• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

బిజెపి శ్రీరంగ నీతులు-వంచన : ఆర్టికల్‌ 370 తీర్మానంపై కాశ్మీరు అసెంబ్లీలో అరాచకం !

11 Monday Nov 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

Article 370, BJP, BJP MLAs 'unruly' behavior, J&K Assembly

ఎం కోటేశ్వరరావు

చట్టసభల్లో ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎలా ప్రవర్తించాలో బోధలు చేసే బిజెపి తనదాకా వచ్చే సరికి ఎదుటి వారికే చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నట్లు వ్యవహరిస్తున్నది.తాజాగా జమ్మూకాశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలో, అంతకు ముందు అది ప్రతిపక్షంగా ఉన్నచోట్ల తన సుభాషితాలను తానే తుంగలో తొక్కి వ్యవహరించింది. పార్లమెంటు రద్దు చేసిన ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ లను పునరుద్దరించాలని కోరుతూ తాజాగా 2024 నవంబరు ఆరవ తేదీన కాశ్మీరు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి బిజెపి సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తూ సభలో అరాచకానికి దిగటంతో మార్షల్స్‌ను దించి గెంటివేయించాల్సి వచ్చింది. ఆ తీర్మానం చట్టవిరుద్దం,దేశానికే వ్యతిరేకం, కాశ్మీరుకు వ్యతిరేకంగా కుట్ర అంటూ బిజెపి గుండెలు బాదుకుంటున్నది. దీనిలో ప్రధాని నరేంద్రమోడీ కూడా భాగస్వామి అయ్యారు. కాశ్మీరులో అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పక్కన పెట్టారంటూ రెచ్చగొట్టారు. భారత రాజ్యాంగం తప్ప అంబేద్కర్‌ పేరుతో ఎలాంటి రాజ్యాంగం లేదు. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన కొన్ని వాదనలు, వాటి బండారాన్ని చూద్దాం.


‘‘ ఆర్టికల్‌ 370ని పునరుద్దరించాలని అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించటం చట్టవిరుద్దం ’’ అయితే పార్లమెంటులో దాన్ని రద్దు చేయటం కూడా అంతే కదా ! ఒక రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసే ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించాల్సి ఉంది. ఆ రాజ్యాంగ ప్రక్రియను తుంగలో తొక్కి ఏకపక్షంగా పార్లమెంటులో రద్దు చేసినపుడు బిజెపి పెద్దలకు అంబేద్కర్‌ గుర్తుకు రాలేదు. సదరు ఆర్టికల్‌ రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన 23 పిటీషన్లను విచారించిన సుప్రీం కోర్టు రద్దు చట్టబద్దమే అని చెప్పింది కదా అని ఎవరైనా అనవచ్చు. పార్లమెంటుకు ఉన్న అధికారాల మేరకు అది తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్దమే అని కోర్టు చెప్పింది. పార్లమెంటు మాదిరే కాశ్మీరు అసెంబ్లీకి కూడా అధికారాలు ఉన్నాయా లేవా ? ఉన్నవి గనుకనే ఆ మేరకు మెజారిటీగా ఉన్న సభ్యులు రద్దు చేసిన దాన్ని పునరుద్దరించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పునరుద్దరణ అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు తప్ప అదేమీ అమల్లోకి రాలేదు, రద్దు చేసిన పార్లమెంటే దాన్ని పునరుద్దరించాల్సి ఉంటుంది. అసలు తీర్మానం చేయటమే చట్టవిరుద్ధం అని బిజెపి చెబితే సరిపోతుందా ? ఆ పార్టీ నందంటే నందంటే నంది పందంటే పంది అవుతుందా ? కావాలంటే ఆ తీర్మానాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ కూడా కోర్టును ఆశ్రయించవచ్చు. అప్పుడు కోర్టేమి చెబుతుందో దేశానికి కూడా తెలుస్తుంది. ఆ పని చేయకుండా అసెంబ్లీలో అరాచకానికి పాల్పడటం ఏమిటి ? ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నామా మూకస్వామ్యంలోనా ?


తమకు అధికారమిస్తే ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. అలాగే తమకు అధికారమిస్తే రద్దు చేసిన సదరు ఆర్టికల్‌ పునరుద్ధరణకు కృషి చేస్తామని కాశ్మీరులో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌, సిపిఎం భాగస్వాములుగా ఉన్న కూటమి కూడా ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ మేరకు అధికారానికి వచ్చిన తరువాత దాన్ని తీర్మానరూపంలో నెరవేర్చింది. అధికారం రాకపోయినా రాష్ట్రంలో తమదే పెద్ద పార్టీ అని రాష్ట్ర బిజెపి నేతలు చెట్టుకింద ప్లీడర్లలా వాదిస్తున్నారు. పెద్ద పార్టీ తప్ప దానికి వచ్చింది నాలుగోవంతు ఓట్లే అన్నది గమనించాలి. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి, దాని మిత్రపక్షాలకు సీట్లు ఎక్కువ వచ్చాయి తప్ప ఓట్లు రాలేదు. దాన్ని వ్యతిరేకించే పార్టీలకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అలాంటపుడు ఆర్టికల్‌ 370ని రద్దు చేయకూడదు కదా, ఎందుకు చేసినట్లు ? 2019లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఏ కూటమికి వచ్చిన ఓట్లు 45.3శాతం కాగా, 2024 ఎన్నికల్లో 42.53శాతానికి పడిపోయాయి. ఇదే సమయంలో యుపిఏ లేదా ఇండియా కూటమి ఓట్లు 27.5 నుంచి 40.56శాతానికి పెరిగాయి. అన్నింటికంటే కాశ్మీరులో బిజెపి ఆర్టికల్‌ 370 రద్దును సమర్ధిస్తూ ఓటర్ల ముందుకు వెళితే ఇండియా కూటమి మద్దతు కోరాయి. బిజెపికి వచ్చిన ఓట్లు కేవలం 25.63శాతమే, ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకించే పార్టీలకే మిగిలిన ఓట్లన్నీ వచ్చాయి.బిజెపి చెప్పే అధిక ఓట్లు నేషనల్‌ కాన్ఫరెన్సుకు వచ్చిన ఓట్లతో పోల్చుకొని మాత్రమే. ఇండియా కూటమికి 36శాతం ఓట్లు వచ్చాయి.


ఆర్టికల్‌ 370ని పునరుద్దరించాలన్న తీర్మానం పెద్ద కుట్ర అంటున్నారు. ఆ తీర్మానం బహిరంగం, టీవీ చిత్రీకరణ మధ్య అసెంబ్లీ ఆమోదించింది, కుట్ర ఎలా అవుతుంది ? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ చెప్పినట్లు కాశ్మీరు మీద కుట్ర అయితే అది బహిరంగ కుట్ర. కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరభ్యంతరంగా చర్య తీసుకోవచ్చు, ఒట్టి మాటలెందుకు ? తాను అధికారంలో ఉన్నంత వరకు కాశ్మీరులో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని, బిఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగమే నడుస్తుందని, ఏ శక్తీ ఆర్టికల్‌ 370ని తిరిగి తీసుకురాలేదని మోడీ చెప్పారు. చరిత్రను చూసినపుడు ఈ ఆర్టికల్‌ను అంబేద్కర్‌ వంటి వారు వ్యతిరేకిస్తే సమర్ధించిన వారు అత్యధికులు ఉన్నారు. ఎవరికైనా తమ అభిప్రాయం వెల్లడిరచే హక్కు ఉంది. రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్‌కు గౌరవం దక్కింది. అది రాజ్యాంగసభ ఉమ్మడి నిర్ణయం తప్ప వ్యక్తిగతం కాదు. ఆ మాటకు వస్తే అంబేద్కర్‌ వ్యతిరేకించిన అంశాలు అనేకం ఉన్నాయి. మనుస్మృతిని బహిరంగంగా తగులపెట్టారు. ఆయన జీవిత కాలంలోనే అమల్లోకి వచ్చిన రాజ్యాంగాన్ని, ఆర్టికల్‌ 370ని తగులబెట్టలేదే ! అంబేద్కర్‌ను పదే పదే ఉటంకించే బిజెపి ఆయన మాదిరి మనుస్మృతిని తగులబెట్టటం సంగతి అలా ఉంచి కనీసం దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించగలదా ? అంబేద్కర్‌ బాటలో ఎందుకు నడవటం లేదు ? ఆయన నిరసించిన మనుస్మృతిని రాజ్యాంగంలో చేర్చలేదంటూ నిరసించిన ఆర్‌ఎస్‌ఎస్‌ గుంపులోని వారే బిజెపి నేతలు. నరేంద్రమోడీ నిక్కర్లు వేసుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలకు హాజరైన సంగతి తెలిసిందే. సదరు సంస్థ మోడీ చెప్పిన అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని వ్యతిరేకించింది. జాతీయ పతాకాన్ని కూడా అది గుర్తించలేదు, గౌరవించలేదు. రాజ్యాంగ సభ 1949 నవంబరు 26న రాజ్యాంగాన్ని ఖరారు చేసింది. తరువాత నాలుగు రోజులకు నవంబరు 30న ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో ఏమి రాసిందో తెలుసా ! ‘‘ కానీ మన రాజ్యాంగంలో పురాతన భారత్‌లో అద్వితీయమైన రాజ్యాంగ పరిణామం గురించిన ప్రస్తావన లేదు.మను చట్టాలు స్పార్టా లికర్‌గుస్‌( గ్రీసు లాయర్‌, క్రీస్తు పూర్వం 730లో మరణించాడు) లేదా పర్షియా సోలోన్‌( క్రీస్తు పూర్వం 630560 మధ్య జీవించిన రాజనీతిజ్ఞుడు) కంటే ఎంతో ముందుగానే రాసినవి. మనుస్మృతిలో రాసిన చట్టాలు నేటికీ ప్రపంచ ప్రశంసలు పొందటం ఉద్వేగాన్ని కలిగిస్తున్నవి.కానీ మన రాజ్యాంగ పండితులకు మాత్రం వాటిలో ఏమీ కనిపించలేదు.’’ అని రాసింది. అంతేనా గురు ఎంఎస్‌ గోల్వాల్కర్‌ రాసిన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ అనే గ్రంధం ఆర్‌ఎస్‌ఎస్‌ వారికి ఒక పవిత్ర గ్రంధం. దానిలో రాజ్యాంగం హిందూ వ్యతిరేకమైనదని రాశారు. వివిధ దేశాల నుంచి అంశాలను తీసుకొని రాజ్యాంగాన్ని రూపొందించారు తప్ప దానిలో మనది అని చెప్పుకొనేందుకు ఏమీ లేదు అంటూ అంబేద్కర్‌ను అవమానించేవిధంగా పేర్కొన్నారు.అలాంటి గోల్వాల్కర్‌ వారసులు ఇప్పుడు అంబేద్కర్‌ గురించి పొగడటం నిజంగా వంచన తప్ప మరొకటి కాదు. వారికి చిత్తశుద్ది ఉంటే గోల్వాల్కర్‌ రచనలు తప్పని బహిరంగంగా ప్రకటించాలి.

కాశ్మీరు అసెంబ్లీలో ఆర్టికల్‌ 370 పునరుద్దరణ తీర్మానాన్ని వ్యతిరేకించి సభలో అరాచకాన్ని సృష్టించిన బిజెపి మరోమారు ఆ అంశాన్ని చర్చకు తెచ్చింది. దాన్ని రద్దు చేసిన ఐదు సంవత్సరాల తరువాత ఎన్నికలు జరిపిన కేంద్ర ప్రభుత్వం(బిజెపి) ఊహించినదానికి భిన్నంగా అక్కడ తీర్పు వచ్చింది. దాన్ని మింగాకక్కలేక బిజెపి సభ్యులు ఐదు రోజుల పాటు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. వాట్సాప్‌ యూనివర్సిటీ సమాచారం మీద ఆధారపడి వ్యవహరించకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమర్‌ అబ్దుల్లా బిజెపి సభ్యులను తూర్పారబట్టారు. తమ అజెండాను నిర్ణయించేది రాష్ట్ర పౌరులు తప్ప వాట్సాప్‌ యూనివర్సిటీ, ఫేస్‌బుక్‌ లేదా ఎక్స్‌ కాదన్నారు. భారత సమగ్రత, సార్వభౌమత్వాన్ని సవాలు చేసే విధంగా స్పీకర్‌ సమావేశాలను నిర్వహిస్తే తాము సమాంతరంగా సభ, ప్రభుత్వాన్ని కూడా నిర్వహిస్తామని బిజెపి నేత సునీల్‌ శర్మ చెప్పారు. తమ సభ్యులను మార్షల్స్‌తో గెంటివేయించినందున వెలుపల సమాంతరంగా సమావేశం జరిపినట్లు చెప్పుకున్నారు. దీన్ని తేలికగా తీసుకోరాదన్నారు. అదంతా మీడియాలో ప్రచారం కోసం తప్ప మరొకటి కాదు. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకొనే ఎంపీలు ఆత్మశోధన చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ హితవు చెప్పారు.2024 జనవరిలో తాత్కాలిక బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గత పది సంవత్సరాల్లో ప్రతిపక్షాలు అడ్డుకొనే ప్రవర్తనతో వ్యవహరించాయని,అదొక అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇంకా చాలా సుభాషితాలు చెప్పారు.

అధికారంలో ఉన్నపుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నపుడు మరొక మాట మాట్లాడటంలో బిజెపి ఏ పార్టీకీ తీసిపోలేదు. దివంగత బిజెపి నేత అరుణ్‌ జెట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు 2011 జనవరిలో మాట్లాడుతూ ‘‘ పార్లమెంటు పని చర్చలు నిర్వహించటం.అయితే అనేక సందర్భాలలో ప్రభుత్వం సమస్యలను పట్టించుకోదు అలాంటి సందర్భాలలో పార్లమెంటును అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి అనుకూలంగానే, కనుక పార్లమెంటులో అడ్డుకోవటం అప్రజాస్వామికం కాదు ’’ అని సెలవిచ్చారు. ఇప్పుడు అదే బిజెపి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రధాని సభకు రావాలని, కీలక అంశాలపై నోరు విప్పాలని కూడా పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్‌ నేత ఆనందశర్మ మాట్లాడుతూ ప్రతిపక్షంగా తమ విధి నిర్వహిస్తున్నాం తప్ప పార్లమెంటును అడ్డుకోవటం లేదని, ప్రధాని నరేంద్రమోడీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు పరిశోధనా సంస్థ పిఆర్‌ఎస్‌ విశ్లేషించినదాని ప్రకారం 2009 నుంచి 2014వరకు యుపిఏ పాలనా కాలంలో నిర్దేశిత సమయంలో లోక్‌సభలో 61శాతం, రాజ్యసభలో 66శాతం సమయం ప్రతిపక్షం ఆటంకాలతో వృధా అయింది. ఆ సమయంలో బిజెపి ప్రతిపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. తరువాత మోడీ తొలి ఏలుబడి 201419లో 16శాతం సమయం మాత్రమే ఆటంకాలతో వృధా అయింది.ఎవరు అడ్డగోలుగా వ్యవహరించారో, ఇతరులకు నీతులు ఎలా చెబుతున్నారో వంచనకు పాల్పడుతున్నారో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరిహద్దు ప్రాంతాన్ని చైనా మనదేశానికి అప్పగించిందా ? నరేంద్రమోడీ పరువు తీస్తున్న సోషల్‌ మీడియా భక్తులు !

02 Saturday Nov 2024

Posted by raomk in Asia, BJP, CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

anti china, BJP, fake news, Indo - China trade, Indo-China standoff, Narendra Modi Failures, RSS, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


ఫేక్‌ న్యూస్‌, కృత్రిమ మేథతో నకిలీ ఫొటోలతో సామాజిక మాధ్యమంలో జరిపే ప్రచారంలో మనదేశం ఎంతో ముందుంది. నకిలీ వార్తల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాలలో మనం ప్రధమ స్థానంలో ఉన్నట్లు గతంలో ప్రపంచ ఆర్థికవేదిక నివేదిక హెచ్చరించింది. గడచిన పది సంవత్సరాలలో ఈ ప్రచారదాడికి గురికాని వాట్సాప్‌ ఉన్న ఫోన్‌ బాధితులు లేరంటే అతిశయోక్తి కాదు.అది నరేంద్రమోడీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, మహాత్మాగాంధీ, మతం, విద్వేషం, తప్పుడు సమాచారం, వక్రీకరణ ఇలా పలు రూపాల్లో ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఫలానా కంపెనీ లేదా వ్యక్తి దివాలా తీసిన కారణంగా తమ దగ్గర మిగిలిపోయిన వస్త్రాలను కారుచౌకగా విక్రయించి సొమ్ముచేసుకోవాలనుకుంటున్నారు అంటూ పత్రికల్లో ప్రకటనలు వచ్చేవి, నాసిరకం సరుకు అంటగట్టి దుకాణం ఎత్తివేసేవారు. ఈ వార్త ఏ ప్రధాన పత్రికల్లో, టీవీల్లో రాదు అంటూ తప్పుడు సమాచారాన్ని వాట్సాప్‌లో ఉచితంగా అందించే సామాజికసేవకులను మనం చూస్తున్నాం. అలాంటిదే ఇప్పుడు ఒక ఫొటో, దాని కింద సమాచారం ఒకటి తిరుగుతోంది.

ఎక్కడైతే ఘర్షణ జరిగిందో అక్కడే నాలుగు సంవత్సరాల తరువాత తొలిసారిగా దీపావళి రోజు భారత్‌చైనా సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఇలాంటి దృశ్యం మరోసారి చూడాలని కోరుకుంటున్నవారికి సంతోషం, ఘర్షణ కొనసాగాలని చూసిన వారికి విషాదం కలిగించింది. సంవత్సరాల పాటు సాగిన చర్చల అనంతరం అక్టోబరు మూడవ వారంలో ఉభయ దేశాల ప్రతినిధులు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సడలించి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఒక ఒప్పందానికి వచ్చారు. దాన్ని రష్యాలోని కజాన్‌ నగరంలో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా అక్టోబరు 23న మన ప్రధాని నరేంద్రమోడీచైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ నేతృత్వంలో ఉభయదేశాల ప్రతినిధి బృందాలు సమావేశమై తుదిరూపమిచ్చాయి. ఒక క్రమ పద్దతిలో గాల్వన్‌ లోయ ఉదంతాలకు ముందున్న పరిస్థితిని పునరుద్దరించేందుకు అంగీకరించారు, ఆ మేరకు అక్టోబరు చివరివారంలో సైనిక దళాల ఉపసంహరణ కూడా జరిగింది.ఈ తరుణంలో చైనా వ్యతిరేక మోడీ అనుకూల సోషల్‌ మీడియా మరుగుజ్జులు రంగంలోకి దిగారు. చైనా దేశ మాప్‌ నేపధ్యంలో నరేంద్రమోడీ ఒక సింహాసనం లాంటి కుర్చీలో ఠీవీగా కూర్చొని ఉంటే షి జింపింగ్‌ మోకాళ్ల మీద కూర్చుని భూమిని అప్పగిస్తున్నదానికి చిహ్నంగా చెట్లు ఉన్న ఒక పచ్చని పళ్లెంలాంటి దాన్ని సమర్పించుకుంటున్నట్లు తయారు చేసిన నకిలీ కృత్రిమ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో వదిలారు. దాన్ని చైనా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని, అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం సెన్సార్‌ చేసిందని, షేర్‌ చేస్తున్న వారి మీద కఠిన చర్యలకు దిగుతున్నట్లు సమాచారం వచ్చిందని రాశారు. తప్పుడు సమాచార వ్యాప్తిలో ఇదొక కొత్త టెక్నిక్‌, అబ్బే మనకేం సంబంధం లేదు చైనాలోనే అలాంటిది జరిగినట్లు నమ్మించే అతి తెలివి తప్ప మరొకటి కాదు. తప్పుడు చిత్రాలు, సమాచారాన్ని ప్రచారం చేసే వారు ఎక్కడో ఒక దగ్గర దొరికి పోతారు.

