• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

వియత్నాంలో తమ మిలిటరీ మారణకాండను నిర్ధారించిన దక్షిణ కొరియా కోర్టు !

15 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Left politics, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Ho Chi Minh, My Lai Massacre, US imperialism, Viet Cong fighters, Vietnam War, Vietnam War Massacre


ఎం కోటేశ్వరరావు


వియత్నాం ! స్వాతంత్య్రం, మూడు సామ్రాజ్యవాద దేశాల కబంధహస్తాల నుంచి విముక్తి కోసం మూడున్నర దశాబ్దాల పాటు అపార రక్తం ధారపోసి, త్యాగాలు చేసిన ఒక చిన్న దేశం. ఇలాంటిది ప్రపంచంలో మరొకటి లేదు. ఖండాలన్నింటినీ తన చెప్పుచేతల్లో ఉంచుకొనేంత బలం కలిగిన అమెరికా సేనలను ప్రాణాలు దక్కితే చాలు బతుకుజీవుడా అంటూ పారిపోయేట్లు చేసి ప్రజాశక్తితో ఎంత పెద్ద మిలిటరీనైనా మట్టికరిపించవచ్చు అని నిరూపించిన దేశం కూడా అదే !! అలాంటి వీర గడ్డకు చెందిన గుయన్‌ థీ ధాన్‌ (62) వేసిన కేసును తొలిసారిగా విచారించిన దక్షిణ కొరియా కోర్టు వియత్నాంలో మారణకాండకు దక్షిణ కొరియా మిలిటరీ కారణమని ఫిబ్రవరి మొదటి వారంలో సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఫ్రెంచి వలసగా ఉన్న వియత్నాంను రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమించింది. అది పతనమైన తరువాత తిరిగి ఫ్రాన్స్‌ ఆక్రమణలోకి వెళ్లింది. దాన్ని ఓడించిన తరువాత అమెరికా రంగంలోకి దిగి ఉత్తర వియత్నాంలోని సోషలిస్టు సమాజాన్ని, కమ్యూనిస్టులను, దక్షిణ వియత్నాంలోని జాతీయవాదులు, కమ్యూనిస్టులను అణచేందుకు చూసింది. దానికి మద్దతుగా తైవాన్‌లో తిష్టవేసిన చాంగ్‌కై షేక్‌ మిలిటరీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌,లావోస్‌, కంపూచియా, ఫిలిప్పైన్స్‌, థాయిలాండ్‌, దక్షిణ వియత్నాం మిలిటరీలు వచ్చాయి. ఉత్తర, దక్షిణ వియత్నాంలలోని కమ్యూనిస్టులకు మద్దతుగా చైనా, సోవియట్‌యూనియన్‌, ఉత్తర కొరియా, లావోస్‌, కంపూచియాల్లోని కమ్యూనిస్టు గెరిల్లాలు బాసటగా నిలిచారు.


వియత్నాంలో అమెరికా కూటమి జరిపిన మారణకాండకు గురికాని గ్రామం, పట్టణం లేదంటే అతియోక్తి కాదు, ప్రతి చెట్టూ, పుట్ట, రాయి, రప్ప దేన్ని కదిలించినా దుర్మార్గాలు-వాటికి ప్రతిగా పోరులో ప్రాణాలర్పించిన వారి కథలు, గాధలు వినిపిస్తాయి. అతివల కన్నీటి ఉదంతాలు కొల్లలు. అలాంటి మారణకాండలో ఏడు సంవత్సరాల ప్రాయంలో గాయపడి కోలుకున్న గుయన్‌ థీ ధాన్‌ అనే 62 సంవత్సరాల మహిళ 2020లో వేసిన కేసులో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఒక కోర్టు తీర్పునిచ్చింది. దక్షిణ కొరియా మిలిటరీ జరిపిన దారుణంలోనే ఆమె గాయపడిందని చెప్పటమే గాక, కేసులో ప్రభుత్వం చేసిన వాదనలన్నింటినీ తోసి పుచ్చి ఆమెకు మూడు కోట్ల వన్‌లు (24వేల డాలర్లు) నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దీని మీద ప్రభుత్వ అప్పీలు చేస్తుందా ? మరొకటి చేస్తుందా అన్నది వెంటనే వెల్లడి కాలేదు. ఫాంగ్‌ హట్‌ సమీపంలోని ఫాంగ్‌ నీ అనే వియత్నాం గ్రామంలో 1968 ఏప్రిల్‌ 12న దక్షిణ కొరియా మిలిటరీ మూకలు నిరాయుధులైన పౌరులపై అకారణంగా జరిపిన కాల్పుల్లో 70 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. వారిలో గుయన్‌ థీ ధాన్‌ ఒకరు. ఆ ఉదంతంలో అమెతల్లి, సోదరుడితో సహా కుటుంబంలోని ఐదుగురు మరణించారు.ఈ ఉదంతం గురించి అమెరికా మిలిటరీ రికార్డులలో నమోదు చేశారు. ఒక దక్షిణ కొరియా మిలిటరీ జవాను గెరిల్లాల కాల్పుల్లో గాయపడిన తరువాత ఈ ఉదంతం జరిగినట్లు పేర్కొన్నారు. అంటే గెరిల్లాలనేమీ చేయలేక సాధారణ పౌరుల మీద కక్ష తీర్చుకున్నట్లు స్పష్టం అవుతున్నది.ఈ దారుణానికి ఒడిగట్టిన తరువాత గెరిల్లాల దాడికి భయపడి సైనికులు పారిపోయినట్లు అమెరికా రికార్డుల్లో ఉంది.


దశాబ్దాల పాటు సాగిన దుర్మార్గం, దాన్ని ప్రతిఘటిస్తూ సాగిన పోరులో మరణించిన వారి కచ్చితమైన సంఖ్యలు అందుబాటులో లేవు. అనేక మందిని అంతర్ధానం చేశారు, మిలిటరీ మరణాలను దాచారు. వియత్నాం పోరును రెండు భాగాలుగా చూడవచ్చు.1945లో జపాన్‌ దురాక్రమణ నుంచి తిరిగి ఫ్రాన్స్‌ ఆక్రమించిన తరువాత 1954 జూలై 21వరకు ఒకటి, తరువాత జరిగిన పరిణామాలను రెండో అంకంగా చెబుతున్నారు. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా సమాచారం ప్రకారం 1945 నుంచి 1954వరకు ఫ్రెంచి సామ్రాజ్యవాదులతో కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ తదితరుల నేతృత్వంలో సాగిన పోరును చరిత్రకారులు తొలి ఇండోచైనా వార్‌గా పిలిచారు.ఈ పోరులో కమ్యూనిస్టు గెరిల్లాలు, సాధారణ పౌరులు మూడు నుంచి ఐదులక్షల మంది వరకు ప్రాణాలర్పించారు. ఫ్రెంచి దళాలు, వారితో చేతులు కలిపిన స్థానికులు, కొద్ది మంది ఫ్రెంచి పౌరులు మొత్తం 92 నుంచి లక్షా పదివేల మంది వరకు మరణించారు. ఈ పోరు ముగింపు మరొక కొత్త పరిణామాలకు నాంది పలికింది. జెనీవాలో కుదిరిన ఒప్పందం ప్రకారం వియత్నాంను ఉత్తర – దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తరవియత్నాం కమ్యూనిస్టుల ఆధీనంలోకి వచ్చింది. రెండు సంవత్సరాల్లో దక్షిణ వియత్నాంలో ఎన్నికలు జరిపి రెండు ప్రాంతాల విలీనం జరపాలని దానిలో ఉంది. ఆ ఒప్పందం ప్రకారం ఎన్నికలు జరిగితే దక్షిణ వియత్నాంలో ఫ్రెంచి అనుకూల శక్తులు ఓడిపోవటం ఖాయంగా కనిపించింది. దాంతో ఆసియాలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికన్లు ఫ్రాన్స్‌ స్థానంలో ప్రవేశించి విలీనాన్ని అడ్డుకున్నారు. దక్షిణ వియత్నాంలోని దేశభక్తులు,కమ్యూనిస్టులు వియట్‌కాంగ్‌ పేరుతో ఒక దేశభక్త సంస్థను ఏర్పాటు చేసి అమెరికా, స్థానిక మిలిటరీ నుంచి విముక్తికోసం పోరు ప్రారంభించారు. దానికి ఉత్తర వియత్నాం పూర్తి మద్దతు ఇచ్చింది. అది 1975 ఏప్రిల్‌ 30వరకు సాగింది. అమెరికా దళాలు అక్కడి నుంచి పారిపోయాయి.


దాడుల్లో 30లక్షల మంది అమెరికా సైనికులు పాల్గొన్నారు. దాడుల్లో అక్కడికక్కడే లేదా గాయాలు తగిలి చచ్చిన వారు గానీ 58,220 మంది, వీరుగాక దక్షిణ వియత్నాం కీలుబొమ్మ మిలిటరీ రెండు నుంచి రెండున్నరలక్షల మంది, మొత్తంగా మరణించిన వారు 3,33,620 నుంచి 3,92,364 మంది ఉంటారని లెక్క. ఈ కూటమికి చెందిన పదకొండు లక్షల మంది సైనికులు గాయపడ్డారని అంచనా. కమ్యూనిస్టు వియత్నాం మిలిటరీ, గెరిల్లాలుగానీ పదకొండు లక్షల మంది ప్రాణాలర్పించారు.అమెరికా దాని తొత్తుల దాడుల్లో ఇరవైలక్షల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఇక సియోల్‌ కోర్టు కేసు అంశానికి వస్తే అసలు దాన్ని అనుమతించటమే ఒక అసాధారణ పరిణామం. ఫాంగ్‌ హీ గ్రామంలో జరిగినట్లు చెబుతున్న మారణకాండలో దక్షిణ కొరియా మిలిటరీ పాత్ర గురించి ఆధారాలు లేవని ఒకసారి,వియట్‌కాంగ్‌లను అణచివేసేందుకు దళాలు ప్రయత్నించినపుడు కొందరు పౌరుల మరణాలు తప్పలేదని మరొకసారి, పౌరుల్లో మిళితమైన వియట్‌కాంగ్‌లు జరిపిన కాల్పుల్లోనే గ్రామస్థులు మరణించి ఉండవచ్చు అని, దక్షిణ కొరియా మిలిటరీ దుస్తులు ధరించి వియట్‌కాంగ్‌లే కాల్పులు జరిపారని ఇలా రకరకాలుగా తప్పించుకొనేందుకు ప్రభుత్వం చూసింది.ఒక వేళ కొరియా సైనికులే కాల్పులు జరిపినా అది గెరిల్లాల నుంచి వచ్చిన ముప్పును తప్పించుకొనేందుకు ఆత్మరక్షణ కోసం జరిపినవి తప్ప మరొకటి కాదని కూడా వాదించింది. ఈ వాదనలన్నింటినీ కోర్టు తోసి పుచ్చింది. ప్రభుత్వం చెప్పిన దానికి ఎలాంటి రుజువులు లేకపోగా అలాంటి ప్రతిఘటనను మిలిటరీ ఎదుర్కొనలేదని, జనాన్ని ఒకదగ్గర చేర్చి సమీపం నుంచి కాల్చి చంపినట్లు మాజీ సైనికుడు చెప్పాడు.ఈ కేసులో వియత్నాం గ్రామీణులు, నాటి దాడిలో పాల్గొన్న మాజీ సైనికుడు యు జిన్‌ సియోంగ్‌ కూడా ఆ రోజు ఏం జరిగిందీ, నిరాయుధులైన మహిళలు, పిల్లల మీద ఎలా కాల్పులు జరిపిందీ కోర్టుకు చెప్పాడు. ఆ దారుణం జరిగిన తరువాత అమెరికా సైనికుడు ఒకడు తీసిన ఫొటోలు ఈ కేసులో సాక్ష్యాలుగా పనికి వచ్చాయి.


దక్షిణ వియత్నాంలో అమెరికా జరుపుతున్నదాడులకు తోడుగా దక్షిణ కొరియా మూడు లక్షల 20వేల మంది సైనికులను అక్కడకు పంపింది.వారు అమెరికన్లతో కలసి లక్షల మందిని చంపారు. దాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ఇంతవరకు అంగీకరించలేదు. ఈ దారుణం తరువాత మై లాయి అనేచోట అమెరికా మిలిటరీ ఇలాంటి ఊచకోతకే పాల్పడి పెద్ద సంఖ్యలో చంపింది. విమానాలు, మిలిటరీ శకటాలతో అమెరికా దాడి జరపగా గెరిల్లాలు భౌగోళిక అనుపానులు ఎరిగి ఉన్నందున తప్పించుకొని శత్రువులను దెబ్బతీశారు. వారికి తినేందుకు తిండి కూడా లేని స్థితిలో ఆహారాన్ని కూడా పరిమితంగా తీసుకొంటూ పోరు జరిపారు.అనేక రోజులు పస్తులు కూడా ఉన్నారు. సరైన పడకలు, నిదురలేని రోజులు అనేకం. సొరంగాలు తవ్వి రక్షణ తీసుకోవటమే గాక అమెరికా మిలటరీ మీద దాడి చేసి అడవుల్లో కనిపించకుండా తప్పించుకొన్నారు. ఇదంతా ఒక రోజు, ఒకనెల, ఏడాది కాదు పందొమ్మిది సంవత్సరాల పాటు పోరాడారు.


మై లాయి మారణ కాండ అమెరికా దుష్ట చరిత్రలో చెరగని మచ్చ. ఇలాంటి అనేక దారుణాలు జరిపిన అమెరికా, ఫ్రాన్స్‌, అంతకు ముందు జపాన్‌ జరిపిన దారుణాలను ఇప్పటికీ ఆ ప్రభుత్వాలు అంగీకరించటం లేదు. మరోవైపు మానవహక్కులు, మన్నూ అంటూ ప్రపంచానికి కబుర్లు చెబుతున్నారు. మై లాయిలో మరతుపాకులతో అమెరికన్లు జనాలను ఊచకోత కోశారు. విలియం కాలే అనే లెప్టినెంట్‌ నాలుగు గంటల పాటు ఆ మారణకాండను పర్యవేక్షించాడు. వందలాది మహిళల మీద అత్యాచారాలు జరిపి నరికి చంపటంతో పాటు రెండు వందల మంది పిల్లలతో సహా 504 మందిని చంపారు. వారందరినీ గోతుల్లో దించి ఎటూ వెళ్లకుండా మరతుపాకులతో కాల్చి చంపారు.ఈ ఉదంతాన్ని తరువాత కాలంలో అమెరికా మిలిటరీలో పాఠంగా చెప్పారంటే దుర్మార్గాలను ఎలా జరపాలో శిక్షణ ఇచ్చారన్నది స్పష్టం.వైమానిక దళ మేజర్‌ లాగాన్‌ సిషన్‌ పాఠాలు చెబుతూ మనం వారిని హీరోలుగా పరిగణించవచ్చని, మై లాయిలో ఎవరైనా హీరోలు ఉంటే వారే అని చెప్పాడంటే ఎంత దుర్మార్గంగా ఉంటారో వేరే చెప్పనవసరం లేదు. ఆ మారణకాండ జరిపినపుడు జనం మీదకు హెలికాప్టర్‌ను తోలిన ముగ్గురు పైలట్లను మూడు దశాబ్దాల తరువాత హీరోలుగా అమెరికా సత్కరించింది.విలియం కాలే మీద తప్పనిసరై విచారణ జరిపి శిక్ష వేశారు. తరువాత దాన్ని గృహనిర్బంధంగా మార్చారు, అది కూడా మూడున్నర సంవత్సరాల తరువాత వదలివేశారు. ఇలాంటి దుర్మార్గులను వదలివేసిన కారణంగానే తరువాత 2005లో ఇరాక్‌లోని హడితా అనే చోట అమెరికా ముష్కురులు మహిళలు, పిల్లలతో సహా 24 మంది పౌరులను ఊచకోత కోశారు.దానికి ఒక్కడిని బాధ్యుడిగా చేసి మందలించి వదలివేశారు.ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా అమెరికన్లు ఇలాంటి దుర్మార్గానికే పాల్పడ్డారు.


వియత్నాంలో దక్షిణ కొరియా మిలిటరీ దుర్మార్గాన్ని కోర్టు నిర్ధారించిన తరువాత కొరియాను ఆక్రమించినపుడు జపాన్‌ చేసిన దుర్మార్గాలను కూడా విచారించాలని, వాటిని జపాన్‌ అంగీకరించాలని దక్షిణ కొరియన్లు కొందరు ప్రదర్శన జరిపి డిమాండ్‌ చేశారు. జపాన్‌ సైనికులకు కొరియా మహిళలను బానిసలుగా మార్చి రాత్రుళ్లు బలవంతంగా అప్పగించి బలిచేశారు. వారిని ”సుఖ మహిళలు ”గా అభివర్ణించి దుర్మార్గానికి పాల్పడ్డారు. జపాన్‌ మాదిరి అక్రమాలు జరగలేదని బుకాయించకుండా మానవహక్కుల పట్ల గౌరవం ఉన్నదిగా కొరియా నిరూపించుకోవాలని కూడా వారు కోరారు. దక్షిణ కొరియా క్రైస్తవ మతాధికారులు కూడా వియత్నాం బాధితులకు క్షమాపణలు చెప్పారు. వియత్నాంలో మారణకాండతో పాటు అమెరికా జరిపిన మరొక దుర్మార్గం ఏమంటే ఏజంట్‌ ఆరెంజ్‌ పేరుతో రసాయన దాడులకు కూడా పాల్పడింది.దీని వలన భూమి, నీరు కలుషితం కావటంతో జనాలు అనేక రుగ్మతలకు గురికావటం, పంటలకు దెబ్బతగిలింది.అమెరికా జరిపిన ఈ దాడి వలన తమకు జరిగిన నష్టాన్ని పూడ్చాలంటూ కొన్ని కేసులను దాఖలు చేశారు. దీని బాధితులకు కూడా న్యాయం చేయాలి. మరి ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ గురించి కబుర్లు చెప్పే అమెరికా,ఫ్రాన్స్‌, జపాన్‌ ఇండోచైనా దేశాలు, కొరియన్లకు క్షమాపణ చెప్పటమే కాదు, నష్టపరిహారం చెల్లిస్తాయా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రకంపన : సుప్రీంకోర్టుకైనా నరేంద్రమోడీ చెబుతారా, కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ?

11 Saturday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, Adani-Hindenburg row, BJP, HINDENBURG, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, RSS, SEBI, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


దేశం మొత్తాన్ని కుదిపివేసినా, ప్రపంచంలో మన కంపెనీల విశ్వసనీయత మీద అనుమానం తలెత్తినా, మదుపర్లు లక్షల కోట్లు పోగొట్టుకున్నా దేశ అత్యున్నత పార్లమెంటులో అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు మెదపలేదు. మోడీ తీరు తెన్నులను గమనించిన వారు నోరు విప్పుతారని ఏ ఒక్కరూ ఆశించలేదన్నది కూడా పచ్చినిజం. ఎవరి స్టైల్‌ వారిది, తగిన తరుణం వచ్చినపుడు ఎవరి పద్దతిలో వారు స్పందిస్తారు. పార్లమెంటులో ప్రతిపక్షాల డిమాండ్‌ను ఖాతరు చేయని అపర ప్రజాస్వామికవాది ఇప్పుడు సుప్రీం కోర్టుకైనా ఏదైనా నివేదిస్తారా ? లేక దేశభద్రతకు సంబంధించిన అంశం కనుక కోర్టుకు చెప్పలేం అని ఠలాయిస్తారా ? లేదా విచారణ, సూచనల కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ? చూద్దాం !


శుక్రవారం నాడు సుప్రీం కోర్టు ముందు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎంఎల్‌ శర్మ, విశాల్‌ తివారీ అనే ఇద్దరు న్యాయవాదులు ఒక దావా వేశారు. అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా అమెరికా కేంద్రంగా ఉన్న హిండెన్‌బర్గ్‌ సంస్థ కుట్రలో భాగంగా విడుదల చేసిన పరిశోధన నివేదిక మదుపర్లకు భారీ నష్టం కలుగ చేసినందున సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని విడి విడిగా కేసులు దాఖలు చేశారు.దీన్ని స్వీకరించిన కోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకుంటామని వివాదం తలెత్తిన నేపధ్యంలో నియంత్రణ విధానం, తీసుకున్న చర్యల గురించి ఆరోజుకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)ని ఆదేశించింది. ప్రభుత్వం, సెబీని సంప్రదించి భవిష్యత్‌లో ఇలాంటి ఉదంతం పునరావృతం కాకుండా నియంత్రణ వ్యవస్థలను ఎలా పటిష్ట పరచాల్సిందీ, క్రమబద్దీకరణ చట్టాలు, మార్కెట్ల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన మార్పులు అవసరమైతే దాని కోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుతో సహా ఒక నివేదికను అందచేయాలని సొలిసిటర్‌ జనరల్‌ను కోరింది.కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఒక కమిటీని వేయవచ్చని కూడా చెప్పింది. తాము దీని గురించి ఏదైనా చెబితే మార్కెట్‌ ప్రవృత్తి, మదుపుదార్ల విశ్వాసం మీద ప్రభావం చూపవచ్చని కోర్టు పేర్కొన్నది. భారత మదుపుదార్ల ప్రయోజనాలను ఎలా కాపాడాలన్నదే నిజంగా తమ తాపత్రయమని కోర్టు పేర్కొన్నది. బంతి ఇప్పుడు ఎక్కడ ఉన్నదీ చెప్పనవసరం లేదు.


జరిగిన పరిణామాలపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని,హిండెన్‌ బర్గ్‌ నివేదిక దేశ స్టాక్‌ ఎక్సేంజ్‌ను కుదిపివేయటమే కాదు, దేశంలోని వాణిజ్యవేత్తలను అనుసరిస్తున్న పద్దతులను కూడా ప్రశ్నార్ధకంగా మార్చిందని పిటీషనర్లు పేర్కొన్నారు.నియంత్రణలు లేకుండా ప్రభుత్వ రంగ బాంకులు రుణాలు ఇవ్వటం తీవ్ర ఆందోళనకరమైన అంశమని, బడా కార్పొరేట్లకు ఐదు వందల కోట్ల రూపాయలకు మించి ఇచ్చే రుణాలపై పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని కూడా కోరారు. ఈ పిటీషన్‌ మీద విచారణ ఎలా జరుగుతుందో, ఏమి తేలుస్తారో చెప్పలేము గానీ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తకుండా ఒకవేళ ఎవరైనా అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకొనేందుకు వీలుగా సుప్రీం కోర్టు సూచించినట్లుగా ఒక కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకరిస్తే కథకంచికే. కోర్టు అందుకు అంగీకరిస్తే దాని నిర్ణయాన్ని తప్పు పట్టకూడదు గానీ ఇది నరేంద్రమోడీ-అదానీ ప్రయోజనం కోసం దాఖలైన పిటీషన్‌ అనుకొనేందుకు అవకాశం ఉంది.


ప్రపంచంలో హిండెన్‌బర్గ్‌ వంటి షార్ట్‌ సెల్లర్స్‌, వారి లీలలు కొత్త కాదు. ఇలాంటి వారు ఉండటం మార్కెట్‌కే మంచిదని సమర్ధించేవారు ఉన్నారు. అదానీ కంపెనీల మీద ఇప్పుడు కాకుండా మరోఐదేండ్ల తరువాత గనుక ఇలాంటి నివేదిక వచ్చి ఉంటే ఇంకా పెద్ద ముప్పు వచ్చి ఉండేదని అనేక మంది అనుకుంటున్నట్లుగా మీరాయె ఎసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సిఐఓ రాహుల్‌ చద్దాతో నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రాసింది.” రానున్న 5-10 సంవత్సరాల్లో భారత్‌ గనుక ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే మన కంపెనీలలో ఎక్కువ భాగం మరింతగా తనిఖీకి గురికావచ్చు. దీన్ని గతంలో చూశాము. కొంత మంది షార్ట్‌ సెల్లర్స్‌ చైనా కంపెనీల గురించి నివేదికలు రాశారు. కొన్ని నివేదికలు వాస్తవమే, కొన్ని సంచలనం కలిగించాయి.మార్కెట్‌ దాన్ని పెద్ద అంగలు వేయటంగా చూసింది. ఎక్కడైతే నివేదికలు వాస్తవమో అక్కడ స్టాక్స్‌ ప్రభావితం అయ్యాయి. అదానీ గ్రూపు విషయానికి వస్తే ఎక్కువ మంది మదుపుదార్లు ప్రైవేటు సంభాషణల్లోనే మాట్లాడుతున్నారు. ప్రముఖంగా ప్రస్తావించిన కొన్ని అంశాలను చూస్తే ఒక విధంగా చెడ్డలో మంచిగా చూస్తున్నారు. ఇప్పుడు గాకుండా ఐదేండ్ల తరువాత ఈ సమస్య తలెత్తివుంటే పెద్ద వ్యవస్థాపరమైన ముప్పుగా ఉండేది. దీన్నుంచి ప్రతివారూ పాఠం నేర్చుకున్నారని అనుకుంటున్నాను ” అని చద్దా చెప్పారు. ఇటీవల తాను ఐరోపా వెళ్లినపుడు ప్రతి చోటా మదుపర్లు తనను అదానీ ఉదంతం గురించి అడిగితే పైన చెప్పుకున్న అంశాలనే వివరించాల్సి వచ్చిందని, ఇంత జరిగాక తానైతే ఆచితూచి పెట్టుబడులు పెడతానని కూడా చెప్పారు.


