• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

పారిస్‌ ఒలింపిక్స్‌లో చైనా వస్తువుల సందడి !

29 Wednesday May 2024

Posted by raomk in CHINA, Current Affairs, Economics, INTERNATIONAL NEWS, Opinion, Sports

≈ Leave a comment

Tags

#Paris Olympics 2024, ‘World’s Factory’, China, Chinese products, Olympics, Sports


ఎం కోటేశ్వరరావు


చైనా రియలెస్టేట్‌ రంగంలో తలెత్తిన కొన్ని సమస్యలను చూపి ఇంకేముంది అక్కడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అంటూ కొంత మంది విశ్లేషణలు చేశారు, పండగ చేసుకున్నారు. కానీ అదే చైనా వస్తువులు ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11వరకు జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో పెద్ద మొత్తంలో దర్శనమివ్వనున్నాయి.క్రీడా పతకాలతో పాటు ప్రపంచ ఫ్యాక్టరీగా తన సత్తా ఏమిటో చూపనుంది. చైనా తూర్పున ఉన్న జెజియాంగ్‌ రాష్ట్రంలో ‘ఇవు’ అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్‌ ఉంది. అది ఎంత పెద్దది అంటే నలభైలక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన సముదాయం, 75వేల దుకాణాలు ఉన్నాయి. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌ ఇతివృత్తంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసేందుకు దిగుమతిదారులు పెద్ద సంఖ్యలో ఆ మార్కెట్‌ను సందర్శించి వస్తువులకు ఆర్డర్లు పెట్టారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల నుంచి ఈ సందడి ప్రారంభమైంది.ఈ వాణిజ్య, పారిశ్రామిక కేంద్రం నుంచి ఒక్క పారిస్‌ ఒలింపిక్స్‌కే కాదు, అమెరికా, ఐరోపాదేశాల్లో జరిగే అని ప్రముఖక్రీడలకూ అవసరమైన వస్తువులను ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నారు. జూన్‌ మాసం వరకు ఒలింపిక్‌ ఆర్డర్ల తయారీకి ఒప్పందాలు కుదిరాయి.జెర్సీలు, ట్రోఫీలు, మెడల్స్‌ ఒకటేమిటి అన్ని రకాల క్రీడా సామగ్రి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్నాయి.టేబుల్‌ టెన్నిస్‌ బంతుల్లో తక్కువ రకం ధర 0.083 డాలర్లు (రు.6.90) ఉంది.పారిస్‌ ఒలింపిక్స్‌లో వాడే ఆరుబంతుల ధర.460గా ఉంది.


అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే మొత్తంగా ఫ్రాన్స్‌కు ఈ మార్కెట్‌ కేంద్రం నుంచి ఎగుమతులు 42శాతం పెరగ్గా వాటిలో క్రీడావస్తువుల పెరుగుదల 70శాతం ఉందంటే పారిస్‌ ఒలింపిక్సే కారణం.జెజియాంగ్‌ రాష్ట్ర జనాభా 5.75 కోట్లు. ఇక్కడ ప్రధానంగా వస్త్రాల వంటి వినిమయ వస్తువులు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. చైనా నుంచి వస్తువులను కొనుగోలు చేసేవారు వేరే దేశాలకు మరలుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వస్తుతయారీ నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉత్పత్తుల మీద చైనా కేంద్రీకరించింది. దీనికి తోడు వేతనాల పెరుగుదల వంటి కారణాలతో కొన్ని సంస్థలు ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడికి వెళ్లటం బహిరంగ రహస్యం.దీనికి తోడు వాణిజ్య ఆంక్షలు, సుంకాల విధింపు, ప్రపంచ రాజకీయాలూ పని చేస్తున్నాయి.ఇన్ని కారణాలున్నా ప్రపంచ సరఫరా గొలుసు నుంచి చైనాను తప్పించటం ఇప్పట్లో జరిగేది కాదన్నది పచ్చినిజం. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వస్తువులు చైనా మొత్తం ఎగుమతుల్లో 2017లో 18శాతం ఉండగా 2023లో 17శాతానికి మాత్రమే తగ్గాయి. ఇదంతా అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం తరువాత జరిగిన పరిణామం.


చైనాలో తలెత్తిన రియలెస్టేట్‌ సమస్యలకూ పారిశ్రామిక ఉత్పత్తులకు కొందరు ముడిపెడుతున్నారు. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి రేటు 5.3శాతం కాగా పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల రేటు 6.1శాతం కాగా పెట్టుబడులు పదిశాతం వరకు పెరిగాయి. మొత్తం సంక్షోభంలో కూరుకుపోయిందని చెబుతున్నవారే అవసరాలకు మించి ఉత్పత్తి చేసి తమ దేశాల్లో కుమ్మరిస్తున్నట్లు గగ్గోలు పెడతారు.ఈ ఏడాది ప్రారంభంలో చైనా పారిశ్రామికరంగ వినియోగం 75శాతం ఉంది. తీసుకున్న ఆర్డర్లను వేగంగా సకాలంలో పూర్తి చేసి ఇవ్వటంలో చైనా తిరుగులేనిదిగా ఉంది.పారిస్‌ ఒలింపిక్స్‌ వస్తువుల విషయంలోనూ అదే నమ్మకం ఉన్నకారణంగా వ్యాపారులు ఎగబడ్డారు.తక్కువ ధరలకు అందించటంతో పాటు సకాలంలో సరఫరా ఇక్కడ ముఖ్యం.జెజియాంగ్‌ రాష్ట్రంలో 78 పారిశ్రామిక పార్కులుంటే వాటిలో నాలుగున్నరవేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి.వాటికి స్థానిక సంస్థలు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్నందున ఆధునిక ప్రమాణాలతో కూడిన ఉత్పాదక పద్దతులతో పాటు మార్కెటింగ్‌ సౌకర్యాలను కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మార్కెట్‌ ధోరణులను పసిగట్టి అందుకనుగుణ్యంగా ఉత్పత్తుల్లో మార్పులు చేయటం చైనా ప్రత్యేకత అని చెప్పవచ్చు.ఈ కారణంగానే ప్రపంచంలో పెద్ద వాటిలో ఒకటైన షి ఇన్‌ ఫ్యాషన్‌ కంపెనీ వారానికి 50వేల కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుండగా జారా అనే కంపెనీ ఏటా పాతికవేలను ఉంచుతున్నది. భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్న కారణంగా చైనాలో ఖర్చు తగ్గుతుంది, దాంతో చౌక ధరలకు విక్రయించగలుగుతున్నది.తనకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన విధానాలను రూపొందిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చైనాకు ఇతర దేశాలు ఎంత అవసరమో, ప్రపంచానికి దాని అవసరమూ అంతే ఉంది. పరస్పర ఆధారాన్ని ఎవరు దెబ్బతీసినా రెండు పక్షాలూ నష్టపోతాయి.


చైనాలో మే ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు మేడే సెలవలు ఇస్తారు. ఈ సందర్భంగా జరిగే వస్తు విక్రయాలు చైనా ఆర్థిక వ్యవస్థ, పౌరుల కొనుగోలు శక్తిని అంచనా వేసేందుకు ఒక కొలబద్దగా పరిగణిస్తారు. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో నమోదైన వివరాలు చైనా తిరిగి కోలుకోవటమే కాదు పెరగటాన్ని సూచించాయి. మే ఒకటవ తేదీన ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల వద్ద నమోదైన వివరాల ప్రకారం 28 కోట్ల ప్రయాణాలు జరిగాయి. ఇవి కరోనాకు ముందున్న స్థాయిని దాటినట్లు పేర్కొన్నారు.జల, వాయు, భూ మార్గాలలో జరిగే ఈ ప్రయాణాలతో రవాణా సంస్థలే కాదు, పర్యాటక రంగం, వస్తూత్పత్తి ఇతర సేవారంగాలు కూడా లబ్దిపొందుతాయి. అనేక దేశాలకు ఎలాంటి వీసాలతో నిమిత్తం లేకుండా చైనా పౌరులు విహార యాత్రలకు వెళ్లవచ్చు. దీంతో ఆయా దేశాలూ, చైనా కూడా లబ్దిపొందుతున్నది. ఐదు రోజుల మేడే సెలవుల్లో 5,800 విమానాలు 9.18లక్షల మంది ప్రయాణీకులను చేరవేస్తాయని అంచనా వేశారు.జపాన్‌, దక్షిణ కొరియాలకు ఎక్కువ మంది వెళతారు.ఈ సారి 2019తో పోలిస్తే ఈ ఏడాది 20శాతం ఎక్కువగా ఈ దేశాలకు టికెట్లను కొనుగోలు చేశారు.ఇతర దేశాలకూ ఇదే రద్దీ ఏర్పడింది.


ఆధునిక పరిజ్ఞానంలో గతంలో చైనా ఎంతో వెనుకబడి ఉండేది. ఇప్పుడు కొన్ని రంగాలలో పశ్చిమ దేశాలను సవాలు చేస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం జనం నోళ్లలో నానుతున్న కృత్రిమ మేథ(ఏఐ)లో చైనా పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముందుకు వస్తుందేమో అన్న భయంతో అమెరికాకు నిదురబట్టటం లేదంటే అతిశయోక్తి కాదు. మేథోసంపత్తి హక్కులున్న నమూనాలకు బదులు అందరికీ అందుబాటులో(ఓపెన్‌ సోర్స్‌) ఉన్న వనరుల మీద చైనా కేంద్రీకరిస్తున్నది. ఇప్పటి వరకు అనేక బడా కంపెనీలు కొన్ని ఉత్పత్తులపై పేటెంట్‌ హక్కులను పొంది విపరీతంగా లాభాలు పొందుతున్న సంగతి తెలిసిందే.కృత్రిమ మేథ అలాంటి కంపెనీలను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. మేథో విజ్ఞానాన్ని మానవ కల్యాణానికి బదులు మారణాయుధాలు తయారు చేసేందుకు, తమకు లొంగని దేశాల వ్యవస్థలను దెబ్బతీసేందుకు వినియోగించిన చరిత్ర పశ్చిమదేశాలది. వివిధ భాషల్లో ఉన్న సమాచారాన్ని పెద్ద ఖర్చు లేకుండానే మన భాషలో తర్జుమా చేసుకొని చదువుకోవచ్చు. మనదేశంలో దుర్వినియోగం చేస్తూ జనాన్ని తప్పుడు సమాచారంతో పక్కదారి పట్టిస్తున్న తీరు ఇప్పటికే చూస్తున్నాము. ఈ రంగంలో చైనా పురోగతిని చూసి అది కూడా తమ మాదిరే వ్యవహరిస్తే అని ఊహించుకొని ఏఐతో చైనా ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటుందని, సైబర్‌దాడులు, జీవాయుధాల తయారీ వంటి వాటికి వినియోగించనుందంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు.లైనక్స్‌, హ్యూమన్‌ జినోమ్‌, ఇమేజ్‌నెట్‌, పైటార్చ్‌ వంటి అందరికీ అందుబాటులో ఉన్న వనరులతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో లబ్దిపొందవచ్చు,విద్యార్ధులు, పరిశోధకులకు ఇవి ఎంతో ఉపయోగం.చైనా కంపెనీల విజయానికి ఇదొక ప్రధాన కారణం.వారి నుంచి ఇతర దేశాలు ఎంతో నేర్చుకుంటున్నాయి.చైనాతో పోటీ పడాలని అమెరికాలోని అనేక మంది తమ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు.
తెలివితేటలు కేవలం కొందరి సొంత అన్న భ్రమలు కలిగిన వారికి అవి పటాపంచలయ్యాయి.కృత్రిమ మేథతో ప్రయోజనాలకంటే ప్రమాదాలే ఎక్కువ అనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. గూండాల చేతుల్లో పడితే చాకులు మారణాయుధాలుగా మారతాయి గనుక ఎక్కువ మందికి వినియోగపడే వాటిని తయారు చేయటం మానుకుంటామా ? అణుబాంబులు కలిగి ఉన్న చైనా, రష్యా కృత్రిమ మేథతో వాటిని మోహరించేందుకు నిర్ణయం తీసుకుంటే ప్రమాదమమని అమెరికా గుండెలు బాదుకుంటోంది. అవసరం లేకున్నా ప్రపంచాన్ని భయపెట్టేందుకు, తమకు లొంగనివారికి ఇదే గతి అని హెచ్చరించేందుకు రెండవ ప్రపంచ యుద్ధ చివరి రోజుల్లో జపాన్‌ మీద అణుబాంబులు వేసిన దుర్మార్గానికి అమెరికా పాల్పడిన సంగతి తెలిసిందే. అణుబాంబులు దాని వద్ద, మిత్రదేశాలుగా ఉన్న బ్రిటన్‌, ఫ్రాన్సు దగ్గర కూడా ఉన్నాయి. అవి దుర్వినియోగానికి పాల్పడవన్న హామీ ప్రపంచానికి లేదు. ఆధునిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయవద్దంటూ తమ అధికారులు చైనాతో సంప్రదింపుల్లో చెప్పినట్లు అమెరికా అధ్యక్ష భవనం ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. కృత్రిమ మేథను దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రచారకొనసాగింపులో ఇదొక భాగం.చైనాతో వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానంలో పోటీపడలేమని, దానితో ఏదో ఘర్షణ పడటం వలన ప్రయోజనం లేదని అమెరికాకు అవగతమైందంటున్నవారూ లేకపోలేదు.


గత రెండు దశాబ్దాల్లో చైనా సాధించిన ప్రగతిని చూసి అమెరికాలో తీవ్ర మధనం జరుగుతోంది.దాన్నింక ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని అనేక మంది భావిస్తున్నారు. మార్చినెలలో అధ్యక్షుడు జో బైడెన్‌ తన పౌరులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ” చైనా పెరుగుతోంది, అమెరికా పడిపోతోందంటూ గత కొద్ది సంవత్సరాలుగా నా రిపబ్లికన్‌ మరియు డెమోక్రాట్స్‌ స్నేహితుల నుంచి వింటున్నాను ” అని చెప్పాడు.కరోనా తరువాత ఇంక చైనా పని అయిపోయింది, పెరగాల్సిన మేరకు పెరిగింది, ఇంక అవకాశం లేదు అని చెప్పేవారు తయారయ్యారు.కొందరు త్వరలో అమెరికాను అధిగమిస్తుందని, మాంద్యంలో కూరుకుపోతుందని చెప్పినవారూ ఉన్నారు.చైనా వృద్ధి వేగం తగ్గిన మాట నిజం.2021 నుంచి 2023 వరకు అమెరికా జిడిపిలో 76 నుంచి 67శాతానికి చైనాలో తగ్గిందని, అయినప్పటికీ 2019తో పోల్చితే 20శాతం పెద్దదని, కరోనా సమయంలో అమెరికా కేవలం ఎనిమిదిశాతమే పెద్దదన్నది మరచిపోవద్దని అంకెలు చెబుతున్నాయి. అమెరికాలో 2023జిడిపి పెరుగుదల రేటు 6.3శాతం ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ వృద్దిరేటు 2.5శాతమే. అదే చైనాను చూస్తే జిడిపి వృద్ది రేటు 4.6శాతమైనప్పటికీ వాస్తవ వృద్ది 5.2శాతం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ వైరుధ్యానికి కారణం చైనాలో ద్రవ్యోల్బణం రేటు తక్కువ, అమెరికాలో ఎక్కువగా ఉండటమే.అమెరికాలో వడ్డీరేటు 2022 మార్చినెల నుంచి 0.25 నుంచి 5.5శాతానికి పెంచగా చైనాలో 3.7 నుంచి 3.45శాతానికి తగ్గించారు. అమెరికాలో వడ్డీరేట్లను తగ్గిస్తే ఎలా ఉండేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జూలై 4న బ్రిటన్‌ ఎన్నికలు : టోరీలకు శృంగభంగం, రిషి సునాక్‌ గెలుపూ కష్టమే !

24 Friday May 2024

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

2024 United Kingdom general election, Rishi Sunak, Tory party, UK Labour party


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది జనవరి వరకు పార్లమెంటు గడువు ఉన్నప్పటికీ జూలై నాలుగున ముందస్తు ఎన్నికలు జరిపేందుకు ప్రధాని రిషి సునాక్‌ నిర్ణయించాడు. లేబర్‌ పార్టీతో పోల్చితే టోరీల పలుకుబడి 21పాయింట్లు తక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతుండగా తీసుకున్న ఈ నిర్ణయం అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్టోబరు లేదా నవంబరులో ఎన్నికలకు వెళతారన్న పండితుల అంచనాలు తలకిందులయ్యాయి. ఇటీవలి కాలంలో రిషి సునాక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువలన రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఓటమి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు గనుక దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న చందంగా ఇప్పుడు ఎన్నికలు జరిపితే ఓడినా గౌరవ ప్రదంగా కొన్ని సీట్లు తెచ్చుకోవచ్చన్న ఎత్తుగడే ప్రధానంగా కనిపిస్తోంది.మేనెల పదమూడవ తేదీ సర్వప్రకారం లేబర్‌ పార్టీ 44, టోరీలు 23పాయింట్లతో ఉండగా ప్రధాని రిషి సునాక్‌ పనితీరు బాగోలేదన్నవారు గత ఏడాది జూన్‌తో పోల్చితే 57 నుంచి 65శాతానికి పెరిగారు. వ్రతం చెడినా ఫలం దక్కుతుందా ?


సునాక్‌ దంపతుల సంపద 12 కోట్ల నుంచి 65.1కోట్ల పౌండ్లకు పెరిగిందని తాజాగా సండే టైమ్స్‌ ధనికుల జాబితాలో ప్రకటించింది. కానీ ప్రధానిగా జనాభిమానం మాత్రం దిగజారుతోంది.పద్నాలుగేండ్ల టోరీల పాలన పొదుపు చర్యలతో జనం విసిగిపోయారు.అన్ని విధాలుగా కార్మికవర్గం దెబ్బతిన్నది. లండన్‌ కింగ్స్‌ కాలేజీ జరిపిన అధ్యయనం ప్రకారం 2010-20 సంవత్సరాల మధ్య ప్రభుత్వ పొదుపు విధానాల వలన 148వేల మంది మరణించారు. ఇండ్ల అద్దెలపై అడ్డుఅదుపూ లేదు, బలహీనవర్గాల ఇండ్ల పధకాన్ని రద్దు చేశారు.ప్రపంచంలో బాగా అభివృద్ది చెందిన దేశాలలో బ్రిటన్‌ ఒకటిగా చెబుతున్న సంగతి తెలిసిందే.జనాభా 6.7 కోట్ల మందిలో ఒక ప్రమాణాన్ని తీసుకుంటే కోటీ పది లక్షలు, ఇండ్ల ధరలను కూడా పరిగణనలోకి తీసుకుంటే 1.44 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు అంచనా.పిల్లల్లో 42.2లక్షల మంది దారిద్య్రంలో ఉన్నారు. పది సంవత్సరాల క్రితం ఈ సంఖ్య 22.8లక్షలు.2021-22లో దాదాపు 2.8లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవు. అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఎవరికైనా ఇల్లు లేకపోతే కనీసం ఆరునెలలు ఉండేందుకు ప్రభుత్వం ఇంటి వసతిని చూపాల్సి ఉంటుంది.ఎక్కడో ఒక దగ్గర నిద్రపోతూ పని చేసే వారు గణనీయంగా ఉన్నారు. అలా నిద్రపోతూ దొరికిన వారికి వెయ్యి పౌండ్ల వరకు జరిమానా విధించే నిబంధనలను ప్రభుత్వం చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా జీవన వ్యయం విపరీతంగా పెరిగింది.మనదేశంలో తగినంత ఉపాధి చూపటంలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా పేదలు ఆహారధాన్యాలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నారు.ఈ కారణంగానే 80 కోట్ల మందికి నెలకు ఐదు కిలోల చొప్పున ఐదేండ్ల పాటు ఉచితంగా ఇస్తున్నట్లు సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో తినటానికి తిండి దొరకనివారికి ఆహార కూపన్ల ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఆహార పొట్లాలను అందిస్తారు. వాటిని ఆహార బ్యాంకులని ముద్దుపేరుతో పిలుస్తారు. ట్రసెల్‌ అనే పేరుతో ఉన్న ఒక ట్రస్టు నిర్వహిస్తున్న ఆహార బ్యాంకు నుంచి 2008-09లో కేవలం 25,899 మంది ఇలా ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటే 2022-23నాటికి ” మన హిందువు, భారత సంతతి ”గా అనేక మంది కీర్తించిన రిషి సునాక్‌ ఏలుబడిలో వారి సంఖ్య 29లక్షల 86వేల 203కు పెరిగింది.


