• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Uncategorized

మోడీ పక్కకెళ్లొద్దురో డింగరీ : పన్నెండు గంటలపని, మూడు రోజుల సెలవు కుర్రకారుకు గాలమే !

30 Sunday Apr 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#May Day 2023, 4-day work week, Anti labour measures, BJP, Four 12-hour days, Labour Reforms INDIA, May Day 2023, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మే డే అంటే కార్మికులు కొన్ని చోట్ల సంబరాలు జరుపుతున్నారు. మరికొన్ని చోట్ల దీక్షాదినంగా పాటిస్తున్నారు. అసలు ఏదీ పాటించకుండా, మే డే అంటే ఏమిటో కూడా తెలియకుండా ఆ రోజున కూడా పనిలో ఉండేవారు ఉన్నారు. కరోనా సమయంలో శ్రామికులు తక్కువగా అందుబాటులో ఉన్నందున రోజుకు పన్నెండు గంటలపాటు పని చేయించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదని సుప్రీం కోర్టు 2020 అక్టోబరు ఒకటవ తేదీన తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చేసిన విధాన నిర్ణయం ప్రకారం వారానికి నాలుగు రోజులు, రోజుకు పన్నెండు గంటల చొప్పున పని గంటలు ఉన్నాయి. వాటిని అమలు జరపాల్సింది రాష్ట్రాలు గనుక అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంది. ఇప్పటికే కర్ణాటకలో ఆమోదించారు. తాజాగా తమిళనాడులో ఆమోదం మీద తీవ్ర నిరసన వెల్లడి కావటంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది తప్ప రద్దు చేయలేదు. అది తాత్కాలికం, దేశమంతటా ఆ కత్తి కార్మికుల మెడమీద వేలాడుతూనే ఉంది.మూడు సాగు చట్టాలను ప్రతిఘటిస్తూ రైతాంగం సాగించిన ఏడాది పోరాటం, దానికి తలొగ్గి క్షమాపణలు చెప్పి మరీ వాటిని రద్దు చేసిన తీరు తెలిసిందే. రైతన్నల పోరు, దేశంలో దిగజారుతున్న ఆర్థిక స్థితి, వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికల కారణంగా లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మికుల మీద రుద్దనున్న చట్టాలను ఆలశ్యం చేస్తున్నారు తప్ప వెనక్కు తగ్గే ధోరణిలో లేరు. ఇప్పటికే పార్లమెంటు ఆమోదించింది. అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని అంశాలపై ముసాయి నిబంధనలను ప్రకటించాయి. ఒక విధానంగా చట్ట సవరణ చేస్తే దాన్ని కోర్టులు కొట్టివేసేందుకు అవకాశాలు దాదాపు లేవు. కార్మికులను కోర్టులు కూడా ఆదుకోలేవు. ఇప్పుడున్న ఎనిమిది గంటల షిప్టులను పన్నెండు గంటలకు పెంచుకోవటమా లేదా అన్నది యజమానులు నిర్ణయించుకోవచ్చని, దీనికి కార్మికుల అంగీకారం కూడా అవసరమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.తమకు వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలనో మరో సాకునో యజమానులు చూపితే పన్నెండు గంటలు ఏకబిగిన పని చేయక తప్పదు.చట్టాలు యజమానులకు చుట్టాలు తప్ప కార్మికులకు కాదు. చట్టాల ఆటంకం కారణంగానే మన దేశానికి విదేశీపెట్టుబడిదారులు రావటం లేదని, ఎగుమతుల్లో పోటీ పడలేమని అందువలన వారు కోరుకున్నట్లుగా భూమి, కార్మిక చట్టాలను మార్చాలని ఎప్పటి నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ మార్పులన్నీ వారి కోసం తప్ప కార్మికుల కోసం కాదు.


ఆసుపత్రులు, మరికొన్ని చోట్ల ఇప్పటికే అరకొర వేతనాలతో పన్నెండు గంటల షిప్టుల్లో పని చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. వారికి వారానికి ఒక రోజు సెలవు తప్ప అదనంగా ఇవ్వటం లేదు. ఇప్పుడు వారికి మూడు రోజులు సెలవులు, వాటికి వేతనం ఇస్తారా, ప్రభుత్వం ఇప్పిస్తుందా ? నాలుగు రోజులు పని చేస్తే వచ్చే వేతనంతో ఏడు రోజులు ఎలా గడుపుకుంటారు ? కొన్ని చోట్ల పని స్థలాలకు వెళ్లి వచ్చేందుకు కార్మికులకు రెండు నుంచి నాలుగు గంటలు పడుతున్నది. అంటే పదహారు గంటలు కుటుంబాలకు దూరంగా ఉండి ఇంటికి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులతో గడిపేందుకు, విశ్రాంతి తీసుకొనేందుకు వ్యవధి దొరుకుతుందా ? ఇదే అమలు జరిగితే వారానికి నాలుగు రోజులు వారు ఇంటికి దూరమై ఫ్యాక్టరీల గేట్ల ముందు పడుకున్న 150 సంవత్సరాల నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయంటే అతిశయోక్తి కాదు. ఈ విధానం అమల్లోకి వస్తే తొలి బాధితులు, పనికి దూరమయ్యేది మహిళలు. వారు ఇంట్లో పని చేసుకొని పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయాన్ని పనికి వెచ్చించగలరా ? పసి పిల్లలను సంరక్షించుకోగలరా ? పన్నెండు గంటల షిఫ్టులు పెడితే ఆహారపు అలవాట్లు, వేళలు మారతాయి. మూడు పూటలా తినేందుకు వీలుండదు, మూడుసార్లు తినాల్సినదాన్ని రెండుసార్లు కుక్కటం జరిగేదేనా ? ఇవి అలసట, ఆరోగ్య, మానసిక వత్తిడి, తాగుడు వంటి వాటికి దారితీస్తాయి.ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు, కుటుంబ జీవనానికి కొత్త వాటిని జోడిస్తాయి.


అదనపు వేతనం ఇచ్చేందుకు నిరాకరిస్తూ, ఇచ్చినా అరకొరా చెల్లిస్తూ అడిగిన వారిని పని నుంచి తొలగిస్తున్న యజమానులకు చట్టబద్దంగా అధికారమిచ్చి ఎనిమిది గంటలకు ఇస్తున్న వేతనంతోనే పన్నెండు గంటలు చేయించినా అడిగేవారు ఉండరు. దశాబ్దాల తరబడి కనీస వేతనాలను పెంచని పాలకులు కళ్ల ముందు కనిపిస్తున్నపుడు ఇంతకు మించి కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు.చట్టవిరుద్ద దోపిడీని చట్టబద్దం చేస్తుంది. కొత్త చట్టాల ప్రకారం మొత్తం వేతనంలో మూలవేతనం సగం ఉండాలని చెబుతున్నారు. అంటే ఆ మేరకు కార్మికులు, యజమానులు చెల్లించే ప్రావిడెంట్‌ ఫండ్‌ వాటా పెరుగుతుందని, ఉద్యోగ విరమణ చేసినపుడు గ్రాట్యూటీ పెరిగి పెద్ద మొత్తాలు చేతికి అంది సుఖంగా జీవించవచ్చని ఆశ చూపుతున్నారు. పిఎఫ్‌ వాటా పెరగటం అంటే తమ పెన్షన్‌కు తామే ముందుగా చెల్లించటం తప్ప మరొకటి కాదు. దీని వలన వచ్చే వేతనాల మొత్తం తగ్గి రోజువారీ గడవటం ఎలా అన్నది అసలు సమస్య. అలవెన్సులు, కరువు భత్యం వంటివి మూలవేతనంలో సగానికి మించకూడదంటే అది కార్మికులకు నష్టమే.
కొత్త చట్టం వస్తే సెలవులేమీ పెరగవు. ఇప్పుడు 45 రోజులకు ఒక వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నారని, దాన్ని ఇరవై రోజులకు ఒకటి వచ్చేట్లు చేస్తున్నామని చెబుతున్నారు. ఎనిమిదికి బదులు నాలుగు గంటలు పని చేస్తే ఓవర్‌టైమ్‌ వేతనం చెల్లించాలి. ఇప్పుడు మామూలు వేతనానికే అదనంగా రోజుకు నాలుగు గంటలు పని చేయాలి.కంపెనీలో చేరిన 240 రోజుల తరువాత సెలవు పెట్టుకొనే దానిని ఇప్పుడు 180రోజులకే తగ్గిస్తున్నట్లు ఆశచూపుతున్నారు. ఇప్పుడు ఏడాదికి వారాంతపు సెలవులు 52 పోగా పని రోజులు 300 వరకు ఉంటున్నాయి. నాలుగు రోజులే పని అమల్లోకి వస్తే పని రోజులు రెండువందలకు తగ్గుతాయి. ఏదైనా ఒకటే కదా ! వాస్తవంగా నిబంధనలు అమల్లోకి వస్తే తప్ప కార్మికులు ఎంత పొగొట్టుకొనేది, యజమానులకు కలిగే లబ్ది ఏమిటనేది స్పష్టం కాదు.


అనేక దేశాల్లో మాదిరి సంస్కరణల్లో భాగంగా షిప్టులను మారిస్తే తప్పేమిటి అని కొందరు వాదించవచ్చు. ఒక సినిమాలో దేన్నీ ఒక వైపే చూడకు అన్న డైలాంగ్‌ తెలిసిందే. వీటినీ అంతే. చైనాలో సంస్కరణలు అక్కడ సంపదలను సృష్టిస్తే మన దేశంలో అలాంటిదేమీ జరగలేదు. అదే చైనాలో పన్నెండుగంటల పనికి అనుమతి ఉంది అని కొందరు కొన్ని కంపెనీలను చూపి ఉదాహరించవచ్చు.వాస్తవాలేమిటి ? చైనాలో రోజుకు ఎనిమిది గంటలపని, వారానికి 44 గంటలు అన్న చట్టాన్ని మార్చి పన్నెండుగంటలుగా, నాలుగు రోజులుగా మార్చలేదు. ప్రభుత్వం ఇచ్చిన కొన్ని వెసులుబాట్లను అవకాశంగా తీసుకొని కొన్ని కంపెనీలు వారానికి ఆరు రోజులు, రోజుకు పన్నెండు గంటల షిప్టులను అమలు జరిపాయి. దాన్నే 996 పని సంస్కృతి అని పిలిచారు. ఆలీబాబా కంపెనీ అధినేత జాక్‌ మా వంటి వారు దాన్ని అమలు జరిపారు. అలాంటి పని పద్దతులను అమలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చైనా ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేసింది. అనేక కోర్టులు పన్నెండు గంటలపని చట్టవిరుద్దమని తీర్పులు చెప్పాయి. 2021 సెప్టెంబరు 21 చైనా సుప్రీం కోర్టు, కార్మిక మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఒక ప్రకటనలో పది కోర్టు తీర్పులను ఉటంకిస్తూ కార్మికుల చేత చట్టాలకు భిన్నంగా ఏ రంగంలోనూ బలవంతంగా పని చేయించటాన్ని సహించేది లేదని స్పష్టం చేశాయి. విశ్రాంతి సమయంలో, సెలవు రోజుల్లో కార్మికులతో పని చేయిస్తే చట్టపరంగా చెల్లింపు లేదా పరిహారాన్ని కోరే హక్కు కార్మికులకు ఉందని పేర్కొన్నాయి. టెక్నాలజీ (ఐటి) కంపెనీలు నిబంధనలకు విరుద్దంగా ఎక్కువ సేపు పని చేయించినట్లు, పరిహారం చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.2019లో కొంత మంది ప్రోగ్రామర్లు రంగంలోకి దిగి అందరికీ అందుబాటులో ఉండే (ఓపెన్‌ సోర్స్‌ కోడ్స్‌ ) సంకేతాలను ఉపయోగించుకొని పని చేసే అంకుర సంస్థలు చట్టాలను ఉల్లంఘిస్తే వాటిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. అలా ఎక్కువ గంటలు పనిచేసి అనారోగ్యాలకు గురై కొందరు నిపుణులు మరణించిన తరువాత నిరసనలు వెల్లువెత్తాయి. మన దగ్గర స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల తరఫున ఆహారాన్ని అందించే కార్మికులు తమకు చట్టాలను వర్తింప చేయటం లేదని ఫిర్యాదు చేసిన తరువాత చైనా ప్రభుత్వం అలాంటి సంస్థలను కట్టడి చేసి కార్మికులకు రక్షణ కల్పించింది. అనేక సంస్థలు దారికి వచ్చాయి. అలాంటి చిత్తశుద్ది మన ప్రభుత్వాలకు ఉన్నాయా అన్నది ప్రశ్న.చైనాలో కార్మిక చట్టాలను కఠినతరం గావించటం, కనీసవేతనాల పెంపుదల వంటి కారణాలతో అక్కడ ఇంకేమాత్రం వాణిజ్యం, ఫ్యాక్టరీలను నడపటం లాభసాటి కానందున అక్కడి నుంచి వచ్చే కంపెనీలను మన దేశం ఆకర్షించాలని మన దేశంలో అనేక మంది చెబుతున్నారు. ఇదే తరుణంలో ఇక్కడ కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసే, జీవితాలను ఫణంగా పెట్టే పని పద్దతులను రుద్దేందుకు చూస్తున్నారు. ఏదో దేశంలో తొడకోసుకుంటే మన దేశంలో మెడకోసుకోవాల్సిన అవసరం లేదు. విదేశీ సిద్దాంతాలు, విదేశీ పద్దతులు వద్దని చెప్పేవారు కార్మికుల మీద విదేశీ పద్దతులనే ఎందుకు బలవంతంగా రుద్దుతున్నట్లు ?


అంబేద్కర్‌ అంటే దళితుల నాయకుడని, ( కొంత మంది దళితులలో ఒక ఉప కులానికే పరిమితం చేస్తున్నారు) మహాత్మా జ్యోతిరావు పూలే అంటే బిసిల నేతగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.ఈ ఇద్దరికీ కమ్యూనిస్టులు వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం కొందరు చేస్తున్నారు.మరికొందరు వారిని తమ మనువాద, తిరోగామి చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వారి స్ధానాన్ని తక్కువ చేసి చూపటమే. మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు, కార్మిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించిన తొలి పత్రిక ‘దీన బంధు ‘ సంపాదకుడు నారాయణ్‌ మేఘాజీ లోఖండే అని, ఆయన మహాత్మా జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన సత్య శోధక సమాజ కార్యక్రమాల వుత్తేజంతోనే దేశంలోనే తొలి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారనే విషయం ఎందరికి తెలుసు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లో జన్మించిన నారాయణ్‌ కేవలం 49 సంవత్సరాలకే ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవలందిస్తూ అనారోగ్యంతో మరణించారు. రైల్వే, తపాల శాఖలో పని చేసిన ఆయన 1870లో మాండవీ బట్టల మిల్లులో స్టోరు కీపరుగా చేరారు. ఆ సమయంలో మిల్లు కార్మికుల దయనీయ స్ధితిని ప్రత్యక్షంగా చూశారు. కార్మికులు పది నుంచి 14 గంటలు పని చేసేవారు.

బాంబే మిల్‌ హాండ్స్‌ అసోసియేషన్‌ పేరుతో తొలి కార్మిక సంఘాన్ని 1884లో నారాయణ్‌ ఏర్పాటు చేశారు. అదే ఏడాది ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్మికుల సంక్షేమ చర్యలలో భాగంగా ప్రమాదానికి గురైనపుడు సాయం, మరణించినపుడు గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వంటి వాటిని అమలు జరపాలని కోరుతూ మిల్లు కార్మిక సంఘ అధ్యక్షుడి హౌదాలో ఆ కమిషన్‌కు ఒక పిటీషన్‌ అందచేశారు.దానిపై వేలాది మంది కార్మికుల సంతకాలను సేకరించారు. ఒకవైపు వాటితో పాటు 1884 సెప్టెంబరు 23న తొలిసారిగా కార్మికుల సభను ఏర్పాటు చేసి అవే డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ వారానికి ఒక రోజు ఆదివారం సెలవు ఇవ్వాలని, వుదయం ఆరున్నర నుంచి సాయంత్రం పొద్దుగూకే వరకు మాత్రమే పని చేయించాలని, మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి ఇవ్వాలని కూడా సభ ఒక తీర్మానం చేసింది.అయితే వాటిని యజమానులు అంగీకరించలేదు. 1890 నాటికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఒక సంక్షోభం వచ్చింది. వస్త్రాలకు డిమాండ్‌ లేని కారణంగా మిల్లులను మూసివేస్తున్నామని యజమానులు ఏకపక్ష చర్యలకు పూనుకున్నారు. దానికి నిరసనగా 1890 ఏప్రిల్‌ 24న లోఖండే ఒక పెద్ద కార్మిక సభను నిర్వహించారు. అదే ఏడాది జూన్‌ పదిన యజమానుల సమావేశంలో ఆదివారం రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. సంఘటిత కార్మికవుద్యమానికి లభించిన విజయమది. మాంద్యం ఎంతకాల కొనసాగుతుందో తెలియదు కనుక ఒక రోజు సెలవు ఇస్తే వచ్చే నష్టం కంటే పని చేస్తే తమపై పడే భారం ఎక్కువ కనుక యజమానులు సెలవుకు అంగీకరించారన్నది మరొక కోణం.


దీన్ని బట్టి యజమానులకు ఏది లాభంగా ఉంటే దాన్నే కోరుకుంటారన్నది స్పష్టం. పన్నెండు గంటల షిప్టు, మూడు రోజుల సెలవు వెనుక ఉన్నది కూడా అదే.మన దేశంతో సహా ప్రపంచమంతటా వినిమయ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు.ఎనిమిది గంటల బదులు పన్నెండు గంటలు చేసి వారానికి మూడు రోజులు సెలవు తీసుకుంటే కుటుంబాలతో సంతోషంగా గడపవచ్చంటూ రంగుల కలను చూపుతున్నారు. ఇలా మార్చాలని అసలు ఎవరు అడిగారు. అన్ని రోజులు సెలవులు గడిపి ఖర్చు చేసేందుకు ఎందరి వద్ద మిగులు ఉంటుంది. పశ్చిమ దేశాలలో జనం ఎంత ఖర్చు చేస్తే అక్కడి కార్పొరేట్లు, వాణిజ్య సంస్థలకు లబ్ది. అందుకోసం అప్పులూ ఇప్పిస్తారు, వాటిని ఖర్చు చేసేందుకు సెలవులూ ఇస్తున్నారు. మన దేశం ఆ స్థితికి ఇంకా చేరిందా? అక్కడున్న మాదిరి సామాజిక రక్షణలు ఇక్కడ ఉన్నాయా ?


2005లో ఆయన స్మారకార్ధం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ లోంఖడేలో జ్యోతిబా పూలే సామాజిక సంస్కరణ, మహిళాభ్యుదయంతో పాటు కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కార్మిక పక్షపాతం కూడా మిళితమై వుందని చెప్పారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు రావు బహద్దూర్‌ బిరుదును ప్రకటించటాన్ని బట్టి ఒక సంస్కర్తగానే చూసిందన్నది స్పష్టం. ఒక కార్మిక నేతకు అలాంటి బిరుదులను వూహించలేము. అంతమాత్రాన కార్మికోద్యమానికి ఆయన వేసిన బలమైన పునాదిని విస్మంరించకూడదు. మే డే సందర్భంగా పూలే, అంబేద్కర్‌లను విస్మరించలేము. పూలే, ఆయన సత్యశోధక సమాజం, సంస్కరణలకోసం కషే నారాయణ మేఘజీ లోఖండేను కార్మిక పక్షపాతిగా కూడా మార్చిందన్నది స్పష్టం.ఈ సందర్భంగా పూలే, లోఖండే, అంబేద్కర్‌లను వామపక్ష వుద్యమం విస్మరించిందనే ఒక విమర్శ వుంది. అది గత చరిత్ర. నేడు వామపక్షాలు గతం కంటే వారి కషిని గుర్తించిన మాట వాస్తవం. పూలే, అంబేద్కర్‌లను వామపక్షాలు సముచిత స్ధానంతో గౌరవించలేదని విమర్శించే వారు తాజా వైఖరిలో వచ్చిన మార్పును గమనించవచ్చు. ఈ సందర్భంగానే పూలే-అంబేద్కరిస్టులుగా ముద్రపడిన వారు కుల వివక్ష సమస్యకే పరిమితమై కార్మికవర్గ, ఇతర పోరాటాలను విస్మరిస్తున్నారనే విమర్శను మరచి పోకూడదు. అందువలన ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నప్పటికీ రెండు సమస్యల మీద ఐక్య వుద్యమాలు చేయటానికి అవి ఆటంకం కానవసరం లేదు. అవి శత్రువైరుధ్యాలు కావు.


కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. పన్నెండు గంటల షిప్టు నిబంధన అందరికీ వర్తిస్తుంది. దానిలో ఎవరికీ మినహాయింపులు ఉండవు. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే మే డే సందేశం. ఎనిమిది గంటల పని దినం కోసం జరిపిన పోరాటాలకు ప్రతి రూపమే మే డే. ఇప్పుడు ఆ విజయాన్ని వమ్ము చేసి పన్నెండు గంటల పనిని రుద్దబోతున్నారు. కార్మికులు ఈ సవాల్‌ను స్వీకరించాలా వద్దా ? ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ల లాభాలు తగ్గేకొద్దీ శ్రమజీవుల సంక్షేమ చర్యల మీద ముందు దాడి జరుగుతుంది. అందువలన ప్రతి పరిణామాన్ని జాగరూకులై పరిశీలించాల్సి వుంది.ఈ రోజుల్లో కూడా మేడే ఏమిటండీ. ప్రపంచమంతా సోషలిజం, కమ్యూనిజం అంతరించిపోయింది. కొంత మంది పొద్దున్నే జండాలు ఎగరేసి, మధ్యాహ్నం నుంచి తాగి తందనాలాడటం, లేకపోతే మొక్కుబడిగా ఒక ర్యాలీ, సభో జరపటం తప్ప చేస్తున్నదేమిటి? అయినా అసలు మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రపంచవ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. తెల్లచొక్కాల వారు తాము కార్మికులం కాదనుకుంటున్నారు.యాజమాన్యంలో భాగం కాకుండా వేతనం తీసుకొనే ప్రతివారూ కార్మికులే. మే డేని ఎలా జరుపుకోవాలా అన్నది వారి చైతన్యానికి గీటురాయి. ఇది ఒక్క రోజుతో ముగిసేది కాదు. దోపిడీకి గురవుతున్న ప్రతి కార్మికుడు ప్రతి రోజూ మేడేను స్మరించుకుంటూ కార్యోన్ముఖులు కావాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎట్టకేలకు బిజెపి ” మల్లుడు ” మీద కీచక కేసులు : పరువు పోగొట్టుకున్న పరుగుల రాణి పిటి ఉష !

