• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Venezuela

యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

03 Wednesday Dec 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Nicolás Maduro Moros, US military action on Venezuela, Venezuela

ఎం కోటేశ్వరరావు

మేక పిల్లను మింగేయాలనుకున్న తోడేలు కథ తెలిసిందే ! ప్రపంచంలో ఏదో ఒక మూల ఘర్షణ లేదా యుద్ధం లేకుండా అమెరికాకు నిదురపట్టదు. అందుకే మాదక ద్రవ్యాల రవాణా సాకుతో వెనెజులాపై ఏ క్షణమైనా దాడి చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పెంటగన్‌ పూర్తి చేసింది. మిలిటరీ ద్వారా మదురోను తొలగించేందుకు పూనుకోవద్దని, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పోప్‌ లియో మంగళవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌కు హితవు చెప్పాడు. అక్కడ మార్పులు కావాలని అనుకుంటే ఆర్థిక ఆంక్షల ద్వారా చేయవచ్చని సలహా కూడా ఇచ్చాడు. ప్రపంచంలో అతి పెద్దది, అధునాతనమైనదిగా పరిగణిస్తున్న యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌ విమానవాహక యుద్ధ నౌకతో సహా అనేక ఇతర నౌకలు, వేలాది మంది సైనికులను కరీబియన్‌ సముద్ర ప్రాంతానికి తరలించింది.దేశం నుంచి వెళ్లిపోవాలని డోనాల్డ్‌ ట్రంప్‌ వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను బెదిరించిన ట్రంప్‌ శుక్రవారం నాటితో గడువు ముగిసిందంటూ వెనెజులా గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించాడు. ఆ ప్రకటన చేసినప్పటికీ సోమ, మంగళవారాల్లో అమెరికా నుంచి వెనెజులా పౌరులను అనేక మందిని విమానాల ద్వారా తరలించారు, వారానికి రెండు రోజుల్లో తరలించవచ్చని గతంలో మదురో సర్కార్‌ అనుమతించింది. అద్దె విమానాలను నడిపే సంస్థ తమకు అనుమతులు ఇవ్వాలని సోమవారం నాడు దరఖాస్తు చేసింది. గత కొద్ది నెలలుగా వెనెజులా నుంచి మాదక ద్రవ్యాలతో నిండిన పడవలు వస్తున్నాయంటూ వాటిపై దాడులు చేసి అనేక మందిని అమెరికా హత్య చేసింది. అమెరికా దుర్మార్గాన్ని వదలిపెట్టి వెనెజులా మిలిటరీ సామర్ధ్యం ఎంత, దాడులను తట్టుకోగలదా లేదా అంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే కథనాలను మీడియా ముందుకు తెస్తున్నది. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ డాట్‌కామ్‌ 2025 మిలిటరీ సూచిక ప్రకారం అమెరికా మొదటి స్థానంలో ఉండగా వెనెజులా 50వదిగా ఉంది. అయినప్పటికీ తమ దేశాన్ని కాపాడు కొనేందుకు చివరి రక్తపు బొట్టువరకు చిందిస్తామని మదురో గతంలో ప్రకటించాడు. ఏ దేశానికైనా అంతకు మించి మరో మార్గం ఉండదు.సోమవారం నాడు విదేశాంగ, రక్షణ మంత్రులు, ఉన్నతాధికారులతో ట్రంప్‌ సమావేశమైన దాడి సన్నాహాల గురించి చర్చించినట్లు వార్తలు.అమెరికా అధికార పీఠంపై ఎవరు ఉన్నప్పటికీ వెనెజులాలో వామపక్షల హ్యూగో ఛావెజ్‌ రాజకీయ వారసుడిగా వచ్చిన మదురో వరకు వారి కుట్రలు ఆపటం లేదు. అక్కడి ప్రతిపక్ష నేతలకు మద్దతు ఇచ్చి కుట్రలకు తెరలేపిన సంగతి తెలిసిందే.

తప్పుడు ప్రచారం, అసత్యాలతో ఇతర దేశాలపై దాడులు చేయటం అమెరికాకు కొత్తేమీ కాదు. తనకు లొంగని, నచ్చని దేశాధినేతలను పదవుల నుంచి తొలగించేందుకు చేసిన కుట్రల గురించి తెలిసిందే. వాటి వలన ప్రయోజనం లేదని చరిత్ర చెబుతున్నా పదే పదే ప్రయత్నాలు చేస్తున్నది.వలసవాదానికి వ్యతిరేకంగా లాటిన్‌ అమెరికా గతంలో పోరాడింది. దాన్ని తన పెరటితోటగా మార్చుకొనేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.ఈ ప్రాంతంలో సామ్రాజ్యవాదుల దుర్మార్గాలు ఇన్నిన్నికాదు. నవంబరు 29న లాటిన్‌ అమెరికాలో జోంగ్‌ మారణ కాండకు 244 సంవత్సరాలు నిండాయి.లాటిన్‌ అమెరికాలోని చెరకు తోటల్లో పని చేసేందుకు జోంగ్‌ అనే పడవలో 1781లో ఆఫ్రికా నుంచి బానిసలను తరలించారు. ఒక్కో బానిసను 36 పౌండ్లకు విక్రయించారు. పడవ సామర్ధ్యానికి రెండు రెట్లు అంటే 442మందిని ఎక్కించారు.ఘనా నుంచి జమైకాకు ప్రయాణించే ఆ పడవ నావికులు చేసిన తప్పిదాల వలన ఆలస్యమై మంచినీరు చాలకపోవటం, ఇతరత్రా కారణాలతో అనేక మంది మరణించారు. ఓడ యజమానులు ఒక్కొక్క బానిస మీద 30 పౌండ్ల చొప్పున బీమా సొమ్ము పొందే అవకాశం ఉంది. దుర్మార్గం ఏమంటే అందుకోసం నీరసించిపోయిన వారిలో 54 మంది మహిళలు, పిల్లలను మరణించినవారితో పాటు నవంబరు 29న కరీబియన్‌ సముద్రంలోకి నెట్టి చంపివేశారు.ఈ ఉదంతం సామ్రాజ్యవాదంపై ప్రతిఘటన, బానిసత్వ రద్దు చట్టాలకు నాంది పలికింది. దీన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే బానిసవ్యాపారులు బీమా సొమ్ముకోసం బతికి ఉన్నవారిని సముద్రంలోకి తోసివేసినట్లే వెనెజులాపై దాడికి అమాయకులైన వారు ప్రయాణిస్తున్న పడవలపై దాడులు చేసి వారిని చంపివేసిన అమెరికా మిలిటరీ దాన్ని మాదకద్రవ్యాల నిరోధానికి తీసుకున్న చర్యగా ప్రపంచాన్ని నమ్మించేందుకు చూసింది. అసలు అమెరికాకు అలాంటి అధికారం ఎవరిచ్చారు, అదేమీ అమెరికా గడ్డకాదు, సముద్రజలాలు వారివి కాదు. తాము పేల్చివేసిన ప్రతిపడవతో 25వేల మంది అమెరికన్ల ప్రాణాలను రక్షించామని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకున్నాడు.ప్రతి ఏటా వేలాది మందిని అమెరికాలో తుపాకులతో కాల్చిచంపుతుంటే, మాదక ద్రవ్యాలతో నింపుతుంటే వారిని నిరోధించటం చేతగాని దద్దమ్మలు ఎక్కడో మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ యుద్ధ నౌకలు, మిలిటరీని తరలిస్తుంటే నమ్మటానికి జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. ఛావెజ్‌ నాయకత్వంలో వెనెజులాలో ప్రారంభమైన వామపక్ష పాలనకు 26 సంవత్సరాలు నిండాయి. ఆ ప్రాంతంలో అమెరికాకు కొరకరాని కొయ్యగా తయారైంది.అసలు దుగ్ద అది, అందుకే మదురోను తొలగించి తన తొత్తులను అక్కడ అధికారంలో కూర్చోపెట్టేందుకే ఈ దుర్మార్గానికి ట్రంప్‌ తెరతీశాడు.

అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా వెనెజులా ప్రస్తుతం క్యూబా, చైనా తదితర దేశాలకు చమురు ఎగుమతులు చేస్తున్నది. ప్రపంచంలో 303 బిలియన్‌ పీపాల చమురు నిల్వలతో వెనెజులా మొదటి దేశంగా ఉంది.వాటిని చేజిక్కించుకొని అమెరికా కంపెనీలకు అప్పగించాలని అక్కడి రిపబ్లికన్లు, డెమోక్రాట్లూ ప్రయత్నిస్తున్నారు.దానికి గాను సాకులు చెబుతున్నారు.2007లో ఛావెజ్‌ ప్రభుత్వం అమెరికా కంపెనీల చేతుల్లో ఉన్న చమురు సంస్థలను జాతీయం చేసినప్పటి నుంచి కుట్రలు మొదలయ్యాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సరఫరాలో వెనెజులా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిరంతరం ప్రచారం చేస్తున్నారు. మాదకద్రవ్యాలు, నేరాలకు సంబంధించిన ఐరాస సంస్థ, చివరికి అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీ కూడా వాటిని తిరస్కరించింది. వార్షిక నివేదికల్లో మాదకద్రవ్యాలను వెనెజులా ఉత్పత్తి చేయటం లేదని, సరఫరా గురించి ఆధారాలు లేవని పేర్కొన్నాయి.అమెరికా చేరుతున్న కొకెయిన్‌లో 90శాతం పసిఫిక్‌ సముద్రమార్గాల ద్వారా దక్షిణ అమెరికా మిత్రదేశాల నుంచి నుంచి చేరుతున్నదని, ప్రమాదకరమైన ఫెంటానిల్‌ అమెరికా దక్షిణ సరిహద్దుల నుంచి ఎక్కువగా అమెరికా పౌరులే స్మగ్లింగ్‌ చేస్తున్నారని అనేక నివేదికలు ఉన్నాయి.వాటిని విస్మరించి మదురో మాదక ద్రవ్యాల సరఫరా మాఫియా నాయకుడని ఆరోపించటం తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. అమెరికా చెబుతున్న మాదకద్రవ్యాల ముఠా జాడ అక్కడ ఉందని ఏ అంతర్జాతీయ సంస్థా చెప్పలేదు. మాదకద్రవ్యాల రవాణా మీద పోరాడుతున్నట్లు అమెరికా చెప్పుకోవటం హాస్యాస్పదం, బూటకం. లాటిన్‌ అమెరికాలోని హొండురాస్‌ మాజీ అధ్యక్షుడు జువాన్‌ ఓర్లాండో హెర్నాండెజ్‌ మాదక ద్రవ్యాల రవాణా కేసులో 2024లో అమెరికా కోర్టు 45 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాంటి నేరగాడికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు.

యుద్ధాల ప్రారంభానికి సామ్రాజ్యవాదులు, యుద్దోన్మాదులు అబద్దాలు చెప్పటం కొత్త కాదు.నిజానికి అది పురాతన ఎత్తుగడ. యుద్దంలో ముందుగా హతమయ్యేది నిజం.మొదటి ప్రపంచ యుద్దంలో న్యూయార్క్‌ నుంచి బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ బయలుదేరిన ఆర్‌ఎంఎస్‌ లుస్టియానా అనే నౌకను ఐర్లండు వద్ద జర్మన్లు పేల్చివేశారని ప్రచారం చేశారు.జున్ను, వెన్న రవాణా పేరుతో పేలుడు పదార్దాలను కూడా దానిలో రవాణా చేస్తుండగా అవి పేలటంతో 139 మంది అమెరికన్లలో 128 మంది మరణించారు. ఇది వాస్తవం కాగా జర్మనీ మీద నెపం మోపి అమెరికన్లను యుద్దానికి సిద్ధంచేసేందుకు తప్పుడు ప్రచారం చేశారు. ఇదే ఎత్తుగడతో రెండవ ప్రపంచ యుద్దంలో చేరేందుకు కుట్ర చేశారు.దాన్ని అర్ధంచేసుకోని జపాన్‌ 1941 డిసెంబరులో పెరల్‌హార్బర్‌పై చేసినదాడిలో 2,400 మంది అమెరికన్‌ మిలిటరీ, పౌరులు మరణించారు. ఆ దాడి గురించి నాటి అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌, అధికార యంత్రాంగానికి ముందే తెలుసునని, వారం ముందే దాడి జరగనున్నదని రూజ్‌వెల్ట్‌ తనకు చెప్పినట్లు నాటి అమెరికా యుద్ధ మంత్రి హెన్రీ టిమ్సన్‌ తన డైరీలో రాశాడు. ప్రభుత్వానికి అందిన హెచ్చరికలను కూడా కావాలనే పక్కన పెట్టారని తరువాత వెల్లడైంది.ఈ దాడిని ఆసరా చేసుకొని జపాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించటం, అణుబాంబులను వినియోగించటం తెలిసిందే. దీనికి పది సంవత్సరాల ముందు చైనాలోని మంచూరియాను ఆక్రమించుకొనేందుకు జపాన్‌ సామ్రాజ్యవాదులు కూడా ఇదే ఎత్తుగడను అనుసరించారు. తమ నిర్వహణలోని రైల్వే ట్రాక్‌ను తామే పేల్చుకొని చైనా మీద నెపం మోపి దురాక్రమణకు పూనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఉత్తర కొరియా దురాక్రమణ నుంచి దక్షిణ కొరియాను రక్షించేపేరుతో కొరియా యుద్దం జరిగింది. అది కూడా తప్పుడు ప్రచారమే.అసలు అలాంటి ప్రయత్నమే జరగలేదు. ఉత్తర కొరియా కమ్యూనిస్టుల ఆధీనంలో ఉండటమే అసలు కారణం. ఐరాస పేరుతో అమెరికా జరిపిన దాడి, ప్రతిఘటనలో 30లక్షల మంది పౌరులు మరణించారు.

వియత్నాం దురాక్రమణ కూడా అసత్యాలతోనే ప్రారంభమైంది. టోంకిన్‌ గల్ఫ్‌(దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం తీరంలోని జలసంధి) లో తమ నౌకపై ఉత్తర వియత్నాం 1964 ఆగస్టులో రెండుసార్లు దాడి చేసిందని ఆరోపిస్తూ అమెరికా దాడికి దిగింది. దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టు వ్యతిరేకపాలకులకు మద్దతుగా వచ్చిన అమెరికా నౌక ముందుగా చేసిన దాడిని ఉత్తర వియత్నాం ప్రతిఘటించింది. అసలు రెండవదాడి ఉదంతమే జరగలేదని తరువాత వెల్లడైంది. 1967లో అమెరికా మద్దతుతో ఈజిప్టు,జోర్డాన్‌, సిరియాపై ఇజ్రాయెల్‌ జరిపినదాడి కూడా అబద్దాలతోనే జరిగింది.ఈజిప్టు తొలుత తమపై దాడి చేసినట్లు దానికి ప్రతిదాడికి దిగినట్లు ఆరోపించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో ఈజిప్టు ఇతర అరబ్బుదేశాలు తమపై దాడికి సన్నద్దం అవుతుండటంతో ఆత్మరక్షణ కోసం దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ సమర్ధించుకుంది. అమెరికాను ప్రత్యక్షంగా రంగంలోకి దించేందుకు పధకం ప్రకారం ఈజిప్టు సమీపంలో ఉన్న అమెరికా నౌక యుఎస్‌ఎస్‌ లిబర్టీపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. నెపాన్ని ఈజిప్టుమీద నెట్టేందుకు చూసింది.ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని తరువాత వెల్లడైంది.1990దశకంలో జరిగిన గల్ఫ్‌దాడులను కూడా అమెరికా అబద్దాలతోనే మొదలు పెట్టింది.ఇరాకీలు కువాయిట్‌పై దాడి చేసినపుడు ఆసుపత్రిలో ఉన్న పిల్లలను చంపివేశారని కాకమ్మ కథలను అమెరికా చెప్పించింది. తరువాత 2003లో ఇరాక్‌ అధినేత సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి దాడి చేయటమేగాక సద్దామ్‌ను ఉరితీసిన సంగతి తెలిసిందే. తరువాత అలాంటి ఆయుధాలేమీ లేవని అమెరికన్లే అంగీకరించారు. సిఐఏ చెప్పిన కట్టుకథలను అమెరికాతో సహా యావత్‌ ప్రపంచ మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. లిబియాలో మానవహక్కులకు భంగం కలిగిందని, వాటిని పునరుద్దరించేపేరుతో జోక్యం చేసుకోవటమే గాక అధినేత గడాఫీని అంతం చేసేందుకు నాటో దళాలను దించిన సంగతి తెలిసిందే.గడాఫీ వ్యతిరేక తిరుగుబాటుదార్ల పేర్లతో నాటకమాడి 2011లో గడాఫీని హత్య చేశారు.

అనేక దేశాలలో పాలకులు, పార్టీలను మార్చి తనకు అనుకూలశక్తులను గద్దెల మీద కూర్చోపెట్టేందుకు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా చేసిన యత్నాలన్నీ విఫలం కావటమేగాక చేతులు కాల్చుకున్నది.నియంతలు, పచ్చిమితవాదులకు ఆశ్రయమిచ్చి రక్తపాతానికి కారకురాలైంది.అయినా సరే ఎప్పటికాలిట్టిట్టే అన్నట్లుగా అమెరికాలో ఏ పార్టీ అధికారానికి వచ్చినా అదే వైఖరి.ఇప్పుడు వెనెజులాలో కూడా అదే జరుగుతోంది.అధ్యక్షుడు నికోలస్‌ మదురో దేశం విడిచిపోవాలని ట్రంప్‌ బెదిరించాడు. ఒక విమానవాహక యుద్ధ నౌక, పది ఇతర మిలిటరీ నౌకలు, పదిహేనువేల మంది మిలిటరీ, వందలాది యుద్ధ విమానాలతో వెనెజులాను చుట్టుముట్టారు. మదురో కూడా గతకొద్ది నెలలుగా తనకున్న మిలిటరీ, గెరిల్లా దళాలను సన్నద్దం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ఏం జరగనుందో అని యావత్‌ ప్రపంచం ఆందోళనతో చూస్తున్నది.నేడు వెనెజులా పతనమైతే రేపు ఏ దేశం మీదనైనా ఏదో ఒకసాకుతో అమెరికా దాడికి దిగితే పరిస్థితి ఏమిటో ప్రతివారూ ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాజా నరమేథం ఆగింది, ప్రజాశత్రువుకు శాంతి బహుమతి ! ఐఎంఎఫ్‌ విధానాలకు లాటిన్‌ అమెరికాలో ప్రతిఘటన !!

15 Wednesday Oct 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Gaza ceasefire deal, Israel genocide, Latin america left, Netanyahu, Nobel peace prize, Peru Protests, Venezuela

ఎం కోటేశ్వరరావు

అమెరికా ముందుకు తెచ్చిన 20 అంశాల శాంతి ప్రతిపాదన ఒప్పందంపై సోమవారం నాడు కైరో(ఈజిప్టు)లో అనేక మంది దేశాధినేతల సమక్షంలో సంతకాలు జరిగాయి. హమస్‌ వద్ద బందీలుగా ఉన్న 20మంది, ఇజ్రాయెల్‌ జైళ్లలో నిర్బంధంలో ఉన్న రెండువేల మంది పాలస్తీనియన్ల విడుదల జరిగింది. బందీలుగా ఉండి మరణించిన 28 మంది మంది భౌతిక కాయాలను కూడా అప్పగించేందుకు హమస్‌ అంగీకారం తెలిపింది. గాజాలో సాగిస్తున్న మారణకాండకు ప్రస్తుతానికి తెరపడింది.ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే మరోసారి ఇజ్రాయెల్‌ అలాంటి దుర్మార్గానికి పాల్పడనే హామీ ఏమీ లేదు. పాలస్తీనియన్లు ఊపిరి పీల్చుకొనేందుకు అవకాశం ఇచ్చే ఏ చర్యనైనా ఆహ్వానించాల్సిందే. అసలైన సమస్య పాలస్తీనా గుర్తింపు, ఐరాస తీర్మానం ప్రకారం దానికి కేటాయించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగటం మీద ఆధారపడి ఉంది. గతంలో కుదిరిన ఒప్పందాలేవీ కూడా ఈ అంశంపై ఎలాంటి పరిష్కారాన్ని చూపలేదు. ఏడాదికేడాది ఇజ్రాయెల్‌ ఆక్రమణలు, నివాసాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనాభా స్వభావాన్ని మార్చేందుకు యూదులందరినీ తీసుకువచ్చి ఆ ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ఒప్పందం మొదటి దశగా పేర్కొన్నదాని ప్రకారం బందీలు-ఖైదీల మార్పిడికి మాత్రమే పరిమితం.

సోమవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌ కైరో వెళ్లే ముందు జెరూసలెంలో ఉన్న ఇజ్రాయెల్‌ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించాడు.నూతన మధ్య ప్రాచ్యానికి చారిత్రాత్మక ఉషోదయం అని ఒప్పందాన్ని వర్ణించాడు. ఆ సందర్భంగా ఇద్దరు వామపక్ష వాదులైన ఎంపీలు పాలస్తీనా పట్ల అమెరికా వైఖరికి నిరసన తెలిపారు.అమెన్‌ ఒడే, ఓఫర్‌ కాసిఫ్‌ అనే ఎంపీలను భద్రతా సిబ్బంది బయటకు తీసుకువెళ్లారు. యూదు దురహంకారం, అరబ్బులను రెండోతరగతి పౌరులుగా చూసే వివక్ష వాస్తవం. అయితే మొత్తం యూదు సామాజికతరగతికి దీన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు.వారిలో కూడా పురోగామి,ప్రజాతంత్ర వాదులు ఉన్నారు గనుకనే అనేక మంది గాజాలో జరుపుతున్న మారణకాండను వ్యతిరేకించారు.దానికి సారధ్యం వహించిన నెతన్యాహు చర్యలకు నిరసన తెలిపారు.అయితే వాటికి ఉన్న పరిమితులు, మీడియా పూర్తిగా అలాంటి వార్తలను పక్కన పెట్టిన కారణంగా బయటి ప్రపంచానికి వివరాలు పూర్తిగా తెలియవు. ట్రంప్‌కు నిరసన తెలిపిన ఇద్దరు ఎంపీలలో ఒకరైన ఒడే సామాజిక మాధ్యమంలో తరువాత పెట్టిన పోస్టులో తామెందుకు ఆ చర్యకు పాల్పడిందీ తెలిపాడు. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించాలని యావత్‌ ప్రపంచ సమాజం అంగీకరించినందున ఆ పని ఎందుకు చేయరన్నదే తమ ప్రశ్న అని ఆ మాత్రానికే తమను పార్లమెంటునుంచి బయటకు గెంటారని పేర్కొన్నాడు.మరో ఎంపీ కాసిఫ్‌ ఒక ప్రకటన చేస్తూ ట్రంప్‌ చర్యలను విమర్శించాడు, పాలస్తీనా, ఇజ్రాయెల్‌ గుర్తింపు పరిష్కారాన్ని అమలు జరపాలని డిమాండ్‌ చేశాడు. అమెరికా మిత్రదేశాలుగా ఉన్న కెనడా, కొన్ని ఐరోపా దేశాలు ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తించినప్పటికీ అమెరికా ముందుకు రావటం లేదు. ఇజ్రాయెల్‌ అసలు ఉనికినే ప్రశ్నిస్తున్నది. ఐరాస అచేతనంగా ఉండిపోయింది. భద్రతామండలిలో ఎవరైనా కార్యాచరణకు తీర్మానం పెడితే వీటో హక్కుతో అమెరికా సైంధవుడిలా అడ్డుపడుతున్నది.మారణకాండనే ఆపేందుకు ముందుకు రాని వాషింగ్టన్‌ తన రాజకీయ, మిలిటరీ, ఆర్థిక అజెండాను పక్కకు పెట్టి పాలస్తీనాను గుర్తిస్తుందా ?

