• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Ukraine war

ఉక్రెయిన్‌ సంక్షోభంలో పుతిన్‌ తొలి విజయం : ఆంక్షల ఎత్తివేత షరతులతో అమెరికాతో ఒప్పందం !

26 Wednesday Mar 2025

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Black Sea deal, Donald trump, Russia-Ukraine War, Ukraine war, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


సోమవారం నాడు అమెరికాతో కుదిరిన ఒప్పందం మేరకు నల్ల సముద్ర ప్రాంతలో స్వేచ్చగా నౌకా సంచారానికి రష్యా అంగీకరించింది. అయితే తమ షరతులను ముందుగా అమలు జరపాలని స్పష్టం చేసింది. బంతిని అమెరికా మైదానం వైపు నెట్టింది. తమ ఆహార ఎగుమతులకు వీలుగా ద్రవ్య సంస్థల మీద విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసిన తరువాతే ఒప్పందం అమల్లోకి వస్తుందని చెప్పింది. మాస్కోలోని అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆహార వాణిజ్యంతో సంబంధం ఉన్న రష్యన్‌ వ్యవసాయ, ఇతర బాంకుల మీద ఉన్న ఆంక్షల ఎత్తివేతతో సహా ఇతర అంశాలను కూడా అమలు జరపాలని స్పష్టం చేసింది. ప్రపంచ మార్కెట్లకు గతంలో మాదిరి ఆహారం, ఎరువుల ఎగుమతుల పునరుద్దరణ, తమ పతాకాలున్న నౌకల మీద ఆంక్షల తొలగింపు, సముద్ర ప్రయాణ బీమా ధరల తగ్గింపు, వివిధ రేవులను, ద్రవ్య లావాదేవీలు జరిపేందుకు చెల్లింపుల వ్యవస్థలను అందుబాటులోకి తేవటం వంటివి ఉన్నాయి. అమెరికా అధ్యక్ష భవనం చేసిన ప్రకటనలో కూడా పైన పేర్కొన్న అంశాల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నది. క్రెమ్లిన్‌ విడిగా చేసిన మరొక ప్రకటనలో మార్చి 18 నుంచి నెల రోజుల పాటు రష్యా మరియు ఉక్రెయిన్‌ ఇంథన వ్యవస్థల మీద పరస్పరం దాడులు చేసుకోకుండా ఉండేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నది. ఒప్పంద వ్యవధిని పొడిగించేందుకు లేదా ఎవరు విఫలమైనా ఒప్పందం నుంచి వెనక్కు తగ్గేందుకు అవకాశం ఉందని కూడా తెలిపింది. అంతకు ముందు అమెరికా ప్రతినిధులతో సమావేశమైన తరువాత రష్యాతో కుదిరిన ఒప్పందానికి తాము అంగీకరిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. మొత్తం మీద చూసినపుడు పుతిన్‌ తొలి విజయం సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు, ఉక్రెయిన్‌ కారణంగానే నల్ల సముద్ర స్వేచ్చా రవాణా ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టు వైపు వెళ్లింది. దాని చిత్తశుద్దికి పరీక్ష అని చెప్పవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి అమెరికా, రష్యా ప్రతినిధి వర్గాల మధ్య సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సోమవారం నాడు చర్చలు జరిగాయి.వాటి తీరుతెన్నుల గురించి ప్రతినిధులు తమ దేశ నేతలకు వివరించిన తరువాత అవగాహన గురించి మంగళవారం రాత్రి ఎవరికి వారు విడిగా ప్రకటనలు చేశారు. పది గంటల పాటు జరిగిన సంప్రదింపులలో మూడు సార్లు విరామం ఇచ్చారు. చర్చల తరువాత అమెరికా ప్రతినిధులు ఉక్రెయిన్‌ అధికారులతో చర్చలు జరిపారు. ఒకవైపు చర్చలు సాగుతున్నప్పటికీ రెండు పక్షాలూ దాడులు కొనసాగించాయి. తాము 30 మంది రష్యన్‌ సైనికులను చంపివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. తాము ట్రంప్‌ ప్రతిపాదించిన నెల రోజుల కాల్పుల విరమణను అంగీకరించలేదని, ఇంథన మౌలిక సదుపాయాలపై దాడులను వాయిదా వేసేందుకు మాత్రమే అంగీకరించినట్లు రష్యా ప్రతినిధులు అంతకు ముందు చెప్పారు.


నల్ల సముద్రంలో రేవుల నుంచి ఎగుమతి అయ్యే ధాన్యం,నూనెలు,ఎరువుల తనిఖీ గురించి గతంలో కుదిరిన ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. దానిలో తమ ఎగుమతుల మీద ఉన్న ఆంక్షల భాగాన్ని అమలు జరపలేదని గతంలో పేర్కొన్నది. ఇతర అంశాలపై సైనిక చర్యనాటి నుంచి రష్యా చేస్తున్న డిమాండ్లలో ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. నాటోలో చేరాలన్న ప్రతిపాదనను అధికారికంగా జెలెనెస్కీ ఉపసంహరించుకోవాలి,ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న, స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ సేనలను ఉపసంహరించుకోవాలి. సోవియట్‌ కాలంలో ఉక్రెయిన్‌ పాలనా పరిధిలోకి వచ్చిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా తిరిగి తనలో విలీనం చేసుకున్నది. దానితో సహా, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు ప్రాంతాలన్నింటినీ వెనక్కు అప్పగించాలని ఉక్రెయిన్‌ కోరుతున్నది. అలాంటి ఆశలు పెట్టుకోవద్దని జెలెనెస్కీకి అమెరికా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఒప్పందం కుదిరి మిలిటరీ చర్యను ఉపసంహరించుకున్న తరువాత శాంతి సేనలనో మరొక పేరుతోనో తమను వ్యతిరేకించే దేశాల మిలిటరీని సరిహద్దుల్లో అంగీకరించేది లేదని కూడా రష్యా స్పష్టం చేసింది.


ఒక వైపు చర్చలకు తేదీ, స్థలం నిర్ణయించిన తరువాత జెలెనెస్కీ టైమ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్‌పై ఆరోపణలు చేశాడు. సౌదీలో చర్చల రోజే వాటిని ఆ పత్రిక ప్రచురించింది. రష్యన్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలు అమెరికా అధ్యక్ష భవనంలో పని చేస్తున్న కొంత మంది మీద ప్రభావం చూపుతున్నాయని జెలెనెస్కీ ఆరోపించాడు. వారు స్వంత గూఢచారుల సమాచారం కంటే పుతిన్‌ మీదనే ఎక్కువగా విశ్వాసం ఉంచుతున్నట్లు చెప్పాడు. యుద్దం ముగియాలని ఉక్రేనియన్లు కోరుకోవటం లేదని అందువలన వారిని దారికి తెచ్చేందుకు ఏదో ఒకటి చేయకతప్పదన్న సూచన అమెరికన్లకు వెళ్లిందని అన్నాడు. రష్యాలోని కురుస్కు ప్రాంతంలో ఉన్న తమ సేనలను రష్యా చక్రబంధం చేసిందన్న ట్రంప్‌ వ్యాఖ్యలు కూడా తప్పుడు సమాచార ప్రభావమే అన్నాడు. పుతిన్ను సంతుష్టీకరించేందుకు, జెలెనెస్కీని అంకెకు రప్పించేందుకు గానీ అందచేస్తున్న మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేత నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ యంత్రాంగం ఐరోపా నుంచి వత్తిడితో తరువాత వాటిని పునరుద్దరించింది. విలువైన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు వాషింగ్టన్‌ వచ్చిన జెలెనెస్కీ ఓవల్‌ కార్యాలయంలో డోనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో గొడవపడి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. పాక్షిక ఒప్పందానికి సుముఖత తెలిపిన తరువాత కూడా రష్యా ప్రతిరోజూ దాడులు చేస్తున్నదని, వాటిని నివారించాలంటే పుతిన్‌ మీద మరింత వత్తిడి తేవాలని జెలెనెస్కీ తన మద్దతుదార్లను కోరుతున్నాడు. గత ఒక్క వారంలోనే నియంత్రిత బాంబుదాడులు 1,580, 1,100డ్రోన్‌ దాడులు, వివిధ రకాల 15 క్షిపణులతో దాడులు చేసినట్లు చెప్పాడు. వాటిలో 1,02,000 వరకు విదేశీ విడిభాగాలు ఉన్నాయని, దీని అర్ధం ఇప్పటి వరకు రష్యా మీద విధించిన ఆంక్షలు ఫలించలేదని తేలింది గనుక ఆంక్షల నిబంధనలలో ఉన్న లోపాలను సవరించి కఠినంగా అమలు జరపాలన్నాడు. అందుకోసం కొత్త నిర్ణయాలు, కొత్తగా వత్తిడి అవసరమన్నాడు.


క్రిమియా,డాన్‌బాస్‌, రష్యా అదుపులో ఉన్న మరో రెండు ప్రాంతాలు ఉక్రెయిన్‌ సంక్షోభంలో కీలక అంశాలని అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్‌కోఫ్‌ రియాద్‌ చర్చలకు రెండు రోజుల ముందు చెప్పాడు.రష్యా పాలనకు మద్దతు ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం వాటిని రష్యా ప్రాంతాలుగా ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయా అన్నది ముఖ్యమన్నాడు. వాటి మీద అంగీకారం కుదిరితే సమస్య పరిష్కారం అవుతుందన్నాడు. ఈ నాలుగు ప్రాంతాల్లో మెజారిటీ జనం రష్యన్‌ భాష మాట్లాడతారని, రష్యా పాలనకు ఆమోదం తెలిపారన్నాడు. వీటిని ఆమోదిస్తే జెలెనెస్కీ రాజకీయంగా బతుకుతాడా అన్నది కూడా కీలకాంశమన్నాడు. వాటిని రష్యన్‌ ప్రాంతాలుగా గుర్తించేది లేదని జెలెనెస్కీ గతంలో స్పష్టం చేశాడు. ఐరోపా ప్రమేయం లేని సౌదీ చర్చల్లో ముందుకు వచ్చిన ఇతర అంశాలేమిటి? ఐరోపా యూనియన్‌, ఇతర నాటో దేశాలు ఎలా స్పందిస్తాయన్నది, తదుపరి ముందుకు పోవటం ఎలా అన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.


ఇజ్రాయెల్‌లో నిరసన ప్రదర్శనలు !
ఒక పరిణామం ఆందోళన, ఆగ్రహాలకు దారి తీస్తున్నది. మరొక సంక్షోభ తాత్కాలిక పరిష్కారం గురించి సానుకూల సంకేతాలు. బందీల విముక్తి దానికి ప్రతిగా ఖైదీల విడుదలకు సంబంధించి గాజాలోని హమస్‌తో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఉల్లంఘించింది. మరోమారు గాజాలో మారణకాండను ప్రారంభించింది.దీని మీద ప్రపంచంలో వెల్లడైన నిరసన అంతా ఒక ఎత్తయితే ఏకంగా ఇజ్రాయెల్‌లోనే లక్షలాది మంది ప్రధాని నెతన్యాహు రక్తదాహాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు జరపటం గమనించాల్సిన పరిణామం. బందీలను తమ వద్ద ఉంచుకొని వేలాది మంది ప్రాణాలను తీసేందుకు, లక్షలాది భవనాలను నేలమట్టం గావించటాన్ని ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారనే వత్తిడి పాలస్తీనియన్ల నుంచి వచ్చిన కారణంగానే హమస్‌ శాంతి ఒప్పందానికి అంగీకరించింది. దీని అర్ధం గాజన్లు హమస్‌ను వ్యతిరేకిస్తున్నారని కాదు. అలాగే బందీల గురించి పట్టించుకోకుండా అరబ్బుల ఊచకోత, పాలస్తీనా ప్రాంతాలపై దాడులతో సాధించేదేమిటని ఇజ్రాయెలీ పౌరులు కూడా పెద్ద ఎత్తున వత్తిడి చేసిన కారణంగానే నెతన్యాహ ఒక అడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది. యూదులు మారుమనసు పుచ్చుకొని తమ ప్రభుత్వంపై ఆగ్రహిస్తున్నారని అనుకున్నా పొరపాటే. నిజానికి అలాంటి ధోరణే ఉంటే ఏడాదిన్నర కాలంగా మారణకాండను సహించి ఉండేవారే కాదు. అలా అని మొత్తం యూదులందరూ ఉన్మాదులే అనుకున్నా తప్పే.గాజా ప్రాంతాన్ని శాశ్వతంగా ఆక్రమించేందుకు ఇజ్రాయెల్‌ పథకవేయనున్నట్లు, దానికి గాను అనేక సాకులు చెబుతున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. మార్చి ఒకటవ తేదీన కాల్పుల విరమణ తొలి దశ ముగిసింది. హమస్‌ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉన్నట్లు చెబుతుండగా వారిలో 35 మంది మరణించి ఉండవచ్చని కూడా అంటున్నారు..


గత వారంలో మారణకాండను తిరిగి ప్రారంభించిన ఇజ్రాయెల్‌ ఈసారి గాజాను శాశ్వతంగా ఆక్రమించుకోవాలని కొందరు బహిరంగంగానే పిలుపు ఇస్తున్నారు. అమెరికా సంగతి సరేసరి. దాన్ని తాము స్వాధీనం చేసుకొని విహార కేంద్రంగా మారుస్తామని, అక్కడ ఉన్న జనాలను జోర్డాన్‌, ఈజిప్టు తదితర దేశాలకు తరలించి పునరావాసం కల్పిస్తామని ట్రంప్‌తో సహా అక్కడి దుర్మార్గులు మాట్లాడుతున్నది తెలిసిందే.2023 అక్టోబరు ఏడు నుంచి గాజా మీద దాడులు జరుపుతున్నా, దాన్ని అష్టదిగ్బంధనం కావించినప్పటికీ ఇజ్రాయెల్‌ మిలిటరీ బందీల జాడ కనుక్కోలేకపోవటమే గాక ఒక్కరంటే ఒక్కరిని కూడా విడుదల చేయించలేకపోయింది. దాని దాడుల్లో కొంత మంది బందీలు మరణించినట్లు హమస్‌ గతంలో పేర్కొన్నది. బందీల ప్రాణాలను ఫణంగా పెట్టి పాలస్తీనియన్లను సాధిస్తారా అని ఆలోచించే వారి సంఖ్య టెల్‌అవీవ్‌లో పెరుగుతున్నది. అందుకే గతంలో జరిగిన ప్రదర్శనలతో పోలిస్తే భారీ సంఖ్యలో జనం పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నెతన్యాహు నివాసం వద్దకూడా నిరసన వెల్లడిరచారు. రాజధాని టెల్‌అవీవ్‌లో లక్ష మంది పాల్గొన్నారు. అంతర్గత గూఢచార సంస్థ అధిపతి, అటార్నీ జనరల్‌ను తొలగించాలనే ఆలోచనకు వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. తిరిగి డాడులు కొనసాగిస్తే బతికి ఉన్న బందీలకు ప్రాణహాని కలుగుతుందని, ముందు వారు విడుదల కావాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెలీ జాతీయ పతాకాలతో పాటు ప్రతిపక్ష పార్టీల జెండాలు, బానర్లు కూడా ప్రదర్శించారు. నియంత్రత్వ ఉన్మాదానికి స్వస్తి పలకాలనే పెద్ద బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.


గత వారం రోజులుగా గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న, ఒక గుడారంలో సేదతీరుతున్న హమస్‌ అగ్రనేతలు ఇద్దరు ఈ దాడుల్లో మరణించారు. అల్‌ జజీరా విలేకరి ఒకరు కూడా మృతుల్లో ఉన్నారు. గాజాతో పాటు పశ్చిమగట్టు ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు జరుపుతూ అనేక మందిని అరెస్టు చేస్తున్నది. ఇప్పటి వరకు గాజా ప్రాంతంలో 50,144 మందిని చంపివేసినట్లు,1,13,704 మంది గాయపడ్డారని, 61,700 మంది కనిపించటం లేదని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడిరచింది. పాలస్తీనియన్లకు మద్దతు తెలుపుతున్న ఎమెన్‌పై దాడుల పథకం వివరాలను పొరపాటున ఒక జర్నలిస్టుకు పంపిన మాట నిజమే అని అమెరికా ప్రభుత్వం పేర్కొన్నది. మరోవైపు దాడులను కొనసాగిస్తూనే ఉంది. రెండు నెలల కాల్పుల విరమణ తరువాత మరోసారి ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించిన పూర్వరంగంలో ఈజిప్టు రెండవ దశ కాల్పుల విరమణకు కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. వారానికి ఐదుగురు బందీల చొప్పున హమస్‌ విడుదల చేయాలని దానికి అనుగుణంగా దాడుల విరమణ జరగాలని, దీనికి హమస్‌, అమెరికా అంగీకరించినట్లు ఇజ్రాయెల్‌ వైపు నుంచి స్పందన లేదని వార్తలు వచ్చాయి. గాజాలో అదనపు ప్రాంతాలను ఆక్రమించాలని రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ తమ దళాలను ఆదేశించినందున రాజీ ప్రతిపాదనలకు సిద్దంగా లేదని స్పష్టం అవుతున్నది. ఇస్లామిక్‌ జీహాద్‌ అనే సంస్థ తాజాగా ఇజ్రాయెల్‌పై రాకెట్లదాడి జరిపింది. దాంతో తమపై దాడులు మరింతగా పెరిగాయంటూ బెల్ట్‌ లహియా ప్రాంతంలో పాలస్తీనియన్లు నిరసన ప్రదర్శన జరిపారని, ముసుగులు ధరించిన హమస్‌ సాయుధులు వారిని చెదరగొట్టినట్లు బిబిసి ఒక వార్తను ఇచ్చింది. అది వాస్తవమైతే మిలిటెంట్ల రెచ్చగొట్టుడు చర్యలను పాలస్తీనియన్లు సహించకపోవచ్చని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అతి రహస్యం బట్టబయలు : మిత్రుల మీదా దొంగకన్నేసిన అమెరికా !

12 Wednesday Apr 2023

Posted by raomk in CHINA, Current Affairs, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, leaked U.S. documents, NATO, Ukraine war


ఎం కోటేశ్వరరావు


అందరికీ జోశ్యం చెప్పే బల్లి తానే కుడితి తొట్లో పడికొట్టుకున్నట్లుగా ఉంది అమెరికా పరిస్థితి. పదేండ్ల క్రితం కేవలం వందడాలర్ల(రు.8,200)తో కొనుగోలుకు అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్‌తో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అనే ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగి లక్షలాది పత్రాలను లీకు చేశాడు. స్నోడెన్‌కు ఇటీవలనే పుతిన్‌ తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చాడు. అంతకు ముందు 1971లో అమెరికా రక్షణ శాఖ పత్రాలు కూడా వెల్లడయ్యాయి. అదే విధంగా 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు కోటి రహస్య పత్రాలను సేకరించి బహిర్గత పరచిన వికీలీక్స్‌ లక్షలాది అమెరికా రహస్య పత్రాలను వెల్లడించటంతో ప్రాచుర్యం పొందింది.వాటి గురించి అమెరికాలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.ఆ సంస్థలో ప్రముఖుడైన జూలియన్‌ అసాంజేను పట్టుకొనేందుకు,జైల్లో పెట్టేందుకు వీలైతే మట్టుపెట్టేందుకు చూస్తూనే ఉంది.


ఇప్పుడు మరోసారి అలాంటి సంచలనం మరో విధంగా చెప్పాలంటే రాసిలో తక్కువైనా వాసిలో ఎక్కువ అన్నట్లుగా వెల్లడైన వందకు పైగా పత్రాలు అమెరికా, నాటో కూటమిని పెద్ద ఇరకాటంలో పెట్టాయనటం అతిశయోక్తి కాదు. రహస్యం, అతి రహస్యం అని దాచుకున్న రక్షణశాఖ ఫైళ్లు బయటకు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకేం వెల్లడౌతాయోనని అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ప్రపంచంలో ఎక్కడే జరిగినా పసిగట్టి చెబుతామని చెప్పుకొనే అమెరికా తాజాగా తన ఫైళ్లను వెల్లడి చేసింది ఎవరన్నది తేల్చుకోలేక గిలగిలా కొట్టుకుంటున్నది. ఎవరు వాటిని వెల్లడించిందీ తరువాత సంగతి, అసలు ఎంత అజాగ్రత్తగా ఫైళ్ల నిర్వహణ చేస్తున్నదో లోకానికి వెల్లడైంది. అమెరికన్లతో తామేమి మాట్లాడినా అవి వెల్లడికావటం తధ్యంగా ఉంది కనుక ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలనే ఆలోచన,జాగ్రత్తలకు ఇతర దేశాలకు చెందిన అనేక మందిని పురికొల్పింది. తమ గురించిఎలాంటి సమాచారం సేకరించిందో అదెక్కడ వెల్లడి అవుతుందో అన్న ఆందోళన అమెరికా మిత్రదేశాల్లో కూడా తలెత్తింది.


