ఎం కోటేశ్వరరావు
మనం బుర్రను పక్కన పెట్టి చెవులప్పగిస్తే ఎదుటి వారు రాజస్థాన్లో సముద్రం, హిమాలయాల్లో భరించలేని వేడి, ఎండిపోయిన బంగాళాఖాతం అంటూ ఎన్నికబుర్లైనా చెబుతారు. ఈ మధ్యనే ప్రపంచ ఆర్థిక వేదిక మీద 34 ముప్పుల్లో తప్పుడు సమాచారంలో భారత్ మొదటి స్థానంలో ఉందని ప్రపంచవ్యాపితంగా1,490 వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సర్వే చేసినపుడు వెల్లడైన నిష్టుర సత్యం. విశ్వగురువుగా నరేంద్రమోడీకి ప్రపంచం నీరాజనాలు అర్పిస్తున్నదని చెబుతున్నవారు దీని గురించి ఏం చెబుతారో తెలియదు. అలాంటి ముప్పులో భాగమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద విడుదల చేసిన శ్వేత పత్రంలోని అంశాలు. పదేండ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినపుడు దేశం సంక్షోభ స్థితిలో ఉందని, దాని గురించి చెబితే పెట్టుబడులు పెట్టేవారు ప్రతికూలంగా ఆలోచిస్తారని, అందుకే అప్పుడే శ్వేత పత్రం ప్రకటించకుండా ఇపుడు పరిస్థితి బాగుపడినందున విడుదల చేస్తున్నట్లు మొదటి పేరాలోనే జనాన్ని తప్పుదారి పట్టించారు.నిజంగా ఇప్పుడు పరిస్థితి బాగుపడిందా, దాని అర్ధం ఏమిటి ?
ఏటా రెండు కోట్ల ఉపాధిని పెంచుతామని 2014లో చెప్పారు. వాస్తవ పరిస్థితి ఏమిటి ? బిజెపి అధికారానికి రాకముందు ఉన్న సమాచారం ప్రకారం 2012లో నిరుద్యోగం 2.1శాతం అది 2018లో నేషనల్ సర్వే సంస్థ సమాచారం ప్రకారం 6.1శాతానికి చేరింది. దేశ కార్మికశక్తి సర్వేల ప్రకారం అంతకు ముందు 45 సంవత్సరాలతో పోలిస్తే అది అధికం. పదిహేను నుంచి 24 సంవత్సరాల యువతలో నిరుద్యోగం ఎంత అన్నది ప్రధానంగా చూడాలి. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ ప్రకారం 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 22.4శాతం మందికి ఉపాధి లేదు. తరువాత 2022లో 23.22 శాతం, తొమ్మిది సంవత్సరాల సగటు 24.74శాతం ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించి ఉంటే ఈ పెరుగుదల ఎలా సంభవించింది? మాక్రోట్రెండ్స్ సమాచారం ప్రకారం 15-24 ఏండ్ల వయస్సులోని యువత కార్మిక శక్తిలో 2014లో 31.64శాతం ఉండగా మోడీ ఏలుబడిలో 2022లో 28.04శాతానికి తగ్గింది. విద్య పెరిగిన కొద్దీ యువతలో నిరుద్యోగశాతం కూడా పెరుగుతున్నదనే అంశాన్ని ఎందుకు మూసిపెడుతున్నట్లు ? నరేంద్రమోడీ గొప్పగా చెప్పుకొనే నైపుణ్యం తీరు ఎలా ఉంది. 2021 భారత నైపుణ్య నివేదిక ప్రకారం దాదాపు సగం మంది డిగ్రీ కలిగిన వారు నిరుద్యోగులు. ప్రైవేటు కాలేజీలు పెరిగినందున నైపుణ్యాలు లేని పట్టాదారులు తామర తంపరగా పెరిగారన్నది మింగుడు పడని వాస్తవం. అందుకే ప్రభుత్వం 2015లో జాతీయ నైపుణ్య విధానాన్ని ప్రకటించింది.కార్మిక శక్తిలో 40 కోట్ల మందికి 2022 నాటికి నైపుణ్యాలను పెంచుతామని చెప్పారు. జరిగిందేమిటి ? 2012లో కార్మికశక్తిలో వృత్తి విద్యావంతులు లేదా శిక్షణ పొందిన వారు 2.3శాతం కాగా మోడీ గారి శిక్షణ తరువాత 2.4శాతానికి మాత్రమే పెరిగారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం పిఎంకెవివై (నైపుణ్య శిక్షణ) మూడు రకాలుగా శిక్షణ పొందిన వారు 18-45-4 లక్షల మంది చొప్పున ఉన్నారు.వారిలో 14-43-7శాతాల చొప్పున ఉపాధి పొందినట్లు పేర్కొన్నారు.ఈ శిక్షణ తీరుతెన్నుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సాంకేతిక విద్య అభ్యసించిన ఇంజనీరింగ్,పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారిలో నిరుద్యోగం గత పది సంవత్సరాల్లో రెట్టింపైంది. మన దేశంలో 2030 వరకు ఉపాధిని కోరుకొనే వారి సంఖ్య ఏటేటా గణనీయంగా పెరగనుందని వర్తమాన ధోరణి వెల్లడిస్తోంది. అంటే నిరుద్యోగమూ పెరగనుంది.
