• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Uncategorized

డోనాల్డ్‌ ట్రంప్‌రుద్దిన వాణిజ్య పోరు : చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ?

23 Wednesday Apr 2025

Posted by raomk in Asia, BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

China, Donald trump, Narendra Modi Failures, Trade talks, TRADE WAR, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రపంచం మీద తాను రుద్దిన వాణిజ్య పోరు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవికి గండం తేనుందా ? దాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు సహిస్తారా ? ఈ పోరులో చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ? ఇలా పరిపరి ఆలోచనలు ప్రారంభమయ్యాయి. రెండు దిగ్గజాల మధ్య కేంద్రీకృతమైన వివాదాన్ని ఆసరా చేసుకొని లబ్దిపొందాలని కొన్ని దేశాలు చూస్తున్నాయి. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు కుదుర్చుకుంటే అలాంటి దేశాలపై తాము గట్టి ప్రతి చర్యలు తీసుకుంటామని సోమవారం నాడు చైనా హెచ్చరించింది. వాణిజ్య పోరులో విజేతలు ఉండరన్నది సాధారణ అభిప్రాయం, అది నిజమేనా ? ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి ? మన దేశం బ్రిటీష్‌ వలస పాలనలోకి వెళ్లక ముందు చేనేత వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి. బ్రిటన్‌తో సహా అనేక దేశాలకు అవి ఎగుమతి అయ్యేవి. అలాంటి వాటిని బ్రిటన్‌ పారిశ్రామిక విప్లవం మింగేసింది. ఇప్పుడు ట్రంప్‌ దిగుమతి పన్ను విధించినట్లుగా మన చేనేత వస్త్రాల మీద నాటి బ్రిటన్‌ కూడా పన్ను విధించి అడ్డుకుంది, చౌకగా తయారయ్యే తన మిల్లు వస్త్రాలను మనదేశంలో కుమ్మరించింది. మన మార్కెట్‌ను ఆక్రమించింది. పత్తి ఎగుమతి దేశంగా మార్చింది. నాడు భారత్‌ పరాధీన దేశం, వ్యతిరేకించిన వారు లేరు. ఇప్పుడు అమెరికా పన్నులతో చైనా వస్తువులను అడ్డుకోవాలని చూస్తోంది. చైనా సర్వసత్తాక స్వతంత్ర దేశం, అమెరికాను ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉంది, ఆట కట్టించాలని చూస్తోంది.చిత్రం ఏమిటంటే అసలైన దేశభక్తులం అని చెప్పుకుంటున్న మన పాలకులు మా ఆయుధాలు, వస్తువులు కొంటారా లేదా అని అమెరికా కొరడా రaళిపిస్తే కంటి చూపులేదు, నోట మాట లేదు.ఏం జరుగుతోంది మహాత్మా ఓ మహాత్మా !


డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు చేసుకొనే దేశాల మీద చర్యలు తప్పవని చైనా తీవ్ర హెచ్చరిక చేసింది.తమతో వాణిజ్యం చేసే దేశాలు చైనా మీద ఆంక్షలు విధించాలని, దానికి ప్రతిగా అలాంటి వాటికి పన్నులను మినహాయిస్తామని అమెరికా చెబుతున్నదని, సంతుష్టీకరణ శాంతిని, రాజీ గౌరవాన్ని తీసుకురాదని చైనా పేర్కొన్నది.అమెరికా చర్యలు చర్మం ఇమ్మని పులిని కోరటంగా వర్ణించింది. ప్రస్తుతం జపాన్‌, దక్షిణ కొరియా, భారత్‌ మరికొన్ని దేశాలు ట్రంప్‌ యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నాయి. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రస్తుతం ఢల్లీి పర్యటనలో ఉన్నాడు. చైనా వస్తువులపై 145శాతంగా విధించిన పన్ను, కొన్ని వస్తువులపై 245శాతం వరకు పెంచుతామని అమెరికా బెదిరించింది. తమ మీద విధించిన పన్నుల కారణంగా తీసుకోలేమంటూ అమెరికా కంపెనీ బోయింగ్‌ జెట్‌ను చైనా తిప్పి పంపింది. అమెరికాతో కలసి చైనాను దెబ్బతీయాలని మనదేశంలో కొందరు యాంకీల ఏజంట్లు నూరిపోస్తున్నారు.చైనా సరఫరా గొలుసులో మనం చేరి దాని స్థానాన్ని ఆక్రమించాలని కొందరు చెబుతున్నారు. నిజానికి స్వంత సత్తాతో ఆస్థాయికి చేరాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదలేరు, అలాగే అమెరికా వెంట నడచిన ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖలా లేదు. కాసేపు దీని గురించి పక్కన పెట్టి వాణిజ్య పోరు గురించి జరుగుతున్న మధనం ఎలా ఉందో చూద్దాం. అమెరికా తాను చేస్తున్న ప్రతిదీ సరైనదే అనుకుటుంది కానీ సమస్య ఏమిటంటే ట్రంప్‌ ప్రతినిర్ణయం తప్పుగా తేలుతోంది.ఏప్రిల్‌ ఐదున జనం 20లక్షల మంది వీధుల్లోకి రాగా 19వ తేదీన మరోసారి పెద్ద ఎత్తున రాజరికం లేదు, రాజులేడు అంటూ నినదించారు. రెండువందల యాభై సంవత్సరాల క్రితం 1775 ఏప్రిల్‌ 19న బ్రిటన్‌ రాజరికానికి వ్యతిరేకంగా అమెరికన్లు పోరు ప్రారంభించిన రోజది. చైనా కమ్యూనిస్టులను అణచివేయాలని చూసింది అమెరికా. అయితే లాభాల కోసం అదే చైనా మార్కెట్‌ను ఉపయోగించుకోవాలనే ఎత్తుగడతో కమ్యూనిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఆమోదించింది.తరువాత కూడా ఒక వైపు లాభాలు పొందుతూనే మరోవైపు చైనా ఎదగకుండా కేవలం తనమీదే ఆధారపడే ఒక ఎగుమతిదేశంగా పరిమితం కావాలని చూసింది. తియన్మెస్‌ మైదానంలో విద్యార్ధుల ప్రదర్శనలు, హాంకాంగ్‌లో స్వాంత్య్రం పేరుతో జరిగిన ప్రదర్శనలు, తైవాన్‌ వేర్పాటు వాదం వెనుక దాని హస్తం గురించి తెలిసిందే. మొత్తంగా చెప్పాలంటే గత ఐదు దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ప్రతిప్రతికూల విధానమూ చైనాను మరింతగా పటిష్టపరిచాయి తప్ప బలహీనపరచలేదు, దీని అర్ధం కొన్ని తాత్కాలిక సమస్యలూ, ఎదురుదెబ్బలూ లేవని కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలతో భౌగోళిక రాజనీతిలో చైనా స్థాయి మరింత బలపడుతుందని అమెరికాను ఆర్థికంగానూ, రాజకీయంగా దాటిపోతుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు వాపోతున్నారంటే అతిశయోక్తి కాదు.


చిత్రం ఏమిటంటే అమెరికన్లు, వారి చెప్పుల్లో కాళ్లు పెట్టి నడవాలని చూసే కాషాయ తాలిబాన్ల ఆలోచన ఒకే విధంగా ఉంది. గాల్వన్‌ ఉదంతం జరిగినపుడు మనం గనుక చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పినట్లే ఇప్పుడు ట్రంప్‌ గాంగ్‌ అంటోంది. చైనా మనకు చేసే ఎగుమతులతో పోల్చితే మనం చైనాకు ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం, అందువలన మన దిగుమతులు ఆగిపోతే నష్టం వారికే అని అమెరికా విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. అమెరికా దిగుమతులు దాని పెద్ద బలహీనత తప్ప బలం కాదు.2018లో ఇదే ట్రంప్‌ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు.వారి వస్తువుల మీద ఆధారపడటం నిలిపివేయాలన్నాడు. జరిగిందేమిటి ? గత ఏడు సంవత్సరాల్లో అమెరికాకు చైనా ఎగుమతులు 19.2 నుంచి 14.7శాతానికి మాత్రమే తగ్గాయి.పూర్తిగా నిలిపివేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.జి 7 దేశాలకు చైనా ఎగుమతులు 2000 సంవత్సరంలో 48శాతం జరగ్గా 2024లో 30శాతానికి తగ్గాయి. ఇంత జరిగినా గత పదేండ్లలో ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 13 నుంచి 14శాతానికి పెరిగింది. దీని అర్ధం ఏమిటి ? చైనా తన సరకులకు ఎప్పటి నుంచో ప్రత్నామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటోంది.చైనా అనే చెరువు మీద అమెరికా అలిగితే ఎండిపోయేది అమెరికన్లకే.ఎందుకంటే ప్రస్తుతం అది దిగుమతి చేసుకుంటున్న వస్తువులను తయారు చేసుకోవాలంటే దశాబ్దాలుగాకపోయినా సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. అప్పటిదాకా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న టాయిలెట్‌ పేపర్‌ వంటి వాటి దిగుమతి ఆపివేస్తారా ? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే సరఫరా చేసే స్థితిలో ఎన్ని ఉన్నాయి ? అమెరికా బోయింగ్‌ జెట్‌ విమానాలు గాకపోతే చైనా ఐరోపా ఎయిర్‌బస్‌లను దిగుమతి చేసుకుంటుంది, లేదూ స్వయంగా తానే పూర్తిగా సమకూర్చుకొనేందుకు ఇప్పటికే ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింతవేగవంతం చేస్తుంది. ఇతర వస్తువులను వేరే దేశాల నుంచి తెచ్చుకుంటుంది. మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాసన్‌ మిలెర్‌ పోగుచేసిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే లిథియమ్‌ బ్యాటరీలు, ఎయిర్‌ కండీషనర్లు, వంటపాత్రల్లో 70, స్మార్ట్‌ ఫోన్లు, వంటగది పరికరాలు, బొమ్మల్లో 80, సూర్యరశ్మి పలకల్లో 90శాతాల చొప్పున చైనా తయారు చేస్తున్నది. కార్లు, ఫోన్లు, అనేక మిలిటరీ పరికరాలకు కీలకంగా అవసరమైన అపురూప ఖనిజాలు, లోహాలు కూడా చైనా దగ్గర గణనీయంగా ఉన్నాయి.

సకల దేశాలూ తన వస్తువులనే కొనాలని చైనా ఎవరినీ దేబిరించే స్థితిలో లేదు. విదేశాలకు అవసరమైన వాటిని కావాలనుకున్నవారికి ఉత్పత్తి చేస్తున్నది, మార్కెట్‌లేకపోతే నిలిపివేస్తుంది, నూటనలభై కోట్ల తనజనాభాకు అవసరమైన వాటి మీద కేంద్రీకరిస్తుంది.ఇప్పటికే ఆప్రక్రియ ప్రారంభమైంది. ఏండ్ల తరబడి సంపాదించిన వాణిజ్య మిగులులో కొంత భాగం సబ్సీడీగా ఇస్తే అంతర్గత మార్కెట్‌ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా,జొన్నలు, మొక్క జొన్నలను ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు.పశ్చిమ దేశాల మీద ఆధారపడే రంగాలను గుర్తించి స్వయం పోషకత్వం సాధించేందుకు బీజింగ్‌ పూనుకుంది. దాన్లో భాగంగానే హరిత ఇంథనం, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్ల రంగాలలో భారీ మొత్తాలను ఖర్చు చేస్తున్నది. విపరీత పరిస్థితులలో కూడా జాతీయ ఆర్థిక రంగం సాధారణ కార్యకలాపాలను సాగించే విధంగా చూడాలని అధ్యక్షుడు షీ జింపింగ్‌ విధాన నిర్ణేతలను కోరాడు. యుద్ధం అన్న తరువాత ఓడిన వారికే కాదు విజేతలకూ దెబ్బలు తగులుతాయి, నష్టాలు సంభవిస్తాయి, వాణిజ్య యుద్ధమూ అంతే.


ఎదురుదాడిలో భాగంగా అమెరికాకు ఎగుమతి అవుతున్న అపురూప ఖనిజాల ఎగుమతులను చైనా నిషేధించింది. అవి జలాంతర్గాములు, ఫైటర్‌ జెట్ల తయారీలో కీలకంగా ఉంటాయి.తన అంబుల పొదిలో ఉన్న అస్త్రాలను అవసరాన్ని బట్టి బయటకు తీస్తున్నది.ఇప్పటికే బోయింగ్‌ విమానాల కొనుగోలు నిలిపివేసింది, కొన్ని కంపెనీలను నిషేధిత జాబితాలో చేర్చింది.యాపిల్‌,గూగుల్‌, డ్యూపాంట్‌్‌, టెస్లా వంటి కంపెనీలు తరువాత వరుసలో ఉన్నాయి.జపాన్‌ తరువాత భారీ మొత్తంలో డాలర్ల నిల్వలున్న దేశం చైనా. వాటి నుంచి అమెరికాకు 760 బిలియన్‌ డాలర్ల మేర అప్పులిచ్చింది. ట్రంప్‌ పిచ్చిపనులు కొనసాగిస్తే ఆ బాండ్లను ఒక్కసారిగా విక్రయిస్తే అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్య సంక్షోభానికి దారి తీస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇలాంటి ఆర్థిక పరమైన దెబ్బతీసే పద్దతులను చైనా పరిశీలిస్తున్నది.అమెరికా దగ్గర కూడా కొన్ని ఆయుధాలు లేకపోలేదు. ఐరోపా, ఆసియాలో తన మిత్రదేశాలను చైనాపైకి ఉసిగొల్పేందుకు పూనుకుంది. అయితే ప్రతికూల పన్నుల విధింపులో ఏ దేశాన్నీ వదలని కారణంగా అవన్నీ జతకట్టటం సందేహమే. తమ కోసం అన్ని దేశాలూ కాస్త నొప్పి భరించాల్సిందే అంటున్నాడు ట్రంప్‌. ఎవరి సంగతి వారు చూసుకోవాలనే రక్షణాత్మక వైఖరులు పెరుగుతున్న తరుణంలో ఎంత మేరకు ఇతర దేశాలు అంగీకరిస్తాయో తెలియదు. అయినప్పటికీ ముందే చెప్పుకున్నట్లు ఇతర దేశాలను చైనా సోమవారం నాడు ముందస్తుగా హెచ్చరించింది. మారిన పరిస్థితులను ట్రంప్‌ గమనిస్తున్నట్లు లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన సర్వేల్లో మెక్సికో, కెనడా, ఐరోపా దేశాల మీద పన్నులు విధించటాన్ని వ్యతిరేకించినప్పటికీ చైనా మీద దాడిని 56శాతం మంది సమర్ధించినట్లు సిబిఎస్‌ తెలిపింది.కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎక్కించుకున్న వారు సహజంగానే చైనా మీద దాడిని అంగీకరిస్తారు. కానీ అదే ట్రంప్‌ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేమిటి ?ద్రవ్యోల్బణం, ధరలను, పన్నుల భారం తగ్గిస్తానని చెప్పాడు. గద్దె నెక్కగానే విముక్తి పేరుతో ఎడాపెడా పన్నులు విధింపు ప్రకటన చేయగానే అమల్లోకి రాక ముందే ధరలు పెరిగి జనం కొనుగోళ్లకు ఎగబడ్డారా లేదా ? కొత్తగా అన్న వస్త్రాలు వస్తాయనుకుంటే ఉన్న వస్త్రాలను ఊడగొట్టినట్లుగా భరించలేని భారాలను మోపితే జనం సహిస్తారా ? ఇప్పటికే రెండుసార్లు లక్షలాది మంది వీధుల్లో ప్రదర్శనలు చేశారు. అందుకే తేడా వచ్చేట్లు ఉందని ఆలోచించుకోవటానికి మూడు నెలల పాటు పన్నుల పెంపుదల పదిశాతానికే పరిమితం చేసి మిగతా వాటిని వాయిదా వేయాల్సి వచ్చింది. గతంలో మాదిరి ధరలు, నిరుద్యోగం పెరుగుదల సంభవించవచ్చనే హెచ్చరికలు వెలువడ్డాయి.ట్రంప్‌ మొరటుగా ముందుకు పోతాడా తెలివి తెచ్చుకొని వెనక్కు తగ్గుతాడా అన్నది చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మింగుడు పడని ట్రంప్‌ మాత్ర : 20లక్షల మంది నిరసన, రక్తమోడిన స్టాక్‌ మార్కెట్లు !

08 Tuesday Apr 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Narendra Modi, TRADE WAR, Trump tariffs, Two Millions marched against trump tariffs


ఎం కోటేశ్వరరావు


డాక్టర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నుల మాత్ర వైకుంఠయాత్రగా మారిందా ? అది వికటించి ప్రపంచమంతా అతలాకుతలం, స్టాక్‌మార్కెట్లు రక్తమోడాయి. ఒక వైపు ధరల పెరుగుదల భయంతో అమెరికాలో వేలం వెర్రిగా కొనుగోళ్లకు పరుగులు తీసిన జనం. వారే మరోవైపు డోనాల్ట్‌ ట్రంప్‌, అతగాడి ఆత్మ ఎలన్‌ మస్క్‌ విధానాలను వ్యతిరేకిస్తూ 150 సంస్థల పిలుపు మేరకు ఏప్రిల్‌ ఐదవ తేదీన మా జోలికి రావద్ద్దు (హాండ్స్‌ ఆఫ్‌) నినాదంతో 20లక్షల మంది దేశమంతటా ప్రదర్శనలు జరిపారు.ప్రపంచ వ్యాపితంగా మూడవ రోజు సోమవారం కూడా స్టాక్‌ మార్కెట్లు పతనమై 9.5లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరి. హంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీ గరిష్టంగా 13శాతం కుదేలైంది. మంగళవారం నాడు మనదేశంతో సహా ఆసియా దేశాల మార్కెట్లు కొద్దిగా తేరుకున్నాయి. నేనైతే తగ్గాలనుకోవంటం లేదు, ఏదన్నా జరిగినపుడు కొన్ని సమయాల్లో ఒక గోలీ వేసుకోకతప్పదు అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికన్ల హక్కులు, స్వేచ్చల మీద దాడి చేస్తూ బలవంతంగా లాక్కుంటున్నారంటూ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారుల పిలుపు మేరకు జనం స్పందించారు. అక్కడి 50 రాష్ట్రాల రాజధానులు, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు 1,400కుపైగా చిన్నా పెద్ద ప్రదర్శనలు జరిగాయి. లండన్‌, పారిస్‌ వంటి ఇతర దేశాల నగరాల్లో కూడా నిరసన తెలిపారు. ధనవంతుల పాలన ఇంకే మాత్రం సాగదు, వారికి జన ఘోష వినిపించేట్లు చేస్తామంటూ ప్రదర్శకులు నినదించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని సంతకాలు చేసిన వారే దాదాపు ఆరులక్షల మంది ఉన్నారు.


వాషింగ్టన్‌ డిసిలోని జార్జి వాషింగ్టన్‌ స్మారక స్థూపం వద్ద ప్రధాన సభ జరిగింది. అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు లిజ్‌ షూలెర్‌ ప్రధాన వక్త.పోరాడేవారి నోరు మూయించేందుకు ట్రంప్‌ సర్కార్‌ చూస్తున్నది కానీ ఆటలు సాగనిచ్చేది లేదని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వంతో బేరమాడే హక్కులను యూనియన్లకు లేకుండా కాలరాస్తోందని, కార్మిక సంఘాలను దెబ్బతీస్తోందన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఎవరెట్‌ కెలీ మాట్లాడుతూ ఉద్యోగులను సులభంగా దెబ్బతీయవచ్చని ట్రంప్‌ మరియు మస్క్‌ భావిస్తున్నారు, మాసభ్యులు మిలిటరీలో పనిచేసిన వారే అని గుర్తుంచుకోవాలని, తమను బెదిరించలేరని హెచ్చరించాడు. డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జామీ రస్కిన్‌ మాట్లాడుతూ అమెరికాను స్థాపించిన వారు రాసిన రాజ్యాంగం మేము పౌరులం అంటూ ప్రారంభమైంది తప్ప మేము నియంతలం అని కాదన్నాడు. ఇక్కడ ప్రదర్శనకు పది వేల మంది వస్తారనుకుంటే పది రెట్లు వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వాషింగ్టన్‌ నగరంలో ప్రదర్శన చేసిన వారు కిరాయిబాపతు తప్ప మరొకటి కాదని ఎలన్‌ మస్క్‌ నోరుపారవేసుకున్నాడు. ఆ మేరకు తన ఎక్స్‌లో అనేక వీడియోలను పోస్టు చేశాడు. వారెందుకు ప్రదర్శన చేశారో కూడా వారికి తెలియదన్నాడు. నిరసనకారులు ట్రంప్‌ను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో లక్షా 21వేల మంది కేంద్ర ఉద్యోగులను తొలగించిన ఎలన్‌ మస్క్‌ను కూడా అంతే నిరసిస్తున్నారు. రానున్న పది సంవత్సరాలలో ధనికులకు ఐదులక్షల కోట్ల డాలర్ల మేర పన్నుల రాయితీ ఇస్తూ ట్రంప్‌ సర్కార్‌ ఇటీవల నిర్ణయించింది. ఇదే సమయంలో వైద్యం, పెన్షన్‌ వంటి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున కోతలను ప్రతిపాదించింది.తమ మీద మరిన్ని భారాలను మోపే పన్నులతో పాటు ఈ విధానాలకు కూడా శనివారం నాడు నిరసన వెల్లడిరచారు. ట్రంప్‌ వెనక్కు తగ్గకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది.