సంస్థాగత మదుపర్ల ఆలోచన ఎలా ఉందో చూశాము. ఎంతసేపూ షార్ట్‌ సెల్లర్లు, వారి వెనుక ఉన్న కుట్ర సిద్దాంతాల చుట్టూ చర్చను తిప్పేందుకు చూస్తున్నారు.హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత అదానీ కంపెనీ ఎఫ్‌పిఓ పేరుతో రు.20వేల కోట్లను సేకరించేందుకు వాటాలను జారీ చేసింది. చిన్న చిన్న మదుపుదార్లెవరూ ముందుకు రాలేదు. కానీ ఆశ్చర్యంగా కొందరు రంగంలోకి దిగి వాటిని కొని అదానీ పరువు నిలిపేందుకు చూశారు. అలా ఎల్‌ఐసి కూడా మూడు వందల కోట్ల మేరకు దరఖాస్తు చేసిందని వార్తలు. వాటిని స్టాక్‌ఎక్సేంజ్‌లో పెడితే కొన్నవారంతా చేతులు కాల్చుకొనేవారే. కానీ అదానీ ఆ అమ్మకాలను రద్దు చేసి ఆదుకున్న తన మిత్రులను రక్షించారు. ఇదొక పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ జరపాలి.అస్థిరపరిస్థితి ఉన్నపుడు అదానీ కోసం ముందుకు వచ్చిన వారెవరు అన్నది బహిరంగం కావాల్సి ఉంది.


ఇక షార్ట్‌ సెల్లర్స్‌ అంటే ఎవరు అన్న ఆసక్తి చాలా మందిలో కలిగింది. అమరావతి ప్రాంత రైతులతో అగ్రిమెంటు చేసుకొని భూములు కొనుగోలు చేసి చేతులు కాల్చుకున్నవారి సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వం రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన రంగంలోకి తేవటంతో భూముల ధరలు ఢమాల్‌ అన్నాయి. దాంతో ఒప్పందాలు చేసుకున్న వారు రైతులకు పెద్ద మొత్తంలో ఇచ్చిన బయానా సొమ్మును వదులుకొని లావాదేవీలను రద్దు చేసుకున్నారు. అదే అదనుగా ధరలు తగ్గటంతో కొందరు చౌకగా కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకర్ల వద్ద కొందరు ఒక కంపెనీ వాటాలను అరువు తెచ్చుకుంటారు. వాటిని మార్కెట్‌లో ఉన్న ధరల కంటే కారుచౌకగా తెగనమ్ముతారు. దీన్నే షార్ట్‌ సెల్లింగ్‌ (తక్కువ ధరలకు అమ్మకం) అంటారు. దాంతో ఆ కంపెనీలో ఏదో గోల్‌మాల్‌ జరిగిందని ఇతరులు కూడా మరింత నష్టపోకుండా చూసుకుందామని అమ్మకాలకు పాల్పడతారు. వాటి విలువ పడిపోతుంది.ఆ ఒక్క కంపెనీ వాటాల ధరలే కాదు, స్టాక్‌ మార్కెట్లో ఇతర కంపెనీల ధరలూ పతనం కావచ్చు. దాన్ని ఆసరా చేసుకొని అదే షార్ట్‌ సెల్లర్స్‌ భారీగా అదే కంపెనీ లేదా ఇతర కంపెనీల వాటాలను తక్కువ ధరలకు కొని పెద్ద మొత్తంలో లాభాలు పొందిన ఉదంతాలతో పాటు చేతులు కాల్చుకున్నవారు లేకపోలేదు. స్టాక్‌ మార్కెట్లో ఇదొక ఖరీదైన జూదం. షార్ట్‌ సెల్లర్స్‌కు వాటాలను అరువుగా ఇచ్చిన బ్రోకర్లకు ఎలాంటి నష్టమూ ఉండదు.లేదూ కొంత మంది బ్రోకర్లే షార్ట్‌ సెల్లింగ్‌కూ పాల్పడి జూదమాడవచ్చు.ఈ షార్ట్‌ సెల్లర్స్‌ ఎలాంటి వారంటే ప్రధాన పట్టణాల బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద కొంత మంది ఆటో, టాక్సీ వాలాలు వచ్చిన వారిని ఎక్కించుకొని కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకోకుండా పగలంతా పడిగాపులు పడి ఎవరైనా అమాయకులు దొరికితే దోచుకొనే ఒక సినిమాలో నిక్కర్‌ నారాయణ పాత్రను గుర్తుకు తెస్తారు.


ఇలాంటి జూదాన్ని స్టాక్‌మార్కెట్‌ నియంత్రణ సంస్థలు నిషేధించవచ్చుకదా అని కొందరు అడగవచ్చు.ప్రపంచంలో చైనాతో సహా ఎక్కడా స్టాక్‌మార్కెట్లలో అలా జరగలేదు.అనుమతిస్తూనే ఉన్నారు. భారీ ఎత్తున అమ్మకాలకు దిగినపుడు స్టాక్‌ ధరలు పతనమైతే ఒక పరిమితి దగ్గర కొద్దిసేపు అమ్మకాలను నిలిపివేస్తారు. అది భారీ ఎత్తున నిర్ణీత పరిమితికి మించి పెరుగుతున్నపుడు కూడా అదే పని చేస్తారు. పూర్తిగా నిషేధించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అదానీ కంపెనీల వాటాల ధరలు విపరీతంగా పెరిగినపుడు లేని నిషేధాలు పతనమైనపుడు ఎలా పెడతారు? గతంలో కేతన్‌ పరేఖ్‌ అనే నేరస్తుడు ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణం జరిగింది. జి టెలిఫిలిమ్‌ వాటా ధర రు.127 ఉంటే దాన్ని పదివేలకు, విజువల్‌ సాప్ట్‌ రు.625ను రు.8,448, సోనాటా సాఫ్ట్‌ రు.90ని రు.2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు. వైస్‌ జగన్‌మోహనరెడ్డి సాక్షి పత్రిక, టీవీ కంపెనీలో పది రూపాయల విలువగల వాటాలను వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వారిని మీరెందుకు అలా కొన్నారని ప్రశ్నిస్తే మేం వ్యాపారులం, లాభాలు వస్తాయనే అంచనాతో కొన్నాం, ఒక వేళ రాలేదనుకోండి నష్టపోయేది మేమే కదా మాకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకు అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దాని వెనుక ఆసలు కథ ఏమంటే అదే వ్యాపారులు రాజశేఖరరెడ్డి సర్కార్‌ నుంచి భారీ మొత్తంలో లబ్ది పొందారని దానికి బల్లకింద గాక బల్లమీదనే బహిరంగంగా చట్టపరంగానే అలా ప్రతిఫలం చెల్లించారనే విమర్శలున్న సంగతి తెలిసిందే. వాటి మీద ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి.దీన్నే నీకది నాకిది అంటారు. హిండెన్‌బర్గ్‌ ఉదంతంపై సోమవారం నాడు లేదా తరువాత సుప్రీం కోర్టు ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.


షార్ట్‌ సెల్లర్లు ఒక్క అదానీ కంపెనీ మీదనే తొలిసారిగా కుట్ర చేసినట్లు, దాన్ని దేశం మీదనే జరిగిన దాడిగా, దానివెనుక చైనా ఉన్నదని ఆరోపిస్తూ కుహనా జాతీయభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.హిండెన్‌బర్గ్‌ కంపెనీ ఉంది అమెరికాలో, దానికి నిజంగా చైనా మద్దతు ఇస్తే అమెరికా ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? చైనా బెలూన్ను కూల్చివేసి అమెరికాను రక్షించినట్లు చెబుతున్న ప్రభుత్వం హిండెన్‌బర్గ్‌ మీద విచారణకు ఆదేశించి చైనా పాత్రను వెల్లడించేందుకు,తన మిత్రదేశంగా భావిస్తున్న భారత్‌ను, అదానీని బహిరంగంగా సమర్ధించలేక విమర్శించలేక ఎక్కాతిక్కా స్థితిలో ఉన్న జిగినీ దోస్తు నరేంద్రమోడీని రక్షించేందుకు జో బైడెన్‌ ఎందుకు పూనుకోలేదు ? 2021లో చైనా ప్రభుత్వం తమ టెక్నాలజీ సంస్థలపై చర్య తీసుకున్నపుడు షార్ట్‌ సెల్లర్స్‌ భారీ ఎత్తున లబ్ది పొందారు. ఆ ఏడాది ఒక్క జూలై నెలలోనే ఎనిమిది బిలియన్‌ డాలర్లు పోగేసుకున్నారు. అలాంటి సొమ్ముతో ఎంచుకున్న కంపెనీల వాటాలను కొనుగోలు చేసి షార్ట్‌ సెల్లింగ్‌కు పాల్పడి లబ్దిపొందేందుకు చూశారు. ఇది నిరంతర ప్రక్రియ. అలీబాబా కంపెనీల షేర్లను మార్కెట్‌ కంటే పదమూడుశాతం తక్కువకు అమ్మి పతనం కాగానే అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసి లాభాలు పొందారు. అలాంటి వారికి ఒక దేశం, ఒక కంపెనీ, దేశభక్తి లాంటివేమీ ఉండవు.అప్పుడు అలీబాబా కంపెనీ కూడా అదానీ మాదిరే కొత్త షేర్లను అమ్మచూపితే ప్రభుత్వం అడ్డుకున్నది. ఇక్కడ నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి పని చేయకున్నా అదానీ తోక ముడిచిన సంగతి తెలిసిందే.2021 జూలైలోనే చైనాలోని ఆన్‌లైన్‌ సరకుల విక్రయ కంపెనీ పిండూడూ కూడా షార్ట్‌ సెల్లర్ల దాడికి గురైంది.వారు పెద్ద మొత్తంలో లబ్ది పొందారు. అప్పుడు చైనా ప్రభుత్వం లేదా పాలకపార్టీ దాన్ని తమ దేశం మీద దాడిగానో దాని వెనుక భారత్‌ లేదా అమెరికా ఉందనో ఆరోపించలేదు. టెక్నాలజీ కంపెనీలపై చైనా సర్కారు తీసుకున్న చర్యలు కొనసాగింపుగా తదుపరి గేమింగ్‌ కంపెనీలపై ఉంటాయని పుకార్లు పుట్టించి షార్ట్‌ సెల్లర్లు లబ్ది పొందారు. ఇలా ప్రతిదేశంలో అచిరకాలంలోనే తారా జువ్వలా ఎదిగిన కంపెనీలన్నింటినీ షార్ట్‌ సెల్లర్లు ఎంచుకొని లబ్ది పొందుతున్నారు. ప్రభుత్వ మద్దతుతో అదానీ వంటి వారు, పాలకుల పక్కన చేరి లెక్కలను తిమ్మినిబమ్మిని చేసిన సత్యం కంప్యూటర్స్‌ మాదిరి కంపెనీలకు లేని విలువను సృష్టించి జనం నెత్తిన చేతులు పెట్టదలచుకుంటే ఇలాంటి షార్ట్‌ సెల్లర్స్‌ అలాంటి కంపెనీల మీద కన్నేసి దెబ్బతీసి లబ్ది పొందుతారు. దివాలా తీసేది అమాయకపు మదుపుదార్లు మాత్రమే. మహా అయితే అదానీ వంటి వారు 2014లో ఎక్కడ ఉన్నారో తిరిగి అక్కడకు పోతారు, వారికి వచ్చే నష్టం ఉండదు. అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిండెన్‌బర్గ్‌ వెనుక చైనా హస్తం నిజానిజాలేమిటి : అదానీని మోస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ” ఆర్గనైజర్‌ ” కట్టుకథలు, పిట్టకతలు !

09 Thursday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, anti china, BJP, China, Donald trump, Explosive BBC documentary, Hindenburg Controversy, HINDENBURG RESEARCH, Joe Biden, Narendra Modi Failures, Propaganda War, RSS, SJM


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? అనేక మందిని తొలుస్తున్న పెద్ద ప్రశ్న. పక్కా నిజాలే చెబుతారు, సత్యహరిశ్చంద్రుడి తరువాత కారణజన్ములు వీరే అన్నట్లు నమ్ముతున్న కొన్ని సంస్థలకు చెందిన వారు పచ్చి అబద్దాలను అలవోకగా ఎలా చెప్పగలుగుతున్నారు ? వారికా తెగింపు ఎలా వచ్చింది ? అన్నింటికీ మించి మన దేశ ప్రధాని నరేంద్రమోడీ ఏం చేస్తున్నారు అన్నది బ్రహ్మపదార్ధంగా ఉంది. బుధవారం నాడు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ఒక్కసారి కూడా అదానీ గురించి, అతని కంపెనీల మీద వచ్చిన ఆరోపణలను ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. గతంలో కాంగ్రెస్‌ ఏలుబడిలో జరిగిన కుంభకోణాల పునశ్చరణతో దేశాన్ని ముందుకు నడిపించగలరా ? అదానీ కంపెనీలపై వచ్చిన విమర్శలతో ప్రపంచంలో మన మీద విశ్వసనీయత సడలిందని ప్రధాని గుర్తించలేదా ? లేక నటిస్తున్నారా ? అదానీ కంపెనీలపై విచారణ జరిపి అక్రమాలేం లేవు అని తేలిస్తే మన ప్రతిష్ట ఇంకా పెరగేది కదా ! ప్రతిపక్షాలు కోరిన విచారణ డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోలేదు. అంటే అదానీ కంపెనీలకు మద్దతు ఇచ్చినట్లేనా ! ఆ ముక్కే సూటిగా ఎందుకు చెప్పలేదు. పాత కుంభకోణాలను ముందుకు తెచ్చి అదానీ కంపెనీల అక్రమాలను మూసిపెట్టాలని చూస్తే కుదురుతుందా ? ఇలా ఎన్నో కొత్త ప్రశ్నలు. ప్రతిపక్షాల కంటే తనను తానే ఇరుకున పెట్టుకుంటున్నారా అని నిజంగా మోడీని నమ్మినవారు కూడా ఆలోచిస్తున్న స్థితి ? మక్కువ పడ్డ మగువ కోసం రాజ్యాలనే పోగొట్టుకున్న రాజుల కథలు విన్నాం. ఒక కంపెనీకోసం నరేంద్రమోడీ ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నారు?


అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు చెప్పింది అమెరికాలోని హిండెన్‌బర్గ్‌ సంస్థ.ఉక్రెయిన్‌ మీద రష్యా సైనిక చర్యకు పాల్పడితే తటస్థంగా ఉన్నట్లు ప్రకటించిన నరేంద్రమోడీ పుతిన్‌తోనూ జో బైడెన్‌తోనూ మాట్లాడి సర్దుబాటు చేసేందుకు చూశారు. అమెరికా నరేంద్రమోడీకి జిగినీ దోస్తు. తన కంపెనీల మీద హిండెన్‌బర్గ్‌ వదలిన క్షిపణి మన దేశం మీద జరిగిన దాడిగా అదానీ వర్ణించారు. ఉక్రెయిను మీద చూపిన శ్రద్దలో వందో వంతైనా లక్షల కోట్ల సంపద ఆవిరవుతున్న మన మదుపర్ల మీద ఎందుకు లేదు అన్నది మోడీ అభిమానులకు సైతం అంతుచిక్కని ప్రశ్న. అమెరికానే మన కాళ్ల దగ్గరకు తెస్తున్న మోడీ అన్న వందిమాగధుల గురించి తెలిసిందే. మిత్రోం లేదా ఏ మోయి జో బైడెనూ మీకు నేను కావాలా వద్దా కావాలనుకుంటే హిండెన్‌బర్గ్‌ మా మీద చేసిన దాడి గురించి చప్పుడు(మాట్లాడవు) చెయ్యవేమిటి అని ఫోన్‌ చేసి అడుగుతారేమో అని ఎదురు చూసిన వారికి ఇప్పటి వరకు నిరాశేమిగిలింది.మంచోడు మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడన్నట్లుగా జనం భావించక ముందే మోడీ స్పందిస్తారా ? ఇది సహస్రశిరచ్చేద అపూర్వ చింతామణి ప్రశ్నగా మారుతుందా ?


హిండెన్‌బర్గ్‌కు ముందు దేశంలోని ఏ సంస్థ లేదా పార్టీ కూడా అదానీ కంపెనీల మీద అలాంటి అంశాలను ముందుకు తేలేదు. ఆరోపణలు చేయలేదు. అది 129 పేజీలలో చెప్పిన అంశాల మీద అదానీ 413 పేజీల వివరణ ఇచ్చారు. ఆ ఒక్కటి మినహా అన్నట్లుగా కీలకమైన అంశాలను వదలి ఇతర గాలిపోగేశారని చెబుతున్నారు. అందుకే దీని మీద నిగ్గుదేల్చాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదీసినా మహామౌనమునిగా పేరుతెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అవి నిజమనో కాదనో, అదానీ పరమపునీతుడనో ఏదో ఒకటి చెప్పమంటే మిన్నువిరిగి మీద పడినా నోరు విప్ప అన్నట్లుగా ఉన్నారు. పార్లమెంటు సమయం, ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అవుతున్నా, లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైనా ప్రతిపైసాకు జవాబుదారీ అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీకి పట్టలేదు.


గుజరాత్‌కు చెందిన స్టాక్‌ బ్రోకర్‌ కేతన్‌ పరేఖ్‌ కుంభకోణం గురించి దర్యాప్తు జరిపేందుకు 2001లో నాటి వాజ్‌పాయి సర్కార్‌ జాయింట్‌ పార్లమెంటరీ కమిటి(జెపిసి)ని వేసింది. గుజరాత్‌లోని సహకార బాంకులను ముంచినందున అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ సారధి నరేంద్రమోడీకి దెబ్బతగులుతుందని భావించిన కారణంగా అనివార్యమై ఆనాడు అంగీకరించాల్సి వచ్చింది. ఆ కుంభకోణం వందల కోట్లలోనే ఉంది. కంపెనీలు, వాటిలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు కుమ్మక్కై కేతన్‌ పరేఖ్‌ ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణమది. జి టెలిఫిలిమ్‌ వాటా ధర రు.127 ఉంటే దాన్ని పదివేలకు, విజువల్‌ సాప్ట్‌ రు.625ను రు.8,448, సోనాటా సాఫ్ట్‌ రు.90ని రు.2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు. ఇప్పుడు అదానీ కంపెనీల వాటా ధరలను కూడా అదే విధంగా లేని విలువను పెంచారన్నదే ప్రధాన ఆరోపణ. నాటి జెపిసి విచారణ జరిపి కుంభకోణం వాస్తవమని తేల్చింది. ఇప్పుడు కూడా అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద అలాంటి కమిటీని వేసేందుకు మోడీ ఎందుకు అంగీకరించటం లేదన్నది ప్రశ్న. నిజం కాదనైనా తేల్చి అదానీ మీద పడిన మచ్చను తొలగించవచ్చు కదా ! వాజ్‌పాయిని ఆదర్శంగా ఎందుకు తీసుకోరు ? దారినపోయే దానయ్య ఒకడు ఏదో అన్నాడని రాముడు సీత పవిత్రతను లోకానికి నిరూపించేందుకు అగ్నిప్రవేశం చేయించిన ఆదర్శవంతుడంటూ గొప్పగా చెప్పే బిజెపి పెద్దలు అదానీ గురించి విచారణకు ఎందుకు జంకుతున్నారు ? రాముడి ఆదర్శం ఓట్లు దండ్లుకొనేందుకు చెప్పుకోవటం తప్ప దాని స్ఫూర్తిని అనుసరించరా ? అదానీ అగ్నిప్రవేశం గురించి ఎవరూ అడగటం లేదుగా !


మరోవైపున నరేంద్రమోడీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పరివార్‌ కాషాయ దళాలు అదానీని సమర్ధించేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అందుకోసం కట్టుకథలు, పిట్టకతలు చెబుతున్నాయి. జనానికి నిర్ధారించే ఆలోచన, అవకాశాలు ఉండవని కాబోలు పచ్చి అవాస్తవాలను వండి వారుస్తున్నాయి. మన దేశ చరిత్రలో ఒక పారిశ్రామిక, వ్యాపార సంస్థ మీద వచ్చిన తీవ్ర ఆరోపణలు విచారించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవటం, సాంస్కృతిక సంస్థ ముసుగువేసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధనకు దిగటం ఇదే ప్రధమం అని చెప్పవచ్చు. డాక్టర్‌ సునీల్‌ గుప్తా అనే పెద్దమనిషి 2023 ఫిబ్రవరి ఆరవ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ” ఆర్గనైజర్‌ ” లో హిండెన్‌బర్గ్‌ వివాదం అంటూ ఒక విశ్లేషణ రాసి అదానీకి కితాబునిచ్చారు. అది భారత్‌ మీద జరిపిన కుట్రగా వర్ణించారు. బిబిసి విదేశీ, అది చెప్పినదానిని మనం ప్రామాణికంగా తీసుకోవాలా, దాని విశ్వసనీయత ఏమిటి? హిండెన్‌బర్గ్‌ ఒక విదేశీ సంస్థ దాని నిజాయితీ ఏమిటీ అంటూ అనేక మంది ఒక తర్కాన్ని ముందుకు తీసుకువచ్చారు. వారంతా సంఘపరివార్‌కు చెందిన వారు లేదా దాని మాటలను గుడ్డిగా విశ్వసించే వారు అన్నది తెలిసిందే. నిజమే, ఏ సంస్థనూ ఎవరూ ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బంగారం స్వచ్చతను కొలిచేందుకు కారట్ల ప్రమాణాలు ఉన్నాయి. ఏ సంస్థకూ దాని స్వచ్చతను కొలిచేందుకు అలాంటి ప్రమాణాలేమీ లేవు. కానీ ఆర్గనైజర్‌ విశ్లేషకులు దవోస్‌లో ప్రపంచ ఆర్థికవేదిక మీద భారత ఆర్థిక రంగం మహా గొప్పగా ఉందని బాంక్‌ ఆఫ్‌ జపాన్‌ గవర్నర్‌ పొగిడారని, అదే సమావేశంలో ఉన్న నోకియా సిఇఓ, ఎరిక్స్‌న్‌ అధిపతి తదితర అగ్రశ్రేణి ప్రపంచ సిఇఓలు నిజమే అన్నారన, సిఎన్‌బిసితో అనేక ప్రముఖ మీడియా సంస్థలు దేశ ఆర్థిక పురోగతి, వచ్చే రోజుల్లో సాధించనున్న విజయాల గురించి ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. మరి ఈ సంస్థలు, సిఇఓలకు ఉన్న విశ్వసనీయత ఏమిటి ? రిలయన్స్‌, టాటాల వంటి సంస్థలతో పాటు అదానీ కంపెనీలు దేశ వృద్దిలో భాగస్వాములౌతున్నట్లు కూడా చెప్పారు. ఇక్కడ ప్రశ్న 2014లో ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బి.డాలర్లకు ఎలా ఎదిగారు, వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నటాటా వంటి వారికి సాధ్యం కానిది అదానీకి ఎలా వచ్చింది, ఎందుకు రాలేదు అన్నది చెప్పాలి.


