• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Fuel prices freezing

చమురు ధరలపై మాటతప్పటం, మడమ తిప్పటానికి నిలువెత్తు నిదర్శనం నరేంద్రమోడీ ! సనాతనం సంగతి తరువాత పవన్‌ కల్యాణ్‌ ముందు జనం సంగతి చూస్తారా ?

04 Friday Oct 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, fuel politics, Fuel prices freezing, Narendra Modi Failures, Pawan kalyan, Sanatana, Tirupati Laddu Controversy


ఎం కోటేశ్వరరావు


పశ్చిమాసియాలో తలెత్తిన తాజా పరిస్థితి కారణంగా ముడి చమురు ధరలు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. బ్రెంట్‌ రకం ముడి చమురు ధర అక్టోబరు ఒకటి నాలుగువ తేదీన ఈ విశ్లేషణ రాస్తున్న సమయానికి 70.40 నుంచి 78.66 డాలర్లకు పెరిగింది. ఒక్క మనమీదే కాదు, చమురు దిగుమతి చేసుకొనే అందరి పరిస్థితి అదే. అయితే పెరుగుదల లేకపోగా తగ్గినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా మన జేబులను కొల్లగొడుతున్నది.ఎదుటి వారి జేబులో పర్సు కొట్టేసినపుడు దాన్లో ఎంత డబ్బు ఉంది అని అడుగుతాం, కానీ 912 రోజులుగా ప్రతి రోజూ పెట్రోలు బంకులో కొల్లగొడుతుంటే ఎంత అని ఎవరూ పట్టించుకోవటం లేదు. అఫ్‌ కోర్స్‌ అది కష్టపడిన సొమ్ము కాదనుకుంటే వదిలేద్దాం ! నరేంద్రమోడీని వ్యతిరేకించేవారికి అలా కావాల్సిందే అని ఎవరైనా అంటే సరే, దేశంకోసంధర్మం కోసం అంటూ మోడీని కొలిచేవారికి, ఆరాధించేవారికి కూడా ఎలాంటి మినహాయింపులు లేకుండా క్షవరం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం రష్యా నుంచి మనం చమురు దిగుమతుల కారణంగా 202223 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి 2,500 కోట్ల డాలర్లు (తాజా రూపాయి మారకపు విలువలో చూస్తే రెండు లక్షల కోట్ల మేరకు) కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు తగ్గింది. పోనీ ఈ మేరకు వినియోగదారులకు ఒక్క పైసా అయినా మోడీ తగ్గించారా ? 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఈ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన మేరకు సవరించకుండా కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అంటూ అంతకు ముందు ప్రతిరోజూ సవరించిన ధరల విధానాన్ని ఎందుకు పక్కన పెట్టారో జవాబుదారీ తనం గురించి తమ భుజాలను తామే చరచుకొనే పెద్దలు ఎవరైనా చెబుతారా ? మోడీ అలాంటి పెద్దలను, గద్దలను పక్కన పెడదాం, అసలు జనంలో ప్రశ్నించే గుణం ఎందుకు అంతరించినట్లు ? ఆక్రమిత కాశ్మీరులో పాక్‌ ప్రభుత్వం భారాలు పెంచితే వాటిని భరించలేక అక్కడి జనం మనదేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నట్లు వస్తున్న వీడియోలను చూపి కొందరు వీరంగం వేస్తుంటారు. ఇక్కడి జనం మీద మోడీ మోపుతున్న భారాలను తప్పించుకొనేందుకు ఎక్కడికి పోవాలి ? పాకిస్తాన్‌ సుత్తి ఇనుపదైనా భారత్‌ది బంగారపుదైనా తల పగులుతుంది.


పశ్చిమ దేశాల ఆంక్షలను పక్కకు నెట్టి రష్యా నుంచి చమురు కొనుగోలు ద్వారా కలుగుతున్న ఆర్థిక లబ్ది పూర్తిగా జనానికి దక్కుతున్నదా ? లేదు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు మన అవసరాల్లో కేవలం రెండు శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే ఇప్పుడు 40శాతం దాటింది. ఈ మొత్తాన్ని ఎవరు దిగుమతి చేసుకుంటున్నారు. ఉదాహరణకు 2024ఏప్రిల్‌ నెలలో మూడు ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు పదిన్నరలక్షల పీపాలు దిగుమతి చేసుకుంటే అంబానీ రిలయన్స్‌, నయారా అనే మరో ప్రైవేటు సంస్థ ఎనిమిది లక్షల పీపాలు దిగుమతి చేసుకున్నాయి. ఈ దామాషా ప్రతి నెలా స్వల్పంగా మారుతున్నది. దీని అర్ధం ఏమిటి ? ప్రభుత్వ రంగ సంస్థలు దిగుమతి చేసుకుంటే ఆ రాయితీ సొమ్ము జనానికి దక్కుతుంది, ప్రైవేటు వారిని అనుమతిస్తే వారి జేబుల్లోకి పోతుంది. నరేంద్రమోడీ అనుసరిస్తున్న విధానం ఇప్పుడు జనం కంటే అంబానీ, నయారా కంపెనీలకు లబ్ది చేకూర్చటమే ప్రధాన కర్తవ్యంగా ఉంది. రవాణా ఖర్చుతో సహా రష్యా నుంచి మనదేశం చేరటానికి ఒక పీపా ధర 2024లో 76.39 డాలర్లు కాగా, ఇతర దేశాల చమురు ధర 85.32 డాలర్లు ఉంది.(ఇండియన్‌ బాస్కెట్‌ రష్యన్‌ క్రూడ్‌ ఆయిల్‌ ప్రైస్‌ అని గూగుల్‌ తల్లిని అడిగితే బిడ్డా కృత్రిమ మేధ వీక్షణం ఇలా ఉంది అంటూ ఆంగ్లంలో సమాచారం అందిస్తుంది. వినిపిస్తుంది, అడిగిన సమయాన్ని బట్టి ధరలు మారుతుంటాయి). ప్రైవేటు కంపెనీలు ఇలా తక్కువ ధరకు కొని ఏం చేస్తున్నాయంటే శుద్ధి చేసి డీజిల్‌, పెట్రోల్‌ ఇతర ఉత్పత్తులను పోటీ ధరలకు ఐరోపా దేశాలకు ఎగుమతులు చేసి అక్కడా లాభాలు పిండుతున్నాయి. ఈ విషయాలేవీ మన్‌కి బాత్‌లోనో ఎన్నికల ప్రచారంలోనో మోడీ మనకు చెప్పరు, గోడీ మీడియా ఇలాంటి వాటి మీద చర్చ పెట్టదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదుల్చుతున్నారు. ఇది గోడదెబ్బ అనుకుంటే చెంపదెబ్బ ఎలా కాడుతున్నారో తెలుసా ? మోడీ అధికారానికి వచ్చిన 201415 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ (పిపిఏసి) సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 202021 నాటికి సెస్‌ల పేరుతో రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 202324 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచుతామంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 201415లో ప్రభుత్వప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 202324నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇలాంటి పాలనతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు.


ప్రారంభంలోనే చెప్పుకున్నట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఒకటి రెండు సార్లు తప్పితే రోజువారీ ధరలను సవరించటం నిలిపివేశారు. మోడీ మీద ఎంత మోజున్నా ఇలా చావబాదుతుంటే భరించటం ఏమిటో అర్ధం కావటం లేదు. చమురు బిల్లు మన రూపాయల్లో 12.6లక్షల కోట్ల నుంచి 10.97లక్షల కోట్లకు తగ్గింది, కేంద్ర సర్కార్‌కు రు.1.64 కోట్లు మిగిలింది. పోనీ ఈ మేరకైనా వినియోగదారులకు తగ్గించారా అంటే లేదు. వంట గ్యాస్‌ వంటి ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరలన్నీ ఇదే విధంగా తగ్గాయి. దిగుమతుల మొత్తం స్వల్పంగా పెరిగినప్పటికీ కేంద్రానికి భారం తగ్గింది. బిజెపి, తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు కానీ దోపిడీ కూడా చేయకూడదు కదా ! చమురు కొనుగోలులో తగ్గిన మేరకు వినియోగదారులకు అందించకుండా మిగిలిన సొమ్మును దేనికి ఖర్చు చేస్తున్నది ? పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రాయితీలు, సబ్సిడీల కోసం, వారు తీసుకున్న రుణాలు ఎగవేసినపుడు బాంకులకు నిధులు సమకూర్చటం కోసం వాటిని మళ్లిస్తున్నది. దీన్ని ఎవరైనా కాదనగలరా ? గతంలో సెస్‌లను భారీగా ఎందుకు అలా పెంచారంటే దేశ రక్షణకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని బిజెపి పెద్దలు దబాయించేవారు. ఆ భారాలను తగ్గించలేదు, ధర తగ్గినా రేట్లు అలాగే ఉంచారు. మన దేశం 202223లో 15,750 కోట్ల డాలర్లు చెల్లించి చమురు దిగుమతి చేసుకుంది. మరుసటి ఏడాది చమురు బిల్లు 13,240 కోట్ల డాలర్లకు తగ్గింది.ఈ మేరకు మోడీ సర్కార్‌ వినియోగదారులకు ధరలు తగ్గించిందా ?ఎందుకు తగ్గించ లేదు. చమురు బిల్లు తగ్గటానికి కారణం ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గటం, రష్యా నుంచి 40శాతం దిగుమతులను రాయితీ ధరలకు పొందటం. తాజాగా బాంక్‌ ఆఫ్‌ అమెరికా నివేదికలో చెప్పినదాని ప్రకారం 2022 ఏప్రిల్‌ మొదటి వారంలో ఇంథన ధరలను చివరి సారిగా సవరించిన తరువాత ముడి చమురు ధరలు 20శాతం తగ్గాయి.2023 సెప్టెంబరు నుంచి 2024 మార్చినెల మధ్య లీటరు డీజిలు ధర రు.9 తగ్గింది.దీని వలన ఏటా లక్షకోట్ల రూపాయలు లేదా జిడిపిలో 0.3శాతం కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం లేదా లాభం సమకూరుతున్నట్లు దానిలో పేర్కొన్నారు. గతంలో రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీని ఈ విధంగా పూడ్చుకున్నట్లయిందని కూడా అది అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పింది. ఇంథన ధరలను తగ్గిస్తే ద్రవ్యోల్బణం తగ్గుతుందని కూడా పేర్కొన్నది. పీపాకు పది డాలర్లు తగ్గితే ఏటా 1,300 కోట్ల డాలర్ల మేర ప్రభుత్వానికి మిగులుతాయి. ఇప్పుడున్న డాలరు మారకం (రు.84) ప్రకారం లక్షా తొమ్మిది వేల కోట్లు మిగులుతాయి. యుపిఏ పాలన చివరి ఏడాది నుంచి ఇప్పటి వరకు మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా సగటు ధరలు ఇలా ఉన్నాయి.

2013-14—-105.52
2014-15--- 84.16 2015-16—– 46.17
2016-17--- 47.56 2017-18—– 56.43
2018-19----69.88 2019-20—– 60.47
2020-21----44.82 2021-22—–79.18
2022-23----93.15 2023-24—– 82.58
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 81.95 డాలర్లు ఉంది. దీనికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా గడచిన రెండున్నర సంవత్సరాలుగా వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నది కేంద్ర ప్రభుత్వం.2022 ఏప్రిల్‌ ఆరున ఢల్లీిలో లీటరు పెట్రోలు రు.105.41, డీజిల్‌ రు.96.67గా సవరించిన వాటిని మే 22వ తేదీన రు.96.72, 89.62 చొప్పున సవరించారు. ఈ ధరలను 2024 మార్చి నెల 21వరకు కొనసాగించి మరుసటి రోజు నుంచి రెండేసి రూపాయల చొప్పున తగ్గించారు.తరువాత ధరలలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. వివిధ రాష్ట్రాలలో ఉన్న వాట్‌ ప్రకారం ధరలలో తేడాలు ఉంటాయి. ఉదా రెండు తెలుగు రాష్ట్రాలలో లీటరు పెట్రోలు రు.109 ఉంది. ప్రకటించిన విధానం ప్రకారమైతే ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా అనేక సార్లు సవరించి ఉండాల్సింది.ఏప్రిల్‌ నెలలో 89.44 డాలర్లు ఉన్నది కాస్తా సెప్టెంబరుకు 73.69కి తగ్గింది, పదహారు డాలర్లు తగ్గినా పదహారు పైసలు కూడా తగ్గించలేదు.


ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తాం, తాటవలుస్తాం అందుకే పార్టీని పెట్టాం అని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ప్రకటించారు. కమ్యూనిస్టులు తెల్లారిలేస్తే ఇలాంటి పిలుపులే ఇస్తుంటారు వారికి అలవాటైపోయింది అని పట్టించుకోని జనం నిజమే కదా కొత్త హీరో వచ్చాడు అనుకున్నారు.(జనం స్పందించనంత మాత్రాన కమ్యూనిస్టులు పిలుపులు ఇవ్వటం, కార్యకర్తలతో నిరసన తెలపటం మానుకోలేదు) 2019కి ముందు నరేంద్రమోడీని, చంద్రబాబు నాయుడిని అదే మాదిరి నిలదీశారు. తరువాత నరేంద్రమోడీతో చేతులు కలిపారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని 2024 ఎన్నికల వరకు నిలదీశారు, తాటవలిచారు. కేంద్రానికి చెందిన సమస్యలపై నిలదీయరేమి అన్నపుడు మేము అధికారంలోలేము కదా అని తప్పుకున్నారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి. వందశాతం స్ట్రైక్‌ రేటు ఉంది. జనం సమస్యలను వదలి సనాతన ధర్మ పరిరక్షకుడి అవతారమెత్తారు. తనకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మానవత్వం అంటూ కబుర్లు చెప్పిన మీరు ఇదేమిటి స్వామీ అంటే ముందునేను సనాతన హిందువును అంటున్నారు, ఆ ముక్క ఎన్నికల ముందు చెప్పలేదు. సినిమా స్క్రిప్ట్‌ మారిపోయింది. పోనీ హిందువులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నారా ? రాష్ట్రంలో తొంభై శాతం హిందువులే ఉన్నారు. ధరలు, దరిద్రం, నిరుద్యోగాలను భరించటం కూడా అదే శాతం ఉంది. కేంద్రం, రాష్ట్రం మోపుతున్న భారాలను కూడా భరిస్తున్నారు. వారికేమీ రాయితీలు లేవు. నాలుగువేల మంది విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు పూనుకుంటే మొత్తం సిబ్బందికి అలవెన్సులు కోత పెడుతుంట ఇదేం అన్యాయం అనటానికి హీరోకు నోరు రాలేదు. పెడుతుంటే నిలదీయలేదు. వరదలతో భారీగా నష్టపోయిన విజయవాడ, ఇతర ప్రాంతాల్లో జనాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం ఒక్క పైసా విదల్చకపోయినా అడిగింది లేదు. అమరావతి నిర్మాణానికి పెద్ద మొత్తంలో గ్రాంట్లు తెస్తామంటూ ప్రగల్భాలు పలికి పదిహేనువేల కోట్ల అప్పు ఇప్పిస్తామంటే అబ్బో ఇదే మహాభాగ్యం అన్నట్లు భజన చేస్తున్నారు. పోలవరం బాధితులకు నష్టపరిహారం సంగతి తేల్చకున్నా నోరు విప్పరు. ఇంథన ధరలు కేవలం రాష్ట్ర సమస్య కానప్పటికీ వినియోగించే పెద్ద రాష్ట్రాలలో ఒకటి గనుక మిగతా అంశాలతో పాటు చమురు ధరల తగ్గింపును పవన్‌ కల్యాణ్‌ నిలదీస్తారా ? ఇంథన కొనుగోలు సర్దుబాటు చార్జీల పేరుతో 2022`23 సంవత్సరానికే రు.8,113 కోట్లు చెల్లించాలని మూడు డిస్కామ్‌లు కోరాయి. ఇది గాక మరుసటి సంవత్సర మొత్తం మరో పదకొండువేల కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. దీన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా, జగన్‌ చేసిన పాపం అంటూ జనం నెత్తిన బాదుతారా ? సమస్యలను పక్కదారి పట్టించేందుకు సనాతన ధర్మ కబుర్లతో కాలక్షేపం చేస్తారా ? చంద్రబాబు ఎలాగూ నోరువిప్పరు. పవన్‌ కల్యాణ్‌ హీరో అని నిరూపించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ తీరు ఇలాగే ఉంటే …… మనదగ్గరా శ్రీలంక, బంగ్లాదేశ్‌ పరిణామాలు పునరావృతం !

15 Sunday Sep 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, China, edible oil import tax, farm crisis, Farmers, Fuel prices freezing, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన సైనికచర్య, ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వ కూల్చివేత వంటి పరిణామాలు ,కుట్రలు సంభవిస్తాయంటూ నరేంద్రమోడీని బలపరిచే శక్తులు కొన్ని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే వాటి నేపధ్యం వేరే కావచ్చుగానీ జనంపై మోపుతున్న భారాలు అన్ని రంగాలలో వెల్లడౌతున్న వైఫల్యాన్ని చూస్తే మన దేశంలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు పునరావృతం అవుతాయా అని ఆలోచించాల్సి వస్తోంది. దానికి వేరే దేశాలు కుట్రలే చేయనవసరం లేదు. హసీనా స్వయంకృతాన్ని ఆమెను వ్యతిరేకించే అమెరికా, బంగ్లా ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి. అయితే చరిత్ర పునరావృతం కావచ్చుగానీ ఒకే విధంగా ఉండదు. ఎవరూ ఊహించలేరు.


తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు, ఓట్ల కోసం ఎంతకైనా కొన్ని రాజకీయ పార్టీలు తెగిస్తున్న రోజులివి.2024 సెప్టెంబరు 14 నుంచి అమల్లోకి వచ్చేలా మనం దిగుమతి చేసుకుంటున్న ఖాద్య తైలాలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున దిగుమతి సుంకాలను విధించింది.ముడి(శుద్ధి చేయని) పామ్‌, సోయా,సన్‌ఫ్లవర్‌ దిగుమతి ధరలపై ఇప్పుడున్న 5.5శాతం పన్ను మొత్తాన్ని 27.5శాతానికి పెంచింది. వీటికి ఇప్పటికే ఉన్న సెస్‌లు అదనంగా పెరుగుతాయి. ఇది సగటు ధర, అదే శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు పువ్వు ఆయిల్‌ దిగుమతి చేసుకుంటే ఇప్పుడున్న 13.75 నుంచి 35.75కు పెరుగుతుంది. ఉదాహరణకు ఒక లీటరు వంద రూపాయలకు దిగుమతి చేసుకుంటే ఇప్పుడు రు.113.75 చెల్లిస్తున్నాము. పెంచిన పన్నుతో అది రు.135.75కు అవుతుంది. ఇది మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుందని వేరే చెప్పనవరం లేదు. మనదేశం ఖాద్యతైలాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఏటా వంద కిలోలు దిగుమతి చేసుకుంటే మన వాటా 20కిలోలకు పైగా ఉంది. ఈ కారణంగానే మన ప్రభుత్వం అనుసరించే వైఖరి ఒక విధంగా ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నది. దిగుమతి సుంకం పెంచగానే చికాగో మార్కెట్‌లో సోయా ధర రెండుశాతం పతనమైంది.లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వినియోగదారులను ఉద్దరించేందుకు దిగుమతి సుంకాలు తగ్గించినట్లు చెప్పిన మోడీ సర్కార్‌ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో రైతుల ఓట్ల కోసం అవే సుంకాలను పెంచుతూ నిర్ణయించింది.ఏది చేసినా ఓట్లకోసమే అంటే కొందరు తమ మనోభావాలను గాయపరుచుకోవచ్చుగానీ వాస్తవం.


హర్యానాలో బాస్మతి రకం వరిని సాగు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పతనం అక్కడి రైతుల మీద కూడా పడిరది. బాస్మతి బియ్యాన్ని టన్నుకు 1200 డాలర్లకు తగ్గకుండా ఎగుమతి చేయాలని నిర్ణయించారు. తరువాత దాన్ని 950డాలర్లకు తగ్గించారు. పక్కనే ఉన్న పాకిస్తాన్‌ అంతకంటే తక్కువ ధరకే ఎగుమతి చేస్తున్నందున మన బియ్యాన్ని కొనేవారు లేకుండా పోవటంతో మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని పది స్థానాల్లో బిజెపి ఐదింటిని పోగొట్టుకుంది. రైతులు ఆగ్రహంతో ఉన్నట్లు తేలటంతో ఇప్పుడు కనీస ఎగుమతి ధరల విధానాన్ని ఎత్తివేసింది. పోయిన ఖాతాదారులు తిరిగి వస్తారా, ఇది రైతులకు మేలు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.అదే విధంగా మహారాష్ట్రలో కూడా బిజెపి చావుదెబ్బతిన్నది, దానికి ఉల్లిరైతుల ఆగ్రహం అని తేలింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కన్నీరు తెప్పించిన ఉల్లిధరలను తగ్గించేందుకు ఎగుమతులపై ఆంక్షలు, కనీస ఎగుమతి ధర టన్నుకు 550 డాలర్లు ఉండాలని నిర్ణయించింది. ఇప్పుడు వాటిని రద్దు చేసింది. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. మహారాష్ట్రలో సోయా సాగు కూడా ఎక్కువే. దానికి కేంద్రం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రు.4,892 కంటే మార్కెట్‌లో రు.4,500 నుంచి 600 వరకు మాత్రమే పలుకుతోంది.దీంతో రైతుల్లో తలెత్తిన అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికల మీద పడకుండా మోడీ సర్కార్‌ సోయా మీద దిగుమతి పన్ను పెంచి కొంతమేరకైనా మార్కెట్లో ధరలు పెరుగుతాయనే ఆశతో ఈ చర్య తీసుకుంది.


ఇటు రైతులుఅటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలనటంలో మరోమాట లేదు. అందుకు తీసుకొనే చర్యలను సమర్దించవచ్చు. కానీ గత పది సంవత్సరాల్లో ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.మధ్యలో మార్కెటింగ్‌ రంగంలో ఉన్న వాణిజ్యవేత్తలకే లబ్ది చేకూరింది.మన దేశ అవసరాలలో మూడిరట రెండువంతుల ఖాద్యతైలాలను దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్నాం. నూనెగింజలను ఉత్పత్తి చేసే రైతాంగానికి అవసరమైన గిట్టుబాటు ధర ఉండటం లేదు. అనేక దేశాల్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికదిగుబడి వంగడాలను రూపొందించి ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. అది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకూ మేలు. నరేంద్రమోడీ 2001 నుంచి 2014వరకు గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు అక్కడ గణనీయంగా సాగుచేసే వేరుశనగ దిగుబడి పెంచేందుకు అవసరమైన వంగడాలను రూపొందించలేదు, పదేండ్లు ప్రధానిగా ఉన్నా చేసిందేమీ లేదు. 2022 గణాకాల(అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డాటా వెబ్‌సైట్‌ ) మేరకు అమెరికాలో హెక్టారుకు వేరుశనగ నాలుగున్నరటన్నుల దిగుబడి ఉండగా, చైనాలో 4.13టన్నులు, అదే మనదేశంలో 1.78 టన్నులు మాత్రమే. మొత్తంగా నూనె గింజల దిగుబడి కూడా ఇదే మాదిరి ఉంది గడచిన పదకొండు సంవత్సరాల సగటు 1.22 టన్నులు మాత్రమే. ఎందుకీ దుస్థితి, దీనికి బాధ్యులెవరు ? జవహర్‌లాల్‌ నెహ్రూయే కారణం అంటారా ? నూనె గింజల సాగు గిట్టుబాటు కాని కారణంగానే రైతులు అటువైపు మొగ్గు చూపటం లేదు. పదేండ్లలో మన కరెన్సీ రూపాయి విలువ పతనం కారణంగా అధిక మొత్తాలను చెల్లించి దిగుమతి చేసుకోవటంతో వినియోగదారులకు ధరలు మండుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం 201314లో దేశ అవసరాల్లో 48.1శాతంగా ఉన్న దేశీయ ఉత్పత్తి 202223 నాటికి 42.92శాతానికి పడిపోయినట్లు అంచనా. దీనికి కారకులెవరు ? మెజారిటీ రాష్ట్రాలలో అధికారం మాదే, అభివృద్ధికి రెండిరజన్ల పాలన కావాలని చెబుతున్న బిజెపి ఏం చెబుతుంది? ఎంతకాలమీ పరిస్థితి, ఈ వైఫల్యాన్ని సహించాల్సిందేనా ? 2047నాటికి వికసిత భారత్‌ అనే కబుర్లతో కడుపు నిండుతుందా ? మన దేశంలో కొంత మంది వైద్యులు, వైద్యుల కంటే తమకే ఎక్కువ తెలుసు అన్నట్లుగా కబుర్లు చెప్పేవారు తయారై వంటల్లో నూనెలను తగ్గించండి వీలైతే పూర్తిగా మానుకోండి అని చెప్పటం తెలిసిందే. ఇటీవల యూట్యూబర్లు ఇలాంటి సలహాలు ఇవ్వటంలో అందరినీ మించిపోయారు. ఆరోగ్యపరంగా సమస్యలున్నవారికి అలాంటి సలహాలు ఇవ్వటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో తలసరి వంటనూనెల కిలోల వాడకాన్ని చూద్దాం. జనాభా రీత్యా మొత్తం వాడకంలో మనదేశం చైనా తరువాత రెండవ స్ధానంలో ఉండవచ్చుగానీ తలసరిలో ఎక్కడో ఉన్నాం.

దేశం——–2010-2012–2022-22---2032 ప్రపంచం- --14.36 ---16.00 --16.60 పేదదేశాలు---07.13---06.97---07.79 భారత్‌----- 09.85---09.87---10.95 ఇండోనేషియా-05.55---10.32---12.24 లాటిన్‌అమెరికా06.95---17.61---18.18 ఐరోపా----- 18.55---24.10---21.73 చైనా------ 20.37---26.02---27.24 అమెరికా----36.63---40.26---36.76

మన దేశంలో కరోనాకు ముందు ఉన్న స్థాయికి వంట నూనెల డిమాండ్‌ పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.అనేక దేశాలతో పోల్చితే మన వినియోగం తక్కువగా ఉన్నపుడే పరిస్థితి కొనబోతే కొరివి అమ్మబోతే అడవిగా ఉంది. అన్నింటికీ పోల్చుతున్న చైనా స్థాయికి చేరితే దిగుమతి చేసుకొనేందుకు మన దగ్గర అవసరమైన డాలర్లు ఉంటాయా ? మూడు దశాబ్దాల కాలంలో వినియోగంలో పెద్ద మార్పు ఉండదనేది గత,వర్తమాన, భవిష్యత్‌ అంచనాలు తెలుపుతున్నాయి. ఇండోనేషియా తన అవసరాలను గమనంలో ఉంచుకొని పామ్‌ ఆయిల్‌ ఎగుమతులపై గతంలోనే కొన్ని ఆంక్షలు విధించింది. రానున్న సంవత్సరాల్లో దాని వినియోగం పెరగనుందనే అంచనాలు వాస్తవ రూపం దాల్చితే మన దిగుమతులు మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోంది. పోటీతో పాటు మన దిగుమతి అవకాశాలు తగ్గితే సోయా ఆయిల్‌ ఎగుమతి దేశాలు కూడా ధరలు పెంచే అవకాశాలు లేకపోలేదు. మన మొత్తం దిగుమతుల్లో పామాయిల్‌ వాటా 60శాతం.