29 Saturday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Sports, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, POCSO Act against WFI chief Brij Bhushan- PT Usha lost her credibility, PT Usha, RSS, Sports Minister Anurag Thakur’, Supreme Court, WFI, Wrestlers


ఎం కోటేశ్వరరావు


సుప్రీం కోర్టు ఆదేశించటంతో విధిలేని స్థితిలో లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న బిజెపి ఎంపీ, మల్లుడు, నలభై కేసులున్న నేరచరితుడైన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌ మీద అమిత్‌ షా ఆధీనంలో పని చేసే ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన పోక్సోకేసు. ఒక కేసు నమోదు చేసేందుకు దేశ ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్న వార్త ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పుకుంటున్న దేశ పరువును తీసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం, పాలకపార్టీ పెద్దలు, వారి సమర్ధకులు తప్ప వేరెవరూ కారణం కాదు. బేటీ పఢావో బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఆయన అధికార పీఠం ఉన్న చోటే ఆఫ్టరాల్‌ ఒక కేసు నమోదుకు ఇంత రచ్చ జరిగిందంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా అని జనం ఆశ్చర్యపోతున్నారు. అంతకు ముందు జరిగిన పరిణామాల్లో అఫ్‌కోర్స్‌ ఎవరేమనుకుంటే నాకేటి…. అనుకున్నట్లుగా ఒక నాడు పరుగుల రాణిగా దేశ ప్రజల, క్రీడాకారుల నీరాజనాలు అందుకున్న పిటి ఉష, రెజ్లర్ల మీద విమర్శలకు దిగి పరువు పొగొట్టుకున్నారు. ఇప్పుడేమంటారో చూడాలి. ఢిల్లీ పోలీసుల మీద ఎవరికీ విశ్వాసం లేదు.కేసు నీరుగారేట్లు చేస్తారని అనేక మంది భావిస్తున్నారు. బహుశా ఈ దుమ్ముతోనే కేసులు పెట్టినా తాను రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ పదవికి రాజీనామా చేసేది లేదని బ్రిజ్‌ భూషణ్‌ ప్రకటించారు. కేసులు నమోదు చేశాం కనుక ఆందోళన విరమించండి, జంతర్‌ మంతర్‌ నుంచి వెళ్లిపోండి అంటూ శరవేగంతో వచ్చిన పోలీసులు ఆందోళన శిబిరంలో ఉన్న వారికి నీరు, ఆహారం అందకుండా అడ్డుకున్నారు.


వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేసి మల్లయుద్ధ క్రీడాకారులు దేశ ప్రతిష్టను మంటగలిపారంటూ భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) అధ్యక్షురాలు పిటి ఉష ఆరోపించారు. రోడ్లెక్కే ముందుకు ఐఓఏను సంప్రదించి ఉండాల్సిందంటూ హితవు పలికారు.మల్లయోధులు తమ అసోసియేషన్‌కు తాత్కాలిక కమిటీ వేయాలని కోరారని, తామాపని చేసినట్లు ఉష చెప్పారు. అంతకు ముందు జరిగిన ఐఓఏ కార్యవర్గ సమావేశం తరువాత కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎల్లవేళలా ఆటగాళ్ల పక్షానే ఉందని, క్రీడలు, అథ్లెట్లు తమ ప్రాధాన్యత అని చెప్పుకున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మీద విమర్శలు వచ్చిన దగ్గర నుంచి జరిగిన పరిణామాలను చూస్తే అతగాడిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి చూపుతున్న శ్రద్ద నిజాలను నిగ్గుదేల్చేందుకు చూప లేదు. నిజానికి రెజ్లర్లను వీధుల్లోకి లాగింది, దేశ ప్రతిష్టను దిగజార్చిందీ కేంద్రం, బిజెపి పార్టీ తప్ప మరొకటి కాదు. బిజెపి నేత అద్వానీ మీద హవాలా ఆరోపణ వచ్చినపుడు ఎంపీగా రాజీనామా చేసి ఆ నింద తొలిగిన తరువాతనే తిరిగి ఎన్నికల్లో నిలిచారు. బ్రిజ్‌ భూషణ్‌ అంశంలో బిజెపి ఎందుకు ఠలాయిస్తున్నట్లు ? వెంటనే పదవి నుంచి తప్పించి విచారణ సక్రమంగా జరిపించి ఉంటే ప్రపంచ క్రీడా రంగంలో, ఇతరంగా దేశ పరువు నిలిచేది కదా !


రాజ్యసభకు పంపినందుకు బిజెపి పట్ల కృతజ్ఞతగా బహుశా పిటి ఉష ఈ కోణాన్ని చూడకుండా రెజ్లర్ల మీదనే దాడికి దిగారన్నది స్పష్టం. నిరసన తెలపటం ప్రజాస్వామిక హక్కు, ఒక మహిళగా తోటి మహిళా అథ్లెట్ల బాధను ఆమె అవగాహన చేసుకోలేదు. అన్ని రంగాల్లో లైంగిక వేధింపులు జరుగుతున్న సంగతి తెలియదని అనుకోవాలా ? ఇతర అసోసియేషన్లలో చేయని ఆరోపణలు రెజ్లింగ్‌లోనే ఎందుకు వచ్చినట్లు ? రెజ్లర్లు తమ వద్దకు రాలేదని చెబుతున్న ఉష, ఆమే వారిని తన వద్దకు ఎందుకు పిలిపించుకోలేదు. జనవరి 18న తొలిసారిగా రెజ్లర్లు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ఆమె రంగంలోకి దిగితే ఇంతదాకా వచ్చేది కాదు కదా ! తాత్కాలిక కమిటినీ తమంత తాముగా ఎందుకు వేయలేదు ? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తటం సహజం. లండన్‌ పర్యటనలో రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలతో దేశం పరువు తీసినట్లు, పోయినట్లు బిజెపి ఇప్పటికీ నానా యాగీ చేస్తోంది. ఇప్పుడు అదే భాషను పరుగుల రాణి వినిపించారు.నిరసన తెలపటమే నేరం అన్నట్లు మాట్లాడారు ? బిజెపి గీసిన గిరి నుంచి వెలుపలికి వస్తే ప్రపంచంలో గతంలో, వర్తమానంలో జరుగుతున్నదేమిటో ఆమెకు తెలిసి ఉండేది. అసలు ఆమె సంగతేమిటి ? ఆమె క్రమశిక్షణ బండారమేమిటి ?


పిటి ఉష రాజకీయ రంగు దాస్తే దాగేది కాదు. క్రీడా రంగంలో ఉన్నంత వరకే ఆమె క్రీడాకారిణి.తరువాత సాధారణ పౌరురాలే. ఏ రాజకీయపార్టీనైనా అభిమానించవచ్చు, చేరవచ్చు. ఆమె నెరపిన రాజకీయం ఏమిటో కేరళ జనాలకు తెలుసు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఏ క్షణంలోనైనా బిజెపిలో చేరవచ్చని 2021 పత్రికలను తిరగేస్తే వచ్చిన వార్తలు చూడవచ్చు. విజయ యాత్ర జరిపిన బిజెపి చివరికి ఉన్న ఒక్క అసెంబ్లీ సీటు, అంతకు ముందు వచ్చిన ఓట్లను కూడా పోగొట్టుకుంది. ఏ రాష్ట్రంలోనూ సిఎం అభ్యర్థిని ప్రకటించటం తమ విధానం కాదని చెప్పుకొనే బిజెపి అక్కడ మెట్రో మాన్‌ శ్రీధరన్ను ప్రకటించింది. తనకేమీ రాజకీయాల్లేవంటూనే 2016లో కేరళలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ఆహ్వాన సంఘానికి అధ్యక్షురాలిగా పని చేశారు. ఆ మరుసటి ఏడాది ఉష అథ్లెటిక్‌ స్కూలులో సింథటిక్‌ ట్రాక్‌ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఆ తరువాత రైతులు తిరస్కరించి ఏడాది పాటు ఆందోళన సాగించిన మోడీ మూడు సాగు చట్టాలను ఆమె సమర్ధించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారంటూ గ్రేటా థన్‌బెర్గ్‌, గాయని రిహానాను ఖండించారు. వీటికి ప్రతిఫలంగా ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కింది.


ఇంతకూ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను బిజెపిని కాపాడుతున్నదా లేక ఆ పార్టీనే అతను ఒక ప్రాంతంలోనైనా శాశించే స్థితిలో ఉన్నారా ?ఉత్తర ప్రదేశ్‌లోని గోండా ప్రాంతంలో ఒకనాటి రౌడీ షీటర్‌, ఇప్పటికీ హత్యాయత్నం, కొట్లాట, దోపిడీ వంటి 40 క్రిమినల్‌ కేసులున్నప్పటికీ గాంగ్‌స్టర్లను ఏరిపారవేస్తానన్న యోగి పాలనలో ఆ జాబితాలో ఇతగాడి పేరు లేదు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా దేశం కోసం, ఉత్తర ప్రదేశ్‌ ఉన్నతి కోసం ఎప్పుడూ సాధు, సంతులతో కలసి తిరిగే బిజెపి గాంగ్‌స్టర్లు వేరయా అని లోకానికి సందేశమిచ్చారు. ఎందుకంటే అరవై ఆరు సంవత్సరాల ఈ పెద్దమనిషి స్వయంగా మల్లయోధుడు, ఒకసారి ఎస్‌పి, ఐదుసార్లు బిజెపి ఎంపీగా ఉన్నారు. అదనపు అర్హతలు ఏమంటే పేరుమోసిన హిందూత్వవాది, బాబరీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుడనని స్వయంగా చెప్పుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌లతో సంబంధాల గురించి చెప్పనవసరం లేదు. ఆ ప్రాంతంలో ” శక్తిశాలి ” అని అనుచరులు ఆకాశానికి ఎత్తుతారు. ఎందుకు అంటే కెమేరాల సాక్షిగా అతిక్‌ అహమ్మద్‌ అనే గూండా సోదరులను కాల్చిచంపిన ఆ పుణ్య గడ్డమీదే తన స్నేహితుడిని చంపిన హంతకుడి మీద కాల్పులు జరిపి హతమార్చినట్లు కెమెరాల ముందే ప్రకటించిన బ్రిజ్‌ తీరు ఉత్తర ప్రదేశ్‌లోగాక మరెక్కడ జరుగుతుంది.లోక్‌సభ ఎన్నికలలో బిజెపి తరఫున పోటీకి దిగినపుడు నాలుగుసార్లు ఎంపీగా ఉన్న కాంగ్రెస్‌ నేత ఆనంద సింగ్‌ మీద పోటీ వద్దని నాటి జిల్లా పోలీసు అధికారి తన కార్యాలయానికి పిలిపించుకొని అడగ్గా తీవ్ర వాదోపవాదాల్లో భాగంగా తన దగ్గర ఉన్న తుపాకిని తీసి ఎస్‌పి మీద గురి పెట్టగా వెనక్కు తగ్గిన తరువాత తాను వెనక్కు వెళ్లినట్లు స్వయంగా మీడియాతో చెప్పారు. అంతేనా ముంబై డాన్‌ అరుణ్‌ గావ్లీ అనుచరుడిని చంపినట్లు ఆరోపణలున్న దావూద్‌ ఇబ్రహీం అనుచరులు సుభాష్‌ ఠాకూర్‌, జయేంద్ర ఠాకూర్‌,ప్రకాష్‌ దేశాయిలతో చేతులు కలిపినందుకు టాడా చట్టం కింద అనేక నెలలు తీహార్‌ జైల్లో ఉన్న హిందూ-ముస్లిం జాతీయవాది, గాంగస్టర్ల ఐక్యతావాది. ఇలాంటి వారి మీద కేసులకు పట్టే గతి తెలిసిందే. ఎవరైనా ముందుకు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పి బతగ్గలరా ?


పన్నెండు సంవత్సరాలుగా దేశ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అతగాడి లైంగిక వేధింపులను భరించలేక కొంత మంది రెజ్లర్లు చేసిన ఫిర్యాదులను ” బేటీ బచావో ” అనుచరులు, అధికారులూ పట్టించుకోలేదు. మాఫియా డాన్‌ అతిక్‌ ఆహమ్మద్‌ సంపాదించిన ఆస్తుల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని కాషాయ దళాలు సామాజిక మాధ్యమాలలో ఏడ్చి పెడబొబ్బలు పెడుతున్నాయి. ఒక నాడు రౌడీ షీటర్‌గా ఉన్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సంపాదించినదేమీ తక్కువ కాదు.అనేక జిల్లాల్లో కనీసం 50 విద్యాసంస్థలు ఉన్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. వీటి విలువ ఎంతో, ఎలా సంపాదించాడో కాషాయ దళాలు చెప్పాలి. ఇన్ని సంపదలు, కేంద్రం, రాష్ట్రంలో పలుకుబడి, ఎంపీగా ఉన్నకారణంగానే మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులకు పాల్పడి నోరు మూయిస్తున్నట్లు లోకం కోడై కూస్తున్నది.ఇతర పార్టీల కుటుంబ వారసత్వం గురించి బిజెపి లోకానికి సూక్తిముక్తావళి వినిపిస్తుంది. ఇతని కుమారుడు ప్రతీక్‌ భూషన్‌ రెండవసారి ఎంఎల్‌ఏగా ఉన్నారు. మరో కుమారుడు కరన్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌లో ఆఫీసుబేరర్‌, భార్య కేతకీ దేవి గోండా జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2004లో బిజెపి టికెట్‌ నిరాకరించి ఇతని బదులు ఘనశ్యాం శుక్లా అనే అతన్ని నిలిపింది. ఎన్నికల రోజున జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా జరిగిన ఒక ప్రమాదంలో శుక్లా మరణించాడు. ఆపని బ్రిజ్‌ భూషణే చేయించినట్లు శుక్లా కుటుంబం ఆరోపించింది. దీనిపై వాజ్‌పాయి ఆగ్రహించటంతో అతను పార్టీ మారీ సమాజవాదిలో చేరి 2009లో ఎంపీగా గెలిచారు. తరువాత 2014లో నరేంద్రమోడీ తిరిగి అతన్ని పార్టీలో చేర్చుకోవటమే గాక రెండుసార్లు టికెట్‌ ఇచ్చి ఎంపీగా గెలిపించి ” వాజ్‌పాయిని గౌరవించారు.”


మహిళా రెజ్లర్లు తమపై తమపై జరుగుతున్న వేధింపుల మీద గళమెత్తారు.కొన్ని ఉదాహరణలను చూస్తే జాతి వివక్ష వంటి అంశాల మీద నిరసన తెలిపిన ప్రపంచ స్థాయి క్రీడాకారులు, అథ్లెట్ల గురించి పిటీ ఉషకు తెలియకుండా ఉంటుందా ? లేకపోతే మాట్లాడే ముందు తెలుసుకోవాలి. 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో రెండువందల మీటర్ల పరుగు పందెంలో గోల్డ్‌, సిల్వర్‌ పతకాలను సాధించిన అమెరికా టోమీ స్మిత్‌, జాన్‌ కార్లోస్‌ జాతి వివక్షకు నిరసనగా కాళ్లకు బూట్లు లేకుండా, చేతులకు నల్లటి గ్లౌజులు వేసుకొని పోడియం మీదకు ఎక్కారు.2016లో ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు కోలిన్‌ కయిపెర్నిక్‌ ఉదంతం తెలిసిందే. అమెరికాలో కొనసాగుతున్న జాతి వివక్ష, నల్లజాతీయుల మీద జరుగుతున్న పోలీసుదాడులకు నిరసనగా క్రీడలకు ముందు జరిపే జాతీయగీతాలాపన సందర్భంగా లేచి నిలబడకుండా మోకాళ్ల మీద నిలిచి నిరసన తెలిపాడు. ఒకసారి కాదు అనేక సార్లు అదే చేశాడు.దాంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిరసన తెలిపే క్రీడాకారులను లంజకొడుకులని నోరుపారవేసుకున్నాడు.2020లో జార్జి ఫ్లాయడ్‌ అనే నల్లజాతి యువకుడిని పోలీసులు చంపినపుడు అమెరికా అంతటా తీవ్ర నిరసన వెల్లడైంది. అనేక మంది క్రీడాకారులు దానిలో పాల్గొన్నారు. క్రమశిక్షణ పేరుతో మౌనంగా ఉండలేదు.ప్రపంచ ఫుట్‌బాల్‌ సంస్థ పీఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో వాటి మీద స్పందిస్తూ నిరసన తెలిపిన క్రీడాకారులను అభినందించాలి తప్ప శిక్షించకూడదన్నాడు. తోటి మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులు జరుగుతుంటే పిటి ఉష గొంతెత్తి వారి పక్షాన నిలవాల్సిందిపోయి నోరుమూసుకొని భరించమనే సందేశం ఇవ్వటం, దానికి క్రమశిక్షణ అని ముసుగుతొడగటం స్త్రీ జాతికే అవమానం.నిరసించే ధైర్యం లేకపోతే అవమానాలను దిగుమింగుతూ ఆత్మగౌరవాన్ని చంపుకొని చచ్చిన చేపల్లా వాలునబడి కొట్టుకుపోతూ, మౌనంగా ఉంటున్న అనేక మంది మాదిరే ఉంటే అదొక తీరు. తోటి క్రీడాకారులు రోడ్డెక్కితే అనేక మంది ప్రముఖ క్రీడాకారులు వారికి బాసటగా నిలిచారు. అనేక మంది మౌనంగా ఉన్నారు. ఈ రోజు వేధింపులు రెజ్లర్ల మీద జరగవచ్చు. వాటి పట్ల మౌనంగా ఉంటే రేపు తమదాకా వస్తే అని ఆలోచించి ఉంటే ఈ పాటికే ఢిల్లీ పోలీసుల మీద వత్తిడి పెరిగి సుప్రీం కోర్టు వరకు పోకుండా కేసులు నమోదు చేసేవారు. క్రీడాకారుల మౌనం ఎంతో ప్రమాదకరం. సుప్రీం కోర్టును సంతుష్టీకరించేందుకు కేసులు నమోదు చేసినా తరువాత జరిగే వాటి గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సూడాన్‌లో భద్రతా దళాల మధ్య అంతర్యుద్ధం, నలుగుతున్న జనం !

19 Wednesday Apr 2023

Posted by raomk in Africa, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Sudan Rapid Support Forces, Sudan’s army, Sudanese Communist party


ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఒక దేశంలో అణచివేతకు పాల్పడుతున్న భద్రతా దళాలు – తిరగబడిన ప్రజాపక్ష సాయుధ దళాల అంతర్యుద్ధం సాధారణం. దానికి భిన్నంగా ఆఫ్రికాలోని సూడాన్‌లో మిలిటరీ-పారా మిలిటరీ అధికార పోరుతో జనాన్ని చంపుతున్నాయి.ఇది రాసిన సమయానికి దాదాపు మూడు వందల మంది మరణించగా రెండువేల మందికిపైగా పౌరులు గాయపడినట్లు వార్తలు. బాధితులు ఇంకా ఎక్కువ మంది ఉండవచ్చని భయపడుతున్నారు. మిలిటరీ రాజధాని ఖార్టుమ్‌ నగరంలో కొన్ని ప్రాంతాలపై వైమానికదాడులు జరుపుతున్నట్లు వార్తలు. ఇది అక్కడి తీవ్ర పరిస్థితికి నిదర్శనం. ఆ దాడుల్లో ఏం జరిగిందీ ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, భద్రతా దళాలు పోరు విరమించాలని సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ కోరింది.ఈ నెల 12న ప్రారంభమైన పరస్పరదాడులు ఏ పర్యవసానాలకు దారితీసేదీ, అసలేం జరుగుతున్నదీ పూర్తిగా వెల్లడికావటం లేదు. ఎవరు ముందు దాడులకు దిగారన్నదాని మీద ఎవరి కథనాలు వారు వినిపిస్తున్నారు. అమెరికా, మరికొన్ని దేశాలు రంగంలోకి దిగి కాల్పులను విరమించాలని చేసిన సూచనలను ఇరు పక్షాలు పట్టించుకోలేదని తాజా వార్తలు వెల్లడిస్తున్నాయి.దాడులు దేశమంతటా జరుగుతున్నట్లు, వాటిలో చిక్కుకు పోయిన జనానికి విద్యుత్‌, మంచినీటి కొరత ఏర్పడిందని గాయపడిన వారు ఆసుపత్రులకు వెళ్లేందుకు కూడా వీలు కావటం లేదని ఆల్‌ జజీరా టీవీ పేర్కొన్నది. సూడాన్‌లో మొత్తం నాలుగున్నర కోట్ల మంది జనాభా ఉన్నారు.


