిన సమస్యలు మాత్రం ముందుకూడా కొనసాగుతాయి. భగత్‌ సింగ్‌, చేగువేరా భావజాలం కలవ్యక్తిగా అనేక మంది ఇప్పటివరకు పవన్‌ కల్యాణ్‌ గురించి భావిస్తున్నవారికి భ్రమలు తొలిగిపోయాయి. అఫ్‌కోర్స్‌ వారాహి పూజలను చూసినపుడే చాలా మందికి అర్ధమైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలిచ్చిందని విమర్శించి తిరుమల లడ్డుకు మరోవిధంగా ప్రచారం కల్పించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆ లడ్డూతోనే రాజకీయం ఆడుతున్నారు. అందువలన కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్నట్లుగా ఆ పెద్దమనిషి సనాతన ధర్మం గురించి రెచ్చిపోయి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించలేదు. ఎన్నో పుస్తకాలు చదివినట్లు చెప్పుకున్న మేథావికి సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో జరిగిన దారుణాలు, కలిగించిన హాని అర్ధం కాలేదా లేక పుస్తకాలు చదవటం అన్నది ఒట్టి కబుర్లేనా ? నిజంగా అర్ధమై ఉంటే కనీసం మౌనంగా ఉండేవారు తప్ప దాన్ని పరిరక్షిస్తానంటూ విరుచుకుపడేవారు కాదు. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేసినపుడు ప్రకాష్‌ రాజ్‌ ఎక్కడకు వెళ్లారంటూ పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారని ఒన్‌ ఇండియా అనే వెబ్‌సైట్‌ తన విశ్లేషణకు శీర్షిక పెట్టింది. అక్కడ జరిగిన వాటి గురించి వాస్తవాల కంటే అభూత కల్పనలే ఎక్కువ వచ్చాయి, కాదూ ఒక వేళ నిజమే అనుకుంటే నరేంద్రమోడీ, బిజెపి ఎందుకు పెద్దగా స్పందించలేదో చెప్పగలరా ? చిన్న పాటి విమర్శ, అభ్యంతరాన్ని కూడా బిజెపి, హిందూత్వశక్తులు సహించవు. ఆరునెలలకే వారు వీరవుతారన్నట్లుగా అంతకంటే ఎక్కువ కాలమే బిజెపితో బంధంలో ఉన్నందున అదే జరిగినట్లు కనిపిస్తోంది. అసలు లడ్డు వివాదం గురించి ప్రకాష్‌ రాజ్‌ అన్నదేమిటి ? ‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌, ఇది మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగింది.దయచేసి దర్యాప్తు చేయండి.దోషులను పట్టుకోండి కఠినమైన చర్యలు తీసుకోండి. జాతీయ స్థాయిలో అనవసర భయాలను ఎందుకు వ్యాపింపచేస్తారు,ఎందుకు పెద్దదాన్ని చేస్తారు.మనకు ఇప్పటికే తగినంత మతతత్వం ఉంది(కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు కృతజ్ఞతలు) ’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీని మీద పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ‘‘ నేను ప్రకాష్‌ రాజ్‌ను ఇష్టపడతాను, ఆయన నాకు మంచి స్నేహితుడు, మేము గొప్ప బంధాన్ని పంచుకుంటాము.రాజకీయ అంశాల మీద మేము విబేధించవచ్చు గానీ, ఒక నటుడిగా నేను నిజంగా గౌరవిస్తాను. అయితే ఈ సమస్య మీద వ్యాఖ్యానించే అవసరం ఆయనకు లేదు ’’ అంటూ స్పందించారు. ప్రపంచంలోని వారందరూ స్పందిస్తున్నట్లు అనేక అంశాల మీద నిరంతరం తన భావాలను వెల్లడిరచే ప్రకాష్‌ రాజ్‌ దీని మీద మౌనంగా ఎలా ఉంటారు ? ఎందుకు ఉండాలి ? వద్దని చెప్పటానికి పవన్‌ కల్యాణ్‌ ఎవరు ? ఇదేమీ వ్యక్తిగత వ్యవహారం కాదు.


వన్‌ ఇండియా ఇంటర్వ్యూలో చెప్పినట్లు రాసిన అంశాలను బట్టి చూస్తే మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు విరుచుకుపడినట్లుగా పవన్‌ కల్యాణ్‌ తీరు ఉంది.‘‘ ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలను చూస్తే రాజకీయ అంశాలను ముందుకు తెచ్చినట్లుగా ఉంది.బిజెపిని, ప్రధాని మోడీని చర్చలోకి లాగుతున్నారు. తానొక గొప్ప లౌకికవాదినని ఆయన భావిస్తున్నారు. అతని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలుసు. నా ప్రశ్న ఏమిటంటే బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేస్తుంటే ఆయన ఎక్కడ ఉన్నారు ? దాని మీద మాట్లాడారా ? కానీ అనేక మంది లౌకికవాదులు హిందూ సమాజం మీద వ్యాఖ్యానించటం సులభం కానీ ఇతర మతాల వారి మీద వ్యాఖ్యానించటానికి భయపడతారు. వారికి లౌకిక వాదం అంటే ఒక వైపు మాత్రమే ప్రయాణించే దారి వంటిది, హిందూయిజం వెలుపల ఉన్న సమస్యలను విమర్శించటాన్ని తప్పించుకుంటారు. అందరి పట్ల సమంగా చూడకపోతే లౌకికత్వం అంటే ఏమిటి ? వ్యాఖ్యానించదలచుకున్నవారు అందరినీ ఒకేవిధంగా చూడాలి, దీన్నే సగటు భారతీయుడు వాంఛిస్తున్నాడు. మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించాలి లేకపోతే మౌనంగా ఉండాలి ’’ ఇవన్నీ సంఘపరివారం స్కూల్లో బోధించే తర్కంలోని అంశాలే. ప్రతిదాన్నీ ప్రశ్నిస్తాను, అవసరమైతే తోలువలుస్తా, తాట తీస్తా అని మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ ఇలా మాట్లాడటం అవకాశవాదం తప్ప మరొకటి కాదు. అందుకే ప్రకాష్‌ రాజ్‌ పరోక్షంగా ఒక చురక అంటించారు. ‘‘ గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తరువాత మరో అవతారం, ఏంటీ అవాంతరం … ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ ఒక ఎక్స్‌, ‘‘ చేయని తప్పుకి సారీ చెప్పించుకోవటంలో ఆనందమేమిటో, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ మరో ఎక్స్‌లో స్పందించారు. అంతే కాదు, మరో ఎక్స్‌లో ఇలా పేర్కొన్నారు.‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌ గారూ … మీ ప్రెస్‌ మీట్‌ను నేను చూశాను. నేను చెప్పిందేమిటి, మీరు దానికి వక్రభాష్యం చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి నేను తిరిగి వస్తా, ఈ లోగా నేను ఇంతకు ముందు చేసిన ట్వీట్‌ను పూర్తిగా పరిశీలించండి, అవగాహన చేసుకోండి, ఊరికే అడుగుతున్నా ’’ అని పేర్కొన్నారు. సినిమా హీరో కార్తి ఎప్పుడూ నవ్వుముఖంతో కనిపిస్తాడు. లడ్డు గురించి అడిగితే అదే ముఖంతో అది సున్నితమైన అంశం అని చెప్పటాన్ని కూడా పవన్‌ కల్యాణ్‌ తప్పుపట్టారు.


ఎవరు ఎటు ఉన్నారో, ఎవరి రంగు ఏమిటో జనాలు గ్రహిస్తున్నారు. మాంసం తింటాంగనుక ఎముకలను మెడలో వేసుకు తిరుగుతాం అన్నట్లుగా తాము భారత మితవాదులమని సగర్వంగా చెప్పుకొనే పత్రిక ‘‘ స్వరాజ్య ’’. అది లడ్డు వివాదంపై ఒక విశ్లేషణకు ‘‘ తిరుపతి లడ్డు సమస్య : పవన్‌ కల్యాణ్‌ మీ ముఖంలో కనిపిస్తున్న హిందూయిజానికి ఆంధ్రలో స్వాగతం ’’ అని శీర్షిక పెట్టింది. పార్టీలతో నిమిత్తం లేకుండా మరింత మంది బిజెపి ఏతర పార్టీల నేతలు సనాతన ధర్మం గురించి మాట్లాడాలని తద్వారా హిందువుల ప్రయోజనాలు రక్షించబడతాయని నొక్కి వక్కాణించారు. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ బోర్డు నెలకొల్పాలని పిలుపు ఇచ్చిన తరువాత సినిమా నటులు కార్తీ, ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించారని ప్రశంసలు కురిపించారు. నీవెవరో తెలియలాంటే నీ స్నేహితులను చూస్తే చాలన్నది గత లోకోక్తి ఇప్పుడు నీ బండారం తెలియలాంటే నిన్ను పొగుడుతున్నవారిని చూస్తే చాలు అని చెప్పాల్సి వస్తోంది. పవన్‌ కల్యాణ్‌ గారు చెబుతున్న సనాతన ధర్మం ఈ దేశంలో దాదాపు నలభై కోట్ల మంది దళితులు, గిరిజనులను అంటరానివారిగా వేల సంవత్సరాల పాటు వెలివాడల్లో దూరంగా పెట్టింది. వెనుకబడిన తరగతుల వారినీ పరిమితం కావించింది. మహిళలను అణచివేసింది.శూద్ర కులాలకు చెందిన వారితో సహా అందరినీ విద్యకు దూరం చేసింది. అందుకే అంబేద్కర్‌ ఈ సనాతన వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకంటే ఎక్కువ అధ్యయనం చేసి ఉంటారని అనుకోలేము. సనాతన వాదాన్ని పరిరక్షించాలని కోరుతున్నవారు నిజానికి ఎంత మంది దాని ప్రకారం నడుచుకుంటున్నారు. సనాతన వాదం మారేది కాదంటున్నారు. ఏక పత్నీవ్రతుడైన రాముడిని, బహుపత్నులున్న కృష్ణుడినీ ఒకే రకమైన భక్తితో సనాతనులు సమర్థిస్తున్నారు.వివాహ బంధంతో నిమిత్తం లేకుండా వేరేవారికి పిల్లలను కనటాన్ని కూడా మహాభారతంలో సమర్ధించారు. పెళ్లితో నిమిత్తం లేకుండా ఏళ్లతరబడి సహజీవనం చేసిన వారు, ఏ కారణంగా చెప్పకుండా భార్యలను వదలివేసిన వారూ, సనాతనంతో సంబంధం లేని ఆధునిక చట్టాల ప్రకారం విడాకులు తీసుకొని అనేక వివాహాలు చేసుకుంటున్నవారు కూడా సనాతన పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. అదొక ఫాషనైపోయింది. సనాతనం గురించి మరొకదాని గురించి గతంలోనే అనేక చర్చలు జరిగాయి.ముఖం మీద నామం అడ్డంగా పెట్టుకోవాలా నిలువుగా పెట్టుకోవాలా అంటూ దాడులు చేసుకున్న సనాతనుల గురించి తెలిసిందే. ఇప్పటికీ దాని మీద ఏకీభావం లేదు. ఇప్పుడు అలాంటి వారంతా ఒకటై సనాతనాన్ని విమర్శించేవారి మీద దాడులకు దిగుతున్నారు. గతంలో లోకాయతులను అణచివేశారు. కొత్తగా మతం పుచ్చుకున్నవారు మరీ రెచ్చిపోతున్నారు. సనాతనం మనదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల బాటలో నిలుపలేదు. ఆ తిరోగమనవాదాన్ని పరిరక్షించి దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతున్నవారు తాత్కాలికంగా ఓటు బ్యాంకులను సృష్టించుకోవచ్చు తప్ప దేశానికి చేసే మేలేమీ ఉండదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే….. మహారాష్ట్ర ఎన్నికల రాజకీయం ! బిజెపి చేతిలో కీలుబొమ్మ ఎన్నికల కమిషన్‌ !!

18 Sunday Aug 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Ajit Pawar, BJP, Chief Election Commissioner Rajiv Kumar, Congress-NCP alliance, Eknath Shinde, Maha Vikas Aghadi, Maharashtra assembly politics 2024, Narendra Modi Failures, NCP, Sarad pawar, shiva sena, Uddhav Thackeray


ఎం కోటేశ్వరరావు


హర్యానా, ఎట్టకేలకు జమూాకాశ్మీరు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పోయిన సారి హర్యానాతో పాటు మహారాష్ట్ర ఎన్నికలు జరిగినా ఈ సారి జరగటం లేదు. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ విలేకర్లతో మాట్లాడుతూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు తరువాత వెల్లడిస్తామన్నారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని అని కుంటి సాకు చెప్పి వెనకటి కెవడో కల్లు దొంగతనాన్ని తప్పించుకోచూశాడట.కొన్ని దేశాల్లో జరుగుతున్న మాదిరి పార్లమెంటు, అసెంబ్లీ, ఇతర ఎన్నికలన్నింటినీ ఒకే రోజు జరపాలంటూ బిజెపి చెబుతున్న కబుర్లకు మద్దతు ఇస్తున్న ఎన్నికల కమిషన్‌ తనదాకా వచ్చే సరికి కుంటి సాకులు చెబుతున్నది. వర్షాలు, భద్రతా సమస్యలంటూ మహారాష్ట్ర ఎన్నికలను తరువాత జరుపుతామంటున్నది. ఈ సమస్యలు హర్యానాలో ఉండవా ? మహారాష్ట్రలో వినాయకచవితి, పిత్ర పక్షం, దసరా, దీపావళి పండుగలు వరుసగా వస్తాయన్న కారణం కూడా ఎన్నికల కమిషన్‌ చూపింది. 2019లో కూడా ఇవన్నీ ఉన్నాయిగా అప్పుడెలా సాధ్యమైంది. ఉదాహరణకు వినాయకచవితి 2019లో సెప్టెంబరు రెండున వస్తే ఈ ఏడాది ఏడవ తేదీ వస్తున్నది. మిగతా పండగలు కూడా అదే మాదిరి కొద్ది రోజుల తేడాతో ఉంటాయి. ఈ పండగలు హర్యానాలో, జమ్మూ ప్రాంతంలో కూడా జరుగుతాయి కదా ? అక్కడ లేని ఆటంకాలు మహారాష్ట్రలోనే ఎలా ఉంటాయి ? ఇలాంటి కారణాలు బిజెపి కూటమిని ఓటమి నుంచి గట్టెక్కిస్తాయా !


అధికారదాహం, రాజకీయ అవకాశవాదానికి మహారాష్ట్రలో మారుపేరుగా తయారైన అజిత్‌ పవార్‌ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకు లేదని, ఇప్పటికే ఏడెనిమిది ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పాడు. ఇదొక ఎత్తుగడని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య సునేత్రను సోదరి సుప్రీయా (శరద్‌ పవార్‌ కుమార్తె) మీద పోటీకి నిలిపి తప్పుచేశానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానంలో(బారామతి) తన కుమారుడు జరు పవార్‌ పోటీ చేసేదీ లేనిదీ పార్టీయే నిర్ణయిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో జనం, మద్దతుదార్లు కోరితే జరును పోటీకి నిలుపుతారు, పార్టీ పార్లమెంటరీ బోర్డు దాన్ని చర్చిస్తుంది అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుప్రియకు 47వేల మెజారిటీ వచ్చింది. అందువలన అజిత్‌ పవార్‌ పోటీ చేసినా గెలిచే అవకాశం అనుమానమే గనుక మర్యాద నిలుపుకొనేందుకు గాను తనకు ఆసక్తి లేదని ప్రకటించినట్లు స్పష్టం అవుతోంది.ఒకవేళ శరద్‌ పవార్‌తో సయోధ్య కుదిరితే కుమారుడికి అక్కడ మద్దతు కోసం బేరమాడవచ్చు. అసలా నియోజకవర్గంలో శరద్‌ పవార్‌ కుటుంబ సభ్యులెవరూ పోటీచేయకుండా ఉంటే మంచిదనే సంకేతాలు పంపుతున్నట్లు కూడా చెబుతున్నారు.రాజకీయాల్లో ఒకసారి అడుగుజారితే ఎంత గొప్పవారికైనా పట్టువుండదు, ఇప్పుడు అజిత్‌ పవార్‌ కూడా అదే స్థితిలో ఉన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే రాజకీయ పార్టీలు తమ తురుపు ముక్కలను ప్రయోగిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన నేత ఉద్దావ్‌థాకరే ఎంతో కష్టపడ్డారని కానీ ఫలితం కాంగ్రెస్‌, ఎన్‌సిపికి ఎక్కువ దక్కిందని బిజెపి వ్యాఖ్యానించింది. ఎన్‌పిసి ఓట్లను చీల్చేందుకు అజిత్‌ పవార్‌ పార్టీని విడిగా పోటీచేయించే అవకాశం ఉందని శరద్‌ పవార్‌ ఎన్‌సిపి భావిస్తోంది. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో, అనూహ్య పరిణామాలు ఏం జరుగుతాయో చూడాల్సి ఉంది. అసెంబ్లీలోని 288 స్థానాలకు గాను తమ కూటమికి 225 వస్తాయని నెల రోజుల క్రితమే శరద్‌ పవార్‌ జోశ్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఈ అంచనాకు వచ్చి ఉండవచ్చు.


2019లో ఒకే సారి ఫలితాలు వెలువడినా బిజెపి కూటమిలో సిఎం పదవి ఎవరికి అనే కుమ్ములాటల కారణంగా ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బిజెపి-శివసేన విడిపోయాయి. ఎవరూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవటంతో అదే ఏడాది నవంబరు 23న రాష్ట్రపతి పాలన విధించారు. యుపిఏ కూటమిలోని ఎన్‌సిపిలో చీలిక తెచ్చి బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ సిఎం, అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన మెజారిటీ లేకపోవటంతో బలనిరూపణ గడువుకు ముందే నవంబరు 26న ఆ ప్రభుత్వం రాజీనామా చేసింది. రెండు రోజుల తరువాత శివసేన, కాంగ్రెస్‌, మిగిలిన ఎన్‌సిపి నేతలు ఉద్దావ్‌ థాకరే సిఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబరు 26వరకు ఉంది.మరోవైపున హర్యానాలో 2019లో నూతన ప్రభుత్వం వెంటనే ఏర్పడిన కారణంగా 2024 నవంబరు మూడవ తేదీతో రాష్ట్ర అసెంబ్లీ గడువు పూర్తి కానుంది. ఈ వివరాలను చూసినపుడు మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే నాటికి హర్యానా, కాశ్మీరు ఎన్నికల ఫలితాలు వస్తాయి. అఫ్‌కోర్స్‌ అక్కడ బిజెపి గెలిస్తే వాటిని చూపి బరిలోకి దిగేందుకు తప్ప మరొకటి దీని వెనుక కనిపించటం లేదు. ఒకవేళ ఓడితే…. తరువాత వెంటనే ఢిల్లీ, ఝార్కండ్‌ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. పోగాలము దాపురించినపుడు అంటారు కదా అదే జరుగుతుంది. సాధ్యమైన మేరకు బిజెపి ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని వ్యవస్థలను వినియోగించుకొనేందుకు చూస్తున్నది. అఫ్‌ కోర్స్‌ ఇలాంటి పనులలో గతంలో కాంగ్రెస్‌ కూడా తక్కువ తినలేదు. అందుకే తగిన శాస్తి పొందింది. బిజెపి కూడా అదే బాటలో నడుస్తున్నది.


