• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: International

చిలీలో వామపక్ష చారిత్రక విజయం – ఎదురయ్యే సవాళ్లు !

21 Tuesday Dec 2021

Posted by raomk in Current Affairs, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Apruebo Dignidad, Chile Presidential Elections 2021, Gabriel Boric, Latin American left



ఎం కోటేశ్వరరావు


గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపధ్యంలో డిసెంబరు 19న జరిగిన చిలీ మలి విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ ఘనవిజయం సాధించాడు.నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్‌ సోషల్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ 27.92 శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో ఉండగా బోరిక్‌ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. మరో ఐదుగురు మిగతా ఓట్లను పంచుకున్నారు. నిబంధనల ప్రకారం విజేత 50శాతం పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంది. దాంతో తొలి ఇద్దరి మధ్య డిసెంబరు 19 పోటీ జరిగింది. బోరిక్‌ 55.87శాతం, కాస్ట్‌ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నవంబరు 21నే పార్లమెంటు ఉభయ సభలు, 15-17 తేదీలలో స్ధానిక సంస్దల ఎన్నికలు కూడా జరిగాయి. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్‌ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత నయా ఉదారవాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్‌ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్ధి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్‌ ఒకడు, 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అధ్యక్షపదవి పోటీకి 35 సంవత్సరాలు నిండాలి. అది నిండిన తరువాత ఎన్నికలు వచ్చాయి. వచ్చే ఏడాది మార్చి 11న పదవీ బాధ్యతలు స్వీకరించే సమయానికి 36వ పడిలో ప్రవేశిస్తాడు.


1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్‌ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్యచేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్‌ పినోచెట్‌ తరువాత పగ్గాలు చేపట్టి నయాఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు.1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది. మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్‌ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. ఆ పార్టీ ఇప్పుడు వామపక్షాలతో లేదు. గత పది సంవత్సరాలలో అనేక ఉద్యమాలు జరగటంతో నూతన రాజ్యాంగ రచనకు జరిగిన రాజ్యాంగపరిషత్‌ ఎన్నికల్లో వామపక్ష వాదులు, వారిని బలపరిచేవారే ఎక్కువ మంది గెలిచారు. దాని కొనసాగింపుగా జరిగిన ఎన్నికల్లో గాబ్రియెల్‌ బోరిక్‌ విజయం సాధించాడు. పార్లమెంటు ఎన్నికల్లో దానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి.


నయా ఉదారవాద విధానాలు లాటిన్‌ అమెరికా జనజీవితాలను అతలాకుతలం చేశాయి. సంపదలన్నీ కొందరి చేతుల్లో కేంద్రీకృతం కావటంతో ఆర్ధిక అంతరాలు పెరిగి సామాజిక సమస్యలను ముందుకు తెచ్చాయి. ఆ విధానాలను వ్యతిరేకించే-సమర్ధించేశక్తులుగా సమాజం సమీకరణ అవుతోంది.గడచిన రెండు దశాబ్దాల్లో వామపక్ష శక్తులు ఎదిగి విజయాలు సాధించటం వెనుక ఉన్న రహస్యమిదే. ఆ విధానాలను సంపూర్ణంగా మార్చకుండా జనానికి తక్షణ ఉపశమనం కలిగించే చర్యలకు మాత్రమే పరిమితమైతే చాలదని ఆ దేశాల అనుభవాలు వెల్లడించాయి. ఉదారవాద మౌలిక వ్యవస్ధలను అలాగే కొనసాగిస్తే ఫలితం లేదని, ఎదురు దెబ్బలు తగులుతాయని కూడా తేలింది. చిలీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కమూనిస్టు పార్టీ భాగస్వామిగా ఉన్న నాలుగు పార్టీల కూటమి చిలీ డింగో తన అభ్యర్ధిగా కమూనిస్టు డేనియల్‌ జాడ్యూను ప్రకటించింది. తరువాత జరిగిన పరిణామాల్లో బోరిక్‌ నేతగా ఉన్న కన్వర్జన్స్‌ పార్టీతో సహా ఐదు పార్టీల కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌, చిలీ డింగో ఉమ్మడిగా పోటీ చేయాలని అంగీకరించి ” మర్యాదకు మన్నన” అనే అర్దం ఉన్న అప్రూవ్‌ డిగ్నిటీ అనే కూటమి ఏర్పాటు చేశాయి. అభ్యర్ధిగా బోరిక్‌ను ఎన్నుకున్నారు. చిలీ రాజకీయాల్లో ఉన్న పరిస్ధితుల్లో వివిధ పార్టీల కూటములు తప్ప ఒక పెద్ద పార్టీగా ఎవరూ రంగంలోకి దిగలేదు.


సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్ధానంలో వచ్చిన బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు.ఈ క్రమంలో బోరిక్‌ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్దతి ప్రకారం కమ్యూనిస్టునిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్‌ తన విజయ సందేశంలో చెప్పాడు. ఉదారవాద విధానాలను అణచివేసేందుకు గత పాలకులు స్వజనం మీదనే మిలిటరీని ప్రయోగించారని అటువంటిది మరోసారి పునరావృతం కాదని అన్నాడు.ప్రస్తుత అధ్యక్షుడు పినేరా 2019లో మిలిటరీని దించి జనాన్ని అణచివేశాడు.


అధ్యక్షపదవిలో వామపక్షవాది విజయం సాధించినప్పటికీ పార్లమెంటు ఉభయ సభల్లోనూ మితవాదులే అత్యధికంగా గెలవటం ఒక ప్రమాదాన్ని సూచిస్తున్నది.1973లో సాల్వెడోర్‌ అలెండీ మీద అమెరికా సిఐఏ అండతో చేసిన కుట్రలో పార్లమెంటులోని మెజారిటీ మితవాదశక్తులు ఒక్కటయ్యాయి. ఇప్పుడు అనేక దేశాలు వామపక్ష శక్తులకు పట్టంగట్టటం మొత్తం ఉదారవాద విధానాలనే సవాలు చేస్తున్న తరుణంలో చిలీలో ఉన్న మితవాద శక్తులు ఎలా స్పందిస్తాయో ఎవరూ చెప్పలేరు. మరోసారి 1973 పునరావృతం అవుతుందా అంటే సామ్రాజ్యవాదులు ఎంతకైనా తెగిస్తారని హెచ్చరించక తప్పదు.పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్‌లో 155 స్ధానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే, రెండు పచ్చి మితవాద కూటములకు 105వచ్చాయి. ఇదే విధంగా ఎగువ సభలోని 50 స్దానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్నఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్దానాలను గెలుచుకున్నారు. ఈ నేపధ్యంలో వామపక్ష అధ్యక్షుడికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పనవసరం లేదు. నయా ఉదారవిధానాలను జనం ప్రతిఘటించిన చరిత్ర, లాటిన్‌ అమెరికాలో ఉన్న వామపక్ష ప్రభుత్వాల మద్దతు ఉన్న పూర్వరంగంలో మితవాదశక్తులు ఎలా వ్యవహరిస్తాయో చూడాల్సి ఉంది. అవసరమైతే జనం మరోసారి వీధుల్లోకి వస్తారు.


తొలి రౌండులో ఆధిక్యత సాధించిన మితవాదులు తమదే అంతిమ గెలుపు అని భావించారు. సర్వేలన్నీ పరిస్ధితి పోటాపోటీగా ఉంటుందని, ప్రతి ఓటూ ఫలితాన్ని నిర్దేశించేదేనని చెప్పాయి. ఈ కారణంగానే మితవాద అభ్యర్ది జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ ఎన్నికలకు ముందు మాట్లాడుతూ మెజారిటీ 50వేలకు అటూఇటూగా ఉంటే ఫలితాన్ని న్యాయ స్దానాలే తేల్చాలని మరీ చెప్పాడు. కాస్ట్‌కు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం బోరిక్‌ మద్దతుదార్లుగా ఉన్న పేద, మధ్యతరగతి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా చూసేందుకు ఎన్నికల రోజున రాజధాని పరిసర ప్రాంతాలలో ప్రజారవాణాను గణనీయంగా నిలిపివేసింది. అయినా ఓటర్లు గత అన్ని ఎన్నికలంటే ఎక్కువగా 55.4శాతం మంది ఓటు హక్కు వినియోగించుకొని రికార్డు నెలకొల్పారు. మితవాదులు, వారికి మద్దతుగా ఉన్న మీడియా దీన్ని ఊహించలేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో 46.7,41.98శాతాల చొప్పున ఓటింగ్‌ జరిగింది. గత పదేండ్లుగా ఉద్యమించిన యువత తమ నేతకు పట్టం కట్టాలని మరింత పట్టుదలతో పని చేశారు. మరో వెనెజులా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ఓటర్లు ఖాతరు చేయ లేదు. ఇలాంటి ప్రచారాలను మిగతా దేశాల్లో కూడా చేసినా అనేక చోట్ల ఓటర్లు వామపక్షాలకు పట్టం కట్టటాన్ని చిలీయన్లు గమనించారు. రెండవ దఫా ఎన్నికల్లో మితవాద శక్తులు వామపక్షాలను రెచ్చగొట్టేందుకు ఎంతగానో ఉసిగొల్పినా బోరిక్‌ ఎంతో సంయమనం పాటించాడు. మాదక ద్రవ్యాలకు బానిస అంటూ టీవీ చర్చలు, సామాజి మాధ్యమాల్లో చేసిన తప్పుడు ప్రచారాన్ని ఒక టీవీ చర్చలో బోరిక్‌ తిప్పి కొడుతూ ప్రత్యర్దుల నోరు మూతపడేలా ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదంటూ అధికారికంగా జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని ప్రదర్శించి నోరు మూయించాడు. గత ఏ ఎన్నికలోనూ ఈసారి మాదిరి దిగజారుడు ప్రచారం జరగలేదని విశ్లేషకులు చెప్పారు.


చిలీ ఆర్ధిక స్ధితి సజావుగా లేదు. బోరిక్‌ విజయవార్తతో స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. సోమవారం నాడు ఒమిక్రాన్‌, తదితర కారణాలతో లాటిన్‌ అమెరికా కరెన్సీ ఐదుశాతం పడిపోతే చిలీ పెసో 18శాతం దిగజారింది. కొత్త ప్రభుత్వం మార్కెట్‌ ఆర్ధిక విధానాల నుంచి వైదొలగనుందనే భయమే దీనికి కారణం. వచ్చే ఏడాది బడ్జెట్‌లో 22శాతం కోత విధించాలన్న ప్రతిపాదనను తాను గౌరవిస్తానని బోరిక్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటో అతనికి తెలియనట్లు అని పిస్తోందని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు. ఒకశాతం మంది ధనికుల చేతిలో దేశంలోని సంపదలో నాలుగో వంతు ఉంది. మితవాది కాస్ట్‌ తాను గెలిస్తే పన్నులతో పాటు సామాజిక సంక్షేమానికి ఖర్చు తగ్గిస్తానని బహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. దానికి భిన్నంగా ధనికుల మీద అధికపన్నులు వేస్తామని, సంక్షేమానికి పెద్ద పీటవేస్తామని చెప్పాడు. పెన్షన్‌ సొమ్ముతో ఇప్పటి మాదిరి పెట్టుబడిదారులు లాభాలు పొందకుండా పెన్షనర్లకు ఫలాలు దక్కేలా చేస్తానని కూడా వాగ్దానం చేశాడు. దేశంలో విద్యా, వైద్యం, రవాణా వంటి సేవలన్నీ కొనుగోలు చేసే వినిమయ వస్తువులుగా గత పాలకుల ఏలుబడిలో మారిపోయాయి.2018లో మెట్రో చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది.అది చివరకు మితవాద ప్రభుత్వాన్ని దిగివచ్చేట్లు చేసింది. దాని నేతలలో గాబ్రియెల్‌ బోరిక్‌ ఒకడు. అందువలన సహజంగానే యువత పెద్ద ఆశలతో ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే ఇక ముందు జరగనున్నది మరొకటి.ఎన్నికలు రసరమ్యమైన కవిత్వంలా ఉంటాయని పాలన దానికి భిన్నమైన వచనంలా ఉంటుందనే నానుడిని కొందరు ఉటంకిస్తూ బోరిక్‌ ఎలా పని చేస్తారో చూడాలని చెప్పారు.తాను పుట్టక ముందు 1973లో సాల్వడార్‌ అలెండీపై జరిగిన కుట్ర చరిత్రను గమనంలో ఉంచుకొని సామ్రాజ్యవాదుల పన్నాగాలను ఎదుర్కొంటూ బోరిక్‌ ముందుకు పోవాలని యావత్‌ వామపక్ష శ్రేణులు ఎదురు చూస్తున్నాయి

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా పిల్లల చేతిలో కంగుతిన్న కమ్యూనిస్టు వ్యతిరేకి -ఆస్ట్రియాలో చిన్న నగరమిచ్చిన పెద్ద సందేశం !

30 Thursday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Anti communist, Austrian Communist Party, I Love Communism, Left politics, Styrian capital Graz


ఎం కోటేశ్వరరావు


మారిన పరిస్ధితులను గమనించకుండా మొరటుగా వ్యవహరిస్తే ఏమౌతుందో అమెరికాలోని ఒక స్కూలు పిల్లలు నిరూపించారు. కరోనా నిరోధ చర్యల్లో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని హంటింగ్‌టన్‌ బీచ్‌ హైస్కూలు అధికారులు మాస్కులు ధరించి రావాలని పిల్లలను ఆదేశించారు. అయితే మాస్కులను వ్యతిరేకిస్తున్న బయటి వారు కొంత మంది వారం రోజుల క్రితం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్కూలు దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. మాకు నిరసన తెలిపే హక్కు ఉంది, రోజంతా ఇక్కడే ఉంటాం అని మెగాఫోన్‌లో ఒక వ్యక్తి ప్రకటించాడు. అంతటితో ఆగలేదు. మాస్కులు పెట్టుకున్న పిల్లలను చూసి ఈ గుంపును చూస్తుంటే కమ్యూనిజానికి మద్దతు ఇచ్చే విధంగా వీరి బుద్ది శుద్ది చేసినట్లుగా ఉంది అంటూ తన వద్ద ఉన్న కెమెరాను వారి వైపు తిప్పాడు. దాంతో ఒక బాలిక కమ్యూనిజం అంటే ఏమిటో చెప్పండి అని అతగాడిని ప్రశ్నించింది. చూస్తుంటే మీకు అదేమిటో తెలిసినట్లు లేదు అన్నాడతడు. మాకు కమ్యూనిజం అంటే ఇష్టం అని ముక్తకంఠంతో పిల్లలు అరిచారు. అయితే మీరు క్యూబా ఎందుకు పోలేదు అని నోరు పారవేసుకున్నాడతడు. దాంతో మరో పిల్ల నేను క్యూబన్నే అంది. నువ్వు క్యూబన్‌ అంతే కదా అంటే నువ్వొక క్యూబన్‌ పిచ్చిగొడ్డువి, నువ్వొక బుద్దిలేని క్యూబన్‌ ఆడదానివి అంటూ బూతులకు దిగాడు. దాంతో ఒళ్లు మండిన పిల్లలంతా ఒక్కుమ్మడిగా బుద్దిలేని వాడివి నువ్వు, చండాలమైన శ్వేతజాతి దురహంకారివి అంటూ ముందుకు వచ్చి నేను కమ్యూనిజాన్ని ప్రేమిస్తాను అంటూ కెమెరా వైపు వేళ్లు చూపుతూ నినాదాలు చేశారు.


దాంతో గుక్కతిప్పుకోలేని అతగాడు ఓV్‌ా మీరంతా కమ్యూనిస్టులన్నమాట, నేను తెలుసుకుంటాను, అలా అయితే మీరు ఉండకూడని దేశంలో ఉన్నారు. అంటూ వారి వద్ద నుంచి జారుకున్నాడు. తరువాత కెమెరా ముందు మాట్లాడుతూ మన పిల్లల బుద్దిని ఇలా శుద్ది చేశారు, వారు కమ్యూనిజాన్ని ఆరాధిస్తున్నారు. స్వేచ్చను ద్వేషిస్తున్నారు. వారిని చూడండి అందరూ కమ్యూనిస్టులు, వారిని మనం భరించాలి. పాఠశాల వ్యవస్ధ మన పిల్లలకు ఇలాంటి బోధన చేస్తోంది అని వ్యాఖ్యానించాడు. ఈ ఉదంతాన్ని చిత్రించిన ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడిన ఒక విద్యార్ధి ” మేము కేవలం స్కూలు పిల్లలం, ఇలాంటి నిరసన అవాంఛనీయం. రోజంతా స్కూల్లో ఉన్నాం, ఈ నిరసన గురించి మాకు తెలియదు, ఇలాంటి వారిని ఎదుర్కొనే శక్తికూడా మాకు లేదు అని వ్యాఖ్యానించింది. నిరసన కారులు పాఠశాల బయటే ఉన్నందున పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.న్యూస్‌వీక్‌ వంటి పత్రికలు ఈ ఉదంతం గురించి రాశాయి. ఈ నిరసన ఘటన మీద తలిదండ్రులు నిరసన తెలిపారు. విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని నిరసన తెలపటం ఏమిటని అభ్యంతర పెట్టారు. మాస్కు ధరించాలా లేదా అన్నది స్కూలు కమిటీలు నిర్ణయిస్తాయి. టీచర్లు, విద్యార్ధులు ఆ నిర్ణయాల మీద అభిప్రాయాలు చెప్పవచ్చు తప్ప అంతిమ నిర్ణయం కమిటీలదే.అమెరికాలో కమ్యూనిస్టు పార్టీకి పార్లమెంటులో సీట్లు లేవు. ఓటర్లను ప్రభావితం చేయగల పరిస్ధితి కూడా లేదు. అయినా కమ్యూనిస్టు సిద్దాంతాన్ని మేము ప్రేమిస్తామని స్కూలు పిల్లలు కూడా చెబుతున్నారంటే అర్ధం ఏమిటి ? పెట్టుబడిదారీ విధానం తమను ఉద్దరించదు అని వారికి కూడా తెలిసిపోతోందనే కదా ! గతంలో కమ్యూనిజం విఫలమైందనే బోధనలు విన్న అమెరికన్లు ఇప్పుడు తమ అనుభవంలో పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, కమ్యూనిజమే మెరుగని భావిస్తున్నారు. ముఖ్యంగా యువతలో అలాంటి ధోరణులు పెరుగుతున్నాయి. అదే ఈ స్కూల్లో కూడా ప్రతిబింబించింది.