పొట్టచేతబట్టుకొని లేదా అణచివేతలను తప్పించుకొనేందుకు శరణార్ధులుగా వచ్చే వారిని సహించలేని స్థితిలో బ్రిటన్‌ పెట్టుబడిదారీ వర్గం ఉన్నదంటే అతిశయోక్తి కాదు.దీన్ని ఎదుర్కొనేందుకు అనుమతి లేకుండా వచ్చే వారిని బలవంతంగా ఆఫ్రికాలోని ర్వాండా దేశానికి తరలించి అక్కడ శిబిరాల్లో ఉంచి వారికి బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించాలా లేదా అన్నది నిర్ణయించేందుకు ర్వాండా ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నది బ్రిటన్‌. అందుకు గాను ప్రతి మనిషికి ఇంత అని చెల్లిస్తుంది. ఉదాహరణకు మూడు వందలు అంతకు మించి జనాలను పంపితే పన్నెండు కోట్ల పౌండ్లు ప్రభుత్వానికి, ఇరవైవేల చొప్పున శరణార్ధులకు చెల్లిస్తుంది. డబ్బుకక్కుర్తితో ర్వాండా సర్కార్‌కూడా శరణార్ధులను స్వీకరించేందుకు అంగీకరించింది. ముందు ర్వాండాకు తరలించి బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించేదీ లేనిదీ అక్కడ విచారిస్తారు.ఆశ్రయం కల్పించేందుకు నిర్ణయిస్తే బ్రిటన్‌కు తిరిగి అనుమతిస్తారు లేకపోతే ర్వాండా అంగీకరిస్తే అక్కడే ఉండేందుకు లేదా మూడో దేశం ఏదైనా అంగీకరిస్తే అక్కడకు పంపుతారు. ఇంగ్లీషు ఛానల్‌ దాటి పడవల ద్వారా అనుమతి లేకుండా ప్రవేశించిన వారు స్వచ్చందంగా వెనక్కు వెళ్లిపోయేందుకు అంగీకరిస్తే వారికి మూడువేల పౌండ్లు ఇస్తారు, లేకుంటే విమానాల ద్వారా ర్వాండాకు బలవంతంగా తరలిస్తారు. సుప్రీం కోర్టు ఈ ఒప్పందం చట్టవిరుద్దమని కొట్టివేసిన తరువాత తీర్పును వమ్ము చేస్తూ మరొక చట్టాన్ని 2023నవంబరులో పార్లమెంటు ఆమోదించింది.దీని మీద కూడా పిటీషన్లు దాఖలైతే విచారణకు 25 కోర్టు గదులు, 150 మంది న్యాయమూర్తులను సిద్దంగా ఉంచారు. తన కుటుంబం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన సంగతి గుర్తుంటే వలస వచ్చిన వారిని బలవంతంగా ర్వాండా పంపే కార్యక్రమానికి రిషి సునాక్‌ పూనుకొని ఉండేవాడు కాదు. ఓడమల్లయ్య-బోడి మల్లయ్య కథ మాదిరి ఒక కార్పొరేట్‌గా తన వర్గ స్వభావాన్ని ప్రదర్శించాడు.


టోరీల పద్నాలుగేండ్ల చరిత్రను చూసినపుడు ప్రతి ప్రధానీ విఫలం చెందినట్లు రుజువైంది.ముందస్తు ఎన్నికలతో రిషి సునాక్‌ కూడా చారిత్రక వైఫల్యాన్ని అంగీకరించినట్లే. ” ఇది ఏం చేయాలో తోచని వ్యక్తి ఆడుతున్న ఆట,దారులు కూడా మూసుకుపోయాయి, తన అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశ సైతం కనిపించని స్థితి ” అని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. మార్చినెలలో 3.2శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు 2.3శాతానికి తగ్గటం తన ఘనతే అని చెప్పుకుంటూ ఓటర్ల ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.2008 సంక్షోభం నుంచి బ్రిటీష్‌ పెట్టుబడిదారీ విధానం ఇంకా కోలుకోలేదని, అంతకు ముందుతో పోలిస్తే ఏడాదికి ప్రతి కార్మికుడు సగటున పద్నాలువేల పౌండ్లు నష్టపోతున్నట్లు ఒక అంచనా వెలువడింది.వేతన పెరుగుదల తీరుతెన్నులు చూస్తే నెపోలియన్‌ యుద్ధాల (1803-15) తరువాత ఇంత అధ్వాన్నంగా ఎప్పుడూ లేదని చెబుతున్నారు. ప్రభుత్వ ఖర్చులకు కోత, జనజీవీతాలు గిడసబారిపోవటంతో ఆలస్యయ్యేకొద్దీ వ్యతిరేకత పెరుగుతుందని భయపడుతున్నారు. ఒక సర్వేలో ఈ ఏడాది తమ జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని 58శాతం మంది చెప్పారు, అనేక మంది రుణ ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితిలో సునాక్‌ ప్రకటనతో అధికారం ముందుగానే దక్కనుందనే సంతోషంతో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ పండుగ చేసుకుంటున్నది.జూలై నాలుగు స్వాతంత్య్రదినమని కొందరు వర్ణించారు. పిచ్చిపని అని టోరీ ఎంపీలు తమలో తాము గొణుక్కుంటున్నారు. కార్మికుల మీద దాడులు జరిపిన టోరీ పాలనకు స్వస్తి చెప్పేందుకు ముందుగానే వచ్చిన అవకాశమని కార్మిక సంఘాలు కూడా ఎన్నికలను స్వాగతించాయి. అయితే కెయిర్‌ స్టార్మర్‌ నాయకత్వంలో ఏర్పడే లేబర్‌ పార్టీ ప్రభుత్వం పట్ల అప్రమత్తగా ఉండాలని కూడా కొన్ని సంఘాలు హెచ్చరించాయి. కార్మికవర్గ జీవితాలను ఫణంగా పెట్టి తాము బయటపడాలని కార్పొరేట్‌శక్తులు చూస్తున్నాయని, స్టార్మర్‌ యజమానులకు, ఇజ్రాయెల్‌కు అనుకూలం, కార్మికులు, వలసలకు వ్యతిరేకి అని పేర్కొన్నాయి. ఇటీవల లేబర్‌ పార్టీ ప్రకటనలు చూస్తే యజమానులకు అనుకూలంగా ఉన్నందున ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచీ ప్రతిఘటించాల్సిందేనని సోషలిస్టు వర్కర్‌ వంటి సంస్థలు స్పష్టం చేశాయి.ఎవరు గెలిచినా సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరు కొనసాగాల్సిందేనని పేర్కొన్నాయి.బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభ(కామన్స్‌)లోని 650 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో కన్సర్వేటివ్‌(టోరీ) పార్టీ 43.6శాతం ఓట్లతో 365, లేబర్‌ పార్టీ 32.1శాతం ఓట్లతో 202 సీట్లు తెచ్చుకుంది.ఈసారి ఎన్నికల్లో టోరీ పార్టీకి 98, లేబర్‌ పార్టీకి 468 వస్తాయని సండే టైమ్స్‌ సర్వే పేర్కొన్నది. అనేక మంత్రులు కూడా ఓడిపోనున్నట్లు జోశ్యం చెప్పింది. ప్రధాని రిషి సునాక్‌ కూడా ప్రత్యర్ధికంటే కేవలం 2.5శాతం ఆధిక్యంతోనే ఉన్నట్లు, ఓడిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పింది. వేల్స్‌, స్కాట్లాండ్‌ ప్రాంతాలలో, లండన్‌ నగరంలో ఒక్క సీటూ గెలిచే అవకాశం లేదన్నది.


రిషి సునాక్‌ మన వాడు ! బ్రిటన్‌ గద్దెపై తొలి హిందువు ! భారత్‌కు అనుకూలంగా బ్రిటన్‌ విధానాలు !
భారతీయులను అణగదొక్కిన వారి మీద ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ ! బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి గురించి మన మీడియాలో ఊదరగొట్టిన అంశాలు. చర్చోపచర్చల సంగతి సరేసరి. తెల్లవారే సరికి బ్రిటన్‌ రూపురేఖలు మార్చగల ఆర్థికవేత్త అంటూ కొండంత రాగాలు.సునాక్‌ తాతలు ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గుజ్రాన్‌వాలాకు చెందిన వారు. దేశ విభజనకు ముందే వారు బతుకు తెరువు కోసం ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియాకు వలస వెళ్లారు. కెన్యాలో సునాక్‌ తండ్రి, టాంజానియాలో తల్లి జన్మించారు.1960 దశకంలో వారి కుటుంబం బ్రిటన్‌ వలస వచ్చింది. తరువాత 1980 మే 16న రిషి సునాక్‌ బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌లో జన్మించాడు. చదువుకొనేటపుడు మన దేశానికి చెందిన ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిన్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షత లండన్‌లో చదివేటపుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు.


అనేక దేశాల్లో భారతీయ మూలాలు ఉన్న వారు అనేక మంది ఉన్నత పదవులను అధిష్టించారు.ఆ జాబితాను చూసినపుడు రిషి సునాక్కు ఇచ్చినంత ప్రచారం మరొకరికి ఎవరికీ ఎన్నడూ ఇవ్వలేదు. వారిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఉన్నారు. ఎందుకు వీరిని పట్టించుకోలేదు ? ఎవరిని సంతుష్టీకరించేందుకు మన మీడియా ఇంతగా పాకులాడినట్లు ? మీడియా అంతటిని హిందూ వ్యతిరేకులు ఆక్రమించారనే తప్పుడు ప్రచారాన్ని నిరంతరం సాగిస్తున్నవారు ఈ ప్రచారం గురించి ఏమంటారు ? మీడియాను ఎవరు నియంత్రిస్తున్నారు ? కన్సర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌ బ్రిటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు.అది కాదనలేని వాస్తవం. పంజాబీ మూలాలున్న తొలి ఆసియన్ను ప్రధానిగా రాజు ఛార్లెస్‌ నియమించాడు. ఆరునెలల కాలంలోనే ఇద్దరు ప్రధానుల రాజీనామాతో మూడవ కృష్ణుడిగా రిషి రంగంలోకి వచ్చాడు. ఆరు సంవత్సరాల కాలంలో ఐదుగురు ప్రధానులు మారిన బ్రిటన్‌లో ఏర్పడిన అస్థిరతకు ఈ పరిణామాలు నిదర్శనం. బ్రిటన్‌ చరిత్రలో కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్‌ ట్రస్‌ చరిత్రకెక్కారు.బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ పార్టీకి 190 సంవత్సరాలు, తొలుత దాని పేరు టోరీ.నూటపన్నెండు సంవత్సరాల క్రితం కన్సర్వేటివ్‌ అని మార్చుకున్నది. అయినప్పటికీ ఈ పార్టీ వారిని ఇప్పటికీ టోరీలనే ఎక్కువగా పిలుస్తారు. ఇంత సుదీర్ఘచరిత్ర కలిగిన పార్టీ 1906లో కనిష్టంగా 131 సీట్లు తెచ్చుకుంది. ఈ సారి రిషి సునాక్‌ నాయకత్వంలో 98కి మించి రావనే సర్వేలు నిజమైతే పార్టీ చరిత్రలో మరో అధ్యాయం నమోదౌతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమి రాజకీయాల్రా బాబూ : చైనాపై అమెరికా పెద్దన్న ధ్వజం – విశ్వగురువు నరేంద్రమోడీ లొంగుబాటు !!

16 Thursday May 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, CHINA TRADE, Donald trump, Import duty on EVs, Joe Biden, Narendra Modi Failures, RSS, TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు బెదిరించి లొంగదీసుకోవాలన్న ఎత్తుగడ. మరోవైపు జనం ముందు శత్రువు అంటూనే చైనా సంతుష్టీకరణ.ఎందుకిలా జరుగుతోంది ? ” ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నరేంద్రమోడీ ఆపివేయగలిగారు. అమెరికా, రష్యా అధినేతలను సైతం శాసించగలిగిన పలుకుబడి కలిగిన విశ్వగురువుగా ఎదిగారు, ప్రపంచ నేతల్లో పలుకుబడి ఎక్కువ కలిగిన నేతగా ఉన్నారు.” మోడీ గురించి ఇలాంటి ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. జనం కూడా నిజమే కదా అని వింటున్నారు, మేము సైతం తక్కువ తిన్నామా అన్నట్లుగా వాటిని ఇతరులకు ఉచితంగా పంచుతున్నారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి కష్టం లేకుండానే పట్టాలు పొందుతున్నారు.ఇక తాజా విషయానికి వస్తే చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్‌ వాహనాలు,కంప్యూటర్‌ చిప్స్‌, వైద్య ఉత్పత్తులపై అమెరికా సర్కార్‌ వందశాతం వరకు దిగుమతి సుంకాన్ని విధించి వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తున్నాం కాసుకోండి అంటూ ఒక సవాల్‌ విసిరింది. మరి అదే అమెరికా మెడలు వంచారని, దారిలోకి తెచ్చుకున్నారని చెబుతున్న నరేంద్రమోడీ ఏం చేశారు ? ఇప్పటి వరకు మనదేశం విదేశీ విద్యుత్‌ వాహనాలపై రకాన్ని బట్టి 70 నుంచి 100శాతం వరకు విధిస్తున్న దిగుమతి సుంకాన్ని పదిహేను శాతానికి తగ్గించారు. అయితే చైనా కంపెనీలతో సహా ఎవరైనా 50 కోట్ల డాలర్ల మేరకు ఆ వాహనరంగంలో మనదేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఉత్పత్తి ప్రారంభించేంత వరకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ఎనిమిది నుంచి 40వేల వరకు వాహనాలను ప్రతి కంపెనీ నేరుగా దిగుమతులు చేసుకోవచ్చు. వాహనాల తయారీలో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న విడిభాగాల వినియోగం ప్రస్తుతం 30 నుంచి 40శాతం వరకు ఉందని, నూతన విధానం వలన మరింత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతుండగా రానున్న రోజుల్లో చైనా వాహనాలతో భారత మార్కెట్‌ నిండిపోతుందని ఆ రంగ నిపుణులు హెచ్చరిక, ఆందోళన వెల్లడించారు. అమెరికా మెడలే వంచగలిగిన నరేంద్రమోడీ చైనా విషయంలో ఇప్పుడున్న పన్నును కొనసాగించకుండా ఇలా ఎందుకు లొంగిపోయినట్లు ? అమెరికా పెద్దన్న బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తుంటే, విశ్వగురువు తనకు నచ్చని మాట సంతుష్టీకరణకు ఎందుకు పూనుకున్నట్లు ?


నవంబరు నెలలో జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌కు ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ చుక్కలు చూపిస్తున్నాడు.చైనా నుంచి దిగుమతులు అంటే అమెరికన్లకు ఉపాధి తగ్గటమే. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో విద్యుత్‌ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఉన్నాయి గనుక అక్కడి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనదేశంలో పదేండ్లలో మోడీ అలాంటి కార్ల తయారీని ప్రోత్సహించటం, పరిశోధనా, అభివృద్ధి రంగాలను పట్టించుకోలేదు. ఈ కారణంగా మనదేశంలోని కార్పొరేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం, దిగుమతులకు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెచ్చాయి. ఎన్నికలలో వాటి నుంచి నిధులు కావాలి గనుక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే వాటిని సంతుష్టీకరించేందుకు విద్యుత్‌ వాహనాల దిగుమతి, తయారీ విధానంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపంలో అంతకు ముందే బిజెపికి గణనీయమొత్తాలను సమర్పించుకున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు తరువాత బహుశా టెంపోలలో నోట్లను రవాణా చేసి ఉంటాయి. దిగుమతుల కారణంగా ఉపాధి తగ్గినా లేక నిరుద్యోగం ప్రాప్తించినా అమెరికా సమాజం సహించదు. మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు, మతం, కులం, ప్రాంతం, విద్వేషం, తప్పుడు సమాచారం తదితర అనేక మత్తుమందులను ప్రయోగిస్తూ అసలు సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించటంలో ఎవరు అధికారంలో ఉన్నా సర్వసాధారణమైంది. జనం కూడా అలవాటు పడ్డారు.గుళ్లు, మసీదు, చర్చీలు ఇతర ప్రార్ధనామందిరాలకు వెళ్లి రోజంతా వేడుకోవటానికి కానుకల సమర్పణ, కొబ్బరి కాయలు కొట్టేందుకు సిద్దపడుతున్నారు గానీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటానికి ఆసక్తి చూపటం లేదు.