ఈ ఫైళ్లలో ఉన్న అంశాలు వికీలీక్స్‌, ఇతర వాటి మాదిరి గతంలో జరిగిన ఉదంతాలు, పరిణామాల సమాచారం కాదు. వర్తమానంలో జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభం, దాని గురించి అమెరికా అంతర్గత అంచనా, ఆందోళనలతో పాటు ఒకే కంచం ఒకే మంచం అన్నట్లుగా ఉండే ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా, చివరికి తాను చెప్పినట్లు ఆడుతున్న ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ మీద కూడా దొంగకన్నేసినట్లు తేలింది.ఉక్రెయిన్‌ దళాల వద్ద ఉన్న మందుగుండు, ఇతర ఆయుధాలు ఎప్పటివరకు సరిపోతాయి, మిలిటరీలో తలెత్తిన ఆందోళన, ఆ సంక్షోభంలో రోజువారీ అంశాల్లో అమెరికా ఎంతవరకు నిమగమైంది, పెద్దగా బహిర్గతం గాని ఉపగ్రహాలద్వారా సమాచారాన్ని సేకరించే పద్దతులతో సహా రష్యా గురించి ఎలా తెలుసుకుంటున్నదీ, మిత్ర దేశాల మీద ఎలా కన్నేసిందీ మొదలైన వివరాలున్న పత్రాలు ఇప్పటివరకు వెలికి వచ్చాయి. రష్యన్లు తమ కంప్యూటర్లలోకి చొరబడి(హాకింగ్‌) సమాచారాన్ని కొల్లగొట్టారని అమెరికా ఒక కథను ప్రచారంలోకి తెచ్చింది. ఆ పత్రాల్లో ఉన్న వివరాలను బట్టి ఆ కథ అంతగా అతకటం లేదని కొందరు చెప్పారు.దాంతో పత్రాల్లో కొంత వాస్తవం కొంత కల్పన ఉందని అమెరికా అధికారులు చెవులు కొరుకుతున్నారు. తాజాగా వెల్లడైన కొన్ని ఫైళ్లు కుర్రాళ్లు ఆటలాడుకొనే వెబ్‌సైట్లలో తొలుత దర్శనమిచ్చాయి.


ఒక కథనం ప్రకారం ఐదునెలల క్రితం అక్టోబరులో కంప్యూటర్‌గేమ్స్‌(ఆటలు) ఆడుకొనే ఒక డిస్కార్డ్‌ వేదిక (ఒక ఛానల్‌) మీద కొన్ని వివరాలు కనిపించాయి. మన దేశంలో ఇప్పుడు నరేంద్రమోడీ- అదానీ పాత్రలతో( గతంలో అమ్మా-నాన్న ఆట మాదిరి) కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నట్లుగా ఉక్రెయిన్‌ సంక్షోభం మీద ఆడుకుంటున్న కుర్రకారులో ఒకడు తనది పై చేయి అని చూపుకొనేందుకు ఎలుగుబంటితో పంది పోరు అంటూ ఒక వీడియోను వర్ణిస్తూ కొన్ని పత్రాలను పెట్టటంతో కొంత మంది భలే సమాచారం అంటూ స్పందించారు. దాంతో ఆ లీకు వీరుడు మరిన్ని జతచేశాడు. ఆ గేమ్‌లో పాల్గొన్నవారు ఉక్రెయిన్‌ పోరు పేరుతో అప్పటికే నాటో కూటమి విడుదల చేసిన అనేక కల్పిత వీడియోలను కూడా పోటా పోటీగా తమ వాదనలకు మద్దతుగా చూపారు. అనేక మంది ఆ రహస్యపత్రాలు కూడా అలాంటి వాటిలో భాగమే అనుకొని తరువాత వదలివేశారు.ఐదు నెలల తరువాత మరొక ఆటగాడు తన వాదనలకు మద్దతు పొందేందుకు మరికొన్ని పత్రాలను జత చేశాడు. తరువాత అవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిని రష్యన్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌ ఎడిట్‌ చేసి పెట్టింది. దాన్ని బట్టి వాటిని రష్యన్లు సంపాదించి పెట్టారని భావించారు. అంతకు ముందు వాటిని చూసిన వారు ఉక్రెయిన్‌ పోరు గురించి ప్రచారం చేస్తున్న అనేక అవాస్తవాల్లో భాగం అనుకున్నారు తప్ప తీవ్రమైనవిగా పరిగణించలేదు. చీమ చిటుక్కుమన్నా పసిగడతామని చెప్పుకొనే అమెరికా నిఘా సంస్థలు వాటిని పసిగట్టలేకపోయినట్లా లేక, జనం ఎవరూ నమ్మరులే అని తెలిసి కూడా ఉపేక్షించారా, ఒక వేళ గేమర్స్‌ మీద చర్యలు తీసుకుంటే లేనిపోని రచ్చవుతుందని మూసిపెడతామని చూశారా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. ఆలోచించేకొద్దీ గందరగోళంగా ఉంది.


వెల్లడైన వందకు పైగా పత్రాల్లోని అనేక అంశాలను ఖరారు చేసేందుకు ఇటీవలనే అమెరికా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మార్క్‌ మిలే, ఇతర ఉన్నతాధికారులకు వాటిని సమర్పించారు. ఇంత త్వరగా అవి బహిర్గతం కావటం అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తోంది. టాప్‌ సీక్రెట్లుగా పరిగణించే పత్రాలకు అంగీకారం, వాటిని పరిశీలించేందుకు అనుమతించే వారి సంఖ్య గురించి చెబుతూ 2019లో పన్నెండు లక్షల మందికి అవకాశం ఉన్నట్లు అమెరికా నేషనల్‌ ఇంటలిజెన్స్‌ డైరెక్టర్‌ కార్యాలయం ఇటీవలనే వెల్లడించింది. అందువలన వారిలో ఎవరైనా వాటిని వెల్లడించాలనుకుంటే ఆ పని చేయవచ్చు. అమెరికా ప్రభుత్వ విధానాలు నచ్చని ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఒక కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్నపుడు తనకు అందుబాటులోకి వచ్చిన అనేక అంశాలను బహిర్గతపరిచాడు. టెలికమ్యూనికేషన్‌ కంపెనీలతో చేతులు కలిపి అమెరికా జాతీయ భద్రతా సంస్థ , ఐదు కళ్ల పేరుతో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ గూఢచార సంస్థలతో కలసి జరుపుతున్న నిఘా బండారాన్ని వెల్లడించాడు. అమెరికా అధికారపక్షం డెమోక్రాట్లు, ప్రతిపక్షం(పార్లమెంటు దిగువసభలో మెజారిటీ పార్టీ) రిపబ్లికన్ల మధ్య ఉన్న విబేధాలు కూడా ఈ లీకుల వెనుక ఉండవచ్చన్నది మరొక కథనం. నాటోలోని పశ్చిమ దేశాలు కొన్ని అమెరికా వైఖరితో పూర్తిగా ఏకీభవించటం లేదు. అందువలన అవి కూడా దీని వెనుక ఉండే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ పోరులో పుతిన్‌ సేనలను ఓడించటం అంత తేలిక కాదని భావిస్తున్న అమెరికా కొంత మంది విధాన నిర్ణేతలు వివాదానికి ముగింపు పలికేందుకు ఈ లీక్‌ దోహదం చేస్తుందని భావించి ఆ పని చేసి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. రష్యా గనుక వీటిని సంపాదించి ఉంటే దానిలో ఉన్న అంశాలను తనకు అనుకూలంగా మలచుకొనేందుకు చూస్తుంది తప్ప బహిరంగపరచదు అన్నది ఒక అభిప్రాయం. కష్టపడి సంపాదించిందాన్ని బహిర్గతం చేస్తే శత్రువు ఎత్తుగడలు మారిపోతాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు అమెరికా సుముఖంగా లేదని, అతి పెద్ద ఆటంకం అన్నది ఈ పత్రాల్లో తేటతెల్లమైంది.కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థల కొరత, బకుమట్‌ పట్టణాన్ని పట్టుకోవటంలో పుతిన్‌ సేనల విజయం వంటి అనేక అంశాలు ఆ పత్రాల్లో ఉన్నాయి.ఈ పత్రాల్లోని సమాచారం కట్టుకథలైనా అది ప్రచారంలోకి తేవటం మానసికంగా ఉక్రెయిన్ను దెబ్బతీసేదిగా ఉంది. ఉద్రిక్తతలు పెరిగి మిలిటరీ రంగంలోకి దిగితే డాన్‌బోస్‌ ప్రాంతాన్ని పుతిన్‌ సేనలు అదుపులోకి తీసుకుంటాయని అమెరికాకు ముందుగానే తెలుసునని కూడా వెల్లడైంది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ పోరులో రెండు లక్షల మంది రష్యన్‌ సేనలు మరణించినట్లు సిఐఏ,అమెరికా, నాటో కూటమి దేశాలన్నీ ఊదరగొట్టాయి.ఈ పత్రాల ప్రకారం పదహారు నుంచి 17,500 మధ్య మరణించి ఉండవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా ఎస్‌-300 గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులు మే రెండవ తేదీ వరకే సరిపోతాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి మద్దతు ఇస్తున్న తూర్పు ఐరోపా, ఇతర దేశాల నమ్మకాలను దెబ్బతీసేవే. మిత్రదేశాల కంటే తొత్తు దేశాలుగా పేరు మోసిన ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియాల మీద కూడా అమెరికా దొంగ కన్నేసినట్లు దాని రాయబారులు పంపిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. న్యాయవ్యవస్థలో నెతన్యాహు ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలను వ్యతిరేకించాల్సిందిగా జనాన్ని అక్కడి గూఢచార సంస్థ మొసాద్‌ రెచ్చగొట్టినట్లుగా అమెరికా పత్రాల్లో ఉంది. అదే విధంగా మరొక దేశానికి వ్యతిరేకంగా ఇంకాకరికి ఆయుధాల సరఫరా తమ విధానాలకు వ్యతిరేకం అని చెబుతున్నా ఉక్రెయినుకు మూడులక్షల 30వేల ఫిరంగి మందుగుండు సరఫరా చేయాలని దక్షిణ కొరియాను అమెరికా వత్తిడి చేసింది. ఫలానా తేదీలోగా జరగాలని కూడా ఆదేశించింది. ఇదంతా కేవలం నలభై రోజుల క్రితం జరిగింది. ఇది దక్షిణ కొరియాను ఇరుకున పెడుతుంది. పక్కనే ఉన్న రష్యా ఈ పరిణామాన్ని తేలికగా తీసుకోదని అక్కడి పాలక పార్టీ భావిస్తున్నది.


గతంలో స్నోడెన్‌, మానింగ్‌, వికీలీక్స్‌ వెల్లడించిన పత్రాలలో ఉన్న సమాచారం ఎక్కువ భాగం పాతదే కానీ అమెరికా దుష్ట పన్నాగాలను లోకానికి వెల్లడించింది. తాజా సమాచారం వర్తమాన అంశాలది కావటం ఆమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. పదేండ్ల నాటికి ఇప్పటికీ అమెరికాను ఎదుర్కోవటంలో చైనా, రష్యా సామర్ధ్యం పెరిగింది. తాజా పత్రాలు అమెరికా ఎత్తుగడలను కూడా కొంత మేరకు వెల్లడించినందున వచ్చే రోజుల్లో వాటిని పక్కన పెట్టి కొత్త పథకాలు రూపొందించాలంటే నిపుణులకు సమయం పడుతుంది. మిగిలిన దేశాలకూ వ్యవధి దొరుకుతుంది. బలాబలాలను అంచనా వేసుకొనేందుకు వీలుకలుగుతుంది.ఇదొకటైతే అనేక దేశాలు అమెరికా, పశ్చిమ దేశాలతో సంబంధాల గురించి పునరాలోచించుకొనే పరిస్థితిని కూడా కల్పించింది.తమ గురించి, తమ అంతర్గత వ్యహారాల్లో ఎలాంటి జోక్యం చేసుకుంటున్నదో అనే అనుమానాలు తలెత్తుతాయి. ఉక్రెయిను, జెలెనెస్కీ ఏమైనా అమెరికాను ఎక్కువగా ఆందోళన పరుస్తున్నదీ ఈ అంశాలే అని చెప్పవచ్చు. ఇంకెన్ని పత్రాలు బహిర్గతం అవుతాయో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండో ఏడాదిలోకి ఉక్రెయిన్‌ సంక్షోభం – స్టార్ట్‌ 2 ఒప్పందాన్ని పక్కన పెట్టిన రష్యా !

22 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, New START treaty, Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


అమెరికాతో ఉన్న నూతన వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం (స్టార్ట్‌) నుంచి తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మంగళవారం నాడు రష్యన్‌ పార్లమెంటు సమావేశంలో ప్రకటించాడు.1991లో కుదిరిన స్టార్ట్‌ ఒకటవ వప్పందం ప్రకారం రెండు దేశాలూ ఆరువేల చొప్పున అణ్వాయుధాలు, పదహారు వందల ఖండాంతర క్షిపణులు, బాంబర్లకు మించి కలిగి ఉండరాదు. దీని గడువు 2009లో ముగిసింది.తరువాత 2010లో కుదిరిన రెండవ ఒప్పందం ప్రకారం 2026 నాటికి రెండు దేశాలూ వాటిని ఇంకా తగ్గించాల్సి ఉంది. పుతిన్‌ ప్రకటన మీద అమెరికా స్పందన వెల్లడి కావాల్సి ఉంది. ఉక్రెయిన్‌ వివాదాన్ని పశ్చిమ దేశాలే ప్రారంభించాయని దాన్ని ముగించేందుకు రష్యా తన బలాన్ని వినియోగిస్తున్నదని పుతిన్‌ పార్లమెంటు సమావేశంలో చెప్పాడు. ఇప్పటికీ సంప్రదింపులకు ద్వారాలు తెరిచే ఉంచామని పరస్పర సమానత్వం, భద్రత ప్రాతిపదికన అవి ఉండాలని అన్నాడు.నాటో విస్తరణ గురించి నిజాయితీలేని సమాధానాలు చెబుతున్నారని అన్నాడు. స్థానిక వివాదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు అమెరికా చూస్తున్నదని, ఉక్రెయిన్‌ పౌరులు తమ పశ్చిమ దేశాల యజమానుల చేతిలో బందీలుగా మారారని పుతిన్‌ అన్నాడు.


రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు జరిపిన అనేక యుద్ధాలు దశాబ్దాల తరబడి సాగినవి ఉన్నప్పటికీ 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచాన్ని కుదిపివేసింది. ఇప్పటికీ దాని ప్రతికూల పర్యవసానాలు ప్రభావం చూపుతూనే ఉన్నాయి. రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య శుక్రవారం నాడు రెండవ ఏడాదిలో ప్రవేశించనుంది. దాన్ని మరింతగా రెచ్చగొట్టేందుకు అవసరమైన అస్ర,్త శస్త్రాలను అందిస్తామని ఉక్రెయిన్‌ రాజధానికి సోమవారం నాడు ఆకస్మికంగా వచ్చిన అమెరికా అధినేత జో బైడెన్‌ వాగ్దానం చేసి వెళ్లాడు. ముందుగా ప్రకటిస్తే ఎటు నుంచి ఏ ముప్పు ఉంటుందో నని భయపడిన కారణంగానే కొద్ది గంటల ముందే సమాచారాన్ని వెల్లడించి కేవలం ఐదు గంటలు మాత్రమే కీవ్‌లో గడిపి పక్కనే ఉన్న పోలాండ్‌ వెళ్లాడు.గతవారంలో మ్యూనిచ్‌ నగరంలో జరిగిన భద్రతా సమావేశం తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
పదిహేను సంవత్సరాల తరువాత అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్‌ రావటం ఇదే ప్రధమం.గతంలో బిల్‌ క్లింటన్‌ 1994,1995, 2000 సంవత్సరాలలో, తరువాత 2008లో జార్జి డబ్ల్యు బుష్‌ కీవ్‌ సందర్శనకు వచ్చారు. జూనియర్‌ బుష్‌ పెట్టిన చిచ్చు చివరకు 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న తన ప్రాంతమైన క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పింది. దాని కొనసాగింపుగా సామ్రాజ్యవాదులు పన్నిన రష్యా ముంగిటకు నాటో విస్తరణ అన్న కుట్ర తన రక్షణకు 2022లో రష్యాను మిలిటరీ చర్యకు పురికొల్పింది.తొలుత సంప్రదింపులంటూ లోకాన్ని నమ్మింప చేసేందుకు చూసినప్పటికీ తరువాత పశ్చిమ దేశాలకు అలాంటి ఉద్దేశ్యం లేదని స్పష్టమైంది. ఈ పూర్వరంగంలో ఇప్పుడు జో బైడెన్‌ పర్యటన ఏ కొత్త పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము.


జెలెనెస్కీ కోరుతున్న విమానాలు తప్ప టాంకులతో సహా ఉక్రెయిన్‌ పౌరులను రక్షించేందుకు అన్ని రకాల అస్త్రాలను మరింతగా సరఫరా చేస్తామని, రష్యామీద మరిన్ని ఆంక్షలను అమలు చేస్తామని జో బైడెన్‌ చెప్పాడు. ఒక వైపు ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పశ్చిమ దేశాల నాటో కూటమి మరోవైపు శాంతికోసం పుతిన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు లేవంటూ ప్రచారదాడి చేస్తున్నది. ఇప్పటి వరకు పది దఫాలుగా రష్యా మీద ఆంక్షల తీవ్రతను పెంచుతున్నారు.మరో దఫాను ప్రతిపాదించారు. నాటో కూటమి ప్రకటనలను చూస్తుంటే మరో యుద్ద రంగాన్ని తెరిచేందుకు సిద్దం అవుతున్నట్లు చెబుతున్నారు. మ్యూనిచ్‌ భద్రతా సమావేశం(ఎంఎఎస్‌సి) సందర్భంగా శనివారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ఈ రోజు ఐరోపాలో జరుగుతున్నది రేపు ఆసియాలో జరగవచ్చు అన్నాడు. ఎప్పటి నుంచో ఇప్పుడు ఉక్రెయిన్‌ తదుపరి తైవాన్‌ అన్న ప్రచారం సంగతి, వరుసగా చైనాను రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రష్యాకు మరింతగా చైనా ఆయుధాలు అంద చేయనున్నది అనే ప్రచారం కూడా జరుగుతున్నది.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అదే సమావేశంలో దాన్ని పునశ్చరణ గావించారు. భారత్‌-చైనా రెండూ ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థంగా ఉన్నాయి. రష్యా నుంచి మన దేశం ఎంత చమురు కొనుగోలు చేసినా ఆ మేరకు పుతిన్‌ సర్కార్‌కు లబ్ది చేకూర్చినా కనపడని తప్పు అదేపని చేస్తున్న చైనాలో పశ్చిమ దేశాలు చూస్తున్నాయి. రష్యా చమురును మన దేశం శుద్ది చేసి డీజిల్‌ ఇతర ఉత్పత్తులను అమెరికా, ఐరోపాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది.


నాటో కూటమిలోని జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు రష్యాను శత్రువుగా పరిగణిస్తున్న మాదిరి చైనా పట్ల లేవు. కానీ మొత్తం నాటోను, ఐరోపాను తమ గుప్పిటలో ఉంచుకోవాలంటే రెండు దేశాల నుంచీ ముప్పు ఉందని, ఐరోపాను తాము తప్ప మరొకరు కాపాడలేరని నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. అందుకే రెండు దేశాలూ ఒకటే అని నూరిపోస్తున్నది. తైవాన్‌ సమస్యలో కూడా అందరం కలసి కట్టుగా ఉండాలని చెబుతున్నది. రష్యా గనుక ఉక్రెయిన్‌లో గెలిస్తే మొత్తం ఐరోపాకే ముప్పు అని చెబుతున్నది. తాము తమ దేశ స్వేచ్చ కోసమే గాక మొత్తం ఐరోపా కోసం పోరు సల్పుతున్నట్లు నిరంతరం జెలెనెస్కీతో చెప్పించటం కూడా దానిలో భాగమే. రష్యాను బూచిగా చూపి ఐరోపా రక్షణ బడ్జెట్లను పెంచుకోవాలని ఆ సొమ్ముతో తమ ఆయుధాలను కొనుగోలు చేయాలని వత్తిడి తెస్తున్నది. మరోవైపు జర్మనీ వంటి కొన్ని దేశాలు అమెరికా పట్ల అనుమానంతో చూస్తున్నాయి. రష్యా నుంచి ఐరోపా దేశాలకు ఇంథనాన్ని సరఫరా చేసే నోర్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌ లైన్‌ పేలుళ్ల వెనుక అమెరికా హస్తం ఉందని తెలిసిన తరువాత అవి ఉలిక్కిపడ్డాయి.


