• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: ANDHRA PRADESH

లడ్డు రాజకీయం : సనాతనవాదిగా పవన్‌ కల్యాణ్‌ – కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడినదాంట్లో తప్పేంటి ?

28 Saturday Sep 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, CHANDRABABU, Narendra Modi Failures, Pawan kalyan, Prakash Raj, RSS, Tirupati Laddu Controversy, YS jagan


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది ? మాజీ సిఎం జగన్‌ మోహనరెడ్డిని ఇరుకున పెట్టాలని చూసిన చంద్రబాబు నాయుడు చివరకు తిరుమల పర్యటనను తీవ్ర వివాదాస్పదం గావించి మొత్తం మీద జగన్‌ నెత్తిన పాలుపోశారనే చెప్పాలి. పోలీస్‌ సెక్షన్‌ 30 తదితర ఆంక్షల పేరుతో ఆటంక పరచకుండా అనుమతించి ఉంటే పరమతాలకు చెందిన వారందరి మాదిరే జగన్‌ కూడా ఆలయసంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు రిజిస్టర్‌లో సంతకం చేసేవారా లేదా అనేది తేలిపోయి ఉండేది.చేయకపోతే అభ్యంతరం తెలిపి ఉంటే బంతి జగన్‌ కోర్టులో ఉండేది. అలాంటి అవకాశం లేకుండా వ్యవహరించటంతో జగన్‌ వ్యతిరేకులందరూ ఒక రకంగా నీరుగారిపోయారు. అయితే దీని మీద ఎవరి భాష్యం వారు చెప్పుకుంటున్నారు గనుక జనం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఇకనైనా లడ్డు రాజకీయానికి తెరదించి రాష్ట్ర సమస్యల మీద కేంద్రీకరించాలి.


చంద్రబాబు నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల వెంకటేశ్వరుడి దర్శనాన్ని చేసుకొని ప్రార్ధిస్తానని ప్రకటించిన వైఎస్‌ జగన్‌మోహన రెడ్డిని పరోక్షంగా ప్రభుత్వం అడ్డుకుంది. అంతకు ముందు తెలుగుదేశం, జనసేన, బిజెపి, వారి కనుసన్నలలో పనిచేసే సంస్థలు, వ్యక్తులు స్వామి దర్శనం చేసుకోవాలంటే ఆచారాలను మన్నిస్తూ దేవస్థాన రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందేనని, తలనీలాలు సమర్పించుకోవాల్సిందేనని ప్రకటించాయి. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి పాపానికి పాల్పడ్డారని దానికి ప్రాయచిత్తంగా సెప్టెంబరు 28 తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో పూజలు చేయాలని క్రైస్తవమతావలంబకుడిగా అందరికీ తెలిసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. మరోసారి శుక్రవారం నాడు మీడియా సమావేశంలో కూడా అదే చెప్పారు. తాను నాలుగు గోడల మధ్య బైబిలు చదువుతానని, బయట అన్ని మతాలను పాటిస్తానని, తనది మానవమతమని ఏం కావాలంటే అది రాసుకోవచ్చని కూడా చెప్పారు. తమ ప్రభుత్వం జగన్‌కు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని, తిరుమల పర్యటనను అడ్డుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అన్యమతస్తులెవరైనా ఆలయ రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందే అన్నారు. ఇప్పుడు లడ్డు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తులో తేలేదేమిటి, జరిగిందని చెబుతున్న లడ్డు నెయ్యి కల్తీ ఎప్పటికి నిర్ధారణ అయ్యేను, నిందితులుగా ఎవరిని తేల్చేను, ఏ శిక్షలు పడేను అన్నది భక్తులు నమ్మే ఆ భగవంతుడికే తెలియాలి. లడ్డు పరిణామాలతో అనేక ముఖ్య సమస్యలు జనం అజెండానుంచి మాయమయ్యాయి. ముఖ్యంగా ఇటీవలి వరదల్లో సంభవించిన భారీ నష్టానికి కేంద్రం నుంచి వరదలా సాయం వస్తుందని ఆశలు రేకెత్తించిన వారికి కనీసం మబ్బులు కూడా కనిపించటం లేదు.


తిరుమల దేవుడి మహిమల సంగతి తెలియదు.అఫ్‌ కోర్స్‌ నిజంగా మహిమే ఉంటే తన లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంటే పట్టించుకోకపోవటమేమిటి, దాని పేరుతో రాజకీయం చేస్తుంటే ఉపేక్షించటం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరూ మనోభావాలను గాయపరుచుకోనవసరం లేదు. దేవుడి లడ్డులో కల్తీ నెయ్యి దగ్గర ప్రారంభమైన వివాదం మలుపులు తిరుగుతూ మతం, సనాతన ధర్మ పరిరక్షణ వైపు పయనిస్తోంది. అనేక మంది నిజరూపాలను బహిర్గతం చేస్తోంది. మతం పేరుతో రాజకీయం, ఓటు బాంకులను ఏర్పాటు చేసుకొనే పార్టీల జాబితాలో బిజెపితో పాటు తెలుగుదేశం, జనసేన కూడా పోటీ పడుతోందన్నది తేలిపోయింది. అయితే దేశంలో మతరాజకీయాలు చేసే వారి గురించి జనం కళ్లు తెరుస్తున్న స్థితిలో ఆంధ్రులు అలాంటి తిరోగమన రాజకీయ వలలో పడతారా ? తిరుమల లేదా మరొక మతకేంద్రం కావచ్చు, మతేతరులు వాటిని సందర్శించాలని అనుకున్నపుడు అక్కడి ఆచారాలను గౌరవిస్తున్నట్లు అంగీకరించాలన్న నిబంధనలు, ఆచారాలు ఉన్నాయి. శుక్రవారం నాటి విలేకర్ల సమావేశంలో తాను వాటిని పాటించనని లేదా పాటిస్తానని గానీ జగన్‌ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోసారి తిరుపతి వెళతానని కూడా చెప్పలేదు.


లడ్డు కల్తీ సంగతి విచారణ తరువాత ఏదో ఒకటి తేలుతుంది. కానీ ఈ వివాదం తెచ్చిన సమస్యలు మాత్రం ముందుకూడా కొనసాగుతాయి. భగత్‌ సింగ్‌, చేగువేరా భావజాలం కలవ్యక్తిగా అనేక మంది ఇప్పటివరకు పవన్‌ కల్యాణ్‌ గురించి భావిస్తున్నవారికి భ్రమలు తొలిగిపోయాయి. అఫ్‌కోర్స్‌ వారాహి పూజలను చూసినపుడే చాలా మందికి అర్ధమైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలిచ్చిందని విమర్శించి తిరుమల లడ్డుకు మరోవిధంగా ప్రచారం కల్పించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆ లడ్డూతోనే రాజకీయం ఆడుతున్నారు. అందువలన కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్నట్లుగా ఆ పెద్దమనిషి సనాతన ధర్మం గురించి రెచ్చిపోయి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించలేదు. ఎన్నో పుస్తకాలు చదివినట్లు చెప్పుకున్న మేథావికి సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో జరిగిన దారుణాలు, కలిగించిన హాని అర్ధం కాలేదా లేక పుస్తకాలు చదవటం అన్నది ఒట్టి కబుర్లేనా ? నిజంగా అర్ధమై ఉంటే కనీసం మౌనంగా ఉండేవారు తప్ప దాన్ని పరిరక్షిస్తానంటూ విరుచుకుపడేవారు కాదు. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేసినపుడు ప్రకాష్‌ రాజ్‌ ఎక్కడకు వెళ్లారంటూ పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారని ఒన్‌ ఇండియా అనే వెబ్‌సైట్‌ తన విశ్లేషణకు శీర్షిక పెట్టింది. అక్కడ జరిగిన వాటి గురించి వాస్తవాల కంటే అభూత కల్పనలే ఎక్కువ వచ్చాయి, కాదూ ఒక వేళ నిజమే అనుకుంటే నరేంద్రమోడీ, బిజెపి ఎందుకు పెద్దగా స్పందించలేదో చెప్పగలరా ? చిన్న పాటి విమర్శ, అభ్యంతరాన్ని కూడా బిజెపి, హిందూత్వశక్తులు సహించవు. ఆరునెలలకే వారు వీరవుతారన్నట్లుగా అంతకంటే ఎక్కువ కాలమే బిజెపితో బంధంలో ఉన్నందున అదే జరిగినట్లు కనిపిస్తోంది. అసలు లడ్డు వివాదం గురించి ప్రకాష్‌ రాజ్‌ అన్నదేమిటి ? ‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌, ఇది మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగింది.దయచేసి దర్యాప్తు చేయండి.దోషులను పట్టుకోండి కఠినమైన చర్యలు తీసుకోండి. జాతీయ స్థాయిలో అనవసర భయాలను ఎందుకు వ్యాపింపచేస్తారు,ఎందుకు పెద్దదాన్ని చేస్తారు.మనకు ఇప్పటికే తగినంత మతతత్వం ఉంది(కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు కృతజ్ఞతలు) ’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీని మీద పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ‘‘ నేను ప్రకాష్‌ రాజ్‌ను ఇష్టపడతాను, ఆయన నాకు మంచి స్నేహితుడు, మేము గొప్ప బంధాన్ని పంచుకుంటాము.రాజకీయ అంశాల మీద మేము విబేధించవచ్చు గానీ, ఒక నటుడిగా నేను నిజంగా గౌరవిస్తాను. అయితే ఈ సమస్య మీద వ్యాఖ్యానించే అవసరం ఆయనకు లేదు ’’ అంటూ స్పందించారు. ప్రపంచంలోని వారందరూ స్పందిస్తున్నట్లు అనేక అంశాల మీద నిరంతరం తన భావాలను వెల్లడిరచే ప్రకాష్‌ రాజ్‌ దీని మీద మౌనంగా ఎలా ఉంటారు ? ఎందుకు ఉండాలి ? వద్దని చెప్పటానికి పవన్‌ కల్యాణ్‌ ఎవరు ? ఇదేమీ వ్యక్తిగత వ్యవహారం కాదు.


వన్‌ ఇండియా ఇంటర్వ్యూలో చెప్పినట్లు రాసిన అంశాలను బట్టి చూస్తే మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు విరుచుకుపడినట్లుగా పవన్‌ కల్యాణ్‌ తీరు ఉంది.‘‘ ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలను చూస్తే రాజకీయ అంశాలను ముందుకు తెచ్చినట్లుగా ఉంది.బిజెపిని, ప్రధాని మోడీని చర్చలోకి లాగుతున్నారు. తానొక గొప్ప లౌకికవాదినని ఆయన భావిస్తున్నారు. అతని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలుసు. నా ప్రశ్న ఏమిటంటే బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేస్తుంటే ఆయన ఎక్కడ ఉన్నారు ? దాని మీద మాట్లాడారా ? కానీ అనేక మంది లౌకికవాదులు హిందూ సమాజం మీద వ్యాఖ్యానించటం సులభం కానీ ఇతర మతాల వారి మీద వ్యాఖ్యానించటానికి భయపడతారు. వారికి లౌకిక వాదం అంటే ఒక వైపు మాత్రమే ప్రయాణించే దారి వంటిది, హిందూయిజం వెలుపల ఉన్న సమస్యలను విమర్శించటాన్ని తప్పించుకుంటారు. అందరి పట్ల సమంగా చూడకపోతే లౌకికత్వం అంటే ఏమిటి ? వ్యాఖ్యానించదలచుకున్నవారు అందరినీ ఒకేవిధంగా చూడాలి, దీన్నే సగటు భారతీయుడు వాంఛిస్తున్నాడు. మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించాలి లేకపోతే మౌనంగా ఉండాలి ’’ ఇవన్నీ సంఘపరివారం స్కూల్లో బోధించే తర్కంలోని అంశాలే. ప్రతిదాన్నీ ప్రశ్నిస్తాను, అవసరమైతే తోలువలుస్తా, తాట తీస్తా అని మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ ఇలా మాట్లాడటం అవకాశవాదం తప్ప మరొకటి కాదు. అందుకే ప్రకాష్‌ రాజ్‌ పరోక్షంగా ఒక చురక అంటించారు. ‘‘ గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తరువాత మరో అవతారం, ఏంటీ అవాంతరం … ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ ఒక ఎక్స్‌, ‘‘ చేయని తప్పుకి సారీ చెప్పించుకోవటంలో ఆనందమేమిటో, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ మరో ఎక్స్‌లో స్పందించారు. అంతే కాదు, మరో ఎక్స్‌లో ఇలా పేర్కొన్నారు.‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌ గారూ … మీ ప్రెస్‌ మీట్‌ను నేను చూశాను. నేను చెప్పిందేమిటి, మీరు దానికి వక్రభాష్యం చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి నేను తిరిగి వస్తా, ఈ లోగా నేను ఇంతకు ముందు చేసిన ట్వీట్‌ను పూర్తిగా పరిశీలించండి, అవగాహన చేసుకోండి, ఊరికే అడుగుతున్నా ’’ అని పేర్కొన్నారు. సినిమా హీరో కార్తి ఎప్పుడూ నవ్వుముఖంతో కనిపిస్తాడు. లడ్డు గురించి అడిగితే అదే ముఖంతో అది సున్నితమైన అంశం అని చెప్పటాన్ని కూడా పవన్‌ కల్యాణ్‌ తప్పుపట్టారు.


ఎవరు ఎటు ఉన్నారో, ఎవరి రంగు ఏమిటో జనాలు గ్రహిస్తున్నారు. మాంసం తింటాంగనుక ఎముకలను మెడలో వేసుకు తిరుగుతాం అన్నట్లుగా తాము భారత మితవాదులమని సగర్వంగా చెప్పుకొనే పత్రిక ‘‘ స్వరాజ్య ’’. అది లడ్డు వివాదంపై ఒక విశ్లేషణకు ‘‘ తిరుపతి లడ్డు సమస్య : పవన్‌ కల్యాణ్‌ మీ ముఖంలో కనిపిస్తున్న హిందూయిజానికి ఆంధ్రలో స్వాగతం ’’ అని శీర్షిక పెట్టింది. పార్టీలతో నిమిత్తం లేకుండా మరింత మంది బిజెపి ఏతర పార్టీల నేతలు సనాతన ధర్మం గురించి మాట్లాడాలని తద్వారా హిందువుల ప్రయోజనాలు రక్షించబడతాయని నొక్కి వక్కాణించారు. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ బోర్డు నెలకొల్పాలని పిలుపు ఇచ్చిన తరువాత సినిమా నటులు కార్తీ, ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించారని ప్రశంసలు కురిపించారు. నీవెవరో తెలియలాంటే నీ స్నేహితులను చూస్తే చాలన్నది గత లోకోక్తి ఇప్పుడు నీ బండారం తెలియలాంటే నిన్ను పొగుడుతున్నవారిని చూస్తే చాలు అని చెప్పాల్సి వస్తోంది. పవన్‌ కల్యాణ్‌ గారు చెబుతున్న సనాతన ధర్మం ఈ దేశంలో దాదాపు నలభై కోట్ల మంది దళితులు, గిరిజనులను అంటరానివారిగా వేల సంవత్సరాల పాటు వెలివాడల్లో దూరంగా పెట్టింది. వెనుకబడిన తరగతుల వారినీ పరిమితం కావించింది. మహిళలను అణచివేసింది.శూద్ర కులాలకు చెందిన వారితో సహా అందరినీ విద్యకు దూరం చేసింది. అందుకే అంబేద్కర్‌ ఈ సనాతన వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకంటే ఎక్కువ అధ్యయనం చేసి ఉంటారని అనుకోలేము. సనాతన వాదాన్ని పరిరక్షించాలని కోరుతున్నవారు నిజానికి ఎంత మంది దాని ప్రకారం నడుచుకుంటున్నారు. సనాతన వాదం మారేది కాదంటున్నారు. ఏక పత్నీవ్రతుడైన రాముడిని, బహుపత్నులున్న కృష్ణుడినీ ఒకే రకమైన భక్తితో సనాతనులు సమర్థిస్తున్నారు.వివాహ బంధంతో నిమిత్తం లేకుండా వేరేవారికి పిల్లలను కనటాన్ని కూడా మహాభారతంలో సమర్ధించారు. పెళ్లితో నిమిత్తం లేకుండా ఏళ్లతరబడి సహజీవనం చేసిన వారు, ఏ కారణంగా చెప్పకుండా భార్యలను వదలివేసిన వారూ, సనాతనంతో సంబంధం లేని ఆధునిక చట్టాల ప్రకారం విడాకులు తీసుకొని అనేక వివాహాలు చేసుకుంటున్నవారు కూడా సనాతన పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. అదొక ఫాషనైపోయింది. సనాతనం గురించి మరొకదాని గురించి గతంలోనే అనేక చర్చలు జరిగాయి.ముఖం మీద నామం అడ్డంగా పెట్టుకోవాలా నిలువుగా పెట్టుకోవాలా అంటూ దాడులు చేసుకున్న సనాతనుల గురించి తెలిసిందే. ఇప్పటికీ దాని మీద ఏకీభావం లేదు. ఇప్పుడు అలాంటి వారంతా ఒకటై సనాతనాన్ని విమర్శించేవారి మీద దాడులకు దిగుతున్నారు. గతంలో లోకాయతులను అణచివేశారు. కొత్తగా మతం పుచ్చుకున్నవారు మరీ రెచ్చిపోతున్నారు. సనాతనం మనదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల బాటలో నిలుపలేదు. ఆ తిరోగమనవాదాన్ని పరిరక్షించి దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతున్నవారు తాత్కాలికంగా ఓటు బ్యాంకులను సృష్టించుకోవచ్చు తప్ప దేశానికి చేసే మేలేమీ ఉండదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎమితిని సెపితివి కపితము : కడప, విశాఖ ఉక్కు మాటెత్తకుండా కూరగాయలు, అరటి పండ్ల కబుర్లు, రాహుల్‌పై అసత్యాలు చెప్పిన నరేంద్రమోడీ !

10 Friday May 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Adani, Ambani and Adani, ANDHRA PRADESH, BJP, CHANDRABABU, India Elections 2024, Modi distortions, Narendra Modi escapement, Narendra Modi Failures, YS jagan


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి, దానితో చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేనలు తబ్బిబ్బులౌతున్నాయి. పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయితేనేం అన్నట్లుగా తిరిగి వైసిపి గెలుస్తుందా ? మూడు పార్టీల కూటమి గెలుస్తుందా అన్నది తప్ప ఎవరు గెలిచినా కొత్తగా రాష్ట్రానికి, జనానికి ఒరిగేదేమీ లేదని మోడీ మాటలతో తేలిపోయింది. చిత్రం ఏమిటంటే తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి సంవత్సరాల తరబడి బిజెపి నేతలు ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది, అనుమతులు మంజూరు చేసింది మీరు, ఆరోపణలను ఎందుకు ఒక కమిషన్‌తో విచారించటం లేదని ప్రశ్నిస్తే కేంద్రం అవసరమైన సమాచారం అంతా సేకరిస్తున్నది త్వరలో చర్య ఏమిటో మీరే చూస్తారంటూ కబుర్లు చెప్పేవారు. చేసిందేమీ లేదు. ఐదు సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి పాలకుల మీద రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు. అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే జుమ్లా (అవసరానికి తగినట్లుగా మాట్లాడటం) తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు పోలవరంను ఏటిఎంగా వాడుకున్నట్లుగానే కాళేశ్వరాన్ని బిఆర్‌ఎస్‌ నేతలు వాడుకున్నారని కూడా మోడీ చెప్పారు. కాళేశ్వరానికి కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పోలవరం కేంద్ర ప్రాజెక్టు. దాన్నుంచి పిండుకున్నారని విమర్శించిన మోడీ ఐదేండ్లు చేసిదేమీ లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో వైసిపి పాలకుల మీద చర్య తీసుకుంటామంటే జనానికి చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు.