మధ్యలో రెండున్నర సంవత్సరాలు తప్ప మహారాష్ట్రలో రెండింజన్ల పాలనే సాగింది. గడచిన పది సంవత్సరాలలో జరిగిన ఎన్నికలను చూసినపుడు బిజెపి-శివసేన కూటమి ఓట్లు, సీట్లు తగ్గిపోవటం తప్ప పెరిగిన తీరు కనిపించదు.లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరువాతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ బిజెపి విజయ ప్రభావం అసెంబ్లీ మీద కనిపించలేదు.అవిభక్త శివసేన-బిజెపి కలసి ఉన్న 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏకు 57.86శాతం ఓట్లు రాగా తరువాత 51.34శాతానికి, 2024లో ఒక ముక్కతో కలసి 43.55శాతం తెచ్చుకుంది. సీట్ల రీత్యా 42 నుంచి 17కు పడిపోయాయి.ఎన్‌సిపి అజిత్‌ పావర్‌ వర్గానికి 3.60శాతం ఓట్లు వచ్చాయి. బిజెపితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు అజిత్‌ పవార్‌ గురించి వార్తలు వస్తున్నాయి. అతగాడి బలం, బలహీనతలేమిటో వెల్లడైనందున అతను బిజెపితో ఉన్నా ఆ ఓటింగ్‌ ఈసారి రాదు. ఇండియా కూటమి సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోగా ఓట్ల రీత్యా 43.71శాతంతో స్వల్పంగా ఆధిక్యతలో ఉంది.ఈ ఓటింగ్‌ను చూసే బిజెపి భయపడుతోంది. రైతులు, ఇతర తరగతులు కూడా ఆ పార్టీకి దూరమైన తీరు వెల్లడైంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలను కుంటి సాకులతో విడిగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ద్వారా పావులు కదిపింది. ఒకేసారి మూడు రాష్ట్రాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించలేనంత బలహీనంగా ఉన్నపుడు దేశమంతటా ఒకేసారి జమిలి ఎన్నికలు పెట్టాలని ఎలా చెబుతున్నట్లు ? రాష్ట్రంలో ఇండియా కూటమి పటిష్టంగా ఉండటం, దేశమంతటా బిజెపి పూర్తి మెజారిటీని తెచ్చుకోవటంలో విఫలం కావటం, కాంగ్రెస్‌ పుంజుకున్న స్థితి, శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ విచ్చిన్నాలను ఎదుర్కొని తమ స్థానం పదిలమే అని నిరూపించుకోవటాన్ని చూశాము.ఈ పూర్వరంగంలో మరింత ఉత్సాహంతో ఇండియా కూటమి బరిలోకి దిగనుంది. సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు.లోక్‌సభ ఎన్నికలలో పోటీలో లేని వామపక్షాలు, ఇతర పార్టీలను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది.


హర్యానాతో పాటు జరిగే జమ్మూాకాశ్మీరు ఎన్నికలు బిజెపికి ఇష్టం లేకపోయినా సెప్టెంబరు 30వ తేదీలోగా జరపాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తప్పలేదు.లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రమైన స్థితి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మహబూబా మప్తి నాయకత్వంలోని పిడిపి పార్టీ మరో భాగస్వామి నేషనల్‌ కాన్ఫరెన్సు పోటీ చేసిన మూడు స్థానాల్లో పోటీకి దిగింది.జమ్మూలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. నేషనల్‌ కాన్ఫరెన్సు రెండు చోట్ల గెలుపొందగా రెండు చోట్ల బిజెపి, మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందాడు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 22.3శాతం, పిడిపికి 8.48, కాంగ్రెస్‌కు 19.38, బిజెపికి 24.36శాతం చొప్పున వచ్చాయి. వాస్తవాలను అర్ధం చేసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పిడిపి సర్దుబాటుకు వస్తుందా రాదా అన్నది చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌ తన బలాన్ని పెంచుకుంటే ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానా విషయానికి వస్తే గడచిన 2014 లోక్‌సభ ఎన్నికలలో త్రిముఖ పోటీ కారణంగా బిజెపి 34.7శాతం ఓట్లతో పదికి గాను ఏడు సీట్లు తెచ్చుకుంది.2019లో 58.21శాతం ఓట్లతో పదికి పది స్థానాలను గెలుచుకుంది.2024లో 46.11శాతంతో ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది.లోక్‌సభ తరువాత జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోటీలో బిజెపి 33.2శాతం, 2019లో 36.49 ఓట్లు తెచ్చుకుంది. మరోవైపున కాంగ్రెస్‌ 2024లోక్‌సభ ఎన్నికలలో తొమ్మిది సీట్లకు పోటీ చేసి 43.67 శాతం ఓట్లు ఐదు సీట్లు, మిత్రపక్షం ఆమ్‌ ఆద్మీ ఒక చోట 3.68ఓట్లు, కూటమిగా 47.61శాతం తెచ్చుకుంది. బిజెపి 2014లో 90కి గాను 47, తదుపరి ఎన్నికల్లో 40 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. జననాయక్‌ జనతా పార్టీ పది సీట్లు తెచ్చుకోవటంతో ఫలితాల తరువాత దానితో కలసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా లోక్‌సభ ఎన్నికల నాటికి బిజెపితో విడిపోయి పదిసీట్లకు పోటీ చేసి నామమాత్రంగా ఓట్లు తెచ్చుకుంది.అసెంబ్లీ ఎన్నికలలో ఎలా ఉండేది చూడాల్సి ఉంది. బిజెపి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లాదేశ్‌లో దాడులు : ప్రముఖ హిందూ నేతల మౌనాన్ని ప్రశ్నిస్తున్న సామాజిక మాధ్యమం ! ఇతర పార్టీల కంటే బిజెపి అదనంగా చేసిందేమిటి ?

15 Thursday Aug 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, Women, Women

≈ Leave a comment

Tags

Awami League, Bangla Hindus, BJP, coup against Sheikh Hasina, Coup In Bangladesh, CPI(M), Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన, ఆమెను దేశం నుంచి వెళ్లగొట్టిన సందర్భంగా జరిపిన హింసాకాండ గురించి, దానిలో భాగంగా అక్కడ మైనారిటీలైన హిందువులపై జరిపిన దాడుల వార్తలతో మనదేశంలో అనేక మంది ఆందోళన వెలిబుచ్చారు. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూసే బాపతు మాదిరి కొందరు ప్రయత్నించారు. ”హిందువుల ఊచకోత, మారణహౌమం ” ఇటీవలి పరిణామాలపై మన మీడియాలో వచ్చిన కొన్ని శీర్షికలివి.ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 2024 ఆగస్టు 13వ తేదీన వెబ్‌ ఎడిషన్‌లో ” బంగ్లాదేశ్‌లో హిందూ జాతి సంహారం : మతహింస క్రూరత్వ వాస్తవం ” అనే పేరుతో ఒక విశ్లేషణ చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన దాడులను మనదేశంలోని అన్ని పార్టీలు బిజెపి మాదిరే ఖండించాయి. ఖండించాల్సిందే, బంగ్లా ప్రభుత్వానికి మన ఆందోళన వెల్లడించాల్సిందే. బంగ్లా హిందువులే కాదు, పాకిస్తాన్‌లో హిందువులు, క్రైస్తవులు, శ్రీలంక హిందువులు, ముస్లిం, క్రైస్తవులు, మయన్మార్‌ రోహింగ్యాలు ఇలా ఏ దేశంలో మైనారిటీలపై దాడులు జరిగినా మానవతా పూర్వక స్పందన ఉండాల్సిందే. బంగ్లా పరిణామాలు, వాటి తీరుతెన్నులను వివరించటం, పోలికలు తేవటం, వాస్తవాలివి అని చెప్పటం అంటే దాడుల తీవ్రతను తక్కువ చేసి చూపటం కాదు. ప్రతి భాషలోనూ తీవ్రతను వెల్లడించే పద ప్రయోగాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో పోలికలు కూడా తెలిసిందే.బంగ్లాదేశ్‌ పరిణామాల సందర్భంగా హిందూత్వనేతలు, సంస్థలు ఒక పోలికను తెచ్చాయి. ఎక్కడో పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులను ఖండిస్తూ ఇక్కడ ప్రదర్శనలు జరుపుతున్నవారు మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్నదాడులకు వ్యతిరేకంగా ఎందుకు ప్రదర్శనలు చేయటం లేదు అని ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో ఊరూపేరూలేని పోస్టులతో రెచ్చగొడుతూ ప్రతికూల మనోభావాలను, ముస్లింల పట్ల విద్వేషాన్ని రేకెత్తించేందుకు చూస్తున్నారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటారు. ఈ ప్రశ్నను అడిగేవారు రెండు రకాలు. మొదటి రకం జనాలు నిజంగా పాలస్తీనా పౌరుల మీదనే కాదు, అసలు మానవత్వం మీద కూడా అభిమానం ఉన్నవారు కాదు. ఎందుకంటే వారు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ఎన్నడూ ప్రశ్నించిన వారు కాదు. రెండవ తరగతి జనాలు మొదటి తరగతి బాపతు ప్రచారానికి లోనై ప్రశ్నించేవారు. వీరిని అర్దం చేసుకోవచ్చు. మొదటి తరగతి వారు ఎన్నడైనా తమ జీవితాల్లో పాలస్తీనా వాసుల మీద జరుగుతున్న దారుణమారణకాండకు నిరసనగా అయ్యోపాపం అని ఏదైనా ప్రదర్శన సంగతి అటుంచండి కనీసం ప్రకటన అయినా చేశారా ? ఎందుకు ఈ పోలిక తెస్తున్నారు, ఇదే కాదు మనదేశంలో జరిగినట్లు చెబుతున్న ఉదంతాలకు కూడా పాలస్తీనా, ఇతర సమస్యలను జోడించి అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. ప్రతిదాన్నీ మత కళ్లద్దాలతో చూస్తే వచ్చే సమస్య ఇది.


మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత అమెరికా, బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాదులు కుట్ర చేసి పాలస్తీనా ప్రాంతంలోకి ఇతర దేశాల నుంచి యూదులను రప్పించారు. స్థానికంగా ఉన్న అరబ్బుల మీద దాడులు చేయించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను చూడాలి. వికీపీడియా సమాచారం ప్రకారం 1920 నుంచి 1948వరకు 20,631మరణాలు సంభవించాయి, ఇంకా లెక్కకు రానివి మరికొన్ని వేలు ఉన్నాయి. వీటిలో అత్యధికులు పాలస్తీనియన్లే.1948లో పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి. ఎవరికి ఏ ప్రాంతమో కేటాయించింది. నాటి నుంచి ఇజ్రాయెల్‌ ఏర్పడింది తప్ప పాలస్తీనా ఎక్కడ ? దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమక్రమంగా ఆక్రమిస్తూ అసలు పాలస్తీనా దేశాన్ని ఇంతవరకు ఉనికిలోకి రాకుండా చేసింది ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా. తమ మాతృభూమి కోసం పోరాడుతున్నవారిని వేల మందిని దురహంకారులైన యూదులు, వారికి మద్దతుగా ఉన్న మిలిటరీ హత్యలు చేస్తున్నది. అప్పటి నుంచి (1948 ) ఇప్పటి వరకు మరణించిన వారు 1,44,963 మంది, వీరిలో అరబ్బులే అత్యధికం. గతేడాది అక్టోబరు ఏడు నుంచే గాజాలో దాదాపు 40వేల మందిని బాంబులు, విమానదాడులతో ఇజ్రాయెల్‌ మిలిటరీ చంపివేసింది, వారిలో 80శాతం మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. ఆసుపత్రులను ధ్వంసం చేసిన కారణంగా, వ్యాధులు ప్రబలి మరోలక్ష మంది మరణించారు. దాడుల్లో లక్ష మందివరకు గాయపడ్డారు. లక్షలాది ఇండ్లను నేలమట్టంగావించారు. ఇరవై మూడు లక్షల మందిని నిర్వాసితులను గావించారు.మారణకాండ, జాతిహననం అంటే ఇది. ఇవి యూదులు-పాలస్తీనీయన్ల మధ్య జరుగుతున్న ఘర్షణలు కావు. ఏకపక్ష దాడులు, ఒక దేశ మిలిటరీ మరొక దేశ పౌరుల మీద జరుపుతున్న మారణకాండ. దీనికీ బంగ్లాదేశ్‌లో జరిగిన దానికి పోలిక పెట్టటాన్ని ఏమనాలి. ప్రపంచమంతా పాలస్తీనియన్లకు సంఘీభావం తెలుపుతున్నది.ఏదైనా సందర్భం వస్తే హమస్‌ జరిపిన హత్యాకాండ సంగతేమిటని బిజెపి పెద్దలు ఎదురుదాడికి దిగుతారు. సాధారణ పౌరులపై వారి డాడిని సమర్థిస్తూ మనదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా చేసిన ప్రకటనను చూపమనండి.దాడులు, ప్రతిదాడులను ఖండిస్తూ 2023 అక్టోబరు ఎనిమిదిన సిపిఐ(ఎం) ఒక ప్రకటన చేసింది. కాంగ్రెస్‌ కూడా హమస్‌దాడులను ఖండించింది. ఇంతవరకు బిజెపి లేదా ఇతర సంఘపరివార్‌ సంస్థలు గానీ గాజా మారణకాండను ఖండించాయా ? పాలస్తీనాకు మనదేశం మద్దతు ఇస్తున్నది, కానీ దానికి సంఘీభావం తెలుపకుండా కేంద్ర ప్రభుత్వం కాశ్మీరులో నిషేధాలు విధించిందని, ఇజ్రాయెల్‌, అమెరికాలను సంతుష్టీకరించిందనే అంశం ఎంత మందికి తెలుసు ?


తమ మీద దాడులు జరిపిన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ ఆగస్టు పది, పదకొండు తేదీలలో ఢాకా నగరంలో హిందువులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు.వారికి భరోసా కల్పించేందుకు తాత్కాలిక ప్రభుత్వ నేతగా ఉన్న మహమ్మద్‌ యూనస్‌ ఢాకేశ్వరి దేవాలయాన్ని సందర్శించాడు. తగినంత భద్రత కల్పించలేకపోయినందుకు క్షమించాలని హౌంమంత్రిత్వశాఖ సలహాదారు(మంత్రితో సమానం) సఖావత్‌ హుసేన్‌ ఆగస్టు12న కోరాడు. ఇలాంటి పరిస్థితి మనదేశంలో అధికారంలో ఉన్న బిజెపి నేతల నుంచి ఎన్నడైనా చూశామా ? బంగ్లాదేశ్‌ హిందువుల సంగతి పట్టదు గానీ పాలస్తీనియన్ల గురించి మాట్లాడతారంటూ బిజెపి, దాని మద్దతుదార్లు ఎదురుదాడి చేస్తున్నారు. అన్ని పార్టీలూ బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడిని ఖండించాయి.మిగతా పార్టీల మాదిరిగానే ఒక ఖండన ప్రకటన చేయటం తప్ప బిజెపి అదనంగా చేసిందేమిటి ? మణిపూర్‌ రాష్ట్రంలో మైనారిటీ మతావలంబకులుగా ఉన్న కుకీ గిరిజనులపై జరిగిన దాడులు, మహిళలపై అత్యాచార ఉదంతాల పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో చర్చ జరిగింది. సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ అని చెప్పుకుంటూ మరోవైపు హిందువుల కోసం బరాబర్‌ మేము ఏమైనా చేస్తాం, పోరాడతాం అని బిజెపి నేతలు చెబుతారు. బంగ్లాపరిణామాలపై కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు కూడా అదే సమయంలో జరిగాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగితే ఒక తీర్మానం, చర్చ పెట్టి ఖండించటానికి, వారికి సానుభూతి తెలిపేందుకు బిజెపికి ఎవరు అడ్డుపడ్డారు ? పదవీ బాధ్యతలు చేపట్టిన మహమ్మద్‌ యూనస్‌కు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు చెబుతూ పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని, హిందువులతో సహా మైనారిటీలందరికీ భద్రత, రక్షణ కల్పించాలని కోరుతూ ఆగస్టు ఎనిమిది రాత్రి ఒక ఎక్స్‌ సందేశం పంపారు.


బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగితే స్పందించరేమిటని సంఘపరివార్‌ శక్తులు అడుగుతున్నాయి. తప్పులేదు. మణిపూర్‌లో గత పదిహేను నెలలుగా స్వంత పౌరుల మధ్య జరుగుతున్న హింసాత్మక ఉదంతాల పట్ల మీ స్పందన, కార్యాచరణ ఏమిటని ఎప్పుడైనా నరేంద్రమోడీని ప్రశ్నించాయా ? మహిళలను నగంగా ఊరేగించారే ! గట్టిగా అడిగితే ఆ ఉదంతాల్లో విదేశీ, చొరబాటుదారుల హస్తం ఉందంటూ తప్పించుకుంటున్నారు. కాసేపు వాదన కోసం ఉన్నదనే అనుకుందాం. సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత, చొరబాటుదార్లను అడ్డుకొని వారి కుట్రలను ఛేదించాల్సిన పని ఎవరిది ? కేంద్ర పెద్దలదే కదా ! ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారు. ఆ బాధ్యత ఢిల్లీ పెద్ద ఇంజనుదైతే రాష్ట్రంలో పౌరుల మాన ప్రాణాలను రక్షించాల్సిన కర్తవ్యం చిన్న ఇంజనుది కాదా ? అదేమి చేస్తున్నట్లు ? ప్రభుత్వ సమాచారం ప్రకారం 2024 మే మూడవ తేదీ నాటికి ఏడాది కాలంలో జరిగిన ఘర్షణలు, దాడుల్లో క్రైస్తవ గిరిజనులు గానీ, హిందూ మెయితీలుగానీ 221 మంది మరణించారు.మరో 32 మంది జాడ తెలియటం లేదు.వెయ్యి మంది గాయపడ్డారు. 4,786 ఇండ్లను దగ్దం చేశారు.దేవాలయాలు, చర్చ్‌లు 386 ధ్వంసమయ్యాయి. అరవై వేల మంది నెలవులు తప్పారు. వారికి ఓదార్పుగా ఇంతవరకు ప్రధాని మోడీ ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. ఇంత జరుగుతుంటే బిజెపి శ్రేణులు, వారికి మద్దతు ఇచ్చే వారు గానీ మణిపూర్‌ దారుణాలకు నిరసనగా లేదా కనీసం శాంతిని కోరుతూ ఎన్నడైనా ప్రదర్శనలు చేశారా ? ఎందుకు చేయలేదు ? మతకోణంలో చూసినా మణిపూర్‌ మెయితీలు హిందువులు , ఇంతకాలం వారిని ఓట్లకోసం ఉపయోగించుకున్నారా లేదా ? బిజెపి బండారం బయట పడింది గనుకనే మెయితీలు, గిరిజనులు ఇద్దరూ బిజెపిని లోక్‌సభ ఎన్నికల్లో ఉన్న రెండు సీట్లలో ఓడించారు. అందుకే బంగ్లాదేశ్‌ హిందువుల గురించి కారుస్తున్న కన్నీళ్లు నిజమైనవి కాదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకోసం గ్లిజరీన్‌ సరకు అని ఎవరైనా అంటే తప్పేముంది.


సామాజిక మాధ్యమంలో వచ్చిన అనేక అంశాలలో సంధించిన ఒక ప్రశ్న దిగువ విధంగా ఉంది.” అత్యంత పలుకుబడి కలిగిన హిందువులు బంగ్లాదేశ్‌ గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు ” అన్నది దాని శీర్షిక. ” బంగ్లాదేశ్‌లో ఏమీ జరగటం లేదన్నట్లుగా ప్రఖ్యాతి గాంచిన వారిలో ఎక్కువ మంది ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు తెలియటం లేదు.జై శంకర్‌ నుంచి వచ్చిన ఒకటి తప్ప భారత ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. మన ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మౌనంగా ఉన్నారు, మంత్రులందరూ, ఇతర రాజకీయనేతలు గమ్మున ఉన్నారు. చివరికి జై శంకర్‌ ప్రకటనలో కూడా ”మైనారిటీ” అనే పదాన్ని ఉపయోగించారు తప్ప ”హిందువులు ” అనలేదు. వారే కాదు ఒక అధికారి, ఒక న్యాయమూర్తి, ”ప్రముఖ ” టీచర్‌, ప్రముఖులు, ఒక పారిశ్రామికవేత్త ఎవ్వరూ హిందువుల కోసం నోరు తెరవ లేదు. కొంత మంది యూట్యూబర్లు మాత్రమే గళమెత్తారు. అయితే అది చాలదు.వీరంతా హిందువులే అయినా అందరూ ఇంకా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష పార్టీల మౌనం గురిచి నేను మాట్లాడదలచుకోలేదు.ఎందుకంటే వారికి ఇప్పుడు అవకాశం లేదు. రాహుల్‌, అఖిలేష్‌,మమత, ఉద్దావ్‌ లేదా ఇతర రాజకీయనేతలు గళం విప్పుతారని నేను ఆశించను. కానీ బిజెపి ఎందుకు మౌనంగా ఉంది. మన హిందూ సోదరులు బాధలు పడుతుంటే మనమంతా మొద్దుబారిపోయామా ? ” (రెడిట్‌ డాట్‌కాం) బిజెపి మొద్దుబారలేదు, ఇలాంటి అవకాశాలు ఎప్పుడు వస్తాయా ? ఎలా సొమ్ముచేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది, చురుకుగా వ్యవహరిస్తుంది అన్న విషయం పై ప్రశ్న వేసిన వారికి తెలియదేమో !