పొద్దున లేస్తే చైనాలో మానవహక్కులు లేవు, మట్టి లేవు అంటూ ప్రచారం చేసే దేశాలలో బ్రిటన్‌ ఒకటి. ఊరందరినీ ఉల్లిపాయ తినొద్దని చెప్పాను తప్ప మనింట్లో వేయవద్దన్నానా అని మండిపడిన బోధకుడి కధ తెలిసిందే. బ్రిటన్‌ తమ దేశంలో ఉద్యోగవిరమణ చేసిన వారి పెన్షన్‌ నిధులను అదే చైనాలో పెట్టుబడులుగా పెడుతోంది. ఇటీవలి నెలల్లో బ్రిటన్‌ పెన్షన్‌ నిధులు, ఇతర పెట్టుబడి సంస్ధలు చైనాలో పెట్టిన పెట్టుబడులు కొత్త రికార్డు నెలకొల్పినట్లు హాంకాంగ్‌ వాచ్‌ అనే సంస్ధ తాజాగా ప్రకటించింది. చైనా మీద విమర్శలు చేసే విధాన నిర్ణేతలు, ప్రజానాయకులు-పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకొనే నిపుణుల మధ్య సమాచార, అవగాహన దూరం ఉందని, బాధ్యత లేకుండా ఉన్నారని ఆ సంస్ధ ధ్వజమెత్తింది. ఆర్ధిక వ్యవస్ధలకు లాభాలు తప్ప సామాజిక పరంగా పడే ప్రభావాలు పట్టటం లేదని వాపోయింది. ఝెజియాంగ్‌ దహువా టెక్నాలజీస్‌ అనే సంస్ధ ముఖాలను గుర్తించే ఒక సాఫ్ట్‌వేర్‌ను కమ్యూనిస్టు పార్టీకి తయారు చేసి ఇచ్చిందట. అది మనుషుల్లో ఎవరు ఏ జాతి వారో గుర్తు పడుతుందట. దానిలో భాగంగా యుఘీర్‌ ముస్లింలను గుర్తించి పార్టీకి తెలియచేస్తుందట. ఆ సంస్ధలో లీగల్‌ అండ్‌ జనరల్‌ అనే నిధుల సంస్ధ పెట్టుబడి పెట్టిందట. ముస్లింలను గుర్తించే ఉత్పత్తి చేసినట్లు తెలిసిన తరువాత అక్కడి నుంచి తీసుకొని వేరే కంపెనీల్లో పెట్టిందట. దానితో పాటు యూనివర్సిటీస్‌ సూపర్‌యాన్యుయేషన్‌ స్కీము(యుఎస్‌ఎస్‌) అనే సంస్ధ కూడా ఈఏడాది మార్చి ఆఖరుకు చెనా అలీబాబా, టెన్సెంట్‌ కంపెనీలలో 80 కోట్ల పౌండ్లు పెట్టుబడులు పెట్టాయని తెలిపింది.ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆర్ధిక వ్యవస్ధలలో ఒకటైన చైనాలో పెట్టుబడులు పెట్టాలని రిషి సునాక్‌ అనే ఛాన్సలర్‌ ప్రోత్సహించినట్లు కూడా హాంకాంగ్‌ వాచ్‌ పేర్కొన్నది. ఈ గ్రూప్‌ ఇంతగా స్పందించటానికి కారణం అది చైనా నుంచి హాంకాంగ్‌ వేర్పాటును సమర్ధిస్తున్నది.లీగల్‌ అండ్‌ జనరల్‌ సంస్ధ తాజాగా కూడా పెట్టుబడులను విస్తరించాలని చూసినట్లు లండన్‌ పత్రిక టెలిగ్రాఫ్‌ రాసింది. ఒక్క బ్రిటన్‌ సంస్ధలే కాదు, అమెరికా, ఐరోపాలకు చెందిన అనేక సంస్ధలు చైనా మార్కెట్లో లాభాల కోసం పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నాయి.


హిట్లర్‌కు జన్మనిచ్చిన ఆస్ట్రియా తరువాత కాలంలో అదే హిట్లర్‌ దురాక్రమణకు గురైంది. తరువాత 1955లో తటస్ధ రాజ్యంగా ప్రకటించుకుంది. 1959 నుంచి పార్లమెంట్‌లో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లేదు.అలాంటి చోట రాజధాని వియన్నా తరువాత మూడు లక్షల జనాభాతో రెండవ పెద్ద నగరంగా ఉన్న గ్రాజ్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో అనూహ్యంగా కమ్యూనిస్టులు పెద్ద పక్షంగా ఎన్నికయ్యారు. పార్టీలో ఎంత మంది ఉన్నారు అని గాకుండా ఆశయం కోసం పని చేస్తే ఎక్కడైనా కమ్యూనిస్టులను జనం ఆదరిస్తారు అనే అంశం ఇక్కడ ముఖ్యం. పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదే, మనల్ని ఎవరు ఆదరిస్తారు అని అక్కడి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆలోచించి ఉంటే అసలు ఎర్రజెండానే ఎగిరేది కాదు. పద్దెనిమిది సంవత్సరాలు విరామం లేకుండా అధికారంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద పార్టీని ఓడించి కమ్యూనిస్టులు ఇలా ముందుకు వస్తారని ఎవరూ ఊహించలేదు.వారికి 48 డివిజన్లు ఉన్న కార్పొరేషన్‌లో 28.8శాతం ఓట్లు, 15 సీట్లు వచ్చాయి. గ్రీన్స్‌ పార్టీకి తొమ్మిది వచ్చాయి. ఆ రెండు పార్టీలు కలిసేందుకు అవకాశం ఉంది, అయినా మెజారిటీకి ఒక ఓటు తక్కువ గనుక మరొక పక్షం మద్దతు అవసరం. దాని గురించి సంప్రదింపులు జరుపుతున్నారు.


ఇక్కడ ఒక కార్పొరేషన్‌లో అధికారం రావటం ముఖ్యం కాదు. పక్కనే ఉన్న తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు, సోవియట్‌ యూనియన్‌ కూలిపోయాయి. కమ్యూనిస్టు వ్యతిరేకులు రెచ్చిపోతున్నారు. చుట్టూ కనుచూపు మేరలో కమ్యూనిజం గురించి ఆశారేఖలు కనిపించని చోట ఎర్రజెండాను ఎత్తుకొని నిలవటం, దాని మీద ఉన్న అచంచల విశ్వాసం ప్రదర్శించటం. ఊపుగా ఉన్నపుడు జండాను పట్టుకొని ముందువరుసలో హడావుడి చేయటం, ఎదురుదెబ్బలు తగలగానే పత్తాలేని వారిని ఎందరినో చూస్తున్న తరుణంలో ఏ ఆశారేఖ ఆస్ట్రియా కమ్యూనిస్టులను ముందుకు నడిపించిందో అందరూ అధ్యయనం చేయటం అవసరం. ఆస్ట్రియా ప్రస్తుతం మితవాదశక్తుల పట్టులో ఉంది. అలాంటి చోట ఎర్రజెండా ఎగిరింది.


తొమ్మిది రాష్ట్రాల ఫెడరేషన్‌ ఆస్ట్రియా, జనాభా 90లక్షలు. వాటిలో ఒక రాష్ట్రం స్ట్రిరియా, దాని రాజధాని గ్రాజ్‌. అక్కడే కమ్యూనిస్టులు విజయం సాధించారు. జాతీయ ఎన్నికల్లో ఒకశాతం ఓట్లు మాత్రమే సాధిస్తున్నా, ఈ రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలుగా ఇరవైశాతం ఓట్లు తెచ్చుకొంటోంది. పార్టీకి నిబద్దులైన నాయకులు,కార్యకర్తలు నిరంతరం జనం, వారి సమస్యల పట్ల స్పందించటం, మిగిలిన పార్టీలన్నీ ప్రయివేటీకరణ ప్రవాహంలో కొట్టుకుపోయినా వ్యతిరేక వైఖరి తీసుకోవటం సరైనదని జనం గుర్తించారు.అందుకే రాజధాని నగరంలో పెద్ద పార్టీగా ఎన్నికైంది.1991లో అద్దెకుండే వారి సమస్యలను తీసుకొని జనానికి దగ్గరకావటంతో పాటు, పార్టీ లీగల్‌ సాయం కూడా అందించటంతో జనంలో విశ్వాసం ఏర్పడింది. తమ ఆదాయంలో 55శాతం అద్దెలకే చెల్లిస్తున్న తరుణంలో మూడోవంతు కంటే ఎవరి నుంచీ అద్దె వసూలు చేయకూడదని గ్రాజ్‌ పట్టణ కౌన్సిల్లో కమ్యూనిస్టు పార్టీ ఒక తీర్మానం పెట్టింది, దాన్ని మిగతా పార్టీలనీ తిరస్కరించాయి. అయితే చట్టంలో ఉన్న ఒక అవకాశాన్ని వినియోగించుకొని పదిహేడువేల మంది ప్రభుత్వ గృహాల్లో ఉండేవారు, అద్దెకుండే వారి నుంచి సంతకాలు సేకరించి తిరిగి అదే తీర్మానాన్ని ప్రవేశపెట్టటంతో ఏకగ్రీవ ఆమోదం పొందింది.1998లో కమ్యూనిస్టు పార్టీ 7.9శాతం ఓట్లు పొందింది. అప్పటి పాలక సంస్ధ కమ్యూనిస్టు పార్టీ నేత కాల్ట్‌నెగర్‌కు గృహాల స్ధాయీ సంఘ బాధ్యత అప్పగించింది. దాని నిర్వహణలో పార్టీ వైఫల్యం చెందుతుందనే దురాలోచన మిగతా పార్టీల్లో ఉంది. అయితే అనుకున్నదొకటి జరిగింది మరొకటి అన్నట్లుగా ప్రభుత్వం ఇచ్చిన గృహాలకు అంతకు ముందు కంటే భిన్నంగా ప్రతి ఇంటికి విడిగా మరుగుదొడ్డి, స్నానాలగది ఉండేట్లు కమ్యూనిస్టు నేత సాధించారు. దాంతో మరుసటి ఎన్నికల్లో పార్టీ 20.8శాతం ఓట్లు పొందింది.

కౌన్సిల్లో ఉన్న ప్రాతినిధ్యంతో పాటు బయట పార్టీ వైపు నుంచి కూడా ఉద్యమాలతో వత్తిడి తేవటంతో కమ్యూనిస్టులు, మిగతా పార్టీలకు ఉన్న తేడాను జనం గమనించారు. ఎన్నికలు జరిగిన మరుసటి ఏడాది 2004లో పట్టణంలోని ప్రభుత్వ గృహాలను ప్రయివేటీకరించేందుకు మిగిలిన పార్టీలన్నీ అంగీకరించినా కమ్యూనిస్టుపార్టీ అడ్డుకుంది. అదే సమయంలో పక్కనే ఉన్న జర్మనీలో సంకీర్ణ కూటమిలో అధికారంలో ఉన్న వామపక్ష డైలింక్‌ పార్టీ గృహాల ప్రయివేటీకరణ చేసింది. దానితో పోల్చుకున్న గ్రాజ్‌ పట్టణ ప్రజలు ఆస్ట్రియా కమ్యూనిస్టు పార్టీ వైఖరిని ప్రశంసించారు. పదివేల మంది సంతకాలు సేకరించి ప్రయివేటీకరణ జరపాలా లేదా అని అధికారయుతంగా పట్టణంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపే విధంగా కమ్యూనిస్టులు చేసిన కృషి ఫలించింది. పౌరుల్లో 96శాతం మంది ప్రయివేటీకరణను వ్యతిరేకించటంతో అది ఆగిపోయింది.


అక్కడి నిబంధనల ప్రకారం దామాషా పద్దతిలో వచ్చిన ఓట్లను బట్టి నగరపాలక సంస్ధలో సీట్లు కేటాయిస్తారు. అ విధానం కూడా కమ్యూనిస్టులకు అనుకూలించింది. పార్టీ ప్రతినిధులు ఎన్నడూ పాలకపక్షంగా లేకపోయినా రోడ్లు, రవాణా, ఆరోగ్య స్ధాయీ సంఘాలకు బాధ్యత వహించి పౌరుల మన్ననలు పొందారు. వృద్దులు ఆసుపత్రులకు పోనవసరం లేకుండా ఇంటి దగ్గరే సేవలు పొందేందుకు అవసరమైన అలవెన్సును అందచేసే ఏర్పాటు చేశారు. అన్నింటికీ మించి కరోనా సమయంలో ఆరోగ్య స్ధాయీ సంఘబాధ్యతలో ఉన్న కమ్యూనిస్టు నేత చేసిన కృషి ప్రశంసలు పొందింది.ఈ ఎన్నికల్లో అది ప్రతిఫలించి పార్టీని ప్రధమ స్ధానానికి చేర్చింది. కమ్యూనిస్టువ్యతిరేక వాతావరణం పరిసర దేశాల్లో ఉన్నప్పటికీ ఆస్ట్రియా కమ్యూనిస్టులు అవసరమైనపుడు తాము మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనినిజాలకు కట్టుబడి ఉన్నామని బహిరంగంగా చెప్పారు, గర్వపడ్డారు.


సోవియట్‌ కాస్మొనాట్‌ యూరీ గగారిన్‌ అంతరిక్షంలోకి వెళ్లి ఆరుదశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆస్ట్రియా కమ్యూనిస్టు పార్టీ ఉత్సవాలను జరపాలని పిలుపు ఇచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకొని అన్ని రకాల భావజాలాలను వ్యతిరేకిస్తున్నట్లు, వాటికి దూరంగా ఉంటామని అన్ని పార్టీలూ నగరపాలక సంస్ధలో ఒక తీర్మానం ద్వారా వెల్లడించాలని అధికార మితవాద ఓవిపి పార్టీ ప్రతిపాదించింది. కమ్యూనిస్టులు తప్ప వామపక్షంగా చెప్పుకొనే గ్రీన్స్‌, ఎస్‌పిఓతో సహా అన్ని పార్టీలు ఆమోదించాయి. చరిత్ర గురించి ఎవరికి వారు చర్చించి వైఖరి తీసుకోవాలి తప్ప కమ్యూనిజాన్ని-నాజీజాన్ని ఒకే గాటన ఎలా కడతామని కమ్యూనిస్టు పార్టీ ప్రశ్నించింది. దాన్ని అవకాశంగా తీసుకొని అధికారంలోని మితవాద పార్టీ కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ గ్రాజ్‌ పట్టణంలో పార్టీ నిత్యం జనంతో ఉన్న కారణంగా వాటిని తోసిపుచ్చారని ఫలితాలు వెల్లడించాయి. పార్టీ సోషలిజం సాధన ఆశయంగా పని చేస్తున్నప్పటికీ స్ధానిక సంస్ధల ఎన్నికలు గనుక ప్రజాసమస్యలే ప్రధానంగా పని చేసింది. ఈ ఎన్నికల్లో సోషలిజం గురించి తాము బోధించనప్పటికీ వామపక్ష రాజకీయాలను కింది నుంచి నిర్మించాలని, ఒక్క మున్సిపాలిటీ అనే కాదు, ఒక దుకాణంలో పని చేసే వారి దగ్గర నుంచి అంటే అత్యంత దిగువ స్ధాయి నుంచి పార్టీ నిర్మాణం జరిపితే జాతీయ రాజకీయాలకు ఎదగటం సాధ్యమే అని ఇరుగుపొరుగు పోర్చుగీసు, బెల్జియం వంటి ఐరోపా దేశాల అనుభవాలు సూచిస్తున్నాయని ఆస్ట్రియా కమ్యూనిస్టులు చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జపాన్‌ మీద అణుబాంబు వేస్తామని చైనా బెదిరించిందా ? నిందలు-నిజాలేమిటి ?

07 Saturday Aug 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#Nuke Japan, China Threat, Taiwan Matters


ఎం కోటేశ్వరరావు


జూలై మూడవ వారంలో మన దేశంతో సహా ప్రపంచ మీడియాలో ఒక వార్త వచ్చింది. అదేమంటే జపాన్‌ మీద అణుబాంబులు వేస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది లేదా ప్రకటించింది. నిత్యం చైనాను రెచ్చగొట్టే దేశాలలో జపాన్‌ కూడా ఒకటి గనుక దానికి చైనా దిమ్మతిరిగే జవాబు ఇచ్చిందని ఎవరైనా కమ్యూనిస్టులు కూడా లోలోపల సంతోషించారేమో తెలియదు. వ్యతిరేకులు మాత్రం వెంటనే అందుకున్నారు. దీనిలో నిందలు- నిజాలేమిటి ? కౌపీన సంరక్షణార్ధం చివరికి ఒక సర్వసంగ పరిత్యాగి సంసార ఊబిలోకి దిగాల్సి వచ్చిందనే కథ తెలిసిందే కదా ! సదరు వార్తను పట్టుకొని గోతికాడ నక్కల్లా కూర్చున్న కొందరు అలాంటి కథలనే అల్లారు, వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో చెప్పింది ఏమిటి ?


” అణ్వాయుధాలను తాముగా ముందు ఉపయోగించబోమని గతంలో ప్రకటించిన విధానానికి చైనా తిలోదకాలు ఇచ్చింది. ఇప్పుడు జపాన్ను బెదిరించింది కనుక యావత్‌ దేశాలకూ ముప్పు వచ్చింది. చైనా వారు 250 అణుబాంబులను భూగర్భంలో దాస్తున్నారు. వాటిని ప్రత్యర్ధులు పసిగట్టలేరు. కానీ అమెరికా కనుగొన్నది. ప్రత్యర్ధుల దాడికి దొరకవు. అందువలన ఆసియన్‌ దేశాలన్నీ అణ్వాయుధాలను సమకూర్చుకోవాలి.” ఇలాంటి వ్యాఖ్యానాలతో చైనా బెదిరింపుల గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. ఈ కధనాలను ఆగస్టు ఆరవ తేదీన ఈనాడు పత్రికలో వ్యాసరచయిత కూడా తలకెత్తుకొని నేను సైతం అన్నట్లుగా ఒక రాయి వేశారు.


చైనా గురించి వచ్చిన వార్తలు, వ్యాఖ్యల్లో నిజమెంత, అసలేం జరుగుతోంది ? తైవాన్ను ఆక్రమించుకొనేందుకు చైనా ప్రయత్నించినపుడు దాన్ని అడ్డుకొనేందుకు జపాన్‌ ఒక సైనికుడు, ఒక నౌక, ఒక విమానాన్ని పంపినప్పటికీ అది లొంగిపోయేంతవరకు అణుబాంబులను ప్రయోగించాల్సిందే అని చైనా కమ్యూనిస్టు పార్టీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చైనా ప్రధాన ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో తైవాన్‌ దీవి ఉంది. అది చైనాలో తిరుగుబాటు రాష్ట్రం. దానికి ఒక వైపున దక్షిణ చైనా సముద్రం, రెండో వైపు తూర్పు చైనా సముద్రం ఉంది. మరోవైపున జపాన్‌ ఉంది. ఐక్యరాజ్యసమితి జాబితాలో తైవాన్‌ అనే దేశం లేదు. నిత్యం వివాద పడుతున్న అమెరికా, జపాన్‌ కూడా ఆ ప్రాంతం చైనాకు చెందినదే అని అంగీకరించాయన్న వాస్తవాన్ని ముందు తెలుసుకోవాలి. చైనా విప్లవ సమయంలో కమ్యూనిస్టులను ఎదిరించిన నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ అప్పటి మిలిటరీ, ఆయుధాలను అన్నింటినీ తీసుకొని తైవాన్‌ దీవిలో కేంద్రీకరించాడు. అతగాడికి అమెరికా,బ్రిటన్‌,జపాన్‌ వంటి దేశాలన్నీ ఆయుధాలు అందించి పటిష్టపరిచాయి. కమ్యూనిస్టులు తైవాన్‌ దీవి మీద తమ బలాన్నంతటినీ కేంద్రీకరించటం కంటే మిగతా దేశంలో ఎదురవుతున్న ప్రతిఘటనను అణచివేయటమే ముఖ్యం, తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని అనుకున్నారు. మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ తన అధికారాన్ని స్ధిరపరచుకొనేందుకు పది సంవత్సరాల పట్టింది. ఈలోగా తైవాన్‌లోని మిలిటరీని మరింత పటిష్టపరిచారు.

