• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

మేరా భారత్‌ మహాన్‌ : 33శాతం మహిళా రిజర్వేషన్లు వద్దు ! 43శాతం నేర చరితులు ముద్దు !!

11 Saturday Mar 2023

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, kavitha, Narendra Modi, Narendra Modi Failures, SITARAM YECHURY, women reservation, Women's Quota Bill


ఎం కోటేశ్వరరావు


ఎక్కడ మహిళలను పూజిస్తారో అక్కడ దైవత్వం వెల్లివిరుస్తుంది ! మన గడ్డ అలాంటిదేమరి అంటూ తెగమురిసిపోతాం. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం !! అని మన జబ్బలు మనమే చరుచుకుంటాం.ఎంతటి ఆత్మవంచన ! ఇంకా ఇలాంటివే చెప్పుకోవాలంటే మరో రామాయణం, భారతాలు అవుతాయి. దేశంలో పరిస్థితి అలానే ఉందా ? ఆమె దీక్ష తెరవెనుక కారణాలు ఏమిటన్నది పక్కన పెడితే తెరముందు రాజకీయ పార్టీలు తమ వైఖరిని తేల్చాలంటూ భారత జాగృతి సంస్థ నేత, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చారు. కవిత జన్మించటానికి నాలుగు సంవత్సరాల ముందే 1974లో ఈ సమస్య ముందుకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆమె తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పుట్టక ముందు నుంచే నలుగుతోంది. దీనికి సంబంధించి రాజ్యసభలో 2010లో ఆమోదం పొందిన బిల్లును 108వ రాజ్యాంగ సవరణ అని కూడా అంటారు. అప్పటి నుంచి 2014, 2019లో రెండు లోక్‌సభల గడువు తీరి రద్దయి ఉనికిలోకి వచ్చిన మూడవ సభలో కూడా ఇంతవరకు ఆమోదం పొందలేదు, ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. వర్తమాన లోక్‌సభ 2024లో రద్దయేలోగా ఆమోదం పొందుతుందా ? ఆ ప్రక్రియ తరువాత రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు ఐదున్నర గంటల పాటు భారీ ఎత్తున మద్దతుదార్లతో కలసి కవిత దీక్ష చేశారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించారు. సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. లాంఛన ప్రాయమైన ఈ దీక్ష ద్వారా మరుగున పడేసిన ఈ అంశాన్ని ఆమె ఒక్కసారి దేశ దృష్టిని ఆకర్షించేట్లు చేశారు. దీని పర్యవసానాలు ఏమిటి ?


మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన వచ్చినపుడు రాజ్యాంగసభ లేదా పరిషత్‌లోని కొందరు పురుషులతో పాటు కొందరు మహిళా సభ్యులు కూడా అంగీకరించలేదు.నిజానికి ఈ అంశం 1931లోనే చర్చకు వచ్చింది. మహాత్మాగాంధీ కూడా రిజర్వేషన్లను వ్యతిరేకించారు.1931లో నాటి బ్రిటిష్‌ ప్రధానికి సరోజిని నాయుడు తదితరులు రాసిన లేఖలో చట్టసభల్లో మహిళల నియామకం, రిజర్వేషన్లు, కో ఆప్షన్‌ వంటి చర్యలను అవమానకరమైనవిగానూ, హానికరమైనవిగానూ పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. తరువాత కాలంలో దీన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు. చట్టసభలలో ఆశించిన మేరకు ప్రాతినిధ్యం పెరగలేదు. 1974లో దేశంలో మహిళల స్థితిగతుల గురించి ఒక కమిటీ చేసిన సిఫార్సులలో స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది ఒకటి. చట్ట సభల్లో రిజర్వేషన్లను తిరస్కరించింది. అప్పటి నుంచి ఈ డిమాండ్‌కు క్రమంగా మద్దతు పెరిగింది.తరువాత 1988లో జాతీయ మహిళా దృష్టికోణ పధకం(నేషనల్‌ పరస్పెక్టివ్‌ ప్లాన్‌ ఫర్‌ ఉమెన్‌) కమిటీ స్థానిక సంస్థలలో మహిళలకు 30శాతం స్థానాలను రిజర్వుచేయాలని సిఫార్సు చేసింది. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1992,93 సంవత్సరాలలో 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా మూడోవంతు స్థానాలను రిజర్వు చేశారు. దీని ప్రకారం మూడవ వంతు కనీసంగానూ, తరువాత ఏ రాష్ట్రమైనా కోరుకుంటే 50శాతం వరకు కూడా పెంచుకొనే అవకాశం కల్పించారు. ఆ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఆమేరకు సగం సీట్లు రిజర్వు చేశాయి. తరువాత 1996 సెప్టెంబరు 12న దేవెగౌడ ప్రధానిగా ఉన్నపుడు లోక్‌సభలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు.అది వీగింది, తరువాత ప్రతి లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టటం ఆమోదం పొందకుండానే సభలు రద్దుకావటం చరిత్రగా మిగిలింది. తరువాత 2008లో యుపిఏ సర్కార్‌ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. స్టాండింగ్‌ కమిటీకి పంపగా దాన్ని ఆమోదించాలని 2009 డిసెంబరులో సిఫార్సు చేసింది.మంత్రివర్గం 2010 ఫిబ్రవరి 25న ఆమోదం తెలిపింది. మార్చి తొమ్మిదవ తేదీన ఓటింగ్‌కు పెట్టగా 199-1తో ఆమోదం తెలిపారు. తరువాత లోక్‌సభ, సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలిపి ఉంటే అది చట్టరూపందాల్చి ఉండేది. ఇంతవరకు అది జరగలేదు.


రాజ్యసభ ఆమోదించినదాని ప్రకారం మూడోవంతు సీట్లు అంటే 543కు గాను 181 స్థానాల్లో మహిళలు ఉండాలి. వర్తమాన లోక్‌సభలో 78 మంది అంటే 14.3శాతం మాత్రమే ఉన్నారు. మంత్రులు కూడా ఇదే దామాషాలో కొలువు దీరారు. అంతకు ముందు ఉన్నవారి కంటే మంత్రుల సంఖ్య తగ్గింది.అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో కేవలం తొమ్మిదిశాతమే ఉన్నారు. వివిధ దేశాల పార్లమెంట్లలో ఉన్న మహిళా ప్రాతినిధ్యం గురించి అంతర పార్లమెంటరీ యూనియన్‌ 2022లో సేకరించిన సమాచారం ప్రకారం సగానికిపైగా, దగ్గరగా మహిళలున్న పార్లమెంట్లు ర్వాండా(61.25) , క్యూబా( 53.22),బొలీవియా(53.08), న్యూజిలాండ్‌( 50.42), యుఏయి (50), మెక్సికో(48.2), నికరాగువా(47.25) ఉన్నాయి. ఇరవై దేశాలలో 40శాతంపైగా, ప్రపంచవ్యాపితంగా సగటున 26శాతం ఉన్నారు. 2020లో ప్రపంచంలో 193 దేశాలలో మన స్థానం 143 కాగా మన కంటే మెరుగ్గా ఉన్న దేశాలు నేపాల్‌ 43, బంగ్లాదేశ్‌ 98, పాకిస్థాన్‌ 106వ స్థానంలో ఉండగా శ్రీలంక 182వదిగా ఉంది.


మన పార్లమెంటులో రిజర్వేషన్ల బిల్లు చర్చకు వచ్చినపుడు ఓబిసి, దళిత, గిరిజన మహిళల భుజాల మీద తుపాకి పెట్టి బిల్లును అడ్డుకున్న ఘనులు ఉన్నారు. ఏ సామాజిక తరగతికి చెందిన వారు అన్నదానితో నిమిత్తం లేకుండా మొత్తంగా మహిళలు అన్ని సామాజిక తరగతుల్లో వివక్షకు గురవుతున్నారు. అందువలన రిజర్వేషన్లు పెడితే ధనికులు, మనువు చెప్పినదాని ప్రకారం ఎగువ నిచ్చెనమెట్ల మీద ఉన్న మహిళలే ఆ ఫలాలను అనుభవిస్తారంటూ అడ్డుకున్నవారు కొందరు. రిజర్వేషన్లు అడగటం, ఇవ్వటం అంటే మహిళలను కించపరచటమే అని వాదించిన వారూ లేకపోలేదు.పైకి కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ దేశంలో ఫ్యూడల్‌ భావజాలం బలంగా ఉండటమే బిల్లు ఆమోదం పొందటానికి ఆటంకంగా ఉందని చెబుతున్నవారు ఉన్నారు. స్థానిక సంస్థలలో ఎన్నికైన మహిళలు పేరుకు ఆ స్థానాల్లో ఉన్నా భర్త లేదా కుటుంబంలోని ఇతర పురుషులే పెత్తనం చేస్తున్నారన్నది కూడా పాక్షిక సత్యమే. మరోవైపున మహిళలు ఉన్న చోట కేటాయింపులు పౌర సేవలు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలకు పెరిగినట్లు, సాధికారత, ఆత్మగౌరవం పెరిగినట్లు కూడా సర్వేలు వెల్లడించాయి. గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ చట్టసభలకు పోటీచేసే వారిలో నిర్ణీతశాతంలో మహిళలు ఉండేట్లు చూడాలన్న ప్రతిపాదనకు ఆమోదం రాలేదు. దీని వలన ఓడిపోయే చోట్ల వారిని పోటీకి దింపుతారనే విమర్శకూడా వచ్చింది.


చట్టపరంగా లేదా రాజకీయ పార్టీలు స్వచ్చందంగా మహిళలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించకపోవటం మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని ప్రచారం చేసుకోవటాన్ని అపహాస్యం చేస్తున్నది. అన్నింటికంటే పెద్ద వైరుధ్యం, సిగ్గుచేటైన అంశం ఏమంటే ఎన్నికలలో మూడోవంతు సీట్లు మహిళలకు రిజర్వు చేసేందుకు ముందుకు రాని పార్టీలు మరోవైపున నేరచరితులకు పెద్ద పీటవేసేందుకు ముందుకు వస్తున్నాయి. దోషులుగా తేలేంతవరకు నిందితులు తప్ప ఎవరూ నేరస్థులు కాదనే నిబంధనను అవకాశంగా తీసుకొని వారి కండబలాన్ని తోడు చేసుకొనేందుకు బరిలో నిలుపుతున్నాయి.తొలి లోక్‌సభలో ధనికులు, నేరచరితులు ఎందరు అని వెతికేందుకు కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ధనికులు కానివారు ఎందరు, నేర చరిత లేనివారు ఎందరు అన్నది వెతుక్కోవాల్సి వస్తోంది.


గతంలో రాజ్యసభ ఆమోదించిన బిల్లు ప్రకారం మూడోవంతు సీట్లను చట్ట సభల్లో మహిళలకు కేటాయించాలి. షెడ్యూలు కులాలు, తెగలకు కేటాయించిన సీట్లలో కూడా మూడోవంతు మహిళలుండాలి.ఏ రాష్ట్రంలోనైనా మూడు కంటే తక్కువ లోక్‌సభ సీట్లుంటే అక్కడ మూడోవంతు సూత్రం వర్తించదు.ఎక్కడైనా మూడు సీట్ల కంటే తక్కువ ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయిస్తే అక్కడ కూడా రిజర్వేషన్‌ ఉండదు. రిజర్వుడు సీట్లను రొటేషన్‌ పద్దతిలో కేటాయించాలి. మైనారిటీ,ఓబిసి మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్‌ లేదు.రాజ్యసభ, శాసనమండళ్లకు రిజర్వేషన్‌ వర్తించదు.పదిహేను సంవత్సరాల తరువాత రిజర్వేషన్లు రద్దవుతాయి.


ఎన్నికల నిబంధనవాళి ప్రకారం పోటీ చేసే వారు తమ ఆస్తిపాస్తులు, తమ మీద ఉన్న కేసులను అఫిడవిట్లలో పేర్కొనాల్సి ఉంది. వాటిని విశ్లేషిస్తున్న ఎడిఆర్‌ సంస్థ వెల్లడించిన సమాచారం మేరకు 2019లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో నేర చరితులు 43శాతం మంది ఉన్నారు.లోక్‌సభలోని 539 మందిలో 233 మంది నేరచరితులు ఉన్నట్లు తేలింది. పార్టీల వారీగా బిజెపి 116(39శాతం), కాంగ్రెస్‌ 19(57శాతం), జెడియు 13(81శాతం), డిఎంకె 10(43శాతం) తృణమూల్‌ 9(41) మంది ఉన్నారు.గత మూడు ఎన్నికలలో 2009లో మొత్తం 162(30శాతం) నుంచి 2014లో 185(34శాతం), 2019లో 233(43శాతం)కు పెరిగారు. వర్తమాన సభలో నేరచరితుల మీద ఉన్న కేసులలో 29శాతం అత్యాచారం, హత్య, హత్యాయత్నం, మహిళల మీద నేరాల వంటి తీవ్ర స్వభావం కలిగినవి ఉన్నాయి.బిజెపికి చెందిన ఐదుగురు, బిఎస్‌పి నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌,ఎన్‌సిపి,వైఎస్‌పి, ఒక స్వతంత్రుడి మీద హత్యకేసులు, బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మీద ఉగ్రవాద కేసు ఉంది.ఆమె భోపాల్‌ నుంచి గెలిచారు, మాలెగావ్‌ పేలుడు కేసులో నిందితురాలు. ఇక 29 మంది తమ మీద విద్వేష పూరిత ప్రసంగాల కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా కేరళలోని ఇడుక్కి నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీ డీన్‌ కురియకోస్‌ మీద దొంగతనంతో సహా 204కేసులు గరిష్టంగా ఉన్నాయి.


ఇలాంటి వారిని కలిగి ఉన్న పార్టీలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించటం గురించి ఏకాభిప్రాయానికి రావటం లేదన్నది ఒక ఆరోపణ. నిజానికి ఏ పార్టీ రంగేమిటో తేలేది బిల్లును లోక్‌సభ ముందుకు తెచ్చినపుడే. గతంలో తమకు ఉభయ సభల్లో మెజారిటీ ఉంటే ఒక్క క్షణంలో చేసి ఉండేవారమన్నట్లుగా బిజెపి నేతలు చెప్పేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పటికీ బిజెపి నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి చొరవలేదు.2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్న ప్రశ్నకు ఆ ఏడాది డిసెంబరులో నాటి మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఇచ్చిన సమాధానం బిజెపి చిత్తశుద్దిని వెల్లడించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయసాధనను జాగ్రత్తగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి చొరవ ఇంతవరకు ఎందుకు తీసుకోలేదన్నదే ప్రశ్న. తాము అనుకున్న కాశ్మీరు రాష్ట్ర రద్దు, ఆర్టికల్‌ 370 రద్దును ఆఘమేఘాల మీద ఎలా ఆమోదం పొందారో తెలిసిందే. అందువలన ఇప్పుడు బిజెపి తలచుకుంటే ఆమోదం కష్టమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుప్రీం కమిటీపై కందకు లేని అనుమానం కాషాయదళాలకెందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ తీరుపై మద్దతుదార్ల మండిపాటు !

05 Sunday Mar 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, Adani-Hindenburg row, BJP, Narendra Modi Failures, RSS, Saffron gang, Supreme Court of India



ఎం కోటేశ్వరరావు


తప్పనిసరి పరిస్థితి ఏర్పడి తప్పు చేసినట్లు ఒక వేళ గౌతమ్‌ అదానీ అంగీకరించినా అతని మద్దతుదారులైన కాషాయదళాలు మాత్రం ఒప్పుకొనేట్లు కనిపించటం లేదు. అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్‌ సంస్థ ఇచ్చిన నివేదిక సృష్టించిన సంచలనం, ఆ కంపెనీల వాటాల విలువ పతనం గురించి తెలిసిందే. ఆ నివేదిక ఆరోపణల మీద విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే చైర్మన్‌గా ఎస్‌బిఐ మాజీ చైర్మన్‌ ఓ ప్రకాష్‌ భట్‌, ఇన్ఫోసిస్‌ సహ ప్రారంభకుడు నందన్‌ నీలెకని, ప్రస్తుతం ఎన్‌బిఎఫ్‌ఐడి చైర్మన్‌గా, గతంలో ఐసిఐసిఐ, బ్రిక్స్‌ బాంకు, ఇన్ఫోసిస్‌ చైర్మన్‌గా పని చేసిన కెవి కామత్‌, ప్రముఖ లాయర్‌ సోమశేఖర సుందరేశన్‌, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జెపి దేవధర్‌ సభ్యులుగా ఉన్నారు. దాన్ని తాము స్వాగతిస్తున్నామని నిజం వెల్లడౌతుందని అదానీ ఒక ప్రకటనలో స్పందించారు. కానీ కందకు లేని అనుమానం కత్తిపీటకు వచ్చినట్లు సుప్రీం కోర్టు కమిటీ తటస్థంగా వ్యవహరిస్తుందా అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపే నేషనలిస్ట్‌ హబ్‌ అనే మీడియా పోర్టల్‌ ప్రశ్నించింది.సభ్యులుగా ఉన్నవారికి గతంలో ఆర్థికనేరాలకు పాల్పడినవారు కొందరితో ఉన్న సంబంధాలివి, మోడీని విమర్శించే సంస్థలతో కాంగ్రెస్‌తో సంబంధాలు అంటూ ఇలాంటి వారు తటస్థంగా ఉండి నివేదిక ఇస్తారా అన్న అనుమానాలను రేకెత్తించింది. దాని మీద ఇవ్వరు ఇవ్వరు అంటూ వెంటనే స్పందనలు.


దేశంలో ఇప్పుడు జరుగుతున్న తీరు తెన్నులను బట్టి జనం ప్రతిదాన్నీ అనుమానిస్తున్నపుడు ఏ కమిటీని వేసినా దానిలో ఉన్నవారిని అనుమానించటం సహజం. తానెలాంటి తప్పు చేయలేదని అదానీ తలకిందులుగా తపస్సు చేస్తున్నప్పటికీ, నరేంద్రమోడీ మద్దతుగా ఉన్నా, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినా పక్కన పెట్టేసి హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికను స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు నమ్మారు. తమ వాటాలను తెగనమ్ముకొన్నారు.నెల రోజులు దాటినా జరిగిన నష్టంలో మార్పు లేదు. అడ్డగోలుగా పెంచి పెద్దచేసినా, ఇబ్బందులు వచ్చినపుడు నరేంద్రమోడీ కూడా అదానీని కాపాడలేరని కూడా స్టాక్‌మార్కెట్‌ మదుపుదార్లలో ఉన్నట్లు ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో సంఘపరివార్‌ సంస్థ సుప్రీం కమిటీ మీద అనుమానాలను ఎందుకు రేకెత్తించినట్లు ? భీమకొరేగాం కేసులో మాదిరి దర్యాప్తు సంస్థే స్టాన్‌స్వామి, ఇతరుల కంప్యూటర్లలో తప్పుడు సమాచారాన్ని చొప్పించి దాన్నే సాక్ష్యంగా చూపేందుకు చూసిన దారుణం తెలిసిందే. అదానీ కంపెనీల్లో అలాంటిదానికి అవకాశం లేదు.వివరాలను ఇప్పటికే ధ్వంసం చేయగా మిగిలిన వాటి నుంచే అక్రమాలకు పాల్పడిందీ లేనిదీ కమిటీ నిర్ధారిస్తుంది. లేదూ ఒకదానికొకటి పొంతనలేని సమాచారం ఇస్తే దాన్ని కూడా సుప్రీం కోర్టుకు అందిస్తుంది. సెబీ కూడా దర్యాప్తు జరుపుతున్నది. ఒక నియంత్రణ సంస్థగా సెబీ తీరు తెన్నుల వైఫల్యం గురించి కూడా సుప్రీం కమిటీ విచారణ జరుపుతుంది. తమ కమిటీకి సహకరించాలని సెబీని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కమిటీలో వెలుగుచూడనివి సెబీ నివేదికలో లేదా సెబీలో రానివి సుప్రీం కమిటీ నివేదికలో చోటు చేసుకోవచ్చు. ఆ రెండు నివేదికలూ బహిర్గతమైన తరువాత గతంలో దర్యాప్తు జరిపిన హిండెన్‌బర్గ్‌ లేదా ఆ రంగంలో నిపుణులైన వారు లేవనెత్తే అంశాలను కూడా సుప్రీం కోర్టు విచారిస్తుంది. ఇంత జరగాల్సి ఉండగా ఇంకా ఆలూలేదూ చూలూ లేదు కొడుకుపేరు సోమలింగమా అన్నట్లుగా సంఘపరివార్‌ మీడియా ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు ? హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నింటినీ సుప్రీం కోర్టు కమిటీ విచారించటం లేదు. మన దేశంలో తిమ్మినిబమ్మిని చేసినట్లు వచ్చిన ఆరోపణల మీదనే అది పరిశీలన జరుపుతుంది. విదేశాల్లోని డొల్లకంపెనీలు, నిధుల మళ్లింపు వంటి వాటి మీద ఏదైనా అనుమానం వచ్చే సమాచారం దొరికితే దాన్ని సుప్రీం కోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది.సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా మీడియా ఎక్కువ చేసి రాస్తున్న వార్తల వలన స్టాక్‌ మార్కెట్‌ ప్రభావితమై మదుపర్లు నష్టపోతున్నందున అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం గురించి వార్తలపై నిషేధం విధించాలన్న పిటీషన్‌దారుల్లో ఒకరైన ఎంఎల్‌ శర్మ వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. సహేతుకమైన వాదనలు వినిపించండి తప్ప నిషేధాన్ని అడగవద్దని చెప్పింది.


ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్‌చేసిన జెపిసికి మోడీ సర్కార్‌ అంగీకరించి ఉంటే సుప్రీం కోర్టు కమిటీ ఉందేదీ కాదు, దాని మీద నేషనలిస్ట్‌ హబ్‌కు సందేహాలు లేవనెత్తే అవకాశం వచ్చి ఉండేది కాదు. జెపిసి పక్షపాతంగా పని చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దానిలో అత్యధికులు అదానీని కంటికి రెప్పలా కాపాడుతున్న బిజెపి లేదా మిత్రపక్షాల సభ్యులే ఉంటారు.అయినా మోడీ ఎందుకు నిరాకరించినట్లు ? ఏ పార్టీ మంది ఎందరని కాదు, ఎవరెందరున్నా అడిగిన సమాచారాన్ని కమిటీకి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వలేదని సభ్యులు రాస్తారు. మెజారిటీ ఒక నివేదికను ఆమోదించినా,దానితో విబేధించేవారు కూడా మరొక నివేదికను ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ రెండూ బహిరంగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు అదానీని కాపాడేందుకు పూనుకున్నది, ఎవరు అక్రమాలను వెలికి తీసేందుకు చూసిందీ యావత్‌ ప్రపంచానికి తెలుస్తుంది. గతంలో నరేంద్రమోడీకి ఉందని చెప్పిన 56 అంగుళాల ఛాతీ ఇప్పుడు లేక కాదు, ఈ కారణంగానే భయపడ్డారు.


సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల మీద వత్తిడి తీసుకురారా, బెదిరించరా అంటే ఈ దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. అదీ ప్రభుత్వం వైపు నుంచే ఉంటుంది. మన ప్రజాస్వామ్యానికి ముంచుకు వస్తున్న ముప్పు అదే ! తమ ముందు దాఖలైన కేసుల్లో సుప్రీం నోటీసులు ఇచ్చిన తరువాత గానీ కేంద్రం కదలలేదు.కమిటీ ఏర్పాటుకు అంగీకరిస్తూ తమ ప్రతిపాదనలను ఒక మూసివేసిన కవరులో పెట్టి సుప్రీం కోర్టుకు అందించింది. దాని అర్దం ఏమిటి ? మేము చెప్పిన వారితో చెప్పినపద్దతుల్లో విచారణ జరిపించాలని సుప్రీంను ప్రభుత్వం ఆదేశించటమే.పారదర్శక విచారణ జరగాలంటూ సదరు కవరును సుప్రీం కోర్టు తిరస్కరించింది. నిజానికి కేంద్రానికి అంతకంటే అవమానం మరొకటి లేదు, బహుశా ఈ పరిణామాన్ని ఊహించి ఉండరు. ఇంతకీ ఆ కవరులో నరేంద్రమోడీ సర్కార్‌ రాసిన అంశాలేమిటి అన్నది ఇప్పటి వరకు వెల్లడికాలేదు. ఇక అవకాశాలు లేవు.తరువాత అవి లీకైనా కేంద్రం తోసిపుచ్చే అవకాశం ఉంటుంది.