దిగుమతి చేసుకొనే ఖాద్య తైలాల మీద పన్నులు పెంచితే రైతాంగాన్ని ఆదుకోవచ్చని చెప్పటం వంచన తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అది వాస్తవ రూపం దాల్చలేదు, సాగు పెద్దగా పెరగలేదు. నిజంగా మేలు చేయాలంటే ఇతర మార్గాలను ఆలోచించాలి. మార్చినెలతో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో రు.2.37లక్షల కోట్ల మేర జిఎస్‌టిని ఎగవేసినట్లు అధికార యంత్రాంగం తేల్చింది.అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఇది రెట్టింపు. మొత్తమే కాదు కేసులు కూడా పెరిగాయి.ముంబై, పూనే, గురుగ్రామ్‌, ఢల్లీి, హైదరాబాద్‌ కేంద్రాలుగా ఈ ఎగవేతను కనుగొన్నారు. మూడోవంతు రు.71వేల కోట్లు ఒక్క ముంబైలోనే ఉంది. అక్కడ రెండిరజన్ల పాలనే సాగుతోంది.లావాదేవీలేమీ లేకుండానే ఇన్‌పుట్‌ టాక్సు క్రెడిట్‌ పేరుతో కొట్టేసిన మొత్తం 20శాతం ఉంది. పన్ను ఎగవేతలను అరికట్టే పేరుతో 2017లో జిఎస్‌టిని తీసుకువచ్చారు.అంతకు ముందు ఎగవేత రు.7,879 కోట్లు కాగా తరువాత ఇంతింతై వటుడిరతై అన్నట్లుగా తాజాగా రు.2.37లక్షల కోట్లకు చేరుకుంది. ప్రతిపక్ష పార్టీల నేతలు, తమను వ్యతిరేకించేవారి మీద సిబిఐ,ఐటి,ఇడి దాడులను సాగిస్తున్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎగవేస్తుంటే ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? దీన్ని అరికడితే రైతాంగానికి అదనంగా చెల్లించవచ్చు, ఖాద్య తైలాల మీద దిగుమతి సుంకం విధించకపోతే వినియోగదారులనూ ఆదుకున్నట్లు అవుతుందా లేదా ? ఖాద్య తైలాల సంవత్సరం నవంబరు నుంచి అక్టోబరు వరకు ఉంటుంది.భారత సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ సమాచారం ప్రకారం 201314 నుంచి 202223తో పోల్చితే పదేండ్లలో నూనెల దిగుమతులు 116 లక్షల టన్నుల నుంచి 165లక్షల టన్నులకు పెరిగితే మోడీ ప్రభుత్వ నిర్వాకంతో రూపాయి విలువ తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కారణంగా ఖర్చు రు.60,750 కోట్ల నుంచి రు.1,38,424 కోట్లకు పెరిగింది. దీనికి తగ్గట్లుగా వినియోగదారుల రాబడి పెరిగిందా ? పోనీ సాగు విస్తీర్ణం పెరిగిందా అంటే లేదు.201112లో 263లక్షల హెక్టార్లలో సాగు చేయగా 202223లో 301లక్షలకు మాత్రమే చేరింది.మన అవసరాలకు ఇదేమాత్రం చాలదు.

గత రెండు సంవత్సరాలుగా పెట్రోలు, డీజిలు ధరలు పెంచలేదు చూడండి అంటూ బిజెపి నేతలు గొప్పలు చెప్పుకుంటారు. కానీ అసలు సంగతేమిటి ? గతంలో ప్రకటించి అమలు జరిపిన విధానం ప్రకారం గణనీయంగా ధరలను తగ్గించాల్సి ఉండగా పాతవాటినే కొనసాగించి మన జేబులను కొల్లగొడుతున్నారు. 202223 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసినపుడు మనదేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా ధర 93.15 డాలర్లు కాగా 202324లో అది 82.58కి తగ్గింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు 15వరకు సగటు ధర81.92 డాలర్లు ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన మేరకు ఎందుకు ధరలు తగ్గించటం లేదంటే అన్నింటికీ జవాబుదారీ అని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ ఎన్నడైనా దేశ పౌరులకు తన మన్‌కీ బాత్‌లో చెప్పారా ? ఎందుకు నోరు విప్పటం లేదో ఎవరైనా చెబుతారా ? వంటనూనెల వ్యాపారంలో అదానీ, పెట్రోలియం ఉత్పత్తులలో అంబానీ వంటి కంపెనీలు ఉండగా వాటికి లబ్ది చేకూరేవిధంగా మన ఎగుమతిదిగుమతి విధానాలు ఉన్నాయి తప్ప రైతులు, వినియోగదారులు పట్టలేదు. 1970దశకం ప్రారంభంలో ముంబైలో చిన్నగా ప్రారంభమైన ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళన క్రమంగా గుజరాత్‌, బీహార్‌ తదితర ప్రాంతాలకు విస్తరించటం, జయప్రకాష్‌ నారాయణ్‌ రంగ ప్రవేశం, ఇందిరాగాంధీ ఎన్నికల కేసులో ఓటమి, అత్యవసరపరిస్థితి విధింపు, ఆ సమయంలోనే జనతా పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి వంటి పరిణామాలు తెలిసినవే.గతంలో లాటిన్‌ అమెరికా, ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి చోట్ల ఏండ్ల తరబడి హృదయ సామ్రాట్టులుగా అభిమానం చూరగొన్న నాయకులనే జనం చివరికి తరిమికొట్టటాన్ని చూశాము. భారాలు పెరిగి జీవనం దుర్భరమైతే ఎక్కడైనా అలాంటి పరిణామాలు జరగవచ్చు. దానికి మనదేశం అతీతమేమీ కాదు. అయితే చరిత్ర ఏ రూపంలో ఎలా పునరావృతం అవుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. అన్నీ అనూహ్యంగా జరిగినవే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రోల్‌, డీజిల్‌ ధర రు.2 తగ్గింపు : నరేంద్రమోడీ కుడుములేస్తున్నారు పండగ చేసుకుందామా !

16 Saturday Mar 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ 1 Comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


త్వరలో ప్రపంచ జిడిపిలో జపాన్‌, జర్మనీలను వెనక్కు నెట్టి మూడవ స్థానం ఆక్రమించే ధనిక దేశంగా మనలను నరేంద్రమోడీ ముందుకు తీసుకుపోతున్నారు. టీవీలు చూడండి రోజూ ఎన్ని గ్యారంటీలను ప్రకటిస్తున్నారో, రామరాజ్యాన్ని తెచ్చారు, రామాలయాన్ని నిర్మించారు, ప్రపంచంలో తలెత్తుకొనేట్లు చేశారు. ఓట్ల కోసం మోడీ ఏమీ చేయరని బరాబర్‌ చెబుతున్నాం అంటూ భక్తులు ఊరూరా తిరుగుతున్నారు. అదే నిజమైతే ”ధనికులైన” మన జనాలకు ముష్టి విదిల్చినట్లుగా తాజాగా పెట్రోలు, డీజిలు మీద లీటరుకు రు.2 తగ్గించటం అవమానించటం కాదా ? ఈ చర్యతో జనం పండగ చేసుకుంటున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. పూర్వం గ్రామాల్లో వృత్తుల వారికి పండుగల సందర్భంగా రైతులు తాము చేసుకున్న పిండివంటలు ఇస్తే ఎంతో సంతోషించేవారు(దీని అర్ధం వృత్తుల వారిని కించపరచటం కాదు, అలాంటి పరిస్థితి గతంలో ఉందని చెప్పటమే.ఇప్పుడు ఇంకా ఎక్కడైనా అలా ఉందేమో తెలియదు). దాన్నుంచి వచ్చిందే కుడుమేస్తే పండగ అనే లోకోక్తి. ఇప్పుడు ముష్టివిదిల్చినట్లుగా రెండు రూపాయలు , గ్యాస్‌ సిలిండర్‌కు వంద ఇచ్చి బిజెపి వారు జనాలను డూ ఫెస్టివల్‌ (పండగ చేస్కో) అంటున్నారు.2022 ఏప్రిల్‌ ఆరు నుంచి చమురు ధరలను స్థిరంగా ఉంచిన పెద్దలు ఓట్లు కొల్లగొట్టాలని తప్ప ఇప్పుడు ఇంత స్వల్పంగా తగ్గించటానికి ప్రాతిపదిక ఏమిటి ? ఈ మాత్రానికే పండగ చేసుకొని ఓట్లు వేస్తామని ఎవరైనా అంటే అది వారిష్టం.


అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గించే విధానం అమలు జరుపుతున్నట్లు ప్రతి రోజూ సుప్రభాతం మాదిరి ధరలను ప్రకటించే వారు. రెండు సంవత్సరాలుగా ఎందుకు నిలిపివేసినట్లు ? ఎన్నికల్లో మీట నొక్కిన తరువాత తిరిగి పెంచరనే గ్యారంటీ ఏముంది ? కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ సెల్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌లోని తాజా సమాచారం ప్రకారం పదేండ్ల యుపిఏ పాలనా కాలంలో 2004-05 నుంచి 2013-14 వరకు కేంద్ర ప్రభుత్వం లేదా చమురు ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీలు వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీల మొత్తం రు.8,88,024 కోట్లు. సగటున ఏటా 88.8వేల కోట్లు. తరువాత నరేంద్రమోడీ అచ్చేదిన్‌ పాలనలో ఈ మొత్తం రు.2,82653 కోట్లు మాత్రమే. సగటున 30.1వేల కోట్లు. వీటిలో ప్రజాపంపిణీ కిరోసిన్‌, ఉజ్వల గ్యాస్‌ సబ్సిడీ ఉన్నాయి. ఇది సబ్సీల కోత తీరు కాగా ఈ కాలంలో చమురు రంగంలో జనంపై మోపిన భారమెంతో చూద్దాం.తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మోడీ సర్కార్‌ పెంచిన పన్నులు, సెస్సులు,చమురు కంపెనీల నుంచి వచ్చిన రాబడుల మొత్తం రు.34,53,930 కోట్లు. అంటే సగటున రు.3.45లక్షల కోట్లు వచ్చింది. అధికారానికి వచ్చిన తొలి ఏడాది అంటే అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ విధించిన పన్నులు, ఇతర రాబడి రు.1.72లక్షల కోట్లు మాత్రమే. అది 2021-22లో గరిష్ట స్థాయికి రు.4.92లక్షల కోట్లకు పెరిగింది. ఈ ప్రాతిపదికన అంటే తొలి ఏడాది పన్నులే కొనసాగి ఉంటే పదేండ్లలో రు17.22 లక్షల కోట్లుగా ఉండేది, కానీ మొత్తం మీద చూసినపుడు రెట్టింపైంది. రద్దు చేసిన సబ్సిడీ, పెంచిన భారాలను కలుపు కుంటే 23లక్షల కోట్ల మేరకు భారం జనం భరించినట్లు లెక్క.


2020లో మనదేశంలో 88.2 బిలియన్‌ లీటర్ల డీజిల్‌,37.2 బిలియన్‌ లీటర్ల పెట్రోలు(స్టాటిస్టా సమాచారం) వినియోగం మొత్తం 125.4బిలియన్‌ లీటర్లు. ఇప్పుడు రెండు రూపాయల చొప్పున తగ్గించారు గనుక ఏడాది పాటు అమలు చేస్తే 250.8బిలియన్లు అంటే 25వేల కోట్లు జనానికి విదిల్చి ఓట్లు కొల్లగొట్టాలని పధకం వేశారు.మోపిన భారం ఎంత ? తగ్గించిన ధర ఎంత ? తరువాత వినియోగం పెరిగి ఉంటే ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరిగినట్లే తగ్గింపు మొత్తం కూడా అదే దామాషాలో పెరుగుతుంది. జనం మరీ ఇంత అమాయకంగా ఉన్నారని, కుడుమేస్తే పండగ చేసుకొనే వారి మాదిరి కనిపిస్తున్నారా ? పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు చమురు ఉత్పత్తుల మీద వచ్చిన పన్ను, ఇతర రాబడి రు.22,19,558 కోట్లు అంటే సగటున 2.3 లక్షల కోట్లు. పదేండ్ల క్రితం వార్షిక రాబడి 1.6లక్షల కోట్ల నుంచి 2.3లక్షల కోట్లకు తప్ప కేంద్రం మాదిరి రు.1.72లక్షల నుంచి 3.45లక్షల కోట్లకు పెరగలేదు. కేంద్రం నుంచి పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా సంగతేమిటని కొందరు ప్రశ్నించవచ్చు. ఎక్సైజ్‌, ఇతర పన్నులో రాష్ట్రాలకు వాటా ఉంటుంది తప్ప సెస్సుల పేరుతో మోపిన దానిలో ఒక్క పైసా కూడా రాదు. మోడీ మోపిందంతా సెస్సుల పేరుతోనే. ధరలు తగ్గించాలని ఒక వైపు డిమాండ్‌ చేసే వారు ప్రభుత్వం అదే చేస్తే సంతోషించకుండా విమర్శలెందుకు చేస్తారు అనే వారు ఉన్నారు.వారందరికీ ఒకటే సమాధానం పెంచాలని ఎవరూ కోరలేదు, వద్దంటున్నా విపరీతంగా పెంచి జేబులు కొల్లగొట్టారు.దానిలో ఓట్ల కోసం నామమాత్రం తగ్గిస్తే పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ తగ్గింపు నేతలకు భజన చేయాల్సినంత గొప్పదేమీ కాదు. రద్దు చేసిన సబ్సిడీలతో పోలిస్తే ఇచ్చిన రాయితీ మొత్తమెంతో ఈ ప్రశ్నలు వేసే వారు సమాధానం చెప్పాలి.యుపిఏ పాలనా కాలంలో వార్షిక సగటు ముడిచమురు పీపా ధర డాలర్లలో, రూపాయలలో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో, నరేంద్రమోడీ హయాంలో ఎలా ఉందో దిగువ చూడవచ్చు.
సంవత్సరం× ధర డాలర్లలో×× పెట్రోలు ×× డీజల్‌
2010-11××× 85.09 ×× 52.64 ×× 38.56
2011-12××× 111.89 ×× 64.71 ×× 40.26
2012-13××× 107.97 ×× 68.71 ×× 45.26
2013-14××× 105.52 ×× 73.70 ×× 51.90
2014-15××× 84.16 ×× 66.36 ×× 52.23
2015-16××× 46.17 ×× 68.71 ×× 45.26


2016-17లో మనదేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధర 47.57 ,2017-18లో 56.43, 2018-19లో 69.88,2019-2020లో 60.57, 2020-21లో 44.82, 2021-22లో 79.18, 2022-23లో 93.15, 2023-24లో 82.41డాలర్లు ఉంది. 2022 ఏప్రిల్‌ ఆరున ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రు.105.41, డీజిల్‌ ధర రు.96.67 కాగా మే 22 నుంచి రు. 96.72, రు.89.62కు తగ్గించారు. అప్పటి నుంచి 2024 మార్చినెల 14వరకు అదే రేట్లు కొనసాగాయి. యుపిఏ పాలనలో 112 డాలర్లకు ముడి చమురు దిగుమతి చేసుకుంటే వినియోగదారుల నుంచి వసూలు చేసింది పెట్రోలు రు.64.71, డీజిల్‌కు రు.40.26 మాత్రమే. ఇప్పుడు తాజా రేటు పైన చెప్పుకున్నట్లు 82.41 డాలర్లు ఉంటే ఢిల్లీలో 96.67, 89.62గా ఎందుకు ఉన్నట్లు? తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు రేటు రు.109, 111 వంతున ఉన్నాయి, మరికొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా వినియోగదారుల నుంచి ఇంతగా ధర వసూలుకు కారణమేమిటి అంటే విపరీతంగా సెస్సులను వడ్డించటం, రూపాయి మారకపు విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధతే తప్ప మరొక కాదు. వీటి గురించి నరేంద్రమోడీ దేశానికి ఇస్తున్న గ్యారంటీలు ఏమిటి అన్నది ప్రశ్న.


