• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: US imperialism

వసుదేవుడిని అనుసరిస్తున్న అమెరికా జో బైడెన్‌ !

09 Wednesday Mar 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Fuel prices freezing, Joe Biden, NATO allies, Ukraine war, Ukraine-Russia crisis, US, US imperialism, Venezuela


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ లొంగుబాటు సూచనలు, మరోవైపు మంటను మరింత ఎగదోస్తూ అమెరికా, దాని మిత్రదేశాల చర్యలు. రష్యా చమురును అమెరికా దిగుమతి చేసుకోవటంపై జోబైడెన్‌ నిషేధం విధించాడు. బ్రిటన్‌ దాన్ని అనుసరించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో పీపా ధర 139 డాలర్లు తాకి తరువాత తగ్గింది. ఫిబ్రవరి 24న యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ధర ఒక్క రోజు కూడా నిలకడగా లేదు. మార్చి 9వ తేదీన 121.5 డాలర్లుగా ఉంది. తమ ఇంధనంపై ఆంక్షలు విధిస్తే మూడువందల డాలర్లకు పెరగవచ్చని రష్యా హెచ్చరిక. మరోవైపున వెనెజులా చమురుపై ఆంక్షల ఎత్తివేత ఆలోచనల్లో అమెరికా. తమపై ఆంక్షలను ఎత్తివేసినా లేకున్నా రష్యాకు ఇచ్చే మద్దతుపై వెనక్కు తగ్గేదేలే అంటున్న వెనెజులా.


రష్యా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సామాజిక ఐక్యత కుప్పకూలుతుందని జర్మనీ హెచ్చరించింది. తాము ఆంక్షలను వ్యతిరేకిస్తామని కూడా జర్మనీ మంత్రి రాబర్ట్‌ హాబెక్‌ చెప్పాడు. సరఫరాలు తగ్గటం సామాజిక ఐక్యతకు ముప్పు తెస్తుందని కూడా అన్నాడు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది ఇంతకు మించి కొత్తగా చేసేదేమీ లేదని తదుపరి చర్యల గురించి మరొక మంత్రి క్రిస్టియన్‌ లెండర్‌ స్పష్టం చేశాడు. ఆంక్షల నుంచి రష్యన్‌ ఇంధన సరఫరాలను కావాలనే ఐరోపా మినహాయించింది, ఈ క్షణంలో మరోమార్గంలో ఇంధన సరఫరాకు అవకాశం లేదని జర్మన్‌ ఛాన్సల్‌ ష్కోల్జ్‌ చెప్పాడు. ఈ కారణంగానే బైడెన్‌ ఐరోపాతో నిమిత్తం లేకుండా తమ దేశానికి మాత్రమే వర్తించే నిషేధాన్ని ప్రకటించాడు. ఐరోపాయునియన్‌ నుంచి విడిపోయిన బ్రిటన్‌ వేరుగా నిషేధాన్ని ప్రకటించింది.రష్యా ఇంధనంపై ఆంక్షలు విధించటాన్ని తాము సమర్ధించటం లేదని హంగరీ ఆర్ధిక మంత్రి ప్రకటించారు.అమెరికా, సౌదీ అరేబియా తరువాత చమురు ఉత్పత్తిలో రష్యా మూడవ స్ధానంలో ఉంది. దాని ఎగుమతుల్లో 60శాతం ఐరోపా ఆర్ధిక సహకార మరియు అభివృద్ధి సంస్ధ(ఓయిసిడి) దేశాలకే చేస్తున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటే వెంటనే జరిగేది కాదు. ఇటలీ గాస్‌ దిగుమతుల నిలిపివేతకు రెండున్నర సంవత్సరాలు పట్టింది. గతేడాది ఐరోపా యూనియన్‌ తన అవసరాల్లో 45శాతం రష్యానుంచి దిగుమతి చేసుకుంది.రష్యా ప్రతి రోజు 50లక్షల పీపాలు ఎగుమతి చేస్తుండగా దానిలో సగం ఐరోపాకే వెళుతుంది.


నోర్డ్‌ స్ట్ర్రీమ్‌ ఒకటి ద్వారా సరఫరా అవుతున్న తమ ఇంధనంపై నిషేధం విధిస్తే చమురు ధరలు మూడువందల డాలర్ల వరకు పెరగవచ్చని రష్యా ఉపప్రధాని నోవాక్‌ హెచ్చరించాడు. రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నవాటిలో ముడిచమురు కంటే దానిఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయి. అందువలన నిషేధం ద్వారా ప్రచార వత్తిడి తప్ప పెద్ద ప్రభావం చూపదన్నది స్పష్టం. అమెరికా తన అవసరాల్లో రష్యా నుంచి ఎనిమిదిశాతం దిగుమతి చేసుకుంటుండగా దానిలో మూడుశాతం మాత్రమే ముడిచమురు, మిగిలినవి చమురు ఉత్పత్తులు. పశ్చిమ దేశాలు తమ మీద విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు ధరలు పెరుగుతున్నందున అమెరికా, ఐరోపా దేశాలు కూడా వాటి ప్రతికూల పర్యవసాలను అనుభవించాల్సి ఉంటుంది. రష్యన్‌ చమురుపై నిషేధం విధిస్తే సరఫరా తగ్గి పీపా ధర 200 డాలర్లకు పెరగవచ్చని బాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు.


వసుదేవుడంతటి వాడే అవసరం తనది గనుక గాడిద కాళ్లను పట్టుకొనేందుకు సిద్ద పడిన కథ తెలిసిందే. ఇప్పుడు అమెరికా అదే చేస్తోంది.రష్యాను దెబ్బతీసేందుకు గతంలో తాను వ్యతిరేకించిన, తిట్టిపోసిన దేశాలతో ఇప్పుడు చమురు అమ్ముతారా అంటూ తెరవెనుక సంప్రదింపులు జరుపుతోంది. దీని వెనుక రెండు కారణాలున్నాయి. ఐరోపా, ఇతర ప్రాంతాల్లోని తన మిత్రరాజ్యాల ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా చూడటం, చమురు ధరలు మరింత పెరిగితే యురోపియన్లలో అమెరికా పట్ల ప్రతికూలత పెరుగుతుంది. తన ఆర్ధిక వ్యవస్ధకు సైతం తలెత్తే ముప్పు నివారణ అవసరం. లేనట్లయితే ఇంటా బయటా ప్రతికూల పరిస్ధితులు బైడెన్‌కు ఎదురవుతాయి.అందువల్లనే అమెరికా ప్రతినిధులు గతవారంలో వెనెజులాను సందర్శించి చమురు సరఫరా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకొని చమురు ఆంక్షలను ఎత్తివేసేందుకు సంసిద్దతను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉత్పత్తిని పెంచమని కోరేందుకు బైడెన్‌ స్వయంగా సౌదీ అరేబియాను సందర్శించవచ్చని వార్తలు వచ్చాయి. రష్యాపై విధించిన ఆంక్షలను సొమ్ము చేసుకొనేందుకు ఉత్పత్తి పెంచాలన్న సూచనలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు సౌదీ అందుకు సముఖత చూపలేదు. గతంలో రష్యాతో వచ్చిన అవగాహనకే కట్టుబడి ఉంటామని చెబుతోంది. అణు ఒప్పందం గురించి ఇరాన్‌తో రాజీకి వచ్చి ఆంక్షలు వెనక్కు తీసుకుంటే అక్కడి నుంచి కూడా సరఫరా పెరుగుతుంది.యుద్దం ప్రారంభమైన తరువాత అమెరికా ఒక మెట్టు దిగుతున్నట్లుగానే ఈ పరిణామాలను చూడవచ్చు. జర్నలిస్టు ఖషోగ్గీ హత్య తరువాత సౌదీ-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. సౌదీ రాజును హంతకుడని బైడెన్‌ వర్ణించాడు. ఇప్పుడు చమురు ఉత్పత్తి పెంచాలని కోరుతున్నాడు. వారి సమావేశం జరుగుతుందా లేదా అన్నది సందేహమే. తాలిబాన్లతోనే ఒప్పందం చేసుకున్నపుడు సౌదీతో సయోధ్య కుదుర్చుకోవటంలో ఆశ్చర్యం ఉండదు. చమురు ధరలు తగ్గటం ప్రతివారికీ ప్రయోజనకరమే నంటూ అధికారులు చర్చలు జరుపుతున్నారు గానీ, బైడెన్‌ పర్యటన గురించి ఇప్పటికైతే ఖరారు కాలేదని పత్రికా కార్యదర్శి జెస్‌ సాకీ చెప్పారు. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?


అనేక సంవత్సరాల తరువాత ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు వెనెజులా రాజధాని కారకాస్‌ వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను గద్దె దించేందుకు కుట్రపన్నినందుకు గాను 2017లో అమెరికా ఇంధన అధికారులను అరెస్టు చేశారు. 2019లో ఆంక్షలతో పాటు, కారకాస్‌లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. తమ వారిని వదలిపెట్టాలని కోరటంతో పాటు చమురు ఎగుమతి గురించి చర్చలు ప్రారంభించారు. అధికారులు వెళ్లటానికి ఒక రోజు ముందు వెనెజులాలో పెట్టుబడులు పెట్టిన రష్యా వ్యాపారి ఉస్మనోవ్‌ వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు తొలగించలేదు గానీ కంపెనీ లావాదేవీలు జరిపేందుకు అమెరికా ఆర్ధికశాఖ సాధారణ అనుమతి మంజూరు చేసింది. అతను పుతిన్‌ మద్దతుదారు. ఇది వెనెజులా పట్ల ఒక సానుకూల వైఖరి. దీనికి ప్రతిగా ఇద్దరు అమెరికన్లను వెనెజులా విడుదల చేసింది. బైడెన్‌ వైఖరి మార్చుకోవటాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ ఎంపీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారితో కొందరు డెమోక్రాట్లు కూడా గొంతు కలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు మదురో బహిరంగంగానే మద్దతు పలికాడు. ఇంతకాలం వెనెజులాను వ్యతిరేకించిన అమెరికా తన మాటలను తానే ఖండించుకున్నట్లయింది. దీంతో మదురో మరింత బలపడతారని, వ్యతిరేకుల నడుంవిరిచినట్లవుతుందని కొందరు వాపోతున్నారు.


చమురు ధరలు పెరగటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని అమెరికాలో వాటాదార్లతో నిమిత్తం లేకుండా కుటుంబ సంస్ధలుగా ఉన్న కొన్ని చిన్న షేల్‌ ఆయిల్‌ కంపెనీలు ఉత్పత్తికి సిద్దం అవుతున్నాయి.నూటపది డాలర్లుంటే తమకు గిట్టుబాటు అవుతుందని అంటున్నాయి. పెరుగుదల ఎంత కాలం ఉంటుందో తెలీని స్ధితిలో బడా కంపెనీలు ఉత్పత్తికి సిద్దం కావటం లేదు. కరోనా కారణంగా ఆ కంపెనీల్లో మదుపు చేసిన వారికి చేతులు కాలటంతో ఆచితూచి స్పందిస్తున్నాయి.


మన దేశంలో నవంబరు నాలుగవ తేదీ నుంచి స్ధంభింపచేసిన చమురు ధరలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏ రోజైనా తిరిగి సవరించే అవకాశం ఉంది. దీని గురించి ప్రభుత్వం రెండు నాలుకలతో మాట్లాడుతోంది. చమురు ధరలను నిర్ణయించేది చమురు కంపెనీలు తప్ప ప్రభుత్వం కాదని, అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి తగ్గటం, పెరగటం ఉంటుందని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన ధరల గురించి నిర్ణయం తీసుకుంటామని చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు విలేకర్లతో చెప్పారు. నవంబరు నుంచి ధరల స్ధంభనతో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు లేదని కూడా చెప్పారు. రోజువారీ ధరల సవరణ చేసే కంపెనీలు గతంలో ఎన్నికల తరుణంలో, తాజాగా నవంబరు నాలుగునుంచి ఎందుకు స్ధంభింపచేసినట్లో ఇంతవరకు ప్రకటించలేదు.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌పై బుజ్జగింపులు, వత్తిడి, బెదిరింపులకు దిగిన అమెరికా !