అమెరికా పెంచిన పన్నులను రద్దు చేయాలని లేదా తాము కూడా ప్రతిచర్య తీసుకుంటామని చైనా స్పందించింది.చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలు,అల్యూమినియం, సెమీకండక్టర్లు,బ్యాటరీలు, కొన్ని రకాల ఖనిజాలు, సోలార్‌ సెల్స్‌,క్రేన్ల వంటి వాటి మీద దిగుమతి పన్ను పెంపు కారణంగా కనీసం 1,800కోట్ల డాలర్ల మేర అమెరికా వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆ కారణంగా దిగుమతులు నిలిపివేస్తే ప్రత్యామ్నాయం చూపే పరిస్థితిలో అమెరికా లేదు. వాటినే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తే భారం ఇంకా పెరుగుతుంది. గత ఏడాది చైనా నుంచి 427 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులను దిగుమతి చేసుకున్న అమెరికా 148బి.డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేసింది.గతంలో చైనా కూడా ప్రతిచర్యల్లో భాగంగా పన్నులు పెంచింది. చైనా వస్తువుల మీద ఆధారపడకుండా స్వంతంగా తయారు చేసుకోవాలని, తద్వారా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని, తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలనే సంకల్పం చెప్పుకున్న అమెరికా, ఐరోపా దేశాల సరసన మనదేశం కూడా ఉంది.
అనేక దేశాలతో మనదేశం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టిఏ) చేసుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి పరస్పరం లబ్ది పొందేందుకు వీటిని చేసుకుంటున్నారు. విదేశాలు తిరిగి మనవస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచానని, దానితో పాటు పలుకుబడి కూడా పెరిగిందని నరేంద్రమోడీ పదే పదే చెబుతారు. కానీ గత ఐదు సంవత్సరాల వివరాలను చూసినపుడు ఎగుమతుల అంశంలో మన పలుకుబడి పప్పులు ఉడకలేదు. 2019-2024 ఆర్థిక సంవత్సరాలలో ఎఫ్‌టిఏలు ఉన్న దేశాలకు మనం ఎగుమతి చేసిన వస్తువుల విలువ 107.2 నుంచి 122.72 బిలియన్‌ డాలర్లకు(14.48శాతం) పెరిగితే, దిగుమతులు 136.2 నుంచి 187.92 బిలియన్‌ డాలర్లకు ( 37.97శాతం) పెరిగినట్లు జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడించింది. ఎగుమతులపై మోడీ ప్రచార బండారాన్ని బయట పెట్టింది. మొత్తంగా చూసుకున్నపుడు ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో 1.8శాతంతో మనదేశం 17వదిగా ఉండగా దిగుమతుల్లో 2.8శాతం వాటాతో ఎనిమిదవ స్థానంలో ఉంది. అంతా బాగుంది అని చెప్పిన 2023-24లో మన వస్తు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 3.11శాతం తగ్గి 437.1బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనుగోలు చేయటం తగ్గటంతో గతేడాది 5.4శాతం తగ్గి 677.2బి.డాలర్లుగా ఉన్నాయి.


ట్రంప్‌ మాదిరి చైనా పట్ల కఠినంగా ఉండాలని జో బైడెన్‌ కూడా జనానికి కనిపించేందుకు తాజా చర్యకు పూనుకున్నాడు. గతనెలలో రాయిటర్స్‌ జరిపిన ఒక సర్వేలో ట్రంప్‌ కంటే బైడెన్‌ ఏడుపాయింట్లు వెనుకబడి ఉన్నాడు. అయితే 2020లో చైనాతో ట్రంప్‌ కుదుర్చుకున్న ఒప్పందంతో ఎలాంటి ఫలితమూ రాలేదు. పరస్పరం సహకారం పెంచుకోవాలని చెబుతూనే దిగుమతి పన్నుల పెంపుదలకు సాకుగా తాము అవసరాలకు మించి హరిత ఉత్పత్తులు చేస్తున్నామని లేనిపోని మాటలు చెబుతున్నదని చైనా విమర్శించింది. ఇది రక్షణాత్మక చర్యలకు పూనుకొనేందుకు చేస్తున్న ప్రచారమని, తనను తాను దెబ్బతీసుకోవటమేనని, గతంలో వచ్చిన అవగాహనకు భిన్నమని, రెండు దేశాల మార్గంలో గుంతలు తవ్వవద్దని హితవు చెప్పింది. బైడెన్‌ ఎన్నికల కోసం రాజకీయంగా తీసుకున్న చర్య తప్ప తమ మీద పెద్దగా ప్రభావం పడదని కూడా వ్యాఖ్యానించింది.2023 నుంచి ఈ ఏడాది మార్చినెల వరకు అమెరికా సమాచారాన్ని చూస్తే జర్మనీ నుంచి 689 కోట్ల డాలర్లు, దక్షిణ కొరియా నుంచి 622 కోట్ల డాలర్ల విలువగల విద్యుత్‌ బాటరీల వాహనాలను కొనుగోలు చేసిన అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 38 కోట్ల డాలర్ల విలువగలవే అని ఒక పత్రిక పేర్కొన్నది. బైడెన్‌ నిర్ణయం ప్రకారం విద్యుత్‌ వాహనాలపై పన్ను 25 నుంచి 102.5శాతానికి పెరిగింది. బాటరీలు, వాటి విడి భాగాలపై 7.5శాతం నుంచి 50శాతం వరకు పెంచారు.నౌకల నుంచి సరకులను తీరానికి చేర్చే క్రేన్లపై ఇప్పటి వరకు పన్నులేదు, వాటి మీద 25శాతం, సిరంజ్‌లు, సూదులపై 50శాతం, రక్షణకు ఉపయోగించే వైద్య కిట్లపై 25శాతం విధించారు. రానున్న సంవత్సరాల్లో ఈ పన్నులు ఇంకా పెరుగుతాయి.ఈ పెరుగుదల అంతా అమెరికా వినియోగదారుల మీదనే భారం మోపుతుంది.చైనా అనుచిత వ్యాపారాన్ని అడ్డుకొనేందుకే ఈ చర్యలని అమెరికా సమర్ధించుకుంటున్నది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే సాకుతో దేశీయంగా తయారైన వాహనాల కొనుగోలుదార్లకు అమెరికా ప్రభుత్వం ఏడున్నరవేల డాలర్లు రాయితీ ఇస్తుంది. అయితే ఇటీవల అలాంటి వాహనాల్లో చైనా విడిభాగాలు ఏవైనా ఉంటే ఆ రాయితీ వర్తించదని ప్రకటించారు.


మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో అమెరికా మొదటి స్థానంలోకి వచ్చింది. దాంతో మీడియాలో కొందరు ఇంకేముంది చైనాతో మనకు పనేముంది, సరఫరా గొలుసు నుంచి బయటపడ్డాం అన్నట్లుగా సంబరాన్ని ప్రకటించారు. కానీ తిరిగి చైనా మొదటి స్థానానికి వచ్చినట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఇదంతా సరిహద్దు వివాదంలో చైనా సంగతి తేలుస్తాం, బుద్దిచెబుతాం అనే పటాటోపం మధ్యనే జరిగింది.2023-24 సంవత్సరంలో రెండు దేశాల వాణిజ్యం 11,840 కోట్లు కాగా అమెరికాతో 11,380 కోట్ల డాలర్లు ఉంది.కౌంటర్‌పాయింట్‌ అధ్యయనం ప్రకారం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకం(పిఎల్‌ఐ) పధకం ఉన్నప్పటికీ మనదేశంలో చైనా బ్రాండు ఫోన్లు గణనీయమార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి.ఈ పధకం వలన ఆపిల్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు లబ్దిపొందినప్పటికీ మార్కెట్లో వాటి వాటా దానికి తగినట్లుగా పెరగలేదని హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. ఇతర బ్రాండ్లతో ఉత్పత్తి కాంట్రాక్టులు కుదుర్చుకోవటం, ఎగుమతులు తప్ప భారతీయ బ్రాండ్లకు రూపకల్పన, అభివృద్ధి జరగలేదు.ఫార్మారంగంలో కొన్నింటిని పిఎల్‌ఐ కారణంగా మనదేశంలోనే తయారు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మన పరిశ్రమలు చైనా మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దిగుమతుల నిరోధానికి ఈ పధక చికిత్స పనిచేయలేదు. గతేడాది మనదేశం చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ దిగుమతుల్లో చైనా నుంచి 43.9శాతం ఉన్నాయి. కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు దుడ్డులా ఎదగాలి అంటే కుదరదన్న సామెత తెలిసిందే. గడచిన పది సంవత్సరాల్లో అన్నీ వేదాల్లోనే ఉన్నాయష బాపతు పెరిగింది తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రభుత్వం ఖర్చు చేయాలన్న జ్ఞానం పాలకులకు రాలేదు.గతమెంతో ఘనం అనే పిచ్చిలోనే కొట్టుకుంటున్నారు. జనాన్ని ముంచుతున్నారు. జిడిపిలో మనకంటే చైనా ఐదు రెట్లు పెద్దది. మనం 0.75శాతం పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే అక్కడ 3.5శాతం ఉంది. దీని అర్ధం మనకంటే చైనాలో 25రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రొఫెసర్‌ అరుణకుమార్‌ వ్యాఖ్యానించారు.మన విశ్వవిద్యాలయాల్లో రాజకీయ, అధికార జోక్యం ఎక్కువగా ఉంది తప్ప పరిశోధన వాతావరణాన్ని సృష్టించలేదన్నారు. ఏవైనా నిధులు ఉంటే గోమూత్రం, పేడలో బంగారం, ఇతరంగా ఏమున్నాయో పరిశోధనలు చేయిస్తున్నారు.చైనా ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకం పెంపు పర్యవసానాలు మనదేశం మీద ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది. చైనా ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా మనదగ్గరకు వచ్చిపడతాయని, మన ఎగుమతి అవకాశాలు పెరగవన్నది ఒక అభిప్రాయం. అమెరికా, ఐరోపా యూనియన్‌ దిగుమతి పన్నులు పెంచటం, దిగుమతులను తగ్గిస్తున్న కారణంగా చైనా తన వాహనాలకు భారత్‌ ఇతర దేశాల మీద ఆధారపడుతుందని కొందరి అంచనా. ఈ అంశాలను ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ చైనా నుంచి పెట్టుబడులు, దిగుమతులను పెంచేందుకు వీలుగా దిగుమతి పన్ను ఎందుకు తగ్గించారన్నది వారి ప్రశ్న. కార్పొరేట్ల లాభాల కోసం సంతుష్టీకరణ తప్ప మరొకటి కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టులు కంపెనీలను రానివ్వరా ? నరేంద్రమోడీ, చంద్రబాబు, జగన్‌ అభివృద్ధి బండారమేమిటి ?

08 Wednesday May 2024

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Political Parties, STATES NEWS, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, CHANDRABABU, Chinese companies, Companies in India, CPI()M, Narendra Modi Failures, YS jagan


ఎం కోటేశ్వరరావు


చరిత్రలో నరేంద్రమోడీ పాలనలో జరిగినంత అభివృద్ధి మరే ప్రధాని, పార్టీ పాలనలోనూ జరగలేదంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా వార్తల కంటే గ్యారంటీ అంటూ నరేంద్రమోడీ దర్శనమిస్తున్నారు. ఎన్నికల బాండ్ల రూపంలో పోగేసుకున్న సొమ్మా మజాకా ! ప్రచారాన్ని గుడ్డిగా నమ్మటం లేదా నమ్మకపోవటం తెలిసిందే.ఏం జరుగుతోంది, వాస్తవాలేమిటి అని నిర్ధారించుకొనే ఓపిక లేదా తీరిక అందరికీ ఉండదు.ఒకదాన్ని నిర్ధారించుకొనే లోపల వంద వచ్చిపడుతున్నకాలమిది.దేశంలో కొత్త కంపెనీల ఏర్పాటు, పాతవాటి మూత తదితర అంశాల గురించి ప్రతినెల కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంసిఏ) ఒక నివేదిక విడుదల చేస్తుంది. 2024 మార్చినెల నివేదిక ప్రకారం దేశంలో 26,63,016 కంపెనీలు నమోదు కాగా వాటిలో 16,91,495 కంపెనీలు (64శాతం) పని చేస్తున్నాయి. మూతపడినవి 9,31,644 లేదా 34.98శాతం ఉన్నాయి. మిగిలినవి కూడా ఇతర ప్రక్రియల్లో ఉన్నాయి. 2014 ఏప్రిల్‌ 28వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త ప్రకారం 2014 మార్చి ఆఖరు నాటికి 13,94,819 కంపెనీలుండగా వాటిలో 9,52,433 లేదా 68శాతం పని చేశాయి. మిగిలినవన్నీ మూత లేదా ఆ దారిలో ఉన్నవే. 2015 మార్చి నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 14,59,278కి గాను పని చేస్తున్నవి 10,22,011 లేదా 70శాతంగా ఉన్నాయి. నరేంద్రమోడీ తొలి ఐదు సంవత్సరాల్లోచూస్తే మొత్తం కంపెనీలు 18,73,044 కాగా పని చేస్తున్నవి 11,56,374 లేదా 61.73శాతం ఉన్నాయి. 2012-13, 2013-14 సంవత్సరాలలో ఇప్పటితో పోల్చితే దిగజారుడు చాలా ఎక్కువగా ఉందని 2020జనవరి 25న ఇటి నౌ ఇంటర్వ్యూలో నీతి అయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా చెప్పారు. దీని ప్రకారం చూస్తే యుపిఏ పదేండ్ల పాలన చివరి రెండు సంవత్సరాలు దిగజారుడు ఎక్కువగా ఉన్నపుడే 68శాతం కంపెలు పని చేయగా తన పాలనలో అస్తవ్యస్థతను సరిదిద్ది గాడిలో పెట్టానని చెప్పుకున్న నరేంద్రమోడీ పదవ ఏడాది పాలనలో 63.5శాతానికి తగ్గాయి. 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1,85,312 కంపెనీలు నమోదు వాటి మూలధనం రు.30,927 కోట్లుగా ఉంది. అదే యుపిఏ పాలన చివరి సంవత్సరంలో 98,473 కంపెనీలు నమోదు కాగా వాటి మూల ధనం 39వేల కోట్ల రూపాయలు.పదేండ్ల పాలన అంతకు ముందు పది సంవత్సరాల స్థితిని చూస్తే మోడీ ఏలుబడిలో దిగజారినట్లా వెలిగిపోతున్నట్లా ?


కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రతినెలా విడుదల చేస్తున్న బులిటెన్‌లో ఏ రాష్ట్రంలో ఎన్ని సంస్థలు నమోదవుతున్నాయన్నది దానిలో ఉంటుంది. మధ్య,చిన్న,సన్నకారు పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)ల వివరాలు అందులో ఉండవు. కంపెనీల చట్టం కింద నమోదైనవే ఉంటాయి.కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచారం మేరకు కొన్ని రాష్ట్రాల తీరు తెన్నులను చూద్దాం. మూడు సంవత్సరాలలో మార్చి 31వరకు ఉన్న కంపెనీల పరిస్థితి, మొత్తం అంటే కంపెనీల చట్టం కింద నమోదైనవి. మన చట్టాలలో కంపనీల మూత గురించి చాలా గందరగోళం ఉంది. అందువలన పని చేస్తున్న వాటినే పరిగణనలోకి తీసుకుంటే మిగిలినవాటిలో మూతపడినవి, పని చేయనివి తదితరాలు ఉంటాయని గమనించాలి.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ×××× పని చేస్తున్నవి××× శాతం
2015 ×× దేశం ×××14,59,278××× 10,22,011 ××× 70
2019 ×× దేశం ×××18,73,044××× 11,56,374 ××× 61.73
2024 ×× దేశం ×××26,63,016××× 16,91,495 ××× 63.5

దేశంలో 2014-15 నాటికి ఉన్న కంపెనీలలో పారిశ్రామిక రంగంలో 21, వ్యవసాయ రంగంలో మూడు శాతం, సేవారంగంలో 76శాతం ఉన్నాయి. సేవారంగంలో ఐటి, వాణిజ్యం,గనులు, విద్యుత్‌ ఉత్పత్తి వంటి ఉన్నాయి. కాగా పదేండ్ల తరువాత చూస్తే గతేడాది నమోదైన వాటిలో 71శాతం సేవారంగం, 23 పరిశ్రమలు, ఆరుశాతం వ్యవసాయరంగంలో ఉన్నాయి.ఇది ఇటీవలి సంవత్సరాల ధోరణులకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. ఈ కారణంగానే మన ఎగుమతుల్లో సేవారంగం తప్ప పారిశ్రామిక వస్తువులు పెరగటం లేదు, జిడిపిలో ఈ రంగం వాటా గిడసబారిపోయింది. గతేడాది నమోదైన కంపెనీలను చూస్తే 17.6శాతంతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. పదేండ్ల క్రితం కూడా అదే స్థానంలో ఉంది.తొలిసారి ప్రధాని అయినపుడు నరేంద్రమోడీ విదేశాలు, విమానాల్లోనే ఎక్కువ కాలం గడిపారనే పేరు తెచ్చుకున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే అంతకు ముందు కాంగ్రెస్‌ పాలనా కాలంలో విదేశాల్లో పోయిన పరువు పునరుద్దరణతో పాటు భారీ మొత్తంలో విదేశీ నిధులు తెచ్చి చైనాతో పోటీ పడి మరీ ఎగుమతులు చేసేందుకు అని చెప్పారు.2015 మార్చి నాటికి దేశంలో 3,314 విదేశీ కంపెనీలు ఉండగా మోడీ తొలి ఏడాది కొత్తగా నమోదైనవి 157 ఉన్నాయి.2024 అవి 5,164కు పెరగ్గా పని చేస్తున్నవి 3,288 లేదా 64శాతం మాత్రమే. 2023 ఆగస్టు చివరి నాటికి చైనా ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం అక్కడ నమోదైన విదేశీ కంపెనీల సంఖ్య 11లక్షల 50వేలు, వాటిలో ఉన్న విదేశీ పెట్టుబడుల మొత్తం 1,950 బిలియన్‌ డాలర్లు.కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ 2021 నవంబరు 29న పార్లమెంటుకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2016 ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి సమాచారం వెల్లడించేనాటికి దేశంలో 7,17,059 కొత్త కంపెనీలు నమోదు కాగా 5,00,506 కంపెనీలు మూత పడ్డాయి.దీనికి పెద్ద నోట్ల రద్దు, కరోనా కారణమని చెప్పారు.2017-18లో 2,36,262, మరుసటి ఏడాది 1,43,233 కంపెనీలు మూత పడ్డాయి. దీనికి పెద్ద నోట్ల రద్దు, ఇతర కారణాలు తప్ప కరోనా కాదు.ఈ సంవత్సరాల్లో నమోదైనవాటికంటే మూతపడినవే ఎక్కువ.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి గురించి తెలుగుదేశం, వైసిపి మధ్య పెద్ద రచ్చ నడుస్తున్నది, మేం రాష్ట్రాన్ని పరిశ్రమలు, సేవారంగ సంస్థలతో ముందుకు ఉరికించామంటే మేమే అని చెప్పుకుంటున్నాయి.తమ పాలనలో సులభతర వాణిజ్య సూచికల్లో ఎంతో ముందున్నామని, లక్షల కోట్ల రూపాయల మేరకు వివిధ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని రెండు పార్టీల నేతలూ హడావుడి చేశారు. గత పదేండ్లలో జరిగిందేమిటో చూద్దాం.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015××ఆంధ్రప్రదేశ్‌ ×× 21,205 ××× 13,395 ××× 63.16
2019××ఆంధ్రప్రదేశ్‌ ×× 30,530 ××× 19,331 ××× 63.31
2024××ఆంధ్రప్రదేశ్‌ ×× 46,625 ××× 30,029 ××× 64.40
ఆమేరకు చూసినపుడు రాష్ట్రం విడిపోయిన తరువాత కంపెనీల నమోదు పెరిగినప్పటికీ పని చేస్తున్నవాటి శాతాలలో పెద్ద తేడా లేదు. అందువలన మేము ప్రోత్సాహమిచ్చాం, ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలను ఆదుకున్నాం అని చెప్పే కబుర్లలో పసలేదు. చంద్రబాబు నాయుడి ఐదేండ్ల పాలనలో వచ్చినవి 9,325 కాగా మూతపడినవాటి జాబితాలో చేరినవి 5,934 ఉన్నాయి. ఇక వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలనలో కొత్తగా నమోదైనవి 16,596 కాగా మూతపడినవి 10,698 ఉన్నాయి.
ప్రపంచం, దేశంలోని వివిధ రాష్ట్రాల ధోరణులను చూసినపుడు ఎక్కడ రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయో అక్కడ, భూమి, విద్యుత్‌, నిపుణులైన పనివారి లభ్యత మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు ముందుగా ఎక్కడైతే కంపెనీలు వస్తాయో అక్కడే పెరుగుదల ఉంటుంది.దానికి ఉదాహరణ తెలంగాణా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తరువాత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015××తెలంగాణా ×× 77,040 ××× 51,743 ××× 67.16
2019××తెలంగాణా ××1,05,072××× 62,123 ××× 59.12
2024××తెలంగాణా ××1,57,064××× 98,440 ××× 62.67
ఈ వివరాలను చూసినపుడు నరేంద్రమోడీ చేసిన పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చి చేష్ట దెబ్బ దేశం మొత్తం మీద పడినట్లే తెలంగాణా కంపెనీల మీద కూడా పడింది. పదేండ్లకు ముందున్న స్థితికి చేరుకోలేదన్నది స్పష్టం.పదేండ్లలో కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో 21,205 నుంచి 46,625 అంటే 25,420 పెరిగితే తెలంగాణాలో 80,024 ఉన్నాయి. రాష్ట్ర విభజన ఆందోళన సందర్భంగా తెలంగాణాలో నేతలు కొందరు ఆంధ్ర ప్రదేశ్‌ పెట్టుబడిదార్లు దోపిడీ చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దానికి పోటీగా తమ ప్రాంతాలను విస్మరించి తమ పెట్టుబడులన్నింటినీ తెలంగణాలో పెట్టామని ఆంధ్ర ప్రాంతం వారు వాపోయారు. లాభం వస్తేనే వ్యాపార వరదన పోతాడన్న లోకోక్తి తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర భక్తులైన పెట్టుబడిదార్లు గత పదేండ్లలో అక్కడ ఇబ్బడి ముబ్బడిగా కంపెనీలు పెట్టిన దాఖలాలు లేవని అంకెలే వెల్లడిస్తున్నాయి.తమ పెట్టుబడులు నిలిపివేసినంత మాత్రాన తెలంగాణాకు కంపెనీలు రావని భ్రమించిన వారు గణాంకాలను చూసి ఏమంటారు ?