వివిధ రంగాలలో ప్రజ్ఞ కనపరచిన వారికి ఇచ్చే నోబెల్‌ బహుమతుల గురించి ఇంతవరకు ఎలాంటి వివాదమూ లేదుగానీ శాంతి బహుమతికి ఎంపికలు కొన్ని అపహాస్యానికి గురౌతున్నాయి. తాజాగా వెనెజులా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మరియా కోరినా మచోడోకు శాంతి బహుమతి అలాంటిదే. అక్కడి వామపక్ష నికోలస్‌ మదురో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చివరికి అమెరికా మిలిటరీ కూడా జోక్యం చేసుకోవాలని, బాంబులు వేయాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును కోరిన ఆమెను శాంతిదూతగా పరిగణించటం, తనకు వచ్చిన బహుమతిని తనకు నిర్ణయాత్మక మద్దతు ఇచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించటాన్ని చూస్తే నోబెల్‌ కమిటీ ఎవరి కనుసన్నలలో పని చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. గత రెండున్నర దశాబ్దాలుగా ఆమె తీరుతెన్నులన్నీ వెనెజులాలో అశాంతిని రెచ్చగొట్టేందుకు అమెరికాతో చేతులు కలిపి చేసిన నిర్వాకాలు తప్ప శాంతి చిహ్నాలే లేవు. అసలా బహుమతి తనకే ఇవ్వాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. మదురోను అరెస్టు చేసేందుకు అవసరమైన సమాచారమిచ్చిన వారికి ఐదు కోట్ల డాలర్ల బహుమతి ఇస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెనెజులాను మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రంగా మార్చారంటూ వెనెజులా నుంచి వచ్చిన రెండు బోట్లమీద కాల్పులు జరిపి వాటిలో ఉన్నవారిని హత్య చేసి మాదకద్రవ్య సరఫరాదారులుగా ప్రచారం చేయటమే కాదు, అవసరమైతే సైనిక చర్యకు దిగేందుకు మిలిటరీని మోహరించిన సంగతి తెలిసిందే. మరియా కోరినా నిర్వాకాలను చూస్తే 2002లో హ్యూగో ఛావెజ్‌కు వ్యతిరేకంగా జరిగిన విఫల కుట్రలో ఆమె పాత్రధారి.కేవలం 47 గంటలు మాత్రమే అధికారంలో ఉన్న తిరుగుబాటుదార్లు రాజ్యాంగాన్ని , పతి ప్రజా సంస్థను రద్దు చేశారు. వెనెజులాను విముక్తి చేసేందుకు మిలిటరీ జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరింది. కరీబియన్‌ సముద్ర ప్రాంతంలో మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో దిగిన అమెరికా నౌకాదళానికి ఆమె జేజేలు పలికింది. వెనెజులా ఎన్నికల ఫలితాన్ని గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన ఘనురాలామె. జెరూసలెంలో మూసివేసిన వెనెజులా రాయబార కార్యాలయాన్ని తెరవాలని కోరింది. వెనెజులా చమురు, నీరు, మౌలిక సదుపాయాలవంటి అన్నింటినీ ప్రవేటింకరించాలని కోరుతున్న శక్తుల ప్రతినిధిగా పని చేస్తున్నది.ఆమె శాంతి లేదా పురోగతికి ప్రతీక కాదని, ఫాసిజం, యూదు దురహంకారం మరియు నయాఉదారవాదాల ప్రపంచ కూటమిలో భాగం,ప్రజాస్వామ్య ముసుగులో శాంతిని విచ్చిన్నం చేసే శక్తి అని కొందరు విమర్శించారు. నోబెల్‌ శాంతి బహుమతి ఆశయం, లక్ష్యాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నవారికి దాన్ని ప్రదానం చేయటం పక్కా రాజకీయం. వియత్నాంలో దురాక్రమణకు పాల్పడి లక్షలాది మంది ప్రాణాలు తీసింది అమెరికా. దానికి నాయకత్వం వహించినవారిలో ఒకడు హెన్రీ కిసింజర్‌. అక్కడ కాల్పుల విరమణకు కృషి చేశాడనే పేరుతో 1973లో శాంతి బహుమతి ఇచ్చారు. అదే పెద్దమనిషి ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు మద్దతు ఇచ్చాడు.ఈజిప్టును లొంగదీసుకొని ఇజ్రాయెల్‌తో కాంప్‌డేవిడ్‌ ఒప్పందానికి తెరతీసిన జిమ్మీ కార్టర్‌కు 1978లో అదే బహుమతి ఇచ్చారు. ఆ ఒప్పందంలో పాలస్తీనా గుర్తింపును విస్మరించారు. పాలస్తీనా ప్రాంతంలో దురాక్రమణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌పై ఆంక్షల కోసం పెట్టిన తీర్మానాన్ని వీటో చేసిన పెద్దమనిషి బరాక్‌ ఒబామా,మిలిటరీ సాయాన్ని మరింతగా పెంచినందుకా అన్నట్లు 2009లో శాంతి బహుమతి పొందాడు. ఇలాంటి విషయాల్లో నేను మాత్రం తక్కువ తిన్నానా నాకెందుకు ఇవ్వరని ట్రంప్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలుగా పేరుమోసిన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ప్రయోగశాల లాటిన్‌ అమెరికా. వాటి ప్రజావ్యతిరేక, ప్రపంచ పెట్టుబడి అనుకూల విధానాల కారణంగా జన జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వాటిని బలవంతంగా అమలు జరిపేందుకు మిలిటరీ పాలకులు, నియంతలను రంగంలోకి తెచ్చారు. వారికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో జరిగిన పోరాటాలతో వామపక్ష శక్తులు ముందుకు వచ్చాయి, అనేక చోట్ల అధికారాన్ని పొందాయి. అయితే నయావలసవాద పునాదులను పూర్తిగా నాశనం చేయకుండా జనాలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ అసలు సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అందుకే ఎన్నికలలో వామపక్షాలకూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇదే సమయంలో బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు మరింతగా సంస్కరణల పేరుతో తమ విధానాలను రుద్దుతుఉన్న కారణంగా కార్మికవర్గం, ఇతర తరగతులు వీధులలోకి రావటం అనివార్యంగా కనిపిస్తున్నది.

ఈ పూర్వరంగంలో పెరూలో వామపక్ష అభ్యర్ధిగా ముందుకు వచ్చి విజయం సాధించిన ఒక సామాన్య స్కూలు టీచర్‌ పెడ్రో కాస్టిలో 2021లో అధికారానికి వచ్చిన ఏడాదిలోనే పదవి కోల్పోయాడు. తన మూలాలను మరచి మితవాద,మతవాద శక్తులతో చేతులు కలిపి కార్మికవర్గాన్ని విస్మరించాడు.పార్లమెంటు ఉద్వాసనతో పదవి నుంచి తప్పుకున్నాడు. అప్పుడు ఉపాధ్యక్షరాలిగా ఉన్న దినా బోలార్టే 2022లో గద్దెనెక్కింది. అన్ని విధాలుగా పాలనలో విఫలం కావటంతో పార్లమెంటు గత శుక్రవారం నాడు పదవి నుంచి తొలగించింది.ఆమెకు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. గురువారం రాత్రి చర్యకు ఉపక్రమించిన పార్లమెంటు మెరుపువేగంతో వ్యవహరించి తెల్లవారేసరికి ఉద్వాసన పలికింది. రాత్రి 11.30కు పార్లమెంటు రావాలని ఇచ్చిన ఆదేశాన్ని ఆమె ఉల్లంఘించింది. ఒకనాడు మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా వ్యతిరేకంగా ఓటువేశాయి. విచ్చలవిడి అవినీతి, రెచ్చిపోయిన నేరస్థ ముఠాలను అదుపుచేయటంలో వైఫల్యంతో దినా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగేవరకు పార్లమెంటు స్పీకరు జోస్‌ జెరీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. గత తొమ్మిది సంవత్సరాలలో ఏడుగురు అధ్యక్షులు మారారు. వారిలో ముగ్గురిని పార్లమెంటు తొలగించింది. అధ్యక్షులుగా ఎన్నికైన పార్టీ పార్లమెంటులో మెజారిటీ సాధించలేకపోవటం అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో జరుగుతున్నది.దామాషా ప్రాతినిధ్యంతో అనేక పార్టీలు పార్లమెంటులో అడుగుపెడుతున్నాయి. పౌరుల ఆగ్రహం తలెత్తినపుడు అధ్యక్షులను పార్లమెంట్లు తొలగిస్తున్నాయి. ప్రైవేట్‌ పెన్షన్‌ నిధులకు కార్మికులు చెల్లించాలనే బిల్లుకు వ్యతిరేకంగా యువతరం నిరసనలకు దిగింది.దీనికి తోడు ఉద్యోగ భద్రత లేదు, యువతలో నిరుద్యోగం విపరీతంగా ప్రబలింది.

మరో లాటిన్‌ అమెరికా దేశం ఈక్వెడార్‌. మితవాది, వాణిజ్యవేత్తలకు అనుకూలమైన అధ్యక్షుడు డేనియల్‌ నోబావోకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నది. చమురు మీద ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేయటంతో ఆగ్రహం భగ్గుమన్నది. ఒక గాలన్‌(3.79 లీటర్లు) డీజిలు ధర 1.8 డాలర్ల నుంచి 2.8డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ ధరలను బట్టి ఎప్పటికప్పుడు ధరలను సవరిస్తామని ప్రకటించారు. స్థానిక తెగలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ అనేక రూపాల్లో ఆందోళనకు పిలుపు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఆదివారం నాడు కొలంబస్‌ దినం రోజున(1492లో కొలంబస్‌ లాటిన్‌ అమెరికా గడ్డపై అడుగు పెట్టాడు) తాజా ప్రదర్శనలపై దేశవ్యాపితంగా పోలీసులు విరుచుకుపడ్డారు. దాంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పది జిల్లాల్లో అధ్యక్షుడు అత్యవసర పరిస్థితిని ప్రకటించేంతగా ఉద్రిక్తత పెరిగింది.గతవారంలో రోడ్డు మీద అధ్యక్షుడి కారునే అడ్డుకున్నారు. స్థానిక తెగలు ఎక్కువగా పని చేస్తున్న వ్యవసాయం, చేపలు పట్టటం, రవాణా రంగాలపై చమురు సబ్సిడీ ఎత్తివేత ప్రభావం ఎక్కువగా ఉంది. ఏటా ప్రభుత్వం 110 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇస్తున్నదని, ఈ కారణంగా ఇరుగుపొరుగున ఉన్న కొలంబియా, పెరూ దేశాలకు పెద్ద ఎత్తున అక్రమరవాణా జరుగుతున్నదని అధ్యక్షుడు వాదిస్తున్నాడు. డేనియల్‌ నోబావో నియంతమాదిరి వ్యవహరిస్తున్నాడని,చమురు సబ్సిడీ ఎత్తివేతకు ముందు ఇతర రాయితీలను కూడా తొలగించారని, చమురు అక్రమరవాణా అన్నది ఒక సాకుమాత్రమే నంటూ ఐదువేల మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగించారని కార్మిక నేతలు ప్రకటించారు. సమ్మెకు పిలుపు ఇచ్చిన సంస్థతో చర్చలకు ససేమిరా అనటంతో పరిస్థితి మరింతగా దిగజారింది. కొత్తగా రుణం ఇచ్చేందుకు రుద్దిన ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు పొదుపు పేరుతో నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఔషధాలు కూడా సరిగా ఉండటం లేదు. విదేశీ మిలిటరీ స్థావరాల ఏర్పాటును అనుమతించేందుకు జూన్‌లో పార్లమెంటు తీర్మానించింది. ఇది అమెరికా కోసమే అన్నది తరువాత వెల్లడైంది. ప్రజా వ్యతిరేక విధానాలకు, అమెరికాకు లొంగిపోవటాన్ని లాటిన్‌ అమెరికా కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరీబియన్‌ ప్రాంతంలో చిచ్చు : వెనెజులా మిలిటరీ విన్యాసాలు, దాడులకు అమెరికా సన్నాహం !

12 Friday Sep 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Chavez, Donald trump, Nicolás Maduro, US boat attack, Venezuela, venezuelan chavista


ఎం కోటేశ్వరరావు


మాదక ద్రవ్యాల ముఠాలను అరికట్టే సాకుతో వామపక్ష పాలనలో ఉన్న వెనెజులాపై దాడులు చేసేందుకు అమెరికా సన్నాహాలు చేసింది. ఏ క్షణమైనా విరుచుకుపడవచ్చని వార్తలు వస్తున్నాయి. అధ్యక్షుడు మదురోను గద్దె దింపటం తమ లక్ష్యం కాదని చెబుతున్నప్పటికీ ఎవరూ నమ్మటం లేదు. అమెరికా దుర్మార్గాన్ని ప్రతిఘటించేందుకు సరిహద్దులో మదురో కూడా మిలిటరీని మోహరించి గురువారం నాడు త్రివిధ దళాలతో విన్యాసాలు నిర్వహించారు. వెనెజులా భూభాగంలో ఉన్న మాదకద్రవ్యాల మాఫియాలపై మిలిటరీ దాడులు చేస్తారా అన్న విలేకరి ప్రశ్నకు మీరే చూస్తారుగా అంటూ ట్రంప్‌ చెప్పటాన్ని బట్టి అమెరికా ఆంతర్యం స్పష్టంగా కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం కరీబియన్‌ సముద్రంలో ఒక పడవపై దాడి అమెరికా మిలిటరీ దాడి చేసి పదకొండు మందిని చంపివేసింది.వారికి మదురోకు సంబంధాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నద్ని అ బోటులో ఉన్నవారెవరికీ అమెరికా చెప్పే మాదక ద్రవ్యాల ముఠాతో ఎలాంటి సంబంధాలు లేవని మదురో సర్కార్‌ ప్రకటించింది. తమ కుటుంబ సభ్యులు కనిపించటం లేదని బంధువులు చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నది.తొలుత ఆ ఉదంతం కృత్రిమ మేథతో సృష్టించిన వీడియో అని మదురో పేర్కొన్నారు. వెనెజులా నుంచి వచ్చిన ఆ మోటార్‌ బోట్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు స్వయంగా ట్రంప్‌ కత చెప్పాడు. ఆ ముఠా అమెరికాలో హింసాత్మక చర్యలకు, మాదక ద్రవ్యాల వ్యాప్తి, సామూహిక హత్యలు, అమ్మాయిల అక్రమరవాణాకు పాల్పడుతున్నదని ఆరోపించాడు. ఆ తరువాత పోర్టారికోకు పది ఎఫ్‌ 35 రకం యుద్ధ విమానాలను అమెరికా తరలించింది. తప్పుడు సాకులతో అమెరికా దాడులకు పూనుకున్నదని మదురో శుక్రవారం నాడు చెప్పారు. మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి ఇరాక్‌ మీద దాడులు చేసినట్లుగానే తమపై అమెరికా దుర్మార్గానికి పాల్పడేందుకు పూనుకున్నదన్నాడు. అనేక దేశాలతో పోల్చితే తమ దేశం ద్వారా రవాణా అవుతున్న మాదకద్రవ్యాలు స్పల్పమని చెప్పాడు. అమెరికన్లు వెనక్కు తిరిగి పోలేని చోటికి చేరుకుంటున్నారని హెచ్చరించారు. మదురోను అరెస్టు చేసేందుకు వీలు కలిగే సమాచారం ఇచ్చిన వారికి ఐదు కోట్ల డాలర్లు ఇస్తామని ఆగస్టు నెలలో అమెరికా ప్రకటించిన అంశం తెలిసిందే.1998లో హ్యూగో ఛావెజ్‌ నాయకత్వంలో వామపక్షాలు అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలను కూలదోసేందుకు మితవాద నేతలకు అనేక రకాలుగా అమెరికా సాయం చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. విధించిన ఆంక్షలు పనిచేయటం లేదు. ఇప్పుడు మాదకద్రవ్యాల పేరుతో మరోకుట్రకు తెరలేపారు.


కరీబియన్‌ అంతర్జాతీయ జలాల్లో ఉన్న పడవను ఆపేందుకు, ప్రాణాలతో దాన్లో ఉన్నవారిని పట్టుకొనేందుకు అమెరికా మిలిటరీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.నేరుగా కాల్పులు జరిపి చంపివేయటం ద్వారా తాను తలచుకొంటే ఏ దేశంపై అయినా యుద్ధాన్ని ప్రకటిస్తామని, ఎవరినైనా మట్టుబెడతామనే బెదిరింపు సందేశాన్ని ఆప్రాంత దేశాలకు పంపినట్లయింది.తమకు పూర్తి అధికారాలు, సత్తా ఉందని ఈ ఉదంతంపై విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించాడు. పడవపై దాడి ఉదంతానికి ఒక రోజు ముందు మదురో మాట్లాడుతూ అమెరికన్లు అవాస్తవాలు చెబుతున్నారని వారు వెనెజులా చమురు, గ్యాస్‌ను ఉచితంగా దోచుకొనేందుకు వస్తున్నారని అందుకోసం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతారని హెచ్చరించాడు. 1898లో స్పెయిన్‌తో యుద్దాలకు తప్పుడు ప్రచారం చేశారని, 1964లో వియత్నాంపై దాడికి టోంకిన్‌ గల్ప్‌ కల్పిత ఉదంతాన్ని, 2003 ఇరాక్‌పై మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేశారని అన్నాడు.మోనికా లెవెన్సీతో తన అక్రమ సంబంధ ఉదంతం నుంచి అమెరికన్లను పక్కదారి పట్టించేందుకు నాటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ సూడాన్‌ మీద దాడి చేయించాడని ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అలాంటి కుంభకోణంలో జెఫ్రి ఎప్‌స్టెయిన్‌ ఫైళ్లలో కూరుకుపోయాడని అన్నాడు.


తన ప్రత్యర్ధులైన ఇరాన్‌,లెబనాన్‌,హుతీ, హిజబుల్లా, హమస్‌ అగ్రనేతలను ఒక ప్రకారం మట్టుబెడుతున్న క్రమంలో ఇజ్రాయెల్‌ తాజాగా ఎమెన్‌ ప్రధాని, మంత్రులను హతమార్చటాన్ని చూశాము. ఈ దుర్మార్గాలన్నింటికీ అమెరికా, ఇతర పశ్చిమదేశాల సంపూర్ణ మద్దతు ఉంది. లాటిన్‌ అమెరికాలో వామపక్ష నేతలు అమెరికాకు కొరకరాని కొయ్యలుగా మారిన పూర్వరంగంలలో వారిని హతమార్చేందుకు అమెరికా చూస్తున్నది, దాని లక్ష్యంగా మదురో ఉన్నాడని వేరే చెప్పనవసరం లేదు.అమెరికా గద్దెపై ఎవరున్నా అదే చేస్తున్నారు. రెండవసారి అధికారానికి వచ్చిన మరుసటి రోజే విదేశీ ఉగ్రవాద సంస్థలను మాదకద్రవ్యాల మాఫియాలుగా చిత్రిస్తూ ట్రంప్‌ ఉత్తరువులు జారీ చేశాడు. ఆ ముసుగులో వెనెజులా సమీపానికి మిలిటరీని దించుతున్నాడు.ఇతర దేశాల్లో జోక్యం చేసుకొనేందుకు మిలిటరీకి అధికారమిస్తూ రహస్య ఉత్తరువులు ఇచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. వెనెజులా చమురు కొనుగోలు చేయవద్దని, దాన్ని రవాణా చేయవద్దంటూ ఆంక్షలు విధించింది. ట్రంప్‌కు చిత్తశుద్ధి ఉంటే అమెరికాలో విచ్చలవిడిగా దొరుకున్న మాదకద్రవ్యాలు, వాటిని సరఫరా చేసే వారి మీద కేంద్రీకరించాలి. ఒక అంచనా ప్రకారం అమెరికాలో 200 నుంచి 750బిలియన్‌ డాలర్ల మేరకు మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతుంటే ప్రాణావసరమైన ఔషధాల లావాదేవీలు 600 బిలియన్‌ డాలర్లు, చమురు లావాదేవీల విలువ 400 బి.డాలర్లు మాత్రమే అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. మరోమాటలో చెప్పాలంటే ప్రపంచంలో మాదక ద్రవ్యాలను అత్యధికంగా వినియోగిస్తున్న, వాటి తయారీకి అవసరమైన ఔషధ సంబంధిత రసాయనాలు, ఆయుధాలను ప్రపంచానికి ఎక్కువగా సరఫరా చేస్తున్నది అమెరికా అన్నది నమ్మలేని నిజం. ఈ అక్రమలావాదేవీల్లో అమెరికాలోని బడా బాంకులు, కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయి. అమెరికన్‌ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇదంతా సాగుతుందా ? తన విధానాలు, కార్పొరేట్ల దోపిడీని ప్రశ్నించకుండా యువతను మత్తులో ముంచే ఎత్తుగడ కూడా దీని వెనుక ఉందన్నది స్పష్టం. ఐరాస 2025 ప్రపంచ మాదకద్రవ్యాల నివేదికలో వెనెజులా గురించి చేసిన ప్రస్తావన చాలా పరిమితంగా ఉంది. అక్కడ మాదక ద్రవ్యాల సాగు లేదా తయారీ దాదాపు లేదని పేర్కొన్నది.


కరీబియన్‌ ప్రాంతంలో అమెరికా మిలిటరీ మోహరింపు వెనుక బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. చైనాలోని తియాన్‌జిన్‌లో జరిగిన చారిత్మ్రాక షాంఘై సహకారం సంస్థ 25వ సమావేశంలో షీ జింపింగ్‌, నరేంద్రమోడీ, పుతిన్‌ కలయిక అమెరికా విధాన నిర్ణేతలకు వణుకుపుట్టించింది. వెంటనే గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్‌ నాలుగు రోజుల తరువాత భారత్‌ను చైనాకు కోల్పోయినట్లు ఉక్రోషంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం ముగిసిన వారం రోజుల్లోనే బ్రిక్స్‌ సమావేశాన్ని ట్రంప్‌ జీర్ణించుకోలేకపోయాడు. వెనెజులా పేరుతో కరీబియన్‌ సముద్రంలో ఉద్రిక్తతలకు తెరతీశాడు. సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్సుద్వారా బ్రిక్స్‌ సదస్సును బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా ప్రారంభించాడు. కరీబియన్‌ ప్రాంతంలో అమెరికా యుద్ద నావలు ఉద్రిక్తతకు కారణం అవుతున్నాయని చెప్పాడు. వెనెజులా మీద దాడికి సన్నాహాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నదన్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు బ్రిక్స్‌ సమావేశానికి డుమ్మాకొట్టిన ప్రధాని నరేంద్రమోడీ విదేశాంగ మంత్రి జై శంకర్‌ను పంపారు. చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం మరింతగా పెరగాలని పిలుపునిచ్చాడు.


ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల తయారీ అక్రమరవాణా సమస్యలు ఉన్నాయి. ఒక దేశం మీదకు యుద్ధ సన్నాహాల మాదిరి కరీబియన్‌ సముద్రంలో అమెరికా యుద్ద నావలను దించింది. వాటిలో నాలుగున్నరవేల మంది మెరైన్లు, నావికులను మోసుకువెళ్లే నౌక, నియంత్రిత క్షిపణులను ప్రయోగించే మూడు డెస్ట్రాయర్లు ఇతర నౌకలు, మరోచోట పది యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇది వెనెజులాను బెదిరించేందుకు, దాడి చేసేందుకు అన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్కడా అమెరికా ప్రత్యక్ష దాడుల్లో పాల్గొన్న ఉదంతాలులేవు. ఇతర దేశాలతో దాడులు చేయించటం, వాటికి ఆయుధాలు విక్రయించి లబ్దిపొందే విధానాన్ని అనుసరిస్తున్నది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో మరోమారు విజయం సాధించిన నికొలస్‌ మదురో ప్రభుత్వాన్ని అమెరికా ఇంతవరకు గుర్తించలేదు.తాము బలపరిచిన ప్రతిపక్ష అభ్యర్థి గోన్‌జాలెజ్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు అమెరికా చెప్పుకుంది. అమెరికా గనుక దాడులకు పాల్పడితే తాము ప్రతిఘటించేందుకు సిద్దంగా ఉన్నామని, మిలిటరీతో పాటు లక్షలాది మంది పౌరులను దించుతామని మదురో హెచ్చరించాడు. దాదాపు ఇరవై ఐదువేల మంది సైనికులను కొలంబియా సరిహద్దులకు, చమురు శుద్ది కర్మాగారాలు ఉన్న ప్రాంతాలకు, సముద్రతీరానికి తరలించటమే గాక దేశవ్యాపితంగా డ్రోన్లు ఎగురవేయటంపై ఆంక్షలు విధించాడు. తమ జలాల్లో నౌకా దళం పహారా కాస్తుందని రక్షణ మంత్రి ప్రకటించాడు.ప్రస్తుతం మిలిటరీలో లక్షా 23వేల మంది సైనికులు ఉన్నారు. వీరు గాక మరో రెండులక్షల ఇరవైవేల మంది ప్రజాసాయుధులు ఉన్నట్లు మదురో ప్రకటించాడు. దేశంలో అమెరికా వ్యతిరేక భావనలను ముందుకు తేవటంతో పాటు పరిసర దేశాల మద్దతు పొందేందుకు వెనెజులా నాయకత్వం పూనుకుంది.

గతంలో మిత్రదేశంగా ఉన్న సమయంలో వెనెజులాకు అమెరికా నాలుగవ తరం ఎఫ్‌ 16 యుద్ద విమానాలను సరఫరా చేసింది. ఇప్పుడు వాటితోనే కరీబియన్‌ సముద్రంలో ఉన్న అమెరికా యుద్ధ నావల చుట్టూ చక్కర్లు కొట్టించారు. నియంతల పాలనా కాలంలో చమురు నిల్వలపై కన్ను, కమ్యూనిజాన్ని విస్తరించకుండా చూసేందుకు వెనెజులా ఆ ప్రాంతంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో అమెరికా యుద్ధ విమానాలను అందచేసింది. అయితే అనూహ్యంగా ఛావెజ్‌ రంగంలోకి రావటంతో వెనెజులా బద్దశత్రువుగా మారింది. ఛావెజ్‌ అధికారానికి వచ్చిన తరువాత చైనా, రష్యాలతో మిలిటరీ సంబంధాలను పెట్టుకున్నాడు. ఒక దశలో తమపై విధించిన ఆంక్షలకు ప్రతిగా ఎఫ్‌16 విమానాలను ఇరాన్‌కు విక్రయిస్తామని ఛావెజ్‌ అమెరికన్లను హెచ్చరించాడు.2013 నుంచి నికోలస్‌ మదురో అధికారంలో కొనసాగుతూ చావెజ్‌ బాటను అనుసరిస్తున్నాడు. కరీబియన్‌ సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగున్నరవేల మందితో వెనెజులాను స్వాధీనం చేసుకోవటం లేదా దాడి చేసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.అమెరికా దాడులకు గురైన ఇతర దేశాలకు భిన్నంగా ప్రజాసాయుధులను కూడా వెనెజులా దింపే అవకాశం ఉంది. ఇరుగు పొరుగులాటిన్‌ అమెరికా దేశాలలో ఎక్కువ భాగం అమెరికా చర్యను ఖండిరచాయి. అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా చైనా చమురు దిగుమతి చేసుకోవటమే గాక వెనెజులాలో చమురు వెలికితీసేందుకు కూడా ముందుకు వచ్చింది. చైనా నుంచి మిలిటరీ జెట్లను కొనుగోలు చేసేందుకు మదురో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అయినప్పటికీ అమెరికా మిలిటరీ శక్తితో పోలిస్తే వెనెజులా బలం ఒక లెక్కలోనిది కాదు. దాని బలం, బలగం మదురోకు మద్దతు ఇస్తున్న జనం, ఇరుగు పొరుగుదేశాల సంఫీుభావమే !
 
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వసుదేవుడిని అనుసరిస్తున్న అమెరికా జో బైడెన్‌ !

09 Wednesday Mar 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Fuel prices freezing, Joe Biden, NATO allies, Ukraine war, Ukraine-Russia crisis, US, US imperialism, Venezuela


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ లొంగుబాటు సూచనలు, మరోవైపు మంటను మరింత ఎగదోస్తూ అమెరికా, దాని మిత్రదేశాల చర్యలు. రష్యా చమురును అమెరికా దిగుమతి చేసుకోవటంపై జోబైడెన్‌ నిషేధం విధించాడు. బ్రిటన్‌ దాన్ని అనుసరించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో పీపా ధర 139 డాలర్లు తాకి తరువాత తగ్గింది. ఫిబ్రవరి 24న యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ధర ఒక్క రోజు కూడా నిలకడగా లేదు. మార్చి 9వ తేదీన 121.5 డాలర్లుగా ఉంది. తమ ఇంధనంపై ఆంక్షలు విధిస్తే మూడువందల డాలర్లకు పెరగవచ్చని రష్యా హెచ్చరిక. మరోవైపున వెనెజులా చమురుపై ఆంక్షల ఎత్తివేత ఆలోచనల్లో అమెరికా. తమపై ఆంక్షలను ఎత్తివేసినా లేకున్నా రష్యాకు ఇచ్చే మద్దతుపై వెనక్కు తగ్గేదేలే అంటున్న వెనెజులా.


రష్యా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సామాజిక ఐక్యత కుప్పకూలుతుందని జర్మనీ హెచ్చరించింది. తాము ఆంక్షలను వ్యతిరేకిస్తామని కూడా జర్మనీ మంత్రి రాబర్ట్‌ హాబెక్‌ చెప్పాడు. సరఫరాలు తగ్గటం సామాజిక ఐక్యతకు ముప్పు తెస్తుందని కూడా అన్నాడు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది ఇంతకు మించి కొత్తగా చేసేదేమీ లేదని తదుపరి చర్యల గురించి మరొక మంత్రి క్రిస్టియన్‌ లెండర్‌ స్పష్టం చేశాడు. ఆంక్షల నుంచి రష్యన్‌ ఇంధన సరఫరాలను కావాలనే ఐరోపా మినహాయించింది, ఈ క్షణంలో మరోమార్గంలో ఇంధన సరఫరాకు అవకాశం లేదని జర్మన్‌ ఛాన్సల్‌ ష్కోల్జ్‌ చెప్పాడు. ఈ కారణంగానే బైడెన్‌ ఐరోపాతో నిమిత్తం లేకుండా తమ దేశానికి మాత్రమే వర్తించే నిషేధాన్ని ప్రకటించాడు. ఐరోపాయునియన్‌ నుంచి విడిపోయిన బ్రిటన్‌ వేరుగా నిషేధాన్ని ప్రకటించింది.రష్యా ఇంధనంపై ఆంక్షలు విధించటాన్ని తాము సమర్ధించటం లేదని హంగరీ ఆర్ధిక మంత్రి ప్రకటించారు.అమెరికా, సౌదీ అరేబియా తరువాత చమురు ఉత్పత్తిలో రష్యా మూడవ స్ధానంలో ఉంది. దాని ఎగుమతుల్లో 60శాతం ఐరోపా ఆర్ధిక సహకార మరియు అభివృద్ధి సంస్ధ(ఓయిసిడి) దేశాలకే చేస్తున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటే వెంటనే జరిగేది కాదు. ఇటలీ గాస్‌ దిగుమతుల నిలిపివేతకు రెండున్నర సంవత్సరాలు పట్టింది. గతేడాది ఐరోపా యూనియన్‌ తన అవసరాల్లో 45శాతం రష్యానుంచి దిగుమతి చేసుకుంది.రష్యా ప్రతి రోజు 50లక్షల పీపాలు ఎగుమతి చేస్తుండగా దానిలో సగం ఐరోపాకే వెళుతుంది.


నోర్డ్‌ స్ట్ర్రీమ్‌ ఒకటి ద్వారా సరఫరా అవుతున్న తమ ఇంధనంపై నిషేధం విధిస్తే చమురు ధరలు మూడువందల డాలర్ల వరకు పెరగవచ్చని రష్యా ఉపప్రధాని నోవాక్‌ హెచ్చరించాడు. రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నవాటిలో ముడిచమురు కంటే దానిఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయి. అందువలన నిషేధం ద్వారా ప్రచార వత్తిడి తప్ప పెద్ద ప్రభావం చూపదన్నది స్పష్టం. అమెరికా తన అవసరాల్లో రష్యా నుంచి ఎనిమిదిశాతం దిగుమతి చేసుకుంటుండగా దానిలో మూడుశాతం మాత్రమే ముడిచమురు, మిగిలినవి చమురు ఉత్పత్తులు. పశ్చిమ దేశాలు తమ మీద విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు ధరలు పెరుగుతున్నందున అమెరికా, ఐరోపా దేశాలు కూడా వాటి ప్రతికూల పర్యవసాలను అనుభవించాల్సి ఉంటుంది. రష్యన్‌ చమురుపై నిషేధం విధిస్తే సరఫరా తగ్గి పీపా ధర 200 డాలర్లకు పెరగవచ్చని బాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు.


వసుదేవుడంతటి వాడే అవసరం తనది గనుక గాడిద కాళ్లను పట్టుకొనేందుకు సిద్ద పడిన కథ తెలిసిందే. ఇప్పుడు అమెరికా అదే చేస్తోంది.రష్యాను దెబ్బతీసేందుకు గతంలో తాను వ్యతిరేకించిన, తిట్టిపోసిన దేశాలతో ఇప్పుడు చమురు అమ్ముతారా అంటూ తెరవెనుక సంప్రదింపులు జరుపుతోంది. దీని వెనుక రెండు కారణాలున్నాయి. ఐరోపా, ఇతర ప్రాంతాల్లోని తన మిత్రరాజ్యాల ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా చూడటం, చమురు ధరలు మరింత పెరిగితే యురోపియన్లలో అమెరికా పట్ల ప్రతికూలత పెరుగుతుంది. తన ఆర్ధిక వ్యవస్ధకు సైతం తలెత్తే ముప్పు నివారణ అవసరం. లేనట్లయితే ఇంటా బయటా ప్రతికూల పరిస్ధితులు బైడెన్‌కు ఎదురవుతాయి.అందువల్లనే అమెరికా ప్రతినిధులు గతవారంలో వెనెజులాను సందర్శించి చమురు సరఫరా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకొని చమురు ఆంక్షలను ఎత్తివేసేందుకు సంసిద్దతను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉత్పత్తిని పెంచమని కోరేందుకు బైడెన్‌ స్వయంగా సౌదీ అరేబియాను సందర్శించవచ్చని వార్తలు వచ్చాయి. రష్యాపై విధించిన ఆంక్షలను సొమ్ము చేసుకొనేందుకు ఉత్పత్తి పెంచాలన్న సూచనలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు సౌదీ అందుకు సముఖత చూపలేదు. గతంలో రష్యాతో వచ్చిన అవగాహనకే కట్టుబడి ఉంటామని చెబుతోంది. అణు ఒప్పందం గురించి ఇరాన్‌తో రాజీకి వచ్చి ఆంక్షలు వెనక్కు తీసుకుంటే అక్కడి నుంచి కూడా సరఫరా పెరుగుతుంది.యుద్దం ప్రారంభమైన తరువాత అమెరికా ఒక మెట్టు దిగుతున్నట్లుగానే ఈ పరిణామాలను చూడవచ్చు. జర్నలిస్టు ఖషోగ్గీ హత్య తరువాత సౌదీ-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. సౌదీ రాజును హంతకుడని బైడెన్‌ వర్ణించాడు. ఇప్పుడు చమురు ఉత్పత్తి పెంచాలని కోరుతున్నాడు. వారి సమావేశం జరుగుతుందా లేదా అన్నది సందేహమే. తాలిబాన్లతోనే ఒప్పందం చేసుకున్నపుడు సౌదీతో సయోధ్య కుదుర్చుకోవటంలో ఆశ్చర్యం ఉండదు. చమురు ధరలు తగ్గటం ప్రతివారికీ ప్రయోజనకరమే నంటూ అధికారులు చర్చలు జరుపుతున్నారు గానీ, బైడెన్‌ పర్యటన గురించి ఇప్పటికైతే ఖరారు కాలేదని పత్రికా కార్యదర్శి జెస్‌ సాకీ చెప్పారు. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?


అనేక సంవత్సరాల తరువాత ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు వెనెజులా రాజధాని కారకాస్‌ వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను గద్దె దించేందుకు కుట్రపన్నినందుకు గాను 2017లో అమెరికా ఇంధన అధికారులను అరెస్టు చేశారు. 2019లో ఆంక్షలతో పాటు, కారకాస్‌లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. తమ వారిని వదలిపెట్టాలని కోరటంతో పాటు చమురు ఎగుమతి గురించి చర్చలు ప్రారంభించారు. అధికారులు వెళ్లటానికి ఒక రోజు ముందు వెనెజులాలో పెట్టుబడులు పెట్టిన రష్యా వ్యాపారి ఉస్మనోవ్‌ వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు తొలగించలేదు గానీ కంపెనీ లావాదేవీలు జరిపేందుకు అమెరికా ఆర్ధికశాఖ సాధారణ అనుమతి మంజూరు చేసింది. అతను పుతిన్‌ మద్దతుదారు. ఇది వెనెజులా పట్ల ఒక సానుకూల వైఖరి. దీనికి ప్రతిగా ఇద్దరు అమెరికన్లను వెనెజులా విడుదల చేసింది. బైడెన్‌ వైఖరి మార్చుకోవటాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ ఎంపీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారితో కొందరు డెమోక్రాట్లు కూడా గొంతు కలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు మదురో బహిరంగంగానే మద్దతు పలికాడు. ఇంతకాలం వెనెజులాను వ్యతిరేకించిన అమెరికా తన మాటలను తానే ఖండించుకున్నట్లయింది. దీంతో మదురో మరింత బలపడతారని, వ్యతిరేకుల నడుంవిరిచినట్లవుతుందని కొందరు వాపోతున్నారు.


చమురు ధరలు పెరగటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని అమెరికాలో వాటాదార్లతో నిమిత్తం లేకుండా కుటుంబ సంస్ధలుగా ఉన్న కొన్ని చిన్న షేల్‌ ఆయిల్‌ కంపెనీలు ఉత్పత్తికి సిద్దం అవుతున్నాయి.నూటపది డాలర్లుంటే తమకు గిట్టుబాటు అవుతుందని అంటున్నాయి. పెరుగుదల ఎంత కాలం ఉంటుందో తెలీని స్ధితిలో బడా కంపెనీలు ఉత్పత్తికి సిద్దం కావటం లేదు. కరోనా కారణంగా ఆ కంపెనీల్లో మదుపు చేసిన వారికి చేతులు కాలటంతో ఆచితూచి స్పందిస్తున్నాయి.


మన దేశంలో నవంబరు నాలుగవ తేదీ నుంచి స్ధంభింపచేసిన చమురు ధరలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏ రోజైనా తిరిగి సవరించే అవకాశం ఉంది. దీని గురించి ప్రభుత్వం రెండు నాలుకలతో మాట్లాడుతోంది. చమురు ధరలను నిర్ణయించేది చమురు కంపెనీలు తప్ప ప్రభుత్వం కాదని, అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి తగ్గటం, పెరగటం ఉంటుందని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన ధరల గురించి నిర్ణయం తీసుకుంటామని చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు విలేకర్లతో చెప్పారు. నవంబరు నుంచి ధరల స్ధంభనతో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు లేదని కూడా చెప్పారు. రోజువారీ ధరల సవరణ చేసే కంపెనీలు గతంలో ఎన్నికల తరుణంలో, తాజాగా నవంబరు నాలుగునుంచి ఎందుకు స్ధంభింపచేసినట్లో ఇంతవరకు ప్రకటించలేదు.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్రలను అధిగమించి పురోగమనంలో వెనెజులా !

02 Wednesday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#viva Venezuela, Chavez, crude oil price, Maduro, President Maduro, Venezuela, Venezuela’s economy, Yandamuri, Yandamuri Veerendranath


ఎం కోటేశ్వరరావు


వెనెజులా మరోసారి వార్తల్లోకి వస్తోంది. దానిపై మీడియా సంస్ధలు, ప్రముఖులుగా ఉన్న కొందరు చేయని ప్రచారం లేదు. అక్కడ సమస్యల్లేవని ఎవరూ చెప్పలేదు. కాకపోతే కాళిదాసు కవిత్వానికి కొంత తమపైత్యాన్ని జోడించే వారి గురించి పట్టించుకోనవసరం లేదు. వెనెజులా సెంట్రల్‌(రిజర్వు)బాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో 686.4శాతం ద్రవ్యోల్బణం ఉంది. అంతకు ముందు సంవత్సరం 2,959.8 శాతం ఉంది. గతేడాది సెప్టెంబరు నుంచి నెలవారీ ద్రవ్యోల్బణం ఒక అంకెకు పరిమితం అవుతోంది. వందలు,వేలశాతాల్లో నమోదైన ద్రవ్యోల్బణం అంటే అర్ధం ఏమిటి ? ఒక వస్తువు ధర ఈ క్షణంలో ఉన్నది మరోక్షణంలో ఉంటుందన్న హమీ ఉండదు. చేతిలో ఉన్న కరెన్సీతో ఫలితం ఉండదు. రాయిటర్స్‌ వార్తా సంస్ధ కథనం ప్రకారం కరెన్సీ మారకపురేటును స్ధిరంగా ఉంచేందుకు తీసుకున్న చర్యలతో ఫలితాలు కనిపించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్ధ సరఫరాదార్లకు విదేశీ కరెన్సీ(డాలర్లలో) చెల్లింపులు చేస్తోంది. ఒక ఆశావహ పరిస్ధితి ఏర్పడింది.దీని అర్ధం అంతా బాగుందని కాదు. ప్రభుత్వ టీవీలో దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు నడిచిన హైపర్‌ ద్రవోల్బణం గత చరిత్రే అని, ఐతే ఇప్పటికీ ఈ సమస్య తీవ్రమైనదే అన్నారు.


లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు చెందిన ఐరాస ఆర్ధిక కమిషన్‌ వచ్చే ఏడాది ఈ ప్రాంతదేశాల జిడిపి వృద్ధిరేటు సగటున 2.1శాతం కాగా, వెనెజులా రేటు 3 శాతంగా పేర్కొన్నది. గత ఏడు సంవత్సరాలలో ఇది తొలిసానుకూల సంవత్సరం కావటం గమనించాల్సిన అంశం, 2014 నుంచి ఇటీవలి వరకు దేశ జిడిపి 75శాతం పతనమైంది. మరొక దేశం ఏదైనా ఈ స్థితిని తట్టుకొని నిలిచిందా ? వెనెజులా వామపక్ష పార్టీల ఏలుబడిలో ఉంది తప్ప అమలు జరుపుతున్న విధానాలన్నీ సోషలిస్టు పద్దతులు కావు.ఇటీవలి కాలంలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ, పాలక సోషలిస్టు పార్టీ మధ్యవిభేదాలు కూడా తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. వాటిని అంతర్గతంగా అక్కడే పరిష్కరించుకుంటారు. జనాన్ని ఆదుకొనేందుకు ఉపశమన చర్యలు వేరు, దీర్ఘకాలిక సోషలిస్టు సంస్కరణలు వేరు. సోషలిస్టు క్యూబా, దానికి మద్దతు ఇస్తున్న వెనెజులా వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, బిజెపి పాలిత ప్రాంతాల్లో అధికారపక్షాలు ప్రతిపక్షాలను దెబ్బతీసి తమకు ఎదురు లేదని జనం ముందు కనిపించేందుకు చేస్తున్నదేమిటో తెలిసిందే. లాటిన్‌ అమెరికాలో వామపక్ష పార్టీలు, ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు అమెరికా,కెనడా, ఐరోపా ధనికదేశాలు ఇంతకంటే ఎక్కువగా ప్రాణాలు తీసే దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి.2018లో డ్రోన్‌తో దాడి చేసి మదురోను హత్య చేయాలని చూశారు. అంతర్గత తిరుగుబాట్లను రెచ్చగొట్టి అసలు ప్రభుత్వాన్నే గుర్తించలేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని బహిరంగా ఇచ్చిన పిలుపులు వెనెజులా వ్యతిరేకులకు వీనుల విందుగా ధ్వనించి ఉండాలి.


మన దేశంలో వెయ్యిమంది జనాభాకు 44 కార్లు ప్రపంచంలో కార్లసాంద్రతలో మనం 132వ స్ధానంలో ఉండగా అదే వెనెజులా 96వ స్థానంలో ఉండి 145కలిగి ఉంది.ఐరాస మానవాభివృద్ధి సూచికలో 2021లో మనం 131 స్ధానంలో ఉంటే వెనెజులా 113లో ఉంది. ఈ అంకెల దేముంది అని తోసిపుచ్చవచ్చు, అలాంటి వారిని ప్రమాణంగా తీసుకోవాలా ? వారి నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి ? వారికి నచ్చితే, విలువ లేకపోతే లేదు, ఎంత బాధ్యతా రాహిత్య వైఖరి ? 2021లో ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం 116 దేశాల్లో 101కాగా వెనెజులా 82లో ఉంది. ఎనిమిదేండ్ల మన ఘనమైన పాలన చేసిందేమిటి ?


