• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Health

రైతాంగానికి పొంచి ఉన్న ముప్పు : ఇండోనేషియా మాదిరే భారత వాణిజ్య ఒప్పందం అన్న ట్రంప్‌, రఘురామ రాజన్‌ హితవచనం తలకెక్కుతుందా!

19 Saturday Jul 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, Environment, Farmers, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

Agri subsidies, BJP, Donald trump, Handling US Tariffs, India’s Poultry Industry, Indian Dairy Farmers, indian farmers, Indian poultry farmers, Narendra Modi Failures, Raghu ram rajan

ఎం కోటేశ్వరరావు


అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన వాణిజ్య ఒప్పంద బెదిరింపు గడువు ఆగస్టు ఒకటవ తేదీ దగ్గరపడుతున్నది. ఏం చేస్తే దేశీయంగా ఏ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న ఆందోళనలో ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు. జూలై 21వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌తో పాటు వాణిజ్య ఒప్పందం గురించి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఇరుదేశాల లావాదేవీలలో పైచేయిగా ఉన్నా ఒకటికి పదిసార్లు మనవారు ట్రంప్‌ గడప తొక్కటమే ఒక బలహీన సూచన. ఇండోనేషియాతో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరే భారత్‌తోనూ ఉండబోతోందని ట్రంప్‌ ఇప్పటికే ఒక లీకు వదిలాడు.వాణిజ్య చర్చల్లో డోనాల్ట్‌ ట్రంప్‌తో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా విదేశీ సబ్సిడీలు ఎక్కువగా ఉండే వ్యవసాయరంగంలో కుదుర్చుకొనే ఒప్పందాలు దేశంలోని చిన్న రైతులకు హానికరంగా ఉంటాయని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఎలాంటి ఆటంకాలు లేని వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు హానికలిగిస్తాయన్నారు. బహుశా ఇండోనేషియా ఒప్పందం గురించి ఉప్పంది ఉంటుంది.మన దేశంలోకి బయటి నుంచి మరిన్ని పాల ఉత్పత్తులను స్వాగతించటం కంటే ఆ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల పెంపుదలకు ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలని రాజన్‌ చెప్పారు. అమెరికా పన్నులతో ఆరు నుంచి ఏడు శాతం మధ్య ఉన్న మన జిడిపి వర్తమాన వృద్ధి రేటు స్వల్పంగా తగ్గుతుందని, చైనా వస్తువులపై పన్నులు ఎక్కువగా ఉన్నందున ప్రత్నామ్నాయంగా మన ఎగుమతులు పెరగవచ్చని అన్నారు.


లోకం దృష్టిలో ఎంతటి సమర్ధులైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో అల్లాడిపోకతప్పదు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ స్థితి అదేనా ? కరవ మంటే కప్పకు, విడవ మంటే పాముకు కోపం తెలిసిందేగదా ! ఇక్కడ భారతీయులు కప్పలు, అమెరికా కార్పొరేట్లు పాములు. సుత్తిలేకుండా సూటిగా చెప్పాలంటే మన మార్కెట్‌ను తెరవాలని ట్రంప్‌ వత్తిడి తెస్తుంటే మన జనాలు ఎలా స్పందిస్తారో అని మోడీ ఎటూతేల్చుకోలేకపోతున్నారు. జూలై తొమ్మిదవ తేదీలోగా ఒప్పందంపై సంతకాలు జరగాల్సిందే అని వత్తిడి చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఆగస్టు ఒకటవ తేదీ వరకు గడువు పొడిగించాడు. ఒప్పందం కుదిరిందన్నట్లుగా ఎప్పటి నుంచో పదేపదే చెబుతున్నప్పటికీ మన పాలకులు మౌనం తప్ప మాటలేదు. మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.అయినా స్పందన లేదు. పోనీ ప్రతిపక్షాలను పిలిచి సమస్యలు, సవాళ్ల గురించి ఏదైనా సలహాలు తీసుకున్నారా అంటే అదీ లేదు, అంతా గుంభనం.
భారత్‌తో కుదిరే ఒప్పందం ఇండోనేషియాతో కుదిరిన దానికి ప్రతిబింబంగా ఉంటుందని ట్రంప్‌ సూచన ప్రాయంగా చెప్పాడు. ఆగస్టు ఒకటవ తేదీలో ఒప్పందానికి రాకుంటే ఇండోనేషియా ఉత్పత్తులపై 32శాతం దిగుమతి పన్ను విధిస్తామని లేఖా బెదిరింపులో పేర్కొన్నాడు. పద్దెనిమిది బిలియన్ల డాలర్ల మేర వాణిజ్య మిగులుతో ఉన్న ఇండోనేషియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం 32కు బదులు 19శాతం పన్ను విధిస్తారు. అయితే అమెరికా వస్తువులపై ఇండోనేషియాలో ఎలాంటి పన్నులు ఉండవని ట్రంప్‌ చెప్పాడు. పశుపెంపకదారులు, రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులను సులభంగా ఇండోనేషియాలో అమ్ముకోవచ్చని అన్నాడు. అయితే ఒప్పంద వివరాలు ఇంకా వెల్లడి కాలేదు గానీ, నామ మాత్ర పన్నులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది ఇండోనేషియాకు నష్టదాయకమని నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా వస్తువులకు పూర్తి మార్కెట్‌ను తెరుస్తారు. బోయింగ్‌ 777 రకం 50విమానాలను, 15బిలియన్‌ డాలర్ల ఇంథనం, 4.5 బిలియన్‌ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా అంగీకరించింది. వారు విమానాలను ఆమ్ముకోవాలి, మాకు వాటి అవసరం ఉందని అధ్యక్షుడు ప్రభువు సుబియాంతో చెప్పాడు. ఎలాంటి పన్నులు లేకుండా అమెరికా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారా అన్న ప్రశ్నకు సూటిగా చెప్పకుండా ప్రతిదాన్నీ సంప్రదిస్తున్నామని మాత్రమే అన్నాడు. పాదరక్షలు, దుస్తులు, పామాయిల్‌ను ఇండోనేషియా ఎగుమతి చేస్తున్నది.


పరస్పర లబ్ది చేకూర్చే నూతన యుగం అని ఒప్పందం గురించి ఇండోనేషియ నేత ప్రభువు వర్ణించగా కొత్త పన్నుల విధానంతో గణనీయ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తామని, ఎగుమతులు పెరుగుతాయని వాణిజ్య మంత్రి బుడి సంతోసో అన్నాడు. ఒప్పందం ప్రతికూలంగా ఉంటుందని ఒక ఇండోనేషియా అధ్యయన సంస్థ డైరెక్టర్‌ భీమా యుధిష్టిర చెప్పాడు.(ఇండోనేషియాలో ముస్లింల పేర్లు మహాభారత, రామాయణ,పురాణాల్లోవే ఎక్కువగా ఉంటాయి). ఎగుమతులు పెరిగినా అమెరికా నుంచి దిగుమతులు ఇబ్బడిముబ్బడి అవుతాయన్నాడు. వియత్నాం పోటీ సామర్ధ్యం ఎక్కువ, రెండు దేశాలకు పన్నుల్లో ఇండోనేషియాకు ఒకశాతమే తక్కువ గనుక పోటీలో నష్టపోతామని చెప్పాడు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు స్థానికంగా ఉత్పత్తి చేసేవే అయితేగనుక దేశీయ పరిశ్రమలకు దెబ్బ అని ప్రొఫెసర్‌ విశాంతి చెప్పారు. స్థానిక వస్తువుల బదులు విదేశీ వస్తువులతో మార్కెట్‌ను నింపితే ప్రతికూలమే అని అమె అన్నారు.

గూగుల్‌తల్లిని అడిగితే కృత్రిమ మేథ రూపంలో అందించిన సమాచారం ప్రకారం అమెరికాలో కోడి మాంసం ధరలు అన్ని చోట్లా ఒకే విధంగా లేవు.ఉదాహరణకు సెలీనా వాముసీ వివరాల మేరకు పౌండు(450గ్రాములు) ధర 1.6 నుంచి 2.97 డాలర్ల వరకు ఉంది. అదే గ్రేజ్‌కార్ట్‌ వివరాల ప్రకారం డజను కోళ్ల ధర 428 డాలర్లు, ఒక్కొక్కదాని ధర 35.67 డాలర్లు, ఒక్కో కోడి సగటున 4.2 పౌండ్లు, అంటే రెండు కిలోలకు వంద గ్రాములు తక్కువ.హడ్సన్‌ వాలీ కోళ్ల ఫారంలో 4 పౌండ్ల బరువు ఉండే ఒక మొత్తం కోడి ధర 18 డాలర్లు. చికెన్‌ బ్రెస్ట్‌ ధర పౌను 8.5 నుంచి 12 డాలర్ల వరకు, కోడి డ్రమ్‌స్టిక్స్‌ వెల 4.99, కాళ్ల ధర 5.36 డాలర్ల వరకు ఉంది. అమెరికాలో కోడి కాళ్లు తినరు. అందుకే బ్రెస్ట్‌, కాళ్ల ధరలో అంత తేడా ఉంది. ఎప్పటి నుంచో అమెరికన్లు తమ దగ్గర గుట్టలుగా పడిఉన్న కోడి కాళ్లను మన దేశానికి ఎగుమతి చేయాలని చూస్తున్నారు. అమెరికాతో పోలిస్తే మనదేశంలో కోడి మాంసం ధర తక్కువ. అందువలన అంతకు మించి ఎక్కువ ఉంటే దిగుమతి చేసుకున్న సరకును కొనుగోలు చేసే అవకాశం లేదు. కనుక మన ధరలకు సమానంగా ఉండేట్లు చూస్తారు. అందుకు గాను అమెరికా ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తుంది, మన ప్రభుత్వం దిగుమతులపై సుంకాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అదే జరిగితే మన కోళ్ల పరిశ్రమ కుదేలే.

తమ కోడి మాంస ఉత్పత్తులకు మార్కెట్‌ తెరవాలని, దిగుమతి పన్ను తగ్గించాలని అమెరికా పదేండ్ల క్రితమే మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెచ్చింది. దాన్ని మన యావత్‌ పరిశ్రమ వర్గాలు వ్యతిరేకించాయి.వెనక్కు తగ్గిన కేంద్రం తరువాత ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల పేరుతో టర్కీ, బాతు మాంసంపై ఉన్న 30శాతం పన్నును ఐదుశాతానికి తగ్గించింది. కోళ్ల ఉత్పత్తులపై వందశాతం పన్ను అమలు చేస్తున్నారు.చిన్నా, పెద్ద రైతులు, వారి మీద ఆధారపడిన వారు కోళ్ల పెంపకంలో 30లక్షల మంది ఉన్నారు. అమెరికా తెస్తున్న వత్తిడిలో జన్యుమార్పిడి మొక్కజొన్నల దిగుమతి కూడా ఒకటి. ఇది కూడా మన రైతాంగాన్ని దెబ్బతీసేదే. మొక్క జొన్నల దిగుమతి అనుమతించాలని కోళ్ల పరిశ్రమవారు, కూడదని సాగు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇది మిత్ర వైరుధ్యం.ఎవరి లాబీ బలంగా ఉంటే వారి ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంది, అయితే దానికి ప్రతికూల ఫలితాలను కూడా పాలక పార్టీ అనుభవించాల్సి ఉంటుంది. శ్రీలంకలో కోడి మాంస ఉత్పత్తుల దిగుమతులను అనుమతించటంతో అక్కడి పరిశ్రమ దెబ్బతిన్నది. ఇప్పుడు మొక్కజొన్నల దిగుమతి కోసం పరిశ్రమ, వద్దంటూ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.దిగుమతి చేసుకున్న సరకు కిలో ధర 0.43 నుంచి 0.46 డాలర్లు గిడుతున్నది, తమకు 0.56 డాలర్లు వస్తే తప్ప గిట్టుబాటు కాదు గనుక దిగుమతులు వద్దని, దిగుమతి సుంకం పెంచాలని రైతులు అంటున్నారు. కోళ్ల పరిశ్రమ దీన్ని వ్యతిరేకిస్తున్నది ప్రస్తుతం కిలోకు 0.08 డాలర్లు దిగుమతి పన్ను ఉందని, ఇంకా పెంచితే కోడి మాంసం, గుడ్ల ధరలు పెరుగుతాయని, తమకు గిట్టుబాటు కాదని వారంటున్నారు.

అమెరికా పాడి ఉత్పత్తులకు మనం ద్వారాలు తెరిస్తే సగటున 15శాతం మేరకు పాల ధరలు పతనమై ఏటా రు.1.8లక్షల కోట్లు నష్టం వస్తుందని, దానిలో రైతులు రు.1.03లక్షల కోట్లు నష్టపోతారని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా( ఎస్‌బిఐ) అధ్యయనం హెచ్చరించింది. భారీ మొత్తంలో దిగుమతులు పెరిగి కోట్లాది మంది రైతుల జీవితాలు దెబ్బతింటాయని పేర్కొన్నది.(పాడి పరిశ్రమపై ఎనిమిది కోట్ల మంది ఆధారపడి ఉన్నారని ఒక అంచనా) పాల ధరలు తగ్గితే గిరాకీ 1.4 కోట్ల టన్నులు పెరుగుతుందని, అదే సమయంలో 1.1 కోట్ల టన్నుల సరఫరా తగ్గుతుందని, రెండిరటి మధ్య తేడా 2.5 కోట్ల టన్నులను దిగుమతుల ద్వారా పూడ్చుకోవాల్సి ఉంటుందని, చిన్న డైరీలు, రైతులు తీవ్రంగా దెబ్బతింటారని కూడా ఎస్‌బిఐ హెచ్చరించింది. అమెరికా జన్యుమార్పిడి ఉత్పత్తులతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొన్నది. వాణిజ్య ఒప్పందం కుదిరితే జపాన్‌, మలేసియా, దక్షిణ కొరియాల నుంచి అమెరికాకు రసాయనాల ఎగుమతులు తగ్గి మన ఎగుమతులు మరొక శాతం పెరుగుతాయని జిడిపి0.1శాతం పెరుగుతుందని, దుస్తుల ఎగుమతులు ఆరు నుంచి 11శాతానికి పెరుగుతాయని చెప్పింది. జనరిక్‌ ఔషధాలతో పాటు ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రస్తుతం ఉన్న ఒక బిలియన్‌ నుంచి మూడు బిలియన్‌ డాలర్ల వరకు పెరుగుతాయని పేర్కొన్నది.ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం రెండంచుల పదును గల కత్తి వంటిదని కూడా హెచ్చరించింది. అమెరికా పాడి ఆవులకు ఇచ్చే మేతలో జంతు సంబంధిత అంశాలు లేవని నిర్ధారిస్తూ హామీ ఇవ్వాలని భారత్‌ గతంలో పేర్కొన్నది. ఇప్పుడు దానికి కట్టుబడి ఉందా లేదా అన్నది ఒక చర్చ సాగుతున్నది. అలాంటి పాలను మాంసాహారంగా పరిగణించే 30శాతం మందిగా ఉన్న శాఖాహారులు వాటి ఉత్పత్తులైన జున్ను, వెన్న, పాలను భుజించేందుకు అంగీకరించరు. మొత్తం మీద వ్యవసాయం, అనుబంధ పాడి, కోళ్ల పెంపకం వంటి మీద ఏం జరుగుతుందో అన్న అనుమానం, భయం రైతాంగంలో ఉన్నాయి. ట్రంప్‌ చెప్పినట్లు ఇండోనేషియా మాదిరి మనతో ఒప్పందం ఉంటే అది కచ్చితంగా ముప్పే. మోడీ దేవుడు అని నమ్ముతున్నవారికి ఒప్పందం పీక్కుతినే దెయ్యంగా మారుతుందా ఏం జరుగుతుందో చూడాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఏలుబడిలో మరింత దిగజారిన లింగ అంతరం : జిడిపికి 2.9లక్షల కోట్ల డాలర్లనష్టం, అడిగేవారు లేరనేగా ఇంత అన్యాయం !

16 Monday Jun 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, Education, employees, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, Beti Bachao Beti Padhao, BJP, Gender Inequality, India’s gender gap 131 Rank, inequality, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఇన్ని మంచి విషయాలు చెప్పారు కదా మీ వాడిలో ఉన్న రెండు లోపాలు చెబుతారా అని పిల్లనివ్వటానికి వచ్చిన పెద్దలు తండ్రిని అడిగారట. ఓస్‌ అంతేనా ఒకటి వాడికి తెలియదు, రెండు ఇతరులు చెప్పేది వినడు అన్నాడట. కొందరు పాలకులను చూస్తుంటే అదే అనిపిస్తోంది. పదకొండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలన విజయోత్సవాలంటూ బిజెపి, దాని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి.సగం మందిగా ఉన్న మహిళల స్థితి బాగుపడకుండా ఎన్నికబుర్లు చెప్పినా అది నిజమైన వృద్ధి కాదు. పచ్చి నిజం ఏమిటంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశంలో లింగఅంతరం తగ్గలేదు కదా , అంతకు ముందు ఉన్నదానికంటే దిగజారింది. దీని వలన జిడిపికి జరుగుతున్న నష్టం మామూలుగా లేదు.2015లో మెకెన్సీ గ్లోబల్‌ సంస్థ చెప్పినదాని ప్రకారం(2015 సెప్టెంబరు 25వ తేదీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా) పురుషులతో సమంగా ఉపాధి, సమానపనికి సమానవేతనం గనుక అమలు జరిపితే ప్రపంచ జిడిపికి 2025నాటికి 12లక్షల కోట్ల డాలర్లు తోడవుతుందని, దానిలో ఎక్కువ మొత్తం 2.9లక్షల కోట్ల డాలర్లు భారత్‌లో తోడవుతుందిని స్పష్టంగా పేర్కొన్నది. అది నాటి వేతనాలు, ద్రవ్యోల్బణం తదితరాల ప్రాతిపదికన వేసిన అంచనా అది. ఈ మొత్తం ఇప్పుడు అంచనా వేస్తున్న 4.187లక్షల కోట్ల డాలర్లకు అదనం, జర్మనీని కూడా దాటి మూడో స్థానంలోకి వెళ్లిపోయి ఉండేది. అసమానతల తగ్గింపు కృషికి మోడీని ఎంపిక చేసినట్లు చెప్పటం మరొక ప్రహసనం. అధికారానికి వచ్చిన మూడేండ్లకే అలాంటి నిర్ణయానికి సియోల్‌ బహమతి ఎంపికదార్లు ఎలా వస్తారు.ప్రధాని నరేంద్రమోడీకి 2018 సియోల్‌(దక్షిణ కొరియా) శాంతి బహమతి ఇచ్చారు.దేనికటా ! 2018 అక్టోబరు 24వ తేదీ మనవిదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో పెట్టిన సమాచారం మేరకు మోడినోమిక్స్‌ ద్వారా ప్రపంచ ఆర్థిక పురోగతిని పెంచటానికి, ఆర్థిక వృద్ధితో భారతీయుల మానవాభివృద్దిని వేగవంతం చేసేందుకు, ప్రజాస్వామ్య వృద్ధి, దేశంలో పేదలు, ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చేసిన కృషిని బహుమతి కమిటీ గుర్తించి ఎంపిక చేసిందని పేర్కొన్నారు. పదేండ్ల అనుభవం ఏమిటి ? 1961లో మన దేశంలో ధనికులుగా ఉన్న ఎగువ ఒకశాతం మంది వద్ద జాతీయ సంపదలో 12.9శాతం పోగుపడితే అది ఇప్పుడు 40శాతం దాటింది. నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన 1991లో 20శాతంగా ఉన్న కేంద్రీకరణ మోడీ అధికారానికి వచ్చే నాటికి 30శాతానికి చేరింది, మోడీ దాన్ని 40శాతానికి చేర్చారు, అసమానత తగ్గింది ఎక్కడ ? దిగువ 50శాతం మంది సంపద 1961నుంచి 2023 మధ్య 11.4 నుంచి 6.5శాతానికి దిగజారింది, మధ్యతరగతి అనుకొనేవారిది కూడా 43.7 నుంచి 29శాతానికి దిగజారింది, అంటే వారు కూడా పేదల్లోకి వచ్చారు. చిత్రం ఏమిటంటే ఇంత అసమానతలు పెరుగుతుంటే నిష్టదారిద్య్రం నుంచి పాతిక కోట్ల మందిని మెరుగైన స్థితిలోకి నెట్టామని చెప్పుకుంటున్నారు. ఇదొక ప్రహసనం, అంకెల గారడీ !


కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో మేము, మామిత్రులు ఉన్నాం అని చెబుతున్న నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా అనుభవంఉన్నప్పటికీ మెకెన్సీ నివేదిక చెప్పిందేమిటో అర్ధం కాలేదా, వారేమిటి మాకు చెప్పేది అని ఖాతరు చేయలేదా ? ఇంతవరకు లింగ అంతరం, ఆర్థిక అసమానతల తగ్గింపుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ? మోడీ విజయగీతాలాపనలో తలమునకలుగా ఉన్న మీడియాలో ఎక్కడా దీని ప్రస్తావన కనిపించదు, వినిపించదు.2014లో ప్రపంచ ఆర్థికవేదిక విడుదల చేసిన నివేదిక ప్రకారం లింగఅంతరంలో 142 దేశాల్లో మన స్థానం 114, వచ్చిన పాయింట్లు 0.6455 కాగా అదే సంస్థ విడుదల చేసిన 2025 నివేదికలో 148దేశాలకు గాను 131వ స్థానంలో ఉన్నాం, వచ్చిన మార్కులు 0.644, గతం కంటే తగ్గాయి. జపాన్‌ కంటే ఈ ఏడాది కొన్నివేల కోట్ల డాలర్లు ఎక్కువగా ఉండి నాలుగో స్థానంలోకి వస్తుందన్న అంచనాలను చూసి పండగచేసుకున్న వారు లింగ అంతరం దిగజారటం గురించి మాట్లాడరేం ! మహిళలంటే చిన్నచూపు, నిర్లక్ష్యం, దీని గురించి చర్చ జరిగితే మోడీ విజయ బండారం బయటపడుతుందని తప్ప మరొక కారణం ఏముంది ?


పదకొండు సంవత్సరాలుగా ఎన్ని కబుర్లు చెప్పినా తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి అంతం లేదు. ఉట్టికొట్టలేనయ్య స్వర్గానికి ఎగురుతాడా అన్నట్లుగా 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతానని చెబుతున్నారు.లింగ అంతరం అంటే స్త్రీ, పురుషుల మధ్య ఉన్న సమానత్వంలో ఉన్న తేడా మదింపు. అవకాశాలు, విద్య, ఆరోగ్యం, రాజకీయ సాధికారత, బతికి ఉండటం సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే మార్కుల ఆధారంగా సూచికలను తయారు చేస్తారు, వాటికి ఆయా దేశాలు ఇచ్చే సమాచారమే ప్రాతిపదిక. ఆర్థికభాగస్వామ్యం, విద్య,వైద్యం,రాజకీయ సాధికారత అనే నాలుగు అంశాలపై విడివిడిగా సూచికలు రూపొందిస్తారు, వాటన్నింటిని కలిపి సాధారణ లింగఅంతర సూచికను తయారు చేస్తారు. వీటిలో కొన్ని పెరుగుదల తగ్గుదల ఉన్నప్పటికీ పది సంవత్సరాలలో మొత్తం మీద స్వల్ప తగ్గుదల నమోదైంది. పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బిల్లు ఆమోదించినప్పటికీ గత ఎన్నికలలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అందువలన మహిళా సాధికారత సూచికలో 2023 కంటే 2025లో 14.7 నుంచి 13.8కి పాయింట్లు తగ్గిపోయాయి.మహిళలకు మంత్రిపదవులు కూడా 6.5 నుంచి 5.6శాతానికి పడిపోయాయి. మరోవైపు త్వరలో జిడిపిలో మూడో స్థానానికి ఎదుగుతాం, అభివృద్ధి చెందిన దేశంగా మారనున్నాం అని అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు మన ఇరుగు పొరుగుదేశాల స్థితి గతులను చూద్దాం. అన్నింటికంటే అధమ స్థానంలో ఉన్న పాకిస్తాన్‌తో 148తో పోల్చుకుంటే 131లో మెరుగ్గా ఉన్నాం. తాజా సూచికలో ఏకంగా 75 స్థానాలను మెరుగుపరచుకొన్న బంగ్లాదేశ్‌ 24, చైనా 103,భూటాన్‌ 119, నేపాల్‌ 125, శ్రీలంక 130, మాల్దీవులు 138వ స్థానంలో ఉన్నాయి.

బేటీ పడావో బేటీ బచావో (ఆడపిల్లల్ని చదివించండి, ఆడపిల్లల్ని రక్షించండి) అంటూ పదేండ్ల క్రితం పెద్దగా ఒక పధకాన్ని నరేంద్రమోడీ ప్రారంభించారు.దరిద్రం ఏమిటంటే దానికి కేటాయించిన నిధులే స్వల్పం కాగా ఆ మొత్తాన్ని కూడా ఖర్చు చేయటం లేదు. ఆరేండ్లలోపు బాలబాలికల నిష్పత్తి 1961నుంచి మనదేశంలో పడిపోతోంది.1991లో ప్రతి వెయ్యి మంది బాలురకు గాను 945 మంది బాలికలు ఉండగా క్రమంగా తగ్గుతూ 2011 నాటికి 918కి పడిపోయింది, తరువాత ఇంతవరకు జనాభా లెక్కలు జరగలేదు గనుక కేవలం అంచనాలు మాత్రమే చెబుతున్నారు.2019 21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అంతకు ముందు 201516తో పోల్చితే 919 నుంచి 929పెరిగిందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 934, తెలంగాణాలో 894 మంది ఉన్నారు. కేంద్ర గణాంకశాఖ 2023లో విడుదల చేసిన భారత్‌లో స్త్రీ, పురుషులు అనే నివేదిక ప్రకారం 2036నాటికి ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 952 మంది ఆడపిల్లలు ఉంటారని అంచనా వేశారు. మొత్తంగా స్త్రీ, పురుషుల నిష్పత్తిని చూస్తే 2025లో ప్రతి 106.453 మంది పురుషులకు వందమంది మహిళలు ఉన్నారని, దీని ప్రకారం జనాభాలో పురుషులు 51.56 శాతం ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 48.44శాతంగా ఉన్న మహిళలు 2036 నాటికి 48.8శాతానికి పెరుగుతారని అంచనా.2010లో ప్రతి వంద మంది ఆడపిల్లలకు 109.6 మంది మగపిల్లలు ఉన్నారని అంచనా. ఈ కారణంగానే అనేక మంది యువకులకు వివాహాలు కావటం లేదు. మంచి ఉద్యోగం, సంపద, రాబడి ఉన్నవారిని మాత్రమే అమ్మాయిలు ఎంచుకుంటున్నారని, వ్యవసాయంలో ఉన్నవారికి ఆలశ్యం అవుతోందని చెబుతున్నారు. జనాభా లెక్కలను 2027లో సేకరించనున్నందున వాటిని నిర్ధారించిన తరువాత మాత్రమే వాస్తవ పరిస్థితి వెల్లడి అవుతుంది. అప్పటి వరకు చెప్పేవన్నీ అంచనాలు మాత్రమే. ఉదాహరణకు 2025లో మన జనాభా 144కోట్లని గతంలో అంచనా చెప్పారు. ఇప్పుడు 146.39 కోట్లంటున్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష, లింగనిర్దారణ పరీక్షలు చేయించి అబార్షన్లు చేయించటం వంటి దుర్మార్గం జరుగుతున్న కారణంగా బేటీ బచావో పథకాన్ని 2015 జనవరి 22న ప్రవేశపెట్టారు గానీ ఆచరణలో అలాంటి చర్యలను ఆపేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు.లింగ అంతరం తగ్గకపోగా మరింతగా పడిపోవటానికి కారణం ఏమిటో ప్రధాని లేదా ఆయన మద్దతుదారులు చెప్పాలి. ఇంతవరకు ఏ బిజెపీ నేతా కాషాయదళాల మేథావులు కూడా స్పందించలేదు.

లింగ అంతరంలో ఆడపిల్లలు బతికి బట్టకట్టటాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు, ఈ పథకంలో బేటీ బచావో అన్నా అదే. అందుకే ఈ పథకం వైఫల్యం కూడా అంతరం మరింతగా పతనం కావటానికి దోహదం చేసిందని చెప్పాల్సి వస్తోంది. ఈ పథకానికి కేటాయించిన నిధులతో నరేంద్రమోడీ బొమ్మతో ప్రచారానికే ఎక్కువ ఖర్చు చేశారు. ఏడాదికి రెండు పాయింట్ల చొప్పున మెరుగుదల సాధించాలన్నది లక్ష్యం. అది జరిగినట్లు కనిపించటం లేదు. మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ 2021 సమీక్షలో ఈ పథకానికి కేటాయించిన సొమ్ములో కేవలం 25.13శాతమే ఖర్చు చేసినట్లు, వాటిలో కూడా 80శాతం ప్రకటనలకే వెచ్చించినట్లు, ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలతో పాటు అనేక రాష్ట్రాలలో పథక లక్ష్యాలు నెరవేరలేదని కూడా తేలింది. కాగ్‌ నివేదికలు కూడా దీన్నే సూచించాయి. పదేండ్లు దాటుతున్నా దీని అమలు గురించి సర్వేలే చేయలేదు.2019లో ప్రభుత్వమే పార్లమెంటుకు ఈ విషయాన్ని చెప్పింది. లింగ నిష్పత్తి ఏమాత్రం పెరిగినా దానికి ఈ పథకమే కారణం అని చెప్పే స్థితిలో పాలకులు లేరు. లింగ నిష్పత్తి ఈ పధకం ప్రారంభమైన తరువాత కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో 2014లో 1107 ఉండగా 201617 నాటికి 976కు, నికోబార్‌ దీవుల్లో 985 నుంచి 839కు పడిపోయిందని వార్తలు రాగా 201921 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పుదుచ్చేరిలో 959, అండమాన్‌, నికోబార్‌లో 914 ఉన్నట్లు పేర్కొన్నారు.


2024 లింగ అంతరం నివేదిక ప్రకారం పురుషుడు రు.100 సంపాదిస్తే అదే పనికి మహిళకు ఇస్తున్నది రు. 39.80 మాత్రమే.ఇది ఒక్క చిన్న చిన్న ఉపాధి, ఉద్యోగాలకే కాదు, టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాల్లో కూడా ఇదే పరిస్థితి అంటే అతిశయోక్తి కాదు.ప్రఖ్యాత హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ 2021 ఆగస్టులో ప్రతిఫల చెల్లింపులో వివక్షను ప్రశ్నించారు. తన భర్త రణవీర్‌ సింగ్‌ ఎంత కష్టపడతారో తానూ అదే చేస్తానని తనకు తక్కువ మొత్తం ఇవ్వచూపినందుకు సంజయ్‌ లీలా బన్సాలీ సినిమా బైజు బావరాలో నటించేందుకు తిరస్కరించినట్లు ఆమె బహిరంగంగా చెప్పారు. ఆమె ఒక స్థాయికి ఎదిగారు గనుక అలా చెప్పగలిగారు, ఎందరికి అలాంటి అవకాశం ఉంది. నిజానికి ఇది బాలీవుడ్‌లోనే కాదు దేశంలోని అన్ని సినిమా రంగాల్లో , ఇతర చోట్ల ఉంది.హాకీలో పది రెట్లు ఉన్నట్లు ఫెమినిజమ్‌ ఇండియా నివేదిక అదే ఏడాది పేర్కొన్నది. 2015లో కేరళలో జరిగిన జాతీయ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో బహుమతిగా పురుషులకు రు.1.2లక్షలు, మహిళలకు రు.50వేలుగా నిర్ణయించటాన్ని నిరసిస్తూ తాను పోటీలలో పాల్గొనటం లేదని దీపికా పాలికల్‌ నిరాకరించింది. మనదేశ శ్రమశక్తి మార్కెట్‌లో వేతన వ్యత్యాసం పెద్ద సమస్యగా ఉంది. నరేంద్రమోడీ తన మన్‌కీ బాత్‌లో ఎన్నడూ దీని గురించి ప్రముఖంగా ప్రస్తావించినట్లు, తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎక్కడా కనిపించదు. కరోనా సమయంలో అంతకు ముందున్నదానికంటే వేతన వ్యత్యాసం ఏడుశాతం పెరిగిందని పిఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వే సమాచారం వెల్లడిరచింది.
ఉద్యోగాల్లో చేరటంలో ఒకే స్థాయిలో 46శాతం ఉన్నప్పటికీ సిఇఓ,సిఎఫ్‌ఓ, సివోవో వంటి ఉన్నత స్థానాలో 25శాతానికి మించి మహిళలు లేరని కెపిఎంజి, మరియు ఏఐఎంఏ 2024 సర్వేలో తేలింది.అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సమానవేతనాలు లేకపోవటం ప్రసూతి సెలవు వంటి సామాజిక భద్రత లేని విషయం తెలిసిందే.శ్రామిక మహిళలకు 26వారాల ప్రసూతి సెలవు ఇవ్వాలనే చట్టసవరణ తరువాత అనేక మంది యజమానులు పిల్లల్ని కనేవయస్సులో ఉన్నవారిని పనిలో పెట్టుకోవటం తగ్గించటం లేదా రాజీనామా చేయించి తరువాత చేర్చుకోవటం వంటి పనులకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. స్త్రీని దేవతగా పూజించే దేశం కదా ! కొన్నిదేశాల్లో తండ్రులకు కూడా పిల్లల సంరక్షణ సెలవులు ఇస్తున్నకారణంగా మహిళల నియామక వివక్ష కొంత మేర తగ్గింది. మనదేశంలో సైతం ఎందుకు దాన్ని ప్రవేశపెట్టకూడదు ? చట్టసభల్లో మూడోవంతు సీట్లు ఇవ్వటానికే వామపక్షాలు మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఎన్ని నాటకాలాడాయో చూశాము. ? భూస్వామిక వ్యవస్థ భావజాలం నుంచి బయపడతారా ? ఒకవైపు పురోగమనంలో ఉన్నామని చెబుతూ మహిళలను అణచివేసిన సనాతన ధర్మాన్ని, మనువాదాన్ని తలకెత్తుకుంటున్న శక్తులు రెచ్చిపోతున్న తరుణంలో పురుషులతో సమంగా స్త్రీలను చూసేందుకు అంగీకరిస్తారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌లో జననాల రేటు 1.9 : ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ! ఎందరు హిందూత్వ వాదులు పది మందిని కన్నారు !!

14 Saturday Jun 2025

Posted by raomk in Communalism, Current Affairs, Health, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Anti Muslim, BJP, fertility fallacy, Hindu Population, hindutva, India TFR, Narendra Modi Failures, RSS, TFR, VHP, Yogi Adityanath

ఎం కోటేశ్వరరావు


ప్రతి సమాజంలో కనీసం 2.1 మంది పిల్లల్ని కంటే అది అంతరించి పోకుండా ముందుకు సాగుతుంది ఇది జనాభా శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.ప్రపంచ జనాభా తాజా నివేదిక ప్రకారం భారత్‌లో జననాల రేటు 1.9 మాత్రమే, అంటే ప్రతి మహిళ సగటున పిల్లల్ని కంటున్న సంఖ్య అది. 1960లో ఆరుగురికి జన్మ నిచ్చింది, ఇలా ఎందుకు ఇలా జరుగుతోంది. హిందూమతాన్ని రక్షించుకోవాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ పవన్‌ కల్యాణ్‌ లాంటి నేతలు ఊగిపోవటాన్ని చూస్తున్నాము. అది నటనో లేక నిజంగానే వేసే వీరంగమో తెలియదు. హిందువులను మైనారిటీలుగా మార్చి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూస్తున్నారంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టే బాపతు మనకు ఈ రోజుల్లో ఎక్కడబడితే అక్కడ కనిపిస్తున్నది. 2015లో సాక్షి మహరాజ్‌ (69) అనే బిజెపి ఎంపీగా నాలుగుసార్లు పని చేసిన స్వామీజీ హిందూమతాన్ని రక్షించుకోవాలంటే హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లల్ని కనాలని చెప్పారు. నలుగురు భార్యలను చేసుకొని40 మంది సంతానాన్ని కనటం భారత్‌లో వీలుకాదు అంటూ వేరే మతం వారి మీద విద్వేషం వెళ్లగక్కారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సే ఒక దేశభక్తుడని చెప్పిన ఈ పెద్దమనిషి సన్యాసాన్ని వదలి వేసి వివాహం చేసుకొని నలుగుర్నిగాక పోతే 40 మందిని ఎందుకు కనలేదన్నది ప్రశ్న. ఇలాంటి స్వాములు, స్వామినులు జనాలకు ఇలాంటి సుభాషితాలు చెబుతుంటారు.


‘‘ హిందువులు పదిమంది పిల్లల్ని కనాలంటూ మితవాద బృందాలు ఇచ్చిన పిలుపు ప్రతికూలఫలితమిస్తుంది ’’ అనే శీర్షికతో హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక 2016 డిసెంబరు 26న ఒక వార్తను ప్రచురించింది. దాని సారాంశం ఇలా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఉన్న పీఠాధిపతులు ధర్మ సంస్కృతి మహాకుంభ పేరుతో మూడు రోజుల సమావేశం నిర్వహించారు. ముస్లిముల సంఖ్య వేగంగా పెరిగిపోయి హిందువులను మించిపోతారు గనుక హిందువులు పదిమంది పిల్లల్ని కనాలని ఈ సదస్సులో పిలుపునిచ్చారు.జ్యోతిర్‌ మఠ శంకరాచార్యుడు వాసుదేవానంద సరస్వతి మాట్లాడుతూ హిందువులు పదేసి మంది పిల్లల్ని కనాలని, దేవుడే వారి సంరక్షణ చూసుకుంటాడని సెలవిచ్చినపుడు మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌, అసోం గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ ఆ సమావేశంలో ఉన్నారు. హిందూమత పరిరక్షకులం అని చెప్పుకొనే అనేక మంది ఆచరణ ఏమిటి ? ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న కమ్యూనిస్టుల నినాదాన్ని కాపీ కొట్టి హిందువులందరూ ఏకంకండి అని పిలుపులు ఇస్తున్నారు. అసలు వారి మధ్య ఏకీభావం ఉందా ? ప్రపంచమంతటా పెద్ద మతం క్రైస్తవం, వారు తమ మతాధిపతిగా పోప్‌ను ఎన్నుకుంటారు. అలాగే ఒక హిందూమతాధిపతిని ఎన్నుకోలేనివారు మొత్తం హిందువులందరినీ ఐక్యం కావాలని పిలుపు ఇవ్వటం దివాలాకోరుతనం కాదా ? ఎవరు అడ్డుకున్నారు ! నిలువు బొట్లు, అడ్డబొట్ల (సామాన్యులు కాదు ) పెద్దలు పరస్పరం ఆయా పుణ్యక్షేత్రాల గడపకూడా తొక్కరు. ఉదాహరణకు వైష్ణవాచార్యుడైన చిన్న జియ్యర్‌ స్వామి ఎన్నడైనా శివాలయాలకు వెళ్లటం ఎవరైనా చూశారా ! ఎందుకు బహిష్కరిస్తున్నట్లు ? ఈ ప్రశ్న నిరంతరం అడుగుతూ ఉండాల్సిందే. కాసేపు పక్కన పెడదాం.

అసలు హిందువులు ఎందరు పిల్లల్ని కనాలో చెప్పేవారి మధ్య ఏకీభావం ఉందా ? వారిని అసలు జనాలు పట్టించుకుంటున్నారా ? ఏ మాత్రం ఖాతరు చేసినా మనదేశంలో జనన రేటు 1.9కి పడిపోయి ఉండేది కాదు. హిందూత్వను పక్కాగా సమర్ధించే బిజెపి, దానికి పక్కా సనాతన్‌ అంటూ తోడైన పవన్‌ కల్యాణ్‌, మేమూ అదే అంటున్న తెలుగుదేశం పార్టీ తదితర మొత్తం 25 పార్టీల కలగూరగంప ఎన్‌డిఏ కూటమికి 2024లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మొత్తం 43శాతం మాత్రమే. అదీ తమకు వివిధ రాష్ట్రాలలో ముస్లింలు, క్రైస్తవులు గణనీయంగా ఓట్లు వేశారని చెప్పుకున్న తరువాత, బిజెపి ఓట్లు 36.56శాతమే. అంటే మెజారిటీ హిందువులు, మొత్తం జనాభాలో ఈ కూటమికి మెజారిటీ లేదు. ఓట్లే వేయని వారు పది మంది పిల్లల్ని కనమంటే ముందుకు వస్తారా ? ఈ నినాదాలు ఇస్తున్నవారు, వాటిని బలపరుస్తున్నవారి కుటుంబాలలో ఎందరు అంతమందిని కన్నారో చెప్పమనండి.


