• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP-Kerala

మైనారిటీ స్కాలర్‌ షిప్‌ల సమస్య : కేరళ ప్రభుత్వ సూత్రబద్దవైఖరి !

19 Monday Jul 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, BJP-Kerala, Kerala LDF, Kerala Minority Scholarship issue, Muslim League, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఓటు బ్యాంకు రాజకీయాలకు సిపిఎం ఆమడ దూరం అని మరోసారి నిరూపితమైంది. యుడిఎఫ్‌ ప్రభుత్వం 2016 అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకొని 2015లో మైనారిటీ తరగతులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లలో 80శాతం ముస్లింలు, ఇరవైశాతం క్రైస్తవులకు నిర్ణయిస్తూ ఉత్తరువులు జారీ చేసింది. దాన్ని హైకోర్టులో సవాలు చేశారు. సూత్రబద్ద వైఖరితో ఆ సమస్యను పరిష్కరించాలని సూచిస్తూ ఆ ఉత్తరువును కోర్టు కొట్టివేసింది. ఈ నేపధ్యంలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అనేక మంది నిపుణులను సంప్రదించి 2011 జనాభా ప్రాతిపదికన ఆ దామాషాలో స్కాలర్‌షిప్పులు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 26.56, క్రైస్తవులు 18.38, బౌద్దులు, సిక్కులు, జైనులు 0.01శాతం చొప్పున ఉన్నారు. స్కాలర్‌ షిప్పులు ఇప్పుడు అందరికీ అదే ప్రాతిపదికన లభిస్తాయి. ప్రస్తుతం స్కాలర్‌ షిప్‌లు పొందుతున్న వారికి లేదా మొత్తాలకు ఎలాంటి భంగం కలగదని, ఇతర మైనారిటీలకూ కొత్తగా లభిస్తాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈ విధానం, నిర్ణయాన్ని ప్రతిపక్షంగా ఉన్న యుడిఎఫ్‌లోని కాంగ్రెస్‌, కేరళ కాంగ్రెస్‌ సమర్దించాయి. అయితే తమ సామాజిక తరగతికి అన్యాయం జరిగిందంటూ ముస్లిం లీగు వ్యతిరేకించింది. ఆ పార్టీ వత్తిడికి లొంగిపోయిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు తాము సమర్ధించిన మాట నిజమే గానీ తాము సూచించిన దానిని ప్రభుత్వం పూర్తిగా అమలు జరపలేదని తరువాత అర్ధం అయిందని అందువలన వ్యతిరేకిస్తున్నట్లు మాట మార్చారు. అంతేకాదు భాగస్వామ్య పక్షాలేవీ బహిరంగంగా ఈ సమస్యపై ప్రకటనలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. టీవీ చర్చలలో మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ కె మురళీధరన్‌ మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చూసుకుంటుందన్నారు. దీని గురించి మాట్లాడేందుకు ఎల్‌డిఎఫ్‌ పక్షాలకు స్వేచ్చ లేదని ఆరోపించారు. తమ యుడిఎఫ్‌లో ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని ఎల్‌డిఎఫ్‌లో భూస్వామి-కౌలుదారు మాదిరి ఉంటుందన్నారు.


సచార్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ముస్లింల అభివృద్ది కోసం గత ప్రభుత్వం 80:20 దామాషా నిర్ణయించిందని ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగిందనే వాదనను ముస్లింలీగు ముందుకు తెచ్చింది.పభుత్వ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. ఎవరికీ అన్యాయం జరగదని సూత్రబద్దమైన వైఖరి అని ఎల్‌డిఎఫ్‌ పేర్కొన్నది. లీగు వైఖరి సమాజాన్ని విభజించేదిగా ఉందని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ రాఘవన్‌ విమర్శించారు. స్కాలర్‌ షిప్‌ల పధకం కేవలం ముస్లింల కోసమే ఏర్పాటు చేశారని ప్రభుత్వం దామాషా ప్రాతిపదికన ఇవ్వటం సరికాదని పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. గతంలో చేసిన నిర్ణయంలో 20శాతం వెనుకబడిన క్రైస్తవులకు కల్పించటమే తప్పిదమని, ముస్లింలకు తగ్గించకుండా ఇతరులకు కావాలంటే ఇచ్చుకోవచ్చని పేర్కొన్నది. సంఘపరివార్‌, కొన్ని క్రైస్తవ సంస్దలు సమాజంలో విభజన తెచ్చే విధంగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం అది మైనారిటీల కోసం ఉద్దేశించింది తప్ప కేవలం ముస్లింలకు మాత్రమే అని ఎక్కడా లేదు. ఈ కారణంగానే 80:20శాతం దామాషాను హైకోర్టు కొట్టివేసింది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కొత్త విధానంలో ముందే చెప్పినట్లు జనాభాను బట్టి దామాషాను నిర్ణయించింది.

సమీప భవిష్యత్‌లో ఎన్నికలు లేవు. అసలు ఎన్నికలకు దానికి సంబంధం లేదు. అయినప్పటికీ మీడియాలో ఓటుబ్యాంకు రాజకీయాల ప్రాతిపదికన కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ విధానంపై యుడిఎఫ్‌ పక్షాలలో విబేధాలు ఎల్‌డిఎఫ్‌కు లాభమన్నది వాటిలో ఒకటి. కాంగ్రెస్‌లో మిగిలి ఉన్న క్రైస్తవులు మరింత ఎక్కువగా ఎల్‌డిఎఫ్‌కు మద్దతు ఇస్తారన్నది రెండవది. అన్యాయం జరిగిందని నిరూపించే స్దితిలో యుడిఎఫ్‌ లేదన్నది మరొకటి. ఇక్కడ గమనించాల్సిందేమంటే యుడిఎఫ్‌ కూటమి గతంలో ఎన్నికల కోసమే స్కాలర్‌షిప్పుల విధానాన్ని రూపొందించి అది లబ్దిపొందింది లేదు. ఒక సూత్రబద్ద వైఖరి తీసుకున్న కారణంగా ఎల్‌డిఎఫ్‌ లబ్దిపొందితే పొందుతుందా లేదా అన్నది వేరే అంశం. మీడియా విశ్లేషకులకు కడుపు మంట ఎందుకో తెలియదు.

బక్రీద్‌ సందర్భంగా కరోనా ఆంక్షల సడలింపు వివాదం !


డెబ్బయి ఒక్క రోజుల తీవ్ర ఆంక్షల తరువాత బక్రీద్‌ సందర్భంగా కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు దుకాణాలను తెరిచేందుకు షరతులతో ఆంక్షలను సడలించింది. కేరళలో ఉన్న జనాభా పొందికను చూసినపుడు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలను అనుసరించే వారి ప్రధాన పండగల రోజుల్లో వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. బక్రీద్‌ సందర్భంగా దుకాణాల్లో పాటించాల్సిన నిబంధనల అమలుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. యజమానులకు గట్టి ఆదేశాలను జారీ చేశారు. ప్రార్ధనా స్ధలాల్లో అనుమతించిన దానికి మించి గుమి కూడదనే షరతు విధించారు. మసీదులతో పాటు దేవాలయాలు, చర్చ్‌లకు అలాంటి ఆంక్షలతోనే అనుమతులు ఇచ్చారు. కన్వర్‌ యాత్ర నిర్వహణ తప్పన్నపుడు బక్రీద్‌కు ఇవ్వటం కూడా తప్పే అని కాంగ్రెస్‌ జాతీయ ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి అభ్యంతరం చెప్పారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా వ్యతిరేకత తెలిపింది. ప్రస్తుతం దేశంలో కేసులు ఎక్కువ ఉన్న కేరళలో ఇలాంటి అనుమతులు ఇవ్వకూడదన్నది దాని వాదన. ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళకు చెందిన బిజెపి మంత్రి వి మురళీధరన్‌ రాజకీయ ప్రయోజనాలకోసం తీసుకున్నదిగా ఆరోపించారు. శాస్త్రీయ పద్దతిలో కరోనా నిరోధ చర్యలను తీసుకోవాలన్నారు.

బక్రీద్‌ సందర్భంగా మసీదుల్లో పరిమిత సంఖ్యలో ప్రార్ధనలకు తప్ప బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేదు. రాష్ట్రాన్ని ఏబిసిడి తరగతులుగా విభజించారు. డి తరగతి ప్రాంతాల్లో ఒక్క రోజు మాత్రమే వస్తువుల కొనుగోలుకు అవకాశం ఇచ్చారు.
మసీదులో వంద మందికి మాత్రమే అనుమతి, ఆరు అడుగుల దూరం పాటించాలి. ఎవరి దుప్పటి లేదా చాప వారే తెచ్చుకోవాలి. ఒక వేళ అంత మంది పట్టే అవకాశం లేకపోతే సంఖ్యను తగ్గించుకోవాలి.అరవై అయిదు సంవత్సరాలు దాటిన పది సంవత్సరాల లోపు వారిని ప్రార్ధనలకు అనుమతించరు. మాస్కుతప్పని సరి, చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి, మసీదులో ప్రవేశించే ముందు శరీర ఉష్ణ్రోగ్రతను చూస్తారు. ప్రార్ధనలకు వచ్చిన వారి చిరునామా, ఫోను నంబర్లు లేదా వారిని కనుగొనేందుకు అవసరమైన సమాచారాన్ని మసీదు నిర్వాహకులు నమోదు చేయాలి. జంతుబలి సమయంలో ఐదుగురికి మించి ఉండకూడదు. కరోనా నిబంధనలకు విరుద్దంగా ఎవరూ గుమికూడవద్దని ముస్లిం మత పెద్దలు బహిరంగ ప్రకటన చేశారు. ఆయా జిల్లాల యంత్రాంగాలు నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. మలప్పురం జిల్లాలో ప్రార్ధన స్దలాల్లో 40 మందికి మించి అనుమతించేది లేదని, రెండు విడతల వాక్సిన్‌ తీసుకున్నట్లు, కరోనా లేదనే ధృవీకరణ పత్రాలు ఉన్నవారినే అనుమతించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీదు సందర్భంగా ఆది, సోమ, మంగళ వారాల్లో దుకాణాలను తెరిచేందుకు అనుమతించి రాష్ట్ర ప్రభుత్వం మనుషు ప్రాణాలతో ఆడుకుంటున్నదంటూ అనుమతి రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఢిల్లీ నివాసి పికెడి నంబియార్‌ ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. దాని మీద ఈ రోజే సమాధానం ఇవ్వాలని కేరళ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీం కోర్టు కోరింది. మంగళవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే ఈ కేసును చేపట్టనున్నట్లు డివిజన్‌ బెంచ్‌ పేర్కొన్నది.


