నకిలీ వార్తల సృష్టి ఆద్యుడు మహాభారతంలో శ్రీకృష్ణుడా !

Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


రానున్న సంవత్సరాలలో ప్రపంచానికి 34 రకాల ముప్పులు ఉంటాయని, వాటిలో ఒకటైన తప్పుడు వార్తల సునామీ తొలుత మన దేశాన్నే తాకుతుందని దవోస్‌లో జరిగిన 54 ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే నకిలీ వార్తల వరదలో నిండా తడిచిన జనం సునామీలో కొట్టుకుపోవటం ఖాయం. అసలు మన జనం అలాంటి వార్తలను అంతగా ఎందుకు నమ్ముతున్నారు? వాటిని ఎవరు, ఎందుకు వండి వడ్డిస్తున్నారు. జనం గుడ్డిగా తాము తిని, ఇతరులకు ఎందుకు తినిపిస్తున్నారు అన్నది ప్రశ్న. ఇతిహాసాలుగా ఉన్న భారత రామాయణాలు, వాటి చుట్టూ అల్లిన పురాణాలు, వేల సంవత్సరాలుగా వాటిలోని అంశాలను ఎందుకు అని ప్రశ్నించకుండా మనల్ని మందమతులుగా, వాలునబడి కొట్టుకుపోయే వారిగా మార్చివేసిన మన పూర్వీకుల ఆచరణ- భావజాలమే దీనికి కారణంగా కనిపిస్తున్నది. ఎందుకు అనటమే పెద్ద పాపం అన్నట్లుగా ప్రశ్నించే తత్వాన్నే అణచివేశారు. రావణుడికి పుష్పక విమానం ఉంది, అదే కాలంలో ఉన్న రాముడికి అదెందుకు లేదు ? ఈ ప్రశ్నవేస్తే ఉత్తిపుణ్యానికే అనేక మంది మనోభావాలను గాయపరుచుకుంటారు. సున్నా, ఇంకా ఇతర అనేక అంశాలను కనిపెట్టింది మనమే అని గొప్పగా చెప్పుకుంటాం.వాటి కొనసాగింపు నవకల్పనలు ఉంటే పారిశ్రామిక విప్లవం, తదుపరి కొనసాగింపుకు మనదేశమే కేంద్రమే అయి ఉండేది.పురాణాల్లో విమాన రూపకల్పన పద్దతి ఉందని గొప్పగా చెప్పుకుంటాం. వర్తమానంలో మన సంస్కృత పండితులు, శాస్త్రవేత్తలు వాటి ఆధారంతో ఆధునిక విమానాలను ఎందుకు రూపొందించలేకపోయారు ? ఇప్పటికైనా పైకీ, కిందికీ, ఎటుబడితే అటు, ఇంథనం లేకుండా తిరిగే పుష్పక విమానాల మాదిరి వాటిని అభివృద్ధి ఎందుకు చేయటం లేదు ? ప్రశ్న లేకుంటే మానవ జాతి ముందుకు పోయేది కాదు, ఆ ప్రశ్నకు అడ్డుగోడలు కట్టి మనువాదులు సమాజాన్ని వెనక్కు నడిపేందుకు చూశారు.ప్రశ్నించిన చార్వాకుల రచనలను సర్వనాశనం చేశారు.


వేల సంవత్సరాల క్రితమే మన దేశం సముద్రాలను దాటి విదేశీ వ్యాపారం చేసిందని చరిత్రలో చెప్పుకుంటాం. అలాంటి సమాజంలో సముద్రం దాటి విదేశాలకు వెళితే పాపం అనే సుభాషితాలు, ఆంక్షలు ఎలా వచ్చాయి. అవి రాకపోతే కొలంబస్‌కు బదులు అమెరికాను మనవారే ఎప్పుడో కనుగొని ఉండేవారు కదా ! అలాంటి అవకాశాలను లేకుండా చేసిందెవరు ? బౌధాయన సూత్రాల ప్రకారం విదేశీగడ్డ మీద హిందూమతానికి చెందిన వారు పవిత్రులుగా ఉండలేరు. సముద్రాలు దాటిన వారు కులాన్ని, పునర్జన్మ అవకాశం కోల్పోతారు.అందువలన సముద్రయానం నేరం, పాపం. దానికి పరిహారం కూడా చెప్పారు. అలాంటి వారు ఏం చేయాలంటే రెండు రోజులకు ఒకసారి కొద్దిగా ఆహారం తీసుకోవాలి, మూడు పూటలా స్నానం చేయాలి. పగలంతా నిల్చోవాలి, రాత్రి పూట కూర్చోవాలి. ఇలా మూడు సంవత్సరాలు చేస్తే పాపం నుంచి విముక్తి అవుతారు. ఎవరైనా అలాంటి పాపానికి, దానికి ప్రాయచిత్తానికి పూనుకుంటారా ? అందుకే నోరు మూసుకొని గిరిగీసుకొని ఉన్నారు. వాటిని ధిక్కరించిన వారు కూడా ఉన్నారు. భీమవరానికి చెందిన యార్లగడ్డ సుబ్బారావ్‌ వారిలో ఒకరు. ఆయన అమెరికా వెళ్లకుండా పౌరోహిత్యమో, కరణీకమో చేసుకుంటూ ఉండి ఉంటే ఫోలిక్‌ యాసిడ్‌ను కనుగొన్న ఘనత ఆయనికీ, భారతీయులుగా మనకీ దక్కేదా ?


చిత్రం ఏమిటంటే ఇప్పటికీ సముద్రాలు దాటిన వారిని తిరుమల తిరుపతి దేవుడి పూజారిగా అనుమతించటంలేదు(వికీపీడియా,ఇతర సమాచారం). బ్రిటన్‌లో న్యాయవాద విద్య అభ్యసించటానికి వెళ్లిన మహాత్మాగాంధీని కులం నుంచి వెలివేశారు. రాజస్థాన్‌ రెండవ మహారాజా సవాయి మధోసింగ్‌ 1901లో బ్రిటన్‌ వెళ్లాడు.హిందువులు విదేశీ నీటిని తాగకూడదన్న నిబంధన ఉన్న కారణంగా ఒక పాత్రలో నాలుగువేల లీటర్ల గంగా జలాన్ని తనతో పాటు తీసుకువెళ్లాడు. ఉడిపి కృష్ట దేవాలయ పూజారిగా సుగేంద్ర తీర్ధ విధులు నిర్వహించటానికి వీల్లేదని 2007లో కొందరు స్వాములు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకటా, అతను విదేశాల్లో పర్యటించి సాగరోల్లంఘనకు పాల్పడినందుకు అని చెప్పారు. మరుసటి ఏడాది కోర్టు తీర్పు ప్రకారం పూజారిగా అనుమతి పొందారు. కేరళలోని తిరువళ్లలో ఉన్న శ్రీవల్లభ ఆలయంలోకి విష్ణునారాయణ నంబూద్రి లండన్‌ పర్యటించి వచ్చిన తరువాత పూజారిగా ప్రవేశించటానికి వీల్లేదని అడ్డుకున్నారు. పాపపరిహారం చేసుకోవాలని, 1008సార్లు గాయత్రీ మంత్రం పఠించి పునీతుడు కావాలని ఆంక్షలు విధించారు. దానికి అతను నిరాకరించారు.చివరికి తిరవాన్కూర్‌ దేవస్థానం బోర్డు జోక్యం చేసుకొని ఇద్దరు అధికారులను తొలగించింది.రాజీగా పవిత్ర జలాలను చల్లుకున్న తరువాత పూజారిగా అనుమతించారు. సనాతన ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించాలని చెబుతున్నవారు విదేశాలు తిరిగి రహస్యంగా ప్రాయచిత్తం చేసుకుంటున్న బహిరంగ రహస్యం తెలిసిందే.ఎవరైనా హేతువాదులు ఇలాంటి కాలం చెల్లిన ఆచారాలను ప్రశ్నిస్తే సనాతన, హిందూ విరోధులు అంటూ సామాజిక మాధ్యమంలో, వెలుపలా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ అనేక దేశాలు తిరిగారు. రామాలయ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సనాతన ధర్మం ప్రకారం ఆయన ప్రాయచిత్తం చేసుకున్నట్లు ఎక్కడా వార్తలు చదవలేదు. రహస్యంగా ఏమైనా చేశారో తెలియదు.


ఇలాంటి చాదస్తాలతో మునిగి తేలుతున్న జనానికి డబ్బుకావాలి, దాంతోపాటు తరతరాలుగా గూడుకట్టుకున్న భయంతో ప్రాయచిత్తం చేసుకోవాలి. అందుకే ఒక చేత్తో డాలర్‌ పూజ మరో చేత్తో పోలేరమ్మకు సద్ది పెడుతున్నారు. డాలర్‌మే పరమాత్మాహై ! అందుకే వాటి కోసం ఎంతటి స్వదేశీ, సనాతన ధర్మ పరిరక్షకులైనా తలవంచాల్సిందే. ఇక్కడ హేతువు, ప్రశ్నను చంపేస్తున్నాం. వాలునబడి కొట్టుకుపోయేందుకు అలవాటు పడ్డాం గనుక గత తరాలు పుక్కిటి పురాణాలను నమ్మితే వర్తమానంలో వాట్సాప్‌ సందేశాలను మోసుకుపోయేందుకు సిద్దపడుతున్నాం. ఇక తప్పుడు వార్తల విషయానికి వస్తే అర్ధ సత్యం అనేది పూర్తి అబద్దమని బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ చెప్పాడు. అబద్దాలు అనేక రకాలుగా ఉంటాయి, నిజానికి అలాంటి అవకాశాలు లేవన్నది ఒక సామెత. అసత్య ప్రచారం, అబద్దాలను వాస్తవంగా చిత్రించటం మనకు వారసత్వంగా వచ్చినట్లు కనిపిస్తోంది. వర్తమానంలో తప్పుడు వార్తలు, మార్ఫింగ్‌ వీడియోలు, ఆడియోలు, తప్పుడు సమాచారం జనాన్ని పక్కదారి పట్టించటంలో భాగమే. మహాభారత కథ ప్రకారం తప్పుడు వార్తలు, మాయల సృష్టికర్తగా శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. మరి కృష్ణుడు ఎందుకు అలాంటి పని చేశాడు అంటే యుద్ధంలో ద్రోణుడిని చంపకపోతే పాండవులకు విజయం దక్కదన్న కారణమే. ఒక ఎత్తుగడపన్ని ధర్మరాజుతో అశ్వద్దామ హతహ అని పెద్దగా పలికించిన తరువాత నారో వా కుంజరో వా (మరణించింది మనిషి లేదా ఏనుగు కావచ్చు అని అర్ధం) అని పూర్తి చేసేటపుడు వినపడకుండా బాజాలు మోగించేట్లు చేయించాడని, దాంతో అశ్వద్దామ మరణించాడనే వార్త వ్యాపించింది. అది విన్న తండ్రి ద్రోణుడు అస్త్ర సన్యాసం చేయటం, ద్రోణుడిని చంపివేయటంతో పాండవులు ముందుకు పోయారని చెబుతున్నది తెలిసిందే. తన కుమారుడికి చావులేదని తెలిసినప్పటికీ ద్రోణుడు అలా ఎందుకు అస్త్రసన్యాసం చేశాడంటే ధర్మరాజు మీద ఉన్న తిరుగులేని విశ్వాసం.


ఎవరినైనా గుడ్డిగా నమ్మితే తప్పుడు వార్తలు ఎంతగా ప్రభావితం చేసేదీ దీనిలో మనకు కనిపిస్తుంది. దాన్ని సొమ్ము చేసుకొనేందుకే హిందూ, ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాలకు చెందిన వారు, వాటిని ఆశ్రయించుకున్న వారు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల యుద్ధాన్ని ఏం చేసైనా గెలవాలన్న మహాభారత నీతి సూత్రమే గత రెండు లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తప్పుడు వార్తల వ్యాప్తికి తెరలేపింది.నాడు మహాభారత యుద్దంలో అలాంటి వార్తలతో పాండవులు గెలిచి ధర్మాన్ని నిలబెట్టారని చెబుతుంటే నేడు అపర మహాభారతంలో కౌరవులు గెలుస్తూ రాజధర్మాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెడుతున్నారు.జనం నమ్ముతున్నారు గనుక అది సాధ్యమౌతోంది. అందుకోసం మీడియా, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌(పూర్వపు ట్విటర్‌) వంటి అస్త్రాలను వాడుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఒక విదేశీ గడ్డ మీద మహాభారత రధం దొరికింది అని ఒక వీడియోను యూట్యూబ్‌లో పెడితే జనం వేలం వెర్రిగా చూశారు. నిజానికి అది 2018లో చైనా టీవీ నిర్మించిన ఒక డాక్యుమెంటరీలో చూపిన 255 సంవత్సరాల నాటి షాంగ్‌ రాజవంశ రధం. ఒక పురావస్తు ప్రదర్శనశాలలో చిత్రీకరించింది. అదే విధంగా భీముడి కుమారుడు ఘటోత్కచుడి భారీ కంకాళం దొరికిందని చెప్పినా జనం గుడ్డిగా నమ్మారు.


రావణుడి చెరలో ఉన్న సీత శీలం గురించి తప్పుడు వార్తల ప్రచారం కారణంగానే రాముడు ఏం చేశాడో తెలిసిందే. తాజాగా నటి రష్మిక మందన్నా మార్ఫింగ్‌ వీడియో సంచలనం, నిందితుడి అరెస్టు తెలిసిందే. బంగరు లేడి ఉండదని తెలిసినా దాన్ని పట్టుకురమ్మని సీత కోరటం ఏమిటి ? లక్ష్మణుడిని సీతకు కాపలాగా పెట్టి రాముడు ఆ లేడి వెంట వెళ్లటం, దాన్ని చంపటం, అప్పుడు లేడి రూపంలో వచ్చిన మారీచుడు ప్రాణం కోల్పోతూ కూడా రాముడి స్వరాన్ని అనుకరించి సీతా, లక్ష్మణా అని అరవటం, సీత కంగారు పడి లక్ష్మణుడిని వెళ్లి చూడమని కోరటం, ఏం కాదు అన్న తిరిగి వస్తాడని చెప్పినా వినకపోవటం, విధిలేక ఒక గీత గీసి దాన్ని దాటి వెలుపలికి రావద్దని లక్ష్మణుడు అడవిలోకి వెళ్లగానే రావణుడు మారువేషంతో రావటం, గీత దాటిన సీతను అపహరించటం తెలిసిందే. కొద్ది సంవత్సరాల క్రితం జెఎన్‌యులో దేశద్రోహ నినాదాలు చేశారంటూ మార్ఫింగ్‌ వీడియోలు సృష్టించిన కథకు, మాయలేడి ఉదంతానికి సంబంధం కనిపించటలేదూ ! రావణుడి ఆయుపట్టు గురించి రాముడికి చెప్పిన విభీషణుడు ధర్మం కోసం పనిచేసిన పవిత్రుడిగా ఆరాధిస్తాం. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలలో అలాంటి వారిని ఎదుటి పక్షం తయారు చేసేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నది, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నవి అంటే రామాయణం నుంచే. మన సమాజ బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నవారిని తప్పు పట్టాలా ? ఎలాంటి తర్క వితర్కం, హేతుబద్దత లేకుండా నమ్ముతున్నవారిని విమర్శించాలా ? కొన్ని దేశాలు ఇలాంటి తప్పుడు వార్తలకు దూరంగా ఎందుకున్నాయి ? మనల్ని వాటిలో ముంచితేల్చుతున్నది ఎవరు ? విధి అనుకుందామా, వాట్సాప్‌ అందామా ? మన చేతుల్లో లేని విధి రాతగా భావించి అచేతనంగా ఉన్నా, మన ఫోన్లో ఉన్న వాట్సాప్‌ను అడ్డుకోకపోయినా నష్టపోయేది మనమే, కాదంటారా ?

కేరళకు అవమానం, పదవికి అగౌరవం :75 సెకండ్లలో ప్రసంగం పూర్తి చేసిన గవర్నర్‌ సరికొత్త రికార్డు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా గవర్నర్లలో కాషాయ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తీరే వేరుగా ఉంది. అనితర సాధ్యమైన కొత్త చరిత్రను జనవరి 25 గురువారం నాడు సృష్టించారు. సరిగ్గా గణతంత్ర దినానికి ఒక రోజు ముందు రాజ్యాంగాన్ని, వ్యవస్థలను అపహాస్యం చేశారనే విమర్శలకు తావిచ్చారు. కేరళ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సాంప్రదాయబద్దంగా గవర్నర్‌ చేయాల్సిన ప్రసంగాన్ని కేవలం 75 సెకండ్లలో ముగించి వెళ్లిపోయారు. 1982 జనవరి 29న నాటి గవర్నర్‌ జ్యోతి వెంకటాచలం కేవలం ఆరు నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించిన రికార్డును ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ బద్దలు కొట్టారు. స్పీకర్‌ ఎఎన్‌ షంషీర్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గవర్నర్‌కు వీడ్కోలు కూడా రెండు నిమిషాల్లో ముగిసింది.అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌కు సిఎం పుష్పగుచ్చం అందచేసి స్వాగతం పలికినపుడు ముఖం పక్కకు పెట్టుకొని దాన్ని అందుకున్నారు. తరువాత ప్రసంగం ప్రారంభానికి ముందు సభ్యులను ఉద్దేశించి సంబోధించే మర్యాదను కూడా పాటించకుండా 62పేజీలు, 136 పేరాల ప్రసంగంలో చివరి పేరాను చదివి ముగించినట్లు మళయాల మనోరమ పేర్కొన్నది. నా ప్రభుత్వం అనే పదాలను ఉచ్చరించకుండా దాటవేసేందుకు ఇలా చేసినట్లు పేర్కొన్నది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్లు చేసే ప్రసంగాలను ఆయా ప్రభుత్వాల విధాన పత్రాలుగా పరిగణిస్తారన్నది తెలిసిందే. వాటిలో సాధించిన వాటితో పాటు రానున్న రోజుల్లో కేంద్రీకరించే అంశాలను కూడా వెల్లడిస్తారు. మంత్రివర్గం పంపిన ప్రసంగ పాఠం మీద ఎలాంటి అభ్యంతరాలు వెల్లడించకుండా వెంటనే ఆమోదం తెలపటం అనేక మందికి ఆశ్చర్యం కలిగించింది. వివాదాలకు తెరదించేందుకు సానుకూల సూచికగా ఇలా చేశారేమో అనుకున్నారు. అయితే ప్రసంగించిన తీరును ఎవరూ ఊహించలేదు.


ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌ 9.02కి ప్రసంగం ముగించి 9.04కల్లా అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. సభను ఉద్దేశించి ప్రసంగించటం తనకు సంతోషంగా ఉందనే ముక్కతో ప్రారంభించి చివరి పేరాను చదువుతున్నట్లు ప్రకటించి వెంటనే ముగించి వెళ్లిపోయారు.వెలుపల వేచి ఉన్న మీడియాకు ఒక నమస్కారం చేసి కారెక్కారు. అసెంబ్లీకి రావటం, ప్రసంగం చదవటం, జాతీయ గీతాలాపాన, వెళ్లిపోవటం అంతా నాలుగు ఐదు నిమిషాల్లోపే పూర్తయింది. గవర్నర్‌ చదివిన చివరి పేరాలో ఇలా ఉంది.” మన గొప్ప వారసత్వం భవనాలు లేదా కీర్తి స్థంభాలలో కాదు, విలువకట్టలేని భారత రాజ్యాంగం, కాలంతో నిమిత్తం లేని ప్రజాస్వామ్య విలువలు,లౌకికవాదం, సమాఖ్యవాదం,సామాజిక న్యాయం పట్ల మనం చూపే గౌరవం, మర్యాదలలో ఉంది. సహకార సమాఖ్యవాద సారమే ఇంతకాలం భారత్‌ను ఐక్యంగా, బలంగా ఉంచింది.దీన్ని దిగజారకుండా చూడటమే మన మహత్తర కర్తవ్యం. సుందరమైన, భిన్నత్వం కలిగిన దేశంలో భాగస్వాములుగా మనం కలసి కట్టుగా సమగ్ర అభివృద్ధి, సమున్నతంగా ముందుకు తీసుకుపోయే విధంగా దేశ చిత్రాన్ని రూపొందించాల్సి ఉంది. మన దారిలో ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిగమించాలి ” ఈ పేరాలో ఎక్కడా నా ప్రభుత్వం అనే పదం లేదు. అందుకే గవర్నర్‌ ఈ మాత్రమైనా చదివి ఉంటారన్నది స్పష్టం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. సమాఖ్యవాదం పట్ల గౌరవ, మర్యాదలను చూపాలని చెప్పిన గవర్నర్‌ వ్యవహరించిన తీరు అందుకు అనుగుణంగా ఉందా లేదా అన్నది ఎవరికి వారు నిర్ధారణకు రావచ్చు. క్లుప్తంగా ముగించటం ద్వారా గవర్నర్‌ తన అసంతృప్తిని వెల్లడించారని రాష్ట్ర బిజెపి వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను తీవ్రంగా అవమానించినట్లు ఆరోపించింది. గవర్నర్‌ చర్యతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు వర్ణించింది.


గవర్నర్‌ వ్యవహరించిన తీరు రాష్ట్రాన్ని అవమానించటమే అని ప్రతిపక్ష యుడిఎఫ్‌ నేత వి సతీశన్‌ విమర్శించారు. ప్రతిపక్ష ఉపనాయకుడు, ముస్లింలీగ్‌ నేత కున్హాలికుట్టి మాట్లాడుతూ తాము గవర్నర్‌ రావటాన్ని రాకెట్‌ మాదిరి వెళ్లిపోవటాన్ని చూసి ఆశ్చర్యపోయామని, కనీసం ప్రతిపక్ష సభ్యులవైపు కూడా చూడలేదని, ఇది అసెంబ్లీని అవమానించటమే అన్నారు. గవర్నర్‌ చర్యను పట్టించుకోవద్దని, నిరసనల వంటివి తెలపవద్దని అసెంబ్లీ ముగిసిన తరువాత ఎల్‌డిఎఫ్‌ ఎంఎల్‌ఏల సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సమావేశం తరువాత రాష్ట్ర న్యాయ, పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్‌ మాట్లాడుతూ గవర్నర్‌ ” రాజ్యాంగబద్ద విధి ” నిర్వహించారని చెప్పారు. మంత్రివర్గం రూపొందించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్‌ ఆమోదించారు. మొదటి చివరి పేరాలను చదివినప్పటికీ మొత్తం చదివినట్లే పరిగణించబడుతుంది, అసెంబ్లీ రికార్డుల్లో అదే నమోదౌతుంది. గవర్నర్‌ పూర్తి పాఠాన్ని ఎందుకు చదవలేదో తెలియదు, చదవలేకపోయారా ఇంకేమైనా కారణాలున్నదీ తెలియదని రాజీవ్‌ చెప్పారు. గవర్నర్‌ ఇలా ముగించారంటే బహుశా ఆయనకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమోనని రాష్ట్ర మంత్రి సాజీ చెరియన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్‌గా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదంతో మీడియాకు ఎక్కుతూనే ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసిన భాగాన్ని అసెంబ్లీలో చదివేందుకు తిరస్కరించి వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల విద్యార్థులను తూలనాడి వారి నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్నారు. బహుశా ఆ ఉక్రోషాన్ని ఈ రూపంలో తీర్చుకొని ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తన మీద దాడికి ఎస్‌ఎఫ్‌ఐ గూండాలను, డబ్బిచ్చి నేరగాండ్లను ఉసిగొల్పినట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ తీరుకు నిరసనగా ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ విద్యార్ధులు నిరసన తెలుపుతున్నారు. గవర్నరు ప్రసంగాన్ని అసెంబ్లీ మీడియాకు విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఆదాయవనరుగా లాటరీలు, మద్యం వుండటం సిగ్గుగా ఉందని గతంలో గవర్నర్‌ ఆరోపించారు. గురువారం నాటి గవర్నర్‌ ప్రసంగంలో దాని గురించి వివరణ ఉంది. రాష్ట్ర పన్ను రాబడిలో మద్యం ద్వారా వస్తున్న మొత్తం కేవలం 3.7శాతమేనని, కొన్ని రాష్ట్రాలలో గరిష్టంగా 22శాతం వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ధాన్య రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాలుకు రు.2,820 కనీస మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపింది.


గవర్నర్‌గా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ స్వతంత్రంగా వ్యవహరించటం లేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్‌ నారిమన్‌ చేసిన వ్యాఖ్య మీద గవర్నర్‌ విరుచుకుపడ్డారు. డిసెంబరు నెలలో ముంబైలో జరిగిన ఒక సభలో రోహింటన్‌ మాట్లాడుతూ గవర్నర్లుగా స్వతంత్రంగా వ్యవహరించే వారిని మాత్రమే పదవుల్లో నియమించాలని సుప్రీం కోర్టు చెప్పే రోజుకోసం తాను వేచి చూస్తున్నట్లు చెప్పారు.” ఈ రోజు మనకు కనిపిస్తున్నటు వంటి వారిని నియమించకూడదు,ఉదాహరణకు ఈ రోజు కేరళలో ఉన్నటువంటి వారిని ” అన్నారు. బుధవారం నాడు చెన్నరులో జరిగిన ఒక సభలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ రోహింటన్‌ స్వలాభంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.రోహింటన్‌ తండ్రి సీనియర్‌ న్యాయవాది పాలీ ఎస్‌ నారిమన్‌, ఆయన సహాయకులు కేవలం సలహా చెప్పినందుకే కేరళ ప్రభుత్వం నుంచి రు.40లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల గవర్నర్ల మీద ఎలాంటి వ్యాఖ్య చేయకుండా తననే ఎంచుకోవటానికి తండ్రి నుంచి సలహాలు తీసుకోవటాన్ని అంగీకరించకపోవటమే అని చెప్పుకున్నారు.

ఆక్స్‌ఫామ్‌ 2024 నివేదిక : కనీవినీ ఎరుగని అసమానతల ప్రపంచం !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


”ఇక్కడ తిరుగులేని ఆర్థిక వాస్తవం ఉంది. దాన్ని మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే. ఇంత ఆదాయ, సంపద అసమానతను, సంపదల కేంద్రీకణను చరిత్ర చూడలేదు ” అమెరికా డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ ఆక్స్‌ఫామ్‌ 2024 అసమానతల నివేదికకు రాసిన ముందు మాటలో చెప్పిన మాటలివి. దవోస్‌ ప్రపంచ ఆర్థికవేదిక 54వ వార్షిక సమావేశాల సందర్భంగా దీన్ని విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాలు కొందరికి నమ్మశక్యం కానంతగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా సమాజంలో దిగువన ఉన్న సగం మంది కంటే ముగ్గురు ఎక్కువ సంపదలను కలిగి ఉన్నారు. అరవైశాతం మంది కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కార్మికుల ఉత్పాదకత భారీ ఎత్తున పెరిగినప్పటికీ యాభై సంవత్సరాల నాటి కంటే అమెరికా కార్మికుల సగటు వేతనాలు నేడు తక్కువగా ఉన్నాయని శాండర్స్‌ పేర్కొన్నాడు. ఆక్స్‌ఫామ్‌ చెప్పినట్లు ఇది ఒక్క అమెరికా సమస్య మాత్రమే కాదు అన్నాడు.2020 తరువాత ఐదు వందల కోట్ల మంది జనం పేదలుగా మారితే ఐదుగురు కుబేరుల సంపద రెండు రెట్లు పెరిగింది. ఇది ప్రపంచానికి చెడువార్త అన్నాడు. రాబడి, సంపదల అసమానతల తీవ్రతకు ఒక మచ్చుతునక అమెజాన్‌ సంస్థ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఉదంతం. అతగాడు ప్రపంచ కుబేరుల్లో ఒకడు. సంపద విలువ 167.4 బిలియన్‌ డాలర్లు.దీనిలో 2020 తరువాత పెరిగిన మొత్తమే 32.7బి.డాలర్లు ఉంది.అందుకే దాన్ని ఏం చేయాలో తోచక 550 కోట్ల డాలర్లు ఖర్చుచేసి తన కంపెనీ తయారు చేసిన రాకెట్లో ఆకాశపు అంచులదాకా వెళ్లి వచ్చాడు. ఆహా ఎంత అదృష్టం అనుకున్నాం తప్ప ఆ సొమ్ముతో ఎంతో మంది పేదలకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని ఆలోచించలేకపోయాం. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వీలు కల్పిస్తున్న ప్రభుత్వాలను విమర్శించే వారు అమెజాన్‌ అధిపతి పది నిమిషాల పది సెకండ్ల పాటు అంతరిక్షంలో విహరించటానికి అతగాడు చేసిన నలభై అయిదు వేల కోట్ల రూపాయలతో ఒక ఏడాది పాటు దేశమంతటా మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించవచ్చు. తన కంపెనీలో యూనియన్‌ ఏర్పాటు చేసుకోవటాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్న ఆ ధనమదాంధుడిని ఎప్పుడైనా నిరసించారా ? తమ కంపెనీ హౌల్‌ ఫుడ్స్‌ ద్వారా విక్రయించే రొయ్యలను శుద్ది చేసే అతగాడి ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలను విశ్రాంతికి, చివరికి పానీయం కూడా తాగేందుకు సమయం ఇవ్వని పెద్దమనిషని ఎంతమందికి తెలుసు ?


ఈ ప్రపంచం కొద్ది మందికి భూతల స్వర్గం అయితే అత్యధికులకు భూతాల నిలయం.2020 నాటికి ఉన్న సంపదతో పోలిస్తే బిలియనీర్లు మూడు సంవత్సరాల్లో 34శాతం లేదా 3.3లక్షల కోట్ల డాలర్ల మేర పెంచుకున్నారు. ద్రవ్యోల్బణం వీరికి మూడు రెట్ల సంపదను పెంచింది.దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ మేరకు సామాన్యుల జేబుల నుంచి మాయమైంది. సంపద అంతా జనాభాలో కేవలం 21శాతం మంది ఉండే ధనికదేశాల్లోనే కేంద్రీకృతమైంది.ప్రయివేటు సంపదల్లో 69శాతం, ప్రపంచ బిలియనీర్లలో 74శాతం మంది ఇక్కడే ఉన్నారు. ద్రవ్య సంబంధ ఆస్తులలో ప్రపంచంలోని ఒకశాతం మంది వద్ద 43శాతం, ఐరోపాలో 47, ఆసియాలో 50శాతం ఉన్నాయి. 1995-2015 మధ్య కాలంలో 60 ఫార్మాకంపెనీలు పదిగా మారాయి. కేవలం రెండు అంతర్జాతీయ కంపెనీలు ప్రపంచ విత్తన మార్కెట్‌లో 40శాతం వాటా కలిగి ఉన్నాయి.నాలుగు కంపెనీలు ప్రపంచ పురుగుమందుల మార్కెట్‌లో 62శాతం వాటా కలిగి ఉన్నాయి. ఆన్‌లైన్‌ ప్రకటనల్లో మూడువంతుల ఖర్చు ఫేస్‌బుక్‌, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌ కంపెనీలకే పోతోంది.వెతుకులాటలో 90శాతం గూగుల్‌ ద్వారానే జరుగుతోంది. ఎకౌంటింగ్‌ మార్కెట్‌లో 74శాతం నాలుగు కంపెనీలదే. గుత్తాధిపత్యం పెరుగుతున్నదని, అది అసమానతలకు దారి తీస్తున్నదని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు అంగీకరించినా నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు.ప్రపంచంలో నిజవేతనాలు తగ్గుతున్నట్లు, దీంతో అసమానతలు పెరుగుతున్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) పేర్కొన్నది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెరగని కారణంగా గడచిన రెండు సంవత్సరాల్లో 79.1 కోట్ల మంది కార్మికులు 1.5లక్షల కోట్ల డాలర్లు నష్టపోయినట్లు పేర్కొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో సవరించటం తప్ప తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడివడిన పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీసవేతనాలను సవరించకపోవటం లేదా ముసాయిదా పేరుతో అడ్డుకోవటం తెలిసిందే.ప్రపంచమంతటా ఇదే వైఖరి.


విద్య, వైద్యం వంటి సేవలను వస్తువులుగా మార్చి వాటిని ప్రభుత్వం రంగం నుంచి తప్పించి ప్రయివేటు కార్పొరేట్‌లు స్వంతం చేసుకొని లాభాలు దండుకోవటం కూడా అసమానతలకు దారితీస్తున్నది. కాలుష్యాల నిరోధ చర్యలు తీసుకోకుండా గతంలో లబ్ది పొందిన కార్పొరేట్లే ఇప్పుడు వాటి నివారణ పేరుతో ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు పొందుతున్నాయి.పేద, మధ్య తరగతి దేశాలు రుణభారంతో సతమతం కావటంతో పాటు తీవ్ర అసమానతలు పెరుగుతున్నాయి. ప్రపంచ మొత్తం పేదల్లో 57శాతం(240 కోట్ల) మంది పేద దేశాల్లో ఉన్నారు. జీవన పరిస్థితి దిగజారటంతో ప్రపంచమంతటా సమ్మెలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెజాన్‌ కంపెనీలో పని చేస్తున్నవారు 30దేశాల్లో 2022లో ఆందోళనలు చేశారు.జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా 2023లో 122 దేశాల్లో ఆందోళనలు జరిగాయి. కరోనా తరువాత కోట్లాది మంది పౌరుల పరిస్థితి పూర్వపు స్థితికి చేరుకోలేదు. 2017-2020తో పోలిస్తే ప్రపంచ అతి పెద్ద కార్పొరేట్‌ సంస్థలు 2021,2022లో 89శాతం లాభాలను పెంచుకున్నాయి. 2023తొలి ఆరునెలల వివరాలను పరిశీలిస్తే గత రికార్డు లాభాల చరిత్రను బద్దలుకొడుతున్నట్లు కనిపిస్తున్నది. చమురు, విలాసవస్తువులు, విత్త సంబంధ కంపెనీలకు లాభాలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోని 0.001శాతం కార్పొరేట్లు అన్ని కార్పొరేట్ల లాభాల్లో మూడోవంతు పొందాయంటే సంపదల కేంద్రీకరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా కంపెనీల్లో 89శాతం వాటాలు తెల్లవారి చేతుల్లో ఉండగా ఆఫ్రికన్లకు 1.1,హిస్పానిక్‌లకు 0.5శాతం ఉన్నాయి. పదకొండుశాతం మంది ప్రపంచ బిలియనీర్లు అధికారంలో లేదా రాజకీయ నేతలుగా ఉన్నారు.గడచిన నాలుగు దశాబ్దాలకాలంలో 30 ఐరోపా దేశాలలో మూడు వేల విధానపరమైన ప్రతిపాదనలను పరిశీలించగా ధనికులు మద్దతు ఇచ్చిన వాటినే అమలు జరిపారు తప్ప పేదల వాటిని పట్టించుకోలేదు.


అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) జరిపిన పరిశోధనలో కార్పొరేట్‌ శక్తుల గుత్తాధిపత్యం పెరగటం వలన అమెరికాలోని వస్తు ఉత్పాదక రంగంలో 76శాతం మంది కార్మికుల ఆదాయాలు తగ్గాయని తేలింది. ఈ సంస్థలు, కార్మికుల వేతనాలనే కాదు మార్కెట్లను అదుపు చేస్తాయి. అవసరమైన వస్తువులు, సేవలను అందుబాటులో లేకుండా చేస్తాయి. నవకల్పనలు, కొత్త సంస్థలను ఎదగనివ్వకుండా చూస్తాయి. తమ లాభాల కోసం ప్రభుత్వ సేవలను ప్రైవేటీకరించేట్లు చూస్తాయి. తమ లాభాలకు ముప్పురాకుండా ధరలను కూడా పెంచుతాయి. వీటికి ప్రభుత్వాలు ఎల్లవేళలా మద్దతు ఇస్తాయి. అందుకే కొన్ని కార్పొరేట్లు దేశాల జిడిపి కంటే ఎక్కువ సంపదలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు యాపిల్‌ కంపెనీ విలువ మూడు లక్షల కోట్ల డాలర్లనుకుంటే 2023లో మన దేశ జిడిపి 3.7లక్షల కోట్లని అంచనా. ప్రపంచంలోని ఇలాంటి ఐదు పెద్ద కంపెనీల సంపదలు మొత్తం ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల మొత్తం జిడిపి కంటే ఎక్కువ. మొత్తం బహుళజాతి కంపెనీల లాభాల్లో 1975లో పెద్ద కంపెనీల వాటా నాలుగుశాతం కాగా 2019నాటికి పద్దెనిమిది శాతానికి పెరిగింది.


ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది ద్రవ్య పెట్టుబడి అన్న సంగతి తెలిసిందే.2009 నుంచి ఈ రంగంలో ఉన్న కొన్ని కంపెనీలు ప్రస్తుతం 5.8లక్షల కోట్ల డాలర్ల ప్రైవేటు పెట్టుబడిదారుల ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇవిగాక బ్లాక్‌ రాక్‌, స్టేట్‌స్ట్రీట్‌, వాన్‌గార్డ్‌ అనే ఫండ్స్‌ సంస్థలు 20లక్షల కోట్ల డాలర్ల మేర ద్రవ్య ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇంత పెద్ద సంస్థలు ప్రభుత్వ విధానాలను, దేశాధినేతలను శాసించటంలో ఆశ్చర్యం ఏముంది. గుత్త సంస్థలు ప్రపంచానికి కొత్త కాదు. ఇంగ్లీష్‌ ఈస్టిండియా కంపెనీ ప్రారంభమైన 1,600 సంవత్సరం నుంచి ఎన్నిదేశాలను ఆక్రమించుకొని దోచుకున్నదీ ఎరిగిందే.వర్తమానంలో రాక్‌ఫెల్లర్‌ కంపెనీ ప్రపంచ చమురు సామ్రాజ్యం, సిసిల్‌ రోడెస్‌ ప్రపంచ వజ్రాల మార్కెట్‌ను శాసిస్తున్న సంగతీ తెలిసిందే. ఒక దశను దాటిన తరువాత ప్రజాస్వామిక రాజ్యం కంటే ప్రైవేట్‌ అధికారం పెరిగితే స్వేచ్చకు హామీ ఉండదని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ చెప్పాడు. గుత్త సంస్థలను అడ్డుకున్నందుకే అవి కుట్రచేసి మిలిటరీ తిరుగుబాటుద్వారా చిలీ కమ్యూనిస్టు నేత సాల్వెడార్‌ అలెండీని అధికారం నుంచి కూల్చివేసిన సంగతి తెలిసిందే. పదహారు వందల బడాకంపెనీల మీద ఒక సర్వే నిర్వహించగా కేవలం 0.4శాతం మాత్రమే కార్మికులకు జీవన వ్యయ వేతనం ఇస్తున్నట్లు అంగీకరించాయి.కార్మిక సంఘాలను ఏర్పాటు కానివ్వకుండా అడ్డుకోవటం, అణచివేతల కారణంగా యూనియన్లలో చేరుతున్నవారి సంఖ్య తగ్గుతోంది.ఓయిసిడి దేశాలలో 1985లో 30శాతం మంది చేరగా 2017నాటికి 17శాతానికి పడిపోయింది.


మహిళలకు జరుగుతున్న అన్యాయం, వేతనాల చెల్లింపు కూడా దారుణంగా ఉంది. మధ్య ప్రాచ్యం,ఉత్తర ఆఫ్రికాలో ఒక పురుషుడు ఎలాంటి చెల్లింపులు లేని సంరక్షణ పనిలో వారానికి ఒకటి నుంచి ఐదు గంటల వరకు ఉంటుండగా అదే మహిళలు 17 నుంచి 34గంటలు పని చేస్తున్నారు. ప్రపంచమంతటా వీరి పని విలువను నగదు రూపంలో లెక్కిస్తే ఏటా 10.8లక్షల కోట్ల డాలర్లుగా తేలింది. అధికవేతనాలు ఉన్నాయని అనుకుంటున్న ప్రపంచ టెక్నాలజీ కంపెనీల్లో చెల్లిస్తున్నదాని కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.ఐరోపా సూపర్‌ మార్కెట్లకు సరఫరా చేసే పండ్లు, ద్రాక్ష క్షేత్రాల్లో పని చేసే కోస్టారికా, దక్షిణాఫ్రికా మహిళలకు ఒక సీసా వైన్‌ విక్రయించే ధరలో కేవలం 1.2శాతమే వేతనాల రూపంలో లభిస్తుండగా సూపర్‌ మార్కెట్లకు 50శాతం పైగా దక్కుతున్నది. సంపదలు కార్పొరేట్ల వద్ద పేరుకు పోవటానికి, అసమానతలు పెరగటానికి పన్నుల తగ్గింపు కూడా ఒక ప్రధాన కారణం.ఓయిసిడి దేశాలలో 1980లో కార్పొరేట్‌ ఆదాయపన్ను 48శాతం ఉండగా 2022నాటికి 23.1శాతానికి తగ్గింది. ప్రపంచవ్యాపితంగా ఇదే ధోరణి.నూటనలభై ఒక్క దేశాలలో 111 చోట్ల 2020-2023 కాలంలో తగ్గాయి. ప్రపంచమంతటినీ చూస్తే 23 నుంచి 17శాతానికి పడిపోయాయి. విదేశాల్లో పొందిన లాభాల్లో 35శాతం ఎలాంటి పన్నులు లేని ప్రాంతాలకు చేరాయి. పన్ను విధానాలపై కార్పొరేట్ల ప్రభావానికి ఇది నిదర్శనం. ఈ మేరకు ప్రభుత్వాలకు రాబడి తగ్గటంతో సంక్షేమ కార్యక్రమాలకు కోత విధిస్తున్న కారణంగా ప్రపంచమంతటా అశాంతి పెరుగుతున్నది..

బాల రామాలయం ఓకే, కాలయాపన కమిటీలు, కోట్లాది రైతుల సంగతేమిటి మోడీ గారూ !

Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎట్టకేలకు అయోధ్య బాలక్‌ రామాలయ ప్రాణ ప్రతిష్ట జరిగింది. జనవరి 22న ఆ కార్యక్రమ కోసం ప్రధాని నరేంద్రమోడీ దేశం నలుమూలలా ఎంతలా తిరిగిందీ, ఎన్ని పొర్లుదండాలు, ఎక్కడ ఎన్ని మొక్కులు మొక్కిందీ చూశాము. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా లోక్‌సభ ఎన్నికలు కనిపిస్తున్నందున ఈ తాపత్రయాన్ని అర్ధం చేసుకోవటం కష్టం కాదు. పోయిన దేశ ప్రతిష్టను, దానితో పాటు విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చే పేరుతో అధికారానికి వచ్చిన కొత్తలో విదేశాలు తిరిగిన తీరు, చేసిన హడావుడి చూశాము.సరే ఎవరెన్ని విమర్శలు చేసినా ఖాతరు చేయని చరిత్రకెక్కిన పాలకుల సరసన చేరిన నరేంద్రమోడీ రామాలయ ప్రారంభాన్ని ప్రభుత్వ-సంఘపరివార్‌ కార్యక్రమంగా మార్చివేశారు. మతానికి ప్రభుత్వానికి ఉన్న గీతను చెరిపివేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఎన్ని దేశాలు తిరిగినా, మనదేశ ప్రతిష్టను పెంచినట్లు ప్రచారం చేసుకున్నా చెప్పినంతగా పెట్టుబడులు రాలేదు.పలుకుబడి పెరుగుదలకు రుజువూ లేదు. మేడిన్‌, మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత సాకారం కాలేదు. ఇప్పుడు రామాలయం కోసం తిరిగినదానికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వస్తాయా ? ఏం జరిగిందీ, ఎందుకు జరిగిందీ దేశమంతా చూసింది. ఏం జరగనుందో చూద్దాం !


రామాలయం మీద చూపిన శ్రద్ద ప్రజల సమస్యల మీద నరేంద్రమోడీ చూపారా ? తమది పనిచేసే ప్రభుత్వమని మోడీ, బిజెపి కూడా చెప్పుకుంటుంది.పదేండ్లలో అలాంటిదేమీ కనిపించలేదు.అచ్చేదిన్‌లో ఆకలో రామచంద్రా అన్న పరిస్థితిని అంగీకరిస్తూ సబ్సిడీతో కూడా జనాలు కొనుక్కోలేని స్థితిలో (లేకుంటే ఉచితంగా ఇవ్వాల్సిన పనేముంది) ఉన్నారన్న వాస్తవాన్ని గ్రహించి ఉచిత ఆహార ధాన్యాల అందచేత పథకాన్ని పొడిగించారు. కొన్ని అంశాల్లో మోడీ సర్కార్‌ ఎక్కడలేని వేగాన్ని కనపరిచిన మాట వాస్తవం.బహుశా కనపడని శక్తి ఏదో నెడుతూ ఉండాలి. ఉదాహరణకు మూడు సాగు చట్టాలనే తీసుకుందాం.2020 సెప్టెంబరులో 17న లోక్‌సభ, 20తేదీన రాజ్యసభ ఆమోదం, 27న రాష్ట్రపతి అంగీకారం, పది రోజుల్లో అంతా జరిగింది. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాలను సంప్రదించలేదు. ఎంత వేగంగా చట్టాలను రుద్దారో ప్రతిఘటన కూడా అంతే తీవ్రంగా ఎదురైంది. రాష్ట్రపతి ఆమోదం పొందక ముందే సెప్టెంబరు 25న భారత బంద్‌కు పిలుపు ఇచ్చారు.వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రైతులను రాజధానిలో ప్రవేశంచకుండా అడ్డుకోవటంతో నవంబరు 26 నుంచి రైతులు ఢిల్లీ శివార్లలో తిష్టవేశారు.చట్టాల అమలు మీద 2021 జనవరి 12 సుప్రీం కోర్టు స్టే విధించి, రైతుల చెబుతున్నదానిని వినాలంటూ ఒక కమిటీని వేసింది. అయినా రైతులు తగ్గలేదు.చివరకు నరేంద్రమోడీ దిగివచ్చి క్షమాపణలు చెప్పి మూడు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు నవంబరులో ప్రకటించారు. డిసెంబరు ఒకటిన పార్లమెంటులో రద్దు బిల్లుతో ఉపసంహరించుకున్నారు.


రైతులు ముందుకు తెచ్చిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత అంశంతో సహా కనీస మద్దతు ధరలు, సేంద్రీయ సాగు గురించి సిఫార్సులు చేసేందుకు 2022 జూలై 18న కేంద్ర ప్రభుత్వం 26 మందితో ఒక కమిటీని వేసింది. కమిటీలో అత్యధికులు తాన తందాన వారే ఉన్నందున దానిలో చేరేందుకు రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా తిరస్కరించింది. ఆ కమిటీలో వివిధ అంశాల మీద సిఫార్సులు చేసేందుకు మరో ఐదు ఉపకమిటీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు కథ ప్రారంభం. చిత్రం ఏమిటంటే ఈ కమిటీ నివేదికకు నిర్దిష్ట కాలపరిమితి విధించలేదు.ఇంతవరకు అదేమి చేసిందో మనకు తెలియదు. గతేడాది జూన్‌లో ఉప కమిటీలు నివేదికలు సమర్పిస్తాయని చెప్పారు. తరువాత ఎలాంటి సమాచారమూ లేదు. సాగు చట్టాలను వేగంగా తెచ్చిన ప్రభుత్వం దీని నివేదిక పట్ల ఎందుకు అంత శ్రద్ద చూపటం లేదు ? గతంలో సుప్రీం కోర్టు కమిటీ వేసిన నివేదిక, ఆ సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న తరువాత నాలుగు నెలలకు బహిర్గతమైంది. దానిలోని అంశాలు అంతకు ముందు ప్రభుత్వం చేసిన వాదనలు తప్ప మరొకటి కాదు. అందుకే రైతు సంఘాలు తిరస్కరించాయి. ప్రభుత్వం వేసిన కనీస మద్దతు ధరల కమిటీ నివేదిక లోక్‌సభ ఎన్నికలకు ముందే వస్తే అది రైతుల్లో చర్చకు దారి తీస్తుందన్న భయంతోనే కాలపరిమితి నిర్దేశించలేదు. కనీసం ముసాయిదా నివేదికలు కూడా సమర్పించలేదు. అది ఎప్పుడు వస్తుందో, ఏమి సిఫార్సు చేస్తుందో అయోధ్య బాల రాముడికే ఎరుక.
రామాలయ నిర్మాణం పూర్తిగాక ముందే ప్రారంభోత్సవం జరపటం గురించి శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు.మనం కొత్త ఇల్లు కట్టుకున్నపుడు పూర్తిగాక ముందే ప్రవేశ పూజలు చేసి తరువాత మిగతా పనులు చూసుకోవటంలేదా అని అనేక మంది సమర్ధించారు. నిజమే, ఇదే పద్దతి ఇతర వాటికి ఎందుకు వర్తింప చేయటం లేదు ?

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొనేందుకు అక్టోబరు నాలుగవ తేదీన కేంద్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. ఇంతవరకు బోర్డును ఏర్పాటు చేయలేదు, ఆఫీసు ఏర్పాటు లేదు.దీని ఏర్పాటుకు వివాదాలేమీ లేవు. వేల కోట్ల ఖర్చూ కాదు. ఎందుకు తదుపరి చర్యలు లేవు. ముందు బోర్డును ఏర్పాటు చేస్తే దానికి నిర్దేశించిన కార్యకలాపాలు ప్రారంభమౌతాయి. పరిశోధనలకు అవసరమైన భూమి కేటాయించకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తేవటానికి వీలుంటుంది. చిత్రం ఏమిటంటే కనీస మద్దతు ధరల పంటల జాబితాలో పసుపు లేదు. పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పడుతుంది, అది రైతులకు ఎలా మేలు చేస్తుంది ? రాబోయే కాలానికే వదలివేద్దాం. అంతకు ముందు పసుపు రైతులకు బాండ్లు రాసిచ్చిన బిజెపి నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ సుగంధ ద్రవ్యాల బోర్డు విస్తరణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించి పసుపు బోర్డు కంటే ఇదే గొప్పది అని చెప్పుకున్నారు. అది రైతుల్లో పేలకపోవటంతో పసుపు బోర్డు గురించి మరో అంకాన్ని ప్రారంభించారు.


ప్రకటనలు చేయటం మీద ఉన్న శ్రద్ద అమలులో లేదని పదేండ్ల అనుభవం నిరూపించింది. రాష్ట్ర విభజన 2014చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు నూతన రైల్వే జోన్‌ ఏర్పాటును పరిశీలించాలని ఉంది. ప్రత్యేక హౌదా వాగ్దానంపై మడమ తిప్పిన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం దానికి బదులు ప్రత్యేక పాకేజి ఇస్తామంటూ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిణామం బిజెపి మీద తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దాంతో 2019 ఫిబ్రవరి 27న లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటన చేశారు. అంతకు ముందు బిజెపి రాష్ట్ర నేతలు కేంద్రానికి ఒక వినతి పత్రం ఇచ్చినట్లు, దాని మీద స్పందించినట్లు ప్రచారం చేశారు.వారు ఐదేండ్లు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోమారో తెలియదు. మరోసారి లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇంతవరకు రైల్వే జోన్‌ ఏర్పడలేదు. అసలు నోటిఫికేషనే ఇవ్వలేదు. అదుగో ఇదిగో అంటూ చెప్పటమే తప్ప అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల ఏర్పాటుకు స్థలం ఇవ్వలేదన్నారు. ఫలాన చోట ఇస్తామని చెప్పిన తరువాత దాని మీద నిర్ణయం తీసుకోలేదంటూ కాలంగడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోతే జోన్‌ ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని ఉంచేందుకు విశాఖలో అద్దె భవనాలే దొరకవా ? ఇచ్చిన స్థలంలో భవనాలు నిర్మించిన తరువాతే జోన్‌ ఏర్పాటు చేస్తారా ? రాజకీయం గాకపోతే మరొకటేమైనా ఉందా ?


