• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Health

కరోనా వైరస్‌ : కాసుల లాభనష్టాల బేరీజులో కార్పొరేట్‌ లోకం !

09 Sunday Feb 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak, Novel Coronavirus, Wuhan

Image result for coronavirus corporates making profit and loss impact assessment

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు చైనా తన సర్వశక్తులను వడ్డుతోంది.కరోనా లేదా మరొక వైరస్‌ దేనికీ జాతి, మతం, రంగు, ప్రాంతం, ఖండం అనే విచక్షణ ఉండదు, సరిహద్దులను అసలే ఖాతరు చేయదని గతంలో వ్యాప్తి చెందిన అనేక వైరస్‌లు నిరూపించాయి. అందువలన అలాంటి వాటిని నిరోధించేందుకు యావత్‌ దేశాలు కృషి చేయాల్సి వుంది. కానీ అమెరికా వంటి కొన్ని రాజ్యాలు సహకరించకపోగా తప్పుడు ప్రచారాన్ని వ్యాపింప చేస్తున్నాయి. మరోవైపు వైరస్‌ వ్యాప్తివలన చైనా, ప్రపంచానికి కలిగే ఆర్ధిక నష్టం గురించి లెక్కలు వేసుకుంటున్నాయి. వాటి గురించి కూడా అతిశయోక్తులు, అర్ధ సత్యాలను వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరు ప్రబుద్దులు చైనా కమ్యూనిస్టు పార్టీ, అక్కడి సోషలిస్టు వ్యవస్ధ మీద ఉన్న కసిని కరోనా పేరుతో తీర్చుకొని మానసిక సంతృప్తిని పొందుతున్నారు. ఒకవైపు వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు దాన్నుంచి లాభాలను ఎలా పిండుకోవాలా అని ఔషధ దిగ్గజ సంస్ధలు చూస్తున్నాయి.
ఆర్ధిక నష్టం గురించి ఎవరూ ఇదమిద్దంగా అంచనా వేయలేదు. వైరస్‌ ప్రభావం ఎంతకాలం ఉంటుంది, దాని తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా ఇప్పటికిప్పుడే చెప్పలేరు. కరోనాతో నిమిత్తం లేకుండానే సోవియట్‌ యూనియన్‌ మాదిరి చైనా సోషలిస్టు వ్యవస్ధ కూడా కుప్పకూలిపోతుందని అనేక మంది కలలు కన్నారు, ఆకాంక్షించారు. ముహార్తాలు కూడా పెట్టారు. అవి నిజం గాకపోవటంతో నీరసపడిపోయారు. ఇప్పుడు కరోనా కూడా అలాంటి వారిని నీరసపరచటం ఖాయం.
ప్రపంచ కార్పొరేట్ల పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ‘ ఆసియా నిజమైన వ్యాధిగ్రస్ధ చైనా ‘ శీర్షికతో వాల్టర్‌ రసెల్‌ మీడ్‌ అనే ఒక కాలేజీ ప్రొఫెసర్‌ తనలో ఉన్న విద్వేషాన్ని వెళ్లగక్కాడు. చైనీయులు మురికి, రోగిష్టి మనుషులనే గత కాలపు పశ్చిమ దేశాల దురహంకారం ఇంకా కొనసాగుతోందనేందుకు ఇది ఒక సూచిక. దీని మీద తీవ్రమైన ఆగ్రహం వెల్లడైంది, చైనా అధికారికంగా నిరసన కూడా తెలిపింది. వాటి మీద వ్యాఖ్యానించేందుకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నిరాకరించింది. శ్వేతజాతీయులకు వచ్చే రోగాల కంటే చైనీయులు, ఇతర ఆసియావాసులకు వచ్చే జబ్బులు ప్రమాదకరమైన వంటూ పందొమ్మిదవ శతాబ్దంలోనే పశ్చిమ దేశాల వారు జాత్యంహకారం వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కరోనాను కూడా చైనా జాతికి అంటకట్టే ప్రయత్నం జరుగుతోంది.
చైనా నిపుణుల అంచనా ప్రకారం ఫిబ్రవరి 15వరకు వైరస్‌ వ్యాప్తి చెందవచ్చు, తరువాత తగ్గుముఖం పడుతుంది. మేనెల మధ్యనాటికి పూర్తిగా అదుపులోకి వస్తుంది.ఈ లోగా చైనా ఆర్ధిక వ్యవస్ధకు జరిగే పరిమిత హాని తరువాత కాలంలో పూడ్చుకోవచ్చు. ఎంత ప్రభావం పడినా చైనా జిడిపి 5.6-5.8శాతం మధ్య వుండవచ్చని అంచనా వేస్తున్నారు.

Image result for coronavirus, corporates cartoons
కరోనా వైరస్‌ ప్రస్తుతం సోకిన ప్రాంత విస్తీర్ణం ఎంత? ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 70శాతం ఉహాన్‌ నగరం ఉన్న హుబెరు రాష్ట్రంలోనే ఉన్నాయి. మరణించిన వారిలో 97శాతం మంది ఈ రాష్ట్రానికి చెందిన వారే. తరువాత తూర్పు రాష్ట్రమైన ఝియాంగ్‌లో వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. వలస వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉండే బీజింగ్‌, షాంఘై నగరాలలో ఒక్కొక్కరు మాత్రమే మరణించారు. చైనా జిడిపి తొలి మూడు నెలల్లో 5.2శాతం ఉంటుందని, తరువాత ఏడాది మొత్తం 5.8శాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కనిష్టంగా తొలి త్రైమాసికంలో 4.8శాతం, మొత్తం ఏడాదిలో 5.5శాతం ఉంటుందని మరొక అంచనా.చైనాలో అందరూ చెబుతున్నంత అభివృద్ధి లేదని, అంకెల గారడీ చేస్తారని చెప్పే నోళ్లు దీని గురించి ఏమంటాయో తెలియదు.
ఉహాన్‌ పరిసర ప్రాంతాలలో ఆటో, టెలికమ్యూనికేషన్స్‌,ఎలక్ట్రానిక్స్‌, బయోమెడిసిన్‌ సంబంధమైనవి పెద్ద పరిశ్రమలు.హుబెరు రాష్ట్రం, ఉహాన్‌ నగర ప్రాధాన్యత ఏమంటే దేశం మధ్యలో ఉండటంతో రవాణా, వాణిజ్యం, పెట్టుబడులు, టూరిజం వంటి సేవారంగం కీలకమైన అంశాలు. ఒకసారి వ్యాధి వ్యాప్తి అదుపులోకి వచ్చిన తరువాత అవన్నీ సాధారణ స్ధితికి చేరుకుంటాయి.
2003లో సారస్‌ వ్యాప్తి సమయంలో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా కేవలం ఐదుశాతమే, ఇప్పుడు 16శాతానికి పెరిగినందున ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఇటీవలి సంవత్సరాలలో చైనాలో వచ్చిన ప్రధాన మార్పుల్లో స్ధానిక వినియోగం పెరగటం ఒకటి. అందువలన మార్కెట్‌ చోదిత పెట్టుబడులు వెనక్కు పోవటం సాధ్యం కాదన్నది ఒక అభిప్రాయం. చైనాలో కార్మికుల వేతనాలు పెరగటం తదితర ఉత్పాదక ఖర్చుల పెరుగుదల కారణంగా లాభాలు తగ్గి ప్రస్తుతం విదేశీ పెట్టుబడులలో 70శాతం ఉత్పాదక రంగం నుంచి సేవారంగానికి మరలాయి. వ్యాధి తగ్గుముఖం పట్టిన తరువాత సేవారంగం తిరిగి పుంజుకుంటుంది. అందువలన తాము ఎలాంటి ఆందోళనకు గురికావటం లేదని చైనీయులు చెబుతున్నారు. ఇప్పటికే గట్టిగా తట్టుకొని నిలిచిన తమ సమాజాన్ని వ్యాధి గ్రస్త దేశమని నోరు పారవేసుకుంటున్నవారు త్వరలో వైరస్‌ను ఎలా ఓడిస్తామో కూడా చూస్తారనే విశ్వాసాన్ని వెల్లడిస్తున్నారు.
చైనా వ్యాధి నిరోధకానికి ప్రాధాన్యత ఇస్తున్నది. గతంలో స్పానిష్‌ ఫ్లూ వంటి ప్రమాదకర వైరస్‌ వ్యాప్తి సమయంలో అమెరికాతో సహా ఏ దేశంలోనూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. హుబెరు రాష్ట్రం, పరిసర ప్రాంతాలలో దాదాపు పది కోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసి వ్యాధి వ్యాపించకుండా చూస్తున్నది. వారికి అవసరమైన ఇతర సాయం చేస్తున్నది. ఇంత పెద్ద సంఖ్యలో జనం ఇండ్లకే పరిమితం అయితే అది ఆర్దిక వ్యవస్ధ మీద, ప్రభుత్వ ఖజానా మీద ప్రభావం చూపకుండా ఎలా ఉంటుంది. చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా, విడివస్తువులను అందచేసే గొలుసులో ఒక ప్రధాన లంకెగా ఉన్నందున ఆ గొలుసులో ఉన్న ఇతర దేశాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం కాకుండా ఎలా ఉంటాయి. కనుకనే కార్ల నుంచి వీడియో గేమ్‌ల వరకు ప్రపంచ సరఫరా గొలుసుకు అంతరాయం కలిగితే తీవ్ర నష్టం జరగనుందని అనేక దేశాలు భయపడుతున్నాయి. అయితే జరిగే నష్టం, పడే ప్రభావం ఎంత ఉంటుందో ఎవరూ ఇదమిద్దంగా చెప్పలేకపోతున్నారు. లండన్‌ కేంద్రంగా పని చేసే కాపిటల్‌ ఎకనమిక్స్‌ అనే సంస్ధ ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు 280బిలియన్‌ డాలర్ల మేర నష్టం కలిగించవచ్చని అంచనా వేసింది.
షాంఘై, హాంకాంగ్‌లోని వినోద కేంద్రాలను గత వారం రోజులుగా మూసివేసిన కారణంగా రెండవ త్రైమాసికంలో తమ ఆదాయం 17.5కోట్ల డాలర్లు తగ్గిపోవచ్చని డిస్నీ ఆర్ధిక అధికారి చెప్పారు.చైనా నూతన సంవత్సరాది సందర్భంగా విడుదల చేయదలచిన ఐదు చిత్రాలను నిలిపివేసినట్లు కెనడా కంపెనీ ఐమాక్స్‌ పేర్కొన్నది. చైనాలోని మకావో దీవిలో 41కాసినోలను మూసివేశారు. వీటిలో ఎక్కువ భాగం అమెరికా జూదశాలలే. ప్రతి రోజూ తమకు 24 నుంచి 26 మిలియన్‌ డాలర్ల మేరకు నష్టమని వయన్‌ రిసార్ట్స్‌ తెలిపింది.
ఆపిల్‌,క్వాల్‌కామ్‌ కంపెనీలు తమ నష్టాలను అంచనా వేస్తున్నాయి. హుండరు వంటి కార్ల కంపెనీలు చైనా నుంచి విడిభాగాలు ఆలస్యమయ్యే కారణంగా దక్షిణ కొరియాలో ఉత్పత్తి కేంద్రాలను తాత్కాలిక మూసివేస్తున్నట్లు తెలపింది. చైనాలో పరిస్ధితులు మెరుగుపడుతున్నట్లు చైనా ప్రభుత్వం చెప్పగానే వారం రోజులు తిరిగి ఉత్పత్తిని ప్రారంభిస్తామని డైల్మర్‌, ఓక్స్‌వాగన్‌ ప్రకటించాయి. విడిభాగాల సరఫరా అంతరాయం కారణంగా ఐరోపాలోని తమ ఉత్పత్తి కేంద్రాలకు అంతరాయం ఉంటుందని ఫియట్‌ ఛిస్లర్‌ పేర్కొన్నది.
గత కొద్ది వారాలుగా అనేక విమాన సంస్ధలు చైనా సర్వీసులను రద్దు చేశాయి, వాటి నష్టాలను అంచనా వేస్తున్నారు. ఎయిర్‌ చైనా ఎక్కువగా ఆదాయాన్ని కోల్పోనుంది.స్టార్‌బక్స్‌ మెక్‌డోనాల్డ్‌ వంటి సంస్ధలు అనేక దుకాణాలను తాత్కాలికంగా మూసివేశాయి, మొత్తంగా చూస్తే తమ లాభాల మీద ప్రభావం పెద్దగా పడదని అంటున్నాయి.
వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాలలో కార్మికుల కొరత కారణంగా వేతనాలు పెద్ద ఎత్తున పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నూతన సంవత్సరాది సెలవులు, ఇదే సమయంలో వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా ఇండ్లకు పరిమితమై విధుల్లోకి రాని కార్మికులకు పొడిగించిన సెలవు రోజులకు సైతం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా నుంచి పర్యాటకులను అనుమతించరాదని థారులాండ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన విహారయాత్రల రంగానికి 10కోట్ల డాలర్ల మేర నష్టమని అంచనా వేశారు.
వైరస్‌ వార్తలు వెలువడిన తరువాత న్యూయార్క్‌, లండన్‌లోని చమురు మార్కెట్‌లో ధరలు 15శాతం పడిపోయాయి. చమురు ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలున్న రష్యా, మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా, గల్ఫ్‌ , ఇతర దేశాలకు, చివరికి అమెరికాలోని షేల్‌ చమురు కంపెనీలకు కూడా ఆ మేరకు నష్టం ఉండవచ్చు. ఇదే సమయంలో దిగుమతులపై ఆధారపడిన చైనాకు దిగుమతి బిల్లుతో పాటు అంతర్గతంగా చమురు డిమాండ్‌ తగ్గిపోయి అక్కడి ఆర్ధిక వ్యవస్ధకు ఆమేరకు లబ్ది కూడా చేకూరనుంది.
అమెరికా-చైనా మధ్య కుదిరిన సర్దుబాటు అవగాహన మేరకు అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ పెరిగే అవకాశాలకు ఇప్పుడు పరిమితంగా అయినా గండి పడింది. వైరస్‌ కారణంగా చైనాలో పరిశ్రమలు మూతపడితే ఆ మేరకు తమకు ఉపాధి, ఇతరత్రా మేలు జరుగుతుందని అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విల్బర్‌ రోస్‌ సంతోషం వ్యక్తం చేశారు, అయితే మొత్తంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధకూ ప్రతికూలమే అని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. చైనా యువాన్‌ విలువ పడిపోతే అది అమెరికాకు దెబ్బ.