బక్రీద్‌ సందర్భంగా మూడు రోజుల పాటు నిబంధనల సడలింపు మీద మిశ్రమ స్పందన వెలువడింది. ప్రభుత్వ చర్యను సమర్ధించే వారు చెబుతున్న అంశాల సారాంశం ఇలా ఉంది. కేరళలో ఓనం-బక్రీదు తరుణంలో వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతుంది. గత ఏడాది ఐదులక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తే 3,62,620 కోట్లు మాత్రమే జరిగాయి. ప్రభుత్వానికి 75వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. ఓనం సమయంలో 25వేల కోట్లని అంచనా వేస్తే వచ్చింది రు.18,131 కోట్లు. గత మూడు సంవత్సరాలుగా ఓనం పండగ సందర్భంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. వరదల కారణంగా 2018,19 సంవత్సరాల్లో దెబ్బతింటే గతేడాది కరోనా వచ్చింది. కేరళ వ్యాపార వ్యవసాయి ఏకోపన సమితి అంచనా ప్రకారం ఇరవై వేల మంది వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పదిమంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇరవై వేల కోట్ల రూపాయల సరకు పనికిరాకుండా పోయింది. ప్రస్తుత పరిస్ధితుల్లో కొత్త సరకు తెచ్చేందుకు భయపడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మతశక్తుల శాపాలు – కమ్యూనిస్టులకు దేవుళ్ల వరాలు !

07 Friday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

BJP-Kerala, Kerala Assembly Elections 2021, Kerala Congress Blame Game, Kerala LDF, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


తామేం చేసినా, ఏం మాట్లాడినా జనం గతం మాదిరి అధికారం అప్పగించక తప్పుదు అన్నట్లు వ్యవహరించిన కేరళ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఓటమికి మీరు బాధ్యులంటే కాదు మీరే అనే కీచులాటలకు దిగారు. అధికారం ఖాయం అన్న ఆశతో మీతో పాటు ఐదేండ్లు ఎదురు చూశాము, మీ తీరు తెన్నులతో మరో ఐదేండ్లు ప్రతిపక్షంలో ఎలా కూర్చోవాలి, అసలు ఆ తరువాతైనా అధికారానికి వస్తామా అన్నది అనుమానమే అన్నట్లుగా కాంగ్రెస్‌ మిత్రపక్షాలు మధనపడుతున్నాయి. పైపై మెరుగులు కాదు సమూల ప్రక్షాళన జరగాలని కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి వత్తిడి వస్తోంది. ఇరవై మంది ప్రస్తుత ఎంఎల్‌ఏలను నిలిపితే ముగ్గురే ఓడిపోయారు, కొత్త ముఖాల పేరుతో 50 మందిని రంగంలోకి రప్పిస్తే గెలిచింది ఇద్దరే , ఎందుకీ పని చేశారు అని అడుగుతున్నారు. ఓటమికి అందరూ బాధ్యులే అయితే నన్ను ఒక్కడినే బలిచేసి పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు పూనుకుంటారా అని ముళ్లపల్లి రామచంద్రన్‌ ఆగ్రహించారు. పార్టీ కేంద్ర నాయకత్వం కోరితే రాజీనామాకు సిద్దం, అదే విషయం చెప్పాను అన్నారు. రెండు సంవత్సరాల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే అప్పుడేమో దానికి బాధ్యత నాది అని ఎవరూ చెప్పలేదు, ఇప్పుడేమో అంతా మీరే చేశారు అన్నట్లు ప్రతివారూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర నాయకత్వం ఈసారి ఎన్నికల్లో జోక్యం చేసుకుంది, అందువలన ప్రతివారూ దీనికి బాధ్యులే, నన్ను అవమానించి పార్టీ నుంచి వెలివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే కష్టకాలంలో పార్టీ వదలి వెళ్లాననే అభిప్రాయం రాకుండా ఉన్నాను, పార్టీ అధినాయకత్వం అనుమతిస్తే వెంటనే రాజీనామా చేస్తా అన్నారు. ముళ్లపల్లి రామచంద్రన్‌కు వ్యతిరేకంగా తిరువనంత పురంలో బ్యానర్లు వెలిశాయి. ఆయన ఎప్పుడూ నిద్రపోతున్నట్లు ఉంటారని, అలాంటి వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా పనికిరారని హిబి ఇడెన్‌ అనే నేత ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ముఠా తగాదాలే ఓటమికి ముఖ్యకారణమని కేరళ కాంగ్రెస్‌ నేత పిజె జోసెఫ్‌ విమర్శించారు. ముళ్లపల్లి రామచంద్రన్‌, రమేష్‌ చెన్నితల ఇద్దరినీ ఆ పదవుల నుంచి తప్పించి కొత్త వారిని ఎన్నుకోవాలని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ చొరవతో జరిగిన ఒక సమావేశంలో ఒక వర్గం అభిప్రాయంపడింది.
పిసిసి అధ్యక్షుడు, శాసనసభా పక్ష నేతను మార్చాల్సిందే అయితే అది ఉన్నవారిని బలవంతంగా తొలగించారనే అభిప్రాయం రాకుండా చూసుకోవాలని పార్టీ నాయకత్వం చూస్తోంది. కరోనా వలన ఎల్‌డిఎఫ్‌కు లబ్ది చేకూరింది, అందువలన పార్టీ ఓటమికి ఎవరినీ నిందించనవసరం లేదని కన్నూరు ఎంపీ కె సుధాకరన్‌ చెప్పారు. కరోనా కారణంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు చురుకుగా పనిచేయలేకపోయారు. కానీ అలాంటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్ధ సృష్టిలో సిపిఎం విజయవంతమైంది.వారి మాదిరి ఏ పార్టీ జనానికి మద్దతు ఇవ్వలేదు, అది ఈ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిందని సుధాకరన్‌ చెప్పారు. ప్రతిపక్ష నేతగా రమేష్‌ చెన్నితల బాగా పని చేశారని, అయితే దాన్ని పార్టీ వినియోగించుకోలేకపోయిందన్నారు. మరోవైపు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలని అనేక మంది సుధాకరన్ను కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి.
పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ అంతరించదని యావత్‌ దేశ దృష్టిని ఆకర్షించిన నీమమ్‌ నియోజకవర్గంలో మూడవ స్దానంలో నిలిచిన కాంగ్రెస్‌ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమారుడు వి మురళీధరన్‌ చెప్పారు. తమ ఓట్లశాతం పెరిగిందని, అయితే బిజెపి ఓట్ల శాతం తగ్గిపోవటం పట్ల ముఖ్యమంత్రి విజయన్‌ ఎక్కువ ఆందోళన వ్యక్తం చేశారని అరోపించారు.యుడిఎఫ్‌ను అంతం చేసేందుకు ఒక సాధనంగా బిజెపిని ఉపయోగించుకుంటున్నారని చెప్పుకున్నారు. ఎంత ప్రయత్నించినా ఇక్కడ బిజెపి ఎదిగేది లేదన్నారు. యుడిఎఫ్‌లో రెండవ పెద్ద పార్టీ అయిన ముస్లింలీగులో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవటానికి నాయకత్వమే కారణమని, కొందరు నేతలు వారిలో వారు పదవులను పంచుకుంటూ కొత్తవారికి అవకాశం ఇవ్వటం లేదని ధ్వజమెత్తుతున్నారు. బలమైన స్దానాల్లో ఓటమి కారణాలు వెల్లడించాలని కోరుతున్నారు.

బిజెపి కూటమిలోనూ కీచులాటలు !


ఉన్న ఒక్క సీటు పోగొట్టుకోవటంతో పాటు ఓట్లు కూడా గణనీయంగా తగ్గిన ఎన్‌డిఏ కూటమిలోనూ కీచులాటలు ప్రారంభమయ్యాయి. ఎన్‌డిఏ రాష్ట్ర కన్వీనర్‌గా ఉన్న భారత ధర్మ జనసేన (బిడిజెఎస్‌) తుషార్‌ వెల్లపల్లి రాజీనామాకు సిద్దపడినట్లు, బిజెపితో కొనసాగాలా లేదా అని మల్లగుల్లాలు పడుతున్నట్లు వార్తలు. కేంద్ర ప్రభుత్వ బోర్డులు, కమిటీలలో తమకు ప్రాతినిధ్యం కల్పిస్తామన్న వాగ్దానాన్ని బిజెపి నిలబెట్టుకోలేదని, తాము పోటీ చేసిన చోట బిజెపి నేతలు ప్రచారం చేయలేదు, కార్యకర్తలు ఓట్లుకూడా వేయలేదని ఆ పార్టీ చెబుతోంది. ఒకవేళ బిడిజెస్‌ ఎన్‌డిఏ నుంచి బయటకుపోయి ఎల్‌డిఎఫ్‌లో చేరినా తమకు జరిగే నష్టం ఏమీ లేదని బిజెపి నేత ఒకరు చెప్పినట్లు మళయాల మనోరమ పత్రిక పేర్కొన్నది.

మతశక్తుల శాపాలు – కమ్యూనిస్టులకు వరాలు !

అసెంబ్లీ ఎన్నికల సమయంలో శబరిమల అయ్యప్ప, ఇతర దైవ సంబంధ అంశాలను ముందుకు తెచ్చి కాంగ్రెస్‌, బిజెపి తీవ్రంగా ప్రయత్నించాయి. పోలింగ్‌ జరుగుతుండగా నాయర్‌ సర్వీసు సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ విలేకర్లతో మాట్లాడుతూ అయ్యప్ప శాపం తగిలిన ప్రభుత్వం రెండవ సారి అధికారానికి రాదని, జనం మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అయ్యప్ప ఇతర దేవుళ్లందరూ ఎల్‌డిఎఫ్‌తో ఉన్నారని ఫలితాలు రుజువు చేశాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. పుణ్యక్షేత్రాలుగా, ప్రాంతాలుగా పేరున్న తొమ్మిది పట్టణాలు లేదా నియోజకవర్గాలు, ప్రతిపక్ష కూటమికి కంచుకోటలుగా భావించిన చోట కమ్యూనిస్టుల నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధులు పెద్ద మెజారిటీలతో విజయాలు సాధించారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో శబరిమల ప్రాంతం ఉన్న కొన్ని నియోజకవర్గంలో యుడిఎఫ్‌ గెలిచింది. అయితే శాసనసభ్యుడి మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలో 23 సంవత్సరాల తరువాత సిపిఎం గెలిచింది. తిరిగి తాజా ఎన్నికలలో ఎనిమిదిన్నర వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అయ్యప్ప పేరుతో పాగా వేయాలని చూసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ ఇక్కడ మూడవ స్ధానంలో నిలిచారు. త్రిసూర్‌లో వడక్కున్హా పేరుతో ఉన్న శివాలయం ఎంతో ప్రాచుర్యం కలిగింది. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గతసారి సిపిఐ గెలిచి, ఈ సారి కూడా విజయం సాధించింది. సినిమా హీరో సురేష్‌ గోపి బిజెపి అభ్యర్ధిగా, మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమార్తె పద్మజ కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగారు. సురేష్‌ గోపి మూడవ స్ధానంలో నిలిచారు.
ప్రపంచంలోనే అత్యంత ధనిక ప్రార్ధనా స్ధలాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందిన అనంత పద్మనాభ స్వామి ఉన్న తిరువనంతపురంలోని నియోజకవర్గంలో దీర్ఘకాలం తరువాత కాంగ్రెస్‌ను ఓడించి సిపిఎం విజయం సాధించింది. ఇక్కడ కూడా బిజెపికి మూడవ స్ధానమే. ప్రఖ్యాత శ్రీకృష్ణ దేవాలయం ఉన్న గురువాయూర్‌లో యుడిఎఫ్‌ అభ్యర్ధి కెఎన్‌ఏ ఖాదర్‌ పోటీ చేశారు. అక్కడ బిజెపి నామినేషన్‌ చెల్లకపోవటంతో ఆయన విజయం సాధించాలని సురేష్‌ గోపి బహిరంగంగానే ఆకాంక్ష వెలిబుచ్చారు. ఇక్కడ కూడా ఎల్‌డిఎఫ్‌ గెలిచింది. వైకోం మహదేవ దేవాలయం, శ్రీ కురుంబ భగవతి వంటి ప్రముఖ క్షేత్రాలలో కూడా ఎల్‌డిఎఫ్‌ విజయం సాధించింది.
ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్రలో భాగంగానే నాయర్‌ సర్వీస్‌ సొసైటీ నేత సుకుమారన్‌ నాయర్‌ కాంగ్రెస్‌-బజెపిలతో చేతులు కలిపారని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ దేశాభిమాని పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.మతపరమైన చీలిక తెచ్చే విధంగా ఆయన ప్రకటనలు చేశారని విమర్శించారు. తాము ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకం కాదని తన మాటలను వక్రీకరించారని సుకుమారన్‌ నాయర్‌ ఆరోపించారు. అయితే నాయర్‌ చేసిన ప్రకటనను కాంగ్రెస్‌, బిజెపి సమర్ధించాయి.
కొన్ని సంస్ధలు ఎన్నికల అనంతరం జరిపిన సర్వేల ప్రకారం రాష్ట్రంలోని అన్ని మతాలలో ఉన్న పేదలు, బడుగు జీవులు ఎల్‌డిఎఫ్‌కు ఓటు వేసినట్లు తేలింది. కొన్ని చోట్ల గతం కంటే ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన వారు ఎక్కువగా ఓటు చేశారు. వెనుకబడిన తరగతులు, దళితులు అత్యధికులు కమ్యూనిస్టులకు ఓటు వేశారు.