2016 ఏప్రిల్‌లో గిరిరాజ్‌ సింగ్‌ అనే బిజెపి కేంద్ర మంత్రి ‘‘ ప్రతి ఒక్కరూ ఒకరూ లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి, అంతకు మించి కన్నవారికి ఓటింగ్‌ హక్కులు రద్దు చేయాలి. ఈ నిబంధన భారతీయులందరికీ వర్తింప చేయాలి. హిందువులు, ముస్లింలు కూడా ఇద్దరేసి కొడుకులను మాత్రమే కనాలి. బీహార్‌లోని చంపరాన్‌ జిల్లాలో హిందూమత పెద్దలు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఈ మాటలు మాట్లాడారు. బీహార్‌లోని ఏడు జిల్లాల్లో ‘‘ మన జనాభా ’’ తగ్గిపోయిందని వాపోయారు. సాక్షి మహరాజ్‌గా సుపరిచితుడైన బిజెపి ఎంపీ, అవివాహితుడైన స్వామి సచ్చిదానంద హరి 2015 జనవరిలో మాట్లాడుతూ హిందూమత పరిరక్షణకోసం ప్రతి కుటుంబం నలుగురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. మరో అవివాహిత, విశ్వహిందూపరిషత్‌ నాయకురాలు సాధ్వీ ప్రాచీ మరింత ముందుకు పోయారు. సింహం కేవలం ఒక పిల్లకు మాత్రమే పరిమితం కాకూడదు.మనం కూడా ప్రతి కుటుంబంలో నలుగురు పిల్లల్ని కనాలి.సరిహద్దుల్లో ఒకరు శత్రువు మీద పోరాడాలి. ఒకర్ని సాధువుగా చేయాలి, మరొకర్ని సామాజిక సేవకోసం విశ్వహిందూపరిషత్‌కు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన శ్యామల్‌ గోస్వామి అనే నేత హిందూయిజం, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందూ కుటుంబం ఐదుగురు పిల్లల్ని కనాలని చెప్పారు. కన్నయ్యదాస్‌ అనే అయోధ్య పూజారి, విశ్వహిందూపరిషత్‌ మద్దతుదారు కనీసం ఎనిమిది మంది పిల్లల్ని కనాలన్నారు.2015లో అలహాబాదులో జరిగిన మాఘమేళ సందర్భంగా బదరీకాశ్రమం శంకరాచార్య వాసుదేవానంద సరస్వతి మాట్లాడుతూ హిందువుల ఐక్యత కారణంగానే మోడీ ప్రధాని అయ్యారని, అందువలన మెజారిటీని కొనసాగించాలంటే ప్రతి హిందూ కుటుంబం పది మంది పిల్లల్ని కంటూ ఉండాలని చెప్పారు.విశ్వహిందూ పరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా ఏం చెప్పారంటే ప్రతి హిందూ జంట నలుగురు పిల్లల్ని కనాలని సాక్షి మహరాజ్‌ చెప్పిందాంట్లో తప్పేముంది ? ఇతరులు పదిమందిని కంటుంటే మాత్రం ఎవరూ ఎలాంటి ప్రశ్న వేయరు, హిందువుల విషయంలోనే ఈ రచ్చ ఎందుకు అని వాదించారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సంస్థలలో ఒకటైన విశ్వహిందూపరిషత్‌ అధ్యక్షుడిగా ఉన్న ప్రవీణ్‌ తొగాడియా ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపే పత్రిక ఆర్గనైజర్‌లో రాసిన ఒక వ్యాసంలోని అంశాన్ని హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక 2015 సెప్టెంబరు మూడవ తేదీన ‘‘ ముస్లింలకు ఇద్దరు పిల్లల నిబంధన ఉండాలన్న విహెచ్‌పి ప్రవీణ్‌ తొగాడియా ’’ అనే శీర్షికతో ఇచ్చిన వార్తలో ఉటంకించింది. ముస్లింలలో ప్రతి బిడ్డ పుట్టుకకు సబ్సిడీ ఇవ్వటం గాక ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత కచ్చితమైన నిరోధాన్ని పెట్టాలని, అది శిక్షార్హమైన నేరంగా మరియు రేషన్‌, ఉద్యోగాలు, విద్యా సౌకర్యాలను నిలిపివేసి జనాభాను క్రమబద్దీకరించి మెరుగైన అభివృద్ది చేయాలని ప్రవీణ్‌ తొగాడియా రాశారని పేర్కొన్నది.జనాభా జీహాద్‌ను ఇప్పుడు వ్యతిరేకించకపోతే భారత్‌ త్వరలో ముస్లిం దేశంగా మారిపోతుందన్నారు.జనాభాలో వచ్చే మార్పులతో హిందూ కుటుంబాలు, భూమి, ఆస్తులు, మతపరమైన ప్రాంతాలు, ఉపాధి, వ్యాపారం, ఇతర అన్నింటికీ ముప్పు తలెత్తే ప్రమాదం ఉందని తొగాడియా పేర్కొన్నారు.


కాషాయ దళాల మాటలను ఎందుకు ప్రస్తావించాల్సి ఉందంటే వీరు లేక ముందు కూడా వేల సంవత్సరాలుగా హిందూమతం ఉనికిలో ఉంది. వందల సంవత్సరాల పాటు మొఘలులు, ఆంగ్లేయులు దేశాన్ని ఆక్రమించి పాలన సాగించినా 80శాతం ఇప్పటికీ హిందువులుగానే ఉన్నారు. మనుధర్మం, మరొకపేరుతో దళితులు, గిరిజనులను అమానుషంగా చూసిన కారణంగానే వారిలో అనేక మంది ముస్లిం, క్రైస్తవులుగా మారారు తప్ప అందరూ విదేశాల నుంచి వలస వచ్చిన వారి వారసులు కాదు.ఇప్పుడేదో హిందూమతానికి ముప్పు వచ్చిందని పదేసి మంది పిల్లల్ని కనాలంటూ పిలుపులు ఇస్తుంటే వాటిని జనం ముఖ్యంగా మహిళలు పట్టించుకోవటం లేదు. అందుకే పదేండ్ల నాటికీ ఇప్పటికీ జననాల రేటు తగ్గిపోతున్నది.

పిటిఐ వార్తా సంస్థ ఇచ్చిన వార్త ప్రకారం (2025జనవరి 25) ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ప్రయాగ్‌రాజ్‌ పట్టణంలో జరిగిన విరాట్‌ సంత్‌ సమ్మేళనంలో పాల్గొన్నారు.(ఎగువన ఉన్న ఫొటోలో చూడవచ్చు) మహాకుంభనగర్‌లో జరిగిన ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి భజరంగ్‌ లాల్‌ బాంగ్రా ప్రతి హిందూ కుటుంబం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. హిందువుల్లో జననాల రేటు తగ్గిపోవటం గురించి విహెచ్‌పి చేస్తున్న ప్రయత్నాలను ఆదిత్యనాధ్‌ ప్రశంసించారు. అంతకు ముందు వీరందరికీ గురువు అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ భారత సమాజం బతికి బట్టకట్టాలంటే ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. అయితే హిందువులు అనే పదం ఆ సమయంలో వాడకపోయినా దాని అర్ధం ఏమిటో ఎవరికి వారే ఊహించుకోవచ్చు. 2024 డిసెంబరు ఒకటవ తేదీన నాగపూర్‌లో మాట్లాడుతూ జనాభా శాస్త్ర ప్రకారం జననాల వృద్ధి రేటు 2.1లేకపోతే ఒక సమాజం దానంతట అదే నాశనం అవుతుంది, వేరే ఎవరూ నాశనం చేయనవసరం లేదు అన్నారు. ఆయన చుట్టూ ఉన్నవారందరూ హిందూ సమాజానికి ముప్పు వచ్చిందంటూ హోరెత్తిస్తుంటే ఆ మాటలకు కూడా అర్ధం అదిగాక వేరే ఎలా అవుతుంది.


జూన్‌ పదవ తేదీన ఐరాస విడుదల చేసిన ప్రపంచ జనాభా స్థితి నివేదికలో జననాల రేటు తగ్గిపోవటానికి దోహదం చేస్తున్న వివిధ అంశాలను పేర్కొన్నది, అవన్నీ మన దేశానికి కూడా వర్తిస్తాయి.మనతో సహా పద్నాలుగు దేశాలకు చెందిన పద్నాలుగువేల మంది నుంచి ప్రశ్నావళికి రాబట్టిన అంశాలను అది విశ్లేషించింది.ప్రస్తుతం ప్రపంచలో 800 కోట్ల మంది జనాభా అధికంగా ఉందనే అభిప్రాయాన్ని కలిగించటం ఒకవాస్తవమైతే అన్ని చోట్లా ఒకే విధంగా లేకపోవటంతో కొన్ని చోట్ల జననాల తగ్గుదల గురించి ఆందోళన వ్యక్తమౌతోంది. కోరుకున్నంత మంది పిల్లల్ని కనాలని అనుకున్నా ఐదోవంతు మందికి సాధ్యం కావటం లేదు.అనేక మందికి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఉన్నప్పటికీ వారిని సక్రమంగా పెంచేందుకు అవసరమైన ఉద్యోగ భద్రత, నివాసం, పిల్లల సంరక్షణ వంటి సమస్యల కారణంగా వెనకడుగు వేస్తున్నారు.ఉద్యోగాలు, పిల్లల సంరక్షణ మహిళల మీద భారాన్ని రెట్టింపు చేయటంతో ఎక్కువ మందిని కనేందుకు వారు విముఖత చూపుతున్నారు. అనేక దేశాల్లో ప్రసూతి సెలవులు, వేతనాలు ఎక్కువగా ఇవ్వటానికి ఇదొక కారణం, అయినప్పటికీ అనుకున్న మేర జననాలు పెరగటం లేదు.ఎక్కువ మంది పిల్లలు ఉంటే వత్తిడి ఎక్కువగా ఉంటున్నకారణం కూడా ఉంది. నైజీరియావంటిచోట్ల సగటున ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఎక్కువ మందిని కనాలనే సామాజిక వత్తిడి, ఆరోగ్యసేవలేమి సమస్యలను అక్కడ ఎదుర్కొంటున్నారు. సంతాన నిరోధక పద్దతులపై అనుమానాలు, అవగాహనలేమి కూడా ఉంది. కొన్ని చోట్ల సంతానాన్ని బట్టి ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాలు ఉన్నప్పటికీ తాత్కాలికంగా కొంత లబ్దిచేకూరినా తరువాత ఎదురయ్యే సమస్యల కారణంగా వాటికి జనాలు ఆకర్షితులు కావటం లేదు. కుటుంబ సభ్యులు, భాగస్వాముల వత్తిడి కారణంగా తాము తక్కువ మంది పిల్లలను కన్నట్లు సర్వేలో చెప్పారు. మొత్తం మీద 39శాతం మందికి ఆర్థిక అంశాల పరిమితులు ఎక్కువ మంది పిల్లలు వద్దనుకోవటానికి కారణమౌతున్నాయి. పన్నెండు శాతం మంది ఆరోగ్య సమస్యల వలన కావాలనుకున్న సంఖ్యలో పిల్లల్ని కనలేకపోతున్నారు. తాము తమ పిల్లల భవిష్యత్‌కు హామీ, సమానత్వం తదితర అంశాలపై కలిగించే భరోసాను, పాలకుల చర్యల మీద కలిగే విశ్వాసాలను బట్టి జననాల రేటు పెరుగుతుంది తప్ప దానికి మించిన పరిష్కారం మరొకటి లేదు.

మనదేశంలో జననాల రేటు గణనీయంగా పడిపోతున్నప్పటికీ ప్రస్తుతం యువజనాభా ఎక్కువగా ఉంది. మొత్తం జనాభా 146 కోట్ల 39లక్షలు. ఈ సంఖ్య 170 కోట్లకు పెరిగిన తరువాత ఇప్పటి నుంచి 40 ఏండ్ల తరువాత తగ్గుముఖం పడుతుంది. తమిళనాడు, కేరళ, ఢల్లీి రాష్ట్రాలలో అవసరమైనదానికంటే జననాల రేటు తక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రతి మహిళకు 1.9 మంది పిల్లలు ఉంటే 1960లో ఆరుగురు ఉన్నారు. బీహార్‌, రaార్కండ్‌, ఉత్తర ప్రదేశ్‌లలో ఎక్కువ జననాల రేటు ఉంది. మన జనాభాలో ఇప్పుడు పద్నాలుగేండ్ల లోపు వారు 24శాతం, పది, పందొమ్మిదేండ్ల మధ్య వారు 17, పది, ఇరవైనాలు సంవత్సరాల వారు 26శాతం ఉన్నారు.
ఎవరెంతమంది పిల్లల్ని కనాలో కనకూడదో నిర్ణయించుకోవాల్సింది దంపతులు తప్ప స్వాములు, సాధ్వులు, ముల్లాలు, పాస్టర్లు కాదు. కానీ వీరంతా కుటుంబ జీవనాల్లో వేలు పెడుతున్నారు. పడకగదుల్లో దూరుతున్నారు. ఏమంటే మతాన్ని కాపాడాల్సిన బాధ్యత అని సుభాషితాలు చెబుతున్నారు. పోనీ వీరెవరైనా పిల్లలు, తల్లుల సంరక్షణ బాధ్యత తీసుకుంటారా ? లేదు, నారుపోసిన వాడు నీరు పోయడా అంటూ దేవుళ్ల మీద దేవదూతల మీద భారం మోపుతారు. తమ సన్యాసాన్ని పక్కన పెట్టి వివాహాలు చేసుకొని డజన్ల కొద్దీ పిల్లలను కంటున్నారా అంటే, అదే జరిగితే ఇప్పటి మాదిరి ఎక్కడబడితే అక్కడ తామరతంపరగా అలాంటి వారంతా ప్రత్యక్షం అయ్యే అవకాశమే లేదు. ఇతరులకు చెప్పేటందుకే నీతులు ! వీరిని ప్రశ్నించేవారే లేరా ? పురాతన మానవుడికి మదిలో తలెత్తిన తొలి ప్రశ్న ఎందుకు. అదే మానవాళి పురోగమనానికి చోదకశక్తి. కమ్యూనిస్టుల సంగతికాసేపు పక్కన పెట్టండి, వారు ప్రతిదాన్నీ ప్రశ్నించమంటారు. బుద్ధుడు, వివేకానందుడు ఇంకా అనేక మంది భారతీయ తత్వవేత్తలు ప్రశ్నించమన్నారు, వద్దు, ప్రశ్నించటం తప్పు అన్నవారు మనకు ఎక్కడా కనిపించరు. అయినా ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం, ఎందుకు ప్రశ్న రోజురోజుకూ బిక్కుబిక్కుమంటోంది, పాలకులను చూసి భయమా, జనంలో తలెత్తిన స్వార్ధమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ ఉగ్రవాదం : చైనా మీద ఆరోపణ మాత్రమే, అమెరికా అధ్యక్షుడు కెనడీ, బ్రిటన్‌ దుర్మార్గం గురించి తెలుసా !

08 Sunday Jun 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, Farmers, Germany, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Agro Terrorism, Amarican Virus, Biological weapons, Bioterrorism, chemical weapons


ఎం కోటేశ్వరరావు


వ్యవసాయ ఉగ్రవాదం ప్రపంచమంతటా పురాతన కాలం నుంచి ఉన్నదే. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే అస్సీరియన్లు తమ శత్రువుల ప్రాంతాలలోని బావులలో విషాన్ని కలిపేవారు. మొదటి ప్రపంచ యుద్ద కాలంలో ఫ్రాన్సుకు రవాణా అయ్యే గుర్రాలు, పశువులకు అమెరికాలో జర్మన్‌ ఏజంట్లు విషం ఇచ్చేవారు. కత్తి, బాకు, బల్లెం వంటి వాటిని కనుగొన్న తొలి మానవుడు వాటిని ప్రమాదకర జంతువుల నుంచి రక్షణకు, ఆహారం కోసం ఉపయోగించాడు. తరువాత అవే యుద్దాల్లో ఆయుధాలుగా మారాయి. శాస్త్రవేత్త చార్లెస్‌ డార్విన్‌ 1880దశకంలో చేసిన పరిశోధనలు పంటల్లో కలుపు మొక్కల నివారణకోసం రసాయనాలను కనిపెట్టేందుకు దారితీశాయి. తరువాత కాలంలో బ్రిటన్‌, అమెరికా, తదితర సామ్రాజ్యవాదులు, నియంతలు ఏకంగా పంటలు, అడవులనే నాశనం చేసేందుకు, లక్షలాది మంది మానవులు, జంతుజాలాన్ని అంతమొందించేందుకు వినియోగించిన చరిత్ర తెలుసా ? శాస్త్రవిజ్ఞానాన్ని మానవ, ప్రకృతి వినాశనానికి వినియోగించింది మానవ కల్యాణానికి బదులు వినాశనాన్ని కోరుకున్న దుర్మార్గులే అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రమాదకరమైన ఫంగస్‌ను అమెరికా వ్యవసాయక్షేత్రాల్లో ప్రవేశపెట్టి దాని ఆహార వనరును దెబ్బతీయాలని చైనా కుట్రపన్నింది, దానిలో భాగంగా ఇద్దరు చైనా జాతీయులు ఆ ఫంగస్‌ను అక్రమంగా తెస్తూ ఎఫ్‌బిఐకి దొరికి పోయారు. ఇదీ వార్త, ఒక ఆరోపణ, సదరు ఫంగస్‌ను ఎక్కడా ప్రయోగించలేదు. పరిశోధనల కోసం తెచ్చారన్నది ఒక అభిప్రాయం. అమెరికా మనదేశంలోకి వయ్యారి భామ అనే వినాశకారి అయిన కలుపు మొక్కను ఎలా ప్రవేశ పెట్టిందీ వేరే విశ్లేషణలో చూశాము. గుండెలు బాదుకుంటున్న అమెరికా కొన్ని దశాబ్దాల నాడే ఆ దుర్మార్గానికి పాల్పడిరది అనే అంశం ఎక్కడా మీడియాలో చర్చకు రావటం లేదు.పురాతన, ఆధునిక యుద్ధాలలో ఆహార ఉత్పత్తి వ్యవస్థలను దెబ్బతీయటం ఒక ఆయుధం. అందుకే చరిత్రను చదివినపుడు శత్రుదేశాలు కోటలను చుట్టుముట్టినపుడు నెలల తరబడి తట్టుకొనేందుకు ఆహారం, నీటిని నిల్వచేసుకొనే ఏర్పాట్లు చేసుకున్నట్లు అనేక దుర్గాలు, కోటల చరిత్రలు వెల్లడిరచాయి. ఆధునిక కాలంలో అందుకు జీవ, రసాయనాలను అమెరికా అస్త్రంగా వాడుకున్నది. అదెలా జరిగిందో చూద్దాం !