ట్రంప్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని చైనా వ్యాఖ్యానించింది. ఈనెల తొమ్మిదవ తేదీలోగా చైనా వెనక్కు తగ్గాలని లేకుంటే మరో 50శాతం వడ్డిస్తానని ట్రంప్‌ ప్రకటించాడు.ఎవరూ తగ్గకపోతే చైనా వస్తువులపై ట్రంప్‌ పన్ను 104శాతానికి చేరనుంది. అతగాడిని ప్రసన్నం చేసుకొనేందుకు మనదేశం గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, ఎక్స్‌ తదితర కంపెనీలకు లబ్ది కలిగేలా డిజిటల్‌ సర్వీసు పన్ను రద్దు చేసింది. ఖరీదైన మోటారు సైకిళ్లు, విస్కీల మీద పెద్ద మొత్తంలో తగ్గించింది. ఇంత చేసిన తరువాత రెండు దేశాల మధ్య ఒప్పందం సంగతి తేల్చాలని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ అమెరికా మంత్రి మార్కో రూబియోకు ఫోన్లు చేస్తున్నారు. పారిశ్రామిక వస్తు ఎగుమతులు, దిగుమతుల మీద ఎలాంటి పన్ను విధించకూడదని తాము కోరుతున్నామని, వీటి మీద చర్చలకు సిద్దం, కుదరకపోతే తాము కూడా ప్రతికూల పన్నులు వేసేందుకు సన్నద్దమౌతున్నట్లు ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ చెప్పారు. మూడు నెలల పాటు పన్నుల వసూలు వాయిదా వేయాలన్న సూచనను ట్రంప్‌ తిరస్కరించాడు. అయినప్పటికీ మంగళవారం నాడు ప్రారంభంలో ఆసియా స్టాక్‌్‌ మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి.


అమెరికాలో బహుళజాతి కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్న ట్రంప్‌, వారి కనుసన్నలలో పని చేసే మీడియా సంస్థలు అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. మెక్సికో నుంచి చైనా పెంటానిల్‌ అనే మత్తు మందును అక్రమంగా సరఫరా చేస్తోందని, అక్రమ వలసలు అమెరికాను దెబ్బతీస్తున్నాయని చేసిన ప్రచారం నిజంగా అసలు సమస్యలే కాదు. వాటిని అరికట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఆ సాకుతో వాణిజ్యం యుద్దం చేయాల్సిన అవసరం లేదు. అధికారానికి వచ్చిన వెంటనే అక్రమవలసదారులను స్వదేశాలకు పంపేపేరుతో చేసిన హడావుడి తరువాత ఎందుకు కొనసాగించలేదు. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో ధరలు తగ్గుతాయి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది, దిగుమతులపై పన్నులు అమెరికన్ల ఉపాధిని కాపాడతాయి, ఇందుకోసం తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులను భరించకతప్పదు అనే రీతిలో జనాన్ని నమ్మించచూస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటైనా కార్మికవర్గ జీవన ప్రమాణాలను పెంచేదిగానీ, ఉపయోగపడేది గానీ ఉందా, వేతనాలను అదుపు చేయటం వారి లాభాలను గరిష్టంగా పెంచుకొనే కార్పొరేట్ల ఎత్తుగడలు తప్ప మరేమైనా ఉన్నాయా అన్న చర్చ కార్మికవర్గంలో ప్రారంభమైంది. గత మూడు దశాబ్దాలుగా అమెరికా వస్తు ఉత్పాదక సంస్థలు దేశం వదలి పోతుంటే 78 ఏండ్ల ట్రంప్‌ గతంలో ఎప్పుడైనా నోరు విప్పాడా ? ఇప్పుడెందుకు గుండెలు బాదుకుంటున్నాడు ? పెట్టుబడిదారులు తమకు ఏది లాభంగా ఉంటే ఆ విధానాలను రూపొందించేవారిని పాలకులుగా గద్దెనెక్కిస్తారు.2018లో ఇదే ట్రంప్‌ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. అమెరికాలో పోయిన ఉద్యోగాలు తిరిగి వస్తాయని అప్పుడు కూడా చెప్పాడు. తరువాత ఎన్నికల్లో ఓడిపోయి చరిత్రకెక్కాడు. అక్కడి ఉక్కు, తదితర కంపెనీలకు లాభాలు తప్ప కార్మికులకు వేతనాలు పెరగలేదు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత అత్యంత వినాశకరమైన ఆర్థిక విధానాన్ని ట్రంప్‌ పాటిస్తున్నట్లు అమెరికా మాజీ అర్థిక మంత్రి లారెన్స్‌ సమర్స్‌ వ్యాఖ్యానించాడు.1930దశకం తరువాత అతి పెద్ద వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్‌ ప్రారంభించినట్లు చెబుతున్నారు.


సమస్య పెట్టుబడిదారీ వ్యవస్థలోనే అంతర్గతంగా ఉంది. కార్మికుల ఉద్యోగాలు పోవటానికి, వేతనాలు తగ్గటానికి కారణం చైనా, మెక్సికో, కెనడా, ఐరోపాల నుంచి వస్తున్న దిగుమతులే కారణమని ట్రంప్‌ యంత్రాంగం చిత్రిస్తున్నది. స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం పేరుతో భారీ ఎత్తున్న పన్ను రాయితీలు ఇచ్చిననప్పటికీ దేశభక్త జనరల్‌ మోటార్స్‌ వంటి కంపెనీలు స్వదేశంలో ఫ్యాక్టరీలను మూసివేసి మెక్సికో, తదితర దేశాలకు తరలిపోయాయి. పన్నుల విధింపు కంపెనీలకు తప్ప కార్మికులకు మేలు చేయవని తొలిసారి అధికారంలో ఉన్నపుడు ఉక్కు దిగుమతుల వ్యవహారం వెల్లడిరచింది. కరోనా కాలం నుంచి చూస్తే కార్పొరేట్లకు లాభాలు కార్మికులకు భారాలు పెరిగాయి. ఈ నేపధ్యంలో దిగువ చర్యలు తీసుకోవాలని కార్మికవర్గండిమాండ్‌ చేస్తోంది. విదేశాల్లో ఉపాధి కల్పించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్‌ కార్పొరేషన్ల మీద పన్ను విధించి, ఆ మొత్తాన్ని ఇతర రంగాలలో కార్మికులను నిలుపుకొనేందుకు వినియోగించాలి. పన్నులు గనుక ఖర్చులను పెంచేట్లయితే ధరలను గట్టిగా నియంత్రించాలి. ఆహారం, ఔషధాలు, గృహ తదితరాల ధరలను స్థంభింప చేయాలి. కార్పొరేట్‌ల కోసం కార్మికులు మూల్యం చెల్లించకూడదు. కార్మిక సంఘాల హక్కులకు భంగం కలగకుండా అంతర్జాతీయ కార్మిక హక్కులను అమలు చేసి మాత్రమే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కీలకమైన ఉక్కు, ఆటోమొబైల్‌ వంటి పరిశ్రమలను బడా కంపెనీలకు దూరంగా ప్రజల భాగస్వామ్యంలో నిర్వహించాలి.


పెట్టుబడిదారులు వారు పారిశ్రామికవేత్తలైనా, వాణిజ్యంచేసే వారైనా లాభాలు వచ్చాయా లేదా అన్నది తప్ప ఎలాంటి విలువలు, వలువలు, సిద్దాంతాలు ఉండవు.ఎప్పటికెయ్యది లాభమో అప్పటికా విధానాలను తమ ప్రతినిధులైన పాలకుల ద్వారా రూపొందించి అమలు చేస్తారు. కమ్యూనిజం వ్యాప్తి నిరోధానికి కంకణం కట్టుకున్నట్లు చెప్పిన అమెరికా ప్రత్యర్థిగా ఉన్న బలమైన సోవియట్‌ను దెబ్బతీసేందుకు ప్రచ్చన్న యుద్దం సాగించింది. అదే కాలంలో ప్రపంచంలో పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో తన వస్తువులను అమ్ముకొనేందుకు, చౌకగా అక్కడ ఉత్పత్తి చేసి దిగుమతులు చేసుకొని లబ్దిపొందాలని ఎత్తువేశారు. దాంతో అప్పటి వరకు ఐరాసలో కమ్యూనిస్టు చైనాకు నిరాకరించిన భద్రతామండలి శాశ్వత సభ్యత్వాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. ఇదే సమయంలో స్వేచ్చా వాణిజ్యం పేరుతో ప్రపంచీకరణ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చింది, ప్రపంచ వాణిజ్య సంస్థపేరుతో నిబంధనలు రూపొందించింది. నాలుగు దశాబ్దాల తరువాత సమీక్షించుకుంటే ఈ విధానం తమకంటే చైనా, ఇతర దేశాలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉన్నట్లు గ్రహించి ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా తొండి చేస్తున్నట్లు ఇప్పుడు అమెరికా ఆరోపిస్తోంది.తమకు రక్షణ చర్యలు,మరిన్ని రాయితీలు కల్పించాలని ట్రంప్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వేచ్చా వాణిజ్యానికి వీలు కల్పించాలని కోరేదీ, దానికి విరుద్దమైన రక్షణ విధానాలను కోరేదీ కూడా పెట్టుబడిదారులే. చైనా నుంచి వస్తువులను స్వేచ్చగా దిగుమతి చేసుకొనేందుకు, పెట్టుబడులను ఆనుమతించాలని మన దేశంలో కోరుతున్నదీ, చౌకగా వచ్చే వస్తువులతో తమ పరిశ్రమల మనుగడకు ముప్పు గనుక ఆంక్షలు పెట్టాలి లేదా పన్ను విధించాలని కోరుతున్నదీ పెట్టుబడిదారులే తప్ప మరొకరు కాదు. చైనా పెట్టుబడులను కేంద్రం అడ్డుకుంటే మోడీ మెడలు వంచి అనుమతించేందుకు ఒప్పించారు. అమెరికాను వ్యతిరేకిస్తున్న దేశాల మీద ప్రతీకార పన్ను ఏటా ఆరువందల బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని చెబుతున్న ట్రంప్‌ రానున్న పది సంవత్సరాల్లో ఐదులక్షల కోట్ల డాలర్ల మేరకు కార్పొరేట్లు, ధనికులకు పన్ను రాయితీలు ఇచ్చేందుకు తీర్మానం చేయించాడు. అంటే అలా వచ్చేదాన్ని ఇలా అయినవారికి వడ్డించేందుకు పూనుకున్నాడు. మరోవైపున కార్మికుల సంక్షేమ చర్యలకు కోత పెట్టేందుకు పూనుకున్నాడు.


డోనాల్డ్‌ ట్రంప్‌ గురించి చెప్పాలంటే అతగాడు ఒకసారి వేడెక్కుతాడు, మరోసారి చల్లబడతాడు, ఒకసారి అవునంటాడు, అదే నోటితో కాదంటాడు, ఒకసారి వస్తానంటాడు, మరోసారి వెళతానంటాడు, ఒకసారి పైకి ఎక్కుతాడు అంతలోనే కిందికి దిగుతాడు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు.కానీ తనవారికి చేయాల్సింది చేస్తున్నాడు, అందుకే కొందరు పిచ్చితనం ప్రదర్శన నటన అంటున్నారు. మిత్రులు, శత్రువులు అని చూడకుండా అందరి మీద బస్తీమే సవాల్‌ అనటం పిచ్చిగాక తెలివా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తమ దేశాలకు చెందిన సంస్థల వస్తువులను అమ్ముకొనేందుకు అవసరమైన మార్కెట్ల వేటలో భాగంగానే ప్రపంచాన్ని వలసలుగా మార్చుకొనేందుకు తలెత్తిన పోటీలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. భౌతిక వలసలలో బ్రిటన్‌ది పైచేయి కాగా ఇప్పుడు అది సాధ్యం కాదు గనుక మార్కెట్లను కబళించే క్రమంలో అమెరికా ముందుకు వచ్చింది. దానికి ప్రతిఘటన ఫలితమే వాణిజ్యపోరు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌కు మతి చలించిందా ! సుంకాలను వ్యతిరేకించేవారంతా చైనా అదుపులో ఉన్నట్లేనట !!

04 Tuesday Feb 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Canada, Donald trump, Mexico wall, Trade Protectionism, TRADE WAR, Trump tariffs, US-CHINA TRADE WAR, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ముందునుంచీ ప్రకటించినట్లుగానే ప్రపంచ వాణిజ్య పోరుకు తెరతీశాడు. తన పన్నులను వ్యతిరేకించే విదేశమైనా లేక అమెరికాలో ఉన్న కంపెనీ అయినా సరే వారంతా చైనా అదుపులో ఉన్నట్లే అన్నాడు. ఇది రాసిన సమయంలో చెప్పిన మాటలకు, పాఠకులకు చేరే సమయానికి మార్పులు, విస్తరణ జరిగే రీతిలో ట్రంప్‌ వేగం కనిపిస్తోంది. కెనడా, మెక్సికోల మీద విధించిన పన్నుల అమలు కొంతకాలం వాయిదా వేస్తామనంటతో పాటు ఐరోపా మీద త్వరలో విధిస్తా ,వారు అమెరికా పట్ల భయంకరంగా వ్యవహరించారు, లాభాలకు ఒక అవకాశంగా తీసుకున్నారు, చైనా మీద ప్రకటించిన మొత్తాన్ని పెంచుతా అన్నాడు. స్వంత జనాలు, కంపెనీలతో పాటు ప్రపంచ వృద్ధికి నష్టం, అమెరికా పలుకుబడికీ దెబ్బ అన్న అనేక మంది ఆర్థికవేత్తల హెచ్చరికలను ఖాతరు చేయటం లేదు. కెనడా, మెక్సికోలపై 25శాతం, చైనా వస్తు దిగుమతుల మీద పదిశాతం పన్ను విధిస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉత్తరువులు జారీ చేశాడు. ఇప్పటి వరకు వెల్లడైన వైఖరులను చూస్తే అదిరించి బెదిరించి దారికి తెచ్చుకోవాలన్న ఎత్తుగడ కనిపిస్తోంది.పన్నులను వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా కుహనా వార్తల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే(హెడ్జ్‌ ఫండ్స్‌) వారు లేదా సంస్థలు చైనా అదుపుల్లో ఉన్నట్లే అన్నాడు. తన నిర్ణయాలకు అద్భుత స్పందన వస్తున్నదని చెప్పుకున్నాడు. ఇతర దేశాలకు రాయితీల రూపంలో అమెరికా లక్షల కోట్ల డాలర్లు నష్టపోతున్నదన్నాడు. జనాలకు ఆర్థికంగా కొంత నొప్పి కలగవచ్చుగానీ అమెరికా ప్రయోజనాలకు ఆ మాత్రం భరించక తప్పదన్నాడు. దక్షిణాఫ్రికా భూములను గుంజుకుంటున్నదని, కొన్ని సామాజిక తరగతుల పట్ల చెడుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశానికి రానున్న రోజుల్లో నిధులు నిలిపివేస్తామని, గతంలో ఇచ్చిన వాటి మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు.


ఖండనలతో పాటు యావత్‌ ప్రపంచం అప్రమత్తమై ఎలా ఎదుర్కోవాలా అన్న శోధనలో పడిరది. అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ నిరోధానికి జాతీయ అత్యవసర పరిస్థితిని ట్రంప్‌ ప్రకటించాడు.కృత్రిమ సింథటిక్‌ మరియు నల్లమందుతో తయారు చేసే నొప్పి నివారణ, మత్తు మందును ఫెంటానిల్‌ అని పిలుస్తున్నారు. దీన్ని ఔషధంగా వినియోగించటానికి అనుమతి ఉంది. మాదక ద్రవ్యంగా కూడా వినియోగిస్తున్నారు.అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ అమెరికాలో లక్షల మంది ప్రాణాలు తీసిందని అధ్యక్ష భవన మీడియా కార్యదర్శి కారోలిన్‌ లీవిట్‌ ఆరోపించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అమెరికా, అమెరికా అంటే ట్రంప్‌ అన్నట్లుగా పరిస్థితి తయారు కావటంతో కొంత మంది ఇప్పుడు ట్రంపెరికా అని పిలుస్తున్నారు. తాము చర్చలను తప్ప ఘర్షణను కోరుకోలేదని, కానీ ప్రతికూల చర్యలకు పూనుకోక తప్పటం లేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షియిన్‌బామ్‌ ఎక్స్‌ ద్వారా ప్రకటించారు. మెక్సికో ప్రయోజనాల రక్షణకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని తమ ఆర్థిక మంత్రిని కోరినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల ముఠాలతో మెక్సికో ప్రభుత్వం కుమ్మక్కు అయినందునే తాము పన్నులు విధించాల్సి వస్తోందంటూ అధ్యక్షభవనం చెప్పిన సాకును ఆమె ఖండిరచారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఏఏ వస్తువులను లక్ష్యంగా చేసుకోవాలో ఇంకా వెల్లడిరచలేదు. స్వతంత్ర మెక్సికో చరిత్రలో జరిగిన అతిపెద్ద దాడులలో ఇదొకటని, అమెరికాకెనడామెక్సికో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇది విరుద్దమని పాలకపార్టీ నేత రికార్డో, ఆర్థిక మంత్రి ఎబ్రార్డ్‌ ప్రకటించాడు. తాము నష్టపడతామని, వారికీ అదే జరుగుతుందన్నారు.ప్రస్తుతం అమెరికాకు ఎగుమతుల్లో చైనాతో మెక్సికో పోటీపడుతోంది. మూడోవంతు మెక్సికో జిడిపి అమెరికాకు ఎగుమతులపై ఆధారపడి ఉంది. ఎగుమతి, దిగుమతుల్లో మెక్సికో వాణిజ్య మిగుల్లో ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పంది మాంసం, జున్ను, వ్యవసాయ ఉత్పత్తులు, ఉక్కు, అల్యూమినియం వస్తువుల మీద ఐదు నుంచి 20శాతం వరకు పన్నులు విధించాలని ఆలోచిస్తున్నది. బీరు,వైన్‌,పండ్లు, పండ్ల రసాలతో సహా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై 25శాతం పన్ను విధించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ప్రకటించాడు. తొమ్మిదివేల కిలోమీటర్ల దూరం ఉన్న సరిహద్దులో ఇరు దేశాల వాణిజ్య లావాదేవీలు రోజుకు రెండున్నర బిలియన్ల డాలర్ల మేర జరుగుతున్నాయి. పన్నుల విధింపు తమ మీద ఆర్థిక యుద్ధం ప్రకటించటం, రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని ఉల్లంఘించటమే అంటూ దీన్ని తాము, కెనడియన్లతో కలసి ప్రతిఘటిస్తామని బ్రిటీష్‌ కొలంబియా ప్రధాని డేవిడ్‌ ఇబై ప్రకటించాడు. డాలర్‌కు డాలర్‌ అన్న పద్దతిలో దెబ్బతీస్తామని కెనడాలోని ఓంటారియో రాష్ట్ర నేతలు చెప్పారు. తమ మీద అడ్డగోలుగా పన్ను విధిస్తే గట్టిగా ప్రతి స్పందిస్తామని ఐరోపా యూనియన్‌ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.