ఇరవైన విజయన్‌ ప్రమాణస్వీకారం !

రాష్ట్రంలో కరోనా ఉధృతి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ముగిసిన తరువాతనే ఈనెల 20న నూతన ప్రభుత్వం ఏర్పడ నుంది ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు పూర్తి స్ధాయి లాక్‌డౌన్‌ ప్రకటించారు. పదిహేడవ తేదీన ఎల్‌డిఎఫ్‌ సమావేశం పద్దెనిమిదిన సిపిఎం కార్యదర్శివర్గ సమావేశం, పందొమ్మిదవ తేదీన మంత్రివర్గ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రికి తీర్మానం అందచేత, ఇరవయ్యవ తేదీన ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది.ఈలోగా వివిధ పార్టీలకు కేటాయించే మంత్రుల సంఖ్య, శాఖల కేటాయింపులో మార్పుల గురించి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. రద్దయిన మంత్రి వర్గంలో ముఖ్యమంత్రిగాక 19 మంది మంత్రులు ఉన్నారు. ఈ సారి ఒక ఎంఎల్‌ఏ ఉన్న పార్టీలకూ ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తే మంత్రుల సంఖ్య 21కి పెరగవచ్చు.గతంలో యుడిఎఫ్‌ మంత్రివర్గంలో 21 మంది మంత్రులు ఉన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళలో ఎర్ర సునామీ : బలపడిన ఎల్‌డిఎఫ్‌, కుంగిన యుడిఎఫ్‌, కొట్టుకుపోయిన బిజెపి !

02 Sunday May 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), BJP-Kerala, Kerala 2021 Elections results, Kerala Assembly Elections 2021, Kerala LDF, UDF Kerala


ఎం కోటేశ్వరరావు
అవును సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాసింది. ఒకసారి ఎల్‌డిఎఫ్‌ను ఎన్నుకుంటే మరోసారి యుడిఎఫ్‌ను ఎన్నుకొనే కేరళీయులు అధికారాన్ని తమకు అప్పనంగా కట్టపెడతారని ఆశపడ్డ కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ఈ ఎన్నికలలో తమకు స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యలో సీట్లు రాకపోయినా వచ్చే కొన్ని సీట్లతో చక్రం తిప్పుతామని, అన్నీ అనుకూలిస్తే అధికారం తమను వరిస్తుందని పగటి కలలు కన్న బిజెపికి ఉన్న ఒక్కసీటును లేకుండా చేసి ఖాతాను మూసివేశారు. ఎల్లవేళలా జన సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం ఆపత్కాలంలో తమను ఎలా అదుకున్నదో చూసిన జనం తమ మనోభావాన్ని గతేడాది చివరిలో జరిగిన స్ధానిక సంస్దల ఎన్నికలలోనే ఎల్‌డిఎఫ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి వెల్లడించారు. ఏప్రిల్‌ ఆరవ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మరింత స్పష్టంగా తమకు కావాల్సిన వారెవరో ఎంచుకున్నారు. ఎన్ని అభాండాలు, ఎన్ని అవాస్తవాలు, ఎన్ని తప్పుడు ప్రచారాలు, ఎన్ని ఆటంకాలు అన్నింటిని మేము కాచుకుంటామంటూ జనం ముందుకు వచ్చారు.


ప్రజలు మమ్మల్ని విశ్వసించారు, యుడిఎఫ్‌ను తిరస్కరించారు, బిజెకి బుద్ది చెప్పారు అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఫలితాలపై తొలి స్పందనలో పేర్కొన్నారు. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన మాత్రమే లౌకిక వాదాన్ని పరిరక్షించగలదని, సామాజిక న్యాయం చేకూర్చగలదని నమ్మారని ఇది ప్రజావిజయం అన్నారు. ఎన్నికల సమయంలో యుడిఎఫ్‌ లేవనెత్తిన అంశాలన్నింటినీ జనం తిరస్కరించారని అన్నారు. ఉన్న ఒక్క సీటును పొగొట్టుకున్న బిజెపి గురించి మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో జిమ్మిక్కులు చేయగలదేమో గానీ ఇక్కడ పని చేయవని కేరళ గడ్డ మీద మతత్వానికి తావులేదన్నారు. గతంలో కాంగ్రెస్‌ నేత ఏకె ఆంటోని నాయకత్వంలో 2001లో యుడిఎఫ్‌ 99 స్ధానాలను సాధించి అప్పటికి ఒక రికార్డు నెలకొల్పింది. దాన్ని పినరయి విజయన్‌ సమం చేశారు. ఓట్లశాతాలు, తీర్పు ఇతర వివరాలను మరో సందర్భంలో వివరంగా సమీక్షించుదాం. రెండు ఫ్రంట్లలో పార్టీల వారీగా సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.


ఎల్‌డిఎఫ్‌ ×× సీట్లు ×××× యుడిఎఫ్‌××××× సీట్లు
సిపిఎం ×××× 68 ×××× కాంగ్రెస్‌ ×××× 22
సిపిఐ –×××× 17 ×××× ముస్లింలీగ్‌ ×××× 14
కెసి(ఎం) ×××× 5 ××××కేరళకాంగ్రెస్‌ ×××× 2
జెడిఎస్‌ ×××× 2 ×××× కెసిజె ×××× 1
ఎన్‌సిపి ×××× 2 ×××× ఎన్‌సికె ×××× 1


ఎల్‌డిఎఫ్‌లోని మరో ఐదు చిన్న పార్టీలకు ఒక్కొక్క స్దానం చొప్పున వచ్చాయి. యుడిఎఫ్‌లోని మూడు పార్టీలకు బిజెపి మిత్రపక్షాలు మూడింటికి, ఇతర పార్టీలు నాలిగింటికి ఒక్క స్దానమూ రాలేదు. గత ఎన్నికలలో స్వతంత్ర అభ్యరిగా గెలిచిన సభ్యుడు ఈ సారి ఎల్‌డిఎఫ్‌ చేతిలో ఓడిపోయారు.


వివిధ జిల్లాలో ఫలితాల తీరుతెన్నులను ఒక్కసారి చూద్దాం. పద్నాలుగు జిల్లాల్లోని 140 స్ధానాల్లో ఇది రాసిన సమయానికి విజయాలను ఖరారు చేసినవి, ఆధిక్యతలో ఉండి అధికారికంగా ప్రకటించని స్ధానాలు దిగువ విధంగా ఉన్నాయి.


జిల్లా పేరు ×××× 2016 ఎన్నికలు×××××× 2021 ఎన్నికలు
××××××××ఎల్‌డిఎఫ్‌××యుడిఎఫ్‌ ××× ఎల్‌డిఎఫ్‌ ×××× యుడిఎఫ్‌
తిరువనంతపురం ×× 9 ×× 4 ×× 13 ×××× 1
కాసరగోడ్‌ ××××× 3 ×× 2 ××× 3 ×××× 2
వయనాడ్‌ ××××× 2 ×× 1 ××× 2 ×××× 1
కన్నూరు ××××× 8 ×× 3 ××× 13 ×××× 1
కోజికోడ్‌ ××××× 11 ×× 2 ××× 11 ×××× 2
మలప్పురం ××× 4 ×× 12 ××× 4 ×××× 12
పాలక్కాడ్‌ ××××× 9 ×× 3 ××× 10 ×××× 2
త్రిసూర్‌ ××××× 12 ×× 1 ××× 12 ×××× 1
ఎర్నాకుళం ××××× 5 ×× 9 ××× 5 ×××× 9
ఇడుక్కి ××××× 3 ×× 2 ××× 4 ×××× 1
కొట్టాయం ××××× 2 ×× 6 ××× 5 ×××× 4
అలప్పూజ ××××× 8 ×× 1 ××× 8 ×××× 1
పత్తానంతిట్ట ××××× 4 ×× 1 ××× 5 ×××× 0
కొల్లం ××××× 11 ×× 0 ××× 9 ×××× 2

ఇలా అనుకోలేదు, ఓటమిని అంగీకరిస్తున్నాం, ఆత్మశోధన చేసుకుంటాం : కాంగ్రెస్‌


ఇలాంటి ఫలితాలు వస్తాయని మేము అనుకోలేదు. విజయన్‌ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశాము. వారు విజయం సాధించినంత మాత్రాన అవన్నీ కొట్టుకుపోవు. పరాజయాన్ని ఆత్మశోధన చేసుకుంటాం అని హరిపాద నియోజకవర్గంలో విజయం సాధించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చెప్పారు.రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ పుతుపల్లి నియోజకవర్గం నుంచి పన్నెండవ సారి విజయం సాధించి గతంలో ఉన్న దివంగత కెఎం మణి రికార్డుతో సమం చేశారు. గత ఎన్నికలలో ఇరవై వేలకు పైగా మెజారిటీ తెచ్చుకున్న చాందీ ఈ సారి ఎనిమిదివేలతో సరిపెట్టుకున్నారు. ఒక విద్యార్ది నేత మీద ఇంత తక్కువ మెజారిటీ తెచ్చుకోవటం ఏమిటని కాంగ్రెస్‌ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. పరాజయాన్ని సవాలుగా తీసుకొని పని చేస్తామని చాందీ అన్నారు.


