• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

లడ్డు రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టికాయలు : లీకు వీరుడు చంద్రబాబు పప్పులో కాలేశారా ?

02 Wednesday Oct 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, TDP, Ycp

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Narendra Modi, Pawan kalyan, Tirupati Laddu Controversy, YS jagan

ఎం కోటేశ్వరరావు


లడ్డు కల్తీ ఉదంతంలో దోషులుగా ఎవరు తేలతారో, ఏ శిక్షలు అనుభవిస్తారో ఆ భగవంతుడికే ఎరుక. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారవుతుందా అన్నది ఒక అనుమానం. కానీ తిరుమల శ్రీనివాసుడితో నిమిత్తం లేకుండా సుప్రీం కోర్టులో దాఖలైన పలు కేసులు, ఈ వివాదం నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. కల్తీ గురించి దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వ వేసిన సిట్‌ సరిపోతుందా లేక మరొక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అవసరమో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలంటూ అక్టోబరు మూడవ తేదికి కోర్టు వాయిదా వేసింది. కేంద్రం ఏమి చెబుతుందో కోర్టు ఏమి నిర్ణయిస్తుందో తెలియదు. అయితే అప్పటి వరకు సిట్‌ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ డిజిపి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. నిజానికి సిట్‌ దర్యాప్తు నిలిపివేయాలని కోర్టు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే నష్టనివారణ చర్యగా కనిపిస్తున్నది. లడ్డూలలో వాడే నేతిలో కల్తీ ఉందంటూనే దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఇచ్చిన నివేదికలో ఎన్‌డిడిబి లాబ్‌ తన జాగ్రత్తలు తాను తీసుకుంది. దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా మార్చి జగన్మోహన్‌ రెడ్డిని మరింతగా దెబ్బతీయవచ్చని ఎవరైనా సలహా ఇచ్చారో లేక తనంతట తానే నిర్ణయం తీసుకున్నారో తెలియదుగానీ లాబ్‌ నివేదికను బహిర్గతం చేసి చంద్రబాబు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. దాని గురించి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెల్లడిరచిన అభిప్రాయాలు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని ఇరకాటంలోకి నెట్టాయి. లడ్డూలో కల్తీకి పరిహారంగా లడ్డు పోటు, ఇతర ప్రాంతాలను ఆలయం శుద్ది చేసింది. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఏకంగా తానేమీ తక్కువ కాదన్నట్లు పదకొండు రోజుల దీక్ష పేరుతో చేసిన హడావుడి చూశాము. కల్తీ గురించి సిట్‌ వేసినపుడు దాని నివేదిక రాకుండా ముందుగానే ఉన్నట్లు కల్తీ గురించి సిఎం ఎలా ప్రకటిస్తారు ? అంటే మీకే స్పష్టత లేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కోట్లాది మంది మనోభావాల మీద ప్రభావం చూపే అంశాలను నిర్ధారించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మాట్లాడటం సరికాదని, దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని కూడా వ్యాఖ్యానించింది. అనేక కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు తీర్పుల్లో కనిపించవు. ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియదు.


నెయ్యి కల్తీ నివేదిక గురించి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరువాత ప్రతికూల స్పందనలు రావటంతో కొంత మంది కొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. అసలు చంద్రబాబు నివేదికను బయటపెట్టాలనుకోలేదని, వందరోజుల పాలన సందర్భంగా ఎంఎల్‌ఏతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఎన్‌డిడిబి నివేదికను యథాలాపంగా ప్రస్తావించారని చెబుతున్నారు. దాన్ని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి సవాలు చేయటంతో అనివార్యంగా తెలుగుదేశం పార్టీ సదరు నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని సమర్ధించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి లీకు వీరుడు అనే మారు పేరు ఉంది. అనేక అంశాలను కావాలనే వేరే మార్గంలో బయటపెట్టించి స్పందనను బట్టి దాన్ని వాడుకోవటం అలవాటు. గతంలో ప్రపంచ బ్యాంకు పధకాలను అమలు చేసే క్రమంలో వాటికి జనం మద్దతు కూడగట్టటం కోసం ఏ శాఖలో ఎంత అవినీతి ఉందో అనే సర్వేలు చేయించి వాటిని మీడియాకు అందచేసిన తీరు జనం మరచిపోయినా అది వాస్తవం. ఇప్పుడు లడ్డూ కల్తీలో ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. ఇప్పుడు ఒకవేళ సుప్రీం కోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించితే దాని మీద స్పందన ఎలా ఉంటుందో తెలియదు. అలాగాక ఇప్పుడు వేసిన సిట్‌ను కొనసాగిస్తే ముందే కల్తీ గురించి సిఎం చెప్పిన తరువాత దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వటం తప్ప వేరే ఏముంటుందని జనం భావిస్తారు. ఒకవేళ సిబిఐ విచారణ జరిపితే మూడు పార్టీల కూటమికి అనుకూలంగా దాని నివేదిక ఉంటుందని కూడా అదే జనం భావిస్తారు. విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది.


దేశ రాజకీయాల మీద చంద్రబాబు చూపిన ప్రభావం గురించి గతంలో ఎన్నో చెప్పుకున్నాం, ఇప్పుడు పలు దేవాలయాల్లో ప్రసాదాల మీద కూడా ‘‘ ప్రభావం ’’ చూపారని వార్తలు. అదేమిటంటే భక్తులు ప్రసాదాల పట్ల ముఖ్యంగా లడ్డుపట్ల అనుమానంగా చూస్తున్నారట. మీడియాలో వచ్చిన వివరాలను బట్టి బయటి సంస్థలు సరఫరా చేసే ప్రసాదాల మీద పూర్తి నిషేధం విధించాలని అయోధ్యలోని రామజన్మ భూమి దేవాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ డిమాండ్‌ చేశారు. తయారీ, పంపిణీలో మార్పులు తేవాలని, ఆలయ పూజారుల పర్యవేక్షణలో తయారు చేయాలని కోరారు. దేవాలయాల్లో వినియోగిస్తున్న నెయ్యి స్వచ్చత పట్ల ఆందోళన వెల్లడిరచారు. నైవేద్యాలలో కల్తీ ద్వారా దేవాలయాలను అపవిత్రం చేయాలన్న అంతర్జాతీయ కుట్ర ఉందని ఆరోపించారు.వాణిజ్య పద్దతిలో తయారు చేసే తీపి పదార్ధాల బదులు పండ్లు, పూల వంటి సహజ వస్తువులతో ప్రసాదాలను తయారు చేయాలని మధుర లోని ధర్మ రక్ష సంఫ్‌ు ప్రకటించింది. సంస్థ జాతీయ అధ్యక్షుడు సౌరవ్‌ గౌర్‌ మాట్లాడుతూ ప్రసాదాల తయారీలో మార్పులు తేవాలని, తిరిగి సాంప్రదాయ పద్దతులకు మరలాలని సంస్థలు, మత నేతలలో ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. సంగం నగరంగా పిలుస్తున్న ప్రయాగ్‌ రాజ్‌ (గతంలో అలహాబాదు) అలోప్‌ శంకరిదేవి, బడే హనుమాన్‌, మంకమేశ్వర వంటి వాటితో సహా అనేక దేవాలయాల్లో భక్తులు తెచ్చే స్వీట్లు తదితర పదార్ధాలను అర్పణలకు అనుమతించకుండా నిషేధించారు. లలితా దేవి ఆలయ ప్రధాన పూజారి శివమూర్తి మిశ్రా మాట్లాడుతూ భక్తులు కేవలం కొబ్బరి కాయలు, పండ్లు, ఎండిన పండ్లు మాత్రమే తేవాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వెల్లడిరచారు.స్వీట్ల స్వచ్చత నిరూపితమయ్యే వరకు వాటిని దేవాలయాల్లో అనుమతించకూడదని లక్నోలోని మంకమేశ్వర దేవాలయ మహంత్‌ శ్రీధరానంద బ్రహ్మచారి జీ మహరాజ్‌ చెప్పారు. వెలుపలి నుంచి భక్తుల ప్రసాదాలు, సీట్లను అనుమతించేది లేదని అలోప్‌ శంకరీదేవి దేవాలయ ప్రధాన పూజారి, శ్రీ పంచాయతీ అఖారా మహానిర్వాణి కార్యదర్శి యమునా పూరీ మహరాజ్‌ ప్రకటించారు. సంగం తీరంలోని బడే హనుమాన్‌ మహంత్‌ బల్బీర్‌ జి మహరాజ్‌ మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణ నిర్మాణం పూర్తయిన తరువాత లడ్డుపేడ ప్రసాదాలను యాజమాన్యమే తయారు చేయనుందన్నారు.పక్కా హిందూత్వవాది యోగి పాలనలోనే పరిస్థితి ఇలా ఉంది.మధ్య ప్రదేశ్‌లోని సేహోర్‌లోని ప్రముఖ వింధ్యవాసినీ బీజాసన్‌ దేవీ దేవాలయ ప్రాంగణంలో స్వయం సహాయక బృందం విక్రయిస్తున్న లడ్డుల విక్రయాన్ని నిలిపివేయాలని ట్రస్టు సభ్యులు జిల్లా కలెక్టకర్‌కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. లడ్లు వాసన వస్తున్నాయని, రుచిలో తేడా ఉందని భక్తులు చెబుతున్నారని ట్రస్ట్‌ చైర్మన్‌ మహేష్‌ ఉపాధ్యాయ చెప్పారు. ఈ దేవాలయం భోపాల్‌కు 70కిలో మీటర్ల దూరంలో ఉంది.అయితే తాను సదరు స్వయం సహాయక బృందంతో మాట్లాడానని సమస్య పరిష్కారమైందని కలెక్టర్‌ చెప్పారు.

మన దేశంలో ప్రసాదాల గురించి భక్తులు అనుమానించటం కొత్తేమీ కాదు. వాటిని సరఫరా చేసే వారు లేదా తయారీకి ఉపయోగించే సరకులు కల్తీ లేదా నాసిరకంగా ఉంటున్నాయని గతంలో అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. నెయ్యి కల్తీ గురించి నాటి కలకత్తాలో వచ్చిన ఆరోపణల గురించి స్పెక్టేటర్‌ అనే పత్రిక 1886 సెప్టెంబరు 25వ తేదీ సంచికలో రాసింది. ఒక చట్టాన్ని చేయాలని భక్తులు కోరినట్లు దానిలో పేర్కొన్నది. నెయ్యిలో పంది, ఆవు కొవ్వు, ఇతర జంతువుల మాంసాలలో ఉన్న కొవ్వు కల్తీ జరుగుతున్నట్లు విశ్లేషణలో పేర్కొన్నది. తరువాత కలకత్తాలో నెయ్యి వ్యాపారం చేసే మార్వాడీలు నెయ్యిలో కల్తీ చేస్తున్న కారణంగా ఒక నాటికి బెంగాలీ జాతే అంతరించి పోతుందంటూ 1917లో ఒక పత్రికలో వచ్చిన వార్త ఆందోళనకు దారితీసింది.దాంతో మార్వాడీ అసోసియేషన్‌ నెయ్యి గోడవున్ల వద్దకు వెళ్లి 67నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా కేవలం ఏడు మాత్రమే స్వచ్చంగా ఉన్నట్లు తేలింది. దాంతో వేలాది మంది కలకత్తా బ్రాహ్మలు హుగ్లీ నది(బెంగాల్లో గంగానది పేరు) తీరాన హోమాలు చేసి కల్తీ నెయ్యి ఆరగించినందుకు ప్రాయచిత్తం, శరీరాలను శుద్ది చేసుకున్నారు. దాంతో మార్వాడీ అసోసియేషన్‌ కల్తీ చేసిన వారిని గుర్తించి వారి వద్దనుంచి జరిమానాల రూపంలో రు.75వేలు వసూలు చేసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనంలో గడ్డి భూములను కొనుగోలు చేసినట్లు ప్రకటించటంతో బ్రాహ్మలు శాంతించారట. అందువలన దేశంలో నెయ్యి కల్తీ వివాదం తిరుపతితోనే ప్రారంభమైందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే వ్యాపారంలాభం ఉంటుందో అక్కడ అవినీతి కూడా తోడుగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. వ్యాపారం చేస్తూ కల్తీ చేసేవారు, వినియోగించేవారు కూడా హిందువులే, ఎక్కడన్నా ఇతర మతాలకు చెందిన వారు కూడా ఉంటే ఉండవచ్చు. నెయ్యి అంటే ఒక్క ఆవు, గేదె(బర్రె) పాలనుంచే కాదు, గొర్రెలు, మేకలు, ఒంటె పాల నుంచి కూడా తయారు చేస్తారు. శాస్త్రీయ పరీక్షలు అందుబాటులో లేని కాలంలో నెయ్యిని చేతిలో వేసుకొని నలపటం, వాసన చూడటం ద్వారా కల్తీ జరిగిందీ లేనిదీ చెప్పేవారటు. శాస్త్రీయ పరీక్షలు వచ్చిన తరువాత కూడా అనుసరించే పద్దతులను బట్టి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల తాజా వివాదంలో ఎన్‌డిడిబి అనుసరించిన పద్దతి గురించి నివేదికలో పేర్కొన్నది, దానితో పాటు ఫలితాల గురించి షరతులు వర్తిస్తాయంటూ కొన్ని సార్లు నివేదికలు తప్పుగా రావచ్చని కూడా చెప్పింది. అందుకే మరొక ప్రయోగశాలలో కూడా పరీక్ష చేయించకుండా చంద్రబాబు నాయుడు తొందరపడి నిర్దారణకు వచ్చి బహిర్గత పరిచారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.ఆ చర్య కోట్లాది మంది భక్తుల మనోభావాల మీద ప్రభావం చూపింది. ఎక్కడ ఎన్ని పరీక్షలు జరిపినా నెయ్యి స్వచ్చత గురించి ఏ లాబ్‌లోనూ ఫలితాలు ఒకే విధంగా ఉండవు అని కూడా చెబుతున్నారు. ఆవులు, గేదెలకు పెట్టే మేతను బట్టి కూడా ఫలితాలు భిన్నంగా ఉంటాయి.


బిజెపి బీఫ్‌ రాజకీయం గురించి తెలిసిందే.2014ఎన్నికల్లో దాని ప్రచార అస్త్రాల్లో అదొకటి.ఆవు, ఎద్దు,దున్నపోతులు, గేదెల మాంసాన్ని బీఫ్‌ అంటారు. దీని ఎగుమతులకు వ్యతిరేకంగా నాటి యుపిఏ ప్రభుత్వం మీద నరేంద్రమోడీ ఉత్తరాదిన ఎన్నికల్లో ప్రచారం చేశారు. చిత్రం ఏమిటంటే అధికారానికి వచ్చిన తరువాత వాటి ఎగుమతులకు అనుమతి ఇచ్చారు. ఏటేటా పెరుగుతున్నట్లు ఎగుమతి గణాంకాలు చెబుతున్నాయి. 2023 వివరాల ప్రకారం బ్రెజిల్‌ తరువాత రెండవ స్థానంలో ఉన్న అమెరికాను పక్కకు నెట్టి మనదేశం ఎగబాకింది.బ్రెజిల్‌ అన్నిరకాల బీఫ్‌ను 30.12 లక్షల టన్నులు, దున్న, గేదె మాంసాన్ని భారత్‌ 14.75లక్షల టన్నులు ఎగుమతి చేసింది. తమ కారణంగా చీమలకు సైతం హాని కలగకూడదంటూ జైన మునులు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తారు. కానీ అనేక మంది ఆ మతానికి చెందిన వారు బీఫ్‌ ఎగుమతిదార్లుగా ఉన్నారు.ఒక సందర్భంలో స్వయంగా నరేంద్రమోడీయే ఆ విషయాన్ని చెప్పారు. మాంస ఎగుమతి ఒక సామాజిక తరగతికి మాత్రమే పరిమితమని చెప్పటం వాస్తవం కాదు, జైన్‌ సామాజిక తరగతికి చెందిన అనేక మంది నా స్నేహితులు ఆ వ్యాపారంలో ఉన్నారు, ఏదో ఒక సామాజిక తరగతికి ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దంటూ మాట్లాడారు. మన పురాణాలు, నమ్మకాల ప్రకారం ప్రతి జంతువు ఏదో ఒక దేవుడితో ముడిపడి ఉంది.గోవధను కొందరు వ్యతిరేకిస్తారు. గోమూత్రం తాగటం పవిత్రంగా భావిస్తారు. దున్నపోతు యుముడి వాహనం, అయినా వాటిని వధించి ఎగుమతులు చేస్తారు. ఎలుక వినాయకుడి వాహనం అంటారు, కానీ అది కనిపిస్తే చంపేయాలని చూస్తారు.(ఇలా చెబుతున్నానంటే నష్టదాయకమైన ఎలుకలను చంపకుండా వదలివేయమని నా ఉద్దేశ్యం కాదు) మొత్తం మీద నెయ్యి కల్తీ గురించి వచ్చే నివేదికలు ఏ ఒక్కటీ ఒకే విధంగా ఉండదని మాత్రం కొందరు నిపుణులు చెబుతున్నారు. అందువలన ముందే చెప్పుకున్నట్లు తిరుపతి లడ్డు కల్తీ వివాదం ఎలా ముగుస్తుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లడ్డు రాజకీయం : సనాతనవాదిగా పవన్‌ కల్యాణ్‌ – కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడినదాంట్లో తప్పేంటి ?

28 Saturday Sep 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, CHANDRABABU, Narendra Modi Failures, Pawan kalyan, Prakash Raj, RSS, Tirupati Laddu Controversy, YS jagan


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది ? మాజీ సిఎం జగన్‌ మోహనరెడ్డిని ఇరుకున పెట్టాలని చూసిన చంద్రబాబు నాయుడు చివరకు తిరుమల పర్యటనను తీవ్ర వివాదాస్పదం గావించి మొత్తం మీద జగన్‌ నెత్తిన పాలుపోశారనే చెప్పాలి. పోలీస్‌ సెక్షన్‌ 30 తదితర ఆంక్షల పేరుతో ఆటంక పరచకుండా అనుమతించి ఉంటే పరమతాలకు చెందిన వారందరి మాదిరే జగన్‌ కూడా ఆలయసంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు రిజిస్టర్‌లో సంతకం చేసేవారా లేదా అనేది తేలిపోయి ఉండేది.చేయకపోతే అభ్యంతరం తెలిపి ఉంటే బంతి జగన్‌ కోర్టులో ఉండేది. అలాంటి అవకాశం లేకుండా వ్యవహరించటంతో జగన్‌ వ్యతిరేకులందరూ ఒక రకంగా నీరుగారిపోయారు. అయితే దీని మీద ఎవరి భాష్యం వారు చెప్పుకుంటున్నారు గనుక జనం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఇకనైనా లడ్డు రాజకీయానికి తెరదించి రాష్ట్ర సమస్యల మీద కేంద్రీకరించాలి.


చంద్రబాబు నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల వెంకటేశ్వరుడి దర్శనాన్ని చేసుకొని ప్రార్ధిస్తానని ప్రకటించిన వైఎస్‌ జగన్‌మోహన రెడ్డిని పరోక్షంగా ప్రభుత్వం అడ్డుకుంది. అంతకు ముందు తెలుగుదేశం, జనసేన, బిజెపి, వారి కనుసన్నలలో పనిచేసే సంస్థలు, వ్యక్తులు స్వామి దర్శనం చేసుకోవాలంటే ఆచారాలను మన్నిస్తూ దేవస్థాన రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందేనని, తలనీలాలు సమర్పించుకోవాల్సిందేనని ప్రకటించాయి. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి పాపానికి పాల్పడ్డారని దానికి ప్రాయచిత్తంగా సెప్టెంబరు 28 తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో పూజలు చేయాలని క్రైస్తవమతావలంబకుడిగా అందరికీ తెలిసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. మరోసారి శుక్రవారం నాడు మీడియా సమావేశంలో కూడా అదే చెప్పారు. తాను నాలుగు గోడల మధ్య బైబిలు చదువుతానని, బయట అన్ని మతాలను పాటిస్తానని, తనది మానవమతమని ఏం కావాలంటే అది రాసుకోవచ్చని కూడా చెప్పారు. తమ ప్రభుత్వం జగన్‌కు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని, తిరుమల పర్యటనను అడ్డుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అన్యమతస్తులెవరైనా ఆలయ రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందే అన్నారు. ఇప్పుడు లడ్డు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తులో తేలేదేమిటి, జరిగిందని చెబుతున్న లడ్డు నెయ్యి కల్తీ ఎప్పటికి నిర్ధారణ అయ్యేను, నిందితులుగా ఎవరిని తేల్చేను, ఏ శిక్షలు పడేను అన్నది భక్తులు నమ్మే ఆ భగవంతుడికే తెలియాలి. లడ్డు పరిణామాలతో అనేక ముఖ్య సమస్యలు జనం అజెండానుంచి మాయమయ్యాయి. ముఖ్యంగా ఇటీవలి వరదల్లో సంభవించిన భారీ నష్టానికి కేంద్రం నుంచి వరదలా సాయం వస్తుందని ఆశలు రేకెత్తించిన వారికి కనీసం మబ్బులు కూడా కనిపించటం లేదు.