Image result for coronavirus political cartoons
చైనాతో పెద్దవ్యాపార భాగస్వామిగా ఉన్న మనదేశం మీద పడే ప్రభావం గురించి కూడా కార్పొరేట్‌ సంస్ధలు మదింపు వేస్తున్నాయి. మన దేశం గతేడాది మొత్తం దిగుమతుల్లో 14శాతం చైనా నుంచి తీసుకోగా ఎగుమతుల్లో మన వస్తువులు ఐదుశాతం చైనా వెళ్లాయి. ఆకస్మిక పరిణామంగా వైరస్‌ వ్యాప్తి వలన వెంటనే దిగుమతుల ప్రత్నామ్నాయం చూసుకోవటం అంత తేలిక కాదు, అదే సమయంలో పరిమితమే అయినా అసలే ఇబ్బందుల్లో ఉన్న మన ఆర్ధిక పరిస్దితి మీద ఎగుమతులు తగ్గితే ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్స్‌మీద ప్రభావం ఎక్కువ. చైనా నుంచి పర్యాటకులు ఇటీవలి కాలంలో బాగా పెరిగినందున ఆ రంగం మీద ప్రభావం తీవ్రంగా పడవచ్చు, విమానరంగం కూడా ప్రభావం కానుంది. చైనాలో వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో సినిమా ధియేటర్లను మూసివేసినందున బాలీవుడ్‌ కూడా ఏంతో కొంత నష్టపోనుంది. అసలే కార్లు, ఇతర మోటారు వాహనాల అమ్మకాలు తగ్గాయి, ఇప్పుడు చైనా నుంచి విడిభాగాలు నిలిచిపోతే నష్టం ఇంకా పెరుగుతుందనే అందోళన ఉంది.
కరోనా వైరస్‌ గురించి ఒకవైపు అతిశయోక్తులు, చైనా వ్యతిరేకతను ప్రచారం చేస్తున్న పశ్చిమ దేశాలు మరోవైపు దాన్నుంచి లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నాయి. వ్యాధుల నివారణ, చికిత్సకు వాక్సిన్‌లు, ఔషధాల తయారీ అవసరమే అయితే అయితే చరిత్రను చూసినపుడు జన కల్యాణం కోసం గాక కాసుల కోసమే కార్పొరేట్‌ కంపెనీలు ప్రయత్నించాయి. కరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీకి కొన్ని సంవత్సరాలు పడుతుందని, అందుకోసం వంద కోట్ల డాలర్లు ఖర్చవుతుందని పోలాండ్‌ నిపుణుడు ఒకరు చెప్పగా మరొక అంచనా 150 కోట్ల డాలర్ల వరకు ఉంది. అది ఎంతో ఖరీదైనదిగా ఉన్నప్పటికీ, తక్షణమే అది ఉపయోగంలోకి రాకపోయినా భవిష్యత్‌లో నష్టాల నివారణకు తోడ్పడుతుంది. అయితే ఇలాంటి వైరస్‌ల నిరోధానికి వాక్సిన్‌ల తయారీ యత్నాలు గతంలో పెద్దగా ముందుకు సాగలేదు. 2003లో వచ్చిన సారస్‌, 2012లో తలెత్తిన మెర్స్‌కే ఇంతవరకు తయారు కాలేదు. ఎబోలా వాక్సిన్‌ పరిస్దితీ అంతే. గతేడాది ఆమోదం పొందిన వాక్సిన్‌ మీద ప్రయోగాలు చేసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌లో కొత్త దనం ఏమిటి !

14 Sunday Jul 2019

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, Farmers, Health, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Andhra Pradesh Budget 2019-20, Y S Jagan Govt 1st Budget

Image result for What is new in YS Jagan first Budget

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ తన తొలి బడ్జెట్‌లో ఎన్నో విన్యాసాలు ప్రదర్శించారు. పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు, ఓట్ల యాత్రల సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వాగ్దానాలు, విసిరిన వాగ్బాణాలకు అనుగుణ్యంగానే ఈ బడ్జెట్‌ను రూపొందించారు. అధికారానికి వచ్చిన రెండో నెల్లోనే బడ్జెట్‌ పెట్టాల్సి రావటం కసరత్తు చేసేందుకు తగిన సమయం లేదని చెప్పుకొనేందుకు, ఎవరైనా నిజమే కదా అనేందుకు ఆస్కారం వుంటుంది. దానిలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. బడ్జెట్‌ కొత్త మంత్రులకు హడావుడి తప్ప నిరంతరం కొనసాగే అధికార యంత్రాంగానికి రోజువారీ వ్యవహారమే. అందునా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌కు ముందుకు గానే ఏర్పాట్లు చేశారు కనుక, నూతన పాలకుల ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని శాఖల, పధకాలకు కోత, వాత, కొన్నింటికి మోత అన్నట్లుగా సవరణలు చేయటం తప్ప పెద్దగా ఇబ్బంది వుండదు. ఫిబ్రవరి మాసంలో నాటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు రెండు లక్షల 26వేల కోట్లతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రతిపాదిస్తే, రాజేంద్రనాధ్‌ రెండు లక్షల 27వేల కోట్లతో ప్రపతిపాదించారు.

అడుక్కొనే దగ్గర పిసినారి తనం ఎందుకన్నది పెద్దల మందలింపు వంటి సలహా. బడ్జెట్‌లో విషయంలో కూడా పాలకులు దీన్నే ప్రదర్శిస్తూ భారీగా ప్రతిపాదనలు చేస్తున్నారు. సంక్షేమ పధకాల అమలు విషయంలో ఎవరికీ పేచీ లేదు గానీ అవే సర్వస్వం, జిందా తిలిస్మాత్‌ (సర్వరోగ నివారిణి అన్నది దాని తయారీదార్ల ప్రచార నినాదం) అంటే కుదరదు. అవి సంక్షోభం లేదా సమస్యల్లో వున్న జనానికి పూత మందు వంటి వుపశమన చర్యలు మాత్రమే అన్నది ముందుగా చెప్పకతప్పదు. జగన్‌ సర్కార్‌ కూడా పిసినారితనం ప్రదర్శించలేదు. బడ్జెట్‌ అంటే అంకెల గజిబిజి కనుక సమీప అంకెల్లోకి మార్చి చెప్పుకుందాం. ప్రతిపాదించిన రెండులక్షల 27వేల కోట్లలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంటులు, రాష్ట్రం తీసుకొనే అప్పులు అన్నీ కలసి వుంటాయి. బడ్జెట్లో చూపిన అంకెలను చూసి ఎవరైనా చూశారా మా జగన్‌ తడాఖా అని ఛాతీ విరుచుకున్నారో తెలుగుదేశం కార్యకర్తలకు జరిగిన పరాభవమే పునరావృతం అవుతుంది.

మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో చంద్రబాబు సర్కార్‌ లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు కుదించింది. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం దాన్నే రెండులక్షల 27వేల కోట్లకు పెంచి చూశారా చంద్రబాబు కంటే తాము 19శాతం బడ్జెట్‌ పెంచాము అని గొప్పలు చెప్పుకొంటోంది. ఆచరణలో ఏం జరుగుతుందన్నది ముఖ్యం. గతేడాది తెలుగుదేశం సర్కార్‌ అప్పుల ఆదాయం మినహా మిగిలిన మొత్తం ఆదాయంలో కేంద్రం నుంచి వచ్చే గ్రాంటుల మొత్తం 50,695 కోట్లుగా చూపితే సవరించిన దాని ప్రకారం వచ్చిన మొత్తం 19,456 కోట్లు మాత్రమే. జగన్‌ సర్కార్‌ వస్తుందని చూపిన మొత్తం 61,071 కోట్లు. గత ఏడాది ఆశించిన మేర రాని కారణంగానే లక్షా 55వేల 507 కోట్ల అంచనాను లక్షా 14వేల 684 కోట్లకు తగ్గించారు. అయినా రాజేంద్రనాధ్‌ వర్తమాన సంవత్సరంలో లక్షా 78వేల 697 కోట్లను చూపారు. రాకపోతే చంద్రబాబు నాయుడి సర్కార్‌ మాదిరే కోత పెట్టటం తప్ప మరొక మార్గం లేదు. తెలుగుదేశం సర్కార్‌ గతేడాది 33,461 కోట్ల రూపాయలను అప్పులు తేవాలని లక్ష్యంగా పెట్టి 38,245 కోట్లకు పెంచింది. ఇప్పుడు జగన్‌ ఆ మొత్తాన్ని 47వేల కోట్లకు పెంచనున్నట్లు ప్రతిపాదించారు.

ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాల్సి వుంది. బడ్జెట్‌కు ముందుగా ఆర్ధికశాఖ ఒక శ్వేత పత్రాన్ని వెల్లడించింది. ఇదే ఆర్ధిక శాఖ ఎన్నికలకు ముందు కూడా శ్వేతపత్రాన్ని ప్రకటించింది. ప్రభుత్వాలు మారగానే వాటిలోని పదజాలం వ్యాఖ్యానాలు కూడా మారిపోయాయి. ఆర్ధిక శాఖ లేదా ప్రభుత్వం ప్రకటించే పత్రాలు వాస్తవ అంకెలను జనం ముందుంచి వారి విచక్షణ, వ్యాఖ్యానాలకు వదలి వేయాలి తప్ప రాజకీయ వ్యాఖ్యానాలను చొప్పించినపుడు వాటి విశ్వసనీయతే ప్రమాదంలో పడుతుంది. వెంటనే వాటి మీద తలెత్తే ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సి వుంటుంది. గత ఐదు సంవత్సరాలలో పాలన, ఆర్ధిక యాజమాన్యంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, మానవ, భౌతిక పెట్టుబడులపై పూర్తి నిర్లక్ష్యం, దానికి అవినీతి తోడై చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టారని (జగన్‌ సర్కార్‌ ఆర్ధిక శాఖ శ్వేత పత్రం-పేరా 8) వ్యాఖ్యానించారు. సహజవనరులను ప్రయివేటు వారు లబ్దిపొందే విధంగా ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారని, నీకిది నాకది అనే పద్దతుల్లో ప్రభుత్వ సంస్ధలను ప్రయివేటీకరించారని దానిలో పేర్కొన్నారు. ఈ విమర్శను తెలుగుదేశం అంగీకరించకపోవచ్చుగానీ మిగతా పార్టీలు, నిష్పాక్షికంగా చూసే వారికి ఎలాంటి అభ్యంతరమూ వుండదు. ఇక్కడ సమస్య జగన్‌ సర్కార్‌ దీన్నుంచి తీసుకున్న గుణపాఠాలు ఏమిటి? వాటిని సరిదిద్దేందుకు అనుసరించే వారి విధానం ఏమిటన్నదే అసలు ప్రశ్న. సహజవనరులను ప్రయివేటు వారి దోపిడికీ వదలి వేయకుండా తీసుకున్న లేదా తీసుకోబోయే చర్యలేమిటి? ప్రయివేటీకరణ మీద నూతన ప్రభుత్వ విధానం ఏమిటి అన్నదానికి ఆర్ధిక మంత్రి ప్రసంగంలో ఎక్కడా సమాధానం కనపడదు.