ఇండియా టుడే పత్రిక 2024 ఆగస్టు 13న ఒక విశ్లేషణ ప్రచురించింది. షేక్‌ హసీనా ప్రభుత్వ పతనం తరువాత తలెత్తిన అరాచకంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఐదు హత్యలతో సహా రెండు వందలకు పైగా ప్రాంతాలలో దాడులు జరిగాయి. విడిగా దాడులను చూస్తే కొన్ని వందలు ఉంటాయి. అత్యాచార ఉదంతాలు కూడా జరిగాయి.దాడుల వీడియోలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తాయి. వాస్తవాల నిర్ధారకులు వాటిని ప్రశ్నించారు.బాధితుల్లో రాజకీయాలతో నిమిత్తం ఉన్నవారితో పాటు లేని వారు కూడా ఉన్నారు. ఆగస్టు ఐదు నుంచి మూడు రోజుల్లో 205ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇండ్లు, దుకాణాలపై ఎక్కువగా ఉన్నాయి, కావాలని లూటీలు, దహనాలు చేశారు.రాజకీయాల నుంచి మతాన్ని విడదీసి చూడాల్సిన అవసరం ఉంది, నిజమైన విచారణ వాస్తవాలను వెల్లడించుతుంది. సమగ్రమైన విచారణ జరపకుండా ఫలానా సంస్థ లేదా పార్టీ దీని వెనుక ఉందనే నిర్ధారణలకు రాలేము. ఇదీ ఇండియా టుడే పేర్కొన్న అంశాల సారం. మతపరమైన దాడులు ఎన్ని, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయనే అంకెలు తీవ్రతను వెల్లడిస్తాయి తప్ప ఒక్క ఉదంతమైనా తీరని నష్టం, తీవ్రంగా ఖండించాల్సిందే. అన్ని దేశాల్లో మతం, భాషా మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను బంగ్లాదేశ్‌లో మైనారిటీలు కూడా ఎదుర్కొంటున్నారు.


మన దేశంలో బిజెపి దానికి ముందు ఉన్న జనసంఘం, ఈ రెండు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి కారణంగా మైనారిటీలు దూరంగా లేదా వ్యతిరేకంగా ఉన్నారు, వారి హక్కులు, భద్రత గురించి పట్టించుకుంటున్నకారణంగా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారు.దాన్ని ముస్లిం సంతుష్టీకరణగా బిజెపి ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులు అత్యధికులు అక్కడి నేషనల్‌ అవామీలీగ్‌ పార్టీ మద్దతుదార్లుగా ఉన్నారు. ఆ పార్టీ మద్దతుదార్లలో నాలుగోవంతు వారే అని చెబుతున్నారు, అంటే అవామీలీగ్‌ను కూడా హిందువులను సంతుష్టీకరించే పార్టీగా బిజెపి చిత్రిస్తుందా ? అవామీ లీగ్‌పై దాడులు, అరాచకం చెలరేగినపుడల్లా ఆ పార్టీలో ఉన్న హిందువుల మీద కూడా జరుగుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేనివారి మీద కూడా జరిగిన దాడులను చూస్తే ముస్లిం మతోన్మాదశక్తులు ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారన్నది స్పష్టం. ఇంట్లో ఆవు మాంసం ఉంది, గోవులను వధిస్తున్నారంటూ గోరక్షకుల ముసుగులో ఉన్న మతోన్మాదులు మనదేశంలో సామూహిక దాడులకు, హత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తిమ్మినిబమ్మినిగా చూపే వీడియోలు, వాట్సాప్‌ సమాచారం మనదేశంలో కుప్పలు తెప్పలుగా సృష్టిస్తూ బుర్రలు ఖరాబు చేసే పార్టీలు, సంస్థల గురించి తెలిసిందే.బంగ్లాదేశ్‌ కూడా దీనికి మినహాయింపు కాదు. అక్కడ జరగని ఉదంతాలను జరిగినట్లు ప్రచారం చేయటంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాటిలో కొన్నింటిని మన దేశంలోనే తయారు చేస్తున్నారట, అవాంఛనీయ శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం వైరల్‌ చేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలించిన నిజ నిర్ధారకులు వాస్తవాలు కాదని తేల్చారు. దీని అర్ధం అసలు దాడులే జరగలేదు, హిందువులను నష్టపరచలేదని కానేకాదు.


మనదేశంలో ఉన్న కొన్ని సంస్థలకు చెందిన నిజ నిర్ధారకులు గతంలో అనేక తప్పుడు ప్రచారాల నిగ్గుతేల్చారు.వారికి రాజకీయ అనుబంధాలను అంటగడుతూ కాషాయ మరుగుజ్జుదళాలు జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూశాయి.మన దూరదర్శన్‌ మాదిరి జర్మనీ ప్రభుత్వ మీడియా సంస్థ డ్వట్చ్‌ విలా. దీన్ని పొట్టి రూపంలో డిడబ్ల్యు అని కూడా పిలుస్తారు. దానికి కూడా దురుద్ధేశ్యాలను ఆపాదిస్తే ఎవరూ చేసేదేమీ లేదు. వైరల్‌ కావించిన అంశాలను లక్షలాది మంది చూశారు, ఇతరులతో పంచుకున్నారు. వీటిలో బంగ్లాదేశ్‌ హిందూ క్రెకెటర్‌ లిటన్‌ దాస్‌ ఇంటిని తగుల పెట్టారు అన్నది ఒకటి. దుండగులు జరిపిన దాడుల్లో దహనం చేసిన ఆ ఇల్లు మాజీ క్రికెటర్‌ మష్రఫీ మోర్తజాది తప్ప లిటన్‌దాస్‌ది కాదు అని తేలింది. ఫొటో లిటన్‌దాస్‌ది,ఇల్లు అతనిది కాదు.మోర్తజా రాజకీయంగా హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ కార్యకలాపాల్లో పాల్గొనటం, ఇటీవలి ఎన్నికలు, అంతకు ముందు కూడా ఆ పార్టీ ఎంపీగా గెలవటం అతని ఇంటిని తగులబెట్టటానికి కారణంగా తేలింది. హిందూ మహిళలపై అత్యాచారాలు, వేధింపులు అంటూ మరోరెండు ఉదంతాలను వైరల్‌ చేశారు. అవి తాజా సంఘటనలు కాదు, వాటిని కూడా అసందర్భంగా జత చేసినట్లు తేలింది.. హిందూ మహిళ లోదుస్తులను ప్రదర్శిస్తున్న ముస్లిం పురుషుల దృశ్యాలను పోస్టు చేస్తూ హిందు బాలికల బ్రాలను తొలగించారని అత్యాచారం చేసిన తరువాత వాటిని ప్రదర్శించి తమ మగతనాన్ని ప్రదర్శించుకున్నారని వ్యాఖ్యానాలు జోడించారు.నిజానికి ఆ వీడియో దృశ్యం,దానిలో కనిపించిన దుస్తులు మాజీ ప్రధాని షేక్‌ హసీనా దేశం వదలి వెళ్లిన తరువాత ఆమె నివాసంలో ప్రవేశించిన వారు చేసిన అరాచకంలో భాగం, అవి మీడియాలో ప్రచురించిన, టీవీలలో చూపించినవిగా తేలింది. అత్యాచారానికి గురైన హిందూ మహిళంటూ వైరల్‌ ఆయిన ఫొటోల బండారాన్ని కూడా జర్మన్‌ టీవీ బయటపెట్టింది. వాటిలో ఒక చిత్రంలో ఉన్న మహిళ 2023లో మణిపూర్‌లో హిందూ పురుషులు అపహరించి, సామూహిక అత్యాచారం చేసిన ఒక క్రైస్తవ యువతిగా తేలింది. మరొక చిత్రం 2021లో ఇండోనేషియాలో వైరల్‌ అయింది. ఐదుగురు బంగ్లాదేశీయులు ఇండోనేషియా వలస మహిళను చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసినట్లు దానిలో పేర్కొన్నారు. దాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలపై అత్యాచారంగా చిత్రించారు. మరొక వీడియో అత్యాచారం చేసినట్లుగా వైరల్‌ అయింది. అది బెంగలూర్‌ రామ్మూర్తినగర్‌లో 2021వ సంవత్సరం మే నెలలో జరిగిన అత్యాచార ఉదంతంలో ముగ్గురు మహిళలతో సహా పన్నెండు మంది బంగ్లా జాతీయులను అరెస్టు చేసిన వీడియోగా మన దేశానికి చెందిన వెబ్‌సైట్‌ బూమ్‌ తేల్చింది. ఇలా సామాజిక మాధ్యమంలో తిప్పుతున్న వీడియో, ఫొటోలను గుడ్డిగా నమ్మించి భావోద్రేకాలను రెచ్చగొట్టేందుకు పనిగట్టుకు చేస్తున్నవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు వాదనలపై హేతుబద్దంగా ఆలోచించాలి. ఎవరు దాడులకు పాల్పడినా ఖండించాలి, నిరసించాలి. దానికి సరిహద్దులు ఎల్లలూ ఉండనవసరం లేదు. మతం కళ్లద్దాలు తొలగించి మానవత్వ అద్దాలను పెట్టుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎస్‌సి,ఎస్‌టి వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు : కేంద్ర సర్వీసులు, ఓబిసి మాటేమిటి ? ఇరకాటంలో నరేంద్రమోడీ !

03 Saturday Aug 2024

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, tdp, TDP, Telangana

≈ Leave a comment

Tags

BJP, Caste Reservation, CHANDRABABU, Narendra Modi Failures, OBC sub-categorisation, Revanth Reddy, Rohini Commission, SC/ST sub-quota, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


దళితులు, గిరిజనుల్లో సామాజిక న్యాయం జరిగేందుకు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్లలో ఆయా తరగతుల వర్గీకరణ జరిపి వాటాలను నిర్ణయించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు దశాబ్దాలుగా నడుస్తున్న ఒక అంకానికి తెరదించింది.మరో దానికి నాంది పలికింది.దీని కోసం ఎదురు చూసిన వారు ఆనందంతో ఉండగా వ్యతిరేకించిన వారు విచారంలో మునిగిపోయారు. ఈ రెండు భావనలూ వాస్తవమే అయినా తాత్కాలికమే.అంటరానితనంతో సహా మొత్తంగా జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం జరపాలని కోరుకుంటున్నవారి ప్రయత్నాలకు కాస్త ఇబ్బందే. ప్రతి అస్తిత్వ భావన ఎంతో కొంత చెరపు చేస్తుంది. రాష్ట్రాలలో వర్గీకరణ గురించి ఒక స్పష్టత వచ్చింది. మరి కేరద్ర సర్వీసులు, ప్రభుత్వరంగ సంస్థలు, బాంకులు, ఎల్‌ఐసి వంటి ఆర్థిక, విత్త సంస్థలలో దళితులు, గిరిజనులతో పాటు ఓబిసి వర్గీకరణ మాటేమిటి అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. అభివృద్ధి జరగాలంటే రెండు ఇంజన్ల పాలన ఉండాలన్న నినాదాన్ని ముందుకు తెచ్చిన పెద్దలు కేంద్రం గురించి కొన్ని రాష్ట్రాలలో వర్గీకరణ ఘనత మాదే అంటున్నారు, కొన్ని చోట్ల మౌనంగా ఉంటున్నారు, తమ ముందున్న అంశాల గురించి మాట్లాడరేం ? వర్గీకరణ సమస్యను ముందుకు తెచ్చిన వారు కూడా రాష్ట్రాల గురించి తప్ప కేంద్ర అంశాన్ని ప్రస్తావించకపోవటం వెనుక ఉన్న కారణం ఏమిటి ?


నిచ్చెన మెట్ల సమాజం మనది. అసమానతలు, దారిద్య్రం, ఉపాధి రంగాలలో నెలకొన్న దుస్థితికి ఎక్కడా లేని అంటరానితనం అనే సామాజిక వివక్ష కారణంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఉపశమనం తప్ప శాశ్వత నివారణ కాదు. వాటిని కూడా కొంత మందే పొందుతున్నారు అన్న అసంతృప్తి నుంచి ముందుకు వచ్చిందే వర్గీకరణ. అది న్యాయసమ్మతమే కనుక ఎక్కువ మంది ఆమోదం పొందింది. గతంలో సంస్థానాధీశులు, జమిందార్లు, భూస్వాములు భూమి వదులుకొనేందుకు సిద్దం కాలేదు. అలాగే రిజర్వేషన్ల వలన లబ్దిపొందిన కొన్ని తరాలు కూడా అదే కోవకు చేరి వర్గీకరణను వ్యతిరేకించిన ఫలితమే కోర్టుల జోక్యం. ఇవి చిన్నయ్య-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వివాదంలో వర్గీకరణ చెల్లదని 2004లో సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌ ఇచ్చిన తీర్పును చెల్లదని, పంజాబ్‌, హర్యానా హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సమీక్షించి వర్గీకరణ సబబే అని తాజాగా ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6-1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా సదరు వర్గీకరణ ఎలా ఉండాలో కూడా న్యాయమూర్తులు చెప్పారు. రాష్ట్రాలు వాటిని ఎలా తమ చట్టాలలో పొందుపరుస్తాయో చూడాల్సి ఉంది. అవి కోర్టుల సమీక్షకు లోబడి ఉండాలని, రాజకీయ దుర్వినియోగం చేయకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. గతంలో క్రీమీ లేయర్‌ (మెరుగైన ఆర్థిక స్థితి) ఓబిసిలకు మాత్రమే వర్తింప చేశారని ఇప్పుడు ఎస్‌సి, ఎస్‌టిలకూ అమలు చేయవచ్చని కూడా పేర్కొన్నది. దళితుల ఉపకులాలైన వాల్మీకులు, మజాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు అమలు జరపాలన్న ఆ రాష్ట్ర చట్టాన్ని 2004 సుప్రీం కోర్టు తీర్పు ప్రాతిపదికన 2010లో పంజాబ్‌-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. దళితులంటే అందరూ ఒకటే అని వారిని విడదీయ కూడదని చెప్పింది. తాజా తీర్పు ఆ వైఖరి తప్పు అని పంజాబ్‌లో చేసిన చట్టం సరైనదే అని చెప్పింది. ఇప్పటి వరకు ఈ అంశాన్ని ఉపయోగించుకొని రాజకీయ పక్షాలు లబ్ది పొందేందుకు చూసినందున పార్టీలపై కచ్చితంగా ఈ తీర్పు ప్రభావం పడనుంది, అదెలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. ప్రతిదాన్నీ రాజకీయం చేసేందుకు చూస్తున్న తరుణమిది.


దళితుల వర్గీకరణ డిమాండ్‌ అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు.కులాల పేర్లు ప్రస్తావించకూడదని అనుకున్నప్పటికీ సందర్భవశాత్తూ తప్పటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాదిగ సామాజిక తరగతి వర్గీకరణను కోరుతుండగా, పంజాబ్‌లో అదే తరగతి వ్యతిరేకిస్తున్నది. రిజర్వేషన్ల వలన లబ్దిపొందిన కొన్ని కులాల వారు తమకు అవకాశాలు తగ్గిపోయాయనే భావనతో వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు.ఇది మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు కాదు. వర్గీకరణ అనుకూల, వ్యతిరేక భావనలకు పంజాబులో నాంది పలికారు. అకాలీదళ్‌ తన పలుకుబడిని పెంచుకొనేందుకు దళితుల్లో వెనుకబడిన వాల్మీకులు, మజాబీ సిక్కులకు అన్యాయం జరిగిందంటూ వారిని సమీకరించేందుకు పూనుకుంది.దాన్ని ఎదుర్కొనేందుకు 1975 మే ఐదున కాంగ్రెస్‌ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్న జ్ఞానీ జైల్‌ సింగ్‌ రిజర్వేషన్ల తురుపుముక్కను ప్రయోగించారు.ప్రభుత్వ శాఖలలో వీలైన మేరకు ఈ రెండు సామాజిక తరగతుల వారికి 50శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని ఆదేశించారు.దీంతో అప్పటికే గణనీయంగా లబ్దిపొందిన మాదిగ సామాజిక తరగతి అవకాశాలు తగ్గిపోయాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పంజాబ్‌ జనాభాలో 32శాతం మంది దళితులు ఉన్నారు.రాష్ట్రం వర్గీకరణ అమలు చేస్తున్నప్పటికీ వాల్మీకులు, మజబీల పరిస్థితి పెద్దగా మెరుగుపడిందేమీ లేదు.వర్గీకరణ లేని కారణంగా కేంద్ర సర్వీసులలో వారు తగిన ప్రాతినిధ్యం పొందలేకపోయారు. 2004 ఆంధ్రప్రదేశ్‌ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అక్కడ కూడా సదరు అంశాన్ని సవాలు చేశారు. హైకోర్టు వర్గీకరణను రద్దు చేసింది. అక్కడి పరిస్థితి గురించి 2007లో వర్గీకరణ సమస్య మీద ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 105 మంది ఐఎఎస్‌లలో పంజాబు దళితుల్లో 42శాతం మంది ఉన్న వాల్మీకులు, మజాబీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆది ధర్మీస్‌గా పిలిచే సామాజిక తరగతి తోలు వృత్తిలో ఉన్న దళితులు ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన స్థితిలో ఉన్నారు. కారణం బ్రిటీష్‌ భారత సైన్యంలో ఉన్న వారికి అవసరమైన బూట్ల తయారీలో వారు నిమగం కావటంతో దానికి పరిమితంగానైనా చదువు సంధ్యలు అవసరం కావటం, ఆర్థిక స్థితి మెరుగై రిజర్వేషన్‌ అవకాశాలను కూడా ఎక్కువగా అందిపుచ్చుకున్నారు. వ్యవసాయ కార్మికులుగా, పట్టణాలలో పారిశుధ్య కార్మికులుగా ఉన్న దళితులకు చదువుతో అవసరం లేకపోయింది. హర్యానాలో 1994లో దళితులను ఏ-బి తరగతులుగా విభజించి తోలు వృత్తి చేసేవారికి 50శాతం ఇతరులకు మిగతా సగం రిజర్వేషన్లు కల్పించారు.తోలు వృత్తి చేసేవారు ఎక్కువగా లబ్ది పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ గురించి అధ్యయనం చేసిన ఉషా మెహ్రా కమిషన్‌ 2008 నివేదిక నాలుగు ఉపతరగతులుగా రిజర్వేషన్లు అమలు జరపాలని సిఫార్సు చేసింది. దళితుల్లో ముందున్న మాలలు ఐఎఎస్‌, ఐపిఎస్‌ ఎంపికల్లో 76, 86శాతం మంది ఉండగా మాదిగలు 23, 13శాతాల చొప్పున ఉన్నట్లు పేర్కొన్నది.దళిత జనాభాలో మాలలు 41శాతం కాగా మాదిగలు 49శాతం ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో దాదాపు ఇలాంటి పరిస్థితి ఉన్నది.