తిరుమల దేవుడి మహిమల సంగతి తెలియదు.అఫ్‌ కోర్స్‌ నిజంగా మహిమే ఉంటే తన లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంటే పట్టించుకోకపోవటమేమిటి, దాని పేరుతో రాజకీయం చేస్తుంటే ఉపేక్షించటం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరూ మనోభావాలను గాయపరుచుకోనవసరం లేదు. దేవుడి లడ్డులో కల్తీ నెయ్యి దగ్గర ప్రారంభమైన వివాదం మలుపులు తిరుగుతూ మతం, సనాతన ధర్మ పరిరక్షణ వైపు పయనిస్తోంది. అనేక మంది నిజరూపాలను బహిర్గతం చేస్తోంది. మతం పేరుతో రాజకీయం, ఓటు బాంకులను ఏర్పాటు చేసుకొనే పార్టీల జాబితాలో బిజెపితో పాటు తెలుగుదేశం, జనసేన కూడా పోటీ పడుతోందన్నది తేలిపోయింది. అయితే దేశంలో మతరాజకీయాలు చేసే వారి గురించి జనం కళ్లు తెరుస్తున్న స్థితిలో ఆంధ్రులు అలాంటి తిరోగమన రాజకీయ వలలో పడతారా ? తిరుమల లేదా మరొక మతకేంద్రం కావచ్చు, మతేతరులు వాటిని సందర్శించాలని అనుకున్నపుడు అక్కడి ఆచారాలను గౌరవిస్తున్నట్లు అంగీకరించాలన్న నిబంధనలు, ఆచారాలు ఉన్నాయి. శుక్రవారం నాటి విలేకర్ల సమావేశంలో తాను వాటిని పాటించనని లేదా పాటిస్తానని గానీ జగన్‌ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోసారి తిరుపతి వెళతానని కూడా చెప్పలేదు.


లడ్డు కల్తీ సంగతి విచారణ తరువాత ఏదో ఒకటి తేలుతుంది. కానీ ఈ వివాదం తెచ్చిన సమస్యలు మాత్రం ముందుకూడా కొనసాగుతాయి. భగత్‌ సింగ్‌, చేగువేరా భావజాలం కలవ్యక్తిగా అనేక మంది ఇప్పటివరకు పవన్‌ కల్యాణ్‌ గురించి భావిస్తున్నవారికి భ్రమలు తొలిగిపోయాయి. అఫ్‌కోర్స్‌ వారాహి పూజలను చూసినపుడే చాలా మందికి అర్ధమైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలిచ్చిందని విమర్శించి తిరుమల లడ్డుకు మరోవిధంగా ప్రచారం కల్పించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆ లడ్డూతోనే రాజకీయం ఆడుతున్నారు. అందువలన కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్నట్లుగా ఆ పెద్దమనిషి సనాతన ధర్మం గురించి రెచ్చిపోయి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించలేదు. ఎన్నో పుస్తకాలు చదివినట్లు చెప్పుకున్న మేథావికి సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో జరిగిన దారుణాలు, కలిగించిన హాని అర్ధం కాలేదా లేక పుస్తకాలు చదవటం అన్నది ఒట్టి కబుర్లేనా ? నిజంగా అర్ధమై ఉంటే కనీసం మౌనంగా ఉండేవారు తప్ప దాన్ని పరిరక్షిస్తానంటూ విరుచుకుపడేవారు కాదు. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేసినపుడు ప్రకాష్‌ రాజ్‌ ఎక్కడకు వెళ్లారంటూ పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారని ఒన్‌ ఇండియా అనే వెబ్‌సైట్‌ తన విశ్లేషణకు శీర్షిక పెట్టింది. అక్కడ జరిగిన వాటి గురించి వాస్తవాల కంటే అభూత కల్పనలే ఎక్కువ వచ్చాయి, కాదూ ఒక వేళ నిజమే అనుకుంటే నరేంద్రమోడీ, బిజెపి ఎందుకు పెద్దగా స్పందించలేదో చెప్పగలరా ? చిన్న పాటి విమర్శ, అభ్యంతరాన్ని కూడా బిజెపి, హిందూత్వశక్తులు సహించవు. ఆరునెలలకే వారు వీరవుతారన్నట్లుగా అంతకంటే ఎక్కువ కాలమే బిజెపితో బంధంలో ఉన్నందున అదే జరిగినట్లు కనిపిస్తోంది. అసలు లడ్డు వివాదం గురించి ప్రకాష్‌ రాజ్‌ అన్నదేమిటి ? ‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌, ఇది మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగింది.దయచేసి దర్యాప్తు చేయండి.దోషులను పట్టుకోండి కఠినమైన చర్యలు తీసుకోండి. జాతీయ స్థాయిలో అనవసర భయాలను ఎందుకు వ్యాపింపచేస్తారు,ఎందుకు పెద్దదాన్ని చేస్తారు.మనకు ఇప్పటికే తగినంత మతతత్వం ఉంది(కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు కృతజ్ఞతలు) ’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీని మీద పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ‘‘ నేను ప్రకాష్‌ రాజ్‌ను ఇష్టపడతాను, ఆయన నాకు మంచి స్నేహితుడు, మేము గొప్ప బంధాన్ని పంచుకుంటాము.రాజకీయ అంశాల మీద మేము విబేధించవచ్చు గానీ, ఒక నటుడిగా నేను నిజంగా గౌరవిస్తాను. అయితే ఈ సమస్య మీద వ్యాఖ్యానించే అవసరం ఆయనకు లేదు ’’ అంటూ స్పందించారు. ప్రపంచంలోని వారందరూ స్పందిస్తున్నట్లు అనేక అంశాల మీద నిరంతరం తన భావాలను వెల్లడిరచే ప్రకాష్‌ రాజ్‌ దీని మీద మౌనంగా ఎలా ఉంటారు ? ఎందుకు ఉండాలి ? వద్దని చెప్పటానికి పవన్‌ కల్యాణ్‌ ఎవరు ? ఇదేమీ వ్యక్తిగత వ్యవహారం కాదు.


వన్‌ ఇండియా ఇంటర్వ్యూలో చెప్పినట్లు రాసిన అంశాలను బట్టి చూస్తే మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు విరుచుకుపడినట్లుగా పవన్‌ కల్యాణ్‌ తీరు ఉంది.‘‘ ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలను చూస్తే రాజకీయ అంశాలను ముందుకు తెచ్చినట్లుగా ఉంది.బిజెపిని, ప్రధాని మోడీని చర్చలోకి లాగుతున్నారు. తానొక గొప్ప లౌకికవాదినని ఆయన భావిస్తున్నారు. అతని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలుసు. నా ప్రశ్న ఏమిటంటే బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేస్తుంటే ఆయన ఎక్కడ ఉన్నారు ? దాని మీద మాట్లాడారా ? కానీ అనేక మంది లౌకికవాదులు హిందూ సమాజం మీద వ్యాఖ్యానించటం సులభం కానీ ఇతర మతాల వారి మీద వ్యాఖ్యానించటానికి భయపడతారు. వారికి లౌకిక వాదం అంటే ఒక వైపు మాత్రమే ప్రయాణించే దారి వంటిది, హిందూయిజం వెలుపల ఉన్న సమస్యలను విమర్శించటాన్ని తప్పించుకుంటారు. అందరి పట్ల సమంగా చూడకపోతే లౌకికత్వం అంటే ఏమిటి ? వ్యాఖ్యానించదలచుకున్నవారు అందరినీ ఒకేవిధంగా చూడాలి, దీన్నే సగటు భారతీయుడు వాంఛిస్తున్నాడు. మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించాలి లేకపోతే మౌనంగా ఉండాలి ’’ ఇవన్నీ సంఘపరివారం స్కూల్లో బోధించే తర్కంలోని అంశాలే. ప్రతిదాన్నీ ప్రశ్నిస్తాను, అవసరమైతే తోలువలుస్తా, తాట తీస్తా అని మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ ఇలా మాట్లాడటం అవకాశవాదం తప్ప మరొకటి కాదు. అందుకే ప్రకాష్‌ రాజ్‌ పరోక్షంగా ఒక చురక అంటించారు. ‘‘ గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తరువాత మరో అవతారం, ఏంటీ అవాంతరం … ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ ఒక ఎక్స్‌, ‘‘ చేయని తప్పుకి సారీ చెప్పించుకోవటంలో ఆనందమేమిటో, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ మరో ఎక్స్‌లో స్పందించారు. అంతే కాదు, మరో ఎక్స్‌లో ఇలా పేర్కొన్నారు.‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌ గారూ … మీ ప్రెస్‌ మీట్‌ను నేను చూశాను. నేను చెప్పిందేమిటి, మీరు దానికి వక్రభాష్యం చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి నేను తిరిగి వస్తా, ఈ లోగా నేను ఇంతకు ముందు చేసిన ట్వీట్‌ను పూర్తిగా పరిశీలించండి, అవగాహన చేసుకోండి, ఊరికే అడుగుతున్నా ’’ అని పేర్కొన్నారు. సినిమా హీరో కార్తి ఎప్పుడూ నవ్వుముఖంతో కనిపిస్తాడు. లడ్డు గురించి అడిగితే అదే ముఖంతో అది సున్నితమైన అంశం అని చెప్పటాన్ని కూడా పవన్‌ కల్యాణ్‌ తప్పుపట్టారు.


ఎవరు ఎటు ఉన్నారో, ఎవరి రంగు ఏమిటో జనాలు గ్రహిస్తున్నారు. మాంసం తింటాంగనుక ఎముకలను మెడలో వేసుకు తిరుగుతాం అన్నట్లుగా తాము భారత మితవాదులమని సగర్వంగా చెప్పుకొనే పత్రిక ‘‘ స్వరాజ్య ’’. అది లడ్డు వివాదంపై ఒక విశ్లేషణకు ‘‘ తిరుపతి లడ్డు సమస్య : పవన్‌ కల్యాణ్‌ మీ ముఖంలో కనిపిస్తున్న హిందూయిజానికి ఆంధ్రలో స్వాగతం ’’ అని శీర్షిక పెట్టింది. పార్టీలతో నిమిత్తం లేకుండా మరింత మంది బిజెపి ఏతర పార్టీల నేతలు సనాతన ధర్మం గురించి మాట్లాడాలని తద్వారా హిందువుల ప్రయోజనాలు రక్షించబడతాయని నొక్కి వక్కాణించారు. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ బోర్డు నెలకొల్పాలని పిలుపు ఇచ్చిన తరువాత సినిమా నటులు కార్తీ, ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించారని ప్రశంసలు కురిపించారు. నీవెవరో తెలియలాంటే నీ స్నేహితులను చూస్తే చాలన్నది గత లోకోక్తి ఇప్పుడు నీ బండారం తెలియలాంటే నిన్ను పొగుడుతున్నవారిని చూస్తే చాలు అని చెప్పాల్సి వస్తోంది. పవన్‌ కల్యాణ్‌ గారు చెబుతున్న సనాతన ధర్మం ఈ దేశంలో దాదాపు నలభై కోట్ల మంది దళితులు, గిరిజనులను అంటరానివారిగా వేల సంవత్సరాల పాటు వెలివాడల్లో దూరంగా పెట్టింది. వెనుకబడిన తరగతుల వారినీ పరిమితం కావించింది. మహిళలను అణచివేసింది.శూద్ర కులాలకు చెందిన వారితో సహా అందరినీ విద్యకు దూరం చేసింది. అందుకే అంబేద్కర్‌ ఈ సనాతన వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకంటే ఎక్కువ అధ్యయనం చేసి ఉంటారని అనుకోలేము. సనాతన వాదాన్ని పరిరక్షించాలని కోరుతున్నవారు నిజానికి ఎంత మంది దాని ప్రకారం నడుచుకుంటున్నారు. సనాతన వాదం మారేది కాదంటున్నారు. ఏక పత్నీవ్రతుడైన రాముడిని, బహుపత్నులున్న కృష్ణుడినీ ఒకే రకమైన భక్తితో సనాతనులు సమర్థిస్తున్నారు.వివాహ బంధంతో నిమిత్తం లేకుండా వేరేవారికి పిల్లలను కనటాన్ని కూడా మహాభారతంలో సమర్ధించారు. పెళ్లితో నిమిత్తం లేకుండా ఏళ్లతరబడి సహజీవనం చేసిన వారు, ఏ కారణంగా చెప్పకుండా భార్యలను వదలివేసిన వారూ, సనాతనంతో సంబంధం లేని ఆధునిక చట్టాల ప్రకారం విడాకులు తీసుకొని అనేక వివాహాలు చేసుకుంటున్నవారు కూడా సనాతన పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. అదొక ఫాషనైపోయింది. సనాతనం గురించి మరొకదాని గురించి గతంలోనే అనేక చర్చలు జరిగాయి.ముఖం మీద నామం అడ్డంగా పెట్టుకోవాలా నిలువుగా పెట్టుకోవాలా అంటూ దాడులు చేసుకున్న సనాతనుల గురించి తెలిసిందే. ఇప్పటికీ దాని మీద ఏకీభావం లేదు. ఇప్పుడు అలాంటి వారంతా ఒకటై సనాతనాన్ని విమర్శించేవారి మీద దాడులకు దిగుతున్నారు. గతంలో లోకాయతులను అణచివేశారు. కొత్తగా మతం పుచ్చుకున్నవారు మరీ రెచ్చిపోతున్నారు. సనాతనం మనదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల బాటలో నిలుపలేదు. ఆ తిరోగమనవాదాన్ని పరిరక్షించి దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతున్నవారు తాత్కాలికంగా ఓటు బ్యాంకులను సృష్టించుకోవచ్చు తప్ప దేశానికి చేసే మేలేమీ ఉండదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేవుని బిడ్డ నరేంద్రమోడీకి ఏమిటీ పరిస్థితి : అయోధ్య రాముడు ఓడిరచాడు, కాశీ విశ్వనాధుడు పరువు, ఆర్‌ఎస్‌ఎస్‌ గాలి తీసింది !

07 Saturday Sep 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

Ayodhya Ramalayam, ‘Sent by god’, BJP, God, kashi vishwanath, Mohan Bhagwat, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


‘‘ నా మాతృమూర్తి జీవించి ఉన్నంత వరకు నేను జన్యు నిర్ణాయకంగా(బయలాజికల్లీ) జన్మించినట్లు నమ్ముతుండేవాడిని. ఆమె మరణించిన తరువాత నా అనుభవాలన్నింటి మీద ప్రతిఫలించుతున్నవాటిని చూస్తుంటే దేవుడే నన్ను పంపాడని నిర్ధారణకు వచ్చాను. నా జీవ సంబంధ శరీరం నుంచి అయితే ఈ శక్తి వెలువడి ఉండేది కాదు.నా శక్తి సామర్ద్యాలు, ఉత్తేజం, సదుద్దేశ్యాలను దేవుడు ఒక లక్ష్యం కోసం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. నేను ఒక సాధనాన్ని తప్ప మరొకటి కాదు.అందుకే నేను ఎప్పుడు ఏది చేసినా దేవుడు నన్ను నడిపిస్తున్నాడని నమ్ముతాను ’’ అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. వారణాసి నియోజకవర్గంలో 2024 ఎన్నికలలో నామినేషన్‌ వేసే సందర్భంగా న్యూస్‌ 18 టీవీ ఛానల్‌ విలేకరి అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానం అది. చిత్రం ఏమిటంటే అదే విలేకరి 2019 ఎన్నికల సందర్భంగా ‘‘ మీకు అలసట రాదా ’’ అని ప్రశ్నించినపుడు దేవుడు అలా రాసి పెట్టాడు అని బదులిచ్చారట. అయితే అప్పుడు అంతగా దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు.నిజం చెప్పాలంటే మనకే(జనానికే) అర్ధం కాలేదు గానీ మొదటి నుంచి నరేంద్రమోడీ తన గురించి స్పష్టతతో ఉన్నారు.మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా నూతన పార్లమెంటు భవనంలో చేసిన తొలి ప్రసంగంలో మోడీ చెప్పిన అంశాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ‘‘ అతల్‌ బిహారీ వాజ్‌పాయి హయాంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును పలుసార్లు ప్రవేశ పెట్టారు, కానీ దాన్ని ఆమోదించటానికి తగినంత మెజారిటీ లేక ఆమోదం పొందలేదు. ఆ కల అసంపూర్తిగా ఉంది, దాన్ని పూర్తి చేయటానికే బహుశా దేవుడు నన్ను పంపినట్లున్నాడు ’’ అన్నారు.2024 మేనెల 22న ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభల్లో మరోసారి తన దైవత్వం గురించి ప్రస్తావించారు. ఎవరైతే తనకు ఓటు వేస్తారో వారు పుణ్యం చేసుకున్న మంచి పనులను పందుతారని, తాను చేస్తానని చెప్పుకున్నారు. కోరుకున్న రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు.నరేంద్రమోడీ ఏ రాష్ట్రానికి వెళితే అక్కడ ఆ రూపంలో సాక్షాత్కరించటం బహుశా దానిలో భాగమేనేమో ! తాము అపర భగవత్‌స్వరూపులమని భావించే నలుగురు శంకరాచార్యలు ‘‘ తమ పోటీ భగవంతుడి ’’ ముందు అయోధ్యలో రామ విగ్రహప్రతిష్టలో ఉత్సవిగ్రహాలుగా కనిపించటం ఇష్టంలేక ఆ కార్యక్రమాన్ని బహిష్కరించిన సంగతి తెలిసిందే. మోడీ నిజంగా దైవాంశ సంభూతుడే అయితే కరోనా సమయంలో శవాలు గంగాతీరానికి కుప్పలుగా వస్తుంటే దీపాలు వెలిగించమని, చపట్లు కొట్టాలని, పళ్లాలను మోగించమని ఎందుకు చెప్పినట్లని అనేక మంది ఎద్దేవాచేశారు.దైవాంశ సంభూతులు అలాంటి వాటిని పట్టించుకోరు.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జై భజరంగ భళీ అంటూ ఓటింగ్‌ యంత్రాల మీట నొక్కమని ఓటర్లకు ఉపదేశించిన సంగతి తెలిసిందే. మోడీ మనసులో ఉన్న భావాన్ని గ్రహించి ఒడిషాలో బిజెపి నేత సంబిత్‌ పాత్ర పూరీ జగన్నాధుడు స్వయంగా మోడీ భక్తుడని సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తరువాత నోరు జారానని చెప్పుకున్నప్పటికీ దానిలో చిత్తశుద్ది లేదని జనం భావించారు. మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోయినందుకు మోడీ క్షమాపణలు చెప్పారు. పూరీ జగన్నాధుడే మోడీ భక్తుడంటూ బిజెపి నేత చేసిన వ్యాఖ్యలకు నరేంద్రమోడీ నుంచి క్షమాపణలు కాదు కదా కనీసం విచారం కూడా వెల్లడి కాలేదు, తనకేమీ తెలియనట్లు ఉన్నారు. మోహన్‌ భగవత్‌ పరోక్షంగా మాట్లాడటం రెండోసారి. అంతకు ముందు జూలై నెలలో రaార్కండ్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ‘‘ అభివృద్దికి అంతం లేదు… జనాలు అతీంద్రియశక్తులు (సూపర్‌మాన్‌లు) కావాలని కోరుకుంటారు, కానీ వారు అక్కడితో ఆగరు. తరువాత దేవతగా మారాలని తరువాత దేవుడిగా మారాలని కోరకుంటారు. కానీ తాను విశ్వరూపుడనని భగవంతుడు చెప్పారు. అంతకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నది ఎవరికీ తెలియదు.’’ అన్నారు. ఈ మాటలు నాగపూర్‌ నుంచి పేల్చిన అగ్నిక్షిపణి వంటివని నాడు కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ వర్ణించారు. కానీ ఆ క్షిపణి తుస్సుమన్నది. ఆ తరువాత మోడీ నుంచి కనీసం అలికిడి కూడా లేదు.నాగపూర్‌ పెద్దలకు మోడీ మాటలు నచ్చలేదన్నది స్పష్టం.


తాజాగా 2024 సెప్టెంబరు ఆరవ తేదీన పూనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ‘‘ మనం దేవుడిగా మారతామా లేదా అన్నది జనం నిర్ణయిస్తారు. దేవుడిగా మారామని మనం ప్రకటించుకోకూడదు. మౌనంగా ఉండటానికి బదులు కొంత మంది తాము మెరుపులా మెరవాలని కోరుకుంటారు.కానీ మెరుపుల తరువాత అంతకు ముందు ఉన్నదాని కంటే అంధకారం ఏర్పడుతుంది.అవసరమైనపుడు కార్యకర్తలు కొవ్వొత్తిలా కరగాలి, వెలుగునివ్వాలి ’’ అన్నారు. ఈ మాటలు నరేంద్రమోడీ గాలితీస్తూ అన్నవేతప్ప వేరు కాదు. ఒకనాడు మెరిసిన మోడీ మూడోసారి సంపూర్ణ మెజారిటీ తెచ్చుకోవటంలో విఫలం కావటాన్ని అంధకారం అని వర్ణించినట్లుగా చెప్పవచ్చు. తన పేరుతో ఓట్లు దండుకోచూడటం, తాను పూర్తిగా బిజెపి పక్షాన ఉన్నట్లు చిత్రించటం, వీధుల్లోకి లాగటం పట్ల రాముడికి ఆగ్రహం కలిగి ఉండవచ్చు, అందుకే అయోధ్య(ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం)లో ఓడిరచినట్లు అనేక మంది నిజమైన భక్తులు భావిస్తున్నారు. చివరికి కాశీ విశ్వనాధుడికి కూడా మనోభావాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అందుకే మూడవ సారి రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించాలని చూసిన నరేంద్రమోడీకి గతం కంటే ఓట్లు, మెజారిటీని కూడా తగ్గించి పరువు తీసినట్లు భావిస్తున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గంలో 63.62శాతం(6,74,664) ఓట్లు రాగా సమాజవాదీ పార్టీ అభ్యర్ధిపై 4,79,505 మెజారిటీ తెచ్చుకున్నారు. 2024ఎన్నికల్లో 54.24శాతం(6,12,970) ఒట్లు తెచ్చుకోగా కాంగ్రెస్‌ అభ్యర్ధి మీద కేవలం 1,52,513 మెజారిటీ మాత్రమే తెచ్చుకున్నారు.