కొన్ని సందర్భాల్లో కేసుల స్వభావాన్ని బట్టి కోర్టులు ప్రభుత్వాలు, ఏజన్సీలను కోరిన సమాచారాన్ని సీల్డు కవర్‌లో అందించాలని అడుగుతాయి. అదానీ కంపెనీలదంతా బహిరంగం అయినపుడు విచారణ రహస్యంగా జరగాల్సిన అవసరం ఏముంది ? కమిటీ విచారణ అంశాలు, పరిధి గురించి పిటీషనర్లకు తెలియాల్సి ఉన్నందున ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ తిరస్కరించి ఒక కమిటీని తానే ఏర్పాటు చేసింది. గతేడాది నవంబరులో కేరళ టీవీ ఛానల్‌ మీడియా వన్‌ కేసులో కేంద్ర ప్రభుత్వ సీల్డుకర్‌ను సుప్రీం తిరస్కరించింది. కక్షిదారు వాటిని చూడకుండా అవకాశాన్ని నిరోధించటమే అవుతుందని పేర్కొన్నది. నిబంధనల ప్రకారం ఒక అంశాన్ని రహస్యమని భావించి సీల్డు కవర్‌లో ఉంచాలని ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు గనుక నిర్ణయిస్తే ప్రజా ప్రయోజనం పేరుతో దాన్ని చూసేందుకు, కాపీ కావాలని కోరేందుకు అవకాశం లేదు. మాజీ మంత్రి పి చిదంబరం అరెస్టయిపుడు బెయిలు కేసులో ఇడి సమర్పించిన సీల్డు కవర్‌ మీద ఆధారపడిన ఢిల్లీ హైకోర్టును 2019లో సుప్రీం కోర్టు తప్పు పట్టింది.తమ మనస్సులను సంతృప్తిపరచుకొనేందుకు న్యాయమూర్తులకు సీల్డు కవర్‌లోని అంశాలను చూసేందుకు అధికారం ఉన్నపుడు కోర్టు విచారణలో వాటిలో కనుగొన్న వాటిని నమోదు చేయకూడదని పేర్కొన్నది.రాఫెల్‌ విమానాల కొనుగోల వివరాలు రహస్యం అని ప్రభుత్వం చెప్పటాన్ని కోర్టు అంగీకరించింది.2జి స్పెక్ట్రం కేసులో కూడా అదే జరిగింది.


ప్రతి వ్యవస్థ తాము చెప్పినట్లు నడవాలని, తమ కనుసన్నలలో మెలగాలని దేశంలోని మితవాద శక్తులు కోరుకుంటున్నాయి.ఈ కారణంగానే తమకు నచ్చని తీర్పులు, పని తీరును అవి సహించలేకపోతున్నాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలదా లేక కొంత మంది అధికారులదా నిర్ణయాధికారం అంటూ జడ్జీల కొలీజియం విధానంపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. బిబిసి డాక్యుమెంటరీ నిషేధంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేదు. దేశ వ్యతిరేకులకు సుప్రీం కోర్టు ఒక పనిముట్టుగా మారిందంటూ హిందూత్వ అనుకూల శక్తులు ధ్వజమెత్తాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక(హిందీ) పాంచజన్య సంపాదకీయంలో దీన్నే పేర్కొన్నది.సుప్రీం కోర్టు ప్రజలు చెల్లించిన పన్నులతో నడుస్తున్నది.భారత్‌కు అనుకూలమైన భారత చట్టాల ప్రకారం నడుచుకొనేందుకు మన ప్రయోజనాలకు అనుగుణంగా నడిచేందుకు ఏర్పాటు చేసినదే సుప్రీం కోర్టు.అలాంటి దానిని దేశ వ్యతిరేకులు ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారని పాంచజన్య మండిపడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ అదానీ ఎంత లబ్ది పొందితే చైనాకు అంత నష్టం అని పేర్కొన్నది. చౌకబారుతనం తప్ప ఆర్థికంగా అసలు చైనాకు భారత్‌కే పోలికలేదు, ఇంక అదానీ ఎంత ! అదానీ సంపదను సృష్టించాడు.భారత పురోగమనంలో భాగస్వాములైన వారి మీద దాడి చేయకూడదని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ పేర్కొన్నారు.


మితవాద శక్తులలో సహనం ఇప్పటికే నశించి మైనారిటీల మీద తెగబడుతున్న తీరుతెన్నులు తెలిసిందే.చివరికి అది ఆర్‌ఎస్‌ఎస్‌ మీదకు కూడా మళ్లుతున్నది. నయా ఇండియా అనే పత్రికలో శంకర్‌ సహారా అనే రచయిత ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి రాసిన వ్యాసంలో హిందువుల ప్రయోజనాలను రక్షించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేయాల్సినంత చేయటం లేదంటూ ధ్వజమెత్తారు.” లాఠీలను పంచుతూ హిందువుల్లో ఉన్న వీరత్వాన్ని పొగిడే సాహిత్యాన్ని ప్రచురిస్తూ ముస్లిం దురాక్రమణకు వ్యతిరేకంగా నేరుగా పోరాడాలంటూ సంఫ్‌ు పుట్టింది.పరిస్థితి ఇప్పటికీ అదే విధంగా ఉంది.వాస్తవానికి అంతకు ముందుకంటే మరింత దిగజారింది. ఇలా ఉండగా మూడోవంతు దేశంలో హిందువులు తగ్గారు.దేశాన్ని విభజించి రెండు హిందూ వ్యతిరేక దేశాలను ఏర్పాటు చేశారు. చివరికి మిగిలిన స్వదేశంలో కూడా హిందువులు చట్టపరంగా రెండవ తరగతి పౌరులుగా మారారు.విద్య,దేవాలయాలను వారి నుంచి లాగివేసుకున్నారు. ఇలాంటివి బ్రిటిష్‌ వారి ఏలుబడిలోనూ జరగలేదు.కానీ ఈ సమస్యల మీద పోరాటాలకు దూరంగా ఉండటమే కాదు సంఘపరివార్‌ నేతలు నోరు విప్పటం కూడా మానుకున్నారు.బాధ్యతల్లో ఉన్న సంఫ్‌ు నాయకులు, కార్యకర్తలూ వారి విధానాలు లేదా కార్యకలాపాలను అధికారికంగా ముందుకు తీసుకుపోవాలని కోరుకోవటం లేదు. దానికి బదులు (ఉదాహరణకు గోల్వాల్కర్‌, సుదర్శన్‌,మధోక్‌, వాజ్‌పాయి) ఏ సర్‌ సంఫ్‌ు సంచాలక్‌ లేదా అగ్రనేతల ప్రకటనలు, కార్యాచరణలనైనా వారి వ్యక్తిగత ఆలోచన లేదా ఆచరణ అంటున్నారు తప్ప సంఫ్‌ుకు చెందినవిగా చెప్పటం లేదు, మరి అలాంటపుడు సంఫ్‌ు భావజాలం, పని ఏమిటి ?” అని శంకర్‌ సహారా ప్రశ్నించారు.


పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న దేశాల్లో దాన్ని కాపాడేందుకే న్యాయ,శాసన,కార్యనిర్వాహక వ్యవస్థలు ఉంటాయి. వాటి మౌలిక స్వభావం అదే. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుంటాయి. అంత మాత్రాన దేశంలో ఉన్న వ్యవస్థలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులుగా పరిగణించనవసరం లేదు. చట్టబద్దమైన పాలన జరపాలి, నిబంధనల మేరకు వ్యాపార,పరిశ్రమలు నడపాలి, ఇలా ప్రతి విభాగానికి కొన్ని నిబంధనలను పెట్టుబడిదారీ విధానాల్లో కూడా పెట్టుకుంటారు. వాటిని ఉల్లంఘిస్తే కోర్టులు తప్పు పట్టినంత మాత్రాన అది మౌలికంగా వ్యవస్థను తిరస్కరించినట్లు కాజాలదు. అనేక మంది పెట్టుబడిదారులు పోటీ పడినపుడు అధికారంలో ఉన్న పాలకులు లేదా అధికారులు కొందరికి అనుకూలంగా ఉంటున్నకారణంగానే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరు వాటిని బయట పెడతారంటే కొందరు నిజాయితీపరులైన వారు లేదా పోటీలో నష్టపోకపోయినా అవకాశం పొందని వారు అన్నది తెలిసిందే. అందువలన తాము బలపరుస్తున్నవారికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు లేదా ఆదేశాలు జారీ చేస్తే వాటిని మితవాద శక్తులు వ్యతిరేకించటం అంటే తామనుకున్నదాన్ని పొందలేకపోవటం తప్ప అవి కోర్టులకు పూర్తిగా వ్యతిరేకం అనో కోర్టులు పురోగామి వైఖరితో ఉంటాయనో అర్ధం కాదు.కోర్టుల మీద భ్రమలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు.


నయా ఇండియా పత్రికలో ఆర్‌ఎస్‌ఎస్‌పై శంకర్‌ సహారా మండిపాటు దాని మద్దతుదార్లలో గూడుకట్టుకొని ఉన్న అసహనాన్ని వెల్లడిస్తున్నది.జర్మనీ, అనేక దేశాల్లో హిట్లర్‌ మూకలు యూదుల పట్ల అనుసరించిన వైఖరిని మన దేశంలో ముస్లింలపట్ల ఇంకా పూర్తిగా ఎందుకు అనుసరించటం లేదన్న దుగ్గ సంఘపరివార్‌ శ్రేణుల్లో పెరుగుతున్నదని శంకర్‌ వాదనల తీరు వెల్లడిస్తున్నది. తమ అజెండాతో ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని తటపటాయిస్తున్నారు, మత విద్వేషాన్ని ఇంకా ఎక్కిస్తే తప్ప అమలు జరపటం సాధ్యం కాదని సంఘపరివార్‌ భావిస్తున్నది, అందుకే ఆ కార్యక్రమాన్ని మరింతగా వేగిరపరుస్తున్నది తప్ప వైదొలగలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తోడేళ్లను బుజ్జగిస్తున్న మేకలు : కేరళలో వివాదంగా మారిన ఆర్‌ఎస్‌ఎస్‌ – జమాతే చర్చలు !

23 Thursday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), JIH, Kerala LDF, Muslim League, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమదారికి తెచ్చుకోవటం అసాధ్యమా ? కొద్ది వారాల క్రితం ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌తో కొన్ని ముస్లిం సంస్థల ప్రతినిధుల సమావేశం ఇప్పుడు కేరళలో వేడిపుట్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కేరళ పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అక్కడి సిపిఐ(ఎం) ఫిబ్రవరి 21 నుంచి నెల రోజులు సాగే జాతాను కోజికోడ్‌లో సిఎం పినరయి విజయన్‌ ప్రారంభించారు. ఆ సందర్భంగా సిఎం ముస్లింలను బుజ్జగించేందుకు చూసినట్లు బిజెపి ధ్వజమెత్తింది. అంతకు ముందే ఆర్‌ఎస్‌ఎస్‌తో కేరళకు చెందిన జమాయతే ఇస్లామిక్‌ హింద్‌ సంస్థ ప్రతినిధులు దేన్ని గురించి చర్చించారో చెప్పాలంటూ పినరయి విజయన్‌ లేవనెత్తిన ప్రశ్న వేడిపుట్టించింది.దాన్ని పక్కదారి పట్టించేందుకు బిజెపి ఎదురుదాడికి పూనుకుంది. సదరు సమావేశం గురించి ఇంతవరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తమంత తాముగా వెళ్లి కలవలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానం మేరకు వెళ్లినట్లు జమాతే వివరణ ఇచ్చుకుంది. అది వాస్తవం కాదని వార్తలు చెబుతున్నాయి.


జమాతే సంస్థ ప్రధాన కార్యదర్శి టి ఆరిఫ్‌ జనవరిలో ఆర్‌ఎస్‌ఎస్‌తో జరిపిన చర్చల గురించి వెల్లడించారు.దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న మూక వధలు, అట్టడుగున ఉన్న తరగతుల అణచివేత అంశాలను చర్చించినట్లు పేర్కొన్నారు. ఇది జమాతే వంచన తప్ప మరొకటి కాదని విజయన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.” ఆర్‌ఎస్‌ఎస్‌తో విబేధించే అంశాలున్నప్పటికీ చర్చలు జరపాల్సి ఉందని జమాతే చెప్పటం దాని వంచనను వెల్లడిస్తున్నది. ఏమి చర్చించారో, సమావేశం ఏ అంశం మీద జరిగిందో వివరించాలి. జమాతే తర్కం ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సంస్థ, చర్చల ద్వారా దాన్ని సంస్కరించవచ్చు, మార్చవచ్చు. ఇదెలా అంటే తోడేలు మచ్చలను నీటితో కడిగి పోగొట్టవచ్చు అన్నట్లుగా ఉంది. భారతలోని మైనారిటీలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలను దేశ యంత్రాంగాన్ని అదుపు చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుంచుతామన్న వాదన చేస్తున్న జమాతేకు అసలు దేశ మైనారిటీల ప్రతినిధిగా ఎవరు అధికారమిచ్చారు.ఏ అంశం గురించి చర్చించినప్పటికీ అది దేశంలోని మైనారిటీలకు సాయపడదు.మైనారిటీల రక్షణ అంటే మత స్వేచ్చకు రక్షణ. దాన్ని విచ్చిన్నం చేస్తున్నదెవరో చర్చల్లో పాల్గొన్నవారికి తెలియదా? అలాంటి వారితో చర్చించి లౌకికవాదాన్ని, మైనారిటీలను ఎలా రక్షించగలం ? సంఘపరివార్‌ తీవ్రవాద హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేడు దేశంలోని లౌకిక శక్తులు పోరాడుతున్నాయి. ఇటువంటి దశలో అలాంటి చర్చలు ఆర్‌ఎస్‌ఎస్‌ అజండాకు మద్దతు ఇస్తాయి.మతశక్తులు కుమ్మక్కై ఐక్యంగా లౌకికవాదాన్ని, ప్రజాస్వామిక విలువలను అణచివేస్తున్నాయనేందుకు ఇంతకంటే రుజువు అవసరం లేదు.లౌకిక శక్తులకు ఇదొక సవాలు ” అని విజయన్‌ పేర్కొన్నారు. జమాతే వైఖరిని కేరళలోని కేరళ ముస్లిం జమాత్‌, సమస్త కేరళ జమైతుల్‌ ఉలేమా, ముస్లిం లీగ్‌, కేరళ నదవతుల్‌ ముజాహిదీన్‌, సున్నీ యువజన సంఘం విమర్శించాయి.


ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడి దానితో సఖ్యత కోరుకుంటున్నట్లు, స్వార్ధ ప్రయోజనాలున్నట్లు కొందరు జమాతేను విమర్శించారు. స్నేహపూర్వక చర్చల ద్వారా జమాతే చారిత్రక తప్పిదం చేసిందని కేరళ ముస్లిం జమాత్‌ కాంతాపురం ఏపి అబూబకర్‌ ముస్లియార్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌కు, దేశ లౌకిక విలువలకు శత్రువని అటువంటి సంస్థతో చర్చలు శత్రువును కౌగలించుకోవటంతో సమానమని ముస్లిం జమాత్‌ పేర్కొన్నది.మతవాదం ఈ రెండు బృందాలను ముడివేస్తున్నది.భారత వ్యతిరేక ఫాసిస్టు శక్తుల నిజరూపాన్ని కప్పి పుచ్చేందుకు జమాతే ఇస్లామీ హింద్‌ ఒక పనిముట్టుగా మారుతున్నది ” అని విమర్శించింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చించాల్సినంత ప్రత్యేక పరిస్థితులేమీ లేవని ముస్లింలీగ్‌ నేతలు పికె కున్హాలీకుట్టి, ఎంకె మునీర్‌ పేర్కొన్నారు.


ముస్లిం సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌ జరిపిన రహస్య సమావేశం గురించి జనవరి 26న హిందూ పత్రిక వెల్లడించింది. సంఘపరివార్‌ నేతలు ఇంద్రేష్‌ కుమార్‌, రామ్‌లాల్‌, కృష్ణ గోపాల్‌ మూడు గంటల పాటు ఢిల్లీలోని మాజీ లెప్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ నివాసంలో జరిపిన భేటీలో అనేక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హింద్‌, జమాతే ఉలేమా ఇ హింద్‌, అజ్మీర్‌ దర్గా సల్మాన్‌ చిస్తీ, తదితరులు ఉన్నారు. గతేడాది ఆగస్టులో ఇలాంటి సమావేశమే జరగ్గా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌, నజీబ్‌ జంగ్‌, మాజీ ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ, ప్రముఖ హౌటల్‌ ఓనరు సయిద్‌ షెర్వానీ, జర్నలిస్టు షాహిద్‌ సిద్దికీ, మరికొందరు పాల్గొన్నారు. దాని కొనసాగింపుగా జరిగిన జనవరి సమావేశంలో భగవత్‌ మినహా మిగిలిన ముస్లిం ప్రతినిధులంతా పాల్గొన్నట్లు కూడా హిందూ పత్రిక పేర్కొన్నది. ఇలాంటి సమావేశాలను తరచూ జరపటం ద్వారా సానుకూల సందేశాన్ని పంపటం ముఖ్యమని భాగాస్వాములైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు భావించారు.ఈ దశలో సంస్థల అధిపతులు, సీనియర్‌ నేతలు రావటం మంచిది కాదని భావించినట్లు, సమావేశాలను తరువాత కూడా కొనసాగించాలని భావించినట్లు కూడా వెల్లడించింది.అనేక అంశాలను ముస్లిం నేతలు లేవనెత్తితే వాటికి సమాధానంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గోవుల అంశాల్లో హిందువుల మనోభావాలను గమనించాలని కోరినట్లు వెల్లడించింది.


ఆర్‌ఎస్‌ఎస్‌-జమాతే ఇస్లామీ హింద్‌ ప్రతినిధుల చర్చలు వెల్ఫేర్‌ పార్టీ బుర్రలో పుట్టిన ఆలోచనకాదా అని సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభలో విమర్శించారు. కాంగ్రెస్‌లోని కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల సానుకూల వైఖరితో ఉంటారు. వెల్ఫేర్‌ పార్టీ, జమాతే పట్ల ముస్లింలీగ్‌లోని కొందరు అదే విధంగా ఉంటారని అందువలన ఆ మూడు పార్టీల మధ్య ఉన్న ప్రత్యేక బంధం ఏమిటో, చర్చల గురించి జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రానికి కేరళ అభివృద్ది పట్టదు, ప్రతిపక్ష కూటమి మౌనంగా ఉంటుంది, కేంద్రం మీద ఒక్క మాట కూడా మాట్లాడదు అన్నారు. ఈ సభలో సిఎం పినరయి విజయన్‌ ప్రస్తావించిన మూడు సార్ల తలాక్‌ అంశంపై బిజెపి, కొన్ని మీడియా సంస్థలు వక్రీకరణలకు పూనుకున్నాయి. మూడు సార్లు తలాక్‌ చెప్పి భార్యను వదలి వేయటానికి సిపిఎం వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. అది చెల్లదని సుప్రీం కోర్టు కూడా చెప్పింది కనుక దాని మీద వేరే చట్టం అవసరం లేదన్నది సిపిఎం వైఖరి. అందువలన దాని మీద చట్టం చేసేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేయటాన్ని సిపిఎం ఖండించింది. తరువాత పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దాని ప్రకారం అలా ఎవరైనా విడాకులు తీసుకుంటే మూడు సంవత్సరాల వరకు శిక్ష వేయవచ్చు. ఇతర మతాలకు చెందిన వారి విడాకుల వివాదాన్ని సివిల్‌ కేసులుగా పరిగణించి ముస్లిం పట్ల క్రిమినల్‌ కేసుగా పరిగణించటాన్ని మాత్రమే సిపిఎం వ్యతిరేకిస్తున్నది తప్ప మూడుసార్ల తలాక్‌ను సమర్ధించలేదు.సిఎం పినరయి విజయన్‌ దాన్నే చెప్పారు తప్ప ముస్లింలను సంతుష్టీకరించలేదు.


ఖురాన్‌లో మూడుసార్లు తలాక్‌ అనే పద్దతే లేదని చెబుతున్నారు. అనేక దేశాల్లో అది లేని మాట నిజం. ఖురాన్‌లోని లేని దాని మీద మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేసినట్లు ? అన్ని మతాల్లో అనేక అంశాలను కొత్తగా చొప్పించినట్లుగా మూడు సార్లు తలాక్‌ అనేదాన్ని కూడా చొప్పించారు. దాన్ని ఎవరూ సమర్ధించటం లేదు.వేదకాలంలో కులాలు లేవని చెబుతారు, చేసే వృత్తిని బట్టి కులం అన్నారు అంటారు. ఇప్పుడు కులవృత్తులు లేకున్నా, సదరు వృత్తులు చేయకున్నా అదే కులాలతో పిలుస్తున్నారు, కించపరుస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సెలవిచ్చినట్లుగా కులాలను సృష్టించింది పండితులు(బ్రాహ్మలు కాదు మేథావులని తరువాత వివరణ ఇచ్చుకున్నారు) అన్నదాని ప్రకారం ఉనికిలో ఉన్న కులాలను ఏం చేస్తారో కూడా చెప్పాలి కదా ! వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు. వాటి మీద చట్టాలను ఎందుకు చేయటం లేదు.కులాలను, వివక్షను, కొందరిని కించపరిచే వాటిని సమర్ధించే మనుస్మృతి, ఇతర పురాణాలను సమర్ధించటాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారా ? వాటిని ప్రచురించి ప్రచారం చేసే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?


సిపిఐ(ఎం) ప్రారంభించిన నెల రోజుల యాత్రలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని జనం ముందుకు తీసుకువెళుతున్నారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చలు ఆ మూడు పార్టీలకు తెలిసే జరిగినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, యాత్ర సారధి ఎంవి గోవిందన్‌ పేర్కొన్నారు.లేకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌తో జమాతే మాట్లాడితే తప్పేముందని కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ ఎలా అంటారు ? ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు సిపిఎం ముందుకు తెచ్చిన అనవసర వివాదం అని ముస్లింలీగ్‌ నేత కున్హాలీ కుట్టి చెప్పటం ఏమిటని ప్రశ్నించారు.చర్చలు జరపటంలో ఆ రెండు పార్టీలకు ఎలాంటి తప్పు కనిపించటం లేదన్నారు. గాంధీ మహాత్ముడిని చంపిన, బాబరీ మసీదు కూల్చివేసిన భావజాలం గలవారితో సంప్రదింపులు తప్పులేదని కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ ఎలా చెప్పగలుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ యాత్రకు పికె బిజు మేనేజర్‌, సిఎస్‌ సుజాత, ఎం స్వరాజ్‌, కెటి జలీల్‌, జేక్‌ సి థామన్‌ సారధులుగా ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏడాది కాలంగా రావాల్సిన రు.40వేల కోట్ల గురించి ఏ మీడియా మాట్లాడదు. పదవ ప్రణాళికలో కేరళకు కేంద్రం నుంచి 3.9శాతం నిధులు వస్తే ఇప్పుడు 1.9శాతానికి తగ్గినా మౌనంగా ఉంటుంది. జిఎస్‌టి పరిహారం రు.9,000 కోట్లు, రెవెన్యూలోటు పరిహారం రు.6,716 కోట్లు ఇవ్వటం లేదని, రుణాలు తీసుకోవటం మీద పరిమితి విధిస్తే సాంఘిక సంక్షేమ పధకాలను ఎలా అమలు జరపాలని సిపిఎం ప్రశ్నిస్తోంది.రాజకీయ కారణాలతోనే ఇదంతా జరుగుతోందని విమర్శించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఓరి మాయలోడో ఓరి మందులోడో : మోదానీ సినిమాలో ఒక రైల్వే పోర్టర్‌ సంచలనం !!