2014 చమురు మార్కెట్లు పతనం కావటంతో ఎగుమతుల మీద ఆధారపడిన వెనెజులా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా తదితర దేశాల ఆంక్షలతో చమురును వెలికితీసే కంపెనీ ముఖం చాటేశాయి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. ఒక సమాచారం ప్రకారం 2021 ప్రారంభంలో దేశంలో ఉన్న 41లక్షలకు పైగా ఉన్న కార్లలో సగానికి మాత్రమే అక్కడ ఉత్పత్తి జరిగే పెట్రోలు, డీజిలు సరిపోతుంది. గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం జనవరి 24న అక్కడ లీటరు పెట్రోలు ధర రు.1.87. ఇటీవలి కాలంలో తిరిగి ముడి చమురు ఉత్పత్తితో పాటు ధరలు పెరగటం దానికి ఎంతగానో ఉపశమనం కలిగించింది. డిసెంబరు 2021నాటికి రోజుకు పదిలక్షల పీపాలకు ఉత్పత్తి పెరిగింది. ఆంక్షల కారణంగా ఇప్పటికీ శుద్ధి కర్మాగారాలు మరమ్మతులకు నోచుకోలేదు.


ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వెనెజులాకు ఉపశమనం కలిగిస్తున్నాయి.చైనా, రష్యా, ఇరాన్‌తో చమురు రంగంలో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు కీలకమైనవి.అమెరికా ఆంక్షల కారణంగా దాదాపు వెనెజులా చమురు ఉత్పత్తి నిలిపివేసిన తరుణంలో ఒప్పందం చేసుకున్న ఇరాన్‌ ఆహారం, చమురుటాంక్లను పంపి ఎంతగానో ఆదుకుంది. చాలా మందికి అర్ధంగాని అంశం ఏమంటే వామపక్షాలు అధికారానికి రాకముందే అక్కడి చమురు పరిశ్రమ అమెరికా, ఐరోపా ధనికదేశాల సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైంది. అందువలన దానికి అవసరమైన విడిభాగాలు కావాలంటే పశ్చిమ దేశాల నుంచి, వాటి అనుమతితోనే తెచ్చుకోవాలి. దీన్ని అవకాశంగా తీసుకొని వెనెజులాను అవి దెబ్బతీస్తున్నాయి. రష్యా, ఇరాన్‌ ఇటీవలి కాలంలో ఆ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రత్నామ్నాయం కనుగొనటంతో పశ్చిమ దేశాల ఆటలు సాగటం లేదు. భారీ సాంద్రత కలిగిన వెనెజులా ముడిచమురును శుద్ది సమయంలో పలుచన గావించేందుకు అవసరమైన డైల్యూటెంట్‌ను ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది.వీటికి తోడు చమురు తవ్వకరంగంలో పోటీ కూడా వెనెజులాకు కలసివచ్చింది. చిన్న డ్రిల్లింగ్‌ సంస్ధలు ముందుకు వచ్చాయి. అనేక ఆంక్షలను పక్కన పెట్టి తనకు అవసరమైన చమురు కొనుగోలు ద్వారా మరోరూపంలో చైనా పెద్ద ఎత్తున తోడ్పడింది.

అమెరికా చంకలో దూరిన మనవంటి దేశాలపై అమెరికా వత్తిడి తెచ్చి వెనెజులా నుంచి చమురుకొనుగోలును నిలిపివేయించాయి. లాయడ్‌ లిస్ట్‌ ఇంటర్నేషనల్‌ ప్రకారం 2020లో 150ఓడలు మలేసియా మీదుగా చైనా, ఇండోనేషియాలకు వెనెజులా చమురును సరఫరా చేశాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు పుట్టుకు వస్తాడన్నట్లు అమెరికా ఆంక్షలు విధిస్తున్నకొద్దీ ఇతర మార్గాలు అనేక వచ్చాయి. ఈ ఏడాది 17లక్షల పీపాలు అదనంగా ఉత్పత్తి జరగవచ్చని భావిస్తున్నారు. ఇరాన్‌, వెనెజులా నుంచి చమురు చౌకగా లభించనుండటంతో పాటు సరఫరా హామీ ఉంటుంది. 1990లో రోజుకు 32లక్షల పీపాల చమురు వెలికి తీసిన వెనెజులా రిగ్గులు అమెరికన్ల దుర్మార్గం కారణంగా దాదాపు నిలిపివేసిన స్ధితికి చేరుకున్నాయి. ఇరాన్‌ తోడ్పాడుతూ రోజుకు నాలుగున్నరనుంచి ఐదులక్షల పీపాల చమురు ఉత్పత్తికి పధకాలు వేశారు.


వెనెజులా ఇబ్బందుల గురించి ఎకసెక్కాలాడటం అపర మానవతావాదులకు ఒక వినోదం. అక్కడి సమస్యలేమిటి ? వాటికి ఎవరు కారకులు అన్నది వారికి పట్టదు.అంగవైకల్యం మీద హాస్యాన్ని పండించి వండి వార్చుకు తినేందుకు అలవాటు పడ్డ చౌకబారు స్దాయికి ఎప్పుడో మనం దిగజారాం. ఒక రొట్టె ముక్క కోసం ఒళ్లప్పగించేందుకు సిద్ద పడుతున్న వెనెజులా పడతులని,సిగిరెట్‌ పీక కోసం దేవురించే వృద్దులున్నారని వర్ణించిన మహానుభావులను చూశాము. ఇక్కడా వక్రదృష్టే. అనేక ఆఫ్రికా దేశాల్లో ఎండు డొక్కలతో కనిపించే పిల్లలు అడుక్కోవటాన్ని, పిల్లలకోసం మానం అమ్ముకొనే తల్లులను ఈ మానవతావాదులు బహుశా చూడలేరు. చూసినా తాగిన ఖరీదైన విస్కీ మత్తు వదలి, అందమైన వర్ణనలు రావు. ఇలాంటి పెద్దలకు మాదాపూర్‌, కొండాపూర్‌ పబ్బుల్లో తాగితందనాలతున్న కొందరు చిన్న పెగ్గు, బిర్యానీ, ఇతర విలాసాల కోసం రాత్రంగా కాలక్షేపసరకుగా మారుతున్న వారు కనిపించరు. వీరు ఏ పేదరికం నుంచి వచ్చినట్లు ? కరోనా లాక్‌డౌన్‌ తరుణంలో అనేక మంది యువతులు ఆధునిక దస్తులు వేసుకొని వైన్‌ షాపుల ముందు వరుసలు కట్టింది కనిపించలేదా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనెజులాతో పోల్చుకొనే పరిస్ధితులేమీ లేవు కదా ? చీకటిపడితే చాలు వెలుతురులేని సందులు, గోడలు, లైటు స్థంభాలపక్కన కడుపు కక్కుర్తి కోసం కనిపించే అభాగినులు చేయితిరిగిన రచయితలకు కథావవస్తువులౌతారు. వారిపట్ల సానుభూతో మరొక పేరుతో సొమ్ము చేసుకుంటారు. వెనెజులాలో సంక్షేమ పధకాలే ఈ స్ధితికి తెచ్చాయట, ఎంత కుతర్కం.


ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ పేరుతో 2019 నుంచి ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, వుచిత సర్వీసుల ఆఫర్‌ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు. అది చరిత్రా కాదు, రాసిన వీరేంద్రనాథ్‌ చరిత్ర కారుడూ కాదు అంటూ అప్పుడే ఈ రచయిత స్పందించాడు. ఇన్నేండ్ల తరువాత కూడా అదే ప్రచారం అటూ ఇటూ మారి జరుతోంది. ఎంత పెద్ద అబద్దాలను అలోకగా ఆడతారంటే 1970లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి’ అని రాశారు. నిజమా అమెరికా లెక్కల ప్రకారం 210, ఐఎంఎఫ్‌ అంచనా మేరకు 191, ఎక్కడనా పోలీక ఉందా ?


అమెరికాకు వెనెజులా అంటే ఎందుకు పడదు ? ఎక్కడన్నా గట్టు తగాదా ఉందా లేదే ? సైద్దాంతిక, అదీ వామపక్ష ప్రభావం పెరటాన్ని తట్టుకోలేకపోతోంది. ప్రపంచీకరణలో అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్ధలోకి ప్రవేశించకుండా వెనిజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త రాయలేని పత్రికా స్వేచ్చ మనది మరి., వెెనిజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ చర్య చట్టవిరుద్దం, లేదా దోచుకోవటం అని రాయటం కూడా కష్టమే అంటూ జర్నలిస్టు జాన్‌ పిల్గర్‌ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చినిజాలు ఇవి. ‘2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధరపెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు’ ఇది హ్యూగో ఛావెజ్‌ గురించి రాశారు.(అసలు ఆ ఏడాది ఎన్నికలే జరగలేదు)
ఎవరీ ఛావెజ్‌ ? 1977లో ఒక సైనికుడిగా ఒక వామపక్ష తీవ్రవాద సంస్ధను అణచివేసేందుకు వెళ్లిన ఆయన, వారెందుకు తీవ్రవాదులుగా మారారు, రాజ్యం వారినెందుకు అణచివేస్తున్నది అనే అంతరంగ మధనంతో వామపక్ష వాదిగా మారిన వ్యక్తి. 1989లో కార్లోస్‌ అండ్రెజ్‌ పెరోజ్‌ అనే పెద్ద మనిషి తాను ఎన్నికైతే అమెరికా వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకుంటానని, ఐఎంఎఫ్‌ విధానాలను వ్యతిరేకిస్తాననే వాగ్దానాలతో అధికారానికి వచ్చి అందుకు వ్యతిరేకంగా వ్యవహించాడు. అతని విధానాలు నచ్చని మిలిటరీ అధికారిగా వున్న ఛావెజ్‌ 1992లో విఫల తిరుగుబాటు చేశాడు. అందుకుగాను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1994లో అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం ఛావెజ్‌ను, ఆయనతో పాటు జైల్లో పెట్టిన ఇతర తిరుగుబాటుదార్లను విడుదల చేసింది. మిలిటరీలో తిరిగి చేరకూడదని ఆంక్షలు విధించింది. 1998 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో, వామపక్ష, వుదారవాద, ప్రజాస్వామిక అభిప్రాయాలు కలిగిన వివిధ సంస్ధలు, పార్టీలతో ఏర్పడిన వెనిజులా ఐక్యసోషలిస్టు పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. నూతన రాజ్యాంగం మేరకు 1999లో మరోసారి ఎన్నికలు జరిపి రెండోసారి అధికారానికి వచ్చారు. 2006 డిసెంబరులోనే జరిగాయి, మరుసటి ఏడాది జనవరిలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. నాలుగోసారి 2012లో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే కాన్సర్‌ కారణంగా ఆసుపత్రిలో వున్నందున ప్రమాణస్వీకారం చెయ్యలేదు. అయితే అధికారంలో వుండి తిరిగి గెలిచినందున ప్రమాణస్వీకారం మరోసారి చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది.అయితే ఆరోగ్యం విషమించి 2013 మార్చి ఐదున మరణించారు. వుపాధ్యక్షుడిగా వున్న నికొలస్‌ మదురో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. తరువాత ఎన్నికల్లో మదురో గెలుస్తున్నారు.

వెనెజులాలో వున్నది వామపక్ష ప్రభుత్వం. అంతకు ముందు అక్కడ అనుసరించిన నయా వుదారవాద విధానాలను పూర్తిగా మార్చకుండా జనానికి వుపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నది. దాని ఆదాయం నూటికి 95శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే పరిమితం అమ్ముకుంటున్నదానికి అయినా నాలుగు డాలర్లు వస్తాయి లేకపోతే ఇబ్బందే. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటినుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు.సంక్షమే పధకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్‌. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనిజులాను సాకుగా చూపటమే అభ్యంతరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోషలిస్టు తాతయ్యకే మద్దతు అంటున్న అమెరికా మనవళ్లు !

19 Sunday Jan 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, capitalism or socialism, chin peng, Nicolás Maduro, Pedro Sanchez, Venezuela, Young People Embracing Socialism

Image result for generation z and millennials support to bernie sanders
ఎం కోటేశ్వరరావు
ఐరోపాను కమ్యూనిస్టు భూతం భయపెడుతున్నదని కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో వ్యాఖ్యానించారు. కమ్యూనిజాన్ని అంతం చేసి విజయం సాధించామని అమెరికా ప్రకటించుకుంది. కానీ ఇప్పుడు అక్కడే కమ్యూనిస్టు భూతం భయపెడుతోందంటే అతిశయోక్తి కాదు. సోషలిస్టు వ్యవస్ధలకు, కమ్యూనిస్టు సిద్దాంతానికి తగిలిన ఎదురు దెబ్బలు అనేక మందిని నిరాశకు గురి చేశాయి. సమాజం పారే నది వంటిది అనుకుంటే కొత్త నీరు వచ్చి పాత నీటిని వెనక్కు నెట్టేస్తుంది. అనేక దేశాల్లో జరుగుతున్న పరిణామాలు నిరాశకు గురైన వారిలో ఆశలు చిగురింప చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నాలుగు ఖండాలలోని కొన్ని దేశాలలో ఇటీవలి పరిణామాలను ఒక్కసారి అవలోకిద్దాం, ఆలోచనలకు పదును పెడదాం.
అమెరికా పాలకవర్గాన్ని, దాన్ని ఆశ్రయించి బతికే పరాన్న జీవులైన మేథావులకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటి? చైనాతో వాణిజ్య యుద్దంలో ఏమి చేయలేక ఆయాస పడటమా, ప్రపంచంలో తమ పలుకుబడి తగ్గి ప్రతిఘటన పెరుగుతోందనే ఆందోళనా, మరొకటా, మరకొటా ? ఇవేవీ కాదు, తమ యువతరంలో పెట్టుబడిదారీ విధానం పట్ల దిగజారుతున్న విశ్వాసం, సోషలిజం పట్ల పెరుగుతున్న మక్కువ అంటే అతిశయోక్తి కాదు. అఫ్‌ కోర్సు అమెరికా ప్రచారాన్ని నమ్మి దాన్నే మెదళ్లకు ఎక్కించుకున్న వారు మింగా కక్కలేని స్ధితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిని కొత్త నీరు వెనక్కు నెట్టేస్తుంది.
జనవరి రెండవ వారంలో బ్రిటీష్‌ మార్కెట్‌ పరిశోధనా సంస్ధ ”యుగవ్‌ ” నిర్వహించిన ఒక సర్వేలో 23-38 సంవత్సరాల యువతరం( మిలీనియనల్స్‌)లో ప్రతి ఇద్దరిలో ఒకరు సోషలిజానికి మద్దతు ఇస్తున్నారని తేలింది. అంతకంటే కమ్యూనిస్టు వ్యతిరేకులు గుండెలు బాదుకొనే అంశం ఏమంటే ఈ యువతలో 36శాతం మంది కమ్యూనిజానికి జై కొట్టడం. అమెరికన్లు ఏర్పాటు చేసిన అనేక సంస్ధలలో ‘కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌’ ఒకటి. దీని పనేమిటో చెప్పక్కర లేదు. ఆ సంస్ధ కార్యనిర్వాహక డైరెక్టర్‌ మరియాన్‌ స్మిత్‌ సర్వే వివరాల గురించి ఒక ప్రకటన చేశాడు.” సోషలిజం, కమ్యూనిజాల ప్రమాదాల గురించి చారిత్రాత్మక విస్మృతి ఈ నివేదికలో పూర్తిగా కనిపిస్తోంది. గత శతాబ్దిలో కమ్యూనిస్టు పాలకుల చేతుల్లో పది కోట్ల మంది బాధితులయ్యారనే చారిత్రాత్మక నిజం గురించి మన యువతరానికి తెలియ చెప్పనట్లయితే వారు మార్క్సిస్టు సిద్దాంతాలను అంగీకరిస్తే మనం ఆశ్చర్యపోనవసరం లేదు.” అన్నాడు. పది కోట్ల మందిని కమ్యూనిస్టులు చంపారనే తప్పుడు ప్రచారం నిత్యం ఇంటర్నెట్‌తో అనుబంధం ఉన్న యువతీ యువకులకు తెలియంది కాదు, అవన్నీ కట్టుకధలని కొట్టి పారవేస్తూ నేటి యువత సోషలిజం పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారనే చారిత్రక సత్యాన్ని గుర్తించ నిరాకరిస్తున్నారు.
ప్రయివేటు ఆస్ధులన్నింటినీ రద్దు చేస్తే సమాజం మెరుగ్గా ఉంటుందని మిలీనియల్స్‌లో 22శాతం మంది, ఉన్నత విద్య ఉచితంగా అందించాలని జడ్‌ తరం(1997-2012 మధ్యలో పుట్టిన వారు)లో 45శాతం మంది భావిస్తున్నారని కూడా తాజా సర్వే వెల్లడించింది. ఇరవయ్యవ శతాబ్దపు సోషలిస్టు ప్రయోగాలను చూసిన తరువాత కూడా ఆ సోషలిస్టు భావజాలం ఇంకా ఆకర్షిస్తూనే ఉండటం, ప్రభుత్వ పాఠశాలలు, మీడియా, సాధారణ సంస్కృతి కారణంగా పెద్ద ఎత్తున సామాజీకరణ పెరగటంతో ఈ భావజాలం విశాల ఆమోదం పొందింది, ఇప్పుడది రానున్న తరాలకు ఒక పటిష్టమైన ఓటు తరగతిగా మారుతోంది, గతంలో సోషలిస్టు ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు విరుచుకుపడినట్లుగా అదే పద్దతుల్లో అమెరికా ఇప్పుడు చేయలేదు అని సర్వేపై విశ్లేషణ చేసిన ఒక రచయిత పేర్కొన్నాడు.
అమెరికాలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా సెనెటర్‌, తాను సోషలిస్టు అని చెప్పుకున్న బెర్నీ శాండర్స్‌ పోటీ పడ్డారు. చివరకు హిల్లరీ క్లింటన్‌ వైపు ఆ పార్టీ మొగ్గింది. తిరిగి ఈ సారి కూడా 78 సంవత్సరాల బెర్నీ శాండర్స్‌ పోటీ పడుతున్నారు. చివరకు ఏమి జరుగనుందో తెలియదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే గత ఎన్నికల్లో బెర్నీ శాండర్స్‌ రంగంలో లేనందుకు యువత నిరాశ చెందలేదు, తరువాత జరిగిన అనేక సర్వేలలో సోషలిజం పట్ల ఆకర్షితులౌతున్నవారి శాతం పెరుగుతోందే తప్ప తగ్గలేదు. ఎందుకీ పరిణామం అంటే పెట్టుబడిదారీ విధాన వైఫల్యం, దాని పట్ల మోజు తగ్గటమే కారణం. అయితే నాలుగు పదులు దాటిన వారిలో అత్యధికులు పెట్టుబడిదారీ విదానం పట్ల ఇంకా మొగ్గు చూపుతూనే ఉన్నారు. చదువుకోసం చేసిన రుణాలు గుదిబండలుగా మారటం, వేతనాల స్థంభన ముఖ్యమైన కారణాలుగా చెబుతున్నారు.జడ్‌ తరం, మిలీనియల్స్‌లో అత్యధికులు తాము సోషలిస్టు అభ్యర్ధికే ఓటు వేస్తామని ఎటు తిప్పి ఎటు ప్రశ్నించినా ప్రతి సర్వేలో చెబుతున్నారు.
సూపర్‌ మనీ అనే సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 1974 నుంచి 2017 మధ్యకాలంలో 24-34 సంవత్సరాల వారికి ద్రవ్యోల్బణ సవరింపు తరువాత వార్షిక సగటు నిజవేతనాలు 35,426 నుంచి 35,455 డాలర్లకు అంటే కేవలం 29 డాలర్లు మాత్రమే పెరిగాయి. అదే కాలంలో 35-44 సంవత్సరాల వారికి 2,900 డాలర్లు, 45-54 వారికి 5,400 డాలర్లు పెరిగాయి. పెరుగుతున్న జీవన వ్యయంతో పోల్చితే వేతనాల పెరుగుదల అన్ని వయస్సుల వారిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ యువతరంలో మరింత ఎక్కువగా ఉంది. స్టూడెంట్స్‌ లోన్‌ హీరో సంస్ధ విశ్లేషణ ప్రకారం అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ట్యూషన్‌ ఫీజు 1980 -2018 మధ్య కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 213, ప్రయివేటు కాలేజీల్లో 129శాతం పెరిగింది. విద్యకోసం చేసిన రుణాల మొత్తం 1.5లక్షల కోట్ల డాలర్లు, అంటే సగటున 29,800 డాలర్లు. అప్పుచేసి డిగ్రీ సంపాదించి ఉద్యోగం పొంది రుణం తీర్చుదామని వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయని సగం మంది మిలీనియల్స్‌ అభిప్రాయపడుతున్నారు. నలభై సంవత్సరాలలో ఇండ్ల ధరలు నలభైశాతం పెరిగాయి. వాయిదాలు చెల్లించలేమనే భయంతో ఇళ్లు కొనుక్కోవటాన్ని కూడా వారు వాయిదా వేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నవారిని చూసిన తరువాత అసలు తమకు పిల్లలు వద్దని 13శాతం అమెరికన్లు భావిస్తున్నట్లు గతేడాది న్యూయార్క్‌ టైమ్స్‌ సర్వే పేర్కొన్నది. అన్ని రకాల జీవన వ్యయం పెరగటం, అందుకు అనుగుణ్యంగా ఆదాయాలు పెరగకపోవటంతో ఓటర్లు వామపక్ష భావజాల అభ్యర్దులవైపు మొగ్గుతున్నారని వ్యాఖ్యాతలు నిర్ధారణకు వస్తున్నారు.
డెమోక్రటిక్‌ పార్టీనేత బెర్నీ శాండర్స్‌ తన ప్రచారంలో ఆర్ధిక అసమానతల తగ్గింపు, అందరికీ వైద్యం, ధనికులపై పన్ను పెంపు వంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ ఇతర నేతలు కూడా ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్య, విద్యార్ధి రుణాల రద్దు, పిల్లలందరికీ సామూహిక ఆరోగ్యబీమా వంటి అంశాలను ప్రస్తావించక తప్పటం లేదు. ట్రంప్‌ ప్రభుత్వం విద్యార్ధి రుణాల వ్యవస్ధను మౌలికంగా దెబ్బతీసిందని విమర్శిస్తూ ఆ విభాగంలో పని చేస్తున్న అధికారి ఏ వేయనె జాన్సన్‌ గతేడాది నవంబరులో రాజీనామా చేశాడు.
అమెరికా యువత సోషలిజం పట్ల మక్కువ చూపటానికి కారణం ఏమంటే కాలేజీల్లో ప్రొఫెసర్లలో ఎక్కువ మంది వామపక్ష భావాలు కలిగి ఉండటం అని కొంత మంది తడుముకోకుండా వెంటనే చెప్పేస్తారు. ఎక్కడైనా కొన్ని సంస్ధలలో ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు, యావత్‌ దేశమంతటా అదే పరిస్ధితి ఉందా ? స్వేచ్చా మార్కెట్‌ను సమర్ధించే ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ గ్లాసెర్‌ ఈ అభిప్రాయాన్ని పూర్వపక్షం చేశారు. అనేక విధాలుగా ఆధునిక అమెరికా ఆర్ధిక వ్యవస్ధ యువత సంక్షేమానికి అనుగుణ్యంగా పని చేయటం లేదు. అనేక ప్రభుత్వ విధానాలు ఉద్యోగం పొందాలంటే ఆటంకంగా ఉన్నాయి, డబ్బు పొదుపు చేసుకోవాలన్నా , ఇల్లు కొనుక్కోవాలన్నా కుదరకపోవటం యువతరాన్ని ఆదర్శభావజాలం గురించి ఆలోచింపచేస్తున్నది, ఒకసారి సోషలిజం ఎలా ఉంటుందో ఎందుకు ప్రయత్నించి చూడకూడదు అనుకుంటున్నారని గ్లాసెర్‌ అంటున్నారు. ప్రచ్చన్న యుద్ద సమయంలో సోషలిజం గురించి చర్చ ఉండేది కాదు, ఎందుకంటే దాన్ని ఒక దుష్ట ప్రభుత్వంగా చూసి వ్యతిరేకించాము. సోవియట్‌ యూనియన్‌లో పేదరికం, అణచివేత కారణంగా ఆ వ్యవస్ధ ఆచరణ సాధ్యం కాదని భావించాము. ఆ జ్ఞాపకాలు లేనివారికి, ప్రస్తుతం 30 సంవత్సరాల లోపు ఉన్న అందరికీ అలాంటిది లేదు అని గ్లాసెర్‌ వాపోయాడు.