రెవెన్యూ ఖర్చు మీద గత ప్రభుత్వానికి అదుపు లేదని, అది విపరీతంగా పెరిగిపోయిందని,సమర్దవంతంగా నిర్వహించలేదని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. పద్నాలుగవ ఆర్ధిక సంఘం నిర్ణయాల మేరకు రెవెన్యూ లోటు గ్రాంట్లను తీసుకుంటూనే రెవెన్యూ ఖాతా ఖర్చుకు గాను ప్రభుత్వం అప్పులు చేసిందని, మూలధన పెట్టుబడి ఖాతాకు అన్నింటికీ మించి మానవ వనరుల అభివృద్ధికి నిధులను గణనీయంగా తగ్గించటంతో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహార సేవలు దిగజారి పోయినట్లు పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో అందుకు భిన్నమైన విధానం అనుసరించారా అని చూస్తే అలాంటిదేమీ కనపడదు. ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించటం అంటే రాష్ట్ర ప్రజల ఆరోగ్య మెరుగుదలకు తోడ్పడుతుందని అనుకుంటే పొరపాటు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, సిబ్బందిని సమకూర్చితే మొత్తంగా జనానికి చౌకగా వైద్యం అందుతుంది, కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీ నివారణ అవుతుంది. విద్యారంగంలో ప్రయివేటు సంస్ధలు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్‌, లేదా ఇతర సంస్దలేవీ ప్రమాణాలను పెంచటం లేదని అనేక సర్వేలు వెల్లడించాయి.చేరే వారు లేక ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడుతున్నాయి. అందువలన ప్రభుత్వం సర్కారీ బడులను అభివృద్ధి చేయకుండా అమ్మ వడి పేరుతో డబ్బు ఖర్చు చేస్తే ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్ధలకే తిరిగి ప్రయోజనం జరుగుతుంది.

చంద్రబాబు సర్కార్‌ 2017ా18లో మూలధన పెట్టుబడి ఖాతాలో మొత్తం రూ.13,490 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది 28,678 కోట్లు ప్రతిపాదించి, 20,398 కోట్లకు సవరించింది. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ 32,293 కోట్లను ప్రతిపాదించింది.ఎంత ఖర్చు చేస్తారో తెలియదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని చూస్తే స్వల్ప పెంపుదల తప్ప చంద్రబాబుకుాజగన్‌కు పెద్ద తేడాలేదని అంకెలు చెబుతున్నాయి. దీనిలో కీలకమైన సాగునీటి రంగానికి గతేడాది బడ్జెట్‌లో 15,915 కోట్లు కేటాయించి 13,385 కోట్లకు సవరిస్తే, ఈ మొత్తం కూడా లేకుండా జగన్‌ 11,981 కోట్లు మాత్రమే ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మారటం, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో వున్న పూర్వరంగంలో దానికి జీవ ధార అయిన నీటి పారుదల రంగానికి కేటాయింపులు పెంచకుండా పోలవరం లేదా నిర్మాణంలో వున్న ఇతర సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయి రైతులకు ఎలా వుపయోగపడతాయో తెలియదు. ఇదిలా వుంటే భారీ ఖర్చుతో తెలంగాణా గడ్డ మీద నుంచి శ్రీశైలానికి గోదావరి నీటిని తరలించే ఎత్తి పోతల పధకాల గురించి జగన్‌ సర్కార్‌ ఆలోచన చేయటం మరింత విడ్డూరంగా వుంది. మరోవైపు ఈ ప్రతిపాదనల మీద భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. గత ఐదేండ్లలోఅది 2018ా19 నాటికి రెండులక్షల 59వేల కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 57వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 20వేల కోట్లకు చేరింది. సర్కార్‌ అప్పుమీద వడ్డీ ఇరవైవేల కోట్లు, అసలు తీర్చేందుకు మరో ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది జగన్‌ సర్కార్‌ తీసుకోదలచినట్లు ప్రతిపాదించిన రుణం 47వేల కోట్ల రూపాయలు. ప్రభుత్వం తీసుకున్న అప్పు మొత్తాన్ని మూలధన పెట్టుబడులకు ఖర్చు చేసి వుంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ రూపురేఖలే మారిపోయి వుండేవని, మౌలిక వసతులు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి చెందితే రాష్ట్రం పారిశ్రామిక, సేవారంగాల ఆధారిత రాష్ట్రంగా మారిపోయి వుండేదని తద్వారా ఆదాయ పెంపు సామర్ధ్యం పెరిగి వుండేదని శ్వేత పత్రం పేర్కొన్నది. దానికి అనుగుణమైన కేటాయింపులు బడ్జెట్లో కనిపించటం లేదు.

Image result for What is new in YS Jagan first Budget

బాబస్తే జాబస్తుందని ప్రచారం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం 2017-18లో పారిశ్రామిక రంగంలో మూలధన పెట్టుబడి ఖర్చు వంద కోట్ల రూపాయలు(బడ్జెట్‌ పత్రాల్లో అంకెల ప్రకారం). ఈ మొత్తాన్ని గతేడాది బడ్జెట్లో 1464 కోట్లుగా ప్రతిపాదించి 653 కోట్లకు సవరించారు. జగన్‌ సర్కార్‌ 1116 కోట్లుగా ప్రకటించింది. దీని భావమేమి తిరుమలేశా ! కడప వుక్కు కర్మాగారం గురించి ప్రస్తావన స్వల్ప నామ మాత్ర కేటాయింపు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు అంటే అదొక్కటే కాదు.1991నుంచి ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల్లో భాగంగా ప్రభుత్వాలు పరిశ్రమల స్ధాపన బాధ్యతను విస్మరించాయి. ఆ తరువాత ఎక్కడైనా ఒకటీ అరాచోట రక్షణ రంగ పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది తప్ప ఇతరంగా ఏవీ రాలేదు. ప్రభుత్వరంగ పరిశ్రమలను వదిలించుకొనేందుకు తెగనమ్మటమే విధానంగా ముందుకు వచ్చింది. జగన్‌ సర్కార్‌ బడ్జెట్‌ కూడా దాని కొనసాగింపుగానే వుంది తప్ప మరొకటి కాదు.ప్రతి ఏటా వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు నిధులు కేటాయించి కొనుగోలు చేసిన వారికి రాయితీలు ఇస్తున్నారు. దాని వలన వ్యవసాయ కార్మికులకు వుపాధి పోతోంది. వారికి ప్రత్యామ్నాయం పారిశ్రామిక రంగం తప్ప మరొకటి కాదు. మానవ శ్రమ పాత్రను తగ్గించేలా పాత పరిశ్రమలను నవీకరిస్తున్నారు, కొత్త పరిశ్రమల్లో అసలు ప్రారంభం నుంచి అదే పరిస్ధితి. అందుకే అభివృద్ధి అంకెలను వెల్లడిస్తున్నా దానికి తగిన విధంగా వుపాధి పెంపొందటం లేదు. వుపాధి రహిత అభివృద్ధి దశలోకి మన దేశం రోజురోజుకూ వేగంగా మారిపోతున్నది. ఆంధ్రప్రదేశ్‌ దానికి మినహాయింపుగా వుండజాలదు. రెండవది ప్రయివేటు రంగంలోని ఐటి సంస్ధలు ఇప్పటికే కేంద్రీకృతం అయిన నగరాల్లో తప్ప మిగతా చోట్లకు రావని గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్‌ అనుభవం తెలిపింది.

రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు గణనీయంగా వున్నారు. కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ఇతర చేతి వృత్తి దారుల ఆదాయాలు గణనీయంగా పెరగకుండా రాష్ట్రంలో వస్తు వినియోగం పెరగదు. అది లేకుండా పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి కావు, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరగదు. అసంఘటిత రంగ కార్మికులకు పదేండ్లు, అంతకు ముందు నిర్ణయించిన వేతనాలే ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వుద్యోగులకు తాత్కాలిక భృతి ప్రకటించాల్సిందే, వేతన సవరణ జరగాల్సిందే. అసంఘటిత రంగ కార్మికుల, చిరుద్యోగుల సంగతేమిటి? బడ్జెట్‌ వుపన్యాసంలో అ సలు ఈ ప్రస్తావనే లేదు. జగన్‌ పర్యటనల్లో ఎవరూ వీటి గురించి అడగలేదు అనుకోవాలా ? ఈ పూర్వరంగంలో వివిధ తరగతుల ఆదాయాలను పెంచేందుకు,నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు జగన్‌ సర్కార్‌ నవరత్నాల పరిధి దాటి ఆలోచించటమే కొత్తదనం అవుతుంది. ఈ బడ్జెట్‌లో అదేమీ లేదు. అసెంబ్లీ చర్చలో అయినా ఇలాంటి లోపాలను సవరిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిల్లర రాజకీయాలు వద్దు, చిన్న పిల్లలను కాపాడండి యోగి మహాశయా !

20 Sunday Aug 2017

Posted by raomk in BJP, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Amitshaw, BJP, BJP’s trolling army, BRD Medical College and Hospital, Dr Kafeel Ahmad Khan, Gorakhpur deaths, petty politics, save the children, UP CM, Yogi Adityanath

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది రోజులుగా వుత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన వార్తలు ఇంతవరకు కొన్ని అంశాలను నిర్ధారించాయి. నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా బిజెపి తరఫున రాబోయే రోజులలో కాబోయే ప్రధానిగా ప్రచారంలో వున్న యోగి ఆదిత్యనాధ్‌ పాలనకు ఇతరులకు పెద్ద తేడా లేదు. వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటం, ఇతరుల మీద నెట్టటంలో ఎవరికీ తీసిపోరు. ప్రజల పట్ల జవాబుదారీ తనం లేదు. కొద్ది రోజుల క్రితం ఆదిత్యనాధ్‌ సోదరి సామాన్యుల మాదిరే ఒక టీ దుకాణం నడుపుకొంటోందని ఈ వుదంతం యోగికి బంధుప్రీతి లేదని చెప్పేందుకు పక్కా నిదర్శనం అని ప్రచారం జరిగింది. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు స్వయం సేవకుడిగా వున్నపుడు పారిశుధ్య పని చేసిన నిగర్వి అంటూ ఒక ఫొటోను ఆయన భక్తులు సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున తిప్పారు. గతంలో ఏ కాంగ్రెస్‌ లేదా ఇతర పార్టీల నాయకులకు లేని వ్యక్తిత్వాన్ని, గతాన్ని సృష్టించేందుకు ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఒక వేళ అలాంటివి వుంటే కాషాయ తాలిబాన్లు, మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) బయట పెడితే లోకానికి మేలు చేసిన వారవుతారు. కాషాయ పరివారం వీరుడు, శూరుడు అని పొగిడే విడి సావర్కర్‌ చరిత్రను చూస్తే ఆయన బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని ప్రేమ లేఖలు రాసిన విషయం తెలిసిందే. అంతే కాదు, బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక హీరోగా, వీరుడిగా వర్ణించటానికి తగిన వ్యక్తి సావర్కర్‌ అన్నట్లుగా తనకు తానే చిత్రగుప్తుడనే మారుపేరుతో రాసిన పుస్తకంలో రాసుకున్న ఘనుడు. అందువలన ఆయన పరంపరలో ముందుకు వస్తున్నవారికి లేని గొప్పలను ఆపాదించటంలో విశేషం ఏముంది. మహా అయితే ఎవరన్నా ‘దేశద్రోహులు’ ఈ విషయాన్ని ప్రస్తావిస్తే అది మా విశ్వాసం, మా మనోభావాలను దెబ్బతీశారంటూ దాడులకు దిగుతారు.https://thewire.in/140172/veer-savarkar-the-staunchest-advocate-of-loyalty-to-the-english-government/

అందువలన యోగి గారి సోదరి కథను నమ్మటమా లేదా అన్నది పక్కన పెడదాం. ఆయన మఠానికి దగ్గరలో వున్న గోరఖ్‌పూర్‌ బిఆర్‌డి ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో పిల్లలు మరణిస్తున్నారనేది ఎవరూ కాదనలేని నిజం. అక్కడ చనిపోవటం కొత్తగా జరుగుతున్నదేమీ కాదని సాక్షాత్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా మహాశయుడే నిర్ధారించారు. అలాంటి దాని గురించి సామాజిక, సాంప్రదాయక మీడియాలో పెద్ద చర్చ, ఆరోపణలు, ప్రత్యాపరోపణలు ఇప్పటికీ వస్తుంటే భవ బంధాలు, రాగ ద్వేషాలు వుండకూడని, నిజం తప్ప అబద్దాలు చెప్పకూడని ఒక యోగి చిల్లర రాజకీయాలు తప్ప నిజాయితీతో కూడిన ఒక ప్రకటన చేసి దానికి స్వస్తి వాక్యం పలకలేదేం ? ఇదేమి జవాబుదారీతనం. లేదూ విచారణకు ఆదేశించాం అప్పటి వరకు మాట్లాడకూడదు అంటే విచారణ నివేదికలు నిర్ధారించేంత వరకు ఆగకుండా కొందరు వైద్యులపై చర్యలెందుకు తీసుకున్నట్లు ?

