• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

అయోధ్య రామాలయ రాజకీయం : అద్వానీని రావద్దన్నారు ! పిలిచినా వెళ్లేది లేదన్నారు పూరీ శంకరాచార్య !!

08 Monday Jan 2024

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

AYODHYA, BJP, Narendra Modi, Ram Temple politics, RSS, Swami Nischalananda Saraswati


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావటం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.దీని మీద మోడీ భక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నారు. వస్తే ఎంత రాకపోతే ఎంత అసలు రామాలయం కోసం పూరీ శంకరాచార్య ఏం చేశారంటూ నిలదీస్తున్నారు.రధయాత్ర నిర్వహించి, బాబరీ మసీదు కూల్చివేత కేసులను ఎదుర్కొన్న ఎల్‌కె అద్వానీకి ఆహ్వానం ఇస్తూనే అసలు కార్యక్రమానికి రావద్దని చెప్పినట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిత్రం ఏమిటంటే రామాలయంతో ఎలాంటి సంబంధంలేని, బాబరీ మసీదు కూల్చివేతను ఖండించిన సీతారాం ఏచూరి, ఇతర పార్టీల నేతలనూ ఆహ్వానించారు గానీ రావద్దని చెప్పలేదు. హాజరు కావటం లేదని చెప్పిన వారి మీద ప్రచారదాడులు చేస్తున్నారు. అద్వానీ(96), మురళీమనోహర్‌ జోషి(90) ఏండ్ల పెద్దవారు గనుక వారు వచ్చి ఇబ్బంది పడతారని అందువల్లనే రావద్దని చెప్పామని విమర్శలు చెలరేగిన తరువాత వివరణ ఇచ్చుకున్నారు. తరువాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా విశ్వహిందూపరిషత్‌ నేతలు ఆహ్వానించినట్లు ప్రకటించారు. కానీ మాజీ ప్రధాని దేవెగౌడకూ 90 ఏండ్లే అయినప్పటికీ ఆయన వయసు రీత్యా రావద్దని నిర్వాహకులు చెప్పలేదు.ఎందుకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత దేవెగౌడ-కుమారస్వామి పార్టీ జెడిఎస్‌ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపితో జట్టుకట్టాలని నిర్ణయించింది. అందుకే అయోధ్య రామాలయ రాజకీయం రంజుగా నడుస్తోంది అని చెప్పాల్సి వస్తోంది. ఈ మాట అంటే కొందరు మనోభావాలను ముందుకు తెచ్చుకొని బాధపడితే చేసేదేమీ లేదు. వయసు రీత్యా కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ శుభ కార్యాలు జరిగినపుడు ఆహ్వానం పలకటం, వారు రాలేమని చెప్పినపుడు వీలు చూసుకొని రావాలని ఆకాంక్ష వెలిబుచ్చటం మన భారతీయ సంప్రదాయం. కానీ దాన్ని తుంగలో తొక్కి రావద్దని మేమే చెప్పామని నిర్వాహకులు చెప్పటాన్ని ఏ సంప్రదాయం అంటారో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.రధయాత్ర పేరుతో బిజెపి నేత ఎల్‌కె అద్వానీ నిర్వహించిన కార్యక్రమం అది సృష్టించిన వినాశకర, అవాంఛనీయ ఉదంతాల గురించి తెలిసిందే. వారు వస్తారా లేదా స్పందన ఏమిటో చూడాల్సి ఉంది. ఒక వేళ వారు నిజంగా రాగలిగినా రానిచ్చేవారా అన్న సందేహాలు కూడా వారిని వద్దన్న తరువాత జనంలో తలెత్తాయి. తనదారిని సుగమం చేసుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన వెంటనే అద్వానీ, ఎంఎ జోషి వంటి వారితో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అది ఇంతవరకు ఒక్కసారి కూడా సమావేశమైన సమాచారంగానీ, ఇచ్చిన మార్గదర్శనం గురించి గానీ ఎవరికీ తెలియదు. గుడులకు పరిమితం కావాల్సిన రాముడిని ఓట్ల కోసం వీధుల్లోకి తెచ్చారు.


ఆది శంకరాచార్య ఏర్పాటు చేసిన నాలుగు పీఠాల్లో పూరీలోని గోవర్ధన మఠం ఒకటి. దాని అధిపతిగా ఉన్న స్వామి నిశ్చలానంద సరస్వతి(80)కి కూడా రామాలయ నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దాన్ని తిరస్కరించినట్లు స్వామి చెప్పారు, గతవారంలో ఒక టీవీ ఛానల్‌తో, అదే విధంగా మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన ఒక సనాతన ధర్మ సభకు హాజరైనపుడు విలేకర్లతో మాట్లాడారు. తనకు పంపిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒక వేళ హాజరు కావాలని అనుకుంటే తోడుగా గరిష్టంగా ఒకరిని మాత్రమే తెచ్చుకోవాలని దానిలో పేర్కొన్నట్లు చెబుతూ ఒక్కరు కాదు వందమందిని అనుమతించినా ఆ రోజు తాను వెళ్లేది లేదని నిశ్చలానంద చెప్పారు. గతంలో కూడా వెళ్లానని భవిష్యత్‌లో కూడా అయోధ్య వెళ్లి రాముడిని సందర్శిస్తానని అన్నారు. రాముడి విగ్రహాన్ని శాస్త్ర విధి ప్రకారం ఏర్పాటు చేయాలని ఇప్పుడు అలా జరగటం లేదన్నారు. తమ మఠపరిధి ప్రయాగ వరకు ఉందని అయినప్పటికీ తమ సలహా, మార్గదర్శనం కానీ కోరలేదని చెప్పారు. ఈ పరిణామాల గురించి ” నేను ఏ మాత్రం ఆశాభంగం చెందలేదు. ఇతర హిందూ సనాతనుల మాదిరి సంతోషంగా ఉన్నాను. ప్రత్యేకించి ప్రస్తుత ప్రధాని ఒక లౌకికవాదిగా కనిపించేందుకు తాపత్రయపడటం లేదు.విగ్రహారాధన, హిందూత్వ అంశాలలో అతనెంతో ధైర్యశాలి, వాటి పట్ల గర్వపడతారు. తనను ఒక లౌకికవాదిగా ప్రదర్శించుకొనేందుకు అతనేమీ పిరికివాడు కాదు.అయితే ఒక శంకరాచార్యగా నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి ? మోడీగారు విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే చప్పట్లు కొట్టి పొగడాలా ? అని ప్రశ్నించారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే ముందు తనను నరేంద్రమోడీ ఎలా కలిశారో నిశ్చలానంద గుర్తు చేసుకున్నారు.కరోనాకు ముందు యోగి ఆదిత్యనాధ్‌ ఏడాదికి రెండు మూడు సార్లు కలిసేవారు. విశ్వహిందూ పరిషత్‌ మాజీ అధ్యక్షుడు దివంగత అశోక్‌ సింఘాల్‌ కనీసం 70సార్లు కలిశారని చెప్పారు.తీర్థస్థలాలను అభివృద్ధి పేరుతో భోగస్థలాలుగా మార్చుతున్నారు,టూరిజం కేంద్రాలుగా చేస్తున్నారని అన్నారు. ఇదే అంశంపై సోమవారం నాడు మరోసారి నిశ్చలానంద తన వ్యతిరేకతను వెల్లడించారు. చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయపూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 17న ఒడిషా ప్రభుత్వం ప్రారంభించనున్న శ్రీమందిర్‌ పరికర్మ ప్రకల్ప పధకం గురించి స్పందించారు.పుణ్య స్థలాలను విహార కేంద్రాలుగా మార్చటం అంటే వాటిని విలాస కేంద్రాలుగా మార్చటమే అన్నారు.హౌటళ్ల వారు, రవాణా రంగంలో ఉన్నవారు లబ్ది పొందుతారు తప్ప ఆ కేంద్రాలకు ఉన్న ప్రత్యేకత తగ్గుతుందన్నారు.ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని అయితే వెళ్లాలా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. రామాలయ ప్రతిష్టాపన గురించి చేసిన వ్యాఖ్యల మీద నిశ్చలానందపై కాషాయ మరుగుజ్జు దళాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నాయి.


సిఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 టీవీ ఛానల్‌తో 30 నిమిషాలు మాట్లాడిన శంకరాచార్య రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేటపుడు క్రతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.చాతుర్వర్ణ వ్యవస్థకు భగవద్గీతలోని కృష్ణుడి బోధనల్లోనే మూలాలు ఉన్నాయి.గుణము, చర్యలను బట్టి నాలుగు వర్ణాలుగా సమాజాన్ని వర్గీకరించారు.ఇది పుట్టుకను బట్టి అని చెప్పటంగాక చేసే పనులు, వాటి స్వభావాన్ని వర్ణాలు ఉంటాయి.పశ్చిమ దేశాల్లో కూడా వర్ణ వ్యవస్థ మాదిరే విద్య, ఆర్థికం, రక్షణ, సేవా రంగాలు ఉన్నాయి.ఇప్పుడు వర్తమాన సమాజంలో పోలీసుల లేదా ప్రధానులు ఏలాంటి పాత్రను పోషించారో వర్ణ వ్యవస్థలో కూ ఎవరికి వారు తమ స్థితిని బట్టి సమతూకాన్ని నిర్వహించారు. శివపురాణంలో వివిధ రకాల బ్రాహ్మలు ఉన్నారని ఒక కుటుంబంలో పుట్టినంత మాత్రాన్నే బ్రాహ్మలుకాదన్నారు.ఒక బ్రాహ్మడు వ్యాపారం చేస్తే వైశ్య బ్రాహ్మణ అని పిలవాలి, పురాతన గ్రంధాలలో చెప్పిన వాటిని అచరిస్తేనే ఒకబ్రాహ్మడిని బ్రాహ్మడిగా పరిగణించాలి అన్నారు.


ఏసుక్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్త పూర్వీకులు సనాతన హిందువులే అని స్వామీజి గతేడాది సెలవిచ్చారు(ఫిబ్రవరి 1, 2023 ఓపి ఇండియా పోర్టల్‌) అమెరికా ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారని అది రుజువైందని నిశ్చలానంద చెప్పారు. వారు క్రైస్తవం, ఇస్లాం స్వీకరించే ముందు హిందువులే అన్నారు. ఏసు క్రీస్తు పది సంవత్సరాలు భారత్‌లో ఉన్నారని దాన్ని ఎక్కడా పేర్కొనలేదన్నారు. పూరీలో మూడు సంత్సరాలు ఉన్నారని క్రీస్తు వైష్ణవుడని హిందూ క్రతువులన్నీ చేసినట్లు చెప్పారు. ఏసు క్రీస్తుకంటే ముందే హిందూయిజం ఉందని అందువలన ఆయన పూర్వీకులు హిందువులే అన్నది స్వామి వారి అభిప్రాయమని ఎన్నోసార్లు చెప్పారని, పూరీ మఠ ప్రజా సంబంధాల అధికారి మాతృదత్తా చెప్పారు. ప్రభుత్వాలకు మఠాలు, దేవాలయాల మీద అదుపు ఉండకూడదని, ప్రతి మూలను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అనుసరిస్తున్నారంటూ తన మీద వచ్చిన విమర్శలు నిశ్చలానంద ఖండించారు, నేను అనుసరించటం లేదు, కావాలంటే వారే నా వెనుక నడవొచ్చు,ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ నాముందు బాలగోపాలుడి మాదిరి కూర్చుంటారని అన్నారు.


రామాలయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్న బిజెపి ఒడిషాలో అక్కడి సిఎం నవీన్‌ పట్నాయక్‌ శ్రీమందిర్‌ పరిక్రమ రధాల ద్వారా ఎన్నికల రాజకీయం చేస్తున్నారని బిజెపి నేత పృధ్వీరాజ్‌ హరిచందన్‌ ఆరోపించారు. జగన్నాధ సంస్కృతిని రూపుమాపేందుకు కుట్ర జరుగుతోందని, తన మాజీ ప్రయివేటు కార్యదర్శి ద్వారా ఒరియా పౌరుల మీద దక్షిణ భారత సంస్కృతిని బలవంతంగా రుద్దేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు.దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.శ్రీమందిర్‌ పధకం ఒక రాజకీయ నాటకమని, ఎన్నికల ముందు తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు తలపెట్టారని, 160 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును బిజెడి తన ఎన్నికల ప్రచారానికి వినియోగించటం గర్హనీయమైన చర్య అన్నారు. బిజెపి నేతల విమర్శలను బిజెడి నేత, ఎంఎల్‌ఏ పద్మనాభ బెహరా తిప్పికొట్టారు. మనమంతా జగన్నాధుని పిల్లలం, మనంగాకపోతే భగవంతుడి పేరును ఎవరు తీసుకుంటారు, దీని గురించి మాట్లాడేందుకేమీ లేదు, రాజకీయం అసలే లేదన్నారు. భువనేశ్వర్‌ నగరంలోని అరవై ఏడు వార్డుల్లో శ్రీమందిర్‌ పరిక్రమ పధకంలోని రధాలను రెండు రోజుల పాటు తిప్పుతారు. ప్రతి ఇంటి నుంచి ఆకు వక్కలను, ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ పధకంలో భాగంగా పూరీలోని జగన్నాధ ఆలయ పరిసరాలలో రధయాత్ర వేగంగా కదలటాన్ని సులభతరం చేసేందుకు, తొక్కిడి లేకుండా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జగన్నాధ దేవాలయం చుట్టూ 75 మీటర్ల పరిధిలో ఉన్న కట్టడాలను తొలగించేందుకు యాత్రకు అవసరమైన పద్దతుల్లో తీర్చిదిద్దేందుకు అవసరమైన భూ,భవనాలను సేకరించారు. జనాలకు అవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు, సామాన్లు భద్రపరుచుకొనే గదులతో పాటు భద్రతకు అవసరమైన కేంద్రాల వంటివి ఈ పధకంలో ఏర్పాటు చేశారు. దీన్ని బిజెపి రాజకీయం చేస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో ఏం జరుగుతోంది ? ఆర్థిక రంగం పతన దశలో ఉందా !

06 Saturday Jan 2024

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#Anti China, China, China economy, China exports, India PMI, Narendra Modi Failures, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


చైనాలో ఏం జరుగుతోంది ? చాలా మందికి అర్థంగాని, గందరగోళ పరిచే ప్రశ్న. అక్కడి వ్యవస్థ, ఆర్థికరంగం గురించి గతంలో చెప్పిన, వర్తమానంలో చెబుతున్న జోశ్యాల సంగతేమిటి ? భారత ఉత్పాదక రంగ పిఎంఐ (పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) 2023 డిసెంబరుల్లో పద్దెనిమిది నెలల కనిష్టానికి నవంబరులో ఉన్న 56 నుంచి 54.9కి తగ్గిందన్నది వార్త. ఎందుకటా కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి బలహీనంగా పెరగటం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ సూచిక 50 అంతకు మించి ఉంటే ఉత్పాదకరంగం విస్తరిస్తున్నట్లు, తగ్గితే దిగజారుతున్నట్లు లెక్క. గడచిన 30నెలలుగా 50కిపైగా నమోదు అవుతోంది. చైనాలో నవంబరులో ఉన్న 50.7పిఎంఐ డిసెంబరులో 50.8కి పెరిగిందని కాయిక్సిన్‌ సర్వే వెల్లడించింది.చిత్రం ఏమిటంటే చైనా ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం గడచిన ఆరునెలల్లో డిసెంబరులో ఫ్యాక్టరీ ఉత్పాదకత తగ్గింది. ప్రభుత్వం సర్వేకు ఎంచుకున్న బడా కంపెనీలకు, కాయిక్సిన్‌ ఎంచుకున్న చిన్న, మధ్య తరహా సంస్థలు కాస్త బాగా పని చేస్తున్నట్లు కొందరు అదీ ఇదీ రెండు సరైనవే అని చెప్పారు. చైనాలో జరుగుతున్న ఆర్థిక మార్పులు కొన్ని సమస్యలను ముందుకు తెచ్చిన మాట వాస్తవం. గతంలో శ్రామికశక్తి ఎక్కువగా ఉన్న పరిశ్రమలు, వ్యాపారాల స్థానంలో ఆధునిక ఉత్పాదక, సాంకేతిక మార్పులు ప్రవేశించాయి. ఈ కారణంగా ఉపాధి రంగం మీద కొన్ని ప్రతికూల ప్రభావాలు పడి సర్దుబాటు సమస్య తలెత్తింది. ఇది ప్రతిదేశంలోనూ జరిగిందే, జరుగుతున్నదే. ఒకనాడు మన దేశంలో సాధారణ డిగ్రీ చదువుకుంటే మెరుగైన ఉపాధి లభించేది, ఇప్పుడు అది కొరగానిదిగా మారింది.దాన్ని చేతపట్టుకొని ఉపాధి పొందలేకపోతున్నారు. అందుకే మన కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధి(స్కిల్‌ డెవలప్‌మెంట్‌) పధకాలను అమలు జరుపుతున్నది. అది ఎంతమేరకు పనికి వచ్చేది, దానిలో శిక్షణ లేకుండా సర్టిఫికెట్లు ఇస్తూ ఎంత అవినీతి జరిగేదీ, నైపుణ్యపాలు ఎంత అన్నది వేరే సంగతి. చైనాలో పరిశ్రమల్లో వస్తున్న మార్పులు శిక్షణ సమస్యలనే ముందుకు తెస్తున్నాయి. వాటిని పరిష్కరించేదిశగా ప్రభుత్వం ఉంది అంటే కొందరికి నమ్మకం కలగటం లేదు.చైనా ఏం చెప్పినా, ఏం చేసినా నమ్మనివారు ఎప్పుడూ ఉంటారు.


