• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

విమర్శలను స్వీకరించే స్ధితిలో మోడీ సర్కార్‌ లేదు -రాహుల్‌ బజాజ్‌ !

01 Sunday Dec 2019

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

India economy 2019, India fiscal deficit, India GDP, Modi govt, Narendra Modi, Rahul Bajaj, We are not able to openly criticise Modi govt

Image result for Rahul Bajaj

ఎం కోటేశ్వరరావు
‘యుపిఏ 2 కాలంలో మనం ఎవరిని అయినా తిట్టగలిగేవారం. మీరు మంచి పని చేస్తున్నారు, అయితే మేము మిమ్మల్ని బహిరంగంగా విమర్శించాలి అనుకుంటే మీరు దాని స్వభావాన్ని గ్రహిస్తారన్న విశ్వాసం లేదు. నేను చెప్పింది తప్పు కావచ్చు గానీ ప్రతివారు అలా భావిస్తున్నారు. భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ పార్లమెంట్‌లో గాడ్సే గురించి వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీని కాల్చి చంపినవాడు ఒక ఉగ్రవాది అనటంలో ఎవరికైనా సందేహం ఉందా…..నాకు తెలియదు. గాడ్సే దేశభక్తుడని మేనెలలో ప్రజ్ఞ వర్ణించారు. దాని మీద ఆమెను క్షమించటం తనకు ఎంతో కష్టమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కానీ తరువాత ఆమెను రక్షణ శాఖ కమిటీలోకి తీసుకువచ్చారు.’

పైన పేర్కొన్న వ్యాఖ్యలు, విమర్శలు చేసిన వ్యక్తి ప్రతిపక్షానికి చెందిన వారు కాదు, నరేంద్రమోడీ వ్యతిరేకి అంతకంటే కాదు. రాజకీయవేత్త కాదు, కమ్యూనిస్టు అసలే కాదు. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్‌. పోనీ ఆయనేమైనా ఎక్కడో అన్నారా అంటే అదేమీ కాదు.అనేక మంది దృష్టిలో ప్రధాని నరేంద్రమోడీ కంటే బలవంతుడని భావించే హౌంమంత్రి అమిత్‌ షా, ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలోనే బహిరంగ వేదిక మీద చేసిన వ్యాఖ్యలవి. ముంబైలో నవంబరు 30న జరిగిన ఎకనమిక్‌ టైమ్స్‌ 2019 అవార్డుల ప్రదానోత్సవ సభలో రాహుల్‌ బజాజ్‌ చేసిన క్తుప్త ప్రసంగంలోని ముఖ్యాంశాలవి. ఎవరూ భయపడనవసరం లేదు, ప్రజ్ఞ చెప్పిన దానిని ఖండించాము అని వేదిక మీద ఉన్న అమిత్‌ షా చెప్పిన మాటలను నమ్మేందుకు ఎవరైనా చెవుల్లో కమలం పువ్వులు పెట్టుకొని ఉన్నారా ?
ఇదే రాహుల్‌ బజాజ్‌ జూలై చివరి వారంలో తమ కంపెనీ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పవచ్చు చెప్పకపోవచ్చు, గత మూడు నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి పడిపోతున్నదని ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు వెల్లడిస్తోంది. డిమాండ్‌ లేకుండా ప్రయివేటు పెట్టుబడులు ఉండవు, అలాంటపుడు అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, స్వర్గం నుంచి ఊడిపడదు. అన్ని ప్రభుత్వాల మాదిరి వారు(మోడీ సర్కార్‌) చిరునవ్వు ముఖాన్ని చూపుతారు, కానీ వాస్తవం, వాస్తవమే’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇవి రాహుల్‌ బజాజ్‌ వ్యక్తిగత అభిప్రాయమే అనుకుంటే పప్పులో కాలేసినట్లే బొంబాయి క్లబ్‌ కార్పొరేట్ల మనోగతం !
నిద్రపోతున్న వారిని లేపగలం గానీ నిద్ర నటిస్తున్నవారిని లేపగలమా ? దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంత నిర్ధారణగా మరొకరికి తెలియదు. అంతర్గతంగా ఏమి జరుగుతోందో కేంద్ర ప్రభుత్వానికి తెలిసినంతగా మరొకరికి ముందుగా తెలిసే అవకాశం లేదు. మోడీ సర్కార్‌, దాన్ని నిరంతరం కాపాడే ఉన్నత అధికార యంత్రాంగం గత కొద్ది సంవత్సరాలుగా అనేక విషయాలను మూసిపెడుతోంది. అవి పాచిపోయి వాసన కొట్టిన తరువాతే బయటకు వస్తున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ తన చుట్టూ తనకు తాన తందానా అనే వారినే నియమించుకున్నారని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అర్ధశాస్త్రం తెలియదన్నారు. అమెరికన్‌ పత్రిక హఫ్‌పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారు నిజమైన అభివృద్ది రేటు 4.8శాతం అంటున్నారు, నేను 1.5శాతమే అంటున్నాను అన్నారు.(ఈ ఇంటర్వ్యూ జరిగిన రెండు రోజుల తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం రెండవ త్రైమాసిక అభివృద్ధి రేటు 4.5శాతమే) మీరు చూస్తే గనుక మీడియా సమావేశంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తే నిర్మలా సీతారామన్‌ మైక్‌ను అధికారులకు ఇస్తారు. ఈ రోజు దేశంలో ఉన్న సమస్య ఏమిటి డిమాండ్‌ లేకపోవటం తప్ప సరఫరా లేమి కాదు, కానీ ఆమె కార్పొరేట్లకు పన్నుల రాయితీ ఇస్తున్నారు. వారు వాటిని తీసుకొని తమ రుణాలను తీర్చుకుంటారు, గతంలో కూడా అదే చేశారు. వాస్తవాలను ప్రధానికి చెప్పేందుకు ఆయన సలహాదారులు కూడా భయపడతారు. ప్రధానికేమీ దాని గురించి తెలియదు అద్భుతమైన ప్రగతి ఉందని చెబుతారు.
మాంద్యమా కాదా అన్నది కాదు అసలు నరేంద్రమోడీ సర్కార్‌కు ఆర్ధిక వ్యవస్ధలోపమేమిటో తెలియదనేందుకు అరకొర చర్యలు తీసుకుంటున్న తీరే నిదర్శనం అని ఆర్ధికవేత్త, 14వ ఆర్ధిక సంఘం సభ్యుడైన సుదీప్త మండల్‌ వ్యాఖ్యానించారు.అసలైన సమస్య డిమాండ్‌ వైపు ఉంది అన్నారు. ఆరునెలల ఆర్ధిక సమీక్ష నివేదికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో అభివృద్ధి రేటు 4.9శాతానికి మించదు అన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలన్నీ సరఫరా వైపున ఉండే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు, కార్పొరేట్‌ సంస్ధలు, రియలెస్టేట్‌ వంటి వాటికి రాయితీలు ఇవ్వటమే. డిమాండ్‌ను పెంచే జనం చేతుల్లో డబ్బు ఉండాలి అని సుదీప్త చెప్పారు.
డిమాండ్‌కు సంబంధించినవే ఉపాధి, వినిమయ అంశాలు. నాలుగున్నర దశాబ్దాల గరిష్ట స్ధాయి 6.1శాతానికి నిరుద్యోగం పెరిగిందన్న నివేదికను ఎన్నికల ముందు విడుదల కాకుండా తొక్కిపెట్టింది మోడీ సర్కార్‌. ఎన్నికల తరువాత వినిమయం తగ్గిపోయిందన్న నివేదిక తప్పుల తడక అంటూ దాన్ని కూడా మూసిపెట్టింది. అవి రెండూ తిరుగులేని పక్కా నివేదికలని ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో అభివృద్ధి రేటు 4.75శాతంగా నమోదై నిర్దారించింది, ఇది ఆరేండ్ల కనిష్టం.
కల్లు కుండను కొట్టేయటానికి ప్రయత్నిస్తూ దొరికి పోయిన వాడిని తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడగడ్డి ఎక్కడుందో చూద్దామని అని అసలు విషయం దాచిన మాదిరి వ్యవహరిస్తున్నారు. ఆటో రంగంలో మాంద్యం ఎందుకంటే కుర్రవారు స్వంతకార్ల బదులు అద్దె కార్లవైపు మళ్లారని చెప్పటం అంటే దూడగడ్డి వ్యవహారమే. వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. తొలి మూడు మాసాలు అలాగే ఉంటుంది, రెండవ త్రైమాస ఫలితాలు చూడండి అన్నారు. తీరా అది 4.5కు దిగజారింది. ఇప్పుడు డిసెంబరు ఫలితాలు చూడండి అంటున్నారు.
ఈ పతనానికి కారణాలు ఏమిటి? అసలు సమస్యను అంగీకరించేందుకు మోడీ సర్కార్‌ సిద్దంగా లేదు. పెట్టుబడుల గురించి మోడీ హడావుడి ఏడాదికేడాది పెరుగుతోంటే వాస్తవంలో 2015-16 నుంచి దేశంలో నూతన పెట్టుబడుల ప్రతిపాదనలు క్రమంగా తగ్గుతున్నాయి.2006-07 నుంచి 2010-11 వరకు ప్రతి ఏటా సగటున 25లక్షల కోట్ల రూపాయల నూతన పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. తరువాత దిగజారుడు ప్రారంభమై 2013-14లో పదిలక్షల కోట్ల రూపాయలకు పడిపోయాయి. తరువాత రెండు సంవత్సరాలలో 21, 20లక్షల కోట్లకు పెరిగాయి. 2015-16 తరువాత క్రమంగా తగ్గుతూ 2018-19లో 10.7లక్షల కోట్ల రూపాయలకు పడిపోయాయి. అయితే ఇవన్నీ కార్యరూపం దాల్చలేదు. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే కొన్ని లక్షల కోట్లుగా కనిపించవచ్చుగానీ అవన్నీ పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేందుకు దోహదం చేసేవి కాదు. ఉదాహరణకు 2018-19లో జెట్‌ ఎయిర్‌వేస్‌ బోయింగ్‌ కంపెనీ నుంచి లక్షా 31వేల కోట్లతో 150 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రతిపాదించింది. తీరా దాన్ని రద్దు చేసుకుంది. అందువలన అంతిమంగా ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఏ మేరకు కార్యరూపం దాల్చేది చెప్పలేము. ఈ ఏడాది జూన్‌, సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో పెట్టుబడుల ప్రతిపాదనలు కేవలం 1.83లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని బిజినెస్‌ టుడే అక్టోబరు ఏడవ తేదీన పేర్కొన్నది. ఇది 15 సంవత్సరాల కనిష్ట రికార్డు.

ఏటేటా ప్రభుత్వ పెట్టుబడులు దిగజారుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్ధలను తెగనమ్మి కార్పొరేట్లకు రాయితీలు, ద్రవ్యలోటును పూడ్చుకోవటం తప్ప వచ్చిన సొమ్మును తిరిగి పెట్టుబడులుగా పెట్టటం లేదు.2015-16లో పది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించగా అది 2017-18లో 5.3లక్షల కోట్లకు, మరుసటి సంవత్సరానికి మూడు లక్షల కోట్లకు తగ్గిపోయాయి.
1991 నుంచి అమలు చేస్తున్న సరళీకరణ విధానాలలో భాగంగా ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించివేస్తున్నారు. ఇదే సమయంలో కార్పొరేట్‌ శక్తులకు ఇచ్చే రాయితీలు ఏదో ఒక రూపంలో పెరుగుతూనే ఉన్నాయి. సంస్కరణలకు ముందు జిడిపిలో 12.7శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రస్తుతం ఏడుశాతానికి తగ్గాయని ప్రపంచ బ్యాంకు సమాచారం వెల్లడించింది.

అమెరికా, ఐరోపా ధనిక దేశాల మాదిరి వినియోగ ఆధారిత వ్యవస్ధగా మన దేశాన్ని మార్చివేసేందుకు ప్రపంచ, దేశీయ కార్పొరేట్‌ శక్తులు చేసిన యత్నం విజయవంతమైంది. అందుకే పరిమితంగా ఉన్న ధనిక మధ్యతరగతి ఆశలు, ఆకాంక్షలను తీర్చేందుకు వారికి దిగువన ఉన్న వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టే విధానాలను ముందుకు తెచ్చారు. ఇప్పటికీ ధనికుల కొనుగోలు డిమాండ్‌లో మార్పు ఉన్నట్లు ఎవరూ చెప్పటం లేదు. ప్రతి ఒక్కరూ గ్రామీణ వినియోగం తగ్గిందనే చెబుతున్నారు. మెజారిటీ జనం అక్కడే ఉన్నారు, వారి ఆదాయాలు పరిమితం కనుక వినియోగమూ పరిమితమే. మునిగే పడవకు గడ్డి పోచకూడా భారమే అన్నట్లుగా వారు ఆధారపడుతున్న వ్యవసాయ రంగంలో ఏ చిన్న ప్రతికూల పరిణామం జరిగినా వినియోగం పడిపోతుంది. గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం పరిష్కారం కాని కారణంగానే అది వినియోగం మీద ప్రభావం చూపి పారిశ్రామిక రంగాన్ని కూడా పడకేసేట్లు చేసింది. ఇది మన జనాభా పొదుపును హరించి వేస్తున్నది. పెట్టుబడికి వినియోగించే పొదుపు రేటు జిడిపిలో కొద్ధి సంవత్సరాల క్రితం సగటున 33.8శాతం ఉండగా 2019 ఆర్ధిక సంవత్సరంలో అది 29.3శాతానికి పడిపోయింది.ఇది ద్రవ్యలోటు పెరుగుదలకు దారి తీస్తోంది. ద్రవ్యలోటు పెరగటం జనం మీద ఖర్చు చేసే సంక్షేమ పధకాలకు కోత పెట్టటం లేదా అప్పులు తీసుకోవటం, అధికంగా కరెన్సీ నోట్ల ముద్రణకు దారి తీస్తుంది. ఇదొక విష వలయం. అందుకే ద్రవ్యలోటు పెరిగింది అంటే తొలి దెబ్బ సామాన్యుల మీదనే పడుతోంది. దేశంలో ద్రవ్యలోటు పెరుగుదల గురించి తెలిసే ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాణిజ్య, పారి శామిక రంగాలకు పన్ను రాయితీలను ఇచ్చింది.
మన బడ్జెట్‌ అంచనాల ప్రకారం 2020 మార్చి నెల ఆఖరుకు ద్రవ్యలోటు ఏడులక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. అది అక్టోబరు నాటికే అంటే ఏడునెలల కాలంలోనే 7.2లక్షల కోట్లకు(102.4శాతానికి) చేరింది.పన్ను ఆదాయం 6.83లక్షల కోట్లు అయితే ఖర్చు 16.55లక్షల కోట్లకు చేరింది. ముందే చెప్పుకున్నట్లు జిడిపి వృద్ధి రేటు తగ్గటం పన్ను ఆదాయాలు తగ్గటానికి కూడా దోహదం చేస్తుంది. అంటే లోటు మరింతగా పెరగటం లేదా బడ్జెట్‌కోతలకు దారి తీస్తుంది. మరొక మార్గం బంగారు బాతుల వంటి ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం.
సంస్కరణల పేరుతో ప్రభుత్వ రంగాన్ని వదిలించుకోవాలన్నది మన దేశం మీద ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ విధించిన ఒక ముఖ్యమైన షరతు. దాన్ని బయటకు చెబితే జనంలో వ్యతిరేకత వస్తుందనే భయంతో నష్టాల బారిన పడిన ప్రభుత్వరంగ సంస్దలను వదిలించుకోవాలనే ప్రచారం మొదలు పెట్టారు. జనానికి కూడా నిజమే అనిపించింది. ఆక్రమంలో ప్రభుత్వరంగం పతనం కావటానికి చేయాల్సిందంతా చేసి ఆ పేరుతో కారుచౌకగా ఆ శితులకు కట్టబెడుతున్నారు. ప్రయివేటు టెలికాం సంస్ధలు ఐదవ తరం టెక్నాలజీలోకి మారటం గురించి ఆలోచిస్తుంటే ప్రభుత్వ బిఎస్‌ఎన్‌ఎల్‌ను మూడవ తరం టెక్నాలజీకే పరిమితం చేసే చర్యలు తీసుకోవటం దానిలో భాగమే. ప్రభుత్వంలోని చమురు సంస్ధలు లాభాలు ఆర్జిస్తున్నాయి, అయినప్పటికీ వాటిని(బిపిసిఎల్‌) అమ్మివేయాలని నిర్ణయించారు. ఇదెక్కడి ఘోరం అని ప్రశ్నిస్తే ప్రభుత్వాలు వ్యాపారాలకు దూరంగా ఉండాలి కనుక అమ్మివేస్తున్నాం, అది కూడా ప్రయివేటు రంగానికే అని బిజెపి సర్కార్‌ చెబుతోంది. ఇంక నాటకాలు ఆడేందుకు ఏమాత్రం అవకాశం లేదు కనుక అసలు విషయాలు చెబుతున్నారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది జనమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ సర్కార్‌ : అంకెల గారడీ, ఎదురుదాడులు !

20 Wednesday Nov 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aravind Subrahmanyam, India Data Crisis, India GDP, jugglery of numbers, narendra modi government, narendra modi offensive attacks, offensive attacks

Image result for narendra modi offensive attacks
(ఆర్థిక దిగజారుడు, సమాచార విశ్వసనీయత సంక్షోభం – 2 ముగింపు భాగం)
ఎం కోటేశ్వరరావు
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏడాది అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని నరేంద్రమోడీ ఉపాధి కల్పన గురించి పార్లమెంట్‌లో మాట్లాడారు. పిఎఫ్‌ పధకంలో ఎంత మంది చేరిందీ, వైద్యులు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్ల గురించి అంకెలు చెబుతూ ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన చేయకపోతే అవన్నీ ఎలా సాధ్యమని ఎదురుదాడి చేశారు. తరువాత ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కూడా అదే కబుర్లు చెప్పారు. ఎన్నికలకు ముందుగానే ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వెల్లడైంది. నాలుగున్నర దశాబ్దాల రికార్డును అధిగమించి నిరుద్యోగశాతం 6.1కి చేరిందన్నది దాని సారం. అయితే తాము కల్పించిన ఉద్యోగాలన్నీ లెక్కల్లోకి చేరలేదని, తప్పుడు లెక్కలని పకోడీ బండి పెట్టుకోవటం కూడా ఉపాధి కల్పనకిందికే వస్తుందని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు వెల్లడైన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక వాస్తవం కాదని బుకాయించిన సర్కార్‌ అనంతరం అదే నివేదికను వాస్తవమైనదిగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో 8.2శాతంగా ఉన్న నిరుద్యోగం అక్టోబరులో 8.5కు చేరింది.
నిరుద్యోగం లేదా ఉద్యోగాల కల్పన గురించి ప్రధాని, బిజెపి నేతలు జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. 2017 సెప్టెంబరు-2018నవంబరు మధ్య తొలిసారిగా కోటీ ఎనభై లక్షల మంది ప్రావిడెంట్‌ ఫండ్‌కు తమ వాటాను జమచేయటం ప్రారంభించారని వారిలో 65లక్షల మంది 28ఏండ్ల లోపు వారేనని, వారందరికీ కొత్తగా ఉద్యోగాలు వచ్చిన కారణంగానే అది జరిగిందని, అదే విధంగా 2014 మార్చి నుంచి 2018 అక్టోబరు వరకు కోటీ ఇరవై లక్షల మంది నూతన పెన్షన్‌ పధకంలో నమోదైనట్లు కూడా మోడీ చెప్పారు.
ఇక్కడ మోడీ మహాశయుడు నాణానికి ఒక వైపును మాత్రమే చూపారు. రెండో వైపు చూద్దాం. ప్రావిడెంట్‌ ఫండ్‌ వెబ్‌సైట్‌లో ఈ లెక్కలన్నీ పెడుతున్నారు. మోడీ గారు కోటీ 79లక్షల నమోదు కాలంలోనే కోటీ 39లక్షల మంది ఈ పధకం నుంచి తప్పుకున్నారు. 33లక్షల మంది గతంలో చేరి తప్పుకొని తిరిగి చేరిన వారు ఉన్నారు. అంటే నిఖరంగా నిలిచిన వారు 73లక్షల మందే. తప్పుకున్నవారందరూ నిరుద్యోగం సైన్యంలో చేరినట్లా లేక ఉద్యోగవిరమణ చేసినట్లా ? ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికుల పేరుతో యజమానులకు మేలుచేసే సబ్సిడీ పధకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరు పిఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహ యోజన. దాని ప్రకారం తమ పధకం ప్రారంభం నాటికే ఉన్న సిబ్బంది గాకుండా తరువాత కొత్తగా చేరిన సిబ్బందిని ప్రావిడెంట్‌ పధకంలో చేర్చితే వారి ఖాతాలకు యజమానులు చెల్లించాల్సిన సొమ్మును మూడేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అది కూడా పదిహేను వేల రూపాయల లోపు వేతన ఉన్న వారికి మాత్రమే. అందువలన అనేక యజమానులు దాన్ని వినియోగించుకొని అప్పటికే ఉద్యోగాల్లో వున్నా పిఎఫ్‌ పధకంలో చేర్చని వారిని కొత్తవారిగా చేర్పించి వుండవచ్చు. అందువలన ఒక్కసారిగా ఉద్యోగాలు పెరిగినట్లు చిత్రిస్తున్నారు.
అంకెలతో జనాన్ని ఎలాగైనా ఆడుకోవచ్చు. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పిఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహయోజన పధకం ప్రారంభమైన 2016 నుంచి 2019 నవంబరు 18 వరకు విస్తరించిన జౌళి రంగ కార్మికులతో సహా లబ్ది పొందిన వారు కోటీ 24 లక్షల 33వేల 819 మంది. లబ్ది పొందిన సంస్ధల సంఖ్య లక్షా 53వేల 574. ఇందుకు గాను ప్రభుత్వం యజమానుల వాటాగా చెల్లించిన సొమ్ము 6,887 కోట్ల రూపాయలు. సగటున ఒక్కొక్క కార్మికుడి ఖాతాలో వేసిన సొమ్ము రూ.5,539. మరి ఈ లెక్కలను మోడీ గారు కాదంటారా తప్పంటారా ?
మోడీ గారు మరో లెక్క చెప్పారు. అదేమంటే 2014 నుంచి కొత్తగా 36లక్షల కొత్త వాణిజ్య ట్రక్కులు,27లక్షల ఆటోలు, కోటీ 50లక్షల ప్రయాణీకుల వాహనాల విక్రయం జరిగిందని, తద్వారా రవాణా రంగంలో కోటీ 25లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చినట్లు వివరించారు. ఇక్కడ చూడాల్సింది, పాతవాహనాలు ఎన్ని వినియోగం నుంచి తప్పుకున్నాయి. కొత్తవాహనాలకు కొత్త ఉద్యోగులే వచ్చారనుకుందాం, వారిలో ఎవరూ అంతకు ముందు ఎక్కడా ఏ పనీ చేయటం లేదా కొత్త వాహనాల మీద అప్పటికే పని చేస్తున్నవారు గాక కొత్తవారు ఉద్యోగాల్లో చేరినట్లు రుజువులు ఏమిటి?
టూరిజం రంగంలో కొత్త హౌటళ్లకు అనుమతులు 50శాతం పెరిగాయని, దీని వలన మరో కోటీ 50లక్షల ఉద్యోగాలు వచ్చాయని మోడీ చెప్పారు. దీనికి కూడా రవాణా రంగం మాదిరే అధికారుల అంచనా లెక్కలు తప్ప ఆధారాలేమీ లేవు.
తొలిసారిగా ముద్ర రుణపధకం కింద నాలుగు కోట్ల 25లక్షల మంది రుణాలు పొందారని, అయితే ఉపాధి వివరాలు లేవని మోడీ చెప్పారు. అంటే రుణాలు తీసుకున్నవారందరికీ ఉపాధి చూపినట్లే అనుకోవాలనా ? ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారమే 15.59 కోట్ల మందికి ఇచ్చిన రుణాల మొత్తం రెండులక్షల 75వేల కోట్లు, అంటే సగటున ఇచ్చిన మొత్తం రు 17,582, దీనితో వచ్చే ఉపాధి ఎంత అన్నది ప్రశ్న.