22 Wednesday Feb 2023

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#Modani, BJP, Gautam Adani, George Soros, Hindenburg effect, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


లాహిరి లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా ఊగెనుగా అంటూ సాగిపోతున్న నరేంద్రమోడీ నౌకకు నెల రోజుల్లో మూడు కుదుపులు. అదానీకి నాలుగు.అదానీ మాయలోకం సినిమా విడుదలై త్వరలో మాసోత్సవం జరుపుకోనుంది. కంపెనీల వాటాల ధరలనే కాదు, వికీపీడియా సమాచారాన్ని కూడా స్వంత మనుషులతో అనుకూలంగా మలుచుకున్నట్లు తాజాగా తేలింది. వికీపీడియా నడిపే సైన్‌ పోస్ట్‌ అనే పత్రిక అదానీ కిరాయి రాతగాళ్ల బండారాన్ని ఫిబ్రవరి 20వ తేదీన వెల్లడించింది. అనూహ్యమైన ఈ పరిణామాలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని ఇరకాటంలోకి నెట్టాయి. అర్ధంగాని అంశం ఏమంటే మొదటి మూడింటిని తప్పుడు ప్రచారం, ఆధారం లేని, పధకం ప్రకారం దేశం మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా, నరేంద్రమోడీ సర్కార్‌ను దెబ్బతీసేవిగా చిత్రిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.వికీపీడియా వెల్లడించిన అక్రమంతో తమకు సంబంధం లేదని తప్పించుకుంటారా ఏం చేస్తారో చూడాలి.వికీపీడియాలో అదానీ కంపెనీలు, కుటుంబానికి చెందిన వివరాలను దొంగ పేర్లతో అదానీ కంపెనీ సిబ్బంది, కిరాయి సంపాదకులు అదానీకి అనుకూలగా పోస్టులను దిద్దినట్లు తేలింది. సోషల్‌ మీడియాలో ఇలాంటి ఖాతాలను కోకొల్లలుగా తెరిచి ఉదాహరణకు కొందరు నరేంద్రమోడీ గొప్పతనాన్ని పొగిడితే మరికొందరు ఇతర పార్టీల నేతల మీద తప్పుడు ప్రచారాలకు దిగుతున్న సంగతి తెలిసిందే.


గుజరాత్‌ మారణకాండ మీద బిబిసి నిర్మించిన రెండు భాగాల డాక్యుమెంటరీ వివాదం ఇంకా సద్దుమణగలేదు. అదానీ కంపెనీ అక్రమాలంటూ హిండెన్‌బర్గ్‌ వెల్లడించిన నివేదిక, దానిమీద తలెత్తిన ప్రశ్నలకు విదేశీ మదుపుదార్లకు, స్వంత పార్లమెంటుకు నరేంద్రమోడీ సమాధానం చెప్పాలంటూ ప్రపంచ మదుపుదారు జార్జి సోరస్‌ ఒక అంతర్జాతీయ వేదిక మీద చేసిన వ్యాఖ్య సంచలనం కలిగించింది. ఆ సభలో ప్రపంచదేశాల ప్రతినిధులందరూ ఉన్నారు. చిత్రం ఏమంటే బిబిసి డాక్యుమెంటరీ గురించి స్పందించాల్సిందేమీ లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. సామాజిక మాధ్యమంలో వాటిని చూడకుండా లింకుల మీద మాత్రం నిషేధం విధించి తొలగించారు.హిండెన్‌బర్గ్‌ మీద అసలు నోరెత్తటానికే సిద్దపడలేదు. జార్జి సోరస్‌ ప్రకటన మీద మాత్రం అసలు ఎవడీ సోరస్‌, ఈ ముసలోడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, సమాధానం చెప్పాలని నరేంద్రమోడీనే అడుగుతాడా అన్నట్లుగా బిజెపి మంత్రులు, నేతలు స్పందిస్తున్నారు. జనవరి 25 నుంచి అదానీ కంపెనీల వాటాల విలువ పడిపోతూనే ఉంది. అధిక ధరల్లో వాటాలు కొనుగోలు చేసిన వారు ఎంత సొమ్ము పోగొట్టుకున్నారు అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేము. ఇది రాసినపుడు ఆ మొత్తం రు. పదకొండులక్షల కోట్లని వార్త. మొత్తంగా చూసిన కంపెనీల వాటాల విలువ సగానికి సగం పతనమైంది. దీంతో కంపెనీల మార్కెట్‌ విలువ 120 బిలియన్‌ డాలర్ల వరకు పతనమైనట్లు ఇండియా టుడే ఫిబ్రవరి 20న తెలిపింది. ఒక్కో సంస్థ ఒక్కో పద్దతిలో ఈ అంకెలను చెబుతున్నాయి. గతంలో గరిష్ట విలువ 147 బి.డాలర్లు కాగా ఇప్పుడు 47.9 బి.డాలర్లకు తగ్గినట్లు ఫోర్బ్స్‌ చెప్పగా 49.1 బి.డాలర్లని బ్లూమ్‌ బెర్గ్‌ పేర్కొన్నది. జనవరి 20న అదానీ టోటల్‌ గాస్‌ కంపెనీ వాటా ధర రు.3,618 ఉండగా నెల తరువాత రు.922కు తగ్గింది.


ఐరోపాలోని మ్యూనిచ్‌ నగరంలో జరిగిన సమావేశంలో జార్జి సోరస్‌ మాట్లాడుతూ అదానీపై తలెత్తిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పాలని అన్నాడు.నలభై రెండు నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో అదానీ-మోడీ బంధంతో పాటు ఇతర అనేక అంశాలను ప్రస్తావించాడు.” మోడీ, వాణిజ్య దిగ్గజం అదానీ సన్నిహితులు.వారి విధి విడదీయ లేనిది.వాటాలను తిమ్మిని బమ్మిని చేసినట్లు అదానీ మీద ఆరోపణలు రావటంతో అవి పేక మేడల్లా కుప్పకూలాయి.మోడీ దీనిమీద మౌనంగా ఉన్నారు. కానీ అతను విదేశీ మదుపుదార్లకు పార్లమెంటు సమాధానం చెప్పాలి.ఈ పరిణామంతో భారత కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్రమోడీకి ఉన్న గట్టి పట్టు గణనీయంగా బలహీనపడుతుంది. సంస్థాపరమైన సంస్కరణలకు ద్వారాలను తెరుస్తుంది.నేను అమాయకుడిని కావచ్చు, కానీ భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్దరణ జరుగుతుందని భావిస్తున్నా ” అన్నాడు. ప్రపంచ ఆధిపత్యం కోసం రెండు రకాల పాలనా వ్యవస్థలు పోటీ పడుతున్నాయి. గుట్టుగా ఉండే దేశాల కంటే బహిరంగ మైనవి నైతికంగా ఉన్నతంగా ఉంటాయని వాటి మధ్య తేడాలను వివరిస్తూ భారత్‌ ఒక ఆసక్తికలిగించే అంశమన్నాడు. అది ప్రజాస్వామికమే గాని దాని నేత నరేంద్రమోడీ ప్రజాస్వామికవాది కాదన్నాడు.భారత్‌ క్వాడ్‌(చతుష్టయ) సభ్యురాలు, అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని సొమ్ము చేసుకుంటున్నది అన్నాడు. ఈ మాటలు బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అగ్గిమీద గుగ్గిలం మాదిరి మండిపడ్డారు. ఇది నరేంద్రమోడీ మీదనే కాదు భారత ప్రజాస్వామిక వ్యవస్థ మీద కూడా దాడి అంటూ దీన్ని అందరూ ఒకే కంఠంతో ఖండించాలని అన్నారు. అదానీ లేదా అతని కంపెనీల గురించి దేశంలో గగ్గోలు తలెత్తితే పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ ప్రస్తావన లేకుండా మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాంటి నేత గురించి అందరూ కలసి ఖండించాలని చెప్పటానికి ఎవరికైనా నోరెలా వస్తుంది. అదానీ కంపెనీల వాస్తవాల నిర్ధారణకు పార్లమెంటరీ కమిటీని మాత్రమే వేయాలని ప్రతిపక్షాలు కోరాయి. దానికి కూడా నోరు రాలేదు.


భారత్‌తో సహా ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలలో జోక్యం చేసుకొనేందుకు జార్జి సోరస్‌ ఒక బిలియన్‌ డాలర్లు పక్కన పెట్టాడని (మన కరెన్సీలో రు.8,200 కోట్లు), మన దేశంలో తాను ఎంపిక చేసిన వారు ప్రభుత్వనేతలుగా ఉండాలని కోరుకున్నట్లు స్మృతి ఇరానీ ఆరోపించారు. ఆమె చెప్పినట్లు ఆ మొత్తాన్ని ఒకవేళ ఇక్కడే ఖర్చు చేసినప్పటికీ కుప్పకూలేంత బలహీనంగా మోడీ సర్కార్‌ ఉన్నదా ? అంత మొత్తానికి బిజెపి ఎంపీలందరూ అమ్ముడుపోతారా ? కేంద్ర సమాచార, ప్రసార శాఖ సలహాదారు కాంచన్‌ గుప్తా దీని గురించి స్పందిస్తూ పాలకుల మార్పు కావాలని కోరుతున్న శక్తులవెనుక ఉన్నదెవరో తేలిపోయిందన్నారు.వారికి జార్జి సోరస్‌ నడిపే ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ నుంచి నిధులు అందచేస్తున్నట్లు ఆరోపించారు. భారత్‌కు అనేక మంది శత్రువులుండగా వారందరినీ సోరస్‌ నడిపిస్తున్నాడని ఆరోపించారు.భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని 2024 ఇంకా ఎంతో దూరం లేదని మరోసారి ఆశాభంగం చెందక తప్పదని అన్నారు. మోడీ గురించి సోరస్‌ చేసిన వ్యాఖ్యలపై మన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందిస్తూ ఒక ముసలోడు, ధనికుడు, మొండిమనిషి న్యూయార్క్‌లో కూర్చొని ప్రపంచమంతా ఇంకా తాను చెప్పినట్లు నడస్తున్నదని అనుకుంటున్న మనిషి అన్నారు. అతని గురించి చెప్పాల్సి వస్తే ముసలోడు, ధనికుడు, మొండిమనిషి, దీన్నే మరోవిధంగా చెప్పాలంటే ప్రమాదకారి కూడా అన్నారు.తాను అభిమానించిన వారు గెలిస్తే సోరస్‌ వంటి వారికి అది మంచిది లేకపోతే ప్రజాస్వామ్యం లోపభూయిష్ట మంటాడు అన్నారు.రైతుల ఆందోళన, సిఎఎ,ఎన్‌ఆర్‌సిలపై సాగిన ఆందోళనల వెనుక సోరస్‌ హస్తం ఉన్నట్లు బిజెపి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.


తొంభై రెండు సంవత్సరాల జార్జి సోరస్‌ గురించి ఆరోపణలు కొత్తవేమీ కాదు, అవి నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. ఎక్కడా ఏ దేశమూ అతని మీద ఉన్న ఆరోపణలను విచారించి రుజువు చేసి జైల్లో పెట్టలేదు. ఇప్పుడు బిజెపి నేతల ఆయాసపడటం తప్ప చేసేదేమీ లేదు.తాను నివశిస్తున్న అమెరికా అధినేతల గురించే బహిరంగంగా సవాలు చేశాడు. 2003 నవంబరు 11వ తేదీ వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవిత కేంద్రీకరణ అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్‌ను పదవి నుంచి తొలగించటమని, అది తనకు జీవన్మరణ సమస్య అన్నారు. బుష్‌ను ఓడిస్తానని ఎవరైనా హామీ ఇస్తే తన దగ్గర ఉన్న సంపదనంతా ఇస్తానని కూడా చెప్పాడు.మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో బుష్‌ ఓటమి కోసం డెమోక్రటిక్‌ పార్టీకి సోరస్‌ వివిధ సంస్థలపేరుతో రెండున్నర కోట్ల డాలర్ల మేర విరాళం కూడా ఇచ్చాడు.పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాడు. సంపాదించినదాన్లో వెనకేసిందానికన్నా దాన ధర్మాలకే ఎక్కువ ఇచ్చాడు. అతను కూడా షార్ట్‌ సెల్లింగ్‌ పద్దతుల్లో లాభాలు గడించిన స్టాక్‌ మార్కెట్‌ జూదగాడే. ఆ జూదాన్ని చట్టపరంగానే అన్ని దేశాలూ అనుమతిస్తున్నాయి.


హంగరీలో నాజీ మూకల దాడి నుంచి మారుపేర్లతో తప్పించుకున్న యూదు కుటుంబాలలో సోరస్‌ది ఒకటి.నాజీలతో చేతులు కలిపాడనే విమర్శలకు కూడా అతని మీద ఉన్నాయి.బుడాపెస్ట్‌లో 1930లో జన్మించిన సోరస్‌ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లండన్‌ చేరుకున్నాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువు కొనేందుకు కొంతకాలం రైల్వే కూలీగా, కొంత కాలం హౌటళ్లలో సర్వర్‌గా పని చేశాడు. (నరేంద్రమోడీ రైల్వే స్టేషన్లో టీ అమ్మినట్లు ప్రచారం చేశారు గానీ దానికి ఎక్కడా రుజువుల్లేవు.) 1956లో అమెరికా చేరుకొని అక్కడ సంపాదన ప్రారంభించాడు. అనేక దేశాల్లో అనేక మందికి గిట్టనిపనులు చేసి ప్రమాకరమైన మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.పచ్చి మితవాద శక్తులను కూడా భయపెట్టే మనిషి అని 2019లో బిబిసి వర్ణించింది.డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అసలు పడదు. ట్రంప్‌-మోడీ జిగినీ దోస్తులు కనుక జార్జి సోరస్‌ చేసిన విమర్శలు, ప్రశ్నలు సహజంగానే మోడీ భక్తగణాన్ని కూడా భయపెట్టి ఉండాలి. సోరస్‌ వివాదాస్పద నేపధ్యం కారణంగా నరేంద్రమోడీ, అదానీ మీద అతని విమర్శలను కొట్టివేస్తే కుదరదు.

సోరస్‌ వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టటం అవి లాభాల బాటలో ఉన్నపుడు వాటినుంచి తప్పుకోవటం, షార్ట్‌ సెల్లింగ్‌ వంటి పనులకు పాల్పడతాడు. గతంలో లండన్‌ బాంకు షేర్లను అలాగే షార్ట్‌ సెల్లింగ్‌ చేసి వాటాల ధరల పతనం కాగానే పెద్ద ఎత్తున కొని లబ్ది పొందాడు. గొర్రెల గోత్రాలు కాపరులకు ఎరుక అన్నట్లు నడమంత్రంగా దూసుకు వచ్చిన కంపెనీల వెనుక ఏం జరిగేదీ అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.అనేక దేశాలు అతన్ని నిషేధించాయి. సోరస్‌కు అనేక ప్రభుత్వాలల్లో కీలకమైన చోట్ల ఉప్పందించేవారు ఉన్నారు. 1992లో బ్రిటన్‌ ప్రభుత్వం పౌండ్‌ విలువను తగ్గించాలని తలపెట్టింది. దాన్ని పసిగట్టిన సోరస్‌ అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో పౌండ్లను సేకరించి వాటిని మార్కెట్లో విక్రయించాడు. ఆ లావాదేవీల్లో వందకోట్ల డాలర్ల మేర లబ్ది పొందాడు.తన కంపెనీలు అక్రమాలకు పాల్పడలేదనే ప్రచారం చేసేందుకు అదానీ ఒక అమెరికా కంపెనీని ఆశ్రయించినట్లు వార్తలు.దానికి ఉన్న విశ్వసత నీయత ఏమిటి ? ఒక జాతీయ వాదిని, దేశభక్తుడిని అని చెప్పుకున్న పెద్దమనిషి విదేశీ కంపెనీల కోసం ఎందుకు ఆరాటపడుతున్నట్లు ? నెల రోజులు కావస్తున్నా రోజురోజుకూ అదానీ కంపెనీల వాటాల ధర పతనం తప్ప ఆగలేదు. అంతాబాగుంది అని చెప్పిన దానిని ఎవరూ నమ్మటం లేదు. ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న మోదాని (మోడీ + అదానీ = మోదాని ) సినిమాలో జార్జి సోరస్‌ సంచలన ప్రవేశం. ఆ సినిమా చివరకు ఏమౌతుంది.అదానీ అక్రమాల చిట్టా రాజకీయంగా నరేంద్రమోడీ మెడకు చట్టుకుంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాజకీయాలను ప్రభావితం చేస్తున్న దేవుళ్లు – కులవివక్షను ప్రశ్నిస్తున్న బహుజనులు, ఇరకాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ !

19 Sunday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Bhakti, BJP, cast politics, caste discrimination, caste system, Manusmriti, manuvadis, Mohan Bhagwat, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మహాశివరాత్రి సందర్భంగా దేశమంతటా భక్తులు జాగారం, పూజలు చేయటం సాధారణమే. రాజకీయపార్టీల నేతల భక్తి ప్రదర్శనలు చర్చనీయం అవుతున్నాయి. శనివారం నాడు శివరాత్రి సందర్భంగా వివిధ పత్రికలు, టీవీలు వివిధ అంశాలను జనం ముందుకు తెచ్చాయి. వాటిలో ఒక టీవీ సమీక్ష శీర్షిక ” భక్తి పోటీలో రాహుల్‌ గాంధీ, నరేంద్రమోడీ , సిఎం యోగి పూజా విధి: రాజకీయాలను ప్రభువు శివుడు ఎలా ప్రభావితం చేస్తున్నాడు ” అని ఉంది.


అయోధ్యలో రామాలయ నిర్మాణం మీద చూపుతున్న శ్రద్ద, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల ముందు జనం దృష్టికి తెచ్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ, ఇతర బిజెపి నేతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు అన్నది తెలిసిందే. నరేంద్రమోడీ 2022 అక్టోబరులో ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్‌ను సందర్శించారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఇది ఆరవసారి. ఆ సందర్భంగా ” ఆయన (శివుడు) మహాపర్వతాల మీద గడిపినందుకు స్వయంగా ఎంతో సంతోషించారు. నిరంతరం ఆయనను గొప్ప మునులు పూజించారు. నేను ప్రభువు శివుడిని మాత్రమే ఆరాధిస్తాను. కేదార ప్రభువు చుట్టూ ఎందరో దేవతలు,రాక్షసులు, యక్షులు, మహాసర్పాలు, ఇతరులు ఉన్నారు.” అని మోడీ చెప్పారు. కొండల్లో నివసించే జనాల సాంప్రదాయ ధవళ దుస్తులపై స్వస్తిక్‌ గుర్తును ఎంబ్రాయిడరీ చేసిన దానిని ధరించి కేదారనాధ్‌ గుడిలో పూజలు చేశారు.నవంబరు నెలలో కాశీ తమిళ సంగం సమావేశాలను ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ ” కాశీలో బాబా విశ్వనాధ్‌ ఉంటే తమిళనాడులో రామేశ్వరంలో ప్రభు దీవెనలు ఉన్నాయి. కాశీ, తమిళనాడు రెండూ శివమయం, శక్తిమయం ” అన్నారు. (న్యూస్‌ 18, ఫిబ్రవరి 18, 2022)


ప్రభుత్వాలు హాజ్‌ యాత్రకు సహకరించటాన్ని, సబ్సిడీలు ఇవ్వటం గురించి గతంలో బిజెపి పెద్ద వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అసోంలోని బిజెపి ప్రభుత్వం శివరాత్రి సందర్భంగా జారీ చేసిన ఒక ప్రకటనలో భక్తులు,యాత్రీకులు కామరూప్‌ జిల్లాలోని డాకిని కొండ మీద ఉన్న భీమేశ్వర దేవాలయాన్ని సందర్శించాలని కోరింది. ప్రభుత్వం ప్రతి మతానికి చెందిన పండుగల సందర్భంగా ఇలాంటి ప్రకటనలు ఇస్తుంటే అదొకదారి, కానీ హిందూ పండగలకే ఇవ్వటం వివాదాస్పదమైంది.దీనిలో మరొక మలుపు ఏమంటే భీమేశ్వర దేవాలయం పూనా జిల్లాలో ఉంది. దాన్ని పన్నెండింటిలో ఆరవ జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. కానీ ఈ దేవాలయం అసోంలో ఉన్నట్లు అక్కడి టూరిజం శాఖ పేర్కొన్నది. బిజెపి నేతలు దేన్నీ మహారాష్ట్రలో ఉంచకూడదని నిర్ణయించారా అని ఎన్‌సిపి నాయకురాలు సుప్రియ సూలే ప్రశ్నించారు. పరిశ్రమలు, ఉపాధిలో మహారాష్ట్ర వాటాను అపహరించారు, ఇప్పుడు సాంస్కృతిక,భక్తిపరమైన వారసత్వాన్ని కూడా హరిస్తారా అని ఆమె ప్రశ్నించారు.


పగటి వేషగాళ్లు లేదా తుపాకీ రాముళ్లు ఏ ఊరు వెళితే ఆ ఊరి గొప్పతనం గురించి పొగడి లబ్ది పొందేందుకు చూస్తారు. అది పొట్టకూటి కోసం, మరి అదే పని రాజకీయ నేతలు చేస్తే….ఓట్ల కోసమని వేరేచెప్పాలా ? శనివారం నాడు సిఎం యోగి ఆదిత్యనాధ్‌ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాధ్‌ ఆలయంలో శివరాత్రి పూజలు చేశారు. తమిళ కాశీ సంగం సమావేశాల్లో గతేడాది నవంబరులో మాట్లాడుతూ తమిళ భాష ఎంతో పురాతనమైనది, ఘనమైన సాహిత్యాన్ని కలిగి ఉంది అంటూనే రెండు భాషలూ శివుడి నోటి నుంచి వచ్చినవే అని చెప్పారు. దాన్ని అంగీకరించటానికి ఇబ్బంది లేదు. కానీ మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ, తెలుగు, బెంగాలీ ఇతర భాషలెందుకు శివుడి నుంచి రాలేదన్నదే ప్రశ్న. శివుడికి ఎన్ని భాషలు వచ్చు అని గూగుల్‌ను అడిగితే ఏవేవో చెబుతోంది తప్ప సూటిగా ఇన్ని వచ్చు అని చెప్పటం లేదు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గుళ్లు గోపురాలు, సాధు సంతుల చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. తమ నేత ఒక శివభక్తుడని రాజస్తాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ గతంలో చెప్పారు.రాజసమంద్‌ జిల్లాలోని నాధ్‌ద్వారా పట్టణంలో గతేడాది ప్రపంచంలోనే ఎత్తైన 369 అడుగుల శివుడి విగ్రహాన్ని విశ్వస్వరూపం పేరుతో ఆవిష్కరించిన సందర్భంగా చెప్పారు.ఈ ఏడాది శివరాత్రి సందర్భంగా రాహుల్‌ గాంధీ ఏ క్షేత్రాన్ని సందర్శించారో తెలీదు గాని శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన చేశారు.


చిత్రం ఏమిటంటే శివ శబ్దం చెవుల్లో పడటాన్నే సహించని త్రిదండి చిన జియ్యర్‌ స్వామి శివాలయాలను సందర్శించరని తెలిసిందే. ముచ్చింతల్‌ ఆశ్రమంలో 2022లో ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాన్ని శివుడిని మాత్రమే ఆరాధిస్తానని చెప్పిన నరేంద్రమోడీ చేత ఆవిష్కరింప చేయించారు. రామానుజాచార్యుల అంతటి సుగుణవంతుడని మోడీని పొగిడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక శివభక్తుడితో ఆవిష్కరింప చేయించినందుకు తరువాత శుద్ది చేయించారేమో తెలీదు. అపవిత్రం అనుకున్నపుడు అలాంటివి బహిరంగంగానే చేస్తున్నారు. మోడీ, అందునా ప్రధాని గనుక చీకటి మాటున జరిపి ఉండవచ్చన్నది అనుమానం. ఇలాంటి స్వామీజీలు-నరేంద్రమోడీ ఒక దగ్గరకు ఎందుకు వస్తున్నారంటే ఎన్నికల ప్రయోజనం. అంతకు ముందు తెలంగాణా సిఎం కెసిఆర్‌కు చిన జియ్యర్‌ స్వామి ఎంతో దగ్గరగా ఉండేవారు. తరువాత ఆ బంధం తెగింది అనేకంటే బిజెపి తెంచింది అన్నది పరిశీలకుల భావన.మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మతాన్ని, దేవుళ్లను వీధుల్లోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకు అన్నది కొంత మందికి ఒక చిక్కు ప్రశ్న. పూ విశ్లేషణ వివరాలు కొంత మేరకు సమాధానమిస్తాయి.