ఏడాది కాలంలో ఉక్రెయిన్‌ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగిస్తున్న నష్టం ఎంత అన్నది ఎవరూ చెప్పలేని స్థితి. ఈ ఏడాది చివరి నాటికి నష్టం 2.8లక్షల కోట్ల డాలర్లని ఓయిసిడి దేశాల సంస్థ అంచనా.ప్రపంచ ఆర్థికవేదిక ప్రపంచంలోని 87.4శాతం జనాభా ఉన్న 116దేశాలలో ఇంథన ధరల పెరుగుదల గురించి సర్వే జరిపింది.ప్రత్యక్ష, పరోక్ష కారణాలతో ఒక్కో కుటుంబానికి 63 నుంచి 113శాతం వరకు పెరిగాయి.అనేక దేశాల్లో చలికాచుకొనేందుకు అవసరమైన ఇంథనాన్ని కొనుగోలు చేయలేని కారణంగా ఇంథన దారిద్య్రంలో మునిగిన వారు, ఇతర జీవన వ్యయం పెరుగుదల వలన ప్రపంచబాంకు దారిద్య్ర దుర్భర రేఖకు దిగువకు వెళ్లిన వారు 7.8 నుంచి 14.1 కోట్ల మంది వరకు ఉంటారు.అమెరికా అంచనా ప్రకారం నలభైవేల మంది ఉక్రెయిన్‌ పౌరులు, రెండు దేశాలకు చెందిన సైనికులు లక్ష మంది చొప్పున మరణించి ఉంటారు.మరి కొందరు చెప్పినదాని ప్రకారం రెండు లక్షల మంది పుతిన్‌ సైనికులు మరణించిగానీ గాయపడి గానీ ఉంటారు. వీటిని ఎవరూ నిర్ధారించలేదు. అరవైఎనిమిది లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు దేశం విడిచి వెళ్లగా మరో 66లక్షల మంది స్వదేశంలో నెలవులు తప్పారు. జర్మనీకి చెందిన కెల్‌ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం గతేడాది జనవరి-అక్టోబరు కాలంలో పశ్చిమ దేశాలు అందించిన మిలిటరీ మద్దతు విలువ 40బిలియన్‌ డాలర్లు కాగా మానవతా పూర్వక సాయం15బి.డాలర్లు మాత్రమే. ప్రపంచ దేశాల సరఫరా గొలుసులన్నీ ఈ సంక్షోభంతో దెబ్బతిన్నాయి.వాటిని పునరుద్దరించటం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేసుకొనేందుకు ఎంతో సమయం పడుతుంది.


కొద్ది వారాల్లోనే ఉక్రెయిన్ను దారికి తెచ్చుకుంటామన్న పుతిన్‌ అంచనాలు ఎలా తప్పాయో రష్యాను తరిమికొట్టామని చెప్పిన జెలెనెస్కీ మాటలు, పశ్చిమదేశాల ప్రచారం కూడా వాస్తవం కాదని ఏడాదిలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.నిజానికి ఒక్క ఉక్రెయిన్‌ మిలిటరీ మాత్రమే రంగంలో ఉంటే వారాలు కాకున్నా నెలల్లో పరిష్కారం దొరికి ఉండేది. కానీ పశ్చిమ దేశాలు తమ సైనికులను పంపలేదు తప్ప తమ దగ్గర ఉన్న అధునాతన అస్త్రాలన్నింటినీ రంగంలోకి దించటంతో అంచనాలు తప్పాయి.ఇరవైశాతం ఉక్రెయిన్‌ ప్రాంతం స్వాతంత్య్రం ప్రకటించుకొని గానీ, రష్యా అదుపులో ఉందని గానీ చెబుతున్నారు. అనేక ఎదురు దెబ్బలు తగిలిన తరువాత పుతిన్‌ సేనలు ఎత్తుగడలు మార్చుకున్నాయి. ఒక వైపు సాధారణ పౌరుల ప్రాణనష్టం జరగకుండా చూడటం, పశ్చిమ దేశాల దన్ను ఉన్న జెలెనెస్కీ సేనలు, కిరాయి దళాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు సరికొత్త దాడులకు సిద్దం అవుతున్నట్లు వార్తలు.ఐరోపాలో చలికాలం ముగిసిన తరువాత అవి ప్రారంభం కావచ్చు.దానికి గాను అవసరమైన సరంజామా సిద్దం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కొత్తగా మిలిటరీలోకి మూడులక్షల మందిని చేర్చుకున్నట్లు పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. జెలెనెస్కీ కోరినంత వేగంగా పశ్చిమ దేశాల సరఫరా ఉండటం లేదు.


సంక్షోభం రెండో ఏడాదిలో ప్రవేశించిన తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అందరూ చెబుతున్నారు. అవి రాజకీయంగా ఎలాంటి పర్యవసానాలకు దారి తీసేదీ చెప్పలేము. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాతో నిమిత్తం లేకుండా తమ భద్రతను తామే చూసుకోగలమనే జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాల ధీమా ఇప్పుడు కనిపించటం లేదు. వాటిని ఇరకాటంలో పెట్టి తమ అవసరాన్ని మిగతా దేశాలతో గుర్తించే ఎత్తుగడలో భాగంగానే ఉక్రెయిన్ను ముందుకు తోసి అమెరికా వర్తమాన పరిస్థితిని సృష్టించిందన్నది స్పష్టం. దానికి రష్యాను అదుపు చేయటంతో పాటు దాని బూచిని చూపి మొత్తం ఐరోపాను తన అదుపులో ఉంచుకొనేందుకు చూస్తున్నది.ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ తప్పుకున్నప్పటికీ తన నమ్మిన బంటుగా అమెరికా నిలబెట్టుకుంది. మరోవైపున భద్రతామండలి, ఐరాస చేసేదేమీ లేదని ప్రపంచానికి రుజువైంది. దీంతో ఎవరి జాగ్రత్తలు వారు చూసుకుంటున్నారు.
రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఇచ్చేందుకు చైనా సిద్దం అవుతున్నదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి బ్లింకెన్‌ సిబిఎస్‌ టీవీలో ఆరోపించాడు.ఇప్పటికే మారణాయుధాలు కాని వాటిని ఇస్తున్నదని త్వరలో వాటిని కూడా అందచేయ నుందని చెప్పాడు.చైనాలో ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలకు తేడా లేదని ఎవరు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినట్లుగానే భావిస్తామన్నాడు. పశ్చిమ దేశాల ఆంక్షలను నీరు గార్చేందుకు చైనా పుతిన్‌కు తోడ్పడుతోందని, చమురు, గాస్‌, బొగ్గు దిగుమతి చేసుకుంటున్నదని ఆరోపించాడు. అనవసరంగా తమ వైపు వేలు చూపితే, బెదిరింపులకు దిగితే అంగీకరించేది లేదని చైనా స్పష్టం చేసింది. మ్యూనిచ్‌ సమావేశంలో చైనా ప్రతినిధి మాట్లాడుతూ కొన్ని శక్తులు సంప్రదింపులు జయప్రదం కావాలని గానీ పోరు త్వరగా ముగియాలని గానీ కోరుకోవటం లేదన్నాడు.పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించటం పాతబడిన సంగతి. పోరును సాగదీసేందుకు, కొత్త ప్రాంతాలలో ఏదో ఒకసాకుతో చిచ్చుపెట్టేందుకు పూనుకోవటం అన్నది తాజా పరిణామాలు ప్రపంచానికి ఇస్తున్న సూచికలు.రష్యాతో సాగుతున్న ప్రతిఘటన కార్యకలాపాలను చక్కదిద్దేందుకు ఉక్రెయిన్‌ వెళుతున్నట్లు అధికారికంగా చేసిన ప్రకటనలో జో బైడెన్‌ పేర్కొన్నాడు. ప్రపంచ శాంతి కోసం సామ్రాజ్యవాదుల పన్నాగాలను మరింతగా వివరించటం, జనాన్ని కూడగట్టేందుకు శాంతిశక్తులు మరింతగా రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి.

,

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ పోరులో కంటే ఇంథన సంక్షోభంతో ఐరోపాలో చలి మరణాలే ఎక్కువా !

30 Wednesday Nov 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

energy cost, High fuel prices, imperialism, Ukraine war, Ukraine-Russia crisis, Vladimir Putin



ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య బుధవారం నాటికి 280 రోజులు. అగ్నికి ఆజ్యం పోస్తున్న మాదిరి వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలు దీన్ని ఇంకా ఎంత కాలం కొనసాగిస్తాయో ఎవరూ చెప్పలేని స్థితి. రష్యాతో చర్చలకు ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ తొలి రోజుల్లో సిద్దపడినప్పటికీ అమెరికా, బ్రిటన్‌ ఇతర నాటో దేశాలు వాటిని పడనివ్వలేదని తరువాత స్పష్టమైంది. అమెరికా, దాన్ని అనుసరించే పశ్చిమ దేశాలు వేసిన తప్పుడు అంచనాలు, ఎత్తుగడల గురించి ఇతరులు చర్చించుకోవటం ఒక ఎత్తు కాగా తొమ్మిది నెలల తరువాత ఐరోపా సమాఖ్యలోని కొన్ని దేశాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభంతో తలెత్తిన పరిస్థితి, పర్యవసానాలు కార్మికవర్గం మీద ప్రభావం చూపటం ప్రారంభమైంది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు చలి కాలం ఎలా గడపాలిరా బాబూ అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.


మరోవైపున ఈ సంక్షోభాన్ని అమెరికా తన లాభాల కోసం వినియోగించుకుంటున్నదని ఐరోపా గొణగటం ప్రారంభించింది.ఉక్రెయిన్‌ సంక్షోభం మీద తటస్థ వైఖరిని అనుసరిస్తున్న భారత్‌, చైనా తదితర దేశాలు పశ్చిమ దేశాల బెదరింపులను పక్కన పెట్టి రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడిచమురును చౌకధరలకు కొనుగోలు చేసి పుతిన్‌కు లబ్ది కలిగించటంతో పాటు డాలర్లను పొదుపు చేసుకుంటున్నాయి. డిసెంబరు ఒకటవ తేదీన చైనా అధినేత షీ జింపింగ్‌ ఆహ్వానం మేరకు ఐరోపా సమాఖ్య మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ చైనా రానున్నాడు. క్రిమియా వంతెన పేల్చివేతకు ఉక్రెయిన్‌ చేసిన కుట్ర వెల్లడి కావటంతో రష్యా దళాలు విద్యుత్‌ కేంద్రాలను దెబ్బతీశాయి. దీంతో రాజధాని కీవ్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో మంచినీరు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చలికాలాన్ని ఆయుధంగా చేసుకొని తమ దేశం మీద పుతిన్‌ దళాలు విరుచుకుపడుతున్నట్లు జెలెనెస్కీ ఆరోపించాడు. డిసెంబరు ఐదు నుంచి రష్యా చమురును తాము నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాలనే ఆంక్షలను అమెరికా, నాటో కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్య తీసుకుంటామని అమెరికా చెప్పగా ధరల అదుపును అంగీకరించిన దేశాలకు అసలు తాము విక్రయించేది లేదని రష్యా స్పష్టం చేసింది.


ఒక వైపు ఉక్రెయిన్‌కు తాము మద్దతుగా ఉన్నామని చెబుతూనే ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఆర్థిక అంశాల దగ్గరకు వచ్చేసరికి లాభాలు మీకు – భారాలు మాకా ఏమిటీ పద్దతి అని ఐరోపా దేశాలు అమెరికాను ఇప్పుడు అడుగుతున్నాయి. అమెరికా చేసిన దురాగతాలన్నింటిని ఆమోదించి అనుసరించిన గతం వాటిని వెన్నాడుతోంది. అనేక విధాలుగా అమెరికా బంధంలో చిక్కుకొని ఉన్నాయి. ఉక్రెయిన్‌ పరిణామాలను చూస్తే ఐరోపా కంటే అమెరికాపెత్తనమే ఎక్కువగా ఉంది. నాటో పేరుతో అక్కడ తిష్టవేసేందుకు చూసిన సిఐఏ పథకంలో భాగంగా 2014లో జరిగిన తిరుగుబాటులో నయా నాజీలను అధికారానికి తెచ్చారు. ఈ పూర్వరంగంలో జనాభిప్రాయానికి అనుగుణంగా గతంలో తమ ప్రాంతంగా ఉన్న ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని తనలో విలీనం చేసుకుంది. అదేబాటలో నడచిన డాంటెస్క్‌ ప్రాంతంలోని జనాన్ని ఉక్రెయిన్‌ మిలిటరీతో అణచివేతకు పాల్పడటం, గతంలో రష్యాకు ఇచ్చిన హామీకి భిన్నంగా నాటో విస్తరణకు పూనుకోవటంతో ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది.


చర్చలను అడ్డుకోవటంతో పాటు దీర్ఘకాలం కొనసాగేలా, తీవ్ర పర్యవసానాలకు దారి తీసేందుకు దోహదం చేసే విధంగా భారీ ఎత్తున అమెరికా ఆయుధాలను అందిస్తున్నది. మరోవైపున రష్యా నుంచి చమురు తదితర దిగుమతులను నిషేధించి ఐరోపాను తమపై ఆధారపడేట్లు చేసుకుంది. గోడదెబ్బ చెంపదెబ్బ మాదిరి ఐరోపా దేశాలు ఉక్రెయిన్నుంచి వచ్చిన శరణార్ధుల భారంతో పాటు పెరిగిన చమురు, విద్యుత్‌ ధరల భారాలను అనుభవిస్తున్నాయి. కరోనాకు ముందే తక్కువ వృద్ధి రేటుతో ఉన్న పరిస్థితి తరువాత మరింత దిగజారింది. దాని మీద ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతో ద్రవ్యోల్బణం, ధరల భారాలతో ఆర్థిక రంగం కుదేలౌతున్నది. ఇది పాలకపార్టీల మీద వత్తిడితో పాటు జనాన్ని వీధుల్లోకి రప్పిస్తున్నది. మరోవైపు రాజకీయంగా అమెరికాతో స్నేహం కోసం కొన్ని దేశాలతో వైరం తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతుండటంతో సుభాషితాలు చెబుతున్న నాయకగణం నేల మీద నడిచేందుకు చూస్తున్నది. తాము చేయాల్సింది చేయకుండా వ్లదిమిర్‌ పుతినే అన్నింటికి కారణం అని చెబితే నమ్మేందుకు జనాలు సిద్దంగా లేరు.


తాజాగా పొలిటికో అనే పత్రికలో ఒక విశ్లేషణ వెలువడింది. ” ఉక్రెయిన్‌పై తొమ్మిది నెలల దురాక్రమణ(ఇది పొలిటికో పదజాలం) తరువాత పశ్చిమ దేశాల ఎముకలు విరగ్గొట్టేందుకు పుతిన్‌ పూనుకుంటున్నాడు. ఐరోపా ఉన్నతాధికారులు జో బైడెన్‌ అధికార యంత్రాంగం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఐరోపా సమాఖ్య దేశాలు ఇబ్బందులు పడుతుండగా అమెరికన్లు యుద్దం నుంచి లాభాలు పొందుతున్నారు.” అని పేర్కొన్నది. ఇన్ని నెలలుగా పుతిన్‌ శకం ముగిసింది, ఉక్రెయిన్‌ గెలిచింది అంటూ గంతులు వేసిన వారు ఇప్పుడు ఎముకలు విరగ్గొట్టటం గురించి మాట్లాడటం గమనించాలి. విధించిన ఆంక్షలు వికటించి ఐరోపాకు దిక్కుతోచని స్థితిలో జో బైడెన్‌ అమెరికా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను, హరిత రాయితీలు ఐరోపా పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని తమ మిలిటరీ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు ఉపయోగించుకుంటున్నారని, శాంతియుత పరిష్కారానికి పూనుకోవాలన్న తమ వినతులను చెత్తబుట్టలో పడవేస్తున్నారని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఐరోపా అధికారి ఒకరు చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది. ” వాస్తవం ఏమంటే, మీరు గనుక నిమ్మళంగా చూస్తే ఈ యుద్దం నుంచి ఎక్కువగా లబ్ది పొందిన దేశం ఏదంటే అమెరికా, ఎందుకంటే వారు అధిక ధరలకు గాస్‌ అమ్ముతున్నారు, ఎక్కువగా ఆయుధాలు అమ్ముతున్నారు. మేము నిజంగా ఇప్పుడు చారిత్రాత్మక సంకట స్థితిలో ఉన్నాము. ముందు చెప్పినట్లుగా అమెరికా ఇస్తున్న సబ్సిడీలు, అధిక ఇంథన ధరల ముప్పు అట్లాంటిక్‌ కూటమి(నాటో),యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మారుతున్నది. అనేక ఐరోపా దేశాలలో ప్రజాభిప్రాయం మారుతున్నదని అమెరికా గుర్తెరగాల్సిన అవసరం ఉంది.” అని కూడా సదరు అధికారి చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది.


రష్యా అంటే ఒంటికాలి మీద లేచే ఐరోపా సమాఖ్య విదేశాంగ విధాన అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ ఉక్రెయిన్‌కు ఉమ్మడిగా సాయపడాలనే భావననే ప్రశ్నించాడు. ” అమెరికన్లు – మా స్నేహితులు – నిర్ణయాలుతీసుకుంటారు, అవి మాపై ఆర్ధిక ప్రభావం చూపుతాయి ” అన్నాడు. ” అమెరికా మాకు అమ్ముతున్న గాస్‌ ధర అట్లాంటిక్‌ దాటే సరికి అనేక రెట్లు పెరిగి నాలుగింతలు అవుతున్నది. అమెరికన్లు మా స్నేహితులనటంలో ఎలాంటి సందేహం లేదు….. కానీ మిత్రుల మధ్య ఎక్కడో తప్పు జరుగుతున్నది అనిపించినపుడు దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ” అని ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థెరీ బ్రెటన్‌ ఒక ఫ్రెంచి టీవీతో మాట్లాడుతూ చెప్పాడు. పొలిటికోతో మరొక ఐరోపా ప్రతినిధి మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 369 బిలియన్‌ డాలర్ల పారిశ్రామిక రాయితీల పథకాన్ని ప్రకటించాడు. అది ఐరోపా రాజధానులన్నింటా ఆకస్మిక భయాన్ని కలిగించింది.ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం అన్నింటినీ మార్చివేస్తున్నది. అమెరికా ఇప్పటికీ మా మిత్రదేశంగా ఉన్నట్లా లేనట్లా అని అడిగినట్లు పొలిటికో పేర్కొన్నది.


అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ తరువాత ఐరోపా సమాఖ్య నుంచి ఒక ఉన్నతాధికారి చైనా సందర్శించటం ఇదే ప్రధమం. చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంటే తప్ప ఐరోపా మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ బీజింగ్‌ సందర్శన జరుగుతుంది. చైనాను ఒంటరిపాటు గావించాలని, అక్కడి నుంచి సరకులు కొనుగోలు నిలిపివేయాలంటూ రోజూ పారాయణం చేస్తున్న అమెరికా వైఖరిని తోసిరాజనటమే ఇది. చైనా మిగతా దేశాలన్నింటికీ పోటీదారు, వ్యవస్థాపరంగా శత్రువు అని అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో అమెరికాకు మరింత దగ్గరైన ఐరోపా సమాఖ్య ప్రముఖుడు చైనా సందర్శన ఒక కీలక పరిణామం. ఎంతో కసరత్తు జరిగితే తప్ప ఇలాంటివి జరగవు.చైనా మీద గుర్రుగా ఉన్న ఐరోపా సమాఖ్యలోని అగ్రదేశం జర్మనీ ఛాన్సలర్‌ ష్కుల్జ్‌ ఇటీవల చైనా సందర్శించి తాము ఘర్షణకు సిద్దం కాదనే సందేశాన్ని నాటో కూటమికి పంపాడు. తరువాత బీజింగ్‌తో సంబంధాలకు సిద్దమే అని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు. దానికొనసాగింపుగా మండలి నేత వస్తున్నట్లు చెప్పవచ్చు. ఐరోపాను తన అవసరాలకు వాడుకుంటూ ఆ మేరకు లబ్ది పొందుతూ ఐరోపాకు వాటా ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తున్నకారణంగానే అవసరమైతే తమదారి తాము చూసుకుంటామనే సందేశాన్ని ఐరోపా ఇస్తున్నది. అమెరికా పెత్తనాన్ని అడ్డుకొని తాము బతకాలంటే చైనా లేకుండా జరిగేది కాదన్న గ్రహింపు కూడా దీనిలో ఉంది. అంటే వారి అవసరాల కోసమే చైనాతో చెలిమి అన్నది స్పష్టం.