Image result for narendra modi offensive attacks
ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతున్నది. ప్రధాని నరేంద్రమోడీకి ఇన్ని వివరాలు తెలిసినపుడు, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) లేదా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేల్లో అవెందుకు ప్రతిబింబించటం లేదు. లెక్కలు సరిగా వేయటం లేదంటున్నారు. ఐదున్నర సంవత్సరాల పాలనలో లెక్కల విధానాన్ని కూడా సరి చేసి సరైన లెక్కలు చెప్పటంలో మోడీ సర్కార్‌ విఫలమైనట్లు అంగీకరించటమే కదా ! లేదూ సరైన లెక్కల విధానాన్ని అమల్లోకి తెచ్చేంత వరకు ఆ సంస్ధ రూపొందించిన వాటిని ఎందుకు అంగీకరించటం లేదు ? ప్రతి సారీ వివాదం ఎందుకు రేపుతున్నట్లు ? మోడీ సర్కార్‌ కోసం ఎన్‌ఎస్‌ఓ కొత్త పద్దతినేమీ ప్రవేశపెట్టలేదు కదా, అంతకు ముందున్నదాని కొనసాగింపే కదా ? పోనీ నరేంద్రమోడీ సర్కార్‌ సాధించినట్లు చెప్పుకుంటున్న లెక్కలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నట్లు? అవి సరైనవే అయితే నిరుద్యోగం పెరగటం, వినిమయశక్తి తగ్గటం వంటి వివరాలు తప్పుడు లెక్కలు ఎలా అవుతాయి ?
2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఆచరణ సంగతి పక్కన పెడదాం. రైతుల ఆదాయం ఎంత అన్నది ప్రభుత్వం ఎప్పుడైనా ప్రకటించిందా ? రైతుల పరిస్ధితి గురించి శ్వేతపత్రం ఏమైనా ప్రకటించిందా అంటే లేదు. ప్రభుత్వ సంస్ధలు చెబుతున్న లెక్కలు తప్పు, వాస్తవాన్ని ప్రతిబింబించటం లేదు అంటున్నారు. స్వచ్చ భారత్‌ లేదా బహిరంగ మలవిసర్జన నిరోధ పధకం కింద మరుగుదొడ్ల గురించి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ వాటిలో ఎన్నింటిని వినియోగిస్తున్నారు అన్న అంశంపై తయారు చేసిన విశ్లేషణ నివేదికను మాత్రం బయట పెట్టకుండా తొక్కి పెట్టారు.
మరుగుదొడ్ల నివేదిక సర్వేను ఎందుకు మూసిపెట్టారు ? ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ మన దేశంలో ఇప్పుడు ఎక్కడా బహిరంగ మలవిసర్జన లేదని అంతర్జాతీయ సమాజానికి చెప్పేశారు. తమ ప్రభుత్వం సాధించిన ఘనతగా చిత్రించారు. అక్టోబరు రెండవ తేదీన గాంధీ మహాత్ముడి 150 జయంతి సందర్భంగా అహమ్మదాబాద్‌ సబర్మతి నదీ తీరంలో ఇరవై వేల గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లకు సర్టిఫికెట్లను కూడా ప్రదానం చేశారు. ఇంత హడావుడి చేసిన తరువాత అధికారిక నివేదికను విడుదల చేస్తే మోడీ గారి గాలి తీసినట్లు అవుతుంది. దేశంలో మరుగుదొడ్లు 75శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, వాటిలో 80శాతం మాత్రమే వినియోగంలో ఉన్నట్లు సదరు ముసాయిదా నివేదిక పేర్కొన్నది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 76వ నివేదికకోసం 2018 జూలై నుంచి డిసెంబరు మధ్య సర్వే చేశారు. దానిలో చేర్చిన ప్రశ్నావళి మోడీ సర్కార్‌ను ఇబ్బంది పెట్టింది. తొలిసారిగా మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా? ఉంటే దాన్ని వినియోగిస్తున్నారా ? వినియోగించకపోతే కారణాలేమిటి ? అని అడిగారు. ఈ నివేదిక సర్వేలో 75శాతం మందికే మరుగుదొడ్లు ఉన్నట్లు తేలింది. సర్వే ముగిసిన డిసెంబరు తరువాత కేవలం తొమ్మిది నెలల కాలంలో మిగిలిన 25శాతం మరుగుదొడ్లు కట్టటం ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న తలెత్తుతుంది కనుక మోడీ సర్కార్‌ దీన్ని తొక్కి పెట్టిందన్నది స్పష్టం. ఇదే నివేదికను తరువాత ఎప్పుడో జనం మరచిపోయిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా ఎన్నికల అనంతరం నిరుద్యోగ నివేదిక మాదిరి విడుదల చేస్తారా ?

Image result for narendra modi offensive attacks
ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి రేటు ఏడు వాస్తవం కాదని, నాలుగున్నరశాతానికి మించదని ప్రధాని ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద్‌ సుబ్రమణ్యం , అభివృద్ధి అంకెలకు ఉపాధి కల్పనకు పొసగటం లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చెప్పిన విషయం తెలిసిందే. అరవింద సుబ్రమణ్యం గణించిన తీరులో లోపాలు ఉన్నాయని కాసేపు అంగీకరిద్దాం. అవెలా తప్పో ఇంతవరకు మోడీ సర్కార్‌ ఎందుకు అసలు గుట్టు విప్పి చెప్పలేదు, అడ్డుకున్నదెవరు ? ప్రతి అంశానికి సమాధానం చెబుతామని రంకెలు వేశారు, ఇంతవరకు అలాంటి దాఖలాలు లేవు. ఈ ఏడాది ఇప్పటి వరకు వెలుబడిన అంకెలు సుబ్రమణ్యం చెప్పిందే సరైనవని నిర్ధారించటం లేదా ? మోడీ స్వయంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్యవలన జిడిపి వృద్ధిరేటు 6.7 నుంచి 8.2శాతానికి పెరుగుతుందని ప్రభుత్వమే అంతకు ముందు వేసిన అంచనాలను సవరించింది. కానీ ఆచరణలో ఆ చర్య వృద్దిని దెబ్బతీసిందని రుజువు చేసింది. అంటే కొందరి బుర్రల్లో తలెత్తిన ఆలోచనల మేరకు చేసిన అంకెల గారడీ తప్ప ప్రాతిపదిక లేదు లేదా తప్పుడు ప్రాతిపదికన అంకెలను సవరించారన్నది స్పష్టం. అభివృద్ది సూచికల తయారీకి తీసుకొనే అంశాలైన కార్ల అమ్మకాలు, విమానాల్లో సరకు రవాణా, కొనుగోలు శక్తి తదితర అంశాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం వృద్ది గురించి అతి అంచనాలు వేసినట్లు రాయిటర్స్‌ వ్యాఖ్యానించింది.
దేశంలో ఆర్ధిక వ్యవస్ధ మందగమనంలో ఉందా మాంద్యంలో ఉందా అనే పండిత చర్చను కాసేపు పక్కన పెడితే కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉత్పత్తి సంస్దలు ఎంత సామర్ధ్యంతో పని చేస్తున్నాయి, అంచనాల మేరకు విద్యుత్‌ ఎందుకు అమ్ముడు పోవటం లేదంటే పరిశ్రమలు, వాణిజ్యం కొత్తగా రాకపోవటమే అన్నది స్పష్టం. అందుకే విద్యుత్‌ కంపెనీల దివాళా. ఈ పూర్వరంగంలో సమాచారం వెలువడుతున్న అనుమానాలు మన అధికారయంత్రాంగం, పాలకుల విశ్వసనీయతనే దెబ్బతీస్తున్నాయని గుర్తించాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ సర్కార్‌ : ఆర్థిక దిగజారుడు, సమాచార విశ్వసనీయత సంక్షోభం – 1

19 Tuesday Nov 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

finance minister nirmala sitharaman, India Data Crisis, India Economic slowdown, Narendra Modi, narendra modi credibility crisis

Image result for narendra modi and nirmala sitharaman
ఎం కోటేశ్వరరావు
ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నాడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం సుమతీ శతకకర్త బద్దెన భూపాలుడు లేక భద్ర భూపాల. అయితే ఆయన దాన్ని వాడిన సందర్భం తెలియదు గానీ మన రాజకీయనేతలు మాత్రం దాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. కొందరిని కొంత కాలం అలాంటి మాటలతో మభ్యపరచవచ్చుగానీ ఎల్లరనూ ఎల్లకాలం మోసం చేయటం కుదురుతుందా ?
మోడీగారు తనకు ఇబ్బంది కలిగించే అంశాల మీద నోరు విప్పరు. ఆయన మాదిరి నోరు మూసుకొని ఉండటం మంత్రులకు సాధ్యం కాదు. ఎవరూ మాట్లాడకపోతే ప్రభుత్వ దుకాణం మూతపడిందని జనం అనుకుంటారు. ఆటోమొబైల్‌ రంగం మందగమనం లేదా రాయంచనడక సంగతేమిటమ్మా అని అడిగితే కుర్రాళ్ల మైండ్‌ సెట్‌ మారింది, స్వంతకారుకు నెలవారీ వాయిదాలు చెల్లించే బదులు ఓలా, ఉబర్‌ వంటి వాటిని ఉపయోగించటం, త్వరలో వచ్చే కొత్త మోడల్స్‌ కోసం ఎదురు చూస్తూ పాతవాటిని కొనుగోళ్లను వాయిదా వేయటం వంటి కారణాలున్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సెప్టెంబరులో చెప్పారు. ఆయితే ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగటంతో ఆమె కాస్త తగ్గారు. దేశ ఆర్థిక వ్యవస్ధ మందగించింది తప్ప మాంద్యంలోకి జారలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నవంబరు 18న లోక్‌సభకు సమర్పించిన రాత పూర్వక సమాధానంలో చెప్పారు. అంతకు ముందు నాలుగు రోజుల క్రితం ఆర్ధిక వ్యవస్ధ అధమ స్ధాయిలోకి దిగజారలేదన్నారు. మందగించినా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 20దేశాల బృందంలో మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా ఉందని, 2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి లక్ష్యాన్ని సాధిస్తామని కూడా లోక్‌సభలో చెప్పారు.

Image result for finance minister nirmala sitharaman
మంత్రులు లేదా మరొకరు చట్టసభల వెలుపల మాట్లాడేవాటిలో అతిశయోక్తులు, అవాస్తవాలు, వక్రీకరణలు ఉండటాన్ని ప్రాణ, విత్త,మాన భంగములతో పాటు రాజకీయములందు కూడా అబద్దములాడవచ్చని సరిపెట్టుకుందాం. నిర్మలా సీతారామన్‌ సమాధానం తరువాత అనుబంధ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను ఆమె జూనియర్‌ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్వీకరించారు. నిజమే చెబుతాను అబద్దాలు చెప్పను అని ప్రమాణం చేసిన ఆ మంత్రిగారు ఆధారాలు లేని అంశాలను చెప్పారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయిందని(ఇది ఆరేండ్ల కనిష్టం) ప్రభుత్వమే చెప్పింది. ఐదుశాతం మాంద్యం లేదని సదరు మంత్రి అడ్డంగా మాట్లాడారు.
అంతేనా ! పెద్ద నోట్ల రద్దు తరువాత పన్ను చెల్లింపుదార్ల ప్రాతిపదిక రెట్టింపు కాగా, ప్రత్యక్ష పన్నుల వసూలు మొత్తం రెట్టింపు అయిందని బయట బహిరంగ సభల్లో చెప్పే అంశాలను పార్లమెంటులోనూ చెప్పారు. ఆదాయ పన్ను శాఖ గణాంకాల ప్రకారం 2016-17లో 6.92కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు ఉంటే 2018-19 నాటికి 8.45 కోట్ల మందికి పెరిగారు. కూడికలు తీసివేతలు మాత్రమే తెలిసిన వారికి కూడా ఇది రెట్టింపు కాదు కదా నాలుగోవంతుకు తక్కువ ఐదో వంతుకు ఎక్కువ అన్నది స్పష్టం. ఇక పన్ను వసూళ్లు 2015-16లో అంటే పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ 7,41,945 కోట్లు కాగా అవి 11,37,685 కోట్లకు పెరిగాయి, అంటే యాభైశాతానికి కొద్దిగా ఎక్కువ. మరి రెట్టింపు ఎక్కడ ? సమర్ధించుకోవటానికి మంత్రులు ఎలాంటి పాట్లు పడుతున్నారో ఇంకా చూడండి !
జాతీయ సెలవు దినం అక్టోబరు రెండవ తేదీ ఒక్క రోజే మూడు సినిమాలు 120 కోట్ల రూపాయలు వసూలు చేశాయని చిత్ర విమర్శకుడు కోమల్‌ నహతా నాకు చెప్పాడు. ఒక దేశంలో 120 కోట్ల రూపాయలు వచ్చాయంటే ఆ దేశం గట్టి ఆర్దిక వ్యవస్ధను కలిగి ఉన్నట్లే అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆక్టోబరు 12న ముంబై పత్రికా గోష్టిలో వ్యాఖ్యానించారు. దీని మీద తీవ్ర విమర్శలు రావటంతో తన వ్యాఖ్యను అసందర్భంగా పేర్కొని వక్రీకరించారని, తానెంతో సున్నిత మనస్కుడను కనుక చేసిన వ్యాఖ్యలు సరైనవే అయినా వాటిని ఉపసంహరించుకుంటున్నా అని మరుసటి రోజు సదరు మంత్రి ప్రకటించారు.
తాజాగా నవంబరు 16న కేంద్ర మంత్రి సురేష్‌ అంగాడీ ఆర్ధిక వ్యవస్ధ గట్టిగా ఉందని దానికి నిదర్శనం వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతుండటం, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో జనం పెద్ద సంఖ్యలో కనిపించటమే అని సెలవిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. అంతే కాదు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆర్ధిక వ్యవస్ధ మందగిస్తుందని, తరువాత పుంజుకుంటుందని ఇది ఒక చక్రమణం వంటిదని వివరించారు. దేశంలో పౌరుల వినిమయ ఖర్చు గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా 2017-18లో పడిపోయిందని జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) తాజా నివేదికలో వెల్లడి కావటం గురించి మంత్రి సురేష్‌ అంగాడీ పై వ్యాఖ్యలు చే శారు.
నరేంద్రమోడీ చెబుతున్న ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధ పగటికల అన్నది ఒక అభిప్రాయం. కానీ కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ తెల్లవారు ఝామున వచ్చిన కల నిజం అవుతుందనే మూఢనమ్మకంతో ఉన్నారు. ఈ జిడిపి అంకెలతో ఐదులక్షల కోట్లడాలర్ల ఆర్ధిక వ్య వస్ధ సాధ్యమా అని ప్రశ్నిస్తే జనాలు అంకెలను, ఆర్ధిక వ్యవస్ధ లెక్కలను పట్టించుకోవద్దు అన్నారు. అంతటితో ఆగితే ఫరవాలేదు. సాంద్రత సిద్దాంతాన్ని కనుగొనేందుకు ఐనిస్టీన్‌కు లెక్కలేమీ ఉపయోగపడలేదని వ్యాఖ్యానించారు.వాస్తవానికి ఐనిస్టీన్‌ సాపేక్షతా సిద్దాంతాన్ని న్యూటన్‌ సాంద్రతా సిద్దాంతాన్ని కనుగొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి ఆర్ధిక పరిస్ధితిని చక్కదిద్ధే తెలివి తేటల సంగతి తరువాత, పై వ్యాఖ్యలను చూసిన తరువాత వారికి ఎప్పుడు, ఏం మాట్లాడాలో కూడా తెలియదనుకొనే పరిస్ధితులు తలెత్తాయని ఎవరైనా భావిస్తే అది వారి తప్పు కాదు. ఇప్పుడు ప్రధాని నాయకత్వం విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదంటే అతిశయోక్తి కాదు.
ప్రధాని నరేంద్రమోడీ సుడిగాలి మాదిరి విదేశీ పర్యటనలు జరిపి దేశ ప్రతిష్టను పెంచి ఎక్కడికో తీసుకుపోయారని బిజెపి నేతలు చెప్పటాన్ని అంగీకరిద్దాం ! భారత ప్రభుత్వ అధికారిక సమాచారం గురించి ఆర్ధికవేత్తలు, పెట్టుబడిదారులకు ఏ మాత్రం నమ్మకం లేదని అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక వార్తా విశ్లేషణను విడుదల చేసింది. జిడిపి పెరుగుదలను అభివృద్దిగా చూపేందుకు మోడీ సర్కార్‌ పడుతున్న తాపత్రయం గురించి తెలిసిందే. 2016 జూలై నుంచి 2017 జూన్‌ వరకు పన్నెండు నెలల కాలంలో గణాంక మంత్రిత్వశాఖ ఒక సర్వే జరిపింది. దేశ జిడిపి లెక్కల్లో ఉపయోగించిన కంపెనీల సమాచారాన్ని ఎంచుకొని జరిపిన సర్వేలో 36శాతం కంపెనీల ఉనికి లేకపోవటం లేదా తప్పుడుగా వర్గీకరించినట్లు తేలింది. సమాచార సేకరణలో లోపాలు ఉన్నాయని అంగీకరిస్తూనే జిడిపి అంచనాల మీద వాటి ప్రభావం ఉండదని, తగిన జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రిత్వశాఖ చెప్పింది. నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల గరిష్ట స్ధాయికి చేరిందన్న నివేదికను విడుదల చేయకుండా తొక్కి పట్టటాన్ని , జిడిపి గణాంకాలను ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వ సమాచారాన్ని నమ్మటానికి లేదనే నిర్ధారణకు రాయిటర్స్‌ వచ్చింది. ఈ కారణంగానే తాము ప్రత్యాయమ్నాయ సమాచార వనరులపై ఆధారపడేందుకు ప్రయత్నిస్తున్నామని రాయిటర్స్‌ విలేకర్లు ఇంటర్వ్యూలు చేసిన ఆర్ధికవేత్తలు, బ్యాంకుల విశ్లేషకులు, మేథావులు చెప్పారు.
దేశ జిడిపి వృద్ధి రేటు పడిపోతున్నది. ఎనిమిదిశాతంగా ఉన్నది ఈ ఏడాది రెండవ త్రైమాసంలో ఐదు శాతానికి పడిపోయినట్లు, నిరుద్యోగులు పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి.2020 ఆర్ధిక సంవత్సరంలో ముందుగా అంచనా వేసిన వృద్ధి రేటు 6.8శాతానికి బదులు 6.1శాతానికి మించకపోవచ్చునని రిజర్వుబ్యాంకు జోశ్యం చెప్పింది. వినిమయంపై జనాల ఖర్చు పడిపోవటం ఆందోళన కలిగిస్తోందని జాతీయ గణాంక సంస్ధ సర్వే చెప్పింది. నాలుగు దశాబ్దాల తరువాత ఆహార వినియోగం తగ్గిపోయిందని, దేశం పోషకాహారలేమి వైపు పయనిస్తోందని, వినిమయం తగ్గటం అంటే దారిద్య్రంలోకి జారుతున్న జనం పెరుగుదలను సూచిస్తోందని గణాంకాలు వెల్లడించాయి.1972-73లో కంటే వినిమయ ఖర్చు తగ్గిపోయింది. అప్పుడు వినిమయ ఖర్చు తగ్గుదలకు చమురు ధరల పెరుగుదలను కారణంగా చెప్పారు. ఎన్‌ఎస్‌ఓ తాజా నివేదికను తొలుత సర్కార్‌ బయటకు రాకుండా తొక్కి పెట్టింది. అది ఎలాగో బయటికి వచ్చింది, దాంతో గణాంకాల ప్రమాణాల మీద అనుమానాలు వున్నాయని, ఇది ముసాయిదా తప్ప నిర్ధారించినది కాదని ప్రభుత్వం ప్రకటించింది. అంటే మోడీ సర్కార్‌ అచ్చేదిన్‌ బండారాన్ని ఎండగట్టింది కనుక అంకెలను మార్చి అంతా బాగుంది అని విడుదల చేస్తారా ?
2011-12లో గ్రామీణులు సగటున నెలకు ఆహారం మీద రూ.643 ఖర్చు చేస్తే 2017-18లో రూ.580కి తగ్గింది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో మాత్రం రూ.943 నుంచి 946కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా వినిమయ ఖర్చు ఇదే కాలంలో 8.8శాతం పడిపోగా, పట్టణాల్లో రెండుశాతం పెరిగింది. ఆహారం మీద వినియోగం తగ్గటం అంటే పోషకాహారలేమి పెరగటానికి ఒక సూచిక. ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం అధమ స్ధానంలో ఉంది. ఎన్నో విజయాలు సాధించామని సులభరత వాణిజ్య సూచిక మెరుగుదల గురించి పదే పదే చెబుతున్న నరేంద్రమోడీ వంది మాగధులు దీని గురించి మాట్లాడరు.2014లో 76దేశాల వివరాలను విశ్లేషించగా మన దేశం 55వ స్ధానంలో ఉంది. 2019లో 117 దేశాల్లో 102వ స్ధానంలో ఉంది. అంటే దేశంలో ఆకలి పెరిగిందని స్పష్టంగా చెబుతోంది. అయితే దీనిలో అనేక తప్పులు ఉన్నాయని, వాస్తవ పరిస్ధితిని ప్రతిబింబించలేదని నీతి ఆయోగ్‌ నిపుణులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్ధలు అనుసరించే పద్దతులు అనేక సందర్భాలలో మారుతున్నాయి. ఆ మేరకు మన దేశానికి వచ్చిన పాయింట్లలో ఒక ఏడాది నివేదికకు మరొక ఏడాది దానికి పొంతన ఉండటం లేదన్నది విమర్శ. గణాంక పద్దతులు ఏడాది కేడాది మారవచ్చు తప్ప దేశానికి దేశానికి మారవు. తప్పులుంటే అన్ని దేశాల సూచికల మీద ప్రతిబింబిస్తాయి. మన పరిస్ధితి గత ఐదు సంవత్సరాల్లో మెరుగుపడిందో లేదో చెప్పకుండా లెక్కల్లో తప్పులని తప్పించుకో చూస్తున్నారు.