ట్రంప్‌ చర్యను ఖండిస్తూ చర్చలకు ద్వారాలను తెరిచే ఉంచామని చైనా వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వశాఖలు ప్రకటించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలో పన్నుల విధింపును సవాలు చేస్తామని ప్రకటించాయి. ఫెంటానిల్‌ అమెరికా సమస్య. దాని మీద ఏ చర్య తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని చైనా స్పష్టం చేసింది. తాము ఇప్పటికే అమెరికాకు సహకరిస్తున్నామని, గణనీయమైన ఫలితాలు కూడా వచ్చాయన్నారు. ట్రంపు పన్నులు చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ కాదని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక రంగం మీద అమెరికా పన్నులు ఎలాంటి ప్రభావితం కలిగిస్తాయో అన్న ఆందోళన చెందుతున్నట్లు జపాన్‌ ఆర్థిక మంత్రి కాటో చెప్పాడు.తమ మీద ప్రభావం ఎలా ఉంటుందో చూసి తగిన చర్యలు తీసుకుంటామన్నాడు. మెక్సికోలో ఉత్పత్తి కేంద్రాలున్న దక్షిణ కొరియా కంపెనీల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో సన్నిహితంగా గమనించాలని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు చోయ్‌ శాంగ్‌ మోక్‌ ప్రభుత్వ సంస్థలను ఆదేశించాడు. కొన్ని కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి జరపాలని ఆలోచిస్తున్నాయి. పీజా, కార్ల ధరలు పెరుగుతాయి సిద్దంగా ఉండండి అంటూ అమెరికా సెనెట్‌లో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ చార్లెస్‌ ష్కమర్‌ హెచ్చరించాడు. కార్ల విడి భాగాల దిగుమతులపై పన్ను విధించి ధరలు పెరిగేందుకు దోహదం చేయవద్దని అమెరికన్‌ ఆటోమోటివ్‌ పాలసీ మండలి అధ్యక్షుడు మాట్‌ బ్లంట్‌ కోరాడు. పరిణామాలు, పర్యవసానాలను ఎదుర్కొనేందుకు భారత్‌తో సహా వర్ధమాన దేశాలన్నీ సిద్దం కావాలని కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ స్థాపకుడు ఉదయ్‌ కోటక్‌ కోరారు. తమకు నష్టం చేసే దేశాలన్నింటి మీద పన్నులు వేస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా వస్తువులను అన్యాయంగా భారత్‌ అడ్డుకుంటున్నదని ఆరోపించాడు.

ట్రంప్‌ పన్నులతో జరిగేదేమిటి అన్న చర్చ ఎన్నికలకు ముందే ప్రారంభమైంది. బస్తీమే సవాల్‌ అంటూ అన్ని దేశాల మీద తొడగొట్టిన కారణంగా మిగతా దేశాలన్నింటికీ కలిపి ఎంత నష్టం జరుగుతుందో ఒక్క అమెరికాకు అంత ఉంటుంది. ఏ ఏ వస్తువుల మీద పన్నులు విధిస్తారు, చేసిన ప్రకటనలు, ఇచ్చిన ఆదేశాలకు ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా అన్నది కూడా చూడాల్సి ఉంది. బెదిరించటం వెనక్కు తగ్గటం అతని చరిత్ర. తొలిసారి అధికారానికి వచ్చినపుడు అక్రమ వలసలను నివారింటచంలో విఫలమైనందున మెక్సికో వస్తువులపై ఐదు నుంచి 25శాతం పన్నులు విధిస్తానని ప్రకటించాడు. తరువాత వెనక్కు తగ్గాడు. నిఘంటువులో దేవుడు, ప్రేమ, మతం తరువాత అందమైన పదం పన్నులు అని ట్రంప్‌ వర్ణించాడు. అమెరికా చరిత్రలో 1890దశకంలో 25వ అధ్యక్షుడు విలియమ్‌ మెకన్లీ ఎడా పెడా పన్నులు విధించిన నేతగా నమోదయ్యాడు. ఇప్పుడు ట్రంప్‌ అదే బాటలో నడుస్తున్నట్లు వర్ణిస్తున్నారు.ఇప్పటికే పెద్ద ఎత్తున లోటుబడ్జెట్‌తో ఉండగా పన్నులు తగ్గించాలని ట్రంప్‌ తలపెట్టాడు, తద్వారా వచ్చిన నష్టాన్ని విదేశీ దిగుమతులపై పన్ను విధింపుతో పూడ్చాలని చూస్తున్నాడు. అయితే దానికి దేశకార్మికవర్గాన్ని ఫణంగా పెట్టాలని చూస్తున్నాడు. దిగుమతి పన్నులు వేల కోట్ల డాలర్లు బహుశా లక్షల కోట్లు కూడా తమ ఖజానాలోకి వచ్చిపడవచ్చని ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాల్లో ట్రంప్‌ చెప్పాడు.
అమెరికా విధించే పన్నులు ఎలా ఉండబోతున్నాయి, సామాన్యుల మీద ఎంత భారం పడుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. టాక్స్‌ ఫౌండేషన్‌ సంస్థ చెబుతున్నదానిని బట్టి కెనడా, మెక్సికోల మీద పన్ను కారణంగా అమెరికా జిడిపి 0.8శాతం దిగజారుతుంది, 1.3 ఎగుమతులు, 2.8శాతాల చొప్పున దిగుమతులు తగ్గుతాయి.లక్షా 84వేల ఉద్యోగాలు పోతాయి. ఎంత భారం పడుతుందనే లెక్కలు అన్నీ ఒకే విధంగా లేవు. పన్ను మొత్తం 272 బిలియన్‌ డాలర్లు ఉంటే కుటుంబానికి ఏటా 2,600 డాలర్లు అదనపు భారం అని కార్పే క్రాస్‌ బోర్డర్‌ సొల్యూషన్స్‌ పేర్కొన్నది. కెనడా, మెక్సికో దిగుమతుల మీద 25శాతం చొప్పున అమలు చేస్తే 232.5 బి.డాలర్లు, చైనా వస్తువులపై 43.2 మొత్తం 275.7బి.డాలర్లని దీని ప్రకారం 33 కోట్ల జనాభాలో తలకు 835 డాలర్ల చొప్పున నలుగురున్న ప్రతి కుటుంబం మీద 3,342 డాలర్లని మరో లెక్క.చైనా వస్తువులపై 60శాతం, మిగతా వాటిపై 20శాతం విధిస్తే ఏటా కుటుంబం మీద 2,600 డాలర్ల భారమని పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌, మొత్తం మీద పదిశాతం విధిస్తే 2,045 డాలర్లని టాక్స్‌ ఫౌండేషన్‌, నేషనల్‌ రిటెయిల్‌ ఫెడరేషన్‌ అంచనా ప్రకారం 7,600 డాలర్లు ఉంటుంది. ఈ పన్నులతో కంపెనీలు, వినియోగదారుల నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చని కూడా చెబుతున్నారు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌ విధించిన పన్నులకు ప్రతిగా ఐరోపా యూనియన్‌, చైనా చర్యలు తీసుకున్నాయి.వ్యవసాయ రంగంలో ట్రంప్‌ మద్దతుదార్లు, ఇతరులూ నష్టపోయారు. జూరిచ్‌ విశ్వవిద్యాలయం,మచాసుచెట్స్‌, హార్వర్డ్‌, ప్రపంచ బ్యాంకు చేసిన అధ్యయనాల ప్రకారం ట్రంప్‌ విధించిన పన్నులు అమెరికాలో ఉపాధిని పునరుద్దరించలేదని అలాగని ఉపాధిని తగ్గించలేదని కూడా తేలింది. అందువలన ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్న మాటలు, చేతల ప్రభావం, పరిణామాలు, పర్యవసానాలు వెంటనే వెల్లడయ్యే అవకాశాలు లేవు.భారత్‌తో సహా వివిధ దేశాలలో స్టాక్‌మార్కెట్లు, కరెన్సీ విలువల్లో ఒడుదుడుకులు మాత్రం కనిపిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డీప్‌సీక్‌, డీప్‌సీక్‌ – ఒక్క రోజే అమెరికాలో లక్ష కోట్ల డాలర్ల నష్టం, ప్రపంచానికి దడ పుట్టించిన చైనా ఏఐ యాప్‌ !

31 Friday Jan 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#CHIPS War, ChatGPT, China, CHIPS Act, DeepSeek, Donald trump, Joe Biden, Technology War

ఎం కోటేశ్వరరావు

తెలివి ఒకడబ్బ సొమ్ము కాదు, పశ్చిమ దేశాల, తెల్లతోళ్ల గుత్త అసలే కాదు. రక్షణాత్మక చర్యలతో తన ప్రత్యర్ధులను అణచివేయాలని ఎవరైనా ఎంతగా ప్రయత్నిస్తే అంతగా ప్రతిఘటనే కాదు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కూడా సవాలు విసురుతాయని గతంలో అణుబాంబులు, ఖండాంతర క్షిపణుల వరకు నిరూపించాయి. తాజాగా చైనా డీప్‌సీక్‌ కృత్రిమ మేథ యాప్‌ అమెరికాతో సహా ప్రపంచ మంతటా సంచలనానికి కారణమైంది. అనేక దేశాలో ప్రభుత్వశాఖలు, భారీ సంఖ్యలో కంపెనీలు ఆ యాప్‌ను తమ ఫోన్లు, కంప్యూటర్లలో పెట్టుకోవద్దని, దాని సేవలను వినియోగించవద్దని ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలు. చైనా సాంకేతికంగా ముందుకు పోకుండా అడ్డుకొనేక్రమంలో జో బైడెన్‌ 2022లో తెచ్చిన చిప్స్‌ చట్టం ప్రకారం డ్రాగన్‌ దేశానికి ఎలాంటి పరిజ్ఞానం, చిప్స్‌ను అందనివ్వకూడదు,ఒక వేళ ఇతర దేశాలు ముందుకు పోతే వాటి మీద కూడా ఆంక్షలు విధిస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడవి దానికే ఎదురుతంతున్నాయి. రక్షణాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా అదే జరుగుతుంది. తగిన ప్రోత్సాహం, అవకాశాలను కల్పించాలేగానీ ఎవరైనా అద్భుతాలు సృష్టించగలరని ప్రత్యేకించి చైనా ఇప్పటికే నిరూపించింది. గంగలో మునిగితే కరోనా పారిపోతుందని చెప్పిన వారు ఇప్పుడు కోట్లాది మందిని మహాకుంభమేళా పేరుతో గంగా స్నానం చేయిస్తున్నారు. వారి నుంచి డీప్‌సీక్‌ వంటి నవకల్పనలు వెలువడతాయని ఆశించలేము. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అన్నవారు ఇంకా ఆ పాటనే పాడుతున్నారు. నిజంగా ఉంటే ఘనాపాటీలు ‘‘ దేశం కోసం ధర్మం కోసం ’’ ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పాటికి ఇంథనం, విమానాశ్రయాలతో పని లేకుండా ఎలా అనుకుంటే అటు తిరుగుతూ ఎందరు ఎక్కినా మరొకరికి సీట్లు ఉండే పుష్పక విమానాలను, కృత్రిమ మేథ(ఏఐ) భారతీయ యాప్‌ను ఎందుకు రూపొందించలేదన్నది ప్రశ్న !

ఈ రంగంలో చైనా కంపెనీ విడుదల చేసిన డీప్‌సీక్‌ఆర్‌ఐ యాప్‌ పెను సంచలనం సృష్టించటమే కాదు, అమెరికా కంపెనీల వాటాల ధరలు పతనమై దాని చరిత్రలో లేని విధంగా దాదాపు లక్ష కోట్ల డాలర్లు( 96,900) నష్టపోయేందుకు దోహదం చేసింది.పది సంవత్సరాల క్రితం అమెరికా ఓపెన్‌ ఎఐ కంపెనీ (చాట్‌ జిపిటి సృష్టికర్త) నాలుగున్నరవేల మంది సిబ్బంది, 660 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైంది. అదే చైనా డీప్‌సీక్‌ 200 మంది సిబ్బందితో ప్రారంభమై రెండు సంవత్సరాలు కూడా నిండలేదు.కోటి డాలర్లలోపు ఖర్చుతోనే యాప్‌ను అభివృద్ధి చేసినట్లు ది కొబెఇసీ న్యూస్‌లెటర్‌ స్థాపకుడు ఆడమ్‌ కొబెఇసీ ఎక్స్‌లో పేర్కొన్నాడు. ఈ రెండు కంపెనీలు ఇప్పుడు ఎలా పోటీబడుతున్నాయో చూడండని పేర్కొన్నాడు. ఒక్క ఎన్విడియా కంపెనీ వాటాల ధరలే 60వేల కోట్ల మేర నష్టపోయాయి. ఆ కంపెనీ సిఇఓ 2,100, ఒరాకిల్‌ అధిపతి సంపద 2,760 కోట్ల డాలర్లు నష్టపోయారు. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఇంత నష్టం ఇదే ప్రధమం. తరువాత ఆ కంపెనీలు పుంజుకోవచ్చు, మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు, అది వేరే అంశం. ఒక్కటి మాత్రం స్పష్టం వందల కోట్ల డాలర్లు ఖర్చుచేసిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు, వాటాలను కొనుగోలు చేసేవారు ఒకటికి వందసార్లు ఆలోచించే విధంగా ఊరూపేరులేని డీప్‌సీక్‌ అంకుర సంస్థ మేల్కొలిపింది. దాని మీద ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో సైబర్‌దాడులు జరుగుతున్నాయి. అమెరికా కంపెనీలు ఒక యాప్‌ను తయారు చేసేందుకు పది కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే చైనా కంపెనీ కేవలం 60లక్షల డాలర్లతో వాటికి ధీటైనదాన్ని రూపొందించింది.

ఆధునిక చిప్‌లను, వాటిని తయారు చేసే యంత్రాలను చైనా కంపెనీలకు విక్రయించరాదని అమెరికా ఆంక్షలు విధించిన తరువాత డీప్‌సీక్‌ తన సత్తాచాటింది. చిత్రం ఏమిటంటే అమెరికాకు చెందిన ఎన్వీడియా కంపెనీ తన వద్ద పాత తరం హెచ్‌800 రకం చిప్స్‌ను రెండువేలు కొనుగోలు చేసి వాటిని వినియోగించామని డీప్‌సీక్‌ ఇంజనీర్లు వెల్లడిరచారు. అందువలన చైనాకు ఆధునిక పరిజ్ఞానం అందకుండా మడిగట్టుకొని మంత్రాలు వేసిన వారు ఇప్పుడేం చేస్తారన్నది ప్రపంచానికి ఆసక్తి కలిగించే అంశం.చివరికి రద్దును అమ్మాలన్నా చైనా గనుక కొనుగోలుకు ముందుకు వస్తే ధనిక దేశాల కంపెనీలు భయపడే స్థితి వచ్చింది. ఇంత తక్కువ ఖర్చుతో చైనా యాప్‌లు తయారు చేస్తున్నపుడు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేయటం అవసరమా అని అమెరికన్లలో సందేహాలు తలెత్తాయి. తాజా యాప్‌ను విడుదల చేయక ముందే అంటే జనవరి ప్రారంభం నుంచి డీప్‌సీక్‌ కంపెనీ మీద సైబర్‌ దాడులు ప్రారంభమయ్యాయని చైనా భద్రతా సంస్థ ఎక్స్‌లాబ్‌ వెల్లడిరచింది. అమెరికా, సింగపూర్‌, నెదర్లాండ్స్‌, జర్మనీ చివరికి చైనాలో చిరునామాలు కలిగిన సంస్థలు వేల సంఖ్యలో దాడులు జరుపుతున్నాయని, రానున్న రోజుల్లో ఇంకా పెరగవచ్చని కూడా హెచ్చరించింది. ఈ దాడులు జరుగుతుండగానే జనవరి 28వ తేదీన డీప్‌సీక్‌ఆర్‌ఐ మోడల్‌ యాప్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది అమెరికన్‌ ఏఐకి హెచ్చరిక అని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించినట్లు సమాచారశాఖ మంత్రి కరోలిన్‌ లీవిట్‌ పేర్కొన్నారు.

చైనా యాప్‌ విడుదలకు వారం రోజుల ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ స్టార్‌గేట్‌ పేరుతో సాంకేతిక రంగంలో తనకు అనుకూలమైన కొందరిని సమావేశపరచి కృత్రిమ మేథ, సంబంధిత రంగాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 500బిలియన్‌ డాలర్ల మేర ప్రాధమిక సదుపాయాలను కల్పించనున్నట్లు, అది సాంకేతికరంగ భవిష్యత్‌కు తోడ్పడుతుందని ప్రకటించాడు. చైనాకు అడ్డుకట్ట వేసేందుకు కన్న కలలను అదే చైనా వారం రోజుల్లోనే ఆటతీరునే మార్చి వేస్తుందని ట్రంప్‌ ఊహించలేకపోయాడు. నిజానికి ఇతర చైనా కంపెనీలు ప్రపంచానికి సుపరిచతం తప్ప డీప్‌సీక్‌ గురించి పెద్దగా తెలియదు. అలాంటి కంపెనీ అమెరికా సాంకేతిక రంగాన్ని, ఖరీదైన ట్రంప్‌ పథకాలను ఒకేసారి దెబ్బతీసింది. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌, తరువాత జోబైడెన్‌ కూడా సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలు చైనాకు అందకుండా చూసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ నేపధ్యంలో అనేక రంగాల్లో చైనా ముందున్నప్పటికీ మైక్రో చిప్స్‌, ఏఐ రంగంలో వెనుకబడి ఉందని వెంటనే అమెరికాను అధిగమించటం జరిగేది కాదని అనేక మంది భావిస్తున్న తరుణంలో అది వాస్తవం కాదని స్పష్టం చేసింది, ఇప్పటికే చిప్స్‌ తయారీకి శ్రీకారం చుట్టిన చైనా ఆ రంగంలో కూడా త్వరలో తన సత్తా నిరూపించటం ఖాయం. ఏఐలో సంచలనాలు సృష్టించిన చాట్‌ జిపిటిని రూపొందించిన ఓపెన్‌ ఏఐ సంస్థ మరికొన్నింటిని పెంపొందించటానికి ట్రంప్‌ స్టార్‌గేట్‌ పేరుతో ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు పూనుకున్నాడు. ఈ రంగంలో అతిపెద్ద సంస్థలైన గూగుల్‌, మేటా, ఇతర పెద్ద సంస్థలను దీన్నుంచి మినహాయించాడు. చాట్‌ జిపిటిపై ప్రతి ఖాతాదారు మీద నెలకు రెండువందల డాలర్లు ఖర్చు అవుతున్నదని, నష్టాల్లో ఉన్నట్లు ఓపెన్‌ ఏఐ చెప్పింది.నిజానికి ఇప్పటి వరకు ఈ సేవద్వారా లాభాలు ఎలా వచ్చేదీ స్పష్టం కాలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన డీప్‌సీక్‌ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు.బైట్‌ డాన్స్‌ రూపొందించిన టిక్‌టాక్‌, అలీబాబా,మూన్‌షాట్‌,రిaపు వంటి చైనా కంపెనీలు ఇప్పటికే ఏదో ఒక రూపంలో అమెరికా సంస్థలను సవాలు చేస్తున్నాయి. మరోసారి అమెరికాను గొప్పదిగా చేయాలన్న ట్రంప్‌ మీద భ్రమలు పెట్టుకున్నవారు నేడు గాకపోతే రేపైనా కళ్లు తెరవక తప్పదు.

సంచలనాత్మక డీప్‌సీక్‌ గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. వాటన్నింటినీ నమ్మటానికి లేదు.దాని దగ్గర ఉన్న సమాచారంలో పదిలక్షల రికార్డులను ఎవరైనా చూడవచ్చని విజ్‌ అనే ఒక సంస్థప్రకటించింది. అయితే ఒక అరగంట వ్యవధిలోనే వాటికి తాళం వేశారని అనుమతి లేకుండా ఎవరూ చూడటానికి లేదని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ సమాచారం ఏమిటి ? ఎవరైనా తీసుకున్నారా ? దానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిది అన్నది కూడా తెలియలేదు. టిక్‌టాక్‌ ఇతర యాప్‌ల ద్వారా చైనా సమాచారాన్ని సేకరిస్తున్నదనే ఆరోపణల మాదిరే ఇప్పడు దీని మీద కూడా అనేక దేశాల్లో హెచ్చరికలు చేస్తున్నారు. ఏ స్థాయిలో ఉన్న వారు కూడా దీని సేవలను పొందవద్దని అమెరికా నౌకా దళం తన సిబ్బందిని ఆదేశించింది.ఈ యాప్‌ మరో స్పూత్నిక్‌ క్షణాలను గుర్తుకు తెచ్చిందని కొందరు వ్యాఖ్యానించారు. నిజానికి ప్రపంచ తొలి సోవియట్‌ యూనియన్‌ కృత్రిమ ఉపగ్రహం స్పూత్నిక్‌1 ప్రయోగం అమెరికా ఒక్కదాన్నే కలవరపెట్టింది. ఇప్పుడు డీప్‌సీక్‌ చైనాను అడ్డుకోవాలని చూసే ప్రతి వారూ కాళ్లు విరగదొక్కుకొనేట్లు చేసింది.స్పూత్నిక్‌ ప్రయోగం పెను సంచలనం సృష్టించింది.అప్పటి నుంచి పెద్ద సంచలనాలను స్పూత్నిక్‌ క్షణాలు అంటున్నారు.

