• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Nathuram Godse

మహాత్మాగాంధీకి ప్రపంచ గుర్తింపు – నరేంద్రమోడీ అజ్ఞానమా ? అవమానించారా ?

01 Saturday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Congress, COUNTRIES, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, UK, USA

≈ Leave a comment

Tags

BJP, GANDHI INTERNATIONAL FAME, Mahatma Gandhi, Narendra Modi Failures, Nathuram Godse, RSS


ఎం కోటేశ్వరరావు


పద్దెనిమిదవ లోక్‌సభ చివరిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. భక్తులకు వినసొంపుగా వారు కోరుకున్నట్లుగా, వ్యతిరేకులకు అనేక విమర్శనాస్త్రాలు అందిస్తూ, నిష్పాక్షికంగా వాస్తవాలను పరిశీలించేవారు అవాక్కయ్యే విధంగా ఎన్నికల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ ప్రక్షాళన కోసమో, మరొకదానికోసమో 45 గంటల పాటు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో ధ్యానదీక్ష చేశారు.నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, ఫలితాలు, పర్యవసానాలు, విమర్శల గురించి పట్టించుకోకు మౌనవ్రతమే నీ ఆయుధం అన్నట్లుగా దేవుడి అంశతో జన్మించినట్లు చెప్పుకున్న మోడీ కార్యాచరణలో నిమిత్తమాత్రుడు తప్ప ఆటాడించిందీ, మాట్లాడించిందీ ఆ దేవుడే గనుక ప్రతిష్టో అప్రతిష్టో ఆయన ఖాతాకు తప్ప మోడీకి కాదని వేరే చెప్పనవసరం లేదు. పచ్చి అవాస్తవాలు,ఎడారిలో సముద్రాల మాదిరి మాటలు, ప్రలోభాలు, బెదరింపులు,బ్రతిమిలాటలు ఇలా ఎన్నో. సకలకళా వల్లభుల ప్రదర్శనలను దేశం చూసింది. మంచో చెడో ఒక నిర్ణయం తీసుకొని ఓటర్లు తమ తీర్పునిచ్చారు. జూన్‌ నాలుగున వెలువడే ఫలితాలలో గెలిచిన పార్టీల, అభ్యర్థుల హడావుడి, ఓడిన పార్టీలు, అభ్యర్థుల వాదనలు, వేదనలు సరేసరి.. ఏ పార్టీ లేదా ఏ కూటమికి మెజారిటీ రాకుండా హంగ్‌ ఏర్పడితే ఏం జరుగుతుందో అనూహ్యం. ఎన్‌డిఏ-ఇండియా కూటమి రెండూ మెజారిటీ సాధనకు తలపడతాయి. చిన్న పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు వరకు కింగ్‌మేకర్లుగా మారతాయి.తరువాత వాటి భవిష్యత్‌ చెప్పలేము.చిన పాముపు పెద పాము, చిన చేపను పెద చేప మింగినట్లుగా జరిగే అవకాశం ఉంది. లోక్‌సభలోని 543 స్థానాలకు గాను మెజారిటీ 272 సాధించుకున్న పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.గత ఎన్నికలను చూసినపుడు 2014లో బిజెపి 31శాతం ఓట్లతో 282 సీట్లు తెచ్చుకుంది,2019లో 37.3శాతం ఓట్లు 303 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 2014లో 19.31శాతం ఓట్లు 44 సీట్లు, తదుపరి ఎన్నికల్లో 19.46శాతం ఓట్లు, 52 సీట్లు తెచ్చుకుంది. బిజెపి హిందూత్వను ఎంతగా రెచ్చగొట్టినా, నరేంద్రమోడీని హిందూ హృదయ సామ్రాట్టుగా జనం ముందుకు తెచ్చినా గత రెండు ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు రాలేదు. అదే కాంగ్రెస్‌ను చూస్తే ఓట్ల శాతంలో పెద్ద మార్పు లేదు.2014కు ముందు జరిగిన ఎన్నికల్లో బిజెపి తెచ్చుకున్న 18.8శాతం ఓట్లను 31శాతానికి పెంచుకోగా, కాంగ్రెస్‌ 28.55 నుంచి 19.31శాతానికి కోల్పోయింది. అంతకు ముందు ఎన్నికలతో పోల్చితే 2014లో బిజెపి 12.2శాతం అదనంగా తెచ్చుకోగా 2019లో అదనంగా 6.36శాతం తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 2014తో పోల్చితే 2019లో 0.18శాతం ఓట్లు అదనంగా తెచ్చుకుంది. తినబోతూ రుచెందుకు అన్నట్లుగా 2024లో తీరుతెన్నుల గురించి జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.


ప్రేమ కోసం, యుద్ధంలో గెలుపుకోసం అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఈ ఎన్నికలలో నరేంద్రమోడీ, బిజెపి నేతల ప్రసంగాల తీరు ఉంది. ఎవరేమనుకుంటే మాకేటి అన్నట్లు వ్యవహరించారు.చివరి దశలో ప్రధాని నరేంద్రమోడీ ఎబిపి టీవీ ఛానల్‌కు జర్నలిస్టులతో మాట్లాడుతూ రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమా తీసిన తరువాతే మహాత్మాగాంధీ ఎవరు అనే ఉత్సుకత ప్రపంచంలో పెరిగిందని చెప్పారు. నిజానికి ఇది ఎన్నికల అంశంగా ఏ పార్టీ కూడా ప్రస్తావన తేలేదు. ఆకర్షణీయమైన నేతలు తప్పులు ఎందుకు చేస్తారంటూ ”అవెంటస్‌ ” పార్టనర్స్‌ అనే ఒక వెబ్‌సైట్‌లో తేదీలేని ఒక సర్వే విశ్లేషణ ఉంది. నేతలు అందునా ఉత్తమ నేతలు కూడా అవివేకమైన తప్పులు తరచుగా చేస్తుంటారని పేర్కొన్నది.పదవి మరియు తెలివితేటల కారణంగా మితిమీరిన విశ్వాసం మరియు అధికారంతో తీవ్రమైన తప్పులు చేస్తుంటారని దీన్ని సైద్దాంతిక వేత్తలు (హ్యూమన్‌ ఫోలీ) మానవ అజ్ఞానం లేదా మూర్ఖత్వమని పిలిచారని పేర్కొన్నది. దానిలో పేర్కొన్న ఐదు తప్పుల సారం ఇలా ఉంది. సంవత్సరాల తరబడి నిరంతరం అందుకునే ప్రశంసల కారణంగా అత్యధిక నేతలు తమ తెలివితేటలు, సామర్ధ్యాల గురించి తిరుగులేని విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటారట.కీలకమైన నిర్ణయాలు తీసుకొనే సమయంలో తమ మీద తమకు ఏర్పడిన అతివిశ్వాసం కారణంగా ఇతరులు వెల్లడించే అభిప్రాయాలు, సూచనలను పట్టించుకోరు, దీంతో చురుకైన నేతలు తప్పుడు నిర్ణయాలు తీసుకొనే ముప్పు ఎక్కువగా ఉంటుందట. సూక్ష్మ నిర్వహణ(మైక్రోమేనేజ్‌మెంట్‌) సమస్య నేతలకు మాత్రమే కాదు సంస్థలలోనూ ఉంది.నాయకత్వ స్థానాల్లో సూక్ష్మ నిర్వహణ, బదలాయింపు లేకపోతే మొత్తం జట్టు మీద ప్రభావం చూపుతుంది. సంక్షోభ సమయాల్లో చురుకైన నేతలు జట్టు హస్తం అందుకొనేందుకు చూస్తారు, కానీ కొత్త ఆలోచనల అన్వేషణలో వారి ఆసరా తీసుకోరు. చురుకైన నేతలు తాము రూపొందించిన నిబంధనలను పాటించటంలో విఫలమైనపుడు ఆ సంస్థల విలువలు, సూత్రాల మీదనే సందేహాలు తలెత్తుతాయి. తరువాత వాటన్నింటినీ పరిరక్షించాల్సిన వ్యక్తి విశ్వసనీయతే ప్రశ్నార్ధకం అవుతుంది. చురుకైన వారు ఇతరులు చెప్పేదానికి విలువ ఇవ్వరు. తమకు సలహాలు ఇచ్చేంత గొప్పవారా అనుకుంటారు.తమ తప్పును అంగీకరించరు. తరచుగా మంచిచెడ్డల స్వీకరణ నిలిపివేత వీరు చేసే అవివేకమైన తప్పు. బలమైన నేతలకు అవకాశాలు సులభంగా వచ్చినపుడు అన్నింటినీ చేసేయగలమనే వ్యక్తిత్వాలను పెంచుకుంటారు. లక్ష్యాలను పెద్దగా నిర్ణయించుకుంటారు, అనుకున్న విధంగా జరగకపోతే తగిన ప్రయత్నం లేకపోవటం అనుకుంటారు.వాస్తవ విరుద్దమైన లక్ష్యాలను నిర్ణయించుకొని ఎలాగైనా సాధించాలనుకొని జనాలను ఇబ్బందుల్లోకి నెడతారు. చురుకైన తెలివితేటలు కలిగిన వారందరూ పైన పేర్కొన్న లక్షణాలు, ధోరణులు గల నేతలు ఎవరన్నది ఎవరికి వారు అన్వయించుకొని ఒక అంచనాకు రావచ్చు.


నరేంద్రమోడీని అనేక మంది చురుకైన, ఆకర్షణ కలిగిన నేత అని చెబుతారు. ఆయనకు ఉందని చెబుతున్న పట్టా రాజకీయ శాస్త్రంలో అని కూడా అందరం చదువుకున్నదే. అలాంటి వ్యక్తికి చరిత్ర తెలియదా లేక కావాలనే ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలను వక్రీకరించినట్లుగా జాతిపిత గురించి కూడా మాట్లాడారా ? రెండూ వాస్తవం కావచ్చు. ప్రపంచ వలస దేశాల చరిత్రను చూసినపుడు మనదేశమంత పెద్దది బ్రిటీష్‌ సామ్రాజ్యంలో మరొకటి లేదు. వారి పాలనను అంతం చేసిన స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారెవరు అన్న చర్చ జరిగినపుడు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే మహాత్మాగాంధీ అని ప్రపంచం తెలుసుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో గాడ్సే గురించి తప్ప గాంధీ గురించి పెద్దగా బోధించి ఉండరు. భగవద్గీత వంటి గ్రంధాల కంటే ” నేనెందుకు గాంధీని చంపాను ” అంటూ గాడ్సే కోర్టులో మాట్లాడిన అంశాలను పెద్ద ఎత్తున బోధిస్తారని వినికిడి. ఆ పుస్తకాన్ని అచ్చువేసి, పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన అంశం తెలిసిందే.మహాత్మాగాంధీ జాతిపిత అని ఎవరు చెప్పారు, ఎలా అయ్యారంటూ, దేశానికి చేసిన ద్రోహాలంటూ వాట్సాప్‌ యూనివర్సిటీలో ప్రచారం చేసే ఊరూపేరు చెప్పుకొనేందుకు ధైర్యం లేని చీకటి బతుకుల బాపతు ఎవరు అన్నది వేరే చెప్పనవసరం లేదు.


మహాత్ముడు కాక ముందు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే బహుశా ఆయన తండ్రి లాగూలు(అప్పటికి నిక్కర్లు వచ్చి ఉండవు) వేసుకొంటున్న సమయానికే 1920దశకంలోనే మోహనదాస్‌ కరంచంద్‌ గాంధీ గురించి పశ్చిమ దేశాలలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి అనుగుణ్యంగా తిరగరాస్తున్నది. గాంధీ హత్య నేపధ్యం గురించి భావితరాలకు తెలియకూడదు అనే లక్ష్యంతో ఎన్‌సిఇఆర్‌టి ద్వారా 2022జూన్‌లో రాజకీయ శాస్త్రంలో ఉన్న అంశాలను తొలగింపచేయించిన ఉదంతం తెలిసిందే.ఏమిటవి ? ” పాకిస్తాన్‌ ముస్లింలకు అన్నట్లుగా ఇండియా హిందువుల దేశంగా మారాలని లేదా హిందువులు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నవారికి ప్రత్యేకించి ఆయన(గాంధీ) అంటే అయిష్టం…హిందువులు-ముస్లింలు ఐక్యంగా ఉండాలనే స్థిరమైన అనుసరణతో రెచ్చిపోయిన హిందూ ఉగ్రవాదులు ఆ మేరకు అనేక సార్లు గాంధీజీని హత్య చేసేందుకు చూశారు….గాంధీజీ మరణం దేశంలో ఉన్న మతపరిస్థితిపై దాదాపు మాయా ప్రభావం(మేజికల్‌ ఎఫెక్ట్‌) చూపింది…..మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్న సంస్థలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు వంటి సంస్థలపై కొంత కాలం నిషేధం విధించింది…” ఇలాంటి కుదురు నుంచి వచ్చిన నరేంద్రమోడీ నోట మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి అని వెలువడటం వెనుక చిత్తశుద్ది ఉందని ఎవరైనా అనుకోగలరా ?


ఇంతకీ మహాత్ముడి గురించి నరేంద్రమోడీ సెలవిచ్చిందేమిటి ? ప్రతిపక్షాలు రామమందిర ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు, ఎన్నికలలో దీని ప్రభావం ఉంటుందా అని ఎబిపి విలేకర్లు అడిగిన ప్రశ్నపై స్పందించిన మోడీ ప్రతిపక్షం బానిసత్వ భావనలనుంచి బయటకు రాలేదు అంటూ ” మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి. మహాత్మా గాంధీ గురించి ప్రపంచం తెలుసుకొనే విధంగా ఈ 75 సంవత్సరాలలో చేయాల్సిన బాధ్యత మనది కాదా ? మహాత్మా గాంధీ గురించి ఎవరికీ తెలియదు. గాంధీ సినిమా తీసిన తరువాత మాత్రమే ఈ మనిషి ఎవరన్న జిజ్ఞాస ప్రపంచంలో పెరిగింది.మనమాపని చేయలేదు. అది మన బాధ్యత. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ గురించి ప్రపంచానికి తెలిసిందంటే, దక్షిణాఫ్రికానేత నెల్సన్‌ మండేలా ప్రపంచానికి తెలిశారంటే వారికంటే గాంధీ తక్కువేమీ కాదు. మీరు దీన్ని అంగీకరించాలి.ప్రపంచమంతా తిరిగిన తరువాత నేను ఈ విషయాన్ని చెబుతున్నాను” అని మోడీ చెప్పారు. బ్రిటీష్‌ సినిమా దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమాతీశాడు, బెన్‌కింగ్‌స్లే గాంధీ పాత్ర పోషించాడు. దానికి పదకొండు అకాడమీ అవార్డులు వచ్చాయి. ఆ సినిమా తరువాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందని చెప్పటం మహాత్ముడిని అవమానించటం తప్ప మరొకటి కాదు.ఆ సినిమా తరువాతనే నాకు గాంధీ గురించి తెలిసిందని మోడీ చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటం మీద గాంధీ ప్రభావం గురించి స్వయంగా నెల్సన్‌ మండేలానే చెప్పారు. ఆ పోరాటం గాంధీ సినిమా చూసిన తరువాత ప్రారంభం కాలేదు.


మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్‌కు సిఎంగా పని చేసిన నరేంద్రమోడీ అమ్మా గూగులమ్మా మా గాంధీ గురించి కాస్త చెప్పమ్మా అని మోడీ అడిగినా, ఆయన సిబ్బంది అడిగినా గాంధీ సినిమాకు ముందు, తరువాత కూడా ఎన్నో విషయాలు తెలిసి ఉండేవి. సామాజిక మాధ్యమంలో ప్రతిపక్షాల నుంచి ఇప్పుడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది కాదు. గాంధీ గురించి ఉన్న వెబ్‌సైట్‌ను అసలు ఒక్కసారైనా చూసి ఉంటారా అన్నది అనుమానమే. చూసి ఉంటే ఇలా మాట్లాడేందుకు ధైర్యం చేసి ఉండేవారు కాదు.బ్రిటన్‌ వార పత్రిక గ్రాఫిక్‌లో 1922లో గాంధీ అరెస్టయినపుడు గాంధీ గురించి రాశారు. నైరోబీలో గాంధీ అరెస్టు గురించి చేసిన ఆందోళనపై రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అదే ఏడాది లాహౌర్‌ నుంచి వెలువడిన సివిల్‌ మరియు మిలిటరీ గెజెట్‌లో ప్రచురించారు.” సదాచార గాంధీ :1930వ సంవత్సర పురుషుడు ” అంటూ టైమ్‌ పత్రిక 1931 జనవరి ఐదవ తేదీన ప్రచురించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా 1930లో గాంధీతో పాటు అరెస్టు అయిన 30వేల మందిని ఏం చేయాలా అని బ్రిటీష్‌ సామ్రాజ్యం భయంతో ఉంది. ఆ ఏడాది చివరిలో ఒక అర్దనగ మనిషిని చూసింది, ప్రపంచ చరిత్ర 1930లో ఆ మనిషి సంకేతం నిస్సందేహంగా అన్నింటికంటే పెద్దది ” అని దానిలో రాసింది. అదే ఏడాది సెప్టెంబరు 20న అమెరికా నుంచి వెలువడే బర్లింగ్టన్‌ హాక్‌ ఐ అనే పత్రిక ఒక పూర్తి పేజీ కేటాయించి గాంధీ గురించి రాసింది.” ప్రపంచంలో ఎక్కువ మంది చర్చించిన మనిషి ” అనే శీర్షిక పెట్టింది. రాట్నం వడుకుతున్న మహాత్మాగాంధీ ఫొటో ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. అమెరికా ఫొటోగ్రాఫర్‌ మార్గరెట్‌ బుర్కే వైట్‌ తీసిన దాన్ని 1946 మే 27వ తేదీన లైఫ్‌ అనే పత్రిక ” భారత నేతలు ‘ అనే శీర్షికతో ప్రచురించింది.


మహాత్మాగాంధీ హత్య గురించి న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఒక పతాక శీర్షికతో ప్రచురించింది.” ఒక హిందూ చేతిలో గాంధీ హత్య, కంపించిన భారత్‌,కొట్లాటల్లో బాంబేలో 15 మంది మృతి ” అని రాసింది.గార్డియన్‌, వాషింగ్టన్‌ పోస్టు, డెయిలీ టెలిగ్రాఫ్‌ వంటి పత్రికలన్నీ పతాక శీర్షికలతో గాంధీ హత్య వార్తను ప్రచురించాయి. గాంధీతో ప్రముఖ సినిమా నటుడు చార్లీ చాప్లిన్‌ భేటీ, ఆల్బర్ట్‌ ఐనిస్టీన్‌ ఉత్తర ప్రత్యుత్తరాలు, గాంధీ గురించి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ రాసిన అంశాలన్నీ సుపరిచతమే.అమెరికా జర్నలిస్టు లూయీస్‌ ఫిశ్చర్‌ 1950లో ” మహాత్మాగాంధీ జీవితం ” పేరుతో రాసిన జీవిత చరిత్రను ఎంతో మంది చదివారు. గాంధీ సినిమాకు ముందే అనేక దేశాలు గాంధీ గౌరవార్ధం పోస్టల్‌ స్టాంపులను ప్రచురించాయి. ఇంత ప్రాచుర్య చరిత్ర ఉంటే నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్దమే గాక అసహ్యం కలిగిస్తున్నట్లు విమర్శలు వెలువడ్డాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మతసామరస్యత గిట్టని సనాతన వాదులు, ఏడుసార్లు గాంధీజీపై హత్యాయత్నాలు !