హిండెన్‌బర్గ్‌ అదానీ కంపెనీ మీద విడుదల చేసిన నివేదికను దేశం మీద దాడిగా చిత్రించటం అంటే గతంలో ఇందిరే ఇండియా- ఇండియా అంటే ఇందిర అన్న కాంగ్రెస్‌ నేత డికె బారువా భజనను గుర్తుకు తెస్తున్నది. అదానీయే ఇండియా-ఇండియా అంటే అదానీ అనటమే. ఇదే హిండెన్‌బర్గ్‌ గతంలో అమెరికాకు చెందిన నికోలా కార్పొరేషన్‌ అనే సంస్థ గురించి కూడా పరిశోధన నివేదికను వెలువరించటంతో ఆ కంపెనీ వాటాల ధర కుప్పకూలింది. అంటే అది అమెరికా మీద దాడి, మాతృ దేశానికి ద్రోహం చేసినట్లా ? దాని వెనుక ఎవరున్నారు ? తీరా తరువాత తేలిందేమిటి నికోలా కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణైంది. అందువలన నడమంత్రపు సిరి వచ్చిన ఏ కంపెనీని ఎవరూ వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. కానీ విలువలు-వలువల గురించి చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఎందుకు కొమ్ముకాస్తున్నట్లు ? గుజరాత్‌ మారణకాండ గురించి బ్రిటన్‌కు చెందిన బిబిసి చెప్పిందాన్ని నమ్మాల్సిన అవసరం లేదని వాదిస్తున్నవారు అదే బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్టు పత్రిక రాసిందాన్ని నమ్మి తన విశ్లేషణలో దాన్ని ఉటంకించి అదానీ తప్పు చేయలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఎలా సమర్ధించుకుంటుంది ? తమకు అనుకూలంగా ఉంటే విదేశీ కితాబు ఫర్వాలేదా ? విమర్శిస్తే దేశం మీద దాడా ?ఎకానమిస్టు చెప్పిందాన్ని వారు నమ్మే వేద ప్రమాణంగా తీసుకుంటారా ? నిజాన్ని నిగ్గుతేల్చమన్న డిమాండ్‌ను అంగీకరించటానికి నోరెందుకు రాదు.ఆత్మవంచన, పర వంచన, రెండునాలికలతో మాట్లాడటం తప్ప మరొకటికాదు.


ఎవడు కొడితే మైండు బ్లాకై దిమ్మ తిరుగుతుందో వాడే పండుగాడు అన్నట్లు హిండెన్‌బర్గ్‌ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిన వారు ఎవరేేం మాట్లాడుతున్నారో పొంతన లేదు.ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ గౌతమ్‌ అదానీకి వత్తాసు పలుకుతూ హిండెన్‌బర్గ్‌ సంస్థకు చైనాకు లంకె ఉందని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ ప్రకటించారు. అదానీకి తమ మద్దతు ఉంటుందని, అలాంటి నివేదికలు మిమ్మల్నేమీ చేయవంటూ ధైర్యం చెప్పారు.మరొక వాట్సాప్‌ పోస్టులో అదానీ దేశభక్తి గురించి సెలవిచ్చారు. ఆర్గనైజర్‌ పత్రికలో 2023 ఫిబ్రవరి 4వ తేదీన వెబ్‌డెస్క్‌ పేరుతో సరికొత్త కథనాన్ని వండి వడ్డించారు.దానిలోని అంశాలను కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో తిప్పుతున్నారు. విజయ గజేరా, ద హాకీఎక్స్‌ అనే వారి ట్వీట్ల ఆధారంగా యధార్ధ సిక్కా దాన్ని పేర్చినట్లు పేర్కొన్నారు.అసలు వారెవరు ? వారి ట్వీట్లకు ఉన్న విశ్వసనీయత ఏమిటి ?


ఆర్గనైజర్‌ కథనం సారాంశం ఇలా ఉంది. ” బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ మరియు బ్యాంక్‌ ఆఫ్‌ థారులాండ్‌ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు భారత వ్యతిరేక వ్యాపారవేత్త జార్జ్‌ సోరోస్‌ చేసిన కుట్రను పోలి ఉంది. వాస్తవంగా అదానీ కంపెనీలపై దాడి జనవరి 25న హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత ప్రారంభం కాలేదు. ఒక ఆస్ట్రేలియన్‌ ఎన్‌జివో నిర్వహించే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ 2016-17లో ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయాల్సిన ఎన్‌జిఓ అదాని వాచ్‌ డాట్‌ ఓఆర్‌జి పేరుతో అదానీ బొగ్గు గనులకు వ్యతిరేకం అని చెప్పినప్పటికీ దానికే పరిమితం కాలేదు. ఇప్పుడు అదానీకి సంబంధం లేని అంశాలను కూడా ప్రచురిస్తోంది. రవీష్‌ కుమార్‌ ఎన్‌డిటివీని వదిలితే దానికేమిటి పని ? ఒక పర్యావరణ ఎన్‌జిఓకు బిబిసి డాక్యుమెంటరీ మీద ట్వీట్‌ను సమర్ధించాల్సిన అవసరం ఏమిటి ? ఎన్‌ఎఫ్‌ఐ అనే భారత్‌ ఎన్‌జివో జార్జిసోరస్‌, ఫోర్డ్‌ ఫౌండేషన్‌, రాక్‌ఫెల్లర్‌, బిల్‌గేట్స్‌, అజీమ్‌ ప్రేమ్‌జీల నుంచి నిధులు పొందుతున్నది. అజీమ్‌ ప్రేమ్‌ జీ ఏర్పాటు చేసిన ఎన్‌జిఓ ఐపిఎస్‌ఎంఎఫ్‌ ఆల్ట్‌ న్యూస్‌, ద వైర్‌, ద కారవాన్‌, ది న్యూస్‌ మినిట్‌ తదితర సంస్థలకు నిధులు ఇస్తున్నది. సిపిఐ(ఎం) నేత సీతారామ్‌ ఏచూరి భార్య సీమా చిస్తీ ఎన్‌ఎఫ్‌ఐకి మీడియా ఫెలోషిప్‌ సలహాదారు. ఆమె ద వైర్‌ ఎడిటర్‌. వైర్‌కు సోరోస్‌, ఫోర్డ్‌, బిల్‌గేట్స్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ, రాక్‌ఫెల్లర్‌, ఓమిడియార్‌తో ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. 2017లో అదానీ ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు సంబంధించి వైర్‌ ఐదు కథనాలను రాసింది.


డిజిపబ్‌ పేరుతో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లతో ఒక గ్రూపును ధన్యా రాజేంద్రన్‌ ఏర్పాటు చేశారు. దీనికి న్యూస్‌క్లిక్‌ ప్రబీర్‌ పురకాయస్థ ఉపాధ్యక్షుడు.దీనిలోని సైట్లన్నింటికీ ఐపిఎస్‌ఎంఎఫ్‌ నిధులు ఇస్తుంది.ఈ సైట్లతో ప్రమేయం ఉన్న వారందరి ఖాతాలను చూస్తే సమన్వయంతో అదాని మీద దాడిచేసిన ట్వీట్లను చూడవచ్చు. విదేశీ ఎన్‌జివోలు, దేశంలోని వారి భాగస్వాముల నుంచి నిధులు, శిక్షిణను పొందిన వీరంతా దేశంలోని జాతీయ వాదులు లేదా సంస్థల మీద దాడి చేస్తారు. అదానీ, అంబానీల మీదనే వీరు దాడి చేస్తారు. టాటా, ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి, వాద్రా లేదా ఇతరుల మీద ఎందుకు చేయరు ? ” ఆర్గనైజర్‌ కథనం ఇలా సాగింది.


ఆర్గనైజర్‌ బాధ అదానీ కంపెనీలను విమర్శించినందుకైతే అంతవరకు పరిమితం కావాలి. కానీ ఇతరుల మీద దాడి ఎందుకు చేయరు అని ప్రశ్నించటం ఏమిటి ? ఒక సాంస్కృతిక సంస్థ అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకుంటుంది. అది నడిపే పత్రికకు ఇతర అంశాలెందుకు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. హిండెన్‌బర్గ్‌ నివేదిక మీద 413పేజీల వివరణ ఇచ్చిన అదానీ తన మీద దేశంలోని కొన్ని వెబ్‌సైట్‌లు నిజంగా దాడి చేస్తుంటే ఇంతవరకు ఒక్క నివేదికా విడుదల చేయలేదేం ? కందకు లేని దురద కత్తిపీటకా అన్నట్లు అదానీకి లేని దురద ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్గనైజర్‌కు ఎందుకు ? అతని కంపెనీలనుంచి ఎంత ముట్టిందేమిటి ? దాని రాతలో పేర్కొన్న సంస్థలు అక్రమాలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, ఎవరు వద్దన్నారు.అమెరికాలోని అనేక సంస్థలు నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. అలాంటపుడు వాటి గురించి నరేంద్రమోడీ గతంలో బరాక్‌ ఒబామా, ట్రంప్‌కు, ఇప్పుడు జో బైడెన్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? జాతీయవాదుల మీద ఆ సంస్థల నిధులతో కొందరు దాడి చేస్తుంటే అసలు సిసలు జాతీయవాదినని చెప్పుకొనే నరేంద్రమోడీ మన దేశంలో వాటి కార్యకలాపాలను ఎందుకు అదుపు చేయరు ? ఈ అంశాలన్నింటినీ ఆర్గనైజర్‌ ఎందుకు ప్రశ్నించదు ?


సుమీత్‌ మెహతా, వినయకుమార్‌ సింగ్‌ ద్వయం 2023 ఫిబ్రవరి 25న ఆర్గనైజర్‌లో ఒక విశ్లేషణ రాసింది. అదానీ నివేదిక, బిబిసి డాక్యుమెంటరీ కూడా చైనా కుట్రే అన్నది సారం. తమిళనాడులోని స్టెరిలైట్‌ రాగి కర్మాగారం మూసివేత వెనుక, ఢిల్లీ శివార్లలో రైతులు ఉద్యమించిన సందర్భంగా జరిగిన రిలయన్స్‌ జియో టవర్ల ధ్వంసం వెనుకా ఉన్నది కూడా చైనా అని ఎందుకంటే దాని 5జి టెలికాం పరికరాలను నిషేధించి రిలయన్స్‌కు ప్రాధాన్యమివ్వటమే చైనా కోపానికి కారణమని సూత్రీకరించారు. భారత కంపెనీల మీద అనుమానాలు రేకెత్తించటం తద్వారా ఆర్థికరంగాన్ని దెబ్బతీయటం,భారత కంపెనీలు నిధులు సేకరించకుండా అడ్డుకోవటం దాగి ఉందన్నారు. స్టెరిలైట్‌ కాపర్‌ కంపెనీ వివాదం చాలా కాలం నుంచి ఉంది. దాన్ని మూసివేత కోరిన సంస్థల వెనుక చైనా ఉన్నదని, తన వద్ద ఉన్న రాగి నిల్వలను అమ్ముకొనేందుకే ఆపని చేసిందని ఆరోపించారు. అసలు విషయ ఏమంటే ఆ కర్మాగార మూసివేతకు ముందు 2017లో మన దేశం నుంచి చైనా 210 కోట్ల డాలర్ల విలువ గల రాగిని దిగుమతి చేసుకుంది.(ఐబిఇఎఫ్‌, 2021 సెప్టెంబరు 20).2021లో చైనా పది దేశాల నుంచి రాగి, రాగి ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా గరిష్టంగా చిలీ నుంచి 19.4శాతం(7.3 బి.డాలర్లు) కాగా తొమ్మిదవ స్థానంలో ఉన్న మన దేశం నుంచి 3.28శాతం(1.18 బి.డాలర్లు) ఉంది. అదే విధంగా చైనా దిగుమతులతో పాటు ఎగుమతులు కూడా చేస్తున్నది. వాటిలో కొరియాకు 31శాతం ఉంది. చైనా దిగుమతుల విలువ 2,738 కోట్ల డాలర్లు కాగా ఎగుమతుల విలువ 24.23 కోట్ల డాలర్లు మాత్రమే.(ట్రెండ్‌ ఎకానమీ డాట్‌కామ్‌ ప్రచురణ తేదీ 2022నవంబరు 14) అందువలన చైనా దగ్గర ఉన్న రాగిని అమ్ముకొనేందుకు స్టెరిలైట్‌ మీద కుట్ర చేసిందనటం పచ్చి అవాస్తం. ఇది ఒక్కటి చాలు ఆర్గనైజర్‌ అబద్దాలకు, వక్రీకరణలకు ఇది పక్కానిదర్శనం.

భారత కంపెనీలు చైనా సంస్థలకు పోటీ ఇస్తున్నందున చైనా హిండెన్‌బర్గ్‌, బిబిసి వంటి వాటి వెనుక ఉండి దాడులు చేయిస్తున్నదని చెబుతున్నారు. ఏ రంగంలో మన దేశం చైనాతో పోటీ పడుతున్నదో చెప్పగలరా ?ఇజ్రాయల్‌ హైఫా రేవును అదానీ తీసుకున్నందుకు చైనాకు కోపం వచ్చి హిండెన్‌బర్గ్‌తో నివేదిక ఇప్పించిందట. ఇజ్రాయల్‌ మొదటి నుంచీ అమెరికా తొత్తు, చైనాకు ఎప్పుడూ శత్రుదేశమే. దాని రేవు కోసం ప్రయత్నించినా చైనాకు దక్కుతుందా ? అసలు చైనా అలాంటి ప్రయత్నం చేసినట్లు దానికి అదానీ అడ్డుపడినట్లు ఏ ఆధారంతో చెబుతున్నారు. హైఫా రేవును చైనా మీద గూఢచర్యానికి వినియోగిస్తే అదే పని ఇజ్రాయల్‌, అమెరికా చేయలేదా, దాన్ని అదానీకి అప్పగించాలా ! బోడిగుండుకు మోకాలికి ముడిపెడితే కుదురుతుందా ?


అలాంటి చైనా నుంచి భారీ ఎత్తున దిగుమతులు చేసుకుంటూ రికార్డులను బద్దలు కొడుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ను ఇంతవరకు ఆర్గనైజర్‌ ఎన్నడైనా ప్రశ్నించిందా ? మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు ఎందుకు తగ్గుతున్నట్లు ? నిజంగా చైనా కుట్రలు పన్నుతుంటే మన ప్రభుత్వం వాటిని నిజమని నమ్మితే మన ప్రభుత్వం చైనాకు నిరసన తెలుపుతూ కనీసం లేఖ కూడా ఎందుకు రాయలేదు, పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించటం లేదు ? గాల్వన్‌ ఉదంతం తరువాత ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంత దేశభక్తి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రతిదాన్నీ చైనా మీదకు నెట్టివేస్తే జనం గుడ్డిగా నమ్ముతారని భావిస్తున్నట్లున్నారు. తలెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వక్రీకరణలు, తప్పుడు రాతలతో కొందరిని కొంత కాలం మోసపుచ్చగలరు తప్ప అందరినీ ఎల్లకాలం మభ్య పెట్టలేరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !

08 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, BALLOON MANEUVERS, China's balloon over America, Joe Biden, Joseph Stalin, spying history, surveillance balloon


ఎం కోటేశ్వరరావు


తమ మీద నిఘాకోసం చైనా పంపిన పెద్ద బెలూన్ను కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి నాలుగవ తేదీ శనివారం మధ్యాహ్నం రెండు గంటల 39 నిమిషాలకు తీరానికి ఆరు నాటికల్‌ మైళ్ల దూరంలోని సముద్రం మీద పేల్చివేసింది. పరిసరాలలో కొద్ది గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేసి అనేక ఫైటర్‌ జెట్‌ విమానాలను రంగంలోకి దింపినప్పటికీ ఒక్క విమానం నుంచి మాత్రమే బెలూన్‌పై కాల్పులు జరిపారు. సముద్రం మీద కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలో పడిన శకలాలను సేకరించేందుకు పూనుకున్నారు. సముద్రంలో మునిగిన వాటిని తీసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చు. వాటిలో దొరికినదేమిటి ? ఎలాంటి సమాచారాన్ని అవి నిక్షిప్తం చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది. జనవరి 28న బెలూన్ను అమెరికా గుర్తించింది. అమెరికా గగనతలంలోని ఒక లక్ష్యాన్ని కూల్చివేసేందుకు స్వంత యుద్ద విమానాన్ని విని యోగించటం ఇదే ప్రధమం.


ఈ ఉదంతాన్ని సాకుగా చూపుతూ నిరసనగా ఫిబ్రవరి ఆరున జరపాల్సిన చైనా సందర్శనను వాయిదా వేసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద డ్రామా నడిచింది.దాన్నొక పెద్ద ఉదంతంగా అమెరికా, ప్రపంచం ముందు ఉంచేందుకు నానా హడావుడి చేసి, ముందుగా ప్రచారదాడికి పాల్పడ్డారు. వాతావరణాన్ని విశ్లేషించేందుకు తాము పంపిన బెలూన్‌ గాలి తీవ్రత కారణంగా అదుపు తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది తప్ప కావాలని పంపిందో మరొకటో కాదని, దాన్ని కూల్చివేసి అమెరికా అతిగా స్పందించిందని చైనా విమర్శించింది. దీన్ని గమనంలో ఉంచుకొని తాము కూడా చేయాల్సింది చేస్తామన్నట్లుగా హెచ్చరిక కూడా చేసింది. అది వాతావరణం కోసం కాదు తమ మీద నిఘా కోసమే పంపినందున కూల్చివేసినట్లు అమెరికా చెబుతోంది. ఏది నిజమో కాదో తరువాత ఎప్పుడో వెల్లడి అవుతుంది. అది మూడు బస్సులు లేదా లారీలకు సమానమైన పరిమాణంలో ఉన్న మానవరహిత బెలూన్‌, సముద్రం మీద కూల్చివేసినందున ఆస్తినష్టం కూడా జరగలేదు గనుక సుఖాంతంగా ముగిసిందని కొందరు చెప్పారు. నిజానికి ఈ ఉదంతం అమెరికా-చైనా మధ్య ఇప్పటికే ఉన్న వివాదాల పుస్తకంలో మరొక అధ్యాయానికి నాంది పలికింది. దానిలో ఎవరేమి రాస్తారో చూద్దాం !


ఇతర దేశాలపై నిఘా అంకానికి తెరతీసింది, ప్రపంచానికి నేర్పింది అమెరికానే. నూటికి నూరుశాతం ఖ్యాతి దానికే దక్కాలి. దొంగకళ్ల బెలూన్లను, విమానాలను పంపి వాటిని, ఎగిరే పళ్లాలు, గ్రహాంతర వాసులుగా ప్రపంచాన్ని నమ్మించటమే కాదు, పలు సినిమాలు తీసి జనం మీదకు వదిలింది కూడా అమెరికన్లే అన్నది దాచేస్తే దాగదు. పిల్లలు ఆడుకొనే బంతిని కూడా గగన తలం నుంచి స్పష్టమైన ఫొటోలను తీయగల ఉపగ్రహాలను నేడు అనేక దేశాలు తిప్పుతున్నది తెలిసిందే. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మన ప్రాంతంలో చైనా గ్రామాలను నిర్మిస్తున్నదంటూ అమెరికా పంపిని చిత్రాల సంగతి తెలిసిందే. ఆగ్రామాలను తమ ప్రాంతంలోనే చైనా నిర్మించినప్పటికీ వక్రీకరించి మనలను ఎగదోసేందుకు అమెరికా చూసింది. దేశాల మధ్య పరస్పరం విశ్వాస లేమి, ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న స్థితిలో బెలూన్లతో సహా రకరకాల నిఘా అన్నది బహిరంగ రహస్యం. రెండవ ప్రపంచ పోరు తరువాత అనేక దేశాల మీదకు అమెరికన్లు బెలూన్లు వదిలారు. వాతావరణం కోసం వదిలినవి కూడా వాటిలో కొన్ని ఉండవచ్చు. దేన్ని ఎందుకోసం వదిలిందీ ఇదమిద్దంగా చెప్పలేము.


ప్రపంచాన్ని తప్పుదారి పట్టించటంలో అమెరికాను మించింది లేదు. ఇరాక్‌లో లేని మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేసి దాని మీద దాడికి దిగి అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను హతమార్చింది. తరువాత ఎలాంటి మారణాయుధాలు లేవని ప్రకటించింది. తానే సృష్టించిన తాలిబాన్లనే మతోన్మాదులు ఏకుమేకుగా మారటం, తమ మీదకే ఎదురు తిరిగిందీ మన కళ్ల ముందే జరిగింది. అంతకు ముందు ఆప్ఘనిస్తాన్‌ విముక్తి వీరులుగా చిత్రించిందీ, ఆయుధాలు ఇచ్చిందీ, తరువాత ఉగ్రవాదులని ప్రచారం చేసి అణచివేసే పేరుతో రెండు దశాబ్దాల పాటు అక్కడ తిష్టవేసి, చివరికి వారితోనే రాజీ చేసుకొని పారిపోయింది అమెరికా అన్నది తెలిసిందే. అందువలన అమెరికా నందంటే నంది పందంటే పంది అని నమ్మాల్సినపని లేదు. ప్రతిదేశమూ తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.


వాతావరణం గురించి పరిశోధించేందుకు పంపిన యు-2 అనే తమ విమానం టర్కీలో కనిపించకుండా పోయిందని పైలట్‌ మరణించినట్లు 1960లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ ప్రకటించాడు. అందరూ నిజమే అని నమ్మారు. కానీ కొద్ది రోజుల తరువాత సదరు విమాన పైలట్‌ ప్రాన్సిస్‌ గారీ పవర్స్‌ తమ వద్ద ప్రాణాలతో ఉన్నాడని నాటి సోవియట్‌ నేత కృశ్చెవ్‌ ప్రకటించి అమెరికా గాలితీశాడు. ఆ నిఘా విమానాన్ని ఆ ఏడాది మే ఒకటవ తేదీన సోవియట్‌ క్షిపణులు కూల్చివేశాయి, పైలట్‌ బతికాడు. దాన్ని పంపింది నిజమే అని తరువాత ఐసెన్‌ హౌవర్‌ అంగీకరించినా కనీసం విచారం కూడా ప్రకటించలేదు. తరువాత రెండు దేశాల మధ్య విబేధాలు మరింత ముదిరాయి. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం గురించి చూడాలి. అనేక రంగాల్లో ముందున్న అమెరికా తన దగ్గర ఎంత ప్రమాదకర అస్త్రం ఉందో ప్రపంచాన్ని బెదిరించేందుకు అవసరం లేకున్నా జపాన్‌పై అణుబాంబు వేసింది. దాన్ని సమర్దించుకొనేందుకు తమ పెరల్‌ హార్బర్‌ మీద దాడి జరిపిందనే కట్టుకథను ప్రచారం చేసింది. నిజానికి ఆ బాంబును చూపి సోవియట్‌ మీద పైచేయి తమదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. సరే తరువాత స్టాలిన్‌ కూడా అణుబాంబును తయారు చేయించి, అంతరిక్ష విజయాలను చూపి అమెరికాను అదుపులో ఉంచాడనుకోండి.

స్టాలిన్‌ తరువాత కృశ్చెవ్‌ అధికారానికి వచ్చాడు. అణుబాంబు తరువాత ఆందోళన చెందిన అమెరికా ఇంకా సోవియట్‌ వద్ద ఉన్న అస్త్రాలేమిటో తెలుసుకొనేందుకు నిఘా విమానాలను దాని గగనతలం మీద తిప్పింది.అవి భూమికి 70వేల అడుగుల ఎత్తున ఎగురుతున్నట్లు సోవియట్‌ పసిగట్టింది.1956 నుంచి అలాంటి విమానాలను తిప్పుతున్నట్లు గమనించినప్పటికీ మౌనంగా ఉంది. వాటిని కూల్చగల క్షిపణి తయారు చేసి పైన పేర్కొన్న విమానాన్ని కూల్చివేసి తమ సత్తాను లోకానికి చాటింది. అమెరికా బండారాన్ని వెల్లడించింది. ఇప్పుడు అమెరికాను ఢ కొంటున్న చైనా నాటి సోవియట్‌ కంటే ఎంతో బలమైనది, కొన్ని రంగాల్లో అమెరికాకు ధీటుగా లేదా కాస్త పైచేయిగా ఉంది. అందువలన పాతబడిన బెలూన్‌ ప్రయోగాలతో అమెరికా మీద నిఘా పెట్టాల్సిన స్థితిలో లేదు. హీలియం వాయువుతో నింపిన బెలూన్లను గగన తలంలో 24 నుంచి 37 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురవేయవచ్చు.యుద్ద విమానాలు 20, వాణిజ్య విమానాలు 12 కిలోమీటర్ల ఎత్తువరకు ఎగురుతాయి. వాటికి అవసరమైన ఇంథనాన్ని అందించేదుకు సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చే పరికరాలను అమర్చుతారు. వాటితో పాటు నిఘాకెమేరాలను కూడా పెడతారని చెబుతారు.