.2011-12లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది.2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29.అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడేబాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లించాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు 83కు అటూ ఇటూగా ఉంది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరుగుతుంది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల గురించి నిరంతరం ఊదరగొడుతుంటారు. 1995లో స్వదేశీ ముడిచమురు ఉత్పత్తి 32.2మిలియన్‌ టన్నులు. దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించుకోవాలి, స్వదేశీ ఉత్పత్తిని పెంచుకోవాలని రోజూ సుభాషితాలు చెబుతుంటారు.మోడీ ఏలుబడిలో 2022 నాటికి 28.4మిలియన్‌ టన్నులకు దిగజారింది. ఎంతో కీలకమైన ఈ రంగంలోనే మన ప్రతిభ ఇలా ఉంటే దేశాన్ని ముందుకు తీసుకుపోతాం, అగ్రస్థానానికి చేరుస్తాం అంటే ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతాం అన్నట్లుగా ఉంది.

కరోనా సంక్షోభంలో కార్పొరేట్‌ శక్తులను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్రమోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ పన్ను తగ్గింపు ఆవిరి – మరోసారి చమురు ధరల మోత !

31 Tuesday May 2022

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మంగళవారం నాడు (మే 31వ తేదీ) అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్రెంట్‌ రకం ధర మరోసారి 124 డాలర్లు దాటింది. 2020-21లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 44.82 డాలర్లు కాగా 2021-22లో అది 79.18 డాలర్లకు పెరిగింది.వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103 డాలర్లుంది. మే నెలలో 108.61డాలర్లకు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పాలనా కాలంలో ఒక లీటరు పెట్రోలు, ఒక లీటరు డీజిలు కొనుగోలు చేస్తే జనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన పన్ను రు.9.48, రు.3.56 మొత్తం రు.13.04. నరేంద్రమోడీ అధికారానికి వచ్చి జనాలకు మంచి చేసేందుకు గాను దాన్ని రు.32.98, రు.31.83 మొత్తం రు.64.81కు పెంచారు. బిజెపికి చెడు రోజులు రాకుండా చూసుకొనేందుకు దీనిలో కేంద్ర ప్రభుత్వం 2021లో ఒకసారి, 2022లో తగ్గించిన మొత్తం రు.29. అంటే నిఖరంగా ” మంచిరోజుల కోసం ” ఇంకా రు.35.81 పిండుతూనే ఉన్నారు. నరేంద్రమోడీ ఏలుబడి మీద ఇంకా భ్రమలున్నవారికి, భజన చేస్తున్నవారికీ ఈ వివరణ కాస్త చిరాకు తెప్పించటం సహజమే. ఎందుకంటే శ్రీలంక పరిణామాలను గుర్తు చేస్తాయి మరి. గతంలో 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింపచేసిన మోడీ సర్కార్‌ ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి మరోసారి ధరల సవరణ నిలిపివేసింది. దీనివలన తమకు పెట్రోలు మీద లీటరుకు రు.13, డీజిలుకు రు.24 నష్టం వస్తోందని ప్రైవేటు కంపెనీలు చెబుతున్నాయి. గతంలో వచ్చిన నష్టాన్ని ధరలు పెంచి పూడ్చారు. ఇప్పుడు మరోసారి కొంత కాలం తరువాత అదేపని చేస్తారు. జనాలకు ఒరిగేదేమీ ఉండదు. మార్చినెల 21 వరకు 137 రోజుల పాటు స్థిరంగా ఉంచి ఢిల్లీలో లీటరు పెట్రోలు రు.95.41 ధరను ఏప్రిల్‌ ఆరు నాటికి రు.105.41కి, డీజిలు ధరను రు.86.67 నుంచి రు.96.67కు పెంచారు. అంతకు ముందు రెండింటి మీద కేంద్రం రు.15 పన్ను తగ్గించి, మార్చి-ఏప్రిల్‌ నెలల్లో రు.20 ధర పెంచింది. ఇటీవల రు.14 తగ్గించారు, తరువాత ఎంత పెంచుతారో వేచి చూడాల్సిందే.


ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. వాటిలో అమెరికా చమురు రాజకీయం కూడా ప్రధానమైనదే. ఆంక్షలు, అలకలు ఏదో ఒక కారణంతో ఐరోపా దేశాలు రష్యానుంచి ముడిచమురు కొనుగోలును తగ్గించేందుకు పూనుకున్నాయి. ఇదే సమయంలో చైనా, భారత్‌ రికార్డు స్థాయిలో దిగుమతులు పెంచాయని ఇంధన విశ్లేషణ సంస్థ కెప్లర్‌ పేర్కొన్నది. మే నెలలో సముద్రాల మీద ప్రయాణంలో లేదా లంగరు వేసి ఉన్న ఓడల్లో 79 మిలియన్ల పీపాల రష్యా చమురు ఉంది. ఫిబ్రవరి నెలలో 27మిలియన్ల పీపాలుంది.ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు రష్యా ప్రధానంగా ఐరోపాకే చమురు ఎగుమతి చేసేది. పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేసేది లేదంటూ చైనా, మన దేశం ఇప్పుడు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. మార్చినెలలో మన దేశానికి చమురు సరఫరా చేసిన దేశాలలో రష్యా పదవ స్థానంలో ఉండగా ఏప్రిల్లో నాలుగవ స్థానానికి చేరిందని చమురు టాంకర్ల సమాచారం వెల్లడించినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. ఈ కారణంగానే ఆ దిగుమతులను నిలిపివేయాలంటూ మరోసారి మన మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా పూనుకుంది.ఆసియాలోని కొందర్ని రాజకీయవైఖరి కంటే ఆర్ధిక అంశాలే కొనుగోలుకు పురికొల్పినట్లు సింగపూర్‌లోని కెప్లర్‌ సీనియర్‌ విశ్లేషకుడు జేన్‌ షీ అన్నారు. గతంలో ఒకశాతంగా ఉన్న మన రష్యా దిగుమతులు ఇప్పుడు ఆరుశాతానికి చేరినట్లు, మార్చి నెలలో రోజుకు 66వేల పీపాల దిగుమతి మరుసటి నెలలో 2,77,000కు పెరిగినట్లు, మే నెలలో అది 4,87,500కు పెరుగుతుందని రాయిటర్స్‌ వార్త వెల్లడించింది. ఆఫ్రికా నుంచి మనదేశం చేసుకుంటున్న దిగుమతులు 14.5 నుంచి ఆరుశాతానికి తగ్గాయి, అమెరికా నుంచి మూడుశాతం తగ్గాయి.


రష్యాపై తాను విధించిన ఆంక్షలను అందరూ అనుసరించేట్లు చూడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించిన మేరకు మన దేశం మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా సహాయ మంత్రి ఎలిజబెత్‌ రోజెన్‌బర్గ్‌ ఢిల్లీ, ముంబాయి నగరాలకు రానున్నారు. రష్యామీద ఆంక్షలను మరింత కఠినతరంగావించనున్నారనే వార్తల నేపధ్యంలో అమెరికా వత్తిడి పెంచుతోంది. ఆసియా కొనుగోళ్లను అడ్డుకుంటే తప్ప ఆంక్షల వలన ఫలితం ఉండదని ఇప్పటికే తేలింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఇప్పటికీ ఆసియా ఓడలద్వారా ఎగుమతులు 50శాతం పెరిగాయి. జనవరిలో రోజుకు 15లక్షల పీపాలు పంపితే ఇప్పుడు 23లక్షలకు చేరింది. మొత్తం మీద ఫిబ్రవరి 24కు ముందు స్ధాయికి ఎగుమతులు చేరుకుంటున్నట్లు చెబుతున్నారు.


అంతర్జాతీయ చమురు మార్కెట్లో వచ్చిన మార్పులు, తాజా పరిణామాలు ఇప్పుడు అమెరికాకు లాభదాయకంగా మారాయి. చమురు ధరలను డాలర్లలో నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర కరెన్సీలతో కొనుగోలు చేయాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చూసినపుడు డాలరు విలువ ఎక్కువగా ఉంటే చమురు ధర తక్కువగానూ చమురు ధర పెరిగితే డాలరు విలువ తక్కువగానూ ఉండేది. అమెరికా గతంలో చమురును దిగుమతి చేసుకొనేది ఇప్పుడు షేల్‌ చమురు ఉత్పత్తితో ఎగుమతిదారుగా మారింది. ప్రపంచ ఉత్పత్తి దేశాల్లో ఒకటో స్ధానంలో ఉంది. గతంలో చమురు దిగుమతి చేసుకున్నపుడు ధర ఎక్కువగా ఉంటే ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు తానే ఎగుమతి చేస్తున్నందున ధర ఎక్కువగా ఉంటే ఆర్ధికంగా పెద్ద లబ్దిపొందుతోంది. చమురు ఉత్పత్తి మొత్తం ప్రయివేటు రంగంలోనే ఉన్నందున వారికి ఎంత ధర పెరిగితే అంతగా లాభాలు వస్తాయి. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోయటం ద్వారా రష్యాను దెబ్బతీసి ఐరోపా చమురు మార్కెట్‌ను తాను ఆక్రమించాలని చూస్తోంది. అది కొంత మేరకు ఇప్పటికే ఫలించింది. ఇటీవల ప్రపంచంలో చమురు ధరతో పాటు అమెరికా డాలరు విలువా పెరుగుతోంది. అమెరికా సరకులు కొనుగోలు చేయాలంటే దిగుమతి చేసుకొనే దేశాలకు భారం పెరుగుతుంది. కనుక నిత్యం ఎక్కడో ఒకచోట ఉద్రిక్తతలను రాజేసి ఆయుధాలను అమ్ముకొని లబ్దిపొందుతున్నది. అవి లేకపోతే దాని వాణిజ్యలోటు ఇంకా పెరుగుతుంది. చైనా, ఇతర దేశాల నుంచి తక్కువ ధరలకు ఇతర సరకులను దిగుమతి చేసుకొని వాటి ద్వారా కూడా లబ్ది పొందుతున్నది. ఇదే సమయంలో ఖరీదైన తన వస్తువులను అంటగట్టేందుకు బెదిరింపులకు దిగుతోంది. అమెరికా చెలగాటం మన వంటి దేశాల జనాలకు ప్రాణసంకటం కలిగిస్తోంది.


గతంలో చమురు సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు అమెరికా కేంద్రంగా ఉండేవి. ఇప్పుడు అమెరికా ఎత్తుగడ కారణంగా ఐరోపా సంక్షోభ కేంద్రంగా మారింది. ఇప్పుడున్న స్థితిని బట్టి రానున్న రోజుల్లో బొగ్గు, చమురు, గాస్‌ ధరలు ఇంకా పెరుగుతాయని, సరఫరా కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీని వలన అమెరికా కంటే ప్రపంచ ఆర్ధికవృద్ది ఎక్కువగా దెబ్బతింటుందని భావిస్తున్నారు. మరోవైపు డాలరు విలువ పెరుగుతుందని కూడా జోశ్యం చెబుతున్నారు. అమెరికా ఫెడరల్‌ నిధుల నిల్వలను పెంచినపుడల్లా వడ్డీరేటు పెరుగుతుంది. డాలరును సురక్షితమైనదిగా భావిస్తున్నందున మిగతా కరెన్సీల కంటే డాలర్ల వైపే మొగ్గుచూపుతారు. మదుపుదార్లు అంతకు ముందు ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా అమెరికాలో వడ్డీ రేటు పెరుగుతుందని భావించగానే వాటిని అమెరికాకు తరలిస్తారు. అది అమెరికాకు లబ్ది చేకూరుస్తుంది. తనకు విదేశీ పెట్టుబడులు అవసరమైనపుడు కూడా వడ్డీ రేట్లను పెంచుతుంది. విదేశీ మదుపుదార్లు మన మార్కెట్‌ నుంచి తప్పుకుంటున్న కారణంగా రూపాయి విలువ పతనమైంది. దాన్ని నిలబెట్టేందుకు రిజర్వుబాంకు నానా కష్టాలు పడుతోంది. రూపాయి విలువ తగ్గితే ఎగుమతులు పెరుగుతాయి, చమురుతో సహా దిగుమతుల ధరలు పెరుగుతాయి.2021 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో మన వాణిజ్యలోటు 12.75బిలియన్‌ డాలర్లు, అది 2022 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో 87.79బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో అది వంద బిలియన్‌ డాలర్లకు పెరగవచ్చని అంచనా. రూపాయి విలువ పతనం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పుడున్నదానికంటే మరింతగా పడిపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. 2020-21లో మన చమురు దిగుమతి బిల్లు 62.2 బిలియన్‌ డాలర్లు కాగా 2021-22లో అది 119.2 బి.డాలర్లకు చేరింది.


ఇటీవల ఎడిపి(రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్స్‌ పీపుల్‌ ఎట్‌ వర్క్‌ 2022 అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం జీవన వ్యయం పెరుగుతున్న కారణంగా తమ వేతనాలను పెంచాలని తమ యజమానుల మీద వత్తిడి తెచ్చేందుకు 86శాతం మంది భారతీయ కార్మికులు సిద్దం అవుతున్నారని తేలింది. ఈ సంస్థ 17దేశాల్లో సర్వే చేసింది. ప్రపంచ వ్యాపితంగా వేతన పెంపుదలను కోరుతున్న వారు సగటున 76శాతం కాగా భారత్‌లో అది 86శాతం ఉంది.బిజెపి వారు పదే పదే చెబుతున్న ”80” శాతంలో ఉన్నవారు వీరిలో కూడా అదే దామాషాలో ఉంటారని, వారికి వేరే వెండి పళ్లాల్లో వడ్డించరని చెప్పనవసరం లేదు. కరోనా మహమ్మారి ముగిసిన తరువాత వేతనాలు పెంచుతారనే భావనలో ఉన్నారని ఎడిపి భారత విభాగం ఎండి రాహుల్‌ గోయల్‌ చెప్పారు.యజమానులు పట్టించుకోకపోతే కార్మికుల ఆగ్రహం ప్రభుత్వాల మీదకు మళ్లుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఏదో ఒక పేరుతో ఎలాంటి వేతనం లేకుండా అదనపు గంటలు పని చేయించుకోవటం పెరిగింది. 2020లో మన దేశంలో వారానికి సగటున 7.3 గంటలు పని చేస్తే 2021లో అది 8.5గంటలకు పెరిగింది. ప్రపంచ సగటు 9.2 గంటలు. ఈ దోపిడీకి ధరల పెరుగుదల తోడైతే బతుకు దుర్భరమే. ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్న కారణాల్లో చమురు ధర ఒకటి. అందువలన నరేంద్రమోడీ అచ్చేదిన్‌ ఏలుబడిలో ఉన్నామనే భ్రమలతో బతుకుతున్నవారు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కొసమెరుపు ఏమంటే రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలను మరింతగా పెంచాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించిన నేపధ్యంలో చమురు ధరలు 130 డాలర్లకు పెరగవచ్చని ఆ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చమురు పన్ను తగ్గింపు : శ్రీలంక దెబ్బతో నరేంద్రమోడీ అదిరి పడ్డారా !