Image result for narendra modi credibility  crisis
నిజానికి దేశంలో ఆర్ధిక పరిస్ధితి దిగజారుడు యుపిఏ చివరి రోజుల్లోనే ప్రారంభమైంది. అయితే దాని పాలనా కాలంలో జరిగిన భారీ కుంభకోణాల మీద ప్రతిపక్షాల, మీడియా దాడి కేంద్రీకృతం కావటంతో జనంలో పెద్దగా చర్చ సాగలేదు. విసిగిపోయి ఉన్న జనం నరేంద్రమోడీ ఆకర్షక నినాదాలతో పట్టం కట్టారు. గత ఐదు సంవత్సరాల కాలంలో చమురు ధరల భారీగా పడిపోయిన కారణంగా ఖజానాకు ఎంతో మిగులుతో పరిస్దితి తొలి రోజుల్లో స్ధిరంగా ఉంది. అయితే చమురు ధరలు ఒక స్ధితికి చేరిన తరువాత తిరిగి అన్ని రంగాల దిగజారుడు ప్రారంభమైంది. వాటిని మూసిపెట్టి భావోద్వేగాల మీద జనం దృష్టిని మళ్లించి, ఇతర అంశాలను ముందుకు తెచ్చి రెండవసారి అధికారానికి వచ్చారు.
ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. పియూష్‌ గోయల్‌, రవిశంకర ప్రసాద్‌, సురేష్‌ అంగాడీ, నిర్మలా సీతారామన్‌ వంటి వారు అలా మాట్లాడటానికి కారణాలను విస్మరించకూడదు. అలాంటి ప్రకటనలు చేయాలని స్వయంగా నరేంద్రమోడీయే దారి చూపారంటే ఆయన భక్తులకు కోపం రావచ్చు. భిన్నమైన ఫలితాలు రావాలని కోరుకుంటూ ఒకే పనిని పదే పదే చేయటం గురించి ఐనిస్టీన్‌ ఒక సందర్భంగా చెప్పారు. కొందరు ఏదీ నేర్చుకోరు, దేన్నీ మరచిపోరు అన్న విషయం కూడా తెలిసిందే. (ముగింపు రెండవ భాగంలో )

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయోధ్య తీర్పు : అనంతర దృశ్యాలు ?

10 Sunday Nov 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ayodhya verdict, economic challenges before narendra modi, Narendra Modi, post ayodhya verdict, probable scenario of the post ayodhya verdict

Image result for economic challenges before narendra modi

ఎం కోటేశ్వరరావు
అయోధ్య బాబరీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒక తీర్పు వెలువరించింది. నిజానికి ఆ కేసు రాముడు ఎక్కడ జన్మించాడు అన్నది కాదు, వివాదాస్పద రెండు ఎకరాల 77సెంట్ల భూమి మీద హక్కులకు సంబంధించిన వాజ్యం మీద అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద దాఖలైన పునర్విచారణ అంశం. దానికి పరిమితం కాకుండా విశ్వాసాలను కలగలపి ప్రభుత్వ భూమి గనుక రాముడికి కేటాయిస్తూ ఇచ్చిన తీర్పు. సరే దీని పర్యవసానాలు, పరిణామాలు ఎలా ఉంటాయన్నది రాబోయే రోజుల్లో నిపుణులు చర్చిస్తారు. ఒక్క ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తప్ప మిగిలిన ముస్లిం సంస్ధలన్నీ కొన్ని మినహాయింపులతో అయినా తీర్పును స్వాగతించాయి. పునర్విచారణ పిటీషన్‌ దాఖలు చేయాలా లేదా అన్నది త్వరలోనే ముస్లిం పర్సనల్‌ లాబోర్డు నిర్ణయిస్తుంది. పిటీషన్‌ దాఖలు చేస్తే ఈ వివాదం మరికొంతకాలం సాగుతుంది. లేకపోతే ఇంతటితో ముగుస్తుంది. న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు తప్ప తీర్పు మంచి చెడ్డల గురించి చర్చించే అవకాశం ఇంకా మన దేశంలో మిగిలే ఉంది కనుక ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. సద్వివిమర్శనాత్మక వైఖరి ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్ధలను మరింత పటిష్ట పరుస్తుందే తప్ప ప్రపంచంలో ఎక్కడా దెబ్బతీసిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వ విధానాలను విమర్శించటం కూడా దేశద్రోహమే అన్న వైఖరి రోజురోజుకూ పాలకుల్లో బలపడుతున్న కారణంగా ఈ స్వేచ్చ ఎంతకాలం ఉంటుంది అన్నది ఊహాజనితమైన ప్రశ్న.
చరిత్రలో ప్రతి ముగింపు మరో దానికి నాంది కావటాన్ని అనేక పరిణామాల్లో చూశాము. సుప్రీం కోర్టు ఎవరికి ఎలా కనిపించినా అది ఒక నూతన అధ్యాయానికి తెర తీసింది అన్నది నిర్వివాదం. గతంలో అనేక ముఖ్య అంశాలపై ఇచ్చిన తీర్పులు వాటి స్వభావాన్ని బట్టి న్యాయమూర్తుల మీద పూలూ రాళ్లూ కూడా పడ్డాయి. మహాత్మా గాంధీ ప్రస్తావన వచ్చినపుడు ఆయన హంతకుడైన హిందూ మతోన్మాది గాడ్సే పేరును తలవకుండా ఉండలేము కదా ! చరిత్ర పేజీలో ఎవరి అవగాహన మేరకు వారు రాసేందుకు అవకాశం ఉంది కనుక దీని గురించి కూడా అదే జరుగుతుంది. అయోధ్యపై సుప్రీం తీర్పు గురించి గాంధీ ముని మనవడు తుషార్‌ గాంధీ వ్యాఖ్యానిస్తూ మన న్యాయవ్యవస్ధలో విశ్వాసానికి సంబంధించిన నేరం కూడా చేరిందని, మహాత్మాగాంధీ హత్యకేసును ఇప్పుడు గనుక సుప్రీం కోర్టు పునర్విచారణ జరిపితే గాడ్సే హంతకుడే అయితే అతను దేశభక్తుడు కూడా అని తీర్పు చెప్పి ఉండేవారు అని వ్యాఖ్యానించాడు. దీనికి టీకా, తాత్పర్యాలు చెబితే అంత బాగోదు ! అయోధ్య తీర్పు అనంతరం ఏమి జరుగుతుంది ?

పునర్విచారణలో తీర్పును కొట్టి వేస్తే ?
ముస్లిం పర్సనల్‌ లా బోర్డు పునర్విచారణ కోరితే ఐదుగురు సభ్యుల బెంచ్‌ లేదా అంతకంటే ఎక్కువ సభ్యుల బెంచ్‌ గానీ దానిని విచారణ చేయవచ్చు. కోర్టు తీర్పులను ఊహించలేము గనుక పునర్విచారణలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసి పుచ్చ వచ్చు లేదా నిర్ధారించనూ వచ్చు, నిర్దారణ ఏక గ్రీవం కావచ్చు లేదా మెజారిటీ ప్రకారమూ కావచ్చు. ఒక వేళ ఇప్పుడిచ్చిన తీర్పును కొట్టి వేసి కొత్త తీర్పు ఇస్తే అది కేంద్రంలో ఉన్న పాలకపక్షానికి అంగీకారం కానట్లయితే ? గతంలో షాబానో కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ సర్కార్‌ మైనారిటీలను సంతృప్తి పరచేందుకు పార్లమెంట్‌ ద్వారా ఆ తీర్పును రద్దు చేసింది. ఇప్పుడు బిజెపి సర్కార్‌కు నచ్చని తీర్పు వస్తే అదేపని చేసి మెజారిటీ పజానీకాన్ని సంతృప్తి పరచవచ్చు.
విశ్వాసాల ప్రాతిపదికన కొత్త డిమాండ్లను ముందుకు తెస్తే ?
ఒక్క అయోధ్య వివాదం తప్ప మిగిలిన ప్రార్ధనా స్ధలాలు 1947 ఆగస్టు 15 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చిన సమయానికి ఏ స్ధితిలో ఉన్నాయో వాటిని అదే విధంగా ఉంచాలని 1991లో కేంద్ర ప్రభుత్వం ప్రార్దనా స్ధలాల ప్రత్యేక అంశాల చట్టం నిర్దేశిస్తోంది. దాని ప్రకారం అప్పటి వరకు ఉన్న కేసులను కోర్టుల నిర్ణయానికి వదలి వేయాలి. మిగతా వాటిని వివాదం చేయటానికి లేదు. దానికి అనుగుణ్యంగానే అయోధ్య కేసును కోర్టు నిర్ణయానికి వదలివేశారు. అయోధ్య తీర్పు ప్రాతిపదికన మధుర, కాశీలోని మసీదులను కూడా దేవాలయాలను కూల్చి నిర్మించినవే అని లేదా లేదా ఇతర ప్రార్ధనా స్దలాల గురించి వివాదాలను ముందుకు తెచ్చినా కోర్టులలో చెల్లవు.
అయితే ఈ చట్టానికి సవరణలు లేదా రద్దు జరగనంత వరకు మాత్రమే ఆ స్ధితి కొనసాగుతుంది. ఒక వేళ ప్రస్తుత పాలకులు లేదా తరువాత వచ్చే వారు గానీ దాన్ని సవరిస్తే ఏమిటి ? ప్రస్తుతం ఊహాగానంగా లేదా మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఎవరైనా అనుకోవచ్చు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అని సుప్రీం కోర్టు గతంలో తీర్పు చెప్పినప్పటికీ దాన్ని పక్కన పెట్టి తన రాజకీయ అజెండాకు అనుకూలంగా బిజెపి ఒక మౌలిక లక్షణమైన ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తీరు చూసిన తరువాత ఏ రాజకీయ పార్టీ అయినా తన రాజకీయ అజెండాకు అనుగుణంగా ఏ చట్టాన్ని అయినా మార్చే అవకాశం ఉంటుంది అన్నది స్పష్టమైంది. అనేక దేశాలలో పాత రాజ్యాంగాలను మార్చి కొత్త వాటిని ఉనికిలోకి తీసుకు వచ్చారు. ఎన్నడో మధ్యయుగాల్లో, అంతకు ముందో యూదులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పేరుతో ఇజ్రాయెల్‌ అనే దేశాన్నే ఐక్యరాజ్యసమితి సృష్టించటాన్ని చూశాము. అదే పేరుతో చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే పేరుతో మన రాజ్యాంగాన్ని మార్చి తమ అజెండాను అమలు చేసేందుకు పూనుకోరు అన్న హామీ ఎక్కడుంది.

సంఘపరివార్‌ హిందూత్వ అజెండా పూర్తి అయినట్లేనా ?
మన దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్నది హిందూత్వశక్తుల లక్ష్యం. అందుకు గాను ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగంగా జనసంఘాన్ని ఏర్పాటు చేసింది. తరువాత దాన్ని జనతా పార్టీలో విలీనం చేసింది. దాన్నుంచి విడదీసి భారతీయ జనతా పార్టీగా మార్చింది. రాజకీయ, ఇతరంగా ఏర్పాటు చేసిస సంస్దల ద్వారా జన సమీకరణకు ఎంచుకున్న అనేక అంశాలలో ఆర్టికల్‌ 370, రామజన్మభూమి, ఉమ్మడి పౌరస్మృతి. వీటిలో రెండింటిని పూర్తి చేశారు.మూడవ దానిని కొంత చేశారు. ఒకసారి వివాదాస్పద అంశాలు పూర్తి అయిన తరువాత అజెండా అయిపోయింది కనుక దుకాణాన్ని మూసుకుంటారు అనుకుంటే పొరపాటు. గుళ్లకు, ఇళ్లకు పరిమితం కావాల్సిస దేవుళ్లను వీధుల్లోకి తీసుకు వచ్చారు. ఇంకా అనేక వివాదాస్పద అంశాల గురించి మాట్లాడుతున్నందున వాటిని ఏ రూపంలో ముందుకు తీసుకు వస్తారో చూడాల్సి ఉంది.

Image result for economic challenges before narendra modi
అయోధ్య తీర్పు అనంతర పర్యవసానాలు ఏమిటి ?
దేశంలో మతాలను నమ్మే వారు, నమ్మని వారు కూడా మతం,ఆలయం, మసీదుల పేరుతో జరిగిన రాజకీయాలు, మారణకాండలను చూసి ఏదో ఒక పరిష్కారం కావాలని కోరుకున్నారు. పెద్ద మనుషుల మాదిరి రెండు పక్షాలను సంతృప్తి పరచేందుకు ఇచ్చిన తీర్పుగా చూసి జనంలో కూడా ఒక సంతృప్తి వ్యక్తం అవుతోంది. మొత్తంగా చూసినపుడు 370 అర్టికల్‌ కంటే రామజన్మభూమి ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే సదరు ఆర్టికల్‌ కాశ్మీర్‌కు చెందినదిగా భావిస్తే రాముడు అనే దేవుడి ఆలయం హిందువులందరూ తమదిగా భావించే స్ధితికి తీసుకువచ్చారు. అది ఒక కొలిక్కి వచ్చింది కనుక. జనం ఇప్పుడు తాము ఎదుర్కొన్న అసలు సమస్యల మీద దృష్టి కేంద్రీకరించే పరిస్ధితులు ఏర్పడతాయి.
అలా కేంద్రీకరించకపోతే జనమే నష్టపోతారు, కేంద్రీకరిస్తే బిజెపి నష్టపోతుంది. నరేంద్రమోడీ కల్పించిన భ్రమల తీవ్రత కారణంగా మూడు సంవత్సరాల క్రితం పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన వారిని దేశద్రోహులు అన్నట్లుగా చూశారు. నోట్ల మార్పిడి, బ్యాంకుల్లో వున్న సొమ్ము కోసం పని పాటలు మాని బ్యాంకుల వద్ద బారులు తీరటాన్ని దేశభక్తియుతమైనదిగా పరిగణించారు. మూడేండ్ల క్రితం రొమ్ము విరుచుకొని మతి మాలిన ఆ చర్యను సమర్ధించిన వారిలో ఇప్పుడా పరిస్ధితి లేదు. పకోడీలు అమ్ముకోవటం కూడా ఉపాధి కల్పనే అన్న మోడీ మాటను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సమర్ధించేవారిని జనం అపహాస్యం చేస్తారు.

ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరపడుతుందా !
రాజకీయ, సామాజిక అంశాలలో వివాదాస్పద అంశాలను ముందుకు తీసుకురావటంలో, అధికారాన్ని పొందటంలో బిజెపి-కాంగ్రెస్‌ ఇతర ప్రాంతీయ పార్టీల మధ్య వివాదాలు, విబేధాలు ఉన్నాయి తప్ప విధానాల పరంగా వామపక్షాలు మినహా అన్నీ ఒక్కటే. మైనారిటీలను ఓటు బ్యాంకుగా చేసుకొనేందుకు కాంగ్రెస్‌ రాజకీయాలు చేసింది. మెజారిటీ జనంతో ఓటు బ్యాంకు ఏర్పాటుకు బిజెపి తెరతీసింది. అంతకు మినహా ఆర్ధిక విషయాల్లో వాటికి తేడా లేదా పంచాయితీ లేదు. అమలు జరపటంలో పోటీ పడుతున్నాయి. ఆవిధానాలే భారీ కుంభకోణాలు, అవినీతి అక్రమాలకు, జన జీవితాలు అతలాకుతలం కావటానికి తద్వారా కాంగ్రెస్‌, కొని ప్రాంతీయ పార్టీల పతనానికి దారి తీశాయి. బిజెపి విషయంలో కూడా అది జరగటానికి ఎంతో సమయం పట్టదు. అచ్చే దిన్‌ బదులు మోడీ విధానాలు జనాలు చచ్చే దినాలకు దారి తీశాయని, రోజు రోజుకూ ముదురుతున్న ఆర్ధిక మందగమనం వెల్లడిస్తోంది. ఆటోమొబైల్‌ రంగంలో కొనుగోళ్లు పడిపోయాయంటే జనం కొత్త మోడళ్ల కోసం కొనుగోలు వాయిదా వేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు రోజువారీ వినియోగ వస్తువుల కొనుగోళ్లు, విదేశాల నుంచి దిగుమతులు కూడా పడి పోయాయని వస్తున్న వార్తలకు ఏ సాకు చెబుతారు? అక్టోబరు నెలలో నిరుద్యోగం 8.5శాతానికి పెరిగింది. అంటే మరింత మెరుగైన వాటికోసం జనాలు ఉద్యోగాల్లో చేరటం లేదని సిద్ధాంతీకరిస్తారా ? పని పాటలు లేని యువత కొంత భాగం పక్కదారి పట్టటమే కాదు, సరైనదారి కోసం కూడా ఆలోచించేది కూడా యువతే. ప్రస్తుతం అనేక దేశాల్లో జరుగుతున్న ఆందోళనలో ముందుంటున్నది వారే. ఆ ధోరణి నుంచి మన దేశం ఎలా తప్పించుకోగలదు ? కొందరిని కొంతకాలం మభ్యపెట్టగలరు గానీ అందరినీ ఎలా కాలం మోసగించలేరుగా !

బిజెపి చెబుతున్న జాతీయ వాదం పర్యవసానాలు ఏమిటి ?
బిజెపి ముందుకు తెచ్చిన హిందూత్వ అజెండాలో భాగమే జాతీయ వాదం. ఏ దేశమైనా కుంభకోణాలు, అవినీతి మయంగా మారినపుడు, పాలకుల విధానాల వైఫల్యాలతో ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు జాతీయ వాదాలను, ప్రజాకర్షక నినాదాలను ముందుకు తేవటం సులభం. అయితే అవి ఎక్కువ కాలం పని చేయవన్నది అంతర్జాతీయ అనుభవం. ఒక దేశం వాటికి దూరంగా ఉండజాలదు. బిజెపి నేతలు ఒక వాదనను ముందుకు తెచ్చారు. మేము ముస్లింలందరినీ ఉగ్రవాదులు అనటం లేదు గానీ, ఉగ్రవాదులంతా ముస్లింలే ఉన్నారు అని చెబుతారు. ఇప్పుడు మన జనం నోళ్లలో నానుతున్న అంశం ఏమంటే పాకిస్ధాన్‌ నుంచి యుద్ధం, ఉగ్రవాద చర్యలు అందరికీ తెలిసినవే గానీ అదేమిటో బిజెపి అధికారంలో ఉన్నపుడు సరిగ్గా అవి ఎన్నికల ముందే జరుగుతున్నాయి అనే చర్చ ప్రతి ఉదంతం సందర్భంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే వాటిని ఆ పార్టీ ఎన్నికల అస్త్రాలుగా, మనోభావాలను రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్న తీరు చూసిన తరువాత బిజెపి అభిమానుల్లో కూడా నాటుకున్న అనుమానం అదే. జాతీయ వాదం పులి స్వారీ వంటిది. పులినెక్కిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేదా దానికే బలి కావాలి. నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించకుండా జాతీయ వాదాన్ని తిని, జాతీయవాదాన్ని చెప్పి, జాతీయ వాదాన్ని పీల్చి బతకమంటే కుదిరేది కాదు.