కరుణాకరన్‌ బిడ్డలు : అన్నకు మూడో స్ధానం – చెల్లికి రెండో స్దానం !


ఓడిపోయిన వారిలో మంత్రి, సిపిఎం సీనియర్‌ నేత మెర్సికుట్టి అమ్మ ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ రెండు సీట్లలో పోటీ చేశారు. శబరిమల ఆలయం ఉన్న కొన్ని నియోజకవర్గంలో సిపిఎం చేతిలో, మరో నియోజకవర్గంలో యుడిఎఫ్‌ ముస్లింలీగ్‌ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికలలో మంజేశ్వరమ్‌లో కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయిన సురేంద్రన్‌ ఈ సారి 1,143 తేడాతో పరాజయం పొందారు. కొన్ని నియోజకవర్గంలోని శబరిమల వివాదాన్ని రెచ్చగొట్టి గెలవాలని చూసి అక్కడ కూడా పరాజయం పాలయ్యారు. రెండు చోట్ల పోటీ చేయటం, ప్రచారానికి హెలికాప్టర్‌ను ఉపయోగించటం వంటి చర్యలు మంజేశ్వరమ్‌లో పరాజయానికి కారణమని మీడియా వ్యాఖ్యానించింది. కేరళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని బిజెపి తొలిసారిగా తిరువనంతపురం నగరంలోని నీమమ్‌ నియోజకవర్గంలో గత ఎన్నికలలో కాంగ్రెస్‌ పరోక్ష మద్దతుతో గెలిచి ప్రాతినిధ్యం పొందింది. ఈసారి సిపిఎం చేతిలో ఓడిపోయింది. బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ గవర్నర్‌ అయిన కుమనం రాజశేఖరన్‌ ఇక్కడ పోటీ చేశారు. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమారుడైన లోక్‌సభ సభ్యుడు మురళీధరన్‌ను అక్కడ నిలిపింది. ఆయన మూడవ స్దానంలో నిలిచారు. తన రాకతో బిజెపికి పెద్ద ఊపు వచ్చిందని, తానే ముఖ్యమంత్రి అభ్యర్ధిని అని చెప్పుకున్న మెట్రోమాన్‌ శ్రీధరన్‌ పాలక్కాడ్‌లో యుడిఎఫ్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి షఫీ పరంబిల్‌ చేతిలో ఓడిపోయారు. ఇక్కడ గత ఎన్నికలలో కూడా బిజెపి రెండవ స్దానంలో నిలిచింది. పాలక్కాడ్‌ మున్సిపాలిటీలో బిజెపి విజయం సాధించింది. పట్టణ ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో ఉన్న శ్రీధరన్‌ గ్రామీణ ప్రాంతంలోకి వచ్చే సరికి వెనుకబడిపోయారు. సినీహీరో సురేష్‌ గోపి బిజెపి అభ్యర్ధిగా త్రిసూర్‌లో పోటీ చేసి మూడవ స్ధానంలో వచ్చారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ కుమార్తె పద్మజా వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్దిగా పోటీ చేశారు. ఆమెపై సిపిఐ అభ్యర్ధి పి బాలచంద్రన్‌ విజయం సాధించారు. పాల నియోజకవర్గంలో కేరళ కాంగ్రెస్‌ (ఎం) జోస్‌కె మణి పరాజయం పొందటం ఎల్‌డిఎఫ్‌ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. మణి ఎల్‌డిఎఫ్‌లో చేరటంతో అంతకు ముందు ఉప ఎన్నికలో గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌సిపి సభ్యుడు మణి సి కప్పన్‌కు వేరే చోట సీటు ఇస్తామని చెప్పినప్పటికీ అదే సీటు కావాలని పట్టుబట్టటం, ఎల్‌డిఎఫ్‌ తిరస్కరించటంతో కప్పన్‌ యుడిఎఫ్‌లో చేరి అదే సీటులో పోటీ చేసి పదివేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.


జయహౌ శైలజ టీచర్‌ – అయ్యప్పకు ఆగ్రహం !


ఎల్‌డిఎఫ్‌ను రెండవ సారి అధికారానికి తీసుకురావటంలో పినరయి విజయన్‌ ఒక రికార్డు స్దాపిస్తే, ఈ ఎన్నికలో ఆరోగ్యశాఖ మంత్రి సిపిఎం అభ్యర్ధిగా కెకె శైలజ రికార్డు స్ధాయిలో 61వేలకు పైగా ఓట్లతో కన్నూరు జిల్లాలో విజయం సాధించారు. గత ఎన్నికలలో ఇక్కడ సిపిఎం నేత ఇపి జయరాజన్‌ 43,381 ఓట్ల మెజారిటీ ఒక రికార్డు కాగా శైలజ దాన్ని బద్దలు కొట్టారు.
వయస్సులో ఉన్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశ సమస్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు జరిపినందుకు ప్రభుత్వంపై ధ్వజమెత్తి శాంతి భద్రతల సమస్యను సృష్టించిన కాంగ్రెస్‌, బిజెపిలకు ఈ ఎన్నికల్లో శృంగభంగమైంది. ఆ సమస్య సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్నందున కోర్టు ధిక్కారమని తెలిసినప్పటికీ ఆ సమస్యను ప్రచారం చేశారు. తాము అధికారానికి వస్తే ప్రత్యేక చట్టం చేస్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. శబరిమల ఆలయ ప్రాంతం, పరిసరాలలో ఉన్న నియోజకవర్గాలలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులు విజయం సాధించారు. తనను అనవసరంగా వివాదంలోకి లాగినందుకు ఆ రెండు పార్టీల మీద అయ్యప్ప ఆగ్రహం పూనారా అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. తాము రాజకీయాలకు తటస్ధం అని ప్రకటించిన నాయర్‌ సర్వీసు సొసైటీ పోలింగ్‌ ప్రారంభమైన తొలిగంటలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సంస్ధ నేత ప్రకటించి తామెవరి పక్షమో వెల్లడించారు. కాంగ్రెస్‌ ఈ విషయంలో బిజెపికి కార్బన్‌ కాపీ మాదిరిగా వ్యవహరించింది. ఎల్‌డిఎఫ్‌ మాత్రమే ఏకైక లౌకికశక్తిగా జనం చూశారు. మైనారిటీలు అనేక ప్రాంతాలలో ఎల్‌డిఎఫ్‌ వైపు మొగ్గారని మధ్య, దక్షిణ కేరళ ఫలితాలు వెల్లడించాయి. తమ అభ్యర్ధి మెట్రోమాన్‌ శ్రీధరన్‌ను ఓడించేందుకు సిపిఎం మద్దతుదారులైన ముస్లింలు యుడిఎఫ్‌ అభ్యర్ధికి ఓటువేసి ఓడించారని, అనేక చోట్ల తమకు వ్యతిరేకంగా ఇదే చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. తాము 35 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సురేంద్రన్‌ ఎన్నికల ముందు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఓటమితో గుండు కొట్టించుకోవద్దని ప్రత్యర్ధికి సలహా ఇచ్చిన మంత్రి !


ప్రియమైన స్నేహితుడా ఎన్నికల్లో ఓటమిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నియోజకవర్గంలో పరిస్ధితికి అనుగుణ్యంగా ఓటు వేశారని కేరళ విద్యుత్‌శాఖ మంత్రి ఎం ఎం మణి కాంగ్రెస్‌ అభ్యర్ధి ఇఎం అగస్తీకి సలహా ఇచ్చారు. తాను ఓడిపోతే గుండు గీయించుకుంటానని ఒక టీవీ ఛానల్లో అగస్తి శపధం చేశారు. ఇడుక్కి జిల్లాలోని ఉడుంబాలోంచా నియోజకవర్గంలో 38,305 పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన మంత్రి తన విజయానికి దోహదం చేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భోళామనిషిగా పేరున్న మంత్రి ప్రత్యర్ధుల మీద పంచ్‌లు వేయటంలో ఆయనకు ఆయనే సాటి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాజనాధ్‌ గారూ రాజ్యాంగం చదువు కోండి : సీతారామ్‌ ఏచూరి !

29 Monday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

A.K Antony, BJP-Kerala, Kerala Assembly Elections 2021, Kerala CPI(M), Rajnath Singh, SITARAM YECHURY


ఎం కోటేశ్వరరావు


కేంద్రానికి రాష్ట్రాలు ఎంత దూరమో రాష్ట్రాలకు కేంద్రం అంతే దూరం అనే పాఠాన్ని చెప్పేందుకు కేరళ ప్రభుత్వం పూనుకుంది. గతంలో కూడా తన ఆధీనంలోని దర్యాప్తు సంస్దల ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రతిపక్షాల పాలనలోని రాజకీయ నేతలకు వ్యతిరేకంగా దాడులు చేయటం, తప్పుడు కేసుల్లో ఇరికించటం తెలిసిందే. దాన్ని విమర్శించిన బిజెపి ఇప్పుడు అంతకంటే ఎక్కువగా వాటిని దుర్వినియోగం చేస్తోంది. సరిగ్గా ఎన్నికల సమయంలో కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ దొంగబంగారం కేసులో ఉన్నారని వాంగ్మూలం ఇవ్వాలని లేనట్లయితే అంతు చూస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు నిందితులను బెదిరించినట్లు వార్తలు రావటమే కాదు స్వయంగా నిందితులే వెల్లడించారు. తప్పుడు వాంగ్మూలాలను ఎన్నికల ప్రచారంలో అస్త్రాలుగా కస్టమ్స్‌, ఇడి అధికారులు కోర్టుకు సమర్పించారు. కేంద్ర దర్యాప్తు సంస్ధల అధికారుల బెదిరింపుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందటంతో వాటి మీద న్యాయవిచారణ జరపాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి కోరింది. ఒక వేళ ఇవ్వకపోతే ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసిన తరువాత కమిషన్‌ తన పని చేయనుంది.