07 Wednesday Feb 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

'Praising' Godse, BJP, Hindu Fundamentalism, HINDU MAHASABHA, hindutva, Mahatma Gandhi, Nathuram Godse, NIT Calicut, RSS, Sanatana


ఎం కోటేశ్వరరావు


ఆమె ఒక ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌), కాలికట్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగ ప్రొఫెసర్‌, పేరు డాక్టర్‌ ఏ షాయిజా.” భారత్‌ను రక్షించినందుకు గాడ్సేను చూసి గర్విస్తున్నా ” అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి ఇప్పుడు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. జనవరి 30వ తేదీన మహాత్ముడి వర్ధంతి. ఆరోజు బిజెపి ఫేస్‌బుక్‌ ఖాతాలో ఒక న్యాయవాది ” హిందూమహాసభ కార్యకర్త నాధూరామ్‌ గాడ్సే భారత్‌లో ఎందరికో ఆదర్శం( హీరో )” అని పెట్టాడు. దాని మీద ” భారత్‌ను రక్షించినందుకు గాడ్సేను చూసి గర్వపడుతున్నా ” అని డాక్టర్‌ షాయిజా స్పందించారు. దాన్ని ఫొటో తీసి కోజికోడ్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ ఎంపీ ఎంకె రాఘవన్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశాడు.” మహాత్మాగాంధీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టటం నాకు సిగ్గుగా ఉంది.నిట్‌లో ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న వ్యక్తి గాడ్సేను పొగిడారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి ” అని ఎంపీ స్పందించారు. అది సంచలనం కావటంతో ఆమె తన పోస్టును ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారు. అయినప్పటికీ డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యుఐ, తదితర సంస్థలకు చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కొట్లాటలను ప్రేరేపించేందుకు కావాలనే రెచ్చగొట్టారన్నది నేరారోపణ. ఆమె తన చర్యను సమర్ధించుకున్నారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది.” నేను గాంధీని ఎందుకు చంపాను అనే గాడ్సే పుస్తకం చదివాను. గాడ్సే కూడా స్వాతంత్య్ర సమరయోధుడే. తన పుస్తకంలో ఎంతో సమాచారాన్ని వెల్లడించాడు. అది సామాన్యులకు తెలియదు. ఆ పుస్తకంలో గాడ్సే మనల్ని వివేకవంతుల్ని చేశాడు. ఈ పూర్వరంగంలో ఒక లాయర్‌ ఫేస్‌బుక్‌ పోస్టు మీద నేను స్పందించాను. జనాలు నా వ్యాఖ్యను వక్రీకరిస్తున్నారని గుర్తించిన తరువాత దాన్ని తొలగించాను” అని షాయిజా చెప్పారు. తన వ్యాఖ్య గాంధీజీ హత్యను ప్రశంసించటం కాదని కూడా ఆమె చెప్పుకున్నారు. ఆమె పోస్టు వైరల్‌ కాగానే సంజాయిషీ తీసుకోవాలని సంస్థ డైరెక్టర్‌ రిజిస్ట్రార్‌ను కోరారు.


ఆమె వయస్సు, అనుభవంలోనూ తక్కువ వారేమీ కాదు. గాడ్సే మీద మీడియాలో జరుగుతున్న అనుకూల, వ్యతిరేక చర్చలు తెలియకుండా ఉంటాయని అనుకోలేము. అన్నీ తెలిసే కావాలనే ఆమె స్పందించారన్నది స్పష్టం. దీనికి కొద్ది రోజుల క్రితం ఆమె పని చేస్తున్న సంస్థలోనే ఒక ఉదంతం జరిగింది. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సంఘపరివార్‌కు చెందిన విద్యార్ధులు ఉత్సవాన్ని చేసుకున్నారు. వ్యాషక్‌ ప్రేమ్‌కుమార్‌ అనే విద్యార్ధి(దళిత సామాజిక తరగతికి చెందిన వ్యక్తి) నిరసన తెలిపాడు. నిట్‌ ప్రధాన భవనం ముందు ” ఇండియా రామ రాజ్యం కాదు ” అనే నినాదం రాసి ఉన్న ఒక ప్లకార్డును పట్టుకొని ఒక్కడే ప్రదర్శన చేశాడు. సైన్స్‌ అండ్‌ స్పిరిట్యువల్‌ క్లబ్‌ పేరుతో రామాలయ ఉత్సవాన్ని నిర్వహించిన వారు ప్రేమకుమార్‌ మీద దాడి చేశారు. జనవరి 21వ తేదీన ఉత్సవం జరిపిన వారు దేశ చిత్రపటాన్ని కాషాయ రంగులో విల్లు, బాణం ఉన్న రాముడి బొమ్మతో చిత్రించారని, జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారని, ఇది భారత మాప్‌ను అగౌరవ పరచటమే అని విద్యార్ధి వ్యవహారాల మండలి(ఎస్‌ఏసి) ఒక ప్రకటనలో పేర్కొన్నది. ప్రేమకుమార్‌ చేసింది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటంగా, విద్యాలయ ప్రాంగణంలో అశాంతిని రేకెత్తించటంగా పరిగణించి ఏడాది పాటు సంస్థ నుంచి వెలివేశారు. జరిగిన ఉదంతాన్ని వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేసిన ఎస్‌ఏసి ప్రతినిధి కైలాష్‌ను కూడా కొట్టారు. నిట్‌ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చెందినవన్న సంగతి తెలిసిందే.
ప్రేమ్‌కుమార్‌, కైలాష్‌పై చేసిన దాడుల వెనుక శివ పాండే అనే విద్యార్ధి ఉన్నట్లు నిట్‌ విద్యార్ధులు చెప్పారు. అతను సంస్థలో భజరంగ్‌దళ్‌ను ఏర్పాటు చేశాడు, కొంత మంది విద్యార్ధుల మీద దాడులు చేశాడు. ఇన్ని జరిగినప్పటికీ అతని మీద ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేవు. ప్రేమకుమార్‌ను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్న సమావేశంలో ఎస్‌ఏఎస్‌కు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.ప్రతినిధులుగా ఉన్న వారిని సమావేశానికి రానివ్వలేదని విద్యార్ధులు విమర్శించారు. అలాంటి వాతావరణం ఉన్న సంస్థలోనే ఫ్రొఫెసర్‌ షాయిజా పని చేస్తున్నారు.ఈ ఉదంతం జరిగిన తరువాతే ఆమె వివాదాస్ప వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో చేశారు. ఆమెపై ఎస్‌ఎఫ్‌ఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్రొఫెసర్‌ చర్యను నిరసించిన మిగతా సంస్థల వారు కూడా ఆమెను బోధనా బాధ్యతల్లో కొనసాగనివ్వరాదని డిమాండ్‌ చేశారు. ఆమె చర్య జాతిపితను అవమానించటమే అని కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు ఖండించారు. డైరెక్టర్‌గా ఉన్న అధికారి ప్రసాద కృష్ణ కాలికట్‌ నిట్‌ను కాషాయీకరణ చేస్తున్నట్లు గతంలోనే విద్యార్దులు, సిబ్బంది విమర్శించారు.


హిందూ-ముస్లిం ఐక్యతను ప్రబోధించినందుకు మతోన్మాదశక్తులు గాంధీ మహాత్ముడిని తూలనాడుతున్న సంగతి తెలిసిందే.1948 జనవరి 30న నాధూరామ్‌ గాడ్సే గాంధీని తానెందుకు చంపిందీ కోర్టులో చెప్పిన మాటలను తరువాత పుస్తకంగా వేసి పంచుతున్నవారందరూ గాడ్సే వారసులే.చివరికి గాడ్సేకు గుడి కట్టేందుకూ చూశారంటే ఉన్మాదం ఏ స్థాయికి చేరిందో అర్ధం అవుతుంది. ఒక నాటికి గాంధీ హత్యలో నిజమైన విలువ ఏమిటో తెలుస్తుందని విచారణ సందర్భంగా గాడ్సే చెప్పాడంటే కాలికట్‌ నిట్‌ ప్రొఫెసర్‌ వంటి వారు రాబోయే రోజుల్లో ఇంకా తామర తంపరగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమానికి సారధ్యం వహించిన మహాత్ముడిని చంపిన ఒక హంతకుడి చర్యలో దేశరక్షణను చూస్తున్న విద్యావంతులను చూసి జాతి గర్వపడాలా గర్హించాలా ? దేశం గాంధీని గుర్తుపెట్టుకున్నంత వరకు గాడ్సేను కూడా మరచిపోకూడదు. ఎందుకంటే మత సామరస్యానికి ప్రతిక గాంధీ అయితే, విద్వేషానికి, సమాజ ఐక్యత విచ్చిన్నానికి చిహ్నం గాడ్సే. గడచిన ఏడున్నరదశాబ్దాల కాలంలో గాడ్సే వారసులు పెరిగారు, గాంధీ వారసులు తగ్గారు. అందుకే చరిత్రను తిరగరాసి అసలైన దేశభక్తుడు గాడ్సే అన్నా నిజమే అని నమ్మేదిశగా మన సమాజం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.హిట్లర్‌ అసలైన దేశభక్తుడు అని జర్మన్లను నమ్మించిన గోబెల్స్‌ ప్రచారం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఇప్పుడు ప్రమాదకారులను, స్వాతంత్య్ర ఉద్యమంలో విద్రోహం చేసిన వారిని దేశభక్తులుగా చిత్రీకరణ జరుగుతోంది.దేశభక్తి అంటే అర్ధాన్నే మార్చివేస్తున్నారు.


” గాంధీ కారణంగానే ముస్లింలకు ప్రత్యేక దేశంగా పాకిస్థాన్‌ ఏర్పాటు జరిగింది. కాశ్మీరుపై దురాక్రమణకు పాల్పడిన తరువాత కూడా పాకిస్థాన్‌కు రు.55 కోట్లు ఇవ్వాలని నిరాహారదీక్ష చేయటం, గాంధీజీ సంతుష్టీకరణ విధానం కారణంగానే ముస్లింలు రెచ్చిపోతున్నారు.” ఇవీ మహాత్మా గాంధీ హత్యను సమర్ధించేవారు సాధారణంగా చెబుతున్నకారణాలు ? అందుకే గాడ్సే హత్య చేశాడని, తప్పేమిటని వాదిస్తారు.నిజానికి ఇది ఒక సాకు, వక్రీకరణ మాత్రమే. పాకిస్థాన్‌ ఏర్పాటుతో నిమిత్తం లేకుండానే గాంధీపై ఎన్నో సంవత్సరాల ముందే సనాతన శక్తులు హత్యాయత్నాలు జరిపాయన్న చరిత్రను మూసిపెడుతున్నారు.నిజానికి హిందూత్వ అజెండాను అమలు జరపాలని చూసిన శక్తులకు గాంధీ వైఖరి ఆటంకంగా మారింది. 1917 నుంచి 1948వరకు గాంధీ పలుసార్లు హత్యాయత్నం జరిగింది.వాటికీ దేశవిభజన,కాశ్మీరుపై దాడికి సంబంధమే లేదు. గాంధీ హత్యను సమర్ధించుకొనేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవం. రెండు జాతులు, రెండు దేశాలంటూ చెప్పిన వారిలో విడి సావర్కర్‌ ప్రముఖుడు.1937లో అహమ్మదాబాద్‌లో జరిగిన హిందూమహాసభ సమావేశంలో ఇప్పుడున్న మాదిరి దేశం ఒకటిగా ఉండబోదని చెబుతూ హిందు-ముస్లిం దేశాలుగా ఉంటాయని చెప్పాడు.(మహారాష్ట్ర ప్రాంతీయ హిందూమహాసభ, పూనే ప్రచురించిన స్వాతంత్య్ర వీర సావర్కర్‌, ఆరవ భాగం పేజీ 296).అంతేకాదు, మరో సందర్భంలో మాట్లాడుతూ రెండు దేశాల సిద్దాంతంతో జిన్నాతో నాకు పేచీ లేదు. హిందువులం స్వతహాగా మనది ఒక జాతి, హిందువులు, ముస్లింలు రెండు దేశాలన్నది చారిత్రక వాస్తవం ” అన్నాడు.


” దేవుడి దయవలన ఏడు సార్లు మరణపు కోరల నుంచి తప్పించుకున్నాను. నేను ఎవరినీ ఎన్నడూ గాయపరచలేదు, నాకు ఎవరూ శత్రువులు లేరని భావిస్తాను. ఎందుకు నాపై ఇన్నిసార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయో నేను అర్ధం చేసుకోలేకపోతున్నాను. నిన్న ప్రయత్నం కూడా విఫలమైంది.నేను అంత తేలికగా మరణించను, నూట ఇరవై అయిదు సంవత్సరాలు వచ్చేదాకా జీవిస్తాను ” అని 1946 జూన్‌ 30న పూనాలో గాంధీ చెప్పారు. ఈ అంశాన్ని గాంధీ మునిమనుమడు తుషార్‌ గాంధీ రాసిన ” లెటజ్‌ కిల్‌ గాంధీ ” (గాంధీని చంపుదాం ) అనే పుస్తకంలో పేర్కొన్నారు. తొలిసారి బీహార్‌లో భూస్వాములకు వ్యతిరేకంగా 1917 ఏప్రిల్‌ 15చంపారాన్‌ సత్యాగ్రహం సందర్భంగా ఇర్విన్‌ అనే ఆంగ్లేయుడు హత్యకు ప్రయత్నించాడు. ఇంటికి పిలిచి పాలలో విషమిచ్చి చంపేందుకు చూశాడు. సహాయకుడు యజమాని ఆజ్ఞను పాటించినట్లు నటిస్తూనే గాంధీకి గ్లాసు ఇవ్వబోతూ ఒలకపోశాడు. అవి తాగిన పిల్లి మరణించిన తరువాత జరిగిన కుట్ర వెల్లడైంది. ఏడు ప్రయత్నాల్లో మూడు సార్లు హిందూమహాసభకు చెందిన నారాయణ ఆప్టే, నాధూరామ్‌ గాడ్సే ప్రయత్నించాడు.1948 జనవరి 20న బాంబుతో చంపాలని చూశారు. ఆ ఉదంతంలో మదన్‌లాల్‌ పహ్వా అనేవాడిని అరెస్టు చేశారు. భారతీయులు జరిపిన తొలి హత్యాయత్నం చారిత్రాత్మక హరిజన యాత్ర సందర్భంగా 1934 జూన్‌ 25న పూనాలో జరిగింది. టౌన్‌హాల్లో జరిగిన సభకు ముందుగా వచ్చిన కారులో గాంధీజి ఉన్నాడని భావించిన సనాతన ఉన్మాదులు బాంబు పేలుడు జరిపారు. అయితే గాంధీ కారు ఆలస్యంగా రావటంతో ప్రమాదం తప్పింది. అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించటం నచ్చని సనాతనవాదులు నాడు గాంధీని వ్యతిరేకించారు. రెండవ సారి 1944 జూలైలో మహారాష్ట్రలోని పంచాగ్నిలో జరిగింది. ఒక ప్రార్ధనా సమావేశం జరుగుతుండగా నాధూరామ్‌ గాడ్సే ఒక కత్తి పట్టుకొని గాంధీ వ్యతిరేక నినాదాలు చేస్తూ దూసుకు వచ్చాడు.ప్రమాదాన్ని గ్రహించిన వారు అతన్ని పట్టుకున్నారు. గాడ్సేతో పాటు వచ్చినవారు పారిపోయారు. అతన్ని వదలివేయమని గాంధీ చెప్పాడు.తనతో ఎనిమిది రోజులు గడిపి చర్చలు జరపమని కోరగా గాడ్సే తిరస్కరించాడు. అదే ఏడాది సెప్టెంబరులో జిన్నాతో చర్చలకు గాంధీ సిద్దంగావటాన్ని హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించాయి. అప్పుడు కూడా సేవాగ్రామ్‌లో గాడ్సే ఆయుధంతో వచ్చాడు. ఇతరులతో కలసి గాంధీ సేవాగ్రామ్‌ నుంచి బొంబాయి వెళ్లకుండా అడ్డుకోవాలని చూశాడు.అప్పుడు కూడా ఆశ్రమవాసులు పట్టుకొని నిరాయుధుడిని చేశారు.తరువాత 1946 జూన్‌ 29న గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలును పడగొట్టి హత్య చేసేందుకు పట్టాలపై పెద్ద బండరాళ్లను ఉంచారు.డ్రైవరు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.ఐదవ సారి 1948 జనవరి 20న బిర్లా హౌస్‌లో గాంధీ ప్రార్ధన చేస్తుండగా కొద్ది మీటర్ల దూరంలో బాంబు పేలింది. చివరికి 1948 జనవరి 30న గాంధీని గాడ్సే కాల్చిచంపాడు.అందుకే ఆ రోజును మతసామరస్య దీక్షాదినంగా పాటిస్తున్నారు. మతశక్తులను సమాజం నుంచి వెలివేయటమే మహాత్ముడికి అసలైన నివాళి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం-1 : అమృత ఉత్సవమా ! హాలాహలమా !!

08 Sunday Aug 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, Uncategorized

≈ 1 Comment

Tags

75th anniversary of India's Independence, Azadi Ka Amrit Mahotsav, BJP, India independence @75, Indian national Congress, Mahatama Gandhi, Narendra Modi Failures, Nathuram Godse, RSS


ఎం కోటేశ్వరరావు


” ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం- నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం,
తారీఖులు దస్తావేజులు ఇవి కాదోయి చరిత్ర సారం ” అన్న శ్రీశ్రీని మనం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు తెచ్చుకోవటం అవసరం. స్వాతంత్య్రానికి ముందు పుట్టి తరువాత దేశాన్ని చూసిన వారి కలలు కల్లలయ్యాయి. తరువాత పుట్టిన వారు ఈ దేశం మాకేమిచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్ధితి. బిడ్డ పుట్టి పెరిగే క్రమంలో జరిగే పరిణామాల మాదిరే స్వాతంత్య్ర తరువాత దేశంలో కూడా మార్పులు వచ్చాయి. పుట్టిన బిడ్డ ఆరోగ్యంతోనా లేక ఈసురో మంటూ ఎదిగినట్లా అన్నదే అసలు సమస్య. స్వాతంత్య్ర దేశాన్ని కూడా అలాగే చూడాలి.


కాలం గడిచే కొద్దీ మెరుగు పరచాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్ధలకు తూట్లు పొడుస్తున్నారు. విపరీత అర్ధాలు చెబుతున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటి హరించుకుపోతున్నాయి లేదా కదలా మెదల్లేని బంధనాల్లో ఇరుక్కు పోతున్నాయి. మనకు నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా ? స్వాతంత్య్రం అంటే ఇదా, ఇలాంటిది మనకు అవసరమా అనే ప్రశ్నలు అనేక మందిలో ఉన్నాయి. ఇంతకాలం తరువాత ఇలాంటి ఆలోచనలు కలగటం విచార, విషాదకర స్దితి. ప్రస్తుత తీరు తెన్నులు చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్దితి ఇంకా దిగజారుతుందా అన్న ఆందోళన తలెత్తుతోంది. సాగు, నిత్య పర్యవేక్షణ లేకపోతే పంట భూముల్లో కలుపు మొక్కలు పుట్టినట్లు లేదా కబ్జాకు గురైనట్లుగానే అనేక దేశాల్లో ఇలాంటి పరిస్ధితులు తలెత్తినపుడు నియంతలు ముందుకు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. ఎవడొస్తే మనకేంలే మన మీద భారాలు, మనకు బాధలు తప్పవు అని జనం నిర్లిప్తతకు లోనవుతారు.