పరస్పర విశ్వాసం లేని కారణంగా 1983లో దక్షిణ కొరియా విమానం గూఢచర్యానికి పాల్పడుతున్నదనే అనుమానంతో సోవియట్‌ మిలిటరీ దాన్ని కూల్చివేసింది. తరువాత అది పౌర విమానం అని తేలింది. 2001లో దక్షిణ చైనా సముద్రం మీద నిఘా కోసం వచ్చిన అమెరికా విమానాన్ని చైనా విమానాలు వెంటాడి, తమ స్థావరంలో దిగేట్లు చేశాయి. చైనా సత్తాను తక్కువ అంచనా వేసిన ఆ విమాన సిబ్బంది, దాన్ని నడిపించిన విభాగానికి ఆ ఉదంతం పెద్ద ఎదురుదెబ్బ.మనం చైనా గుట్టు తెలుసుకోవటం సంగతి అటుంచి విమానాన్ని దారి మళ్లించకుండా, పేల్చివేయకుండా వారి స్థావరానికి పంపి మన ఆధునిక నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాకు సమర్పించుకున్నామని అమెరికన్లు లోలోపల కుమిలిపోయారు. ఏ దేశ గగన తలంలోనైనా అనుమతి లేకుండా ఇతర దేశాల విమానాలు ఎగరటం, అవీ నిఘా తరహా విమానాలైతే సదరు దేశాలపై దాడితో సమానమే. కంటికి కనిపించని వస్తువును కూడా పసిగట్టగల పరిజ్ఞానం అమెరికా వద్ద ఉందన్న సంగతి తెలిసి కూడా మూడు బస్సులంత పరిమాణం గల బెలూన్ను అనుమతి లేకుండా అమెరికా గగనతలం మీద నిఘాకోసం చైనా పంపిందని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. 1962లో భారత్‌-చైనా యుద్దం తరువాత కోపంతో చైనా మీద నిఘావేసేందుకు అమెరికా సిఐఏ-భారత గూఢచార సంస్థ ప్రతినిధులు హిమాలయాల్లోని నందాదేవి శిఖరం మీద ప్లుటోనియం ఇంథనంతో పని చేసే నిఘాపరికరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ఏర్పాటు చేసిన ఆ పరికరాలతో అటు చైనా ఇటు మనదేశం మీద కూడా నిఘావేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ అమెరికాను గుడ్డిగా నమ్మి నాటి మన పాలకులు అంగీకరించారు. తరువాత ఆ ప్లూటోనియం కారణంగా ఉత్తరాఖండ్‌ తదితర ప్రాంతాల్లో వరదలు వచ్చినట్లు కొందరు చెప్పారు. అదేమైందో ఇప్పటికీ రహస్యమే. నిఘా అంశంలో ఎవరూ తక్కువ తినటం లేదు.


సూదికోసం సోదికి పోతే పాత గుట్టులన్నీ బయటపడినట్లుగా బెలూన్‌ ఉదంతం మీద అమెరికా చేసిన రచ్చ ఒక విధంగా దానికే ఎదురుతన్నింది. డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో కూడా అమెరికా గగన తలం మీద చైనా బెలూన్లు కనిపించినా కూల్చివేత వంటి పనులకు పాల్పడలేదని వెల్లడైంది. అప్పుడెందుకు ఉపేక్షించారు, ఇప్పుడెందుకు రచ్చ చేసి కూల్చివేశారు అంటే అంతర్గత రాజకీయాల ప్రభావంతో పాటు చైనాతో వైరాన్ని కొనసాగించేందుకు ఒక సాకుగా దీన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కూల్చివేత గురించి జో బైడెన్‌ తాత్సారం చేయటం చైనా పట్ల మెతకవైఖరే కారణమని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ దాడికి దిగింది. అంతే కాదు తమకు మెజారిటీ ఉన్న ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదిస్తామని బెదరింపులకు దిగింది. ప్రతిపక్షం చేసిన దాడిని ఎదుర్కొనేందుకు ట్రంప్‌ ఏలుబడిలో కూడా చైనా బెలూన్లు ఎగిరినప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని అధికారపక్షానికి చెందిన వారు ఎదురుదాడికి దిగారు. అంతేకాదు అది నిజమే అని అప్పుడు పెంటగన్‌ నివేదించినా గుట్టుగా ఉంచారని, ఎందుకు అలా చేశారో చెప్పాలని అనేక మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. చైనా పట్ల తమ నేత ట్రంప్‌ గట్టిగా ఉన్నారని రిపబ్లికన్లు చెబుతుంటే కాదు తమ నేత తక్కువేమీ కాదని బెలూన్‌ కూల్చివేత, మంత్రి బ్లింకన్‌ పర్యటన రద్దును అధికార డెమోక్రాట్లు చూపుతున్నారు. చైనాను ఎవరు గట్టిగా ప్రతిఘటిస్తే వారు అంత పెద్ద దేశభక్తులని అమెరికన్ల ముందు ప్రదర్శించుకొనే పోటీలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి.


చైనా బెలూన్‌ ఎగిరిందని చెబుతున్న మోంటానా ప్రాంతంలో అమెరికా అణ్వస్త్రాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణులను నిలువ చేసే 150 సిలోస్‌( పురులు లేదా పాతర్ల వంటివి ) ఉన్నట్లు జనం భావిస్తున్నందున నిఘావేసినట్లు చెబుతున్నారు. అమెరికా వద్ద పెద్ద సంఖ్యలో అణుబాంబులు, క్షిపణులు ఉన్నది బహిరంగ రహస్యం. వాటిని దాచిన సిలోస్‌ ఎవరికైనా కనిపించేట్లు ఎవరూ పెట్టరు.వ్యూహాత్మక ప్రాంతాల్లోనే మోహరిస్తారన్నది అందరికీ తెలిసిందే. అంతరిక్షంలోని నిఘా ఉపగ్రహాలు అనేక అంశాలను పసిగట్టినప్పటికీ కొన్నింటిని తెలుసుకోవాలంటే బెలూన్లే అవసరమన్నది కొందరి వాదన.రేడియో, సెల్యులర్‌, ఇతర సంకేతాలను బెలూన్లకు అమర్చిన శక్తివంతమైన సెన్సర్లు మాత్రమే గ్రహిస్తాయని చెబుతున్నారు. చైనా పంపిన బెలూన్‌ దారి తప్పి వచ్చింది కాదని, వారి నియంత్రణ మేరకు అమెరికా మీద తిరిగిందని అంటున్నారు. అదేగనుక నిజమైతే, దానిలో నిఘాపరికరాలే ఉండి ఉంటే అమెరికాలో రచ్చ మొదలు కాగానే చైనా వారే దాన్ని పేల్చి ఆధారాలు దొరకకుండా చేసి ఉండేవారు కదా ? లేదూ నిజంగానే చైనా నిఘాపరికరాలను అమర్చిందని అనుకున్నా అలాంటి పని చేస్తున్నది చైనా ఒక్కటే కాదు కదా. అమెరికా సిఐఏ వద్ద కాంట్రాక్టరుగా పని చేసి దాని గుప్త పత్రాలను భారీ సంఖ్యలో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వెల్లడి చేసిన వివరాల ప్రకారం నాసా ఇతర సంస్థలు నిరంతం చైనా మీద నిఘా పెడుతున్నాయి.చైనా టెలికమ్యూనికేషన్స్‌ సంస్థ హువెయిలో అమెరికా చొరబడి చైనా నేతలు, సైనికుల కదలికలు, అణ్వస్త్రాల సమాచారాన్ని తెలుసుకున్నదని స్నోడెన్‌ పత్రాల్లో ఉన్నది. అందువలన ప్రతి దేశం నిరంతరం తనను కాపాడుకోవటంతో పాటు ఎదుటి వారి బలం,బలహీనతలను పసిగట్టేందుకు నిరంతరం చూస్తూనే ఉంటాయి.అది వాటికి ఉన్న హక్కు, బాధ్యత.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !

05 Sunday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, anti china, BJP, Chang Chung Ling, Gudami International, HINDENBURG RESEARCH, Narendra Modi, Narendra Modi Failures, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్నాడు గురజాడ గిరీశం. అంటే నిష్ప్రయోజకులు అని అర్ధం. శాస్త్రంలో ఉన్న ప్రతిదానికీ మినహాయింపులుంటాయని మన పండితులెప్పుడో సెలవిచ్చారు గనుక గిరీశం చెప్పినదానికి మినహాయింపు ఏమిటంటే అది అందరికీ వర్తించదు. వాట్సాప్‌ ” విజ్ఞానాన్ని ” గుడ్డిగా నమ్మే అజ్ఞానులకు మాత్రమే అని చెప్పవచ్చు. నరేంద్రమోడీ మీద విదేశీ బిబిసి చెప్పిందాన్ని మనం నమ్మాలా, దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా, దేశభక్తుడు అదానీ కంపెనీల గురించి అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ ఇచ్చిన నివేదికను విశ్వసించాలా అని 56 అంగుళాఛాతీ విరుచుకొని ప్రశ్నిస్తున్నవారు మనకు చాలా మంది కనిపిస్తారు. నిజమే దేన్నీ గుడ్డిగా నమ్మకూడదు. వాళ్లే ఇంకా ఏమంటారంటే మన దేశంలో నరేంద్రమోడీని విమర్శించే దేశద్రోహులకు మోడీ గురించి విదేశాల వారు చెప్పే ప్రశంసలు కనిపించవా అని తర్కానికి దిగుతారు. పాకిస్తాన్‌ వాళ్లు ఏమంటున్నారో చూడండి అంటూ మనకు వీడియోలు పంపుతారు. వాటిని మనం చూడాలి, తరించాలి. బిబిసి డాక్యుమెంటరీ చూడకుండా లింకులను నిషేధిస్తారు. మోడీని ప్రశంసించిన తమవారి వీడియో లింక్‌లను పాక్‌ ప్రభుత్వం ఎందుకు నిషేధించలేదు ? సదరు వీడియో మోడీ భక్తుల కల్పితం అనుకోవాలా లేక పాక్‌లో భావ ప్రకటన స్వేచ్చ ఉందనుకోవాలా ?


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని సుమతీ శతకకారుడు చెప్పాడు. ఆ రోజుల్లో గిరీశం, వాట్సాప్‌ ఉండి ఆ మాటలు బద్దెన గారి చెవినపడి లేదా చేరి ఉంటే తప్పించుకు తిరుగువారు వాట్సాప్‌ పండితులు సుమతీ అని కచ్చితంగా రాసి ఉండేవాడు. స్వదేశీయులు విమర్శించినపుడు మీకు పొగిడే విదేశీయులు కనిపించరా అంటారు. అదే విదేశీయులు విమర్శిస్తే, దాని సంగతేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే శత్రువులను భుజాన వేసుకుంటారా అని మాటలమారులు దెబ్బలాడతారు. వారి నాలికలకు నరం ఉండదు. ఇదే గాంగు వాట్సాప్‌లలో తిప్పుతున్న ఒక అంశాన్ని చాలా మంది చదివే ఉంటారు. అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక చీఫ్‌ ఎడిటర్‌ జోసెఫ్‌ హౌప్‌ రాసిన సంపాదకీయం అంటూ నరేంద్రమోడీ గొప్పతనం గురించి అనేక అంశాలను పేర్కొన్నారు.బిబిసి విమర్శిస్తే దురుద్దేశం ఉంది అన్నారు. మరి ఈ సంపాదకీయం మోడీని బుట్టలో వేసుకొనేందుకు మునగ చెట్టు ఎక్కించినట్లా ? ఇక జోసెఫ్‌ సంపాదకీయంలో చెప్పిందేమిటో కొన్ని ఆణిముత్యాలను చూద్దాం. లేకపోతే మోడీ భక్తుల మనోభావాలు గాయపడితే ప్రమాదం.


” నరేంద్రమోడీ ఒక ప్రత్యేక లక్ష్యం వైపుగా పయనిస్తున్నాడు. ఆయన ఏం చెయ్యబోతున్నాడో ఎవ్వరికీ తెలియదు( నిజమే పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపని తెలిసిందే).ఆయన చిరునవ్వు వెనుక ఒక భయంకరమైన దేశభక్తుడున్నాడు.( ఇదేమీ వర్ణన రాబాబూ, ఏ దేశభక్తుడినైనా ఇలా వర్ణించటం చూశారా, అసలు నరేంద్రమోడీలో ఎవరైనా చిరునవ్వును చూశారా). పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లకు అమెరికాతో సంబంధాలను తెగ్గొట్డాడు.ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సరిహద్దులకు దగ్గరగా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ను నాలుగు ముక్కలు చేస్తాడు.యుద్దం చేయకుండానే పాకిస్తాన్ను సర్వనాశనం చేశాడు. ఆసియా ఖండంలో ఆధిపత్యాన్ని నిరూపించాడు.రష్యా,జపాన్‌లను అతి సున్నితంగా తన గుప్పిట్లో ఉంచుకున్నాడు.” ఇలాంటి అనేక అంశాలను చెప్పి ఇంతవరకు ఎవ్వరినీ నేను ఇంతగా మెచ్చుకోలేదు అని జోసెఫ్‌ హౌప్‌ రాసినట్లుగా దానిలో పేర్కొన్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమంటే బిబిసి, హిండెన్‌బర్గ్‌ వాస్తవం.జోసెఫ్‌ హౌప్‌ అనే జీవి అసలు ఉనికిలో లేడు, న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అసలు అలాంటి సంపాదకీయం రాయలేదు.ఇది ఫేక్‌ న్యూస్‌ అని అనేక సంస్థలు దాని బండారాన్ని చెప్పాయి. పోనీ ఇది వాస్తవం కాదని ప్రభుత్వం ప్రకటించిందా అంటే అదెక్కడా కనపడదు. నమో భారతీయం వంటి పేర్లతో ఆంగ్లంలో ప్రచారం చేసినదానిని తెలుగులో పాక్షికంగా అనువందించి వాట్సాప్‌లో తిప్పుతున్నారు.


ఇక వాట్సాప్‌లో చాడా శాస్త్రి పేరుతో ఒక తేడా పోస్టును తిప్పుతున్నారు.జోసెఫ్‌ హౌప్‌ మాదిరి సదరు శాస్త్రి నకిలీ పాత్రో ఉనికిలో ఉన్నదీ తెలీదు. ఏదైనా కావచ్చు, దీన్లో కూడా ఎన్నో అతిశయోక్తులు.వాటిలో కొన్నింటిని చూద్దాం. ” అసలు మన దేశంపై చైనా గుర్రుకు కారణం ఏమిటి ? ఆ దేశ సంస్థలకి పోటీగా మన దేశ వ్యాపార సంస్థలు ఎదిగి ప్రపంచంలో వారి వ్యాపారానికి పోటీకి రావటం, చైనాకు రావాల్సిన వ్యాపారాలను భారత సంస్థలు తన్నుకుపోవటం ” పగటి కలలు కనటం అంటే ఇదే. రికార్డులను బద్దలు కొడుతూ మనం చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం అన్నది తెలిసే ఇలా రాస్తున్నారా ? మన సంస్థలు తన్నుకుపోతే మన దిగుమతులు తప్ప ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు. అమెరికా మన దేశంపై ఎందుకు గుర్రుగా ఉందంటూ రాసిన అంశం ఆసక్తికరం. రష్యా నుంచి రోజుకు 17లక్షల పీపాల చమురును 47 డాలర్ల వంతున దిగుమతి చేసుకొనటంతో 70బిలియన్‌ డాలర్ల ఎగుమతి ఆదాయం మన దేశానికి వచ్చిందని చెప్పారు. దానికి చేసిన ఖర్చు కూడా ఎంతో చెప్పలేదు. దాన్ని శుద్ధి చేసి రోజుకు ఆరులక్షల పీపాల డీజిల్‌ కొరత ఉన్న ఐరోపా దేశాలకు దానిలో 60శాతం మనం ఎగుమతి చేస్తున్నాం అన్నారు.దీని వలన వచ్చే లాభం అంబానీ, మరొక ప్రైవేటు కంపెనీకే కదా ! మన జనానికి కలిగే మేలు ఏమిటి ? ఒక్క లీటరైనా తక్కువ ధరకు మన జనానికి అమ్మారా ? దీనితో ప్రపంచ ఇంథన ఆర్థిక ఆటలో మనం ప్రధాన ఆటగాడిగా ఎదుగుతున్నాం అన్నారు. జనం చెవుల్లో పూలు దూర్చటం అంటే ఇదే.ఉక్రెయిన్‌పై దాడికి దిగిందంటూ రష్యా మీద ఆంక్షలు విధించి అక్కడి నుంచి ఇంథన కొనుగోళ్లను నిలిపివేసింది ఐరోపా. తటస్థంగా ఉన్నామని చెబుతున్న మనం ఐరోపా కోసం రష్యా నుంచి కొనుగోలుకు మన విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని అంబానీ, నయారా కంపెనీలకు ఇస్తూ మనకు ఆదాయం వస్తుందని జనానికి కబుర్లు చెబుతారా ? ఇదొక గొప్ప రాజకీయమా, తటస్థం పేరుతో ఎవరికి ఉపయోగపడుతున్నట్లు ?


వారం రోజుల తరువాత స్వదేశీ జాగరణ మంచ్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ మేలుకున్నది.గౌతమ్‌ అదానీకి వత్తాసు పలుకుతూ హిండెన్‌బర్గ్‌ సంస్థకు చైనాకు లంకె ఉందని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ ప్రకటించారు. అదానీకి తమ మద్దతు ఉంటుందని, అలాంటి నివేదికలు మిమ్మల్నేమీ చేయవంటూ ధైర్యం చెప్పారు.మరొక వాట్సాప్‌ పోస్టులో అదానీ దేశభక్తి గురించి సెలవిచ్చారు. ఇజ్రాయల్‌ హైఫా రేవును అదానీ తీసుకున్నందుకు చైనాకు కోపం వచ్చి హిండెన్‌బర్గ్‌తో నివేదిక ఇప్పించిందట. ఇజ్రాయల్‌ మొదటి నుంచీ అమెరికా తొత్తు, చైనాకు ఎప్పుడూ శత్రుదేశమే. దాని రేవును చైనా మీద గూఢచర్యానికి వినియోగిస్తే అదే పని అమెరికా చేయలేదా, దాన్ని అదానీకి అప్పగించాలా ! మోకాలికీ బోడిగుండుకు ముడిపెట్టటం అంటే ఇదే.హిండెన్‌బర్గ్‌ నిర్వాహకుడు అమెరికాలో స్థిరపడిన ఇజ్రాయలీ. ప్రపంచంలో కంపెనీల వాటాలను షార్ట్‌ సెల్లింగ్‌ చేసే సంస్థ హిండెన్‌బర్గ్‌ ఒక్కటే కాదు. దానికి నిధులు ఇవ్వటం ఎందుకు ? స్వయంగా చైనా అలాంటి కంపెనీని పెట్టవచ్చు. ప్రపంచంలో డాలర్‌ నిల్వలు ఎక్కువ ఉన్న దేశం అది. ఒక్క అదానీని మాత్రమే ఎందుకు అన్ని పారిశ్రామిక సంస్థలను అదే విధంగా చేయవచ్చు కదా ? చైనా గనుక హిండెన్‌బర్గ్‌కు నిధులు ఇస్తే మన జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌ను పంపి బయట పెట్టించవచ్చు. ఎవరన్నా అడ్డుపడ్డారా ? కాసేపు నిజంగానే చైనా నిధులు ఇచ్చి ఆపని చేసిందని అనుకుందాం. పార్లమెంటును కుదిపివేస్తున్న ఈ ఉదంతం మీద మాట్లాడి దాని బండారాన్ని వెల్లడించవచ్చు.ఇదేమీ దేశ రహస్యం కాదు. ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? ఆడలేక మద్దెల ఓడంటే కుదరదు.


హిండెన్‌బర్గ్‌ నివేదికను ఆసరా చేసుకొని చైనా మీద ప్రచారదాడి మొదలు పెట్టటం వెనుక అసలు అంశాన్ని పక్కదారి పట్టించి అదానీ కంపెనీలను రక్షించే ఎత్తుగడ ఉంది.హిండెన్‌బర్గ్‌ తన నివేదికలో అదానీకి చాంగ్‌ చుంగ్‌ లింగ్‌ అనే చైనా జాతీయుడికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించింది. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ఇంటి చిరునామానే తనదిగా చాంగ్‌ ఇచ్చాడని, అతనితో ఉన్న సంబంధం గురించి చెప్పాలని నిగ్గదీసింది. ప్రపంచంలో ఉన్న చైనా జాతీయులందరూ చైనా పౌరులు కానట్లే ఇతగాడూ కాదు. తైవాన్‌కు చెందిన వాడు. (ఎగువున చాంగ్‌ – అదానీ కలసి ఉన్న చిత్రం కూడా తైవాన్‌ మీడియా ప్రచురించినదే.) హిండెన్‌బర్గ్‌ 129 పేజీల నివేదికలో లేవనెత్తిన ప్రశ్నలకు గాను అదానీ ఇచ్చిన 413 పేజీల వివరణలో కీలకమైన వాటిని విస్మరించారు. చాంగ్‌ గురించి హిండెన్‌బర్గ్‌ నివేదికలో నాలుగు చోట్ల ప్రస్తావన ఉంది. ఒక్కదానికీ అదానీ సమాధానం ఇవ్వలేదు. నిజానికి ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోతే అంతా ఉత్తిదే అని ఒక ట్వీట్‌ చేసి ఊరుకునేదానికి అంత వివరణ ఎందుకు ఇవ్వాలి.


హిండెన్‌బర్గ్‌ నివేదికలో ” గుడామీ ఇంటర్నేషనల్‌ ” అనే సంస్థ గురించి పేర్కొన్నారు.దానిలో చాంగ్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. అది తమకు సంబంధించినదే అని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2002 కంపెనీ వివరాల్లో పేర్కొన్నది. ఈ గుడామీ ఇంటర్నేషనల్‌ 2018 వార్తల్లో ఉంది. కాంగ్రెస్‌ నేతలు, మిలిటరీ అధికారులు ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలు వచ్చిన అగస్టా వెస్ట్‌ లాండ్‌ హెలికాప్టర్‌ కుంభకోణంలో అనుమానిత మూడు సింగపూర్‌ సంస్థలలో ఇదొకటి. మాంటెరోసా ఇన్వెస్ట్‌మెంట్‌ హౌల్డింగ్స్‌ అనే సంస్థ అదానీ కంపెనీల్లో 450 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది.ఈ కంపెనీలో గుడామీ పెట్టుబడులు పెట్టింది.చాంగ్‌ అనేక అదానీ కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నట్లు హిండెన్‌బర్గ్‌ పేర్కొంటే మన దేశానికి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజన్స్‌(డిఆర్‌ఐ) ఇచ్చిన ఒక తీర్పు ఉత్తరువులో, సంస్థ రికార్డుల్లో గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ఇంటి చిరునామానే తన అడ్రస్‌గా చాంగ్‌ ఇచ్చినట్లు ఉంది.


ఇదిగాక హిండెన్‌బర్గ్‌ మరొక ఉదంతాన్ని పేర్కొన్నది. గ్రోమోర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే కంపెనీ 2011లో 42.3 కోట్ల డాలర్ల లాభంతో అదానీ పవర్‌లో విలీనమైంది.దీనికీ చుంగ్‌కు సంబంధం ఉంది.భారత చట్టాల ప్రకారమే దాన్ని విలీనం చేసుకున్నాం తప్ప అక్రమాలేమీ జరగలేదని అదానీ తన సమాధానంలో పేర్కొన్నది.హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన 88ప్రశ్నల్లో మూడు పిఎంసి ప్రాజెక్ట్స్‌ అనే సంస్థకు చెందినవి. దీనికి అదానీ కంపెనీలు చెల్లింపులు జరిపినట్లు డిఆర్‌ఐ నివేదికలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఈ కంపెనీ అదానీ బినామీనా కాదా చెప్పాలని కోరింది. ఇది చాంగ్‌ చుంగ్‌ లింగ్‌ కుమారుడిదని, తైవాన్‌లో అదానీ కంపెనీ ప్రతినిధి అని పేర్కొంటూ వారంతా కలసి ఉన్న చిత్రాన్ని కూడా జత చేసి వారి సంబంధాలపై అనుమానాలున్నట్లు పేర్కొన్నది. పిఎంసితో తమకెలాంటి సంబంధాలు లేవని అదానీ తన వివరణలో పేర్కొన్నారు. తాము అడిగిన దానికి సూటిగా చెప్పకుండా కలగాపులగం చేసి చెప్పారని హిండెన్‌బర్గ్‌ పేర్కొన్నది.