గత కొద్ది రోజులుగా మీడియాలో రాసిన వార్తలు, రాయించిన వార్తలను చదివిన వారికి, టీవీలలో చూసిన వారికి ‘మెదడు వాపు ‘ వ్యాధి వచ్చేట్లుగా వుంది. గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో మెదడువాపు వ్యాధి విభాగపు అధిపతిగా పని చేస్తున్న డాక్టర్‌ కఫీల్‌ అహమ్మద్‌ సదరు ఆసుపత్రికి అనుబంధంగా వున్న మెడికల్‌ కాలేజీలో పిల్లల వైద్య సహాయ ఫ్రొఫెసర్‌గా బోధన కూడా చేస్తున్నారు.అందువలన ఆయన ఆక్సిజన్‌ కొరత గురించి తెలుసుకొని ఇతర స్నేహితుల నుంచి అరువుగా లేదా కొనుగోలు చేసి సిలిండర్లను తెచ్చి ఎందరో పిల్లలను కాపాడినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.ఆయన ఆక్సిజన్‌ తెప్పించిన విషయాన్ని అభినందించకపోతే పోయే వాటి గురించి తన ప్రతిష్టను పెంచుకొనేందుకు మీడియాలో ఆయన అలా రాయించుకున్నాడని కొంత మంది చెబుతున్నారు.ఆ వార్తలు వచ్చిన వెంటనే బహుశా వాటిని రాయటంలో వెనుకబడిన కొన్ని మీడియా సంస్ధలు చద్ది వార్తలే ఇస్తే తమకు ‘లాభం’ ఏముంటుంది అనుకున్నాయోమో ఆయన తాను పని చేస్తున్న ఆసుపత్రి నుంచి సిలిండర్లను దొంగతనం చేశాడని, అలా తస్కరించిన వాటిని తన, ఇతర ఆసుపత్రుల నుంచి తిరిగి తెప్పించాడు తప్ప అందరూ అనుకున్నట్లు ప్రాణదాతేమీ కాదని మరుసటి రోజునే ప్రచురించాయి. ఒక బిజెపి మహిళా నాయకురాలు ఆయన అత్యాచారాలు చేశాడన్న ప్రచారం మొదలెట్టింది. విద్యార్ధిగా వుండగా ఒకరి బదులు మరొకరికి పరీక్ష రాసిన కేసులో అరెస్టయ్యాడని మరొక వార్త.ఆయనపై క్రిమినల్‌ కేసు వున్న కారణంగా మణిపాల్‌ విశ్వవిశ్వవిద్యాలయం ఆయనను సస్పెండ్‌ చేసిందని మరొక వార్త. ఇలా ఇంకా రాబోయే రోజుల్లో ఏమేమి ఆపాదిస్తారో తెలియదు.సదరు వైద్యుడు ఎందరినో కాపాడారని రాసిన వార్తలను సహించలేక ఆయనపై ఇన్ని ఆరోపణలు లేదా పాత విషయాలను( ఎంతవరకు నిజమో తెలియదు) తవ్వి సామాజిక మాధ్యమంలోపరువు తీయటం అవసరమా ? వారికి దురుద్ధేశ్యం తప్ప మరొకటి కనపడటం లేదు.

సదరు డాక్టర్‌పై తీసుకున్న చర్య గురించి కూడా మీడియాలో వార్తలు తప్పుదారి పట్టించేవిగా వున్నాయి. జాతీయ ఆరోగ్య కార్యక్రమ నోడల్‌ అధికార బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. మెదడువాపు వ్యాధి నివారణకు సదరు సంస్ధ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని పని చేస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం ఆయనపై నమోదు చేసిన అత్యాచార ఆరోపణలో వాస్తవం లేదని ఆ కేసును పోలీసులు మూసివేశారు. అయినా ఆయనొక రేపిస్టు అని నేను విన్నా అని బిజెపి నాయకురాలు ట్వీట్‌ చేసింది. సినిమా నటుడైన బిజెపి ఎంపీ పరేష్‌ రావల్‌ దానిని సమర్ధిస్తూ చెద పురుగుల తెగ దృష్టిలో హీరో అని పేర్కొన్నాడు. డాక్టర్‌ ఖాన్‌ను బలిపశువును చేశారని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో విమర్శించింది. ప్రజారోగ్యాన్ని యోగి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నది.వైద్య విద్య డైరెక్టర్‌ జనరల్‌ చేసిన మౌలిక ఆరోపణ ప్రకారం ఆక్సిజస్‌ సిలిండర్లను తన ఆసుపత్రి నుంచి సేకరించటం అని న్యూస్‌18 వార్త పేర్కొంటే ప్రయివేటు ప్రాక్టీస్‌ చేయటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా చర్య తీసుకున్నట్లు హిందుస్తాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది. గతేడాది సెప్టెంబరు ఎనిమిది నుంచి డాక్టర్‌ ఖాన్‌ ప్రయివేటు ప్రాక్టీస్‌ చేయటం లేదని చెబుతున్నారు.

నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌తో వున్న మన దేశ సరిహద్దులను కాపాడే సహస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బి) ప్రజాసంబంధాల అధికారి ఓపి సాహు ఇలా చెప్పారు.’ ఆగస్టు పదిన బిఆర్‌డి మెడికల్‌ కాలేజీలో అసాధారణ సంక్షోభ పరిస్ధితి ఏర్పడింది. డాక్టర్‌ కఫిల్‌ ఖాన్‌ ఎస్‌ఎస్‌బి డిఐజి వద్దకు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లను సేకరించి మెడికల్‌ కాలేజీకి తరలించేందుకు ఒక ట్రక్కు కావాలని అడిగారు.బిఆర్‌డి మెడికల్‌ కాలేజీ సిబ్బందికి సహకరించేందుకు డిఐజి పదకొండు మంది జవాన్లను కూడా ట్రక్కుతో పాటు పంపారు. మా క్క్రు కొద్దిగంటల్లోనే వివిధ ప్రాంతాల నుంచి ఖలీలాబాద్‌లోని ఒక గోడౌన్‌ నుంచి కూడా సిలిండర్లను సేకరించి తీవ్ర సంక్షోభం వున్న మెడికల్‌ కాలేజికి తరలించారు.’

పిల్లల మరణాల వార్తలు వెలువడగానే ఆక్సిజన్‌ సరఫరా లేక మరణించారనటాన్ని యోగి సర్కార్‌ తోసి పుచ్చింది. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ రౌటెల ఒక ప్రకటన చేసి ఇతర కారణాలతో మరణించినట్లు చెప్పిన దాన్ని ఆరోగ్య మంత్రి కూడా చిలుక పలుకుల్లా వల్లించాడు. తొమ్మిదవ తేదీన ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి నాలుగవ తేదీ వరకు ఆక్సిజన్‌ కొరత గురించి తన కార్యాలయానికి తెలియదని, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకుంటానని దానికి ప్రిన్సిపల్‌, ఇతరులే కారణమని ఆరోపించారు.

మార్చి 22నే ప్రిన్సిపల్‌ రాజీవ్‌ మిశ్రా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌కు ఆక్సిజన్‌ సరఫరాదారు పుష్పా సేల్స్‌ వారి లేఖను కూడా జతపరచి చెల్లింపుల గురించి తెలిపారు. తిరిగి ఏప్రిల్‌ మూడున అదనపు ఛీఫ్‌ సెక్రటరీకి పుష్సా సేల్స్‌ తాజా లేఖను జతపరచి మరోసారి రాశారు. రెండు లేఖలకూ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.ఆగస్టు ఒకటిన మరోసారి అదనపు చీఫ్‌ సెక్రటరీకి రాసి దాని కాపీని మంత్రికి పంపారు. తొమ్మిదవ తేదీన ఆసుపత్రిలో సమీక్ష సందర్భంగా ఆరోజు వుదయం బిల్లుల చెల్లింపు గురించి ఆరోగ్యశాఖ మంత్రికి స్వయంగా తాము లేఖను అంద చేశామని, ఆరోజు సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తేగా ఏమిటి అన్నట్లు ప్రశ్నార్ధకంగా యోగి మంత్రివైపు చూసి తరువాత మౌనంగా వుండిపోయినట్లు తమకు తెలిసిందని పుష్పా సేల్స్‌ ప్రతినిధులు టెలిగ్రాఫ్‌ పత్రికతో చెప్పారు. యోగి కాలేజీ నుంచి వెళ్లిపోయిన తరువాత ఆ సాయంత్రమే సిలిండర్ల సరఫరా నిలిపివేశారు. అంటే ఒక చిన్న వ్యాపార సంస్ధ కూడా యోగి పని తీరు మీద విశ్వాసం కోల్పోయిందన్నది స్పష్టం.

మరణాలకు బాధ్యత వహిస్తూ ఆగస్టు 12న రాజీనామా చేసిన మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజీవ్‌ మిశ్రా మరుసటి రోజు చేసిన ఓ ప్రకటనలో ఆక్సిజన్‌ సరఫరాదారుకు డబ్బు చెల్లించటంలో బ్యూరాక్రటిక్‌ పద్దతులు, ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ పర్యటనే కారణమని విమర్శించారు. ఆక్సిజన్‌ సరఫరాదారుకు చెల్లించేందుకు తాము ఐదవ తేదీనే నిధులు విడుదల చేశామని, సకాలంలో ప్రిన్సిపల్‌ చెల్లించలేదని వైద్య విద్య శాఖ మంత్రి అశుతోష్‌ టాండన్‌ చెప్పారు. రెండు కోట్ల రూపాయలు విడుదల చేయాలని జూలై నెలలోనే మూడు నాలుగు లేఖలు రాశానని ఐదవ తేదీన నిధులు విడుదల చేశారని డాక్టర్‌ మిశ్రా చెప్పారు. ఆగస్టు ఐదవ తేదీ శనివారం, నిధుల విడుదల ఆదేశాలు మాకు ఏడవ తేదీన అందాయి. బిల్లు ఓచర్‌ను ఏడవ తేదీన ట్రెజరీకి పంపాము, వారు ఎనిమిదవ తేదీన టోకెన్‌ విడుదల చేశారు.తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ ఆసుపత్రి సందర్శనకు వచ్చిన కారణంగా ఆసుపత్రి యంత్రాంగమంతా తీరికలేకుండా వుంది.పదవ తేదీన మాత్రమే 52లక్షల రూపాయలను ఆక్సిజన్‌ సరఫరాదారు ఖాతాకు బదిలీ చేయాల్సిందిగా కోరుతూ బ్యాంకుకు పంపగలిగాము.మెడికల్‌ కాలేజీ, ఆక్సిజన్‌ సరఫరాదారు బ్యాంకు ఖాతాలు వేర్వేరు చోట్ల వున్నందున బ్యాంకు బదిలీ చేసే అవకా శం లేదు, రెండు బ్యాంకుల మధ్య నగదు బదిలీకి ఒక రోజు వ్యవధి పడుతుంది. అని మిశ్రా చెప్పారు. పదవ తేదీ మధ్యాహ్నం ఆక్సిజన్‌ సరఫరాదారు నుంచి ఫోన్‌ వచ్చింది, తదుపరి ట్రక్కు సిలిండర్లను పంపే అవకా శం లేదని వారు చెప్పారు. నిధులు విడుదల చేశామని బ్యాంకులో ఆలశ్యం అవుతున్నదని, మీ ఖాతాకు నిధులు అందుతాయని చెప్పానని, అయితే సిలిండర్ల సరఫరా నిలిపివేస్తారని తాను ఊహించలేదని డాక్టర్‌ మిశ్రా అన్నారు.