23 Monday May 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Diesel Price, Fuel prices freezing, India fuel tax reduction, Narendra Modi Failures, Petrol


ఎం కోటేశ్వరరావు


తాజాగా లీటరు పెట్రోలు మీద రు.8, డీజిలు మీద రు.6 కేంద్ర ప్రభుత్వం పన్నులను తగ్గించింది. అసల్లేనిదాని కంటే ఏమాత్రం తగ్గినా తగ్గినట్లే కదా అని సంతృప్తి చెందుతున్నారు కొందరు. దీని వలన కేంద్ర ప్రభుత్వం మీద లక్ష కోట్ల భారం పడుతుందని మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అంటే ఏదో రూపంలో తిరిగి జనం మీదనే మోపుతారు. తమ మీద భారం భారం అంటూ మురిపిస్తూ జనం మీద మోపిన విపరీత భారాన్ని మరిపించాలని చూస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా 137 రోజుల పాటు ధరలను స్ధంభింపచేశారు. తరువాత మార్చినెల 22 నుంచి ఏప్రిల్‌ ఆరు వరకు ధరలు పెంచారు. ఢిల్లీలో లీటరు పెట్రోలు రు.95.41 నుంచి 105.41వరకు, డీజిలు ధర రు.86.67 నుంచి 96.67వరకు పెరిగింది రాష్ట్రాల వాట్‌ను బట్టి అన్ని చోట్లా ఒకే రేట్లు ఉండవు.


ఏప్రిల్‌ ఆరు నుంచి ఇప్పటి వరకు (ఇది రాసిన మేనెల 23వరకు) సవరించలేదు. బహుశా దీనికి శ్రీలంకపరిణామాలతో పాటు, ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇతర కారణాలతో దేశంలో పెరుగుతున్న ధరలు కారణం అన్నది స్పష్టం. అంతకు ముందు పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు చమురు మీద కేంద్రం భారీగా విధించిన పన్నులను తగ్గించాలని ఆర్‌బిఐతో సహా అనేక మంది ఆర్ధికవేత్తలు సూచించినా కేంద్రం పట్టించుకోలేదు. గత రెండు నెలల్లో పరిస్ధితి మరింతగా దిగజారింది. ఈ ధోరణి మరింతగా విషమించటం తప్ప మెరుగుపడే తీరు కనిపించకపోవటంతో కేంద్రం దిగివచ్చింది. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు కూడా దీనికి కారణం కావచ్చు. అప్పటి వరకు చమురు ధరల స్ధంభన కానసాగించి తరువాత మొత్తంగా వడ్డించవచ్చు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా 137 రోజుల పాటు ధరలను సవరించకుండా నిలిపి తరువాత మొత్తాన్ని వసూలు చేసిన సంగతి తెలిసిందే.


అచ్చేదిన్‌ సంగతి గోమాత కెరుక ఇప్పుడున్న ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం వీటి పర్యవసానాలతో మనం ఇంకా శ్రీలంకకు ఎంతదూరంలో ఉన్నాం అని జనం ఆలోచించే పరిస్ధితి వస్తుందని బిజెపి పెద్దలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ సింహళ (మెజారిటీ బౌద్దులు) హృదయ సామ్రాట్టుగా నీరాజనాలు అందుకున్న మాజీ అధ్యక్షుడు, ప్రధానిగా పని చేసిన మహింద రాజపక్స ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మహాభారతంలో రారాజుగా కీర్తి పొందిన ధుర్యోధనుడు చివరి రోజుల్లో ప్రాణాలు కాపాడుకొనేందుకు మడుగులో దాగినట్లుగా మేనెల 10వ తేదీ నుంచి ట్రింకోమలీలోని నౌకాదళ కేంద్రంలో రక్షణ పొందుతున్నాడు. మాజీ మంత్రి, ప్రస్తుతం ఎంపీగా ఉన్న కుమారుడు నామల్‌ రాజపక్సతో కలసి మే 18వ తేదీన భద్రత నడుమ పార్లమెంటు సమావేశాలకు మహీంద రాజపక్స హాజరయ్యాడు. అతగాడు దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. సింహళ మెజారిటీ జాతీయవాదాన్ని తలకు ఎక్కించుకున్న ఆ జనమే ఆర్ధిక సంక్షోభంతో తమ జీవితాలు అతలాకుతలం కావటంతో అదే మహింద రాజపక్స కనిపిస్తే చంపేస్తామంటూ వీధులకు ఎక్కిన దృశ్యాలు మెజారిటీ హిందూ హృదయ సామ్రాట్టులకు కనిపిస్తున్నాయా ? ఏమో !
జనానికి ఎంత భారం తగ్గినా మంచిదే కనుక ప్రభుత్వ చర్య మంచిదే అనుకున్నా పన్నుల పెంపుదల పూర్వపు స్ధాయికి చేరితేనే మరింత ఊరట కలుగుతుంది. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పన్నులు తగ్గింపు ప్రకటన చేసినదాని కంటే – ఏమాటకామాటే చెప్పుకోవాలి -వాటి గురించి ఇచ్చిన వివరణకు నిజంగా ఆమెను అభినందించకతప్పదు. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రం చమురు మీద పెంచిన పన్నుల నుంచి రాష్ట్రాలకు ఎలాంటి వాటా రాదు అని ఎందరు మొత్తుకున్నా బుకాయించి వాటి నుంచి 41శాతం వాటా కేంద్రం తిరిగి రాష్ట్రాలకు ఇస్తుందని వాట్సాప్‌ విశ్వవిద్యాలయం ద్వారా చేసిన కాషాయదళాలు చేసిన బోధనలను తలకు ఎక్కించుకున్న వారిని ఇప్పుడు తలలు దించుకోవటమే కాదు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్ధితిలోకి నిర్మలమ్మ నెట్టివేశారు. అలాంటి కనువిప్పు కలిగించినందుకు ఆమెకు నీరాజనాలు పలకాల్సిందే మరి. తాజా తగ్గింపు వలన రాష్ట్రాలకు వచ్చే వాటా ఏమాత్రం తగ్గదని, అవి వాటాలేని రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ ఖాతాకు చెందినవని ఆమె స్పష్టంగా చెప్పారు. సెస్‌లు దేనికోసం విధించారో అందుకోసమే ఖర్చు చేయాలి. సెస్‌ల విధింపును సమర్ధిస్తూ కాషాయదళాలు చేసిన వాదనలను ఒక్కసారి వారి బోధనలతో ప్రభావితమైన వారు గుర్తుకు తెచ్చుకోవాలి. గత మన్మోహన్‌ సింగ్‌ చేసిన చమురు(ఇరాన్‌కు) అప్పులు తీర్చేందుకు అని తొలుత చెప్పారు. తరువాత చమురు బాండ్లను తీర్చేందుకుఅన్నారు. గాల్వాన్‌ ఉదంతాల తరువాత సైనికులకు ఖర్చు చేసేందుకు చమురు పన్నువేశారంటే కాదన్న వారిని దేశద్రోహులుగా చిత్రించి జనాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.తొలుత మొరాయించి తరువాత కరోనా వాక్సిన్‌ ఉచితంగా వేయాల్సి వచ్చే సరికి వీటన్నింటికీ పన్నులు వేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటూ ఎదురుదాడి చేశారు.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలు చెప్పారు.


పెట్రోలు మీద 8, డీజిలు మీద ఆరు రూపాయల సెస్‌ తగ్గించినందుకు గాను కేంద్రం మీద ఏడాదికి లక్ష కోట్ల మేరకు భారం పడుతుందని, దాన్ని అప్పుల ద్వారా పూడ్చుతామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీనికి కూడా ఆమెను అభినందించాల్సిందే. చెంపదెబ్బ-గోడదెబ్బ మాదిరి చమురు పేరుతో రోడ్డు పన్ను మన నుంచి వసూలేగాక రోడ్ల మీద తిరిగినందుకు రోడ్డుపన్ను(టోల్‌టాక్సు) కూడా వసూలు చేశారని అనేక మంది ఆమె ప్రకటన తరువాత గ్రహించిన విద్యావంతులు గుండెలు బాదుకుంటున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చమురు పన్నుల రూపంలో ఎంత మోపిందో ప్రతిపక్షాలు, విశ్లేషకులు చెబితే జనాలకు ఎక్కలేదు, ఇప్పుడు నిర్మలమ్మే చెప్పారు గనుక నమ్మకతప్పదు.మోడీ ఏలుబడి ప్రారంభంలో పెట్రోలు మీద లీటరుకు రు.9.48 గా ఉన్నదానిని రు.32.98కి, డీజిలు మీద రు.3.56గా ఉన్నదానిని రు.31.83కు పెంచారు. అంటే ఇన్నేండ్లుగా జనాల నుంచి కేంద్రం ఎంత పిండిందో, తమ జేబులకు ఎంత చిల్లిపడిందో ఎవరికి వారు లెక్కలు వేసుకోవచ్చు.


గతేడాది కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలు కొంతమేరకు తగ్గించినందుకు, ఆ మేరకు తగ్గించని రాష్ట్రాలు కూడా వెసులుబాటు కలిపించాలని ప్రధాని నరేంద్రమోడీ కొద్ది వారాల క్రితం రాష్ట్రాల మీదకు జనాన్ని ఉసికొల్పారు. నిజం ఏమిటి ? మే 23వ తేదీ హిందూ పత్రిక వార్త ప్రకారం 2015-2021 మధ్య కేంద్ర పన్నులు జిడిపిలో 0.79 నుంచి 1.88శాతానికి పెరిగితే ఇదే కాలంలో రాష్ట్రాల పన్నులు 1.1 నుంచి 1.02శాతానికి తగ్గాయి. ఈ కారణంగానే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పన్నులు తగ్గించేందుకు అంగీకరించలేదు. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఇతరంగా ఏదో రీతిలో సర్దుబాటు చేస్తారు గనుక అవి మౌనంగా ఉన్నాయి. గతేడాది తగ్గించిన మొత్తాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేంద్రం ఇప్పటి వరకు పెట్రోలు మీద రు.13, డీజిలు మీద రు.16 తగ్గించింది.దీని వలన కేంద్రానికి రు.2,20,000 కోట్ల రాబడి తగ్గుతుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇది నాణానికి ఒకవైపు చూపటమే. రెండోవైపు చూస్తే 2014-15లో కేంద్రానికి చమురు రంగం నుంచి వచ్చిన వివిధ రకాల రాబడి రు.1,26,025 కోట్లు కాగా 2020-21లో వచ్చిన మొత్తం రు.4,19,884 కోట్లకు పెరిగింది. అంటే జనాల నుంచి ఎంత గుంజారో వేరే చెప్పనవసరం లేదు. ఈ కాలంలోనే చమురు ధరలు గణనీయంగా తగ్గినా ఆమేరకు జనానికి తగ్గించకపోగా పన్నులు పెంచి చేసిన దోపిడీని ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. వంద పెంచి 50 తగ్గించి చూశారా మా ఘనత అని నమ్మించేందుకు పూనుకున్నారు.


తగ్గింపు మేరకు ఏర్పడిన లోటు పూడ్చుకొనేందుకు అప్పు చేస్తామని నిర్మలమ్మ చెప్పారు. దీనికి కూడా ఆమెను అభినందించాల్సిందే, కేంద్రమే భారం భరిస్తుందని చెప్పలేదు. గతంలో యుపిఏ సర్కార్‌ చమురు సంస్దలకు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తాన్ని నగదుగా చెల్లించలేక కంపెనీలకు బాండ్ల రూపంలో ఇచ్చింది. ఆ మొత్తం రు.1.44లక్షల కోట్లు, దానికి వడ్డీ 70వేల కోట్లు. దాన్ని తప్పుపట్టటమే కాదు, ఆ బాండ్ల భారాన్ని తీర్చేందుకు అదనంగా పన్నులు వేయాల్సివచ్చిందని అప్పుడు చెప్పారు. ఇప్పుడు తగ్గించిన పన్ను మేరకు బాండ్ల ద్వారా అప్పులు చేస్తామని ఆర్దిక మంత్రి చెబుతున్నారు. రెండింటికీ తేడా ఏమిటో ఎవరైనా చెప్పగలరా ? పోనీ నరేంద్రమోడీ పలుకుబడిని చూసి ఇప్పుడు తీసుకొనే అప్పుకు ఎవరైనా వడ్డీ లేకుండా ఇస్తారా ? తాము చేస్తే సంసారం, అదేపని ఇతరులు చేస్తే మరొకటా ? రేపు మరోసారి ఇదే సర్కార్‌ అప్పు తీర్చే పేరుతో మరిన్ని భారాలు మోపదని హామీ ఏమిటి ? పన్ను తగ్గించిన కారణంగా అప్పుతీసుకుంటామని సాకు చెబుతున్నారు. గత ఎనిమిది సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో రుణాలు ఎందుకు తీసుకున్నట్లు ? రుణభారాన్ని అదుపు చేసుకోవాలని మోడీ సర్కార్‌ రాష్ట్రాలను కోరుతున్నది. కానీ తాను చేసిన అప్పుల గురించి ప్రస్తావించటం లేదు. 2021 సెప్టెంబరులో రిజర్వుబాంకు విడుదల చేసిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ అధికారం చేపట్టే నాటికి అంటే 2014 మార్చి ఆఖరుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న దేశీయ రుణం రు.54,84,848కోట్లు, విదేశీ అప్పు రు.3,74,483 కోట్లు మొత్తం రు.58,59,331 కోట్లు. 2022-23 బడ్జెట్‌లో పేర్కొన్నదాని ప్రకారం 2023 మార్చినాటికి దేశీయ రుణం రు.147,48,875కోట్లు, విదేశీ అప్పు రు.4,69,034 కోట్లు మొత్తం రు.152,17,910 కోట్లు అవుతుందని అంచనా. కేంద్రం రాబడి తగ్గితే గతంలో తగ్గించిన కార్పొరేట్‌ పన్నును తిరిగి పెంచాలి. ఏటా పెరుగుతున్న కోటీశ్వరుల నుంచి అదనంగా రాబట్టాలి. వడ్డీ రేట్లు పెంచేందుకు బుర్రను పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం లేదని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారు. అప్పుకూడా అంతేగా, లేకపోతే కొత్తగా నోట్లు ముద్రిస్తారు. దానికీ పెద్దగా ఆలోచించాల్సినపనిలేదు.