మిలిటరీ అధిపతి అబ్దెల్‌ ఫతా అల్‌ బుర్హాన్‌, పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌) అధిపతి హిమెతీ ఆధిపత్య కుమ్ములాటలే గాక వర్తమాన పరిణామాల్లో ఇంకా ఇతరం అంశాలు కూడా పని చేస్తున్నాయి. గతంలో జరిగిన అంతర్యుద్ధం ముగింపు కోసం జరిగిన ఒప్పందాల్లో ఆర్‌ఎస్‌ఎఫ్‌ మిలిటరీలో విలీనం ఒకటి. ఒప్పందం మీద సంతకాలు జరిగిన రెండు సంవత్సరాల్లో అది పూర్తి కావాలని అంగీకరించినట్లు మిలిటరీ అధిపతి బుర్హాన్‌ చెబుతుండగా, కాదు పది సంవత్సరాలని హిమెతీ భాష్యం చెబుతున్నాడు. అంటే పది సంవత్సరాల పాటు ఆర్‌ఎస్‌ఎఫ్‌ స్వతంత్ర ప్రతిపత్తిగలిగిన సంస్థగా తన ఆధిపత్యంలో కొనసాగాలని, ఆ మేరకు తనకు అధికారంలో వాటా దక్కాలని డిమాండ్‌ చేస్తున్నాడు.ఇది పైకి కనిపిస్తున్న కారణంగా కనిపిస్తున్నప్పటికీ అంతకు ముందు జరిగిన పరిణామాలను బట్టి ఎవరూ మిలిటరీ పాలనకు స్వస్తి చెప్పి పౌరపాలన ఏర్పాటుకు అంగీకరించేందుకు సిద్దం కాదని, అధికారాన్ని స్వంతం చేసుకొనేందుకే ఇదంతా అన్న అభిప్రాయం కూడా వెల్లడౌతున్నది.” సాయుధ వివాదాన్ని మరింతగా కొనసాగించటంలో రెండు శక్తులకు పరస్పర ప్రయోజనం ఉంది, దీన్ని సాకుగా చూపి పౌరశక్తులకు అధికారాన్ని బదలాయించకుండా చూస్తున్నాయని ” సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి సాలె మహమ్మద్‌ చెప్పారు.


తాజా పరిణామాల పూర్వపరాలను ఒక్కసారి అవలోకిద్దాం.1989కి ముందు ప్రధానిగా ఉన్న సాదిక్‌ అల్‌ మహదీ ప్రజావ్యతిరేకిగా మారటాన్ని అవకాశంగా తీసుకొని కుట్ర ద్వారా అల్‌ బషీర్‌ అధికారానికి వచ్చి నియంతగా మారాడు. తీవ్రమైన ఇస్లామిక్‌ విధానాలు, మానవహక్కుల ఉల్లంఘనలు, అణచివేతలకు పాల్పడటంతో అనేక తిరుగుబాట్లు జరిగినా వాటిని అణచివేశాడు. 2018 డిసెంబరు 19న ప్రారంభమైన నిరసనలు బషీర్‌ అధికారాన్ని కుదిపివేశాయి. దీన్ని డిసెంబరు లేదా సూడాన్‌ విప్లవంగా వర్ణించారు. మూడు దశాబ్దాల నిరంకుశ పాలనకు మద్దతుగా ఉన్న భద్రతా దళాలే తిరుగుబాటు చేయటంతో 2019 ఏప్రిల్‌ 11న అధికారాన్ని వదులుకున్నాడు. ఆ స్థానంలో సంధికాల మిలిటరీ మండలి(టిఎంఎసి) అధికారానికి వచ్చింది.వచ్చిన వెంటనే ఇది కూడా జనాన్ని అణచివేసేందుకు పూనుకుంది. దానిలో భాగంగా ప్రజాస్వామ్యపునరుద్దరణ కోరిన జనాలపై జూన్‌ మూడున రాజధాని ఖార్టుమ్‌లో భద్రతాదళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి మారణకాండకు పాల్పడ్డాయి. అనేక మంది యువతులు మానభంగానికి గురయ్యారు, 128 మంది మరణించగా 650 మంది గాయపడ్డారు. తరువాత జూలై, ఆగస్టు మాసాల్లో స్వేచ్చ, మార్పును కోరే శక్తుల కూటమి(ఎఫ్‌ఎఫ్‌సి)తో టిఎంసి ఒక ఒప్పందం చేసుకుంది.దాని ప్రకారం కొత్త రాజ్యాంగ రచన,2022లో ఎన్నికలు, ఆలోగా తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. ఐదుగురు మిలిటరీ ప్రతినిధులు, ఐదుగురు పౌర ప్రతినిధులు, ఇరుపక్షాలకూ ఆమోదమైన మరొక పౌరప్రతినిధితో సంపూర్ణ అధికారాలు గల 11 మందితో మండలి ఏర్పాటు. అది మూడు సంవత్సరాల మూడునెలలపాటు కొనసాగటం, తొలి 21 మాసాలు దానికి మిలిటరీ ప్రతినిధి, మిగిలిన పద్దెనిమిది మాసాలు పౌర ప్రతినిధి అధిపతిగా ఉండటం, పౌర ప్రధాని, మంత్రి మండలిని ఎఫ్‌ఎఫ్‌సి నియమించటం, పదకొండు మంది ప్రతినిధుల మండలి, మంత్రివర్గ ఏర్పాటు తరువాత తాత్కాలిక పార్లమెంటు ఏర్పాటు,2019 తిరుగుబాటు, ఖార్టూమ్‌ ఊచకోత మీద పారదర్శకంగా స్వతంత్ర విచారణ అంశాలున్నాయి.


ఈ ఒప్పందం జరిగినప్పటి నుంచీ దానికి తూట్లు పొడిచేందుకు కుట్రలు చేశారు.2020లో మాజీ అధ్యక్షుడు అల్‌ బషీర్‌ అనుచరులుగా ఉన్న మిలిటరీ అధికారులు తిరుగుబాటు నాటకం, ప్రధానిగా ఉన్న అబ్దుల్లా హమ్‌దోక్‌పై హత్యాయత్నం జరిగింది. దాని వెనుక ఎవరున్నదీ ఇప్పటికీ వెల్లడికాలేదంటే ప్రస్తుత మిలిటరీ పాలకులే అన్నది స్పష్టం. ఒప్పందం ప్రకారం 2021 ఫిబ్రవరిలో సర్వసత్తాక అధికార మండలి అధ్యక్షపదవి నుంచి మిలిటరీ అధికారి బుర్హాన్‌ తప్పుకోవాలి. దాన్ని తుంగలో తొక్కి శాంతి ఒప్పందం పేరుతో మరొక 20నెలలు కొనసాగేందుకు అంగీకరించారు. దాన్ని కూడా ఉల్లంఘించి అదే ఏడాది అక్టోబరు 25న తిరుగుబాటు చేసి పూర్తి అధికారం తనదిగా ప్రకటించుకున్న బుర్హాన్‌, పదకొండు మంది కమిటీని రద్దు చేశాడు. గతేడాది జరగాల్సిన ఎన్నికలూ లేవు.అణచివేతకు పూనుకున్నాడు. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పే అమెరికా, ఇతర పశ్చిమ దేశాలూ బుర్హాన్‌ మిలిటరీ నిరంకుశపాలనకు ఏదో ఒకసాకుతో మద్దతు ఇస్తున్నాయి.తిరిగి ప్రజా ఉద్యమం లేచే అవకాశం ఉండటం, కమ్యూనిస్టు పార్టీ, దానితో కలసి పని చేస్తున్న సంస్థలు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించటం ప్రారంభమైంది. ప్రదర్శకులపై దమనకాండకు పాల్పడి 120 మందిని చంపటంతో పరిస్థితి చేయి దాటుతుందని భావించి మరొక ప్రహసనానికి తెరలేపారు. మిలిటరీ నియంత, మితవాద శక్తులతో కూడిన ఎఫ్‌ఎఫ్‌సి మధ్య 2022 డిసెంబరులో అధికార భాగస్వామ్య అవగాహన కుదిరింది. దాన్ని ఐదువేలకు పైగా ఉన్న స్థానిక ప్రతిఘటన కమిటీలు తిరస్కరించాయి. ఒప్పందాన్ని ఒక కుట్రగా పేర్కొన్నాయి.పాలకులు గద్దె దిగేవరకూ పోరు అపకూడదని నిర్ణయించాయి. తాజా అవగాహన మేరకు పౌర సమాజానికి చెందిన ప్రధాన మంత్రి మిలిటరీ దళాల ప్రధాన అధికారిగా ఉంటారు. తరువాత దీని మీద వివరణ ఇచ్చిన బుర్హాన్‌ విలేకర్లతో మాట్లాడుతూ మిలిటరీ ప్రధాన అధికారి అంటే నియామకాలు జరపటం గానీ, అధికారిక సమావేశాలకు అధ్యక్షత వహించటం గానీ ఉండదని, తనకు నివేదించిన వాటిని అమోదించటమే అన్నారు.అయినప్పటికీ ఒప్పందానికి అంగీకారమే అని ఎఫ్‌ఎఫ్‌సి తలూపింది.ఇంకా అనేక అంశాలపై రాజీ, లొంగుబాటును ప్రదర్శించింది. అవగాహనను ఖరారు చేస్తూ ఒప్పందంపై ఏప్రిల్‌ ఒకటిన సంతకాలు జరపాలన్నదాన్ని ఆరవ తేదీకి వాయిదా వేశారు, పదకొండవ తేదీ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలని, రెండు సంవత్సరాల్లో ఎన్నికలు జరపాలని చెప్పారు. కొత్త సర్కార్‌ ఏర్పాటు జరగలేదు. పన్నెండవ తేదీన మిలిటరీ-పారామిలిటరీ పరస్పరదాడులకు దిగాయి. దీనికి తెరవెనుక జరిగిన పరిణామాలే మూలం.


అవే మిలిటరీ-పారామిలిటరీ దళాల మధ్య తాజా ఆయుధపోరుకు దారితీశాయి. ఆర్‌ఎస్‌ఎఫ్‌ను రెండు సంవత్సరాల్లో మిలిటరీలో విలీనం చేస్తే ప్రస్తుతం దాని అధిపతిగా ఉన్న హిమెతీ అధికారుల మందలో ఒకడిగా ఉంటాడు తప్ప దానిలోని లక్ష మందికి అధిపతిగా ఇంకేమాత్రం ఉండడు. అందువలన మిలిటరీలో విలీనం పదేండ్లలో జరగాలని అతడు అడ్డం తిరిగాడు. దానికి బుర్హాన్‌ అంగీకరించలేదు. దానికి మరొక మెలికపెట్టి గతంలో కుదిరిన అవగాహనతో నిమిత్తం లేని ఇతర పార్టీలు, శక్తులను కూడా ఒప్పందంలో చేర్చాలని కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చాడు. మాజీ నియంత బషీర్‌కు మద్దతుదారుగా ఉన్న ఇస్లామిస్ట్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ను చేర్చాలని పట్టుబడుతున్నాడు. ఈ వివాదంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌కు మద్దతు ఇవ్వటం ద్వారా ఎఫ్‌ఎఫ్‌సి తన విశ్వసనీయతను కోల్పోయిందని గతంలో ఆ సంస్థలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండి తరువాత వెలుపలికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విప్లవ కార్యాచరణకు తిరిగి ఉపక్రమించటం, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచటం తప్ప మరొక మార్గం లేదని కూడా పేర్కొన్నది.నియంత బషీర్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరులో కలసి వచ్చిన ఉదారవాద, మితవాద శక్తులతో కలసి కమ్యూనిస్టు పార్టీ కూటమిలో చేరింది. అల్‌ బషీర్‌ పాలన అంతమైన తరువాత అధికారానికి వచ్చిన సంధికాలపు మిలిటరీ మండలి కొన్ని సంస్కరణల అమలు గురించి చెప్పినప్పటికీ అది కూడా పౌరుల మీద ఊచకోతకు పాల్పడింది. మిలిటరీతో రాజీపడుతున్న ఎఫ్‌ఎఫ్‌సి వైఖరిని తప్పుపడుతూ ఆ సంస్థ నుంచి 2020 నవంబరు ఏడున కమ్యూనిస్టు పార్టీ వెలుపలికి వచ్చింది. భావ సారూప్యత, మిలిటరీ పాలనను వ్యతిరేకించే ఇతర శక్తులతో కొత్త కూటమిని ఏర్పాటు చేసింది.దానికి విప్లవాత్మక మార్పుల శక్తులు (ఎఫ్‌ఆర్‌సి) అని పేరు పెట్టారు.దీని నాయకత్వాన గతేడాది భారీ ప్రదర్శనలు, నిరసన తెలిపారు.


సూడాన్‌లో జరుగుతున్న పరిణామాల్లో పారామిలిటరీ దళాలు రాజధానిలోని అధ్యక్ష భవనాన్ని, విమానాశ్రయాన్ని పట్టుకున్నట్లు నిర్ధారణగాని వార్తలు వచ్చాయి.మరోవైపు ఈ దళాలు రక్షణ కోసం పౌరనివాసాల్లో చేరి రక్షణ పొందుతున్నట్లు మరికొన్ని వార్తలు. ఈ నేపధ్యంలో కోటి మంది జనాభా ఉన్న ఖార్టుమ్‌, పరిసర ప్రాంతాలపై మిలిటరీ వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు ఒక కథనం. ఆ దాడులు జరుపుతున్నది ఈజిప్టు మిలిటరీ అని కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా గందరగోళం కలిగిస్తున్నాయి. సూడాన్‌ మిలిటరీ, పారామిలిటరీ ప్రజలను అణచివేసేందుకే గతంలో పని చేసింది. పాలకులు కిరాయి మూకలను సమీకరించి డార్ఫర్‌, ఇతర ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాన్ని అణచివేశారు. తరువాత వాటిని 2013లో పారామిలిటరీగా మార్చారు. ఇటీవలి అధికార పంపిణీలో మిలిటరీ నేత, పారామిలిటరీ నేతలు ఇద్దరూ అధికార వ్యవస్థను ఆక్రమించారు. పారామిలిటరీ అధిపతికి బంగారు గనులు కూడా ఉన్నాయి. నియంత బషీర్‌ను గద్దె దింపిన తరువాత దేశ రిజర్వుబాంకుకు వంద కోట్ల డాలర్లను అందచేశాడంటే ఏ స్థితిలో ప్రజల సంపదలను కొల్లగొట్టిందీ అర్ధం చేసుకోవచ్చు. బహుశా ఇది కూడా తాజా ఘర్షణలకు మూలం కావచ్చు. ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ వివాదంలో అరబ్బు, మధ్యప్రాచ్య దేశాలు ఇరు పక్షాలకూ మద్దతు ఇచ్చేవిగా చీలి ఉన్నాయి. మిలిటరీకి అమెరికా మద్దతు ఉంది. పారామిలిటరీ-మిలటరీ ఎవరిది పై చేయిగా మారినా సూడాన్‌ తిరిగి ఉక్కుపాదాల నియంత్రణలోకే వెళ్లనుందని చెప్పవచ్చు.మరోవైపు ప్రజాప్రతిఘటన దళాలు విప్లవం కొనసాగుతుంది, ఎలాంటి సంప్రదింపులు ఉండవు,ఎవరితోనూ సంప్రదింపులు ఉండవు, చట్టవిరుద్దమైన పాలకులతో ఎలాంటి రాజీలేదని జనాన్ని సమీకరించేందుకు పూనుకున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అతి రహస్యం బట్టబయలు : మిత్రుల మీదా దొంగకన్నేసిన అమెరికా !

12 Wednesday Apr 2023

Posted by raomk in CHINA, Current Affairs, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, leaked U.S. documents, NATO, Ukraine war


ఎం కోటేశ్వరరావు


అందరికీ జోశ్యం చెప్పే బల్లి తానే కుడితి తొట్లో పడికొట్టుకున్నట్లుగా ఉంది అమెరికా పరిస్థితి. పదేండ్ల క్రితం కేవలం వందడాలర్ల(రు.8,200)తో కొనుగోలుకు అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్‌తో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అనే ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగి లక్షలాది పత్రాలను లీకు చేశాడు. స్నోడెన్‌కు ఇటీవలనే పుతిన్‌ తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చాడు. అంతకు ముందు 1971లో అమెరికా రక్షణ శాఖ పత్రాలు కూడా వెల్లడయ్యాయి. అదే విధంగా 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు కోటి రహస్య పత్రాలను సేకరించి బహిర్గత పరచిన వికీలీక్స్‌ లక్షలాది అమెరికా రహస్య పత్రాలను వెల్లడించటంతో ప్రాచుర్యం పొందింది.వాటి గురించి అమెరికాలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.ఆ సంస్థలో ప్రముఖుడైన జూలియన్‌ అసాంజేను పట్టుకొనేందుకు,జైల్లో పెట్టేందుకు వీలైతే మట్టుపెట్టేందుకు చూస్తూనే ఉంది.


ఇప్పుడు మరోసారి అలాంటి సంచలనం మరో విధంగా చెప్పాలంటే రాసిలో తక్కువైనా వాసిలో ఎక్కువ అన్నట్లుగా వెల్లడైన వందకు పైగా పత్రాలు అమెరికా, నాటో కూటమిని పెద్ద ఇరకాటంలో పెట్టాయనటం అతిశయోక్తి కాదు. రహస్యం, అతి రహస్యం అని దాచుకున్న రక్షణశాఖ ఫైళ్లు బయటకు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకేం వెల్లడౌతాయోనని అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ప్రపంచంలో ఎక్కడే జరిగినా పసిగట్టి చెబుతామని చెప్పుకొనే అమెరికా తాజాగా తన ఫైళ్లను వెల్లడి చేసింది ఎవరన్నది తేల్చుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నది. ఎవరు వాటిని వెల్లడించిందీ తరువాత సంగతి, అసలు ఎంత అజాగ్రత్తగా ఫైళ్ల నిర్వహణ చేస్తున్నదో లోకానికి వెల్లడైంది. అమెరికన్లతో తామేమి మాట్లాడినా అవి వెల్లడికావటం తధ్యంగా ఉంది కనుక ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలనే ఆలోచన,జాగ్రత్తలకు ఇతర దేశాలకు చెందిన అనేక మందిని పురికొల్పింది. తమ గురించిఎలాంటి సమాచారం సేకరించిందో అదెక్కడ వెల్లడి అవుతుందో అన్న ఆందోళన అమెరికా మిత్రదేశాల్లో కూడా తలెత్తింది.


ఈ ఫైళ్లలో ఉన్న అంశాలు వికీలీక్స్‌, ఇతర వాటి మాదిరి గతంలో జరిగిన ఉదంతాలు, పరిణామాల సమాచారం కాదు. వర్తమానంలో జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభం, దాని గురించి అమెరికా అంతర్గత అంచనా, ఆందోళనలతో పాటు ఒకే కంచం ఒకే మంచం అన్నట్లుగా ఉండే ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, చివరికి తాను చెప్పినట్లు ఆడుతున్న ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ మీద కూడా దొంగకన్నేసినట్లు తేలింది.ఉక్రెయిన్‌ దళాల వద్ద ఉన్న మందుగుండు, ఇతర ఆయుధాలు ఎప్పటివరకు సరిపోతాయి, మిలిటరీలో తలెత్తిన ఆందోళన, ఆ సంక్షోభంలో రోజువారీ అంశాల్లో అమెరికా ఎంతవరకు నిమగమైంది, పెద్దగా బహిర్గతం గాని ఉపగ్రహాలద్వారా సమాచారాన్ని సేకరించే పద్దతులతో సహా రష్యా గురించి ఎలా తెలుసుకుంటున్నదీ, మిత్ర దేశాల మీద ఎలా కన్నేసిందీ మొదలైన వివరాలున్న పత్రాలు ఇప్పటివరకు వెలికి వచ్చాయి. రష్యన్లు తమ కంప్యూటర్లలోకి చొరబడి(హాకింగ్‌) సమాచారాన్ని కొల్లగొట్టారని అమెరికా ఒక కథను ప్రచారంలోకి తెచ్చింది. ఆ పత్రాల్లో ఉన్న వివరాలను బట్టి ఆ కథ అంతగా అతకటం లేదని కొందరు చెప్పారు.దాంతో పత్రాల్లో కొంత వాస్తవం కొంత కల్పన ఉందని అమెరికా అధికారులు చెవులు కొరుకుతున్నారు. తాజాగా వెల్లడైన కొన్ని ఫైళ్లు కుర్రాళ్లు ఆటలాడుకొనే వెబ్‌సైట్లలో తొలుత దర్శనమిచ్చాయి.


ఒక కథనం ప్రకారం ఐదునెలల క్రితం అక్టోబరులో కంప్యూటర్‌గేమ్స్‌(ఆటలు) ఆడుకొనే ఒక డిస్కార్డ్‌ వేదిక (ఒక ఛానల్‌) మీద కొన్ని వివరాలు కనిపించాయి. మన దేశంలో ఇప్పుడు నరేంద్రమోడీ- అదానీ పాత్రలతో( గతంలో అమ్మా-నాన్న ఆట మాదిరి) కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నట్లుగా ఉక్రెయిన్‌ సంక్షోభం మీద ఆడుకుంటున్న కుర్రకారులో ఒకడు తనది పై చేయి అని చూపుకొనేందుకు ఎలుగుబంటితో పంది పోరు అంటూ ఒక వీడియోను వర్ణిస్తూ కొన్ని పత్రాలను పెట్టటంతో కొంత మంది భలే సమాచారం అంటూ స్పందించారు. దాంతో ఆ లీకు వీరుడు మరిన్ని జతచేశాడు. ఆ గేమ్‌లో పాల్గొన్నవారు ఉక్రెయిన్‌ పోరు పేరుతో అప్పటికే నాటో కూటమి విడుదల చేసిన అనేక కల్పిత వీడియోలను కూడా పోటా పోటీగా తమ వాదనలకు మద్దతుగా చూపారు. అనేక మంది ఆ రహస్యపత్రాలు కూడా అలాంటి వాటిలో భాగమే అనుకొని తరువాత వదలివేశారు.ఐదు నెలల తరువాత మరొక ఆటగాడు తన వాదనలకు మద్దతు పొందేందుకు మరికొన్ని పత్రాలను జత చేశాడు. తరువాత అవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిని రష్యన్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌ ఎడిట్‌ చేసి పెట్టింది. దాన్ని బట్టి వాటిని రష్యన్లు సంపాదించి పెట్టారని భావించారు. అంతకు ముందు వాటిని చూసిన వారు ఉక్రెయిన్‌ పోరు గురించి ప్రచారం చేస్తున్న అనేక అవాస్తవాల్లో భాగం అనుకున్నారు తప్ప తీవ్రమైనవిగా పరిగణించలేదు. చీమ చిటుక్కుమన్నా పసిగడతామని చెప్పుకొనే అమెరికా నిఘా సంస్థలు వాటిని పసిగట్టలేకపోయినట్లా లేక, జనం ఎవరూ నమ్మరులే అని తెలిసి కూడా ఉపేక్షించారా, ఒక వేళ గేమర్స్‌ మీద చర్యలు తీసుకుంటే లేనిపోని రచ్చవుతుందని మూసిపెడతామని చూశారా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. ఆలోచించేకొద్దీ గందరగోళంగా ఉంది.