బిజెపి నుంచి ఆంధ్రప్రదేశ్‌ పౌరులు ఆశిస్తున్నదీ, తెలుగుదేశం, జనసేన ఆశలు కల్పించిందీ విభజన హామీల అమలు గురించి తప్ప వట్టిస్తరి మంచినీళ్ల గురించి కాదు.కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తారా లేదా విశాఖలో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తారా, అది సక్రమంగా పని చేయాలంటే అవసరమైన ఇనుప ఖనిజ గనులను కేటాయిస్తారా లేదా ఏం చెబుతారోనని ఎదురు చూస్తుంటే అవేమీ తనకు సంబంధం లేనట్లుగా రాజంపేట ఎన్నికల సభలో కూరగాయల శీతల గిడ్డంగులు,పులివెందులలో అరటి పరిశ్రమ గురించి మాట్లాడారు. పోనీ వాటినైనా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులతో ఏర్పాటు చేస్తామన్నారా అంటే అదీ లేదు.ఆంధ్రప్రదేశ్‌ పౌరులను మరీ అమాయకులుగా భావించినట్లు కనిపిస్తోంది.పదేండ్ల క్రితం ఏర్పాటు చేయాల్సిన విశాఖ రైల్వే జోన్‌కు ఇంతవరకు అతీగతి లేదు, దాని గురించి చెప్పకుండా మీకు బుల్లెట్‌ రైలు వద్దా అని ప్రశ్నించారు.వద్దని ఎవరు చెప్పారు. రద్దు చేసిన పాసింజరు రైళ్లను పూర్తిగా పునరుద్దరించలేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తవాటిని వేయటం లేదు గానీ సామాన్యులు భరించలేని టిక్కెట్‌ ధరలతో నడిచే బుల్లెట్‌ రైలు వద్దా అంటున్నారు. తక్కువ ఛార్జీలతో నడిచే రైళ్లకు బదులు రాబోయే రోజుల్లో ప్రైవేటు వారికి గిట్టుబాటుగా ఉండేందుకు గాను రద్దీ మార్గాల్లో సాధారణ సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు బదులు వందేభారత్‌లను ప్రవేశపెడుతున్నారు.వాటిని కూడా ప్రవేశపెట్టండి కలిగిన వారు ఎక్కుతారు. కానీ మధ్యతరగతి, దిగువ ఆదాయవర్గాల అవసరాలకు అనుగుణంగా ఇతర రైళ్లను ఎందుకు వేయరు.


మూడు పార్టీలు ఒక కూటమిగా పోటీ చేస్తున్నప్పటికీ తెలుగుదేశం-జనసేన పార్టీలు మాత్రమే ఉమ్మడి మానిఫెస్టోను విడుదల చేశాయి. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌తో కలసి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఆవిష్కరించేందుకు బిజెపి నేత సిద్దార్దనాధ్‌ తిరస్కరించిన వీడియోలను జనమంతా చూశారు. తమ కేంద్ర మానిఫెస్టో తెలుగు కాపీని మాత్రమే బిజెపి విడుదల చేసింది. బహిరంగ సభల్లో వెనుకబడిన తరగతుల జాబితాలో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పటం తప్ప ఎక్కడ బిజెపికి ఆగ్రహం వస్తుందో అన్న భయంతో తమ మానిఫెస్టోలో దాన్ని పెట్టలేదు. పోలవరం ప్రాజెక్టు కిందనిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం సంగతి తేల్చటం లేదు. ప్రాజెక్టు నిర్మిస్తున్న కేంద్రం ఇచ్చేదీ, రాష్ట్రమే భరించేదీ ఇంతవరకు తేల్చలేదు.ఇచ్చేందుకు కేంద్రం మొరాయిస్తున్నది.తన పర్యటనలో నరేంద్రమోడీ దాని గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ కేంద్రాన్నైనా మరొకరినైనా తాట వలుస్తాం, తోలు తీస్తాం అని సినిమా డైలాగులు చెప్పిన పవన్‌ కల్యాణ్‌ పోలవరం నిర్వాసితులకు చెల్లించేందుకు అవసరమైన వేల కోట్ల రూపాయలను సెస్‌ రూపంలో, విరాళాలు వసూలు చేసి చెల్లిస్తామని ప్రకటించటం గమనించాల్సిన అంశం. ఇలా ఇంతవరకు ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా ? తెలుగుదేశం-జనసేన మానిఫెస్టో అమలుకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి తెస్తారని అడిగితే ముందు అధికారమివ్వండి తరువాత చంద్రబాబు నాయుడు తన అనుభవంతో చక్రం తిప్పి కేంద్రం నుంచి సాధిస్తారు, రాష్ట్రంలో వనరుల వృద్ధికి అల్లా ఉద్దీన్‌ అద్బుత దీపం ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లో అలాంటి దాఖలాలు లేవు కదా అంటే ఈ సారి చూడండి అంటున్నారు. తెలంగాణాలో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ మరిన్ని అప్పులు చేస్తే తప్ప రోజు గడవని స్థితిలో ఉంది. తెలంగాణా కంటే వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ఎక్కువ అప్పులు చేసిందని చెబుతున్న తెలుగుదేశం పార్టీకి నిజంగానే అధికారం దక్కితే ఎలా నెట్టుకొస్తుందన్నది ప్రశ్న.


తెలంగాణాలో నరేంద్రమోడీ కొత్త సంగతి చెప్పారు. ఏదైనా పార్టీతో ఒప్పందం చేసుకుంటే అంబానీ-అదానీలు టెంపోల ద్వారా నోట్ల కట్టలను వారికి పంపుతారట. ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ నోట అంబానీ-అదానీ మాటలు రావటం లేదని, వారితో కాంగ్రెస్‌ ఒప్పందం కుదుర్చుకుందా ? టెంపోలలో నోట్లు వారికి చేరాయా అని ప్రధానికరీంనగర్‌ జిల్లా వేములవాడ ఎన్నికల సభలో ప్రశ్నించారు.” ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి వీరు అంబానీ-అదానీలను దుర్భాషలాడటం మానుకున్నారు. నేను తెలంగాణా గడ్డ నుంచి అడగదలుచుకున్నాను.అంబానీ-అదానీల నుంచి ఎంత సొమ్ము తీసుకున్నారో రాకుమారుడిని వెల్లడించమనండి. టెంపోల కొద్దీ నోట్లు కాంగ్రెస్‌కు చేరాయా ? తెల్లవారేసరికి అంబానీ-అదానీలను దూషించటం ఆగిపోయింది కనుక ఏ ఒప్పందం కుదిరింది. మీరు వారిని ఐదేండ్లుగా దూషించటాన్ని ఆకస్మికంగా ఆపివేశారంటే ఏదో నీచం జరిగింది( జరూర్‌ దాల్‌ మే కుచ్‌ కాలా హై(పప్పులో కంపు కొట్టేది ఏదో పడింది) ” అని మోడీ అన్నారు. రాహుల్‌ గాంధీ వెంటనే దానికి తగిన జవాబు ఇచ్చారు.” నమస్కారం మోడీ గారూ, మీరు భయపడుతున్నారు.సాధారణంగా మీరు తలుపులు మూసుకొని రహస్యంగా అంబానీ-అదానీల గురించి మాట్లాడతారు.తొలిసారిగా మీరు వారి గురించి బహిరంగంగా మాట్లాడారు.వారు టెంపోలలో డబ్బు ఇస్తారని మీకు తెలుసు, అది మీ వ్యక్తిగత అనుభవమా ? సాధ్యమైనంత త్వరలో దీని గురించి ఒక విచారణ జరపండి ” అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన రోజు నుంచి దేశంలో అనేక చోట్ల తనిఖీలు జరుపుతూ భారీ మొత్తాలలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. మరి టెంపోలలో తరలిస్తున్న సొమ్ము పట్టుకున్నట్లుగానీ, అవి అంబానీ, అదానీలవని ఎక్కడా వార్తలు రాలేదు. వారి కంపెనీలన్నీ బిజెపి పాలిత రాష్ట్రాలలోనే ఎక్కువగా ఉన్నాయి. నరేంద్రమోడీ ఆరోపించినట్లుగా నిజంగానే ఎన్నికల ప్రకటన తేదీ నుంచి రాహుల్‌ గాంధీ ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలను విమర్శించలేదా ? అది పచ్చి అవాస్తవమని హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక వాస్తవ నిర్ధారణ వార్త వెల్లడించింది. తొలిదశ ఓటింగ్‌ (ఏప్రిల్‌ 19) నుంచి తమ బృందం రాహుల్‌ గాంధీ,కాంగ్రెస్‌ యూట్యూబ్‌ ఉపన్యాసాలను పరిశీలించగా అనేక సందర్భాలలో విమర్శించినట్లు ఉందని మే తొమ్మిదవ తేదీన ప్రచురించిన వార్తలో వివరాలను ఇచ్చింది. ఇదీ విశ్వగురువు బండారం.


నిజానికి ఇది ఎదురుదాడి తప్ప మరొకటి కాదు. అదానీ కంపెనీల అక్రమాలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక అనేక ఆరోపణలు చేసింది. సూట్‌ కేసు కంపెనీల గురించి చెప్పింది. ఆ నివేదికలోని అంశాల మీద పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని, అదానీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదనైనా మీ నోటితో చెప్పండని ప్రతిపక్షాలు కోరితే అంగీకరించలేదు. అసలు పార్లమెంటులో లేదా వెలుపల అదానీ పేరే మోడీ ఉచ్చరించలేదు. దీని వెనుక ఏదైనా ఒప్పందం, టెంపోల కొద్దీ నోట్లు అందాయా ? ఎందుకంటే అంబానీ, అదానీ ఇతర బడా కార్పొరేట్ల కంపెనీల పేర్లు ఎక్కడా ఎన్నికల బాండ్ల జాబితాలో పెద్దగా కనిపించలేదు. రాజకీయ పార్టీలకు అవి విరాళాలు ఇవ్వలేదంటే నమ్మే అమాయకులు ఎవరైనా ఉన్నారా ? అంబానీలు, అదానీలు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రాపకంతో మరింత ధనవంతులౌతున్నారని కాంగ్రెస్‌, వామపక్షాలు, మరికొన్ని పార్టీలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు ఎవరైనా వ్యాపార, పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై పరస్పరం లబ్దిపొందే నిర్ణయాలు తీసుకొని మాకది-మీకిది అని పంచుకోవటం బహిరంగ రహస్యం.చట్టబద్దంగా జరుగుతున్న అవినీతి. వేములవాడ సభలో నరేంద్రమోడీ చలోక్తి విసిరారని కొందరు భాష్యం చెబుతున్నారు.అదానీ కంపెనీల అక్రమాల గురించి మోడీ మాట్లాడకపోవటాన్ని ప్రతిపక్షాలు జోక్‌గా విమర్శించలేదు,సీరియస్‌గానే చెప్పాయి.


రెండింజన్ల పాలన పుణ్యమా అని మధ్యప్రదేశ్‌ ఎంతో వెనుకబడింది. దానికి అనుగుణంగానే అక్కడి జనంలో వెనుకబాటుతనం కూడా ఎక్కువేకావచ్చు. నరేంద్రమోడీ మంచి మాటకారి, జనాన్ని బుట్టలో వేయటంలో దిట్ట అనటంలో సందేహం లేదు. కానీ ఏం చెబితే దాన్ని గుడ్డిగా నమ్ముతారా ? లేకపోతే విశ్వగురువు అంతధైర్యంగా మాట్లాడగలరా ? అది జన అమాయకత్వమా ? నేతల దిగజారుడా ? మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ నాలుగు వందల సీట్లు ఎందుకు కావాలంటున్నానంటే అని చెబుతూ క్రికెట్‌ జట్టులో ఎక్కువ మంది ముస్లింలను కాంగ్రెస్‌ చేర్చకుండా ఉండేందుకు అని చెప్పారని మేనెల ఏడవ తేదీన ది వైర్‌ పోర్టల్‌ నివేదించింది. నాలుగు వందల సీట్లు కావాలని బిజెపి అడగటం రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్లు తొలగించేందుకు అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే నరేంద్రమోడీ ముస్లిం విద్వేష అజండాను ఎంచుకున్నారు.” కాంగ్రెస్‌ ఉద్దేశ్యం ఏమంటే క్రీడల్లో మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వటం. దీని అర్ధం ఏమిటి ? మత ప్రాతిపదికన క్రికెట్‌ టీములో ఎవరు ఉండాలో లేదో అది నిర్ణయిస్తుందన్నమాట. నేను కాంగ్రెస్‌ను ఈ రోజు అడుగుతున్నాను.ఇలా వారు కోరుకోబట్టే, ఇందుకే 1947లో స్వాతంత్య్రం వచ్చినపుడు భారతమాతను మూడు ముక్కలు చేశారు. వారు 1947లో దేశం మొత్తాన్ని పాకిస్తాన్‌గా మార్చాలనుకున్నారు, తరువాత భారత ఆనవాళ్లు చెరిపివేయాలనుకున్నారు.నేను ఈ రోజు స్పష్టంగా చెబుతున్నా. కాంగ్రెస్‌ వారందరూ, వారిని అభిమానించేవారు జాగ్రత్తగా వినాలి…. మోడీ బతికి ఉన్నంత కాలం నకిలీ లేదా తప్పుడు లౌకికవాదం పేరుతో భారత గుర్తింపును చెరిపేందుకు ప్రయత్నిస్తే అతను అనుమతించడు ” అని మోడీ చెప్పారు.


దశాబ్దాలుగా ఉన్న బాబరీ మసీదు తాళాలను తీయించింది రాజీవ్‌ గాంధీ అన్నది తెలిసిందే. కాంగ్రెస్‌ అధికారానికి వస్తే రామాలయం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఆలయానికి కాంగ్రెస్‌ తాళం వేస్తుందని, జమ్మూ-కాశ్మీరుకు ఆర్టికల్‌ 370 తిరిగి తీసుకువస్తుందని దాన్ని నివారించాలన్నా, రిజర్వేషన్లను కాంగ్రెస్‌ తస్కరించకుండా, వాటిని ముస్లింలకు అప్పగించకుండా ఉండాలన్నా, పది సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లను పొడిగించాలన్నా తనకు నాలుగు వందల సీట్లు అవసరం అని కూడా నరేంద్రమోడీ చెప్పారు. ఇది భారతీయ తర్కమా, అడ్డగోలు మాటలా ? అధికారంలో కాంగ్రెస్‌ ఉండి తనకు నాలుగు వందల సీట్లు కావాలని కోరితే పైన చెప్పినవన్నీ జరగకుండా ఉండాలంటే తమకు అధికారం ఇవ్వాలనో, అంత భారీ మెజారిటీ ఇవ్వకూడదనో జనానికి చెబితే అర్ధం వుంది. ఆ సంఖ్య కోరుతున్న తమ మీద వస్తున్న విమర్శలను కాంగ్రెస్‌కు ఆపాదించి జనాన్ని తప్పుదారి పట్టించటం తప్ప ఇది మరొకటి కాదు.జనం మరీ అంత అమాయకంగా ఉన్నారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టులు కంపెనీలను రానివ్వరా ? నరేంద్రమోడీ, చంద్రబాబు, జగన్‌ అభివృద్ధి బండారమేమిటి ?

08 Wednesday May 2024

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Political Parties, STATES NEWS, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, CHANDRABABU, Chinese companies, Companies in India, CPI()M, Narendra Modi Failures, YS jagan


ఎం కోటేశ్వరరావు


చరిత్రలో నరేంద్రమోడీ పాలనలో జరిగినంత అభివృద్ధి మరే ప్రధాని, పార్టీ పాలనలోనూ జరగలేదంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా వార్తల కంటే గ్యారంటీ అంటూ నరేంద్రమోడీ దర్శనమిస్తున్నారు. ఎన్నికల బాండ్ల రూపంలో పోగేసుకున్న సొమ్మా మజాకా ! ప్రచారాన్ని గుడ్డిగా నమ్మటం లేదా నమ్మకపోవటం తెలిసిందే.ఏం జరుగుతోంది, వాస్తవాలేమిటి అని నిర్ధారించుకొనే ఓపిక లేదా తీరిక అందరికీ ఉండదు.ఒకదాన్ని నిర్ధారించుకొనే లోపల వంద వచ్చిపడుతున్నకాలమిది.దేశంలో కొత్త కంపెనీల ఏర్పాటు, పాతవాటి మూత తదితర అంశాల గురించి ప్రతినెల కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంసిఏ) ఒక నివేదిక విడుదల చేస్తుంది. 2024 మార్చినెల నివేదిక ప్రకారం దేశంలో 26,63,016 కంపెనీలు నమోదు కాగా వాటిలో 16,91,495 కంపెనీలు (64శాతం) పని చేస్తున్నాయి. మూతపడినవి 9,31,644 లేదా 34.98శాతం ఉన్నాయి. మిగిలినవి కూడా ఇతర ప్రక్రియల్లో ఉన్నాయి. 2014 ఏప్రిల్‌ 28వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త ప్రకారం 2014 మార్చి ఆఖరు నాటికి 13,94,819 కంపెనీలుండగా వాటిలో 9,52,433 లేదా 68శాతం పని చేశాయి. మిగిలినవన్నీ మూత లేదా ఆ దారిలో ఉన్నవే. 2015 మార్చి నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 14,59,278కి గాను పని చేస్తున్నవి 10,22,011 లేదా 70శాతంగా ఉన్నాయి. నరేంద్రమోడీ తొలి ఐదు సంవత్సరాల్లోచూస్తే మొత్తం కంపెనీలు 18,73,044 కాగా పని చేస్తున్నవి 11,56,374 లేదా 61.73శాతం ఉన్నాయి. 2012-13, 2013-14 సంవత్సరాలలో ఇప్పటితో పోల్చితే దిగజారుడు చాలా ఎక్కువగా ఉందని 2020జనవరి 25న ఇటి నౌ ఇంటర్వ్యూలో నీతి అయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా చెప్పారు. దీని ప్రకారం చూస్తే యుపిఏ పదేండ్ల పాలన చివరి రెండు సంవత్సరాలు దిగజారుడు ఎక్కువగా ఉన్నపుడే 68శాతం కంపెలు పని చేయగా తన పాలనలో అస్తవ్యస్థతను సరిదిద్ది గాడిలో పెట్టానని చెప్పుకున్న నరేంద్రమోడీ పదవ ఏడాది పాలనలో 63.5శాతానికి తగ్గాయి. 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1,85,312 కంపెనీలు నమోదు వాటి మూలధనం రు.30,927 కోట్లుగా ఉంది. అదే యుపిఏ పాలన చివరి సంవత్సరంలో 98,473 కంపెనీలు నమోదు కాగా వాటి మూల ధనం 39వేల కోట్ల రూపాయలు.పదేండ్ల పాలన అంతకు ముందు పది సంవత్సరాల స్థితిని చూస్తే మోడీ ఏలుబడిలో దిగజారినట్లా వెలిగిపోతున్నట్లా ?


కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రతినెలా విడుదల చేస్తున్న బులిటెన్‌లో ఏ రాష్ట్రంలో ఎన్ని సంస్థలు నమోదవుతున్నాయన్నది దానిలో ఉంటుంది. మధ్య,చిన్న,సన్నకారు పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)ల వివరాలు అందులో ఉండవు. కంపెనీల చట్టం కింద నమోదైనవే ఉంటాయి.కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచారం మేరకు కొన్ని రాష్ట్రాల తీరు తెన్నులను చూద్దాం. మూడు సంవత్సరాలలో మార్చి 31వరకు ఉన్న కంపెనీల పరిస్థితి, మొత్తం అంటే కంపెనీల చట్టం కింద నమోదైనవి. మన చట్టాలలో కంపనీల మూత గురించి చాలా గందరగోళం ఉంది. అందువలన పని చేస్తున్న వాటినే పరిగణనలోకి తీసుకుంటే మిగిలినవాటిలో మూతపడినవి, పని చేయనివి తదితరాలు ఉంటాయని గమనించాలి.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ×××× పని చేస్తున్నవి××× శాతం
2015 ×× దేశం ×××14,59,278××× 10,22,011 ××× 70
2019 ×× దేశం ×××18,73,044××× 11,56,374 ××× 61.73
2024 ×× దేశం ×××26,63,016××× 16,91,495 ××× 63.5

దేశంలో 2014-15 నాటికి ఉన్న కంపెనీలలో పారిశ్రామిక రంగంలో 21, వ్యవసాయ రంగంలో మూడు శాతం, సేవారంగంలో 76శాతం ఉన్నాయి. సేవారంగంలో ఐటి, వాణిజ్యం,గనులు, విద్యుత్‌ ఉత్పత్తి వంటి ఉన్నాయి. కాగా పదేండ్ల తరువాత చూస్తే గతేడాది నమోదైన వాటిలో 71శాతం సేవారంగం, 23 పరిశ్రమలు, ఆరుశాతం వ్యవసాయరంగంలో ఉన్నాయి.ఇది ఇటీవలి సంవత్సరాల ధోరణులకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. ఈ కారణంగానే మన ఎగుమతుల్లో సేవారంగం తప్ప పారిశ్రామిక వస్తువులు పెరగటం లేదు, జిడిపిలో ఈ రంగం వాటా గిడసబారిపోయింది. గతేడాది నమోదైన కంపెనీలను చూస్తే 17.6శాతంతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. పదేండ్ల క్రితం కూడా అదే స్థానంలో ఉంది.తొలిసారి ప్రధాని అయినపుడు నరేంద్రమోడీ విదేశాలు, విమానాల్లోనే ఎక్కువ కాలం గడిపారనే పేరు తెచ్చుకున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే అంతకు ముందు కాంగ్రెస్‌ పాలనా కాలంలో విదేశాల్లో పోయిన పరువు పునరుద్దరణతో పాటు భారీ మొత్తంలో విదేశీ నిధులు తెచ్చి చైనాతో పోటీ పడి మరీ ఎగుమతులు చేసేందుకు అని చెప్పారు.2015 మార్చి నాటికి దేశంలో 3,314 విదేశీ కంపెనీలు ఉండగా మోడీ తొలి ఏడాది కొత్తగా నమోదైనవి 157 ఉన్నాయి.2024 అవి 5,164కు పెరగ్గా పని చేస్తున్నవి 3,288 లేదా 64శాతం మాత్రమే. 2023 ఆగస్టు చివరి నాటికి చైనా ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం అక్కడ నమోదైన విదేశీ కంపెనీల సంఖ్య 11లక్షల 50వేలు, వాటిలో ఉన్న విదేశీ పెట్టుబడుల మొత్తం 1,950 బిలియన్‌ డాలర్లు.కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ 2021 నవంబరు 29న పార్లమెంటుకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2016 ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి సమాచారం వెల్లడించేనాటికి దేశంలో 7,17,059 కొత్త కంపెనీలు నమోదు కాగా 5,00,506 కంపెనీలు మూత పడ్డాయి.దీనికి పెద్ద నోట్ల రద్దు, కరోనా కారణమని చెప్పారు.2017-18లో 2,36,262, మరుసటి ఏడాది 1,43,233 కంపెనీలు మూత పడ్డాయి. దీనికి పెద్ద నోట్ల రద్దు, ఇతర కారణాలు తప్ప కరోనా కాదు.ఈ సంవత్సరాల్లో నమోదైనవాటికంటే మూతపడినవే ఎక్కువ.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి గురించి తెలుగుదేశం, వైసిపి మధ్య పెద్ద రచ్చ నడుస్తున్నది, మేం రాష్ట్రాన్ని పరిశ్రమలు, సేవారంగ సంస్థలతో ముందుకు ఉరికించామంటే మేమే అని చెప్పుకుంటున్నాయి.తమ పాలనలో సులభతర వాణిజ్య సూచికల్లో ఎంతో ముందున్నామని, లక్షల కోట్ల రూపాయల మేరకు వివిధ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని రెండు పార్టీల నేతలూ హడావుడి చేశారు. గత పదేండ్లలో జరిగిందేమిటో చూద్దాం.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015××ఆంధ్రప్రదేశ్‌ ×× 21,205 ××× 13,395 ××× 63.16
2019××ఆంధ్రప్రదేశ్‌ ×× 30,530 ××× 19,331 ××× 63.31
2024××ఆంధ్రప్రదేశ్‌ ×× 46,625 ××× 30,029 ××× 64.40
ఆమేరకు చూసినపుడు రాష్ట్రం విడిపోయిన తరువాత కంపెనీల నమోదు పెరిగినప్పటికీ పని చేస్తున్నవాటి శాతాలలో పెద్ద తేడా లేదు. అందువలన మేము ప్రోత్సాహమిచ్చాం, ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలను ఆదుకున్నాం అని చెప్పే కబుర్లలో పసలేదు. చంద్రబాబు నాయుడి ఐదేండ్ల పాలనలో వచ్చినవి 9,325 కాగా మూతపడినవాటి జాబితాలో చేరినవి 5,934 ఉన్నాయి. ఇక వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలనలో కొత్తగా నమోదైనవి 16,596 కాగా మూతపడినవి 10,698 ఉన్నాయి.
ప్రపంచం, దేశంలోని వివిధ రాష్ట్రాల ధోరణులను చూసినపుడు ఎక్కడ రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయో అక్కడ, భూమి, విద్యుత్‌, నిపుణులైన పనివారి లభ్యత మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు ముందుగా ఎక్కడైతే కంపెనీలు వస్తాయో అక్కడే పెరుగుదల ఉంటుంది.దానికి ఉదాహరణ తెలంగాణా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తరువాత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015××తెలంగాణా ×× 77,040 ××× 51,743 ××× 67.16
2019××తెలంగాణా ××1,05,072××× 62,123 ××× 59.12
2024××తెలంగాణా ××1,57,064××× 98,440 ××× 62.67
ఈ వివరాలను చూసినపుడు నరేంద్రమోడీ చేసిన పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చి చేష్ట దెబ్బ దేశం మొత్తం మీద పడినట్లే తెలంగాణా కంపెనీల మీద కూడా పడింది. పదేండ్లకు ముందున్న స్థితికి చేరుకోలేదన్నది స్పష్టం.పదేండ్లలో కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో 21,205 నుంచి 46,625 అంటే 25,420 పెరిగితే తెలంగాణాలో 80,024 ఉన్నాయి. రాష్ట్ర విభజన ఆందోళన సందర్భంగా తెలంగాణాలో నేతలు కొందరు ఆంధ్ర ప్రదేశ్‌ పెట్టుబడిదార్లు దోపిడీ చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దానికి పోటీగా తమ ప్రాంతాలను విస్మరించి తమ పెట్టుబడులన్నింటినీ తెలంగణాలో పెట్టామని ఆంధ్ర ప్రాంతం వారు వాపోయారు. లాభం వస్తేనే వ్యాపార వరదన పోతాడన్న లోకోక్తి తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర భక్తులైన పెట్టుబడిదార్లు గత పదేండ్లలో అక్కడ ఇబ్బడి ముబ్బడిగా కంపెనీలు పెట్టిన దాఖలాలు లేవని అంకెలే వెల్లడిస్తున్నాయి.తమ పెట్టుబడులు నిలిపివేసినంత మాత్రాన తెలంగాణాకు కంపెనీలు రావని భ్రమించిన వారు గణాంకాలను చూసి ఏమంటారు ?


ఏడాది×× రాష్ట్రం×× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015×× కేరళ ×× 37,905 ××× 24,835 ××× 65.52
2019×× కేరళ ×× 51,809 ××× 32,440 ××× 62.61
2024×× కేరళ ×× 81,177 ××× 54,460 ××× 67.08
కమ్యూనిస్టులతో పెద్ద తలనొప్పి కార్మికులు, ఉద్యోగులు వేతనాలు పెంచాలంటారు తప్ప రాష్ట్రం, దేశ అభివృద్ధి గురించి పట్టదు, పెట్టుబడిదార్లను బెదిరిస్తారు అనే ప్రచారం తెలిసిందే. తనను తాను స్వయంగా సిఇఓ అని పిలుచుకున్న చంద్రబాబు లేదా విజయవంతమైన వ్యాపార, పారిశ్రామికవేత్త అని పేరు పడిన జగన్‌మోహనరెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన కంపెనీల కంటే పోరాటాలకు చిరునామాగా ఉన్న సిపిఎం నాయకత్వంలోని కేరళలో గత పది సంవత్సరాలలో అదనంగా నమోదైన కంపెనీలు 43,272. మరి దీనికి విమర్శకులు ఏ సమాధానం చెబుతారు ? రెండవది అక్కడి కంపెనీల పని తీరు దేశ సగటుతో, రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉందా లేదా ? మధ్యప్రదేశ్‌లో 2003 నుంచి మధ్యలో ఒక ఏడాది కాంగ్రెస్‌ మినహా ఇప్పటి వరకూ బిజెపి పాలన కొనసాగుతోంది. 2015లో అక్కడ నమోదైన కంపెనీలు 29,782 కాగా 2024నాటికి 60,700కు అంటే 30,918 మాత్రమే పెరిగాయి. అక్కడేమీ కమ్యూనిస్టుల ప్రభావం లేదు, రెండింజన్ల పాలన ఎందుకు కంపెనీలు రాలేదు ? ఇక దేశానికి గుజరాత్‌ను నమూనా ప్రకటించి ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోడీ గురించి తెలిసిందే. అక్కడ 2015లో పని చేస్తున్న కంపెనీలు 64.72శాతం కాగా 2019లో 61.32, 2024లో శాతం 65.5 చొప్పున ఉన్నాయి. గుజరాత్‌ నమూనా అంత గొప్పగా లేదని, ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ప్రత్యేకంగా చేసిందేమీ లేదని గణాంకాలు వెల్లడించటం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కృష్ణా గోదావరి బేసిన్లో చమురు, గ్యాస్ – కష్టాలు మాకు, సంపద మీకా?

25 Sunday Feb 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, Krishna Godavari Basin, Krishna Godavari Basin oil, Narendra Modi Failures

డాక్టర్ కొల్లా రాజమోహన్,

          కృష్ణ – గోదావరి బేసిన్ ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాలలో వ్యాపించి ఉన్నది. ఇది భూఉపరితల పరంగా చూస్తే 28 వేల చదరపు కిలోమీటర్లలోను, సముద్రగర్భంలో 24 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. కేంద్ర పభ్రుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)- 14 ఆగస్టు 1956 నుండి చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం పరిశోధనలు జరుపుతున్నది.1978వ సంవత్సరంలో నర్సాపురం వద్ద మొదటిబావిని తవ్వి గ్యాస్ ను కనుగొన్నా రు. ఆ బేసిన్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా చమురు, గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఓ యన్ జీ సీకి ఉన్న ఆస్తులన్నిటిలోకీ అత్యంత ఎక్కువ ఉత్పాదకత వున్న విలువైన ఆస్తుల్లో కేజీ బేసిన్ ముఖ్యమైనది. ఇలాంటి సంపద్వంతమైన కేజీ బేసిన్ నిలువలు మన ముంగిట్లో వున్నా ఆంధ్రపజ్రలకు అందుబాటులో లేకపోవడమే విషాదం.


తాజా పరిణామం…
       కాకినాడకు 30 కిలోమీటర్ల దూరాన సముద్రగర్భం నుండి 2024, జనవరి7న ముడిచమురు ఉత్పత్తి  ప్రారంభమవటమే తాజా పరిణామం. కృష్ణ – గోదావరి బేసిన్ లో సహజవాయువుతో పాటుగా చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుందని అంచనా. ఆంధ్రతీరంలోవున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి. దీనివలన ఆంధ్రప్రాంత ప్రజలు సర్వతోముఖాభివృద్ధిని సాధించవచ్చు. కానీ బడా కార్పొరేట్ కంపెనీల అధిపత్యానికి కేంద్ర పాలకులు  లొంగిపోవటం వలన ఆంధ్రపజ్రలు సంపదలకు దూరమయ్యారు. ఆంధ్ర రాష్ట్రం మరింత నష్టపోతున్నది.   అన్వేషణ,వెలికితీత, ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, ధర నిర్ణయ విధానాలను సరిగ్గా నిర్వహించిన చోట ప్రజలు సంపదలను అనుభవిస్తున్నారు. లేనిచోట రిలయన్స్ అంబానీ లాంటి కొద్దిమంది కార్పొరేట్ శక్తులు లక్షల కోట్లరూపాయల సంపదలకు అధిపతులై విలాసజీవితం గడుపుతున్నారు.


లీటర్ పెట్రోల్ ను రు10, గ్యాస్ సిలిండర్ను రు 100 కే ఇవ్వవచ్చు!
        కేవలం విద్యుత్ ఉత్పాదనలోనేకాక ఎరువుల తయారీలో కూడా సహజవాయువు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంతోపాటు చౌకగా లభించేగ్యాస్ ఆధారిత విద్యుత్తును అందించటం ద్వారా సిమెంట్, సెరామిక్, రసాయనిక,అల్యూమినియం, స్టీల్ ప్లాంట్, ఫ్యా బ్రికేషన్ పరిశ్రమలలో ఖరీదైన విద్యుత్ మీద ఆధారపడటం తగ్గుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికిగ్యాస్ సరఫరా చేస్తే సంవత్సరానికి1200 కోట్ల రూపాయలకు మించి ఖర్చు తగ్గుతుందని 2010లోనేఅంచనా వేశారు. కే.జీ.బేసిన్  గ్యాస్ చాలినంతగా న్యాయమైన ధరకు లభిస్తే కాకినాడ నుండి విశాఖపట్నం వరకు కాలుష్య రహిత రసాయనిక పరిశమ్రల కారిడార్ ను నెలకొల్పవచ్చు.    కే.జీ బేసిన్ లో రోజుకి కొన్ని మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నారు. కేవలం ఒక్క ఎం ఎం ఎస్ సిఎం డి యూనిట్ గ్యాస్, సుమారు 1000 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షించగలదని నిపుణుల అంచనా. అంటే కేజీ బేసిన్   గ్యాస్ లో సగాన్ని ఉపయోగించుకున్నా మనం లక్ష కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించవచ్చు.లక్షలాదిమందికి ఉపాధిఅవకాశాలను కలిగించవచ్చు . రవాణా రంగంలో బస్సులకు, లారీలకు,కార్లకు, ఆటోలకు సిఎన్ జీ గ్యాస్ వాడకంవల్ల ఖర్చు తగ్గటమేకాకుండా కాలుష్యం నుండి పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చు. గృహ అవసరాలకు గ్యాస్ పైపుల ద్వారా అతి చౌకగా వంటగ్యాస్ ను అందించవచ్చు. దీని మూలంగా గ్యాస్ సిలిండర్లపై పభ్రుత్వ సబ్సిడీభారం తగ్గుతుంది. ప్రస్తుతం వెయ్యి రూపాయలకు పైగా ఖరీదవుతున్న వంట గ్యాస్ సిలిండర్ కు సమానమైన గ్యాస్ ను పైపులైన్ ద్వారా వందరూపాయలకే ఇవ్వవచ్చును. అలానే లీటర్ పెట్రోలును రు 10 కే వాహనదారులకు అందించవచ్చు.


నూతన పాలసీతో కార్పొరేట్ సంస్థల అధిపత్యం!
      
       1991లో పీవీ నరసింహారావు పభ్రుత్వం నూతన ఆర్థిక విధానాలను చేపట్టింది. దేశం ఎదుర్కొంటున్న సర్వసమస్య లకు ఏకైక పరిష్కారంగా ప్రైవేటైజేషన్ ను ముందుకు  తెచ్చారు. అందులో భాగంగా చమురు సహజవాయువు ప్రాంతాల వేలంకు దేశ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. దేశీయకంపెనీ అయిన రిలయన్స్, విదేశీ సంస్ద అయిన కెయిర్న్ లాంటి కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇవి ప్రభుత్వ సంస్థలను రద్దు చేయకుండానే వాటిపునాదిని ఉపయోగించుకుని విపరీతమైన లాభాలను గడించాయి.    ప్రపంచీకరణ విధానాలలో భాగంగా చమురు గ్యాస్ నిక్షేపాలను దేశ విదేశీ కార్పోరేట్ వ్యాపార సంస్థలకు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో కేంద్రం 1997లో నూతన అన్వేషణ లైసెన్సింగ్ పాలసీ( నెల్ప్-NELP) ని పవ్రేశ పెట్టింది. నూతన విధానానికి రెండు లక్ష్యాలను పభ్రుత్వం పక్రటించింది. సముద్ర గర్భంలోనూ,భూ ఉపరితలంలోనూ నూతన గ్యాస్ నిక్షేపాల కోసం అన్వేషణను ప్రోత్సహించి,
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా స్వదేశీ గ్యాస్, చమురు ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటం. రెండవది, ఈ పథకం కింద పభ్రుత్వం వేలంపాట ద్వారా కొన్ని నిర్దిష్టప్రాంతాలలో నిక్షేపాల అన్వేషణకు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం పక్రారం తాము పెట్టిన పెట్టుబడిని లాభాలతో సహా త్వరగా రాబట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వంతో సంప్రదించి ధర నిర్ణయించే అవకాశాన్ని పభ్రుత్వం ఈ నూతన అన్వేషణ దారులకు కల్పించింది. ఈ నూతన విధానం పక్రారం  కృష్ణా- గోదావరి బేసిన్ లో సముద్రగర్భంలోని బావులలో అత్యధిక నిల్వలున్న గ్యాస్,చమురు నిక్షేపాలను రిలయన్స్ కంపెనీ కైవసం చేసుకుంది. ఈ కంపెనీ తన సామ్రాజ్యాన్ని అనేక
రంగాల్లోకి విస్తరించుకున్నది. 


అంగట్లో అన్నీ ఉన్నా…


       సహజవాయువు, చమురునిక్షేపాలు మన ముంగిట్లో అంటే కే.జీ.బేసిన్ లో పుష్కలంగా ఉన్నా ఆ వనరులను ఉపయోగించుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. దీనికి ప్రధాన కారణం కే.జీ.బేసిన్ గ్యాస్ సంపద రాష్ట్రసరిహద్దులు దాటి తరలిపోవడం. సహజ న్యాయసూత్రాల పక్రారం కే.జీ.బేసిన్ లో లభ్యమయ్యే సహజవాయువు మన రాష్ట్రఅవసరాలు తీరిన తర్వాతనే మనసరిహద్దులు దాటిపోవాలి. సహజ వనరుల యాజమాన్యం, నియంత్రణ ఆ ప్రాంత ప్రజలందరి ప్రయోజనాలను న్యాయమైనరీతిలో కాపాడేటట్లుగా రాజ్యవ్యవస్థ వ్యవహరించాలని భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు చెప్తున్నాయి.    సహజ న్యాయానికి, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా  బేసిన్ లో లభ్యమవుతున్న సహజవాయువు మన సరిహద్దులు దాటి 1500 కిలోమీటర్లదూరంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్రలకు తరలిపోతున్నది. 45.50% గ్యాస్ ను గుజరాత్ కు తరలిస్తున్నారు. 24% మహారాష్టలోని పరిశమ్రలకు ఇచ్చేస్తున్నారు. మిగిలిన దాన్ని ఉత్తరపద్రేశ్ కు తరలిస్తున్నారు.  ఆంధప్రద్రేశ్ రాష్ట్ర అవసరాలకు 1.2 శాతాన్ని మాతమే కేటాయిస్తున్నారు. కేంద్రపభ్రుత్వ కార్పోరేట్ అనుకూల విధానాలు, రాష్ట్రపభ్రుత్వాల నిష్క్రియాపరత్వం, పటిష్టమైన ప్రజా పోరాటాలు సాగని ఫలితంగా  మన సహజసంపద తరలిపోతున్నది.


ప్రహసనంగా మారిన ధరల నిర్ణయం ధర!