Image result for Pedro Sanchez
” స్పెయిన్‌లో మార్క్సిస్టు కమ్యూనిజం పునర్జన్మించింది ”
కమ్యూనిస్టు వ్యతిరేకులు పురోగామి శక్తుల ఉనికిని సహించలేకుండా ఉన్నారు.” బెర్లిన్‌ గోడ కూల్చివేతతో నాశనం అయిందనుకున్న మార్క్సిస్టు కమ్యూనిజం తిరిగి ఆవిర్భవించింది, స్పెయిన్‌లో పాలన సాగించటం ఖాయం, నవంబరులో సంకీర్ణ కూటమి ఎన్నికైనపుడు అనుకున్న లేదా విశ్వసించిన దాని కంటే పరిస్ధితి ఇప్పుడు మరింత తీవ్రంగా ఉంది ” అని స్పానిష్‌ బిషప్పుల సంఘం ఉపాధ్యక్షుడు కార్డినల్‌ ఆంటోనియో కానిజారెస్‌ లొవెరా వ్యాఖ్యానించాడు. ఈనెల 11న మత వెబ్‌ సైట్‌లో పోస్టు చేసిన లేఖలో ఈ అభిప్రాయాలను వెల్లడించాడు. వెనిజులా వంటి లాటిన్‌ అమెరికా దేశాల తప్పుల తడకలతో ఉన్న సోషలిస్టు విధానాలను దాదాపుగా స్పెయిన్‌ కాపీ చేస్తున్నదని భావిస్తున్నారు. స్పెయిన్‌ను స్పెయిన్‌గా ఉంచకుండా ఒక ప్రయత్నం జరుగుతోందని ఎంతో బాధతో చెబుతున్నా మరియు హెచ్చరిస్తున్నా. అంతర్యుద్ధం తరువాత నియంత్రత్వం నుంచి ప్రజాస్వామ్యానికి మారాలన్న స్ఫూర్తి ఖాళీ అయింది, మరచిపోయారు. ఎల్లవేళలా విభజించే మరియు ఎన్నడూ ఐక్యం కానివ్వని భావజాలంతో నింపేస్తున్నారు అని ఆరోపించాడు. మరుసటి రోజు మరొక ఆర్చిబిషప్‌ జీసస్‌ శాంజ్‌ మాంటెస్‌ మరొక లేఖ రాస్తూ చరిత్రలో దేశం మరొక తీవ్ర పరిస్ధితిలోకి పోతున్నదని, వివిధ పద్దతుల్లో స్వేచ్చను పరిమితం చేస్తున్నారని ఆరోపించాడు.ఈ నెల ఎనిమిది పోడెమాస్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సోషలిస్టు పార్టీ నేత పెడ్రో శాంఛెజ్‌ ప్రధానిగా పదవీ స్వీకారం చేస్తూ సాంప్రదాయకమైన శిలువ, బైబిల్‌ మీద ప్రమాణం చేసేందుకు తిరస్కరించాడు. పాఠశాల విద్య పాఠ్యాంశాల నుంచి మతాన్ని తొలగించటంతో సహా లౌకిక విధానాల అజెండాను అమలు జరుపుతామని ప్రకటించాడు. అంతే కాదు, గతంలో అక్రమంగా చర్చ్‌లకు దఖలు పరచిన ఆస్తులను జాతీయం చేస్తామని, విద్యార్ధులకు లైంగిక విద్యను బోధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యలు సహజంగానే చర్చ్‌కు ఆగ్రహం కలిగిస్తున్నాయని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి సోషలిస్టు పార్టీ గతంలో కూడా అధికారంలోకి వచ్చింది. కొన్ని పురోగామి సంస్కరణలు తప్ప అదేమీ విప్లవకార్యాచరణను చేపట్టటం లేదు. అయినా మతం ఆగ్రహిస్తోంది.

Image result for chin peng
మలేసియాను భయపెట్టిన కమ్యూనిస్టు చితా భస్మం !
కమ్యూనిస్టు వ్యతిరేకులకు కమ్యూనిస్టులే కాదు చివరకు వారి చితా భస్మం కూడా భయపెడుతోందా ? అవును మలేషియాలో అదే జరిగింది. వృద్ధాప్యంతో మరణించిన పూర్వపు మలేషియా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్‌ పెంగ్‌ చివరి కోర్కె మేరకు ఆయన మరణించిన ఆరు సంవత్సరాల తరువాత థారులాండ్‌ నుంచి తెచ్చిన చితాభస్మాన్ని సముద్రంలోనూ, పెంగ్‌ సాయుధపోరాటం సాగించిన అడవుల్లోనూ గతేడాది సెప్టెంబరు 16న చల్లినట్లు ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఈ వార్తతో పాటు 1989లో సాయుధ పోరాటాన్ని విరమించి మూడు దశాబ్దాలు గడిచిన సందర్భంగా దానితో సంబంధం ఉన్న వారు, దాని గురించి తెలిసిన వారు మలేషియాలో కొన్ని చోట్ల సభలు జరిపారని మీడియా పేర్కొన్నది. వారిలో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంకే ముంది ఇవన్నీ మలేషియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని కఠినంగా అణచివేయాలని మాజీ పోలీసు, పారా మిలిటరీ అధికారుల సంఘాల నాయకత్వంలో ప్రదర్శనలు చేసి, చితాభస్మం తెచ్చిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే తొమ్మిది సంస్ధలకు చెందిన వారు ఆ సభలో పాల్గొన్నట్లు, వారి నుంచి పోలీసులు సంజాయిషీ కోరి నట్లు వార్తలు వచ్చాయి. బ్రిటీష్‌ పాలనలోని పూర్వపు మలయా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారు. తరువాత స్వాతంత్య్రం వచ్చి మలయా, మలేషియాగా రెండు దేశాలు ఏర్పడిన తరువాత కమ్యూనిస్టులు మలేషియాలో విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 1968 నుంచి 1989వరకు పోరాడారు. ఆ ఏడాది మలేషియా సర్కార్‌తో పోరు విరమణకు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు పార్టీ నేత చిన్‌ పెంగ్‌ థారులాండ్‌లో ఆశ్రయం పొంది 2013లో అక్కడే 90 ఏండ్ల వయస్సులో మ రణించారు. ఒప్పందం మేరకు మలేషియాకు తిరిగి వచ్చేందుకు అనుమతించిన నేతలు తిరిగి పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ అండతోనే పోలీసులు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు.

(Reuters/edited by Ricardo Vaz for Venezuelanalysis.com)
పరువు పోగొట్టుకున్న వెనిజులా ప్రతిపక్ష నేత గుయడో !
గత సంవత్సరం లాటిన్‌ అమెరికా పరిణామాలను గుర్తుకు తెచ్చుకుంటే అరవైకి పైగా దేశాలు వెనిజులా అసలైన అధ్యక్షుడిగా గుర్తించిన జువాన్‌ గుయడో ఈనెల మొదటి వారంలో పరువు పోగొట్టుకొని అపహాస్యం పాలయ్యాడు. అధ్యక్షుడు మదురో ఎత్తుగడకు చిత్తయి గిలగిలా కొట్టుకుంటున్నాడు.2018 వెనిజులా ఎన్నికల్లో అధ్యక్షుడిగా సోషలిస్టు నికోలస్‌ మదురో ఎన్నికైనా, అంతకు ముందు పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లను తెచ్చుకోవటంలో సోషలిస్టు పార్టీ విఫలమైంది. దాంతో ప్రతిపనికీ ప్రతిపక్షం అడ్డం పడటంతో పాటు గతేడాది పార్లమెంట్‌ స్పీకర్‌గా ఉన్న ప్రతిపక్ష జువాన్‌ గుయడో తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. పొలో మంటూ అమెరికా కనుసన్నలలో నడిచే అరవైకిపైగా దేశాలు గుర్తింపును ప్రకటించాయి. మిలిటరీలో తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చేసిన యత్నం కూడా విఫలమైంది. ఇదే మరొక దేశంలో అయితే అందుకు పాల్పడిన వారిని కాల్చివేయటం లేదా కటకటాల వెనుక ఉంచుతారు. జనం, మిలిటరీ, పోలీసు, పారా మిలిటరీ మద్దతు ఉన్న సోషలిస్టు మదురో అలాంటి చర్యలకు పాల్పడకుండా అతడి వలన ప్రమాదం లేదనే అంచనా, ఇతర కారణాలతో గుయడోను స్వేచ్చగా తిరగనిస్తున్నారు.
అమెరికాతో సహా దాని మిత్ర దేశాలన్నీ మదురోను ఇప్పటికీ అధ్యక్షుడిగా గుర్తించటం లేదు గానీ పార్లమెంట్‌ను గుర్తిస్తున్నాయి.ఈనెల ఐదున పార్లమెంట్‌ స్పీకర్‌ ఎన్నిక జరిగి, దానికి తిరిగి గుయడో ఎన్నికైతేనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా అమెరికా కూటమి గుర్తింపు ఉంటుంది. గుయడోను తిరిగి ఎన్నుకొనే పరిస్ధితి లేదు. అయితే ఏదో ఒకసాకుతో పార్లమెంట్‌ను బహిష్కరిస్తే అధికారపక్షం నుంచి లేదా దాని మద్దతు ఉన్నవారు స్పీకర్‌ అవుతారు. గత ఏడాదిలో జరిగిన పరిణామాలలో ప్రతిపక్ష పార్టీలలో చీలిక వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని మదురో ప్రధాన ప్రతిపక్షాన్ని చావు దెబ్బతీశాడు. జనవరి ఐదో తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా భద్రతా దళాలు తనను పార్లమెంట్‌లో ప్రవేశించనివ్వకుండా అడ్డుకుంటున్నాయంటూ గుయడో కేకలు వేస్తూ తన మద్దతుదార్ల వీపుల మీద ఎక్కి పార్లమెంట్‌ గేట్‌ దూకుతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు ఫోజులిచ్చాడు. నిజానికి అతగాడి ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఎన్నికలో చీలిక పక్షనేతకు అధికారపక్షం మద్దతు ఇవ్వటంతో గుయడో ఓడిపోయాడు. తరువాత తన మద్దతుదారులతో తనకు వత్తాసు పలికే ఒక మీడియా కార్యాలయంలో స్పీకర్‌ ఎన్నిక తతంగాన్ని నిర్వహించి తిరిగి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నాడు. ఇది అమెరికాను కూడా ఇరకాటంలో పడేసింది. త్వరలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొనాలా వద్దా అన్న మీమాంసలో ప్రతిపక్షాలు పడ్డాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పార్లమెంట్‌ ఎన్నికలకు దూరంగా ఉంటే సోషలిస్టులు దానిలో మెజారిటీ సాధించి మరింత బలపడతారు. విఫల తిరుగుబాట్ల నేపధ్యంలో పోటీ చేస్తే తిరిగి గెలుస్తామన్న ధైర్యమూ ప్రతిపక్షానికి లేదు.
పైన పేర్కొన్న పరిణామాలను చూస్తే దుష్ట పెట్టుబడిదారీ వ్యవస్ద దోపిడీ కొనసాగినంత కాలం, ఎదురు దెబ్బలు తగిలినా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు వాటిని తట్టుకొని ముందుకు పోతాయి, అంతకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నిరాశావాదులు అరగ్లాసు నీటిని చూసి అయ్యోపూర్తిగా నిండలేదే కూలబడితే, ఆశావాదులు సగం గ్లాసు నిండిందనే ధీమాతో ముందుకు పోతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందే వెల్లడైన వెనెజులా ప్రతిపక్ష కుట్ర !

06 Monday May 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

“Operation Liberty”, cia, Juan Guaidó, Nicolás Maduro, operation liberty coup, Venezuela

Image result for operation liberty coup unveiled weeks before

ఎం కోటేశ్వరరావు

వెనెజులా పరిణామాలు 2

ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీన జరిపిన తిరుగుబాటు యత్నం విఫలం కావటంతో ఇప్పుడు వెనెజులా ప్రతిపక్ష నేత జువాన్‌ గుయ్‌డో అమెరికా ప్రత్యక్షంగా మిలిటరీ జోక్యంచేసుకోవాలని కోరుతున్నాడు. తమ నడకలో ఎలాంటి తడబాట్లు లేవని, మిలిటరీ జోక్యంతో సహా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా ప్రకటించింది. మరోవైపు గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని కారకాస్‌లోని స్పెయిన్‌ రాయబారి ఇంట్లో ఆశ్రయం పొందిన ప్రతిపక్ష నేత లియోపాల్డ్‌ లోపెజ్‌ను అరెస్టు చేయాలని వెనెజులా సర్కార్‌ నిర్ణయించింది. అతను రాజకీయ ఆశ్రయం కోరలేదని తాము ఆతిధ్యం మాత్రమే ఇస్తున్నామని స్పెయిన్‌ ప్రకటించింది.

వెనెజులా వ్యవహారాల్లో అమెరికా జోక్యం నిత్యకృత్యం అన్న విషయం తెలిసినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త పధకాలు వేస్తూనే వుంటారు. ఆపరేషన్‌ లిబర్జీ పధకం కూడా అలాంటిదే. మధ్యంతర అధ్యక్షుడిగా జువాన్‌ గుయ్‌డో ప్రకటించుకోవటం, అతగాడి ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు అమెరికా, దాని కనుసన్నలలో నడిచే దేశాలతో దాన్ని గుర్తింప చేయటం, మదురో సర్కార్‌ నియమించిన రాయబారులను గుర్తించటం లేదని ప్రకటించటం వగైరాలన్నీ అంతర్జాతీయంగా వెనెజులాలో ప్రభుత్వం మారిపోయిందని, మదురో ఇంకేమాత్రం అధ్యక్షుడు కాదని ప్రపంచాన్ని నమ్మింపచేయటం ఈ పధకంలో భాగమే. దీన్ని అనేక దశల్లో అమలు జరిపారు. విఫలమైన అంకం ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి దేశంలో అంతర్గతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేయటం, మిలిటరీని తన వైపు రమ్మని కోరటం, తిరుగుబాటు చేయాలని అమెరికా పిలుపు ఇవ్వటం వంటి వన్నీ దానిలో భాగమే. కుట్రను గొప్పగా రూపొందించిన వారికి దాన్ని అనుసరించటానికి వెనెజులా జనం సిద్ధంగా లేరనే స్పృహ లేదు. అక్కడే పప్పులో కాలేశారు.

ఈ పధకంలో భాగంగా అమలు జరపాల్సిన వాటి మీద అమెరికాకు చెందిన సిఐఏ, యుఎస్‌ ఎయిడ్‌, ఎన్‌ఇడి వంటి వాటికి బాధ్యతలు అప్పగించారు. యుఎస్‌ ఎయిడ్‌ రూపొందించిన పలు దేశాలకు రూపొందించిన కార్యాచరణ పధకానికి సంబంధించిన పత్రం ఫిబ్రవరిలోనే వెల్లడైంది. ఆ సంస్ధకు అనుబంధంగా పనిచేసే ‘ యుఎస్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ లాబ్‌ ‘ 75పేజీల పత్రాన్ని రూపొందించింది. దానికి రాపిడ్‌ ఎక్స్‌పెడిషనరీ డెవలప్‌మెంట్‌(ఆర్‌ఇడి)(రెడ్‌) టీమ్స్‌: డిమాండ్‌ అండ్‌ ఫీజ్‌బులిటీ అని పేరు పెట్టింది.( వేగంగా దండయాత్ర నిర్వహించే బృందాలు: అవసరం మరియు సాధ్యాసాధ్యాలు) ఈ నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం వివిధ దేశాలలో రహస్య కార్యకలాపాలు నిర్వహించే సామర్ధ్యం గురించి అమెరికా మిలిటరీ, గూఢచార తదితర అధికారులు నివేదికను రూపొందించిన వారిని ఇంటర్వ్యూ చేశారు. ఒక్కో బృందం ఇద్దరిద్దరితో వుండాలని, ఎదురుదాడి, ఆత్మరక్షణ పద్దతులను, ప్రతికూల పరిస్ధితుల్లో ఎలా పని చేయాలో వాటికి నేర్పాలని అవి అమెరికా ప్రత్యేక దళాలు(ఎస్‌ఎఫ్‌) మరియు సిఐఏ పర్యవేక్షణలో పని చేయాలని నిర్దేశించారు. ఇవి స్ధానిక సామాజిక తరగతుల మధ్య అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. స్ధానికంగా వున్న పరిస్దితులను గమనించటం వాటికి అనుగుణంగా వెంటనే స్పందించి పధకాలు రూపొందించటం, నిధులు అందచేయటం, చిన్న చిన్న కార్యకలాపాల నిర్వహణ చేస్తాయి. వీటిలో సామాజిక కార్య క్రమాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే పేరుతో బోధలతో పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించటం కూడా వుంటాయి. దేశమంతటా స్వేచ్చ మరియు సహాయ కమిటీలను దేశ వ్యాపితంగా ఏర్పాటు చేయాలి. రెడ్‌ టీమ్స్‌ పైకి వుత్ప్రేరకాలుగా కనిపించాలి, వాటికి సామాజిక తరగతులను సమీకరించే పద్దతులు, చిట్కాలతో పాటు ఎదురుదాడి, ఆత్మ రక్షణకు ఆయుధాలను ఎలా వినియోగించాలో కూడా శిక్షణ ఇస్తారు. వారు స్ధానికులతో సంబంధాలను నెలకొల్పుకొని వారి ద్వారా మరికొందరిని ప్రభావితం చేసేందుకు, ప్రలోభపరచేందుకు వారి బలహీనతలను గుర్తించి డబ్బు,ఇతర వాటిని ఎరవేస్తారు. ఒకసారి వారి వలలో చిక్కిన తరువాత తమకు నిర్ధేశించిన రహస్యకార్యకలపాలలో నిమగ్నం చేస్తారు. ఈ అంశాలన్నీ ప్రతి దేశంలో అమలు జరపాల్సిన నమూనాలో భాగం. ఈ పధకాన్ని దక్షిణ అమెరికా దేశాలన్నింటా అమలు జరపాలి. ముందుగా అమెరికా పట్ల సానుకూలంగా వుండే ప్రభుత్వాలున్న దేశాలను ఎంచుకోవాలి. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు జరిపేందుకు బ్రెజిల్‌ను ఎంచుకోవాలని సూచించారు.

ఈ ఏడాది జనవరిలో బ్రెజిల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఫాసిస్టు జెయిర్‌ బల్‌సానారో అమెరికాతో సంబంధాల ఏర్పాటు గురించి బహిరంగంగానే చెప్పాడు. సిఐఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తొలి బ్రెజిల్‌ అధ్యక్షుడయ్యాడు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ గతం కంటే తమ మధ్య సంబంధాలు బలపడ్డాయని, బ్రెజిల్‌ నాటోలో చేరాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తరువాత బొల్‌సానారో ఫిబ్రవరిలో ఒక ప్రకటన చేస్తూ తమ గడ్డ మీద నుంచి అమెరికా మరో దేశంలో సైనిక జోక్యం చేసుకోవటాన్ని తాము అనుమతించబోమని ప్రకటించాడు. అయితే తండ్రికి సలహాదారు, పార్లమెంట్‌ సభ్యుడైన ఎడ్వర్డ్‌ బొల్‌సానారో మార్చినెలలో మాట్లాడుతూ ఏదో ఒక సమయంలో వెనెజులాలో సైనిక జోక్యం అవసరమని, అన్ని అవకాశాలున్నాయని చెప్పాడు. అయితే బ్రెజిల్‌ నుంచి ప్రత్యక్ష జోక్యం చేసుకొనే అవకాశం లేకపోతే అక్కడి నుంచి రెడ్‌ బృందాలు రహస్య కార్యకలాపాలను నిర్వహించాలని సిఐఏ సూచించింది.

Image result for Venezuela 2 : operation liberty coup unveiled weeks before

నివేదికలో వెనెజులాలో నిర్వహించాల్సిన అంశాలను కూడా అనుబంధాలలో పొందుపరిచారు. ఏప్రిల్‌ ఆరవ తేదీన ఆపరేషన్‌ ఫ్రీడమ్‌ లేదా లిబర్టీ ప్రారంభమౌతుందని వాటిలో పేర్కొన్నారు. కాన్వాస్‌ అనే సంస్ధ అమెరికా నిధులతో వెనెజులాలో ప్రతిపక్ష పాత్రను ఎలా పోషించాలో జువాన్‌ గుయ్‌డోకు శిక్షణ ఇచ్చింది. దేశంలోని కీలకమైన వ్యవస్ధలను ధ్వంసం చేయటం ద్వారా మదురో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తిని రెచ్చగొట్టటం వాటిలో ఒకటి. దానికి అనుగుణంగానే కొద్ది వారాల క్రితం వెనెజులా విద్యుత్‌ వ్యవస్ధను దెబ్బతీసి అంధకారం గావించిన విషయం తెలిసిందే. ఇలాంటి సలహాలు, ఎత్తుగడలు అమెరికా జోక్యం చేసుకొనే అన్నిదేశాలకూ సూచించారు. చిత్రం ఏమిటంటే వుదాహరణకు అని చెప్పినట్లుగా వెనెజులాలోని గౌరి డామ్‌ వద్ద వున్న సైమన్‌ బోలివర్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని దెబ్బతీస్తే పర్యవసానాలు ఎలా వుంటాయో వివరించారు.