వెల్లడైన వందకు పైగా పత్రాల్లోని అనేక అంశాలను ఖరారు చేసేందుకు ఇటీవలనే అమెరికా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మార్క్‌ మిలే, ఇతర ఉన్నతాధికారులకు వాటిని సమర్పించారు. ఇంత త్వరగా అవి బహిర్గతం కావటం అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తోంది. టాప్‌ సీక్రెట్లుగా పరిగణించే పత్రాలకు అంగీకారం, వాటిని పరిశీలించేందుకు అనుమతించే వారి సంఖ్య గురించి చెబుతూ 2019లో పన్నెండు లక్షల మందికి అవకాశం ఉన్నట్లు అమెరికా నేషనల్‌ ఇంటలిజెన్స్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఇటీవలనే వెల్లడించింది. అందువలన వారిలో ఎవరైనా వాటిని వెల్లడించాలనుకుంటే ఆ పని చేయవచ్చు. అమెరికా ప్రభుత్వ విధానాలు నచ్చని ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఒక కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్నపుడు తనకు అందుబాటులోకి వచ్చిన అనేక అంశాలను బహిర్గతపరిచాడు. టెలికమ్యూనికేషన్‌ కంపెనీలతో చేతులు కలిపి అమెరికా జాతీయ భద్రతా సంస్థ , ఐదు కళ్ల పేరుతో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ గూఢచార సంస్థలతో కలసి జరుపుతున్న నిఘా బండారాన్ని వెల్లడించాడు. అమెరికా అధికారపక్షం డెమోక్రాట్లు, ప్రతిపక్షం(పార్లమెంటు దిగువసభలో మెజారిటీ పార్టీ) రిపబ్లికన్ల మధ్య ఉన్న విబేధాలు కూడా ఈ లీకుల వెనుక ఉండవచ్చన్నది మరొక కథనం. నాటోలోని పశ్చిమ దేశాలు కొన్ని అమెరికా వైఖరితో పూర్తిగా ఏకీభవించటం లేదు. అందువలన అవి కూడా దీని వెనుక ఉండే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ పోరులో పుతిన్‌ సేనలను ఓడించటం అంత తేలిక కాదని భావిస్తున్న అమెరికా కొంత మంది విధాన నిర్ణేతలు వివాదానికి ముగింపు పలికేందుకు ఈ లీక్‌ దోహదం చేస్తుందని భావించి ఆ పని చేసి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. రష్యా గనుక వీటిని సంపాదించి ఉంటే దానిలో ఉన్న అంశాలను తనకు అనుకూలంగా మలచుకొనేందుకు చూస్తుంది తప్ప బహిరంగపరచదు అన్నది ఒక అభిప్రాయం. కష్టపడి సంపాదించిందాన్ని బహిర్గతం చేస్తే శత్రువు ఎత్తుగడలు మారిపోతాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు అమెరికా సుముఖంగా లేదని, అతి పెద్ద ఆటంకం అన్నది ఈ పత్రాల్లో తేటతెల్లమైంది.కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థల కొరత, బకుమట్‌ పట్టణాన్ని పట్టుకోవటంలో పుతిన్‌ సేనల విజయం వంటి అనేక అంశాలు ఆ పత్రాల్లో ఉన్నాయి.ఈ పత్రాల్లోని సమాచారం కట్టుకథలైనా అది ప్రచారంలోకి తేవటం మానసికంగా ఉక్రెయిన్ను దెబ్బతీసేదిగా ఉంది. ఉద్రిక్తతలు పెరిగి మిలిటరీ రంగంలోకి దిగితే డాన్‌బోస్‌ ప్రాంతాన్ని పుతిన్‌ సేనలు అదుపులోకి తీసుకుంటాయని అమెరికాకు ముందుగానే తెలుసునని కూడా వెల్లడైంది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ పోరులో రెండు లక్షల మంది రష్యన్‌ సేనలు మరణించినట్లు సిఐఏ,అమెరికా, నాటో కూటమి దేశాలన్నీ ఊదరగొట్టాయి.ఈ పత్రాల ప్రకారం పదహారు నుంచి 17,500 మధ్య మరణించి ఉండవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా ఎస్‌-300 గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులు మే రెండవ తేదీ వరకే సరిపోతాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి మద్దతు ఇస్తున్న తూర్పు ఐరోపా, ఇతర దేశాల నమ్మకాలను దెబ్బతీసేవే. మిత్రదేశాల కంటే తొత్తు దేశాలుగా పేరు మోసిన ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియాల మీద కూడా అమెరికా దొంగ కన్నేసినట్లు దాని రాయబారులు పంపిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. న్యాయవ్యవస్థలో నెతన్యాహు ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలను వ్యతిరేకించాల్సిందిగా జనాన్ని అక్కడి గూఢచార సంస్థ మొసాద్‌ రెచ్చగొట్టినట్లుగా అమెరికా పత్రాల్లో ఉంది. అదే విధంగా మరొక దేశానికి వ్యతిరేకంగా ఇంకాకరికి ఆయుధాల సరఫరా తమ విధానాలకు వ్యతిరేకం అని చెబుతున్నా ఉక్రెయినుకు మూడులక్షల 30వేల ఫిరంగి మందుగుండు సరఫరా చేయాలని దక్షిణ కొరియాను అమెరికా వత్తిడి చేసింది. ఫలానా తేదీలోగా జరగాలని కూడా ఆదేశించింది. ఇదంతా కేవలం నలభై రోజుల క్రితం జరిగింది. ఇది దక్షిణ కొరియాను ఇరుకున పెడుతుంది. పక్కనే ఉన్న రష్యా ఈ పరిణామాన్ని తేలికగా తీసుకోదని అక్కడి పాలక పార్టీ భావిస్తున్నది.


గతంలో స్నోడెన్‌, మానింగ్‌, వికీలీక్స్‌ వెల్లడించిన పత్రాలలో ఉన్న సమాచారం ఎక్కువ భాగం పాతదే కానీ అమెరికా దుష్ట పన్నాగాలను లోకానికి వెల్లడించింది. తాజా సమాచారం వర్తమాన అంశాలది కావటం ఆమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. పదేండ్ల నాటికి ఇప్పటికీ అమెరికాను ఎదుర్కోవటంలో చైనా, రష్యా సామర్ధ్యం పెరిగింది. తాజా పత్రాలు అమెరికా ఎత్తుగడలను కూడా కొంత మేరకు వెల్లడించినందున వచ్చే రోజుల్లో వాటిని పక్కన పెట్టి కొత్త పథకాలు రూపొందించాలంటే నిపుణులకు సమయం పడుతుంది. మిగిలిన దేశాలకూ వ్యవధి దొరుకుతుంది. బలాబలాలను అంచనా వేసుకొనేందుకు వీలుకలుగుతుంది.ఇదొకటైతే అనేక దేశాలు అమెరికా, పశ్చిమ దేశాలతో సంబంధాల గురించి పునరాలోచించుకొనే పరిస్థితిని కూడా కల్పించింది.తమ గురించి, తమ అంతర్గత వ్యహారాల్లో ఎలాంటి జోక్యం చేసుకుంటున్నదో అనే అనుమానాలు తలెత్తుతాయి. ఉక్రెయిను, జెలెనెస్కీ ఏమైనా అమెరికాను ఎక్కువగా ఆందోళన పరుస్తున్నదీ ఈ అంశాలే అని చెప్పవచ్చు. ఇంకెన్ని పత్రాలు బహిర్గతం అవుతాయో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

టెక్నాలజీ పోరులో చైనాతో గొంతు కలిపిన భారత్‌! 

05 Wednesday Apr 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Anti China, #CHIPS War, chipmakers, CHIPS Act, Semiconductor Programme, Trade Protectionism, WTO, WTO-India

ఎం. కోటేశ్వరరావు

          చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరు మరింత తీవ్రం అవుతున్నది. చైనాతో సహా ఇతర దేశాలను దెబ్బతీసేందుకు అమెరికా పూనుకోవటంతో ఈ రంగంలో ముందున్న దేశాలు తమవైన జాగ్రత్తలు తీసుకుం టున్నాయి. మన దేశంలో సెమి కండక్టర్లు లేదా చిప్స్‌ తయారీకి మద్దతు ఇస్తామని అమెరికా చెప్పినప్పటికీ దాని చర్యలు అనుమానా స్పదంగా ఉండటంతో మన దేశం కూడా ప్రపంచ వాణిజ్య సంస్థలో అభ్యంతరం తెలిపింది. గతేడాది అక్టోబరులో అమెరికా వాణిజ్యశాఖ చైనాకు చిప్స్‌, సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్‌ను తయారు చేసే యంత్రాలను ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధించింది. అంతటితో ఆగితే అదొక దారి, ఇతర దేశాలు కూడా అలాగే ఉండాలని లేకుంటే తమ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని బెదిరించింది. ఈ ఆంక్షలు తమ న్యాయమైన హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నట్లు డిసెంబరు నెలలో ప్రపంచవాణిజ్య సంస్థలో చైనా కేసు దాఖలు చేసింది. ప్రస్తుతం అప్పీళ్ల కమిటీ ఏర్పాటుపై వివిధ దేశాల మధ్య ఏకీభావం కుదరకపోవటంతో అది పని చేయటం లేదు.అందువలన చట్టపరంగా జరిగేదేమీ ఉండదు. కమిటీ పునరుద్దరణ జరిగిన తరువాతనే దాని మీద విచారణ జరుగుతుంది.


చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 2018లో డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ విధించిన పన్నులు న్యాయసమ్మతం కాదని 2022 డిసెంబరు తొమ్మిదిన ప్రపంచ వాణిజ్య సంస్థ తీర్పు చెప్పింది. ఈ తీర్పు తరువాతనే చిప్స్‌ నిషేధంపై చైనా ఫిర్యాదు దాఖలు చేసింది. దీని మీద అమెరికా ప్రతినిధి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చిప్స్‌ మీద విధించిన ఆంక్షలు తమ జాతీయ భద్రతకు చెందిన అంశాలని చైనాకు ముందే తెలిపామని, ఇలాంటి అంశాలపై తీర్పు చెప్పేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ సరైన వేదిక కాదని అన్నాడు. ఇంతకు ముందు చిప్స్‌ను, వాటిని తయారు చేసే యంత్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎన్నడూ జాతీయ భద్రత గురించి అమెరికా, మరొక దేశం ఎన్నడూ ప్రస్తావించలేదు. షీ జింపింగ్‌ అధికారానికి వచ్చిన తరువాత పశ్చిమ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని, అలాంటి వాటి మీద ఎక్కువగా పరిశోధనలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది, దాని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ఆంక్షలకు పూనుకున్నాడు. చైనా హువెయి టెలికాం కంపెనీని అడ్డుకోవటంతో అమెరికా అసలు రంగు వెల్లడైంది.చైనాపై సాంకేతిక పోరులో కలసి రావాలని జపాన్‌, నెదర్లాండ్స్‌ను కూడా అమెరికా కోరింది. చివరకు చైనాలో ఉన్న కంపెనీలకు సేవలందించే సిబ్బందిని కూడా అమెరికా కంపెనీలు తగ్గించాయి. ఎవరైనా చైనా కంపెనీల్లో పని చేసేందుకు వెళ్తే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కూడా ఆంక్షలు విధించింది.


ప్రపంచ చిప్‌ మార్కెటో ఆధిపత్యం కోసం అమెరికా పూనుకుంది. అందుకోసం 280 బిలియన్‌ డాలర్ల పథకాన్ని రచించింది. అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందే చిప్స్‌ను అనుమతి లేకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం లేదు. ఈ నిబంధన ప్రస్తుతానికి చైనాను దెబ్బతీసేందుకు ఉద్దేశించినప్పటికీ తన దారికి రాని ఏదేశం మీదనైనా ఆ నిబంధనను రుద్దే అవకాశం ఉంది. గతంలో విదేశీ ఉత్పత్తుల నిబంధనల పేరుతో చైనా కంపెనీ హువెయి టెలికాం ఉత్పత్తులను అమెరికాకు దిగుమతి చేసుకోవటాన్ని నిషేధించింది. రష్యాకు చిప్స్‌ ఎగుమతి నిలిపివేసింది. ఇది మన దేశ ప్రయోజనాలకు కూడా భంగకరమే అని గుర్తించిన మన ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన అమెరికా వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో అభ్యంతరాన్ని నమోదు చేసింది. అమెరికా కోసం ఉత్పత్తి చేసే సెమికండక్టర్లకు తోడ్పడే ప్రోత్సాహకాల పేరుతో అమెరికా రూపొందించిన ఒక చట్టం ప్రకారం ఇవ్వనున్న రాయితీలు ప్రపంచమంతటా మరింత పోటీని పెంచుతాయని, నష్టాన్ని కలిగిస్తాయని ఈ రంగంలో ఉత్పత్తిదారులు ప్రత్యేకించి వర్దమాన దేశాలలో వారికి సమాన అవకాశాలు కలిగించేందుకు ప్రతి పాదన లేమిటని మన దేశం ప్రశ్నించింది. వివిధ సందర్భాలలో ఇతర దేశాల సబ్సిడీ విధానాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అమెరికా తన వైఖరిని మార్చుకుందా అంటూ మన దేశ వాదనకు మద్దతుగా చైనా కూడా గొంతు కలిపింది. తమ దేశం రూపొందించుకున్న చట్టం, ప్రపంచ వాణిజ్య సంస్థకు లోబడే సబ్సిడీలు ఇస్తున్నట్లు అమెరికా సమర్థించుకుంది.


అనేక దేశాలు అమెరికా పోకడలను గమనించి తాము కూడా రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. తమ దేశంలో చిప్స్‌ ఉత్పత్తిదారులకు పన్నుల రాయితీ ఇవ్వాలని దక్షిణ కొరియా నిర్ణయించింది. దానికి గాను కొరియా చిప్స్‌ చట్టాన్ని తెచ్చింది. రక్షణాత్మక చర్యల వలన తమ కంపెనీలకు అమెరికా నుంచి నిధులు రావటం కష్టమని మంత్రి ప్రకటించాడు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాయితీ వర్తిస్తుంది. గతంలో తగ్గింపు ఎనిమిది శాతం ఉన్నదానిని ఇప్పుడు 15శాతానికి పెంచారు. వచ్చే ఇరవై సంవత్సరాల్లో 230 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు శాంసంగ్‌ ప్రకటించింది. ఐరోపా కమిషన్‌ కూడా అమెరికా మాదిరే 2022 చిప్స్‌ చట్టాన్ని చేసింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో పదిశాతంగా ఉన్న ఐరోపా వాటాను 2030 నాటికి కనీసం ఇరవై శాతానికి పెంచేందుకు దాన్ని తెచ్చారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఐరోపాలోనే చిప్స్‌ ఉత్పత్తి చేయటం వాటికి ప్రోత్సాహకాల చుట్టూ దానిలో నిబంధనలు ఉన్నాయి. ఇందుకోసం 2030 నాటికి 17బిలియన్‌ డాలర్లను సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదించారు.


డిజిటలైజేషన్‌ వంటి ఆధునిక ఉత్పత్తుల నుంచి మిలిటరీ పరికరాల వరకు చిప్స్‌ ప్రాణవాయువు వంటివి. అందువలన చైనాకు దాన్ని నిలిపివేస్తే తమ దారికి వస్తుందని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కూడా భావిస్తున్నాయి. పశ్చిమ దేశాల కంపెనీలకు ఫౌండ్రిగా పని చేసేందుకు ఇంకే మాత్రం చైనా సిద్దంగా లేదని స్వంతంగా రూపొందించేందుకు పూనుకుందని ఐరోపా ఐడిసి పరిశోధనా డైరెక్టర్‌ ఆండ్రూ బస్‌ వంటి వారు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆధునిక చిప్స్‌ తయారీలో తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ 80శాతం వాటాను కలిగి ఉంది. చైనా బలవంతంగా దాన్ని విలీనం చేసుకొనేందుకు పూనుకుంటే చైనాకు దక్కకుండా అక్కడి చిప్స్‌ పరిశ్రమలను ధ్వంసం చేస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా ఒక్క చిప్స్‌ రంగాన్నే కాదు విద్యుత్‌ వాహనాలకు సైతం భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చేందుకు పూనుకుంది. చైనాపై అమెరికా జరుపుతున్న సాంకేతిక దాడిలో తాత్కాలికంగానైనా పొగపెట్టే నాలుగు అంశాలున్నాయి. 1.ఆధునిక కృత్రిమమేధ చిప్స్‌ను చైనాకు చేరకుండా అడ్డుకోవటం, 2. అమెరికాలో రూపొందించిన చిప్‌ రూపకల్పన సాఫ్ట్‌వేర్‌ను చైనాకు అందకుండా చూడటం, 3.చిప్స్‌ను తయా రు చేసేయంత్రాలు చైనాకు చేరకుండా చేయటం, 4. చైనా చిప్స్‌ తయారీకి అమెరికాలో రూపొందిన విడి భాగాలు అందకుండా చూడటం. ప్రపంచం లోని ఇతర అమెరికా మిత్ర దేశాల నుంచి కూడా ఇదే విధంగా అడ్డుకోవటం ప్రస్తుతం బైడెన్‌ పనిగా ఉంది. పౌర అవసరా లకు ఉపయోగపడే వాటిని కూడా చైనా మిలిటరీకి వాడుతున్నదనే ప్రచారం మరోవైపు చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచ చిప్స్‌ మార్కెట్‌ విలువ 2022లో 574 బి.డాలర్లకు చేరింది. ప్రపంచంలో ఇతర రంగాలన్నీ మందగించి నప్పటికీ చిప్స్‌ మార్కెట్‌ పెరగటం వాటి అవసరాన్ని వెల్లడిస్తున్నది. ఈ మొత్తంలో చైనా ఒక్కటే 180 బి.డాలర్ల మేరకు కొనుగోలు చేస్తున్నది, 2021తో పోలిస్తే 6.2శాతం తగ్గినప్పటికి ఇంత వాటా కలిగి ఉంది కనుకనే దాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి దెబ్బతీయాలని అమెరికా కూటమి చూస్తున్నది. 1990లో ప్రపంచ చిప్స్‌ రంగంలో అమెరికా వాటా 37శాతంగా ఉన్నది 2021 నాటికి 12కు పడిపోయింది. అప్పటికీ ఇప్పటికీ వాటి ప్రాధాన్యత ఎంతో పెరిగింది కనుకనే తిరిగి పూర్వపు స్థితికి చేరాలని, తద్వారా ప్రపంచ మార్కెట్‌ను శాసించాలని అమెరికా కలలు కంటున్నది. ఇటీవలి కాలంలో చైనా ఈ రంగంలో పురోగమించినప్పటికీ ఆధునిక చిప్స్‌ కోసం ఇతర దేశాల మీద ఆధారపడే స్థితిలోనే ఉంది. కొన్ని ఆధునిక ఉత్పత్తులు జపాన్‌, నెదర్లాండ్స్‌, అమెరికాలోని కొన్ని కంపెనీల చేతుల్లో ఉన్నాయి.

ఆధునిక సాంకేతికరంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఎప్పటికైనా పశ్చిమ దేశాల నుంచి సవాలు ఎదురవుతుందని గమనించిన చైనా 2015లో చిప్స్‌ రూపకల్పన, ఉత్పత్తికి పూనుకుంది. అంతకు ఏడాది ముందే 21బిలియన్లు, 2019లో 35బి.డాలర్లు నిధులు కేటాయించింది, 2020 నాటికి ఈ మొత్తం 150 బి.డాలర్లని పశ్చిమ దేశాలు అంచనా వేశాయి. ఎక్కువ భాగం పరిశోధనకే వెచ్చించారు. తాజా పరిణామాలతో మరింతగా బడ్జెట్‌ను పెంచేందుకు పూనుకుంది. స్థానిక పరిశ్రమలకు 143 బి.డాలర్ల మేర సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు డిసెంబరులో వార్తలు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం చైనాను అడ్డుకొనేందుకు అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు ఒక్కటిగా ముందుకు పోవాలని నిర్ణయించాయి. ఇరవై మూడు రకాల ఉత్పత్తులను చైనాకు విక్రయించకూడదని జపాన్‌ శుక్రవారం నాడు ప్రకటించింది. మిలిటరీ అవసరాలకు వాడకుండా చూసేందుకే ఈ పని చేసినట్లు చెప్పుకుంది. అమెరికా ప్రారంభించిన ఈ పోరుతో వినియోగదారులకు ఉపయోగం లేకపోగా భారం పడుతుందని తైవాన్‌ కంపెనీ ప్రతినిధి హెచ్చరించాడు. అక్కడ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ గనుక ధరలు పెరుగుతాయన్నాడు. కనీసం 40శాతం ధరలు పెరగవచ్చని కొన్ని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం ఐఫోన్‌ 14ప్లస్‌ ధర ఉత్పత్తి ఖర్చు 527 డాలర్లు కాగా దానిలో 54శాతం చిప్స్‌కే చెల్లించాల్సి ఉంది.దీనిలో 5జి మోడెం ధర 47 డాలర్లు కాగా, 618 డాలర్ల శాంసంగ్‌ 22 ప్లస్‌లో మోడెం ధర 193, గూగుల్‌ పిక్సెల్‌ 441 డాలర్లలో మోడెం ధర 69 డాలర్లు ఉంది. అమెరికా చిప్స్‌ను వాడితే ఐఫోన్‌ ధర మరో వంద డాలర్లు పెరగవచ్చని అంచనా. పశ్చిమ దేశాలు ప్రారంభించిన ఈ పోరు ఎటుదారి తీస్తోందో అని ప్రపంచం ఎదురు చూస్తోంది!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !

26 Sunday Mar 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, CM Adityanath, Hate-Speech, J P Nadda, Kushboo Sunder, Narendra Modi Failures, Prakash Raj, Rahul gandhi, RSS


ఎం కోటేశ్వరరావు


మాజీ హీరోయిన్‌ కుష్‌బూ తన పార్టీ బిజెపి నేతలను మెప్పించేందుకు తంటాలు పడ్డారు. గతంలో తాను కాంగ్రెస్‌ ప్రతినిధిగా మాట్లాడిన మాటలు పార్టీ నేతలవే తప్ప తనవి కాదని, అందువలన వాటిని ఇప్పుడు తాను వెనక్కు తీసుకోవాలను కోవటం లేదని చెప్పారు. మోడీలపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూరత్‌ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించటం, వెంటనే లోక్‌సభ సచివాలయం రంగంలోకి దిగి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయటం తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా కాంగ్రెస్‌ నేతలు గతంలో కుష్‌బూ కూడా రాహుల్‌ మాదిరి వ్యాఖ్యలు చేశారని, ఆమె ఇప్పుడు బిజెపిలో ఉన్నారని గుర్తు చేశారు. వాటి మీద కుషఉ్బ మండి పడ్డారు. ఆమె ప్రస్తుతం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, జాతీయ మహిళా కమిషన్‌ మెంబర్‌గా ఉన్నారు. 2018 ఫిబ్రవరి 15న కాంగ్రెస్‌ ప్రతినిధిగా కుష్‌బూ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. ” ఇక్కడ మోడీ, అక్కడ మోడీ, ఎక్కడ చూస్తే అక్కడ మోడీ… లేకపోతే ఏమిటి ? మోడీ అనే పదానికి ముందు అవినీతి పరుల పేర్లు ఉంటున్నాయి.దాని అర్ధం తెలియటం లేదు. కనుక మోడీ అంటే అవినీతి పరులని అర్ధం మార్చుదాం. నీరవ్‌, లలిత్‌, నమో అంటే అవినీతి పరులంటే తగినట్లుగా ఉంటుంది.” అని ఉంది.


దీని గురించి కుష్‌బూ పిటిఐ విలేకరితో మాట్లాడుతూ ” నేను కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఒక కాంగ్రెస్‌ ప్రతినిధిగా నా బాధ్యత మాత్రమే నిర్వహించాను. అలాంటి భాషలోనే మేము మాట్లాడాల్సి ఉండేది, నేను సరిగ్గా అదే చేశాను. నేను పార్టీ నేతను అనుసరించాను.ఇది అతని భాష. కాంగ్రెస్‌ పార్టీ ఎంత తెంపరితనంతో ఉందో చూపటమే కాదు, ఈ అంశాన్ని లేవనెత్తటం ద్వారా వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందో కూడా వెల్లడిస్తున్నది. నా ఖాతా నుంచి నేను ఏ ఒక్క ట్వీట్‌ను కూడా తొలగించలేదు. ఇప్పుడు నేనా పని చేయను. నా పేరును ప్రస్తావించటం ద్వారా కాంగ్రెస్‌ నేతలు ఏం చేస్తున్నారు ? నన్ను రాహుల్‌ గాంధీతో సమానంగా చూస్తున్నారా ? మోడీలను దొంగలు అని పిలిచే స్థాయికి రాహుల్‌ గాంధీ దిగజారారు, నేను అవినీతి అనే పిలిచాను. తేడాను చూసే సామర్ధ్యం కాంగ్రెస్‌కు లేదు. కానీ వారికి దమ్ముంటే నా మీద కేసును దాఖలు చేయాలని సవాలు చేస్తున్నాను. చట్టపరంగా దాన్ని ఎదుర్కొంటాను. నేను నా ట్వీట్‌ను తొలగించను.అది అక్కడే ఉంది, ఇంకా అనేకం ఉన్నాయి. కాంగ్రెస్‌కు పని లేదు. మీ సమయాన్ని వెచ్చింది మరిన్ని ట్వీట్లను వెలికి తీయండి. ” అని. పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీతో తనను సమంగా చూసినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అని కుష్‌బూ ట్వీట్‌ చేశారు.


కుష్‌బూ రాజకీయ ప్రయాణం 2010లో డిఎంకెతో ప్రారంభమైంది. మరుసటి ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, 2014లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. తనకు పార్టీలో తగినంత గుర్తింపు ఇవ్వలేదంటూ అదే ఏడాది రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేదని ఆరోపించారు. తరువాత బిజెపిలో చేరారు.వందకు పైగా సినిమాల్లో నటించిన 52 సంవత్సరాల కుష్‌బూ గత పోకడలను బట్టి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేము. కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఆ పార్టీ నేత భాషనే మాట్లాడాను తప్ప ఆ విమర్శలు తనవి కాదని చెప్పుకున్న కుష్‌బూ విశ్వసనీయత ఎంత అన్నది ప్రశ్న. బిజెపిలో చేరిన తరువాత ఆమె చెప్పిన మాటలు కూడా ఆ పార్టీ నేతకు అనుగుణంగా మాట్లాడినట్లు భావించాల్సి ఉంటుంది. అలా మాట్లాడాలని (కాంగ్రెస్‌లో ఉన్నపుడు అలా మాట్లాడాల్సి వచ్చేదని ఆమే చెప్పారు గనుక) బిజెపి నిర్దేశించి ఉంటుంది గనుక నరేంద్రమోడీని పొగుడుతూ కుషఉ్బ మాట్లాడారన్నది స్పష్టం. బిజెపిలో చేరటాన్ని ఖరారు చేసుకున్న తరువాత ఆమె ఏం మాట్లాడిందీ చూద్దాం.” పార్టీ నాకేమి చేస్తుంది అన్నదాన్ని గురించి నేనేమీ ఆశించటం లేదు. కానీ దేశ ప్రజలకు పార్టీ ఏమి చేస్తుందీ అని చూస్తాను.నూట ఇరవై ఎనిమిది కోట్ల మంది ఒక మనిషిని అదే మన ప్రధానిని నమ్ముతున్నారు. వారు చేస్తున్నది పూర్తిగా సరైనదే అని భావిస్తున్నాను.” అని ఎఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పారు. అధికార బిజెపిలో చేరే అవసరం కోసం తప్ప ఈ మాటలు నిజాయితీగా చెప్పినట్లు ఆధారం ఏమిటి ?


ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ రాహుల్‌ గాంధీ ఉదంతంపై తనదైన శైలిలో స్పందించి ఆదివారం నాడు ఒక ప్రశ్నను సంధించారు.తన ట్వీట్‌కు ఒక ఫొటోను జత చేశారు. దానిలో ఎడమవైపు లలిత్‌ మోడీ, మధ్యలో నరేంద్రమోడీ, కుడివైపున లలిత్‌ మోడీ చిత్రం ఉంది. అటూ ఇటూ ఉన్నవారు అక్రమాలకు పాల్పడి దేశం వదలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఫొటో పైన ” జనరల్‌ నాలెడ్జ్‌- ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏకైక అంశం ఏమిటి అని కేవలం అడుగుతున్నా అంతే ” అన్న వ్యాఖ్యను పెట్టారు. ముగ్గురి పేరులోనూ మోడీ ఉండటం అన్నది దాని భావం అని వేరే చెప్పనవసరం లేదు.” దొంగలందరికీ మోడీ అనే ఒకే ఇంటి పేరు ఎలా వచ్చింది ” అంటూ రాహుల్‌ గాంధీ కర్ణాటకలో ఒక ఎన్నికల సభలో అన్న మాటలు మోడీ కులం అంతటికీ పరువు నష్టం కలిగించినట్లు సూరత్‌ కోర్టులో బిజెపి నేత దాఖలు చేసిన కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడింది. మోడీ కులంతో సహా ఒబిసి లందరినీ రాహుల్‌ గాంధీ అవమానించారు అని బిజెపి ఒబిసిలను రెచ్చగొడుతూ ప్రచారం చేస్తున్నది. తెలుగు ప్రాంతాల్లో ఒకే ఇంటి పేరు కలిగిన వారు అన్ని కులాల్లో ఉన్నారు. ఒకే కులంలో అనేక ఇంటి పేర్లు గలవారు ఉన్నారు. ఒబిసిల్లో మోడీ అనే కులమే లేదు. నరేంద్రమోడీ తెలీ ఘంచీ లేదా మోధ్‌ ఘంచీ అనే కులానికి చెందిన వారు. కొన్ని చోట్ల ఘంచీ అని కూడా పిలుస్తారు.(ఈ పేరుతో ముస్లింలు కూడా ఉన్నారు) ఈ కులానికి చెందిన వారు నూనె గానుగ ఆడించటం, నూనెను అమ్మటం ప్రధాన వృత్తిగా చేస్తారు. వీరిని వైశ్యుల్లో ఒక ఉపకులంగా కూడా పరిగణిస్తారు. కర్ణాటకలో ఈ పని చేసే వారిని గనిగ అని పిలుస్తారు.ఇక అవినీతికి పాల్పడి దేశం వదలి పారిపోయిన నీరవ్‌ మోడీదీ నరేంద్రమోడీది ఒకే కులం, మతం కూడా కాదు. నీరవ్‌ మోడీ జైన మతంలో పాలంపూరీ జైన్స్‌ కులానికి చెందిన వ్యక్తి.లలిత్‌ మోడీ వెనుకబడిన కులానికి చెందిన వారు కాదు. బీహార్‌కు చెందిన బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోడీ వైశ్య, బిసి కాదు. గుజరాత్‌లో పార్వతికి మరో పేరు మోదేశ్వరీ దేవి. అందువలన గుజరాతీలు అనేక మంది ఆమె పేరు కలసి వచ్చేట్లుగా మోడీ అని అడా మగా అందరూ పెట్టుకుంటారు.


మోడీ ఇంటి పేరు గలవారిని అవమానపరిచినట్లు రాహుల్‌ గాంధీ మీద ధ్వజమెత్తుతున్న బిజెపి, సంఘపరివార్‌కు చెందిన వారు మొత్తం ముస్లిం సామాజిక తరగతినే ఉగ్రవాదులు అనే అర్ధం వచ్చేట్లు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ” ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే ” అంటున్నారా లేదా ?కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఒక సందర్భంగా మాట్లాడుతూ ” నేను ఒక సామాజిక తరగతిని నిందించటం లేదు గానీ ఉగ్రవాద చర్యలలో పట్టుబడిన వారందరూ ఒక సామాజిక తరగతికే చెందిన వారన్నది నిజం కాదా ? లౌకిక పార్టీలం అని చెప్పుకొనేవి ఎందుకు మౌనం పాటిస్తున్నట్లు ? ” అని ప్రశ్నించారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా 2022 మే ఆరవ తేదీన కోజికోడ్‌లో మాట్లాడుతూ ముస్లిం ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రంగా కేరళ మారినట్లు మాట్లాడారు. ఇది మొత్తం కేరళనే అవమానించినట్లు కాదా ? దీన్లో పరువు నష్టం అంశం లేదా ? ఎవరైనా కేసు వేసినా లేకున్నా సూరత్‌ కోర్టు తీర్పు స్ఫూర్తితో నడ్డాను రాజ్యసభ సచివాలయం అనర్హుడిగా ప్రకటిస్తుందా ?


బిజెపిలో నోటి తుత్తర మనుషులు ఎక్కడ చూసినా కనిపిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న గిరిరాజ్‌ కిషోర్‌ ఒక సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ గనుక ఒక తెల్లమహిళను కాకుండా ఒక నైజీరియన్‌ మహిళను చేసుకొని ఉండి ఉంటే ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్‌ ఆమోదించి ఉండేదా అని ప్రశ్నించారు.నిజానికి ఇది ఒక్క నైజీరియన్‌ మహిళలనే కాదు, మొత్తం మహిళలను అవమానించినట్లు ? జాత్యహంకార ప్రదర్శన తప్ప మరొకటి కాదు. దీని గురించి తాము నిరసన తెలపటం లేదంటూ, ప్రధాని నరేంద్రమోడీ దీన్ని సరిచేయగలరని భావిస్తున్నట్లు మన దేశంలో నైజీరియన్‌ రాయబారి ఓబి ఓకోంగొర్‌ ఎంతో హుందాగా స్పందించాడు. కానీ నరేంద్రమోడీ సరి చేసినట్లు గానీ, గిరిరాజ్‌ సింగ్‌ తన ప్రకటనను సవరించుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు.ఈ పెద్దమనిషి నోటి నుంచి ఇలాంటి సుభాషితాలకు కొదవ లేదు. నరేంద్రమోడీని వ్యతిరేకించే వారందరూ పాకిస్తాన్‌ పోవాల్సిందే అని 2014 ఎన్నికల ప్రచారం సెలవిచ్చారు.కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత 2014 నవంబరులో నాడు సిఎంగా ఉన్న నితీష్‌ కుమార్‌ను విమర్శిస్తూ నరేంద్రమోడీని చూసి ఓర్చుకోలేక ”పల్లెటూరి ఆడదానిలా” పోట్లాడుతున్నట్లు వర్ణించారు. ఇది గ్రామీణ ప్రాంతాల మహిళలు అందరినీ అవమానించినట్లే కదా ! షహరాన్‌ పూర్‌లోని ముస్లిం మత కేంద్రం దారులు ఉలుం దేవబంద్‌ను ఉగ్రవాద దేవాలయం అని ఇదే మంత్రి వర్ణించారు. బాబరీ మసీదు భూమి కేసులో సుప్రీం కోర్టు తీర్పు వాయిదా వేసినపుడు మంత్రికి కోపం వచ్చింది.” ఈ వంద కోట్ల మంది హిందువులు కూడా మీ సోదరులే అని గుర్తించాలని ముస్లింలను కోరుతున్నాను. మీరు మూడు లక్షల మసీదులను ఏర్పాటు చేస్తే ఎవరూ అడ్డుకోలేదు. ఇప్పుడు హిందువుల సహనాన్ని పరీక్షించవద్దు.రాముడి మీద నాకు విశ్వాసం, ఆయన ఆలయాన్ని ఆయోధ్యలో నిర్మించాలి.హిందువుల విశ్వాసానికి రాముడు మూలం.దీన్ని హిందూ – ముస్లిం సమస్యగా మార్చాలని చూసింది.హిందువుల్లో సహనం నశిస్తున్నది” అని అన్నారు. హిందువేతరులందరూ అక్రమ సంతానమే అంటూ నోరు పారవేసుకున్న సాధ్వి నిరంజన గురించి తెలిసిందే. పాలకులుగా రాముడిని అనుసరించే వారు కావాలో అక్రమ సంతానానికి పుట్టిన వారు కావాలో తేల్చుకోవాలని 2014 ఎన్నికల సభలో మాట్లాడారు. ఆ మాటలను మోడీ తప్పు పట్టటంతో ఆమె క్షమాపణ చెప్పారు గానీ ఆమెకు కేంద్ర మంత్రిపదవి బహుమానంగా దక్కింది.


ఉగ్రవాదానికి సంబంధించి సౌత్‌ ఆసియన్‌ టెర్రరిజం పోర్టల్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం ఎవరి చేతుల్లో ఎందరు మరణించింది దిగువ విధంగా ఉంది. కాశ్మీర్‌ మరణాలను మొత్తంగా ఇస్లామిక్‌ ఉగ్రవాదుల ఖాతాలో వేసినా, మావోయిస్టు, ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదులందరూ హిందువులు, క్రైస్తవులే కదా ? వారిలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారన్నది తెలిసిందే.
సం××ఈశాన్య ××మావోయిస్టు×× కాశ్మీర్‌
2011 ×× 246 ×× 602 ×× 225
2012 ×× 326 ×× 367 ×× 206
2013 ×× 252 ×× 421 ×× 193
2014 ×× 465 ×× 314 ×× 193
ఈ వివరాలను చూసిన తరువాత ఎవరైనా ఉగ్రవాదులందరూ ఒక సామాజిక తరగతి లేదా ముస్లింలే అని ఎలా చెప్పగలరు ? ఉగ్రవాదానికి ముస్లిం మతానికి ముడి పెట్టి విశ్లేషణలు చేస్తున్నవారి సంగతేమిటి ? అనేక ముస్లిం దేశాల్లో ఉగ్రవాద చర్యలను ఎలా వర్ణిస్తారు ?


విద్వేషపూరిత ప్రసంగాలకు కాషాయదళాలు పెట్టింది పేరు. కొందరి నోళ్ల నుంచి వెలువడిన ఆ మాటలు పరువు తీసేవిగానూ, సమాజంలో కలతలు రేపేవిగానూ ఉన్నాయి. ఎందరి మీద కేసులు నమోదు చేశారు, ఎందరికి శిక్షలు వేసి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేశారు ? కోర్టులు కూడా తమంతట తాముగా తీసుకోవచ్చు, ఎన్ని ఉదంతాల్లో తీసుకున్నట్లు ? ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాధ్‌ 34 సందర్భాలలో ముస్లిం విద్వేష ప్రసంగాలు చేసినట్లు వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ నమోదు చేసి ప్రచురించింది. మధ్య ప్రదేశ్‌లో గడ్డం ఉన్న ఒక భవర్‌లాల్‌ జైన్‌ అనే వృద్దుడిని నువ్వు ముస్లిమ్‌వా, ఆధార్‌ కార్డుచూపమంటూ దాడి చేసిన బిజెపి నేత గురించి తెలిసిందే. తరువాత జైన్‌ శవం కనిపించింది. రావణుడ్ని దహనం చేసినట్లు ముస్లింలను కూడా చేయాలని బీహార్‌ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ బచువల్‌ చెప్పారు. వారికి ఓటింగ్‌ రద్దు చేయాలని రెండో తరగతి పౌరులుగా చూడాలన్నారు. బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్‌ అశ్వనీ ఉపాధ్యాయ ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు పోలీసు అరెస్టు చేస్తే తనను అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. చేసింది కేంద్ర ప్రభుత్వం కింద పని చేసే ఢిల్లీ పోలీసులు అని గమనించాలి. అతన్ని లాయర్‌గా పనికి రాడని ప్రకటించలేదు. ” ఏ హిందువైనా నాకు ఓటు వేయకపోతే వారి నరాల్లో మియా(ముస్లిం) రక్తం ఉన్నట్లే. అతను ఒక ద్రోహి. విద్రోహి జయ చంద్రుడికి పుట్టిన అక్రమ సంతానం.వాడి తండ్రి పాపపు కొడుకే.ఈ సారి నేను హెచ్చరిస్తున్నాను.హిందూ మత ద్రోహులను నాశనం చేస్తాం” ఈ మాటలన్నది బిజెపి ఉత్తర ప్రదేశ్‌ ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌. ఎంతో గౌరవ ప్రదమైన మాటలు గనుకనే అతని ఎంఎల్‌ఏ గిరి నిలిచిందనుకోవాలి. అదే రాష్ట్రానికి చెందిన మరొక బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర సింగ్‌ ” హిందువులు గనుక మేలుకుంటే మేము మీ మీగడ్డాలను లాగి గట్టిగా ముడివేస్తాం.మీరు హిందూస్తాన్‌లో ఉండాలంటే రాధే రాధే అనాలి ” అన్నారు. బక్రీద్‌ సందర్భంగా అమాయకపు జంతువులను కాదు మీ పిల్లలను బలి ఇవ్వాలంటూ 2020లో మరో బిజెపి ఎంఎల్‌ఏ నంద కిషోర్‌ గుజార్‌ అన్నారు. ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి.వాటి మీద ఎలాంటి కేసులు లేవు, ఉన్నా శిక్షలు పడిన దాఖలాల్లేవు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !

22 Wednesday Mar 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China's peace plan, Donald trump, imperialism, Joe Biden, NATO allies, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping, Xi Jinping-Vladimir Putin summit : west in a tight spot on China's peace plan


ఎం కోటేశ్వరరావు


చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మూడు రోజుల రష్యా పర్యటన బుధవారం నాడు ముగిసింది. మార్చి 20 నుంచి 22వ తేదీ వరకు మాస్కోలో ఉన్నారు. మూడవ సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జింపింగ్‌ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇది. దీని ఫలితాలు, పర్యవసానాల గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. బద్దశత్రువులుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా సాధారణ సంబంధాలు ఏర్పరచుకొనేట్లు చూడటంలో చైనా పాత్ర గురించి అనేక మంది ఇంకా నమ్మటం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి పన్నెండు అంశాలతో చైనా ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చిన పూర్వరంగంలో ఆసక్తి మరింతగా పెరిగింది. ఉభయ దేశాలూ ఈ సందర్భంగా చేసిన ప్రకటన మీద స్పందించిన తీరు చూస్తే ఈ పరిణామం అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలకు ఇది మింగా కక్కలేని పరిస్థితిని ఏర్పరచింది. చైనా ప్రతిపాదనలపై చర్చించేందుకు తమకు అభ్యంతరం లేదని రష్యా స్పష్టంగా స్పందించింది. తాము కూడా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఈ అంశాలపైనే ప్రధానంగా జింపింగ్‌-పుతిన్‌ చర్చలు జరిపినట్లు వార్తలు. మాస్కో చర్చల గురించి అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మాట్లాడుతూ ఐరాస నిబంధనల ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని నివారించాలన్న చైనా ప్రతిపాదనల్లోని ఒక అంశం మీద నిజానికి చైనా దానికి కట్టుబడితే ఇదే ప్రాతిపదిక మీద వ్లదిమిర్‌ జెలెనెస్కీ, ఉక్రెయిన్‌తో కూడా షీ జింపింగ్‌ మాట్లాడాలని అన్నాడు. తమ మీద జరుపుతున్న దాడికి స్వస్తి పలికేందుకు చైనా తన పలుకుబడిని ఉపయోగించగలదని, జెలెనెస్కీ, షీ మధ్యనేరుగా చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒలెగ్‌ నికొలెంకో కోరాడు. వీలైనపుడు తమ దేశాన్ని సందర్శించాలని పుతిన్ను కోరినట్లు షీ జింపింగ్‌ వెల్లడించాడు.