ప్రస్తుత ప్రపంచ రాజకీయ చదరంగంలో అమెరికాకు మన అవసరం ఉంది తప్ప మనకు దాని అవసరం లేదని, మన ప్రధాని మోడీ చక్రం తిప్పుతున్నట్లు ఒకవైపు ప్రచారం. అమెరికా మనకు జిగినీ దోస్తుగా ఉంది, మన ప్రధాని మోడీ దాని అధ్యక్షులతో భుజాల మీద చేతులు వేసి తిరిగే చనువు ఉంది. నిజంగా దానికి మన అవసరం ఉంటే హిండెన్‌బర్గ్‌ గురించి ఇంతవరకు జో బైడెన్‌ నోరువిప్పడేం. మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరవుతుంటే నరేంద్రమోడీ ఫోన్‌ చేసి మాట్లాడరేం ! హిండెన్‌బర్గ్‌ వెనుక చైనా ఉందని మన వాట్సాప్‌ మరుగుజ్జులకు తెలిసిన పరమ రహస్యం మోడీ సర్కార్‌కు తెలియని దుస్థితిలో ఉందా ? తెలిస్తే హెచ్చరిక ఎందుకు చేయరు ? దేశం, మదుపర్ల కంటే మౌనమే ప్రధానమా ? ఇంతటి సంచలనం చెలరేగితే ఏ దేశాధినేతైనా మౌనంగా ఉంటారా ? జనాలకు భరోసా ఇవ్వాల్సిన రాజధర్మం తెలియదా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలేమిటి అని ఆలోచించకుండా వాట్సాప్‌, ఫేస్‌బుక్కులో మోడీ, అదానీ, తదితరుల గురించి ప్రచారం చేసే అతియోక్తుల మీద స్వంత బుర్రలను ఉపయోగించకుండా వాటిని ఇతరులకు పంచే, ప్రచారం చేసే, సమర్దించే పెద్దమనుషులను గిరిశం చెప్పినట్లుగా వర్ణిస్తే తప్పా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !

02 Thursday Feb 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Prices, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Agriculture, Fertilizers, Fertilizers subcidies, world agriculture challenge 2023


ఎం కోటేశ్వరరావు


సమస్యలను ఎదుర్కొనే అంశంలో తప్ప ప్రపంచమంతటా రైతాంగం ఒకే విధంగా లేదు. పురాతన పద్దతుల్లో విత్తనాలు చల్లి పండిన మేరకు పంట తీసుకొనే రైతుల మొదలు ఆధునిక పద్దతుల్లో మొత్తం యంత్రాలతో సాగు చేసే వారు ఉన్నారు. కడుపు నింపుకొనేందుకు మాత్రమే పండించుకొనే వారు ఎందరో ఉంటే అమ్ముకొని లాభాలు పోగేసుకొనేందుకు చూసే వారు కొందరు. అందువలన సమస్యలు కూడా ఒకే విధంగా లేవు. మనుషులందరూ ఒకటే గానీ కొందరికి ఆకలి జబ్బు మరికొందరికి తిన్నది అరగని జబ్బు మాదిరి ఎవరి సమస్య వారిది. రైతులు అంటే కేవలం పంటలు పండించేవారే కాదు, అనుబంధ రంగాలలో పని చేసేవారు కూడా అదే కోవకు చెందుతారు. ఈ సందర్భంగా కొన్ని దేశాల్లో రైతాంగం తీరు తెన్నులు, వారి ముందున్న కొన్ని సవాళ్లు-సమస్యల గురించి చూద్దాం.


ఏ రైతుకైనా కావాల్సిన వాటిలో ఎరువు ఒకటి. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్‌ – రష్యా వివాదం దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల రైతాంగాన్ని, ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నది.2022లో ఎరువుల ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. అనేక దేశాల్లో మాంద్యం రానుందనే హెచ్చరికల నేపధ్యంలో రైతులు, ఆహార సరఫరా మీద 2023లో మరింత వత్తిడి పెరగనుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాతావరణ అనుకూల ప్రతికూలతలకు ఎక్కువగా ప్రభావితం అవుతున్నది రైతులే. ఉదాహరణకు ఉక్రెయిన్‌ సంక్షోభం, చమురు, గాస్‌ ధరల పెరుగుదుల, రవాణా అంశాల కారణంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి సాగు ఖర్చు ఇబ్బడి ముబ్బడై అనేక దేశాల రైతాంగం ఇబ్బంది పడింది.2022 రెండవ అర్ధకాలంలో పొటాష్‌, ఫాస్పేట్‌ వినియోగం పది నుంచి 40శాతం తగ్గింది, దాంతో ధరలూ తగ్గాయి.చైనా ఎగుమతులు నిలిపివేసిన తరువాత ప్రపంచమార్కెట్లో 2022 ఏప్రిల్‌లో టన్ను డిఏపి ధర వెయ్యి డాలర్లు ఉండగా తరువాత 713కు తగ్గింది. ఈ ఏడాది 550 డాలర్లకు తగ్గుతుందని ఒక అంచనా. మన దేశంలో ఏడాది పాటు సాగిన రైతాంగ ఆందోళన, వివిధ రాష్ట్రాలు, 2024లో లోక్‌సభ ఎన్నికల్లో ఎరువుల ధరలు ప్రభావం చూపకుండా చూసేందుకు సబ్సిడీలను పెంచి రైతుల మీద భారం పడకుండా చూసింది. అనేక దేశాలలో రైతులే వాటిని భరించారు. సబ్సిడీ ఎరువులు మినహా, ఇతర పెట్రోలు,డీజిలు, రవాణా ఖర్చులు, పురుగుమందుల ధరల పెరుగుదల వంటి భారాలను మన రైతులే భరించారు. 2022 జూలైలో ఉక్రెయిన్‌ వ్యవసాయ ఉత్పత్తుల దిగ్బంధననాన్ని రష్యా ముగించటంతో ఎగుమతులు పెరిగి ధరల తగ్గుదలకు దారితీసింది. కొన్ని దేశాల ఎగుమతులు తగ్గిన మేరకు రైతులకు నష్టం జరిగింది. అందువల ఉక్రెయిన్‌ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము, దాని పర్యవసానాలు, ప్రభావాలు ఎలా ఉండేదీ అనూహ్యమే.

ప్రపంచంలో ఫాస్పేట్‌ను ఎక్కువగా 2021లో చైనా 85మిలియన్‌ టన్నులను ఉత్పత్తి చేయగా రష్యా 14మి.టన్నులతో నాలుగవ స్థానంలో ఉంది.
అంతర్జాతీయ ఫర్టిలైజర్స్‌ సంస్థ సమాచారం ప్రకారం ప్రపంచ భూముల్లో 85శాతం నత్రజని కొరత, 73శాతానికి ఫాస్పేట్‌, 55శాతానికి పొటాష్‌ కొరత ఉంది. ధరల పెరుగుదల కారణంగా అనేక మంది రైతులు వీటి వాడకాన్ని తగ్గించారు. అది పంటల ఆరోగ్యం, దిగుబడుల మీద ప్రతికూల ప్రభావం చూపింది.పొటాష్‌ ఉత్పత్తిలో 14మి.టన్నులతో కెనడా ప్రధమ స్థానంలో ఉండగా రష్యా,బెలారస్‌ కలసి 17 మి.టన్నులు ఉత్పత్తి చేశాయి.2022కు ముందు ప్రపంచంలో 40శాతం ఉత్పత్తి వీటిదే. ఉక్రెయిన్‌ వివాదానికి ముందు ఎంఓపి టన్ను ధర 221 డాలర్లుండగా తరువాత 562 డాలర్లకు చేరింది. 2009 తరువాత ఇదే అధికం.పొటాష్‌కు డిమాండ్‌ తగ్గింది. 2022లో ఆంక్షల కారణంగా రష్యా,బెలారస్‌ నుంచి ఎగుమతులు ఆగాయి. దీన్ని కెనడా సొమ్ము చేసుకొని విపరీత లాభాలు పొందింది. ఈ విధంగా అమెరికా, నాటో కూటమి దేశాలు రైతాంగాన్ని, సాగును దెబ్బతీశాయి.


వివిధ దేశాలలో మన దేశంలో మాదిరి కనీస మద్దతు ధరలు లేవు. ఉన్నవాటిని కూడా ఒకదానితో మరొకదానిని పోల్చలేము. చైనా వంటి ఒకటి రెండు చోట్ల తప్ప ముందే చెప్పుకున్నట్లు ఎక్కడ ఎంత ఉన్నా అక్కడి సాగు ఖర్చులతో పోలిస్తే సాగు గిట్టుబాటు కావటం లేదన్నది స్పష్టం. అందుకే అనేక ప్రభుత్వాలు భారీ మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నాయి.లేని చోట రైతాంగం నష్టపోతున్నది. ఎగుమతులకు సైతం సబ్సిడీలు ఇచ్చే అమెరికా వంటి ప్రభుత్వాల గురించి తెలిసిందే. వివిధ దేశాలలో ఉన్న పంటల దిగుబడి కూడా రైతాంగ రాబడిని ప్రభావితం చేస్తుంది. దిగవన కొన్ని దేశాల వివరాలను చూద్దాం. వాతావరణాన్ని బట్టి అంచనాలు మారుతూ ఉంటాయి. ఒక హెక్టారుకు దిగుబడి అంచనాలు కిలోల్లో ఇలా ఉన్నాయి.2023 జనవరి అంచనాలని గమనించాలి. ఆఫ్రికా ఖండానికి సూచికగా ఈజిప్టును తీసుకున్నప్పటికీ పంటల దిగుబడి మిగతా దేశాలలో దానితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నదని గమనించాలి.


దేశం ××× గోధుమ ××వరి×× ముతక ధాన్యం×× పత్తి ×× చమురు గింజలు××మొక్కజొన్న
ప్రపంచం×× 3,550 ×××4,590××× 4,290 ××× 787 ××× 2,330 ××× 5,740
అమెరికా×× 3,130 ×××8,280××× 10,130×××1,062 ××× 3,150 ×××10,880
ఐరోపా××× 5,500 ××× 6,060××× 4,980××× నిని ××× 2,640 ××× 6,010
బ్రిటన్‌ ××× 8,610 ××××××××××× 6,320××× ×× ××× 3,400 ××× ×××××××
చైనా ××× 5,860 ××× 7,080××× 6,270××× 2,032××× 2,560 ××× 6,440
భారత్‌ ××× 3,370 ×××4,120××× 2,030××× 444 ××× 1,030 ×××3,200
బ్రెజిల్‌ ××× 3,060 ×××7,000××× 5,330××× 1,777××× 3,490 ××× 5,510
ఈజిప్టు ××× 6,410 ×××8,700××× 7,130××× 703 ××× 1,040 ×××8,000


పైన పేర్కొన్న వివరాల అంచనాల్లో స్వల్ప మార్పులు తప్ప దిగుబడుల ధోరణులను వెల్లడిస్తాయి. మన దేశంలో పత్తి కనీస మద్దతు ధర గిట్టుబాటు కాదని తెలిసిందే. చైనాలో కూడా అంతే ఇచ్చినప్పటికీ అక్కడ దిగుబడులు ఎక్కువ కారణంగా రైతాంగానికి నష్టం ఉండదు. పత్తి పండే దేశాల్లో అనేక ఆఫ్రికా దేశాలకు దగ్గరగా తక్కువ దిగుబడి ఉంది. అమెరికా వంటి దేశాలు మన దేశంలో కనీస మద్దతు ధరలు ఇవ్వటాన్ని సబ్సిడీ ఇవ్వటంగా చిత్రిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దిగుబడులు ఎక్కువగా ఉండటం, సబ్సిడీలు ఇచ్చి తక్కువ ధరలకే ఎగుమతులు చేస్తూ మన వంటి దేశాలను అమెరికా,ఇతర ధనిక దేశాలు దెబ్బతీస్తున్నాయి.

ప్రపంచమంతటా 2022లో పెరిగిన సాగు ఖర్చులు, రైతులను ఎలా ప్రభావితం చేసిందీ ఇంకా సమగ్రమైన సమాచారం అందుబాటులోకి రాలేదు. అమెరికాలో ప్రతి డాలరును పట్టి పట్టి చూస్తారు గనుక మిగతా దేశాలతో పోలిస్తే ఆ లెక్కలు కూడా వేగంగా రూపొందుతాయి. భూమి,యంత్రపరికరాలు, ఇంథనం, ఎరువులు, పురుగుమందుల ధరలు బాగా పెరిగినందున ఉత్పత్తి ఖర్చు పెరుగుదల తీరు గురించి కొంత విశ్లేషణ అందుబాటులోకి వచ్చింది. సాగు పద్దతులు, మెట్ట, తరి వంటి తేడాలు, దిగుబడులు కూడా సాగు ఖర్చులను ప్రభావితం చేస్తాయి. అమెరికాలోని నెబరస్కా లో వివిధ పంటలకు పెరిగిన ఖర్చు ఇలా ఉంది. ఒక ఎకరా విస్తీర్ణంలో సగటు దిగుబడి బుషెల్స్‌ (25.4 కిలోలకు సమానం)లో, ఒక్కో బుషెల్‌కు ఖర్చు డాలర్లలో అని గమనించాలి.
పంట××××××× సగటు దిగుబడి××× 2021 ×××2022
మెట్ట మొక్కజొన్న×× 150 ××× 2.34 ××× 2.87
తరి మొక్కజొన్న×× 239 ××× 2.28 ××× 2.83
మెట్ట గోధుమ ×× 62 ××× 3.36 ××× 4.55
తరి గోధుమ ×× 98 ××× 3.11 ××× 4.20
మెట్ట సోయా ×× 47 ××× 5.53 ××× 6.46
తరి సోయా ×× 73 ××× 4.64 ××× 5.55
యంత్రాల వినియోగాన్ని బట్టి అమెరికాలో శ్రమశక్తి-కార్మికుడి ఖర్చును లెక్కిస్తారు. అది సగటున గంటకు 25డాలర్లు ఉంది.ఇతర అంశాల్లో తప్ప ఈ ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. ఎరువుల ఖర్చు 30 నుంచి 70శాతం వరకు పురుగుమందుల ఖర్చు 16 నుంచి 60శాతం పెరిగింది. అది ఎలా పెరిగిందో చూద్దాం.( డాలర్లలో)
పంట, ఏడాది×× ఎరువు ××పురుగుమందు ××మెటీరియల్‌×× నిర్వహణ×× భూమి
మెట్ట మొక్కజొన్న×× —- ××× — ××× —- ××××× —×××——
2020 ×× 49 ××× 60 ××× 226 ×××××× 66 ××× 132
2021 ×× 42 ××× 62 ××× 221 ×××××× 75 ××× 135
2022 ×× 84 ××× 69 ××× 280 ×××××× 78 ××× 144
తరి మొక్కజొన్న×× — ××× — ××× — ××××× —××× —-
2020 ×× 95 ××× 70 ××× 344 ×××××× 144 ××× 260
2021 ×× 82 ××× 59 ××× 320 ×××××× 152 ××× 259
2022 ×× 167 ××× 86 ××× 489 ×××××× 152 ××× 281
ఇదే విధంగా మిగతా పంటల పెట్టుబడి ఖర్చుల్లో కూడా పెరుగుదల ఉంది.


పది ప్రధాన దేశాల వ్యవసాయానికి సంబంధించిన కొన్ని సంక్షిప్త వివరాలు ఇలా ఉన్నాయి.1చైనా : ప్రపంచంలో పదిశాతం సాగుభూమి ఉన్న చైనా నాలుగో వంతు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నది.గోధుమ, వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు. ప్రపంచ కూరగాయల్లో సగం సరఫరా చేస్తూ 50 కోట్ల టన్నులను ఉత్పత్తి చేస్తున్నది.2019లో అమెరికా, ఐరోపా సమాఖ్యలను వెనక్కు నెట్టి అగ్రశ్రేణి వ్యవసాయ ఎగుమతిదారుగా ఉంది.2.అమెరికా: మొక్కజొన్న, సోయా, పత్తి ప్రధాన పంటలు. ఆధునిక సాగు పద్దతుల్లో అగ్రస్థానంలో ఉంది. 3.బ్రెజిల్‌ : ప్రపంచంలో కర్రపెండలాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది గాక కాఫీ, చెరకు, సోయా ప్రధాన పంటలు. ప్రపంచంలో కాఫీ ప్రధాన ఎగుమతిదారుగా ఉంది. జిడిపిలో 25శాతం వ్యవసాయ రంగం నుంచి ఉంది.4.భారత్‌ : పాలు, జనపనార, పప్పుదినుసుల ఉత్పత్తిలో ప్రపంచంలో పెద్దది.వరిలో రెండవ స్థానంలో ఉంది. వ్యవసాయ రంగం 58శాతం మందికి జీవనాధారంగా ఉంది.జీడిపిలో 19.9శాతం(2020-21) కలిగి ఉంది.పాల ఉత్పత్తిలో ప్రపంచంలో తొలి స్థానంలో ఉంది. 5.రష్యా: గోధుమ, బార్లీ, ఓట్స్‌ ప్రధాన పంటలు.ఐదోవంతు భూమిలో గోధుమ సాగు చేస్తారు. పదహారు శాతం మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది.6. ఫ్రాన్స్‌ : గోధుమ, తృణ ధాన్యాలు, బంగాళాదుంపల వంటి పంటలతో ఫ్రాన్స్‌ ఐరోపాలో ముందుంది. ప్రపంచంలో ద్రాక్షతో ఉత్పత్తి చేసే వైన్‌లో ప్రధమ స్థానంలో ఉంది.ఏడుశాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది. 7.మెక్సికో : పండ్లు, మొక్కజొన్న ప్రధాన పంటలు. చెరకు, కాఫీ వాణిజ్య పంటలు.పశుపోషణ ఎక్కువ.8.జపాన్‌ : ప్రధాన పంట వరి. జిడిపిలో రెండుశాతం వాటా ఉంది, పదిశాతం మందికి ఉపాధి కల్పిస్తోంది.సగటు కమతం విస్తీర్ణం మూడు ఎకరాలు మాత్రమే. 9.జర్మనీ : ప్రపంచంలో బీట్‌రూట్‌ ద్వారా పంచదార ఉత్పత్తి చేసే దేశాల్లో నాలుగో స్ధానంలో ఉంది. తరువాత ప్రధాన పంటగా బార్లీ, గోధుమలు ఉన్నాయి. సాగు రంగంలో ఐరోపాలో నాలుగవదిగా ఉంది. 10.టర్కీ : గోధుమ, బీట్‌రూట్‌ ప్రధాన పంటలు. హాజల్‌నట్స్‌, చెస్ట్‌నట్స్‌,అప్రికోట్స్‌, చెరీస్‌ వంటి వాటిని ఎగుమతి చేస్తుంది. ఇరవై ఐదుశాతం మందికి ఉపాధి కల్పిస్తూ జిడిపికి ఎనిమిది శాతం అందిస్తున్నది.


వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ఒక మిత్ర వైరుధ్యంగా చెప్పవచ్చు. తమకు గిట్టుబాటు కావాలంటే యంత్రాలు తప్పవని రైతులు, వాటితో తమ ఉపాధి పోతుందని కూలీలు. రైతులకు గిట్టుబాటు కాకపోవటానికి కూలీల వేతనం కానే కాదు. అదేగనుక వాస్తవమైతే అమెరికాలో కూలీల్లేకుండా చేస్తున్న సాగుదార్లకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నట్లు ? ఐరాస ఆధ్వర్యంలోని ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) 2022 నివేదికలో యాంత్రీకరణ గురించి చెప్పిన అంశాల సారాన్ని చూద్దాం. దారిద్య్రం, ఆకలిని పోగొట్టాలంటే యాంత్రీకరణ ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది.అది చిన్న రైతులకు అందుబాటులోకి రాకుంటే అసమానతలను పెంచుతుంది. డిజిటల్‌ విప్లవం, యాంత్రీకరణలో దేశాల మధ్య, దేశంలోనే ప్రాంతాల మధ్య తేడాలు ఉన్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ పరికరాలు ఉండాలి.యాంత్రీకరణ ప్రభావం సందర్భాన్ని బట్టి ఉంటుంది. వేతనాలు పెరుగుతున్నపుడు, కూలీల కొరత ఉన్నపుడు అది రైతులు, కార్మికులకు లాభసాటి, నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలను సృష్టిస్తుంది. గ్రామీణ కూలీలు ఎక్కువగా, వేతనాలు తక్కువగా ఉన్నపుడు నిరుద్యోగానికి దారితీస్తుంది. సబ్సిడీలు ఎంత ఎక్కువ ఇస్తే అంతగా, వేగంగా యాంత్రీకరణ చేయవచ్చు.కూలీలు అగ్గవగా ఉన్నపుడు విధాననిర్ణేతలు సబ్సీడీలు ఇవ్వకూడదు.అంతగా ఇవ్వాలనుకున్నపుడు సంధికాలంలో పని కోల్పోతున్న వారికి సామాజిక భద్రత కల్పించాలి. మన దేశం, ఇతర అనేక దేశాల అనుభవం చూసినపుడు అలాంటి భద్రత కల్పించిన దాఖలాలు లేవు.


పేదరికం, ఆకలి తాండవించే ప్రాంతాలు ఆఫ్రికా, ఆసియా ఖండాలలో ఎక్కువగా ఉన్నాయి.ప్రపంచంలో 2030నాటికి ఆకలితో ఉండేవారు ఉండకూడదన్నది లక్ష్యం. గడచిన వంద సంవత్సరాలలో ఆఫ్రికాలో తీవ్రమైన కరవులు 300 సంభవించాయంటే అక్కడి పరిస్థితిని ఊహించుకోవచ్చు. 2021లో ఆ ఖండంలో 30 కోట్ల మంది అన్నార్తులున్నారు. అక్కడి ఆహార ఉత్పత్తిలో 70శాతం చిన్న రైతులే చేస్తున్నారు. నిరంతర సాగు వృద్ది, దిగుబడుల పెంపు,ఉపాధి అక్కడి ప్రధాన సవాళ్లు. ఆహార ఉత్పత్తిలో 40శాతం మంది మహిళలు ఉన్నారు. ఆఫ్రికా సాగు వృద్దికి గాను 2030 నాటికి 600 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరం. అందుకనే ధనిక దేశాలు అక్కడ పెట్టుబడి పెడితే అంటూ పెట్టుబడి-లాభాలు-నష్టాలను బేరీజు వేసుకుంటున్నాయి.


అడవిని కొట్టి కొంత కాలం సాగు చేసి ఆ భూమిని వదలి మరోచోట సాగు చేసే పోడు పద్దతిని అనుసరించే అడవి బిడ్డల నుంచి ఆకాశం నుంచి డ్రోన్లు, విమానాల ద్వారా మందులు చల్లే ఆధునిక సాగుదార్లు ఉన్న ప్రపంచంలో దవోస్‌లో జనవరిలో కొలువు దీరిన ప్రపంచ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు డిజిటల్‌ సాగు గురించి సలహాలు ఇచ్చారు. మూడు సాగు చట్టాల పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తీసుకువచ్చిన అంశాలవే. ఇంటర్నెట్‌లో రైతులు తమ వద్ద ఉన్న పంట గురించి వివరాలు పెడితే, మార్కెట్లో కొనుగోలు చేసే వారు, అప్పులు ఇచ్చేవారు ముందుకు వచ్చి అంతా ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు జరుపుతారు, రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని దవోస్‌లో చెప్పారు. కరోనా కాలంలో ఆన్‌లైన్‌ తరగతులు అని చెపితే సెల్‌ఫోన్లకు ఇంటర్నెట్‌ సంకేతాల కోసం చెట్లు ఎక్కిన పిల్లల మాదిరి మారుమూల రైతులు పొలాలను వదలి చెట్లెక్కాల్సి ఉంటుంది. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు 86శాతం మంది ఉన్నారు. ప్రపంచ జిడిపి నాలుగున్నరలక్షల కోట్ల డాలర్లలో నాలుగుశాతం వాటా, నాలుగోవంతు మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయం గురించి ప్రపంచ కార్పొరేట్లు పట్టించుకోవటం వెనుక అసంఘటితంగా ఉన్న రైతుల నుంచి ఎలాంటి పెట్టుబడి, రిస్కు తీసుకోకుండా ఉత్పత్తులను కారుచౌకగా కొట్టేసి లాభాలు పోగేసుకోవాలన్న ఎత్తుగడ తప్ప ఉద్దరించేందుకు కాదు. ప్రపంచంలో మూడో వంతు ఆహారాన్ని 60.8కోట్ల మందిగా ఉన్న చిన్న రైతులు పండిస్తున్నారు. వారికి నిరంతర జీవనం గురించి ఎలాంటి హామీ లేదు.