ప్రచ్చన్న యుద్ధం కారణంగానే అమెరికన్లు నాసాను రంగంలోకి తెచ్చారు.1950 దశకం ప్రారంభంలో అమెరికాకు చెందిన యుా2 అనే గూఢచార విమానం ద్వారా తమ రహస్యాలను సేకరించిందని గ్రహించిన సోవియట్‌ ప్రతి చర్యలను చేపట్టింది. దాని గురించి అమెరికా రాబట్టిన సమాచారం ప్రకారం 1955 నుంచి 61 సంవత్సరాలలో తమ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ మందితో పరిశోధనలను జరిపించిందని అమెరికన్లు గ్రహించారు. దాని ఫలితమే 1957 అక్టోబరు నాలుగున ప్రపంచ తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌1 ప్రయోగం. అది ఎంత సంచలనం అంటే న్యూయార్క్‌ టైమ్స్‌ సేకరించిన సమాచారం ప్రకారం అక్టోబరు 6`31వ తేదీల మధ్య 279 వ్యాసాలు, రోజుకు పదకొండు చొప్పున అమెరికా పత్రికల్లో వచ్చాయి. అమెరికా ద్వితీయ శ్రేణి శక్తిగా మారిందని మీడియా వ్యాఖ్యాతలు రెచ్చగొట్టారు. సోవియట్‌ సాంకేతికంగా ఎంతో ముందున్నదని, అది అమెరికా భద్రతకు ముప్పు అని భాష్యం చెప్పారు.అమెరికన్లలో తలెత్తిన కలవరపాటును తగ్గించేందుకు అసలు మనం 1956లోనే ఎక్స్‌ప్లోరర్‌1 అనే ఉపగ్రహాన్ని సిద్దం చేశామని ప్రచారం చేశారు. అయితే అది ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సోవియట్‌ ఉపగ్రహ ప్రయోగానికి ఖండాంతర క్షిపణి పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఉపగ్రహంతో పాటు దాన్ని నింగిలోకి మోసుకుపోయిన ఆర్‌ా7 రాకెట్‌ పదిలక్షల పౌండ్ల శక్తిని విడుదల చేసిందని గ్రహించిన అమెరికన్లు దాన్ని చూసి కూడా కలవరపడ్డారు. ఆ రాకెట్‌ ద్వారా అణ్వాయుధాన్ని కొన్ని నిమిషాల్లోనే ఆరువేల కిలోమీటర్ల దూరం మోసుకుపోగల శక్తి కలిగిందన్నది మరింత ఆందోళన కలిగించి అంతరిక్ష రంగంలో తాము ఎంతో వెనుకబడి ఉన్నామని తరువాత కాలంలో వేగాన్ని పెంచారు. స్పుత్నిక్‌ వలన ఎలాంటి ముప్పు లేదని గ్రహించి ఐదు రోజుల తరువాత నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ అదొక శాస్త్రప్రయోగ విజయం తప్ప భద్రకు ముప్పులేదని చెప్పారు. (తరువాత అమెరికా రెండు ఉపగ్రహాలను ప్రయోగించినా అవి విఫలమయ్యాయి) అదే పెద్ద మనిషి 1958లో మాట్లాడుతూ అంతరిక్ష శాస్త్ర, సాంకేతిక రంగంలో అమెరికా, ఇతర స్వేచ్చా ప్రపంచ దేశాలను సోవియట్‌ అధిగమించిందని, అమెరికా ప్రతిష్ట, నాయకత్వాన్ని ఖాతరు చేయకుండా ఉండేందుకు ఒక సాధనంగా వినియోగించుకోవచ్చని, గగన తలంలో ఉన్నతమైన మిలిటరీ సామర్ధ్యాన్ని ప్రదర్శించిన తొలిదేశంగా సోవియట్‌ అవతరించిందని అంగీకరించక తప్పలేదు.


డీప్‌సీక్‌ కంపెనీ 2023 చివరిలో ప్రారంభమైంది. అంతకు ముందు దాని అధినేత లియాంగ్‌ వెన్‌ఫెంగ్‌ ఒక వెంచర్‌ కాపిటల్‌ సంస్థను నడుపుతున్నాడు. దాని వాణిజ్య వ్యూహాలను రూపొందించేందుకు కృత్రిమ మేథను వినియోగించాడు. తరువాత కంప్యూటర్‌ ప్రాతిపదికగా పని చేసే రెండు కంపెనీలను పదేండ్ల క్రితం ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో తలెత్తిన ఆసక్తి నుంచి డీప్‌సీక్‌ యాప్‌ వెలువడిరది. ఇటీవలి కాలంలో చైనా తనదైన శైలిలో అమెరికన్లకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నది. ప్రపంచంలో అతి పెద్ద నౌకాదళ శక్తిగా రూపొందింది. ఆరవ తరం యుద్ధ విమానాన్ని ప్రయోగించింది. ఇప్పుడు కృత్రిమ మేథ రంగంలో షాకిచ్చింది. అమెరికా కంపెనీలు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే కేవలం 60లక్షల డాలర్లు, అంతగా ఆధునికం కాని, పరిమిత కంప్యూటర్‌ చిప్స్‌తో యాప్‌ను తయారు చేశారు. ఒక ఊరూపేరులేని సంస్థే ఆ ఘనతను సాధించటంతో సిలికాన్‌ వాలీలోని అగ్రశ్రేణి కంపెనీలు భయాలను వ్యక్తం చేశాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేతన పెంపుదల : కమ్యూనిస్టులు పోరాడితే సంస్థలకు వ్యతిరేకం-అదే కార్పొరేట్లు కోరితే….?

25 Saturday Jan 2025

Posted by raomk in CPI(M), Current Affairs, Economics, employees, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BRS, CHANDRABABU, fair wages, indian corporate, minimum wage, Narendra Modi Failures, Revanth Reddy, tdp

ఎం కోటేశ్వరరావు

బడ్జెట్‌ ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హల్వా వంటకాన్ని ప్రారంభించారు. అంటే బడ్జెట్‌ ప్రతుల ముద్రణకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో ప్రవేశపెట్టేంత వరకు సిబ్బంది ముద్రణాలయం నుంచి బయటకు వచ్చేందుకు వీల్లేదు. గతంలో ఏ వస్తువు మీద ఎంత పన్ను వేస్తారో, ఎంత తగ్గిస్తారో ముందుగానే వెల్లడి కాకూడదని అలా చేసేవారు. ఇప్పుడు పార్లమెంటుతో పని లేకుండానే జిఎస్‌టి కౌన్సిల్లో ముందుగానే అన్నీ నిర్ణయిస్తున్న తరువాత నిజానికి బడ్జెట్‌లో అంత రహస్యమేమీ ఉండదు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేబోయే ముందు కేంద్ర ప్రభుత్వం వివిధ తరగతులతో సంప్రదింపులు జరపటం ఒక నాటకం తాము కోరుకున్న వారికి పెద్ద పీట వేయటం చేదు వాస్తవం. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఆరు బడ్జెట్‌లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డును అధిగమించారు.మరో బడ్జెట్‌కు సిద్దం అవుతున్నారు. ఏ బడ్జెట్‌ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా కార్పొరేట్లకు పెద్ద పీటవేయటంలో కూడా ఆమె రికార్డు సృష్టించారు. తాజా బడ్జెట్‌ గురించి అన్ని తరగతులను చర్చలకు ఆహ్వానించారు గానీ రైతులను కావాలనే విస్మరించారు. ఎందుకంటే నరేంద్రమోడీకి ఇష్టం ఉండదు గనుక. అంచనాలకు దూరంగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు ఉంది. ఎందుకు అంటే జనాల వినియోగం తగ్గిపోవటం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. చిన్నప్పటి ఏడు చేపల కథను గుర్తుకు తెచ్చుకుంటే అందులో ఏడ్చిన పిల్లవాడు ఒక్కడైతే వర్తమాన కథలో ఎందరో. కానీ కేంద్రీకరణ అంతా వారిలో ఒకరైన వినియోగదారు మీదే ఉంది.


కమ్యూనిస్టులు వేతన పెంపుదల కోరగానే అనేక మంది విరుచుకుపడుతుంటారు. వీరికి పరిశ్రమలు,వ్యాపారాలు ఎలాపోయినా ఫరవాలేదు, కార్మికులకు వేతనాలు, అలవెన్సులు, బోనస్‌లు ఇంకా ఏవేవో పెంచాలంటారు, మొత్తం సంస్థలనే అప్పగించాలంటారు, వేరే పనేలేదని దుమ్మెత్తి పోస్తారు. నిజమే, వాటి గురించి చట్టాలు, నిబంధనలు ఉన్నవే కదా, వాటినే కమ్యూనిస్టులు అడుగుతున్నారు, దీనమ్మ జీవితం ! చట్టాలు అమలు జరగాలని, వాటి మేరకు పాలన జరగాలని కోరుకోవటం కూడా తప్పంటారా ? ఇది ప్రమాదకర పోకడ, తమదాకా వస్తే గానీ తెలియదు. కమ్యూనిస్టుల సంగతి సరే సాక్షాత్తూ కార్పొరేట్ల అధిపతులే వేతనాలు పెంచాలని, న్యాయంగా ఉండాలని చెబుతున్న సంగతి కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని వారికి ఎలా చెప్పాలి ! బెంగలూరు కేంద్రంగా పని చేస్తున్న వెంచర్‌ కాపిటల్‌ సంస్థ ఆరిన్‌, దాని చైర్మన్‌ మోహనదాస్‌ పాయ్‌. గతంలో ఇన్ఫోసిస్‌ కంపెనీ సిఎఫ్‌ఓగా పని చేశారు. ఆయన వేతనాల గురించి చెప్పిన మాటల సారం ఇలా ఉంది.(ఎకనమిక్‌ టైమ్స్‌ డిసెంబరు 19,2024) ‘‘ 2011లో ఇన్పోసిస్‌లో కొత్తగా చేరిన ఉద్యోగి ఏడాదికి రు.3.25లక్షలు పొందితే ఇప్పుడు రు.3.5 లేదా 3.75లక్షలు మాత్రమే తీసుకుంటున్నారు. పదిహేను శాతం ఎక్కువగా ఇస్తుండవచ్చు, పదమూడేండ్ల తరువాత దీన్ని ఎలా సమర్ధించాలి ? 2011లో కంపెనీ సిఇఓ ఎంత పొందారు ? ఇప్పుడు ఎంత ? న్యాయంగా ఉండాలి కదా ! మన వాణిజ్యం ద్రవ్యాశతో నీచకార్యాలకు పాల్పడే సంస్థలుగా(మెర్సినరీస్‌)గా మారాలని మనం కోరుకోకూడదు.లాభాల కోసం ప్రయత్నించటం తప్పుకాదు.తామెంతో న్యాయంగా ఉంటున్నట్లు యజమానులు చెప్పుకుంటున్నారు గనుక కంపెనీలు కూడా న్యాయంగా ఉండాలి. సిబ్బంది అత్యంత విలువైన సంపద అని చెబుతున్నారు గనుక దయచేసి చెప్పినట్లుగా చేయండి’’ అన్నార్‌ పాయ్‌. ఇదే ఒక కమ్యూనిస్టు చెబితే ఏ మీడియా అయినా దాన్ని అంత ప్రముఖంగా ప్రచురిస్తుందాప్రసారం చేస్తుందా ? అసలు వార్తగా అయినా ఇస్తుందా !

వేతన పెరుగుదల లేదా స్థంభన, నిజవేతనాలు పెరగకపోవటం గురించి తరచూ కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు మాట్లాడుతుంటాయి. కానీ ఇప్పుడు ఇతరులు మాట్లాడుతున్నారంటే నిజంగా వారికి కష్టజీవుల జీవితాల మీద ప్రేమ పుట్టుకువచ్చినట్లా ? ఇటీవలి కాలంలో కార్పొరేట్లకు ఆకాశాన్నంటే రీతిలో లాభాలు రావటం వెనుక నరేంద్రమోడీ అనుసరించే విధానాలు కారణం. అయితే ఆ మేరకు కార్మికులకు వేతనాలు పెరగకపోతే వినిమయ గిరాకీ తగ్గి మొదటికే మోసం వస్తుందని అదే మోడీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ స్వయంగా హెచ్చరించారు. పండుగల సమయాల్లో కూడా అమ్మకాల గురించి వాణిజ్యవేత్తలు పెదవి విరిచారు. ఇంటి దగ్గర భార్య ముఖాన్ని చూస్తూ ఎన్నిగంటలు గడుపుతారు, ఆదివారాలతో నిమిత్తం లేకుండా వారానికి 90గంటలు పని చేయాలని ఎల్‌ అండ్‌ టి అధిపతి సుబ్రమణ్యన్‌ సెలవిచ్చారు.పిల్లలు, పెద్ద వారిని వదిలేసి ఇద్దరూ 90 గంటలు పని చేయాలని అనలేదు. ఇన్పోసిస్‌ నారాయణ మూర్తి మరో 20 గంటలు తగ్గించి 70 అన్నారు. వీరందరికీ స్ఫూర్తి ఎవరంటే అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రస్తుతం జైలుపాలైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సక్‌ యోల్‌, అతగాడు 120 గంటలు చేయాలన్నాడు. యంత్రాలు కూడా నిరంతరం పని చేస్తే అరిగి చెడిపోతాయి గనుక కొంత విరామం, నిర్వహణ పనులు చేస్తారు. కార్మికులకు అదేమీ అవసరం లేదన్నది ఈ అపరమానవతా మూర్తుల ఉవాచ.

కంపెనీలు వేతనాలు సక్రమంగా ఇస్తున్నాయా అంటే లేదు, పని మాత్రం చేయాలి.నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో నమోదైన 500 కంపెనీలకు 2024 ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపు అనంతరం వచ్చిన లాభాలు 15 ఏండ్ల గరిష్టం అని అనంత నాగేశ్వరన్‌ చెప్పారు.జిడిపి వృద్ధి రేటు అంచనాలకంటే తగ్గినప్పటికీ ప్రపంచంలో అధికవృద్ధి మన దగ్గరే అని పాలకపార్టీ పెద్దలు తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ఉపాధి రహిత వృద్ధి, వేతన వృద్ధి బలహీనంగా ఉన్నపుడు కార్పొరేట్లకు లాభాలు తప్ప శ్రామికులకు ఒరిగేదేమీ లేదు.ద్రవ్యోల్బణం పెరుగుదలతో వారిలో కొనుగోలు శక్తి పడిపోతున్నది. ఐటి రంగంలో వేతన వృద్ధి దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే పడిపోయింది. దానికి తోడు రూపాయి విలువ పతనంతో ఎగుమతులు ప్రధానంగా ఉన్న ఆ రంగంలోని కంపెనీలకు లాభాలే లాభాలు. వివిధ రంగాల్లోని నిపుణులైన కార్మికులు(వారిని బ్లూ కాలర్‌ వర్కర్స్‌ అంటున్నారు) జీవన వేతనం కోసం నిరంతరం సతమతం అవుతున్నారు. వర్క్‌ ఇండియా అనే సంస్థ నివేదిక ప్రకారం దేశంలో 57శాతం మంది ఈ కార్మికుల వేతనాలు నెలకు రు.20 వేలకంటే తక్కువే, 29శాతం మంది 2040వేల మధ్య పొందుతున్నారు. కార్పొరేట్ల నిలయం దవోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ పెట్టుబడులను ఆకర్షించేందుకు పడుతున్న తాపత్రయం మంచిదే. కానీ కార్మికులకు ఆర్థిక న్యాయం, గౌరవాన్ని కలిగించేందుకు అవసరమైన వేతనాలు ఇప్పించేందుకు ఏం చేస్తున్నారు. రెండు చోట్లా కోట్లాది మందిగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కనీస అవసరాలు తీర్చే విధంగా దశాబ్దాలతరబడి సవరణకు నోచుకోని కనీసవేతనాల గురించి ఒక్క పలుకూ చేతా లేదు. వారి విజన్లలో కార్పొరేట్లు తప్ప కార్మికులకు చోటు లేదు.ఆకలి కేకలతో ఉన్న 80 కోట్ల మందికి మరికొన్ని సంవత్సరాలు ఉచితంగా ఐదేసి కిలోల ఆహార ధాన్యాలు ఇస్తానంటారు తప్ప చేసేందుకు ఉపాధి కల్పించి ఆత్మగౌరవంతో బతకటం విశ్వగురువు నరేంద్రమోడీ అజెండాలో లేదు.శ్రమజీవులు ముష్టిని కోరుకోరుకుంటారా ?

నైపుణ్యం పెంచినట్లు మోడీ పదేండ్లుగా చెబుతున్నారు.వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. రేవంత రెడ్డి విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి కబుర్లు చెబుతుంటే చంద్రబాబు నాయుడు నిపుణులు ఎంత మంది ఉన్నారో ముందు లెక్కతేలాలంటున్నారు.పదేండ్ల నుంచి నైపుణ్యాలు నిజంగా పెంచితే దానికి తగిన విధంగా వేతనాలు వాటికి అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగాలి, కానీ తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని రంగాల్లో ఆటోమేషన్‌ , దాంతో ఉత్పాదకత పెరుగుతోంది ఉపాధి తగ్గుతోంది, కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి. న్యాయమైన వేతనాలు చెల్లించటం కేవలం నైతిక విధాయకమే కాదు నిరంతర వినియోగ గిరాకీ పెరగటానికి కూడా అవసరమే అని అనంత నాగేశ్వరన్‌ నొక్కి చెప్పారు. కార్పొరేట్ల లాభదాయకతకార్మికుల సంక్షేమం మధ్య తేడాను తగ్గించకపోతే దీర్ఘకాలంలో దేశ ఆర్థిక స్థిరత్వానికి పెద్ద ముప్పు పొంచి ఉన్నట్లే. దేశంలో కాంటాక్టు కార్మికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది, పరిశ్రమలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు, కార్మికులను మాత్రం తాత్కాలికం పేరుతో నియమిస్తారు. ఐటి రంగంలో సిఇఓవేల వేతనాలు చూస్తే గత ఐదేండ్లలో 5060శాతం పెరగ్గా దిగువ 20శాతం సిబ్బంది వేతనాలు 2025శాతం మాత్రమే పెరిగినట్లు మోహనదాస్‌ పాయ్‌ చెప్పారు. దిగువ 50శాతం మంది సిబ్బంది పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతున్నారని కార్పొరేట్‌ సంస్థలు వారికి మెరుగైన వేతనాలివ్వాలని కూడా చెప్పారు. ఎక్కడైనా కమ్యూనిస్టులు లేదా కార్మిక సంఘాల నాయకత్వాన విధిలేని స్థితిలో కార్మికులు సమ్మెలకు దిగితే ఇంకేముంది సంస్థలు దివాలా అంటూ గుండెలు బాదుకొనే వారు పాయ్‌ చెప్పిందాన్ని ఏమంటారు ? దుకాణాలు, పరిశ్రమల్లో సహాయకులుగా ఉండే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు గత ఐదేండ్లలో ఒకటి రెండుశాతమే పెరిగినట్లు అధ్యయనాలు తెలిపాయి.