షీ జింపింగ్‌-వ్లదిమిర్‌ భేటీ అవకాశవాద కూడిక తప్ప మరొకటి కాదని అమెరికా పేర్కొన్నది. ఆ దేశ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ మాట్లాడుతూ ప్రపంచంలో పుతిన్‌కు స్నేహితులెవరూ లేరని, జింపింగ్‌ను పెద్ద మద్దతుదారుగా పరిగణిస్తున్నాడని అన్నాడు. చైనాకు రష్యా జూనియర్‌ భాగస్వామిగా మారిందని రెచ్చగొడుతూ మాట్లాడాడు. జింపింగ్‌ పర్యటన సందర్భంగా ఉభయ దేశాలు వివిధ రంగాల్లో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. కీలకమైన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం గురించి సానుకూలంగా స్పందించాయి. ఉక్రెయిన్‌ అంశంపై ఏ వైపూ మొగ్గు చూపకుండా చైనా తీసుకున్న వాస్తవిక వైఖరిని సానుకూల వైఖరితో రష్యా మదింపు చేసింది. మిలిటరీ, రాజకీయ ఇతరంగా అనుకూలంగా మార్చుకొనేందుకు చూసే క్రమంలో ఏ దేశాలు వాటి కూటములు గానీ ఇతర దేశాల న్యాయబద్దమైన భద్రతా ప్రయోజనాలను నష్టపరిచేందుకు చూడటాన్ని వ్యతిరేకిస్తాయి. సాధ్యమైనంత త్వరలో శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు రష్యా చూపిన సుముఖతను చైనా వైపు నుంచి సానుకూలంగా మదింపు చేస్తున్నది అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు బంతి ఉక్రెయిన్‌ దానికి మద్దతుదారులుగా ఉన్న అమెరికా, పశ్చిమ దేశాల చేతుల్లో ఉంది.


జింపింగ్‌ పర్యటన ఖరారు కాగానే పుతిన్‌ మీద అరెస్టు వారంటు జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు, దానికి ఆ అర్హత లేదంటూ సదరు కోర్టు జడ్జీలు, ప్రాసిక్యూటర్‌పై తామే దర్యాప్తు జరుపుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న మరియాపూల్‌ ప్రాంతాన్ని పుతిన్‌ సందర్శించారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను అందించేందుకు నాటో కూటమి పూనుకుంది. దానిలో భాగంగా గతంలో సోవియట్‌ నుంచి పొందిన మిగ్‌ 29 విమానాలను పోలాండ్‌, స్లోవేకియా దేశాలు ఉక్రెయిన్‌కు అందచేసి రష్యా మీదకు పురికొల్పుతున్నాయి. కిరాయి మూకల పేరుతో పోలాండ్‌ తన మిలిటరీని కూడా పంపినట్లు వార్తలు. ఇలాంటి వాటితో పుతిన్‌ సేనలు ఓటమి ఖాయమంటూ మరోవైపున ప్రచారం. చైనా బెలూన్‌ కూల్చివేతకు ప్రతీకారం అన్నట్లుగా అమెరికా ప్రయోగించిన ఒక నిఘా డ్రోన్ను నల్ల సముద్రంలో రష్యా విమానాలు కూల్చివేశాయి. ఫిన్లండ్‌ నాటోలో చేరేందుకు టర్కీ అంగీకారం తెలిపింది. ఇలా అనేక కీలక పరిణామాలు జింపింగ్‌ రాక ముందు జరిగాయి.


షీ జింపింగ్‌ పర్యటనలో చివరి రోజు-బుధవారం నాడు రెండు దేశాలు ఏ ప్రకటన చేస్తాయనేది వెల్లడిగాక ముందే ప్రపంచ మీడియాలో పరిపరి విధాలుగా చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య స్నేహబంధం, ఇతర సంబంధాలు మరింత పటిష్టం కావించుకోవటం గురించి చివరి రోజు ఎలాగూ చెబుతారు. చైనా ముందుకు తెచ్చిన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార అంశాల చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తున్నది. ఈ పర్యటనతోనే అవి కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. ఇది ప్రారంభం మాత్రమే. పశ్చిమ దేశాలు నడిపే శల్యసారధ్యం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో ఉక్రెయిన్‌ తొలి రోజుల్లో చర్చలకు సిద్దపడినా అమెరికా తన పథకాన్ని అమలు జరిపేందుకు వాటిని చెడగొట్టింది. రష్యా లేవనెత్తిన తన భద్రత అంశాలను విస్మరించటమేగాక దానిపై ఆంక్షల కత్తికట్టింది.ఇతర పశ్చిమ దేశాలు వంతపాడుతున్నాయి. పుతిన్‌తో చర్చించిన తరువాత షీ జింపింగ్‌ అవసరమైతే ఉక్రెయిన్‌ కూడా వెళతారని వార్తలు.గతేడాది డిసెంబరు 30న షీ జింపింగ్‌తో పుతిన్‌ జరిపిన వీడియో చర్చలలో మాస్కో రావాలని పుతిన్‌ ఆహ్వానించినా, కేవలం వారం రోజుల ముందే షీ టూర్‌ ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీన చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ శాంతి ప్రతిపాదనలను ప్రకటించింది. షీ టూర్‌కు ముందు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసిసి) పశ్చిమ దేశాల ప్రచారదాడి పథకంలో భాగంగానే పుతిన్‌ మీద అరెస్టు వారంట్‌ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటామని అంగీకరించిన దేశాలకే దాని నిర్ణయాలు వర్తిస్తాయి ఇతర దేశాలకు కాదు. ఇది చైనా మీద వత్తిడి తేవటంలో భాగంగా జరిగినట్లు చెబుతున్నారు. ఐసిసిలో అమెరికా, చైనా, రష్యా మరికొన్ని దేశాలు భాగస్వాములు కాదు. లేని మారణాయుధాలను సాకుగా చూపి ఇరాక్‌ మీద దాడి చేసి దాదాపు ఆరులక్షల మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న, కోట్లాది మంది జీవితాలను అతలాకుతలం గావించిన అమెరికా, దాని మిత్రదేశాల అధిపతుల మీద ఐసిసి ఇలాంటి అరెస్టు వారంట్లను జారీ చేయలేదు.


గత కొద్ది వారాలుగా ఇంకేముంది ఉక్రెయిన్‌ గడ్డమీద రష్యా ఓడిపోతున్న సూచనలు కనిపించటంతో తటస్థం అని పైకి చెప్పినా పుతిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా నిర్ణయించిందంటూ పెద్ద ఎత్తున పశ్చిమ దేశాలు ప్రచారం చేశాయి. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాయి. పూర్తిగా ఓడిపోక ముందే కలుసుకోవాలని జింపింగ్‌ అనుకున్నారని, పశ్చిమ దేశాలకు గెలిచే అవకాశం ఇవ్వకూడదని చూస్తున్నారని చెబుతున్నాయి. శాంతిదూత మాదిరి నటిస్తూ రాజకీయ క్రీడలో భాగంగా సంక్షోభ పరిష్కారానికి శాంతి ప్రతిపాదనలను ముందుకు తేవటంతో పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అందచేస్తున్నదానికి భిన్నంగా తాత్కాలికంగానైనా ఆయుధ సరఫరా జరపదు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. తన అవసరాల కోసం చైనా మీద ఆధారపడినందున పుతిన్‌ శాంతి ప్రతిపాదనలను పరిశీలించేందుకు అంగీకరించినా అమలుకు మాత్రం ససేమిరా అంటాడని జోశ్యం చెబుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు తమ మీద మరింత దూకుడును ప్రదర్శించకుండా చైనా చూసుకుంటున్నదని ఆరోపిస్తున్నాయి. ఇలా చిలవలు పలవలుగా కథనాలను అల్లుతున్న దశలో షీ జింపింగ్‌ మాస్కో వెళ్లారు.


అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వ్యవస్థను కాపాడేందుకు రష్యాతో పాటు ఒక రక్షకుడిగా చైనా నిలిచేందుకు సిద్దమని మాస్కోలో జింపింగ్‌ చెప్పాడు. సోమవారం రాత్రి విందుకు ముందు పుతిన్‌తో కలసి ఇష్టా గోష్టిగా విలేకర్లతో క్లుప్తంగా మాట్లాడుతూ వ్లదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు మరోసారి సందర్శనకు రావటం సంతోషంగా ఉందని, ఇరుదేశాల సంబంధాలు చక్కగా, స్థిరమైన వృద్దితో ముందుకు సాగేందుకు కొత్త ఊపు నిస్తుందని అన్నాడు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ సంక్షోభ తీవ్రత గురించి చైనా ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, వాటి గురించి చర్చిందుకు మాకు అవకాశం వచ్చిందంటూ, చర్చలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నట్లు చెప్పాడు. అంతకు ముందు పీపుల్స్‌ డైలీ ( చైనా) పత్రికలో పుతిన్‌ రాసిన ఒక వ్యాసంలో ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాల మీద చైనా సమతుల్య వైఖరితో ఉన్నందుకు తాము కృతజ్ఞులమై ఉంటామని,దాన్ని పరిష్కరించేందుకు ఒక నిర్మాణాత్మక పాత్రను పోషించేందుకు సుముఖంగా ఉండటాన్ని ఆహ్వానిస్తున్నామన్నాడు. ఉక్రెయిన్‌ అంశంలో వ్యవహార జ్ఞానంతో ఉండాలని షీ జింపింగ్‌ కోరినట్లు రష్యా అధికార పత్రిక రూసిసక్యా గజెటాలో ప్రచురించిన ఒక ఆర్టికల్లో పేర్కొన్నారు.


ప్రపంచ వ్యవహారాల నిర్వహణలో మరింత ప్రబలమైన పాత్ర పోషించాలని చైనా కోరుకుంటోందని దాన్ని మరింత ముందుకు నెట్టేందుకు ఈ పర్యటన కలసి వచ్చిందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్నుంచి పుతిన్‌ సేనలు వైదొలగటం, స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వెళ్లిపోవటం వంటి వాటి గురించి చైనా ప్రతిపాదనల్లో స్పష్టత లేదని, అందువలన అది ముందుకు పోదని పశ్చిమ దేశాలు చిత్రిస్తున్నాయి. చైనా ప్రతిపాదనలు ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని అమెరికా పత్రిక టైమ్‌ ధ్వజమెత్తింది.ఈ ప్రతిపాదన ద్వారా అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించేందుకు ఒక ముఖ్యమైన అడుగువేసింది.చైనా భద్రతతో నేరుగా సంబంధ లేని అంశాల్లో బాధ్యత తీసుకొనేందుకు, ముప్పు ఎదుర్కొనేందుకు గతంలో దూరంగా ఉండేది.ఇప్పుడు జింపింగ్‌ కొత్త పద్దతుల్లో చైనా ప్రభావాన్ని చూపేందుకు పూనుకున్నారు. శాంతి ప్రతిపాదనల్లో మొక్కుబడిగా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం పట్ల గౌరవం ఉందని పేర్కొన్నది.పౌరుల రక్షణ, మానవతా పూర్వసాయంపై జోక్యం చేసుకోరాదని,అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాలను ఖండించటం, ప్రపంచంలో వెల్లడైన అభిప్రాయాలను అది ప్రతిబింబించినప్పటికీ ప్రధానంగా రష్యాకు సాయపడేవిధంగా ప్రతిపాదనలు ఉన్నట్లు టైమ్స్‌ విశ్లేకుడు ఆరోపించాడు. వాటి ప్రకారం తక్షణమే కాల్పుల విరమణ జరిగితే రష్యా జయించింది దాని దగ్గరే ఉంటుంది. తమ ప్రాంతాలను తమకు స్వచ్చందంగా అప్పగించాలని పుతిన్ను ఉక్రెయిన్‌ బతిమాలుకోవాల్సి ఉంటుందని టైమ్‌ రెచ్చగొట్టింది. నష్టపోయేందుకు ఎవరూ సిద్దం కానందున ఈ దశలో శాంతిపధకం విజయవంతం కాదని పేర్కొన్నది. పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు ముందుకు తెచ్చిన అంశాలు వాటి పాలకవర్గాల ఆలోచనా వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.వాటిలో చైనాను బెదిరించటం కూడా ఒకటి.


కరోనా, తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తలెత్తిన పరిస్థితి, పేద, వర్ధమాన దేశాలకు సంకటంగా మారింది. దాన్ని పరిష్కరించకుండా అడ్డుపడుతున్నది అమెరికా, పశ్చిమదేశాల కూటమే అని అవి భావిస్తున్నాయి. ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, సరఫరా సంక్షోభం వంటి తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.ఉక్రెయిన్‌ వివాదాన్ని మరింత తీవ్రంగావించే, దీర్ఘకాలం కొనసాగించే ఎత్తుగడల కారణంగా రష్యా మీద విధించిన ఆంక్షలకు అవి మద్దతు పలకకపోవటంతో అమెరికా వ్యూహవేత్తలు కంగుతిన్నారు. ఇరాన్‌-సౌదీ మధ్య చైనా కుదిర్చిన ఒప్పందం తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం పరిష్కారానికి అడ్డుపడేవారి మీద వత్తిడిపెరుగుతోంది. ఇప్పుడు చైనా ముందుకు తెచ్చిన శాంతి పథకాన్ని సూత్ర ప్రాయంగా ఏ దేశమూ కాదనలేదు. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచి చర్చలకు అడ్డుపడుతున్న పశ్చిమ దేశాల మీద మరింత ఆగ్రహం వెల్లడి అవుతోంది.
తమ పెత్తనానికి ఎసరు వస్తోందని, దానికి చైనా, రష్యాలే కారణమని భావిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇటీవలి కాలంలో అన్ని విధాలుగా పెద్ద సవాలు విసురుతున్నాయి.ఈ నేపధ్యంలో రెండు దేశాలూ తమ సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం ఏడాది క్రితం ప్రారంభమైనట్లు పైకి కనిపించినా పశ్చిమ దేశాల మద్దతుతో పది సంవత్సరాల క్రితం ” యూరోమైదాన్‌ ” పేరుతో ఉక్రెయిన్లో అమలు జరిపిన కుట్ర దానికి నాంది పలికింది. అది అమెరికా-రష్యా ఘర్షణకు దారి తీసింది.రష్యా మీద అవసరమైతే దాడి చేసేందుకు అమెరికా రెండు విమానవాహక యుద్ద నౌకలను రష్యా ముంగిట తెచ్చిపెట్టింది. దాంతో ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ సైనిక చర్యకు దిగాడు. మరోవైపు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో చైనాతో వాణిజ్య పోరుతో ప్రారంభించి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోరు అనే మరో రెండో రంగాన్ని కూడా తెరిచారు. ఈ పూర్వరంగంలో షీ జింపింగ్‌ మాస్కో పర్యటన నామమాత్రం కాదు అన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

12 Sunday Mar 2023

Posted by raomk in Current Affairs, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Adolf Hitler, anti communists, Joseph Stalin, Joseph Vissarionovich Stalin, USSR, world war 2


ఎం కోటేశ్వరరావు


” జర్మనీ గెలుస్తున్నట్లు మనకు కనిపించిందనుకోండి మనం రష్యాకు తోడ్పడాల్సి ఉంటుంది, ఒక వేళ రష్యా గెలుస్తున్నదనుకోండి మనం జర్మనీకి సాయం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎంత మందిని పరస్పరం హతమార్చుకుంటారో అంతవరకు వారిని చంపుకోనిద్దాం ” తరువాత కాలంలో హిట్లర్‌ను దెబ్బతీశాం అని తన జబ్బలను తానే చరుచుకున్న అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్‌ 1941లో చెప్పిన మాటలివి. డెబ్బయి నాలుగు సంవత్సరాల వయసులో 1953 మార్చి ఐదున గుండెపోటుతో హిట్లర్‌ పీచమణచిన స్టాలిన్‌ మరణించాడు. డెబ్బయి సంవత్సరాలు గడచినా స్టాలిన్‌ ముద్ర చెరగలేదు. ఈనెల ఐదున మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో వేలాది మంది స్టాలిన్‌కు నివాళి అర్పించారు. అనేక చోట్ల పలు కార్యమాలను నిర్వహించారు. పలు చోట్ల విగ్రహాలను ఆవిష్కరించారు. అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్న పూర్వరంగంలో వాటిని ఎదుర్కొనేందుకు స్టాలిన్‌ వంటి వారు కావాలని జనం కోరుకొంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచానికే ముప్పుగా మారిన నాజీ మూకలను దెబ్బతీసి చివరికి బంధించేందుకు ఎర్ర సైన్యం చుట్టుముట్టటంతో బెర్లిన్‌లోని ఒక నేళమాళిగలో హిట్లర్‌ తన సహచరితో కలసి ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు. అలాంటి మహత్తర పోరుకు మార్గదర్శి సోవియట్‌ నేత స్టాలిన్‌. తన పెద్ద కుమారుడు ఎకోవ్‌ స్టాలిన్‌ 1941లో హిట్లర్‌ మూకలకు పట్టుబడినపుడు తమ కమాండర్‌ను వదిలితే ఎకోవ్‌ను అప్పగిస్తామని నాజీ మిలిటరీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన స్టాలిన్‌ వంటి వారు చరిత్రలో అరుదు.చివరికి ఎకోవ్‌ను హిట్లర్‌ మూకలు చిత్రహింసలపాలు చేసి హతమార్చాయి.


ఎర్రజెండా చరిత్రలో స్టాలిన్‌ది ఒక ప్రత్యేక స్థానం. మరణం తరువాత సోవియట్‌ నేతలే స్వయంగా తప్పుడు ప్రచారానికి పూనుకోవటంతో కమ్యూనిస్టు వ్యతిరేకుల సంగతి చెప్పేదేముంది.స్టాలిన్‌ మీద దుమ్మెత్తి పోసిన వారు చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. రష్యాలో స్టాలిన్‌ అభిమానులు పెరుగుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఓల్గా గ్రాడ్‌లో కార్పొరేషన్‌ స్టాలిన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.నాజీజంపై విజయం సాధించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కొన్ని దేశాలు ఈ రోజున సోవియట్‌ మిలిటరీ సాధించిన విజయాన్ని కనుమరుగు చేసేందుకు చూస్తున్నాయి, దాన్ని సాగనివ్వం అన్నాడు.డెబ్బయ్యవ వర్ధంతి సందర్భంగా అనేక మంది విశ్లేషకులు పత్రికల్లో స్టాలిన్‌ మీద దాడి చేస్తూనే జనంలో వెల్లడౌతున్న సానుకూల వైఖరిని కూడా చెప్పకతప్పలేదు. గతేడాది జరిపిన ఒక సర్వేలో నాజీలను ఓడించటంలో స్టాలిన్‌ పాత్ర గురించి 70 శాతం మంది రష్యన్లు సానుకూలంగా ఉన్నట్లు తేలింది.2015 సర్వేలతో పోలిస్తే సానుకూలంగా స్పందించిన వారు పెరిగారు.కమ్యూనిస్టులు కానివారిలో కూడా పెరుగుదల ఉండటం గమనించాల్సిన అంశం.


చరిత్ర కారులు రెండవ ప్రపంచ యుద్దం గురించి భిన్నమైన పాఠాలు తీశారు. స్టాలిన్‌ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. స్టాలిన్‌ గురించి ఎక్కువగా తప్పుడు పాఠాలు తీసేవారు 1939లో సోవియట్‌-నాజీ జర్మనీ మధ్యకుదిరిన మాల్టోవ్‌-రిబ్బెన్‌ట్రాప్‌ ఒప్పందాన్ని చూపుతారు. కమ్యూనిస్టులు-నాజీలు ఒకటే అని చెప్పేవారు కూడా దీన్నే పేర్కొంటారు. ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎన్నడూ హిట్లర్‌తో స్టాలిన్‌ చేతులు కలపలేదు. పరస్పరం దాడులు జరుపుకోవద్దు అన్నదే ఆ ఒప్పందసారం. అసత్యాలు, అర్ధ సత్యాలను పక్కన పెట్టి దీనికి దారితీసిన పరిస్థితులను మదింపు చేయటం అవసరం.జర్మనీలో 1930దశకం మధ్యనుంచి మిలిటరీని పటిష్టపరచటం ప్రారంభించారు.ఇథియోపియా(గతంలో దాన్ని అబిసీనియా అని పిలిచేవారు)ను ఆక్రమించేందుకు ఇటలీ ముస్సోలినీకి, స్పెయిన్లో నియంత ఫ్రాంకో పాలన రుద్దేందుకు జర్మనీ తోడ్పడింది. ఇదంతా నాజీ జర్మనీని పటిష్టపరిచే పధకంలో భాగమే.1938లో ఆస్ట్రియాను జర్మనీ ఆక్రమించింది.తరువాత చెకొస్లోవేకియాలోని జర్మన్లు నివశించే ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకుంది. దాంతో బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీ, ఇటలీ ఒక ఒప్పందానికి వచ్చి హిట్లర్‌ను సంతృప్తిపరచేందుకు ఆ ప్రాంతాన్ని జర్మనీకి అప్పగించేందుకు అంగీకరించాయి. దీన్నే 1938 సెప్టెంబరు 30 మ్యూనిచ్‌ ఒప్పందం అన్నారు. ఇది నాజీలు తూర్పు ఐరోపాను ఆక్రమించేందుకు దోహదం చేసింది. ఒకవేళ జర్మనీ గనుక దాడి చేస్తే తాము రక్షణ కల్పిస్తామని పోలాండ్‌తో మరుసటి ఏడాది మార్చి 31వ తేదీన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఏప్రిల్‌ ఏడున ఇటలీ దళాలు అల్బేనియాను ఆక్రమించాయి.సెప్టెంబరు ఒకటవ తేదీన హిట్లర్‌ మూకలు పోలాండ్‌ను ఆక్రమించాయి. ఎలాంటి మిలిటరీ చర్యల్లేకుండా బ్రిటన్‌,ఫ్రాన్స్‌ దేశాలు జర్మనీ మీద యుద్దాన్ని ప్రకటించాయి.తాను తటస్థమని అమెరికా చెప్పింది.