స్వతంత్ర భారత చరిత్రలో కేంద్ర సంస్ధల అధికారుల తీరుతెన్నులపై ఒక రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదులు చేయటం, కొన్ని సందర్భాలలో దర్యాప్తుకు అనుమతి నిరాకరించటం తెలుసు గానీ విచారణ జరపటం ఇదే ప్రధమంగా కనిపిస్తోంది. అనూహ్యమైన ఈ పరిణామంతో దిమ్మదిరిగిన కేంద్ర మంత్రులు గుండెలు బాదుకుంటున్నారు. ఇది ఒక జోక్‌ అని ఒక విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ అంటే ఇది దురదృష్టకరం, రాజ్యాంగంలోని ఫెడరల్‌ వ్యవస్ధకే ఇది సవాలు అని రక్షణశాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ కేరళ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేంద్ర సంస్దలు చేసిన వినతిని రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది, నిలిపివేసేందుకు కూడా నిరాకరించింది. చివరకు ఇది ఏమౌతుందో తెలియదు గానీ కేంద్ర -రాష్ట్ర సంబంధాల సమస్యల్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు ఈ ఉదంతం ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంది. వామపక్ష ప్రభుత్వ చర్య తనకు ఆశ్చర్యం కలిగించలేదని హౌం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. పరువు కాపాడుకొనేందుకు ఇలా చేశారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్దలపై విచారణ జరపటం రాజ్యాంగ వ్యతిరేకమని కేంద్ర మంత్రి రాజనాధ్‌ సింగ్‌ భావిస్తే మంత్రి తిరిగి మరోసారి రాజ్యాంగాన్ని చదువుకోవటం అవసరం అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి విలేకర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం ఏ కేంద్ర సంస్ద కూడా సంబంధిత రాష్ట్ర అనుమతి లేకుండా వ్యవహరించరాదని, రాష్ట్రాలు తమ పరిధులకు లోబడి వ్యవహరిస్తాయని అన్నారు. ఎన్నికల సమయంలో నిందితుల ప్రకటనల పేరుతో దర్యాప్తు సంస్దలు నీచస్ధాయికి దిగజారి వ్యవహరిస్తున్నాయని అసెంబ్లీ స్పీకర్‌ శివరామకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. స్వ ప్రయోజనాల కోసం స్పీకర్‌ తన నివాసానికి తనను రమ్మన్నట్లుగా దొంగబంగారం కేసు ప్రధాన నిందితురాలు స్వప్ప సురేష్‌ చేసిందన్న ప్రకటనను ఇడి కోర్టుకు సమర్పించింది.


కేరళలో హిందూత్వ కోసం బిజెపి-కాంగ్రెస్‌ పోటా పోటీ !


కేరళలో హిందూత్వ పోటీలో కాంగ్రెస్‌-బిజెపి పోటీ పడుతూ జనాన్ని మత ప్రాతిపదిక మీద చీల్చేందుకు దోహదం చేస్తున్నాయని, వామపక్షాలు లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాయని, రాజకీయాలకు-మత విశ్వాసాలను వేర్వేరుగా చూస్తాయని, విశ్వాసాలు వ్యక్తిగత అంశంగా పరిగణిస్తామన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి విలేకర్లతో చెప్పారు.వివాదాలతో సమస్యలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్‌-బిజెపి ప్రయత్నిస్తున్నాయని రెండూ కుమ్మక్కుతో వ్యవహరిస్తున్నాయని లేకుంటే తమకు 34 సీట్లు వస్తే చాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తామని బిజెపి ఎలా చెబుతుందని ప్రశ్నించారు. కేరళ నుంచి జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయటం పూర్తిగా రాజ్యంగ విరుద్దమని, రాజ్యసభలో తమ ప్రతినిధులను కలిగి ఉండటం రాష్ట్ర ప్రజల హక్కు అన్నారు. ఇలాంటి నిర్ణయాలను ఎన్నికల సంఘం ఏకాభిప్రాయంతో తీసుకోవాల్సి ఉండగా అలాంటిదేమీ లేదన్నారు.


బలంపై బిజెపి బడాయి- కాంగ్రెస్‌ పగటి కలలు !


అనేక రాష్ట్రాలలో అధికారానికి వచ్చిన మనం నేపాల్‌, శ్రీలంకల్లో కూడా విజయం సాధించాల్సి ఉందని కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్పినట్లు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ దేవ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. త్రిపుర నేతలతో మాట్లాడిన సమయంలో షా ఈ విషయం చెప్పారని అన్నారు. అమిత్‌ షాకు బెంగాలీ లేదా త్రిపుర బిజెపి నేతలకు హిందీ తెలియకపోవటం వలనగానీ ఇలా అర్ధం అయి ఇంకేముంది ఇరుగుపొరుగు దేశాల్లో కూడా మనం పాగా వేయబోతున్నామని కార్యకర్తలను ఉబ్బించేందుకు చెప్పి ఉంటారు. కానీ కేరళలో మెట్రోమాన్‌ శ్రీధరన్‌ అచ్చమైన మళయాళంలో మాట్లాడుతూ బిజెపి పూర్తి మెజారిటీ లేదా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో నిర్ణయించే నిర్ణయాత్మక స్ధాయిలో సీట్లు సంపాదించనున్నదని చెబుతున్నారు. కేరళలో బిజెపి ఎదగకపోవటానికి ఒక కారణం అక్కడ అక్షరాస్యత ఎక్కువగా ఉండటం అని ఆ పార్టీనేత ఓ రాజగోపాల్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఏం జరుగుతుందో చూద్దాం ! ఎనభై ఎనిమిది సంవత్సరాల వయస్సున్న పెద్దమనిషి గనుక ఏం మాట్లాడినా కేరళీయులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు.
పగటి కలలు కంటున్న వారిలో బిజెపి పెద్దలే కాదు కాంగ్రెస్‌ నేతలు కూడా తీసిపోలేదు. తమకు వందసీట్లకు పైగా వస్తాయని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ముందస్తు ఎన్నికల సర్వేలను తాను నమ్మనని అన్నారు. సర్వేలు చేసే సంస్దల వారు కాంగ్రెస్‌ కార్యాలయానికి కూడా వచ్చి తనను కలసి కావాలంటే సర్వే చేస్తామని చెప్పారు. నాకు నమ్మకం లేదు వద్దు అన్నాను అని రామచంద్రన్‌ చెప్పారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లతికా సుభాష్‌ పిసిసి కార్యాలయంలోనే గుండు చేయించుకున్న విషయం గురించి అడగ్గా అన్ని పార్టీల్లో అలాంటివి జరుగుతుంటాయి. ఆమె సిపిఎం కుట్రకు బలైంది అన్నారు.
మరోవైపున మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ తన ఆరోపణల పరంపరను కొనసాగిస్తూ ఏడు సీట్లలో బిజెపిని గెలిపించేందుకు సిపిఎం, దానికి ప్రతిగా తిరిగి అధికారం వచ్చే విధంగా బిజెపి సహకరించేట్లు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. ఓటమిని ఈ సాకుతో ముందే అంగీకరించారు. ఎన్నికల సిబ్బందిగా 95శాతం మందిని వామపక్ష ఉద్యోగ సంఘాలకు చెందిన వారినే రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు కె.సుధాకరన్‌ ఆరోపించారు. ఎవరిని ఎక్కడ నియమించిందీ ముందు రోజే పార్టీకి జాబితాలు అందుతాయని కూడా అన్నారు.క సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను సిపిఎం కార్యకర్తలు సమకూర్చుతారని ఆరోపించారు. సిపిఎంకు బలమైన కేంద్రాలుగా ఉన్నచోట కేవలం మహిళా సిబ్బందినే నియమిస్తారని, వారు ఎన్నికల అక్రమాలను ప్రతిఘటించలేరని సుధాకరన్‌ చెప్పుకున్నారు. ఎన్నికలను సిపిఎం అదుపు చేస్తున్నదని అందువలన స్వేచ్చగా ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు. చర్యలు తీసుకుంటామంటారే తప్ప ఎన్నికల కమిషనర్‌ అలా చేయటం లేదన్నారు.

కాంగ్రెస్‌ నేతకు మార్చి-మే నెలకు తేడా కూడా తెలియదన్న విజయన్‌ !

రేషన్‌ పంపిణీ గురించి ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితలకు మార్చి-మే నెలల మధ్య ఉన్న తేడా కూడా తెలియనట్లుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఎద్దేవాచేశారు.అధికారపక్షానికి ఓట్ల కోసం మేనెల రేషన్‌ కూడా ముందే ఇస్తున్నారని చెన్నితల ఫిర్యాదు చేశారు. పండుగల సందర్భంగా ఆలస్యమైన మార్చి, ఏప్రిల్‌ నెలల రేషన్‌ పంపిణీ చేస్తున్నాం తప్ప మే నెలది కాదని విజయన్‌ అన్నారు. ఏప్రిల్‌ 14న ఉన్న హిందూ పండగ విషు, గుడ్‌ ఫ్రైడే, రంజాన్‌ పండుగల సందర్భంగా ఆహార కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఎన్నికల తరువాతనే వాటిని పంపిణీ చేయాలని కాంగ్రెస్‌ కోరింది. అయితే దీని మీద ఆయా సామాజిక తరగతుల్లో వ్యతిరేకత వ్యక్తం కావటంతో తాము పంపిణీ నిలిపివేయాలని కోరలేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ చెప్పుకోవాల్సి వచ్చింది. బియ్యం పంపిణీపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించటంతో ఆ సమస్యపై హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలుపు, నీలి రంగు కార్డుల వారికి కిలో పదిహేను రూపాయల చొప్పున ప్రత్యేకంగా పదేసి కిలోల బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయం ఎన్నికల ప్రకటనకు ముందే జరిగిందని, బియ్యం రావటం ఆలస్యం కావటంతో పంపిణీ వాయిదా పడిందని ప్రభుత్వం చెబుతోంది. ఆహార కిట్లను పంపిణీ చేస్తున్నది కేంద్రం తప్ప రాష్ట్రం కాదని బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ అంటున్నారు. దొంగ ఓట్ల గురించి పదే పదే ఫిర్యాదులు చేసిన రమేష్‌ చెన్నితలకు పదే పదే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. స్వయంగా ఆయన తల్లికే రెండు చోట్ల ఓట్లు ఉన్న విషయాన్ని సిపిఎం కార్యకర్తలు బయట పెట్టారు. చిరునామా మార్పు గురించి దరఖాస్తు చేసినా ఎన్నికల సిబ్బంది మార్చలేదని చెన్నితల సంజాయిషీ చెప్పుకున్నారు. కజకోట్టమ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి డాక్టర్‌ లాల్‌కు కూడా రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని బయటపడింది. స్ధానిక సంస్దల ఎన్నికలలో కూడా సిపిఎం దొంగ ఓట్లతో గెలిచిందని, పోస్టల్‌ ఓట్లలో కూగా గోల్‌మాల్‌ జరుగుతోందని రమేష్‌ చెన్నితల కొత్త ఆరోపణ చేశారు. ఒకరికి ఒక చోట కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఉదంతాలలో ఒక చోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకొనే విధంగా చూడాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు కోరింది. దీంతో రమేష్‌ చెన్నితల ఆరోపణల పర్వానికి తెరపడింది.


గురువాయురూరప్ప సాక్షిగా ముస్లింలీగుకు బిజెపి ఓట్లు – ఆంటోని రంగంలోకి వస్తే బిజెపితో కుమ్మక్కే !