2021లో అమెరికా చెందిన ” పూ ” విశ్లేషణా సంస్థ మన దేశంలో ఒక సర్వే నిర్వహించింది. దానిలో వెల్లడైన కొన్ని అంశాలను చూస్తే ఎందుకు దేవుళ్ల కోసం రాజకీయ పార్టీలు వెంపర్లాడుతున్నదీ అర్ధం అవుతుంది. 2019 నవంబరు 17 నుంచి 2020 మార్చి 23వ తేదీ వరకు మన దేశంలో 29,999 మందిని సర్వే చేసింది. వారిలో 22,975 హిందువులు, 3,330 ముస్లింలు,1,782 సిక్కులు,1,011 క్రైస్తవులు, 719 బౌద్దులు, 109 జైనులు,67 మంది ఏమతం లేని వారు ఉన్నారు. 2019 ఎన్నికలు జరిగిన తరువాత, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం, ఆర్టికల్‌ 370 రద్దు తరువాత జరిపిన సర్వే ఇది. విశ్లేషణలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. వీటిని పరమ ప్రమాణంగా తీసుకోవాలని చెప్పటం లేదు గానీ దేశంలో నెలకొన్న ధోరణులకు ఒక సూచికగా తీసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో పార్టీల వారీగా హిందువులు బిజెపికి 49శాతం, కాంగ్రెస్‌కు 13శాతం వేశారు. ముస్లింలలో కాంగ్రెస్‌కు 30, బిజెపికి 19శాతం, క్రైస్తవుల్లో కాంగ్రెస్‌కు 30, బిజెపికి పదిశాతం, సిక్కుల్లో కాంగ్రెస్‌కు 33, బిజెపికి 19, బౌద్దుల్లో బిజెపికి 29, కాంగ్రెస్‌కు 24శాతం మంది వేశారు. ఈ ధోరణి 2014 నుంచి ఉన్నదని చెప్పవచ్చు. అందువల్లనే ఎవరి ఓటు బాంకును వారు కాపాడుకొనేందుకు చూడటంతో పాటు హిందువుల ఓట్లకోసం కాంగ్రెస్‌ నేతలు, మైనారిటీల ఓట్లకోసం బిజెపి నేతలు వెంపర్లాడటం లేదా సంతుష్టీకరణకు పూనుకున్నారని చెప్పవచ్చు.


దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల విశ్వాసం తగ్గుతున్నదని ఈ సర్వే అంకెలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రజాస్వామ్య నాయకత్వం కావాలని 46శాతం మంది చెప్పగా దానికి విరుద్దమైన బలమైన నేత కావాలని చెప్పిన వారు 48శాతం మంది ఉన్నారు. హిందువుల్లో మొదటిదానికి 45 శాతం మద్దతు పలకగా రెండవ దానికి 50శాతం మంది ఉన్నారు.మిగతా మతాల వారిలో ప్రజాస్వామిక వ్యవస్థ కావాలని కోరిన వారి శాతం 49 నుంచి 57శాతం వరకు ఉండగా బలమైన నేత కావాలని చెప్పిన వారు 37 నుంచి 47శాతం వరకు ఉన్నారు.బలమైన నేత కావాలని స్త్రీలు 48, పురుషులు 49శాతం మంది కోరుకోగా ప్రజాస్వామ్యం కావాలని చెప్పిన వారు 44, 47శాతాల చొప్పున ఉన్నారు. ఈ కారణంగానే గట్టి నిర్ణయాలు తీసుకోవటం నరేంద్రమోడీ వల్లనే జరుగుతుందని బిజెపి వ్యూహకర్తలు అలాంటి ప్రచారాన్ని ముందుకు తెచ్చినట్లు స్పష్టం అవుతోంది. సంస్కరణలను వేగంగా అమలు జరపటం గురించి తగ్గేదే లేదని, అదానీ కంపెనీల గురించి విచారణకు అంగీకరించేది లేదన్న వైఖరి, రాష్ట్రాలకు చెందిన సాగు రంగంపై వాటితో సంప్రదించకుండా మూడు చట్టాలను రుద్దేందుకు పూనుకోవటం. ఆర్టికల్‌ 370ని కాశ్మీర్‌ అసెంబ్లీతో చర్చించకుండా రద్దు వంటి వాటిని ” గట్టి నాయకుడి ”లో చూడవచ్చు. చరిత్రలో జర్మన్లు హిట్లర్‌లో గట్టి నేతను చూశారు.


తెలంగాణాలో బిజెపి నేతలు హైదరాబాద్‌లోని వివాదాస్పద భాగ్యలక్ష్మి ఆలయం(చార్మినార్‌ వద్ద ఒక మినార్‌ పక్కనే తెచ్చిపెట్టిన విగ్రహం) నుంచే దాదాపు ప్రతి కార్యకమాన్ని ప్రారంభిస్తారు, కర్ణాటకలో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టటం తెలిసిందే. కేరళలో ముస్లిం, క్రైస్తవ విద్వేషం ఇలా దక్షిణాది రాష్ట్రాలలో మత ప్రాతిపదికన ఓటు బాంకు ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నది. దేశంలోని ఇతర ప్రాంతాలలో ఇప్పటికే రెచ్చగొట్టిన దానిని కొనసాగించేందుకు నిరంతరం కొత్త అంశాలను ముందుకు తెస్తున్నది. ఎందుకు అన్నది పూ సర్వే వివరాలను చూస్తే తెలుస్తుంది.ముందే చెప్పుకున్నట్లుగా 2019లో మొత్తంగా హిందువులలో బిజెపికి ఓటు వేసింది 49శాతమే. వాటిని దేశ జనాభాలో 80శాతం వరకు ఉన్నారు గనుక ఆ మేరకు ఓటు బాంకు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నది. ప్రాంతాల వారీ చూస్తే ఉత్తరాదిన 68శాతం, మధ్యభారత్‌లో 65, పశ్చిమాన 56, తూర్పున 46, దక్షిణాదిన 19శాతం మాత్రమే. ఈ కారణంగానే దక్షిణాది మీద బిజెపి ఎంతగానో కేంద్రీకరిస్తున్నది. నిజమైన భారతీయుడు అంటే హిందూ అన్నట్లుగా హిందూ అంటే హిందీ, హిందీ మాట్లాడేవారంటే హిందువులే అన్న భావనను రేకెత్తించేందుకు కూడా చూస్తున్నారు.దానిలో భాగంగానే దేశం మొత్తం మీద హిందీని బలవంతంగా రుద్దాలన్న యత్నం. పూ సర్వే ప్రకారం నిజమైన భారతీయుడు హిందువుగా ఉండాలని భావిస్తున్నవారు 55శాతం, హిందీ మాట్లాడాలని చెప్పిన వారు 59, హిందూగా ఉండటం హిందీ మాట్లాడటం అనేవారు 60శాతం ఉన్నారు.


ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత జనం మత వ్యవహారాల్లో రాజకీయపార్టీల, నేతల జోక్యాన్ని సమర్ధించేవారు అన్ని మతాల్లో మూడింట రెండువంతుల మంది ఉండటం ఆందోళన కలిగించే అంశం.దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని శక్తులు నిస్సిగ్గుగా మతాన్ని-రాజకీయాన్ని మిళితం చేస్తున్నాయి. మత పెద్దలమని చెప్పుకొనే వారు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. పూ సర్వే ప్రకారం మొత్తంగా చూసినపుడు 62శాతం మంది మత వ్యవహారాల్లో రాజకీయపార్టీల ప్రమేయాన్ని సమర్ధించారు.హిందూమతంలో సమర్ధించిన వారు 64శాతం కాగా వద్దన్న వారు 29శాతం ఉన్నారు. సమర్ధించిన వారు ఇతర మతాల్లో 59 నుంచి 42శాతం వరకు ఉన్నారు. రాజకీయపార్టీల ప్రమేయం ఉండకూడదని చెప్పిన వారు ఇతర మతాల్లో 35 నుంచి 52శాతం వరకు ఉన్నారు. ఈ కారణంగానే హిందూత్వశక్తులు తమ అజెండాను అమలు చేస్తున్నాయి. ముస్లింలలో రాజకీయపార్టీల ప్రమేయం ఉండాలన్న వారు 59శాతం వద్దన్నవారు 35శాతం. అంటే మెజారిటీ మైనారిటీ మతాల్లో మతాన్ని ఎంతగా ఎక్కించిందీ అర్ధం చేసుకోవచ్చు.మెజారిటీ మతతత్వం ఎంత ప్రమాదకరమో మైనారిటీ మతతత్వం కూడా అంతే ప్రమాదకరం. నిరుద్యోగం ప్రధాన సమస్య అని భావిస్తున్నవారు అందరిలో 84శాతం మంది ఉండగా అవినీతి అని 76, మహిళలమీద నేరాలని 75, మతహింస అని 65శాతం మంది భావించారు.హిందూ-ముస్లిం మతాలకు చెందిన వారు ఈ అంశాల గురించి దాదాపు ఒకే విధంగా స్పందించటం విశేషం.


ఇక ఏ దేవుడు, దేవత పలుకుబడి లేదా ప్రభావం ఎక్కువగా ఉందో కూడా పూ విశ్లేషణలో ఆసక్తికర అంశాలున్నాయి.శివుడు 44శాతంతో ఆలిండియా దేవుడిగా అగ్రస్థానంలో ఉండగా హనుమాన్‌ 35, గణేష్‌ 32,లక్ష్మి 28, కృష్ణ 21, కాళి 20, రాముడు 17,విష్ణు 10, సరస్వతి 8, ఇతరులు 22శాతంతో ఉన్నారు. చిత్రం ఏమిటంటే శ్రీరాముడి గురించి సంఘపరివార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ మిగతా దేవుళ్లతో పోలిస్తే ఎక్కడా పెద్దగా ప్రభావం చూపటం లేదని పూ చెబుతోంది. మధ్య భారత్‌లో మాత్రమే పైన పేర్కొన్న తొమ్మిది మంది జాబితాలో రాముడు గరిష్టంగా 27శాతంతో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఉత్తరాదిన 20,తూర్పున 15, దక్షిణాదిన 13,పశ్చిమాన 12, ఈశాన్యంలో ఐదుశాతం మంది అనుచరులతో ఉన్నాడు. ఉత్తరాదిన 43శాతంతో హనుమాన్‌ తరువాత 41శాతంతో శివుడు, గణేష్‌ ఉన్నారు.ఈశాన్యంలో కృష్ణుడు 46శాతం, తూర్పున 34శాతంతో కాళి, 32శాతంతో లక్ష్మి,పశ్చిమాన 46శాతంతో గణేష్‌ అగ్రస్థానంలో ఉన్నారు.దేశంలోని మిగతా ప్రాంతాల వారితో పోలిస్తే దక్షిణాదిన ప్రాంతీయ దేవతలు గణనీయంగా ప్రభావం కలిగి ఉన్నారు. మురుగన్‌ 14, అయ్యప్ప 13, మీనాక్షి ఏడు శాతం మందిని కలిగి ఉన్నారు.శివుడు 39శాతంతో అగ్రస్థానంలో ఉన్నాడు.


ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకున్నట్లుగా లోకం నడవదు. రామచరిత మానస్‌లో వెనుకబడిన తరగతుల వారిని కించపరిచినట్లు వచ్చిన వివాదం తరువాత ఆ సామాజిక తరగతులను సంతుష్టీకరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌ భగవత్‌ రంగంలోకి దిగారన్నది ఒక అభిప్రాయం. హిందూత్వ శక్తులు, వారిని అనుసరించేవారిలో ఒక వైరుధ్యం ఉంది. తాము చెప్పే హిందూత్వ సనాతనమైనదని దానిలో కులాలు లేవని జనాన్ని నమ్మించేందుకు బిజెపి చూస్తున్నది. గతేడాది అక్టోబరు ఎనిమిదవ తేదీన నాగపూర్‌లో ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ వర్ణ, కుల వ్యవస్థలను హిందూయిజం నుంచి తొలగించాలని, అది పాపమని కూడా మోహన్‌ భగవత్‌చెప్పారు. ఆ సభ గురించి లోక్‌సత్తా పత్రిక రాసిన వార్తలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి బ్రాహ్మల గురించి ప్రస్తావించినట్లు రాశారని ఆ పత్రిక సంపాదకుడు, నాగపూర్‌ విలేకరి మీద సంఘపరివార్‌కు చెందిన వారు కేసులు దాఖలు చేశారు. ఒక కులం గురించి భగవత్‌ ప్రస్తావించని మాట నిజమే అయినా కులవ్యవస్థను సృష్టించింది ఎవరు ? లేక దానికి అదే పుట్టిందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.వర్ణ వ్యవస్థ సృష్టి బ్రాహ్మణవాదులపనే అనే అభిప్రాయం బలంగా ఉండటంతో సదరు విలేకరి బ్రాహ్మణుల పేరు ప్రస్తావించి ఉండవచ్చు.


చిత్రం ఏమిటంటే అదే మోహన్‌ భగవత్‌ ఈ ఏడాది ఒక దగ్గర మాట్లాడుతూ కులాలను సృష్టించింది పండితులే అని సెలవిచ్చారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మహిళలను కించపరుస్తూ తులసీదాస్‌ రామచరిత మానస్‌లో రాశారన్న విమర్శలను సమాజవాదీ, ఆర్‌జెడి నేతలు ముందుకు తెచ్చిన పూర్వరంగంలో భగవత్‌ ఈ మాటలు చెప్పారని అనుకోవచ్చు. ఈ దేశంలో పండితులు అంటే బ్రాహ్మలే కదా ! దాని మీద ఆర్‌ఎస్‌ఎస్‌లోని బ్రాహ్మలు, వెలుపల ఉన్న వారిలో కూడా గగ్గోలు తలెత్తటంతో నష్టనివారణగా ఒక వివరణ ఇచ్చారు. అదే మంటే పండిట్‌ అంటే ఆంగ్లంలో బ్రాహ్మలు కాదు, ఆంగ్లం, మరాఠీలో మేథావులు అని అర్ధం ఉంది కనుక ఆ భావంతో అన్నారు అని పేర్కొన్నారు. ఇక్కడ సమస్య మేథావులు అంటే ఎవరు. బ్రాహ్మలు కాని మేథావులను పండిట్‌ అని ఎందుకు పిలవటం లేదు ? కాశ్మీరీ బ్రాహ్మలకు ఉన్న మరోనామ వాచకమే కాశ్మీరీ పండిట్‌లు కదా ! కులవ్యవస్థ ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి బ్రాహ్మణులు తప్ప వేదాలు చదివిన వారు ఇతర కులాల్లో ఎవరూ లేరు. వేదాల్లో ఉన్నదే చెబుతున్నారా అసలు వాటిలో ఉన్నదేమిటి అని తెలుసుకొనే ఆసక్తి కలిగిన వేళ్ల మీద లెక్కించగలిగిన వారు తప్ప వేదాలను చదివే ఇతర కులస్థులు ఎంతు మంది ఉన్నారు ? ఇటీవలి వరకు అసలు ఇతరులను చదవనివ్వలేదు. నిన్న మొన్నటి వరకు శూద్రులు, అంటరాని వారిగా ముద్రవేసిన వారికి కనీస చదువు సంధ్యలు కూడా లేవు కదా. అలాంటపుడు ఇతర కులాల్లోని ఏ పండితులు తమను తాము కించపరుచుకొనే విధంగా నిచ్చెన మెట్ల అంతరాలతో కులాలను సృష్టించినట్లు? చదువుకున్నది బ్రాహ్మల తరువాత క్షత్రియులు, వైశ్యులు మాత్రమే. అంటే ఈ కులాలకు చెందిన మేథావులు అనుకుంటే అందులో బ్రాహ్మల వాటా ఎంత ? ఇతరుల వాటా ఎంతో ఆర్‌ఎస్‌ఎస్‌ నిపుణులు వేదగణితంతో గుణించి చెప్పాలి.


కుల వ్యవస్థ పోవాలని ఇప్పటికైనా ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పటం, మారుమనస్సు పుచ్చుకోవటం మంచిదే. అందుకోసం వారు చేసిందేమిటి ?మాటలకే పరిమితం, చిత్తశుద్ది ఎక్కడా కనిపించదు. గమనించాల్సిందేమంటే కులాల సృష్టి పండితులదే అని చెప్పటంతో హిందూ, బ్రాహ్మణ వ్యతిరేకం అంటూ హిందూత్వ అనుకూలురు మోహన్‌ భగవత్‌ మీద మండిపడుతున్నారు. పండితుల గురించి ఇచ్చిన వివరణను ఏ పండితులూ జీర్ణించుకోవటం లేదు. మరోవైపు పండితులుగా ముద్రవేసుకున్న వారు, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు కులవ్యవస్థను సమర్ధించే మనుస్మృతి పుస్తకాలను అచ్చువేయించి ప్రచారం చేస్తున్నారు. పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి భగవత్‌ మాటలపై స్పందిస్తూ కులవ్యవస్థను సమర్ధిస్తూ మాట్లాడారు.” తొలి బ్రాహ్మడి పేరు బ్రహ్మ. మీరు వేదాలను చదవాలి.ప్రపంచంలోని సైన్సు, ఆర్ట్స్‌ను బ్రహ్మ ఒక్కడే వివరించాడు. మనం సనాతన వ్యవస్థను ఆమోదించకపోతే దాని స్థానంలో ఏ వ్యవస్థ ఉండాలి ” అని ప్రశ్నించారు. శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ ” కుల వ్యవస్థను దేవుడు సృష్టించలేదని, వాటిని పండితులు సృష్టించి ఉండవచ్చని భగవత్‌ చెబుతున్నారు. తరువాత పండితులంటే మేథావులు తప్ప బ్రాహ్మలు కాదని వివరించారు.మేథావులు కొన్ని విషయాలను చెబితే మీ రెందుకు తిరస్కరిస్తున్నారు ” అని ప్రశ్నించారు. భగవత్‌ జాతి వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అని ఇటీవల ప్రముఖంగా వార్తలకు ఎక్కిన నరసింగానంద ధ్వజమెత్తారు.


దక్షిణాదిలో మనువాదం, దానికి ప్రతినిధులుగా ఉన్న బ్రాహ్మణుల మీద ధ్వజమెత్తుతూ పెద్ద ఉద్యమం మాదిరి నడిచింది. బ్రాహ్మణులకు ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల కమ్మ బ్రాహ్మణులు వివాహతంతు వాటిని నిర్వహించిన రోజులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో బ్రాహ్మణులు కాకున్నప్పటికీ బ్రాహ్మణవాదాన్ని తలకు ఎక్కించుకున్న అనేక మంది వర్ణ వ్యవస్థకు, హిందూత్వకు ముప్పు వచ్చిందంటూ వీధుల్లోకి వస్తున్నారు. ఇప్పటికీ తంతుల పేరుతో బ్రాహ్మణులు జనాన్ని దోచుకుతింటున్నారని, పరాన్న భుక్కులుగా ఉన్నారంటూ వ్యతిరేకతను వెల్లడించటాన్ని చూడవచ్చు. ఉత్తరాదిలో బిజెపి మద్దతుదార్లుగా ఉన్న అనేక మంది దళితులు,వెనుకబడిన తరగతుల వారు తమ పట్ల వివక్షను ప్రదర్శించే మనుస్మృతి, పురాణాల గురించి ప్రశ్నిస్తున్నారు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నది తెలిసిందే. అందుకే ఓటు బాంకుగా ఉన్న బలహీనవర్గాలు లేవనెత్తే సామాజిక వివక్ష, కించపరచటాన్ని ప్రశ్నిస్తున్న కారణంగా అసలైన హిందూత్వ అంటే కులాలు లేనిది అనే పల్లవిని ఆర్‌ఎస్‌ఎస్‌ అందుకుంది. ఇప్పటి వరకు ప్రధాన మద్దతుదార్లుగా ఉన్న బ్రాహ్మలు, బ్రాహ్మణవాదులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఒక విమర్శ చేసి దళిత, బహుజనులను , అబ్బే నా అర్ధం అది కాదు అంటూ బ్రాహ్మలను ఇతర అగ్రకులాలు అనుకొనే వారిని సంతుష్టీకరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి సాము గరిడీ చేస్తున్నారు.ఉత్తరాదిన బహుజనుల్లో ప్రారంభమైన ఈ ప్రశ్నించే, వివక్షను ఖండించేతత్వం మరింత పెరగటం అనివార్యం. అది హిందూత్వ అజెండాను, మనుకాలం నాటికి దేశాన్ని తీసుకుపోవాలనటాన్ని కూడా అంతిమంగా ప్రశ్నించకమానదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపిని భయపెడుతున్న తులసీదాన్‌ ” రామ చరిత మానస్‌ ” !

17 Friday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Literature., NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


” మీరు ఎల్లవేళలా కొంత మందిని, అందరినీ కొంత కాలం వెర్రి వాళ్లను చేయవచ్చు. కానీ మీరు అందరినీ అన్ని వేళలా వెర్రి వాళ్లను చేయలేరు ” ఇది అమెరికా నేత అబ్రహాం లింకన్‌ చెప్పిన సుభాషితం.” ఏ పదజాలం వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగుందో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు ” కమ్యూనిస్టు నేత లెనిన్‌ చేసిన హెచ్చరిక ఇది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా ఇది వర్తిస్తుంది.మన దేశంలో ఇదే జరుగుతోందా అంటే అవుననే చెప్పాలి. మరి జనం ఎల్లవేళలా మోసపోతారా ? తెలివిగా ఉంటున్నారా ? తమ తెంపరితనాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మోసకారులు మండిపడతారు. తరువాత దెబ్బలాట, అణచివేతలకు పూనుకుంటారు. జనం దాన్ని సహిస్తారా ? లేదు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రజలకు తెలియని భాష, లిపిలో రాసిన గ్రంధాల్లో ఉన్నదాన్ని కొంత మంది ఏ విధంగా చెబితే దాన్ని జనం నిజమని నమ్మారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీకా తాత్పర్యాలను విడదీసి అర్ధాలను వెల్లడించేవారు భిన్న కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు.వాస్తవాన్ని జీర్ణించుకోలేని వారు తమకు అనువైన భాష్యాలను చెబుతూ వివక్షను, గతాన్ని సమర్ధించేందుకు పూనుకున్నారు.