కార్పొరేట్లు సంపదల పంపిణీకి వ్యతిరేకం, కానీ పరిమితంగా వేతనాలు పెరగాలని కోరకుంటున్నాయి. ఎందుకని ? మనదేశంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జరుపుతున్నారు, తమ ప్రయాణాలు సుఖవంతం, వేగవంతంగా జరిపేందుకు వేస్తున్నారని జనం భావిస్తారు, దాన్లో వాస్తవం లేకపోలేదు, టోల్‌ రూపంలో తగిన మూల్యం చెల్లిస్తున్నారన్నది వేరే అంశం. అదొక్కటే కాదు, జనం సొమ్ముతో రోడ్లను ప్రభుత్వం వేస్తే కాంట్రాక్టులు తీసుకొని లాభాలు పొందేది, నిర్వహణను తీసుకొని టోలు వసూలు చేసుకొనేది ప్రయివేటు కంపెనీలే.ఆర్థిక వ్యవస్థ మందగించినపుడు అమెరికాలో పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి వివిధ కంపెనీల ఉత్పత్తులు పడిపోకుండా ఉద్దీపన ఇచ్చారు. మనదేశంలో జరుగుతున్నది కూడా అదే. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రాణాపాయంగా మారిన గర్భిణులను డోలీల ద్వారా ఆసుపత్రులకు చేర్చటం ఒకవైపు జర్రున జారే రోడ్ల మీద తుర్రుమంటూ ప్రయాణించే తీరు మరోవైపు చూస్తున్నాం. ఎందుకిలా ? ఎక్కడ లాభం ఉంటే అక్కడే పెట్టుబడులు. గతంలో కూడా కార్మికులకు యజమానులు వేతనాలిచ్చేవారు, అవి కుటుంబ సభ్యులు, వారు మరుసటి రోజు పనిచేయటానికి అవసరమైన శక్తినిచ్చేందుకు సరిపడా మాత్రమే. ఇప్పుడు ఉత్పాదకత ఎన్నో రెట్లు పెరిగి ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సరకులు, సేవలు అమ్ముడు పోవాలంటే తగినంత మంది వినిమయదారులు కూడా ఉండాలి. అందుకే అవసరమైతే జనాలకు సబ్సిడీలు ఇచ్చి ఆ మేరకు మిగిలే సొమ్ముతో కొనుగోలు చేయించేందుకు చూస్తున్నారు. ఇంత చేసినా వినియోగం పెరగటం లేదు. ఎక్కువకాలం ఇలాగే ఉంటే పరిశ్రమలు, వాణిజ్యాలను మూసుకోవాలి. అప్పుడు కార్పొరేట్ల పెట్టుబడి వృధా అవుతుంది. కరోనా సమయంలో ఉచితంగా నగదు బదిలీ కూడా జరగాలని కొందరు సూచించారు, ఇప్పుడు వేతనాలు పెంచాలని తద్వారా జనం జేబుల్లోకి డబ్బు చేరాలని తమ సరకులు, సేవలకు మార్కెట్‌ కల్పించాలని చెబుతున్నారు. కమ్యూనిస్టులు చెబుతున్నట్లుగా హక్కుగా కోరేందుకు మాత్రం అంగీకరించరు.అవసరమైతే అణచివేస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిత్తశుద్దిలేని శివపూజ : నంగనాచి క్షమాపణ చెప్పి ఎదురుదాడికి దిగిన మణిపూర్‌ సిఎం !

02 Thursday Jan 2025

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, CM Biren Singh, Manipur files, Manipur unrest, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మణిపూర్‌లో 2023 మే మూడవ తేదీన రెండు సామాజిక తరగతుల మధ్య పరస్పర అనుమానాలతో ప్రారంభమైన ఘర్షణ 2024లో కొనసాగి మూడో ఏడాదిలో ప్రవేశించింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు. పరిస్థితిని చక్కదిద్దటంలో విఫలమైనందుకు విచారంగా ఉందంటూ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఒక రోజు కూడా గడవక ముందే విమర్శకులపై ఎదురుదాడికి దిగటాన్ని బట్టి విచార ప్రకటనలో చిత్తశుద్ది లేదని స్వయంగా వెల్లడిరచుకున్నారు. మెయితీకుకీ, జో తెగల మధ్య ప్రారంభమైన ఘర్షణలు, భద్రతా దళాల చర్యల్లో కొందరు మహిళలపై అత్యాచారాలు, నగ్నంగా ఊరేగింపు, 260 మంది ప్రాణాలు కోల్పోయారు, అరవై వేల మంది నెలవులు తప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది గిరిజనులైన కుకీలే ఉన్నారు. మెయితీలందరినీ గిరిజనులుగా పరిగణించాలంటూ హైకోర్టు పెట్టిన చిచ్చు అక్కడ జరుగుతున్న దారుణ మారణకాండకు మూలం.రెండిరజన్ల పాలన సాగిస్తున్న బిజెపి ఆదిలోనే దానికి తెరదించి ఉంటే ఇంత జరిగేది కాదు. ఓట్ల రాజకీయంలో మెజారిటీ మెయితీలను ఓటు బాంకుగా మార్చుకొనేందుకు ఆ పార్టీ చూసింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో దానికి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. రెండు స్థానాల్లోనూ అది మట్టి కరచింది. తిరిగి మద్దతు పొందే ఎత్తుగడలో భాగమే పశ్చాత్తాప ప్రకటన ప్రహసనం అని చెప్పవచ్చు. నిజానికి అక్కడ జరిగిన ఉదంతాలను జరిగిందేదో జరిగింది మరిచిపోదాం అంటే సరే అనేవి కాదు.ఒక రోజు, ఒక ఘటన కాదు కదా ! మహిళల మీద అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించిన ఉదంతాన్ని మూసిపెట్టేందుకు చూసిన తీరు, అది వెల్లడైన తరువాత పార్లమెంటులో ప్రతిస్పందనలను మరచిపోవాలని బిజెపి చూడవచ్చు తప్ప చరిత్ర మరవదు, మణిపూరీయులు అసలు మరవరు ! మే మొదటి వారంలో గిరిజన మహిళలపై అత్యాచారం జరిగితే ఏ ఒక్క పత్రికా బయటపెట్టలేదు, అంతా సజావుగా ఉందని రాష్ట్రప్రభుత్వం నమ్మబలికింది. జూలై నెలలో నగ్నంగా తిప్పిన మహిళ వీడియో బయటకు వచ్చిన తరువాత మాత్రమే లోకానికి వెల్లడైంది. అందుకే ఆత్మశుద్ధి లేని యాచారమదియేల, భాండశుద్ది లేని పాకమేల, చిత్తశుద్ది లేని శివపూజలేల అన్న మహాకవి వేమనను ఈ సందర్భంగా బీరేన్‌ సింగ్‌ క్షమాపణల తీరు గుర్తుకు తెచ్చింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను పొందుపరచటం దుర్వినియోగానికి కాదు సద్వినియోగానికి మాత్రమే. చాకులు, కత్తుల తయారీకి చట్టం అనుమతిస్తున్నదంటే దాని అర్ధం పీకలు కోసేందుకు వినియోగించాలని కాదు. గతంలో సదరు ఆర్టికల్‌ను కాంగ్రెస్‌ దుర్వినియోగం చేసిన మాట నిజం. తమ పాలనలో దాన్ని ఒక్కసారైనా వినియోగిస్తే చెప్పండి అని బిజెపి ప్రశ్నించుతోంది.దుర్వినియోగం ఎంత తప్పో సద్వినియోగం చేయకపోవటం కూడా అంతకంటే పెద్దది. మణిపూర్‌లో బిజెపి రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. అదే ఏ ప్రతిపక్ష పార్టీనో అధికారంలో ఉంటే అలా ఉపేక్షించేదా ? అది రాజధర్మమేనా ! అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిన కారణంగా రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించారు. అక్కడ బిజెపికి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు రాజభోగాలు అనుభవించటం తప్ప చేసేదేమీ లేదు.వేతనాలు, అలవెన్సులు దండగ. ప్రపంచ మంతటా, మణిపూర్‌ చుట్టూ ప్రధాని నరేంద్రమోడీ విమానాల్లో తిరుగుతారు, సుభాషితాలు చెప్పి వస్తున్నారు తప్ప మణిపూర్‌ వెళ్లి భరోసా ఇచ్చేందుకు ఎలాంటి చొరవ లేదు.

కాంగ్రెస్‌ నేత జయరాం రమేష్‌ ఈ మాట అంటూ ప్రధాని నరేంద్రమోడీ కూడా మణిపూరీయులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దాన్లో తప్పేముంది ? దేశ చరిత్రలో అనేక మంది ప్రధానులు అనేక చట్టాలను చేశారు. కానీ మోడీ తెచ్చిన మూడు సాగు చట్టాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురుకావటంతో విధిలేక క్షమాపణలు చెప్పి మరీ వాటిని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ముందుకు తెచ్చిన అనేక అంశాల మీద మోడీ మౌనంగా ఉన్నట్లుగానే ఆయన ప్రధమ గణంలోని బీరేన్‌ సింగ్‌ మౌనంగా ఉంటే అదొక తీరు. కానీ ఎదురుదాడికి దిగారు. గతంలో కూడా మణిపూర్‌లో అనేక ఉదంతాలు జరిగాయి కదా వాటన్నింటికీ నాడు ప్రధానులుగా ఉన్న పివి నరసింహారావు, ఐకె గుజ్రాల్‌ క్షమాపణలు చెప్పారా అని ప్రశ్నించారు. ఆ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారు కూడా క్షమాపణలు చెప్పిన దాఖలా లేదు, మరి బీరేన్‌ సింగ్‌ ఎందుకు చెప్పినట్లు ? నాడు మణిపూర్‌లో జరిగిన ఉదంతాలను పాలకులు మూసిపెట్టలేదు, మోడీ ఏలుబడిలో ఎందుకు పాచిపోయేట్లు చేసినట్లు ? సామాజిక మాధ్యమంలో నగ్నంగా మహిళను తిప్పిన ఉదంతం వెలువడిన తరువాతనే కదా నోరు విప్పింది. గతంలో కాంగ్రెస్‌ చేసిన పాపాల ఫలితమే నేడు మణిపూర్‌ ఉదంతాలకు మూలం అని బీరేన్‌ సింగ్‌ ఆరోపించారు. ఇది కూడా తర్కానికి నిలిచేది కాదు. ముందే చెప్పుకున్నట్లు మెయితీలకు గిరిజన రిజర్వేషన్‌ కల్పించాలన్న హైకోర్టు సిఫార్సు తాజా పరిణామాలకు మూలం తప్ప మరొకటి కాదు. గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్న మెయితీల డిమాండ్‌ను ప్రస్తావించటం ద్వారా బీరేన్‌ సింగ్‌ ఆ సామాజిక తరగతి తెగనేత స్థాయికి దిగజారారు. ఒక వేళ అది సరైనదే అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎందుకు ప్రకటించరు ?కాంగ్రెసే అంతా చేసిందని చెబుతున్న బిరేన్‌ సింగ్‌ గతం ఏమిటి ? డెమోక్రటిక్‌ రివల్యూషనరీ పీపుల్స్‌ పార్టీని ఏర్పాటు చేసి దాని తరుఫున తొలిసారి ఎంఎల్‌ఏగా గెలిచారు. తరువాత దానిని 2004 లేదా 2005లో కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీలో కొనసాగారు. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదనే అసంతృప్తితో 2016లో బిజెపిలో చేరారు, 2017 ఎన్నికల్లో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఫిరాయింపులతో కొనసాగారు, తరువాత 2022లో మెజారిటీ సీట్లతో సిఎం అయ్యారు.

మణిపూర్‌ అంశం ప్రస్తావనకు వచ్చినపుడల్లా బిజెపి నేతలు గతంలో కాంగ్రెస్‌ అనుసరించిన వైఖరి, విదేశీ జోక్యం గురించి చెబుతూ తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చూస్తారు. సరిహద్దుల భద్రత, అక్రమ చొరబాట్లను అరికట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. పదేండ్ల నుంచి ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? 2017 నుంచి ఇదే బీరేన్‌ సింగ్‌ సిఎంగా ఉన్నారు. ఈ పెద్దమనిషి ఏం చేస్తున్నట్లు ? అంతా చేసి నేరం నుంచి తప్పించుకోవటం తప్ప క్షమాపణలో చిత్తశుద్ది లేదని మణిపూర్‌ గిరిజన సంఘాల ఐక్యతా కమిటీ బీరేన్‌ సింగ్‌ ప్రకటన మీద వ్యాఖ్యానించింది. ఒక మైనారిటీ తరగతి మీద జరిపిన మారణకాండ బాధ్యత నుంచి తప్పించుకొనేందుకు సిఎం చూశారని పేర్కొన్నది. కుకీజో గిరిజనుల పట్ల వివక్ష నిలిపివేయాలని మరో గిరిజన సంఘాల కమిటీ డిమాండ్‌ చేసింది.మణిపూర్‌లో సాయుధ బృందాలపై భద్రతా దళాలు జరిపిన దాడులలో స్టార్‌ లింక్‌ ఉపగ్రహ యాంటెన్నా, రౌటర్‌తో పాటు ఆధునిక రైఫిళ్లు దొరికినట్లు ప్రకటించారు. మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్‌ సేవలను అందించే ఈ ఉపగ్రహం సేవలను పొందటం మనదేశంలో నిషిద్దం, అయినప్పటికీ అవి దొరికాయంటే అనధికారికంగా సమాచారం అందుకున్నట్లు స్పష్టమౌతోంది. వీటిని మెయితీలు అధికంగా నివసించే ప్రాంతాలపై జరిగిన దాడుల సమయంలో సాయుధులు వదలివేసి పారిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే తమ ఉపగ్రహం నుంచి భారత్‌కు సంకేతాలు అందకుండా చేసినట్లు ఎలన్‌మస్క్‌ చెప్పుకున్నాడు. తమ దాడుల సందర్భంగా మయన్మార్‌లో తయారైన ఆయుధాలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్పారు. వాటిలో మయన్మార్‌ సైనికులు వాడే ఎంఏ4 రైఫిలు,ఎకె47 కూడా ఉంది. గత ఐదారు నెలల నుంచి సాయుధ బృందాలు తలదాచుకున్న ప్రాంతాలలో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌లు, మిలిటరీ యూనిఫారాలు తదితరాలను కూడా పట్టుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మయన్మార్‌ సరిహద్దులను దాటి ఉగ్రవాదులు రాకపోకలు సాగిస్తున్నా, ఆయుధాలు అక్రమ రవాణా జరుగుతుంటే సరిహద్దు భద్రతలను చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? స్టార్‌ లింక్‌ ఉపగ్రహం నుంచి ఉగ్రవాదులు, సాయుధ మూకలకు సంకేతాలు, సందేశాలు అందుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. భద్రమైన చేతుల్లో దేశం ఉందని నరేంద్రమోడీ గురించి గొప్పలు చెప్పుకోవటం తప్ప ఉపయోగం ఏముంది ?

తాజా ఘర్షణలు, దాడులకు కారణం 2023 ఏప్రిల్‌ 14న మణిపూర్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే మూలం. మెయితీ సామాజిక తరగతికి గిరిజన హోదా కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలంటూ తనకు లేని అధికారంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరువాత సుప్రీం కోర్టు ఈ చర్యను తప్పు పట్టింది.ఒక పెద్ద కుట్రలో భాగంగా అక్కడ పరిణామాలు జరిగినట్లు భావిస్తున్నారు. హైకోర్టు ఆదేశాన్ని నిరసిస్తూ మే 3వ తేదీన గిరిజన విద్యార్థులు నిరసన తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక వైపు నుంచి హింసాకాండ జరుగుతూనే ఉంది. మెయితీ`గిరిజనుల మధ్య పరస్పరం అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మయన్మార్‌లో 2021 మిలిటరీ తిరుగుబాటు సమయంలో అక్కడి నుంచి శరణార్ధులుగా వచ్చిన వారి గురించి మెయితీలు అభ్యంతరం తెలిపారు. ఇవన్నీ కూడా బిజెపి రెండిరజన్ల పాలనలోనే జరిగాయి. అందువలన గత కాంగ్రెస్‌ పాలనే కారణం అనటం తప్పించుకోచూడటం తప్ప మరొకటి కాదు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అక్కడ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ అనే ఒక ప్రాంతీయ పార్టీతో జత కట్టి చెరోసీటులో పోటీ చేసింది. రెండు సీట్లలో కాంగ్రెస్‌ గెలిచింది. రెండు సీట్లలో కాంగ్రెస్‌కు 47.59శాతం ఓట్లు రాగా నాగా పార్టీకి 18.87, బిజెపికి 16.58శాతం( మొత్తం 35.45శాతం) ఓట్లు వచ్చాయి. అరవై అసెంబ్లీ సెగ్మెంట్లలో 36 చోట్ల కాంగ్రెస్‌, 13 నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌, బిజెపి తొమ్మిది చోట్ల మెజారిటీ తెచ్చుకున్నాయి. మెయితీలు, గిరిజన సామాజిక తరగతులు రెండూ బిజెపిని ఓడిరచాయన్నది స్పష్టం. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకొని క్షమాపణల పర్వానికి తెరతీశారని చెప్పాల్సి వస్తోంది. మెయితీలను గిరిజనులుగా గుర్తించాలా లేదా అన్నది బిజెపి తేల్చటం లేదు. తమకు అన్యాయం చేస్తారని కుకీ, ఇతర గిరిజనులు అనుమానంగా చూస్తుంటే తమకు రిజర్వేషన్ల ఆశచూపి ఓటు బాంకుగా మార్చుకోవాలని చూసి ఎటూ తేల్చటం లేదని మెయితీలు అసంతృప్తితో ఉండటమే బిజెపి ఓటమికి కారణం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎత్తిన ఎర్ర జెండా దించం – అమెరికాకు ఏనాటికీ తల వంచం : అరవై ఆరేండ్ల క్యూబా సోషలిస్టు విప్లవం !

01 Wednesday Jan 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Che Guevara, Cuba Communist Party, Cuban Ration Book, Donald trump, Fidel Castro, Joe Biden, Sixty five years Socialist Cuba

ఎం కోటేశ్వరరావు

క్యూబా సోషలిస్టు విప్లవం 66వ ఏడాదిలో ప్రవేశించింది.1953 జూలై 26న నియంత బాటిస్టా పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన తిరుగుబాటు 1959 జనవరి ఒకటిన విప్లవోద్యమ నేత ఫిడెల్‌ కాస్ట్రో అధికారానికి రావటంతో ముగిసింది. ఐదు సంవత్సరాల ఐదు నెలల ఐదవ రోజు 1958 డిసెంబరు 31న బాటిస్టా ప్రభుత్వాన్ని కూల్చివేశారు. విప్లవాన్ని మొగ్గలోనే తుంచి వేసేందుకు వెంటనే అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని ప్రారంభించి, క్రమంగా తీవ్రతరం కావించింది. నాటి నుంచి నేటి వరకు అక్కడ ఎనుగు పార్టీ(రిపబ్లికన్‌)గాడిద పార్టీ(డెమోక్రటిక్‌) ఎవరు అధికారంలో ఉన్నా మానవాళి చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ దిగ్బంధనం కొనసాగుతూనే ఉంది. అమెరికాకు క్యూబా కూతవేటు దూరంలో ఉంది. రెండు దేశాల సమీప భూభాగాల మధ్య దూరం కేవలం 90 మైళ్లు లేదా 145 కిలోమీటర్లు మాత్రమే. కరీబియన్‌ సముద్ర మెక్సికో అఖాతం, అట్లాంటిక్‌ మహాసముద్రం కలిసే ప్రాంతంలో ఉన్న కోటీ 12లక్షల జనాభాతో ప్రధాన భూభాగానికి అనుబంధంగా 4,195 చిన్నా, పెద్ద దీవులు ఉన్న దేశం. నవరంధ్రాలు మూసివేసి ప్రాణాలు తీసినట్లుగా అన్ని రకాల దిగ్బంధాలతో అక్కడి జనాన్ని మాడిస్తే వారు తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ ఒడిలో కూర్చుంటారని 65 ఏండ్లుగా అమెరికా చూస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యానికి తలొగ్గకుండా ఆత్మగౌరవంతో పితృదేశమా ( కొన్ని దేశాలు పితృసామిక వ్యవస్థను అనుసరించి అలా పిలుచుకుంటాయి.దేశ భక్తిలో ఎలాంటి తేడా ఉండదు) లేక మరణమా అన్న ఆశయంతో ముందుకు సాగుతున్నది.