1953లో కొరియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే నెల రోజుల ముందు ఉత్తర కొరియా ప్రాంతంలో అమెరికా వైమానిక దళం చేసిన దాడుల్లో 75శాతం వరి ఉత్పత్తికి నీటిని అందించే ప్రాజెక్టులను నాశనం చేసింది. ఇది తరువాత కాలంలో అక్కడ కరవుకు దారి తీసింది. కమ్యూనిస్టుల పాలనలో జనాన్ని ఆకలితో మాడ్చి చంపారని ప్రచారం చేసే మానవతావాదులకు ఈ విషయం పట్టలేదు. వియత్నాంపై దాడిచేసిన అమెరికా మొక్కలను నాశనం చేసే ఏజంట్‌ ఆరెంజ్‌ అనే రసాయనాన్ని ఆపరేషన్‌ రాంచ్‌ హాండ్‌ పేరుతో 1962 నుంచి 1971వరకు వెదజల్లింది. దీనికి ఆదర్శం ఎవరు అంటే మలయా యుద్ధంలో ప్రయోగించిన బ్రిటీష్‌ దుర్మార్గులు. అమెరికాలో రైలు మార్గాలు, విద్యుత్‌ లైన్లు వేసే ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా చూసేందుకు 1940దశకంలో దీన్ని తయారు చేశారు. మనందరికీ తెలిసిన మానశాంటో సహా తొమ్మిది కంపెనీల నుంచి వియత్నాంలో చల్లేందుకు అమెరికన్‌ మిలిటరీ 7.6 కోట్ల లీటర్లు కొనుగోలు చేసింది. దాన్ని చల్లిన చోట 40లక్షల మంది మీద ప్రతికూల ప్రభావాలను చూపింది,30లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ అంచనా ప్రకారం పది లక్షల మంది వికలాంగులయ్యారు. ఈ దుర్మార్గ ప్రక్రియలో భాగస్వాములైన అమెరికా మిలిటరీలో అనేక మందికూడా దీని ప్రభావంతో కాన్సర్‌, లింఫోమా వంటి వ్యాధులకు గురైనట్లు తేలింది. వారికి పుట్టిన పిల్లలకు జన్యు సంబంధమైన వ్యాధులు వచ్చాయి, వారి దుర్మార్గానికి పిల్లలు బలయ్యారు. వియత్నాంలో పర్యావరణానికి కలిగిన హాని గురించి చెప్పనవసరం లేదు, 77లక్షల ఎకరాల్లో పంటలు పండలేదు, అడవుల్లో మొక్కలు పెరగలేదు. అనేక జంతువులకు హాని కలిగింది.మానవ మారణకాండను జనోసైడ్‌ అని వర్ణిస్తే పర్యావరణానికి చేసిన హానిని ఎకోసైడ్‌ అని వర్ణించారు. అమెరికా దురాక్రమణను వ్యతిరేకించిన వియత్నాం వీరులు అడవుల్లో ఉండటంతో వియత్నాం సరిహద్దుల్లో ఉన్న లావోస్‌, కంపూచియా అడవులను కూడా అమెరికా దుర్మార్గులు వదల్లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రసాయన, జీవ ఆయుధాలను తయారు చేశాయి. ఆ సమయంలో అనేక ప్రాంతాల్లో వాటిని పరీక్షించి చూశారు. జపాన్‌పై అణుబాంబును వేసిన అమెరికా యుద్దం గనుక కొనసాగితే 1946లో జపాన్‌పై ఏజంట్‌ ఆరెంజ్‌ను ప్రయోగించాలని పథకం వేసింది. బ్రిటీష్‌ పాలనలో ఉన్న మనదేశం, ఆస్ట్రేలియాలతో సహా మొత్తం 1,100 కేంద్రాల్లో దాని పనితీరును పరీక్షించారు. అమెరికాను కూడా వదల్లేదు. ఉష్ణప్రదేశాల్లో ఎలా పని చేస్తుందో చూసేందుకు కెన్యాలో కూడా చల్లారు. మలయా ప్రాంత దేశాల్లో రబ్బరు తోటల్లో పెరిగే కలుపు మొక్కలను నివారించేందుకు తయారు చేసిన రసాయనాన్ని తమ మీద తిరుగుబాటు చేసిన మలయన్లు ఉన్న అడవుల్లో 1960వరకు బ్రిటీష్‌ మిలిటరీ ప్రయోగించింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని అమెరికా తరువాత ఇండోచైనా ప్రాంతంలో అమలు చేసింది.ముఖ్యంగా దక్షిణ వియత్నాం బలైంది. అనేక మంది గొప్పగా పొగిడే నాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ఈ దుర్మార్గానికి అనుమతి ఇచ్చాడు. ఈ దుర్మార్గం గురించి తెలుసుకున్న తరువాత అమెరికాలో వియత్నాం యుద్ధవ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది.తప్పుడు వాదనలతో ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి.


అమెరికా ముందుగా ఎవరి మీద జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించదని, అయితే శత్రుదేశం ఏదైనా వినియోగిస్తే మాత్రం రసాయన ఆయుధాలను వదులుతామని అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ గొప్పగా చెప్పాడు, ఏ దేశమూ వినియోగించకుండానే అణుబాంబుతో సహా ఆ దుండగాలకు అమెరికా పాల్పడిరది. జపాన్‌లో వరి పొలాలను నాశనం చేసేందుకు అమెరికా వినియోగించింది.వియత్నాంలో ఏజంట్‌ ఆరంజ్‌ చల్లిన ప్రాంతాల్లో గత ఐదు దశాబ్దాలుగా చెట్లలో సాధారణ పెరుగుదల లేదు, మామూలు స్థితికి రావాలంటే చాలాకాలం పడుతుందని చెబుతున్నారు.వియత్నాం దురాక్రమణ, దాడుల్లో పాల్గొన్న అమెరికా సైనికులు ఏజంట్‌ ఆరంజ్‌ తదితర విషపూరిత రసాయనాలను వెదజల్లుతున్నపుడు వారికి కూడా వాటి ప్రభావం సోకిన కారణంగా 1984లో కోర్టు వెలుపల రసాయన కంపెనీలు 18 కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇజ్రాయెల్‌ ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాల్లోకి సముద్రపు నీరు, తమ నివాసాల నుంచి వెలువడే మురుగునీటిని పాలస్తీనియన్ల నివాసాలు, వ్యవసాయ భూముల్లోకి వదలి పనికి రాకుండా చేయటం నిత్యకృత్యం. ఇది కూడా ఒక రకంగా వ్యవసాయ ఉగ్రవాదమే. పంటలు పండకుండా అరబ్బులను మాడ్చే ఎత్తుగడ.

నీవు నేర్పియే నీరజాక్షా అని తమ వ్యవసాయం మీద చైనా దాడి చేయనుందని అమెరికా గగ్గోలు పెడుతోంది. దానికి ఇదేమీ కొత్త కాదు. ప్రతి దేశం మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే. తద్వారా తాను చేసే దుర్మార్గాలను స్వంత జనం ప్రశ్నించకుండా సమర్ధించేందుకు అది ఎంచుకున్న ఎత్తుగడ.తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి అదే బలికావటం కూడా వాస్తవం న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై వైమానికదాడి అదే. తాను పెంచిన తాలిబన్లే దానికి పాల్పడ్డారు.అమెరికా జిడిపిలో వ్యవసాయం తక్కువే అయినప్పటికీ గణనీయ మొత్తం ఎగుమతులకు ఉపయోగపడుతున్నది. ఆల్‌ఖైదాతో చెడిన తరువాత తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక కేంద్రాలపై దాడులు చేసినపుడు దొరికిన పత్రాలలో అమెరికా వ్యవసాయ వివరాలున్న పత్రాలు దొరికాయి. వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీయాలా అన్నది ఆల్‌ఖైదా శిక్షణలో భాగంగా బయటపడిరది.అమెరికాకు నాలుగు తరగతుల నుంచి వ్యవసాయ ఉగ్రవాద ప్రమాదం ఉందని 2012లో ఎఫ్‌బిఐ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. ఒకటి ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు, రెండవది మార్కెట్లను తిమ్మినిబమ్మిని చేసి లబ్దిపొందాలని చూసే ఆర్థిక నేరగాండ్లు లేదా అవకాశవాదుల నుంచి ప్రధానంగా ముప్పు ఉన్నట్లుపేర్కొన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి(ఎఫ్‌ఎండి అంటే ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌)ని వ్యాపింప చేస్తే మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నది తెలిసిందే. మూడవ తరగతి అసంతృప్తి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు తమ కసి తీర్చుకొనేందుకు చేసే ఉగ్రవాద చర్యలు, నాలుగవ తరగతిగా జంతుహక్కుల రక్షకులు, పర్యావరణ ప్రేమికులు అని పేర్కొన్నారు. న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన తరువాత అమెరికాలో ఆగ్రో టెర్రరిజం ఆకర్షణీయంగ ఉన్నట్లు కనిపించిందట.


అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తిగా ప్రపంచానికి కనిపించకుండా చేయాలంటే దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఒసామా బిన్‌లాడెన్‌ పదే పదే వాదించేవాడట.2004 అమెరికా ఎన్నికల సమయంలో ఒక వీడియోలో పదేండ్ల పాటు రష్యా రక్తమోడిరది, అమెరికా కూడా దివాలా తీసేంతవరకు అదే విధానాన్ని అనుసరించాలని చెప్పాడట. 2011 సెప్టెంబరులో అమెరికా ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి ఆల్‌ఖైదాకు అయిన ఖర్చు కేవలం ఐదు లక్షల డాలర్లేనని , అమెరికాకు కలిగిన నష్టం 500బిలియన్‌ డాలర్లని ఒసామా చెప్పాడు. ఉగ్రవాద సంస్థలు నిజంగా అలా ఆలోచిస్తున్నాయో, పథకాలు వేస్తున్నాయో తెలియదు గానీ అమెరికా విశ్లేషకులు మాత్రం ఏం చేస్తే ఎలా,ఎంతటి నష్టం జరుగుతుందో వారికి విడమరచి చెబుతున్నారు. ఆహార ధాన్యాలు విషపూరితం అయితే వాటి ఎగుమతులు ఆగిపోతాయి లేదా నిల్వలు పేరుకు పోతాయి. పశువుల్లో వ్యాధులను వ్యాపింప చేస్తే వాటిని హతమార్చాల్సి ఉంటుంది. పరోక్షంగా రైతాంగానికి భారీ మొత్తాలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.పరిశ్రమలకూ పరిహారంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి, ఖర్చులూ పెరుగుతాయి. పశువుల్లో గాలికుంటు వ్యాధిని అమెరికాలో 1929లోనే నిర్మూలించారు. ఇతర ప్రాంతాల్లో ఉంది. ఇది మసూచి కంటే 20 రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ కేవలం నలభై ఎనిమిది గంటల్లో వంద కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందగలదు. ఏదైనా వస్త్రానికి అంటుకుంటే నెల రోజుల పాటు బతికి ఉంటుంది. దీని గురించి తెలుసుకొనే లోపే అమెరికాలోని 25 రాష్ట్రాలకు కేవలం ఐదు రోజుల్లో వ్యాపింపగలదని అంచనా. అమెరికాకు పక్కనే దక్షిణ అమెరికాలో ఈ వ్యాధి ఉంది. అమెరికాలో ఒక్కో రైతు 1,500 నుంచి పదివేల వరకు ఆవులను పెంచుతాడు. ఒక దగ్గర ఈ వైరస్‌ను ప్రవేశపెడితే జరిగే నష్టాన్ని ఊహించుకోవచ్చు.2001లో బ్రిటన్‌లో ఈ వ్యాధి వ్యాపించటంతో 40లక్షల పశువులను వధించాల్సి వచ్చింది. అదే అమెరికాలో సంభవిస్తే 60 బిలియన్‌ డాలర్ల నష్టం(2012అంచనా) అని పరిశోధకులు పేర్కొన్నారు.ఇలాంటి దుర్మార్గాలకు తాము పాల్పడిన ఉదంతాలు అమెరికా అధికార యంత్రాంగానికి తెలుసుగనుక వారు నిరంతరం భయపడుతూనే ఉంటారు, ఎందుకు అంటే అమెరికాను ప్రతి ఒక్కరూ ద్వేషిస్తున్నారు గనుక. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అది అమెరికా నుంచి కూడా కావచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ ఉగ్రవాదం : వయ్యారి భామను భారత్‌పై దాడికి పంపిన వగలమారి మామ !

06 Friday Jun 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, Farmers, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Agro Terrorism, Bioterrorism, China, FBI, invasive herb, parthenium seeds, US Attacked India

ఎం కోటేశ్వరరావు


అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు ఫుసారియమ్‌ గ్రామినియారమ్‌ అనే ఫంగన్‌ను చైనా పంపిందని, దాన్ని తీసుకువచ్చిన ఇద్దరు చైనా జాతీయులను అమెరికా ఎఫ్‌బిఐ అరెస్టు చేసినట్లు అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. దీన్ని ఆగ్రో టెర్రరిజం(వ్యవసాయ ఉగ్రవాదం లేదా దాడి ) అని పిలుస్తున్నారు. ఆ ఫంగస్‌ను పరిశోధనలకోసం తెచ్చారన్నది ఒక కథనమైతే అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు తీసుకువచ్చారనేది మరొక ఆరోపణ. ఎవరినైనా కేసుల్లో ఇరికించదలిస్తే పోలీసులు లేదా క్రిమినల్‌ గాంగ్స్‌ మాదక ద్రవ్యాలను ప్రత్యర్థుల నివాసాలు లేదా కార్యాలయాల్లో పెట్టి కేసుల్లో ఇరికించటం తెలిసిందే. రెండు దేశాల మధ్య వైరుధ్యాలు ముదిరితే ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల సిబ్బంది గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించి వెళ్లగొట్టటం సాధారణమే. అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వైరం పూర్వరంగంలో ఫుసారియమ్‌ ఫంగస్‌ను అమెరికా ఏజంట్లే చైనీయుల చేతిలో పెట్టి అరెస్టు చేసి ఉండవచ్చు. ఎందుకంటే అది అమెరికాలో కూడా దొరుకుతుంది. అరెస్టు చేసిన ఎఫ్‌బిఐ కథనం ప్రకారం జున్‌యోంగ్‌ లియు అనే 34 ఏండ్ల పరిశోధకుడు చైనాలో పని చేస్తున్నాడు.తన స్నేహితురాలు యంగింగ్‌ జియాన్‌ (33) అమెరికాలోని మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నది. ఆమెను కలిసేందుకు 2024జూలైలో అమెరికా వచ్చాడు, తనతో పాటు ఫంగస్‌ను తెచ్చాడు. జియాన్‌ పని చేస్తున్న ప్రయోగశాలలో పరిశోధన కోసం పంగస్‌ను తెచ్చినట్లు ఆరోపణ. వారి చర్యలు అమెరికా పౌరుల భద్రతకు పెను ముప్పు అంటూ కేసు నమోదు చేశారు. వారు కమ్యూనిస్టు పార్టీకి విధేయులు కావటం మరింత ముప్పని అమెరికా అటార్నీ చెప్పాడు. మన దేశంలో నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లు చేసినపుడు వారి వద్ద ఎర్ర అట్టలున్న విప్లవ సాహిత్యం దొరికినట్లు పోలీసులు చెప్పే పిట్టకతలు తెలిసినవే. అలాగే వారు చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యులని కూడా అమెరికా పోలీసులు తెలుసుకున్నారట. తప్పుడు సమాచారం, తప్పుడు వీసాల ఆరోపణల గురించి చెప్పనవసరం లేదు. చైనా తన ఏజంట్లు, పరిశోధకులను అమెరికా సంస్థలలోకి చొప్పించి విద్రోహ చర్యలతో అమెరికా ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పని చేస్తోందని భారతీయ సంతతికి చెందిన ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ ఆరోపించాడు. ఆ కేసు ఏమౌతుంది ఏమిటి అన్నది ముందు ముందు చూద్దాం.

అసలు ఆగ్రో టెర్రరిజం గురించి అమెరికా గుండెలు బాదుకోవటాన్ని చూస్తే దొంగే దొంగని అరవటం గుర్తుకు వస్తోంది. మన దేశం గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అమెరికా ఆగ్రో టెర్రరిజానికి బలి అవుతున్నది. ఇది నమ్మలేని నిజం, మన మీడియాకు కనిపించని వాస్తవం. మీరు ఎప్పుడైనా వయ్యారి భామ, కాంగ్రెస్‌ గడ్డి, పార్ధీనియమ్‌ అనే మాటలను విన్నారా ? మూడూ ఒకటే, మన రైతాంగాన్ని, మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అమెరికా కలుపు మొక్క. దీని శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టరోఫోరస్‌. ఇది చూడటానికి అందంగా ఉంటుంది గనుక వయ్యారి భామ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్‌ గడ్డి అని పిలిచారు. అమెరికా అమ్మాయి కూడా అంటారు. ఒక మొక్క ఎంతో ఏపుగా పెరిగి చాలా త్వరగా పుష్పించి వేలాది విత్తనాలను విడుదల చేస్తుంది.చాలా చిన్నవిగా ఉండటంతో గాలిలో మూడు కిలోమీటర్ల వరకు వ్యాపించి మొలకలెత్తుతాయి. ఒక్కో మొక్క 60 కోట్ల పుప్పొడి రేణువులను వదులుతుందట. ఇవి మొలిస్తే పంటల దిగుబడి 40శాతం తగ్గుతుంది, వాటిని తాకితే, తింటే పశువులు, మనుషులకూ వ్యాధికారకాలవుతాయి.దేశంలో 35 మిలియన్ల హెక్టార్లలో ఇది వ్యాపించి ఉన్నట్లు అంచనా. ఇంకా ఎక్కువే అన్నది మరొక అభిప్రాయం. మొక్కగా ఉన్నపుడు దాన్ని నాశనం చేయకపోతే పుష్పించినపుడు రెచ్చిపోతుంది.


మనదేశం స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్నది. ఆసమయంలో అమెరికాతో ఉన్న సంబంధాలతో ప్రధాని నెహ్రూ అక్కడి నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటే వాటితో అమెరికా ఈ కలుపు మొక్కనూ కావాలనే మనకు బహుమతిగా పంపింది. అంతకు ముందు అసలు మన రైతాంగానికి దీని గురించి తెలియదు. ఇది పంటలను దెబ్బతీస్తుందని అమెరికన్లకు పూర్తిగా తెలుసు. గోధుమలతో పాటు పంపింది అంటే మన పొలాల్లో వ్యాపించి పంటలను దెబ్బతీయాలని, తద్వారా శాశ్వతంగా తమ మీద ఆహార ధాన్యాలకు ఆధారపడేట్లు చేసుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. నాడు పిఎల్‌ (పబ్లిక్‌ లా)480 పధకం కింద 1950దశకంలో కేవలం రెండు మిలియన్‌ టన్నుల గోధుమలను సాయంగా తెచ్చుకున్నందుకు ఇప్పటికీ మనం మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం. అనేక మంది ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు, నోరులేని పశువుల సంగతి సరేసరి. వ్యాధులతో పాటు పాలదిగుబడీ తగ్గిపోతుంది.దీన్ని అమెరికా మన ఒక్క దేశానికే కాదు 46దేశాలకు వ్యాపింప చేసిందంటే దాని కుట్ర ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు, ఇది అతి పెద్ద ఆగ్రో టెర్రరిజం కాదా ! నాడు మనదేశం అలీన విధానాన్ని అనుసరిస్తున్నది, ఆహార ధాన్యాలు కావాలని కోరినపుడు తమతో కలిస్తే వెంటనే ఇస్తామని 1949లో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ ఒక బిస్కెట్‌ వేశాడు. నెహ్రూ అంగీకరించలేదు, ఉచితంగా వద్దు డబ్బుతీసుకోవాలని ప్రతిపాదించాడు.1955వరకు ఎటూ తేల్చలేదు, మరోవైపు దేశంలో ఆహార కొరత పెరుగుతుండటంతో అమెరికా సాయంగానే ఇస్తూ ప్రపంచంలో పది ప్రమాదకర మొక్కల్లో ఒకటైన వయ్యారి భామను మన మీదకు వదిలింది. కావాలనే వదలినట్లు ఇంత వరకు అంగీకరించకపోగా తామే పంపినట్లు ఆధారాలేమిటో చూపాలని మనలను దబాయిస్తోంది.

ప్రమాదకరమైన కలుపు మొక్కలు, విత్తనాలు ఇతర దేశాల నుంచి రాకుండా అరికట్టేందుకు అవసరమైన గట్టి చట్టాలు, నిబంధనల మనదేశంలో లేని కారణంగా అనేకం మన దేశంలో ప్రవేశించాయి. మెక్సికో, అమెరికా, లాటిన్‌ అమెరికా నుంచి వయ్యారి భామ ఇతర దేశాలకు వ్యాపించింది. మన దేశంలో దీన్ని పూర్తిగా తొలగించాలంటే పదేండ్ల పాటు ఏడాదికి 18,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని 2010లో శాస్త్రవేత్తలు చెప్పారు, 1955 నుంచి మనకు జరిగిన నష్టం రు. 2,06,716 కోట్లు అని ఒక అంచనా. ఇది గాక మనుషుల, పశువుల అనారోగ్య ఖర్చు అదనం. జీవ వైవిధ్యానికి జరిగిన నష్టం, పునరుద్దరణలను పరిగణనలోకి తీసుకుంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ నష్టం అంటున్నారు. జమ్మూ`కాశ్మీరులో పాకిస్తాన్‌ ఉగ్రవాద సమస్య గురించి మాత్రమే మనకు తెలుసు, కార్గిల్‌ వంటి ప్రాంతాలలో వయ్యారి భామ తిష్టవేసింది, ప్రధాన భూభాగానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అండమాన్‌కు సైతం ఇది విస్తరించిందంటే దాని వేగం, ప్రమాదం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. మన కళ్ల ముందు వయ్యారాలు పోతూ సవాలు చేస్తున్న ఈ ఆగ్రో ఉగ్రవాదిని అరికట్టేందుకు దేశమంతటా ఒకేసారి చర్యలు తీసుకొని ఉంటే నిరోధించి ఉండేవారు. కానీ జరగలేదు. దీని విస్తరణ ఎంత ప్రాంతంలో జరిగిందన్నది కూడా సమగ్ర అధ్యయనం లేదు. ఒక అంచనా ప్రకారం ఎక్కువగా పెరిగిన ప్రాంతం నుంచి దీన్ని తొలగించాలంటే హెక్టారుకు నలభై పనిదినాలు అవసరమని తేల్చారు. ఆయా సమయాలను బట్టి అందుకయ్యే ఖర్చును లెక్కకట్టాలి.