తులసీదాస్‌ రచన రామచరిత మానస్‌లో వెనుకబడిన తరగతులు, మహిలు, దళితులను కించపరిచే భాగాలు, భావాలు ఉన్నట్లు సమాజవాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్‌ మౌర్య, అయోధ్య హనుమాన్‌ దేవాలయపూజారి రాజు దాస్‌, అయోధ్య తపస్విచావని మహంత్‌ పరమహంస దాస్‌ గురువారం నాడు దాడులకు పాల్పడినట్లు పరస్పరం కేసులు దాఖలు చేశారు.రామచరిత మానస్‌ గ్రంధంలోని వివాదాస్పద అంశాలపై లక్నోలోని ఒక హౌటల్‌లో ఒక టీవీ ఛానల్‌ ఏర్పాటు చేసిన ఒక చర్చలో పాల్గొనేందుకు వారు వచ్చారు.చర్చ ముగిసిన తరువాత తాను హౌటల్‌ నుంచి వెళుతుండగా మౌర్య, అతని అనుచరులు తన మీద దాడిచేసినట్లు రాజుదాస్‌ ఆరోపిస్తూ ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. పూజారి, మహంత్‌ తన మీద కత్తి, గొడ్డలితో దాడికి పాల్పడగా తన అనుచరుల కారణంగా తప్పించుకున్నానని ఆ మేరకు కేసు దాఖలు చేస్తున్నట్లు మౌర్య ప్రకటించారు.తనకు అదనపు రక్షణ కల్పించాలని కూడా పోలీసు కమిషనర్‌ను కోరారు. చర్చలో టీవీ యాంకర్‌ తన మీద దాడికి రెచ్చగొట్టినట్లు కూడా విమర్శించారు. అభ్యంతరకర భాగాలను రామచరిత మానస్‌ గ్రంధం నుంచి తొలగించాలి లేదా దాన్ని నిషేధించాలని మౌర్య కోరుతున్నారు. అలాంటివాటిని తాము అంగీకరించేది లేదని సాధు, సంతులు చెబుతున్నారు. చర్చ పక్కదారి పట్టి భౌతికదాడుల వైపు మళ్లటం ఒక ప్రమాదకర సూచన.మౌర్యను విమర్శిస్తూ పోస్టులు పెట్టినందుకు రిచా సింగ్‌, రోలీ తివారీ అనే ఇద్దరు మహిళా ప్రతినిధులను పార్టీ నుంచి సమాజవాది పార్టీ బహిష్కరించింది.సమాజవాదీ ఎంఎల్‌ఏ రాకేష్‌ సింగ్‌ ఈ వివాదంతో స్వంత పార్టీనేతపై ధ్వజమెత్తారు. మౌర్యకు మతి తప్పిందని అన్నారు.అతను సనాతనీ లేదా సోషలిస్టు కానీ కాదన్నారు.ఈ వివాదం జనవరిలో బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌,మౌర్య ప్రకటనలతో మొదలైంది.క్షమాపణలు చెప్పాలన్న బిజెపి నేతల స్పందనకు చెప్పేదే లే అంటూ స్వామి ప్రసాద్‌ మౌర్య జవాబిస్తూ రామచరిత మానస్‌కు ఎవరూ ఎవరూ వ్యతిరేకం కాదు, రామ ప్రభువుకూ కాదు, కొన్ని చరణాలకు మాత్రమే వ్యతిరేకం అన్నారు.మౌర్యను ఉరితీయాలని బిజెపి నేత నందకిషోర్‌ గుజార్‌ సుప్రీం కోర్టుకు లేఖరాశారు.

ప్రతి తరంలోనూ సమాజాన్ని వెనక్కు నడిపించాలని చూసిన వారు మనకు కనిపిస్తారు. కానీ సమాజం ముందుకు, మున్ముందుకు పోతున్నదే తప్ప తలకిందులుగా నడవటం లేదు. పనికిరాని వాటిని విసర్జిస్తూనే ఉంది. మానవ శరీరంలో ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చే భాగం క్రిమిక(అపెండిసైటిస్‌). అలాంటి శక్తులు రెచ్చిపోతున్న తరుణమిది. ఏ అంబేద్కరైతే భారత నాగరికత, సమాజానికి మాయనిమచ్చగా ఉందని మనుస్కృతిని దగ్దం చేశారో ఆ మహానుభావుడిని ఒకవైపు గౌరవిస్తున్నామని చెబుతున్నారు కొందరు. ఆ అంబేద్కర్‌ అధ్యక్షతన రూపొందించిన రాజ్యాంగ రచనకు ఆ మనుస్మృతిని పరిగణనలోకి తీసుకోలేదు. దానిలో ఉన్న అంశాలకు విరుద్దంగా సమానత్వాన్ని అమలు చేసే నిబంధనలు, స్ఫూర్తితో ఉన్న రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. సదరు మనుస్మృతిని భారత పురాతన రాజ్యాంగంగా వర్ణిస్తూ దాని తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించేందుకు పూనుకున్న తిరోగమన వాదులకు ఎదురుదెబ్బ తగిలింది.హైదరాబాద్‌ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా ఒక సభలో ఆవిష్కరించేందుకు అభ్యంతరాలు వెల్లువెత్తటంతో ఇచ్చిన అనుమతిని అధికారులు రద్దు చేశారు. దాంతో నిర్వాహకులు తరువాత దాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ఏదో ఒక ప్రైవేటు స్థలంలో ఆ పని చేస్తారు, అది వేరే అంశం. మూడున్నర కిలోల బరువు, రు.2,100 విలువగల పుస్తకాన్ని అచ్చువేసేందుకు అవసరమైన భారీ పెట్టుబడితో ఆ పుస్తకాన్ని జనాలతో చదివించి తిరోగమనంవైపు నెట్టేందుకు పడుతున్న ప్రయాస స్పష్టంగా కనిపిస్తున్నది.


ఒకవైపు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే దానికి ప్రతిఘటన ఉండటం సహజం.మనువు చెప్పినట్లుగా బతకటానికి జనం సిద్దంగా లేరు. ఆ బోధనలను బలవంతంగా అమలు జరిపే అవకాశమూ లేదు. ఇస్లాం మత ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో షరియాను అమలు జరిపేందుకు పూనుకున్నవారికి , మన దేశంలో మనుస్మృతిని రుద్దాలని చూసే వారికి పెద్ద తేడా లేదు. దేశంలో అనేక మంది రామాయణాన్ని తిరగ రాశారు. వాటిలో పదహారవశతాబ్దినాటి తులసీదాన్‌ రచన ఒకటి.హిందీకి దగ్గరగా ఉండే అవధీ భాషలో రాసినందున జనానికి సులభంగా అర్ధం కావటంతో ప్రాచుర్యం పొందింది.తులసీదాస్‌ కలం నుంచి వెలువడిన రామచరిత మానస్‌ గ్రంధంలోని మనుస్మృతిలో చెప్పిన అంశాలు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలలో వివాదాన్ని రేపాయి. నల్లేరు మీద బండిలా తమ పథకాన్ని అమలు జరపాలని చూస్తున్న హిందూత్వశక్తులకు ఇది మింగుడు పడక మండిపడుతున్నాయి.శాపాలు పెట్టే శక్తి లేకపోవటం లేదా పని చేయవని తెలిసి గానీ అభ్యంతర అంశాలను విమర్శించిన బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌ నాలుక కోస్తే రు. పదికోట్ల బహుమానం ఇస్తామని అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య ప్రకటించారు. స్వామి ప్రసాద్‌ మౌర్య తలనరికితే 21 లక్షలు ఇస్తానని హనుమాన్‌ గుడి పూజారి రాజు దాస్‌ ప్రకటించారు.ఈ ప్రకటనలను చూసిన తరువాత బాబాలు,సాధువులు, సంత్‌లు ఉగ్రవాదులు, కసాయిలుగా మారారని స్వామి ప్రసాద్‌ విమర్శించారు. గతంలో బాబాలు అంటే సన్యాసులుగా ఉండేవారు. గతంలో బాబాలు,సాధువులకు కోపం వచ్చేది కాదు, వచ్చినా శాపాలు పెట్టేవారు. నేటి బాబాలకు అలాంటి తపస్సు లేదు.వారికి నిజంగా శక్తి ఉంటే చైనాను భస్మం చేయమనండి, ఈ రోజు బాబాలు, సాధువులు ఉగ్రవాదులుగా మారారు. కొంత మంది ముక్కులు, నాలుకలు కోసేయమని, తలలు తీసేయమంటూ కసాయిలుగా మారుతున్నారు అని ప్రసాద్‌ అన్నారు. ఈ పూర్వరంగంలోనే గురువారం నాడు లక్నోలో ఇరువర్గాలకు చెందిన అనుచరులు గొడవకు దిగినట్లు చెప్పవచ్చు.


రామచరిత మానస్‌, మనుస్మృతి, పురాణాలు, ఇతర గ్రంధాల్లో ఉన్న అవాంఛనీయ వర్ణనలు, బోధల గురించి దశాబ్దాల క్రితమే తెలుగునాట హేతువాదులు, నాస్తికవాదులు ఎత్తి చూపిన అంశం తెలిసిందే.ఇప్పుడు ఉత్తరాదిన అలాంటి పరిణామం జరుగుతోంది. నాడు ఆ విమర్శ, సమర్థనలు ఎన్నికలతో నిమిత్తం లేవు. ఇప్పుడు వాటితో మిళితం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బిసిలను కించపరిచే భాగాలను నిషేధిస్తామని స్వామి ప్రసాద్‌ చెప్పారు.


సమాజవాదీ ఎంఎల్‌ఏ ఆర్‌కె వర్మ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. దానిలో ” తులసీదాస్‌ వివక్ష, అంటరానితనం,అసమానతను తలకు ఎక్కించుకున్న ఒక కవి. అతని రామచరిత మానస్‌లో రాజ్యాంగానికి విరుద్దమైన అనేక చరణాలున్నాయి.అవి వెనుబడిన తరగతులు, మహిళలు, దళితులు, సంత్‌ సమాజాన్ని అవమానిస్తున్నాయి.ఆ చరణాలను తొలగించాలి ” అని పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ బిజెపి యువమోర్చా వారు ఎంఎల్‌ఏ శవయాత్ర జరిపి బొమ్మను దగ్దం చేశారు. రామచరిత మానస్‌ను అవమానించినందుకు ఆర్‌జెడి,సమాజవాది పార్టీల గుర్తింపును రద్దు చేయాలని విశ్వహిందూపరిషత్‌ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. హిందూ సమాజంలో అపనమ్మకాన్ని కలిగించేందుకు ఆ పార్టీల నేతలు చూస్తున్నారని ఆరోపించింది.


ఉత్తరాదిలో 120లోక్‌ సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌లో తలెత్తిన ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం ఉంది.మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికలపై దీని ప్రభావం పడుతుందేమో అని కంగారు పడుతున్న బిజెపి ఇతర సంస్థలు, సాధు సంతులను రంగంలోకి దింపి ఆచితూచి మాట్లాడుతున్నది.సున్నితమైన, మనోభావాలతో ముడిపడిన ఈ వివాదం పెరిగితే తన బిసి ఓటు బాంకుకు గండిపడుతుందన్న భయం దానిలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సంఘపరివార్‌ సంస్థలకు చెందిన అగ్రవర్ణాలుగా అనుకుంటున్న కులాలకు చెందిన వారు హిందూత్వ అజెండాను దెబ్బతీసే ఈ పరిణామంపై మండిపడుతుండగా వారిని మాట్లాడవద్దని బిజెపి ఆదేశించినట్లు వార్తలు. రామచరిత మానస్‌లో తమను కులపరంగా కించపరిచినా తమకేమీ ఇబ్బంది లేదు అని చెప్పగల స్థితి లేనందున వెనుక బడిన తరగతుల నేతలు, మద్దతుదారులు నోరు మెదపలేని స్థితి ఏర్పడింది. వెనుకబడిన తరగతుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ చాలా కాలం నుంచి ఉంది. ఆ జనాభా ఎంత అన్నది తాజా లెక్కలు లేవు. అందువలన కులపరమైన లెక్కలు తేల్చాలన్న డిమాండ్‌ను బిజెపి అంగీకరించటం లేదు. బీహార్‌లో గణాంకాల సేకరణకు ఆర్‌జెడి-జెడియు కూటమి నిర్ణయించటంతో ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఆ డిమాండ్‌కు మద్దతు పెరుగుతున్నది. దాని కోసం ఆందోళన ప్రారంభిస్తామని సమాజవాదీ పార్టీ ప్రకటించింది. రామచరిత మానస్‌ వివాదం గురించి సిఎం యోగి ఆదిత్యనాధ్‌ను అడగ్గా వివాదం రేపే వారికి దాని గురించి తెలియదని, బిసి లెక్కల గురించి నిర్ణయించాల్సింది కేంద్రమని తప్పించుకున్నారు.


1980దశకంలో ఉత్తరాదిన మండలమా ా కమండలమా అన్న ప్రాతిపదికన ఓటర్లు చీలారు. మండల్‌ కమిషన్‌ నివేదికను సమర్ధించిన పార్టీలు ఒక వైపు బిజెపి మరోవైపు తారసిల్లాయి. తరువాత జరిగిన పరిణామాల్లో 2014 నాటికి ఎంబిసీలు బిజెపికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికీ అదే కొనసాగుతున్నది. ఎంబిసిలు, కొందరు దళితులను ఆకట్టుకున్న బిజెపి మిగతావారిని కూడా తన వైపు తిప్పుకొనేందుకు పూనుకున్నప్పటికీ అది జరగలేదు. బిసి జనాభా గణనకు తిరస్కరించటంతో అనేక మంది బిజెపి మద్దతుదారుల్లో కూడా పునరాలోచన ప్రారంభమైన దశలో రామచరిత మానస్‌ వివాదం ముందుకు వచ్చింది. ఆ గ్రంధాన్ని లక్నోలో తగులబెట్టిన వారి మీద మీసాతో సహా ఇతర చట్టాల కింద మౌర్యతో సహా పది మందిపై బిజెపి సర్కార్‌ కేసులు పెట్టింది. ఈ వివాదం తలెత్తిన తరువాత సమాజవాదీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తాను కూడా శూద్రుడనే అని అంటూ బిజెపి మీద అనేక ప్రశ్నలను సంధించారు. అసెంబ్లీలో సిఎం యోగి తులసీదాస్‌ రచనలో ఉన్నవాటిని అనువదించి చదివి శూద్రులు ఎవరో తేల్చాలని సవాలు చేశారు. దళితులను శూద్రులుగా బిజెపి వారు పరిగణిస్తున్నారా లేక మమ్మల్ని బిసిలుగానూ దళితులను శూద్రులుగా పరిగణిస్తున్నారా అన్నది తేల్చాలి అన్నారు.ఇదిలా ఉండగా లక్నోలోని సమాజవాదీ ఆఫీసు సమీపంలో పెద్ద బోర్డు వెలసింది. ” 6,743 కులాలు, శూద్ర సమాజం గర్వంతో చెబుతున్నాం మేం శూద్రులం, జై శూద్ర సమాజం, జై రాజ్యాంగం ” అని దాని మీద రాసి ఉంది. దాన్ని ఆలిండియా కుర్మీ క్షత్రియ మహాసభ( ముంబై) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శూద్ర ఉత్తమ్‌ ప్రకాష్‌ సింగ్‌ పటేల్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


పాము పాలు తాగితే విషంగా మారినట్లుగా దిగువ కులాల వారు విద్యనేర్చుకుంటే విషపూరితం అవుతారని దానిలో రాసినట్లు బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌ చెప్పారు.సకల గుణ హీనుడైనా బ్రాహ్మణుడిని పూజించాలి, వేద ప్రవీణులైనా శూద్రులను గౌరవించకూడదని, తెలీ, కుమ్‌హార్‌, కహార్‌,దళితులు, ఆదివాసీలు అధములని పేర్కొన్నట్లు కూడా చెప్పారు. మహిళలు, దళితుల గురించి తులసీదాస్‌ కించపరిచే విధంగా రాశారు, అవి ఒకటో రెండో వాక్యాలు కాదు అనేక చరణాలు రాశారు. ఒక దానిలో ఒక బ్రాహ్మణుడి నిండా చెడు లక్షణాలు ఉన్నా అతన్ని పూజించాలి. ఒక దళితుడు వేద పండితుడైనా అతన్ని గౌరవించకూడదు అని రాశారని, అంత వివక్షతో కూడిన వాటిని ఎలా అంగీకరించాలని జామియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ హేమలత మహేశ్వర్‌ ప్రశ్నించారు.డోలు వాయించేవారు,నిరక్షరాస్యులు, మహిళలు,పశువులు, దళితులు దండనార్హులని రామచరిత మానస్‌లో తులసీదాస్‌ చెప్పినట్లు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ 2018 ఆగస్టులో ఒక పోస్టులో పేర్కొన్నదాని మీద పెద్ద చర్చ జరిగింది. ఇది గృహ హింస చట్టం, ఎస్‌సి ఎస్‌టి చట్టాలను ఉల్లంఘించాలని ప్రోత్సహించటం కిందికి రాదా అని కట్జూ ప్రశ్నించారు.దళితులు,ఓబిసిలను శూద్రులని వర్ణించటం పట్ల బిఎస్‌పి నాయకురాలు మాయావతి నిరసన తెలిపారు.సమాజవాదీ వారిని శూద్రులని అప్రతిష్టపాలు చేస్తున్నదా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదా అని ప్రశ్నించారు.వారిని ఓటు బాంకుగా పరిగణిస్తున్నదని విమర్శించారు.


తులసీదాస్‌ను సమర్ధించే కొందరు విపరీత తెలివిని ప్రదర్శిస్తున్నారు. అతనేమీ సంస్కర్తకాదు, కనుక అతనిలో వివక్ష ఉంటుంది. వివాదాస్పద అంశాలను అతను సృష్టించిన పాత్రలు చెప్పినవి తప్ప అతని స్వంత అభిప్రాయాలు కాదని వితండవాదం చేస్తున్నారు. అసందర్భంగా ప్రస్తావిస్తున్నారని, వాటి అసలు అర్ధం వారికి అవగతం కాలేదని చెబుతున్నారు.శూద్రులు లేదా బ్రాహ్మలు అనేది చేసే పనులను బట్టి తప్ప పుట్టుకనుబట్టి కాదని కొందరు చెబుతున్నారు. అలాంటి పరిగణన గతంలో ఉందో లేదు తెలీదు ఇప్పుడు ఉనికిలో లేదు. పుట్టుకతోనే కులం, మతం వస్తున్నది. ఆ మేరకు గౌరవ మర్యాదలు, హీనంగా చూడటం జరుగుతున్నది. మొత్తంగా చెప్పాలంటే నల్లేరు మీద బండిలా తమ హిందుత్వ అజెండాను అమలు జరపాలన్న కాషాయ దళాలను ఎదుర్కొనే శక్తులు సదరు హిందూత్వ భావజాలంలో ఉన్న అసంబద్దతలనే ఆయుధాలు చేసుకుంటుంటే మింగా కక్కలేని స్థితిలో బిజెపి గిలగిల కొట్టుకుంటున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రకంపన : సుప్రీంకోర్టుకైనా నరేంద్రమోడీ చెబుతారా, కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ?

11 Saturday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, Adani-Hindenburg row, BJP, HINDENBURG, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, RSS, SEBI, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


దేశం మొత్తాన్ని కుదిపివేసినా, ప్రపంచంలో మన కంపెనీల విశ్వసనీయత మీద అనుమానం తలెత్తినా, మదుపర్లు లక్షల కోట్లు పోగొట్టుకున్నా దేశ అత్యున్నత పార్లమెంటులో అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు మెదపలేదు. మోడీ తీరు తెన్నులను గమనించిన వారు నోరు విప్పుతారని ఏ ఒక్కరూ ఆశించలేదన్నది కూడా పచ్చినిజం. ఎవరి స్టైల్‌ వారిది, తగిన తరుణం వచ్చినపుడు ఎవరి పద్దతిలో వారు స్పందిస్తారు. పార్లమెంటులో ప్రతిపక్షాల డిమాండ్‌ను ఖాతరు చేయని అపర ప్రజాస్వామికవాది ఇప్పుడు సుప్రీం కోర్టుకైనా ఏదైనా నివేదిస్తారా ? లేక దేశభద్రతకు సంబంధించిన అంశం కనుక కోర్టుకు చెప్పలేం అని ఠలాయిస్తారా ? లేదా విచారణ, సూచనల కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా ? చూద్దాం !


శుక్రవారం నాడు సుప్రీం కోర్టు ముందు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎంఎల్‌ శర్మ, విశాల్‌ తివారీ అనే ఇద్దరు న్యాయవాదులు ఒక దావా వేశారు. అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా అమెరికా కేంద్రంగా ఉన్న హిండెన్‌బర్గ్‌ సంస్థ కుట్రలో భాగంగా విడుదల చేసిన పరిశోధన నివేదిక మదుపర్లకు భారీ నష్టం కలుగ చేసినందున సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని విడి విడిగా కేసులు దాఖలు చేశారు.దీన్ని స్వీకరించిన కోర్టు సోమవారం నాడు విచారణకు తీసుకుంటామని వివాదం తలెత్తిన నేపధ్యంలో నియంత్రణ విధానం, తీసుకున్న చర్యల గురించి ఆరోజుకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)ని ఆదేశించింది. ప్రభుత్వం, సెబీని సంప్రదించి భవిష్యత్‌లో ఇలాంటి ఉదంతం పునరావృతం కాకుండా నియంత్రణ వ్యవస్థలను ఎలా పటిష్ట పరచాల్సిందీ, క్రమబద్దీకరణ చట్టాలు, మార్కెట్ల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన మార్పులు అవసరమైతే దాని కోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుతో సహా ఒక నివేదికను అందచేయాలని సొలిసిటర్‌ జనరల్‌ను కోరింది.కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఒక కమిటీని వేయవచ్చని కూడా చెప్పింది. తాము దీని గురించి ఏదైనా చెబితే మార్కెట్‌ ప్రవృత్తి, మదుపుదార్ల విశ్వాసం మీద ప్రభావం చూపవచ్చని కోర్టు పేర్కొన్నది. భారత మదుపుదార్ల ప్రయోజనాలను ఎలా కాపాడాలన్నదే నిజంగా తమ తాపత్రయమని కోర్టు పేర్కొన్నది. బంతి ఇప్పుడు ఎక్కడ ఉన్నదీ చెప్పనవసరం లేదు.


జరిగిన పరిణామాలపై సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని,హిండెన్‌ బర్గ్‌ నివేదిక దేశ స్టాక్‌ ఎక్సేంజ్‌ను కుదిపివేయటమే కాదు, దేశంలోని వాణిజ్యవేత్తలను అనుసరిస్తున్న పద్దతులను కూడా ప్రశ్నార్ధకంగా మార్చిందని పిటీషనర్లు పేర్కొన్నారు.నియంత్రణలు లేకుండా ప్రభుత్వ రంగ బాంకులు రుణాలు ఇవ్వటం తీవ్ర ఆందోళనకరమైన అంశమని, బడా కార్పొరేట్లకు ఐదు వందల కోట్ల రూపాయలకు మించి ఇచ్చే రుణాలపై పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని కూడా కోరారు. ఈ పిటీషన్‌ మీద విచారణ ఎలా జరుగుతుందో, ఏమి తేలుస్తారో చెప్పలేము గానీ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తకుండా ఒకవేళ ఎవరైనా అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకొనేందుకు వీలుగా సుప్రీం కోర్టు సూచించినట్లుగా ఒక కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకరిస్తే కథకంచికే. కోర్టు అందుకు అంగీకరిస్తే దాని నిర్ణయాన్ని తప్పు పట్టకూడదు గానీ ఇది నరేంద్రమోడీ-అదానీ ప్రయోజనం కోసం దాఖలైన పిటీషన్‌ అనుకొనేందుకు అవకాశం ఉంది.