విశాఖ ముడసర్లోవలో ప్రతిపాదిత రైల్వేజోన్‌ ప్రధాన కేంద్రానికి 52.2ఎకరాలు ఇస్తామని రాష్ట్రం ప్రతిపాదించింది. ఇంకా భూమిని గుర్తించాల్సి ఉందని, దాన్ని ఆమోదించాలని, ప్రాజెక్టు నివేదిక సిద్దంగా ఉందని 107 కోట్ల రూపాయలను మంజూరు చేశామని డిసెంబరులో కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ కె రామమోహన్నాయుడి ప్రశ్నకు సమాధానంలో చెప్పారు.2023-24 బడ్జెట్‌లో పది కోట్లు కేటాయించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. జోన్‌ ఎప్పుడు ప్రారంభమౌతుంది, నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయన్న ప్రశ్నలకు సమాధానం లేదు. బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహారావు నెల రోజుల క్రితం మాట్లాడుతూ ముడసర్లోవ భూములను అధికారులు ఖరారు చేశారని, నిర్మాణ జాప్యం ఎందుకో అర్దం కావటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఖరారులో చాలా ఆలశ్యం చేసిందన్నారు.విశాఖ జోన్‌ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన కార్యాలయం ఉన్న విశాఖ డివిజన్ను రద్దు చేసి మూడు ముక్కలుగా విడగొట్టి ఒక ముక్కను రాయఘఢలో మరో ముక్కను ఖుర్దా, మూడో భాగాన్ని విజయవాడ డివిజన్‌లో విలీనం చేస్తారు. ఈ జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు ఉంటాయి. ప్రధాన కేంద్రంలో డివిజన్‌లేని జోన్‌గా ఇది చరిత్రలో నిలుస్తుంది.


బిజెపి ఓట్ల రాజకీయంలో భాగంగా తెలంగాణా ఎన్నికలకు ముందు షెడ్యూలు కులాల ఉపవర్గీకరణ గురించి వాగ్దానం చేసింది. కానీ దానికి ఎలాంటి ఫలితమూ దక్కలేదు.అయిననూ ప్రయత్నించి చూడవలె అన్నట్లుగా ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వర్గీకరణ అంశం సుప్రీం కోర్టులో ఏడుగురు సభ్యులున్న బెంచ్‌ విచారణలో ఉంది. లోక్‌సభ ఎన్నికల కోసం తప్ప ఈ కమిటీ ఏం చేస్తుందన్నది అనేక మందిలో ఉన్న సందేహం.ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ సమస్య మీద దశాబ్దం క్రితం అధికారానికి వచ్చిన బిజెపి చేసిందేమిటి? అన్నది సమాధానం లేని ప్రశ్న.ఉభయ సభల్లో పూర్తి మెజారిటీ ఉన్నందున నిజానికి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి అమలు చేసేందుకు పూనుకోవచ్చు.ఆ పని చేయలేదు. కాబినెట్‌ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తుందని చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు కేంద్రం కట్టుబడి ఉంటుందా ?ఉండేట్లయితే కమిటీ చేసే పనేమిటి ? కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారు ? అందుకే దీన్ని ఓట్ల ఆకర్షణ కమిటీ అంటున్నారు.

సబ్సిడీల ఎత్తివేతపై జర్మన్‌ రైతుల నిరసన, రౌడీ ఆందోళన అన్న మీడియా !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


” ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మరింత సాయం వస్తుందని నేను చెప్పలేను, మీకు మరింత స్వేచ్చ, మీ పనికి మర్యాద కోసం కావాలంటే నేను కూడా మీతో కలసి ఆందోళన చేస్తా , నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాడినే ” జనవరి ప్రారంభం నుంచి ఆందోళన చేస్తున్న రైతులతో జర్మనీ ఆర్థిక మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌నర్‌ అన్న మాటలి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బెర్లిన్‌తో సహా అనేక పట్టణాల్లో రోడ్ల మీద ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేస్తున్న అన్నదాతలను రౌడీ రైతులుగా చిత్రించి మీడియా వార్తలకు శీర్షికలిచ్చింది.2024 బడ్జెట్‌తో ప్రారంభించి వ్యవసాయ యంత్రాలు, డీజిల్‌కు ఇస్తున్న సబ్సిడీలను దశలవారీ ఎత్తివేస్తామని జర్మన్‌ ప్రభుత్వం డిసెంబరులో ప్రకటించింది. సబ్సిడీలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందంటూ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో రైతాంగంలో ఆగ్రహం పెల్లుబుకింది. దీంతో ఒకడుగు వెనక్కు వేసి కొత్త వ్యవసాయ యంత్రాలకు పన్ను రాయితీలు ఇస్తాం తప్ప డీజిల్‌ సబ్సిడీలు ఎత్తివేస్తామని చెప్పింది. శాంతించని రైతులు జనవరి మొదటి వారం నుంచి వివిధ రూపాలలో ఆందోళనలు చేస్తున్నారు.పదిహేనవ తేదీన బెర్లిన్‌లో దేశమంతటి నుంచి వచ్చిన 30వేల మంది రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో సహా తరలి వచ్చి ప్రదర్శన చేశారు. దాంతో నగరంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బస్‌లు, ట్రామ్‌లు నడిచే మార్గాలను మూసివేయాల్సి వచ్చింది. ఆ సందర్భంగా రైతుల నుద్దేశించి మాట్లాడేందుకు మంత్రి ప్రయత్నించగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనకు ప్రతిపక్ష మితవాద పార్టీలు మద్దతు ప్రకటించటంతో ఇంకేముంది ఆందోళన వెనుక మితవాదులు చేరారు అంటూ మీడియాలో పక్కదారి పట్టించే వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.(మన దేశంలో రైతులు ఢిల్లీ శివార్లలో తిష్టవేసి ఏడాది పాటు చేసిన ఆందోళనను బిజెపి ప్రభుత్వం కూడా ఇలాగే ఉగ్రవాదులతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే). జర్మన్‌ రైతులు తమ నిరసన వ్యక్తం చేసేందుకు గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద విడిచిన బూట్లు,పక్కనే వెలుగుతున్న కొవ్వొత్తులున్న డబ్బాలను ప్రదర్శిస్తున్నారు.రైతుల నిరసనలతో కాస్తవెనక్కు తగ్గిన సర్కార్‌ వ్యవసాయ వాహనాల పన్నులను తగ్గించేది లేదని, డీజిల్‌పై పన్నులను దశలవారీ ఎత్తివేస్తామని చెప్పింది. దీన్ని రైతులు అంగీకరించటం లేదు. సోమవారం (జనవరి 22న) ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, తమకు అంగీకారం కానట్లయితే మరోసారి ఆందోళనకు దిగుతామని జర్మనీ రైతు సంఘం ప్రకటించింది.


రైతులకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించేందుకు ప్రభుత్వం ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని సాకుగా చూపింది. బెర్లిన్‌లో నిరసన తెలిపిన రైతులతో మంత్రి లిండ్‌నర్‌ మాట్లాడుతూ స్కూళ్లు, రోడ్లు, పారిశ్రామిక ఇంథన సబ్సిడీలకు నిధులు అవసరమని చెప్పటంతో రైతులు మరింత ఆగ్రహించారు. దాంతో స్వరం పెంచిన మంత్రి ఐరోపాలో స్వేచ్చకు మరోసారి ముప్పు వచ్చినందున భద్రత నిమిత్తం ఉక్రెయిన్‌ యుద్ధం కోసం నిధులు కావాలని అన్నాడు. ఉక్రెయిన్‌కు నిధులు ఇస్తే ఇచ్చుకోండిగానీ దానికి తమను ఎందుకు బలిపెట్టాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. జర్మనీతో సహా అనేక దేశాల్లో రైతుల ఆందోళనకు ఉక్రెయిన్‌ సంక్షోభం ఒక తక్షణ కారణమైంది. ఉక్రెయిన్‌ నుంచి వస్తున్న ధాన్యంతో పోటీ పెరిగిందని, తమకు గిట్టుబాటు కావటం లేదని ఉక్రెయిన్‌ సరిహద్దులో రుమేనియా రైతులు ఆందోళన చేశారు.


అనేక పారిశ్రామిక దేశాల్లో మాదిరి జర్మనీలో రైతుల ఆత్మహత్యల రేటు ఎక్కువ.మన దేశంలో మాదిరి వ్యవసాయం గిట్టుబాటుగాక అప్పులపాలై పురుగుమందులు తాగి ప్రాణాలు తీసుకుంటున్నవారు అక్కడ కూడా ఉన్నారు. అనేక మంది సాగుభూములను వదలి వేశారు.వ్యవసాయం చేసే వారికి జీవిత భాగస్వాములు దొరకటం కూడా సమస్యే. సబ్సిడీ చెల్లించే నిబంధనలను ఎప్పటికప్పుడు మారుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కొదవలేదు. వారి నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే సూపర్‌మార్కెట్లు కూడా ప్రపంచ ధరల తీరు పేరుతో ఎప్పటి కప్పుడు మార్చివేస్తుండటంతో రైతులకు ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది.ఐరోపా యూనియన్‌ దేశాలలో సాగు గిట్టుబాటుగాక ప్రతి రోజూ వెయ్యి మంది రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిన్న రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెద్ద్ద కమతాలైతేనే సాగు గిట్టుబాటు అవుతుందనే సూత్రీకరణలు పశ్చిమదేశాల ఆర్థికవేత్తలు చేస్తున్నారు. అది వాస్తవం కాదని అనేక దేశాల్లో జరుగుతున్న ఆందోళనలు స్పష్టం చేస్తున్నాయి. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా మన దేశంలో కూడా కార్పొరేట్ల లాబీయిస్టులు కొందరు అదే పాట పాడుతున్నారు. పారిశ్రామిక-వర్ధమాన దేశాలలో వ్యవసాయ సంక్షోభ తీరుతెన్నులు భిన్నంగా ఉండవచ్చు గానీ సంక్షోభం మాత్రం వాస్తవం.పూర్తిగా మార్కెట్‌ శక్తులకు వదలి వేస్తే మెరుగైన ధరలు వచ్చి రైతులు లబ్ది పొందుతారని కొందరు చేస్తున్న వాదనలు వట్టి బూటకమని జర్మనీ రైతుల ఆందోళన వెల్లడిస్తున్నది. వారి ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర వస్తే యంత్రాలు, డీజిలుపై సబ్సిడీ చెల్లించాలని రోడ్డెక్కాల్సిన అవసరం ఉండేది కాదు. డీజిల్‌ సబ్సిడీలను ఎత్తివేస్తే ఏటా జర్మన్‌ రైతులు ఐదు నుంచి పదివేల యూరోలు( మన కరెన్సీలో ఒక యూరో విలువ 91 రూపాయల వరకు ఉంది) నష్టపోతారని అంచనా.


కార్పొరేట్‌ సాగు మాత్రమే గిట్టుబాటు అవుతుంది అని చెబుతున్నవారు అది అమలు జరుగుతున్న, భారీ కమతాలున్న ధనిక దేశాల్లో ఎందుకు రైతులు ఆందోళనలు చేస్తున్నారో, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎందుకు సబ్సిడీలు ఇస్తున్నాయో చెప్పాలి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కుదరకపోవటానికి ధనిక దేశాలు ఇస్తున్న వ్యవసాయ సబ్సిడీలపై తలెత్తిన వివాదమే ప్రధాన ఆటంకంగా ఉన్న సంగతి తెలిసిందే. జర్మనీ పార్లమెంటుకు సమర్పించిన ఒక నివేదికలో 2010-20 దశాబ్ద కాలంలో 36వేల వ్యవసాయ క్షేత్రాలు మూతపడ్డాయి. పక్కనే ఉన్న ఫ్రాన్స్‌లో 2021డిసెంబరులో విడుదల చేసిన వివరాల ప్రకారం పదేండ్లలో లక్ష మూతపడ్డాయి. ఐరోపా మొత్తంగా 2005 నుంచి 2020 వరకు మొత్తం 53లక్షల వ్యవసాయ క్షేత్రాలు అదృశ్యమయ్యాయి. అంటే కుటుంబ సాగు బడాకంపెనీల చేతుల్లోకి భూమి పోతున్నది. కమతాల్లో భూమి ఎంత ఎక్కువగా ఉంటే సాగు ఖర్చు అంత తక్కువ అని ఒకవైపు చెబుతారు. అమెరికా, ఐరోపాల్లో హెక్టార్ల వంతున సబ్సిడీ చెల్లిస్తున్నారు తప్ప వేరు కాదు.అందుకే చిన్న రైతులకు గిట్టుబాటు కావటం లేదు. అమెరికాలో ప్రత్యక్ష, పరోక్ష సాగు సబ్సిడీలకు గాను 130 పధకాలున్నాయి. ఏడాదికి 30బిలియన్‌ డాలర్ల సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ధనిక దేశాల్లో కార్పొరేట్‌ సాగు కూడా సబ్సిడీలు లేకుండా నడవదా లేక ప్రభుత్వాలు వాటికి అప్పనంగా దోచిపెడుతున్నట్లా ? అమెరికాలో గడచిన నాలుగు దశాబ్దాలలో 33 సంవత్సరాలు ఉత్పత్తి ఖర్చు గిట్టుబాటు కాలేదని తేలింది. అందుకే అక్కడ భారీగా సబ్సిడీలు ఇస్తున్నారు. కార్పొరేట్‌ సాగే అలా ఉంటే కుటుంబ సాగు పరిస్థితి చెప్పనవసరం లేదు. మన దేశంలో కూడా ఒక్క పంజాబ్‌లో తప్ప దేశమంతటా ధాన్య రైతులుఉ నష్టపోవటం లేదా ఖర్చులు రావటమే అన్నట్లుగా పరిస్థితి ఉంది.


ఐరోపా దేశాల్లో పర్యావరణ పరిరక్షణ అంటూ కాలుష్యాన్ని తగ్గించే పేరుతో డీజిల్‌, పురుగుమందులు, ఎరువుల మీద సబ్సిడీల తగ్గింపుకు తీసుకుంటున్న చర్యలు సాగు రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. 2050 నాటికి పర్యావరణానికి హాని కలిగించే వాయువుల విడుదల నిలిపివేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. దానిలో భాగంగా 2030 నాటికి రసాయన పురుగు మందుల వాడకాన్ని 50శాతానికి తగ్గించాలనే నిబంధనలు విధించారు. రైతులను నిరుత్సాహపరిచేందుకు వీటికి ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేస్తున్నారు. వీటితో పాటు ఉక్రెయిన్‌ నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్న ధాన్యం అనేక దేశాల్లో రైతులను రోడ్ల బాట పట్టిస్తున్నది. నీటి పొదుపు చర్యల పేరుతో బోరు బావుల తవ్వకాన్ని నిషేధించటంతో స్పెయిన్‌ రైతులు అక్రమంగా తవ్వుతున్నారు. బావుల నిబంధనలకు వ్యతిరేకంగా స్పెయిన్‌ రైతులు, నీటి తీరువా ,డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా ఫ్రెంచి రైతులు ఇటీవల కాలంలో ఆందోళన చేశారు. వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరిగిన విధంగా ఉత్పత్తులకు పెరగటం లేదు. బీమా ప్రీమియం పెంపు, సబ్సిడీల నిలిపివేతకు నిరసనగా రుమేనియా రైతులు, ట్రక్కు డ్రైవర్లు దేశమంతటా ట్రాక్టర్లు, ట్రక్కులతో రోడ్ల మీద నిరసనలు తెలిపారు.డీజిల్‌పై పన్నులు తగ్గించాలని, రుణాల వసూలు వాయిదా వేయాలని, సబ్సిడీలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు. మొక్కజన్నలపై సబ్సిడీ ఇవ్వాలని, పన్నులు పెంచరాదని పోలాండ్‌ రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం అంగీకరించటంతో ఆందోళన విరమించారు.


జర్మనీలో ఆందోళన చేస్తున్న రైతులకు అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మితవాద ఎఎఫ్‌డి పార్టీ మద్దతు ఇస్తున్నది. దాన్ని చూపి నయా నాజీలు, మితవాదులు రైతులను రెచ్చగొడుతున్నారని, ఆందోళన వారి చేతుల్లోకి పోతోందని జర్మన్‌ పాలక కూటమి ఆరోపించింది. తమ డిమాండ్లకు ఎవరు మద్దతు ఇచ్చినా స్వీకరిస్తామని రైతులు చెబుతున్నారు. అనేక దేశాల్లో ఎన్నికలు జరగనుండటంతో మితవాద శక్తులు మౌనంగా ఉండవు. అధికారపక్షాల మీద వ్యతిరేకతను సహజంగానే రెచ్చగొడతాయి. పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకుంటే వాటికి అలాంటి అవకాశం రాదు. ఉదారవాద పాలకపార్టీల వైఫల్యం అనేక దేశాల్లో మితవాద పార్టీలు అధికారానికి రావటం లేదా సవాలు చేసే స్థితికి ఎదిగాయి. వాటిని ఎదుర్కోవాలనటంలో ఎలాంటి పేచీ లేదు గానీ ఆ బూచిని చూపి న్యాయమైన డిమాండ్లను తిరస్కరిస్తే జనాన్ని ఆ శిబిరంలోకి నెట్టినట్లే. తాము అధికారానికి వస్తే సాగు సబ్సిడీలను తగ్గిస్తామని పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నది. అయితే ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహంతో కొందరు రైతులు ఆ పార్టీవైపు కూడా మొగ్గుచూపవచ్చని విశ్లేషకులు చెబుతున్న మాటలకు అర్ధం ఇదే.