మార్కెట్లో అనిశ్చితి కారణంగా జపాన్‌లో కూడా ఫ్యాక్టరీ కార్యకలాపాలు తగ్గాయి. పిఎంఐ అంతకు ముందు నెలలో ఉన్న 48.3 నుంచి డిసెంబరులో 47.9కి తగ్గింది. యాభైకంటే తక్కువగా ఉన్నప్పటికీ జపాన్‌ మాంద్యంలో ఉందని చెప్పరుగానీ అంతకంటే ఎక్కువ ఉన్న చైనాలో మాంద్యం ఉందని చిత్రిస్తారు. గ్లోబల్‌ ఎకానమీ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఉత్పత్తి, సేవారంగాల సంయుక్త పిఎంఐ వివిధ దేశాల పరిస్థితి దిగువ విధంగా ఉంది.(న అంటే నవంబరు, డి అంటే డిసెంబరు 2023గా గమనించాలి)
దేశం ×××× తాజాపిఎంఐ×× మూడునెలలక్రితం×× ఏడాది క్రితం
భారత్‌ ××× 57.40న ××× 60.90 ××××××× 56.70
చైనా ××× 51.60న ××× 51.70 ××××××× 47.00
జపాన్‌ ××× 50.40డి ××× 52.10 ××××××× 49.70
అమెరికా×× 51.00డి ××× 50.20 ××××××× 45.00
యూరో××× 47.00డి ××× 47.20 ××××××× 49.30
ఎగువ వివరాలను చూసినపుడు ఏడాది క్రితం పరిస్థితి పోల్చుకుంటే ఎక్కడ ఎలాంటి సమస్య ఉందో ఎవరికి వారు నిర్ధారణకు రావచ్చు.పిఎంఐలను బట్టే మాంద్యాల్లోకి పోయినట్లు లేదా బయటపడినట్లు పూర్తిగా చెప్పలేము. అది ఒక సూచిక మాత్రమే. చైనా, ఇతర దేశాల కంటే మనదేశ సంయుక్త పిఎంఐ ఎక్కువగా కనిపిస్తోంది. అదే వాస్తవమైతే వస్తు, సేవల ఎగుమతుల్లో అది ప్రతిబింబించాలి.2023 గణాంకాలు ఇంకా ఖరారు కానందున 2022ను ప్రామాణికంగా తీసుకుంటే ప్రపంచంలో తొలి పది వస్తు ఎగుమతి దేశాల జాబితాలో మనకు చోటు లేదు.పోనీ అంతర్గత డిమాండ్‌ పెరిగితే డిసెంబరు నెలలో వస్తూత్పత్తి పిఎంఐ పద్దెనిమిది నెలల కనిష్టానికి ఎందుకు తగ్గినట్లు ? విజువల్‌ కాపిటలిస్ట్‌ డాట్‌కామ్‌ సేకరించిన సమాచారం ప్రకారం 2022లో వివిధ దేశాల వస్తు ఎగుమతులు ఇలా ఉన్నాయి.1.చైనా 3.6లక్షల కోట్ల డాలర్లు,2.అమెరికా 2.1ల.కో.డా, 3.జర్మనీ 1.7లకోడా,4.నెదర్లాండ్స్‌ 965.5బిలియన్‌ డాలర్లు, 5.జపాన్‌ 746.9 బి.డా,6. దక్షిణ కొరియా 683.6బి.డా,7.ఇటలీ 656.9 బి.డా, 8. బెల్జియం 632.9 బి.డా, 9.ఫ్రాన్స్‌ 617.8 బి.డా,10.హాంకాంగ్‌ 609.9బి.డా, 11.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 598.5బి.డాలర్లుగా ఉన్నాయి.మన ఎగుమతులు 453.58బి.డాలర్లు.


ముందే చెప్పుకున్నట్లు పిఎంఐ ఒక దేశ ఆర్థికరంగ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదు. అది ఇతర దేశాల పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది.ఉదాహరణకు 2015 డిసెంబరు రెండున మింట్‌ పత్రిక విశ్లేషణలో వివిధ దేశాల పిఎంఐల వివరాలను ఇచ్చింది. దాని ప్రకారం జపాన్‌ 52.6తో అగ్రస్థానంలో ఉండగా భారత్‌ 50.3, తైవాన్‌ 49.5, వియత్నాం 49.4, దక్షిణ కొరియా 49.1,చైనా 48.6, మలేషియా 47, ఇండోనేషియా 46.6గా ఉంది. అంటే మనదేశం అప్పుడే చైనా కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్లే. అలాంటిది ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఎగుమతుల్లో ఎందుకు ఎదుగుదల లేదు.మేకిన్‌, మేడిన్‌ ఇండియాల జాడ ఎక్కడ ? పిఐబి 2022 జూలై 29న విడుదల చేసిన సమాచారం ప్రకారం 2017-18లో జిడిపిలో వస్తు ఎగుమతుల శాతం 11.4కాగా 2021-22లో 13.3శాతంగా పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల సగటు 11.78శాతం ఉంది. వస్తు, సేవల ఎగుమతులు ఈ కాలంలోనే 18.8 శాతం నుంచి 21.4శాతం మధ్య ఉన్నాయి. సగటు 19.5శాతమే ఉంది. అందువలన వాటిలో కూడా పెద్దగా పెరుగుదల లేదు.మాక్రోట్రెండ్స్‌ అనే పోర్టల్‌ నిర్వహిస్తున్న సమాచారం ప్రకారం 2004 నుంచి 2013వరకు ఏటా సగటున మన దేశ జిడిపిలో 22.1శాతం ఎగుమతులు జరిగాయి. ఈలెక్కన మోడీ ఏలుబడిలో దిగుమతులు పడిపోయినట్లా పెరిగినట్లా ?


చైనాలో మాంద్యం… ఒప్పుకొన్న జింపింగ్‌ అనే శీర్షికలతో పాటు అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.ఆర్థికంగా చైనా ఎంతో ఇబ్బందుల్లో ఉందని వాణిజ్యాలు గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నాయని, జనాలు ఉపాధి పొందలేకపోతున్నారని, కొంత మందికి రోజువారీ అవసరాలు తీరటం లేదని వర్తమాన స్థితి గురించి దేశాధినేత షీ జింపింగ్‌ నూతన సంవత్సర సందేశంలో చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు చైనా నేత ఏం చెప్పారు ? షీ జింపింగ్‌ చైనా భాషలో ఇచ్చిన సందేశాన్ని విదేశీ మంత్రిత్వశాఖ ఆంగ్లంలో అనువదించి విడుదల చేసింది. దానిలో అనేక ఆకాంక్షలను వెలిబుచ్చారు. వాటితో పాటు దిగువ మాటలను చెప్పారు.” ప్రయాణంలో మనం కొన్ని ఎదురుగాలులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొన్ని సంస్థలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నాయి.కొంత మంది పౌరులు ఉపాధిని వెతుక్కోవటంలో, మౌలిక అవసరాలను తీర్చుకోవటంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాలు వరదలు, తుపాన్లు, భూ కంపాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నాయి. ఇవన్నీ నా మదిలో అగ్రభాగాన ఉన్నాయి.”. ఈ మాటలను పట్టుకొని చైనా ఆర్థిక స్థితి గురించి చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు చేశారు. జింపింగ్‌ గడచిన సంవత్సరంలో చైనా ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావించారు. సాధించిన విజయాలను కూడా పేర్కొన్నారు.వాటిని విస్మరించి ఇబ్బందుల్లో ఉందన్న ప్రచారం చేస్తున్నారు. దాని వలన కొంత మంది తప్పుదారి పట్టటం తప్ప చైనాకు వచ్చే నష్టమేమీ లేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే చైనా జింపింగ్‌ దాచేందుకు ప్రయత్నించలేదు.


ఇంతకీ అసలు మాంద్యం అంటే ఏమిటి ? చైనాలో ఆ పరిస్థితి ఉందా ? మందగమనం అంటే మాంద్యమని అర్ధమా ? న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో 1974లో రాసిన ఒక విశ్లేషణలో అమెరికా కార్మిక గణాంకాల కమిషనర్‌ జూలియస్‌ షిష్కిన్‌ ఒక భాష్యం చెప్పారు. వరుసగా రెండు త్రైమాసిక (ఆరునెలలు) కాలాల్లో వాస్తవ జిఎన్‌పి(జాతీయ మొత్తం ఉత్పత్తి) తగ్గినా, ఆరునెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి పతనమైనా దాన్ని మాంద్యం అంటారు. దీని తీవ్రత నిజ జిఎన్‌పి 1.5శాతం తగ్గినపుడు, వ్యవసాయేతర ఉపాధి 15శాతం పతనమైనపుడు, నిరుద్యోగం రెండు శాతం పెరిగి ఆరుశాతం స్థాయికి చేరినపుడు, ఇక వ్యాప్తి గురించి చెప్పాల్సి వస్తే వ్యవసాయేతర రంగంలో 75శాతం పైగా పరిశ్రమల్లో ఆరునెలలు, అంతకు మించి ఉపాధి తగ్గినపుడు మాంద్యంలో ఉన్నట్లు పరిగణించాలని షిష్కిన్‌ చెప్పాడు. ఇలాంటి పరిస్థితి చైనాలో ఉందా ? జింపింగ్‌ నోట మాంద్యం అనే మాట వచ్చిందా ? కరోనా తరువాత చైనా ఆర్థికరంగం మందగమనంలో ఉంది తప్ప మాంద్యంలో కాదు.చైనాలో గడచిన నాలుగున్నర దశాబ్దాల పారిశ్రామిక విధానం వేరు, ఇప్పుడు అనుసరిస్తున్నది వేరు. తన ఉత్పత్తిని పెంచుకొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగమతి చేసుకున్న చైనా ఇప్పుడు స్వంతంగా రూపొందించుకున్నదానితో ఆ రంగంలో ముందున్న దేశాలతో పోటీపడేందుకు చూస్తోంది. సాంప్రదాయ పరిశ్రమల స్థానంలో ఆధునికమైనవి వస్తున్నాయి. వాటికి అవసరమైన పరిశోధన-అభివృద్ధి ఖర్చులో మన వంటి దేశాలతో పోలిస్తే ఎంతో ముందున్నా ధనికదేశాలతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉంది. దాన్ని అధిగమించే క్రమంలో ఉంది.అడ్డుకొనేందుకు పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.దానిలో భాగమే చిప్‌ వార్‌. కృత్రిమ మేథ(ఏఐ)లో పశ్చిమ దేశాలకు సవాలు విసురుతోంది. చైనా అంటే ఇష్టంలేని మీడియా సంస్థలు అక్కడ జరుగుతున్నదాని గురించి జనాలను తప్పుదారి పట్టిస్తున్నాయి. వైఫల్యాలను వారేమీ దాచటం లేదు. చైనా గురించి గతంలో చెప్పినవన్నీ అర్ధసత్యాలుగానూ అవాస్తవాలుగా తేలాయి. కూలిపోతుంది, విఫలమౌతుందని చెప్పిన జోశ్యాలన్నీ తప్పాయి. గతంలో మాదిరి రెండంకెల పెరుగుదల లేదు గానీ ధనిక దేశాల కంటే వృద్ధి రేటు అధికంగా ఉంది. అవి పతనం కానపుడు చైనాకే ఆ దుర్గతి ఎలా పడుతుంది ? ఇంత చిన్న తర్కాన్ని అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ క్మిస్మస్‌ విందు రాజకీయం – కేరళ మంత్రి వ్యాఖ్య టీకప్పులో తుపాను !

05 Friday Jan 2024

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

a storm in a tea cup, BJP, CPI()M, Narendra Modi, Pinarayi Vijayan, Saji Cherian, wine and cake christmas politics


ఎం కోటేశ్వరరావు


క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవ పూజార్లకు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో విందు ఇచ్చారు. దానిలో పాల్గొన్న బిషప్పులు మణిపూర్‌లో తమ సామాజిక తరగతికి చెందిన వారి మీద జరుగుతున్నదాడుల గురించి ప్రధానితో ప్రస్తావించలేదని కేరళ మంత్రి సాజి చెరియన్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.జనవరి మూడున కేరళ సిఎం పినరయి విజయన్‌ ఇచ్చిన క్రిస్మస్‌ విందుకు చెరియన్‌ వ్యాఖ్యలను తప్పుపట్టిన బిషప్పుల కౌన్సిల్‌ నేత క్లిమిస్‌తో సహా అనేక మంది హాజరయ్యారు. అంతకు ముందు చెరియన్‌ తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో ఆ వివాదం ముగిసింది. ఈ విందుకు గవర్నర్‌ మహమ్మద్‌ ఆరిఫ్‌ ఖాన్‌ హాజరు కాలేదు. సిఎం ఆహ్వానించని కారణంగానే రాలేదని వచ్చిన వార్తలపై గవర్నర్‌ స్పందించారు. కావాలంటే రాజభవన్‌కు వచ్చి తనిఖీ చేసుకోవచ్చు, నేను ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించానో మీరు శోధించవచ్చు, ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నలు అడగవచ్చు అన్నారు. ప్రధాని విందు వివాదం గురించి చూద్దాం. న్యూ ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఇచ్చిన క్రిస్మస్‌ విందుకు ఆహ్వానం అందగానే కొందరు బిషప్పులకు వెంట్రుకలు నిక్కబొడుచుకొని అక్కడ అందించిన పండ్లరసాలు, ద్రాక్ష రసాలు, కేకుల మీద చూపిన శ్రద్ద తమ స్వంత సామాజిక తరగతి మీద మణిపూర్‌లో జరిగిన హింసను మరిచిపోయారని, వారికది ఒక సమస్యగా కనిపించలేదని కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెరియన్‌ ఒక సభలో అన్నారు. చెరియన్‌ సిపిఎం నేత, క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారు. దాని మీద కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌(కెసిబిసి) అధ్యక్షుడు కార్డినల్‌ మార్‌ బెసిలియోస్‌ క్లిమిస్‌ మండిపడుతూ మంత్రి మాటలను ఉపసంహరించుకొనేంత వరకు తాము ప్రభుత్వానికి సహకరించేది లేదని ప్రకటించారు. వివాదాన్ని పొడిగించకుండా ఉండేందుకు తాను చేసిన విమర్శలో వెంట్రుకలు నిక్కపొడుచుకోవటం, కేకులు, డ్రాక్ష రసం పదాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే మణిపూర్‌ హింసాకాండపై క్రైస్తవ మతాధికారులు స్పందించలేదన్న విమర్శకు కట్టుబడి ఉన్నట్లు చెరియన్‌ స్పష్టం చేశారు. కెసిబిసి ప్రతినిధి ఫాదర్‌ జాకబ్‌ పాలకపిలి మాట్లాడుతూ దేశానికి క్రైస్తవులు చేసిన సేవల గురించి చర్చించేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశమని పేర్కొన్నారు.మణిపూర్‌ జనాభాలో 41శాతాల చొప్పున క్రైస్తవులు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఎనిమిదిశాతంపైగా ఉన్నారు. అక్కడ గతేడాది మే 3వ తేదీన ప్రారంభమైన మెయితీ-గిరిజన ఘర్షణలు వందలాది మంది ప్రాణాలు తీశాయి. వేలాది ఇండ్లు, వందలాది ప్రార్ధనా మందిరాలను ధ్వంసమయ్యాయి. దాదాపు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. గిరిజన మహిళలను ఇద్దరిని వివస్త్రలను గావించి రోడ్ల మీద తిప్పిన దుర్మార్గం వెలుగులోకి వచ్చిన తరువాత ప్రధాని మొక్కుబడిగా ఖండించారు తప్ప ఇంత వరకు ఆ రాష్ట్రానికి వెళ్లి భరోసా కల్పించేందుకు పూనుకోలేదు..


మణిపూర్‌ ఉదంతాల గురించి మౌనంగా ఉండటంపై కేరళ క్రైస్తవ మత పత్రికల్లోనే తీవ్ర విమర్శలు చాలా నెలల క్రితమే వచ్చాయి. ఈ పూర్వరంగంలోనే మంత్రి చెరియన్‌ మాట్లాడారు. కేరళలో ఓటు బాంకు ఏర్పాటు చేసుకొనే ఎత్తుగడతో క్రైస్తవ మతాధికారులను ప్రసన్నం చేసుకొనేందుకు బిజెపి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది.లౌ జీహాద్‌ పేరుతో హిందూ, క్రైస్తవ యువతులను కూడా ఆకర్షించి మతమార్పిడికి పూనుకుంటున్నారని క్రైస్తవుల-ముస్లింల మధ్య విబేధాలు సృష్టించే విధంగా బిజెపి నేతలు గతంలో కొందరు వ్యాఖ్యానించారు. క్రైస్తవులు దేశానికి చేసిన సేవ గురించి చర్చించేందుకు ప్రధాని విందు ఏర్పాటు చేసినట్లు చెప్పటమే విచిత్రం.సంఘపరివార్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఏర్పాటు చేసిన బిజెపి, ఇతర అనేక సంస్థలు క్రైస్తవ మిషనరీల గురించి, ప్రలోభాలతో మతమార్పిడులు చేస్తున్నారంటూ నిత్యం చేస్తున్న ప్రచారం, ఆ పేరుతో చేస్తున్న దాడుల గురించి తెలిసిందే. వాటిని నివారించటం గురించి ప్రధాని నరేంద్రమోడీ గడచిన పది సంవత్సరాల్లో ఎలాంటి సమావేశాల ఏర్పాటు లేదా ప్రయత్నాలుగానీ కనిపించవు.
2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ముస్లింలు, క్రైస్తవులు అభద్రతా భావానికి గురయ్యారు.భారత్‌లో ఇతర మతాల్లో ఉన్నప్పటికీ వారంతా గతంలో హిందువులే అన్న ప్రచారాన్ని తీవ్రం చేయటంతో పాటు ఘర్‌వాపసీ పేరుతో ఇతర మతాల వారిని తిరిగి హిందువులుగా మార్చే పేరుతో పెద్ద హడావుడి చేశారు. దానికి స్పందన రాలేదు. గుజరాత్‌లో జరిపిన మారణకాండను నివారించటంలో విఫలమైన నరేంద్రమోడీ తమ దేశంలో అడుగుపెట్టకూడదంటూ 2005 అమెరికా అనుమతి నిరాకరించింది. తరువాత అదే అమెరికా మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత ఆహ్వానం పలికింది. 2014 అక్టోబరు, 2015 జనవరిలో నరేంద్రమోడీతో భేటీ అయినపుడు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా,మత స్వేచ్చపై అమెరికా కమిషన్‌ కూడా భారత్‌లో మతస్వేచ్చకు భంగం కలుగుతున్నదని, మైనారిటీ మతాల వారి మీద దాడులు జరుపుతున్నట్లు విమర్శలు చేసింది. భారత్‌లో కనిపిస్తున్న అసహనాన్ని మహాత్మాగాంధీ చూసి ఉంటే దిగ్భ్రాంతికి గురై ఉండేవాడని బరాక్‌ ఒబామా వ్యాఖ్యానించాడు. ఈ పూర్వరంగంలో అమెరికాను సంతుష్టీకరించేందుకు, ప్రపంచంలో తన ప్రతిష్టకు కలిగిన మచ్చను కనిపించకుండా చేసుకొనేందుకు నరేంద్రమోడీ చూశారు. తమ ప్రభుత్వం ఎలాంటి వత్తిడీ, ప్రభావం లేకుండా పౌరులు ఏ మతాన్నైనా అనుసరించటానికి, లేదా నిలుపుకోవటానికి స్వేచ్చను అన్ని విధాలుగా పరిరక్షిస్తుందని, మెజారిటీ లేదా మైనారిటీ మతాలకు చెందిన వారు ఎవరైనా ఇతరుల మీద విద్వేషాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా రెచ్చగొట్టినప్పటికీ సహించదని పార్లమెంటులో చెప్పాల్సి వచ్చింది. విదేశాల వారిని ఆకట్టుకొనేందుకు ఈ ముక్కలను ఆంగ్లంలో చెప్పారని కొందరు వ్యాఖ్యానించారు. ఈ మాత్రం మాట్లాడటాన్ని కూడా సహించలేని హిందూ జాతీయవాదులు ” లౌకిక నరేంద్రమోడీ ” అంటూ ఎద్దేవా చేశారని వాషింగ్టన్‌ పోస్టు, గార్డియన్‌ పత్రికలు రాశాయి. క్రైస్తవ మతాధికారులతో సమావేశాన్ని కూడా మోడీ నిర్వహించారు.