ప్రపంచంలో హిండెన్‌బర్గ్‌ వంటి షార్ట్‌ సెల్లర్స్‌, వారి లీలలు కొత్త కాదు. ఇలాంటి వారు ఉండటం మార్కెట్‌కే మంచిదని సమర్ధించేవారు ఉన్నారు. అదానీ కంపెనీల మీద ఇప్పుడు కాకుండా మరోఐదేండ్ల తరువాత గనుక ఇలాంటి నివేదిక వచ్చి ఉంటే ఇంకా పెద్ద ముప్పు వచ్చి ఉండేదని అనేక మంది అనుకుంటున్నట్లుగా మీరాయె ఎసెట్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సిఐఓ రాహుల్‌ చద్దాతో నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రాసింది.” రానున్న 5-10 సంవత్సరాల్లో భారత్‌ గనుక ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే మన కంపెనీలలో ఎక్కువ భాగం మరింతగా తనిఖీకి గురికావచ్చు. దీన్ని గతంలో చూశాము. కొంత మంది షార్ట్‌ సెల్లర్స్‌ చైనా కంపెనీల గురించి నివేదికలు రాశారు. కొన్ని నివేదికలు వాస్తవమే, కొన్ని సంచలనం కలిగించాయి.మార్కెట్‌ దాన్ని పెద్ద అంగలు వేయటంగా చూసింది. ఎక్కడైతే నివేదికలు వాస్తవమో అక్కడ స్టాక్స్‌ ప్రభావితం అయ్యాయి. అదానీ గ్రూపు విషయానికి వస్తే ఎక్కువ మంది మదుపుదార్లు ప్రైవేటు సంభాషణల్లోనే మాట్లాడుతున్నారు. ప్రముఖంగా ప్రస్తావించిన కొన్ని అంశాలను చూస్తే ఒక విధంగా చెడ్డలో మంచిగా చూస్తున్నారు. ఇప్పుడు గాకుండా ఐదేండ్ల తరువాత ఈ సమస్య తలెత్తివుంటే పెద్ద వ్యవస్థాపరమైన ముప్పుగా ఉండేది. దీన్నుంచి ప్రతివారూ పాఠం నేర్చుకున్నారని అనుకుంటున్నాను ” అని చద్దా చెప్పారు. ఇటీవల తాను ఐరోపా వెళ్లినపుడు ప్రతి చోటా మదుపర్లు తనను అదానీ ఉదంతం గురించి అడిగితే పైన చెప్పుకున్న అంశాలనే వివరించాల్సి వచ్చిందని, ఇంత జరిగాక తానైతే ఆచితూచి పెట్టుబడులు పెడతానని కూడా చెప్పారు.


సంస్థాగత మదుపర్ల ఆలోచన ఎలా ఉందో చూశాము. ఎంతసేపూ షార్ట్‌ సెల్లర్లు, వారి వెనుక ఉన్న కుట్ర సిద్దాంతాల చుట్టూ చర్చను తిప్పేందుకు చూస్తున్నారు.హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత అదానీ కంపెనీ ఎఫ్‌పిఓ పేరుతో రు.20వేల కోట్లను సేకరించేందుకు వాటాలను జారీ చేసింది. చిన్న చిన్న మదుపుదార్లెవరూ ముందుకు రాలేదు. కానీ ఆశ్చర్యంగా కొందరు రంగంలోకి దిగి వాటిని కొని అదానీ పరువు నిలిపేందుకు చూశారు. అలా ఎల్‌ఐసి కూడా మూడు వందల కోట్ల మేరకు దరఖాస్తు చేసిందని వార్తలు. వాటిని స్టాక్‌ఎక్సేంజ్‌లో పెడితే కొన్నవారంతా చేతులు కాల్చుకొనేవారే. కానీ అదానీ ఆ అమ్మకాలను రద్దు చేసి ఆదుకున్న తన మిత్రులను రక్షించారు. ఇదొక పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ జరపాలి.అస్థిరపరిస్థితి ఉన్నపుడు అదానీ కోసం ముందుకు వచ్చిన వారెవరు అన్నది బహిరంగం కావాల్సి ఉంది.


ఇక షార్ట్‌ సెల్లర్స్‌ అంటే ఎవరు అన్న ఆసక్తి చాలా మందిలో కలిగింది. అమరావతి ప్రాంత రైతులతో అగ్రిమెంటు చేసుకొని భూములు కొనుగోలు చేసి చేతులు కాల్చుకున్నవారి సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వం రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన రంగంలోకి తేవటంతో భూముల ధరలు ఢమాల్‌ అన్నాయి. దాంతో ఒప్పందాలు చేసుకున్న వారు రైతులకు పెద్ద మొత్తంలో ఇచ్చిన బయానా సొమ్మును వదులుకొని లావాదేవీలను రద్దు చేసుకున్నారు. అదే అదనుగా ధరలు తగ్గటంతో కొందరు చౌకగా కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. స్టాక్‌ మార్కెట్‌లో బ్రోకర్ల వద్ద కొందరు ఒక కంపెనీ వాటాలను అరువు తెచ్చుకుంటారు. వాటిని మార్కెట్‌లో ఉన్న ధరల కంటే కారుచౌకగా తెగనమ్ముతారు. దీన్నే షార్ట్‌ సెల్లింగ్‌ (తక్కువ ధరలకు అమ్మకం) అంటారు. దాంతో ఆ కంపెనీలో ఏదో గోల్‌మాల్‌ జరిగిందని ఇతరులు కూడా మరింత నష్టపోకుండా చూసుకుందామని అమ్మకాలకు పాల్పడతారు. వాటి విలువ పడిపోతుంది.ఆ ఒక్క కంపెనీ వాటాల ధరలే కాదు, స్టాక్‌ మార్కెట్లో ఇతర కంపెనీల ధరలూ పతనం కావచ్చు. దాన్ని ఆసరా చేసుకొని అదే షార్ట్‌ సెల్లర్స్‌ భారీగా అదే కంపెనీ లేదా ఇతర కంపెనీల వాటాలను తక్కువ ధరలకు కొని పెద్ద మొత్తంలో లాభాలు పొందిన ఉదంతాలతో పాటు చేతులు కాల్చుకున్నవారు లేకపోలేదు. స్టాక్‌ మార్కెట్లో ఇదొక ఖరీదైన జూదం. షార్ట్‌ సెల్లర్స్‌కు వాటాలను అరువుగా ఇచ్చిన బ్రోకర్లకు ఎలాంటి నష్టమూ ఉండదు.లేదూ కొంత మంది బ్రోకర్లే షార్ట్‌ సెల్లింగ్‌కూ పాల్పడి జూదమాడవచ్చు.ఈ షార్ట్‌ సెల్లర్స్‌ ఎలాంటి వారంటే ప్రధాన పట్టణాల బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద కొంత మంది ఆటో, టాక్సీ వాలాలు వచ్చిన వారిని ఎక్కించుకొని కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకోకుండా పగలంతా పడిగాపులు పడి ఎవరైనా అమాయకులు దొరికితే దోచుకొనే ఒక సినిమాలో నిక్కర్‌ నారాయణ పాత్రను గుర్తుకు తెస్తారు.


ఇలాంటి జూదాన్ని స్టాక్‌మార్కెట్‌ నియంత్రణ సంస్థలు నిషేధించవచ్చుకదా అని కొందరు అడగవచ్చు.ప్రపంచంలో చైనాతో సహా ఎక్కడా స్టాక్‌మార్కెట్లలో అలా జరగలేదు.అనుమతిస్తూనే ఉన్నారు. భారీ ఎత్తున అమ్మకాలకు దిగినపుడు స్టాక్‌ ధరలు పతనమైతే ఒక పరిమితి దగ్గర కొద్దిసేపు అమ్మకాలను నిలిపివేస్తారు. అది భారీ ఎత్తున నిర్ణీత పరిమితికి మించి పెరుగుతున్నపుడు కూడా అదే పని చేస్తారు. పూర్తిగా నిషేధించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అదానీ కంపెనీల వాటాల ధరలు విపరీతంగా పెరిగినపుడు లేని నిషేధాలు పతనమైనపుడు ఎలా పెడతారు? గతంలో కేతన్‌ పరేఖ్‌ అనే నేరస్తుడు ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణం జరిగింది. జి టెలిఫిలిమ్‌ వాటా ధర రు.127 ఉంటే దాన్ని పదివేలకు, విజువల్‌ సాప్ట్‌ రు.625ను రు.8,448, సోనాటా సాఫ్ట్‌ రు.90ని రు.2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు. వైస్‌ జగన్‌మోహనరెడ్డి సాక్షి పత్రిక, టీవీ కంపెనీలో పది రూపాయల విలువగల వాటాలను వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వారిని మీరెందుకు అలా కొన్నారని ప్రశ్నిస్తే మేం వ్యాపారులం, లాభాలు వస్తాయనే అంచనాతో కొన్నాం, ఒక వేళ రాలేదనుకోండి నష్టపోయేది మేమే కదా మాకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకు అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దాని వెనుక ఆసలు కథ ఏమంటే అదే వ్యాపారులు రాజశేఖరరెడ్డి సర్కార్‌ నుంచి భారీ మొత్తంలో లబ్ది పొందారని దానికి బల్లకింద గాక బల్లమీదనే బహిరంగంగా చట్టపరంగానే అలా ప్రతిఫలం చెల్లించారనే విమర్శలున్న సంగతి తెలిసిందే. వాటి మీద ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి.దీన్నే నీకది నాకిది అంటారు. హిండెన్‌బర్గ్‌ ఉదంతంపై సోమవారం నాడు లేదా తరువాత సుప్రీం కోర్టు ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.


షార్ట్‌ సెల్లర్లు ఒక్క అదానీ కంపెనీ మీదనే తొలిసారిగా కుట్ర చేసినట్లు, దాన్ని దేశం మీదనే జరిగిన దాడిగా, దానివెనుక చైనా ఉన్నదని ఆరోపిస్తూ కుహనా జాతీయభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.హిండెన్‌బర్గ్‌ కంపెనీ ఉంది అమెరికాలో, దానికి నిజంగా చైనా మద్దతు ఇస్తే అమెరికా ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? చైనా బెలూన్ను కూల్చివేసి అమెరికాను రక్షించినట్లు చెబుతున్న ప్రభుత్వం హిండెన్‌బర్గ్‌ మీద విచారణకు ఆదేశించి చైనా పాత్రను వెల్లడించేందుకు,తన మిత్రదేశంగా భావిస్తున్న భారత్‌ను, అదానీని బహిరంగంగా సమర్ధించలేక విమర్శించలేక ఎక్కాతిక్కా స్థితిలో ఉన్న జిగినీ దోస్తు నరేంద్రమోడీని రక్షించేందుకు జో బైడెన్‌ ఎందుకు పూనుకోలేదు ? 2021లో చైనా ప్రభుత్వం తమ టెక్నాలజీ సంస్థలపై చర్య తీసుకున్నపుడు షార్ట్‌ సెల్లర్స్‌ భారీ ఎత్తున లబ్ది పొందారు. ఆ ఏడాది ఒక్క జూలై నెలలోనే ఎనిమిది బిలియన్‌ డాలర్లు పోగేసుకున్నారు. అలాంటి సొమ్ముతో ఎంచుకున్న కంపెనీల వాటాలను కొనుగోలు చేసి షార్ట్‌ సెల్లింగ్‌కు పాల్పడి లబ్దిపొందేందుకు చూశారు. ఇది నిరంతర ప్రక్రియ. అలీబాబా కంపెనీల షేర్లను మార్కెట్‌ కంటే పదమూడుశాతం తక్కువకు అమ్మి పతనం కాగానే అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసి లాభాలు పొందారు. అలాంటి వారికి ఒక దేశం, ఒక కంపెనీ, దేశభక్తి లాంటివేమీ ఉండవు.అప్పుడు అలీబాబా కంపెనీ కూడా అదానీ మాదిరే కొత్త షేర్లను అమ్మచూపితే ప్రభుత్వం అడ్డుకున్నది. ఇక్కడ నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి పని చేయకున్నా అదానీ తోక ముడిచిన సంగతి తెలిసిందే.2021 జూలైలోనే చైనాలోని ఆన్‌లైన్‌ సరకుల విక్రయ కంపెనీ పిండూడూ కూడా షార్ట్‌ సెల్లర్ల దాడికి గురైంది.వారు పెద్ద మొత్తంలో లబ్ది పొందారు. అప్పుడు చైనా ప్రభుత్వం లేదా పాలకపార్టీ దాన్ని తమ దేశం మీద దాడిగానో దాని వెనుక భారత్‌ లేదా అమెరికా ఉందనో ఆరోపించలేదు. టెక్నాలజీ కంపెనీలపై చైనా సర్కారు తీసుకున్న చర్యలు కొనసాగింపుగా తదుపరి గేమింగ్‌ కంపెనీలపై ఉంటాయని పుకార్లు పుట్టించి షార్ట్‌ సెల్లర్లు లబ్ది పొందారు. ఇలా ప్రతిదేశంలో అచిరకాలంలోనే తారా జువ్వలా ఎదిగిన కంపెనీలన్నింటినీ షార్ట్‌ సెల్లర్లు ఎంచుకొని లబ్ది పొందుతున్నారు. ప్రభుత్వ మద్దతుతో అదానీ వంటి వారు, పాలకుల పక్కన చేరి లెక్కలను తిమ్మినిబమ్మిని చేసిన సత్యం కంప్యూటర్స్‌ మాదిరి కంపెనీలకు లేని విలువను సృష్టించి జనం నెత్తిన చేతులు పెట్టదలచుకుంటే ఇలాంటి షార్ట్‌ సెల్లర్స్‌ అలాంటి కంపెనీల మీద కన్నేసి దెబ్బతీసి లబ్ది పొందుతారు. దివాలా తీసేది అమాయకపు మదుపుదార్లు మాత్రమే. మహా అయితే అదానీ వంటి వారు 2014లో ఎక్కడ ఉన్నారో తిరిగి అక్కడకు పోతారు, వారికి వచ్చే నష్టం ఉండదు. అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిండెన్‌బర్గ్‌ వెనుక చైనా హస్తం నిజానిజాలేమిటి : అదానీని మోస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ” ఆర్గనైజర్‌ ” కట్టుకథలు, పిట్టకతలు !

09 Thursday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, anti china, BJP, China, Donald trump, Explosive BBC documentary, Hindenburg Controversy, HINDENBURG RESEARCH, Joe Biden, Narendra Modi Failures, Propaganda War, RSS, SJM


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? అనేక మందిని తొలుస్తున్న పెద్ద ప్రశ్న. పక్కా నిజాలే చెబుతారు, సత్యహరిశ్చంద్రుడి తరువాత కారణజన్ములు వీరే అన్నట్లు నమ్ముతున్న కొన్ని సంస్థలకు చెందిన వారు పచ్చి అబద్దాలను అలవోకగా ఎలా చెప్పగలుగుతున్నారు ? వారికా తెగింపు ఎలా వచ్చింది ? అన్నింటికీ మించి మన దేశ ప్రధాని నరేంద్రమోడీ ఏం చేస్తున్నారు అన్నది బ్రహ్మపదార్ధంగా ఉంది. బుధవారం నాడు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ఒక్కసారి కూడా అదానీ గురించి, అతని కంపెనీల మీద వచ్చిన ఆరోపణలను ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. గతంలో కాంగ్రెస్‌ ఏలుబడిలో జరిగిన కుంభకోణాల పునశ్చరణతో దేశాన్ని ముందుకు నడిపించగలరా ? అదానీ కంపెనీలపై వచ్చిన విమర్శలతో ప్రపంచంలో మన మీద విశ్వసనీయత సడలిందని ప్రధాని గుర్తించలేదా ? లేక నటిస్తున్నారా ? అదానీ కంపెనీలపై విచారణ జరిపి అక్రమాలేం లేవు అని తేలిస్తే మన ప్రతిష్ట ఇంకా పెరగేది కదా ! ప్రతిపక్షాలు కోరిన విచారణ డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోలేదు. అంటే అదానీ కంపెనీలకు మద్దతు ఇచ్చినట్లేనా ! ఆ ముక్కే సూటిగా ఎందుకు చెప్పలేదు. పాత కుంభకోణాలను ముందుకు తెచ్చి అదానీ కంపెనీల అక్రమాలను మూసిపెట్టాలని చూస్తే కుదురుతుందా ? ఇలా ఎన్నో కొత్త ప్రశ్నలు. ప్రతిపక్షాల కంటే తనను తానే ఇరుకున పెట్టుకుంటున్నారా అని నిజంగా మోడీని నమ్మినవారు కూడా ఆలోచిస్తున్న స్థితి ? మక్కువ పడ్డ మగువ కోసం రాజ్యాలనే పోగొట్టుకున్న రాజుల కథలు విన్నాం. ఒక కంపెనీకోసం నరేంద్రమోడీ ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నారు?


అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు చెప్పింది అమెరికాలోని హిండెన్‌బర్గ్‌ సంస్థ.ఉక్రెయిన్‌ మీద రష్యా సైనిక చర్యకు పాల్పడితే తటస్థంగా ఉన్నట్లు ప్రకటించిన నరేంద్రమోడీ పుతిన్‌తోనూ జో బైడెన్‌తోనూ మాట్లాడి సర్దుబాటు చేసేందుకు చూశారు. అమెరికా నరేంద్రమోడీకి జిగినీ దోస్తు. తన కంపెనీల మీద హిండెన్‌బర్గ్‌ వదలిన క్షిపణి మన దేశం మీద జరిగిన దాడిగా అదానీ వర్ణించారు. ఉక్రెయిను మీద చూపిన శ్రద్దలో వందో వంతైనా లక్షల కోట్ల సంపద ఆవిరవుతున్న మన మదుపర్ల మీద ఎందుకు లేదు అన్నది మోడీ అభిమానులకు సైతం అంతుచిక్కని ప్రశ్న. అమెరికానే మన కాళ్ల దగ్గరకు తెస్తున్న మోడీ అన్న వందిమాగధుల గురించి తెలిసిందే. మిత్రోం లేదా ఏ మోయి జో బైడెనూ మీకు నేను కావాలా వద్దా కావాలనుకుంటే హిండెన్‌బర్గ్‌ మా మీద చేసిన దాడి గురించి చప్పుడు(మాట్లాడవు) చెయ్యవేమిటి అని ఫోన్‌ చేసి అడుగుతారేమో అని ఎదురు చూసిన వారికి ఇప్పటి వరకు నిరాశేమిగిలింది.మంచోడు మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడన్నట్లుగా జనం భావించక ముందే మోడీ స్పందిస్తారా ? ఇది సహస్రశిరచ్చేద అపూర్వ చింతామణి ప్రశ్నగా మారుతుందా ?


హిండెన్‌బర్గ్‌కు ముందు దేశంలోని ఏ సంస్థ లేదా పార్టీ కూడా అదానీ కంపెనీల మీద అలాంటి అంశాలను ముందుకు తేలేదు. ఆరోపణలు చేయలేదు. అది 129 పేజీలలో చెప్పిన అంశాల మీద అదానీ 413 పేజీల వివరణ ఇచ్చారు. ఆ ఒక్కటి మినహా అన్నట్లుగా కీలకమైన అంశాలను వదలి ఇతర గాలిపోగేశారని చెబుతున్నారు. అందుకే దీని మీద నిగ్గుదేల్చాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదీసినా మహామౌనమునిగా పేరుతెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అవి నిజమనో కాదనో, అదానీ పరమపునీతుడనో ఏదో ఒకటి చెప్పమంటే మిన్నువిరిగి మీద పడినా నోరు విప్ప అన్నట్లుగా ఉన్నారు. పార్లమెంటు సమయం, ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అవుతున్నా, లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైనా ప్రతిపైసాకు జవాబుదారీ అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీకి పట్టలేదు.


గుజరాత్‌కు చెందిన స్టాక్‌ బ్రోకర్‌ కేతన్‌ పరేఖ్‌ కుంభకోణం గురించి దర్యాప్తు జరిపేందుకు 2001లో నాటి వాజ్‌పాయి సర్కార్‌ జాయింట్‌ పార్లమెంటరీ కమిటి(జెపిసి)ని వేసింది. గుజరాత్‌లోని సహకార బాంకులను ముంచినందున అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ సారధి నరేంద్రమోడీకి దెబ్బతగులుతుందని భావించిన కారణంగా అనివార్యమై ఆనాడు అంగీకరించాల్సి వచ్చింది. ఆ కుంభకోణం వందల కోట్లలోనే ఉంది. కంపెనీలు, వాటిలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు కుమ్మక్కై కేతన్‌ పరేఖ్‌ ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణమది. జి టెలిఫిలిమ్‌ వాటా ధర రు.127 ఉంటే దాన్ని పదివేలకు, విజువల్‌ సాప్ట్‌ రు.625ను రు.8,448, సోనాటా సాఫ్ట్‌ రు.90ని రు.2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు. ఇప్పుడు అదానీ కంపెనీల వాటా ధరలను కూడా అదే విధంగా లేని విలువను పెంచారన్నదే ప్రధాన ఆరోపణ. నాటి జెపిసి విచారణ జరిపి కుంభకోణం వాస్తవమని తేల్చింది. ఇప్పుడు కూడా అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద అలాంటి కమిటీని వేసేందుకు మోడీ ఎందుకు అంగీకరించటం లేదన్నది ప్రశ్న. నిజం కాదనైనా తేల్చి అదానీ మీద పడిన మచ్చను తొలగించవచ్చు కదా ! వాజ్‌పాయిని ఆదర్శంగా ఎందుకు తీసుకోరు ? దారినపోయే దానయ్య ఒకడు ఏదో అన్నాడని రాముడు సీత పవిత్రతను లోకానికి నిరూపించేందుకు అగ్నిప్రవేశం చేయించిన ఆదర్శవంతుడంటూ గొప్పగా చెప్పే బిజెపి పెద్దలు అదానీ గురించి విచారణకు ఎందుకు జంకుతున్నారు ? రాముడి ఆదర్శం ఓట్లు దండ్లుకొనేందుకు చెప్పుకోవటం తప్ప దాని స్ఫూర్తిని అనుసరించరా ? అదానీ అగ్నిప్రవేశం గురించి ఎవరూ అడగటం లేదుగా !


మరోవైపున నరేంద్రమోడీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పరివార్‌ కాషాయ దళాలు అదానీని సమర్ధించేందుకు నానా తంటాలు పడుతున్నాయి. అందుకోసం కట్టుకథలు, పిట్టకతలు చెబుతున్నాయి. జనానికి నిర్ధారించే ఆలోచన, అవకాశాలు ఉండవని కాబోలు పచ్చి అవాస్తవాలను వండి వారుస్తున్నాయి. మన దేశ చరిత్రలో ఒక పారిశ్రామిక, వ్యాపార సంస్థ మీద వచ్చిన తీవ్ర ఆరోపణలు విచారించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవటం, సాంస్కృతిక సంస్థ ముసుగువేసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధనకు దిగటం ఇదే ప్రధమం అని చెప్పవచ్చు. డాక్టర్‌ సునీల్‌ గుప్తా అనే పెద్దమనిషి 2023 ఫిబ్రవరి ఆరవ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ” ఆర్గనైజర్‌ ” లో హిండెన్‌బర్గ్‌ వివాదం అంటూ ఒక విశ్లేషణ రాసి అదానీకి కితాబునిచ్చారు. అది భారత్‌ మీద జరిపిన కుట్రగా వర్ణించారు. బిబిసి విదేశీ, అది చెప్పినదానిని మనం ప్రామాణికంగా తీసుకోవాలా, దాని విశ్వసనీయత ఏమిటి? హిండెన్‌బర్గ్‌ ఒక విదేశీ సంస్థ దాని నిజాయితీ ఏమిటీ అంటూ అనేక మంది ఒక తర్కాన్ని ముందుకు తీసుకువచ్చారు. వారంతా సంఘపరివార్‌కు చెందిన వారు లేదా దాని మాటలను గుడ్డిగా విశ్వసించే వారు అన్నది తెలిసిందే. నిజమే, ఏ సంస్థనూ ఎవరూ ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బంగారం స్వచ్చతను కొలిచేందుకు కారట్ల ప్రమాణాలు ఉన్నాయి. ఏ సంస్థకూ దాని స్వచ్చతను కొలిచేందుకు అలాంటి ప్రమాణాలేమీ లేవు. కానీ ఆర్గనైజర్‌ విశ్లేషకులు దవోస్‌లో ప్రపంచ ఆర్థికవేదిక మీద భారత ఆర్థిక రంగం మహా గొప్పగా ఉందని బాంక్‌ ఆఫ్‌ జపాన్‌ గవర్నర్‌ పొగిడారని, అదే సమావేశంలో ఉన్న నోకియా సిఇఓ, ఎరిక్స్‌న్‌ అధిపతి తదితర అగ్రశ్రేణి ప్రపంచ సిఇఓలు నిజమే అన్నారన, సిఎన్‌బిసితో అనేక ప్రముఖ మీడియా సంస్థలు దేశ ఆర్థిక పురోగతి, వచ్చే రోజుల్లో సాధించనున్న విజయాల గురించి ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. మరి ఈ సంస్థలు, సిఇఓలకు ఉన్న విశ్వసనీయత ఏమిటి ? రిలయన్స్‌, టాటాల వంటి సంస్థలతో పాటు అదానీ కంపెనీలు దేశ వృద్దిలో భాగస్వాములౌతున్నట్లు కూడా చెప్పారు. ఇక్కడ ప్రశ్న 2014లో ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బి.డాలర్లకు ఎలా ఎదిగారు, వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నటాటా వంటి వారికి సాధ్యం కానిది అదానీకి ఎలా వచ్చింది, ఎందుకు రాలేదు అన్నది చెప్పాలి.