       కేజీ బేసిన్ లో సహజవాయువు ధరను నిర్ణయించటం ఒక ప్రహసనంగా మారింది. రిలయన్స్ కంపెనీ ప్రవేశించేవరకూ గెయిల్ సంస్థ ల్యాంకో పరిశమ్రకు యూనిట్ ఒకటికి 1.97 డాలర్లకు సరఫరా చేస్తున్నది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు కేజీ బేసిన్ నుండి ఒక యూనిట్ గ్యాస్ ను 2.97 డాలర్లకు సరఫరా చేస్తానని రిలయన్స్ కంపెనీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. తదనంతరం ప్లేట్ ఫిరాయించి 4.3 డాలర్లకైతేనే గ్యాస్ ఇస్తామన్నది. ఇంత ఎక్కువ ధరలు నిర్ణయించటానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఆ ధరకు గ్యాస్ కొనుగోలు చేస్తే ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి, తదితర పరిశమ్రలకు భారం అధికమవుతుందన్న ఆనాటి కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి జైపాల్ రెడ్డిని ఆ శాఖ నుండి తప్పించేశారు. ధర పెంచటం అన్యాయమన్న కేంద్రకార్యదర్శుల కమిటీనిర్ణయాన్ని ఆమోదించలేదు. రంగరాజన్ అధ్యక్షతనగల పధ్రాన ఆర్థిక సలహా మండలి నిర్ణయాన్ని ఒప్పు కోలేదు. పణ్రబ్ ముఖర్జీ అధ్యక్షతన కేంద్రపభ్రుత్వం ఒక మంత్రుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఏదోఘనకార్యం చేసినట్లుగా నటించి రిలయన్స్ కోరిన 4.33 డాలర్ల ధరను 4.2 డాలర్లకు తగ్గించింది. కొండను తవ్వి ఎలుకను పట్టటం అంటే ఇదే! 


ఆనాటి రాష్ట్రపభ్రుత్వ ఆందోళన


       అలస్యంగానైనా మేల్కొన్న ఆనాటి ఆంధర్రాష్ట్ర పభ్రుత్వం కేజీ బేసిన్ లోని సహజ సంపదలో మన రాష్ట్రానికి న్యాయసమ్మతమైన వాటా లభించాలని కేంద్రపభ్రుత్వాన్ని కోరితే రిలయన్స్ కంపెనీతో మాట్లాడుకోమంది. ఉన్న నిల్వలు మాకే సరిపోవు కాబట్టి  కొత్తగా ఆంధప్రద్రేశ్ రాష్ట్రానికి ఒక్క యూనిట్ సహజవాయువును కూడా సరఫరా చేయలేను అని తేల్చి చెప్పింది. దీని ఫలితంగా మన రాష్ట్రంలో అప్పటికే ప్రైవేట్  రంగంలో నెలకొల్పన గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు గ్యాస్ సరఫరా అసాధ్యమైంది. ఈ పరిస్థితులలో ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిగారు కేంద్రానికి కొన్ని సూచనలు చేస్తూ 29 లేఖలు రాశారు. న్యాయబద్ధమైన సూచనలలో ఏ ఒక్కదానిని కూడా కేంద్రపభ్రుత్వ మంత్రుల కమిటీ పరిగణనలోకి తీసుకొననేలేదు. ఈ విధానం హక్కులను నిరాకరించటమే గాక అణిచివేయటం కాదా!    12వ ఆర్థిక సంఘం కూడా ఏ ప్రాంతంలో దొరికేసహజ వనరులపైన ఆ ప్రాంతానికి వినియోగ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అక్టోబర్, 2013 రిపోర్టులో, సహజ వనరులు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రానికి కనీసం 50 శాతం గ్యాస్ తో పాటు రాయల్టీనీ కూడా ఇవ్వాలని రికమెండ్ చేసింది. సముద్ర అంతర్భాగం నుండి గ్యాస్ తీసినా, భూమినుండి తీసినా రాష్ట్రానికి వాటా వుండాల్సిందేనని పార్లమెంటు కమిటీ తేల్చిచెప్పింది. మన రాష్ట్రంలో లభ్యమయ్యే సహజ వనరులలో కొంత భాగాన్ని మాత్రమే మన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికోసం డిమాండ్ చేస్తున్న అత్యంత హేతుబద్ధమైన, న్యాయమైన ఈ డిమాండ్ ను కూడా కేంద్రపభ్రుత్వం నిరాకరించటం అంటే ఫెడరలిజాన్ని నిరాకరించటమే, కార్పోరేట్ కంపెనీలకు పత్ర్యక్షంగా వత్తాసు పలకటమే!


కష్టాలు మాకు-సంపద మీకా?


       భూమిలోపల కొన్ని లక్షల సంవత్సరాల పరిణామాల ఫలితంగా సహజవాయువు, చమురుఏర్పడుతుంది. ప్రజలు సముద్రపు ఆటుపోట్లను, అల్పపీడనాలను, వాయుగుండాలను,ఉప్పెనలను, సునామీలు, పంట పొలాలలో గ్యాస్ బ్లో అవుట్లు లాంటి కష్టాలను ఎదుర్కొంటూ జీవిస్తున్నారు. మన గ్రామాల నుండి మన పొలాల నుండి గ్యాస్ ను పైపులద్వారా గుజరాత్ కు తీసుకొని వెళ్తూ మనకు ఒక్క కేజీ గ్యాస్ కూడా ఇవ్వరట. మన రాష్ట్రంలో లభించేసహజ వనరులను దోచుకుని రిలయన్స్ వంటి బడా కార్పోరేట్ సంస్థలు ఇబ్బడి
ముబ్బడిగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటాన్ని, మన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మనం వ్యతిరేకించాలి. లేనిపక్షంలో మనం భవిష్యత్ తరాల ముందు దోషులుగా నిలబడవలసి వస్తుంది. నిజానికి ఇది పభ్రుత్వ, ప్రజా ప్రతినిధుల బాధ్యత. అయితే ఇప్పటివరకు మన ప్రజా ప్రతినిధులు స్పందించాల్సిన రీతిలో స్పందించని ఫలితంగా ప్రజాఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజీలేని సమైక్య ఉద్యమాన్నినిర్వహించవలసిన అవసరం నేడు ఏర్పడింది. కేజీ బేసిన్లో లభించే సహజ వనరులపై మన ప్రాథమిక హక్కును సాధించుకోవటానికి పోరాట దీక్షతో కలసికట్టుగా ముందడుగులు వేద్దాం!

  డాక్టర్ కొల్లా రాజమోహన్,   కృష్ణా గోదావరి బేసిన్ చమురు గ్యాస్ సాధన సమితి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెల్లెలు షర్మిల రాజకీయం : వసుదేవుడి స్థితిలో అన్న వైఎస్‌ జగన్మోహనరెడ్డి ?

01 Monday Jan 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, BRS, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, tdp, TDP, Telangana, Ycp

≈ Leave a comment

Tags

#YS Sharmila, ANDHRA PRADESH, Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


కాంగ్రెస్‌లో చేరవద్దు, అన్నతో చేతులు కలిపి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగాలని, అక్కడ ఉన్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయిస్తామని సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెల్లెలు షర్మిలకు రాయబారం పంపినట్లు, ఆమె తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమా కాదా అన్నది పెద్దగా ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. అన్నతో కలిస్తే లేదా లడాయికి దిగితే జరిగే పరిణామాలు, పర్యవసానాలు ఏమిటన్నదే చర్చ. నిజానికి షర్మిల కాంగ్రెస్‌లో చేరటం తెలంగాణా ఎన్నికలకు ముందే ఖరారైంది. ఆమె ఎక్కడ తన నూతన ప్రస్థానాన్ని ప్రారంభిస్తే పార్టీకి ప్రయోజనం అన్న తర్జనభర్జనల తరువాత చివరికి ఆంధ్రప్రదేశ్‌ను కార్యస్థానంగా ఎంచుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. ఇది వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఊహించని పరిణామేమీ కాదు. తెలంగాణాలో తిరిగి బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని వేసుకున్న లెక్కల పరీక్షలో జగన్‌ తప్పారు. అతని ధీమా గురించి ఎరిగిన వైసిపి అభిమానులు తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ విజయం మీద ధీమాతో పెద్ద మొత్తంలో పందాలు కాసి చేతులు కాల్చుకున్నారు.సోదరి కాంగ్రెస్‌ ప్రవేశం గురించి ఆ ఎన్నికలకు ముందు తరువాత అంచనాల్లో మార్పులతో జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు పూనుకున్నారని చెబుతున్నారు. తల్లీ, చెల్లిని ఇంటి నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి గెంటివేశారన్న విమర్శలకు జగన్మోహనరెడ్డి గానీ, వైసిపి నేతల వద్దగానీ సరైన, సమర్ధనీయమైన సమాధానం లేదు. షర్మిలను ఇంటికి ఆహ్వానించటం అంటే తల్లిని కూడా చేరదీయటమే అవుతుందని, తమ మీద ఉన్న విమర్శలకు సమాధానం చెప్పినట్లు అవుతుందని వైసిపి నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.తమ నేత అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారని, చిప్పకూడు తిన్నారని తెలుగుదేశం, జనసేన ఇతర పార్టీలు, మీడియా చేస్తున్న దాడిని తక్కువ చేసేందుకు, మీ నేత కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు, అదే చిప్పకూడు తిన్నారు అని తమ గణాలకు ఒక ఆయుధం ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడిని కేసులతో జైలుకు పంపారన్న విమర్శలు, ఆ ఉదంతాన్ని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. షర్మిలను దగ్గరకు తీయటం జరుగుతుందా ?


రాజకీయాల్లో ఏదీ అనూహ్యం కాదు, ఎవరు ఎప్పుడు దేనికి ఎవరితో చేతులు కలుపుతారో ఊహించలేము.నారా లోకేష్‌కు క్రిస్మస్‌ బహుమతి పంపిన షర్మిల తీరును సాధారణ అంశంగా కొట్టివేయలేము. ఊహాగానాల్లో ఉన్న అంశం ప్రకారం షర్మిల తన అన్న జగన్మోహనరెడ్డితో కలిస్తే జరిగేదేమిటి ? అన్న చేసిన అన్యాయానికి ఎంత లబ్దిపొంది చేతులు కలిపారు అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే అన్నా-చెల్లెళ్లు ఒకటైతే తెరవెనుక షర్మిలకు జరిగే లాభం ఏమిటో వెల్లడికాదు కానీ తెరముందు జగన్‌కు అది పెద్ద నష్టానికి దారి తీస్తుంది. ఓట్ల పరంగా షర్మిల తెచ్చేదేమీ ఉండదు. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందన్న లోకోక్తి తెలిసిందే. అయితే పురాణాల్లో అది ఒక మహత్తర కార్యం కోసం అలా చేశారని సమర్దిస్తారు. కానీ షర్మిల కోసం జగన్‌ తలవంచినా, ఒక అడుగువెనక్కు తగ్గినా సమర్థన జనానికి ఎక్కదు. ఓడిపోయే పరిస్థితి వచ్చింది కనుకనే అలా చేస్తున్నారని అనుకోవటం ఖాయం. అదే జరిగితే వైసిపి శ్రేణుల్లో జగన్‌ మీద ఉన్న విశ్వాసం మరింతగా సన్నగిల్లుతుంది, డొల్లతనం బయటపడుతుంది, ఓటర్ల మీద ప్రతికూల ప్రభావంతో మరింత నష్టం జరుగుతుంది. తమకు ఎవరితో పనిలేదని ఇంతకాలం చేసిన ప్రచారానికి ఎదురుదెబ్బ. అలాగాక రాయబారం లేదా బేరాన్ని షర్మిల తిరస్కరించినట్లు వచ్చిన వార్తలు నిజమే అయితే అది కూడా జగన్‌కు ఎదురుదెబ్బే. వ్రతం చెడ్డా ఫలం దక్కని స్థితి. దాన్ని కూడా జగన్‌ బలహీనతగానే ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చేస్తాయి. ఎలా జరిగినా అన్నను చెల్లెలు ఇరకాటంలోకి నెట్టినట్లే. బహుశా జగన్‌ లేదా సలహాదారులు దీన్ని ఊహించి ఉండరు.


2024 ఎలా ఉంటుందో తెలియదు గానీ 2023 వైఎస్‌ జగన్‌కు నిద్రలేని రాత్రులతో వీడ్కోలు పలికిందని చెప్పవచ్చు. మరోవైపు తెలుగుదేశ-జనసేన కూటమికి ఆశావహ సూచనలతో 2024 స్వాగతం పలికింది.అయితే బిజెపితో తెలుగుదేశం సయోధ్యకు పూనుకున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే ఆ సంతోషం తాత్కాలికమే కావచ్చు.నాలుగు లోక్‌సభ, పన్నెండు అసెంబ్లీ స్థానాల కోసం బిజెపి బేరమాడుతున్నట్లు చెబుతున్నారు. ఒప్పందం కుదురుతుందా లేదా ప్రచారమేనా, ఎన్ని సీట్లు కొనుక్కుంటారు అన్నది పక్కన పెడితే వచ్చే పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. 2004లో బిజెపితో చేతులు కలిపి చేతులు కాల్చుకున్న చంద్రబాబు నాయుడు పదేండ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.2014లో బిజెపితో ముడివేసుకొని ఐదేండ్లూ కాపురం చేయకుండానే ఎవరిదారి వారు చూసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు చేసిన విమర్శలకు ఫలితాల తరువాత మోడీ, ఇడి, ఐటి, సిబిఐలను చూసి తెలుగుదేశం నోటికి తాళం వేసుకుంది. ఇప్పుడు వైసిపిని ఓడించటమనే ఏకైక అజండా తప్ప బిజెపి- తెలుగుదేశం కలవటానికి మరొక కారణం లేదు. అధికార యావతప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని జనం భావిస్తారు. తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని కర్ణాటకలో బిజెపి నేతలు స్వయంగా ప్రకటించారు. రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల తీరుతెన్నులు చూసినపుడు మైనారిటీలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు ఓటుచేసినట్లు స్పష్టమైంది. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించింది వైఎస్‌ జగన్మోహరెడ్డి అయితే వెనుక నుంచి ప్రోత్సహించింది లేదా మీ ఇష్టం అన్నట్లు వ్యవహరించింది బిజెపి అని తెలుగుదేశం శ్రేణులు భావించాయి. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపటాన్ని ఎంతవరకు జీర్ణించుకుంటాయి ?ప్రస్తుతం తెలుగుదేశం కూటమి, వైసిపి మధ్య నువ్వానేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాంటపుడు వచ్చే-పోయే ప్రతి ఓటుకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణా, రాజస్థాన్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికార మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే.


అధికారమే పరమావధిగా ఉన్న రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులూ ఎవరూ ఉండరు.ఇప్పటి వరకు తెరవెనుక వైసిపి మద్దతుదారుగా ఉన్న బిజెపి ఒక్కసారిగా తెరముందు తెలుగుదేశంతో చేతులు కలిపితే షర్మిల చేరిన కాంగ్రెస్‌తో జగన్మోహనరెడ్డి చేతులు కలిపే అవకాశాన్ని కొట్టిపారవేయలేము. ఇప్పుడు అది ఊహాజనితమే కావచ్చు. జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదని, కేసులు బనాయించిందన్న దుగ్దతప్ప కాంగ్రెస్‌తో వైసిపికి ఇతర పంచాయితీ ఏముంది. తన సత్తాఏమిటో జగన్‌ నిరూపించుకున్నందున అతనితో కలిసేందుకు కాంగ్రెస్‌కూ ఇబ్బంది ఉండదు. దానికి పార్టీ పునరుద్దరణ ముఖ్యం తప్ప మరొకటి కాదు. పాత సంవత్సరం తెలుగుదేశానికి ఒక పీడకల అని చెప్పాలి. చంద్రబాబునే అరెస్టు చేయించిన జగన్మోహనరెడ్డి తమ మీద కేంద్రీకరిస్తే ఏమిటన్న ఆందోళన తెలుగుదేశ శ్రేణుల్లో తలెత్తిందన్నది కాదనలేని వాస్తవం. ఒక విధంగా చంద్రబాబు నాయుడి మీద బనాయించిన కేసు, రిమాండ్‌కు పంపటం తెలుగుదేశం కార్యకర్తల్లో ఇంతకంటే ఏం చేస్తారు అన్న తెగింపును కూడా తెచ్చింది. బెయిలు వచ్చిన తరువాత వారిలో చలి వదిలింది..


మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధి చేస్తామనే పేరుతో వైసిపి ఆడిన క్రీడ వికటించింది.వట్టిస్తరి మంచినీళ్లు అన్నట్లుగా అభివృద్దీ లేదు, దానికి రోడ్‌మాపూ లేదు. అమరావతిని గాలికి వదలివేశారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రకరకాల ఆందోళనలను, న్యాయపోరాటాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద, గత ఒప్పందాలను విస్మరించటం మీద కేసులు దాఖలు చేశారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని అన్న ప్రచారం అక్కడ భూ దందాలకు తెరలేపేందుకే అన్న సంగతిని ఆ ప్రాంత వాసులు ఇప్పటికే గుర్తించారు.ముహూర్తాలు ఎన్నో చెప్పారు. చివరికి 2023 నవంబరు 22న జారీచేసిన ఉత్తరువులో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పధకాల సమీక్షల నిమిత్తం ముఖ్యమంత్రి, శాఖాధిపతుల క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానిలో ఎక్కడా కార్యనిర్వాహక రాజధాని అనే పదం లేదు. చివరికి కోర్టులో కేసు దాఖలు కావటంతో అది కూడా ఆగిపోయింది. ఇది జగన్‌కు ఊహించని దెబ్బ. కోర్టు కేసు ఇప్పట్లో తేలే అవకాశాలు లేవు. ఈ లోగా ఎన్నికల షెడ్యూలు ప్రకటన రానుంది. కాళేశ్వరాన్ని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్న బిఆర్‌ఎస్‌ ఆశలను మేడిగడ్డ బారేజ్‌ పిల్లర్ల కుంగుబాటు ఎలా దెబ్బతీసిందో చూశాము. వైసిపికి మూడు రాజధానుల అంశం కూడా అలాంటిదే. ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసేందుకు మాత్రమే పనికి వస్తుంది తప్ప జనాన్ని మెప్పించేది కాదు.


జగన్మోహనరెడ్డికి 2023 మిగిల్చిన మరో ఆశాభంగం స్కిల్‌డెవలప్‌మెంట్‌, ఇతర కేసులు. తెలుగుదేశం పార్టీ నేతలను ప్రత్యేకించి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌లను వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు లేదా కనీసం ఎన్నికల తేదీ వరకు జైలుకు పంపి ప్రచారానికి దూరం చేయటం, అంతకంటే ముఖ్యంగా అగ్రనేతలకే ఏ గతి పట్టిందో చూడండి అని తెలుగుదేశం శ్రేణులను భయపెట్టేందుకు చూశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈకేసుల్లో సిఐడి వ్యవహరించిన తీరు ఊహించినదానికంటే ముందుగానే జనసేనను తెలుగుదేశానికి మరింతదగ్గర కావించింది. చంద్రబాబు నాయుడిపై బనాయించిన కేసు బలం, తమ ప్రభుత్వం గురించి గొప్పగా ఊహించుకున్న వైసిపి శ్రేణులు పైకి చెప్పుకోలేని విధంగా తీవ్ర ఆశాభంగం చెందాయి. నాలుగేండ్లు మౌనంగా ఉండి 2023 చివరిలో చంద్రబాబును ముద్దాయిగా చేర్చటం విఫల రాజకీయ వ్యూహంలో భాగమే. బెయిలు రాదు అనుకున్న చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావటమే కాదు, రాజకీయ ప్రచారం చేసుకొనేందుకు కూడా కోర్టు అనుమతించింది. మంత్రులు, ఎంఎల్‌ఏల పని తీరు మీద అటు జనంలోనూ ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉన్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వచ్చాయి. ఎంఎల్‌ఏలు, ఎంపీలను వదిలించుకొనేందుకు, వీలుగాకపోతే బదిలీలు చేసేందుకు జగన్‌ పూనుకున్నారు. పొమ్మనకుండా పొగపెట్టినట్లు ముందుగానే భారీ మొత్తంలో నిధి సమర్పించుకోవాలని చెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. వైసిపికి 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని ఇంటలిజెన్స్‌ ఇచ్చిన నివేదిక పేర్కొన్నట్లు చెబుతున్నారు. అధికారానికి కావాల్సిన సంఖ్య 88, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వైసిపి మునిగిపోయే నావ మాదిరి ఉంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రక్షించటం కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌లోకి వైఎస్‌ షర్మిల : బిజెపిని కలుపుకుంటే లాభమా ! నష్టమా !! ఎన్నికల ఎత్తులు, పొత్తులు !!!