08 Tuesday Mar 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు
లాహిరి లాహిరిలో ఓహౌ జగమే ఊగెనుగా సాగెనుగా అంటూ సాగుతున్న భారత – అమెరికా ప్రేమ నౌకను ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ఒక్క కుదుపు కుదిపింది.ప్రేమ జంట తాత్కాలికంగా వేరు పడింది. జన్మజన్మలకు ఒక్కటిగా ఉందామంటూ చేసుకున్న బాసలను మర్చి పోయి నాతో కలసి రష్యాను ఖండిస్తూ యుగళగీతం పాడేందుకు నిరాకరిస్తావా అంటూ అమెరికా గుర్రుగా ఉంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల్లేవుగానీ తడిక రాయబారాలు కొనసాగుతున్నాయి.వత్తిడికి తట్టుకోలేక నరేంద్రమోడీ సర్కార్‌ తిరిగి ప్రేమ నౌక ఎక్కుతుందా, మరేమైనా చేస్తుందా ? అసలెందుకు భాగస్వాముల మధ్య ఈ పరిస్ధితి వచ్చిందన్నది ప్రపంచంలో చర్చ జరుగుతోంది. మధ్యలో కొందరు చైనాను లాగుతున్నారు? వారి ఎత్తుగడ ఏమిటి ? ఇలాంటి ప్రశ్నలెన్నింటినో ఉక్రెయిన్‌ – రష్యా వివాదం ముందుకు తెచ్చింది. మరోమాటలో చెప్పాలంటే మన విదేశాంగ విధానం గురించి సరైన దారీ తెన్నూ గురించి తేల్చుకోవాల్సిన అగత్యాన్ని వెల్లడిస్తోంది.


ఈ వివాదంలో మన దేశం ప్రకటించిన తటస్ధ వైఖరి గురించి అంతర్గతంగా రష్యా ఏమనుకుంటోందో ఇంకా తెలియదు, తన వ్యతిరేకులతో చేతులు కలపకపోవటం ఒక రకంగా మేలే అని భావిస్తున్నట్లు దాని సానుకూల స్పందన వెల్లడించింది. మరోవైపు అమెరికా పట్టలేని ఆగ్రహంతో ఉన్నా తన పధకాల్లో మన అవసరాలను గమనంలో ఉంచుకొని తమాయించుకుంటూ బయపడకుండా ఉంది. దాని అధినేత, నరేంద్రమోడీతో పెద్దన్న బైడెన్‌ ఇంతవరకు మాట్లాడలేదు. యుద్ధానికి ముందే కొన్ని నెలల పాటు తమతో గొంతు కలపాలని ఒప్పించేందుకు తమ నేతలు తీవ్ర కసరత్తు చేసినట్లు, యుద్దం ప్రారంభమైన తరువాత మరింతగా ప్రయత్నాలున్నట్లు అధికారయంత్రాంగం చెప్పింది.


పలు వైఫల్యాల కారణంగా ప్రపంచంలో పరువు పోగొట్టుకుంటున్నది అమెరికా. శత్రుదేశాలుగా పరిగణిస్తున్నవాటి మీద మరింతగా దూకుడు పెంచటం ద్వారా నష్టనివారణ, తన మిత్రదేశాల్లో విశ్వాసం పెంపొందించేందుకు దుస్సాహసాలకు పాల్పడుతోంది. గత రెండు దశాబ్దాలుగా భారత్‌ను తన కౌగిట్లోకి తీసుకొనేందుకు పావులు కదిపింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత కొంత మేరకు సఫలీకృతమైంది.చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని ముందుకు నెట్టే ఎత్తుగడతో ఒక ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు 2007లోనే చతుష్టయ(క్వాడ్‌) కూటమికి రూపకల్పన చేసినా అది ముందుకు సాగలేదు. మన దేశం చేతులు కాల్చుకొనేందుకు సిద్దం కాకపోవటం ఒక ప్రధాన కారణం.కానీ 2017లో దానికి నరేంద్రమోడీ సిద్దపడటంతో అది అమల్లోకి వచ్చింది. లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ ఉదంత రూపంలో దాని పర్యవసానాలను చూశాము.


ఇప్పుడు ఉక్రెయిన్‌ – రష్యా పరిణామాలను ఆసరా చేసుకొని అమెరికా, మన దేశంలోని దాని మద్దతుదారులు మరోసారి చైనాను ఒక బూచిగా చూపేందుకు పూనుకున్నారు.ఆసియాలో ఆధిపత్యానికి చైనా పూనుకున్నదనే అమెరికా ప్రచారాన్ని మరో రూపంలో ముందుకు తెస్తున్నారు. రష్యా మనకు తరతరాలుగా మిలిటరీ సాయం అందిస్తున్నది. దాన్ని వదులుకుంటే మన జుట్టు అమెరికా వాడి చేతికి చిక్కుతుందనే భయమూ, వారి పాతబడిన ఆయుధాలు కొనుగోలు చేయటం కంటే రష్యా గతంలో ఇచ్చిన వాటిని నవీకరించుకోవటం మెరుగు అనే అభిప్రాయమూ ఉంది. రష్యాను చూపి కొత్త వాటిని ఇస్తారా లేదా అని అమెరికాతో బేరమాడేందుకూ కావచ్చు, ఇలా అనేక అంశాలున్నాయి. మనం కావాలన్న క్షిపణి రక్షణ వ్యవస్ధలను ఇచ్చేందుకు అమెరికా సిద్దం కాదు. రష్యా గతంలో ఇస్రోకు క్రయోజనిక్‌ ఇంజన్లు, వాటి పరిజ్ఞానం అందచేసింది. మనతో కలసి బ్రహ్మౌస్‌ అనే ఆధునిక క్షిపణులు, బహుళ ప్రయోజనాలకు అవసరమైన విమానాల రూపకల్పన, ఎకె రకం తుపాకుల తయారీ వంటి అంశాల్లో భాగస్వామిగా ఉంది. అమెరికా మబ్బుల్లో నీళ్లు చూసి రష్యా ముంతలోని నీళ్లు పారబోసుకుంటే జరిగేదేమిటో మనకు తెలుసు. అందుకే అమెరికా బెదిరించినా ఎస్‌-400 అనే రష్యా క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేశాము. ఇన్ని కారణాలతో ఉక్రెయిన్‌ కోసం రష్యాను కాదని అమెరికా చంకనెక్కి దాని పాటపాడేందుకు మనం సిద్దం కాలేదు.


ఈ విషయాలు చెప్పుకొనేందుకు మన పాలక ప్రభువులు, మీడియాకు భయం, ఎందుకంటే అమెరికా ఆగ్రహం మరింత పెరుగుతుందేమోననే దడ. దాన్ని కప్పి పుచ్చి చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే రష్యా అవసరం కనుక తటస్ధంగా ఉండి దాన్ని దగ్గర చేసుకొనేందుకు పూనుకున్నామని చెప్పేవారు తయారయ్యారు. అమెరికన్లు ఇప్పుడు పుతిన్‌ బూచిని చూపి మనలను వారి చంకనెక్కమంటున్నారు. దక్షిణాసియా వ్యవహారాల అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి డోనాల్డ్‌ లు తమ ఎంపీలతో మాట్లాడుతూ అమెరికా-భారత్‌ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ప్రతి రోజూ పని చేస్తున్నామని, పుతిన్‌కు అడ్డుకట్టవేయకపోతే చైనా మరింత రెచ్చిపోతుందని, ఉక్రెయిన్‌లో జరుగుతున్నదానితో చైనా ప్రవర్తన ప్రభావితం అవుతుందని, అది భారత్‌కు అర్ధంకావాలి. ” అన్నాడు.ఇప్పటి వరకు ఐరాసలో మన దేశం నాలుగు సార్లు తటస్ధంగా ఉంది.


ఒక స్పష్టమైన వైఖరి (అంటే తమబాటలో నడిచే) తీసుకోవాలని అమెరికా కోరుతోంది. కొద్ది నెలలుగా మన మీద బుజ్జగింపులు, వత్తిడికి దిగిన అమెరికన్లు ఇప్పుడు బెదిరింపులకూ పాల్పడ్డారు. ” ఇప్పుడు రష్యాకు మరింతదూరంగా భారత్‌ జరగాల్సిన తరుణం ఆసన్నమైంది.లేనట్లయితే తమ ” కాట్సా ” చట్టం (తమ ప్రయోజనాలకు భంగం కలిగితే ఏ దేశం మీదనైనా ఆంక్షలు విధించవచ్చని అమెరికా రూపొందించుకున్న స్వంత చట్టం ) కింద గతంలో ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరించుకొనే అంశాన్ని బైడెన్‌ పరిశీలిస్తారని ” డోనాల్డ్‌ లు బెదిరించాడు.ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి 543 కోట్ల డాలర్ల ఎస్‌-400 క్షిపణి వ్యవస్ధల కొనుగోలుకు 2018లో ఒప్పందం చేసుకున్నాము. అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మన మీద ” కాట్సా” తో వేటు వేస్తానని బెదిరించినా వెనక్కు తగ్గాడు. తరువాత అదే ట్రంప్‌ను అమెరికా వెళ్లి మన నరేంద్రమోడీ కౌగిలింతలతో ముంచెత్తి ట్రంప్‌ మరోసారి అధికారంలోకి రావాలని ఒక సభలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆ మినహాయింపు గురించి జోబైడెన్‌ బెదిరిస్తున్నాడు.


అంతేకాదు భారత అధికారులను మందలించాలని, ఐరాసలో పదే పదే చర్చలు జరపాలని కోరటం, తటస్ధ వైఖరి అవలంభించటం అంటే రష్యా శిబిరంలో ఉన్నట్లే అన్న ముద్రవేయాలని అమెరికా తన దౌత్యసిబ్బందికి పదునైన పదజాలంతో వర్తమానం పంపింది. దాన్ని కావాలనే లీకు చేసింది. రష్యాకంటే భారత్‌ మనకు దగ్గరగా ఉన్నందున ఇలాంటి పని చేస్తే తీరా అది వ్యతిరేక ఫలితాలనిస్తుందేమో అన్న భయం కొందరిలో పట్టుకుందని వార్తలు వచ్చాయి. ఈ సమస్యకారణంగా చైనాపై భారత్‌-అమెరికా వ్యూహాత్మక ఐక్యతకు భంగం కలిగించకూడదని, అమెరికా ప్రయోజనాల రీత్యా భారత్‌తో సంబంధాలు కొనసాగించటం ముఖ్యమని చెబుతున్నవారు కూడా ఉన్నారు. మన దేశం ఇప్పుడు ఉక్రెయిన్‌ అంశంలో తటస్ధంగా ఉన్నట్లే భారత్‌-చైనా వివాదంలో బహిరంగంగా, నిర్ణయాత్మకంగా చైనా వైపు రష్యా ఉండకుండా చూసుకోవాలన్నది కొందరి సలహా.


ఇస్లామాబాద్‌లోని 22 మంది విదేశీ రాయబారులు ఒక బహిరంగ సంయుక్త లేఖను విడుదల చేశారు. రష్యా చర్యను ఐరాసలో ఖండించాలని వారు పాకిస్తాన్ను కోరారు. దీని మీద ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మండిపడ్డాడు. మీరు చెప్పినట్లు చేసేందుకు మేమేమైనా బానిసలం అనుకుంటున్నారా, మా గురించి ఏమనుకుంటున్నారు ? ఇలాంటి లేఖను మీరు భారత్‌కు రాశారా అంటూ ఐరోపా దేశాల రాయబారులపై ధ్వజమెత్తాడు. తమకు అమెరికా, రష్యా, చైనా, ఐరోపా అందరూ కావాల్సినవారే, స్నేహితులే, ఏ శిబిరంలోనూ మేము ఉండం అన్నాడు. మన దేశానికి లేఖ రాసిందీ లేనిదీ బహిరంగం కాలేదు గాని ఢిల్లీలోని విదేశీ దౌత్యవేత్తలు కొందరు ఉక్రెయినుకు మద్దతుగా ఒక సమావేశం నిర్వహించారు. దాని మీద మన దేశం ఎలాంటి అభ్యంతరమూ వెల్లడించలేదు.