కిన్లే బదులు ఆవు మూత్రం తాగి, బాబా గారి సబ్బుల బదులు ఆవు పేడతో స్నానం చేస్తామా ?
దేశభక్తి అంటే ఆవు మూత్రం, ఆవు పేడలో సుగుణాలను అంగీకరించటంగా తయారైంది. నిజానికి అలా చెప్పే వారు రోజూ గోమూత్రం తాగుతూ సబ్బుల బదులు ఆవు పేడతో స్నానం చేస్తున్నారా ? ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ! ప్రధాని నరేంద్రమోడీ గారూ, వారి పార్టీ నేతలూ కాంగ్రెస్‌ 50 ఏండ్లలో సాధించలేని వాటిని మేము ఐదేండ్లలో సాధించాం అని వూరూ వాడా ఎన్నికల ప్రచారం చెశారు. రెండోసారి అధికారానికి వచ్చాక 70 ఏండ్లుగా చేయలేని దానిని 70 రోజుల్లో చేశాం అన్నారు. నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ సరిగ్గా ఈ సమయంలోనే 70 సంవత్సరాలలో ఎన్నడూ తలెత్తని అసాధారణ పరిస్ధితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు.
ఆరు సంవత్సరాల క్రితం అంటే 2012, 2013లో రూపాయి విలువ పతనంతో ధరలు పెరుగుతాయని మిగతా వారంతా ఆందోళన పడుతుంటే ‘నేనూ పాలనలోనే వున్నాను(ముఖ్యమంత్రిగా) ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోకూడదని నాకు తెలుసు, ఈ విధంగా పతనం కావటానికి కారణం ఏమై వుంటుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం కావాలని దేశం డిమాండ్‌ చేస్తోంది.రూపాయి ఈ రోజు ఆసుపత్రిలో వుంది, జీవన పోరాటం చేస్తోంది, అని మన్మోహన్‌ సింగ్‌ గురించి నరేంద్రమోడీ అన్నారు. గతేడాది గరిష్టంగా రికార్డు స్ధాయిలో ఒక రోజు రూపాయి విలువ 74.48కి పడిపోయింది. ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రూపాయి విలువ పతనం వార్త సందర్భంగా ‘ కాలం మారింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోంది. ఆయనేమీ చెప్పటం లేదు’ అన్నారు.

Image result for economic challenges before narendra modi
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడితే ….. ?
నల్ల ధనం దేశం నుంచి బయటకు పోతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతున్నదని 2018 సెప్టెంబరు 23న గోవాలో జరిగిన ఒక సభలో బిజెపి నేత సుబ్రమణ్య స్వామి చెప్పారు. అమెరికా డాలరుతో మన రూపాయి విలువ పతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నల్లధనం దేశం నుంచి బయటకు పోతున్నది, రూపాయల సరఫరా ఎక్కువైనపుడు విలువ పతనం అనివార్యం. ‘ అన్నారు. యుపిఏ హయాంలో రూపాయి విలువ పతనం భయానకం అన్న అరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా మాట్లాడుతూ ‘ ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివ ద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ గనుక మనం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు ‘ అన్నారు.
స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ 4.16 అంటే సుబ్రమణ్య స్వామి తర్కం ప్రకారం ఆ రోజు నల్లధనం బాగా వున్నట్లు, అది క్రమంగా తగ్గుతూ వున్న కారణంగా 2004లో 45.32కు పడిపోయింది. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది విలువ 66.46 అంటే అప్పటికి ఇంకా నల్లధనం తగ్గిపోయింది లేదా బయటకు పోయింది. 2018లో 70.09కి చేరింది. అంటే పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా వున్నట్లే, ఇప్పుడు 72రూపాయలకు చేరింది కనుక నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా పెరిగినట్లే కదా ! బిజెపి వారు ఎది చెబితే అదే దేశ భక్తి, అదే జాతీయవాదం, అదే ఆర్ధశాస్త్రం. దాన్ని నమ్మిన ఆమోదించిన వారు దేశభక్తులు, కాని వారు దేశద్రోహులు. నాడు బ్రిటీష్‌ వారి ద ష్టిలో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు వంటి వారందరూ దేశ ద్రోహులే. ఇప్పుడు బిజెపి చెప్పేదాన్ని అంగీకరించని వారందరూ దేశ ద్రోహులే.
సంవత్సరం -రూపాయి సగటు విలువ

2004 45.32

2005 44.10

2006 45.31

2007 41.35

2008 43.51

2009 48.41

2010 45.73

2011 46.67

2012 53.44

2013 56.57

2014 62.33

2015 62.97

2016 66.46

2017 67.79

2018 70.09
2019 70.31 (జనవరి నుంచి నవంబరు పదవ తేదీ వరకు సగటు విలువ)

నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం నమ్మని రోజులు రాబోతున్నాయి. యుపిఏ పదేండ్ల కాలంలో రూపాయి విలువ ఏడాది సగటు 47.04గా వుంది. అదే నరేంద్రమోడీ 2014-19 మధ్య 66.65కు పతనమైంది. రామాలయ సమస్య ఒక కొలిక్కి వచ్చింది కనుక అప్రకటిత కర్ఫ్యూ, ఆంక్షలతో మూతవేసిన కాశ్మీరును ఎప్పుడు తెరుస్తారు, నిరుద్యోగాన్ని కనీసం ఆరేండ్ల స్ధాయికి ఎప్పుడు తగ్గిస్తారు వంటి ప్రశ్నలన్నీ ఎదురు కానున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆవు కాదు, గాడిద పాలు ‘ బంగారం ‘ !

08 Friday Nov 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP Delip Ghosh, BJP pseudoscience, Cow Milk, Donkey Milk, pseudoscience

Image result for not cow, donkeys milk is gold

ఎం కోటేశ్వరరావు
బిజెపి నేతలు తమ అగ్రజుడు నరేంద్ర మోడీకి నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే సైన్సు గురించి తాను మాట్లాడి, అనుచరులు కూడా ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడే స్వేచ్చ ఇచ్చారు కదా ! ఆవు పాలల్లో బంగారం ఉందని చెప్పిన బెంగాల్‌ బిజెపి నేత దిలీప్‌ ఘోష్‌ అపర ‘దేశభక్త’ తెగ తండాలో ఉన్నారు కనుక సరిపోయింది.అదే ఆవు దాని పాలు, మూత్రం, పేడ గురించి ఇతర తెగ వారు ఏమైనా మాట్లాడి ఉంటే ….. ?
ఆవు పాలల్లో బంగారం ఉందని చెప్పటంతో బెంగాల్లో ఒక రైతు తన రెండు ఆవులను మనప్పురం బంగారం తాకట్టు కార్యాలయానికి తీసుకుపోయి వాటిని తాకట్టుపెట్టుకొని రుణం ఇవ్వాలని కోరాడట. తనకు ఇరవై ఆవులున్నాయని, రుణం ఇస్తే వ్యాపారాన్ని పెంచుకుంటానని కూడా ప్రాధేయపడ్డాడట. ఆవు పాలల్లో బంగారం లేదు, ఆవులను తాకట్టుపెట్టుకొని ఎవరూ రుణాలు ఇవ్వరని తన దగ్గరకు ఆవులతో సహా వచ్చి తమ ఆవులు రోజుకు 15-16 లీటర్ల పాలు ఇస్తాయని వాటికి ఎంత రుణం వస్తుందంటూ అడుగుతున్న రైతాంగానికి నచ్చచెప్పలేక చస్తున్నానని బెంగాల్‌ హుగ్లీ జిల్లా గార్‌లగ్‌చా పంచాయతీ అధ్యక్షుడు మనోజ్‌ సింగ్‌ వాపోయారు. ఈ పరిస్ధితికి కారకుడైన బిజెపినేత దిలీప్‌ సింగ్‌కు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని, ఇదంతా విన్న తనకు ఎంతో సిగ్గుగా ఉందని కూడా అన్నాడు.
బర్ద్వాన్‌ జిల్లాలో ఒక సభలో మాట్లాడిన దిలీప్‌ ఘోష్‌ భారతీయ ఆవులకు మూపురాలు ఉంటాయి, విదేశీ ఆవులు గేదె(బర్రెలు)ల వంటివి. మూపురాల్లో ఒక నరం ఉంటుంది దాన్ని స్వర్ణనారి అంటారు. దాని మీద వెలుగు పడగానే బంగారం తయారవుతుంది. అందువల్లనే ఆవు పాలు పచ్చగా లేదా బంగారం రంగులో ఉంటాయి. ఇలాంటి ఆవు పాలు రోగనిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. మరొక పదార్ధమేదీ తినకుండా కేవలం ఈ పాలు తాగి బతకవచ్చు, ఇది సంపూర్ణ ఆహారం అని దిలీప్‌ ఘోష్‌ చెప్పారు. ఇంకా నయం మూపురాలు హిందూ ఆవులకు మాత్రమే ఉంటాయని చెప్పలేదు. అంతే కాదు ఆవులను చంపటం, పవిత్ర భారత భూమిలో గొడ్డు మాంసం తినేవారిని సంఘవ్యతిరేక శక్తులుగా పరిగణిస్తాం. కొంత మంది మేథావులు రోడ్ల మీద గొడ్డు మాంసం తింటారు, వారు కుక్క మాంసం కూడా తినాలని చెబుతున్నాను నేను, ఏది కావాలనుకుంటే దాన్ని ఇండ్లలో తినమనండి, రోడ్ల మీద ఎందుకు ? ఆవు మన తల్లి వంటిది, ఎవరైనా నా తల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని ఏమి చెయ్యాలో అదిచేస్తా. దేశీ ఆవులు మాత్రమే మన తల్లుల వంటివి విదేశీవి కాదు. విదేశీ భార్యలను జెర్సీ ఆవులతో పోల్చుతూ కొందరు విదేశీ భార్యలను తెచ్చుకుంటారు, వారంతా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు అని కూడా సెలవిచ్చారు.
బిజెపి దాని మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ దేశాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నది. శాస్త్రవేత్తలకు ఏమైంది అన్నది ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ నెల మొదటి వారంలో కొల్‌కతాలో జరిగిన ఐదవ భారత అంతర్జాతీయ సైన్స్‌ ఉత్సవాన్ని ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్సుద్వారా ప్రారంభించారు.అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఉన్న ఆ సమావేశంలో మోడీ ప్రసంగం సందర్భంగా జై శ్రీరామ్‌ అనే నినాదాలు చేయటం, వారిని అడ్డుకున్నవారు లేకపోవటం నిజంగా ఆందోళనకరమే. శాస్త్రవేత్తలైనా మరొకరు ఎవరైనా జై శ్రీరామ్‌ నినాదాలు లేదా భజనలు చేయదలచుకుంటే అందుకు వేరే స్ధలాలు, సందర్భాలు లేవా ?
వేల సంవత్సరాల నాడే ఇంథనంతో నిమిత్తం లేకుండా, పైకి కిందికి ఎలా కావాలంటే అలా ఎగిరే, ఎంత మంది ఎక్కినా మరొకరికి సీటు దొరికే విమానాలు ఉన్నాయని, మనిషికి ఏనుగు తలను అతికించిన పరిజ్ఞానం మన దగ్గర ఎప్పుడో ఉందని చెప్పిన వారిని మన శాస్త్రవేత్తలు గట్టిగా ఎదుర్కొని ఉంటే దిలీప్‌ ఘోష్‌ వంటి వారు ఆవు పాలల్లో బంగారం గురించి , మరొకరు మరొక ఆశాస్త్రీయ అంశం గురించి చెప్పి ఉండేవారా ? ఇలాంటి వాతావరణంలో మన భావి భారత పౌరులు ఏమి నేర్చుకుంటారు? కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి, అనురక్తి ఎలా కలిగి ఉంటారు. మన దేశాన్ని ఎటువైపు తీసుకుపోవాలనుకుంటున్నారు? సమాజంలో మత ఛాందసాన్ని నింపిన అనేక దేశాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాము, వాటి సరసకు మనలను తీసుకుపోతున్నారు. ఇదే దేశభక్తి అని చెబుతున్నారు. వినాయకుడు పాలు తాగాడంటే గుడ్డిగా నమ్మిన జనాన్ని చూశాము. ఆధునిక ఆవిష్కరణలు, రోబోట్స్‌తో సహా అనేకం మన ప్రాచీన గ్రంధాలలో ఉన్నాయని సభలు పెట్టి మరీ సంఘపరివారం ప్రచారం చేయటాన్ని చూశాము.
బిజెపి నేతలు లేదా ప్రవచన కారులు, ఇతర ప్రముఖులు చెప్పే ఆశాస్త్రీయ అంశాల గురించి నవ్వుకొని వదలి వేస్తున్నారు చాలా మంది. కానీ దీర్ఘకాలంలో అవి చేసే హాని, పర్యవసానాల గురించి ఆలోచించటం లేదు. ఏదో కొంత నిజం లేకపోతే శాస్త్రవేత్తలందరూ ఎందుకు వ్యతిరేకించటం లేదు అనే అర్ధం లేని తర్కంతో నమ్మటమే కాదు, వారే ప్రచారకర్తలుగా మారతారు. ఆవు మూత్రం, పేడ గురించి ఎలా నమ్ముతున్నారో, వాట్సాప్‌లో తిరుగుతున్న అసంబద్ధ సమాచారానికి కారణమిదే. ఇలాంటి సమాచారాన్ని ఎండగట్టే వారు సమాజంలో ఉన్నప్పటికీ అది నిరంతర ప్రక్రియగా సాగటం లేదు. మనం అటువంటి మూర్ఖత్వానికి లోను కాలేదుగా అని తగినంతగా ముందుకు రావటం లేదు.

Image result for not cow, donkeys milk is gold
ఇక దిలీప్‌ ఘోష్‌ గారి పరిజ్ఞానం గురించి చూద్దాం. ఆవు పాలైనా గాడిద పాలైనా పాలు పాలే, ఒకదానిలో బంగారం మరొకదానిలో మట్టి ఉండదు, నిజానికి లీటరు నాలుగువేల రూపాయల వరకు పలుకుతున్న గాడిద పాలే బంగారంతో సమానం అంటే ఆశ్చర్యపడవద్దు. ఇలా చెప్పిన వారిని గోమాతను అవమానిస్తున్నారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు, హైందవ ద్రోహులు, దేశద్రోహులు అని జై శ్రీరాం నినాదాలతో ఎదురు దాడికి దిగినా ఆశ్చర్యం లేదు. అలవిగానివిగా ఉన్న ఆవులు, గాడిదలు రెండింటినీ ముందుగా మచ్చిక చేసుకొని పెంపకం మొదలు పెట్టింది ఆఫ్రికా,ఐరోపాలోని నేటి ముస్లిం దేశాలతో కూడిన ప్రాంతంలో అంటే కొంత మందికి ఏమౌతుందో తెలియదు. కనుక వారి మీద దయతో ఇంతటితో వదలివేద్దాం.
ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ(ఎఫ్‌ఏఓ) ప్రకారం గాడిద పాలు కూడా తల్లిపాలవంటివే.విలువైన విటమిన్స్‌, ఫాటీ యాసిడ్స్‌ ఉన్నాయని, కొన్ని ప్రత్యేక పోషకాహార ఉపయోగాలున్నాయని చెప్పిన అంశంతో ఏకీభవిస్తారా లేకపోతే గాడిద అని తృణీకరిస్తారా ? గాడిదలకూ మనోభావాలు ఉంటాయి, అవి తమవైన శైలిలో తన్నకుండా చూసుకోవాలి మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపి ఒప్పందం : కర్షకులకు కాస్త మోదం -కార్మికులకు తీవ్ర ఖేదం !

07 Thursday Nov 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Labour Reforms INDIA, Labour reforms RCEP, RCEP Farmers, RCEP INDIA, RCEP workers

Image result for rcep
ఎం కోటేశ్వరరావు
‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం చేరుతుందా లేదా అన్న అంశంపై చివరి క్షణం వరకూ ఉత్కంఠకు గురి చేసి ఇప్పటికైతే చేరటం లేదు అని ప్రధాని నరేంద్రమోడీ దానికి తెరదించారు.మన వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యానికి హాని కలిగించే తద్వారా మన ఆర్ధిక వ్యవస్ధను మరింత దిగజార్చి జనాన్ని ఇబ్బందుల పాలు చేయకుండా తాత్కాలికంగా అయినా నివారించారు. అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వ తీరుతెన్నులు, చివరి నిమిషం వరకూ ఏమి జరుగుతుందో తెలియకుండా యావత్‌ దేశాన్ని ఉంచిన తీరు గత విశ్లేషణల్లో పేర్కొన్నందున చర్విత చరణం చేయనవసరం లేదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెనుక పని చేసిన అంశాలేమిటి ? పర్యవసానాలేమిటి ? అనే చర్చ ఇప్పుడు దేశంలో ప్రారంభమైంది. ఒప్పందంలో చేరటానికి ఇంకా తలుపులు తెరిచే ఉన్నందున అంతిమంగా ఒక వైఖరిని ప్రకటించే వరకు ఎవరి అనుమానాలు వారికి ఉండటం సహజం. అప్పటి వరకు మెడమీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఒప్పందంలో చేరితే ఎగుమతుల పోటీని మన రైతాంగం, పరిశ్రమలు, వాణిజ్యం తట్టుకోలేదు, నష్టం అనే కారణాలే వెనుకడుగుకు ప్రధాన కారణం. అయితే ఇది సమాజంలోని కోట్లాది మంది కార్మికులను దెబ్బతీస్తుందా ?
రైతులు, పరిశ్రమలు, వాణిజ్యవేత్తలు ముప్పు తప్పిందిలెమ్మని ఆదమరవ కూడదు. ఒప్పందంలో చేరాలని ఇప్పటికీ వత్తిడి చేసే బలమైన కార్పొరేట్‌ శక్తులు ఉన్నాయని మరచి పోరాదు. గతంలో చేసుకున్న ఒప్పందాలు, అనుసరించిన విధానాలు మన రైతాంగాన్ని నిండా ముంచాయి. వాటిని వెనక్కు తీసుకొనేందుకు, రైతుల జీవితాలను బాగు పరిచేందుకు గత ఐదున్నర సంవత్సరాలుగా తీసుకున్న చర్యలేమీ లేవని గ్రహించాలి. పారిశ్రామిక, వాణిజ్యవేత్తల నుంచి వసూలు చేస్తున్న పన్నులను గణనీయంగా తగ్గించటాన్ని మనం చూశాము. ఇది కార్పొరేట్‌శక్తులకు ఇచ్చిన అతిపెద్ద సబ్సిడీ. మరోవైపున రైతాంగానికి ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. ఉన్నవాటిని మరింత తగ్గించటం తప్ప కొత్తగా పెంచిందేమీ లేదు. ఇప్పుడు రైతాంగాన్ని మరింత ముంచకుండా చూశారు తప్ప అదనపు మేలేమీ లేదు. మరింతగా దిగజారకుండా చూడటమే గొప్ప మేలు కదా అని ఎవరైనా అంటే వారి మేథకు జోహార్లు.
ఆర్‌సిఇపి ఒప్పందం- మోడీ సర్కార్‌ 2024 ఓట్ల లెక్కలు అనే శీర్షికతో అక్టోబరు 19వ తేదీన కొన్ని అంశాల మీద, ఒప్పంద ఖరారు సమావేశం నవంబరు నాలుగవ తేదీకి ఒక రోజు ముందుగా ‘ఆర్‌సిఇపికి బిజెపి అనుకూలం, కమ్యూనిస్టుల వ్యతిరేకత-ఎవరు దేశ భక్తులు ? అనే శీర్షికతో మరికొన్ని అంశాలను చర్చించాను. దీనికి సంబంధించిన మంచి చెడ్డలను స్ధలాభావం రీత్యా పరిమితంగానే రెండు వ్యాసాల్లో విశ్లేషణ చేశాను.
ఒప్పందం మీద సంతకాలు చేయరాదని నిర్ణయించటం వెనుక ఏ కారణం ఎంత మేరకు పని చేసింది అనే అంశాన్ని పక్కన పెడితే భవిష్యత్‌లో కూడా మోడీ సర్కార్‌ ఇదే వైఖరికి కట్టుబడితే హర్షించాల్సిందే. మోడీ ఈ నిర్ణయానికి రావటానికి కారణాలను మరోసారి చర్చించబోయే ముందు గత రెండు వ్యాసాల్లో ఏమి రాశానో పాఠకులకు గుర్తు చేయటం అవసరం.(ఆసక్తి వున్న వారు పూర్తి వ్యాసాలు ఇక్కడే చదవుకోవచ్చు)
అక్టోబరు 19 వ్యాసంలో ” ఇప్పటి వరకు వెలువడిన సూచనలు, ధోరణులను బట్టి ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి)’ ఒప్పందంపై మన దేశం సంతకాలు చేసే అంశం చివరి నిమిషం వరకు ఉత్కంఠను కలిగించే అవకాశం వుంది. మన ఎగుమతిదార్లకు తగినన్ని రాయితీలు సంపాదించేందుకు ప్రయత్నించి ఒప్పందం మీద సంతకం చేయాలన్న వైఖరితో మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమేరకు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒప్పందం మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా దెబ్బతీస్తుందనే అభిప్రాయాల పూర్వరంగంలో మోడీ సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. అధికారిక అభిప్రాయాలు వెల్లడి కాలేదు.
మూడు సంవత్సరాల క్రితం మతిమాలిన పెద్ద నోట్ల రద్దు, తగినంత కసరత్తు లేకుండా జిఎస్‌టి ప్రవేశపెట్టటం, ఇతర కారణాలతో దేశం ప్రస్తుతం రోజురోజుకూ మాంద్యంలోకి కూరుకుపోతోంది. ఈనేపధ్యంలో మోడీ సర్కార్‌ రాజకీయంగా తన లాభనష్టాలను లెక్కవేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వ్యవసాయంతో పాటు అనుబంధ పాడి, సేవా రంగాలను దెబ్బతీస్తుందని రైతు సంఘాలు, ఇతర సంస్ధలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. నవంబరులో ఆర్‌సిఇపి ఒప్పందం కుదిరితే దాని అంశాలు 2021-22 నాటికి అమల్లోకి వస్తాయి. వాటి ప్రభావం 2023-24లో కనిపిస్తుంది. ఒక వేళ అది ప్రతికూలమైతే ఆ ఏడాది జరిగే ఎన్నికల్లో తమ భవిష్యత్‌ ఏమిటన్నది బిజెపి తేల్చుకోలేకపోతున్నది. పైన చెప్పుకున్నట్లు ఓట్ల లెక్కలు కేంద్ర పాలకులను ప్రభావితం చేస్తాయా? కార్పొరేట్ల వత్తిడిది పై చేయి అవుతుందా చూడాల్సి వుంది. ”
నవంబరు మూడవ తేదీ వ్యాసంలో ఇలా పేర్కొన్నాను ” ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం సహేతుకమైన ప్రతిపాదనలను చేసిందని ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పోస్ట్‌ అనే థారులాండ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒప్పందం అమల్లోకి వస్తే రాగల ప్రతికూల పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారవేత్తలకు అవేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గత నెల రోజులుగా దీని గురించి ఎంతో ఉత్కంఠనెలకొన్నది. ఒప్పందంతో ప్రభావితులయ్యే వారితో బిజెపి చర్చించినట్లు మీడియాలో వార్తలు రాయించుకోవటం తప్ప ఏమి చర్చించారు, సర్కార్‌కు ఏమి సూచించారో తెలియదు. మరోవైపు కేంద్రం ఏమి చెబుతుందా అని ఎదురు చూసిన వారికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రభావితులయ్యే తరగతులతో అధికారిక చర్చ అసలే లేదు. సోమవారం నాడు సదరు ఒప్పందం మీద సంతకాలు జరగాల్సి ఉంది. ఒక వేళ మన దేశానికి అంగీకారం కానట్లయితే ప్రదాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పర్యటన రద్దయి ఉండేది. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప సంతకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.”