డెబ్బయి అయిదేళ్ల స్వాతంత్య్ర సందర్భాన్ని ఏమని పిలవాలి అన్నది ఒక మీమాంస. వజ్రోత్సవం లేదా ప్లాటినం వాటి నిర్వచనాలకు సరిపోదు. నూటయాభయ్యవ సంవత్సరాన్ని ఆంగ్లంలో సెస్‌కో సెంటెనియల్‌ అన్నారు. దీనికి తెలుగులో తగిన పదం లేదని గూగుల్తల్లి నిఘంటువు సమాధానం చెప్పింది. తెలిసిన వారెవరైనా సూచిస్తే దాన్నే ఉపయోగిద్దాం. డెబ్బయి అయిదు అంటే నూటయాభైలో సగం కనుక సెమీ సెస్‌కో సెంటినియల్‌ అనాలన్నారు. మన ప్రధాని నరేంద్రమోడీ గారు అమృత మహౌత్సవ్‌ అన్నారు. పేరులోనేమున్నది పెన్నిధి. వదిలేద్దాం. దానితో ఎవరికీ పేచీ లేదు.
జూలై ఒకటిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలైన సందర్భంగా వారు ఎంత గొప్పగా ఆ ఉత్సవాన్ని జరుపుకున్నారో, కమ్యూనిస్టు ఆశయాలకు ఎలా పునరంకితమయ్యారో యావత్‌ ప్రపంచం చూసింది. మనకంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా అక్కడ కష్టజీవుల ప్రభుత్వం ఏర్పడింది, 75 ఏండ్ల ఉత్సవాన్ని వారెలా జరుపుకుంటారో తరువాత చూద్దాం. మోడీ గారు ఏడేళ్ల క్రితం అనేక మాటలు చెప్పారు. తరువాత చెప్పిన మాట చెప్పకుండా చేసేది చెప్పకుండా చెప్పింది చెయ్యకుండా అసాధారణ ప్రతిభతో ” నిత్య నూతనత్వంతో ” గడుపుకు వస్తున్నారు. నిజంగా మనం ఇప్పుడు అమృత మహౌత్సవం జరుపుకొనే స్ధితిలో ఉన్నామా హాలాహలం మింగాల్సిన దుస్దితిలో ఉన్నామో తెలియటం లేదు. అచ్చేదిన్‌ (మంచి రోజులు) తెస్తామని వాగ్దానం చేసిన ప్రస్తుత కేంద్ర పాలకులు జనం చేత దేన్ని మింగిస్తారో అర్ధం కావటం లేదు.


ప్రతి ఏడాదీ పంద్రాగస్టు పండగ జరుపుకుంటున్నాం. అదొక తంతులా మారిపోయిందని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సిన పని లేదు. అంతకు మించి జరుగుతున్నదేమీ లేనపుడు ఎవరైనా అలాగే అనుకుంటారు మరి. పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు అన్నట్లుగా మార్చివేశారు. ఉదయాన్నే దేశభక్తి గీతాలు, పాటలను వినిపించటం, మూడు రంగుల జండా ఎగురవేయటం, ప్రతిజ్ఞలు, పప్పు బెల్లాల స్ధానంలో ఏదో ఒకటి తిని మిగిలిన రోజంతా సెలవుగా గడిపేయటానికి అలవాటు పడ్డాము. స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్దగా ఉన్న కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా మార్చి వేశారు. ఆ ఉద్యమం ఏ లక్ష్యాలనైతే ముందుకు తెచ్చిందో వాటిని ఆ పార్టీ 1947 ఆగస్టు 16 నుంచే మరచి పోయింది. దాన్ని నీరుగార్చే, ముప్పు తెచ్చే, జనానికి విశ్వాసం కోల్పోయే చర్యలకు పాల్పడింది. చరిత్ర దాస్తే దాగేది కాదు. విజేతలే చరిత్రను రాస్తారు అన్నది తెలిసిందే. అందువలన అది వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు జనం కూడా చరిత్రను రాస్తున్నారు. అందువలన దానిలో ఎలాంటి వివక్ష, పక్షపాతం ఉండదు. చరిత్ర నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఉపయోగించుకొనేందుకు స్వాతంత్య్ర ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేకపోవటమే కాదు బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన వారి వారసులతో నిండిన బిజెపి రంగంలోకి దిగింది. బ్రిటీష్‌ పాలన నుంచి దేశ విముక్తి అన్న నినాదాన్ని కాపీ కొట్టి కాంగ్రెస్‌ విముక్త భారత్‌ అనే పేరుతో జనం ముందు మాట్లాడింది. కాంగ్రెస్‌ విధానాలనే వేగంగా అమలు చేస్తూ దేశం మరింత దిగజారే విధంగా ఏలుబడి సాగిస్తోంది.


ఎందుకీ పరిస్ధితి తలెత్తింది ? దీక్షా దినంగా పాటించాల్సిన స్వాతంత్య్ర దినాన్ని సెలవుగా మార్చినపుడే ఆ మహౌద్యమాన్ని జనం మరచి పోవాలన్న అంశం దానిలో ఇమిడి ఉంది. చివరకు అది ఎంతవరకు వచ్చిందంటే స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాలకు ముప్పు వచ్చిందని చెబుతున్నవారిని ఇప్పుడు జనం అపహాస్యం చేస్తున్నారు. అవి ఉంటేనేం లేకపోతేనే అంటున్నారు. పంద్రాగస్టు పండగకు 75 వారాల ముందే ప్రధాని నరేంద్రమోడీ మార్చి 12న గుజరాత్‌లో అజాదీ కా అమృతమహౌత్సవాన్ని ప్రారంభించారు. 2022 ఆగస్టు 15న నాటికి డెబ్బయిఅయిదు సంవత్సరాలు నిండి 76వ ఏట ప్రవేశిస్తాము. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రాలు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. ఇది రాసిన సమయానికి వాటిని ఖరారు చేయలేదు. అమృతమహౌత్సవాన్ని ప్రజాఉద్యమంగా నిర్వహించాలని దాని అమలుకు హౌమ్‌ మంత్రి అమిత్‌ షా నాయకత్వాన ఒక జాతీయ కమిటీ ఉంటుందని చెప్పారు. వారేమి చేస్తారో, అవెలా ఉంటాయో మరో సందర్భంగా చర్చించుకుందాం.


స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు అందరూ ఒకే పార్టీలో లేరు, అనేక పార్టీలలో చేరారు. మెజారిటీ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందున తామే దేశాన్ని విముక్తి చేశామని వారు చెప్పుకుంటారు. అలాంటి కాంగ్రెస్‌ దేశానికి శనిలా దాపురించిందని దాన్నుంచి ముక్తి కలిగిస్తామంటూ కాంగ్రెస్‌ ముక్త భారత్‌గా మారుస్తామని బిజెపి ప్రకటించుకుంది. దేశ రాజ్యాంగం ప్రకారం నాలుగు ఉన్నత పదవుల్లో అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, ముందే చెప్పుకున్నట్లు బ్రిటీష్‌ వారికి లొంగిపోయిన వారి రాజకీయ వారసులు ఇప్పుడు అధిష్టించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,ప్రధాని,లోక్‌సభ స్పీకర్లుగా సంఘపరివార్‌ రాజకీయ విభాగమైన బిజెపికి చెందిన వారే ఉన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరామ్‌ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి, హత్య సమయంలో అతను తమ సంస్ధలో లేడని వారు చెబుతారు గానీ గాడ్సే కుటుంబసభ్యులు సంఘపరివార్‌లోనే ఉన్నట్లు చెప్పారు. అది తేలేది కాదు గనుక ఆ వివాదాన్ని పక్కన పెడదాం. గాంధీని నేనెందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనలను పుస్తకరూపంలో ప్రచురించి ప్రచారం చేస్తున్నవారు, సామాజిక మాధ్యమంలో అవే వాదనలను చేస్తున్న వారెవరో మనకు తెలుసు, అయితే అదంతా అనధికారికంగానే అనుకోండి. అలాంటి వారికి స్వాతంత్య్రం , దాని లక్ష్యాల మీద , ప్రజాస్వామిక వ్యవస్ధల పట్ల గౌరవం ఉంటుందా ? ఒకవైపు గాంధీకి నివాళులు అర్పిస్తూ మరోవైపు గాడ్సేను ఆరాధించే వారు పెరుగుతున్నారు, వారు ఎంతకైనా తెగిస్తారు. ఇంతకంటే ఆందోళనకరమైన అంశం ఏముంటుంది ?


జనాభాలో సగ భాగం గురించి ఇన్నేండ్లుగా కబుర్లు చెప్పటమే తప్ప ఫ్యూడల్‌ భావజాలం నుంచి ఇంకా బయటపడలేని స్ధితి ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక దేశాల చట్ట సభల్లో మహిళలు సగం మంది ఉన్నారు. తాజాగా చిలీ రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. మన దేశంలో చట్టసభల్లో 33శాతం గురించి ఎప్పటి నుంచో చర్చ. తమకు సంపూర్ణ మెజారిటీ ఉంటే అమలు జరుపుతామని బిజెపి చెప్పింది. ఇప్పుడు పార్లమెంట్‌ ఉభయ సభల్లో వారికి, వారిని బలపరిచే మిత్రపక్షాలతో కలిపి అవసరమైన మెజారిటీ ఉంది. మెజారిటీ రాష్ట్రాలూ వారివే. అయినా దాని గురించి ఎప్పుడైనా ప్రధాని మన్‌కీబాత్‌లో ప్రస్తావన చేశారా అంటే లేదు.


మన దేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందింది అని చెబుతుంటాం, నిజమే. కానీ అది జనానికి ఏ మేరకు ఉపయోగపడిందన్నదే గీటురాయి. వేల కోట్ల రూపాయలను పెట్టి రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేయటానికి, అవసరం లేకపోయినా కొత్త పార్లమెంట్‌ భవనం కట్టేందుకు నిధుల కొరత లేదు. కరోనా మహమ్మారి పోరు గురించి కబుర్లకూ అంతకంటే కొదవ లేదు. అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధించి రాకెట్లను ఎగరేశాం గానీ చాలా చౌకగా లభించే ఆక్సిజన్‌ ఇవ్వలేకపోయారు. అనేక మంది కరోనా పీడితులు ఆ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆనందయ్య ఆకుల పసరు ఆక్సిజన్‌ అందిస్తుందంటే, పచ్చడి కరోనాను అరికడుతుందంటే నిజమని జనం నమ్మారు. దీన్ని ఎలా చూడాలి ? కరోనా నిరోధం కోసం లాక్‌డౌన్‌ పెట్టినపుడు రెక్కాడితే తప్ప డొక్కాడని వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లేందుకు అయ్యే రైలు ఖర్చులను కేంద్రం – రాష్ట్రాలు ఎవరు భరించాలి అని వివాదపడిన అపర మానవతా వాదులను మనం తప్ప మరేదేశమూ చూడలేకపోయింది.

పది లక్షల కోట్ల రూపాయల పారుబాకీలను వేళ్ల మీద లెక్కించదగిన బడాబాబులకు రద్దు చేయటానికి ఉదారంగా నిర్ణయాలు చేసిన పాలకులకు వాక్సిన్లు వేయటానికి చేతులు రాలేదు. తాము స్వయంగా చెప్పిన ఉచితవాక్సిన్లు వేసేందుకు మధ్యలో ఠలాయించి సగం భారం రాష్ట్రాల మీద మోపేందుకు, చివరకు సుప్రీం కోర్టు వాక్సిన్ల పేరుతో కేటాయించిన సొమ్ముకు లెక్కలు చెప్పండని నిలదీస్తే తప్ప లొంగని నేతలు ఇప్పుడున్నారు. కరోనాను ప్రపంచ విపత్తుగా ప్రకటించారు. మనం దేశంలో విపత్తు సహాయ చట్టం ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారు. కరోనా జాతీయ విపత్తుగా పరిగణించినపుడు నష్టపరిహారం ఎందుకు ఇవ్వరు. ఎవరి జేబులో డబ్బు ఇస్తున్నారు ? ఎవరు ఎవరికి జవాబుదారులుగా ఉన్నారు, ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు ? రెండు విడతలుగా ఇరవై ఆరులక్షల కోట్ల ఆత్మనిర్భర తాయిలాలను అందించిన కేంద్ర పెద్దలు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు వాయిదాల కరువు భత్యం చెల్లింపునకు ఎసరు పెట్టారు. నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. అనేక దేశాలలో కరోనా సహాయ చర్యలకు గాను ప్రభుత్వాలు కార్పొరేట్ల మీద ప్రత్యేక పన్ను విధించి నిధులు సమకూర్చుకున్నారు. మన దేశంలో అలాంటిదేమీ లేకపోగా ఉద్యోగుల పొట్టగొట్టేందుకు పూనుకున్నారు. నిలిపివేసిన కరవు భత్యాన్ని వాయిదాల రూపంలో లేదా పిఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామన్నా అదొక దారి, ఎగ్గొట్టటం ఏమిటి ?
(రెండవ భాగంలో ముగింపు https://vedikaa.com/2021/08/09/india-independence-75-what-is-happening-part-two/ )

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిఎఎ వివాదం : హద్దులు దాటిన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌

29 Sunday Dec 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

CAA, governor arif mohammad khan, Historian Irfan Habib, Indian constitution, Indian History Congress, Nathuram Godse

Image result for as a governor arif mohammad khan crossed his limits
ఎం కోటేశ్వరరావు
దేశంలో ఎవరు ‘అసహనంతో ప్రజాస్వామ్యవిరుద్దంగా ‘ ప్రవర్తిస్తున్నారో చూశారా అంటూ పొద్దున్నే ఒక పలకరింపు. కేరళలోని కన్నూరు విశ్వవిద్యాలయంలో శనివారం నాడు (ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌) భారత చరిత్ర కారుల 80వ మహాసభను ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ చేసిన ప్రసంగం, దాని మీద వ్యక్తమైన నిరసన గురించి ఆ పరామర్శ. తర్కబద్దంగా సమాధానం చెబితే వినే ‘సహనం’ కనిపించకపోవటంతో మహాశయా మీరు చిన్నతనంలో చదువుకున్న కుక్క పని గాడిద చేస్తే….. కథను ఒక్కసారి చదువుకుంటే చాలు అని చెప్పి ముగించాల్సి వచ్చింది.
దేెశంలో గవర్నర్ల పాత్ర అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది, రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభాలు వచ్చినపుడు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే గుర్తుకు వస్తాయి. ఆ విషయంలో కాంగ్రెస్‌ ముందుంటే, దాన్ని అధిగమించేందుకు, కొత్త పుంతలు తొక్కేందుకు బిజెపి తహతహలాడుతోంది. మన రాజ్యాంగంలో గవర్నర్ల పాత్ర పరిమితం, వారు రాజకీయాలు చేయకూడదు, చేస్తున్నారు గనుక ఎవరైనా విమర్శిస్తే భరించాల్సిందే, గవర్నర్లంటే గౌరవం లేదా అంటే కుదరదు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర గవర్నర్‌ ప్రవర్తించిన తీరు తెన్నులను మరచి పోకముందే కేరళ గవర్నర్‌ తానూ తక్కువ తినలేదని, పదవి ఇచ్చిన వారి ఉప్పుతిన్నందున వారికి విధేయుడనై ఉన్నానని ప్రదర్శించుకొనేందుకు తాపత్రయ పడ్డారు అని చెప్పక తప్పదు.
గవర్నరు పదవిలో ఉన్న వారికి అధికారికంగా చట్ట సభల్లో ప్రభుత్వ అభిప్రాయాలు తప్ప వ్యక్తి గత అభిప్రాయాలు వ్యక్తం చేసే నిబంధనలు లేవు. బయట గవర్నర్లు గౌరవ అధ్యక్షులో మరొకటో అయిన సంస్దలు లేదా పర్యటనల్లో పరిమితమైన అంశాల మీద సందేశాలు, ప్రకటనలు చేయవచ్చు తప్ప. రాజకీయాల జోలికి పోకూడదు. అయితే చరిత్రకారుల మహాసభ లేదా మరొక సభ దేనినైనా ప్రారంభించాలని ఆహ్వానించినపుడు రావాలా లేదా అనేది గవర్నర్ల విచక్షణకు సంబంధించిన అంశం. అలా వచ్చినపుడు సాధారణంగా ముందుగా తయారు చేసుకున్న సంబంధిత అంశం మీదనే ప్రసంగిస్తారు. దానితో అందరూ ఏకీభవించాలని లేదు. కన్నూరులో జరిగింది అది కాదు. గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తాను తయారు చేసుకు వచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి అంతకు ముందు వక్తలు సిఎఎ, కాశ్మీర్‌ పరిణామాలపై చేసిన ప్రస్తావనలు లేదా విమర్శలకు రాజకీయ సమాధానాలు చెప్పటం ప్రారంభించటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక పార్టీ నాయకత్వంలో నడిచే ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, చట్టాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. వాటికి రాజకీయ పరమైన సమాధానం చెప్పాల్సింది మంత్రులు, పార్టీ నేతలు మాత్రమే. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న అధికారులు చట్టంలోని అంశాల మీద వివరణ ఇస్తారు తప్ప రాజకీయ పరమైన విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం లేదు. గవర్నర్లకూ లేదు.
తనను ప్రసంగించకుండా చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌, శ్రోతల నుంచీ కొందరు అడ్డుకున్నారని, గేలిచేశారని గవర్నర్‌ ఆరోపించారు. ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేయటాన్ని సహించలేకపోవటం అప్రజాస్వామికం అని కూడా వ్యాఖ్యానించారు. భౌతికంగా తనను నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ ప్రయత్నించారని కూడా ట్వీట్ల ద్వారా తీవ్ర ఆరోపణ చేశారు. అయితే ఆ ట్వీట్లలోనే గవర్నరే జరిగిందేమిటో వివరించాల్సి వచ్చింది.” భారత చరిత్రకారుల మహాసభ ప్రారంభం ఎలాంటి వివాదాలను రేకెత్తించలేదు.అయితే కన్నూరు విశ్వవిద్యాలయంలో జరిగిన 80వ చరిత్రకారుల మహాసభలో సిఎఎ మీద ఇర్ఫాన్‌ హబీబ్‌ కొన్ని అంశాలను లేవనెత్తారు. వీటి గురించి గవర్నర్‌ జవాబు చెబుతున్న సమయంలో గవర్నర్‌ను భౌతికంగా నిరోధించేందుకు ఇర్ఫాన్‌ హబీబ్‌ తన స్ధానం నుంచి లేచారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ పేరు ఉటంకించటానికి గవర్నర్‌కు ఉన్న హక్కును ఆయన ప్రశ్నించారు, చప్పట్లు కొడుతూ ఆయన గాడ్సే పేరును ప్రస్తావించాలని అన్నారు. అవాంఛనీయ ప్రవర్తనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన గవర్నర్‌ ఎడిసి మరియు రక్షణ అధికారిని తోసివేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా తాను తనకంటే ముందు మాట్లాడిన వక్తలు పేర్కొన్న కొన్ని అంశాలపై మాత్రమే తాను స్పందించానని ” గవర్నర్‌ ట్వీట్లలో పేర్కొన్నారు.
కన్నూరు సభలో గవర్నర్‌ కంటే ముందు మాట్లాడిన వక్తలు పౌరసత్వ సవరణ చట్టం, ఇతర అంశాలపై విమర్శలు చేశారు. రాజ్యాంగంలోనే కొన్ని అంశాలపై లోపాలు ఉన్నాయనే అభిప్రాయం వెలిబుచ్చటం తప్పు కాదు, రాజ్యాంగ ఉల్లంఘన అంతకంటే కాదు, దానికి ముప్పు తలపెట్టినట్లు కాదు. ఇప్పటికి 104 రాజ్యాంగ సవరణలు చేశారు, రాబోయే రోజుల్లో ఇంకా చేయవచ్చు. చట్ట సభల్లో దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను మరొక పది సంవత్సరాల పాటు పొడిగిస్తూ, ఆంగ్లో ఇండియన్‌ల నామినేటెట్‌ సీట్లను రద్దు చేస్తూ 104 సవరణలో తీర్మానించారు. ఎవరైనా వీటిని కూడా విమర్శించవచ్చు.అలాంటపుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని సవరించటాన్ని విమర్శించటం, రాజ్యాంగానికి వచ్చిన ముప్పుగా పరిగణించటం, దాన్ని కాపాడే బాధ్యతలో భాగంగా విమర్శలకు సమాధానం చెప్పబూనుకోవటమే అసలైన రాజ్యాంగ నిబంధనలకు విరుద్దం.
అదే వేదికపై ఉన్న సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు కెకె రాగేష్‌ గవర్నర్‌ కంటే ముందు మాట్లాడారు.” చరిత్రకారుల సభలో గవర్నర్‌ పూర్తిగా రాజకీయ ప్రసంగం చేశారు. ఆయన ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిలా మాట్లాడారు. ఎంపీ గారూ ఇది మీ కోసమే అంటూ నన్ను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేనుకూడా ఇతర పెద్దలతో పాటే వేదిక మీద ఉన్నాను. ఇర్ఫాన్‌ హబీబ్‌ గవర్నర్‌ను తోసివేయలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ మాటలను వక్రీకరించటానికి బదులు గాడ్సే చెప్పిందాన్ని ఉటంకించమని మాత్రమే కోరారు.” అని రాగేష్‌ చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. అంతే కాదు సభలో ఉన్న ఒక ప్రతినిధి జరిగిన సంఘటన గురించి ” గవర్నర్‌ మౌలానా అజాద్‌, గాంధీ ఇతరుల పేర్లను పూర్తి అసందర్భంగా ప్రస్తావించారు, అదే సమయంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా పొగడటం ప్రారంభించారు. ఎవరైనా ఆయనకు ఏమి చెబుతారు, వారిని వక్రీకరిస్తూ మాట్లాడినపుడు తరువాత గాడ్సేను కూడా ప్రస్తావించాలని చెప్పారు. ఇది చరిత్రకారుల మహాసభ, పౌరసత్వ సవరణ చట్టం మీద సెమినార్‌ కాదు.” అని పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఖాన్‌ చెత్త మాట్లాడుతున్న సమయంలో మీరెందుకు అజాద్‌, గాంధీలను ఉదహరిస్తున్నారు గాడ్సే గురించి చెప్పండి అంటూ హబీబ్‌ అడ్డుకున్నారు అని అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ షిరీన్‌ మూస్వీ చెప్పారు.
గవర్నర్‌ ప్రసంగంశాలపై అనేక మంది ప్రతినిధులు, విద్యార్ధులు కూడా నిరసన తెలిపారు. వారిని ఉద్దేశించి ” మీకు నిరసన తెలిపే హక్కుంది, కానీ నన్ను నోరు మూయించలేరు. మీరు చర్చల ద్వారాన్ని మూయటం అంటే మీరు హింసా సంస్కృతిని ప్రోత్సహించటమే అని” వారితో గొంతు కలిపారు. నిరసనల మధ్య తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తాను ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగంతోనే వచ్చానని, అయితే తనకంటే ముందు మాట్లాడిన వక్తలు ఈ అంశాన్ని(సిఎఎ) ప్రస్తావించకుండా ఉంటే నేను మాట్లాడేవాడినే కాదు, మీరు ప్రస్తావించి రాజకీయ ప్రకటనలు చేశారు.రాజ్యాంగాన్ని సమర్ధించుతానని, రక్షించాలని నేను ప్రమాణం చేశాను. దానిలో భాగంగా నేను హబీబ్‌ లేవనెత్తిన అంశాలపై ప్రతిస్పందించాను. అయితే ఆయన నా ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు” అని గవర్నర్‌ ఆరోపించారు.
ఈ ఉదంతంపై ఇద్దరు జర్నలిస్టులు చేసిన ట్వీట్లను గమనించాల్సిన అవసరం ఉంది. బిజెపి ఎంపీ యజమానిగా ఉన్న రిపబ్లిక్‌ టీవీతో సహా అనేక సంస్ధలలో పని చేసిన జర్నలిస్టు ఆదిత్య రాజ్‌ కౌల్‌ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు.’ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కొంత మంది కుహనా ఉదారవాదులనబడే వారు ఇప్పుడు మాట్లాడే, భావప్రకటనా స్వేచ్చ హక్కులేదని అంటున్నారు. మౌలానా అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ను ప్రస్తావిస్తూ సుప్రసిద్ద పండితుడైన కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతున్న సమయంలో ఆయన్ను గేలిచేశారు” అని విమర్శించారు. దీనికి స్పందనగా ఎన్‌డిటీవీ జర్నలిస్టు గార్గి రావత్‌ ఒక ట్వీట్‌ చేస్తూ ” ఆశ్చర్యంగా ఉంది. గేలి చేయటాన్ని సమర్ధించటం లేదు. కానీ, అవకాశవాద మాజీ రాజకీయవేత్త అయిన గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను మీరు ఒక పండితుడు అంటున్నారు, సుప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ను కుహనా ఉదారవాదిగా పిలుస్తున్నారు” అని చురక అంటించారు.


ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను అవకాశవాది అనటం సరికాదని, నిజంగా అవకాశవాది అయితే షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును తిరస్కరించే నిర్ణయం తీసుకున్న రాజీవ్‌ గాంధీని ఎందుకు వ్యతిరేకిస్తారు, మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తారని కొందరు మీడియా విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇర్ఫాన్‌ హబీబ్‌ అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపణలు చేశారు. ఆయోధ్యలో ముస్లింలు రాజీపడేందుకు సిద్దపడినపుడు హబీబ్‌ ఇతరులు పడనీయలేదని ఆరోపించారు. అంతవరకు పరిమితం కాలేదు గార్గి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ముక్తార్‌ అబ్బాస్‌ అహమ్మద్‌ అన్సారీ మనవడిని వివాహం చేసుకుందని, ఆమె భర్త యూసుఫ్‌ అహమ్మద్‌ అన్సారీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేశారని, ఆమె కాంగ్రెస్‌ అనుకూల జర్నలిస్టు అని అసందర్భ వ్యాఖ్యలు చేయటాన్ని బట్టి వారు కాషాయ దళసైనికులన్నది స్పష్టం.
ఇక ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ విషయానికి వస్తే షాబానో కేసు తీర్పును వమ్ము చేసేందుకు నిర్ణయించిన రాజీవ్‌ గాంధీ చర్యను వ్యతిరేకించిన మాట వాస్తవం.ఆచర్యను అనేక మంది పురోగామి వాదులు ప్రశంసించారు. అలీఘర్‌ ముస్లిం విద్యార్ధి సంఘనాయకుడిగా పని చేశారు. తొలుత బికెడి తరఫున పోటీ చేసి ఓడిపోయారు, తరువాత 26 ఏండ్ల వయస్సులోనే ఎంఎల్‌సి అయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పని చేస్తూ రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్‌ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరోసారి మంత్రిగా పని చేశారు. తరువాత ఆ పార్టీ నుంచి బిఎస్‌పిలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు. తరువాత 2004లో బిజెపిలో చేరి ఎన్నికలలో ఓడిపోయారు. మూడు సంవత్సరాల తరువాత బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించినా ఆ పార్టీతో సంబంధాలను వదులు కోని కారణంగానే నరేంద్రమోడీ సర్కార్‌ కేరళ గవర్నర్‌గా నియమించింది. ఇన్ని పార్టీలు మారిన వ్యక్తిని అవకాశవాది అనాలో మరొక విధంగా పిలవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీని దేశపితగా అంగీకరించకపోతే భారతీయులు కాదా ?

29 Sunday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP motor mouths, Donald trump, father of the country, Father of the Nation, Mahatama Gandhi, Narendra Modi, Nathuram Godse

Image result for PM As “Father Of India”

(నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా ! అన్న విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ప్రముఖ నేతలు మనసా, వాచా, కర్మణా జీవితాలను జాతికి అంకితం చేసిన వారిని కొన్ని దేశాలలో జాతిపితలుగా వర్ణించి గౌరవించటం మనం చూస్తున్నాం. రాజకీయంగా విబేధించే వారు కూడా వారి వ్యక్తిత్వాలను గౌరవిస్తారు. స్పెయిన్‌ వంటి చోట్ల రాజకుటుంబానికి పాలనా పరంగా ఎలాంటి బాధ్యతలు, హక్కులు లేనప్పటికీ రాజును దేశ ఐక్యతా చిహ్నంగా పరిగణిస్తారు. థాయ్‌లాండ్‌లో కూడా రాజుకు అటువంటి గౌరవమే వుంది.

కొన్ని దేశాలలో దేశ స్ధాపకులుగా కొందరిని గౌరవిస్తారు. అయితే కొంత మంది తమకు తామే జాతిపితలుగా ప్రకటించుకున్నవారు కూడా లేకపోలేదు. వారంతా నియంతలు, ఇతర అవాంఛనీయ శక్తులకు ప్రాతినిధ్యం వహించిన వారిగానే వున్నారు. ప్రపంచ సమాజం వారిని గుర్తించ లేదు. టోగో అనే దేశంలో గనాసింగ్‌బె యడేమా తను జాతిపిత, పెద్ద అన్న, ప్రజల మార్గదర్శకుడు అనే బిరుదులతో పిలిపించుకున్నాడు. జైరే నియంత మొబుటు సెసె సెకో జాతి పిత, దేవదూత, వుదయించే సూర్యుడు వంటి పేర్లను తగిలించుకున్నాడు.

కొన్ని సందర్భాలలో ముఖ్యంగా నియంతల కాలంలో జాతి పిత వివాదాలకు కారణమైంది. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాట నేత ముజబుర్‌ రహ్మాన్‌ అని అందరికీ తెలిసిందే. పాకిస్దాన్‌ నుంచి విముక్తి పొందిన అనంతరం 1972లో రాజ్యాంగంలో ఆయనను జాతిపిత అని చేర్చారు.2004 అధికారానికి వచ్చిన బిఎన్‌పి దాన్ని రాజ్యాంగం నుంచి తొలగించింది. దాని మీద నిరసనలు వ్యక్తమయ్యాయి.

నరేంద్రమోడీని భారత దేశ పిత అని పిలిచారు తప్ప జాతిపిత అనలేదు కదా అని కొందరు వాదిస్తున్నారు. చరిత్రలో బ్రిటీష్‌ వారు ఆక్రమించుకోక ముందు ఇప్పుడు మనం అమెరికాగా పిలుస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే ఒక దేశం లేదు. కొలంబస్‌ అమెరికాను కనుగొన్న తరువాత వివిధ ఐరోపా దేశాల నుంచి వలస వచ్చిన వారు 13వలస ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 1760దశకంలో అక్కడి జనాభా కేవలం 25లక్షల మాత్రమే. బ్రిటీష్‌-ఫ్రెంచి వారి యుద్ధాలను చూసి, వాటి పర్యవసానాలతో ప్రభావితమైన ఆ కాలనీలకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో బ్రిటీష్‌ వారి వలసపాలనను వ్యతిరేకించి అమెరికా అనే దేశాన్ని ఏర్పాటు చేశారు. వారిని అమెరికా దేశ స్ధాపక పితలుగా పరిగణిస్తున్నారు. వారిలో ఎనిమిది మంది పేర్లు కనిపిస్తాయి. జార్జి వాషింగ్టన్‌, అలెగ్జాండర్‌ హామిల్టన్‌, బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌, జాన్‌ ఆడమ్స్‌, శామ్యూల్‌ ఆడమ్స్‌, థామస్‌ జఫర్సన్‌, జేమ్స్‌ మాడిసన్‌, జాన్‌లే అనే నేతలను అమెరికా స్ధాపక పితలుగా పరిగణిస్తారు. వారిలో అగ్రగణ్యుడు జార్జి వాషింగ్టన్‌ దేశ తొలి అధ్యక్షుడయ్యాడు. అమెరికా దేశ పిత ఎవరు అన్నా జాతిపిత ఎవరు అన్నా ఆయన పేరే వస్తుంది.

ఈ పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ జాతిపిత-దేశ పిత ఒకటే అనే అర్ధంలో నరేంద్రమోడీని అలా పిలిచారా అన్నది ఒక అంశం. ఒక వేళ దేశపిత అనాలంటే బ్రిటీష్‌ వారు రాక ముందే భారతదేశం వుంది. పోలీసు చర్య ద్వారా హైదరాబాద్‌ సంస్ధానాన్ని విలీనం చేసిన ఖ్యాతిని కేవలం సర్దార్‌ పటేల్‌కే ఆపాదిస్తున్న బిజెపి వాదన మేరకు, లేదా కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని నడిపించిన జవహర్‌లాల్‌ నెహ్రూను, భారత రక్షిత స్వతంత్ర దేశంగా వున్న సిక్కింను మన దేశంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకున్న ఇందిరా గాంధీని దేశపితలు, దేశమాత అంటే ఒక మేరకు అర్ధం చేసుకోవచ్చు నరేంద్రమోడీ ఎలా అవుతారు ? ‘ చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు.’ అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు అర్ధం ఏముంది. కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక రక్షణలు తొలగించటాన్ని , దానికి కూడా దేశంలో మాదిరి చట్టాలు వర్తింపచేశామని మోడీ చెప్పుకోవటాన్ని బట్టి అలా అన్నారా ? ఒక వేళ అదే ప్రాతిపదిక అయితే అనేక రాష్ట్రాలకు వున్న ప్రత్యేక రక్షణలు, చట్టాల మాటేమిటి?

మన దేశానికి వస్తే ఎవరినీ జాతిపితగా గుర్తించేందుకు రాజ్యాంగంలో అవకాశం లేదు. రాజకీయంగా గాంధీతో విబేధించినప్పటికీ సుభాస్‌ చంద్రబోస్‌ తొలిసారిగా 1944లో సింగపూర్‌ రేడియోలో ప్రసంగిస్తూ జాతిపిత అని సంబోధించాడు. అయితే మరుసటి ఏడాదే గాంధీని హతమార్చేందుకు గాడ్సే తొలి విఫల హత్యాయత్నం చేసినట్లు తరువాత వెల్లడి అయింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జాతిపితగా పరిగణించి మన కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాలను ముద్రించి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధీని జాతిపితగా బిజెపి గుర్తించదు. ఆయన మీద విమర్శ చేస్తే జనం అంగీకరించరన్న భయం కారణంగా పైకి మాట్లాడటం లేదు గానీ ఏదో ఒక రూపంలో ఆ పార్టీ వారు దాచుకోలేకపోతున్నారు.

గాంధీ పాకిస్తాన్‌కు జాతి పిత అని బిజెపి మధ్యప్రదేశ్‌ నేత అనిల్‌ సౌమిత్ర నోరు పారవేసుకున్నాడు.మహాత్మా గాంధీ జాతిపితే అయితే అది పాకిస్ధాన్‌కు. ఆయన వంటి వారు భారత్‌లో కోట్లాది మంది పుత్రులున్నారు. కొందరు పనికి వచ్చే వారైతే మరికొందరు పనికిమాలిన వారు’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఇదేమిటయ్యా నేతా అని విలేకర్లు ప్రశ్నిస్తే భారత జాతిపితగా గౌరవం ఎవరికి వుందో ఎవరికీ తెలియదు లేదా వూరూపేరూ లేనివారు. కాబట్టి మహాత్మాగాంధీ జాతిపిత కావచ్చు కానీ అది పాకిస్ధాన్‌కు, ఇక్కడ పుట్టిన ప్రతివారూ భారత మాత పుత్రులమని గర్విస్తారు’ అన్నాడు. అంతే కాదు, ఆ పోస్టును తొలగించటానికి కూడా అంగీకరించలేదు. ఎవరూ 24గంటలూ పార్టీ ప్రతినిధులుగానే వుండలేరు. అలాంటి వారి అభిప్రాయాలన్నీ ఎల్లవేళలా పార్టీ వైఖరిగా వుండాల్సిన అవసరం లేదు అని కూడా అన్నాడు. అంటే అది తన వ్యక్తిగత అభిప్రాయమని చిత్రించే యత్నం అని వేరే చెప్పనవసరం లేదు.

ఈ సౌమిత్రకు వుత్తేజం సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌. ఆమె భోపాల్‌ బిజెపి అభ్యర్ధినిగా రంగంలో వుండి ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా అగర్‌-మాళ్వా ప్రాంతంలో ప్రచార సభల్లో విలేకర్లతో మాట్లాడుతూ ‘ నాధూరామ్‌ గాడ్సే ఒక దేశభక్తుడు. ఆయన ఎన్నటికీ దేశభక్తుడిగానే వుంటారు. కొందరు ఆయన్ను వుగ్రవాది అని పిలుస్తారు. ఈ ఎన్నికల్లో అలాంటి వారికి తగిన విధంగా బుద్ది చెబుతారు’ అని వ్యాఖ్యానించిన మరుసటి రోజు సౌమిత్ర రెచ్చిపోయాడు. తరువాత బిజెపి నుంచి వత్తిడితో ప్రజ్ఞ క్షమాపణ చెప్పారు. యథా ప్రకారమే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా సెలవిచ్చారు. ఆరోగ్యం బాగోలేదని తరువాత కొద్ది రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా వున్నారని చెప్పారు గానీ వచ్చే ఓట్లకు ఏమైనా గండిపడుతుందేమో అని పార్టీయే ఆమెను దూరం పెట్టింది. నరేంద్రమోడీ ఆమె వ్యాఖ్యలపై ఆమెను క్షమించటానికి నేను అశక్తుడను అని చెప్పి నష్టాన్ని తగ్గించే యత్నం చేశారు.గాడ్సే స్వతంత్ర భారత తొలి వుగ్రవాది అని సినీ హీరో కమల్‌ హసన్‌ చేసిన వ్యాఖ్యకు సమాధానంగానే ప్రజ్ఞ తన మన్‌కీ బాత్‌ను వెల్లడించారు.

ఆమె, మరో ఇద్దరు ఎంపీలు కూడా వారి వ్యక్తిగత స్ధాయిలో చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని అమిత్‌ షా చెప్పటం విశేషం. గాడ్సే ఒకరిని చంపాడు, కసబ్‌ 72 మందిని, రాజీవ్‌ గాంధీ 17వేల మందిని చంపాడు. వీటిలో ఎవరిది పెద్ద క్రూరత్వమో మీరే నిర్ణయించండి అని కర్ణాటక బిజెపి ఎంపీ నళిన్‌ కుమార్‌ కటీల్‌ కూడా ఇదేసమయంలో ట్వీట్‌ చేశాడు. అతని మీదా ఎలాంటి చర్య లేదు. ఇతగాడు రెండు సార్లు బిజెపి ఎంపీగా పనిచేసి మూడవ సారి గత ఎన్నికల్లో గెలిచాడు.కేంద్రమంత్రిగా వున్న అనంత కుమార్‌ తక్కువ తినలేదు.’ ఏడు దశాబ్దాల తరువాత దృష్టి మారిన వాతావరణంలో నేటి తరం శిక్షకు గురైన ఒక వ్యక్తిని గురించి చర్చిస్తున్నారంటే గాడ్సే గనుక బతికి వుంటే ఇప్పుడు జరుగుతున్న చర్చను చూసి సంతోషపడి వుండేవాడు.’ అని ట్వీట్‌ చేశారు.