నరేంద్రమోడీ చేసిన ప్రకటన ఇంకా చెవుల్లో వినిపిస్తుండగానే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌ భగవత్‌ మదర్‌ తెరెసాను విమర్శిస్తూ తన గణాన్ని సంతృప్తి పరచేందుకు చూశారు. మిషనరీలు తమ సాయం కోరి వచ్చిన వారిని మతం మారాలని కోరినట్లు ఆరోపించారు.ఆమె సేవలు మంచివే కావచ్చు, కానీ వాటిని వినియోగించుకున్న వారిని క్రైస్తవులుగా మార్చే లక్ష్యంతో చేశారని అన్నారు. ప్రభుత్వేతర సంస్థలు కూడా సేవలు చేస్తాయి అవి మదర్‌ తెరేసా వంటివి కాదు అన్నారు. అంతకు ముందు మతపరమైన మైనారిటీలను అపహరణకు గురైన వస్తువులుగా వర్ణిస్తూ నా వస్తువులను నేను తిరిగి పొందుతా అన్నారు. మదర్‌ తెరేసాపై మోహన్‌ భగవత్‌ మాటలతో తీవ్ర విమర్శలు రావటంతో తమ నేత మాటలను మీడియా వక్రీకరించిందంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. విదేశీ నిధులతో క్రైస్తవ మిషనరీలు, సంస్థలు మత మార్పిడికి పాల్పడుతున్నాయంటూ చేస్తున్న ప్రచారం ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. క్రైస్తవం మన దేశానికి రెండువేల సంవత్సరాల నాడే వచ్చింది. రెండు వందల సంవత్సరాల బ్రిటీష్‌ పాలన, తరువాత కూడా చూస్తే ప్రస్తుతం దేశంలో క్రైస్తవుల సంఖ్య కేవలం 2.3శాతమే. అంటరానితనం వంటి తీవ్ర వివక్ష కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారారు. ఆ సమస్యతో నిమిత్తం లేని వారు ఆర్థిక, ఇతర ప్రయోజనాల కోసం క్రైస్తవం పుచ్చుకున్నారు. మొఘల్‌ పాలనా కాలంలో కూడా జరిగింది అదే. రిజర్వేషన్ల కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారనప్పటికీ దేవాలయాలకు బదులు చర్చ్‌లకు వెళ్లి క్రీస్తును పూజిస్తున్నారన్నది హిందూత్వవాదుల దుగ్ద.


గతంలో జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలసి అహమ్మదాబాద్‌లో ఒక పురాతన మసీదును మోడీ సందర్శించారు. సందర్శన వేరు, చర్చిలో మాదిరి పూజా క్రతువులో భాగంగా కొవ్వొత్తి వెలిగించినట్లుగా మసీదులో ఎక్కడా చూడలేదు.విదేశాలకు వెళ్లినపుడు అబూదాబీలో మోడీ మసీదును సందర్శించారు. ఇవన్నీ ఇస్లామిక్‌, క్రైస్తవ దేశాల పాలకుల మెప్పు పొందేందుకే అన్నది స్పష్టం. గతేడాది ఈస్టర్‌ పండగనాడు మోడీ చర్చికి వెళ్లటానికి ముందు క్రైస్తవుల మీద అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ ముంబైలో పదివేల మంది ప్రదర్శన చేశారు.” ఈస్టర్‌ పండగ రోజు కెథడ్రల్‌ చర్చిని సందర్శించాలన్న వాంఛను ప్రధాని మోడీ వెలిబుచ్చారు. మేము ఏర్పాటు చేశాము. దీని మీద స్పందన ఏమిటని అనేక మంది జర్నలిస్టులు ఎందుకు అడుగుతున్నారో తెలియటం లేదని ” అన్న ఢిల్లీ ఆర్చిబిషప్‌ అనిల్‌ కౌటో అంతకు మించి మాట్లాడేందుకు తిరస్కరించారు.ప్రధాని కోరితే కుదరదని చెప్పలేం అని ఫరీదాబాద్‌ సిరో మలబార్‌ చర్చి అధిపతి కురియకోస్‌ భరణికులనగార అన్నారు. ప్రధాని చర్చిలో ఉండగా మూడు స్తోత్రాలను ఆలపించాము, రైసెన్‌ క్రీస్టు విగ్రహం ముందు కొవ్వొత్తిని కూడా వెలిగించారని చెప్పారు.అరగంటపాటు అక్కడే ఉన్న మోడీ ప్రాంగణంలో ఒక మొక్క నాటారు.ముంబైలో క్రైస్తవుల ప్రదర్శన నిర్వాహకులలో ఒకరైన డోల్ఫీ డి సౌజా మాట్లాడుతూ నరేంద్రమోడీ చర్చికి రావటానికి మాకెలాంటి సమస్య లేదు. స్వాగతిస్తాం, కానీ మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత క్రైస్తవుల మీద హింసాకాండ పెరిగింది, దాడులకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి మోడీ నిరాకరిస్తున్నారు, అదే మాకు ఆందోళన కలిగిస్తోంది అని కూడా డి సౌజా చెప్పారు.అలాంటి ప్రధాని మణిపూర్‌ గురించి మౌనంగా ఉండటాన్ని ఎందుకు ప్రశ్నించలేదనే కేరళ మంత్రి తప్పుపట్టారు.


ఈస్టర్‌ పండుగ రోజున బిజెపి నేతలు కేరళలో పదివేల చర్చ్‌లు, క్రైస్తవుల ఇండ్లను సందర్శించి వారిని సంతుష్టీకరించేందుకు, ఓటు బాంకుగా మార్చుకునేందుకు చూశారు. ఈస్టర్‌ రోజున ఆడించిన నాటకమిదని కేరళకు చెందిన కురియకోస్‌ భరణికులనగార విమర్శించారు. కేరళలో సిరో మలబార్‌ చర్చ్‌ ఆర్చిబిషప్‌ కార్డినల్‌ జార్జి అలెంచెరీ నరేంద్రమోడీని ప్రశంసించినట్లు, దేశంలో క్రైస్తవులు అభద్రతతో లేరని చెప్పినట్లు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. దేశంలో ఆందోళనకరంగా ఉన్న వాస్తవం కార్డినల్‌ అలెంచెరీ మాటల్లో ప్రతిబింబించలేదని కేరళలో ప్రచురితమయే సత్యదీపమ్‌ అనే కాథలిక్‌ పత్రిక సంపాదకుడు ఫాదర్‌ పాల్‌ తెలక్కాట్‌ వ్యాఖ్యానించారు. మోడీ పాలనను ప్రశంసించటం క్రైస్తవులకు విభ్రాంతి కలిగించిందని కూడా అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మిజోరం వెళ్లలేదు. మణిపూర్‌ తగులబడుతుంటే రాని ప్రధాని తగుదునమ్మా అంటూ పక్కనే ఉన్న మిజోరంలో ఓట్ల కోసం వచ్చారనే విమర్శను మూటగట్టుకోవాల్సి వస్తుందనే కారణం తప్ప మరొకటి కాదు. లోక్‌సభ ఎన్నికల పూర్వరంగంలో నరేంద్రమోడీ క్రిస్మస్‌ రాజకీయం చేశారు. ఈ పూర్వరంగంలో ప్రధాని విందుకు వెళ్లిన బిషప్పులు మణిపూర్‌లో జరుగుతున్న ఉదంతాలను పట్టించుకోలేదని కేరళ మంత్రి సాజీ చెరియన్‌ చేసిన వ్యాఖ్యలను చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా కేసు, బీరూట్‌లో హమస్‌ నేత హత్య, ఎర్ర సముద్రంలోకి ఇరాన్‌ యుద్ధనౌక !

03 Wednesday Jan 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Hamas, Iran War Ship Alborz, Israel genocide, Israel-Hamas war, Joe Biden, Red Sea


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు గాజా నుంచి సైన్య ఉపసంహరణ వార్తలు, మరోవైపు ఆలోగా మిగిలి ఉన్న నివాసాలను పూర్తిగా నాశనం చేయటం, సాధ్యమైనంత మంది పాలస్తీనియన్ల ప్రాణాలను హరించేందుకు వైమానిక, టాంకులతో ఇజ్రాయెల్‌ మిలిటరీ విరుచుకుపడుతున్నట్లు సమాచారం. నిబంధనలను తోసిరాజని అమెరికా భారీ ఎత్తున మిలిటరీ సాయం. పాలస్తీనా జాతిని తుడిచిపెట్టేందుకు పూనుకున్న ఇజ్రాయెల్‌ మీద విచారించాలంటూ అంతర్జాతీయ కోర్టు (ఐసిజె)లో దక్షిణాఫ్రికా కేసు దాఖలు. ఎమెన్‌ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధులు ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు, వారి మీద అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రతిదాడులు. పది మంది హౌతీల మరణం,ఈ పూర్వరంగంలో మంగళవారం నాడు ఎర్ర సముద్రంలోకి ఇరాన్‌ తన యుద్ధ నౌక అల్‌బోర్జ్‌ను నడిపింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా ముడి చమురు ధరలు పెరిగాయి. హిందూమహా సముద్రంతో ఎర్రసముద్రాన్ని కలిపే ఏడెన్‌ జలసంధి నుంచి ఎర్ర సముద్రం దక్షిణ ప్రాంతంలోకి ఇరాన్‌ నౌక ప్రవేశించింది. తాము కూడా ఆ ప్రాంతంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పించేందుకే అని ఇరాన్‌ ప్రకటించింది. అదే పేరుతో అమెరికా, బ్రిటన్‌ ఇతర దేశాల నౌకలు ఉన్నాయి.2009 నుంచి నియమిత కాలాల్లో తమ నౌక ఆ ప్రాంతంలో గస్తీకి రావటం మామూలేనని, ఎవరికీ చెందని జలాల్లోకి ఇతర దేశాల యుద్ధ నావలు ఎలా వస్తున్నాయో తమది కూడా అంతేనని ఇరాన్‌ చెప్పింది.2021లో ఏడెన్‌ జలసంధిలో రెండు చమురు టాంకర్లపై సముద్ర దొంగల దాడిని తమ అల్‌బోర్జ్‌ తిప్పిన కొట్టిన అంశాన్ని గుర్తు చేసింది. ఎర్ర సముద్రంలో నౌకల స్వేచ్చా విహారానికి విఘాతం కలిగిస్తున్న హౌతీల మీద ప్రత్యక్ష చర్యకు దిగుతామని బ్రిటన్‌ బెదిరించింది. మంగళవారం నాడు లెబనాన్‌ రాజధాని బీరూట్‌ శివార్లలో హమస్‌ అగ్రనేతలలో ఒకడైెన సాలే అల్‌ అరౌరీని హత్య చేశారు. ఇజ్రాయెల్‌ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ దాడిలో మరణించినట్లు హమస్‌ ప్రకటించింది, అయితే ఏ సంస్థ కూడా తామే హతమార్చినట్లు చెప్పుకోలేదు. దీని గురించి మాట్లాడవద్దని ఇజ్రాయెల్‌ తమ నేతలకు సలహా ఇచ్చింది. ఇవీ మధ్యప్రాచ్యంలో వర్తమాన పరిణామాలు.


పాలస్తీనా జాతిని తుడిచిపెట్టి, గాజా ప్రాంతాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు పూనుకున్న ఇజ్రాయెల్‌ మీద విచారణ జరపాలని దక్షిణాఫ్రికా ఐసిజెలో కేసు దాఖలు చేసింది. పాలస్తీనియన్లు యూదుదురహంకారుల అణచివేతకు గురవుతున్నట్లే శతాబ్దాల తరబడి శ్వేత జాతి దురహంకారుల వివక్ష, అణచివేతకు దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లు బలైన సంగతి తెలిసిందే. ఆ బాధ ఏమిటో వారికి తెలిసినంతగా మరొకరికి అవగతం కాదు, ఈ కారణంగానే పాలస్తీనియన్లకు మద్దతుగా కేసుదాఖలు చేసినట్లు భావిస్తున్నారు. అది ఏమౌతుందో చెప్పలేము గానీ ఇజ్రాయెల్‌ మీద వత్తిడి పెంచుతుంది, బహుశా దాని ప్రభావం వల్లనే పెద్ద సంఖ్యలో సేనలను గాజా నుంచి వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించిందా ? అబ్బే అదేమీ లేదు, పోరులో ఉన్నవారికి విశ్రాంతినిచ్చేందుకు, వారి స్థానంలో కొత్తవారిని దించుతామని ఇజ్రాయెల్‌ అధికారులు ప్రకటించింది వాస్తవమా ? చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు గాజాలో ఇరవై రెండువేల మందికి పైగా పౌరులను చంపారు. ఎనిమిది వేల మంది హమస్‌ తీవ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకోవటం తప్ప దానికి తగిన ఆధారాలను చూపలేదు, ఎవరూ నమ్మటం లేదు. ఈ ఏడాది అంతటా తమ దాడులు కొనసాగుతాయని ప్రకటించారు. అంతర్జాతీయ వ్యవస్థలో ఐసిజె సివిల్‌ కోర్టు, ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు(ఐసిసి) నేరాలను విచారిస్తుంది. ఐరాసలో రెండు దేశాలూ సభ్యులే కనుక కోర్టు నిర్ణయాలకు బద్దులు కావాల్సి ఉంది.తమ దేశంలో 1994లో అంతమైన జాత్యంహకార పాలనలో శ్వేతజాతి మైనారిటీలు జనాన్ని బలవంతంగా వేర్వేరుగా ఉంచారని, ఇప్పుడు ఇజ్రాయెల్‌ విధానాలు కూడా అలాగే ఉన్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా చెప్పాడు. అక్టోబరు ఏడు నుంచి గాజాలో ఇజ్రాయెల్‌ చర్యలు జాతుల అంతంపై ఐరాస తీర్మానాలకు విరుద్దంగా ఉన్నాయని అందువలన తక్షణమే విచారణ జరపాలని కోర్టును దక్షిణాఫ్రికా అభ్యర్ధించింది. గాజాలో కాల్పుల విరమణ జరిపేవరకు ప్రిటోరియాలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించటమే గాక అన్ని రకాల దౌత్య సంబంధాలను పక్కన పెడుతున్నట్లు దక్షిణాఫ్రికా చాలా రోజుల క్రితమే ప్రకటించింది. తమ మీద చేసిన అభియోగాలకు ఆధారం లేదని, రక్తపు మరకలను తమకు అంటిస్తున్నారని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. గాజాలోని పౌరులు తమకు శత్రువులు కాదని చెప్పుకుంది.మరోవైపు గాజాలో అమాయకులెవరూ లేరని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు హర్‌జోగ్‌ ప్రకటించాడు. అక్కడి జనం మానవ మృగాలు గనుక వారికి సామూహిక శిక్ష విధిస్తామని రక్షణ మంత్రి చెప్పాడు. ప్రధాని నెతన్యాహు బైబిల్‌లోని అంశాలను ఉల్లేఖించటం జాతి నిర్మూలనకు పిలుపు నివ్వటం తప్ప మరొకటి కాదని అనేక మంది చెప్పారు. దక్షిణాఫ్రికా చర్యను పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వశాఖ స్వాగతించింది.వెంటనే కోర్టు స్పందించాలని, పౌరులకు మరింత హాని జరగకుండా చూడాలని కోరింది.


గాజాలో ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా ఎర్ర సముద్రంలోని బాబ్‌ ఎల్‌ మాండెబ్‌ జలసంధి ద్వారా రాకపోకలు సాగిస్తున్న నౌకలపై తాము దాడులు చేస్తామని ఎమెన్‌ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధ దళాలు ప్రకటించాయి. తమ సేనలు మూడు హౌతీ పడవలను ముంచివేసి పదిమందిని హతమార్చినట్లు అమెరికా వెల్లడించింది. తొలిసారిగా ప్రత్యక్ష దాడులకు దిగటం ఇదే ప్రధమం. ఎమెన్‌ కాలమానం ప్రకారం ఆదివారం నాడు ఉదయం ఆరున్నర గంటలకు హంగఝౌ అనే కంటెయినర్‌ నౌక మీద చిన్న పడవల నుంచి దాడులు జరగటంతో తమను రక్షించాలని నౌకలో ఉన్నవారు కోరిన వెంటనే యుద్ధ నౌకలు, కొన్ని హెలికాప్టర్లను పంపి హౌతీలపై అమెరికన్లు దాడులు జరిపారు. బహుళజాతి సముద్రయాన రక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబరు 19న అమెరికా ప్రకటించగా సుముఖత చూపిన పందొమ్మిది దేశాలు సంతకాలు చేసినప్పటికీ కేవలం తొమ్మిది మాత్రమే ఈ ప్రయత్నంలో ఉన్నట్లు తమ పేర్లు పేర్కొనాలని చెప్పాయి.ఒక్క బ్రిటన్‌ మాత్రమే తమ యుద్ధ నౌకలను పంపింది. అనేక అరబ్బు దేశాలు పరిణామాలు, పర్యవసానాల గురించి ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్‌కు సంబంధం ఉన్న నౌకల రక్షణకు తామెందుకు మద్దతు ఇవ్వాలని అవి ఆలోచిస్తున్నాయి. హౌతీల దాడుల గురించి అమెరికా రక్షణశాఖ ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. హౌతీలు కేవలం రెండువేల డాలర్ల విలువగల డ్రోన్లతో దాడులు చేస్తుంటే తాము 21 లక్షల డాలర్ల విలువగల క్షిపణులను వాటిని కూల్చేందుకు వినియోగించాల్సి రావటం భారంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. గడచిన రెండు నెలల కాలంలో ఎర్రసముద్రంలో 38 డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా చెప్పుకుంది. ఇరాన్‌ తయారు చేస్తున్న డ్రోన్ల కనిష్ట ధర రెండు వేల డాలర్లు కాగా గరిష్టంగా ఇరవైవేల డాలర్లు ఉంది. ప్రస్తుతం అమెరికా మధ్యధరాసముద్రం, ఏడెన్‌ గల్ఫ్‌కు రెండు విమానవాహక యుద్ద నౌకలు, నాలుగు డెస్ట్రాయర్లు, ఒక క్రూయిజర్‌ను పంపింది.సూయజ్‌ కాలువ ద్వారా హిందూ మహాసముద్రంలో ప్రవేశించే మార్గం ద్వారా ప్రపంచ వాణిజ్యంలో పన్నెండు శాతం రవాణా జరుగుతుంది. ఎర్ర సముద్రంలో తలెత్తిన పరిస్థితి కారణంగా నౌకలు గుడ్‌హౌప్‌ ఆగ్రం వరకు వెళ్లి ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చే పాత మార్గానికి మళ్లుతున్నాయి. ఇది ఖర్చుతో పాటు ప్రయాణ సమయాన్ని కూడా పెంచుతుంది. ఇజ్రాయెల్‌ చెబుతున్నట్లు ఈ ఏడాది అంతా గాజామీద దాడులు జరిపితే ఎర్రసముద్రంలో దాడులు కూడా కొనసాగుతాయి. ఎవరి ఎత్తుగడలు వారికి ఉంటాయి. అమెరికా నేరుగా రంగంలోకి దిగటంతో తమ దాడులను కూడా తీవ్రం చేస్తామని హౌతీలు ప్రకటించారు.