ఏడాది×× రాష్ట్రం×× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015×× కేరళ ×× 37,905 ××× 24,835 ××× 65.52
2019×× కేరళ ×× 51,809 ××× 32,440 ××× 62.61
2024×× కేరళ ×× 81,177 ××× 54,460 ××× 67.08
కమ్యూనిస్టులతో పెద్ద తలనొప్పి కార్మికులు, ఉద్యోగులు వేతనాలు పెంచాలంటారు తప్ప రాష్ట్రం, దేశ అభివృద్ధి గురించి పట్టదు, పెట్టుబడిదార్లను బెదిరిస్తారు అనే ప్రచారం తెలిసిందే. తనను తాను స్వయంగా సిఇఓ అని పిలుచుకున్న చంద్రబాబు లేదా విజయవంతమైన వ్యాపార, పారిశ్రామికవేత్త అని పేరు పడిన జగన్‌మోహనరెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన కంపెనీల కంటే పోరాటాలకు చిరునామాగా ఉన్న సిపిఎం నాయకత్వంలోని కేరళలో గత పది సంవత్సరాలలో అదనంగా నమోదైన కంపెనీలు 43,272. మరి దీనికి విమర్శకులు ఏ సమాధానం చెబుతారు ? రెండవది అక్కడి కంపెనీల పని తీరు దేశ సగటుతో, రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉందా లేదా ? మధ్యప్రదేశ్‌లో 2003 నుంచి మధ్యలో ఒక ఏడాది కాంగ్రెస్‌ మినహా ఇప్పటి వరకూ బిజెపి పాలన కొనసాగుతోంది. 2015లో అక్కడ నమోదైన కంపెనీలు 29,782 కాగా 2024నాటికి 60,700కు అంటే 30,918 మాత్రమే పెరిగాయి. అక్కడేమీ కమ్యూనిస్టుల ప్రభావం లేదు, రెండింజన్ల పాలన ఎందుకు కంపెనీలు రాలేదు ? ఇక దేశానికి గుజరాత్‌ను నమూనా ప్రకటించి ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోడీ గురించి తెలిసిందే. అక్కడ 2015లో పని చేస్తున్న కంపెనీలు 64.72శాతం కాగా 2019లో 61.32, 2024లో శాతం 65.5 చొప్పున ఉన్నాయి. గుజరాత్‌ నమూనా అంత గొప్పగా లేదని, ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ప్రత్యేకంగా చేసిందేమీ లేదని గణాంకాలు వెల్లడించటం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల పాలనలో నరేంద్రమోడీ చైనాకు ఎన్ని లక్షల కోట్లు సమర్పించారో తెలుసా !

30 Tuesday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

Anti China Propaganda, BJP, CHINA TRADE, India Trade with China, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


పేరు పెట్టి చెప్పకపోయినా చైనాకు పరోక్ష హెచ్చరికలు చేయటంలో మననేతలు తక్కువ తినలేదు. అవి సరిహద్దు సమస్యల మీద కావచ్చు, చైనా స్థానంలో ప్రపంచ ఫ్యాక్టరీగా మనం మారబోతున్నాం అన్న కోతలు ఏవైనా కావచ్చు. మాటలు కోటలు దాటినా చేతలు గడపదాటటం లేదన్న సామెత తెలిసిందే. గత పదేండ్లుగా మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత వంటి నినాదాలు మన చెవుల తుప్పు వదలగొడుతున్నాయి. కానీ పదేండ్ల పాలనలో చైనాకు నరేంద్రమోడీ సమర్పించిన మొత్తం ఎంతో తెలుసా ? యాభై లక్షల కోట్ల రూపాయలకు పైమాటే అంటే ఎవరైనా నమ్ముతారా ? తమ విశ్వగురువు ఇలా చేశారంటే వీర భక్తులు అసలు నమ్మరు. కానీ చేదు నిజం. గడచిన పది సంవత్సరాలలో చైనాతో మన వాణిజ్య లోటు 614బిలియన్‌ డాలర్లు.(గత ఐదేండ్లలో 387బి.డాలర్లు) బిలియన్‌కు వంద కోట్లు అంటే 61,400, ఒక డాలర్‌కు మన రూపాయి మారకం విలువ ఇది రాసిన సమయంలో 83.47 ఉంది. ఆ లెక్కన చైనాకు మనం సమర్పించుకున్న మొత్తం రు.51,25,058 కోట్లు. ఈ వివరాలను 2024 ఫిబ్రవరి 29న ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో విశ్లేషణ రాసిన గ్రూప్‌ కెప్టెన్‌ ప్రవీర్‌ పురోహిత్‌(ఐఎఎఫ్‌ విశ్రాంత ఉద్యోగి) పేర్కొన్నారు.” చైనాతో పెరుగుతున్న భారత వాణిజ్యలోటు వ్యూహాత్మక దుర్బలత్వం ” అనే శీర్షికతో సదరు విశ్లేషణ ఉంది. ఒక వైపు ఏటికేడు చైనా నుంచి దిగుమతులను పెంచుకుంటూ మరోవైపు చైనా నుంచి ముప్పువస్తోంది గనుక అమెరికాతో చేతులు కలపాలి, ఆయుధాలు కొనుగోలు చేయాలి అంటూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న నరేంద్రమోడీ విధానాలను ఎలా అర్ధం చేసుకోవాలి ?మన దేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడి వృద్ధి చెందాలని, జనానికి ఉపాధి కల్పించి సరిపడా ఆదాయకల్పన చేసి మెరుగైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి అనువైన విధానాలను అనుసరించటం లేదనేదే పాలకుల మీద విమర్శ. మనోభావాలను రేకెత్తించటం మీద ఉన్న శ్రద్ద అభివృద్ది మీద లేదు. తమ సరకులను దిగుమతి చేసుకోవాలని ఏ దేశాన్నీ చైనా దేబిరించటం లేదు. మా ఊళ్లో దుకాణం తెరవాలని గ్రామస్తులు ఎవరినైనా వేడుకుంటారా ? ఉన్న దుకాణానికి తోడు కొత్తది వెలిస్తే అక్కడ తక్కువ ధరలకు వస్తువులను అమ్మితే జనం అక్కడే కొనుక్కుంటారు.ప్రపంచ మార్కెట్‌లో ఎప్పటినుంచో ఉన్న అమెరికా, జపాన్‌, జర్మనీ,బ్రిటన్‌ సరసనే చైనా కూడా దుకాణం తెరిచింది.అక్కడ సరసమైన ధరలకు ఇస్తున్నందున ప్రపంచ దేశాలన్నీ ఎగబడి కొనుక్కుంటున్నాయి. గిరాకీని తట్టుకోలేకపోతున్నాము, ఎవరైనా వచ్చి మా దేశంలోనే వస్తూత్పత్తి చేయండి అంటే వివిధ దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడకు వెళ్లి ఉత్పత్తి చేసి నాలుగురాళ్లు వెనుకేసుకుంటున్నారు. ఆపని చేయలేక మనం కూడా చైనా, ఇతర దేశాల నుంచి కావాల్సినవి కొనుక్కుంటున్నాం.ఎవరూ ఎవరిని బలవంతం చేయటం లేదు. చైనా వస్తువులను బహిష్కరించాలని మనదేశంలో చాలా మంది వాట్సాప్‌ ద్వారా సందేశాలను పంపారు. పెద్ద జోకేమిటంటే అందుకోసం వారు కూడా చైనా ఫోన్లనే వాడుతున్నారు.


తాజాగా గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(జిటిఆర్‌ఐ) అనే సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం పదిహేను సంవత్సరాల క్రితం మనం దిగుమతి చేసుకున్న పారిశ్రామిక వస్తువులలో చైనా వాటా 21 ఉంటే ఇప్పుడు 30శాతానికి పెరిగింది. విదేశాల మీద ప్రత్యేకించి చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించటమే కాదు, అసలు మనమే ప్రపంచానికి ఎగుమతి చేద్దామంటూ నరేంద్రమోడీ ఎంతో హడావుడి చేస్తున్నపుడే ఇదంతాజరిగింది.ఇప్పటికి తాను చేసింది ట్రైలర్‌ మాత్రమే అని చెప్పిన మోడీ రానున్న రోజుల్లో చైనా నుంచి ఇంకా పెద్ద ఎత్తున దిగుమతులకు పూనుకుంటారా ? మరింత గట్టిగా పని చేస్తానంటూ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత గత ఐదేండ్లలో చైనాకు మన ఎగుమతులు ఏటా 16బిలియన్‌ డాలర్లకు అటూ ఉండగా అక్కడి నుంచి దిగుమతులు 70.3 నుంచి 101 బి.డాలర్లకు పెరిగాయి. ఇది సమర్ధతా, అసమర్ధతకు చిహ్నమా ? చైనా మీద ఆధారపడటం పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని జిటిఆర్‌ఐ అన్నది, దేశం కోసం, ధర్మం కోసం అంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీలో అలాంటిదేమైనా ఉందా ? రామాలయం మీద, దాని ద్వారా ఓట్లు దండుకోవాలన్న యావలో కొంచెమైనా పారిశ్రామికీకరణ మీద ఉందా ? రాజ్యసభలో వైసిపి సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి చైనాతో పెరుగుతున్న మనదేశ వాణిజ్య లోటు గురించి ఒక ప్రశ్న అడిగితే దానికి 2023 డిసెంబరు ఎనిమిదిన కేంద్ర ప్రభుత్వం ఒక సమాధానమిచ్చింది.దానిలో గడచిన తొమ్మిది సంవత్సరాల్లో ఎంతో మార్పు వచ్చిందంటూ గాలిపోగేసి రోజూ చెప్పే కబుర్లను పునరుద్ఘాటించటం తప్ప అసలు సంగతి మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదో దిగుమతులు రికార్డులను ఎందుకు బద్దలు కొడుతున్నదీ చెప్పలేదు.


మనకు అవసరమైన వస్తువులు లేదా ముడి పదార్దాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవాలా మరొక దేశం నుంచా అన్న అంశం మీద కూడా చర్చ జరుగుతున్నది. మనవి కానపుడు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నా ఒకటే. ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరాం గనుక చైనా నుంచి కొన్ని దిగుమతులు చేసుకోక తప్పదు అంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. అదే వాస్తవమైతే పాకిస్తాన్‌ కూడా దానిలో సభ్యురాలే కదా ? అక్కడి నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవటం లేదు. పూర్తిగా చైనా మీద ఆధారపడితే ప్రపంచ రాజకీయాల్లో తేడా వస్తే, అక్కడి నుంచి నిలిచిపోతే పరిస్థితి ఏమిటని కొందరు అంటున్నారు. అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి. మన విధానాలు సరిగా ఉంటే ఎవరితో నైనా వివాదాలు ఎందుకు వస్తాయి. అమెరికా లేదా దాని కనుసన్నలలో పనిచేసే దేశాల మీద ఆధారపడినా అదే జరగదా ? గతంలో అంతర్జాతీయంగా తమ కూటమిలో చేరకుండా ఉన్నందుకే కదా పరిశ్రమలు, అంతరిక్ష ప్రయోగాలకు అలాంటి సహకారం అందించేందుకు అమెరికా నిరాకరించింది. ఆ కారణంగానే మన దేశం సోవియట్‌ వైపు మొగ్గింది.చైనాను మనదేశం శత్రుదేశంగా భావిస్తే ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలను రికార్డు స్థాయిలో నరేంద్రమోడీ ఎందుకు కలసినట్లు ? ఇరు నేతలూ అటు ఊహాన్‌ ఇటు మహాబలిపురంలో కలసి ఉయ్యాలలూగారు. గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత చైనా నుంచి వచ్చే పెట్టుబడులు మనదేశానికి ముప్పు తెస్తాయంటూ కేంద్ర అనుమతి లేకుండా అంగీకరించకూడదని గిరిగీసుకున్నది మనమే. దానికి ప్రతిగా చైనా మన దిగుమతుల మీద లేదా అక్కడి నుంచి వస్తుదిగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. మరింత పెరిగాయి, వాటితో ముప్పురాదా ?


పోనీ చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించారా అంటే అదీ లేదు. ఇతర దేశాలతో పోలిస్తే చైనా నుంచి దిగుమతుల వేగం 2.3రెట్లు పెరిగిందని, 2023-24 మనదేశం 677.2 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే దానిలో 101.8 బి.డాలర్లు చైనా నుంచి అంటే 15శాతం ఉన్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక పేర్కొన్నది.కీలక రంగాలలో దిగుమతులు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరి మధ్య మనదేశం మొత్తం 67.8 బి.డాలర్ల మేర ఎలక్ట్రానిక్స్‌, టెలికాం, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే వాటిలో చైనా నుంచి చేసుకున్నవాటి విలువ 26.1 బిలియన్‌ డాలర్లు, 38.4శాతం,యంత్రాల దిగుమతిలో కూడా అక్కడి నుంచి 39.6శాతం,రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు 29.2శాతం ఉంది.మొత్తం దిగుమతుల్లో 50శాతం యంత్రాలు, ఇతర ఉత్పాదక సంబంధమైనవే ఉన్నాయి. శత్రుదేశమంటూ మన మీడియా, సంఘపరివార్‌కు చెందిన సంస్థలు సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోస్తున్నా చైనా వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవటం లేదు. జపాన్‌ తదితర దేశాల సముద్ర ఉత్పత్తులను తిరస్కరించినట్లుగా, ఆస్ట్రేలియా ఉత్పత్తుల మీద ఆంక్షలు విధించినట్లుగా మన వస్తువులను తిప్పిపంపిన దాఖలాలు లేవు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇతర దేశాల్లో కూడా దొరుకుతాయి, అయితే అంత చౌకగా దొరకవు గనుక మోడీ ప్రభుత్వ మెడలు వంచి దిగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు విదేశీమారకద్రవ్యాన్ని కేటాయింప చేసుకొని వస్తు దిగుమతులు చేసుకుంటున్నారు. మనదేశంలో చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.ఎంఎస్‌ఎంఇ సంస్థలు మనదేశంలో ఉత్పత్తి చేయగలిగిన వస్త్రాలు, దుస్తులు,గాజువస్తువులు, ఫర్నీచర్‌, కాగితం, చెప్పులు, బొమ్మలను కూడా దిగుమతి చేసుకుంటున్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక ఆవేదన వెలిబుచ్చింది.రానున్న రోజుల్లో మనదేశ రోడ్ల మీద తిరిగే ప్రతి మూడు విద్యుత్‌ వాహనాల్లో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కుదుర్చుకున్న లేదా దిగుమతి చేసుకున్నవే ఉంటాయని జిటిఆర్‌ఐ పేర్కొన్నది.మన మార్కెట్‌లోకి చైనా సంస్థలు ప్రవేశిస్తే వాటి ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాలన్నింటినీ చైనా నుంచి దిగుమతి చేసుకొనేందుకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నందున దిగుమతులు మరింతగా పెరుగుతాయని తెలిపింది.మన జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి ఇప్పుడున్న 17 లేక 18శాతం స్థితి నుంచి 25శాతానికి పెరగాలంటే చైనా నుంచి మరిన్ని దిగుమతులు అవసరమని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.


అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో భాగంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద భారీ మొత్తంలో దిగుమతి పన్ను విధిస్తున్నారు. ఆ మొత్తం అక్కడి వినియోగదారుల మీదనే మోపుతున్నారు తప్ప దిగుమతులను నిలిపివేయలేదు. ప్రత్యక్షంగా వాణిజ్య పోరుకు దిగినట్లు ప్రకటించకపోయినా మనదేశం కూడా చేస్తున్నది అదే. రెండుదశాబ్దాల క్రితం ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రవేశించినపుడు మనదేశంతో వాణిజ్య లావాదేవీల విలువ 3.6బిలియన్‌ డాలర్లు మాత్రమే. దానిలో మనలోటు కేవలం 0.19బి.డాలర్లు మాత్రమే. అదే 2022లో ద్విపక్ష వాణిజ్యం 136 బి.డాలర్లకు చేరగా మనలోటు 101బి.డాలర్లు ఉంది.మరుసటి ఏడాది పరిస్థితి కూడా అలాగే ఉంది.దిగుమతులు మన పరిశ్రమలు, వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి దిగుమతి పన్ను 500 రెట్లు పెంచింది. అయినా తగ్గలేదు, అంటే పెంచిన పన్ను మొత్తాలను భరిస్తున్నది మన వినియోగదారులే. మన దేశంలోనే వస్తూత్పత్తి చేసి జనానికి ఉపాధితో పాటు చౌకగా సరకులను అందించాల్సిన నరేంద్రమోడీ దిగుమతి చేసుకున్న వస్తువుల మీద కూడా పన్నులు మోపి జనం జేబులు గుల్లచేస్తున్నారు.రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడి చమురు మీద కూడా అంతే చేస్తున్న సంగతి ఎరిగిందే.వినియోగదారులకు ఒక్క పైసా అయినా తగ్గించారా ? ఫార్మాదిగుమతులపై పన్ను పెంపును మనదేశంలోని పరిశ్రమ వర్గాలు వ్యతిరేకించటంతో 76 ఔషధాలపై పెంపుదలను వెనక్కు తీసుకున్నారు. అనేక వస్తువులపై దిగుమతి పెంపును ఉత్పత్తిదారులు స్వాగతిస్తే దిగుమతిదారులు వ్యతిరేకించారు. ఆర్థికశాఖ తీసుకున్న నిర్ణయాలను ఇతర మంత్రిత్వశాఖలు వ్యతిరేకించాయి.ఈ ఏడాది తాత్కాలిక బడ్జెట్‌కు ముందు అనేక వస్తువులపై పన్నులను తగ్గించారు. ఉత్పాదకత ఎగుమతులతో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకం(పిఎల్‌ఐ) రాయితీలను ఉపయోగించుకున్న సంస్థలు పన్నెండింటిలో పదకొండు చైనా సరఫరా గొలుసు భాగస్వాములు లేదా సేవలు అందించే సంస్థలున్నట్లు వార్తలు వచ్చాయి. గత పది సంవత్సరాల కాలంలో అనేక ప్రోత్సాహాకాలు, రక్షణ చర్యలు చేపట్టినా మన పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 15శాతం చుట్టూ తిరుగుతున్నది తప్ప పెరగలేదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత మనదేశం నుంచి ఎగుమతులు నిలిపివేస్తే చైనా మన కాళ్లదగ్గరకు వస్తుందని అనేక మంది కలలు గని అలాంటి పిలుపులే ఇచ్చారు. మొత్తం చైనా చేసుకునే దిగుమతుల్లో మనదేశ వాటా కేవలం మూడుశాతమే, అదే మనం దిగుమతి చేసుకుంటున్నది 15శాతం ఉన్నాయి.చెరువు మీద అలగటం మంచిది కాదని మన విధాన నిర్ణేతలకు అర్ధమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేదలకు మొండిచేయి ! మన్మోహన్‌ ధారాళంగా అప్పులిస్తే నరేంద్రమోడీ ఉదారంగా లక్షల కోట్లు రద్దు !! ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా !!!

21 Sunday Apr 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Freebies, loans written off, Narendra Modi Failures, NPA;s, Politics Of Freebies, wilful defaulters


ఎం కోటేశ్వరరావు


పేదరికం, పేదల గురించి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చర్చ జరుగుతోంది. ” ఒక్క దెబ్బతో పేదరికాన్ని మాయం చేస్తానని రాహుల్‌ గాంధీ చెబుతున్నారు. ఇంతకాలం ఈ మహా మంత్రగాడు ఎక్కడున్నారు ” ఇది ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్న.ఈ మంత్రాన్ని ఎక్కడ నుంచి నేర్చుకున్నారు, పేదలను అవమానించటం కాదా అని కూడా అన్నారు. ఒక్క దెబ్బతో పేదరికం పోతుందని తాను చెప్పలేదని గట్టి ప్రయత్నం చేయాలని మాత్రమే అన్నట్లు రాహుల్‌ గాంధీ వివరణ. దేశంలో దారిద్య్రం ఉండటానికి కారణం కొంత మంది ఎంపిక చేసుకున్న వ్యక్తులకు నరేంద్రమోడీ సంపదలను కట్టబెట్టటమే అన్నారు. నరేంద్రమోడీ చెబుతున్నట్లుగా 2030నాటికి ప్రపంచంలో మూడవ పెద్దదిగా మనదేశం అవతరించినప్పటికీ జనం పేదరికంలోనే ఉంటారని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పారు. ఇప్పటి వరకు చేసింది ట్రైలర్‌ మాత్రమేనని అసలు సినిమా ముందు చూపుతా, పక్కా, నన్ను నమ్మండి అంటున్నారు నరేంద్రమోడీ. అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని పేదరికంలో జనాభా ఉన్నారని యుపిఏ సర్కార్‌ ఆహార భద్రతా పధకాన్ని తెచ్చింది.2011-12 వినియోగ సమాచారం ఆధారంగా గ్రామీణ ప్రాంత జనాభాలో 75శాతం, పట్టణాలలో 50శాతం మందికి కుటుంబానికి నెలకు 35కిలోల వంతున, వ్యక్తులుగా నెలకు ఐదు కిలోల చొప్పున ఇవ్వాలని పేదల్లో పేదలను గుర్తించి అంత్యోదయ అన్న యోజన కింద నాడు 81.34 కోట్ల మంది అర్హులని, వారిలో 80 కోట్ల మందిని గుర్తించి సబ్సిడీ ఆహార ధాన్యాల పధకాన్ని అమలు చేస్తున్నారు. వచ్చే ఐదు సంవత్సరాలలో 80 కోట్ల మందికి పూర్తి ఉచితంగా ఐదేసి కిలోల వంతున అందచేస్తామని నరేంద్రమోడీ ప్రకటించారు. దీని అర్ధం ఏమిటి ? దారిద్య్రం నుంచి బయటపడని వారు, లేదా బయటపడవేసిన వారు కూడా అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని, మరో ఐదేండ్లు తమ అచ్చేదిన్‌ పాలనలో అలాగే ఉంటారని, పని కల్పించలేమని చేతులెత్తేయటమే కదా !


మనదేశ బహుముఖ దారిద్య్రం గురించి 2023లో వెల్లడించిన నివేదిక ప్రకారం 2015-16లో దేశంలో 24.85 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉంటే 2019-21 నాటికి 14.96శాతానికి అంటే 13 కోట్ల 56లక్షల 61వేల 35 మందిని ఎగువకు తెచ్చినట్లు చెప్పారు. నరేంద్రమోడీ ఏలుబడిలో 2001 అక్టోబరు 7 నుంచి 2014 మే 22 వరకు గుజరాత్‌ ఉంది. అంతకు ముందు ఆరు సంవత్సరాలు కూడా బిజెపి పాలనలోనే ఉంది. దేశానికి నమూనాగా పేర్కొన్న గుజరాత్‌లో 2015-16 నాటికి పేదరికం 18.47శాతం ఉంది. కమ్యూనిస్టులు అభివృద్ధికి దూరంగా ఉంచారన్న కేరళలో 0.7శాతమే ఉంది. పైన చెప్పుకున్న వ్యవధిలో దేశంలో 24.85శాతం దారిద్య్రాన్ని 14.96శాతానికి తగ్గించామని చంకలు కొట్టుకుంటున్న నరేంద్రమోడీ రెండింజన్ల గుజరాత్‌లో ఆ దామాషా ప్రకారం తగ్గించటంలో ఎందుకు విఫలమైనట్లు ? 18.47శాతంగా ఉన్న వారిని 11.66శాతానికి ఎందుకు పరిమితం చేశారు ? పోషకాహారం లేని వారు బీహార్‌లో 2019-21లో 42.2శాతం, రెండవదిగా ఉన్న జార్ఖండ్‌లో 40.32, మూడవదిగా ఉన్న గుజరాత్‌లో 38.09శాతం ఉన్నట్లు సదరు నివేదిక వెల్లడించింది. గుజరాత్‌ జనాభాలో 2.44శాతానికి ఇప్పటికీ విద్యుత్‌, 23.3శాతానికి ఇండ్లు,11.37శాతానికి ఎలాంటి ఆస్తులు,4.4శాతానికి బాంకు ఖాతాలు లేవు. దేశంలో సగటున ఆరేండ్ల లోపు పిల్లల్లో 67.1, మహిళల్లో 15-49 ఏండ్ల మధ్యవయస్సుల వారిలో 57శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గుజరాత్‌లో దేశ సగటుకు మించి పిల్లల్లో 79.7, మహిళల్లో 65.1శాతం ఉన్నారు.దీనికి నరేంద్రమోడీ, ఆయనను పొగిడేవారు తలలెక్కడ పెట్టుకుంటారు.


నరేంద్రమోడీ ధరించే సూటు ధర రు.పదిలక్షలు. సాధారణ జనాల మాదిరి సంవత్సరాల తరబడి వేసుకుంటారా లేక తరచుగా మార్చివేస్తారో తెలియదు. 2016లో మోడీ ధరించిన ఒక సూట్‌ను వేలం వేస్తే సూరత్‌లోని ఒక ” పేదవాడు ” రు.4.3 కోట్లకు దక్కించుకున్నాడు. దాన్ని అహమ్మదాబాద్‌లోని జేడ్‌ బ్లూ అనే వస్త్రదుకాణ సంస్థలో కుట్టారని విలువ పది లక్షలని తేలింది. అప్పటి నుంచి మోడీ అంత ఖరీదుగల దుస్తులు ధరిస్తారని ప్రచారంలోకి వచ్చింది. పేద కుటుంబం నుంచి వచ్చిన మోడీకి తన ప్రభుత్వం 60,80 ఏండ్లు దాటిన దారిద్య్రరేఖ దిగువన ఉన్న పేదలకు ఇస్తున్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల మొత్తం తెలియదా ! లేక తన పాలనలో కనీసం కోడి గుడ్డంత బంగారం కూడా లేని పేదలు ఉండరన్న ధీమా కావచ్చు. యుపిఏ పాలనలో నిర్ణయించిన నెల పెన్షన్‌ రు.200,500 మాత్రమే ఇప్పటికీ నరేంద్రమోడీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడువేలు, తెలంగాణాలో రెండు వేలు, కేరళలో రు.1,600 ఇస్తున్నారంటే కేంద్రం ఇస్తున్న మొత్తాలకు అక్కడి ప్రభుత్వాలు తమ బడ్జెట్ల నుంచి అదనంగా జతచేసి ఇస్తున్నాయి. బిజెపి పాలనలోని మహారాష్ట్రలో రెండువందలకు మరో నాలుగు వందలు కలిపి ఇస్తున్నారు. వికీ పీడియా సమాచారం ప్రకారం వృద్ధాప్య పెన్షన్లు అసోంలో 200-500, బీహార్‌ 400-500, గుజరాత్‌లో 750-1000, మధ్య ప్రదేశ్‌ 600-800, రాజస్తాన్‌లో 750-1000 ఇస్తున్నారు. పదేండ్ల అచ్చేదిన్‌ పాలనలో ధరల పెరుగుదలకు అనుగుణంగా ఒక్క పైసా కూడా పెంచేందుకు మహానుభావుడు నరేంద్రమోడీకి చేతులు రాలేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బిజెపి నేతలు రోడ్లు వేశాం, రేవులను అభివృద్ధి చేశాం అంటారు తప్ప పెన్షన్లు పెంచాం అనే మాట చెప్పరు..


పెన్షన్లు పెంచే ప్రతిపాదనేదీ లేదని 2023 డిసెంబరు ఆరవ తేదీన ఒక ప్రశ్నకు ( నం.429) కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. తాము ఇస్తున్న పెన్షన్‌ మొత్తాన్ని కూడా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని, కేంద్ర వాటా గురించి కూడా చెప్పాలని బిజెపి పెద్దలు కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దానికి తమకేమీ అభ్యంతరం లేదని, ఎవరెంత ఇస్తున్నారో జనానికి తెలియటం అవసరమేనని విజయన్‌ చెప్పారు. పెన్షన్‌ పధకాలకు 2021, 2022 ఆర్థిక సంవత్సరాలకు కేరళకు చెల్లించాల్సి 573 కోట్లను కేంద్రం నిలిపివేసినట్లు పైన పేర్కొన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో వివరాలు చెబుతున్నాయి. పేదల పెన్షన్ల పట్ల ఇంత కఠినంగా ఉన్న మోడీ కావాలని రుణాలు ఎగవేసిన వారి పట్ల ఎంతో ఉదారంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో అడ్డగోలుగా రుణాలు ఇచ్చారని ఎదురుదాడి ఒకటి. వారి ఏలుబడిలో ఇస్తే తన పాలనలో వాటిని వసూలు చేయకూడదని ఎవరైనా అడ్డుపడ్డారా ? ఒక్క ముక్కలో చెప్పాలంటే యుపిఏ హయాంలో బాధ్యతారహితంగా కార్పొరేట్లకు అప్పులిస్తే మోడీ హయాంలో ఎగవేసిన వాటిని రద్దు చేసి వారి సేవలో తరించారు. అంతిమంగా జనం జేబులు గుల్ల. ఉచితాలకు తాను వ్యతిరేకం అని చెబుతున్న మోడీ కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ బాంకుల రుణాలను ఉదారంగా ఎలా రద్దు చేశారు ? ఇది ఖజానాను దెబ్బతీయదా ? రిజర్వుబాంకు సమాచారం ఆధారంగా బాంకుల్లో నిరర్ధక(బడా బాబులు ఎగవేసిన) ఆస్తులుగా పేర్కొన్న కొన్ని వివరాలు దిగువ చూడవచ్చు. అంకెలు రు.లక్షల కోట్లు.


పాలన××కాలం×××××× మొత్తం వాణిజ్య బాంకులు ×××××× ప్రభుత్వ రంగ బాంకులు
పాలన××××కాలం××××× ఎన్‌పిఏ ×× వసూలు×× రద్దు ×× ఎన్‌పిఏ ×× వసూలు×× రద్దు
యుపిఏ 1× 2004-09×× 1.55 ×× 1.39 ××0.08 ×× 1.08 ×× 1.12 ×× 0.02
యుపిఏ 2× 2009-14×× 5.76 ×× 3.24 ×× 0.55 ×× 4.80 ×× 2.64 ×× 0.32
మోడీ 1× 2014-19 ×× 19.79 ×× 5.99 ×× 6.40 ××15.90 ×× 4.52 ×× 5.05
మోడీ 2× 2019-21 ×× 7.79 ×× 2.74 ×× 4.46 ×× 5.17 ×× 1.74 ×× 3.12


ఈ అంకెలు వెల్లడిస్తున్నదేమిటి ? యుపిఏ పదేండ్లలో నిరర్దక ఆస్తులుగా తేలిన ప్రతి వంద రూపాయల్లో వసూలు రు.63.34 ఉండగా రద్దు చేసినది రు.8.62 కాగా, మోడీ ఏలుబడి 2014 నుంచి 2021వరకు వందకు వసూలు రు.31.65 కాగా రద్దు చేసిన మొత్తం రు.39.38. మొత్తం వాణిజ్య బాంకుల్లో రద్దు చేసిన మొత్తాలు 10.86 లక్షల కోట్లు కాగా వాటిలో ప్రభుత్వ బాంకుల వాటా 8.17లక్షల కోట్లు ఉంది. నరేంద్రమోడీ 2016లో ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంకరప్టసీ బోర్డు(ఐబిసి) అంటే దివాలా మరియు అప్పులు తీర్చలేని వారి కోసం ఏర్పాటు చేశారు.2022 జూన్‌ వరకు ఈ సంస్థకు నివేదించిన దానిలో ఆమోదించిన మొత్తాల విలువ రు.7.67లక్షల కోట్లు. దీనికి గాను వసూలు చేసింది 2.25లక్షల కోట్లు(30.6శాతం) మాత్రమే.దీన్ని జనం భాషలో చెప్పాలంటే ప్రతి లక్ష కోట్లకు బాంకులకు అయిన క్షవరం రు.67,000 కోట్లు.2014-15 నుంచి 2023 మార్చి నెల వరకు తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రద్దు చేసిన రుణాల మొత్తం రు.14లక్షల 56వేల 226 కోట్లని కేంద్ర మంత్రి గతేడాది ఆగస్టులో లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో చెప్పారు.కాగా వసూలు చేసిన మొత్తం రు.7లక్షల 40వేల, 968కోట్లని కూడా వెల్లడించారు.ఇదంతా మోడినోమిక్స్‌లో భాగమే. నేను తినను ఇతరులను తిననివ్వను, ప్రతి పైసాకూ జవాబుదారీగా ఉంటానని చెప్పిన నరేంద్రమోడీ ఎవడబ్బ సొమ్మని లక్షల కోట్లు రద్దు చేసినట్లు రామచంద్రా ? స్వతంత్ర భారత చరిత్రలో ఏకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగిన ఇంతకంటే పెద్ద కుంభకోణం ఏముంది. అప్పనంగా రద్దు చేస్తే కార్పొరేట్లు కుంభకోణానికి పాల్పడాల్సిన అవసరం ఏముంది ? పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయితేనేం. కొల్లగొడుతున్నది జనం సొమ్మేగా ! ఇంతగా సహకరిస్తున్నారు గనుకనే మూడో సారి కూడా మోడీనే రావాలని వేల కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల రూపంలో సమర్పించారు. తమ చేతుల్లో ఉన్న మీడియా ద్వారా ఊదరగొడుతున్నారు. ఏ టీవీ ఛానల్లో అయినా ఈ తీరు తెన్నుల గురించి చర్చలను ఎవరైనా చూశారా ?


మోడీ పాలనలో బాంకుల అవినీతి వెల్లడైనా మీడియాకు పెద్దగా పట్టదు. తొలి ఎనిమిది సంవత్సరాల పాలనలో బాంకుల్లో జరిగిన అవినీతి కారణంగా మూడు లక్షల కోట్లు గల్లంతు కాగా వాటిలో ప్రభుత్వ రంగబాంకుల్లోనే 2.15లక్షల కోట్లు ఉంది, మూడు లక్షల కోట్లకు గాను తిరిగి వసూలు చేసింది కేవలం 33,646 కోట్లని 2021-22 సంవత్సరం వరకు ఆర్‌బిఐ ఇచ్చిన సమాచారహక్కు సమాధానంలో చెప్పింది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం రు. 3.4లక్షల కోట్లు ప్రభుత్వ రంగబాంకులకు ఇచ్చి వాటిని నిలబెట్టింది. ఇదంతా జనం సొమ్ము కాదా ? 2008లో 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపు సక్రమంగా వేలం వేయని కారణంగా రు.1.76లక్షల కోట్ల మేర నష్టం జరిగిందన్న కాగ్‌ నివేదిక దేశంలో ఎంత సంచలనం కలిగించిందో, కాంగ్రెస్‌ను అధికారం నుంచి తొలగించేందుకు ఎలా తోడ్పడిందో తెలిసిందే. ఆ మొత్తం ఊహాజనితం, కేటాయింపు సక్రమంగా లేదు తప్ప అవినీతి జరగలేదని తరువాత కోర్టు ఆ కేసును కొట్టివేసింది.కానీ బాంకు రుణాల రద్దు అలాంటిది కాదు. వాస్తవం. ఒక సినిమాలో హీరోయిన్‌ రష్మిక మీకు అర్ధమౌతోందా అన్న ఊతపదాన్ని ఈ సందర్భంగా జనాలకు గుర్తు చేయాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ బడాయి : ట్రైలర్‌కే పదేండ్లా ! అసలు సినిమా చూస్తామా ?