యోగులు మఠాలకే పరిమితం అయితే ఒక తీరు, అలాగాక ప్రజాజీవనంలోకి వచ్చి, అధికారపదవులు కూడా స్వీకరించిన తరువాత వారినేమీ ప్రశ్నించకూడదు అంటే కుదరదు. పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించటం వాస్తవం. ఆ సంబంధిత వార్తలతో పాటు ఆసుపత్రి, దాని పరిసరాలు, అసలు మొత్తంగా గోరఖ్‌పూర్‌ పరిసరాలన్నీ ఆశుభ్రత నిలయాలుగా వున్నాయని కూడా వార్తలు వచ్చాయి. మెదడు వాపు వ్యాధి కారణంగా ఆ ప్రాంతంలో పిల్లలు, ఇతరులు మరణించటం కూడా ఎక్కువగానే వుందని వెల్లడైంది. సరే ఎవరైనా మూడు నెలల్లోనో, ఆరునెలల్లోనే అద్భుతాలు చేయగలరని ఎవరూ అనుకోరు. యోగులైనా అంతే.మరణించిన పిల్లల తలిదండ్రులను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గోరఖ్‌ పూర్‌ వెళతానని ప్రకటించటంతో యోగికి పూనకం వచ్చింది. ఆగ్రహంతో వూగిపోయారు. గోరఖ్‌పూర్‌ను ఒక విహార కేంద్రంగా మార్చవద్దని ఎదురుదాడి ప్రారంభించారు.(కేరళలో వ్యక్తిగత కక్షలు లేదా కారణాలతో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే కేంద్ర మంత్రి పరామర్శకు వెళ్లటం సరైనదే అయితే 70 మందికి పైగా పిల్లలు మరణించిన వుదంతంలో రాహుల్‌ గాంధీ పరామర్శించటం తప్పెలా అవుతుందో మరి) స్వచ్చ వుత్తర ప్రదేశ్‌ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సరే షరా మామూలుగా గత ప్రభుత్వాలు కనీస సదుపాయలు కల్పించలేదని చెప్పారనుకోండి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మన యోగి గారు పాతికేండ్లుగా, అంతకు ముందు ఆయన సీనియర్‌ యోగి గోరఖపూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధిగా వున్నారు. ప్రతి ఏటా తమ కనుసన్నలలో వుండే బిఆర్‌డి ఆసుపత్రిలో పిల్లలు చని పోతుంటే, ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా తయారైతే, మెదడు వాపు వ్యాధి ప్రబలంగా వుంటే ఎంపీగా ఆయన లేదా స్ధానిక బిజెపి ఎంఎల్‌ఏలు ఏం చేస్తున్నారు. ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నారు. మూడు సంవత్సరాలుగా నరేంద్రమోడీ స్వచ్చ భారత్‌ కార్యక్రమంలో కనీసం ఆసుపత్రి పరిసరాలను అయినా బాగు చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి?ఎంపీగా ఏం పట్టించుకున్నట్లు ? తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి కేరళ ఆసుపత్రులలో చేర్చుకోని కారణంగా మరణించాడు. ఆ ఘటన మీద కేరళ ముఖ్యమంత్రి విచారం వెలిబుచ్చారు. రాగ ద్వేషాలకు అతీతంగా వుండే, వుండాల్సిన యోగి బిఆర్‌డి ఆసుపత్రికి నిధులు సకాలంలో విడుదల కాలేదన్న విమర్శలు తలెత్తినపుడు వాస్తవాలను వెల్లడించి భవిష్యత్‌లో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా చూస్తామని చెబితే ఆయన గౌరవం మరింత పెరిగి వుండేది. ఇంత రాద్దాంతం జరిగేది కాదు.కానీ చేసిందీ, జరిగిందేమిటి? ముందసలు తనకు తెలియదన్నారు ముఖ్యమంత్రి. ఇలాంటివి కొత్తగా జరగటం లేదని తేల్చిపారేశారు అమిత్‌ షా. యోగి ప్రభుత్వం, బిజెపి మరుగుజ్జు యోధులు, బిజెపి మెప్పుపొందేందుకు తహతహలాడిన మీడియా చౌకబారు రాజకీయాలకు పాల్పడింది. విమర్శకులపై ఎదురుదాడికి దిగింది. యోగి సర్కార్‌ పని తీరును బజారుకు ఈడ్చింది.

యోగి ఆదిత్యనాధ్‌ ఒక పర్యటన సందర్భంగా దళితులు శుభ్రంగా లేరని వారికి సబ్బులు, షాంపూలు ఇచ్చి స్నానాలు చేయించి, వారెక్కడ యోగిని ముట్టుకుంటారో అని లేవకుండా చేసేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇపుడు ప్రజల ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్న సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న అధికార యంత్రంగాన్ని మొత్తంగా శుద్ధి చేయటానికి ఎన్ని సబ్బులు వాడాలో తెలియదు. మొత్తం మీద ఈ వుదంతం బిజెపి, యోగి సర్కార్‌, యోగికి వ్యక్తిగతంగా చెప్పుకోలేని చోట దెబ్బ కొట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కావాల్సింది చిల్లర రాజకీయాలు కాదు, చిన్న పిల్లల ప్రాణాలు కాపాడండి యోగి మహాశయా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జిందా తిలిస్మాత్‌ స్ధానంలో ఆవు పేడ, మూత్రం !

22 Saturday Jul 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Science, Uncategorized

≈ Leave a comment

Tags

cow, cow dung, cow sciences, Gujarat model, Narendra Modi, narendra modi bhakts, Science, Vedic sciences

ఎం కోటేశ్వరరావు

ఎందరో యువత, మధ్యతరగతి మేథావులు బిజెపి అంటే ఇష్టం లేకపోయినా కాంగ్రెస్‌ మీద కోపంతో నరేంద్రమోడీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయనను చూసి చెప్పినవారికల్లా ఓటు వేశారు. ఆ బలహీన క్షణంలో అలా జరిగింది అన్నట్లుగా ఓటింగ్‌ రోజు జరిగిందేదో జరిగిపోయింది. తరువాత ఆ ప్రభుత్వం ఏమి చేస్తుందో, ఆ పార్టీ వారు, వారికి వెన్నుదన్నుగా వున్న సంస్ధలకు చెందిన వారు ఏమి చేస్తున్నారో అని ఒక్క క్షణమైనా వెనుదిరిగి చూశామా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మూడు సంవత్సరాలు గడిచాయి. ఎన్నో విజయాలు సాధించామని ఇప్పటికే వూదరగొడుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్నికల ప్రణాళిక, ప్రచారంలో చెప్పినవి మినహా ఇతర అనేక వివాదాస్పద, రెచ్చగొట్టే, సమాజాన్ని చీల్చే అంశాలను బిజెపి, దాని చుట్టూ వుండే శక్తులు ముందుకు తెస్తున్నాయి. ఆ గోమాత సాక్షిగా మూడు సంవత్సరాలకు ముందున్నదాని కంటే దేశం ఏ రంగంలో ముందుకు పోయిందో ఆధార సహితంగా ఎవరైనా చెబితే సంతోషం. అంతరిక్షంలోకి అత్యధిక వుపగ్రహాలను పంపి విజయం సాధించిన శాస్త్రవేత్తలు ఒకవైపు మరోవైపు ఆవు పేడ, మూత్రంలో ఏముందో తెలుసుకొనేందుకు కాలం వృధా చేసే శాస్త్రవేత్తలు. మొదటి వారిని చూసి గర్వపడాలా రెండో వారిని చూసి సిగ్గుతో తలవంచుకోవాలా? యధారాజా తధా శాస్త్రవేత్త !

వాట్సాప్‌ గ్రూపులలో ఆ మధ్య గుజరాత్‌లోని రాజ్‌కోటలో అంతర్జాతీయ విమానాశ్రయం స్ధాయిలో ఒక బస్టాండ్‌ నిర్మించారంటూ ఏప్రిల్‌ నెలలో ఫొటోలతో సహా సమాచారం తిరిగింది. బాబూలాల్‌ సుప్రియ అనే కేంద్ర మంత్రి ఆ బస్టాండ్‌ను ప్రారంభించారంటూ ట్వీట్‌ చేశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటి ? ఇప్పటి వరకు ఆ బస్టాండ్‌ నిర్మాణమే జరగలేదు. ప్రతిపాదిత కట్టడటం గురించి తయారు చేసిన నమూనా ఫొటో అది. పోనీ అది దేశంలో పెద్ద బస్టాండా అంటే కానే కాదు. దానికంటే మూడు నాలుగు రెట్లు పెద్దవి మన హైదరాబాదు, విజయవాడ, గుంటూరుల్లో ఇప్పటికే నిర్మితమై వున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వ అభివృద్ధి గురించి కూడా ఇలాంటివే అనేకం ప్రచారంలో వున్నాయని తెలుసుకోవాలి.

గోరక్షణ, గోమాంసం తింటున్నారనే పేరుతో మైనారిటీలు, దళితులను మూకుమ్మడిగా హత్యలు చేయటం వెనుక తమ ప్రభుత్వ అభివృద్ధి అజెండాను పక్కదారి పట్టించే కుట్ర వుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మరత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ బుధవారం నాడు రాజ్యసభలో చెప్పారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుందన్న జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ ఆయనను ఆవహించినట్లుగా కనిపిస్తోంది. గో రక్షకుల ముసుగులో సంఘవ్యతిరేకశక్తులు దుకాణాలు తెరిచారనో, వారి చర్యలను సహించరాదనో, కఠిన చర్యలు తీసుకుంటామనో కోహినూరు వజ్రం వంటి మాటలతో మౌనబాబా ప్రధాని నరేంద్రమోడీ వుత్తరాయణానికో దక్షిణాయానానికో సెలవిస్తుంటారు. ఆయన శిష్యులు మరోవైపు ఇలా నోరు పారవేసుకుంటారు. అసలు అభివృద్దే బూటకం అయితే దానిని అడ్డుకొనేందుకు గోరక్షకుల పేరుతో ఎవరో దాడులు చేస్తున్నారని చెప్పటం అంతకంటే దారుణం. ఆ దాడులు ఎక్కడైతే జరిగాయో, జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలన్నింటా అధికారంలో వున్నది బిజెపి ప్రభుత్వమే. తమ ప్రభుత్వ అభివృద్దిని అడ్డుకొనే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. దాదాపు అన్ని వుదంతాలలో బాధితులు, వారి కుటుంబాలపైనే తప్పుడు కేసులు బనాయించిన ఘనుల ప్రతినిధి అయిన కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో అలా మాట్లాడారంటే గుండెలు తీసిన బంట్లకే సాధ్యం అని స్పష్టం కావటం లేదూ ?

ముఖ్యమంత్రిగా తాను అభివృద్ధి చేసిన గుజరాత్‌ నమూనాను దేశమంతటికీ విస్తరిస్తానని నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు ఊరూ వాడా ప్రచారం చేశారు. తరువాత విలేకర్లు ప్రశ్నించటానికి వీలులేకుండా ఇంతవరకు ప్రధాని హోదాలో ఒక్కటంటే ఒక్క పత్రికా గోష్టి కూడా నిర్వహించకుండా ఒక రికార్డు సృష్టించారు. అసలా గుజరాత్‌ అభివృద్ధి అనేదే పెద్ద బూటకం. అందుకే చివరికి మన్‌కీ బాత్‌లో కూడా దాని ప్రస్తావన తేవటం లేదు.2003 నుంచి అంటే గుజరాత్‌లో నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి గుజరాత్‌ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అది కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాల సంఖ్య 51,378, అమలు జరిగినవీ, అమలులో వున్న పధకాల పెట్టుబడుల విలువ రు. 84లక్షల కోట్లని చెప్పారు. ప్రస్తుతం మన దేశ మొత్తం స్ధూలాదాయం రు.170లక్షల కోట్లరూపాయలని అంచనా. అంటే ఒక్క గుజరాత్‌కు వచ్చిన పెట్టుబడులే 84లక్షల కోట్లంటే మొత్తం జిడిపిలో గుజరాత్‌ విలువ ఎంతో లెక్కవేసుకోవాల్సింది.ఇవన్నీ చెప్పింది మూడు సంవత్సరాల క్రితం వరకు నరేంద్రమోడీ, తరువాత ఆయన వారసులు అని తెలిసిందే. కానీ అసలు వాస్తవం ఏమంటే 1983 నుంచీ అంటే మోడీ కంటే రెండు దశాబ్దాల ముందునుంచీ 2016 సెప్టెంబరు వరకు గుజరాత్‌లో అమలయిన పధకాలు 6,251 వచ్చిన పెట్టుబడుల విలువ రు.2.76లక్షల కోట్లు, కల్పించిన వుపాధి 10.67లక్షల మందికి, ఇవిగాక మరో 4033 పధకాలు మధ్యలో వున్నాయి, వాటి మొత్తం పెట్టుబడి రు.9.52లక్షల కోట్లని, మరో 9.3లక్షల మందికి వుపాధి కల్పించబడుతుందని సాక్షాత్తూ గుజరాత్‌ అధికారిక సమాచారమే వెల్లడించింది. మోడీ భక్తులు నిజాలను తట్టుకొనే ధైర్యం వుంటే దిగువ లింక్‌లోని వివరాలు చదివి, వాస్తవం కాదని గోమాత సాక్షిగా నిరూపిస్తే సంతోషం.http://www.moneylife.in/article/the-gujarat-model-ndash-some-facts/51106.html ఈ వివరాలు సేకరించింది కమ్యూనిస్టులు కాదు, సీతారాం ఏచూరి అంతకంటే కాదు.

గోవాలో గొడ్డు మాంసానికి కొరత లేదని, అటువంటి పరిస్ధితే వస్తే పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి దిగుమతికి ఏర్పాట్లు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మనోహర్‌ పారికర్‌ ఏకంగా అసెంబ్లీలోనే చెప్పారు. ఇలా మాట్లాడిన ముఖ్యమంత్రి బిజెపి పరువు తీశారని, రాజీనామా చేయాలని, బిజెపి అంటే బీఫ్‌ జాయ్‌ పార్టీ అని విశ్వహిందూ పరిషత్‌ నేత డాక్టర్‌ సురేంద్ర జైన్‌ ఎద్దేవా చేశారు.