ఇంటా బయటా కులవివక్ష : ఉడిపి పెజావర్‌ మఠ స్వామి, టీవీ యాంకర్‌పై ఫిర్యాదు !

Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కుల వివక్ష మహమ్మారి కొంతకాలం క్రితం వరకు మన దేశానికే సొంతం, ప్రత్యేకం. ఇప్పుడు ”విద్యావంతులు” దాన్ని అంతర్జాతీయం గావించారు. దాన్ని పాటించేవారు ఎక్కడ అడుగుపెడితే అక్కడ పిచ్చి తుమ్మలా విస్తరిస్తోంది. దాన్ని నిరసించే వారు ఎక్కడ తలెత్తితే అక్కడ ప్రతిఘటన, బెదిరింపులు ఎదురవుతున్నాయి. డిసెంబరు 27న కర్ణాటకలోని సువర్ణ కన్నడ టీవీ కార్యక్రమంలో అయోధ్యలోని రామాలయంలోపల దళితులు పూజలు నిర్వహించవచ్చా అనే చర్చ జరిపారు. జనవరి పన్నెండున బెంగలూరులో ” బిఆర్‌ అంబేద్కర్‌ దండు(సేన) ” అనే సంస్థ దానిలో పాల్గన్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ, ఉడిపి పెజావర్‌ మఠ స్వామీజీ విశ్వప్రసన్న తీర్ధ, టీవీ యాంకర్‌ అజిత్‌ హనుమక్కనావర్‌ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని మీద ఎఫ్‌ఐఆర్‌ దాఖలైందీ లేనిదీ తెలియదు. సువర్ణ టీవీ చర్చలో నాగరాజ్‌ అనే ఒక దళిత సంస్థ ప్రతినిధి అయోధ్య రామాలయం పూజల్లో దళితులను చేర్చలేదని ఆందోళన వెలిబుచ్చారు. దాని మీద స్వామి స్పందిస్తూ ఒక్క కాశీ ఆలయంలో తప్ప ఒక దేవాలయంలో పూజకోసం నియమించిన ఒక్కరు మాత్రమే చేస్తారని ప్రతి ఒక్కరూ చేయరని అన్నారు. ఒక్క దేవాలయమే కాదు, ఉదాహరణకు ఏ కార్యాలయం లేదా సంస్థలో నిర్దేశిత స్థానంలో ఒక్కరే ఉంటారు తప్ప ప్రతి ఒక్కరూ కూర్చోరని, నియమిత వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. అయోధ్యలో వంతుల వారీ పూజలు ఎందుకు చేయకూడదని నాగరాజు ప్రశ్నించారు.” ఇప్పటి వరకు పూజలు నిర్వహిస్తున్న సామాజిక తరగతి మాత్రమే భవిష్యత్‌లో కూడా చేస్తుందని, ఇతరులు చేయకూడదని అన్నారు. సంప్రదాయాలను మార్చకూడదా అన్న దానికి ఈ ప్రశ్న దేవాలయాలు, ధార్మిక సంస్థల గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నారని స్వామి ఎదురు ప్రశ్నించారు.
లౌకిక నిబంధనలు మతప్రదేశాలకు వర్తించరాదని, రెండింటినీ కలగా పులగం చేయరాదని టీవీ యాంకర్‌ అజిత్‌ వాదించారు.” మీరు శబరిమల ఆలయానికి వెళ్లాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి, వాటిని పాటించకుండా వెళ్లాలంటే ఎలా ? కొన్ని ఇళ్లలో మీరు బూట్లు వేసుకోవచ్చు, కొన్ని చోట్ల బయట వదలి రావాలన్న నిబంధనలు ఉంటాయి. మీ వంట ఇంట్లో బూట్లు ధరించినట్లుగా ఇతరుల ఇండ్లలో కూడా ధరిస్తామని అంటే అప్పుడు మీరు తర్కబద్దంగా మాట్లాడేవ్యక్తి కానట్లే ” అన్నారు. చర్చలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి ” దళితులు పూజ చేయాలని కోరుకుంటే వారు మంత్రాలు నేర్చుకోవాలి, అఖండ పాండిత్యాన్ని సంపాదించాలి, తరువాత పూజలు చేయాలి ” అన్నారు. అప్పుడు పెజావర్‌ స్వామి మాట్లాడుతూ హిందూయిజంలో దళితులు ప్రత్యేక బృందంగా విడిగా ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దళిత సంఘ ప్రతినిధి నాగరాజు మాట్లాడుతూ దళితులకు ఎక్కడా అవకాశాలు లేవని చెప్పారు. దాని మీద స్వామి మాట్లాడుతూ ” ఒక దళిత సంస్థ నేతగా మీరు ఒక బ్రాహ్మణుడిని అంగీకరిస్తారా ” అని ప్రశ్నించగా అదెలా కుదురుతుందని నాగరాజు అన్నారు.


దళిత సంస్థ అంటే కుల సంస్థ కాదు. దళిత సామాజిక తరగతిలో అనేక కులాలు ఉన్నాయి. అవి వేటికవి తమ కులం గురించి ఏర్పాటు చేసుకున్న సంఘాలకు వేరే కులం వారిని అనుమతించరు. కులవివక్షను ఎదుర్కొంటున్న వారిలో గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు కూడా ఉన్నారు. తీవ్ర వివక్షను దళితులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఉన్న దళిత సంస్థలు ఆ సామాజిక తరగతికి చెందిన వారు మొత్తంగా ఎదుర్కొంటున్న కులవివక్ష, అవమానాలకు, ఉద్యోగ, రిజర్వేషన్లలో చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవి. తమ డిమాండ్లను బలపరిచే ఎవరినైనా తమ నేతలలో ఒకరిగా అంగీకరివచ్చు. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాలకు(కెవిపిఎస్‌) నాయకత్వం వహిస్తున్నవారిలో దళితులు కాని వారు కూడా ఉన్నారు. అందువలన పెజావర్‌ స్వామి వేసిన ప్రశ్న సరైందికాదు లేదా తప్పుదారి పట్టించేది కాగా, దానికి సమాధానం చెప్పిన నాగరాజు అవగాహనలో గందరగోళం ఉన్నది. ఇక బిఆర్‌ అంబేద్కర్‌ దండు చేసిన ఫిర్యాదును చూద్దాం. మత ప్రదేశాల్లో మత నిబంధనలను పాటించాలని చెప్పటం ద్వారా దేవాలయాల్లో పూజలు చేసేందుకు దళితులను అనుమతించరని పెజావర్‌ స్వామి, టీవీ యాంకర్‌ చెప్పినట్లయిందని, తద్వారా వారు అంటరానితనాన్ని పాటించాలని చెప్పటమేనని, అలాంటి ప్రకటనలు రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ, లౌకికత్వానికి విరుద్దమని, సంప్రదాయం అనే పదాన్ని ఉపయోగించటం దళితులను అణచివేయటం, ఈ చెడు సంప్రదాయాన్ని ప్రశ్నించకుండా అనుసరించాలని చెప్పటమే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. బెంగలూరు హై గ్రౌండ్స్‌ పోలీసులు తమ ఫిర్యాదు అందినట్లు రసీదు ఇచ్చారని ఇంతవరకు(జనవరి 15) ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయలేదని దండు సలహాదారు ఆదర్శ ఆర్‌ ఆయ్యర్‌ చెప్పారు.


గాంగస్టర్‌ చోటా రాజన్‌ కుమార్తె అమెరికా విశ్వవిద్యాలయంలో లోపాలతో ఉన్న కులసర్వే నిర్వహించారని, జార్జి సోరస్‌తో సంబంధమున్న సంస్థలకు డబ్బు విరాళంగా ఇస్తామని పేర్కొన్నట్లు కాషాయ దళం నిర్వహించే ఓపిఇండియా పోర్టల్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. గంధపు చెక్కల స్మగ్లర్‌, ఎన్నో హత్యలు చేసిన వీరప్పన్‌ కుమార్తె దివ్యకు తమిళనాడు బిజెపి యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా కాషాయ కండువా కప్పారు. తండ్రి నేరాలు అందుకు అడ్డురాలేదు. గాంగస్టర్‌ చోటా రాజన్‌ ప్రస్తుతం ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ముంబై జైల్లో ఉన్నాడు. రాజన్‌ కుమార్తె అంకిత నికాలజి ప్రస్తుతం అమెరికాలోని విస్కాన్సిన్‌ మిల్‌వాకీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.ఆమె నిర్వహించిన సర్వే వార్త రాసేటపుడు తండ్రి గురించి ప్రస్తావించటం, సర్వేలో పాల్గొన్నవారికి ప్రతి ఒక్కరికి మూడు డాలర్ల వంతున ఇచ్చే సొమ్మును వివాదాస్పాద పాలస్తీనా హక్కుల కోసం, పాలస్తీనా పిలల్ల నిధి, ఇంటర్నేషనల్‌ దళిత్‌ సాలిడారిటీ సంస్థకు(ఐడిఎస్‌ఎన్‌) ఇస్తామని చెప్పారని, ఐడిఎస్‌ఎన్‌కు జార్జి సోరస్‌కు చెందిన ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ నిధులు అందిస్తున్నదని, సోరస్‌ భారత్‌లో రంగుల విప్లవం పేరుతో తిరుగుబాటు రెచ్చగొట్టేందుకు చూస్తున్నట్లు ఓపి ఇండియా ఆరోపించింది. ఇది బురదజల్లే వ్యవహారం తప్ప మరొకటి కాదు. అమెరికాలో కులపరమైన వివక్షను ఎదుర్కొన్నవారి అభిప్రాయాలను ఆ సర్వేలో సేకరించేందుకు అవసరమైన ప్రశ్నలను రూపొందించారు. కులవివక్ష ఉందని అంగీకరించేందుకు ఇష్టపడని కాషాయ దళాలకు మింగుడుపడలేదు.


హిందూమతం లేదా హిందూయిజానికి సంబంధించి ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు బ్రిటన్‌లోని లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న హిందూ కౌన్సిల్‌ యుకె(హెచ్‌సియుకె) అనే సంస్థ బెదిరింపులకు దిగింది. డిసెంబరు నెలలో లిసెస్టర్‌ సెక్యులర్‌ సొసైటీ(ఎల్‌ఎస్‌ఎస్‌) ” హిందూయిజం : అనైతిక తుచ్చ ఆవరణము ” అనే పేరుతో ఒక ప్రసంగాన్ని ఏర్పాటు చేసింది.హిందూయిజ వైఫల్యాలను విమర్శనాత్మక దృష్టితో పరిశీలించే అంశమిది. అసలు పేరులోనే హిందువుల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టే అంశం ఉందని, దీని గురించి స్థానిక హిందువులు, అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెసియుకె సంస్థ ఒక ఇమెయిల్‌ ద్వారా నిర్వాహకులను బెదిరించింది. మతం గురించి లోతుగా, స్వేచ్చగా చర్చించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, వివక్ష పద్దతులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎల్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు నెడ్‌ న్యూయిట్‌ ప్రతి లేఖలో స్పష్టం చేశాడు.కుల వ్యవస్థలో వివక్ష అంతర్లీనంగా ఉందని, మతం-వివక్షకు ఉన్న సంబంధాలను తెలుసుకొనేందుకు ఆసక్తితో ఉన్నామని పేర్కొన్నాడు. బ్రిటన్‌లో యాభై నుంచి రెండు లక్షల మంది వరకు తక్కువ కులాలుగా పరిగణించబడేవారు ఉన్నారని, వారంతా వివక్ష, వేధింపులకు గురౌతున్నట్లు ఎల్‌ఎస్‌ఎస్‌ పేర్కొన్నది. 2017లో బ్రిటన్‌ ఆమోదించిన సమానత్వ చట్టంలో కులపరమైన వివక్ష వ్యతిరేక అంశాలున్నాయి. దీన్ని హిందూ కౌన్సిల్‌ తీవ్రంగా వ్యతిరేకించింది.దీని వలన దళితులు ఉన్నత కులాల వారి మీద ప్రతీకారం కోరే అవకాశం ఉందని వాదించింది. డిసెంబరు ఆరవ తేదీన ఆ ప్రసంగ కార్యక్రమం జరిగింది. దానికి నిరసన తెలిపేందుకు ఎవరూ రాలేదు. ప్రశాంతంగా ముగిసింది.


హిందూమతం, దాన్ని అనుసరించే సమాజంలో కొంత మంది పాటించే అంటరానితనానికి దూరంగా ఉండేందుకు అనేక మంది ఇస్లాం, క్రైస్తవ, బౌద్ద మతం పుచ్చుకున్న చరిత్ర తెలిసిందే. తెలుగు ప్రాంతాల్లో క్రైస్తవ మతం పుచ్చుకున్నవారిలో దళితులు, కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ తదితర కులాల వారు ఉన్నారు. మతం ఒక్కటే అయినా సామాజిక వివక్ష కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏ కులంవారు ఆ కులంలోనే సంబంధాలు కలుపుకుంటారు తప్ప మరొక విధంగా లేరు. తమిళనాడులోని క్రైస్తవులలో కూడా వివక్ష కొనసాగుతున్నట్లు జనవరి రెండ వారంలో ఒక పుస్తక విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. నివేదిత లూయీస్‌ అనే రచయిత క్రీస్తువతిల్‌ జాతి( క్రైస్తవంలో కులం) అనే పుస్తక విడుదల కార్యక్రమంలో విసికె పార్టీ ఎంపీ తిరుమవలన్‌ మాట్లాడుతూ భారత్‌లో క్రైస్తవం కుల వేళ్లను పెంచి పోషించింది తప్ప క్రైస్తవ విలువలను కాదని విమర్శించారు. క్రైస్తవులుగా మారినా తమ కుల గుర్తింపును వదులుకొనేందుకు సిద్దంగా లేరని అందుకే క్రైస్తవ నాడార్లు, ముదలియార్లు, రెడ్డియార్లు,యాదవులు కనిపిస్తున్నారని అన్నారు.చర్చి వ్యవస్థలో కూడా దళితులు, ఇతర కులాల వారి మధ్య తేడాలు ఉన్నాయన్నారు. సామాజిక న్యాయ గడ్డగా పిలుస్తున్న తమిళనాడులో కులపరమైన దాడుల పట్ల ప్రభుత్వ స్పందన ఉపేక్షతో కూడి ఉందని, పౌరసమాజం మౌనంగా ఉందని జనవరి ఆరవ తేదీన చెన్నరులో జరిగిన ఒక సభలో వక్తలు పేర్కొన్నారు.దళిత్‌ ఇంటెలెక్చ్యువల్‌ కలక్టెవ్‌(డిఐసి) పేరుతో ఒక రోజు పాటు సాగిన వర్క్‌షాప్‌లో రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆ సామాజిక తరగతికి చెందిన పలువురు పాల్గొన్నారు.అనేక పత్రాలను సమర్పించారు. పద్దెనిమిది డిమాండ్లను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని పార్టీలకు అందచేయాలని నిర్ణయించారు. దళితుల మీద జరిగిన దాడుల మీద తీసుకున్న చర్యలతో శ్వేత పత్రం విడుదల చేయాలని, అన్ని పార్టీలతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, పేర్లకు ముందు,వెనుక కుల గుర్తింపు లేకుండా చూడాలని, అన్ని స్థాయిల్లో ఉన్న అధికార యంత్రాంగానికి వివక్షకు దూరంగా ఉండాల్సిన పద్దతుల గురించి వివరించాలని, కేరళలో మాదిరి కులాంత వివాహాలు చేసుకున్న వారి పిల్లలకు రిజర్వేషన్లు కల్పించాలని తదితర అంశాలు వాటిలో ఉన్నాయి.


జైళ్లలో ఖైదీల పట్ల కులవివక్ష పాటించటం గురించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌, జెబి పార్థీవాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జైళ్ల నిబంధనల్లోనే వివక్ష ఉందని, బలవంతంగా చాకిరీ చేయిస్తున్నారని పిటీషనర్‌ జర్నలిస్టు సుకన్య శాంత పేర్కొన్నారు. తమిళనాడులోని పాలయం కొట్టారు సెంట్రల్‌ జైలులో థేవర్లు, నాడార్లు, పాలార్లకు ప్రత్యేక బ్లాకులు ఉన్నాయని, పశ్చిమ బెంగాల్లో అగ్ర కులాలకు చెందిన ఖైదీలు వంట విధులకు, పారిశుధ్యం వంటి వాటికి ఫలానా కులం వారనే నిబంధనలు ఉన్నాయని, అదే విధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న లోపాలు, వివక్ష గురించి కూడా పిటీషన్‌లో పేర్కొన్నారు.

తిరిగి చైనా పెట్టుబడులు : తొలి సంకేతాలు పంపిన భారత్‌ !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్‌-చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్‌ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి) కేంద్రశాఖ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ చెప్పినట్లు, నాలుగేండ్లనాటి అంక్షల ఎత్తివేతకు ఇది సూచిక అని జనవరి పద్దెనిమిదవ తేదీన రాయిటర్స్‌ ఇచ్చిన వార్తకు అంతర్జాతీయ, జాతీయ మీడియా ఎంతో ప్రాధాన్యతనిచ్చింది.దవోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేదిక 54వ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాజేష్‌ కుమార్‌ సింగ్‌ వెళ్లారు. అక్కడ రాయిటర్స్‌ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వార్త చైనాతో సత్సంబంధాలు కోరుకొనే పౌరులు, లబ్దిపొందాలని చూస్తున్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఆశలు రేకెత్తించేదైతే , కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకులకు మింగుడుపడనిదే. అయితే వెంటనే ఏదో అయిపోతుందని అనుకోనవసరం లేదు గానీ నరేంద్రమోడీ సర్కార్‌ మీద దేశీయ కార్పొరేట్‌ శక్తుల నుంచి వస్తున్న వత్తిడికి కూడా ఇది సూచికే. దిగుమతులను అనుమతించుతున్నట్లుగానే పెట్టుబడులను కూడా అంగీకరించకతప్పనట్లు కనిపిస్తోంది.