ఉక్రెయిన్‌ పోరు సంక్షోభం కారణంగా మరణించేవారి కంటే దాని పర్యవసానాలతో తలెత్తిన పరిస్థితి కారణంగా చలి కాలంలో ఎక్కువ మంది ఐరోపా వారు మరణిస్తారని బ్రిటన్నుంచి వెలువడే వారపత్రిక ఎకానమిస్ట్‌ నవంబరు 28వ తేదీ సంచిక విశ్లేషణ పేర్కొన్నది. ఐరాస అధికారికంగా ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అక్కడ మరణించిన పౌరులు 6,900 మంది, గాయపడిన వారి సంఖ్య పదివేలకు చేరింది. మిలిటరీ పరంగా ఎందరు సైనికులు మరణించిందీ నిర్ధారించటం కష్టమని రెండు వైపులా మరణించిన వారు 25 నుంచి 30వేల చొప్పున ఉండవచ్చని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. చలికాలంలో ఇంథన ధరలు పెరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే ఇతివృత్తంతో గత సమాచార ప్రాతిపదికన ప్రాణ నష్టం గురించి పేర్కొన్నది. అసాధారణ రీతిలో గాస్‌, విద్యుత్‌ ధరలు పెరిగిన కారణంగా రానున్నది ప్రత్యేకమైన చలికాలంగా మారితే సాధారణ మరణాలకంటే లక్షా 47వేల మంది అదనంగా మరణిస్తారని పేర్కొన్నది. చలి మరింత తీవ్రంగా ఉంటే, వాతావరణ మార్పులు జరిగితే ఈ సంఖ్య 3,35,000 ఉండవచ్చని పేర్కొన్నది. చలి తక్కువగా ఉన్నప్పటికీ కనిష్టంగా 79 వేలు అదనంగా ఉండవచ్చని తెలిపింది.జూన్‌-ఆగస్టు నెలలతో పోలిస్తే డిసెంబరు-ఫిబ్రవరి మధ్య మరణాలు 21శాతం ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ విశ్లేషణ తరువాత ఐరోపా ప్రభుత్వాలు, సమాజాల్లో స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.రికార్డు స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా పేదలు, మధ్యతరగతి జనాలు చలికాలంలో ఆహారానికి ఎక్కువ సొమ్ము వెచ్చించాలా గృహాలను వెచ్చచేసుకొనే ఇంథనానికి ఎక్కువ ఖర్చు చేయాలా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.2000 నుంచి 2019 ధరలతో పోల్చితే గాస్‌ ధర 144, విద్యుత్‌ ధర 78శాతం పెరిగింది. ఇటలీలో 2020 నుంచి 200శాతం వరకు విద్యుత్‌ బిల్లులు పెరిగాయి. ఎక్కువగా నష్టం, ఇబ్బందులు పడుతున్నది ఐరోపా సమాజమే గనుక దాన్నుంచి బయటపడేందుకు ఉక్రెయిన్‌ – రష్యా చర్చలకు వత్తిడి తెచ్చే అవకాశం ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సమస్య :రణమా ! శరణ్యమా ? నాటోలో కొత్త భయం ! మరో మలుపు తిరిగిన సంక్షోభం !!

12 Wednesday Oct 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Crimea bridge blast, Crimea., NATO, Ukraine war, Ukraine-Russia crisis, Vladimir Putin, Volodymyr Zelensky


ఎం కోటేశ్వరరావు


కొందరు వర్ణిస్తున్నట్లు ఉక్రెయిన్లో అసలైన పోరు ఇప్పుడే ప్రారంభమైందా లేక మరో పెద్ద మలుపు తిరిగిందా ? రోజులు గడిచే కొద్దీ కొత్త సందేహాలు, సమస్యలు. తాజా పరిణామాలను ఉక్రెయిన్‌ – రష్యా సంక్షోభ పునరుద్భవంగా కొందరు పేర్కొన్నారు. అసలేం జరగనుంది అనే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు 231 రోజుల తరువాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి.గత కొద్ది వారాలుగా ఎలాంటి దాడులు లేవు. కొన్ని ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వెనక్కు వెళ్లాయి.నాలుగు ప్రాంతాల పౌరులు కోరుకున్నట్లుగా వాటిని రష్యా విలీనం చేసుకున్నట్లు ప్రకటించిన తరువాత విమర్శలు తప్ప పెద్ద పరిణామాలేవు. అలాంటిది ఒక్కసారిగా సోమ, మంగళవారాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉక్రెయిన్‌ అంతటా అనేక పట్టణాలపై పెద్ద ఎత్తున రష్యా క్షిపణి దాడులు జరిగాయి. అనేక పట్టణాల్లో అంధకారం అలుముకుంది. వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించాలని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ పశ్చిమ దేశాలను వేడుకున్నాడు. మిలిటరీ వ్యవస్థలతో పాటు విద్యుత్‌ కేంద్రాలపై సోమ, మంగళవారాల్లో పుతిన్‌ దళాలు కేంద్రీకరించాయి. రాజధాని కీవ్‌లోని కొన్ని కీలక కేంద్రాలపై క్షిపణిదాడులు జరిగినా జెలెనెస్కీ నివాసం, అధికార కేంద్రాలపై ఇంతవరకు గురిపెట్టలేదు. ఇక ముందు అది జరగదని చెప్పలేము. ఇదంతా ఎందుకు అంటే !


అక్టోబరు 8 తేదీ శనివారం నాడు రష్యా క్రిమియా ద్వీపకల్పంలోని క్రిమియా లేదా కెర్చ్‌ వంతెన మీద పెద్ద పేలుడు జరిగింది. ఐదుగురు మరణించారని వార్తలు. ఉదయం ఆరు గంటలపుడు (మన కాలమానం ప్రకారం 9.30 గంటలు) ఈ ఉదంతం జరిగింది. ఉక్రెయిన్‌ ఉగ్రవాద ఆత్మాహుతి దళం తాము తెచ్చిన ఒక కారు, ట్రక్కును పేల్చివేసినట్లు ఒక కథనం కాగా, వంతెన కింద ఉన్న సముద్ర జలాల్లోనుంచి వచ్చిన ఒక అస్త్రంతో పేల్చివేసినట్లు మరొక విశ్లేషణ. ఈ ఉదంతం జరిగినపుడే ఉక్రెయిన్‌ మిలిటరీకి అమెరికా సరఫరా చేసిన ఒక మానవరహిత పడవ రష్యా ఓడరేవు సమీపంలో కనిపించటంతో ఈ అనుమానం తలెత్తింది. ఎలా జరిగిందనేది ఇంకా నిర్ధారణగాకున్నా పేలుడు జరిగింది. దానికి ప్రతి స్పందనగా సోమవారం నాడు వివిధ పట్టణాల మీద రష్యా త్రివిధ దళాల క్షిపణుల దాడి ప్రారంభమైంది. ఈ దాడిలో అనుమానితులుగా ఐదుగురు రష్యన్‌, ముగ్గురు ఉక్రేనియన్‌, ఆర్మీనియన్‌ పౌరులను అరెస్టు చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.


ఈ వంతెన మీదుగా వెళ్లే ప్రతి వాహనం ఒక పెద్ద స్కానర్‌ గుండా వెళుతుంది. వాటిలో ఒకవేళ పేలుడు పదార్ధాలు ఉంటే వెంటనే తెలుసుకోవచ్చు. దాన్ని తప్పించుకొని వాహనాలు వెళ్లాయా, అప్పుడు అది పని చేయలేదా, తనిఖీలోపమా, విద్రోహమా లేక సముద్ర జలాల్లో నుంచి వచ్చిన ఏదైనా పడవ నుంచి పేలుడు జరిపారా అన్నది తేలాల్సి ఉంది. గతంలో అనేక మార్లు ఉక్రెయిన్‌ అధికారులు వంతెనలను పేల్చివేస్తామని ప్రకటించారు.జూలై నెలలో జెలెనెస్కీ సలహాదారు అరెస్తోవిచ్‌ త్వరలో తమ మిలిటరీ దాడి చేస్తుందని చెప్పాడు. వంతెనల మీద దాడి చేసినందుకు బహిరంగంగా ఎస్తోనియా విదేశాంగ మంత్రి అభినందనలు తెలిపాడు.ఈ దాడి వెనుక ఉక్రెయిన్‌ ప్రత్యేక కార్యకలాపాల దళపు హస్తం ఉందని కూడా చెప్పాడు. గత కొద్ది సంవత్సరాలుగా సిరియా, ఇతర ఇస్లామిక్‌ తీవ్ర వాదులను జెలెనెస్కీ సర్కార్‌ చేరదీస్తున్నదని, వారు ఐరోపా సమాఖ్య దేశాల్లో తిరిగేందుకు ఎలాంటి వీసాలతో నిమిత్తం లేకుండా చూసేందుకు ఉక్రెయిన్‌ పాస్‌పోర్టులు ఇచ్చారని, ఆ ఆత్మాహుతి దళాలతో పేలుడుకు పాల్పడి ఉండవచ్చని కొందరు అంటున్నారు.
వంతెన మీద పేలుడుతో సంబంధం లేకుండానే తమపై దాడికి ముందుగానే రష్యా పధకం వేసిందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. వంతెన పేలుడు గురించి మౌనంగా ఉన్న అమెరికా, ఇతర దేశాలూ మరోవైపు క్షిపణి దాడులను ఖండిస్తూ విమర్శలకు దిగాయి. పుతిన్‌ సేనలను, రష్యాను దెబ్బతీయాలంటే ఎక్కువ దూరం ప్రయాణించి రష్యా మీద బాంబులను కురిపించే క్షిపణులను తమకు ఇవ్వాలని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ అమెరికా, ఇతర నాటో దేశాలను కోరుతున్నాడు. అందుకు గాను పుతిన్ను మరింత రెచ్చగొట్టే ఎత్తుగడలో భాగంగా క్రిమియా వంతెన పేల్చి వేతకు పధకం వేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అది ఎంతో కీలకమైన రోడ్డు, రైలు వంతెన గనుక పుతిన్‌ తీవ్రంగా స్పందిస్తే ఆ సాకుతో అలాంటి క్షిపణులు ఇవ్వాలన్న ఎత్తుగడ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వేళ అందచేస్తే కొందరు చెబుతున్నట్లు అసలైన పోరు ప్రారంభానికి నాంది అవుతుంది. దానిలో అమెరికా, ఇతర నాటో దేశాల సైనికులు భౌతికంగా పాల్గొంటారా లేదా అన్నది ప్రశ్నార్ధకమైతే ఆ దేశం ఆధునిక ఆయుధాల ప్రయోగశాలగా మారుతుంది.


క్రిమియా ద్వీపకల్పంలో పేల్చిన వంతెన ఆ ప్రాంతానికి రష్యా ప్రధాన భూభాగాన్ని కలిపే పందొమ్మిది కిలోమీటర్ల రోడ్డు, పక్కనే ఉన్న రైలు వంతెన.పౌరులకు అవసరమైన సరఫరాలతో పాటు మిలిటరీ రవాణాకు సైతం అది కీలకం. ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడి జనం తమ ప్రాంతాన్ని తిరిగి రష్యాలో కలపాలని కోరారు. ఆ మేరకు 2014లో విలీనం జరిగింది. తరువాతనే పుతిన్‌ ప్రభుత్వం ఆ వంతెనల నిర్మాణం చేసింది.స్వయంగా పుతిన్‌ కారు నడిపి వంతెనలను ప్రారంభించారు. నిజానికి ఆ వంతెనల వలన రవాణా వేగంగా జరగటం తప్ప ఆ ప్రాంతానికి దారి లేక కాదు. ఇక శనివారం నాటి పేలుడు జరిగిన చోట రోడ్డు వంతెన మీద ఒక వైపున ఉన్న ఇనుపకంచె(రెయిలింగ్‌) కొంత మేర విరిగి సముద్రంలో పడింది. పక్కనే ఉన్న రైలు వంతెన మీద ఉన్న రైలులోని ఇంధన టాంకర్లకు నిప్పంటుకుంది. కొంత సేపు రవాణా నిలిపివేసి అదే రోజు పునరుద్దరించారు. నష్టం పెద్దది కాదు గానీ తరువాత జరిగిన పరిణామాలకు అది నాంది పలికింది. ఈ పేలుడుకు తమదే బాధ్యత అని చెప్పుకొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఉక్రెయిన్లో సంబరాలు, నర్మగర్భంగా ఆ దేశ నేతలు చేసిన ప్రకటనలు, అది ఉక్రెయిన్‌ చేసిందే అని పేరు చెప్పని వారు తమకు చెప్పినట్లు అమెరికా పత్రికలు ప్రకటించటం వంటి పరిణామాలన్నీ వేలు జెలెనెస్కీవైపే చూపుతున్నాయి. ఇది పౌర, కీలకమైన మౌలిక సదుపాయాలను దెబ్బతీసే ఉగ్రవాద చర్య అంటూ భద్రతా మండలిలోని శాశ్వత దేశాల ప్రతినిధులతో పుతిన్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చించాడు.


గత ఎనిమిది సంవత్సరాలుగా ఉక్రెయిన్‌ ఉగ్రవాద దళాలు స్వదేశంలోనూ, తమ ప్రాంతంలోనూ దాడులకు పాల్పడినట్లు రష్యా గతంలో కూడా పేర్కొన్నది.హిట్లర్‌ మూకలు పార్లమెంటు భవనాన్ని తగులబెట్టి నెపాన్ని కమ్యూనిస్టుల మీద మోపినట్లుగా జెలెనెస్కీ దళాలు స్వంత అణు విద్యుత్‌ కేంద్రాలపై దాడులకు పాల్పడి నెపాన్ని తమ మీద మోపేందుకు చూసినట్లు కూడా ఐరాసకు ఫిర్యాదు చేసింది. తమ కురుస్క్‌ అణు విద్యుత్‌ కేంద్రాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా మూడు సార్లు విద్యుత్‌ లైన్ల మీద దాడులు చేసినట్లు, టర్క్‌ స్ట్రీమ్‌ గాస్‌పైప్‌లైన్‌ పేల్చివేతకు చూసిందని కూడా పేర్కొన్నది. బాల్టిక్‌ సముద్రంలో ఉన్న అంతర్జాతీయ గాస్‌ పైప్‌లైన్ల విధ్వంసానికి జరిపిన పేలుళ్ల విచారణ బృందంలో తమ ప్రతినిధులను అనుమతించలేదని రష్యా పేర్కొన్నది.
క్రిమియా వంతెన పేల్చివేతకు ప్రతిగా రష్యా క్షిపణులు జనావాసాలపై బాంబులు వేసినట్లు జెలెనెస్కీ, పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండగా తాము ఉక్రెయిన్‌ ఇంథన, మిలిటరీ, సమాచార కేంద్రాల మీద దాడులు జరిపి ధ్వంసం చేసినట్లు పుతిన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. సోమవారం నాటి రష్యా దాడుల్లో 14 మరణించారని, 97 మంది గాయపడినట్లుగా ఉక్రెయిన్‌ పేర్కొన్నది. నిజంగా జనం ఉన్న ప్రాంతాల మీద క్షిపణులు పడి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉండేది.రష్యా ప్రత్యేక సైనిక చర్య ప్రారంభమై మంగళవారం నాటికి 230 రోజులు.(ఫిబ్రవరి 24) అప్పటి నుంచి ఐరాస లెక్కల ప్రకారం అక్టోబరు రెండవ తేదీనాటికి మరణించిన పౌరుల సంఖ్య 6,114 అంటే సగటున రోజుకు పాతిక మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం నాడు ఒకే సారి అనేక పట్టణాల మీద క్షిపణి దాడి జరిగింది. ఏ కారణంతోనైనా అమాయక పౌరుల మరణాలను సమర్ధించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. దాడుల స్వభావం గురించి జరుగుతున్న ప్రచారం గురించి తెలుసుకొనేందుకే ఈ వివరాలు. తమ ప్రతీకారం తీవ్రంగానే ఉంటుందని రష్యన్లు బాహాటంగానే చెబుతున్నారు. సోమవారం నాడు పుతిన్‌ సేనలు వదలిన 83క్షిపణుల్లో 43ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఉక్రెయిన్‌ సైనికులు 60 మంది మరణించినట్లు, అనేక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు , ఒక మిగ్‌ విమానాన్ని కూల్చినట్లు రష్యా లెక్కలతో సహా ప్రకటించింది. నిజానికి ఇప్పటి వరకు 230 రోజుల పోరులో ఎటువైపు ఎంత నష్టం అన్నది ఇంతవరకు నిర్దారణగా వెల్లడికాలేదు. దేశమంతటా తమ విద్యుత్‌ వ్యవస్థకు ముప్పు వచ్చినట్లు ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. పదకొండు ప్రధాన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు ప్రధాని వెల్లడించాడు. అనేక చోట్ల మంచినీరు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉక్రెయిన్‌లో ఫ్రెంచి పౌరులందరూ తమ ఇండ్లలోనే ఉండాలని ఫ్రాన్స్‌ కోరగా, దేశం విడిచి పోవాలని తమ పౌరులను అమెరికా కోరింది. అదనపు మిలిటరీ సరఫరాలను పంపుతామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. అనేక దేశాల నేతలకు ఫోన్‌ చేసిన జెలెనెస్కీ అందరం కలసి పోరాడాలని కోరాడు.


అనేక దేశాలలో అమెరికా కూటమి కిరాయి మూకలను రంగంలోకి దించుతోంది. ఉక్రెయిన్లో కూడా అదే జరుగుతోంది. వేలాది మందిని రష్యా మిలిటరీ పట్టుకోవటం, హతమార్చటం తెలిసిందే. ఇంకా వేలాది మంది ఉన్నారు. ఈ నేపధ్యంలో తాజాగా వస్తున్న వార్తలను బట్టి గతంలో తిరుగుబాటుదార్లుగా ఉండి పుతిన్‌ సర్కార్‌కు లొంగిపోయిన చెచెన్‌ సాయుధులను ఉక్రెయిన్‌పై దాడులకు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న అనుభవంతో ఉగ్రవాదుల తీరుతెన్నులు వారికి కొట్టిన పిండేగనుక ఉక్రెయిన్‌ ఉగ్రవాదులను అరికట్టేందుకు వారే సరైన వారని భావిస్తున్నట్లు చెప్పవచ్చు. ఇప్పటికే తమ వారు పదివేల మంది ఉన్నారని 70వేల మందిని రంగంలోకి దించనున్నట్లు కొద్ది రోజుల క్రితం రష్యా మిలిటరీలో జనరల్‌గా చేరిన రమజాన్‌ కదరయోవు చెప్పాడు. నాటో కూటమి నేర్పిన పాఠాలను తిరిగి వారికే నేర్పేందుకు పుతిన్‌ పావులు కదుపుతున్నట్లు కొందరు పేర్కొన్నారు. అమెరికా, ఇతర నాటో ప్రధాన దేశాల తీరు తెన్నులను చూసినపుడు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఒక తీరులో దీర్ఘకాలం కొనసాగిస్తూ రష్యాను బలహీనపరిచి తమకు ఎదురులేదని, తమను ప్రతిఘటించేవారికి ఇదే గతి అని ప్రపంచానికి చెప్పేందుకు చూస్తున్నట్లు చెప్పవచ్చు.ఈ క్రమంలో వారు ఊహించని ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుత శీతాకాలం గడవటం ఒకటైతే దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితి నుంచి ఎలా నెగ్గుకు రావాలా అన్నది వాటి ముందున్న ప్రధాన సవాలు.


ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ మిలిటరీకి నాటో కూటమి అందచేసిన అస్త్రాలన్నీ పరిమిత ప్రాంతాలకు పరిమితమైనవే. మూడు వందల కిలోమీటర్లు అంతకు మించి వెళ్లగల క్షిపణులను ఇంతవరకు ఇవ్వలేదు. వాటిని ఇస్తే సంక్షోభ స్వరూపం, స్వభావమే మారుతుంది. నాలుగు ప్రాంతాలను తనలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించిన తరువాత కూడా ఈ వైఖరిలో ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. రష్యా భూభాగమైన క్రిమియా వంతెనపై దాడి చేస్తే ఎలాంటి ప్రతి స్పందన ఉంటుందో చూసేందుకు ఒక పధకం ప్రకారం పశ్చిమ దేశాలు చేయించిన దాడి అన్నది స్పష్టం. రెండు రోజులుగా జరుపుతున్న దాడులను పుతిన్‌ నిలిపివేస్తారా, కానసాగిస్తారా? కొనసాగితే ఉక్రెయిన్‌ పౌరుల్లో తలెత్తే భయ, సందేహాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయి, సంక్షోభం ఏ రూపం తీసుకుంటుంది, జెలెనెస్కీని మునగచెట్టు ఎక్కించిన పశ్చిమ దేశాలు ఏం చేస్తాయి. ఇలాంటి అనేక సందేహాలకు ఇప్పట్లో సమాధానం కనిపించేట్లు లేదు.


ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను మొత్తంగా చూస్తే మానవ నష్టాన్ని పరిమితం చేసేవిగా రష్యా దాడులున్నాయి. ఇక ముందు అలానే ఉంటాయా లేదా అన్నది ఎర్ర గీతలు దాటి రెచ్చగొడుతున్న పశ్చిమ దేశాలు, వాటిలో కీలుబమ్మగా మారిన ఉక్రెయిన్‌పై ఆధారపడి ఉంది.తనపై విధించిన ఆంక్షల కారణంగా ఐరోపాకు ఇంధన సరఫరా నిలిపివేసిన రష్యాను దెబ్బతీసేందుకు నోర్డ్‌స్ట్రీమ్‌ పైప్‌లైన్లను కొన్ని చోట్ల ధ్వంసం చేశారు. రష్యామహిళా జర్నలిస్టు దర్యా దుగీనాను హత్య చేశారు. కెర్చ్‌ వంతెనల పేల్చివేతకు చూశారు. రష్యా సరిహద్దులకు టాంకులు, క్షిపణులను తరలిస్తున్నారు.


తొలి రోజుల్లో చర్చలకు సిద్దమన్నట్లు జెలెనెస్కీ కనిపించినా అదంతా ఉత్తిదే అని తేలింది. తదుపరి చర్చలను నిషేధించే ఒక ఫర్మానాను జెలెనెస్కీ విడుదల చేసిన తరువాత అసలు స్వరూపం వెల్లడైంది. రష్యా ఇంథన సరఫరాల్లేకుండా చలికాలాన్ని అధిగమించటం ఐరోపాకు కాస్త ఇబ్బందైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటుంది గానీ, పరిశ్రమల మూత, ద్రవ్యోల్బణం వంటి ఆర్ధికపరమైన అంశాలతో పుట్టి మునుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుతిన్ను తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని పశ్చిమ దేశాలు చూస్తుంటే జెలెనెస్కీ మీద పుతిన్‌ గురిపెట్టాడు. అన్ని దేశాలకూ ఈ సంక్షోభాన్ని పంచాలని చూస్తున్న అతను లొంగితే ఆ పరాభవం పశ్చిమ దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే పెద్ద ఎత్తున ఆయుధ సరఫరాలు చేస్తున్నాయి. మొదటికే మోసం వస్తే అంటే తమ జీవితాలనే ఈ సంక్షోభం అతలాకుతలం గావిస్తే ఐరోపా జనం ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. గతంలో పుతిన్‌ విజయం సాధిస్తాడేమోనని నాటో భయపడితే ఇప్పుడు ఓడిపోతే అణ్వాయుధాలను రంగంలోకి తెస్తాడేమో అని భయపడుతున్నట్లు ఒక వార్తా సంస్థ కొత్త కథనాన్ని రాసింది. ఇది ఊహాజనితమే గాని దీని వెనుక రష్యా ఓడిపోనుందని, కొద్ది రోజులు ఇబ్బందులను భరించాలనే భావనలోకి పశ్చిమ దేశాల జనాన్ని తీసుకు వెళ్లే ఎత్తుగడ కూడా ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ది ” ప్రచార విజయమా ” !

14 Wednesday Sep 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Germany, NATO, Propaganda “Victory”, Ukraine war, Ukraine-Russia crisis, Ukraine’s counteroffensive, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు

రష్యా సైనిక చర్యలో కోల్పోయిన ప్రాంతంలో మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు, పుతిన్‌ సేనలను తరిమికొట్టినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. మరుసటి రోజు దాన్ని ఆరువేలని, మంగళవారం నాడు ఎనిమిది వేలని చెప్పారు. నిజమే, ఇదిగో చూడండి పారిపోతున్న రష్యా సేనలు అంటూ పశ్చిమ దేశాల టీవీలు కొన్ని దృశ్యాలను చూపటం, విశ్లేషణలు, వాటి ప్రాతిపదికగా అనేక దేశాల వారు స్పందించటం, వాటిని మన దేశంలోని మీడియా ఎప్పటికప్పుడు అందించటం చూస్తున్నాము.ఖారకైవ్‌ ప్రాంతం నుంచి తమ సేనలను వెనక్కు మళ్లించినట్లు మాస్కో అధికారులు ప్రకటించారు. అందువలన ఆప్రాంతం ఎంతైతే అన్ని వేల కిలోమీటర్లను విముక్తి చేసినట్లు ఉక్రెయిన్‌ చెప్పుకోవటంలో తప్పులేదు, ఆశ్చర్యమూ ఉండదు. దాని నేత జెలెనెస్కీ అధికారానికి రాక ముందు సినిమాల్లో విదూషక పాత్రధారి. గత ఆరున్నర నెలలుగా అనేక ప్రకటనలు చేశాడు. తమ మూలనున్న ముసలమ్మలు ఊతకర్రలు పట్టుకొని, పాలుతాగే పసివాళ్లు కూడా ఉయ్యాళ్ల నుంచి దూకి దేశ రక్షణకు వచ్చినట్లుగా గతంలో చెప్పిన కబుర్లను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.


మరికొన్ని విశ్లేషణల ప్రకారం ఒక ఎత్తుగడగా మాస్కో సేనలు భారీ దాడులకు సిద్దం కావటంలో భాగంగా వెనక్కు వెళ్లినట్లు చెబుతున్నారు. అందువలన ఆ ప్రాంతాన్ని తిరిగి ఉక్రెయిన్‌ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నదా ? నాలుగు నెలలుగా సాధ్యం కానిది ఈనెల మొదటి వారంలో ఆకస్మికంగా నాలుగు రోజుల్లో రష్యా సేనలను తరిమికొట్టే శక్తిని జలెనెస్కీ ఎలా సంపాదించినట్లు ? పశ్చిమ దేశాలు జనాల ప్రాణాలు తీసే లేదా ఆస్తులను విధ్వంసం చేసే అస్త్ర శస్త్రాలే కాదు జనాల మెదళ్ల మీద దాడి చేసే ప్రచార ఆయుధాలను కూడా సమకూర్చుతున్నాయి. ప్రాణాంతక అస్త్రాలను దాడులు జరిగే చోటనే ప్రయోగిస్తే ప్రచారదాడికి ఎల్లలు లేవు. తాజాగా ఉక్రెయిన్‌ ప్రతిఘటన అనేది ఒక ప్రచార ” విజయం ” గా కొందరు వర్ణించారు. జరిగిన దాన్ని తమ వైఫల్యాలు, ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇతర కారణాలతో తలెత్తిన ఆర్ధిక సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు, ఇంకొక్క ఊపు ఊపితే పుతిన్‌ పతనం ఖాయం అనే అభిప్రాయాన్ని, వాతావరణాన్ని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నంగా కనిపిస్తున్నది.


తాము జరుపుతున్నది దురాక్రమణ దాడి కాదని రష్యా చెబుతున్నది, కాదు అదేనని దాన్ని వ్యతిరేకించే దేశాలు వర్ణిస్తున్నాయి. ఏ కారణంతో పశ్చిమ దేశాలు చెప్పినప్పటికీ 1,27,484 చదరపు కిలోమీటర్ల మేర జెలెనెస్కీ సర్కార్‌ ఏలుబడిలో లేదు, దీనిలో ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగి స్వాధీనం చేసుకోవటాన్ని పెద్ద విజయంగా చిత్రించుతున్నారు. ఒక పోరు జరుగుతున్నపుడు ఇలాంటివి సాధారణం. ఇదేమీ నిర్ణయాత్మక పరిణామం కాదు. దీంతోనే ముగిసేది లేదు. అందుకే దీన్ని ప్రచార ” విజయం ” అంటున్నారు. దశాబ్దాల పాటు ఆప్ఘనిస్తాన్‌లో తిష్టవేసిన అమెరికన్లు అక్కడ సాధించిన విజయ గాధలను ప్రపంచానికి ఎలా వినిపించారో, తప్పుదారి పట్టించారో, చివరికి తాలిబాన్ల కాళ్లు పట్టుకొని ప్రాణాలతో స్వదేశానికి పారిపోయారో తెలిసిందే. ఖార్‌కైవ్‌ ప్రాంతం నుంచి రష్యా సైనికులు టాంకులు, వాహనాలు, తుపాకులను ఎక్కడి వక్కడ వదిలేసి ఉక్రేనియన్లు దాచుకున్న సైకిళ్లను అపహరించి వాటి మీద పారిపోయారట. మరి జెలెనెస్కీ సేనలు వారిని ఎందుకు బందీలుగా చేయలేదు. ఎవడైనా పారిపోవటానికి ఉన్న వాహనాలను వదలి సైకిళ్లెందుకు ఎక్కుతారు?


మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకోవటం గొప్పే అనేవారిని కాసేపు సంతృప్తిపరుద్దాం. ఐరాస కాందిశీకుల సంస్థ వివరాల ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత మంది కాందిశీకులు ఏ సంక్షోభంలోనూ రాలేదు. ఆగస్టు 30 నాటికి 70లక్షల మంది కాందిశీకులు వివిధ దేశాల్లో ఉన్నారు. అత్యధికంగా 24లక్షల మంది రష్యాకే వెళ్లారు. డాన్‌బాస్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ మిలిటరీ, నాజీ కిరాయి మూకలు జరిపిన దాడుల కారణంగా వారు వలస పోవాల్సి వచ్చింది. మిగిలిన వారు రష్యా మిలటిరీ దాడుల కారణంగా ఇతర ఐరోపా దేశాలకు వలస వెళ్లారు. వీరు గాక అంతర్గతంగా మరో 80లక్షల మంది తమ నెలవులు తప్పారు. విదేశాలకు వెళ్లిన వారిలో ఎందరు తిరిగి వచ్చారు, వారికి ఎందరికి తిరిగి పూర్వపు జీవనాన్ని కల్పించారన్నది ముఖ్యం. ఆ వివరాలు మనకు ఎక్కడా కనపడవు, వినపడవు.తామే ఇంథన కొరతతో ఇబ్బందులు పడుతుంటే కాందిశీకులకు ఎక్కడ ఏర్పాట్లు చేస్తామంటూ అనేక దేశాల్లో గుసగుసలు.


ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ఉక్రెయిన్‌ మిలిటరీ, ఆర్ధిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా రష్యా దాడులను జరుపుతున్నది. జన నష్టం జరగకుండా ఎంపిక చేసుకున్న వాటి మీదనే దాడులు చేస్తోంది. రెండు వైపులా జరుగుతున్న నష్టాల గురించి ఇప్పటికీ స్పష్టమైన లెక్కలు లేవు. చెబుతున్నది నమ్మదగినవిగా లేవు. దాడుల్లో జననష్టం జరిగితే దాన్ని చూపి రష్యాను మరింత ఒంటరి చేసి ఎండగట్టాలన్న అమెరికా ఎత్తుగడ పారలేదు. అదే విధంగా పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున జెలెనెస్కీ సేనలకు ఆయుధాలు అందిస్తాయనే అంచనా ఉన్నప్పటికి ఆధునిక అస్త్రాలతో తమను ఎదుర్కొంటారని పుతిన్‌ ఊహించినట్లు కనపడదు. ఇలా ఊహించనివి మరికొన్ని కూడా ఉన్నాయి. ఇంథనాన్ని ఆయుధంగా మలచాలని చూసిన అమెరికాకు అది ఎదురుతన్నటమే కాదు మాస్కోకు అదనపు రాబడి తెచ్చిపెడుతున్నది. ఇంథన సంక్షోభంతో ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అది ఏ రూపంలో జనంలో ఆగ్రహం కలిగిస్తుందో చెప్పలేము. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అమెరికాలో ద్రవ్యోల్బణం, మాంద్య ముప్పు పొంచి ఉంది. మేము కావాలో రష్యా కావాలో తేల్చుకోవాలని అమెరికా విసిరిన మతిమాలిన సవాలు దానికే ఎదురుతన్నింది. డాలరును పక్కన పెట్టి తమ కరెన్సీలతో లావాదేవీలు జరుపుకోవాలని మరింతగా గట్టిగా చెప్పేందుకు ఈ సంక్షోభం అవకాశం ఇచ్చింది. పెద్దన్న ప్రాభవం తగ్గుతున్నదని లోకానికి స్పష్టం చేసింది. చివరికి ప్రతిదానికి అమెరికా నేతలను కావలించుకున్న నరేంద్రమోడీ ఈ అంశంలో మాత్రం దూరంగా ఉన్నారు. గొంతు కలిపేందుకు వెనుకాడుతున్నారు.

రెండవ ప్రపంచయుద్దంలో జర్మనీ,జపాన్‌ సామ్రాజ్యవాదులను ఎదుర్కొనేందుకు సోవియట్‌తో భుజం కలిపి పోరాడిన అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్సులు తరువాత దాన్నే బూచిగా చూపి ప్రపంచానికే శత్రువులుగా రుజువైన జర్మనీ,జపాన్‌లను చంకనెత్తుకున్నాయి. అన్నింటికంటే విపరీతం ఏమంటే నాటో పేరుతో జర్మనీని, రక్షణ ఒప్పందం పేరుతో జపాన్ను కాపాడేందుకు పూనుకున్నాయి. అన్నీ కలసి ప్రపంచానికి ముప్పు తలపెట్టాయి. గతంలో ఐరోపాలో యుద్దానికి జర్మనీ కారణమైతే ఇప్పుడు దాన్ని కూడా కలుపుకొని ఉక్రెయిన్‌ యుద్దానికి అమెరికా కారణమైంది. ఏదో ఒకదాన్ని బూచిగా చూపకపోతే తమ దుష్టపధకాలను జనం ప్రశ్నిస్తారు గనుక ఊహాజనిత బూచిని చూపుతున్నాయి. దానిలో భాగంగానే ప్రస్తుతం రష్యాను, దానికి మద్దతు ఇస్తున్నదంటూ చైనాను బూచిగా చూపుతున్నారు. చివరికి స్విడ్జర్లాండ్‌, ఫిన్లాండ్‌ వంటి తటస్థ దేశాలను కూడా తమ కూటమిలోకి లాగాయి. లాటిన్‌ అమెరికాలో నియంతలను ప్రోత్సహించి ప్రజా ఉద్యమాలను అణచేందుకు పూనుకుంటే అక్కడా ఎదురుతన్నింది.వామపక్ష ప్రజాతంత్ర పురోగామి శక్తులు ముందుకు వస్తుండగా మితవాద శక్తులను జనం ఛీకొడుతున్నారు.


అమెరికా డాలరు దెబ్బకు తమ కరెన్సీ యురో, బ్రిటీష్‌ పౌండ్‌ కూడా విలవిల్లాడుతున్నాయి. వాటి పర్యవసానాలు ఇప్పుడే తెలియదు. ఇంథనాన్ని ఆయుధంగా మార్చాలని చూసిన అమెరికా ఎత్తుగడకు విరుగుడుగా దాన్నే తన అస్త్రంగా మార్చుకున్న రష్యా ప్రయోగానికి ఐరోపా గింగిరాలు తిరుగుతోంది. చమురు, చమురు ఉత్పత్తుల మీద డిసెంబరు ఐదు, 2023 ఫిబ్రవరి ఐదు నుంచి రెండు దశలుగా రష్యా ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు పూనుకున్నారు. తాము నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు కొనుగోలు చేస్తే వాటిని రవాణా చేసే టాంకర్లకు బీమా సౌకర్యాన్ని నిలిపివేస్తామని అమెరికా, కెనడా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌, ఇటలీలతో కూడిన జి7దేశాల కూటమి ఇప్పటికే ప్రకటించింది. దీనికి సిద్దము సుమతీ అన్నట్లుగా ఐరోపా సమాఖ్య వంతపాడింది. ఓడలు, టాంకర్ల బీమా వాణిజ్యం 90శాతం ఈ దేశాల చేతుల్లోనే ఉంది. ఈ పధకానికి ఆమోదం తెలిపే, ఆంక్షలను సమర్ధించే ఏ దేశానికి తమ ఉత్పత్తులను వేటినీ విక్రయించేది లేదని మాస్కో అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ తెగేసి చెప్పాడు. ఐరోపాకు చమురు, గాస్‌ను సరఫరా చేసే నార్డ్‌ స్రీమ్‌ ఒకటవ సహజవాయు సరఫరాను రష్యా నిలిపివేసింది. చెప్పిన గడువు తరువాత కూడా మూసివేత కొనసాగుతోంది. దాంతో ఇంథనాన్ని ఆయుధంగా చేసుకొని ఐరోపా దేశాల మీద వత్తిడి తేవటం తొండి ఆట అంటూ అమెరికా గుండెలు బాదుకుంటోంది.

ఆంక్షలు అమల్లోకి రాక ముందే రష్యా నుంచి అందినంత మేరకు ఇంథనాన్ని కొని నిలువ చేసుకోవాలని ఐరోపా దేశాలు చూశాయి. ఇప్పటికే అనేక ప్రభుత్వాలు కోతలు, పరిశ్రమల మూతలు ప్రారంభించి పొదుపు మంత్రాన్ని జనాలకు ప్రవచిస్తున్నాయి.చలికాలాన్ని ఎలా తట్టుకోవాలా అని తలలు పట్టుకుంటున్నాయి. సిగ్గువిడిచి రష్యాను అడగలేవు, జనానికి సంతృప్తి కలిగించలేని స్థితి. ఇంథన బ్లాక్‌మెయిల్‌, తమను చీల్చేందుకు కుట్ర అంటూ ఐరోపా సమాఖ్య మండిపడుతోంది. నీవు నేర్పినే విద్యే కదా అన్నట్లుగా పుతిన్‌ ఉన్నాడు. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలు వద్దు అన్న జర్మనీ ఇప్పుడు తమకు అవే ముద్దు అన్నట్లుగా తిరిగి తెరుస్తున్నది. జర్మనీతో సహా అనేక దేశాలజనం పెరిగిన ఇంథన ధరలను తాము తట్టుకోలేమంటూ వీధులకు ఎక్కుతున్నారు.మన ఆర్‌బిఐ మాదిరే ఐరోపా బాంకు వడ్డీ రేట్లు పెంచుతున్నది.1970దశకం తరువాత ఇలాంటి తీవ్ర పరిస్థితిని ఐరోపా ఎన్నడూ ఎదుర్కోలేదు, ఈ స్థితి ఎంతకాలం ఉంటుందో అంతుబట్టటం లేదు.రెండు సంవత్సరాల పాటు సాధారణ జనానికి, ఆరునెలల పాటు వాణిజ్య సంస్థలకు విద్యుత్‌ చార్జీలను పెంచబోమని బ్రిటన్‌ నూతన ప్రధాని లిజ్‌ ట్రస్‌ అంటున్నారు. ఇతర దేశాల నుంచి ఎల్‌ఎన్‌జి, ఇతర ఇంథనం అందుబాటులో ఉన్నా ఐరోపా దేశాలకు నిల్వచేసుకొనే ఏర్పాట్లు లేవు. ఇంతకాలం రష్యా నుంచి నిరంతర సరఫరా ఉండటంతో నిల్వ అవసరం లేకపోయింది. ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు కుదిరేవి కాదు. జర్మనీలో రసాయనకర్మాగారాల మూత లేదా విద్యుత్‌ లేక కోతలుండటంతో చైనా ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది.