చైనా ఆక్రమించుకున్న 90వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని (22.23ఎకరాలు) తిరిగి మనదేశానికి అందచేసినట్లు రాశారు. నిజానికి రెండు దేశాల మధ్య వివాదం ఉన్న స్థల విస్తీర్ణం 90వేల చదరపు మీటర్లు కాదు కిలోమీటర్లు. ఆ ప్రాంతాన్ని నిజంగా చైనా అప్పగిస్తే అది ప్రపంచ వార్తగా మారి ఉండేది.సరిహద్దుల్లో గతంలో మాదిరి ఎవరి ప్రాంతాల్లో వారు ఉండటం గురించి, గస్తీమీద ఒక ఒప్పందానికి వచ్చారు తప్ప ఒక్క గజం స్థలం కూడా మార్పిడి జరగలేదు, అసలు దాని మీద చర్చలే జరగలేదు. అది మాది అంటే మాది అని మన ప్రభుత్వం, చైనా సర్కార్‌ ఎప్పటి నుంచో పరస్పరం వాదించుకుంటున్నాయి. మన ఆధీనంలో 84వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదని, టిబెట్‌ దక్షిణ ప్రాంతమని చైనా చెబుతుంటే వారి ఆధీనంలో ఉన్న ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతం 90వేల చదరపు కిలోమీటర్లు మనదని అంటున్న అంశం తెలిసిందే. రెండు దేశాల మధ్య వివాదం అదే కద. అసలేమీ జరగనిదాన్ని చైనా సోషల్‌ మీడియాలో ఎలా ప్రచారం చేస్తారు. అక్కడ మన మాదిరి దేన్నిబడితే దాన్ని జనం మీదకు వదలటానికి గూగుల్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌లు లేవు. వాటి మీద నిషేధం ఉంది. అవెక్కడా కనిపించవు. చైనా సర్కార్‌ అధికారికంగా నిర్వహించే బైడు వంటి సామాజిక మాధ్యమవేదికలు ఉన్నాయి.నిజంగా ఎవరైనా అలాంటి పిచ్చి పోస్టు వాటిలో పెడితే వెంటనే తొలగించే సాంకేతిక నైపుణ్యం చైనా దగ్గర ఉంది. అందువలన అలాంటి వాటిని వైరల్‌ చేసే అవకాశం అక్కడ లేదు. అలాంటి చిత్రాల గురించి నిజానిజాలు తేల్చేందుకు చూసిన వారికి మన సోషల్‌ మీడియాలో తిరుగుతున్న ఒక కృత్రిమ చిత్రంగా తేలింది తప్ప చైనాలో తయారైందిగా కనిపించలేదు. ఒకవేళ ఎవరికైనా అలాంటి సమాచారం ఉంటే ఆధారాలతో వెల్లడిరచవచ్చు. ఆ చిత్రం తీరుతెన్నులను చూస్తే నరేంద్రమోడీ గొప్పతనాన్ని కృత్రిమంగా పెంచేందుకు చూస్తున్న కిరాయిబాపతు సృష్టి తప్ప మరొకటి కాదు అన్నది స్పష్టం. వారికి అదొక తుత్తి(తృప్తి),చౌకబారుతనం తప్ప మరొకటి కాదు. నిజంగా అలాంటి వాటిని పదే పదే ప్రచారం చేస్తే నిజం చెప్పినా ఒకనాటికి మోడీ భక్తులు కూడా నమ్మని స్థితి ఏర్పడుతుంది.పరాయి దేశాల్లో అపహాస్యం పాలౌతారు.


2020లో గాల్వన్‌లోయ సరిహద్దులో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణ ఆసియా రాజకీయాల్లో భూకంపం అని కొందరు వర్ణించారు. ముఖ్యంగా అమెరికా మీడియా మాటలను చూస్తే భారత్‌చైనాల మధ్య మరో యుద్ధమే తరువాయి అన్నట్లుగా భ్రమపడిన వారున్నారు. ఇంకే ముంది మన చేతికి మట్టి అంటకుండా చైనాను నిరోధించే బాధ్యత నరేంద్రమోడీ నెత్తిన పెట్టవచ్చనుకున్నారు అమెరికన్లు. సరిహద్దులో లక్షల సైన్యం కొనసాగితే మరింతగా సొమ్ము చేసుకోవచ్చని అమెరికా, ఇతర ఐరోపా దేశాల ఆయుధ కంపెనీలు మన గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.మన మార్కెట్లో తమ సరకులను కుమ్మరించి లాభాలు పిండుకోవచ్చని కలలు కన్నాయి. ఇప్పుడవి కల్లలయ్యాయి. చైనా నుంచి గత నాలుగేండ్లుగా రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకోవటమే కాదు, నిషేధించిన పెట్టుబడులను కూడా పొందేందుకు మోడీ సర్కార్‌ నిర్ణయించింది. దీంతో ఇప్పుడు కుదిరిన సయోధ్య చైనా వ్యతిరేకులకు పిడుగుపాటుగా ఉంది. తమ ఎన్నికలకు పక్షం రోజుల ముందు కుదిరిన ఈ అవగాహనను అమెరికన్లు ఊహించినప్పటికీ పరిస్థితి తమ చేతుల్లో లేదన్న ఉక్రోషంతో ఉన్నారు. మనదేశంలోని కొన్ని శక్తులకు మింగుడు పడకపోయినా కార్పొరేట్ల వత్తిడి కారణంగా లోలోపల ఉడుక్కుంటున్నారు.

చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌పై పోస్టు పెట్టినందుకు, దాన్ని వైరల్‌చేసిన వారి మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందంటూ సంఘపరివార్‌ మరుగుజ్జులు గుండెలు బాదుకుంటున్నారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి అమిత్‌ షా ఉపన్యాసమంటూ ఫేక్‌ వీడియోలు తయారు చేసిన వారి మీద పెట్టిన కేసులు, అరెస్టుల సంగతి వారికి తెలిసినా చైనాలో సామాజిక మాధ్యమాలలో స్వేచ్చ లేదనట్లుగా ఫోజుపెడుతున్నారు. మరి అపర ప్రజాస్వామికవాది అమిత్‌ షా తరఫున ఎందుకు కేసులు పెట్టినట్లు ? నిజానికి చైనాలో సదరు పోస్టు మీద కేసులు పెట్టారో అసలు అది అక్కడ వైరల్‌ అయిందో లేదో కూడా తెలియదు. అయిందని చెప్పేవారి దగ్గర ఎలాంటి నిర్ధారిత సమాచారమూ లేదు. ఒక్క అధ్యక్షుడి మీద వక్రీకరణ వార్తల మీదే కాదు, గంగానదిలో మునిగితే కరోనా రాదు, దీపాలు వెలిగిస్తే, చప్పట్లు కొడితే పారిపోతుంది అని బాధ్యతా రహితంగా ప్రచారం చేసి జనాలను తప్పుదారి పట్టించేవారి మీద కూడా అక్కడ కేసులు పెడతారు, స్వేచ్చగా వదలి జనాల బుర్రలను ఖరాబు కానివ్వరు. ఐదు సంవత్సరాల క్రితం షీ జింపింగ్‌ మహాబలిపురాన్ని సందర్శించినపుడు అక్కడ నరేంద్రమోడీ షీ ముందు వంగి నమస్కారం చేసినట్లు ఆ రోజుల్లో ఒక ఫొటో వైరల్‌ అయింది. తీరా అది ఫేక్‌ అని తేలింది. ఎప్పుడో 2014లో కర్ణాటకలోని తుముకూర్‌ మహిళా మేయర్‌ స్వాగతం పలికినపుడు నరేంద్రమోడీ వంగి అభివాదం చేసినప్పటి చిత్రాన్ని షీ జింపింగ్‌కు కలిపి వైరల్‌ చేశారు. ఇలా మోడీకి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్ద ఎత్తున అనేక ఫేక్‌ చిత్రాలు, వార్తలను ప్రచారంలో పెట్టారు. ఇటీవల ఐరాస సమావేశాలకు మోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు చైనాను భద్రతా మండలి శాశ్వత సభ్యరాజ్యంగా తొలగించారని, భారత్‌కు చోటు కల్పించారంటూ మోడీ ప్రతిష్టను పెంచేందుకు ఒక తప్పుడు వీడియో, సమాచారాన్ని వైరల్‌ చేశారు. అది ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ఉంది. 1970దశకం వరకు కమ్యూనిస్టు చైనాను ఐరాసలో అసలు గుర్తించలేదు, దానికి అడ్డుపడిరది అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ నెహ్రూ కమ్యూనిస్టు చైనాకు భద్రతా మండలిలో సభ్యత్వానికి మద్దతుపలికారంటూ కాషాయదళాలు పచ్చి అబద్ద ప్రచారం చేస్తుంటాయి. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఐరాస స్థాపక దేశంగా 1945 నుంచీ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పేరుతో శాశ్వత సభ్యత్వ హోదా ఉంది. ఆ తరువాత నాలుగేండ్లకు 1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారానికి వచ్చారు. ఆ తరువాత కూడా 1971వరకు తైవాన్‌లో ఉన్న తిరుగుబాటు ప్రభుత్వాన్నే అసలైన చైనా పాలకులుగా గుర్తించి అదే హోదాను కొనసాగించారు.1971లో తైవాన్‌ పాలకులకు ఉన్న గుర్తింపును రద్దు చేసి కమ్యూనిస్టుల నాయకత్వంలోని పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా పాలకులను గుర్తించారు. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగం అని ఐరాస గుర్తించింది. నెహ్రూ 1964లో మరణించారని తెలిసిందే. 1971 నుంచి ఇప్పటి వరకు మనకు అత్యంత ఆప్తులు, భాగస్వాములు అంటున్న అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సు గానీ మనకు శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాలని ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఐరాసలో తీర్మానం పెట్టలేదు. ఇదంతా తెలిసినప్పటికీ మోడీ శాశ్వత సభ్యత్వాన్ని సాధించారంటూ తప్పుడు వీడియోలు తయారు చేసి జనంలోకి వదిలారు. ఫేక్‌ న్యూస్‌ చూసేవారికి బుర్ర ఉండదని వారికి ఎంత నమ్మకమో ! షీ జింపింగ్‌మోడీ గురించి పెటిన చిత్రం కూడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా పెట్టుబడులకు గేట్లు తెరిచిన మోడీ సర్కార్‌ : సంఘపరివార్‌కు ఎదురు దెబ్బ ! కార్పొరేట్‌ సత్తానా మజాకా !!

26 Saturday Oct 2024

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Anti communist, BJP, BRICS, Indo - China trade, Indo-China standoff, Narendra Modi, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు.


నాలుగు సంవత్సరాల క్రితం మనదేశంలో చైనా వ్యతిరేక ఉన్మాదం తారాస్థాయిలో ఉంది.చైనా వస్తువులను బహిష్కరించి దాన్ని మనకాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది వీరంగం వేశారు. ఇప్పుడు అలాంటి దృశ్యాలు, రాతలు ఎక్కడా కనిపించవు. అక్టోబరు చివరి వారంలో కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లలో వచ్చిన వార్తల శీర్షికలు కొంతమందికి ఆనందం, ఆసక్తి కలిగిస్తే మరి కొందరికి ఆందోళన కలిగించవచ్చు. 2020 సంవత్సరంలో జరిగిన సరిహద్దు ఉదంతాల అనంతర అనుమానాల నుంచి బయటపడి లడక్‌ సరిహద్దు ప్రాంతంలో సాధారణ పరిస్థితులను పునరుద్దరించేందుకు భారతచైనా ప్రభుత్వాలు నిర్ణయించాయి, ఆ మేరకు చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీచైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ ఈమేరకు కరచాలనం చేసి ఆమోద ముద్రవేశారు. ఇది రెండు దేశాలకూ శుభసూచికం. వేల కోట్ల రూపాయలను సరిహద్దుల్లో వృధా చేయనవసరం లేదు. ‘‘ భారతచైనాల సామరస్యత కొరకు భారత సిఇఓలు ఎందుకు వత్తిడి చేశారు ’’ ( 2024 అక్టోబరు 24 ) బిజినెస్‌ చెఫ్‌ డాట్‌కాం విశ్లేషణ శీర్షిక. పదాల తేడాతో అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ఇచ్చిన ఇదే వార్తకు మరికొంత విశ్లేషణను జోడిరచి జాతీయ పత్రికలు, టీవీ ఛానల్స్‌ కొన్నింటిలో దర్శనమిచ్చింది. ఇదే సమయంలో ‘‘ పావురాల మధ్య గండుపిల్లి ’’ అంటూ చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు మరోశీర్షికతో వచ్చిన వార్తా విశ్లేషణలో చైనా పెట్టుబడుల గురించి భారత మాజీ రాయబారి హెచ్చరిక గురించి రాశారు. ఈ అంశంలో ఏం జరుగుతోంది ? ఎవరు దిగి వచ్చారు, ఎవరు వెనక్కు తగ్గారన్నది పాఠకులకే వదలి వేద్దాం.

గాల్వన్‌లోయలో పెద్ద ఉదంతం జరిగిన తరువాత మన దేశం చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించి రాకుండా అడ్డుకుంది. ఇప్పుడు మన కార్పొరేట్‌ శక్తులు ఎందుకు చైనాతో సంబంధాల పునరుద్దరణకు నరేంద్రమోడీ మీద వత్తిడి తెస్తున్నారు ? చైనా సోషలిస్టు వ్యవస్థ అంటే అభిమానమా, కమ్యూనిజం అంటే ప్రేమా ?కానే కాదు, పక్కా వాణిజ్య ప్రయోజనాలే ! పెట్టుబడుల మీద ఆంక్షల సడలింపు గురించి కొద్ది నెలల క్రితమే మన అధికారం యంత్రాంగం లీకులు వదిలింది. దాని మీద ప్రతికూల ప్రచారం, వ్యతిరేకత తలెత్తకుండా రాజకీయ నాయకత్వం తగిన జాగ్రత్తలు తీసుకున్నది. చైనా పెట్టుబడులను అనుమతించేందుకు కేంద్రం నిర్ణయించినట్లు ఈ ఏడాది వెల్లడిరచిన ఆర్థిక సర్వేలో పేర్కొన్న అంశాలే సూచన ప్రాయంగా వెల్లడిరచాయి. అయితే సరిహద్దు వివాదం చర్చలు కొనసాగుతున్న తరుణంలో తలుపులు బార్లా తెరిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో చైనా వ్యతిరేకులను చల్లబరిచేందుకు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కలిగించేందుకు చూస్తున్నారు. సరిహద్దులో పూర్వపు స్థితిని పునరుద్దరించేందుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. వచ్చిన వార్తల ప్రకారం ఇరుదేశాల పరువుకు భంగం కలగకుండా గతంలో ఎవరు ఎక్కడ ఉంటే అక్కడకు వెనక్కు తగ్గాలన్న ఒప్పందం కుదిరింది. ఆ మేరకు తట్టాబుట్టా సర్దుకోవటం ప్రారంభమైంది. చైనాతో సాధారణ స్థితికి మన సంబంధాలు రాకూడదని కోరుకుంటున్న అమెరికాకు ఇది మింగుడుపడటం లేదు.దానికి తక్షణ స్పందన అన్నట్లుగా ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో మన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న కెనడాకు మద్దతు పలుకుతున్న వైనాన్ని చెప్పవచ్చు.అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదీ సూటిగా ఉండదు.

ఇటీవలి ఆర్థిక సర్వేలో చైనా పెట్టుబడులకు పచ్చజెండా ఊపారు. దీని మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చీలికలను ఉపయోగించుకొనేందుకు వెంటనే మనదేశంలో చైనా రాయబారి పావులు కదిపారని చైనాలో భారత మాజీ రాయబారి గౌతమ్‌ బంబావాలే వ్యాఖ్యానించారు. చైనా ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ భారత ప్రధాన ఆర్థిక సలహాదారు చేసిన వ్యాఖ్యలతో పావురాల మధ్య గండుపిల్లిని వదలినట్లయింది. ఈ విషయంలో సమన్వయం లేదని, అలాంటి ప్రకటన చేసే ముందుకు జాతీయ భద్రతా సలహాదారులను కూడా పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని, ఎకనమిక్‌ సర్వే సమయంలో వ్యాఖ్యలు చేయటం ఆందోళనకరంగా ఉందని గౌతమ్‌ వ్యాఖ్యానించారు. టెలికమ్యూనికేషన్స్‌ ఇతర రంగాలలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని గౌతమ్‌ సలహాఇచ్చారు. చైనా పెట్టుబడులపై పునరాలోచనలేదని వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ గతంలోనే చెప్పినా పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి. చైనాతో సఖ్యతకు కేంద్రం సుముఖంగా లేకపోతే సరిహద్దు సమస్యపై అంగీకారం కుదిరివుండేదే కాదు.రానున్న రోజుల్లో వేగం పుంజుకొనే అవకాశం ఉంది. చైనా పెట్టుబడులపై ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పును అర్ధం చేసుకోవాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించే స్వదేశీ జాగరణ్‌ మంచ్‌(ఎస్‌జెఎం) గతంలో ఏం చెప్పిందో 2020జూలై ఒకటవ తేదీ ఎఎన్‌ఐ వార్త సారాంశాన్ని చూద్దాం.ఆ సంస్థ జాతీయ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ చెప్పినదాని ప్రకారం ఇలా ఉంది.‘‘పేటిఎం వంటి భారతీయ స్టార్టప్‌ కంపెనీల నుంచి చైనా పెట్టుబడులకు ఉద్వాసన పలకాలి. మన విదేశీమారకద్రవ్య నిల్వలు ఐదువందల బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఆరు బిలియన్‌ డాలర్ల చైనా పెట్టుబడులు లెక్కలోనివి కాదు. మన సంస్థలు పైచేయి సాధించటానికి ఇదొక సువర్ణ అవకాశం.చైనా పెట్టుబడులను కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకించటం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. చైనా ఒక సూపర్‌పవర్‌ అనే వాతావరణాన్ని సృష్టిస్తున్నపుడు దాన్ని మనం దెబ్బతీయాల్సిన అవసరం లేదా ? ముందుగా మన పరిశ్రమలను రక్షించుకోవాలి.’’ సరిగ్గా ఈ మాటలు చెప్పిన నాలుగు సంవత్సరాల తరువాత అదే చైనా నుంచి పెట్టుబడులు తెచ్చుకోవాలని మన ఎకనమిక్‌ సర్వేలో రాసుకున్నాం, తగిన జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడులను తీసుకోవచ్చని అదే పాలకపార్టీ పెద్దలు సెలవిస్తున్నారు.మేము వాణిజ్యం కావాలనుకుంటున్నాం, పెట్టుబడులను కోరుకుంటున్నాం, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుంటాం అని తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.అమెరికన్లను ఉద్దేశించిన ఒక సమావేశంలో ఈ మాటలు చెప్పారు. జాగ్రత్తలు తీసుకోవద్దని ఎవరన్నారు? ఇది కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతలను నిరంతరం రెచ్చగొట్టే సంఘపరివార్‌, దాని భావజాలానికి లోనైన వారికి చెప్పుకోరానిచోట తగిలినదెబ్బ.

2020 సరిహద్దు ఉదంతం తరువాత చైనా పెట్టుబడులపై ఆంక్షలు ఎదురుతన్నుతున్నాయని మన కార్పొరేట్‌ పెద్దలు చెప్పినట్లు, వాణిజ్య ఆంక్షలను సడలించేందుకు ప్రభుత్వం చూస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. నిజానికి చైనా నుంచి దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు, ఈ విషయంలో మోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. నిబంధనలు సడలించటం అంటే పెట్టుబడుల స్వీకరణకు ద్వారాలు తెరవటమే. గడచిన ఆర్థిక సంవత్సరంలో చైనాతో లావాదేవీలు 118.4బిలియన్‌ డాలర్లు కాగా అక్కడి నుంచి చేసుకున్న దిగుమతుల మొత్తం 101.7బిలియన్‌ డాలర్లు ఉంది. చైనా పెట్టుబడులపై ఆంక్షల కారణంగా చిప్‌ తయారీ వంటి ఉన్నత సాంకేతిక రంగాలతో పాటు విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల తయారీలో కూడా వెనుకబడుతున్నట్లు భావిస్తున్న కార్పొరేట్స్‌ చైనా పెట్టుబడులకు అనుమతులు ఇవ్వాలని మోడీ సర్కార్‌ మీద తీవ్ర వత్తిడి తెస్తున్నాయి. భారతీయులు యజమానులుగా ఉన్న కంపెనీలలో తొలిదశలో పదిశాతం మేరకు చైనా పెట్టుబడులను అనుమతించాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గత పదిహేను సంవత్సరాలలో మనదేశ దిగుమతులలో చైనావాటా 21 నుంచి 30శాతానికి పెరిగింది.ప్రస్తుతం మొత్తం దుస్తులు, వస్త్రాల దిగుమతుల్లో చైనా నుంచి 41.5, ఎలక్ట్రానిక్‌, టెలికాం ఉత్పత్తులు 38.7,యంత్రాలు 38.5 శాతం చొప్పున ఉన్నాయి.రసాయనాలు 28.7,ప్లాస్టిక్స్‌ 25, ఆటోమొబైల్‌ 23, ఐరన్‌,స్టీలు, బేస్‌ మెటల్‌ 16.6శాతం చొప్పున దిగుమతి చేసుకుంటున్నాము.నరేంద్రమోడీ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత 201920లో చైనా నుంచి దిగుమతుల విలువ 8,187 కోట్ల డాలర్లుండగా 202324నాటికి 11,839 కోట్ల డాలర్లకు పెంచారు.(2015లో 7,166కోట్ల డాలర్లు మాత్రమే ఉండేది.) ఇదే సమయంలో మన ఎగుమతులు చైనాకు 1,661 కోట్ల నుంచి 1,665 కోట్ల డాలర్లకు మాత్రమే పెరిగాయి. మన మేకిన్‌ ఇండియా ఎలా విఫలమైందో దీన్నొక ఉదాహరణగా చెప్పవచ్చు.