1970వరకు అంటే రెండు దశాబ్దాల పాటు తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా ఐక్యరాజ్యసమితిలో గుర్తించటం, అధికారిక సంబంధాలు పెట్టుకోవటం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపధ్యంలో సైనిక చర్య కంటే శాంతియుత విలీనానికే ప్రాధాన్యత ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. తరువాత రెండు చైనాలు అనేవి లేవు, ఉన్నది ఒకటే, అది కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న ప్రధాన ప్రాంతంలోనిదే అసలైన చైనా అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించింది. కానీ విలీనానికి తగిన పరిస్ధితులు లేవు, తైవానీయుల్లో అనుమానాలు ఉన్నాయి, అవి తొలగిన తరువాతే విలీనం జరగాలి అంటూ అమెరికా నాయకత్వంలోని దేశాలు అప్పటి నుంచి నేటికీ విలీనానికి అడ్డుపడుతున్నాయి.


జపాన్ను బెదిరించిందంటూ పేర్కొంటున్న ఆ వీడియో కథేమిటి ? మిలిటరీ వ్యవహారాలను పరిశీలించే కొందరు వ్యాఖ్యాతలు సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ పేరుతో నడుపుతున్న ఇంటర్నెట్‌ ఛానెల్లో సదరు వీడియోను ప్రసారం చేశారు. దాన్ని గ్జి గువా (యు ట్యూబ్‌ వంటిది)లో పెట్టారు. సదరు ఛానల్‌తో కమ్యూనిస్టు పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అవసరం అయితే అణుబాంబులు వేయాలి అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వీడియోను తొలగించాలని చైనా ప్రభుత్వం సలహా ఇచ్చి ఉండవచ్చు లేదా ఛానల్‌ స్వయం నిర్ణయంతోగానీ దాన్ని తొలగించారు. అయితే అప్పటికే దానిని లక్షలాది మంది షేర్‌ చేశారు. స్ధానిక కమ్యూనిస్టు పార్టీ శాఖలు నిర్వహించే సామాజిక మాధ్యమ ఛానళ్లు వాటిలో ఉన్నాయి. వాటిని కూడా తరువాత తొలగించారు. ప్రపంచ మీడియాలో వార్తలకు కారణమైన సదరు వీడియో బావోజీ అనే పట్టణంలోని కమ్యూనిస్టు పార్టీ ఛానల్‌లో అలాగే ఉంది. దాన్ని చూపి అమెరికాలో స్ధిరపడిన చైనా జాతీయురాలు ఒకామె జపాన్ను కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది అంటూ ట్వీట్లు చేశారు, దానిలో ఉన్న వ్యాఖ్యానాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. వాటిని ఆధారం చేసుకొని మీడియాలో కథలు రాశారు. తరువాత దాన్నుంచి కూడా తొలగించారు.


దేశ విధానం, ప్రభుత్వాలతో, అధికార పార్టీలతో నిమిత్తం లేకుండా ఇలాంటి అనధికార వ్యక్తులు, వారి వ్యాఖ్యలతో కూడిన వీడియోల ప్రచారాన్ని పార్టీలు, ప్రభుత్వాలకు అంటగట్టటం రాళ్లు వేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఇక్కడ మౌలిక సమస్య ఆ వీడియో ఇప్పుడు ఎందుకు వచ్చింది ? ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనానికి చైనా చేసే యత్నాలు తమ అస్తిత్వానికే ముప్పు అంటూ జూలై రెండవ వారంలో విడుదల చేసిన జపాన్‌ మిలిటరీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గడచిన ఐదు దశాబ్దాల్లో జపాన్‌ వైపు నుంచి ఇలాంటి పదజాలంతో ఆరోపణలు లేదా నివేదికలు లేవు, ఇదే తొలిసారి. ప్రస్తుతం అమల్లో ఉన్న జపాన్‌ రాజ్యాంగం ప్రకారం ఆత్మరక్షణకు అవసరమైతే యుద్దానికి దిగేందుకు అనుమతి ఉంది. అందుకే జాగ్రత్తగా అస్తిత్వం అనే పదాలను వినియోగించారు.దీని ప్రకారం చైనా మిలిటరీ గనుక తైవాన్‌ విలీనానికి పూనుకుంటే అది తమ ఉనికికే ముప్పు గనుక యుద్ధానికి దిగి అమెరికా దళాలతో కలసి జపాన్‌ ప్రతిఘటిస్తుందని జపాన్‌ ఉపప్రధాని తారో అసో ప్రకటించారు. అదే చేస్తే జపాన్‌ మిలిటరీని నాశనం చేస్తామని చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌లో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు తప్ప అణుదాడి చేస్తామని ఎక్కడా చెప్పలేదు. చైనా 1964లో అణుబాంబును రూపొందించింది. ఆత్మరక్షణకు ప్రత్యర్ధులు ఉపయోగిస్తే తప్ప తాముగా ముందు వాటిని ప్రయోగించబోమని ప్రకటించింది. జపాన్‌ విషయంలో ఆ విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ వీడియో సలహా యిచ్చింది.


జపాన్‌ మీద చైనాలో అంత ఆగ్రహం ఎందుకు ఉంది ? ఎవరినుంచి ఎవరికి ముప్పు ఉంది? ఆసియాలో మిలిటరీ శక్తిగా ఎదిగిన జపాన్‌ ఆక్రమించిన దేశాలలో చైనా కూడా ఒకటి. దానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు తెలిసినవే. అందుకే జపాన్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను పెద్ద సంఖ్యలో నెటిజన్లు బలపరిచారు. జపాన్‌ దేశం దీవుల సముదాయం. ప్రధాన దీవుల ప్రాంతం నుంచి ఒకినావా అనే దీవి 640కిలోమీటర్లు, (అదే టోకియో నగరానికి 1,550 కిలోమీటర్లు,) అక్కడి నుంచి తైవాన్‌ 500కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సముద్రతీర ప్రాంతం ఏడు వందల కిలోమీటర్లలో ఉంది. జపాన్‌ మొత్తంలో ఎన్ని అమెరికా నౌకా స్దావరాలు ఉన్నాయో వాటిలో 62శాతం అంటే 28 ఈ దీవిలోనే ఉన్నాయి. అక్కడ పన్నెండు వందల అణ్వాయుధాలు, యాభైవేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఎందుకటా ? అక్కడికి పన్నెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూయార్క్‌, ఇతర అమెరికా ప్రాంతాల భద్రత కోసం ఇక్కడ తిష్టవేయాలని అమెరికా చెబుతోంది. అందుకు జపాన్‌ అంగీకరించింది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి ఎక్కడుందో చూద్దామని అని చెప్పినట్లుగా లేదూ !


సదరు వీడియోలో ఉన్నదేమిటి ? ” మనం తైవాన్ను విముక్తి చేసినపుడు ఒక వేళ జపాన్‌ బలంతో జోక్యం చేసుకుంటే, అది ఒక సైనికుడిని, ఒక విమానాన్ని, ఒక నౌకను మాత్రమే దించినా మనం ప్రతిదాడికి దిగటమే కాదు, పూర్తి స్ధాయి యుద్దానికి పూనుకోవాలి. తొలిసారిగా మనం అణుబాంబులను వినియోగించాలి. బేషరతుగా లొంగిపోతున్నట్లు రెండవ సారి జపాన్‌ ప్రకటించే వరకు అణుబాంబులను వినియోగిస్తూనే ఉండాలి.(రెండవ ప్రపంచ యుద్దంలో తొలిసారిగా బేషరతుగా లొంగిపోతున్నట్లు బ్రిటన్‌,చైనాలతో జపాన్‌ ఒప్పందం చేసుకుంది) జపాన్‌ యుద్ద సామర్ధ్యం పూర్తిగా కోల్పోయేవరకు మన లక్ష్యం ఉండాలని మేము చెబుతున్నాము.ఇంకే మాత్రం యుద్ద మూల్యం చెల్లించలేమని జపాన్‌ గుర్తించినపుడే తైవాన్‌కు దూకుడుగా అది సైన్యాన్ని పంపేందుకు సాహసించదు.


ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితి నాటకీయంగా మారిపోయింది.ప్రస్తుతం మన దేశం ఒక శతాబ్ది కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఒక ప్రధాన పరివర్తన మధ్యలో ఉంది. అన్ని రాజకీయ విధానాలు, ఎత్తుగడలు, వ్యూహాలను దానికి అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకోవాలి, పరివర్తనకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అణువిధానాన్ని కూడా పరిమిత సర్దుబాట్లకు వీలుగా మార్చాల్సి ఉంది. జపాన్‌ మినహాయింపు అనే సిద్దాంతాన్ని ఒక నిష్టగా మనం ముందుకు తీసుకుపోవాలి. అణ్వాయుధాలను తొలి సారిగా ఉపయోగించకూడదు అనే విధానానికి జపాన్‌ మినహాయింపు అని సూచించాలి. మనం జపాన్‌కు హెచ్చరిక చేస్తున్నాం, ప్రపంచానికి తెలియచేస్తున్నాం. అదేమంటే ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనంతో సహా జపాన్‌ మిలిటరీ పద్దతుల్లో మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే జపాన్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ఉపయోగించాలి. బేషరతుగా లొంగిపోయేంతవరకు వాటిని వినియోగిస్తూనే ఉండాలి.


జపాన్‌ గనుక మూడోసారి చైనాతో యుద్దానికి దిగితే చైనా జనం పాత, కొత్తల బదులు తీర్చుకోవాలి. వారితో శాంతి చర్చలు వద్దు. దియాయు,రియుకు దీవులను (ఒకినావా పరిసరాల్లో ఉన్న దీవులు) తిరిగి స్వాధీనం చేసుకుందాం ” అనే వ్యాఖ్యానం ఆ వీడియోలో ఉంది.
జపాన్‌ మిలిటరీ నివేదికను వెలువరించక ముందే తైవాన్‌ గురించి జపాన్‌ రెచ్చగొడుతున్నది. జూన్‌ 24న రక్షణ మంత్రి నోబు కిషి మాట్లాడుతూ తైవాన్‌ భద్రతకు జపాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది అన్నాడు. చైనా ఒకటే అనే విధానం అనుసరించాలంటే అది కాలపరీక్షకు నిలబడుతుందా ? అది సరైనదేనా, నాకు తెలియదు అని జపాన్‌ ఉపరక్షణ మంత్రి యుషిహైడ్‌ నకయామా అన్నాడు. అధికారికంగా జపాన్‌ వైఖరిలో మార్పు లేనప్పటికీ దానికి కట్టుబడి ఉండాల్సిన అగత్యం లేదని పరోక్షంగా చెప్పటం, తైవాన్‌ సమస్యను తురుపుముక్కగా ఉపయోగించుకొనే యత్నమే. తైవాన్‌ వేరు కాదు, చైనాలో అంతర్భాగమే అని గుర్తిస్తూనే దానికి ఆయుధాలు అందిస్తున్న అమెరికా బాటలోనే జపాన్‌ కూడా నడుస్తున్నది. చైనాాజపాన్‌ సాధారణ సంబంధాలు నెలకొల్పుకొని ఐదు దశాబ్దాలు గడచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, జపాన్‌ ప్రధాని సుగా విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తొలిసారిగా తైవాన్‌ సమస్యను ప్రస్తావించారు. ప్రస్తుతం జపాన్‌ రాజ్యాంగం ప్రకారం జపాన్‌ నేరుగా చైనా మీద యుద్దానికి దిగకపోయినా తన గడ్డపై ఉన్న అమెరికా స్దావరాలకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించగలదు. ఒక వేళ నేరుగా యుద్దంలోకి దిగితే చైనా చేతిలో చావు దెబ్బలు తింటుంది.


చైనా వీడియో ప్రయివేటు వ్యవహారం గనుకనే జపాన్‌ అధికారికంగా స్పందించలేదు. దాని రక్షణకు హామీ ఇచ్చిన అమెరికా వైపు నుంచి కూడా వ్యాఖ్యలేమీ లేవు. మరి మీడియా వార్తలు ఏమిటి అంటే, స్పందన ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు అమెరికా, జపాన్‌ ప్రచారదాడిలో భాగంగా వెలువడిన కట్టుకధలు మాత్రమే.ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో బైడెన్‌ కొత్తగా చేరినా అమెరికన్లు నెగ్గే సూచనలు కనుచూపు మేరలో లేవు. ఏదో విధంగా చైనాతో గిల్లి కజ్జా పెట్టుకోవాలంటే దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, హాంకాంగ్‌ సాకులు ఉన్నాయి. జపాన్‌, ఆస్ట్రేలియాలు అన్ని విషయాల్లో, కొంత మేరకు మన దేశం అమెరికాతో యుగళగీతాలు పాడుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా 5జిపై బెదిరింపుల నుంచి ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగిన అమెరికా !

01 Thursday Jul 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Chinese 5G, G7, US fight against Chinese 5G, US-China Tech war

మన చుట్టూ జరుగుతున్నదేమిటి : ఐదవ భాగము

ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఒక కంపెనీ తమ కంపెనీ ఉత్పత్తులు ఎంత గొప్పవో లేదా తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఎలా వస్తాయో చూడండి అంటూ దేశ విదేశాల్లో రోడ్‌ షోలను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇప్పుడు దానికి భిన్నంగా చైనా 5జి పరిజ్ఞానం, పరికరాలను గనుక మీరు తీసుకోకపోతే మేమిచ్చే శిక్షణ, రాయితీల గురించి తెలుసుకోండి అంటూ అమెరికా ఇప్పుడు రోడ్‌ షోలను నిర్వహిస్తోంది. ఇతర ధనిక దేశాలు కూడా అదే యోచనలో ఉన్నాయి. చైనా దగ్గర తీసుకుంటే జరిగే నష్టాలు ఇతర కంపెనీల నుంచి తీసుకుంటే కలిగే లాభాలు ఇవి అని రాజకీయ నేతలు, నియంత్రణ అధికారులు, ప్రభుత్వాలకు వివరించేందుకు అమెరికా యంత్రాంగం పుస్తకాల పంపిణీ, సమావేశాలను నిర్వహిస్తున్నదని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది. చైనా హువెయి, జట్‌టిఇ తదితర కంపెనీల పరికరాలను కొనవద్దని గతంలో బెదిరించిన అమెరికా ఇప్పుడు ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగింది. చైనా పరికరాల్లో ఆయా దేశాల సమాచారాన్ని తస్కరించే దొంగ చెవులు ఉన్నాయని ఇతర దేశాలను భయపెడుతోంది.


బ్రిటన్‌లో జూన్‌ 11-13వ తేదీలలో జరిగిన 47వ జి7 సమావేశాలు బి3డబ్ల్యు పధకాన్ని అమలు జరపాలని నిర్ణయించాయి. ఇది చైనా అమలు చేస్తున్న బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పధకానికి పోటీగా అని చెప్పారు గనుక ప్రపంచం మరింత పురోగమిస్తుందని అందరూ భావించారు. వివరాలు ఇంకా వెల్లడిగాకున్నా కానీ దాని తీరు చూస్తే చైనా చొరవను నీరుగార్చే వ్యవహారంగా కనిపిస్తోంది. జి7 దేశాలు ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. దానిలో భాగంగా చైనా,రష్యా,బ్రెజిల్‌, మన దేశాన్ని పక్కన పెట్టాయి. వాటి భాషలో ఈ విషయాన్ని అంత సూటిగా చెప్పవు. ఆ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో ఒక్క చైనా మీద మాత్రమే దాడి చేశారు. అక్కడ మానవహక్కులు లేవని, కరోనా మూలాలు అక్కడే, పర్యావరణాన్ని దెబ్బతీస్తోందంటూ దాడి సాగింది. అందరం కలసి కట్టుగా చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని సూటిగానే చెప్పాయి. జి7 దేశాలు మన సహజ భాగస్వాములని మన ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు గనుక మనకూ ” ఆ మహత్తర కార్యక్రమం ” లో ఏదో ఒక పాత్ర ఉంటుందన్నది స్పష్టం.


మధ్య, తూర్పు ఐరోపా దేశాలు గనుక చైనా బదులు ఇతర దేశాల టెలికాం పరికరాలు కొనుగోలు చేస్తే ఆర్ధిక సాయం చేసేందుకు వీలు కల్పించే బిల్లును మే నెలలో అమెరికా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మీరు గనుక చైనా హువెయి పరికరాలను కొనుగోలు చేస్తే మిత్ర దేశాలైనప్పటికీ మా గూఢచారులు సేకరించిన సమాచారాన్ని అందచేయబోమని అమెరికా ఇతర దేశాలను బెదిరించింది. అయితే అది పని చేయకపోవటంతో బుజ్జగింపులకు పూనుకుంది, ఇప్పుడు ప్రలోభాలకూ పాల్పడుతోంది. అమెరికా వత్తిడికి లొంగిన జర్మనీ చాలా కాలం పాటు చైనా పరికరాలను తీసుకొనేందుకు ముందుకు రాలేదు. అయితే హువెయికి పోటీ కంపెనీలైన ఎరిక్స్‌న్‌, ఏబి, నోకియాలు అందచేసే పరికరాల ధర చాలా ఎక్కువగా ఉండటంతో అనేక దేశాలు ఎటూ మొగ్గకుండా తటపటాయిస్తున్నాయి. దీంతో అలాంటి దేశాల దగ్గర తగినంత సొమ్ము లేకపోతే అప్పులిస్తామంటూ అమెరికా ముందుకు వస్తోంది. అమెరికా చట్టాలు అభివృద్ది చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వటానికి అంగీకరించవు, అయినప్పటికీ మినహాయింపు సవరణలు చేసి 50 కోట్ల డాలర్ల మేరకు రుణాలు ఇచ్చేందుకు సిద్దం చేశారు. అయితే హంగరీ, సెర్బియా వంటి దేశాలు చైనా కంపెనీ కేంద్రాలను తెరిచేందుకు అనుమతించాయి.


అమెరికా వత్తిళ్లను ఖాతరు చేయని జర్మనీ రెండు సంవత్సరాల తరువాత తమకు అన్ని కంపెనీలు ఒకటే అంటూ ఏప్రిల్‌ ఆఖరులో ఒక చట్టాన్ని చేసింది. తమ భద్రతా ప్రమాణాలను పాటించిన ఏ కంపెనీ ఉత్పత్తి అయినా తమకు సమ్మతమే, రక్షణ గురించి ఎలాంటి భయం లేదని ప్రకటించింది. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చైనా కంపెనీలకు వ్యతిరేకంగా అమెరికా చెప్పినట్లు నడుచుకోజాలమని జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించాడు. జర్మనీ-చైనా తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పాడు. కొన్ని ఐరోపా దేశాలు సంయక్తంగా టెలికాం సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకొనేందుకు ఏర్పాటు చేసిన పధకంలో పెట్టుబడి పెట్టిన జర్మనీ దాని వలన ఫలితం లేదని గ్రహించింది.


అభివృద్దిలో పోటీ బదులు చైనా నియంత్రణపై కేంద్రీకరించాలట !


ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన పరుగులో చైనాను నిరోధించేందుకు చతుష్టయ దేశాలు (అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌) ఉమ్మడిగా పని చేయాలని ముంబైలోని గేట్‌వే హౌస్‌ ఎకానమీ మరియు టెక్నాలజీ కార్యాచరణ సంస్ధ ప్రతినిధులు లిసా కర్టిస్‌, సూర్జిత్‌భల్లా సలహా ఇచ్చారు. చైనా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, కొన్ని ముఖ్యమైన ఖనిజ సంపదతో ప్రపంచ సరఫరా వ్యవస్ధలను నియంత్రించాలని చూస్తోందన్నది వారి ఆరోపణ. దానికి పోటీగా ఆర్ధిక, సాంకేతిక రంగాలలో నాలుగు దేశాలు, సహరించుకొని ఇతర దేశాలను కలుపుకోవాలని సలహా ఇస్తున్నారు. 5జి గురించి రెండు దేశాలూ సహకరించుకోవాలని డోనాల్డ్‌ట్రంప్‌-నరేంద్రమోడీ ఇద్దరూ గతంలో కబుర్లు చెప్పినా అడుగు గడపదాటలేదు. అసలు చతుష్టయ దేశాల దగ్గర ఆ పరిజ్ఞానమే లేదు, మరోవైపు చైనా ఆరవ తరం పరిజ్ఞానం గురించి ఆలోచనలు చేస్తున్నది. కీలకమైన సెమికండక్టర్ల రంగంలో అమెరికా వెనుకబడింది. మన దేశంలో సాంకేతిక నిపుణులు ఉన్నప్పటికీ వారికి పని లేదు, పెట్టుబడి పెట్టేవారూ లేరు. మన మేథావులు అమెరికా వెళితే వారికి వ్యక్తిగతంగా, అమెరికాకు లాభం తప్ప మనకు ప్రయోజనం లేదని గతం స్పష్టం చేసింది. మన వారిని ఆకర్షించటం తప్ప ముందే చెప్పుకున్నట్లు ఉమ్మడి పరిశోధనలకు అమెరికా వైపు నుంచి ఎలాంటి చొరవ లేదు. చైనా మాదిరి పరిశోధన-అభివృద్దికి కేటాయింపుల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాము.

వివిధ రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.అయినప్పటికీ చైనా కంటే ఎంతో వెనుకబడే ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎనిమిది సంవత్సరాలలో ఉపాధి కల్పనకు వివిధ రంగాలలో 2.25లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. ఇది ఏడాదికి 280 కోట్ల డాలర్లు. అయితే ఈ ఏడాది చైనా ప్రభుత్వం, స్ధానిక సంస్ధల ద్వారా 556 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. రానున్న సంవత్సరాలలో ఇదే ధోరణి కొనసాగినా అమెరికా కంటే ఎంతో ముందుంటుంది.పరిశోధన-అభివృద్ధికి గాను 180 బిలయన్‌ డాలర్లని అమెరికా పేర్కొన్నది, అయితే ఇవి ఏమూలకన్నది ప్రశ్న. అయితే అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ఇప్పటికే మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి, వాటికి పెద్ద ఎత్తున మరమ్మతులు తప్ప కొత్తగా ఏర్పాటు చేయాల్సినవి పెద్దగా ఉండవు. కనుక సహజంగానే చైనాలో ఏడాది కేడాది పెరుగుదల ఉంటుంది. అయితే మరి చైనా ప్రత్యేకత ఏమిటి అంటే గతేడాదినాటికి అక్కడ 38వేల కిలోమీటర్ల హై స్పీడు రైలు మార్గాలు ఉన్నాయి. ఇతర దేశాలతో పోల్చితే మూడవ వంతు ఖర్చుతో అక్కడ నిర్మిస్తున్నట్లు 2019లో ప్రపంచబ్యాంకు చెప్పింది.ఈ వ్యవస్ధ రవాణా ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. అమెరికాతో పోల్చితే తలసరి ఉత్పత్తిలో చైనాలో ఆరోవంతు మాత్రమే ఉంది, అందువలన దాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం పరిశోధన-అభివృద్ధికి చైనా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.

చైనా వద్దు గానీ లాభాలు మాత్రం ముద్దు !


చైనా విషయంలో అమెరికాతో జతకట్టిన ఐరోపా ధనిక దేశాలన్నీ ఒకటే. చైనా వద్దుగానీ దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం ముద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇటలీలోని బార్సిలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఇది వెల్లడైంది. ఫ్రాన్స్‌లో అతి పెద్ద టెలికాం కంపెనీ పేరు ఆరెంజ్‌. చైనా పరికరాలను తమ దేశంలో వినియోగించవద్దని నిర్ణయించాం గానీ ఆఫ్రికాలో మాతో సంబంధాలున్న కంపెనీల్లో వాటిని వినియోగించటానికి సిద్దమే అని కంపెనీ స్టీఫెన్‌ రిచర్డ్‌ రాయిటర్‌ వార్తా సంస్దతో చెప్పాడు. ఆఫ్రికాలో యూరోపియన్లు పెట్టుబడులు పెట్టేందుకు విముఖంగా ఉన్నారు, చైనీయులు పెడుతున్నారు అని చెప్పాడు. ఆ ఖండంలోని అనేక దేశాల టెలికాం ఆపరేటర్లు చైనా పరికరాల మీద ఆధారపడుతున్నారు.అందువలన మేము చైనా కంపెనీలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నామని దాపరికం లేకుండా చెప్పాడు. ఐరోపాలో ఇప్పుడు చైనా కంపెనీలతో కలసి 5జి నెట్‌వర్క్‌లను అభివృద్ది చేయటం ఎంతో కష్టం అన్నది వాస్తవం అన్నాడు. ఆరెంజ్‌ కంపెనీలో ఫ్రెంచి ప్రభుత్వానికి 23శాతం భాగస్వామ్యం ఉంది.


5జి గురించి ధనిక దేశాలు ఎందుకు ఇంతగా చైనాను దెబ్బతీయాలని చూస్తున్నాయి ? దీనిలో రాజకీయంంతో పాటు ఆర్ధికం కూడా ఇమిడి ఉంది. 2030 నాటికి ప్రపంచ జీడిపిలో 5జి ద్వారా 1.3లక్షల కోట్ల డాలర్ల ఆదాయం తోడవుతుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ తాజా నివేదికలో పేర్కొన్నది.ఆరోగ్య, వినియోగదారుల, ఆర్ధికసేవలు, వస్తు తయారీ, మీడియా రంగాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉత్తర అమెరికా ఖండ దేశాల లబ్ది ఎక్కువగా ఉంటుంది. చైనా ఆర్ధిక వ్యవస్ధకు 220 బిలియన్‌ డాలర్లు తోడవుతాయని పేర్కొన్నది. ఎవరైనా అభివృద్ది చెందాలనుకుంటే చూసి నేర్చుకోమన్నారు తప్ప ఎదుటివారిని చూసి ఏడవమని, చెడగొట్టేందుకు ప్రయత్నించమని మన పెద్దలెవరూ చెప్పలేదు. అలాంటి వారు బాగుపడిన దాఖాలాలు కూడా లేవు. వారి శక్తుయుక్తులన్నీ తమ బాగుకోసం గాక ఇతరులను చెడొట్టేందుకు ఉపయోగిస్తే ఫలితం ఏముంటుంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో ట్రంప్‌ చెలగాటం – బైడెన్‌కు ప్రాణ సంకటం !

24 Thursday Jun 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Donald trump, Joe Biden, Narendra Modi, Propaganda War, US-CHINA TRADE WAR


మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 4

ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో నిత్యం అనేక కుట్ర సిద్దాంతాలు, వాటికి అనుగుణ్యంగా కట్టుకథలు-పిట్టకథలూ వెలువడుతుంటాయి. ఇది ప్రచార దాడిలో భాగం అని చాలా మందికి తెలియదు. నిజమే అని విశ్వసిస్తారు. వాస్తవం కాదని తెలిసేసరికి ఆ సమస్య ఉనికిలో ఉండదు కనుక పట్టించుకోరు. ఉదాహరణకు ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినందున తాము దాడి చేశామని అమెరికా ప్రపంచాన్ని నమ్మించింది. సద్దాంను అంతం చేసిన తరువాత అదే అమెరికా తరువాత కొన్ని సంవత్సరాల తరువాత అబ్బే అలాంటి గుట్టలేమీ దొరకలేదు అని చెప్పింది. ఎంత మంది దానిని పట్టించుకున్నారు.

గతంలో అమెరికన్లు రష్యన్లను విలన్లుగా చిత్రిస్తే ఇప్పుడు వారి బదులు చైనీయులను చేర్చారు. వారి పొడ మనకు గిట్టదు అని చెబుతుంటారు. కానీ అమెరికాలోని కాటో ఇనిస్టిట్యూట్‌ అనే ఒక మేథో సంస్ధకు చెందిన ఇద్దరు మేథావులు ఈ మధ్యే ఒక వ్యాసం రాశారు. చైనా నుంచి వలస వచ్చే వారిని అమెరికా ప్రోత్సహించాలి అని దానిలో ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా వారిని అమెరికా గడ్డమీద అడుగు పెట్టనివ్వొద్దు అన్నట్లుగా చెలరేగి పోయాడు.వారు గూఢచర్యాలకు పాల్పడుతున్నారని, విద్యా సంస్ధలలో కమ్యూనిస్టు సిద్దాంతాలను వ్యాపింపచేస్తున్నారని, అమెరికా సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరిస్తున్నారని మొత్తం మీద అమెరికా భద్రతకే ముప్పు తెస్తున్నారన్నట్లుగా ప్రచారం చేయించాడు. చైనా మిలిటరీ-పౌర సంస్దలు సమ్మిళితంగా అనుసరించే వ్యూహాలతో సంబంధం ఉన్న ఎఫ్‌-1 విద్యార్ధులు, జె-1పర్యాటకులను అడుగుపెట్టనివ్వవద్దని ఆదేశాలు జారీ చేశాడు.చైనా సంస్ధల నుంచి నిధులు పొందే అమెరికన్‌ విశ్వవిద్యాలయాల మీద కూడా చర్యలు తీసుకున్నాడు. శాస్త్ర, సాంకేతిక సంస్ధలలో ప్రవేశం కోరే చైనీయుల వీసాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలన్నాడు.దాంతో ప్రతి వీసా నెలల తరబడి విచారణల్లోనే ఉండేది. కాటో సంస్ధ మేథావులు వీటన్నింటితో ఏకీ భావం కలిగిన వారే.


అయితే వారి దూరా లేదా దురాలోచనను దాచుకోలేదు.గతంలో సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్దం సాగించినపుడు దాని పౌరులను ఆకర్షించటాన్ని ఒక విధానంగా అమెరికా అనుసరించింది. ఇప్పుడు దాన్ని చైనాకు ఎందుకు వర్తింప చేయకూడదన్నది వారి తర్కం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో సోవియట్‌ యూనియన్‌ ఎర్రసైన్యం అనేక తూర్పు ఐరోపా దేశాలను హిట్లర్‌ ఆక్రమణ, దుర్మార్గాల నుంచి విముక్తి చేసింది. స్ధానిక కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు అధికారంలోకి వచ్చి సోషలిస్టు రాజ్యాలను నెలకొల్పటం ఒకపరిణామం. అదే సమయంలో ఆ దేశాలకు చెందిన కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులను అమెరికాకు ఆహ్వానించి కమ్యూనిస్టు నియంతృత్వం నుంచి బయటపడిన స్వేచ్చా జీవులుగా ముద్రవేసి వారితో కట్టుకథలు చెప్పించి అమెరికన్లను, ప్రపంచాన్ని నమ్మించారు. నాటి అధ్యక్షుడు ట్రూమన్‌ అలా 80వేల మందికి ఆశ్రయం కల్పించాడు.1990లో సోవియట్‌, తూర్పు ఐరోపాలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన సమయంలో కూడా అదే ఎత్తుగడను అనుసరించి వలసలను సరళతరం గావించారు.

అలా వచ్చిన లక్షలాది మంది రాజకీయ, నైతిక, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఎంతగానో తోడ్పడ్డారు. కమ్యూనిజం కంటే పెట్టుబడిదారీ విధానం ఎంత గొప్పదో వారి చేత చిలుకపలుకులు పలికించి ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేకులకు వీనుల విందు చేశారు. అదే సమయంలో అమెరికాకు ఆర్ధికంగా ఎంతో ఉపయోగపడ్డారు. ఇప్పుడు చైనీయులు సాంకేతిక రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు సవాలు విసురుతున్నారు. అందువలన అత్యంత ప్రతిభావంతులు, విద్యావంతులైన చైనీయులను అమెరికాకు రప్పించటం ఎంతో లాభదాయకం అన్నది కాటో తర్కం. అలావచ్చిన వారు గూఢచర్యానికి పాల్పడి, రహస్యాలను చైనాకు చేరవేస్తేనో అన్న ప్రశ్నకు కూడా వారే సమాధానం చెప్పారు.అలాంటి చర్యలవలన జరిగే నష్టం చాలా తక్కువ అని అంతకంటే ఎక్కువగా చైనా నుంచి వచ్చే వారు చేసే పరిశోధన, అభివృద్ధి ఎక్కువ లాభం అని బల్లలు చరిచి మరీ చెపుతున్నారు. కరోనా వైరస్‌ను ఊహాన్‌ పరిశోధనాకేంద్రంలోనే తయారు చేశారనే కథనాలు చైనా నుంచి ఫిరాయించిన ఒకరిద్దరు చెబుతున్నవే. వాటన్నింటితో ప్రపంచ మీడియా చైనా వ్యతిరేక పండగ చేసుకొంటోంది.


అయితే ఈ మేథావులు, వారిని సమర్ధించేవారు గానీ ఒక విషయాన్ని మరచి పోతున్నారు. మూడు దశాబ్దాల నాడు కూల్చి వేసిన సోవియట్‌ నాడు అమెరికాతో పోలిస్తే ఒక మిలిటరీ శక్తి తప్ప ఆర్ధిక శక్తి కాదు.ఇప్పుడు చైనా అమెరికా ఆర్ధికశక్తిని సవాలు చేసి రెండవ స్ధానం నుంచి మొదటి స్దానానికి పరుగులు తీస్తున్నది. మిలిటరీ పరంగా కూడా పటిష్టంగానే ఉంది. సోవియట్‌ నాయకత్వం సామ్రాజ్యావాదం, పెట్టుబడిదారీ విధానాల ప్రమాదాన్ని తక్కువ అంచనా వేసింది. పర్యవసానంగా జనానికి వాటి ముప్పు గురించి చైతన్యం కలిగించటంలో నిర్లక్ష్యం చేసింది. చైనా అలాంటి భ్రమల్లో లేదు. మూడు దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపా రాజ్యాలను కూల్చివేసే సమయంలో సంభవించిన తియన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన వెనుక ఉన్న అంశాలను పసిగట్టి మొగ్గలోనే తుంచి వేసింది. జనాన్ని హెచ్చరించింది.ఇదే సమయంలో ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికాలో నేడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందని నమ్ముతున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. సోషలిస్టు చైనా విజయాలు ఎలా సాధ్యం అవుతున్నాయనే ఆలోచన కలుగుతోంది.

అమెరికా ఇప్పటికీ బలమైన, ప్రమాదకర దేశమే అయినప్పటికీ దాని సమస్యలు దానికి ఉన్నాయి. అందుకే ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం మీద పట్టుకోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో చతుష్టయం (క్వాడ్‌) పేరుతో జట్టుకడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఫసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య కోసం సమగ్ర మరియు పురోగామి ఒప్పందం (సిపిటిపిపి) ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా సిద్దం కావటం లేదు. అది లేకుండా మిగతా దేశాలు చేసేదేమీ లేదు. అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సమస్యల కారణంగా స్వంతగడ్డమీద పెట్టుబడులను ప్రోత్సహించాలని బైడెన్‌ సర్కార్‌ భావిస్తోంది. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనాతో వాణిజ్యలోటు తగ్గింపులక్ష్యంతో దేశ భద్రత పేరుతో చైనా నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియం తదితర వస్తువుల మీద డోనాల్డ్‌ ట్రంప్‌ దిగుమతి సుంకాల పెంపు అమెరికన్ల మీదనే భారం మోపాయి. పనిలో పనిగా జపాన్‌, ఐరోపా మిత్ర దేశాల మీద కూడా అదేపని చేశాడు. ఈ పన్నులను ఎత్తివేయాలని చైనా కంటే అమెరికా వాణిజ్యవేత్తలే ఇప్పుడు బైడెన్‌ మీద ఎక్కువ వత్తిడి తెస్తున్నారు.


చైనాతో పోరు సంగతి తరువాత, అమెరికా వెలుపలి నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి పన్నుల విధింపు కారణంగా తాము మార్కెట్లో పోటీ పడలేకున్నామని అందువలన వాటిని ఎత్తివేయాలని మూడువందల సంస్దలు బైడెన్‌కు విజ్ఞప్తి చేశాయి. అమెరికన్ల కొనుగోలు శక్తి పెంచేందుకు ఆరులక్షల కోట్ల డాలర్లతో అనేక పధకాలను అమలు జరిపేందుకు ఆమోదం తెలపాలని బైడెన్‌ పార్లమెంట్‌ను కోరారు. దీని వలన తమ మీద పడే ప్రభావం, పర్యవసానాలు ఏమిటని జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. అమెరికన్లు ఎంత హడావుడి చేసినా ఇతర దేశాల సహకారం లేకుండా చైనాను వారేమీ చేయలేరు. అదే సమయంలో చైనీయులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుంటున్నారు. పరిశోధన-అభివృద్ధికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా స్వంత గడ్డమీద జనం కొనుగోలు శక్తి పెంచేందుకు, ఇతర దేశాల్లో మార్కెట్‌ను పెంచుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు ప్రారంభించారు.దానిలో భాగమే బెల్ట్‌ మరియు రోడ్‌ (బిఆర్‌ఐ) పధకాలు. రాజకీయంగా తమకు వ్యతిరేకంగా జట్టుకట్టిన ఆస్ట్రేలియాకు చైనా చుక్కలు చూపిస్తోంది.గతంలో ఏటా 50 కోట్ల డాలర్ల విలువగల పీతలు ఆస్ట్రేలియా ఎగుమతి చేసేది. అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అనగానే ఆ పీతల దిగుమతులను చైనా నిషేధించింది. ఇలాంటి అనేక చర్యలు తీసుకోవటంతో ఆస్ట్రేలియన్‌ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అమెరికా అండచూసుకొని చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కొండంత రాగం తీసి హడావుడి చేసిన మన పాలకులు తిరిగి చైనా వస్తువుల దిగుమతులను పెంచారు.


మన దేశంలో చైనా అంటే అభిమానం లేని వారు కూడా దానితో వైరం తెచ్చుకొని సాధించేదేమిటి అన్న ప్రశ్నను ఇప్పుడు ముందుకు తెస్తున్నారు. మనతో సహా అమెరికా నాయకత్వంలోని దేశాలు చైనాను ఒంటరి పాటు చేయాలని చూస్తున్నాయి. చైనాను దెబ్బతీయటం అంటే తమను తాము నాశనం చేసుకోవటం అనే అంశాన్ని అవి మరచిపోతున్నాయి. నూటనలభై కోట్ల మంది జనాభా ఉన్న చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఉండటమే కాదు, వినియోగ మార్కెట్‌ అని మరచి పోరాదు. ఎవరి సంగతి వారు చూసుకుంటున్న ఈ తరుణంలో చైనాతో ఆసియన్‌ దేశాల కూటమి వాణిజ్యం 732 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌ వంటి దేశాలు చైనాతో జరుపుతున్న ఎగుమతి దిగుమతుల విలువ 1,600 బిలియన్‌ డాలర్లు. చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ పధకానికి చైనా ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్లను సమకూర్చగలదని వార్తలు వచ్చాయి. తానే స్వయంగా వాగ్దానం చేసినట్లుగా జనానికి వాక్సిన్లు వేయించకుండా భారాన్ని రాష్ట్రాల మీద నెట్టేందుకు ప్రయత్నించిన మన కేంద్ర ప్రభుత్వం నుంచి అంత మొత్తంలో విదేశాల్లో పెట్టుబడులను పెడుతుందని ఎవరైనా ఆశించగలరా ? దానితో పోటీగా మనమూ తయారైతే తప్ప కమ్యూనిస్టు వ్యతిరేకత పేరుతో అవి మనతో కలసి వస్తాయా ? మనలను నమ్ముకొని మిగతా దేశాలు చైనాకు వ్యతిరేకంగా జట్టుకడతాయా ?