ఏప్రిల్‌ ఆరు నుంచి ధరలను స్ధంభింప చేసిన కారణంగా తమకు పెట్రోలు మీద లీటరుకు మే నెల 16వ తేదీ మార్కెట్‌ ప్రకారం రు.13, డీజిల్‌కు రు.24 నష్టం వస్తున్నదని రిలయన్స్‌-బిపి కంపెనీ ప్రతినిధులు తెలిపినట్లు మే 23వ తేదీ ఎకనమిక్స్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. తమకు ప్రతినెలా ఏడువందల కోట్ల మేరకు నష్టం వస్తున్నదని సదరు కంపెనీ చెబుతోంది. వారు చెప్పే అంకెలతో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పీపా ధర 110 డాలర్లకు అటూ ఇటూగా ఉంటున్నది. దేశంలో 83,027 పెట్రోలు బంకులుండగా రిలయన్స్‌-బిపికి 1,459, మరో ప్రయివేటు కంపెనీ నయారా ఎనర్జీకి 6,568 ఉన్నాయి.మిగిలినవన్నీ ప్రభుత్వ రంగ సంస్దలవే. ఏప్రిల్‌ ఆరు తరువాత మన దేశం కొనుగోలు చేసే చమురు ధరలో ఎగుడుదిగుడులున్నాయి. ఏరోజు ధరపెరిగితే ఆమరుసటి రోజు పెంచుతాము లేదా తగ్గితే తగ్గించే విధానం అమలు చేస్తున్నట్లు ప్రతి రోజూ ప్రకటించిన ధరల గురించి తెలిసిందే. మార్చినెల 28న మనం కొనే చమురు పీపా ధర 112 డాలర్లుంది. తరువాత అది వందకు పడిపోయింది, తరువాత పెరిగింది, తగ్గుతోంది, కానీ ఆ మేరకు సవరించకుండా ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి ధరలను స్ధంభింపచేశారు. ఎందుకిలా చేశారో జనానికి చెప్పాలా లేదా ?నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు 58గా ఉన్న రూపాయి విలువ మే 23న 77.66గా దిగజారింది. అంటే ముడి చమురు ధరలు స్ధిరంగా ఉన్నా మన మీద భారం పెరుగుతూనే ఉంటుంది.


ఉజ్వల పధకం కింద గాస్‌ కనెక్షన్లు పొందిన తొమ్మిది కోట్ల మందికి ఏడాదికి గరిష్టంగా పన్నెండు సిలిండర్ల మీద రు.200 సబ్సిడీ ఇస్తున్నట్లు అందుకు గాను ఏడాదికి 6,100 కోట్లు కేంద్రంపై భారం పడుతుందని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అంటే ఒక్కొక్కరికి రు.2,400 అనుకున్నారు. కాని మంత్రి చెప్పిన దాన్ని సగటు లెక్కిస్తే రు.677 మాత్రమే. పెంచిన గాస్‌ ధరలు, గతంలో ఉన్న సబ్సిడీ కోతను చూస్తే ఇది పెద్ద లెక్కలోనిది కాదు. అసలు ఈ పధకం కింద కనెక్షన్‌ పొందిన వారు 2020-21లో 90లక్షల మంది అసలు గాసే తీసుకోలేదు. కోటీ ఎనిమిది లక్షల మంది ఒకసారి తీసుకున్నారని సమాచార హక్కు కింద అడిగిన ఒక ప్రశ్నకు తాము ఇచ్చిన కనెక్షన్ల గురించి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. తమ వద్ద ఈ పధకం కింద 15.96శాతం మంది అసలు గాస్‌ తీసుకోలేదని భారత్‌ పెట్రోలియం,9.175లక్షల మంది తీసుకోలేదని హెచ్‌పి కంపెనీ తెలిపింది. గాస్‌ ధరలను భరించలేని కారణంగా ఉజ్వల పధకం కింద కనెక్షన్‌ పొందిన వారు అసలు తీసుకోవటానికే ముందుకు రావటం లేదు. లేదా బినామీలకు అప్పగిస్తున్నారు.శ్రీలంక పరిణామాల నుంచి మన జనం ఏమి గ్రహించారో తెలియదు గానీ ఆకాశవాణి బిజెపి నేతలను ప్రత్యేకించి నరేంద్రమోడీని హెచ్చరించినట్లుగా కనిపిస్తోంది.దాని పర్యవసానమే పరిమితంగా మరోసారి పన్ను తగ్గింపు అని ఎందుకు అనుకోకూడదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వసుదేవుడిని అనుసరిస్తున్న అమెరికా జో బైడెన్‌ !

09 Wednesday Mar 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Fuel prices freezing, Joe Biden, NATO allies, Ukraine war, Ukraine-Russia crisis, US, US imperialism, Venezuela


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ లొంగుబాటు సూచనలు, మరోవైపు మంటను మరింత ఎగదోస్తూ అమెరికా, దాని మిత్రదేశాల చర్యలు. రష్యా చమురును అమెరికా దిగుమతి చేసుకోవటంపై జోబైడెన్‌ నిషేధం విధించాడు. బ్రిటన్‌ దాన్ని అనుసరించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో పీపా ధర 139 డాలర్లు తాకి తరువాత తగ్గింది. ఫిబ్రవరి 24న యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ధర ఒక్క రోజు కూడా నిలకడగా లేదు. మార్చి 9వ తేదీన 121.5 డాలర్లుగా ఉంది. తమ ఇంధనంపై ఆంక్షలు విధిస్తే మూడువందల డాలర్లకు పెరగవచ్చని రష్యా హెచ్చరిక. మరోవైపున వెనెజులా చమురుపై ఆంక్షల ఎత్తివేత ఆలోచనల్లో అమెరికా. తమపై ఆంక్షలను ఎత్తివేసినా లేకున్నా రష్యాకు ఇచ్చే మద్దతుపై వెనక్కు తగ్గేదేలే అంటున్న వెనెజులా.


రష్యా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సామాజిక ఐక్యత కుప్పకూలుతుందని జర్మనీ హెచ్చరించింది. తాము ఆంక్షలను వ్యతిరేకిస్తామని కూడా జర్మనీ మంత్రి రాబర్ట్‌ హాబెక్‌ చెప్పాడు. సరఫరాలు తగ్గటం సామాజిక ఐక్యతకు ముప్పు తెస్తుందని కూడా అన్నాడు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది ఇంతకు మించి కొత్తగా చేసేదేమీ లేదని తదుపరి చర్యల గురించి మరొక మంత్రి క్రిస్టియన్‌ లెండర్‌ స్పష్టం చేశాడు. ఆంక్షల నుంచి రష్యన్‌ ఇంధన సరఫరాలను కావాలనే ఐరోపా మినహాయించింది, ఈ క్షణంలో మరోమార్గంలో ఇంధన సరఫరాకు అవకాశం లేదని జర్మన్‌ ఛాన్సల్‌ ష్కోల్జ్‌ చెప్పాడు. ఈ కారణంగానే బైడెన్‌ ఐరోపాతో నిమిత్తం లేకుండా తమ దేశానికి మాత్రమే వర్తించే నిషేధాన్ని ప్రకటించాడు. ఐరోపాయునియన్‌ నుంచి విడిపోయిన బ్రిటన్‌ వేరుగా నిషేధాన్ని ప్రకటించింది.రష్యా ఇంధనంపై ఆంక్షలు విధించటాన్ని తాము సమర్ధించటం లేదని హంగరీ ఆర్ధిక మంత్రి ప్రకటించారు.అమెరికా, సౌదీ అరేబియా తరువాత చమురు ఉత్పత్తిలో రష్యా మూడవ స్ధానంలో ఉంది. దాని ఎగుమతుల్లో 60శాతం ఐరోపా ఆర్ధిక సహకార మరియు అభివృద్ధి సంస్ధ(ఓయిసిడి) దేశాలకే చేస్తున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటే వెంటనే జరిగేది కాదు. ఇటలీ గాస్‌ దిగుమతుల నిలిపివేతకు రెండున్నర సంవత్సరాలు పట్టింది. గతేడాది ఐరోపా యూనియన్‌ తన అవసరాల్లో 45శాతం రష్యానుంచి దిగుమతి చేసుకుంది.రష్యా ప్రతి రోజు 50లక్షల పీపాలు ఎగుమతి చేస్తుండగా దానిలో సగం ఐరోపాకే వెళుతుంది.


నోర్డ్‌ స్ట్ర్రీమ్‌ ఒకటి ద్వారా సరఫరా అవుతున్న తమ ఇంధనంపై నిషేధం విధిస్తే చమురు ధరలు మూడువందల డాలర్ల వరకు పెరగవచ్చని రష్యా ఉపప్రధాని నోవాక్‌ హెచ్చరించాడు. రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నవాటిలో ముడిచమురు కంటే దానిఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయి. అందువలన నిషేధం ద్వారా ప్రచార వత్తిడి తప్ప పెద్ద ప్రభావం చూపదన్నది స్పష్టం. అమెరికా తన అవసరాల్లో రష్యా నుంచి ఎనిమిదిశాతం దిగుమతి చేసుకుంటుండగా దానిలో మూడుశాతం మాత్రమే ముడిచమురు, మిగిలినవి చమురు ఉత్పత్తులు. పశ్చిమ దేశాలు తమ మీద విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు ధరలు పెరుగుతున్నందున అమెరికా, ఐరోపా దేశాలు కూడా వాటి ప్రతికూల పర్యవసాలను అనుభవించాల్సి ఉంటుంది. రష్యన్‌ చమురుపై నిషేధం విధిస్తే సరఫరా తగ్గి పీపా ధర 200 డాలర్లకు పెరగవచ్చని బాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు.


వసుదేవుడంతటి వాడే అవసరం తనది గనుక గాడిద కాళ్లను పట్టుకొనేందుకు సిద్ద పడిన కథ తెలిసిందే. ఇప్పుడు అమెరికా అదే చేస్తోంది.రష్యాను దెబ్బతీసేందుకు గతంలో తాను వ్యతిరేకించిన, తిట్టిపోసిన దేశాలతో ఇప్పుడు చమురు అమ్ముతారా అంటూ తెరవెనుక సంప్రదింపులు జరుపుతోంది. దీని వెనుక రెండు కారణాలున్నాయి. ఐరోపా, ఇతర ప్రాంతాల్లోని తన మిత్రరాజ్యాల ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా చూడటం, చమురు ధరలు మరింత పెరిగితే యురోపియన్లలో అమెరికా పట్ల ప్రతికూలత పెరుగుతుంది. తన ఆర్ధిక వ్యవస్ధకు సైతం తలెత్తే ముప్పు నివారణ అవసరం. లేనట్లయితే ఇంటా బయటా ప్రతికూల పరిస్ధితులు బైడెన్‌కు ఎదురవుతాయి.అందువల్లనే అమెరికా ప్రతినిధులు గతవారంలో వెనెజులాను సందర్శించి చమురు సరఫరా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకొని చమురు ఆంక్షలను ఎత్తివేసేందుకు సంసిద్దతను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉత్పత్తిని పెంచమని కోరేందుకు బైడెన్‌ స్వయంగా సౌదీ అరేబియాను సందర్శించవచ్చని వార్తలు వచ్చాయి. రష్యాపై విధించిన ఆంక్షలను సొమ్ము చేసుకొనేందుకు ఉత్పత్తి పెంచాలన్న సూచనలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు సౌదీ అందుకు సముఖత చూపలేదు. గతంలో రష్యాతో వచ్చిన అవగాహనకే కట్టుబడి ఉంటామని చెబుతోంది. అణు ఒప్పందం గురించి ఇరాన్‌తో రాజీకి వచ్చి ఆంక్షలు వెనక్కు తీసుకుంటే అక్కడి నుంచి కూడా సరఫరా పెరుగుతుంది.యుద్దం ప్రారంభమైన తరువాత అమెరికా ఒక మెట్టు దిగుతున్నట్లుగానే ఈ పరిణామాలను చూడవచ్చు. జర్నలిస్టు ఖషోగ్గీ హత్య తరువాత సౌదీ-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. సౌదీ రాజును హంతకుడని బైడెన్‌ వర్ణించాడు. ఇప్పుడు చమురు ఉత్పత్తి పెంచాలని కోరుతున్నాడు. వారి సమావేశం జరుగుతుందా లేదా అన్నది సందేహమే. తాలిబాన్లతోనే ఒప్పందం చేసుకున్నపుడు సౌదీతో సయోధ్య కుదుర్చుకోవటంలో ఆశ్చర్యం ఉండదు. చమురు ధరలు తగ్గటం ప్రతివారికీ ప్రయోజనకరమే నంటూ అధికారులు చర్చలు జరుపుతున్నారు గానీ, బైడెన్‌ పర్యటన గురించి ఇప్పటికైతే ఖరారు కాలేదని పత్రికా కార్యదర్శి జెస్‌ సాకీ చెప్పారు. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?