ఆపరేషన్‌ లిబర్టీలో ఒక అంశం నిర్ణయాత్మక దశ అని పేరు పెట్టారు. దాన్ని ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీల్లో అమలు జరపాలని చూశారు. దాని ప్రకారం ఏం జరిగిందో కొందరు ప్రత్యక్ష సాక్షుల వివరణ సారాంశం ఇలావుంది.ఆపరేషన్‌ లిబర్టీలో భాగంగా ఏప్రిల్‌ 30వ తేదీ తెల్లవారు ఝామున 5.46 నిమిషాలకు కొంత మంది సైనికుల రక్షణగా కెమెరా ముందు నిలబడిన లియోపాల్డ్‌ లోపెజ్‌ మాట్లాడుతూ పౌరులు వీధుల్లో ప్రదర్శనలుగా రావాలని, జువాన్‌ గుయ్‌డో వేచి వున్న లా కార్లోటా వైమానిక స్ధావరం వద్ద అందరం కలసి అక్కడి నుంచి మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కదులుదామని చెప్పాడు. ఆ తరువాత అర్ధగంటకు తాను నిర్బంధం నుంచి విముక్తి అయ్యానని, గుయ్‌డోకు విధేయులుగా వున్న సైనికులు తనను విడిపించారని ఇది నిర్ణయాత్మక దశ అని విజయానికి ఇదే తరుణం అన్నాడు. కొద్ది సేపటికి తాను వైమానిక స్ధావరం వద్దకు వచ్చానని చెప్పాడు. అయితే పంపిన ఫొటోలు దాని వెలుపల రోడ్డుమీదివి తప్ప మరొకటి కాదు. వుదయం 8.30కు తుపాకి కాల్పులు వినిపించాయి. ఎవరు ఎవరి మీద కాల్చారో తెలియని స్ధితి. మధ్యాహ్నానికి రోడ్ల మీద కొన్ని వుందల మందే వున్నారు. అక్కడి నుంచి ప్రదర్శన జరుపుదామని గుయ్‌డో, లోపెజ్‌ జనంతో చెప్పారు. ఆ సమీపంలోనే అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌, తదితర ప్రభుత్వ భవనాలు వున్నాయి. అటువైపు ప్రదర్శన సాగాలని చెప్పిన తరువాత భద్రతా దళాలు ప్రదర్శకులను అడ్డుకున్నాయి. రెండు గంటల సమయంలో నేషనల్‌గార్డ్స్‌, బొలివేరియన్‌ పోలీస్‌లు ప్రదర్శకులపై కాల్పులు జరిపారు. కొద్ది మంది గాయపడటం తప్ప ఎవరూ మరణించలేదు. సాయంత్రానికి కొద్ది మంది నిరసనకారులు అక్కడే వున్నారు.ఎక్కువ మంది వెళ్లిపోయారు.

తన ప్రయత్నం విఫలమైందని అర్ధం కాగానే గుయ్‌డో మే ఒకటవ తేదీన పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చాడు. మరోవైపు లోపెజ్‌ కారకాస్‌లోని చిలీ రాయబార కార్యాలయంలో వున్న తన భార్యాబిడ్డలను తీసుకొని స్పానిష్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి ఆశ్రయం కోరాడు. అయితే వారు కార్యాలయానికి బదులు రాయబారి ఇంట్లో రక్షణ ఇచ్చారు. వారం రోజులుగా ఇప్పటికి అక్కడే వున్నాడు. ఇరవై అయిదు మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. గుయ్‌డో గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయాడు. తొలి రోజు ఒకడు మరణించినట్లు,59 మంది గాయపడినట్లు వార్తలు వచ్చాయి. రెండవ రోజు మే డే నాడు కొన్ని చోట్ల గుయ్‌డో మద్దతుదార్లు ఘర్షణలకు దిగారు. పోలీసు కాల్పుల్లో ఒక యువతి గాయపడి తరువాత ఆసుపత్రిలో మరణించింది. అంతకు ముందు రోజు రాత్రే తిరుగుబాటును అణచివేసినట్లు మదురో ప్రకటించాడు. మే డే రోజున పెద్ద ఎత్తున ఆయన మద్దతుదార్లు వీధుల్లో అనేక చోట్ల ప్రదర్శనలు జరిపారు. తిరుగుబాటుదార్లు, వారి నేతలు గుయ్‌డో, లోపెజ్‌ల పట్ల మదురో సర్కార్‌ ఎంతో సంయమనం పాటించిందన్నది స్పష్టం. లేకుంటే వారు అంత స్వేచ్చగా కారకాస్‌ శివార్లలో తిరిగే వారు కాదు. తప్పుదారి పట్టిన పౌరుల పట్ల కూడా భద్రతా దళాలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. భారీ ఎత్తున కాల్పులు జరిగాయని పశ్చిమ దేశాల మీడియా వార్తలు ఇచ్చింది. అయితే తరువాత అందుకు తగిన ఆధారాలు లేకపోవటంతో గప్‌చుప్‌ అయ్యాయి. తరువాత ఏమిటి అంటూ సమస్యను పక్కదారి పట్టించే కధనాలను ఇస్తున్నాయి. మచ్చుకు ఒకదాన్ని చూస్తే చాలు.

Image result for operation liberty coup

వెనెజులా పౌరులు పోగొట్టుకున్న తమ స్వాతంత్య్రం కోసం వీధుల్లోకి పెద్ద ఎత్తున వచ్చివుంటే ఎందరో మరణించి వుండేవారు. ఛావెజ్‌ను ఎన్నుకొని వారు పెద్ద తప్పు చేశారు. ఇరవై ఏండ్ల సోషలిజపు వినాశకర ప్రభావాలను చూస్తున్నారు. దశాబ్దకాలంగా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. ప్రజాస్వామిక స్వేచ్చలను అణచివేశారు. భావ ప్రకటనా స్వేచ్చ, స్వతంత్ర మీడియా అదృశ్యమైంది. సమాజంలోని ప్రతి స్ధాయిలో క్యూబా గూఢచారులను నింపివేశారు. దేశాన్ని ఒక పోలీసు రాజ్యంగా మార్చివేశారు. చివరకు మదురో వ్యక్తిగత అంగరక్షకులుగా భారీ సంఖ్యలో రష్యన్‌ సాయుధులు వచ్చారు. వెనెజులా మిలిటరీ ప్రస్తుత నాయకత్వాన్ని బలపరచి ప్రయోజనం లేదని గ్రహించి తిరుగుబాటు చేసే వరకు రష్యా, చైనా మదురోకు మద్దతు ఇస్తూనే వుంటాయి. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పటం తొందరపాటు అవుతుంది.

ఇలా చెత్త రాతలన్నీ రాస్తున్నాయి. వాటన్నింటినీ దేవదూతల సందేశాలుగా భావించిన వారు ప్రచారంలో పెడుతున్నారు. ఆపరేషన్‌ లిబర్టీ కుట్ర ముందే వెల్లడి కావటంతో మదురో సర్కార్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవటం కూడా జయప్రదంగా దాన్ని తిప్పి కొట్టటానికి దోహదం చేసిందనవచ్చు. వాస్తవం ఏమిటో అనుభవించిన వారికి స్పష్టంగా తెలుసు, ప్రతిపక్ష నాయకుల గురించి కూడా వారికి చెప్పనవసరం లేదు. అయితే అమెరికన్లు తెగించి ప్రత్యక్ష సైనిక చర్యకు పాల్పడతారా, మరోసారి మిగతా దేశాలలో మాదిరి చేతులు కాల్చుకుంటారా అన్నది వచ్చే ఎన్నికలలో లబ్ది కోసం డోనాల్ట్‌ ట్రంప్‌ చేసే పిచ్చి ఆలోచనలను బట్టి వుంటుంది. ఒక వేల ప్రత్యక్ష జోక్యం చేసుకుంటే అది లాటిన్‌ అమెరికాలో, ప్రపంచంలో మరో కొత్త పరిణామాలకు నాంది అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘ ఆపరేషన్‌ లిబర్టీ ‘కుట్ర విఫలంపై మీడియా మూగనోము !

05 Sunday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

“Operation Liberty”, Juan Guaidó, Media’s Propaganda Campaign Against Venezuela’s Government, Nicolás Maduro, Nicolás Maduro Moros, Propaganda War, Venezuela

Image result for venezuela 1: mainstream media ignores failed coup

వెనెజులా పరిణామాలు -1

ఎం కోటేశ్వరరావు

ఏప్రియల్‌ 30వ తేదీన వెనెజులా వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ‘ ఆపరేషన్‌ లిబర్టీ ‘ (స్వేచ్చా ప్రక్రియ) పేరుతో అమలు జరపతలచిన కుట్రను మొగ్గలోనే నికోలస్‌ మదురో సర్కార్‌ తుంచివేసింది. ఇదెంత ప్రాధాన్యత కలిగిన అంశమో అమెరికా మరోసారి పచ్చి అబద్దాల కోరు అని ప్రపంచముందు బహిర్గతం కావటం కూడా అంతే ప్రాధాన్యత కలిగి వుంది. కూల్చివేత ప్రయత్నాల వార్తలకు అంతర్జాతీయ మీడియా ఇచ్చిన ప్రాధాన్యత దాని తుంచివేతకు ఎందుకు ఇవ్వలేదో నిజాయితీగా ఆలోచించే వారు అర్ధం చేసుకుంటారు. వెనెజులా మీద ఇప్పుడు బహుముఖ దాడి జరుగుతోంది. దానిలో ఆర్ధిక దిగ్బంధనం, ప్రచారదాడి, మతాన్ని వినియోగించటం, మిలిటరీని, జనాన్ని అంతర్గత తిరుగుబాట్లకు రెచ్చగొట్టటం ఇలా అనేక రకాలుగా సాగుతోంది. ఇది ఈ నాటిది కాదు, ఇప్పటితో అంతమయ్యేది కాదు. ఇది ఒక్క వెనెజులాకే పరిమితం కాదు. తనను రాజకీయంగా వ్యతిరేకించే వారు ఎక్కడ అధికారానికి వస్తే అక్కడ వారిని కూల్చివేయటం, ఆయా దేశాలు, ప్రాంతాలను ఆక్రమించకోవటం లేదా తన ఆధిపత్యం కిందకు తెచ్చుకోవటం అమెరికాకు నిత్యకృత్యం.

ఐరోపో నుంచి వలస వెళ్లిన వివిధ దేశాలకు చెందిన వారు స్ధానిక రెడ్‌ ఇండియన్లను అణచివేసి నేడు అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పరిగణించబడుతున్న, ఇతర అమెరికా ఖండ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అవి వివిధ ఐరోపా దేశాల వలస ప్రాంతాలుగా మారాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మెజారిటీ ప్రాంతాలు(అమెరికా) బ్రిటీష్‌ పాలనలో వున్నాయి. తమకు తామే పరిపాలించుకొనే శక్తి వచ్చింది కనుక బ్రిటీష్‌ పెత్తనం ఏమిటంటూ వలస వచ్చిన వారు చేసిన తిరుగుబాటు కారణంగానే 1776లో అమెరికాకు స్వాతంత్య్రం వచ్చింది. అంతర్యుద్ధం ముగిసి కుదుట పడిన తరువాత వారే తొలుత తమ పరిసరాలను, తరువాత ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకొని మరోబ్రిటన్‌ మాదిరి తయారయ్యేందుకు ప్రయత్నించారు. బ్రిటీష్‌ వారు మన దేశంలో ముందు రాజులు, రాజ్యాల మీద యుద్దాలు చేయలేదు. ప్రలోభాలు, కొన్ని ప్రాంతాల మీద హక్కులు సంపాదించుకున్నారు. అమెరికా విషయానికి వస్తే ప్రస్తుతం అమెరికాలోని పదిహేను రాష్ట్రాలలో, కెనడాలో కొంత భాగం, హైతీగా వున్న దేశంతో కూడిన ఫ్రెంచి ఆధీనంలోని లూసియానా ప్రాంతాన్ని 1803లో అమెరికా కొనుగోలు చేసింది. 1699 నుంచి 1762 వరకు తన ఆధీనంలో వున్న లూసియానా ప్రాంతాన్ని ఫ్రెంచి పాలకులు స్పెయిన్‌కు దత్తత ఇచ్చారు. 1800 సంవత్సరంలో తిరిగి వుత్తర అమెరికా ఖండంలో తమ పాలనను విస్తరించేందుకు లూసియానాను తిరిగి తీసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే హైతీ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటును ఫ్రెంచి సేనలు అణచివేయలేకపోయాయి. దానికి తోడు బ్రిటన్‌తో తలపడేందుకు సన్నాహాలలో భాగంగా లూసియానా ప్రాంతాన్ని విక్రయించేందుకు ఫ్రాన్స్‌ ప్రయత్నించింది. తనకు రేవు పట్టణమైన న్యూ ఆర్లినియన్స్‌ పరిసరాలను కొనుగోలు చేయాలని ముందుగా భావించిన అమెరికా సర్కార్‌ ఫ్రాన్స్‌ బలహీనతను సాకుగా తీసుకొని మొత్తం ప్రాంతాన్ని కొనుగోలు చేసింది.కోటీ 80లక్షల ఫ్రాంకుల అప్పురద్దు రద్దు చేసి మరో ఐదు కోట్ల ఫ్రాంకులను అందుకుగాను చెల్లించింది.(2017 విలువ ప్రకారం 600బిలియన్‌ డాలర్లకు అది సమానం) ఇలా ఇతర దేశాల ప్రాంతాలను కొనుగోలు చేయటం అమెరికా రాజ్యాంగానికి విరుద్దం అని ప్రతిపక్ష ఫెడరలిస్టు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తే అధ్యక్షుడిగా తనకున్న అధికారాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకొని కొత్త ప్రాంతాలను సేకరించవచ్చని థామస్‌ జఫర్సన్‌ సమర్ధించుకున్నాడు. అలా అమెరికా విస్తరణ తొలుత ఒప్పందాలతో ప్రారంభమైతే తరువాత సామ్రాజ్యవాదిగా మారి 1846లో మెక్సికో నుంచి నేటి టెక్సాస్‌ ప్రాంతాన్ని యుద్దంలో ఆక్రమించుకున్న అమెరికా నాటి నుంచి నేటి వెనెజులా వరకు అనేక ప్రభుత్వాలను అదిరించటం,బెదిరించటం, లొంగని వారిని అడ్డుతొలగించుకోవటం, వలసలు చేసుకోవటం, అది సాధ్యం కానపుడు తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం వరకు అన్ని ఖండాలలో అమెరికా పాల్పడని అప్రజాస్వామిక చర్య లేదు. అంతర్జాతీయ చట్టాలకు వక్ర భాష్యం చెప్పటం ఒకటైతే తన పధకాల అమలుకు ఇతర దేశాల మీద స్వంత చట్టాలను రుద్దటం మరొక దుశ్చర్య.

స్పానిష్‌ వలస పాలన నుంచి విముక్తి పొందిన లాటిన్‌ అమెరికా లేదా దక్షిణ అమెరికా దేశాలలో వెనెజులా ఒకటి. గత వంద సంవత్సరాలలో సామ్రాజ్యవాదుల జోక్యం, మిలిటరీ నియంతలు, ఆర్ధిక పతనాలు ఇలా ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్న దాని చరిత్రను మూసి పెట్టి వామపక్షాల పాలనలోనోనే దేశమంతా పాచిపోయిందనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో వున్న మదురో, అంతకు ముందున్న ఛావెజ్‌లనే కాదు,తనను వ్యతిరేకించిన వామపక్ష వాదులు కాని అనేక మందిని అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో కూల్చివేసేందుకు, గద్దెల నెక్కించేందుకు ప్రయత్నించిన అమెరికా చరిత్ర దాస్తే దాగేది కాదు. వెనెజులా విషయానికి వస్తే 1951-58 మధ్య అధికారంలో వున్న నియంత పెరెజ్‌ జిమెంజ్‌ను అమెరికా బలపరిచింది.1958లో వామపక్ష, మధ్యేవాదులుగా వున్న వారు తిరుగబాటు చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోశారు. మరో నియంతను బలపరిచే అవకాశాలు లేక తరువాత కాలంలోే ఏ నినాదంతో ధికారంలోకి వచ్చినప్పటికీ పాలకులందరినీ తన బుట్టలో వేసుకొని తన అజెండాను అమలు జరపటంలో అమెరికా జయప్రదమైంది. వామపక్ష వాది ఛావెజ్‌ విషయంలో కూడా అమెరికా అదే అంచనాతో వుంది. అది వేసుకున్న తప్పుడు అంచానాల్లో అదొకటిగా చరిత్రలో నమోదైంది. ఆయన వారసుడిగా అధికారంలోకి వచ్చిన నికొలస్‌ మదురో విషయంలో కూడా అదే జరిగింది. అందుకే ఆయనను తొలగించేందుకు ఆపరేషన్‌ లిబర్టీ పేరుతో విఫలయత్నం చేసింది. దానికి ముందుగా, ఆ సమయంలోనూ, తరువాత ప్రచార దాడిని కొనసాగిస్తోంది. ఈ దాడి తీరుతెన్నులను ముందుగా పరిశీలిద్దాం,( తరువాయి భాగాల్లో మిగతా అంశాలు)

దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమనే వాట్సాప్‌, లైక్స్‌ కొట్టే ఫేస్‌బుక్‌ మరుగుజ్జులు చెలరేగిపోతున్న తరుణమిది. సామ్రాజ్యవాదం తన ప్రచార దాడికి వుపయోగించే ఆయుధాలలో సాంప్రదాయక మీడియాతో పాటు ప్రస్తుతానికి సామాజిక మీడియాలో ఇవెంతో శక్తివంతగా పని చేస్తున్నాయి. అనేక మంది వాటి దాడికి మానసికంగా బలి అవుతున్నారు. వామపక్ష ప్రభుత్వాలు అమలు జరిపిన అనేక పధకాల వలన వెనెజులా ఆర్ధిక వ్యవస్ధ దివాలా దీసింది, జనాన్ని సోమరులను గావించింది, మన దేశాన్ని లేదా తెలుగు రాష్ట్రాలను ఇలా కానివ్వ వద్దు అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనిలో పేరు మోసిన ఒక రచయిత కూడా స్టార్‌ కాంపెయినర్‌గా మారటంతో అనేక మంది దృష్టిని ఆకర్షించింది. చాలా మంది నిజమే అని నమ్ముతున్నారు.

Image result for media war on venezuela

వెనెజులా గురించిన ఈ ప్రచారం 2001లో ప్రారంభమైంది.1999లో వామపక్ష వాది హ్యూగో ఛావెజ్‌ తొలిసారి అధికారానికి వచ్చారు. అప్పటికే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్ధ ఘోరవైఫల్యం చెందిన కారణంగానే ఆయనను జనం అందలం ఎక్కించారు. కానీ మీడియా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం గురించి ఏమాత్రం తెలియనట్లే వుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా జరిపిన దుశ్చర్యలు, అది బలపరిచిన పాలకులు జరిపిన మారణకాండ, పర్యవసానాలలో రెండు కోట్ల మంది మరణించారని, లిబియా, ఎమెన్‌, లెబనాన్‌, సిరియాలలో జరిగిన మానవ నష్టం దీనికి అదనమని జేమ్స్‌ ఏ లూకాస్‌ అంచనా వేశారు. వెనెజులాలో అత్యవసర ఔషధాలు లేక 40వేల మంది మరణించారని చెబుతున్నా, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని అంటున్నా, మిలియన్ల మంది పొరుగుదేశాలకు వలసపోయారంటూ అతిశయోక్తులు చెబుతున్నా, అవన్నీ అమెరికా, దాని కనుసన్నలలో వ్యవహరించే పొరుగుదేశాలు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, అమెరికా విధించిన ఆంక్షలే కారణం తప్ప వామపక్ష పాలకులు కాదు. ఇవన్నీ మీడియాకు, పరిశీలకులకు కనిపించవా?

వెనెజులా ఎంతో ధనిక దేశం వామపక్ష పాలనలో దివాలా తీసిందన్నది మరొక ప్రచారం.1999లో ఛావెజ్‌ అధికారానికి వచ్చినపుడు అక్కడ జనాభాలో సగం మంది దారిద్య్రరేఖకు దిగువన, పొరుగు దేశాలతో పోల్చితే శిశు మరణాలు రెండు రెట్లు ఎక్కువ. మరి ధనిక దేశం అయితే అలా ఎందుకున్నట్లు ? అంతకు ముందున్న పాలకులందరూ అమెరికాతో మిత్రులుగా వున్నవారే కదా ! అనేక దేశాలలో వామపక్ష, వుదారవాదులుగా వుంటూ అధికారంలోకి వచ్చిన వారిని అమెరికా తనకు అనుకూలంగా మార్చుకుంది. చిలీలో అందుకు వ్యతిరేకించిన సాల్వెడార్‌ అలెండీని హతమార్చింది. వెనెజులాలో కూడా ఛావెజ్‌ను తమ వాడిగా మార్చుకోవచ్చని ఆశించిన అమెరికాను 2001లో ఆయన తొలి దెబ్బతీశాడు. ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించి ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంతో అప్పటి నుంచి కుట్రలు మొదలు.2002లో మిలిటరీ తిరుగుబాటు చేసి వాణిజ్యవేత్త పెడ్రో కార్‌మోనాకు అదికారం అప్పగించారు. అప్పుడు జార్జి బుష్‌ ఆ తిరుగుబాటను సమర్ధించాడు. వెంటనే ఐఎంఎఫ్‌ రంగంలోకి దిగి సాయం చేస్తామని ప్రకటించింది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఆ తిరుగుబాటు విఫలం కాకుండా చూడాలని సంపాదకీయం రాసింది.’కాబోయే నియంత’ ను తొలగించారని ఛావెజ్‌ను వర్ణించింది, ఆయన స్ధానంలో గౌరవనీయుడైన వాణిజ్యవేత్తను ప్రతిష్టించారని ప్రశంసించింది. ఈ కుట్ర వెనుక అమెరికా వుందని ఛావెజ్‌ అబద్దాలు చెబుతున్నారని గార్డియన్‌ పత్రిక ప్రకటించింది. .అయితే ఆ కుట్ర విఫలమై తిరిగి ఛావెజ్‌ అధికారానికి వచ్చాడు. వెంటనే ప్రభుత్వ చమురు కంపెనీలో విద్రోహ చర్యలకు పాల్పడి పెద్ద నష్టం కలిగించారు. అప్పటికే వున్న ఆర్ధిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. నిరుద్యోగం, దారిద్య్రం పెరిగింది. దానికి కారకులు ఎవరు?