ఉక్రెయినుపై భారత్‌ అనుసరిస్తున్న గడసాము వైఖరి సంతృప్తికరంగా లేదని, ఆ దేశం నిశిత పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఇది అమెరికా అంతరంగంగా చెప్పవచ్చు.ఇదీ బెదిరింపే. ఒక వేళ అమెరికా వత్తిడి ఫలించినా, భారత్‌ రాజీపడటం కష్టమని, కొన్ని స్వల్పమార్పులు మాత్రమే ఉండవచ్చని, బహిరంగంగా రష్యాను విమర్శించలేకపోవచ్చని చైనా నిపుణులు చెప్పారు. అమెరికా తన అవసరాలకు అనుగుణంగా చదరంగంలోని పావుల్లా దేశాలను వాడుకోవాలని చూస్తోందన్నది అనేక దేశాలు గుర్తిస్తున్నాయి. మెక్సికో, టర్కీ తాము రష్యాపై ఎలాంటి ఆర్ధిక ఆంక్షలను అమలు జరపబోమని ప్రకటించగా బ్రెజిల్‌, పనామా, అర్జెంటీనా, బలీవియా వంటివి ఖండించేందుకు తిరస్కరించాయి.


రష్యా ఇప్పుడు సోషలిస్టు దేశమూ కాదు, పుతిన్‌ కమ్యూనిస్టూ కాడు. సోవియట్‌ విడిపోయిన తరువాత రష్యా అనేక సమస్యలను ఎదుర్కొన్నది, ఆర్ధికంగా బలహీనపడింది. ఇదే అమెరికా, ఇతర ధనిక దేశాలు తమ జి7 బృందాన్ని విస్తరించి రష్యాను కలుపుకొని జి8గా వ్యవహరించిన రోజులు ఉన్నాయి. అది ఆర్ధికంగా బలపడటం ప్రారంభం కావటం, నాటో విస్తరణ పేరుతో దాని ముంగిటకు తన సైన్యాలు, ఆయుధాలను తరలించాలని ఎప్పుడైతే చూసిందో అప్పటి నుంచి రెండు దేశాలు దూరం కావటం, జి8 నుంచి రష్యాను తొలగించటం తెలిసిందే. ఇదే సమయంలో ఆర్ధికంగా ఎదుగుతున్న చైనాను చూసి కూడా అమెరికాకు దడపట్టుకుంది. ఈ రెండు దేశాలను దెబ్బతీయాలని ఒకేసారి పావులు కదుపుతోంది. వీటికి వ్యతిరేకంగా మన దేశాన్ని, జపాన్‌, ఆస్ట్రేలియాలను ముగ్గులోకి దించేందుకు పూనుకుంది. అందువలన రష్యా పెట్టుబడిదారీ దేశమైనా, చైనా సోషలిస్టు వ్యవస్ధ కలదైనా ఉమ్మడి శత్రువుగా అమెరికా కూటమి ముందుకు వస్తున్నందున ఇప్పుడున్న బలాబలాల్లో రెండూ కలిసి ఎదుర్కోవాల్సిన అగత్యాన్ని గుర్తించి ముందుకు పోతున్నాయి. ఇది శాశ్వతమా అంటే చెప్పలేము. రెండవ ప్రపంచ యుద్దంలో సోవియట్‌ నేత స్టాలిన్‌ నాజీ హిట్లర్‌తో ఒప్పందం చేసుకున్నాడు, అదిశాశ్వతంగా ఉండదని ఇద్దరికీ తెలుసు. రష్యా గత మూడుదశాబ్దాలుగా తన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఇంతవరకు ఏ దేశాన్నీ ఆక్రమించేందుకు పూనుకున్న ఉదంతాలు లేవు. సిరియా వంటి చోట్ల అమెరికా కూటమికి వ్యతిరేకంగా ఉంది. రష్యా-చైనాల మధ్య 4,209 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వివాదాల్లేకపోతే అంత పొడవున సాధారణ మిలిటరీ కార్యకలాపాతో సరిపెట్టుకోవచ్చు. అదే ఉద్రిక్తతలు ఉంటే పెద్ద మొత్తంలో వనరులు ఖర్చు. ఆ మొత్తాన్ని ఇప్పుడు చైనా అభివృద్ది కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు.భవిష్యత్‌లో సమస్యవస్తే అప్పుడు ఎలాగూ తప్పదు.


ఈ వివాదంలో మన దేశం తీసుకుంటున్న వైఖరి గురించి ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు వివరించలేదు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరాసలో తటస్ధతను ప్రకటించటాన్ని ప్రతిపక్ష పార్టీలేవీ విమర్శించలేదు. ఆపరేషన్‌ గంగ మీద వచ్చిన విమర్శలకు విదేశాంగ విధానానికి సంబంధం లేదు.స్వతంత్ర వైఖరిని తీసుకోవాల్సిన తరుణం వచ్చింది. చైనా, పాకిస్తాన్‌లను బూచిగా చూపి అమెరికా వత్తిళ్లకు లొంగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘ మహా రష్యన్‌ దురహంకారం ‘ – పొసగని రంగనాయకమ్మ సూత్రీకరణలు !

04 Friday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joseph v Stalin, Lenin, RUSSIA, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు


నూరు పూవులు పూయనీయండి – వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్న స్ఫూర్తితో ఎవరు ఏమైనా చెప్పవచ్చు, రాయవచ్చు. దానిలో భాగంగానే ఎవరైనా వాటితో విబేధించవచ్చు కూడా. తొలుత ప్రముఖ రచయిత్రిగా తెలుగునాట పేరు తెచ్చుకున్న రంగనాయకమ్మ తరువాత మార్క్సిస్టు సిద్దాంతవేత్తగా కూడా మారారు. మార్క్సిజం- లెనినిజం లేదా దానికి మావోయిజాన్ని తోడు చేసి వాటి మీద వ్యాఖ్యానాలు చేసేందుకు ఎవరికీ మేథోసంపత్తి హక్కులేమీ లేవు, కనుక ప్రతివారికీ అవకాశం ఉంది, అనేక మంది రాస్తున్నారు. అలాంటి వారిలో రంగనాయకమ్మ ఒకరు. ‘ మహా రష్యన్‌ దురహంకారం ‘ అనే శీర్షికతో మార్చి రెండవ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన అంశాలలో కొన్నింటి గురించి చూద్దాం. బోల్షివిక్‌ పార్టీ సారధిగా, తొలి సోషలిస్టు విప్లవానికి నేతృత్వం వహించి అనేక అంశాలపై మార్క్సిజాన్ని మరింతగా పరిపుష్టం చేసిన కారణంగానే లెనిన్‌కు చరిత్రలో ఒక ప్రత్యేక స్ధానం ఉంది. అదెంతటి మహత్తరమైనదంటే తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజంగా ప్రతి కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శనంగా చేసుకొనేంతగా అన్నది స్పష్టం.


రంగనాయకమ్మగారు ప్రస్తావించిన జాతుల సమస్య మీద ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ జరగనన్ని చర్చలు, వాదోపవాదాలు అక్కడి భౌతిక పరిస్ధితుల కారణంగా విప్లవానికి ముందు తరువాత రష్యన్‌ పార్టీలో జరిగాయి. లెనిన్‌ ప్రతిపాదించిన వాటితో తీవ్రంగా విబేధించిన వారున్నారు, లెనిన్‌ విబేధించినవీ రాజీపడినవీ ఉన్నాయి. ఆ చర్చ జోలికి పోదలచలేదు. బోల్షివిక్‌ పార్టీ ఒక ప్రజాస్వామిక సంస్ధ. మెజారిటీ నిర్ణయాన్ని మైనారిటీ కూడా అంగీకరించి అమలు జరపాలనే కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రాలతో పని చేసింది. అందువలన పార్టీలో లెనిన్‌ప్రతిపాదించినా, స్టాలిన్‌ ప్రతిపాదించినా తప్పయినా ఒప్పయినా చర్చల తరువాత ఆమోదం పొందిన వాటినే అమలు చేశారు. అందువలన వాటిని వ్యక్తులకు ఆపాదించటం తగనిపని.ఉమ్మడి óాకమ్యూనిస్టు పార్టీ సైద్దాంతిక విబేధాలతో చీలిన తరువాత తెలుగునాట రెండు పార్టీలను కొందరు సుందరయ్య పార్టీ, రాజేశ్వరరావు పార్టీ అని పిలవటాన్ని ఆమె గుర్తుకు తెచ్చారు. ” లెనిన్‌ వ్యతిరేకించిన జాతుల విధానమే స్టాలిన్‌ ఆధిపత్యంలో కొనసాగింది ” అని చెప్పటం అలాంటిదే. బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైనపుడు రష్యాలో అనేక మైనారిటీ జాతులు ఉన్నాయి. తొలి శ్రామిక రాజ్యం పేరు ” రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌ఎస్‌ఆర్‌) ”. తరువాత 1924లో వివిధ రిపబ్లిక్‌ల మధ్య ఒప్పందం జరిగి ”యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(యుఎస్‌ఎస్‌ఆర్‌)గా పేరు మార్చారు.


జారు కాలంలో మైనారిటీ జాతులను అణచివేసింది నిజం, అందుకే విప్లవం సంభవించక ముందే సోషలిస్టు దేశంలో జాతుల సమస్య పరిష్కారం గురించి పార్టీలో చర్చ జరిగింది. ఐనప్పటికీ రష్యన్‌ రిపబ్లిక్‌ అని నామకరణం చేసింది లెనిన్‌ నాయకత్వంలో ఉన్న పార్టీ, ప్రభుత్వమే కదా పెట్టింది. దాని అర్ధం మహా రష్యన్‌ దురహంకారానికి లెనిన్‌ లోనైనట్లా ? రిపబ్లిక్‌లకు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్న లెనిన్‌ వైఖరిని కొందరు ఆమోదించకపోయినా మెజారిటీ అంగీకరించారు.1917 నవంబరు ఏడున రష్యన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ ఏర్పడితే, స్వయం నిర్ణయాధికార అవకాశాన్ని వినియోగించుకొని అంతకు ముందు స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ఫిన్లండ్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంటే లెనిన్‌ ఆమోదించాల్సి వచ్చింది. దీని మీద భిన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయి, తరువాత కూడా అలాంటి అవకాశం కల్పించినా మరొకటేదీ విడిపోలేదు. స్టాలిన్‌ కాలం నుంచి అనుసరించిన ఆధిపత్య విధానాలు 1991లో వేరుపడి పోవటానికి ఒక ముఖ్యకారణం అని రంగనాయకమ్మ చేసిన సూత్రీకరణకు స్టాలిన్‌ పట్ల గుడ్డి వ్యతిరేకత తప్ప తర్కబద్దత కనిపించదు. అమెరికా ఇతర శక్తుల కుట్రలను గుర్తించేందుకు నిరాకరించటమే. ఆమెతో సహా కొందరు చెప్పే స్టాలిన్‌ ఆధిపత్యానికి తలొగ్గి రిపబ్లిక్కులు విధిలేక కలసి ఉన్నాయనుకుందాం, స్టాలిన్‌ 1953లో మరణించిన తరువాత ఎక్కడి నుంచీ స్వయం నిర్ణయాధికార కాంక్ష లేదా డిమాండ్‌ ఎందుకు తలెత్తలేదు. రిపబ్లిక్కులకు అసమాన అధికారాలు ఉంటే మన దేశంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల సమస్య మాదిరి అక్కడ కూడా తలెత్తి ఉండేవి.లెనిన్‌ వ్యతిరేకించిన లేదా స్టాలిన్‌ అమలు పరచిన విధానాలు అనే పదప్రయోగాలు కూడా తప్పే. అవేవీ ఏకపక్షమైనవి కాదు, తప్పయినా ఒప్పయినా పార్టీ తీసుకున్న వైఖరిని అమలు చేశారు. తప్పనుకుంటే గుణపాఠాలు తీసుకోవచ్చు, అభిప్రాయాలు వెల్లడించవచ్చు. రంగనాయకమ్మకు ఆ స్వేచ్చ ఉంది. ఆమె ఆలోచనా బడిలొ చదువుకుంటున్నవారికి, అనుసరిస్తున్నవారికి అవే తిరుగులేనివిగా అనిపించవచ్చు, ఇతరులు విబేధించవచ్చు.