పశ్చిమాసియా, ఉక్రెయిన్‌ సంక్షోభాలలో డ్రోన్ల వినియోగం యుద్ధ తీరుతెన్నులనే మార్చివేసిందంటే అతిశయోక్తి కాదు.భారీ ఖర్చుతో కూడిన అమెరికా, ఇతర నాటో దేశాల ఆధునిక ఆయుధాలు స్వల్ప ఖర్చుతో రూపొందించే నాటు రకం డ్రోన్లను కూల్చేందుకు ఉపయోగించాల్సి రావటం ఎంతో వ్యయంతో కూడుకున్నది. అందువలన ఇప్పుడు డ్రోన్లను కూల్చేందుకు శక్తివంతమైన లేజర్‌ కిరణాలను పంపే విధంగా కొత్త వ్యవస్థలను రూపొందించాల్సిన అగత్యం అమెరికాకు ఏర్పడింది. రష్యా ఇప్పటికే తన డ్రోన్లు పనిచేయకుండా స్థంభింపచేసే ఎలక్ట్రానిక్‌ యుద్ధ వ్యవస్థలను వమ్ము చేసేందుకు మాజిక్‌ రేడియో పేరుతో రక్షణ కల్పిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.దీన్ని బట్టి రానున్న రోజుల్లో సినిమాల్లో మాదిరి కిరణాల యుద్ధాలు జరగనున్నాయని చెప్పవచ్చు.శక్తివంతమైన లేజర్‌ కిరణాలను పంపి డ్రోన్లు, క్షిపణుల మీద దాడి చేసినపుడు వాటినుంచి వెలువడే ఉష్ణం వాటిని మండించి పనికి రాకుండా చేస్తుంది. హమస్‌, హౌతీ సాయుధులు ఉపయోగిస్తున్న మానవ రహిత ఆత్మాహుతి డ్రోన్లతో అమెరికా రక్షణశాఖను ఆతురతలోకి నెట్టారు. ఈ డ్రోన్లన ఇరాన్‌ వీరితో పాటు రష్యాకూ సరఫరా చేస్తున్నది. వాటితో ఉక్రెయిన్‌ మౌలిససదుపాయాల వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న సంగతి తెలిసిందే.కేవలం యాభైవేల డాలర్ల విలువ గల రష్యా డ్రోన్లను కూల్చేందుకు అమెరికా అందచేసిన 30లక్షల డాలర్ల ఖరీదు చేసే పేట్రియాట్‌ క్షిపణులను జెలెనెస్కీ సేనలు ప్రయోగిస్తున్నాయి. వీటిని ప్రయోగించే మొత్తం వ్యవస్థకయ్యే ఖర్చు 110 కోట్ల డాలర్లు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు ఉక్రెయిన్‌ వద్ద నిండుకున్నట్లు, అందుకే పరిమితంగా వాటిని వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. డ్రోన్ల గుంపు అంటే ఎన్ని అన్నది కూడా అర్ధంకాని స్థితి ఉంది.కొన్ని డజన్లు అంతకంటే ఎక్కువ దూసుకువచ్చినపుడు శక్తివంతమైన లేజర్‌ కిరణాలు వాటన్నింటినీ కూల్చివేసే అవకాశం లేదని చెబుతున్నారు. వీటిని ప్రయోగించాలంటే వాటిని ఉంచిన కేంద్రాలలో నిరంతరం విద్యుత్‌ సరఫరా కూడా ఉండాలి.


తాము నిర్మించినవే గనుక ఉక్రెయిన్‌లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థలన్నీ రష్యన్లకు కొట్టినపిండి. ఇరాన్‌ సరఫరా చేసిన దీర్ఘశ్రేణి డ్రోన్లలో ముందుగానే లక్ష్యాలను నిక్షిప్తం చేసి వదులుతున్నందున అక్కడి వ్యవస్థలను ధ్వంసం చేయగలుగుతున్నాయి.గాజాపై దాడులను విరమించకపోతే తాము ఇజ్రాయెల్లో మంటలు రేపుతామని హమస్‌ తీవ్రవాదులు హెచ్చరిస్తున్నారంటే వారి దగ్గర ఇలాంటి డ్రోన్లు ఇప్పటికే చేరి ఉండాలి. ఉక్రెయిన్‌ వద్ద రాడార్లను, లేజర్‌ కిరణాలను తప్పించుకుంటూ సముద్రాల మీద తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు ఉన్న కారణంగానే అజోవ్‌ సముద్రంలోని వంతెన పేల్చివేత, సెవాస్తపూల్‌లోని రష్యా నౌకలపై దాడులు సాధ్యమైందని చెబుతున్నారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌ యుద్దాలలో వీటిని చూసిన తరువాత ప్రపంచ దేశాలలో ఆందోళన తలెత్తుతున్నది, భారీ ఆయుధాలు, జెట్‌ విమానాలను కూల్చటమెట్లా అని ఇప్పటి వరకు ఆలోచిస్తున్న దేశాలు ఇప్పుడు ఇలాంటి చిన్న వాటిని పసిగట్టేవాటిని తయారు చేయటం మీద కేంద్రీకరించాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలస్తీనా ప్రజలు చరిత్ర నిర్మిస్తున్నారు

02 Tuesday Jan 2024

Posted by raomk in Current Affairs, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, Gaza Deaths, Israel genocide, Netanyahu, Recep Tayyip Erdoğan


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


2023 అక్టోబరు 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి తరువాత పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో మారణకాండకు పూనుకుంది. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్ధుల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని కార్పెట్‌ బాంబుదాడులను సాగిస్తోంది. కొరియా, వియత్నాంలపై దురాక్రమణ యుద్ధాలలో ఒక్క అంగుళంకూడా వదలకుండా ఇలాగే అమెరికా మారణహౌమాన్ని సష్టించింది. అదే చరిత్రను పునరావతం చేస్తూ, ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలో ఇళ్ళను భూమట్టంచేస్తూ తన పై దాడి చేసిన హమాస్‌ వారిని పట్టుకోలేక, 22 వేలమందికి పైగా సామాన్య అమాయక ప్రజలను హతమార్చింది. ఇందులో 70 శాతం మంది చిన్న పిల్లలు, మహిళల తోపాటుగా జర్నలిస్టులు , డాక్టర్లు కూడా వున్నారు. తీవ్ర అననుకూల పరిస్ధితులలోవార్తలను సేకరిస్తూ, సంఘర్షణలను, బాంబుదాడులను చిత్రీకరిస్తూ 90 మంది జర్నలిస్టులు తమ ప్రాణాలనర్పించారు. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ గత వారం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం యుద్ధ నేరానికి పాల్పడిందని ప్రకటించింది. ప్రజలకు ఆహారం, నీరు అందకుండా కత్రిమ కరువు ను సష్టించి ప్రజల ప్రాణాలను తీస్తున్నఇజ్రాయల్‌ ప్రధాని నెతన్యాహూని ఈ నాటి హిట్లర్‌ అని టర్కీఅధ్యక్షుడు ఎర్డోగాన్‌ అన్నాడు. అంతేకాకుండా గాజాపై ఈ ఉన్మాద దాడులను ఆపేయాలి అన్నాడు. పాలస్తీనా ప్రజలకు అండగా మేమున్నామంటూ, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ప్రదర్శను ఇస్తాంబుల్‌ పట్టణంలో నిర్వహించారు. మలేసియా ప్రధాని అన్వర్‌ఇబ్రహీమ్‌ తమది ఒక స్వతంత్ర సార్వభౌమ దేశమని, అమెరికా వత్తుడులకు లోంగమన్నారు. తమహక్కులకోసం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు పూర్తి సహకారం అందిస్తామని పెద్ద ప్రజా ప్రదర్శనను నిర్వహించారు. కొలంబియా అధ్యక్షుడు పెట్రో. దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు రామపోసా , అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, తదితర దేశాల్లో ప్రజలు గాజా ప్రజలకుఅండగా వుంటామన్నారు.

మానవ కల్పిత కరువు

గాజాలోని పాలస్తీనియన్లకు అవసరమయిన ఆహారంలో కేవలం 10 శాతం మాత్రమే అందుతున్నదని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఐరాస ఏజెన్సీలు మరియు స్వచ్చంద సహాయ సంస్థల భాగస్వామ్యం అయిన ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ ఫేజ్‌ క్లాసిఫికేషన్‌ ప్రచురించిన ఒక నివేదికలో, గాజాలో ఉన్న కుటుంబాలు సంక్షోభంలో తీవ్రమైన ఆహార అభద్రతతో బాధపడుతున్నట్లు పేర్కొంది. గాజాలోని మొత్తం 23 లక్షల జనాభా అతిపెద్ద మానవ కల్పిత కరువు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని హెచ్చరించింది.తక్షణ కాల్పుల విరమణ కోసం ఐ రా స పిలుపునిచ్చేందుకు వీల్లేదని అమెరికా వీటోని ప్రయోగించి తన సామ్రాజ్యవాద స్వభావాన్ని మరోసారి నిరూపించుకున్నది. గాజాలో మానవతావాద పరిస్థితి మరింత భయంకరంగా మారడంతో ఇజ్రాయెల్‌ సైనిక చర్య సమర్థించలేనిదిగా మారడంతో, బలమైన మద్దతుదారు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌ లలోకూడా ప్రజలు తీవ్ర నిరసనతెలపుతున్నారు. ప్రభుత్వాలు ఇరుకున పడుతున్నాయి.ఎర్ర సముద్రంలోని ”ఇజ్రాయెల్‌- సంబంధిత” నౌకలపై యెమెన్‌ హౌతీ మిలీషియా దాడులను తీవ్రతరం చేయడంతో వివాదం మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఇజ్రాయల్‌-పాలస్తీనాకు పరిమితమయిన యుద్ధం సముద్రానికి మారింది.

పాలస్తీనాకు మద్దతిస్తున్న హౌతీ రెబెల్స్‌ ఎర్రసముద్రంలో ఇజ్రాయల్‌తో సంబంధమున్న దేశాల నౌకలపై డ్రోన్లు, క్షిపణు లతో దాడులను చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రంగంలో ముఖ్యమైన నౌకా రవాణా రంగంలో అత్యంత కీలకమైన మార్గమిది. అమెరికా, ఐరోపా దేశాలు ఆసియా, ఆఫ్రికా దేశాలతో వ్యాపారం చేసి లాభాలను ఆర్జిస్తూన్నాయి. ఆఫ్రికా చుట్టూ తిరిగిరాకుండా ఈజిప్ట్‌లోని సూయజ్‌ కాలువ-ఎర్రసముద్రం మీదుగా ఆంతర్జాతీయ వాణిజ్యంసాగుతోంది. బాబ్‌ ఎల్‌ మండెప్‌ జలసంధి వద్ద మార్గం చాలా సన్నంగా 29 కి.మీ. మాత్రమే వుండటం వలన నౌకలపై దాడులకు అనువుగా వుంది. పక్కనే ఉన్న ఎమెన్‌ స్ధావరంగా చేసుకుని హౌతీ రెబెల్స్‌ వాణిజ్య నౌకలపై దాడుల ద్వారా గాజాలో మారణహౌమాన్ని ఆపాలని వత్తిడి తెస్తున్నారు. ఇజ్రాయల్‌, అమెరికా, యూరప్‌లను హడలెత్తిస్తున్నారు. మొత్తం ఆంతర్జాతీయ సమాజానికి అల్టిమేటం ఇస్తున్నారు. పది దేశాల మిలిటరీ బలగాలను ఎర్రసముద్రం లోకి దించి హౌతీలను ఎదుర్కోవాలని అమెరికా”ఆపరేషన్‌ ప్రాస్పరిటీ గార్డియన్‌” వ్యూహాలను రచిస్తున్నది. యుద్ధ నౌకల పహారాతో నౌకలను దాడులనుండి రక్షించటానికి ఎర్రసముద్ర సంకీర్ణ రక్షణ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బహరైన్‌, షెషల్స్‌, స్పెయిన్‌, నార్వే, నెదర్లాండ్‌, కెనడా, ఇటలీతో 10 దేశాలున్నాయి. ప్రాంతీయ దేశాలలో బలమైన సౌదీ అరేబియా, ఈజిప్టు చేరలేదు. ఒక్క బహ్రైన్‌ చేరింది. కూటమిలో చేరటానికి అన్ని నాటో దేశాలు ఉత్సాహం చూపటంలేదు.

గాజాపై దాడులు ఆపకపోతే ప్రపంచ ఇంటర్నెట్‌పై కూడా దాడి చేస్తామని హౌతీలు హెచ్చరించారు. బాబ్‌ ఎల్‌ మండెప్‌ జలసంధికి దగ్గర సముద్ర కేబుల్‌ నెట్‌ వర్క్‌ వైర్‌లను కత్తిరించేస్తామన్నారు. హౌతీలు వాణిజ్య నౌకల పైననే కాకుండా , అమెరికా యుద్ధనౌకలపైనా, ఇజ్రాయల్‌ రేవులపౖౖె కూడా దాడులను మొదలెట్టారు. వందలకొలదీ నౌకలు సముద్రంలో లంగరు వేసి ఆగిపోయాయి. అతి పెద్ద, యం.స్‌.సీ యునైటెడ్‌ వాణిజ్య నౌక పై డిసెంబర్‌ 26న హౌతీ మిలిటరీ మిస్సైల్‌ తో దాడి చేసినట్లుగా వెల్లడించింది. గెలక్సీ లీడర్‌ అనే ఇజ్రాయల్‌ వ్యాపారి నౌకను హైజాక్‌ చేసి 25 మంది సిబ్బందిని ఎమెన్‌ లో నిర్బంధించారు. ఇజ్రాయల్‌ తో అంటకాగుతున్న ఇండియా నౌకలను కూడా వదలలేదు. ఇండియా వస్తున్నఎం.వి.కెమ్‌.ఫ్లూటో నౌక పైనా, సౌదీనుండి వస్తున్న ఎం.వి.సాయిబాబా నౌకల పైన కూడా డ్రోన్‌ దాడులు జరిగాయి. భారతదేశం 3 యుద్ధ నౌకలను కాపలాగా పంపించింది. అందులో”ఐ యన్‌ యస్‌ మారముగో”గైడెడ్‌ మిస్సైల్‌ విధ్వంసక నౌక కూడా వుంది.

ప్రపంచ ప్రజలు ఉద్యమించాలి

నౌకలు రెడ్‌ సీ ద్వారా రోజుకి 16 నాటికల్‌ మైళ్ళ వేగంతో ప్రయాణించి 25 రోజులలో యూరప్‌ ని చేరగల్గుతున్నాయి. ఎర్రసముద్రాన్ని తప్పించి ఆఫ్రికా చుట్టూ తిరిగి గుడ్‌ హౌప్‌ మార్గం ద్వారా ప్రయాణించటానికి 43 రోజులు పడ్తుంది. వ్యయ ప్రయాసలకోర్చిరూట్‌ మార్చే ప్రయాణానికి 9 రోజులనుండి 30 రోజులు ఆలస్యమవుతుంది. 15 రోజులు ప్రయాణ కాలం పెరిగితే నౌకకు ఇంధనం ఖర్చు అదనంగా 10లక్షల డాలర్ల వుతాయి. వందకు పైగా వాణిజ్య నౌకలు రూటు మార్చుకున్నాయి. ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. భీమా కంపెనీలు ప్రతి కంటైనర్‌ మీద 700 డాలర్ల సర్‌ ఛార్జి విధిస్తున్నాయి. నిత్యవసరవస్తువులన్నిటికీ ఆసియా, ఆఫ్రికా దేశాలపై ఆధారపడిన అమెరికా యూరప్‌ దేశాలు సరుకుల రవాణా ఆలస్యాన్ని భరించలేవు. ఖర్చు పెరుగుతుంది. ఆసియా ధేశాలకు చమురు సహజ వాయువు దిగుమతులు కష్టవుతాయి. ప్రపంచవ్యాపితంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం సంభవించి ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రమాదంగా పరిణమించిన సమస్యను పరిష్కరించాలంటే గాజా పై ఇజ్రాయల్‌ మానవ హననాన్ని ఆపేటట్లుగా ప్రపంచ ప్రజలు ఉద్యమించాలి.

టెక్నాలజీ, ఆయుధాలు సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాయనే విశ్వాసం అన్నిసార్లూ వాస్తవం కాదని పాలస్తీనీయులు, హౌతీలు నిరూపించారు. ప్రపంచంలో అత్యంత ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఏదైనా ముందే కనుక్కోగలమనే ఇంటలిజెన్స్‌ నెట్‌ వర్క్‌ వున్నదనుకుని విర్రవీగే ఇజ్రాయల్‌ ప్రభుత్వం, హమాస్‌ దాడిని ముందే పసిగట్టలేకపోయింది. హఠాత్తుగా జరిగిన అక్టోబర్‌ 7 దాడిని జీర్ణించుకోలేక సాగిస్తున్నవిశంఖలదాడులు హమాస్‌ ని పట్టుకోవటం లో విఫలం చెంది విచక్షణారహితంగా సామాన్యప్రజలను హతమారుస్తున్నారు. 200 డాలర్లతో తయరయ్యే డ్రోన్‌ ల తో , లక్షలకోట్ల డాలర్ల విలువ చేసే నౌకలను హౌతీలు హడలెత్తిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం సంక్షోభం లోకి జారేటట్లున్నది. వరస ఎదురుదెబ్బలు తింటూ, డాలర్‌ పతనం ప్రారంభమయి, ఉక్రెయిన్‌ లోకూడా భంగపడబోతున్న అమెరికాకు ఇజ్రాయల్‌ దుశ్చర్యలను చివరకంటా బలపరచటం సాధ్యంకాదు. ప్రజలే చరిత్రను నిర్మిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెల్లెలు షర్మిల రాజకీయం : వసుదేవుడి స్థితిలో అన్న వైఎస్‌ జగన్మోహనరెడ్డి ?