29 Friday Dec 2023

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, STATES NEWS, tdp, TDP, Women, Ycp

≈ Leave a comment

Tags

#YS Sharmila, ANDHRA PRADESH, AP Assembly Elections 2024, AP Politics, BJP, CHANDRABABU, CPI, CPI(M), Pawan kalyan, YS jagan


మన్నెం కోటేశ్వరరావు


వైఎస్‌ఆర్‌ తెలంగాణా పార్టీ నేత వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరటం ఖాయమైంది. ఆమె ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోపని చేసేందుకు ఒక బాధ్యత అప్పగిస్తారనే వార్తలు, అది రాష్ట్ర అధ్యక్ష పీఠం లేదా దానికి సమానవమైన మరొకటి అనే ఊహాగానాలు వెలువడ్డాయి. 2024 ఎన్నికల పూర్వరంగంలో ఒక మానసిక తంత్ర క్రీడ(మైండ్‌గేమ్‌) ప్రారంభమైంది. రాష్ట్ర బాగు కోసమంటూ నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు చండీయాగం,హౌమాలు నిర్వహించారు. వర్తమాన, భవిష్యత్‌ పరిణామాల గురించి జనంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణాలో జరిగిన ఎన్నికల ప్రభావం అన్ని పార్టీల మీదా పడింది. బిజెపి తమతో కలవాలని అంటున్న తెలుగుదేశం-జనసేన కూటమి దానితో నిమిత్తం లేకుండానే సీట్ల సర్దుబాటు, సంయుక్తంగా సభల నిర్వహణ తదితర అంశాల గురించి కసరత్తు ప్రారంభించింది.ఎన్నికల సంబంధిత అంశాలపై సలహాలు ఇచ్చే, సర్వేలు నిర్వహించే సంస్థను ఏర్పాటు చేసి ప్రస్తుతం సంబంధం లేదని గతంలో ప్రకటించిన ప్రశాంత కిషోర్‌ తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావటం చర్చనీయాంశమైంది. బెంగలూరు విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ భేటీ ఊహాగానాలకు తెరలేపింది. జనంలో, స్వంత పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు భావిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఏలలో కొందరికి ఉద్వానస పలికేందుకు నియోజకవర్గాల బదిలీలకు వైఎస్‌ జగన్మోహనరెడ్డి పూనుకున్నారు. ఇలాంటి మార్పులు 90కిపైగా నియోజకవర్గాలలో జరుగుతాయని తెలుగుదేశం నేతలు చెబుతున్నప్పటికీ 50 చోట్ల ఉండవచ్చని రాష్ట్ర వైసిపి నేత ఒకరు చెప్పారు. ముఫ్పై మందికి ఉద్వాసన ఉంటుందని, ఇరవై మందిని అటూ ఇటూ మార్చవచ్చన్నారు.


టీ కప్పులో తుపాను !
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది.ఈ సభకు హాజరు కావాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం పలుకగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడే స్వయంగా హైదరాబాదులోని పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి ఆహ్వానించటంతో అంగీకరించినట్లు చెబుతున్నారు.ఈ వార్తలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఊహాగానాలే తప్ప ఎవరూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. చివరికి పవన్‌ కల్యాణ్‌ ఆ సభకు వెళ్లటంతో ఈ అంశం టీకప్పులో తుపానులా ముగిసింది.ఈ సభ బ్రహ్మాండంగా విజయవంతమైందని తెలుగుదేశం చెబితే, ఘోరంగా విఫలమైందని వైసిపి వర్ణించింది.


ఎన్నికల గోదాలో దిగిన పార్టీలు !
ఇంకా ఎన్నికల ప్రకటన జరగకపోయినా ఒక విధంగా అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన కూటమి ఎన్నికల గోదాలోకి దిగాయి. రెండు ప్రధాన జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ రెండూ నామమాత్రంగా మారటం విశేషం. అవి 2019 అసెంబ్లీ ఎన్నికలలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నాయి. గతంలో వైసిపిలో చేరేందుకు ఆసక్తి చూపిన వాసగిరి వెంకట ( జెడి) లక్మీనారాయణ దానికి భిన్నంగా జై భారత్‌ నేషనల్‌ పార్టీ పేరుతో స్వంత దుకాణం తెరిచారు. అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.వైఎస్‌ జగన్‌ మీద నమోదైన కేసులను విచారించిన అధికారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక వైసిపి తిరస్కరించి ఉండవచ్చన్నది ఒక అభిప్రాయమైతే, ఆయనతో ఒక పార్టీని పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక కాపు ఓట్లను చీల్చేందుకు చూస్తున్నట్లు మరొక ప్రచారం జరుగుతోంది.దేన్నీ కొట్టివేయలేము.ప్రధాన పార్టీలలో అవకాశం రాని వారు అనేక మంది తమ బలాన్ని పరీక్షించుకొనేందుకు, ప్రచారం కోసం ఇలాంటి కొత్త పార్టీల తరఫున పోటీ చేశారు.


వైఎస్‌ షర్మిల ప్రభావం ఎంత ఉంటుంది !
రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరనున్న వైఎస్‌ షర్మిల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణా ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరితే నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యంతో తెలంగాణా నేతల సూచన మేరకు అధిష్టానం కూడా ఆమె చేరికను వాయిదా వేసింది. ఆమె చేరగానే ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌లో అనూహ్య మార్పులు వస్తాయనుకొనేందుకు తగిన వాతావరణం లేదు. షర్మిలను చేర్చుకొని వెంటనే అధికారానికి రాకున్నా పార్టీని పునరుద్దరించవచ్చనే అంచనాలో కేంద్ర నాయకత్వం ఉంది.తెలుగుదేశం – జనసేన-వైసిపి నేతల మాదిరి బూతులకు దూరంగా ఉన్నప్పటికీ జగన్మోహన రెడ్డి పాలనను షర్మిల తెగనాడితే వైసిపి నేతలు ఊరుకుంటారా అన్నది ప్రశ్న. తిడదామంటే అక్క కూతురు, కొడదామంటే కడుపుతో ఉంది అన్న పరిస్థితి వైసిపికి ఎదురుకావచ్చు. రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు కూడా జరగవచ్చు. తెలుగుదేశం-జనసేన కూటమి బిజెపి కోసం పాకులాడకుండా కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిస్తే షర్మిల ప్రచారం ఆ కూటమి మొత్తానికి ఉపయోగపడుతుంది. స్వంత చెల్లెలికే అన్యాయం చేసినట్లు మాట్లాడుతున్న తెలుగుదేశం-జనసేన నేతల ప్రసంగాల తీరు ఒక ఎత్తు బాధితురాలిగా అన్న మీద వైఎస్‌ షర్మిల ధ్వజం మరొక ఎత్తుగా ఉంటుంది.ప్రచారానికి మంచి ఊపువస్తుంది. తీవ్రమైన పోటీ ఉన్నపుడు ప్రతి ఒక్క ఓటునూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.తెలుగుదేశం కూటమి అలాంటి ఆలోచన చేస్తుందా ? తెలుగుదేశం-జనసేనల్లో చేరేందుకు అవకాశం లేని వైసిపి అసంతృప్త నేతలకు కాంగ్రెస్‌ వేదికగా మారవచ్చు. బిజెపితో సంబంధాల గురించి చంద్రబాబు ఇంకా ఒక స్పష్టతకు రాలేదు. ఓట్ల రీత్యా చూసుకుంటే కాంగ్రెస్‌తోనే ప్రయోజనం ఎక్కువ.వాటి సంబంధాల గురించి అలాంటి సూచనలు ప్రస్తుతం లేనప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడేం జరిగేదీ దేన్నీ కాదనలేం. నారా లోకేష్‌కు షర్మిల పంపిన క్రిస్మస్‌ బహుమతి అలాంటిదే. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఎలాంటి ఎత్తుగడ లేకుండా ఇలాంటివి జరగవు. షర్మిల ప్రభావంతో వైసిపి ఓట్లను కాంగ్రెస్‌ చీల్చినా లేదా బిజెపి లేని పార్టీల కూటమిలో చేరితే దానితో పాటు ఇతర పార్టీలకూ అది ప్రయోజనకరం.


పవన్‌ కల్యాణ్‌కు రోడ్‌ మాప్‌ పంపని బిజెపి !
బిజెపి తమకు రోడ్‌ మాప్‌ ఇవ్వాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ బహిరంగంగానే పార్టీ ఆవిర్భావ సభలో కోరిన సంగతి తెలిసిందే.నిజానికి పెద్ద పార్టీగా ఉన్న జనసేన మిత్రపక్షమైన బిజెపికి రోడ్‌ మాప్‌ ఇవ్వాలి. రెండు పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేయాలని 2020లోనే నిర్ణయించుకొని ఒప్పందం కూడా చేసుకున్నందున వారిద్దరూ కూర్చుని రోడ్‌ మాప్‌ను తయారు చేసుకోవాలి. అలాంటిదేమీ జరగలేదు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్‌ జైల్లో ఉన్నపుడు తెలుగుదేశం పార్టీతో సీట్లు సర్దుబాటు చేసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. మిత్రపక్షంగా ఉన్న బిజెపితో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఇది జరిగింది. జనసేనతో తామింకా భాగస్వామ్య పక్షంగా ఉన్నామని చెబుతూనే ఈ పరిణామం గురించి బిజెపి ఇప్పటి వరకు మౌనంగా ఉంది. జనసేన పార్టీ ఎన్‌డిఏలో చేరింది. తెలంగాణా ఎన్నికల్లో బిజెపితో సీట్లు సర్దుబాటు చేసుకొని ఎనిమిది చోట్ల పోటీ చేసి డిపాజిట్లు పొగొట్టుకుంది. చివరి క్షణంలో తెలుగుదేశం-జనసేన కూటమితో చివరి క్షణంలో చేరవచ్చనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అదే జరిగితే వచ్చే లాభనష్టాలు ఏమిటన్నది తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది. పక్కనే ఉన్న కర్ణాటకలో బిజెపి అధికారాన్ని పోగొట్టుకుంది. తెలంగాణాలో తమదే అధికారం అన్నట్లుగా ప్రచారం చేసుకున్నప్పటికీ అక్కడ దరిదాపుల్లో లేదు. దాని సిఎం అభ్యర్ధులుగా ప్రచారం జరిగిన ఈటెల రాజేందర్‌,బండి సంజరు ఇద్దరూ ఓడిపోయారు.గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే బిజెపి బలం 6.98 నుంచి 13.9శాతానికి పెరిగినా తెలంగాణాలో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వచ్చిన 19.65 శాతం ఓట్లతో పోల్చుకుంటే 5.75శాతం తగ్గాయి.


బిజెపిని కలుపుకుంటే లాభమా ! నష్టమా !!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గత ఎన్నికల్లో వివిధ పార్టీల ఓట్ల శాతాలు ఇలా ఉన్నాయి. వైసిపి 49.96 , తెలుగుదేశం 39.17, మూడవ కూటమిగా పోటీసిన పార్టీలలో జనసేన(137) 5.53,సిపిఎం(7)0.32, బిఎస్‌పి(21)0.28, సిపిఐ(7)0.11 శాతాలు తెచ్చుకున్నాయి. నోటాకు 1.28 ,కాంగ్రెస్‌కు 1.17, బిజెపికి 0.84 శాతం వచ్చాయి. బిజెపితో తెలుగుదేశం ఉన్నపుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ముస్లిం మైనారిటీల్లో 66శాతం ఓట్లు పొందగా, 2019 ఎన్నికలకు ముందు బిజెపితో సంబంధాల కారణంగా అది 49శాతానికి తగ్గినట్లు, తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకున్నపుడు వారి మద్దతు తగ్గిందని లేనపుడు పెరిగిందని ” పీపుల్స్‌ పల్స్‌ ” పరిశోధకుడు ఐవి.మురళీ కృష్ణ శర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని తెలుగుదేశంలో కొందరు భయపడుతున్నారు. వైసిపి నవరత్నాలతో గ్రామీణ ప్రాంతాలలో గతం కంటే కొంత మద్దతు పెంచుకున్నట్లు చెబుతున్నా పట్టణాల్లో మద్దతు తగ్గిందని, మొత్తంగా మధ్యతరగతి ఉద్యోగులు, టీచర్లు, ఇతర స్కీముల సిబ్బంది, కార్మికులలో మద్దతు కోల్పోయినట్లు, ఆ మేరకు తెలుగుదేశం, జనసేన బలపడినట్లు ఒక అంచనా.ఈ పూర్వరంగంలో ప్రతి ఓటునూ అధికార, ప్రతిపక్ష పార్టీలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. కేవలం 4,81,868 లేదా 2.05శాతం ఓట్ల తేడాతో బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణాలో అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.పైకి ఏమి చెప్పినప్పటికీ ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు జాగ్రత్తలు పడుతున్నాయి. తెలుగుదేశం- జనసేన కూటమితో బిజెపి సంబంధాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు స్పందించిన తీరు ఇలా ఉంది.


వామపక్షాల వైఖరేంటి !
” బిజెపితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకున్నపార్టీలతో ఎన్నికల్లో ఎలాంటి సర్దుబాట్లకు మేము సిద్దం కాదు. తెలుగుదేశం-జనసేన కూటమి బిజెపితో సంబంధాల గురించి స్పష్టత ఇచ్చినపుడు, రాజకీయంగా దానికి వ్యతిరేక వైఖరి తీసుకుంటే పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం.లేనట్లయితే ఇండియా కూటమిలోని పార్టీలతో కలసి లేదా అవసరమైతే ఒంటరిగానే పోటీ చేస్తాం. జెడి లక్ష్మీనారాయణ ప్రారంభించిన పార్టీ వివిధ అంశాలపై తీసుకొనే వైఖరి ఏమిటో ఇంకా స్పష్టం కానందున దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేం. మేము ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే ఎవరికి మద్దతు ఇచ్చేదీ ఎన్నికలకు ముందు వెల్లడిస్తాం.”
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఇలా చెప్పారు.” బిజెపితో సంబంధాలు పెట్టుకోవద్దని అనేక ఉద్యమాలలో కలసి పని చేస్తున్న తెలుగుదేశం పార్టీతో చెబుతున్నాం. ఒక వేళ పెట్టుకుంటే ఆ కూటమితో ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎన్‌డిఏ కూటమిలోని జనసేన బిజెపితో సంబంధం లేకుండా తెలుగుదేశంతో సర్దుబాటు చేసుకుంటే తెలుగుదేశంతో సర్దుబాటుకు అవకాశం ఉంటుంది. జనసేనను లౌకిక పార్టీగానే పరిగణిస్తున్నాం.జెడి లక్ష్మీనారాయణ పార్టీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎలాంటి విధానాలను అనుసరిస్తారో వేచి చూస్తాం ”


ప్రశాంత కిషోర్‌ కలయిక్‌ మైండ్‌ గేమ్‌లో భాగమా !
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్‌ హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలసి వచ్చి చంద్రబాబు నాయుడిని కలుసుకొని చర్చలు జరిపారు. మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లేందుకు వచ్చానని మాత్రమే ముక్తసరిగా ఆయన చెప్పారు. దాన్ని ఎవరూ విశ్వసించటం లేదు. ప్రశాంత కిషోర్‌ గెలిచే పార్టీలకే సలహాలు చెబుతారనే ఒక అభిప్రాయం ఉంది.(బిఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికలకు ముందు ప్రశాంత కిషోర్‌తో చర్చలు జరిపినప్పటికీ ఆ పార్టీ ఓడిపోయింది. కొందరు మంత్రులు, ఎంఎల్‌ఏలను పక్కన పెట్టాలన్న సలహాను కెసిఆర్‌ విస్మరించినందునే అలా జరిగిందని చెప్పేవారు లేకపోలేదు.) ఎన్నికలకు ఇంకా వంద రోజులు కూడా లేని స్థితిలో చంద్రబాబుతో ప్రశాంత కిషోర్‌ భేటీ ఒక మైండ్‌ గేమ్‌లో భాగమని, దాని వలన తెలుగుదేశం కూటమికి కలసి వచ్చేదేమీ లేదని వైసిపి రాష్ట్ర సంయుక్తకార్యదర్శి కారుమూరి వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రశాంత కిషోర్‌ ప్రస్తుతం అలాంటి సలహాలు ఇవ్వటం లేదని, అతనికి ఎలాంటి బృందాలు కూడా లేవని అన్నారు.జెడి లక్ష్మీనారాయణ పార్టీ వెనుక తమ పార్టీ హస్తం వుందనటం వాస్తవం కాదన్నారు. బిజెపికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని నిలిపేందుకు, కాంగ్రెస్‌తో సయోధ్యకు ఒప్పించేందుకు ప్రశాంత కిషోర్‌ వచ్చినట్లు కూడా చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?

17 Friday Mar 2023

Posted by raomk in AP, AP NEWS, BRS, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, AP Budget 2023-24, AP CM YS Jagan, AP debt, CHANDRABABU


ఎం కోటేశ్వరరావు


2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 16వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రసంగమంతా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి భజనకు, మీట నొక్కిన అంకెలను వల్లించేందుకే సరిపోయింది. అంకెల గారడీ మామూలుగా లేదు. ప్రసంగం నిండా ప్రముఖుల సూక్తులు, బోధలు మడమతిప్పుడు తప్ప కొత్త పథకాలేమీ లేవు.మార్చి ఆఖరుతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గతంలో ప్రతిపాదించిన బడ్జెట్‌ మొత్తం రు.2,56,256.57 కోట్లను రు.2,40,509.35 కోట్లకు కుదించారు. వచ్చే ఏడాది రు.2,79,279.27 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం ఖర్చు చేస్తారా లేదా అన్నది జగన్‌కే ఎరుక. బడ్జెట్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కేంద్రం నుంచి వచ్చే వాటాతో పాటు రాష్ట్రం విధించే పన్నుల మొత్తం. ఇవిగాక రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తం రెండవది.పన్నుల ద్వారా 2021-22లో వచ్చిన మొత్తం రు. 1,50,552.49 కోట్లు. ఇది 2022-23లో రు.1,91,225.11 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంత వచ్చే అవకాశం లేదు రు.1,76,448.39 కోట్లకు సవరిస్తున్నామని, 2023-24లో మాత్రం రు. 2,06,224.01 కోట్లు వస్తుందని చెప్పారు.ఇవన్నీ ఉజ్జాయింపు మాత్రమే. బడ్జెట్‌ పత్రాల్లో ఎకౌంట్స్‌ అనే శీర్షిక కింద ఇచ్చే అంకెలు మాత్రమే ఖరారు చేసినవి. ఉదాహరణకు 2021-22లో పన్ను రాబడి రు. 1,77,196.48 కోట్లు వస్తుందని వేసిన అంచనాను రు.1,54,272.70కు సవరించారు.చివరికి పైన పేర్కొన్న రు. 1,50,552.49 కోట్లుగా ఖరారు చేశారు. ఇప్పటికే జనాల నుంచి గరిష్టంగా పన్నులను పిండుతున్నందున ఎన్నికలు కళ్ల మందు కనిపిస్తున్నందున గొప్పకోసం అంకెలను పెంచి చూపారా లేక వేలాది కోట్ల ఆదాయ, ద్రవ్యలోటును అదనపు భారాలు, అప్పుల ద్వారా తెస్తారా అన్నది చూడాల్సి ఉంది. రాష్ట్ర స్వంత రాబడి, కేంద్రం నుంచి వచ్చే మొత్తం రు.రు. 2,06,224.01 కోట్లు కాగా దీనికి అదనంగా వివిధ మార్గాల ద్వారా తెచ్చే రు.73,055.26 కోట్లను జత చేస్తే మొత్తం బడ్జెట్‌ రు.రు.2,79,279.27 కోట్లు అవుతుంది.గతేడాది తెచ్చిన అప్పు రు.64,303.71కోట్లను ఈ ఏడాది రు.73,055.26 కోట్లకు పెంచుతామని చెప్పారు.