బ్రిటన్‌-ఫ్రాన్స్‌-పోలాండ్‌ రక్షణ ఒప్పందం చేసుకోక ముందు తెరవెనుక జరిగిన పరిణామాలను చూడాలి. సోవియట్‌ మీద దాడి చేసేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని పోలాండ్‌ మీద హిట్లర్‌ వత్తిడి తెచ్చాడు. అదే తరుణంలో పరస్పర రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ కూడా పోలాండ్‌కు ప్రతిపాదించింది. రెండింటినీ తిరస్కరించిన పోలాండ్‌ పాలకులు బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం చేసుకున్నారు. హిట్లర్‌తో కలసి ప్రపంచాన్ని పంచుకొనేందుకు ఈ దేశాలు సిద్దం కాదు, అదే సమయంలో సోవియట్‌ బలపడటం కూడా వాటికి సుతరామూ ఇష్టం లేదు.తమ బలాన్ని అతిగా ఊహించుకోవటం కూడా ఒక కారణం. అప్పటికే సోవియట్‌ గురించి అమెరికా భయపడుతోంది.అమెరికా సెనెటర్‌ రాబర్ట్‌ ఏ టాఫ్ట్‌ చెప్పినదాని ప్రకారం ” అమెరికాకు సంబంధించినంతవరకు ఫాసిజం విజయం కంటే కమ్యూనిజం గెలుపు ఎక్కువ ప్రమాదకరం (1941 జూన్‌ 25 సిబిఎస్‌) ”. అంతేకాదు ఐరోపాలో ప్రజాస్వామ్య ముసుగువేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు సోవియట్‌ను అడ్డుకొనేందుకు నాజీలను ఒక ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించాయి. ఈ కారణంగానే హిట్లర్‌ మూకలు ఆస్ట్రియాను ఆక్రమించగానే నాజీల దురాక్రమణలను అడ్డుకొనేందుకు రక్షణ ఒప్పందాలను చేసుకుందామని, ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న సోవియట్‌ ప్రతిపాదనను అవి తిరస్కరించాయి.జర్మన్ల దాడిని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఒక రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ 1939 జూలై 23న చేసిన ప్రతిపాదన గురించి ఎటూ తేల్చకుండానే జర్మనీతో పరస్పరం దాడులు జరుపుకోకుండా ఒప్పందం చేసుకోవాలని లోపాయికారీ చర్చలకు బ్రిటన్‌ తెరతీసింది.లండన్‌లో హిట్లర్‌ ప్రతినిధితో చర్చలు జరిపారు.


ఈ పరిణామాలు, అంతరంగాల అర్ధం ఏమిటంటే నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ, స్పెయిన్లకూ, ప్రజాస్వామిక ముసుగువేసుకున్న బ్రిటన్‌,ఫ్రాన్స్‌, అమెరికాలకు కావలసింది సోవియట్‌ నాశనం కావటం.బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో హిట్లర్‌కు వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకొనేందుకు అనేక విఫల ప్రయత్నాలు చేసిన తరువాతనే జర్మనీతో పరస్పరదాడుల నివారణ ఒప్పందాన్ని స్టాలిన్‌ చేసుకున్నారు. ఎప్పుడైనా హిట్లర్‌ మూకలు దాడులకు దిగవచ్చన్న అంచనా లేక కాదు.కొద్ది పాటి వ్యవధి దొరికినా ఎర్ర సైన్యాన్ని పటిష్టపరచాలన్న ఎత్తుగడ దాని వెనుక ఉంది. చరిత్రను ఒక వైపే చూడకూడదు.1939లో పోలాండ్‌ మీద నాజీ మూకలు దాడి చేశాయి. దానితో రక్షణ ఒప్పందం చేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ పత్తాలేవు. రష్యాలో బోల్షివిక్‌ విప్లవంలో లెనిన్‌ అధికారానికి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతీఘాత శక్తులు పూనుకున్నాయి. అంతకు ముందు పోలాండ్‌ కూడా రష్యాలో భాగమే అని జార్‌ చక్రవర్తి చేసిన వాదనను బోల్షివిక్‌ సర్కార్‌ అంగీకరించలేదు. బాల్టిక్‌ ప్రాంతంలోని పశ్చిమ బెలారస్‌, పశ్చిమ ఉక్రెయిన్‌, లిథువేనియాలో కొంత ప్రాంతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం నాటికే పోలాండ్‌ తన ఆధీనంలో ఉంచుకుంది.జారు చక్రవర్తితో కలసి బోల్షివిక్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సెంట్రల్‌ పవర్స్‌ పేరుతో జర్మనీ,ఒట్లోమన్‌, ఆస్ట్రియా-హంగరీ, బల్గేరియాలతో కలసి పోలాండ్‌లోని అనేక ప్రాంతాల్లో ఉన్న నాజీ, ఫాసిస్టు శక్తులు కూడా చేతులు కలిపాయి.(ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉన్న నాజీశక్తులు రష్యన్‌ భాషమాట్లాడేవారు ఉన్న కొన్ని ప్రాంతాల మీద దాడులు చేస్తున్నారు) ఈ పూర్వరంగంలోనే సెంట్రల్‌ పవర్స్‌తో లెనిన్‌ శాంతి ఒప్పందం చేసుకున్నాడు. దాన్నే బ్రెస్ట్‌-లిటోవస్క్‌ ఒప్పందం అని పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌-స్టాలిన్‌ ఒప్పందం ఆ రెండు దేశాలకే పరిమితం తప్ప మూడో దేశ ప్రస్తావన లేదు. పోలాండ్‌ మీద నాజీమూకలు దాడి చేసిన వెంటనే దానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న దేశభక్తులు నాజీదాడులను ప్రతిఘటించారు. వారికి మద్దతుగా సోవియట్‌ సేనలు పోలాండ్‌లో ప్రవేశించాయి. కొన్ని ప్రాంతాలను విముక్తి కావించాయి. దాన్నే కొందరు సోవియట్‌ దురాక్రమణగా చిత్రించి నాజీలకు-కమ్యూనిస్టులకు తేడా ఏముందని వాదిస్తారు.


హిట్లర్‌-స్టాలిన్‌ సంధిలో దేశాలను విభజించే అంశం లేదు.అలాంటి దుర్మార్గపు నిబంధనలు ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌-ఫ్రాన్స్‌ దేశాలు హిట్లర్‌తో చేతులు కలిపి చెకొస్లొవేకియాను విడదీశాయి. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత తూర్పు ఐరోపాలో సోవియట్‌ విముక్తి చేసిన అన్ని ప్రాంతాలూ స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి.(సోవియట్‌ పతనమైన తరువాత దానిలో ఉన్న రిపబ్లిక్కులు కూడా స్వతంత్ర దేశాలుగా మారిన సంగతి తెలిసిందే) ఒక్క జర్మనీలోనే తూర్పు ప్రాంతాన్ని ఎర్రసైన్యం విముక్తి చేస్తే పశ్చిమ ప్రాంతాన్ని ఇతర మిత్రదేశాలు ఆధీనంలోకి తెచ్చుకున్నందున దాన్ని విభజించి తరువాత విలీనం చేయాలని నిర్ణయించారు. కొరియా, వియత్నాం విభజన అలాగే జరిగింది. విలీనానికి అడ్డుపడిన అమెరికా, దాని తొత్తు ప్రభుత్వం మీద దక్షిణ వియత్నాం పౌరులు తిరగబడి అమెరికాను తరిమివేసి ఒకే దేశంగా ఏర్పడ్డారు. తూర్పు ఐరోపా దేశాల్లో సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలో భాగంగా తూర్పు జర్మనీలో ప్రభుత్వం పతనం కాగానే పశ్చిమ జర్మనీలో విలీనం చేశారు. రెండు కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది అమెరికా, జపాన్‌ అన్నది తెలిసిందే. అదే విధంగా చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ విలీనానికి అడ్డుపడుతున్నది కూడా అమెరికా అన్నది తెలిసిందే.


లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్‌ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్‌, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఏమార్చేందుకు చూస్తున్నారు. వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నదానికి బదులుగా తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. గతేడాది కాలంగా ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ ప్రారంభించిన సైనిక చర్యతో రాజకీయ చర్చంతా దాని మీదకు మళ్లింది.


కొంత మంది హిట్లర్‌ అనుకూలురు లేదా కమ్యూనిస్టు వ్యతిరేక చరిత్రకారులు అరే ఆ ఒక్క తప్పిదం చేయకుండా ఉంటే చరిత్ర గతి వేరుగా ఉండేది అని నిట్టూర్పులు విడుస్తారు.ఏమిటా తప్పిదం అంటే సోవియట్‌ శక్తిని, స్టాలిన్‌ ఎత్తుగడలను తప్పుగా అర్ధం చేసుకున్న హిట్లర్‌ తన మూకలను సోవియట్‌ మీదకు నడపటమే అని చెబుతారు. అది నిజానికి స్టాలిన్‌, కమ్యూనిస్టుల త్యాగాలను తక్కువ చేసి చూపే దుష్ట ఆలోచనే. తప్పుడు అంచనాలు వేసింది ఒక్క హిట్లరేనా ? ప్రపంచాన్ని తమ చంకలో పెట్టుకోవాలని చూసిన ప్రతివారూ అదే తప్పిదాలు చేశారు. తరువాత కాలంలో అమెరికా కూడా చేసి భంగపడిందని గ్రహించటానికి వారు సిద్దం కాదు.కొరియా, వియత్నాం, ఆప్ఘనిస్తాన్‌ అనుభవాలు చెబుతున్నది. అదే ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా అదే జరగనుందని భావిస్తున్నారు.గర్హనీయమైన అంశం ఏమంటే తన మూకలను నడిపించి యూదులు, ఇతరులను లక్షలాది మందిని ఊచకోత కోయించిన హిట్లర్‌ను, వాడిని ఎదుర్కొనేందుకు జనాన్ని సమీకరించి ఎదురొడ్డిన స్టాలిన్ను ఒకే గాట కడుతున్నారు. సోవియట్‌ మిలిటరీ తమను ప్రతిఘటించి నాజీలు, వారితో చేతులు కలిపిన వారి సంగతి చూశారు తప్ప సామాన్య జనం మీద దాడులకు దిగలేదు. చరిత్రను వక్రీకరించగలరు తప్ప దాన్ని చెరపటం ఎవరి తరమూ కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

11 Saturday Mar 2023

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, kavitha, Narendra Modi, Narendra Modi Failures, SITARAM YECHURY, women reservation, Women's Quota Bill


ఎం కోటేశ్వరరావు


ఎక్కడ మహిళలను పూజిస్తారో అక్కడ దైవత్వం వెల్లివిరుస్తుంది ! మన గడ్డ అలాంటిదేమరి అంటూ తెగమురిసిపోతాం. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం !! అని మన జబ్బలు మనమే చరుచుకుంటాం.ఎంతటి ఆత్మవంచన ! ఇంకా ఇలాంటివే చెప్పుకోవాలంటే మరో రామాయణం, భారతాలు అవుతాయి. దేశంలో పరిస్థితి అలానే ఉందా ? ఆమె దీక్ష తెరవెనుక కారణాలు ఏమిటన్నది పక్కన పెడితే తెరముందు రాజకీయ పార్టీలు తమ వైఖరిని తేల్చాలంటూ భారత జాగృతి సంస్థ నేత, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చారు. కవిత జన్మించటానికి నాలుగు సంవత్సరాల ముందే 1974లో ఈ సమస్య ముందుకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆమె తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పుట్టక ముందు నుంచే నలుగుతోంది. దీనికి సంబంధించి రాజ్యసభలో 2010లో ఆమోదం పొందిన బిల్లును 108వ రాజ్యాంగ సవరణ అని కూడా అంటారు. అప్పటి నుంచి 2014, 2019లో రెండు లోక్‌సభల గడువు తీరి రద్దయి ఉనికిలోకి వచ్చిన మూడవ సభలో కూడా ఇంతవరకు ఆమోదం పొందలేదు, ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. వర్తమాన లోక్‌సభ 2024లో రద్దయేలోగా ఆమోదం పొందుతుందా ? ఆ ప్రక్రియ తరువాత రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు ఐదున్నర గంటల పాటు భారీ ఎత్తున మద్దతుదార్లతో కలసి కవిత దీక్ష చేశారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు. సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. లాంఛన ప్రాయమైన ఈ దీక్ష ద్వారా మరుగున పడేసిన ఈ అంశాన్ని ఆమె ఒక్కసారి దేశ దృష్టిని ఆకర్షించేట్లు చేశారు. దీని పర్యవసానాలు ఏమిటి ?


మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన వచ్చినపుడు రాజ్యాంగసభ లేదా పరిషత్‌లోని కొందరు పురుషులతో పాటు కొందరు మహిళా సభ్యులు కూడా అంగీకరించలేదు.నిజానికి ఈ అంశం 1931లోనే చర్చకు వచ్చింది. మహాత్మాగాంధీ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారు.1931లో నాటి బ్రిటిష్‌ ప్రధానికి సరోజిని నాయుడు తదితరులు రాసిన లేఖలో చట్టసభల్లో మహిళల నియామకం, రిజర్వేషన్లు, కో ఆప్షన్‌ వంటి చర్యలను అవమానకరమైనవిగానూ, హానికరమైనవిగానూ పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. తరువాత కాలంలో దీన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. చట్టసభలలో ఆశించిన మేరకు ప్రాతినిధ్యం పెరగలేదు. 1974లో దేశంలో మహిళల స్థితిగతుల గురించి ఒక కమిటీ చేసిన సిఫార్సులలో స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఒకటి. చట్ట సభల్లో రిజర్వేషన్లను తిరస్కరించింది. అప్పటి నుంచి ఈ డిమాండ్‌కు క్రమంగా మద్దతు పెరిగింది.తరువాత 1988లో జాతీయ మహిళా దృష్టికోణ పధకం(నేషనల్‌ పరస్పెక్టివ్‌ ప్లాన్‌ ఫర్‌ ఉమెన్‌) కమిటీ స్థానిక సంస్థలలో మహిళలకు 30శాతం స్థానాలను రిజర్వుచేయాలని సిఫార్సు చేసింది. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1992,93 సంవత్సరాలలో 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా మూడోవంతు స్థానాలను రిజర్వు చేశారు. దీని ప్రకారం మూడవ వంతు కనీసంగానూ, తరువాత ఏ రాష్ట్రమైనా కోరుకుంటే 50శాతం వరకు కూడా పెంచుకొనే అవకాశం కల్పించారు. ఆ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఆమేరకు సగం సీట్లు రిజర్వు చేశాయి. తరువాత 1996 సెప్టెంబరు 12న దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడు లోక్‌సభలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు.అది వీగింది, తరువాత ప్రతి లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టటం ఆమోదం పొందకుండానే సభలు రద్దుకావటం చరిత్రగా మిగిలింది. తరువాత 2008లో యుపిఏ సర్కార్‌ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. స్టాండింగ్‌ కమిటీకి పంపగా దాన్ని ఆమోదించాలని 2009 డిసెంబరులో సిఫార్సు చేసింది.మంత్రివర్గం 2010 ఫిబ్రవరి 25న ఆమోదం తెలిపింది. మార్చి తొమ్మిదవ తేదీన ఓటింగ్‌కు పెట్టగా 199-1తో ఆమోదం తెలిపారు. తరువాత లోక్‌సభ, సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలిపి ఉంటే అది చట్టరూపందాల్చి ఉండేది. ఇంతవరకు అది జరగలేదు.


రాజ్యసభ ఆమోదించినదాని ప్రకారం మూడోవంతు సీట్లు అంటే 543కు గాను 181 స్థానాల్లో మహిళలు ఉండాలి. వర్తమాన లోక్‌సభలో 78 మంది అంటే 14.3శాతం మాత్రమే ఉన్నారు. మంత్రులు కూడా ఇదే దామాషాలో కొలువు దీరారు. అంతకు ముందు ఉన్నవారి కంటే మంత్రుల సంఖ్య తగ్గింది.అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో కేవలం తొమ్మిదిశాతమే ఉన్నారు. వివిధ దేశాల పార్లమెంట్లలో ఉన్న మహిళా ప్రాతినిధ్యం గురించి అంతర పార్లమెంటరీ యూనియన్‌ 2022లో సేకరించిన సమాచారం ప్రకారం సగానికిపైగా, దగ్గరగా మహిళలున్న పార్లమెంట్లు ర్వాండా(61.25) , క్యూబా( 53.22),బొలీవియా(53.08), న్యూజిలాండ్‌( 50.42), యుఏయి (50), మెక్సికో(48.2), నికరాగువా(47.25) ఉన్నాయి. ఇరవై దేశాలలో 40శాతంపైగా, ప్రపంచవ్యాపితంగా సగటున 26శాతం ఉన్నారు. 2020లో ప్రపంచంలో 193 దేశాలలో మన స్థానం 143 కాగా మన కంటే మెరుగ్గా ఉన్న దేశాలు నేపాల్‌ 43, బంగ్లాదేశ్‌ 98, పాకిస్థాన్‌ 106వ స్థానంలో ఉండగా శ్రీలంక 182వదిగా ఉంది.


మన పార్లమెంటులో రిజర్వేషన్ల బిల్లు చర్చకు వచ్చినపుడు ఓబిసి, దళిత, గిరిజన మహిళల భుజాల మీద తుపాకి పెట్టి బిల్లును అడ్డుకున్న ఘనులు ఉన్నారు. ఏ సామాజిక తరగతికి చెందిన వారు అన్నదానితో నిమిత్తం లేకుండా మొత్తంగా మహిళలు అన్ని సామాజిక తరగతుల్లో వివక్షకు గురవుతున్నారు. అందువలన రిజర్వేషన్లు పెడితే ధనికులు, మనువు చెప్పినదాని ప్రకారం ఎగువ నిచ్చెనమెట్ల మీద ఉన్న మహిళలే ఆ ఫలాలను అనుభవిస్తారంటూ అడ్డుకున్నవారు కొందరు. రిజర్వేషన్లు అడగటం, ఇవ్వటం అంటే మహిళలను కించపరచటమే అని వాదించిన వారూ లేకపోలేదు.పైకి కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ దేశంలో ఫ్యూడల్‌ భావజాలం బలంగా ఉండటమే బిల్లు ఆమోదం పొందటానికి ఆటంకంగా ఉందని చెబుతున్నవారు ఉన్నారు. స్థానిక సంస్థలలో ఎన్నికైన మహిళలు పేరుకు ఆ స్థానాల్లో ఉన్నా భర్త లేదా కుటుంబంలోని ఇతర పురుషులే పెత్తనం చేస్తున్నారన్నది కూడా పాక్షిక సత్యమే. మరోవైపున మహిళలు ఉన్న చోట కేటాయింపులు పౌర సేవలు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలకు పెరిగినట్లు, సాధికారత, ఆత్మగౌరవం పెరిగినట్లు కూడా సర్వేలు వెల్లడించాయి. గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ చట్టసభలకు పోటీచేసే వారిలో నిర్ణీతశాతంలో మహిళలు ఉండేట్లు చూడాలన్న ప్రతిపాదనకు ఆమోదం రాలేదు. దీని వలన ఓడిపోయే చోట్ల వారిని పోటీకి దింపుతారనే విమర్శకూడా వచ్చింది.


చట్టపరంగా లేదా రాజకీయ పార్టీలు స్వచ్చందంగా మహిళలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించకపోవటం మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని ప్రచారం చేసుకోవటాన్ని అపహాస్యం చేస్తున్నది. అన్నింటికంటే పెద్ద వైరుధ్యం, సిగ్గుచేటైన అంశం ఏమంటే ఎన్నికలలో మూడోవంతు సీట్లు మహిళలకు రిజర్వు చేసేందుకు ముందుకు రాని పార్టీలు మరోవైపున నేరచరితులకు పెద్ద పీటవేసేందుకు ముందుకు వస్తున్నాయి. దోషులుగా తేలేంతవరకు నిందితులు తప్ప ఎవరూ నేరస్థులు కాదనే నిబంధనను అవకాశంగా తీసుకొని వారి కండబలాన్ని తోడు చేసుకొనేందుకు బరిలో నిలుపుతున్నాయి.తొలి లోక్‌సభలో ధనికులు, నేరచరితులు ఎందరు అని వెతికేందుకు కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ధనికులు కానివారు ఎందరు, నేర చరిత లేనివారు ఎందరు అన్నది వెతుక్కోవాల్సి వస్తోంది.