కొన్ని ప్రత్యేక పరిశ్రమలకు సంబంధించి 2023 చివరిలో చైనా నిపుణులకు వీసా నిబంధనలు సడలించటమే మోడీ సర్కార్‌లో వచ్చిన మార్పుకు నిదర్శనమని 2024 జూలై 18 ఎకానమిస్టు పత్రికలో వచ్చిన వార్తను నిదర్శనంగా చూపుతున్నారు.కొన్ని కంపెనీలలో యంత్రాల అమరిక వంటి పనులకు అవసరమైన చైనా ఇంజనీర్లను గతనాలుగు సంవత్సరాలుగా మనదేశం అనుమతించని కారణంగా మన పరిశ్రమలకే నష్టం వాటిల్లింది. తాజాగా ప్రభుత్వం పదిహేను రోజుల్లో ఇ వీసాలు ఇచ్చేందుకు నిర్ణయించటంతో పరిశ్రమలకు ఎంతో ఊరట కలిగింది. ఇటీవలి కాలంలో చైనా వ్యతిరేక ధోరణి తగ్గి, సరిహద్దుల్లో శాంతి మంత్రం జపించటం పెరిగింది. సరిహద్దు చర్చలు ‘‘పురోగతి’’లో ఉన్నాయని ఏప్రిల్‌ నెలలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చెప్పారు. ఆ మరుసటి నెలలోనే 18నెలల తరువాత ఢల్లీిలో చైనా నూతన రాయబారి నియామకం జరిగింది.మరో వైపు మన దేశంలో దలైలామాను అమెరికా అధికారులు కలిసినా పెద్ద సమస్యగా మార్చకుండా చైనా సంయమనం పాటించింది. దాన్ని అమెరికాతో సమస్యగా పరిగణించింది. సరిహద్దులో బఫర్‌ జోన్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఇరు దేశాలు సేనలను వెనక్కు రప్పించి, కాపలా నిబంధనలను సడలించటం కూడా ముఖ్యపరిణామమే.చైనా ఇతర దేశాలతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నదని, భారత్‌తో సఖ్యతగా మెలిగితే దానికి లాభం తప్ప నష్టం ఉండదనే ముందుచూపుతో సరిహద్దుల్లో సఖ్యతకు అంగీకరించిందని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే మన దేశానికి చెందిన కొన్ని కార్పారేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్య కంపెనీల ఏర్పాటుకు పావులు కదుపుతున్నాయి. చైనా ప్రభుత్వ ంగ సంస్థ ఎస్‌ఏఐసి మోటార్స్‌తో కలసి మన దేశానికి చెందిన జెఎస్‌డబ్ల్యు గ్రూపు 2030నాటికి దేశ మార్కెట్లో గణనీయ వాటాను దక్కించుకొనేందుకు విద్యుత్‌ వాహనాల ఉత్పత్తికి భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. డిక్సన్‌ టెక్నాలజీస్‌ సంస్థ లాంగ్‌ ఛీర్‌ మరియు హెచ్‌కెసి అసెంబ్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు, మైక్రోమాక్స్‌ కంపెనీ స్మార్ట్‌ ఫోన్ల నమూనాలు, ఐటి హార్డ్‌వేర్‌, టెలికాం పరికరాల రూపకల్పనలకు ఓడిఎం హాక్విన్‌ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నాయి. చైనాలో యాపిల్‌ ఐ ఫోన్లను తయారు చేసే అమెరికా కంపెనీ మనదేశంలో కూడా ఉత్పత్తి చేస్తున్నది. దానికి విడిభాగాలను అందిస్తున్న చైనా కంపెనీలను మనదేశంలో ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇలాంటి వాటివలన చైనాకు వచ్చే నష్టం ఉండదు.

సరిహద్దు సమస్యపై ఒప్పందాలు, పెట్టుబడుల స్వీకరణకు చైనాతో సఖ్యత కుదుర్చుకుంటున్న మన దేశం పాకిస్తాన్‌తో అదే మాదిరి ఎందుకు ముందుకు పోవటం లేదని కూడా మన మీడియాలో కొందరు విశ్లేషిస్తున్నారు. అదేమీ అర్ధం కానంత బ్రహ్మపదార్ధమేమీ కాదు. ప్రపంచ సరఫరా గొలుసులో మనం కూడా కలవాలంటే చైనా నుంచి ఎఫ్‌డిఐ అవసరమని తాజా ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొన్నారు. మనవాణిజ్యంలో ప్రధమ స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కు నెట్టి మరోసారి చైనా ముందు వచ్చింది.అమెరికాకు ఎగుమతులు చేయాలన్నా చైనా పెట్టుబడుల అవసరం ఉంది. చైనా కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెడితే మనం ఎగుమతులు చేయవచ్చు. ఇలా ఆర్థికంగా చైనాతో ఉన్న లాభాలు పాకిస్థాన్‌తో లేవు. పాక్‌ ప్రేరేపిత లేదా అక్కడి నుంచి వచ్చిన తీవ్రవాదులు మనదేశంలో అనేక దాడులు చేసి ఎంతో నష్టం కలిగించారు.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ పాక్‌ నుంచి మనదేశానికి ఉగ్రవాదంతీవ్రవాదులను ఎగుమతి చేస్తున్నట్లుగా చైనా నుంచి లేదన్నది తెలిసిందే.చైనాను వ్యతిరేకించేవారు, అనుమానంతో చూసే వారు కూడా ఉగ్రవాదం విషయంలో వేలెత్తి చూపే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పవన్‌ ‘‘కల్యాణానంద’’ స్వామికి ఓ ప్రశ్న : హతవిధీ ! ఇలాంటి ‘‘సనాతనుల’’ సరసనా మీరు చేరింది !! రేపిస్టులు, హంతకులకు సన్మానాలు !!!

17 Thursday Oct 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women, Women

≈ Leave a comment

Tags

Bilkis Bano gangrape, BJP, Gouri lankesh, Gurmeet Ram Rahim Singh, Hinduthwa, Narendra Modi Failures, Pawan kalyan, RSS, Sanatan Hindu Dharma, VHP

ఎం కోటేశ్వరరావు


తాను పక్కా సనాతనవాదినంటూ పవన్‌ కల్యాణ్‌ ఊగిపోతూ చెప్పారు, చెబుతూనే ఉంటారు. ఎందుకంటే సనాతనవాదం పులి స్వారీ వంటిది. ఒకసారి పులినెక్కిన వారు అది ఎక్కడికి తీసుకుపోతే అటు పోవాల్సిందే. ఊహలు, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, సినిమాలు, సాహిత్యంలో తప్ప చరిత్రలో పులిని అదుపుచేసిన వారు ఎవరూ లేరు. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తానం ఎలా ఉంటుందో చూద్దాం. వారాహి ప్రకటన సందర్భంగా చేసిన సనాతన విన్యాసాల మీద సామాజిక మాధ్యమంలో అనేక మంది అంతకంటే ఎక్కువగా స్పందించి చీల్చి చెండాడుతూ సంధించిన ప్రశ్నలకు ఎక్కడా సమాధానం రాలేదు.బహుశా ఇలా జరుగుతుందని అనుకొని ఉండరు.భావజాల పోరులో ఎదుటి వారి మీదికి బంతిని ఎంత వేగంగా విసిరితే అంతే వేగంగా తిరిగి వస్తుంది. తగ్గేదేలేదని చరిత్ర నిరూపించింది. సనాతన ధర్మమునందు విడాకులు లేవు అంటూ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాటలనుపవన్‌ కల్యాణ్‌ సుభాషితాలను కలిపిన ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. దాన్ని తనకు వర్తింప చేసుకొని ఎలా సమర్ధించుకుంటారో తెలియదు.

పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద విరుచుకుపడిన మాటలు ఇంకా చెవుల్లో గింగురు మంటుండగానే సనాతనులకు తామే బ్రాండ్‌ అంబాసిడర్లమని చెప్పుకొనే వారు చేసిన పనికి సభ్య సమాజం సిగ్గుపడిరది. అఫ్‌కోర్సు వారిలో కట్టర్‌ హిందూత్వవాదులు ఉండరనుకోండి. ప్రముఖ జర్నలిస్టు, పురోగామివాది, హిందూత్వ వ్యతిరేకి అయిన గౌరీ లంకేష్‌ను కాల్చి చంపిన కేసులో నిందితులైన పరశురామ్‌ వాగ్మోరే, మనోహర్‌ యెదవే అనే వారిని కర్ణాటక సనాతన లేదా హిందూత్వశక్తులు విజయపురాలో 2024 అక్టోబరు 11న సన్మానించాయి. గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబరు ఐదవ తేదీన కాల్చిచంపారు. బెంగలూరు సెషన్స్‌ కోర్టు అక్టోబరు తొమ్మిదవ తేదీన జారీ చేసిన ఆదేశాల మేరకు ఎనిమిది మంది నిందితులకు బెయిలు మంజూరు చేసింది. దీంతో మొత్తం 18 మందిలో 16 మంది బెయిలు మీద బయటకు వచ్చారు. మిగిలిన ఇద్దరిలో శరద్‌ కలాస్కర్‌ అనే వాడు మహారాష్ట్ర హేతువాది నరేంద్ర దబోల్కర్‌ హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కారణంగా లోపలే ఉన్నాడు. వికాస్‌ పాటిల్‌ అనే వాడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. పైన పేర్కొన్న ఇద్దరు నిందితులు కన్నడ పత్రిక వార్తా భారతి కథనం ప్రకారం తమ స్వస్థలం విజయపుర వెళ్లినపుడు కాళికాదేవి గుడిలో పూజలు చేశారు, సంఘపరివార్‌(ఆర్‌ఎస్‌ఎస్‌), శ్రీరామ్‌ సేన కార్యకర్తలు వారికి సన్మానం చేశారు, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన హిందూత్వ నేతలు వారిద్దరినీ ఆరేళ్లుగా అన్యాయంగా జైల్లో ఉంచారని, విజయదశమి సందర్భంగా వారిని విడుదల చేయటం సంతోషమని పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఈ వార్తను చదివారో లేదో తెలియదు. ఒకవేళ చదివినా ఆ కేసులోని వారు ఇంకా నిందితులే తప్ప నేరం రుజువు కాలేదుగా అని లా పాయింట్‌ తీసి ‘‘సనాతనుల’’ను సమర్ధించవచ్చు. అందుకే మరికొన్ని ఉదంతాలను పేర్కొనాల్సి వస్తోంది. గుజరాత్‌లో బిల్కిస్‌ బానూ అనే మహిళపై గోద్రా అనంతర మారణకాండ సందర్భంగా సామూహిక అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులందరినీ హత్య చేసిన సంగతి తెలిసిందే. అత్యాచార కేసులో నేరగాండ్లలో పరివర్తన కలిగి మంచివారుగా మారారంటూ అక్కడి సనాతనవాదుల ఏలుబడిలోని రాష్ట్ర ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. ఆ సందర్భంగా వారిని సనాతన ధర్మాన్ని లేదా హిందూత్వను కాపాడేందుకు కంకణం కట్టుకున్నట్లు చెప్పుకొనే విశ్వహిందూపరిషత్‌ నేతలు వారికి సన్మానం చేసి, మిఠాయిలు పంచారు. సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం అత్యాచారం కేసులో యావజ్జీవిత శిక్షపడిన వారు జైల్లో ఉండాల్సిందే. అయితే సదరు సదాచార సనాతనుల కేసులో ఆ తీర్పు రాక ముందే శిక్ష విధించినందున తరువాత వచ్చిన తీర్పు వారికి వర్తించదని, పాత నిబంధనల ప్రకారం వారి సత్ప్రవర్తకు మెచ్చి మేకతోలు కప్పి ముందుగానే జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయితే సుప్రీం కోర్టు ఆ చర్యను తప్పు పట్టి నేరగాండ్లను తిరిగి జైలుకు పంపింది. అత్యాచారాలకు పాల్పడిన వారిని ఉరితీయాలని ఒకనాడు నినదించిన మన సభ్యసమాజం నేడు నేరగాండ్లకు పూలదండలు వేసి సత్కరిస్తే మౌనంగా ఉండిపోయిందంటే మన చర్మాలు ఎంతగా మొద్దుబారిందీ తెలుస్తున్నది. దేన్నయినా సమర్ధించే బాపతు తయారవుతున్నారు. దీని మీద పవన్‌ కల్యాణ్‌ ఏమంటారో ? అంతేనా !

సకల కళావల్లభుడిగా పేరుగాంచిన హంతకుడు, ఇద్దరు మహిళలపై అత్యాచార నేరగాడు డేరా సచా సౌదా ప్రవచకుడు గర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ (డేరా బాబా) జీవిత ఖైదు అనుభవిస్తూ బెయిలు మీద వచ్చినపుడు హర్యానా బిజెపి నేతలు ఆశీస్సులు పొందారు. అతగాడి అనుచరుల ఓట్లు పొందేందుకు గాను తాజా హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెరోల్‌ మీద బిజెపి ప్రభుత్వం విడుదల చేసిందనే విమర్శలు వచ్చాయి.2018లో జమ్మూలోని కథువాలో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారికి మద్దతుగా అక్కడ హిందూ ఏక్తా మంచ్‌ పేరుతో జరిపిన ప్రదర్శన తెలిసిందే.మహిళను దేవతగా కొలిచే సమాజంలో దాని గురించి రోజూ ప్రవచనాలు చెప్పేశక్తులే ఈ ఉదంతాలకు పాల్పడ్డాయంటే దేశం ఎటుపోతోందని కాదు, కొంత మంది ఎటు తీసుకుపోతున్నారో జనం ఆలోచించాలి. రామ్‌ రహీమ్‌కు 2017లో శిక్ష పడిరది, అప్పటి నుంచి ఉత్తరాదిన ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పెరోలు ఇవ్వటం గమనించాల్సిన అంశం.

బిల్కిస్‌ బానూ ఉదంతంలో నేరగాండ్లను సమర్దించటంలో మతాన్ని కూడా జోడిరచిన దుర్మార్గం, దాన్నినిస్సిగ్గుగా సమర్ధించిన ఉన్మాదం కనిపిస్తుంది. వారంతా సనాతనులే.మతాలతో నిమిత్తం లేకుండా అత్యాచారం ఎవరి మీద జరిగినా దాన్ని ఖండిరచాల్సిందే. తమ నేతల ప్రమేయం ఉన్న ఉదంతాల పేరెత్తటానికి సనాతన నరేంద్రమోడీ సిగ్గుపడి ఉంటారు. 2014లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఢల్లీి నిర్భయ కేసును పేరు పెట్టి ప్రస్తావించిన ఆ పెద్దమనిషి తమ ఏలుబడిలో జరిగిన కథువా, ఉన్నావో అత్యాచారాల తరువాత మాట్లాడుతూ సాధారణ పరిభాషలో ఖండిరచారే తప్ప వాటి ప్రస్తావన ఎక్కడా తేలేదు. ఎందుకంటే కథువా ఉదంతంలో నిందితులకు మద్దతుగా బిజెపి మంత్రులు కూడా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాల్సి ఉండగా విమర్శలు పెరగటంతో తీరికగా తరువాత రాజీనామా చేయించారు. ఉన్నావో ఉదంతంలో బిజెపి ఏంఎల్‌ఏ దోషి, ఇప్పుడు జీవిత కాలఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. ఏమీ తెలియని అమాయకుడు, అన్యాయంగా ఇరికించారంటూ అతగాడిని రక్షించేందుకు అనేక మంది ఎంఎల్‌ఏలు, బిజెపి పెద్దలు, పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎడిఆర్‌ అనే స్వచ్చంద సంస్థ మహిళల మీద నేరారోపుణలు తమ మీద ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్న 48 మంది ఎంఎల్‌ఏలు, ముగ్గురు ఎంపీల వారిలో సనాతన ధర్మ పరిరక్షణ గురించి రోజూ కబుర్లు చెప్పే బిజెపికి చెందిన వారు 14 మంది, తాము కూడా అదే బాటలో నడుస్తామని చెప్పే శివసేనకు చెందిన వారు 7గురు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన వారు ఆరుగురు ఉన్నారు.

హర్యానాలోని ఆరు జిల్లాలు, పక్కనే ఉన్న పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో డేరా బాబా అనుచరులు ఉన్నారు. ప్రధానంగా దళిత సామాజిక తరగతికి చెందిన వారు. వారి ఓట్ల కోసం పడేపాట్లు ఇవి.వ్రతం చెడ్డా బిజెపికి ఫలం దక్కలేదని పరిశీలకులు చెబుతున్నారు.డేరా బాబా పలుకుబడి ఉందని భావిస్తున్న ఆరు జిల్లాల్లో 28 అసెంబ్లీ సీట్లుండగా బిజెపి గెలిచింది పది చోట్ల మాత్రమే, కాంగ్రెస్‌ 15 గెలుచుకుంది. గత రెండు సంవత్సరాల్లో రాష్ట్ర బిజెపి ప్రభుత్వం డేరాబాబాకు పదకొండుసార్లు బెయిలు ఇచ్చి బయటకు వదిలింది. ఏడు సార్లు వేర్వేరు చోట్ల ఎన్నికలకు ముందు బెయిలు ఇచ్చారు. తాజాగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అదే జరిగింది. బిజెపికి ఓటు వేయాల్సిందిగా అనుచరులకు సందేశం పంపాడు. అతగాడి ఆశ్రమం ఉన్న సిర్సా జిల్లాలోని ఐదు అసెంబ్లీ సీట్లలో బిజెపికి ఒక్కటి కూడా దక్కలేదు. మూడు కాంగ్రెస్‌కు రెండు ఐఎన్‌ఎల్‌డికి వచ్చాయి. బిజెపితో పోటీ పడి కొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా డేరాబాబా ఆశీసుల కోసం ప్రదక్షిణలు చేశారు. సనాతనవాదుల మందలో కొత్తగా చేరిన పవన్‌ కల్యాణ్‌ తాను ఎన్నో చదివానని చెప్పిన తరువాత ఆ వాదాన్ని భుజానవేసుకున్నారు గనుక అమాయకుడని అనుకోలేం. సినిమా రంగం మనిషి, అక్కడ ఏ ఫార్ములా నాలుగు డబ్బులు తెస్తే పొలోమంటూ మిగతావారూ దాన్నే అనుసరిస్తారు.

సనాతనంహిందూత్వ ఫార్ములా ఓట్లు రాల్చేదిగా ఉందని బిజెపి దాన్ని ఎప్పటి నుంచో రంగంలోకి తెచ్చింది. సవ్యసాచి మాదిరి సినిమాలతో పాటు రాజకీయాలను కూడా చేయాలనుకుంటున్నారు గనుక పవన్‌ కల్యాణ్‌ సనాతన ఫార్ములాను ఎంచుకున్నారని భావించవచ్చు. దీని వెనుక ఉన్న కారణాల గురించి కూడా చర్చ జరుగుతున్నది. మర్రి చెట్టువంటి చంద్రబాబు నాయుడి నీడలో ఎంతకాలం ఉన్నా ఎదుగూ బొదుగూ ఉండదు కనుక తాను ప్రత్యేకంగా కనిపించాలంటే సనాతనాన్ని భుజాన వేసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతు మీద ఆధారపడిన తాము ఆంధ్రప్రదేశ్‌లో హిందూత్వ అజెండా అమలు జరిపితే రాజకీయంగా ఇబ్బందులు తలెత్తవచ్చు గనుక శిఖండిలా పవన్‌ కల్యాణ్ణు రంగంలోకి దించిందని కూడా చెబుతున్నారు. హిందూమతంలో సంస్కరణలు తేవాలని ఆర్య(మహత్తర)సమాజాన్ని స్థాపించిన దయానంద సరస్వతిని సనాతన వాదులు కుట్ర చేసి చంపారనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది తాము వేదాలను ప్రమాణంగా తీసుకుంటామని అదే సనాతన ధర్మమని అందమైన ముసుగువేసుకుంటారు. ఇది వేదకాలం కాదు, మనువాదులు అమలు జరుపుతున్న కుల,మత సమాజం.వేదాలను ప్రామాణికంగా తీసుకొనే వారేమీ కులమతాలకు అతీతంగా లేరు గనుక ఉన్న దుర్మార్గపూరిత వ్యవస్థను ఏదో ఒక పేరుతో సమర్ధించేవారిగానే పరిగణించాలి. పవన్‌ కల్యాణ్‌ కూడా ఆ తెగకు చెందిన వారే. అయితే ఐదు పదులు దాటిన ఆ పెద్దమనిషి గ్రహించాల్సిందేమంటే హిందూత్వ నినాదం పనిచేయటం వెనుక పట్టు పట్టిన తరుణంలో దాన్ని ఎంచుకున్నారు. ఆయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలోనే బిజెపి మట్టి కరచింది.వారణాసిలో నరేంద్రమోడీ మెజారిటీ గణనీయంగా పడిపోయింది.