01 Monday Jan 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, BRS, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, tdp, TDP, Telangana, Ycp

≈ Leave a comment

Tags

#YS Sharmila, ANDHRA PRADESH, Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


కాంగ్రెస్‌లో చేరవద్దు, అన్నతో చేతులు కలిపి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగాలని, అక్కడ ఉన్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయిస్తామని సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెల్లెలు షర్మిలకు రాయబారం పంపినట్లు, ఆమె తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమా కాదా అన్నది పెద్దగా ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. అన్నతో కలిస్తే లేదా లడాయికి దిగితే జరిగే పరిణామాలు, పర్యవసానాలు ఏమిటన్నదే చర్చ. నిజానికి షర్మిల కాంగ్రెస్‌లో చేరటం తెలంగాణా ఎన్నికలకు ముందే ఖరారైంది. ఆమె ఎక్కడ తన నూతన ప్రస్థానాన్ని ప్రారంభిస్తే పార్టీకి ప్రయోజనం అన్న తర్జనభర్జనల తరువాత చివరికి ఆంధ్రప్రదేశ్‌ను కార్యస్థానంగా ఎంచుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. ఇది వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఊహించని పరిణామేమీ కాదు. తెలంగాణాలో తిరిగి బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని వేసుకున్న లెక్కల పరీక్షలో జగన్‌ తప్పారు. అతని ధీమా గురించి ఎరిగిన వైసిపి అభిమానులు తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ విజయం మీద ధీమాతో పెద్ద మొత్తంలో పందాలు కాసి చేతులు కాల్చుకున్నారు.సోదరి కాంగ్రెస్‌ ప్రవేశం గురించి ఆ ఎన్నికలకు ముందు తరువాత అంచనాల్లో మార్పులతో జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు పూనుకున్నారని చెబుతున్నారు. తల్లీ, చెల్లిని ఇంటి నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి గెంటివేశారన్న విమర్శలకు జగన్మోహనరెడ్డి గానీ, వైసిపి నేతల వద్దగానీ సరైన, సమర్ధనీయమైన సమాధానం లేదు. షర్మిలను ఇంటికి ఆహ్వానించటం అంటే తల్లిని కూడా చేరదీయటమే అవుతుందని, తమ మీద ఉన్న విమర్శలకు సమాధానం చెప్పినట్లు అవుతుందని వైసిపి నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.తమ నేత అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారని, చిప్పకూడు తిన్నారని తెలుగుదేశం, జనసేన ఇతర పార్టీలు, మీడియా చేస్తున్న దాడిని తక్కువ చేసేందుకు, మీ నేత కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు, అదే చిప్పకూడు తిన్నారు అని తమ గణాలకు ఒక ఆయుధం ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడిని కేసులతో జైలుకు పంపారన్న విమర్శలు, ఆ ఉదంతాన్ని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. షర్మిలను దగ్గరకు తీయటం జరుగుతుందా ?


రాజకీయాల్లో ఏదీ అనూహ్యం కాదు, ఎవరు ఎప్పుడు దేనికి ఎవరితో చేతులు కలుపుతారో ఊహించలేము.నారా లోకేష్‌కు క్రిస్మస్‌ బహుమతి పంపిన షర్మిల తీరును సాధారణ అంశంగా కొట్టివేయలేము. ఊహాగానాల్లో ఉన్న అంశం ప్రకారం షర్మిల తన అన్న జగన్మోహనరెడ్డితో కలిస్తే జరిగేదేమిటి ? అన్న చేసిన అన్యాయానికి ఎంత లబ్దిపొంది చేతులు కలిపారు అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే అన్నా-చెల్లెళ్లు ఒకటైతే తెరవెనుక షర్మిలకు జరిగే లాభం ఏమిటో వెల్లడికాదు కానీ తెరముందు జగన్‌కు అది పెద్ద నష్టానికి దారి తీస్తుంది. ఓట్ల పరంగా షర్మిల తెచ్చేదేమీ ఉండదు. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందన్న లోకోక్తి తెలిసిందే. అయితే పురాణాల్లో అది ఒక మహత్తర కార్యం కోసం అలా చేశారని సమర్దిస్తారు. కానీ షర్మిల కోసం జగన్‌ తలవంచినా, ఒక అడుగువెనక్కు తగ్గినా సమర్థన జనానికి ఎక్కదు. ఓడిపోయే పరిస్థితి వచ్చింది కనుకనే అలా చేస్తున్నారని అనుకోవటం ఖాయం. అదే జరిగితే వైసిపి శ్రేణుల్లో జగన్‌ మీద ఉన్న విశ్వాసం మరింతగా సన్నగిల్లుతుంది, డొల్లతనం బయటపడుతుంది, ఓటర్ల మీద ప్రతికూల ప్రభావంతో మరింత నష్టం జరుగుతుంది. తమకు ఎవరితో పనిలేదని ఇంతకాలం చేసిన ప్రచారానికి ఎదురుదెబ్బ. అలాగాక రాయబారం లేదా బేరాన్ని షర్మిల తిరస్కరించినట్లు వచ్చిన వార్తలు నిజమే అయితే అది కూడా జగన్‌కు ఎదురుదెబ్బే. వ్రతం చెడ్డా ఫలం దక్కని స్థితి. దాన్ని కూడా జగన్‌ బలహీనతగానే ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చేస్తాయి. ఎలా జరిగినా అన్నను చెల్లెలు ఇరకాటంలోకి నెట్టినట్లే. బహుశా జగన్‌ లేదా సలహాదారులు దీన్ని ఊహించి ఉండరు.


2024 ఎలా ఉంటుందో తెలియదు గానీ 2023 వైఎస్‌ జగన్‌కు నిద్రలేని రాత్రులతో వీడ్కోలు పలికిందని చెప్పవచ్చు. మరోవైపు తెలుగుదేశ-జనసేన కూటమికి ఆశావహ సూచనలతో 2024 స్వాగతం పలికింది.అయితే బిజెపితో తెలుగుదేశం సయోధ్యకు పూనుకున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే ఆ సంతోషం తాత్కాలికమే కావచ్చు.నాలుగు లోక్‌సభ, పన్నెండు అసెంబ్లీ స్థానాల కోసం బిజెపి బేరమాడుతున్నట్లు చెబుతున్నారు. ఒప్పందం కుదురుతుందా లేదా ప్రచారమేనా, ఎన్ని సీట్లు కొనుక్కుంటారు అన్నది పక్కన పెడితే వచ్చే పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. 2004లో బిజెపితో చేతులు కలిపి చేతులు కాల్చుకున్న చంద్రబాబు నాయుడు పదేండ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.2014లో బిజెపితో ముడివేసుకొని ఐదేండ్లూ కాపురం చేయకుండానే ఎవరిదారి వారు చూసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు చేసిన విమర్శలకు ఫలితాల తరువాత మోడీ, ఇడి, ఐటి, సిబిఐలను చూసి తెలుగుదేశం నోటికి తాళం వేసుకుంది. ఇప్పుడు వైసిపిని ఓడించటమనే ఏకైక అజండా తప్ప బిజెపి- తెలుగుదేశం కలవటానికి మరొక కారణం లేదు. అధికార యావతప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని జనం భావిస్తారు. తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని కర్ణాటకలో బిజెపి నేతలు స్వయంగా ప్రకటించారు. రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల తీరుతెన్నులు చూసినపుడు మైనారిటీలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు ఓటుచేసినట్లు స్పష్టమైంది. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించింది వైఎస్‌ జగన్మోహరెడ్డి అయితే వెనుక నుంచి ప్రోత్సహించింది లేదా మీ ఇష్టం అన్నట్లు వ్యవహరించింది బిజెపి అని తెలుగుదేశం శ్రేణులు భావించాయి. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపటాన్ని ఎంతవరకు జీర్ణించుకుంటాయి ?ప్రస్తుతం తెలుగుదేశం కూటమి, వైసిపి మధ్య నువ్వానేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాంటపుడు వచ్చే-పోయే ప్రతి ఓటుకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణా, రాజస్థాన్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికార మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే.


అధికారమే పరమావధిగా ఉన్న రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులూ ఎవరూ ఉండరు.ఇప్పటి వరకు తెరవెనుక వైసిపి మద్దతుదారుగా ఉన్న బిజెపి ఒక్కసారిగా తెరముందు తెలుగుదేశంతో చేతులు కలిపితే షర్మిల చేరిన కాంగ్రెస్‌తో జగన్మోహనరెడ్డి చేతులు కలిపే అవకాశాన్ని కొట్టిపారవేయలేము. ఇప్పుడు అది ఊహాజనితమే కావచ్చు. జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదని, కేసులు బనాయించిందన్న దుగ్దతప్ప కాంగ్రెస్‌తో వైసిపికి ఇతర పంచాయితీ ఏముంది. తన సత్తాఏమిటో జగన్‌ నిరూపించుకున్నందున అతనితో కలిసేందుకు కాంగ్రెస్‌కూ ఇబ్బంది ఉండదు. దానికి పార్టీ పునరుద్దరణ ముఖ్యం తప్ప మరొకటి కాదు. పాత సంవత్సరం తెలుగుదేశానికి ఒక పీడకల అని చెప్పాలి. చంద్రబాబునే అరెస్టు చేయించిన జగన్మోహనరెడ్డి తమ మీద కేంద్రీకరిస్తే ఏమిటన్న ఆందోళన తెలుగుదేశ శ్రేణుల్లో తలెత్తిందన్నది కాదనలేని వాస్తవం. ఒక విధంగా చంద్రబాబు నాయుడి మీద బనాయించిన కేసు, రిమాండ్‌కు పంపటం తెలుగుదేశం కార్యకర్తల్లో ఇంతకంటే ఏం చేస్తారు అన్న తెగింపును కూడా తెచ్చింది. బెయిలు వచ్చిన తరువాత వారిలో చలి వదిలింది..


మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధి చేస్తామనే పేరుతో వైసిపి ఆడిన క్రీడ వికటించింది.వట్టిస్తరి మంచినీళ్లు అన్నట్లుగా అభివృద్దీ లేదు, దానికి రోడ్‌మాపూ లేదు. అమరావతిని గాలికి వదలివేశారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రకరకాల ఆందోళనలను, న్యాయపోరాటాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద, గత ఒప్పందాలను విస్మరించటం మీద కేసులు దాఖలు చేశారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని అన్న ప్రచారం అక్కడ భూ దందాలకు తెరలేపేందుకే అన్న సంగతిని ఆ ప్రాంత వాసులు ఇప్పటికే గుర్తించారు.ముహూర్తాలు ఎన్నో చెప్పారు. చివరికి 2023 నవంబరు 22న జారీచేసిన ఉత్తరువులో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పధకాల సమీక్షల నిమిత్తం ముఖ్యమంత్రి, శాఖాధిపతుల క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానిలో ఎక్కడా కార్యనిర్వాహక రాజధాని అనే పదం లేదు. చివరికి కోర్టులో కేసు దాఖలు కావటంతో అది కూడా ఆగిపోయింది. ఇది జగన్‌కు ఊహించని దెబ్బ. కోర్టు కేసు ఇప్పట్లో తేలే అవకాశాలు లేవు. ఈ లోగా ఎన్నికల షెడ్యూలు ప్రకటన రానుంది. కాళేశ్వరాన్ని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్న బిఆర్‌ఎస్‌ ఆశలను మేడిగడ్డ బారేజ్‌ పిల్లర్ల కుంగుబాటు ఎలా దెబ్బతీసిందో చూశాము. వైసిపికి మూడు రాజధానుల అంశం కూడా అలాంటిదే. ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసేందుకు మాత్రమే పనికి వస్తుంది తప్ప జనాన్ని మెప్పించేది కాదు.


జగన్మోహనరెడ్డికి 2023 మిగిల్చిన మరో ఆశాభంగం స్కిల్‌డెవలప్‌మెంట్‌, ఇతర కేసులు. తెలుగుదేశం పార్టీ నేతలను ప్రత్యేకించి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌లను వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు లేదా కనీసం ఎన్నికల తేదీ వరకు జైలుకు పంపి ప్రచారానికి దూరం చేయటం, అంతకంటే ముఖ్యంగా అగ్రనేతలకే ఏ గతి పట్టిందో చూడండి అని తెలుగుదేశం శ్రేణులను భయపెట్టేందుకు చూశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈకేసుల్లో సిఐడి వ్యవహరించిన తీరు ఊహించినదానికంటే ముందుగానే జనసేనను తెలుగుదేశానికి మరింతదగ్గర కావించింది. చంద్రబాబు నాయుడిపై బనాయించిన కేసు బలం, తమ ప్రభుత్వం గురించి గొప్పగా ఊహించుకున్న వైసిపి శ్రేణులు పైకి చెప్పుకోలేని విధంగా తీవ్ర ఆశాభంగం చెందాయి. నాలుగేండ్లు మౌనంగా ఉండి 2023 చివరిలో చంద్రబాబును ముద్దాయిగా చేర్చటం విఫల రాజకీయ వ్యూహంలో భాగమే. బెయిలు రాదు అనుకున్న చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావటమే కాదు, రాజకీయ ప్రచారం చేసుకొనేందుకు కూడా కోర్టు అనుమతించింది. మంత్రులు, ఎంఎల్‌ఏల పని తీరు మీద అటు జనంలోనూ ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉన్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వచ్చాయి. ఎంఎల్‌ఏలు, ఎంపీలను వదిలించుకొనేందుకు, వీలుగాకపోతే బదిలీలు చేసేందుకు జగన్‌ పూనుకున్నారు. పొమ్మనకుండా పొగపెట్టినట్లు ముందుగానే భారీ మొత్తంలో నిధి సమర్పించుకోవాలని చెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. వైసిపికి 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని ఇంటలిజెన్స్‌ ఇచ్చిన నివేదిక పేర్కొన్నట్లు చెబుతున్నారు. అధికారానికి కావాల్సిన సంఖ్య 88, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వైసిపి మునిగిపోయే నావ మాదిరి ఉంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రక్షించటం కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

క్యా బాత్‌ హై, క్యా సీన్‌ హై : 2004 వెలిగిపోతున్న భారత్‌, 2014 అచ్చేదిన్‌, 2024లో వికసిత భారత్‌ !

31 Sunday Dec 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

BJP, BJP mind game, IMF about India, India Exports, Make In India, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


సంకీర్ణ ప్రభుత్వాలతో మూడు దశాబ్దాల కాలం వృధా అయిందని, పాలన లేకపోవటాన్ని, సంతుష్టీకరణ రాజకీయాలను జనం చూశారని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. ఈ కారణంగానే బిజెపిని సహజ ఎంపికగా జనం పరిగణిస్తున్నారని, 2024లో తాము ఎవరి మీదా ఆధారపడని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇండియా టుడే మాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పదేండ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు అన్ని రంగాలు మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని ఉద్ఘాటించారు. ఇలాంటి ముఖాముఖిలో మోడీ చెప్పింది రాసుకోవటం తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఉండదన్నది తెలిసిందే.మోడీ-హిజ్‌ మాస్టర్‌ వాయిస్‌ మీడియా ఆడుతున్న మైండ్‌ గేమ్‌లో ఇలాంటివి కొత్తకాదు. ఎప్పుడైనా విలేకర్ల సమావేశం పెట్టి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు చెబితే జనానికి నాణానికి మరోవైపు ఏముందో తెలుస్తుంది. 2014 ఎన్నికల సమయంలో సెలవిచ్చిన అచ్చే దిన్‌, నల్లధనం వెలికితీత, గుజరాత్‌ తరహా అభివృద్ధి వంటి అంశాలను ఏమేరకు సాధించారో ఎక్కడా చెప్పటం లేదు. జనాలను మార్కెటింగ్‌ మాయాజాలంలో ముంచి తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు వ్యాపార సంస్థలు విడుదల చేసే వాణిజ్య ప్రకటనల గురించి తెలిసిందే. దేశంలో పలు పార్టీలు ఇప్పుడు ఇస్తున్న నినాదాలు, చేసే ప్రసంగాలు, ప్రదర్శించే హావభావాల వెనుక అలాంటి మార్కెటింగ్‌ నిపుణులు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. గతంలో ప్రజా ఉద్యమాల నుంచి నినాదాలు పుట్టేవి.ఇప్పుడు అనేక పార్టీలకు వాటితో పనిలేదు.


వాజ్‌పాయి ప్రధానిగా ఉండగా బిజెపి 2004 ఎన్నికల్లో ఇచ్చిన నినాదం ” వెలిగిపోతున్న భారత్‌ ”. తరువాత అదే బిజెపి 2014లో ముందుకు తెచ్చిన నినాదం ” అచ్చేదిన్‌ ”, తాజాగా ప్రధాని నరేంద్రమోడీ డిసెంబరు రెండవ వారంలో ”వికసిత భారత్‌ ” ప్రభుత్వ సంకల్పమని ప్రకటించారు. 2024లో ఎన్నికల్లోపు ఎలాంటి అనూహ్య ఉదంతాలు జరగక లేదా జరపకపోతే దాన్నే బిజెపి స్వీకరించి ఎన్నికల గోదాలోకి దిగనుంది. మూడు నినాదాలకు తేడా ఉంది. మొదటిది తమ విఫలమైన పాలనను కప్పిపుచ్చుకొనేందుకు భారత్‌ వెలిగిపోతోంది అన్నారు. కాంగ్రెస్‌ పాలన మీద ధ్వజమెత్తేందుకు తాము అధికారానికి వస్తే అచ్చేదిన్‌(మంచిరోజులు) తెస్తామని ఆశచూపారు. పదేండ్ల తరువాత వాటి జాడ కనిపించటం లేదు, దీంతో మరో పాతికేండ్లలో 2047 నాటికి అభివృద్ది చెందిన వికసిత భారత్‌గా దేశాన్ని మారుస్తామని నమ్మబలుకుతున్నారు. అప్పటికి రాజెవరో రెడ్డెవరో !


వికసిత భారత్‌ 2047 రోడ్‌మాప్‌ ప్రకారం ఆ సంవత్సరానికి మన దేశం అభివృద్ది చెందిన జాబితాలో చేరుతుందని చెబుతున్న దాన్ని జనం నమ్మేదెలా ? అభివృద్ధి లక్షణాలలో అధిక తలసరి రాబడి ఒకటి. దాన్లో ఇప్పుడు మనం ఎక్కడున్నాం ? ప్రపంచబాంకు రూపొందించిన అట్లాస్‌ పద్దతి ప్రకారం 2022 సంవత్సర వివరాల మేరకు 190 దేశాల జాబితాలో జిఎన్‌ఐ తలసరి ఆదాయంలో ముందున్న తొలి 59 దేశాల్లో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకే చోటు లేదు. ఎగువ మధ్య తరగతి ఆదాయ జాబితాలో రెండవదిగా, మొత్తం దేశాలలో 61వ స్థానంలో ఉంది. మన దేశం దిగువ మధ్య తరగతి జాబితాలో 26వ స్థానంలో మొత్తం దేశాల్లో 140వదిగా ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలతో దేశం వెనుకబడిందని మోడీ అన్నారు.జనానికి సమాచారం అందుబాటులో ఉన్నా చూసే ఓపిక, ఆసక్తి కూడా లేని బలహీనతను పాలకులు సొమ్ము చేసుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఉన్న 2004లో భారత జిఎన్‌ఐ 600 డాలర్లు 2013 నాటికి 1,500కు చేరింది.వార్షిక సగటు వృద్ది రేటు 11.48శాతం. కాగా స్థిరమైన, స్పష్టమైన విధానాలు అమలు జరిపినట్లు చెప్పుకున్న నరేంద్రమోడీ పాలనలో 2022 నాటికి అది 2,380 డాలర్లకు, వార్షిక వృద్ది రేటు 5.44శాతమే పెరిగింది. సంతోష సూచికలో 146 దేశాలకు గాను మనదేశం 137వ స్థానంలో ఉంది. కొంత మంది అంగీకరించినా లేకున్నా మన కంటే ఎగువన చైనా 82, నేపాల్‌ 85, బంగ్లాదేశ్‌ 99,పాకిస్థాన్‌ 103, శ్రీలంక 126వ స్థానాల్లో ఉన్నాయి. అయినప్పటికీ భారత్‌ను వికసింప చేస్తామని చెప్పటం నరేంద్రమోడీకే చెల్లింది.