దళితులు, వెనుకబడిన తరగతులలో కొందరు అన్యాయానికి, విస్మరణకు గురౌతున్నారంటూ బిజెపి వారిని తన ఓటుబాంకుగా మార్చుకొనేందుకు పావులు కదిపింది. దానిలో భాగంగానే ఒబిసిల వర్గీకరణ పరిశీలనకు 2017లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. తన నివేదికను 2023జూలై 31న రాష్ట్రపతికి అందచేసింది. నరేంద్రమోడీ ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు.దానిలో ఉన్న అంశాలు వెల్లడైనా, కేంద్ర ప్రభుత్వం వాటి గురించి అభిప్రాయం వెల్లడించినా లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే రాజకీయ కారణంతో ఆ నివేదికను అటకెక్కించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎందుకు తెప్పించుకోలేదన్నది ప్రశ్న. రాజకీయ కారణాలతోనే కమిషన్‌ గడువును పదమూడు సార్లు పొడిగించారు. ఏడాది గడుస్తున్నా దేశ ప్రధమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఎందుకు కేంద్రానికి పంపలేదు, ఎంతకాలం తన దగ్గర ఉంచుకుంటారన్నది ఆసక్తి కలిగించే అంశం. ఆ నివేదికను కేంద్రం తిరస్కరిస్తే వేరు, ఆమోదిస్తే పార్లమెంటుకు సమర్పించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి.వేగంగా పనిచేస్తామని చెప్పుకుంటున్న నరేంద్రమోడీకి ఇది ఒక సవాలే. నివేదికలోని అంశాలపై మీడియాలో తిరుగుతున్న లీకు సమాచారం ప్రకారం ఓబిసిలలో ఐదు నుంచి ఆరువేల ఉపతరగతులు ఉన్నారని, వారి జనాభాలో కేవలం ఒకశాతంగా ఉన్న 40 కులాలవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో 50శాతం మేరకు రిజర్వేషన్‌ లబ్దిపొందుతున్నట్లు తేలిందట. ఈ నివేదికను తెరవటం అంటే వెంటనే వచ్చే అంశం వెనుకబడిన తరగుతుల జన గణన. దాన్ని రాష్ట్రాలు చేపట్టవచ్చునని బిజెపి తప్పించుకుంటున్నది, ఇంతవరకు ఆ పార్టీ పాలిత రాష్ట్రాలు బుల్డోజర్లు, మత విభజన మీద చూపుతున్న శ్రద్దలో నూరోవంతు కూడా అందుకు చొరవచూపలేదు. దాన్ని బట్టే ఆ పార్టీ చిత్తశుద్ది వెల్లడైంది, ఒక రాష్ట్రంలో బిసిగా ఉన్న వారు మరొక రాష్ట్రంలో ఓసిగానో, కొన్ని చోట్ల దళితులు, గిరిజనులుగానో ఉన్న ఉదంతాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అందువలన రాష్ట్రాలు తీసిన జనాభా లెక్కలను కేంద్రం ఆమోదిస్తుందా అన్నది ప్రశ్న. కేంద్రమే నిర్వహించినా అదే సమస్య ఎదురు కావచ్చు, రెండవది జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం నిర్ణయించాలనే డిమాండ్‌కు దారి తీసే అవకాశం కూడా ఉంది.1953లో ఏర్పాటు చేసిన కాకా కలేల్‌కర్‌ తొలి కమిషన్‌ బిసిలను వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరుగతులు అనే రెండుగా వర్గీకరించాలని సిఫార్సు చేసింది. మండల్‌ కమిషన్‌లోని సభ్యుడైన ఎల్‌ఆర్‌ నాయక్‌ అణచివేతకు గురైన బిసిలు, మధ్యస్థంగా ఉన్నవారు అనే రెండు ఉపతరగతులుగా విభజించాలని ప్రతిపాదించారు. రోహిణీ కమిషన్‌ నిర్దిష్టంగా ఏమి చెప్పిందో తెలియదు.


చరిత్ర, ఆచరణను చూసినపుడు ఒకే సామాజిక తరగతిగా భావించబడుతున్న కొన్ని కులాల గుంపులో అన్నీ ఒకటిగా లేవన్నది తెలిసిందే.సాధారణ తరగతిగా పరిగణిస్తున్న బ్రాహ్మలలో అధికార వ్యవస్థతో సంబంధాలు కలిగి ఉన్న వారికి-పూజా పునస్కారాలకు పరిమితమైన వారికి ఎంత తేడా ఉన్నదో చూస్తున్నాము. అదే విధంగా మరికొన్ని ఇతర తరగతుల్లో ఆస్తిపాస్తులు ఉన్నవారికి లేని వారికీ చివరికి ఒకే కులంలో ఉన్నవారిలో గల తేడా ఏమిటో తెలిసిందే.దళితులు, గిరిజనుల్లో కూడా అంతే.వర్గీకరణను వ్యతిరేకించేవారు, అనుకూలించే వారు గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న వాదనలు తెలిసినవే. ఇప్పుడు వాటికి తెరపడింది. వర్గీకరణ జరిపినా ఈ తరగతులకు పూర్తిగా సామాజిక న్యాయం అమలు కాదు. సుప్రీం తీర్పును అమలు జరిపేందుకు అవసరమైన సమాచారాన్ని. సాక్ష్యాలను సేకరించకుండా తొందరపడి చేస్తే కోర్టు లిటిగేషన్లో చిక్కుకోవచ్చు.జనాభా లెక్కలు, ఇతర అంశాలను నవీకరించాల్సి ఉంది. దీనికి మానవ వనరులు, నిధులు కూడా అవసరమే. అందువలన వెంటనే అమలు జరపటం సాధ్యమా కాదా అన్నది కూడా చూడాల్సి ఉంది.ఓబిసి వర్గీకరణ, కేంద్ర సర్వీసుల్లో దళితులు, గిరిజనుల వర్గీకరణను బిజెపి అమలు చేస్తుందా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల పంపుసెట్లకు మీటర్ల ఒప్పందం నిజమేనా : బిజెపి మద్దతు ! వ్యతిరేకించిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ రద్దు చేస్తాయా ?

30 Tuesday Jul 2024

Posted by raomk in AP, BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, tdp, TDP, Telangana, Ycp

≈ Leave a comment

Tags

A Revanth Reddy, BJP, BRS, CHANDRABABU, Electricity Act (2003), KCR, meters for agriculture pump sets, Narendra Modi Failures, UDAY sceam


ఎం కోటేశ్వరరావు


విద్యుత్‌ వినియోగదారులందరికీ స్మార్ట్‌ మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి చేసిన ప్రకటన, సభకు చూపిన పత్రాలు వివాదాస్పదమయ్యాయి.తాము వ్యవసాయ పంపుసెట్లకు తప్ప మిగిలిన వాటికి మాత్రమే స్మార్టు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకున్నామని, ఆ విషయాన్ని దాచి తమపై అవాస్తవాలు చెప్పారని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెడుతున్నారు. పంపిణీ ట్రాన్స్‌ఫర్లకు మీటర్లు పెడతామని అంగీకరించారని, రైతులకు కూడా అక్కడి నుంచే సరఫరా జరుగుతుంది గనుక వ్యవసాయ సరఫరాకూ మీటర్లు పెట్టేందుకు సమ్మతించినట్లే కదా అని కాంగ్రెస్‌ చెబుతోంది. ఒప్పంద పత్రాలను జనాలకు అందుబాటులో ఉంచితే నిజానిజాలేమిటో అందరికీ సుబోధకం అవుతుంది.2017లో కుదుర్చుకున్న ఒప్పందంలో ఏమి ఉంది అన్నది పక్కన పెడితే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పంపుసెట్లకు మీటర్లు పెట్టలేదన్నది వాస్తవం. అందువలన నిజంగా వ్యవసాయ పంపుసెట్లకు తప్ప అనే పదం ఒప్పందంలో ఉందా లేదా అన్నది ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది.


ఇప్పటికే విద్యుత్‌ మీటర్లు ఉన్నాయి కదా స్మార్ట్‌ మీటర్లంటే ఏమిటని ఎవరికైనా సందేహం రావచ్చు.ప్రయివేటీకరించే రంగాలలో విద్యుత్‌ పంపిణీ కూడా ఒకటి. సెల్‌ఫోన్లకు రెండు పథకాలు ఉన్నాయి. ఒకటి ముందుగానే డబ్బు చెల్లించేది, రెండవది తరువాత బిల్లు కట్టేది. విద్యుత్‌ రంగంలో స్మార్టు మీటర్లు అంటే ముందుగా సొమ్ము చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయాలి. ఆ మేరకు వినియోగించగానే సరఫరా ఆగిపోతుంది. వాడకం తరువాత బిల్లు చెల్లించే పథకాలనూ పెట్టవచ్చు. అసలు ఈ విధానం ఎందుకు, చెప్పిన కారణాలేమిటి ? వినియోగించే ప్రతి యూనిట్‌కూ లెక్కతేలాలని, మీటర్లు లేకుండా వినియోగించేవారిని నిరోధించేందుకు, ఖర్చు మొత్తం వినియోగదారుల నుంచి రాబట్టేందుకు అని చెప్పారు. ప్రయివేటీకరించిన తరువాత కొనుగోలు చేసిన కార్పొరేట్‌ సంస్థకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం ఒకటైతే, ముందుగానే చెల్లించే జనం సొమ్ముతో పెట్టుబడి పెద్దగా లేకుండా సదరు సంస్థలకు లాభాలు అప్పగించే మహత్తర ఆలోచన దీనివెనుక ఉంది. వినియోగదారులు చెల్లించే మొత్తాలనే జన్‌కోలకు చెల్లిస్తారు. ఇతర ఖర్చులకూ వినియోగిస్తారు.ప్రస్తుతం రైతాంగానికి కొన్ని రాష్ట్రాలలో ఉచితంగా అందచేస్తున్నారు, కొందరికి సబ్సిడీలు ఇస్తున్నారు. స్మార్టు మీటర్లు పెడితే అందరూ ముందుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయాలి. ఎలా అంటే గతంలో వంటగ్యాస్‌కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించి చెల్లిస్తే సిలిండర్లు ఇచ్చేవారు. ఇటీవల దాన్ని మార్చి ముందుగా మొత్తం చెల్లించేట్లు చేశారు. తరువాత సబ్సిడీ మొత్తం వారి బాంకు ఖాతాలలో జమ చేస్తున్నారు. విద్యుత్‌కూ అంతే చేయనున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తే వినియోగదారులకు బదలాయిస్తారు. చేతులేత్తేసినా చేసేదేమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు పంపిణీ సంస్థలకు సబ్సిడీ సొమ్మును నెలల తరబడి చెల్లించటం లేదు, ప్రభుత్వ శాఖలు బిల్లులు చెల్లించకుండానే వాడుతున్నాయి. దీంతో పంపిణీ సంస్థ(డిస్కామ్‌లు)లు అప్పుల పాలవుతున్నాయి.ప్రైవేటీకరిస్తే వాటిని కొనుగోలు చేసే సంస్థలు ముందుకు రావు. అందుకే రుణాలు లేకుండా చూసేందుకు విధానపరంగా ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.


దానిలో భాగంగానే నరేంద్రమోడీ సర్కార్‌ అధికారంలోకి రాగానే 2015లో ఉజ్వల డిస్కామ్‌ అస్యూరెన్సు యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది.దీని పొట్టి రూపమే ”ఉదరు”. తొలుత ప్రకటించినదాని ప్రకారం 2018-19 నాటికి విద్యుత్‌ ప్రసార నష్టాలను 22 నుంచి 15శాతానికి తగ్గించాలి.విద్యుత్‌ కొనుగోలు,సరఫరా, ప్రసారానికి అయ్యే ఖర్చును పూర్తిగా వినియోగదారుల నుంచి రాబట్టాలి. ఇందుకు గాను స్మార్ట్‌ మీటర్లను విధిగా పెట్టించి నిర్వహణా సామర్ధ్యాన్ని మెరుగుపరచాలి. పొదుపు చర్యల్లో భాగంగా ఎల్‌ఇడి బల్బులను ప్రోత్సహించాలి, ఇదే మాదిరి వ్యవసాయ పంపుసెట్లు, ఫ్యాన్లు, ఎయిర్‌ కండీషనర్లను ప్రోత్సహించాలి. విద్యుత్‌ ఖర్చు, వడ్డీ భారాన్ని, నష్టాలను తగ్గించాలి.సరసమైన ధరలకు విద్యుత్‌ను అందించాలి. ఇలాంటి చర్యలను చేపట్టిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించాలి.ఇది ఘోరంగా విఫలం కావటంతో తొలుత ప్రకటించిన లక్ష్యాలను కొన్నింటిని 2021జూన్‌లో సవరించారు. వాటి ప్రకారం ప్రైవేటు రంగంలో ఉన్న పంపిణీ సంస్థలు తప్ప ప్రభుత్వ రంగంలో ఉన్నవాటి ఆర్థిక, నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచాలి.మౌలిక సదుపాయాల పటిష్టతకు ఆర్థిక సాయం చేసేందుకు కొన్ని షరతులను విధించాలి.ప్రసార నష్టాలను 2024-25నాటికి 12-15శాతానికి తగ్గించాలి. సరఫరా ఖర్చును పూర్తిగా వినియోగదారుల నుంచి వసూలు చేయాలి, ఆధునిక పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.పైన చెప్పుకున్న స్మార్ట్‌ మీటర్ల కథ ఈ పధకంలో భాగమే. ఆంధ్రప్రదేశ్‌లో అందిన కాడికి అప్పులు చేసిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సర్కార్‌ వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టేందుకు అంగీకరించి ఎఫ్‌ఆర్‌బిఎం అర్హతకు మించి అదనంగా 0.5 అప్పులు తెచ్చుకొనే ” ప్రోత్సాహాన్ని ” పొందింది. తెలంగాణాలో విద్యుత్‌ మోటార్లు ఎక్కువగా ఉన్నందున అంగీకరిస్తే రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తుంది గనుక బిఆర్‌ఎస్‌ సర్కార్‌ వాటి జోలికి పోకుండా పంపిణీ ట్రాన్సఫార్మర్లకు మీటర్లు పెట్టి లెక్క తేలుస్తామని, ఇతర వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకుంది.


రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు, పార్టీలు అధికారంలోకి వచ్చాయి. స్మార్టు మీటర్లను రెండచోట్లా బిజెపి సమర్ధించింది, ఇప్పటికీ సమర్ధిస్తున్నది. ఈ విషయంలో బిఆర్‌ఎస్‌, వైసిపి విధానాలకు మద్దతు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం వ్యతిరేకించింది. ఇప్పుడు అదే బిజెపితో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసిపి తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తామని గానీ, కొనసాగిస్తామనీ ఇంతవరకు స్పష్టం చేయలేదు.తెలంగాణాలో వ్యతిరేకించిన కాంగ్రెస్‌దీ ఇప్పుడు అదే పరిస్థితి. అమలు చేయకపోతే పంపిణీ సంస్థలపై కేంద్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతోంది తప్ప, స్మార్టు మీటర్లు పెట్టేదీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఏం చేస్తారో చూడాలి.మరోవైపు విద్యుత్‌ సంస్కరణలను అమలు జరిపి తీరుతామని బిజెపి గట్టిగా చెబుతోంది. పంపిణీ సంస్థలు అప్పుల్లో కూరుకుపోవటం గురించి రాజకీయపరమైన దాడి చేస్తున్నది. అనేక రాష్ట్రాలలో అంగీకరించినందున రెండు తెలుగు రాష్ట్రాలలో ఎందుకు వ్యతిరేకించాలని బిజెపి అంటున్నది. ఇది అసంబద్ద వాదన. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అధారిటీ (సిఇఏ) కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాని నివేదిక 2023 ప్రకారం 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక,తెలంగాణా, పంజాబ్‌ రాష్ట్రాలు మాత్రమే రైతాంగానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నాయి. మీటర్లు లేకుండా పంపుసెట్ల సామర్ధ్యాన్ని బట్టి మరో ఎనిమిది రాష్ట్రాలు రేట్లు నిర్ణయించాయి. ఒక హార్స్‌ పవర్‌కు బీహార్‌లో నెలకు రు.800, గుజరాత్‌లో రు.200, హర్యానాలో పదిహేను హెచ్‌పి వరకు రు.12, అంతకు మించితే రు.15, కాశ్మీరులో పది హెచ్‌పి వరకు రు.205, 11 నుంచి 20కి రు.222, ఇరవై మించితే రు.1,415, మహారాష్ట్రలో జోన్లు, హార్స్‌పవర్‌ ప్రాతిపదికన గరిష్టంగా రు.422 నుంచి కనిష్టంగా రు.265వరకు, పంజాబ్‌లో ప్రభుత్వ సబ్సిడీ లేని పంపుసెట్లకు రు.419, రాజస్తాన్‌లో రు.775, 955 చొప్పున రెండు తరగతులుగా, ఉత్తర ప్రదేశ్‌లో రైతాంగానికి రు.170( లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం దీన్ని రద్దు చేశారు, రు.1,500 కోట్లు సబ్సిడికి కేటాయించినట్లు ప్రకటించారు.), ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ నిర్వహణలో ఉన్న పంపుసెట్లకు 100 హెచ్‌పివరకు రు.3,300 వసూలు చేస్తున్నారు. అందువలన ఈ రాష్ట్రాలలో మీటర్లు పెట్టినందున రైతులకు జరిగే నష్టం లేదు, ఎలాగూ సొమ్ము చెల్లిస్తున్నారు. అందువలన అవి అంగీకరించాయంటే వేరు, ఉచితంగా ఇచ్చే వాటి సమస్య వేరు. అయితే మీటర్లు పెట్టి ఇప్పుడు చెల్లిస్తున్నదానికంటే అదనపు భారం మోపితే వచ్చే వ్యతిరేకతను అక్కడి పార్టీలు అనుభవించాల్సి ఉంటుంది.


ఇక పంపిణీ సంస్థల నిర్వహణ ఇతర పార్టీల ఏలుబడి ఉన్న చోట కంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏమైనా మెరుగ్గా ఉందా ?బిజెపి వారు తెలంగాణాలో తరచూ హైదరాబాదు పాత బస్తీలో విద్యుత్‌ చౌర్యం గురించి చెబుతూ ఉంటారు. అక్కడ ఉన్నవారిలో ఒక్క ముస్లింలే విద్యుత్‌ను అక్రమంగా వాడుతున్నట్లు ? హిందువులుగా ఉన్నవారు దేశం కోసం ధర్మం కోసం నిజాయితీగా ఉన్నట్లు చిత్రిస్తున్నారు.అవకాశం ఉంటే చౌర్యంలో ఎవరూ తక్కువ కాదు, వివిధ సందర్భాలలో లైన్ల మీద కొక్కేలు వేసేవారందరూ చోరులే. ఇతర చోట్ల, ఇతర రాష్ట్రాలలో ఇలాంటి ఆక్రమాలు, మీటర్లు తిరగకుండా చేస్తున్నవారు లేరా ? స్వయంగా ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌ను చూద్దాం. హైదరాబాద్‌ పాతబస్తీలో విద్యుత్‌ చౌర్యం జరుగుతోందని బిజెపి ఆరోపిస్తున్న, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న తెలంగాణాలో డిస్కామ్‌ల రుణం రు.62వేల కోట్లు దాటింది. ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడేవారి మీద ప్రయోగానికి అక్కడ యోగి బుల్డోజర్లు సిద్దంగా ఉంటాయి, రెండింజన్ల పాలన. రెండు దశల్లో ఉదరు పథకాన్ని అమలు జరిపిన తరువాత చూస్తే పంపిణీ సంస్థల నష్టాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు.జూలై నెలలో పదహారవ ఆర్థిక సంఘానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సమర్పించిన పత్రంలో 2022-23సంవత్సరం నాటికే దేశంలో అన్ని పంపిణీ సంస్థలకు పేరుకు పోయిన నష్టాల మొత్తం రు.6.77లక్షల కోట్లు, వీటిలో సమర్దవంతమైన పాలన సాగిస్తున్నట్లు చెబుతున్న యోగి ఏలుబడిలో ఉత్తర ప్రదేశ్‌ వాటా పదిహేనుశాతం అంటే లక్ష కోట్లు దాటింది, ఈ నష్టాలు సగటున ఏటా పదిశాతం పెరుగుతున్నట్లు చెబుతున్నందున మరుసటి ఏడాదిలో మరో పదివేల కోట్లు అదనం, రాజస్తాన్‌ వాటా కూడా పదిహేనుశాతం, మరోబిజెపి పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో పదిశాతం నష్టాలు ఉన్నాయి.తెలంగాణాలో కూడా పదిశాతం ఉన్నాయి. వినియోగదారుల మీద భారాలు మోపటానికి బదులు గడచిన పదేండ్లుగా విద్యుత్‌ ప్రసార నష్టాలను తగ్గించేందుకు కేంద్రం పూనుకొని ఉంటే ఎంతో మేలు జరిగేది. మోడీ సర్కార్‌ దాని మీద కేంద్రీకరించి ఉంటే ఈ పాటికి ఎంతో మేలు జరిగి ఉండేది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న 2014 వివరాల ప్రకారం మనదేశంలో ఆ నష్టాలు 19.33శాతం ఉంటే బంగ్లాదేశ్‌లో 11.4, శ్రీలంకలో 11 పాకిస్తాన్‌లో 17.14 శాతం ఉండగా చైనాలో 5.47శాతం ఉంది.ప్రపంచంలోని 138దేశాల సూచికలో మనం 25వ స్థానంలో ఉండగా చైనా 119వదిగా ఉంది. అందువలన ఈ విఫల పధకం గురించి కాంగ్రెస్‌-బిఆర్‌ఎస్‌ దెబ్బలాడుకుంటే ప్రయోజనం లేదు.వినియోగదారుల మీద భారాలు మోపటాన్ని సమర్ధిస్తున్న బిజెపిని ఎండగడుతూ విధానాన్ని వ్యతిరేకించేందుకు పూనుకోవాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోలవరంలో మునిగి తేలుతున్న చంద్రబాబు : బీహార్‌కు అధిక కేటాయింపుల వెనుక అసలు కథేంటి ?