చంద్రబాబు నాయుడు సిఎంగా దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 2,57509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55,508.46 కోట్లు. అప్పుల మీద ఊరూవాడా టాంటాం వేసిన జగన్‌ తాను వస్తే తగ్గిస్తానని చెప్పినా ఆచరణలో 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2023 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.4,26,233.92 కోట్లు, జిఎస్‌డిపిలో 32.35శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం రు.1,38,874.75 కోట్లకు పెరిగింది. 2023-24కు ప్రభుత్వ రుణం రు. 4,83,008.96 కోట్లకు పెరుగుతుందని అది జిఎస్‌డిపిలో 33.32 శాతం అని బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. దీనికి హామీల రుణం అదనం.అంటే మొత్తం ఆరులక్షల కోట్లు దాట నుంది. ఆర్ధిక మంత్రి జిఎస్‌డిపి పెంపుదల గురించి చెప్పారు. 2023 మార్చి ఆఖరుకు రు.13,17,728 కోట్లుగా ఉన్నదాన్ని 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. కానీ తీరు తెన్నులు ఆ ధోరణిని సూచించటం లేదు. కరోనా కారణంగా అరశాతం రుణాలు అదనంగా తీసుకొనేందుకు దొరికిన వీలును జగన్‌ సర్కార్‌ వాడుకుంది. దీనికి తోడు విద్యుత్‌ సంస్కరణలు(మీటర్ల బిగింపు) అమలు చేసినందుకు మరో అరశాతం అదనంగా తీసుకొనేందుకు వీలుదొరికింది.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు. 2024నాటికి రు.14,49,501 కోట్లకు పెంచనున్నట్లు చెప్పారు. దీని ప్రకారం 48,316 కోట్లకు పెరుగుతుంది. కేంద్రం మినహాయింపులు ఇస్తే ఇంకాస్త పెరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఇవ్వకున్నా అదనంగా అప్పుతెచ్చుకొనేందుకే కేంద్రం మీద, బిజెపి మీద వైసిపి విమర్శలు చేయటం లేదా ? తెలంగాణా అప్పులపై ఆంక్షలు పెట్టిన కేంద్రం జగన్‌ పట్ల ఉదారంగా ఉండటానికి కారణం రాజకీయమా లేక కేంద్రం రుద్దిన సంస్కరణలను వినయ విధేయతలతో అమలు జరుపుతున్నందుకు బహుమతి కోసం ఎదురు చూపా ? 2021-22లో రాబడి లోటు (ఖర్చు-ఆదాయం మధ్య తేడా) రు.8,610 కోట్లు కాగా 2022-23లో అది రు.17,036 కోట్లుగా ఉంటుందని అంచనా కాగా సవరించిన మొత్తం రు.29,107 కోట్లకు చేరింది. 2023-24లో రు.22,316కోట్లకు పెరిగింది. ద్రవ్యలోటు (మొత్తం ఖర్చు-రాబడి మధ్య తేడా) గతేడాది రు.47,716 కోట్లు కాగా వచ్చే ఏడాదికి రు.54,587 కోట్లుగా చూపారు. ఈ తేడాను పూడ్చుకొనేందుకు జనం మీద భారాలు మోపాలి లేదా అప్పులు తీసుకోవాలి.పరిమితికి మించి రుణాలు తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించదు. అలాంటపుడు సంక్షేమం లేదా ఇతర పధకాలకు కోతలు విధించాలి.జగన్‌ సర్కార్‌ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.


గడచిన నాలుగు సంవత్సరాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు సగటున ఏటా జగన్‌ సర్కార్‌ ఖర్చు చేసింది పదహారువేల కోట్లు మాత్రమే. ఒకేడాది 18వేల కోట్లుగా ఉన్నది తరువాత తగ్గింది. కానీ అప్పు మాత్రం రెట్టింపైంది. అభివృద్ధి కోసమే అప్పులు తెస్తున్నామని చెప్పేవారు దీనికి ఏమి సమాధానం చెబుతారు ? అందుకే తెచ్చిన అప్పును దేని కోసం ఖర్చు చేశారో జనం అడగాల్సి ఉంది. ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల గురించి చెప్పే కబుర్లు వినీ విని జనానికి బోరు కొడుతోంది. ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు. ఇది నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా ఉంది. అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్పే అప్పులకు చెల్లించే మొత్తాలు ఆకాశాన్ని చూస్తున్నాయి. సంక్షేమాన్ని తప్పు పట్టటం లేదు. పెట్టుబడి వ్యయం ఎందుకు పెరగటం లేదు, కేటాయించిన మొత్తాలు ఎందుకు ఖర్చు కావటం లేదని రాష్ట్ర ప్రజలు నిలదీసి అడగాల్సి ఉంది.పెట్టుబడివ్యయ పద్దు కింద 2021-22 ప్రతిపాదించిన రు. 31,198 కోట్లకు గాను ఖర్చు చేసింది రు. 16,372 కోట్లు మాత్రమే.2022-23 ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని రు.16,846 కోట్లకు సవరించినట్లు చెప్పారు. వాస్తవంగా ఇంకా తగ్గవచ్చు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఈ నిర్వాకం ఇలా వుంటే కొత్త బడ్జెట్‌లో రు.31,061 కోట్లని మురిపించేందుకు చూశారు. ఇదే సందర్భంలో అప్పుల చెల్లింపు ఎలా ఉంది ? దీనికి కోతలు విధిస్తే ఇంకేమైనా ఉందా ? అంతకు ముందు చెల్లించింది రు.22,165 కోట్లుగా కాగా 2022-23లో దాన్ని రు.21,340 కోట్లకు తగ్గిస్తామని చెప్పి రు.25,288 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సవరించారు. తాజా బడ్జెట్‌లో రు. 28,673 కోట్లన్నారు. గతేడాది అనుభవాన్ని చూస్తే మూడు పదులు దాటినా ఆశ్చర్యం లేదు. గడగడపకు అనే పేరుతో వచ్చే వైసిపి నేతలు ఈ నిర్వాకానికి ఏం సమాధానం చెబుతారో జనం అడగాలా లేదా ?


ఇప్పటి వరకు తమ ప్రభుత్వం లబ్దిదారులకు నేరుగా బదిలీ చేసిన నగదు మొత్తం లక్షా 97వేల కోట్లని ఆర్థిక మంత్రి రాజేంద్రనాధ్‌ తాజా బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ఏటా 50వేల కోట్లు ఇస్తున్నట్లు ఎప్పటి నుంచో ఊదరగొడుతున్నారు. రెండో వైపు వివిధ కులాల కార్పొరేషన్ల పేరుతో భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా నగదు బదిలీ కింద 2022-23లో రు.47,240 కోట్లు పంపిణీ చేయగా 2023-24లో ఆ మొత్తాన్ని రు.54,228 కోట్లకు పెంచినట్లు ప్రతిపాదించారు. దానిలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు. 17,850 నుంచి రు. 21,434 కోట్లని పేర్కొన్నారు. వాగ్దానం మేరకు నెలకు మూడువేలు చేసేందుకు ఈ మేరకు పెంపుదల చేశారు. ఇక్కడే తిరకాసు ఉంది. వివిధ కార్పొరేషన్లకు కేటాయించినట్లు చెబుతున్న నిధుల మొత్తం ఒక తరగతిలో రు.4,115 నుంచి రు.5,760 కోట్లకు వేరే తరగతిలోని కార్పొరేషన్లు, పధకాలకు రు.39,103 కోట్ల నుంచి రు.46,911 కోట్లకు పెంచినట్లు బడ్జెట్‌ ప్రసంగ ప్రతిలో పేర్కొన్నారు. మొత్తంగా రు.45,218 కోట్ల నుంచి రు.52,671 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.ఈ అన్నింటిలో ఉన్న వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక సొమ్ము రు.23,042 కోట్లు ఉంది. రెండింటినీ కలిపితే మొత్తం వైఎస్‌ఆర్‌ కానుకలుగా రు.44,476 కోట్లు ఉంది. మిగిలిన దంతా ఇతర నవరత్న పధకాలకు చూపారు. ఈ లెక్కన ఏటా లక్ష కోట్లను జగన్‌ సర్కార్‌ నేరుగా బదిలీ చేస్తున్నదా ? లేదా నేరుగా బదిలీ చేసే సొమ్మును కులాల కార్పొరేషన్ల ఖాతాల్లో వేసి అక్కడి నుంచి తీసి నవరత్నాలకు ఖర్చు పెడుతున్నారని అనుకోవాలి. కార్పొరేషన్ల ఏర్పాటు వైసిపి రాజకీయ నిరుద్యోగులను సంతుష్టీకరించేందుకు, ప్రచారానికి వేసిన ఎత్తుగడగా చెప్పుకోవచ్చు.ఇవిగాక కేవలం ఎస్‌సి (సబ్‌ప్లాన్‌ )నిధులుగా రు.20,005, ఎస్‌టిలకు రు.6,929, బిసిలకు రు.38,605,మైనారిటీలకు రు.4,203 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం రు.69,742 కోట్లు. అందుకే ఇదంతా అంకెల గారడీ అనుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏ ఖాతా కింద సొమ్మును చూపినా జనాలకు కావాల్సింది ఒక స్పష్టత. ఏ సామాజిక తరగతి సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి ఆ సామాజిక తరగతి వారికి అందచేసే నవరత్నాలకు సొమ్ము బదలాయిస్తున్నారా, విడిగా బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతున్నారా ? అందుకే ఉదాహారణకు అసలెన్ని వైఎస్‌ఆర్‌ పెన్షన్లు ఇస్తున్నారు, వారికి కేటాయిస్తున్న సొమ్మెంత అన్నది జనానికి స్పష్టం కావాలి.


పెరుగుతున్న ధరలు, వ్యయంతో పోల్చితే వివిధ శాఖలకు కేటాయింపులు అరకొరే.అందుకే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా, సాగునీటి ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నా తగినన్ని కేటాయింపులేకనే అన్నది స్పష్టం.వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో 2022-23లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రు. 13,630 కోట్లు ప్రకటించి రు.12,270 కోట్లకు కోత పెట్టారు. ఈ ఏడాది రు.14,043 కోట్లని చూపారు.సాగు నీటికి రు.11,482 కోట్లకు గాను 10740 కోట్లకు కోత, ఇప్పుడు 11,908 కోట్లంటున్నారు.రవాణా రంగానికి రు. 9,617 కోట్లను 6,039 కోట్లకు తెగ్గోసి వచ్చే ఏడాది రు.10,322 కోట్లు ఖర్చు చేస్తాం చూడండి అంటున్నారు. వైద్య రంగానికి రు.15,384 కోట్లను రు.13,072కోట్లకు తగ్గించి ఇప్పుడు రు.15,882 కోట్లని నమ్మబలికారు.ఈ అంకెలను ఎలా నమ్మాలి ?


ఐదు సంవత్సరాల్లో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు జరుపుతామని చెప్పారు. ఆచరణలో ఆ సూచనలేమీ కనిపించటం లేదు. మరోవైపు దాన్ని ఒక ఆదాయవనరుగా మార్చుకున్నారు. జగన్‌ అధికారానికి వచ్చినపుడు ఎక్సైజ్‌ రాబడి రు.6,220 కోట్లు కాగా 2023-24లో ఆ మొత్తం రు.18,000 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. జనాలకు నేరుగా అందచేసిన లబ్ది 197వేల కోట్లని చెప్పారు. కానీ రెండోవైపు మోపిన భారాల సంగతి దాస్తున్నారు.మొదటి రెండు సంవత్సరాల లో రాష్ట్ర పన్నుల వార్షిక సగటు రు.57,523 కోట్లు ఉండగా తరువాత రెండు సంవత్సరాల్లో వార్షిక సగటు రు.77,703 కోట్లకు, ఐదవ ఏట రు.1,02,631కోట్లు అని ప్రతిపాదించారు. అందుకే జనం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు అని చెబుతున్నారు. మీట నొక్కుడు తమకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు తెస్తాయని వైసిపి నేతలు చెబుతున్నారు. కానీ బాదుడు ఇంతగా పెంచినా జనం అన్ని సీట్లు, అసలు తిరిగి అధికారం కట్టబెడతారా ? అసలేమీ చేయని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. చేపలను తొలుత ఇచ్చినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది. సంక్షేమ పధకాలూ అంతే ! ప్రభుత్వానికి రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అనేక దేశాల్లో జరిగింది అదే. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంపముంచినా ఆశ్చర్యంలేదు. ఏమో గుర్రం ఎగరావచ్చు ! ఏదో ఒక సాకుతో జగన్‌ ముందస్తు ఎన్నికలకూ పోవచ్చు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాతవరవడిలోనే జగనన్న బడ్జెట్‌ – పెరుగుతున్న అప్పులు, తిప్పలు ?

12 Saturday Mar 2022

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Telugu

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, AP Budget 2022-23, AP debt, YS jagan



ఎం కోటేశ్వరరావు


2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మార్చి 11వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంకెల గారడీ షరా మామూలే. భారీగా కొండంత రాగం తీసి చడీ చప్పుడు లేకుండా కోత పెట్టటం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది. ప్రభుత్వ ఆర్ధిక స్ధితి గురించి ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నా తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు పోవాలని గట్టిగా శపధం పూనినట్లుగా ఉంది. కొత్త అప్పులు పుట్టే అవకాశాలు మూసుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అలా తీసుకోవాలంటే షరతులకు అంగీకరించాలి. దానిలో భాగమే చెత్త పన్ను. మున్సిపల్‌ ఎన్నికల తరువాత అలాంటి భారాలు వేస్తారని వామపక్షాలు హెచ్చరించినా జనం కూడా తగ్గేదేలే అన్నట్లుగా వైసిపికి ఓట్లు వేశారు. బండి గుర్రానికి గడ్డి ఆశచూపి పరుగెత్తించినట్లు కేంద్రం తాను ప్రకటించిన లేదా ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేస్తే అప్పులకు సడలింపులు ఇస్తామని ప్రకటించింది. ఆమేరకు దాదాపు ఇరవై లక్షల రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు నిర్ణయించింది తెలిసిందే.
ఇక బడ్జెట్‌ పత్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడు దిగిపోయినపుడు 2018-19 రాష్ట్ర రుణభారం రు. 257509.87 కోట్లు, అది రాష్ట్ర జిఎస్‌డిపిలో 28.02శాతం. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి వివిధ సంస్ధలు, శాఖలకు ఇప్పించిన అప్పు పేరుకు పోయిన మొత్తం రు.55508.46 కోట్లు. 2019 మే 30న అధికారానికి వచ్చిన జగనన్న వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. 2022 మార్చి నెలతో ముగిసే ఆర్ధిక సంవత్సరానికి ప్రభుత్వ రుణం రు.390670.19 కోట్లు, జిఎస్‌డిపిలో 32.51శాతం ఉంది. హామీగా ఉన్న అప్పుల మొత్తం 2021 డిసెంబరు 31నాటికి రు.117503.12 కోట్లకు పెరిగింది. 2022-23లో అప్పుల మొత్తాన్ని రు.439394.35 కోట్లు, 32.79 శాతం జిఎస్‌డిపిలో ఉంటుందని పేర్కొన్నారు. దీనికి హామీల రుణం అదనం. చంద్రబాబు ఏలుబడిలో అన్ని రకాల రుణాలు మూడు లక్షల కోట్లకు పైబడితే జగనన్న దాన్ని వచ్చే ఏడాది చివరికి ఐదున్నర లక్షల కోట్లకు పైగా పెంచనున్నారు. ఇది అంచనాలకు మించిన వృద్ధి.


ఆస్తుల కల్పన ద్వారా ఆదాయ, ఉపాధి పెరుగుదల ఉంటుంది. దీన్నే ఆర్ధిక పరిభాషలో పెట్టుబడి వ్యయం అంటారు.దీని తీరుతెన్నులను చూద్దాం. అప్పులకు సంబంధించి నిర్ణీత లక్ష్యాన్ని చేరేందుకు చూపే శ్రద్ద ఇతర వాటి మీద ఉండటం లేదు.పెట్టుబడివ్యయ పద్దు కింద గత ఏడాదిలో ప్రతిపాదించిన రు. 31,198 కోట్లను 18,529 కోట్లకు సవరించినట్లు చూపారు. అంతకు ముందు ఏడాది కూడా రు.29,300 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది రు.18,974 కోట్లే. వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రు.30,679 కోట్లని పేర్కొన్నారు. దీన్ని అంకెల గారడీగాక ఏమనాలి ? ఇలాంటి కోతల కారణంగానే బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రకటించినపుడు గొప్పగా చెప్పి కోతలు వేస్తున్నారు.


బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం 2021- 22లో మొత్తం రు.2,29,779 కోట్లు ఖర్చు ఉంటుంది. దీన్ని ఇప్పుడు రు. 2,08,106.57 కోట్లుగా సవరించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ను రు.2,56,256.56 కోట్లుగా చూపారు. ద్రవ్యలోటు రు.48,724.11 కోట్లుగా చూపారు. ఈ మొత్తాన్ని ఎలా పూడుస్తారో తెలియదు. కేటాయింపులకు కోతలు పెట్టాలి, లేదా జనం మీద భారాలు మోపాలి. ఉదాహరణకు 2020-21లో కూడా ఖర్చు రు.2,24,789 కోట్లుగా చూపి చివరకు రు.1,85,468కి సవరించారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సర అన్ని రకాల రాబడి రు.1,54,272.70 కోట్లుగా సవరించారు, వచ్చే ఏడాది ఈ మొత్తం రు.1,91,225.11కోట్లని చెప్పారు. దీనికి రు.64,816 కోట్ల మేరకు అప్పులు తెచ్చి బడ్జెట్‌ను అమలు చేస్తామన్నారు.ఈ అప్పులో రు.21,805 కోట్లు పాత వాటిని తీర్చేందుకే పోతుంది. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగు నీటి వనరుల వృద్ధి వలన రైతాంగ ఆదాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. జగన్‌ అధికారానికి రాక ముందు మూడు సంవత్సరాల్లో పెట్టుబడి ఖర్చు రు.31,624 కోట్లు ఖర్చు చేస్తే ఈ మూడేండ్లలో ఆ మొత్తం రు.15,193 (2021-22 సవరించిన అంచనాతో) మాత్రమే ఖర్చు చేశారు. గతేడాది నీటి పారుదల రంగానికి రు.11,586 కోట్లు ప్రతిపాదించి దాన్ని రు.6,832 కోట్లకు కోత పెట్టారు. వచ్చే ఏడాది అసలు ప్రతిపాదనే రు.9,810 కోట్లుగా పేర్కొన్నారు. పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా లేదా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని భారీగా పెంచాల్సింది పోయి ఇలా చేయటం ఏమిటి ?


నవరత్నాలు లేకపోతే జగన్‌ రత్నాలు పేరు ఏది పెట్టినా పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను తప్పు పట్టటం లేదు. అదే పేదలు కార్పొరేట్‌ ఆసుపత్రుల పాలైనపుడు ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పధకాల సొమ్ము మొత్తం, ఇంకా అప్పులు చేసినదీ వాటి యజమానులకు సమర్పించుకుంటున్నారు. ఆ స్ధితిలో వైద్య, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ ఖర్చును గణనీయం పెంచాలి. కానీ ఈ బడ్జెట్‌లో గతేడాది చేసిన ఖర్చు కంటే తగ్గించారు. సవరించిన అంచనా ప్రకారం రు.12,972 కోట్లనుంచి రు.11,974 కోట్లకు కుదించారు. షెడ్యూలు కులాలు, తరగతులు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గతేడాది ప్రతిపాదించిన రు.27,401 కోట్లను రు.25,349కు కుదించారు. ఈ ఏడాది మాత్రం దాన్ని ఏకంగా రు.45,411 కోట్లుగా పేర్కొన్నారు. దీన్ని చూస్తే అంకెల గారడీ లేదా మధ్యంతర ఎన్నికల ప్రచార అస్త్రమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


రోడ్ల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో తెలిసిందే. గతేడాది రోడ్లు, వంతెనలకు పెట్టుబడి ఖర్చు రు.2,792 కోట్లుగా చూపి దాన్ని రు.927 కోట్లకు కుదించారు. ఇప్పుడు రు.2,713 కోట్లు ఖర్చు చేస్తామని నమ్మబలుకుతున్నారు.మొత్తం ఆర్ధిక సేవల పెట్టుబడి ఖర్చు రు.18,319 కోట్లుగా ప్రకటించి ఆచరణలో రు.9,859 కు కోత పెట్టి ఈ ఏడాది రు.17,412 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. ఏ శాఖను చూసినా ఇదే తీరు. నోరున్నదని చెప్పుకొనే ఉద్యోగులకు తాను ప్రకటించిన 27తాత్కాలిక భృతిలో కూడా కోత పెట్టి పిఆర్‌సిని బలవంతంగా రుద్దిన సర్కార్‌ ఇక నోరు లేని లేదా ఉన్నా నోరెత్తలేని జనాలకు సంబంధించిన, అభివృద్ధి పనులకు కోత పెట్టటంలో ఆశ్చర్యం ఏముంది ?


కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. ఇవన్నీ పరిస్ధితులు సాధారణంగా ఉంటే, కానీ కరోనా కారణంగా ఇచ్చిన మినహాయింపులు, ఇతర అంశాల కారణంగా అది అమలు జరుగుతుందని చెప్పలేము. ఐదు సంవత్సరాల కాలంలో పరిమితులను తొలి నాలుగు సంవత్సరాలలో వినియోగించుకోనట్లైతే ఐదవ ఏడాది అదనపు రుణాలు తీసుకోవచ్చు. ఈ లోగా విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రతిపాదించిన షరతులను అమలు జరిపితే తొలి నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా జిఎస్‌డిపిలో 0.5 శాతం చొప్పున అదనంగా అప్పులు తీసుకోవచ్చు.2021-25 మధ్య విద్యుత్‌ నిర్వహణ నష్టాలు తగ్గించాలి.ఆదాయ తేడాను కుదించాలి. వినియోగదారులకు నేరుగా సబ్సిడీని అందించటం ద్వారా సబ్సిడీ మొత్తాలను తగ్గించాలి. ఆదాయాన్ని సబ్సిడీ రేట్లను తగ్గించాలి. ఇవన్నీ ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు దారి సుగమం చేయటమే.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు.2018-19నాటికి అది రు.9,33,402 కోట్లకు పెరిగింది కనుక రుణం 28వేల కోట్లు తీసుకోవచ్చు. అలాగే 2020-21లో రు.10,19,146 కోట్లుగా సవరించినందున రుణం 34వేల కోట్ల వరకు తీసుకోవచ్చు. 2021-22లో ముందస్తు అంచనా ప్రకారం అది రు. 12,01,736 కోట్లుగా ఉన్నట్లు ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు. అందువలన ఆ మేరకు రుణపరిమితి పెరుగుతుంది. ఆత్మనిర్భర పధకం కింద రెండు శాతం అదనంగా తీసుకొనేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆర్ధిక సంఘం ఆంక్షలకు మించి ద్రవ్యలోటు ఉంది. 2020-21లో ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 4.78శాతంగా ప్రతిపాదిస్తే అది 5.38శాతానికి చేరింది. కేంద్రం కరోనా కారణంగా సడలించిన రుణ పరిమితి ఐదుశాతానికి మించి ఇది ఉంది. ఐదుశాతానికి కూడా కేంద్రం షరతులు విధించింది. నాలుగుశాతం వరకు ఎలాంటి షరతులు లేవు, ఒకశాతానికి నాలుగు ఉన్నాయి. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు ఒకటి, సులభతర వాణిజ్యం, స్ధానిక సంస్దలలో పన్నుల పెంపు, విద్యుత్‌ పంపిణీ సంస్కరణ. మొదటి మూడింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో అదనంగా 9,090 కోట్లు అదనంగా అప్పు చేసేందుకు అవకాశం వచ్చింది. విద్యుత్‌ సంస్కరణలో భాగంగా మీటర్లు పెట్టేందుకు నిర్ణయించిన అంశం తెలిసిందే. అది జరిగిన తరువాత వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లించాలి. మిగిలిన షరతుల ప్రకారం సబ్సిడీలో కోత వంటి వాటికి పూనుకుంటే వంటగాస్‌ మాదిరి క్రమంగా తగ్గించి వేసి నామమాత్రంగా సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. పెట్రోలు, డీజిలు ధరల మాదిరి ఖర్చు పెరిగినపుడల్లా చార్జీలను పెంచవచ్చు.


అసలేమీ ఇవ్వని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. జనాలకు కావలసినన్ని చేపలను తొలుత సరఫరా చేసినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది, వారి బతుకు వారు బతుకుతారు. సంక్షేమ పధకాలూ అంతే ! రాబడి వనరులు లేక లేదా పెరగక, అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంప ముంచినా ఆశ్చర్యంలేదు.జనం వైఫల్యాలను గుర్తించక, అసంతృప్తి పెరగముందే ఏదో ఒక సాకుతో ముందస్తు ఎన్నికలకు పోయినా పోవచ్చు !


Share this:

  • Tweet
  • More
Like Loading...

అప్పుచేసి పప్పు కూడు, కేంద్ర షరతులతో భారాలు – నవరత్నాలే జగనన్నకు ముప్పు తెస్తాయా ?

15 Monday Nov 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, Andhra Pradesh Debt, AP’s financial matters, YS jagan


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక స్ధితి గురించి ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నాయి. మూసిపెడితే పాచి పోతుంది అన్నట్లు పరిస్ధితి ఉంది. అప్పుల తిప్పలు జగన్మోహనరెడ్డి సర్కారును చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే నిబంధనల పరిమితిని మించి అప్పులు తీసుకున్నారు.రోజు గడవాలంటే కొత్త అప్పులు తీసుకోక తప్పటం లేదు. అలా తీసుకోవాలంటే కేంద్రం విధించే షరతులను అమలు జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే చేసి ఆ మేరకు జనాల మీద భారాలు పెంచుతున్నారు.వృతం చెడ్డా ఫలం దక్కని స్ధితి రానుంది.


తాజాగా కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు 2021-22 ఆర్ధిక సంవత్సరం రెండవ త్రైమాసికం వరకు అంటే సెస్టెంబరు వరకు మూలధన( కొత్త ఆస్తుల కల్పన పెట్టుబడి) వ్యయ కేటాయింపులో నిర్ణీతశాతం ఖర్చు చేసిన రాష్ట్రాలకు పరిమితికి మించి 0.5శాతం జిఎస్‌డిపికి సమానమైన మొత్తాన్ని అదనంగా అప్పు తెచ్చుకొనేందుకు కేంద్రం అనుమతిని ప్రకటించింది. ఏడు రాష్ట్రాలు అలాంటి అర్హత సాధించాయి. ఆ విధంగా చత్తీస్‌ఘర్‌కు 895, కేరళకు 2,256, మధ్యప్రదేశ్‌కు 2,590, మేఘాలయ 96, పంజాబ్‌, 2,869, రాజస్తాన్‌ 2,593, తెలంగాణా 5,392 కోట్ల మేరకు కొత్తగా రుణాలు తీసుకోవచ్చు. సెప్టెంబరు 30వరకు 22 రాష్ట్రాలు అందచేసిన సమాచారం మేరకు సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్తమాన సంవత్సరంలో ఏ రాష్ట్రమైనా జిఎస్‌డిపిలో నాలుగుశాతం వరకు రుణాలు తీసుకోవచ్చు. రాష్ట్రాలు తమ బడ్జెట్లలో మూలధన పెట్టుబడికింద చేసిన కేటాయింపులలో తొలి మూడు మాసాల్లో 15శాతం, ఆరుమాసాల్లో 45, తొమ్మిది మాసాల్లో 70, ఏడాది చివరికి నూరుశాతం ఖర్చు చేశారా లేదా అనే ప్రాతిపదికన సమీక్ష చేస్తారు. అందువలన ఒక మూడు మాసాల్లో ఆ మేరకు చేయకపోయినా తరువాత ఖర్చు చేస్తే అర్హత వస్తుంది. తొలి ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్‌ అలాంటి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. తదుపరి సమీక్ష డిసెంబరు 31న జరుగుతుంది.


తొలిఆరునెలల్లో రాష్ట్ర ఆదాయ(రెవెన్యూ)లోటు 662.8శాతంగా ఉంది. 2021-22 బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రు.5,000.08 కోట్లుగా చూపితే ఏప్రిల్‌-సెప్టెంబరునాటికి రు.33,140.62కోట్లకు చేరింది. కాగ్‌ వివరాల ప్రకారం ఆరునెలల్లో మొత్తం ఆదాయం రు.1,04,804.91 కోట్లు, దీనిలో అప్పుగా తెచ్చిన రు.39,914.18 కోట్లు కలసి ఉన్నాయి.రాబడిలో రు.50,419 కోట్లు సంక్షేమ పధకాలకు, మిగిలిన మొత్తంలో అప్పుల అసలు, వడ్డీలు, వేతనాలు, సబ్సిడీలకు చెల్లించినట్లు చూపారు. ఏడాది మొత్తంలో అప్పులుగా తీసుకుంటామని బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం రు.37,029.79 కోట్లు కాగా ఆరునెలల్లో తీసుకున్నదే రు.39,914 కోట్లు. మరో ఆరునెలల్లో ఎంత అవుతుందో తెలియదు. గతేడాది కంటే ఆదాయం పెరిగినప్పటికీ చేసిన అప్పు ఇదని గమనించాలి. మూలధన పెట్టుబడి ఖర్చు రు.6,415.51 కోట్లు, ఇది గతేడాది తొలి ఆరునెలల కంటే రు.2,912 కోట్లు తక్కువ. ఏడాదిలో ప్రతిపాదించిన రు. 31,198 కోట్లు అంకెల్లో తప్ప అమలుకు నోచుకోదు. గతేడాది నిర్వాకం కూడా ఇదే రు.29,300 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది రు.18,385 కోట్లే.


బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం 2021- 22లో మొత్తం రు.2,29,779 కోట్లు ఖర్చు ఉంటుంది. దీనికి గాను రు. 1,77,247 కోట్లు స్వంత వనరులు, కేంద్ర గ్రాంట్ల రూపంలో ఆదాయం వస్తుందని, రు.50,525 కోట్లు అప్పులు తీసుకువస్తామని చెప్పారు. ఆదాయలోటు ఐదువేల కోట్లు,ద్రవ్యలోటు 37వేల కోట్లు అని చూపారు. ప్రతి సంవత్సరం చివరిలో వాటిని సవరిస్తారు. ఉదాహరణకు 2020-21లో ఖర్చు రు.2,24,789 కోట్లుగా చూపి చివరకు రు.1,85,468కి సవరించారు. ఇదే ఆదాయాన్ని చూస్తే రు.1,62,558 కోట్లుగా చూపి రు.1,19,126 కోట్లకు తగ్గించగా అప్పు రు.60,258 కోట్లు తెస్తామని రు.57,805 కోట్లు తెచ్చారు.


ఇక కేటాయింపు, ఖర్చు అంశానికి వస్తే దీనిలో అనేక మతలబులున్నాయి.2020-21లో పెట్టుబడి వ్యయం రు.18,797 కోట్లు, ఇది కేటాయింపు కంటే 37శాతం తక్కువ. సాగునీరు, వరద నివారణ పధకాలకు రు.6,786, రవాణాకు 1,962 కోత పెట్టారు. పెట్టుబడి ఖర్చులో ఆస్తులను సమకూర్చే పధకాల నిర్మాణంతో పాటు, గతంలో వాటికోసం తెచ్చిన తీర్చే అప్పులు, వడ్డీలు కూడా ఉంటాయి. 2019-20లో ఇందుకోసం చేసిన వాస్తవ ఖర్చు రు.36, 226 కోట్లు, దీనిలో ఆస్తుల కల్పనకు చేసింది రు.12,242 కోట్లు. అంటే అప్పులకే ఎక్కువ పోయింది. 2020-21లో మొత్తం రు.44,397 కోట్లు కేటాయించి రు.32,478 కోట్లకు కుదించారు. దీనిలో అప్పులకు రు.13,681 కోట్లు, ఆస్తులకు రు.18,797 ఖర్చు చేశారు. వర్తమాన బడ్జెట్‌లో రెండింటికీ కలిపి రు. 47,583 కోట్లుగానూ, ఆస్తుల కల్పనకు రు.31,198 కోట్లుగాచూపారు. దీనిలో ముందే చెప్పుకున్నట్లు తొలి ఆరునెలల్లో ఖర్చు చేసింది రు. 6,415.51 మాత్రమే. రెవెన్యూ ఖర్చును చూస్తే 2019-20లో రు.1,37,475 కోట్లు, మరుసటి ఏడాది దాన్ని రు.1,80,393 కోట్ల నుంచి రు.1,52,990 కోట్లకు కోత పెట్టారు. వర్తమాన సంవత్సరంలో ప్రతిపాదనే రు.1,82,197 కోట్లు. దీన్లో ఎంత కోత పెడతారో తెలియదు. పరిస్ధితి ఇంత తీవ్రంగా ఉంది కనుకనే ఉద్యోగులు, టీచర్లకు కొత్త వేతనాలు ఖరారు చేసేందుకు ముందుకు రావటం లేదు. ఇక అప్పుల తిప్పల సంగతి చూద్దాం. 2019-20లో అసలు చెల్లింపు రు.18,625, వడ్డీకి రు.17,635 కోట్లు, 2020-21లో ఈ మొత్తాలు రు.11,973 – 22,026గా, 2021-22లో రు.15,503-22,740 కోట్లుగా చూపారు.


కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. కార్పొరేట్లకు మార్గాన్ని సుగమం చేస్తోంది. ఉదాహరణకు 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. ఇవన్నీ పరిస్ధితులు సాధారణంగా ఉంటే, కానీ కరోనా కారణంగా ఇచ్చిన మినహాయింపులు, ఇతర అంశాల కారణంగా అది అమలు జరుగుతుందని చెప్పలేము. ఐదు సంవత్సరాల కాలంలో పరిమితులను తొలి నాలుగు సంవత్సరాలలో వినియోగించుకోనట్లైతే ఐదవ ఏడాది అదనపు రుణాలు తీసుకోవచ్చు. ఈ లోగా విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రతిపాదించిన షరతులను అమలు జరిపితే తొలి నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా జిఎస్‌డిపిలో 0.5 శాతం చొప్పున అదనంగా అప్పులు తీసుకోవచ్చు.2021-25 మధ్య విద్యుత్‌ నిర్వహణ నష్టాలు తగ్గించాలి.ఆదాయ తేడాను కుదించాలి. వినియోగదారులకు నేరుగా సబ్సిడీని అందించటం ద్వారా సబ్సిడీ మొత్తాలను తగ్గించాలి. ఆదాయాన్ని సబ్సిడీ రేట్లను తగ్గించాలి. ఇవన్నీ ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు దారి సుగమం చేయటమే.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు.2018-19నాటికి అది రు.9,33,402 కోట్లకు పెరిగింది కనుక రుణం 28వేల కోట్లు తీసుకోవచ్చు. అలాగే 2020-21లో రు.10,19,146 కోట్లుగా సవరించినందున రుణం 34వేల కోట్ల వరకు తీసుకోవచ్చు. ఆత్మనిర్భర పధకం కింద రెండు శాతం అదనంగా తీసుకొనేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆర్ధిక సంఘం ఆంక్షలకు మించి ద్రవ్యలోటు ఉంది. 2020-21లో ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 4.78శాతంగా ప్రతిపాదిస్తే అది 5.38శాతానికి చేరింది. కేంద్రం కరోనా కారణంగా సడలించిన రుణ పరిమితి ఐదుశాతానికి మించి ఇది ఉంది. ఐదుశాతానికి కూడా కేంద్రం షరతులు విధించింది. నాలుగుశాతం వరకు ఎలాంటి షరతులు లేవు, ఒకశాతానికి నాలుగు ఉన్నాయి. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు ఒకటి, సులభతర వాణిజ్యం, స్ధానిక సంస్దలలో పన్నుల పెంపు, విద్యుత్‌ పంపిణీ సంస్కరణ. మొదటి మూడింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో అదనంగా 9,090 కోట్లు అదనంగా అప్పు చేసేందుకు అవకాశం వచ్చింది. విద్యుత్‌ సంస్కరణలో భాగంగా మీటర్లు పెట్టేందుకు నిర్ణయించిన అంశం తెలిసిందే. అది జరిగిన తరువాత వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లించాలి. మిగిలిన షరతుల ప్రకారం సబ్సిడీలో కోత వంటి వాటికి పూనుకుంటే వంటగాస్‌ మాదిరి క్రమంగా తగ్గించి వేసి నామమాత్రంగా సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. పెట్రోలు, డీజిలు ధరల మాదిరి ఖర్చు పెరిగినపుడల్లా చార్జీలను పెంచవచ్చు.


రాష్ట్రానికి ఉన్న అన్నిరకాల అప్పుల సంగతి చూస్తే 2019-20 ఆదాయలోటు 2.7, ద్రవ్యలోటు 4.1శాతం ఉన్నపుడు జిఎస్‌డిపిలో రుణాలు 31శాతం ఉన్నాయి. మరుసటి ఏడాది అంచనాలను సవరించిన తరువాత అవి వరుసగా 3.5, 5.4, 35.2శాతంగా చూపారు. వర్తమాన సంవత్సరంలో 0.5, 3.5, 36.5 శాతాలుగా ప్రతిపాదించినప్పటికీ ఎంతకు సవరిస్తారో తెలీదు.ప్రభుత్వ పనితీరును చూస్తే కీలకమైన ఐదు శాఖల్లో మిగతా రాష్ట్రాల సగటుతో పోలిస్తే బడ్జెట్లలో కేటాయింపుల శాతాలు ,ఆంధ్ర ప్రదేశ్‌ తీరుతెన్నులు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలు 2021-22వి కాగా ఇతర రాష్ట్రాలవి 2020-21 వివరాలు.
శాఖ××××× ఆంధ్రప్రదేశ్‌ ×× మొత్తం రాష్ట్రాల సగటు
విద్య ×××××× 12.8 ××××× 15.8
ఆరోగ్యం ×××× 6.6 ××××× 5.5
వ్యవసాయం××× 6.2 ××××× 6.3
గ్రామీణాభివృద్ది×× 7 ××××× 6.1
రోడ్లు, వంతెనలు× 1.7 ××××× 4.3
కరోనా, మరొకపేరుతో గతేడాది మోపిన పన్నులు ఇప్పుడు కొంత మేరకు జగన్‌ సర్కార్‌కు ఊరటనిస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే పన్నెండువేల కోట్ల మేరకు అదనపు ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో ఏడాదికి తీసుకుంటామని చెప్పిన రుణాల మొత్తం కూడా తీసుకున్నారు. రెవెన్యూలోటు ఏడాదికి ఐదువేల కోట్లని చెబితే 31వేల కోట్లు దాటింది. సంక్షేమ పధకాలకు గతేడాది 75వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది 84కోట్లకు పెరిగింది. దశలవారీగా మద్యనిషేధం గురించి చెప్పినా దాన్నొక ఆదాయ వనరుగా చూస్తున్నారు. ప్రొబేషన్‌ టాక్సు పేరుతో రు.4,500 కోట్లు, రోడ్ల అభివృద్ధి పేరుతో చమురు, సహజవాయువుపై 900 కోట్లు పన్ను విధించారు. వాటిని రోడ్ల మరమ్మతుకు వినియోగించినా ఇంత అధ్వానంగా ఉండేవి కాదు. పైన చెప్పుకున్నట్లు చెత్త పన్ను 350 కోట్లు, పట్టణ ఆస్తులపై రెండువేల కోట్లు, విద్యుత్‌పై 1000 కోట్లు వడ్డించారు.భూముల విలువ పెంచి అదనంగా 800 కోట్లు రాబట్టారు.