బిజెపి నేతలు కేరళ వచ్చినపుడల్లా గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇప్పుడు అక్కడ సిపిఎంకు వ్యతిరేకంగా ముస్లింలీగుకు, తెలిచేరిలో కాంగ్రెస్‌కు తన ఓట్లను బదలాయించేందుకు బిజెపి కుమ్మక్కు అయిందన్న విమర్శలు వచ్చాయి. కావాలనే బిజెపి తన అభ్యర్దులతో గురువాయూర్‌, తెలిచేరి నియోజకవర్గాలలో అసంపూర్ణంగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయించి తిరస్కరణకు గురయ్యేట్లు చేసిందని వార్తలు వచ్చాయి. దీన్ని బలపరుస్తూ ప్రముఖ నటుడు త్రిసూరులో బిజెపి అభ్యర్ధి సురేష్‌ గోపి ఈ రెండు చోట్లా యుడిఎఫ్‌ విజయం సాధించనున్నదని, వారికి ఓట్లు వేయాలని చెప్పారు. గురువాయూరులో యుడిఎఫ్‌లోని ముస్లింలీగు అభ్యర్ధి గెలవాలని, తెలిచేరిలో సిపిఎం అభ్యర్ధి ఓడిపోవాలని అన్నారు. అయితే బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్‌ అది సురేష్‌ గోపి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని పార్టీకేమీ సంబంధం లేదన్నారు. గోపి ప్రకటనతో ఇరుకున పడిన బిజెపి కేంద్ర మంత్రి మురళీధరన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఇలాంటి విషయాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన విషయాలనే పరిణనలోకి తీసుకోవాలన్నారు. ఇదేదో పొరపాటున నోరు జారిన వ్యవహారం కాదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. గురువాయూర్‌లో లీగ్‌ అభ్యర్ధి కెఎన్‌ఏ ఖాదర్‌ సిఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాన్ని బలపరిచారని, ఇప్పుడు బిజెపి ఓట్ల కోసం వేరే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి ఎకె ఆంటోని రంగంలోకి వచ్చారంటే కాంగ్రెస్‌-బిజెపి మధ్య కుమ్మక్కు ఒప్పందం ఉన్నట్లే అని విజయన్‌ అన్నారు. తనపై ఆంటోని ఆరోపణలు చేయటం సహజమని అందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం పాతిక సంవత్సరాల పాటు ఉంటుందని, సిపిఎం నాయకత్వం విజయన్‌తో ప్రారంభమై విజయన్‌తో అంతం అవుతుందని ఎకె ఆంటోని వ్యాఖ్యానించారు. ఈసారి గనుక అధికారానికి వస్తే ఆ పార్టీ అంతరిస్తుందని, తరువాత జనం కాంగ్రెస్‌కే ఓటు వేస్తారన్నారు. సిపిఎం రెండో సారి అధికారానికి రావటం ప్రమాదకరమని ఆంటోని చెప్పుకున్నారు.

మెట్రోమాన్‌కు శ్రీధరన్‌కు కోపం వచ్చింది !


నరేంద్రమోడీ ముందుగా ఏర్పాటు చేసుకున్న ఒప్పందం ప్రకారం సానుకూలమైన ప్రశ్నలు వేసే జర్నలిస్టులకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేక ప్రధానిగా ఇంతవరకు ఒక్క పత్రికా గోష్టి కూడా పెట్టని విషయం తెలిసిందే. కేరళలోని పాలక్కాడ్‌ నిజయోజకవర్గంలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మెట్రోమాన్‌ శ్రీధరన్‌కు విలేకరి ప్రశ్నలు కోపం తెప్పించి మధ్యలోనే వెళ్లిపోయారు. న్యూస్‌ లాండ్రి ( వార్తల ఉతుకుడు ) అనే ఆంగ్లవెబ్‌సైట్‌ విలేకరి గొడ్డుమాంస నిషేధం, లవ్‌జీహాద్‌ల మీద అభిప్రాయం ఏమిటని కోరగా అవన్నీ తుచ్చమైన అంశాలు వాటి గురించి నేను మాట్లాడను అన్నారు. బిజెపి దక్షిణాది-ఉత్తరాది నేతలు భిన్నంగా మాట్లాడుతున్నారు గనుక మీ అభిప్రాయం ఏమిటని మరోసారి అడగ్గా వాటి మీద స్పందించేంత అర్హత నాకు లేదన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌పై ఉన్న కేసుల గురించి అడగ్గా దొంగబంగారం కేసులతో వాటిని పోల్చరాదన్నారు.లవ్‌జీహాద్‌ మీద చట్టం తీసుకు వస్తామని బిజెపి చెప్పిన విషయం గురించి చెప్పండి అని అడగ్గా తీసుకురాకపోతే మరో సిరియా అవుతుంది, అయినా మీరు అన్నీ ప్రతికూల ప్రశ్నలు, అడిగినవే అడుగుతున్నారు, ప్రతివారినీ అడుగుతున్నారు అని విసుకున్నారు. జర్నలిస్టుగా ప్రశ్నలు అడగటం నా పని అని విలేకరి చెబుతుండగా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పను అంటూ లేచి వెళ్లిపోయారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపికి తీవ్ర ఆశాభంగం కలిగించిన అయ్యప్ప !

12 Friday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Kerala elections 2021, #Pinarayi Vijayan, Ayyappa-Pandalam palace, BJP-Kerala, Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


బంగారం దొంగరవాణా వ్యవహారంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, ఒక సీనియర్‌ నేత కుమారుడికీ సంబంధం ఉందని చెప్పవలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు తనమీద వత్తిడి తెచ్చినట్లు ఆ కేసులో నిందితుడిగా ఉన్న సందీప్‌ నాయర్‌ ఎర్నాకుళం జిల్లా జడ్జికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మూడు పేజీల ఆ లేఖ శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చింది. తాము చెప్పినట్లుగా మారి అప్రూవర్‌గా మారితే బెయిలుతో సహా ఇతరంగా అన్ని రకాలుగా సాయం చేస్తామని అధికారులు ప్రలోభపెట్టినట్లు దానిలో సందీప్‌ పేర్కొన్నాడు. దర్యాప్తు అధికారి రాధాకృష్ణన్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా పేర్కొన్నాడు. ఇదే విధంగా డాలర్ల కుంభకోణంలో కూడా స్వప్నా సురేష్‌ను బెదిరించి ముఖ్యమంత్రి, స్పీకర్‌,ఇతరుల మీద తప్పుడు ప్రకటనలు చేయించటమేగాక వాటిని కస్టమ్స్‌ శాఖ కోర్టులో అఫిడవిట్‌గా ఇచ్చి ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రచార అస్త్రంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

అభ్యర్ధులెవరో తేల్చని కాంగ్రెస్‌- ప్రచారంలో దూసుకుపోతున్నసిపిఎం

సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది.కాంగ్రెస్‌ జాబితాను ఆదివారం నాడు వెల్లడించనున్నట్లు వార్తలు వచ్చాయి. బిజెపి తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. ఏవో అద్భుతాలు జరిగి తిరిగి అధికారానికి వస్తామనుకుంటున్న కాంగ్రెస్‌లో ముఠాకుమ్ములాటలంటే అర్ధం చేసుకోవచ్చు, ఉన్న ఒక్క సీటు కూడా వస్తుందో తెలియని బిజెపిలో కూడా కుమ్ములాటల కారణంగా జాబితాలను ప్రకటించలేకపోయారు. రాష్ట్ర అసెంబ్లీలోని 140 స్ధానాలలో తమకు 35వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ తమ మనుషులు కాంగ్రెస్‌లో ఉన్నారని బిజెపి చెబుతున్నదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారానికి 71 స్ధానాలు కావాల్సి ఉండగా తమకు 35 వస్తే చాలని బిజెపి చెబుతున్నదంటే కాంగ్రెస్‌లో తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లుగా అనుకుంటున్నదని ఎద్దేవా చేశారు. అందువలన కాంగ్రెస్‌లోని బిజెపి వారికి ఓటు వేసి మోసం పోవటం ఎందుకని ఆ పార్టీ మద్దతుదారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారని విజయన్‌ చెప్పారు. ఈనెల 15న విజయన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
ఎనభై ఐదు స్ధానాలకు పోటీ చేస్తున్న సిపిఎం 23 మంది వెనుకబడిన తరగతుల వారికి సీట్లిచ్చిందని, వారిలో 20 మంది ఎజవా సామాజిక తరగతికి చెందిన వారే ఉన్నారని కేరళ కౌముది పత్రిక రాసింది. గత ఎన్నికలలో 92చోట్ల పోటీ చేసిన పార్టీ ఈ సారి తక్కువ చోట్ల బరిలో ఉన్నప్పటికీ వెనుకబడిన తరుగతులకు గతంలో మాదిరే సీట్లు ఇచ్చిందని పేర్కొన్నది.

ఎన్నికల్లో పోటీకి రాజకుటుంబీకుల తిరస్కరణ-బిజెపికి ఆశాభంగం !

శబరిమల అయ్యప్ప స్వామి బిజెపికి ఆశాభంగం మిగిల్చారు. ఆలయ నిర్మాణం చేసిన పండలం రాజకుటుంబీకుల వారసులను ఎన్నికల్లో నిలిపి దాన్ని ఎన్నికల అంశంగా చేసి లబ్దిపొందాలని చూసిన బిజెపికి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. రాజకుటుంబీకులు తమ పార్టీ తరఫున పోటీ చేయాలని లేదా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలన్న ప్రతిపాదనలను రాజకుటుంబం తిరస్కరించినట్లు కేరళ పత్రికలు రాశాయి. అయ్యప్ప విషయంలో రాజకీయాలకు తావులేదని, తాము పోటీ చేయాలనుకోవటం లేదని రాజప్రతినిధులు చెప్పారని పేర్కొన్నాయి. శబరిమల వివాద సమయంలో జరిగిన కొన్ని ఉదంతాలు జరిగి ఉండాల్సింది కాదని, తాను విచారపడుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ (సిపిఐ) చేసిన ప్రకటన మీద ప్రతిపక్షాలు రాద్దాంతం చేయాల్సిందేమీ లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్‌ రామచంద్రన్‌ పిళ్లే, ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఏ విజయరాఘవన్‌ చెప్పారు. మంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ బిజెపి, కాంగ్రెస్‌, నాయర్‌ సర్వీసు సొసైటీ పండలం రాచకుటుంబం ధ్వజమెత్తాయి. మంత్రి దాదాపు క్షమాపణ చెప్పారంటూ మీడియా వర్ణించింది. శబరిమల వివాదం సుప్రీం కోర్టులో ఉన్నదని దాని నిర్ణయం వెలువడిన తరువాత అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, విమర్శించదలచుకున్న వారికి స్వేచ్చ ఉన్నదని రామచంద్రన్‌ పిళ్లే వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ అభ్యర్దుల ప్రకటనలో మల్లగుల్లాలు పడుతుండగా దాని భాగస్వామ్య పక్షమైన ముస్లింలీగ్‌ తాను పోటీ చేయనున్న 27కుగాను 25 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. పాతికేండ్ల తరువాత మొదటిసారిగా ఒక మహిళా అభ్యర్ధిని పోటీకి నిలిపింది. ఆర్ధిక లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన ఇద్దరు ఎంఎల్‌ఏలను పక్కన పెట్టి ఒక చోట ఒకరి కుమారుడికి సీటు ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 24 చోట్ల పోటీ చేసింది.