గోరక్షకులకు ఆయుధాలు, శిక్షణ ఇస్తామని విశ్వహిందూపరిషత్‌ నేతలు ప్రకటించారు. కాబోయే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రచారంలో వున్న ఆ సంస్ధ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా గోరక్షకులను సాయుధులను చేస్తామని అలీఘర్‌లో చెప్పారు. తాము ఇప్పటికే తమ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చామని, గుంపులతో ప్రతికూల పరిస్ధితులు ఎదురైతే ఎలా వ్యవహరించాలో కూడా దానిలో నేర్పించామని ఒక నేత చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ పత్రిక రాసింది.

ఆవుల దొంగ రవాణాను అరికట్టేందుకు, లవ్‌ జీహాద్‌ నిరోధానికి ఒక్క ఆలీఘర్‌ జిల్లాలోనే ఐదువేల మంది ‘మత సైనికుల’ ను తయారు చేయాలని అలీఘర్‌లో ఈనెల 14-16 తేదీలలో అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వహిందూ పరిషత్‌ ప్రకటించింది.భజరంగదళ్‌ కార్యకర్తలు మాత్రమే ఈ సైనికుల్లో చేరటానికి అర్హులట. ఈ సైనికులు ఆవుల దొంగరవాణాతో పాటు లవ్‌ జీహాద్‌ నిరోధం, హిందూ యువకులు, యువతులు, మఠాలు, దేవాలయాలు, సంత్‌ సమాజం, దేశాన్ని కూడా రక్షిస్తారట.

గత పది సంవత్సరాలలో 50 మందికి పైగా పోలీసులు, గోరక్షకులను గోహంతకులు చంపివేశారని విహెచ్‌పి అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్‌ చెప్పారు. గోరక్షకులు బాధితులు తప్ప ప్రజా పీడకులు కాదని, గో రక్షకులకు కూడా ఆత్మరక్షణ హక్కుందని కూడా అన్నారు.

వేదాల్లోనే అన్నీ వున్నాయని చెప్పే మనువాదులు, వాటిని సమర్ధించే వారు గాని వాటి నుంచి పెట్రోలు, పైలట్లతో పనిలేని, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే పుష్పక విమాన, కార్ల, ఎన్ని ప్రయోగించినా తరగతని అస్త్రాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర వాటిని గానీ ఇంతవరకు బయటకు తీయలేదంటే వారి దేశ భక్తిని అనుమానించాల్సి వస్తోంది. మనమే వాటిని తయారు చేసి ఎగుమతి చేసి ప్రపంచంలో మన దేశాన్ని మొదటి స్ధానంలో నిలబెట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకొనేందుకు బడా కార్పొరేట్ల కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారా అన్నది సందేహం. మరోవైపు కౌపతి లేదా గో వేదం. లాభాల వేటలోని కార్పొరేట్‌ సంస్ధలు ఇప్పటికే ఆవు పేడ, మూత్రంతో వ్యాపారం చేస్తున్నాయి. వాటి మార్కెట్‌ను మరింత పెంచేందుకు మోడీ సర్కార్‌ చర్యలు తీసుకుంది. బహుశా అది మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగం కావచ్చు.

ప్రస్తుతం మన దేశ జిడిపిలో 0.8శాతం సైన్సు కోసం ఖర్చు చేస్తున్నారు. దానిని మూడుశాతానికి పెంచాలన్నది మన శాస్త్రవేత్తల చిరకాల డిమాండ్‌. సైన్సు పరిశోధనల మీద ఖర్చు పెట్టని, యువత నైపుణ్యాన్ని పెంచని ఏదేశమైనా పరాధీనంగా వుంటుంది తప్ప పురోగమించలేదు. సైన్సుకోసం భారత్‌ పురోగతి పేరుతో ఆగస్టు తొమ్మిదిన దేశ వ్యాప్తంగా నిరసన,డిమాండ్లతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మరోవైపున కేంద్ర ప్రభుత్వం ఏ చేయబోతోంది.

పంచగవ్యం(ఆవు పేడ, మూత్రం, పాలు, పాలనుంచి వచ్చే పెరుగు, వెన్న లేదా నెయ్యి)లోని సుగుణాలను నిర్ధారించేందుకు అవసరమైన పరిశోధనలు చేయాలంటూ పందొమ్మిది మంది ప్రముఖులతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఇప్పటికే అరకొరగా వున్న నిధులను వీటికోసం మళ్లించనుంది అన్నది వేరే చెప్పనవసరం లేదు. సంస్కృత గ్రంధాలలో వున్న విజ్ఞానాన్ని దాన్ని వెలికి తీసేందుకు ఆ భాష తెలిసిన పండితులుండగా వాటిపై పరిశోధనలు చేసేందుకు మరొక కమిటీ, శాస్త్రవేత్తలు ఎందుకు ? ఇప్పటికే మార్కెట్లో సర్వరోగనివారిణి పేరుతో జిందాతిలిస్మాత్‌ను విక్రయిస్తున్నారు. దానికి పోటీ లేదా దాని స్ధానంలో కొత్తదానిని తయారు చేస్తే ఎలా వుంటుందన్నట్లుగా పంచగవ్యాలకు బెల్లం, అరటి పండ్లు, లేత కొబ్బరినీరు, చెరకు రసాలను తగు మోతాదులో కలిపి ఆరోగ్యం నుంచి పంటల సాగుకు అవసరమైన ఎరువుల వరకు ఒకే మాత్రలో వుండే విధంగా ఆ పరిశోధనలు చేస్తారట. ఇలాంటి చర్యలతో దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతుంటే చెవుల్లో పూలు పెట్టుకొని తలాడిస్తే అంతకంటే దేశద్రోహం, నగుబాట్ల వ్యవహారం మరొకటి వుండదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో తగ్గుతున్న ఆరోగ్య భారం-భారత్‌లో పెరుగుతున్న రోగ రుణ భారం

23 Saturday Jul 2016

Posted by raomk in CHINA, Economics, Health, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

China, healthcare costs, healthy china, INDIA, world bank on china health

Image result for china healthcare

ఎం కోటేశ్వరరావు

   మన ప్రభుత్వాలు అమలు జరుపుతున్న దారిద్ర నిర్మూలన పధకాలు కాగితాల మీద దరిద్రుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఎంత ఆదాయం వస్తే, ఎంత ఖర్చు చేస్తే దారిద్య్రంతో వున్నట్లు అనే కొలబద్ద నిర్ణయంలోనే తిరకాసు వున్న విషయం తెలిసిందే. లెక్కలు చూపేందుకు పడుతున్న తాపత్రయం దారిద్య్ర నిర్మూలనలో లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే పాలకులు విధానాల కారణంగా అనారోగ్యం పాలైన పేద, మధ్యతరగతి కుటుంబాలన్నీ తట్టుకోలేని ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పుల పాలు కావలసి వస్తోందని ప్రతి కుటుంబ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా 6.3 కోట్ల మంది ఈ అప్పుల వూబిలో దిగుతున్నారు. తాజాగా జూలై 22వ తేదీన ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్ధ, చైనా ప్రభుత్వం హెల్తీ చైనా (ఆరోగ్యవంతమైన చైనా) పేరుతో ఒక పెద్ద విశ్లేషణాత్మక నివేదికను వెల్లడించాయి. దానిలో చైనాలో జరిగిన అభివృద్ధి కారణంగా తలెత్తిన సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలా అనే అంశాలను చర్చించారు. దానిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

  ప్రస్తుతం మొత్తం చైనా ఆరోగ్యఖర్చులో అక్కడి ఆసుపత్రుల వాటా 54శాతం వుండగా, ఓయిసిడి(ఐరోపా ఆర్ధిక, అభివృద్ధి సంస్ధ ) దేశాలలో అది 38 శాతంగా వుంది.

   1980-2000 సంవత్సరాల మధ్య చైనాలో ఆసుపత్రి పడకల సంఖ్య 1.19 నుంచి 2.17 మిలియన్లకు , తరువాత 13 సంవత్సరాలలో 2013 నాటికి 4.58 మిలియన్లకు పెరిగాయి. ఇదే సమయంలో అత్యధిక ఓయిసిడి దేశాలలో పడకలను కుదించారు, కొన్ని దేశాలలో అది 30శాతం వరకు వుంది.

   2002-2013 మధ్య టెరిటరీ, సెకండరీ ఆసుపత్రుల సంఖ్య 82,29శాతం చొప్పున పెరగ్గా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య ఆరుశాతం తగ్గింది.ఆసుపత్రులలో చేరటం 2003లో 4.7శాతం వుండగా 2013లో 14.1శాతానికి చేరింది.

    ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల నిపుణుల సంఖ్య 36శాతం తక్కువగా వుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలపై విశ్వాసం లేక అన్ని అర్హతలు కలిగిన ఆరోగ్య కార్యకర్తలు లేని కారణంగా గ్రామీణ ప్రాంత రోగులు వాటికి వెళ్లకుండా నేరుగా పై తరగతి ఆసుపత్రులకు వెళ్లటం ఎక్కువైంది.

  వైద్య రంగంలో వేతనాలు ఆకర్షణీయంగా లేని కారణంగా దాదాపు 40శాతం మంది మెడికల్‌ గ్రాడ్యుఏట్లు ఆసుపత్రులలో చేరకుండా ఔషధాలు, వైద్య పరికరాల పరిశ్రమలలో చేరుతున్నారు.

  మెడికల్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య 2003-13 మధ్య రెట్టింపైంది. వారిలో నర్సింగ్‌ సిబ్బంది 108శాతం, ఫిజిషియన్స్‌లో 41 శాతం పెరుగుదల కనిపించింది.అయినప్పటికీ నర్సింగ్‌ సిబ్బంది, ఇతరుల కొరత ఇంకా ఎక్కువగానే వుంది.

    అవసరానికి మించి మందులు రాయటం ఒక ప్రధాన సమస్యగా వుంది.సగటున మూడు మందులు రాస్తున్నారు. ఇంజెన్ల రేటు 53శాతం వుంది, ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సిఫార్సు కంటే ఇవి రెండు ఎక్కువే. రాస్తున్న మందులలో యాంటీబయటిక్స్‌ సగం వుంటున్నాయి.

  గ్రామీణ వైద్యులు కేవలం 26శాతం కేసులలో వ్యాధిని సరిగా నిర్ధారిస్తున్నారని ఒక సర్వేలో తేలింది.అవసరంలేని, హానికరమైన మందుల సిఫార్సు చేయటం 64శాతం కేసులలో కనిపించింది.

    వైద్య సేవలకు ఫీజు చెల్లించే ఏజన్సీ ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఔషధాలపై ఇస్తున్న లాభాల కారణంగా ఆసుపత్రుల రంగంలో, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. స్థూలజాతీయాదాయం (జిడిపి) పెరుగుదల రేటు కంటే ఆరోగ్య ఖర్చుల పెరుగుదల రేటు ఎక్కువగా వుంది. ఏటా 8.4శాతంగా వుంది.జిడిపిలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు 2015లో 5.6శాతం వుండగా 2035 నాటికి 9.1శాతం పెరగవచ్చని అంచనా.ఇది డాలర్లలో 467.2 మిలియన్ల నుంచి 2.4 బిలియన్లకు పెరుగుతుంది.

   ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం మెరుగైన వ్యాధుల యాజమాన్య పద్దతులను పాటిస్తే ఆరోగ్య ఖర్చు తగ్గి జిడిపిలో మూడు శాతం పొదుపు అవుతుంది. మరింత మెరుగైన ఆరోగ్య వ్యవస్ధ, సంరక్షణ,ఆరోగ్యం సమకూరే విధంగా సంస్కరణలు చైనాలో అమలు జరిగితే ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించినట్లు అవుతుంది.

    జీవితకాలం పెరిగిన కారణంగా ప్రస్తుతం 65 సంవత్సరాల వయసు దాటిన వారు చైనాలో 14 కోట్ల మంది వున్నారు.వీరి సంఖ్య 2030 నాటికి 23 కోట్లకు పెరుగుతుందని అంచనా.

  రెండు దశాబ్దాల క్రితం అప్పుడే అంటు వ్యాధులు, పుట్టిన పిల్లలకు వచ్చే వ్యాధులు, పౌష్టికాహారం,తల్లుల ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన వ్యాధులు 41శాతం వుండేవి. ఇప్పుడు ఓయిసిడి దేశాలలో మాదిరి చైనాలో దీర్ఘకాల, అంటు లక్షణం లేని వ్యాధుల కారణంగా 85 శాతం మంది మరణిస్తున్నారు. మొత్తం మరణాలలో మూడింట రెండువంతులకు హృదయ, క్యాన్సర్‌ వ్యాధులు కారణం అవుతున్నాయి. పెద్ద వారిలో అధిక బరువు సమస్య 1991-2009 మధ్య మూడు రెట్లు 11.8 నుంచి 29.2శాతానికి పెరిగింది. ఇది పురుషులలో ఎక్కువగా వుంది. నలభై తొమ్మిదిశాతం చైనా పురుషులు రోజూ పొగతాగుతున్నారు. ఇది ఓయిసిడి దేశాలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువ. మద్యం వినియోగం 2000-2010 మధ్య రెట్టింపైంది. సగటున తలకు 5.8లీటర్లు వుంది.