అసలేమీ ఇవ్వని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. జనాలకు కావలసినన్ని చేపలను తొలుత సరఫరా చేసినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది, వారి బతుకు వారు బతుకుతారు. సంక్షేమ పధకాలూ అంతే !ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించలేరు. ఏదో ఒక పేరుతో వాయిదా వేసే ఎత్తుగడ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అమలు జరపలేరు. తెలంగాణా అనుభవం చూసిన తరువాత ఉద్యోగులు, ఇతరులను ఏమాత్రం మభ్యపెట్టలేరు. నవరత్నాలే సర్వస్వం కాదనే తత్వం ఇప్పుడే తలకెక్కుతోంది. కేంద్రం ఆదేశించిన మేరకు విధించిన భారాల గురించి చెప్పుకోలేరు, విద్యుత్‌ సంస్కరణలను ఎదిరించలేరు. మొత్తం మీద మూడో ఏడాది నాటికే తలకు మించిన ఆర్ధిక భారాన్ని తలకెత్తుకున్నారు. ప్రస్తుతం నాలుగు లక్షల కోట్ల వరకు అప్పులు పెరిగాయి. ఇవిగాక ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్దలు, శాఖలకు హామీ ఇచ్చిన అప్పులు మరో లక్ష కోట్లు ఉంటాయి. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులను తప్పించుకొనేందుకు ఇలా రెండు ఖాతాల్లో చూపుతున్నారు. 2024 నాటికి 6.54 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా. అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంప ముంచినా ఆశ్చర్యలేదు.జనం వైఫల్యాలను గుర్తించక, అసంతృప్తి పెరగముందే ఏదో ఒక సాకుతో ముందస్తు ఎన్నికలకు పోయినా పోవచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కెసిఆర్‌ సారు విశ్వసనీయత ? జగనన్నకు బిజెపి సెగ !

10 Wednesday Nov 2021

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, fuel politics, K. Chandrashekar Rao, KCR, telugudesam, YS jagan


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా రాష్ట్రసమితి సారధి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏమైంది ? ఆంధ్రప్రదేశ్‌ పాలక పార్టీ వైసిపికి బిజెపి సెగ పెరిగిందా ? రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాల పర్యవసానాలేమిటి ? తెలంగాణాలో కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనల దారెటు ? రెండు చోట్లా ముందస్తు ఎన్నికలు వస్తాయా ? అనేక మందిలో ఇప్పటికిప్పుడు సమాధానం దొరకని, తలెత్తుతున్న ప్రశ్నలలో ఇవి కొన్ని మాత్రమే. కెసిఆర్‌ వరుసగా రెండు రోజులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి మీద, కేంద్ర ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామంటూ బ్యాటింగ్‌ ప్రారంభించి సిక్సర్లు కొట్టి తరువాత మంత్రులకు అప్పగించారు. కెసిఆర్‌ సారుకు ఏమైందీ అనుకుంటున్నవారికి చెప్పేదేమంటే, ఏమీ కాలేదు. హుజూరాబాద్‌లో అవమానకర ఓటమి, నాలుగువైపుల నుంచీ రాజకీయ సెగతగలటం ప్రారంభమైంది, పాత బంధులు-కొత్త బంధులు కుదురుగా కూర్చోనివ్వటం లేదు. అవే బంధనాలుగా మారతాయనే భయం కూడా తలెత్తి ఉండవచ్చు. అందువలన ఏదో ఒకటి మాట్లాడకపోతే పార్టీ శ్రేణులు మరింతగా డీలాపడతాయి.


మరి ఆంధ్రప్రదేశ్‌లో జగనన్నకు ఏమైంది. కెసిఆర్‌ మాదిరి మాటల మాంత్రికుడు కాదు. విలేకర్లతో మాట్లాడే అనుభవం సంగతేమో గానీ ఆసక్తిలేదని స్పష్టమైంది. వైసిపి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం అమలు జరుపుతున్న నవరత్నాలు ఏమౌతాయో తెలియని స్ధితి. వాటితో ఐదేండ్లూ ప్రచారం, కాలక్షేపం చేయలేమని రెండు సంవత్సరాలకే అర్ధమైంది. ఉన్నవాటినే ఎలా కొనసాగించాలో తెలియని అయోమయంలో పడి కెసిఆర్‌ మాదిరి కొత్త బంధులను తలకెత్తుకొనే సాహసం చేయటం లేదు. అప్పుల తిప్పలు గుక్కతిప్పుకోనివ్వటం లేదు. జెన్‌కో, ఏపి పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చెల్లించాల్సిన కిస్తీలను సకాలంలో చెల్లించకపోవటంతో ఆర్‌ఇసి జెన్‌కోను నిరర్దక ఆస్తిగా ప్రకటించిందంటే పరిస్ధితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో పెట్రోలు, డీజిలు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వత్తిడి తెస్తున్నాయి. దీంతో ఏకంగా ప్రభుత్వమే పత్రికలకు పూర్తి పేజీ ప్రకటన జారీ చేసి చమురుపై కేంద్రం, రాష్ట్రాల పన్నుల గురించి వివరాలు అందచేసి కేంద్ర బిజెపిని ఎండగట్టేందుకు పూనుకుంది. కెసిఆర్‌ మాదిరి జగన్‌మోహనరెడ్డి మీడియా ముందుకు రాలేదు గానీ ప్రకటనలు, పార్టీ నేతలు, మంత్రులతో ఆ పని చేయిస్తున్నారు.


హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తగిలిన తీవ్ర ఎదురుదెబ్బతో నాకు ఎదురులేదు, నా ఎత్తుగడకు తిరుగులేదు అనుకొనే వారు కెసిఆర్‌ లేదా మరొకరు ఎవరికైనా మైండ్‌ బ్లాంక్‌ కావాల్సిందే. అక్కడ గెలిచేందుకు బహుశా దేశంలో, ప్రపంచంలో కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు ఆ స్ధాయిలో డబ్బు వెదజల్లటం, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉండదంటే అతిశయోక్తి కాదు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ఘోరపరాజయంతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు డీలాపడిపోయాయి. తమనేత చాణక్యతను అనుమానించటం ప్రారంభించాయి. వారిని నిలబెట్టుకొనేందుకు కెసిఆర్‌ నడుంకట్టినట్లుగా కనిపిస్తోంది. అది జరిగేదేనా !


దుబ్బాక ఉప ఎన్నికల్లో అంతకు ముందు అక్కడ పోటీ చేసిన బిజెపినేత రఘునందనరావు మీద సానుభూతి, టిఆర్‌ఎస్‌లోని ఒక సామాజిక తరగతి సానుకూలత, దానిలో భాగంగా కెసిఆర్‌ సైతం ఉపేక్షించారన్న ప్రచార నేపధ్యం, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసి దుబ్బాకను ఉపేక్షించారన్న ప్రచారం అన్నీ కలసి టిఆర్‌ఎస్‌ ఓటమి-బిజెపి గెలుపుకు తోడ్పడ్డాయి. తరువాత జరిగిన హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో అధికార పార్టీ కార్పొరేటర్ల మీద ఉన్న అసంతృప్తికి తోడు వరదల నివారణలో వైఫల్యం, సాయంలో అవకతవకలు అన్నీ కలసి అధికార పార్టీకి తలబొప్పి కట్టించాయి.తరువాత జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో బిజెపి బొక్కబోర్లాపడింది.అభ్యర్ధిని కూడా కాంగ్రెస్‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. బలమైన కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డిని ఓడించేందుకు టిఆర్‌ఎస్‌ పడరాని పాట్లు పడి గెలిచింది.తరువాత పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో హైదరాబాదులో బిజెపి ఉన్న సీటును కోల్పోయింది. మరొకస్ధానం వరంగల్‌లో ఊహించని ఎదురుదెబ్బతిన్నది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం టిఆర్‌ఎస్‌ ఎన్ని పాట్లు పడిందీ చూశాము.హుజూరాబాద్‌ గురించి ముందే చెప్పుకున్నాం. అక్కడ బిజెపి కంటే కెసిఆర్‌ అహం మీద ఈటెల దెబ్బకొట్టారు. మొత్తం మీద జరిగిందేమంటే టిఆర్‌ఎస్‌ సారధి కెసిఆర్‌ విశ్వసనీయత గ్రాఫ్‌ పడిపోతోందన్నది స్పష్టమైంది. హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల తరువాత వరదసాయం మిగిలిన వారికీ అందచేస్తామని ప్రకటించి మాటనిలుపుకోలేదు. ఈ కారణంగానే దళితబంధును హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తరువాత రాష్ట్రమంతటా అమలు జరుపుతామని చెప్పినప్పటికీ జనాలు విశ్వసించలేదని తేలిపోయింది. దళితబంధును అమలు చేస్తానని ఉప ఎన్నిక తరువాత కూడా ప్రకటించారు. అయినా అమలు జరుపుతారా ? అప్పు రేపు అని గోడమీద రాస్తారా ? ఏదో ఒకపేరుతో నీరుగారుస్తారా అన్నది పెద్ద ప్రశ్న. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి గురించి జనం మరచిపోగలరా ?


పోగాలము దాపురించినపుడు తాడే పామై కరుస్తుందంటారు. బంధులే టిఆర్‌ఎస్‌, కెసిఆర్‌కు బంధనాలుగా మారే దృశ్యాలు కనిపిస్తున్నాయి.ప్రపంచమంతటా ఈ ఏడాది పత్తి ధరలు పెరిగాయి, దాన్లో భాగంగా మద్దతు ధరకంటే అదనంగా లభిస్తున్నందున రైతుల్లో సంతృప్తి ఉండవచ్చు. ధాన్యం ధర, మార్కెటింగ్‌,ఎఫ్‌సిఐ కొనుగోలు తీవ్ర సమస్యగా మారనుంది. అది రైతు బంధు సంతృప్తి స్ధానంలో అసంతృప్తికి దారి తీయవచ్చు. రైతులకు కావాల్సింది తాము పండించిన వరి, ఇతర పంటలకు మద్దతుధర, మార్కెటింగ్‌ తప్ప మిగతా అంశాలు అంతగా పట్టవు. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. మన్మోహన్‌ సింగ్‌కు అమలు జరిపే ధైర్యం లేకపోయింది. నరేంద్రమోడీకి 56అంగుళాల ఛాతీ ఉందని చెబుతున్నారు గనుక ఎవరేమనుకున్నా ముందుకు పోవాలని నిర్ణయించారు. దానిలో భాగమే మూడు సాగు చట్టాలు. మద్దతు ధర అమల్లో ఉంది కనుక కాస్త భరోసా ఉందని వరి పండించటం తప్ప వడ్లను ఉప్పుడు బియ్యంగా మారుస్తారా, పచ్చి బియ్యాన్నే ఎఫ్‌సిఐకి ఇస్తారా అనేదానితో వారికి నిమిత్తం లేదు. ఎంత ధాన్యమైనా కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు ఇప్పుడు ఆకస్మికంగా వరి వద్దు అంటే కుదురుతుందా ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వద్దు అంటే కేంద్రంలో ఉన్న పార్టీ పండించమంటోంది. తెలంగాణాలో పండించిన ధాన్యం ఉప్పుడు బియ్యానికి మాత్రమే పనికి వస్తుందని పాలకులకు, విధాన నిర్ణేతలకు ముందే తెలిస్తే వేరే రకాల సాగుకు రైతులను క్రమంగా ఎందుకు ప్రోత్సహించలేదు ? శాస్త్రీయంగా అలాంటి నిర్దారణలు ఎవరు చేశారు. అసలు సాగు వద్దే వద్దంటే ఎలా కుదురుతుంది. గతేడాది కరోనా కారణంగా చమురు నిల్వలు పెరిగిపోయి, నిల్వచేసే సౌకర్యాలు లేక అమ్మకందార్లకు కొనుగోలుదారులు ఎదురు డబ్బు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే మాదిరి తెలంగాణా రైతులు వరి వేయటం తక్షణమే నిలిపివేయాలంటే ప్రతామ్నాయం చూపేంతవరకు పరిహారం ఇస్తే నిరభ్యంతరంగా సాగు నిలిపివేస్తారు. వరి పండించాల్సిందే అని బిజెపి నేతలు కూడా చెబుతున్నారు గనుక పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తారా లేక పరిహారం ఇస్తారా ? అది కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా అన్నది తేల్చాల్సింది రైతులు కాదు.


అసలేం జరుగుతోందో టిఆర్‌ఎస్‌ లేదా బిజెపి రైతాంగానికి ఎప్పుడైనా వాస్తవాలు చెప్పిన పాపాన పోయాయా ?ఇప్పుడు రెండు పార్టీలు రాజకీయానికి పాల్పడ్డాయి. గతవేసవిలో పండిన ధాన్యం నుంచి 24.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం చెప్పిన అంశాన్ని కెసిఆర్‌ రైతులకు ఎప్పుడైనా చెప్పారా ? అంతకు మించి ఉన్న మిగిలిన వాటిని తీసుకొనేది లేదని కేంద్రం చెప్పి ఉంటే అదైనా చెప్పాలి. మరిన్ని ఉప్పుడు బియ్యం తీసుకోవాలని కెసిఆర్‌ కేంద్రాన్ని కోరారు, మరో 20లక్షల టన్నులు తీసుకొనేందుకు అంగీకరించినట్లు చెప్పారు తప్ప దానికి తాను అంగీకరించిన షరతు గురించి చెప్పలేదు. ఆ ఇరవైలక్షల టన్నులు తీసుకుంటే భవిష్యతో ఇవ్వబోమనే షరతుకు అంగీకరించిన అంశాన్ని దాచిపెట్టారు. తమ చేత బలవంతంగా రాయించుకున్నారని ఇప్పుడు చెబుతున్నారు. దానిలో నిజాయితీ, విశ్వసనీయత ప్రశ్నార్దకమే. ఏవైనా కేసుల్లో దళితులు, ఇతర బలహీన తరగతుల వారిని పోలీసులు బెదిరించి బలవంతంగా తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారంటే నమ్మవచ్చు, కేంద్రం ఒక ముఖ్యమంత్రిని బలవంతం చేసిందంటే నమ్మగలమా, ఆ దారుణం గురించి జనానికి ఎందుకు చెప్పలేదు ? పంజాబ్‌లో మాదిరి తెలంగాణాలో కూడా ఎఫ్‌సిఐ నేరుగా ఎందుకు కొనుగోలు చేయదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మేమే సేకరించి ఇస్తామని తొలుత ఎందుకు అంగీకరించినట్లు ? పోనీ ఎప్పుడైనా ఈ అంశాన్ని రైతులు, కేంద్రం దృష్టికి తెచ్చారా ? తమ నుంచి కొనుగోలును తప్పించటానికే కేంద్రం సాగు చట్టాలను తెచ్చిందని పంజాబ్‌,హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ రైతులు ఏడాది కాలంగా రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న అంశం కెసిఆర్‌కు తెలియదంటే నమ్మే అమాయకులెవరూ లేరు. ఆ సాగు చట్టాలకు మద్దతు ఎందుకు ఇచ్చారు, రైతులకు ఒకసారి మద్దతు ఇచ్చి తరువాత ఎందుకు ముఖం చాటేసినట్లు ? మొత్తం వడ్లు కొనుగోలు చేయాలని ఆందోళనకు ఇప్పుడు పిలుపులు ఇస్తే రైతులు నమ్ముతారా ? బిజెపి కూడా దాగుడుమూతలాడుతోంది, రైతులకు భరోసా కల్పించటం లేదు.


ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే చమురు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, తెలుగుదేశం వత్తిడి చేసిన తరువాత గానీ వైసిపికి చమురు మంట తగల్లేదా ? కేంద్రం పన్నుల పేరుతో పెంచిన సెస్‌ల నుంచి రాష్ట్రాలకు వాటాలు రావని రెండున్నర సంవత్సరాలుగా వారికి తెలియదా ? ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? వ్యాట్‌ తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌ పన్నెండు రూపాయలు తగ్గిస్తే వ్యాట్‌ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు తగ్గించదు అంటున్నారు. బిజెపి పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో పెట్రోలు, డీజిలు మీద 26.8-17.48శాతాల చొప్పున వ్యాట్‌ వుండగా అదే బిజెపి ఏలుబడిలోని అసోంలో 32.66-23.66శాతం ఉంది. అంత ఎక్కువ వసూలు చేస్తున్న అసోం ఏడు రూపాయలు మాత్రమే ఎందుకు తగ్గించినట్లు ? ఇన్ని సంవత్సరాలుగా కేంద్రం ఎందుకు, ఎంత పెంచింది, ఇంతకాలం ససేమిరా తగ్గించేది లేదని తిరస్కరించి ఇప్పుడు ఎందుకు, ముష్టి విదిల్చినట్లుగా తగ్గించిందో, ఉత్తర ప్రదేశ్‌ మాదిరి డీజిలు, పెట్రోలు మీద కేంద్రం కూడా పన్నెండు రూపాయలు కేంద్రం ఎందుకు తగ్గించలేదో బిజెపి నేతలు చెప్పాలి. మోడీ గారు అధికారంలోకి వచ్చినపుడు 58గా ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 75కు పడిపోవటానికి కారణం మోడీ గారు అనుసరిస్తున్న విధానాలే. అందువలన ముందు దాన్ని కనీసం పూర్వపువిలువకైనా పెంచాలి, లేదా వారి అసమర్ధతకు జనాన్ని బలిచేయకుండా మరింతగా ఏడున్నర సంవత్సరాల స్ధాయికి పన్ను తగ్గించాలి. లేదా చమురును కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి, రాష్ట్రాల ఆదాయం తగ్గినంతకాలం ఇప్పుడు జిఎస్‌టి పరిహారం ఇస్తున్న మాదిరే ఎంతకాలం లోటు ఉంటే అంతకాలం చెల్లించాలి. కేంద్రం పెంచిన మాదిరి రాష్ట్రాలు వ్యాట్‌ విపరీతంగా పెంచలేదు. అందువలన కేంద్రం ముందు దారి చూపి రాష్ట్రాలను అనుసరించాలని కోరవచ్చు తప్ప డిమాండ్‌ చేసే హక్కు లేదు. కేంద్రం తగ్గిస్తే దానికి అనుగుణంగా రాష్ట్రాలు తగ్గించకుండానే భారం తగ్గుతుంది. కేంద్రం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయలు తగ్గిస్తే ఆమేరకు రాష్ట్రాల వ్యాట్‌ భారం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు మీద 31శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. కేంద్రం తగ్గించినదాని ప్రకారం పెట్రోలు మీద లీటరుకు 155పైసలు, డీజిలు మీద 22.25శాతం ఉన్నందున 2.25పైసలు రాష్ట్రవాటాగా తగ్గుతుంది. కేంద్రం తగ్గించిన మేరకు ఆ దామాషాలో రాష్ట్రానికి కూడా వాటా తగ్గుతుంది.


కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధుల గురించి కేంద్రం ఎటూ తేల్చదు, బిజెపికి పట్టదు.ప్రకటించిన విశాఖ రైల్వేజోన్‌ సంగతి మాట్లాడరు. చమురు ధరల తగ్గింపు గురించి ఆందోళనకు దిగిన తెలుగుదేశం రైల్వే జోన్‌, ఇతర అంశాల గురించి ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? రెండు తెలుగు రాష్ట్రాల్లోను అధికార పార్టీలైన తెరాస-వైసిపి కేంద్రంలోని బిజెపితో ఘర్షణకు దిగేందుకు సిద్దం కావటం లేదు. తాజా పరిణామాలు అనివార్యంగా బిజెపితో తెరాస-వైసిపి మధ్యం దూరం పెంచనున్నాయని భావిస్తున్నారు. రెండు పార్టీలను మింగివేసేందుకు లేదా తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు బిజెపి చేయాల్సిందంతా చేస్తోంది. విధానపరమైన తేడాలు లేవు, తేడా అధికారం దగ్గరే కనుక, బిజెపి బలహీనపడుతున్న కారణంగా రెండు పార్టీలు రానున్న రోజుల్లో ప్రతిఘటించేందుకే పూనుకోవచ్చు.లేదూ బిజెపికి లొంగితే అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది . సమస్యలు చుట్టుముడుతున్న నేపధ్యంలో రెండు రాష్ట్రాల సిఎంలూ ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలకు తెరలేపినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d