అనేక సంవత్సరాల తరువాత ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు వెనెజులా రాజధాని కారకాస్‌ వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను గద్దె దించేందుకు కుట్రపన్నినందుకు గాను 2017లో అమెరికా ఇంధన అధికారులను అరెస్టు చేశారు. 2019లో ఆంక్షలతో పాటు, కారకాస్‌లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. తమ వారిని వదలిపెట్టాలని కోరటంతో పాటు చమురు ఎగుమతి గురించి చర్చలు ప్రారంభించారు. అధికారులు వెళ్లటానికి ఒక రోజు ముందు వెనెజులాలో పెట్టుబడులు పెట్టిన రష్యా వ్యాపారి ఉస్మనోవ్‌ వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు తొలగించలేదు గానీ కంపెనీ లావాదేవీలు జరిపేందుకు అమెరికా ఆర్ధికశాఖ సాధారణ అనుమతి మంజూరు చేసింది. అతను పుతిన్‌ మద్దతుదారు. ఇది వెనెజులా పట్ల ఒక సానుకూల వైఖరి. దీనికి ప్రతిగా ఇద్దరు అమెరికన్లను వెనెజులా విడుదల చేసింది. బైడెన్‌ వైఖరి మార్చుకోవటాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ ఎంపీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారితో కొందరు డెమోక్రాట్లు కూడా గొంతు కలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు మదురో బహిరంగంగానే మద్దతు పలికాడు. ఇంతకాలం వెనెజులాను వ్యతిరేకించిన అమెరికా తన మాటలను తానే ఖండించుకున్నట్లయింది. దీంతో మదురో మరింత బలపడతారని, వ్యతిరేకుల నడుంవిరిచినట్లవుతుందని కొందరు వాపోతున్నారు.


చమురు ధరలు పెరగటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని అమెరికాలో వాటాదార్లతో నిమిత్తం లేకుండా కుటుంబ సంస్ధలుగా ఉన్న కొన్ని చిన్న షేల్‌ ఆయిల్‌ కంపెనీలు ఉత్పత్తికి సిద్దం అవుతున్నాయి.నూటపది డాలర్లుంటే తమకు గిట్టుబాటు అవుతుందని అంటున్నాయి. పెరుగుదల ఎంత కాలం ఉంటుందో తెలీని స్ధితిలో బడా కంపెనీలు ఉత్పత్తికి సిద్దం కావటం లేదు. కరోనా కారణంగా ఆ కంపెనీల్లో మదుపు చేసిన వారికి చేతులు కాలటంతో ఆచితూచి స్పందిస్తున్నాయి.


మన దేశంలో నవంబరు నాలుగవ తేదీ నుంచి స్ధంభింపచేసిన చమురు ధరలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏ రోజైనా తిరిగి సవరించే అవకాశం ఉంది. దీని గురించి ప్రభుత్వం రెండు నాలుకలతో మాట్లాడుతోంది. చమురు ధరలను నిర్ణయించేది చమురు కంపెనీలు తప్ప ప్రభుత్వం కాదని, అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి తగ్గటం, పెరగటం ఉంటుందని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన ధరల గురించి నిర్ణయం తీసుకుంటామని చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు విలేకర్లతో చెప్పారు. నవంబరు నుంచి ధరల స్ధంభనతో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు లేదని కూడా చెప్పారు. రోజువారీ ధరల సవరణ చేసే కంపెనీలు గతంలో ఎన్నికల తరుణంలో, తాజాగా నవంబరు నాలుగునుంచి ఎందుకు స్ధంభింపచేసినట్లో ఇంతవరకు ప్రకటించలేదు.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దడ పుట్టిస్తున్న చమురు ధరలు – నరేంద్రమోడీ జనం గురించి పట్టించుకుంటారా ?

03 Thursday Mar 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, crude oil price, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గురువారం నాడు మరో మెట్టు ఎక్కాయి. ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం పీపా ధర 116.94 డాలర్లను తాకింది. వ్యూహాత్మక నిల్వల నుంచి 60మిలియన్ల పీపాల చమురును మార్కెట్లోకి విడుదల చేయాలని అంతర్జాతీ ఇంధన సంస్ధ(ఐఇఏ) మంత్రుల సమావేశం ప్రకటించిన తరువాత కూడా మార్కెట్లో ధరలు పెరిగాయి. ఈ మొత్తంలో తాము 30మిలియన్ల పీపాలు విడుదల చేస్తామని అమెరికా పేర్కొన్నది. అరవై మిలియన్ల పీపాలు ఐఇఏలోని 31 దేశాల నిల్వల్లో నాలుగుశాతం. ఈ దేశాల్లో 1.5బిలియన్ల పీపాలు ఉంటే ఒక్క అమెరికాలోనే 600మి. పీపాలుంది. మార్కెట్‌ ఇబ్బందుల్లో పడిన ప్రతికూల సందేశాన్ని సందేశాన్ని ఈ నిర్ణయం పంపిందని, అరవై మిలియన్లన్నది చమురు పీపాలో ఒకబొట్టు వంటిదని, ప్రపంచంలో ఒక రోజుకు అవసరమైన 100మి. పీపాల గిరాకీ కంటే తక్కువంటూ ఇది చమురు ధరలపై ప్రభావం ఎలా చూపుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆంక్షల కారణంగా మార్కెట్లోకి రష్యానుంచి రోజుకు ఏడు మిలియన్‌ పీపాల సరఫరా నిలిచిపోనుంది. ఆంక్షలున్నప్పటికీ తమ కొనుగోళ్లు కొనసాగుతూనే ఉంటాయని చైనా ప్రకటించింది. గోధుమల దిగుమతులపై గతంలో ఉన్న పరిమితులను కూడా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.


ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో నిమిత్తం లేకుండానే అమెరికాలో నాలుగుదశాబ్దాల రికార్డు స్ధాయిలో 7.5శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇప్పుడు చమురు ధరల పెరుగుదల తోడైంది. కొందరి అంచనా ప్రకారం 125 డాలర్లకు పెరిగితే అమెరికా ఏకంగా మాంద్యంలోకి దిగజారుతుంది. ఐరోపా దేశాలకు చమురు, గాస్‌ అవసరం కనుక రష్యా నుంచి వాటి ఎగుమతులపై ఆంక్షలను మినహాయించారు, లేనట్లయితే ఐరోపాలో మరోరకం సంక్షోభం తలెత్తి ఉండేది.ఐరోపా దేశాలు మరిన్ని ఆంక్షలను విధించినట్లయితే తనకు మరింత నష్టమైనా రష్యా చమురు, గాస్‌ నిలిపివేత అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. ఈ కారణంగానే స్విఫ్ట్‌( అంతర్జాతీయ బాంకు లావాదేవీల వ్యవస్ధ) నుంచి ఏడు రష్యన్‌ బాంకులకు ఆంక్షల నుంచి పశ్చిమ దేశాలు మినహాయింపునిచ్చాయి. ఉక్రెయిన్‌ వివాదం వలన ఇంధన ధరలు పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారితీసి అమెరికా ఆర్ధిక పురోగతి, పౌరుల ఖర్చు తగ్గేందుకు దారి తీస్తుందని రిచ్‌మండ్‌ ఫెడరల్‌ రిజర్వు అధ్యక్షుడు టామ్‌ బార్కింగ్‌ హెచ్చరించాడు.ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ సగటున చమురు ధరలు వంద డాలర్లు ఉంటే అమెరికా ఆర్ధిక రంగం ఆరునెలల పాటు నిభాయించుకోగలదని, 125 డాలర్లకు పెరిగితే నిరుద్యోగం పెరుగుతుందని, వృద్ధి ఆగుతుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జో బైడెన్‌ సైతం ఉక్రెయిన్‌ వివాదానికి అమెరికన్లు మూల్యం చెల్లించాల్సి రావచ్చని చెప్పిన అంశం తెలిసిందే.ఐరోపాలో గాస్‌ ధరలు 60శాతం పెరిగాయి. చలికాలంలో మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. రష్యాకు వెసులుబాటు కల్పించేందుకు ఇరు దేశాల మధ్య తమ కరెన్సీలో చెల్లింపులకు చైనా ఏర్పాట్లు చేసింది.ఈ అనుభవం భవిష్యత్‌లో అంతర్జాతీయ మార్పిడి కరెన్సీగా డాలర్‌ను పక్కకు నెట్టేందుకు కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం డాలర్‌ చెల్లింపులు 40శాతం ఉండగా చైనా కరెన్సీ రెన్‌మిన్‌బీ(యువాన్‌) రెండుశాతం జరుగుతున్నాయి.


2022-23 ఆర్ధిక సంవత్సరంలో ముడి చమురు పీపా ధర 70-75 డాలర్ల మధ్య ఉంటుందనే అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. మార్చి నెలాఖరుతో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంపై పెరిగిన చమురు ధరలు ప్రభావం చూపటం ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పెట్రోలు, డీజిలుపై సెస్‌లను ఐదు, పది చొప్పున తగ్గించటంతో పాటు నవంబరు నాలుగవ తేదీ నుంచి వాటి ధరలను స్ధంభింప చేశారు.ఈ నెల ఏడవ తేదీన చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత నుంచి చమురు ధరలు పెరగటం ఖాయం. రానున్న రోజుల్లో జిడిపి వృద్ధి తగ్గటంతో పాటు ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎంకి పెళ్లి సుబ్చి చావుకు వచ్చిందన్నట్లుగా ఉక్రెయిన్‌ – రష్యా వివాదంతో మనకు ప్రమేయం లేనప్పటికీ దాని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తోంది. మన దిగుమతుల బిల్లు తడిచి మోపెడు అవుతోంది.దీంతో మన కరెంటు ఖాతాలోటు పెరుగుతోంది. ముడిచమురు, ఎరువులు, ఖాద్య, ఖనిజతైలాలు, ఇతర దిగుమతుల ధరలు పెరుగుతున్నాయి. దిగుమతుల బిల్లు 2022లో 600బి. డాలర్లు దాటవచ్చని అంచనా. తక్షణం ద్రవ్యోల్బణం, దానితో పాటు వచ్చే ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం జరగవచ్చు. ఒక పీపా ధర ఐదు డాలర్లు పెరిగితే మన కరెంటు ఖాతాలోటు 6.6బి.డాలర్లు పెరుగుతుంది. ముడి చమురు ధర 105 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నప్పటి అంచనాల ప్రకారం మార్చి ఎనిమిది తరువాత చమురు కంపెనీలు పెట్రోలు, డీజిలు ధరలను పది రూపాయల వరకు పెంచవచ్చని అంచనా. ఇప్పుడు 117 డాలర్ల వరకు తాకింది. ఇది ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది. మన ఎగుమతుల మీద కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ఏడాది తొలి ఆరునెలల పాటు చమురు ధరలు వంద డాలర్లకు ఎగువనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తంగా దేశ ప్రగతి నిస్తేజంగా ఉంటుందని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ విశ్లేషకులు చెప్పారు.


జాతీయ గణాంకాల సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) 2021-22లో వృద్ధి రేటు అంతకు ముందు సంవత్సరంలోని 7.3శాతం తిరోగమనాన్ని అధిగమించి 9.2శాతం పురోగమనం ఉంటుందని అంచనా వేసింది. తాజాగా తొమ్మిది నెలల తరువాత దాన్ని8.9శాతానికి తగ్గించింది. తొలి మూడు మాసాల్లో 20.3 శాతంవృద్ధి కాస్తా రెండవ త్రైమాసికంలో 8.4శాతానికి తగ్గింది.తదుపరి మూడు నెలల్లో 5.4శాతంగా ఉందని అంచనా వేశారు. చమురు ధరల పెరుగుదల గణనీయంగా ఉన్న జనవరి-మార్చి నెలల గణాంకాలు వెల్లడైతే స్పష్టమైన అంచనాలు తెలుస్తాయి. ఈ వృద్ధి కూడా గతేడాది తగ్గిన దాని ప్రాతిపదికన చెబుతున్న లెక్క కనుక వాస్తవ వృద్ధి రేటు అంత ఉండదు. అందుకే గతంలో ఉన్న జిడిపి స్దాయికి చేరాలంటే దీర్ఘకాలం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తక్కువగా ఉంచినప్పటికీ వృద్ది రేటు ఆందోళనకరంగా ఉంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగేట్లయితే వడ్డీ రేట్లు పెరుగుతాయి, అది మరొక సమస్యకు దారి తీస్తుంది.


వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ప్రాతిపదికన ద్రవ్యోల్బణం ఆరుశాతం వరకు మనం భరించగలమని రిజర్వుబాంకు అన్నది. అంటే ఆ మేరకు ధరలు పెరుగుతాయని సిద్దంకమ్మని జనానికి చెప్పింది.డిసెంబరులో 5.59శాతం ఉన్నది జనవరిలో 6.01శాతానికి పెరిగింది. ఇదే తరుణంలో టోకు ధరల ద్రవ్యోల్బణం దాదాపు 13శాతంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక కూడా పదినెలల కనిష్టానికి పడిపోయింది. మన దేశంలో ప్రయివేటు వినియోగం 55శాతం ఉంది. ఇది కరోనాకు ముందున్న స్దాయికంటే తక్కువే. కరోనా మహమ్మారి జనాల పొదుపు మొత్తాలను, గణనీయంగా వేతనాలను హరించివేసినందున వినియోగం బలహీనంగా ఉంది. పులిమీద పుట్రలా దీనికి ఉక్రెయిన్‌ వివాదం మరింత ముప్పు తెచ్చింది. జనంపై పెరిగే భారాల గురించి ఏం చేద్దామన్న అంశాన్ని చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ పూనుకున్నారని గానీ, సమీక్షలు జరిపినట్లుగా ఎక్కడా వార్తలు లేవు. చేతులు కాలిన తరువాత ఆకలు పట్టుకున్నట్లు ఆపరేషన్‌ గంగ పేరుతో ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన మన విద్యార్దుల గురించి ఎక్కడలేని శ్రద్ద చూపుతున్నట్లు సమావేశాల మీద సమావేశాలు జరుపుతున్నట్లు ప్రకటిస్తున్నారు, మంచిదే, ఇవాళా రేపట్లో అది కూడా పూర్తి అవుతుంది. తరువాతనైనా జనం గురించి పట్టించుకుంటారా ?చమురు ధరలు తగ్గితే ఆ మేరకు జనానికి ఉపశమనం కలిగించకుండా వందల రెట్లు పన్ను, సెస్‌లు పెంచి ఖజానా నింపుకొనేందుకు చూపిన వేగం ఇప్పుడు చమురు ధరలు పెరుగుతుంటే భారం తగ్గించేందుకు కనపరచరేం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపికి చమురు సెగ : ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం – చమురుపై మూడేండ్లు పన్నులు పెంచం !