తాను దైవాంశ సంభూతుడనని లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ప్రకటించుకున్నదానికి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం వచ్చింది. ఆ విషయం మోహన్‌ భగవత్‌కు అప్పుడు తెలియదని అనుకోలేము. ఫలితాలు వెలువడే వరకు మౌనవ్రతం పాటించారు. తరువాత కూడా పరోక్షంగా విమర్శలు చేయటం తప్ప నేరుగా తప్పని చెప్పే సాహసం చేయలేకపోయారు. అది కూడా లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ సాధించటంలో విఫలమై మిత్ర పక్షాల మీద ఆధారపడాల్సిన స్థితి ఏర్పడి మోడీ బలహీనత లోకానికి వెల్లడైన తరువాతనే చెప్పారు.మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితి గురించి కూడా మోహనభగవత్‌ మరోసారి పూనా సభలో ప్రస్తావించారు(జూన్‌లో తొలిసారి నాగపూర్‌లో నోరు విప్పారు). దీన్లో కూడా చిత్తశుద్ది కనిపించదు. 2023 మే మూడు నుంచి మణిపూర్‌ మండుతున్నది. రాష్ట్రంలో విఫలమైన బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించారు. అయినా గానీ అక్కడ ఎంతో కష్టతరమైన, సవాలు విసురుతున్న పరిస్థితి ఉందని, స్థానికులకు తమ భద్రత మీద విశ్వాసం లేదని, సామాజిక సేవచేయాలని అక్కడకు వెళ్లిన వారికి కూడా పరిస్థితి మరింత సవాలుగా ఉందని మోహన్‌ భగవత్‌ చెప్పారు. ఇన్ని చెప్పిన పెద్దమనిషి తన ఆధీనంలో పనిచేసే ఒక స్వయం సేవకుడిగా మణిపూర్‌ వెళ్లాలని నరేంద్రమోడీని ఆదేశించలేకపోయారు. కనీసం రాజధర్మంగా ప్రధాని మోడీ ఆ రాష్ట్ర పర్యటన జరిపి జనానికి భరోసా కల్పించాలన్న ఉద్బోధ చేయలేకపోయారు. మోడీతో సహా మొత్తం కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ మార్గదర్శనంలో నడుస్తాయన్న బహిరంగ రహస్యం అందరికీ తెలిసిందే.


దేవుళ్లు,దేవతల పట్ల విశ్వాసం, కనిపించిన ప్రతి పుట్టా చెట్టుకు మొక్కే జనాలు పుష్కలంగా ఉన్న మన సమాజంలో చరిత్రలో అనేక మంది తాము దైవాంశ సంభూతులం,కలియుగ దేవతలమని చెప్పుకొన్నారు.ఎంతగా మూఢభక్తి ఉన్నా ఇలాంటి బాపతు చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. ఈ విషయం తెలిసినప్పటికీ ఎంతమేరకు వీలైతే అంతమేరకు సొమ్ము చేసుకోదలచిన వారు ఎప్పటికప్పుడు పుట్టుకు వస్తూనే ఉన్నారు. తనను దేవుడే పంపాడని నరేంద్రమోడీ పదేండ్ల తరువాత అంత బాహాటంగా ఎందుకు చెప్పుకున్నట్లు ? జనం ఎందుకు నమ్మలేదు ? మోడీ ప్రతిష్టను పెంచటానికి 2014కు ముందు, తరువాత కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రశాంత కిషోర్‌ వంటి ‘‘కృత్రిమ గొప్పల తయారీ నిపుణులను’’ కూడా వినియోగించుకున్నారు.ఎక్కడ పర్యటించినా కాషాయ దుస్తులతో గుళ్లు గోపురాలను సందర్శించి మతపరమైన పూజలు పునస్కారాలు, ధ్యానాలు చేశారు. వాటన్నింటినీ టీవీలు పెద్ద ఎత్తున చూపాయి. జనాలను హిందూ ముస్లిం వర్గాలుగా సమీకరించేందుకు చేయాల్సిందంతా చేశారు. తీరా ఇంత చేసినా పదేండ్ల పాలన ఎలాంటి ఫలితాలు ఇవ్వటం లేదని గ్రహించి తానే రంగంలోకి దిగి రామబాణంలాగా దైవాంశసంభూతుడనని చెప్పుకున్నారని చెప్పవచ్చు. రామాయణంలో చివరి అస్త్రంగా పరిగణించే రామబాణం గురించి చదువుకోవటం, సినిమాల్లో చూశాము, కానీ నరేంద్రుడి బాణం ఎదురు తిరగకపోయినా పనిచేయలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తిట్టే నోరు తిరిగే కాళ్లు ఊరికే ఉండవు :‘‘ఎమర్జన్సీ’’ ఇరకాటంలో బిజెపి, రైతులు, కులగణన మీద కంగన నోటి దురుసు !

31 Saturday Aug 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Caste census, Kangana ranaut, Kangana Ranaut’s Emergency ’, Kangana's controversial statement, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కాలం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు ! లోక్‌సభ ఎన్నికలు, అనంతర పరిణామాలను చూస్తున్నపుడు బిజెపి, దాన్ని నమ్ముకున్న వారు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారా ? అంటే, అవును అని చెప్పాల్సి వస్తోంది. నోటి దురుసు సెలబ్రిటీగా పేరు మోసిన నటి కంగనా రనౌత్‌ ఇందిరా గాంధీ పాత్రలో నటించి, దర్శకురాలిగా ఉన్న ‘‘ ఎమర్జన్సీ’’ సినిమా బిజెపికి తలనొప్పిగా మారింది. చరిత్రను వక్రీకరించటమే గాక తమను దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, అది తమపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున ఆ చిత్రంపై నిషేధం విధించాలంటూ దేశవ్యాపితంగా సిక్కులు డిమాండ్‌ చేస్తున్నారు. ఖలిస్తాన్‌ మద్దతుదార్లు కంగనను చంపివేస్తామంటూ బెదిరింపులకు దిగారని వార్తలు.దీంతో 2024సెప్టెంబరు ఆరున విడుదల తేదీని ప్రకటించిన కంగన ఇప్పుడు దానికి సెన్సార్‌ బోర్డు ఆమోదం తెలిపినా కొందరి వత్తిడి కారణంగా ధృవీకరణ పత్రం నిలిపివేశారని చెబుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం, ఆమె ప్రధానిగా ఉన్నపుడు 21నెలల అత్యవసరపరిస్థితి విధింపు తదితర అంశాల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన 2.43నిమిషాల నిడివిగల ట్రైలర్‌ను విడుదల చేయగా 50లక్షల మంది చూశారని, కేవలం 461 మంది మాత్రమే ఇష్టపడినట్లు నమోదైనట్లు ఇండియా టుడే పేర్కొన్నది.ప్రతి ఒక్క ఓటునూ లెక్కించుకుంటున్న బిజెపికి ఇప్పటికే దేశంలో ఉన్న మూడు కోట్ల మంది సిక్కులు వ్యతిరేకంగా ఉన్నారు.ఈ సినిమాతో వారు మరింత దూరమౌతారని, పక్కా వ్యతిరేకులుగా మారతారని ఆ పార్టీ భయపడుతోంది.అక్టోబరులో జరిగే హర్యానా, కాశ్మీరు ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.గతంలో బిజెపి మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్‌ కూడా అదే డిమాండ్‌ చేసింది.ఆ సినిమా ప్రదర్శనను అనుమతించకూడదని తెలంగాణా సిక్కు సామాజిక తరగతి ప్రతినిధులు ముఖ్యమంత్రి ఏ రేవంతరెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు.


బిజెపి ఎంపీ కంగన రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుమోసిన సంగతి తెలిసిందే.రైతుల గురించి నోరుపారవేసుకున్న ఉదంతం సమసి పోక మందే కులగణన గురించి చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బిజెపి చెప్పుకుంది. ఆ పార్టీలో ఇలాంటి వారికి కొదవలేదు. అవి పార్టీ కొంపముంచుతున్నాయి.తమకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక బిజెపి ఎంపి అనంతకుమార్‌ హెగ్డే, ఫైజాబాద్‌(అయోధ్య) ఎంపీ లాలూ సింగ్‌, మరి కొందరు కూడా ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పారు. అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు మోహన్‌ భగవత్‌, మన్మోహన్‌ వైద్య కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన పూర్వరంగం, తాము 50సంవత్సరాల పాటు ఏకధాటిగా అధికారంలో ఉంటామని అమిత్‌ షా చెప్పటం, ఇవన్నీ చూసిన తరువాత రాజ్యాంగాన్ని మార్చివేస్తారన్న అనుమానాలు బలపడ్డాయి. అందుకే బిజెపికి సంపూర్ణమెజారిటీ రాకుండా జనం తీర్పు చెప్పారు. అనంతకుమార్‌కు సీటు ఇవ్వలేదు, లాలూ సింగ్‌ ఓడిపోయారు. తీరా అధికారానికి వచ్చిన రెండు నెలల్లోనే ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా కేంద్రంలో ఐఎఎస్‌ కాడర్‌కు సమానమైన 45 పోస్టులను ప్రయివేటు వారితో భర్తీ చేసేందుకు పూనుకోవటంతో రిజర్వేషన్లకు ఎసరు పెడతారనే ప్రతిపక్షాల మాట నిజమే అని జనం నమ్మటం, అది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని దెబ్బతీస్తుందనే భయంతో వెంటనే నోటిఫికేషన్‌ వెనక్కు తీసుకోవటం తెలిసిందే.వీటన్నింటినీ చూసిన తరువాత బిజెపి నేతలు తమ మనసులోని మాటలను దాచుకోలేకపోతున్నారని కంగన వంటి వారు రుజువు చేస్తున్నారు.


ఆగస్టు చివరి వారంలో దైనిక్‌ భాస్కర్‌ అనే పత్రికతో మాట్లాడిన కంగన 2020`21లో జరిగిన రైతు ఉద్యమం గురించి నోరుపారవేసుకున్నారు. ఆ సందర్భంగా మృతదేహాలు వేలాడాయని,మానభంగాలు జరిగాయని ఆరోపించారు.రైతు ఉద్యమం జరిగిన హర్యానాలో లోక్‌సభ ఎన్నికల్లో పదికి గాను ఐదు సీట్లు పోగొట్టుకున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దూరం కానుందనే భయంతో ఉంది. సరిగ్గా ఈ తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హర్యానా రైతాంగాన్ని మరింతగా రెచ్చగొట్టేవే. పార్టీకి నష్టం కలిగిస్తాయని హర్యానా పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. దాంతో కేంద్ర బిజెపి వెంటనే కంగన మాటలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంది తప్ప కనీసంగా ఆమెను మందలించలేదు. బంగ్లాదేశ్‌లో మాదిరి పరిస్థితిని భారత్‌లో సృష్టించే పథకం ఉందని, రైతుల నిరసనల వెనుక చైనా, అమెరికా హస్తం ఉందని కూడా అంతకు ముందు ఆరోపించారు. పార్టీ విధానాల గురించి ప్రకటనలు చేసేందుకు కంగన రనౌత్‌కు అధికారం లేదా అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్‌లో అలాంటి ప్రకటనలు చేయకూడదని కోరినట్లు బిజెపి ప్రకటించింది. తాను నటించిన ఎమర్జన్సీ సినిమా గురించి ప్రచారం చేసుకొనేందుకు దైనిక భాస్కర్‌ పత్రికతో మాట్లాడినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అందరూ వాటిని ఎక్కడ చదవరో అని లేదా మరింత ప్రచారం కోసం సదరు పత్రిక వార్తను తన ఎక్స్‌ ఖాతాలో ఆగస్టు 25న పోస్టు కూడా చేశారు. ‘‘ బంగ్లాదేశ్‌లో జరిగిందే భారత్‌లో కూడా జరిగే అవకాశం ఉంది.మన అగ్రనాయకత్వం బలంగా లేనపుడు ఇక్కడ(ఢల్లీి శివార్లలో) నిరసనలు తెలిపారు.శవాలు వేలాడాయి, మానభంగాలు జరిగాయి. రైతులకు అనుకూలమైన చట్టాలను వెనక్కు తీసుకున్నపుడు దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది.కానీ ఆ రైతులు ఆ తరువాత కూడా ధర్నాలో కూర్చున్నారు….ప్రభుత్వం చట్టాలను వెనక్కు తీసుకుంటుందని వారెన్నడూ ఊహించలేదు.బంగ్లాదేశ్‌లో జరిగిన మాదిరి పెద్ద పథకంతో వారు వచ్చారు. ఈ పధకాలు రైతులవని మీరు అనుకుంటున్నారా ? కాదు, చైనా, అమెరికా వంటి మనదేశంలో పని చేస్తున్న విదేశీ శక్తులది ’’ అన్నారు.లోక్‌సభ ఎన్నికలపుడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను బిజెపి తరఫున గ్రామాల్లో ప్రచారానికి అక్కడి రైతులు రానివ్వని ఉదంతాలను చూసిన బిజెపి నేతలు కంగన మాటలతో తమపని అయిపోయినట్లే అని భావించారు. నష్ట నివారణ చర్య తీసుకున్నప్పటికీ కంగన మాటలు రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారటం అనివార్యం.ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ హిమచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఒక తీర్మానం కూడా చేసింది.రెండవ సారి శంభు సరిహద్దులో ఆందోళన ప్రారంభించి రెండవందల రోజుల సందర్భం జరిగే నిరసనకు రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ రానున్నట్లు వార్తలు.


తిట్టే నోరు తిరిగే కాళ్లు ఊరికే ఉండవు అంటారు కదా ! రైతులపై నోరుపారవేసుకున్న కంగన మాటలు ఇంకా చెవుల్లో గింగురు మంటుండగా తగ్గేదేలే అంటూ కుల గణన జరగదు అని మరొక ప్రకటన వదిలారు. వెంటనే అది మా వైఖరి కాదు అంటూ దానికి కూడా బిజెపి జనానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది.న్యూస్‌ 24 అనే టీవీతో మాట్లాడుతూ కుల గణన తప్పకుండా చేయాలా అన్న ప్రశ్నకు అవసరమే లేదు అంటూ కంగన చెప్పేశారు. కుల గణన మీద యోగి ఆదిత్యనాథ్‌ వైఖరే తనదని, అందరం కలసి ఉంటేనే మంచిదని, విడిపోతే నాశనం అవుతామన్నారు.‘‘ కులగణన జరపకూడదు.నటుల కులమేమిటో మనకు తెలియదు.ఎవరికీ ఏమీ తెలియదు.నా చుట్టూ ఉన్నవారు కులం గురించి పట్టించుకోరు. దాన్ని ఎందుకు ఇప్పుడు తేల్చాలి.గతంలో మనం చేయలేదు, ఇప్పుడూ అవసరం లేదు.కేవలం పేదలు, రైతులు, మహిళలు అనే మూడు కులాలు మాత్రమే ఉన్నాయి, నాలుగో కులం ఉండకూడదు’’ అన్నారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు కావాలంటే రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చు తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టదని, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బిజెపి నేతలు పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ముందు మరోసారి ఎన్‌డిఏ కూటమిలో చేరిన జెడియు నితీష్‌ కుమార్‌ బీహార్‌లో కులగణన చేశారు.అనేక రాష్ట్రాలలో అలాంటి డిమాండ్‌ ముందుకు వచ్చింది.కేంద్రమే జనాభా లెక్కలతో పాటు జరపాలని ప్రతిపక్ష పార్టీలు కోరాయి. ఎన్నికలో బిజెపికి సంపూర్ణ మెజారిటీ రాలేదు, మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది.దాంతో వాటి వత్తిడికి లొంగిపోయింది.కంగన ప్రకటన మరోసారి బిజెపిని ఇరుకున పెట్టింది.‘‘ అవసరం తలెత్తితే తాము కులగణన చేస్తామని హోంమంత్రి చెప్పారని,కనుక కంగన చెప్పిన మాటలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవు’’ అని బిజెపి జాతీయ ప్రతినిధి గురు ప్రకాష్‌ పాశ్వాన్‌ ప్రకటించాల్సి వచ్చింది.అయితే ఇంతవరకు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


తోటకూర నాడే మందలించి ఉంటే అనే సామెత తెలిసిందే.గతంలో కంగన రనౌత్‌ చేసిన అనేక వివాదాస్పద ప్రకటనలు, ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగినపుడు బిజెపి నోరు మెదపలేదు.దాడి జరపటాన్ని ఆస్వాదించింది.పరిస్థితి మారిన తరువాత ఇప్పుడు ప్రతి మాటా పార్టీకి ఎదురు తిరుగుతోంది.ఆమె ఎక్కడా తగ్గటం లేదు. తన సినిమా గురించి ప్రచారం చేసుకుంటూ చౌకబారు,తెలివి తక్కువ ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఉచిత ప్రచారం పొందాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో చెప్పారు.స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. అదే విధంగా కత్రినా కైఫ్‌ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్‌ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చాయ్‌వాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు. సుభాస్‌ చంద్రబోస్‌ను భారత ప్రధమ ప్రధాని అని చెప్పటమే కాదు, ఆయన అజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని ఏర్పరచిన కారణంగా బోసే ప్రధమ ప్రధాని అని సమర్ధించుకున్నారు.తనను విమర్శించిన వారికి రెండు రకాల మెదడు కణాలు ఉంటాయని వారికి ఇది అర్ధం కాదని కూడా ఎదురుదాడి చేశారు.రామనాధ్‌ కోవింద్‌ను కోవిడ్‌గా పలకటమేగాక, ప్రధమ దళిత రాష్ట్రపతిగా వర్ణించి తరువాత నాలుక కరుచుకున్నారు. అలాంటి కంగన సినిమా ఎమర్జన్సీ గురించి సెన్సార్‌బోర్డు ఏం చేస్తుందో, బిజెపి ఏం చెబుతుందో వాటి మీద స్పందనలు ఎలా ఉంటాయో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి-పెరిగిన ఉద్రిక్తతలు !

28 Wednesday Aug 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, USA, WAR, Women

≈ Leave a comment

Tags

Hamas, Hezbollah, iran, israel attack lebanon, Joe Biden, Netanyahu


ఎం కోటేశ్వర రావు


మధ్య ప్రాచ్యుంలో ఏం జరుగుతోంది ? ఏ క్షణంలోనైనా ప్రాంతీయ యుద్ధం జరగనుందా ? ఇప్పటికే సూయజ్‌ కాలువ గుండా జరుగుతున్న రవాణాకు ఆటంకం కలుగుతూ పడుతున్న ఇబ్బందులు మరింతగా పెరుగుతాయా ? గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసినపుడు సామాన్యులకు తలెత్తుతున్న సందేహాలివి. హమస్‌ సాయుధులను అణచివేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఇజ్రాయెల్‌ అక్టోబరు ఏడు నుంచి ఇంతవరకు ఆ పనిచేయలేకపోయింది. కుట్రలు, దొంగదెబ్బలతో విదేశాల్లో హమస్‌ నేతలను హతమారుస్తున్నది. దానికి ప్రతీకారంగానే తాజాగా జరుగుతున్న పరిణామాలు. ఒక సరిహద్దులో ఉన్న లెబనాన్‌లో కేంద్రీకరించిన హిజబుల్లా సాయుధులు తమ మీద దాడి చేసే అవకాశాన్ని పసిగట్టి వంద విమానాలతో వారి 40 స్థావరాల మీద తామే ముందుగా ఆదివారం నాడు దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంది.ఆదివారం నాడు 30 గ్రామాలు, పట్టణాల మీద ఇజ్రాయెల్‌ వంద విమానాలతో దాడి చేసింది.దానికి ప్రతిగా తాము ఇజ్రాయెల్‌లోని 11 మిలిటరీ స్థావరాల మీద 340 రాకెట్లను ప్రయోగించామని హిజబుల్‌ ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధి నసరల్లా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాము బలమైన మిలటరీ అని, తొలి దశను విజయవంతంగా పూర్తి చేశామన్నాడు. దీని అర్ధం రానున్న రోజుల్లో దాడులు జరగవని కాదని విశ్లేషకులు చెబుతున్నారు.మరోవైపు గాజాలో ఇజ్రాయెల్‌ దాడులను మరింత తీవ్రం కావించింది. అల్‌ అక్సా ఆసుపత్రిలో ఉన్న రోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టి, దాని మీద దాడి చేసింది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఐరాస సిబ్బంది పని చేసే అవకాశాలు లేకుడా దాడులు జరుపుతున్నది. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్న ఎమెన్‌లోని హౌతీ సాయుధులు కూడా దాడులకు దిగటంతో ఇజ్రాయెల్‌ మరింతగా మారణకాండ సాగిస్తున్నది.హిజబుల్లా దాడిలో జరిగిన నష్టాన్ని ఇజ్రాయెల్‌ వెల్లడి కాకుండా చూస్తున్నది. ఇరాన్‌ నేరుగా పోరుకు దిగకుండా తన మద్దతుదార్లకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తున్నది. తాము పూర్తి స్థాయి దాడులకు దిగటం లేదని ఇజాయెల్‌ విదేశాంగ మంత్రి కట్జ్‌ ప్రకటించాడు. తమ పౌరులను రక్షించుకోవటానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకున్నాడు. ఇదే సమయంలో హిజబుల్లా కూడా దాడులను కానసాగించటం లేదు. రెండు వైపులా లక్షా 60వేల మందిని అటూ ఇటూ వేరే ప్రాంతాలకు తరలించినట్లు ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు.