10 Wednesday Apr 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

10 years Narendra Modi, BJP, India GDP, India percapita GDP, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


గడిచిన పది సంవత్సరాల్లో మీరు చూసింది కేవలం ట్రైలరే మరోసారి ఎన్నుకుంటే అసలు సినిమా ముందు చూపిస్తా అని ప్రధాని నరేంద్రమోడీ రాజస్థాన్‌లోని చురు పట్టణంలో జరిగిన ఎన్నికల సభలో చెప్పారు. అంతకు ముందు ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటులో మాట్లాడుతూ దేశ జిడిపి 11వ స్థానంలో ఉన్నందుకు కాంగ్రెస్‌ ఉత్సవాలు చేసుకుంది. కానీ ఈ రోజు ఐదవ స్థానానికి చేరుకుంది. కాంగ్రెస్‌ దిగ్భ్రాంతిలో ఉంది. ఈ విజయం సాధించాలంటే కాంగ్రెస్‌కు వంద ఏండ్లు పడుతుంది అని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ జిడిపిని ఒక విజయంగా గొప్పలు చెప్పుకుంటోంది. అయితే దాన్ని చూసి జనం ఎక్కడా సంబరాలు చేసుకోవటం లేదు. కొన్ని ట్రైలర్లను చూసి సినిమాకు వెళ్లినా, శీర్షికలను చూసి యూ ట్యూబ్‌ చూసినా ఆశాభంగం తప్ప మరొకటి మిగలదు.


నరేంద్రమోడీ ట్రైలర్లలో ఒకటైన జిడిపి సంగతి చూద్దాం. వివిధ సంస్థలు ప్రకటించే గణాంకాల్లో తేడాలు ఉండే అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి. అయితే స్వల్పతేడాలున్నా ధోరణుల్లో పెద్ద తేడా లేదు. 2004లో ప్రపంచ జిడిపిలో భారత్‌ 12వ స్థానంలో ఉంది, 2014లో ఐఎంఎఫ్‌, ప్రపంచ బాంకు విశ్లేషణల ప్రకారం తొమ్మిది, 2015,16లో ఏడు,2017లో ఆరు, 2018లో ఏడవదిగా ఉంది. తరువాత ఐదవ స్థానానికి చేరింది. యుపిఏ లేదా కాంగ్రెస్‌ జిడిపిని ఒక విజయంగా చెప్పలేదు. 2004లో మన తలసరి జిడిపి మాక్రోట్రెండ్స్‌ విశ్లేషణ ప్రకారం 624 డాలర్లు, 2013లో 1,438 డాలర్లు, అంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అది నరేంద్రమోడీ ఏలుబడిలో 2022నాటికి 2,389కి పెరిగింది.రెట్టింపు కంటే చాలా తక్కువ అని ఎవరైనా చెబుతారు. మన కంటే దిగజారిన వారితో పోల్చుకొని మన స్థానం పెరిగిందని సంబరపడుతున్నారు. ప్రతిదానికీ చైనాతో పోల్చుకుంటున్నపుడు దీన్ని కూడా దానితోనే చూపాలి కదా.ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం 2014లో చైనాలో 7,636 డాలర్లున్న తలసరి జిడిపి 2022 నాటికి 12,720కి పెరిగితే అదే కాలంలో మన దగ్గర 1,560 నుంచి 2,380కు మాత్రమే పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) సమాచారం ప్రకారం 2023లో ప్రపంచ తలసరి జిడిపి 13,330 డాలర్లు. అంతకంటే ఎక్కువగా 65దేశాల్లో ఉంది. ప్రపంచ జిడిపిలో మనం ఐదవ స్థానంలో ఉంటే తలసరి జిడిపిలో 138లో ఉంది. దీని గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు ? ప్రపంచ జిడిపిలో 32వదిగా ఉన్న బంగ్లాదేశ్‌ తలసరిలో మనకంటే ఎగువన 137వదిగా ఉంది. చైనా రెండు, 71వ స్థానాల్లో ఉన్నాయి. కనుక జిడిపి గురించి నరేంద్రమోడీ గొప్పలు చెప్పుకోవాల్సింది ఏముంది ?


ప్రపంచ జిడిపిలో చైనా వాటా 2014లో 13.1శాతం ఉండగా 2023లో 17.86కు పెరిగింది. త్వరలో చైనాను అధిగమిస్తామని చెబుతున్న నరేంద్రమోడీ ఏలుబడిలో ముక్కుతూ మూలుగుతూ 2.6 నుంచి 3.37శాతానికి మాత్రమే అంటే ఒకశాతం కూడా పెరగలేదు. ఈ మాత్రానికే ఇది ట్రైలర్‌ అంటున్నారు.అసలు సినిమా ప్రారంభమే కాలేదని, జనం చూసేదేమీ ఉండదని ఈ తీరు వెల్లడించటం లేదా ! ఈ మధ్య కాలంలో కొందరు పడకకుర్చీ మేథావులు చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది గనుక మనదేశం దాని స్థానాన్ని ఆక్రమించనుందనే కబుర్లు చెబుతున్నారు. మనదేశం అందరితో పోటీపడాలని, ఆరోగ్యకరమైన పోటీతో అధిగమించాలని కోరుకోవటం వేరు, మనం ఎగువన ఉండాలంటే మిగతావారు దిగువకు తగ్గాలని కోరుకోవటం విడ్డూరం, మన పూర్వీకులు మనకు చెప్పిన సుగుణమిదా ! గత పాతిక సంవత్సరాలలో దేశంలో రోడ్లు, రేవుల వంటి మౌలిక సదుపాయాలను వృద్ధి చేశారు. ఏ బిజెపి నేతను కదిలించినా పాడిందే పాడరా అన్నట్లు మనకు చెప్పేది ఇదే. సంస్కరణలు, వాటిలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చైనాలో కూడా ఇదే మాదిరి చేశారు. అనేక మంది అక్కడి మాదిరే ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందని, మరో పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని ఆశించారు, ఆహ్వానించారు. కానీ అదేమీ జరగలేదు. చైనాలో ఉత్పత్తులతో పాటే వాటి రవాణా వేగంగా జరగటానికి మౌలిక సదుపాయాలను కల్పించారు. మన దేశంలో చూడండి మేము వేసిన రోడ్లు, రేవులు అని బిజెపి నేతలు చెప్పుకొనేందుకు తప్ప జనానికి ఉపాధిని పెంచే పారిశ్రామిక ఉత్పత్తి పెరగకపోగా గత పదేండ్లలో జిడిపిలో దాని వాటా తగ్గిపోయింది. గత పాలకుల ఏలుబడిలో ప్రారంభమైన ఉపాధి రహిత పరిశ్రమలు, సేవారంగాలు మరింతగా విస్తరించాయి. రవాణా చేసేందుకు రోడ్లు, రేవులు ఉన్నా సరకులు లేవు.డిజిటల్‌ చెల్లింపుల రంగంలో గణనీయ పురోగతి ఉంది తప్ప రాబడులు పెరగటం లేదు.


సేవారంగంలో పని చేసేందుకు అవసరమైన ఐటి నిపుణులు గణణీయంగా పెరిగారు.దీనికిగాను ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వటం తప్ప పెట్టుబడులేమీ పెట్టలేదు. ప్రభుత్వరంగంలో సంస్థలేవీ రాలేదు.ఈ రంగంలో ఎగుమతుల వల్లనే మన పరిస్థితి మెరుగుపడింది తప్ప పారిశ్రామిక రంగ వృద్ది వలన కాదు. పారిశ్రామిక రంగంలో మాదిరి సేవారంగంలో కూడా మనవారిని చౌకగా వినియోగించుకొనేందుకు అనేక విదేశీ కంపెనీలు ఇక్కడకు వాలిపోయాయి. జెపి మోర్గాన్‌, గోల్డ్‌మాన్‌ శాచస్‌, అమెజాన్‌, తదితర విదేశీ కంపెనీలు వేలాది మందిని నియమించుకుంటున్నాయి.చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లు సంవత్సరాల నుంచి చెబుతున్నారు. కొన్ని వస్తున్నమాట నిజం. అవి మనదేశంలో ఉత్పత్తిని పెంచుతున్నాయా ? ఉపాధి కల్పిస్తున్నాయా ? రెండూ లేవు. స్టాక్‌ మార్కెట్‌, రుణ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. జనవరి చివరి నాటికి అలాంటి పెట్టుబడులు రు.1.43 లక్షల కోట్లు వచ్చినట్లు, అంతకు ముందు ఏడాది అదే కాలంలో రు.91,460 కోట్లు వచ్చినట్లు వివరాలు వెల్లడించాయి. ఇలాంటి వాటికోసం మన పాలకులు చూస్తున్నారు తప్ప ఉత్పత్తికి, తద్వారా ఉపాధి పెరుగుదలకు అవసరమైన పెట్టుబడుల గురించి శ్రద్దలేదు. స్టాక్‌ మార్కెట్లు, రుణాలలో విదేశీ పెట్టుబడులు ఎంత పెరిగితే అంతగా అది చైనా, మనదేశం మరొకటైనా లాభాలను తరలించుకుపోతే నష్టం తప్ప లాభం ఉండదు. నైపుణ్యాలతో పెద్దగా పనిలేని వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతులు చేయటంలో ప్రస్తుతం చైనా వాటా ప్రపంచంలో 40శాతం ఉండగా మనవాటా మూడు శాతానికి అటూ ఇటూగా ఉంది. రానున్న దశాబ్దంలో ఇది 5 నుంచి పదిశాతం వరకు పెరగవచ్చని కొందరి అంచనా. ఇదే సమయంలో చైనా అలాంటి ఎగుమతులను తగ్గించి అధిక నైపుణ్యం గల వస్తువులవైపు కేంద్రీకరిస్తున్నది. అక్కడ వేతనాల పెరుగుదల వంటి కారణంగా కొందరు మనవైపు చూస్తున్న మాట నిజం.దీన్నే బూతద్దంలో చూపి చైనా స్థానంలో మనదేశం ఉంటుందని చెబుతున్నారు. కానీ ప్రచారం చేస్తున్నదానికి అనుగుణంగా మనదేశంలో అలాంటి మార్పులు కనిపించటం లేదని, దానికి విధానపరమైన లోపాలే కారణమని అనేక మంది చెబుతున్నారు.మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చినప్పటికీ ఎన్ని విదేశీ సంస్థలు తమ కార్యకలాపాలను మనదేశంలో విస్తరించాయన్నది సమస్య. 2023లో వెల్లడైన లెక్కల ప్రకారం ప్రపంచ వస్తూత్పత్తిలో చైనా 28.4, అమెరికా 16.6, జపాన్‌ 7.5, జర్మనీ 5.8 శాతాల చొప్పున మొత్తం 58.3శాతం నాలుగుదేశాలే చేస్తున్నాయి. మనం 3.3శాతంతో ఉన్నాం. 2010లో మొదటి స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కు నెట్టి చైనా ముందుకు వచ్చింది. అదే ఏడాది తొమ్మిదవ స్థానంలో ఉన్న మనదేశం 2014లో ఆరవ స్థానానికి వచ్చింది. గుజరాత్‌ నమూనా అని మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి ఎన్ని కబుర్లు చెప్పినా మోడీ ఏలుబడిలో పదేండ్లు గడచినా ఐదవ స్థానంలో మాత్రమే ఉంది.


విదేశాల్లో దేశ ప్రతిష్టను పెంచానని, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించానని మోడీ చెప్పుకుంటారు.2004లో మనదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4.3బిలియన్‌ డాలర్ల నుంచి 2014 నాటికి 36బిలియన్లకు పెరిగాయి. మోడీ ఏలుబడిలో గరిష్టంగా 84.8బి.డాలర్లకు పెరిగి 2023లో 70.9బి.డాలర్లకు తగ్గాయి. గత పదేండ్లు, అంతకు ముందు పెరుగుదల రేటు ఎంత ? ఈ కాలంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే వస్త్ర రంగంలో ఎగుమతులు తగ్గాయి. కొత్త ప్రాజెక్టులు పెట్టి ముప్పు ఎదుర్కోవటం కంటే ఉన్న కంపెనీల వాటాల మీద పెట్టుబడి పెట్టటం లాభసాటిగా ఉంది కనుక విదేశీ పెట్టుబడిదారులు స్టాక్‌ మార్కెట్‌ వైపు చూస్తున్నారు. స్థానిక పరిశ్రమలకు రక్షణ కల్పిస్తున్న కారణంగా విదేశీ కంపెనీలు పెద్దగా ఉత్పత్తి రంగంలో ఆసక్తి చూపటం లేదు. సెల్‌ఫోన్ల వంటి రాయితీలు ఉన్న వాటికే వస్తున్నారు. లాప్‌టాప్‌ల దిగుమతులపై పరిమితులు విధించి తరువాత నిబంధనలను నీరుగార్చారు. దాని వలన జరిగిందేమిటి ? ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని స్థితిలో స్థానిక పెట్టుబడిదారులు, విదేశీయులూ ముందుకు రావటం లేదు.చైనాలో ఇలాంటి అనిశ్చితికు తావులేదు గనుకనే విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఒక నిర్దిష్ట వ్యవధి వరకు విధానాల్లో మార్పులు ఉండవని చెబుతున్నారు. ఉదాహరణకు బ్రిటీష్‌, పోర్చుగీసు వారి కౌలు గడువు తీరిన తరువాత హాంకాంగ్‌, మకావో దీవులను నేరుగా ప్రధాన భూభాగం చైనాలో విలీనం చేసుకోవచ్చు.కాని దాని వలన కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ గనుక ఆ ప్రాంతాల్లో ఉన్న పెట్టుబడులు, సేవారంగం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఒకే దేశం – రెండు వ్యవస్థలనే విధానాన్ని ప్రకటించింది. దాని ప్రకారం 50 ఏండ్లు అంటే 2049వరకు ఆ రెండు దీవుల్లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగిస్తామనే నిర్దిష్ట హామీ ఇచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌ను ముంచెత్తనున్న విద్యుత్‌ వాహనాలు – చైనా మీద మోడీ సర్కార్‌కు ఎక్కడలేని ప్రేమ ఎందుకబ్బా !

04 Thursday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices

≈ Leave a comment

Tags

BJP, China, China imports to India, Chinese E vehicles, Chinese investment, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


సరిహద్దు సమస్యల గురించి మాతో రహస్యంగా భారత్‌ లోతైన చర్చలు జరుపుతున్నదని, మరోవైపు విదేశాంగ మంత్రి రాజీపడేది లేదని ప్రకటిస్తారని, ఇదంతా నెపం మా మీద నెట్టేందుకు, బేరమాడేందుకు చేస్తున్న ట్రిక్కు అని చైనా విదేశాంగశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. గత నెలలో బీజింగ్‌లో రెండు దేశాల ప్రతినిధులు సరిహద్దు వివాదాల గురించి 29వ దఫా చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దులో సాంప్రదాయ పద్దతిలో బలగాలను మోహరించితేనే సాధ్యమని చర్చల అనంతరం మలేషియా భారతజాతీయుల సమావేశంలో జై శంకర్‌ చెప్పారు. సరిహద్దు సమస్యపై రాజీపడేది లేదన్నారు. భారత్‌లో జరగనున్న ఎన్నికల్లో లబ్దిపొందేందుకే జైశంకర్‌ ఇంత గట్టిగా మాడ్లాడారని చైనా విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదానికి బాధ్యత చైనాదే అని ప్రపంచానికి చెప్పే యత్నం కూడా దీనిలో ఉందన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌ అంతర్భాగంగా తాము ఎన్నడూ గుర్తించలేదని, మరోసారి దాన్ని గురించి ప్రస్తావించటం కూడా ఎన్నికల కోసమే అని విమర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనా జాంగ్‌నాన్‌ అని పిలుస్తున్నది, పురాతన కాలం నుంచి అది చైనా ప్రాంతమే అని వాదిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన సమయానికి అది మనదేశ అంతర్భాగంగా ఉంది.అదే విధంగా మనదని చెబుతున్న ఆక్సారుచిన్‌ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. ఇది రెండు దేశాల మధ్య తెగని సరిహద్దు వివాదంగా కొనసాగుతున్నది. పరస్పరం చొరబడకుండా వాస్తవాధీన రేఖకు అటూ రెండు దేశాలూ కాపలా కాస్తుంటాయి.ఉద్రిక్తతలు తలెత్తినపుడు మిలిటరీని మోహరిస్తున్నాయి. లడక్‌ ప్రాంతంలోని గాల్వన్‌ లోయ 2020 ఉదంతం తరువాత మోహరించిన మిలిటరీలు కొనసాగుతున్నాయి. వాటి ఉపసంహరణ గురించి చర్చలు జరుగుతున్నా కొత్త వివాదం తలెత్తలేదు తప్ప పూర్వపు స్థితి నెలకొనలేదు.