హిండెన్‌బర్గ్‌ అదానీ కంపెనీ మీద విడుదల చేసిన నివేదికను దేశం మీద దాడిగా చిత్రించటం అంటే గతంలో ఇందిరే ఇండియా- ఇండియా అంటే ఇందిర అన్న కాంగ్రెస్‌ నేత డికె బారువా భజనను గుర్తుకు తెస్తున్నది. అదానీయే ఇండియా-ఇండియా అంటే అదానీ అనటమే. ఇదే హిండెన్‌బర్గ్‌ గతంలో అమెరికాకు చెందిన నికోలా కార్పొరేషన్‌ అనే సంస్థ గురించి కూడా పరిశోధన నివేదికను వెలువరించటంతో ఆ కంపెనీ వాటాల ధర కుప్పకూలింది. అంటే అది అమెరికా మీద దాడి, మాతృ దేశానికి ద్రోహం చేసినట్లా ? దాని వెనుక ఎవరున్నారు ? తీరా తరువాత తేలిందేమిటి నికోలా కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణైంది. అందువలన నడమంత్రపు సిరి వచ్చిన ఏ కంపెనీని ఎవరూ వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. కానీ విలువలు-వలువల గురించి చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఎందుకు కొమ్ముకాస్తున్నట్లు ? గుజరాత్‌ మారణకాండ గురించి బ్రిటన్‌కు చెందిన బిబిసి చెప్పిందాన్ని నమ్మాల్సిన అవసరం లేదని వాదిస్తున్నవారు అదే బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్టు పత్రిక రాసిందాన్ని నమ్మి తన విశ్లేషణలో దాన్ని ఉటంకించి అదానీ తప్పు చేయలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఎలా సమర్ధించుకుంటుంది ? తమకు అనుకూలంగా ఉంటే విదేశీ కితాబు ఫర్వాలేదా ? విమర్శిస్తే దేశం మీద దాడా ?ఎకానమిస్టు చెప్పిందాన్ని వారు నమ్మే వేద ప్రమాణంగా తీసుకుంటారా ? నిజాన్ని నిగ్గుతేల్చమన్న డిమాండ్‌ను అంగీకరించటానికి నోరెందుకు రాదు.ఆత్మవంచన, పర వంచన, రెండునాలికలతో మాట్లాడటం తప్ప మరొకటికాదు.


ఎవడు కొడితే మైండు బ్లాకై దిమ్మ తిరుగుతుందో వాడే పండుగాడు అన్నట్లు హిండెన్‌బర్గ్‌ కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిన వారు ఎవరేేం మాట్లాడుతున్నారో పొంతన లేదు.ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ గౌతమ్‌ అదానీకి వత్తాసు పలుకుతూ హిండెన్‌బర్గ్‌ సంస్థకు చైనాకు లంకె ఉందని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ ప్రకటించారు. అదానీకి తమ మద్దతు ఉంటుందని, అలాంటి నివేదికలు మిమ్మల్నేమీ చేయవంటూ ధైర్యం చెప్పారు.మరొక వాట్సాప్‌ పోస్టులో అదానీ దేశభక్తి గురించి సెలవిచ్చారు. ఆర్గనైజర్‌ పత్రికలో 2023 ఫిబ్రవరి 4వ తేదీన వెబ్‌డెస్క్‌ పేరుతో సరికొత్త కథనాన్ని వండి వడ్డించారు.దానిలోని అంశాలను కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో తిప్పుతున్నారు. విజయ గజేరా, ద హాకీఎక్స్‌ అనే వారి ట్వీట్ల ఆధారంగా యధార్ధ సిక్కా దాన్ని పేర్చినట్లు పేర్కొన్నారు.అసలు వారెవరు ? వారి ట్వీట్లకు ఉన్న విశ్వసనీయత ఏమిటి ?


ఆర్గనైజర్‌ కథనం సారాంశం ఇలా ఉంది. ” బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ మరియు బ్యాంక్‌ ఆఫ్‌ థారులాండ్‌ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు భారత వ్యతిరేక వ్యాపారవేత్త జార్జ్‌ సోరోస్‌ చేసిన కుట్రను పోలి ఉంది. వాస్తవంగా అదానీ కంపెనీలపై దాడి జనవరి 25న హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత ప్రారంభం కాలేదు. ఒక ఆస్ట్రేలియన్‌ ఎన్‌జివో నిర్వహించే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ 2016-17లో ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయాల్సిన ఎన్‌జిఓ అదాని వాచ్‌ డాట్‌ ఓఆర్‌జి పేరుతో అదానీ బొగ్గు గనులకు వ్యతిరేకం అని చెప్పినప్పటికీ దానికే పరిమితం కాలేదు. ఇప్పుడు అదానీకి సంబంధం లేని అంశాలను కూడా ప్రచురిస్తోంది. రవీష్‌ కుమార్‌ ఎన్‌డిటివీని వదిలితే దానికేమిటి పని ? ఒక పర్యావరణ ఎన్‌జిఓకు బిబిసి డాక్యుమెంటరీ మీద ట్వీట్‌ను సమర్ధించాల్సిన అవసరం ఏమిటి ? ఎన్‌ఎఫ్‌ఐ అనే భారత్‌ ఎన్‌జివో జార్జిసోరస్‌, ఫోర్డ్‌ ఫౌండేషన్‌, రాక్‌ఫెల్లర్‌, బిల్‌గేట్స్‌, అజీమ్‌ ప్రేమ్‌జీల నుంచి నిధులు పొందుతున్నది. అజీమ్‌ ప్రేమ్‌ జీ ఏర్పాటు చేసిన ఎన్‌జిఓ ఐపిఎస్‌ఎంఎఫ్‌ ఆల్ట్‌ న్యూస్‌, ద వైర్‌, ద కారవాన్‌, ది న్యూస్‌ మినిట్‌ తదితర సంస్థలకు నిధులు ఇస్తున్నది. సిపిఐ(ఎం) నేత సీతారామ్‌ ఏచూరి భార్య సీమా చిస్తీ ఎన్‌ఎఫ్‌ఐకి మీడియా ఫెలోషిప్‌ సలహాదారు. ఆమె ద వైర్‌ ఎడిటర్‌. వైర్‌కు సోరోస్‌, ఫోర్డ్‌, బిల్‌గేట్స్‌, అజీమ్‌ ప్రేమ్‌జీ, రాక్‌ఫెల్లర్‌, ఓమిడియార్‌తో ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. 2017లో అదానీ ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు సంబంధించి వైర్‌ ఐదు కథనాలను రాసింది.


డిజిపబ్‌ పేరుతో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్లతో ఒక గ్రూపును ధన్యా రాజేంద్రన్‌ ఏర్పాటు చేశారు. దీనికి న్యూస్‌క్లిక్‌ ప్రబీర్‌ పురకాయస్థ ఉపాధ్యక్షుడు.దీనిలోని సైట్లన్నింటికీ ఐపిఎస్‌ఎంఎఫ్‌ నిధులు ఇస్తుంది.ఈ సైట్లతో ప్రమేయం ఉన్న వారందరి ఖాతాలను చూస్తే సమన్వయంతో అదాని మీద దాడిచేసిన ట్వీట్లను చూడవచ్చు. విదేశీ ఎన్‌జివోలు, దేశంలోని వారి భాగస్వాముల నుంచి నిధులు, శిక్షిణను పొందిన వీరంతా దేశంలోని జాతీయ వాదులు లేదా సంస్థల మీద దాడి చేస్తారు. అదానీ, అంబానీల మీదనే వీరు దాడి చేస్తారు. టాటా, ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి, వాద్రా లేదా ఇతరుల మీద ఎందుకు చేయరు ? ” ఆర్గనైజర్‌ కథనం ఇలా సాగింది.


ఆర్గనైజర్‌ బాధ అదానీ కంపెనీలను విమర్శించినందుకైతే అంతవరకు పరిమితం కావాలి. కానీ ఇతరుల మీద దాడి ఎందుకు చేయరు అని ప్రశ్నించటం ఏమిటి ? ఒక సాంస్కృతిక సంస్థ అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకుంటుంది. అది నడిపే పత్రికకు ఇతర అంశాలెందుకు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. హిండెన్‌బర్గ్‌ నివేదిక మీద 413పేజీల వివరణ ఇచ్చిన అదానీ తన మీద దేశంలోని కొన్ని వెబ్‌సైట్‌లు నిజంగా దాడి చేస్తుంటే ఇంతవరకు ఒక్క నివేదికా విడుదల చేయలేదేం ? కందకు లేని దురద కత్తిపీటకా అన్నట్లు అదానీకి లేని దురద ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్గనైజర్‌కు ఎందుకు ? అతని కంపెనీలనుంచి ఎంత ముట్టిందేమిటి ? దాని రాతలో పేర్కొన్న సంస్థలు అక్రమాలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, ఎవరు వద్దన్నారు.అమెరికాలోని అనేక సంస్థలు నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. అలాంటపుడు వాటి గురించి నరేంద్రమోడీ గతంలో బరాక్‌ ఒబామా, ట్రంప్‌కు, ఇప్పుడు జో బైడెన్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? జాతీయవాదుల మీద ఆ సంస్థల నిధులతో కొందరు దాడి చేస్తుంటే అసలు సిసలు జాతీయవాదినని చెప్పుకొనే నరేంద్రమోడీ మన దేశంలో వాటి కార్యకలాపాలను ఎందుకు అదుపు చేయరు ? ఈ అంశాలన్నింటినీ ఆర్గనైజర్‌ ఎందుకు ప్రశ్నించదు ?


సుమీత్‌ మెహతా, వినయకుమార్‌ సింగ్‌ ద్వయం 2023 ఫిబ్రవరి 25న ఆర్గనైజర్‌లో ఒక విశ్లేషణ రాసింది. అదానీ నివేదిక, బిబిసి డాక్యుమెంటరీ కూడా చైనా కుట్రే అన్నది సారం. తమిళనాడులోని స్టెరిలైట్‌ రాగి కర్మాగారం మూసివేత వెనుక, ఢిల్లీ శివార్లలో రైతులు ఉద్యమించిన సందర్భంగా జరిగిన రిలయన్స్‌ జియో టవర్ల ధ్వంసం వెనుకా ఉన్నది కూడా చైనా అని ఎందుకంటే దాని 5జి టెలికాం పరికరాలను నిషేధించి రిలయన్స్‌కు ప్రాధాన్యమివ్వటమే చైనా కోపానికి కారణమని సూత్రీకరించారు. భారత కంపెనీల మీద అనుమానాలు రేకెత్తించటం తద్వారా ఆర్థికరంగాన్ని దెబ్బతీయటం,భారత కంపెనీలు నిధులు సేకరించకుండా అడ్డుకోవటం దాగి ఉందన్నారు. స్టెరిలైట్‌ కాపర్‌ కంపెనీ వివాదం చాలా కాలం నుంచి ఉంది. దాన్ని మూసివేత కోరిన సంస్థల వెనుక చైనా ఉన్నదని, తన వద్ద ఉన్న రాగి నిల్వలను అమ్ముకొనేందుకే ఆపని చేసిందని ఆరోపించారు. అసలు విషయ ఏమంటే ఆ కర్మాగార మూసివేతకు ముందు 2017లో మన దేశం నుంచి చైనా 210 కోట్ల డాలర్ల విలువ గల రాగిని దిగుమతి చేసుకుంది.(ఐబిఇఎఫ్‌, 2021 సెప్టెంబరు 20).2021లో చైనా పది దేశాల నుంచి రాగి, రాగి ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా గరిష్టంగా చిలీ నుంచి 19.4శాతం(7.3 బి.డాలర్లు) కాగా తొమ్మిదవ స్థానంలో ఉన్న మన దేశం నుంచి 3.28శాతం(1.18 బి.డాలర్లు) ఉంది. అదే విధంగా చైనా దిగుమతులతో పాటు ఎగుమతులు కూడా చేస్తున్నది. వాటిలో కొరియాకు 31శాతం ఉంది. చైనా దిగుమతుల విలువ 2,738 కోట్ల డాలర్లు కాగా ఎగుమతుల విలువ 24.23 కోట్ల డాలర్లు మాత్రమే.(ట్రెండ్‌ ఎకానమీ డాట్‌కామ్‌ ప్రచురణ తేదీ 2022నవంబరు 14) అందువలన చైనా దగ్గర ఉన్న రాగిని అమ్ముకొనేందుకు స్టెరిలైట్‌ మీద కుట్ర చేసిందనటం పచ్చి అవాస్తం. ఇది ఒక్కటి చాలు ఆర్గనైజర్‌ అబద్దాలకు, వక్రీకరణలకు ఇది పక్కానిదర్శనం.

భారత కంపెనీలు చైనా సంస్థలకు పోటీ ఇస్తున్నందున చైనా హిండెన్‌బర్గ్‌, బిబిసి వంటి వాటి వెనుక ఉండి దాడులు చేయిస్తున్నదని చెబుతున్నారు. ఏ రంగంలో మన దేశం చైనాతో పోటీ పడుతున్నదో చెప్పగలరా ?ఇజ్రాయల్‌ హైఫా రేవును అదానీ తీసుకున్నందుకు చైనాకు కోపం వచ్చి హిండెన్‌బర్గ్‌తో నివేదిక ఇప్పించిందట. ఇజ్రాయల్‌ మొదటి నుంచీ అమెరికా తొత్తు, చైనాకు ఎప్పుడూ శత్రుదేశమే. దాని రేవు కోసం ప్రయత్నించినా చైనాకు దక్కుతుందా ? అసలు చైనా అలాంటి ప్రయత్నం చేసినట్లు దానికి అదానీ అడ్డుపడినట్లు ఏ ఆధారంతో చెబుతున్నారు. హైఫా రేవును చైనా మీద గూఢచర్యానికి వినియోగిస్తే అదే పని ఇజ్రాయల్‌, అమెరికా చేయలేదా, దాన్ని అదానీకి అప్పగించాలా ! బోడిగుండుకు మోకాలికి ముడిపెడితే కుదురుతుందా ?


అలాంటి చైనా నుంచి భారీ ఎత్తున దిగుమతులు చేసుకుంటూ రికార్డులను బద్దలు కొడుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ను ఇంతవరకు ఆర్గనైజర్‌ ఎన్నడైనా ప్రశ్నించిందా ? మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు ఎందుకు తగ్గుతున్నట్లు ? నిజంగా చైనా కుట్రలు పన్నుతుంటే మన ప్రభుత్వం వాటిని నిజమని నమ్మితే మన ప్రభుత్వం చైనాకు నిరసన తెలుపుతూ కనీసం లేఖ కూడా ఎందుకు రాయలేదు, పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించటం లేదు ? గాల్వన్‌ ఉదంతం తరువాత ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంత దేశభక్తి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రతిదాన్నీ చైనా మీదకు నెట్టివేస్తే జనం గుడ్డిగా నమ్ముతారని భావిస్తున్నట్లున్నారు. తలెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వక్రీకరణలు, తప్పుడు రాతలతో కొందరిని కొంత కాలం మోసపుచ్చగలరు తప్ప అందరినీ ఎల్లకాలం మభ్య పెట్టలేరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !

05 Sunday Feb 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Adani Group, anti china, BJP, Chang Chung Ling, Gudami International, HINDENBURG RESEARCH, Narendra Modi, Narendra Modi Failures, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్నాడు గురజాడ గిరీశం. అంటే నిష్ప్రయోజకులు అని అర్ధం. శాస్త్రంలో ఉన్న ప్రతిదానికీ మినహాయింపులుంటాయని మన పండితులెప్పుడో సెలవిచ్చారు గనుక గిరీశం చెప్పినదానికి మినహాయింపు ఏమిటంటే అది అందరికీ వర్తించదు. వాట్సాప్‌ ” విజ్ఞానాన్ని ” గుడ్డిగా నమ్మే అజ్ఞానులకు మాత్రమే అని చెప్పవచ్చు. నరేంద్రమోడీ మీద విదేశీ బిబిసి చెప్పిందాన్ని మనం నమ్మాలా, దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా, దేశభక్తుడు అదానీ కంపెనీల గురించి అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ ఇచ్చిన నివేదికను విశ్వసించాలా అని 56 అంగుళాఛాతీ విరుచుకొని ప్రశ్నిస్తున్నవారు మనకు చాలా మంది కనిపిస్తారు. నిజమే దేన్నీ గుడ్డిగా నమ్మకూడదు. వాళ్లే ఇంకా ఏమంటారంటే మన దేశంలో నరేంద్రమోడీని విమర్శించే దేశద్రోహులకు మోడీ గురించి విదేశాల వారు చెప్పే ప్రశంసలు కనిపించవా అని తర్కానికి దిగుతారు. పాకిస్తాన్‌ వాళ్లు ఏమంటున్నారో చూడండి అంటూ మనకు వీడియోలు పంపుతారు. వాటిని మనం చూడాలి, తరించాలి. బిబిసి డాక్యుమెంటరీ చూడకుండా లింకులను నిషేధిస్తారు. మోడీని ప్రశంసించిన తమవారి వీడియో లింక్‌లను పాక్‌ ప్రభుత్వం ఎందుకు నిషేధించలేదు ? సదరు వీడియో మోడీ భక్తుల కల్పితం అనుకోవాలా లేక పాక్‌లో భావ ప్రకటన స్వేచ్చ ఉందనుకోవాలా ?


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని సుమతీ శతకకారుడు చెప్పాడు. ఆ రోజుల్లో గిరీశం, వాట్సాప్‌ ఉండి ఆ మాటలు బద్దెన గారి చెవినపడి లేదా చేరి ఉంటే తప్పించుకు తిరుగువారు వాట్సాప్‌ పండితులు సుమతీ అని కచ్చితంగా రాసి ఉండేవాడు. స్వదేశీయులు విమర్శించినపుడు మీకు పొగిడే విదేశీయులు కనిపించరా అంటారు. అదే విదేశీయులు విమర్శిస్తే, దాని సంగతేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే శత్రువులను భుజాన వేసుకుంటారా అని మాటలమారులు దెబ్బలాడతారు. వారి నాలికలకు నరం ఉండదు. ఇదే గాంగు వాట్సాప్‌లలో తిప్పుతున్న ఒక అంశాన్ని చాలా మంది చదివే ఉంటారు. అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక చీఫ్‌ ఎడిటర్‌ జోసెఫ్‌ హౌప్‌ రాసిన సంపాదకీయం అంటూ నరేంద్రమోడీ గొప్పతనం గురించి అనేక అంశాలను పేర్కొన్నారు.బిబిసి విమర్శిస్తే దురుద్దేశం ఉంది అన్నారు. మరి ఈ సంపాదకీయం మోడీని బుట్టలో వేసుకొనేందుకు మునగ చెట్టు ఎక్కించినట్లా ? ఇక జోసెఫ్‌ సంపాదకీయంలో చెప్పిందేమిటో కొన్ని ఆణిముత్యాలను చూద్దాం. లేకపోతే మోడీ భక్తుల మనోభావాలు గాయపడితే ప్రమాదం.


” నరేంద్రమోడీ ఒక ప్రత్యేక లక్ష్యం వైపుగా పయనిస్తున్నాడు. ఆయన ఏం చెయ్యబోతున్నాడో ఎవ్వరికీ తెలియదు( నిజమే పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపని తెలిసిందే).ఆయన చిరునవ్వు వెనుక ఒక భయంకరమైన దేశభక్తుడున్నాడు.( ఇదేమీ వర్ణన రాబాబూ, ఏ దేశభక్తుడినైనా ఇలా వర్ణించటం చూశారా, అసలు నరేంద్రమోడీలో ఎవరైనా చిరునవ్వును చూశారా). పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లకు అమెరికాతో సంబంధాలను తెగ్గొట్డాడు.ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సరిహద్దులకు దగ్గరగా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ను నాలుగు ముక్కలు చేస్తాడు.యుద్దం చేయకుండానే పాకిస్తాన్ను సర్వనాశనం చేశాడు. ఆసియా ఖండంలో ఆధిపత్యాన్ని నిరూపించాడు.రష్యా,జపాన్‌లను అతి సున్నితంగా తన గుప్పిట్లో ఉంచుకున్నాడు.” ఇలాంటి అనేక అంశాలను చెప్పి ఇంతవరకు ఎవ్వరినీ నేను ఇంతగా మెచ్చుకోలేదు అని జోసెఫ్‌ హౌప్‌ రాసినట్లుగా దానిలో పేర్కొన్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమంటే బిబిసి, హిండెన్‌బర్గ్‌ వాస్తవం.జోసెఫ్‌ హౌప్‌ అనే జీవి అసలు ఉనికిలో లేడు, న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అసలు అలాంటి సంపాదకీయం రాయలేదు.ఇది ఫేక్‌ న్యూస్‌ అని అనేక సంస్థలు దాని బండారాన్ని చెప్పాయి. పోనీ ఇది వాస్తవం కాదని ప్రభుత్వం ప్రకటించిందా అంటే అదెక్కడా కనపడదు. నమో భారతీయం వంటి పేర్లతో ఆంగ్లంలో ప్రచారం చేసినదానిని తెలుగులో పాక్షికంగా అనువందించి వాట్సాప్‌లో తిప్పుతున్నారు.


ఇక వాట్సాప్‌లో చాడా శాస్త్రి పేరుతో ఒక తేడా పోస్టును తిప్పుతున్నారు.జోసెఫ్‌ హౌప్‌ మాదిరి సదరు శాస్త్రి నకిలీ పాత్రో ఉనికిలో ఉన్నదీ తెలీదు. ఏదైనా కావచ్చు, దీన్లో కూడా ఎన్నో అతిశయోక్తులు.వాటిలో కొన్నింటిని చూద్దాం. ” అసలు మన దేశంపై చైనా గుర్రుకు కారణం ఏమిటి ? ఆ దేశ సంస్థలకి పోటీగా మన దేశ వ్యాపార సంస్థలు ఎదిగి ప్రపంచంలో వారి వ్యాపారానికి పోటీకి రావటం, చైనాకు రావాల్సిన వ్యాపారాలను భారత సంస్థలు తన్నుకుపోవటం ” పగటి కలలు కనటం అంటే ఇదే. రికార్డులను బద్దలు కొడుతూ మనం చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం అన్నది తెలిసే ఇలా రాస్తున్నారా ? మన సంస్థలు తన్నుకుపోతే మన దిగుమతులు తప్ప ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు. అమెరికా మన దేశంపై ఎందుకు గుర్రుగా ఉందంటూ రాసిన అంశం ఆసక్తికరం. రష్యా నుంచి రోజుకు 17లక్షల పీపాల చమురును 47 డాలర్ల వంతున దిగుమతి చేసుకొనటంతో 70బిలియన్‌ డాలర్ల ఎగుమతి ఆదాయం మన దేశానికి వచ్చిందని చెప్పారు. దానికి చేసిన ఖర్చు కూడా ఎంతో చెప్పలేదు. దాన్ని శుద్ధి చేసి రోజుకు ఆరులక్షల పీపాల డీజిల్‌ కొరత ఉన్న ఐరోపా దేశాలకు దానిలో 60శాతం మనం ఎగుమతి చేస్తున్నాం అన్నారు.దీని వలన వచ్చే లాభం అంబానీ, మరొక ప్రైవేటు కంపెనీకే కదా ! మన జనానికి కలిగే మేలు ఏమిటి ? ఒక్క లీటరైనా తక్కువ ధరకు మన జనానికి అమ్మారా ? దీనితో ప్రపంచ ఇంథన ఆర్థిక ఆటలో మనం ప్రధాన ఆటగాడిగా ఎదుగుతున్నాం అన్నారు. జనం చెవుల్లో పూలు దూర్చటం అంటే ఇదే.ఉక్రెయిన్‌పై దాడికి దిగిందంటూ రష్యా మీద ఆంక్షలు విధించి అక్కడి నుంచి ఇంథన కొనుగోళ్లను నిలిపివేసింది ఐరోపా. తటస్థంగా ఉన్నామని చెబుతున్న మనం ఐరోపా కోసం రష్యా నుంచి కొనుగోలుకు మన విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని అంబానీ, నయారా కంపెనీలకు ఇస్తూ మనకు ఆదాయం వస్తుందని జనానికి కబుర్లు చెబుతారా ? ఇదొక గొప్ప రాజకీయమా, తటస్థం పేరుతో ఎవరికి ఉపయోగపడుతున్నట్లు ?