ఒక వైపు గాజాలో దాడుల విరమణ గురించి కైరోలో చర్చలు జరుగుతుండగా తమ మీద దాడులు జరపాలని హిజబుల్లా తలపెట్టిందనే సాకుతో ఇజ్రాయెల్‌ దాడులు జరపటం చర్చలను దెబ్బతీయటం తప్ప మరొకటి కాదు. శాంతి చర్చల కారణంగా చాలా రోజులుగా తాము ప్రతీకార దాడికి దిగలేదని అయితే, ఇజ్రాయెల్‌ తెగబడినందున తాము స్పందించామని,ప్రతి దాడి ముగిసిందని హిజబుల్లా ప్రకటించగా ఇజ్రాయెల్‌ సోమవారం నాడు కూడా లెబనాన్‌ మీద దాడులు చేసింది. తమ గడ్డ మీద హమస్‌ నేత హత్యకు ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్‌ మరోసారి హెచ్చరించింది. ప్రస్తుతానికి పూర్తి స్థాయి యుద్దం లేకున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి ఉంది. హిజబుల్లా దాడిలో తాము పెద్దగా నష్టపోలేదని, తమ మిలిటరీ స్థావరాలకు ఎలాంటి హాని జరగలేదని ఇజ్రాయెల్‌ చెప్పుకుంది. గతేడాది అక్టోబరు 8 నుంచి ఇప్పటి వరకు లెబనాన్‌పై అది జరిపిన దాడుల్లో వంద మంది 566 మంది మరణించగా వారిలో సాధారణ పౌరులు 133 మంది, మిగిలిన వారు సాయుధులు మరణించినట్లు అంచనా. హిజబుల్లా దాడుల్లో 23 మంది యూదు సైనికులు, 26 మంది పౌరులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. రెండువైపులా లక్షలాది మంది జనం నివాసాలను వీడాల్సి వచ్చింది. ఇజ్రాయెల్‌ వద్ద అపార ఆయుధ సంపద ఉంది, ఎప్పటికప్పుడు అమెరికా, ఇతర దేశాలు కొత్తగా అందిస్తున్నాయి. అయితే హిజబుల్లా వద్ద అంత పెద్ద మొత్తంలో లేకున్నా ఇజ్రాయెల్‌లోని అన్ని ప్రాంతాల మీద దాడులు చేసేందుకు అవసరమైన రాకెట్లు ఉన్నట్లు అంచనా. లక్షా 20వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటాయని, అక్టోబరు ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వేలు ప్రయోగించినట్లు అంచనా. ఆధునిక డ్రోన్లతో పాటు నిర్ణీత లక్ష్యాలను తాకే క్షిపణులు కూడా ఉన్నాయి. ఒక వేళ యుద్ధమే ప్రబలితే రెండు వైపులా నష్టాలు తీవ్రంగా ఉంటాయి.2006లో జరిగిన నెల రోజుల పోరులో దక్షిణ లెబనాన్‌, రాజధాని దక్షిణ ప్రాంతాలు దెబ్బ తిన్నాయి. రెండు వైపులా ప్రాణ నష్టం జరిగింది. లెబనాన్‌ నాశనం కాగా ఇజ్రాయెల్‌ ఆర్ధికంగా ఎంతో నష్టపోయింది. అప్పటి నుంచి హిజబుల్లాను తుడిచిపెట్టాలని చూస్తున్నా సాధ్యం కావటం లేదు.


గత పది నెలలుగా ఇజ్రాయెల్‌, అమెరికా లక్ష్యాలుగా సిరియా, ఇరాక్‌, ఎమెన్‌లలో ఉన్న సాయుధ గ్రూపులు దాడులు చేస్తున్నాయి. వాటికి ఇరాన్‌ మద్దతు బహిరంగ రహస్యమే.ఒక వేళ ఇరానే ప్రత్యక్షంగా దాడులకు దిగవచ్చనే అంచనాతో ఇటీవల పెద్ద ఎత్తున తమ నౌకా, వైమానిక దళాలను మధ్య ప్రాచ్యానికి అమెరికా తరలించింది. విమానవాహక యుద్ద నౌకలు కూడా వాటిలో ఉన్నాయి. ఇజ్రాయెల్‌ మీద ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే రక్షణ వ్యవస్థలను అమెరికా అందచేసింది.దాన్నే ఇనుప కప్పుగా పిలుస్తున్నారు. లెబనాన్‌తో ఉన్న సరిహద్దులో పరిస్థితి ఇలాగే ఉంటుందనే నమ్మకం లేదని ఇజ్రాjెల్‌ అంటున్నది. ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించిన తమ పౌరులు డిసెంబరు 31వరకు తిరిగి రావద్దని కోరటాన్ని బట్టి అది ఎంతగా భయపడుతున్నదో అర్ధం అవుతోంది.వచ్చే నెలలో పా ఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రకటన చేసింది. గాజాపై తాను జరుపుతున్న దాడులను అప్పటి వరకు విరమించేది లేదన్న సంకేతం కూడా దీనిలో ఉంది. అందువలన రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు తెగబడే అవకాశం ఉంది.
గాజాలో హమస్‌ ఉనికి లేకుండా చేయాలని, తిరిగి అది తలెత్తకుండా ఉండాలంటే సాధారణ పరిస్థితి ఏర్పడిన తరువాత కూడా తమ మిలిటరీని అక్కడ అనుమతించాలని ఇజ్రాయెల్‌ డిమాండ్‌ చేస్తున్నది, దీని అర్ధం హమస్‌ ఆత్మహత్య చేసుకోవాలని అనటమే అని దానికి ఏ మాత్రం అంగీకరించే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు. గాజాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఉన్న ఆరున్నరలక్షల మంది పిల్లలకు పోలియో వాక్సిన్‌ వచ్చినప్పటికీ దాన్ని వేసేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించటం లేదు.ఐరాస సిబ్బందిని కూడా వదల కుండా దాడులు చేస్తున్నది. కాల్పుల విరమణ జరగకుండా వాక్సిన్లు వేసే అవకాశాలు లేవు. గాజాలో తొలిసారిగా పాతిక సంవత్సరాల తరువాత తొలి పోలియో కేసు నమోదైంది.మురుగునీటిని పరీక్షించినపుడు వైరస్‌ ఉన్నట్లు నిర్థారణ అయింది.పిల్లల్లో 95శాతం మందికి వాక్సిన్‌ అవసరమని యూనిసెఫ్‌ ప్రకటించింది.దాడులు ఆగకపోతే వాక్సిన్‌ వేయటం కష్టమని స్పష్టం చేసింది.పారిశుధ్య పరిస్థితి దిగజారటంతో పాటు మంచినీటి సరఫరాకూ ఆటంకం కలుగుతోంది. దీంతో ఇతర వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఆకలి మంటలు, అనాధలుగా రోడ్ల పాలుకావటం సరేసరి.


ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే దౌత్య ఎత్తుగడల పేరుతో అమెరికా ఆడిన నాటకాన్ని యావత్‌ ప్రపంచ ప్రజానీకం గ్రహిస్తున్నది. తాను మధ్యవర్తిని అని చెప్పుకుంటూనే 1990దశకపు ఓస్లో ఒప్పందాల నుంచి నేటి వరకు అనుసరించిన వైఖరి ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. ప్రధాన కారణం ఒక వైపు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తూ భద్రతా మండలిలో దానికి వ్యతిరేకంగా వచ్చిన అన్ని తీరానాలను అడ్డుకోవటమే. పది నెలలుగా గాజా మారణంకాండ సాగుతున్నప్పటికీ దాన్ని ఆపలేకపోయింది. ఇరాన్‌, లెబనాన్లలో హమస్‌ అగ్రనేతల హత్య అమెరికాకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. నవంబరు ఐదున జరిగే ఎన్నికల్లో ప్రతి అంశాన్ని ఉపయోగించుకొని లబ్ది పొందాలని అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. ఏ పరిష్కారం జరిగినా అది తమకు అనుకూలంగా ఉండాలని జోబైడెన్‌ భావిస్తున్నాడు. ఇజ్రాయెల్‌ ఓడిపోయినట్లు లేదా వెనక్కు తగ్గిందనే భావనకు వీలులేకుంలేకుా చూడాలని చూస్తే కుదరటం లేదు. అదే సమయంలో ఎన్నికల రోజు దగ్గపడేలోగా ఏదో ఒక పరిష్కారం కుదిరితే తమ విజయంగా చెప్పుకోవాలని కూడా బైడెన్‌ చూస్తున్నాడు. మధ్య ప్రాచ్య యుద్ధం జరగాలని కోరుకుంటున్న అమెరికా వలలో పడేందుకు ఇరాన్‌ సిద్దంగా లేదు.ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉప్పునిప్పు మాదిరి సంబంధాలున్న స్థితిలో చైనా మధ్యవర్తిత్వంలో సౌదీతో అది సయోధ్య కుదుర్చుకోవటాన్ని అమెరికా ఊహించలేదనే చెప్పాలి. ఒక వైపు తమ మద్దతుతో గాజాలో మారణకాండ సాగుతుండగా మానవత్వం గురించి కబుర్లు చెబుతున్న అమెరికా బండారం మరింతగా బయటపడుతున్నది.


అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ కొద్ది రోజుల క్రితం తమ ప్రతిపాదనను ఇజ్రాయెల్‌ అంగీకరించిందని ప్రకటించాడు. అయితే కొద్ది గంటల్లోనే అలాంటిదేమీ లేదని ప్రధాని నెతన్యాహు ప్రకటించి గాలి తీశాడు. ఒప్పందానికి ప్రధాని సుముఖంగా లేనందున శాంతి చర్చల్లో తమ ప్రతినిధి పాల్గొనే అవకాశం లేదని కూడా ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. దీంతో ఒప్పందాన్ని నెతన్యాహు అడ్డుకుంటున్నట్లు రెండుదేశాల అధికారులు లీకులు వదిలారు.గడచిన పదినెలల్లో ఏడు సార్లు ఆంటోని బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌ పర్యటన జరిపాడు.శాంతి చర్చలకు ఎప్పటి కప్పుడు నెతన్యాహు కొత్త షరతులను జోడిస్తున్నాడు. అమెరికా అతగాడికి వంతపాడుతూ వివాదాన్ని కొనసాగిస్తున్నదని కొందరు విమర్శి స్తున్నారు. మధ్యవర్తిగా ఉంటూ ఇలాంటి పని చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు తాము పోరాటం కొనసాగిస్తూనే శాంతి చర్చలకు కూడా సిద్దమని హమస్‌ ప్రకటించింది.చైనా మధ్యవర్తిత్వంలో పాలస్తీనాలోని అన్ని విముక్తి సంస్థలతో చేతులు కలుపుతామని, పిఎల్‌ఓ ఆధిపత్యాన్ని అంగీకరించి భాగస్వాములమౌతామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లాదేశ్‌లో దాడులు : ప్రముఖ హిందూ నేతల మౌనాన్ని ప్రశ్నిస్తున్న సామాజిక మాధ్యమం ! ఇతర పార్టీల కంటే బిజెపి అదనంగా చేసిందేమిటి ?

15 Thursday Aug 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, Women, Women

≈ Leave a comment

Tags

Awami League, Bangla Hindus, BJP, coup against Sheikh Hasina, Coup In Bangladesh, CPI(M), Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన, ఆమెను దేశం నుంచి వెళ్లగొట్టిన సందర్భంగా జరిపిన హింసాకాండ గురించి, దానిలో భాగంగా అక్కడ మైనారిటీలైన హిందువులపై జరిపిన దాడుల వార్తలతో మనదేశంలో అనేక మంది ఆందోళన వెలిబుచ్చారు. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూసే బాపతు మాదిరి కొందరు ప్రయత్నించారు. ”హిందువుల ఊచకోత, మారణహౌమం ” ఇటీవలి పరిణామాలపై మన మీడియాలో వచ్చిన కొన్ని శీర్షికలివి.ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 2024 ఆగస్టు 13వ తేదీన వెబ్‌ ఎడిషన్‌లో ” బంగ్లాదేశ్‌లో హిందూ జాతి సంహారం : మతహింస క్రూరత్వ వాస్తవం ” అనే పేరుతో ఒక విశ్లేషణ చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన దాడులను మనదేశంలోని అన్ని పార్టీలు బిజెపి మాదిరే ఖండించాయి. ఖండించాల్సిందే, బంగ్లా ప్రభుత్వానికి మన ఆందోళన వెల్లడించాల్సిందే. బంగ్లా హిందువులే కాదు, పాకిస్తాన్‌లో హిందువులు, క్రైస్తవులు, శ్రీలంక హిందువులు, ముస్లిం, క్రైస్తవులు, మయన్మార్‌ రోహింగ్యాలు ఇలా ఏ దేశంలో మైనారిటీలపై దాడులు జరిగినా మానవతా పూర్వక స్పందన ఉండాల్సిందే. బంగ్లా పరిణామాలు, వాటి తీరుతెన్నులను వివరించటం, పోలికలు తేవటం, వాస్తవాలివి అని చెప్పటం అంటే దాడుల తీవ్రతను తక్కువ చేసి చూపటం కాదు. ప్రతి భాషలోనూ తీవ్రతను వెల్లడించే పద ప్రయోగాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో పోలికలు కూడా తెలిసిందే.బంగ్లాదేశ్‌ పరిణామాల సందర్భంగా హిందూత్వనేతలు, సంస్థలు ఒక పోలికను తెచ్చాయి. ఎక్కడో పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులను ఖండిస్తూ ఇక్కడ ప్రదర్శనలు జరుపుతున్నవారు మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్నదాడులకు వ్యతిరేకంగా ఎందుకు ప్రదర్శనలు చేయటం లేదు అని ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో ఊరూపేరూలేని పోస్టులతో రెచ్చగొడుతూ ప్రతికూల మనోభావాలను, ముస్లింల పట్ల విద్వేషాన్ని రేకెత్తించేందుకు చూస్తున్నారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటారు. ఈ ప్రశ్నను అడిగేవారు రెండు రకాలు. మొదటి రకం జనాలు నిజంగా పాలస్తీనా పౌరుల మీదనే కాదు, అసలు మానవత్వం మీద కూడా అభిమానం ఉన్నవారు కాదు. ఎందుకంటే వారు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ఎన్నడూ ప్రశ్నించిన వారు కాదు. రెండవ తరగతి జనాలు మొదటి తరగతి బాపతు ప్రచారానికి లోనై ప్రశ్నించేవారు. వీరిని అర్దం చేసుకోవచ్చు. మొదటి తరగతి వారు ఎన్నడైనా తమ జీవితాల్లో పాలస్తీనా వాసుల మీద జరుగుతున్న దారుణమారణకాండకు నిరసనగా అయ్యోపాపం అని ఏదైనా ప్రదర్శన సంగతి అటుంచండి కనీసం ప్రకటన అయినా చేశారా ? ఎందుకు ఈ పోలిక తెస్తున్నారు, ఇదే కాదు మనదేశంలో జరిగినట్లు చెబుతున్న ఉదంతాలకు కూడా పాలస్తీనా, ఇతర సమస్యలను జోడించి అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. ప్రతిదాన్నీ మత కళ్లద్దాలతో చూస్తే వచ్చే సమస్య ఇది.


మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత అమెరికా, బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాదులు కుట్ర చేసి పాలస్తీనా ప్రాంతంలోకి ఇతర దేశాల నుంచి యూదులను రప్పించారు. స్థానికంగా ఉన్న అరబ్బుల మీద దాడులు చేయించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను చూడాలి. వికీపీడియా సమాచారం ప్రకారం 1920 నుంచి 1948వరకు 20,631మరణాలు సంభవించాయి, ఇంకా లెక్కకు రానివి మరికొన్ని వేలు ఉన్నాయి. వీటిలో అత్యధికులు పాలస్తీనియన్లే.1948లో పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి. ఎవరికి ఏ ప్రాంతమో కేటాయించింది. నాటి నుంచి ఇజ్రాయెల్‌ ఏర్పడింది తప్ప పాలస్తీనా ఎక్కడ ? దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమక్రమంగా ఆక్రమిస్తూ అసలు పాలస్తీనా దేశాన్ని ఇంతవరకు ఉనికిలోకి రాకుండా చేసింది ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా. తమ మాతృభూమి కోసం పోరాడుతున్నవారిని వేల మందిని దురహంకారులైన యూదులు, వారికి మద్దతుగా ఉన్న మిలిటరీ హత్యలు చేస్తున్నది. అప్పటి నుంచి (1948 ) ఇప్పటి వరకు మరణించిన వారు 1,44,963 మంది, వీరిలో అరబ్బులే అత్యధికం. గతేడాది అక్టోబరు ఏడు నుంచే గాజాలో దాదాపు 40వేల మందిని బాంబులు, విమానదాడులతో ఇజ్రాయెల్‌ మిలిటరీ చంపివేసింది, వారిలో 80శాతం మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. ఆసుపత్రులను ధ్వంసం చేసిన కారణంగా, వ్యాధులు ప్రబలి మరోలక్ష మంది మరణించారు. దాడుల్లో లక్ష మందివరకు గాయపడ్డారు. లక్షలాది ఇండ్లను నేలమట్టంగావించారు. ఇరవై మూడు లక్షల మందిని నిర్వాసితులను గావించారు.మారణకాండ, జాతిహననం అంటే ఇది. ఇవి యూదులు-పాలస్తీనీయన్ల మధ్య జరుగుతున్న ఘర్షణలు కావు. ఏకపక్ష దాడులు, ఒక దేశ మిలిటరీ మరొక దేశ పౌరుల మీద జరుపుతున్న మారణకాండ. దీనికీ బంగ్లాదేశ్‌లో జరిగిన దానికి పోలిక పెట్టటాన్ని ఏమనాలి. ప్రపంచమంతా పాలస్తీనియన్లకు సంఘీభావం తెలుపుతున్నది.ఏదైనా సందర్భం వస్తే హమస్‌ జరిపిన హత్యాకాండ సంగతేమిటని బిజెపి పెద్దలు ఎదురుదాడికి దిగుతారు. సాధారణ పౌరులపై వారి డాడిని సమర్థిస్తూ మనదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా చేసిన ప్రకటనను చూపమనండి.దాడులు, ప్రతిదాడులను ఖండిస్తూ 2023 అక్టోబరు ఎనిమిదిన సిపిఐ(ఎం) ఒక ప్రకటన చేసింది. కాంగ్రెస్‌ కూడా హమస్‌దాడులను ఖండించింది. ఇంతవరకు బిజెపి లేదా ఇతర సంఘపరివార్‌ సంస్థలు గానీ గాజా మారణకాండను ఖండించాయా ? పాలస్తీనాకు మనదేశం మద్దతు ఇస్తున్నది, కానీ దానికి సంఘీభావం తెలుపకుండా కేంద్ర ప్రభుత్వం కాశ్మీరులో నిషేధాలు విధించిందని, ఇజ్రాయెల్‌, అమెరికాలను సంతుష్టీకరించిందనే అంశం ఎంత మందికి తెలుసు ?


తమ మీద దాడులు జరిపిన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ ఆగస్టు పది, పదకొండు తేదీలలో ఢాకా నగరంలో హిందువులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు.వారికి భరోసా కల్పించేందుకు తాత్కాలిక ప్రభుత్వ నేతగా ఉన్న మహమ్మద్‌ యూనస్‌ ఢాకేశ్వరి దేవాలయాన్ని సందర్శించాడు. తగినంత భద్రత కల్పించలేకపోయినందుకు క్షమించాలని హౌంమంత్రిత్వశాఖ సలహాదారు(మంత్రితో సమానం) సఖావత్‌ హుసేన్‌ ఆగస్టు12న కోరాడు. ఇలాంటి పరిస్థితి మనదేశంలో అధికారంలో ఉన్న బిజెపి నేతల నుంచి ఎన్నడైనా చూశామా ? బంగ్లాదేశ్‌ హిందువుల సంగతి పట్టదు గానీ పాలస్తీనియన్ల గురించి మాట్లాడతారంటూ బిజెపి, దాని మద్దతుదార్లు ఎదురుదాడి చేస్తున్నారు. అన్ని పార్టీలూ బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడిని ఖండించాయి.మిగతా పార్టీల మాదిరిగానే ఒక ఖండన ప్రకటన చేయటం తప్ప బిజెపి అదనంగా చేసిందేమిటి ? మణిపూర్‌ రాష్ట్రంలో మైనారిటీ మతావలంబకులుగా ఉన్న కుకీ గిరిజనులపై జరిగిన దాడులు, మహిళలపై అత్యాచార ఉదంతాల పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో చర్చ జరిగింది. సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ అని చెప్పుకుంటూ మరోవైపు హిందువుల కోసం బరాబర్‌ మేము ఏమైనా చేస్తాం, పోరాడతాం అని బిజెపి నేతలు చెబుతారు. బంగ్లాపరిణామాలపై కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు కూడా అదే సమయంలో జరిగాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగితే ఒక తీర్మానం, చర్చ పెట్టి ఖండించటానికి, వారికి సానుభూతి తెలిపేందుకు బిజెపికి ఎవరు అడ్డుపడ్డారు ? పదవీ బాధ్యతలు చేపట్టిన మహమ్మద్‌ యూనస్‌కు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు చెబుతూ పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని, హిందువులతో సహా మైనారిటీలందరికీ భద్రత, రక్షణ కల్పించాలని కోరుతూ ఆగస్టు ఎనిమిది రాత్రి ఒక ఎక్స్‌ సందేశం పంపారు.


బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగితే స్పందించరేమిటని సంఘపరివార్‌ శక్తులు అడుగుతున్నాయి. తప్పులేదు. మణిపూర్‌లో గత పదిహేను నెలలుగా స్వంత పౌరుల మధ్య జరుగుతున్న హింసాత్మక ఉదంతాల పట్ల మీ స్పందన, కార్యాచరణ ఏమిటని ఎప్పుడైనా నరేంద్రమోడీని ప్రశ్నించాయా ? మహిళలను నగంగా ఊరేగించారే ! గట్టిగా అడిగితే ఆ ఉదంతాల్లో విదేశీ, చొరబాటుదారుల హస్తం ఉందంటూ తప్పించుకుంటున్నారు. కాసేపు వాదన కోసం ఉన్నదనే అనుకుందాం. సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత, చొరబాటుదార్లను అడ్డుకొని వారి కుట్రలను ఛేదించాల్సిన పని ఎవరిది ? కేంద్ర పెద్దలదే కదా ! ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారు. ఆ బాధ్యత ఢిల్లీ పెద్ద ఇంజనుదైతే రాష్ట్రంలో పౌరుల మాన ప్రాణాలను రక్షించాల్సిన కర్తవ్యం చిన్న ఇంజనుది కాదా ? అదేమి చేస్తున్నట్లు ? ప్రభుత్వ సమాచారం ప్రకారం 2024 మే మూడవ తేదీ నాటికి ఏడాది కాలంలో జరిగిన ఘర్షణలు, దాడుల్లో క్రైస్తవ గిరిజనులు గానీ, హిందూ మెయితీలుగానీ 221 మంది మరణించారు.మరో 32 మంది జాడ తెలియటం లేదు.వెయ్యి మంది గాయపడ్డారు. 4,786 ఇండ్లను దగ్దం చేశారు.దేవాలయాలు, చర్చ్‌లు 386 ధ్వంసమయ్యాయి. అరవై వేల మంది నెలవులు తప్పారు. వారికి ఓదార్పుగా ఇంతవరకు ప్రధాని మోడీ ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. ఇంత జరుగుతుంటే బిజెపి శ్రేణులు, వారికి మద్దతు ఇచ్చే వారు గానీ మణిపూర్‌ దారుణాలకు నిరసనగా లేదా కనీసం శాంతిని కోరుతూ ఎన్నడైనా ప్రదర్శనలు చేశారా ? ఎందుకు చేయలేదు ? మతకోణంలో చూసినా మణిపూర్‌ మెయితీలు హిందువులు , ఇంతకాలం వారిని ఓట్లకోసం ఉపయోగించుకున్నారా లేదా ? బిజెపి బండారం బయట పడింది గనుకనే మెయితీలు, గిరిజనులు ఇద్దరూ బిజెపిని లోక్‌సభ ఎన్నికల్లో ఉన్న రెండు సీట్లలో ఓడించారు. అందుకే బంగ్లాదేశ్‌ హిందువుల గురించి కారుస్తున్న కన్నీళ్లు నిజమైనవి కాదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకోసం గ్లిజరీన్‌ సరకు అని ఎవరైనా అంటే తప్పేముంది.


సామాజిక మాధ్యమంలో వచ్చిన అనేక అంశాలలో సంధించిన ఒక ప్రశ్న దిగువ విధంగా ఉంది.” అత్యంత పలుకుబడి కలిగిన హిందువులు బంగ్లాదేశ్‌ గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు ” అన్నది దాని శీర్షిక. ” బంగ్లాదేశ్‌లో ఏమీ జరగటం లేదన్నట్లుగా ప్రఖ్యాతి గాంచిన వారిలో ఎక్కువ మంది ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు తెలియటం లేదు.జై శంకర్‌ నుంచి వచ్చిన ఒకటి తప్ప భారత ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. మన ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మౌనంగా ఉన్నారు, మంత్రులందరూ, ఇతర రాజకీయనేతలు గమ్మున ఉన్నారు. చివరికి జై శంకర్‌ ప్రకటనలో కూడా ”మైనారిటీ” అనే పదాన్ని ఉపయోగించారు తప్ప ”హిందువులు ” అనలేదు. వారే కాదు ఒక అధికారి, ఒక న్యాయమూర్తి, ”ప్రముఖ ” టీచర్‌, ప్రముఖులు, ఒక పారిశ్రామికవేత్త ఎవ్వరూ హిందువుల కోసం నోరు తెరవ లేదు. కొంత మంది యూట్యూబర్లు మాత్రమే గళమెత్తారు. అయితే అది చాలదు.వీరంతా హిందువులే అయినా అందరూ ఇంకా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష పార్టీల మౌనం గురిచి నేను మాట్లాడదలచుకోలేదు.ఎందుకంటే వారికి ఇప్పుడు అవకాశం లేదు. రాహుల్‌, అఖిలేష్‌,మమత, ఉద్దావ్‌ లేదా ఇతర రాజకీయనేతలు గళం విప్పుతారని నేను ఆశించను. కానీ బిజెపి ఎందుకు మౌనంగా ఉంది. మన హిందూ సోదరులు బాధలు పడుతుంటే మనమంతా మొద్దుబారిపోయామా ? ” (రెడిట్‌ డాట్‌కాం) బిజెపి మొద్దుబారలేదు, ఇలాంటి అవకాశాలు ఎప్పుడు వస్తాయా ? ఎలా సొమ్ముచేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది, చురుకుగా వ్యవహరిస్తుంది అన్న విషయం పై ప్రశ్న వేసిన వారికి తెలియదేమో !


ఇండియా టుడే పత్రిక 2024 ఆగస్టు 13న ఒక విశ్లేషణ ప్రచురించింది. షేక్‌ హసీనా ప్రభుత్వ పతనం తరువాత తలెత్తిన అరాచకంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఐదు హత్యలతో సహా రెండు వందలకు పైగా ప్రాంతాలలో దాడులు జరిగాయి. విడిగా దాడులను చూస్తే కొన్ని వందలు ఉంటాయి. అత్యాచార ఉదంతాలు కూడా జరిగాయి.దాడుల వీడియోలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తాయి. వాస్తవాల నిర్ధారకులు వాటిని ప్రశ్నించారు.బాధితుల్లో రాజకీయాలతో నిమిత్తం ఉన్నవారితో పాటు లేని వారు కూడా ఉన్నారు. ఆగస్టు ఐదు నుంచి మూడు రోజుల్లో 205ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇండ్లు, దుకాణాలపై ఎక్కువగా ఉన్నాయి, కావాలని లూటీలు, దహనాలు చేశారు.రాజకీయాల నుంచి మతాన్ని విడదీసి చూడాల్సిన అవసరం ఉంది, నిజమైన విచారణ వాస్తవాలను వెల్లడించుతుంది. సమగ్రమైన విచారణ జరపకుండా ఫలానా సంస్థ లేదా పార్టీ దీని వెనుక ఉందనే నిర్ధారణలకు రాలేము. ఇదీ ఇండియా టుడే పేర్కొన్న అంశాల సారం. మతపరమైన దాడులు ఎన్ని, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయనే అంకెలు తీవ్రతను వెల్లడిస్తాయి తప్ప ఒక్క ఉదంతమైనా తీరని నష్టం, తీవ్రంగా ఖండించాల్సిందే. అన్ని దేశాల్లో మతం, భాషా మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను బంగ్లాదేశ్‌లో మైనారిటీలు కూడా ఎదుర్కొంటున్నారు.


మన దేశంలో బిజెపి దానికి ముందు ఉన్న జనసంఘం, ఈ రెండు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి కారణంగా మైనారిటీలు దూరంగా లేదా వ్యతిరేకంగా ఉన్నారు, వారి హక్కులు, భద్రత గురించి పట్టించుకుంటున్నకారణంగా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారు.దాన్ని ముస్లిం సంతుష్టీకరణగా బిజెపి ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులు అత్యధికులు అక్కడి నేషనల్‌ అవామీలీగ్‌ పార్టీ మద్దతుదార్లుగా ఉన్నారు. ఆ పార్టీ మద్దతుదార్లలో నాలుగోవంతు వారే అని చెబుతున్నారు, అంటే అవామీలీగ్‌ను కూడా హిందువులను సంతుష్టీకరించే పార్టీగా బిజెపి చిత్రిస్తుందా ? అవామీ లీగ్‌పై దాడులు, అరాచకం చెలరేగినపుడల్లా ఆ పార్టీలో ఉన్న హిందువుల మీద కూడా జరుగుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేనివారి మీద కూడా జరిగిన దాడులను చూస్తే ముస్లిం మతోన్మాదశక్తులు ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారన్నది స్పష్టం. ఇంట్లో ఆవు మాంసం ఉంది, గోవులను వధిస్తున్నారంటూ గోరక్షకుల ముసుగులో ఉన్న మతోన్మాదులు మనదేశంలో సామూహిక దాడులకు, హత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తిమ్మినిబమ్మినిగా చూపే వీడియోలు, వాట్సాప్‌ సమాచారం మనదేశంలో కుప్పలు తెప్పలుగా సృష్టిస్తూ బుర్రలు ఖరాబు చేసే పార్టీలు, సంస్థల గురించి తెలిసిందే.బంగ్లాదేశ్‌ కూడా దీనికి మినహాయింపు కాదు. అక్కడ జరగని ఉదంతాలను జరిగినట్లు ప్రచారం చేయటంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాటిలో కొన్నింటిని మన దేశంలోనే తయారు చేస్తున్నారట, అవాంఛనీయ శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం వైరల్‌ చేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలించిన నిజ నిర్ధారకులు వాస్తవాలు కాదని తేల్చారు. దీని అర్ధం అసలు దాడులే జరగలేదు, హిందువులను నష్టపరచలేదని కానేకాదు.


మనదేశంలో ఉన్న కొన్ని సంస్థలకు చెందిన నిజ నిర్ధారకులు గతంలో అనేక తప్పుడు ప్రచారాల నిగ్గుతేల్చారు.వారికి రాజకీయ అనుబంధాలను అంటగడుతూ కాషాయ మరుగుజ్జుదళాలు జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూశాయి.మన దూరదర్శన్‌ మాదిరి జర్మనీ ప్రభుత్వ మీడియా సంస్థ డ్వట్చ్‌ విలా. దీన్ని పొట్టి రూపంలో డిడబ్ల్యు అని కూడా పిలుస్తారు. దానికి కూడా దురుద్ధేశ్యాలను ఆపాదిస్తే ఎవరూ చేసేదేమీ లేదు. వైరల్‌ కావించిన అంశాలను లక్షలాది మంది చూశారు, ఇతరులతో పంచుకున్నారు. వీటిలో బంగ్లాదేశ్‌ హిందూ క్రెకెటర్‌ లిటన్‌ దాస్‌ ఇంటిని తగుల పెట్టారు అన్నది ఒకటి. దుండగులు జరిపిన దాడుల్లో దహనం చేసిన ఆ ఇల్లు మాజీ క్రికెటర్‌ మష్రఫీ మోర్తజాది తప్ప లిటన్‌దాస్‌ది కాదు అని తేలింది. ఫొటో లిటన్‌దాస్‌ది,ఇల్లు అతనిది కాదు.మోర్తజా రాజకీయంగా హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ కార్యకలాపాల్లో పాల్గొనటం, ఇటీవలి ఎన్నికలు, అంతకు ముందు కూడా ఆ పార్టీ ఎంపీగా గెలవటం అతని ఇంటిని తగులబెట్టటానికి కారణంగా తేలింది. హిందూ మహిళలపై అత్యాచారాలు, వేధింపులు అంటూ మరోరెండు ఉదంతాలను వైరల్‌ చేశారు. అవి తాజా సంఘటనలు కాదు, వాటిని కూడా అసందర్భంగా జత చేసినట్లు తేలింది.. హిందూ మహిళ లోదుస్తులను ప్రదర్శిస్తున్న ముస్లిం పురుషుల దృశ్యాలను పోస్టు చేస్తూ హిందు బాలికల బ్రాలను తొలగించారని అత్యాచారం చేసిన తరువాత వాటిని ప్రదర్శించి తమ మగతనాన్ని ప్రదర్శించుకున్నారని వ్యాఖ్యానాలు జోడించారు.నిజానికి ఆ వీడియో దృశ్యం,దానిలో కనిపించిన దుస్తులు మాజీ ప్రధాని షేక్‌ హసీనా దేశం వదలి వెళ్లిన తరువాత ఆమె నివాసంలో ప్రవేశించిన వారు చేసిన అరాచకంలో భాగం, అవి మీడియాలో ప్రచురించిన, టీవీలలో చూపించినవిగా తేలింది. అత్యాచారానికి గురైన హిందూ మహిళంటూ వైరల్‌ ఆయిన ఫొటోల బండారాన్ని కూడా జర్మన్‌ టీవీ బయటపెట్టింది. వాటిలో ఒక చిత్రంలో ఉన్న మహిళ 2023లో మణిపూర్‌లో హిందూ పురుషులు అపహరించి, సామూహిక అత్యాచారం చేసిన ఒక క్రైస్తవ యువతిగా తేలింది. మరొక చిత్రం 2021లో ఇండోనేషియాలో వైరల్‌ అయింది. ఐదుగురు బంగ్లాదేశీయులు ఇండోనేషియా వలస మహిళను చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసినట్లు దానిలో పేర్కొన్నారు. దాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలపై అత్యాచారంగా చిత్రించారు. మరొక వీడియో అత్యాచారం చేసినట్లుగా వైరల్‌ అయింది. అది బెంగలూర్‌ రామ్మూర్తినగర్‌లో 2021వ సంవత్సరం మే నెలలో జరిగిన అత్యాచార ఉదంతంలో ముగ్గురు మహిళలతో సహా పన్నెండు మంది బంగ్లా జాతీయులను అరెస్టు చేసిన వీడియోగా మన దేశానికి చెందిన వెబ్‌సైట్‌ బూమ్‌ తేల్చింది. ఇలా సామాజిక మాధ్యమంలో తిప్పుతున్న వీడియో, ఫొటోలను గుడ్డిగా నమ్మించి భావోద్రేకాలను రెచ్చగొట్టేందుకు పనిగట్టుకు చేస్తున్నవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు వాదనలపై హేతుబద్దంగా ఆలోచించాలి. ఎవరు దాడులకు పాల్పడినా ఖండించాలి, నిరసించాలి. దానికి సరిహద్దులు ఎల్లలూ ఉండనవసరం లేదు. మతం కళ్లద్దాలు తొలగించి మానవత్వ అద్దాలను పెట్టుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లాదేశ్‌లో హసీనా పతనానికి ముందు ఏం జరిగింది : అమెరికా మానసపుత్రుడు మహమ్మద్‌ యూనిస్‌ !

09 Friday Aug 2024

Posted by raomk in Asia, Communalism, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, RELIGION, USA

≈ Leave a comment

Tags

cia, coup against Sheikh Hasina, Hillary Clinton, Muhammad Yunus, Narendra Modi, Sheikh Hasina, Sheikh Hasina's ouster



ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌లో జరిగిన అనూహ్య పరిణామాల పూర్వరంగలో మైక్రో ఫైనాన్స్‌ ద్వారా ప్రపంచ వ్యాపితంగా గుర్తింపు పొందిన నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనిస్‌(84)ను అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ప్రభుత్వ సారధిగా నియమించింది. గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఎంతకాలం ఈ ఏర్పాటు అమల్లో ఉంటుంది ? ఎప్పుడు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తారు ? ఎన్నికల నిర్వహణకు ”తగిన పరిస్థితులు” లేవని తాత్కాలిక ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. మరోవైపున మనదేశంలో ఆశ్రయం పొందిన మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఇక్కడే ఉండేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరిస్తుందా ? లేకపోతే ఆమె ఎక్కడకు వెళతారు ? ఇలాంటి అంశాల మీద కూడా ఇది రాసిన సమయానికి స్పష్టత లేదు. ఎవరీ యూనస్‌ అనే శోధన అంతర్జాలంలో జరుగుతున్నక్రమంలో సూదికోసం సోదికి పోతే పాత బాగోతాలన్నీ బయట పడినట్లుగా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ నాటి పరిణామాల పూర్వరంగంలో వెలువడిన వార్తలు, విశ్లేషణలు, బయటపడిన అంశాలే. అవన్నీ కూడా అతగాడు అమెరికా మనిషి అని చూపుతున్నాయి. తోలుమ్మలాటలో తెర వెనుక ఉన్నవారు బొమ్మలను ఎలా ఆడించేదీ, వాటిపేరిట పలికే మాటలూ తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అదే క్రీడకు తెరలేచినట్లు చెప్పవచ్చు.


ఈ పెద్ద మనిషి గతంలోనే రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నట్లు , ప్రధాని పదవికోసం ప్రయత్నించినట్లు వెల్లడైంది. 2007 ఫిబ్రవరి 13న కొల్‌కతాలోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ తమ ప్రభుత్వానికి పంపిన ఒక వర్తమానం వికీలీక్స్‌ వెల్లడించిన పత్రాల్లో ఉంది. దానిలో ఉన్న సమాచార సారం ఇలా ఉంది. యూనస్‌ రాజకీయాల్లోకి రావాలని దానికి గాను తన పథకాల గురించి అమెరికా అధికారికి వెల్లడించాడు. రాజకీయాల్లోకి వస్తే తలెత్తే ముప్పు గురించి కూడా చెప్పాడు. అక్కడ అంతర్యుద్ధం చెలరేగ కుండా ఉండేందుకు మిలిటరీ మద్దతు ఉన్న తాత్కాలిక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించటాన్ని సమర్ధించాడు. దేశంలో అవినీతి, హింసాకాండ నుంచి కాపాడేందుకు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని ఫిబ్రవరి 11న ఒక బహిరంగ లేఖ రాశాడు.(పరిస్థితి తనకు అనుకూలంగా లేదని గ్రహించి రెండు నెలల తరువాత సదరు ఆలోచన విరమించుకున్నాడు) హసీనా-ఖలీదా జియా మధ్య అధికార క్రీడలో నలుగుతున్న ప్రజాస్వామ్య క్రమంలో గొప్ప నైతిక వ్యక్తిత్వం మరియు బలమైన సంస్థాగత నైపుణ్యాలు ఉన్న యూనస్‌ అభ్యర్థిత్వం ప్రత్యామ్నాయాన్ని చూపగలదు అని అమెరికా అధికారి తమ ప్రభుత్వానికి నివేదించాడు. ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం ఆ లేఖను ధృవీకరించి స్వదేశానికి పంపింది.


ఇన్నేండ్ల తరువాత యూనస్‌ను గద్దె నెక్కించటానికి అమెరికాకు అవకాశం దొరికింది. అతని మీద వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపితమని అతను కొట్టిపారవేశాడు.మైక్రో ఫైనాన్స్‌ పేరుతో పేదల రక్తం తాగే మనిషి అని ఒక సందర్భంగా షేక్‌ హసీనా వర్ణించింది.ఇతగాడు అమెరికా మానసపుత్రుడు.ప్రతి దేశంలో తనకు అవసరమైన వారికోసం అమెరికా సిఐఏ గాలం వేస్తుంది.ఒకసారి చిక్కిన తరువాత తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. వర్ధమాన దేశాల వారిని ఆకర్షించేందుకు వేసే ఎరల్లో విద్య, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే పేరుతో అమెరికా ప్రభుత్వం ఎన్నో ఎత్తులు వేసింది, వాటిలో ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌షిప్‌ ఒకటి.యూనస్‌ను దానికి ఎంపిక చేశారు.సిఐఏ నేరుగా ఎంపిక చేయదు గాని ఎంపిక తరువాత అది రంగ ప్రవేశం చేస్తుంది.ఈ స్కాలర్‌ షిప్‌ను 1965లో యూనస్‌ పొందాడు. అర్ధశాస్త్రంలో పిహెచ్‌డి కూడా అమెరికాలోనే చేశాడు.1983లో గ్రామీణ బ్యాంకును ప్రారంభించి మైక్రోఫైనాన్స్‌ ద్వారా దారిద్య్రాన్ని తొలగించవచ్చనే చిట్కాను ముందుకు తెచ్చాడు. దానికి గాను 2006లో మరొకరితో కలసి నోబెల్‌ బహుమతి పొందాడు. ఆ బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్‌క్లింటన్‌ లాబీయింగ్‌ చేశాడు.మైక్రోఫైనాన్స్‌ పధకాన్ని అమలు చేసిన బంగ్లాదేశ్‌లో పేదరికం గణనీయంగానే ఉంది. ఇప్పుడు రోజుకు 6.85డాలర్ల దారిద్య్రరేఖలో(ప్రపంచబాంక్‌ 2022) 74.1శాతం మంది ఉన్నారు. (అఫ్‌ కోర్స్‌ మనదేశంలో కూడా మైక్రోఫైనాన్స్‌ తారక మంత్రంగా చంద్రబాబు నాయుడు వంటి వారు ఊదరగొట్టారు, అమలు చేశారు.ప్రైవేటు కంపెనీలు జనాల రక్తాన్ని పీల్చాయి, అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటంతో తరువాత సదరు కంపెనీలన్నీ జెండా ఎత్తేశాయి.) అయితే పైన చెప్పుకున్న అదే ప్రమాణం ప్రకారం భారత్‌లో 81.8శాతం ఉన్నారు.పాకిస్తాన్‌లో 84శాతంపైగా ఉన్నారు గనుక బిజెపి వారు తరచూ దానితో పోల్చి చూడండి మా మోడీ ఘనత అంటారన్నది తెలిసిందే.పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగానికి తోడు ప్రతిపక్షాల అణచివేత షేక్‌ హసీనా మీద జనంలో వ్యతిరేకత పెరగటానికి, దాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా కుట్రలో భాగంగా ప్రభుత్వ కూల్చివేత జరిగింది. తమ మానసపుత్రుడు గనుక యూనస్‌కు అమెరికా అనేక అవార్డులు ఇచ్చి స్థాయిని పెంచింది. ఇక షేక్‌ హసీనా విషయానికి వస్తే యూనస్‌ కార్యకలాపాలపై దర్యాప్తును ప్రారంభించి రుణాల వసూలుకు బలప్రయోగ పద్దతులను ప్రయోగించినట్లు వెల్లడించించారు. పదవీ విరమణ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో 2011లో అతగాడిని బాంకు బాధ్యతల నుంచి తొలగించింది. సుప్రీం కోర్టు ఆ చర్యను సమర్ధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా నోబెల్‌ బహుమతి సొమ్ముతో సహా పుస్తకాల మీద సొమ్మును స్వీకరిస్తున్నారంటూ 2013లో కేసు నమోదు చేశారు. యూనస్‌ స్థాపించిన గ్రామీణ టెలికాం కంపెనీలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.2023లో సదరు కంపెనీ సిబ్బంది తమ సొమ్మును స్వాహా చేసినట్లు ఒక కేసును దాఖలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ కేసులో శిక్ష పడి ప్రస్తుతం బెయిలు మీద ఉన్నాడు. సిఐఏ ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆ తీర్పును తప్పుపట్టింది.