ప్రపంచమంతా మోడీని పొగడుతోందని బిజెపి ప్రచారం చేసుకుంటుంది. నిజమే, మనతో అవసరం ఉన్నవారు ఎన్నిమాటలైనా చెబుతారు. గతంలో గ్రామాల్లో హరికథలు, బుర్రకథలు చెప్పేవారు ప్రతి ఊరులో మీ గ్రామం చుట్టుపక్కల అరవై ఆరుగ్రామాలకు పోతుగడ్డ అన్నట్లుగా పొగిడితే పొంగిపోవటం మామూలే. ఉదాహరణకు ఒక ఉదంతం చూద్దాం. 2014లో ఎన్నికల ఫలితాలు రాగానే నరేంద్రమోడీ ” భారత్‌ గెలిచింది, మంచి రోజులు రానున్నాయి ” అని ట్వీట్‌ చేశారు.2015నవంబరు 13న లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో నాటి బ్రిటీష్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ మాట్లాడుతూ దాన్ని కాపీకొట్టాడు, నరేంద్రమోడీని మునగచెట్టు ఎక్కించాడు.” అతి పెద్ద ప్రజాస్వామిక దేశాన్ని ఒక చారు వాలా పాలించలేడు అని వ్యతిరేకులు చెప్పారు. కానీ వారిది తప్పని మోడీ నిరూపించారు. మంచి రోజులు రానున్నాయని మోడీ సరిగానే చెప్పారు. కానీ మోడీ శక్తి, మోడీ స్వప్నం, మోడీ తృష్ణను చూసిన తరువాత నేను మరొకటి చెబుతున్నాను మంచి రోజులు కచ్చితంగా రానున్నాయి ” అన్నాడు. మనకు మంచి రోజుల సంగతేమో గానీ ఆ పెద్దమనిషి మరుసటి ఏడాదే ఉద్యోగం పొగొట్టుకున్నాడు. నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తి దేశపిత అని ఉబ్బేసిన డోనాల్డ్‌ ట్రంపుకూ పదవి ఊడింది. ఇటీవలే కామెరాన్‌ విదేశాంగ మంత్రిగా కొత్త కొలువులో కుదిరాడు. భారత్‌ అప్పుల పాలు కానుందని సరిగ్గా వికసిత భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) రూపొందించిన నివేదిక హెచ్చరించింది.

ప్రపంచంలో మనదేశ స్థానం గురించి వివిధ సంస్థలు వెల్లడిస్తున్న సూచికలను అధికార బిజెపి, అది నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించదు, తప్పుల తడకలని, వారికి లెక్కలు వేయటం రాదని బుకాయించటం తెలిసిందే.పోనీ వారు నమ్మే వేదగణితం ప్రకారం మనం నిజంగా ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో ఎప్పుడైనా చెప్పారా ? ఇప్పుడు ఐఎంఎఫ్‌ చెప్పిందాన్ని కూడా తాము అంగీకరించటం లేదని, అవన్నీ ఊహాగానాలు తప్ప వాస్తవం కాదని కేంద్ర ప్రభుత్వం గింజుకుంది. నెరవేరని ఐదు లక్షల కోట్ల డాలర్ల జిడిపి కబుర్లు కూడా ఊహాగానమే, వర్తమాన వికసిత భారత్‌ కూడా అదే, వాస్తవం కాదు. వికసిత భారత్‌, తమ విజయం నల్లేరు మీద బండిలా సాగుతుందని చెప్పుకుంటున్న పూర్వరంగంలో ఐఎంఎఫ్‌ విశ్లేషణ గొంతులో పచ్చివెలక్కాయ వంటిదే. ఇంతకీ అదేమి చెప్పింది ? ప్రతికూల దెబ్బలు తగిలితే 2028నాటికి జిడిపి ఎంత ఉంటుందో ప్రభుత్వ అప్పు అంతకు (వందశాతం) చేరుతుందని హెచ్చరించింది. ఒక శతాబ్దిలో ఒకసారి వచ్చే కరోనా -19 మాదిరి విపరీత పరిణామాలు సంభవిస్తే అని ఐఎంఎఫ్‌ చెప్పిందని, అలాంటివేమీ జరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం అన్నది.


తమ నేత అధికారానికి వచ్చిన తరువాత విదేశీ అప్పులేమీ చేయటం లేదని ప్రచారం చేస్తున్న భక్తులను సంతుష్టీకరించలేము. మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం ప్రకారం 1970లో ఎనిమిది బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ అప్పు నూతన ఆర్థిక విధానాలను అమల్లోకి తెచ్చిన 1990నాటికి 83కి చేరింది. తరువాత పదేండ్లకు 101, 2010 నాటికి 290, నరేంద్రమోడీ అధికారానికి వచ్చేనాటికి 457 బి.డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్‌ తాజా విశ్లేషణ ప్రకారం 2024 మార్చి నాటికి 681, మరుసటి ఏడాది మార్చికి 748 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. వార్షిక అప్పు పెరుగుదల శాతాల్లో ఎగుడుదిగుళ్లు ఉండవచ్చు తప్ప మొత్తంగా చూసినపుడు పెరుగుదల ధోరణే ఉంది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ దేశీయ రుణ భారం 58.6లక్షల కోట్ల నుంచి 156.6లక్షల కోట్లకు 174శాతం పెరిగింది.కరోనా కారణంగా ఇంత అప్పు చేశాము, ఉచితంగా వాక్సిన్లు వేశాము అని బిజెపి పెద్దలు చెప్పవచ్చు. ఇన్ని లక్షల కోట్లు దానికే తెచ్చారా ? బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశీయ అప్పు రు.164లక్షల కోట్లు, విదేశీ అప్పు 5లక్షల కోట్లు మొత్తం కలిపితే రు.169లక్షల కోట్లకు చేరనుంది.


ఐఎంఎఫ్‌ ఒక్క రుణం గురించి మాత్రమే చెప్పలేదు. నవంబరు 20నాటికి సంస్థ సిబ్బంది మనదేశ ఆర్థిక అంశాల గురించి రూపొందించిన 142పేజీల నివేదికను డిసెంబరు మూడవ వారంలో బహిర్గతం చేశారు. దానిలో గత పది సంవత్సరాల పాలన డొల్లతనం, వైఫల్యాల గురించి పేర్కొన్నారు. నివేదిక పదజాలంలో ఆ మాటలు లేకపోవచ్చు గానీ అచ్చేదిన్‌ పాలనలో అంకెలు చెబుతున్న అంశాల సారమిదే. వస్తు ఎగుమతులు 2019-20లో 320 బిలియన్‌ డాలర్లు ఉంటే తదుపరి రెండు సంవత్సరాల్లో వరుసగా 296, 429 బి.డాలర్లుగా ఖరారు చేసిన లెక్కలు చెబుతున్నాయి. తరువాత 2022-23లో 456, వర్తమాన సంవత్సరంలో 436, వచ్చే ఏడాది 460 బిలియన్‌ డాలర్ల అంచనాలుగా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. ఎగుమతుల ప్రోత్సాహకం పేరుతో పక్కన పెట్టిన రెండు లక్షల కోట్ల రూపాయల వలన అదనంగా పెరిగిందేముంది ? మేకిన్‌, మేడిన్‌ ఇండియాల జాడ ఎక్కడ ? పిఐబి 2022 జూలై 29న విడుదల చేసిన సమాచారం ప్రకారం 2017-18లో జిడిపిలో వస్తు ఎగుమతుల శాతం 11.4కాగా 2021-22లో 13.3శాతంగా పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల సగటు 11.78శాతం ఉంది. వస్తువులు, సేవల ఎగుమతులు ఈ కాలంలోనే 18.8 శాతం నుంచి 21.4శాతం మధ్య ఉన్నాయి. సగటు 19.5శాతమే ఉంది. అందువలన వాటిలో కూడా పెద్దగా పెరుగుదల లేదు.మాక్రోట్రెండ్స్‌ అనే పోర్టల్‌ నిర్వహిస్తున్న సమాచారం ప్రకారం 2004 నుంచి 2013వరకు ఏటా సగటున 22.1శాతం ఎగుమతులు జరిగాయి. ఈలెక్కన మోడీ ఏలుబడిలో దిగుమతులు పడిపోయినట్లా పెరిగినట్లా ? దేశ ప్రతిష్టను, మార్కెట్లను పెంచేందుకు నరేంద్రమోడీ విదేశాలు తిరిగినట్లు, విశ్వగురువుగా మారినట్లు ఎంతగా చెప్పుకున్నా మోడీ లావూ పొడుగూ చూసి ఎవరూ ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు చేసుకోవటం లేదు. యుపిఏ హయాంలో దేశ దిగుమతులు జిడిపిలో వార్షిక సగటు 26.4శాతం ఉంది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత తొమ్మిది సంవత్సరాలలో సగటున 22.9శాతం చొప్పున ఉన్నాయి.

మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకు ఉన్నాయంటే తాము చేసిన ఆర్థికవృద్ధి కారణంగా జనంలో కొనుగోలు శక్తి పెరిగి దిగుమతులకు గిరాకీ ఏర్పడిందంటారు బిజెపి నేతలు. ఒకవేళ అదే వాస్తవమైతే జిడిపిలో దిగుమతుల శాతం యుపిఏ హయాంలోనే ఎక్కువ ఉంది, అంటే బిజెపి కంటే మెరుగైన పాలన అందించినట్లుగా భావించాలి. విదేశీ వాణిజ్యలోటు యుపిఏ పాలనా కాలంలో సగటున ఏటా జిడిపిలో 2.26శాతం ఉంది. 2004లో 0.3శాతం నుంచి మధ్యలో 4.8శాతానికి పెరిగి 2013నాటికి 1.7శాతానికి తగ్గింది. నరేంద్రమోడీ ఏలుబడిలో ఎనిమిది సంవత్సరాలలో వార్షిక సగటు 1.45శాతం ఉండగా మధ్యలో ఒక ఏడాది 0.9శాతం మిగులు ఉంది. 2014లో 1.3శాతంగా ఉన్న లోటు 2022లో 2.6శాతానికి పెరిగింది. సూచిక పైకి చూస్తున్నది తప్ప కిందికి రావటం లేదు. మొత్తంగా చూసినపుడు వికసిత భారత్‌ కనుచూపులో కనిపించకపోయినా పట్టపగలు అరుంధతి నక్షత్రాన్ని చూపిన మాదిరి చెబుతున్నారు. ఒకసారి చెప్పినదాన్ని మరొకసారి మాట్లాడకుండా కొత్త పాట అందుకుంటున్నారు, అదే బిజెపి, నరేంద్రమోడీ ప్రత్యేకత !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల : బిజెపిని కలుపుకుంటే లాభమా ! నష్టమా !! ఎన్నికల ఎత్తులు, పొత్తులు !!!

29 Friday Dec 2023

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, STATES NEWS, tdp, TDP, Women, Ycp

≈ Leave a comment

Tags

#YS Sharmila, ANDHRA PRADESH, AP Assembly Elections 2024, AP Politics, BJP, CHANDRABABU, CPI, CPI(M), Pawan kalyan, YS jagan


మన్నెం కోటేశ్వరరావు


వైఎస్‌ఆర్‌ తెలంగాణా పార్టీ నేత వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరటం ఖాయమైంది. ఆమె ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోపని చేసేందుకు ఒక బాధ్యత అప్పగిస్తారనే వార్తలు, అది రాష్ట్ర అధ్యక్ష పీఠం లేదా దానికి సమానవమైన మరొకటి అనే ఊహాగానాలు వెలువడ్డాయి. 2024 ఎన్నికల పూర్వరంగంలో ఒక మానసిక తంత్ర క్రీడ(మైండ్‌గేమ్‌) ప్రారంభమైంది. రాష్ట్ర బాగు కోసమంటూ నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు చండీయాగం,హౌమాలు నిర్వహించారు. వర్తమాన, భవిష్యత్‌ పరిణామాల గురించి జనంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణాలో జరిగిన ఎన్నికల ప్రభావం అన్ని పార్టీల మీదా పడింది. బిజెపి తమతో కలవాలని అంటున్న తెలుగుదేశం-జనసేన కూటమి దానితో నిమిత్తం లేకుండానే సీట్ల సర్దుబాటు, సంయుక్తంగా సభల నిర్వహణ తదితర అంశాల గురించి కసరత్తు ప్రారంభించింది.ఎన్నికల సంబంధిత అంశాలపై సలహాలు ఇచ్చే, సర్వేలు నిర్వహించే సంస్థను ఏర్పాటు చేసి ప్రస్తుతం సంబంధం లేదని గతంలో ప్రకటించిన ప్రశాంత కిషోర్‌ తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావటం చర్చనీయాంశమైంది. బెంగలూరు విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ భేటీ ఊహాగానాలకు తెరలేపింది. జనంలో, స్వంత పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు భావిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఏలలో కొందరికి ఉద్వానస పలికేందుకు నియోజకవర్గాల బదిలీలకు వైఎస్‌ జగన్మోహనరెడ్డి పూనుకున్నారు. ఇలాంటి మార్పులు 90కిపైగా నియోజకవర్గాలలో జరుగుతాయని తెలుగుదేశం నేతలు చెబుతున్నప్పటికీ 50 చోట్ల ఉండవచ్చని రాష్ట్ర వైసిపి నేత ఒకరు చెప్పారు. ముఫ్పై మందికి ఉద్వాసన ఉంటుందని, ఇరవై మందిని అటూ ఇటూ మార్చవచ్చన్నారు.


టీ కప్పులో తుపాను !
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది.ఈ సభకు హాజరు కావాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం పలుకగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడే స్వయంగా హైదరాబాదులోని పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి ఆహ్వానించటంతో అంగీకరించినట్లు చెబుతున్నారు.ఈ వార్తలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఊహాగానాలే తప్ప ఎవరూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. చివరికి పవన్‌ కల్యాణ్‌ ఆ సభకు వెళ్లటంతో ఈ అంశం టీకప్పులో తుపానులా ముగిసింది.ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతమైందని తెలుగుదేశం చెబితే, ఘోరంగా విఫలమైందని వైసిపి వర్ణించింది.


ఎన్నికల గోదాలో దిగిన పార్టీలు !
ఇంకా ఎన్నికల ప్రకటన జరగకపోయినా ఒక విధంగా అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన కూటమి ఎన్నికల గోదాలోకి దిగాయి. రెండు ప్రధాన జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ రెండూ నామమాత్రంగా మారటం విశేషం. అవి 2019 అసెంబ్లీ ఎన్నికలలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నాయి. గతంలో వైసిపిలో చేరేందుకు ఆసక్తి చూపిన వాసగిరి వెంకట ( జెడి) లక్మీనారాయణ దానికి భిన్నంగా జై భారత్‌ నేషనల్‌ పార్టీ పేరుతో స్వంత దుకాణం తెరిచారు. అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.వైఎస్‌ జగన్‌ మీద నమోదైన కేసులను విచారించిన అధికారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక వైసిపి తిరస్కరించి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయమైతే, ఆయనతో ఒక పార్టీని పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక కాపు ఓట్లను చీల్చేందుకు చూస్తున్నట్లు మరొక ప్రచారం జరుగుతోంది.దేన్నీ కొట్టివేయలేము.ప్రధాన పార్టీలలో అవకాశం రాని వారు అనేక మంది తమ బలాన్ని పరీక్షించుకొనేందుకు, ప్రచారం కోసం ఇలాంటి కొత్త పార్టీల తరఫున పోటీ చేశారు.


వైఎస్‌ షర్మిల ప్రభావం ఎంత ఉంటుంది !
రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరనున్న వైఎస్‌ షర్మిల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణా ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరితే నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణా నేతల సూచన మేరకు అధిష్టానం కూడా ఆమె చేరికను వాయిదా వేసింది. ఆమె చేరగానే ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌లో అనూహ్య మార్పులు వస్తాయనుకొనేందుకు తగిన వాతావరణం లేదు. షర్మిలను చేర్చుకొని వెంటనే అధికారానికి రాకున్నా పార్టీని పునరుద్దరించవచ్చనే అంచనాలో కేంద్ర నాయకత్వం ఉంది.తెలుగుదేశం – జనసేన-వైసిపి నేతల మాదిరి బూతులకు దూరంగా ఉన్నప్పటికీ జగన్మోహన రెడ్డి పాలనను షర్మిల తెగనాడితే వైసిపి నేతలు ఊరుకుంటారా అన్నది ప్రశ్న. తిడదామంటే అక్క కూతురు, కొడదామంటే కడుపుతో ఉంది అన్న పరిస్థితి వైసిపికి ఎదురుకావచ్చు. రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు కూడా జరగవచ్చు. తెలుగుదేశం-జనసేన కూటమి బిజెపి కోసం పాకులాడకుండా కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిస్తే షర్మిల ప్రచారం ఆ కూటమి మొత్తానికి ఉపయోగపడుతుంది. స్వంత చెల్లెలికే అన్యాయం చేసినట్లు మాట్లాడుతున్న తెలుగుదేశం-జనసేన నేతల ప్రసంగాల తీరు ఒక ఎత్తు బాధితురాలిగా అన్న మీద వైఎస్‌ షర్మిల ధ్వజం మరొక ఎత్తుగా ఉంటుంది.ప్రచారానికి మంచి ఊపువస్తుంది. తీవ్రమైన పోటీ ఉన్నపుడు ప్రతి ఒక్క ఓటునూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.తెలుగుదేశం కూటమి అలాంటి ఆలోచన చేస్తుందా ? తెలుగుదేశం-జనసేనల్లో చేరేందుకు అవకాశం లేని వైసిపి అసంతృప్త నేతలకు కాంగ్రెస్‌ వేదికగా మారవచ్చు. బిజెపితో సంబంధాల గురించి చంద్రబాబు ఇంకా ఒక స్పష్టతకు రాలేదు. ఓట్ల రీత్యా చూసుకుంటే కాంగ్రెస్‌తోనే ప్రయోజనం ఎక్కువ.వాటి సంబంధాల గురించి అలాంటి సూచనలు ప్రస్తుతం లేనప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడేం జరిగేదీ దేన్నీ కాదనలేం. నారా లోకేష్‌కు షర్మిల పంపిన క్రిస్మస్‌ బహుమతి అలాంటిదే. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఎలాంటి ఎత్తుగడ లేకుండా ఇలాంటివి జరగవు. షర్మిల ప్రభావంతో వైసిపి ఓట్లను కాంగ్రెస్‌ చీల్చినా లేదా బిజెపి లేని పార్టీల కూటమిలో చేరితే దానితో పాటు ఇతర పార్టీలకూ అది ప్రయోజనకరం.