26 Friday Jul 2024

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, tdp, TDP

≈ Leave a comment

Tags

Amaravathi capital, BJP, BJP-JDU, CHANDRABABU, Narendra Modi, Nirmala Sitaraman stimulus package, Nithish Kumar


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికార యంత్రాంగం సహకరించటం లేదా ? ఆర్థిక ఇబ్బందుల ఆత్రంతో చేయాల్సింది చేయటం లేదా ? రాజకీయంగా నరేంద్రమోడీ చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారా ? మొత్తం మీద ఏదో జరుగుతోంది. నీతి ఆయోగ్‌ సమావేశాలకు వెళ్లిన సందర్భంగా మరోసారి సిఎం కేంద్ర మంత్రులను కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్‌ పెట్టక ముందు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పర్యటన జరిపి అనేక అంశాలను కేంద్రానికి నివేదించారు. ఎన్నికలకు ముందు బిజెపి పెద్దలు చెప్పింది ఒకటి తరువాత చేస్తున్నది ఒకటి అన్న సంగతి అమరావతికి అప్పు ఇప్పిస్తామనటంలోనే వెల్లడైంది. బయటకు చెప్పుకోలేక చంద్రబాబు అదియును మంచిదే అన్నారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి మాత్రమే తెలుసు. కేంద్రం ఇచ్చేదేమిటో చంద్రబాబుకు ముందే తెలుసు గనుకనే వచ్చేదేమీ ఉండదని బడ్జెట్‌ను రెండునెలలు వాయిదా వేసుకున్నారు. బడ్జెట్‌ కేటాయింపులు చూసిన తరువాత అది వాస్తవమని తేలింది. అసలేమీలేని దానికంటే పదే పదే రాష్ట్రం పేరును ప్రస్తావించటాన్ని చూసి కడుపు నింపుకున్న వారు కొందరు ఉన్నారు. అమరావతికి గ్రాంటు బదులు అప్పు ఇప్పిస్తామంటే పండగ చేసుకున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామంటే ఆహా ఓహౌ అన్నారు. కానీ ఆకస్మికంగా ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు పోలవరం గురించి చర్చించి ఒక తీర్మానాన్ని ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. బడ్జెట్‌కు ముందు జరిగిన కాబినెట్‌లో ఆ తీర్మానాన్ని ఎందుకు చేయలేదు ? దాని అవసరం గురించి అధికార యంత్రాంగం తప్పుదారి పట్టించిందా ? ఇంతకూ ఏమిటా తీర్మానం ?


పోలవరం ప్రాజక్టు డయాఫ్రం వాల్‌ 2020వరదల్లో దెబ్బతిన్నది. ఏది జరిగినా అందుకయ్యే ఖర్చును భరించాల్సింది కేంద్రమే. దేవుడు చేసిన దానికి మా బాధ్యత లేదంటే కుదరదు. అది జాతీయ ప్రాజెక్టు, ఖర్చంతా భరించేందుకు ఎప్పుడో అంగీకరించారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని జూలై మూడున నిపుణుల సమక్షంలో కేంద్ర జలసంఘం చైర్మన్‌ కుశ్చిందర్‌ ఓహ్రా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దానికి అవసరమైన నిధులు ఇవ్వటమే తరువాయి, అంచనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే తన నిపుణులను పంపవచ్చు లేదా రాష్ట్రం పంపిన వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేయవచ్చు. డిపిఆర్‌లో లేని కొత్త అంశమైతే అర్ధం చేసుకోవచ్చు, అలాకానపుడు ముద్ద ముద్దకు గోవిందా గోవిందా లేదా బిస్మిల్లా బిస్మిల్లా అనాల్సిన అవసరం ఏమిటి ? దీనికి గాను ఆకస్మికంగా మంత్రి వర్గ సమావేశం, తీర్మానంతో పనేమిటి ? కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి రు.900 కోట్లు కేటాయించాలని, తొలిదశ సవరించిన అంచనా రు.30,437 కోట్లకు గాను ఇంకా రు.12,157 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ముందుస్తుగా మంజూరు చేయాలని మంత్రివర్గ తీర్మానంలో పేర్కొన్నారు. సాంకేతికంగా అలాంటి తీర్మానం అవసరం అయితే బడ్జెట్‌కు ముందే కేంద్రానికి పంపివుంటే నిర్మలా సీతారామన్‌ కేటాయించి ఉండేవారు కదా ! ఎందుకు పంపలేదు ? అధికార యంత్రాంగానికి తెలియదా ? ఇప్పుడు బడ్జెట్‌ను సవరించి కేటాయిస్తారా ? లోగుట్టు పెరుమాళ్లకెరుక !


తమ ప్రభుత్వ హయాంలోనే డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరినా అనుమతి రానందున తామేమీ చేయలేకపోయినట్లు వైసిపి నేతలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చర్చల్లో చెప్పారు. అంతకు ముందు కేంద్ర నిర్వాకాన్ని గురించి జగన్‌ మోహనరెడ్డి లేదా పార్టీ పెద్దలు ఎవరూ ఎక్కడా చెప్పిన, లేదా అనుమతికి కేంద్రం మీద వత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. గురువారం నాడు రాష్ట్రమంత్రి వర్గం ఆకస్మిక సమావేశం జరిపి తీర్మానం చేసిన వార్తతో పాటు శుక్రవారం నాడు సాక్షి పత్రిక కొన్ని విషయాలను ప్రస్తావించింది. దాని కథనం ప్రకారం ” దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ప్రతిపాదన మేరకు 2022 మార్చి నాలుగవ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదించారు.వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి మేరకు తొలిదశ పూర్తి చేయడానికి రు.10,911 కోట్లు, డయాఫ్రం వాల్‌ పునరుద్దరణ, మరమ్మతులకు రు.2వేల కోట్లు వెరసి రు.12,911 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్‌ ఐదున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నోట్‌ జారీచేశారు. ఆ నిధులు విడుదల చేయాలంటే కేంద్ర కాబినెట్‌ ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే 2016 సెప్టెంబరు ఆరున పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకొనే క్రమంలో 2013-14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 2014 ఏప్రిల్‌ ఒకటి నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయం అంటే రు.15,667.90 కోట్లు ఇవ్వాలని 2017 మార్చి 15న కేంద్రకాబినెట్‌నిర్ణయించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రు.15,146.28 కోట్లు విడుదల చేసింది.దీనికి తోడు రు.12,157.52 కోట్లు విడుదల చేయాలంటే 2017 మార్చి 15న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కాబినెట్‌ మారుస్తూ తీర్మానం చేయాలి. ఈ మేరకు కేంద్రజలశక్తి శాఖ ఈ ఏడాది మార్చి ఆరున కేంద్ర కాబినెట్‌కు ప్రతిపాదన పంపింది.”


అయితే అప్పటికే ఎన్‌డిఏలో చేరిన టిడిపి అధినేత చంద్రబాబు ఆ నిధులు ఇస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ పెద్దల చెవుల్లో ఊదారని, దాంతో కేంద్రం పక్కన పెట్టిందని కూడా సాక్షి కథనం ఆరోపించింది. రు.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపిన అంశాన్ని చంద్రబాబు కాబినెట్‌ సమావేశం గుర్తు చేసిందని ఆంధ్రజ్యోతి వార్తలో పేర్కొన్నారు. అదే నిజమైతే మిగిలిన మొత్తం రు.12,157కోట్లు విడుదల చేయాలంటూ ఆకస్మికంగా రాష్ట్ర కాబినెట్‌ తీర్మానించాల్సిన అవసరం ఏమిటి అన్నది ప్రశ్న. దీనిపై కేంద్ర ప్రభుత్వం అదే మాదిరి చంద్రబాబు నాయుడు కూడా వాస్తవాలేమిటో జనానికి వెల్లడించాలి. తాజాగా పోలవరంపై విడుదల చేసి శ్వేత పత్రంలో సవరించిన ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం ఆమోదించినట్లు చెప్పలేదు. 2013-14 సంవత్సర సిఫార్సులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.ఇక 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాలను 2019 ఫిబ్రవరి 11న చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండగానే టెక్నికల్‌ అసిస్టెన్స్‌ కమిటీ రు.55,657 కోట్లకు ఆమోదం తెలిపింది. దానికి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఒకవేళ రు.30వేల కోట్లకు ఆమోదం తెలిపితే విడుదల కోసం ప్రత్యేకంగా తీర్మానంతో పనిలేదు. తరువాత పెరిగిన ధరల ఖర్చు సంగతేమిటి ? నీతి అయోగ్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు చేసేది ఉంటుందా ? ప్రతిపాదనలను సవరించేందుకు కేంద్రం అంగీకరిస్తుందా ? అదే జరిగితే మిగతా రాష్ట్రాలు చేస్తున్న వత్తిడి మరింత పెరగదా ? చూద్దాం ఏం జరుగుతుందో !


కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అప్పు ఇప్పిస్తామని చెప్పి బీహార్‌కు పెద్ద మొత్తంలో పథకాలకు నిధులు ఇస్తామని ప్రకటించింది. ఎందుకిలా చేసింది ? ఏమిటీ వివక్ష ? ఆ రాష్ట్రానికి మొత్తం 62వేల కోట్ల రూపాయల విలువగల పథకాలను ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. వీటిలో రోడ్లు, వంతెనలకు రు.26వేల కోట్లు, 2,400 మెగావాట్ల నూతన విద్యుత్‌ కేంద్రంతో సహా విద్యుత్‌ ప్రాజెక్టులకు రు.21,400 కోట్లు, వరదల నిరోధంతో సహా సాగునీటి పథకాలకు రు.11,500 కోట్లు, ఇవిగాక మెడికల్‌ కాలేజీలు, విమానాశ్రయాలు, క్రీడలకు మౌలిక సదుపాయాలు, దేవాలయాల టూరిజం పాకేజ్‌లు ఉన్నాయి. వీటిని బీహార్‌కు ఇచ్చినందుకు ఎవరూ తప్పుపట్టటం లేదు. అయితే ఒక్కసారిగా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారన్నది ప్రశ్న. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి-జెడియు కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది సీట్లతో పాటు దాదాపు తొమ్మిదిశాతం ఓట్లను కూడా కోల్పోయింది. నరేంద్రమోడీకి ఎదురులేదని భావించిన నితీష్‌ కుమార్‌ అంచనా తప్పింది, బిజెపి స్వంతంగా మెజారిటీని సాధించలేకపోయింది. మోడీ, బిజెపి బలహీనత వెల్లడైనందున దాని ప్రభావం వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడుతుంది. పలుకుబడి ఇంకా దిగజారక ముందే జాగ్రత్త పడేందుకు ముందస్తు ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. ఈ కేటాయింపులను చూస్తే ఈ ఏడాది మహారాష్ట్ర, హర్యానాలతో కలిపి జరుపుతారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ రాష్ట్రాలలో కూడా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు తగిలాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగితే బీహార్‌ను వదులు కోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో తిరిగి తనకే సిఎం కుర్చీ కావాలని అడిగే అవకాశాలు నితీష్‌కుమార్‌కు సన్నగిల్లుతున్నాయి. లోక్‌సభ ఓటింగ్‌ వివరాల ప్రకారం ఆర్‌జెడి తరువాత బీహార్‌లో బిజెపి పెద్ద పార్టీ, అది అక్కడ నిలవాలంటే జెడియు నితీష్‌ కుమార్‌ అవసరం ఉంది.

అదే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మీద బిజెపి ఆధారపడాల్సి ఉంది. అక్కడ పెద్ద పార్టీగా ఎదిగే అవకాశాలు లేవు. అందువలన నితీష్‌ కుమార్‌ కంటే తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు బిజెపి బీహార్‌ మీద వరాల వాన కురిపించింది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి, ఎక్కువ సాయం చేస్తే అది తెలుగుదేశం, జనసేనకే రాజకీయ లబ్దితప్ప బిజెపికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. తెలుగుదేశం పార్టీ తాను తప్ప మరొక పార్టీని ఎదగనివ్వదు. అయినా ఇంకా ఐదు సంవత్సరాల వరకు జనంతో సంబంధం ఉండదు, అడిగేవారు ఎవరూ ఉండరు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలు గనుక నోటికి తాళం వేసుకుంటాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తమకే అధికారం కట్టబెట్టాలని అడగాలంటే తెలుగుదేశం బలపడకూడదు.దానికి తోకగా ఎంతకాలం ఉండాలి. అప్పులు ఇప్పిస్తామనటం అంటే పొమ్మనకుండా పొగపెట్టటమే. పోలవరానికి పెరిగిన అంచనాను ఆలశ్యం చేస్తే అది పూర్తిగాక విమర్శలను ఎదుర్కోవాల్సింది చంద్రబాబే. బహుశా ఈ తర్కంతో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసేందుకు కూడా వెనకాడటం లేదా ? ఏమో దేన్నీ కాదనలేం !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు : అమరావతి రుణం, కేంద్ర సాయంపై శ్వేతపత్రం ప్రకటిస్తారా ?

25 Thursday Jul 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, STATES NEWS, TDP

≈ Leave a comment

Tags

Amaravati capital, Andhra Pradesh Budget 2019-20, BJP, CHANDRABABU, Narendra Modi Failures, nirmala sita raman


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో లేదా ఇతర చోట్ల ఏ ఇద్దరు తెలుగు వారు కలిసినా, రచ్చబండల మీద జరిగిన,కానసాగుతున్న చర్చ ఒక్కటే. అది రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం గురించే, ప్రత్యేకించి రాజధాని అమరావతి పట్టణ అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన పదిహేనువేల కోట్ల రూపాయలు రుణమా లేక దానమా (ఆంగ్లంలో గ్రాంట్‌ అంటే తెలుగులో దానం ) అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కొన్ని మీడియా సంస్థల వార్తల్లో, చర్చల సందర్భంగా తెలుగుదేశం నాయకత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రతినిధులు దానమే అంటే, కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి ఐదేండ్లపాటు ఏటా పదిహేనువేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినందున పండగ చేసుకోవాలని చెప్పారు.కాదన్నవారి మీద మండిపడ్డారు. కొందరైతే విదేశీ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం 90శాతం భరిస్తుందని, కేవలం పదిశాతమే రాష్ట్రం పెట్టుకోవాలని చెప్పారు. అంటే పదమూడున్నరవేల కోట్లు కేంద్రమే భరిస్తుందని, పదిహేను వందల కోట్లు రాష్ట్రం పెట్టుకోవాలన్నది వారి వాదన. అదే నిజమనుకున్నా రాష్ట్రానికి కొంత మేలే. రాష్ట్రం కోరుతున్నది తన మీద భారం మోపని సాయం. కేంద్ర మంత్రి చెప్పిన పదాలకు అర్ధం రుణం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఉన్న రెండు ఇంజన్ల డ్రైవర్లు ఏది నిజమో చెబితే జనం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సినపని లేదు.చెప్పటానికి సిద్దంగా ఉన్నారా ?


దీని గురించి స్పష్టంగా చెప్పకుండా చంద్రబాబు నాయుడు తన పరువును, నరేంద్రమోడీ పరువును కాపాడేందుకు పూనుకున్నారు. గతంలో కేంద్రం ప్రత్యేక హౌదా బదులు పాకేజ్‌ ఇస్తామంటే అదే గొప్పదని చెప్పారు. బిజెపితో బంధం తెగిన తరువాత మాట మార్చారు. ఇప్పుడు ఎలాగైతేనేం డబ్బులు వస్తున్నాయిగా అంటున్నారు.తరువాత ఏమంటారో భవిష్యత్‌కే వదలివేద్దాం.తనదైన శైలిలో చెప్పిందేమిటి ? ” నిధులు ఎక్కడి నుంచి ఎలా వస్తేనేం రాష్ట్రం అభివృద్ది చెందుతుంది.కేంద్రం ముందు ఆంధ్రప్రదేశ్‌ ఉంచిన ప్రతిపాదనల్లో అత్యధికాన్ని ఆమోదించింది. రాజధానికి వచ్చే నిధులతో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, దీంతో పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. వాగ్దానం చేసిన నిధులతో రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభమౌతుంది.విదేశీ సంస్థల నుంచి రుణాల రూపంలో వచ్చినప్పటికీ వాటిని 20-30 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వివిధ సంస్థల నుంచి వచ్చే రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. రాజధాని సహాయ రూపంలో కొన్ని కేంద్ర గ్రాంటులు వస్తాయి.వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ ఖండ్‌ తరహా సాయం వచ్చే అవకాశం ఉంది.ఈ పాకేజ్‌లో పారిశ్రామిక సబ్సిడీలు కూడా ఉంటాయి.” అన్నారు చంద్రబాబు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తరువాత విలేకర్లతో నిర్మలా సీతారామన్‌ మాట్లాడిన అంశాలు గందరగోళంగా ఉన్నాయి. ” రాజధాని నిర్మాణానికి ఈ ఏడాదే ప్రపంచ బాంకు నుంచి 15వేల కోట్ల రుణం తీసుకుంటాం.ఇందులో రాష్ట్రం వాటాను కూడా భరించాలి.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం తన వాటాను చెల్లించగలదా లేదా కేంద్రమే గ్రాంటు ఇస్తుందా అన్న విషయాలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం ” అని నిర్మలమ్మ చెప్పారు. ప్రపంచబ్యాంకు నుంచి కేంద్రం రుణం తీసుకుంటే దానిలో రాష్ట్రం భరించాల్సిదేమిటి ? ఇచ్చేది రాష్ట్రానికే అయినపుడు రాష్ట్ర వాటా ఏమిటి ? దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రాజెక్టుల రుణాలు తీసుకోవటం కొత్తేమీ కాదు. అవి రాష్ట్రాల్లో అమలు జరిగినా కేంద్రం హామీ ఇవ్వాల్సి ఉంటుంది.నేరుగా రాష్ట్రాలు తీసుకొనేందుకు వీలులేదు. అలా ఇచ్చే రుణాలలో కొన్నింటిలో కొంత గ్రాంటు కూడా వుంటుంది. బాటా కంపెనీ చెప్పుల ధరలు, వెయ్యో, రెండువేలో కాకుండా రు.999, 1,999 మాదిరి ఉంటాయి. వినియోగదారుని మానసిక స్థితిని సొమ్ముచేసుకొనే వాణిజ్య చిట్కా ఇది. అలాగే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రుణాలకు అనేక షరతులు ఉంటాయి. వాటికి వ్యతిరేకత తలెత్తకుండా ఉండేందుకు అవిచ్చే రుణాల్లో కొంత భాగాన్ని గ్రాంటుగా ఇస్తాయి. చేదు మాత్రను మింగించేందుకు వాటికి పంచదార పూత పూయటం వంటిదే ఇది. రుణ షరతులను వ్యతిరేకించేవారి నోరు మూయించేందుకు గ్రాంటు భాగాన్ని జనానికి చూపుతారు. అమరావతి స్వయం పోషక నగరమని, దాని నిధులతోనే నిర్మాణం జరుపుతామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆర్థిక మంత్రి విదేశీ సంస్థల నుంచి అప్పుతీసుకుంటామంటున్నారు. ఒక వేళ అదే వాస్తవం అనుకుంటే ఆ అప్పును ఎవరు తీర్చాలి ? కేంద్రం అంటే దేశం మొత్తం కదా ! ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేసే అప్పును దేశం మొత్తం ఎందుకు భరించాలి ? మా రాజధానులను కూడా నవీకరిస్తాం, ప్రపంచ స్థాయి నగరాలుగా చేస్తాం అప్పుచేసి మాకూ నిధులు ఇవ్వాలి అంటే కేంద్రం అంగీకరిస్తుందా ? విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకోవాలంటే ముందుగా ఆ సంస్థలకు ప్రాజెక్టు వివరాలను సమర్పించాలి. పర్యావరణం,వాటి అమలుతో నష్టపోయేవారెవరైనా ఉన్నారా, ఉంటే వారికి పరిహారం ఎలా చెల్లించాలి? తీసుకున్న అప్పులను ఎలా తీరుస్తారు? అందుకుగాను మీదగ్గర ఉన్న ఆదాయవనరులు ఏమిటి ? లేకపోతే ఎలా రాబడతారు ? ఇలా అనేక అంశాలను పరిశీలించి షరతులతో కూడిన రుణాలను మంజూరు చేస్తాయి. ఆదాయాన్ని ఎలా రాబట్టాలో కూడా వినియోగదారుల ఛార్జీల వంటి సూచనల రూపంలో షరతులు విధిస్తాయి. మనం సాధారణంగా బాంకులకు అలా వెళ్లి ఇలా అప్పుతెచ్చుకున్నంత సులభంగా విదేశీ సంస్థల అప్పు ఉండదు. అయినప్పటికీ ఇంకా వర్తమాన ఆర్థిక సంవత్సరంలోనే విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకొని ఇస్తామంటూ నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బహుశా నరేంద్రమోడీగారిని విశ్వగురువుగా, నేతగా ప్రచారం చేస్తున్నారు గనుక అలాంటి నిబంధనలను పక్కన పెట్టే ప్రత్యేక వెసులు బాటు, వివరాలేమీ లేకుండానే ముందుగానే ఇచ్చే అవకాశం ఉందేమో తెలియదు. ఇంతవరకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌)ను కేంద్రానికి సమర్పించినట్లు చంద్రబాబు నాయుడు ఎక్కడా ప్రకటించలేదు, లీకులు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు అమరావతి కోసం విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. వినియోగదారుల దగ్గర రుసుములు వసూలు చేసే షరతులతో ముందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం మారటం, అమరావతిని వదలివేయటంతో కథకంచికి చేరింది. ఒక వేళ ఇప్పుడు మరోసారి ప్రయత్నించాలన్నా, పెరిగిన ధరలకు అనుగుణ్యంగా డిపిఆర్‌ను సమర్పించాలి. అలాంటి ప్రక్రియ ఇంతవరకు లేనందున పదిహేనువేల కోట్లు వెంటనే ఎలా వస్తాయన్నది ప్రశ్న.