ఆగ్రో ఉగ్రవాది వయ్యార భామ గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం, వ్యవసాయంతో అనుబంధంగా ఉండే వాటిపై మరికొన్ని దాడుల గురించి చూద్దాం. వీర, రౌద్ర,శోక,హాస్య,శృంగార తదితర రసాలతో పాటు భీభత్స రసం అంటే ఉగ్రవాదమే. ఇతిహాసాలు, పురాణాల్లో వీరులు శత్రువులకు ఈరసాన్ని చవి చూపించినట్లు చదువుకున్నాం. కానీ ఆధునిక మిలిటరీ దుర్మార్గాల్లో బయో ఉగ్రవాదం కూడా ఒక ఆయుధం.అనేక ప్రమాదకర వైరస్‌లను ప్రత్యేకంగా ఎవరో పనిగట్టుకొని వ్యాపింప చేయనవసరం లేదు. అయితే సహజంగా తలెత్తినవి ఏవో ఇతరులు ప్రయోగించినవి ఏవో తెలుసుకోవటం అవసరం, అదేమీ కష్టం కూడా కాదు. ఆఫ్రికన్‌ హార్స్‌ సిక్‌నెస్‌(ఎహెచ్‌ఎస్‌) వైరస్‌ను తొలిసారిగా 1600 సంవత్సరాల్లో ఆఫ్రికాలోని సహారా ఎడారి కనుగొన్నారు. అది క్రమంగా మనదేశానికి వ్యాపించి మిలిటరీలో ఉన్నవాటితో సహా 20లక్షల గుర్రాల మరణానికి కారణమైంది. రిఫ్ట్‌వాలీ వైరస్‌ అనేది ఒంటెల ద్వారా వ్యాపిస్తుంది, అనేక దేశాలను అది చుట్టుముట్టింది,మన దేశం సంగతి తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. మన వ్యవసాయానికి అనుబంధంగా ఉండేది పశుపాలన, చేపలు, రొయ్యలు, కోళ్ల పెంపకం వంటివి. వాటికి అనేక వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. సంతలు, మార్కెట్‌లు పెద్ద వ్యాపక కేంద్రాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆరేండ్ల నాటి అంచనా ప్రకారం దేశంలో ఎలుకలు, పందికొక్కుల సంఖ్య 240 కోట్లు, అవి ఇప్పుడిరకా పెరిగి ఉంటాయి. ప్రతి ఆరు ఒక మనిషి ఆహారాన్ని తింటున్నాయి. ఏటా 24లక్షల నుంచి 2.6కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. వాటితో వచ్చే వ్యాధులు, వాటి నివారణ ఖర్చులపై అంచనాల్లేవు. వీటన్నింటినీ ఎవరు ప్రవేశపెట్టినట్లు ? ఇప్పుడైతే కుట్ర సిద్దాంతవేత్తలు, వారిని అనుసరించే మీడియా పండితులు వెంటనే చైనా అనేస్తారు. గతంలో ప్రపంచలో కోట్లాది మంది ప్రాణాలు తీసిన ప్లేగు, స్పానిష్‌ ఫ్లూ వంటి వాటికి కూడా అదే అని చెప్పినా ఆశ్చర్యం లేదు.బ్రిటీష్‌ పాలనా కాలంలో 1943లో వచ్చిన బెంగాల్‌ కరువుకు 30లక్షల మంది మరణించారు.వారి ఆకలి బాధ తీర్చటానికి ఆ రోజు ప్రపంచంలో ఆహారం లేదా అంటే ఉంది,బ్రిటీష్‌ వారికి పట్టలేదంతే ! ఇటీవలి సంవత్సరాల్లో తెల్లదోమ ఎంతటి వినాశనాన్ని కలిగించిందో చూశాము. తెగుళ్ల నివారణకు తయారు చేసిన సింథటిక్‌ పైరిత్రాయిడ్స్‌ వినియోగంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని కొత్త సమస్యలు తలెత్తాయి. అనేక పశ్చిమ దేశాలలో వాటిని నిషేధించినప్పటికీ మనదేశంలో వాటిని విక్రయించేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. బహుళజాతి గుత్త సంస్థలు చేస్తున్న ఆగ్రో ఉగ్రదాడి తప్ప మరొకటి కాదు. అసలు అమెరికా గతంలో చేసిన ఆగ్రో ఉగ్రదాడులకు బలైన దేశాలు, ఉదంతాలు గురించి మరో విశ్లేషణలో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ వట్టిస్తరి మంచినీళ్లు : భారత్‌లో మహిళా సమానత్వ సాధనకు 152 ఏళ్లు !

19 Wednesday Jun 2024

Posted by raomk in BJP, Current Affairs, Economics, Education, Health, History, INDIA, NATIONAL NEWS, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Global Gender Gap India, Global Gender Gap Report 2024, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


బేటీ బచావో బేటీ పఢావో, మహిళా సురక్ష కేంద్ర, మహిళా పోలీసు వలంటీర్స్‌, రాష్ట్రీయ మహిళా కోష్‌, సుకన్య సమృద్ధి యోజన, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ… ఇవన్నీ మన దేశంలో ఉన్న పధకాలు, ఎవరికో చెప్పనవసరం లేదు.కొన్ని రాష్ట్రాల్లో వీటికి పేర్లు మార్చి అమలు జరుపుతున్నారు. మొత్తం మీద ఇన్ని జరిగిన తరువాత కూడా ప్రపంచంలో స్త్రీ, పురుష సమానత్వ తేడాలో 2024 ప్రపంచ 146దేశాల జాబితా ప్రకారం మన స్థానం 129. పదేండ్లతో పోల్చుకుంటే దిగజారింది. మహిళల అభ్యున్నతి గురించి గత పది సంవత్సరాలుగా తమ భుజాలను తామే చరుచుకొని రొమ్ములు విరుచుకొని గొప్పలు చెప్పుకున్న, మహిళలను వంచించిన వారు, అంతకంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లు వారికి భజన చేసిన ఘనులు తలలెక్కడ పెట్టుకుంటారో చూడాలి. పధకాలన్నీ మావే, రాష్ట్రాలు పేర్లు మార్చుకుంటున్నాయి, అందువలన మా ఫొటోలు పెట్టాలి, వాటి ” ఖ్యాతి ”లో మాకూ వాటా రావాలని కోరుతున్న బిజెపి పెద్దలు ఆ మొత్తాన్ని వారే తీసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. డిఎంకె సభ్యురాలు కనిమొళి రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు నాడు మంత్రిగా ఉన్న మేనకా గాంధీ 2015 మే 7వ తేదీన ఇచ్చిన జవాబు సారం ఇలా ఉంది. ప్రపంచ ఆర్థికవేదిక (డబ్ల్యుఇఎఫ్‌) లింగసమానత్వ తేడా నివేదిక 2014 ప్రకారం 142దేశాలలో భారత్‌ 114వదిగా ఉంది. అంతకు ముందు సంవత్సర నివేదిక ప్రకారం 136 దేశాలలో 101వదిగా ఉంది. ఏడాది కాలంలోనే ఇంతగా దిగజారి పోవటానికి కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం తగ్గటం, అవకాశాలు లేకపోవటమే అని పేర్కొన్నారు. అలాంటిది కొన్ని మార్పులు జరిగినా పదేండ్ల తరువాత 101 నుంచి 129వ స్థానానికి దిగజారింది. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బిజెపి, మిత్రపక్షాలే, మెరుగుపరచకపోయినా దిగజారటానికి నెపం నెహ్రూ మీదో, గాంధీ మీదో నెడితే కుదరదు.


ఈ సూచికలను రూపొందించటానికి నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.1.ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం, అవకాశాలు, 2. విద్యా అవకాశాలు, 3. ఆరోగ్యం,బతుకు, 4.రాజకీయ సాధికారత. వీటన్నింటిలో ఏ దేశం ఎక్కడుందనే సూచికలు, పాయింట్లు వేస్తారు. వాటన్నింటిని కలిపి మొత్తంగా సాధారణ సూచికలను రూపొందిస్తారు. ఇలాంటి నివేదికలను 2006 నుంచి ప్రతి ఏటా రూపొందిస్తున్నారు. పరిగణనలోకి తీసుకున్న 146దేశాల సగటు లింగ సమానత్వ తేడా 2024లో 68.5శాతం ఉంది. గతేడాది కంటే కేవలం 0.1శాతమే మెరుగైంది. అంటే 31.5శాతాన్ని పూరించాల్సి ఉంది. ఇప్పుడున్న వేగంతో తేడాను పూర్తిగా తగ్గించాలంటే 134 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచంలో నూటికి నూరుశాతం సమానత్వం సాధించిన దేశమేమీ లేదు. మొదటి స్థానంలో ఉన్న ఐస్‌లాండ్‌లో 93.5శాతం సాధించారు.భారత్‌లో 64.1శాతం ఉంది. ఈ లెక్కన పూర్తి సమానత్వం సాధించటానికి కనీసం 152 సంవత్సరాలు పడుతుంది. దక్షిణాసియా దేశాల సగటు తేడా 63.7శాతమే. పది సంవత్సరాల నాడు మొత్తం రాంకు మార్కులను చూస్తే 0.6455 కాగా తాజా సూచికలో 0.641కి దిగజారింది.


మన దేశంలో లింగ బేధాలను తగ్గించటంలో పదేండ్ల నరేంద్రమోడీ పాలన ఘోరంగా విఫలమైంది. మరింత దిగజారింది.ఇరుగుపొరుగు దేశాలలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌ తరువాత ఐదవదిగా మనదేశం ఉంటే బిజెపి పెద్దలు నిత్యం స్మరించే పాకిస్తాన్‌ ఏడవదిగా ఉంది.ఆర్థిక భాగస్వామ్యం, ఆరోగ్యంలో 146కు గాను 142వదిగా ఉంది.(మన తరువాత పాకిస్తాన్‌ ఉంది) విద్య అందుబాటులో 112, రాజకీయ రంగంలో 65, కార్మికశక్తి భాగస్వామ్యంలో 134వదిగా ఉంది. విద్యాఅవకాశాలు, రాజకీయ సాధికారత తగ్గుదల కారణంగానే గతేడాది వచ్చిన 127వ రాంకు 129కి దిగజారింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినప్పటికీ ఆ స్ఫూర్తిని రాజకీయ పార్టీలేవీ పాటించలేదు. దాని ఘనత తమదే అని భుజాలు చరుచుకున్న బిజెపి 30 మంది కాబినెట్‌ మంత్రులకు గాను కేవలం ఇద్దరికి, మొత్తం మంత్రివర్గంలో గతంలో ఉన్న పది మందిని ఈ సారి ఏడుకు తగ్గించింది. నేపాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న మంత్రులలో 23.5శాతం మంది మహిళలే ఉన్నారు. చట్టసభల్లో మహిళల ప్రపంచ సగటు 33శాతం కాగా అక్కడ 49.9శాతం ఉంది.


జనాభాలో సగంగా ఉన్న మహిళలకు ఉత్పాదక రంగంలో భాగస్వామ్యం కల్పించకుండా వారి సాధికారత గురించి ఎన్ని కబుర్లు చెప్పినా వట్టిస్తరి మంచి నీళ్లు తప్ప మరొకటి కాదు. గడచిన పది సంవత్సరాల్లో జరిగింది అదే. లింగసమానత్వ తాజా నివేదికలో మనదేశంలో కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం 35.09శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కూడా ప్రభుత్వం అందచేసిన తప్పుడు లెక్కల కారణంగానే. నిజంగానే అంత ఉందా ? లోక్‌సభ ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశట్టే ముందు నరేంద్రమోడీ తన పాలనలో మహిళాభ్యున్నతిని చూసి ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని చెప్పారు. తన పదేండ్ల ఏలుబడిలో దిగజారిన రాంకును చూసి తలవంచుకుంటారా ? ప్రతిపక్షాలకు సుభాషితాలు చెబుతూనే ఉంటారా ? ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు, ప్రభుత్వ లెక్కలకు పొంతన కుదరటం లేదు. స్టాటిస్టా విశ్లేషణ ప్రకారం 2014 నుంచి 2022వరకు తొమ్మిదేండ్ల సగటు 26.81శాతం కాగా 2023లో 32.68శాతం ఉన్నట్లు అదే సంస్థ పేర్కొన్నది.ఒక్కసారిగా అంత ఎలా పెరిగింది ? ప్రపంచ బాంకు లెక్క 32.7శాతం అన్నది. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్‌ స్టేటస్‌ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. అందుకే అంకెల గారడీ అనాల్సి వస్తోంది.


ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు మహిళలు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది. ప్రముఖ మీడియా సంస్థ అల్‌ జజీరా. అది 2023 ఏప్రిల్‌ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్‌ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్‌ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్‌కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్‌ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మహిళలకు అన్ని గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం, ఇన్ని మరుగుదొడ్లు కట్టించాం అని ఊరూ వాడా ప్రచారం చేసే బిజెపి ప్రచార దళాలు తమ రెండింజన్ల డ్రైవర్లు సాధించిందేమిటో, పదేండ్లలో పరిస్థితి ఎందుకు దిగజారిందో ఎక్కడా మాట్లాడటం లేదు. గోడీ మీడియా సంగతి సరేసరి తేలుకుట్టిన దొంగల్లా నోరెత్తటం లేదు. ఈ అంశాన్ని పట్టించుకోవాల్సింది కాదన్నట్లుగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీని కోల్పోవటానికి మహిళా ఉపాధి తగ్గటం కూడా ఒక కారణమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అచ్చేదిన్‌ పదేండ్లలో ఆవిరైన సంతోషం, పాకిస్థాన్‌ కంటే దిగువనే : నాడు బ్రిటీష్‌ రాజ్యం – నేడు బిలియనీర్ల భోజ్యం !!

22 Friday Mar 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, Education, Health, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Religious Intolarence

≈ Leave a comment

Tags

BILLIONAIRE RAJ, BJP, ECONOMIC INEQUALITY IN INDIA, Narendra Modi Failures, RSS, World Happiness Report 2024


ఎం కోటేశ్వరరావు


తెల్లోడి రాజ్యమే బాగుంది, కమ్యూనిస్టులే మంచోళ్లు అని మా తాత చెప్పేవాడు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్ల పాలకులు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచండి అన్న విధానంలో భాగంగా బండి పట్టాలకు అవసరమైన ఇనుము ఇచ్చారట, వాటిని పంపిణీ చేయటంలో ఆ నాడే కాంగ్రెస్‌ వారు తన, పర బేధాన్ని పాటిస్తే కమ్యూనిస్టులు అందరికీ ఇప్పించేందుకు చూశారట. తెల్లోడి పాలనను తప్పు పట్టనందుకు మా తాతను విమర్శించాలా ? ఒక రైతుగా తన పరిమిత ప్రయోజనాన్ని చూసి సంతోషించినందుకు విమర్శించాలా ? ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. జనజీవితాలను దిగజారుస్తూ కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీని వ్యతిరేకించాలా ? రామాలయం కట్టినందుకు సానుకూలంగా ఉండాలా ? ముఖ్యవైరుధ్యం ఏమిటన్నదే కీలకం. నరేంద్రమోడీ పదేండ్ల విజయ గీతాలాపన వికసిత భారత్‌ చెవుల తుప్పు వదిలిస్తున్నది. అఫ్‌ కోర్స్‌ 2004 ఇదే బిజెపి దేశం వెలిగిపోతోందంటూ తాను ఆరిపోయిందనుకోండి. ఇప్పుడూ అదే జరగనుందా ? ఎవరి అంచనాలు వారివి ! పదేండ్లలో తమను మరింతగా పెంచిన మోడీ ఏలుబడిని బిలియనీర్లు అంత తేలికగా వదులుకోరు, వారి చేతుల్లో ఉన్న మీడియాలో మోడీ భజన మరింత పెరుగుతుంది, దీనికి మత మత్తు ఎలాగూ ఉంది. ఈ అంశాన్ని తక్కువ అంచనా వేయకూడదు.


వికసిత భారత్‌ అంటూ బిజెపి ప్రచార గాలి తీస్తూ రెండు నివేదికలు తాజాగా వెలువడ్డాయి. ఒకటి ప్రపంచ సంతోష సూచికలో మనదేశ స్థానం గత పది సంవత్సరాల్లో దిగజారింది తప్ప జనానికి అచ్చేదిన్‌ జాడలేదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి రూపొందిస్తున్నది గనుక సంతోష సూచికను మేం అంగీకరించం అని బిజెపి ఠలాయిస్తే కుదరదు.తలసరి జిడిపి, సామాజిక మద్దతు,ఆరోగ్యం, జీవన విధానాన్ని ఎంచుకొనే స్వేచ్చ,ఉదారత, ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో అవినీతిని జనం ఎలా చూస్తున్నారు అనే ప్రాతిపదికల మీద ప్రతిదేశం తెచ్చుకొనే మార్కులను బట్టి సూచికలను ప్రకటిస్తారు. ప్రతి ఏడాది సూచిక అంతకు ముందు రెండు సంవత్సరాల తీరుతెన్నుల ప్రాతిపదిన ఉంటుంది. కొన్ని సార్లు పరిగణనలోకి తీసుకొనే దేశాల సంఖ్యలో తేడాలు ఉండవచ్చు. అందువలన మార్కులను బట్టి దిగజారిందా మెరుగుపడిందా అన్నది కూడా చెప్పవచ్చు. మన ఇరుగు పొరుగు దేశాల వివరాలను చూద్దాం. 1.సూచిక, మార్కులు అంటే 2014-16 పంవత్సరాలకు సంబంధించి 2017వ సంవత్సర నివేదిక, 2 సూచిక, మార్కులు అంటే 2021-23కు సంబంధించి 2024 నివేదిక వివరాలు అని గమనించాలి.
దేశంపేరు×1.సూచిక×1.మార్కులు×2.సూచిక××2.మార్కులు
భారత్‌ ×× 118 ×× 4.407 ×× 126 ×× 4.054
చైనా ×× 83 ×× 5.245 ×× 60 ×× 5.979
పాకిస్థాన్‌ ×× 92 ×× 5.132 ×× 108 ×× 4.657
నేపాల్‌ ×× 107 ×× 4.793 ×× 93 ×× 5.158
బంగ్లాదేశ్‌ ×× 110 ×× 4.643 ×× 129 ×× 3.886
శ్రీలంక ×× 117 ×× 4.415 ×× 128 ×× 3.898
నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ప్రపంచ జిడిపిలో పదవ స్థానంలో ఉన్నదానిని ఐదవ స్థానానికి చేర్చారని గొప్పలు చెప్పుకుంటారు.త్వరలో చైనాను అధిగమించి పోతామని అందుకే వికసిత భారత్‌ అని చెబుతున్నారు.వచ్చే రోజుల్లో రాజెవరో రెడ్డెవరో అన్నట్లుగా వాటి గురించి వదలివేద్దాం. గడచిన పదేండ్లలో చైనాకు పోటీగా దేశాన్ని నిలబెడతానని చెప్పిన మోడీ దానితో పోలిస్తే దేశాన్ని ఎక్కడ ఉంచారోపైన పేర్కొన్న సంతోష సూచికల్లోనే డొల్లతనం వెల్లడైంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా కూడా ఉంచటంలో విఫలమయ్యారు. పదేండ్ల క్రితం ప్రపంచ జిడిపిలో చైనా వాటా 13.1శాతంగా ఉన్నదాన్ని 2023లో 17.7శాతానికి పెంచుకోగా మన వాటా 2.6 నుంచి 3.73కు పెరిగింది. పాకిస్థాన్‌ జిడిపి 2014లో 271.4బిలియన్‌ డాలర్ల నుంచి మధ్యలో ఒక ఏడాది 374.66 బి.డాలర్లకు పెరిగి 2023లో 340.64బి.డాలర్ల వద్ద ఉంది. జిడిపి పెరిగినా సంతోష సూచిక పతనంలో మనకూ పాకిస్థాన్‌కూ తేడా ఏముంది ? అచ్చేదిన్‌, వికసిత భారత్‌ నినాదాలు ఇచ్చిన వారూ, విదేశాల్లో దేశ ప్రతిష్ట పెంచినట్లు చెప్పుకున్నవారూ అక్కడ లేరు. బిజెపి వారు చెబుతున్నట్లు మనకు అన్నీ ఉన్నా జనాలు ఎందుకు సంతోషంగా లేకపోతున్నారు ?