ఖారకైవ్‌ ప్రాంతంలో మూడువేల చదరపు కిలోమీటర్లను తిరిగి స్వాధీనం చేసుకున్నాం,మిగతా ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే పశ్చిమ దేశాలు తమకు మరిన్ని ఆయుధాలు, డబ్బు ఇవ్వాలంటూ ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కోరుతున్నాడు. ఇచ్చినడబ్బులో కొంత నొక్కేశాడని వార్తలు. మా సమస్యలు మాకుంటే ఇదేమి గొడవ అని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. తాము ఇస్తున్న వాటిని పెంచే అవకాశం లేదని జర్మన్‌ రక్షణ మంత్రి క్రిస్టిని లాంబ్రెచెట్‌ అన్నారు. మా దగ్గర ఉన్న ఆయుధాలు నిండుకుంటున్నాయి, మా అవసరాలకే మేము కొనుక్కోవాలి అన్నారామె. మరొక ముఖ్య దేశమైన ఫ్రాన్స్‌ అంటీముట్టనట్లుగా నాకేంటి అన్నట్లుగా ఉంది. బ్రిటన్‌, జర్మనీ, పోలెండ్‌, ఇస్తోనియా, డెన్మార్క్‌ తరువాతే అది ఇస్తున్న సాయమొత్తం ఉంది. గొడవలెందుకు అన్న ధోరణితో ఫ్రాన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. మీరు తలచుకుంటే అందరికంటే ఎక్కువ సాయం చేయగలరంటూ జర్మనీని మునగ చెట్టు ఎక్కించేందుకు అమెరికా పూనుకుంది. మొత్తం మీద రానున్న కొద్ది రోజులు లేదా చలికాలంలో లేదా ముగిసిన తరువాత కొత్త పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభంపై అమెరికా కూటమి మల్లగుల్లాలు : అనుకున్నదొకటి అవుతున్నది మరొకటి !

06 Wednesday Jul 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

European Union, G7 summit 2022, NATO, Ukraine war, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధిపత్యంలోని నాటో కూటమి సృష్టించిన వివాదంలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య బుధవారం నాడు 133వ రోజులో ప్రవేశించించింది. డాన్‌బాస్‌లో కొంత మినహా మిగిలిన ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానికి అనుబంధంగా ఉన్న కిరాయి నాజీ మూకలను రష్యా మిలిటరీ తరిమివేసింది. లుహానస్క్‌ ప్రాంతాన్ని విముక్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ అభినందనలు తెలిపారు. లుహానస్క్‌ వేగంగా పతనం కావటాన్ని చూస్తే రష్యా సేనల మధ్య మెరుగైన సమన్వయం ఉన్నట్లు కనిపిస్తోందని బ్రిటన్‌ రక్షణశాఖ పేర్కొన్నది. మరోవైపు తమ సేనలు వెనక్కు తగ్గటం, రష్యా దళాలను అడ్డుకోవటం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెనెస్కీ చెప్పాడు. డాన్‌టెస్క్‌ ప్రాంతం కూడా త్వరలో పతనం కానున్నట్లు వార్తలు. మూలనున్న ముసలమ్మలు, ఉయ్యాళ్లలో ఉన్న పసి పిల్లలు కూడా తుపాకులు పట్టి పుతిన్‌ సేనలను తరిమికొడుతున్నారన్న కథలు ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేదు. ఒక వేళ చెప్పినా నాటో కూటమి దేశాల్లో జనం క్రమంగా చెవుల్లో పూలు తొలగించుకుంటున్నారు గనుక నమ్మని పరిస్థితి. కనుక ఆయాసపడినా ఫలితం ఉండదని గ్రహించి వాటిని తగ్గించారు.


గత నెలలో జర్మనీలో జి7, మాడ్రిడ్‌లో నాటో కూటమి సమావేశాలు జరిగాయి. రెండుచోట్లా రష్యాను ఎలా దెబ్బతీయాలి, కొత్త చోట్ల ఎలా చిచ్చు పెట్టాలన్న ఆలోచనల చుట్టూ చర్చలు, నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. అంతర్గతంగా జరుగుతున్న మల్లగుల్లాల్లో మాత్రం ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి బయటపడేదెలా ? అనుకున్నదాని కంటే రష్యా మెరుగ్గా ఎలా ఉంది, నెలల తరబడి చేసిన కసరత్తు వృధాగా మారిందా? అన్న అంశాలున్నాయని వార్తలు. ఐరోపా సమాఖ్య(ఇయు) ఆర్ధిక పురోగతికి, దేశాల మధó్య ఆటంకాలను తొలగించుకొనేందుకు ఏర్పడింది.అలాంటి వేదికపై ఇప్పుడు మిలిటరీ అంశాల గురించి చర్చలు చోటు చేసుకుంటున్నాయి. నిరంతరం ప్రపంచంలో సామ్రాజ్యవాదులు రెండు రంగాల్లో యుద్ధాలు చేస్తున్నారు. ఒకటి ఆర్ధిక, రెండవది మిలిటరీ. రష్యా మీద ఆంక్షల రూపంలో అమెరికా, ఐరోపా సమాఖ్య తన నిర్ణయాలను ప్రపంచం మీద రుద్దాలని చూస్తున్నది. వందల కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను అందిస్తూ నాటో కూటమి ఉక్రెయినుకు వెన్నుదన్నుగా ఉంది.


వ్లదిమిర్‌ పుతిన్‌కు దగ్గరగా ఉన్నట్లు భావించిన వారిలో 1,100 మంది ఆస్తులను పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షల్లో భాగంగా స్థంభింప చేశాయి. ఐరోపా ద్రవ్యమార్కెట్లకు రష్యన్‌ బాంకులను దూరం చేశారు. రష్యా ఎగుమతులతో పాటు అది ఐరోపా నుంచి చేసుకొనే దిగుమతులపై ఆంక్షలు పెట్టారు.దాదాపు వంద బిలియన్‌ యురోల విలువగల వస్తువులను అడ్డుకున్నారు. దీన్ని ” ఎగుమతి నియంత్రణలను మిలిటరీకరించటం ”గా పిలుస్తున్నారు. ఆర్ధిక కూటమి నుంచి భద్రతా కూటమిగా స్వయంగా మార్పు చెందటంగా చెబుతూ ఇటీవలి కాలంలో ఆ దిశగా ఇయు చేసిన చట్టాలను ఉటంకిస్తున్నారు. అమెరికా ఆదేశాలను ఇయు సభ్య దేశాలపై రుద్దుతున్నది. పరిస్థితిని ఆసరా చేసుకొని అనేక అధికారాలను స్వంతం చేసుకుంది. అమెరికా తాను తీసుకున్న నిర్ణయాలను ముందుగా ఇయుకు చెప్పి తరువాత ఇతర దేశాలతో సంప్రదింపుల తతంగం జరుపుతున్నది. రష్యా మీద అమలు జరిపిన ఈ ఎత్తుగడను చైనాకు విస్తరించేందుకు పూనుకున్నారు.


గతేడాది నవంబరులో అమెరికా సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బర్న్‌ ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం ఉన్న బ్రసెల్స్‌ వచ్చి రహస్య సమావేశాలు జరిపి ఉక్రెయిన్‌ మీద పెద్ద ఎత్తున దాడి చేసేందుకు పుతిన్‌ సిద్దం అవుతున్నాడు, ఏం చేద్దామని అడిగాడు. గత కొద్ది నెలలుగా పుతిన్‌ సన్నద్దం అవుతున్నాడు. మీరు కూడా భాగస్వాములవుతారు గనుక చలికాలంలో గాస్‌ అవసరం మీకుంటుంది. మిమ్మల్ని ఇరుకున పెట్టేందుకుగాను మీరు నిల్వ చేసుకొనేందుకు వీల్లేకుండా గాస్‌ సరఫరాలను తగ్గించాడని కూడా చెప్పాడు. మిలిటరీగా నాటో జోక్యం కుదిరేది కాదు గానీ, కావాలంటే 2014 క్రిమియా విలీనం తరువాత మీరు చేస్తున్న ఆర్ధిక దాడుల్లో మేము కూడా భాగస్వాములం అవుతామని ఇయు నేతలు అంగీకరించారు. ఐదు రకాలుగా ఆంక్షలు అమలు జరపాలని ముందే పధకం వేశారు. తరువాత కసరత్తు చేసి ఎలా అమలు జరుపుతున్నదీ తెలిసిందే. రష్యా సైనిక చర్య డాన్‌బాస్‌ ప్రాంతానికే పరిమితం అవుతుందని, మనకు పెద్దగా పని ఉండదని అనేక మంది భావించారు. ఏకంగా రాజధాని కీవ్‌ మీదనే దాడులు జరపటంతో అంతకు ముందే అనుకున్న దశలవారీ ఆంక్షలను వేగంగా వెంటనే ప్రకటించారు. అది కొన్ని దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌ బస్‌ కంపెనీకి అవసరమైన టిటానియంను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. దాంతో నాలక్కరుచుకొని అబ్బే వాటికి వర్తించవని సడలించారు. అలాగే కొన్ని దేశాలకు ఇంథన సరఫరాలకు మినహాయింపునిచ్చారు.


ఆంక్షల్లో ఉన్న లోపాలను ఆధారం చేసుకొని మూడవ పక్ష దేశాల నుంచి రష్యన్లు కంప్యూటర్లు, కార్ల విడిభాగాల వంటి వాటిని దిగుమతి చేసుకున్నారు. తమ నుంచి దిగుమతి చేసుకొనే వారు రూబుళ్లలోనే చెల్లించాలన్న ఎత్తుగడ కూడా కొంత మేరకు ఫలించింది.అన్నింటికీ మించి పశ్చిమ దేశాలు ఊహించని విధంగా లబ్ది పొందింది. ఇంథన ఉత్పత్తిని తగ్గించినప్పటికీ ఇప్పటి వరకు గతం కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. తమ ఆంక్షల ఫలితంగా రష్యాలో పదిశాతం ఉత్పత్తి తగ్గుతుందని, ఇరవై శాతం పెట్టుబడులు ఆగుతాయని, అవసరమైన విడి భాగాలకు కొరత ఏర్పడి ఆయుధ పరిశ్రమల మూత, చివరికి ట్రాక్టర్లకు సైతం కొరత, వీటన్నింటి ఫలితంగా ఆర్ధిక సంక్షోభం, రాజకీయంగా పుతిన్‌కు ఎసరు వస్తుందని రాసుకున్న నివేదికలన్నింటినీ పశ్చిమ దేశాలు ముందు వేసుకొని నాలుగు నెలలు గడిచినా అలా ఎందుకు జరగటం లేదని పదే పదే చదువు కుంటున్నాయి. మరోవైపున అమెరికాతో సహా పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్ధిక దిగజారుడు మాంద్యానికి గురికానున్నట్లు వార్తలు. పెరుగుతున్న ఇంథన ధరలు ఐరోపాలోని అనేక దేశాల్లో దారిద్య్రం పెరగనుందని రష్యన్‌ మీడియా చెబుతోంది.


పశ్చిమ దేశాలు ఊహించని మరొక అంశం. రష్యా సరిహద్దులకు వెలుపల మాస్కో నుంచి 1,257 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న రిపబ్లిక్‌ కలినిన్‌గ్రాడ్‌. దీని జనాభా ఐదు లక్షలు. రష్యా నుంచి రోడ్డు మార్గంలో రావాలంటే ఒక వైపున లాత్వియా, లిథువేనియా మీదుగా, మరోవైపు నుంచైతే బెలారస్‌,లిథువేనియా మీదుగా రావాల్సి ఉంటుంది. నౌకా మార్గంలోనైతే బాల్టిక్‌ సముద్రం నుంచి చేరుకోవచ్చు.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జర్మనీ-సోవియట్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జర్మనీ కలినిన్‌గ్రాడ్‌ ప్రాంతాన్ని సోవియట్‌కు అప్పగించింది. 1990దశకంలో సోవియట్‌ విడివడిన తరువాత అది రష్యా ఆధీనంలోకి వచ్చింది. ఉక్రెయిన్‌ వివాదం తలెత్తిన తరువాత ఈ ప్రాంతానికి రష్యా నుంచి సరఫరాలను అనుమతించాలా లేదా అన్నది సమస్యగా మారింది. ఉక్కు, అల్యూమినియం వంటివి ఆంక్షల జాబితాలో ఉన్నప్పటికీ వాటి రవాణాను పునరుద్దరించాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది. జూన్‌ పదిహేడవ తేదీ నుంచి రైళ్ల ద్వారా నిర్మాణ సామాగ్రి, బొగ్గు,ఖనిజ రవాణాను లిథువేనియా నిలిపివేసింది. ఉక్రెయిన్‌ వివాదానికి ముందు ఎంత పరిమాణంలో సరఫరా ఉంటే అంతే అనుమతిస్తామని ఐరోపా సమాఖ్య చెబుతోంది. కలినిన్‌ గ్రాడ్‌ నుంచి ఇతర దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకొనేందుకు ఈ షరతు విధిస్తున్నారు.లిథువేనియా వైఖరితో విబేధించిన జర్మనీ ఐరోపా సమాఖ్య ద్వారా తన నిర్ణయాన్ని అమలు చేయిస్తున్నదని వార్తలు వెలువడ్డాయి. రష్యా-ఉక్రెయిన్‌ వివాదంలో ఆంక్షలను జర్మనీ సమర్ధిస్తున్నప్పటికీ యుద్ధంలో నాటో భాగస్వామి కాకూడదని కోరుకుంటోంది. అనవసర వివాదాలతో రష్యాను మరింతగా రెచ్చగొట్టవద్దని కూడా చెబుతోంది. అయితే లిథువేనియా దీని గురించి రుసరుసలాడుతోంది. ఐరోపా కమిషన్‌లో రష్యా భయాన్ని నింపిందని, ఇది కొన్ని రైల్వే వాగన్ల అంశం కాదని, రష్యా బెదిరింపులకు లొంగినట్లు కనిపిస్తోందని, ఇది ఇంతటితో ఆగదని, ఐరోపాలో చీలికలు తెచ్చేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని, తమ పరువు తీశారని, ఇప్పుడు నాటోలో భాగంగా లిథువేనియాలో ఉన్న జర్మన్‌ దళాలను ఉంచుతారా వెనక్కు తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉందని అక్కడి విశ్లేషకులు చిత్రిస్తున్నారు. చివరికి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాల్సి ఉంది.


జి7, నాటో సమావేశాల్లో ఆంక్షలను మరింతగా పెంచాలని సంకల్పం చెప్పుకున్నారు, ఉక్రెయినుకు ఆయుధ సరఫరాను పెంచాలని నిర్ణయించారు. ఇదే సమయంలో తమ పరువు కాపాడుకుంటూ వివాదాన్ని ఎలా ముగించాలా అనే ఆలోచన కూడా చేస్తున్నారు. తొలి రోజుల్లో ఉక్రెయిను గట్టిగా నిచినట్లు కనిపించినా దాని అడుగుజారుతున్నట్లు అంతర్గతంగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. మిలిటరీ, ఆర్ధిక లక్ష్యాలను దెబ్బతీస్తూ రష్యా అడుగులు వేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమ దేశాలు ఇచ్చిన అస్త్రాలతో ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు పాల్పడుతున్నది తప్ప రష్యా చేతికి చిక్కిన ప్రాంతాలను తిరిగి పొందే అవకాశం కనిపించటం లేదు. ఉక్రెయిన్‌తో పోలిస్తే ఆర్ధికంగా, ఆయుధపరంగా రష్యా పైచేయితో ఉంది. దాడులు మరికొంత కాలం ఇదే తీరుతో కొనసాగితే అంతర్గతంగా ఉక్రెయిన్‌ జనం స్పందన ప్రతికూలంగా మారవచ్చు.ఇరుగు పొరుగు దేశాలకు శరణార్ధులకు ఆశ్రయం కల్పించటం,ఆర్ధిక సాయం భారంగా మారవచ్చు.


సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఇంకా ఎంత మేరకు ఉక్రెయిన్‌ ధ్వంసమౌతుందో అంచనా లేదు. ఇప్పటి వరకు జరిగినదాన్నుంచి పునర్‌నిర్మాణం జరగాలంటే 750బిలియన్‌ డాలర్లు అవసరమని, ఈ బాధ్యతను ప్రజాస్వామిక ప్రపంచమే చేపట్టాలని జెలెనెస్కీ డిమాండ్‌ చేస్తున్నాడు. ఉక్రెనియన్లలో అసంతృప్తి తలెత్తకుండా చూసేందుకు పునర్‌నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 6.84 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనలు వచ్చినట్లు ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్స్‌ ప్రకటించారు, ఎక్కడ 750 ఎక్కడ 6.84 బి.డాలర్లు ? స్విడ్జర్లాండ్‌లో జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలు, సంస్థలకు చెందిన వారు తాము భాగస్వాములం అవుతామని సంతకాలు చేశారు. ఈ సంక్షోభం పరోక్షంగా ప్రపంచమంతటినీ ప్రభావితం చేస్తోంది. పరిస్థితి ఇంకా దిగజారితే దాన్ని ఎగదోస్తున్న పశ్చిమదేశాల వైపు చూపే వేళ్ల సంఖ్య పెరుగుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా మీద ఆంక్షల పర్యవసానాలను ఊహించని పశ్చిమ దేశాలు !

08 Wednesday Jun 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

100 days Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై బుధవారం నాటికి 105వ రోజుకు చేరింది. అమెరికా, ఇతర నాటో దేశాలు ప్రపంచం మీద రుద్దిన సంక్షోభ పర్యవసానాలను ఉక్రెేనియన్లు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పరోక్షంగా మన దేశంతో సహా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వందవ రోజు సందర్భంగా ఆ సంక్షోభం గురించి అనేక మంది పాఠాలు, గుణపాఠాలు అంటూ తమ వైఖరులను వెల్లడించారు. ఏ దాడి లేదా యుద్దంలోనైనా ముందుగా నిజాలు బలి అవుతాయి. వంద రోజులు దాటిన తరువాత కూడా ఉక్రెయిన్లో నిజంగా జరుగుతున్నదేమిటి? అమెరికా కూటమి దేశాలు చెబుతున్నట్లుగా రష్యాకు ఎదురు దెబ్బలు తగిలాయా ఏమిటి అన్నది స్పష్టంగా వెల్లడికావటం లేదు.అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొన్ని అంశాలను చూద్దాం.


ఇరవై శాతం భూభాగం తమ పట్టునుంచి తప్పిందని స్వయంగా ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. అది గత ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటుదారులది పైచేయిగా ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతం. ఉక్రెయిన్‌ మిలిటరీ, దాని కనుసన్నలలో పని చేసే కిరాయి నాజీమూకలు ఒక వైపు, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దార్ల మధ్య అక్కడ అంతర్యుద్దం జరుగుతున్నది. రష్యా ప్రారంభించిన సైనిక చర్యలక్ష్యాలలో ఈ ప్రాంతంలోని నాజీ మూకలను అంతం చేయటం, నాటోలో చేరి తమ సరిహద్దులో అమెరికా, ఇతర దేశాల మిలిటరీ,ఆయుధాలను మోహరించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ జీవనాడులను దెబ్బతీసి ఆ ప్రక్రియనుంచి వెనక్కు తగ్గేట్లు చేయటం ఉన్నాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుందని వేసిన అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలు అందించిన ఆధునిక ఆయుధాలే దానికి కారణం. నయా నాజీ మూకలు, మిలిటరీ దాడుల నుంచి డాన్‌బాస్‌ పౌరులను రక్షించాలన్న లక్ష్యం నెరవేరేందుకు వందరోజులు పట్టింది. ఇక్కడ గ్రహించాల్సిన అంశాలు రెండున్నాయి. ఒకనాడు రష్యాలో అంతర్భాగంగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పిన కారణం కూడా ఉక్రెయినుకు నాటో తీర్ధం ఇవ్వాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడే.