మహనీయుడు అంబేద్కర్‌ దృష్టిలో సనాతన ధర్మం అంటే వేద,బ్రాహ్మణిజం అన్నది స్పష్టం.ఆయన కాలంలో కులమతాలు, అంతరాలు లేవని చెబుతున్న వేదకాలము లేదూ వేదాలకు అనుగుణంగా పాలనా లేదు.మనువాదం మాత్రమే ఉంది. అందుకే వేదాల జోలికి పోకుండా మనుధర్మ శాస్త్రాన్నే తగులపెట్టారు. మనువాదులు తాము చెప్పేదానినే సనాతన ధర్మమని భాష్యం చెబుతున్నారు, ఇప్పటికీ మన కళ్ల ముందు కనిపిస్తున్నది వారే. అందువలన ఎవరైనా సనాతనాన్ని వ్యతిరేకిస్తున్నారంటే మను ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నట్లే, దాన్ని పరిరక్షించాలని, విమర్శించేవారిని సహించబోమని పవన్‌ కల్యాణ్‌ వంటి వారు చెబుతున్నారంటే అంబేద్కర్‌ను కూడా వ్యతిరేకించుతున్నట్లే. ఉనికిలో లేని వేదకాల సనాతనంతో ఎవరికీ ఇబ్బంది లేదు,అమలులో ఉన్న మనుసనాతనం, అది సృష్టించిన వివక్షను నిర్మూలించాలా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కావమ్మ మొగుడి కథ పునరావృతం అవుతోందా ? నరేంద్రమోడీ అద్భుత శక్తులెక్కడ ! ప్రశ్నిస్తున్న ప్రపంచ మీడియా !!

13 Sunday Oct 2024

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, USA

≈ Leave a comment

Tags

#Indian Economy, agriculture in india, BJP, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీగారి మాటలను చూస్తే దేశం వెలిగిపోతోంది. భజన బృందాన్ని చూస్తే మోడీ విశ్వగురువు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే లెక్కలను చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నది. ఎవరి మాటలను నమ్మాలి ? తమ అనుభవంలోకి వచ్చిన విషయాలను బట్టి జనమే తేల్చుకోవాలి. దేశంలో మాకు తిరుగులేదు అని బిజెపి చెబుతుంది. దాన్ని గుడ్డిగా నమ్మేవారున్నారు, చేసేదేముంది ! ఆ గోమాతే కనువిప్పు కలిగించాలి. వారికి వివరాలు తెలియకనా ? 2014లో బిజెపికి స్వంతంగా వచ్చిన ఓట్లు 31శాతం, ఎన్‌డిఏ కూటమి మొత్తానికి 38.5శాతం, 2019లో బిజెపికి 37.36శాతం, కూటమికి 45.3శాతం, 2024లో బిజెపికి 36.56శాతం కాగా కూటమికి 42.5శాతం వచ్చాయి. గత ఎన్నికల తరువాత తెలుగుదేశం, జనసేన ఓట్లు కొత్తగా కలిసినా బిజెపికి, మొత్తంగా కూటమి ఓట్లశాతం తగ్గింది. దీన్ని చూస్తేమోడీ ప్రభావం పెరుగుతున్నట్లా తరుగుతున్నట్లా ? ఇవి సాధారణ అంకెలు, ఆల్జిబ్రాకాదు గనుక అర్ధంగాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. లేకపోతే వేద గణికులను సంప్రదించవచ్చు.


ఇక్కడ ఒక పొట్టి పిట్టకత చెప్పాలి. ఊరంతా ఎప్పుడో వెళ్లిపోయిన కావమ్మ మొగుడులా ఉన్నావంటే కామోసు కామోసనుకొని కాపురం చేశాను, ఇప్పుడు కాదంటున్నారు గనుక నా కర్రా బుర్ర ఇస్తే నాదారిన నేపోతా అన్నాడట సన్యాసివేషంలో వచ్చిన ఒక పెద్దమనిషి. ప్రధాని నరేంద్రమోడీ దగ్గర అద్భుత శక్తులు ఉన్నట్లు ఇంతకాలం నమ్మిన ఊరూవాడా ఇప్పుడు అనుమానంగా చూస్తోంది.‘‘ నరేంద్రమోడీ తన అద్భుత శక్తి కోల్పోయారా ?’’ అంటూ ప్రశ్నార్ధక శీర్షికతో అంతర్జాతీయ పత్రిక ‘‘ఎకానమిస్టు ’’ 2024అక్టోబరు పదవ తేదీ సంచికలో ఒక విశ్లేషణను ప్రచురించింది. ప్రపంచ ఆర్థిక అంశాలను ప్రచురించే ఆ పత్రికే అనుమానాన్ని వ్యక్తం చేసిన తరువాత అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని వేరే చెప్పనవసరం లేదు. తరువాత కథ ఎలా ఉంటుంందో తెలియదు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఏండ్ల తరబడి జరిగిన ప్రచారాన్ని చూసిన నరేంద్రమోడీ నిజంగా తాను దేవదూతననే నమ్మారు. నమ్మటం ఏమిటి ! చరిత్రలో అనేక మంది మాదిరి స్వయంగా ప్రకటించుకున్నారు. 2024 మే పదవ తేదీన వారణాసి పర్యటన సందర్భంగా న్యూస్‌ 18 అనే టీవీ ఛానల్‌తో మోడీ మాట్లాడారు. దాన్లో ఏం చెప్పారు ‘‘ నా మాతృమూర్తి బతికి ఉన్నపుడు నేను దేహసంబంధంగానే(సాధారణ మానవుల్లా) పుట్టానని అనుకొనేవాడిని. ఆమె మరణించిన తరువాత నా అనుభవాలన్నింటినీ అవలోకించుకుంటే దేవుడు తనను పంపాడని నిర్ధారణకు వచ్చాను. కేవలం నా భౌతికదేహం నుంచైతే ఈ శక్తి వెలువడదు, దేవుడు నాకు ప్రసాదించాడు.నేను ఎప్పుడే పనిచేసినా దేవుడే నన్ను అలా నడిపిస్తున్నాడని నమ్ముతున్నాను.’’ అని చెప్పారు. ఇదంతా లోక్‌సభ ఎన్నికలకు ముందు, తరువాత అనేక మందిలో మోడీ అద్భుత శక్తుల గురించి అనుమానాలు తలెత్తుతున్నాయి.


తొలిసారి అధికారానికి వచ్చినపుడు నరేంద్రమోడీ క్షణం తీరిక లేకుండా విదేశాలన్నీ తిరిగారు.ఎక్కువ సమయం విమానాల్లోనే గడిపారు. ఎందుకంటే యుపిఏ హయాంలో ప్రపంచంలో కోల్పోయిన భారత ప్రతిష్టను తిరిగి తీసుకురావటంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు అని చెప్పారు. జనం నిజమే కామోసనుకున్నారు. కానీ వాస్తవాలను చూస్తే వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో వచ్చిన విదేశీ పెట్టుబడులు 16 సంవత్సరాల కనిష్టానికి తగ్గిపోయాయి. పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏమైంది, విదేశాల్లో పెరిగిన ప్రతిష్ట ఎందుకు తగ్గినట్లు, విశ్వగురువుగా భుజకీర్తులు తప్ప పెట్టుబడులు ఎందుకు రావటం లేదు. వెనుదిరిగి చూస్తే జరిగిన ప్రచారం అంతా మాయ, కనికట్ట్లు అనిపిస్తోంది. విదేశీ పెట్టుబడులు ఎందుకు తగ్గుతున్నాయంటే మన దేశానికే కాదు, ప్రపంచమంతా తగ్గటం లేదా అని దబాయించారు. ఇది నిజమా ? ఒక దగ్గర తగ్గితే మరో దగ్గర పెరుగుతున్నాయి. డబ్బునెవరూ మురగపెట్టుకోవటం లేదు. ఐరాస విడుదల చేసిన 2024 ప్రపంచ పెట్టుబడుల నివేదిక ఏం చెబుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 2022లో ఎనిమిదవ స్థానంలో ఉన్న మనదేశం 2023లో ఒక్కసారిగా 15వ స్థానానికి దిగజారింది. స్వల్పంగా తగ్గినప్పటికీ అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను కొనసాగించాయి. అమెరికాకు వచ్చిన పెట్టుడులు 332 నుంచి 311 బిలియన్‌ డాలర్లకు(6.32శాతం) తగ్గగా చైనాకు వచ్చినవి 189 నుంచి 163కు(13.75శాతం) తగ్గాయి, కానీ మనదేశానికి 49 నుంచి 28 బిలియన్‌ డాలర్లకు(42.85శాతం) తగ్గాయి. ఎఫ్‌డిఐల రాకపోకలు వివిధ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఎక్కడ లాభం ఎక్కువగా ఉంటే అక్కడకు పోతాయి.ద్రవ్య పెట్టుబడికి ఒక ప్రాంతమంటూ ఉండదు. లాభం ఉందా లేదా అని చూసుకొని ఉదయం ఆస్ట్రేలియాలో ఉంటే మధ్యాహ్నం భారత్‌, సాయంత్రానికి అమెరికా వెళ్లిపోతుంది. పరిశ్రమలకు అలా కుదరదు.


గాల్వన్‌లోయ సరిహద్దు ఉదంతం తరువాత చైనా నుంచి పరిశ్రమలు, పెట్టుబడులన్నీ భారత్‌కు మూకుమ్మడిగా తరలి వస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీడియాలో కతలు కతలుగా కబుర్లు చెప్పారు. ఆమేరకు మన ఎఫ్‌డిఐలు పెరిగిన దాఖలాలు లేవు.‘‘ చైనా, భారత్‌ల నుంచి బయటకు వెళుతున్న పెట్టుబడులతో ఇతర దేశాలు లబ్దిపొందుతున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి సుభాస్‌ చంద్ర గార్గ్‌ (డెక్కన్‌ హెరాల్డ్‌ 2024,ఏప్రిల్‌ 23) రాశారు. అంతే కాదు, చైనా వద్ద ఆపార సాంకేతిక సత్తా, అరుదైన మెటీరియల్‌, పారిశ్రామిక పునాది ఉన్నదని, దానికి ఎఫ్‌డిఐలు నిలిచిపోవచ్చు కూడా, అక్కడి నుంచే భారీ మొత్తాలలో పెట్టుబడులు బయటకు వెళుతున్నాయి,దానికి ఎఫ్‌డిఐ అవసరం లేకపోవచ్చు, భవిష్యత్‌ ఉన్న పరిశ్రమలను స్వంతంగా నిర్మించుకోగలదని కూడా రాశారు. మనదేశంలో నైపుణ్యం తప్ప సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి, ఉత్పాదక వ్యవస్థలు లేవని, మన దగ్గర నుంచి పెట్టుబడులు బయటకు వెళితే ఎక్కువ నష్టం మనకే ’’ అని కూడా గార్గ్‌ పేర్కొన్నారు. ఆయనేమీ మోడీ వ్యతిరేకి కాదు.


చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దశలో ఉందని సోషల్‌ మీడియాలో సంచలనాత్మక శీర్షికలతో కతలు చెప్పేవారు మనకు కొల్లలుగా ఉన్నారు. అఫ్‌కోర్సు గుడ్డిగా వాటిని నమ్మేవారు ఉండబట్టే పదే పదే అలా చెబుతున్నారు. మన ఆర్థిక వ్యవస్థ గురించి ఇష్టం లేకపోయినా ప్రభుత్వం సమాచారం వెల్లడిరచకతప్పటం లేదు. సమాచారం కొత్తగా ఉన్నప్పటికీ మోడీ అభిమానులను ఇబ్బంది పెట్టే పాత సమస్యలనే అది జనం ముందుంచుతున్నది. వాటికి ఇంకే మాత్రం నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లే కారణం అనటానికి అవకాశం లేదు. జనం గడ్డిపెడతారు. ఇది చైనా కాదు భారత యుగం అని భజన చేసేందుకు కుదరదు. రానున్న రోజుల్లో ఇబ్బందులకు ఆరంభ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా చెప్పక తప్పలేదు. ఈ కారణంగానే వడ్డీరేట్ల తగ్గింపు మీద ఆర్‌బిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది.అయితే ఎన్ని ఇబ్బందులున్నా వర్తమాన సంవత్సర వృద్ధి రేటు 7.2శాతం ఉంటుందని చెబుతోంది. కరోనా తరువాత గొప్పగా ముందుకు పోతోందన్న వృద్ధి రేటు వడిదుడుకులకు లోనవుతున్నది. జనవరిమార్చి నెలల్లో వృద్ధి రేటు 7.8శాతం ఉండగా ఏప్రిల్‌జూన్‌లో 6.7కు పడిపోయింది. బొగ్గు,ముడిచమురు, విద్యుత్‌ వంటి ఎనిమిది కీలక రంగాల తీరును చూస్తే మూడు సంవత్సరాల్లో మొదటి సారిగా ఆగస్టులో దిగజారింది. పారిశ్రామిక, సేవారంగాలలో ఎదుగుదల లేని కారణంగా ఉపాధి కోసం జనాలు తిరిగి వ్యవసాయం వైపు మరలు తున్నారు. మోడీ గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది అన్నది ఎండమావి అన్నది ఈ పరిణామం తెలుపుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం 201819లో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారు శ్రామికశక్తిలో 43శాతం ఉండగా అది 202324నాటికి 46శాతానికి పెరిగింది. ఇదే కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 12 నుంచి 11శాతానికి తగ్గింది. సెప్టెంబరు నెలలో నిరుద్యోగుల శాతం 7.8గా సిఎంఐఇ పేర్కొన్నది. ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన గురించి మోడీ చెప్పిన కబుర్లన్నీ వంచన తప్ప మరొకటి కాదు.ఉన్న ఉపాధి కోల్పోయి 6.8కోట్ల మంది వ్యవసాయ రంగానికి మరలినట్లే. పరిశ్రమలు, సేవారంగాల్లో యాంత్రీకరణతో పాటు వ్యవసాయంలో కూడా రోజు రోజుకూ యంత్రాల వినియోగం పెరుగుతున్నది. ఉదాహరణకు గతంలో పురుగు మందులను మనుషులే చల్లేవారు, ఇప్పుడు డ్రోన్లు ఆపని చేస్తున్నాయి. వాటిని ఇతర అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. డ్రోన్‌ దీదీ తదితర పథకాల పేరుతో డ్రోన్ల కొనుగోలుకు ప్రభుత్వం 75శాతం సబ్సిడీ ఇస్తున్నది, అవింకా పెరిగితే ఉపాధి ఇంకా తగ్గుతుంది. డ్రోన్‌ పరిశ్రమలు పెరిగితే ఐదు లక్షల మందికి కొత్తగా ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు తప్ప అంతకంటే ఎన్నో రెట్లు వ్యవసాయ కూలీలకు తగ్గే పని రోజులు, ఆదాయం గురించి మాత్రం మాట్లాడరు. మరోవైపు పారిశ్రామిక రంగంలో ఇస్తున్న సబ్సీడీల్లో ఎక్కువ భాగం పెట్టుబడులు భారీ మొత్తాలలో ఉండే పరిశ్రమలకు తప్ప ఉపాధి ఎక్కువగా దొరికే వాటికి వెళ్లటం లేదని అభివృద్ధి అధ్యయనాల మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆర్థికవేత్త అభిషేక్‌ ఆనంద్‌ చెప్పారు.


ముడిచమురు ధరలు పీపాకు పది డాలర్లు పెరిగితే జిడిపిలో 0.4శాతం తగ్గిపోతుంది. అదే తగ్గితే అంతే మేరకు పెరుగుతుంది. చమురు ధరలు పెరిగితే సబ్సిడీల మొత్తం కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది. గత రెండు సంవత్సరాలుగా చమురు ధరలు తగ్గటం, రష్యా నుంచి రాయితీ ధరలకు కొనుగోలు చేస్తుండటంతో జిడిపి పెరిగినట్లు కనిపిస్తున్నది. అది తాత్కాలికమే అని వేరే చెప్పనవసరం లేదు. మూలధన పెట్టుబడి ఏ ఆర్ధిక వ్యవస్థకైనా ఎంతో ముఖ్యం. గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో 30శాతం మూలధన పెట్టుబడి ఖర్చు తగ్గిందని, అదే ఏప్రిల్‌ఆగస్టు నెలలకు 19.5శాతం తగ్గినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు నెలలో ఉత్పత్తి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1.8శాతం తగ్గింది, ఇది గత 42నెలల్లో అధ్వాన్నపని తీరు. జిఎస్‌టి వసూళ్లు పెరుగుతున్నాయి, అవి కూడా సెప్టెంబరులో 6.5శాతమే, 2021 తరువాత ఇంత తక్కువ పెరుగుదల లేదట.ఉత్పత్తి, సేవారంగాల పిఎంఐ పరిస్థితి కూడా ఇంతే. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది అదే నెలలో 9.3శాతం మేరకు వాహనాల అమ్మకాలు తగ్గినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ ఫెడరేషన్‌ వెల్లడిరచింది.వీటిని వినిమయానికి ఒక సూచికగా పరిగణిస్తారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు గత నాలుగు నెలలుగా పడిపోతూనే ఉన్నాయి, 43నెలల్లో అధ్వాన్నంగా తేలింది. కార్ల నిల్వలు పెరిగిపోవటంతో వాటిని వదిలించుకొనేందుకు కంపెనీలు పెద్ద ఎత్తున రాయితీలను ప్రకటించటం రోజూ పత్రికల్లో కనిపిస్తున్నదే.పండుగల తరుణంలో పరిస్థితి మెరుగుపడుతుందనే ప్రకటనలు ప్రతి ఏటా తెలిసిందే.

ప్రపంచ మీడియా నరేంద్రమోడీ అద్భుత శక్తుల గురించి ఎందుకు ప్రశ్నిస్తోంది ? ఎన్నికల్లో మోడీ ఆకర్ష ఆకర్ష మంత్ర ప్రభావం, గొప్పగా ప్రచారం చేసుకున్న ఎఫ్‌డిఐ, దేశ ఆర్థిక రంగం ఎలా ఉందోపైన చెప్పుకున్న విషయాలన్నీ మన గోడీ మీడియా చర్చలు పెట్టకపోతే, విశ్లేషణలు రాయనంత మాత్రాన, నా కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తా అన్న ముసలమ్మ మాదిరి ఉంటే సూర్యోదయంఅస్తమయం ఆగుతుందా ? హర్యానా ఎన్నికల్లో బిజెపికాంగ్రెస్‌ మధ్య ఓట్లతేడా ఒకశాతం లోపే. ఒక స్థానంలో పోటీ చేసిన సిపిఎం, 89 చోట్ల బరిలో దిగిన కాంగ్రెస్‌కు కలిపి వచ్చిన ఓట్లు 39.34శాతం కాగా, బిజెపికి 39.94 ఆమ్‌ ఆద్మీ పార్టీని కాంగ్రెస్‌ కలుపుకొని వెళ్లి ఉంటే దానికి వచ్చిన 1.79శాతం ఓట్లు తోడైతే అక్కడా బిజెపి బొక్కబోర్లా పడి ఉండేదే. ఈ చిన్న మతలబు ప్రపంచానికి తెలియకుండా ఉంటుందా ?హర్యానా, జమ్మూకాశ్మీరు ఎన్నికల అనుభవాలను చూసిన తరువాత రాబోయే మహారాష్ట్ర,ఢల్లీి, రaార్కండ్‌, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి పెద్ద సవాలుగా మారబోతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వారెక్కడ-మనమెక్కడ : 77 ఏండ్ల భారత్‌ – 75 సంవత్సరాల చైనా !

11 Friday Oct 2024

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, CPI(M), Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics, USA

≈ Leave a comment

Tags

75 years' China, Anti China Propaganda, BJP, GDP growth, Narendra Modi Failures, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


అంటే అన్నారని తెగ గుంజుకుంటారు గానీ మన దేశంలో తెలివి తేటలు ఎక్కువగా ఉన్న కొందరు పడక కుర్చీల్లో కూర్చొని అభివృద్ధిప్రజాస్వామ్యం, నియంతృత్వాలకు ముడిపెట్టి భలే సొల్లు కబుర్లు చెబుతారు. అదే నిజమైతే నిజాం సంస్థానం, బ్రిటీష్‌ పాలనలోని ఇండియా అభివృద్ధిలో ఎక్కడో ఉండి ఉండాలి. అంతెందుకు మన పక్కనే ఉన్న పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటివి మన కళ్ల ముందే అమెరికాను మించిపోయి ఉండాలి. ఎందుకు ఇదంతా అంటే..... చైనా 2024 అక్టోబరు ఒకటి నుంచి ఏడు వరకు 75 సంవత్సరాల కమ్యూనిస్టు పాలన ఉత్సవాలు జరుపుకున్నది. మనదేశం రెండు 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాన్ని రెండు సంవత్సరాల ముందే జరుపుకుంది. రెండు దేశాల మధ్య ఇష్టం ఉన్నా లేకున్నా పోలిక తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ పూర్వరంగంలో చైనా మాదిరి మనదేశం ఎందుకు అభివృద్ధి చెందలేదంటే మనది ప్రజాస్వామ్యంవారిది కమ్యూనిస్టు నియంతృత్వం అని తడుముకోకుండా ఠకీమని చెబుతారు.
బిజినెస్‌ టుడే పత్రిక కమ్యూనిస్టులది కాదు, 2024 ఆగస్టు 25న గత రెండు దశాబ్దాల్లో భారత్‌చైనా ఆర్థిక వ్యవస్థలు ఎలా పనిచేసిందీ వివరిస్తూ ఒక విశ్లేషణ చేసింది.దానిలో ఉన్న కొన్ని వివరాల సారం ఇలా ఉంది. 1980లో చైనా తలసరి జిడిపి 307 డాలర్లు కాగా దాదాపు దానికి రెండు రెట్లు ఎక్కువగా 582 డాలర్లు భారత్‌లో ఉంది. 2024లో అది తారుమారై(పిపిపి పద్దతిలో) 25,01510,123 డాలర్లుగా ఉంది. ఐఎంఎఫ్‌ సమాచారం మేరకు ప్రస్తుత ధరల ప్రకారం 2024లో చైనా జిడిపి విలువ 18.53లక్షల కోట్ల డాలర్లు. 1980లో 303 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది ఈ కాలంలో 61 రెట్లు పెరిగింది. భారత్‌ 186 బిలియన్‌ డాలర్ల నుంచి 21రెట్లు మాత్రమే పెరిగి 3.93లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మోడీ ఏలుబడి పదేండ్లలో 2.04లక్షల కోట్ల నుంచి 3.93లక్షల కోట్ల డాలర్లకు పెరగ్గా చైనాలో 10.5 నుంచి 18.53లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.ప్రస్తుతం చైనా రుణభారం జిడిపిలో 88.6శాతం కాగా భారత్‌కు 82.5శాతం.1995లో చైనా రుణం 21.6శాతం కాగా భారత్‌కు 71శాతం ఉంది.యుపిఏ పాలనా కాలంలో రుణం 84.9 నుంచి 67.1శాతానికి తగ్గితే మోడీ ఏలుబడిలో అది 82.5శాతానికి పెరిగింది. ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 2023లో మూడున్నరలక్షల కోట్ల డాలర్లు లేదా 14శాతం ఉంది. అదే భారత్‌ వాటా కేవలం 0.78లక్షల కోట్ల డాలర్లు మాత్రమే అని మెకెన్సీ నివేదిక పేర్కొన్నది.