గతంలో రాజ్యసభ ఆమోదించిన బిల్లు ప్రకారం మూడోవంతు సీట్లను చట్ట సభల్లో మహిళలకు కేటాయించాలి. షెడ్యూలు కులాలు, తెగలకు కేటాయించిన సీట్లలో కూడా మూడోవంతు మహిళలుండాలి.ఏ రాష్ట్రంలోనైనా మూడు కంటే తక్కువ లోక్‌సభ సీట్లుంటే అక్కడ మూడోవంతు సూత్రం వర్తించదు.ఎక్కడైనా మూడు సీట్ల కంటే తక్కువ ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయిస్తే అక్కడ కూడా రిజర్వేషన్‌ ఉండదు. రిజర్వుడు సీట్లను రొటేషన్‌ పద్దతిలో కేటాయించాలి. మైనారిటీ,ఓబిసి మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్‌ లేదు.రాజ్యసభ, శాసనమండళ్లకు రిజర్వేషన్‌ వర్తించదు.పదిహేను సంవత్సరాల తరువాత రిజర్వేషన్లు రద్దవుతాయి.


ఎన్నికల నిబంధనవాళి ప్రకారం పోటీ చేసే వారు తమ ఆస్తిపాస్తులు, తమ మీద ఉన్న కేసులను అఫిడవిట్లలో పేర్కొనాల్సి ఉంది. వాటిని విశ్లేషిస్తున్న ఎడిఆర్‌ సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు 2019లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో నేర చరితులు 43శాతం మంది ఉన్నారు.లోక్‌సభలోని 539 మందిలో 233 మంది నేరచరితులు ఉన్నట్లు తేలింది. పార్టీల వారీగా బిజెపి 116(39శాతం), కాంగ్రెస్‌ 19(57శాతం), జెడియు 13(81శాతం), డిఎంకె 10(43శాతం) తృణమూల్‌ 9(41) మంది ఉన్నారు.గత మూడు ఎన్నికలలో 2009లో మొత్తం 162(30శాతం) నుంచి 2014లో 185(34శాతం), 2019లో 233(43శాతం)కు పెరిగారు. వర్తమాన సభలో నేరచరితుల మీద ఉన్న కేసులలో 29శాతం అత్యాచారం, హత్య, హత్యాయత్నం, మహిళల మీద నేరాల వంటి తీవ్ర స్వభావం కలిగినవి ఉన్నాయి.బిజెపికి చెందిన ఐదుగురు, బిఎస్‌పి నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌,ఎన్‌సిపి,వైఎస్‌పి, ఒక స్వతంత్రుడి మీద హత్యకేసులు, బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మీద ఉగ్రవాద కేసు ఉంది.ఆమె భోపాల్‌ నుంచి గెలిచారు, మాలెగావ్‌ పేలుడు కేసులో నిందితురాలు. ఇక 29 మంది తమ మీద విద్వేష పూరిత ప్రసంగాల కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా కేరళలోని ఇడుక్కి నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీ డీన్‌ కురియకోస్‌ మీద దొంగతనంతో సహా 204కేసులు గరిష్టంగా ఉన్నాయి.


ఇలాంటి వారిని కలిగి ఉన్న పార్టీలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం గురించి ఏకాభిప్రాయానికి రావటం లేదన్నది ఒక ఆరోపణ. నిజానికి ఏ పార్టీ రంగేమిటో తేలేది బిల్లును లోక్‌సభ ముందుకు తెచ్చినపుడే. గతంలో తమకు ఉభయ సభల్లో మెజారిటీ ఉంటే ఒక్క క్షణంలో చేసి ఉండేవారమన్నట్లుగా బిజెపి నేతలు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పటికీ బిజెపి నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి చొరవలేదు.2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్న ప్రశ్నకు ఆ ఏడాది డిసెంబరులో నాటి మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఇచ్చిన సమాధానం బిజెపి చిత్తశుద్దిని వెల్లడించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయసాధనను జాగ్రత్తగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి చొరవ ఇంతవరకు ఎందుకు తీసుకోలేదన్నదే ప్రశ్న. తాము అనుకున్న కాశ్మీరు రాష్ట్ర రద్దు, ఆర్టికల్‌ 370 రద్దును ఆఘమేఘాల మీద ఎలా ఆమోదం పొందారో తెలిసిందే. అందువలన ఇప్పుడు బిజెపి తలచుకుంటే ఆమోదం కష్టమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

క్రైస్తవ మత కుట్రదారులకు జైలు శిక్ష -నికరాగువాలో పెరుగుతున్న ప్రజా చర్చ్‌లు !

08 Wednesday Mar 2023

Posted by raomk in Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Politics, RELIGION, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#latin american left, Bishop Rolando Álvarez, Daniel Ortega, FSLN, Hugo Chávez, Nicaragua, Nicaraguan Catholic Church, Sandinista National Liberation Front


ఎం కోటేశ్వరరావు


లాటిన్‌ అమెరికాలోని నికరాగువాలో మానవహక్కులకు భంగం వాటిల్లిందంటూ తాజాగా ఐరాస మానవహక్కుల సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది.తటస్థంగా ఉండాల్సిన సంస్థలు తాము ఇచ్చిన వివరాలను, జరిగిన ఉదంతాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు నికరాగువా వామపక్ష శాండినిస్టా ప్రభుత్వం ఆ నివేదికను తోసిపుచ్చింది. డేనియల్‌ ఓర్టేగా అధిపతిగా ఉన్న ప్రభుత్వం కాథలిక్‌ బిషప్‌ రోలాండో అల్వారెజ్‌కు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన 26 సంవత్సరాల శిక్ష విధించి జైల్లో పెట్టిందంటూ అనేక క్రైస్తవ మత సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. పోప్‌ ఫ్రాన్సిస్‌ కూడా ఆ ఉదంతం పట్ల విచారం, ఆందోళన ప్రకటించారని, సదరు బిషప్‌ కోసం ప్రార్ధనలు జరపాలని ఎసిఎన్‌ (ఎయిడ్‌ టు ద చర్చ్‌ ఇన్‌ నీడ్‌) సంస్థ పిలుపునిచ్చింది.మతపరమైన ఊరేగింపుల మీద కూడా ప్రభుత్వం ఆంక్షలను విధించినట్లు ఆరోపిస్తూ అందువలన గుడ్‌ఫ్రైడే వంటి వాటిని కూడా చర్చ్‌లకే పరిమితం చేసినట్లు మత సంస్థలు పేర్కొన్నాయి.బిషప్‌ రోలాండో అల్వారెజ్‌ వంటి వారు అమెరికాతో చేతులు కలిపి 2018 ఓర్టేగా సర్కార్‌ను కూల్చేందుకు కుట్ర చేశారు. అలాంటివారు 222 మందిని కోర్టులలో విచారించి శిక్షలు వేశారు. వారి పౌరసత్వాలను రద్దు చేశారు.వారందరికీ ఆశ్రయం కల్పించేందుకు అమెరికా ముందుకు రావటంతో ఒక విమానంలో వారిని పంపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.తాను అమెరికా వెళ్లేది లేదని బిషప్‌ తిరస్కరించాడు. దాంతో అతన్ని జైల్లో పెట్టి అంగీకరించిన వారిని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విమానంలో అమెరికా పంపారు.వారిలో పదకొండు మంది మతాధికారులు కూడా ఉన్నారు.


నికరాగువాలో అసలే జరుగుతోంది ? తప్పుడు ప్రచారాలకు ఎందుకు పూనుకున్నట్లు ? ముందుగా గమనించాల్సింది, ఇది మొదటిసారి కాదు. అక్కడ తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం ఏర్పడినపుడు, కొంత కాలం తరువాత తిరిగి అధికారానికి వచ్చిన తరువాత ప్రచారం సాగుతూనే ఉంది. అమెరికా దేశాల సంస్థ(ఓఎఎస్‌) సంస్థతో కలసి ఐరాస మానవహక్కుల కమిషన్‌ ప్రతినిధులు తాజాగా ఒక నివేదిక ఇచ్చారు. ఏకపక్షంగా ప్రపంచం ముందు నికరాగువాను చెడుగా చూపేందుకు చూసింది. భారత్‌ను కనుగొనేందుకు బయలు దేరిన కొలంబస్‌ తన నాలుగవ యాత్రలో 1502లో పసిఫిక్‌ సముద్రం వైపు నుంచి నికరాగువాలో అడుగుపెట్టాడు.తరువాత 1523 నుంచి ఆ ప్రాంతం మొత్తాన్ని అక్రమించి 1821వరకు స్పెయిన్‌ వలసగా మార్చారు. 1821లో గౌతమాలా స్వాతంత్య్రం ప్రకటించుకుంది.అదే ఏడాది మెక్సికోలో భాగంగా మారింది. రెండు సంవత్సరాలకే మెక్సికో రాజరికాన్ని కూలదోసి మిగతా ప్రాంతాలతో కలసి కొత్త రిపబ్లిక్‌ను ఏర్పాటు చేశారు. దానిలో భాగమైన నికరాగువా 1838లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంది. అప్పటి నుంచిఅంతర్యుద్దానికి లోనైంది.1848లో కాలిఫోర్నియాలో బంగారాన్ని కనుగొన్న తరువాత తూర్పు అమెరికా నుంచి అక్కడికి కార్మికులను చేర్చేందుకు అమెరికన్లు నికరాగువా మీదుగా ప్రయాణించటం దగ్గరిదారిగా భావించి లక్షలాది మంది అటుగా వచ్చారు. నికరాగువాపై ఆధిపత్యం కోసం పోటీపడిన అక్కడి మితవాద, ఉదారవాద వర్గాలలో రెండవది అమెరికన్లను ఆహ్వానించి వారి మద్దతు తీసుకుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎన్నికల పేరుతో 1856లో ఫిలిబస్టర్‌ విలియం వాకర్‌ అనేవాడు తాను నికరాగువా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నాడు. 1857లో వాకర్‌ను తరిమివేసి మితవాద శక్తుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1909 వరకు నికరాగువా స్వతంత్ర దేశంగా ఉంది.1893 నుంచి 1909వరకు నికరాగువా అధ్యక్షుడిగా ఉన్న జోస్‌ శాంటోస్‌ జెలయాపై అమెరికా మితవాద శక్తులతో తిరుగుబాటు చేయించింది. తమ పౌరులను రక్షించే పేరుతో 1909 నవంబరు 18 నికరాగువా తీరానికి అమెరికా తన యుద్ద నౌకలను పంపింది. దాంతో జెలయా పదవి నుంచి తప్పుకున్నాడు. తరువాత అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడింది.దానిలో కుమ్ములాటలు తలెత్తాయి. 1912 నుంచి 1933 వరకు అమెరికా మిలిటరీ స్వాధీనంలో నికరాగువా ఉంది. కాలువ తవ్వకంతో సహా అనేక ఒప్పందాలను తనకు అనుకూలంగా చేసుకుంది.


1927 నుంచి 1933 వరకు తిరుగుబాటు మిలిటరీ అధికారి అగస్టో సీజర్‌ శాండినో గెరిల్లా పద్దతిలో మితవాద ప్రభుత్వం, అమెరికా మిలిటరీ మీద సాయుధ పోరాటం సాగించాడు. దాంతో 1933లో ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. శాండినో తిరిగి తిరుగుబాటు చేయవచ్చన్న జనరల్‌ అంటాసియా సోమోజా గార్సియా సలహామేరకు శాండినోను హతమర్చాలని పధకం వేశారు. దానిలో భాగంగా శాంతి ఒప్పందం మీద సంతకాలు చేసే పేరుతో 1934 ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి విందుకు ఆహ్వానించారు, విందు తరువాత తిరిగి వెళుతున్న శాండినోను సోమోజా హత్య చేయించాడు. తరువాత తానే గద్దెనెక్కాడు.1956లో సోమోజాను ఒక యువకవి కాల్చి చంపాడు. సోమోజా పెద్ద కుమారుడు లూయిస్‌ సోమోజాను గద్దె నెక్కించారు. 1967లో సీనియర్‌ సోమోజా చిన్న కుమారుడు ఆంటాసియో సోమోజాను గద్దెనెక్కించారు. శాండినోలు 1979 కూల్చేంతవరకు అధికారంలో ఉన్నాడు. సోమోజాపాలన మీద తిరుగుబాటు చేసిన శక్తులు ఆగస్టో సీజర్‌ శాండినో పేరుతో శాండినిస్టా విముక్తి దళాన్ని ఏర్పాటు చేశారు. దాని నేతగా డేనియల్‌ కార్టేగా 1979లో అధికారానికి వచ్చాడు. అనేక సంక్షేమ పధకాలను అమలు చేశాడు. దేశంలో అస్థిర పరిస్థితలను సృష్టించి ఓర్టేగాను దోషిగా చూపి 1990 ఎన్నికల్లో ఓడించారు.తిరిగి 2007 నుంచి ఇప్పటి వరకు వరుసగా ఓర్టేగాను జనం ఎన్నుకుంటున్నారు.


2018లో ఓర్టేగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విఫల తిరుగుబాటు కుట్ర జరిగింది.ఏప్రిల్‌ 18 నుంచి జూలై 17వరకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులు అమెరికా తదితర దేశాలు,సంస్థలు ఇచ్చిన మద్దతు, డబ్బు, ఆయుధాలతో హింసాకాండకు పాల్పడ్డాయి. ఇరవైరెండు మంది పోలీసు అధికారులు ఆ దాడుల్లో మరణించగా 400 మందికి పైగా తుపాకి గాయాలయ్యాయి. అరవై మంది అధికార శాండినిస్టా పార్టీ కార్యకర్తలు లేదా మద్దతుదార్లను చంపివేశారు. వందలాది మంది గాయపడ్డారు. ఏప్రిల్‌ 19,20,21 తేదీల్లో అనేక చోట్ల ప్రతిపక్ష సాయుధమూకలు పోలీస్‌ స్టేషన్లు, శాండినిస్టా ఆఫీసులపై జరిపిన దాడుల్లో పెట్రోలు బాంబులు, తుపాకులను వినియోగించిన తీరు వీడియోల్లో ఉంది. వీటిని అసలు పరిగణనలోకి తీసుకోలేదు. వాటికి సంబంధించి స్థానిక పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా ఐరాస కమిషన్‌కు కనిపించలేదు.శాంతియుతంగా ప్రారంభమైన ప్రదర్శనలపై పోలీసులు దాడులకు పాల్పడినట్లు, తొలుత జరిగిన నిరసనల్లో అసలు ప్రతిపక్షాలకు చెందిన వారెవరూ పాల్గొనలేదని ఐరాస కమిషన్‌ చెప్పింది.


ఎవరెన్ని కుట్రలు చేసినా వాటన్నింటికీ ఇప్పటి వరకు ఓర్టేగా సర్కార్‌ తిప్పికొడుతున్నది. జన విశ్వాసం పొందుతున్నది.ముందే పేర్కొన్న 2018 విఫల కుట్ర తరువాత జరిగిన 2019 కరీబియన్‌ ప్రాంతీయ ఎన్నికలు,2021జాతీయ ఎన్నికలు, 2022 మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార శాండినిస్టా నేషనల్‌ ఫ్రంట్‌ భారీ మెజారిటీలతో గెలిచింది. జనాభాలో 85శాతం మంది క్రైస్తవులే, వారిలో సగానికి పైగా రోమన్‌ కాథలిక్‌లు. పదిహేనుశాతం జనాభా మతం లేని వారు. లాటిన్‌ అమెరికా అంతటా చర్చి ఎప్పుడూ నిరంకుశ శక్తులు, మితవాదులు కనుసన్నలలోనే పనిచేసింది. వారికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమాలలో ప్రజల పక్షం వహించే మతపెద్దలు అనేక మంది మమేకమయ్యారు. అలాంటి దేశాలలో నికరాగువా ఒకటి.వారికి నియంతలను వ్యతిరేకించటం, పేదల సంక్షేమం ప్రధానం తప్ప పోరు చేస్తున్న వారు పురోగామి వాదులా,కమ్యూనిస్టులా ? మతం పట్ల వారి వైఖరి ఏమిటన్నది ప్రధానంగా కనిపించలేదు.వామపక్ష, కమ్యూనిస్టు గెరిల్లాలకు కూడా మతపెద్దలని గాక వారేవైపు ఉన్నారన్నదే గీటురాయి. అక్కడి వాస్తవ పరిస్థితుల నుంచే ఈ పరిణామం. అందుకే లాటిన్‌ అమెరికా దేశాల్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు పడక కుర్చీ మార్క్సిస్టు సిద్దాంతవేత్తల చట్రంలో జరగటం లేదు. ఒక చేత్తో బైబిల్‌ మరో చేత్తో ఎర్రజెండా పట్టుకున్న వెనెజులా నేత హ్యూగో ఛావెజ్‌ను ” అమెరికా క్రీస్తు ” అని అనేక మంది జనం నమ్మారు.”నేను క్రీస్తును ప్రేమిస్తాను. నేను క్రైస్తవుడిని. పిల్లలు ఆకలితో మరణిస్తున్నపుడు, అన్యాయాన్ని చూసినపుడు నేను ఏడ్చాను ” అని ఛావెజ్‌ ఒకసారి చెప్పారు.నికరాగువాలో కూడా అదే జరుగుతోంది. అమెరికాతో చేతులు కలిపిన క్రైస్తవమతాధికారులు వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చర్చీలను ఆయుధాలు, కిరాయిమూకల కేంద్రాలుగా మార్చారు. ఆదివారం ప్రార్దనల్లో ప్రభుత్వ కూల్చివేత సుభాషితాలు వల్లించారు.చర్చ్‌కు వచ్చిన వారిలో ఎవరైనా శాండినిస్టాలు(కమ్యూనిస్టులు) ఉన్నారా అని మరీ పిలిచి నిలబడిన వారిని చర్చికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలు, 2018 కుట్రలో అనేక మంది ఫాదర్లు స్వయంగా హింసాకాండలో పాల్గొనటాన్ని చూసిన అనేక మందికి చర్చ్‌లు, ఫాదర్ల మీద విశ్వాసం పోయింది. తమకు మేలు చేస్తున్న పాలకులను కూల్చివేసి నిరంకుశ, దోపిడీదార్లను బలపరుస్తున్న చర్చి ఉన్నతాధికారుల తీరును చూసి నివ్వెరపోయారు. దాంతో క్రీస్తును ఆరాధించాలంటే చర్చ్‌లకే పోనవసరం లేదని అనేక మంది భావించారు. ఇండ్లకే పరిమితం కానివారు సామూహిక ప్రార్ధనలు జరిపేందుకు ప్రత్యామ్నాయాలను చూశారు. అవే ప్రజా చర్చ్‌లుగా ఉనికిలోకి వచ్చాయి.


” మేం సంప్రదాయ కాథలిక్కులం కాదు. ఎందుకంటే మాకు ఇక్కడ పూజార్లు ఉండరు.ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి.” అని రాజధాని మనాగువాలోని సెయింట్‌పాల్‌ ప్రాంతానికి చెందిన అపోస్తల్‌ క్రిస్టియన్‌ బేస్‌ కమ్యూనిటీకి చెందిన యామిల్‌ రియోస్‌ విలేకర్లతో చెప్పాడు. ఒక రూములో ప్రార్దనల కోసం వచ్చిన వారందరూ మడత కుర్చీల్లో కూర్చున్నారు. రూము వెలుపల ప్రార్ధనగీతాలు పాడేవారు సంగీత వాద్యాలతో సిద్దంగా ఉన్నారు. మత పెద్దల కుట్రలు వెల్లడైనకొద్దీ పేదలు, కార్మికులతో ఇలాంటి ప్రజా చర్చ్‌లు పెరుగుతున్నాయి.సంప్రదాయ చర్చ్‌లకు వెళ్లేవారు తగ్గుతున్నారు. ఇలాంటి ప్రజాచర్చ్‌లు 1970దశకంలో ప్రారంభమైన 1979లో నియంత పాలన అంతంతో మరింతగా పెరిగాయి. ఇవి క్రైస్తవం-విప్లవం మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవన్న క్రైస్తవ విముక్తి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన పూజారుల ప్రచార కేంద్రాలుగా కూడా పని చేశాయి. వారిలో ఒకరైన ఫాదర్‌ మిగుయెల్‌ డి స్కోటో ప్రస్తుతం నికరాగువా విదేశాంగ మంత్రిగా పని చేస్తున్నారు.” నీవు జీసస్‌ను అనుసరించకపోతే విప్లవకారుడు కారుడివి కూడా కాలేవు ” అంటారాయన.ఇలాంటి వారు అనేక మంది ఇప్పుడు ఓర్టేగా సర్కార్‌లో పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.వారు క్రైస్తవులే గానీ శాండినిస్టాపాలనను ప్రతిఘటించే అధికార మతపెద్దల తెగకు చెందిన వారు కాదు.1990లో తాము కాథలిక్కులమని చెప్పుకున్నవారు 94శాతం ఉండగా ఇటీవల అది 50శాతానికి తగ్గి ఇప్పుడు 37శాతం ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. లాటిన్‌ అమెరికాలో ఒక చిన్న దేశమైన నికరాగువా(జనాభా 70లక్షల లోపు) ఐరాస మానవహక్కుల సంస్థను శిఖండిగా చేసుకొని అమెరికా, దాని కూటమి చేస్తున్న ప్రచారదాడికి గురవుతోంది. కరీబియన్‌-దక్షిణ పసిఫిక్‌ సముద్రాల మధ్య వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న దేశాలలో అదొకటి. అందువల్లనే ఆ ప్రాంత దేశాలను ఆక్రమించుకొనేందుకు, వీలుగాకుంటే తన తొత్తు ప్రభుత్వాలను రుద్దేందుకు అమెరికా నిరంతరం చూస్తూ ఉంటుంది.దానిలో భాగమే ఇటీవలి పరిణామాలు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d