పవన్‌ కల్యాణ్‌కు రోడ్‌ మాప్‌ పంపని బిజెపి !
బిజెపి తమకు రోడ్‌ మాప్‌ ఇవ్వాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ బహిరంగంగానే పార్టీ ఆవిర్భావ సభలో కోరిన సంగతి తెలిసిందే.నిజానికి పెద్ద పార్టీగా ఉన్న జనసేన మిత్రపక్షమైన బిజెపికి రోడ్‌ మాప్‌ ఇవ్వాలి. రెండు పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని 2020లోనే నిర్ణయించుకొని ఒప్పందం కూడా చేసుకున్నందున వారిద్దరూ కూర్చుని రోడ్‌ మాప్‌ను తయారు చేసుకోవాలి. అలాంటిదేమీ జరగలేదు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్‌ జైల్లో ఉన్నపుడు తెలుగుదేశం పార్టీతో సీట్లు సర్దుబాటు చేసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మిత్రపక్షంగా ఉన్న బిజెపితో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఇది జరిగింది. జనసేనతో తామింకా భాగస్వామ్య పక్షంగా ఉన్నామని చెబుతూనే ఈ పరిణామం గురించి బిజెపి ఇప్పటి వరకు మౌనంగా ఉంది. జనసేన పార్టీ ఎన్‌డిఏలో చేరింది. తెలంగాణా ఎన్నికల్లో బిజెపితో సీట్లు సర్దుబాటు చేసుకొని ఎనిమిది చోట్ల పోటీ చేసి డిపాజిట్లు పొగొట్టుకుంది. చివరి క్షణంలో తెలుగుదేశం-జనసేన కూటమితో చివరి క్షణంలో చేరవచ్చనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అదే జరిగితే వచ్చే లాభనష్టాలు ఏమిటన్నది తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది. పక్కనే ఉన్న కర్ణాటకలో బిజెపి అధికారాన్ని పోగొట్టుకుంది. తెలంగాణాలో తమదే అధికారం అన్నట్లుగా ప్రచారం చేసుకున్నప్పటికీ అక్కడ దరిదాపుల్లో లేదు. దాని సిఎం అభ్యర్ధులుగా ప్రచారం జరిగిన ఈటెల రాజేందర్‌,బండి సంజరు ఇద్దరూ ఓడిపోయారు.గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బిజెపి బలం 6.98 నుంచి 13.9శాతానికి పెరిగినా తెలంగాణాలో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వచ్చిన 19.65 శాతం ఓట్లతో పోల్చుకుంటే 5.75శాతం తగ్గాయి.


బిజెపిని కలుపుకుంటే లాభమా ! నష్టమా !!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో వివిధ పార్టీల ఓట్ల శాతాలు ఇలా ఉన్నాయి. వైసిపి 49.96 , తెలుగుదేశం 39.17, మూడవ కూటమిగా పోటీసిన పార్టీలలో జనసేన(137) 5.53,సిపిఎం(7)0.32, బిఎస్‌పి(21)0.28, సిపిఐ(7)0.11 శాతాలు తెచ్చుకున్నాయి. నోటాకు 1.28 ,కాంగ్రెస్‌కు 1.17, బిజెపికి 0.84 శాతం వచ్చాయి. బిజెపితో తెలుగుదేశం ఉన్నపుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ముస్లిం మైనారిటీల్లో 66శాతం ఓట్లు పొందగా, 2019 ఎన్నికలకు ముందు బిజెపితో సంబంధాల కారణంగా అది 49శాతానికి తగ్గినట్లు, తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్నపుడు వారి మద్దతు తగ్గిందని లేనపుడు పెరిగిందని ” పీపుల్స్‌ పల్స్‌ ” పరిశోధకుడు ఐవి.మురళీ కృష్ణ శర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని తెలుగుదేశంలో కొందరు భయపడుతున్నారు. వైసిపి నవరత్నాలతో గ్రామీణ ప్రాంతాలలో గతం కంటే కొంత మద్దతు పెంచుకున్నట్లు చెబుతున్నా పట్టణాల్లో మద్దతు తగ్గిందని, మొత్తంగా మధ్యతరగతి ఉద్యోగులు, టీచర్లు, ఇతర స్కీముల సిబ్బంది, కార్మికులలో మద్దతు కోల్పోయినట్లు, ఆ మేరకు తెలుగుదేశం, జనసేన బలపడినట్లు ఒక అంచనా.ఈ పూర్వరంగంలో ప్రతి ఓటునూ అధికార, ప్రతిపక్ష పార్టీలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. కేవలం 4,81,868 లేదా 2.05శాతం ఓట్ల తేడాతో బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణాలో అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.పైకి ఏమి చెప్పినప్పటికీ ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు జాగ్రత్తలు పడుతున్నాయి. తెలుగుదేశం- జనసేన కూటమితో బిజెపి సంబంధాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు స్పందించిన తీరు ఇలా ఉంది.


వామపక్షాల వైఖరేంటి !
” బిజెపితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకున్నపార్టీలతో ఎన్నికల్లో ఎలాంటి సర్దుబాట్లకు మేము సిద్దం కాదు. తెలుగుదేశం-జనసేన కూటమి బిజెపితో సంబంధాల గురించి స్పష్టత ఇచ్చినపుడు, రాజకీయంగా దానికి వ్యతిరేక వైఖరి తీసుకుంటే పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం.లేనట్లయితే ఇండియా కూటమిలోని పార్టీలతో కలసి లేదా అవసరమైతే ఒంటరిగానే పోటీ చేస్తాం. జెడి లక్ష్మీనారాయణ ప్రారంభించిన పార్టీ వివిధ అంశాలపై తీసుకొనే వైఖరి ఏమిటో ఇంకా స్పష్టం కానందున దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేం. మేము ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే ఎవరికి మద్దతు ఇచ్చేదీ ఎన్నికలకు ముందు వెల్లడిస్తాం.”
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఇలా చెప్పారు.” బిజెపితో సంబంధాలు పెట్టుకోవద్దని అనేక ఉద్యమాలలో కలసి పని చేస్తున్న తెలుగుదేశం పార్టీతో చెబుతున్నాం. ఒక వేళ పెట్టుకుంటే ఆ కూటమితో ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎన్‌డిఏ కూటమిలోని జనసేన బిజెపితో సంబంధం లేకుండా తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకుంటే తెలుగుదేశంతో సర్దుబాటుకు అవకాశం ఉంటుంది. జనసేనను లౌకిక పార్టీగానే పరిగణిస్తున్నాం.జెడి లక్ష్మీనారాయణ పార్టీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎలాంటి విధానాలను అనుసరిస్తారో వేచి చూస్తాం ”


ప్రశాంత కిషోర్‌ కలయిక్‌ మైండ్‌ గేమ్‌లో భాగమా !
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలసి వచ్చి చంద్రబాబు నాయుడిని కలుసుకొని చర్చలు జరిపారు. మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లేందుకు వచ్చానని మాత్రమే ముక్తసరిగా ఆయన చెప్పారు. దాన్ని ఎవరూ విశ్వసించటం లేదు. ప్రశాంత కిషోర్‌ గెలిచే పార్టీలకే సలహాలు చెబుతారనే ఒక అభిప్రాయం ఉంది.(బిఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికలకు ముందు ప్రశాంత కిషోర్‌తో చర్చలు జరిపినప్పటికీ ఆ పార్టీ ఓడిపోయింది. కొందరు మంత్రులు, ఎంఎల్‌ఏలను పక్కన పెట్టాలన్న సలహాను కెసిఆర్‌ విస్మరించినందునే అలా జరిగిందని చెప్పేవారు లేకపోలేదు.) ఎన్నికలకు ఇంకా వంద రోజులు కూడా లేని స్థితిలో చంద్రబాబుతో ప్రశాంత కిషోర్‌ భేటీ ఒక మైండ్‌ గేమ్‌లో భాగమని, దాని వలన తెలుగుదేశం కూటమికి కలసి వచ్చేదేమీ లేదని వైసిపి రాష్ట్ర సంయుక్తకార్యదర్శి కారుమూరి వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రశాంత కిషోర్‌ ప్రస్తుతం అలాంటి సలహాలు ఇవ్వటం లేదని, అతనికి ఎలాంటి బృందాలు కూడా లేవని అన్నారు.జెడి లక్ష్మీనారాయణ పార్టీ వెనుక తమ పార్టీ హస్తం వుందనటం వాస్తవం కాదన్నారు. బిజెపికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని నిలిపేందుకు, కాంగ్రెస్‌తో సయోధ్యకు ఒప్పించేందుకు ప్రశాంత కిషోర్‌ వచ్చినట్లు కూడా చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యాపై పనిచేయని పశ్చిమ దేశాల ఆంక్షలు ?

27 Wednesday Dec 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య మంగళవారం 671వ రోజులో ప్రవేశించింది. పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.మేనెలలో బఖ్‌మట్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత మారింకా అనే మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా సోమవారం నాడు ప్రకటించింది. అబ్బే అలాంటిదేమీ లేదు, తమ సైనికులు ఇంకా అక్కడే ఉన్నారని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి చెప్పాడు. తమ మీదకు వచ్చే క్షిపణులు, యుద్ధ విమానాలను కూల్చివేస్తున్నామని, విజయానికి చేరువలో ఉన్నామని జెలెనెస్కీ ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ తమ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అడుగు ముందుకు పడటం లేదు. పశ్చిమదేశాల కారణంగా సంక్షోభం మూడవ సంవత్సరంలో కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ పోరులో ప్రత్యక్షంగా నిమగమైన రష్యా-ఉక్రెయిన్లే కాదు ప్రపంచ దేశాలన్నీ అనేక విధాలుగా గుణపాఠాలు తీసుకుంటున్నాయి. ఇక ఆయుధ వ్యాపారులు, ఉత్పత్తిదారుల సంగతి చెప్పనవసరం లేదు. వాటిని ఎంత ఎక్కువగా ఆమ్ముకోవాలి, మరింతగా మారణకాండను సృష్టించేవిగా వాటిని ఎలా సానబట్టాలా అని చూస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దాడిలో పట్టుకున్న లేదా ధ్వంసం చేసిన రష్యన్‌ టాంకులు, ఆయుధశకలాలను సేకరించి ఉత్పత్తిదారులకు అందచేసి పోటీగా రూపొందించే వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో పరిశీలించండని కోరుతున్నట్లు బ్రిటీష్‌ మిలిటరీ అధికారి వెల్లడించారు.దొరికిన ప్రత్యర్ధుల ఆయుధాలు, వాహనాలను విశ్లేషించటం ప్రతిపోరులోనూ జరుగుతున్నదే. ఈ పోరులో డ్రోన్లతో దాడులు ఎలా చేయవచ్చో ప్రపంచం నేర్చుకుంటున్నది. ఉక్రెయిన్‌ సరిహద్దులకు ఆవల రష్యా తన వ్యూహాత్మక అంశాలను మరోసారి విశ్లేషించుకొనే విధంగా నాటో కూటమి దేశాల విస్తరణ పురికొల్పుతున్నది. కొత్త ఎత్తుగడలకు పుతిన్‌ తెరతీస్తాడు. అది ఒక్క రష్యాకే కాదు, ఐరోపా రక్షణ అంశాలను కూడా సమీక్షించాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది. కానీ అసలైన సమస్య ఎంతకాలం ఉక్రెయిన్‌ తట్టుకొని నిలబడుతుందనే ఆందోళన పశ్చిమ దేశాల్లో రోజురోజుకూ పెరుగుతోంది. రాజీకి సిద్దమేగానీ రష్యా చేతిలోకి వెళ్లిన తమ ప్రాంతాల సంగతేమిటని జెలెనెస్కీ అడుగుతున్నాడు. ఒకటి కావాలంటే మరొకదాన్ని వదులుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా అమెరికా సూచిస్తున్నట్లు వార్తలు. ఆ ప్రాంతాల గురించి మరిచిపోండి, పశ్చిమ దేశాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఇంతకంటే జరిగే నష్టం మాకు ఉండడు, కావాలంటే రాజీ చర్చలకు నేను సిద్దమే అని పుతిన్‌ చెబుతున్నాడు. ఇటు ఉక్రెయిన్‌ ఓడిపోయి, రష్యా మీద ఆంక్షలను ఎత్తివేసే పరిస్థితి వస్తే తమ పరువేంగాను అని నాటో కూటమి దేశాలు అనుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. మరోవైపు పాలస్తీనా ప్రాంతమైన గాజాలో పరువు దక్కించుకొని బయటపడటం ఎలా అన్న సమస్య పశ్చిమదేశాలకు తలెత్తింది.మధ్య ప్రాచ్యపరిస్థితిని చూస్తే ఎప్పుడేమౌతుందో తెలియటం లేదు.


వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఫిన్లండ్‌, తరువాత స్వీడెన్‌ నాటోలో ప్రవేశించనున్నాయి. అంటే మరోవైపు నుంచి రష్యా సరిహద్దులకు నాటో మిలిటరీ, ఆయుధాలు చేరనున్నాయి. ఫిన్లండ్‌-రష్యా మధ్య 1,300 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 2026 నాటికి ఎఫ్‌-35 ఐదవతరం యుద్ధ విమానాలను అది సమకూర్చుకోనుంది. అమెరికాలో ఎన్నికల కారణంగా అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు వచ్చే సాయానికి అంతరాయం కలిగితే ఆ ఖర్చును తట్టుకొనేదెలా అని ఐరోపా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. వలసలను అనుమతించరాదంటూ మితవాద శక్తులు ప్రతి దేశంలోనూ జనాన్ని రెచ్చగొడుతున్నాయి, ఎన్నికల్లో వాటికి మద్దతు పెరుగుతోంది.తాము మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు స్లోవేకియా ప్రకటించింది. అది చిన్నదేశమే అయినప్పటికీ దాని ప్రభావం పెద్ద దేశాలు, జనం మీద పడుతుంది.అమెరికా, ఐరోపా ధనికదేశాలు కోరుకున్న విధంగా రష్యా మీద విధించిన ఆంక్షలు ఫలితాలనివ్వటం లేదు.పోరు ఆగేట్లు లేదు, మడిగట్టుకొని ఎంతకాలం కూర్చుంటాం రష్యాతో వాణిజ్యం చేస్తామని చెబుతున్నాయి. రష్యాను ఒంటరి చేయటంలో పశ్చిమ దేశాలు ఇంకా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి గానీ ఫలించటం లేదు. నల్లసముద్రం, బాల్టిక్‌ సముద్రం, ఆర్కిటిక్‌ సముద్రాల మీద పట్టు నిలుపుకోవాలన్నది రష్యా లక్ష్యం, దెబ్బతీయాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకోసం ఐరోపాలోని నాటో కూటమి దేశాల మీద ఆధారపడింది. ఫిన్లండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకోవటం ద్వారా ఆపని చేయాలని చూస్తున్నది. తాము తలచుకుంటే రష్యా సెంట్‌పీటర్స్‌బర్గ్‌కు చేరే, తిరిగి వచ్చే మార్గాలను మూసివేయగలమని నాటో ప్రధాన కార్యదర్శి జనరల్‌ ఆండ్రెస్‌ ఫాగ్‌ రాస్‌ముసెన్‌ అన్నాడు. నార్వే గడ్డమీద నాలుగు మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసి పట్టుసాధించేందుకు అమెరికా పూనుకుంది.


ఆంక్షలు విధించిన తరువాత 2023లో రష్యా రేవుల ద్వారా సరకు రవాణా 7.8శాతం పెరిగినట్లు సమాచారం తెలుపుతున్నది. బాల్టిక్‌ సముద్రాన్ని నాటో సరస్సుగా పశ్చిమ దేశాలు ప్రకటించినా ఆ ప్రాంత రేవుల ద్వారా కూడా రెండున్నరశాతం సరకు రవాణా పెరిగింది. వీటిలో చైనాకు చమురు కీలక పాత్ర పోషించింది.2019లో తొలి వాణిజ్య రవాణాలో 22లక్షల పీపాల చమురు ఎగుమతి జరగ్గా, 2023లో 104లక్షలకు పెరిగింది. పశ్చిమదేశాల వ్యూహాలను, రష్యాపై విధించిన ఆంక్షలను చూసిన తరువాత సూయజ్‌ కాలువ ద్వారా జరుగుతున్న రవాణాను మరో మార్గానికి మళ్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చైనా భావిస్తోంది. రష్యా కూడా ప్రత్యామ్నాయాల గురించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నది. ఉత్తర ధృవ కేంద్రం ఉన్న ఆర్కిటిక్‌ సముద్ర ప్రాంతరేవుల ద్వారా రవాణాలో మూడో వంతుదూరం, సమయం, ఖర్చు కూడా కలసి వస్తుంది. సూయజ్‌ కాలువ మాదిరి దాటేందుకు సుంకం చెల్లించాల్సిన అవసరంగానీ, వేచి ఉండాల్సిన పరిస్థితిగానీ, సముద్రపు దొంగల బెడదా ఉండదు. అయితే ఊహించని వాతావరణ, మంచు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.పశ్చిమ దేశాలతో తలెత్తే వైరుధ్యాలను గమనంలో ఉంచుకొని రష్యా కూడా వాటిని అధిగమించే చర్యలకు పూనుకుంది.ఆర్కిటిక్‌ సముద్ర మార్గంలో మంచును బద్దలు చేసి ముందుకు పోయే నౌకలను సిద్దం చేస్తున్నది. రానున్న పదమూడు సంవత్సరాల్లో 22 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 50 (ఐస్‌ బ్రేకర్స్‌ )మంచులో నడిచే నౌకలను నిర్మిస్తున్నది.ఇలాంటి వాటిని అమెరికా, చైనా కూడా నిర్మిస్తున్నది. అవసరమైన ఏర్పాట్లు జరిగితే రష్యాలోని సైబీరియా, అలాస్కా మీదుగా ఉత్తర చైనాకు సరకురవాణా జరపవచ్చు.ఆ మార్గంలో ఏ దేశాలూ లేవు.ఇరవై నాలుగు వేల ఆర్కిటిక్‌ సముద్ర తీరం ఉన్న రష్యా ఆ ప్రాంతం నుంచి వెలికి తీస్తున్న చమురు, గాస్‌ను ఐరోపాకు ప్రధానంగా ఎగుమతి చేసేది, ఇప్పుడు ఇతర ప్రాంతాలకు పంపుతున్నది. ఈ ప్రాంత వనరులను రష్యా ఎంతగా వెలికితీస్తే అంతగా ప్రపంచంలో దాని ఆర్థిక పలుకుబడి పెరుగుతుంది.బహుశా దీన్ని ఊహించే అమెరికా కూడా అలాస్కా, గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో ఇప్పుడున్న మిలిటరీ కేంద్రాలను మరింతగా పటిష్టపరుస్తున్నది, నార్వేలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. రష్యాను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా ఫిన్లండ్‌, నార్వేలతో మిలిటరీ సహకారాన్ని పెంచుకుంటున్నది.ఆర్కిటిక్‌ ప్రాంతంలో తన సరిహద్దుల నుంచి రెండువందల నాటికల్‌ మైళ్లకు (370 కిలోమీటర్లు) ఆవల కూడా తమకు హక్కు ఉందని అమెరికా కొత్తగా వివాదాస్పద ప్రకటనగావించింది. సముద్ర చట్టాల ఐరాస ఒప్పందంలో ఇంతవరకు అది భాగస్వామి కాదు. ఆ ప్రాంతంలో ఉన్న విలువైన ఖనిజాలు ఉండటమే దీనికి కారణం.