ముంబయ్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా వున్న ఐఏఎస్‌ అధికారిణి నిధి చౌధరి చేసిన ఒక ట్వీట్‌లో దేశంలో వున్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలన్నింటినీ కూల్చివేయండి,కరెన్సీ నోట్లపై వున్న ఆయన చిత్రాలను చెరిపివేయండి, నాధూరామ్‌ గాడ్సేకు కృతజ్ఞలు అని పేర్కొన్నారు. తరువాత దాన్ని వుపసంహరించుకున్నారు. ఆమెపై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆ వ్యాఖ్యలను తాను వ్యంగ్యంగా చేశాను తప్ప మరొకటి కాదని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా జనవరి నుంచి సామాజిక మాధ్యమంలో మహాత్మాగాంధీ మీద ప్రతికూల వ్యాఖ్యలు బాగా కనిపిస్తున్నాయని, గాంధీ వాటిని చూడకుండా చేసినందుకు గాడ్సేకు కృతజ్ఞలు అనే అర్ధంలో తాను ట్వీట్‌ చేసినట్లు మీడియాకు వివరించారు.

నరేంద్రమోడీని జాతి పిత లేదా ప్రపంచ పిత అని పిలవటానికి సంఘపరివార్‌ నీడలో వున్నవారిలో వున్న ఆతృత ఎలా వుందో అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అని ప్రశ్నించటం ఒక సూచిక. అనేక మంది అలా పిలిచేందుకు వుబలాటపడుతున్నారు. నరేంద్రమోడీ 69వ పుట్టిన రోజు సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ సతీమణి అమృత శుభా కాంక్షలు చెబుతూ నరేంద్రమోడీని జాతి పిత అని సంబోధించారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన వీడియోను కొన్ని వేల మంత్రి ఆమోదించారు. దాని మీద సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు కూడా వెల్లడయ్యాయి. నరేంద్రమోడీ సన్నిహితుడు గుజరాత్‌ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన విష్ణు పాండ్య గుజరాత్‌ సమాచార్‌ టీవీ చర్చలో పాల్గొంటూ గాంధీ మాదిరే గాడ్సే కూడా దేశభక్తుడే అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించే వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎక్కడైనా ఒకరో అరో వుంటారేమోగానీ గాడ్సేను దేశభక్తుడు కాదని చెప్పేవారెవరూ మనకు కనిపించరు. నేను గాంధీని ఎందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనను పెద్ద ఎత్తున ప్రచురించి పంపిణీ చేసేది, చదివించేది కూడా వారే అంటే అతిశయోక్తి కాదు.

Image result for narendra modi and gandhi

చరఖా తిప్పినంత మాత్రాన గాంధీలు, శాంతి మంత్రం జపించినంత మాత్రాన బుద్దులు అయిపోరు. కానీ అలాంటి ప్రయత్నాలను దేశం చూసింది. ఖాదీ వుద్యోగ సంస్ధ కాలెండర్‌ కోసం నరేంద్రమోడీ చరఖా ముందు కూర్చొని ఫొటోకు పోజిచ్చారు. మహాత్మా గాంధీ సామాన్యులను ప్రతిబింబిస్తూ కొల్లాయి కట్టి తిరిగారు. నరేంద్రమోడీ ధరించే దుస్తులు ఎంత ఖరీదైనవో, ఎంత దర్జాగా వుంటాయో రోజుకు రెండు మూడు మార్లు మారుస్తారని చదివాము. గాంధీ ఆశ్రమంలో తన మరుగుదొడ్డి తానే శుభ్రం చేసుకున్నారు. పారిశుధ్యకార్మికులను విముక్తి చేయాలని కోరుకున్నారు. కానీ కుంభమేళా సందర్భంగా ఐదుగురు పారిశుధ్యకార్మికుల కాళ్లు కడిగి నరేంద్రమోడీ మీడియా ఫొటోలకు ఫోజిచ్చారు. అంతమాత్రాన గాంధీ అయిపోతారా ? గాంధీ ఒక వ్యవస్ధకు ప్రతిరూపం అయితే నరేంద్రమోడీ కంపెనీల ప్రచారకర్తగా తయారయ్యారు. గాంధీ కంటే ప్రధాని మంచి బ్రాండ్‌ అని హర్యానా బిజెపి మంత్రి వ్యాఖ్యానించిన విషయం మరచిపోరాదు. జియో, పేటియంల ప్రచారకర్తగా జాతికి కనిపించిన విషయం మరచిపోగలమా ? గాంధీ సామాన్యులకు ప్రతిబింబంగా అంగవస్త్రంతో బతికారు, మరి మోడీ ఖరీదైన దుస్తులను రోజుకు రెండు మూడుసార్లు మారుస్తారని చదివాము. గాంధీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశాన్ని నడిపారు. నరేంద్రమోడీ సామ్రాజ్యవాదుల పాదాల దగ్గరకు దేశాన్ని నడిపిస్తున్నారు.

ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయితీ వుంది. అందుకని దాని దగ్గర చమురు కొనవద్దని మన దేశాన్ని ట్రంప్‌ ఆదేశిస్తే తలొగ్గటాన్ని సామ్రాజ్యవాదుల పాదాల చెంతకు మనం చేరటం కాదా ? గాంధీ 150వ జయంతి సందర్భంగా బిజెపి వారు గాంధీ ఆర్ధిక సిద్దాంతాల గురించి కూడా ప్రచారం చేస్తారట. దానికి పూర్తి విరుద్దమైన పాలన ఐదేండ్లు సాగించారు. బిజెపి ఏలుబడిలోకి రాక ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసింది. మొత్తం మార్కెట్‌ను విదేశాలకు అప్పగిస్తుంటే మరి ఆ సంస్ధ ఏమైందో, దాని దేశభక్తి ఎటుపోయిందో తెలియదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

భగవద్గీత కంటే గాడ్సే గ్రంధమే వారికి ముఖ్యం !

20 Monday May 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

bhagavad gita, Godse, Mahathma Gandhi, Narendra Modi, Nathuram Godse, Prahgya Thakoor, RSS, why i killed gandhi

Image result for gandhi

ఎం కోటేశ్వరరావు

మనిషిని కుక్క కరవటం సాధారణం, మనిషి కుక్కను కరవటమే వార్త అన్నది పాత చింతకాయ పచ్చడి. అధ్యక్షులు, ప్రధానులు, ఛాన్సలర్‌లు ఇలా ఏ పేరుతో వున్నా వారు అబద్దాలు చెప్పటం సాధారణం, ఎన్ని నిజాలు చెప్పారన్నదే వార్త అన్నది కొత్త చింతకాయ పచ్చడి. ఏప్రిల్‌ 29వరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదివేలకు పైగా అబద్దాలు చెప్పారని వాషింగ్టన్‌ పోస్టు ఫాక్ట్‌ చెక్కర్‌( వాస్తవాలు, అవాస్తవాలను కనుకొనే వ్యవస్ధ) వెల్లడించింది. ట్రంప్‌ అధికారంలో వున్న 827రోజుల్లో ఈ రికార్డు నెలకొల్పారు. ఆయన పదవీకాలం నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే సరికి ఆ సంఖ్య ఇరవై వేలకు చేరుతుందా, పాతికవేలు అవుతుందా అన్నది ఇప్పుడు అసలైన వార్తగా మీడియాలో విశ్లేషిస్తున్నారు. ఏప్రిల్‌ 25-27 తేదీల మధ్య అంటే మూడు రోజుల్లో ట్రంప్‌ మహాశయుడు 171 అబద్దాలు లేదా వక్రీకరణలకు గానీ పాల్పడ్డారట. రోజుకు 57 అబద్దాలు చెప్పటం అంటే సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు, ఇదొక రికార్డు. మరి మన దేశంలో ఇలా అబద్దాలు చెప్పేవారిని కనుక్కొనే వ్యవస్ధలను ఒక్క బడాపత్రిక లేదా ఛానల్‌ కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు? పాకేజీలు ఆగిపోతాయనా ? ఏమో !

అబద్దాలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేయటం నిత్యజీవితంలో ఒక భాగమైంది. సామాజిక మాధ్యమాల్లో నేను సైతం ఫేస్‌బుక్కుకు, ట్విటర్‌కు ఫేక్‌ పోస్టును సమకూర్చాను అన్నట్లుగా పరిస్ధితి వుంది. అబద్దాల కోరు ట్రంప్‌కు అడుగులకు మడుగులొత్తటం, కౌగిలింతల దౌత్యం, మమేకం అయ్యే వారికి ట్రంప్‌ లక్షణాలు అబ్బకుండా ఎలా వుంటాయి. మనలోని అసహ్యాన్ని, దుష్టాలోచనలను కనిపించకుండా వేసుకొనేది ముసుగు. అది పలు రూపాలు, వ్యక్తీకరణలు, ఇతరత్రా వుంటుంది. కొన్ని శరీరాల నుంచి వెలువడే దుర్గంధం, చెడువాసనల నుంచి ఇతరులను రక్షించేందుకే అత్తర్లను తయారు చేశారని కొంత మంది చెబుతారు. భారతీయ సంస్కృతికి, నాగరికతకు వారసురాలు అని స్వయంగా మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రశంసలు అందుకున్న ప్రజ్ఞా ఠాకూర్‌ మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే గొప్ప దేశభక్తుడు అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే దేశంలో తొలి వుగ్రవాది, అతను హిందువు అని ప్రముఖ చలన చిత్ర నటుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఒక వుగ్రవాద కేసులో నిందితురాలిగా వుండి, అసత్యాలతో బెయిలు మీద బయటకు వచ్చి, బిజెపి అభ్యర్ధిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ‘యోగిని’ ప్రజ్ఞ తీసిన దెబ్బకు దెబ్బ అది. ఆమె మీద కేసు తేలేంత వరకు యోగిని ముసుగు వేసుకున్న మహిళ అంటే తప్పు లేదు. అయితే డేరాబాబా, ఆశారాంబాపు వంటి హంతకులు, అత్యాచారాలకు పాల్పడిన వారికి శిక్షలు పడేంతవరకు వారి మీద మాటపడనివ్వలేదు సరికదా వారితో అంటకాగారు బిజెపి వారు అని గుర్తు చేయటం అవసరం. ప్రజ్ఞ ఠాకూర్‌ నోటి నుంచి వెలువడిన దుర్గంధాన్ని కప్పి పుచ్చేందుకు బిజెపి క్షమాపణ అనే అత్తరు పూసింది.దుర్గంధం సహజలక్షణం, అత్తరు తాత్కాలికం, మళ్లీ మళ్లీ పూసుకుంటే తప్ప ఫలితం లేదు. ఆమె అత్తరు పూసుకున్నప్పటికీ నేను ఆమెను ఎప్పటికీ క్షమించను అన్న నరేంద్రమోడీ అతిశయోక్తి అలంకార ప్రయోగాన్ని చూసి నవరసాల నటుడు కమల్‌ హసనే కాదు, యావత్తు దేశ, ప్రపంచ సినీ రంగం తమకు 56అంగుళాల ఛాతీ గలిగిన కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, గాయకుడు, దర్శకుడు, నటుడు ఒకే వ్యక్తిలో దొరికారని సంతోషించక తప్పదు. మరో విధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ రెండింటికీ చెడ్డ రేవడి అయ్యారు.ఆయన చేసిన ప్రకటనను మిగతా వారే కాదు మోడీ భక్తులు కూడా నమ్మరని వేరే చెప్పనవసరం లేదు.ఒక మనిషి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైనా అంతిమంగా ఎక్కడ ముగిసింది అనేది ముఖ్యం. వినాయక దామోదర సావర్కర్‌ అందరు యువకుల మాదిరే స్వాతంత్య్ర వుద్యమంలోకి వచ్చారు. అండమాన్‌ జైలుకు పంపగానే పిరికిబారి అనేక మంది మాదిరే బ్రిటీష్‌ వారికి లొంగిపోయారు, లేఖల మీద లేఖలు రాశారు, చివరికి తెల్లవారి దయాదాక్షిణ్యాలతో బయట పడ్డారు. అలాంటి వ్యక్తినే దేశభక్తుడు అని కీర్తిస్తున్నవారు, గాడ్సేను దేశభక్తుడు అనటంలో ఆశ్చర్యం ఏముంది? జనానికి మతిమరుపు ఎక్కువ అని జర్మన్‌ నాజీ గోబెల్స్‌ ఎప్పుడో నిరూపించారు. ఆయనను అనుసరించేవారు వేరే దారిలో ఎలా నడుస్తారు?

Image result for gandhi godse

రాజకీయాల్లోకి వచ్చిన కమల్‌హసన్‌ రాబోయే రోజుల్లో ఏం చేస్తారో తెలియదు గానీ ఇప్పటి వరకైతే గాడ్సే గురించి వ్యాఖ్యానించి ఎవరెటువైపు వుంటారో తేల్చుకోవాల్సిన సవాలును మన జాతి ముందుంచారు. ఇప్పుడు సమస్య గాంధీ కాదు, గాడ్సే అయ్యారంటే అతిశయోక్తి కాదు. మహాత్మాగాంధీ, ఆయన సిద్ధాంతాలు, ఆచరణ గురించి గతంలోనే చర్చ జరిగింది. తొలుత ఆయనను అనుసరించిన ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ వంటి వారు తరువాత కమ్యూనిస్టులయ్యారు. ఆయన ఆశయాలనే పాటిస్తున్నామని చెప్పేవారు ఇప్పుడెక్కడ వున్నారో చూస్తున్నాము. స్వాతంత్య్రవుద్యమంలో ఆయనతో విబేధించిన వారు సైతం ఆయనను జాతి పితగా, మహాత్ముడిగా పిలవటాన్ని ఎన్నడూ వ్యతిరేకించలేదు, ప్రశ్నించలేదు. స్వాతంత్య్రం వుద్యమంలో ఆయనతో కొంత కాలం నడచిన కొందరు వ్యక్తులు లేదా నడచినట్లు చెప్పుకొనే వారు, దూరంగా వున్నవారు తరువాత కాలంలో హిందూత్వవాదులుగా మారారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఆయన పాత్రను సవాలు చేశారు, చేస్తున్నారు. ఆయన మహాత్ముడని ఎవరు చెప్పారు, జాతి పిత ఎలా అయ్యారు అని ప్రశ్నిస్తూనే వున్నారు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను సంఘీయులందరూ ‘వీర’ బిరుదుతో కలిపి పిలుస్తారు. వారు తగిలించటం తప్ప ఆ బిరుదును ఎవరిచ్చారో చెప్పమనండి. సదరు సావర్కర్‌ వేరే పేరుతో తన చరిత్రను తానే రాసుకొని దానిలో తన వీరత్వం గురించి కూడా జోడించారు. అంటే స్వంతడబ్బా కొట్టుకున్నారు. మహాత్మా గాంధీ ఎక్కడా ఆ స్ధాయికి దిగజారలేదు. మహాత్ముడిని హతమార్చిన వాడిని దేశభక్తుడు అంటూ అధికార పార్టీ ప్రసిద్ధ వ్యక్తి ప్రజ్ఞా ఠాకూర్‌ వ్యాఖ్యానించారు.ఆమెను సమర్ధిస్తూ ట్వీట్లు, ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేస్తున్న వారందరూ చౌకీదార్‌ నామం తగిలించుకున్న నరేంద్రమోడీ అనుయాయులే. వారందరి చేత బిజెపి లేదా దానికి మార్గదర్శనం చేస్తున్నామని చెప్పుకొనే సంఘపరివారం, నరేంద్రమోడీ క్షమాపణ చెప్పిస్తారా, చెప్పినా వారిని కూడా క్షమించనని నరేంద్రమోడీ అంటారా ? బంతి ఆయన కోర్టులోనే వుంది. ఐదేండ్లలో ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశంలో మాట్లాడేందుకు ధైర్యం చేయని వ్యక్తి, ఐదేండ్ల గడువు ముగిసేలోగా అమిత్‌ షా పత్రికా గోష్టిలో ప్రధాని నరేంద్రమోడీ కూడా పాల్గొన్నారు స్ధాయికి దిగిపోయారు. ప్రతమూ చెడింది, ఫలితమూ రాలేదు. మరోసారి ఆలిండియా రేడియోలో మనసులోని మాట చెప్పేందుకు అవకాశం వుంటుందో తెలియదు, ఎలా వెల్లడిస్తారనేది ఆయనకే వదిలేద్దాం !

ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులుగా లేదా దాని ప్రభావానికి లోనైన వారి విశ్వసనీయత ఎల్లవేళలా ప్రశ్నార్దకమే. వారు ముసుగు మనుషులు. వారు చెప్పే ఆదర్శాలు, అందుకు విరుద్దమైన ఆచరణే దానికి నిదర్శనం. ఇలాంటి వారి తీరు, తెన్ను మనకు ఇటలీ,జర్మనీలోని ఫాసిస్టులు, నాజీల్లోనూ వారి బాటలో నడిచే నియంతల్లో మాత్రమే కనిపిస్తుంది. బిజెపిలో వాజ్‌పేయి ఒక ముసుగు వంటి వారు, నిజమైన నేత అద్వానీయే అని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు గోవిందాచార్య మన్‌కీ బాత్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేతవై వుండి కూడా నిజాలు చెబుతావా నీకెంత ధైర్యం అన్నట్లుగా సదరు ఆచార్యను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. గాడ్సేను దేశభక్తుడని ప్రజ్ఞ వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యం లేదు. మహాత్ముడి హత్య కుట్రలో భాగస్వామి అని తీవ్ర విమర్శలు వచ్చిన, శిక్ష పడకుండా కేసునుంచి తప్పించుకున్న విడి సావర్కర్‌ను నరేంద్రమోడీ స్వయంగా దేశభక్తుడు అని కితాబిచ్చారు. ఆ సావర్కర్‌ స్వాతంత్య్ర సమర కార్యకర్తగా అండమాన్‌ జైలుకు వెళ్లి అక్కడ వుండలేక బ్రిటీష్‌ సర్కార్‌కు లేఖలు రాసి తాను ప్రభుత్వానికి విధేయుడనై వుంటాను, సహకరిస్తాను అని లొంగిపోయిన పిరికి పందగా జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంఘపరివార్‌ పెద్దలు ఏమి చెబుతారంటే ఒక ఎత్తుగడగా అలా లేఖలు రాశారు తప్ప ఆయన లొంగలేదు అంటారు. అంటే సావర్కర్‌ ఒక ముసుగు వేసుకున్నట్లు ఆయన శిష్యులే అంగీకరించటం. లేదా శిష్యులే ఆయనకు ఆ ముసుగు వేశారని అనుకోవాలి. ఆ పెద్దమనిషి వేసుకోవటం ఏమిటి ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంగా తమకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలకు పాల్పడం, తమది సాంస్కృతిక సంస్ధ అని ఒక అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి తమ మీద వున్న నిషేధాన్ని ఎత్తివేయించుకుంది. ఇది దేశ చరిత్రలో అతి పెద్ద ముసుగు.గత ఏడు దశాబ్దాలుగా దాని వెనుక అది ఎన్ని రాజకీయాలు నడిపిందో, ఏమి చేసిందో, ఎలాంటి శక్తులను సృష్టించి దేశం మీదకు వదలిందో, అనేక మతకల్లోలాలు, గుజరాత్‌ మారణకాండ, బాబరీ మసీదు కూల్చివేత, అనంతర పరిణామాల్లో తెలిసిందే.