Image result for media war on venezuela

దాన్నుంచి బయట పడేందుకు ఛావెజ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా వ్యాపారవేత్తలు తమకు అనువుగా మార్చుకొని మరిన్ని కొత్త సమస్యలను తెచ్చిపెట్టారు.ఛావెజ్‌ మరణించిన తరువాత 2014లో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పతనమయ్యాయి. దాంతో ఇబ్బందులు పెరిగాయి. అయినా నికొలస్‌ మదురో స్వల్పమెజారిటీతో విజయం సాధించటంతో తిరిగి కుట్రలు మరో దశకు చేరాయి. బరాక్‌ ఒబామా 2015లో ఆంక్షలను ప్రకటించాడు. ఏ సాకూ దొరక్క మదురో సర్కార్‌ వుండటం తమ జాతీయభద్రతకు ముప్పు అనే ప్రచారాన్ని ప్రారంభించారు. దీన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ కొనసాగిస్తున్నాడు.మరిన్ని కొత్త ఆంక్షలు విధించాడు. వీటన్నింటిని విస్మరించిన మీడియా వెనెజులా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అతిగా చూపుతూ మొసలి కన్నీరు కారుస్తోంది. కెనడాకు చెందిన స్టెఫానీ నోలెన్‌ అనే జర్నలిస్టు వెనెజులా గురించి వాస్తవాలనే పేరుతో అనేక అవాస్తవాలను రాస్తూ ముగింపులో ఇలా పేర్కొన్నారు.’మదురో సర్కార్‌ అంతిమంగా పతనం అవుతుందని ప్రతిపక్ష నేత ఆశాభావంతో వున్నాడు. ఆహారం మొత్తం ఖాళీ అయింది, జనాన్ని వీధుల్లో దింపాలని, మదురో గద్దె దిగే వరకు వారు ఇండ్లకు వెళ్లకూడదనేవిధంగా ఆలోచనలు సాగుతున్నాయని రాశారు. దీనికి అమెరికా, ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయని ఎలాంటి బెరకు లేకుండా ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. అంటే ఏం చేయాలో కూడా జర్నలిస్టులు నిర్ణయిస్తారు, అవన్నీ అమెరికా ఆలోచనలకు అనుకూలంగా వుంటాయి.

Image result for media war on venezuela

తాజా పరిణామాల విషయానికి వస్తే మదురో సర్కార్‌ కూలిపోనుందనే రీతిలో ఏప్రిల్‌ చివరివారంలో మీడియా వార్తలున్నాయి. తానే అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న గుయ్‌డో రాజధాని శివార్లలోని ఒక వైమానిక స్ధావరం సమీపంలో మకాం వేశాడు. గృహనిర్బంధంలో వున్న అతగాడి గురువు లియోపాల్డో లోపెజ్‌ను తప్పించి గుయ్‌డో వద్దకు చేర్చారు. తిరుగుబాటులో భాగంగా ఆ స్దావరాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది పధకం. అయితే అంతా పదిగంటల వ్యవధిలోనే ముగిసిపోయింది. తిరుగుబాటుదార్లు వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలో వున్నారు. లక్షల మందిగా వస్తారనుకున్న జనం ఎక్కడా జాడలేదు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి సిఎన్‌ఎన్‌ ఛానల్లో మాట్లాడుతూ మదురో క్యూబాకు పారిపోతున్నాడంటూ చేసిన అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున మీడియా జనం ముందు కుమ్మరించింది. ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీన అంతర్జాతీయ మీడియాలో మొత్తంగా అక్కడ తిరుగుబాటు జరుగుతున్నట్లే వార్తలు వచ్చాయి. మదురోకు మద్దతుగా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చిన జనం మీడియాకు కనిపించలేదు.బిబిసి అలాంటి వార్తనే రోజంతా ఇచ్చి చివరకు సాయంత్రానికి దాన్ని కొద్దిగా మార్చుకోవాల్సి వచ్చింది. కొద్ది మంది కిరాయి మనుషులను, గుయ్‌డోను పదే పదే చూపాయి. కుట్రలో భాగంగా కొన్ని చోట్ల సాగించిన దహనకాండను తిరుగుబాటుగా వర్ణించాయి. అయితే ఇంత జరిగినా మీడియాను వెనెజులా జనం విశ్వసించలేదు. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా జరుగుతున్న అసత్య ప్రచారం ప్రపంచం కంటే వారికి ఎక్కువగా తెలుసు. వాస్తవం ఏమిటో, కట్టుకధలేమిటో ఎరిగిన వారు. 2002లో తిరుగుబాటు సమయంలో నిరాయధుల మీద ఛావెజ్‌ సర్కార్‌ కాల్పులు జరిపిందని, మారణకాండ జరిపినట్లు కొన్ని మీడియా సంస్ధలు ప్రసారం చేసిన వీడియోలు నకిలీవని తేలింది. అందువలన విశ్వసనీయత కోల్పోయిన మీడియా వార్తలను వారు విస్మరించారు. వాస్తవాలు తెలియదు కనుక మన జనాల్లో కొంత మంది అలాంటి వాటిని నిజమే అని నమ్ముతున్నారు. సమాచార సామ్రాజ్యవాదానికి కావాల్సింది అదే.అయితే అందరినీ ఎల్లకాలం నమ్మించలేమనే వాస్తవం వారికి తెలిసినా, ఇదొక యుద్ధం కనుక అస్త్రాలను ప్రయోగిస్తూనే వుంటారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులాలో మంగళవారం నాటి తిరుగుబాటును అణచివేసిన వామపక్ష ప్రభుత్వం !

01 Wednesday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Caracas, Juan Guaidó, Leopoldo Lopez, Nicolás Maduro, Venezuela, Venezuelan Military Putsch, Venezuelan Opposition

ఎం కోటేశ్వరరావు

తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనికులు, ఇతర భద్రతా దళాలకు చెందిన కొద్ది మంది చేసిన తిరుగుబాటు ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచివేసినట్లు వెనెజులా అధ్య క్షుడు నికోలస్‌ మదురో మంగళవారం రాత్రి ప్రకటించారు. సైనిక అధికారులు, ఇతర ప్రముఖులతో కలసి గంటసేపు టీవీలో చేసిన ప్రసంగంలో వుదయం నుంచి జరిగిన పరిణామాలను దేశ ప్రజలకు వివరించారు. సాయుధ తిరుగుబాటును సాకుగా చూపి అమెరికా మిలిటరీ జోక్యానికి పాల్పడాలని కుట్ర చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్న సమాయానికి కొంత మంది విద్రోహులు బయటపడ్డారని వారిని వదిలేదని చెప్పారు. తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జువాన్‌ గుయ్‌డో అజ్ఞాతం నుంచి తిరుగుబాటుకు పిలుపునిస్తూ వీడియోలను విడుదల చేయటం , అక్కడక్కడా బారికేడ్ల ఏర్పాటు, దహనకాండ వుదంతాలు తప్ప ఎక్కడా తిరుగుబాటు సూచనలు లేవని వార్తలు వెల్లడించాయి. మదురోకు మిలిటరీ మద్దతు ఇవ్వటం లేదని గుయ్‌డో చెప్పుకున్నాడు. తమ నాయకుడికి పధకం ప్రకారం అమెరికా నుంచి రావాల్సిన సాయం అందలేదని అనుచరులు చెప్పినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే సైనిక తిరుగుబాటుకు బదులు బుధవారం నాడు శాంతియుత తిరుగుబాటులో భాగంగా లక్షల మంది వీధుల్లోకి వచ్చి తనకు మద్దతుగా ప్రదర్శనలు చేయాలని గుయ్‌డో విడుదల చేసిన వీడియోల్లో వుందని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక పేర్కొన్నది. బుధవారం నాడు వీధుల్లోకి వచ్చి ప్రతిపక్షాల కుట్రను విఫలం చేయాలని, మేడేను జరుపుకోవాలని మదురో కూడా తన మద్దతుదార్లకు పిలుపునిచ్చాడు. తాను మంగళవారం వుదయం రష్యన్ల మద్దతుతో వెనిజులా నుంచి క్యూబాకు పారిపోనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పటాన్ని మదురో అపహాస్యం చేశాడు. వెనెజులాలో వున్న క్యూబన్‌ సైనికులు అక్కడ ఏదైనా మరణాలు, నష్టానికి కారకులైతే క్యూబా మీద మరిన్ని కఠిన ఆంక్షలు అమలు జరుపుతామని, కనుక వెంటనే స్వదేశానికి వెళ్లాలని మంగళవారం సాయంత్రం ట్విటర్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. వెనెజులాలో పరిస్ధితి క్లిష్ట దశకు చేరుకుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ అన్నాడు.ముగ్గురు సీనియర్‌ అధికారులతో తాము సంప్రదించామని, మదురోను తప్పించేందుకు వారు అంగీకరించారని చెప్పుకున్నాడు. అయితే బోల్టన్‌ ఇలాంటి ఇలాంటి కలలు కనటం కొత్త కాదని వెనెజులా విదేశాంగ మంత్రి జార్జ్‌ అరియా వ్యాఖ్యానించాడు.

మంగళవారం తెల్లవారు ఝామున నాలుగు గంటల సమయంలో గుయ్‌డోకు గురువు, గృహనిర్బంధంలో వున్న ప్రతిపక్ష నేత లియోపోల్డో లోపెజ్‌ను కొంత మంది సాయుధులు తప్పించి వెలుపలకి తీసుకువచ్చారు. రాజధాని కారకాస్‌లో ఒక రహదారిని మూసివేశారు. నగరశివార్లలోని ఒక చోట లోపెజ్‌, గుయ్‌డో కలుసుకున్నారు. అక్కడి నుంచి వీడియోలు విడుదల చేశారు. రాజ్యాంగపరిషత్‌ అధ్యక్షుడు డియోసడాడో కాబెల్లో టీవీలో మాట్లాడుతూ కుట్రదారుల గురించి వివరించి బలివేరియన్‌ మిలిషియా వీధుల్లోకి వచ్చి అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన జరిపారు. తామనుకున్న విధంగా ఎలాంటి తిరుగుబాటు లేకపోవటంతో గుయ్‌డో కొంత మంది అనుచురులతో కలసి గుర్తు తెలియని ప్రాంతానికి తప్పించుకోగా లోపెజ్‌ తొలుత చిలీ రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడ వున్న కుటుంబసభ్యులతో కలసి తరువాత స్పెయిన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి శరణువేడినట్లు,25 మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారని వార్తలు వచ్చాయి.

రాజధాని కారకాస్‌, ఇతర పట్టణాల్లో గుయ్‌డో అనుచరులు బారికేడ్లు ఏర్పాటు చేసి కొన్ని చోట్ల దహనకాండకు పాల్పడ్డారని, కారకాస్‌ శివార్ల నుంచి ప్రదర్శన జరిపేందుకు ప్రయత్నించిన గుయ్‌డోను భద్రతాదళాలు చెదరగొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఏడు గంటల పాటు గుయ్‌డో సామాజిక మాధ్యమానికి అందుబాటులో లేకుండా పోయాడు. ప్రతిపక్షం రెచ్చగొట్టే చర్యల పట్ల సంయమనం పాటించాలని మదురో మిలిటరీ, ఇతర భద్రతా దళాలను కోరాడు.తిరుగుబాటు యత్నాలను బలీవియా అధ్యక్షుడు ఇవోమొరేల్స్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ తీవ్రంగా ఖండించారు. ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటన చేస్తూ హింస ఏరూపంలో వున్నా ఖండించాలని, సంయమనం పాటించాలని కోరగా, ఐరోపా పార్లమెంట్‌ అధ్యక్షుడు అంటోనియో టజని మాత్రం తిరుగుబాటును సమర్ధించాడు.

నాడు క్యూబా, నేడు వెనెజులాలో చరిత్ర పునరావృతం !

అమెరికా దేశాల సంస్ధ (ఒఎఎస్‌) నుంచి తప్పుకొనే ప్రక్రియను పూర్తి కావటంతో సంతోషం ప్రకటిస్తూ వెనిజులాలో అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఆ సంస్ధ అమెరికా కీలబొమ్మగా మారిందని ఇప్పుడు తాము మరింత స్వతంత్రంగా వున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో ఆ సంస్ధ చేసే నిర్ణయాలకు కట్టుబడనవసరం లేదు. అది అమెరికా వలస దేశాల మంత్రిత్వశాఖ అని గతంలో కాస్ట్రో చేసిన విమర్శను మదురో పునరుద్ఘాటించారు.అమెరికా ఆంక్షలకు గురైన వెనెజులా విదేశాంగ మంత్రి జార్జి అరియా విదేశాంగశాఖ భవనంపై నుంచి శనివారం నాడు ప్రదర్శకులతో మాట్లాడుతూ మనం నిన్నటి కంటే నేడు మరింత స్వతంత్రుల మయ్యామని ప్రకటించారు. అమెరికా దేశాల సంస్ధ ప్రధాన కార్యదర్శి లూయీస్‌ మగారో అమెరికాకు వంతపాడుతూ అవసరమైతే మానవతా పూర్వకంగా మిలిటరీ జోక్యం చేసుకున్నాతప్పు లేదని గతంలో ప్రకటించాడు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో సభ్యదేశాలన్నీ గుయ్‌డో సర్కార్‌ను గుర్తించాలని తీర్మానించటమేగాక మదురో సర్కార్‌ ప్రతినిధి బదులు గుయ్‌డో మనిషిని సమావేశానికి ఆహ్వానించింది. ఈ పూర్వరంగంలో వెనిజులా రెండు సంవత్సరాల గడువు నిబంధనను పూర్తి చేసి ఆ సంస్ధ నుంచి వైదొలిగింది. వెనిజులా మీద దాడికి పాల్పడితే సహించేది లేదని రష్యా, చైనా హెచ్చరికలు చేశాయి. యాభై ఏడు సంవత్సరాల క్రితం క్యూబాలో క్షిపణుల మోహరింపు, నేడు వెనెజులాలో అదే పునరావృతం అయింది. నాడు అమెరికా తోక ముడిచి రాజీకి దిగి వచ్చింది.నేడు వుక్రోషంతో హూంకరింపులు చేస్తోంది. ముగింపు కూడా గతమే పునరావృతం అవుతుందా? ఆరు దశాబ్దాల నాటికి నేటికీ ప్రపంచం, రాజకీయాల్లో వచ్చిన మార్పులేమిటి? కొత్త వుద్రిక్తతలకు నాందీ వాచకం పలుకుతుందా, అంతర్జాతీయ పరిణామాలు, పర్యవసానాలు ఎలా వుంటాయి? వీటి మంచి చెడ్డలను ఎలా చూడాలి? రెండింటి మధ్య వున్న సామ్యాలు ఏమిటి ?

నాడు క్యూబాలో జరిగిందానికి, నేడు వెనెజులాలో జరుగుతున్నదానికి అమెరికా సామ్రాజ్యవాదులే కారణం. తమ గుమ్మం ఎదుట ఒక సోషలిస్టు రాజ్యం అవతరించటమా అని నాడు ఆగ్రహం వస్తే, అంతరించిపోయిందనుకు కున్న వామపక్ష శక్తి తన పెరటితోటలోనే పెరగటమా అని నేడు అమెరికా వూగిపోతోంది. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన 1959లో ఏర్పడిన సోషలిస్టు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కాస్ట్రో వ్యతిరేకులకు ఆయుధాలు, శిక్షణ ఇచ్చిన అమెరికా 1961లో జరిపిన తిరుగుబాటు కుట్రను బే ఆఫ్‌ పిగ్స్‌ అని పిలిచారు. ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌ దృష్టిని క్యూబా నుంచి మళ్లించేందుకు ఐరోపాలోని టర్కీ, ఇటలీలో ఖండాంతర క్షిపణులను మోహరించి రెచ్చగొట్టారు. అమెరికన్ల మద్దతుతో జరిగిన తిరుగుబాటును అణచివేసిన క్యూబా సర్కార్‌ తమకు రక్షణ కల్పించాలని కోరగా 1962 అక్టోబరులో క్యూబా గడ్డమీద సోవియట్‌ తన క్షిపణులను మోహరించింది. ఈ చర్య అమెరికా సమాజంలో ప్రభుత్వం మీద ఆగ్రహం కలిగించింది. తమకు అణ్వాయుధాల ముప్పు తెచ్చారంటూ తీవ్ర నిరసనలు, విమర్శలు చెలరేగాయి. రెండవది అదే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దానికే ఎదురు తిరగటంతో ఎన్నికలకు కొద్ది రోజుల ముదు అంటే 1962 అక్టోబరు రెండవ పక్షంలో జరిగిన ఈ పరిణామంతో అమెరికా వెనక్కు తగ్గి సోవియట్‌ యూనియన్‌తో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టర్కీ, ఇటలీ నుంచి అమెరికా అణ్వాయుధాలను తొలగించాలి, దానికి ప్రతిగా క్యూబా నుంచి సోవియట్‌ తొలగిస్తుంది. క్యూబా వైపు నుంచి ప్రత్యక్షంగా రెచ్చగొట్టే చర్యలు వుంటే తప్ప తాముగా క్యూబాలో జోక్యం చేసుకోబోమని, సోవియట్‌తో న్యూక్లియర్‌ హాట్‌లైన్‌ ఏర్పాటు చేసుకుంటామని అమెరికన్లు దిగివచ్చారు.

ఇప్పుడు వెనిజులా విషయంలో అమెరికన్లు ఎత్తుగడను మార్చారు. సైన్యంలో తిరుగుబాట్లను రెచ్చగొట్టి విఫలమయ్యారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షానికి వచ్చిన మెజారిటీని ఆసరా చేసుకొని వామపక్ష మదురో సర్కార్‌ను కూలదోసేందుకు తెరతీశారు.ఈ ఏడాది జనవరి 23న పార్లమెంట్‌ స్పీకర్‌ జువాన్‌ గుయ్‌డో తనకు తానే దేశాధ్యక్షుడనని ప్రకటించుకున్నాడు. బయట ప్రమాణస్వీకార తతంగం కూడా జరిపాడు. దాన్ని అమెరికాతో సహా దాని అనుంగు దేశాలు గుర్తించాయి. గుయ్‌డోకు విధేయులై వుండాలని మిలిటరీ, అధికార యంత్రానికి చేసిన వినతికి స్పందన లేదు. వాస్తవానికి అంతకు ముందే అధ్యక్షుడు మదురో పార్లమెంట్‌ను రద్దు చేసి నూతన రాజ్యాంగ రచనకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. అందువలన గుయ్‌డో అధ్యక్షుడిగా అతను చేసిన ప్రమాణస్వీకారం చెల్లదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే విదేశాలలో ఏర్పాటు అయినట్లు చెప్పుకున్న గుయ్‌డో అనుకూల సుప్రీం కోర్టు అతన్ని సమర్ధించింది. తన పధకానికి అనుగుణంగా పరిణామాలు లేకపోవటంతో కంగు తిన్న అమెరికన్లు వెనెజులా మీద మరింత కఠినంగా ఆంక్షలు పెట్టటమే కాదు, దేశంలోని విద్యుత్‌ వ్యవస్ధను చిన్నాభిన్నం చేశారు. ప్రాణావసర ఔషధాలను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మానవతా పూర్వక సాయం పేరుతో ట్రక్కుల్లో ఆయుధాలు చేరవేసేందుకు పన్నిన ఎత్తుగడను మదురో సర్కార్‌ విఫలం చేసింది.

దీనికి ప్రతిగా వెనెజులా కోరిక మీద అమెరికన్ల అధునాతన ఆయుధాల దాడిని ఎదుర్కొనే వుపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే ఎస్‌300క్షిపణులను, వాటిని ప్రయోగించే మిలిటరీ నిపుణుల రష్యా తరలించింది. వాటిని దాపరికం లేకుండా వెనిజులా ప్రత్యక్షంగా ప్రదర్శించింది కూడా. దీనికి తోడు యాంగ్జీఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌లైన్స్‌ చైనా నుంచి బోయింగ్‌ 747 సరకు రవాణా విమానంలో ఔషధాలు, పరికరాలను చైనా పంపింది. నికొలస్‌ మదురో వుద్వాసనకు గురి కాబోతున్నాడంటూ సోమవారం నాడు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించాడు. లక్ష కోట్ల డాలర్ల సిల్కు రహదారి(దీన్నే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ అని పిలుస్తున్నారు) పారిశ్రామిక, వాణిజ్య పధకం గురించి 150దేశాలకు, 90సంస్ధలకు చెందిన ప్రతినిధులతో గతవారంలో బీజింగ్‌లో చైనా పెద్ద సమావేశం నిర్వహించింది. దానికి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా 37దేశాధినేతలు కూడా హాజరయ్యారు.( ఈ సమావేశాన్ని అమెరికా,దానితో కౌగిలింతల దౌత్యం నడుపుతున్న మన దేశం కూడా బహిష్కరించింది) ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు గ్జీ గింపింగ్‌తో సమావేశమైనపుడు వెనిజులా ప్రస్తావన వచ్చిందని, ఒక దేశంలో ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలు ఆమోదయోగ్యం కాదని, ఇరుదేశాలు దానికి బాసటగా నిలవాలని, అమెరికా వైఖరిని ఖండిస్తూ వారు మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఇది అమెరికన్లకు ఆగ్రహం తెప్పించింది. క్యూబా మీద మరిన్ని ఆంక్షలు విధించటాన్ని గుర్తు చేస్తూ మదురో మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్ధితి ఎంతో మెరుగ్గా వుండేదని చెప్పేందుకే తామీ పని చేశామని, మదురోను సమర్ధించే దేశాలన్నింటికీ ఇదే చెప్పదలచుకున్నామని రష్యా, చైనాలను బెదిరిస్తూ పాంపియో మాట్లాడాడు. వెనెజులా పౌరులు, మిలిటరీకి, క్యూబన్లకు, రష్యన్లకు, మీరు గనుక వార్తలు చూస్తే వెనిజులాకు సాయం చేస్తున్న ఇరాన్‌కు, అదే విధంగా ఎంతో చేస్తున్న చైనాకూ ఇదే హెచ్చరిక అన్నాడు. మదురోకు మద్దతుదారుల్లో ఒకరు తిరుగుబాటుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. క్యూబా నుంచి వందల మంది అధికారులు, 20వేల మంది సనికులు వెనెజులా వెళ్లినట్లు అమెరికా చేసిన ఆరోపణలను క్యూబా అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌ తోసి పుచ్చారు. ప్రపంచంలో 800చోట్ల సైనిక స్ధావరాలు, లక్షల మంది సైన్యాన్ని దింపిన అమెరికా తమ గురించి మాట్లాడుతోందని,అబద్దాలు చెబుతోందని అన్నారు.