పగలంతా ఎక్కడెక్కడో తిరిగిన సన్యాసులు రాత్రికి మఠానికి చేరి గంజాయి దమ్ము కొట్టి తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలని ప్రగల్భాలు పలికి తెల్లవారేసరికి మత్తు దిగి ఎవరి కర్రా బుర్రా వారు తీసుకొని ఎవరిదారిన వారు పోయినట్లు ఇప్పటికి 47 సార్లు జి7 దేశాల సమావేశాల కబుర్లున్నాయి తప్ప ఎవరికైనా విశ్వాసం కలిగించాయా ? గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో మన ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిందేమిటి ? చైనీయులు మన సరిహద్దుల్లోకి చొరబడిందీ లేదు, మన పోస్టులను తమతో తీసుకుపోయిందీ లేదు అన్నారు. అలాంటపుడు చైనాతో ఏ సమస్య మీద పోరాడుతారు ? చతుష్టయం పేరుతో శతృత్వం పెంచుకోవటం తప్ప సాధించేదేమిటి ? మనకంటే ఎంతో బలమైన చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించగలిగిన ఆర్ధిక వనరులను కలిగి ఉంది. మన పరిస్ధితి ఏమిటి ? కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఎందుకు ? దాన్ని సంతుష్టీకరించేందుకు చైనాతో వైరం ఎందుకు, సైన్య మోహరింపు ఎవరికోసం, ఆ ఖర్చును జనం మీద మోపటం ఎందుకు ? గతంలో సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలతో పోరాడి అక్కడి వ్యవస్ధలను కూల్చివేసిన అమెరికా కొన్ని దేశాల మార్కెట్లను ఆక్రమించుకుంది. అయినా దాని ఆర్ధిక సమస్యలు తీరలేదు. 2008లో దానితో సహా తూర్పు ఐరోపాను పంచుకున్న ధనికదేశాలన్నీ ఆర్ధిక సంక్షోభానికి గురయ్యాయి. ఇప్పుడు చతుష్టయం పేరుతో చైనాను ఢకొీని దాని మార్కెట్‌ను ఆక్రమించుకోవటం సాధ్యమయ్యేనా. ఒకవేళ జరిగినా ఆమెరికా మిగతాదేశాలకు వాటా ఇస్తుందా ? ఎవరిపని వారు చేసుకోకుండా మనకెందుకీ ఆయాసం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనాను మించి భయపెడుతున్న చమురు – అచ్చేదిన్‌ కాదు జనం చచ్చే రోజులు !

23 Wednesday Jun 2021

Posted by raomk in Current Affairs, Economics, History, International, INTERNATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

$100 Oil Predictions Soar, crude oil price, world oil prices



ఎం కోటేశ్వరరావు
కొంత అతిశయోక్తిగానే ఉండవచ్చు గానీ అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరుగుతున్న ధరల తీరు తెన్నులను చూస్తే మన జనాలను కరోనా కంటే చమురు ధరలే ఎక్కువగా భయపెట్టేట్లు ఉన్నాయి. బుధవారం నాడు ఇది రాస్తున్న సమయానికి బ్రెంట్‌ రకం చమురు ధర 75.30 డాలర్లుగా ఉంది. ఇరాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికాతో కరాఖండిగా వ్యవహరించే ఇబ్రహీం రైసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు గనుక అని ఒక కారణం చెప్పారు. అమెరికా ఇతర దేశాలు ఇరాన్‌తో జరుపుతున్న అణు చర్చలలో ప్రతిష్ఠంభన ఏర్పడవచ్చని చెబుతున్నారు. అమెరికాలో చమురు నిల్వలు తగ్గిపోవటం, ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచుతాయో లేదో తెలియని పరిస్ధితి కూడా ఇతర కారణాల్లో ఉన్నాయి. కరోనా తగ్గిపోయి క్రమంగా సాధారణ పరిస్ధితి ఏర్పడితే ఈ ఏడాది ఆఖరుకు లేదా వచ్చే ఏడాది ముడిచమురు పీపా ధర వంద డాలర్ల వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే సమయంలో అమెరికాలో షేల్‌ అయిల్‌ ఉత్పత్తి పెరిగితే డిమాండ్‌ తగ్గి ధరలు అదుపులో ఉండటం లేదా కొంత మేరకు తగ్గవచ్చని జోశ్యాలు చెప్పిన వారు పునరాలోచనలో పడ్డారు. దీనితో పాటు ఇరాన్‌కు కొత్త అధ్యక్షుడు వస్తే అమెరికాతో అణు ఒప్పందం కుదిరి ఆంక్షలు ఎత్తివేస్తే సరఫరా పెరుగుతుందని ఆశించిన వారంతా అలాంటి అవకాశాలు లేవని భావించటంతో ధరలు భగ్గుమన్నాయి.
అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌(ఏపిఐ) మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం జూన్‌ 18వ తేదీతో ముగిసిన వారంలో చమురు నిల్వలు 7.199 మిలియన్‌ పీపాలకు తగ్గాయి. అంతకు ముందు వారంలో 8.537 మిలియన్‌ పీపాలు ఉన్నాయి. గతేడాది జనవరితో పోల్చితే ఎక్కువే ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరితో పోల్చితే తగ్గాయి.ఇది కూడా ధరల పెరుగుదల మీద ప్రభావం చూపింది. ఊహించినదానికంటే ముందుగానే వంద డాలర్లకు పెరుగుతుందా ? వచ్చే నెలలో ఒపెక్‌+దేశాల అదనపు ఉత్పత్తి మార్కెట్‌కు వచ్చినా ధరలు తగ్గకపోవచ్చన్నది కొందరి అభిప్రాయం.
ద్రవ్యోల్బణం, చమురు గిరాకీ పెరుగుదల, చమురు కంపెనీల వాటాదార్ల వత్తిడి, పర్యావరణం వంటి కారణాలతో రానున్న మూడు సంవత్సరాలలో ధరల పెరుగుదలతో పాటు చమురు సంక్షోభం తలెత్తవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. కొన్ని దేశాల్లో విద్యుత్‌ వాహనాల తయారీ మీద కేంద్రీకరణ, అమెరికా వంటి దేశాలలో పునరుత్పాదక ఇంథనాలకు ప్రోత్సాహం వంటి కారణాలతో చమురు ఉత్పత్తి తగ్గిపోయి ధరలు పెరగవచ్చన్నది విశ్లేషణల సారాంశం. ఈ పరిణామాలు, పర్యవసానాలకు సిద్దం గాని మనవంటి దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడవచ్చు. అది పాలకుల మీద వత్తిడికి దారి తీసి రాజకీయ పర్యవసానాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
రానున్న ఆరునెలల్లో ముడి చమురు ధర వంద డాలర్లకు పెరగవచ్చన్నది ఒక అంచనా అయితే రానున్న సంవత్సరాలలో 130 డాలర్లకు పెరగవచ్చని చెబుతున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత పరిణామాలు ఎలా ఉండేది చెప్పలేని స్ధితి. చమురు మార్కెట్‌ను కృత్రిమంగా అదుపు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గతంలో పడిపోయిన 35 డాలర్ల నుంచి 130 డాలర్లకు పెరగవచ్చు లేదా తిరిగి 35 డాలర్లకు దిగిరావచ్చన్నది కొందరి తర్కం. గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తి పెరగాలి, అది జరగాలంటే ఆ రంగంలో పెట్టుబడులు కావాలి. కరోనా కారణంగా తలెత్తిన అనిశ్చితి వలన ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. ఇది చమురు కొరతకు దారి తీయవచ్చు. పర్యావరణ సమస్యల కారణంగా అనేక కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని తగ్గించాలని డచ్‌ కోర్టు షెల్‌ కంపెనీని ఆదేశించింది. మరోవైపున అంతర్జాతీయ ఇంథన సంస్ధ కొత్తగా నిక్షేపాల అన్వేషణలను నిలిపివేయాలని కోరింది.
అమెరికాలో షేల్‌ చమురు ఉత్పత్తి పరిమితంగా ఉన్నందున, తిరిగి పెరిగినా మార్కెట్‌ పడిపోయే అవకాశం లేదని ఒపెక్‌ దేశాలు భావిస్తున్నాయి.ఈ ఏడాది అమెరికా చమురు ఉత్పత్తి రోజుకు కేవలం రెండు లక్షల పీపాలు మాత్రమే పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది పెరగవచ్చు. షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటాన్ని ఒపెక్‌ దేశాలు గమనంలోకి తీసుకున్నాయి. గతేడాది రికార్డు స్ధాయిలో చమురు ధరలు పడిపోయినందున షేల్‌ ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. ఆ కంపెనీలు లాభాలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ సంవత్సరం అమెరికా ఉత్పత్తి రోజుకు 11.2 మిలియన్‌ పీపాలు ఉంటుందని, అది గతేడాది కంటే లక్షా 20వేల పీపాలు తక్కువని తాజా జోశ్యాలు ఉన్నాయి. అమెరికాలోని వెస్ట్‌ టక్సాస్‌ ఇంటర్‌మీడియెట్‌(డబ్ల్యుటిఐ) రకం చమురు ధర పీపాకు 60 డాలర్లకు మించితేనే అక్కడి కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయి. అయితే ప్రస్తుతం అంతకంటే ఎక్కువే ఉంది. మార్కెట్‌ స్ధిరపడింది అనుకున్న తరువాత వచ్చే ఏడాది ఉత్పత్తి పెంచవచ్చని భావిస్తున్నారు. తమ లాభాలు పెరుగుతాయనుకుంటేనే పెట్టుబడిదారులు మరింత ఉత్పత్తి చేస్తారు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ను బట్టి ఆగస్టులో ముడి చమురు ఉత్పత్తి పెంచాలా వద్దా అని చమురు ఉత్పత్తి దేశాల సంస్ధ (ఒపెక్‌) చర్చలు జరుపుతోంది.వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. మార్కెట్‌లో ఉన్న లోటును పూడ్చేందుకు ఉత్పత్తి పెంచాలా అన్న అంశాన్ని రష్యా పరిశీలిస్తోంది. రెండు సంవత్సరాల తరువాత లండన్‌ మార్కెట్‌లో ముడిచమురు బ్రెంట్‌ ధర 75 డాలర్లు దాటింది. మే నుంచి జూలై మధ్య రోజుకు 20లక్షల పీపాల ఉత్పత్తి పెంచాలన్న అంశాన్ని ఒపెక్‌ దేశాలు సమీక్షిస్తున్నాయి, అయితే ఊహించినదాని కంటే ధరలు పెరగటంతో అంతకంటే ఎక్కువే పెంచాలనే వత్తిడి వస్తోంది. గిరాకీ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే నిలిపివేసిన ఉత్పత్తిని పునరుద్దరించటం గురించి పరిశీలిస్తామని ఒపెక్‌ దేశాల నేతగా ఉన్న సౌదీ అరేబియా చమురు మంత్రి అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 30లక్షల పీపాల కొరత ఉన్నట్లు గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా వేసింది. ఒపెక్‌+దేశాలు రోజుకు 58లక్షల పీపాలు ఉత్పత్తి చేస్తున్నాయి. సౌదీతో రోజువారీ ఫోన్లో మాట్లాడుతున్న రష్యా తక్షణమే ప్రత్యక్షంగా కూర్చుని చర్చించాల్సిన పరిస్ధితి లేదని భావిస్తోంది.
అమెరికాలో చమురు నిల్వల గురించి వస్తున్న వార్తల కారణంగా ముందస్తు చమురు మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయి. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో సరఫరా చేయాల్సిన డబ్య్లుటిఐ చమురు ధర పీపాకు 1.2 డాలర్లు పెరిగింది. గత పద మూడు సంవత్సరాలలో రెండు నెలల మధ్య ఒక డాలరుకు మించిన వ్యత్యాసం కేవలం రెండు సార్లు (2008, 2014)మాత్రమే జరిగింది. ఏడాది క్రితం కొనుగోలు చేసిన చమురును ఎక్కడ నిల్వచేసుకోవాలో తెలియక ఒప్పందం ప్రకారం చమురు సరఫరాను స్వీకరించలేని కంపెనీలు ఎగుమతిదార్లకు ఎదురు డాలర్లు ఇచ్చి నష్టాలను తగ్గించుకున్నాయి.ఇప్పుడు చమురుశుద్ది కర్మాగారాలు అమెరికాలో పూర్తి స్దాయిలో పని చేస్తుండటంతో ఆ నిల్వలన్నీ ఖాళీ అవుతున్న కారణంగా చమురు నిల్వ టాంకులు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. జూన్‌ తరువాత ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని పెంచనట్లయితే చమురు కొరత ఏర్పడుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్ధ హెచ్చరించింది.
ప్రపంచ చమురు నిల్వల్లో 2012 అంచనా ప్రకారం ఐదో వంతు (296.5 బిలియన్‌ పీపాలు) నిర్దారిత చమురు కలిగి ఉంది వెనెజులా. మార్కెట్లో ధరలు పెరిగిన కారణంగా అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున చమురు ఉత్పత్తిని పెంచనున్నది. గతేడాది చమురు ధరలు భారీగా పతనమైనందున రోజుకు నాలుగు లక్షల పీపాలకు ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఏడులక్షలు జరుగుతోందని చమురుశాఖ మంత్రి ఎల్‌ ఇసామీ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి పదిహేను లక్షల పీపాలకు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నందున ఉత్పత్తి చేసినప్పటికీ కొనుగోలుదార్లు ముందుకు రాకపోతే ప్రయోజనం లేదు. అందువలన ఆంక్షల గురించి జో బైడెన్‌ సర్కార్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో చెప్పాడు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తేనే చర్చలు, ఆంక్షల తొలగింపు అని అమెరికా అంటోంది. మన దేశంలోని రిలయన్స్‌ చమురు కంపెనీ కోసం గతంలో సెనెటర్‌గా బైడెన్‌ ఉన్నపుడు సహాయకుడిగా పని చేసిన భారతీయ లాబీయిస్టు అంకిత్‌ దేశారు ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. రిలయన్స్‌ చమురు శుద్ది కర్మాగారానికి పని కావాలంటే ముడి చమురు కావాలి. వెనెజులా వద్ద చమురు ఉన్నప్పటికీ డీజిల్‌ తయారీకి అవసరమైన శుద్ది కర్మాగారాలు లేవు. వెనెజులా నుంచి చమురు దిగుమతి చేసుకొని డీజిల్‌ను తయారు చేసి తిరిగి ఎగుమతి చేసే అవకాశం ఉన్నందున ఏదో ఒక రూపంలో ఆంక్షలను సడలించి రిలయన్స్‌ కంపెనీకి తోడ్పడాలని అంకిత్‌ దేశారు రాయబారాలు జరుపుతున్నారు. అంబానీలతో నరేంద్రమోడీకి విడదీయరాని సంబంధాలు ఉన్నందున ఆయన కూడా జోక్యం చేసుకోవచ్చు. అయితే తమ కంపెనీ అమెజాన్‌కు మోడీ మొండి చేయి చూపుతున్నందున బైడెన్‌ యంత్రాంగం ఏమేరకు దిగి వస్తుందో తెలియదు. అమెజాన్‌-రిలయన్స్‌ రాజీపడితే…..ఏమో ఏదైనా జరగవచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 2 ఇతరుల భుజాల మీద తుపాకితో చైనాను కాల్చాలని చూస్తున్న అమెరికా – జి7 47వ శిఖరాగ్ర సభ, !

14 Monday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

47th G7 Summit, China, G7, G7-India, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఏడు ధనిక దేశాల (జి7) బృంద 47వ వార్షిక సమావేశం జూన్‌ 11-13 తేదీలలో బ్రిటన్‌లోని ఇంగ్లండ్‌ సముద్రతీరంలోని కారన్‌వాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి భారత్‌,ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాను ఆహ్వానించారు. ప్రతి ఏటా చేస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా అనేక అంశాల మీద తీర్మానాలు చేశారు, సంకల్పాలు చెప్పుకున్నారు. హడావుడి చేశారు. చైనా మీద జబ్బ చరచటం ఈ సమావేశాల ప్రత్యేకత. జి7కు భారత్‌ సహజ మిత్రదేశమని మన ప్రధాని నరేంద్రమోడీ అంతర్జాలంద్వారా చేసిన ప్రసంగంలో చెప్పటం ద్వారా తామెటు ఉన్నదీ మరోసారి స్పష్టం చేశారు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత ధనిక దేశాల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు( ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ) తమ ప్రయోజనాలను సక్రమంగా నెరవేర్చటం లేదనే అసంతృప్తి వాటిని ఏర్పాటు చేసిన దేశాల్లోనే తలెత్తింది. దాంతో వాటిని కొనసాగిస్తూనే తమ ప్రయత్నాలు తాము చేయాలనే లక్ష్యంతో 1973లో అమెరికా చొరవతో సన్నాహక సమావేశం జరిగింది. దానిలో అమెరికా, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఆర్ధిక మంత్రులు పాల్గొన్నారు.మీకు అభ్యంతరం లేకపోతే జపాన్ను కూడా కలుపుకుందాం అన్న అమెరికా ప్రతిపాదనకు మిగతా దేశాలు అంగీకరించటంతో జి5గా ప్రారంభమైంది.1975లో తొలిశిఖరాగ్ర సమావేశానికి ఇటలీని కూడా ఆహ్వానించారు.మరుసటి ఏడాది సమావేశంలో బృందంలో ఆంగ్లం మాట్లాడేవారు మరొకరు ఉంటే బాగుంటుందంటూ కెనడాను కూడా ఆహ్వానించాలని అమెరికా ప్రతిపాదించటంతో 1976 నాటికి జి7గా మారింది. ఈ బృంద సమావేశాలకు ఐరోపా యూనియన్ను శాశ్వత ఆహ్వానితురాలిగా నిర్ణయించారు. సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత 1997లో రష్యాను జి7లోకి ఆహ్వానించి, జి8గా మార్చారు. 2014వరకు సభ్యురాలిగా కొనసాగింది. ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించటంతో అదే ఏడాది దాన్ని సస్పెండ్‌ చేశారు. 2018లో ఈ బృందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే 2020లో అమెరికా, ఇటలీ రెండు దేశాలూ తిరిగి రష్యాను చేర్చుకోవాలని చేసిన ప్రతిపాదనను మిగిలిన దేశాలు తిరస్కరించాయి. తమకసలు చేరాలనే ఆసక్తి లేదని రష్యా చెప్పేసింది. ఏ దేశంలో సమావేశం జరిగితే ఆ దేశం ఎవరిని కోరుకుంటే వారిని ఆహ్వానితులుగా పిలుస్తారు. మన దేశం పెద్ద మార్కెట్‌ గనుక ప్రతి దేశమూ ప్రతిసారీ మనలను ఆహ్వానిస్తున్నది.