క్యూబా విప్లవానికి ఒక ప్రత్యేకత ఉంది. కమ్యూనిస్టుల నాయకత్వాన విముక్తి పోరాటాలు జరగటం అధికారానికి రావటం సాధారణంగా జరిగింది. అదే క్యూబాలో అధికారానికి వచ్చిన తరువాత కాస్ట్రో తదితర విప్లవకారులు కమ్యూనిస్టులుగా మారారు.1952లో ఎన్నికల ద్వారా పాలకులను ఎన్నుకోవటాన్ని సహించని మిలిటరీ జనరల్‌ ఫల్లునేసియో బాటిస్టా కుట్రద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని వ్యతిరేకించిన ప్రజాస్వామికవాదుల్లో కాస్ట్రో ఒకరు. కొంత మంది కోర్టులో సవాలు చేసి బాటిస్టాను గద్దె దింపాలని చూసి విఫలమయ్యారు.తరువాత 1953 జూలై 26న సోదరుడు రావుల్‌తో కలసి కాస్ట్రో తదితరులు మంకాడా మిలిటరీ బారక్స్‌ మీద విఫల దాడి చేశారు. దాంతో వారందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అక్కడే జూలై 26 ఉద్యమం పేరుతో సంఘటితమయ్యారు. కేసు విచారణ సందర్భంగా కోర్టులో రెండు గంటల పాటు కాస్ట్రో తిరుగుబాటు కారణాలను వివరించి దేశమంతటా ప్రాచుర్యం పొందారు.పౌరుల్లో వచ్చిన సానుభూతిని చూసిన తరువాత తిరుగుబాటు చేసిన వారిని విడుదల చేసి ప్రజామద్దతు పొందాలని బాటిస్టా క్షమాభిక్ష ప్రకటించాడు. విప్లవకారులు మెక్సికో, తదితర దేశాలకు ప్రవాసం వెళ్లి 1956లో తిరిగి గ్రాన్మా అనేక నౌకలో తిరిగి వచ్చారు.(తరువాత కాలంలో ఆ నౌక పేరుతోనే పత్రిక నడుపుతున్నారు) మెక్సికోలో పరిచయమైన చే గువేరా కూడా వారితో వచ్చాడు. బాటిస్టా మిలిటరీ వారిని ఎదుర్కోవటంతో సియెరా మెస్ట్రా అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ బాటిస్టాను వ్యతిరేకించే పాపులర్‌ సోషలిస్టు పార్టీ వంటి వారందరినీ కూడా గట్టి దాడులకు దిగారు.చివరికి 1958 డిసెంబరు 31న విజయం సాధించటంతో బాటిస్టా దేశం వదలి పారిపోయాడు.1959జనవరి ఒకటిన కాస్ట్రో అధికారానికి వచ్చాడు.జూలై 26 ఉద్యమం పేరుతో ఉన్న వారు కీలక పాత్ర పోషించారు. తరువాత మార్క్సిజంలెనినిజాన్ని ఆమోదించి 1965 అక్టోబరులో క్యూబా కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు.అయితే విప్లవంలో కీలక ఘట్టమైన జూలై 26వ తేదీని విప్లవ దినంగా పరిగణించారు.

మేం వైద్యులను ఎగుమతి చేస్తాం తప్ప బాంబులను కాదని అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ఎయిర్స్‌ నగరంలో 2003లో క్యూబా అధినేత ఫిడెల్‌ కాస్ట్రో చెప్పాడు.మా దేశం ఇతర దేశాల పౌరుల మీద బాంబులు వేయదు లేదా నగరాల మీద బాంబులు వేసేందుకు వేలాది విమానాలను పంపదు. మాకు అణు, రసాయన లేదా జీవ ఆయుధాలు లేవు. ప్రాణాలను రక్షించేందుకు లక్షలాది మంది వైద్యులను మా దేశంలో తయారు చేశాము. మనుషులను చంపే బాక్టీరియా, వైరస్‌, ఇతర పదార్ధాలను సృష్టించేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులను తయారు చేయాలనే అవగాహనకు భిన్నంగా మేము పని చేస్తున్నాము అని కాస్ట్రో ఆ సభలో చెప్పాడు. హవానా నగరంలో నిర్వహిస్తున్న లాటిన్‌ అమెరికా మెడికాలేజీ 25వ వార్షికోత్సవాన్ని నవంబరు నెలలో నిర్వహించారు. ‘‘జీవిత సంరక్షకులుమెరుగైన ప్రపంచ సృష్టికర్తలు ’’ అనే ఇతివృత్తంతో ఒక సదస్సును ఏర్పాటు చేశారు. సామాన్య జనం కోసం వైద్యం చేయాలనే లక్ష్యంతో అనేక దేశాల నుంచి విద్యార్థులు అక్కడ చేరుతున్నారు. కరీబియన్‌ ప్రాంతంలోని దేశాలకు తరచూ వస్తున్న హరికేన్‌ల వలన జరుగుతున్న అపార నష్టాన్ని చూసిన తరువాత అలాంటి సమయాల్లో వైద్యుల అవసరాన్ని గుర్తించి ఈ కాలేజీని ప్రారంభించారు. మొత్తం లాటిన్‌ అమెరికా, కొందరు ఆఫ్రికా, అమెరికా నుంచి కూడా వచ్చి చేరుతున్నారు.


గత పాతికేండ్లలో 120దేశాలకు చెందిన వారు 31,180 మంది వైద్యులుగా తయారు కాగా ప్రస్తుతం 1,800 మంది విద్యార్ధులున్నారు. హవానాకు పశ్చిమంగా ఉన్న నౌకా కేంద్రాన్ని కాలేజీగా మార్చారు. మొదటి రెండు సంవత్సరాలు అక్కడ ఆసుపత్రులతో అవసరం లేని బోధన చేస్తారు. నాలుగు సంవత్సరాల పాటు క్యూబాలోని బోధనా ఆసుపత్రులలో శిక్షణ ఇస్తారు. ఈ కాలేజీ విద్యార్థి, ప్రస్తుతం హొండూరాస్‌లో శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేస్తున్న లూథర్‌ కాస్టిలో హారీ పాతికేండ్ల వార్షికోత్సవంలో మాట్లాడుతూ అసాధ్యాలకు వ్యతిరేకంగా పోరాడినపుడే సుసాధ్యాలతో లబ్దిపొందుతామని, ప్రతి ఒక్కరూ క్యూబా విప్లవ రాయబారిగా పని చేస్తూ ప్రపంచంలో అతి గొప్ప శాస్త్రీయ సంస్థను ఏర్పాటు చేయాలని ఆకాంక్షించాడు.హరికేన్‌ కారణంగా చేపడుతున్న సహాయ చర్యల కారణంగా ఈ ఉత్సవానికి హాజరు కాలేకపోయిన క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ సందేశాన్ని పంపారు. మీ మీ దేశాలలో జీవితాల, ఆరోగ్య సంరక్షకులుగా తయారైన మిమ్మల్ని చూసి ఫిడెల్‌ కాస్ట్రో బతికి ఉంటే ఎంతో సంతోషించేవారన్నాడు. మూడంచెల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భాగంగా 69 వైద్య ప్రత్యేక చికిత్స కేంద్రాలు, 149 ఆసుపత్రులు, 451పాలిక్లినిక్‌లు, 11,315 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నాలుగు లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతివెయ్యి మందికి మొత్తం 80వేల మందిఒక వైద్యుడు లేదా వైద్యురాలు ఉన్నారు. పదమూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 2,767 వైద్య పరిశోధనా ప్రాజెక్టులు, 82క్లినికల్‌ ప్రయోగాలు నడుస్తున్నాయి. నూటఅరవై దేశాలలో ఆరులక్షల మంది క్యూబన్లు వైద్య సేవలు అందిస్తున్నారు.


క్యూబా సర్కార్‌ జనానికి అందిస్తున్న సబ్సిడీ ఆహార పధకాన్ని అదిగో రద్దు చేస్తున్నారు ఇదిగో రద్దు చేస్తున్నారంటూ గత రెండు దశాబ్దాలుగా అమెరికా, దాని ఉప్పు తింటున్న మీడియా కథనాలు రాస్తూనే ఉంది. కొన్ని సందర్భాలలో దుర్వినియోగం జరిగినపుడు పథకాన్ని సవరించటం గురించి మాట్లాడారు తప్ప ఎత్తివేత గురించి కాదు. ఉదాహరణకు ప్రతినెలా 18 ఏండ్లు దాటిన వారికి ఆహార వస్తువులతో పాటు 80 సిగిరెట్లు కూడా నామమాత్ర ధరలకు సరఫరా చేసే వారు. కొందరు పొగతాగని వారు వాటిని తీసుకొని బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకొనే వారు. ఇలాంటి వాటిని అరికట్టాలను కోవటం సబ్సిడీ ఎత్తివేత కిందకు రాదు. సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలు కూలిపోయిన తరువాత క్యూబా అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నమాట నిజం. అవి ఉనికిలో ఉన్నపుడు కూడా ఉన్నదేదో కలసి తింటాం లేకుంటే కాళ్లు ముడుకు పడుకుంటాం తప్ప అమెరికా ముందు చేయిచాచం అని ఫిడెల్‌ కాస్ట్రో దశాబ్దాల క్రితమే చెప్పారు. దానిలో భాగంగానే ఆహార సబ్సిడీ`పంపిణీ పధకాన్ని ప్రారంభించారు. దాన్నే రేషన్‌ బుక్‌ అని పిలుస్తున్నారు. ప్రతి ఏటా ఒక పుస్తక రూపంలో కూపన్లు ఇస్తే దుకాణాల్లో వాటితో సరకులు తీసుకుంటారు.1962 నుంచి ఈ పథకం అమల్లో ఉంది.ప్రతి ఒక్కరికీ ప్రతినెలా బియ్యం, బీన్స్‌, బంగాళాదుంప, అరటికాయలు, బఠాణీ గింజలు, కాఫీ, వంటనూనె, గుడ్లు, మాంసం, కోడి మాంసం, పిల్లలకు పాలు సరఫరా చేస్తున్నారు.2010వరకు సబ్సిడీ ధరలకు సిగిరెట్లు కూడా సరఫరా చేశారు.ఈ మధ్య పోషకాహార లేమివలన క్యూబాలో మరణాల రేటు 2022 నుంచి 2023కు 74.42శాతానికి పెరిగిందంటూ కొన్ని పత్రికలు పతాక శీర్షికలతో వార్తలను ఇచ్చాయి.అక్కడ సంభవిస్తున్న మరణాలకు కారణాలలో పోషకాహార లేమి 20వదిగా ఉంది. ఇంతకూ పైన పేర్కొన్న సంవత్సరాలలో మరణించిన వారి సంఖ్య 43 నుంచి 75కు పెరిగింది(74.42శాతం). కోటి మంది జనాభా, అష్టకష్టాలు పడుతూ,80శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్న అక్కడ మరణాలు అవి. ప్రపంచానికి ఆహారాన్ని అందచేసే స్థితిలో ఉన్నామని మన ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన మన దేశంలో 140 కోట్ల జనాభాలో పోషకాహార లేమి కారణంగా ఎందరు మరణిస్తున్నారో తెలుసా ! హిండ్‌రైజ్‌ డాట్‌ ఓఆర్‌జి సమాచారం ప్రకారం మనదేశంలో రోజుకు ఏడువేల మంది మరణిస్తున్నారు. ఐదేండ్లలోపు వయస్సున్న పిల్లల మరణాలలో 69శాతం పోషకాహార లేమి కారణమని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సుప్రీం కోర్టుకు 2022లో తెలిపింది. ఒక సోషలిస్టు వ్యవస్థకు అంతకంటే మెరుగైనది సర్వేజనా సుఖినో భవంతు సమాజం ఉంది అనుకుంటున్న మన వ్యవస్థకు ఉన్న అంతరం ఏమిటో వేరే చెప్పాలా ?


మన దేశంలో ఆహార భద్రతా చట్టం అమల్లో ఉంది. దానిలో భాగంగా 80 కోట్ల మందికి గతంలో సబ్సిడీ బియ్యం లేదా గోధుమలు ఇవ్వగా ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. అయినా మనదేశం 2024 ప్రపంచ ఆకలి సూచిక 127దేశాలలో 105వదిగా ఉంది. పదేండ్ల అచ్చేదిన్‌లో ఆకలి తీవ్రంగా ఉన్న దేశాల సరసన మనదేశాన్ని ఉంచిన ఘనత విశ్వగురువు నరేంద్రమోడీకి దక్కింది. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 171దేశాల జాబితాలో మన దేశంలో పోషకాహార లోపం ఉన్నవారు 2011లో 18.35 కోట్ల మంది ఉంటే, 2023లో 19.46 కోట్ల మందికి పెరిగారు. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ. పోషకాహార లేమి నామమాత్రంగా ఉన్నప్పటికీ ఆయా దేశాలలో 2.5శాతం మంది ఉన్నట్లు లెక్కిస్తారు. అలాంటి దేశాల జాబితాలో చైనా, క్యూబా ఇంకా అనేక దేశాలు ఉన్నాయి. మనదేశంలో పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ దాన్ని గుర్తించటానికి మోడీ సర్కార్‌ ససేమిరా అంటున్నది.క్యూబా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారటానికి, ఇతర సమస్యలకు కారణం అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనమే. ఆంక్షలను తొలగించాలని ప్రతి ఏటా ఐరాసలో తీర్మానం పెట్టటం, అమెరికా, దాని తొత్తు ఇజ్రాయెల్‌ వ్యతిరేకించటం మిగిలిన దేశాలన్నీ సమర్థించటం తెలిసిందే. అయితే ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానాలకు పూచికపుల్ల పాటి విలువ కూడా లేదు. వాటిని దిక్కరించిన దేశాలను చేసేదేమీ లేదు. అమెరికా దిగ్బంధనం వలన ప్రపంచంలో మరోదేశమేదీ క్యూబా మాదిరి నష్టపోవటం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది ? ప్రపంచ మంతటా కమ్యూనిజాన్ని అరికడతానంటూ బయలు దేరిన అమెరికన్లకు తమ పెరటితోట వంటి క్యూబాలో కమ్యూనిస్టులు అధికారంలో ఉండటం అవమానకరంగా మారింది. గతంలో డోనాల్డ్‌ ట్రంప్‌ అమలు జరిపిన కఠిన ఆంక్షలను సడలిస్తానని జో బైడెన్‌ ప్రకటించినప్పటికీ అలాంటదేమీ జరగలేదు, పదవీ కాలం ముగియనుంది, తిరిగి ట్రంప్‌ గద్దె నెక్కనున్నాడు. అమెరికా దిగ్బంధనం కారణంగా ప్రతి నెలా క్యూబా 42 కోట్ల డాలర్లు నష్టపోతున్నదని అంచనా, ఎన్నాళ్లీ దుర్మార్గం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి విలువ 101కి పతనం ! జవాబుదారీతనపు జాడలేదు !! గుడ్లప్పగించి చూస్తున్న నరేంద్రమోడీ !!!

28 Saturday Dec 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Donald trump, Inflation, Narendra Modi Failures, RSS, Rupee depreciation, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


రూపాయి పతనంలో రికార్డుల మీద రికార్డులను బద్దలు కొడుతుంటే ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ మాటా పలుకూ లేకుండా గుడ్లప్పగించి చూస్తున్నది. ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? మోడీ అంటే విశ్వగురువు గనుక ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోరని, ప్రపంచ రాజకీయాలను చక్కపెడుతున్నారని అనుకుందాం. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌, ఇతర పెద్దలు ఏమయ్యారు. శుక్రవారం నాడు 85.80వరకు పతనమై 85.48దగ్గర స్థిరపడిరది, అంతకు ముందు రోజు 85.27కు దిగజారింది. నరేంద్రమోడీ గురించి చరిత్రలో ఇప్పటికే అనేక వైఫల్యాలు నమోదయ్యాయి.ఒకసారి చెప్పిన మాట మరోసారి చెప్పరు, వైఫల్యం గురించి వాటి వలన జనానికి కలిగిన ఇబ్బందులకు విచార ప్రకటన లేదు. రూపాయి పతనం గురించి తాను మాట్లాడిన మాటలను జనం మరచిపోయి ఉంటారన్న గట్టి నమ్మకం కారణంగానే మాట్లాడటం లేదు. బిజెపి ప్రచార కమిటీ నేతగా 2014 ఎన్నికలకు ముందు రూపాయి పతనాన్ని కాంగ్రెస్‌పై దాడికి ఒక ఆయుధంగా వాడుకున్నారు. విలువలువలువల గురించి నిత్యం తమ భుజాలను తామే చరుచుకొనే సంఘపరివార్‌కు చెందిన వ్యక్తి నుంచి అనేక మంది జవాబుదారీతనాన్ని ఆశించారు, నమ్మారు.వారందరూ కూడా మౌనంగా ఉంటున్నారు, దేశం ఏమై పోతున్నా పట్టని ఈ బలహీనత ఎందుకు ?

రూపాయి విలువ పతనమౌతుంటే గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమన్నారో తెలుసా ! ‘‘ ఆర్థికం లేదా రూపాయి విలువ పతనం గురించి ప్రభుత్వానికి ఎలాంటి చింత లేదు, తన కుర్చీని ఎలా కాపాడుకోవాలన్నదే దాని ఏకైక ఆందోళన. ఈ కారణంగా దేశం ఈ రోజు ఆశాభంగం చెందింది. గత మూడు నెలలుగా పతనం అవుతున్న రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దాన్ని అవకాశంగా తీసుకుంటాయి. గడచిన ఐదు సంవత్సరాలుగా ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెబుతున్నారు తప్ప జరిగిందేమీ లేదు ’’ (2013 ఆగస్టు 20, బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో పిటిఐ వార్త).మోడీ ఈ ఆరోపణలు చేసిన రోజు డాలరుకు రూపాయి విలువ 64.11గా ఉంది, తరువాత కొంత మేరకు పెరిగినా గత పదేండ్లలో మొత్తం మీద చూసినపుడు 2024 డిసెంబరు 27వ తేదీ 85.80కు దిగజారింది. పార్లమెంటులో బిజెపికి, దానికి వంతపాడుతున్న పార్టీల బలాన్ని బట్టి 2029వరకు మధ్యలో అనూహ్య రాజకీయ సంక్షోభం ఏర్పడితే తప్ప ప్రధానిగా మోడీ పదవికి ఎలాంటి ఢోకా ఉండదు. పదేండ్ల క్రితం రూపాయి విలువ పతనం గురించి గుండెలు బాదుకొన్న నరేంద్రమోడీ పదిహేనేండ్లు అధికార వ్యవధిని పూర్తి చేసుకొనే నాటికి 101కి పతనం అవుతుందని ద్రవ్యవ్యాపార నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతన చరిత్రను చూసినపుడు ఇంకా ఎక్కువ మొత్తంలో దిగజారేందుకే అవకాశం ఉంది తప్ప బలపడే లక్షణాలు కనిపించటం లేదు. 2024 డిసెంబరు 27న రూపాయి 85.80కి దిగజారి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ పతనం కొందరికి మోదం ఎందరికో ఖేదాన్ని తెస్తుంది. ఎగుమతులు చేసే వారికి, విదేశాల నుంచి మనదేశానికి డబ్బు పంపేవారికి సంతోషం కలిగిస్తే, విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల భారంతో కోట్లాది సామాన్యులకు జేబు గుల్ల అవుతుంది.అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయిన నవంబరు ఐదున రూపాయి విలువ 84.11 ఉంటే డిసెంబరు చివరి వారంలో ముందే చెప్పుకున్నట్లు 85.80ని తాకింది. జనవరి 20న అధికారాన్ని స్వీకరించే సమయానికి, తరువాత ఏమౌతుందో తెలియదు. రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబాంకు రంగంలోకి దిగి విదేశీ కరెన్సీ విక్రయాలకు పాల్పడి స్థిరంగా ఉండేట్లు చేస్తుంది. ఇప్పుడూ చేసింది, గతంలోనూ చేసింది, అయినప్పటికీ మొత్తం మీద పతనం ఆగటంలేదు. దేశం వెలిగిపోతోంది అని బిజెపి చెప్పుకున్న వాజ్‌పాయి ఏలుబడిలో 2000 సంవత్సరంలో రూపాయి విలువ 43.35 ఉంది. అది మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చిన 2004లో 45.10, మోడీ పదవీ స్వీకారంచేసిన 2014లో 62.33గా ఉంది. ఇప్పుడు 85.80 దగ్గర ఉంది.1947లో స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ డాలరుకు 3.30 ఉంది. మోడీ అధికారానికి వస్తే ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవంతో రూపాయిని 45కు తిరిగి తీసుకువస్తారని అనేక మంది పండితులు జోశ్యాలు చెప్పారు. గల్లా పట్టుకు అడుగుదామంటే వారెక్కడా ఇప్పుడు మనకు కనిపించరు. మోడీ నోరుతెరవరు.