అంతర్జాలంలో వెల్లడైన సమాచారం ప్రకారం అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌కు యూనస్‌ అత్యంత సన్నిహితుడు. ఆర్కాన్సాస్‌ గవర్నరుగా ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. బిల్‌ క్లింటన్‌ సతి హిల్లరీ క్లింటన్‌ పేరుతో ఉన్న ఫౌండేషన్‌కు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాడు. వాటి వివరాలను ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ నుంచి తరువాత తొలగించారు. దీర్ఘకాలం పాటు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే డెమోక్రటిక్‌ పార్టీ అధికారంలో ఉంది. ఏడుదేశాల మీద దాడులు జరిపించి మానవహక్కులను హరించిన మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు శాంతిదూతగా నోబెల్‌ బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.అదే పెద్ద మనిషి చేతుల మీదుగా యూనస్‌ అనేక అవార్డులు అందుకున్నాడు.ఒబామా నుంచి అమెరికా అధ్యక్షుడి పేరుతో ఉన్న స్వేచ్చా పతకాన్ని, అమెరికా పార్లమెంటు బంగారు పతకం, సిఐఏతో సంబంధమున్న రాక్‌ఫెల్లర్‌ సోదరులు, ఫోర్డు ఫౌండేషన్‌ సంస్థలు ఏర్పాటు చేసిన రామన్‌ మెగాసెసే అవార్డు వాటిలో ఉన్నాయి. విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్‌ పనిచేసిన సమయంలో పద్దెనిమిది రకాల లావాదేవీలతో యుఎస్‌ ఎయిడ్‌ అనే సంస్థ యూనస్‌కు గ్రాంటులు, రుణాలు, కాంట్రాక్టుల రూపంలో కోటీ 30లక్షల డాలర్ల మేర లబ్దిచేకూర్చినట్లు తరువాత వెల్లడైంది. గ్రామీన్‌ అమెరికా పేరుతో హిల్లరీ క్లింటన్‌ పలుకుబడితో అమెరికా ఆర్థికశాఖ ఆరు లక్షల డాలర్ల గ్రాంటు ఇచ్చింది.యూనస్‌ మీద బంగ్లా ప్రభుత్వం జరుపుతున్న విచారణను విరమించుకోవాలని ఆమె వత్తిడి తెచ్చినట్లు అమెరికా పార్లమెంటరీ డాక్యుమెంట్లు స్పష్టం చేశాయి.హిల్లరీ ఫౌండేషన్‌ అంతర్జాతీయ విధాన డైరెక్టర్‌గా ఉన్న అమితాబ్‌ దేశారు ద్వారా ఆమె బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చారు.2012 జూన్‌ 11వ తేదీన అతగాడు పంపిన ఒక ఇమెయిల్‌ వర్తమానంలో ” ఒకవేళ మీరు ఇప్పటికే దాన్ని చూసి ఉండనట్లయితే వెంటనే చూడాలని డబ్లుజెసి(బిల్‌క్లింటన్‌), హెచ్‌ఆర్‌సి( హిల్లరీ క్లింటన్‌) కోరారు.” అని పేర్కొన్నారు.ప్రపంచబాంకులోని ఇద్దరు కీలక అధికారులను ఎఫ్‌బిఐ, సిఐదే ద్వారా బ్లాక్‌మెయిల్‌ కూడా చేయించారు. ఆ కారణంగానే పద్మానదిపై వంతెన నిర్మాణానికి మంజూరు చేసిన 120 కోట్ల డాలర్ల రుణాన్ని నిలిపివేసింది, దాని నిర్మాణంలో అవినీతి జరిగినట్లు సాకు చూపింది.(అవమానానికి గురైన హసీనా తరువాత అదే వంతెనకు చైనా నిధులు తెచ్చి పూర్తి చేసింది, దాంతో చైనాకు దగ్గరైనట్లు చెబుతారు) అంతే కాదు హసీనా మీద కక్ష కట్టిన అమెరికా సర్కార్‌ న్యూయార్క్‌లో ఉంటున్న ఆమె కుమారుడు సాజీబ్‌ వాజెద్‌ జారు (ఇప్పుడు బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు వార్తలు) కంపెనీ మీద దాడులు జరపాలని 2017లో నాటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ చుక్‌ గ్రాసీ వత్తిడి తెచ్చినట్లు కూడా వెల్లడైంది.మైనస్‌ టూ ఫార్ములా ( షేక్‌ హసీనా, ఖలీదా జియా ) ప్రకారం వారిద్దరికీ రిటైర్మెంట్‌ ఇచ్చి ప్రవాసం పంపి మహమ్మద్‌ యూనస్‌ను నూతన నేతగా చేసే అవకాశాన్ని పరిశీలించాలని బంగ్లా కీలక అధికారులతో హిల్లరీ క్లింటన్‌ 2007లో విశ్వప్రయత్నాలు చేసినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే నూతన నేతగా మహమ్మద్‌ యూనస్‌ను మిలిటరీ ముందుకు తేవచ్చునని 2007 ఏప్రిల్‌ ఏడున బిబిసి ఒక వార్తను ప్రసారం చేసింది. అదే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకాన్సులేట్‌ జనరల్‌ సానుకూలత వ్యక్తం చేస్తూ పంపిన వర్తమానం గురించి ముందే చెప్పుకున్నాం.


హసీనాకు ఉద్వాసన మహమ్మద్‌ యూనస్‌కు పట్టం గట్టటం వెనుక ఉన్న సంబంధం ఏమిటో ఇప్పటికే అర్ధమై ఉంటుంది.యూనస్‌ పట్ల 2009లో అధికారానికి వచ్చిన హసీనా కఠిన వైఖరి ఎందుకు తీసుకున్నారో విశ్లేషిస్తూ మనదేశంలోని స్టేట్స్‌మన్‌ పత్రికలో 2019 ఏప్రిల్‌ ఐదున అమెరికాకు చెందిన జర్నలిస్టు బిజడ్‌ ఖుస్రూ రాశాడు. మిలిటరీతో చేతులు కలిపి తనను, ఖలీదాను ప్రవాసం పంపేందుకు యూనస్‌ కుట్ర చేశాడని, రాజకీయాల్లోకి రావాలని స్వయంగా సిద్దపడినట్లు ఆమె భావించారు. దశాబ్దాలపాటు సాగిన గిరిజన తిరుగుబాట్లకు స్వస్తిపలికిన తనకు నోబెల్‌ బహుమతి ఇవ్వకుండా యూనస్‌కు ఇచ్చారని ఆమె అసూయ చెందినట్లు ఖుస్రూ పేర్కొన్నారు. రాసిన అంశాల సారం ఇలా ఉంది.హసీనా 2009లో అధికారానికి రాక ముందు తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా తనను నియమిస్తే సంతోషిస్తానని యూనస్‌ ఢాకాలో ఒక సభలో ప్రకటించాడు. ఆ మరుసటి రోజు అవామీ లీగ్‌ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ జలీల్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. దానికి ఐదు నెలల ముందు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు యూనస్‌ చెప్పాడని, అంతేగాక పాలన పట్ల అతని అభిప్రాయాలతో తాము విబేధిస్తున్నట్లు కూడా జలీల్‌ చెప్పాడు. ఈ వైఖరి తీసుకోవటానికి హసీనాకు ఢిల్లీ నుంచి అందిన సమాచారం కూడా ఒక కారణం. అదేమంటే హసీనా స్థానంలో యూనస్‌ను ఉంచాలని అమెరికా కోరుకుంటున్నదని దాని పట్ల భారత్‌ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. అంతే కాదు, మతవాద జమాతే ఇస్లామీకి రాజకీయ రంగంలో చోటు కల్పించకూడదన్నది భారత వైఖరి కాగా జమాతే మీద చర్య తీసుకుంటే దాన్ని అజ్ఞాతవాసంలోకి నెట్టడమే అవుతుందని అమెరికా చెప్పిందట. జమాతే ప్రధాన రాజకీయ స్రవంతిలో ప్రవేశిస్తే అది మతవాదాన్ని తగ్గించుకుంటుందన్న తమ వైఖరిని భారత్‌ అర్ధం చేసుకోవటం లేదని అమెరికా చెప్పింది. తన పట్ల ఉన్న వైఖరిని మార్చుకోవాల్సిందిగా హసీనాను కోరాలని అమెరికా రాయబారిని కోరగా, తాను ఆపని చేస్తానని ఆమెతో ఒక మంచిమాట చెప్పిస్తానని హామీ ఇచ్చాడని అయితే హసీనా అందుకు అంగీకరించకపోగా యూనస్‌ను బాంకు పదవి నుంచి తప్పించారు.


హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన మిలిటరీ అధికారులు కేవలం 45 నిమిషాల సమయమిచ్చి ఆమెను బలవంతంగా భారత్‌కు పంపిన సంగతి తెలిసిందే. డెయిలీ స్టార్‌ అనే పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్రాన్సులో ఉన్న యూనస్‌ స్వదేశానికి తిరిగి వచ్చి బాధ్యతలు స్వీకరించాలని విద్యార్థులు కోరారు. తాను పూర్తి చేయాల్సిన పనులెన్నో ఉన్నందున రాలేనని యూనస్‌ తొలుత చెప్పాడు.విద్యార్థులు పదే పదే కోరటంతో అంగీకరించాడు. దేశంలో ఆరాచకాన్ని తొలగించే క్రమంలో హసీనాను గద్దెదించటం పట్ల సంతోషం వెలిబుచ్చాడు. విద్యార్థులు, దేశ పౌరులు ఎన్నో త్యాగాలు చేసినపుడు నాకు సైతం కొంత బాధ్యత ఉంది, అందుకే అంగీకరించాను అన్నాడట.హసీనాను గద్దె దించిన రోజును రెండవ విముక్తి దినంగా యూనస్‌ వర్ణించినట్లు ఒక జర్నలిస్టు చెప్పాడు. ఇలాంటి వ్యక్తి సారధ్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తుందా అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తుందా ? ఏదో ఒక ముసుగులో అమెరికా అనుకూల బిఎన్‌పి-జమాతే మతశక్తులకు అధికారం కట్టబెడుతుందా ? బంగ్లాదేశ్‌లో అమెరికా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసి అటు చైనా ఇటు భారత్‌కూ ముప్పు తెస్తుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కన్వర్‌ యాత్ర నిబంధనలకు సుప్రీం కోర్టు బ్రేక్‌, బిజెపి హిందూత్వకు ఎదురుదెబ్బ, దళితులతో ముందు ముంత వెనుక చీపురు కట్టించినా ఆశ్చర్యం లేదు !

22 Monday Jul 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Hinduthwa, Kangana ranaut, Kanwar Yatra, Narendra Modi Failures, RSS, Sonu Sood, Supreme Court, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


జూలై 22 నుంచి ఆగస్టు ఆరు వరకు జరిపే కన్వర్‌-కావడి యాత్రల సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌ ప్రభుత్వాలు జారీ చేసిన వివాదాస్పద ఉత్తరువు అమలును సోమవారం నాడు సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది బిజెపి హిందూత్వ అజెండాకు ఎదురు దెబ్బ యాత్రలు జరిగే దారిలో ఉన్న దుకాణాలు,హౌటళ్ల, పానీయాల దుకాణాల యజమానుల పేర్లను సంస్థల ముందు ప్రదర్శించాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. వాటిలో హలాల్‌ ధృవీకరణ పత్రం ఉన్న పదార్థాలను విక్రయించరాదని కూడా పేర్కొన్నారు. యాత్రల పవిత్రతను కాపాడేందుకు అని చెబుతున్నప్పటికీ అధికారిక ఉత్తరువుల్లో శాంతి భద్రతలను సాకుగా చూపారు. ఈ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం పేర్ల ప్రదర్శనకు బ్రేకు పడింది. అయితే ఆహార పదార్ధాల స్వభావాన్ని వినియోగదారులకు ప్రదర్శించాలని కోర్టు పేర్కొన్నది. పోలీసులు తీసుకున్న చర్యలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని, సామాజికంగా వెనుకబడిన తరగతులు, మైనారిటీలను ఆర్థికంగా విడదీస్తుందని పిటీషనర్ల తరఫున వాదించిన సియు సింగ్‌ చెప్పారు. మరో న్యాయవాది అభిషేక్‌ షింఘ్వి తన వాదనలను వినిపిస్తూ ” నేను గనుక పేరును ప్రదర్శించకపోతే నన్ను మినహాయిస్తారు, నేను పేరును ప్రదర్శించినా మినహాయిస్తారని ” చెప్పారు. అయ్యప్ప, భవానీ వంటి దీక్షలు, కన్వర్‌(కావడి) యాత్ర వంటివి జనాల వ్యక్తిగత అంశాలు. ఇష్టమైన వారు పాటిస్తారు, కాని వారు దూరంగా ఉంటారు. వీరంతా నాస్తికులని గానీ పాటించేవారే పరమ ఆస్తికులని గానీ నిర్ధారించటానికి, ముద్రవేసేందుకు ఎవరికీ హక్కులేదు.పౌరహక్కుల పరిరక్షణ సంస్థ(ఎపిసిఆర్‌) పేరుతో ఉన్న ఒక స్వచ్చంద సంస్థ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టు తలుపుతట్టింది.న్యాయమూర్తులు హృషికేష్‌ రారు, ఎస్‌విఎన్‌ భట్‌ ధర్మాసనం సోమవారం నాడు విచారించింది. ప్రభుత్వ ఉత్తరువుల కారణంగా దుకాణాల యజమానుల మతపరమైన గుర్తింపు వెల్లడి కావటమేగాక ముస్లిం మతానికి చెందిన దుకాణాల యజమానుల పట్ల వివక్ష ప్రదర్శించటమే అని పిటీషన్‌లో పేర్కొన్నారు.ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటూ, తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని అధికారపక్షానికి స్పష్టం చేశాయి. కోర్టు ఆదేశాలతో దీని మీద చర్చ జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.


బిజెపి మిత్రపక్షాలుగా ఉన్న జెడియు, ఎల్‌జెపి, ఆర్‌ఎల్‌డి పార్టీలు ఇలాంటి ఉత్తరువులు తగవని వ్యతిరేకతను వెల్లడించినా బిజెపి ఖాతరు చేయ లేదు. జనాలను మత ప్రాతిపదికన చీల్చే, ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అజండాను అమలు జరిపేందుకే పూనుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు తాజా పరిణామాల వెనుక ఉన్న కుట్రలేమిటి, ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా, ఆందోళనకరంగా మారింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఆయోధ్యతో సహా అనేక చోట్ల చావుదెబ్బతిన్నది. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కారణమంటూ కేంద్ర పెద్దల మద్దతుతో బిజెపి స్థానిక నేతలు ధ్వజమెత్తటమే కాదు, నాయకత్వ మార్పు జరగాలని కోరుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా యోగి కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వాటిలో కన్వర్‌ యాత్రల ఆదేశం ఒకటి. శివలింగం మీద తేలును చెప్పుతో కొట్టలేరు, చేతితో తొలగించలేరు అన్నట్లుగా కేంద్ర బిజెపి నాయకత్వం ముందు పరిస్థితి ఉంది. ఇంతకూ ఈ యాత్రీకులు చేసేదేమిటి ? శ్రావణమాసంలో పవిత్ర జలం పేరుతో గంగా నది నుంచి నీరు తెచ్చి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకం చేసి శివుని కృపకు పాత్రులౌతామనే నమ్మకాన్ని వెల్లడిస్తారు. జూలై 22 నుంచి ఆగస్టు ఆరవ తేదీ మధ్య హరిద్వార్‌ వద్ద ఉన్న గంగానది నుంచి తెచ్చే నీటి పాత్రలను కావళ్లలో పెట్టి తీసుకువస్తారు గనుక దీనికి కావడి యాత్ర అనే పేరు వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి వేర్వేరు మార్గాల్లో భక్తులు హరిద్వార్‌ వస్తారు. ఈ మార్గాల్లో యాత్రీకుల కోసం వస్తువుల దుకాణాలు, ఆహార పదార్దాల హౌటళ్లు. దాబాలు, బండ్లు ఏర్పాటు చేస్తారు. కాలినడకన, మోటారు వాహనాలు ఇలా ఎవరికి వీలైన పద్దతుల్లో వారు ఈ యాత్రలో పాల్గొంటారు. 1980దశకం వరకు చాలా పరిమితంగా జరిగే ఈ క్రతువును క్రమంగా పెద్ద కార్యక్రమంగా మార్చారు. అయ్యప్ప దీక్షలకు పోటీగా అనేక దీక్షలను తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా అలాంటిదే.


దుకాణాలు, హౌటళ్ల ముందు యజమానుల పేర్లకు బదులు ” మానవత్వం ” అని ప్రదర్శించాలని ప్రముఖ నటుడు సోనూ సూద్‌ ఎక్స్‌లో సూచన చేశారు.దీని మీద బాలీవుడ్‌ హీరోయిన్‌, బిజెపి లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌ స్పందిస్తూ ఉమ్మిన ఆహారం, ఆపని చేసేవారిని సమర్ధించటమే ఇదంటూ ధ్వజమెత్తారు. ముస్లింలు తయారు చేసే ఆహారం, విక్రయించే పండ్లు మొదలైన వాటి మీద ఉమ్ముతారని, హలాల్‌ చేస్తారని,అపవిత్రమైన వాటిని హిందువులు బహిష్కరించాలని, హిందువుల పవిత్ర స్థలాలు, గుడులు గోపురాలు ఉన్న ప్రాంతాలలో ముస్లింల దుకాణాలను అనుమతించరాదని, ఇప్పటికే ఉంటే ఎత్తివేయాలని హిందూత్వ సంస్థలు ఎప్పటి నుంచో రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. సాధారణ పౌరులెవరూ వాటిని పట్టించుకోవటం లేదన్నది కూడా ఎరిగిందే. అయోధ్యలో రామాలయం పేరుతో యోగి సర్కార్‌ బుల్డోజర్లతో కూలదోయించిన కట్టడాల్లో హిందువులవి కూడా ఉన్నాయి. అందుకే అక్కడ బిజెపికి వ్యతిరేకంగా ఓటువేయటం, అభ్యర్థి ఓటమి తెలిసిందే. పాలస్తీనాలో అరబ్బులపై దాడులు, మారణకాండ, స్వతంత్ర దేశ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌ ఉత్పత్తులను బహిష్కరించాలని ముస్లిం, అరబ్బుదేశాలలో పలు సంస్థలు గతంలో పిలుపునిచ్చాయి. వాటిని కాపీకొట్టిన కాషాయ దళాలు మనదేశంలో ముస్లింల వ్యాపారాలను దెబ్బతీసేందుకు వినియోగిస్తున్నాయి. అరబ్బు దేశాల చమురును బహిష్కరించమని చెప్పేందుకు వారికి నోరురాదు, ఎందుకంటే వారి యాత్రల వాహనాలు నడవాలంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న ఇంథనమే దిక్కు. అక్కడ పవిత్రత గుర్తుకు రాదు.