‘‘ ప్రపంచాధిపత్యం గురించి మరచిపోండి, భారత్‌ సమీప భవిష్యత్‌లో చైనాను అందుకోలేదు ’’ అనే శీర్షికతో 2023 ఆగస్టు 18వ తేదీన హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే పత్రిక ఒక విశ్లేషణ ప్రకటించింది.దాన్లో ఉటంకించిన, వెల్లడిరచిన అభిప్రాయాల సారం ఇలా ఉంది. భారత్‌ గురించి సానుకూలంగా చెబుతున్న అంచనా ప్రకారం చైనా (57లక్షల కోట్ల డాలర్లు) తరువాత అమెరికా(51.5లక్షల కోట్ల డాలర్లు )ను వెనక్కు నెట్టి భారత్‌ (52.5లక్షల కోట్ల డాలర్లు) రెండవ స్థానం సంపాదించటానికి 50 సంవత్సరాలు పడుతుంది.భారత్‌ ప్రపంచాధిపత్యం గురించి నరేంద్రమోడీ 75వ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో చెప్పారు. కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా ఆయన చెప్పిన పథకాలు కాగితాల మీదే ఉన్నాయి. భారత జిడిపి వాస్తవ వృద్ధి రేటు 2040వరకు ఏటా 8శాతం, తరువాత 5శాతం వంతున వృద్ధి చెందితే ఇదే కాలంలో అమెరికా వృద్ధి రేటు రెండుశాతమే ఉంటే అమెరికాను అధిగమించటానికి 2073వరకు భారత్‌ ఆగాలని కొలంబియా విశ్వవిద్యాలయ ఆర్థికవేత్త అరవింద్‌ పనగారియా చెప్పారు. ఇవన్నీ రానున్న 50 ఏండ్లలో ఇలా లేదా అలా జరిగితే అన్న షరతుల మీద చెప్పినవే.2000 సంవత్సరంలో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో భారత వాటా ఒకశాతం కాగా చైనా 7శాతంతో ఉంది. అదే 2022 నాటికి 331శాతాలతో ఉన్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో రెండు15శాతాలతో ఉన్నాయి.


‘‘ భారత్‌ నూతన చైనా కాదు(ఇంకా) ’’ అనే శీర్షికతో అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ 2024 మే ఎనిమిదవ తేదీన ఒక విశ్లేషణ రాసింది.దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న భారత ఆర్థిక వ్యవస్థపైకి లేస్తుందా అన్న ప్రశ్నతో ప్రారంభించి అనేక మంది ఆమెరికా కార్పొరేట్స్‌ ఆ విధంగా ఆలోచిస్తున్నారని అయితే ఇది అరగ్లాసు నిండిన కథ మాత్రమే అని వ్యాఖ్యానించింది.ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ఇతర సంస్థలు, కొందరు ఆర్థికవేత్తలు పేర్కొన్న పురోగతి అంకెలు, అంచనాలను పేర్కొంటూ ఇదంతా నిండిన అరగ్లాసు గురించిన పొగడ్తలుగా పేర్కొంటూ ఇతర దేశాలతో పోల్చితే పనితీరు చాలా తక్కువగా ఉన్నట్లు వ్యాఖ్యానించింది.భారత తలసరి జిడిపి అమెరికాతో పోలిస్తే 30వంతు, చైనాతో 12వ వంతు, ఇప్పుడున్న వృద్ధిరేటు ప్రకారం అమెరికా తలసరి జిడిపిలో నాలుగోవంతుకు చేరాలంటే భారత్‌కు 75 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త ఇందర్‌మిత్‌ గిల్‌ అంచనా వేశారు. ఇది జరుగుతుందనే గ్యారంటీ కూడా లేదు.ఇండోనేషియా తలసరి జిడిపి 5,270 డాలర్లను చేరుకోవటానికే భారత్‌కు దశాబ్దాలు పడుతుంది.


ఫారిన్‌ పాలసీ అనే పత్రికలో అమెరికా హార్వర్డ్‌ కెనడీ స్కూలు ప్రొఫెసర్‌ గ్రాహం అలిసన్‌ 2023 జూన్‌ 24వ తేదీన ‘‘ భారత్‌ తదుపరి అగ్రరాజ్యంగా మారేందుకు చైనాను అధిగమిస్తుందా ’’ అనే శీర్షికతో ఒక విశ్లేషణ చేశాడు. అలాంటి అవకాశం లేదని నాలుగు ఇబ్బందికరమైన అంశాలు చెబుతున్నాయని పేర్కొన్నాడు. ఏప్రిల్‌ నెలలో (2023) ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనాను భారత్‌ వెనక్కు నెట్టేసినపుడు పరిశీలకులు ఆశ్చర్యపోయారు. ప్రపంచ అగ్రరాజ్యంగా కూడా మారుతుందా అన్నారు.జనాభాతో పాటు గత రెండు సంవత్సరాలుగా చైనా వృద్ధి రేటు 5.5శాతం ఉంటే భారత్‌లో 6.1శాతం ఉంది, ఈ అంకెలు ఎంతో ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. భారత్‌ వేగంగా అభివృద్ది చెందుతుందని చెబుతున్నదానిని బుర్రలకు ఎక్కించుకొనే ముందు ఇబ్బందికరమైన నాలుగు వాస్తవాలు ఉన్నాయని తెలుసుకోవాలి.


మొదటిది,1990 దశకంలో భారత్‌లో పెరుగుతున్న యువజనాభాతో ఆర్థిక సరళీకరణ విధానం ఒక ‘‘ ఆర్థిక అద్బుతాన్ని’’ సృష్టిస్తుందని విశ్లేషకులు పెద్దగా చెప్పారు. అమెరికాలో భారత్‌ను ఎంతో ఆలోచనాత్మకంగా విశ్లేషించే జర్నలిస్టుల్లో ఒకరైన ఫరీద్‌ జకారియా ఇటీవల వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో 2006లో తాను కూడా అలాంటి భావానికి లోనైనట్లు ప్రస్తావించాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న స్వేచ్చామార్కెట్‌ ప్రజాస్వామ్యంగా భారత్‌ను అప్పుడు దవోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక వర్ణించింది, త్వరలో భారత ఆర్థిక వ్యవస్థ చైనాను దాటిపోతుందని నాటి భారత వాణిజ్య మంత్రి చెప్పారు.భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినప్పటికీ అద్భుతం జరగలేదని జకారియా చెప్పాడు. రెండవది, గత రెండు సంవత్సరాలలో అసాధారణ వృద్ధితో భారత్‌ ప్రపంచ ఐదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో క్లబ్‌లో చేరినప్పటికీ చైనాతో పోల్చితే చాలా చిన్నది. మూడవది, సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత శాస్త్ర విద్యార్థులు భారత్‌ కంటే చైనాలో రెండు రెట్లు ఎక్కువ ఉన్నారు.పరిశోధనఅభివృద్ధికి జిడిపిలో భారత్‌ 0.7శాతం ఖర్చు చేస్తుండగా చైనాలో రెండుశాతం ఉంది. ప్రపంచంలోని ఇరవై పెద్ద టెక్‌ కంపెనీలలో నాలుగు చైనాలో ఉన్నాయి.భారత్‌లో ఒక్కటి కూడా లేదు. ఐదవ తరం మౌలిక సదుపాయాల్లో సగం ఒక్క చైనాయే ఉత్పత్తి చేస్తోంది. భారత్‌లో ఒక్కశాతమే ఉంది.కృత్రిమ మేథ ప్రపంచ పేటెంట్లలో చైనా 65శాతం కలిగి ఉండగా భారత్‌ వాటా మూడుశాతమే. నాలుగవది, ఒక దేశ సత్తాను విశ్లేషించేటపుడు జనాభా ఎందరని కాదు, కార్మికశక్తి నాణ్యత ఎంత అన్నది ముఖ్యం.చైనా కార్మికశక్తి ఉత్పాదకత ఎక్కువ. దుర్భరదారిద్య్రాన్ని చైనా పూర్తిగా నిర్మూలించింది.1980లో ప్రపంచ బ్యాంకు ప్రమాణాల ప్రకారం 90శాతం మంది చైనీయులు దారిద్య్రంలో ఉన్నారు.నేడు దాదాపు లేరు.భారత్‌లో పదిశాతం మందికి పైగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.చైనాలో రెండున్నరశాతం పోషకాహారలేమితో ఉంటే భారత్‌లో 16.3శాతం ఉన్నారు. పిల్లలో పోషకాహారలేమి ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్‌ ఒకటని ఐరాస నివేదిక చెప్పింది. 195051లో మన ఆహారధాన్యాల ఉత్పత్తి 51మిలియన్‌ టన్నులు కాగా ఇప్పుడు 329 మి.టన్నులకు పెరిగింది, అదే చైనాలో 113 నుంచి 695 మిలియన్‌ టన్నులకు పెరిగింది. రెండుదేశాల జనాభా ఒక్కటే, ఎక్కడ జనాల కడుపు నిండుతున్నట్లు ?


ఈ విధంగా కమ్యూనిస్టులు కానివారు చైనా 75 ఏండ్ల ప్రస్తాన ప్రాధాన్యతను తమదైన అవగాహనతో చెప్పారు. చైనాను దెబ్బతీయాలని కమ్యూనిస్టు వ్యతిరేకులు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ కొంత మందికి అతిశయోక్తిగా కనిపించవచ్చుగానీ దెబ్బతీస్తే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకే ముప్పు అని అనేక మంది హెచ్చరిస్తున్నారు. ఏడున్నర దశాబ్దాల క్రితం కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినపుడు ప్రపంచ ఆర్థిక రంగంలో చైనా వాటా కేవలం నాలుగు కాగా, నేడు 19శాతం ఉంది.1990దశకం వరకు పేద, వర్ధమాన దేశాలన్నీ పశ్చిమ ధనికదేశాల మీద ఆధారపడ్డాయి.గడచిన పదిహేనేండ్లుగా పరిస్థితి మారుతోంది.చైనా ప్రభావం పెరుగుతోంది. అది స్వయంగా ప్రారంభించిన బెల్డ్‌ అండ్‌ రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ), ఆసియన్‌ మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంక్‌(ఎఐఐబి), న్యూడెవలప్‌మెంట్‌ బాంకు వంటి సంస్థలు కూడా పేద దేశాలకు సాయపడుతున్నాయి.అయితే కొన్ని చైనా ఎగుమతులు, ప్రాజక్టులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ క్రమంలో నూతన అవకాశాలను వెతుక్కుంటున్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలతో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా చైనాను దెబ్బతీస్తే అది వర్దమానదేశాల మీద ప్రభావం చూపుతుంది.


ఎవరు అవునన్నా కాదన్నా, ఎంతగా గింజుకున్నా చైనాను కాదనలేని స్థితి.యావత్‌ ప్రపంచం హరిత ఇంథన దిశగా మారుతున్నది. దానికి చోదకశక్తిగా డ్రాగన్‌ ఉంది. మూడు నూతన వస్తువులుఎలక్ట్రిక్‌ వాహనాలు, లిథియమ్‌అయాన్‌ బ్యాటరీలు, సోలార్‌ సెల్స్‌` రంగాలలో మిగతాదేశాలన్నీ ఇప్పటికైతే దాని వెనుక నడవాల్సిందే. చిన్నవీ పెద్దవీ చైనా మౌలికవసతుల ప్రాజెక్టులు 190దేశాలు, ప్రాంతాలలో కొనసాగుతున్నాయి. నిమిషానికి ఎనిమిది కోట్ల యువాన్ల (కోటీ 14లక్షల డాలర్లు) మేర వాణిజ్య కార్యకలాపాల్లో చైనా ఉంది. గంటకు 11.2 కోట్లు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నది. రోజుకు 3,377 కోట్ల యువాన్ల మేర విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది.


ఇక గడచిన ఏడు దశాబ్దాల్లో చూస్తే చైనా పేద, వెనుకబడిన దేశంగా ఉన్నంత కాలం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు అది ముప్పుగా కనిపించలేదు. చివరకు కమ్యూనిస్టుల పాలనలో ఉన్నదే అసలైన చైనా అనటమే కాదు, రెండు చైనాలు లేవంటూ ప్రకటించటమే కాదు, భద్రతా మండలిలో తమ సరసన శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు అంగీకరించాయి. అది ఎప్పుడైతే పుంజుకొని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందో అప్పటి నుంచి ‘‘ ముప్పు ’’ గా పరిగణిస్తూ కుట్ర సిద్దాంతాలను జనాల మెదళ్లలో నాటుతున్నారు. నిజానికి చైనా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇంకా ఎంతో వెనుకబడి ఉంది. సాధారణ తలసరి జిడిపి 2023లో అమెరికాలో 76వేల డాలర్లుంటే చైనాలో 12,720 మాత్రమే. వివిధ రంగాలలో దాని వృద్ధి వేగాన్ని చూసి తమ గుత్తాధిపత్యానికి గండిపడుతుందని అవి భయపడుతున్నాయి. తాము రూపొందించిన ఆట నిబంధనలే అమల్లో ఉండాలి, ఎప్పుడు ఎలా మారిస్తే వాటిని ప్రపంచమంతా అంగీకరించాలి, దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే తమకు ముప్పువచ్చినట్లు చెబుతారు. అది ఒక్క చైనా విషయంలోనే అనుకుంటే పొరపాటు. మనదేశం ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నప్పటికీ అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరించటం అమెరికా కూటమికి గిట్టని కారణంగా వ్యతిరేకించిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి. పంజాబ్‌, కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదులను రెచ్చగొట్టింది కూడా దానిలో భాగమే. ఇప్పుడు నరేంద్రమోడీ వారి వైపే మొగ్గుతున్నా పూర్తిగా తమ చంకనెక్కలేదని రుసరుసలాడుతున్నాయి.తామిచ్చిన మద్దతుతో ఉక్రెయిన్‌ జెలెనెస్కీ ఏ విధంగా రష్యాకు వ్యతిరేకంగా ఒక పావుగా మారాడో చైనాకు వ్యతిరేకంగా మనదేశం కూడా అలాంటి పాత్రనే పోషించి ఘర్షణకు దిగాలని అవి కోరుకుంటున్నాయి. దానికి మన దేశంలో ఉన్న కార్పొరేట్‌ శక్తులు అంగీకరించటం లేదు. దానికి కారణం వాటికి చైనా మీద ప్రేమ కాదు, చౌకగా వస్తువులను దిగుమతి చేసుకొని లబ్ది పొందాలనుకోవటమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ సిఎంతో కయ్యానికి కాలుదువ్వుతున్న గవర్నర్‌ : లేని అధికారం చెలాయించబోయి అభాసుపాలైన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ !

10 Thursday Oct 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Anti communist, Arif Mohammed Khan, BJP, LDF, Pinarai Vijayan, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


తనకు లేని అధికారాన్ని చెలాయించబోయి కేరళ గవర్నర్‌ అభాసుపాలయ్యారు.ఉక్రోషం పట్టలేక కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. మలప్పురం జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా బంగారం స్మగ్లింగ్‌,దానితో సంబంధాలున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలపై, సిఎం పినరయి విజయన్‌ చెప్పినట్లు హిందూ పత్రికలో ఆపాదించిన అవాస్తవ అంశాలను అధారం చేసుకొని గవర్నర్‌ సిఎం మీద దాడికి దిగారు. సదరు పత్రికలో వచ్చిన అంశాలపౖౖె నేరుగా 2024 అక్టోబరు ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తనకు నివేదించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్‌, డిజిపి షేక్‌ దర్వేష్‌ సాహిబ్‌లను గవర్నర్‌ ఆదేశించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు.అంతకు ముందు ఇదే అంశం గురించి వివరించాలని, తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని సిఎంకు గవర్నర్‌ లేఖ రాశారు. అయితే ఆ పత్రిక విజయన్‌కు ఆపాదించిన మాటలను ఆయన చెప్పలేదని సవరించుకున్న తరువాత కూడా దాన్నే పట్టుకొని కక్ష సాధించాలని గవర్నర్‌ ప్రయత్నించటం గమనించాల్సిన అంశం. మలప్పురం గురించి సిఎం చెప్పని అంశాలు తమ వార్తలో చోటు చేసుకున్నాయని, ఒక పబ్లిక్‌ రిలేషన్స్‌ ఏజన్సీకి చెందిన వ్యక్తి సిఎంపేరుతో వాటిని కలిపి రాయమని కోరినట్లు ఆ పత్రిక రాసింది. అయితే సిఎం తన ప్రచారం కోసం ఒక ఏజన్సీని నియమించారంటూ ప్రతిపక్షం దాని మీద రాద్దాంతం చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఎలాంటి ఏజన్సీని నియమించలేదని ముఖ్యమంత్రి విజయన్‌ స్పష్టం చేశారు. సిఎంకు రాసిన లేఖకు ఎలాంటి స్పందన లేకపోవటంతో అధికారులు వచ్చి వివరణ ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశించారు.‘‘ దొంగబంగారంతో వచ్చిన సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ సిఎం చెప్పారని, అలాంటి పనికి పాల్పడుతున్నవారెవరు, వారిపై తీసుకున్న చర్య ఏమిటి ?వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సిఎంను కోరాను.‘‘ కొద్ది రోజులు వేచి చూశాను. రాష్ట్రంలో చాలా తీవ్రమైన పరిస్థితి ఉన్నట్లు నాకు కనిపిస్తోంది, సిఎం తన బాధ్యతను విస్మరించారు. నాకు తెలియకుండా ఎందుకు దాచాలని చూస్తున్నారో తెలియటం లేదని విలేకర్లతో గవర్నర్‌ ఆరోపించారు. అధికారులకు గవర్నర్‌ ఆదేశించటంపౖౖె రాజభవన్‌కు సిఎం ఒక లేఖ రాస్తూ అలా నేరుగా పిలిచే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అంగీకారంతోనే సీనియర్‌ అధికారులను పిలవాలని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలను చూపి తనకు సమాచారం ఇవ్వకుండా ఉండజాలరని, రాష్ట్రపతికి నివేదించాల్సి ఉన్నందున వివరణ ఇవ్వాల్సిందేనని సిఎంకు మరొక లేఖ రాశారు. కోరిన సమాచారం ఇవ్వకపోతే నిబంధనలు, రాజ్యాంగబద్దమైన విధి నిర్వహణను ఉల్లంఘించినట్లు అవుతుందని గవర్నర్‌ బెదిరించారు.


తనకు చెప్పకుండా కొన్ని విషయాలను దాస్తున్నారన్న గవర్నర్‌ ఆరోపణలపై సిఎం పినరయి విజయన్‌ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లేఖ రాశారు. తనను పక్కన పెట్టి తన ప్రభుత్వంలో పనిచేసే అధికారులను పిలవటం ఏమిటని ప్రశ్నించారు. సత్యదూరమైన, ఆధారంలేని అంశాలతో గవర్నర్‌ చేసిన ఆరోపణల కారణంగా గౌరవ ప్రదమైన రీతిలో నిరసనతెలపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి తానెలాంటి బహిరంగ ప్రకటన చేయలేదని, గవర్నర్‌ వక్రీకరించిన కథనంపై ఆధారపడ్డారని స్పష్టం చేశారు. కేరళ వెలుపల దొంగబంగారాన్ని పట్టుకున్న వివరాలను కొన్నింటిని తాను సేకరించానని దొంగరవాణా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, గణనీయ మొత్తంలో పన్నుల ఎగవేత జరుగుతుందని అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను కూడా హెచ్చరించానని పేర్కొన్నారు. విమానాశ్రయాల ద్వారా జరుగుతున్న దొంగబంగార రవాణాను అరికట్టాల్సిన ప్రాధమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వ కస్టమ్స్‌శాఖదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను దాని గురించి అడగకూడదని, అయినా ముఖ్యమంత్రితో నిమిత్తం లేకుండా రాష్ట్ర అధికారులను పిలవటం ఏమిటని ప్రశ్నించారు.