నాటి బ్రిటీష్‌ వలస పాలనలో కంటే నేటి స్వతంత్ర పాలనలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా పెరిగినట్లు తాజాగా ప్రపంచ అసమానతల ప్రయోగశాల(వరల్డ్‌ ఇనీక్వాలిటీ లాబ్‌) 2024 మనదేశం గురించి ప్రకటించిన విశ్లేషణలో పేర్కొన్నది. నాడు మన జనాన్ని విదేశీ దొరలు దోచుకుంటే నేడు స్వదేశీ దొరలు ఆపని చేస్తున్నారు. అనేక అంశాల మీద అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఆర్థికవేత్తలు నితిన్‌ కుమార్‌ భర్తీ, లూకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెట్టీ, అన్‌మోల్‌ సోమాంచీ ఒక పత్రాన్ని రూపొందించారు.దానిలో పేర్కొన్న ప్రధాన అంశాలేమిటి ? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1980దశకం వరకు అసమానతలు తగ్గాయి. తరువాత ముఖ్యంగా 1990దశకంలో సంస్కరణలు ప్రారంభించిన పదేండ్ల తరువాత విపరీతంగా పెరిగాయి.నరేంద్రమోడీ ఏలుబడిలో అది మరింత ఎక్కువైంది. 1982 నాటికి దేశంలోని ఎగువ ఒకశాతం మంది రాబడి 6.1శాతం, అది 2014-15 నుంచి 2022-23 వరకు పరిశీలించినపుడు 22.6శాతం ఉంటే వారి వద్ద పోగుబడిన సంపదలు 40.1శాతంగా ఉన్నాయి. ఎగువ పదిశాతం మంది వద్ద 2022 నాటికి దేశ సంపదల్లో 60శాతం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు.అంతరాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, అమెరికాల్లో కూడా ఆదాయరాబడి వాటా ఇంతగా లేదు. పన్నుల విధానం, ప్రపంచీకరణ దీనికి కారణం.ధనికులుగా ఉన్న 167 కుటుంబాల సంపదపై రెండుశాతం పన్ను విధిస్తే జాతీయ ఆదాయం 0.5శాతం పెరుగుతుందని అంచనా వేశారంటే సంపద ఎలా గుట్టలుగా పడి ఉందో అర్ధం చేసుకోవచ్చు. సక్రమంగా లేని సమాచారం మేరకే తాము అసమానతల గురించి చెబుతున్నామని, నాణ్యమైన, సమగ్ర సమాచారం ఉంటే అసమానతలు ఇంకా ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ధనికుల్లో ఉన్న ఎగువ తరగతిలో కూడా మిగతావారితో పోలిస్తే వారిలో 0.1శాతం మంది పదిశాతం రాబడిని పొందారు. ప్రస్తుతం రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయని కొందరు చెప్పిన మాటలను నరేంద్రమోడీ నిజం చేస్తున్నారు. అందుకే కార్పొరేట్‌ మీడియా, ధనికుల ప్రతినిధులందరూ మరోసారి వచ్చే ఎన్నికల్లో మోడీని కోరుకుంటున్నారన్నది స్పష్టం.


దేశంలో అనేక సమస్యలకు జనాభా పెరుగుదలే కారణం అని గతంలో ఊదరగొట్టారు, కుటుంబనియంత్రణ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటి పాలకులు అధిక జనాభా మన దేశానికి వరం అని ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా మారటానికి అవసరమైన చౌక శ్రామిక శక్తి అందుబాటులో ఉందని తమ జబ్బలను తామే చరుచుకుంటున్నారు. మరోవైపు గత పదేండ్లుగా కేంద్రంలో, వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాషాయ దళాలు ముస్లిం జనాభా పెరిగి హిందువుల కంటే మెజారిటీగా మారనున్నదనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అది నిజమా, సంతోషం ఆవిరి అవుతున్న స్థితిలో ఏ మతానికి చెందిన వారైనా ప్రతి కుటుంబమూ పరిమితం చేసుకొనేందుకు చూస్తున్నాయని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి.జనన-మరణాల రేటును ప్రాతిపదికగా తీసుకున్నపుడు జననాల రేటు 2.1గా ఉండాలని ఆ రంగనిపుణులు పేర్కొన్నారు. కానీ తాజా సర్వ ప్రకారం రెండుశాతమే ఉన్నందున రానున్న రోజుల్లో జనాభా తగ్గుతుంది తప్ప పెరగదని చెబుతున్నారు. జనాభాలో పదిహేనేండ్ల లోపు వారు 2015-16లో 28.6శాతం ఉండగా 2019-21లో 26.5శాతానికి తగ్గారు. అంటే కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గుతోంది. జమ్మూ-కాశ్మీరు జనాభాలో 68శాతం ముస్లింలే ఉన్నారు. అక్కడ జననాల రేటు దేశ సగటు కంటే తక్కువగా 1.4శాతమే ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లిం జననాల సగటు కంటే కూడా ఇది తక్కువ. విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్య రంగాల్లో కేటాయింపులు ఎక్కువగా ఉండి జనాల పరిస్థితి మెరుగుపడితే కులం, మతంతో నిమిత్తం లేకుండా కుటుంబనియంత్రణ ఎవరికి వారు పాటిస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం.

రెండు సంవత్సరాల క్రితం ఆక్స్‌ఫామ్‌ ఇండియా సంస్థ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం కేవలం 98 మంది ధనికులైన భారతీయులు రు.49.15లక్షల కోట్ల సంపదలను అదుపు చేస్తుండగా పేదల్లోని 55.5 కోట్ల మంది వద్ద అంత ఉందని పేర్కొన్నది. 2021లో ఒక వ్యక్తి జాతీయ ఆదాయ సగటు రు.2,04,200గా లెక్కించగా దిగువ 50శాతం మంది ఆదాయం రు.53,610 ఉంది. ఎగువ పదిశాతం మంది జనాల సగటు రాబడి రు.11,66,520గా ఉంది. కరోనా తరువాత పేదలలో 20శాతం మంది రాబడి 2020-21లో 53శాతం తగ్గగా ఇదే సమయంలో ఎగువ 20శాతం మంది రాబడి 39శాతం పెరిగింది. కరోనా కారణంగా ఆరు కోట్లుగా ఉన్న పేదలు 13.4 కోట్లకు పెరిగారు. వైద్య ఖర్చుల కారణంగా 2017లో 5.5 కోట్ల మంది పేదరికంలోకి దిగజారారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా దిగువ తరగతి జనాల రాబడి పెరగకపోతే వారి జీవితాలు అతలాకుతలం అవుతాయి. విద్య, వైద్య రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటూ ప్రయివేటు వారిని ప్రోత్సహిస్తున్నాయి. రుణగ్రస్తులు కావటానికి వీటి మీద పెట్టే ఖర్చు కూడా ఒక అంశంగా మారింది.జిడిపిలో విద్య మీద ఆరుశాతం ఖర్చు పెట్టాలన్నది లక్ష్యం. కానీ నరేంద్రమోడీ తొలి ఐదు సంవత్సరాలలో మూడు శాతానికి మించలేదు, ఏటేటా తగ్గుతున్నది.జిడిపిలో ఐదవ స్థానానికి దేశాన్ని చేర్చామని గొప్పలు చెప్పుకోవటం కాదు. మన కంటే ఎంతో తక్కువగా ఉన్న బ్రెజిల్‌ విద్యకు 6.1, వైద్యానికి 9.5శాతం, రష్యా 4.7-5.3 చొప్పున దక్షిణాఫ్రికా 6.8-8.2శాతాల చొప్పున కేటాయిస్తున్నాయి. సంతోష సూచికలో సామాజిక రంగాల మీద పెట్టే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటారని గమనించాలి. వాటి కేటాయింపులు సరిగా లేకపోతే,తగ్గుతుంటే సంతోషం ఆవిరి అవుతుంది. గడచిన పదేండ్లలో సూచికలో దిగజారటానికి కారణం ఇదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ప్రేమ-ద్వేషం : చైనా వద్దు అమెరికన్‌ విద్యుత్‌ కార్లు ముద్దు !

29 Wednesday Nov 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Environment, Europe, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, UK, USA

≈ Leave a comment

Tags

BJP, BYD, Donald trump, Electric car wars, EU, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, Tesla


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో ఎలక్ట్రానిక్‌ కార్ల యుద్ధానికి తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చైనా ఒక వైపు, ఐరోపా సమాఖ్య-అమెరికా మరోవైపు మోహరిస్తున్నాయి. అమెరికా కంపెనీ టెస్లా కార్ల దిగుమతికిి మన కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదరిందని, వచ్చే ఏడాది నుంచి ఓడల్లో కార్లు దిగనున్నాయని వార్తలు. అధికారికంగా జనవరిలో ప్రకటించవచ్చు. రానున్న రెండు సంవత్సరాల్లో కార్ల తయారీ(విడి భాగాలను తీసుకువచ్చి ఇక్కడ అమర్చటం) కూడా ప్రారంభించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధిక కార్లను అమ్ముతున్న చైనా బివైడి కంపెనీతో కలసి కార్ల తయారీని ప్రారంభిస్తామన్న మెఘా ఇంజనీరింగ్‌ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. టెస్లా రెండు వందల కోట్ల డాలర్ల మేర కార్ల తయారీ కేంద్రానికి పెట్టుబడి పెడుతుందని మన దేశం నుంచి 1,500 కోట్ల డాలర్ల విలువగల విడి భాగాలను కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ సెప్టెంబరు నెలలో కాలిఫోర్నియాలోని టెస్లా కంపెనీని సందర్శించి వచ్చిన సంగతి తెలిసినదే. వంద కోట్ల డాలర్ల పెట్టుబడితో హైదరాబాదులో ఏటా పది నుంచి పదిహేను వేల కార్ల తయారీ, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేస్తామని చైనా బివైడి-మెఘా చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అనుమతించే అవకాశం లేదని కారణం చెప్పింది. మెఘా కంపెనీ పెట్టుబడిపెడితే సాంకేతిక పరిజ్ఞానం చైనా కంపెనీ అందచేస్తుందని చెప్పినప్పటికీ అంగీకరించలేదు. దీనికి కారణం అమెరికన్‌ కంపెనీ టెస్లాను అనుమతించేందుకు సముఖంగా ఉండటమే అని చెప్పవచ్చు. మనం ఎలాగూ తయారు చేయలేనపుడు రెండు విదేశీ కంపెనీలు పోటీ పడి ధరలను తగ్గిస్తే మన వినియోగదారులకు లాభం, కొన్ని విడిభాగాలు ఇక్కడే తయారీ ద్వారా కొంత మేరకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ టెస్లావైపే మొగ్గుచూపటం ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. చైనాలో స్వంతంగా తయారు చేసే కంపెనీలు ఉన్నప్పటికీ టెస్లాను కూడా అనుమతించిన కారణంగా పోటీ బడి అది కూడా తక్కువ ధరలకే అక్కడ కార్లు అమ్ముతున్నది. మెఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ఇప్పటికే చైనా కంపెనీతో కలసి ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.దానికి లేని అడ్డంకి కార్లకు వచ్చిందంటే 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణలు, చైనా వ్యతిరేక కూటమిలో మన దేశం మరింతగా భాగస్వామి కావటమే అని చెప్పవచ్చు.


ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిలో చైనా జోరు ప్రపంచ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది.సాంప్రదాయ కార్ల నుంచి ఎలక్ట్రానిక్‌ వాహనాలకు మారితే ప్రస్తుతం తమ సంఘంలోని లక్షా యాభై వేల మంది కార్మికుల్లో 35వేల మందికి ఉపాధిపోతుందని అమెరికా యునైటెడ్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ తెలిపింది. తమ దేశంలో 2032 నాటికి మూడింట రెండువంతులు ఎలక్ట్రానిక్‌ కార్ల విక్రయమే ఉంటుందని అమెరికా ప్రకటించగా, 2035 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్ముతామని ఐరోపా సమాఖ్య పేర్కొన్నది. ఈ లక్ష్యాలను సాధించటానికి చైనా నుంచి వాహనాల దిగుమతులను అనుమతించాలా వద్దా అని ఆ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కేవలం ఎలక్ట్రిక్‌ మరియు ఇంథనంతోనూ నడిచే హైబ్రిడ్‌ కార్లతో సహా 2022లో ప్రపంచంలో నూటికి 60 చైనాలోనే ఉత్పత్తి చేశారు.చైనాలో ఐదువేల నుంచి 90వేల డాలర్ల వరకు ధర ఉండే 90 రకాల కార్లను అందుబాటులో ఉంచారు. సగటు ధర 53,800 డాలర్లుండగా ఐరోపాలో 94,100 డాలర్లుంది. ఈ ఏడాది చైనాలో మొత్తం కార్ల అమ్మకాల్లో నాలుగో వంతు(80లక్షలు) ఎలక్ట్రిక్‌ కార్లుండగా, ఐరోపా సమాఖ్య దేశాల్లో 22, అమెరికాలో ఆరు, జపాన్‌లో కేవలం మూడు శాతమే ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఐరోపా సమాఖ్య(ఇయు) 2022లో చైనా నుంచి దిగుమతి చేసుకున్న కార్లు సమాఖ్య మొత్తం ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో మూడు శాతమే. అవి 2030నాటికి 20శాతానికి చేరతాయని స్థానిక కార్ల కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. చైనా పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చిన కారణంగా తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తూ వాటి మీద విచారణ జరపాలని ఇయు నిర్ణయించింది. దిగుమతి సుంకాల మీద ఒక నిర్ణయం తీసుకొనేందుకు పూనుకుంది.ఇయు నిర్ణయం రక్షణాత్మక చర్యలు తప్ప మరొకటి కాదని వెంటనే చైనా స్పందించింది. అక్కడ ఇస్తున్న సబ్సిడీల సంగతేమిటని ప్రశ్నించింది. ఏ హౌదాతో తమపై విచారణ జరుపుతుందని నిలదీసింది. చైనా నుంచి వస్తున్న దిగుమతులతో స్థానికంగా ఉన్న కార్ల గిరాకీ 20శాతం తగ్గుతుందని అంచనా. చైనా కస్టమ్స్‌ సమాచారం ప్రకారం వర్తమాన సంవత్సరం ఏడునెలల్లో గతేడాది కంటే 113శాతం పెరగ్గా, 2020తో పోల్చితే3,205 శాతం ఎక్కువ. చైనా ఇస్తున్న సబ్సిడీలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే పోరాడాల్సిందేనని జర్మనీ మంత్రితో భేటీ అయిన ఫ్రెంచి ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయరే చెప్పాడు. అయితే కొందరు ఐరోపా వాణిజ్యవేత్తలు దర్యాప్తును వ్యతిరేకిస్తున్నారు. దీంతో చైనా కూడా ఎదురుదాడికి దిగితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు అనేక దేశాలు చైనా నుంచి చౌకగా వచ్చే కార్లను దిగుమతి చేసుకోవాలని ఉన్నా స్థానిక కార్మికులకు పని లేకుండా పోతుందనే భయం మరోవైపు ఉంది.ప్రపంచంలో ఆటో పరిశ్రమల్లో కార్మికులు కోటీ నలభై లక్షల మంది ఉండగా చైనాలో 40లక్షలు,ఇయులో 25, అమెరికా, మెక్సికో, జపాన్లలో పది లక్షల వంతున ఉన్నారు. గతేడాది ప్రపంచ కార్ల ఎగుమతి విలువ 780బిలియన్‌ డాలర్లు కాగా ఇయు 407, జపాన్‌ 87, అమెరికా 58, దక్షిణ కొరియా 52, మెక్సికో 47 బి.డాలర్ల వాటా కలిగి ఉండగా చైనా 45 బి.డాలర్ల మేరకే ఎగుమతి చేసింది. ఉక్కు రంగంలో 2021లో మిగతా దేశాలను వెనక్కు నెట్టేసినట్లుగా రానున్న రోజుల్లో కార్లలో కూడా చైనా అగ్రస్థానానికి వస్తుందేమోనన్న భయం వెల్లడవుతోంది.


అమెరికాలో పికప్‌ ట్రక్కుల మీద 25శాతం తప్ప సాధారణ పన్ను 2.5శాతమే, అయితే చైనాతో వాణిజ్యపోరు ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా కార్ల మీద 25శాతం విధించగా దాన్ని జోబైడెన్‌ కొనసాగిస్తున్నాడు. జపాన్‌లో అసలు పన్ను లేదు, పదిశాతం వసూలు చేస్తున్న ఇయు చైనా కార్ల మీద పన్ను పెంచాలని చూస్తున్నది.చైనా కంపెనీలు తక్కువ ధరలకు కార్లను ఎందుకు విక్రయించగలుగుతున్నాయన్నది ప్రశ్న. ఎలక్ట్రిక్‌ కార్లలో కీలకమైనవి. లిథియం – అయాన్‌ బ్యాటరీలు.వీటి పరిశోధన-అభివృద్దికి చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది, ఆ రంగంలో ఉన్నవారికి రాయితీలిచ్చింది. దానికి తోడు వాటి తయారీకి అవసరమైన ముడిపదార్దాలు చైనాలో పుష్కలంగా ఉండటం అక్కడి కంపెనీలకు కలసివచ్చింది. దీంతో స్థానిక వినియోగదారులు ఆకర్షితులౌతున్నారు ప్రపంచంలో వందకార్లు అమ్మితే గతేడాది చైనాలోనే 59 అమ్మారు. ఈ ఊపుతో ప్రపంచ మార్కెట్లకు విస్తరించాలని అక్కడి కంపెనీలు చూస్తున్నాయి. ఐరోపా దేశాల్లో తలెత్తిన కాలుష్యం కారణంగా రోడ్ల మీద ధ్వనితో 40శాతం మంది బ్రిటీష్‌ పౌరులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తేలింది.వాయు కాలుష్యంతో శ్వాస సమస్యలు పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ కార్ల వలన 17 నుంచి 30శాతం వరకు గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ విడుదల తగ్గుతుందని అంచనా. అందుకే 2035నాటికి బ్రిటన్‌లో మొత్తం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్మాలని నిర్ణయించారు. ఒకవైపు చమురు ఇంథన కాలుష్యం తగ్గుతుందనే సానుకూలత ఉన్నా ప్రతికూలతల గురించి కూడా చర్చ మొదలైంది. హరిత ఇంథనం కోసం ధనికదేశాల ప్రయత్నం పేద దేశాల్లో పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నది.


ప్రస్తుత తీరుతెన్నులను చూస్తే చైనా – ఇతర దేశాల మధ్య కార్ల ధరల యుద్దం జరిగే సూచన కనిపిస్తున్నది. అమెరికా కంపెనీ టెస్లా దీనికి నాంది పలికింది.దీంతో చైనాలోని కొన్ని రకాల కార్ల ఉత్పత్తిని ఆపివేయాల్సి వచ్చింది.ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో దేశీయ మార్కెట్లో 114లక్షల కార్లను విక్రయించగా 20లక్షలు ఎగుమతి చేసింది. విదేశీ ఎగుమతులు 80శాతం పెరగ్గా, స్వదేశీ మార్కెట్‌ 1.7శాతమే పెరిగినందున ధరల పోటీకి దిగితే చైనా కూడా నష్టపోవచ్చని కొందరు చెబుతున్నారు.గతేడాది డిసెంబరు నాటికి చైనాలో 4.3 కోట్ల కార్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉందని, ఉన్న సామర్ధ్యంలో 2017లో 66.6శాతం వినియోగిస్తే గతేడాది 54.5శాతంగా ఉందని రాయిటర్స్‌ పేర్కొన్నది.అక్కడ ఆటోపరిశ్రమ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. జపాన్‌ కార్ల పరిశ్రమకు సైతం చైనా సెగతగులుతోంది.టయోటా తదితర కంపెనీలు తమ డిమాండ్‌ పడిపోకుండా చూసుకుంటున్నాయి.చైనాలో హైబ్రిడ్‌ కార్లకు మార్కెట్‌ ఎక్కువగా ఉంది. నిజంగా కార్ల ధర యుద్దమే తీవ్రమైతే చైనాకు తక్షణమే ఇబ్బంది ఉండదు. ఇప్పటికే సామర్ధ్యాన్ని సమకూర్చుకున్నందున పూర్తిస్థాయిలో ఉత్పత్తి వెంటనే జరపవచ్చు, అదే మిగతా దేశాల్లో సామర్ధ్యాన్ని పెంచుకొనేందుకు భారీగా పెట్టుబడులను కూడా పెట్టాల్సి వస్తుంది.