మహాత్మాగాంధీ హత్యానంతరం దానిలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం కారణంగా నాటి ప్రభుత్వం నిషేధం విధించింది. వల్లభాయ్‌ పటేల్‌ నాడు హోం మంత్రి. ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టించిన విషపూరిత వాతావరణమే గాంధీ హత్యకు దారితీసిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. నిషేధం మీద సంతకం చేసింది, తరువాత ఎత్తివేసింది కూడా ఆయనే.గోల్వాల్కర్‌తో సహా అనేక మందిని జైలులో వేశారు. ఆ సమయంలో వున్నత స్ధాయిలో జరిగిన కుట్ర లేదా అధికారంలో వున్న పెద్దల కారణంగా కానీ నిషేధం ఎత్తివేశారు. దానికి గాను ప్రభుత్వం పెట్టిన షరతు ఏమిటి? హింసాకార్యకలాపాలనుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ వైదొలగాలి, రాతపూర్వకమైన నిబంధనావళితో అది బహిరంగ కార్యకలాపాలు నిర్వహించాలి. రాజకీయాలను వదలి పెట్టాలి, జాతీయ పతాకాన్ని గౌరవించాలి, భారత్‌ను లౌకిక దేశంగా గుర్తించాలి. ఆ మేరకు గోల్వాల్కర్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అప్పుడు భారత్‌ను లౌకిక దేశంగా గుర్తిస్తున్నారా అన్న ప్రశ్నకు ఒక హిందువుకు దేశం ఎల్లవేళలా లౌకిక రాజ్యమే అని సమాధానమిచ్చాడు. నాటి ప్రభుత్వానికి సమర్పించిన నిబంధనావళిలో తమది సాంస్కృతిక సంస్ధ అని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని కార్యకలాపాలు, ఆచరణ ప్రభుత్వానికి ఇచ్చిన వాగ్దానానికి విరుద్దమే. అన్నింటికీ వక్రీకరణలే. అందుకే దేశంలో, ప్రపంచంలో వున్న అనేక ముసుగు సంస్ధలలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దది. దాని రహస్య అజెండాను అమలు చేసేందుకు అప్పటి వరకు రాజకీయ సంస్ధగా వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ తన రాజకీయ విభాగంగా జనసంఘ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు బిజెపి, విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, హిందూవాహిని, దుర్గావాహిని వంటి అనేక సంస్ధలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వాటిలో వున్న వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులే. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా అంగీకరించే ధైర్యం దానికి లేదు. గాంధీని చంపింది హిందూమహాసభకు చెందిన గాడ్సే అని చెబుతారు. అదే హిందూమహాసభకు చెందిన శ్యాంప్రసాద్‌ ముఖర్జీతో జనసంఘ్‌ను ఏర్పాటు చేశారు. అంటే సాంకేతిక ఆటంకాలను తప్పించుకొనేందుకు తప్ప నిజానికి దానిలో దీనిలో పనిచేసేది ఆర్‌ఎస్‌ఎస్‌ వారే. గాడ్సే ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్‌ను వదలిపెట్టలేదని కుటుంబసభ్యులే చెప్పారు. పోనీ వారేమైనా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి వ్యతిరేకులా అంటే కాదు. అందువలన వారికి అలాచెప్పాల్సిన అవసరం లేదు.

ట్రంప్‌ పెద్ద అబద్దాల కోరైతే మన దేశ నేతలను ఏమనాలి. నిత్యం వందల కుహనా వార్తలు, అసత్యాలు, అర్ధసత్యాలతో సామాజిక మాధ్యమాలను నింపేస్తున్నదెవరు? ఎవరికి అనుకూలంగా వస్తున్నాయో వారే ఆ పని చేస్తున్నారు. వాటి పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని మేథావులు గుర్తించటం లేదు. అలాంటి సమాజంలో నియంతలు, నిరంకుశులు పెరగటం చాలా సులభం. గతంలో సుభాష్‌ చంద్రబోస్‌ మరణం గురించి జవహర్‌లాల్‌ నెహ్రూ మీద పెద్ద ఎత్తున తప్పుడు ప్ర చారం చేశారు. అది 2016లో ఎన్నికలకు ముందు ప్రారంభమై ఎన్నికలు ముగిసే వరకు సాగింది. సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబ సభ్యులు బిజెపిలో చేరారు. బెంగాల్లో ఆయన గురించి ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయని ఆపని చేశారు. పోనీ కేంద్ర ప్రభుత్వం సుభాష్‌ చంద్రబోస్‌ మరణం గురించి నిజాలేమైనా బయట పెట్టిందా అంటే ఏమీ లేదు. ప్రభుత్వం దగ్గర గతంలో బహిర్గతం కాని పత్రాలను కొన్నింటిని బహిర్గతం చేయటం తప్ప జరిగిందేమిటి?

సంఘపరివార్‌ శక్తులు బయట చేస్తున్న తప్పుడు ప్రచారాలనే అదే పరివార్‌ సభ్యుడైన నరేంద్రమోడీ పార్లమెంట్‌ వేదికగా చేసుకొని అవే విషయాలను చెప్పారు. సర్దార్‌ పటేల్‌ గనుక నాడు ప్రధాని అయి వుంటే కాశ్మీరు పూర్తిగా మన చేతుల్లోనే వుండేది అన్నారు. ఇది చరిత్రకు విరుద్ధం. చరిత్రను వక్రీకరించటానికి కొందరు వ్యక్తులు అవసరం. అందుకే నెహ్రూ, గాంధీని ఎన్నుకున్నారు. గాంధీని నేరుగా తిడితే పరువు దక్కదు కనుక ఆయన మీద సామాజిక మాధ్యమాల్లో, నెహ్రూమీద ప్రత్యక్షంగా దాడి చేస్తున్నారు. అసలు మనకు స్వాతంత్య్రం రాక ముందే ఏర్పడిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనాకు శాశ్వత సభ్యత్వం రావటానికి నెహ్రూ కారకుడని స్వయంగా కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీలో పచ్చి అబద్దమాడారు.భారత ఫాసిజం చర్చిల్‌ మాదిరి ముసుగు ధరించిందని బ్రిటన్‌ పత్రిక ఇండిపెండెంట్‌ 1998ఫిబ్రవరి 15న బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి గురించి రాసింది. సౌమ్యుడంటూ చిత్రించిన వాజ్‌పేయి నికార్సయిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. బాబరీ మసీదు కూల్చివేతకు బాధ్యులైన ఎవరి మీదా పార్టీ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గుజరాత్‌ మారణకాండ సమయంలో నరేంద్రమోడీ మీద చర్య లేదు. ఇప్పుడు ప్రజ్ఞ మీద అలాగే ఇతర బిజెపి నేతల మీద పార్టీ పరంగా ఎలాంటి చర్యలూ లేవు.

Image result for gandhi godse

సంఘపరివార్‌ కార్యకర్తలు నేతలు, కార్యకర్తలు హిందూమతానికి చెందిన గ్రంధాలు ఎంత మంది చదివారో తెలియదు, సెల్‌ఫోన్లలో భగవద్గీత అయినా వుందో లేదో చెప్పలేము గానీ ఇప్పుడు వారి సెల్‌పోన్లలో గాంధీని నేను ఎందుకు చంపాను అనే గాడ్సే పుస్తకం వుందంటే అతిశయోక్తి కాదు. వారు దానిని బలవంతంగా ఇతరులకు పంపుతున్నారు. ఆ మధ్య మన ఇతిహాసాలలో హింస వుంది, హిందువులు హింసకు అతీతులు కాదు అని చేసిన వ్యాఖ్య మీద రగడ జరిగింది. భారత, రామాయణాలు చదివిన వారు ఎంత మంది హింసకు పాల్పడ్డారు లేదా వుగ్రవాదులయ్యారు అని సంఘీయులు అడ్డు సవాళ్లు విసిరారు. మహాత్మా గాంధీ, నాధూరామ్‌ గాడ్సే ఇద్దరూ భగవద్గీతను చదివిన వారే ఒకరు ప్రాణాలను బలిదానమెందుకు ఇచ్చారు, మరొకడు ప్రాణాలు ఎందుకు తీసినట్లు ? భగవద్గీత నుంచి ఏమి నేర్చుకున్నట్లు? కేసు విచారణ సమయంలో తన చర్యకు సమర్ధనగా భగవద్గీతనే వుదాహరించాడు. అందుకే సంఘీయులు ఇప్పుడు దాన్ని జనాల మెదళ్లకు ఎక్కించటానికి పుస్తక రూపంలో వచ్చిన గాడ్సే వాదననే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా గాంధీ మీద అభిమానం, గౌరవం వుంటే అలా చేస్తారా? రాజకీయంగా, ఓట్ల పరంగా నష్టం అనే భయంతో క్షమాపణ చెప్పించటం, చెప్పినా నేను క్ష మించను అని మోడీ అనటం తప్ప నిజంగా వారి మనసులో గాడ్సే మీద భక్తి, అభిమానమే వుంది. జనంలో జరగాల్సిన ప్రచారం ఎలాగూ జరిగిపోయింది, గాడ్సేకు రావాల్సిన ప్రచారం వచ్చింది, మరి కొంత కాలం గాడ్సే గురించి చర్చ జరుగుతుంది తప్ప గాంధీ గురించి కాదు. గాడ్సే మీద జరిగే చర్చ తమ ముసుగును మరింత తొలగిస్తుంది అనుకుంటే బిజెపి మరో ముసుగు వేసుకుంటుంది. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం. మతోన్మాదం, వుగ్రవాదం, తీవ్రవాదం పులి స్వారీ వంటివి. ఒకసారి వాటిని ఎక్కిన వారు లేదా ఎక్కించుకున్నవారు వాటిని అదుపు చేయాలి లేదా వాటికే బలికావాలి. చరిత్రలో అలాంటి పులులను ఎక్కిన వారు ఎవరూ అదుపు చేయలేక వాటికే బలయ్యారన్నది తెలిసిందే.ప్రజ్ఞ మీద వెల్లడైన వ్యతిరేకతను పక్కదారి పట్టించటానికి ఆడిన నాటకం క్షమాపణ, దాన్ని ముందే చెప్పుకున్నట్లు బయటి వారే కాదు, పెద్ద చౌకీదారు మోడీ చేసిన ప్రకటనను పిల్ల చౌకీదార్లు గౌరవించటం లేదు. గాడ్సేను కీర్తిస్తూనే వున్నారు. అలాంటి వారు అవసరమైతే మోడీని కూడా పక్కన పెడతారు. వున్మాద లక్షణం అది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతిపితను చంపిందెవరన్న ప్రశ్న జనం ముందుకు రానుందా – 2

14 Saturday Oct 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

assassination of Mohandas Karamchand Gandhi, Hindu Fundamentalism, HINDU MAHASABHA, Mahatma Gandhi, Nathuram Godse, RSS

ఎం కోటేశ్వరరావు

మహాత్మాగాంధీ హత్యలో మరోవ్యక్తి వున్నాడంటూ విచారణ జరపాలని కోరటం వెనుక గాడ్సే, తద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్రను చరిత్ర నుంచి అధికారికంగా తుడిచివేయాలనే ప్రయత్నం కనపడుతోంది.తమకు అనుకూలంగా చరిత్రను మార్చుకొనేందుకు మితవాద హిందూశక్తులు ప్రయత్నిస్తున్నాయని మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. దాని సారాంశం ఇలా వుంది.తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయటం, గందరగోళపరచేందు ప్రయత్నించటం ఇదే మొదటిసారి కాదు. ఇది గాంధీ హంతకుల నుంచి సైద్ధాంతిక స్ఫూర్తి పొందిన హిందూ మితవాదుల పెద్ద పధకంలో భాగం. హత్య గురించి అనుమానాలను పెంచేందుకు మరొక స్ధాయికి తీసుకుపోయారు.ఇటువంటి విజ్ఞాపనను కోర్టు తిరస్కరించకపోవటం ఆశ్చర్యపరిచింది. అదృష్టం కొద్దీ గతేడాది ముంబై హైకోర్టు వినతిని తిరస్కరించింది. పిటీషన్‌ వేసిన వ్యక్తి తాను వీర సావర్కర్‌ భక్తుడిని అని స్వయంగా అంగీకరించాడు. సావర్కర్‌పేరును కేసు నుంచి తొలగించాలని కోరాడు. జస్టిస్‌ కపూర్‌ కమిషన్‌ 1969లో సమర్పించిన నివేదికలో గాంధీ హత్యకు వున్న సంబంధాన్ని నిరూపించటమేగాక హత్యకుట్రలో సావర్కర్‌ పాత్ర, ప్రమేయం వున్నట్లు కూడా తెలిపింది. అంతకు ముందే కేసు నుంచి సావర్కర్‌ విముక్తి చేసినప్పటికీ ఈ కమిషన్‌ తన నివేదికలో అతని ప్రమేయం గురించి పేర్కొన్నది. అప్పటి నుంచి సంఘపరివార్‌ మరియు సావర్కర్‌ వాదులకు ఈ నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కమిషన్‌ నివేదికను రద్దు చేయాలని ఫడ్నిస్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు అనుమతించింది. వర్తమాన చరిత్రను కించపరుస్తూ దాని స్ధానంలో తమ వూహలనే చరిత్రగా చొప్పించాలని చూసే ఈ పధకంలో బంబే హైకోర్టు తిరస్కరించటం, సుప్రీం కోర్టు అనుమతించటం కొన్ని అడుగులు.

పిటీషన్‌దారు ఆరోపించిన దాని ప్రకారం 1948 జనవరి 30న రెండవ అజ్ఞాత వ్యక్తి జరిపిన నాలుగవ రౌండ్‌ కాల్పులకే గాంధీ మరణించారు. రెండున్నర అడుగుల దూరం నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన గాడ్సే తూటాల కారణంగా ఆయన మరణించలేదు. రెండవ వ్యక్తి రహస్యంగా జరిపిన కాల్పులను ఎవరూ వినలేదు, అతను వున్నట్లు కూడా ఎవరూ గుర్తించలేదు.ఆ సమయంలో అక్కడదాదాపు వెయ్యి మందికి పైగా వున్నారు. గాంధీ మరణం తరువాత అంత్యక్రియలకు ముందు చేయించే పార్ధివ దేహానికి స్నానం చేయించి,శుద్ధి చేసే సమయంలో దేహంపై కప్పిన షాల్‌ మడతలలో ఒక బుల్లెట్‌ కనిపించిందని మనుబెన్‌ అనే వ్యక్తి చెప్పాడని పిటీషనర్‌ పేర్కొన్నాడు. దాన్నే నాలుగవ బుల్లెట్‌గా చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం మూడుసార్లు కాల్పులు జరిగినట్లు మూడు గాయాలున్నట్లు రెండు బుల్లెట్లు వెనుకవైపుకు దూసుకుపోయాయని, మూడింటిలో ఒక బుల్లెట్‌ గాంధీ వెనుక పది అడుగుల దూరంలో పడి వుండగా తరువాత కనుగొన్నారు. ఒకటి బాపు శరీరంలోనే వుండిపోయి చితిలో తరువాత కరిగిపోయి కనిపించింది. మూడవ బుల్లెట్టే షాల్‌లో దొరికిందని, నాలుగవది అసలు లేదని తుషార్‌ గాంధీ పేర్కొన్నారు.

గాంధీ హత్యకు వుపయోగించిన 9ఎంఎం బెరెట్టా తుపాకి గాడ్సే చేతికి ఎలా వచ్చిందన్న అంశం గురించి తుషార్‌ గాంధీ తన విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. పిటీషన్‌దారు రెండు బెరెట్టా తుపాకులున్నాయని పేర్కొన్నారు. అవును నిజమే.ఒకే 606824 నంబరు గల రెండు తుపాకులున్నాయి.ఒకటి అసలైనది, రెండవది సందర్శకుల కోసం రూపొందించిన దాని నమూనా రాజఘాట్‌లోని జాతీయ గాంధీ మ్యూజియంలో వున్నాయి.ఈ తుపాకీ గాడ్సే చేతిలోకి ఎలా వచ్చిందన్నది ఆసక్తికరం. హత్యకు రెండు రోజుల ముందు వరకు అంటే జనవరి 28వరకు గాడ్సే-ఆప్టే ముఠాకు విస్వసనీయమైన ఆయుధం దొరకలేదు. ఇరవయ్యవ తేదీన వారు మూడు తుపాకులు కలిగి వున్నప్పటికీ హత్యాయత్నం విఫలమైంది. మరుసటి రోజునుంచి మరో ఆయుధం కోసం అన్ని వనరులనూ సంప్రదించారు. ఆ రోజుల్లో అక్రమ తుపాకుల విక్రయ కేంద్రంగా గ్వాలియర్‌ వుండేది. అక్కడ దత్తాత్రేయ పర్చూరే అనే డాక్టరున్నాడు. అతను సావర్కర్‌ వీర భక్తుడు, హిందూమహాసభ సభ్యుడిగా నాధూరామ్‌, ఆప్టేలకు తెలుసు. డాక్టరు దగ్గర మంచి తుపాకీ వుందని తెలిసి అది కావాలని అడిగారు. తిరస్కరించిన దత్తాత్రేయ వారికి ఒకదానిని సమకూర్చేందుకు అంగీకరించాడు.గంగాధర్‌ దండావతే అనే తన కింద పనిచేసే వ్యక్తికి ఆ బాధ్యత అప్పగించాడు. జనవరి 28 సాయంత్రానికి అతను ఐదువందల రూపాయలకు ఒక తుపాకీని తెచ్చాడు.దానితో గాడ్సే-ఆప్టేలకు కాల్చటం రాకపోతే ఆ డాక్టరు తన ప్రాంగణంలో కాల్చిచూపించాడు.

సమీపం నుంచి హత్యలు చేయటానికి ఆ రోజుల్లో బెరెట్టా సెమీ ఆటోమాటిక్‌ తుపాకిని ఎక్కువగా వుపయోగించేవారు. ఇటాలియన్‌ ఫాసిస్టు ముస్సోలినీ సైన్యాధికారులు వుపయోగించేందుకు బెరెట్టా కంపెనీ పరిమితంగా వాటిని తయారుచేసేది. ఇప్పటికీ దాన్ని ఫాసిస్టు స్పెషల్‌ అని పిలుస్తారు. వుత్తర ఆఫ్రికాలోని అబిసీనియాను ఆక్రమించేందుకు ముస్సోలినీ సేనలు ప్రయత్నించినపుడు మిత్రపక్షాల సేనలు వాటిని ఓడించాయి. ఆ యుద్ధంలో బ్రిటీష్‌ సైన్యంలోని నాలుగ గ్వాలియర్‌ ఇన్‌ఫాంట్రిలో కమాండింగ్‌ అధికారిగా పనిచేసిన లెప్టినెంట్‌ కల్నల్‌ వి.వి జోషి ముస్సోలినీ సేనల లంగుబాటుకు చిహ్నంగా ఒక అధికారి నుంచి బెరెట్టా తుపాకిని స్వీకరించాడు. అది యుద్ద ట్రోఫిగా మారింది. తరువాత జోషిని నాటి గ్వాలియర్‌ రాజు జియాజీరావు సింధియా సంస్ధాన కోర్టులో అధికారిగా నియమించాడు. జోషి దగ్గర వున్న బెరెట్టా తుపాకి దొంగ తుపాకులు అమ్మేవారి దగ్గరకు అక్కడి నుంచి హంతకుల దగ్గరకు ఎలా చేరిందన్న విషయాన్ని ఎవరూ దర్యాప్తు చేయలేదు. గాంధీ హత్యలో డాక్టరు దత్తాత్రేయ సహనిందితుడు. అతడిని పంజాబు హైకోర్టు కేసు నుంచి విడుదల చేసింది. ఎందుకంటే అతడు సాంకేతికంగా అప్పటికి బ్రిటీష్‌ పౌరుడు. స్వయంగా తన నేరాన్ని అంగీకరించినప్పటికీ బ్రిటీష్‌ ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం నిందితుడిగా మార్పిడి జరగలేదనే సాకుతో విడుదల చేశారు. గాంధీ హంతకులకు సంబంధించి నకిలీలకు ఇవన్నీ ఇబ్బంది కలిగించే వాస్తవాలు. వారు ఇప్పుడు తమకు నిజాలను తారు మారు చేయగల, చరిత్రను తమకు అనుకూలంగా తిరిగి రాయగల సామర్ధ్యం, అధికారం వచ్చాయని భావిస్తున్నారు. ఇప్పటికే పురాతన చరిత్రను దిగజార్చటంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు వర్తమాన చరిత్రను తమ అవసరాలకు అనుకూలంగా మార్చుకొనేందుకు పూనుకున్నారు. అని తుషార్‌ గాంధీ పేర్కొన్నారు.