అక్టోబరు ఏడవ తేదీ సోమవారం నాడు కేరళ అసెంబ్లీలో జరిగిన అనూహ్య పరిణామంతో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ తమ ఎత్తుగడ వికటించటంతో అల్లరికి దిగింది. దాంతో స్పీకర్‌ సమావేశాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు.తాము సంధించిన 49 ప్రశ్నలను నక్షత్ర గుర్తు కలవిగా పరిగణించి సభలో ప్రత్యక్షంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా స్పీకర్‌ కార్యాలయం వాటిలో ఎక్కువ భాగం రాతపూర్వక సమాధానాలు ఇచ్చే ప్రశ్నలుగా మార్చివేసిందంటూ ప్రశ్నోత్తరాల సమయంలో యుడిఎఫ్‌ సభ్యులు గొడవకు దిగారు. ఆ సందర్భంగా స్పీకర్‌కు దురుద్ధేశ్యాలను ఆపాదించటంతో పాటు పోడియం ముందుకు వెళ్లి అల్లరి చేశారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేత సతీశన్‌ తన స్థానంలోకి వెళ్లారు. అయితే కొందరు కాంగ్రెస్‌ సభ్యులు అల్లరి కొనసాగిస్తుండగా అసలు ప్రతిపక్ష నేత ఎవరూ, మీరందరూ నేతలేనా అని ప్రశ్నించటాన్ని సతీశన్‌ తప్పుపడుతూ తమను అవమానించారని, స్పీకర్‌ ఎఎం శంషీర్‌ పరిణితిలేకుండా మాట్లాడారని, ఆ పదవికే అవమానమని తీవ్రంగా ఆరోపించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి అవినీతి పరుడని ఆరోపించారు. తమ ప్రశ్నల స్వభావాన్ని మార్చినందుకు నిరసనగా ప్రశ్నోత్తరాల సమయాన్ని బహిష్కరించినట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత, యుడిఎఫ్‌ సభ్యుల తీరును ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. ప్రతిపక్ష నేత దిగజారిన వ్యక్తని పదే పదే ప్రదర్శించుకుంటున్నారని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ప్రతిపక్షనేతను చూడలేదని దుయ్యబట్టారు. స్పీకర్‌ మీద చేసిన విమర్శలను ఖండిరచాలన్నారు. తనను అవినీతి పరుడని ప్రతిపక్ష నేత అంటే కుదరదని సమాజం అంగీకరించదని అన్నారు.


ప్రశ్నోత్తరాల బహిష్కరణ తరువాత జీరో అవర్‌లో సభలో ప్రవేశించిన యుడిఎఫ్‌ సభ్యులు మరోసారి అల్లరికి దిగారు. ప్రతిపక్ష నేత సతీశన్‌ మాట్లాడుతూ తనపై సిఎం చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, సిఎం మాదిరి అవినీతి పరుడు కాకుండా చూడమంటూ తాను ప్రతిరోజూ భగవంతుడిని ప్రార్ధిస్తానని చెప్పుకున్నారు. దాంతో ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పాటు తమ వెంట తీసుకువచ్చిన బానర్‌ను ప్రదర్శించారు. ప్రతిపక్ష సభ్యులను అడ్డుకొనేందుకు కొందరు అధికారపక్ష సభ్యులు కూడా ముందుకు రావటంతో స్పీకర్‌ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. హిందూ పత్రిక ప్రతినిధితో సిఎం ముఖాముఖి మాట్లాడినదానిని వక్రీకరించి వార్త రాశారు. సిఎం చెప్పని అంశాలను ఒక ప్రజాసంబంధాల సంస్థ ప్రతినిధి జోడిరచమని కోరగా రాసినట్లు సదరు పత్రిక తరువాత తప్పును సవరించుకుంటూ పెద్ద వార్తను ఇచ్చింది. అసలు తామే సంస్థను నియమించలేదని, అవసరం కూడా లేదని విజయన్‌ స్పష్టం చేసినప్పటికీ దాని గురించి సభలో అల్లరి చేసేందుకు కాంగ్రెస్‌ ఎత్తువేసింది. దానిలో భాగంగా ఆ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చింది. అక్కడే కాంగ్రెస్‌ పప్పులో కాలేసింది. ఇతర అంశాల మీద ప్రతి పక్షాలు ఇచ్చిన వాటిని చర్చకు అంగీకరించారు తప్ప నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలతో కూడిన వాయిదా తీర్మానాలను ఏ రాష్ట్ర అసెంబ్లీ లేదా పార్లమెంటులో ఆమోదించిన దాఖలాలు ఇంతవరకు లేవు. బహుశా చరిత్రలో మొదటి సారిగా కేరళలో జరిగింది. తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరిస్తారని, కనీసం సభలో ఉంచరని, దాన్ని అవకాశంగా తీసుకొని అల్లరి చేయాలనే ఎత్తుగడతో వచ్చిన కాంగ్రెస్‌ను ఊహించని విధంగా సిఎం దెబ్బతీశారు. ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని, మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడుగంటల పాటు ఇతర కార్యక్రమాలను వాయిదా వేసి చర్చించటానికి అంగీకరిస్తూ విజయన్‌ ప్రకటించారు. ఆ తరువాత జీరో అవర్‌లో సభలోకి వచ్చిన కాంగ్రెస్‌ సభ్యులు తాము అనుకున్నదొకటి అయింది ఒకటని గ్రహించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిరసనపేరుతో సభలో గందరగోళం సృష్టించి సభను వాయిదాపడేట్లు చేశారు. ఇలాంటి తీర్మానాలపై చర్చ తరువాత చివరగా ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు, అంతటితో చర్చ ముగుస్తుంది. ప్రతిపక్ష ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికారపక్షం పూర్తిగా సమాయత్తమైందని గ్రహించి తమ ఆరోపణల బండారం బయటపడుతుందని భావించిన కాంగ్రెస్‌ అల్లరికి దిగిందన్నది స్పష్టం.


వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన మద్దతుతో మలప్పురం జిల్లా నుంచి రెండుసార్లు గెలిచిన స్వతంత్ర సభ్యుడు పివి అన్వర్‌ గత కొద్ది నెలలుగా సంఘటన నుంచి వెళ్లిపోయేందుకుగాను సిపిఎం, సిఎం, ఇతరుల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. అతగాడిని చేర్చుకొనేందుకు కాంగ్రెస్‌ కూడా సిద్దంగా లేదు. దాంతో డిఎంకెలో చేరి కేరళలో ఆ పార్టీ ఏర్పాటు, లేదా తమిళనాడు ముస్లింలీగుతోనైనా చేతులు కలపాలని పావులు కదిపారు. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో సత్సంబంధాలు కలిగిన డిఎంకె నేత స్టాలిన్‌ అందుకు అంగీకరించలేదు, కనీసం అన్వర్‌ కలుసుకొనేందుకు సమయం కూడా ఇవ్వలేదు. అక్కడి ముస్లిం లీగ్‌ కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నందున అది కూడా విముఖత చూపింది. దాంతో డిఎంకె అనే పేరు వచ్చేట్లుగా డెమోక్రటిక్‌ మువ్‌మెంట్‌ ఆఫ్‌ కేరళ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని రాజకీయాలు నడపాలని అన్వర్‌ నిర్ణయించుకున్నారు.డిఎంకె నేతలు ధరించే రంగు కండువాలను కప్పుకొని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు.


మలప్పురం జిల్లాలో బంగారం స్మగ్లింగ్‌ జరుగుతోందని, వచ్చిన సొమ్మును దేశవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటూ ముఖ్యమంత్రి మాట్లాడి జిల్లాను అవమానించారని అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేశారు. సిఎం అలాంటి ఆరోపణలు చేయలేదని, అసలు ఆ జిల్లాను ఏర్పాటు చేసిందే కమ్యూనిస్టులని, నాటి కాంగ్రెస్‌ నేతలు జనసంఘంతో కలసి జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారని, అలాంటి పార్టీతో ముస్లింలీగ్‌ స్నేహం నెరుపుతున్నదని సిపిఎం తిప్పికొట్టింది. ఆ జిల్లా గురించి మాట్లాడేందుకు ఎవరికీ యాజమాన్య హక్కులు లేవని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పారు. తాము మెజారిటీ, మైనారిటీ మతోన్మాదాలు రెండిరటినీ వ్యతిరేకిస్తామని అన్నారు. రెండవ సారి విజయన్‌ అధికారానికి వచ్చిన తరువాత ప్రతిపక్ష యుడిఎఫ్‌, ఇతర శక్తులు ఒక అవకాశవాద కూటమిగా చేతులు కలిపి మీడియాలో కొన్ని సంస్థల మద్దతుతో 1957నాటి తొలి కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విముక్తి ఆందోళన మాదిరి రెచ్చగొట్టేందుకు పూనుకున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నది. వెనుకబాటు తనంతో ఉన్న కారణంగా ముఖ్యమంత్రిగా నంబూద్రిపాద్‌ ప్రత్యేక జిల్లాగా మలప్పురాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఒక చిన్న పాకిస్తాన్ను ఏర్పాటు చేస్తున్నారంటూ నాడు జనసంఫ్‌ు పార్టీ ఆరోపించిందని, దానితో చేతులు కలిపింది కాంగ్రెస్‌ అని చెప్పారు. ఒకప్పుడు ముస్లింలు, కమ్యూనిస్టులను పోలీసులుగా తీసుకొనేవారు కాదని నంబూద్రిపాద్‌ అధికారానికి వచ్చిన తరువాత పరిస్థితి మారిందన్నారు. సిపిఎంలో దేవుడిని నమ్మేవారు, నమ్మని వారు కూడా పని చేయవచ్చని, తమ మద్దతుతో రెండు సార్లు గెలిచిన స్వతంత్ర సభ్యుడు అన్వర్‌ ఇప్పుడు జమాతే ఇస్లామీ, ఎస్‌డిపిఐ, యుడిఎఫ్‌ మద్దతుతో అసత్యాలను ప్రచారం చేస్తున్నట్లు గోవిందన్‌ చెప్పారు. ముస్లింలీగ్‌, జమాతే ఇస్లామీ రెండూ కూడా ఎన్‌డిపిఐ భావజాలంతో ముస్లింలను సమీకరిస్తున్నాయని విమర్శించారు. అలప్పూజ, పాలక్కాడ్‌ జిల్లాల్లో పోలీసులు గట్టిగా జోక్యం చేసుకున్న తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌`ఎస్‌డిపిఐ మతహింస అదుపులో ఉందని, అవి రెండూ సిపిఎం మీద రాజకీయదాడి చేస్తున్నాయంటే మతశక్తులకు వ్యతిరేకంగా తాము పనిచేస్తున్నదానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ ఓట్లు బిజెపికి పడిన కారణంగానే త్రిసూర్‌లో ఆ పార్టీ గెలిచిందని చెప్పారు.

కేరళలో మీడియా వివాదాల తయారీ కేంద్రంగా మారిందని సిఎం పినరయి విజయన్‌ విమర్శించారు. వయనాడ్‌లో జరిగిన ప్రకృతి విలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ఇచ్చారని ఆ కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు. తప్పుడు వార్తల కారణంగా రాష్ట్రం అనర్హమైన సాయం పొందేందుకు చూస్తోందనే తప్పుడు అభిప్రాయం కలుగుతోందని అన్నారు. వీటి ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయటమేనని, వాటిని ఆధారం చేసుకొని ప్రతిపక్షం విమర్శలకు దిగుతున్నదని అన్నారు. కేంద్రానికి సమర్పించిన మెమోరాండాన్ని నిపుణులు రూపొందించారు తప్ప మంత్రులు కాదని, దానిలోని అంకెలనే తీసుకొని మీడియా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నదని అన్నారు. విధ్వంసం నుంచి కోలుకొనేందుకు రాష్ట్రం చూస్తుంటే టీవీ ఛానల్స్‌ రేటింగ్స్‌ పెంచుకొనేందుకు ఛానల్స్‌ చూస్తున్నాయన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చమురు ధరలపై మాటతప్పటం, మడమ తిప్పటానికి నిలువెత్తు నిదర్శనం నరేంద్రమోడీ ! సనాతనం సంగతి తరువాత పవన్‌ కల్యాణ్‌ ముందు జనం సంగతి చూస్తారా ?

04 Friday Oct 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, fuel politics, Fuel prices freezing, Narendra Modi Failures, Pawan kalyan, Sanatana, Tirupati Laddu Controversy


ఎం కోటేశ్వరరావు


పశ్చిమాసియాలో తలెత్తిన తాజా పరిస్థితి కారణంగా ముడి చమురు ధరలు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. బ్రెంట్‌ రకం ముడి చమురు ధర అక్టోబరు ఒకటి నాలుగువ తేదీన ఈ విశ్లేషణ రాస్తున్న సమయానికి 70.40 నుంచి 78.66 డాలర్లకు పెరిగింది. ఒక్క మనమీదే కాదు, చమురు దిగుమతి చేసుకొనే అందరి పరిస్థితి అదే. అయితే పెరుగుదల లేకపోగా తగ్గినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా మన జేబులను కొల్లగొడుతున్నది.ఎదుటి వారి జేబులో పర్సు కొట్టేసినపుడు దాన్లో ఎంత డబ్బు ఉంది అని అడుగుతాం, కానీ 912 రోజులుగా ప్రతి రోజూ పెట్రోలు బంకులో కొల్లగొడుతుంటే ఎంత అని ఎవరూ పట్టించుకోవటం లేదు. అఫ్‌ కోర్స్‌ అది కష్టపడిన సొమ్ము కాదనుకుంటే వదిలేద్దాం ! నరేంద్రమోడీని వ్యతిరేకించేవారికి అలా కావాల్సిందే అని ఎవరైనా అంటే సరే, దేశంకోసంధర్మం కోసం అంటూ మోడీని కొలిచేవారికి, ఆరాధించేవారికి కూడా ఎలాంటి మినహాయింపులు లేకుండా క్షవరం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం రష్యా నుంచి మనం చమురు దిగుమతుల కారణంగా 202223 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 2,500 కోట్ల డాలర్లు (తాజా రూపాయి మారకపు విలువలో చూస్తే రెండు లక్షల కోట్ల మేరకు) కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు తగ్గింది. పోనీ ఈ మేరకు వినియోగదారులకు ఒక్క పైసా అయినా మోడీ తగ్గించారా ? 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఈ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన మేరకు సవరించకుండా కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అంటూ అంతకు ముందు ప్రతిరోజూ సవరించిన ధరల విధానాన్ని ఎందుకు పక్కన పెట్టారో జవాబుదారీ తనం గురించి తమ భుజాలను తామే చరచుకొనే పెద్దలు ఎవరైనా చెబుతారా ? మోడీ అలాంటి పెద్దలను, గద్దలను పక్కన పెడదాం, అసలు జనంలో ప్రశ్నించే గుణం ఎందుకు అంతరించినట్లు ? ఆక్రమిత కాశ్మీరులో పాక్‌ ప్రభుత్వం భారాలు పెంచితే వాటిని భరించలేక అక్కడి జనం మనదేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నట్లు వస్తున్న వీడియోలను చూపి కొందరు వీరంగం వేస్తుంటారు. ఇక్కడి జనం మీద మోడీ మోపుతున్న భారాలను తప్పించుకొనేందుకు ఎక్కడికి పోవాలి ? పాకిస్తాన్‌ సుత్తి ఇనుపదైనా భారత్‌ది బంగారపుదైనా తల పగులుతుంది.


పశ్చిమ దేశాల ఆంక్షలను పక్కకు నెట్టి రష్యా నుంచి చమురు కొనుగోలు ద్వారా కలుగుతున్న ఆర్థిక లబ్ది పూర్తిగా జనానికి దక్కుతున్నదా ? లేదు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు మన అవసరాల్లో కేవలం రెండు శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే ఇప్పుడు 40శాతం దాటింది. ఈ మొత్తాన్ని ఎవరు దిగుమతి చేసుకుంటున్నారు. ఉదాహరణకు 2024ఏప్రిల్‌ నెలలో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు పదిన్నరలక్షల పీపాలు దిగుమతి చేసుకుంటే అంబానీ రిలయన్స్‌, నయారా అనే మరో ప్రైవేటు సంస్థ ఎనిమిది లక్షల పీపాలు దిగుమతి చేసుకున్నాయి. ఈ దామాషా ప్రతి నెలా స్వల్పంగా మారుతున్నది. దీని అర్ధం ఏమిటి ? ప్రభుత్వ రంగ సంస్థలు దిగుమతి చేసుకుంటే ఆ రాయితీ సొమ్ము జనానికి దక్కుతుంది, ప్రైవేటు వారిని అనుమతిస్తే వారి జేబుల్లోకి పోతుంది. నరేంద్రమోడీ అనుసరిస్తున్న విధానం ఇప్పుడు జనం కంటే అంబానీ, నయారా కంపెనీలకు లబ్ది చేకూర్చటమే ప్రధాన కర్తవ్యంగా ఉంది. రవాణా ఖర్చుతో సహా రష్యా నుంచి మనదేశం చేరటానికి ఒక పీపా ధర 2024లో 76.39 డాలర్లు కాగా, ఇతర దేశాల చమురు ధర 85.32 డాలర్లు ఉంది.(ఇండియన్‌ బాస్కెట్‌ రష్యన్‌ క్రూడ్‌ ఆయిల్‌ ప్రైస్‌ అని గూగుల్‌ తల్లిని అడిగితే బిడ్డా కృత్రిమ మేధ వీక్షణం ఇలా ఉంది అంటూ ఆంగ్లంలో సమాచారం అందిస్తుంది. వినిపిస్తుంది, అడిగిన సమయాన్ని బట్టి ధరలు మారుతుంటాయి). ప్రైవేటు కంపెనీలు ఇలా తక్కువ ధరకు కొని ఏం చేస్తున్నాయంటే శుద్ధి చేసి డీజిల్‌, పెట్రోల్‌ ఇతర ఉత్పత్తులను పోటీ ధరలకు ఐరోపా దేశాలకు ఎగుమతులు చేసి అక్కడా లాభాలు పిండుతున్నాయి. ఈ విషయాలేవీ మన్‌కి బాత్‌లోనో ఎన్నికల ప్రచారంలోనో మోడీ మనకు చెప్పరు, గోడీ మీడియా ఇలాంటి వాటి మీద చర్చ పెట్టదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదుల్చుతున్నారు. ఇది గోడదెబ్బ అనుకుంటే చెంపదెబ్బ ఎలా కాడుతున్నారో తెలుసా ? మోడీ అధికారానికి వచ్చిన 201415 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ (పిపిఏసి) సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 202021 నాటికి సెస్‌ల పేరుతో రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 202324 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచుతామంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 201415లో ప్రభుత్వప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 202324నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇలాంటి పాలనతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు.


ప్రారంభంలోనే చెప్పుకున్నట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఒకటి రెండు సార్లు తప్పితే రోజువారీ ధరలను సవరించటం నిలిపివేశారు. మోడీ మీద ఎంత మోజున్నా ఇలా చావబాదుతుంటే భరించటం ఏమిటో అర్ధం కావటం లేదు. చమురు బిల్లు మన రూపాయల్లో 12.6లక్షల కోట్ల నుంచి 10.97లక్షల కోట్లకు తగ్గింది, కేంద్ర సర్కార్‌కు రు.1.64 కోట్లు మిగిలింది. పోనీ ఈ మేరకైనా వినియోగదారులకు తగ్గించారా అంటే లేదు. వంట గ్యాస్‌ వంటి ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలన్నీ ఇదే విధంగా తగ్గాయి. దిగుమతుల మొత్తం స్వల్పంగా పెరిగినప్పటికీ కేంద్రానికి భారం తగ్గింది. బిజెపి, తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు కానీ దోపిడీ కూడా చేయకూడదు కదా ! చమురు కొనుగోలులో తగ్గిన మేరకు వినియోగదారులకు అందించకుండా మిగిలిన సొమ్మును దేనికి ఖర్చు చేస్తున్నది ? పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రాయితీలు, సబ్సిడీల కోసం, వారు తీసుకున్న రుణాలు ఎగవేసినపుడు బాంకులకు నిధులు సమకూర్చటం కోసం వాటిని మళ్లిస్తున్నది. దీన్ని ఎవరైనా కాదనగలరా ? గతంలో సెస్‌లను భారీగా ఎందుకు అలా పెంచారంటే దేశ రక్షణకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని బిజెపి పెద్దలు దబాయించేవారు. ఆ భారాలను తగ్గించలేదు, ధర తగ్గినా రేట్లు అలాగే ఉంచారు. మన దేశం 202223లో 15,750 కోట్ల డాలర్లు చెల్లించి చమురు దిగుమతి చేసుకుంది. మరుసటి ఏడాది చమురు బిల్లు 13,240 కోట్ల డాలర్లకు తగ్గింది.ఈ మేరకు మోడీ సర్కార్‌ వినియోగదారులకు ధరలు తగ్గించిందా ?ఎందుకు తగ్గించ లేదు. చమురు బిల్లు తగ్గటానికి కారణం ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గటం, రష్యా నుంచి 40శాతం దిగుమతులను రాయితీ ధరలకు పొందటం. తాజాగా బాంక్‌ ఆఫ్‌ అమెరికా నివేదికలో చెప్పినదాని ప్రకారం 2022 ఏప్రిల్‌ మొదటి వారంలో ఇంథన ధరలను చివరి సారిగా సవరించిన తరువాత ముడి చమురు ధరలు 20శాతం తగ్గాయి.2023 సెప్టెంబరు నుంచి 2024 మార్చినెల మధ్య లీటరు డీజిలు ధర రు.9 తగ్గింది.దీని వలన ఏటా లక్షకోట్ల రూపాయలు లేదా జిడిపిలో 0.3శాతం కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం లేదా లాభం సమకూరుతున్నట్లు దానిలో పేర్కొన్నారు. గతంలో రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీని ఈ విధంగా పూడ్చుకున్నట్లయిందని కూడా అది అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పింది. ఇంథన ధరలను తగ్గిస్తే ద్రవ్యోల్బణం తగ్గుతుందని కూడా పేర్కొన్నది. పీపాకు పది డాలర్లు తగ్గితే ఏటా 1,300 కోట్ల డాలర్ల మేర ప్రభుత్వానికి మిగులుతాయి. ఇప్పుడున్న డాలరు మారకం (రు.84) ప్రకారం లక్షా తొమ్మిది వేల కోట్లు మిగులుతాయి. యుపిఏ పాలన చివరి ఏడాది నుంచి ఇప్పటి వరకు మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా సగటు ధరలు ఇలా ఉన్నాయి.