ఇక ” ఉక్రెయిన్‌ ముందుగా దాడి చేయనపుడు రష్యాకు ఆత్మరక్షణ ప్రశ్న ఏమిటి ” అని రంగనాయకమ్మ అడుగుతున్నారు. ఇది అమాయకత్వమో లేక కొందరి టీకా తాత్పర్యాల ప్రభావమో తెలియదు. అసలు రష్యా ఆ మాట ఎక్కడ చెప్పింది ? చెప్పలేదు, కనుక ఇతరులు చెప్పినదాన్ని ప్రమాణంగా తీసుకోవటం ఏమిటి ? ” ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత….అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీతో సంబంధాలు పెట్టుకుంది ” అన్నారు. ఇది వాస్తవ విరుద్దం. ఒక స్వతంత్ర దేశంగా ప్రతిదేశంతో దౌత్య సంబంధాలు పెట్టుకోవటం వేరు, ఒక దేశం లేదా కూటమికి వ్యతిరేకంగా మరో కూటమి వైపు మొగ్గి ఇతర సంబంధాలు పెట్టుకోవటం వేరు. 2013లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ ఎన్‌కోవిచ్‌ ఒక ప్రకటన చేశాడు. ఐరోపా యూనియన్‌తో ఆర్ధిక అనుసంధాన ఒప్పందానికి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు. తొలుత ఆర్ధికం పేరుతో సంబంధాలు, తరువాత నాటోలో చేర్చుకోవాలని తద్వారా రష్యా ముంగిటకు తమ సేనలను చేర్చాలన్నది అమెరికా పధకం. దానికి ఎదురుదెబ్బ తగలటంతో సిఐఏ రంగంలోకి దిగి ప్రతిపక్ష పార్టీలతో ప్రదర్శనలు చేయించి తిరుగుబాటును రెచ్చగొట్టింది. ఎనుకోవిచ్‌ రష్యాలో తలదాచుకున్నాడు. తరువాత ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. అసలు సమస్య ఇక్కడినుంచే ప్రారంభం కాగా స్వతంత్రదేశంగా ఏర్పడిన వెంటనే అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకున్నదని రాయటం వక్రీకరణ కాదా ?


” రెండవ ప్రపంచ యుద్దం తరువాత నుంచీ ప్రపంచం మీద పెత్తనం చేసే విషయంలో అమెరికాకి రష్యా ప్రధాన పోటీదారు.అందుకే అమెరికా, రష్యాలను అగ్రరాజ్యాలు అంటారు ఇతర దేశాల వారు. అసలు అనవలసింది రెండూ పెద్ద బందిపోటు ముఠాలు అని….” ఇది రంగనాయకమ్మ వంటి సీనియర్‌ కలం నుంచి వెలువడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రాధమిక అంశాలను కూడా విస్మరిస్తే అమెకు ఉన్న పేరును బట్టి చదువరులు నిజమే అని భావించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకొనే అవకాశం ఉంది.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ ఉంది. దానిలో రష్యాతో సహా 15 రిపబ్లిక్కులున్నాయి.1991 వరకు అదే కొనసాగింది. సోవియట్‌ ప్రపంచ పెత్తనం కోసం చూసిందని అమెరికా కూటమి, దాన్ని అనుసరించే వారు చేసిన ప్రచారాన్ని రంగనాయకమ్మ కూడా వంటపట్టించుకున్నారా ? మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తరువాత అంతకు ముందు చేసిన తన రచనల్లో కొన్ని పదాలను సవరించారు. కానీ సోవియట్‌ గురించి పూర్వపు వైఖరితోనే ఉన్నట్లున్నారు. లేకపోతే అమెరికాతో అంటగట్టి రెండూ ఒకటే అనటం ఏమిటి ? అమెరికా పెత్తనానికి, దుర్మార్గాలకు బలైన కొరియా, వియత్నాం, ఇరాక్‌, లిబియా, సిరియా వంటి ఉదంతాలున్నాయి. వీటిలో ఏ ఒక్కదేశమైనా అమెరికాను ఆహ్వానించిందా, ఏకపక్ష దాడులకు గురయ్యాయా ?అటువంటి చరిత్ర సోవియట్‌ లేదా దాని తరువాత రష్యాకు గానీ ఉందా ? ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ ఎందుకు జోక్యం చేసుకుందో రంగనాయకమ్మకు తెలీదనుకోవాలా లేక అమెరికా దాడులకు దీనికి తేడా లేదని అనుకుంటున్నారా ? ఆఫ్ఘన్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా చేసిన కుట్రల్లో భాగంగా తాలిబాన్లను తయారు చేసి ఉసిగొల్పారు. వారి నుంచి రక్షణకు ఆ ప్రభుత్వం సోవియట్‌ సాయం కోరింది.


శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు యుద్దం పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి అని ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ చెప్పిన అంశాలు ఆ దృక్పధాన్ని ప్రతిబింబించలేదు. రష్యా పెట్టుబడిదారీ దేశమే, అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు. గత మూడు దశాబ్దాల్లో రష్యాకు అలాంటి చరిత్ర లేదు. అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్లో ప్రత్యేక సైనిక చర్యకు పూనుకుంది. ప్రపంచాధిపత్యం కోసం పూనుకున్న అమెరికా కుట్రలను ఎదిరించేందుకు ఒక పెట్టుబడిదారీ దేశంగా రష్యా లేదా మరొకటి ముందుకు వస్తే శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు ఎదిరించిన వారిని బలపరచాలి. మొదటి ప్రపంచ యుద్దంలో జర్మనీతో లెనిన్‌ బ్రెస్ట్‌-లిటోవస్క్‌ సంధి కుదుర్చుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో స్టాలిన్‌ ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోంది. కనుక దాన్ని ఎదుర్కొనేవారిని బలపరచాలి. వర్తమాన ఉదంతంలో ఐరాసలో చైనా తటస్ధ వైఖరిని తీసుకుంది. అదే సమయంలో పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు, గోధుమల వంటి వాటిని దిగుమతి చేసుకుంటోంది. రంగనాయకమ్మగారు వర్ణించినట్లు ” ఒక బందిపోటు ”ను చైనా సమర్ధిస్తున్నట్లుగా అనుకోవాలా, అమెరికాతో పోరాడేశక్తికి తోడ్పాటు ఇస్తున్నట్లుగా భావించాలా ? ఆమె కళ్లతో చూస్తే అమెరికా బందిపోట్లతో 50 సంవత్సరాల క్రితం సోషలిస్టు చైనా ఒప్పందం చేసుకుంది.దానిలో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించింది. దాని వలన చైనా శ్రామికులకు మేలు జరిగినట్లా కీడు జరిగిందా ? దీనికి ఏ భాష్యం చెబుతారు. అదే విధంగా రష్యాతోనూ ఒప్పందాలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. దీని అర్ధం రెండు పెద్ద బందిపోటు దేశాలతో చైనా చేతులు కలిపినట్లా ?


తన ప్రధాన పోటీదారైన అమెరికా అడుగుజాడల్లోనే నడుస్తోందనే కారణంతోనే ఉక్రెయిన్‌ మీద రష్యా దురాక్రమణకు పాల్పడిందని రంగనాయకమ్మ చెప్పారు. తన వర్గం ఏదో మరచిపోయి ఒక ఫ్యాక్టరీ కార్మికుడు, వ్యవసాయ కార్మికుడు తమ యజమానులవైపు కొమ్ముకాస్తే పర్యవసానాలను అనుభవించకతప్పదు. అదే ఇక్కడా వర్తిస్తుంది. ఐరోపాలో ఉక్రెయిను కంటే అనేక చిన్న దేశాలు అదే పని చేస్తున్నాయి, మరి వాటి మీద ఎందుకు దాడికి దిగలేదు ? యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల గురించి ప్రస్తావించారు, అవి జరిగే కారణాలు వేరు, అవన్నీ విముక్తి మార్గ బాటలో ఉన్నట్లు భావిస్తున్నారా ? గతంలో అమెరికా, అనేక ఐరోపా దేశాల్లో ఇంతకంటే పెద్ద ఎత్తున జరిగాయి. వాటికీ విముక్తికీ ముడిపెట్టటం ఏమిటి ?


ఇక శ్రామికవర్గ చైతన్యం గురించి, ఐరాస గురించి చెప్పిందానితో విబేధించాల్సిందేమీ లేదు.తాను శ్రామికవర్గ పక్షపాతినని ఆమె పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు. అందుకు అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. అయితే, పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు మార్క్సిజాన్ని ఔపోసన పట్టినట్లు కనిపించే రంగనాయకమ్మగారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమె రచనలను అనుసరించేవారు తర్కబద్దంగా ఆలోచించి సరైనవో కాదో నిర్ధారించుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యాపై నాటో కూటమి దేశాలు, ఇతరుల ఆర్ధిక దాడి !

01 Tuesday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Joe Biden, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమి కుట్రల కారణంగా ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య తలెత్తిన వివాదం విచారకరమైన యుద్ధానికి దారి తీసి బుధవారం నాటికి ఏడవ రోజులో ప్రవేశించింది. రష్యా సైనిక పాటవం ముందు ఉక్రెయిన్‌ నిలిచే అవకాశం లేదని, త్వరగానే పతనం అవుతుందన్న అంచనాలు తప్పాయి. ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తున్నారు. వస్తున్న వార్తలను బట్టి సామాన్య జన నష్టం జరగకుండా చూసేందుకు రష్యన్‌ దళాలు కేవలం నిర్దేశిత సైనిక కేంద్రాల మీదనే కేంద్రీకరించటం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నాటో అందచేసిన ఆధునిక ఆయుధాలు కూడా ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతిఘటన శక్తిని పెంచాయి. ఉక్రెయిన్‌ దళాల ప్రతిఘటన ఊహించలేదని పశ్చిమ దేశాల సంస్ధలు వార్తలు ఇచ్చాయి. బైలోరస్‌ మధ్యవర్తిత్వంలో జరిగిన బేషరతు చర్చలు ఎలాంటి ఫలితం తేలకుండానే సోమవారం ముగిశాయి.భద్రతా కారణాల రీత్యా ఈ చర్చలు సరిగ్గా ఎక్కడ జరిగాయన్నది అధికారికంగా ప్రకటించలేదు. బెలారస్‌-ఉక్రెయిన్‌ సరిహద్దులో ” మత్స్యకారుడి గుడిసె ”లో అని గుప్తనామం చెప్పారు. ఈ చర్చలు సరిహద్దులో తమవైపే జరపాలని పట్టుబడిన ఉక్రెయిన్‌ మెట్టుదిగి బెలారస్‌ వైపుకే తన ప్రతినిధులను పంపింది. రెండవ దఫా సంప్రదింపులు బెలోరస్‌- పోలాండ్‌ సరిహద్దులో జరపాలని నిర్ణయించారు. వీటి ఫలితం గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఈ రెండు దేశాల వివాదంతో ఇప్పటికే చమురు ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్ధలకు అంతరాయం, పరస్పర ఆంక్షల కారణంగా ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు, పర్యవసానాలను ప్రపంచం చవి చూస్తోంది. మంగళవారం నాడు జరిగిన దాడుల్లో ఉక్రెయిన్‌లో రెండవ పెద్ద పట్టణమైన ఖర్‌కివ్‌ నగరంలో కర్ణాటకకు చెందిన విద్యార్ధి నవీన్‌ శేఖరప్ప మరణించటం తీవ్ర విచారకరం.


శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇరు పక్షాలూ సంయమనం, కాల్పులకు విరామం పాటించటం సాధారణంగా జరుగుతుంది. ఇక్కడ అటువంటి అవకాశాలు కనిపించలేదు. చర్చలు చర్చలే, దాడులు దాడులే అని రష్యా చెప్పటం కొంత మందికి విపరీతంగా అనిపించవచ్చు. ఉక్రెయిన్ను రెచ్చగొట్టి ముందుకు తోసిన పశ్చిమ దేశాలు ప్య్రత్యక్షంగా దాడులకు దిగలేదు తప్ప రష్యాను దెబ్బతీసేందుకు భద్రతా మండలిని సాధనంగా చేసుకొని ప్రచారదాడి, ప్రతిరోజూ కొత్త ఆంక్షలు, చర్యలను ప్రకటిస్తూనే పరోక్షదాడులను పెంచుతున్నాయి. ఇదంతా ఉక్రెయినుకు మద్దతుగానే అన్నది తెలిసిందే. ఈ నేపధ్యంలోనే తన అణుదళాలను సిద్దంగా ఉండాలని పుతిన్‌ ఆదేశించాడు, చర్చల సమయంలో దాడులను ఆపేది లేదని కూడా ప్రకటించాడు. ఇవన్నీ వత్తిడిని పెంచే ఎత్తుగడలే.


రెండు దేశాల మధ్య చర్చలు ఎన్నిసార్లు జరిగినా కీలక సమస్యపై అంగీకారం కుదిరితేనే సంధి తప్ప మరొకమార్గం లేదు.ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి ఆ ముసుగులో రష్యా సరిహద్దుల్లో తిష్టవేయాలన్న అమెరికా ఎత్తుగడను పక్కన పెట్టేందుకు సిద్దం కావటం లేదు. అందువలన భౌతికంగా దాడి ఉక్రెయిన్‌ మీద జరుపుతున్నప్పటికీ అసలు లక్ష్యం నాటో కూటమి, దాని పెద్ద అమెరికా అన్నది స్పష్టం. నాటోలో చేరకుండా తటస్ధదేశంగా ఉంటామని ఉక్రెయిన్‌ హామీ ఇవ్వాలని రష్యా పట్టుపడుతోంది. ఒకవైపు తమను ముందుకు తోసి నట్టేట ముంచారని ఉక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీ చెబుతూనే ఇంకా దింపుడు కల్లం ఆశమాదిరి పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యాను దారికి తెస్తాయనే భ్రమలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయ మీరు మా వైపు ఉన్నారో లేదో రుజువు చేయాలంటూ ఐరోపాయునియన్ను మంగళవారం నాడు డిమాండ్‌ చేశాడు. రష్యాను ఖండిస్తూ భద్రతా మండలిలో పెట్టిన తీర్మానాలు వీగిపోతాయని తెలుసు. ఐనా ప్రచారదాడిలో భాగంగా ఆ తతంగం నడిపించిన తరువాత కొనసాగింపుగా ఇప్పుడు సోమవారం నుంచి ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు తెరతీశారు. దాని మీద ఓటింగ్‌ జరగనుంది. దాని ఫలితం ఏమైనప్పటికీ నిబంధనల ప్రకారం దాన్నెవరూ అమలు జరపాల్సిన అవసరం లేదు. గతంలో యుగోస్లావియాపై భద్రతా మండలి అనుమతి లేకుండానే నాటో దళాలు 78 రోజుల పాటు దాడులు చేశాయి. దాన్ని మూడు ముక్కలు చేసి బోస్నియా, హెర్జ్‌గోవినా, సెర్బియాగా విడతీసి ప్రత్యేక రాజ్యాలుగా గుర్తించాయి. అల్బేనియా నుంచి కొసావోను విడగొట్టి గుర్తింపునిచ్చాయి. ఇప్పుడు అవే నాటో దేశాలు ఉక్రెయిన్లో స్వాతంత్య్రం కోరుకుంటున్న డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లను రష్యాగుర్తిస్తే ఇంకేముంది చట్టబద్దతకు ముప్పు వాటిల్లిందంటూ గుండెలు బాదుకుంటున్నాయి. చైనా అంతర్భాగాలైన తైవాన్‌, హాంకాంగ్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలన్న కుట్రను బలపరుస్తున్నాయి.


ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదన్న ప్రధాన డిమాండ్‌తో పాటు రష్యా మరికొన్ని అంశాలను కూడా ముందుకు తెచ్చింది. 2015మిన్‌స్క్‌ ఒప్పందాన్ని అమలు జరపాలని అది డిమాండ్‌ చేస్తోంది. డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లను స్వయంపాలిత ప్రాంతాలుగా ఉక్రెయిన్‌ గుర్తించాలని, ఆ ప్రాంతాల నుంచి మిలిటరీ సామగ్రిని తొలగించాలన్న వాటితో పాటు పన్నెండు అంశాలున్నాయి. దాన్ని ఉక్రెయిన్‌ ఉల్లంఘించింది. ఆ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన నాటోలోని జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు కూడా పట్టించుకోకుండా చోద్యం చూశాయి. ఇప్పుడు ఆ రిపబ్లిక్‌లను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించటంతో అవి కూడా గగ్గోలు పెడుతున్నాయి. రష్యా ముందుకు తెచ్చిన అంశాలను అంగీకరించేందుకు ఉక్రెయిన్‌ సిద్దంగా ఉన్నప్పటికీ అమెరికా, నాటో కూటమి పడనిచ్చేట్లు కనిపించటం లేదు. అవి విధించిన ఆంక్షలు రష్యాకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తి జనంలో పుతిన్‌ మీద వ్యతిరేకతను రేకెత్తించాలన్న పధకం కూడా ఉందన్నది స్పష్టం. రష్యన్‌ ఆర్ధిక వ్యవస్ధను కుప్పకూల్చివేస్తామని ఫ్రాన్స్‌ ఆర్ధిక మంత్రి బ్రూనో లీ మారీ చెప్పాడు. రష్యామీద పూర్తి స్ధాయిలో ఆర్ధిక యుద్ధం చేయనున్నట్లు, ఆ మేరకు ఆర్ధిక రంగాన్ని దెబ్బతీస్తామని ఒక రేడియోలో మాట్లాడుతూ చెప్పాడు.ఈ అంశాలు పుతిన్‌కు తెలియనివేమీ కాదు కనుకనే ప్రతి ఆంక్షలు, తీవ్ర వత్తిడికి పూనుకున్నాడు. ఇప్పటికి ఐదు దఫాలుగా నాటోను విస్తరించి రష్యా ముంగిట తిష్టవేసేందుకు అమెరికా పూనుకుంది. ఈ వివాదానికి మూలం అదే అన్నది తెలిసిందే.రష్యా భద్రత అంశాన్ని విస్మరించి ఏకపక్షంగా ముందుకు సాగితే కుదరదని పుతిన్‌ పశ్చిమ దేశాలకు స్పష్టం చేశాడు. దానిలో భాగంగానే క్రిమియాను తమ అంతర్భాగంగా గుర్తించాలని, ఉక్రెయిన్లోని నయానాజీ మూకలను వదిలించుకోవాలని కూడా కోరుతున్నాడు.


పశ్చిమ దేశాల కవ్వింపు చర్యలు, సమీప దేశాల్లో ఆయుధమోహరింపును ఎదుర్కొనేందుకు రష్యాకూడా పావులు కదిపింది. దానిలో భాగంగానే బెలారస్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అవసరమైతే అణ్వాయుధాలు, క్షిపణులను మోహరించేందుకు, రష్యాదళాలను శాశ్వతంగా దేశంలో కొనసాగించేందుకు రాజ్యాంగబద్ద ఆమోదం పొందారు. రష్యా మీద ప్రకటించిన ఆంక్షలు అణుదాడి కంటే తక్కువేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే రూబుల్‌ విలువిలువ కుప్పకూలింది.ద్రవ్యోల్బణం పెరిగింది. జనం బాంకుల ముందు వరుసలు కట్టారు. ఇతర దేశాల నుంచి నగదు బదిలీకి వీల్లేకుండా కొన్ని రష్యన్‌ బాంకులను స్విఫ్ట్‌ నుంచి తొలగించారు.పుతిన్‌తో సహా అనేక మంది వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు విధించారు. విదేశాల్లో ఉన్నవారి ఆస్తుల విలువ 800 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఆంక్షల నుంచి గాస్‌, చమురు, ఎరువులు, గోధుమల వంటి వాటి లావాదేవీలకు చెల్లింపులను మినహాయించారు. ఇరాన్‌, వెనెజులా మీద ఇలాంటి ఆంక్షలనే అమెరికా విధించింది. క్యూబామీద దశాబ్దాలుగా ఇంతకంటే తీవ్ర అష్టదిగ్బంధనం గావించినప్పటికీ అవి తట్టుకొని నిలిచాయి. అందువలన తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ రష్యాకు తట్టుకొనే శక్తి ఉంది. ఐరోపాలో అమెరికా అణ్వాయుధాల మోహరింపు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యన్‌ విదేశాంగ మంత్రి లావరోవ్‌ మంగళవారం నాడు చెప్పాడు. ప్రస్తుత పరిస్ధితిలో నూతన ఆయుధపోటీ తగదని, నిరోధించాలని అన్నాడు.ఐరోపాలో స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల మోహరింపుపై మారటోరియం ప్రకటించాలని ప్రతిపాదించాడు. అమెరికా అణ్వాయుధాలు కొన్ని దేశాల్లో ఉన్నాయని ఇది అణ్వస్త్రవ్యాప్తి నిరోధ ఒప్పందానికి విరుద్దమని జెనీవాలో జరుగుతున్న నిరాయుధ సభలో వీడియో ద్వారా మాట్లాడుతూ లావరోవ్‌ చెప్పాడు.


తమ గడ్డమీద అణ్వాయుధాలను ఉంచేందుకు బెలారస్‌ తీర్మానించటాన్ని బట్టి పశ్చిమ దేశాల నుంచి వచ్చే ముప్పు కనిపిస్తున్నది. బహుశా అందుకే రష్యా అణుదళాలు సన్నద్దంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు చెప్పవచ్చు. అణ్వాయుధాల గురించి ముందుగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఫిబ్రవరి 24న ప్రస్తావించాడు. అణుదాడి గురించి పుతిన్‌ బెదిరిస్తున్నాడని బైడెన్‌ విలేకర్లతో చెప్పాడు. అదేమిటో వివరిస్తారా అని అడిగితే అతనేమనుకుంటున్నాడో తనకు తెలియదని సమాధానాన్ని దాటవేశాడు. పశ్చిమ దేశాలన్నీ ఐక్యంగా ఉంటాయా లేదా అని పుతిన్‌ పరీక్షించాలనుకుంటున్నాడని కూడా అన్నాడు. అణుదళాల సన్నద గురించి పుతిన్‌ చెప్పటాన్ని అణుదాడికి దిగుతాడని భావించనవసరం లేదు.


ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడినపుడల్లా అణ్వాయుధ అగ్రదేశాలు హెచ్చరికలు, కొత్త పరీక్షలు, అణు సామర్ధ్య క్షిపణుల పరీక్షలు చేయటం సాధారణంగా జరుగుతోంది తప్ప రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఎవరూ ప్రయోగించలేదు. గతంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు జరిపినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హడావుడి, తరువాత మౌనంగా ఉండటం తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్‌ వ్యవహారంలో పుతిన్‌ కూడా అదే ఎత్తుడను అనుసరించాడు. దాడికి రెండునెలల ముందు నుంచి అనేక విధాలుగా తమ దేశ భద్రతకు హామీ గురించి ఐరాసకు, నాటో దేశాలకు మొరపెట్టుకున్నా పట్టించుకున్నవారు లేకపోగా మరింతగా రెచ్చగొట్టిన అంశం తెలిసిందే.ఉక్రెయిన్‌ అణుశక్తి దేశం కాదు. కేవలం బెదిరింపు, వత్తిడికి మాత్రమే పరిమితం అని విశ్లేషకులు చెఋన్నారు. ఐతే ప్రస్తుతం జరుగుతున్న ప్రచార యుద్దంలో ఏ దేశం ఎటువంటి వైఖరి తీసుకుంటుందో ఎలాంటి తెగింపులకు పాల్పడుతుందో చెప్పలేము. ఉక్రెయిన్‌కు నాటో తీర్ధం ఇవ్వనంత మాత్రాన గత మూడు దశాబ్దాలుగా ఆదేశానికి వచ్చిన ముప్పేమీ లేదు. అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఎప్పుడైతే తన అనుకూల శక్తులను గద్దెనెక్కించి రష్యాను కవ్విస్తోందో అప్పటి నుంచే అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు పశ్చిమ దేశాలు అనుసరించే వైఖరిపైనే అనేక అంశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రతిదేశం తన రక్షణను తాను చూసుకోవాల్సిన పరిస్ధితిని అమెరికా, నాటో కూటమి కల్పించింది. అందువలన ఇప్పుడు ఎక్కడా మనకు శాంతిదూతలు కనపడరు.పశ్చిమదేశాల తీరు తెన్నులను చూస్తుంటే మరోసారి ఐరోపా ఆయుధ మోహరింపు కేంద్రంగా మారే అవకాశాలు లేకపోలేదు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒక వైపు రష్యా మరోవైపు ఉంటాయి. తగులుతున్న ఎదురుదెబ్బలు, దెబ్బకుదెబ్బ తీస్తామని చేస్తామని హెచ్చరికల కారణంగానే అమెరికా అదుపులో ఉంటోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : అమెరికా, రష్యా ఎత్తులకు పైఎత్తులు !