సర్వసత్తాక దేశాల్లో జోక్యం చేసుకొనే అమెరికా వైఖరిని రష్యా, చైనా ఖండించాయి. వెనిజులాపై చర్య తీసుకొనే అంశంలో తమ అధికారులు సిద్ధంగా వున్నారని అమెరికా దక్షిణ కమాండ్‌ నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ క్రెయిగ్‌ ఫాలర్‌ వెల్లడించాడు. ఈ ప్రకటన మిలిటరీ జోక్యం వూహకాదు వాస్తవమే అని రష్యా వ్యాఖ్యానించింది.అమెరికా అంతర్గత చట్టాల పేరుతో భద్రతా మండలి వెలుపల ఆం్షలు విధించటాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా పేర్కొన్నది.చైనా, ఇరాన్‌ మానవతా పూర్వక సాయాన్ని అందించేందుకు ప్రతినిధులతో పాటు విమానాల్లో సాయాన్ని కూడా పంపాయి. అమెరికా దాడికి సిద్ధం అవుతున్నదనే వార్తల పూర్వరంగంలో భద్రతా దళాలకు మద్దతుగా పది లక్షల మందిని సిద్ధం చేయాలని గతవారం మదురో ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

గత నెల చివరి వారంలో రష్యా నుంచి యుద్ధనిపుణులు వెనిజులా చేరుకున్నారు. అమెరికా నుంచి ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు అవసరమైన ఎత్తుగడలను వారు రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మిలిటరీ కేంద్రాల సంరక్షణకు రష్యా తయారీ ఎస్‌-300 క్షిపణులను ప్రయోగించే నాలుగు సంచార వాహనాలను ఏర్పాటు చేశారు. ఛావెజ్‌ బతికి వున్న సమయంలోనే బ్రహ్మూెస్‌ క్షిపణులను మోసుకుపోగల సుఖోయ్‌ ఎస్‌యు-30 జట్‌ యుద్ధ విమానాలను, టి-72 టాంకులు, వేగంగా ప్రయాణించే పడవలు, ఎకె-103 తుపాకులను తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వుపరితలం నుంచి గగనతలంలోకి సైనికులు భుజాలపై వెంట తీసుకుపోగల క్షిపణి ప్రయోగ పరికరాలను పెద్ద సంఖ్యలో రష్యా సరఫరా చేసింది. అమెరికా తొత్తు గుయ్‌డోకు మద్దతు ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్ళిన గూఢచారశాఖ మాజీ అధిపతి కార్వాజల్‌ను స్పెయిన్‌లో మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు.

Crowds gathered outside Miraflores Palace on Tuesday morning. (Cira Pascual Marquina)

అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని  మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన

అమెరికా విధించిన ఆర్ధిక, వస్తు సరఫరాలపై ఆంక్షలు, విద్యుత్‌ కేంద్రాలలో విద్రోహ చర్యల వంటి సమస్యల కారణంగా వెనిజులా పౌరులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారు గత నిరంకుశపాలనతో పోల్చుకొని మదురోకు బాసటగా నిలుస్తున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తట్టుకొనేందుకు వీలుగా కార్మికుల, వుద్యోగుల వేతనాలను మదురో సర్కార్‌ ఎప్పటికప్పుడు సవరిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి పరిస్ధితి మరింత దిగజారింది. ఆర్ధికంగా జనాన్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటం అమెరికా ఎత్తుగడగా వుంది.ఇప్పటికే చమురుపై ఆంక్షల కారణంగా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయింది. 2017-18లో 40వేల మంది చావులకు అమెరికా ఔషధాలపై విధించిన దుర్మార్గ ఆంక్షలే కారణం. మరో మూడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 2013లో 11.2బిలియన్‌ డాలర్ల మేరకు ఆహారం దిగుమతి చేసుకుంటే ఆంక్షల కారణంగా 2018లో అది 2.46బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

ఇన్ని ఇబ్బందులను భరిస్తున్నప్పటికీ అమెరికా వ్యతిరేక వైఖరిలో ఇంతవరకు జనంలో పట్టుసడల లేదు. అమెరికాకు చెందిన గాలప్‌ సంస్ధ ఇటీవల జరిపిన సర్వేలో వెనిజులా పౌరుల కంటే ప్రపంచంలో అత్యంత ధనికులు, శక్తివంతులైన అమెరికన్లే ఎక్కువ వత్తిడికి లోనవుతున్నట్లు 2019 ప్రపంచ మనోద్వేగ నివేదికలో గాలప్‌ సంస్ధ తెలిపింది. పగలు తాము అత్యంత వత్తిడికి లోనవుతున్నట్లు 55శాతం మంది అమెరికన్లు చెప్పారట. ఇరాన్‌, శ్రీలంక,అల్బేనియా, అమెరికా నాలుగవ స్ధానంలో వున్నాయి. మొదటి మూడు స్ధానాల్లో గ్రీస్‌, ఫిలిప్పయిన్స్‌, టాంజానియా వున్నాయి.అనేక ఇబ్బందులున్నప్పటికీ వెనెజులా 12వ స్ధానంలో వుంది.

క్యూబాపై అమెరికా కుట్ర చేసిన సమయంలో క్షిపణులను మోహరించిన సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు రాజ్యం. సోదర దేశాన్ని రక్షించటం తన బాధ్యతగా ఎంచుకుంది. ఆ సమయం చైనా కూడా సోషలిస్టు దేశమే అయినప్పటికీ సోవియట్‌ మాదిరి శక్తి కలిగినది కాదు, అంతర్గత ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇప్పుడు రష్యాకు అలాంటి బాధ్యత లేనప్పటికీ ఐరోపాలో తనకు ఎసరు పెడుతున్న అమెరికాను అడ్డుకోవాలంటే దాని పెరటితోటలోనే తాను పాగా వేయగలమన్న హెచ్చరిక దాని చర్యలో కనిపిస్తోంది. మరోవైపున క్యూబా, వెనిజులా, తదితర సోషలిస్టు, వామపక్ష ప్రభుత్వపాలనలో వున్న దేశాల పట్ల చైనా ఇటీవలి కాలంలో బాసటగా నిలవటం మరింత ఎక్కువగా చేస్తున్నది. మాటల కంటే చేతల్లో చూపుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యండమూరి చరిత్రకారుడు కాదు, వెనిజులా గురించి రాసింది చరిత్రా కాదు !

12 Friday Apr 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Historian, History, populist schemes, Venezuela, Yandamuri, Yandamuri Veerendranath

ఎం కోటేశ్వరరావు

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ పేరుతో ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, వుచిత సర్వీసుల ఆఫర్‌ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు.ఈ సందర్భంగా రాస్తున్న దిగువ అంశాలు యండమూరి వంటి వారిని మార్చేందుకో లేక వారికి తెలియచేసేందుకో కాదు, ఏడు పదులు నిండిన వారు నేర్చుకొనేదేమి వుంటుంది. ఆ పేరుతో రాసింది నిజం అని గుడ్డిగా నమ్మేవారిని భిన్న కోణంలో ఆలోచించమని కోరేందుకే ఇది. ఆసక్తి వున్నవారే ముందుకు పోండి. లేని వారు సమయం వృధా చేసుకోవద్దని మనవి.

వెనిజులా గురించి కానీ మరొకదాని గురించి గానీ రాసే హక్కు యండమూరికి వుంది. అది కాపీ చేసిందా, లేక వక్రీకరణలను గుడ్డిగా అనుసరించిందా అని చర్చ చేసే హక్కు దాన్ని చదివిన వారందరికీ వుంది. అలాగే ఒక రచన, ఒక కళారూప ప్రయోజనం ఏమిటన్నది అవి వెలువడిన నాటి నుంచీ చర్చ జరుగుతూనే వుంది. యండమూరి రచనలనూ అలాగే పరిశీలించాలి. అవి కాపీ కొట్టినవా లేక మిగిలిపోయిన ఇడ్లీలను పొడి చేసి ఘమఘమ లాడే తాలింపుతో తయారు చేసిన వుప్మా వంటివా అన్నది వేరే విషయం. మీడియాలో వచ్చిన వార్తల మేరకు ఆయన వయస్సులో వుండగా ఒక యువకుడు, ఒక యువతి ఆయన రచనలను చదివి ‘వుత్తేజం’ పొంది ఆత్మహత్య చేసుకున్నారని 1980దశకం పత్రికల్లో వచ్చింది. ఆ సమయంలోనే ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ ఆ రచనలను విమర్శించినందుకుగాను తన పరువు పోయింది, దాని వెల 20వేల రూపాయలంటూ యండమూరి ఒక లాయర్‌ ద్వారా నోటీసు ఇప్పిస్తే దానికి ఆమె తగిన సమాధానం ఇచ్చిందనుకోండి. బహిరంగంగా ఒక రచన చేసినా, చరిత్ర అంటూ చెత్తను కుమ్మరించినా వాటి మీద వచ్చే విమర్శలను హుందాగా స్వీకరించాలి. ఆసక్తి వుంటే అర్దవంతమైన చర్చ జరపాలి.

2019 ఫిబ్రవరి 19వ తేదీన జాన్‌ పిల్గర్‌ అనే జర్నలిస్టు గ్లోబల్‌ రిసర్చ్‌ అనే పత్రికలో ‘అబద్దాల ప్రాతిపదికగా వెనిజులా మీద యుద్ధం'(ది వార్‌ ఆన్‌ వెనిజులా బిల్ట్‌ ఆన్‌ లైస్‌) అందువలన అంతర్జాతీయంగా సాగుతున్న ప్రచారానికి (బహుశా వాట్సాప్‌ పరిజ్ఞానం అయివుండవచ్చు) యండమూరి ప్రభావితులై నేను సైతం అన్నట్లుగా ఒక అబద్దాన్ని వండి వడ్డించారనుకోవాలి.

‘ ఓ నాయకుడు అధికారంలోకి రావటం కోసం ఎన్నికల సమయంలో …. ఖాళీగా ఇంట్లో కూర్చున్నవారికి, బీద కుటుంబాలకూ నెలనెలా ధన సహాయం అని ప్రకటించాడు. గొప్పగా గెలిచాడు. ‘ ఈ మాటలకు ముందు ‘తీరాల్లో సమృద్ధిగా ఆయిల్‌ వుంది, 1970లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి’ అని రాసిన యండమూరి అలాంటి దేశంలో ఖాళీగా ఇంట్లో కూర్చొనే వారు, బీద కుటుంబాలు ఎందుకున్నాయో, దానికి కారకులు ఎవరో,అలాంటి బీదలకు సాయం చేస్తే తప్పేమిటో, ఆ దేశ సంపద అంతా ఎవరి చేతుల్లోకి పోయిందో, అదెలా సమర్ధనీయమో చెబుతారా ? చరిత్ర అంటూ చెప్పేటపుడు దానికి వున్న అన్ని కోణాలను చెప్పకపోతే చెప్పేది చరిత్ర కాదు, చెత్త అవుతుంది. యండమూరి రాత చదివిన వారు అదేమిటో నిర్ణయించుకోవచ్చు.

‘దేశ ఐశ్యర్యం అందరికీ పంచాడు. తరువాతి ఎన్నికల్లో కార్మికుల, వుద్యోస్తుల జీతాలు ఐదు రెట్లు పెంచాడు. సింగిల్‌ పేరెంట్స్‌ ఆడవారికి అనూహ్యంగా కానుకలిచ్చాడు ‘ అని యండమూరి తన అక్కసును వెళ్లగక్కారు. దేశ సంపదను అందరికీ గాక అద్వానీ, అంబానీల మాదిరి కొన్ని కార్పొరేట్‌ సంస్ధలకే అప్పగించాలా? విదేశీ కంపెనీలతో పాటు స్వదేశీ కంపెనీలు కూడా సంపదలను విదేశాలకు తరలించి విదేశీ పెట్టుబడుల రూపంలో వాటినే తిరిగి తీసుకు వచ్చి లాభాల మీద లాభాలు ఆర్జిస్తున్నారు. వెనిజులా కార్మికులు, వుద్యోగులకు వేతనాలు పెంచితే అవి తిరిగి వెనిజులా ఆర్దిక వ్యవస్దలోకే తిరిగి వస్తాయి, వారేమీ డాలర్లుగా మార్చివిదేశాల్లో పెట్టుబడులుగా పెట్టేవారు కాదు. ఈ మాత్రం కూడా తెలియని మేథావి యండమూరి అనుకోలేము. ఇక సింగిల్‌ పేరెంట్స్‌ మహిళలకు అనూహ్యంగా కానుకలిచ్చాడట అంటూ తన అక్కసుసు వెళ్లగక్కారు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా భర్తలు లేని ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఒక్కసారి పెన్షన్‌ కార్యాలయం దగ్గరకు వెళ్లి మీకెందుకు ఇవ్వాలని వారిని ప్రశ్నిస్తే ఏ సమాధానం వస్తుందో, ఏమి జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకుంటే మంచిది, చేయి తిరిగిన రచయిత కదా, కొత్త ఇతివృత్తం దొరుకుతుంది.

వెనిజులా గురించి పక్షపాతం అంటే తెలియని మీడియా సంస్ధగా కొందరు చెప్పే బిబిసి పదేండ్ల కాలంలో ఇచ్చిన 304 వార్తల గురించి వెస్ట్‌ ఇంగ్లండ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చిందేమంటే వాటిలో మూడంటే మూడే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి సానుకూల వార్తలు వున్నాయట. అక్కడి మానవహక్కుల చట్టం, ఆహార, ఆరోగ్య, దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు, నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధన, మిలియన్ల మంది ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్‌ మదురోకు మద్దతుగా చేసిన ప్రదర్శన కనిపించలేదు. ఏమ్మా మదురో వ్యతిరేక ప్రతిపక్ష ప్రదర్శన వార్తను మాత్రమే ఇచ్చావేమిటి అని బిబిసి రిపోర్టర్‌ ఓర్లా గుయెరిన్‌ను అడిగితే ఒకే రోజు రెండు ప్రదర్శనల వార్తలను ఇవ్వటం ఎంతో కష్టం అని సమాధానమిచ్చింది.

ఏ వాస్తవం ఆధారంగా వెనెజులా మీద యుద్ధం ప్రకటించారో వార్త ఇవ్వటం కూడా ఎంతో కష్టం. ప్రధానంగా వాల్‌స్ట్రీట్‌ నేరపూరితమైన యంత్రాంగం కారణంగా 2014 నుంచి చమురు ధరలు కుప్పకూలటం గురించి నివేదించటం కూడా కష్టమే, అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్ధలోకి ప్రవేశించకుండా వెనిజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త ఇవ్వటం కూడా చాలా కష్టం, రెండు బిలియన్‌ డాలర్ల విలువగల దిగుమతి చేసుకున్న ఔషధాలతో సహా 2017 నుంచి వాషింగ్టన్‌ ఆంక్షలు, వాటి వలన కనీసంగా ఆరు బిలియన్‌ డాలర్లు వెనిజులా నష్టపోయిందని వార్త రాయటం ఎంతో కష్టం, వెనిజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ చర్య చట్టవిరుద్దం, లేదా దోచుకోవటం అని రాయటం కూడా కష్టమే అంటూ జాన్‌ పిల్గర్‌ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చినిజాలు ఇవి. వాటిని కాదనే ధైర్యం యండమూరితో సహా ఎవరికైనా వుందా, ఇది చరిత్రలో భాగం కాదా అని సవినయంగా అడగాలి.

‘2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధరపెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు’ ఇది హ్యూగో ఛావెజ్‌ గురించి అని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఛావెజ్‌ గురించి యండమూరికి ఏబిసిడిలు కూడా తెలియవు లేదా ముందే చెప్పినట్లు వాట్సాప్‌ పరిజ్ఞానంతో రాశారనుకోవాలి. 1977లో ఒక సైనికుడిగా ఒక వామపక్ష తీవ్రవాద సంస్ధ(మన దగ్గర నక్సల్స్‌)ను అణచివేసేందుకు వెళ్లిన ఆయన, వారెందుకు తీవ్రవాదులుగా మారారు, రాజ్యం వారినెందుకు అణచివేస్తున్నది అనే అంతరంగ మధనంతో వామపక్ష వాదిగా మారిన వ్యక్తి. 1989లో కార్లోస్‌ అండ్రెజ్‌ పెరోజ్‌ అనే పెద్ద మనిషి తాను ఎన్నికైతే అమెరికా వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకుంటానని, ఐఎంఎఫ్‌ విధానాలను వ్యతిరేకిస్తాననే వాగ్దానాలతో అధికారానికి వచ్చి అందుకు వ్యతిరేకంగా వ్యవహించాడు. వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు. అతని విధానాలు నచ్చని మిలిటరీ అధికారిగా వున్న ఛావెజ్‌ 1992లో విఫల తిరుగుబాటు చేశాడు. అందుకుగాను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1994లో అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం ఛావెజ్‌ను, ఆయనతో పాటు జైల్లో పెట్టిన ఇతర తిరుగుబాటుదార్లను విడుదల చేసింది. మిలిటరీలో తిరిగి చేరకూడదని ఆంక్షలు విధించింది. 1998 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో, వామపక్ష, వుదారవాద, ప్రజాస్వామిక అభిప్రాయాలు కలిగిన వివిధ సంస్ధలు, పార్టీలతో ఏర్పడిన వెనిజులా ఐక్యసోషలిస్టు పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. తన అజెండాను అమలు జరిపేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, రాజ్యాంగ సవరణలు చేసిన ప్రజాస్వామిక వాదిగా ఆయన చరిత్రకెక్కారు. నూతన రాజ్యాంగం మేరకు 1999లో మరోసారి ఎన్నికలు జరిపి రెండోసారి అధికారానికి వచ్చారు. అక్కడ పదవీ కాలం ఆరేండ్లు, దాని మేరకు తరువాత ఎండమూరి చెప్పినట్లు 2008లో అసలు ఎన్నికలు జరగలేదు, 2006 డిసెంబరులోనే జరిగాయి, మరుసటి ఏడాది జనవరిలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. 2008లో బ్లాక్‌మార్కెటీర్లు ధరలను విపరీతంగా పెంచేసిన పూర్వరంగంలో ‘ యండమూరి చరిత్ర ‘లోని రొట్టెల మీదే కాదు, నిత్యావసర వస్తువుల ధరలన్నింటి మీద నియంత్రణలో భాగంగా ఆంక్షలు విధించాడు.నాలుగోసారి 2012లో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే కాన్సర్‌ కారణంగా ఆసుపత్రిలో వున్నందున ప్రమాణస్వీకారం చెయ్యలేదు. అయితే అధికారంలో వుండి తిరిగి గెలిచినందున ప్రమాణస్వీకారం మరోసారి చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది.అయితే ఆరోగ్యం విషమించి 2013 మార్చి ఐదున మరణించారు. వుపాధ్యక్షుడిగా వున్న నికొలస్‌ మదురో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.

ఇక యండమూరి చరిత్ర పేరుతో రాసిన చెత్త అంతటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పెద్దమనిషికి నేరాల రేటును ఎలా లెక్కిస్తారో కూడా తెలిసినట్లు లేదు. వెనిజులాలో ప్రతి లక్షమంది జనాభాకు ప్రతి ఏటా 20వేల మంది హత్యలకు గురి అవుతున్నారట. ఇంతకంటే అతి శయోక్తి లేదు ప్రపంచంలో అత్యధికంగా హత్యల రేటు వున్న దేశాల వరుసలో ముందున్న ఎల్‌సాల్వెడార్‌లో లక్షమందికి 82.84 మంది హతులవుతుండగా వెనిజులాలో 56.33 వుంది. లాటిన్‌ అమెరికా దేశాలన్నింటా, అనేక ఆఫ్రికా దేశాలలో ఇలాంటి పరిస్ధితికి కారణం నియంతలు, వారిని బలపరిచిన అమెరికా, సిఐఏ అన్నది జగమెరిగిన సత్యం. వెనిజులా రాజధాని కారకాస్‌ అంటే జంతుకళేబరం అని సెలవిచ్చారు. అక్కడ హత్యల రేటు 111.19 వుంది. ప్రధమ స్ధానంలో వున్న మెక్సికోలోని లాస్‌ కాబోస్‌ జంటనగరాల్లో అది 111.33 వుంది. లాస్‌ కాబోస్‌ అంటే సురక్షితమైన రేవు అని అర్ధం. మరి అక్కడెందుకు జరుగుతున్నట్లు, అక్కడేమీ ఛావెజ్‌ లేదా వామపక్ష పాలన లేదే. అంతెందుకు సెయింట్‌ లూయీస్‌ పేరుతో వున్న అమెరికా నగరంలో హత్యల రేటు 65.83తో అమెరికాలో ప్రధమ స్ధానంలో వుంది. మరి పవిత్రమైన పేరు పెట్టుకున్న అక్కడెందుకు అన్ని హత్యలు జరుగుతున్నట్లు ? అందుకే చరిత్ర తెలియకపోతే చౌకబారు వ్యాఖ్యానాలు వస్తాయంటారు.

ఇక ఒళ్లమ్ముకొనే బాలికలనీ, సగం తాగిన సిగిరెట్ల కోసం వెంపర్లాడే పెద్దలనీ ఇలా ఏవేవో అతిశయోక్తులు రాశారు. వెనిజులా ఆర్ధిక ఇబ్బందులతో వున్న మాట నిజం, తనకు లంగలేదన్న కారణం, చమురు సంపదలను జాతీయం చేసిందన్న వుక్రోషం వంటి అనేక అంశాల కారణంగా అమెరికా కక్ష తీర్చుకుంటున్న దేశాలలో వెనిజులా మొదటి స్ధానంలో వుంది. అవి కొన్ని సామాజిక సమస్యలను సృష్టిస్తాయి. భూతల స్వర్గం అమెరికాలో ఒళ్లు అమ్ముకుంటున్నవారు, అడుక్కొనే వారు కూడా సూటూ బూటూ వేసుకొని అడుక్కొనే వారెందుకు వున్నట్లు, ధాయ్‌లాండ్‌ మంచి దేశమే కదా రాజధాని బ్యాంకాక్‌, ఇతర నగరాల్లో ఒళ్లమ్ముకొనే బాలికల కోసం ఎగబడి పోతున్న జనం గురించి యండమూరికి తెలియదా?

వెనెజులాలో వున్నది వామపక్ష ప్రభుత్వం. అంతకు ముందు అక్కడ అనుసరించిన నయా వుదారవాద విధానాలను పూర్తిగా మార్చకుండా జనానికి వుపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నది. దాని ఆదాయం నూటికి 95శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే పరిమితం అమ్ముకుంటున్నదానికి అయినా నాలుగు డాలర్లు వస్తాయి లేకపోతే ఇబ్బందే. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటినుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు.

సంక్షమే పధకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్‌. అలాంటి వారిలో యండమూరి ఒకరు. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనిజులాను సాకుగా చూపటమే అభ్యంతరం. చరిత్ర పేరుతో కుమ్మరించిన చెత్త విషయాలలో పేర్కొన్న అంశాలు అనేక దేశాలలో అంతెందుకు మన దేశంలో ఏ పట్టణంలో లేవు. రూపాయి కోసం హత్యలు చేసే వారు, కడుపు ఆకలి తీర్చితే మానం పోగొట్టుకొనేందుకు సిద్దపడే అభాగినులు ఇక్కడెందుకు వున్నట్లు ? సమసమాజం మంచిదే అంటూ జనానికి కాస్త వుపశమనం కలిగించే చర్యలను కూడా వ్యతిరేకించే వారు నిజంగా దాన్ని కోరుకుంటారంటే నమ్మేదెవరు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d