నీమమ్‌లో కాంగ్రెస్‌-బిజెపిలకు విషమ పరీక్ష !

రాజధాని తిరువనంతపురంలోని నీమమ్‌ స్ధానాన్ని మరోసారి గెలుచుకోవాలని బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు. 2019లోక్‌ సభ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ పరిధిలో బిజెపికి 12వేల ఓట్ల ఆధిక్యత వచ్చింది. గతేడాది చివరిలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో అది రెండువేలకు పడిపోయింది. అయితే అక్కడ బలమైన అభ్యర్దిని నిలిపి బిజెపితో తమకు లోపాయికారీ ఒప్పందం లేదని, ఆ పార్టీని నిఖరంగా ఎదిరిస్తున్నది తామే అని రాష్ట్ర ఓటర్ల ముందు కనిపించేందుకు కాంగ్రెస్‌ నానా తంటాలు పడుతున్నది. అభ్యర్దుల ఎంపిక కసరత్తు ఢిల్లీలోని కేరళ హౌస్‌కు మార్చారు. రెండు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ లేదా ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితల లేదా మరొక ముఖ్యనేత పోటీ చేస్తారనే లీకులను మీడియాకు వదిలారు. తిరువనంతపురం ఎంపీ శశిధరూర్‌ పోటీ చేయాలని రాహుల్‌ గాంధీ కోరినట్లుగా మరొక లీకు వార్త షికార్లు చేసింది. ధరూర్‌ గెలిస్తే అది జాతీయ స్ధాయిలో ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బిజెపితో కుదిరిన లోపాయికారీ ఒప్పందంలో భాగంగా తమ మిత్రపక్షమైన బలహీన జెడియుకు ఆ స్ధానాన్ని కేటాయించి తన ఓట్లన్నింటినీ బిజెపి అభ్యర్ధి ఓ రాజగోపాల్‌కు బదలాయించి గెలిపించింది. గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన కె.కరుణాకరన్‌ ఆ స్దానానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి రాజగోపాల్‌ పోటీ నుంచి తప్పుకోవటం, బిజెపితో తమకు ఎలాంటి ఒప్పందం లేదని నిరూపించుకొనేందుకు అక్కడ తమ అభ్యర్దిని నిలిపాలని నిర్ణయించింది.” నీమమ్‌ స్ధానం తమ గుజరాత్‌ అని బిజెపి అనుకుంటున్నది. తొందరెందుకు అది గుజరాత్‌ అవునో కాదో తేలుతుంది, అక్కడ బలమైన అభ్యర్ధిని నిలపాలని ఆలోచిస్తున్నామని” రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ చెప్పారు. నీమమ్‌లో పోటీ చేసేందుకు తనకు అభ్యంతరం లేదని పోటీలోకి దిగితే అక్కడికే పరిమితం కావాల్సి ఉంటుంది, రాష్ట్రంలో ఇతర చోట్ల ప్రచారం అవకాశం ఉండదు మీ ఇష్టం అన్నట్లుగా తన అసమ్మతిని తెలిపినట్లు తెలిసింది. తనను దెబ్బతీసినప్పటికీ తన షరతులను అంగీకరిస్తే పోటీ చేసేందుకు సిద్దమే అని ఊమెన్‌ చాందీ చెప్పారని, తనను గాకుండా వేరే వారిని చూడాలని శశిధరూర్‌ తప్పించుకున్నారని పుకార్లు షికార్లు చేశాయి. రమేష్‌ చెన్నితల ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారని తనకు మరొక అవకాశం ఇవ్వాలని, ఒక వేళ అది జరగకపోతే హౌంమంత్రి పదవిని తాను సూచించిన వారికి ఇవ్వటంతో పాటు కొన్ని స్ధానాల అభ్యర్దుల ఎంపిక తనకే వదలాలని చాందీ షరతులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తాను కోరిన విధంగా తన అనుచరులకు సీట్లు కేటాయించకపోతే నీమమ్‌తో సహా తాను ఎక్కడా పోటీ చేయనని మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ అధిష్టానికి హెచ్చరిక చేశారంటే ముఠాల పెత్తనం ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. ముఠాల నేతలు తమకు అనుకూలమైన, ప్రత్యర్ధులను ఇరుకున పెట్టే కధనాలను మీడియాకు లీకులుగా వదిలారు. దీంతో నీమమ్‌ స్దాన అభ్యర్దిని మీడియా పదే పదే మార్చింది.

అమిత్‌ షా పోటీ చేసినా నీమమ్‌లో ఎల్‌డిఎఫ్‌ విజయం ఖాయం : సిపిఎం

ప్రతిష్టాత్మక స్ధానాల్లో ఒకటిగా మారిన నీమమ్‌ నియోజకవర్గంలో అమిత్‌ షా పోటీ చేసినా అక్కడ ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్ది శివన్‌ కుట్టి విజయం ఖాయమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. మాజీ ఎంఎల్‌ఏ శివన్‌కుట్టి అభ్యర్ధిగా ఉన్నందున తాను అక్కడ పోటీ చేయనని ఊమెన్‌ చాందీ, రమేష్‌ చెన్నితల కూడా కేంద్ర పార్టీనేతలకు చెప్పారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ మద్దతుతో బిజెపి గెలిచిందని ఈసారి ఓడిపోవటం, బిజెపి లేని అసెంబ్లీ ఖాయమని చెప్పారు.
కేరళలో ఈ సారి బిజెపి అధికారంలోకి రానున్నదని ముఖ్యమంత్రి పదవికి తాను సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించిన మెట్రో మాన్‌ ఇ శ్రీధరన్‌ చెప్పారు. తన ఎన్నికల ప్రచారంలో అభివృద్ది గురించి మాట్లాడతాను తప్ప వివాదాల జోలికి పోనన్నారు. గతంలో గెలిచిన నీమమ్‌ కాకుండా తొమ్మిది స్ధానాలను బిజెపి ఏ క్లాస్‌గా గుర్తించింది. వాటిలో ఎవరిని పోటీలోకి దించాలన్నది అధిష్టాన నిర్ణయానికి వదలివేసినట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో అసమ్మతినేతగా పేరుమోసిన శోభా సురేంద్రన్‌ పేరును అసలు సిఫార్సు చేసిన జాబితాలోనే లేదని చెబుతున్నారు.
మిగతా పార్టీలు. ఇతర అంశాల విషయానికి వస్తే కొత్తగా ఎల్‌డిఎఫ్‌ వైపు వచ్చిన కేరళ కాంగ్రెస్‌కు సీట్ల సర్దుబాటులో భాగంగా సిపిఎం ఆరు స్ధానాలను వదులుకోవాల్సి వచ్చింది. ఈ సారి పార్టీ నిబంధనలకు అనుగుణ్యంగా సీనియర్‌ ఎంఎల్‌ఏలకు బదులు 38 చోట్ల కొత్త వారిని ఎంపిక చేశారు. దీంతో కొన్ని చోట్ల సిపిఎం కార్యకర్తలు అసమ్మతిని వెల్లడించినట్లు, ప్రదర్శనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. సమస్యల గురించి కార్యకర్తలు, అభిమానులకు వివరించి సర్దుబాటు చేస్తామని సిపిఎం స్ధానిక నేతలు ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో సిపిఎం పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్న ఒక మహిళ ఎల్‌డిఎఫ్‌లోని కేరళ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటన వెలువడగానే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్లు స్ధానిక కమిటీ ప్రకటించింది. గతంలో ఆమె స్వతంత్ర అభ్యర్ధిగా సిపిఎం మద్దతుతో పోటీ చేశారు. మరొక పంచాయతీ అధ్యక్షుడు తనను అభ్యర్దిగా పరిగణనలోకి తీసుకోనందుకు నిరసనగా బిజెపి మిత్రపక్ష అభ్యర్దిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. కొన్ని చోట్ల సిపిఎంను కాపాడండి అనేపేరుతో ప్రత్యర్ధులు పోస్టర్లు వేసి పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. గతంలో కూడా కొన్ని చోట్ల అసంతృప్తి తలెత్తినప్పటికీ అది ఎల్‌డిఎఫ్‌ విజయానికి హాని కలిగించలేదు. తలెత్తిన అసమ్మతిని తొలగింప చేసి మిత్రపక్షాల అభ్యర్ధులకు ఎలాంటి హాని కలగకుండా చూసేందుకు పార్టీ పూనుకుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళామే హమ్‌ దేఖేంగే !

06 Saturday Mar 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Kerala elections 2021, BJP-Kerala, CPI(M), Kerala Assembly Elections 2021, Kerala LDF, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఇల్లలకగానే పండగ కాదు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా ! హాం ఫట్‌ అంటే బంగాళాఖాతం కేరళపక్కకు వస్తుందా ? కస్టమ్స్‌ శాఖ దాఖలు చేసిన తప్పుడు అఫిడవిట్లు కేరళ సిపిఎంను దెబ్బతీస్తాయా ? యుఏయి నుంచి దౌత్య సంచిలో వచ్చిన దొంగబంగారం కేసులో అరెస్టయి జైల్లో ఉన్నవారిలో స్వప్న సురేష్‌ ప్రధాన నిందితురాలు. లక్షా 90వేల డాలర్ల( కోటీ ముప్పయి లక్షల రూపాయలకు సమానం)ను అక్రమంగా తరలించటంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, అసెంబ్లీ స్పీకర్‌ పి శ్రీరామకృష్ణన్‌ మరికొందరు మంత్రులు, ఇతరులకు సంబంధం ఉందని ఆమె చెప్పిందంటూ ఆ విషయాలను కస్టమ్స్‌ శాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఇంకేముంది దున్నఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా ముఖ్యమంత్రి విజయన్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ శనివారం నాడు రాష్ట్ర వ్యాపితంగా ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఎన్నికలలో దెబ్బతీసేందుకు జరిపిన కుట్రలో భాగంగా కస్టమ్స్‌ శాఖ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేయటాన్ని నిరసిస్తూ కస్టమ్స్‌ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని సిపిఎం, ఇతర పక్షాలు పిలుపునిచ్చాయి. స్ధానిక సంస్దల ఎన్నికలను అవకాశంగా తీసుకొని కాంగ్రెస్‌, బిజెపి వాటితో జతకలసిన మీడియా పెద్దలు పెద్ద ఎత్తున దొంగ బంగారం, ఇతర కేసులు, ఆరోపణలతో సిపిఎంను దెబ్బతీసేందుకు చేసిన తప్పుడు ప్రచారాన్ని అక్కడి జనం పట్టించుకోలేదు. ఎల్‌డిఎఫ్‌ పక్షాలను గెలిపించారు.