ఒక వైపు మనదేశంలోని సంఘపరివార్‌, ఇతర కొన్ని శక్తులు చైనా వ్యతిరేకతను నిరంతరం రెచ్చగొడుతూ ప్రచారం చేస్తుంటాయి. మరోవైపు అదే చైనా నుంచి మన దేశం రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకుంటున్నది. గత రికార్డులను నరేంద్రమోడీ బద్దలు కొట్టారు.ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గతేడాది అదే నెలలతో పోలిస్తే 15.8శాతం తమతో వాణిజ్యం పెరిగిందని చైనా కస్టమ్స్‌ శాఖ ప్రకటించింది. తూర్పు చైనాలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న షియాంగ్‌సు రాష్ట్రం నుంచి బ్రెజిల్‌,భారత్‌,రష్యా, దక్షిణాఫ్రికా దేశాలతో గతేడాదితో పోలిస్తే 2024జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 36శాతం పెరిగి 14.4బిలియన్‌ డాలర్లకు చేరిందని వెల్లడించారు.షియాంగ్‌షు రాష్ట్రం నుంచి ప్రధానంగా విద్యుత్‌ వాహనాలు, వాటిలో వినియోగించే లిథియమ్‌ అయాన్‌ బాటరీలు, ఫొటోవోల్టాయిక్‌ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.పైన పేర్కొన్న నాలుగుదేశాలతో పాటు చైనాను కలిపి బ్రిక్స్‌ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి దీనిలో సౌదీ అరేబియా, ఈజిప్టు,ఇరాన్‌, యుఏయి. ఇథియోపియా కూడా చేరటంతో దీన్ని బ్రిక్స్‌ ప్లస్‌ అని పిలుస్తున్నారు. ఒక వైపు చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, మనదగ్గర నుంచే మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియాలో భాగంగా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసే అవకాశం వచ్చిందని మీడియా ఊదరగొడుతున్నది. మరోవైపు మనదేశం చైనా, ఐరోపా సమాఖ్య మీద ఆధారపడటం పెరుగుతున్నదని తాజాగా ఐరాస సంస్థ ” అంక్టాడ్‌ ” ప్రకటించింది.
మనదేశం అందించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ కరోనా తరువాత, రష్యా-ఉక్రెయిన్‌ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి చైనా, ఐరోపా సమాఖ్యపై భారత్‌ ఆధారపడటం 1.2శాతం పెరిగిందని, సౌదీ అరేబియాపై 0.6శాతం తగ్గిందని పేర్కొన్నది. భారత్‌లో ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం(పిఎల్‌ఐ) అమలు, చైనా నుంచి వస్తున్న దిగుమతులపై నాణ్యతా ప్రమాణాల ఉత్తరువుల పేరుతో పరిమితులను విధించిన తరువాత కూడా భారత్‌ ఆధారపడటం పెరిగింది. గడచిన రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ వాణిజ్యం స్థిరంగా ఉండటం, రాజకీయాల ప్రాతిపదికన వాణిజ్యం పెరిగినప్పటికీ చైనా మీద ఆధారపడటం ఎక్కువైంది. చైనాపై ఆధారపడటాన్ని 2023లో అమెరికా 1.2శాతం తగ్గించుకుంటే మనదేశం పెంచుకుంది. ఈ కాలంలోనే చైనాపై ఆధారపడిన రష్యా వాణిజ్యం 7.1శాతం పెరగ్గా, ఐరోపా మీద 5.3శాతం తగ్గింది.2022 నుంచి ప్రపంచ వస్తు వ్యాపారం క్రమంగా తగ్గుతున్నది, సేవల లావాదేవీలు పెరుగుతున్నాయి. పొద్దున లేస్తే చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న కారణంగా చైనాతో పెంచుకుంటున్న వాణిజ్య లావాదేవీల గురించి చెప్పుకొనేందుకు మన మీడియా సిగ్గుపడుతున్నదని చెప్పవచ్చు. మన ఆర్థిక సంవత్సరపు లెక్కలను మన అధికారులు వెల్లడిస్తే చైనా జనవరి నుంచి డిసెంబరు ప్రాతిపదిక వార్షిక లెక్కలు ప్రకటిస్తుంది. అందువలన రెండుదేశాల లెక్కల్లో తేడాలు కనిపిస్తాయి.చైనా నుంచి జనవరిలో వస్తువులు ఎగుమతి జరిగి అవి మనదేశానికి వచ్చే సరికి ఒకటి రెండు నెలలు పడుతుంది. ఇది లెక్కల్లో తేడాలకు ఒక కారణం.


మనదేశ వాణిజ్య శాఖ సమాచారం ప్రకారం 2021-22 నుంచి 2023-24వరకు మూడు సంవత్సరాలలో 95.266 నుంచి 99.389 బిలియన్‌ డాలర్లకు చైనాతో వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో చైనా వెల్లడించిన సమాచారం ప్రకారం 110.361 నుంచి 116.953 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా లెక్కలు తప్పు మనం అంతగా దిగుమతులు చేసుకోలేదు అని కొందరు వాదించవచ్చు. అంకెల్లో తేడాలున్నా చైనా నుంచి దిగుమతులు పెరిగాయన్నది స్పష్టం.లేకపోతే కొంత మంది చెబుతున్నట్లు దిగుమతి చేసుకున్న వస్తువుల విలువను తగ్గించి లేదా పెంచి చూపుతున్నట్లు వార్తలు. దాన్ని నిర్ధారించుకోవటం కష్టమేమీ కాదు. కొన్ని వస్తువులు చైనా బదులు హాంకాంగ్‌ నుంచి వచ్చినట్లుగా మనదేశం నమోదు చేస్తే చైనా నుంచి తక్కువ మొత్తాలు కనిపించవచ్చు. మనదేశం చైనాతో పోటీ పడాల్సిన అవసరం ఉందని, కానీ నిర్లక్ష్యం చేశారని, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ సూరత్‌లో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మేకిన్‌, మేడిన్‌ ఇండియా అని పిలుపులు ఎన్ని ఇచ్చినా పారిశ్రామిక వస్తుఉత్పత్తి పెద్దగా పెరగటం లేదు.2010 నుంచి 2022వరకు ఉన్న వివరాల ప్రకారం వార్షిక సగటు జిడిపిలో పారిశ్రామిక రంగం వాటా 14.92శాతం ఉంది.స్టాటిస్టా అందించిన వివరాల ప్రకారం 2010లో 17శాతం ఉన్నది 2022నాటికి 13కు తగ్గింది. చైనాలో 2013 నుంచి 2023వరకు వార్షిక సగటు 40శాతం కాగా, 2013లో 44.2 నుంచి 2023లో 38.3శాతానికి తగ్గింది. దీన్ని బట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా చైనాను వెనక్కునెట్టటం మరో పదేండ్లు పదవిలో ఉన్నా నరేంద్రమోడీ వల్లకాదని అనుభవం తేల్చింది. అందువలన జైశంకర్‌ చెబుతున్న మాటలు మోడీని మునగచెట్టు ఎక్కించటానికి మాత్రమే పనికివస్తాయి.


చైనా నుంచి వచ్చే పెట్టుబడులను నిరుత్సాహపరచాలని గతంలో తీసుకున్న నిర్నయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. విద్యుత్‌ వాహనాల తయారీలో మనదేశంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి స్థానికంగా ఉత్పత్తి చేస్తే చైనాతో సహా ఏ కంపెనీలనైనా అనుమతిస్తామని మన అధికారులు వెల్లడించారు. అలాంటి కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించే వరకు దిగుమతి చేసుకొనే వాహనాలపై ఇప్పుడున్న 70-100శాతం పన్ను మొత్తాన్ని 15శాతానికి తగ్గిస్తున్నట్లు కూడా ప్రకటించింది. టిక్‌టాక్‌ యాప్‌తో మన సమాచారం అంతా చైనా సంగ్రహిస్తుందని నిషేధించిన పెద్దలు ఇప్పుడు చైనా పెట్టుబడితో ఫ్యాక్టరీలు పెట్టటాన్ని ఎలా అనుమతిస్తున్నట్లు ? చైనా మీద ప్రేమతో లేదా నరేంద్రమోడీ మారుమనసు పొంది కాదు. కార్పొరేట్ల వత్తిడే కారణం ! 2022-23లో మన దేశం 20.3బిలియన్‌ డాలర్ల మేరకు ఆటో విడిభాగాలను దిగుమతి చేసుకుంటే వాటిలో 30శాతం చైనా నుంచే ఉన్నాయి. రానున్నది విద్యుత్‌ వాహనాల యుగం. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. స్థానికంగా వాటిని తయారు చేసే కంపెనీలకు చైనా విడిభాగాలు అవసరం. తమ పెట్టుబడులను అడ్డుకుంటామంటే చైనా ఊరుకుంటుందా ? ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది. విద్యుత్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీల ఉత్పత్తిలో 75శాతంతో చైనా ముందుంది.వాహనతయారీ ఖర్చులో 40శాతం బ్యాటరీలదే. ప్రస్తుతం ప్రపంచ విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా 50శాతం వాటా కలిగి ఉంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో భారత రోడ్లపై తిరిగే ప్రయాణ,వాణిజ్య విద్యుత్‌ వాహనాల్లో ప్రతి మూడింటిలో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కలిగినవే ఉత్పత్తి చేయనున్నాయని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆమేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందువలన అనివార్యమై కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులు, వాహనాలకు అనుమతి ఇచ్చింది.వాటిలో ఒకటైన బ్రిటన్‌కు చెందిన ఎంజి మోటార్స్‌ ఇండియా ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అనేక చైనా కంపెనీలు రంగ ప్రవేశం చేయనున్నాయి.దీంతో చైనా నుంచి విడిభాగాల దిగుమతులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి.టెస్లా, విన్‌ఫాస్ట్‌ వంటి ఇతర దేశాల కంపెనీలు కూడా చైనా వాహనాలతో పోటీ పడేందుకు చూస్తున్నాయి. దీని వలన మన వినియోగదారులకు మేలు జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు.


గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు. తరువాత జాబితాను 270కి పెంచారు. షీ ఇన్‌ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదని రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు. ఇప్పుడు విద్యుత్‌ వాహనాలు,పెట్టుబడులకు గేట్లు తెరిచారు.కార్పొరేట్లు రంగంలోకి దిగితే నరేంద్రమోడీ తనమాటలను తానే దిగమింగుతారు. కాషాయమార్కు దేశభక్తి మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సాగుకు ముందుకు రాని యువత – ఐరోపా రైతాంగ ఆందోళన కారణాలేమిటి !

03 Wednesday Apr 2024

Posted by raomk in BJP, Current Affairs, Economics, Environment, Europe, Farmers, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Farmers matter, #Farmers’ protest, EU wide farmers Protest, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.ప్రపంచమంతటా పొలాల్లో పని చేసేందుకు యువత ముందుకు రావటం లేదు.వ్యవసాయమే వృత్తిగా ఉన్న వారిని వివాహం చేసుకొనేందుకు కొన్ని చోట్ల యువతులు సుముఖత చూపటం లేదు. పర్యావరణం పేరుతో అనేక నిబంధనలు, సబ్సిడీల కోతలతో పాటు, చౌకగా ఉత్పత్తుల దిగుమతులతో సాగు గిట్టుబాటు కావటం లేదు. అనేక దేశాలు, ఐరోపా పార్లమెంట్‌కు ఎన్నికల సంవత్సరమిది. మమ్మల్ని నానా కష్టాలు పెడుతున్న మీరు మమ్మల్ని ఎలా ఓటు అడుగుతారో, మా జీవితాలను ఫణంగా పెట్టి పాలన ఎలా సాగిస్తారో చూస్తామంటూ అనేక దేశాల్లో గ్రామీణులు ఆందోళన బాట పట్టారు. ఎక్కడైనా వ్యవసాయం ఒక్కటే, అందరూ రైతులే అయితే, ఒక్కో దేశంలో ఒక్కో సమస్య ముందుకు వస్తున్నది. రైతులను ఉద్యమాల్లోకి ముందుకు తెస్తున్నది. మార్కెట్‌ యార్డులతో నిమిత్తం లేకుండా ఎక్కడబడితే అక్కడ అమ్ముకొనేందుకు, నేరుగా ఎగుమతులు చేసుకొని భారీ మొత్తంలో రాబడి పొందేందుకు మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు గతంలో నరేంద్రమోడీ రైతాంగాన్ని నమ్మించేందుకు చూసి, భంగపడి క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గారు.ప్రభుత్వం బాధ్యతలనుంచి తప్పుకొని ప్రయివేటు శక్తులకు అప్పగిస్తే ఏం జరుగుతుంది ?


స్పెయిన్‌ అనుభవమే తీసుకుందాం. అక్కడ మార్కెట్‌ యార్డులు లేవు. ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఐరోపాలో జరుగుతున్న ఆందోళనలో స్పెయిన్‌ రైతులు ముందున్నారని పత్రికల్లో విశ్లేషణలు వచ్చాయి. టోకు సూపర్‌మార్కెట్ల యజమానులు రైతాంగానికి సరసమైన చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అక్కడ చట్టం ఉంది. దాన్ని అమలు జరిపేనాధుడు లేకపోవటంతో రైతులు పోరుబాట పట్టారు. మన దేశంలో కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళన సాగుతున్న సంగతి తెలిసిందే. వినియోగదారులకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, తమ ఉత్పత్తులకు ధర రావటం లేదని, ఇతర దేశాల నుంచి పోటీ, 2012 నుంచి 2022 మధ్య కాలంలో దిగుమతులు ఎనభైశాతం పెరిగినట్లు స్పెయిన్‌ రైతులు చెబుతున్నారు.2023 జూన్‌-సెప్టెంబరు మాసాల మధ్య అంతకు ముందు ఏడాది వచ్చిన సగటు ధరలకంటే రైతుల ఉత్పత్తుల ధరలు తొమ్మిదిశాతం తగ్గినట్లు తేలింది.మరోవైపున సాగు ఖర్చుల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ పేరుతో అమలు జరుపుతున్న నిబంధనలు, నియంత్రణ, చౌకధరలకు దిగుమతులతో తీవ్రమైన విదేశీ పోటీని అక్కడి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నది.దేశీయ రైతుల మీద నిబంధనలను గట్టిగా అమలు జరుపుతున్న పాలకులు కార్పొరేట్‌ కంపెనీల దిగుమతుల మీద ఉన్నవాటిని చూసీ చూడనట్లు వదలివేస్తున్నారు.
ఐరోపా పారిశ్రామిక, సేవారంగ కార్పొరేట్ల నుంచి వస్తున్న వత్తిడిని తక్కువ అంచనా వేయకూడదు.ఐరోపా సమాఖ్య దేశాల జిడిపిలో వ్యవసాయ రంగం నుంచి వస్తున్నది కేవలం 1.4శాతం, ఉపాధి కల్పిస్తున్నది 4.2శాతం మందికి మాత్రమే కాగా సమాఖ్య బడ్జెట్‌లో వ్యవసాయ రంగం 30శాతం పొందుతున్నదని కొందరు లెక్కలు చెబుతున్నారు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే అంతకంటే తక్కువ ఖర్చుతో దిగుమతులు చేసుకొని కడుపునింపుకోవచ్చు, ఇక్కడ సాగు ఎందుకు అని ప్రశ్నించటమే.1960లో స్పెయిన్‌ జిడిపిలో వ్యవసాయ వాటా 23.5శాతం కాగా 2022 నాటికి 2.6శాతానికి, ఉపాధి 39 నుంచి 3.6శాతానికి తగ్గింది. నియంత ఫ్రాంకో పాలనలో మార్కెట్‌ ఎకానమీకి మారిన తరువాత జరిగిన పరిణామమిది.పారిశ్రామిక రంగ జిడిపి వాటా కూడా ఇదే కాలంలో .30.8 నుంచి 17.4శాతానికి తగ్గగా సేవారంగం 41.7 నుంచి 74.6శాతానికి పెరిగింది.ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో 11.3శాతం మందికి ఉపాధి దొరుకుతుండగా సేవారంగంలో 78.2శాతం ఉన్నారు. దేశంలో తొమ్మిది లక్షల కమతాలుండగా 6.6లక్షల యజమానులు ఏదో ఒక రూపంలో ఐరోపా సమాఖ్య సాయం పొందుతున్నారు. గతేడాది నలభైశాతం ప్రాంతంలో తీవ్రమైన కరవు ఏర్పడింది. తొంభైలక్షల మంది జనాభా మీద ఏదో ఒక నియంత్రణ అమల్లో ఉంది. తెలుగు ప్రాంతాల్లో వేరుశనగ నూనె వంటలకు వాడినట్లుగా స్పెయిన్‌లో ఆలివ్‌ నూనె వినియోగిస్తారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గి లీటరు ధర ఐదు నుంచి 14యూరోలకు పెరిగింది. దుకాణాల్లో దొంగతనాలు చేసే వస్తువుగా మారింది.


రైతుల ఆందోళన కారణంగా స్థానిక ప్రభుత్వాలు, ఐరోపా సమాఖ్య కొన్ని నిబంధనలను సడలించింది, మరికొన్నింటిని వాయిదా వేసినప్పటికీ మెడమీద కత్తిలా వేలాడుతూనే ఉన్నాయి.వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి పర్యావరణానికి హానికలిగించే వాయువుల విడుదలను 2040 నాటికి తగ్గించేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. మీథేన్‌, నైట్రోజన్‌ తదితర వాయువులను 30శాతం తగ్గించాలన్నది ఒకటి.ఓజోన్‌ పొరను దెబ్బతీసే వాయువులు వ్యవసాయ రంగం నుంచి 14.2శాతం వెలువడుతున్నాయని 2050 నాటికి వాటిని సున్నాకు తగ్గించాలన్నది మరొక లక్ష్యం. ఇందుకోసం నిబంధనల జారీ, వాటి అమలుతో రైతాంగం ఆందోళనబాట పట్టారు.మన మీద కూడా దాని ప్రభావం కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదు పంటలకు ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధరకు హామీ ఇస్తామని చెబుతూ పంటల మార్పిడి విధానం అనుసరించిన రైతులకే అది వర్తిస్తుందనే షరతు పెట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ మీద రష్యా దాడులు జరుపుతోంది గనుక అక్కడి నుంచి ఎలాంటి దిగుమతి పన్నులు లేకుండా 2025 జూన్‌ వరకు వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చని ఐరోపా సమాఖ్య అనుమతి ఇచ్చింది. రష్యాను త్వరలోనే ఓడిస్తామని మా ఆర్థిక మంత్రి చెబితే నిజమే అని నమ్మాం, ఇప్పుడు అలాంటి సూచనలేమీ కనిపించటం లేదు, అదే యుద్దం ఇప్పుడు మమ్మల్ని నాశనం చేస్తోందని ఫ్రెంచి రైతులు చెబుతున్నారు.


ఐరోపా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ఆధారం చేసుకొని అనేక దేశాల్లో మితవాద శక్తులు జనాల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకుంటున్నాయి. జూన్‌లో జరిగే ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఈ శక్తులు బలం పుంజుకుంటాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అనేక చోట్ల స్థానిక ఎన్నికల్లో అలాంటి ధోరణి వెల్లడైంది. పోర్చుగల్‌ ఎన్నికల్లో చెగా అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 7.2శాతం ఓట్లను 18.1కి పెంచుకుంది. స్పెయిన్‌ రైతుల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ఓక్స్‌ అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 24 పార్లమెంటు సీట్లను గతేడాది 33కు పెంచుకుంది. అనేక రాష్ట్రాలలో రైతుల ఓట్లు పార్టీల తలరాతలను మార్చివేస్తున్నాయి. అనేక దేశాల్లో లాటిన్‌ అమెరికా దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాన పార్టీలన్నీ ముందుకు వచ్చాయి. రైతుల ఆందోళన కారణంగా ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.జూన్‌లో జరిగే ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ డిసెంబరులో సంతకం చేయాల్సిన ఒక ఒప్పందాన్ని వాయిదా వేయటానికి కారణం అక్కడి రైతుల ఆందోళనే. అదే విధంగా రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకంపై ఆంక్షలు విధించే బిల్లును కూడా వెనక్కు తీసుకున్నాడు. ఇలా తాత్కాలికంగా వెనక్కు తగ్గినా ఎన్నికల తరువాత ముందుకు పోతారని భావిస్తున్నారు. తమకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని కర్ణాటక బిజెపి ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే ప్రకటించిన సంగతి తెలిసిందే. నరేంద్రమోడీ మరోసారి అధికారానికి వస్తే గతంలో వెనక్కు తీసుకున్న మూడు సాగు చట్టాలను మరో రూపంలో తిరిగి ప్రవేశపెడతారనే భావం కార్పొరేట్లలో ఆశలు రేపుతోంది. అందుకే మద్దతు ఇస్తున్నారు. అనేక దేశాల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాల నుంచి మనదేశంలో జరుగుతున్నదానిని వేరు చేసి చూడలేము.ప్రపంచీకరణ యుగంలో ప్రతి రంగంలోనూ విడదీయరాని బంధం ఉంటుంది.


లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రచారానికి అనుమతి లేదంటూ పంజాబ్‌లోని అనేక గ్రామాలలో పోస్టర్లు వెలువడినట్లు జాతీయ పత్రికలు వెల్లడించాయి.” మీరు మమ్మల్ని ఢిల్లీలో ప్రవేశించనివ్వలేదు గనుక మీ నేతలను గ్రామాల్లోకి రానివ్వం ” అని పోస్టర్లలో హెచ్చరించారు. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే రద్దు చేసిన సాగు చట్టాలను మరో రూపంలో ప్రవేశపెడతారని పంజాబ్‌లో జరుగుతున్న రైతుల సభల్లో హెచ్చరిస్తున్నారు. ఇటీవలనే కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి ఫిరాయించిన సునీల్‌ జక్కర్‌ మార్చినెల 24న భటిండాలో తలపెట్టిన బిజెపి మహౌత్సవ్‌ సభ రైతుల నిరసన కారణంగా రద్దు చేసుకున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది.ఇలాంటి నిరసనలే అనేక గ్రామాల్లో వెల్లడౌతున్నాయి. రైతుల ఆందోళన పట్ల బిజెపి వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం, ఎన్‌డిఏ నుంచి అకాలీదళ్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీతో సర్దుబాటు చేసుకొనేందుకు చూసిన బిజెపి భంగపడింది. రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే బిజెపితో చేతులు కలిపేందుకు ఆ పార్టీ భయపడిందని చెప్పవచ్చు.” బిజెపి బండారాన్ని బయటపెట్టండి, బిజెపిని వ్యతిరేకించండి, బిజెపిని శిక్షించండి ” అంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రచారం చేస్తున్నది.


మనదేశంలో రైతు కుటుంబాలలో యువకులకు వివాహాలు ఒక సమస్యగా మారుతున్న పరిణామాన్ని చూస్తున్నాం. ఐరోపా, అమెరికాల్లో కూడా వ్యవసాయం చేసేందుకు యువకులు ముందుకు రావటం లేదు.ఫ్రాన్సులో రైతుల సగటు వయస్సు 50 సంవత్సరాలుగా ఉందని, అనేక కుటుంబాల్లో సాగును కొనసాగించే వారు కనిపించటం లేదని విశ్లేషణలు వెలువడ్డాయి. యాంత్రీకరణతో పనిచేసే జనాభా తగ్గి అనేక చోట్ల గ్రామాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.ఫ్రెంచి ఆహార, వ్యవసాయ, పర్యావరణ జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం 18శాతం మంది రైతులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు, మరో 25శాతం మంది చావ బతకలేని స్థితిలో ఉన్నారు.పర్యావరణం పేరుతో సాగుకు ఆటంకం కలిగించటం పట్ల రైతులు ఆగ్రహం వెల్లడిస్తున్నారు.నాలుగుశాతం సాగు భూమిలో సాగు చేయకుండా చెట్ల పెంపకానికి వదలివేయాలన్నది ఒక నిబంధన పెట్టారు. ఇతర నిబంధనల కారణంగా సబ్సిడీలకు కోత పెడుతున్నారు. ఐరోపాలో పర్యావరణ పరిరక్షణ పేరుతో ఏర్పడిన పార్టీల సమావేశాల మీద రైతులు దాడులకు దిగుతున్నారు. జర్మనీలో అదే జరిగింది. బెర్లిన్‌ సమపంలో రోడ్లపై ఎరువుల మడ్డిని కుమ్మరించటంతో అనేక కార్లు ఒకదానినొకటి ఢకొీన్నాయి.ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ఐరోపా దేశాల్లో ఇంథన, విద్యుత్‌ ధరలు విపరీతంగా పెరిగాయి.ఫ్రాన్స్‌లో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ ఖర్చు అంతకు ముందుతో పోలిస్తే గతేడాది రెట్టింపైంది. ఎరువుల ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఐరోపా వ్యవసాయ విధానమే అక్కడి రైతులను ఆందోళనలకు పురికొల్పుతున్నది. పోలాండ్‌లో కార్మికుల వేతన రేట్లు చాలా తక్కువ, దానికి తోడు చౌకగా కోళ్లను పెంచి ఇతర దేశాల మార్కెట్లలో కుమ్మరించటంతో ఫ్రాన్స్‌ వంటి చోట్ల కోళ్ల రైతులకు గిట్టుబాటు కావటం లేదు.ఉక్రెయిన్లో వేతనాలు మరీ తక్కువ. దాంతో అక్కడి నుంచి చౌక ధరలకు దిగుమతులు విపరీతంగా పెరిగాయి. అది రైతుల్లో అసంతృప్తికి దారితీయటంతో పంచదార, కోడి మాంస దిగుమతులపై ఐరోపా సమాఖ్య కొన్ని ఆంక్షలను విధించక తప్పలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి రాజకీయం : తెదే, వైసిపి అసంబద్ద వాదనలు, అంకెలతో వంచన !

30 Saturday Mar 2024

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP, Ycp

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, Andhra Pradesh Elections 2024, Andhrapradesh, AP CM YS Jagan, CHANDRABABU


ఎం కోటేశ్వరరావు


గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌ సర్వనాశనమైందని తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి చెబుతోంది. అంతే కాదు, తమ పాలనలో వచ్చిన అనేక పరిశ్రమలు రాష్ట్రం వదలివెళ్లినట్లు కూడా ఆరోపిస్తున్నారు. దానికి పోటీగా వైసిపి తనదైన శైలిలో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నది. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఊదరగొడుతున్నది. ఉదాహరణకు జిఎస్‌డిపిలో దేశంలో రాష్ట్రాన్ని ఒకటవ స్థానంలో నిలబెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. చెప్పేవారికి లేకున్నా వినేవారికి వివేకం ఉండాలంటారు.వర్తమాన ఆర్థిక సంవత్సరం 2023-24 మార్చినెల 31తో ముగుస్తుంది. వెంటనే గణాంకాలు ఖరారు కావు. వివిధ రాష్ట్రాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో పేర్కొన్న అంచనాల ప్రకారం కొన్ని సూచికలను వెలువరించారు. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి 14.49లక్షల కోట్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది. తరువాత తెలంగాణా. మొదటి ఏడింటిలో మహారాష్ట్ర 38.79,తమిళనాడు 28.3, గుజరాత్‌ 25.62, కర్ణాటక 25, ఉత్తర ప్రదేశ్‌ 24.39,పశ్చిమ బెంగాల్‌ 17.19, రాజస్థాన్‌ 15.7లక్షల కోట్లతో ఉన్నాయి. ఇక తలసరి జిడిపిలో 2022-23 సంవత్సరంలో అగ్రస్థానంలో 5.19లక్షలతో సిక్కిం, 4.72లక్షలతో గోవా రెండవదిగా ఉంది. పెద్ద రాష్ట్రాలలో 3.08లక్షలతో తెలంగాణా ప్రధమ, 3.01తో కర్ణాటక,2.96తో హర్యానా, 2.73తో తమిళనాడు, 2.72తో ఢిల్లీ, 2.41తో గుజరాత్‌, 2.33తో ఉత్తరాఖండ్‌, కేరళ, 2.24తో మహారాష్ట్ర,2.22తో హిమచల్‌ ప్రదేశ్‌, 2.19తో ఆంధ్రప్రదేశ్‌ పదకొండవ స్థానంలో ఉంది. ఇక వైసిపి చెప్పుకుంటున్న ఒకటవ స్థానం సంగతేమిటి అంటే ప్రతి ఏటా జిఎస్‌డిపి వృద్ది రేటు ప్రతి రాష్ట్రంలోనూ మారుతూ ఉంటుంది.2021-22లో వృద్ధి రేటులో స్థిర ధరల్లో 11.43శాతంతో మొదటి స్థానంలో ఉంది అని తేల్చారు గనుక, దాన్నే మొత్తం జిడిపిలో మొదటి స్థానంగా చెబుతూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. జిడిపి అంటే అంబానీ,అదానీ సంపదలతో పాటు అట్టడుగు బడుగు జీవులకు వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకొని వేసే మొత్తం, తలసరి అంటే దాన్ని జనాభాతో భాగించగా వచ్చేది. అందుకే తెలంగాణా జిడిపిలో మనకంటే తక్కువగా ఉన్నప్పటికీ జనాభా తక్కువ గనుక దేశంలో పెద్ద రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది. జిడిపిలో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉన్నప్పటికిటీ తలసరిలో తొమ్మిదవదిగా ఉంది.ఈ సూచికలతో జనానికి ఒరిగేదేమీ ఉండదు.తెలుగుదేశం పార్టీ కూడా తన ఐదు సంవత్సరాల పాలనలో వృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంది.2013-14లో రాష్ట్ర జిడిపి వృద్ది రేటు ఏడుశాతంగా ఉన్నదానిని 2017-18 నాటికి 11.2శాతానికి పెంచినట్లు అంకెల్లో చూపింది.


తెలుగుదేశం వారు తమ ఏలుబడిలో విశాఖను ఐటి హబ్‌గా మార్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఇదొక అతిశయోక్తి. హైదరాబాద్‌లో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు నాయుడే కారణమనే ప్రచారం గురించి తెలిసిందే. అలాంటి నేత ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఐటి పరిశ్రమలను ఆకర్షించలేకపోయారో ఎవరూ చెప్పరు. పెట్టుబడుల ఆకర్షణల పేరుతో సమావేశాల ఆర్భాటాలు చేయటం వేరు, ఆచరణలో పెట్టుబడులు రావటం వేరు. ఐటి రంగాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి బండారం బయటపడుతుంది. దీని అర్ధం వైసిపి అభివృద్ధి చేసిందని కాదు. దొందూ దొందే.ఐటి అంటే మారుపేరు చంద్రబాబు అని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు గనుక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది.కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటి సాంకేతిక మంత్రిత్వశాఖ సమాచారం ఆధారంగా 2021-22 సంవత్సర వివరాలతో రూపొందించిన ఎగువ మాప్‌ ఐటి ఎగుమతుల్లో ఏ రాష్ట్రం ఎక్కడుందో వెల్లడిస్తున్నది. ఎవరైనా అది వాస్తవం కాదని అంటే వాస్తవం ఏమిటో వెల్లడించాలి. పొరుగున ఉన్న ఒడిషా ఐదువేల కోట్ల రూపాయల మేర ఎగుమతి చేస్తే ఆంధ్రప్రదేశ్‌ వెయ్యి కోట్లుగా ఉంది. తరువాతి సంవత్సరాల్లో మొత్తంగా ఎగుమతులు పెరిగినందున ఆమేరకు అంకెలు మారవచ్చు తప్ప ధోరణిలో పెద్ద తేడా ఉండదు. ఆ ఏడాది రు.11.59లక్షల కోట్ల మేర ఎగుమతి చేస్తే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాల నుంచే రు.9.72లక్షల కోట్లు ఉంది. ఉపాధి కూడా దీనికి అనుగుణంగానే ఉంటుంది. ఐటి ఉద్యోగాలంటే బెంగలూరు,పూనే,హైదరాబాద్‌, చెన్నయిని చూస్తున్నారు తప్ప విశాఖ, విజయవాడ అని ఎవరైనా అంటారా ? 2023 మార్చి నాటికి దేశంలో 54లక్షల మంది ఐటి, ఐటి అనుబంధ సేవారంగంలో పని చేస్తున్నారు. పరోక్షంగా మరో కోటి మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నవారు ఎందరు ? ఎన్నికలు వస్తున్నాయి గనుక అంకెలతో ఆడుకుంటూ జనాన్ని మభ్యపెడుతున్నారు తస్మాత్‌ జాగ్రత్త అని చెప్పాల్సి వస్తోంది. రెండు పార్టీలూ పోలీసు యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మలచుకొని ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలు, న్యాయమైన డిమాండ్లపై ఆందోళనలను అణచేందుకే చూశాయి. మాట తప్పి మడమ తిప్పిన వారే. ఎవరూ తక్కువ తినలేదు.


ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా తెలుగుదేశం, వైసిపి పాలన ఉంది. కొన్ని వివరాలను చూద్దాం. ఉదాహరణకు అప్పుల గురించి ఆరోపణలు-ప్రత్యారోపణలు చోటుచేసుకుంటున్నారు.కాపిటల్‌ అంటే కాపిటల్‌ పెట్టుబడి,రుణాలు, వడ్డీ చెల్లింలులు రు.కోట్లలో.రెండు పార్టీల పాలనలో మచ్చుకు రెండేసి సంవత్సరాల వివరాలు.ఈ అంకెలకు పిఆర్‌ఎస్‌ సంస్థ విశ్లేషణలు ఆధారం.
ఏడాది××× రుణాలు ×× వడ్డీ చెల్లింపు××రుణ చెల్లింపు×× కాపిటల్‌
2016-17×59,923 ×× 11,697 ×× 34,776 ×× 50,520
2017-18×30,500 ×× 14,783 ×× 8,009 ×× 40,792(బడ్జెట్‌)
2021-22×53,524 ×× 22,165 ×× 15,503 ×× 16,373
2022-23× 64,978 ×× 25,288 ×× 16,291 ×× 16,847
రాష్ట్రంలో శాశ్వత సంపదలు, వాటి ద్వారా సేవలు, ఉపాధి సృష్టికి చేసే ఖర్చును మూలధన లేదా కాపిటల్‌ అంటారు. రెండు పార్టీల పాలనలోనూ ఇది దిగజారింది తప్ప ప్రాధాన్యత లేదు. పిఆర్‌ఎస్‌ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం రెండు పార్టీలూ బడ్జెట్లలో భారీ మొత్తాలను ప్రకటించి ఏడాది చివరికి కోత పెట్టటంలో దొందూ దొందే. తెలుగుదేశం పార్టీ చివరి రెండు సంవత్సరాలలో ప్రతిపాదిత మొత్తాలలో 39,30శాతాల చొప్పున, వైసిపి మొదటి నాలుగు సంవత్సరాలలో 82,37,48,45శాతాల చొప్పున కోతలు పెట్టింది.
తెలుగుదేశం పార్టీ చివరి మూడు సంవత్సరాలలో రాష్ట్ర రుణ భారం జిఎస్‌డిపిలో సగటున ఏటా 28.6శాతం ఉంటే, వైసిపి ఐదు సంవత్సరాల పాలనలో 32.74శాతం ఉంది. వీటికి ప్రభుత్వం హామీగా ఉండి కార్పొరేషన్లు, ఇతర సంస్థల ద్వారా చేసిన అప్పులు, ప్రభుత్వ సంస్థలు తీసుకున్న అప్పులు అదనం.ఉదాహరణకు 2022 మార్చి 31నాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు రు.1,38,875 కోట్లు వీటిలో విద్యుత్‌ సంస్థల వాటా రు.38,473 కోట్లు. జిఎస్‌డిపిలో ఇలాంటి మొత్తాలు 2021-22లో పన్నెండు శాతం ఉంది. అంటే ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకొనే అప్పులకు ఇది అదనం. తెలుగుదేశం పాలనలో చివరి నాలుగు సంవత్సరాలలో ఇతర రాష్ట్రాల కేటాయింపులతో పోల్చితే విద్యారంగంలో తక్కువ, వైద్య రంగంలో సమంగా, గ్రామీణాభివృద్ధి రంగంలో ఎక్కువగా ఉంది.వైసిపి పాలనలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయనే విమర్శ పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.2022-23లో అన్ని రాష్ట్రాలలో సగటున రోడ్లు, భవనాలకు 4.5శాతం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహనరెడ్డి సర్కార్‌ 2021-22లో 0.9, మరుసటి ఏడాది 0.8శాతం మాత్రమే కేటాయించింది.తీవ్ర విమర్శల తరువాత 2023-24లో 1.8శాతంగా ప్రతిపాదించింది, ఆచరణలో ఎంత ఖర్చు చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది. వైసిపి ప్రభుత్వం అనేక కీలక రంగాలను అలక్ష్యం చేసింది. ఆర్థిక మంత్రి భారీ మొత్తాలు కేటాయించినట్లు చూపటం తప్ప కోతల సంగతి తరువాత చెప్పలేదు. ఉదాహరణకు 2021-22 బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తాలలో అమలులో వివిధ శాఖలకు పెట్టిన కోతలను చూస్తే అభివృద్ది బండారం బయటపడుతుంది.రోడ్లు, భవనాలకు 55,గృహనిర్మాణం 54,నీటిసరఫరా, పారిశుధ్యం 46,సాగు నీరు 45,పట్టణాభివృద్ధి 42,వ్యవసాయం 40, సాంఘిక సంక్షేమం 39, గ్రామీణాభివృద్ది 34,ఆరోగ్యం, ఎస్‌సి,ఎస్‌టి,బిసి సంక్షేమశాఖలలో 20శాతాల చొప్పున కోత పెట్టారు. సంక్షేమ పథకాలు అమలు జరిపినంత మాత్రాన సరిపోదు.వాటినెవరూ వ్యతిరేకించటం లేదు. వివిధ శాఖలకు ప్రతిపాదించిన కేటాయింపులను కోత ఎందుకు పెట్టారో, తెచ్చిన అప్పులను దేనికి వెచ్చించారన్నది జనం అడుగుతున్న ప్రశ్న.


మోయలేని అప్పుల భారం గురించి ఒకవైపు చెబుతున్న తెలుగుదేశం కూటమి తాము అధికారానికి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింతగా పెంచి అమలు చేస్తామని ఆశచూపుతున్నాయి. ఇప్పటికే ఉన్న అప్పులతో కొత్త అప్పులు చేసే అవకాశాలు లేవు. కేంద్రం రుద్దిన విద్యుత్‌ సంస్కరణలు అమలు జరుపుతున్నందుకు అన్ని రాష్ట్రాలకు అనుమతించి జిఎస్‌డిపిలో 3.5శాతం పరిమితిని మించి మరో అరశాతం వైసిపి సర్కార్‌ ఉపయోగించుకుంది. వ్యవసాయానికి విద్యుత్‌ మీటర్లు బిగించే షరతును ఇందుకోసం అంగీకరించింది.పక్కనే ఉన్న తెలంగాణాలో అక్కడి ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రాలతో అప్పుల భారం ఎంత పెరిగిందో స్పష్టమైంది. కొత్త ప్రభుత్వం గత మూడునెలలుగా కొత్త అప్పులు తీసుకుంటే తప్ప గడవని స్థితి.ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన పరిస్థితి మీద శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప వాస్తవాలు వెల్లడికావు. ఎవరు అధికారానికి వచ్చినా కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేమిటి అన్నది ప్రశ్న.జనం మీద పన్నుల భారాన్ని విపరీతంగా మోపటం ఒకటి లేదా అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలకు ఏదో ఒకసాకుతో కోత పెట్టటం మినహా మరో మార్గం కనిపించటం లేదు. అందుకే పోటీ చేస్తున్న పార్టీలు నిర్ధిష్ట ప్రతిపాదనలతో ప్రణాళికలను ప్రకటిస్తే వాటి బండారం బయట పడుతుంది. ముందు మాకు తెలియలేదు, ఖజానాలో పైసా లేదని తెలంగాణాలో కాంగ్రెస్‌ చెప్పిన మాదిరి నాలుక మడతవేస్తే పరిస్థితి ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d