22 Tuesday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Joe Biden, NATO allies, RUSSIA, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ – రష్యా వివాదం కొత్త మలుపు తిరిగింది.ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులను గుర్తిస్తున్నట్లు సోమవారం నాడు రష్యా ప్రకటించింది. వెంటనే ఆ రిపబ్లిక్కులతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దంటూ ఆర్ధిక ఆంక్షలను అమెరికా అధినేత జోబైడెన్‌ ప్రకటించటంతో మరో రూపంలో వాటిని గుర్తించినట్లయింది. అంతకు ముందు వివాదం గురించి చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, రష్యా అధినేత పుతిన్‌ అంగీకరించారని, ఫిబ్రవరి 24న సమావేశం జరగవచ్చని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఈ లోగా రష్యా దాడి జరపకపోతేనే తాను హాజరవుతానని బైడెన్‌ షరతు పెట్టారు.బైడెన్ను ఒప్పించటానికి పదిహేను నిమిషాలు పడితే పుతిన్‌తో మూడు గంటలు మాట్లాడాల్సి వచ్చిందని మక్రాన్‌ కార్యాలయం వెల్లడించింది. ఆ ప్రకటన ఇంకా చెవుల్లో గింగురు మంటుండగానే కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశం జరిగేదీ లేనిదీ చెప్పలేము. తాజా పరిణామాల గురించి చర్చించాలని భద్రతా మండలి సభ్యురాలు మెక్సికో, అమెరికా, ఉక్రెయిన్‌, ఐదు ఐరోపా దేశాలు భద్రతామండలిని కోరగా సోమవారం రాత్రి అత్యవసర భేటీ జరిగింది. పశ్చిమదేశాలన్నీ రష్యా చర్యను ఖండించగా మన దేశం తటస్ధ వైఖరి తీసుకొని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. తాజా పరిణామాలపై భద్రతా మండలి ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, తీసుకుంటే దాన్ని రష్యా వీటో చేస్తే జరిగేదేమిటి ? తాను గుర్తించిన రిపబ్లిక్కులతో స్నేహ ఒప్పందాలు చేసుకున్న రష్యా ఆ ప్రాంతాలకు శాంతి పరిరక్షక దళాలను పంపనున్నట్లు వార్తలు. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతానికి దళాలను పంపాలన్న పధకం ప్రస్తుతానికి లేదని ముప్పు తలెత్తితే ఆ పని చేస్తామని రష్యా ప్రకటించింది.


ఉక్రెయిన్‌పై దాడికి రష్యా పూనుకుందని నిర్ధారణగా తాము చెబుతున్నామని కొద్ది వారాలుగా మాట్లాడిన అమెరికా ఇప్పుడు భద్రతామండలి ద్వారా సరికొత్త పల్లవి అందుకుంది. డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులను గుర్తించటం ద్వారా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లయిందని,ఇది దాడేనని అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు గుండెలుబాదుకుంటున్నాయి. ఈ రెండు ప్రాంతాలూ 2014లోనే ఉక్రెయిన్‌ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకోసం అక్కడి జనం ఆయుధాలు పట్టారు. వారిని అణచివేసేందుకు ఉక్రెయిన్‌ పంపిన భద్రతా దళాలను తిప్పికొట్టి రిపబ్లికులుగా ప్రకటించుకున్నారు. ఇప్పటి వరకు అదే స్ధితి కొనసాగుతోంది.2014 బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి గతవారంలో ఉక్రెయిన్‌ మిలిటరీ కాల్పులు జరిపింది, ప్రతిగా తిరుగుబాటుదార్లు కూడా స్పందించారు.


గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ రిపబ్లిక్‌ల స్వాతంత్య్రప్రకటనను సాంకేతికంగా గుర్తించలేదు తప్ప అనేక అంశాలలో గుర్తింపు దేశాలతో మాదిరే రష్యా వ్యహరిస్తోంది.2014 మే నెలలో జరిపిన డాన్‌టెస్క్‌ ప్రజాభిప్రాసేకరణలో 75శాతం మంది పాల్గొనగా 89శాతం స్వయం పాలనకు మద్దతు ఇచ్చారు. 2016 నుంచి డాన్‌టెస్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ పేరుతో పాస్‌పోర్టులు జారీచేస్తున్నారు.2019 జూన్‌ నుంచి డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులోని జనాలకు రష్యా తన పాస్‌పోర్టులను జారీ చేయటం ప్రారంభించి ఇప్పటి వరకు ఆరులక్షల మందికి జారీ చేసింది. మానవతాపూర్వకమైన సాయంగా తామీ పని చేస్తున్నట్లు పేర్కొన్నది. ఈ రెండు రిపబ్లిక్కులలో ఉక్రెయిన్‌ పాస్‌పోర్టులను గుర్తించటం లేదని అదే ఏడాది ప్రకటించారు. ఉక్రెయిన్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న మోటారువాహనాలు తమ ప్రాంతాల్లోకి రావటాన్ని అక్రమం అని డాన్‌టెస్క్‌ ప్రకటించింది. 2014లో అధికార భాషలుగా ఉక్రేనియన్‌, రష్యన్‌ ఉంటాయని ప్రకటించిన డాన్‌టెస్క్‌ 2020లో రష్యన్‌ ఒక్కదాన్నే గుర్తిస్తున్నట్లు పేర్కొన్నది. ఇప్పుడు ఈ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది. ఇంతకాలం ఈ రిపబ్లిక్‌లను ఆక్రమించేందుకు రష్యా పధకం వేసినట్లు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ప్రచారం చేశాయి.
తాజాగా వెల్లడైన సమాచారాన్ని బట్టి నాటో విస్తరణ గురించి ఆ కూటమి దేశాలు గతంలో రష్యాకు ఇచ్చిన వాగ్దానం నుంచి వైదొలిగినట్లు జర్మన్‌ పత్రిక డెర్‌ స్పీగెల్‌ ఒక బ్రిటన్‌ పత్రాన్ని బయట పెట్టింది. నాటోను విస్తరించబోమని అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ మాస్కోకు వాగ్దానం చేసిన అంశం గురించి చర్చించినట్లు ఆ పత్రంలో ఉంది.1991 మార్చి ఆరవ తేదీన బాన్‌ పట్టణంలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో దీని గురించి చర్చించారు. ” అధికార లేదా అనధికారికంగా కూడా నాటోను తూర్పు వైపు విస్తరించకూడదు ” అని ఐరోపా, కెనడాలతో సంబంధాలు నెరిపే అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి రేమాండ్‌ సెట్జ్‌ ప్రకటనను దానిలో ఉటంకించారు. తూర్పు ఐరోపా దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్న సాధారణ ఒప్పందం ఉనికిలో ఉన్న అంశాన్ని బ్రిటన్‌ ప్రతినిధి చర్చల్లో ప్రస్తావించినట్లు కూడా ఆ పత్రంలో ఉంది.” 2+4 సంభాషణల్లో నాటోను ఎల్‌బె నది ఆవలకు విస్తరించకూడదని మనం స్పష్టం చేశాం, కనుక పోలాండ్‌తో సహా ఇతరులెవరికీ నాటో సభ్యం ఇవ్వకూడదని ” నాటి పశ్చిమ జర్మనీ ప్రతినిధి జర్‌జెన్‌ హ్రౌబోగ్‌ అన్నాడు.


డెర్‌ స్పీగల్‌ ప్రచురించిన పత్రాన్ని తొలుత అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ జాషువా షిఫ్రిన్స్‌న్‌ బ్రిటన్‌ నేషనల్‌ ఆర్కైవ్స్‌లో కనుగొన్నాడు. దాని మీద రహస్యం అనే ముద్ర ఉంది, తరువాత దాన్ని బహిర్గతం చేశారు. నాటోను విస్తరించకూడదనే వాగ్దానం లేదని సీనియర్‌ విధాన నిర్ణేతలు చెప్పవచ్చు కానీ ఈ పత్రం వాస్తవాన్ని చెబుతున్నదని షిఫ్రిన్స్‌న్‌ పేర్కొన్నాడు. ఎనిమిది సంవత్సరాల తరువాత నాటో విస్తరణ జరిగింది. ఒక్క అంగుళం మేరకు కూడా తూర్పు వైపు నాటో విస్తరణ జరగదని వాగ్దానం చేశారని డిసెంబరు నెలలో వ్లదిమిర్‌ పుతిన్‌ పత్రికా గోష్టిలో చెప్పారు. అలాంటిదేమీ లేదని, తెరవెనుక ఒప్పందాలేమీ లేవని నాటో సెక్రటరీ జనరల్‌ జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ అన్నాడు.1999లో పోలాండ్‌, హంగరీ, చెకియాలను, 2004లో మాజీ సోవియట్‌ రిపబ్లిక్కులు ఎస్తోనియా, లాత్వియా, లిధువేనియాలను చేర్చుకున్నారు. దీంతో నాటో దళాలు రష్యాలోని సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరానికి 135 కిలోమీటర్ల దూరంలోకి వచ్చినట్లయింది. మరోవైపు నుంచి ఇంకా దగ్గరకు వచ్చేందుకు ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వాలని నాటో నిర్ణయించింది. ఇదే ఉద్రిక్తతలకు మూలం.


ఉక్రెయిన్‌ పేరుతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆర్ధిక లబ్ది పొందేందుకు అమెరికా పధకం వేసిందనే తర్కం కూడా వినిపిస్తోంది. అక్కడి మిలిటరీ-పారిశ్రామికవేత్తలకు ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధం ఉంటేనే వారి ఉత్పత్తులు అమ్ముకొని లబ్ది పొందవచ్చు. ఐరోపాకు ముప్పును ఎదుర్కొనే పేరుతో ఏర్పాటు చేసిన నాటో ద్వారా జరుగుతున్నది అదే. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా రెచ్చగొట్టినన్ని ఉద్రిక్తతలు, యుద్ధాలు మరొక దేశం వైపు నుంచి లేవు. రేథియాన్‌ అనే అమెరికన్‌ కంపెనీ క్షిపణులు, ఇతర ఆయుధాల తయారు చేస్తుంది. జనవరి చివరిలో దాని సిఇఓ గ్రెగ్‌ హేస్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ లేదా ఇతర భద్రతా ముప్పులు అంతర్జాతీయ అమ్మకాలకు అవకాశాలను కల్పిస్తుందని చెప్పాడు. అమెరికాకు ఉద్రిక్తతలు కొనసాగినా లాభమే. గత కొద్ది నెలలుగా తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల నుంచి పెట్టుబడులు అమెరికా ద్రవ్య మార్కెట్‌కు తరలుతున్నాయి. దీని వలన ద్రవ్య సరఫరా పెరుగుతుంది, బాండ్ల రేటు స్ధిరపడుతుంది, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా విదేశాంగ విధానాన్ని ఆయుధ కంపెనీలు నిర్దేశిస్తున్నాయి.