కార్మిక శక్తిలో మొత్తంగా, ప్రత్యేకించి మహిళల శాతం పెరగటం లేదన్నది అందరికీ తెలిసిందే. ఎందుకు అన్నది సమస్య. అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో విదేశాలు తిరిగి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు తెచ్చినట్లు నరేంద్రమోడీ చెప్పారు. పది సంవత్సరాల తరువాత జనానికి అందిన వాటి ఫలితాలేమిటో చెప్పరు. తమ వికసిత భారత్ నినాదంతో త్వరలో చైనా, అమెరికాలను మించిపోతామని చెబుతున్నారు. ఎంతగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నప్పటికీ మన దేశంలో పెట్టుబడి వాతావరణం వ్యాపారం చేసేందుకు పెద్ద సవాలుగా ఉందని 2022 నివేదికలో అమెరికా చెప్పింది. రక్షణాత్మక చర్యలు, భారతీయ ప్రమాణాల నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరలేకపోవటం వంటి కారణాలను దానిలో పేర్కొన్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్థిక స్వేచ్చ సూచిక 2023 నివేదిక ప్రకారం 131వ స్థానంలో మనదేశం ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 39దేశాల్లో 27వదిగా ఉంది. దేశ ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని, భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పుకోవటమే తప్ప కనిపించటం లేదు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో 2022లో తొలి పది దేశాల్లో మనం పదవ స్థానంలో ఉన్నాం.మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 388, రెండవదిగా ఉన్న చైనాకు 180 బిలియన్ డాలర్లు వస్తే మన దేశానికి వచ్చింది 50బి.డాలర్లు. విదేశీ పెట్టుబడుల సంగతి అలా ఉంటే చైనా జిడిపిలో 50శాతం పెట్టుబడులు పెడుతుంటే మనదేశంలో 30శాతమే ఉంది. చైనా ఉత్పాదకరంగం జిడిపికి 30శాతం సమకూర్చుతుంటే మనదగ్గర 20శాతమే ఉంది. యుపిఏ పాలనలో ఎన్నివేల కిలోమీటర్ల రోడ్లు వేశారు, మా పాలనలో ఎలా వేశామో చూడండి అని బిజెపి అడ్డుసవాళ్లు విసురుతుంది. మౌలిక సదుపాయాలకు గాను 2013-14లో జిడిపిలో 1.7శాతం ఉన్న మొత్తాన్ని 2022-23లో 2.9శాతానికి పెంచాం చూడండి అని చెబుతారు. పదేండ్ల సగటు 1.93శాతం. ఇక్కడ సమస్య పెట్టుబడి వ్యయాన్ని పెంచాల్సిందేఅది అవసరాలకు తగినట్లుగా ఉండాలి. పారిశ్రామిక ఉత్పత్తి లేకుండా ఎన్ని రోడ్లు, రైలు మార్గాలువేసినా, ఓడరేవులను అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏముంటుంది.