2013-14—-105.52
2014-15--- 84.16 2015-16—– 46.17
2016-17--- 47.56 2017-18—– 56.43
2018-19----69.88 2019-20—– 60.47
2020-21----44.82 2021-22—–79.18
2022-23----93.15 2023-24—– 82.58
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 81.95 డాలర్లు ఉంది. దీనికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా గడచిన రెండున్నర సంవత్సరాలుగా వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నది కేంద్ర ప్రభుత్వం.2022 ఏప్రిల్‌ ఆరున ఢల్లీిలో లీటరు పెట్రోలు రు.105.41, డీజిల్‌ రు.96.67గా సవరించిన వాటిని మే 22వ తేదీన రు.96.72, 89.62 చొప్పున సవరించారు. ఈ ధరలను 2024 మార్చి నెల 21వరకు కొనసాగించి మరుసటి రోజు నుంచి రెండేసి రూపాయల చొప్పున తగ్గించారు.తరువాత ధరలలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. వివిధ రాష్ట్రాలలో ఉన్న వాట్‌ ప్రకారం ధరలలో తేడాలు ఉంటాయి. ఉదా రెండు తెలుగు రాష్ట్రాలలో లీటరు పెట్రోలు రు.109 ఉంది. ప్రకటించిన విధానం ప్రకారమైతే ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అనేక సార్లు సవరించి ఉండాల్సింది.ఏప్రిల్‌ నెలలో 89.44 డాలర్లు ఉన్నది కాస్తా సెప్టెంబరుకు 73.69కి తగ్గింది, పదహారు డాలర్లు తగ్గినా పదహారు పైసలు కూడా తగ్గించలేదు.


ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తాం, తాటవలుస్తాం అందుకే పార్టీని పెట్టాం అని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ప్రకటించారు. కమ్యూనిస్టులు తెల్లారిలేస్తే ఇలాంటి పిలుపులే ఇస్తుంటారు వారికి అలవాటైపోయింది అని పట్టించుకోని జనం నిజమే కదా కొత్త హీరో వచ్చాడు అనుకున్నారు.(జనం స్పందించనంత మాత్రాన కమ్యూనిస్టులు పిలుపులు ఇవ్వటం, కార్యకర్తలతో నిరసన తెలపటం మానుకోలేదు) 2019కి ముందు నరేంద్రమోడీని, చంద్రబాబు నాయుడిని అదే మాదిరి నిలదీశారు. తరువాత నరేంద్రమోడీతో చేతులు కలిపారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని 2024 ఎన్నికల వరకు నిలదీశారు, తాటవలిచారు. కేంద్రానికి చెందిన సమస్యలపై నిలదీయరేమి అన్నపుడు మేము అధికారంలోలేము కదా అని తప్పుకున్నారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి. వందశాతం స్ట్రైక్‌ రేటు ఉంది. జనం సమస్యలను వదలి సనాతన ధర్మ పరిరక్షకుడి అవతారమెత్తారు. తనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మానవత్వం అంటూ కబుర్లు చెప్పిన మీరు ఇదేమిటి స్వామీ అంటే ముందునేను సనాతన హిందువును అంటున్నారు, ఆ ముక్క ఎన్నికల ముందు చెప్పలేదు. సినిమా స్క్రిప్ట్‌ మారిపోయింది. పోనీ హిందువులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నారా ? రాష్ట్రంలో తొంభై శాతం హిందువులే ఉన్నారు. ధరలు, దరిద్రం, నిరుద్యోగాలను భరించటం కూడా అదే శాతం ఉంది. కేంద్రం, రాష్ట్రం మోపుతున్న భారాలను కూడా భరిస్తున్నారు. వారికేమీ రాయితీలు లేవు. నాలుగువేల మంది విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు పూనుకుంటే మొత్తం సిబ్బందికి అలవెన్సులు కోత పెడుతుంట ఇదేం అన్యాయం అనటానికి హీరోకు నోరు రాలేదు. పెడుతుంటే నిలదీయలేదు. వరదలతో భారీగా నష్టపోయిన విజయవాడ, ఇతర ప్రాంతాల్లో జనాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం ఒక్క పైసా విదల్చకపోయినా అడిగింది లేదు. అమరావతి నిర్మాణానికి పెద్ద మొత్తంలో గ్రాంట్లు తెస్తామంటూ ప్రగల్భాలు పలికి పదిహేనువేల కోట్ల అప్పు ఇప్పిస్తామంటే అబ్బో ఇదే మహాభాగ్యం అన్నట్లు భజన చేస్తున్నారు. పోలవరం బాధితులకు నష్టపరిహారం సంగతి తేల్చకున్నా నోరు విప్పరు. ఇంథన ధరలు కేవలం రాష్ట్ర సమస్య కానప్పటికీ వినియోగించే పెద్ద రాష్ట్రాలలో ఒకటి గనుక మిగతా అంశాలతో పాటు చమురు ధరల తగ్గింపును పవన్‌ కల్యాణ్‌ నిలదీస్తారా ? ఇంథన కొనుగోలు సర్దుబాటు చార్జీల పేరుతో 2022`23 సంవత్సరానికే రు.8,113 కోట్లు చెల్లించాలని మూడు డిస్కామ్‌లు కోరాయి. ఇది గాక మరుసటి సంవత్సర మొత్తం మరో పదకొండువేల కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. దీన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా, జగన్‌ చేసిన పాపం అంటూ జనం నెత్తిన బాదుతారా ? సమస్యలను పక్కదారి పట్టించేందుకు సనాతన ధర్మ కబుర్లతో కాలక్షేపం చేస్తారా ? చంద్రబాబు ఎలాగూ నోరువిప్పరు. పవన్‌ కల్యాణ్‌ హీరో అని నిరూపించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

లడ్డు రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టికాయలు : లీకు వీరుడు చంద్రబాబు పప్పులో కాలేశారా ?

02 Wednesday Oct 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, TDP, Ycp

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Narendra Modi, Pawan kalyan, Tirupati Laddu Controversy, YS jagan

ఎం కోటేశ్వరరావు


లడ్డు కల్తీ ఉదంతంలో దోషులుగా ఎవరు తేలతారో, ఏ శిక్షలు అనుభవిస్తారో ఆ భగవంతుడికే ఎరుక. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారవుతుందా అన్నది ఒక అనుమానం. కానీ తిరుమల శ్రీనివాసుడితో నిమిత్తం లేకుండా సుప్రీం కోర్టులో దాఖలైన పలు కేసులు, ఈ వివాదం నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. కల్తీ గురించి దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వ వేసిన సిట్‌ సరిపోతుందా లేక మరొక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అవసరమో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలంటూ అక్టోబరు మూడవ తేదికి కోర్టు వాయిదా వేసింది. కేంద్రం ఏమి చెబుతుందో కోర్టు ఏమి నిర్ణయిస్తుందో తెలియదు. అయితే అప్పటి వరకు సిట్‌ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ డిజిపి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. నిజానికి సిట్‌ దర్యాప్తు నిలిపివేయాలని కోర్టు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే నష్టనివారణ చర్యగా కనిపిస్తున్నది. లడ్డూలలో వాడే నేతిలో కల్తీ ఉందంటూనే దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఇచ్చిన నివేదికలో ఎన్‌డిడిబి లాబ్‌ తన జాగ్రత్తలు తాను తీసుకుంది. దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా మార్చి జగన్మోహన్‌ రెడ్డిని మరింతగా దెబ్బతీయవచ్చని ఎవరైనా సలహా ఇచ్చారో లేక తనంతట తానే నిర్ణయం తీసుకున్నారో తెలియదుగానీ లాబ్‌ నివేదికను బహిర్గతం చేసి చంద్రబాబు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. దాని గురించి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెల్లడిరచిన అభిప్రాయాలు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని ఇరకాటంలోకి నెట్టాయి. లడ్డూలో కల్తీకి పరిహారంగా లడ్డు పోటు, ఇతర ప్రాంతాలను ఆలయం శుద్ది చేసింది. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఏకంగా తానేమీ తక్కువ కాదన్నట్లు పదకొండు రోజుల దీక్ష పేరుతో చేసిన హడావుడి చూశాము. కల్తీ గురించి సిట్‌ వేసినపుడు దాని నివేదిక రాకుండా ముందుగానే ఉన్నట్లు కల్తీ గురించి సిఎం ఎలా ప్రకటిస్తారు ? అంటే మీకే స్పష్టత లేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కోట్లాది మంది మనోభావాల మీద ప్రభావం చూపే అంశాలను నిర్ధారించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మాట్లాడటం సరికాదని, దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని కూడా వ్యాఖ్యానించింది. అనేక కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు తీర్పుల్లో కనిపించవు. ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియదు.


నెయ్యి కల్తీ నివేదిక గురించి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరువాత ప్రతికూల స్పందనలు రావటంతో కొంత మంది కొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. అసలు చంద్రబాబు నివేదికను బయటపెట్టాలనుకోలేదని, వందరోజుల పాలన సందర్భంగా ఎంఎల్‌ఏతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఎన్‌డిడిబి నివేదికను యథాలాపంగా ప్రస్తావించారని చెబుతున్నారు. దాన్ని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి సవాలు చేయటంతో అనివార్యంగా తెలుగుదేశం పార్టీ సదరు నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని సమర్ధించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి లీకు వీరుడు అనే మారు పేరు ఉంది. అనేక అంశాలను కావాలనే వేరే మార్గంలో బయటపెట్టించి స్పందనను బట్టి దాన్ని వాడుకోవటం అలవాటు. గతంలో ప్రపంచ బ్యాంకు పధకాలను అమలు చేసే క్రమంలో వాటికి జనం మద్దతు కూడగట్టటం కోసం ఏ శాఖలో ఎంత అవినీతి ఉందో అనే సర్వేలు చేయించి వాటిని మీడియాకు అందచేసిన తీరు జనం మరచిపోయినా అది వాస్తవం. ఇప్పుడు లడ్డూ కల్తీలో ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. ఇప్పుడు ఒకవేళ సుప్రీం కోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించితే దాని మీద స్పందన ఎలా ఉంటుందో తెలియదు. అలాగాక ఇప్పుడు వేసిన సిట్‌ను కొనసాగిస్తే ముందే కల్తీ గురించి సిఎం చెప్పిన తరువాత దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వటం తప్ప వేరే ఏముంటుందని జనం భావిస్తారు. ఒకవేళ సిబిఐ విచారణ జరిపితే మూడు పార్టీల కూటమికి అనుకూలంగా దాని నివేదిక ఉంటుందని కూడా అదే జనం భావిస్తారు. విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది.


దేశ రాజకీయాల మీద చంద్రబాబు చూపిన ప్రభావం గురించి గతంలో ఎన్నో చెప్పుకున్నాం, ఇప్పుడు పలు దేవాలయాల్లో ప్రసాదాల మీద కూడా ‘‘ ప్రభావం ’’ చూపారని వార్తలు. అదేమిటంటే భక్తులు ప్రసాదాల పట్ల ముఖ్యంగా లడ్డుపట్ల అనుమానంగా చూస్తున్నారట. మీడియాలో వచ్చిన వివరాలను బట్టి బయటి సంస్థలు సరఫరా చేసే ప్రసాదాల మీద పూర్తి నిషేధం విధించాలని అయోధ్యలోని రామజన్మ భూమి దేవాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ డిమాండ్‌ చేశారు. తయారీ, పంపిణీలో మార్పులు తేవాలని, ఆలయ పూజారుల పర్యవేక్షణలో తయారు చేయాలని కోరారు. దేవాలయాల్లో వినియోగిస్తున్న నెయ్యి స్వచ్చత పట్ల ఆందోళన వెల్లడిరచారు. నైవేద్యాలలో కల్తీ ద్వారా దేవాలయాలను అపవిత్రం చేయాలన్న అంతర్జాతీయ కుట్ర ఉందని ఆరోపించారు.వాణిజ్య పద్దతిలో తయారు చేసే తీపి పదార్ధాల బదులు పండ్లు, పూల వంటి సహజ వస్తువులతో ప్రసాదాలను తయారు చేయాలని మధుర లోని ధర్మ రక్ష సంఫ్‌ు ప్రకటించింది. సంస్థ జాతీయ అధ్యక్షుడు సౌరవ్‌ గౌర్‌ మాట్లాడుతూ ప్రసాదాల తయారీలో మార్పులు తేవాలని, తిరిగి సాంప్రదాయ పద్దతులకు మరలాలని సంస్థలు, మత నేతలలో ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. సంగం నగరంగా పిలుస్తున్న ప్రయాగ్‌ రాజ్‌ (గతంలో అలహాబాదు) అలోప్‌ శంకరిదేవి, బడే హనుమాన్‌, మంకమేశ్వర వంటి వాటితో సహా అనేక దేవాలయాల్లో భక్తులు తెచ్చే స్వీట్లు తదితర పదార్ధాలను అర్పణలకు అనుమతించకుండా నిషేధించారు. లలితా దేవి ఆలయ ప్రధాన పూజారి శివమూర్తి మిశ్రా మాట్లాడుతూ భక్తులు కేవలం కొబ్బరి కాయలు, పండ్లు, ఎండిన పండ్లు మాత్రమే తేవాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వెల్లడిరచారు.స్వీట్ల స్వచ్చత నిరూపితమయ్యే వరకు వాటిని దేవాలయాల్లో అనుమతించకూడదని లక్నోలోని మంకమేశ్వర దేవాలయ మహంత్‌ శ్రీధరానంద బ్రహ్మచారి జీ మహరాజ్‌ చెప్పారు. వెలుపలి నుంచి భక్తుల ప్రసాదాలు, సీట్లను అనుమతించేది లేదని అలోప్‌ శంకరీదేవి దేవాలయ ప్రధాన పూజారి, శ్రీ పంచాయతీ అఖారా మహానిర్వాణి కార్యదర్శి యమునా పూరీ మహరాజ్‌ ప్రకటించారు. సంగం తీరంలోని బడే హనుమాన్‌ మహంత్‌ బల్బీర్‌ జి మహరాజ్‌ మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణ నిర్మాణం పూర్తయిన తరువాత లడ్డుపేడ ప్రసాదాలను యాజమాన్యమే తయారు చేయనుందన్నారు.పక్కా హిందూత్వవాది యోగి పాలనలోనే పరిస్థితి ఇలా ఉంది.మధ్య ప్రదేశ్‌లోని సేహోర్‌లోని ప్రముఖ వింధ్యవాసినీ బీజాసన్‌ దేవీ దేవాలయ ప్రాంగణంలో స్వయం సహాయక బృందం విక్రయిస్తున్న లడ్డుల విక్రయాన్ని నిలిపివేయాలని ట్రస్టు సభ్యులు జిల్లా కలెక్టకర్‌కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. లడ్లు వాసన వస్తున్నాయని, రుచిలో తేడా ఉందని భక్తులు చెబుతున్నారని ట్రస్ట్‌ చైర్మన్‌ మహేష్‌ ఉపాధ్యాయ చెప్పారు. ఈ దేవాలయం భోపాల్‌కు 70కిలో మీటర్ల దూరంలో ఉంది.అయితే తాను సదరు స్వయం సహాయక బృందంతో మాట్లాడానని సమస్య పరిష్కారమైందని కలెక్టర్‌ చెప్పారు.

మన దేశంలో ప్రసాదాల గురించి భక్తులు అనుమానించటం కొత్తేమీ కాదు. వాటిని సరఫరా చేసే వారు లేదా తయారీకి ఉపయోగించే సరకులు కల్తీ లేదా నాసిరకంగా ఉంటున్నాయని గతంలో అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. నెయ్యి కల్తీ గురించి నాటి కలకత్తాలో వచ్చిన ఆరోపణల గురించి స్పెక్టేటర్‌ అనే పత్రిక 1886 సెప్టెంబరు 25వ తేదీ సంచికలో రాసింది. ఒక చట్టాన్ని చేయాలని భక్తులు కోరినట్లు దానిలో పేర్కొన్నది. నెయ్యిలో పంది, ఆవు కొవ్వు, ఇతర జంతువుల మాంసాలలో ఉన్న కొవ్వు కల్తీ జరుగుతున్నట్లు విశ్లేషణలో పేర్కొన్నది. తరువాత కలకత్తాలో నెయ్యి వ్యాపారం చేసే మార్వాడీలు నెయ్యిలో కల్తీ చేస్తున్న కారణంగా ఒక నాటికి బెంగాలీ జాతే అంతరించి పోతుందంటూ 1917లో ఒక పత్రికలో వచ్చిన వార్త ఆందోళనకు దారితీసింది.దాంతో మార్వాడీ అసోసియేషన్‌ నెయ్యి గోడవున్ల వద్దకు వెళ్లి 67నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా కేవలం ఏడు మాత్రమే స్వచ్చంగా ఉన్నట్లు తేలింది. దాంతో వేలాది మంది కలకత్తా బ్రాహ్మలు హుగ్లీ నది(బెంగాల్లో గంగానది పేరు) తీరాన హోమాలు చేసి కల్తీ నెయ్యి ఆరగించినందుకు ప్రాయచిత్తం, శరీరాలను శుద్ది చేసుకున్నారు. దాంతో మార్వాడీ అసోసియేషన్‌ కల్తీ చేసిన వారిని గుర్తించి వారి వద్దనుంచి జరిమానాల రూపంలో రు.75వేలు వసూలు చేసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనంలో గడ్డి భూములను కొనుగోలు చేసినట్లు ప్రకటించటంతో బ్రాహ్మలు శాంతించారట. అందువలన దేశంలో నెయ్యి కల్తీ వివాదం తిరుపతితోనే ప్రారంభమైందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే వ్యాపారంలాభం ఉంటుందో అక్కడ అవినీతి కూడా తోడుగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. వ్యాపారం చేస్తూ కల్తీ చేసేవారు, వినియోగించేవారు కూడా హిందువులే, ఎక్కడన్నా ఇతర మతాలకు చెందిన వారు కూడా ఉంటే ఉండవచ్చు. నెయ్యి అంటే ఒక్క ఆవు, గేదె(బర్రె) పాలనుంచే కాదు, గొర్రెలు, మేకలు, ఒంటె పాల నుంచి కూడా తయారు చేస్తారు. శాస్త్రీయ పరీక్షలు అందుబాటులో లేని కాలంలో నెయ్యిని చేతిలో వేసుకొని నలపటం, వాసన చూడటం ద్వారా కల్తీ జరిగిందీ లేనిదీ చెప్పేవారటు. శాస్త్రీయ పరీక్షలు వచ్చిన తరువాత కూడా అనుసరించే పద్దతులను బట్టి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల తాజా వివాదంలో ఎన్‌డిడిబి అనుసరించిన పద్దతి గురించి నివేదికలో పేర్కొన్నది, దానితో పాటు ఫలితాల గురించి షరతులు వర్తిస్తాయంటూ కొన్ని సార్లు నివేదికలు తప్పుగా రావచ్చని కూడా చెప్పింది. అందుకే మరొక ప్రయోగశాలలో కూడా పరీక్ష చేయించకుండా చంద్రబాబు నాయుడు తొందరపడి నిర్దారణకు వచ్చి బహిర్గత పరిచారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.ఆ చర్య కోట్లాది మంది భక్తుల మనోభావాల మీద ప్రభావం చూపింది. ఎక్కడ ఎన్ని పరీక్షలు జరిపినా నెయ్యి స్వచ్చత గురించి ఏ లాబ్‌లోనూ ఫలితాలు ఒకే విధంగా ఉండవు అని కూడా చెబుతున్నారు. ఆవులు, గేదెలకు పెట్టే మేతను బట్టి కూడా ఫలితాలు భిన్నంగా ఉంటాయి.