Image result for rcep modi
సమావేశం జరిగిన సోమవారం నాడు ఒప్పందం మీద సంతకాలు చేయరాదని మన సర్కార్‌ నిర్ణయించింది.దీనికి ఓట్ల లెక్కలే ప్రధానంగా పని చేశాయన్నది స్పష్టం. ఒప్పందం ప్రజల జీవనాధారాలను దెబ్బతీస్తుంది కనుక వ్యతిరేకించినట్లు బిజెపి చెప్పింది. ఇది భారత విజయం అని కూడా పేర్కొన్నది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ ఒప్పందంలో చేరటం సరైంది కాదని విదేశాంగ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది. ఇది మా విజయమే అని కాంగ్రెస్‌ ప్రకటించుకుంది. తాము గట్టిగా వ్యతిరేకత వ్యక్తం చేయటంతో తప్పనిసరై బిజెపి సర్కార్‌ వెనక్కు తగ్గిందని వ్యాఖ్యానించింది. మంత్రులు పియూష్‌ గోయల్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఇంకా ఇతరులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. మోడీని అభినందించారు. సర్కార్‌ వెనక్కు తగ్గటం వెనుక వత్తిడిలో ఎవరి వాటా ఎంతో తేల్చటం కష్టం గనుక ఆ లెక్కలను వదలి వేద్దాం. తాత్కాలికంగా కొంతకాలం పాటు అయినా రైతాంగం, చిన్న వ్యాపారులు, తోటల రైతాంగం కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అనటం నిస్సందేహం.
అయితే అది ఎంతకాలం? ఇంతటితో ఆర్‌సిఇపి కథ ముగిసినట్లేనా ? ఇప్పుడు జరగాల్సింది ఏమిటి ? ఏదో ఒకసాకుతో ముగిసిన అధ్యాయాన్ని తిరిగి ప్రారంభిస్తారా ? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిద్దాం, హర్షిద్దాం అయితే ముసాయిదా ఒప్పందంలోని ఏఏ అంశాల మీద మన సర్కార్‌ ఎలాంటి సవరణలు కోరింది? అవి ఏమిటో అధికారయుతంగా వెల్లడిస్తే అనేక ఊహాగానాలకు తెరపడుతుంది. ఒప్పందంలో చేరితే చైనా, ఇతర దేశాల నుంచి చౌకగా వస్తువులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయన్న అభిప్రాయాలు, ముంచెత్తుతున్న వాస్తవాలూ పాతవే. వాటిని అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకోవాలని మన సర్కార్‌ కోరింది, చైనాతో సహా మిగతా దేశాలు ఎక్కడ విబేధించాయి అన్నది తెలియాల్సి ఉంది.
పదహారు దేశాల కూటమి నుంచి మన దేశం సంతకం చేయటం లేదని ప్రకటించటంతో మిగిలిన దేశాలన్నీ ముందుకు పోవాలని నిర్ణయించాయి. భారత్‌ ఎప్పుడైనా చేరవచ్చని పేర్కొన్నాయి. అంటే ద్వారాలు ఇంకా తెరిచే ఉంచారు. అనేక అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేసిన దేశాలన్నీ ఒకేసారి చేరలేదు. ఏదైనా ఒక ఒప్పందాన్ని సూత్రప్రాయంగా అంగీకరించిన తరువాత ఆయా దేశాల రాజ్యాంగాలను బట్టి వాటికి చట్టసభలు ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. అందువలన సంతకాల కార్యక్రమం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది.
అమెరికా ప్రభావంతో మన దేశం వెనక్కు తగ్గిందా ? ఆర్‌సిఇపిని చూపి మన దేశం బేరమాడుతోందా ?
ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక బడా కొర్పొరేట్ల మానస పుత్రిక అనటంలో ఎలాంటి సందేహం లేదు. దానిలో సైబల్‌ దాస్‌గుప్తా అనే వ్యాఖ్యాత చేసిన విశ్లేషణ సారాంశం ఇలా ఉంది.” ఆర్‌సిఇపి ఒప్పందం మీద సంతకం చేయటం అమెరికాకు వ్యతిరేకంగా బల ప్రదర్శన అవుతుంది. ఈ బృందంలో చేరేందుకు భారత్‌ తిరస్కరించటం, తద్వారా దాన్ని బలిష్టం కావించేందుకు తిరస్కరించటాన్ని ఈ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. భారత్‌ నిర్ణయాన్ని కొంత మేరకు అమెరికా ప్రభావితం చేసిందని చైనా సర్కార్‌తో ముడిపడిపడి వున్న నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో బేరమాడేందుకు ఈ నిర్ణయాన్ని భారత్‌ ఉపయోగించేందుకు సాధ్యపడుతుంది అని ఏనాన్‌ అకాడమీలో భారత అధ్యయనాల కేంద్రం పరిశోధకుడు మావో కెజీ చెప్పారు. ఇందుకు గాను ట్రంప్‌ యంత్రాంగం భారత్‌కు లబ్ది చేకూరుస్తుందనిగానీ లేదా భారత కంపెనీలతో సామరస్య వైఖరి తీసుకుంటుందని ఎవరూ అనుకోవటం లేదు.
తక్షణ ప్రశ్న ఏమంటే భారత్‌ నుంచి ఔషధాలు ముఖ్యంగా కాన్సర్‌కు సంబంధించి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలన్న చైనా పధకాల మీద మోడీ నిర్ణయం ప్రభావం చూపుతుందా అన్నది. పశ్చిమ దేశాల కంపెనీలతో మాదిరి చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం లేదా భారత ఉత్పత్తి కేంద్రాలను చైనాలో ఏర్పాటు చేయాలని గానీ చైనీయులు కోరుతున్నారు. ఇందుకు భారత తయారీదారులు ఉత్సాహంగా లేరు.ఔషధాల తయారీ సాంకేతిక పద్దతులను చైనీయులు అపహరిస్తారని భయపడుతున్నారు. ధరలు తక్కువగా ఉండే భారత ఔషధాలకు చైనాలో డిమాండ్‌ పెరుగుతున్నందున తలుపులు మూయటం చైనాకు అంత సులభం కాదు. సంతకం చేయకపోవటం ద్వారా భారత్‌కు జరుగుతుందని చెబుతున్న నష్టం ఏమైనా అది తాత్కాలికమే.” అని దాస్‌ గుప్తా పేర్కొన్నారు.
చైనా, అమెరికా, ఐరోపా యూనియన్‌ దేనితో అయినా బేరమాడేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు తప్పు పట్టనవసరం లేదు. అయితే అది మన రైతాంగం, పరిశ్రమలకు మొత్తంగా ఎంతమేరకు ఉపయోగపడుతుందన్నది గీటు రాయిగా ఉండాలి. గతంలో ఆ విధంగా బేరమాడిన పర్యవసానమే నాటి సోవియట్‌ యూనియన్‌ సహకారంతో అనేక ప్రభుత్వ రంగ సంస్ధల ఏర్పాటు, అంతరిక్ష పరిశోధనలకు ఊపు ఇచ్చిన క్రయోజనిక్‌ ఇంజన్ల పరిజ్ఞానం, ఆయుధాలు మనకు అందాయి. వాటితో మనకు కలిగిన లబ్ది తెలిసిందే. ఇప్పుడు అంతా ప్రయివేటీకరణ, ప్రయివేటు రంగం తప్ప ప్రభుత్వరంగం లేనందున జనానికి ఎలా లబ్ది కలిగిస్తారో తెలుసుకోవటం అవసరం.
దేశంలో నెలకొన్న ఆర్ధిక పరిస్ధితిపై ఆందోళనలు వ్యక్తమౌతున్న నేపధ్యంలో ఒప్పందంపై సంతకం చేయరాదన్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రాముఖ్యత వుందని మింట్‌ పత్రిక వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అనుకున్నదాని కంటే రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి పనితీరు తక్కువగా ఉండటం, త్వరలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఈ నిర్ణయం జరిగింది. ఒప్పందం వలన భారత మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరవటం తప్ప చైనా వంటి మార్కెట్లలో ప్రవేశానికి ఎలాంటి హామీ లేకపోవటం ఒప్పందం మీద సంతకం చేయకపోవటానికి ఒక ప్రధాన కారణం అని ఒప్పందం గురించి బాగా తెలిసిన ఒకరు చెప్పినట్లు మింట్‌ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.
సిఐఐ ఏమి చెప్పింది ?
ఆర్‌సిఇపిలో మన దేశం భాగస్వామి కానట్లయితే ప్రాంతీయ, ప్రపంచ గుంపులో చేరే ప్రయత్నాలకు నష్టం జరిగి దేశ ఎగుమతులు, పెట్టుబడుల ప్రవాహానికి హాని జరుగుతుందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ(సిఐఐ) ఒప్పంద గడువు సోమవారానికి ఒక రోజు ముందు ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ సంస్ధ దేశంలోని బడా కార్పొరేట్‌ సంస్ధలకు ప్రతినిధి అన్నవిషయం తెలిసిందే. ప్రతి చోటా బడా పెట్టుబడిదారులు-చిన్న పెట్టుబడిదారుల మధ్య ఉండే మిత్రవైరుధ్యం దీనిలో చూడవచ్చు. ఒప్పందం కుదిరిన తరువాత పదహారు భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుంది. ఎగుమతుల అవకాశాలు దెబ్బతింటాయని సిఐఐ పేర్కొన్నది. చైనా నుంచి ద్వైపాక్షికంగా మనం రాయితీలు పొందటం అన్ని వేళలా ఎంతో కష్టమని తెలిసిందే, ఇప్పుడు ఆర్‌సిఇపిని ఒక అవకాశంగా ఉపయోగించుకోవటంలో మనం వైఫల్యం చెందామని వ్యాఖ్యానించింది. మన పరిశ్రమలోని కొందరు ఈ రోజు ఏమిటని చూస్తున్నారు. ఈ ప్రాంతంలోని సచేతనమైన 15 ఇతర దేశాల్లో ప్రవేశించాలని పదేండ్ల తరువాత వీరే కోరతారని సిఐఐ అధ్యక్షుడు విక్రమ్‌ కిర్లోస్కర్‌ వ్యాఖ్యానించారు. ఒక దేశం ప్రాతిపదికగా మనం ఆందోళన చెందకూడదని దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాన్ని చూడాలన్నారు. ఈ ఒప్పందం గురించి చర్చలు ప్రారంభమైన 2012లో ఇప్పుడు చర్చిస్తున్న అంశాలు లేవని, మొత్తం వ్యవహారమంతా స్వకీయ రక్షణ, చైనా నుంచి రక్షణ గురించి మాట్లాడుతున్నారని కిర్లోస్కర్‌ వ్యాఖ్యానించారు.
నరేంద్రమోడీ సర్కార్‌ చిత్తశుద్ది గురించి ఎవరికీ భ్రమలు ఉండనవసరం లేదు. ఆర్‌సిఇపి ఒప్పందం చర్చల్లో చైనా వస్తువుల గురించి ఒక ప్రధాన సమస్యగా వస్తోంది. వాస్తవం కూడా, అయితే దీనికి బాధ్యులెవరు ? మనకు అవసరమైన వాటిని చైనా నుంచి గాకపోతే అమెరికా లేదా ఐరోపా యూనియన్‌ నుంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. చైనా నుంచి దిగుమతులు లాభసాటి గనుక సైద్ధాంతికంగా బిజెపి సర్కార్‌ చైనాను వ్యతిరేకిస్తున్నా గత ఐదు సంవత్సరాలలో ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు పెరగటానికి అనుమతి ఇచ్చింది. ఒప్పందంలో చేరితే పాడి రైతాంగం నష్టపోతారు. దీనికి చైనా కాదు, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా అన్నది అందరికీ తెలిసిందే. అదే విధంగా మన వేరుశనగ, ఇతర చమురు గింజల, పామాయిల్‌ రైతులు నష్టపోయేది ఇండోనేషియా, మలేషియాల నుంచి వచ్చే పామాయిల్‌ తప్ప మరొక దేశం నుంచి కాదు. ఒప్పందం జరగక ముందే సుగంధ ద్రవ్యాలు ఇతర దేశాల నుంచి శ్రీలంకకు వచ్చి అక్కడి నుంచి మన మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఒప్పందంలో చేరి ఉంటే మరింతగా వరదలా పారతాయన్నది నిజం. అందుకే రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించారు. దానికి దూరంగా ఉండాలన్న నిర్ణయం మంచిదే. కానీ అంతటితో సమస్య పరిష్కారం అవుతుందా ? వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం సమసి పోతుందా ?
అసలే ఆర్ధిక మందగమనం లేదా మాంద్యం, ఎగుమతులు తగ్గటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న మన దేశానికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా కేసు దాఖలు చేసి గెలిచింది. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఎగుమతి రాయితీ లేదా సబ్సిడీ పధకాలను రద్దు చేయాలన్నది ఈనెల ప్రారంభంలో వచ్చిన కేసు తీర్పు సారాంశం. దీని వలన కేవలం ఎగుమతుల కోసమే ఏర్పాటు చేసిన సంస్ధలు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు, బయో టెక్నాలజీ పార్కులు, ఎగుమతి దారులకు పన్నులేని దిగుమతుల అనుమతులు, ఇలా అనేక పధకాలకు ఇప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. దీనికి చైనా కారణం కాదు. తలసరి జిడిపి భారత్‌లో వెయ్యి డాలర్లు దాటింది కనుక ఎగుమతుల ప్రోత్సాహక సబ్సిడీలు ఇవ్వకూడదని కూడా తీర్పులో ఉంది. వరుసగా మూడు సంవత్సరాల పాటు తలసరి జిడిపి వెయ్యి డాలర్లు దాటితే అన్ని రకాల ఎగుమతుల రాయితీలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఉక్కు, ఔషధాలు, రసాయనాలు, వస్త్రాలు, దుస్తులు, ఐటి వంటి వాటికి వెంటనే రాయితీలను మూడు నుంచి నాలుగు నెలల్లోగా నిలిపివేయాలని డబ్ల్యుటిఓ మన దేశాన్ని ఆదేశించింది. దీనిపై అప్పీలుకు ఒక నెల గడువు ఇచ్చింది.

Image result for labour reforms india protest citu
అమెరికా వంటి దేశాలు మనలను ప్రపంచవాణిజ్య సంస్ధలో ఇలాంటి ఇబ్బందులను పెడుతుంటే మరోవైపున ఏమి జరుగుతోందో చూద్దాం. ఎగుమతుల్లో పోటీ పడాలంటే పారిశ్రామికవేత్తలకు చౌకగా వస్తువులు తయారు కావాలి. అందుకు గాను మన దేశంలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని, కార్మిక చట్టాలు ఆటంకంగా వున్నాయని, వేతనాలు ఎక్కువగా ఉన్నాయనే వాదనలను ముందుకు తెస్తూ ఆ రంగాలలో మార్పులను డిమాండ్‌ చేస్తున్నారు. సంస్కరణల పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ అందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు వేతనాలపై నవంబరు ఒకటి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసి దాని మీద డిసెంబరు ఒకటిలోగా అభిప్రాయాలు తెలపాల్సిందిగా కార్మిక సంఘాలను కోరింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బిఎంఎస్‌కే అవి మింగుడుపడలేదు. అనేక లోపాలు వున్నాయని, కొన్ని అంశాల మీద స్పష్టత లేదని చెప్పాల్సి వచ్చింది. వేతనాల గురించి స్పష్టత ఇవ్వలేదు గానీ రోజుకు తొమ్మిది గంటలను పని వ్యవధిగా చేయాలనే ప్రతిపాదన చేశారు. వేతన నిర్ణాయక సంఘాలలో కార్మిక సంఘాలకు ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యం గురించి ముసాయిదా పత్రంలో ప్రతిపాదన లేదు. ఎగుమతుల కోసం లేదా వస్తువులు చౌకగా తయారు అయ్యేందుకు కార్మికుల మీద భారాలు మోపటం ఏమిటి ? కర్షకులను మరింత ఇబ్బందుల పాలు కాకుండా ఆర్‌సిఇపిలో చేరేందుకు నిరాకరించినందుకు సంతోషించాలా? అదే సమయంలో కార్మికులపై భారాలు మోపేందుకు, వారి ప్రయోజనాలను దెబ్బతీసేందుకు పూనుకున్నందుకు ఆగ్రహించాలా ? కార్మికులు, కర్షకులు మిత్రులే తప్ప శత్రువులు కాదు, ఒకరి ప్రయోజనాలకు ఒకరు బాసటగా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్లు అనిపించటం లేదూ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపికి బిజెపి అనుకూలం, కమ్యూనిస్టుల వ్యతిరేకత – ఎవరు దేశ భక్తులు !

03 Sunday Nov 2019

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

BJP on RCEP, CPI(M) on RCEP, RCEP, RCEP INDIA, RCEP Narendra Modi, Regional Comprehensive Economic Partnership (RCEP)

Image result for rcep
ఎం కోటేశ్వరరావు
‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం సహేతుకమైన ప్రతిపాదనలను చేసిందని ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పోస్ట్‌ అనే థారులాండ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒప్పందం అమల్లోకి వస్తే రాగల ప్రతికూల పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారవేత్తలకు అవేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గత నెల రోజులుగా దీని గురించి ఎంతో ఉత్కంఠనెలకొన్నది. ఒప్పందంతో ప్రభావితులయ్యే వారితో బిజెపి చర్చించినట్లు మీడియాలో వార్తలు రాయించుకోవటం తప్ప ఏమి చర్చించారు, సర్కార్‌కు ఏమి సూచించారో తెలియదు. మరోవైపు కేంద్రం ఏమి చెబుతుందా అని ఎదురు చూసిన వారికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రభావితులయ్యే తరగతులతో అధికారిక చర్చ అసలే లేదు. సోమవారం నాడు సదరు ఒప్పందం మీద సంతకాలు జరగాల్సి ఉంది. ఒక వేళ మన దేశానికి అంగీకారం కానట్లయితే ప్రదాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పర్యటన రద్దయి ఉండేది.ఆయన అక్కడకు చేరుకొని ఎర్రతివాచీ స్వాగతం పొందారు. రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ఆసియన్‌ దేశాల శిఖరాగ్ర సభ, ఆర్‌సిఇపి శిఖరాగ్ర సమావేశం జరగనున్నాయి. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప సంతకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.
పారదర్శకత గురించి కొందరు ఎంత ఎక్కువగా చెబుతారో అంత ఎక్కువగా తెరవెనుక పనులు చేస్తారనేది అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వారు చేసేది చెప్పరు-చెప్పింది చేయరు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని బిజెపి ఎన్నడూ చెప్పకుండా ఆ పని చేయటం అందుకు నిదర్శనం. ఆర్‌సిఇపి ఒప్పందం విషయంలో కూడా నరేంద్రమోడీ సర్కార్‌ అదే పని చేస్తోందా ? 2017లో మోడీ ఏర్పాటు చేసిన నీతి అయోగ్‌ పత్రం కూడా ఒప్పందం మీద హెచ్చరికలు చేసింది. వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అలాంటి దాని గురించి పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరపలేదు. నిజానికి ఈ ఒప్పందంలోని అంశాలు పెద్ద నోట్ల రద్దు వంటి రహస్యమైనవేమీ కాదు.ఏ ఏ అంశాలను అంగీకరిస్తే ఎలా నష్టం జరుగనుందో ఇప్పటికే చర్చ జరిగింది. ఏఏ వస్తువుల మీద మన దేశం పన్నులను ఎంతమేరకు తగ్గిస్తుంది, వేటిని మినహాయిస్తుంది అనేది వెల్లడి కావాల్సి ఉంది. వీటిి మీద ప్రభుత్వం తన వైఖరిని చెప్పలేదు, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. ఒప్పందాన్ని మన దేశం అంగీకరించరాదని కోరుతూ 250 రైతు సంఘాలతో కూడిన ఐక్యవేదిక ఆందోళనకు పిలుపు నిచ్చింది. సోమవారం నాడు ప్రదర్శనలు జరగనున్నాయి. సిపిఎం దీనికి మద్దతు ప్రకటించింది. సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేసింది. ఆరెస్సస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అయినా ఏ అంశాలను కేంద్రం అంగీకరించిందో, వేటిని వ్యతిరేకించిందో జనానికి ఇంతవరకు తెలియదు. అంగీకరించిన వాటితో ఎలా లబ్ది చేకూరనుందో, ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో, వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏమి చేయనుందో జనానికి చెప్పాలా లేదా ?