చరిత్ర రెండు రకాలు, ఒకటి హీనమైనది, రెండవది ఘనమైనది. మొదటి చరిత్ర కలవారు రెండోవారిని కించపరిచేందుకు, తమకు లేని చరిత్రను కృత్రిమంగా తయారు చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. మన దేశంలో గాంధీ మహాత్ముడిని హత్యచేసిన వారు మతోన్మాదులు అన్నది తిరుగులేని సత్యం. ఒకవైపు హంతకుడు,కుట్ర చేసిన వారిని అనధికారికంగా కీర్తిస్తూ మరోవైపు వారితో తమపై ఏర్పడ్డ మచ్చను చెరిపివేసుకొనేందుకు కాషాయశక్తులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. నాధూరామ్‌ గాడ్సే మావాడు కాదు అన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాదనదానిలో మొదటిది. అయితే హత్యానంతరం కమిషన్‌ విచారణలో వారికి వున్న సంబంధాన్ని నిర్ధారించటంతో పాటు గాడ్సే సోదరుడు స్వయంగా నాధూరామ్‌ గాడ్సే ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్‌ను వీడలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఏర్పడిన జనసంఘ్‌పై గాంధీ హత్య మరక చాలా పెద్దదిగా కనిపించేది, ఎందుకంటే గాడ్సేను సమర్ధించే ఆర్‌ఎస్‌ఎస్‌ వారు, హిందూమహాసభకు చెందిన వారందరూ ఆ పార్టీలో కనిపించేవారు. 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్దితిని ప్రకటించటం ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని కూడా జైళ్లలో వేయటంతో వారు ప్రజాస్వామ్యం పరిరక్షణలో జైలుపాలైన వారిగా ఫోజు పెట్టి తమపై వున్న మచ్చను కాస్త మసకపారేట్లు చేసుకున్నారు. జనతా పార్టీలో మత ముద్రను చెరిపివేసుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు, అయితే ఆర్‌ఎస్‌ఎస్‌-జనతా పార్టీలలో ఏదో ఒకదానిలో మాత్రమే సభ్యులుగా వుండాలన్న అంశం తెరమీదకు వచ్చినపుడు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవాలంటే లౌకిక ముద్ర కంటే మతముద్రే లాభమని లెక్కలు వేసుకొని బిజెపి రూపమెత్తారు. తరువాత బాబ్రీ మసీదు కూల్చివేత- అయోధ్యలో రామాలయ నిర్మాణం తదితర అజెండాను ముందుకు తీసుకువచ్చినా విజయం సాధించలేకపోయారు. ఎదురుదెబ్బలు తిన్నారు. గత ఎన్నికలలో గణనీయ సంఖ్యలో సీట్లు సాధించినా మూడోవంతు కూడా ఓట్లు రాలేదు. ఆ వచ్చినవి కూడా నరేంద్రమోడీ గుజరాత్‌ను అభివృద్ది చేసిన ప్రగతివాదిగా చిత్రించటం, అన్నింటి కంటే కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, అసంతృప్తి కారణంగా ఆమేరకైనా ఓట్లు వచ్చాయి. ఆ ఓటింగ్‌ నిలవదని బిజెపి, సంఘపరివార్‌ నాయకత్వానికి తెలుసు. అందువలననే తమపై వున్న తిరోగామి ముద్రలను తుడిచివేసుకొనేందుకు పూనుకుంది. దానిలో తొలి అడుగు స్వచ్చభారత్‌ పిలుపును మహాత్మాగాంధీకి జతచేసి తాము ఆయనను గౌరవిస్తున్నామనే సందేశం పంపేందుకు ప్రయత్నించారు. దాని వలన ఆయనను హత్యచేసిన మచ్చపోయే అవకాశం లేదు. గతంలో ఏ సందర్భంలోనూ ప్రస్తావించని అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ నివేదిక పేరుతో ఒక కధనాన్ని ప్రచారంలో పెట్టారు. ఆ పధకంలో భాగమే బ్రిటీష్‌ గూఢచార విభాగానికి చెందిన గుర్తుతెలియని మూడో వ్యక్తి, అసలు లేని నాలుగో బుల్లెట్‌ కధ. మహాత్మాగాంధీని నిజంగా వదిలించుకోవాలని బ్రిటీష్‌ పాలకులు నిర్ణయించుకొని వుంటే ఆయనేం ఖర్మ యావత్తు స్వాతంత్య్రపోరాట నాయకత్వాన్నే అంతం చేసి వుండేది. అందునా స్వాతంత్య్రం ప్రకటించి, మన దేశం నుంచి వెళ్లిపోయిన తరువాత మహాత్ము డిని హత్యచేయాల్సిన అవసరం బ్రిటీష్‌ వారికి ఏమాత్రం లేదు. ఎందుకంటే వారు వెళ్లిపోయినా బ్రిటీష్‌ కార్పొరేట్ల పెట్టుబడులు అలాగే వున్నాయి. మహాత్ము డిని హత్య చేయించి వాటిని కాపాడుకోగలమనే పిచ్చి ఆలోచన వారికి కలిగే అవకాశం లేదు.

అయినా బ్రిటీష్‌ గూఢచారి కధ చెబుతున్నారంటే రాబోయే రోజుల్లో దాన్ని బలపరిచేందుకు వీలుగా అమెరికాలో కొత్త స్క్రిప్టు,దర్శ కత్వం, సినేరియో వంటి వన్నీ తయారువుతున్నాయని భావించాల్సి వుంది. మన మార్కెట్‌, మన మిలిటరీతో సంబంధాల విషయంలో అమెరికా పట్టు సాధించిన కారణంగా దానికి అనుగుణంగా వ్యవహరించే శక్తులకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. అనేకదేశాలలో ఇది రుజువైంది.మన దేశంలో కూడా అదే పునరావృతం అవనుందా ?

గమనిక: ఈ వ్యాసం ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాయబడినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతిపితను చంపిందెవరన్న ప్రశ్న జనం ముందుకు రానుందా-1

14 Saturday Oct 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

assassination of Mohandas Karamchand Gandhi, Hindu Fundamentalism, HINDU MAHASABHA, Mahatma Gandhi, Nathuram Godse, RSS

ఎం కోటేశ్వరరావు

ఆయేషా మీరా, అరుషి కేసులలో నిందితులు నిర్దోషులు, వారు హత్య చేయలేదని కోర్టులు తీర్పులిచ్చాయి. ఎవరూ వారిని చంపకపోతే వారెలా హత్యకు గురయ్యారు? జాతిపిత మహాత్మాగాంధీ హత్యకేసులో కూడా, నిందితులు, వారి వెనుక కుట్ర చేశాయన్న సంస్ధలు పరిశుద్ధులని నిర్ధారించేందుకు ప్రయత్నం జరుగుతోందా ? మన న్యాయవ్యవస్ధకు ఎలాంటి దురుద్ధేశ్యాలను అపాదించకుండానే జరుగుతున్నవాటిని చూసి ఏమైనా జరగవచ్చని సామాన్యులు అనుకోవటంలో తప్పులేదు కదా. దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న కొందరు వూహిస్తున్నట్లుగా ఒక వేళ ఆయేషా, అరుషి కేసుల తీర్పులే మహాత్మాగాంధీ విషయంలో పునరావృతం అయితే జాతిపితను చంపింది ఎవరు అన్న ప్రశ్న భవిష్యత్‌ తరాల ముందు వుంటుంది. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ వూహించి వుండరు కదా !

మహాత్మాగాంధీ జన్మించి 148 సంవత్సరాలు గడిచాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నాధూరామ్‌ గాడ్సే, మరొకడు కలిసి ఆయనను హత్యచేసి 69 సంవత్సరాలవుతోంది. ఇన్ని సంవత్సరాల తరువాత హత్యలో మూడోవాడు,వాడు పేల్చిన నాలుగో బుల్లెట్టే ప్రాణం తీసింది దాని గురించి విచారణ జరపండి అని సుప్రీం కోర్టులో ఒక కేసు దాఖలైంది. ముంబైకి చెందిన డాక్టర్‌ పంకజ్‌ ఫడ్నిస్‌ అనే వ్యక్తి అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించే సంస్ధగా పరిగణించబడే అభినవ్‌ భారత్‌ ట్రస్టీ. నాధూరామ్‌ గాడ్సే, నారాయణ్‌ ఆప్టేలో పాటు మహాత్మాగాంధీ హత్య సమయంలో మరో విదేశీ అజ్ఞాత వ్యక్తి వున్నాడని, నాలుగవ బుల్లెట్‌ పేలిందని దాని గురించి విచారణ జరపాలని గతేడాది దాఖలు చేసిన పిటీషన్ను బంబాయి హైకోర్టు కొట్టివేసింది. అదే వ్యక్తి సుప్రీం కోర్టుకు విన్నవించారు. అమెరికా సిఐఏ నుంచి తనకు కొంత విలువైన సమాచారం త్వరలో అందనుందని, దానిని కోర్టుకు సమర్పిస్తానని కూడా అతను వాదించాడు. ఇద్దరు సభ్యులతో కూడిన బెంచ్‌ తదుపరి వాదనలను అక్టోబరు 30కి వాయిదా వేస్తూ ఈ కేసును విచారణకు చేపట్టవచ్చో లేదో తమకు సలహా ఇవ్వాలని అమరేందర్‌ శరణ్‌ అనే సీనియర్‌ న్యాయవాదిని నిర్ణయించింది. ఆ కేసు తదుపరి ఎటు తిరుగుతుందో అన్న ఆసక్తి సహజంగానే రేకెత్తింది. అనేక ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

ఒక వైపు మహాత్మాగాంధీని పొగుడుతూనే మరోవైపు ఆయనను కించపరిచే ద్వంద్వ వైఖరిని మనం ప్రస్తుత అధికారపక్షంలో చూస్తున్నాం. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్‌ షా కొద్ది వారాల క్రితం గాంధీని చతురుడైన కోమటి అని వర్ణించిన విషయం తెలిసిందే. గాంధీని హత్యచేసిన ‘గాడ్సేను దేవుడే పంపాడు, అసలు గాంధీనే వురి తీసి వుండాల్సింది, గాంధీని చంపటానికి గాడ్సేకు వుండే కారణాలు గాడ్సేకున్నాయి, అవును నేను గాడ్సేకు పెద్ద అభిమానిని, అయితే ఏమిటి’ అని ఆరాధించే అనేక మంది ప్రధాని నరేంద్రమోడీ భక్తులైతే అందుకు ప్రతిగా ట్విటర్‌ ద్వారా మోడీ వారిని అనుసరిస్తూ ప్రోత్సహిస్తున్నారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎవరో వూరూ పేరు లేని వారైతే పట్టించుకోనవసరం లేదు బిజెపి జాతీయ ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ ఒక ట్వీట్‌లో ‘గాంధీని హత్యచేయటానికి గాడ్సేకు వుండే కారణాలు ఆయనుకున్నాయి, న్యాయబద్దమైన సమాజం వాటిని కూడా వినాలి’ అని వ్యాఖ్యానించాడు. వారందరికీ ఆరాధ్యదైవంగా పరిగణించబడే నరేంద్రమోడీ మరోవైపు ‘ గాంధీ జయంతి సందర్బంగా బాపూకు నేను ప్రణమిల్లుతున్నాను. ఆయన మహత్తర ఆశయాలు ప్రపంచవ్యాపితంగా కోట్లాది మందికి ప్రేరణనిస్తున్నాయి’ అని ట్వీట్‌ చేస్తారు.

సైద్ధాంతికంగా గాంధీని వ్యతిరేకించిన సుభాస్‌ చంద్రబోసే గాంధీని జాతిపితగా వర్ణించారు. మన రాజ్యాంగంలో జాతిపితగా గుర్తించే అవకాశం లేదు. అయినా మహాత్ముడి వ్యక్తిత్వం కారణంగా ఆయనను జాతిపితగా వర్ణిస్తున్నాము. కరెన్సీపై ఆయన చిత్రాన్ని ముద్రించటం అంటే అంతటి స్ధాయిని కల్పించటమే. బిజెపి, దానిని వెనుక నుంచి నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ ఆయనను జాతిపితగా గుర్తించలేదు, పిలవలేదు.అలాంటి వ్యక్తిని గాడ్సే గాంగ్‌ ఎందుకు చంపింది. అనేది అవలోకించాల్సి వుంది. ప్రస్తుతం దేశంలో హిందూమతోన్మాదశక్తులు రెచ్చిపోతున్నాయి. గాంధీని చంపటం ఒక పెద్ద ఘనతగా, అలాంటిదానిని తమకు దక్కకుండా చేసేందుకు పూనుకున్నారని హిందూమహాసభ పేరుతో వున్న వారు ప్రకటించారు.

మహాత్మాగాంధీని చంపింది హిందూమహసభకు చెందిన నాధూరామ్‌ గాడ్సే అనే తమ వారసత్వ ఆస్థి లేదా వుత్తరదాయిత్వాన్ని దెబ్బతీసేందుకు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయని హిందూమహాసభ ఆగ్రహం వెలిబుచ్చింది.మూడో వ్యక్తి, నాలుగో బుల్లెట్‌ పేరుతో దాఖలైన కేసులో సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరీ నియామకం జరుపుతున్నట్లు ప్రకటించగానే హిందూమహాసభ జాతీయ వుపాధ్యక్షుడు అశోక్‌ శర్మ ఒక ప్రకటన చేశారు. హిందూ మహాసభ నుంచి పుట్టిన భావజాలమే బిజెపి మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ వునికి కారణం. ఆ రెండు సంస్ధలు ఈరోజు ధరించిన ముసుగులను బహిరంగపరచగలిగేది తమ సంస్ధ మాత్రమే అని వాటికి తెలుసు, హిందూమహసభ గుర్తింపును నాధూరామ్‌ గాడ్సే నుంచి విడదీయలేరు, గాంధీ హత్యలో గాడ్సేకు ఖ్యాతి దక్కకుండా చేసేందుకు అతని పాత్రపై అనుమానాలను సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. గాడ్సే లేకపోతే హిందూమహాసభ పూర్తిగా వునికి కోల్పోతుందని వారికి తెలుసు.ఇదందా బిజెపి ద్విముఖ వ్యూహంలో భాగం. గాడ్సేను పొగడలేదు కనుక గాంధీ పట్ల సానుకూల వైఖరిని అనుసరించేందుకు ఒక వైపు ప్రయత్నిస్తోంది. మరోవైపు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ ప్రమాణాల గురించి బహిరంగంగా మాట్లాడగలిగేది హిందూ మహాసభే కనుక దానిని పూర్తిగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి పూర్తిగా సంఘ్‌ తరఫున పని చేస్తున్నాడు.’ అని అశోక్‌ శర్మ వ్యాఖ్యానించాడు.

ఇలాంటి మతోన్మాద, హంతక శక్తులకు అంతటి బరితెగింపు ఎలా వచ్చింది? వారిని రక్షించే శక్తులది పైచేయి అయిందా, జనం విచక్షణ కోల్పోతున్నారా ? దేశవిభజన సమయంలో చెలరేగిన మతఘర్షణలపై గాంధీ తీసుకున్న వైఖరి మతోన్మాదులకు నచ్చనందునే ఆయనను పొట్టన పెట్టుకున్నారు. మతాల గురించి గాంధీ చెప్పిందేమిటి? గాంధీ ధర్మం ప్రకారం సహనానికి మించి అన్ని మతాల పట్ట చిత్తశుద్దితో కూడిన గౌరవం వుంది.ఆమేరకు ఆయన విజ్ఞప్తి చేశారు.మతోన్మాదానికి ఏ మాత్రం అవకాశం లేదు. వివిధ సందర్భాలలో ఆయన చెప్పిన, రాసిన మాటలు ఇలా వున్నాయి. ‘ నావరకు విభిన్న మతాలు ఒకే తోటలోని అందమైన పూలవంటివి లేదా దివ్యమైన చెట్టు యొక్క వివిధ కొమ్మలు. మానవ పరిణామక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్రతి మతం తనదైన అంశభాగాన్ని అందచేసింది. ప్రపంచంలోని అన్ని విశ్వాసాలు ఒకే చెట్టులోని అనేక శాఖలు, మిగతావాటితో పోల్చితే దేనికది ప్రత్యేకతలు కలిగి వున్నప్పటికీ వాటికి వనరు ఒక్కటే.’ వివిధ మతాలు ఒకే చెట్టుమీది ఆకుల వంటివి. ఏ రెండు ఆకులూ ఒకే విధంగా వుండవు. ఒకే చెట్టుమీద పెరిగిన కొమ్ములు లేదా ఆకుల మధ్య వైరం వుండదు. ప్రపంచంలోని అన్ని గొప్పమతాలలోని నిజాల విశ్వాసిని, కేవలం సహనమే కాదు ఇతర మతాల విశ్వాసాలు కూడా మన వంటివే అనే గౌరవం లేకపోతే భూమ్మీద శాంతి నెలకొనదు. నేను ప్రబోధించే విశ్వాసం దాన్ని అమలు చేయటానికి మాత్రమే నన్ను అనుమతించదు, ఏ వనరునుంచి వచ్చినప్పటికీ మంచిని గ్రహించే విధి నిర్వహణ అనివార్యం చేస్తుంది. దీర్ఘ పఠనం, అనుభవం తరువాత నేను కొన్ని నిర్ధారణలకు వచ్చాను. అన్ని మతాలు నిజమైనవే,అన్ని మతాలలోనూ కొన్ని తప్పులున్నాయి, నా స్వంత హిందూమతం మాదిరి నాకు అన్ని మతాలూ ప్రియమైనవే, అదే విధంగా మానవులందరూ వారి స్వంత బంధువుల మాదిరి ప్రియంగా వుండాలి. ‘ ఒక క్రైస్తవ మిత్రుడు ఒకసారి గాంధీని ఒక ప్రశ్న అడిగాడు. మీ మతం అన్ని మతాల సంయోగం అని మీరు చెబుతారా ? అంటే ఆ సంయోగాన్ని నేను హిందూయిజం అని పిలుస్తాను, మరియు మీ విషయానికి వస్తే క్రైస్తవమే సంయోగం అవుతుంది అని గాంధీ చెప్పాడు.