పెట్రోలు, డీజిలు మీద విపరీతంగా సెస్లను పెంచారు. ఎందుకు అంటే దేశ రక్షణకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలనే మనోభావాన్ని ముందుకు తెచ్చారు. ఇది నిజమా ? కేంద్ర ప్రభుత్వ 2022-23 ఆర్థిక సర్వే60వ పేజీలో ఇచ్చిన సమాచారం ప్రకారం 2013-14లో జిడిపిలో 1.1శాతం కేటాయిస్తే 2022-23లో 0.9శాతంగా ప్రతిపాదించారు.పదేండ్ల సగటు 1.04శాతం. ఈ కాలంలో చేసిన అప్పులు 4.5 నుంచి 6.4శాతానికి చేరాయి. పదేండ్ల సగటు 4.99శాతం.దీనికి అనుగుణంగానే వడ్డీ చెల్లింపులు 3.3 నుంచి 3.6శాతానికి పెరిగాయి. అచ్చేదిన్ గురించి కబుర్లు చెప్పిన పెద్దలు సబ్సిడీ మొత్తాన్ని 2.3 నుంచి 1.2శాతానికి దిగ్గోశారు. పదేండ్ల సగటు 1.74శాతం. ముందే చెప్పినట్లుగా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల ఖర్చు పెరగాలి. దాని కోసం సంక్షేమ కార్యక్రమాల ఖర్చు తగ్గింపు సమర్దనీయమా ? పారిశ్రామిక ఉత్పత్తి విలువ తమ ఏలుబడిలో ఎంత పెరిగిందో చూడమని మోడీ భక్తులు చెబుతారు. ఆ మేరకు ఉపాధి ఎందుకు పెరగలేదో చెప్పలేరు. మరోవైపు జిడిపిని ఎంత పెంచామో చూడండి అంటారు. ప్రపంచబాంకు విశ్లేషించినదాని ప్రకారం 2014లో మన పారిశ్రామిక ఉత్పత్తి విలువ 307బిలియన్ డాలర్లు, అది 2022 నాటికి 450 బి.డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో జిడిపిలో దాని వాటా 15 నుంచి 13.32శాతానికి దిగజారింది. కార్మిక శక్తిలో 15-24 సంవత్సరాల వయస్సు వారు ఎందరున్నారు అంటే 2014లో 31.64శాతం ఉంటే 2022 నాటికి 28.04కు పడిపోయింది. దీని అర్ధం ఏమిటి ఉపాధి రహిత వృద్ధి జరుగుతున్నది. దీని వలన కార్పొరేట్ల సంపద పెరుగుతుంది తప్ప జనానికి దక్కేదేముంది.
ఏ దేశమైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నపుడు డిమాండ్ను పెంచేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి. దాని వలన వివిధ రంగాలు కొంత మేరకు సానుకూలంగా స్పందిస్తాయి. ఉదాహరణకు రోడ్ల నిర్మాణం జరిపితే సిమెంటు, ఉక్కు, చమురు, రోడ్డు నిర్మాణ వాహనాలు తదితర ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఈ కారణంగానే 2020-21లో మూలధన వ్యయం కేంద్ర బడ్జెట్లో రు.4.26లక్షల కోట్లుండగా 2023-24లో రు.10లక్షల కోట్లకు పెంచారు.(ఎన్నికల సంవత్సరం కదా !) ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. రైల్వే, రోడ్లు,రక్షణ రంగం వాటా 66శాతం ఉంది. రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలకు ఇచ్చే 50 ఏండ్ల వడ్డీ లేని రుణ మొత్తం అంతకు ముందు ఉన్న రు.76వేల కోట్లను 130వేల కోట్లకు పెంచారు. ఇదే సమయంలో కొన్ని రంగాలకు ఎలా కోతలు పెట్టారో చూద్దాం. 2009 తరువాత తొలిసారిగా సామాజిక సంక్షేమ ఖర్చు 18శాతానికి తగ్గింది.2023-24 బడ్జెట్లో రు.8.28లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకు ముందు సంవత్సరం కంటే 56వేల కోట్లు తక్కువ. విద్యారంగానికి కేటాయింపులు 2009-2021 మధ్య 20 నుంచి 9శాతానికి తగ్గాయి. 2023-24లో 14శాతం ఉన్నప్పటికీ తక్కువే కదా ! గ్రామీణాభివృద్ధి కేటాయింపులు 28 నుంచి 19శాతానికి తగ్గాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి వాటికి తగ్గటం లేదా గిడసబారి ఉన్నాయి. పదకొండు సాంఘిక సంక్షేమ రంగాలలో కరోనాకు ముందు 2019-20లో ఉన్న కేటాయింపుల కంటే 2023-24లో ఐదింటిలో తగ్గాయి. అవి స్వచ్చ భారత్, సమగ్ర విద్యా శిక్షణ, గ్రామీణ ఉపాధి హామీ పధకం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం. రాష్ట్రాలు తమ వాటాను చెల్లించని కారణంగా కొన్ని పధకాలకు నిధులు పెంచలేదని కేంద్ర అధికారులు చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రంగాలకు పెంచారు.మొత్తంగా చూసినపుడు కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే మౌలిక సదుపాయాలకు ఖర్చు పెంపుదల కోసం కోట్లాది మంది సంక్షేమానికి చేసే ఖర్చును కోత పెడుతున్నారు లేదా మంచం చాలకపోతే కాళ్లు ముడుచుకొని సర్దుకోమని చెప్పినట్లుగా చేస్తున్నారు.