Image result for rcep
పదహారు దేశాలు, 360కోట్ల జనాభా వున్న ప్రాంతాలతో కూడిన ఈ ఒప్పందం ప్రపంచంలో అతి పెద్ద స్వేచ్చావాణిజ్య అవగాహనగా చరిత్రకెక్కనుంది.2012లో ప్రారంభమైన ఈ చర్చలు భారత్‌ సంతకం చేస్తే సోమవారం నాటితో మరో అధ్యాయానికి నాంది పలుకుతాయి. మన దేశానికి సంబంధించి రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్న ఈ ఒప్పందం గురించి కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకపోవటం రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను బాహాటంగా ఉల్లంఘించటంతప్ప మరేమీ కాదని ప్రముఖ ఆర్ధికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు. ఒప్పందంపై సంతకం చేయటానికి బదులు దాన్ని బహిర్గత పరచాలని, రైతులతో సంప్రదింపులు జరపాలని రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది.ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కేరళ తోటల రైతాంగం అందరికంటే ఎక్కువగా నష్టపోనుంది. ఈ కారణంగానే అక్కడి ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ వ్యతిరేకత తెలిపింది. ఇప్పటికే వియత్నాం నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న మిరియాల కారణంగా వాటి ధరలు దారుణంగా పడిపోయాయి. కొబ్బరి, రబ్బరు, పామ్‌ ఆయిల్‌, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర పంటలకు తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. ఇప్పటి వరకు అనేక దేశాలు చివరికి ఐరోపా యూనియన్‌-అమెరికా మధ్య స్వేచ్చావాణిజ్య ఒప్పందాల నుంచి కూడా వ్యవసాయాన్ని మినహాయించారు.

Image result for rcep
దేశీయ ఉత్పత్తిదారుల సామర్ధ్యాలను పెంచకుండా ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తే ప్రతికూల ప్రభావాలు పడతాని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బిఐ) పరిశోధన నివేదిక కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.2018-19లో ఆర్‌సిఇపిలోని పదకొండు దేశాలతో మనకు వాణిజ్య లోటు 107.28 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇతర దేశాలతో కూడా కలిపి చూస్తే మొత్తంగా మన వాణిజ్య లోటు 184బిలియన్‌ డాలర్లు. ఆర్‌సిఇపి దేశాలకు మన ఎగుమతులు 21శాతం జరగ్గా మన దిగుమతులు ఈ దేశాల నుంచి 34శాతం వున్నాయి. మన వాణిజ్యం వ్యవసాయం, సంబంధిత ఉత్పత్తులు, దుస్తులు, ఆభరణాల వంటి వాటిలో మాత్రమే మిగులు ఉంది. మొత్తం వాణిజ్యంతో పోలిస్తే అది నామమాత్రమే. ఈ ఒప్పందంలో మన దేశం భాగస్వామి అయితే ఈ మిగులు కూడా హరించుకుపోయి లోటు ఇంకా పెరుగుతుందని ఎస్‌బిఐ నివేదిక చెప్పింది.
సంప్రదింపుల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మనం పాల ఉత్పత్తుల దిగుమతుల మీద పన్నులు తగ్గిస్తే అది మరింత నష్టదాయకమని కూడా ఎస్‌బిఐ హెచ్చరించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను మనం ఉపయోగించుకోవటం 25శాతానికి లోపుగానే ఉందని కూడా పేర్కొన్నది. అయితే ఒప్పందంలో భాగస్వామి కాకపోయినా మన దేశానికి నష్టమే అని ఎగుమతులు కష్టమౌతాయని కూడా తెలిపింది.
ఆర్ధికవేత్త సూర్జిత్‌ ఎస్‌ భల్లా నాయకత్వంలోని హైలెవెల్‌ అడ్వయిజరీ గ్రూప్‌(హెచ్‌ఎల్‌ఏజి) బృందం ఆర్‌సిఇపి ఒప్పందం మీద సంతకాలు చేయాలని సూచించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి నిరంతరం తెలియ చేస్తూ వాటిని ఉపయోగించుకోవాలని కోరింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ కోరిక మేర తన సిఫార్సులు, ఇతర అంశాల గురించి ఈనివేదికను రూపొందించారు. అయితే ఇది అందచేసే సమయానికే మన అధికారులు, మంత్రులు బ్యాంకాక్‌ తరలివెళ్లారు. ఒప్పందం మీద సంతకాలకు ఒక సాకుగా దీన్ని ఉపయోగించుకోనున్నట్లు కనిపిస్తోంది.
1991లో ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల కారణంగా మన వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం లక్షలాది మంది రైతుల బలవన్మరణాలకు కారణాలలో ప్రధానమైనది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో తలెత్తిన సమస్యలు ఇంకా అపరిషతృంగానే ఉన్నాయి. రైతుల్లో మరింత ఆగ్రహం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ యోజన పేరుతో ఏటా ఆరువేల రూపాయల నగదు సాయాన్ని అందచేస్తున్నది. ఇదేమీ శాశ్వత పధకం కాదు. ఆర్‌సిఇపి ఒప్పందం అమలులోకి వస్తే మన వ్యవసాయ రంగ సంక్షోభం మరింత తీవ్రం కావటం అనివార్యం.అది గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తిని మరింత తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
ఈ ఒప్పందానికి తెరలేపింది కాంగ్రెస్‌ అయితే బిజెపి తెర దించనుంది. రెండు పార్టీలూ దీన్నుంచి రాజకీయ లబ్దిపొందేందుకు చూస్తున్నాయి. అధికారంలో ఉండగా ఒప్పందానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. నవంబరు ఐదు నుంచి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చింది. అప్పుడేం చేశారని బిజెపి ఎద్దేవా చేస్తోంది తప్ప తన వైఖరి ఏమిటో చెప్పదు. ప్రతిపక్షంలో ఉండగా, ఇప్పుడు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ ఈ ఒప్పందానికి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నది తప్ప బిజెపిని ఒప్పించలేకపోయింది. ఈ ఒప్పందాన్ని అందరూ వ్యతిరేకించటం లేదమ్మా అంటూ బిజెపి నేతలు ఇతరుల మీద నెపాన్ని నెడుతున్నారు. మరీ ఎక్కువ లొంగిపోవద్దబ్బా అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద అసలు విషయం చెప్పకుండా గత నెల రోజులుగా కేంద్ర పాలకులు, అధికారపక్షం మీడియాకు లీకులతో కాలం గడిపింది.
ఇక మిగతా దేశాల విషయానికి వస్తే ఒక వేళ భారత్‌ సంతకం చేయకున్నా మనం ముందుకు పోవాల్సిందే అని మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ జూన్‌లోనే వ్యాఖ్యానించాడు. గణనీయంగా దిగుమతి పన్నులు ఉన్నప్పటికీ ఇప్పటికే ఇండోనేషియా, మలేషియాల నుంచి వస్తున్న పామాయిల్‌ మన దుకాణాల్లో నిండిపోతోంది. ఈ ఒప్పందంలో చేరితే పన్నులను రద్దు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు లభించవచ్చు, వ్యాపారులకు లాభాల పంట పండవచ్చుగానీ మన రైతాంగ పరిస్ధితి, మన దేశం నుంచి తరలిపోయే డబ్బు సంగతేమిటి? న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియాల నుంచి వచ్చే పాల ఉత్పత్తులతో పాల రైతాంగ పరిస్ధితి అగమ్యగోచరం. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పంట, ఉత్పత్తుల రైతాంగం ప్రభావితం అవుతారు. బిజెపి చెప్పే గోమాత పవిత్రత సంగతి ఎలా ఉన్నా ఆవుపాలతో రాజస్ధాన్‌లో ఇంకా అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి. పది కోట్ల మంది రైతులకు పాల రాబడి ఒక వనరుగా ఉన్నట్లు అంచనా.
ఇప్పుడు నరేంద్రమోడీకి మరో పెద్ద సమస్య వచ్చింది. ఆయన అంతర్జాతీయ నాయకుడని, అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నారని, పెద్ద ఆర్ధిక నిపుణుడన్నట్లుగా ఇంతకాలం ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రపంచ జనాభాలో సగానికి ప్రాతినిధ్యం వహించే దేశాల ఒప్పందంపై సంతకం చేయకపోతే ఆయన ప్రతిష్టకు దెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నవారు లేకపోలేదు. చేస్తే దేశీయంగా రైతాంగం, ఇతర తరగతుల ప్రజానీకం నుంచి వేరుపడిపోతే అసలుకే మోసం వస్తుంది అన్నది చెప్పుకోలేని సంశయం. ఒప్పందం మీద సంతకం చేస్తే చైనా, ఇతర దేశాల నుంచి ఒక్క వ్యవసాయ ఉత్పత్తులే కాదు, అన్ని రకాల వస్తువులు వెల్లువలా మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. పోనీ ఈ ఒప్పందానికి దూరంగా అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో చేతులు కలిపితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని చూస్తే అవన్నీ కూడా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌- మాయింటి కొస్తే మాకేం తెస్తావ్‌ అనే రకాలు తప్ప మనకు సాయపడేవి కాదు. ఎగుమతి ఆధారిత అభివృద్ధి అనే ఒక దివాలా కోరు ఆర్ధిక విధానాన్ని అనుసరిస్తున్న (మేకిన్‌ ఇండియా అంటే అదే) మోడీ సర్కార్‌ ఈ ఒప్పందంలో చేరకపోతే మన ఎగుమతులు ఇంకా పడిపోయేందుకు దోహదం చేసినట్లు అవుతుంది. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధను రూపొందిస్తా అని చెప్పిన గొప్పల గురించి జనం అడిగితే పరిస్ధితి ఏమిటి అనే మనో వ్యాధి పట్టుకుంది. ఒప్పందంలో చేరక ముందే మన ఆర్ధిక వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. ఇక విదేశాల నుంచి వస్తు దిగుమతులు మరింత పెరిగితే మన పరిశ్రమలు, వ్యవసాయం మూతపడుతుంది. ఇప్పటికే 8.5శాతానికి చేరిన నిరుద్యోగం మరింత పెరుగుతుంది.

Image result for bjp cpim
ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా చేయాల్సింది చేశాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఆర్‌సిఇపిలో చైనాదే ప్రధాన పాత్ర. చైనా వస్తువులను బహిష్కరించండి అంటూ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నది వారే. కనీసం చైనా నుంచి వచ్చే సగం వస్తువులనైనా అడ్డుకోవాలన్నది కొందరి వత్తిడి.అలాంటి చైనాతో కలసి ఒప్పందం చేసుకోవటం ఏమిటన్నది వారికి మింగుడుపడటం లేదు. ఈ విషయంలో నరేంద్రమోడీ తక్కువేమీ తినలేదు. వాణిజ్య, పారిశ్రామికవేత్తల వత్తిడికి లంగి తన కుర్చీని కాపాడుకొనేందుకు చైనాతో సయోధ్యకు ముందుకు పోక తప్పని స్ధితి.మన దేశంలోని కమ్యూనిస్టులు చైనా అనుకూలురనే ప్రచారం చేస్తున్నది కూడా కాషాయ దళాలే అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు ఈ ఒప్పందంపై సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేస్తున్నారు. బిజెపి దేశభక్తి, స్వదేశీ అనుమానంలో పడింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విద్రోహిగా మారిన విడి సావర్కర్‌ భారత రత్నమా ?

20 Sunday Oct 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

A militant turned british agent vd savarkar, Bharat Ratna ?, Saverkar Hindutva, vd savarkar

Image result for savarkar, chitragupta

ఎం కోటేశ్వరరావు
విజేతలే చరిత్రను రాశారు అని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ చెప్పాడు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోందా ? ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో తమకు విజయం చేకూర్చితే ఫలాన చర్యలు చేపడతామని ఎన్నికల ప్రణాళిక రూపంలో ఓటర్ల ముందుకు వస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తాము వినాయక దామోదర్‌ సావర్కర్‌కు (విడి సావర్కర్‌) భారత రత్న అవార్డు ఇప్పించేందుకు కృషి చేస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి పరోక్షంగా తన హిందూత్వ అజెండాకు ఆమోదం పొందేందుకు పూనుకుంది. పెన్సిలిన్‌ ఇంజక్షన్లు అందరి శరీరాలకు సరిపడవు. అందువలన పరీక్ష చేసేందుకు రోగికి పరిమిత మొత్తంలో ముందు ఎక్కించి వికటించిన లక్షణాలు కనిపించకపోతే నిర్ణీత డోనుసు అందించటాన్ని మనం చూశాము. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ తన రాజకీయ విభాగం బిజెపి ద్వారా అటువంటి ప్రయోగానికే పూనుకుందని చెప్పవచ్చు. సావర్కర్‌ ఒక్కడి గురించి చెబితే తలెత్తే వ్యతిరేకతను నీరు గార్చేందుకు లేదా ఒక ఎత్తుగడగా మహారాష్ట్రకు చెందిన సంస్కర్తలు జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే పేర్ల సరసన సావర్కర్‌ను చేర్చారు. ఇది పూలే దంపతులను అవమానించటం తప్ప మరొకటి కాదు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మతోన్మాద శక్తులు తప్ప వామపక్ష భావజాలం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్ధను కోరుకొనే వారి వరకు సామ్రాజ్యవాద వ్యతిరేకత ప్రాతిపదికగా పని చేశారు. దేశంలో ఉన్న సామాజిక పరిస్ధితుల్లో లౌకిక వాదం ఒక ఐక్యతా శక్తిగా పని చేసింది. అందువల్లనే మన చరిత్రను దానికి అనుగుణ్యంగానే చరిత్రకారులు రచించారు. అనేక మంది చరిత్రను మార్క్సిస్టు దృక్కోణంలో శాస్త్రీయంగా రూపొందించేందుకు ప్రయత్నించారు. వారిలో కమ్యూనిజంతో సంబంధం లేని వారు, కమ్యూనిస్టులు కాని వారు ఎందరో ఉన్నారు.

బిజెపి నయా భారత్‌ , నయా దేశ పిత, నయా భారత రత్నలు !
జర్మనీ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన నాజీల మాదిరి మన దేశ చరిత్రను వక్రీకరించి మత కోణంలో జనాల మెదళ్లకు ఎక్కించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దానికి గాను ప్రస్తుతం ఉన్న పుస్తకాలలో చరిత్రను వక్రీకరించారని, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు అవగాహన మేరకు రాసినది తప్ప మన ఘనమైన గత చరిత్రను ప్రతిబింబించటం లేదని నిరంతరం ప్రచార దాడి చేస్తున్నారు. ప్రతిదాన్నీ మత కోణంతో చూసే తిరోగమన శక్తులు మతకోణంతో చరిత్రను జనాల మెదళ్లకు ఎక్కించే ప్రయత్నం తీవ్రంగా జరుగుతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా మతోన్మాద భావజాల ప్రాతిపదికగా పని చేసే వారు పార్లమెంటరీ వ్యవస్ధలోని నాలుగు ప్రధాన పదవులైన తొలిసారిగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్లుగా బాధ్యతల్లో ఉన్న సమయమిది. గతంలో అనేక రంగాలలో ఆశక్తులు ప్రవేశించినప్పటికీ పూర్తి ఆధిపత్యాన్ని కలిగిన సమయమిదే. అంటే ఆ శక్తులు విజయం సాధించాయి. వారి చర్యలు ఇప్పుడు విన్‌స్టన్‌ చర్చిల్‌ చరిత్ర గురించి చెప్పిన అంశాలను గుర్తుకు తెస్తున్నాయి.

జవహర్‌లాల్‌ నెహ్రూను ఆధునిక భారత నిర్మాతగా అనేక మంది పరిగణిస్తారు. అందువలన నరేంద్రమోడీ తాను నూతన భారత్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పుకోవటం ద్వారా నూతన భారత నిర్మాతగా చరిత్రకెక్కేందుకు చూస్తున్నారు. మహాత్మాగాంధీని జాతిపితగా పరిగణిస్తున్నంత కాలం మరొకరిని ఆ స్ధానంలో ఉంచలేరు. అందువల్లనే నరేంద్రమోడీని డోనాల్డ్‌ ట్రంప్‌ భారత దేశ పిత అని వర్ణించాడు. దేశంలో ఇప్పటి వరకు ప్రకటించిన భారత రత్నలో మతోన్మాదులు ఎవరూ లేరు. నయా భారత్‌ కనుక రాబోయే రోజుల్లో వారే నిజమైన జాతీయవాదులు, జాతి రత్నాలుగా చరిత్రకు ఎక్కనున్నారంటే అతిశయోక్తి కాదు.

విప్లవకారుడు-విద్రోహి -మతోన్మాది !

మన దేశ చరిత్రలో వి డి సావర్కర్‌ అత్యంత వివాదాస్పద వ్యక్తి. యువకుడిగా తీవ్రవాద జాతీయ వాద భావాలకు ఆకర్షితుడైన వారిలో ఒకరు. తరువాత లండన్‌లో న్యాయవిద్య చదివే సమయంలో అక్కడ స్వాతంత్య్ర భావాలతో పని చేసే వారితో ఏర్పడిన పరిచయాల ప్రభావంతో కొన్ని రచనలు కూడా చేశారు. 1857 ప్రధమ స్వాతంత్య్రపోరాటంలో హిందువులు-ముస్లింలు ఎలా కలసిపని చేశారో వివరిస్తూ మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు. తీవ్రవాద భావాలతో స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న అనేక మంది మాదిరి బ్రిటీష్‌ పాలకులు కేసులు బనాయించి 50 సంవత్సరాల జైలు శిక్షవేసి సావర్కర్‌ను కూడా అండమాన్‌కు పంపారు. అప్పటి వరకు నిర్బంధం అంటే ఏమిటో తెలియని సావర్కర్‌ అండమాన్‌ వెళ్లిన వారు తిరిగి రారు అనే ప్రచారం, కొన్ని వుదంతాలను విని పిరికిబారి జైలు నుంచి బయట పడేందుకు గాను బ్రిటీష్‌ ప్రభుత్వానికి విధేయుడిగా వుంటానని అరడజను లేఖలు రాసి బయటపడటమే కాదు, బ్రిటీష్‌ వారికి ఎలా కావాలంటే అలా సేవ చేస్తానని రాసి ఇచ్చాడు. తరువాత దాన్ని తుచ తప్పకుండా అమలు జరిపాడు. దీనికి సంబంధించిన ఆధారాలు బయట పడిన తరువాత తమ నేత ఒక ఎత్తుగడగా ఆ లేఖలు రాసినట్లు సంఘపరివార్‌ నేతలు చెప్పటం ప్రారంభించారు. ఇదే సమయంలో మితవాద తిరోగమన హిందూత్వ ప్రచారకుడిగా మారిపోయాడు. బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటు చేసేందుకు సుభాస్‌ చంద్రబోస్‌ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేస్తే యువకులు బ్రిటీష్‌ సైన్యంలో చేరేందుకు సావర్కర్‌ తోడ్పడ్డారని, స్వాతంత్య్ర సమరాన్ని పక్కదారి పట్టించేందుకు హిందూత్వ భావజాలాన్ని ముందుకు తెచ్చారని విమర్శకులు పేర్కొన్నారు. చివరకు మహాత్మా గాంధీ హత్యకేసులో కూడా సావర్కర్‌ ఒక ముద్దాయని, సాంకేతిక కారణాలతో కేసునుంచి బయటపడ్డారని పరిశీలకులు పేర్కొన్నారు.

Image result for vd savarkar chitraguptaఇద్దరు దేశ భక్తులు – రెండు లేఖలు- ఎంత తేడా !
సంఘపరివార్‌ శక్తులు అటు భగత్‌ సింగ్‌ను ఇటు విడి సావర్కర్‌ను దేశ భక్తులుగానే పరిగణిస్తాయి. సావర్కర్‌ను తమ ఆరాధ్య దైవంగా పరిగణిస్తాయి. జైలు శిక్షకు గురైన సావర్కర్‌ అండమాన్‌ జైలు నుంచి తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి నమ్మిన బంటుగా పని చేస్తానని లేఖ రాశాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదానికి బహుళ ప్రచారం తెచ్చిన భగత్‌ సింగ్‌ తనకు విధించిన ఉరిశిక్షను అమలు జరపాలని లేఖ రాశాడు. ఆ మేరకు తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించాడు. అదే సావర్కర్‌ విషయానికి వస్తే తనను జైలు నుంచి విడుదల చేసిన బ్రిటీష్‌ వారికి విధేయుడిగా మారిపోయి స్వాతంత్య్ర వుద్యమం నుంచి దూరం అయ్యాడు. హిందూత్వశక్తిగా మారాడు.

ద్విజాతి సిద్ధాంతం, పాక్‌ ఏర్పాటును కోరిన ముస్లింలీగ్‌తో అధికారం !