రూపాయి పతనంతో జన జీవితాలు అతలాకుతలం అవుతుంటే ఇతర కొన్నింటితో పోల్చితే మన కరెన్సీ పతనం తక్కువ అని అధికారపార్టీ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. వీళ్లను ఏమనాలో అర్ధం కాదు. దాని వలన మనకు ఒరిగేదేమిటి ? పెట్రోలు, డీజిలు లేకపోతే క్షణం గడవదు. వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నెలలో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా ధర రవాణా ఖర్చులను కూడా కలుపుకొని 89.44 డాలర్లు, అది నవంబరు నెలలో 73.02కు తగ్గింది.తొమ్మిది నెలల సగటు చూసినా 79.20 డాలర్లు. ఈ మేరకు పెట్రోలు, డీజిలు ధరలను ఎందుకు తగ్గించలేదు, కారణం జనం పట్టించుకోకపోవటమే. నిలబెట్టి జేబులు కత్తిరిస్తున్నా మౌనంగా భరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గిస్తాం అన్న విధానాన్ని ఎందుకు పక్కన పెట్టినట్లు ? రూపాయి విలువ పతనంతో వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన ఎగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి మన విదేశీ వాణిజ్య లోటు తగ్గుతున్నదా అంటే ఆ జాడలేదు. రూపాయి పతనం ఎంత పెరిగితే అంతగా ద్రవ్యోల్బణంధరల పెరుగుదల ఉంటుంది. డాలర్లు, ఇతర కరెన్సీలను రప్పించేందుకు విదేశాల్లో ఉన్న భారతీయుల బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేపు పెంపుదలకు ఆర్‌బిఐ అనుమతిస్తున్నది. అమెరికాలో వడ్డీ రేటు కోత, రూపాయి విలువ పతనం కారణంగా విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళుతున్నాయి. మన స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలటానికి ఇదొక కారణం. ముడిచమురు, ఎలక్ట్రానిక్స్‌, పరిశ్రమల యంత్రాల దిగుమతులకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. వస్తు ఎగుమతిదార్లు, ఐటి రంగ కంపెనీలు ప్రధాన లబ్దిదారులుగా ఉంటున్నాయి.

రూపాయి విలువ పతనం చెందినప్పుడల్లా పండితుల జోశ్యాలు చెబుతారు. అవి కూడా పరిస్థితి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే అనే ప్రాతిపదిక మీద చెప్పేవే. లాంగ్‌ ఫోర్‌కాస్ట్‌ డాట్‌ కాం గతంలో చెప్పిన జోశ్యం ప్రకారం 2025 జనవరిలో 79.79తో ప్రారంభమై ఏడాది చివరికి 86.97గా ఉంటుందని పేర్కొన్నది. జనవరిలో రూపాయి విలువ పెరగాలి. ఏఐ పికప్‌ అనే సంస్థ 2027 నాటికి రూపాయి 74.97కు బలపడుతుందని చెప్పింది. అయితే 2024లో రికార్డు పతనం 84.35 తరువాత 2030లో 72.6కు బలపడుతుందట.కృత్రిమ మేథ జోశ్యాలు తప్పు కావచ్చని కూడా కొందరు హెచ్చరించారు. రానున్న సంవత్సరాలలో ఏడాది ప్రారంభం, చివరిలో రూపాయి ముగింపు విలువలు దిగువ విధంగా ఉంటాయి. దిగువ పట్టికలో మొదటి వరుస జోశ్యం లాంగ్‌ ఫోర్‌కాస్ట్‌ డాట్‌ కాంది కాగా, రెండవ వరుసలో ఉన్నది వాలెట్‌ ఇన్వెస్టర్‌ డాట్‌కాం అంకెలుగా గమనించాలి
.ఏడాది–జనవరి– డిసెంబరు
2024– RRRR– 85.06
2025– 85.27– 86.67
2025II 84.62II 88.13
2026II 86.27II 87.16
2026II 87.89II 91.40
2027II 88.60II 96.78
2027II 91.16II 94.66
2028II 96.09II 98.68
2028II 94.47II 97.92
2029II 97.41II RRRRR
2029II 97.77II 101.20
ఇవే గాక అనేక సంస్థలు తమ తమ అంచనాలను చెబుతున్నాయి. ఎవరు చెప్పినా అంకెల తేడాలున్నప్పటికీ పతనం వాస్తవం.రూపాయి పతనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బిఐ చెబుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించటం లేదు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో డాలరుకు 84 దాటకుండా చూడాలని లక్ష్యంగా చెప్పుకున్నప్పటికీ ఇప్పటికే 86వరకు రావటాన్ని చూశాము.రోగనిరోధక శక్తి సన్నగిల్లితే అన్ని రకాల జబ్బులు వస్తున్నట్లు కరెన్సీ విలువ పతనం కూడా ఆర్థిక వ్యవస్థకు అలాంటిదే. ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తటానికి మూడు ప్రధాన కారణాలను చెబుతున్నారు. విదేశీ మదుపుదార్లు(ఎఫ్‌ఐఐ) స్టాక్‌, రుణ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కు తీసుకొని ఎక్కడ లాభాలు వస్తే అక్కడికి తరలిస్తుండటం. అవి డాలర్ల రూపంలో ఉండటంతో వాటికి డిమాండ్‌ పెరిగి రూపాయి విలువ తగ్గుతున్నది. అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నిక, అక్కడ వడ్డీ రేట్లను పెంచటంతో మదుపుదార్లందరూ ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు ఎగబడుతున్నారు. వారి చెలగాటం మన వంటి ఆర్థిక వ్యవస్థలకు ప్రాణ సంకటం. మోడీని ఆయన భక్తులు విశ్వగురువుగా కీర్తిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌ సంక్షోభం, మధ్య ప్రాచ్యంపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, తమకు లొంగని దేశాలపై ట్రంప్‌ బెదిరింపులు, వాణిజ్య పోరు వంటి అనేక సమస్యలు కూడా అనేక దేశాల కరెన్సీల విలువ పతనానికి కారణం అవుతున్నాయి. వాటిని పరిష్కరించటంలో ఎవరూ కూడా మోడీ ప్రమేయాన్ని కోరటం లేదు.

రూపాయి పతనం వలన లబ్ది కంటే మనకు నష్టమే ఎక్కువ.ద్రవ్యోల్బణం, దాంతో ధరల పెరుగుదలకు దారితీస్తుంది.దీని వలన కొనుగోలు శక్తి తగ్గుతుంది. చమురు దిగుమతి బిల్లు పెరిగి అందరి మీదా భారం పెరుగుతుంది. విదేశాల నుంచి రుణాలు పొందిన కంపెనీల మీద భారం పెరుగుతుంది, పరోక్షంగా పెట్టుబడుల మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. రూపాయి విలువ పతనం కాకుండా కాపాడేందుకు ఆర్‌బిఐ తన వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యంలో కొన్ని డాలర్లను విక్రయిస్తుంది, దాంతో వాటి సరఫరా పెరిగి రూపాయి విలువ స్థిరంగా ఉంటుందన్నది ఆశ. అయితే తాత్కాలికంగా కొద్ది రోజులు అలా ఉన్నప్పటికీ పతనం సాగుతూనే ఉంది. అదే విధంగా రూపాయల కొనుగోలు, వడ్డీల సవరణ ద్వారా విలువను పెంచేందుకు చూసినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. గడచిన ఇరవై సంవత్సరాల్లో సగటున ఏటా 3.2శాతం పతనం అవుతున్నది.ట్రంప్‌ ఏలుబడి నాలుగేండ్ల కాలంలో 810శాతం వరకు రూపాయి పతనం చెందవచ్చని ఎస్‌బిఐ పరిశోధన విశ్లేషణ తెలిపింది. కనీసం ఈ పతనాన్ని అయినా నరేంద్రమోడీ నివారించగలరా ? వంది మాగధుల భజనలతో కాలక్షేపం చేస్తారా ? రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి మాదిరి ఉంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మసీదుల కింద శివలింగాల వెతుకులాట : మూడేండ్లుగా అఫిడవిట్‌ సమర్పించని కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మాటలపై నరేంద్రమోడీ మౌనానికి అర్ధమేమిటి !

24 Tuesday Dec 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

#Hindutva, Ayodhya Ramalayam, BJP, CPI(M), Hinduism, Hinduthwa, Mohan Bhagwat, Narendra Modi Failures, RSS, shivling under every mosque


ఎం కోటేశ్వరరావు

మందిరాల మీద మసీదులు కట్టారంటూ వెనుకా ముందూ చూడకుండా ముందుకు తెస్తున్న వివాదాలను ఆపాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ తాజాగా సుభాషితం చెప్పారు. పూనాలో 2024 డిసెంబరు 19వ తేదీన ‘‘ విశ్వగురువు భారత్‌ ’’ అనే అంశం మీద సహజీవన వ్యాఖ్యాన మాల ప్రసంగాల పరంపరలో భాగంగా మాట్లాడుతూ సెలవిచ్చిన మాటలవి.కొంత మంది తాము హిందువుల నేతలుగా ఎదగాలని చూస్తున్నారంటూ గుడి గోపురం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుత్మంతుడిగా మారుతుందా అంటూ మసీదుల మీద కేసులు వేసినంత మాత్రాన వారంతా నేతలు అవుతారా అన్నారు. ఇదే మోహన భగవత్‌ 2022 జూన్‌ 2న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి మసీదు కింద శివలింగాల కోసం వెతక వద్దని బోధ చేశారు. ఆ పెద్దమనిషి మాటలను హిందూత్వవాదులు ఎవరైనా వింటున్నారా ? పూచిక పుల్లల మాదిరి తీసివేస్తున్నారా ? అసలు మోహన్‌భగవత్‌ నోటి వెంట ఇలాంటి మాటలు ఎందుకు వెలువడుతున్నాయి. ఇదంతా ఒక నాటకమా, వాటివెనుక అసలు చిత్తశుద్ది ఉందా ? అదే గుంపుకు చెందిన ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడటం లేదు ? ఇలా ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.


దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు పదిహేను నాటికి ఉన్న ప్రార్ధనా మందిరాలను ఉన్నవాటిని ఉన్నట్లుగానే పరిగణించాలని 1991లో పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించింది. అయితే అప్పటికే అయోధ్య వివాదం కోర్టులో ఉన్నందున దానికి మినహాయింపు ఇచ్చారు. అయోధ్య వివాదం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనేక మంది ఆమోదించనప్పటికీ మసీదు అంటూ కేసును వాదించిన కక్షిదారులు కూడా ఆమోదించిన కారణంగా దానికి తెరపడిరది. అక్కడ రామాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత మందిరాలను కూల్చివేసి మసీదులు కట్టారంటూ తరువాత పది ప్రార్ధనా మందిరాలపై 18 కేసులు వివిధ రాష్ట్రాలలో దాఖలయ్యాయి. 1991నాటి ప్రార్ధనా మందిరాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో మరోకేసు దాఖలైంది. ఇలాంటి వివాదాలను తమ నిర్ణయం వెలువడేంతవరకు దిగువ కోర్టులు పక్కన పెట్టాలని, కొత్తగా ఎలాంటి కేసులను తీసుకోవద్దంటూ 2024 డిసెంబరు 12న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌ దాఖలు చేయాలని నెల రోజుల గదువు ఇచ్చింది. ఆ తరువాత మరో నెల రోజుల్లో ఇతరులు తమ అఫిడవిట్లను సమర్పించాలని కోరింది.ఈ కేసులో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ కూడా ప్రతివాదిగా చేరారు.

కోర్టు ఆదేశించినట్లుగా కేంద్రం అఫిడవిట్‌ సమర్పిస్తుందా ? అనుమానమే, గత కొద్ది సంవత్సరాలుగా ఏదో ఒకసాకుతో తప్పించుకుంటున్నవారిని నమ్మటమెలా ? 2020లో ప్రార్ధనా స్థలాల 1991 చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో గత నాలుగు సంవత్సరాలుగా అనేక గడువులు విధించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడిస్తూ ఇంతవరకు అఫిడవిట్‌ సమర్పింలేదు, ఏదో ఒకసాకుతో కాలం గడుపుతున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా అదే స్థితి. చట్టం రద్దు లేదా కొనసాగింపుకుగానీ ఏ వైఖరిని తెలియచేసినా అది ఎన్నికల్లో ప్రభావితం అవుతుందనే ముందుచూపుతోనే మోడీ ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. కేంద్రం ఇంకా తన వైఖరిని తేల్చకపోతే రాజకీయంగా విమర్శలపాలవుతుంది. అనేక చోట్ల మసీదులను సర్వే చేయించి శివలింగాలు, విగ్రహాలు ఉన్నదీ లేనిదీ తేల్చాలనే కేసులు దాఖలు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో న్యాయమూర్తులు, బెంచ్‌లు మారాయి, ఇంకే మాత్రం దీని గురించి తేల్చకపోతే అత్యున్నత న్యాయవ్యవస్థ మీదనే పౌరుల్లో విశ్వాసం కోల్పోయే స్థితి ఏర్పడిరది. కోర్టు కూడా తన అభిప్రాయాన్ని వెల్లడిరచాల్సి ఉంది.


ఈ పూర్వరంగంలో మోహనభగవత్‌ ఇలాంటి వివాదాలను ఆపాలని కోరారు. అసలు అలాంటి కేసులు దాఖలైన వెంటనే ఆ పిలుపు ఎందుకు ఇవ్వలేదన్నది ప్రశ్న. కేసులు దాఖలు చేసిన వారు ఏ సంస్థ పేరు పెట్టుకున్నా లేదా వ్యక్తిగతంగా చూసినా వారంతా హిందూత్వవాదులే. వారిలో బిజెపి రాజ్యసభ మాజీ సభ్యుడైన సుబ్రమణ్యస్వామి ఒకరు. అందువలన తమ పార్టీకి సంబంధం లేదంటే కుదరదు. పోనీ ఆ పెద్దమనిషిని పార్టీ నుంచి బహిష్కరించారా అంటే లేదు. సదరు స్వామితో సహా ఏ ఒక్కరూ మోహన్‌ భగవత్‌ మాటలను పట్టించుకోలేదు, అయినప్పటికీ ఎందుకు అలా సెలవిస్తున్నారంటే అదే అసలైన రాజకీయం. సంఘపరివార్‌ తీరు తెన్నులను చూసి ఊసరవెల్లులు దేశం వదలి వెళ్లిపోయినట్లు కొందరు పరిహాసంగా మాట్లాడతారు. రెండు నాలికలతో మాట్లాడవద్దు అనే లోకోక్తిని పక్కన పెట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ గుంపు మాదిరి మాట్లాడవద్దు అనే కొత్త నానుడిని తీసుకు రావాల్సిన అవసరం కనిపిస్తోంది.నటీ నటులు ఏ సినిమాకు తగిన వేషాన్ని దానికి తగినట్లుగా వేస్తున్నట్లు వీరు కూడా ఎప్పటికెయ్యది అప్పటికా మాటలు మాట్లాడటం తెలిసిందే. పెద్దలుగా ఉన్న మీరు సుభాషితాలు వల్లిస్తూ ఉండండి మేము చేయాల్సింది మేము చేస్తాం, న్యాయవ్యవస్థలో ఉన్న మనవారు నాటకాన్ని రక్తికట్టిస్తారు అన్నట్లుగా హిందూత్వవాదుల తీరు ఉంది.


చరిత్ర పరిశోధకుల ముసుగులో ఉన్న కొందరు దేశంలో 1,800 దేవాలయాలను మసీదులుగా మార్చారంటూ ఒక జాబితాను రూపొందించారు. సుప్రీం కోర్టు ముందున్న 1991నాటి ప్రార్ధనా స్థలాల చట్టాన్ని మార్చే హక్కు ప్రభుత్వానికి ఉన్నదని గనుక తీర్పు వస్తే మరో 1,800 అయోధ్యలకు తెరలేస్తుంది. సుప్రీం కోర్టు మరోసారి కొత్త గడవు విధించింది. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఎలా వెల్లడిస్తుందన్నది చూడాల్సి ఉంది. మోహన్‌ భగవత్‌సుభాషితాలు చెబుతూనే ఉంటారు. వేర్వేరు ముసుగుల్లో ఉన్నవారు వివాదాలను ముందుకు తెస్తూనే ఉంటారు. వారి సంగతేమంటే తమ వారు కాదని తప్పించుకుంటారు.తాజా లోక్‌సభ ఎన్నికల్లో బలహీనపడిన బిజెపి, నరేంద్రమోడీ నాయకత్వం దేశమంతటా మసీదుల కింద శివలింగాల వెతుకులాటలకు దిగే శక్తులు సృష్టించే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం లేదు గనుకనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇలాంటి పిలుపు ఇచ్చారని కొందరి అభిప్రాయం. ఒక మాటను జనంలోకి వదలి దాని మీద స్పందనలు ఎలా ఉంటాయో చూడటం కూడా దీని వెనుక లేదని చెప్పలేము. ఈ పిలుపు ఇచ్చిన తరువాత ఒక్కరంటే ఒక్కరు కూడా తమ కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించలేదు. అంతెందుకు తన స్వంత నియోజకవర్గంలో ముందుకు వచ్చిన జ్ఞానవాపి మసీదులో శివలింగవెతుకులాట గురించి నరేంద్ర మోడీ ఒక్కసారైనా నోరు విప్పారా ? నిజంగా అలాంటి వివాదాలను రేపకూడదని బిజెపి నిజంగా కోరుకుంటే ఎందుకు మాట్లాడటం లేదు ? మౌనం అంగీకారం అన్నట్లే కదా ! మణిపూర్‌లో మానవత్వం మంట కలిసినా నోరు విప్పని, అక్కడికి వెళ్లి సామాజిక సామరస్యతను పాటించాలని కోరేందుకు వెళ్లని నేత నుంచి అలాంటివి ఆశించగలమా ? గతంలో గోరక్షకుల పేరుతో రెచ్చిపోయిన వారి ఆగడాల మీద తీవ్ర విమర్శలు రావటంతో స్పందించిన మోడీ శివలింగాల వెతుకులాట మీద ఎందుకు మాట్లాడటం లేదు. తాను ఆర్‌ఎస్‌ఎస్‌ వాదినే అని గర్వంగా చెప్పుకుంటారు కదా ! దాని అధినేత చెప్పిన మాటలను ఔదాల్చకపోతే క్రమశిక్షణ తప్పినట్లు కాదా ?


మోహన్‌ భగవత్‌ రాజకీయ అవకాశవాదంతో మాట్లాడుతున్నారంటూ ఉత్తరాఖండ్‌ జ్యోతిర్మయిపీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద విమర్శించారు.అయోధ్య రామాలయ నిర్మాణం తరువాత మిగతా అంశాలను మాట్లాడకూడదని అంటే కుదరదన్నారు. గతంలో మనదేశంలోకి చొరబాటుదార్లుగా వచ్చిన వారు నాశనం చేసిన దేవాలయాల జాబితాను తయారు చేసి వాటన్నింటినీ పునరుద్దరించాలన్నారు. భగవత్‌ వ్యక్తిగతంగా వివాదాల గురించి మాట్లాడి ఉండవచ్చు. అది అందరి అభిప్రాయం కాదు. అతను ఒక సంస్థకు అధినేత తప్ప హిందూమతానికి కాదు.హిందూయిజానికి బాధ్యత సాధు, సంతులది తప్ప అతనిది కాదు అని జగద్గురు రామభద్రాచార్య డిసెంబరు 24వ తేదీన ధ్వజమెత్తారు. చారిత్రక సంపదను హిందువులు తిరిగి పొందాల్సిందే అన్నారు.అఖిల భారతీయ సంత్‌ సమితి కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతను విమర్శించింది. మతపరమైన అంశాలేమైనా వస్తే నిర్ణయించాల్సింది మత గురువులు, వారి నిర్ణయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి ఆమోదించాల్సి ఉందని స్వామి జితేంద్రనాదానంద సరస్వతి చెప్పారు.