జి7 మౌలికంగా సామ్రాజ్యవాద దేశాల కూటమి. వలసలుగా చేసుకోవటం ఇంకేమాత్రం కుదిరే అవకాశం లేకపోవటంతో రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఈ కూటమి దేశాలన్నీ రాజీకి వచ్చి దేశాలకు బదులు మార్కెట్‌ను పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాటి మధ్య విబేధాలున్నప్పటికీ తాత్కాలికంగా పక్కన పెట్టాయి. అయితే రష్యా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారి రంగంలోకి వచ్చిన తరువాత అది కూడా తన వాటా సంగతేమిటని డిమాండ్‌ చేసింది. ద్వితీయ శ్రేణి పాత్ర పోషించేందుకు సిద్దం కాదని ప్రధమ స్ధానంలో ఉండాలని కోరింది కనుకనే జి7 మొత్తంగా దాని మీద దాడికి దిగాయి. దాన్నుంచి తట్టుకొనేందుకు వర్గరీత్యా ఒకటి కాకున్నా ప్రస్తుతానికైతే చైనాతో కలసి ఎదిరించాలని రష్యా నిర్ణయించుకుంది. ఈ కూటమి దేశాలు మన దేశాన్ని కూడా వినియోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప తమ భాగస్వామిగా చేసుకొనేందుకు సిద్దం కావటం లేదు. బ్రెజిల్‌ పరిస్ధితీ అదే.

జి7 47వ సమావేశం ఆమోదించిన అంశాలను క్లుప్తంగా చూద్దాం. వీటిలో రెండు రకాలు, ఒకటి రాజకీయ పరమైనవి, రెండవది ఆర్ధిక, ఇతర అంశాలు. మొదటిదాని సారం ఏమంటే అన్ని దేశాలు కలసి చైనా మెడలు వంచాలి, కాళ్లదగ్గరకు తెచ్చుకోవాలి. గ్జిన్‌ జియాంగ్‌, హాంకాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు, తైవాన్ను బెదిరిస్తున్నట్లు ప్రచారం చేయాలి, వత్తిడి తేవాలి. అర్ధిక అంశాలలో తప్పుడు పద్దతులకు పాల్పడుతున్నని ఊదరగొట్టాలి. రెండవ తరగతిలో కంపెనీలు పన్ను ఎగ్గొట్టేందుకు పన్నుల స్వర్గాలుగా ఉన్న ప్రాంతాలకు తరలిపోతున్నందున కార్పొరేట్‌ పన్ను కనీసంగా 15శాతం విధించాలని పేర్కొన్నాయి. పేద దేశాలకు వందకోట్ల డోసుల కరోనా వాక్సిన్‌ అందించాలి. అభివృద్ది చెందుతున్న దేశాల అభివృద్ధికి తోడ్పడాలి.దానిలో భాగంగా బి3డబ్యు పధకాన్ని అమలు చేయాలి.


ఈ బృందంలో ఒకటైన బ్రిటన్‌ మన దేశాన్ని వలసగా చేసుకొని మన మూల్గులను పీల్చింది. మనం ఎదగాల్సినంతగా ఎదగకపోవటానికి అది కూడా ఒక కారణం. అదే విధంగా మిగిలిన దేశాలు కూడా అలాంటి చరిత్ర కలిగినవే. అలాంటి వాటికి మన దేశం సహజ బంధువు అని చెప్పటం అసలు సిసలు దేశభక్తుడిని అని చెప్పుకొనే నరేంద్రమోడీ చెప్పటం విశేషం. మన స్వాతంత్య్ర స్ఫూర్తికి అది విరుద్దం. సంఘపరివార్‌ దానిలో భాగం కాదు కనుక ఆ స్ఫూర్తితో దానికి పనిలేదు. ఆ కూటమి దేశాలతో వాణిజ్య లావాదేవీలు జరపటం వేరు, వాటికి సహజ మిత్రులం అని చెప్పుకోవటం తగనిపని. అణచివేసినవారు-అణిచివేతకు గురైన వారు సంబంధీకులు ఎలా అవుతారు? జి7 కూటమి దేశాల పాలకవర్గాల చరిత్ర అంతా ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని అణచివేయటం లేదా అణచివేతకు మద్దతు ఇచ్చిందే తప్ప మరొకటి కాదు. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యవారసుడైన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తాజా సమావేశాల్లో దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చైనా వంటి నియంతృత్వ దేశం కంటే తమ కూటమి పేద దేశాలకు మంచి స్నేహితురాలని చెప్పుకున్నారు. కమ్యూనిస్టు చైనా ఉనికిలో లేకముందు ఆ దేశాల చరిత్ర ఏమిటో లోకానికి తెలియదా ? పులిమేకతోలు కప్పుకున్నంత మాత్రాన సాధు జంతువు అవుతుందా ?

నలుగురు కూర్చుని ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో గతించాయని జి7 కూటమి గ్రహిస్తే మంచిదని చైనా తిప్పికొట్టింది.ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రాతిపదికన నిజమైన ఉమ్మడి లక్ష్యంతో మాత్రమే నిర్మాణం జరగాలని పేర్కొన్నది. దేశాలు చిన్నవా – పెద్దవా, బలమైనవా – బలహీనమైనవా పేద-ధనికా అన్నది కాదు అన్నీ సమానమైనవే, వ్యవహారాలన్నీ అన్ని దేశాలు సంప్రదింపులతో నిర్ణయం కావాల్సిందే. ఏదైనా ఒక పద్దతి అంటూ ఉంటే అది ఐరాస వ్యవస్ధ ప్రాతిపదికనే తప్ప కొన్ని దేశాలు నిర్ణయించేది కాదు అని స్పష్టం చేసింది. ధనిక దేశాల్లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించుకొనేందుకు ఏర్పాటు చేసుకున్న కూటమి ఇది. మరో మూడు సంవత్సరాల్లో ఐదు దశాబ్దాలు నిండనున్నాయి. ఈ కాలంలో ఈ కూటమి తన సమస్యలనే పరిష్కరించుకోలేకపోయింది, ఇక పేద దేశాల గురించి ఎక్కడ ఆలోచిస్తుంది? కరోనా విషయంలో ఇవన్నీ ఎంత ఘోరంగా విఫలమయ్యాయో ప్రత్యక్షంగా చూశాము. కరోనాను అదుపు చేయటమే గాక ఆర్ధికంగా పురోగమిస్తున్న చైనా మరింత బలపడుతుందన్న దుగ్ద, దాన్ని అడ్డుకోవాలన్నది తప్ప మరొకటి ఈ సమావేశాల్లో వ్యక్తం కాలేదు.


ఒక వైపు అమెరికాలో ఉన్న వాక్సిన్లు సకాలంలో వినియోగంచకు మురిగిపోతున్నాయనే వార్తలు మరోవైపు ప్రపంచాన్ని ఆదుకుంటామనే గంభీర ప్రకటనలు. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కడోసును కూడా అమెరికా ఇతర దేశాలకు ఇవ్వలేదు. వాటి తయారీకి అవసరమైన ముడిసరకులు, పరికరాల ఎగుమతులపై నిషేధం కొనసాగిస్తూనే ఉంది. చైనా బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పేరుతో తలపెట్టిన ప్రాజెక్టుల అమలుకు ఇప్పటి వరకు వందకు పైగా దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2013లో ప్రారంభమైన ఈ పధకాన్ని 2049లో కమ్యూనిస్టు చైనా ఆవిర్భావ వందవ సంవత్సరం నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. నిజానికి ఇలాంటి పధకాలను ఏ దేశం లేదా కొన్ని దేశాల బృందం ప్రారంభించటానికి ఎలాంటి ఆటంకం లేదు. చైనా చెప్పేది అమలు జరిగేనే పెట్టేనా అని నిర్లక్ష్యం చేసిన దేశాలు దాని పురోగమనాన్నిచూసి ఎనిమిది సంవత్సరాల తరువాత దానికి పోటీగా ఇప్పుడు బి3డబ్ల్యు (బిల్డ్‌ బాక్‌ బెటర్‌ వరల్డ్‌ )పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని ప్రతిపాదించాయి. మంచిదే, అభివృద్దిలో పోటీ పడటం కంటే కావాల్సింది ఏముంది.


బ్రిటన్‌ సమావేశాల్లో జి7 ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా ప్రస్తుతం చైనాతో యుద్దానికి సిద్దంగా లేదన్నది స్పష్టం. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నది. అయితే మూడు దశాబ్దాల క్రితం ప్రచ్చన్న యుద్దం ముగిసింది, విజేతలం మేమే అని ప్రకటించుకున్న తరువాత ఇప్పటి వరకు అమెరికన్లు తమ మిలిటరీ మీద 19లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. ఇదే కాలంలో చైనా ఖర్చు మూడులక్షల కోట్ల డాలర్లని అంచనా. అయినప్పటికీ అమెరికా యుద్దాన్ని కోరుకోవటం లేదని అనేక మంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతవరకు అమెరికా ఏ ఒక్క యుద్దంలోనూ చిన్న దేశాల మీద కూడా విజయం సాధించలేదు, అలాంటిది చైనాతో తలపడే అవకాశాలు లేవన్నది వారి వాదన. అయితే ఉక్రోషం పట్టలేక తెగించి అలాంటి పిచ్చిపనికి పూనుకున్నా ఆశ్చర్యం లేదు. తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోవాలని చైనా గనుక పూనుకుంటే అడ్డుపడే అమెరికా మిలిటరీని పనికిరాకుండా చేయగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతకాలం అమెరికా అనుసరించిన మిలిటరీ ఎత్తుగడలు దానికి పెద్ద భారంగా మారాయి.అందువల్లనే నాటో ఖర్చును ఐరోపా దేశాలే భరించాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. చైనాకు పోటీగా భారత్‌ను తీర్చి దిద్దుతామనే బిస్కట్లు వేసి ముగ్గులోకి దించి మన దేశం కేంద్రంగా ఆసియా నాటో కూటమి ఏర్పాటు చేయాలన్నది అమెరికా ఎత్తుగడ. ఇన్ని దశాబ్దాల నాటో కూటమితో ఐరోపా బావుకున్నదేమిటో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అమెరికన్లు యుద్దాన్ని కూడా లాభనష్టాల లెక్కల్లో చూస్తారు. 1986లో అమెరికా దళాల చర్యలు, నిర్వహణకు పెంటగన్‌ (రక్షణ) బడ్జెట్‌లో 28శాతం ఖర్చు అయ్యేది, ఇప్పుడది 41శాతానికి పెరిగింది, ఆయుధాల కొనుగోలు కంటే ఇది రెండు రెట్లకంటే ఎక్కువ.

అమెరికా మిలిటరీ బడ్జెట్‌, ఆయుధాలతో పోలిస్తే చైనా బలం తక్కువే అని వేరే చెప్పనవసరం లేదు. వేల మైళ్ల దూరం నుంచి అమెరికా వచ్చి యుద్దం చేయాలన్నా లేదా దానికి ముందు చైనా చుట్టూ తన దళాలను మోహరించాలన్నా చాలా ఖర్చుతో కూడింది. కానీ చైనాకు అలాంటి అదనపు ఖర్చు, ప్రయాస ఉండదు. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ చేతులెత్తేసిన తరువాత అణుబాంబులు వేసి భయపెట్టింది అమెరికా. ఇప్పుడు పశ్చిమాసియాలో అమెరికాను ఎదిరించే ఇరాన్‌, సిరియా వంటి దేశాలు, సాయుధశక్తుల వద్ద ఉన్న ఆయుధాలు అంతగొప్పవేమీ కాదు, అలాంటి వారి మీద అమెరికా అత్యంత అధునాతన ఆయుధాలను ప్రయోగించి చూడండి మా ప్రతాపం అంటున్నది. అది చైనా విషయంలో కుదిరేది కాదు. నిజంగా చైనాతో యుద్దమంటూ వస్తే అది ఒక్క దక్షిణ చైనా సముద్రానికే పరిమితం కాదు.కరోనా నేపధ్యంలో వైరస్‌ పేరుతో అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న ప్రచార యుద్దంతో జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో విజయవంతం అయ్యారని చెప్పవచ్చు. అది వాస్తవ యుద్దంలో అంత తేలిక కాదు. సాధ్యమైన మేరకు అదిరించి బెదిరించి తన పబ్బంగడుపుకొనేందుకే అమెరికా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి.తాజా జి7 సమావేశాలను కూడా అందుకే వినియోగించుకుంది. అమెరికాను నమ్ముకొని తాయత్తులు కట్టుకొని ముందుకు దూకిన దేశాలకు చైనా చుక్కలు చూపుతుందని ఇప్పటికే కొన్ని ఉదంతాలు వెల్లడించాయి.మన దేశం వాస్తవ దృక్పధంతో ఆలోచిస్తుందా ? దుస్సాహసం, దుందుడుకు చర్యలకు మొగ్గుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన చుట్టూ జరుగుతున్నదేమిటి -1 వైఫల్యాలపై దృష్టి మరల్చేందుకు మరో వివాదం : మోడీపై చైనా అనుమానం !

13 Sunday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ 1 Comment

Tags

anti china, Anti China Propaganda, Indo-China trade, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా ఘర్షణ జరిగి ఏడాది గడిచింది. మనవైపు 20 మంది మరణించగా తమవారు నలుగురు చనిపోయినట్లు చైనా చెప్పింది. అది ఒక బాధాకరమైన, అవాంఛనీయ ఉదంతం. సాధారణ పరిస్ధితులను పునర్దురించాలని ఇరుదేశాలూ సంకల్పం ప్రకటించాయి, చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అయినా ఒకరి మీద ఒకరికి అనుమానాలు తొలగలేదు. అందుకే ఉభయులూ కొన్ని చోట్ల బలగాలను కొంత మేరకు ఉపసంహరించుకున్నా, పూర్తిగా వైదొలగలేదు. చైనా వైపు నుంచి బలగాలను మోహరిస్తున్నారని మన మీడియాలో, మనమూ అదే పని చేస్తున్నామని చైనా ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఏడాది గడచిన సందర్భంగా ప్రపంచ మీడియాలోనూ దాని గురించి రాశారు.

బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్‌ పత్రిక జూన్‌ ఎనిమిదవ తేదీన రాసిన వార్తలో కొత్త వివాదాలు తలెత్తుతాయనే భయంతో భారత్‌ సరిహద్దుల్లో మిలిటరీ బలగాలను పటిష్ట పరుస్తున్నదని పేర్కొన్నది. వేసవి కాలం వచ్చినందున రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగే పెద్ద ముప్పు ఉన్నట్లు రష్యా పత్రిక ఇండిపెండెంట్‌ పేర్కొన్నది. ఈ పత్రికల వార్తలను ప్రస్తావిస్తూ అనేక పత్రికలు విశ్లేషణలు రాశాయి.కరోనా వైరస్‌, ఆర్ధిక రంగంలో వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నించవచ్చని చైనా విశ్లేషకులు చెప్పిన అంశాలను చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ ప్రచురించింది. ” యుద్దం రాదు, అయితే 2020 మేనెలలో సంక్షోభం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉంది, ఉభయపక్షాలూ పోరుకు ఎంతో సన్నద్దంగా ఉన్నాయి ” అని ఆసియా రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు అర్జన్‌ తారాపోర్‌ చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ రాసింది. కరోనా మహమ్మారి, ఆర్ధిక పరిస్ధితి మరింతగా దిగజారితే సరిహద్దుల్లో భారత్‌ మరో ఘర్షణకు పాల్పడవచ్చని షాంఘైలోని సామాజిక అధ్యయనాల సంస్ధ అంతర్జాతీయ సంబంధాల విభాగపు పరిశోధకుడు హు ఝియాంగ్‌ చెప్పారు.దేశీయంగా సంక్షోభం ఉన్నపుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎప్పుడూ సరిహద్దు సమస్యలవైపు చూసే రాజకీయ సంప్రదాయం భారత్‌కు ఉందని, ఈ విషయమై చైనా చాలా జాగ్రత్తగా ఉండాలని హు చెప్పాడు.

ఎక్కువ భాగం సైన్యాలను రెండు దేశాలూ ఉపసంహరించుకున్నాయి. హాట్‌స్ప్రింగ్స్‌, డెస్పాంగ్‌ మైదానాల వంటివాటి నుంచి ఇంకా జరగాల్సి ఉందని సింఘువా విశ్వవిద్యాలయంలోని జాతీయ వ్యూహ సంస్ధ డైరెక్టర్‌ క్వియాన్‌ ఫెంగ్‌ చెప్పారు.సరిహద్దు వెంబడి చైనా మౌలిక సదుపాయాలు చక్కగా ఉన్నాయి,అయినప్పటికీ ముందు పీఠీన అక్కడ ఎక్కువ దళాలు లేవు, రెండవ వరుసలో బలాలను మోహరించాల్సి ఉందని క్వియాన్‌ చెప్పారు. వివాదం చిన్నదే అన్నారు. గత ఏడాదితో పోలిస్తే సరిహద్దులో పరిస్దితి ఎంతో మెరుగ్గా ఉంది, అయితే ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగితే రెండు దేశాల మిలిటరీ మధ్య సంబంధాలకు, పశ్చిమ సరిహద్దులో స్ధిరత్వానికి ముప్పు అని కొందరు అభిప్రాయపడ్డారు. సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో చైనా తన దళాలం సంఖ్యను పెంచిందని కొన్ని వార్తలు సూచించాయి. భారత-చైనా నేతలు జనాలకు జవాబుదారీ కనుక సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోగలరని, ఇతర ప్రాంతాల వారు ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఉండటం ముఖ్యమని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ వ్యాఖ్యానించాడు. మే నెలలో జరిగిన కీలక ఎన్నికలలో ఓటమి తరువాత ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి వచ్చే ఎన్నికల్లో మద్దతు పొందాలని చూస్తోందని గ్లోబల్‌టైమ్స్‌ వ్యాఖ్యాత పేర్కొన్నారు.

రెండు దేశాల సైన్యాల ఉపసంహరణకు రెండు రోజుల ముందు చైనా నుంచి బెదిరింపులు ఉన్నందున ఇండో – పసిఫిక్‌ అవగాహనను మరింత పటిష్టపరుచుకోవాల్సిఉందని ఫిబ్రవరి 8న ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అంగీకరించినట్లు ప్రకటించారు.ఇరు దేశాల సంబంధాలు చౌరాస్తాలో ఉన్నాయి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం సహకారం గురించి ఆలోచించలేమని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ మేనెలలో వ్యాఖ్యానించారు. పరిస్ధితి ఇలా ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి-మే మాసాల మధ్యకాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం డాలర్ల విలువలో చూస్తే 70.1శాతం జరిగినట్లు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 64.1 పెరిగితే, భారత్‌ నుంచి చైనా దిగుమతుల 90.2శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2020 సంవత్సరంలో రెండు దేశాల మధ్య 86.4 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. తిరిగి అమెరికాను వెనక్కు నెట్టేసి మన దేశం చైనాతో అత్యధికంగా వాణిజ్యం నిర్వహించింది. ఈ ఏడాది తొలి ఐదునెలల్లో 48.16బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగినట్లు చైనా కస్టమ్స్‌శాఖ వద్ద జూన్‌ ఏడవ తేదీనాటికి నమోదైన వివరాలు వెల్లడించాయి. గతేడాది జరిగిన సరిహద్దు వివాదాలు చాలా వరకు వెనక్కు పోయినట్లు అసాధారణ వాణిజ్య లావాదేవీలు సూచిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే గతంలో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో చైనా 63 బిలియన్‌ డాలర్ల మేరకు మిగుల్లో ఉంటే 2020-21లో అది 44 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.మన ఎగుమతులు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి.