బిజెపి బీఫ్‌ రాజకీయం గురించి తెలిసిందే.2014ఎన్నికల్లో దాని ప్రచార అస్త్రాల్లో అదొకటి.ఆవు, ఎద్దు,దున్నపోతులు, గేదెల మాంసాన్ని బీఫ్‌ అంటారు. దీని ఎగుమతులకు వ్యతిరేకంగా నాటి యుపిఏ ప్రభుత్వం మీద నరేంద్రమోడీ ఉత్తరాదిన ఎన్నికల్లో ప్రచారం చేశారు. చిత్రం ఏమిటంటే అధికారానికి వచ్చిన తరువాత వాటి ఎగుమతులకు అనుమతి ఇచ్చారు. ఏటేటా పెరుగుతున్నట్లు ఎగుమతి గణాంకాలు చెబుతున్నాయి. 2023 వివరాల ప్రకారం బ్రెజిల్‌ తరువాత రెండవ స్థానంలో ఉన్న అమెరికాను పక్కకు నెట్టి మనదేశం ఎగబాకింది.బ్రెజిల్‌ అన్నిరకాల బీఫ్‌ను 30.12 లక్షల టన్నులు, దున్న, గేదె మాంసాన్ని భారత్‌ 14.75లక్షల టన్నులు ఎగుమతి చేసింది. తమ కారణంగా చీమలకు సైతం హాని కలగకూడదంటూ జైన మునులు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తారు. కానీ అనేక మంది ఆ మతానికి చెందిన వారు బీఫ్‌ ఎగుమతిదార్లుగా ఉన్నారు.ఒక సందర్భంలో స్వయంగా నరేంద్రమోడీయే ఆ విషయాన్ని చెప్పారు. మాంస ఎగుమతి ఒక సామాజిక తరగతికి మాత్రమే పరిమితమని చెప్పటం వాస్తవం కాదు, జైన్‌ సామాజిక తరగతికి చెందిన అనేక మంది నా స్నేహితులు ఆ వ్యాపారంలో ఉన్నారు, ఏదో ఒక సామాజిక తరగతికి ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దంటూ మాట్లాడారు. మన పురాణాలు, నమ్మకాల ప్రకారం ప్రతి జంతువు ఏదో ఒక దేవుడితో ముడిపడి ఉంది.గోవధను కొందరు వ్యతిరేకిస్తారు. గోమూత్రం తాగటం పవిత్రంగా భావిస్తారు. దున్నపోతు యుముడి వాహనం, అయినా వాటిని వధించి ఎగుమతులు చేస్తారు. ఎలుక వినాయకుడి వాహనం అంటారు, కానీ అది కనిపిస్తే చంపేయాలని చూస్తారు.(ఇలా చెబుతున్నానంటే నష్టదాయకమైన ఎలుకలను చంపకుండా వదలివేయమని నా ఉద్దేశ్యం కాదు) మొత్తం మీద నెయ్యి కల్తీ గురించి వచ్చే నివేదికలు ఏ ఒక్కటీ ఒకే విధంగా ఉండదని మాత్రం కొందరు నిపుణులు చెబుతున్నారు. అందువలన ముందే చెప్పుకున్నట్లు తిరుపతి లడ్డు కల్తీ వివాదం ఎలా ముగుస్తుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లడ్డు రాజకీయం : సనాతనవాదిగా పవన్‌ కల్యాణ్‌ – కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడినదాంట్లో తప్పేంటి ?

28 Saturday Sep 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, CHANDRABABU, Narendra Modi Failures, Pawan kalyan, Prakash Raj, RSS, Tirupati Laddu Controversy, YS jagan


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది ? మాజీ సిఎం జగన్‌ మోహనరెడ్డిని ఇరుకున పెట్టాలని చూసిన చంద్రబాబు నాయుడు చివరకు తిరుమల పర్యటనను తీవ్ర వివాదాస్పదం గావించి మొత్తం మీద జగన్‌ నెత్తిన పాలుపోశారనే చెప్పాలి. పోలీస్‌ సెక్షన్‌ 30 తదితర ఆంక్షల పేరుతో ఆటంక పరచకుండా అనుమతించి ఉంటే పరమతాలకు చెందిన వారందరి మాదిరే జగన్‌ కూడా ఆలయసంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు రిజిస్టర్‌లో సంతకం చేసేవారా లేదా అనేది తేలిపోయి ఉండేది.చేయకపోతే అభ్యంతరం తెలిపి ఉంటే బంతి జగన్‌ కోర్టులో ఉండేది. అలాంటి అవకాశం లేకుండా వ్యవహరించటంతో జగన్‌ వ్యతిరేకులందరూ ఒక రకంగా నీరుగారిపోయారు. అయితే దీని మీద ఎవరి భాష్యం వారు చెప్పుకుంటున్నారు గనుక జనం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఇకనైనా లడ్డు రాజకీయానికి తెరదించి రాష్ట్ర సమస్యల మీద కేంద్రీకరించాలి.


చంద్రబాబు నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల వెంకటేశ్వరుడి దర్శనాన్ని చేసుకొని ప్రార్ధిస్తానని ప్రకటించిన వైఎస్‌ జగన్‌మోహన రెడ్డిని పరోక్షంగా ప్రభుత్వం అడ్డుకుంది. అంతకు ముందు తెలుగుదేశం, జనసేన, బిజెపి, వారి కనుసన్నలలో పనిచేసే సంస్థలు, వ్యక్తులు స్వామి దర్శనం చేసుకోవాలంటే ఆచారాలను మన్నిస్తూ దేవస్థాన రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందేనని, తలనీలాలు సమర్పించుకోవాల్సిందేనని ప్రకటించాయి. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి పాపానికి పాల్పడ్డారని దానికి ప్రాయచిత్తంగా సెప్టెంబరు 28 తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో పూజలు చేయాలని క్రైస్తవమతావలంబకుడిగా అందరికీ తెలిసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. మరోసారి శుక్రవారం నాడు మీడియా సమావేశంలో కూడా అదే చెప్పారు. తాను నాలుగు గోడల మధ్య బైబిలు చదువుతానని, బయట అన్ని మతాలను పాటిస్తానని, తనది మానవమతమని ఏం కావాలంటే అది రాసుకోవచ్చని కూడా చెప్పారు. తమ ప్రభుత్వం జగన్‌కు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని, తిరుమల పర్యటనను అడ్డుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అన్యమతస్తులెవరైనా ఆలయ రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందే అన్నారు. ఇప్పుడు లడ్డు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తులో తేలేదేమిటి, జరిగిందని చెబుతున్న లడ్డు నెయ్యి కల్తీ ఎప్పటికి నిర్ధారణ అయ్యేను, నిందితులుగా ఎవరిని తేల్చేను, ఏ శిక్షలు పడేను అన్నది భక్తులు నమ్మే ఆ భగవంతుడికే తెలియాలి. లడ్డు పరిణామాలతో అనేక ముఖ్య సమస్యలు జనం అజెండానుంచి మాయమయ్యాయి. ముఖ్యంగా ఇటీవలి వరదల్లో సంభవించిన భారీ నష్టానికి కేంద్రం నుంచి వరదలా సాయం వస్తుందని ఆశలు రేకెత్తించిన వారికి కనీసం మబ్బులు కూడా కనిపించటం లేదు.


తిరుమల దేవుడి మహిమల సంగతి తెలియదు.అఫ్‌ కోర్స్‌ నిజంగా మహిమే ఉంటే తన లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంటే పట్టించుకోకపోవటమేమిటి, దాని పేరుతో రాజకీయం చేస్తుంటే ఉపేక్షించటం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరూ మనోభావాలను గాయపరుచుకోనవసరం లేదు. దేవుడి లడ్డులో కల్తీ నెయ్యి దగ్గర ప్రారంభమైన వివాదం మలుపులు తిరుగుతూ మతం, సనాతన ధర్మ పరిరక్షణ వైపు పయనిస్తోంది. అనేక మంది నిజరూపాలను బహిర్గతం చేస్తోంది. మతం పేరుతో రాజకీయం, ఓటు బాంకులను ఏర్పాటు చేసుకొనే పార్టీల జాబితాలో బిజెపితో పాటు తెలుగుదేశం, జనసేన కూడా పోటీ పడుతోందన్నది తేలిపోయింది. అయితే దేశంలో మతరాజకీయాలు చేసే వారి గురించి జనం కళ్లు తెరుస్తున్న స్థితిలో ఆంధ్రులు అలాంటి తిరోగమన రాజకీయ వలలో పడతారా ? తిరుమల లేదా మరొక మతకేంద్రం కావచ్చు, మతేతరులు వాటిని సందర్శించాలని అనుకున్నపుడు అక్కడి ఆచారాలను గౌరవిస్తున్నట్లు అంగీకరించాలన్న నిబంధనలు, ఆచారాలు ఉన్నాయి. శుక్రవారం నాటి విలేకర్ల సమావేశంలో తాను వాటిని పాటించనని లేదా పాటిస్తానని గానీ జగన్‌ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోసారి తిరుపతి వెళతానని కూడా చెప్పలేదు.


లడ్డు కల్తీ సంగతి విచారణ తరువాత ఏదో ఒకటి తేలుతుంది. కానీ ఈ వివాదం తెచ్చిన సమస్యలు మాత్రం ముందుకూడా కొనసాగుతాయి. భగత్‌ సింగ్‌, చేగువేరా భావజాలం కలవ్యక్తిగా అనేక మంది ఇప్పటివరకు పవన్‌ కల్యాణ్‌ గురించి భావిస్తున్నవారికి భ్రమలు తొలిగిపోయాయి. అఫ్‌కోర్స్‌ వారాహి పూజలను చూసినపుడే చాలా మందికి అర్ధమైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలిచ్చిందని విమర్శించి తిరుమల లడ్డుకు మరోవిధంగా ప్రచారం కల్పించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆ లడ్డూతోనే రాజకీయం ఆడుతున్నారు. అందువలన కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్నట్లుగా ఆ పెద్దమనిషి సనాతన ధర్మం గురించి రెచ్చిపోయి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించలేదు. ఎన్నో పుస్తకాలు చదివినట్లు చెప్పుకున్న మేథావికి సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో జరిగిన దారుణాలు, కలిగించిన హాని అర్ధం కాలేదా లేక పుస్తకాలు చదవటం అన్నది ఒట్టి కబుర్లేనా ? నిజంగా అర్ధమై ఉంటే కనీసం మౌనంగా ఉండేవారు తప్ప దాన్ని పరిరక్షిస్తానంటూ విరుచుకుపడేవారు కాదు. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేసినపుడు ప్రకాష్‌ రాజ్‌ ఎక్కడకు వెళ్లారంటూ పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారని ఒన్‌ ఇండియా అనే వెబ్‌సైట్‌ తన విశ్లేషణకు శీర్షిక పెట్టింది. అక్కడ జరిగిన వాటి గురించి వాస్తవాల కంటే అభూత కల్పనలే ఎక్కువ వచ్చాయి, కాదూ ఒక వేళ నిజమే అనుకుంటే నరేంద్రమోడీ, బిజెపి ఎందుకు పెద్దగా స్పందించలేదో చెప్పగలరా ? చిన్న పాటి విమర్శ, అభ్యంతరాన్ని కూడా బిజెపి, హిందూత్వశక్తులు సహించవు. ఆరునెలలకే వారు వీరవుతారన్నట్లుగా అంతకంటే ఎక్కువ కాలమే బిజెపితో బంధంలో ఉన్నందున అదే జరిగినట్లు కనిపిస్తోంది. అసలు లడ్డు వివాదం గురించి ప్రకాష్‌ రాజ్‌ అన్నదేమిటి ? ‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌, ఇది మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగింది.దయచేసి దర్యాప్తు చేయండి.దోషులను పట్టుకోండి కఠినమైన చర్యలు తీసుకోండి. జాతీయ స్థాయిలో అనవసర భయాలను ఎందుకు వ్యాపింపచేస్తారు,ఎందుకు పెద్దదాన్ని చేస్తారు.మనకు ఇప్పటికే తగినంత మతతత్వం ఉంది(కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు కృతజ్ఞతలు) ’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీని మీద పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ‘‘ నేను ప్రకాష్‌ రాజ్‌ను ఇష్టపడతాను, ఆయన నాకు మంచి స్నేహితుడు, మేము గొప్ప బంధాన్ని పంచుకుంటాము.రాజకీయ అంశాల మీద మేము విబేధించవచ్చు గానీ, ఒక నటుడిగా నేను నిజంగా గౌరవిస్తాను. అయితే ఈ సమస్య మీద వ్యాఖ్యానించే అవసరం ఆయనకు లేదు ’’ అంటూ స్పందించారు. ప్రపంచంలోని వారందరూ స్పందిస్తున్నట్లు అనేక అంశాల మీద నిరంతరం తన భావాలను వెల్లడిరచే ప్రకాష్‌ రాజ్‌ దీని మీద మౌనంగా ఎలా ఉంటారు ? ఎందుకు ఉండాలి ? వద్దని చెప్పటానికి పవన్‌ కల్యాణ్‌ ఎవరు ? ఇదేమీ వ్యక్తిగత వ్యవహారం కాదు.


వన్‌ ఇండియా ఇంటర్వ్యూలో చెప్పినట్లు రాసిన అంశాలను బట్టి చూస్తే మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు విరుచుకుపడినట్లుగా పవన్‌ కల్యాణ్‌ తీరు ఉంది.‘‘ ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలను చూస్తే రాజకీయ అంశాలను ముందుకు తెచ్చినట్లుగా ఉంది.బిజెపిని, ప్రధాని మోడీని చర్చలోకి లాగుతున్నారు. తానొక గొప్ప లౌకికవాదినని ఆయన భావిస్తున్నారు. అతని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలుసు. నా ప్రశ్న ఏమిటంటే బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేస్తుంటే ఆయన ఎక్కడ ఉన్నారు ? దాని మీద మాట్లాడారా ? కానీ అనేక మంది లౌకికవాదులు హిందూ సమాజం మీద వ్యాఖ్యానించటం సులభం కానీ ఇతర మతాల వారి మీద వ్యాఖ్యానించటానికి భయపడతారు. వారికి లౌకిక వాదం అంటే ఒక వైపు మాత్రమే ప్రయాణించే దారి వంటిది, హిందూయిజం వెలుపల ఉన్న సమస్యలను విమర్శించటాన్ని తప్పించుకుంటారు. అందరి పట్ల సమంగా చూడకపోతే లౌకికత్వం అంటే ఏమిటి ? వ్యాఖ్యానించదలచుకున్నవారు అందరినీ ఒకేవిధంగా చూడాలి, దీన్నే సగటు భారతీయుడు వాంఛిస్తున్నాడు. మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించాలి లేకపోతే మౌనంగా ఉండాలి ’’ ఇవన్నీ సంఘపరివారం స్కూల్లో బోధించే తర్కంలోని అంశాలే. ప్రతిదాన్నీ ప్రశ్నిస్తాను, అవసరమైతే తోలువలుస్తా, తాట తీస్తా అని మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ ఇలా మాట్లాడటం అవకాశవాదం తప్ప మరొకటి కాదు. అందుకే ప్రకాష్‌ రాజ్‌ పరోక్షంగా ఒక చురక అంటించారు. ‘‘ గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తరువాత మరో అవతారం, ఏంటీ అవాంతరం … ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ ఒక ఎక్స్‌, ‘‘ చేయని తప్పుకి సారీ చెప్పించుకోవటంలో ఆనందమేమిటో, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ మరో ఎక్స్‌లో స్పందించారు. అంతే కాదు, మరో ఎక్స్‌లో ఇలా పేర్కొన్నారు.‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌ గారూ … మీ ప్రెస్‌ మీట్‌ను నేను చూశాను. నేను చెప్పిందేమిటి, మీరు దానికి వక్రభాష్యం చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి నేను తిరిగి వస్తా, ఈ లోగా నేను ఇంతకు ముందు చేసిన ట్వీట్‌ను పూర్తిగా పరిశీలించండి, అవగాహన చేసుకోండి, ఊరికే అడుగుతున్నా ’’ అని పేర్కొన్నారు. సినిమా హీరో కార్తి ఎప్పుడూ నవ్వుముఖంతో కనిపిస్తాడు. లడ్డు గురించి అడిగితే అదే ముఖంతో అది సున్నితమైన అంశం అని చెప్పటాన్ని కూడా పవన్‌ కల్యాణ్‌ తప్పుపట్టారు.


ఎవరు ఎటు ఉన్నారో, ఎవరి రంగు ఏమిటో జనాలు గ్రహిస్తున్నారు. మాంసం తింటాంగనుక ఎముకలను మెడలో వేసుకు తిరుగుతాం అన్నట్లుగా తాము భారత మితవాదులమని సగర్వంగా చెప్పుకొనే పత్రిక ‘‘ స్వరాజ్య ’’. అది లడ్డు వివాదంపై ఒక విశ్లేషణకు ‘‘ తిరుపతి లడ్డు సమస్య : పవన్‌ కల్యాణ్‌ మీ ముఖంలో కనిపిస్తున్న హిందూయిజానికి ఆంధ్రలో స్వాగతం ’’ అని శీర్షిక పెట్టింది. పార్టీలతో నిమిత్తం లేకుండా మరింత మంది బిజెపి ఏతర పార్టీల నేతలు సనాతన ధర్మం గురించి మాట్లాడాలని తద్వారా హిందువుల ప్రయోజనాలు రక్షించబడతాయని నొక్కి వక్కాణించారు. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ బోర్డు నెలకొల్పాలని పిలుపు ఇచ్చిన తరువాత సినిమా నటులు కార్తీ, ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించారని ప్రశంసలు కురిపించారు. నీవెవరో తెలియలాంటే నీ స్నేహితులను చూస్తే చాలన్నది గత లోకోక్తి ఇప్పుడు నీ బండారం తెలియలాంటే నిన్ను పొగుడుతున్నవారిని చూస్తే చాలు అని చెప్పాల్సి వస్తోంది. పవన్‌ కల్యాణ్‌ గారు చెబుతున్న సనాతన ధర్మం ఈ దేశంలో దాదాపు నలభై కోట్ల మంది దళితులు, గిరిజనులను అంటరానివారిగా వేల సంవత్సరాల పాటు వెలివాడల్లో దూరంగా పెట్టింది. వెనుకబడిన తరగతుల వారినీ పరిమితం కావించింది. మహిళలను అణచివేసింది.శూద్ర కులాలకు చెందిన వారితో సహా అందరినీ విద్యకు దూరం చేసింది. అందుకే అంబేద్కర్‌ ఈ సనాతన వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకంటే ఎక్కువ అధ్యయనం చేసి ఉంటారని అనుకోలేము. సనాతన వాదాన్ని పరిరక్షించాలని కోరుతున్నవారు నిజానికి ఎంత మంది దాని ప్రకారం నడుచుకుంటున్నారు. సనాతన వాదం మారేది కాదంటున్నారు. ఏక పత్నీవ్రతుడైన రాముడిని, బహుపత్నులున్న కృష్ణుడినీ ఒకే రకమైన భక్తితో సనాతనులు సమర్థిస్తున్నారు.వివాహ బంధంతో నిమిత్తం లేకుండా వేరేవారికి పిల్లలను కనటాన్ని కూడా మహాభారతంలో సమర్ధించారు. పెళ్లితో నిమిత్తం లేకుండా ఏళ్లతరబడి సహజీవనం చేసిన వారు, ఏ కారణంగా చెప్పకుండా భార్యలను వదలివేసిన వారూ, సనాతనంతో సంబంధం లేని ఆధునిక చట్టాల ప్రకారం విడాకులు తీసుకొని అనేక వివాహాలు చేసుకుంటున్నవారు కూడా సనాతన పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. అదొక ఫాషనైపోయింది. సనాతనం గురించి మరొకదాని గురించి గతంలోనే అనేక చర్చలు జరిగాయి.ముఖం మీద నామం అడ్డంగా పెట్టుకోవాలా నిలువుగా పెట్టుకోవాలా అంటూ దాడులు చేసుకున్న సనాతనుల గురించి తెలిసిందే. ఇప్పటికీ దాని మీద ఏకీభావం లేదు. ఇప్పుడు అలాంటి వారంతా ఒకటై సనాతనాన్ని విమర్శించేవారి మీద దాడులకు దిగుతున్నారు. గతంలో లోకాయతులను అణచివేశారు. కొత్తగా మతం పుచ్చుకున్నవారు మరీ రెచ్చిపోతున్నారు. సనాతనం మనదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల బాటలో నిలుపలేదు. ఆ తిరోగమనవాదాన్ని పరిరక్షించి దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతున్నవారు తాత్కాలికంగా ఓటు బ్యాంకులను సృష్టించుకోవచ్చు తప్ప దేశానికి చేసే మేలేమీ ఉండదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d