ఇలాంటి ప్రశ్నలు, సందేహాలను ఎవరైనా లేవనెత్తితే రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవటం లేదనో, వైసిపి కండువా కప్పుకున్నారనో ఎన్‌డిఏ కూటమి ఎదురుదాడికి దిగవచ్చు.గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నిస్తే వైసిపి వారు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. వాటిని వదలి వేద్దాం.హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికలో 2024 జూలై 18న న్యూఢిల్లీ ప్రతినిధి రాసిన విశ్లేషణ ప్రకారం ”రాష్ట్ర పునర్‌నిర్మాణానికి ” కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల సాయం కావాలని చంద్రబాబు నాయుడు కోరారు. అందుకోసం ప్రధాని నరేంద్రమోడీ, అరడజను మంది కేంద్ర మంత్రులు, పదహారవ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియాను కలిశారు. నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరణాత్మక పత్రాన్ని కూడా అందచేశారు.కేంద్రం ఎందుకు సాయం చేయాలో కూడా వివరించారు.వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి జిడిపిలో మూడుశాతం నిబంధనను సడలిస్తూ 0.5శాతం పెంచాలని, అమరావతి నిర్మాణానికి రు.50వేల కోట్ల సాయం ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు పన్నెండువేల కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే దుగ్గరాజపట్నం రేవు నిర్మాణం, రాష్ట్ర మూలధన పెట్టుబడికి ప్రత్యేక పధకం కింద సాయం,బుందేల్‌ ఖండ్‌ పాకేజ్‌ మాదిరి వెనుకబడిన ప్రాంతాలకు సాయాన్ని, చమురుశుద్ధి కర్మాగారాల ఏర్పాటును కూడా కోరారు.కీలకమైన కేంద్ర మంత్రి పదవులు,లోక్‌సభ ఉపసభాపతి పదవిని కూడా కోరకుండా ఆర్థిక సాయం మీదే కేంద్రీకరించినట్లు కూడా బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ” ఆంధ్రప్రదేశ్‌కు నిర్మల మద్దతు, కానీ నాయుడు కోరిన దానికి చాలా తక్కువ ” అనే శీర్షికతో అదే బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. దానిలోని అంశాల సారం ఇలా ఉంది. కేంద్ర సాయాన్ని ఆశిస్తూ బడ్జెట్‌లో ఏం కేటాయిస్తారో చూసేందుకు గాను చంద్రబాబు రాష్ట్రబడ్జెట్‌ ప్రవేశపెట్టటాన్ని వాయిదా వేసుకున్నారు. స్థానికంగా వనరులను పెంచేందుకు మార్గాలు వెతకాల్సి ఉంటుంది, పదిహేనవ ఆర్థిక సంఘం సూచనను అనుసరిస్తే రాష్ట్ర ప్రభుత్వం పన్నేతర రాబడులను పెంచుకోవాల్సి ఉంది.కేేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక పాకేజ్‌ లేదా ప్రత్యేక హౌదా ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతానికి బడ్జెట్‌ పెట్టకుండా సమయాన్ని తీసుకుంది.అయితే చంద్రబాబు లక్ష్యం అంత తేలిక కాదు.రాష్ట్ర ఆదాయంతో పోల్చితే వడ్డీ చెల్లింపులు గణనీయంగా ఎక్కువగా ఉన్నందున ఆర్థిక పునర్‌నిర్మాణం కోసం ఎంతో ఎంతో చేయాల్సి ఉందని పేర్కొన్నారు.


బడ్జెట్‌ కేటాయింపులను పరిశీలించేపేరుతో కొద్ది రోజులు కాలయాపన చేయవచ్చు. కేంద్రం నుంచి ఆశించిన సాయం, దాని గురించి తెలుగుదేశం పార్టీ, జనసేన జనంలో పెద్ద ఎత్తున ఆశలు కలిగించాయి.సూపర్‌సిక్స్‌ పేరుతో చేసిన వాగ్దానాలను బిజెపి ఆమోదించి ఉంటే ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో దాని పేరు కూడా ఉండేది.ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం గురించి 2014-19 మధ్య బిజెపితో కలసి కాపురం చేసినంత కాలం చంద్రబాబు నాయుడు సానుకూలంగా మాట్లాడారు తప్ప జనాలకు వివరాలు చెప్పలేదు. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్న తరువాతే గళమెత్తి, ఢిల్లీలో నిరసనలు, తరువాత 2019ఎన్నికలకు ముందు శ్వేత పత్రాలను ప్రకటించారు. జనం వాటిని నమ్మలేదు.చిత్తుగా ఓడించారు.వైసిపిని గెలిపించారు. ఆ పార్టీ అనుసరించిన వైఖరితో విసిగిపోయి చారిత్మ్రాక స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని గెలిపించారు. రాష్ట్రం ఉన్న స్థితి గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాదిరి గుండెలు బాదుకుంటే, వైసిపి మీద విమర్శలను గుప్పిస్తే కుదరదు. కేంద్ర సాయం గురించి తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలంటే అధికారానికి వచ్చిన తరువాత కేంద్రాన్ని ఏ ఏ రంగాలలో ఎంత సాయం చేయాలని కోరారు, తాజా బడ్జెట్‌లో వాటిలో ఏమేరకు వచ్చింది అనే అంశాలను జనానికి అర్దమయ్యే రీతిలో ఒక శ్వేతపత్రం ద్వారా ప్రకటించి పరిస్థితిని వివరించాలి. అందుకు చంద్రబాబు సిద్దపడతారా ?
హొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

కన్వర్‌ యాత్ర నిబంధనలకు సుప్రీం కోర్టు బ్రేక్‌, బిజెపి హిందూత్వకు ఎదురుదెబ్బ, దళితులతో ముందు ముంత వెనుక చీపురు కట్టించినా ఆశ్చర్యం లేదు !

22 Monday Jul 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Hinduthwa, Kangana ranaut, Kanwar Yatra, Narendra Modi Failures, RSS, Sonu Sood, Supreme Court, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


జూలై 22 నుంచి ఆగస్టు ఆరు వరకు జరిపే కన్వర్‌-కావడి యాత్రల సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌ ప్రభుత్వాలు జారీ చేసిన వివాదాస్పద ఉత్తరువు అమలును సోమవారం నాడు సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది బిజెపి హిందూత్వ అజెండాకు ఎదురు దెబ్బ యాత్రలు జరిగే దారిలో ఉన్న దుకాణాలు,హౌటళ్ల, పానీయాల దుకాణాల యజమానుల పేర్లను సంస్థల ముందు ప్రదర్శించాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. వాటిలో హలాల్‌ ధృవీకరణ పత్రం ఉన్న పదార్థాలను విక్రయించరాదని కూడా పేర్కొన్నారు. యాత్రల పవిత్రతను కాపాడేందుకు అని చెబుతున్నప్పటికీ అధికారిక ఉత్తరువుల్లో శాంతి భద్రతలను సాకుగా చూపారు. ఈ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం పేర్ల ప్రదర్శనకు బ్రేకు పడింది. అయితే ఆహార పదార్ధాల స్వభావాన్ని వినియోగదారులకు ప్రదర్శించాలని కోర్టు పేర్కొన్నది. పోలీసులు తీసుకున్న చర్యలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని, సామాజికంగా వెనుకబడిన తరగతులు, మైనారిటీలను ఆర్థికంగా విడదీస్తుందని పిటీషనర్ల తరఫున వాదించిన సియు సింగ్‌ చెప్పారు. మరో న్యాయవాది అభిషేక్‌ షింఘ్వి తన వాదనలను వినిపిస్తూ ” నేను గనుక పేరును ప్రదర్శించకపోతే నన్ను మినహాయిస్తారు, నేను పేరును ప్రదర్శించినా మినహాయిస్తారని ” చెప్పారు. అయ్యప్ప, భవానీ వంటి దీక్షలు, కన్వర్‌(కావడి) యాత్ర వంటివి జనాల వ్యక్తిగత అంశాలు. ఇష్టమైన వారు పాటిస్తారు, కాని వారు దూరంగా ఉంటారు. వీరంతా నాస్తికులని గానీ పాటించేవారే పరమ ఆస్తికులని గానీ నిర్ధారించటానికి, ముద్రవేసేందుకు ఎవరికీ హక్కులేదు.పౌరహక్కుల పరిరక్షణ సంస్థ(ఎపిసిఆర్‌) పేరుతో ఉన్న ఒక స్వచ్చంద సంస్థ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టు తలుపుతట్టింది.న్యాయమూర్తులు హృషికేష్‌ రారు, ఎస్‌విఎన్‌ భట్‌ ధర్మాసనం సోమవారం నాడు విచారించింది. ప్రభుత్వ ఉత్తరువుల కారణంగా దుకాణాల యజమానుల మతపరమైన గుర్తింపు వెల్లడి కావటమేగాక ముస్లిం మతానికి చెందిన దుకాణాల యజమానుల పట్ల వివక్ష ప్రదర్శించటమే అని పిటీషన్‌లో పేర్కొన్నారు.ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటూ, తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని అధికారపక్షానికి స్పష్టం చేశాయి. కోర్టు ఆదేశాలతో దీని మీద చర్చ జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.


బిజెపి మిత్రపక్షాలుగా ఉన్న జెడియు, ఎల్‌జెపి, ఆర్‌ఎల్‌డి పార్టీలు ఇలాంటి ఉత్తరువులు తగవని వ్యతిరేకతను వెల్లడించినా బిజెపి ఖాతరు చేయ లేదు. జనాలను మత ప్రాతిపదికన చీల్చే, ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అజండాను అమలు జరిపేందుకే పూనుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు తాజా పరిణామాల వెనుక ఉన్న కుట్రలేమిటి, ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా, ఆందోళనకరంగా మారింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఆయోధ్యతో సహా అనేక చోట్ల చావుదెబ్బతిన్నది. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కారణమంటూ కేంద్ర పెద్దల మద్దతుతో బిజెపి స్థానిక నేతలు ధ్వజమెత్తటమే కాదు, నాయకత్వ మార్పు జరగాలని కోరుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా యోగి కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వాటిలో కన్వర్‌ యాత్రల ఆదేశం ఒకటి. శివలింగం మీద తేలును చెప్పుతో కొట్టలేరు, చేతితో తొలగించలేరు అన్నట్లుగా కేంద్ర బిజెపి నాయకత్వం ముందు పరిస్థితి ఉంది. ఇంతకూ ఈ యాత్రీకులు చేసేదేమిటి ? శ్రావణమాసంలో పవిత్ర జలం పేరుతో గంగా నది నుంచి నీరు తెచ్చి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకం చేసి శివుని కృపకు పాత్రులౌతామనే నమ్మకాన్ని వెల్లడిస్తారు. జూలై 22 నుంచి ఆగస్టు ఆరవ తేదీ మధ్య హరిద్వార్‌ వద్ద ఉన్న గంగానది నుంచి తెచ్చే నీటి పాత్రలను కావళ్లలో పెట్టి తీసుకువస్తారు గనుక దీనికి కావడి యాత్ర అనే పేరు వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి వేర్వేరు మార్గాల్లో భక్తులు హరిద్వార్‌ వస్తారు. ఈ మార్గాల్లో యాత్రీకుల కోసం వస్తువుల దుకాణాలు, ఆహార పదార్దాల హౌటళ్లు. దాబాలు, బండ్లు ఏర్పాటు చేస్తారు. కాలినడకన, మోటారు వాహనాలు ఇలా ఎవరికి వీలైన పద్దతుల్లో వారు ఈ యాత్రలో పాల్గొంటారు. 1980దశకం వరకు చాలా పరిమితంగా జరిగే ఈ క్రతువును క్రమంగా పెద్ద కార్యక్రమంగా మార్చారు. అయ్యప్ప దీక్షలకు పోటీగా అనేక దీక్షలను తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా అలాంటిదే.


దుకాణాలు, హౌటళ్ల ముందు యజమానుల పేర్లకు బదులు ” మానవత్వం ” అని ప్రదర్శించాలని ప్రముఖ నటుడు సోనూ సూద్‌ ఎక్స్‌లో సూచన చేశారు.దీని మీద బాలీవుడ్‌ హీరోయిన్‌, బిజెపి లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌ స్పందిస్తూ ఉమ్మిన ఆహారం, ఆపని చేసేవారిని సమర్ధించటమే ఇదంటూ ధ్వజమెత్తారు. ముస్లింలు తయారు చేసే ఆహారం, విక్రయించే పండ్లు మొదలైన వాటి మీద ఉమ్ముతారని, హలాల్‌ చేస్తారని,అపవిత్రమైన వాటిని హిందువులు బహిష్కరించాలని, హిందువుల పవిత్ర స్థలాలు, గుడులు గోపురాలు ఉన్న ప్రాంతాలలో ముస్లింల దుకాణాలను అనుమతించరాదని, ఇప్పటికే ఉంటే ఎత్తివేయాలని హిందూత్వ సంస్థలు ఎప్పటి నుంచో రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. సాధారణ పౌరులెవరూ వాటిని పట్టించుకోవటం లేదన్నది కూడా ఎరిగిందే. అయోధ్యలో రామాలయం పేరుతో యోగి సర్కార్‌ బుల్డోజర్లతో కూలదోయించిన కట్టడాల్లో హిందువులవి కూడా ఉన్నాయి. అందుకే అక్కడ బిజెపికి వ్యతిరేకంగా ఓటువేయటం, అభ్యర్థి ఓటమి తెలిసిందే. పాలస్తీనాలో అరబ్బులపై దాడులు, మారణకాండ, స్వతంత్ర దేశ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌ ఉత్పత్తులను బహిష్కరించాలని ముస్లిం, అరబ్బుదేశాలలో పలు సంస్థలు గతంలో పిలుపునిచ్చాయి. వాటిని కాపీకొట్టిన కాషాయ దళాలు మనదేశంలో ముస్లింల వ్యాపారాలను దెబ్బతీసేందుకు వినియోగిస్తున్నాయి. అరబ్బు దేశాల చమురును బహిష్కరించమని చెప్పేందుకు వారికి నోరురాదు, ఎందుకంటే వారి యాత్రల వాహనాలు నడవాలంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న ఇంథనమే దిక్కు. అక్కడ పవిత్రత గుర్తుకు రాదు.


ఉమ్ముతారని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. నిజమే అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనేక బిర్యానీ హౌటళ్లకు, రంజాన్‌ మాసం సందర్భంగా హలీం కోసం ఎగబడేవారిలో ఎక్కువ మంది ముస్లిమేతరులే ఎందుకు ఉంటున్నారు.దుకాణాలలో విక్రయించే వస్తువులు నాణ్యమైనవా కాదా, హౌటళ్లలో వడ్డించే ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది గీటురాయిగా ఉండాలి తప్ప యజమానుల వివరాలు ఎందుకు ? ఒకవేళ ముస్లిం మతానికి చెందిన వారు యజమానులుగా ఉంటే వాటిని బహిష్కరించాలని పరోక్షంగా చెప్పటమే ఇది. పేర్ల ప్రదర్శన ఒక్క ముస్లింలనే దెబ్బతీస్తుందా ? హిందువులను కూడా నష్టపరుస్తుంది.మన సమాజంలో మత విద్వేషమే కాదు, కుల వివక్ష, విద్వేషం కూడా ఎక్కువే, అందునా దేశ ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలలో మరీ ఎక్కువ.దళితులు వివాహాల సందర్భంగా గుర్రాల మీద, ఇతరత్రా ఊరేగింపులు జరపకూడదని, ఎక్క కూడదని దాడులు చేసిన ఉదంతాలు ఎన్ని లేవు.దుకాణాలపై దళితులు, గిరిజనులు, వెనుకబడిన సామాజిక తరగతులకు చెందిన యజమానుల పేర్లను ప్రదర్శిస్తే ముస్లిం దుకాణాల పట్ల అనుసరించే వైఖరినే మనువాద కులాల వారు పాటిస్తారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే అనేక చోట్ల గతంలో ఆర్యవైశ్య బ్రాహ్మణ హౌటల్‌ అని రాసుకొనే వారు. ఇప్పుడు ఇంకా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉండి ఉండవచ్చు. వాటి స్థానలో రెడ్డి, చౌదరి హౌటల్స్‌ పేరుతో ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నాయి తప్ప ఇతర కులాలను సూచించే హౌటళ్లు ఎక్కడా కనిపించకపోవటానికి సమాజంలో ఇప్పటికీ ఉన్న చిన్న చూపు, వివక్షే కారణం. అదే ముస్లింల విషయానికి వస్తే మతవిద్వేషం. రాఘవేంద్ర,రామా, కృష్ణా, వెంకటేశ్వర విలాస్‌లు తప్ప ఎక్కడైనా అబ్రహాం, ఇబ్రహీం, ఏసుక్రీస్తు,మహమ్మద్‌ ప్రవక్త విలాస్‌లను చూడగలమా ?


ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ యుపి ప్రభుత్వ చర్యను తప్పు పట్టారు. ఒక మతపరమైన యాత్ర సందర్భంగా పోలీసులు జారీ చేసిన ఆదేశాలు దుకాణాలు, హౌటళ్ల యజమానుల పేర్లను ప్రముఖంగా వాటి ముందు రాసి ఉంచాలని చెప్పారు. సమీప భవిష్యత్‌లో ఇది వాహనాలకు సైతం వర్తింప చేస్తారని, గతంలో నాజీ జర్మనీలో కొన్ని దుకాణాలు, ఇండ్లకు ఇలాంటి గుర్తింపును అమలు చేశారని జావేద్‌ అక్తర్‌ ఎక్స్‌లో స్పందించారు.బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ కూడా తప్పు పట్టారు. ఇది అంటరానితనాన్ని ప్రోత్సహించటం తప్పవేరు కాదన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను నేరుగా విమర్శించలేని నక్వీ దీనికి అధికారయంత్రాంగం కారణమని విరుచుకుపడ్డారు. అత్యుత్సాహపరులైన అధికారులే ఇది చేశారన్నారు.సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌, బిఎస్‌పి నాయకురాలు మాయావతి, మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా విమర్శించారు. ఇది సామాజిక నేరమని, కోర్టులు కలగచేసుకొని నివారించాలన్నారు. తొలుత యజమానుల పేర్లను ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు. దాని మీద విమర్శలు రావటంతో కాదు స్వచ్చందంగా చేయాలన్నారు, చివరికి విధిగా ప్రదర్శించాలని నిర్ణయించారు.స్వచ్చందంగా అన్నప్పటికీ అంతిమంగా ఫలితం మతపరమైన గుర్తింపును విధిగా వెల్లడించేట్లు చేయటమే. పేర్లు ప్రదర్శించని హిందువులను కూడా ముస్లింలుగానే భావించేందుకు ఆస్కారం ఉంటుంది. ముస్లింలు పేర్లు రాసుకొని ప్రదర్శిస్తే వారి దగ్గర కొనవద్దని చెప్పేందుకు తప్ప దీనిలో శాంతి భద్రతల సమస్య ఎక్కడుంది. యాత్రికులకు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకంటూ ముజఫర్‌ నగర్‌ ఎస్‌పి ప్రకటన సాకు మాత్రమే. కావాల్సిన వస్తువు లేదా ఆహారం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తేనేం, దానిలో యాత్రీకులు పడే గందరగోళం ఏమిటి ? దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లను వేరు చేసేందుకు సృష్టించిన బంటూస్తాన్‌లకు, మనదేశంలో వెలిగా ఉంచిన దళిత వాడలకు, వీటికీ తేడా ఏముంది? దళితవాడల్లో నివశించేందుకు ఎంత మంది దళితేతరులు సిద్దపడుతున్నారు ? ముస్లింలు మెజారిటీగా ఉన్న అనేక ప్రాంతాల్లో ఇతరులు ఇండ్లు కొనేందుకు జంకే ఇతరుల గురించి తెలియని వారెవరు ?


చరిత్రలో మతపరమైన గుర్తింపు చాలా ప్రమాదకరం అని రుజువు చేసింది.మనతో సహా ఆసియా ఉపఖండంలోని దేశాల్లో మతంతో పాటు ఎక్కడా లేని కులపరమైన గుర్తింపు బోనస్‌.మధ్య యుగాల్లో, తరువాత ఇస్లామిక్‌, క్రైస్తవమతాల ఉన్మాదంతో ఇతర మతాల వారు ప్రత్యేక గుర్తులు ధరించాలని ఆదేశించారు. మౌఢ్యం లేదా నిరంకుశత్వం చోటు చేసుకుంది. నాజీ జర్మనీలో యూదు వ్యతిరేకతలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. మహమ్మద్‌ ప్రవక్త మరణం తరువాత అరేబియాలో అధికారానికి వచ్చిన ఖలీఫా రెండవ ఉమర్‌ 717-20 సంవత్సరాలలో ముస్లిమేతరులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని తొలిసారిగా ఆదేశించినట్లు వికీపీడియా సమాచారం తెలుపుతోంది. నేటి ఇటలీలోని సిసిలీ ప్రాంతంలో రాజ్యాధికారం చలాయించిన అరబ్‌ రాజవంశం అగలాబిద్‌ 887-88లో యూదులు తమ ఇండ్లకు గాడిదలను చిత్రించిన వస్త్రాలను వేలాడదీయాలని, పసుపు పచ్చ బెల్టులు, టోపీలు ధరించాలని ఆదేశించింది. తరువాత 1,212లో మూడవ పోప్‌ ఇన్నోసెంట్‌ ప్రతి క్రైస్తవ ప్రాంతంలో గుర్తించేందుకు వీలుగా యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని ఆదేశించాడు. ప్రష్యాలో 1,710లో అధికారంలో ఉన్న ఒకటవ ఫెడరిక్‌ విలియమ్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించనవసరం లేదు.అయితే అలా ఉండాలంటే ఎనిమిదివేల వెండి నాణాల నగదు చెల్లించాలని షరతు పెట్టాడు. తరువాత రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా జర్మనీలో నాజీ పాలకులు యూదులను గుర్తించేందుకు డేవిడ్‌ బొమ్మ ఉన్న ఏదో ఒక రంగు గుర్తును ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.హిట్లర్‌ యంత్రాంగం కొత్త ఆదేశాలను జారీచేసి యూదుల ఇండ్ల ముఖద్వారాలకు గుర్తులు వేయాలని ఆదేశించింది. అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఇలాంటి గుర్తింపు ఆదేశాలను అమలు చేశారు. హంగరీ ఆక్రమణ తరువాత యూదుల పౌరసత్వాలను రద్దు చేసి వారంతా ప్రత్యేక గుర్తులను ధరించాలని ఆదేశించారు.ఇక వర్తమానంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు 1996-2001 మధ్య తమదేశంలో ఉండే హిందువులు పసుపుపచ్చ గుర్తున్న బాడ్జ్‌లను ధరించాలని, వేధింపులకు గురికాకుండా ఉండేందుకు హిందూ మహిళలు బురఖాలు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కన్వర్‌ యాత్రీకులు గందరగోళపడకుండా ఉండేందుకు, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అనే పేరుతో దుకాణాల యజమానులు తమ పేర్లను ప్రముఖంగా రాసి ప్రదర్శించాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఆకుపచ్చ తాలిబాన్లకు కాషాయ తాలిబాన్లకు పద్దతి తప్ప ఇతరంగా తేడా ఏమిటి ? యోగి సర్కార్‌ ఉత్తరువులు ముస్లింల కోసమేనని,మనకేంటి అని ఇతరులు ఎవరైనా భావిస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. చరిత్రను చూసినపుడు సనాతనం లేదా మనువాదం కారణంగా దళితులకు ఇతరుల వాడల్లో ప్రవేశం నిషేధించారు, ఒకవేళ అనుమతిస్తే ఉమ్మివేయకుండా మెడలో ముంత ధరించాలని, వీపులకు చీపుర్లు కట్టుకొని ఊడ్చుకుంటూ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. ఇప్పుడు కన్వర్‌ మరోపేరుతో మతవిద్వేషం రెచ్చగొడుతున్నవారు మనువాదుల వారసులే. సనాతనాన్ని అమలు జరపాలని కోరేశక్తులకు ప్రతిఘటన లేకపోతే దళితులకు ముంతలు, చీపుర్లే గతి, వెనుకబడిన తరగతులు తిరిగి కులవృత్తులకు పోవాల్సిందే ! కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి క్రమశిక్షణ నేతి బీరలో నెయ్యి : మఠం దారిలో యోగి ఆదిత్యనాథ్‌, పావులు కదుపుతున్న మో-షా !!

20 Saturday Jul 2024

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

Amit Shah, BJP, CM Yogi Adityanath, Modi vs Yogi, Narendra Modi Failures, RSS, Rumblings in Uttar Pradesh BJP, UP BJP poll fate


ఎం కోటేశ్వరరావు


లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి దిమ్మతిరిగింది. గుండెకాయ వంటి ఉత్తర ప్రదేశ్‌లో చెప్పుకోలేని చోట దెబ్బ తగిలింది. దీంతో పార్టీలో చదరంగం, వైకుంఠపాళీ క్రీడలు ప్రారంభమయ్యాయి. దీన్ని అవకాశంగా తీసుకొని సమాజవాది పార్టీ తన తురుపు ముక్కను ప్రయోగించింది. ఎవరైనా వంద మంది ఎంఎల్‌ఏలతో బిజెపి నుంచి వెలుపలికి వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తామని, ఇది వర్షాకాల ధమాకా అని ప్రతిపక్ష నేత అఖిలేష్‌ యాదవ్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఆ రాష్ట్రంలోని 80లోక్‌సభ స్థానాలకు గాను బిజెపికి 2014లో 72, గత ఎన్నికల్లో 62రాగా ఇప్పుడు 33కు పడిపోయాయి. సమాజవాది పార్టీకి 37,దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ఆరు స్థానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. యోగిని తప్పించి తిరిగి గోరఖ్‌పూర్‌ మఠానికి పంపేందుకు నరేంద్రమోడీ, అమిత్‌ షా పూనుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. రకరకాల కథనాలను ప్రచారంలో పెట్టారు. మరోవైపు పార్టీ, ప్రభుత్వం మొత్తం తన వెనుకే ఉందని చూపేందుకు యోగి వరుసగా సమావేశాలు జరుపుతూ బల ప్రదర్శనకు పూనుకున్నారు.బిజెపి స్వయం ప్రకటిత నిబంధనల ప్రకారం 75 సంవత్సరాలు దాటిన వారు ముఖ్యమైన పదవుల్లో ఉండకూడదు.ఆ సాకుతో అద్వానీని ప్రధాని పదవికి దూరంగా పెట్టారు. ఇప్పుడు నరేంద్రమోడీ వంతు వచ్చింది. ఆ స్థానంలో తదుపరి యోగి ఆదిత్యనాధ్‌ ఉంటారని ఒక ప్రచారం కాగా నితిన్‌ గడ్కరీ పేరు మరోవైపు నుంచి వినిపిస్తున్నది. అమిత్‌ షా ప్రయత్నం సరేసరి. తన పుట్టుక మామూలుగా జరగలేదని, దైవాంశతో జన్మించిన కారణంగానే తనకు శక్తి వస్తున్నదంటూ వయస్సు వచ్చినా గద్దె దిగేది లేదన్నట్లు మోడీ తెగేసి చెప్పారు. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్‌ ఓటమికి యోగిని బాధ్యుడిగా చేసి ఒకవేళ ప్రధానిగా అమిత్‌ షాకు అవకాశం వస్తే అడ్డుతొలిగించుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని చూస్తున్నట్లుకూడా చెబుతున్నారు. దేన్నీ కాదనలేని స్థితి. మొత్తం మీద మిగతా పార్టీలకూ బిజెపికీ పెద్ద తేడాలేదని జనాల కళ్లు తెరిపిస్తున్నారు.


ఇతర పార్టీల వ్యవహారాల్లో వేలుపెట్టి కెలుకుతున్న బిజెపి నేతలు ఇప్పుడు స్వంత పార్టీలోనే చేస్తున్నారని అఖిలేష్‌ యాదవ్‌ ఊరికే అనలేదు. ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌తో సహా అనేక కీలక నియోజకవర్గాలలో బిజెపి మట్టికరచింది. నరేంద్రమోడీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో గతంలో వచ్చిన మెజారిటీ 4.79లక్షల నుంచి 1.52లక్షలకు దిగజారింది. తమను ఓట్ల రొంపిలోకి లాగటం ఏమిటని అటు రాముడు, ఇటు కాశీ విశ్వనాధుడు కన్నెర్ర చేసినట్లు స్పష్టమైంది. అంతా మీరే చేశారు, అన్నింటికీ మీరే కారణం అన్నట్లుగా ఓటమి కారణాలను యోగి మీదకు నెట్టేందుకు పావులు కదుపుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తన ప్రమేయం లేదని యోగి చెబుతున్నారు. నిజానికి యోగి పేరుకు సర్వసంగ పరిత్యాగి తప్ప అతగాడి వెనుక బలమైన రాజపుత్ర ఠాకూర్‌ సామాజిక తరగతి ఉంది. ఓసిలలో బ్రాహ్మణులు, యాదవుల తరువాత ఎనిమిది శాతంతో వీరిదే పెద్ద సంఖ్య. ఆర్థికంగా బలమైన తరగతి. బ్రాహ్మణులు-ఠాకూర్ల మధ్య వైరం ఎప్పటి నుంచో ఉంది. నరేంద్రమోడీ ఈ సామాజిక తరగతులను పక్కన పెట్టి వెనుకబడిన తరగతులను ముందుకు తెచ్చి తనదైన ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకున్నారు. నిజానికి ఈ రాష్ట్ర బిజెపిలో ఎప్పటి నుంచో కుమ్ములాటలు ఉన్నాయి.లోక్‌సభ ఎన్నికల తరువాత యోగిని ఇంటికి పంపుతారన్న ప్రచారం ముందే ఉంది. మూడోసారి మోడీ గెలిస్తే యోగికి మూడినట్లే అనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్నికలలో చావు దెబ్బతినటంతో యోగి వ్యతిరేకులకు, అనుకూలురకు కూడా మంచి ఊపు వచ్చింది. బిజెపిలో కించపరిచే పదజాలం ఒక్క ముస్లింలకే పరిమితం కాదు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నియోజకవర్గ అభ్యర్థి, కాబినెట్‌ మంత్రి పురుషోత్తం రూపాలా రాజపుత్రుల మీద విరుచుకుపడ్డారు. రోటీ బేటీ కా సాత్‌ – రాజపుత్రులు బ్రిటీష్‌ వారికి వారి కుమార్తెలనిచ్చి వివాహాలు చేశారని, బ్రిటీష్‌ వారితో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. ఇది గుజరాత్‌తో పాటు ఉత్తర భారతంలో రాజపుత్రులున్న చోటల్లా వారికి కాలింది. మధ్య ప్రదేశ్‌లో ఠాకూర్లను పక్కన పెట్టినట్లుగానే ఉత్తర ప్రదేశ్‌లో వికె సింగ్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌ వంటి కీలక నేతలను ఇంటికి పంపారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పటికీ రాజనాధ్‌ సింగ్‌ను కూడా పక్కన పెట్టినట్లుగానే భావిస్తున్నారు. ఆ కారణంగానే ఎక్కడా పెద్దగా మాట్లాడరు. ఆగ్రహంతో ఉన్న ఠాకూర్లను బుజ్జగించేందుకు అధిష్టానం ఇప్పుడు రాజనాధ్‌ను ఎంచుకుందని వార్తలు వచ్చాయి. వారిని సంతుష్టీకరించే ప్రక్రియలో భాగంగా అమిత్‌ షా ఇప్పటికే కొందరు నేతలతో రహస్యమంతనాలు జరిపారు. ఠాకూర్లలో పలుకుబడి కలిగిన రాజా భయ్యాను చేరదీసి వారిలో చీలిక తెచ్చి ఠాకూర్లను విస్మరించలేదనే సందేశంతో యోగికి పోటీ నేతగా ముందుకు తెచ్చే ఎత్తుగడ దీనిలో ఉంది. ఈ పరిణామం మీద ఆ సామాజిక తరగతి ఎలా స్పందించేదీ చూడాల్సి ఉంది. దీంతో యోగిని సాగనంపటం ఎలా అన్నది ఆసక్తికరంగా మారింది.
శాసనసభలో పది స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.వాటిలో మిత్రపక్షాలకు ఒక్కటి కూడా ఇవ్వకుండా బిజెపి ఒక్కటే బరిలో ఉండాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. వీటిలో ఐదు స్థానాలు సమాజవాది పార్టీ, నాలుగు బిజెపి, ఒకటి ఆర్‌ఎల్‌డి గతంలో గెలిచినవే.వీటిలో బిజెపి దెబ్బతింటే దానికి బాధ్యత యోగీదే అని చెప్పేందుకు ప్రత్యర్ధులు సిద్దం అవుతున్నారు. ఇటీవల ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పది చోట్ల ఇండియా కూటమి గెలిచింది. ఉత్తర ప్రదేశ్‌లో ఓటమికి యోగి కంటే ప్రధానిగా నరేంద్రమోడీ ఎక్కువగా ఎక్కువగా బాధ్యత వహించాలి.చివరకు తన మెజారిటీ తగ్గటానికి కూడా వేరే వారిని నిందిస్తే కుదరదు. యోగి ఒక్కరే సర్వస్వం కాదు అన్న సందేశం ఇచ్చేందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను అధిష్టానం నియమించింది. ప్రతి చిన్న విషయాన్ని ప్రధాని కార్యాలయం నియంత్రిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. రాష్ట్ర డిజిపి నియామకంలో తనకు ఇష్టమైన వారిని ఎంచుకొనేందుకు యోగికి అవకాశం ఇవ్వటం లేదు.తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఎంతో వత్తిడితో ఒకరిని నియమించినా తరువాత నలుగురు తాత్కాలిక డిజిపిలు తప్ప శాశ్వత నియామకాలు లేవు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో కూడా అదే జరిగింది.మంత్రివర్గం నుంచి యోగి అనుకూల సూర్య ప్రతాప షాహిని తొలగించి వ్యతిరేకిగా ఉన్న శివ ప్రతాప శుక్లాకు కట్టబెట్టారు. ఒక విధంగా యోగిని పొమ్మనకుండా పొగబెట్టారు.రెండవసారి గెలిచిన తరువాత కూడా అదే జరిగింది. తీవ్రంగా వ్యతిరేకించినా ఇద్దరిని మంత్రులుగా చేర్చారు. వారిలో ఒకరు ఉప ఎన్నికలో ఓడిన తరువాత సమాజవాది పార్టీలో చేరారు. ప్రస్తుతం ఇద్దరిలో ఒకరైన ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్యకు మోడీ, షా మద్దతు ఉందని, అందువల్లనే ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదని తాజాగా ధ్వజమెత్తినట్లు చెబుతున్నారు.పార్టీ కార్యకర్తల బాధ తనకు తెలుసునని మౌర్య అనటాన్ని యోగి మద్దతుదార్లు తప్పుపడుతున్నారు. అతను ఉపముఖ్యమంత్రి కాదా ? కార్యకర్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా ?అది చేయకుండా ప్రతికూల ప్రచారం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.


తన పదవికి ఎసరు పెడుతున్నారని గ్రహించిన యోగి జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు.ఇంతవరకు ఎక్కడా బహిరంగంగా ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు.తన అనుచరులను రంగంలోకి దించారు. ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదన్న కేశవ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యపై వెంటనే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పార్టీ నేత సునీల్‌ భరాలా స్పందించారు.” ఎన్నికలలో ఎదురుదెబ్బలు, ఓటమికి పార్టీయే కారణమని గౌరవనీయ ఉపముఖ్యమంత్రి కెపి మౌర్య వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.కనుక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నష్టాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలి ” అని ఎక్స్‌ ద్వారా డిమాండ్‌ చేశారు. ఈ పోస్టును తొలగించేందుకు బిజెపి కేంద్ర పెద్దలు తెచ్చిన వత్తిడికి ఇప్పటివరకైతే భరాలా లొంగలేదు. గతంలో పార్టీ ఓడినపుడు కల్‌రాజ్‌ మిశ్రా, వినరుకతియార్‌ రాజీనామా చేశారని కూడా గుర్తుచేశారు. బిజెపి మురికివాడల విభాగపు జాతీయ కన్వీనర్‌గా భరాలా ఉన్నారు.ఇలాంటి వారు అనేక మంది యోగి కనుసైగల కోసం ఎదురు చూస్తున్నారు. తన అనుచరులకు సీట్లు ఇవ్వకపోతే ఏం చేస్తానో చూడండి అన్నట్లుగా యోగి చూపారు. ఆయన కనుసన్నలలో నడిచే హిందూ యువ వాహిని స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఉప ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు వస్తే తనపై వేటు పడుతుందని గ్రహించిన యోగి ఆ నియోజకవర్గాలకు 16 మంది మంత్రులను కేటాయించారు. ఎన్నికలు ముగిసేవరకు వారంలో రెండు రోజులు మంత్రులు అక్కడే మకాం వేయాలని ఆదేశించారు. గెలిస్తే తన ప్రతిభ లేకపోతే మంత్రులు సరిగా పనిచేయలేదని చెబుతారు.