కార్పొరేట్‌ శక్తుల ధనదాహం, విచక్షణ రహితంగా రైతాంగానికి అందుబాటులోకి తెస్తున్న రసాయనాలు, వాతావరణ మార్పులు తదితర అంశాల కారణంగా ఏటా కోటీ 20లక్షల హెక్టార్ల భూమి సాగుకు పనికి రాకుండా పోతున్నది. దాన్ని అరికట్టి జనాలకు ఉపాధి చూపటం ఒక పద్దతి. దానికి బదులు కృత్రిమ సాగు గురించి కార్పొరేట్‌ సంస్థలు ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నాయి. వాటిని ఎందుకు తెచ్చినప్పటికీ వీటిని తిరస్కరించాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, వారు కడుపునిండా తినేందుకు అవసరమైన మొత్తంలో ఆహారం కావాలంటే 70శాతం ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని అంచనా. ఇతర అవసరాలకోసం చేసే పరిశోధనలు అనేక సందర్భాలలో ఇతర రంగాలలో విప్లవాత్మక మార్పులకు వీలు కల్పించాయి. అంతరిక్ష పరిశోధనలే అందుకు ఉదాహరణ. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహణకు చేసిన వార్షిక ఖర్చుతో పోల్చితే అది చేసిన పరిశోధనల వలన అమెరికా ఆర్థిక వ్యవస్థకు మూడు రెట్లు ఆర్థిక లబ్ది కలుగుతోంది.హరికేన్ల గురించి హెచ్చరించటం మొదలు రోబోటిక్స్‌ వరకు ఆరోగ్యం నుంచి ఆహార నిల్వ పద్దతుల వరకు అనేక రూపాల్లో అది ఉంది. ఇప్పుడు అంతరిక్షంలో సాగు గురించి పరిశోధిస్తున్నారు. అంతరిక్ష నౌకలలో వెళ్లి పరిశోధనలు చేసే వారి మీద అంతరిక్ష వెలుగు ప్రభావం ఎలా ఉంటుంది అన్న అంశంపై చేసిన పరిశోధనలలో వచ్చిన ఫలితాలతో ఇండ్లలో ఎల్‌ఇడి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కిరణ జన్య సంయోగ క్రియతో మొక్కలను పెంచవచ్చని చేసి చూపారు. దీంతో కొన్ని దేశాల్లో సాగుభూమి కొరతను అధిగమించేందుకు అనేక అంతస్తుల భవనాలను నిర్మించి వాటిలో ఆహారానికి అవసరమైన ఆకుకూరల వంటి వాటిని పండిస్తున్నారు. ఇలాంటి భవనాల్లో ఒక ఎకరం విస్తీర్ణం అందుబాటులోకి వచ్చి అక్కడ పండించే పంటల మొత్తం భూమి మీద నాలుగు-ఆరు ఎకరాలలో పండేదానికి సమానంగా ఉంటున్నది. ఈ భవనాల్లో ఏడాది అంతటా సాగు చేయవచ్చు. వాటికి భారీ యంత్రాల వంటి పరికరాలు అవసరం ఉండదు, ఇతర ఖర్చులూ తక్కువే. ఇలాంటి పరిశోధనలు, ప్రయోగాలు మరింతగా అవసరం. అదే విధంగా ఆస్ట్రోనాట్లకు నిల్వవుండే ఆహార పదార్దాలను ఎలా అందచేయాలన్న పరిశోధన వెలుపల ఆహార నిల్వ ప్రక్రియకు దోహదం చేసింది. శాస్త్రవేత్తలు నూతన వంగడాల మొదలు ఆవిష్కరించిన అనేక నూతన ప్రక్రియలను రైతాంగానికి తక్కువ ధరలతో అందుబాటులోకి తేవాల్సిన ప్రభుత్వాలు వాటిని కార్పొరేట్‌ సంస్థలకు లాభాల కోసం అప్పగిస్తున్నాయి.


ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యవసాయ సబ్సిడీలు, వాణిజ్యం మీద దోహా దఫా చర్చలు ప్రారంభమై రెండు దశాబ్దాలు గడిచినా కనుచూపు మేరలో ఒప్పందం కుదిరే అవకాశం కనిపించటం లేదు. ఇంతకాలం చర్చలు చేసి సాధించిందేమిటంటే ఇప్పుడున్న స్థితిని మరింతగా అస్థిరపరచవద్దనే ఏకాభిప్రాయానికి తాజా (2022 జూన్‌) జెనీవా సమావేశం వచ్చింది. ఒకసారి ఆఫ్ఘనిస్తాన్‌లో అస్థిరత అని చెప్పారు తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం అంటూ సాకులతో కాలం గడుపుతున్నారు. ఒప్పందం కుదిరితే ధనిక దేశాలకు నష్టం గనుక అవి ముందుకు సాగనివ్వటం లేదు. ప్రపంచీకరణకు ప్రపంచ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేశారు. ఇంజన్‌ మొరాయించలేదు గాని వాహనాన్ని ముందుకు లాగలేకపోతోంది అన్నట్లుగా దాని పరిస్థితి ఉంది. సర్వేజనా సుఖినోభవంతు దానికి ప్రతిదేశం సంపద్వంతం కావాలన్నది ప్రపంచీకరణ సుభాషితం. అందుకు గాను స్వేచ్చామార్కెట్‌ ఉండాలని చెప్పింది. మార్కెట్‌ అంటేనే లాభాలు, కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్లు అవి మార్కెట్లో పట్టున్నవారికే వస్తాయి. ఇప్పుడు ఆ పట్టుకోసం కుమ్ములాట, ధనికదేశాలు తాము చెప్పిన పద్దతిల్లో ఆట నిబంధనలు ఉండాలని చెబుతున్నాయి.వాటిలో కూడా విబేధాలు. ప్రపంచ వాణిజ్య సంస్థ, దానికి ముందు ఉన్న పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్‌) గానీ మీరు పప్పులు తీసుకు రండి మేము పొట్టు తీసుకువస్తాం రెండింటినీ కలిపి ఊదిన తరువాత మిగిలిన వాటిని పంచుకుందాం అన్నట్లుగా పశ్చిమ దేశాలు తమకు అనుకూలంగా ఏర్పరచుకున్నవే. దేశాలను ఆక్రమించి వలసలుగా చేసుకోవటం కుదరదు గనుక మార్కెట్లను ఆక్రమించే ఎత్తుగడదానిలో ఉంది. అది పారలేదు గనుక కొత్త దారులు వెతుకుతున్నాయి. భారత్‌, చైనా వంటివి కొరకరాని కొయ్యలుగా మారాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దిమ్మ తిరిగే నరేంద్రమోడీ మంత్రాంగం : రష్యా చమురు దిగుమతి అసలు మతలబు ఇదా !

18 Wednesday Jan 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BJP, Energy Crisis, Narendra Modi, Oil Imports From Russia, Reliance, Russian oil


ఎం కోటేశ్వరరావు


2021 డిసెంబరు నెలతో పోలిస్తే 2022 డిసెంబరులో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 33 రెట్లు పెరిగింది. మన దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్‌ను వెనక్కు నెట్టి రష్యా ముందుకు వచ్చింది. డిసెంబరు నెలలో రోజుకు పన్నెండు లక్షల పీపాలను మనం దిగుమతి చేసుకున్నాము. జనవరిలో 17లక్షలకు పెరిగింది. మన దేశం ఏడాది క్రితం దిగుమతి చేసుకున్న ముడిచమురులో అక్కడి నుంచి వచ్చేది కేవలం 2శాతమే, అలాంటిది ఇప్పుడు 25 నుంచి 30శాతానికి చేరింది. ఇరాక్‌ నుంచి 8.86లక్షలు, సౌదీ అరేబియా నుంచి 7.48లక్షల పీపాలు దిగుమతి చేసుకున్నాము. ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యను అమలు చేస్తున్న రష్యాను దెబ్బతీసేందుకు ప్రకటించిన ఆనేక ఆంక్షల్లో భాగంగా డిసెంబరు ఐదవ తేదీ నుంచి తాము నిర్ణయించిన పీపా 60డాలర్ల ధరకు మించి ఎవరూ కొనుగోలు చేయరాదని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారి మీద కూడా ఆంక్షలు ప్రకటిస్తామని అమెరికా, ఐరోపా సమాఖ్య, జి7 కూటమి, మరికొన్ని దేశాలు ప్రకటించాయి. వాటిని ఆమోదించిన దేశాలకు తాము విక్రయించేది లేదని పుతిన్‌ ప్రకటించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు మన దేశం వంద పీపాలు దిగుమతి చేసుకుంటే 60 మధ్యప్రాచ్య దేశాల నుంచి 14 అమెరికా, 12 ఆఫ్రికా, ఐదు లాటిన్‌ అమెరికా, రెండు పీపాలు రష్యా నుంచి దిగుమతి ఉండేది.


పశ్చిమ దేశాలు ప్రకటించిన ఆంక్షలను ఖాతరు చేయరాదని భారత్‌, చైనా మరికొన్ని దేశాలు నిర్ణయించాయి.ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తమ ఇంథన భద్రతను తాము చూసుకోవాలని అందుకోసమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వం క్రియాశీలత, వేగాన్ని ప్రదర్శించిందని ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ వర్ణించారు. ఇంథన ధరలు అదుపు తప్పకుండా ఉండేందుకే కొనుగోలు అన్నారు.రష్యా ప్రతిపాదనను అంగీకరించకపోతే లీటరు పెట్రోలు రు.150 నుంచి 175కు పెరిగేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలివైన నిర్ణయం తీసుకుందని క్రిసిల్‌ ప్రధాన ఆర్థికవేత్త డికె జోషి చెప్పారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌గారు ప్రధాని రాజనీతిజ్ఞత, ధైర్యం కారణంగానే రష్యా నుంచి కొనుగోళ్లు పెంచినట్లు చెప్పారు. తమ ఆంక్షలను ధిక్కరించినా భారత్‌ మీద ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోకూడదని పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. దాంతో మన అవసరం వారికి ఉంది కనుకనే అమెరికా దిగివచ్చిందని, ఇదంతా నరేంద్రమోడీకి ప్రపంచంలో ఉన్న పలుకుబడి, అమెరికా మెడలు వంచే సత్తా కలిగి ఉండటమే అని ప్రచారం చేశారు. దశాబ్దాలుగా సోవియట్‌, తరువాత రష్యా మనకు మిత్రదేశంగా ఉంది కనుక అనేక మంది నిజమే అని నమ్మారు. తాజాగా వచ్చిన సమాచారం ఇప్పుడు అనేక అనుమానాలను ముందుకు తెస్తున్నది. ముందే చెప్పుకున్నట్లు రికార్డు స్థాయిలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన రష్యా చమురుతో వినియోగదారులకు ఒరిగిందేమిటో ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. గతేడాది ఏప్రిల్‌ తరువాత ధరలను తగ్గించిందీ లేదు. దానిని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రిలయన్స్‌, నయారా సంస్థలు ఎక్కడా ఒక్క లీటరు పెట్రోలు, డీజిల్‌ కూడా తక్కువ ధరలకు అమ్మిన జాడలేదు. రష్యా ఇచ్చిన రిబేటు ఎవరి జేబుకు వెళ్లినట్లు ?


నిజానికి రష్యా చమురును అమెరికా, ఇతర దేశాలకు అమ్మేందుకే అని, అంబానీకి లాభాలు కట్టబెట్టేందుకే అని ఇప్పుడు అసలు సంగతి వెల్లడైంది. ఆ చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న అంబానీ, ఇతర ప్రైవేటు చమురుశుద్ధి కర్మాగారాలు దాన్నుంచి ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను అమెరికా,బ్రిటన్‌కు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక వైపు రష్యా మీద ఆంక్షలు మరోవైపు అక్కడి నుంచి దిగుమతి చేసుకొని మరో దేశంలో ఉత్పత్తి చేస్తున్న చమురు ఉత్పత్తులను చౌకగా కొనుగోలు చేసి లబ్దిపొందుతున్న పశ్చిమ దేశాల మోసకారితనం దాస్తే దాగేది కాదు. ఇదంతా నరేంద్రమోడీ సర్కార్‌కు తెలియకుండా జరుగుతుందా ? ఆంక్షలకు ముందు అమెరికా కంపెనీలు రష్యాలో ముడిచమురు నుంచి ఉత్పత్తి చేసే వర్జిన్‌ గాస్‌ ఆయిల్‌ (విజిఓ)ను దిగుమతి చేసుకొనేవి. ఇప్పుడు భారత్‌ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. రష్యా నుంచి రిలయన్స్‌, నయారా ఎనర్జీ కంపెనీలు ముడి చమురు దిగుమతి చేసుకొని విజిఓ, ఇతర ఉత్పత్తులుగా మార్చి అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. రోజుకు రెండులక్షల పీపాల ఎగుమతి జరుగుతున్నట్లు కెప్లర్‌ సంస్థలో ముడిచమురు విశ్లేషకుడిగా ఉన్న విక్టర్‌ కాటోనా చెప్పాడు. రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నది ఆ రెండు కంపెనీలైనప్పటికీ ప్రభుత్వ రంగంలోని ఐఓసి,బిపి, హెచ్‌పి సంస్థలు కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నాయని, ప్రతివారూ కొంటున్నారు, ఇప్పుడిది ఒక జాతీయ క్రీడగా మారిందని కాటోనా అన్నాడు.


ప్రస్తుతం రోజుకు మన దేశం 17లక్షల పీపాలు కొనుగోలు చేస్తుండగా దానిలో ఒక్క రిలయన్స్‌ కంపెనీ రోజుకు ఆరులక్షల పీపాలు దిగుమతి చేసుకుంటోంది. దాని చమురు శుద్ది సామర్ధ్యంలో ఇది సగం.నయారా ఎనర్జీ ఇటీవల దాదాపుగా రష్యన్‌ చమురునే శుద్ధి చేస్తోంది. భారత్‌కు పీపాకు పది డాలర్ల చొప్పున తక్కువ ధరకు ఇస్తున్నందున ఇక్కడి చమురుశుద్ది కంపెనీలకు ఒక టాంకరుకు కోటి డాలర్ల మేరకు లాభం వస్తున్నదని, ప్రస్తుతం భారత రేవులకు వచ్చినవి లేదా దారిలో ఉన్నవిగానీ 68 టాంకర్లు ఉన్నట్లు కాటోనా వెల్లడించాడు. డిసెంబరు నెల సమాచారాన్ని చూసినపుడు విజిఓ ఎక్కువగా అమెరికా, తరువాత ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌, సింగపూర్‌ వెళ్లినట్లు కాటోనా చెప్పాడు.ఎక్కడైనా ఆధునిక చమురుశుద్ది కర్మాగారం ఉంటే విజివోతో రవాణా ఇంథనాల తయారు ప్రత్యేకించి డీజిల్‌, అవసరమైతే పెట్రోలుగా కూడా మార్చవచ్చన్నాడు. మన దేశం నుంచి అమెరికా ఒక్కటే కాదు, రష్యా మీద కాలుదువ్వుతున్న బ్రిటన్‌ కూడా దొడ్డిదారిన కొనుగోలు చేస్తున్నట్లు కెప్లర్‌ సమాచారం వెల్లడించింది. 2022లో జామ్‌ నగర్‌లోని రిలయన్స్‌ రిఫైనరీ 215 టాంకర్లలో చమురు దిగుమతి చేసుకుంది.


అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు తమ చమురు ఉత్పత్తులను కొనుగోలు చేసి తమకు డాలర్లను సమకూర్చుతున్నందున, మన దేశం ద్వారా లబ్ది కలుగుతున్నది కనుక రష్యా ఎలాంటి అభ్యంతరాలు పెట్టటం లేదు, మనం ఎంత కోరితే అంత పంపుతున్నది. ఈ పరిణామం రష్యా చమురు కొనుగోలు నిలిపివేసిన ఐరోపా దేశాలు-అమెరికా మధ్య విబేధాలను కలిగిస్తే అదీ పుతిన్‌కు లాభమే కనుక చూసీ చూడనట్లు ఉన్నాడని అనుకోవాలి. ఐరోపాలో ప్రస్తుతం పెట్రోలు, డీజిలు ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ముడి చమురు ఎక్కడిదైనా మన దేశం తక్కువ ధరలకు ఎగుమతి చేస్తే తీసుకొనేందుకు వాటికి అభ్యంతరం లేదు. గతంలో కూడా కొంత మేర దిగుమతి చేసుకున్నందున ఇప్పుడు ఇంకా పెంచుకుంటున్నాయి. బ్రిటన్‌ నిబంధనలు కూడా ఈ దిగుమతులకు అవకాశం కలిగిస్తున్నాయి. పశ్చిమ దేశాల తరఫున రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ దీని గురించి తెలిసినా పైకి చెప్పుకోలేని స్థితి. జెలెనెస్కీ సలహాదారు ఒలెగ్‌ ఉస్తెంకో మాట్లాడుతూ ఆంక్షలు విధించిన దేశాల బలహీనతలను ఈ కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నట్లు వాపోయాడు. ” తమ సరిహద్దుల పొడవునా నెత్తుటి ఇంథనాన్ని పారించటం ద్వారా ఉక్రెయిన్‌కు ఇస్తున్న మద్దతును నీరుగార్చే నిబంధనలను బ్రిటన్‌ సరిచేసుకోవాలి. ఆ కంపెనీలు శుద్ది చేస్తున్న ప్రతి ఐదు పీపాల్లో ఒకటి రష్యాదే, అవి ఉత్పత్తి చేస్తున్న దానిలో పెద్ద మొత్తం డీజిలు రష్యా ముడిచమురు నుంచే ” అన్నాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ కర్మాగారం నుంచి బ్రిటన్‌ 2022లో కోటి పీపాల డీజిల్‌, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఈ మొత్తం 2021తో పోల్చితే రెండున్నరెట్లు ఎక్కువ అని కెప్లర్‌ సమాచారం తెలిపింది.


ఒక్క అమెరికా, బ్రిటన్‌ మాత్రమే దొడ్డిదారిన డీజిల్‌,ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం లేదు. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలలో ఎల్‌ఎన్‌జి లేకపోవటంతో ఐరోపా దేశాలు భారీ ఎత్తున రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. 2021 ఆగస్టుతో పోల్చితే 2022 ఆగస్టులో 41శాతం ఎల్‌ఎన్‌జి దిగుమతి పెరిగింది.లేనట్లయితే ఇంథన ధరలు ఇంకా పెరిగి ఉండేవని లండన్‌లోని ఒక సంస్థ పేర్కొన్నది. ఫిబ్రవరి ఐదు నుంచి మరిన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నందున అప్పుడేం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఒకవైపు రష్యాను నిలువరించే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్ను శిఖండిగా నిలిపిన ఐరోపా దేశాలు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. ఆ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇంథన కొరత కారణంగా పెట్టుబడులను ఆకర్షించటంలో జర్మనీ వెనుకబడిందని జర్మన్‌ దినపత్రిక ఒకటి తెలిపింది.జర్మనీ పరిశోధనా సంస్థ జే రూపొందించిన సూచికల ప్రకారం 21 దేశాలలో జర్మనీ 18వ స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే నాలుగు స్థానాలు దిగజారింది. ప్రభుత్వం 200బిలియన్‌ యూరోల సబ్సిడీ ప్రకటన,2024వరకు గాస్‌ ధరల అదుపు వంటి పధకాలను ప్రకటించినప్పటికీీ ఇంథన ధరలు తక్కువగా ఉన్న అమెరికా, ఆసియా దేశాలకు జర్మనీ వ్యాపారులు వలస పోతున్నారు. గడచిన నాలుగు సంవత్సరాల సగటుతో పోల్చితే 2022లో జర్మనీలో 14శాతం గాస్‌ వినియోగం తగ్గింది. పారిశ్రామిక డిమాండ్‌ 15శాతం పడిపోయింది. గతంలో వెనెజులాను సాధించేందుకు విధించిన ఆంక్షలను తన అవసరాల కోసం అమెరికా ఎత్తివేసింది. ఇప్పుడు దొడ్డిదారిన రష్యా నుంచి మన దేశం దిగుమతి చేసుకున్న చమురును శుద్ది చేసిన తరువాత దొడ్డిదారిన దిగుమతి చేసుకుంటోంది. ఆ విధంగా మన ప్రభుత్వం అమెరికా- రష్యాలను సంతుష్టీకరిస్తున్నట్లు భావించవచ్చా ? తటస్థ విధానం అంటే ఇదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాను బూచిగా చూపి పేట్రేగుతున్న అమెరికా మిలిటరీ ఉన్మాదం !

18 Wednesday Jan 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Military Spending Frenzy, Nuclear Warheads, PENTAGON, Pentagon on China military, US imperialism


ఎం కోటేశ్వరరావు


2023లో 858 బిలియన్‌ డాలర్ల మేరకు మిలిటరీ ఖర్చు చేయాలని పెంటగన్‌ (అమెరికా రక్షణ శాఖ ) నిర్ణయించింది. ఇది అడిగినదానికంటే 45 బి.డాలర్లు అదనం. నిజానికి 1200బి.డాలర్లు ఖర్చు పెట్టాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. రాజు తలచుకోవాలే గానీ దెబ్బలకు కొదవా అన్నట్లుగా మిలిటరీ పరిశ్రమల కార్పొరేట్లు కనుసైగ చేయాలేగానీ అమెరికా పాలకులు డాలర్లతో వాలిపోతారు. స్టాక్‌హౌం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(ఎస్‌ఐపిఆర్‌ఐ-సిప్రీ) గతేడాది వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో తొలిసారిగా ప్రపంచ రక్షణ ఖర్చు రెండు లక్షల కోట్ల డాలర్లు (2,113 బి.డాలర్లు) దాటింది. అమెరికా, చైనా, భారత్‌, బ్రిటన్‌, రష్యా వాటా మొత్తంలో 62శాతం ఉంది. కరోనాను ఎదుర్కొనేందుకు లేదా బాధితులను ఆదుకొనేందుకు చేసిన ఖర్చు సంగతేమో గానీ వరుసగా ఏడేళ్లు , కరోనాలో ఆర్థిక రంగం దిగజారినప్పటికీ వరుసగా రెండవ సంవత్సరం మిలిటరీ ఖర్చు మాత్రం పెరిగింది.


అమెరికాలో 2021లో 801 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టారు. సాంకేతికంగా ఇతర దేశాల కంటే పైచేయిగా ఉండాలన్న వైఖరితో ఏటా భారీ ఎత్తున పరిశోధన – అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. రష్యా నుంచి ప్రధానంగా ఎగుమతి జరిగే చమురు ధరలు తక్కువగా ఉండి రాబడి తగ్గటంతో 2016 నుంచి 2019 వరకు దాని మిలిటరీ ఖర్చు కూడా తగ్గింది. అయితే, అమెరికా, ఇతర నాటో దేశాల కుట్రలను పసిగట్టి తరువాత ఉక్రెయిన్‌ సరిహద్దులో మిలిటరీని పెంచటంతో ఖర్చు కూడా పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2021లో ఖర్చు పెరిగినందున 65.9బి.డాలర్లకు చేరింది. గతేడాది 75, ఈ ఏడాది 84బి.డాలర్లకు పెరగవచ్చని అంచనా. రెండవ స్థానంలో ఉన్న చైనా ఖర్చు 293 బి.డాలర్లుంది. గత 27 సంవత్సరాలుగా వరుసగా పెరుగుతూనే ఉంది.76.6 బి.డాలర్లతో మన దేశం మిలిటరీ ఖర్చులో మూడవ స్థానంలో ఉంది. ఇటీవల జపాన్‌ భారీ మొత్తాలను పెంచటంతో మనలను వెనక్కు నెట్టి మూడవ స్థానాన్ని ఆక్రమించనున్నట్లు వార్తలు. 2021లో 50 బి.డాలర్లకు మించిన ఖర్చు ఉన్న దేశాలు వరుసగా అమెరికా(801), చైనా (293), భారత్‌ (76.6), బ్రిటన్‌ (68.4), రష్యా (65.9), ఫ్రాన్స్‌ (56.6), జర్మనీ (56), సౌదీ అరేబియా (55.6), జపాన్‌(54.1), దక్షిణ కొరియా (50.2) ఉంది.
అమెరికాతో సహా ప్రత్యేకించి చైనాను దెబ్బతీసేందుకు చూస్తున్న దేశాలు దాన్నొక బూచిగా చూపుతూ తమ ఖర్చును పెంచుతున్నాయి.