క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవటం ఉక్రెయినుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు తమ పట్టునుంచి జారిందని చెబుతున్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని కూడా నాటో కూటమి దేశాలు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా తిరిగి ఉక్రెయిన్‌ ఆధిపత్యంలోకి వస్తుందా అన్నది అపూర్వచింతామణి ప్రశ్న.పూర్వపు సోవియట్‌ నుంచి విడిపోయి దేశంగా ఏర్పడిన వాటిలో జార్జియా ఒకటి. దీనిలో అబ్కాజియా, దక్షిణ ఒసెట్టి అనే ప్రాంతాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా గుర్తించటమే కాదు, అక్కడి ప్రభుత్వాలతో రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకొన్నది. జపాన్‌తో అమెరికా రక్షణ ఒప్పందం కుదుర్చుకొని అక్కడ తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి మిలిటరీని ఎలా దించిందో అదే పద్దతిలో ఇక్కడ రష్యా కూడా ఆ రిపబ్లిక్కులకు రక్షణ కల్పిస్తోంది.ఈ రెండు ప్రాంతాలు జార్జియాలో ఇరవైశాతం కలిగి ఉండేవి. అందువలన డాన్‌బాస్‌ ప్రాంతం కూడా వచ్చే రోజుల్లో ఇదే మాదిరి స్వతంత్ర రాజ్యం లేదా రెండు రాజ్యాలుగా ఏర్పడి రష్యాతో మిలిటరీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకొని విడిగా కొనసాగవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం నేర్పిన ఒక పాఠం ఏమంటే అమెరికాను నమ్ముకుంటే తన ఎత్తుగడలో భాగంగా ఒక దేశాన్ని మరొక దేశం మీదకు ఉసిగొల్పుతుంది తప్ప తన మిలిటరీని పంపి ప్రత్యక్షంగా రంగంలోకి దిగదు అన్నది స్పష్టమైంది. కొరియా, వియత్నాంలపై జరిపిన దాడులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొన్ని తిన్న చావుదెబ్బలే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కిరాయి మూకలను పశ్చిమదేశాలు సమీకరించినా అది సాధ్యం కాలేదు. ఉక్రెయిన్లో కూడా దాదాపు పాతిక వేలమందిని సమీకరించి జనం మీద దాడులు చేయించారు. మరియుపూల్‌ నగరంలోని ఉక్కు కర్మాగారాన్ని స్థావరంగా చేసుకొని మూడు నెలలపాటు రష్యన్లను ఎదిరించింది కూడా ఈ మూకలే. ఆ ఫ్యాక్టరీని ముట్టడించిన రష్యన్లు అక్కడి వారికి అవసరమైన సరఫరాలను అడ్డుకోవటంతో చివరికి వేలాది మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. నాలుగు కోట్ల నలభై లక్షల మంది జనాభాలో కోటీ నలభై లక్షల మంది విదేశాలకు శరణార్ధులుగా వెళ్లటం లేదా స్వదేశంలో నెలవులు తప్పటం గానీ జరిగింది. వారిని ఎంతకాలం అలా అనిశ్చితంగా పరాయిపంచల్లో కొనసాగిస్తారో తెలియటం లేదు. ఇరుగుపొరుగు దేశాలు వారిని దీర్ఘకాలం భరించటం అంతతేలిక కాదు. సంప్రదింపుల పేరుతో జెలెనెస్కీ నాటకం ఆడారు తప్ప చిత్తశుద్దిని ప్రదర్శించలేదు.తమకు నాటోలో చేరే ఉద్దేశ్యం లేదని చెప్పిన పెద్దమనిషి ఆ మాటమీద నిలిచి ఉంటే ఈ పాటికి సంక్షోభం సద్దుమణిగి ఉండేది. చావు దెబ్బలు తింటున్నా ఇంకా విదేశీఆయుధాలు తీసుకుంటూ మరింత నాశనానికి కారకుడు అవుతున్నాడు. పశ్చిమ దేశాలకు సమన్య పరిష్కారం కావటం సుతరామూ అంగీకారం కాదని తేలిపోయింది. రష్యన్‌ దాడుల్లో దెబ్బతిన్నవాటి పునరుద్దరణకు రుణాలిస్తామంటూ సంక్షోభం నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నారు.


ఈ వివాదాన్ని ఆసరా చేసుకొని రష్యాను బూచిగా చూపి ఐరోపాలో మరోసారి మిలిటరీ శక్తిగా మారేందుకు జర్మనీ పావులు కదుపుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిలిటరీ ఖర్చును తగ్గించి దాన్ని పరిశోధన-అభివృద్ధి, కార్పొరేట్లకు సబ్సిడీల వంటి వాటికి మళ్లించటంతో పారిశ్రామికంగా ఎదిగింది. ఇప్పుడు భారీ ఎత్తున మిలిటరీ ఖర్చుకు నిర్ణయించింది. ఆధునిక ఎఫ్‌35 రకం విమానాలను కొనుగోలు చేస్తానని ప్రకటించింది. ఐరోపాలో పెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగేందుకే ఇది అన్నది చెప్పనవసరం లేదు. తటస్థదేశాలుగా ఉన్న స్వీడన్‌, ఫిన్లండ్‌తో పాటు డెన్మార్క్‌ కూడా నాటోలో చేరాలని నిర్ణయించింది. వీటి కదలికల వెనుక ఉన్న అసలు లక్ష్యాలు వెల్లడికావాల్సి ఉంది.


తమ ఆంక్షలతో రష్యా ఆర్ధికవ్యవస్థ కుప్పకూలి జనం పుతిన్‌ మీద తిరగబడతారని పశ్చిమ దేశాలు వేసిన అంచనాలు, పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. మాస్కో స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది. రష్యన్‌ కరెన్సీ విలువ తొలి వారాల్లో సగానికి సగం పతనమైనా తిరిగి సైనికచర్యపూర్వపు స్థితికి చేరుకుంది. తమతో కాళ్లబేరానికి వస్తాడని భావించిన పుతిన్‌లో అలాంటి సూచనలేమీ లేవు. దాదాపు 300 బిలియన్‌ డాలర్ల మేర విదేశీమారక ద్రవ్యాన్ని పశ్చిమ దేశాలు స్థంభింప చేశాయి. ఎగుమతులపై నిషేధం విధించి ఆధునిక పరికరాలు, యంత్రసామగ్రి, పరిజ్ఞానం అందకుండా కట్టడి చేశారు.అమెరికా, ఐరోపా దేశాలు చమురు దిగుమతులను నిలిపివేసినా రష్యా ఇప్పటివరకు నిలదొక్కుకుంది. తన ఎగుమతులకు వేరే మార్కెట్లను చూసుకుంది. అమెరికా వడ్డీరేట్లను పెంచుతుంటే రష్యా తగ్గిస్తున్నది. మార్చి నెలలో భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా పదవస్థానంలో ఉంటే అది ఏప్రిల్‌ నెలలో నాల్గోస్థానానికి ఎదిగింది. మరో ఆరునెలల పాటు చమురు కొనుగోలుకు మన దేశ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నట్లు తాజా వార్తలు తెలిపాయి. మరోవైపు చైనా కూడా పెద్ద ఎత్తున చమురుతో పాటు ఇతర దిగుమతులను పెంచింది. రష్యా ఆర్థికవ్యస్థ నిలదొక్కుకొనేందుకు ఇదొక ప్రధాన కారణం. కొన్ని ఐరోపా దేశాలు కూడా ఆంక్షలను పక్కన పెట్టి అక్కడి నుంచి చమురు, గాస్‌ దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా వద్ద బంగారం, విదేశీకరెన్సీ గానీ 640 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే విధించిన ఆంక్షలను అది తట్టుకోగలుగుతోందని చెప్పవచ్చు.


రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షలు అంటే తమ కాళ్లను తామే తొక్కుకుంటున్నట్లని కొందరు వర్ణిస్తున్నారు. రష్యా నుంచి నిలిపివేసిన ఇంథనాన్ని ఇతర దేశాల నుంచి పొందాలంటే ఐరోపా దేశాలకు వెంటనే కుదిరేది కాదు.తమ నుంచి దిగుమతులు చేసుకోవాలంటే రూబుళ్లలోనే చెల్లించాలని లేకుంటే తామే నిలిపివేస్తామని పుతిన్‌ షరతులు విధించాడు. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరగటం వలన ఎగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున చెలామణిలోకి రావటం కూడా రూబుల్‌కు సానుకూల అంశంగా మారింది. రూబుల్‌ విలువ పెరగకుండా చూసేందుకు రష్యా రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. తమ నుంచి దిగుమతులను నిలిపివేయటం అంటే ఐరోపా ఆర్ధిక ఆత్మహత్య చేసుకోవటమే అని పుతిన్‌ ఎద్దేవాచేశాడు. ఇంధన ధరలు,ద్రవ్యోల్బణం పెరుగుతాయని అన్నాడు. అయితే రష్యా ఇబ్బందులను ఎదుర్కొంటోందని కూడా చెబుతున్నారు. సైనిక చర్యకు ముందు బడ్జెట్‌లో చమురు ఎగుమతుల ఆదాయం 30శాతం ఉంటే ఇప్పుడు 65శాతానికి పెరిగిందంటున్నారు.
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాకు వరంగా మారాయి. మార్చి రెండవ తేదీన ముడి చమురు ధర 60 డాలర్లవరకు ఉంటే తరువాత 110 డాలర్లు దాటింది. అందువలన రష్యా తన ఖాతాదార్లకు పెరిగిన ధరమీద పెద్ద మొత్తంలో రాయితీ ఇచ్చినా గతంతో పోల్చుకుంటే నష్టం లేదు, మన వంటి దేశాలకు ఎంతగానో కలసి వస్తుంది.రష్యా మీద వత్తిడి తెచ్చేందుకు ఆంక్షల మార్గాన్ని ఎంచుకున్న పశ్చిమ దేశాలు వాటి వలన ఇతర దేశాలకు, చివరికి తమకూ కలిగే ప్రతికూల పర్యవసానాలను ఊహించలేకపోయాయి. కొన్ని ఐరోపా దేశాల వత్తిడికి లొంగి కొంత మేరకు చమురు దిగుమతులకు అనుమతించారు. వందరోజుల తరువాత అనేక దేశాల్లో తలెత్తిన పరిస్థితి అక్కడి పాలకులకు సమస్యలు తెస్తున్నది. 2014కు ముందు రష్యా ఆహారాన్ని దిగుమతి చేసుకోగా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అక్కడి నుంచి రవాణాపై ఆంక్షలున్న కారణంగా ప్రపంచంలో సరఫరా తగ్గి ఇప్పుడు ధరలు పెరిగాయి.


వంద రోజుల సైనిక చర్య తరువాత జరగనున్నదేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. డాన్‌బాస్‌ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినందున ఇక ముందు రష్యా తూర్పు నుంచి భారీ దాడులకు సిద్దం అవుతుంది. ఉక్రేనియన్లు ఇంకేమాత్రం దాడులను తట్టుకోలేని స్థితిలోకి వెళుతున్నారు. తమకు ఇంకా ఆయుధాలు ఇమ్మని జెలెనెస్కీ కోరితే ముందు ముందు జనాగ్రహాన్ని ఎదుర్కోవచ్చు. ప్రస్తుత పోరులో ఉక్రెయిన్‌ గెలుస్తుందనే నమ్మకం రోజు రోజుకూ పశ్చిమ దేశాల్లో సడలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరవైశాతం ప్రాంతం మీద తమ పట్టులేదని జెలెనెస్కీ ప్రకటించిన తరువాత ఆ భావన ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని కొనసాగించాలా లేదా అన్న ప్రశ్న ఎదురుకానుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ధనికదేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాంటపుడు రష్యామీద పోరు కొనసాగించి సాధించేదేమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికన్లకు యుద్దం ఒక లాభసాటి బేరం !

29 Tuesday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

politics of war, Ukraine war, US imperialism, war cost, wh war is a profitable business for US


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక చర్య ఇంకా ఎన్ని రోజులో సాగుతుందో, జనాలకు ఎన్ని ఇబ్బందులను తెస్తుందో అన్న ఆందోళన చెందుతున్నవారెందరో ! అలా ఆలోచించటం, దాడులను ఆపాలని కోరుకోవటంలో సహజం అదేమీ గొంతెమ్మ కోరిక కాదు. కానీ అమెరికా, నాటో దేశాల పాలకులు అలా అనుకోవటం లేదు. వాటికి వంతపాడే పశ్చిమ దేశాల మీడియా రాస్తున్న కథనాలన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయి. మన దేశంలోని టీవీలు, పత్రికలు వాటినే మనకూ అందిస్తున్నాయి. ఉక్రెయిన్‌ జనం కన్నీళ్ళు, మానవహక్కులు, ఇతర అంశాలను ముందుకు తెస్తున్న మీడియా అమెరికా, దాని కనుసన్నలలో నడుస్తున్న ఐరోపా ధనిక దేశాలు దశాబ్దాల తరబడి ఇతర దేశాలపై చేస్తున్న దాడులు, దుర్మార్గాలు, మానవహననం గురించి విస్మరిస్తున్నది.
ఇటీవలి ఉదంతాలను చూస్తే పశ్చిమాసియాలోని సిరియాపై 2009 నుంచి ఇప్పటికీ అమెరికా, దానితో చేతులు కలిపిన కిరాయి మూకలు దాడులు జరుపుతున్నాయి. బరాక్‌ ఒబామా, డోనాల్డ్‌ ట్రంప్‌, ఇప్పుడు జో బైడెన్‌ ఎవరు అమెరికా గద్దెపై ఉన్నా దాడులు ఆపటం లేదు.లిబియా మీద 2009 నుంచి 2021జనవరి వరకు దాడులు చేసిన పుణ్యం, నాటో, బరాక్‌ ఒబామా, ట్రంప్‌కు దక్కింది. ఇరాక్‌ మీద రెండవసారి దాడులు 2009 నుంచి 2021వరకు ఏదో రూపంలో కొనసాగాయి.2001 నుంచి సోమాలియాలో జోక్యం చేసుకొని ఏదో ఒకసాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. జార్జి డబ్ల్యు బుష్‌ ఏలుబడిలో ప్రారంభమయ్యాయి. ఎమెన్‌లో 2001 నుంచి అమెరికా, దాని మిత్రపక్షం సౌదీ అరేబియా నాయకత్వంలోని దేశాలు ఇప్పటికీ దాడులు జరుపుతూనే ఉన్నాయి.2001 నుంచి 2021వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా, ఇతర దేశాల దాడుల గురించి తెలిసిందే.వీటి గురించి మీడియాకు ఎందుకు పట్టటం లేదు. ఎందుకీ వివక్ష ? ఆ దేశాల్లోని వారు మనుషులు కాదా, వారికి శాంతి అవసరం లేదా ?


తాజ్‌మహల్‌ నిర్మించిందెవరు కాదు, దాని నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరన్నది ముఖ్యమని శ్రీశ్రీ అన్నట్లుగా యుద్ధానికి ఎంత మూల్యం చెల్లిస్తున్నారని కాదు అడగాల్సింది దాని వలన లబ్ది పొందిందెవరన్నది కీలకమైన ప్రశ్న.2001 సెప్టెంబరు 11న న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్యకేంద్రంపై ఉగ్రవాదదాడి జరిగింది. అదేనెల 18న ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులకు జార్జి డబ్ల్యు బుష్‌ ఆదేశాలు జారీ చేశాడు. అక్కడి నుంచి జో బైడెన్‌ ఏలుబడిలో అమెరికన్‌ మిలిటరీ స్వదేశానికి పారిపోయి వచ్చేంతవరకు సగటున రోజుకు 30 కోట్ల డాలర్ల వంతున అమెరికా చేసిన ఖర్చు మొత్తం 2.26లక్షల కోట్ల డాలర్లు. ఉగ్రవాదంపై పోరు పేరుతో సాగించిన ఈ దాడుల ప్రత్యేకత ఏమంటే ప్రయివేటు కాంట్రాక్టర్లపై ఆధారపడటం.చిత్రం ఏమంటే చివరికి 2021 ఆగస్టులో అమెరికన్‌ సేనలు బతుకుజీవుడా అంటూ అఫ్ఘనిస్తాన్‌ నుంచి స్వదేశం చేరేందుకు కూడా 37 హెలికాప్టర్ల కోసం ప్రయివేటు కంపెనీలకు 45 కోట్ల డాలర్లు చెల్లించింది. వాటిని లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ తయారు చేసింది.


ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌పై దాడులకు అమెరికా చేసిన ఖర్చు మొత్తం ఐదు లక్షల కోట్ల డాలర్లని అంచనా. ఆఫ్ఘనిస్తాన్‌లో దాడుల్లో పాల్గొన్నవారిలో ప్రయివేటు వారే ఎక్కువ మంది ఉన్నారు. ఆయుధ కంపెనీలతో పాటు దాడులకు అవసరమైన వారిని,ఆయుధాలను సరఫరా చేసేందుకు అవసరమైన చమురును కూడా ప్రయివేటు వారే సరఫరా చేసి లబ్ది పొందారు. ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సిరియాలో జరిపిన దాడుల్లో అమెరికా రక్షణశాఖ 27వేల మంది కాంట్రాక్టర్లను వినియోగించింది. 2008-2018 మధ్య 380 మంది ఉన్నత స్ధాయి అధికారులు ఇలాంటి వారి అవతారమెత్తారని తేలింది.రెండు దశాబ్దాల క్రితం ఐదు అగ్రశ్రేణి ఆయుధ కంపెనీల వాటాలను పదివేల డాలర్ల విలువగలవి కొంటే ఇప్పుడు వాటి విలువ లక్ష డాలర్లకు పెరిగినట్లు అంచనా. అమెరికా దాడులకు చేస్తున్న ఖర్చులో లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియన్‌, జనరల్‌ డైనమిక్స్‌, బోయింగ్‌, నార్తరప్‌ గ్రుమ్మన్‌ అనే ఐదు కంపెనీలకు 60శాతం మొత్తం దక్కింది.గతంలో పని చేసిన ఐదుగురు అమెరికా రక్షణ మంత్రుల్లో నలుగురు ఈ కంపెనీలతో లావాదేవీల్లో ఉన్నవారే అంటే కుమ్మక్కు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రజల సొమ్ముతో ఆయుధాలు, ఇతర పరికరాలను కొనుగోలు చేయిస్తారు.


అందువలన అమెరికా, బ్రిటన్‌ వంటి సామ్రాజ్యవాదులు జరిపే యుద్దాలకు మూలం లాభార్జనే. గతంలో దేశాలకు దేశాలను ఆక్రమించుకుంటే ఇప్పుడు అది సాధ్యం కావటం లేదు గనుక ఏదో ఒకసాకుతో దేశాలను ఆక్రమించుకొని అక్కడ తమ తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న ఉదంతాలు(ఉదా ఇరాక్‌, లిబియా) కొన్ని కాగా, సంస్కరణల పేరుతో మార్కెట్లను ఆక్రమించుకోవటం ఒకటి. వీటికి తోడు ఇలా యుద్దాలను సృష్టించి అలా లబ్దిపొందేందుకు దగ్గరదారినెంచుకున్నాయి అమెరికన్‌ కార్పొరేట్‌ రాబందులు. దానికి అనుగుణంగానే దేశ విధానాలను రూపొందించి అమలు చేయిస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్దసమయంలో ముందుకు వచ్చిన ఈ వ్యవస్ధకు ఏదో ఒక మూల ఏదో ఒక ఉద్రిక్తత లేకపోతే గడవదు. దీనిలో కార్పొరేట్‌లు, మిలిటరీ, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు ఉంటారు. అందుకే అమెరికాకు యుద్దం ఒక లాభదాయక వాణిజ్యం, దానికోసం అదెంతకైనా తెగిస్తుంది. అందుకే అమెరికాలో నాలుగువేలకు పైగా లాబీలు(అన్ని రకాలుగా ప్రభావితం చేసే బృందాలు) మిలిటరీ-పారిశ్రామిక సంస్ధల కోసం నేడు పని చేస్తున్నాయి. ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఏదో ఒక లాబీలో ఉంటారన్నది బహిరంగ రహస్యం. అందుకే రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నా ఏదో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధాలకు కారకులు ఆయుధకంపెనీల యజమానులే. వారు నిర్దేశించిన మేరకే అమెరికా స్వదేశీ, విదేశీ విధానాలు ఉంటాయి. దశాబ్దాలుగా ఎలాంటి ఘర్షణలు లేని మన దేశం-చైనా మధ్య ఉద్రిక్తతలను సృష్టించి మన దేశానికి పెద్ద మొత్తంలో ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఎత్తుగడ ఇప్పటికే ఫలించింది. అదింకా కొనసాగుతోంది. గతంలో పాకిస్దాన్ను మనమీదకు ఉసిగొల్పిన అంశం తెలిసిందే. చైనా వారు అమెరికా, ఇతర దేశాల వద్ద ఆయుధాలు కొనాల్సినపని లేదు. వారే ఎగుమతులు చేసే స్ధితిలో ఉన్నారు.