పాకిస్ధాన్‌ ఏర్పాటు గురించి మహమ్మదాలీ జిన్నా, ముస్లింలీగ్‌ నేతలు ప్రతిపాదన తీసుకు రావటానికి రెండు సంవత్సరాల ముందే హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులంటూ సావర్కర్‌ ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌ నేతలు అరెస్టయిన సమయంలో హిందూ మహాసభ నేతగా వున్న సావర్కర్‌ సింధు, బెంగాల్‌ రాష్ట్రాలలో ముస్లింలీగ్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుకు నాయకత్వం వహించారు. ఆచరణాత్మక రాజకీయాలంటూ ఆ చర్యలను సమర్ధించుకున్నారు.అంతే కాదు హిందువులందరూ బ్రిటీష్‌ మిలిటరీ చేరాలని దేశమంతటా ప్రచారం చేసిన ‘ అపర దేశ భక్తుడు ‘. హిందూ మహాసభ, ముస్లింలీగ్‌ రెండూ కూడా స్వాతంత్య్రవుద్యమానికి దూరంగా వున్నవే కావటం గమనించాల్సిన అంశం.1943లో సింధు రాష్ట్ర అసెంబ్లీ భారత్‌ నుంచి పాకిస్ధాన్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయినప్పటికీ హిందూమహాసభ నేతలు మంత్రి పదవుల్లోనే కొనసాగారు. తీరా భారత్‌ను విభజించిన తరువాత దానికి గాంధీయే కారకుడని అదే సావర్కర్‌ ద్వేషం పెంచుకున్నారు. 1948 ఫిబ్రవరి 27న జవహర్‌లాల్‌ నెహ్రూకు రాసిన లేఖలో గాంధీ హత్యలో సావర్కర్‌ పాత్ర గురించి ప్రస్తావించారు. హిందూమహాసభకు చెందిన మతపిచ్చిగల వారు నేరుగా సావర్కర్‌ నాయకత్వంలో చేసిన, అమలు జరిపిన కుట్రలో భాగంగానే బాపూ హత్య జరిగిందని పేర్కొన్నారు. కుట్ర గురించి విచారణ జరిపిన కపూర్‌ కమిషన్‌ కూడా పటేల్‌ వ్యాఖ్యలను నిర్ధారించింది.

Related image
సావర్కర్‌ ‘విలువల ‘ ప్రాతిపదికన జాతి నిర్మాణం-మోడీ !

సావర్కర్‌ విలువల ప్రాతిపదికనే జాతీయవాదంతో జాతి నిర్మాణం జరుగుతున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించిన వారే వీర సావర్కర్‌ను కించపరుస్తూ ఇంతవరకు భారత రత్న అవార్డు ఇవ్వకుండా అడ్డుపడ్డారని కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.సావర్కర్‌ భరతమాత నిజమైన పుత్రుడని గతంలో ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వారు కొద్ది రోజులు పోతే మహాత్ముడిని హత్య చేసిన గాడ్సేకు సైతం భారత రత్న ఇస్తారని కాంగ్రెస్‌ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తే సావర్కర్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.1857లో జరిగిన తిరుగుబాటును ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా గుర్తించింది సావర్కర్‌ అని హౌమంత్రి అమిత్‌ షా ఒక సభలో చెప్పారు. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ఇందిరా గాంధీ స్వయంగా సావర్కర్‌ను అనుసరించారని ఆయన సమీప బంధువు రంజీత్‌ చెప్పారు. సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని బిజెపి చెప్పిన అంశం జనం ముందు వుంది. అది తప్పనుకుంటే జనం వ్యతిరేకంగా ఓటు వేస్తారని అన్నాడు.

కాంగ్రెస్‌ అవకాశవాదం !
వాజ్‌పేయి ప్రధానిగా వున్న సమయంలో సావర్కర్‌ చిత్రపటాన్ని పార్లమెంట్‌ హాలులో పెట్టాలన్న స్పీకర్‌ మనోహర్‌ జోషి ప్రతిపాదనను కాంగ్రెస్‌ వ్యతిరేకించలేదు. స్పీకర్ల ప్రతిపాదనలను ఎవరూ వ్యతిరేకించరని కొందరు కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ సావర్కర్‌ స్మారక నిధికి 1970లో వ్యక్తిగతంగా పదకొండు వేల రూపాయల విరాళం ఇచ్చారని, ఆయన స్మారకంగా ఒక తపాలా బిళ్లను విడుదల చేశారని అయితే సోనియా గాంధీ సావర్కర్‌ను వ్యతిరేకిస్తున్నారని బిజెపి విమర్శలు కురిపించింది. బ్రిటీష్‌ పలకులకు సావర్కర్‌ క్షమాభిక్ష పెట్టమని లేఖలు రాసిన విషయం ఇందిరా గాంధీకి తెలిసి వుండకపోవుచ్చు, తెలిసిన తరువాత సోనియా గాంధీ ఎందుకు సమర్ధించాలి అనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి.సావర్కర్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు, అయితే ఆయన హిందూత్వను మాత్రం అంగీకరించం అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.

Image result for savarkar, chitraguptaImage result for savarkar, chitragupta
వీర సావర్కర్‌ బిరుదు వెనుక అసలు కధ !
సంఘపరివార్‌, బిజెపి వాటి అనుబంధ సంస్ధల కార్యకర్తలు, అభిమానులు సావర్కర్‌ను వీర బిరుదు తగిలించి పిలుస్తారు. ఆ బిరుదు ఎవరిచ్చారు, ఏ వీరత్వం కారణంగా వచ్చింది అంటే ఎవరూ సమాధానం చెప్పరు. వీర సావర్కర్‌ జీవితం పేరుతో ఒక పుస్తకం ప్రచురితమైంది.1926లో చిత్రగుప్త అనే గుప్త నామ రచయిత దానిలో సావర్కర్‌ వీరత్వం గురించి గొప్పగా రాశారు. 1966లో ఆయన మరణించిన రెండు దశాబ్దాల తరువాత 1987లో సావర్కర్‌ రచనల అధికారిక ముద్రణ సంస్ధ వీర సావర్కర్‌ ప్రకాశన్‌ ఆ పుస్తకాన్ని రెండోసారి ప్రచురించింది. చిత్రగుప్త అంటే మరెవరో కాదు స్వయంగా సావర్కరే అని దానికి ముందు మాట రాసిన రవీంద్ర రామదాస్‌ వెల్లడించారు. అంటే అది సావర్కర్‌ ఆత్మకధ అన్నది నిర్ధారణ అయింది. పుట్టుకతోనే సావర్కర్‌ హీరో అని తన గురించి తానే దానిలో రాసుకున్నారు.

Image result for vd savarkar chitragupta
అతిశయోక్తులు – అవాస్తవాలు !
‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్‌ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక ఉన్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్‌ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్‌ 18వ తేదీ యంగ్‌ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి తన చిత్రాలలో పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్‌ సిన్హా అనే గుజరాత్‌ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్‌ ఇండియా సంచికే లేదని 1921 జూన్‌ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్‌ గురించి ప్రస్తావన గానీ, ))ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్‌లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు.

ఆవు దేవత కాదన్న సావర్కర్‌ !
గోమాత అంటూ గోరక్షకుల పేరుతో కొందరు చేసిన దాడులతో మన దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా అడుగంటిన విషయం తెలిసిందే. అసలైన హిందూ హృదయ సామ్రాట్‌గా పరిగణించే సావర్కర్‌ ఆవు ఒక సాధారణ జంతువు తప్ప దేవత కాదని అన్నారు. అవి మానవులకు ఉపయోగపడతాయి గనుక వాటిని కాపాడుకోవాలి తప్ప దేవతలు కాదని రాశారు. పాలకు ప్రతీక ఆవు తప్ప హిందూ దేశానికి కాదని కూడా పేర్కొన్నారు.
‘స్వంత అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు సావర్కర్‌కు ఉంది. ఆయన హేతువాదాన్ని నమ్మారు.మనోద్వేగాల కంటే వుపయోగితావాదానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే అదే సమయంలో గాంధీ కూడా ప్రజల మనోద్వేగాలను గౌరవించారు ‘ అని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్త ఎంజివైద్య వ్యాఖ్యానించారు.

అమిత్‌ షా అతియోక్తి !
1857లో జరిగిన ఉదంతాన్ని సిపాయిల తిరుగుబాటుగా బ్రిటీష్‌ పాలకులు ప్రచారం చేశారు. కొందరు చరిత్రకారులు కూడా అదే విధంగా చూశారు. అయితే ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా సావర్కర్‌ వర్ణించినట్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.’ భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు ‘ అని 1857 జూలై 28, 31 తేదీలలో కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. అప్పటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో మార్క్స్‌ రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు.

హిందూత్వ-నాజీ పోలిక !
హిందూత్వ ఒక జీవన విధానం తప్ప మతానికి సంబంధించింది కాదని సంఘపరివార్‌ శక్తులు పదే పదే చెబుతారు, కొంత మంది అది నిజమే అనుకుంటున్నారు. యావత్‌ ప్రపంచం హిట్లర్‌ మూకలు, అనుయాయులను నాజీలు అని పిలిచే విషయం తెలిసిందే. అయితే హిట్లర్‌, ఆతగాడి అనుయాయులు ఎన్నడూ దాన్ని అంగీకరించలేదు, తమను జర్మన్‌ జాతీయ సోషలిస్టులుగా, తమది జాతీయ సోషలిజంగా వర్ణించుకున్నారు. మహారాష్ట్రలో బిజెపి, శివసేన హిందూత్వశక్తులుగా రంగంలో వున్నాయి. హిందూత్వకు సావర్కర్‌ ప్రతీకగా వున్నారు. స్వాతంత్య్రవుద్యమసమయంలో సావర్కర్‌ భావజాలాన్ని మరాఠాలు ఆమోదించలేదు. అయితే మారిన పరిస్ధితుల్లో అనేక దశాబ్దాలపాటు ఆయన అనుయాయులు చేసిన ప్రచారం కారణంగా అనేక మంది సావర్కర్‌ నిజమైన జాతీయవాది అని భావిస్తున్నారు. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు ఆయనకు భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదనను బిజెపి ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.
ముందు వక్రీకరణలతో గందరగోళాన్ని సృష్టించటం, మెల్లగా తమ అజెండాను ఎక్కించటాన్ని చూస్తున్నాము. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే అదే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రాన్ని అమలు జరుపుతున్నారు. ఇదే సమయంలో మెజారిటీ హిందూ మతోన్మాదశక్తులను జాతీయవాదులుగా చిత్రించి అసలైన జాతీయవాదులు, లౌకికశక్తుల మీద దాడి చేస్తున్నారు. దానిలో భాగమే సావర్కర్‌కు భారత రత్న బిరుదు సాధన వాగ్దానం. అది అమలు జరిగితే తదుపరి గాంధీని హత్యచేసిన గాడ్సేను ముందుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. విజేతలే చరిత్రను రాయటం అంటే ఇదే. అందువలన ‘చరిత్రను విస్మరించిన తరానికి గతమూ, భవిష్యత్‌ రెండూ ఉండవు ‘ అని చెప్పిన రాబర్ట్‌ హెయిన్‌లిన్‌ మాటలను ఈ సందర్భంగా గుర్తుకు తేవాల్సి ఉంది. ఏది అసలైన చరిత్ర ? ఏది నకిలీ ? వాట్సాప్‌ యూనివర్సిటీ చరిత్ర పాఠాల పట్ల తస్మాత్‌ జాగ్రత్త ! అక్కడ వైద్య శాస్త్రం చదవకుండా వైద్యం చేసే నకిలీ వైద్యుల మాదిరి చరిత్ర తెలియని వారు సుప్రసిద్ధ చరిత్ర కారులుగా మనకు బోధిస్తారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపి ఒప్పందం-మోడీ సర్కార్‌ 2024 ఓట్ల లెక్కలు !

19 Saturday Oct 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ASEAN, free trade agreement, RCEP, RCEP INDIA, Regional Comprehensive Economic Partnership

Image result for RCEPఎం కోటేశ్వరరావు
ఇప్పటి వరకు వెలువడిన సూచనలు, ధోరణులను బట్టి ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి)’ ఒప్పందంపై మన దేశం సంతకాలు చేసే అంశం చివరి నిమిషం వరకు ఉత్కంఠను కలిగించే అవకాశం వుంది. నవంబరు నాలుగవ తేదీన బ్యాంకాక్‌ సమావేశంలో సంతకాలు జరగనున్నాయి. దానికి మన ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం పునరాలోచన గురించి ఇంతవరకు ఎలాంటి వార్తలు లేవు. మన ఎగుమతిదార్లకు తగినన్ని రాయితీలు సంపాదించేందుకు ప్రయత్నించి ఒప్పందం మీద సంతకం చేయాలన్న వైఖరితో మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమేరకు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒప్పందం మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా దెబ్బతీస్తుందనే అభిప్రాయాల పూర్వరంగంలో మోడీ సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. అధికారిక అభిప్రాయాలు వెల్లడి కాలేదు.
ఎగుమతి, దిగుమతి వాణిజ్య లాబీయిస్టులు ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉండి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. మరోవైపు ఈ ఒప్పందం షరతులు అమలు జరిగితే ఇప్పటికే మన దేశ వ్యవసాయ, అనుబంధ రంగాలలో నెలకొన్న సంక్షోభం లేదా తీవ్ర సమస్యలు మరింతగా పెరిగే అవకాశం వుంది కనుక ఒప్పందంపై సంతకాలు చేయరాదని రైతు సంఘాలు మరోవైపున డిమాండ్‌ చేస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)లో భాగస్వాములు అయినప్పటికీ గత దశాబ్దకాలంగా అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకుంటున్నాయి. అనేక దేశాలు ద్విపక్ష ఒప్పందాలు, ప్రాంతీయ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దానిలో భాగమే ఆర్‌సిఇపి. గత ఐదు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ ప్రచార ఆర్భాటం తప్ప మన దేశం నుంచి ఎగుమతులను పెంచటంలో ఘోరంగా విఫలమైంది. ఆర్‌సిఇపి విషయానికి వస్తే దీనిలో ఆగేయ ఆసియాలోని బ్రూనీ, కంపూచియా, ఇండోనేషియా, లావోస్‌, మలేసియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ లాండ్‌, వియత్నాం(వీటిని ఆసియన్‌ దేశాలని కూడా అంటారు)లతో పాటు చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలతో కూడిన కూటమి మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి 2012 నవంబరు నుంచి చర్చలు జరుగుతున్నాయి.

ఈ కూటమి ఆసియన్‌ దేశాల 2012 సమావేశంలో పురుడుపోసుకుంది.గత కొన్ని సంవత్సరాలుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. తుది ఒప్పంద దశకు చేరుకుంది. పదహారు దేశాలలో 340 కోట్ల మంది జనాభా ఉన్నారు.2017 వివరాల ప్రకారం ప్రపంచ జిడిపిలో 39శాతం అంటే 49.5 లక్షల కోట్ల డాలర్ల వాటా వుంది. ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య కూటమి కానుంది.2050 నాటికి ఈ దేశాల జిడిపి 250లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. అందువలన ఇంత పెద్ద కూటమికి దూరంగా ఉండేందుకు మన దేశంలోని బడా కార్పొరేట్‌ సంస్ధలు ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించవు. గత అనుభవాలను గమనంలో వుంచుకొని రైతు సంఘాలు భయపడుతున్నట్లుగా రైతాంగాన్ని బలిపెట్టి అయినా వాణిజ్య, పారిశ్రామిక, సేవారంగాల కార్పొరేట్లు తమ ప్రయోజనాలకోసం కృషి చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు.చైనా నుంచి మరిన్ని రాయితీలను రాబట్టాలని అవి కేంద్రం మీద వత్తిడి చేస్తున్నాయి.

ఇక మన దేశం విషయానికి వస్తే ఈ ఒప్పందంలో భాగస్వామి అయితే సంభవించే నష్టాలేమిటి, కలిగే లాభాలేమిటి అన్న చర్చ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఆసియన్‌ దేశాలకు మన దేశం నుంచి 2018-19లో 9.56శాతం పెరిగి 37.47 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. అయితే ఇదే సమయంలో దిగుమతులు 25.87శాతం పెరిగి 59.32 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం ఏ దేశానికీ క్షేమకరం కాదు. అందువలన వాణిజ్య మిగులు సంగతి తరువాత లోటును తగ్గించుకొనేందుకే మన ప్రయత్నాలన్నీ పరిమితం అవుతున్నాయి. సంప్రదింపుల ప్రారంభంలో అంటే 2010-11లో ఆసియన్‌ దేశాలతో మన వాణిజ్య లోటు 12 బిలియన్‌ డాలర్లు వుంటే 2018-19 నాటికి 22 బిలియన్లకు పెరిగింది.

ఆసియన్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) విషయానికి వస్తే మన దేశం 74శాతం వరకు పన్నులను రద్దు చేసేందుకు అంగీకరించగా ఇండోనేషియా 50, వియత్నాం 70శాతం మాత్రమే అంగీకరించాయి. ఇది మన కార్పొరేట్‌లను కలవర పెడుతున్నది.కనీసం చైనా కంటే పదిశాతం మేరకు అయినా మనకు అనుకూలంగా వుండాలని కోరుతున్నాయి. ఇతర దేశాలతో దాదాపు ఒప్పందం తుది దశలో ఉండగా చైనాతో ఇంకా ఆదశకు రాలేదు. ఇటీవల చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పర్యటన సందర్భంగా ఈ అంశం మంత్రుల స్ధాయిలో చర్చించాలని అనుకున్నారు. మన దేశం కూటమిలో భాగస్వామి కాకుండా ప్రయోజనం లేదని భావించిన దేశాలు సంప్రదింపులకు గడువును పెంచాయి.

ఇటీవల నీతి ఆయోగ్‌ వివిధ కూటములు, దేశాలతో మన ఎగుమతులు, దిగుమతుల గురించి చేసిన సమీక్షలో ఒక్క శ్రీలంక విషయంలో తప్ప మిగిలిన అన్నింటి విషయంలో నష్టం తప్ప లాభం లేదని తేలింది. రెండు వైపులా జరిగే వాణిజ్యంలో 75శాతం మేరకు ఆర్‌సిఇపి స్వేచ్చా వాణిజ్య ఒప్పంద పరిధిలోకి వస్తాయి. మొత్తం పన్నెండువేల ఉత్పత్తులకు సంబంధించి తొమ్మిదివేల వరకు పన్నులను తగ్గించాల్సి వుంటుంది. పదమూడు వందల ఉత్పత్తులు పన్నుల నుంచి మినహాయింపు పొందిన జాబితాలో , 1800 వస్తువులు ఆచితూచి వ్యవహరించాల్సిన జాబితాలో ఉన్నాయి. మన దేశం మినహాయింపు జాబితాలో పదిశాతం వస్తువులను చేర్చగా అనేక దేశాలు అంతకంటే ఎక్కువ వస్తువులనే తమ జాబితాల్లో చేర్చాయి.

మూడు సంవత్సరాల క్రితం మతిమాలిన పెద్ద నోట్ల రద్దు, తగినంత కసరత్తు లేకుండా జిఎస్‌టి ప్రవేశపెట్టటం, ఇతర కారణాలతో దేశం ప్రస్తుతం రోజురోజుకూ మాంద్యంలోకి కూరుకుపోతోంది. ఈనేపధ్యంలో మోడీ సర్కార్‌ రాజకీయంగా తన లాభనష్టాలను లెక్కవేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వ్యవసాయంతో పాటు అనుబంధ పాడి, సేవా రంగాలను దెబ్బతీస్తుందని రైతు సంఘాలు, ఇతర సంస్ధలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. నవంబరులో ఆర్‌సిఇపి ఒప్పందం కుదిరితే దాని అంశాలు 2021-22 నాటికి అమల్లోకి వస్తాయి. వాటి ప్రభావం 2023-24లో కనిపిస్తుంది. ఒక వేళ అది ప్రతికూలమైతే ఆ ఏడాది జరిగే ఎన్నికల్లో తమ భవిష్యత్‌ ఏమిటన్నది బిజెపి తేల్చుకోలేకపోతున్నది.

Image result for RCEP

బిజెపి ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి ఒప్పందాలను అది వ్యతిరేకించింది, ముఖ్యంగా స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సంస్ధ ఇప్పటికీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల కారణంగా 2018లో మన దేశం 530 కోట్ల డాలర్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పటికే అనేక దేశాల మార్కెట్లు మనకు అందుబాటులో వున్నాయని, ఈ ఒప్పందం ద్వారా కొత్తగా సాధించేదేమిటి అన్న ప్రశ్నకు సరైన సమాధానం రావటం లేదు. పాడి, పామోలిన్‌ రైతాంగం తీవ్రంగా నష్టపోతారని బయటకు వచ్చిన పత్రాల సమాచారం వెల్లడిస్తున్నది.

ఆలిండియా కిసాన్‌సభ (ఎఐకెఎస్‌) రాగల పర్యవసానాల గురించి ఒక ప్రకటనలో రైతాంగాన్ని హెచ్చరించింది. దేశంలో పది కోట్ల రైతు కుటుంబాలకు పాడి పరిశ్రమ జీవనాధారంగా వుందని, పాలధరలో 71శాతం రైతాంగానికి చేరుతోందని పేర్కొన్నది. ప్రస్తుతం పాల వుత్పత్తుల దిగుమతులపై విధిస్తున్న 64శాతం పన్ను రద్దు చేస్తే దిగుమతులతో పాల ధర పతనం అవుతుందని హెచ్చరించింది. న్యూజిలాండ్‌ తన పాలవుత్పత్తుల్లో 93శాతం ఎగుమతులు చేస్తోందని, మన దేశంలో పాలపొడి కిలో 260 రూపాయల వరకు వుండగా న్యూజిలాండ్‌ నుంచి 160-170కే లభిస్తుందని కిసాన్‌ సభ పేర్కొన్నది.దేశంలోని వ్యవసాయ రంగంలో 85శాతం మంది రైతులు చిన్న సన్నకారేనని ఆర్‌సిఇపి ఒప్పందం వారి పాలిట శాపం అవుతుందని హెచ్చరించింది. ఇప్పటికే ఆటోమొబైల్‌ తదితర అన్ని రంగాలూ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత విదేశాల నుంచి దిగుమతి అయ్యే చౌకధరల వుత్పత్తులతో సమస్య మరింత తీవ్రం కావటం అనివార్యమని ఆయా రంగాల నిపుణులు ఇ్పటికే హెచ్చరించారు.