   2009లో చైనా పెద్ద ఎత్తున ఆరోగ్య సంస్కరణలు ప్రారంభించింది.నూట ముప్ఫై కోట్ల మందికి మూడు లక్షల కోట్ల యువాన్లను ఖర్చు చేయాలని తలపెట్టింది. ఫలితంగా దాదాపు నూటికి నూరుశాతం మందికి ఆరోగ్యబీమా సమకూరింది. దశాబ్దకాలంలో ఆరోగ్య సంరక్షణకు జేబులోంచి ఖర్చు చేయాల్సిన మొత్తం 60 నుంచి 30శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ జనాభా మాత్రం మొత్తం ఖర్చులో సగం తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. మెరుగుదల అంతటా సమంగా లేదని ఇది వెల్లడిస్తోంది.

    వందల సంవత్సరాలుగా అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిలో ఎంతో ముందున్న ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అర్ధికంగా,రాజకీయ, సైనిక రంగాలలో ఎంతో ముందున్నా మొత్తం జనానికి ఆరోగ్యబీమా కల్పించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికీ మూడు కోట్ల మందికిపైగా (2014) 10.4 శాతం జనానికి ఆరోగ్యబీమా లేదు. వారికి జబ్బు చేస్తే మన దేశంలో సామాన్య, మధ్యతరగతి మాదిరి అప్పులపాలు కావాల్సిందే. బీమా లేని వారి సంఖ్య ఏటా ఏడుశాతం పెరుగుతున్నదని ఒకవైపు సర్వేలు తెలుపుతున్నాయి.2018 నాటికి బీమా సౌకర్యం లేనివారి సంఖ్యను 2.4కోట్లు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఆ సమస్య మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. వలస వచ్చిన వారిలో నమోదు కాని వారికి బీమా సౌకర్యం వర్తించదు, వారి సంఖ్య దీనికి అదనం. ఎంతన్నది అమెరికా ఎన్నడూ చెప్పదు. మన దేశంలో బీమా సౌకర్యం గురించి చెప్పుకోనవసరం లేదు. ప్రభుత్వ వుద్యోగులు, కొందరు ప్రయివేటు వుద్యోగులకు మినహా మిగతా సామాన్య జనంలో చాలా పరిమితంగానే బీమా పధకాలలో వున్నారు. వైద్యానికి జేబులోంచి ఖర్చు చేసే మొత్తం 85శాతం వరకు వుంటోంది.

   ఇక్కడ ఒక సమస్య గురించి ప్రస్తావించక తప్పదు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటాం. పీల్చటానికి కావాల్సినంత కాలుష్య గాలి, తాగటానికి తగినన్ని కాలుష్య జలాలు వుచితం తప్ప వాటి కారణంగా వచ్చే రోగాల బారిన పడితే అంతే సంగతులు. గాలి, నీటి కాలుష్యానికి పాల్పడేవారిని కాపాడటం తప్ప వారి బారిన పడేవారిని ఆదుకొనేందుకు ముందుకు రాని ప్రజాస్వామ్యం ! డబ్బు లేక కాదు సుమా, డబ్బు లేకపోతే ఏటా ఆరులక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్‌ సంస్ధలు, ధనికుల వజ్రవైఢూర్యాల దిగుమతులకు పన్ను రాయితీలివ్వటం ఎలా సాధ్యం? అడిగితే జవాబు చెప్పరు. మరి అత్యంత సంపద్వంతమైన భూతల స్వర్గం అమెరికాలో కూడా అందరికీ వైద్యం అందుబాటులో ఎందుకు లేకపోయింది ?

  మొత్తం 130 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సౌకర్యం అందించే స్ధితికి ఇంకా చైనా చేరుకోకపోయినప్పటికీ రోగాల కారణంగా జనం అప్పుల పాలు కావటం అక్కడ లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక బీమా ప్రతి ఒక్కరికీ వుంది.రెండువందల యాభై సంవత్సరాల స్వాతంత్య్రం, అభివృద్దిలో అమెరికా సాధించలేని విజయాన్ని చైనా అందులో నాలుగో వంతు కాలంలోనే సాధించటం ఎలా సాధ్యమైంది ? మనం ఆ బాటలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి వుంది. చైనా నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రజాస్వామ్యం అన్న జవాబు వెంటనే సిద్దంగా వుంటుంది.చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడటం ముఖ్యం అన్నారు. అలాగే మంచి గాలి కోసం కిటికీ తెరిస్తే గాలితో పాటు ఈగలూ,దోమలూ కూడా వస్తాయి, వాటిని అరికట్టగలం అన్నారు. సంస్కరణలు అంటే విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానానికి చైనా మార్కెట్‌ను తెరవటం. అది జరిగింది. అభివృద్ధితో పాటు అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలూ పుష్కలంగానే ప్రవేశించినట్లు అక్కడ జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దానిని చైనీయులేమీ దాచుకోవటం లేదు.

    కౌలుగడువు తీరి వాటిని తనలో విలీనం చేసుకొనే సందర్భంగా హాంకాంగ్‌, మకావో దీవులలో 2050 వరకు పెట్టుబడిదారీ విధానాన్ని అనుమతిస్తామని  చైనా ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అంటే దాని ప్రకారం బిలియనీర్లను అనుమతించటంతో పాటు వారు పెరగటానికి కూడా కమ్యూనిస్టుపార్టీ అంగీకరించినట్లే. ఈ కారణంగానే 2050 వరకు తమ పెట్టుబడులకు ఎలాంటి ఢోకాలేదనే ధీమాతో చైనాలో పెట్టుబడులు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు పెట్టటానికి ధైర్యంగా ముందుకు వచ్చి డబ్బు కుమ్మరించారు. దీనిని చూసి కొంత మంది చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదు, అది కమ్యూనిజం బాటలో పయనించటం లేదు అని విమర్శిస్తున్నారు. చైనా ప్రభుత్వ కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి, బిలియనీర్లు తయారయ్యేందుకు వీలు కల్పిస్తోంది కనుక అధికారిక పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశం అని వర్ణిస్తున్నవారూ లేకపోలేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాల కంటే భిన్నంగా చైనాలో జీవన ప్రమాణాలు, ఆదాయాలూ పెరుగుతున్నాయా లేదా అంటే పెరుగుతున్నాయి. పెట్టుబడిదారీ దేశం అయితే అది ఎలా సాధ్యం ? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరోపాలోని ధనిక దేశాలు కూడా కొన్ని సంక్షేమ చర్యలు అమలు జరిపినంత మాత్రాన వాటిని సోషలిస్టు దేశాలు అనటం లేదు అలాగే అమలు జరుపుతున్న చైనాను మాత్రం సోషలిస్టు దేశంగా ఎలా అంగీకరిస్తాం అనే వారు లేకపోలేదు. సోషలిజం, కమ్యూనిజం భావనల వ్యాప్తిని అడ్డుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపాలోని ధనిక దేశాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపాయి. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా 2008 సంక్షోభం ప్రారంభమైన తరువాత వాటన్నింటినీ ఒక్కటొక్కటిగా రద్దు లేదా కోత పెడుతున్నాయి. ఇదే సమయంలో చైనాలో సంక్షేమ చర్యలు మరింతగా పెరుగుతున్నాయి తప్ప తగ్గుతున్నట్లు సమాచారం లేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్న ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలన్నీ సంక్షోభం లేదా ఒకటి రెండు శాతం అభివృద్ధి రేటుతో మాత్రమే ముందుకు పోతుండగా చైనాలో గతంతో పోలిస్తే కొంత మేరకు తగ్గినా ఎనిమిదిశాతం వరకు అభివృద్ధి వుంది, ఇలా ఎందుకు జరుగుతోంది ?

    చివరిగా ఒక్క విషయం. మన కంటే సాగు భూమి తక్కువ, జనాభా ఎక్కువ వున్న దేశం చైనా. మనదేశంలో 65 ఏండ్లు దాటిన వృద్ధులు జనాభాలో 5.8 శాతం వుంటే అక్కడ 9.6 శాతం వున్నారు. అ ంటే వృద్దాప్య పెన్షన్లు, వారి సంక్షేమ ఖర్చూ ఎక్కువే. మన సగటు జీవన కాలం 67.8 అయితే అక్కడ 75.15 వుంది. మన పట్టణ జనాభా 31శాతం అయితే అక్కడ 50శాతం దాటింది.మన దేశంలో ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆసుపత్రి పడక వుంటే చైనాలో 3.8 వున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాతో పోల్చితే మనకు అనుకూలమైనవీ, ప్రతికూలమైన పరిస్ధితులూ వున్నాయి. చైనాలో అమలు జరుపుతున్న సంస్కరణలు అక్కడ సామాన్య జనజీవితాలను మెరుగు పరచటంతో పాటు ధనికులనూ పెంచుతున్నాయి.మన దేశంలో కేవలం ధనికులను మాత్రమే పెంచుతున్నాయి.

   చైనా తనదైన ప్రత్యేక శైలిలో సోషలిజాన్ని నిర్మిస్తున్నట్లు మొదటి నుంచి చెబుతోంది. సోషలిజాన్ని ఫలానా మార్గంలో సాధించాలని లేదా ఫలానా విధంగానే నిర్మించాలని మార్క్సిస్టు మహోపాధ్యులెవరూ నిర్ధేశించలేదు. కొన్ని అంచనాలు, జోశ్యాలు, ఊహలు మాత్రమే చేశారు. అత్యంత వెనుకబడిన ఆఫ్రికా దేశాలలో, ఎంతో పురోగతి సాధించిన అమెరికా ఖండ దేశాలలో భౌతిక పరిస్ధితులు భిన్నంగా వున్నపుడు రెండు చోట్లా ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధను సాధించటం ఎలా సాధ్యం. దేని మార్గం దానిదే. అందువలన చైనాలో జరుగుతున్నదానిని చూసి కొన్ని నిర్ధారణలకు రావాల్సిన అవసరం లేదు, చైనా అయినా మరొక కమ్యూనిస్టుపార్టీ గురించి అయినా విమర్శనాత్మక దృష్టితో చూడటం, సద్విమర్శలు చేయటంలో తప్పులేదు. ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన స్ధితిలో కమ్యూనిజాన్ని తెగనాడితే లబ్దిపొందేది కమ్యూనిస్టు వ్యతిరేకులు మాత్రమే.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

Selling of Medicines Banned in Foreign Countries

26 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Health, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Analgin, Medicines, Nimesulide, Pioglitazone

A drug banned / restricted in one country may continue to be marketed in other countries as the respective Governments examine the usage, doses, indications permitted, etc. along with the overall risk-benefit ratio and take decisions on the continued marketing of any drug in that country. In India, safety issues concerning drug formulations are, as and when noted, assessed in consultation with the experts. Safety and efficacy issues relating to certain drugs which have been banned in some countries have been examined and some of these have been allowed for continued marketing subject to stipulated condition/restrictions. These include:

I. Nimesulide:- The manufacture, sale and distribution of Nimesulide formulation for human use in children below 12 years of age has been prohibited in the country.

II. Analgin:- The manufacture for sale, sale and distribution of Analgin and its formulations containing Analgin for human use was initially suspended in the country w.e.f. 18.06.2013. Subsequently, DTAB examined the issue of suspension of manufacture and sale of the said drug on 25.11.2013 in its 65th meeting and on the basis of the recommendations of the DTAB, the ban was revoked subject to the condition that manufacturers will be required to mention the following on their package insert and promotional literature of the drug:-

“The drug is indicated for severe pain and pain due to tumour and also for bringing down temperature in refractory cases when other antipyretics fail to do so”.

III Pioglitazone:- The manufacture for sale, sale and distribution of the drug Pioglitazone and formulations containing Pioglitazone for human use was initially suspended w.e.f. 18.06.2013. Subsequently, DTAB, after examination, recommended for revocation of the suspension of the manufacture and sale of the drug subject to certain conditions and accordingly, the suspension was revoked subject to the condition that the manufacturer shall mention on the package insert and promotional literature of the drug the following:-

a) The drug should not be used as first line of therapy for diabetes.

b) The manufacturer should clearly mention the following box warning in bold red.

“Advice for healthcare professionals:

I. Patients with active bladder cancer or with a history of bladder cancer, and those with uninvestigated haematuria, should not receive pioglitazone.

II. Prescribers should review the safety and efficacy of pioglitazone in individuals after 3–6 months of treatment to ensure that only patients who are deriving benefit continue to be treated. Pioglitazone should be stopped in patients who do not respond adequately to treatment (e.g. reduction in glycosylated haemoglobin, HbA1c).

III. Before starting pioglitazone, the following known risk factors for development of bladder cancer should be assessed in individuals: age; current or past history of smoking; exposure to some occupational or chemotherapy agents such as cyclophosphamide; or previous irradiation of the pelvic region.

IV. Use in elderly patients should be considered carefully before and during treatment because the risk of bladder cancer increases with age. Elderly patients should start on the lowest possible dose and be regularly monitored because of the risks of bladder cancer and heart failure associated with pioglitazone.”