అంతర్జాతీయ పోలీసు బాధ్యతను ఐరాస లేదా మరొక సంస్ధగానీ అమెరికాకు అప్పగించలేదు. తన ఆర్ధిక, మిలిటరీ శక్తితో ప్రపంచంలో ప్రజాస్వామ్యపరిరక్షణ, కమ్యూనిజవ్యాప్తి నిరోధం, ఉగ్రవాదంపై పోరు మరొకసాకుతో ఆధిపత్యకోసం చూస్తున్నది. అమెరికా కార్పొరేట్లకు యుద్దాలు ఎలా లాభాలు చేకూర్చుతున్నాయో చాలా మందికి అర్ధం కావటం లేదు. గతంలో సోవియట్‌ను బూచిగా చూపి ఆయుధాల అమ్మకాల కోసం ఉద్రిక్తతలను సృష్టిస్తే ఇప్పుడు చైనాను చూపి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకొనేందుకు చూస్తున్నారు. ఇతర దేశాలనే కాదు, అమెరికా రక్షణ బడ్జెట్‌నూ పెంచుతున్నారు. నౌకదళంలో ఇప్పుడున్న 300పెద్ద ఓడలను 350కి పెంచాలని ప్రతిపాదించారు. ఎఫ్‌35 విమానాల కొనుగోలు సంగతి చెప్పనవసరం లేదు. అణ్వాయుధాలను నవీకరించేందుకు 1.5లక్షల కోట్ల డాలర్లతో పధకాన్ని రూపొందించారు. ఇప్పుడున్న త్రివిధ దళాలకు అదనంగా అంతరిక్ష సేన ఏర్పాటుకు, దానికి శిక్షణ,ఆయుధాల పేరుతో పెద్ద ఎత్తున ఖర్చుపెట్టనున్నారు.ఇదంతా ప్రయివేటు కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు, ప్రపంచాధిపత్యం కోసమే అన్నది స్పష్టం.


నిజానికి అమెరికా రెండవ ప్రపంచయుద్ధం నుంచే కుట్రలు మొదలు పెట్టింది. చైనాలో కమ్యూనిస్టులు సాధిస్తున్న విజయాలు అమెరికా,బ్రిటన్‌లకు దడపుట్టించాయి. చైనా పాలకుడిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ను పటిష్టపరచాలని చూసి విఫలమయ్యాయి. పక్కనే ఉన్న మయన్మార్‌లో అధికారానికి వచ్చిన జాతీయవాది అంగసాన్‌ (అంగసాన్‌ సూకీ తండ్రి)తో మొత్తం మంత్రులను హతమార్చిన కుట్రలో బ్రిటన్‌ హస్తం ఉంది. రెండు కొరియాల విలీనాన్ని అడ్డుకొనేందుకు అమెరికా యుద్దానికి తలపడిన సంగతి తెలిసిందే. ఇండో చైనాలో వందేండ్ల ఫ్రెంచి పాలనకు కమ్యూనిస్టులు స్వస్తిపలికారు.1954లో హౌచిమిన్‌ సారధిగా కమ్యూనిస్టులు ఫ్రెంచి సేనలను ఓడించారు. రెండుగా చీల్చిన వియత్నాం విలీనానికి 1956ను గడువుగా నిర్ణయించారు. అంతకు ముందే తెరవెనుక ఉన్న అమెరికా నేరుగా రంగంలోకి వచ్చి దక్షిణ వియత్నాంను కేంద్రంగా చేసుకొన్నది. దక్షిణ వియత్నాంలోని మిలిటరీ, కమ్యూనిస్టు వ్యతిరేకులకు శిక్షణ, ఆయుధాలను సరపరా చేసి ఉత్తర వియత్నాంను దెబ్బతీసేందుకు చూసింది. వారివల్ల కాదని తేలటంతో 1964లో టోంకిన్‌ గల్ఫ్‌లో తన నౌకలపై ఉత్తర వియత్నాం దాడి చేసిందనే కట్టుకధను ముందుకు తెచ్చి నేరుగా దాడులకు దిగింది.1975 ఏప్రిల్‌ 29-30 తేదీలలో అక్కడి నుంచి అమెరికా సేనల్లో చివరి బృందం పారిపోవటంతో ఆ దురాక్రమణ యుద్దం ముగిసింది.


వియత్నాం కమ్యూనిస్టులు అమెరికాకు పెద్ద గుణపాఠం నేర్పారు. వియత్నాంపై దాడులకు అమెరికా 5,43,000 మంది సైనికులను పంపింది. దక్షిణ వియత్నాంలో ప్రజాస్వామికశక్తులకు మద్దతు పేరుతో ఈదారుణానికి పాల్పడింది. ఈ సైనికుల్లో 58,200 మంది దాడుల్లో, ఇతరత్రా మరో 32వేల మంది మరణించారు. గాయపడిన వారు 3.03,000 మంది ఉన్నట్లు అంచనా. వీరుగాక రెండున్నరలక్షల మంది వరకు దక్షిణ వియత్నాం సైనికులు మరణించారు. ఇది ఒక వైపే మరో వైపు అమెరికా, దక్షిణ వియత్నాం మిలిటరీని ఎదిరించేందుకు జరిగిన పోరులో 20లక్షల మంది సామాన్య పౌరులు మరణించారు. తొమ్మిదిన్నరలక్షల మంది వియత్నాం మిలిటరీ,దక్షిణ వియత్నాం గెరిల్లాలు ప్రాణాలను త్యాగం చేశారు, ఆరులక్షల మంది గాయపడ్డారు. ఇరవై ఒక్క సంవత్సరాలు అమెరికా జరిపిన దాడుల్లో ఒక్క అణ్వాయుధాలు తప్ప అన్ని రకాల మారణ, రసాయన ఆయుధాలను పెద్ద ఎత్తున ప్రయోగించిన దుర్మార్గానికి పాల్పడింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు సాగుకు పనికిరాకుండా కలుషితమయ్యాయి.


ఇరాన్‌ – ఇరాక్‌ దేశాల మధ్య ఉన్న వివాదాలను ఆసరా చేసుకొని అమెరికా వాటి మధ్యతంపులు పెట్టింది. రెండు దేశాలకూ ఒకరికి తెలియకుండా ఒకరికి ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంది. పరస్పర దాడులతో రెండు దేశాలూ బలహీనపడితే వాటి మీద పెత్తనం, రెండు చోట్లా ఉన్న చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవాలన్నది దాని ఆలోచన. ఏడు సంవత్సరాల పదకొండునెలల పాటు సాగిన ఆ యుద్ధంలో ఇరాన్‌ వైపున ఆరులక్షల మంది ఇరాక్‌ వైపున ఐదులక్షల మంది సైనికులు మరణించారని అంచనా. విజేతలు లేరు. కొరియా యుద్దంలో పదిహేనున్నరలక్షల మంది ఉత్తర కొరియన్లు, పదిలక్షల మంది దక్షిణ కొరియన్లు మరణించారు. పదిలక్షల మంది ఉత్తర కొరియా, రెండు లక్షల మంది దక్షిణ కొరియా సైనికులు మరణించారు. ఈ దుర్మార్గాలు, మానవ నష్టాలకు కారణం అమెరికా ఆధిపత్యకాంక్షే అన్నది స్పష్టం. ఇప్పుడు అమెరికా, నాటో కూటమి దేశాలు రష్యాకు ముప్పు తెచ్చేందుకు ఉక్రెయిన్ను పావుగా వాడుకుంటూ రెచ్చగొట్టి రష్యాను ఉసిగొల్పిదాడులకు కారణమయ్యాయి. ఉక్రెయిన్‌ పౌరులను, ఇతర దేశాల వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్న వాటి దుష్ట రాజకీయాన్ని విరమించాలని వత్తిడి తేవాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తటస్ధ దేశంగా ఉక్రెయిన్‌ – ఒప్పందానికి చేరువలో చర్చలు !

16 Wednesday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Russia- Ukraine peace plan, Russia-Ukraine tensions Impact on India, Ukraine war, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


రష్యా -ఉక్రెయిన్‌ పోరుకు స్వస్తి పలికేలా ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరినట్లు బుధవారం నాడు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. దీని మేరకు నాటోలో చేరాలనే ఆకాంక్షలకు స్వస్తి పలికినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించాలి.దాని సాయుధ దళాలను పరిమితం చేసుకోవాలి. దీనికి అంగీకరిస్తే రష్యా సైనిక చర్యనిలిపివేస్తుంది. దీనికి ముందు ఉక్రెయిన్‌ తటస్ధ దేశంగా ఉండాలని ప్రతిపాదించినట్లు వచ్చిన వార్తలకు అనుగుణంగానే ఈ పరిణామం ఉంది.అయితే సంభావ్యమైన ( సంభవించగల) ఒప్పందాల వివరాలను వెల్లడించటం తొందరపాటవుతుందని రష్యా ప్రతినిధి దిమిత్రి సెకోవ్‌ చెప్పాడు. మరోవైపున దాడులను నిలిపివేయాలని బుధవారం నాడు అంతర్జాతీయ న్యాయ స్ధానం రష్యాను కోరింది. ఇదిలా ఉండగా రష్యాకు లొంగిపోతున్నట్లు జెలెనెస్కీ ఒక ప్రకటన చేసినట్లు ఉక్రెయిన్‌ 24 అనే టీవీ ఛానల్‌ ప్రసారం చేసింది. వెంటనే జెలెనెస్కీ ఒక ప్రకటన చేస్తూ తానలాంటి ప్రకటన చేయ లేదని ఖండించాడు. తమ నెట్‌వర్క్‌ను హాక్‌ చేసి తప్పుడు వార్తను చొప్పించారని తరువాత ఆ ఛానల్‌ వివరణ ఇచ్చింది. రష్యా దాడులను తీవ్రతరం చేసిన నేపధ్యంలో అనేక కుహనా వార్తలు వస్తున్నాయి.


చర్చలు చర్చలే – దాడులు దాడులే – రెండునోళ్లతో మాట్లాడుతున్న జెలెనెస్కీ. రష్యా ప్రతిపాదనలు వాస్తవికంగా ఉన్నాయంటాడు ఒకనోటితో. మరోవైపు తమ తరఫున యుద్దం చేయాలని పశ్చిమ దేశాలకు వినతుల మీద వినతులు. ఎవరి ఎత్తుగడలు వారివే, 30లక్షల మంది నిర్వాసితులుగా మారినా, ఇంకా ఎందరు ఉక్రెయిన్‌ వదలిపోయినా దుష్ట రాజకీయాల నుంచి వెనక్కు తగ్గేదేలే అంటున్నారు పశ్చిమ దేశాల మానవతామూర్తులు.అగ్గిని మరింతగా ఎగదోసేందుకు పూనుకున్నారు. ప్రపంచ ఆర్ధిక రంగం అతలాకుతలం అవుతుందని ఐఎంఎఫ్‌ ఆందోళన. ఇదీ మార్చి 16 నాటికి ఉన్న పరిస్ధితి. వివాదం ఎప్పుడు సమసిపోతుందో తెలియదు. రక్తపోటు అదుపులోకి రాకపోతే పరిస్ధితి ఎలా ఉంటుందో ప్రపంచ చమురు మార్కెట్‌లో ధరలు ఎందుకు ఒక రోజు విపరీతంగా పైకి ఎగబాకుతున్నాయో,ఎందుకు మరోరోజు పడిపోతున్నాయో తెలీటం లేదు.మన వంటి చమురు దిగుమతి దేశాలకు నిదురపట్టటం లేదు.నవంబరు నాలుగు నుంచి స్ధంభింపచేసిన చమురు ధరల కళ్లెం విప్పితే ఏమౌతుందో లేకపోతే ఎంత బండపడుతుందో అన్న ఆందోళన కేంద్ర ప్రభుత్వానికి పట్టుకుంది. ఉక్రెయిన్‌ తటస్ధ దేశంగా ఉండేట్లు ఒప్పందం కుదరవచ్చని వార్తలు, పశ్చిమదేశాలు దాన్ని పడనిస్తాయా అన్న సందేహాలు సరేసరి !


ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల తీరు రాజీకుదిరేందుకు కొంత ఆశాభావాన్ని కలిగించాయని రష్యా విదేశాంగ మంత్రి లావరోవ్‌ చెప్పాడు.ఆస్ట్రియా, స్వీడన్‌ మాదిరి తటస్ధ దేశంగా ఉక్రెయిన్‌ ఉండవచ్చని, మిలిటరీని కూడా కలిగి ఉండవచ్చని రష్యా ప్రతిపాదించింది. అదే జరిగితే ఆ ప్రాంత దేశాలకు లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. రష్యా ప్రతిపాదించినట్లుగాక తమకు అంతర్జాతీశక్తుల హామీ కావాలని ఉక్రెయిన్‌ చెప్పింది. తాము నేరుగా రష్యాతో పోరులో ఉన్నాం గనుక తమ పద్దతిలోనే పరిష్కారం ఉండాలని అంటోంది. బాధ్యత కలిగిన దేశాలతో కూడిన కొత్త కూటమి శాంతికోసం పని చేయాలని జెలెనెస్కీ బుధవారం నాడు అమెరికా పార్లమెంట్‌ను ఉద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో కోరాడు. ఐరోపా దేశాలు చాలా కాలంగా రష్యా ముప్పు గురించి పట్టించుకోలేదన్నాడు. మరిన్ని ఆంక్షలను విధించాలని కోరాడు. మేమూ మీలాంటి వారిమే, మా ప్రాణాలను రక్షించాలని కోరటం చాలా ఇబ్బందిగా ఉందన్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో పెరల్‌ హార్బర్‌ మీద దాడి, 2011లో న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడిని ఉటంకిస్తూ తాము మూడువారాలుగా అలాంటి దాడులను అనుభవిస్తున్నాం అన్నాడు. అంతకు ముందు రోజు కెనడా పార్లమెంటునుద్దేశించి కూడా జెలెనెస్కీ మాట్లాడాడు.


పోలాండ్‌, చెక్‌, స్లోవేనియా దేశాల ప్రధానులు కీవ్‌ను సందర్శించి జెలెనెస్కీతో చర్చలు జరిపి మద్దతు ప్రకటించి వెళ్లారు. ఇలాగే ఇతర దేశాల నేతలు కూడా వచ్చి రష్యా మీద వత్తిడి తేవాలని జెలెనెస్కీ కోరాడు. ప్రస్తుత దశలో తమ అధ్యక్షుడు మక్రాన్‌ కీవ్‌ పర్యటన జరిపే ఆలోచనేదీ లేదని ఫ్రెంచి ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించాడు.ప్రచారదాడిలో భాగంగా తూర్పు ఐరోపాలో మిలిటరీ సన్నద్దంగా ఉండాలని నాటో కమాండర్లను కోరినట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌ తరువాత ఇతర దేశాల మీద కూడా రష్యా దాడులు జరపనుందని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగిన సన్నద్దత గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఇబ్బంది కనుక ఇలాంటి ప్రచార విన్యాసాలు జరుపుతున్నట్లు చెప్పవచ్చు.


రష్యా గనుక అడ్డం తిరిగి విదేశాల నుంచి తీసుకున్న అప్పులను మేము ఇచ్చేది లేదని ప్రకటిస్తే ఏమిటన్న బెంగ ఇప్పుడు రుణాలు ఇచ్చిన వారికి పట్టుకుంది. బుధవారం నాటికి వడ్డీ కింద 11.7కోట్ల డాలర్లను చెల్లించాల్సి ఉంది. తమపై విధించిన ఆంక్షల కారణంగా డాలర్లలో కాకుండా తమ కరెన్సీ రూబుళ్లలో చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని పుతిన్‌ ప్రకటించాడు. ప్రభుత్వమే అప్పులను చెల్లించేది లేదని ప్రకటిస్తే అక్కడి కంపెనీలు కూడా అదే బాటపడతాయనే భయం పట్టుకుంది. ప్రస్తుతం పుతిన్‌ సర్కార్‌ జారీ చేసిన బాండ్లను మార్కెట్లో అమ్ముకోవచ్చు గానీ మన కరెన్సీలో చెప్పాలంటే రూపాయికి ఇరవై పైసలు కూడా అప్పులిచ్చిన వారికి వచ్చే అవకాశాలు లేవు. అందువలన ఆంక్షలు ఎత్తివేసి తమను ఆదుకోవాలని రుణాలిచ్చిన వారు పశ్చిమదేశాల మీద వత్తిడి తేవచ్చు. గతేడాది వెల్లడించిన సమాచారం ప్రకారం రష్యా అంతర్గత రుణాలు జిడిపిలో కేవలం 13శాతమే ఉన్నాయి. విదేశీరుణం 150 బిలియన్‌ డాలర్లు కాగా దానిలో ప్రభుత్వం తీసుకున్నది కేవలం 45 బి.డాలర్లే, మిగతాదంతా కంపెనీలు తీసుకున్నది. రష్యా వద్ద 630బి.డాలర్ల నిల్వలున్నాయి.కనుక చెల్లింపులకు ఇబ్బంది లేదు. ఆంక్షలే అడ్డుపడుతున్నాయి.


రష్యాకు వర్తింప చేస్తున్న అత్యంత సానుకూల హౌదా రాయితీని ఎత్తివేస్తున్నట్లు జపాన్‌ ప్రకటించింది.మరోవైపు మరిన్ని ఆంక్షలను అమలు జరిపేందుకు జి7 దేశాలు సమావేశం కానున్నాయని వార్తలు వచ్చాయి. తాము నాటోలో చేరటం లేదనే అంశాన్ని గుర్తించండి మహా ప్రభో అని జెలెనెస్కీ నాటోదేశాలకు స్పష్టంచేశాడు. బ్రిటన్‌ ప్రతినిధి వర్గంతో మాట్లాడుతూ ” ఉక్రెయిన్‌ నాటో సభ్యురాలు కాదు. దానికోసం ద్వారాలు తెరిచి ఉన్నట్లు చాలా సంవత్సరాలుగా మేం వింటున్నాం, ఇదే సమయంలో మేం చేరకూడదని కూడా విన్నాం. ఇది ఒక వాస్తవం దీన్ని గుర్తించాల్సి ఉంది. మా జనం దీన్ని అర్ధం చేసుకోవటం ప్రారంభించారు, స్వశక్తితో నిలబడాలనుకుంటున్నారు, అలాగే మాకు సాయం చేస్తున్నవారు కూడా గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అన్నాడు.నాటోలో ఉక్రెయిన్‌ చేరకూడదని, తమ భద్రతకు తలపెడుతున్న ముప్పును కూడా గమనించాలని రష్యా ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న అంశాన్ని పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిణామాలన్నది తెలిసిందే.


ఉక్రెయిన్‌పై రష్యాదాడి కారణంగా దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధలో మౌలిక మార్పులు వస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) పేర్కొన్నది. పౌరుల ఇబ్బందులు, నిర్వాసితులు కావటంతో పాటు ఆహార, ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతుందని, జనాల కొనుగోలుశక్తి పడిపోతుందని, ప్రపంచ వాణిజ్య, సరఫరా వ్యవస్ధలు దెబ్బతింటాయని కూడా చెప్పింది. మదుపుదార్లలో అనిశ్చిత పరిస్ధితి ఏర్పడటంతో పాటు ఆస్తుల విలువలు పడిపోతాయని, వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని కూడా చెప్పింది. ఉక్రెయిన్‌ గగనతలంపై ఆంక్షలు విధించకుండానే నాటో కూటమి వేరే విధంగా ఆయుధాలతో ఎంతో తోడ్పడవచ్చని నాటోలో అమెరికా మాజీ రాయబారి కర్ట్‌వాల్కర్‌ చెప్పాడు. నల్లసముద్రం మీద నుంచి రష్యా వదులుతున్న క్షిపణులను, టాంకులను కూల్చివేసేందుకు అవసరమైన సాయం అందించవచ్చన్నాడు.


యుద్దం ముగిసే సూచనలు కనిపించకపోవటంతో ఐరోపా దేశాల్లో అనేక చోట్ల జనం ఆహార పదార్దాలను పెద్ద ఎత్తున కొనుగోలు నిల్వచేసుకుంటున్నారు. స్లీపింగ్‌ బాగ్స్‌, పాలపొడి, డబ్బాల్లో నిల్వ ఉండే ఆహారం, బాటరీలు, టార్చిలైట్లు, ప్లాస్టిక్‌ డబ్బాల వంటివి ఒక్కసారిగా ఆరురెట్లమేరకు అమ్మకాలు పెరిగాయి. రేడియోల అమ్మకాలు కూడా ఇరవైశాతం పెరిగాయి. వీటిలో నిర్వాసితులుగా వచ్చిన వారు కొనుగోలు చేసినవి కూడా ఉన్నాయి. రష్యా మీద విధించిన ఆంక్షల కారణంగా తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు 26 బిలియన్‌ యురోలు అవసరమౌతాయని ఫ్రెంచి ఆర్ధిక మంత్రి ప్రకటించాడు. రష్యా, బెలారస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న పొటాష్‌ ఎరువులకు మన దేశంలో కొరత ఏర్పడే అవకాశం ఉందని వార్తలు. రష్యా నుంచి గోధుమల ఎగుమతులకు ఆటంకం ఏర్పడటంతో మన దేశ గోధుమల ఎగుమతికి అవకాశాలున్నట్లు రాయిటర్‌ పేర్కొన్నది.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d