Image result for RCEP

ఈనెల 11,12 తేదీల్లో బ్యాంకాక్‌లో జరిగిన ఆర్‌సిఇపి మంత్రుల సమావేశంలో మన దేశం లేవనెత్తిన అంశాల కారణంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది. ముందే చెప్పుకున్నట్లు గతంలో కుదిరిన అవగాహన ప్రకారం ఒప్పందం అమలు జరిగితే సంభవించే ప్రతికూల ప్రభావంతో 2024 ఎన్నికల్లో దెబ్బతగులుతుందనే అంచనాతో ఒప్పందం అమలు సంవత్సరాన్ని 2014కు బదులు 2019గా మార్చాలని మన వాణిజ్య మంత్రి ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. గత రెండు సంవత్సరాల్లో మన పరిశ్రమల పరిరక్షణ చర్యల్లో భాగంగా సగటున దిగుమతులపై పన్నును 13 నుంచి 17శాతం వరకు పెంచారు. ఇప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తే వెంటనే పన్ను తగ్గించాల్సి వుంటుంది. వివిధ తరగతుల నుంచి వస్తున్న వత్తిళ్ల పూర్వరంగంలో మన దేశం గతంలో లేని కొన్ని కొత్త అంశాలను ఒప్పందంలో చేర్చాలని ప్రతిపాదించింది. దీని వెనుక రెండు వాదనలు వినిపిస్తున్నాయి. తాము చివరి వరకు మన ప్రయోజనాల రక్షణకే ప్రయత్నించామని, విధిలేని స్ధితిలో సంతకాలు చేశామని చెప్పుకొనేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇదే సమయంలో మొత్తంగా మన ఆర్దిక వ్యవస్ధకే ముప్పు వస్తుందని భావిస్తే తమ షరతులకు అంగీకరించలేదనే మిషతో ఒప్పందానికి దూరంగా వుండవచ్చు. ఈ నేపధ్యంలోనే భారత్‌ లేవనెత్తిన అంశాలపై మిగతా సభ్య దేశాలను అంగీకరింపచేసే బాధ్యత భారతే తీసుకోవాలని కొన్ని దేశాలు ఈనెల రెండవ వారంలో జరిగిన సమావేశంలో ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి.ఇంకా పక్షం రోజులు వున్నందున హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన తరువాత కేంద్ర సర్కార్‌ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈనెల పది నుంచి 20వ తేదీ వరకు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ నిరసన కార్యక్రమాలను ప్రకటించింది. అయితే వాటికి పెద్దగా స్పందన వున్నట్లు మీడియాలో మనకు కనపించదు. పైన చెప్పుకున్నట్లు ఓట్ల లెక్కలు కేంద్ర పాలకులను ప్రభావితం చేస్తాయా? కార్పొరేట్ల వత్తిడిది పై చేయి అవుతుందా చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గ్జీ జింపింగ్‌ మహాబలిపుర పర్యటన-మోడీ మితి మీరిన విశ్వాసం ?

12 Saturday Oct 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

China-India informal summit, Mamallapuram informal summit, narendra modi overconfidence, Narendra Modi with Xi Jinping in Mamallapuram, Xi Jinping mahabalipuram visit

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence

ఎం కోటేశ్వరరావు
అంతర్జాతీయంగా ప్రధాని నరేంద్రమోడీ నాయక (ప్రజా) రంజకత్వం సహజంగా పెరిగిందా లేక కృత్రిమంగా పెంచారా అని తర్జన భర్జనలు పడేవారున్నారు. ఏది జరిగినప్పటకీ పెరిగిందనే ఎక్కువ మంది భావిస్తున్నారు. ఏకీభవించటమా లేదా అన్నది ఎవరిష్టం వారిదే.
ఎక్కువ మంది భావిస్తున్నదాని ప్రకారం మోడీ-ప్రపంచ నేతలు ఎవరి అవసరాల కోసం వారు పరస్పరం సహకరించుకుంటున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హౌడీ మోడీ కార్యక్రమం సందర్భంగా హూస్టన్‌ స్డేడియంలో జరిగిన సభ. దానిలో మోడీ గారు ట్రంప్‌కు ఎన్నికల ప్రచారం చేశారు. దానికి ప్రతిగా మోడీ దేశపిత అని ట్రంప్‌ బదులు తీర్చుకున్నారు. హూస్టన్‌ అభిమానుల సంబరం అంబరాన్ని అంటితే, వెలుపల నిరసనకారుల అసమ్మతి కూడా వెల్లడైంది. అయితే ‘నిష్పాక్షికం’ అని చెప్పుకొనే మీడియా ఆనంద సమయంలో అసమ్మతి వినిపించటం, కనిపించటం అశుభం అని కాబోలు స్డేడియం లోపలి హేలనే చూపింది తప్ప వెలుపలి గోలను పట్టించుకోలేదు.
చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ మహాబలిపుర ఇష్టాగోష్టి సమావేశానికి రాక సందర్భంగా చైనాను మనం ఎలా కట్టడి చేయవచ్చో కథలతో పాటు మనకు నమ్మదగ్గ మిత్ర దేశం కాదని మీడియా హితవు చెప్పి కాషాయ దళాల ముందు తన దేశభక్తిని ప్రదర్శించుకుంది. జింపింగ్‌తో కలసి మహాబలిపుర సందర్శన చేస్తే వచ్చే ప్రచారంలో మోడీ వాటా సగమే. అందువలన పైచేయి సాధించేందుకు శనివారం పొద్దున్నే లేచి ఒక సంచి భుజాన వేసుకొని మహాబలిపురం బీచ్‌లో పడివున్న ప్లాస్టిక్‌ సీసాలను సేకరించి స్వచ్చ భారత్‌ గురించి చెప్పటమే కాదు ఆచరించి చూపిన ప్రధానిగా ప్రత్యేక ప్రచారాన్ని పొందారు.

ఇద్దరు మహానేతలు సందర్శనకు వచ్చే సమయంలో బీచ్‌లో వ్యర్ధాలను కూడా తొలగించరా ! ఇదేమి మర్యాద ? ప్రపంచ అగ్రనేతలు వచ్చే సమయాల్లో ఎంతో ముందుగానే ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకొని అణువణువూ గాలించి ఎలాంటి పేలుడు పదార్ధాలు సముద్ర తీరంలో లేవని నిర్ధారించుకుంటారు కదా ! పర్యటన ముగిసే వరకు సాధారణ పర్యాటకులను రానివ్వరు కదా ! అలాంటపుడు వ్యర్ధాలు వేయటాన్ని సిబ్బంది ఎలా అనుమతించారు? ఎలా వదలివేశారు అని అంతర్జాతీయ మీడియాలో కాస్త బుర్రవున్నవారు ప్రశ్నిస్తే సమాధానం ఏమిటి ? ఇలాంటి నాటకీయ చర్యలతో మోడీ ప్రతిష్ట పెరుగుతుందా ?

Image result for narendra modi swachh bharat mahabalipuram
రోజూ ఎందరో యువతీ యువకులు సంచులను భుజాన వేసుకొని వీధుల్లో చెత్తను ఏరుకుంటూ పొట్టపోసుకొనే దృశ్యాలు మనం చూసేవే. దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి వారి సంఖ్య ఐదు లక్షలని, దేశం మొత్తం మీద 15 నుంచి 40లక్షల మంది వరకు వున్నారని ఒక అంచనా. వారి గాధలను మీడియా ఏమేరకు ఇచ్చిందో మనకు తెలియదు. ప్రధానికి వచ్చే రేటింగ్‌కు వారికి రాదు. స్వచ్చ భారత్‌, ప్లాస్టిక్‌పై నిషేధం అమలు జరిగితే వారిలో కనీసం సగం మందికి ఆ వుపాధిపోవటం ఖాయం.( ఈ విశ్లేషణ రాసే సమయానికి మహాబలిపుర ఇష్టాగోష్టి ఫలితాలు వెలువడలేదు. కనుక మీడియాలో వెల్లడైన కొన్ని అంశాలకు మాత్రమే ఇది పరిమితం అని గమనించ మనవి)
కర్మ సిద్దాంతాన్ని నమ్మే వారి అంతరంగం ప్రకారం(బహిరంగంగా చెబితే మన ఖర్మ ఎలా కాలుతుందో అనే భయం కావచ్చు) రెండో సారి నరేంద్రమోడీకి అంతగా కలసి రావటం లేదట. అంతర్జాతీయంగా నేతల ప్రశంసలు తప్ప మిగతా అంశాలలో దేశీయ ఆర్ధిక రంగంలో అన్నీ అశుభాలే ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అదే సిద్దాంతం ప్రకారం ఎవరు చేసిన దానిని వారు అనుభవించకతప్పదని ఎవరైనా అంటే మనోభావాలను కించపరిచే, దేశద్రోహలు అయిపోతారు.’ ఇదేమి ఖర్మమో ‘ !

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
గత ఐదు సంవత్సరాలుగా దేశాన్ని ప్రపంచ మార్కెట్లో పోటీకి తట్టుకొనేదిగా తయారు చేస్తున్నామని నరేంద్రమోడీ చెప్పుకోవటాన్ని కొందరు అంగీకరించకపోయినా ఎక్కువ మంది జేజేలు పలికారు. మరి అదేమిటో ఏ రోజు ఏ పత్రిక తిరగేస్తే, ఏ టీవీని చూస్తే ఆర్ధిక రంగంలో దిగజారుడు ఏ ఏడాదితో పోలుస్తారో అని సందేహించాల్సి వస్తోంది. దవోస్‌ కేంద్రంగా పనిచేసే ప్రపంచ అర్ధిక వేదిక(డబ్ల్యుఇఎఫ్‌) రూపొందిస్తున్న ప్రపంచ పోటీతత్వ సూచిక 2019లో మన దేశం గత ఏడాది కంటే పది పాయింట్లు దిగజారి 68వ స్ధానంలోకి పోయింది. 2008-09 నుంచి ప్రారంభమైన ఈ సూచికలో పదేండ్ల క్రితం చైనా 30వ స్ధానంలో వున్నది. స్ధిరంగా నిలుపుకోవటం లేదా మెరుగుపరచుకోవటం తప్ప అంతకంటే దిగజారలేదు, తాజా సూచికలో 28వ స్దానంలో వుంది. అదే మన దేశం విషయానికి వస్తే 50వ స్ధానంతో ప్రారంభమైంది. తాజా సూచిక 68. మెరుగుపడటం లేదా కనీసం స్ధిరంగా వుండటం లేదన్నది స్పష్టం. ఇదంతా ఎప్పుడు ? యాభై ఆరు అంగుళాల ఛాతీ విరుచుకొని ఐదేండ్లు సాము చేసిన తరువాత !

నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన విజయ గాధలలో వినిపించేది దేశపు సులభతర వాణిజ్య సూచిక. 2014లో 142గా వున్నది 2018 నాటికి 77వ స్ధానానికి ఎగబాకటం. ఇది రాస్తున్న సమయానికి 2019 సూచిక ఇంకా వెలువడలేదు. అది మరింత ఎగబాకినా, దిగజారినా నరేంద్రమోడీకి సంకటమే. సులభతరవాణిజ్య సూచిక ఇంకా ఎగబాకితే ఆర్ధిక వ్యవస్ధలో కనిపిస్తున్న ‘అశుభాల’ సంగతేమిటని జనం ప్రశ్నించకపోయినా ఆలోచిస్తారు. జనం మెదళ్లు పని చేయటం ప్రారంభించటం పాలకులకు ఎల్లవేళలా ప్రమాదరకమే. సూచిక దిగజారితే కబుర్లు తప్ప మాకు ఒరగబెట్టిందేమీ లేదని కార్పొరేట్‌ శక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తాయి. వారి సంఖ్య తక్కువ, వారేమనుకుంటే మాకేం జాతీయ భావాలతో ఓటేసే జనం వుండగా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. జనం రంగంలోకి రానంత వరకు ఏ పాలకుడిని ఎప్పుడు అందలమెక్కించాలో, ఎప్పుడు దించాలో నిర్ణయించేది వారే.
అమెరికా-చైనా వాణిజ్య యుద్దంతో దెబ్బలాడుకుంటుంటే చైనా కంపెనీలు మన దేశానికి తరలి వస్తాయని, మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేస్తే మనం చెప్పినట్లు చైనా వింటుందని నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మీడియా ‘అగ్రహారీకులు’ కొందరు దీనికి అనుగుణ్యంగా అమెరికా తరువాత చైనా వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకొనేది మనమే అన్నట్లుగా తాము నమ్మటమే కాదు, జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

2018 వివరాల ప్రకారం చైనా నుంచి వంద రూపాయల విలువగల వస్తువుల ఎగుమతి జరిగితే మన దేశానికి వచ్చినవి అక్షరాలా మూడు రూపాయల పదిపైసల కిమ్మత్తు కలిగినవి. మన కంటే ఎగువన వున్న ఆరు దేశాలు, ప్రాంతాలు 48.10 రూపాయల విలువగల వస్తువులను దిగుమతులు చేసుకున్నాయి. వాటిలో అమెరికా 19.20, హాంకాంగ్‌ 12.10, జపాన్‌ 5.40, దక్షిణ కొరియా 4.40, వియత్నాం 3.40, జర్మనీ 3.10 చొప్పున దిగుమతి చేసుకున్నాయి. అందువలన మన కోడి కూయకపోతే చైనాకు తెల్లవారదు అని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ ప్రకటించిన మేకిన్‌ ఇండియా వస్తువుల ఎగుమతుల వైఫల్యం, మేడిన్‌ చైనా దిగుమతులు చేసుకుంటున్నట్లు అంగీకరించటమే.

గత రెండు దశాబ్దాలలో చూస్తే ఉభయ దేశాల మధ్య వాణిజ్య గణనీయంగా పెరిగింది.2000-01లో చైనా నుంచి దిగుమతులు 150 కోట్ల డాలర్లయితే మన ఎగుమతులు 83.1కోట్ల డాలర్లు, తేడా 67.1కోట్ల డాలర్లు. అదే 2008-09 నాటికి మన దిగుమతులు 32 బిలియన్లకు పెరగ్గా ఎగుమతులు 2007-08 నాటికి పదిబిలియన్‌ డాలర్లకు మించలేదు.2012 -13లో గరిష్టంగా 18 బిలియన్లకు చేరాయి తరువాత ఐదు సంవత్సరాల పాటు 13 బిలియన్‌ డాలర్లకు మించి జరగలేదు. చైనా నుంచి దిగుమతులు మాత్రం రెట్టింపు అయ్యాయి.2018లో మన ఎగుమతులు 16.5 బిలియన్‌ డాలర్ల కిమ్మత్తు కలిగినవి. మన కంటే చైనా దిగుమతులు 57.4బిలియన్‌ డాలర్లు ఎక్కువ, అంటే 74 బిలియన్‌ డాలర్ల మేర మనం దిగుమతులు చేసుకున్నాం. కమ్యూనిస్టు చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవటం నేరం, ఘోరం, దేశద్రోహం అని ఎవరైనా అంటే పై అంకెలను బట్టి అతల్‌ బిహారీ వాజ్‌పేయి, తరువాత ఏలుబడి సాగించిన మన్మోహన్‌ సింగ్‌ కంటే నరేంద్రమోడీ పెద్ద దేశద్రోహం చేసినట్లే ! చైనాతో పోలిస్తే ఘోరంగా విఫలమైనట్లే ? ఈ ఐదేండ్ల కాలంలో సామాజిక మీడియాలో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కాషాయ దళాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. నరేంద్రమోడీ ఆచరణ భిన్నంగా వుంది.

ఇటీవలి కాలంలో మన మీడియాలో చైనా నుంచి వలసపోతున్న కంపెనీల గురించి వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. అది వాస్తవమే, అయితే చైనాలో వున్న ఫ్యాక్టరీలెన్ని వాటిలో తరలిపోయే వాటి శాతం ఎంత అన్న నిర్దిష్ట సమాచారం లేదు. సర్వేజనా సుఖినో భవంతు అన్నది మన సంస్కృతి అని ఒక వైపు చెబుతూనే మన దేశంలో రోజు రోజుకూ మూతబడుతున్న ఫ్యాక్టరీల గురించి పట్టని మీడియా చైనా ఫ్యాక్టరీల గురించి అత్యుత్సాహం ప్రదర్శించటాన్ని ఏమనాలి?
చైనా నుంచి తరలిపోతున్న ఫ్యాక్టరీలు ఎక్కువగా వియత్నాం, తైవాన్‌, చిలీలకు పోతున్నాయన్నది తాజాగా వెలువడిన ఒక విశ్లేషణ సారాంశం. దీనికి అమెరికాతో వాణిజ్య యుద్దం కంటే ఇతర కారణాలు ప్రధానంగా పని చేస్తున్నాయని, ఈ పోటీలో నష్టపోయేది దక్షిణాసియా అంటే భారత్‌ అని కూడా చెబుతున్నారు. రెనే యువాన్‌ సన్‌ అనే పరిశోధకురాలు ‘ తదుపరి ప్రపంచ ఫ్యాక్టరీ : చైనా పెట్టుబడులు ఆఫ్రికాను ఎలా పున:రూపకల్పన చేస్తున్నాయి ‘ అనే గ్రంధం రాశారు. ఆమె తాజాగా రాసిన విశ్లేషణ సారాంశం దిగువ విధంగా వుంది.

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
‘ గత దశాబ్దకాలంగా ముందుకు వస్తున్న ఒక ముఖ్యమైన ధోరణిని వాణిజ్యయుద్దం కేవలం వేగవంతం చేసింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా చైనా వుత్పత్తిదారులు కార్మికులను తగ్గించే యాంత్రీకరణ సాంకేతికతల మీద పెట్టుబడులు పెట్టటమా లేక ఫ్యాక్టరీలను వేరే చోట్లకు తరలించటమా అన్నది ఎంచుకోవాల్సి వుంది. రెండవ అంశాన్ని వారు ఎంచుకుంటున్నారు. తమ దేశంలో పెద్ద సంఖ్యలో జనాభా వుంది కనుక పెట్టుబడిదారులు వాలిపోతారనే మితిమీరిన విశ్వాసాన్ని భారత్‌ వదిలిపెట్టాలి.’
మరో విశ్లేషకుడు ఎమాన్‌ బారెట్‌ చెప్పిన అంశాల సారం ఇలా వుంది.’ తయారీదారులు చైనాను వదలి వెళ్లాలని చూస్తున్నారు, అయితే అదంతా వాణిజ్య యుద్దం వలన కాదు. అమెరికా వాణిజ్య యుద్దం ప్రకటించక ముందే చైనా వేతన ఖర్చులు పెరుగుతున్నాయి. 2008 గ్వాంగ్‌డూయింగ్‌ రాష్ట్రంలో కనీసవేతనం 4.12 యువాన్లు వుంటే 2018నాటికి 14.4యువాన్లకు పెరిగింది. జౌళి కర్మాగారాలు అంతకంటే తక్కువ వేతనాలకు కార్మికులు దొరికే దేశాలకు తరలిపోవాలని కోరుకుంటున్నాయి. సాంకేతికత తక్కువగా వుండే ఇలాంటివి తరలిపోవటం దీర్ఘకాలంలో చైనాకు అనుకూలంగా మారతాయి.2015లో చైనా ప్రకటించిన మేడిన్‌ చైనా 2025 ప్రకారం ఆధునిక తయారీ కేంద్రంగా మారాలన్నది లక్ష్యం. తక్కువ ఖర్చుతో పని చేసే ఫ్యాక్టరీలు తరలిపోతే మిగిలినవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాల్సి వుంటుంది. జర్మనీ పరిశ్రమ 4.0 నవీకరణ చేసేందుకు బిలియన్ల డాలర్లను సమకూర్చుకుంటున్నది, చైనా విధానం కూడా దానికి దగ్గరగా వుంది. పశ్చిమ దేశాల సాయం లేకుండా ఆ లక్ష్యాన్ని చైనా చేరుకోగలదా అనే సమస్య వాణిజ్య యుద్ధాన్ని తొందరపరచింది. అనేక కంపెనీలు పూర్తిగా చైనాను వదలి పెట్టాలని అనుకోవటం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం రెండవ పెద్ద మార్కెట్‌గా వున్న చైనాను వదలి పెట్టాలని ఎవరూ అనుకోవటం లేదు. ప్రధాన మైన భాగాలను చైనాలో తయారు చేసి వాటిని నౌకల ద్వారా ఇతర దేశాలకు తరలించి అక్కడ ఆ దేశాల పేరుతో అంతిమంగా వస్తువులను తయారు చేసి ఇవ్వాలనే అనే ఆలోచనతో వున్నాయి.(ఉదాహరణకు మన దేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మారుతీ కార్ల ప్రధాన భాగాలు జపాన్‌లో తయారు చేసి మన దేశంతో సహా ఇతర దేశాలకు తరలించి ఆయా దేశాల బ్రాండ్ల పేరుతో వాటిని విక్రయించిన మాదిరి) ”

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
ఈ నేపధ్యంలో చైనా నుంచి మన దేశానికి వచ్చే ఫ్యాక్టరీల మీద ఆశపెట్టుకోవటం మబ్బులను చూసి ముంతలోని నీరు పారపోసుకోవటం తప్ప వేరు కాదు. ఒక వేళ వచ్చినా అవి ఆధునికమైనవి కాదు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో వస్తూత్పత్తికి అవసరమైన నైపుణ్యం మన దేశంలో లేకపోవటం మన ప్రపంచ పోటీతత్వ సూచికలో మన వెనుకబడటానికి, దిగజారటానికి కారణాల్లో ఒకటన్నది స్పష్టం. జనాభా ఎంత మంది అన్నది కాదు, వారిలో ఎందరికి నైపుణ్య సామర్ధ్యం సమకూర్చామన్నది ముఖ్యం. ఈ విషయంలో నరేంద్రమోడీ సర్కార్‌ విజయం సాధించిందా ? వైఫల్యం చెందిందా ? యాభైఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో చేయలేనిదాన్ని ఐదేండ్లలో, 70 ఏండ్లలో చేయలేని దాన్ని 70 రోజుల్లో చేశామని చెప్పుకుంటున్నవారు ఈ విషయంలో ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d