మరోసారి అధికారానికి వచ్చి ఎల్‌డిఎఫ్‌ చరిత్ర సృష్టించనుందంటూ స్ధానిక సంస్ధల ఎన్నికలలో వచ్చిన ఓట్ల తీరు తెన్నులు, ఎన్నికల ముందు సర్వేలు వెల్లడించటంతో కేంద్రంలోని బిజెపి పెద్దలకు బుర్ర ఖరాబై (సామాన్యుల భాషలో మైండ్‌ దొబ్బి) కస్టమ్స్‌ శాఖ ద్వారా ఇలాంటి చౌకబారు చర్యలకు పాల్పడిందని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గం వర్ణించింది. కేంద్ర సంస్దలు బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు కావటం తప్ప దీనిలో పసలేదని పేర్కొన్నది. నిజానికి ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అని విమర్శించింది.ఈ అంశం మీద యుడిఎఫ్‌, బిజెపి ముందుకు తెచ్చిన సవాలును తగిన విధంగా ఎదుర్కొంటామని, స్ధానిక సంస్దల ఎన్నికలలో వారి దిగజారుడు యత్నాలను జనం వమ్ము చేశారంటూ, చౌకబారు వ్యవహారాలకు పాల్పడే వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అదేమంటే ఇది కేరళ అని సిపిఎం పేర్కొన్నది.


నిజానికి స్వప్ప సురేష్‌ చెప్పింది అంటూ కస్టమ్స్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు కొద్ది నెలలుగా కేరళలో తిరుగుతున్నవే.ఒక మెజిస్ట్రేట్‌ ముందు నిందితురాలు ఒక ముఖ్యవిషయం వెల్లడించిందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమైంది. ఇప్పుడు వాటినే రాజకీయ అవసరాల కోసం అఫిడవిట్‌ రూపంలో సమర్పించి సంచలనాత్మక అంశంగా మార్చారు. ఇంకేముంది దీంతో సిపిఎం ఢమాల్‌ అన్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు. ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

బిజెపి కూడా సిగ్గుపడిన అంశాన్ని కాంగ్రెస్‌ చెబుతోంది !

కరోనా మహమ్మారి సమయంలో వామపక్ష సంఘటన సర్కార్‌ పౌరులను ఆదుకున్న తీరును జనం మెచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఆహార కిట్‌ ఎంతగానో ఆదరణ పొందింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్ప రాష్ట్రం చేసిందేమిటని కన్నూరు కాంగ్రెస్‌ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు కె సురేంద్రన్‌ తాజాగా ఆరోపించారు. గతేడాది నవంబరు నెలవరకు కేంద్ర ప్రభుత్వం నెలకు ఐదు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు కరోనా సమయంలో ఇచ్చింది. కేరళ ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్‌లో 17రకాల వస్తువులు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. దాన్ని మరో ఐదు నెలల వరకు అంటే మే నెల వరకు పొడిగించింది. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన సరకులను రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి కొనుగోలు చేసిన సంచులలో నింపి జనానికి ఇచ్చిందని, సంచుల కొనుగోలులో కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తే అవే సరకులను తమ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఎందుకు పంపిణీ చేయలేదో సురేంద్రన్‌ చెప్పి ఉంటే అసలు బండారం బయటపడేది. తమ కేంద్ర పభుత్వం ఇచ్చిన సరకులను విజయన్‌ సర్కార్‌ పంపిణీ చేసిందని స్దానిక ఎన్నికల ప్రచారంలో చెప్పుకొనేందుకు బిజెపి కూడా సిగ్గుపడి నోరుమూసుకుంది. అలాంటిది కాంగ్రెస్‌ ఎంపీ నోట వెలువడింది. ఇలాంటి నోటి ముత్యాలు ఏం చేస్తాయో ,ఏప్రిల్‌ ఆరున కేరళలో ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

కాంగ్రెస్‌ ఓడిపోబోతోంది అంటున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు !


ఆహార కిట్‌లో సరకులు కేంద్రమే ఇచ్చిందన్న కాంగ్రెస్‌ ఎంపీ సుధాకరన్‌ మరో మాట కూడా చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోనుందని, బలమైన కాంగ్రెస్‌ వర్గం బిజెపిలో చేరనుందని కూడా చెప్పినట్టు కేరళ కౌముది పత్రిక పేర్కొన్నది. ఈ పెద్దమనిషే బిజెపిలో చేరనున్నారంటూ కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో గనుక అధికారానికి రానట్లయితే కేరళలో కాంగ్రెస్‌ చరిత్రలో కలసినట్లే అని కాసరగోడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ రాజమోహన్‌ ఉన్నితన్‌ చెప్పారు. పార్టీలో ముఠాలు పెద్ద శాపంగా ఉన్నాయని వాటిని అదుపు చేయనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదన్నారు. పార్టీ కంటే కేరళలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ముఠాలనే ఎక్కువగా ప్రేమిస్తారు. అది పార్టీ వైఫల్యం. ఈ ఎన్నికల్లో దానిలో మార్పు వస్తుందనుకుంటున్నా , లేనట్లయితే అధికారానికి వచ్చే అవకాశం లేదు. అసెంబ్లీ నామినేషన్ల సమయంలోనే కుట్రలు జరుగుతాయి అన్నారు.


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌కు రాష్ట్రం గురించి తెలియదని, అది కాంగ్రెస్‌ పార్టీకి బలహీనత అని మాజీ మంత్రి వయలార్‌ రవి ఆసియా నెట్‌ ఛానల్‌తో చెప్పారు. వ్యక్తిగతంగా కె సుధాకరన్‌(కన్నూరు ఎంపీ) ఉండాలని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. పార్టీలో ఇప్పటికీ ముఠాతత్వం ఉందని, అందువల్లనే వాటి ప్రాతిపదికన గాక పార్టీ ప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక జరగాలన్నారు. ముళ్లపల్లి రామచంద్రన్‌ కూడా కన్నూరుకు చెందిన నాయకుడే అయినప్పటికీ కేరళలో తిరిగిన అనుభవం లేదని, తనకు, ఎకె ఆంటోని, ఊమెన్‌ చాందీకి మాత్రమే కన్నూరుకు రైళ్లలో తిరిగిన అనుభవం ఉందన్నారు. ఇక్కడ ఉన్నవారందరూ, రాజకీయాలు కూడా తెలుసు, ముళ్లపల్లిని ఢిల్లీలో నేతను చేశారు, ఇది పార్టీకి ఎంతో చెడు, ఊమెన్‌ చాందీని నాయకత్వ స్దాయికి తీసుకురావటం ఎంతో ప్రాధాన్యత కలిగిందని వయలార్‌ రవి చెప్పారు.

ఉన్న ఒక్కటీ దక్కుతుందో లేదో…. కేరళలో బిజెపి సిఎం అభ్యర్ధి ప్రహసనం !


కేరళలో బిజెపికి ఉన్నది ఒకే ఒక అసెంబ్లీ స్ధానం. దాని ప్రతినిధి ఓ రాజగోపాల్‌. వివిధ కారణాలతో గత అసెంబ్లీ ఎన్నికలలో నీమమ్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. రాజగోపాల్‌ను గెలిపించేందుకు అక్కడ కాంగ్రెస్‌ బలహీన అభ్యర్ధిని నిలిపిందన్నది బహిరంగ రహస్యం. ఈ సారి ఆయన పోటీ చేయటం లేదని ఇప్పటికే ప్రకటించారు. ఎవరు పోటీ చేస్తారో, ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. ఆ స్ధానంలో పోటీ చేసి గెలవాలని అనేక మంది తాపత్రయ పడుతున్నారు. సినిమా స్టార్లు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారుల్లో ఒకరైన శ్రీధరన్‌ లాంటి వారిని బిజెపి తన టూల్‌కిట్‌లో అలంకార వస్తువులుగా, ఎన్నికల సమయంలో ప్రచారానికి, ఫొటోలకు మాత్రమే ఉపయోగించుకోవటం తెలిసిందే. టూరిస్టు పాకేజి ముసిగిన తరువాత ఎక్కడా కనపడరు. అలాంటి వారిలో ఒకరిగా భావించిన మెట్రోమాన్‌ 88 సంవత్సరాల ఇ శ్రీధరన్‌ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి సిద్దంగా ఉన్నానని, ఎన్నికల్లో పోటీ చేస్తే బిజెపికి గతంలో వచ్చిన వాటికంటే రెట్టింపు ఓట్లు వస్తాయని, పోటీ చేస్తానని ప్రకటించారు. రెండు సార్లు దేశంలో బిజెపిని వరుసగా అధికారానికి తెచ్చిన నరేంద్రమోడీకే కేరళ కొరకరాని కొయ్యగా ఉంది. అలాంటి స్దితిలో రెట్టింపు ఓట్ల వస్తాయని చెప్పటం పరోక్షంగా నరేంద్రమోడీ పలుకుబడిని కించపరచటమే. నాలుగు ఓట్లు వస్తాయి కదా అని శ్రీధరన్‌కు కాషాయ కండువా కప్పారు.


కేరళ ఓటర్లను మరీ అంత అమాయకులుగా భావించారో లేక ఆత్రత వారిని అలా ముందుకు తోసిందో లేక ఇతరంగా ఏ నేతను ముందుకు తెస్తే ఏమిసమస్యలు వస్తాయో తెలియదుగానీ శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ ప్రకటించారు. వెంటనే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వి. మురళీ ధరన్‌ కూడా నిర్ధారించారు.అసెంబ్లీ ఎన్నికలకు స్ధానిక సంస్ధల ఫలితాలకు సంబంధం లేదని, ఎన్నికల ముందు వెలువడే సర్వేలను తాము విశ్వసించబోమని, ఈ సారి తమకు ఎక్కువ స్ధానాలు వస్తాయని కేంద్ర మంత్రి మురళీధరన్‌ చెబుతున్నారు. అధికారానికి వస్తామని కలలు కంటున్న చోటే సిఎం అభ్యర్ధిని ప్రకటించే స్ధితిలో లేని బిజెపి ప్రకటన కేరళ, దేశ వ్యాపితంగా నవ్వులు పండించింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం కేంద్ర నాయకత్వం ఇదేమి పిచ్చి ప్రకటన అంటూ రాష్ట్ర నాయకులకు బుద్దిశుద్ది చేయటంతో కొద్ది గంటల్లోనే అబ్బే మీడియాలో వార్తలను చూసి నిజమే అనుకున్నా తప్ప నిజం కాదు అని కేంద్ర మంత్రి తన మాటలను తానే దిగమింగారు. సురేంద్రన్‌ కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ జారుకున్నారు. ఈలోగా శ్రధరన్‌ తానే కాబోయే ముఖ్యమంత్రిని అని తెగ ఫీలయిపోయి రైల్వే సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన పరువు కాపాడుకొనేందుకు ఒక ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కానని, అయితే ఎన్నికల్లో ప్రచార బాధ్యత నిర్వహిస్తానని అన్నారు. ఆ పార్టీలో ఇంకే పరిణామాలు వస్తాయో, ఏప్రిల్‌ ఆరున ఎన్నికల్లో కేరళలో బిజెపికి ఏం జరగనుందో (హమ్‌ దేఖేంగే )మనమూ చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d