మన దేశంలో ఎలక్ట్రానిక్‌ కార్ల తయారీకి పూనుకుంటే ముడిపదార్దాలు, బ్యాటరీల కోసం చైనా మీద ఆధారపడటం పెరుగుతుందని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(గిట్రి) ఈ ఏడాది మార్చి నెలలో తన నివేదికలో పేర్కొన్నది. భారత్‌లో తయారయ్యే వాహనాలకు అవసరమైన వాటిలో 70శాతం వస్తువులను చైనా, ఇతర దేశాల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది..కాలుష్యం, ఉపాధిపై తలెత్తే పర్యవసానాల వంటి 13 అంశాలను గిట్రి గుర్తించింది.ఈ వాహనాల బ్యాటరీలను దిగుమతి చేసుకోవాలి, ధరలు ఎక్కువగా ఉంటాయి, ఆరేడు సంవత్సరాల తరువాత కొత్తవాటిని వేసుకోవాలి, వాటిని రీసైకిల్‌ చేయాలంటే వెలువడే విషపదార్దాలు సమస్యగా మారతాయి, దీని వలన విద్యుత్‌ గిరాకీ పెరుగుతుంది, బొగ్గుద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ ప్రక్రియలో కాలుష్యం పెరుగుతుంది. దూరప్రయాణాలకు అనువుగా ఉండవు,ప్రజా రవాణాకు పెద్దగా ఉపయోగపడవు,చైనా మీద ఎక్కువగా ఆధారపడటం వంటి అంశాలను పేర్కొన్నది. ఆటో విడిభాగాలను తయారు చేసే ఏడు వందల సంఘటిత రంగ సంస్థలతో పాటు పదివేల అసంఘటిత రంగ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. విడిభాగాలు అమ్మేవారు, లక్షలాది గారేజ్‌ షాపులు, సర్వీసు సెంటర్ల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని కూడా పేర్కొన్నది. తమ కాలుష్యకారక పరిశ్రమలను రక్షించుకొనేందుకు, ప్రపంచ వాణిజ్యాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లాలని ఐరోపా దేశాల చెబుతున్నాయి తప్ప ప్రపంచమంతా అలా లేదు.ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు చార్జర్లకు ఒక ప్రమాణం లేదు, అందువలన ప్రతి సంస్థ తనదైన నమూనాను ఇస్తున్నది, దేశమంతటా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నదని గిట్రి పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రామ్‌దేవ్‌ బాబా పతంజలి బండారాన్ని సుప్రీం కోర్టు విచారణ బయటపెడుతుందా ! రెచ్చిపోతున్న కాషాయ దళం !!

25 Saturday Nov 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, Education, Health, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Baba Ramdev, Bogus claims, love for pseudoscience, Patanjali Ayurved, saffron brigade hypocrisy, saffron nationalists, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


వివాదం తలెత్తిన ప్రతిసారీ రు.48వేల కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన పతంజలి ఆయుర్వేద కంపెనీ ఉత్పత్తులకు పైసా ఖర్చు లేకుండా భారీ ఎత్తున ఉచిత ప్రచారం లభిస్తున్నది.మరోసారి అదే జరిగింది. ఎవరు అంగీకరించినా లేకున్నా వాస్తవమిది. సేవించిన వారికి కంపెనీ ఉత్పత్తులు ఎంత మేర ఉత్తేజమిస్తాయో తెలియదు గానీ అధినేత రామ్‌దేవ్‌ బాబా కాషాయ వేషంతో చేసే ఉపన్యాసాలు హిందూత్వ శక్తులకు స్టెరాయిడ్లలా కిక్కునిస్తున్నాయి. అందుకే వివాదం తలెత్తినపుడల్లా సామాజిక మాధ్యమంలో వారు రెచ్చిపోతున్నారు. అడ్డగోలు వాదనలతో జాతీయోన్మాదాన్ని ముందుకు తెస్తూ జనాల బుర్రలను ఖరాబు చేస్తున్నారు. అల్లోపతి(ఇంగ్లీషు మందులుగా జనానికి తెలిసినవి) ఔషధాల గురించి జనాన్ని తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలు, ఆధారం లేని అంశాలను ప్రచారంలో పెడుతున్నారన్న వివాదంలో నవంబరు 21వ తేదీన సుప్రీం కోర్టు సర్వరోగ నివారిణి అని చెప్పుకుంటున్న వాటి ప్రకటనలు వెలువడకుండా చూసేందుకు పద్దతిని కనుగొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అటువంటి పనులకు పాల్పడితే పతంజలి ఉత్పత్తుల మీద జరిమానా విధించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు అహసనుద్దీన్‌, ప్రశాంత కుమార్‌ వ్యాఖ్యానించారు.అలాంటి ప్రకటనల జారీ నిలిపివేయాలని, వాటి గురించి మీడియాతో మాట్లాడకూడదని, పతంజలి ఉత్పత్తుల గురించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని పేర్కొన్నారు.దీంతో మరోసారి చర్చ, ఖండన మండనలు ప్రారంభమయ్యాయి.ఈ కేసును ఫిబ్రవరి 5కు కోర్టు వాయిదా వేసింది.


పతంజలి సంస్థ అల్లోపతి వైద్యాన్ని, వైద్యులను కించపరుస్తున్నదని, తమ ఉత్పత్తులతో వ్యాధులు నయం గావటం గురించి అవాస్తవ ప్రకటనలు చేస్తున్నదని, కరోనా గురించి పుకార్ల వ్యాప్తి, వాక్సిన్ల పట్ల వైముఖ్యతను రెచ్చగొడుతున్నదని గతేడాది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. జీవనశైలి కారణంగా తలెత్తే సమస్యలను, ఎడతెగకుండా ఉండే అస్వస్తత, జన్యుపరమైన, చర్మ వ్యాధులు, కీళ్లనొప్పులు,ఆస్మా,వెన్నెముక కండరాల బాధల వంటి వాటన్నింటినీ తమ ఉత్పత్తి శాశ్వతంగా నివారిస్తుందనే తప్పుడు ప్రచారాన్ని పతంజలి చేస్తున్నదని ఐఎంఎ ఫిర్యాదు చేసింది. దీని మీద తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే రామ్‌దేవ్‌ బాబా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజాలు, అవాస్తవాలను డబ్బు నిర్ణయించకూడదని, అల్లోపతి ఆసుపత్రులు, వైద్యులు ఎక్కువగా ఉండవచ్చు, వారి గళాన్ని ఎక్కువ మంది వినవచ్చు గానీ తమకు రుషుల జ్ఞానవారసత్వం ఉందని, తాము దానిలో పేదలం కాదని చెప్పుకున్నారు.యోగా, ఆయుర్వేద, ప్రకృతి వైద్యం, తమ సనాతన విలువలకు వ్యతిరేకంగా కొంత మంది అల్లోపతి వైద్యుల బృందం తప్పుడు ప్రచారం చేస్తున్నదని తమ కంపెనీ ఎలాంటి అబద్దాలు చెప్పటం లేదన్నారు.తప్పుడు ప్రచారం చేస్తున్నందున తమను సుప్రీం కోర్టు మందలించినట్లు వెలువడిన ఒక వార్తా కథనం గురించి చెబుతూ తామలాంటిదేమీ చేయటం లేదని, సుప్రీం కోర్టు అంటే గౌరవం ఉందన్నారు.తప్పుచేసినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్దమే, మేము అబద్దాలకోరులమైతే వెయ్యికోట్ల రూపాయల జరిమానాకు, మరణశిక్షకూ సిద్దమని కాదని తేలిదే మా మీద ప్రచారం చేస్తున్నవారిని శిక్షించాలన్నారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన కరోనిల్‌ పని చేస్తుందని 2020 జూన్‌లో పతంజలి చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది. రోగనిరోధక శక్తిని పెంచుతుందనే ఏకైక కారణంతో దానికి అనుమతి ఇచ్చాం తప్ప కరోనా నిరోధం గురించి కాదని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ దాన్ని కరోనా నిరోధ ఔషధంగా ప్రచారం చేయటంతో జనాలు ఎగబడి కొనుగోలు చేశారు. దాని సామర్ధ్యం, రక్షణ గురించి ఎలాంటి వివరాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వెల్లడించింది. నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్న మోసకారులుగా పేర్కొంటూ బీహార్‌, రాజస్థాన్‌లలో రామ్‌దేవ్‌ బాబా, పతంజలి సంస్థ చైర్మన్‌ బాలకృష్ణ మీద కేసులను దాఖలు చేశారు. ఇంత జరిగిన తరువాత కరోనిల్‌ ఉత్పత్తులు కొనుగోలుకు దొరుకుతున్నాయి.


యోగా చేస్తే ఎయిడ్స్‌ నివారణ అవుతుందని, స్వలింగ సంపర్క అలవాటును మానుకుంటారని రామ్‌దేవ్‌ బాబా చెప్పినదానికి నిజమే నిజమే అని తలలూపేవారికి కొదవలేదు.తాము ఉత్పత్తి చేసిన ” దివ్య పుత్రజీవక్‌ సీడ్‌ ”ను తీసుకుంటే పుత్రులు పుడతారని 2015 నుంచి ప్రచారం చేస్తున్నారు. దీన్ని సహజ ఔషధ మొక్కల నుంచి తయారు చేశామని, సంతానలేమి చికిత్సకు ఉపయోగపడుతుందని మార్కెటింగ్‌ చేస్తున్నారు. బుర్రల్లో గుంజులేని జనం దాన్ని నమ్ముతూనే ఉన్నారు. మాగీ నూడిల్స్‌లో సీసం శాతం నెస్లే కంపెనీ చెప్పినదానికంటే వెయ్యిరెట్లు ఎక్కువ ఉందని రుజువు కావటంతో 2015లో దాని మీద నిషేధం విధించారు. వెంటనే రామ్‌దేవ్‌ బాబా తన నూడిల్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇక్కడ అసలు కథ ఏమిటంటే కేంద్రంలో నీకది నాకిది అనే పాలకులు అధికారంలో ఉన్నందున ఎలాంటి అనుమతులు లేకుండానే భారత ఆహార భద్రత, ప్రమాణాల ఆధారిటీ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పేరుతో ఒక లేని నంబరును ఆ ఉత్పత్తి మీద ముద్రించి అమ్మి సొమ్ము చేసుకొనే అక్రమానికి పాల్పడ్డారు.దాన్ని గుర్తించిన అధారిటీ అధ్యక్షులు ఆషిష్‌ బహుగుణ ఆ ఉత్పత్తికి అంగీకారం, అనుమతుల్లేేవంటూ తిరస్కరించారు.కాషాయం ధరించిన వారు ఏం చేసినా చెల్లుతుందనే భరోసా కేంద్రంలో ఉన్న పెద్దలు ఇవ్వకుండా ఇలాంటి అక్రమానికి పాల్పడతారని అనుకోగలమా ? తరువాత 2017లో ఆయుర్వేద ఉసిరికాయ రసం పేరుతో మార్కెటింగ్‌ ప్రారంభించారు. అది తాగేందుకు పనికిరాదని ప్రభుత్వ ప్రయోగశాల ప్రకటించటంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్పత్తిని పక్కన పెట్టినప్పటికీ ఇప్పుడు కూడా దాన్ని విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.తాజాగా ఒక రకపు చేప ఎముకల పొడితో కూడిన దివ్య దంత మంజన్‌ పేరుతో పండ్లుతోముకొనే పేస్టును మార్కెట్‌ చేయటంపై ఒక లాయర్‌ ఆ సంస్థకు నోటీసులు ఇచ్చారు. అది శాఖాహార పదార్ధాలతో తయారు చేసిందని నమ్మకం కలిగించేందుకు ఆకుపచ్చ గుర్తువేసి మరీ అమ్ముతున్నారు. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించటమే అన్నది అభ్యంతరం.లాయర్‌ సాషా జైన్‌ పంపిన నోటీసులో తమ సామాజిక తరగతి, ఇతర శాఖాహారుల మీద జరిపిన దాడిగా ఆమె అభివర్ణించారు.


అల్లోపతి వైద్యులపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కరోనా మీద చేసి వ్యాఖ్యలపై తన మీద పాట్నా, రాయపూర్‌లలో నమోదైన కేసులను ఎత్తివేయాలని లేదా ఢిల్లీలో విచారించాలని రామదేవ్‌బాబా సుప్రీం కోర్టును కోరారు. అక్టోబరు నెలలో దీని మీద న్యాయమూర్తులు ఏఎస్‌ బోపన్న, ఎంఎ సుందరేష్‌లతో కూడిన బెంచ్‌ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేసింది. విద్వేష పూరిత ప్రసంగం కేసులో దర్యాప్తు అధికారి ముందుకు అక్టోబరు ఐదవ తేదీన రావాలని రాజస్థాన్‌ హైకోర్టు సెప్టెంబరులో ఆదేశించింది. దాని మీద గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తరువులను అక్టోబరు 16 వరకు పొడిగించింది. అప్పటి వరకు అరెస్టు చేయరాదని ఆదేశించింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఫిబ్రవరి రెండవ తేదీన ఒక మతపరమైన కార్యక్రమంలో రామ్‌దేవ్‌ బాబా మాట్లాడుతూ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు కేసు నమోదు చేశారు. ముస్లింలు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని, హిందూ మహిళలను అపహరిస్తున్నారంటూ మాట్లాడిన అంశాలతో కూడిన వీడియోను సమర్పిస్తూ పాథైఖాన్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. తమ ఆయుర్వేద ఔషధాలు సర్వరోగ నివారిణి అని ప్రచారం చేసుకుంటున్న పతంజలి కంపెనీ అధికారి బాలకృష్ణ 2019 అగస్టులో 23న తనకు తల తిరుగుతోందని, గుండెలో నొప్పి ఉందంటూ రిషికేష్‌లోని ఆలిండియా మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రిలో చేరారు.తొలుత హరిద్వార్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకుపోగా వారు ఎయిమ్స్‌కు పంపారు.ఉల్లి-హరిదాసు కథ తెలిసిందే. తమదాకా వస్తే గాని అసలు సంగతి వెల్లడి కాదంటారు ఇందుకే.
ఇలాంటి వివాదాస్పద వ్యక్తులు, శాస్త్రీయత లేని వారి ఉత్పత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో కొందరు కుహనా దేశభక్తులు రెచ్చిపోతున్నారు. అదానీ కంపెనీ అక్రమాలపై హిండెన్‌ బర్గ్‌ చేసిన ఆరోపణల సందర్భంగా కూడా ఇదే జరిగింది. దేశభక్తుడైన వాణిజ్య, పారిశ్రామికవేత్త మీద దేశద్రోహులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇది దేశం మీద జరుగుతున్నదాడే అన్నారు. పతంజలి వివాదం గురించి వారు చేస్తున్న కొన్ని వాదనల తీరు తెన్నులు చూద్దాం.


” 100 సంవత్సరాలుగా సినిమా యాక్టర్స్‌ను చూపించి లక్స్‌ వాడితే తెల్లబడతాం అంటే ఏం ప్రశ్నించకుండా ఎగబడి కొన్నది మనమే కదా? ”
భావజాలం, మతం, సనాతనం, ఆచారం పేరు ఏది పెట్టినా తరతరాలుగా అసలు మన జనాన్ని ప్రశ్నించకుండా, మెదళ్లను ఎదగకుండా పనికిరాకుండా చేసిన ప్రబుద్దుల గురించి ముందుగా ఆలోచించాలి. ఎందుకు అని ఎవరూ ప్రశ్నించకూడదు. నేర్పకున్నా చూసి నేర్చుకోవటం కూడా అపరాధమే. అర్జునుడి కంటే గొప్ప విలుకాడిగా తయారైన గిరిజన ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలిని ద్రోణుడు గురుదక్షిణగా అడిగి అసలు విల్లుపట్టకుండానే చేశాడు కదా ! నిజమే, లక్స్‌ గురించి అడగలేదు అని ఎద్దేవా చేస్తున్నవారు పతంజలి ” సౌందర్య ” బ్రాండ్‌ సబ్బు కూడా అలాంటిదే అని ఎందుకు చెప్పటం లేదు. గుడ్డిగా కొనేవారున్నారు గనుకనే సొమ్ము చేసుకుంటున్నారు.లక్స్‌ వంటి వాటిని చూసే కదా రామ్‌దేవ్‌ సంపాదనకు దిగింది.
” కాంప్లాన్‌ తాగండి జిరాఫీ అంత పొడుగు అవ్వండీ అంటే ఏనాడూ ప్రశ్నించని మనం మన ఆయుర్వేదిక్‌ ఉత్పత్తులపై మాత్రం నానా యాగీ చేస్తాం. కోర్టులూ అంతే. ”
ప్రశ్నించవద్దని ఎవరు వద్దన్నారు. స్వదేశీ జాగరణ మంచ్‌ కార్యకర్తలు, ఈ ప్రశ్నలు వేసేవారు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? కోర్టులూ అంతే అంటే ఎవరైనా కోర్టుకు వెళితేనే కదా అవి తమ పరిధి మేరకు జోక్యం చేసుకొనేది.తప్పుడు సమాచారం ఇచ్చి వినియోగదారులను మోసం చేస్తున్న కంపెనీలు ఏవైనా ప్రశ్నించాల్సిందే, కోర్టులకు లాగాల్సిందే. ఆయుర్వేదంతో సహా పొడవును పెంచే ఉత్పత్తులేవీ ప్రపంచంలో లేవు.
” తప్పు ఏం ఉంది ఆయన మార్కెటింగ్‌ చేసుకుని సంపాదించింది దేశంలోనే ఉంటోంది కదా లీవర్‌ కంపనీ నెస్లే కంపెనీల వాళ్ళ లాగా విదేశాలకు పట్టుకుపోవడం లేదు కదా? ”
ఈ ప్రశ్న వేసేవారు విదేశాలకు పట్టుకుపోయే కంపెనీల మీద చర్యలు తీసుకోవటానికి అడ్డుపడుతున్నదెవరో చెప్పాలి. పతంజలి సంపాదించిందంతా దేశంలోనే ఉంటే ఒరిగేదేమిటి ? జన సంక్షేమానికేమీ ఖర్చు పెట్టటం లేదుగా ! దేశభక్త అదానీ అని చెప్పిన వారు విదేశాల్లో అతని సూట్‌కేసు కంపెనీల గురించి ఎందుకు చెప్పరు. ఇక్కడ సంపాదించిన సొమ్మును అడ్డంగా తరలించి ఆ సొమ్మునే తిరిగి విదేశీ పెట్టుబడుల పేరుతో తీసుకువచ్చి రాయితీలు భారీగా పొందుతున్న పెద్దల సంగతి తెలియందెవరికి ? గతంలో ఉన్న కాంగ్రెస్‌ పాలకులు, దేశం కోసం, ధర్మం కోసమే అంతా అంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే విదేశాలకు తరలింపుకు అవకాశం కలిగిస్తోంది.
”అన్ని మందుల కంపెనీలు, అన్ని కాస్మెటిక్‌ కంపెనీలు అబద్ద ప్రకటనలతోనే, డాక్టర్లకు కోట్లలో మూడుపులు ఇస్తూ వంద సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాయి కదా? ”
నేను తినను ఇతరులను తిననివ్వను అని చెప్పిన నరేంద్రమోడీకీ ఈ విషయాలు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. అలాంటి పనులు ఎవరు చేసినా అక్రమమే. వాటి సరసన పతంజలి కూడా చేరింది. తన ఉత్పత్తుల మార్కెటింగ్‌కు పతంజలి ఏమీ ఇవ్వకుండానే వ్యాపారులు అమ్మిపెడుతున్నారా ? అల్లోపతి వైద్యులే డబ్బుతీసుకుంటున్నారా, ఆయుర్వేద వైద్యులకు డబ్బు చేదా ! మనవాడని చెప్పి సుత్తితో కొట్టించుకుంటే తలపగలదా ! మెదడు చితకదా !! చితికితే ఆయుర్వేదంతో కుట్లు వేస్తారా ?
”వాడితే తెల్లగా అయిపోతారు అనే ఫెయిర్‌ అండ్‌ లవ్లీ ని ప్రశ్నించం. వాడి మార్కెటింగ్‌ మోసాన్ని హాయిగా ఎంజారు చేస్తాం.”
గర్భ సంస్కారం పేరుతో బలశాలులైన పక్కాహిందూ పిల్లల్ని పుట్టిస్తామని చెబుతున్న బాపతు గురించి లొట్టలేసుకుంటూ చెప్పుకుంటాం. తమ ” దివ్యపుత్రజీవక్‌ సీడ్‌ ”తో మగపిల్లలను పుట్టిస్తామంటే ఎలా అని రామ్‌దేవ్‌బాబాను ప్రశ్నించం ! పతంజలి ” సౌందర్య స్వర్ణ క్రాంతి క్రీమ్‌” కు ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీమ్‌కు తేడా ఏమిటన్న ప్రశ్నే మన మెదళ్లకు తట్టదు. ప్రతి వాడి మోసాన్ని, వేషాన్ని ప్రశ్నిద్దాం !
” మరి ఒక్క దేశీయ కంపెనీలపై మాత్రమే ఈ దాడి దేనికి? ”
ఏ కంపెనీ అయినా మోసానికి, జనాన్ని తప్పుదారి పట్టిస్తే ఎవరైనా ప్రశ్నిస్తారు. ప్రశ్నించటాన్నే దాడి అని వర్ణించటం ప్రమాదకరపోకడ. ఇప్పుడు దేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని ఎదిరించిన వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న పూర్వరంగంలో పతంజలిని కాషాయ భక్తులు వెనకేసుకురావటం విశేషమేమీ కాదు.
” మన కళ్లను మనమే ఎలా పొడిపించుకోవచ్చో ఎంఎన్‌సిలకు ఉగ్గుతో అబ్బిన విద్య.తెల్ల తొక్క వాడు ఏది చెప్పినా అది మనకు వేదమే. వెధవ దేశీయ నల్లవాడు ఏది చెప్పినా ఎలా ఎదిగినా తప్పే. ”
ఏ రంగువాడు చెప్పాడన్నది కాడు, ఏం చెప్పాడన్నది, ఎవడు ఏం చేశాడన్నది ముఖ్యం. మన వారిలోనే తెల్లవాడిని ఎదిరించే క్రమంలో ప్రాణార్పించిన దేశభక్తులను చూశాం. అండమాన్‌ జైల్లో పెట్టగానే పిరికిబారి బయటపడేస్తే సేవ చేసుకుంటా అని ప్రేమలేఖలు రాసి తనను తానే ”వీర ” అని రాసుకున్న దొంగదేశభక్తుడి గురించీ తెలిసిందే. చిన చేపను పెద చేప మింగినట్లుగా దేశం మారకుండా చూసేందుకు 1969లో గుత్త సంస్థల పరిమిత వాణిజ్య చట్టాన్ని(ఎంఆర్‌టిపి) తెచ్చారు. దాన్ని2002 ఎన్‌డిఏ పాలకులు పోటీ చట్టం తెచ్చి చెత్తబుట్టలో పడేశారు. పోటీ పెరిగినందున జనానికి జరిగిన మేలేమిటి ? ప్రతిదీ దేశీయమే అని చెప్పేవారు అదే తెల్ల విదేశీ కంపెనీలు, పెట్టుబడుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నట్లు ?
” ప్రపంచ సంస్ధ లతో పోటీ పడే పెద్ద ఎంఎన్‌సిలు దేశంలో 70 సం. లుగా ఎందుకు తయారు కాలేదు అంటే మన ఈ మనస్తత్వమే.. ఆలోచన విధానమే కారణం.”
ప్రపంచ ఎంఎన్‌సిలు ఇతర దేశాల జనాన్ని కొల్లగొట్టి బలిశాయి. అందుకు ఆ దేశాల పాలకులు ప్రపంచమంతటినీ వలసలుగా చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు గనుక మనవంటి దేశాల మార్కెట్లను ఆక్రమిస్తున్నాయి. మనం కూడా ఇతర దేశాలను ఆక్రమించి ఉంటే ఎంఎన్‌సిలు వచ్చి ఉండేవి. మనం తక్కువ తినటం లేదు. అదానీని మరింత పెద్ద శక్తిగా మార్చటానికి శ్రీలంకలో విద్యుత్‌ కేంద్రాన్ని అప్పగించమని నరేంద్రమోడీ స్వయంగా వత్తిడి చేసినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. అంబానీ రిలయన్స్‌ను మరింత బలపరచటానికే కదా అమెజాన్‌ కంపెనీని మోడీ అడ్డుకుంటున్నది.
”స్వతంత్ర పోరాటం చేశాం, దేశభక్తి అని చెప్పి గత 75 సం. లలో ఎంత మంది కాంగ్రెస్‌ నేతలు వేల కోట్లకు అధిపతులు అయ్యారు?”
అవును, ఆ పేరుతో కొంత మంది సంపాదించుకున్నారు, ప్రభుత్వ రంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మేమే అసలైన దేశభక్తులం అని చెబుతున్నవారు దేశం కోసం-ధర్మం కోసం అనే పేరుతో కొత్త పెట్టుబడులేవీ పెట్టకుండా గతంలో సమకూర్చిన ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ అయినకాడికి తెగనమ్మేస్తున్నారు. కావాలని ఎగవేసిన వారికి లక్షల కోట్ల బాంకు రుణాలను రద్దు చేశారు. వారికి 75 ఏండ్లు అవకాశం ఇచ్చాం, వీరికీ మరో 75 ఏండ్లు అవకాశమిద్దామా ? ఎలాంటి శషభిషలు లేకుండా మన కళ్ల ముందే దేశాన్నే తెగనమ్మేస్తారు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడట్లుండె, నేడిట్లుండె – దేశంలో తెలంగాణా ఎక్కడుండె !