ఆకస్మికంగా ప్రభుత్వం మీద జనాలకు ఆగ్రహం కలిగేందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటంటూ బిజెపి ఎంఎల్‌సి దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సిఎంకు లేఖ రాశారు.రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నందున కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలన్న ఎంఎల్‌ఏ రమేష్‌ మిశ్రా వీడియో వైరల్‌ అవుతోంది.బిజెపి మిత్ర పక్షం నిషాద్‌ నేత సంజరు నిషాద్‌ కూడా యోగిపై ధ్వజమెత్తారు.బుల్డోజర్లను మాఫియాలు, భూ కబ్జాదారులపై ప్రయోగించాలి తప్ప తగిన పత్రాలు లేని పేదల ఇండ్లు కూల్చివేతకు ఉపయోగించరాదని, అలా చేస్తే ఎన్నికల్లో మనలను ఓడించేందుకు వారు సంఘటితం అవుతారని, అనేక ఉదంతాలలో అధికారులు అలాంటి కూల్చివేతలకు పాల్పడ్డారని అన్నారు. అతి విశ్వాసం, ఓట్ల బదిలీ మన అంచనాలను దెబ్బతీశాయి. గతంలో ప్రతిపక్షం వెంటిలేటర్‌ మీద ఉంది, ఇప్పుడు కొంత ప్రాణవాయువు తీసుకుంటున్నదని ఆదిత్యనాథ్‌ చెప్పారు.ఫైజాబాద్‌(ఆయోధ్య ఉన్న నియోజకవర్గం) వంటి గట్టి ప్రాంతాల్లో ఓడిపోవటానికి కొన్ని కులాలు దూరం కావటమే కారణం, ఓబిసి కులాల,దళితుల మద్దతు తిరిగి పొందాలంటే ఓబిసి నేత, ఉపముఖ్యమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఉన్న మౌర్యకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుందని యోగి వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.ప్రధాని నరేంద్రమోడీ కొన్ని రౌండ్లలో వెనుకబడిన తీరు చూస్తే నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్లు ఎంతవారైనా ఓడిపోకతప్పదు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో పది స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని, తరువాత యోగికి ఉద్వాసన ఖాయమని చెబుతున్నారు.అధికారం అందరినీ కలిపి ఉంచుతుంది. దానికి ముప్పు సూచనలు కనిపిస్తే అసలు రంగు తెలుస్తుంది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ బిజెపిలో జరుగుతున్న పరిణామాలు దీన్నే వెల్లడిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చికిత్సలేని హిందూత్వ వైరస్‌ – వాళ్లంతే ! అదో టైపు !! ఓటేయని ముస్లింలు, యాదవులను పట్టించుకోరట-ప్రమాణాన్ని ఉల్లంఘించిన కేంద్ర మంత్రి !

14 Sunday Jul 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

#Hindutva, Anti Muslim, Communal Sentiments, Himanta Biswa Sarma, Hindu Rashtra, Hindu Supremacists, Hindutva fanatics, Narendra Modi Failures, RSS, Union Minister Giriraj Singh


ఎం కోటేశ్వరరావు


” ముస్లింలు నాకు ఓటు వేయలేదు.కాబట్టి ఇప్పుడు నేను కూడా వారికోసం పని చేయటం లేదు. నా ప్రాంతంలోని ఒక మౌల్వీ ఒక ఇల్లు, ఉజ్వల గ్యాస్‌, ఐదులక్షల రూపాయల ఆయుష్మాన్‌, మరుగుదొడ్డి, రేషన్‌ కార్డు కూడా పొందాడు. నాకు ఓటు వేసి ఉంటే ప్రమాణం చేసి చెప్పాలని నేను అడిగాను, అతనా పనిచేయలేదు. నా హృదయం ముక్కలైంది. ఇది సనాతన ధర్మాన్ని బలహీన పరిచేందుకు, భారత్‌పై ముస్లిం యుద్ధం (ఘజ్వా ఏ హింద్‌ ) చేసేందుకు పక్కాగా రూపొందించిన ఒక వ్యూహం ” తెల్లారగానే సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌ సుప్రభాతంతో జనాన్ని నిద్రలేపే కారణజన్ముడైన దేవుని బిడ్డ నరేంద్రమోడీ గురించి తెలిసిందే. అలాంటి దైవాంశసంభూతుడి మంత్రివర్గ సభ్యుడైన జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత తాజాగా ఎక్స్‌ ఖాతాలో వెల్లడించిన అభిప్రాయమిది. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రిగా ” నా బాధ్యతలను నమ్మకంగా మరియు మనస్సాక్షిగా నిర్వర్తిస్తాను. మరియు రాజ్యాంగం మరియు చట్ట ప్రకారం అన్ని రకాల ప్రజలకు భయం లేదా అభిమానం, ఆప్యాయత లేదా దురుద్దేశ్యం లేకుండా న్యాయం చేస్తాను ” అని ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి దాన్ని ఉల్లంఘించారు. ఇందుకు గాను అతగాడిని మంత్రి వర్గం నుంచి ప్రధాని తొలగించాలి, లేదా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాష్ట్రపతి తన బాధ్యతను నిర్వర్తించాలి. ఏదీ జరిగే సూచనలు లేవు.


ఘజ్వా ఏ హింద్‌ అనే పదాన్ని ఇటీవల అనేక మంది ముఖ్యంగా హిందూ-ముస్లిం మతోన్మాదులు, ఉగ్రవాదులు, కొన్ని మీడియా సంస్థల జర్నలిస్టులు రెండు మతాలవారినీ రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్నారు. కొంత మంది ఇస్లామిక్‌ పండితులు దాని అసలు అర్దాన్ని వక్రీకరిస్తున్నారని వివరణ ఇచ్చారు. దాని సారం ఏమిటంటే మహమ్మద్‌ ప్రవక్త ప్రవచనాలకు తప్పుడు భాష్యం చెబుతున్నారు.దానితో విబేధించే పండితులు కూడా ఉన్నారు. క్రైస్తవం మీద తిరుగుబాటులో భాగంగా ఇస్లాం ఉద్భవించింది. క్రీస్తుశకం 530వ సంవత్సరంలో జన్మించిన మహమ్మద్‌ ప్రవక్త 632జూన్‌ ఎనిమిదిన మరణించాడు.ఎవరి భాష్యం ఎలా ఉన్నప్పటికీ నాడు చెప్పిన అంశాలు నేడు వర్తించవన్నది తెలిసిందే. ఈ అంశాలలో హిందూ-ముస్లిం మతశక్తులు బొమ్మా- బొరుసు వంటివి. సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని రెండూ చెబుతున్నాయి. అరబ్బీలో ఘజ్వా అంటే యుద్ధం. భారత ఉపఖండం మీద దాడి చేసి ఇస్లాం భావజాలాన్ని వ్యాపింప చేయాలని ప్రవక్త చెప్పాడని, దాన్ని కొనసాగించాలని ముస్లిం తిరోగమనవాదులు నిత్యం రెచ్చగొడుతుంటారు. ముస్లింలు ఇప్పటికీ ఘజ్వాను వదల్లేదని అందువలన వారి దాడి నుంచి హిందూ లేదా సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ హిందూ తిరోగమన వాదులు పదే పదే దాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు.నిజానికి సనాతనం అంత గొప్పదైతే మరి అంటరానితనం, వివక్షలనే కాన్సర్లు మన సమాజంలో ఎలా విస్తరించాయి ? మహానుభావుడు అంబేద్కర్‌కు సనాతనం గురించి తెలియదా ? పక్కాగా తెలుసు, నాటి సనాతనుల ఆచరణను చూసే దాన్ని వ్యతిరేకించి బౌద్దంలోకి మారిన సంగతి తెలిసిందే.అంటరాని తనంతో సహా అనేక వివక్షలను రుద్దిన మనుస్మృతిని అమలు జరపాలని అంటే దళితులు, గిరిజనులు, వెనుక బడిన తరగతుల వారు బిజెపికి దూరం అవుతారనే భయంతో దాని బదులు సనాతన ధర్మం అనే పల్లవిని అందుకున్నారు. ఇది కూడా ఎంతో కాలం నడవదన్నది వేరే సంగతి.


దానిలో భాగంగానే హిందూ దేవాలయాలు, యాత్రా ప్రాంతాలలో ఉన్న ముస్లింల దుకాణాలను మూసివేయాలి. ముస్లిం పేర్లతోనే ముస్లింలు దాబాలను ఎందుకు తెరవరు ? కన్వర్‌ యాత్రీకులను మోసం చేసేందుకు ముస్లిం దాబాల యజమానులు హిందూ పేర్లు పెడుతున్నారు,పేర్లు ఎందుకు మార్చాలి, దాబాలను ఎందుకు తెరవాలి అంటూ విశ్వహిందూ పరిషత్‌ ప్రశ్నిస్తోంది. సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్థలకు చెందిన వారు, దాని మతోన్మాద వైరస్‌ బారిన పడిన వారు ఇలాంటి విద్వేషాన్ని వెళ్లగక్కటం తెలిసిందే. అఫ్‌ కోర్సు అలాంటి వాటిని అలఓకగా వెల్లడించే వారిలో పేరుమోసిన వ్యక్తి గిరిరాజ్‌ సింగ్‌ అన్నది తెలిసిందే. ఇలా మాట్లాడటం తగదని తన సహచరులకు నరేంద్రమోడీ అంతర్గతంగానైనా చెప్పి ఉంటే గిరిరాజ్‌ సింగ్‌ లాంటి వారు, విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్థలు పదే పదే రెచ్చిపోతాయా ? దైవాంశ సంభూతుడిని తిరస్కరిస్తాయా ? మీరంతా నిమిత్త మాత్రులు, మీతో చెప్పించేది, చేయించేదీ అన్నీ నేనే అనే భగవద్గీత సారం తెలిసిందే. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి…గుడిసెలు అనే సామెత తెలిసిందే కనుక టీకా తాత్పర్యాలు అవసరం లేదు.


మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది గనుకనే నరేంద్రమోడీ మూడవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా మత స్వేచ్చ నివేదికలో మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు, విద్వేష ప్రచారం గురించి పేర్కొన్నారు. ప్రతి ఏటా అమెరికా నివేదికల్లో ఈ అంశాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు.వాటిని ఒక వైపు మోడీ సర్కార్‌ ఖండిస్తున్నదీ, తిరస్కరిస్తున్నది. మరోవైపున కాషాయ దళం తనపని తాను చేస్తున్నది. నిజం ఏమిటో మన జనానికి తెలియదా ? మణిపూర్‌లో క్రైస్తవులైన గిరిజన కుకీల మీద జరిగిన దాడులు,హత్యాకాండ, ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన వైనం అక్కడి బిజెపి రాష్ట్ర ప్రభుత్వం దాచినా దాగలేదు.గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలోనే కాదు, చివరకు హిందువులైన మెయితీలు అధికంగా ఉన్న చోట కూడా బిజెపి రెండు చోట్లా తాజా లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరచింది. గిరిరాజ్‌ సింగ్‌ కేంద్ర మంత్రిగా ఎవరి పట్లా వివక్ష చూపనంటూ చేసిన ప్రమాణస్వీకారాన్ని ఉల్లంఘించి మాట్లాడారు గనుకనే ఆ పెద్ద మనిషి గురించి చెప్పుకోవాల్సి వస్తున్నది. ముస్లింలు దుకాణాలు తెరవకూడదు, ఉన్నవాటిని మూసివేయాలంటూ వీరంగం వేసిన అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో హిందువులే మెజారిటీ అయినప్పటికీ అక్కడ బిజెపి ఓడిపోయింది. ప్రతిపక్షాలు గెలిస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని స్వయంగా నరేంద్రమోడీ చెప్పినా అక్కడి జనాలు పట్టించుకోకుండా చెంపదెబ్బ కొట్టినట్లుగా తీర్పు చెప్పారు.


ఆరునెల్లు గడిస్తే వారు వీరవుతారు అన్నట్లుగా బిజెపితో చేతులు కలిపిన ఇతర పార్టీలు కూడా దాని భావజాలాన్ని, విద్వేషాన్ని తలకెక్కించుకుంటున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయని యాదవులు, ముస్లింల కోసం తాను ఎలాంటి పనులు చేయనని బీహార్‌లోని నితీష్‌ కుమార్‌ పార్టీ జెడియు సీతామరి ఎంపీ దేవేష్‌ చంద్ర ఠాకూర్‌ ఇటీవల ప్రకటించారు. యాదవులు, ముస్లింలు తనవద్దకు వస్తే స్వీట్లు పెట్టి, టీ ఇచ్చి పంపుతాను తప్ప వారికి ఎలాంటి పనులూ చేయనని అన్నారు.హృదయంలో చెలరేగిన భావాలతోనే ఠాకూర్‌ అలా మాట్లాడినట్లు అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అతగాడిని సమర్ధించారు.కేంద్రం, రాష్ట్రం అమలు జరిపిన పధకాలతో లబ్ది పొందిన ముస్లింలు తనకూ ఓట్లు వేయలేదన్నారు. దీనికంతటికీ మంగళసూత్రాలు లాక్కుంటారంటూ ప్రతిపక్షాల మీద ప్రధాని నరేంద్రమోడీ చేసిన తప్పుడు ప్రచారమే కారణని ఆర్‌జెడి విమర్శించింది. ఎంపీలు, ఎంఎల్‌ఏలు నియోజకవర్గాల్లో ఉన్న అందరికీ చెందిన వారు తప్ప ఒక కులం, మతానికో ప్రాతినిధ్యం వహించేవారు కాదని, రాజ్యాంగం మేరకు దేశం నడుస్తున్నది తప్ప కొంత మంది బుర్రల్లో పుట్టినదాని ప్రకారం కాదని పేర్కొన్నది. ఇలాంటి ఎంపీలు, కేంద్ర మంత్రుల వద్దకు కేవలం టీ తాగేందుకు ఆత్మగౌరవం కలవారు ఎవరైనా వెళతారా ?యాదవులు, ముస్లింలే కాదు, వీరికి ఓటేయని ఏ సామాజిక తరగతికీ మినహాయింపు ఉండదని అందరూ గమనించాలి.ఇలాంటి వారు బిజెపి, దాని మిత్రపక్షాల్లో ఎంతగా వర్ధిల్లితే అంతగా జనం అసలు రంగు తెలుసుకుంటారు.


గిరిరాజ్‌ సింగ్‌ ఏం మాట్లాడినా బిజెపి పెద్దలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నాటి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలోనే బీహార్‌ బెగుసరారు నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జిల్లా కలెక్టర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బహుశా ఈ పెద్ద మనిషి డిఎన్‌ఏలోనే ముస్లిం ద్వేషం ఉన్నట్లు అతగాడి వదరుబోతుతనం వెల్లడిస్తున్నది.దేశ విభజన సందర్భంగా ముస్లింలందరినీ పాకిస్తాన్‌ పంపకపోవటం మన పూర్వీకులు చేసిన పెద్ద తప్పిదం అన్నారు.2014లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీకి ఓటు వేయని వారిని పాకిస్తాన్‌ పంపాలని సెలవిచ్చినందుకు బహుమతిగా నాడు సహాయ కేంద్ర మంత్రి పదవి, తరువాత మరింతగా రెచ్చిపోయినందుకు 2019లో కాబినెట్‌ మంత్రిగా, మరోసారి ఇప్పుడు కొనసాగించారు మోడీ. బీహార్‌లో మిత్ర పక్షాలుగా ఉన్న ఎల్‌జెపి, జెడియు నేతలు ఈ పెద్దమనిషి వ్యాఖ్యలను విమర్శించటం తప్ప గట్టిగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు. మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్థలలో ఇలాంటి విద్వేష ప్రసంగీకులకు కొదవ లేదు. విశ్వహిందూ పరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా వారిలో ఒకరు. ” మనం అధికులుగా ఉన్న ప్రాంతాలలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ముస్లింలను భయపెట్టాలి ” అన్నారు. నోటిదూల, నోటి తుత్తర లేదా విద్వేష గళాల పీఠాధిపతుల్లో గిరిరాజ్‌ సింగ్‌ను ఒకరిగా చెప్పవచ్చు.ప్రపంచ జనాభా దినం సందర్భంగా 2019 జూలై 11న మంత్రి హౌదాలో ఒక ట్వీట్‌ ( ప్రస్తుతం ఎక్స్‌) చేశారు. ” ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఓటింగ్‌ హక్కు రద్దు చేయాలన్నది నా వైఖరి ” అని పేర్కొన్నారు. ఇది ముస్లింలను ఉద్దేశించే చేసినప్పటికీ ఇతర మతాలలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి కూడా వర్తిస్తుంది కనుక వారు కూడా ఇలాంటి వ్యక్తులు, వారి పార్టీ గురించి ఆలోచించుకోవాలి.


బిజెపి నేతలు హిందూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని బహిరంగంగానే ప్రకటిస్తారు. తనకు మియా(అసోంలోని ముస్లింలకు మరోపేరు)ల ఓట్లు అవసరం లేదని సాక్షాత్తూ ఆ రాష్ట్ర సిఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. తాను వారి ప్రాంతాలలో అసలు ప్రచారానికే వెళ్లనని కూడా చెప్పారు. మియాల్లో బాల్య వివాహాలు అంతరించేవరకు వారి ఓట్లను తాను కోరనని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని కూడా చెప్పారు. ముస్లిం సామాజిక తరగతి ఉద్దారకుడిగా ఫోజు పెడుతూ వారి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటం తప్ప ఇది మరొకటి కాదు. దేశంలో బాల్యవివాహాల సామాజిక రుగ్మత ఉంది. దాన్ని రూపుమాపాలంటే జనాల ఆర్థిక, విద్యా స్థాయిని మెరుగుపరచాలి. అసలు వాస్తవం ఏమంటే దేశంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 84శాతం హిందువుల్లోనే ఉన్నట్లు ఇండియా స్పెండ్‌ అనే మీడియా సంస్థ జనాభా లెక్కలను విశ్లేషించి చెప్పింది. ముస్లింలలో పదకొండుశాతం, ఇతరులు మిగతా మతాల్లో ఉన్నారు. అదే హిమంత బిశ్వశర్మ బాల్య వివాహాలు చేసే హిందువుల ఓట్లు, అంటరానితనం పాటించేవారి ఓట్లు తమకు అవసరం లేదని చెప్పగలరా ? బిజెపి నేతల నాలికలకు నరం లేదు. ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది మాట్లాడతారు. తనకు ఓట్లు వేయని కారణంగా ముస్లింల కోసం తాను పనిచేయనని రాజ్యాంగ విరుద్దమైన మాటలను కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వల్లిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో బిజెపి సీనియర్‌ నేత కెఎస్‌ ఈశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు ఒక్కటి కూడా అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఆవు చేలో మేస్తుంటే దూడగట్టున ఉంటుందా ? అధినేత నరేంద్రమోడీ స్వయంగా ఇటీవలి ఎన్నికల్లో ముస్లిం విద్వేషాన్ని ఎలా రెచ్చగొట్టారో తెలిసిందే. మోడీ ముందు హిమంత బిశ్వశర్మలూ, గిరిరాజ్‌ సింగ్‌లూ మరుగుజ్జులే. తన ఉపన్యాసాలు, వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశం అవుతాయని, భారత ప్రతిష్ట మురికి గంగలో కలుస్తుందని తెలిసి కూడా మోడీ వెనక్కు తగ్గలేదు.ఏది ఎటుపోతేనేం ! కావాల్సింది ఓట్లు, అధికారం ! రామరాజ్యం కోరుకొనే శక్తులకు ఓటు వేస్తారా లేక ఓట్‌ జీహాదీలకు వేస్తారా అంటూ మోడీ ఓటర్లను అడగటం తెలిసిందే.కాంగ్రెస్‌ అధికారానికి వస్తే చొరబాటుదార్లకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి సంపదలు పంచుతారని, పుస్తెలను కూడా లాక్కుంటారని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి మాట్లాడిందీ తెలిసిందే. దేశాన్ని ఆక్రమించుకొనేందుకు ముస్లింలకు కాంగ్రెస్‌ సహాయం చేస్తోందని కూడా ఆరోపించారు. మోడీ దిగజారి మాట్లాడినట్లు, అది కూడా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం అవాంఛనీయమని బిజెపి నేత అలోక్‌ వత్స తమతో వ్యాఖ్యానించినట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది. సంవత్సరాల తరబడి గుడ్డిగా మోడీకి మద్దతు ఇచ్చిన వారు కూడా ఆయన వ్యాఖ్యలను ఆమోదించరని, ప్రధాని స్థాయికి తగని మాటలని వత్స అన్నట్లు పేర్కొన్నది. ఇలాంటి నేత అనుచర గణం ప్రసన్నం చేసుకొనేందుకు మరింత రెచ్చిపోతుంది తప్ప వెనక్కు తగ్గదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d