2020లో జరిగిన గాల్వన్‌లోయ వివాదాల తరువాత మన సరిహద్దులలో ఉన్న దేశాల పెట్టుబడులను తనిఖీ చేయకుండా అనుమతించరాదంటూ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి పరోక్షంగా చైనా పెట్టుబడులను అడ్డుకొనేందుకే అన్నది స్పష్టం.ఎందుకంటే మన నుంచి తీసుకొనేవే తప్ప మరొక సరిహద్దు దేశమేదీ మనకు పెట్టుబడులు పెట్టే స్థితిలో లేదు. అనేక మంది నోటితుత్తర జనాలు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇచ్చినప్పటికీ మన దిగుమతిదారులు వాటిని ఖాతరు చేయకుండా రికార్డులను బద్దలు కొట్టి మరీ దిగుమతులు చేసుకున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. సరిహద్దు ఉదంతాల తరువాత రెండు దేశాల వాణిజ్యం 32శాతం పెరిగింది. నాలుగేండ్లుగా చైనా పెట్టుబడులు, అంతకు ముందు ప్రతిపాదనలు ఏ మాత్రం ముందుకు సాగలేదు.” ఒకసారి మా సంబంధాలు, సరిహద్దు సమస్యలు స్థిరపడితే మార్పు రావచ్చు. పరిణామాలు సక్రమంగా ముందుకు పోతే పెట్టుబడుల అంశంలో కూడా సాధారణ లావాదేవీలను పునరుద్దరించవచ్చని నేను చెప్పగలను. సరిహద్దులను ఎవరైనా కొద్ది కొద్దిగా అక్రమించుకుంటూ ఉంటే మనమేమీ చేయలేం, అటువైపు నుంచి పెట్టుబడులకు ఎర్రతివాచీ మర్యాదలు జరపలేము ” అని రాజేష్‌ కుమార్‌ చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ పెట్టుబడుల విషయంలో ఒక అడుగు వెనక్కు వేసి ఆటంకాలను తగ్గించినట్లు చెప్పారు. ” గతేడాది కాలంగా ఎలాంటి ఉదంతాలు లేవు గనుక సాధారణ ఆశ కనిపిస్తోంది, పరిణామాలు స్థిరపడతాయి, మెరుగుపడతాయి అనుకుంటున్నాను. అమెరికా, ఆస్ట్రేలియాల్లో మాదిరి అన్ని దేశాలకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల సమీక్షకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం, పెట్టుబడులకు స్వాగతం పలకాలనే పరిస్థితిని కొనసాగించాలని భారత్‌ కోరుకుంటున్నదని రాజేష్‌ కుమార్‌ చెప్పారు.


2020లో గాల్వన్‌ లోయలో జరిగిన పరిణామాల తరువాత చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయి. 2022లో రెండు సార్లు స్వల్ప ఘర్షణలు తప్ప ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదు.చర్చలతో ఒక అవగాహనా కుదరలేదు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నారు. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. మనవైపున 50వేల మంది సైనికులు మోహరించి ఉన్నారు. వాస్తవాధీన రేఖ ఉల్లంఘనల గురించి పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. రెండువైపులా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం, అభివృద్దీ జరుగుతున్నది. గాల్వన్‌ ఉదంతాలకు ముందు కూడా వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో చైనా సైనికులు మన వైపు చొచ్చుకు రావటం, మనవారు అటువైపు వెళ్లటం జరిగినప్పటికీ చేతులతో నెట్టుకోవటం తప్ప ఆయుధాలను ఉపయోగించలేదు. సగటున ఏడాదికి ఐదు వందల సార్లు చైనీయులు అతిక్రమిస్తున్నట్లు మన అధికారులు గతంలో వెల్లడించారు. ప్రతి ఉదంతమూ మీడియాలో రాదు. 2015లో చైనా వైపు నుంచి 428సార్లు అతిక్రమణలు జరగ్గా అవి 2019నాటికి 663కు పెరిగాయి. మనవైపు నుంచి జరిగేవి చైనా వారు చెబుతారు తప్పమనం చెప్పుకోం.


నరేంద్రమోడీ తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన తరువాత, షీ జింపింగ్‌ మన దేశాన్ని తొలిసారి సందర్శించనున్న తరుణంలో 2014లో సెప్టెంబరు 16న లడఖ్‌ తూర్పు ప్రాంతంలోని చుమార్‌ గ్రామ సమీపంలో చైనా ఒక రోడ్డు నిర్మిస్తుండగా అది తమ ప్రాంతమంటూ మన సైనికులు అడ్డుకొన్నారు. ప్రతిగా దానికి సమీపంలోని డెమ్‌చోక్‌ వద్ద నిర్మిస్తున్న కాలువ పనులను చైనా మిలిటరీ అడ్డుకుంది. ఇలా రెండు దేశాల దళాలు 16 రోజుల పాటు మోహరించి తిష్టవేశాయి. చివరికి ఉన్నత స్థాయి చర్చల తరువాత ఉభయపక్షాలూ వెనక్కు తగ్గాయి. రోడ్డు నిర్మాణాన్ని చైనా విరమించుకుంటే దానికి ప్రతిగా మనదేశం పరిశీలక కేంద్రాన్ని కూల్చివేసేందుకు, బంకర్ల నిర్మాణాన్ని నిలిపివేసేందుకు అంగీకరించింది. తరువాత 2015లో లడఖ్‌ ఉత్తర ప్రాంతంలోని బర్టసే అనే గ్రామం వద్ద చైనా మిలిటరీ నిర్మించిన ఒక పరిశీలన కేంద్రాన్ని ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసులు కూల్చివేశారు. దాంతో చైనా మిలిటరీ రాగా పోటీగా మన సైనికులు కూడా వెళ్లటంతో వారం రోజుల వివాదం తరువాత ఇరుదేశాల స్థానిక మిలిటరీ అధికారులు సర్దుబాటు చేశారు.తరువాత రెండు దేశాల మిలిటరీల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు పన్నెండు రోజుల పాటు సంయుక్త మిలిటరీ విన్యాసాలు జరిపారు. చైనా-భూటాన్‌ మధ్య సరిహద్దు సమస్యలున్నాయి. వాటిలో డోక్లాం ఒకటి. ఆ ప్రాంతం మన దేశంలోని సిలిగురి కారిడార్‌కు దగ్గరగా ఉంటుంది. డోక్లాంలో చైనా మిలిటరీ రోడ్లు, తదితర నిర్మాణాలను చేపట్టడంతో అంతకు ముందు భూటాన్‌ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా మన దేశం జోక్యం చేసుకొని చైనాను నిలువరించింది.2017లో 73 రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. తరువాత సద్దుమణిగింది. ఇలాంటివి జరుగుతున్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా మన ప్రధాని నరేంద్రమోడీ ఊహాన్‌ నగరానికి వెళ్లినట్లే చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మహాబలిపురం వచ్చారు. రెండు దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.


1962లో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో సంబంధాలను మెరుగుపరుచుకొనేందుకు సరిహద్దు వివాదం, చిన్న చిన్న ఘర్షణలు అడ్డం రాలేదు. కొంతకాలం ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలు ఏర్పడ్డాయి.గాల్వన్‌ ఉదంతం నిస్సందేహంగా మరోసారి సంబంధాలను దెబ్బతీసింది. తరువాత పెద్ద ఉదంతాలేమీ జరగలేదు గనుక సీనియర్‌ అధికారి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యల వెనుక ప్రభుత్వ ఆలోచనాధోరణి కనిపిస్తున్నది. చైనా తన వస్తువులను తక్కువ ధరలకు మనదేశంతో సహా ప్రపంచంలో కుమ్మరిస్తున్నదని కొంత మంది నిరంతరం ఆరోపిస్తుంటారు. అలాంటి వివాదాలను, సమస్యలను పరిష్కరించటానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది.చైనా మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని అనేక దేశాలు అనుకుంటున్నట్లుగానే మనదేశంలో కూడా కొందరు సూచిస్తున్నారు. తప్పేమీ లేదు. చైనా బదులు ప్రపంచం మన మీదే ఆధారపడే విధంగా చేస్తానని ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర పిలుపులు ఇచ్చారు. మంచిదే, ఎవరూ కాదనటం లేదు.కానీ కొంత కాలానికి మనదేశం మీద ఆధారపడకూడదని ఇతర దేశాలు అనుకోవన్న గ్యారంటీ ఏమిటి? అసలు సమస్య అది కాదు. ఏ దేశానికి ఆదేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్దమయ్యే పరిస్థితి వచ్చేంత వరకు పరస్పరం ఆధారపడక తప్పదన్నది వాస్తవం.


అనుభవమైతే గానీ తత్వం తలకెక్కదంటారు పెద్దలు. గాల్వన్‌ ఉదంతం తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక ప్రచారం, వస్తు బహిష్కరణ పిలుపుల సంగతి, చైనాతో విడగొట్టుకోవాలన్న స్థానిక, అంతర్జాతీయ పెద్దల సలహాలు ఎరిగినవే. అయినప్పటికీ చైనా నుంచి దిగుమతులలో ఏడాదికేడాది స్వల్పతేడాలుండవచ్చుగానీ పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. చైనాకు మన ఎగుమతులు పెరగటం లేదు.చైనా కంటే ముందు గతంలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌,మోటారు వాహనాలు, సెల్‌ఫోన్లు మన మార్కెట్‌ను ముంచెత్తాయి.ఇప్పటికీ గణనీయంగానే ఉన్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి ఎగుమతులు చేశాయన్నది తెలిసిందే. మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు వాటిని ఇక్కడే తయారు చేస్తే అనే ఆలోచన రాలేదనుకుంటే పొరపాటు. అందుకు అనువైన పరిస్థితి మనదేశంలో అప్పుడూ ఇప్పుడూ లేదు. గతంలో ఉన్న కాంగ్రెస్‌ పాలకులకూ, ఇప్పుడున్న నరేంద్రమోడీకి అది పట్టలేదు.చౌకగా వస్తూత్పత్తికి అవసరమైన పరిశోధన-అభివృద్ధికి భారీ మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు చేయకుండా వీలుకాదు. అందుకే ఉత్పత్తి కంటే దిగుమతి చేసుకుంటే వచ్చే లాభాలే ఎక్కువని అప్పుడూ ఇప్పుడూ మన కార్పొరేట్‌ శక్తులు భావిస్తున్నాయి. జపాన్‌ కంపెనీలు తమ మార్కెట్‌కోసం మన దేశంలోని స్థానిక కార్పొరేట్లతో సంయుక్త భాగస్వామ్య కంపెనీలను ఏర్పాటు చేశాయి గనుకనే మారుతీ సుజుకీ, హీరో హౌండా,స్వరాజ్‌ మజడా, వంటి కంపెనీలు రంగంలోకి వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ మోటారు వాహన రంగంలో చైనా ముందుంది.దానితో సంయుక్త భాగస్వామ్యానికి మన పాలకులు అంగీకరిస్తే జపాన్‌ మారుతీ కార్ల మాదిరి చైనా ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి.ఇప్పటికిప్పుడు ఆ రంగంలో మనం పోటీపడలేం గనుక ఆ లాభాల కోసం మన కార్పొరేట్లు చైనా పెట్టుబడులను అనుమతించాలని వత్తిడి చేస్తున్నాయా ? ప్రభుత్వం అంగీకరిస్తుందా? దానికి సూచికగానే మన ఉన్నత అధికారి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ దవోస్‌లో మాట్లాడారా ? చూద్దాం ఏం జరుగుతుందో !

మధ్య ప్రాచ్య సంక్షోభం : ఎమెన్‌పై అమెరికా,బ్రిటన్‌ దాడులు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలో పరిణామాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తమ శత్రువులు, ఇజ్రాయెల్‌ గూఢచార కేంద్రాలపై దాడులు చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉండే నౌకలపై కొనసాగిస్తున్న దాడులను ఎమెన్‌లోని హౌతీ సాయుధులు తీవ్రం చేశారు. వారి మీద అమెరికా, బ్రిటన్‌ ప్రత్యక్షంగా దాడులు చేస్తుండగా పది దేశాలు వాటికి వివిధ రూపాలలో సాయపడుతున్నాయి. గాజాపై యూదు దురహంకారుల మారణకాండ, విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు ఇప్పుడున్న బ్రెంట్‌ రకం 78 డాలర్ల నుంచి ఏప్రిల్‌ నాటికి 110 డాలర్ల వరకు పెరగవచ్చని కొందరు జోశ్యాలు చెబుతున్నారు. తాము పాలస్తీనాకు మద్దతుదార్లమే అనే సంకేతాలు ఇచ్చేందుకు ఎర్ర సముద్రంలో ప్రవేశించే అనేక నావలు చైనా, రష్యా సిబ్బందితో నడుస్తున్నట్లు సంకేతాలు పంపుతున్నాయి. ఇవి నిజంగా ఆ దేశాల కంపెనీలకు చెందినవేనా లేక దాడులను తప్పించుకొనేందుకు అలా సూచిస్తున్నాయా అన్నది నిర్ధారణ కాలేదు.ఉత్తర గాజా ప్రాంతంలో పౌరుల ప్రాణ రక్షణకు అవసరమైన ఆహారం, ఔషధాలు,మంచినీరు, ఇతర అవసరాలను అందచేస్తున్న సంస్థలను ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నదని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇప్పటివరకు గాజాలో 24వేల మందికి పైగా పౌరులను ఇజ్రాయెల్‌ చంపింది, 61వేల మంది గాయపడ్డారు. తాను గనుక అధ్యక్షుడిగా ఉండి ఉంటే పరిస్థితిని ఎంతో వేగంగా చక్కదిద్ది ఉండేవాడినని డోనాల్ట్‌ ట్రంప్‌ చెప్పుకున్నాడు. తాను పదవిలో ఉంటే అసలు ఇజ్రాయెల్‌ దాడే చేసి ఉండేది కాదన్నాడు. అమెరికా చరిత్రలో జో బైడెన్‌ పరమ చెత్త అధ్యక్షుడని వర్ణించాడు.


ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ దళం (ఐఆర్‌జిసి) సోమవారం నాడు ఇరాక్‌, సిరియాల్లోని శత్రు కేంద్రాలు,స్థావరాలపై ఖండాంతర క్షిపణులతో దాడులు జరిపింది. ఇరాక్‌లోని కర్దిష్‌ పాక్షిక స్వయం పాలిత ప్రాంత రాజధాని ఎర్బిల్‌ నగరంలోని ఇజ్రాయెల్‌ గూఢచార కేంద్రంపై దాడులను కేంద్రీకరించింది.పేలుళ్ల కారణంగా జరిగిన నష్టం గురించి వెల్లడి కాలేదు గానీ ఐదుగురు మరణించినట్లు కర్దిష్‌ డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటించింది. ఈనెల ప్రారంభంలో ఇరాన్‌లోని కెర్మెన్‌ పట్టణంలో జరిపిన దాడుల్లో వంద మంది మరణానికి కారకులం తామే అని ఐఎస్‌ఐఎల్‌ ప్రకటించింది. సోమవారం నాడు సిరియాలోని ఆ సంస్థ కేంద్రాలపై ఇరాన్‌ దాడులు చేసింది.సిరియాలోని ఐఎస్‌ఐఎస్‌ తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ పార్టీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ సోమవారం నాడు దీర్ఘశ్రేణి క్షిపణిదాడి జరిపిందని, నిజానికి ఇది ఇజ్రాయెల్‌ను హెచ్చరించటమే అని ఇరాన్‌ మిలిటరీ వ్యవహారాల జర్నలిస్టు మహమ్మద్‌ షల్‌టౌకీ చెప్పాడు. ఆ క్షిపణి పన్నెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని, ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దాడి జరపలేదని అన్నాడు.తాను తలచుకొంటే నేరుగా ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలను గురిచూసి కొట్టగలనని చెప్పటమే ఇదన్నాడు.హమస్‌ను ఓడించటం జరిగేది కాదని అయినప్పటికీ లక్ష్యాన్ని సాధించాల్సిందేనని ఇజ్రాయెల్‌ న్యాయశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత యుద్ధ కాబినెట్‌ మంత్రి గిడియన్‌ సార్‌ చెప్పాడు.వంద రోజులుగా జరుపుతున్న దాడుల మీద పెద్ద ఎత్తున వత్తిడి వస్తున్నది. గాజాపై యుద్ధాన్ని సమర్ధిస్తున్నందుకు గాను ఇద్దరు ముఖ్యమైన అధికారులు జో బైడెన్‌కు తమ రాజీనామాలను సమర్పించారు. ఎర్ర సముద్రంలో అమెరికా వస్తురవాణా నౌక ఎంవి జిబ్రాల్టర్‌ ఈగిల్‌పై ఎమెన్‌ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధులు క్షిపణులతో దాడులు జరిపారు. అది మార్షల్‌ ఐలాండ్స్‌ పతాకంతో ఉంది. పెద్దగా నష్టం లేదని, ప్రయాణం కొనసాగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఎమెన్‌లోని హౌతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌ దాడులు జరుపుతున్నాయి. సోమవారం నాడు ఒక విమానాశ్రయం వద్ద పేలుళ్లు వినిపించాయి. ఇజ్రాయెల్‌ వైపు వెళ్లే నౌకలపై దాడులను కొనసాగిస్తూనే ఉంటామని హౌతీ నేతలు ప్రకటించారు. అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రం, ఏడెన్‌ జలసంధికి దగ్గరగా ఉన్న కీలక ప్రాంతం, రాజధాని సనాతో సహా ముఖ్యమైన ప్రాంతాలన్నీ హౌతీ సాయుధుల ఆధీనంలో ఉన్నాయి.తమదే అధికారం అని ప్రకటించుకున్నాయి. ఎమెన్‌పై దాడులను ఆపాలని ఇరాన్‌ ప్రభుత్వం అమెరికా,బ్రిటన్‌లను కోరింది. ఆ దాడులు చట్టవిరుద్దమని ప్రకటించగా తాము ఆత్మరక్షణ కోసం జరుపుతున్నట్లు అమెరికా చెప్పుకుంటున్నది.హౌతీలకు ఇరాన్‌ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఎమెన్‌ అంతర్యుద్ధంలో హౌతీలకు వ్యతిరేకంగా అమెరికా అనుకూల శక్తులకు దాదాపు పది సంవత్సరాలపాటు మద్దతు ఇచ్చిన సౌదీ అరేబియా ఇటీవల ఇరాన్‌తో దౌత్య సంబంధాలను పునరుద్దరించుకుంది.దాంతో హౌతీలపై చేస్తున్న దాడులకు సాయాన్ని నిలిపివేసింది. ఈ పరిణామం మింగుడుపడని అమెరికా ఇప్పుడు ఎర్రసముద్రంలో నౌకల రక్షణకు గాను తాము ఎమెన్‌పై దాడులు జరుపుతున్నట్లు సాకు చూపుతున్నది.హౌతీల వెనుక ఇరాన్‌ ఉన్నట్లు ఆరోపిస్తున్నది.