22 Wednesday Nov 2023

Posted by raomk in BJP, BRS, Congress, Current Affairs, Economics, Education, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS, Telangana, Women, Women

≈ Leave a comment

Tags

BRS, KCR, Telagana politics, Telangana BJP, Telangana CM, telangana Congress, Telengana Elections 2023


ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అంటూ మూడు ప్రధాన పార్టీలు ఓటర్ల ముందుకు ఎన్నికల ప్రణాళికలు, ఓట్లు దండుకునే ప్రచారం, పధకాలతో ముందుకు వచ్చాయి. అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ నాడెట్లుండె-నేడెట్లుండే రేపు ఎలా ఉండబోతుందో చూడండి అంటూ రంగుల కలను జనం ముందు ఉంచింది. అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీ తాను ప్రకటించిన ప్రణాళికను ఎలా అమలు జరుపుతుంది ? దానికి తగిన నిధులు అందుబాటులో ఉన్నాయా ? ఏమి చూసుకొని జనాన్ని వాగ్దానాల జడివానలో తడుపుతున్నది అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి, కేంద్రంలో ఏలుబడి సాగిస్తున్న బిజెపి ఇతర రాష్ట్రాలలో, కేంద్రంలో అమలు జరపని పధకాలను ఇక్కడ ఎందుకు జనానికి చెబుతున్నది, ఎలా అమలు చేస్తుంది ? రాష్ట్ర అధికారపక్షం బిఆర్‌ఎస్‌ గత పది సంవత్సరాలుగా అమలు జరపని వాటిని రానున్న రోజుల్లో అమలు జరుపుతామంటే నమ్మేదెలా అన్న ప్రశ్న సహజంగానే వస్తున్నది. బిఆర్‌ఎస్‌ చెబుతున్నట్లు నిజంగానే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుస్తున్నదా ? దాని పని తీరు ఎట్లుండె అన్నది బడ్జెట్లలో చూస్తే అర్ధం అవుతుంది. అందుకే దాని పని తీరును ఒక్కసారి అవలోకించాల్సిందిగా మనవి.


ఒక పెద్ద మనిషి పదేండ్ల తరువాత బంధువుల ఇంటికి వచ్చాడు. అప్పుడు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని చూశా ఇప్పుమో నడుస్తూ గంతులేస్తున్నడు, ఎంతగా ఎదిగిండో కదా అన్నడట.పిల్లవాడు పుట్టిన తరువాత పెరగకుండా ఎట్లుంటడు ? ఎలా పెరిగిండు, కడుపు నిండా తింటున్నడా, మంచిగా ఆడుకుంటున్నడా, ఆరోగ్యంగా ఉన్నడా లేడా బడికిపోతున్నడా లేదా అన్నది ముఖ్యం. రాష్ట్రమైనా అంతే పదేండ్లనాడు ఉన్న మాదిరే ఇప్పుడు ఎట్లుంటది, మార్పులు వస్తాయి. అవి ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం. రాష్ట్రం, దేశం ఏదైనా అంతే ! దిగువ చూపుతున్న వివరాలలో గత సంవత్సరాల కేటాయింపులు 2023-24 బడ్జెట్‌ ప్రతిపాదనలుగా గమనించాలి. అంకెలు రు. కోట్లు అని గమనించాలి. ఓ.మా రుణం అంటే ఓపెన్‌ మార్కెట్‌ రుణం.
అంశం×××× 2014-15 ××× 2022-23 ×× 2023-24
జిడిపి ×××× 5,05,849 ××× 12,93,000 ×× 14,00,000
అప్పులు ×× 75,577 ××× 4.50,000 ×× 5,00,000
ప్ర.రుణచెల్లింపు× 587 ××× 8,336 ×× 9,341
వడ్డీ,అసలు ×× 6,291 ××× 18.912 ×× 22,400
ఓ.మా.రుణం ×× 8,211 ××× 44, 970 ×× 40,615
లిక్కర్‌ రాబడి×× 10,883 ××× 31,077 ×× 35,000
కే.పన్నువాటా ×× 8,185 ××× 19,668 ×× 21,470
కాపిటల్‌ ఖర్చు×× 8,372 ××× 26,934 ×× 37,525
మూలధన పెట్టుబడి అన్నది రాష్ట్రం, దేశానికైనా కీలకమైనది.2014-15లో ఖర్చు బడ్జెట్‌ మొత్తం ఖర్చు రు.62,306 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.11,633 కోట్లు, 18.6శాతం ఉంది. 2022-23లో సవరించిన అంచనా ప్రకారం ఖర్చు బడ్జెట్‌ రు.2,26,010 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.26,934 కోట్లు,11.9శాతానికి దిగజారింది.2023-24 సంవత్సర ఖర్చు బడ్జెట్‌ రు.2,77,690 కోట్లు కాగా మూలధన పెట్టుబడి రు.37,525 కోట్లుగా ప్రతిపాదించారు.దీన్ని మొత్తం ఖర్చు చేస్తే 13.5శాతం అవుతుంది. బడ్జెట్‌ వివరాలను చూసినపుడు 2021-22లో రు.28,874 కోట్లు వాస్తవ ఖర్చు ఉంది. మరుసటి ఏడాది రు.29,728 కోట్లు ప్రతిపాదించి రు.26,934 కోట్లకు సవరించారు. వాస్తవ ఖర్చు ఇంకా తగ్గవచ్చు. అందువలన వర్తమాన బడ్జెట్‌లో ఎంత కోతపెడతారో తెలియదు. మొత్తం తెలంగాణా వచ్చినపుడు 18.6శాతంగా ఉన్న ఖర్చు క్రమంగా దిగజారటం ఆందోళన కలిగించే అంశం.


పెంచకపోయినా తొలి ఏడాది మూలధన పెట్టుబడి శాతం ఎంత ఉందో దాన్నయినా కొనసాగించాలి కదా ? తెలంగాణా ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో రాష్ట్ర జిడిపిలో అప్పులు16.06శాతం ఉన్నాయి.పదిహేనవ ఆర్థిక సంఘం నిబంధనల(ఎఫ్‌ఆర్‌బిఎం) ప్రకారం అప్పులు 29.5శాతం ఉండవచ్చు. కాగ్‌ నివేదిక 2020-21 ప్రకారం ఆ సంవత్సరంలో అప్పులు 28.1శాతానికి పెరిగాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు. ఇవిగాక ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసిస సంస్థలకు హామీగా ఇప్పించిన రుణాలను కూడా పరిగణనలోకి తీసుకొంటే 38.1శాతంగా ఉన్నాయి. బంగారు బదులు అప్పుల తెలంగాణాగా మార్చారు. పరిమితికి మించి రుణాలు తీసుకున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వలన రుణ అర్హత పరిమితి తగ్గింది. పేరుకు పోయిన అప్పుల మొత్తం పెరుగుతున్నట్లు అంకెలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర జిడిపి ఏటేటా పెరుగుతున్నందున దానితో పోల్చుకున్నపుడు తగ్గుదల కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ అంకెలనే తనకు అనుకూలంగా చూపుతుంది. కొత్తగా తీసుకొనే రుణాల మీద కోత విధించటం కూడా తగ్గుదలకు ఒక కారణం.2023-24 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రుణభారం జిడిపిలో 23.8శాతంగా ఉంటుందని చూపారు. రానున్న రెండు సంవత్సరాల్లో 2025,26 ఆర్థిక సంవత్సరాల్లో ఆ మొత్తం 25శాతానికి పెరుగుతుందని కూడా పేర్కొన్నారు అంతకు ముందు సంవత్సరం 24.3శాతం ఉంది. ముందే చెప్పుకున్నట్లు వీటికి ప్రభుత్వం హామీగా ఉన్న రుణాల మొత్తం 2022-23లో రు.1,29,244 కోట్లు, ఇది జిడిపిలో 11.3శాతం, దీన్ని కూడా కలుపుకుంటే అప్పుల మొత్తం 35.6శాతం ఉంది.


కొన్ని సంక్షేమ పధకాలను చూపి వాటిని తెలంగాణా నమూనాగా ప్రచారం చేస్తున్నారు, అభివృద్ధిలో ముందుందని అంటున్నారు.ఇది వాస్తవమా ? రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్ల వంటి కొన్ని సంక్షేమ పధకాలు అందరికీ తెలిసినవే.ఆరు కీలక రంగాలలో తెలంగాణా దేశంలో ఎక్కడుందో తెలుపుతూ పిఆర్‌ఎస్‌ అనే స్వచ్చంద సంస్థ విశ్లేషణలను అందించింది.2022-23లో తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాల బడ్జెట్‌ కేటాయింపులను పోల్చి చూపింది.ఎంతో పురోగమించింది, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం, అందుకే టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా అవతరించాం అని చెప్పుకోవటంలో వాస్తవం ఎంతో చూద్దాం. బిఇ అంటే బడ్జెట్‌ అంచనా, ఆర్‌ఇ అంటే సవరించిన బడ్జెట్‌ అంచనా.ఆయా రంగాలకు మొత్తం ఖర్చులో తెలంగాణా కేటాయింపు శాతం, చివరి కాలంలో అన్ని రాష్ట్రాల సగటు శాతాలు దిగువ విధంగా ఉన్నాయి.ఆర్‌డి అంటే గ్రామీణాభివృద్ధి.ప.అ అంటే పట్టణ అభివృద్ధి,
రంగం×××2021-22××22-23బిఇ××22-23ఆర్‌ఇ××23-24బిఇ××అ.రా 22-23బిఇ
విద్య ××× 8.7 ×× 7.3 ×× 8.0 ×× 7.6 ××14.8
వైద్యం××× 4.2 ×× 5.0 ×× 5.5 ×× 5.0 ×× 6.3
ఆర్‌డి ××× 4.5 ×× 3.9 ×× 4.3 ×× 3.6 ×× 5.7
ప.అ ××× 1.6 ×× 3.0 ×× 3.2 ×× 2.8 ×× 3.5
పోలీస్‌ ××× 4.6 ×× 4.0 ×× 4.4 ×× 3.6 ×× 4.3
రోడ్లు ××× 1.4 ×× 3.2 ×× 3.3 ×× 3.7 ×× 4.5
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు ఆయా రంగాలలో మూడు సంవత్సరాలలో ధనిక రాష్ట్రంగా చెప్పుకొనే తెలంగాణా దేశ సగటు కంటే తక్కువే ఖర్చు చేస్తున్నది. కెజి నుంచి పిజి వరకు ఉచితం అని చెబుతున్న పాలకులు విద్యలో సగం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కార్పొరేట్లకు ఈ రంగాన్ని అప్పగించటమే అన్నది స్పష్టం. ప్రభుత్వ విద్యా సంస్థలలో తగిన సౌకర్యాలు, సిబ్బంది, చదువుకొనే వాతావరణం ఉంటే తలిదండ్రులు ప్రైవేటు సంస్థలవైపు చూడరు.


ఇక వైద్యం, తల్లీ పిల్లల ఆరోగ్యం, పోషకాహారం గురించి చూద్దాం.2015-16 సంవత్సరాలలో నాలుగవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, 2019-21లో ఐదవ సర్వే జరిగింది.ఈ రెండు సర్వేల వివరాలను చూసినపుడు దేశం మొత్తం మీద రక్తహీనత సమస్య పెరిగింది.శరీరంలో తగినంత రక్తం లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది తెలిసిందే.రక్తహీనత పెరుగుదల బడుగు, బలహీన వర్గాలలోనే ఎక్కువగా ఉంది.తాము తిన్నా తినకపోయినా పిల్లలకు పెట్టేందుకు చూసే తలితండ్రులు తమ బిడ్డలను ఆరోగ్యంగా పెంచలేకపోవటానికి ప్రధాన కారణం వారికి తగినంత కుటుంబ ఆదాయం లేక పోషకాహారం తీసుకోకపోవటమే అని వేరే చెప్పనవసరం లేదు.వివరాలు దిగువ చూడవచ్చు.1.ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లలు, 2.గర్భిణులు కాని మహిళలు 15 నుంచి 49 ఏండ్లు , 3. గర్భిణులు 15 నుంచి 49 ఏండ్లు,4.మహిళందరు 15-49 ఏండ్లు, 5.యువతులు 15-19 ఏండ్లు, 6.యువకులు 15-19 ఏండ్లు.దేశం 4 అంటే నాలుగవ సర్వే, దేశం 5 అంటే ఐదవ సర్వే శాతాలు.
ఏరియా ×× 1 × 2 × 3 × 4 × 5 × 6
దేశం 4 ××58.6 ×52.3 ×50.4×53.1 ×54.1× 29.2
దేశం 5 ××67.1 ×57.2 ×52.2×57.0 ×59.1× 31.2
తెలంగాణా4××60.7 ×56.9 ×48.2×56.6 ×57.9× 19.2
తెలంగాణా5××70.0 ×57.8 ×53.2×57.6 ×64.7× 25.1
పై పట్టిక చూసినపుడు పసిపిల్లలో రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు ఇంత అనారోగ్యంగా ఉంటే ఎలా ! ఒకే వయసు ఉన్న యువతీ యువకుల్లో రక్తహీనత తేడాలు ఎంతగా ఉన్నాయో చూస్తే ఆడపిల్లల పట్ల వివక్ష, నిర్లక్ష్యం కనిపిస్తుంది. దేశంలోని యువకుల్లో రెండు సర్వేల మధ్య తేడా రెండుశాతం కాగా తెలంగాణాలో ఆరుశాతానికి పెరగటాన్ని గమనించవచ్చు. తల్లీ, పిల్లల ఆరోగ్యం, పోషణ అంశంలో దేశం మొత్తం మీద చూపుతున్న నిర్లక్ష్యం కంటే తెలంగాణాలో ఎక్కువగా ఉన్నట్లు అంకెలు చెబుతున్నాయి.అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు కీలక రంగాలకు తగిన కేటాయింపులు జరపక, తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని పట్టించుకోక తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నట్లు ? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి దిగజారిందా మెరుగుపడిందా ? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా వివక్షకు గురైందని చెప్పిన పాలకులు దేశ సగటు కంటే తక్కువ కేటాయింపులు ఎందుకు చేసినట్లు ?


రాష్ట్ర ప్రభుత్వం రెండులక్షల రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం చేస్తామని 2016-17బడ్జెట్‌లోనే చెప్పింది. ఒక లక్ష హైదరాబాద్‌, మరోలక్ష ఇతర చోట్ల అని పేర్కొన్నది.దాని ఆచరణ ఎలా ఉందంటే 2021-22 బడ్జెట్‌లో ఇండ్ల నిర్మాణానికి రు.11,151 కోట్లు కేటాయించి ఖర్చు చేసిందెంతో తెలుసా కేవలం రు.299 కోట్లు మాత్రమే.2022-23లో రు.12,172 కోట్లు కేటాయించి రు.8,112కోట్లకు తగ్గించి సవరణ బడ్జెట్‌లో చూపారు. ఆచరణలో ఇంకా తగ్గవచ్చు.కానీ 2023-24లో రు.12,140 కోట్లుగా ప్రతిపాదించి అంతకు ముందు కంటే 50శాతం పెంచినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు కొంత మేర నిధులు కేటాయించి నామ మాత్రంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామనిపించి వాటినే గొప్పగా ప్రచారం చేస్తున్నారు.అదే విధంగా అదే ఏడాది పట్టణాభివృద్ధికి రు.10,555 కోట్లు ప్రకటించి 75శాతం కోత పెట్టి రు.2,665 కోట్లు ఖర్చు చేశారు.సగానికిపైగా జనాభా పట్టణాల్లో నివసిస్తున్న పూర్వరంగంలో ఎంత నిర్లక్ష్యం చేసిందీ వేరే చెప్పనవసరం లేదు. అదే బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమం-పోషకాహారానికి రు.18,997 కోట్లు కేటాయించి 35శాతం,రోడ్లు, వంతెనలకు రు.5,187 కోట్లు ప్రకటించి 55శాతం, వ్యవసాయం, అనుబంధ రంగాల ప్రతిపాదనల్లో 27శాతం కోత పెట్టారు.ఇలా కోతలను దాచి వర్తమాన బడ్జెట్‌లో పెంచినట్లు మాటల్లో కోతలు కోస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d