ఉమ్ముతారని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. నిజమే అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనేక బిర్యానీ హౌటళ్లకు, రంజాన్‌ మాసం సందర్భంగా హలీం కోసం ఎగబడేవారిలో ఎక్కువ మంది ముస్లిమేతరులే ఎందుకు ఉంటున్నారు.దుకాణాలలో విక్రయించే వస్తువులు నాణ్యమైనవా కాదా, హౌటళ్లలో వడ్డించే ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది గీటురాయిగా ఉండాలి తప్ప యజమానుల వివరాలు ఎందుకు ? ఒకవేళ ముస్లిం మతానికి చెందిన వారు యజమానులుగా ఉంటే వాటిని బహిష్కరించాలని పరోక్షంగా చెప్పటమే ఇది. పేర్ల ప్రదర్శన ఒక్క ముస్లింలనే దెబ్బతీస్తుందా ? హిందువులను కూడా నష్టపరుస్తుంది.మన సమాజంలో మత విద్వేషమే కాదు, కుల వివక్ష, విద్వేషం కూడా ఎక్కువే, అందునా దేశ ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలలో మరీ ఎక్కువ.దళితులు వివాహాల సందర్భంగా గుర్రాల మీద, ఇతరత్రా ఊరేగింపులు జరపకూడదని, ఎక్క కూడదని దాడులు చేసిన ఉదంతాలు ఎన్ని లేవు.దుకాణాలపై దళితులు, గిరిజనులు, వెనుకబడిన సామాజిక తరగతులకు చెందిన యజమానుల పేర్లను ప్రదర్శిస్తే ముస్లిం దుకాణాల పట్ల అనుసరించే వైఖరినే మనువాద కులాల వారు పాటిస్తారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే అనేక చోట్ల గతంలో ఆర్యవైశ్య బ్రాహ్మణ హౌటల్‌ అని రాసుకొనే వారు. ఇప్పుడు ఇంకా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉండి ఉండవచ్చు. వాటి స్థానలో రెడ్డి, చౌదరి హౌటల్స్‌ పేరుతో ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నాయి తప్ప ఇతర కులాలను సూచించే హౌటళ్లు ఎక్కడా కనిపించకపోవటానికి సమాజంలో ఇప్పటికీ ఉన్న చిన్న చూపు, వివక్షే కారణం. అదే ముస్లింల విషయానికి వస్తే మతవిద్వేషం. రాఘవేంద్ర,రామా, కృష్ణా, వెంకటేశ్వర విలాస్‌లు తప్ప ఎక్కడైనా అబ్రహాం, ఇబ్రహీం, ఏసుక్రీస్తు,మహమ్మద్‌ ప్రవక్త విలాస్‌లను చూడగలమా ?


ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ యుపి ప్రభుత్వ చర్యను తప్పు పట్టారు. ఒక మతపరమైన యాత్ర సందర్భంగా పోలీసులు జారీ చేసిన ఆదేశాలు దుకాణాలు, హౌటళ్ల యజమానుల పేర్లను ప్రముఖంగా వాటి ముందు రాసి ఉంచాలని చెప్పారు. సమీప భవిష్యత్‌లో ఇది వాహనాలకు సైతం వర్తింప చేస్తారని, గతంలో నాజీ జర్మనీలో కొన్ని దుకాణాలు, ఇండ్లకు ఇలాంటి గుర్తింపును అమలు చేశారని జావేద్‌ అక్తర్‌ ఎక్స్‌లో స్పందించారు.బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ కూడా తప్పు పట్టారు. ఇది అంటరానితనాన్ని ప్రోత్సహించటం తప్పవేరు కాదన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను నేరుగా విమర్శించలేని నక్వీ దీనికి అధికారయంత్రాంగం కారణమని విరుచుకుపడ్డారు. అత్యుత్సాహపరులైన అధికారులే ఇది చేశారన్నారు.సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌, బిఎస్‌పి నాయకురాలు మాయావతి, మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా విమర్శించారు. ఇది సామాజిక నేరమని, కోర్టులు కలగచేసుకొని నివారించాలన్నారు. తొలుత యజమానుల పేర్లను ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు. దాని మీద విమర్శలు రావటంతో కాదు స్వచ్చందంగా చేయాలన్నారు, చివరికి విధిగా ప్రదర్శించాలని నిర్ణయించారు.స్వచ్చందంగా అన్నప్పటికీ అంతిమంగా ఫలితం మతపరమైన గుర్తింపును విధిగా వెల్లడించేట్లు చేయటమే. పేర్లు ప్రదర్శించని హిందువులను కూడా ముస్లింలుగానే భావించేందుకు ఆస్కారం ఉంటుంది. ముస్లింలు పేర్లు రాసుకొని ప్రదర్శిస్తే వారి దగ్గర కొనవద్దని చెప్పేందుకు తప్ప దీనిలో శాంతి భద్రతల సమస్య ఎక్కడుంది. యాత్రికులకు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకంటూ ముజఫర్‌ నగర్‌ ఎస్‌పి ప్రకటన సాకు మాత్రమే. కావాల్సిన వస్తువు లేదా ఆహారం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తేనేం, దానిలో యాత్రీకులు పడే గందరగోళం ఏమిటి ? దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లను వేరు చేసేందుకు సృష్టించిన బంటూస్తాన్‌లకు, మనదేశంలో వెలిగా ఉంచిన దళిత వాడలకు, వీటికీ తేడా ఏముంది? దళితవాడల్లో నివశించేందుకు ఎంత మంది దళితేతరులు సిద్దపడుతున్నారు ? ముస్లింలు మెజారిటీగా ఉన్న అనేక ప్రాంతాల్లో ఇతరులు ఇండ్లు కొనేందుకు జంకే ఇతరుల గురించి తెలియని వారెవరు ?


చరిత్రలో మతపరమైన గుర్తింపు చాలా ప్రమాదకరం అని రుజువు చేసింది.మనతో సహా ఆసియా ఉపఖండంలోని దేశాల్లో మతంతో పాటు ఎక్కడా లేని కులపరమైన గుర్తింపు బోనస్‌.మధ్య యుగాల్లో, తరువాత ఇస్లామిక్‌, క్రైస్తవమతాల ఉన్మాదంతో ఇతర మతాల వారు ప్రత్యేక గుర్తులు ధరించాలని ఆదేశించారు. మౌఢ్యం లేదా నిరంకుశత్వం చోటు చేసుకుంది. నాజీ జర్మనీలో యూదు వ్యతిరేకతలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. మహమ్మద్‌ ప్రవక్త మరణం తరువాత అరేబియాలో అధికారానికి వచ్చిన ఖలీఫా రెండవ ఉమర్‌ 717-20 సంవత్సరాలలో ముస్లిమేతరులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని తొలిసారిగా ఆదేశించినట్లు వికీపీడియా సమాచారం తెలుపుతోంది. నేటి ఇటలీలోని సిసిలీ ప్రాంతంలో రాజ్యాధికారం చలాయించిన అరబ్‌ రాజవంశం అగలాబిద్‌ 887-88లో యూదులు తమ ఇండ్లకు గాడిదలను చిత్రించిన వస్త్రాలను వేలాడదీయాలని, పసుపు పచ్చ బెల్టులు, టోపీలు ధరించాలని ఆదేశించింది. తరువాత 1,212లో మూడవ పోప్‌ ఇన్నోసెంట్‌ ప్రతి క్రైస్తవ ప్రాంతంలో గుర్తించేందుకు వీలుగా యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని ఆదేశించాడు. ప్రష్యాలో 1,710లో అధికారంలో ఉన్న ఒకటవ ఫెడరిక్‌ విలియమ్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించనవసరం లేదు.అయితే అలా ఉండాలంటే ఎనిమిదివేల వెండి నాణాల నగదు చెల్లించాలని షరతు పెట్టాడు. తరువాత రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా జర్మనీలో నాజీ పాలకులు యూదులను గుర్తించేందుకు డేవిడ్‌ బొమ్మ ఉన్న ఏదో ఒక రంగు గుర్తును ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.హిట్లర్‌ యంత్రాంగం కొత్త ఆదేశాలను జారీచేసి యూదుల ఇండ్ల ముఖద్వారాలకు గుర్తులు వేయాలని ఆదేశించింది. అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఇలాంటి గుర్తింపు ఆదేశాలను అమలు చేశారు. హంగరీ ఆక్రమణ తరువాత యూదుల పౌరసత్వాలను రద్దు చేసి వారంతా ప్రత్యేక గుర్తులను ధరించాలని ఆదేశించారు.ఇక వర్తమానంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు 1996-2001 మధ్య తమదేశంలో ఉండే హిందువులు పసుపుపచ్చ గుర్తున్న బాడ్జ్‌లను ధరించాలని, వేధింపులకు గురికాకుండా ఉండేందుకు హిందూ మహిళలు బురఖాలు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కన్వర్‌ యాత్రీకులు గందరగోళపడకుండా ఉండేందుకు, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అనే పేరుతో దుకాణాల యజమానులు తమ పేర్లను ప్రముఖంగా రాసి ప్రదర్శించాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఆకుపచ్చ తాలిబాన్లకు కాషాయ తాలిబాన్లకు పద్దతి తప్ప ఇతరంగా తేడా ఏమిటి ? యోగి సర్కార్‌ ఉత్తరువులు ముస్లింల కోసమేనని,మనకేంటి అని ఇతరులు ఎవరైనా భావిస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. చరిత్రను చూసినపుడు సనాతనం లేదా మనువాదం కారణంగా దళితులకు ఇతరుల వాడల్లో ప్రవేశం నిషేధించారు, ఒకవేళ అనుమతిస్తే ఉమ్మివేయకుండా మెడలో ముంత ధరించాలని, వీపులకు చీపుర్లు కట్టుకొని ఊడ్చుకుంటూ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. ఇప్పుడు కన్వర్‌ మరోపేరుతో మతవిద్వేషం రెచ్చగొడుతున్నవారు మనువాదుల వారసులే. సనాతనాన్ని అమలు జరపాలని కోరేశక్తులకు ప్రతిఘటన లేకపోతే దళితులకు ముంతలు, చీపుర్లే గతి, వెనుకబడిన తరగతులు తిరిగి కులవృత్తులకు పోవాల్సిందే ! కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చికిత్సలేని హిందూత్వ వైరస్‌ – వాళ్లంతే ! అదో టైపు !! ఓటేయని ముస్లింలు, యాదవులను పట్టించుకోరట-ప్రమాణాన్ని ఉల్లంఘించిన కేంద్ర మంత్రి !

14 Sunday Jul 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

#Hindutva, Anti Muslim, Communal Sentiments, Himanta Biswa Sarma, Hindu Rashtra, Hindu Supremacists, Hindutva fanatics, Narendra Modi Failures, RSS, Union Minister Giriraj Singh


ఎం కోటేశ్వరరావు


” ముస్లింలు నాకు ఓటు వేయలేదు.కాబట్టి ఇప్పుడు నేను కూడా వారికోసం పని చేయటం లేదు. నా ప్రాంతంలోని ఒక మౌల్వీ ఒక ఇల్లు, ఉజ్వల గ్యాస్‌, ఐదులక్షల రూపాయల ఆయుష్మాన్‌, మరుగుదొడ్డి, రేషన్‌ కార్డు కూడా పొందాడు. నాకు ఓటు వేసి ఉంటే ప్రమాణం చేసి చెప్పాలని నేను అడిగాను, అతనా పనిచేయలేదు. నా హృదయం ముక్కలైంది. ఇది సనాతన ధర్మాన్ని బలహీన పరిచేందుకు, భారత్‌పై ముస్లిం యుద్ధం (ఘజ్వా ఏ హింద్‌ ) చేసేందుకు పక్కాగా రూపొందించిన ఒక వ్యూహం ” తెల్లారగానే సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌ సుప్రభాతంతో జనాన్ని నిద్రలేపే కారణజన్ముడైన దేవుని బిడ్డ నరేంద్రమోడీ గురించి తెలిసిందే. అలాంటి దైవాంశసంభూతుడి మంత్రివర్గ సభ్యుడైన జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత తాజాగా ఎక్స్‌ ఖాతాలో వెల్లడించిన అభిప్రాయమిది. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రిగా ” నా బాధ్యతలను నమ్మకంగా మరియు మనస్సాక్షిగా నిర్వర్తిస్తాను. మరియు రాజ్యాంగం మరియు చట్ట ప్రకారం అన్ని రకాల ప్రజలకు భయం లేదా అభిమానం, ఆప్యాయత లేదా దురుద్దేశ్యం లేకుండా న్యాయం చేస్తాను ” అని ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి దాన్ని ఉల్లంఘించారు. ఇందుకు గాను అతగాడిని మంత్రి వర్గం నుంచి ప్రధాని తొలగించాలి, లేదా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాష్ట్రపతి తన బాధ్యతను నిర్వర్తించాలి. ఏదీ జరిగే సూచనలు లేవు.


ఘజ్వా ఏ హింద్‌ అనే పదాన్ని ఇటీవల అనేక మంది ముఖ్యంగా హిందూ-ముస్లిం మతోన్మాదులు, ఉగ్రవాదులు, కొన్ని మీడియా సంస్థల జర్నలిస్టులు రెండు మతాలవారినీ రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్నారు. కొంత మంది ఇస్లామిక్‌ పండితులు దాని అసలు అర్దాన్ని వక్రీకరిస్తున్నారని వివరణ ఇచ్చారు. దాని సారం ఏమిటంటే మహమ్మద్‌ ప్రవక్త ప్రవచనాలకు తప్పుడు భాష్యం చెబుతున్నారు.దానితో విబేధించే పండితులు కూడా ఉన్నారు. క్రైస్తవం మీద తిరుగుబాటులో భాగంగా ఇస్లాం ఉద్భవించింది. క్రీస్తుశకం 530వ సంవత్సరంలో జన్మించిన మహమ్మద్‌ ప్రవక్త 632జూన్‌ ఎనిమిదిన మరణించాడు.ఎవరి భాష్యం ఎలా ఉన్నప్పటికీ నాడు చెప్పిన అంశాలు నేడు వర్తించవన్నది తెలిసిందే. ఈ అంశాలలో హిందూ-ముస్లిం మతశక్తులు బొమ్మా- బొరుసు వంటివి. సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని రెండూ చెబుతున్నాయి. అరబ్బీలో ఘజ్వా అంటే యుద్ధం. భారత ఉపఖండం మీద దాడి చేసి ఇస్లాం భావజాలాన్ని వ్యాపింప చేయాలని ప్రవక్త చెప్పాడని, దాన్ని కొనసాగించాలని ముస్లిం తిరోగమనవాదులు నిత్యం రెచ్చగొడుతుంటారు. ముస్లింలు ఇప్పటికీ ఘజ్వాను వదల్లేదని అందువలన వారి దాడి నుంచి హిందూ లేదా సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ హిందూ తిరోగమన వాదులు పదే పదే దాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు.నిజానికి సనాతనం అంత గొప్పదైతే మరి అంటరానితనం, వివక్షలనే కాన్సర్లు మన సమాజంలో ఎలా విస్తరించాయి ? మహానుభావుడు అంబేద్కర్‌కు సనాతనం గురించి తెలియదా ? పక్కాగా తెలుసు, నాటి సనాతనుల ఆచరణను చూసే దాన్ని వ్యతిరేకించి బౌద్దంలోకి మారిన సంగతి తెలిసిందే.అంటరాని తనంతో సహా అనేక వివక్షలను రుద్దిన మనుస్మృతిని అమలు జరపాలని అంటే దళితులు, గిరిజనులు, వెనుక బడిన తరగతుల వారు బిజెపికి దూరం అవుతారనే భయంతో దాని బదులు సనాతన ధర్మం అనే పల్లవిని అందుకున్నారు. ఇది కూడా ఎంతో కాలం నడవదన్నది వేరే సంగతి.


దానిలో భాగంగానే హిందూ దేవాలయాలు, యాత్రా ప్రాంతాలలో ఉన్న ముస్లింల దుకాణాలను మూసివేయాలి. ముస్లిం పేర్లతోనే ముస్లింలు దాబాలను ఎందుకు తెరవరు ? కన్వర్‌ యాత్రీకులను మోసం చేసేందుకు ముస్లిం దాబాల యజమానులు హిందూ పేర్లు పెడుతున్నారు,పేర్లు ఎందుకు మార్చాలి, దాబాలను ఎందుకు తెరవాలి అంటూ విశ్వహిందూ పరిషత్‌ ప్రశ్నిస్తోంది. సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్థలకు చెందిన వారు, దాని మతోన్మాద వైరస్‌ బారిన పడిన వారు ఇలాంటి విద్వేషాన్ని వెళ్లగక్కటం తెలిసిందే. అఫ్‌ కోర్సు అలాంటి వాటిని అలఓకగా వెల్లడించే వారిలో పేరుమోసిన వ్యక్తి గిరిరాజ్‌ సింగ్‌ అన్నది తెలిసిందే. ఇలా మాట్లాడటం తగదని తన సహచరులకు నరేంద్రమోడీ అంతర్గతంగానైనా చెప్పి ఉంటే గిరిరాజ్‌ సింగ్‌ లాంటి వారు, విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్థలు పదే పదే రెచ్చిపోతాయా ? దైవాంశ సంభూతుడిని తిరస్కరిస్తాయా ? మీరంతా నిమిత్త మాత్రులు, మీతో చెప్పించేది, చేయించేదీ అన్నీ నేనే అనే భగవద్గీత సారం తెలిసిందే. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి…గుడిసెలు అనే సామెత తెలిసిందే కనుక టీకా తాత్పర్యాలు అవసరం లేదు.


మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది గనుకనే నరేంద్రమోడీ మూడవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా మత స్వేచ్చ నివేదికలో మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు, విద్వేష ప్రచారం గురించి పేర్కొన్నారు. ప్రతి ఏటా అమెరికా నివేదికల్లో ఈ అంశాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు.వాటిని ఒక వైపు మోడీ సర్కార్‌ ఖండిస్తున్నదీ, తిరస్కరిస్తున్నది. మరోవైపున కాషాయ దళం తనపని తాను చేస్తున్నది. నిజం ఏమిటో మన జనానికి తెలియదా ? మణిపూర్‌లో క్రైస్తవులైన గిరిజన కుకీల మీద జరిగిన దాడులు,హత్యాకాండ, ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన వైనం అక్కడి బిజెపి రాష్ట్ర ప్రభుత్వం దాచినా దాగలేదు.గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలోనే కాదు, చివరకు హిందువులైన మెయితీలు అధికంగా ఉన్న చోట కూడా బిజెపి రెండు చోట్లా తాజా లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరచింది. గిరిరాజ్‌ సింగ్‌ కేంద్ర మంత్రిగా ఎవరి పట్లా వివక్ష చూపనంటూ చేసిన ప్రమాణస్వీకారాన్ని ఉల్లంఘించి మాట్లాడారు గనుకనే ఆ పెద్ద మనిషి గురించి చెప్పుకోవాల్సి వస్తున్నది. ముస్లింలు దుకాణాలు తెరవకూడదు, ఉన్నవాటిని మూసివేయాలంటూ వీరంగం వేసిన అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో హిందువులే మెజారిటీ అయినప్పటికీ అక్కడ బిజెపి ఓడిపోయింది. ప్రతిపక్షాలు గెలిస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని స్వయంగా నరేంద్రమోడీ చెప్పినా అక్కడి జనాలు పట్టించుకోకుండా చెంపదెబ్బ కొట్టినట్లుగా తీర్పు చెప్పారు.


ఆరునెల్లు గడిస్తే వారు వీరవుతారు అన్నట్లుగా బిజెపితో చేతులు కలిపిన ఇతర పార్టీలు కూడా దాని భావజాలాన్ని, విద్వేషాన్ని తలకెక్కించుకుంటున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయని యాదవులు, ముస్లింల కోసం తాను ఎలాంటి పనులు చేయనని బీహార్‌లోని నితీష్‌ కుమార్‌ పార్టీ జెడియు సీతామరి ఎంపీ దేవేష్‌ చంద్ర ఠాకూర్‌ ఇటీవల ప్రకటించారు. యాదవులు, ముస్లింలు తనవద్దకు వస్తే స్వీట్లు పెట్టి, టీ ఇచ్చి పంపుతాను తప్ప వారికి ఎలాంటి పనులూ చేయనని అన్నారు.హృదయంలో చెలరేగిన భావాలతోనే ఠాకూర్‌ అలా మాట్లాడినట్లు అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అతగాడిని సమర్ధించారు.కేంద్రం, రాష్ట్రం అమలు జరిపిన పధకాలతో లబ్ది పొందిన ముస్లింలు తనకూ ఓట్లు వేయలేదన్నారు. దీనికంతటికీ మంగళసూత్రాలు లాక్కుంటారంటూ ప్రతిపక్షాల మీద ప్రధాని నరేంద్రమోడీ చేసిన తప్పుడు ప్రచారమే కారణని ఆర్‌జెడి విమర్శించింది. ఎంపీలు, ఎంఎల్‌ఏలు నియోజకవర్గాల్లో ఉన్న అందరికీ చెందిన వారు తప్ప ఒక కులం, మతానికో ప్రాతినిధ్యం వహించేవారు కాదని, రాజ్యాంగం మేరకు దేశం నడుస్తున్నది తప్ప కొంత మంది బుర్రల్లో పుట్టినదాని ప్రకారం కాదని పేర్కొన్నది. ఇలాంటి ఎంపీలు, కేంద్ర మంత్రుల వద్దకు కేవలం టీ తాగేందుకు ఆత్మగౌరవం కలవారు ఎవరైనా వెళతారా ?యాదవులు, ముస్లింలే కాదు, వీరికి ఓటేయని ఏ సామాజిక తరగతికీ మినహాయింపు ఉండదని అందరూ గమనించాలి.ఇలాంటి వారు బిజెపి, దాని మిత్రపక్షాల్లో ఎంతగా వర్ధిల్లితే అంతగా జనం అసలు రంగు తెలుసుకుంటారు.