వారం రోజుల తరువాత స్వదేశీ జాగరణ మంచ్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ మేలుకున్నది.గౌతమ్‌ అదానీకి వత్తాసు పలుకుతూ హిండెన్‌బర్గ్‌ సంస్థకు చైనాకు లంకె ఉందని సంస్థ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ ప్రకటించారు. అదానీకి తమ మద్దతు ఉంటుందని, అలాంటి నివేదికలు మిమ్మల్నేమీ చేయవంటూ ధైర్యం చెప్పారు.మరొక వాట్సాప్‌ పోస్టులో అదానీ దేశభక్తి గురించి సెలవిచ్చారు. ఇజ్రాయల్‌ హైఫా రేవును అదానీ తీసుకున్నందుకు చైనాకు కోపం వచ్చి హిండెన్‌బర్గ్‌తో నివేదిక ఇప్పించిందట. ఇజ్రాయల్‌ మొదటి నుంచీ అమెరికా తొత్తు, చైనాకు ఎప్పుడూ శత్రుదేశమే. దాని రేవును చైనా మీద గూఢచర్యానికి వినియోగిస్తే అదే పని అమెరికా చేయలేదా, దాన్ని అదానీకి అప్పగించాలా ! మోకాలికీ బోడిగుండుకు ముడిపెట్టటం అంటే ఇదే.హిండెన్‌బర్గ్‌ నిర్వాహకుడు అమెరికాలో స్థిరపడిన ఇజ్రాయలీ. ప్రపంచంలో కంపెనీల వాటాలను షార్ట్‌ సెల్లింగ్‌ చేసే సంస్థ హిండెన్‌బర్గ్‌ ఒక్కటే కాదు. దానికి నిధులు ఇవ్వటం ఎందుకు ? స్వయంగా చైనా అలాంటి కంపెనీని పెట్టవచ్చు. ప్రపంచంలో డాలర్‌ నిల్వలు ఎక్కువ ఉన్న దేశం అది. ఒక్క అదానీని మాత్రమే ఎందుకు అన్ని పారిశ్రామిక సంస్థలను అదే విధంగా చేయవచ్చు కదా ? చైనా గనుక హిండెన్‌బర్గ్‌కు నిధులు ఇస్తే మన జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌ను పంపి బయట పెట్టించవచ్చు. ఎవరన్నా అడ్డుపడ్డారా ? కాసేపు నిజంగానే చైనా నిధులు ఇచ్చి ఆపని చేసిందని అనుకుందాం. పార్లమెంటును కుదిపివేస్తున్న ఈ ఉదంతం మీద మాట్లాడి దాని బండారాన్ని వెల్లడించవచ్చు.ఇదేమీ దేశ రహస్యం కాదు. ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? ఆడలేక మద్దెల ఓడంటే కుదరదు.


హిండెన్‌బర్గ్‌ నివేదికను ఆసరా చేసుకొని చైనా మీద ప్రచారదాడి మొదలు పెట్టటం వెనుక అసలు అంశాన్ని పక్కదారి పట్టించి అదానీ కంపెనీలను రక్షించే ఎత్తుగడ ఉంది.హిండెన్‌బర్గ్‌ తన నివేదికలో అదానీకి చాంగ్‌ చుంగ్‌ లింగ్‌ అనే చైనా జాతీయుడికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించింది. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ఇంటి చిరునామానే తనదిగా చాంగ్‌ ఇచ్చాడని, అతనితో ఉన్న సంబంధం గురించి చెప్పాలని నిగ్గదీసింది. ప్రపంచంలో ఉన్న చైనా జాతీయులందరూ చైనా పౌరులు కానట్లే ఇతగాడూ కాదు. తైవాన్‌కు చెందిన వాడు. (ఎగువున చాంగ్‌ – అదానీ కలసి ఉన్న చిత్రం కూడా తైవాన్‌ మీడియా ప్రచురించినదే.) హిండెన్‌బర్గ్‌ 129 పేజీల నివేదికలో లేవనెత్తిన ప్రశ్నలకు గాను అదానీ ఇచ్చిన 413 పేజీల వివరణలో కీలకమైన వాటిని విస్మరించారు. చాంగ్‌ గురించి హిండెన్‌బర్గ్‌ నివేదికలో నాలుగు చోట్ల ప్రస్తావన ఉంది. ఒక్కదానికీ అదానీ సమాధానం ఇవ్వలేదు. నిజానికి ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోతే అంతా ఉత్తిదే అని ఒక ట్వీట్‌ చేసి ఊరుకునేదానికి అంత వివరణ ఎందుకు ఇవ్వాలి.


హిండెన్‌బర్గ్‌ నివేదికలో ” గుడామీ ఇంటర్నేషనల్‌ ” అనే సంస్థ గురించి పేర్కొన్నారు.దానిలో చాంగ్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. అది తమకు సంబంధించినదే అని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2002 కంపెనీ వివరాల్లో పేర్కొన్నది. ఈ గుడామీ ఇంటర్నేషనల్‌ 2018 వార్తల్లో ఉంది. కాంగ్రెస్‌ నేతలు, మిలిటరీ అధికారులు ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలు వచ్చిన అగస్టా వెస్ట్‌ లాండ్‌ హెలికాప్టర్‌ కుంభకోణంలో అనుమానిత మూడు సింగపూర్‌ సంస్థలలో ఇదొకటి. మాంటెరోసా ఇన్వెస్ట్‌మెంట్‌ హౌల్డింగ్స్‌ అనే సంస్థ అదానీ కంపెనీల్లో 450 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది.ఈ కంపెనీలో గుడామీ పెట్టుబడులు పెట్టింది.చాంగ్‌ అనేక అదానీ కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నట్లు హిండెన్‌బర్గ్‌ పేర్కొంటే మన దేశానికి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజన్స్‌(డిఆర్‌ఐ) ఇచ్చిన ఒక తీర్పు ఉత్తరువులో, సంస్థ రికార్డుల్లో గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ ఇంటి చిరునామానే తన అడ్రస్‌గా చాంగ్‌ ఇచ్చినట్లు ఉంది.


ఇదిగాక హిండెన్‌బర్గ్‌ మరొక ఉదంతాన్ని పేర్కొన్నది. గ్రోమోర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే కంపెనీ 2011లో 42.3 కోట్ల డాలర్ల లాభంతో అదానీ పవర్‌లో విలీనమైంది.దీనికీ చుంగ్‌కు సంబంధం ఉంది.భారత చట్టాల ప్రకారమే దాన్ని విలీనం చేసుకున్నాం తప్ప అక్రమాలేమీ జరగలేదని అదానీ తన సమాధానంలో పేర్కొన్నది.హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన 88ప్రశ్నల్లో మూడు పిఎంసి ప్రాజెక్ట్స్‌ అనే సంస్థకు చెందినవి. దీనికి అదానీ కంపెనీలు చెల్లింపులు జరిపినట్లు డిఆర్‌ఐ నివేదికలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఈ కంపెనీ అదానీ బినామీనా కాదా చెప్పాలని కోరింది. ఇది చాంగ్‌ చుంగ్‌ లింగ్‌ కుమారుడిదని, తైవాన్‌లో అదానీ కంపెనీ ప్రతినిధి అని పేర్కొంటూ వారంతా కలసి ఉన్న చిత్రాన్ని కూడా జత చేసి వారి సంబంధాలపై అనుమానాలున్నట్లు పేర్కొన్నది. పిఎంసితో తమకెలాంటి సంబంధాలు లేవని అదానీ తన వివరణలో పేర్కొన్నారు. తాము అడిగిన దానికి సూటిగా చెప్పకుండా కలగాపులగం చేసి చెప్పారని హిండెన్‌బర్గ్‌ పేర్కొన్నది.


ప్రస్తుత ప్రపంచ రాజకీయ చదరంగంలో అమెరికాకు మన అవసరం ఉంది తప్ప మనకు దాని అవసరం లేదని, మన ప్రధాని మోడీ చక్రం తిప్పుతున్నట్లు ఒకవైపు ప్రచారం. అమెరికా మనకు జిగినీ దోస్తుగా ఉంది, మన ప్రధాని మోడీ దాని అధ్యక్షులతో భుజాల మీద చేతులు వేసి తిరిగే చనువు ఉంది. నిజంగా దానికి మన అవసరం ఉంటే హిండెన్‌బర్గ్‌ గురించి ఇంతవరకు జో బైడెన్‌ నోరువిప్పడేం. మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరవుతుంటే నరేంద్రమోడీ ఫోన్‌ చేసి మాట్లాడరేం ! హిండెన్‌బర్గ్‌ వెనుక చైనా ఉందని మన వాట్సాప్‌ మరుగుజ్జులకు తెలిసిన పరమ రహస్యం మోడీ సర్కార్‌కు తెలియని దుస్థితిలో ఉందా ? తెలిస్తే హెచ్చరిక ఎందుకు చేయరు ? దేశం, మదుపర్ల కంటే మౌనమే ప్రధానమా ? ఇంతటి సంచలనం చెలరేగితే ఏ దేశాధినేతైనా మౌనంగా ఉంటారా ? జనాలకు భరోసా ఇవ్వాల్సిన రాజధర్మం తెలియదా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలేమిటి అని ఆలోచించకుండా వాట్సాప్‌, ఫేస్‌బుక్కులో మోడీ, అదానీ, తదితరుల గురించి ప్రచారం చేసే అతియోక్తుల మీద స్వంత బుర్రలను ఉపయోగించకుండా వాటిని ఇతరులకు పంచే, ప్రచారం చేసే, సమర్దించే పెద్దమనుషులను గిరిశం చెప్పినట్లుగా వర్ణిస్తే తప్పా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !

04 Saturday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, Filims, Health, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Prices, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP, Budget-2023-24, Farmers, Fertilizers subsidies, Food Subsidy, india debt, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసింది. మేం చెప్పాల్సింది చెప్పాం ఇక మీ ఇష్టం అని మంత్రి నిర్మలా సీతారామన్‌ సెలవిచ్చారు. రెండవ సారి తిరుగులేని మెజారిటీతో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ 2.0కు ఇది చివరి బడ్జెట్‌. మూడో సారి 2024లో తిరిగి వస్తారా, ఇంతటితో సరిపెట్టుకుంటారా అన్నది తరువాత చూద్దాం. వివిధ రాష్ట్రాలలో ఈ ఏడాది, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు గనుక ఇప్పటి వరకు మోడీ సర్కార్‌ సాధించిన ఘనత, తాజా బడ్జెట్‌ గురించి బిజెపి శ్రేణులు ప్రచారం చేసేందుకు జనం ముందుకు రానున్నారు. ఈ తీరు తెన్నులన్నింటినీ ఒక్క విశ్లేషణలో వివరించలేం గనుక కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం.


” మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రు.169లక్షల 46వేల 666 కోట్లు. ఈ ఏడాది కొత్తగా చేస్తున్న అప్పులు రు.16 లక్షల 85వేల కోట్లు. కడుతున్న వడ్డీలు రు.10లక్షల 79వేల కోట్లు.1947 నుంచి 2014వరకు 67 ఏండ్లలో 14 మంది ప్రధానులు చేసిన అప్పు 56లక్షల కోట్లు. ఎనిమిదేండ్లలో మోడీ చేసిన అప్పు 114లక్షల కోట్లు. దీనికి గబ్బర్‌సింగ్‌ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది ? ” అంటూ ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. ఈ వివరాలు మింగుడుపడని మోడీ వీర భక్తులు నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. స్వల్ప సవరణలతో అవి తిరుగులేని వివరాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో చెప్పిన అంశాలే అని గమనించాలి. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లుగా ఉంటుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.


అచ్చేదిన్‌, తనకు అధికారం ఇస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన నాటికి ఉన్న అప్పు 56లక్షల కోట్లు కాదు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు పెంచారు. దాని ప్రకారం ఇప్పటి వరకు మోడీ ఒక్కరే చేసిన అప్పు రు.101,92,887 కోట్లను 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. అందువలన ఇంత అప్పుచేసి సాధించిన ప్రగతి ఏమిటి అని అడగటం తప్పంటారా ? కానేకాదు. కాంగ్రెస్‌ పాలకులు 50 ఏండ్లలో సాధించలేని దానిని తాను తొలి ఐదు సంవత్సరాల్లోనే సాధించానని చెప్పుకున్న నరేంద్రమోడీ ఎలాగూ దీని గురించి నోరు విప్పరు.


గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తి తగ్గినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుదల వలన రోజు రోజుకూ మానవ శ్రమ పని దినాలు తగ్గుతున్నాయి.వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది వలసలే అందుకు పక్కా నిదర్శనం.కనీసం వంద రోజులు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి పధకానికి 2021-22లో రు.98,468 కోట్లు ఖర్చు చేస్తే 2022-23లో 89,400 కోట్లకు దాన్ని 2023-24లో రు.60వేల కోట్లకు(32.9శాతం) తగ్గించారు. అంటే గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా పని పెరిగింది అనుకోవాలి. ఈ పధకం కింద ఏడాదికి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలని నిర్దేశించారు. గతేడాది సగటున 40 రోజులకు మించలేదు. అందువలన కనీసం లక్షా 40 నుంచి రెండు లక్షల 20వేల కోట్లకు బడ్జెట్‌ను పెంచాలని అనేక మంది డిమాండ్‌ చేశారు. ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళనతో దిగి వచ్చి క్షమాపణ చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటూ కనీస మద్దతు ధరకు హామీ కల్పించాలన్న డిమాండ్‌ను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని నరేంద్రమోడీ చెప్పారు. అది ఏమైందో మోడీకే ఎరుక. క్షమాపణ చెప్పే స్థితికి రైతులు తనను నెట్టారన్న కోపమో, పగసాధింపో మరొకటో తెలియదు గానీ 2022-23లో ఎరువులకు ఖర్చు చేసిన రు.2,27,681 కోట్లను రు.1,78,482 కోట్లకు(21.6శాతం) తగ్గించారు.


అదే విధంగా ఆహార సబ్సిడీ రు.2,87,194 నుంచి రు.1,97,350 కోట్లకు(31.3) శాతం కోత పెట్టారు. మొత్తంగా సబ్సిడీలను రు. 5,62,080 నుంచి 4,03,084 కోట్లకు(28.3) శాతం కోత పెట్టారు. వ్యవసాయం-రైతు సంక్షేమ పద్దు కింద 2021-22లో రు.1,22,836 కోట్లు ఖర్చు చేశారు.దాన్ని 2022-23 బడ్జెట్‌లో రు.1,32,14 కోట్లకు పెంచినట్లు గొప్పలు చెప్పారు. ఆచరణలో రు.1,18,913 కోట్లకు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో దాన్ని రు.1,25,036 కోట్లకు పెంచామని చంకలు కొట్టుకుంటున్నారు. దేశంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో చేరి అప్పుల పాలై తిప్పలు తెచ్చుకున్న కుటుంబాలు మనకు ప్రతి చోటా కనిపిస్తాయి. అలాంటి స్థితిలో కేటాయించిన మొత్తాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవటాన్ని ఏమనాలి ? 2022-23లో విద్యా రంగానికి రు.1,04,278 కోట్లు కేటాయించి రు.99,881 కోట్లు ఖర్చు చూపారు, వర్తమాన బడ్జెట్‌లో రు.1,12,899 కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిపాదిస్తే నమ్మేదెలా ? ఇదే పరిస్థితి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉంది. గతేడాది రు.86,201 కోట్లని చెప్పి రు.79,145 కోట్లకు కోత పెట్టారు, ఇప్పుడు 89,155 కోట్లు ఖర్చు పెడతామని మనల్ని నమ్మించేందుకు చూస్తున్నారు.


పైన చెప్పుకున్నట్లుగా ఈ ఏడాది కొత్తగా తీసుకోనున్న 16.85లక్షల కోట్ల అప్పును రైతులు, గ్రామీణ కార్మికులు, జనం కోసం గాక ఎవరికోసం ఖర్చు చేయనున్నట్లు ? పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తితో ముడిపెట్టి బోనస్‌ ఇస్తామని చెబుతున్నవారు పంట పండించే రైతులను ఎందుకు విస్మరిస్తున్నట్లు ? ఏమిటీ వివక్ష – ఎందుకీ కక్ష ? పఠాన్‌ సినిమాలో హీరోయిన్‌ ధరించిన బికినీ కాషాయ రంగులో ఉన్నందున హిందూ మతానికి ముప్పు వచ్చిందని, సినిమా హాళ్లు తగులబెడతామని నానా రచ్చ చేసిన వారే ఇప్పుడు అదానీ దేశభక్తి గురించి అతని కంపెనీల మీద మన శత్రువులు దాడి చేస్తున్నట్లు గుండెలు బాదుకుంటున్నారు. ఆ పెద్ద మనుషులకు కోట్లాది మంది గ్రామీణులున్న రంగాలు, సబ్సిడీల తగ్గింపు ఎందుకు పట్టలేదు, ఒక్కరు కూడా ఎందుకు నోరు విప్పలేదు, ఏ టీవీ ఛానల్‌ కూడా వీటి మీద ప్రత్యేక చర్చలు ఎందుకు పెట్టలేదు. జనం ఆలోచించాలి, దేవదూతగా భావిస్తున్న మోడీ నోట సినిమాల గురించి అనవసరంగా మాట్లాడవద్దని నేరుగా వెలువడింది, హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదంలో అదానీ కంపెనీల గురించి గాక బడ్జెట్‌ గురించి జనంలో మాట్లాడండని బిజెపి అధిష్టానం నేతలను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కనుక మోడీ భక్తులు గతంలో ఉద్రేకంలో ఏ మాట్లాడినా ఇప్పుడు దాన్ని తగ్గించుకొని పునరాలోచించాలి. ఎవరూ మాట మార్చినట్లు అనుకోరు.


ఇటీవలనే ఆక్స్‌ఫామ్‌ సంస్థ కొంత మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదలు, ఏటేటా పెరుగుతున్న శత కోటీశ్వరుల గురించి చెప్పింది. కొత్తగా వస్తున్న పరిశ్రమలు, నరేంద్రమోడీ తన పలుకుబడితో తెచ్చిన విదేశీ పెట్టుబడులు, కార్మికుల పిఎఫ్‌ ఖాతాల పెరుగుదల అంకెలను చూడండని ఊదరగొట్టిన అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.పరిశ్రమలు పెరిగితే, వాటి నుంచి ఖజానాకు తగినంత పన్ను రావటం లేదు, పోనీ ప్రయివేటు కంపెనీలు తాము పొందిన రాయితీలను తిరిగి పెట్టుబడులు పెట్టిన దేశభక్తికి నిదర్శనంగా ఉపాధి పెరగక పోగా నిరుద్యోగ రేటు ఎందుకు పెరుగుతున్నట్లు ? నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రంగాల నుంచి వస్తున్న పన్నులు, మోడీ ఏలుబడిలో వస్తున్న పన్నుల వసూలు తేడాల గురించి చూద్దాం. అంకెలను కోట్ల రూపాయలుగా గమనించాలి.
వనరు×××× 2014-15 ××× 2022-23××× 2023-24అంచనా
కార్పొరేట్‌×× 4,28,925 ××× 8,35,000 ××× 9,22,675
ఆదాయ ×× 2,65,733 ××× 8,15,000 ××× 9,00,575
కస్టమ్స్‌ ×× 1,88,016 ××× 2,10,000 ××× 2,33,100
ఎక్సైజ్‌ ×× 1,89,953 ××× 3,20,000 ××× 3,39,000
జిఎస్‌టి ×× 1,67,969 ××× 8,54,000 ××× 9,56,600
మొత్తంపన్ను××13,64,524×× 30,43,067×× 33,60,858
రాష్ట్రాలకు ×× 3,82,216××× 9,48,405 ×× 10,21,448
ఎగువ అంకెల్లో గమనించాల్సిన అంశాలు 2014-15లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు దక్కిన వాటా 28శాతం కాగా 2020-21లో అది 33.16 శాతం, 2022-23లో31.16శాతం, 2023-24లో 30.3 శాతంగా ఉండనుంది.గత ప్రభుత్వం రాష్ట్రాలకు 32శాతం ఇస్తే తాము 41శాతం ఇచ్చినట్లు బిజెపి చెప్పుకుంది. మరి ఈ అంకెల మతలబు ఏమిటి ? ఈ అంకెలను ఎవరైనా కాదనగలరా ? కార్పొరేట్‌ పన్ను క్రమంగా తగ్గిస్తున్న కారణంగానే గత తొమ్మిది సంవత్సరాల్లో రెండు రెట్లు పెరగ్గా జనాన్ని బాదుతున్న జిఎస్‌టి మాత్రం ఐదు రెట్లు పెరిగింది. ఈ కారణంగానే కార్పొరేట్ల సంపదల పెరుగుదల జన సంపదల తరుగుదల.


కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు బదలాయిస్తున్న తీరు తెన్నులు ఎలా ఉన్నదీ చూద్దాం. దీనిలో రాష్ట్రాలకు కేటాయిస్తున్నది పోను మిగిలిందంతా కేంద్రం వద్దనే ఉంటుంది.
వనరు ××× ఏడాది×××× కేంద్రం ×××× రాష్ట్రాలకు ఇస్తున్నది, శాతం
కార్పొరేట్‌×× 2014-15 ×× 4,28,925 ××× 1,18,235 (27.56)
కార్పొరేట్‌×× 2020-21 ×× 5,57,719 ××× 1,79,716 (32.22)
ఆదాయ ×× 2014-15 ×× 2,65,733 ××× 84.431(31.77)
ఆదాయ ×× 2020-21 ×× 4,70,719 ××× 184.271(39.14)
కస్టమ్స్‌ ×× 2014-15 ×× 1,88,016 ××× 54,759 (29.1)
కస్టమ్స్‌ ×× 2020-21 ×× 1,34,750××× 31,529 (23.39)
ఎక్సైజ్‌ ××2014-15 ×× 1,89,953 ××× 30,920 (16.3)
ఎక్సైజ్‌ ××2020-21 ×× 3,89,667 ××× 19,793 (5.07)
జిఎస్‌టి ××2014-15 ×× 1,67,969 ××× 49,142 (29.25)
జిఎస్‌టి ××2020-21 ×× 5,48,778 ××× 1,76,451 (32.15)
ఎగువ అంకెలను చూసినపుడు మోడీ పాలన తొలి సంవత్సరం ఎక్సైజ్‌ మొత్తంలో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తానికి, ఏడు సంవత్సరాల తరువాత మొత్తానికి చాలా తేడా ఉన్నది. కారణం ఏమంటే పెట్రోలు, డీజిలు, ఇతర పెట్రో ఉత్పత్తుల మీద ఎక్సైజ్‌ పన్ను తగ్గించి, సెస్‌లను భారీ మొత్తంలో పెంచారు. సెస్‌లో రాష్ట్రాలకు వాటా ఉండదు కనుక కేంద్రానికి అది కామధేనువుగా మారింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే రోడ్డు సెస్‌ వసూలు చేస్తారు, అదే రోడ్లకు టోల్‌ టాక్సు వసూలు చేస్తారు, వ్యవసాయ సెస్‌ వేస్తారు ఆ రంగానికి కేటాయింపులు తగ్గిస్తారు, స్వచ్చభారత్‌ సెస్‌ వేస్తారు, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా చెత్త పన్ను జనం నుంచి వసూలు చేస్తారు. ఈ తీరు తెన్నుల గురించి ఆలోచించాలా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d