ఏ దేశమూ మరో దేశాన్ని నమ్మే పరిస్థితి లేనందున మిలిటరీ నవీకరణకు తప్పనిసరిగా కొంత ఖర్చు పెరగటం సహజం. అమెరికా, ఐరోపాలోని ప్రయివేటు రంగంలోని ఆయుధ కంపెనీల లాభాలను పెంచేందుకు వివిధ ప్రాంతాలలో చిచ్చు రేపుతున్నందున, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అనేక దేశాలు ఖర్చును పెంచాల్సి వస్తోంది. రెండవ అంశమే ప్రధానంగా పని చేస్తోంది. ప్రపంచాన్ని భయ పెట్టేందుకు, తన పెత్తనాన్ని రుద్దేందుకు అవసరం లేకున్నా తొలిసారిగా అణుబాంబులను ప్రయోగించిన అమెరికా తరువాత కాలంలో ప్రపంచమంతటా అణ్వాయుధాల తయారీ, ఇతర వాటికి పదును పెట్టే, సేకరణ పోటీకి తెరతీసింది. సోవియట్‌ యూనియన్ను బూచిగా చూపి రక్షణ పేరుతో నాటో కూటమిని ఏర్పాటు చేసి ఐరోపా ఖండాన్నే ఏకంగా తన గుప్పెట్లో పెట్టుకుంది. తన మిలిటరీ శక్తితో చైనా, ఇండో-చైనా దేశాలను ఆక్రమించుకున్నది జపాన్‌.అది రెండవ ప్రపంచ యుద్దంలో ఓడిన తరువాత దాని మీదకు ఎవరో దాడికి రానున్నట్లు బూచిగా చూపి రక్షణ ఒప్పందం పేరుతో తన గుప్పిటలోకి తీసుకున్నదీ అమెరికానే. ఇప్పుడు చైనాను బూచిగా చూపి ఇతర దేశాలను తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే కొత్త కథలు అల్లుతోంది.


చైనా దగ్గర ఇప్పుడున్న నాలుగు వందల అణ్వాయుధాలు 2035 నాటికి 1,500కు పెరుగుతాయని, అందువలన దాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని పెంటగన్‌ అందరినీ ఉసిగొల్పుతోంది. అంతే కాదు, అమెరికాలోని ఆయుధ పరిశ్రమల కోసం కూడా మీడియాలో కట్టుకథలను అల్లించటం, వాటిని చూపి బడ్జెట్‌ను పెంచాలని వత్తిడి తేవటం అమెరికాలో అనేక మంది అధికారుల, ఎంపీల రోజువారీ వృత్తి. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర 13,080 అణ్వాయుధాలు ఉన్నట్లు ఒక అంచనా. ఇక అణువిద్యుత్‌ కేంద్రం ఉన్న ప్రతి దేశం వాటిని ఏ క్షణంలోనైనా రూపొందించగల సత్తా కలిగినదిగా పరిగణిస్తున్నారు. రష్యా వద్ద 6,257 అణ్వస్త్రాలు ఉంటే వాటిలో తక్షణమే దాడికి పనికి వచ్చేవి 1,458, అందుబాటులో ఉన్నది 3,039, పనికి రానివి 1,760గా చెబుతున్నారు. ఆ తరువాత అమెరికా వద్ద ఇలాంటివే వరుసగా 5,550-1,389-2,361-1,800 ఉన్నట్లు అంచనా. వీటితో పోలిస్తే చైనా ఒక మరుగుజ్జు మాదిరి ఉంటుంది. ఇక దేశాల వారీగా చైనా వద్ద 350, ఫ్రాన్స్‌ 290, బ్రిటన్‌ 225, పాకిస్థాన్‌ 165, భారత్‌ 156, ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా వద్ద 40 నుంచి 50 వరకు ఉన్నట్లు అంచనా. ఈ అంచనాలు, సంఖ్యలను ఎవరూ పూర్తిగా నిర్ధారించలేరు. అవసరమైతే ఎప్పటికప్పుడు రూపొందిందే ఆధునిక పరిజ్ఞానం అమెరికా, రష్యా వద్ద ఉంది. ఇప్పుడు చైనాను చూపి మరింతగా మిలిటరీ ఖర్చు ఎందుకు చూపుతున్నట్లు అన్నది ప్రశ్న.


ఏడాదికి ఒక సారో రెండుసార్లో ఎవరైనా కొనుగోలు చేసి కాల్చగల దీపావళి బాంబుల వంటివి కాదుఅణ్వాయుధాలు. వాటి రూపకల్పనకు ఖర్చైన మాదిరే నిర్వీర్యం చేసేందుకు కూడా చేతి సొమ్ము వదిలించుకోవాల్సిందే. అమెరికా తప్ప ఇంతవరకు ఏ దేశమూ వాటిని ప్రయోగించలేదు.అలాంటి పని చేస్తే ఏ దేశమూ మిగలదు.భారత్‌కు పాకిస్థాన్‌ ఎంత దూరమో పాకిస్థాన్‌కూ భారత్‌ అంతే దూరం. అదే విధంగా ఇతర అణుశక్తి దేశాలూ కూడా. ఎవరు అస్త్రాన్ని వదిలినా వెంటనే మరొకరు సంధిస్తారు. కట్టుకథలు, పిట్టకతలను ఆకర్షణీయంగా మలచటం తప్ప వాటిలో హేతుబద్దత కనిపించదు. ఉదాహరణకు గతేడాది నవంబరు 29న సిఎన్‌ఎన్‌ ఒక వార్తను అల్లింది. దాని ప్రకారం చైనా వద్ద 2020లో రెండువందల అణ్వాయుధాలుండగా 2022 నాటికి 400కు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ వేగానికి అనుగుణంగా 2035 నాటికి 1,500కు పెరగవచ్చని చెప్పారు. ప్రతి రెండు సంవత్సరాలకు రెట్టింపు పెరిగితే పదమూడు సంవత్సరాల్లో 12,800కు చేరతాయి.అది జరిగేదేనా ? ఈ లోగా ఇతర దేశాలు చేతులు ముడుచుకు కూర్చుంటాయా ? ఇలాంటి అంకెలకు ఆధారం ఏమిటి ?


అణ్వాయుధాలంటే ఫాక్షనిస్టులు ఇండ్ల దగ్గర నాటు బాంబులను చుట్టినట్లు కాదు. అవసరమైన యురేనియం,ప్లుటోనియం కోసం అణురియాక్టర్లు, శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగాలి.దానికోసం ఎంతో ఖర్చు అవుతుంది. అనేక దేశాలు విద్యుత్‌ వంటి పౌర అవసరాల కోసం అణుకేంద్రాల నిర్మాణం చేస్తున్నాయి. అక్కడే అణ్వాయుధాల రూపకల్పనకు అవసరమైన గ్రేడ్ల యురేనియం,ప్లుటోనియం కూడా తయారు చేయవచ్చు.విద్యుత్‌ కోసం చైనాతో సహా అనేక దేశాలు అణుకేంద్రాల నిర్మాణం చేపట్టాయి. మన దేశంలో 22 రియాక్టర్లు, ఎనిమిది విద్యుత్‌ కేంద్రాలున్నాయి. మరో పది రియాక్టర్లు, విద్యుత్‌ కేంద్రాలు నిర్మాణం,ప్రతిపాదనల్లో ఉన్నాయి. పెంటగన్‌ నివేదికల్లో చెప్పినవన్నీ ప్రమాణాలు కాదు. ఊహాగానాలు, ఆధారం లేని ఆరోపణలు అనేకం ఉంటాయి. మూడు వందల ఖండాంతర క్షిపణుల(ఐసిబిఎం)ను ప్రయోగించేందుకు అవసరమైన నిర్మాణాలను చైనా జరుపుతోందన్నది దానిలో ఒకటి. దీనికి ఎలాంటి ఆధారం లేదని అమెరికా పత్రికలే రాశాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌ సంస్థకు చెందిన వారు చైనా వద్ద కేవలం 110 మాత్రమే ఖండాంతర క్షిపణులున్నట్లు, బహుశా దీర్ఘశ్రేణి క్షిపణులను కూడా కలుపుకొని 300 సంఖ్య చెప్పి ఉండవచ్చని పేర్కొన్నారు. అమెరికా1960 దశకం నుంచి ఐసిబిఎం, అణుక్షిపణి జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి బాంబర్లను సమన్వయం చేస్తున్న విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నది. బరాక్‌ ఒబామా పాలనా కాలంలో వీటిని మరింత నవీకరించేందుకు 1.8లక్షల కోట్ల డాలర్లతో ఒక పధకాన్ని ప్రారంభించారు. చైనా కూడా ఇలాంటి వ్యవస్థలను రూపొందిస్తున్నదనే అనుమానం పెంటగన్‌కు ఉండి, చీకట్లో బాణాలు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఏ దేశానికైనా తన జాగ్రత్తలో తానుండే హక్కు, అవకాశం ఉంది.


అణుక్షిపణుల జలాంతర్గాములతో 1959 నుంచే అమెరికా పహారా కాస్తున్నది. చైనా వద్ద ఉన్న అలాంటి జలాంతర్గాములు 2021 నుంచి పని చేస్తున్నట్లు అంచనా. అమెరికా వద్ద 11,840 కిమీ దూరంలోని లక్ష్యాన్ని చేరుకొనే జలాంతర్గాములు క్షిపణులు ఉండగా చైనా వద్ద 6,880 కిమీ దూరం వెళ్లే క్షిపణులున్నట్లు ఊహిస్తున్నారు తప్ప ఆధారాలు లేవు. ఒక్కటి మాత్రం వాస్తవం చైనా అంటే చౌక ధరలకు అందించే పాదరక్షలు, దుస్తులు,ఫోన్లు, టీవీల వంటి వినియోగవస్తువులను మాత్రమే భారీ ఎత్తున తయారు చేయగలదని అనేక మంది ఇప్పటికీ ఒక భ్రమలో ఉన్నారు. బొమ్మ విమానాలు, దీపావళి తారాజువ్వలనే కాదు నిజమైన వాటిని రూపొందించగల సత్తా సమకూర్చుకుంది. చైనాలో గుట్టు ఎక్కువ. రోజువారీ వస్తువులతో పాటు తనను దెబ్బతీసేందుకు చూసే వారికి దడపుట్టించే ఆధునిక అస్త్రాలను కూడా అది ఇప్పుడు కలిగి ఉంది. అమెరికాకు పట్టుకున్న భయాలలో అదొకటి. ఇటీవల తైవాన్‌ జలసంధిలో అలాంటి వాటిని చైనా ప్రదర్శించింది.


2023లో జర్మనీతో సహా నాటో దేశాలన్నీ రక్షణ ఖర్చును భారీ ఎత్తున పెంచనున్నాయి. వాటి జిడిపిలో రెండు శాతం అందుకు కేటాయించాలని, నాటో ఖర్చును తామెంత కాలం భరించాలంటూ, ఒక వేళ రష్యా గనుక దాడి చేస్తే రక్షణకు తాము వచ్చేది లేదంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నపుడు బహిరంగంగానే వత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభ నేపధ్యంలో భారీగా పెంచుతున్నప్పటికీ పెంటగన్‌ వాటిని లోక కల్యాణం కోసం అన్నట్లుగా చూస్తున్నది. జిడిపిలో రెండు శాతం అన్న దానికి అనుగుణంగా ప్రత్యేక ఆయుధ నిధి కోసం తాము 106బి.డాలర్లు ఖర్చు చేస్తామని గతేడాది ఫిబ్రవరి 27న ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన మూడు రోజుల తరువాత జర్మన్‌ ఛాన్సలర్‌ ఓల్ఫ్‌ షఉల్జ్‌ ప్రకటించాడు.జర్మనీ ఆయుధ కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలను తప్పించుకోవటంతో పాటు, అమెరికాను సంతుష్టీకరించటం నాటోలో అమెరికా తరువాత పెత్తనం తనదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆర్థికంగా దిగజారి ఉన్నందున బ్రిటన్‌ ఖర్చు పెంచే స్థితిలో లేదు. జపాన్‌ మాదిరే ఇటీవలి కాలంలో జర్మనీ తన ఆధిపత్యాన్ని పెంచుకొనేందుకు చూస్తున్నది. తటస్థ దేశాలుగా ఉన్న స్వీడన్‌,ఫిన్లండ్‌ కూడా నాటోలో చేరి మిలిటరీ ఖర్చును పెంచనున్నాయి. పోలాండ్‌ కూడా ఖర్చు పెంచేందుకు పూనుకుంది.ఇవన్నీ జరిగితే సింహభాగం అమెరికా సంస్థలే లబ్ది పొందుతాయి.


భారీ ఎత్తున పెంచిన పెంటగన్‌ బడ్జెట్‌తో సంతృప్తి చెందని మిలిటరీ కార్పొరేట్ల కనుసన్నలలో నడిచే ఎంపీలు, అధికారులు, విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. వైట్‌హౌస్‌ మాజీ జాతీయ సలహాదారు మెక్‌ మాస్టర్‌ పన్నెండువందల బి.డాలర్లు కావాలని చెప్పాడు. జపాన్‌ రెండింతలు చేసేందుకు పూనుకున్నదని దాన్ని చూసి నేర్చుకోవాలంటూ చైనాను నిలువరించేందుకు అవసరమైనదాని కంటే అమెరికా తక్కువ ఖర్చు చేస్తున్నట్లు విమర్శించాడు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెంటగన్‌ వాస్తవ కొనుగోలు శక్తి తగ్గుతుందని కొందరు గుండెలు బాదుకున్నారు. ఆసియాలో చిచ్చు పెట్టేందుకు చూస్తున్న అమెరికాకు తోడుగా, జపాన్‌, ఆస్ట్రేలియా కూడా రక్షణ ఖర్చు పేరుతో సమీకరణ కావటం ఆందోళన కలిగించే పరిణామం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో వాణిజ్య లోటు వంద బి.డాలర్లు : వస్తువులు నాసిరకమైతే దిగుమతులు ఎందుకు ? మోడీ కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి !

15 Sunday Jan 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Anti China Propaganda, BJP, China goods boycott, India’s Trade Deficit With China, Indo-China trade, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


లడక్‌ సరిహద్దులో గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా పెట్టుబడులను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని నరేంద్రమోడీ చైనా దిగుమతులను కూడా అడ్డుకుంటారని అనేక మంది కాషాయ దేశభక్తులు నిజంగానే ఆశించారు, భ్రమించారు, కోరుకున్నారు. మోడీ వారి మనో భావాలను దారుణంగా దెబ్బతీశారు. చైనాతో వాణిజ్య లావాదేవీలను వంద బిలియన్‌ డాలర్లకు పెంచాలని ఆశించిన మన్మోహన్‌ సింగ్‌ అది నెరవేరకుండానే గద్దె దిగారు. మన్మోహన్‌ సింగ్‌ వైఫల్యాలను, మౌనాన్ని ఎండగట్టి రాజకీయంగా సొమ్ము చేసుకున్న నరేంద్రమోడీని ఒకందుకు ” అభినందించక ” తప్పదు. చైనాతో లావాదేవీలను వంద బి.డాలర్లు దాటించి ఒక రికార్డు నెలకొల్పారు. తాజాగాచైనాతో వాణిజ్య లోటును కూడా ఏకంగా వంద బి.డాలర్లు దాటించి సరిలేరు నాకెవ్వరూ అన్నట్లుగా మౌన గీతాలు పాడుతున్నారు. కాకపోతే ఈ ఘనత గురించి బిజెపితో సహా ఎవరూ ఎక్కడా చెప్పరు, టీవీలు చర్చలు జరిపి ఆహౌ ఓహౌ అన్న వాతావరణం కల్పించవు. మోడీ నోరు విప్పరు. ఇదేం నిర్వాకం బాబూ అని బిజెపి ప్రతినిధులను అడిగితే సరిహద్దు వివాదాలకూ మిగతా వాటికి లంకెలేదు, వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా చేసుకోక తప్పదు కదా అంటారు. ఇదొక జుమ్లా, తప్పించుకొనే మోసకారి వాదన.


తాజాగా చైనా జనవరి 13న విడుదల చేసిన వివరాల ప్రకారం రెండు దేశాల వాణిజ్య లావాదేవీలు 2022(వారి లెక్క జనవరి నుంచి డిసెంబరు )లో 135.98 బి.డాలర్లకు చేరింది. అంతకు ముందు ఏడాది 125 బి.డాలర్లుంది. అఫ్‌ కోర్సు ఈ లెక్కలు తప్పని ” దేశభక్తులు ” చెప్పినా ఎవరూ చేసేదేమీ లేదు. చైనా నుంచి దిగుమతులు 118.5 బి.డాలర్లు కాగా మన ఎగుమతులు 17.48 బి.డాలర్లు. నిఖరంగా మనం 101.02 బి.డాలర్లు చైనాకు సమర్పించుకున్నాం.2021లో ఆ మొత్తం 69.38 బి.డాలర్లు. ఇదంతా దేశభక్తి, సైనికుల త్యాగాల గురించి రోజూ జనాలకు మనోభావాలను గుర్తు చేస్తుండగానే, వారి కనుసన్నలలోనే జరిగింది. ఏ వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఈ దిగుమతులు చేసుకుంటున్నారో, ఏటేటా పెంచుతున్నారో ఎవరైనా చెప్పగలరా ? ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇరు దేశాలూ సభ్యులుగా ఉన్నందున లావాదేవీలు జరిపినపుడు దాని నిబంధనలను పాటించాల్సిన విధి తప్ప మరొక లంపటం ఎవరికీ లేదు. దాని వెలుపల ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న మాదిరి ద్విపక్ష ఒప్పందాలు కూడా లేవు.చైనాలోని మన దేశ రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌లో లావాదేవీల గురించి తప్ప ఫలానా ఒప్పందం ప్రకారం పెరుగుతున్నట్లు ఎక్కడా ఉండదు.మన దేశం చైనాతో సహా 38 దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి చర్చలు జరుపుతున్నది తప్ప ఇంకా ఖరారు చేసుకోలేదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా నుంచి దిగుమతులను నిలిపివేసి వారిని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది కలలు కన్నారు. అనేక చైనా వస్తువుల మీద మన దేశం ఆంక్షలు విధించింది. టీవీలు, పాదరక్షలు, బొమ్మలు, ఫర్నీచర్‌ వంటి 89 వస్తువులపై దిగుమతి పన్నులు పెంచి నిరుత్సాహపరచింది. యాప్స్‌పై నిషేధం సంగతి తెలిసిందే. పెట్టుబడులను రాకుండా చూస్తున్నది. మరి ఒప్పందాలు ఉంటే ఈ ఆంక్షలు ఎలా పెట్టినట్లు ?


గాల్వన్‌ ఉదంతాల తరువాత మన దేశం విదేశీ పెట్టుబడులకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. దాని ప్రకారం మనతో భూ సరిహద్దులు కలిగి ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను సమీక్షించి అనుమతి ఇచ్చిన తరువాతనే స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అలాంటి సరిహద్దులున్న దేశాల్లో ఒక్క చైనా తప్ప గతంలో మన దేశంలో పెట్టుబడి పెట్టిన వారెవరూ లేరు గనుక ఆ నిబంధన చైనాను లక్ష్యంగా చేసిందే అన్నది స్పష్టం. చైనా నుంచి తెచ్చుకోవాలని ఏ ప్రతిపక్ష పార్టీ కూడా కోరలేదు. చైనాతో సహా ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నింటి నుంచి నిబంధనలను పాటించిన మేరకు ఎఫ్‌డిఐలను అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు తెలిపింది. మూడో దేశం నుంచి వచ్చే చైనా పెట్టుబడులను అడ్డుకొనే అవకాశం లేదు. స్టాటిస్టా వెబ్‌సైట్‌ సమాచారం మేరకు 2015లో గరిష్టంగా మన దేశానికి చైనా నుంచి వచ్చిన పెట్టుబడులు 70.525 కోట్ల డాలర్లు. తరువాత 2019లో 53.46 కోట్లకు తగ్గాయి. ఆంక్షలు విధించిన తరువాత 2020లో20.519 కోట్లకు, 2021లో 29.946 కోట్ల డాలర్లకు తగ్గాయి.2022 జూన్‌ 29 నాటికి 382 ప్రతిపాదనలు రాగా చైనాతో సంబంధమున్న 80కి అంగీకారం తెలిపారు. 2014నుంచి 2019 వరకు ఏటా సగటున 36 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగా 2021-22 ఆరు నెలల్లో 3.6 కోట్లకు తగ్గాయి.


ఒక గణతంత్ర దేశంగా మనం ఎలాంటి నిబంధనలైనా పెట్టుకోవచ్చు, అమలు జరపవచ్చు. పెట్టుబడుల సూత్రాన్నే దిగుమతులకు వర్తింప చేసి అనుమతులు ఇచ్చిన తరువాతే లావాదేవీలు జరపాలన్న నిబంధన ఎందుకు పెట్టలేదు అన్నది సహస్రశిరఛ్చేద అపూర్వ చింతామణి ప్రశ్న.ఒప్పందాల ప్రకారమే మనం రికార్డులను బద్దలు కొడుతూ చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం అని చెబుతున్నవారు అదే ఒప్పందం ప్రకారం చైనా మన దేశం నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవటంలేదు, ఆ మేరకు మన ప్రభుత్వం ఎందుకు డిమాండ్‌ చేయటంలేదో చెప్పాలి కదా ! 2022లో మొత్తం చైనా వాణిజ్య మిగులు 877.6 బి.డాలర్లు అంటే దానిలో మన వాటా 101 బి.డాలర్లు (11.5శాతం) ఉంది. ఇక చైనా ఆర్థికం అంతా దిగజారింది, ఇబ్బందుల్లో ఉంది అని చెబుతున్నవారు నమ్మినా నమ్మకున్నా వృద్ది వేగం తగ్గింది తప్ప తిరోగమనంలో లేదు.2021లో 3.548 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఎగుమతులు చేస్తే 2022లో అది 3.95 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.


1962లో సరిహద్దు వివాదం తరువాత రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి.1988లో రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన తరువాత 1993లో సరిహద్దులో శాంతి సామరస్యాల గురించి జరిగిన ఒప్పందం, 2003లో వాజ్‌పాయి పర్యటనతో మరొక అడుగు ముందుకు వేసి మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. వాణిజ్యంతో సహా వివిధ రంగాలకు సంబంధించి చైనాతో అనేక డజన్ల సాధారణ ఒప్పందాలున్నాయి. మానస సరోవర యాత్రకు నాథూలా మార్గాన్ని తెరవటం వాటిలో ఒకటి. ఏ ప్రధానీ కలవన్ని సార్లు నరేంద్రమోడీ వివిధ సందర్భాల్లో చైనా నేతలతో భేటీ కావటం కూడా ఒక రికార్డుగా ఉంది. రాజీవ్‌ గాంధీ పర్యటనకు,చైనాలో సంస్కరణలకు తెరలేపక ముందే ఐరాస చొరవతో 1975లో ఆసియా-పసిఫిక్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదిరింది. దాన్నే బాంకాక్‌ ఒప్పందం అంటారు.దానిలో చైనా, మనం ఇతర దేశాలు భాగస్వాములు. ఈ దేశాల మధ్య ప్రాధాన్యత ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా దానిలో ఉంది.2005లో ఒప్పంద దేశాల మంత్రుల మండలి సమావేశం బీజింగ్‌లో జరిగింది. సవరించిన పన్నుల తగ్గింపు చర్చలకు మరుసటి ఏడాది ఒక రూపం వచ్చింది. దాన్ని మరింతగా విశదీకరించి ఖరారు చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఇప్పటికీ ఒక రూపానికి రాలేదు. అప్పుడే చైనా -భారత్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి కూడా ఏడిబి చొరవతో చర్చలు జరిగాయి.ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనే సంస్థ వెబ్‌సైట్‌లో 2022 జనవరి నాలుగవ తేదీ నాటికి నవీకరించిన సమాచారం ప్రకారం చైనాకు వంద దేశాలతో వివిధ ఒప్పందాలుండగా 17 దేశాలు, బృందాలతో మాత్రమే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలున్నాయి. వీటిలో మన దేశం లేదు. ఇవిగాక 2022 నుంచి అమల్లోకి వచ్చిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో తొలుత మన దేశం చేరేందుకు అంగీకరించినా తరువాత దూరంగా ఉంది. దీనిలో చేరితే మన ఎగుమతులకు బదులు ఇతర దేశాల నుంచి దిగుమతులు మరింతగా పెరుగుతాయని, అది మన పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి దెబ్బ అని చెప్పిన అంశం తెలిసిందే. ఒప్పందంలో చేరిన దేశాలు దిగుమతుల మీద పన్నులు తగ్గించాల్సి ఉంటుంది.దాంతో చైనా నుంచి మరింతగా దిగుమతులు పెరుగుతాయని మన కార్పొరేట్లు హెచ్చరించాయి. ప్రపంచ జిడిపిలో 30శాతం ఉన్న దేశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. దాని ప్రకారం రెండు దశాబ్దాలలో పూర్తిగా పన్నులను రద్దు చేస్తారు.