గిరిరాజ్‌ సింగ్‌ ఏం మాట్లాడినా బిజెపి పెద్దలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నాటి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలోనే బీహార్‌ బెగుసరారు నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జిల్లా కలెక్టర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బహుశా ఈ పెద్ద మనిషి డిఎన్‌ఏలోనే ముస్లిం ద్వేషం ఉన్నట్లు అతగాడి వదరుబోతుతనం వెల్లడిస్తున్నది.దేశ విభజన సందర్భంగా ముస్లింలందరినీ పాకిస్తాన్‌ పంపకపోవటం మన పూర్వీకులు చేసిన పెద్ద తప్పిదం అన్నారు.2014లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీకి ఓటు వేయని వారిని పాకిస్తాన్‌ పంపాలని సెలవిచ్చినందుకు బహుమతిగా నాడు సహాయ కేంద్ర మంత్రి పదవి, తరువాత మరింతగా రెచ్చిపోయినందుకు 2019లో కాబినెట్‌ మంత్రిగా, మరోసారి ఇప్పుడు కొనసాగించారు మోడీ. బీహార్‌లో మిత్ర పక్షాలుగా ఉన్న ఎల్‌జెపి, జెడియు నేతలు ఈ పెద్దమనిషి వ్యాఖ్యలను విమర్శించటం తప్ప గట్టిగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు. మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్థలలో ఇలాంటి విద్వేష ప్రసంగీకులకు కొదవ లేదు. విశ్వహిందూ పరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా వారిలో ఒకరు. ” మనం అధికులుగా ఉన్న ప్రాంతాలలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ముస్లింలను భయపెట్టాలి ” అన్నారు. నోటిదూల, నోటి తుత్తర లేదా విద్వేష గళాల పీఠాధిపతుల్లో గిరిరాజ్‌ సింగ్‌ను ఒకరిగా చెప్పవచ్చు.ప్రపంచ జనాభా దినం సందర్భంగా 2019 జూలై 11న మంత్రి హౌదాలో ఒక ట్వీట్‌ ( ప్రస్తుతం ఎక్స్‌) చేశారు. ” ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఓటింగ్‌ హక్కు రద్దు చేయాలన్నది నా వైఖరి ” అని పేర్కొన్నారు. ఇది ముస్లింలను ఉద్దేశించే చేసినప్పటికీ ఇతర మతాలలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి కూడా వర్తిస్తుంది కనుక వారు కూడా ఇలాంటి వ్యక్తులు, వారి పార్టీ గురించి ఆలోచించుకోవాలి.


బిజెపి నేతలు హిందూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని బహిరంగంగానే ప్రకటిస్తారు. తనకు మియా(అసోంలోని ముస్లింలకు మరోపేరు)ల ఓట్లు అవసరం లేదని సాక్షాత్తూ ఆ రాష్ట్ర సిఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. తాను వారి ప్రాంతాలలో అసలు ప్రచారానికే వెళ్లనని కూడా చెప్పారు. మియాల్లో బాల్య వివాహాలు అంతరించేవరకు వారి ఓట్లను తాను కోరనని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని కూడా చెప్పారు. ముస్లిం సామాజిక తరగతి ఉద్దారకుడిగా ఫోజు పెడుతూ వారి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటం తప్ప ఇది మరొకటి కాదు. దేశంలో బాల్యవివాహాల సామాజిక రుగ్మత ఉంది. దాన్ని రూపుమాపాలంటే జనాల ఆర్థిక, విద్యా స్థాయిని మెరుగుపరచాలి. అసలు వాస్తవం ఏమంటే దేశంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 84శాతం హిందువుల్లోనే ఉన్నట్లు ఇండియా స్పెండ్‌ అనే మీడియా సంస్థ జనాభా లెక్కలను విశ్లేషించి చెప్పింది. ముస్లింలలో పదకొండుశాతం, ఇతరులు మిగతా మతాల్లో ఉన్నారు. అదే హిమంత బిశ్వశర్మ బాల్య వివాహాలు చేసే హిందువుల ఓట్లు, అంటరానితనం పాటించేవారి ఓట్లు తమకు అవసరం లేదని చెప్పగలరా ? బిజెపి నేతల నాలికలకు నరం లేదు. ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది మాట్లాడతారు. తనకు ఓట్లు వేయని కారణంగా ముస్లింల కోసం తాను పనిచేయనని రాజ్యాంగ విరుద్దమైన మాటలను కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వల్లిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో బిజెపి సీనియర్‌ నేత కెఎస్‌ ఈశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు ఒక్కటి కూడా అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఆవు చేలో మేస్తుంటే దూడగట్టున ఉంటుందా ? అధినేత నరేంద్రమోడీ స్వయంగా ఇటీవలి ఎన్నికల్లో ముస్లిం విద్వేషాన్ని ఎలా రెచ్చగొట్టారో తెలిసిందే. మోడీ ముందు హిమంత బిశ్వశర్మలూ, గిరిరాజ్‌ సింగ్‌లూ మరుగుజ్జులే. తన ఉపన్యాసాలు, వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశం అవుతాయని, భారత ప్రతిష్ట మురికి గంగలో కలుస్తుందని తెలిసి కూడా మోడీ వెనక్కు తగ్గలేదు.ఏది ఎటుపోతేనేం ! కావాల్సింది ఓట్లు, అధికారం ! రామరాజ్యం కోరుకొనే శక్తులకు ఓటు వేస్తారా లేక ఓట్‌ జీహాదీలకు వేస్తారా అంటూ మోడీ ఓటర్లను అడగటం తెలిసిందే.కాంగ్రెస్‌ అధికారానికి వస్తే చొరబాటుదార్లకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి సంపదలు పంచుతారని, పుస్తెలను కూడా లాక్కుంటారని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి మాట్లాడిందీ తెలిసిందే. దేశాన్ని ఆక్రమించుకొనేందుకు ముస్లింలకు కాంగ్రెస్‌ సహాయం చేస్తోందని కూడా ఆరోపించారు. మోడీ దిగజారి మాట్లాడినట్లు, అది కూడా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం అవాంఛనీయమని బిజెపి నేత అలోక్‌ వత్స తమతో వ్యాఖ్యానించినట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది. సంవత్సరాల తరబడి గుడ్డిగా మోడీకి మద్దతు ఇచ్చిన వారు కూడా ఆయన వ్యాఖ్యలను ఆమోదించరని, ప్రధాని స్థాయికి తగని మాటలని వత్స అన్నట్లు పేర్కొన్నది. ఇలాంటి నేత అనుచర గణం ప్రసన్నం చేసుకొనేందుకు మరింత రెచ్చిపోతుంది తప్ప వెనక్కు తగ్గదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో గిల్లి కజ్జా : అమెరికా రాజకీయ క్రీడలో పావుగా దలైలామా !

26 Wednesday Jun 2024

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, USA

≈ 1 Comment

Tags

#Anti China, 14th Dalai Lama, Anti communist, China, cia, Nancy Pelosi, Tibet


ఎం కోటేశ్వరరావు


ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్న 88 ఏండ్ల దలైలామా మోకాలి చికిత్సకోసం అమెరికా వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ రాజకీయ నేతలతో చర్చలు జరుపుతారా లేదా అన్నది ఇంకా స్ఫష్టం కాలేదు. గతవారంలో అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసి హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో దలైలామాను కలిశారు.ఈ సందర్భంగానే ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కూడా ఆమె నాయకత్వంలో వచ్చిన ఏడుగురు ఎంపీల బృందం భేటీ జరిపింది. ఇతర పని మీద భారత్‌ పర్యటనలో భాగంగా ఏదో ఇంతదూరం వచ్చాం కదా మర్యాద పూర్వకంగా అనుకుంటే దలైలామాను కలవటం పెద్ద వార్తే కాదు.రావటమే కాదు,నేను చైనాను విమర్శిస్తే అది దలైమాకు అంగీకారం కాదని తెలిసినా అంటూ అక్కడే చైనా అధినేత షీ జింపింగ్‌ మీద ధ్వజమెత్తింది. అందుకే ఇది పక్కా రాజకీయ, చైనా వ్యతిరేక పర్యటనే అనటంలో ఎలాంటి సందేహం లేదు.దలైలామా వారసత్వం ఎప్పటికీ ఉండిపోతుంది, కానీ చైనా అధ్యక్షపదవిలో ఉన్న మీరు శాశ్వతంగా ఉండరు,ఎవరూ, దేనికీ మిమ్మల్ని గుర్తుంచుకోరు అంటూ నాన్సీ పెలోసి నోరుపారవేసుకుంది. దలైలామాతో చైనా ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కూడా చెప్పింది.
ఈ పరిణామం మీద మన విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ భారత వైఖరిలో ఎలాంటి మార్పులేదు, స్థిరంగా ఉందని చెప్పారు.మనదేశంలో మతపరమైన,ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించేందుకు మాత్రమే దలైలామాకు ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. నాన్సీ పెలోసీ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు-మన ప్రభుత్వానికి సంబంధం లేదని, వాటి గురించి మీరు అమెరికానే ప్రశ్నించాలని విలేకర్లతో చెప్పారు. ధర్మశాలలో ఉందని చెబుతున్న టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం ఒక వేర్పాటు వాద రాజకీయ సంస్థ, చైనా రాజ్యాంగం, చట్టాల ప్రకారం అది చట్టవిరుద్దం, ఆ సంస్థకు ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు లేదు, ఇక దలైలామాతో సంప్రదింపులు, మాటల విషయానికి వస్తే అది చైనా ప్రభుత్వం-పద్నాలుగవ దలైలామాకు సంబంధించిన వ్యవహారం అన్నది ఎప్పుటి నుంచో మేము చెబుతున్నాం అని చైనా స్పందించింది. ఈ సందర్భంగా కొన్ని అభిప్రాయాలు, వక్రీకరణలు, భాష్యాలు వెలువడ్డాయి.టిబెటన్ల హక్కుల పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆడుతున్న నాటకం తెలిసిందే. అమెరికా, దానికి తాన తందాన పలికే దేశాలు చెబుతున్నదాని ప్రకారం టిబెట్‌ ఒక స్వతంత్ర దేశం, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని చైనా ఆక్రమించింది. కనుక టిబెటన్ల హక్కును పరిరక్షించాలి అంటూ వేర్పాటు వాదాన్ని సమర్ధిస్తున్నది.మనదేశంలో బ్రిటీష్‌ ప్రభుత్వానికి లోబడిన సామంత రాజరిక సంస్థానాల మాదిరే చైనాలో రాజరిక కాలంలో టిబెట్‌ కూడా అలాంటిదే.చైనాకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చైనా ప్రభుత్వానికి లోబడిన ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఉంది, దాని అధిపతిగా దలైలామా కొనసాగాడు.


చైనా కమ్యూనిస్టు పార్టీ లాంగ్‌ మార్చ్‌ లేదా విప్లవపోరాట కాలంలో అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వం కూలిపోవటం తధ్యమని గ్రహించిన అమెరికా, బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు ఒక వ్యూహం ప్రకారం నాడు ఫార్మోజా దీవిగా నేడు తైవాన్‌గా పిలుస్తున్న ప్రాంతానికి మిలిటరీ, ఆయుధాలను తరలించి అక్కడే తిష్టవేయించింది. చైనా రాజులు ఆ దీవిని 1895లో జపాన్‌కు ధారాదత్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన తరువాత 1945లో దాన్ని తిరిగి చైనా ప్రభుత్వానికి అప్పగించారు. మిగతా ప్రధాన ప్రాంతంలో కమ్యూనిస్టులు కేంద్రీకరించి తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని భావించారు.తరువాత అనేక కారణాలతో స్వాధీనం చేసుకోలేదు. ఈ లోగా అమెరికా, ఇతర దేశాలు తైవాన్‌ పాలకులకు భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చి ఒక దేశం మాదిరి తయారు చేశారు. దాన్నే అసలైనా చైనాగా భద్రతా మండలిలో గుర్తించారు. 1970దశకంలో అనివార్య స్థితిలో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానం ప్రకారం చైనా అంటే తైవాన్‌తో కూడిన ప్రాంతం తప్ప రెండు చైనాలు లేవు. దీనికి అమెరికా కూడా అంగీకరించింది. అయితే శాంతియుతంగా విలీనం జరగాలంటూ కొత్త నాటకం ప్రారంభించింది. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటే తాము సహించేది లేదని అమెరికా అంటున్నది. తైవాన్‌ వ్యవహారాలను చూసేందుకు ఏ ఒక్కదేశానికీ భద్రతా మండలి అనుమతి ఇవ్వలేదు. తనకు తానే రక్షకురాలిగా అమెరికా ప్రకటించుకుంది. ఆధునిక ఆయుధాలన్నీ ఇచ్చి ఎదురుదాడులకు కూడా అనుగుణంగా తయారు చేస్తున్నది.


ఇక టిబెట్‌ విషయానికి వస్తే కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్తతో వ్యవహించి సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ముచేసింది. మతం, దలైలామా పేరుతో జరిపిన తిరుగుబాటును అణచివేసింది.టిబెట్‌లో తిరుగుబాటు చేసేందుకు పూనుకున్న వేర్పాటు వాదులకు సిఐఏ అనేక చోట్ల రహస్యంగా సాయుధ శిక్షణ, పెద్ద మొత్తంలో నిధులు అందచేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ 1949లో అధికారానికి వచ్చిన తరువాత ” ఇంకే ముంది మనం చైనాను నష్టపోయాం, మన అదుపు నుంచి పోయింది, మనకు కొత్త విరోధి ఉనికిలోకి వచ్చింది ” అన్నట్లుగా అమెరికా పాలకవర్గం భావించింది. విప్లవ కాలంలోనే చైనాలో కమ్యూనిస్టు పార్టీని అడ్డుకోవటంలో విఫలం కావటం గురించి అది బెంగపెట్టుకుంది. ఇరాన్‌లో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు1953లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు చేసిన ఖర్చుతో పోలిస్తే సిఐఏ 1949-51కాలంలో ఇరవై రెట్లు మొత్తాన్ని చైనా కోసం వెచ్చించింది.రహస్య కార్యకలాపాలకు పది రెట్లు సిబ్బందిని పెట్టింది.కార్యస్థానంగా టిబెట్‌ను ఎంచుకుంది.చరిత్రను చూస్తే టిబెట్‌ ప్రాంతంలో చైనా రాజులకు సామంత రాజ్యంగా ఉంది తప్ప స్వతంత్రదేశం కాదు.1912లో క్వింగ్‌ రాజరిక వ్యవస్థకూలిపోయిన మరుసటి ఏడాది పదమూడవ దలైలామా తమకు స్వాతంత్య్రం కావాలని ప్రకటించాడు.చైనా ఆశీస్సులతో నిమిత్తం లేకుండా ఆధ్యాత్మిక, రాజకీయ అధికారాన్ని చెలాయిస్తానని చెప్పుకున్నాడు.దాన్ని చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత టిబెట్‌ను పూర్తిగా చైనాలో విలీనం చేసేందుకు చూస్తున్నట్లు 1941డిసెంబరు 20వ తేదీ డైరీలో నాటి ప్రధానిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ రాశాడు.


కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత ముందే చెప్పుకున్నట్లు సిఐఏ రంగంలోకి దిగింది. దీన్ని పసిగట్టిన మావో జెడాంగ్‌ ముందు జాగ్రత్త చర్యగా 1950లో అక్కడికి 40వేల మంది మిలిటరీని పంపాడు.దీంతో పాటు చైనాతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకున్నాడు. అదే ఏడాది అక్టోబరు 6-24వ తేదీల మధ్య తూర్పు టిబెట్‌లో తిరుగుబాటుకు తెరతీసిన వేర్పాటు వాదులను చామడో పోరులో మిలిటరీ అణచివేసింది, మూడు వేల మందిని బందీలుగా పట్టుకుంది. టిబెట్‌ పౌరుల మీద ఎలాంటి దాడులు జరపలేదు. ప్రస్తుతం మనదేశంలో ఉన్న 14వ దలైలామా టెంజిన్‌ జియాస్టో ఆ పరిణామం తరువాత తాను క్రమశిక్షణతో మెలుగుతానని ప్రకటించాడు. కాశ్మీరు, హైదరాబాదు సంస్థానాలను మనదేశంలో విలీనం చేసినట్లుగానే టిబెట్‌ సంస్థానాన్ని చైనా 1951 మే నెలలో విలీనం చేసింది. టిబెట్‌ రాజకీయం చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రావటానికంటే ముందే మొదలైంది.మన దేశం తొలిసారిగా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం టిబెట్‌తోనే మొదలైంది.చైనా మిలిటరీ చర్య గర్హనీయమని, అది చైనా ప్రయోజనాలకు, శాంతికి కూడా దోహదం చేయదని నాటి నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి వెంటనే అమెరికా, బ్రిటన్‌ తదితర ఆ గుంపు దేశాలు కూడా మద్దతు ఇచ్చాయి.


దలైలామాకు 1940దశకంలోనే సిఐఏతో సంబంధాలు, నిధుల అందచేత ఉన్నట్లు తరువాత వెల్లడైంది. అమెరికాలోని కొలరాడోలో టిబెట్‌ తిరుగుబాటుదార్లకు శిక్షణ ఇచ్చింది. వారిని అక్కడికి విమానాల్లో తరలించి తరువాత తిరిగి టిబెట్‌కు చేర్చింది. ఆయుధాలను ఇచ్చింది. అలాంటి వారి నాయకత్వంలో 1956లో తూర్పు టిబెట్‌లో రెండు చోట్ల తిరుగుబాటును ప్రకటించారు. దలైలామా అన్న గయాలో తోండప్‌ 1951లో అమెరికా వెళ్లాడు.అక్కడే ఉండి ఎప్పటికప్పుడు చైనా, టిబెట్‌లో పరిస్థితుల గురించి అక్కడ ఎందరు సైనికులు ఉన్నదీ మొదలైన సమాచారాన్ని అందచేసేవాడు. దానికి ప్రతిగా చైనాకు వ్యతిరేకంగా తమకు సాయం చేయాలని కోరాడు. అందుకోసం భారత్‌, నేపాల్లో అమెరికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జపాన్‌లోని ఒకినావా, మైక్రోనేసియా ప్రాంతంలోని ఫసిపిక్‌ దీవుల్లో అమెరికా ఆధీనంలో ఉన్న గువామ్‌లో టిబెటన్లకు శిక్షణ ఇచ్చారు. ఢిల్లీలో సిఐఏ-మనదేశ సంస్థ కలసి ఒక కేంద్రాన్ని కూడా నడిపినట్లు తరువాత వెల్లడైంది. ఆపరేషన్‌ ఎస్‌టి సర్కస్‌ పేరుతో ఒక పధకాన్ని రూపొందించి 1959లో దలైలామా సోదరుడి నాయకత్వంలో గెరిల్లా తిరుగుబాటు ప్రారంభించారు. అయితే దాన్ని చైనా మిలిటరీ రెండు వారాల్లోనే అణచివేసింది. లాసా నుంచి పారిపోయిన దలైలామా నాటి భారత ప్రభుత్వ సహకారంతో నేటి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతం ద్వారా మనదేశానికి 1959 మార్చి 31న వచ్చాడు. ధర్మశాలలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో కాందిశీకుల పేరుతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత తాను వైదొలిగి ఇతరులకు అప్పగించాడు. ఈ ప్రభుత్వాన్ని మనదేశం గుర్తించనప్పటికీ నాటి నుంచి నేటి వరకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నది. అమెరికా విదేశాంగశాఖ 1998లో వెల్లడించిన పత్రాలలో ఉన్న సమాచారం మేరకు దలైలామా 1970దశకం మధ్య వరకు ఏటా లక్షా 80వేల డాలర్లను అమెరికా సిఐఏ నుంచి పొందినట్లు ఉంది. ఇప్పటికీ అమెరికా మద్దతు కొనసాగుతోంది. నాన్సీ పెలోసీ గుంపు పర్యటన అదే.


దలైలామాతో చర్చలు జరపాలని చైనాను డిమాండ్‌ చేసే హక్కు అమెరికాకు లేదు. తాను చేసిన చట్టాలు, లేదా అవగాహన ప్రకారం బిన్‌లాడెన్‌ లాంటి కొంత మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. అలాంటి వారితో ఎవరైనా చర్చలు జరపాలని కోరితే అంగీకరిస్తుందా. చైనా దృష్టిలో తిరుగుబాటు చేసిన దలైలామా వేర్పాటువాది. అలాంటి వారితో చర్చలు జరిపేది లేదని గతంలోనే ప్రకటించింది.దలైలామా ఒక్క మతనాయకుడే కాదు, ప్రవాసంలో ఉన్న రాజకీయవాది కూడా అని తాజాగా స్పష్టం చేసింది. అతగాడి వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు దలైలామాకు వృద్దాప్యం వచ్చింది. తదుపరి వారసుడు ఎవరన్నది తేలాల్సి ఉంది. తన వారసుడు భారత్‌లో ఉన్నట్లు దలైలామా చెబుతున్నారు. కొత్త దలైలామాను తాము ఆమోదించాల్సిందేనని చైనా అంటున్నది.జూన్‌ పన్నెండున అమెరికా పార్లమెంటు టిబెట్‌-చైనా వివాద బిల్లును ఆమోదించింది.అధ్యక్షుడు ఆమోదిస్తే చట్టం అవుతుంది. అది ఉభయ దేశాల సంబంధాల మీద ప్రభావం చూపుతుంది గనుక అలాంటి పనికి పూనుకోవద్దని చైనా హితవు పలికింది. పురాతన కాలం నుంచి చైనాలో టిబెట్‌ భాగం కాదని దానిలో పేర్కొన్నారు. అసలు అలాంటి చట్టం చేసే అధికారం అమెరికా పార్లమెంటుకు ఎవరిచ్చారు. దలైలామా గురించి ప్రపంచంలో ఆసక్తి తగ్గిపోతున్న తరుణంలో అమెరికా ఈ పని చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d