ఒక వైపు చైనాను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పడిన చతుష్టయ బృందంలో అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా,మన దేశం ఉన్నప్పటికీ మరోవైపున వాణిజ్యంలో మన దేశం చైనాతో ప్రధమ స్దానంలో ఉంది. వాణిజ్యం గురించి చర్చిందేందుకు మేము సిద్దమే అని ఆస్ట్రేలియా ప్రకటించింది. అమెరికా వైపు నుంచి కూడా అలాంటి సంకేతాలే వెలువడుతున్నాయి. సరిహద్దు వివాదాలకు వాణిజ్యానికి లంకె పెట్టవద్దని చైనా చెబుతున్నది. అయితే చైనా వస్తువులను బహిష్కరించాలని, చైనా మన శత్రువు, ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఒకవైపున ప్రచారంతో జనాన్ని సంతృప్తి పరుస్తున్నారు. మరోవైపు అదే చైనా నుంచి వస్తువుల దిగుమతులు, లాభాలతో వాణిజ్యవేత్తలను ప్రధాని నరేంద్రమోడీ సంతుష్టులను గావిస్తున్నారు. టెలికామ్‌ రంగంలో ఐదవ తరం ఫోన్లను ప్రవేశపెట్టేందుకు చౌకగా ఉండే చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరస్కరించి అధిక ఖర్చుతో కూడిన అమెరికా, ఐరోపాల వైపు మన దేశం చూస్తున్నది. అదే జరిగితే సెల్‌ఫోన్‌ ఛార్జీలు ఇంకా పెరుగుతాయి.
బీజింగ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆసియా మౌలికసదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబి)లో మన దేశం ఒక వాటాదారు. చైనాకు దానిలో 30.34శాతం వాటాలు ఉండగా మన దేశం 8.52, రష్యా 6.66శాతంతో రెండు, మూడు స్ధానాలలో ఉన్నాయి. చైనా వద్దుగానీ దాని డబ్బు ముద్దు అన్న విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఈ బ్యాంకులో మనమూ వాటాదారులమే గనుక సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ రుణం తీసుకుంటే తప్పేముందని మన అధికారులు వ్యాఖ్యానించారు. అయితే ఈ బ్యాంకు లేదా ఆసియా అభివృద్ది బ్యాంకు(ఏడిబి), ప్రపంచబ్యాంకు వంటి సంస్దల నుంచి రుణాలు తీసుకుంటే ఆ పధకాలకు సభ్యదేశాల కంపెనీలన్నీ టెండర్లు వేసి పాల్గొనేందుకు హక్కును కలిగి ఉంటాయి. గతేడాది ఏడిబి రుణంతో చేపట్టిన రైల్వే ప్రాజక్టులలో చైనా కంపెనీలను అనుమతించవద్దని కొందరు పెద్ద వివాదం సృష్టించిన విషయం తెలిసినదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కనిపించిన కేసు ఒక్కటే, పరీక్షలు కోటీ 80లక్షలు – కరోనా కట్టడిలో చైనా రహస్యం అదే !

11 Friday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science

≈ 1 Comment

Tags

china communists action to fight against covid-19, China Covid-19, COVID- 19 pandemic, Guangzhou tests 18m people, Narendra Modi Failures, nucleic acid test


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు, ఏ నెలలో చైనా ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవటం ఎంతో కష్టంగా మారిందంటూ ఒక విశ్లేషకుడు కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యానం రాశాడు. ఇది నిజమే. అది అతని వ్యక్తిగతం కాదు, చైనా వారు చెప్పే అంశాలపై నమ్మకం కోల్పోయిన వారందరి తీవ్ర మానసిక సమస్య ఇది. వారికి పూర్తిగా తెలియదు, ఇతరులు చెబితే వినరు. చైనా వారు చెప్పేవన్నీ అతిశయోక్తులే, అంత అభివృద్ది, పురోగమనం లేదూ, పాడూ లేదు, అన్నీ నాశిరకరం అని కొట్టి పారవేసిన వారు ఇప్పుడు నమ్మలేని అంశాలతో బిత్తరపోతున్నారు. అది నేల నుంచి నింగి విజయాల వరకు దూసుకుపోతున్నది. త్వరలో ఆర్ధికంగా అమెరికాను అధిగమించనుంది. సాంకేతిక రంగంలో కొన్ని అంశాలలో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలదే పైచేయిగా ఉన్నప్పటికీ వాటికి ధీటుగా ముందుకు వస్తోంది.


అనేక మంది చైనా గురించి సరైన సమాచారం తెలుసుకోవటం కష్టం అంటూనే రకరకాల చెత్తకథనాలు రాయటం, చూపటం, వినిపించటం చూస్తున్నాము. ఎంతో స్వేచ్చ, దేన్ని గురించైనా మాట్లాడుకోవచ్చు, తెలుసుకోవచ్చు, బయట పెట్టవచ్చు అడ్డూ అదుపు ఉండదు అని చెప్పుకొనే అమెరికా వంటి దేశాలలో కూడా అక్కడి పాలకుల కనుసన్నలలో వారికి పనికిరానిదాన్ని, వారి ప్రయోజనాలకు పనికి వచ్చే సమాచారాన్నే బయటికి వదులుతారు తప్ప ప్రతిదాన్నీ బహిరంగపరచరు. చైనా దానికి మినహాయింపు కాదు. చైనా విలేకర్ల పేరుతో వ్యవహరించే వారిలో అత్యధికులు తైవాన్‌, హాంకాంగ్‌, దక్షిణకొరియా, జపాన్‌లో ఉండి వార్తలు రాస్తారు. వారికి సిఐఏ ఏజంట్లు, చైనా వ్యతిరేకులు అందించే అంశాలే ఆధారం. చైనా ప్రధాన భూభాగంలో ఉండేవారు కూడా ఎక్కువ మంది అసత్య, అర్ధసత్య వార్తలనే వండి వడ్డిస్తారు. వీరిలో చాలా మంది జర్నలిస్టుల ముసుగులో విదేశీ గూఢచార ఏజంట్లు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. రెండు పనులూ చేస్తారు. మరి చైనా జర్నలిస్టులు ఇతర దేశాల్లో ఎలా ఉంటారు ? వ్యతిరేకులు బాంబులు వేస్తుంటే చైనా వారు రసగుల్లాలు విసురుతూ ఉంటారా ? అయితే ఎవరూ నిజాన్ని అంగీకరించరు.

విదేశీ జర్నలిస్టులు ప్రశ్నించినపుడు సహజంగానే జనాలు ఏ దేశంలో అయినా సందేహిస్తారు. దానికి చైనా మినహాయింపు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా పార్టీ కార్యకర్తలను విదేశీ జర్నలిస్టులు కలిసినపుడు వారు చెప్పదలచుకున్న అంశాలను వక్రీకరించకుండా ఉండేందుకు రాతపూర్వకంగా అందచేస్తారు. ప్రభుత్వ వైఖరి గురించి జనాలు స్వేచ్చగా అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం, వేదికలు ఉండవు అని చాలా మంది చెబుతారు. కానీ చైనా పేరుతో విశ్లేషణలు రాసే అనేక మంది అక్కడి సామాజిక మాధ్యమాల్లో వెల్లడయ్యే వైఖరుల ఆధారంగా, వాటిని ఉటంకిస్తూ, భిన్నఅభిప్రాయాలను తీసుకొని కాళిదాసు కవిత్వానికి తమపైత్యం జోడించి అన్నట్లుగా రాస్తారు.


కరోనా వైరస్‌ గురించి చేసిన తప్పుడు ప్రచారాల్లో వెయ్యోవంతు ఆ వైరస్‌ నివారణ, అంతానికి చైనా సర్కార్‌ తీసుకుంటున్న చర్యల గురించి రాసినా ప్రపంచానికి ప్రయోజనం ( అది చైనాకు కాదు ) ఉండి ఉండేది. అక్కడ అనుసరిస్తున్న పద్దతులను ఎందుకు అమలు చేయరంటూ ఆయా దేశాల జనాలు పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉండేది. వరల్డో మీటర్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఇది రాసిన సమయానికి ప్రపంచలో మొత్తం కరోనా కేసులు 17కోట్ల 56లక్షల 79వేల 912. మరణించిన వారు 37లక్షల 90వేల 392 మంది. మన దేశానికి సంబంధించి మొత్తం కేసులు రెండు కోట్ల 92లక్షల 74,823, మరణాలు 3,63,097. కేసుల సంఖ్యలో అమెరికా తరువాత రెండవ స్ధానంలో ఉంది, మరణాల్లో అమెరికా,బ్రెజిల్‌ తరువాత మూడవ స్ధానం. మొత్తం 222 దేశాలు, ప్రాంతాలలో చైనా 98వ స్ధానంలో ఉంది. అక్కడ నమోదైన కేసులు 91,359, మరణాలు 4636.చైనాలో కరోనా కేసులు, మరణాలు అంత తక్కువ ఎందుకున్నాయని ఇప్పటికీ సందేహించే వారున్నారు. వారిని ఎవరూ ఒప్పించలేరు,మెప్పించలేరు.ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా కేసులు, మరణాలు తక్కువే ఉన్నాయని వారికి తెలిస్తే తట్టుకోలేరేమో !

తాజాగా ప్రపంచ మీడియాలో వచ్చిన ఒక వార్త మరోసారి చైనా కరోనా కట్టడి గురించి ఆసక్తిరేపింది. దేశీయంగా ఒక వాక్సిన్‌ తయారు చేసినందుకు మన ప్రధాని నరేంద్రమోడీ తన భుజాలను తానే చరుచుకొని అభినందించుకున్నారు. పొగడ్తలకు అలవాటు పడ్డ ప్రాణం కదా, పోనీయండి అని అనేక మంది సమర్ధిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ఝౌ అనే పట్టణం, పరిసరాల జనాభా కోటీ 86లక్షలు. ఒక మహిళ (75) ఒక హౌటల్‌కు వెళ్లినపుడు కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు మేనెల 21 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు నగరంలో కోటీ 80లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 115 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి, 106 మందికి నిర్ధారణ అయింది. ఈ కేసులన్నింటిలో భారత్‌లో బయటపడిన డెల్టా రకం కనిపించింది. ఇది వేగంగా వ్యాపించే లక్షణం కలిగినదని చైనా అధికారులు చెప్పారు. ఒక గంటలోపే ఫలితాన్ని వెల్లడించే న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టులు చేశారు. రక్తం,కండరాలు,మూత్రంలో ఏవైనా వైరస్‌, బాక్టీరియాలు ఉంటే వెంటనే పసిగట్టే ఆధునిక పరిజ్ఞానంతో ఆ పరీక్షను చేస్తారు. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన పట్టణంగా రికార్డులకెక్కింది. గతంలో చైనాలోనే మరికొన్ని పట్టణాల్లో కూడా ఈ పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహించినా సంఖ్యరీత్యా ఇదే అత్యధికం. వాన్‌ఫు బయోటెక్నాలజీ అభివృద్ది చేసిన విధానం ప్రకారం బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలలో బయటపడిన కరోనా వైరస్‌ లక్షణాలను ఈ పరీక్ష వెల్లడిస్తుంది. గ్వాంగఝౌ పట్టణం, పరిసరాలలో 5,500 బయో, ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు, ఈ రంగంలోనే వెయ్యి ఆధునిక పరిజ్ఞాన సంస్ధలు ఉన్నాయి. కింగ్‌మెడ్‌ డయాగస్టిక్స్‌ గ్రూప్‌ రోజుకు మూడున్నరలక్షల పరీక్షలు చేయగల సామర్ధ్యం కలిగినది ఇక్కడ ఉంది, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. తమకు కరోనా వచ్చిన విషయాన్ని దాచినందుకు లేదా తెలియచేయనందుకు, పరీక్షకు నిరాకరించినందుకు కొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక హౌటల్‌లో ఉన్న వ్యక్తి పరీక్షకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగటమేగాకుండా భోజనానికి ఉపయోగించే ఫోర్క్‌తో పోలీసు మీద దాడి చేశాడు.

చైనాలో కరోనా కట్టడికి ఇప్పటివరకు మూడు రకాల వ్యూహాలను అనుసరించారు. వైరస్‌ బయటపడగానే దానికి చికిత్స ఏమిటో తెలియలేదు గనుక తొలి దశలో ప్రజారోగ్య నిరోధం మరియు అదుపు పద్దతులను అమలు జరిపారు. రెండవ దశలో వాక్సిన్లను ఉపయోగించారు. ఇప్పుడు మూడవ దశలో నిరోధం మరియు అదుపు పద్దతులను కూడా పాటిస్తున్నట్లు చైనా సిడిసి అధిపతిగా గతంలో పని చేసిన జెంగ్‌ గ్వాంగ్‌ చెప్పారు.ఈ చర్యలతో పాటు వాటిని అమలు జరిపే క్రమంలో చైనీయుల సామాజిక అలవాట్లను, అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నారు. గ్వాంగ్‌ఝౌ నగరంలో కేసులు 115 మాత్రమే బయటపడినప్పటికీ కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ప్రకటించి జన సంచారాన్ని పరిమితం చేశారు.చైనాలో అనేక సంస్ధలు వాక్సిన్ల తయారీకి పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఏడు రకాలకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 80 కోట్ల మందికి తొలి, రెండవ డోసు వాక్సిన్లు వేసినట్లు చైనా ప్రకటించింది.


గత ఏడాది ఊహాన్‌ నగరంలో కరోనాను కట్టడి చేయటం అనేక అనుభవాలను ముందుకు తెచ్చింది. తరువాత కాలంలో చెదురుమదురుగా వివిధ నగరాల్లో చాలా పరిమితంగా అయినా కేసులు బయటపడ్డాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా వైరస్‌ విస్తరించకుండా చూసేందుకు నూక్లియక్‌ యాసిడ్‌ పరీక్షలు చేసి జల్లెడ పట్టాలని నిర్ణయించారు. దీనికి కూడా ఊహాన్‌ అనుభమేతోడ్పడింది. అక్కడ ప్రారంభంలో యాభైవేల పరీక్షలు చేసి సమాచారాన్ని విశ్లేషించారు. తరువాత గతేడాది మేనెల ప్రారంభంలో అక్కడి కోటి మంది జనాభాకు పది రోజుల్లో ఈ పరీక్షలు చేసి దాగున్న వైరస్‌ను వెలికి తీసే యత్నం చేశారు.లక్షణాలు బయటకు కనిపించకుండా వైరస్‌ ఉన్న మూడు వందల కేసులు వెల్లడయ్యాయి.తరువాత బీజింగ్‌లోని కోటి ఇరవైలక్షల మందికి పరీక్షలు చేశారు, 174కేసులు బయటపడ్డాయి.


చైనాలో ప్రయాణాలు చేసే వారు గణనీయ సంఖ్యలో ఉంటారు. ప్రతివారినీ ప్రతి చోటా పరీక్షించటం సాధ్యంకాదు, అవసరమైన సిబ్బంది లభ్యత కూడా పెద్ద సమస్యే. అందువలన చైనా ప్రయాణ ఆరోగ్య సూచిక (కోడ్‌)లను రూపొందించాలని ఐటి కంపెనీలను కోరారు. ఆమేరకు తయారు చేసి ప్రతి ఒక్కరికీ ఒక సూచికను కేటాయించారు. వారి సెల్‌ఫోన్లలో యాప్‌ ఏర్పాటు చేశారు. దానిలో మూడు రంగుల సూచికలను పొందుపరిచారు.దానిలో సదరు వ్యక్తి చిరునామా వంటి ప్రాధమిక సమాచారంతో పాటు అనుమతించిన ఆరోగ్య వివరాలు, సందర్శించిన ఆసుపత్రులు, వాడిన మందుల వంటి వాటిని పొందుపరిచారు.అంతే కాదు, వారు పర్యటించిన ప్రాంతాలు, హౌటల్స్‌, మాల్స్‌, రైలు, విమానం, బస్‌, స్వంత వాహనం వంటి వివరాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా తనిఖీ సిబ్బంది ఫోన్లలో వారి కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు ఆకుపచ్చ సూచిక ఉన్నవారి వివరాలను చూస్తే వారు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు లేవని, కరోనా ప్రాంతాల్లో సంచరించలేదని అర్ధం. పసుపు పచ్చ కోడ్‌ వస్తే వారు శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారని, కరోనా ముప్పు ప్రాంతాలను సందర్శించటం, వైరస్‌ సోకిన వారితో కలిసినట్లు అర్ధం. ఎరుపు సూచిక ఉంటే ప్రమాదం ఉందని అర్ధం. వారికి లేదా కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకటం, సోకినవారిని కలిసినందున విడిగా ఉంచాల్సిన అవసరం ఉందని అర్ధం. కరోనాను మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించినందున పసుపు, ఎరుపు సూచికలు ఉన్న వారికి ప్రయాణించేందుకు అవసరమైన టిక్కెట్లను తిరస్కరించే, ప్రయాణ అనుమతి నిరాకరించే అధికారం యంత్రాంగానికి ఉంటుంది. ఆకుపచ్చ సూచిక ఉన్నవారు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

కరోనా నివారణకు వాక్సిన్‌ రూపొందించే వరకు ఫలానా ఔషధంతో నివారించవచ్చనే హామీ ఎక్కడా లేదు. అనేక రకాలతో ప్రయోగాలు చేశారు. . రెమిడెసివర్‌ కరోనా చికిత్సకు పనికిరాదని గతేడాది ఏప్రిల్‌ 15 నుంచే చైనాలో దాన్ని పక్కన పెట్టారు. అయినా మన నిపుణులు దాని గురించి జనంలో పెద్ద ఎత్తున ఆశలు కల్పించేందుకు కారకులయ్యారు. దాంతో మన జనాన్ని ఎలా పిండుకున్నారో చూశాము. ఫార్మా మాఫియాల పీకనులిమే కొత్త దేవుడు మోడీ అంటూ ప్రచారం చేసినప్పటికీ ఇది జరిగింది. తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ పరిశోధనలో కూడా అదే తేలింది. చైనాలో మన ఆయుర్వేదం మాదిరే స్ధానిక వైద్య పద్దతిలో వాడుతున్న ఔషధాలను కూడా చికిత్సలో ఉపశమనానికి వినియోగించారు. ఆ రంగ నిపుణులను కూడా అల్లోపతి ఆసుపత్రుల్లో నియమించారు, పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ వైద్యపద్దతి, ఔషధం వైరస్‌ను అంతం చేస్తుందనే భ్రమలు కల్పించలేదు. కనుకనే అక్కడ బాబా రామ్‌దేవ్‌ వంటి వారు వాటితో సొమ్ము చేసుకోవటం గానీ, ఆనందయ్య పచ్చడి వంటివి రంగంలోకి రావటం గానీ జరగలేదు.


ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న కారణంగానే చైనాలో వైరస్‌ అదుపులో ఉంది. అయితే ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది కనుక దేశ సంపదలను జనం కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు.లాభ నష్టాల లెక్కలు వేసుకోలేదు. ముందు ప్రాణాలను రక్షించటమే ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. మన వంటి దేశాలలో పెట్టుబడిదారులు దేని మీద ఎంత ఖర్చు చేస్తే ఎంత లాభం వస్తుందనే లెక్కలు ముందే వేసుకుంటారు. కొత్తదాని మీద ఖర్చు పెడితే ఒకవేళ ప్రయోజనం లేకపోతే మొత్తం దండగే అని భావిస్తే అసలు ముందుకు రారు. పాలకులు కూడా వారినే అనుసరిస్తారు గనుక అంబానీ, అదానీ అండ్‌కోకు ఆత్మనిర్భర అనో మరొక పేరుతోనే రాయితీలు ఇచ్చేందుకు చూపే శ్రద్ద జనం మీద చూపరు. ఆ కారణంగానే కేవలం రెండు వందల కోట్ల ఖర్చుతో జనానికి అవసరమైన ఆక్సిజన్‌ అందించే యంత్రాల ఏర్పాటు టెండర్లను ఎనిమిది నెలల పాటు కేంద్రం ఖరారు చేయలేదు. తీరా ముప్పు ముంచుకు వచ్చిన తరువాత, సుప్రీం కోర్టు మందలింపులతో చేయటాన్ని చూశాము. వాక్సిన్లు కూడా అంతే కదా ! అందుకోసం కేటాయించినట్లు చెప్పిన 35వేల కోట్లకు లెక్కలు చెబుతారా లేదా అని నిలదీసిన తరువాత విధిలేక మేమే వాక్సిన్లు వేయిస్తాం అనే ప్రకటన వెలువడింది. కేసులు తక్కువే అయినప్పటికీ చైనాలో ఖర్చు తక్కువేమీ కాలేదు. దాని కంటే ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవటం పెద్ద దెబ్బ అని వెంటనే గ్రహించింది. అందుకే ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో ఎక్కడా లేనిóంగా వైరస్‌ కనిపించిన నాలుగు నెలల్లోనే దాన్ని అదుపులో ఉంచి ఆర్ధిక కార్యకలాపాలన్నింటినీ పునరుద్దరించింది. అది ఖర్చు కంటే లబ్దే ఎక్కువ చేకూర్చిందని రుజువైంది. దాన్నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా ? మన భుజాలను మనమే చరుచుకుంటామా ?
అనువుగాని చోట అధికులమన రాదు,
కొంచెమైన నదియు కొదువగాదు,
కొండ అద్దమందు కొంచెమై ఉండదా,
విశ్వదాభిరామ వినుర వేమా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెరూలో తీవ్ర ఉత్కంఠ-అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష విజయం !

09 Wednesday Jun 2021

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Elecciones en Perú, Latin america left, Pedro Castillo, Peru presidential election 2021, Socialist Castillo


ఎం కోటేశ్వరరావు


నువ్వా నేనా ! ఒక వైపు పచ్చిమితవాద, అవినీతి వారసత్వం మరోవైపు మచ్చలేని వామపక్ష ఘన వారసత్వం. నరాలు తెగే ఉత్కంఠ. ఓటు ఓటుకూ అభ్యర్ధులు, మద్దతుదారుల రక్తపోటులో తేడా. ఆదివారం నాడు పెరూలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. మూడు లక్షల ఓట్లను లెక్కించకుండా బయటపడవేశారంటూ ప్రత్యర్ధి మద్దతుదారులు ఎన్నికల కార్యాలయం ముందు ప్రదర్శనలకు దిగగా కాస్టిల్లో మద్దతుదారులు కూడా ఫలితాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పోటీ ప్రదర్శనలకు దిగారు. ఇది రాస్తున్న సమయానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటికీ మారు మూల గ్రామీణ ప్రాంతాలు, విదేశాల నుంచి ఓట్ల వివరాలు రావటంలో ఆలశ్యం కారణంగా లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. పెరూ కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన 99.8 శాతం ఓట్లలెక్కింపులో కాస్టిల్లో 50.20 ప్రత్యర్ధి మితవాద కైయికు ఫుజిమోరి 49.80శాతం ఓట్లు సాధించారు. సంఖ్య రీత్యా కాస్టిల్లోకు 87,35,448, ప్రత్యర్ధికి 86,63,684 వచ్చాయి. కాస్టిలో మెజారిటీ 71,764 ఉంది. మెజారిటీ కంటే లెక్కించాల్సిన ఓట్లు తక్కువగా ఉండటంతో కాస్టిలో విజయం ఖాయమైంది. అక్రమాలకు పాల్పడి అవాంఛనీయ పరిణామాలు జరిగితే తప్ప అదే ఖరారు అవుతుంది.

గ్రామీణ ప్రాంతాలలో వామపక్ష అభ్యర్ధికి పెద్ద ఎత్తున మద్దతు ఉన్నట్లు వెల్లడైన కారణంగా మిగిలిన ఓట్లు అక్కడివే కావటంతో తమ అభ్యర్ధి విజయం సాధించినట్లు కాస్టిలో మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు లెక్కింపులో అక్రమాలు జరిగినందున ఫలితాన్ని తాను అంగీకరించేది లేదని కైయికూ ప్రకటించినందున పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లు పరిగణిస్తున్నారు. పరిశీలకులుగా ఉన్న లాటిన్‌ అమెరికా దేశాల సంస్ధ సభ్యులు ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. పది సంవత్సరాల కాలంలో మూడవ సారి కూడా ఓడిపోతుండటంతో కైకు నిరాశతో ఇలాంటి ఆరోపణలకు దిగారని విమర్శలు వచ్చాయి.


వామపక్ష అభ్యర్ధి విజయం తధ్యమనే వాతావరణం ఏర్పడటంతో స్టాక్‌ మార్కెట్‌, వాణిజ్య, పారిశ్రామికవేత్తలలో వెల్లడైన భయం కూడా ఒక సూచిక. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలటంతో సోమవారం నాడు కొద్ది సేపు క్రయ విక్రయాలను నిలిపివేయాల్సి వచ్చింది. కరెన్సీ విలువ కూడా గణనీయంగా పడిపోయింది. వామపక్ష నేత అధికారానికి వస్తే మార్కెట్‌ శక్తుల ఆధిపత్యంలోని వ్యవస్ధను మార్చివేస్తారనే ఆందోళన వ్యక్తమైంది.పట్టణ ప్రాంతాల నుంచి తొలుత లెక్కింపు ప్రారంభమైంది. ఎనభై ఆరుశాతం ఓట్ల లెక్కింపు వరకు మితవాద అభ్యర్ధిని కెయికో ఫుజిమోరీ 52శాతానికి పైగా ఓట్ల మెజారిటీతో కొనసాగారు,అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావటంతో 93శాతానికి చేరగానే ఇద్దరి ఓట్లు సమం తరువాత కాస్టిల్లో ఓట్లు పెరగటం ప్రారంభమైంది.

పెరూ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి అవసరమైతే రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలిదశలోనే 50శాతానికి మించి ఓట్లు తెచ్చుకుంటే రెండవ సారి అవసరం ఉండదు. లేనట్లయితే తొలి దశలో మొదటి రెండు స్దానాలలో ఉన్న అభ్యర్ధుల మధ్య అంతిమ పోటీ జరుగుతుంది. దీని ప్రకారం ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికలలో 18 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. వీరిలో మార్క్సిస్టు భావజాలంతో పని చేస్తున్న ఫ్రీ పెరు పార్టీ అభ్యర్ది పెడ్రో కాస్టిల్లో 18.92శాతం ఓట్లతో ముందుండగా ద్వితీయ స్ధానంలో పాపులర్‌ ఫోర్స్‌ పార్టీకి చెందిక కెయికు ఫుజిమోరి 13.41శాతంతో రెండవ స్ధానంలో నిలిచారు. పార్లమెంట్‌లోని 130 స్ధానాలకు గాను 27 బహుళనియోజకవర్గాల నుంచి ప్రతినిధులను దామాషా ప్రాతిపదికన ఎన్నుకుంటారు. మొత్తంగా ఐదుశాతంపైగా ఓట్లు సాధించటం లేదా ఒక నియోజకవర్గంలో ఏడుగురు ప్రతినిధులు గెలిచినా దేశం మొత్తంలో దామాషా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. ఈ మేరకు 20 పార్టీలు పోటీ పడగా పది పార్టీలు ఐదుశాతానికి పైగా ఓట్లు సాధించి పార్లమెంట్‌లో ప్రవేశం పొందాయి.ఫ్రీ (విముక్త )పెరు పేరుతో రంగంలోకి దిగిన కొత్త పార్టీ 13.4శాతం ఓట్లు పొంది 37 స్ధానాలతో పెద్ద పార్టీగా ఎన్నికైంది. .


దేెశంలో జరిగిన అభివృద్ది సామాన్యులకు ఉపయోగపడలేదని, కరోనా సమయంలో పిల్లలు ఇంటి దగ్గర నుంచి చదువుకొనేందుకు అవసరమైన లాప్‌టాప్‌లు, ఇంటర్నెట్‌కు నోచుకోలేకపోయారని పేదలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నరకాల మాదిరి తయారయ్యాయని విమర్శిస్తున్నారు. గతంలో ఎన్నికైన పది మంది అధ్యక్షులలో ఏడుగురు అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారు. గత మూడు సంవత్సరాలలో నలుగురు అధ్యక్షులు మారారంటే రాజకీయ అనిశ్చితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.తీవ్ర మాంద్యం, కరోనా కేసులతో పాటు మరణాల రేటూ ఎక్కువగా ఉంది. కేవలం మూడు కోట్ల 20లక్షల మంది జనాభాలో కరోనా కారణంగా ఇప్పటి వరకు రెండు లక్షల మంది మరణించారు. ప్రపంచంలో ఇది అత్యధిక రేటు. ఇదే సమయంలో పదకొండుశాతం మంది అన్నార్తులు పెరిగారు. చిలీ తరువాత ప్రపంచంలో రాగి ఎగుమతి చేసే రెండవ దేశంగా ఉంది. రాగి ఎగుమతులతో జిడిపిలో పదిశాతం ఆదాయం వస్తోంది.

తుది పోరులో పోటీ బడిన కైయికు ఫుజిమోరి జనానికి పరిచయం అవసరంలేని పేరు. కుట్రతో అధికారానికి వచ్చిన తిరుగుబాటుదారుగా, నియంతగా పేరున్న తండ్రి ఆల్బర్ట్‌ ఫుజిమోరి నుంచి రాజకీయవారసత్వం, ధనికులకు అనుకూల వైఖరితో పాటు, గత రెండు ఎన్నికలలో ఆమె అధ్యక్షపదవికి పోటీ పడ్డారు.2016 ఎన్నికలలో విజయం సాధించిన పెడ్రో పాబ్లోకు ప్రత్యర్ధి కెయికు ఫుజిమోరి మీద కేవలం 42,597 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. తాను గెలిస్తే కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 2,600 డాలర్ల విలువగల స్ధానిక కరెన్సీ చెల్లిస్తానని, గనుల నుంచి వచ్చే ప్రతిఫలంలో 40శాతం సొమ్ము ఆ ప్రాంత పౌరులకు నేరుగా అందచేస్తానని వాగ్దానం చేశారు. కెయికో ఫుజిమోరీ మాజీ ఎంపీ, అవినీతి కేసులు శిక్ష అనుభవించారు. పాతిక మందిని హత్య చేయించటం, అవినీతి కేసులో పాతిక సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న తన తండ్రిని విడుదల చేస్తానని చెప్పారు. గత ఎన్నికల తరువాత దేశంలో తలెత్తిన రాజకీయ అనిశ్చిత పరిణామాలకు తనను క్షమించాలని వేడుకున్నారు.ఆల్బర్టో ఫూజిమోరి పాలన అవినీతి అక్రమాలు, సంఘటిత నేరాల మయంగా మారింది, పది సంవత్సరాల పాలనలో పాల్పడిన నేరాలకు గాను పాతికేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆల్బర్ట్‌ కుమార్తె కెయికు నాయకత్వంలోని పార్టీ గత ఐదు సంవత్సరాలలో రాజకీయ అనిశ్చితికి కారకురాలు కావటంతో పాటు అవినీతి కేసులో కెయికు కూడా జైలు శిక్ష అనువించింది.అయితే ధనికులందరూ ఆమె తమ ప్రయోజనాలను కాపాడే సమర్ధురాలనే అభిప్రాయంతో మద్దతుగా నిలిచారు.


వామపక్ష అభ్యర్ధి కాస్టిలో ఒక స్కూలు టీచరు. ఫుజిమోరి హయాంలో రూపొందించిన ప్రజావ్యతిరేక రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని ఆయన వాగ్దానం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా పెరూలో ధనికులు-పేదల మధ్య అంతరాలు పెరిగాయి. ఎన్నికల్లో కూడా ఇదే సమీకరణ కనిపిస్తోంది.పెరూ ప్రయోజనాలకు విరుద్దమైన వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులను సమీక్షిస్తామని, గ్యాస్‌ ప్రాజెక్టులను జాతీయం చేయటం వంటి చర్యలు తీసుకుంటామని, లూటీ చేసిన సంపదలను స్వాధీనం చేసుకుంటామని పెరూ విముక్త పార్టీ వాగ్దానం చేసింది. 2007లో తొలుత పెరూ విముక్త రాజకీయ ప్రాంతీయ ఉద్యమంగా ప్రారంభమైంది.2012లో పెరూ విముక్త పార్టీగా ఏర్పడింది.2016లో దీన్ని ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేశారు. 2019లో పెరూ విముక్త జాతీయ రాజకీయ పార్టీగా పేరు ఖరారైంది.తమది సోషలిస్టు సంస్ధ అని, తాము మార్క్సిజానికి కట్టుబడి ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది.

ఓట్ల లెక్కింపులో తన మెజారిటీ తగ్గటం ప్రారంభం కాగానే కెయికో ఆరోపణల పర్వానికి తెరలేపారు.తనకు పడిన ఓట్లను బయట పడవేశారని, ఫలితాన్ని అంగీకరించేది లేదని ప్రకటించారు. లెక్కింపు సమయంలో ప్రతి ఒక్కరూ జాగరూకులై ఉండాలని అంతకు ముందు కాస్టిలో తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. రెండవ దశ ఎన్నికలకు ముందు ఆయన మీద పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరిగింది. గత నెలలో గుర్తు తెలియని సాయుధులు జరిపిన జరిపినదాడిలో నలుగురు పిల్లలతో సహా 16 మంది మరణించారు. దీనికి షైనింగ్‌ పాత్‌ పేరుతో సాయుధ చర్యలకు పాల్పడిన మావోయిస్టు గెరిల్లాల నుంచి విడిపోయిన వారే కారణమని ప్రచారం జరిగింది. ఈ మారణకాండను కాస్టిలో తీవ్రంగా ఖండించారు.
తొలి దశ ఎన్నికల్లో వామపక్ష కాస్టిల్లో ప్రధమ స్ధానంలో నిలవటంతో మీడియాలో, సామాజిక మాధ్యమంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు.మావోయిష్టు షైనింగ్‌ పాత్‌ సంస్ధతో సంబంధాలున్నాయని, కమ్యూనిస్టు అని ముద్రవేసి ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నించారు. వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో సంబంధాలు ఉన్నాయని మనం మరో వెనెజులాగా మారవద్దంటూ ధ్వజమెత్తారు. తనపై జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ, కొందరిలో ఉన్న అనుమానాలను తొలగిస్తూ మేం కమ్యూనిస్టులం కాదు, ఛావిస్తాలమూ(వెనెజులా ఛావెజ్‌) కాదు, ఉగ్రవాదులమూ కాదు. మేం కార్మికులం, మీ వంటి వారిమే,మనమందరం వీధుల్లో ఉన్నాం, ప్రశాంతంగా ఉండే వ్యవస్ధ కావాలని కోరుకుంటున్నాం అని ప్రచారంలో చెప్పారు.అంతకు ముందు విముక్త పెరూ పార్టీ నేత కాస్టిలోకు షైనింగ్‌ పాత్‌తో సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతుదారులు నాయకులుగా ఉన్న టీచర్స్‌ యూనియన్‌ నాయకత్వంలో నాలుగు సంవత్సరాల క్రితం సమ్మెకు నాయకత్వం వహించాడని మీడియా ప్రచారం చేసింది. తన పదవీకాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన తరువాత గ్రామీణ ప్రాంతాలలోని తన పాఠశాలలో తిరిగి బోధన చేస్తానని కాస్టిలో చెప్పాడు.


రాజ్యాంగం ప్రకారం ఒకసారి ఎన్నికయిన తరువాత వెంటనే జరిగే ఎన్నికలో పాల్గొనేనేందుకు అవకాశం లేదు. ఐదు సంవత్సరాల తరువాత తిరిగి పోటీ చేయవచ్చు. పెరూ రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు ప్రత్యక్ష ఎన్నిక జరిగిన తరువాత మరణించినా, ఏకారణంతో అయినా పదవి కోల్పోయినా, రాజీనామా చేసినా తదుపరి ఎవరిని ఎన్నుకోవాలో కూడా నిర్ధిష్టంగా ఉంటుంది, ఆమేరకు వారిని ఎన్నుకోవాలి తప్ప కొత్తగా ఎన్నికలు ఉండవు. అధ్యక్షుడిని అభిశంసించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. స్పెయిన్‌ వలస నుంచి విముక్తి పొందిన జూలై 28న ఎన్నికైన ప్రభుత్వం నూతన బాధ్యతలను స్వీకరిస్తుంది. ఇక పెరూలో ఉన్న రాజకీయ అనిశ్చితి విషయానికి వస్తే ఐదు సంవత్సరాల క్రితం పెడ్రో పాబ్లో కుజిన్‌స్కి ఎన్నికయ్యాడు.2018లో రాజీనామా చేయటంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న మార్టిన్‌ విజికారా బాధ్యతలు స్వీకరించాడు. అతగాడిని 2020లో అభిశంసించి పదవి నుంచి తొలగించారు. తరువాత పార్లమెంట్‌ స్పీకర్‌ మెరినో బాధ్యతలు స్వీకరించిన వారంలోగానే జనం నిరసన కారణంగా రాజీనామా చేశాడు.తరువాత ఫ్రాన్సిస్కో సగస్తీని పార్లమెంట్‌ ఎన్నుకుంది.


తొలి దశ ఎన్నికలో పోటీపడి గణనీయంగా ఓట్లు సంపాదించిన పార్టీలలో వామపక్ష శక్తులతో పాటు ఫుజిమోరిజంగా వర్ణితమైన మితవాదులను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. తుది దశ ఎన్నికల్లో వారంతా కాస్టిలోకు మద్దతు ప్రకటించారు. రాజధాని లిమా, ధనికులుండే పట్టణ ప్రాంతాలలో కైయికు మెజారిటీ సాధించగా పేదలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు కాస్టిలోను ఎంచుకున్నారు. రాజకీయాల్లో వామపక్ష శక్తుల పలుకుడి పెరిగినట్లే. రానున్న రోజుల్లో విధానపరమైన మార్పుల కోసం పెరూవియన్లు పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశం ఉంది. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో వామపక్షాల విజయాలను చూసి అనేక మంది తాము కూడా వామపక్ష వాదులమే అనే ముసుగు తగిలించుకొని ప్రజాకర్షక నినాదాలతో రంగంలోకి వచ్చారు. ఆ విధంగా గతంలో పెరూలో అధికారానికి వచ్చిన ఇద్దరు అధ్యక్షులు తాము వామపక్ష వాదులమే అని ప్రకటించుకున్నారు. ఆచరణలో పెట్టుబడిదారుల బంట్లుగా మారారు. వారిలో ఒల్లాంటా హుమలా ఒకడు. 2011నుంచి 2016 వరకు అధికారంలో ఉన్నాడు. నయాఉదారవాద విధానాలను అమలు జరిపి అభాసుపాలయ్యాడు. అవినీతి అక్రమాలకు తరువాత అరెస్టయ్యాడు.తాజా ఎన్నికల్లో తొలిదశలో పోటీ చేసి పదమూడవ స్ధానంలో నిలిచి కేవలం 1.5శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్నాడు. అనేక దేశాల అనుభవం చూసినపుడు వామపక్ష శక్తులు అధికారంలో ఉండి పెట్టుబడిదారులు, ప్రపంచ ద్రవ్య పెట్టుబడిని వ్యతిరేకించే చర్యలు తీసుకుంటే ఆశక్తుల కుట్రలను ఛేదించేందుకు జనం అవసరమైతే వీధుల్లోకి రావాల్సి ఉంటుందని బొలీవియా, వెనెజులా, చిలీ తదితర దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d