V. The Central Government has banned 344 Fixed Dose Combinations on 10.03.2016, as these combinations lacked therapeutic rationality/ justification.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Draft Guidelines for Organ Donation

26 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Health, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

NOTTO, Organ, Organ Donation

 

Draft guidelines for kidney had been placed in public domain for seeking comments and suggestions from the general public. Based on the comments received, the Government has since finalized the said guidelines and issued Allocation Criteria for deceased donor kidney transplant which have been uploaded on the website of National Organ and Tissue Transplant Organization (NOTTO) namely http://www.notto.gov.in.  The allocation policy for organs has been developed keeping in view the ethical, legal and scientific rationale. Further, these guidelines provide for allocation of kidney in a transparent manner. Draft guidelines for Liver and Heart have been prepared/placed on the NOTTO website for seeking comments from public and stakeholders.

These guidelines concern allocation criteria of organs from cadaver donors and not the illegal trading of organs. The illegal trading and transplantation of organs is regulated in terms of the Transplantation of Human Organs and Tissues Act, 1994 and Transplantation of Human Organs and Tissues Rules 2014, which are available on the NOTTO website namely www.notto.gov.in .

Share this:

  • Tweet
  • More
Like Loading...

Online Sale of Medicines

27 Saturday Feb 2016

Posted by raomk in Current Affairs, Health, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Medicines, Online Sale of Medicines

In accordance with the provisions of the Drugs & Cosmetics Act, 1940 and Rules made thereunder, the sale of drugs in the country is regulated by State Licensing Authorities. Accordingly, drugs specified in Schedule H, H1 or Schedule X cannot be sold except on and in accordance with the prescription of a Registered Medical Practitioner. The supply of prescription drugs can be effected only by or under the personal supervision of a registered pharmacist from a licensed premises.

Food and Drug Administration, Maharashtra has taken regulatory action against Snapdeal, Amazon and Flipkart which were found to be selling/distributing medicines to consumers through internet without valid sales bill and requisite licenses.

A number of representations have been received from Chemists and Druggist associations against online sale of prescription drugs. Similarly, a number of representations have also been received to permit such sales.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Health Ministry issues guidelines on Zika Virus Disease

03 Wednesday Feb 2016

Posted by raomk in Current Affairs, Health, International, INTERNATIONAL NEWS, Science

≈ Leave a comment

Tags

Zika, Zika virus

 

The Ministry of Health and Family Welfare,India issued guidelines on the Zika virus disease, here today. The text of the guidelines is as follows.

Background

Zika virus disease is an emerging viral disease transmitted through the bite of an infected Aedes mosquito. This is the same mosquito that is known to transmit infections like dengue and chikungunya.  Zika virus was first identified in Uganda in 1947.

World Health Organization has reported 22 countries and territories in Americas1 from where local transmission of Zika virus has been reported. Microcephaly in the newborn and other neurological syndromes (Guillain Barre Syndrome) have been found temporally associated with Zika virus infection. However, there are a number of genetic and other causes for microcephaly and neurological syndromes like Guillain Barre Syndrome.

Zika virus disease has the potential for further international spread given the wide geographical distribution of the mosquito vector, a lack of immunity among population in newly affected areas and the high volume of international travel. As of now, the disease has not been reported in India. However, the mosquito that transmits Zika virus, namely Aedes aegypti , that also transmits dengue virus,  is widely prevalent in India.

A majority of those infected with Zika virus disease either remain asymptomatic (up to 80%) or show mild symptoms of fever, rash, conjunctivitis, body ache, joint pains. Zika virus infection should be suspected in patients reporting with acute onset of fever, maculo-papular rash and arthralgia, among those individuals who travelled to areas with ongoing transmission during the two weeks preceding the onset of illness.

Based on the available information of previous outbreaks, severe forms of disease requiring hospitalization is uncommon and fatalities are rare. There is no vaccine or drug available to prevent/ treat Zika virus disease at present.

World Health Organization has declared Zika virus disease to be a Public Health Emergency of International Concern (PHEIC) on 1stFebruary, 2016.

[1] Zika virus disease has been reported so far in the following countries; Brazil, Barbados, Bolivia, Columbia, Dominican Republic, Equador, El Salvador, French Guyana. Guadeloupe, Guatemala, Guyana, Haiti, Honduras, Martinique, Mexico, Panama, Paraguay, Puerto Rico, St Martin, Suriname, Virgin Island  and Venezuela. It may be noted   that this list is likely to change with time. Hence, updated information should be checked periodically.

In the light of the current disease trend, and its possible association with adverse pregnancy outcomes, the Directorate General of Health Services, Ministry of Health and Family Welfare advises on the following:

  1. Enhanced Surveillance

1.1.      Community based Surveillance

 

  • Integrated Disease Surveillance Programme (IDSP) through its community and hospital based data gathering mechanism would track clustering of acute febrile illness   and seek  primary case, if any,  among those who travelled to areas with ongoing transmission in the 2 weeks preceding the onset of illness.
  • IDSP would also advise its State and District level units to look for clustering of cases of microcephaly among newborns and reporting of Gullian Barre Syndrome.
  • The Maternal and Child Health Division (under NHM) would also advise its field units to look for clustering of cases of microcephaly among new borns.

1.2       International Airports/ Ports

  • All the International Airports / Ports will display billboards/ signage providing information to travelers on Zika virus disease and to report to Custom authorities if they are returning from affected countries and suffering from febrile illness.
  • The Airport / Port Health Organization (APHO / PHO) would have quarantine / isolation facility in identified Airports.
  • Directorate General of Civil Aviation, Ministry of Civil Aviation  will be asked to instruct all international airlines to follow the recommended aircraft disinsection guidelines
  • The APHOs shall circulate guidelines for aircraft disinsection (as per International Health Regulations) to all the international airlines and monitor appropriate vector control measures with the assistance from NVBDCP in airport premises and in the defined perimeter.

1.3       Rapid Response Teams

  • Rapid Response Teams (RRTs) shall be activated at Central and State surveillance units. Each team would comprise an epidemiologist / public health specialist, microbiologist and a medical / paediatric specialist and other experts (entomologist  etc) to travel at short notice  to investigate suspected outbreak.
  • National Centre for Disease Control (NCDC), Delhi would be the nodal agency for investigation of outbreak in any part of the country.

1.4       Laboratory Diagnosis

  • NCDC, Delhi and National Institute of Virology (NIV), Pune, have the capacity to provide laboratory diagnosis of Zika virus disease in acute febrile stage. These two institutions would be the apex laboratories to support the outbreak investigation and for confirmation of laboratory diagnosis.  Ten additional laboratories  would be strengthened by ICMR to expand the scope of laboratory diagnosis.
  • RT- PCR test would remain the standard test. As of now there is no commercially available test for Zika virus disease. Serological tests are not recommended.
  1. Risk Communication
  • The States/ UT Administrations would create increased awareness among clinicians including obstetricians, paediatricians and neurologists about Zika virus disease and its possible link with adverse pregnancy outcome (foetal loss, microcephaly etc). There should be enhanced vigilance to take note of travel history to the affected countries in the preceding two weeks.
  • The public needs to be reassured that there is no cause for undue concern. The Central/ State Government shall take all necessary steps to address the challenge of this infection working closely with technical institutions, professionals and global health partners.
  1. Vector Control
  • There would be enhanced integrated vector management. The measures undertaken for control of dengue/ dengue hemorrhagic fever will be further augmented. The guidelines for the integrated vector control will stress on vector surveillance (both for adult and larvae), vector management through environmental modification/ manipulation; personal protection, biological and chemical control at household, community and institutional levels. Details are at Annexure-I.
  • States where dengue transmission is going on currently due to conducive weather conditions (Kerala, Tamil Nadu etc) should ensure extra vigil.
  1. Travel Advisory
  • Non-essential travel to the affected countries to be deferred/ cancelled2.
  • Pregnant women or women who are trying to become pregnant should defer/ cancel their travel to the affected areas.
  • All travelers to the affected countries/ areas should strictly follow individual protective measures, especially during day time, to prevent mosquito bites (use of mosquito repellant cream, electronic mosquito repellants, use of bed nets, and dress that appropriately covers most of the body parts).
  • Persons with co-morbid conditions (diabetes, hypertension, chronic respiratory illness, Immune disorders etc) should seek advice from the nearest health facility, prior to travel to an affected country.
  • Travelers having febrile illness within two weeks of return from an affected country should report to the nearest health facility.
  • Pregnant women who have travelled to areas with Zika virus transmission should mention about their travel during ante-natal visits in order to be assessed and monitored appropriately.
  1. Non-Governmental Organizations
  • Ministry of Health &FW / State Health Departments would work closely with Non-Governmental organizations such as Indian / State Medical Associations, Professional bodies etc to sensitize clinicians both in Government and private sector about Zika virus disease.

2  Based on available evidence, World Health Organization  is not recommending any  travel or trade restrictions.

  1.         Co-ordination with International Agencies
  • National Centre for Disease Control, Delhi, the Focal Point for International Health Regulations (IHR), would seek/ share information with the IHR focal points of the affected countries and be in constant touch with World Health Organization for updates on the evolving epidemic.
  1.         Research
  • Indian Council of Medical Research would identify the research priorities and take appropriate action.
  1.         Monitoring
  • The situation would be monitored by the Joint Monitoring group under Director General of Health Services on regular basis. The guidelines will be updated from time to time as the emerging situation demands.

****

MV/SK

 

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

So, what is the Zika virus?

30 Saturday Jan 2016

Posted by raomk in Current Affairs, Health, INTERNATIONAL NEWS, Latin America, Readers News Service, USA, Women

≈ Leave a comment

Tags

Brazil, WHO, Zika virus

 

 

By Peter Gelling

NEED TO KNOW: 

The Zika virus may be the Ebola of 2016, just a lot less deadly. The virus is spreading rapidly throughout the Americas. The World Health Organization said the virus is spreading “explosively.” Health officials are warning of a pandemic. And the news media is starting to take notice.

So, what is the Zika virus? Zika is spread through a certain kind of mosquito that thrives in warmer climates. It’s named after a forest in Uganda and is usually found in Africa and Asia. In fact, until 2015, almost no one in the Western Hemisphere had ever been infected with it.

That’s now changed in a big way. Last May, the Zika virus began showing up in patients in Brazil. And since people in the Americas have no immunity to it, the virus began to spread quickly. Millions of people may already be infected across South and Central America.

The Zika virus, however, is not like Ebola. It won’t kill you. Most people who contract Zika won’t even notice. Those who do will have a fever, joint pain, maybe red eyes. All of it is treatable and it’s unlikely a patient would even have to be admitted to the hospital.

There is one exception: pregnant women. Scientists suspect that a rise in the number of cases of pregnant women giving birth to children with abnormally small heads and brains — a condition called microcephaly — is related to the rise in Zika.

Typically Brazil sees about 150 microcephaly cases a year. It is right now investigating some 4,000 cases. The connection between Zika and microcephaly, however, is circumstantial. Scientists are still researching to see if Zika is actually the cause.

WANT TO KNOW: 

Whether the connection between Zika and microcephaly is true or not, many pregnant women in South and Central America are worried. So are their governments. Some governments are even recommending that women postpone getting pregnant for the next two years.

The growing health crisis in Brazil, where the most cases of microcephaly have been reported, has sparked a new public debate over women’s rights to abortion for troubled pregnancies.

Brazil’s 1940 penal code made abortion a crime in all but two cases: pregnancy from rape and when terminating a pregnancy is necessary to save the mother’s life, writesGlobalPost Senior Correspondent Will Carless. The only amendment to those laws came more than 70 years later, in 2012, when the Supreme Court ruled that women could also terminate a pregnancy if the fetus was diagnosed with anencephaly, a rare condition where the child is born missing pieces of the brain and skull.

The sudden reported uptick in microcephaly cases has reinvigorated a cadre of powerful women’s rights activists in Brazil, some of whom are already preparing a fresh appeal to the Supreme Court to consider granting the right to abortion in the case of microcephaly.

It won’t be easy. Abortion is a controversial subject in Brazil, and the country’s political climate is not friendly to the debate. Conservative politicians have even recently pushed for a harsh new bill that would require rape victims to undergo physical exams before being allowed an abortion because, you know, they haven’t been through enough already.

STRANGE BUT TRUE: 

And while everyone is freaking out about Zika, our old friend swine flu has come back for a sentimental and rather deadly visit. In Russia, Ukraine and Armenia, the virus has killed more than 150 people.

Swine flu had its moment in 2009, you might remember, when it grew to a global pandemic and killed tens of thousands. There is no need to panic this time, though. Since 2009, the virus has become a seasonal sickness that can be treated with vaccinations. The WHO says there is no danger of a new pandemic.

That isn’t stopping people in some parts of Russia and Ukraine from wearing surgical masks on public streets. The paranoia is real. One Russian politician even suggested the outbreak was planted by the United States.

This article appeared in globalpost.com

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d