అమెరికా నౌకపై దాడి దానికి ప్రతిగా బ్రిటన్‌తో కలసి అమెరికా దళాలు చేస్తున్న దాడుల తరువాత హౌతీలు ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని ప్రకటించటంతో అమెరికా కూటమి సామర్ధ్యం గురించి విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.సమీప భవిష్యత్‌లో తాము ఎల్‌ఎన్‌జి రవాణా నౌకలను ఎర్ర సముద్రంలోకి పంపే అవకాశం లేదనని కతార్‌ ప్రకటించింది. గురువారం నాటి అమెరికా,బ్రిటన్‌ దాడుల తరువాత ఆ మార్గంలో ప్రయాణించే నౌకలు తగ్గాయి.గత ఆరువారాల్లో హౌతీలు 30సార్లు నౌకలపై జరిపారు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను నిలిపివేస్తే తాముకూడా స్వేచ్చగా నౌకల రవాణాను అనుమతిస్తామని ప్రకటించారు. తమ దాడులు ఒక హెచ్చరిక మాత్రమేనని, నిరంతరం కొనసాగిస్తామని చెప్పలేదని బ్రిటన్‌ రక్షణ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ చెప్పాడు.ఐరాస గుర్తింపు పొందిన ఎమెన్‌ ప్రభుత్వం హౌతీలను ఓడించాలంటే తమకు మిలిటరీ ఆయుధాలు, శిక్షణతో పాటు గూఢచార సమాచారాన్ని అందించాలని పశ్చిమ దేశాలను కోరింది. తొమ్మిది సంవత్సరాల పాటు సౌదీ అరేబియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, వైమానిక దళ శక్తి చాలదని మేజర్‌ జనరల్‌ ఇదారస్‌ చెప్పాడు.హౌతీల క్షిపణులు భూగర్భంలో ఉంటాయని వాటిని పసిగట్టటం కష్టమని కూడా చెప్పాడు.ఆదివారం నాడు ఎమెన్‌ పిఎల్‌సి ప్రభుత్వ ప్రధాని మయీన్‌ అబ్దుల్‌ మాలీతో బ్రిటన్‌ రాయబారి భేటీ అయ్యాడు. మరుసటి రోజు తాము ఇజ్రాయెల్‌ను సమర్ధించటం లేదని, పాలస్తీనియన్లకు మద్దతు ఇస్తున్నట్లు ఎమెన్‌ ప్రకటించింది. తొలిసారిగా ఎమెన్‌పై అమెరికా,బ్రిటన్‌ దాడులకు దిగినప్పటికీ వాటిని ఎదురుదాడులుగా పరిగణించలేమని కొందరు చెబుతున్నారు.ఎర్ర సముద్రంలో స్వేచ్చగా తమ నౌకలు తిరిగే హక్కుందని స్పష్టం చేయటమే అసలైన లక్ష్యమని చెబుతున్నారు. ఈ దాడులకు ఆస్ట్రేలియా, బహరెయిన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ తదితర దేశాల మద్దతు ఉంది.హౌతీల చరిత్ర చూసినపుడు వారిని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదని చెబుతున్నారు.అమెరికా యుద్ధ నౌక డెస్ట్రాయర్‌ మీద జరిపిన దాడి తరువాత సోమవారం నాడు అమెరికా వాణిజ్య నౌక మీద హౌతీలు దాడులు జరిపారు. ఎర్ర సముద్రం నుంచి సూయజ్‌ కాలువకు వెళ్లే మార్గంలో కీలకమైన బాబ్‌ అల్‌ మండెబ్‌ జలసంధితో సహా ఎమెన్‌ కీలక ప్రాంతాలన్నీ హౌతీల చేతుల్లో ఉన్నాయి. ఉద్రిక్తతలు మరింత దిగజారకుండా చూడాలని జో బైడెన్‌ పైకి చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్‌కు ఆయుధాలు పంపేందుకు ఇప్పటికి రెండు సార్లు అమెరికా పార్లమెంటును పక్కన పెట్టి తన అధికారాలను వినియోగించాడు. రానున్న రోజుల్లో ఎమెన్‌ మీద దాడులు జరిపితే పరిస్థితి విషమించవచ్చు.


విశ్లేషకుల అంచనాలు తప్ప వచ్చు, పోరు తమకు లాభం చేకూర్చుతుందని అమెరికా, దాని మిత్ర దేశాలు భావిస్తే ఆ ప్రాంతాన్ని యుద్ధ రంగంలోకి లాగవచ్చు. అదే జరిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ప్రపంచ కంటెయినర్‌ రవాణా 30, పన్నెండుశాతం ప్రపంచ వాణిజ్యం ఎర్ర సముద్రంగుండా జరుగుతున్నది. ఐరోపాతో మన దేశ వస్తువాణిజ్యం 80శాతం ఈ మార్గం నుంచే ఉంది. రవాణా వ్యయం పెరిగి మనం చేసుకొనే దిగుమతుల ఖర్చు పెరిగితే వాటిని మనజనం మీద మోపుతారు. అదే మన ఎగుమతుల రవాణా ఖర్చు పెరిగితే వాటిని కొనేవారు లేకపోతే పరిస్థితి ఏమిటన్నది సమస్య. ఇప్పటి వరకైతే ఎలాంటి సమస్య లేదు గానీ జనవరి నుంచి ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. నవంబరు మధ్య నుంచి సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించాల్సిన నౌకలలో 95శాతం ఆఫ్రికాలోని గుడ్‌ హౌప్‌ ఆగ్రంను చుట్టి వస్తున్నాయి. దీని వలన నాలుగు నుంచి ఆరువేల నాటికల్‌ మైళ్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి రావటం, 14 నుంచి 20రోజులు అదనపు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్‌ దాడులను కొనసాగించినంతకాలం హౌతీల దాడులు కొనసాగుతూనే ఉంటాయి. అదే జరిగితే ప్రపంచ ముడిచమురు సరఫరా వ్యవస్థ దెబ్బతినవచ్చని ఆరు నుంచి ఎనిమిది మిలియన్ల పీపాల సరఫరాలోటు ఏర్పడవచ్చని అక్టోబరు చివరిలో ప్రపంచ బాంకు హెచ్చరించింది.ఫలితంగా 56 నుంచి 75శాతం వరకు ధరలు పెరిగి 140 నుంచి 157 డాలర్ల వరకు పీపా ధర పెరగవచ్చని పేర్కొన్నది. అయితే చమురు వ్యాపారులు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పీపాధర 110 డాలర్లవరకు పెరగవచ్చనే అంచనాతో 30 మిలియన్ల పీపాల మీద పందెంకాశారు.( అంతకంటే తక్కువ ధర ఉంటే వారు చెల్లిస్తారు ఎక్కువ ఉంటే ఇతరుల నుంచి తీసుకుంటారు.చమురు చేతులు మారదు) దీనికి ప్రధాన కారణం ఇరాన్‌ పూర్తి మద్దతు ఉన్న హౌతీ సాయుధుల చర్యలే. అదే విధంగా మే, జూన్‌ మాసాల్లో 130 డాలర్లు ఉండవచ్చని కూడా పందెం కాస్తున్నారు. మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం ఈ ఏడాది ఆరునెలల్లో వంద డాలర్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో పెద్ద పరిణామాలేవీ జరగకపోవచ్చని అనేక మంది చెబుతున్నారు. డిసెంబరులో రాయిటర్స్‌ సర్వేలో 34 మందిలో ఒక్కరే ఈ ఏడాది 90 డాలర్లకంటే ఎక్కువ ఉండవచ్చని చెప్పారు.అమెరికా, ఇతర పశ్చిమదేశాలు అనుసరిస్తున్న వైఖరి కారణంగా మొత్తం మీద పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి.తమ మీద దాడులు జరిగిన తరువాత కూడా అమెరికా నౌకల మీద హౌతీలు దాడులు చేశారు. ఇవి ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

అయోధ్య రామాలయ వివాదం : ఎరక్కపోయి ఇరుక్కున్న గాయని చిత్ర ! శంకరాచార్యలపై కేంద్ర మంత్రి ధ్వజం !!

Tags

, , , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగేవరకు దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు వివాదాలు కూడా కొనసాగేట్లున్నాయి. మతాన్ని, విశ్వాసాలను పాటించేవారు మౌనంగా ఉండగా ఓట్ల కోసం రాముడిని ముందుకు తెచ్చిన రాజకీయ కుహనా హిందూత్వవాదులదే పైచేయి కావటం ప్రత్యేకత. తెలిసిగానీ తెలియకగానీ చేసిన ప్రకటనలతో సుప్రసిద్ద గాయని చిత్ర తాజాగా సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. జనవరి 22న విగ్రహ ప్రతిష్ట జరిగే 12.20ని సమయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ సంకీర్తన జరపాలని, జ్యోతులను వెలిగించాలని, లోకసమస్తా సుఖినోభవంతు అంటూ గాయని చిత్ర సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు, విడుదల చేసిన వీడియోలో కోరారు.దీని మీద అనేక మంది అనుకూలంగానూ వ్యతిరేకంగానూ స్పందించారు. బిజెపి నేతలు కేరళ ప్రభుత్వం మీద, కమ్యూనిస్టుల మీద దాడికి ఉపయోగించుకున్నారు. వామపక్ష పాలిత రాష్ట్రంలో అసహనానికి ఇది నిదర్శనమంటూ ఆరోపించారు. సామాజిక మాధ్యమం మీద కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి గానీ ఎలాంటి నియంత్రణ, అధికారం లేదు. వామపక్షాలు, పురోగామి భావాలకు వ్యతిరేకంగా సంఘపరివార్‌, బిజెపి నేతల స్పందనలు అదే సామాజిక మీడియా, సంప్రదాయ మీడియాలో చోటు చేసుకుంటున్నాయంటే అసహనం, వ్యతిరేకత ఉంటే కుదిరేదా ? తన మీద వచ్చిన విమర్శలు లేదా ప్రశంసల గురించి గానీ ఇది రాస్తున్న సమయానికి చిత్ర వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.


భావ వ్యక్తీకరణ హక్కులో భాగంగా ఇతరుల హక్కులకు భంగం కలుగకుండా ఏమైనా చెప్పవచ్చు. ఆ రీత్యా చూసినపుడు చిత్ర తన భావాన్ని వ్యక్తం చేశారు. అయితే అదే భావ వ్యక్తీకరణలో భాగంగా ఒకరి భావాలను మరొకరు విమర్శించే హక్కు కూడా మన రాజ్యాంగం కల్పించింది. అఫ్‌కోర్సు దానికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. నూరుపూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా భావజాల చర్చ జరగాల్సిందే. చిత్రను సమర్ధించిన వారు కొందరైతే అలాంటి సందేశం ద్వారా రాజకీయ వైఖరులను తీసుకున్నారని మరికొందరు విమర్శించారు. ” చిత్రకు భావ ప్రకటనా స్వేచ్చ ఉంది, ఆమె నచ్చిన వైపు నిలిచే స్వేచ్చ కూడా ఉంది.ఆమె తన ఇంట్లో రామ భజన చేయవచ్చు, దీపాలను వెలిగించుకోవచ్చు. మారణకాండకు, జాత్యంహంకారానికి దారితీసే ఒక కారణాన్ని అమాయకంగా ఉత్సవంగా జరుపుకోవటంలో హానికరమైనది కనిపించకపోవచ్చుగానీ అది వాస్తవానికి అది ఎంతో బాధాకర అనుభవం అని రచయిత్రి ఇందూ మీనన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో చిత్ర తీరును విమర్శించారు. జనాల రక్తం, వలసలు, వారి బాధలు పట్టకుండా మీరు రామ భజన చేస్తున్నారు.రాముడు లేదా విష్ణువు రాబోవటం లేదు. మీరు ఐదులక్షల దీపాలను వెలిగించినప్పటికీ మీ బుర్ర వెలుగుతో నిండదు. మీ కంఠం కారణంగానే మిమ్మల్ని నైటింగేల్‌(పశ్చిమ దేశాల్లో కోకిల వంటి మధురంగా కూసే పక్షి) అని భావించారు, కానీ మీరు నకిలీ నైటింగేల్‌ అని రుజువైంది అని ఇందూ మీనన్‌ తీవ్రంగా విమర్శించారు.చరిత్రను విస్మరించి ప్రతివారూ సుఖంగా ఉండాలని చెప్పేవారి అమాయకత్వం ఇక్కడ ముఖ్యమైనదని గాయకుడు సూరజ్‌ సంతోష్‌ అన్నారు.మసీదును కూల్చివేసి దేవాలయాన్ని కట్టిన చరిత్రను చిత్ర కావాలనే మరచినట్లు విమర్శించారు. ప్రముఖ గాయకుడు జి వేణుగోపాల్‌ ఒక వైపు చిత్రకు మద్దతు ఇస్తూనే ఆమె ప్రకటనలపట్ల ఏవైనా విబేధాలుంటే విమర్శించేవారు ఆమెను క్షమించాలని వ్యాఖ్యానించారు. ఆమె కేవలం భక్తిభావంతో చెప్పారే తప్ప రాజకీయ కోణం తెలియదని అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని, మనకోసం వేలాది పాటలు పాడిందని అన్నారు. క్షమించాల్సినంత తప్పేమి చేసిందని కొందరు వ్యాఖ్యానించారు.గాయని చిత్ర గతాన్ని చూసినపుడు ఎలాంటి వివాదాలలో చిక్కుకోలేదు. వివాదాస్పద వ్యాఖ్యలూ చేసిన చరిత్ర లేదు.ప్రతిదాన్నీ రాజకీయం గావిస్తున్న వర్తమానంలో ప్రజాజీవనంలో ఉన్న ప్రముఖులు తాము చేసే ప్రకటనల పట్ల తగిన జాగరూకత పాటించాలని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


సుప్రీం కోర్టే ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.విశ్వాసం ఉన్నవారు అయోధ్య రామాలయానికి వెళ్లవచ్చు, లేనివారు వెళ్లకపోవచ్చు, గాయని చిత్ర ప్రకటనను వివాదాస్పదం కావించాల్సిన అవసరం ఏముంది, తమ అభిప్రాయాలను ఎవరైనా వెల్లడించుకోవచ్చని సిపిఎం నేత, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ వ్యాఖ్యానించారు.కేరళ ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ మాట్లాడుతూ భౌతిక దాడులు చేయలేనపుడు సామాజిక మాధ్యమాల ద్వారా దాడి చేయటం ఫాసిజం అన్నారు. మనం చిత్ర వైఖరితో అంగీకరించకపోవచ్చు, ఆమె వైఖరిని ఆమెను వెలిబుచ్చనివ్వండి, ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుంది, ఎవరైనా అంతకు ముందు చెప్పని వాటి గురించి మాట్లాడటాన్ని ప్రశ్నించవచ్చు అన్నారు. సనాతన ధర్మాన్ని నమ్ముతున్న కారణంగానే గాయని చిత్ర మీద విమర్శలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. వామపక్ష-జీహాదీ వాతావరణంలో ఉన్నవారే దాడులు చేస్తున్నారన్నారు.ఈ విమర్శలు చేస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. పినరయి విజయన్‌ పాలనలో హిందువులు తోటి వారితో తమ విశ్వాసాలను పంచుకొనే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌ దీని మీద మౌనంగా ఉందని ఎక్స్‌లో ఆరోపించారు. కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ విలేకర్లతో మాట్లాడుతూ అయోధ్యను అవకాశంగా తీసుకొని హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. వామపక్షం, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అసహనానికి ఒక ఉదాహరణ చిత్ర మీద చేస్తున్న విమర్శలని జాతీయ మహిళాకమిషన్‌ సభ్యురాలు, బిజెపి నేత కుషఉ్బ ఆరోపించారు.


మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి నారాయణ రాణే శంకరాచార్యల మీద ధ్వజమెత్తటాన్ని కుషఉ్బ వంటి వారు ఎలా వర్ణిస్తారు.నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, ఇతర మతాల వారిని పక్కన పెడితే హిందూమతాన్ని నమ్మేవారు, పాటించేవారికి నలుగురు శంకరాచార్యలు పూజనీయులు ! ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ ఏదో ఒక సమయంలో వారి పాదాలవద్ద చేరి ఆశీస్సులు పొందిన వారే. రామాలయ ప్రతిష్ట మీద వారు మాట్లాడినదాన్ని ఇప్పుడు ఎందుకు సవాలు చేస్తున్నట్లు ? హిందూ ధర్మానికి మీరేమి చేశారని గతంలో ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదన్నది కీలక అంశం. శంకరాచార్యులను అవమానించినందుకు గాను కేంద్ర మంత్రి రాణేను పదవి, పార్టీ నుంచి తొలగించాలని శివసేన నేత ఉద్దావ్‌ థాకరే డిమాండ్‌ చేశారు. బిజెపి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కోరారు. రాణేకు వ్యతిరేకంగా ఆదివారం నాడు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అంతకు ముందు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మంత్రి రాణే విలేకర్లతో మాట్లాడుతూ శంకరాచార్యలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని రాజకీయ కోణం నుంచి చూస్తున్నారని ఆరోపించారు. ఇంతవరకు ఏ ఒక్కరూ ఏమీ చేయలేదని, ప్రధాని మోడీ, బిజెపి బాధ్యతను తీసుకొని రామాలయాన్ని నిర్మించిందని, దాన్ని వారు ఆశీర్వదించాలా లేక విమర్శించాలా ? ఆలయాన్ని రాజకీయాలకోసం కాదు మతం కోసం నిర్మించాము, రాముడు మా దేవుడు.హిందూమతం కోసం తామేమీ చేసిందీ శంకరాచార్యలు చెప్పాలని రాణే డిమాండ్‌ చేశారు. శంకరాచార్యలు రాకపోవటానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా కారకులే అని శివసేన విమర్శించింది. వారు రాకపోతేనే మీ బొమ్మలు కనిపిస్తాయి, వస్తే వారి చిత్రాలనే పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నది.రామాలయాన్ని కూల్చి బాబరీ మసీదును కట్టారని ఇంతకాలం సంఘపరివారం ఆరోపించింది.కానీ పూర్తికాని రామాలయాన్ని ఎన్నికల కోసం ముందే ప్రారంభించారన్న విమర్శలు ఇప్పుడు చరిత్రకెక్కాయి. ఇది వాస్తవం.

నయనతారకు ఒక న్యాయం,రామాలయ ట్రస్టుకు మరొకటా ! పవిత్ర కట్టడం కాదు సమాధి అన్న శంకరాచార్య !! హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదెవరు ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి సినిమా తమ మనోభావాలను గాయపరచిందని హిందూత్వవాదులు ఫిర్యాదు చేసిన కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ ఆ సినిమాను తన వేదిక నుంచి తొలగించింది. ఒక బ్రాహ్మణ పూజారి కుమార్తె బతుకుతెరువు కోసం వంటగత్తెగా మారి ఎలా ఎదిగిందన్నది ప్రధాన కథ. తండ్రి ప్రసాదాలు వండి వడ్డిస్తే, కుటుంబ ఆంక్షలకు భిన్నంగా పాకశాస్త్ర కాలేజీలో చేరి మాంసాహార తయారీ నేర్చుకోవటమే గాక, ఒక రోజు తింటూ కనిపిస్తుంది. ఆ క్రమంలో ఆమెకు బలవంతంగా వివాహం చేసేందుకు తండ్రి చూడటంతో ఇష్టం లేనందున తన స్నేహితుడు ఫర్హాన్‌తో కలసి ఇంటి నుంచి పారిపోతుంది. ఈ సినిమాను సెన్సార్‌ బోర్డు అనుమతించిన తరువాత విడుదలైంది. అయితే కొద్ది రోజుల తరువాత ఆ కథ, చిత్రీకరణలో తమ దేవతలు మాంసాహారాన్ని తింటున్నట్లు చిత్రించారని, ఇది హిందూమత, బ్రాహ్మణ కుల మనోభావాలను గాయపరచిందంటూ ఫిర్యాదులు, పోలీసు కేసుల దాఖలు వరకు హిందూత్వవాదులు వెళ్లారు.లవ్‌ జీహాద్‌ కోణం కూడా ఉందని ఆరోపించారు. ఇదే సమయంలో అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట శాస్త్రవిరుద్దంగా జరుగుతోందంటూ ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా నలుగురు శంకరాచార్యలు తిరస్కరించారు. వారి మనోభావాలు దెబ్బతిన్న కారణంగానే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. భార్యలేని నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్ట పూజలకు అనర్హులని సామాజిక మాధ్యమంలో వ్యతిరేక, అనుకూల వాదనలు వెల్లువెత్తాయి. శంకరాచార్యుల వ్యాఖ్యల మీద మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రామాలయ ట్రస్టు చేస్తున్నది సనాతన హిందూ ధర్మ విరుద్దమని వారు ప్రకటించినప్పటికీ ఏ ఒక్క హిందూత్వవాది మనోభావాలూ గాయపడలేదు, ఆ కార్యక్రమం మీద ఎలాంటి పోలీసు కేసులు నమోదు చేయలేదు. ఎవరు ఎవరి మనోభావాలను దెబ్బతీశారు. కొందరిపైనే హిందూత్వవాదులు ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారు.శంకరాచార్యులు చెప్పిన మాటలనే ఏ నాస్తికులో, హేతువాదులో చెప్పి ఉంటే ఈ పాటికి ఎంత రచ్చ జరిగి ఉండేది !


బాబరీ మసీదు-రామ మందిర వివాదానికి సుప్రీం కోర్టు తెరదించింది. ఆ తీర్పు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా దాన్నెవరూ సవాలు చేయలేదు. ఆ మేరకు బాబరీ మసీదును కూల్చిన ప్రాంతంలో రామాలయ నిర్మాణం జరుగుతోంది.అది పూర్తిగాక ముందే ప్రారంభానికి ముహూర్తం పెట్టటంతో కొన్ని వివాదాలు తలెత్తాయి. వాటిని నాస్తికులు, హేతువాదులు, అబ్రహామిక్‌ మతాల వారో చెప్పలేదు. సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధులుగా, భాష్యం చెబుతున్న నలుగురు శంకరాచార్యులే అభ్యంతరాలను లేవనెత్తారు. రామాలయ నిర్మాణం కావించిన నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిధిగా రావటాన్ని సహించలేని శంకరాచార్యులు తమ మనోభావాలను గాయపరుస్తున్నారంటూ వారి మీద సామాజిక మాధ్యమంలో మోడీ భక్తులు విరుచుకుపడుతున్నారు. అసలు రామాలయ ఉద్యమంలో వారెక్కడ ఉన్నారని సవాళ్లు విసురుతున్నారు. తమ మనోభావాలను దెబ్బతీస్తూ సనాతన ధర్మ విరుద్ద పద్దతులకు తెరతీశారని శంకరాచార్యులను అనుసరించేవారు కుమిలిపోతున్నారు. ఎవరైనా నరేంద్రమోడీ చేస్తున్నది ధర్మవిరుద్దం అంటూ వీధుల్లోకి వస్తే వారి వీపులకు హామీ లేదనే వాతావరణం నేడుంది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. హిందూ మతంలోని అసంబద్దతలు, మతం లేదా మనుస్మృతి పేరుతో అమలు జరిపిన వివక్షాపూరితమైన చర్యలను ప్రశ్నించిన నాస్తికులు, హేతువాదులు, సంస్కరణ వాదులు, పురోగామివాదులు, కమ్యూనిస్టులను హిందూ ద్వేషులు, సనాతన ధర్మవిరోధులుగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు హిందూత్వను పరిరక్షిస్తామని చెబుతున్నవారు శంకరాచార్యులను కూడా ఆ జాబితాలో చేరుస్తారా ? లేదా సనాతనాన్ని నిలబెట్టాలని కంకణం కట్టుకున్నాం అనుకుంటున్నవారు రామాలయాన్ని రాజకీయం చేసిన నరేంద్రమోడీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలను ధర్మం కోసం- దేశం కోసం వ్యతిరేకిస్తారో లేదో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చింది.


హిందూ ఉనికి కోసం పోరాటం(స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌.ఓఆర్‌జి) అనే వెబ్‌ సైట్‌ జనవరి ఏడవ తేదీన దైనిక్‌ జాగరణ్‌ అనే పత్రిక ప్రచురించిన ఒక వ్యాసం ఆధారంగా చేసిన వ్యాఖ్యను తన సైట్‌లో ఉంచింది. నలుగురు సనాతన హిందూ ధర్మ గురువులు ఎందుకు రామ మందిర ప్రాణప్రతిష్టలో పాల్గొనటం లేదు అన్నది దాని శీర్షిక. దాన్ని రాసిన వారు ఉపేంద్ర భారతి, శౌనక్‌ రారు చౌదరి. వారి రచనలో పేర్కొన్న కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.” గోవర్ధన మఠ పూరీ పీఠ శంకరాచార్య స్వామి శ్రీ నిశ్చలానంద సరస్వతి అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరస్కరించారు. ఆయనిలా చెప్పారు.” పవిత్ర ఆలయ నిర్మాణంవైపుగా ప్రభుత్వ ప్రయత్నం లేదు ” ఆయన మాటల్లోనే ” ఒక సమాధి ” అని ఆ నిర్మాణాన్ని వర్ణించటాన్ని బట్టి సాంప్రదాయ ఆలయ నిర్మాణానికి ఉండవలసిన పూజ్యభావం మరియు పవిత్రత దానికి లేవు అని సూచించినట్లయింది. తగిన గౌరవంలేని స్థలానికి వెళ్లటం ఇష్టం లేదనే ఆయన నిర్ణయం వెల్లడిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవటం అంటే శ్రీరాముడిని తిరస్కరించటం కాదు. కొందరు నేతల అవకాశవాద, తిమ్మినిబమ్మిని చేసే రాజకీయాలకు వ్యతిరేకం.


శృంగేరి శారదా పీఠ శంకరాచార్య స్వామి శ్రీ భారతీ తీర్ధ ఎందుకు తిరస్కరించారంటే ఆలయ నిర్మాణం అసంపూర్తిగా జరగటమే.అలాంటి దానికి వెళ్లటం సరైన చర్యకాదు. దీనితో పాటే ఆసియాలో అతి పెద్దదైన మసీదును అయోధ్యలో నిర్మించాలని తలపెట్టటం పట్ల ఆయన తన ఆందోళన వెల్లడించారు. దురదృష్టకరమైన పరిణామాలుగా భావిస్తున్నారు.తాను, ఇతరులు కోర్టుకు రామమందిరం సాక్ష్యాలను సమర్పించామని, కానీ రామమందిర ట్రస్ట్‌ లేదా దాని ప్రతినిధులుగానీ ఆలయనిర్మాణంలో తమ సలహాలు తీసుకోలేదని భారతీ తీర్ధ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలో ద్వంద్వ వైఖరి ఉన్నట్లు శంకరాచార్య విమర్శించారు. రామాలయ నిర్మాణం చేసినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మనోభావాలను ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతీ తీర్ధ నిరాకరణకు ప్రాణ ప్రతిష్ట పవిత్రత, నిర్మాణ క్రమం పట్ల అసంతృప్తి, మత వ్యవహారాల పట్ల ప్రభుత్వ వైఖరికి తిరస్కరణగా చెప్పవచ్చు.


ద్వారకా పీఠ శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి అనేక అంశాల మీద ఆందోళన వెల్లడించారు. పుష్య మాసం ప్రాణప్రతిష్టకు శుభప్రదం కాదన్నది మొదటి విమర్శ.దేవతల ప్రతిష్టాపన అశుభ గడియల్లో చేపట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. సరైన సమయం వచ్చే శ్రీరామ నవమి అవుతుంది.రామ నవమి నాటికి ఎన్నికల నియమావళి అడ్డం వస్తుంది గనుక ముందుగానే ఎంచుకోవటం వ్యూహాత్మకమని, అప్పుడు జరిపితే పెద్దగా ఉపయోగం ఉండదని బిజెపి నేతలు భావించిన కారణంగానే నిర్మాణం పూర్తి కాకుండా ముందుగానే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని సదానంద సరస్వతి భావిస్తున్నారు. మతపరమైన అంశాలు, రాజకీయ ఉద్దేశ్యాలు, ప్రాణ ప్రతిష్ట సమయం, నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించటం అనే అంశాలు అయోధ్య రావటం లేదని చెప్పటానికి సదానంద సరస్వతి కారణాలుగా చెప్పవచ్చు.


ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌మఠ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తిరస్కరణకు మతపరమైన, సామాజిక అంశాలు ఉన్నాయి. వేదాలు, హిందూ మత గ్రంధాల్లో బ్రాహ్మణుల పాత్ర గురించి ప్రత్యేక స్థానం ఉంది. పూజారులుగా కేవలం వారినే నియమించాలి.ప్రత్యేకించి శూద్రులను పూజారులుగా నియమించటాన్ని ఆయన విమర్శిస్తున్నారు. మత ఆచారాల ఫలాలను అందరూ పొందటానికి అర్హులే అయినప్పటికీ శూద్రులు సేవకు మాత్రమే పరిమితం, సనాతన హిందూ ధర్మంలో వివక్ష ఉందనటాన్ని ఆయన ఖండిస్తారు.బ్రాహ్మణులకు బదులు పూజారులుగా శూద్రుల నియామకం వేదాలకు విరుద్ధం అని భావిస్తారు. అలాంటి నియామకాలు శ్రీ రాముడితో ముడివడిన ఆదర్శాలకు విరుద్దం, వేదాల్లో చెప్పినట్లు సామాజిక వ్యవస్థ ఉండాలి అంటారు. వీటికి విరుద్దంగా జరుగుతున్న కారణంగానే అవిముక్తేశ్వరానంద హాజరు కావటం లేదు. రాజకీయ లబ్దికోసం ఒకనాడు శంకరాచార్యుల పాదాల ముందు మోకరిల్లిన నరేంద్రమోడీ ఇప్పుడు సనాతన విలువలు, మర్యాదలకు భిన్నంగా అధర్మంగా వ్యవహరించటం దురదృష్టకరం. రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రారు ప్రధాని మోడీలో విష్ణు అవతారాన్ని మాత్రమే చూస్తున్నారు. నలుగురు శంకరాచార్యల్లో శివుడిని చూడలేకపోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్టలో హిందూ ధర్మంలోని ఉన్నత ధర్మ గురువులు భాగస్వాములు గాకపోవటం దురదృష్టకరం. ఇది కేవలం మతపరమైన ఎదురుదెబ్బే కాదు సామాజిక, రాజకీయ చిక్కులను కూడా తీసుకువస్తాయి. ఇదీ స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌.ఓఆర్‌జి విశ్లేషణ, వ్యాఖ్య సారం. ఈ భావాలు, అభిప్రాయాలతో నిజమైన హిందువులు ఏకీభవిస్తారు తప్ప రాజకీయ హిందూత్వ వాదులకు మింగుడు పడదు. పురోగామి వాదుల దృష్టిలో మతం వ్యక్తిగతం, రాజీకీయాల్లోకి చొప్పించకూడదని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు మతాన్ని రాజకీయాలకు ముడి పెట్టారని ఏకంగా శంకరాచార్యలు చెప్పటమే కొసమెరుపు.


విశ్వాసుల ఖర్మో లేక రాముడికి పరీక్షో గానీ రామాలయాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు మోసగాండ్లు బయలుదేరారు. జనవరి 22 అయోధ్య రామాలయ ప్రతిష్టకు ఆహ్వానం అంటూ వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో మోసగాండ్లు రెచ్చిపోతున్నారని వార్తలు.” రామజన్మ భూమి గృహసంపర్క్‌ అభియాన్‌.ఏపికే ” పేరుతో ఉన్న యాప్‌ను ఫోన్లో ఏర్పాటు చేసుకోవాలని, దానితో ప్రముఖుల పాస్‌లను పొందాలని కోరుతున్న మెసేజ్‌లు మొదలయ్యాయి.ఎవరైనా ఆ పని చేస్తే తమ సమాచారం మొత్తాన్ని దొంగలకు స్వయంగా అప్పగించినట్లే.ఇక అనేక వెబ్‌సైట్లు కూడా ప్రారంభమై దోచుకోవటం ప్రారంభించాయి. రాముడి ప్రసాదం ఉచితంగా పంపుతామని, మీరు చేయవలసిందల్లా రవాణా ఖర్చులు ముందుగా పంపటమేనని పేర్కొంటున్నాయి. ఇది మీ జేబులోని సొమ్ముతో పాటు మీ సమాచారాన్ని కూడా మోసగాండ్లకు అప్పగించటమే అవుతుంది.