09 Wednesday Feb 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


బిజెపికి చమురు సెగ తగిలింది. తమను గెలిపిస్తే ఏడాదికి ప్రతి ఇంటికి మూడు గాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మూడు సంవత్సరాల పాటు చమురుపై పన్నులు పెంచబోమని గోవా బిజెపి ఓటర్లకు వాగ్దానం చేసింది. తమను గెలిపిస్తే లీటరు పెట్రోలు ధర రు.80కి మించి పెరగనివ్వం అని వాగ్దానం చేసింది.దీని మీద బిజెపి మానిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ త్వరలో వాహనాలకు అమర్చే ఇంజన్లను ఇథనాల్‌తో నడిపించవచ్చని, అది లీటరు ధర రు.62కు మించదని, అందువలన కాంగ్రెస్‌ రు.80 పరిమితి విధించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. అంతపరమ రహస్యం తెలిసిన పెద్దలు తామే ఆ ముక్క వాగ్దానంగా చెప్పవచ్చు, అంత సంతోషకరమైన వార్తను కేంద్రమే ఒక ప్రకటనగా చేయవచ్చు. ఇంక బిజెపి పెద్దలు గోవాలో అమెరికా ప్రమాణాలతో కూడిన రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా సెలవిచ్చారు.


అమెరికా – ఇరాన్‌ మధ్య అణుచర్చలు జరుగుతాయనే వార్తలు రాగానే ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి.సఫలమైతే మరికొంత తగ్గవచ్చు, విఫలమైతే పెరగవచ్చు. అంటే అమెరికా చర్యలు అంతర్జాతీయ మార్కెట్‌ మీద ప్రభావం చూపుతున్నాయి. అనేక దేశాలు అణు పరీక్షలు జరుపుతున్నా అమెరికాకు పెద్దగా పట్టదు, అదే ఇరాన్‌ జరిపితే దానికి నొప్పి ఏమిటి ? ఏ దేశాన్నీ ప్రశాంతంగా ఉండనివ్వదా ? దాని రాజకీయం, లబ్ది కోసం ప్రపంచమంతా బలి కావాలా ? అలాంటి అమెరికా తోకపట్టుకొని మనం పోవాలా ?


గత ఏడు సంవత్సరాలలో తొలిసారిగా ఫిబ్రవరి ఏడున బ్రెంట్‌ రకం ముడిచమురు 94 డాలర్లను తాకింది(దానికి ఒక డాలరు తక్కువగా మన దేశం దిగుమతి చేసుకొనే చమురు ధర ఉంటుంది) అమెరికా-ఇరాన్‌ పరోక్షంగా చర్చలను ప్రారంభించనున్నాయి.దీంతో బుధవారం నాడు 90.6 డాలర్ల వద్ద మార్కెట్‌ ఉంది. గతంలో అంగీకరించిన ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగిన కారణంగా తాను అణు కార్యక్రమాన్ని పునరుద్దరిస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. దాన్ని సాకుగా తీసుకొని మన దేశంతో సహా ఎవరూ ఇరాన్‌ చమురు కొనుగోలు చేయకూడని అమెరికా ఆంక్షలు విధించింది. ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు మనం తలొగ్గి మిత్రదేశమైన ఇరాన్‌ నుంచి చమురుకొనుగోలు నిలిపివేశాము. ఇరాన్‌పై కొన్ని ఆంక్షలను అమెరికా తొలగించటంతో ధరలు పరిమితంగా తగ్గాయి. చమురుకు డిమాండ్‌ పెరుగుతున్నందున ఇది తాత్కాలికమే అని చెబుతున్నారు.


గతంలో ఆసియా దేశాలకు సరఫరా చేసే చమురు ధరలను సౌదీ అరేబియా స్వల్పంగా తగ్గించినపుడు చూశారా నరేంద్రమోడీ పలుకుబడి అంటూ డబ్బాకొట్టారు. ఇప్పుడు ధరలను పెంచుతున్నట్లు సౌదీ ప్రకటించింది. నోరు మూతపడింది. నిజానికి గతంలో కూడా ఒక్క మన దేశానికే కాదు, ఇతర ఆసియా దేశాలకూ తగ్గించింది. ఇప్పుడు గిరాకీ ఉంది కనుక ఎంతైనా కొనుగోలు చేయక తప్పదు. వెనెజులా కూడా మనకు మిత్రదేశమే.దాని దాడికి దిగిన అమెరికా ఆంక్షల కారణంగా అక్కడి నుంచి కూడా మనం చమురు కొనుగోలు నిలిపివేశాము. పేరుకు స్వతంత్ర దేశం ఆచరణలో అమెరికా అడుగులకు మడుగులొత్తటం.వెనెజులా బదులు మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇప్పుడు దానికి మెక్సికో కోత పెట్టింది.గతేడాది రోజుకు 98వేల పీపాలను దిగుమతి చేసుకోగా ఈ ఏడాది తొలి రెండు నెలల్లో దాన్ని 15వేలకు తగ్గించారు. దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే విధానంలో భాగంగా ఈ చర్యతీసుకున్నట్లు చెబుతున్నారు. మనకు చమురును విక్రయించే దేశాలు సమంజసమైన ధరలకు చమురు సరఫరా చేయాలని కోరుతున్నట్లు మన చమురుశాఖ సహాయ మంత్రి రామేశ్వర తేలి ఫిబ్రవరి ఏడున రాజ్యసభలో చెప్పారు. గతంలో ఇరాన్‌ మనకు రవాణా రాయితీతో పాటు, ప్రపంచంలో ఎక్కడా చెల్లని మన రూపాయిలను తీసుకొనేందుకు కూడా ఇరాన్‌ వీలు కల్పించింది. ఇప్పుడు దానితో పరోక్షంగా వైరం తెచ్చుకున్నాం. జర కాస్త చూసి ధరవేసుకోండి అంటూ ఇతర దేశాలను బతిమాలుకుంటున్నాం.

మనం దిగుమతి చేసుకొనే చమురు ధర డిసెంబరు ఒకటిన 71.32 డాలర్లు ఉండగా జనవరి 31న 89.41డాలర్లని మరోమంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. ఇంత పెరుగుదల ఉన్నప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా పెట్రోలు, డీజిలు ధరలను పెంచకుండా నిలిపివేశారు.ఎన్నికలు ముగియగానే ఈ మొత్తాలను వసూలు చేసే విధంగా ధరలను పెంచనున్నారు.
అనేక దేశాల్లో చమురు ధరల పెరుగుల సెగతగలటం ప్రారంభమైంది.ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కనిపిస్తోంది.న్యూజిలాండ్‌లో ఏడాది కాలంలో 30శాతం చమురు ధరలు పెరిగాయి.ద్రవ్యోల్బణం 5.9శాతానికి పెరగటంలో చమురు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. కాలుష్యనివారణలో భాగంగా పెట్రోలు మీద లీటరుకు ఎనిమిది నుంచి 16సెంట్ల వరకు పన్ను విధిస్తున్నారు. ఐరోపా యునియన్‌ దేశాల్లో జీవన వ్యయం పెరిగిపోతోంది. దాంతో జనం పొదుపు చర్యలకు పూనుకున్నారు. దానికి పెట్రోలు టూరిజం అని ముద్దుపేరు పెట్టారు. తన జనం మీద భారం తగ్గించాలని పోలెండ్‌ సర్కార్‌ చమురు, గాస్‌ మీద పన్ను తగ్గించింది. దాంతో లీటరుకు 25 నుంచి 35సెంట్ల భారం తగ్గింది. ఐతే ఈ చర్య ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇరుగుపొరుగుదేశాలైన హంగరీ, జర్మనీ, స్లోవేకియా, చెక్‌ తదితర దేశాల వారందరూ పెద్ద కాన్లతో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశంలో కొరత ఏర్పడింది. ఎవరూ 60లీటర్ల కాన్లు నాలుగుకు మించి విడిగా తీసుకుపోకూడదంటూ రోడ్ల మీద తనిఖీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.స్లోవాక్‌లు సరిహద్దుదాటి వచ్చి 50లీటర్ల కారు టాంకు నింపుకుంటే దూరాన్ని బట్టి 10 నుంచి 18 యురోలు మిగుల్చుకుంటున్నారు. పోలెండ్‌లో ఇతర సరకులపై కూడా పన్ను తగ్గించటంతో పెట్రోలు, డీజిలుతో పాటు సరకులను కూడాకొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. అనేక చోట్ల చమురు, గాస్‌ బంకులు సరఫరా లేక మూసివేస్తున్నారు. పోలెండ్‌తో ఇతర దేశాల్లోని సరిహద్దు సమీప బంకుల వారు పెట్రోలు టూరిజంతో భారీగా నష్టపోతున్నారు. వారి వద్ద కొనుగోలు చేసే వారు లేకుండా పోయారు.(మన దేశంలో ఢిల్లీ చుట్టూ ఉన్న హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాలు పన్ను తగ్గించటంతో ఢిల్లీ పరిధిలోని బంకులకూ అదే పరిస్దితి ఎదురైంది. ఢిల్లీ నుంచి సమీపంలోని రాష్ట్రాల బంకుల్లో కొనుగోలు లేదా ఇతర మార్గాల్లో సమకూర్చుకోవటంతో కేజరీవాల్‌ కూడా పన్ను తగ్గించాల్సి వచ్చింది)


చమురు, గాస్‌, విద్యుత్‌ ధరల పెరుగుదల ఐరోపా దేశాల పర్యాటక రంగం మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.బ్రిటన్‌లో ఏప్రిల్‌ నాటికి 54శాతం వరకు ఇంధన బిల్లులు పెరగవచ్చని అంచనా. కార్లలో విహార యాత్రలకు వచ్చే కుటుంబాలకు ఒక టాంకు పెట్రోలు నింపుకునేందుకు గతంలో 60యురోలు చెల్లించాల్సి వస్తే ఇప్పుడు 85కు పెరిగాయి, అందువలన ప్రయాణ దూరాలపై కూడా పరిమితులు విధించుకుంటున్నారు. మార్చి ఏడవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని చివరి దశ ఎన్నికలు ముగుస్తాయి, ఆ మరుసటి రోజునుంచే ధరల పెరుగుదల ప్రారంభం కానుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి ఎన్నికల లబ్దికే చమురు ధరల స్ధంభన – మార్చి ఏడు తరువాత బాదుడే బాదుడు !

19 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రకటిత విధానాలను తుంగలో తొక్కటంలో కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీల వారి గురించి ఎవరికీ తేడా లేదు. మాది మిగతా పార్టీలకు భిన్నం అని చెప్పుకున్న బిజెపిని ఏర్పాటు చేసింది ఆర్‌ఎస్‌ఎస్‌, కనుక అనేక మంది అది నిజమే అనుకున్నారు. క్రమంగా మా మీద అలాంటి భ్రమలేవీ పెట్టుకోవద్దని బిజెపి తన చర్యల ద్వారా పదే పదే జనాలకు చెబుతోంది. దానికి తాజా ఉదాహరణే చమురు ధరల స్ధంభన.


నవంబరు నాలుగవ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు దేశంలో చమురు ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. తరువాత కూడా మార్చి ఏడవ తేదీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ చివరి దశ ముగిసేవరకు ఇదే స్ధితి కొనసాగుతుంది. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్నది పీపా ధర నెల సగటున 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగినా ధర ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర(రు.91.17) ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గింది 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు అన్నది స్పష్టం.


ఇప్పుడు జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. బిజెపి పాలిత రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. జరుగుతున్నదేమిటి ? అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో 28 సార్లు సవరించారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌( పిపిఎసి) సమాచారం ప్రకారం సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 27వరకు సగటున పీపా ముడి చమురు దిగుమతి ధర 81.54 డాలర్లు, అక్టోబరు 28 నుంచి నవంబరు 26వరకు 81.51 కాగా నవంబరు 27 నుంచి డిసెంబరు 29వరకు 72.93 డాలర్లకు తగ్గింది. దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నవంబరు నాలుగవ తేదీ నుంచి ఇది రాసిన జనవరి 20వరకు 75 రోజులుగా తమ ధరలను ఎందుకు సవరించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం ఏమైంది ? పాలకులు కంపెనీలను ఎందుకు ప్రశ్నించటం లేదు ? సమాధానం చెప్పే జవాబుదారీ తనం ఉందా ? అసలు కథేమిటి ?


అక్టోబరు 25న గరిష్టంగా మన ముడి చమురు కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. డిసెంబరు సగటు ధర ముందే చెప్పుకున్నట్లు 72.93 డాలర్లు. చంబల్‌ బందిపోట్లు ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం ఎవరినీ వదలటం లేదు, అంతకంటే పెద్ద దోపిడీ సాగుతోందా లేదా ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు కొన్ని తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ?


ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా బిజెపికి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి. దీని వలన ఇతర సరకుల ధరలు కూడా తాత్కాలికంగా కొంత మేరకు అదుపులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఆమేరకు జనానికి తగ్గించలేదు. డిసెంబరు ఐదు నుంచి ముడి చమురు ధరలు మనం దిగుమతి చేసుకొనేది జనవరి 18వరకు 69.52 డాలర్ల నుంచి 87.03పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలో ఇది సరికొత్త రికార్డు. జనవరి 20వ తేదీన బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 88.68 డాలర్లకు చేరింది, త్వరలో వంద డాలర్లకు చేరవచ్చని అంచనా.


అక్టోబరు 25న మన దిగుమతి రకం 84.77 డాలర్లు ఒక రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఐనా ధరలు పెంచలేదు.మార్చి ఏడవ తేదీన ఎన్నికల చివరి దశ ముగుస్తుంది. అంటే ఆ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా అప్పటి వరకు ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయి. ఆ తరువాతే అసలు కథ మొదలౌతుంది. నవంబరు 4- మార్చి ఏడవ తేదీ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఉందనుకోండి, ఆమేరకు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. ఈ లోగా బిజెపి తన ప్రచారం తాను చేసుకుంటుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేసింది. రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. పరోక్షంగా అవీ తగ్గించినట్లే. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఏదో ఒక రూపంలో కేంద్రం సొమ్ము ముట్టచెబుతుంది.


ఢిల్లీ చుట్టూ హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి బంకుల్లో ధరలు తక్కువగా ఉన్నపుడు ఢిల్లీ వాహనదారులందరూ కొద్ది కిలోమీటర్లు వెళ్లి అక్కడే కొనుగోలు చేస్తారు. అది బంకుల వారికి, ఢిల్లీ ప్రభుత్వానికి నష్టమే కనుక కొద్ది రోజు తరువాత ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెచ్చారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో సెస్‌ను సవరించిన కారణంగా రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది. కేంద్రం తగ్గించిన ఐదు, పది వలన కేంద్రానికి ఆదాయం ఎంత తగ్గిందన్నది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d