కార్పొరేట్‌ లాబీకి లొంగి మన దేశంలో దొరికే వాటిని కూడా మోడీ సర్కార్‌ దిగుమతి చేసుకుంటున్నది.ఇప్పటికి వెల్లడైన సమాచారం మేరకు మన దేశంలో 319.02 బిలియన్‌ టన్నుల బొగ్గునిక్షేపాలు ఉన్నాయి. వాటి నుంచి ఏటా ఒక బిలియన్‌ టన్నులు కూడా మనం వెలికి తీయటం లేదు. కానీ దరిద్రం ఏమిటంటే గత పాలకుల విధానాలను తప్పు పట్టిన నరేంద్రమోడీ అదే బాటలో నడుస్తూ మన దగ్గర బొగ్గు తవ్వకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకొనేందుకు ఉత్తరువులు జారీ చేసిన అపరదేశ భక్తి పరుడిగా రుజువు చేసుకున్నారు. మన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు పదిశాతం విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చిన తరువాత దాని మీద వచ్చిన విమర్శలను తట్టుకోలేక తరువాత వెనక్కు తగ్గారు. ఇదంతా ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు ఉన్న అదానీ కోసం అన్నది తెలిసిందే. మన బొగ్గును మనం తవ్వుకుంటే ఉపాధి కల్పనతో పాటు డాలర్లూ మిగులుతాయి. నరేంద్రమోడీకి ఈ మాత్రం తెలియదని అనుకొనేంత అమాయకులెవరూ లేరు.


చైనా నాసిరకం వస్తువులను తయారు చేస్తుందన్నది ఒక ప్రచారం. అమెరికా, ఐరోపా మార్కెట్లన్నింటా నాసిరకం కొంటున్నారా ? తక్కువ ధరలకు వస్తువులను సరఫరా చేస్తున్నందున అలాంటి అభిప్రాయంతో పాటు చైనా బజార్ల పేరుతో మన దేశంలో తయారు చేసిన నకిలీ వస్తువులను అమ్మిన కారణంగా అనేక మంది అలా అనుకోవచ్చు. ఒక వేళ నిజంగానే చైనా సరకులు నాసి అనుకుంటే మన విలువైన విదేశీమారకద్రవ్యాన్ని ఫణంగా పెట్టి ఆ సరకులను దిగుమతి చేసుకొని మన జనం మీద ఎందుకు రుద్దుతున్నట్లు ? నిజానికి చైనా నుంచి ఇప్పుడు మనం రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతి చేసుకుంటున్న వస్తువులేవీ ఇతర దేశాల్లో దొరకనివి కాదు. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారంటే కార్పొరేట్‌ లాబీ వత్తిడికి మోడీ సర్కార్‌ తలవంచటమే, అది చెప్పినట్లు వినటమే. అవే వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే చెల్లించాల్సిన మొత్తాలు ఎక్కువగా ఉండటమే అసలు కారణం. ఆ సంగతిని అంగీకరించటానికి ముందుకురారు. మరోవైపున కాషాయదళాలు మాత్రం నిరంతరం చైనా వ్యతిరేక ప్రచారం చేస్తూ కొంత మంది మనోభావాల సంతుష్టీకరణ, మరికొందరిని తప్పుదారి పట్టిస్తుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాకిస్తాన్‌ దివాలా తీయనుందా : బిజెపి నేతలు పదే పదే దానితో మన దేశాన్ని ఎందుకు పోలుస్తున్నట్లు ?

09 Monday Jan 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China–Pakistan Economic Corridor, CPEC, Pak debt matters, pakistan, Pakistan default, Pakistan’s economy


ఎం కోటేశ్వరరావు


గోధుమ పిండి ధర కిలో రు.150కి పెరిగింది. వంట గాస్‌ 11.8కిలోల బండ ధర రు.2,550. విద్యుత్‌ ఉత్పత్తి తగినంత లేక దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశిస్తున్న అధికారులు. లీటరు పాల ధర రు.108.71, కిలో బియ్యం రు.245, డజను గుడ్ల ధర రు.240, కోడి మాంసం కిలో రు.548, కిలో ఉల్లి రు.86, బ్రెడ్‌ రు.108,(నంబియో డాట్‌కామ్‌) పాకిస్తాన్‌ నుంచి వస్తున్న వార్తలివి.అక్కడ విద్యుత్‌ కొరత ఉంది.(మన గుజరాత్‌లో కూడా గత వేసవిలో గంటల కొద్దీ ఇండ్లకు, వారానికి ఒకసారి పరిశ్రమలకు కోత విధించారు) అక్టోబరులో సవరించిన ధరల ప్రకారం 50 యూనిట్లకు రు.2 నుంచి 700 వరకు శ్లాబుల వారీ పెరుగుతూ రు.20.82, అంతకు మించితే ప్రతియూనిట్‌కు రు.23.92, ఇవి గాక ఇతర పన్నులు అదనం. తెలంగాణాలో 50 యూనిట్లకు రు.1.45 నుంచి క్రమంగా పెరుగుతూ 401-800కు రు.9, అంతకు మించితే రు.9.50 వసూలు చేస్తున్నారు. అక్కడి ధరలతో పోల్చుకొని మన దేశంలో ధరలను చూడండి, నరేంద్రమోడీ పాలన జనాలకు మంచి రోజులు తెచ్చిందా లేదా అని భక్తులు రెచ్చిపోతున్నారు, అడ్డు సవాళ్లు విసురుతున్నారు. పాకిస్తాన్‌ తీవ్ర మైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నమాట నిజం. అక్కడ పరిస్థితులన్నీ సజావుగా ఉన్నట్లు , జరుగుతున్నదంతా సరైనదే అని ఎవరూ చెప్పటం లేదు. అవసరమూ లేదు. అలాంటి దేశం గురించి ఎక్కువగా చెబుతున్నదీ, పోలుస్తున్నదీ ఎవరంటే బిజెపి నేతలు, మద్దతుదారులే. ఎందుకంటే అంతకంటే మెరుగైన దేశంతో పోల్చుకొనేందుకు వారి దగ్గర ఏమీ లేకపోవటమే. అక్కడ పెట్రోలు, డీజిలు ధరలు తక్కువ అంటే వెళ్లి అక్కడి నుంచి తెచ్చుకోవాలని ఎద్దేవా చేస్తారు.


మన దేశంలో గత నెల రోజులుగా గోధుమల టోకు ధర కిలో రు.28.50గా ఉందని, ఇది కనీస మద్దతు ధర కంటే 40శాతం ఎక్కువ అని జనవరి ఏడవ తేదీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పేర్కొన్నది. ప్రైస్‌ఇ డాట్‌కామ్‌ జనవరి ఎనిమిదవ తేదీ సమాచారం ప్రకారం ఆశీర్వాద్‌ షర్బతీ గోధుమ పిండి ధర అమెజాన్‌లో రు.282(ఐదు కిలోలు) అదే కంపెనీ సుపీరియర్‌ ఎంపీ రకం ధర రు.175(ఐదు కిలోలు),ఆశీర్వాద్‌ శుద్ద గోధుమ పిండి రకం ధర రు.95(రెండు కిలోలు). విడిగా ఎలాంటి బ్రాండ్‌ లేకుండా దొరికే పిండి ధర కిలో 40కి అటూ ఇటూగా ఉంటున్నది. మన దగ్గర 14.5 కిలోల గాస్‌ బండ ధర రు.1,105 గా ఉంది. మరి వీటితో పోల్చినపుడు పాకిస్తాన్‌ కంటే మన దేశంలోనే ధరలు తక్కువగా ఉన్నాయి కదా అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. నిజమే కనిపించేదాన్ని కాదని ఎలా అంటాం ? ఎఎన్‌ఐ వార్తా సంస్థ జనవరి ఏడవ తేదీన పేర్కొన్నదాని ప్రకారం పాక్‌ పంజాబ్‌లో 15కిలోల గోధుమ పిండి సంచి ధర రు.2,250 ( కిలో 130 నుంచి 150వరకు ఉంది), అదే వార్తలో మండ్‌ గోధుమల ధర రు.5,000కు తాకినట్లు కూడా పేర్కొన్నది. మండ్‌ అంటే 37 కిలోల 324 గ్రాములకు సమానం. ఈ లెక్కన కిలో గోధుమలకు అక్కడి రైతులు రు. 134 పొందుతున్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పేర్కొన్న ప్రకారం అదే మన రైతులు పొందుతున్నది రు.28.50 మాత్రమే ! ఇది ఘోరం అని అనిపించటం లేదూ ! పాక్‌ రైతులు అంత మొత్తం పొందుతుండగా మన రైతులకు ఎందుకు ఇవ్వటం లేదు ? మన రైతుల్ని పాకిస్తాన్‌ వెళ్లి అమ్ముకోమంటారా ?


ఒక డాలరుకు మన కరెన్సీ రూపాయి విలువ జనవరి ఎనిమిదిన రు.82.27 ఉంది. పాకిస్తానీ రూపాయి విలువ రు.227.25గా ఉంది. మన ఒక రూపాయి 2.76 పాక్‌ రూపాయలకు సమానం. మన దేశ బహిరంగ మార్కెట్‌నుంచి పాకిస్తాన్‌ ఒక క్వింటాలు గోధుమలను దిగుమతి చేసుకుంటే వారు చెల్లించాల్సిన మొత్తం రు.7,866 అవుతుంది.( మన బహిరంగ మార్కెట్‌ ధర కిలోకు రు.28.50, దాన్ని పాక్‌ కరెన్సీలోకి మారిస్తే రు.78.66, ఆ లెక్కన క్వింటాలు ధర రు.7,866. కానీ పాక్‌ రైతులకు కిలోకు 134 వంతున 13,400 దక్కుతున్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొన్నది. పాక్‌లో గాస్‌ కిలో ధర రు.216. మన దేశంలో రు.76.20. గాస్‌ను మనమూ దిగుమతి చేసుకోవాలి, పాకిస్తాన్‌ కూడా దిగుమతి చేసుకోవాల్సిందే. అందువలన తక్కువగా ఉన్న పాక్‌ కరెన్సీ విలువను చూపి అక్కడ ఎంతో ఎక్కువగా ఉన్నట్లు చిత్రించటాన్ని ఏమనాలి ? రెండు కరెన్సీల పేర్లూ రూపాయి కావటంతో మభ్య పెట్టేందుకు వీలు కలుగుతోంది.


గ్లోబల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ ప్రతి దేశంలో ఉన్న స్థానిక కరెన్సీలో ఉన్న పెట్రోలు, డీజిలు ధరలను డాలర్లలోకి మార్చి ధరల తీరు తెన్నులను వారానికి ఒకసారి ప్రచురిస్తుంది. దాని ప్రకారం పెట్రోలు, (బ్రాకెట్లలో డీజిలు) ధరలు డాలర్లలో జనవరి రెండవ తేదీన ఇలా ఉన్నాయి. పాకిస్తాన్‌ 0.947(1.005),భూటాన్‌ 0.990( 0.947 ), మయన్మార్‌ 1.046(1.156) చైనా 1.178(1.051) బంగ్లాదేశ్‌ 1.221(1.024) భారత్‌ 1.260(1.130) నేపాల్‌ 1.344(1.324) శ్రీలంక 1.396(1.108) ఉంది. ఇప్పటికీ మన దేశంలో పాకిస్తాన్‌ కంటే చమురు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాలో లీటరు పెట్రోలు ధర 0.893, డీజిలు ధర 1.199 డాలర్లుగా ఉంది. ప్రతి దేశం ఎగుమతులు చేస్తుందా లేదా అన్నది ఒక అంశమైతే, దానికి అనేక అంశాలు తోడు కావాలి. సాధారణంగా ఎగుమతులు చేసే దేశాల కరెన్సీ విలువ తక్కువగా ఉంటేనే అది అంతర్జాతీయ మార్కెట్లో తన సరకులను అమ్ముకోగలుగుతుంది అని చెబుతారు. ఇది ఒక అంశం తప్ప అదొక్కటే చాలదు, జపాన్‌ ఎన్‌ విలువ ఒక డాలరుకు 132 కాగా చైనా యువాన్‌ విలువ 6.84 ఉంది. జపాన్‌ కరెన్సీ విలువ తక్కువగా ఉన్నా, చైనాతో పోలిస్తే వేతనాలు ఎక్కువ గనుక ఉత్పత్తి ఖర్చు ఎక్కువ. అందువలన ఒకే వస్తువును చైనా తక్కువ ధరలకు ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తున్నది. మన దేశంలో వేతనాలు, కరెన్సీ విలువ తక్కువ ఉన్నప్పటికీ సరైన విధానం, నూతన ఆవిష్కరణలు,సాంకేతిక పరిజ్ఞానం లేక ఎగుమతులు చేయలేని స్థితి.


మన దేశంలో తక్కువ ఆదాయం వచ్చే వారు పెరిగిన ధరలతో ఎలా ఇబ్బందులు పడుతున్నారో పాకిస్తాన్‌లో కూడా మన కంటే ఎక్కువగా ద్రవ్యోణ పెరుగుదల ఉన్నందున అక్కడి పేదలు కూడా ఒకింత ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్లనే పెట్రోలు, డీజిలు ధరలకు పన్నులు వడ్డిస్తే భారం మరింతగా పెరుగుతుంది కనుక మన మాదిరి పన్నులు లేనందున, దాని కరెన్సీ విలువ ఎంత తగ్గినా మనతో పోలిస్తే తక్కువ ధరలకు పెట్రోలు, డీజిలు అందుబాటులో ఉంటున్నది. విదేశీ చెల్లింపుల సంక్షోభం, రుణ భారంతో శ్రీలంక తీవ్ర పరిస్థితి ఎదుర్కొన్నట్లుగానే పాకిస్తాన్‌ కూడా అదే బాటలో ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. దివాలా కోరు విధానాలను అనుసరిస్తే ఏ దేశమైనా అదే విధంగా మారుతుంది. పాకిస్తాన్‌ నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ” డాన్‌ ” డిసెంబరు 18వ తేదీన ప్రచురించిన ఒక (ఇద్దరు ఆర్థిక నిపుణుల) విశ్లేషణలో కొన్ని అంశాలు దిగువ విధంగా ఉన్నాయి. దేశ విభజన నాటి నుంచే పాకిస్తాన్‌కు ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని శక్తులు తమ స్వప్రయోజనాల కోసం దేశాన్ని రుణగ్రస్తం గావించాయి. విభజనతో నాడు వలస పాలనలో ఉన్న రాబడిలో 17శాతం పాకిస్తాన్‌కు రాగా మిలిటరీలో 33శాతాన్ని భరించాల్సి వచ్చింది. దీని వలన అనేక ప్రభుత్వాలు రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ 22సార్లు ఐఎంఎఫ్‌ రుణాలు తీసుకోగా భారత్‌ ఏడు, బంగ్లాదేశ్‌ పదిసార్లు మాత్రమే తీసుకుంది. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అనేక సార్లు సంక్షోభాలు దగ్గరకు వచ్చిన అనుభవాలను చూసింది.చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. ప్రతిసారీ మరింత నష్టం జరగకుండా ఐఎంఎఫ్‌ ఆదుకున్నది. ఆ సాయాన్ని సాంప్రదాయ పద్దతుల్లో ఆర్థిక రంగం స్వల్పకాలిక స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగించారు. తరచుగా సంక్షోభాలు రావటం, వాటి ప్రభావాలు పేరుకు పోవటంతో దీర్ఘకాలిక సవాళ్లు అలాగే ఉండి మొత్తం వృద్ధి మీద ప్రభావం చూపుతున్నది.


ప్రారంభంలో పాకిస్తాన్‌ కంటే భారత్‌ వెనుకబడి ఉంది, 1980దశకంలో ఒక దశలో పాక్‌ ఆర్థిక వృద్ధి రేటు భారత్‌ను దాటింది.1990ల్లో భారత ఆర్థిక సంస్కరణలు నిరంతర వృద్ధి బాటలో దేశాన్ని నిలిపాయి. పాకిస్తాన్‌ ఆర్థిక పురోగమనంలో దిగజారుడు అలాగే ఉంది. ప్రస్తుతం అస్థిరమైన జిడిపి వృద్ది రేటు, కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పతనం, దానితో పాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విస్తృతం అవుతున్న కరంట్‌ ఖాతా లోటు ఉంది. ప్రజల జీవనం తీవ్రంగా ప్రభావితం అవుతున్నది. వ్యవస్థాగతమైన ఆర్థిక సమస్యలేమిటో నిర్ధారించకుండా రాజ్యం రెంటియర్‌ ఆర్థిక వ్యవస్థను తయారు చేసింది. (దీని అర్ధం ఏమంటే కొత్త నిర్మాణాలేమీ లేకుండానే ఉన్న ఇండ్లకు అద్దె వసూలు చేసుకోవటం, బతకటం ) సమాజంలో ఆర్థికంగా ఉన్నతులైన వారందరూ అనేక సబ్సిడీలు పొందటంలో నిమగమయ్యారు. దీంతో ఉన్న అప్పులకు తోడు మరింతగా పెరిగాయి. అప్పులు పెరిగినపుడు పెట్టుబడులను ఆకర్షించటం, నవీకరణలు ప్రోత్సహించటం పాకిస్తాన్‌కు పెద్ద సవాలుగా ఉంది.చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఒక కారణం నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం.1993-2020 సంవత్సరాలలో పాకిస్తాన్‌ కేవలం రెండు సార్లు ఆరుశాతం కంటే ఎక్కువగా వృద్ధి రేటును సాధించగా భారత్‌లో పద్దెనిమిది సార్లు ఉంది. ఇదీ డాన్‌ విశ్లేషణ సారం.


పాకిస్తాన్‌ మరోసారి ఇబ్బందుల్లో పడింది. దీంతో వెంటనే దీనికి కారణం చైనా నుంచి తీసుకున్న అప్పులే అనే ప్రచారం మొదలైంది. డాన్‌ పత్రికలో రాసిన విశ్లేషణ ప్రకారం పాక్‌ పాలకులు అనుసరించిన విధానాలే ప్రస్తుత స్థితికి కారణం. గతంలో 22 సార్లు ఐఎంఎఫ్‌ ఎందుకు రుణాలిచ్చి ఆదుకున్నట్లు ? అప్పుడేమీ చైనా నుంచి ప్రాజెక్టు రుణాలు లేదా ఇతర రుణాలేమీ లేవు కదా ? పాక్‌ అవసరాలకు లేదా అభివృద్ధికి పశ్చిమ దేశాలు తగినన్ని అప్పులిచ్చి పరిస్థితిని మెరుగుపరచి ఉంటే చైనా ప్రవేశానికి అవకాశం ఉండేది కాదు కదా ! అవెందుకు ఇవ్వలేదు అంటే పాకిస్తాన్‌ లేదా మరొక దేశం అభివృద్ది చెందితే వాటి మీద ఆధారపడటం లేదా దిగుమతులను తగ్గించుకుంటే వాటికి ఒరిగేదేమీ ఉండదన్న ఆలోచన తప్ప మరొకటి కాదు. మరి చైనా ఎందుకు పెట్టుబడులు పెడుతోంది, అప్పులు ఇస్తోంది అంటే పరస్పరం లబ్ది చేకూరుతుంది గనుక.


చైనా -పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సిపిఇసి) 2015 నుంచి ఉనికిలోకి వచ్చింది. గల్ఫ్‌ దేశాల నుంచి చైనా దిగుమతి చేసుకుంటున్న ఇంథన ఓడలు మలేషియా – ఇండోనేషియా మధ్యన ఉన్న మలక్కా జల సంధి గుండా రాకపోకలు సాగించాలి. ఏ కారణంతోనైనా వాటికి ఆటంకం కలిగితే చైనా ఆర్థిక రంగం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువలన ప్రత్యామ్నాయ మార్గ అన్వేషణలో వచ్చిందే సిపిఇసి. అట్లాంటిక్‌ – పసిఫిక్‌ సముద్రాలను కలుపుతూ పనామాలో 82కిలోమీటర్ల పొడవున ఒక కాలువను తవ్వితే కొన్ని వేల కిలోమీటర్ల మేరకు ఓడల ప్రయాణ దూరం,ఖర్చు తగ్గుతుందన్న ఆలోచకు ప్రతి రూపమే అది. అదే ప్రాతిపదికన సూయజ్‌ కాలువను కూడా తవ్వారు. పశ్చిమాసియా నుంచి పన్నెండువేల కిలోమీటర్లు ప్రయాణించి చమురు ఓడలు చైనా వస్తున్నాయి. అరేబియా సముద్రతీరంలోని పాకిస్తాన్‌ గ్వాదర్‌ వద్ద రేవు నిర్మాణం చేసి అక్కడి నుంచి చైనాలోని షింజియాంగ్‌ వరకు రైలు మార్గం నిర్మాణం చేస్తే కేవలం 2,395 కిలోమీటర్ల దూరంతోనే చమురును తెచ్చుకోవచ్చు. దీనివలన చైనాకు ఏటా 200 కోట్ల డాలర్లు ఆదా అవుతుంది. ఈ మార్గంలో అనుబంధంగా అనేక పథకాలను ఏర్పాటు చేస్తే అది పాకిస్తాన్‌కూ లబ్ది చేకూరుస్తుంది. మౌలిక సదుపాయాలు వృద్ధి చెందుతాయి. ఇవన్నీ శాశ్వతంగా ఉండేవి, రాబడిని పెంచేవి. ఈ పధకంలో చైనా 25.4బి.డాలర్ల పెట్టుబడులు పెడుతుందని, పాకిస్తాన్‌కు 2.12 బి.డాలర్ల మేరకు పన్ను ఆదాయం, లక్షా92వేల మందికి ఉపాధి దొరుకుతుందని చైనా రాయబారి చెప్పాడు.

గతంలో 22 సార్లు రుణం ఇచ్చిన ఐఎంఎఫ్‌ ఇతర దేశాలు ఇచ్చిన రుణాలతో ఇలాంటి మౌలిక సదుపాయాలును అభివృద్ది చేసి ఉంటే చైనా ప్రవేశానికి అవకాశం ఉండేదా ? పాక్‌ పాలకులు గానీ ఐఎంఎఫ్‌ సలహాదారులు గానీ ఆ దిశగా గతంలో ఎందుకు ఆలోచించలేదు ? ఇప్పుడు చైనా మీద తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు ?ఇప్పుడు పాకిస్తాన్‌ విదేశీ చెల్లింపుల సమస్యను ఎదుర్కొంటోంది. పారిస్‌ క్లబ్‌, ఇతర సంస్థలు ఇచ్చిన రుణాల చెల్లింపు గడువు దగ్గరపడింది తప్ప చైనా రుణాలు కాదు. పారిస్‌ క్లబ్‌ పేరుతో ఉన్న 22 ధనిక దేశాలు వంద దేశాలకు 610 బి.డాలర్లు రుణాలిచ్చాయి. పాకిస్తాన్‌కు పది బి.డాలర్లు వాటిలో ఉంది. ఇప్పటి వరకు రెండు సార్లు పారిస్‌ క్లబ్‌ రుణాల చెల్లింపు గడువును పెంచి వెసులు బాటు కల్పించింది. ఉగ్రవాదం మీద పోరులో అమెరికాతో కలసి పాకిస్తాన్‌ పోరాడింది కనుక రుణాలు చెల్లించలేనందున 15 సంవత్సరాల పాటు కిస్తీ గడువు పెంచింది. తరువాత కరోనా కారణంగా మరో ఐదేండ్లు పెంచింది. ఇప్పుడు మరోసారి ఆ పని చేసి ఆదుకోవాలని పాక్‌ కోరుతోంది.డిసెంబరు నాటికి కిస్తీ సొమ్ము 110 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇలాంటి రుణాలను తీర్చేందుకు, దిగుమతుల అవసరాల కోసం ఐఎంఎఫ్‌తో మరింత అప్పు కోసం పాక్‌ సర్కార్‌ సంప్రదింపులు జరుపుతోంది

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d