పశ్చిమ దేశాల అండచూసుకొని ఉక్రెయిన్‌ ఎన్నిబెదిరింపులకు పాల్పడినప్పటికీ ఇటీవలి కాలంలో నల్లసముద్రం, అజోవ్‌ సముద్రాలలో రష్యా ఓడల రవాణా 17.2శాతం పెరిగింది. నాటో రష్యా మీద విధించిన ఆంక్షలను సభ్యదేశమైనప్పటికీ టర్కీ పాలకులు అమలు చేయటం లేదు, అంతేకాదు ఏజియన్‌ సముద్రం నుంచి నల్లసముద్రంలోకి దారి తీసే రెండు జలసంధులలోకి నాటో యుద్ధ నౌకలను అనుమతించటం లేదు.వాటికి రెండువైపులా టర్కీ ఉంది. నాటో తన బలగాలను విస్తరించుకొనేందుకు నల్లసముద్రంలో అమర్చిన మందుపాతరలను వెలికి తీసే పేరుతో రుమేనియా రూపంలో ముందుకు వస్తున్నదని చెబుతున్నారు. నాటోతో నిమిత్తం లేకుండా రుమేనియాతో పాటు టర్కీ, బల్గేరియా ఒక ఒప్పందం చేసుకొని మందుపాతరలను తొలగించేందుకు పూనుకున్నాయి.అమెరికా, ఐరోపా దేశాల ఎత్తుగడలను పసిగట్టిన వ్లదిమిర్‌ పుతిన్‌ నల్లసముద్ర తటస్థ జలాల మీద కాపలా కాసేందుకు హైపర్‌సోనిక్‌ క్షిపణులతో కూడిన జట్‌ విమానాలను మోహరించాలని అక్టోబరు నెలలో ఆదేశించాడు. సూయజ్‌ కాలువ ద్వారా కంటే తక్కువ దూరం ఉండే జలమార్గం కాస్పియన్‌ సముద్రం నుంచి ఉంది.దాన్ని పూర్తిగా వినియోగించుకొనేందుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇరాన్‌, పర్షియన్‌ గల్ఫ్‌,మధ్య ఆసియా దేశాలు, పాకిస్థాన్‌, భారత్‌కు ఈ మార్గం నుంచి చేరటం దగ్గర అవుతుంది. ఈ సముద్ర తీరంలో ఉన్న తన నౌకాశ్రయాల నుంచి రవాణాను పెంచేందుకు రష్యా పూనుకుంది. ఇటీవల చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరాన్‌లో 162కిలోమీటర్ల రైలు మార్గాన్ని రష్యా నిర్మిస్తుంది.పసిఫిక్‌ ప్రాంత దేశాలతో రష్యా సరకు రవాణా 5.7శాతం పెరిగింది.రష్యా దూరప్రాచ్య రేవుల నుంచి ఇది జరిగింది. గతేడాది సెప్టెంబరులో చైనాలోని క్వాంగ్‌ఝౌ నుంచి రష్యా వ్లాడీవోస్టాక్‌ వరకు ఒక నౌకా మార్గాన్ని ప్రారంభించాయి. దీన్ని ఐస్‌ సిల్క్‌ రోడ్‌ అని పిలుస్తున్నారు. యూరేసియా ప్రాంతంతో మరింత సన్నిహితం కావటానికి ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు.వ్లాడీవోస్టాక్‌ నుంచి ఆర్కిటిక్‌ ప్రాంతంలోని వివిధ రేవులకు ఈ మార్గాన్ని చైనా పొడిగించవచ్చని వార్తలు.


ఉక్రెయిన్‌ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో అంతకాలం రష్యా మీద ఆంక్షలు కొనసాగుతాయి. వాటిని తప్పించుకొని గ్రీస్‌ ఓడలు ఇరాన్‌, రష్యా చమురు రవాణా చేయటాన్ని గ్రహించిన అమెరికా యజమానులను బెదిరించింది. దాంతో ఆ తలనొప్పి ఎందుకు అంటూ ఓడలు, టాంకర్లను అమ్ముకొని లాభాలు పొందుతున్నట్లు తేలింది.టాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. గడచిన పన్నెండు నెలల్లో నాలుగు వందల కోట్ల డాలర్ల విలువగల 125 చమురు టాంకర్లు, నౌకలను విక్రయించారు. అయితే వాటిని కొన్నవారి పేర్లు వెల్లడికాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎక్కువ భాగం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన వారు కొనుగోలు చేసినట్లు తేలింది. తరువాత చైనా, టర్కీ, భారత్‌ ఉన్నాయి. తమ మనుగడకే ముప్పు తెచ్చిన నాటో కూటమిని ఎదుర్కొనేందుకు రష్యా కూడా దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యూహాలను రూపొందించుకోవటం అనివార్యం.మిలిటరీ రీత్యా ఆయుధనవీకరణ ఒకటైతే ఐరోపాతో దెబ్బతిన్న వాణిజ్యం, ఎగుమతులకు ప్రత్యామ్నాయ ప్రాంతాలను చూసుకోవటం తప్పనిసరి.ఆర్థికంగా చైనా పెద్ద మద్దతుదారుగా ఉంది. మనదేశం దీర్ఘకాలంగా రష్యాతో ఉన్న మిలిటరీ, ఆర్థిక సంబంధాలను కొనసాగించక తప్పని స్థితి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అడ్దా మీది కూలీ మాదిరి రాష్ట్ర ఆర్థిక స్థితి: భారాలు మోపితే జనానికి ఆగ్రహం ! రేవంత రెడ్డి కత్తిమీద సాము !!

23 Saturday Dec 2023

Posted by raomk in BRS, Congress, Current Affairs, Economics, NATIONAL NEWS, Politics, Telangana

≈ Leave a comment

Tags

A Revanth Reddy, Telangana CM, Telangana CM Revanth Reddy, Telangana White Papers


ఎం కోటేశ్వరరావు


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి ఎన్నికలకు ముందు, ఫలితాల తరువాత ప్రకటించిన మేరకు వివిధ అంశాల మీద శ్వేత పత్రాలను ప్రకటిస్తూ జనాలకు వాస్తవాలను వెల్లడించే ఒక మంచి పని చేస్తున్నారు. మిగిలిన వాటి మీద కూడా వెంటనే ప్రకటిస్తారని ఆశిద్దాం. వీటికి పోటీగా స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని బిఆర్‌ఎస్‌ ప్రకటించింది. మథనం జరగటం మంచిదే. దేన్నయినా మూసిపెడితే పాచిపోతుందన్నది ఒక సామెత. అధికారానికి వచ్చిన కొత్తలో గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు శ్వేత పత్రాను విడుదల చేశాయి. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో వస్తున్న సమాచారం గందరగోళాన్ని సృష్టిస్తున్నది.పైకి ఎన్ని సుభాషితాలను వల్లించినా మీడియా రాజకీయ శిబిరాల వారీ చీలి నాణానికి ఒకవైపు మాత్రమే చూపుతూ తాను మద్దతు ఇచ్చే పక్ష ప్రతికూల సమాచారాన్ని తొక్కిపెడుతున్నది. చాకుతో కూరగాయలతో పాటు మెడను కూడా కోయవచ్చు. శ్వేతపత్రాలు కూడా అలాంటివే. జనానికి వాస్తవాలు చెప్పే మంచితో పాటు ఆ సమాచారాన్ని చూపే పాలకులు వాగ్దాన భంగాలకూ పాల్పడవచ్చు. గత అనుభవాన్ని బట్టి దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. ఎవరి మీదా భ్రమలు పెట్టుకోనవసరం లేదు.


తెలంగాణా ఆర్థిక స్థితి గురించి వెల్లడించిన పత్రంలోని వివరాలు, రాష్ట్ర సర్కారుకు ఎదురయ్యే సవాళ్ల గురించి చూద్దాం. గత పాలకులు చెప్పినదానికి భిన్నంగా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో అప్పులు చేసింది..2014లో రాష్ట్ర విభజన సమయంలో ఉన్న అప్పు రు.72,658 కోట్లు. 2023 డిసెంబరు నాటికి అది రు.6,12,343 కోట్లకు పెరిగింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న (ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడి) రుణం రు.3,89,673 కోట్లు.పదిహేడు నిర్దిష్ట అవసరాల కోసం( స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌) తీసుకున్న అప్పు రు.1,27,208 కోట్లు, ప్రభుత్వ హామీతో 14 సంస్థలు తీసుకున్న మొత్తం రు.95,462 కోట్లు ఉన్నాయి. ఇవిగాక జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి వంటి వివిధ సంస్థలు స్వంతంగా తీసుకున్న రుణాల బకాయిలు రు.59,414 కోట్లు కూడా కలుపు కుంటే మొత్తం బకాయిలు రు.6,71,757 కోట్లని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా లోకానికి చూపించిన కాళేశ్వరం పధకానికి రుణ మంజూరు రు.97,449 కోట్లు కాగా విడుదల చేసింది రు.79,287 కోట్లు, దీని అప్పు ఇంకా రు.74,590 కోట్లు ఉంది. ఈ రుణాలకు గాను చెల్లిస్తున్న అసలు, వడ్డీలు 2015లో మొత్తం రు.7,255 కోట్లు(బడ్జెట్‌ రాబడిలో 14శాతం) ఉంటే 2023లో రు.53,978 కోట్ల(బడ్జెట్‌లో 34శాతం)కు చేరాయి. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర జిఎస్‌డిపిలో 25శాతం వరకు అప్పులు తీసుకోవచ్చు. ప్రస్తుతం 27.8శాతంగా ఉన్నాయి. ఇవిగాక ఇతరంగా తీసుకున్న అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే 36.9శాతానికి చేరాయి. దీంతో రాష్ట్ర రుణ అర్హత పరిమితి తగ్గింది.


బడ్జెట్‌ కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయటం లేదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో తేడా ఎక్కువగా ఉందని శ్వేత పత్రం పేర్కొన్నది.2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో మొత్తంగా 87శాతం ఖర్చు చేశారు. తెలంగాణా ఏర్పడిన తరువాత అది 82.3శాతానికి దిగజారింది. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం 2021-22లో పద్దెనిమిది సాధారణ రాష్ట్రాలలో రాజస్థాన్‌ 116.4శాతంతో ప్రధమ స్థానంలో ఉండగా పదిహేడవదిగా ఉన్న తెలంగాణాలో 79.3శాతమే ఖర్చు చేశారు. చివరిదిగా 74.7శాతంతో పంజాబ్‌ ఉంది. కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఇతరులకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తం రు.40,155 కోట్లు ఉంది. నిధులు లేనపుడు వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌ డ్రాప్టుల రూపంలో ఆర్‌బిఐ నుంచి రుణాలు తీసుకొనే సౌకర్యం ఉంది. అడ్డామీద కూలీకి ఏరోజు పని దొరికితేనే ఆ పూట భుక్తి. రాష్ట్ర స్థితి కూడా అలాంటిదే. ఈ కారణంగానే ప్రతి నెలా ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటవ తేదీనే చెల్లించలేని స్థితి. పిఆర్‌సి, కరువు భత్యం వాయిదాల పద్దతిలో చెల్లిస్తుండగా, సకాలంలో మంజూరు చేయకుండా సంవత్సరాల తరబడి నిలిపివేస్తున్నారు.(ప్రస్తుతం రేవంత రెడ్డి రైతు బంధును కూడా దశలవారీ విడుదల చేస్తున్న కారణం అదే.) .2015-16లో కేవలం రెండు సార్లు మాత్రమే మాత్రమే వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యాన్ని వినియోగించుకోగా తరువాత సంవత్సరాల్లో క్రమంగా పెరిగింది. 2022-23లో ఏడాదిలో 328 రోజులు తీసుకున్నారు. వర్తమాన సంవత్సరంలో నవంబరు 23 నాటికి 214 రోజులు తీసుకున్నారు. రేవంత రెడ్డి సర్కార్‌కు సైతం మరో మార్గం లేదు.2014-15లో గరిష్టంగా 303 రోజులు నగదు నిల్వలు ఉండగా ప్రస్తుతం అవి 30 రోజులకు పడిపోయాయి.


నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నందున ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన జరిగింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడదీసి తెలంగాణాను ఏర్పాటు చేసినపుడు ఆస్తులు-అప్పుల విభజన 58-42 దాషామాతో జరిగింది. దీనికి జనాభా ప్రాతిపదిక. ఉమ్మడి రాష్ట్రంలో 1956-57లో వాస్తవ వ్యయం రు.79 కోట్లు కాగా తెలంగాణా వాటా రు.33 కోట్లు. రాష్ట్రం విడిపోయే నాటికి మొత్తం వ్యయం రు.11,94,945 కోట్లు కాగా తెలంగాణాలో ఖర్చు రు.4,98,053 కోట్లు అంటే 41.68శాతం ఉంది.( రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు వాటిలో పెట్టుబడులను కూడా కలుపు కుంటే తెలంగాణాలో అంతకంటే ఎక్కువ మొత్తమే ఖర్చు జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చిన ప్రైవేటు పరిశ్రమల పెట్టుబడులు వీటిలో లేవు. వీటి గురించి శ్వేత పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు)


ఇక విద్యుత్‌ రంగ పరిస్థితి మీద విడుదల చేసిన పత్రంలో ఉన్న వివరాల ప్రకారం పది సంవత్సరాల నాడు పంపిణీ కంపెనీలు(డిస్కామ్స్‌) రు.12,186 కోట్ల నష్టాలతో ఉండగా ప్రస్తుతం రు.62,461 కోట్లకు చేరాయి. ప్రభుత్వ బకాయిలే రు.43,770 కోట్లు ఉన్నాయి.విద్యుత్‌ క్రమబద్దీకరణ కమిషన్‌ ముందు ప్రతిపాదించి ఆమోదం పొందిన దానికన్నా వాస్తవిక వ్యయం పెరిగితే దాన్ని ట్రూ అప్‌ ఛార్జీలు అంటారు.తాత్కాలిక అవసరాల కోసం కొనుగోలు చేసిన విద్యుత్‌ యూనిట్‌ ధర రు.5.86 నుంచి గరిష్టంగా రు.20వరకు ఉంది.ఒక్క 2022-23లోనే ట్రూఅప్‌ ఛార్జీల మొత్తం రు.12,550 కోట్లు. ఇవిగాక క్రమబద్దీకరణ కమిషన్‌ ఆమోదం పొందిన సమయంలో విద్యుత్‌ తయారీకి వినియోగించే బొగ్గు, గ్యాస్‌ వంటి ఇంథన ధరల్లో పెరుగుదల ఎంత ఉంటే అంత సర్దుబాటు చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయవచ్చు.ఇవి, ట్రూఅప్‌ ఛార్జీలను సబ్సిడీగా ప్రభుత్వం భరించాలి లేదా వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. ఇంత భారం జనాల నుంచి వసూలు చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఎన్నికలను గమనంలో ఉంచుకొని వాటిని తామే చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది తప్ప ఇంతవరకు చెల్లించలేదు. ఇవన్నీ భారాల రూపంలో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ మెడకు చుట్టుకున్నాయి.


బడ్జెట్‌ పత్రాల్లో ఈ వివరాలన్నీ పొందుపరుస్తున్నప్పటికీ వివిధ ఖాతాల్లో చూపుతారు. వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చటం సామాన్యులకు సాధ్యం కాదు గనుక వాటి జోలికి పోరు. అధికార యంత్రాంగం గారడీ చేస్తుంది. శ్వేత పత్రంలో వాటి సారాన్ని ఒక దగ్గరకు చేర్చుతారు గనుక సూటిగా అర్ధం అవుతాయి. ఈ పత్రాలపై చర్చ సందర్భంగా అసెంబ్లిలో, వెలుపలా అధికార పార్టీకి చెందిన వారు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారిందని తమకు ముందు తెలియలేదని, అధికారికంగా సమీక్షల్లో చూసిన తరువాతనే తీవ్రత అర్ధమైందని మాట్లాడుతున్నారు. వీటిని చూస్తే గతం గుర్తుకు వస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నేత వై.ఎస్‌ .జగన్మోహనరెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు జరుపుతామని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకున్నారు. తరువాత అడ్డం తిరిగి దాని గురించి తెలియక మేము వాగ్దానం చేశాము, దాని బదులు కొత్త పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు, పార్టీ నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించి మడమ తిప్పారు.ఐదు సంవత్సరాల్లో మద్యనిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి దాని గురించి ఇప్పుడు అసలు మాట్లాడటమే మానుకున్నారు. ఎందుకంటే దాని మీద వచ్చే రాబడిని వదులుకోవటానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. ఆర్థికంగా పరిస్థితి దిగజారి నవరత్నాలకు కోతపెట్టాల్సి వస్తుందన్నదే దీని వెనుక ఉన్న అసలు కారణం. తెలంగాణా రాష్ట్ర సమితి తాము అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పింది. తీరా అడ్డం తిరిగి కొనటానికి భూమి లేదని తప్పించుకున్నది.ఇలా ఎన్ని ఉదాహరణలనైనా చెప్పుకోవచ్చు.


రేవంత రెడ్డి సర్కార్‌ ముందు తీవ్ర సవాళ్లు ఉన్నాయి. గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులుకేటాయించి విద్యుత్‌ సంస్థలు, ఇతరులకు పెద్ద ఎత్తున బకాయి పెట్టింది. అప్పులు తెచ్చుకొనే అవకాశాలన్నింటినీ వాడుకొని కొత్తగా పుట్టకుండా చేసింది. వడ్డీ, అసలు వాయిదాలకే పరిమితంగా తీసుకొనే అప్పు సరిపోదు. రైతు బంధు పధకంలో పెద్ద రైతులకు మినహాయిస్తామని చెప్పినందున దాని వలన పెద్దగా మిగిలేదేమీ ఉండదు. ఎందుకంటే అర్హులకు గతం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పటంతో పాటు కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలకు నగదు అందిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది.లబ్దిదారుల గుర్తింపు విధి విధానాలను ఇంకా ప్రకటించలేదు.లోక్‌సభ ఎన్నికలలోపు వాటిని విడుదల చేస్తే దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుంది. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్‌ వస్తుందని చెబుతున్నారు గనుక అప్పటి వరకు శ్వేత పత్రాలు, వాటి మీద చర్చ, తక్షణమే నగదుతో పనిలేని పధకాలను ప్రారంభించవచ్చు. విద్యుత్‌ సంస్థలకు బకాయిలు పెట్టినందుకు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ అంత పెద్ద మొత్తాలను వెంటనే ఎలా తీరుస్తుందన్నది ప్రశ్న. ఉద్యోగులు వేతనాలు, పెన్షన్లు పెరిగేవే తప్ప తగ్గవు.వడ్డీల చెల్లింపు తప్పదు.ఈ కారణంగా ప్రకటించిన హామీలను తక్షణమే అమలు కాకుండా సాగదీసే అవకాశం ఉంది. తక్షణమే వాగ్దానాలను అమలు చేస్తామని చెప్పినందున సహజంగానే జనం కూడా అలాగే ఎదురు చూస్తారు.ఫిబ్రవరి లేదా మార్చినెలలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అనుమతి తప్ప పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశం లేదు గనుక ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో వెంటనే జనానికి తెలిసే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d