ఇటువంటి భావాలున్న వ్యక్తి దేశవిభజన సమయంలో చెలరేగిన మతఘర్షణలకు నిరసనగా దీక్ష చేపట్టటాన్ని అవకాశంగా తీసుకొని హిందూమతోన్మాదశక్తులు తమ కసి తీర్చుకున్నాయి.ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ వంటి సంస్దలకు నాయకత్వం వహించిన వారి కార్యకలాపాలు రచనలు, వుపన్యాసాలను గమనించితే వారికి ఇటాలియన్‌ ఫాసిస్టు ముస్సోలినీ, జర్మన్‌ హిట్లర్‌ నాజీలు స్ఫూర్తి ప్రదాతలుగా కనిపిస్తారు. భారత్‌ను జర్మనీగా భావించి అక్కడ యూదులను దేశద్రోహులుగా ఎలా చిత్రించారో ఇక్కడ ముస్లింలను అలా పరిగణించాలని భావించారు. ఐరోపా మతరాజ్యాల మాదిరి భారత్‌ను ఒక హిందూ రాజ్యంగా చూడాలని అనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో తాము గెలవాలని కోరుకున్న ముస్సోలినీ, హిట్లర్‌ మట్టి కరవటం, యూదులను వూచకోత కోయటాన్ని సభ్యసమాజం వ్యతిరేకించటం, జర్మనీ, ఇటలీలు ఓడిపోవటం, భారత్‌ నుంచి పాకిస్తాన్‌ విడిపోవటం వంటి అంశాలతో తాము వూహించుకున్నది ఒకటి జరిగింది ఒకటనే ఆశాభంగానికి గురైన శక్తులు గాంధీ కారణంగానే హిందువులు చేతగాని విధంగా తయారయ్యారనే తప్పుడు నిర్దారణలకు వచ్చి ఆయనను హతమారిస్తే తప్ప హిందూమతం పటిష్టం కాదనే అంచనాతో హత్యకు పాల్పడివుంటారని చెప్పవచ్చు. వారి వారసులు ఇప్పుడు గాంధీ హత్యను మరోవిధంగా వ్యాఖ్యానించటానికి, వుపయోగించుకోవటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే సుప్రీం కోర్టులో మూడో వ్యక్తి, నాలుగో బుల్లెట్‌ కథ.

గత లోక్‌సభ ఎన్నికలలో మూడింట రెండువంతుల సీట్లు బిజెపికి వచ్చాయి గానీ వచ్చిన ఓట్లు 31శాతమే. బిజెపిని వ్యతిరేకించే పార్టీల ఓట్ల చీలిక దానికి సీట్ల పంట పండించింది. గరిష్ట మతరాజకీయాల అనంతరం పరిస్ధితి ఇది. వుత్తర ప్రదే శ్‌ ఎన్నికలలో కూడా బిజెపికి ఎన్నడూ లేని సంఖ్యలో సీట్లు వచ్చాయి. కానీ ఓట్ల లెక్కలో లోక్‌సభ ఎన్నికల కంటే తగ్గాయి. అత్యవసర పరిస్దితి అనంతర ఓట్లవివరాలను చూస్తే తమకు వున్న పరిమితులేమిటో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వానికి అవగతం అయ్యాయి. అందువలన అధికారంలో కొనసాగాలన్నా, మరో రూపంలో మతోన్మాద అజెండాను అమలు జరపాలన్నా విశ్వసనీయతను సృష్టించుకోవటం అవసరంగా భావించినట్లు కనిపిస్తోంది.

నాటి నుంచి నేటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలందరూ హిందుత్వ గురించి, దేశాన్ని హిందూదేశంగా ప్రకటించాలని కోరుతూ, హిందూ ధర్మానికి ముప్పు కలుగుతోందని చెబుతున్నవారే. అది వారికి ఆక్సిజన్‌ వంటిది. అదిలేకపోతే దానికింక మనుగడే వుండదు. ఎందుకంటే మిగతా అంశాలన్నీ అన్నీ పార్టీలు చెప్పేవే. గాంధీ హత్యకు కుట్రచేసిన గాడ్సే, ఇతరులందరూ ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభలలో సభ్యులుగా వున్న హిందుత్వశక్తులే. గతంలో జనసంఘం, ప్రస్తుతం బిజెపిగా వ్యవహరిస్తున్న పార్టీకి అది ఒక మాయని మచ్చ. దానిని తొలగించుకోవాలని ఎప్పటి నుంచో పెద్ద ప్రయత్నం జరుగుతోంది. గాంధీని హతమార్చిన విషయాన్ని కాదనలేరు కనుక ఆయనను చంపింది రాజకీయ కారణాలతో తప్ప మతఅంశాలు కాదని చెప్పటానికి అనేక మంది బిజెపి ప్రముఖులు గతంలో ప్రయత్నించారు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన వారు గాంధీని హత్యచేసిన ఘనత తమఖాతాలో వేసుకొనేందుకు ఇంకా మోజుపడుతున్నారు.అది బహిరంగంగా చెప్పుకోలేరు. అదే సమయంలో అధికారం కావాలంటే అదొక ఆటంకంగా వుంది కనుక అధికారికంగా ఏదో విధంగా మత ముద్ర బదులు రాజకీయ ముద్రవేయాలని చూస్తున్నారన్నది ఒక విమర్శ. గాడ్సే గతాన్ని తుడిచి వేసుకొనేందుకు అతడసలు ఆర్‌ఎస్‌ఎస్‌ కాదని ప్రకటిస్తారు.హత్య సమయంలో అతను సంఘపరివార్‌లో లేడంటారు. అయితే గాడ్సే తమ్ముడు గోపాల్‌ గాడ్సే అసలు విషయాలు చెప్పాడు.’ నాధూరామ్‌, దత్తాత్రేయ, నేను, గోవింద్‌ సోదరులందరం ఆర్‌ఎస్‌ఎస్‌లో వున్నాం. మా ఇండ్లలో కంటే మేం ఆర్‌ఎస్‌ఎస్‌లోనే పెరిగామని నేను చెప్పగలను, అది మాకు ఒక కుటుంబం వంటిది.ఆర్‌ఎస్‌ఎస్‌లో నాధూరామ్‌ ఒక మేధోపరమైన కార్యకర్తగా ఎదిగాడు, తన ప్రకటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వైదొలిగినట్లు చెప్పాడు, ఎందుకంటే గాంధీ హత్య తరువాత గోల్వాల్కర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో ఇబ్బందుల్లో వుంది కనుక అలా చెప్పాడు. అతను ఆర్‌ఎస్‌ఎస్‌ను వదలి పెట్టలేదు. వెళ్లు, గాంధీని హత్యచేయమని ఆర్‌ఎస్‌ఎస్‌ తీర్మానించలేదని చెప్పుకోవచ్చు తప్ప అతనితో మాకేమీ సంబంధం లేదని చెప్పకూడదు.ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేస్తూనే 1944 నుంచి హిందూ మహాసభలో కూడా నాధూరామ్‌ పని చేయటం ప్రారంభించాడు.’ అని పేర్కొన్నాడు. గోపాల్‌ గాడ్సే చెప్పింది వాస్తవమే అనటానికి నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వుత్తర ప్రత్యుత్తరాల్లోని అంశాలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఆరవ వాల్యూమ్‌ పేజి 56లో ‘సావర్కర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసిన మతోన్మాద విభాగం హిందూమహాసభ కుట్ర చేసి అమలు చేయించింది’ అని పేర్కొన్న విషయాన్ని జర్నలిస్టు ఏజి నూరాని తన పుస్తకంలో వివరించాడు.

దేశ రాజకీయ చిత్రపటం నుంచి గాంధీ, నెహ్రూ వంటి స్వాతంత్య్రం పోరాటనాయకులను తొలగించాలని బిజెపి నేతలు బాహాటంగానే చెబుతున్నారు. హత్యకేసు విచారణ సమయంలో గాడ్సే చెప్పిన అంశాల కొనసాగింపే ఇది. జిన్నాకు గాంధీ తదితరులు లంగిపోయారని గాడ్సే ఆరోపించాడు. చెవులప్పగించిన వారికిది వినసొంపుగానే వుంటోంది. ఎందుకంటే గత 70సంవత్సరాలుగా మధ్యలో కొంత కాలం మినహా గాంధీ, నెహ్రూల వారుసులుగా చెప్పుకొనే వారే అధికారంలో కొనసాగారు. అనుసరించిన దివాళాకోరు ఆర్ధిక విధానాల కారణంగా సమాజంలోని వివిధ తరగతులలో అసంతృప్తి నెలకొంది. దీన్ని సొమ్ము చేసుకోవాలంటే ఒక దగ్గర మార్గం సకల అనర్ధాలకు గాంధీ, నెహ్రూవారసులే కారణం అంటే చాలు. సరిగ్గా జర్మనీలో హిట్లర్‌ కూడా అదే చేశాడు. ఐరోపా యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచాన్ని పంచుకొనే పోటీలో జర్మన్‌ సామ్రాజ్యవాదులు వెనుకబడ్డారు. అందువలన మొదటి ప్రపంచయుద్ధంలో విజేతలు జర్మనీని దెబ్బతీసేందుకు అవమానకరమైన షరతులతో సంధిని రుద్ధారు. దాన్ని చూపి జనాన్ని రెచ్చగొట్టి హిట్లర్‌ రాజకీయంగా ఎదిగాడు. ఇప్పుడు బిజెపి చేస్తోంది అదే. కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలలో ఎలాంటి మార్పు లేదు. అవే దివాలా కోరు విధానాలను అమలు జరుపుతున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనం ప్రారంభమైన సమయంలో అంకెల గారడీ చేసి నరేంద్రమోడీ సర్కార్‌ లేని అభివృద్ధిని చూపింది. దేన్నయినా మూసిపెడితే పాచి పోతుంది. మూడు సంవత్సరాల కాలంలో అదే జరిగింది. తప్పుడు సలహాలు విని తాత్కాలికంగా అయినా కొన్ని మెరుపులు మెరిపించి మరోసారి ఓట్లను కొల్లగొడదామనే ఎత్తుగడుతో పెద్ద నోట్లను రద్దు చేశారు. ముఖ్యమంత్రిగా తన జీవిత కాలమంతా వ్యతిరేకించిన జిఎస్‌టిని ముందు వెనుకలు ఆలోచించకుండా బలవంతంగా అమలు జరిపించారు. ఆర్ధికాభివృద్ధి వెనుకపట్టు పట్టటం తాత్కాలికమే అని కొత్త పల్లవి అందుకున్నారు. దాని మంచి చెడ్డల గురించి మరోసారి చూద్దాం.

అసలు మహాత్మా గాంధీ అనుసరించిన విధానాలేమిటి? అవి ఇప్పుడెలా వున్నాయో, వర్తమాన మేథావులు వాటిని ఎలా చూస్తున్నారో చూద్దాం. అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నీతి నాయర్‌ గాంధీ జయంతి సందర్భంగా ఒక విశ్లేషణ చేశారు. దానితో ఎకీభవించాలా లేదా మరో కోణం నుంచి చూడాలా అనేది వేరే విషయం. అమె విశ్లేషణ సారం ఇలా వుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ రాజఘాట్‌లో శ్రద్ధాంజలి ఘటించటాన్ని కోట్లాది మంది చూశారు. గాంధీకి ఇష్టమైన ప్రార్ధనలను రేడియో వినిపించి, నలుపు, తెలుపుల డాక్యుమెంటరీలను టీవీలలో ప్రసారం చేశారు. అయితే ఈ తీపి మాటలు, విధిలో భాగంగా వెల్లడించే శ్రద్ధాంజలులు, జాతిపితకు సంబంధించిన వాస్తవాలను మూసిపెట్టేందుకే. అధికార భారత్‌లో వాస్తవానికి గాంధీ గతించారు.

మహాత్మాగాంధీ సంప్రదింపుల శక్తిని విశ్వసించారు. కాశ్మీరులో పరిస్ధితి నెత్తుటి మరకలా వుంది. సంప్రదింపులు లేవు,క్లుప్తంగా చెప్పాలంటే అధికారం పశుబలాన్ని ప్రయోగించింది. నిరాయుధనిరసనకారులపై భద్రతాదళాలు ప్రయోగించిన పిల్లెట్లతో వందలాది మంది అంధులయ్యారు. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ ఎన్ని సత్యాగ్రహాలు చేసి వుండేవారు? భిన్న సామాజిక తరగతులను ఐక్యం చేసేందుకు తన ప్రార్ధనా సమావేశాలలో గాంధీజీ బైబిల్‌, ఖురాన్‌, గీతలోని అంశాలను ప్రస్తావించేవారు, ఇప్పుడు హిందూ చిహ్నలను మాత్రమే వినియోగిస్తున్నారు. ఏ పధకమైనా పేదలకు లబ్ది చేకూర్చిందా లేదా అన్నదే దాని విజయానికి గీటురాయిగా తీసుకోవాలన్నది గాంధీ వైఖరి. మోడీ తన పుట్టిన రోజు కానుకగా జాతికి అంకితం చేసిన సర్దార్‌ సరోవర్‌ డామ్‌ నీటిని నాలుగు రాష్ట్రాలలో రువు ప్రాంతాలకు వుద్దేశించగా దానికి భిన్నంగా దామాషాకు వ్యతిరేకంగా కోకాకోలా, టాటానానో కారు వంటి కొన్ని ఎంపిక చేసిన కార్పొరేట్ల అవసరాలకు అనుగుణ్యంగా నీటిని మళ్లిస్తున్నారు. అత్యంత పేదలైన గిరిజనుల నివాసాలు మునిగిపోయాయి, దశాబ్దాలు గడిచినా, పాకేజీలు ప్రకటించినా నిర్వాసిత గిరిజనుల జీవితాల్లో మార్పులేదు. ప్రజాస్వామ్యంలో మీడియా పోషించాల్సన విమర్శనాత్మక పాత్రను గాంధీజి విశ్వసించారు. నేడు దేశంలో ప్రభుత్వ విమర్శకులను భయపెట్టే పద్ధతులను నిరంతరం అనుసరిస్తున్నారు. జర్నలిస్టులను హత్యచేయటం నుంచి స్వతంత్రంగా వ్యవహరించే సంపాదకులను రాజీనామా చేయించటం వరకు అవి వున్నాయి.

గాంధీ గోవధను వ్యతిరేకించినప్పటికీ హిందువేతరులపై ఒక మతాన్ని రుద్దటాన్ని ఎన్నడూ అంగీకరించలేదు. హిందువులు బీఫ్‌ తింటారని, ఆవు చర్మాలతో వ్యాపారం చేస్తారని ఆయనకు బాగా తెలుసు. భిన్న ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలున్న ముస్లిం, పార్సీ, క్రైస్తవులు తదితర బహుళ సామాజిక తరగతుల గురించి గాంధీజి పదే పదే చెప్పారు. కానీ నేడు ఆయన ప్రాతినిధ్యం వహించినదానికి విరుద్దంగా గో రక్షకులు రాత్రి పగలూ వీధులలో తిరుగుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ స్వచ్చభారత్‌ కార్యక్రమంలో గాంధీ జీవించి వున్నారు. చీపుర్లు పట్టి మోడీ మంత్రులు ఫొటోలు తీయించుకోవటంలో చూపుతున్న శ్రద్ధ పారిశుద్ధ్య నియమాలను పాటించటంలో లేదు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కాలండర్‌ నుంచి రాట్నం వడుకుతున్న గాంధీ పొటోను తొలగించి నరేంద్రమోడీది చేర్చటం ఖాదీతో గాంధీ అనుబంధాన్ని కనిపించకుండా చేయటమే. గోరక్షకుల దాడులకు బలైన బాధిత కుటుంబాల ఇండ్లకు శాంతియుతంగా వెళ్లిన కార్యకర్తల కార్యక్రమంలో గాంధీ జీవించి వున్నారు. జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా అక్టోబరు రెండున దేశవ్యాపితంగా మౌనంగా అయినప్పటికీ శక్తివంతంగా జరిపిన జర్నలిస్టుల నిరసనల్లో గాంధీ వున్నారు. ప్రపంచవ్యాపితంగా జరిగిన అనేక శాంతియుత నిరసనల్లో గాంధీ భావజాలం పని చేసింది.

గాంధీకి అధికారికంగా ఏర్పాటు చేసిన రాజఘాట్‌ స్మారక చిహాన్ని చూపేందుకు బస్సుల్లో స్కూలు పిల్లల్ని తీసుకు వెళ్లేవారు ఒక పధకం ప్రకారం మితవాద మతోన్మాది నాధూరామ్‌ గాడ్సే చేతిలో గాంధీ హత్యకు గురైన బిర్లా భవనాన్ని ఎందుకు చూపరు అని గాంధియన్‌ విద్యావేత్త కృష్ణకుమార్‌ 2007ఒక రచనలో ఆశ ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గాడ్సే పేరును పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నారు. భారతీయ, విదేశీ అతిధులు కూడా బిర్లా భవనాన్ని ఎవరూ సందర్శించరు. గాంధీ హత్యవెనుక వున్న కారణాలేమిటని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగే అవకాశం లేకుండా చేసేందుకు హత్యజరిగిన నాటి నుంచి ఒక ‘నిశబ్ద ఒప్పందం’ జరగటమే దీనికి కారణం అయివుండాలని కృష్ణ కుమార్‌ నిర్ధారణకు వచ్చారు. గాంధీ హత్య జరిగిన తరువాత హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలపై దాడులు చేసి కార్యకర్తలను అరెస్టుచేసి వారి రికార్డులను స్వాధీనం చేసుకొన్నారు. తరువాత రికార్డులను నెహ్రూ మ్యూజియంలో భద్రపరిచారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం తొలగింపు, కార్యకర్తల విడుదల తరువాత వారు రహస్యంగా హిందూ సామాజిక తరగతిని పటిష్టపరిచేందుకు పనిచేస్తున్నారు. విరాళాలు వసూలు చేసేటపుడు రాతపూర్వక రికార్డులు నిర్వహించకూడదని నిర్ణయించారు. గాడ్సేకు మరణశిక్ష విధించిన న్యాయమూర్తులలో ఒకరైన జి.డి ఖోస్లా కొన్ని సంవత్సరాల తరువాత ‘ ఆరోజు కోర్టులో ప్రేక్షకులుగా వున్నవారు ఒక జూరీని ఏర్పాటు చేసి గాడ్సే అప్పీలు మీద విచారణ జరపమని దానికి అప్పగించి వుంటే గాడ్సే తప్పుచేయలేదని అత్యధిక మెజారిటీతో తీర్పు చెప్పి వుండేవారు’ అని పేర్కొన్నారు.

సంవత్సరాలు గడిచిన కొద్దీ అనేక రోడ్లకు మహాత్మాగాంధీ పేరు పెట్టారు, దేశమంతటా అనేక విగ్రహాలు నెలకొల్పారు తప్ప ఆయన సందేశాన్ని నిర్లక్ష్యం చేశారు. లౌకికవాదులుగా పిలుచుకొనే పార్టీలు 1977-79 మధ్య కాలంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు స్ధానం దొరికింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనతా పార్టీ రెండింటిలో ద్వంద్వ సభ్యత్వం కలిగి వుండటమనే సమస్యకారణంగా దేశంలోని తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం కూలిపోయింది.( ఇప్పుడు బిజెపిగా ఏర్పడిన వారు తాము ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వాన్ని వదులుకొనేది లేదని జనతా పార్టీ నుంచి బయటికి వచ్చారు) రాజకీయాలు మరియు ఇటీవలి సంవత్సరాలలో సాగుతున్న రాజకీయ బేరసారాలలో దేశంలో గాడ్సే స్ధానం గురించి పరిశీలించటానికి ఏమాత్రం చోటులేదు. భగత్‌ సింగ్‌, బిఆర్‌ అంబేద్కర్‌ వంటి గాంధీ సమకాలిక పెద్దలు వున్నప్పటికీ భిన్న తరగతుల మధ్యó మహాత్ముడి స్ధానంలో గాంధీ కొనసాగుతూనే వుంటారు.ఆయన అనుసరించిన, ఆచరించిన పద్దతులు వర్తమాన భారతంలో ఎన్నడూ లేనివిధంగా మరింతగా ప్రతిబింబించాలి.’ నీతి నాయర్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవించినా, విబేధించినా అవి ఆలోచనాత్మకంగా వున్నాయని చెప్పవచ్చు. మూసిపెట్టటానికి ప్రయత్నించకుండా మరిన్ని కోణాల నుంచి ఈ అంశాలను చర్చించవచ్చు.

గమనిక: ఈ వ్యాసం ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాయబడినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d