నరేంద్రమోడీని విశ్వగురువు అని వర్ణిస్తూ ప్రపంచ నేతగా చిత్రించేందుకు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. అందుకే ఇటీవల ఆ ప్రచారాన్ని తగ్గించారని చెబుతారు. ఉక్రెయిన్‌ యుద్దాన్ని ఆపాలంటారు, మరోచోట మంచి జరగాలంటారు తప్ప మణిపూర్‌ ఎందుకు వెళ్లరనే ప్రశ్న పదే ముందుకు రావటం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.నిజానికి గత పదేండ్లలో మనకు మనం చెప్పుకోవటం తప్ప ఏ ప్రధాన వివాదంలోనూ మన దేశ సహాయం కోరిన వారు లేరు, మనంగా తీసుకున్న చొరవ కూడా లేదు. బహుశా అందుకే విదేశాంగ మంత్రి జై శంకర్‌ భారత్‌ విశ్వమిత్ర అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయినప్పటికీ భారత్‌ విశ్వగురువు పాత్ర గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ మాట్లాడుతున్నది.1991నాటి ప్రార్ధనా స్థలలా చట్టాన్ని సంఘపరివార్‌కు చెందిన వారు ఇప్పుడు సవాలు చేస్తున్నారు. దాని ప్రకారం వాటి స్వభావాన్ని మార్చకపోయినా చరిత్రలో జరిగిందేమిటో తెలుసుకొనేందుకు తాము పేర్కొన్న మసీదులను సర్వే చేయాలని, తవ్వివెలికి తీయాలని వారు కోరుతున్నారు. గతంలో బాబరీ మసీదు వివాదంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్ధించిన అనేక మంది ఇప్పుడు ఇతర మసీదుల వివాదాలను ముందుకు తెస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. దేశంలో ఇతర సమస్యలేమీ లేనట్లు, మసీదుల కింద శివలింగాలు, ఇతర విగ్రహాలకోసం వెతుకులాట గురించి కేంద్రీకరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించేవారు ప్రస్తుతానికి పరిమితమే అయినా మరోసారి మసీదుల కూల్చివేతల అంశం ముందుకు వస్తే కచ్చితంగా పెరుగుతారు. అప్పుడు బిజెపి హిందూత్వ అజెండాకే ఎసరు వస్తుంది. ఇప్పటికే పక్కనే ఉన్న మతరాజ్యం పాకిస్తాన్‌ మాదిరి భారత్‌ను కూడా అదే మాదిరి మార్చి దిగజారుస్తారా అన్న ప్రశ్నకు హిందూత్వ వాదుల వద్ద సరైన సమాధానం లేదు. మరోవైపున మారని సనాతన వాదాన్ని ముందుకు తెస్తూ దాన్ని రక్షించాలని కోరతారు. దానికోసం ఎంతదూరమైనా వెళతామంటూ ఊగిపోతారు.మానవజాతి చరిత్రను చూసినపుడు పనికిరాని వాటిని ఎప్పటికప్పుడు వదలించుకోవటం తప్ప కొనసాగించటం కనపడదు.

సద్గురుగా భావిస్తూ అనేక మంది అనుసరించే జగ్గీ వాసుదేవ్‌ హిందూమతంలో లేదా సనాతనంలో ఏ మెట్టులో ఉన్నారో ఎక్కడ ఇముడుతారో,సాధికారత ఏమిటో తెలియదు. ‘‘ సనాతన ధర్మం అంటే మీరు ఏదో ఒకదాన్ని నమ్మాలి లేదంటే మరణిస్తారు అని కాదు. నేను ఏదైనా ఒక విషయాన్ని చెబితే దానివల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రశ్నలు ఉదయించాలి.సనాతన ధర్మ ప్రక్రియ అంతా కూడా మీలో ప్రశ్నలను పెంచటం గురించే కాని సంసిద్దంగా ఉన్న సమాధానాలను ఇవ్వటం కాదు.’’ అని వాసుదేవ్‌ చెప్పారు. సనాతనం అంటే మారనిది అన్నారు, ఇక దాన్ని గురించి ప్రశ్నించేదేమి ఉంటుంది. అసలు సమస్య ఏమంటే సనాతనం లేదా హిందూ ధర్మం మనదేశంలో ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలను, నూతన ఆలోచనలనే అణచివేసింది.ప్రశ్న అడగటమే తప్పు, మన పెద్దలనే అవమానిస్తావా, ప్రశ్నిస్తావా అంటూ నోరుమూయించటం నిత్యం కనిపిస్తున్నదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎరుపంటే ఎందుకంత భయం : అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేక విద్య బిల్లు !

13 Friday Dec 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Politics, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, Anti communist, Anti-Communism Education Bill, communism, Failure of Capitalism, Socialism

ఎం కోటేశ్వరరావు


ఒక భూతం ఐరోపాను వెంటాడుతున్నది. అదే కమ్యూనిస్టు భూతం అంటూ ప్రపంచ సామాజిక గతినే మార్చివేసిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది.బ్రిటన్‌లో కారల్‌ మార్క్స్‌ఫెడరిక్‌ ఎంగెల్స్‌ 1848 ఫిబ్రవరి 21న ఆ గ్రంధాన్ని వెలువరించారు.నాటి నుంచి నేటి వరకు 176 సంవత్సరాల తరువాత కూడా ప్రపంచంలోని దోపిడీ వర్గాలు, వాటిని కాపాడేవారిని అది భయపెడుతూనే ఉంది. సోషలిజం, కమ్యూనిజాలను ఏడు నిలువుల లోతున పాతిపెట్టాం, విజయం మాదే అని ప్రకటించుకున్న అమెరికా గడ్డ మీదే పాలకవర్గం ఇప్పుడు ఎందుకు వణికి పోతున్నది. 2024 డిసెంబరు మొదటి వారంలో అమెరికా ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్‌)లో కమ్యూనిస్టు వ్యతిరేక బిల్లును 32762 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. సోషలిజం, కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రపంచంలో ఉధృతంగా ఉన్న రోజుల్లో అలాంటి బిల్లు పెట్టారంటే అదొక దారి, ఆ ఉద్యమాలు అంత ఆకర్షణీయంగా లేని వర్తమానంలో ఎందుకు ఇలాంటి చట్టాలు తీసుకువస్తున్నట్లు ? అధికార రిపబ్లికన్‌ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా చేతులు కలపటంతో ఇంత మెజారిటీ వచ్చింది. ఈ బిల్లుకు పెట్టిన పేరు ఎడ్యుకేటింగ్‌ ఫర్‌ డెమోక్రసీ యాక్ట్‌( ప్రజాస్వామ్యం కోసం చైతన్య చట్టం). ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైన అడుగు అని కొందరు వర్ణిస్తే సైద్దాంతిక పరమైన విభజన జరుగుతుందని మరికొందరు పేర్కొన్నారు. ఒక భావజాలాన్ని అణగదొక్కటం చరిత్రలో ఇంతవరకు ఎవరి వల్లా కాలేదు. ఎవరైనా ఫలానా సిద్దాంతాన్ని రూపుమాపాం అని చెబితే ఎలా అనే ఉత్సుకత ఏ ఒక్కరిలో చిగురించినా అది మొక్కై మానుగా మారుతుంది. ఇప్పుడు అమెరికాలో ఇతర పెట్టుబడిదారీ దేశాలలో జరుగుతున్నది అదే. ఓడిరచామన్న సోషలిజం, కమ్యూనిజాల గురించి యువతరంలో ఆసక్తి, అనురక్తి పెరుగుతున్నదనే సర్వేల సమాచారం అక్కడి దోపిడీ శక్తులకు కునుకు పట్టకుండా చేస్తున్నది.


1997-2012 మధ్య జన్మించిన వారిని జెడ్‌ తరం అని పిలుస్తున్నారు. వారిలో గణనీయంగా కమ్యూనిజం పట్ల సానుకూలంగా ఉన్నారు. అంతకు ముందు 1946-64 మధ్యకాలంలో జన్మించిన వారిలో కేవలం మూడు నుంచి ఆరుశాతం మంది మాత్రమే సుముఖంగా ఉన్నారు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం కంటే కమ్యూనిజం మెరుగని 28శాతం మంది జడ్‌ తరం భావిస్తున్నది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలే పురాతన కాలం నుంచి నేటి ఆధునిక సమాజానికి బాటలు వేశాయి. ఇంతకాలం సోషలిజం విఫలమైందని ప్రచారం చేసిన వారి ఏలుబడిలో సోషలిస్టు చైనా నుంచి దిగుమతులు లేకపోతే రోజు గడవటం లేదు. ఈ పరిస్థితి ఎందుకు అనే ఆలోచన అమెరికా యువతలో ఉదయించదా ? ‘‘ పెట్టుబడిదారీ విధాన ఒక వైఫల్యం ’’ అనే పేరుతో అమెరికా న్యాయమూర్తిగా పనిచేసిన రిచర్డ్‌ ఫోసనర్‌ 2009లో ఒక గ్రంధం రాశాడు. ఈ పెద్దమనిషి కమ్యూనిస్టు కాదు. అప్పటి నుంచి సోషలిజం వైఫల్యం కంటే పెట్టుబడిదారీ వైఫల్యం గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ కాలంలోనే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ దేశాలలో సోషలిజం, కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి పెరుగుతోంది.ఈ ధోరణి అమెరికా పాలకవర్గం, అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఆందోళన కలిగిస్తోంది. దిక్కుతోచని స్థితిలో అమెరికా పాలకవర్గం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఎంత ఎక్కువ చేస్తే అంతగా యువతలో ఆసక్తి పెరటం అనివార్యం. ఉన్మాదంలో ఉంచటం ద్వారా యువతను సైద్దాంతిక మధనానికి దూరం చేయాలని విఫలయత్నం చేస్తోంది.


సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలు, చైనా తదితర సోషలిస్టు దేశాలు, వాటికి నాయకులుగా ఉన్నవారి గురించి ఇప్పటికే పేలిన అవాకులు చవాకులను అమెరికా పిల్లలకు పాఠాలుగా బోధించేందుకు తాజా బిల్లును తెచ్చారు. కమ్యూనిజం లోపాల గురించి చెబితే విద్యార్థులు స్వేచ్చ, ప్రజాస్వామ్య విలువ గురించి తెలుసుకుంటారని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ జాన్సన్‌ చెప్పాడు. ఈ చట్టం ప్రకారం బోధించాల్సిన పాఠ్యాంశాలను ‘‘ కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌(విఓసిఎంఎఫ్‌) రూపొందిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది మరణాలకు కారకులైన నాజీలు ఎర్ర సైన్యం చేతిలో చచ్చారు. వారిని కూడా కమ్యూనిజం బాధితులుగానే ఈ సంస్థ చిత్రిస్తున్నది.చైనాలోని యుఘిర్స్‌ పట్ల, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనల పట్ల చైనా అనుసరించిన వైఖరిని కూడా కమ్యూనిస్టు వ్యతిరేక అంశాలతో పాటు బోధించాలని ఈ చట్టం నిర్దేశించింది. ఒక భావజాలాన్ని వక్రీకరించి చూపుతున్నారని, రాజకీయ భావజాలం కోసం తరగతి గదులు యుద్ధ క్షేత్రాలుగా మారతాయని కొందరు హెచ్చరించారు. ప్రపంచ చరిత్రను సమగ్రదృష్టితో చూడకుండా నిస్సిగ్గుగా పాక్షిక వైఖరితో ఈ బిల్లు చూసిందని వ్యతిరేకించిన డెమోక్రాట్లు పేర్కొన్నారు.‘‘ చరిత్రను బోధించటం అంటే ఒక దానికి వ్యతిరేకంగా మరొక భావజాలాన్ని ప్రోత్సహించటం కాదు. మన రాజకీయం కోసం అవసరమైన దాన్ని మాత్రమే కాదు మొత్తం కథను చెప్పాలి ’’ అని డెమోక్రటిక్‌ సోషలిస్టు 35 ఏండ్ల అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్‌ చెప్పారు. ఈమె డెమోక్రటిక్‌ పార్టీ తరఫున 2019 నుంచి న్యూయార్క్‌ నుంచి ప్రజాప్రతినిధుల సభకు ఎన్నికై పని చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ ప్రేరేపితమైన సిలబస్‌తో వత్తిడికి గురవుతున్న టీచర్లు కమ్యూనిజం ముప్పు అంటే స్పష్టత లేని ఈ బిల్లు వలన మరింతగా ఇబ్బంది పడతారని నిపుణులు చెప్పారు. కమ్యూనిజం గురించి చెప్పాలంటున్నారు సరే అడ్డూ అదుపులేని పెట్టుబడిదారీ విధానం సంగతేమిటి ? కథను సంపూర్ణంగా చెప్పరా లేక కేవలం స్వంత సిద్దాంతాలను చెప్పుకోవటమేనా అన్న విమర్శలు కూడా సామాజిక మాధ్యమంలో వెలువడ్డాయి.


ఇటీవలి కాలంలో నిర్వహిస్తున్న అనేక సర్వేల ప్రకారం గత తరాలతో పోల్చితే సోషలిజం, కమ్యూనిజాల గురించి యువ అమెరికన్లు సానుకూల వైఖరితో చూడటం పెరిగిపోతోందని, ప్రజాస్వామ్య సూత్రాల గురించి అవగాహన తగ్గుతున్నదని రిపబ్లికన్‌ సెనెటర్లు వాపోయారు. బిల్లును రూపొందించిన వారిలో ఒకరైన మరియా సాలాజార్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో అమెరికా విలువల బోధన అన్నది ఒక విప్లవాత్మక ఆలోచనేమీ కాదు. యువతరంలో మూడోవంతు మంది కమ్యూనిజానికి అనుకూలంగా ఉన్న సమయం, అయితే ఆ సిద్దాంత ప్రమాదం, దాని చరిత్రను యువతకు చెప్పటంలో విఫలం అవుతున్నామన్నది స్పష్టం, అందుకే ఈ బిల్లు అవసరమైంది అన్నారు. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించుకొనేందుకు ఇది అవసరమని మరికొందరు సమర్దించారు. స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ బిల్లును ఆమోదించినందుకు అభినందించాడు. విద్యావ్యవస్థలో కమ్యూనిజం వాస్తవాలను గమనించకపోవటం లేదా తక్కువ చేసి చూస్తున్నారని ఆరోపించాడు. చైనా వంటి శత్రుదేశాలు అమెరికా వ్యవస్థలో తమ అజెండాను చొప్పిస్తున్నాయన్నాడు. అమెరికా చట్టాలు అనుమతించిన మేరకు కన్ఫ్యూసియస్‌ తరగతి గదుల పేరుతో చైనా ఐదువందల చోట్ల ఏర్పాటు చేసింది.అవి అమెరికా మిలిటరీ కేంద్రాలకు దగ్గరగా ఉన్నాయని, వాటిలో కమ్యూనిస్టు సిద్దాంతాలను బోధిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది.
పురోగామి భావాలను వెల్లడిరచే ప్రతి ఒక్కరిని కమ్యూనిస్టుగా భావిస్తూ అమెరికన్లలో అనేక మంది మానసికవ్యాధితో బాధపడుతున్నారు. కొందరు కావాలని అలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ సామాన్యజనాల బుర్రలను చెడగొడుతున్నారు. అలాంటి వాటిలో హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ఒకటి. దాని ట్రస్టీ కెవిన్‌ రాబర్డ్‌తో జెసీ కెలీ అనే రేడియో వ్యాఖ్యాత గతేడాది ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేశాడు.‘‘ 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనమైంది. దాంతో పాటే ప్రపంచ కమ్యూనిజపు నీడ జాడలేకుండా పోయింది. కమ్యూనిజం అంతరించిందని అమెరికన్లందరూ ఊపిరి పీల్చుకున్నారు, కానీ మనింట్లో కొత్త కుట్ర ప్రారంభమైంది.పురోగామివాద ముసుగులో నేడు కమ్యూనిస్టులు అనేక సంస్థలలో చొరబడ్డారు. అమెరికన్ల రోజువారీ కార్యకలాపాలను వారి నూతన శక్తితో అదుపు చేస్తున్నారు ’’ అని వ్యాఖ్యాత చెప్పాడు. అతగాడు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రణాళిక పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. దాన్లో కమ్యూనిస్టుల పని తీరు పేరుతో అనేక వక్రీకరణలకు పాల్పడ్డాడు.


మితవాదుల నాయకత్వంలో నడిచే ఫ్రాసర్‌ ఇనిస్టిట్యూట్‌ అనే మేథోమధన సంస్థ జరిపిన సర్వేలో 1834 ఏండ్ల మధ్య ఉన్న కెనడా యువతలో 54శాతం మంది సోషలిజం దేశ ఆర్థిక వ్యవస్థ, పౌరుల మంచి చెడ్డలను ప మెరుగుపరుస్తుందని భావిస్తున్నట్లు తేలింది. అంతవరకే కాదు, ఆ సర్వే ప్రకారం పదిలక్షల మంది యువత సోషలిజం కంటే కమ్యూనిజం మంచి ఆర్థికవ్యవస్థను కలిగి ఉంటుందని చెప్పటంతో సర్వే నిర్వాహకులు నిర్ఘాంతపోయారట. అంతేనా ఇప్పుడున్న పెట్టుబడిదారీ వ్యవస్థ పనిచేయటం లేదని యువత భావించటం వారికి ఆందోళన కలిగించింది. ఆ సర్వేను మరింత లోతుగా చూసినపుడు 1834 ఏండ్ల వారిలో సోషలిజం అనువైనదని చెప్పినవారు 46శాతమైతే, 1824 ఏండ్ల వయస్సు వారిలో 50శాతానికి పెరిగారు. పెట్టుబడిదారీ విధానం మంచిదని చెప్పిన వారు 1834లో 39శాతమే ఉండగా కాదన్నవారు 41శాతం. సోషలిజానికి మారాలని చెప్పిన వారు 1834లో 54శాతం ఉండగా 1824లో 58శాతం ఉన్నారు, కాదని చెప్పిన వారు 17శాతం మాత్రమే. ఎందుకు యువత ఇలా భావిస్తున్నదంటే 2008లో ధనిక దేశాల్లో వచ్చిన సంక్షోభం అనుభవించారు గనుక, అది ఇంకా ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. దానికంటే మరింత పెద్ద సంక్షోభం రానున్నదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలే హెచ్చరిస్తున్నందున ఎక్కడైనా యువత ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకుండా ఉంటుందా ? వారికి సోషలిజం, కమ్యూనిజం తప్ప మరొకటి కనిపించటం లేదు. పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక సరైన సమాధానం చెప్పలేక ధరలు పెరిగి ఆహారవస్తువులను కొనుగోలు చేయలేకపోతే ఉదయపు అల్పాహారాన్ని మానుకోండని ఉచిత సలహా చెప్పింది. పరిస్థితి ఇంకా దిగజారితే రోజుకు ఒక పూటే తినండని కూడా చెప్పగలదు.యువత కమ్యూనిజం పట్ల ఇంత ఆసక్తిని ఎందుకు పెంచుకుంటున్నదన్న ప్రశ్నకు ఫ్రాసర్‌ సంస్థ ఉపాధ్యక్షుడు జేసన్‌ క్లెమెన్స్‌ సమాధానమిస్తూ ఇంతటి దురవస్థను వారి మీద ఎన్నడూ రుద్దలేదు అన్నాడు. భూతల స్వర్గం అనుకుంటున్నవారికి లాభాలు పిండుకొనే కార్పొరేట్‌ భూతాలు కళ్ల ముందు కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోవటం మానవనైజం కాదు. తగ్గేదే లేదు, దాని అంతమే తమ పంతం అంటారు, కాదంటారా ! దానికి సోషలిజం తప్ప మరొక మార్గం కనుచూపు మేరలో కనిపించటం లేదు, అందుకే మూలనపెట్టిన సిద్దాంత పుస్తకాలు దుమ్ముదులుపుతున్నారు.నడిచే సమయం రాగానే, తపన కలగ్గానే ఏం చేయాలో పసివాళ్లకు ఎవరూ చెప్పనవసరం లేదు. వారంతటవారే లేచి అడుగులు వేసినట్లుగా మార్గం వెతుక్కుంటారు. సమాజమార్పూ అంతే !


కమ్యూనిస్టు మానిఫెస్టో రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో అనేక మార్పులు జరిగిన మాట నిజం. అది ఆ నాటికి సరిపోయిందిగానీ నేటికి పనికి రాదు అని కొందరు వ్యతిరేకులు దాడి చేస్తున్నారు.దాన్లో చెప్పింది ఒక శాస్త్రీయ సిద్దాంతం. కూడినా హెచ్చవేసినా రెండురెళ్లు నాలుగే. అది మారదు. అలాగే శ్రమదోపిడీ ఉన్నంత కాలం దాన్నుంచి జనావళిని విముక్తం చేసేందుకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి దేశంలో విప్లవం ఒకే విధంగా జరగదని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా వెనుకబడిన, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం ప్రభావితం చేస్తున్న దేశాలలో విప్లవాన్ని ఎలా తీసుకురావాలనేది అక్కడి కార్మికవర్గం నిర్ణయించుకోవాల్సిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d