తీర్మానాలతో నిమిత్తం లేకుండానే అమెరికా, ఇతర నాటో దేశాలు గతంలో ఇరాక్‌ మీద దాడి చేసినప్పటికీ భద్రతామండలి చేసిందేమీ లేదు. అలాగే ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో అది చేసే తీర్మానం లేదా నిర్ణయం గురించి (ఇది రాస్తున్న సమయానికి ) ఇంకా తెలియదు. ఏ తీర్మానం చేసినా రష్యా వీటో చేస్తే వీగిపోతుంది. ఇప్పుడేం జరుగుతుంది అన్నది ఆసక్తికలిగించే అంశం. రష్యా గుర్తింపుతో నిమిత్తం లేకుండానే అంతకు ముందునుంచే డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లపై ఉక్రెయిన్‌ దళాలు దాడులను ప్రారంభించాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ రిపబ్లిక్‌ల తిరుగుబాటుదార్లకు రష్యా మద్దతు బహిరంగ రహస్యమే. 2015లో కుదిరిన మిన్‌స్క్‌ ఒప్పందం ప్రకారం ఆ రెండు ప్రాంతాలు ఉక్రెయిన్లో స్వయం పాలిత ప్రాంతాలుగా ఉండవచ్చు. కానీ అది ఇంతవరకు అమలు జరగలేదు. 2008లో రష్యా-.జార్జియా యుద్ధానంతరం జార్జియాలోని అబ్కాజియా, దక్షిణ ఒసెటియా ప్రాంతాలు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా, వెనెజులా, నికరాగువా, సిరియా, నౌరు గుర్తించాయి. ఆ రెండు ప్రాంతాలూ పరస్పరం గుర్తించుకున్నాయి. వాటికి ఇంతవరకు ఐరాస సభ్యత్వం లేదు.


ఐరాసలో చేరాలంటే ఐరాస నిబంధనలను అంగీకరిస్తున్నట్లు సంస్ధ సెక్రటరీ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును భద్రతామండలికి నివేదిస్తారు. పదిహేను మంది సభ్యులున్న మండలిలో కనీసం తొమ్మిది మంది దాన్ని ఆమోదించాలి. శాశ్వత సభ్య దేశాలైన చైనా, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యాలలో ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఓటు వేయకూడదు. అలా సిఫార్సు చేసిన తీర్మానాన్ని ఐరాస సాధారణ అసెంబ్లీకి నివేదిస్తారు. అక్కడ మూడింట రెండువంతుల దేశాలు ఆమోదించాలి. ఆ రోజు నుంచి సభ్యత్వం వస్తుంది. సాధారణ అసెంబ్లీ ప్రతి సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధుల అర్హతలను తొమ్మిది మంది సభ్యుల కమిటీ పరిశీలిస్తుంది. సదరు ప్రతినిధిని పంపిన ప్రభుత్వం చట్టబద్దమైనదా కాదా అని ఎవరైనా ప్రశ్నించినపుడు మెజారిటీ ఓటుతో నిర్ణయిస్తారు. ఈ నేపధ్యంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్న దేశాలన్నీ ఐరాసలో చేరే అవకాశం లేదు. ఐరాసతో నిమిత్తం లేకుండా ఏ దేశమైనా గుర్తించి సంబంధాలు పెట్టుకోవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు.


డాంటెస్క్‌, లుహనస్క్‌ రిపబ్లిక్‌లను గుర్తించిన వెంటనే రష్యావాటితో స్నేహ ఒప్పందాలు కూడా చేసుకుంది.దాని మేరకు శాంతిపరిరక్షణకు కొన్ని దళాలను పంపింది. ఈ చర్య ఉక్రెయిన్‌పై దాడి అని పశ్చిమ దేశాలు వర్ణిస్తున్నాయి. రష్యా మీద మరిన్ని ఆంక్షలను ప్రకటిస్తామని చెప్పాయి. ఎలాంటి కారణం లేకుండా కూడా తమ మీద ఆంక్షలు విధించటం చూశామని, దీనిలో కొత్తేముందని రష్యా విదేశాంగ మంత్రి అన్నారు. తాము స్వంతంగా కొన్ని ఆంక్షలు ప్రకటిస్తామని అమెరికా చెప్పింది. బ్రిటన్‌ కొన్ని బాంకులపై ఆంక్షలు విధించింది. సముద్రగర్భం నుంచి వేసిన గాస్‌, చమురు గొట్టపు మార్గ పధకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ పేర్కొన్నది. తిరుగుబాటు రిపబ్లిక్‌లపై మిలిటరీతో పాటు కిరాయి మూకలను కూడా ఉక్రెయిన్‌ ప్రయోగిస్తున్నది. ఉక్రెయిన్‌ పూర్తి స్ధాయి దాడులకు దిగితే ఏం జరుగుతుందన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాటో బలగాల సమీకరణ ఉక్రెయిన్‌లో పోరుకు దారి తీస్తుందా ?

25 Tuesday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, NATO massive arms buildup, RUSSIA, Ukraine war, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


మంగళవారం తెల్లవారేసరికి రెండు ప్రధాన అంతర్జాతీయ వార్తలు. ఒకటి రష్యాదిశగా నాటో నావిక, వైమానిక దళాల తరలింపు. తూర్పు ఐరోపా దేశాలకు 50వేల మందివరకు సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సర్కార్‌ చర్చలు. భద్రతా చర్యల్లో భాగంగా తైవాన్‌ ప్రాంతంపై చక్కర్లు కొట్టిన చైనా వైమానిక దళ విమానాలు. ఉక్రెయిన్‌ నుంచి అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తమ దౌత్యసిబ్బంది, కుటుంబాలను స్వదేశాలకు రావాలని ఆదేశించాయి. ఈ పరిణామాలకు పూసల్లో దారం మాదిరి సంబంధం ఏమైనా ఉందా ? అంతర్జాతీయ రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తుల్లో భాగంగా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.కార్యాకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. చైనా గనుక తైవాన్‌ ప్రాంతాన్ని బలవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే తాము సాయుధ జోక్యం చేసుకుంటామని అంతకు ముందు డోనాల్డ్‌ట్రంప్‌, ఇప్పుడు బైడెన్‌ పదే పదే హెచ్చరించిన అంశం తెలిసిందే. అలాగే దక్షిణచైనా సముద్రం, తైవాన్‌ జలసంధిలోకి అమెరికా యుద్ద నావలను నడిపించిన అంశం తెలిసిందే. ఒక్క చిన్న యుద్ద రంగంలోనే గెలుపెరగని అమెరికా, దాని అనుచర దేశాలు ఒకేసారి రెండు చోట్ల యుద్ధానికి – అదీ బలమైన రష్యా, చైనాలతో తలపడతాయా ?


ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే రష్యాను రెచ్చగొట్టేందుకు పశ్చిమ దేశాలు కవ్వింపులకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తొలి దశలో వెయ్యి నుంచి ఐదువేల మంది వరకు మిలిటరీని రుమేనియా, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియా దేశాలకు పంపాలని తరువాత 50వేలు, అంతకు మించి కూడా మోహరించాలని అమెరికన్లు చర్చలు జరుపుతున్నారు. బాల్టిక్‌, నల్లసముద్ర ప్రాంతంలోని ఈ దేశాల నుంచి కొద్ది నిమిషాల్లోనే రష్యాపై క్షిపణి దాడులు జరిపేందుకు వీలు కలుగుతుంది. పశ్చిమ దేశాల కదలికలు, ప్రకటనలను గమనించిన రష్యా సరిహద్దులకు లక్ష మంది సైనికులను తరలించినట్లు వార్తలు. ఐరోపా గడ్డమీద రెండవ ప్రపంచ పోరు తరువాత అతి పెద్ద యుద్ధం అవుతుంది కనుక తాము ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని ఇంత పెద్ద ఎత్తున ఆయుధ తరలింపును తాము చూడలేని అమెరికా ప్రతినిధి విండ్‌మాన్‌ చెప్పాడు.


నిజంగా యుద్ధం జరుగుతుందా ? అసలెందుకీ హూంకరింపులు ? ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యం, జాతీయ సమగ్రత పరిరక్షణకోసమే ఇది అంటున్నారు. ఇదొక పెద్ద అబద్దం. రష్యాను దెబ్బతీయాలంటే దాని సరిహద్దులకు నాటోను విస్తరించాలన్నది అమెరికా ఎత్తుగడ.2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌ పాలకులను కుట్ర చేసి గద్దెదింపారు. తాజా ఉద్రిక్తతలకు మూలం, రష్యా-ఉక్రెయిన్‌ విబేధాలకు 2013 పరిణామాలు నాంది. ఐరోపా యునియన్‌తో ఆర్ధిక సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్న ప్రతిపాదనను నాటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ యనుకోవిచ్‌ తిరస్కరించాడు. 2013 నవంబరులో దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శకులకు అమెరికా, ఐరోపా దేశాలు, యనుకోవిచ్‌కు రష్యామద్దతు ఇచ్చింది. ఆర్ధిక సంబంధాల ముసుగుతో నాటోలో చేర్చుకోవాలని అమెరికా చూస్తే, వ్యతిరేకించి నిలువరించాలన్నది రష్యాఎత్తుగడ. మరుసటి ఏడాది ఫిబ్రవరిలో యనుకోవిచ్‌ దేశం వదలిపారిపోయాడు. మార్చినెలలో క్రిమియా ప్రాంతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ జనం రష్యాతో కలవాలని తీర్పు చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకొని రష్యా తనతో విలీనం చేసుకుంది.(గతంలో రష్యా రిపబ్లిక్‌లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని నాటి సోవియట్‌ పాలకులు పాలనా సౌలభ్యత కోసం ఉక్రెయిన్‌లో కలిపారు.) మరో రెండు నెలల తరువాత తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటు వాదులు డోన్‌టెస్క్‌, లుహాన్‌స్క్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా వేరుపడాలని జనం చెప్పారు. దాన్ని ఉక్రెయిన్‌ తిరస్కరించింది. తరువాత అక్కడి వేర్పాటు వాదులు ఆయుధాలు పట్టి అనేక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఇప్పటికీ అదే స్ధితి కొనసాగుతోంది. వారికి రష్యా మద్దతు ఇస్తోంది.2015లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ఎవరూ దానికి కట్టుబడిలేరు. అంతర్యుద్దంలో 15వేల మంది మరణించారని అంచనా.


ఇప్పుడు ఆ వేర్పాటువాదులు కోరుతున్నట్లుగా వారిని రష్యా గుర్తించినా లేదా వారికి మద్దతుగా సైన్యాన్ని పంపినా ఆ పేరుతో రష్యా మీద దాడికి దిగాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకుగాను పచ్చి అవాస్తవాలను ప్రచారంలో పెట్టారు. మధ్యధరా సముద్రంలో నాటో కూటమి ఇప్పుడు ” నెప్ట్యూన్‌ స్ట్రైక్‌ 22” పేరుతో ఫిబ్రవరి నాలుగు వరకు సైనిక విన్యాసాలు జరుపుతున్నది. ఇంకా డైనమిక్‌ మంటా 22, డైనమిక్‌ గార్డ్‌, కోల్డ్‌ రెస్పాన్స్‌ 22 పేరుతో కూడా సైనిక విన్యాసాలు జరపనున్నాయి. ఇవన్నీ బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, విదేశాంగశాఖ చేసిన ప్రకటనలో ఉక్రెయిన్‌లో తన అనుకూల మాజీ ఎంపీ మురాయెవ్‌ను గద్దెమీద నిలిపేందుకు రష్యాకుట్ర పన్నినట్లు ఆరోపించింది. దీని మీద స్పందించిన అతగాడు బ్రిటన్‌ గాలితీశాడు. బ్రిటన్‌ విదేశాంగశాఖ గందరగోళంలో ఉన్నట్లుంది.రష్యా నామీద నిషేధం విధించింది, అంతేకాదు నాతండ్రి సంస్ధ నుంచి డబ్బుతీసుకోకుండా ఆ సంస్ధనే స్వాధీనం చేసుకుందని చెప్పాడు. అయినా సరే ప్రచారం ఆపలేదు, అమెరికా దాన్ని లంకించుకుంది. నాటో దేశాల్లో 20లక్షల మందికి పైగా కరోనాతో మరణించినా వారికి పట్టలేదు. ఉక్రెయిన్‌ ప్రజాస్వామ్యం పేరుతో కవ్వింపులకు దిగుతున్నారు.ప్రజారోగ్యరక్షణ ఖర్చును ఆయుధాల మీద ఖర్చు చేస్తున్నారు.


సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసి, స్వాతంత్య్రం ప్రకటించుకున్న తరువాత ఉక్రెయిన్‌ కుక్కలు చింపిన విస్తరిలా మారింది. ఎవరికి దొరికిన ప్రజాసంపదలను వారు స్వంతం చేసుకున్నారు. నడమంత్రపు సిరిగాళ్లు ముందుకు వచ్చారు. ఇప్పుడు అన్ని రంగాలను వారే శాసిస్తున్నారు.మీడియా, అధికారులు, న్యాయమూర్తులు, ఎంపీలు అందరూ సంతలోని సరకులుగా మారారు. ఎవరికి వారు స్వంత సాయుధ ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. ఫాసిస్టు శక్తులు రాజకీయాల్లోకి వచ్చాయి. 2014లో రష్యా అనుకూల యనుకోవిచ్‌ను గద్దె దించేందుకు ఐదు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు అమెరికా విదేశాంగ సహాయమంత్రి విక్టోరియా న్యూలాండ్‌ స్వయంగా చెప్పారు.నాటి జర్మన్‌ మంత్రి స్వయంగా ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపాడు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులతో తలపడేందుకు ఏర్పాటు చేసిన అజోవ్‌ రెజిమెంట్‌ అనే కిరాయి సాయుధమూకకు 2014 కుట్రలో జైలు నుంచి విడుదలైన నేరగాడు ఆండ్రీ బిలెట్‌స్కీ నేత. పచ్చి నాజీ. ఇలాంటి ముఠాలను ఉక్రెయిన్‌ మిలిటరీతో సమన్వయం చేసి వేర్పాటువాదుల మీదకు వదులుతున్నారు. ఈ రెజిమెంట్‌కు మీడియా,రాజకీయపార్టీ, సాయుధ శిక్షణా కేంద్రాలు, ఆయుధాలు ఉన్నాయి.


వివిధ కారణాలతో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తమ స్వంత మిలిటరీ సిబ్బంది పాత్ర నామమాత్రం గావించి కిరాయి మూకలను దించటం ఇటీవలి కాలంలో నానాటికీ పెరుగుతోంది. సిరియాలో అది స్పష్టంగా కనిపించింది. గత కొద్ది సంవత్సరాలుగా అలాంటి మూకలకు కేంద్రంగా ఉక్రెయిన్‌ మారింది.గత ఆరు సంవత్సరాలుగా 50దేశాల నుంచి 17వేల మందికి పైగా కిరాయి మూకలు అక్కడకు వచ్చినట్లు ఎఫ్‌బిఐ మాజీ ఏజంట్‌ అలీ సౌఫాన్‌ చెప్పినట్లు గతేడాది టైమ్‌ పత్రిక రాసింది. వీరందరికి అక్కడి అమెరికా అనుకూల ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.అజోవ్‌ సంస్ధను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధగా ప్రకటించాలన్న 40 మంది ఎంపీల వినతిని అమెరికా సర్కార్‌ బుట్టదాఖలు చేసింది.ఇలాంటి నయా నాజీ మూకలకు అమెరికా శిక్షణ, ఆయుధాలను అందచేస్తోంది. ఇది బరాక్‌ ఒబామా ఏలుబడి నుంచీ జరుగుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన సరిహద్దు రక్షణ దళాలతో పాటు ప్రయివేటు సాయుధ ముఠాలకూ శిక్షణ ఇస్తున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక గతేడాది డిసెంబరు 26న రాసింది. ఇప్పుడు మిలిటరీతో పాటు ఇలాంటి ముఠాలను కూడా సన్నద్దం చేయటాన్ని బట్టి వారిని ఎలా ఉపయోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాన్ని, ఉద్యమించే కార్మికవర్గాన్ని అణచేందుకు, రష్యాతో గిల్లి కజ్జాలు పెట్టుకొనేందుకు వీరిని ముందుకు నెట్టే అవకాశం ఉంది. ఉక్రెయిన్లోని డోన్‌టెస్క్‌,లుహానస్క్‌ ప్రాంతాలలో వేర్పాటు వాదులపైకి వీరిని ఉసిగొల్పితే వారికి మద్దతుగా రష్యా రంగంలోకి దిగవచ్చని, దాన్ని సాకుగా చూపి నాటో దేశాలు దాడులకు పూనుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇది ఒక అంశం మాత్రమే.


మరో రెండు దశాబ్దాల వరకు నాటో కూటమిలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వబోమని రష్యాను నమ్మించేందుకు అమెరికా పూనుకుంది. అమెరికా కడుపులో దుష్టాలోచన లేకపోతే ఇప్పుడు ఆయుధ సమీకరణ ఎందుకు అని అనుమానించిన రష్యా రిజర్వు దళాలు, క్షిపణులను మోహరిస్తున్నది.పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికన్‌ మీడియా యుద్దోన్మాదంతో ఊగిపోతున్నది.జనానికి ఎక్కిస్తున్నది. ఏక్షణమైనా దాడులు జరగవచ్చంటూ వర్ణిస్తున్నది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఉక్రెయిన్‌లో మూడు లక్షల మందికి ఆయుధ శిక్షణ ఇచ్చామని వారికి ఆయుధాలు, డబ్బు అందచేస్తే వారే రష్యా సంగతి చూసుకుంటారని తన మిత్రదేశాలకు అమెరికా చెప్పినట్లు వార్తలు. నాటో కూటమి దేశాలన్నింటా మీ చావు మీరు చావండి, కరోనాతో సహజీవనం చేయండి అంటూ వదిలేసిన పాలకుల మీద కార్మికవర్గం ఆగ్రహంగా ఉంది. అటువంటపుడు యుద్ధానికి మద్దతు ఏమేరకు ఇవ్వగలరన్నది సందేహమే. ఇదే విధంగా రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌ స్ధితి కూడా అంత సానుకూలంగా లేదు. అందువలన రెండు పక్షాలూ బేరసారాలు తప్ప తెగే దాగా లాగే పరిస్ధితి ఉండకపోవచ్చు.

పుతిన్‌ మాటకు గౌరవం, విలువ ఇవ్వాలంటూ ఢిల్లీలో మాట్లాడిన జర్మన్‌ నౌకాదళాధిపతికి స్వదేశం వెళ్లే సరికి ఇక చాలు ఇంటికి దయచెయ్యండి అనే వర్తమానం సిద్దంగా ఉంది. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని విచారం వెలిబుచ్చినా పదవి ఊడింది. మరోవైపు ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఎస్తోనియాకు తాము అందచేసిన వాటిని కూడా ఉక్రెయిన్‌కు తరలించరాదని షరతు పెట్టింది. రష్యాతో సంబంధాల అంశంలో జర్మనీలో భిన్న వైఖరులున్నట్లు ఈ పరిణామాలు వెల్లడించాయి.ఆర్ధిక ఆంక్షలపై జర్మనీ అంగీకరించటంలేదు. రష్యానుంచి పెద్ద గాస్‌ సరఫరా ప్రాజెక్టుకు జర్మనీ మద్దతు ఇస్తున్నది. ఐరోపా యునియన్‌ నుంచి వెళ్లిపోయిన బ్రిటన్‌ మాత్రం అమెరికాకు పూర్తి మద్దతు ఇస్తోంది.ఇప్పటికే ఆర్ధిక ఆంక్షలకు అలవాటు పడిన రష్యా ఇంతకంటే తమను చేసేదేముందనే తెగింపుతో ఉంది.
ఉక్రెయిన్‌ వేర్పాటు వాద ప్రాంతాలను స్వతంత్రదేశాలుగా రష్యా గుర్తిస్తే స్వల్పవివాదం తలెత్తవచ్చు. అది కూడా వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ మిలిటరీకే పరిమితం కావచ్చు తప్ప నాటో రష్యా పోరుగా మారే అవకాశాలు పరిమితం. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, ఉక్రెయిన్‌కు అందచేసిన ఆయుధాలను వెనక్కు తీసుకోవాలని రష్యాకోరుతోంది. అమెరికా నిరాకరిస్తోంది.ఉక్రెయిన్‌ నాటో కూటమికి దగ్గరగా ఉన్నప్పటికీ దానిలో సభ్యురాలు కాదు. గతంలో జార్జియాలో రెండు ప్రాంతాలు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నపుడు రష్యాగుర్తించింది. రెండు దేశాల మధ్య 2008లో స్వల్పపోరు జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరి పరిణామాలు ఉంటాయా ? ప్రతి మేఘం వర్షించదుా ప్రతి ఉరుముకూ పిడుగులు పడవు. ప్రతి పరిణామమూ వినాశకర పోరుకు దారితీయదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బీజింగ్‌ ఒలింపిక్స్‌-అమెరికా కపట రాజకీయం!

15 Wednesday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Sports, UK, USA

≈ Leave a comment

Tags

Beijing Olympics, US imperialism, US-Beijing Boycott, US’s diplomatic boycott


ఎం. కోటేశ్వరరావు


బీజింగ్‌ ఒలింపిక్స్‌ తుది సన్నాహాలు కూడా పూర్తి కావస్తున్నాయి. ఫిబ్రవరి నాలుగు నుంచి 20వ తేదీ వరకు జరిగే పోటీల్లో సత్తా చూపేందుకు క్రీడాకారులు ఒకవైపు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు చైనాను బదనాం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని దేశాలు అంతకంటే ఎక్కువగా సిద్ధం అవుతున్నాయి. క్రీడల కంటే అంతర్జాతీయ రాజకీయాలు ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. అసలేం జరగనుంది? అమెరికా కూటమి దేశాలు తమ క్రీడాకారులను బీజింగ్‌ పంపుతాయట గానీ వారి వెంట రాజకీయ నేతలు, అధికారులను మాత్రం పంపవట. దీనికి దౌత్యపరమైన బహిష్కరణ అని పేరు పెట్టారు. ఆడేది క్రీడాకారులు తప్ప అధికారులు కాదు కదా! వారు వస్తే ఏమిటి? రాకపోతే ఏమిటి అని క్రీడా సంబంధిత వర్గాలు పెద్దగా ఆ పిలుపులను పట్టించుకోవటం లేదని వార్తలు. రాజకీయ నేతల హడావుడి మరీ ఎక్కువగా ఉంది, మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత, అసలు మిమ్మల్ని రమ్మని పిలిచిందెవరు అని చైనా ప్రతినిధులు బహిష్కరణ గురించి చెప్పేవారి గాలితీశారు. తాము ఇంతవరకు అసలు అమెరికా రాజకీయవేత్తలకు ఆహ్వానాలే పంపలేదని, అలాంటప్పుడు బహిష్కరణకు తావెక్కడని అమెరికాలోని చైనా రాయబారి ప్రతినిధి ప్రశ్నించాడు.


నిర్వహించేది అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ, దానికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆతిధ్యదేశం చైనా మాత్రం దీన్ని తేలికగా తీసుకోవటం లేదు. ప్రతిగా క్రీడలు పూర్తయిన తరువాత కర్ర కాల్చి ఎక్కడ పెట్టాలో అక్కడ వాత పెడతాం అన్నట్లుగా హెచ్చరించింది. ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఎన్ని దేశాలు అమెరికాను అనుసరిస్తాయి, ఎన్ని తిరస్కరిస్తాయో ఇంకా తెలియదు. ఇప్పటి వరకు అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, లిధువేనియా బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించాయి. జపాన్‌ ఇంకా ప్రకటన చేయలేదు గానీ అలాంటి సూచనే చేసింది. అమెరికా అడుగులో అడుగువేసే దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ ఆ బాటలో నడిచేది లేదని చెప్పేశాయి. పంపటం లేదని, తమది బహిష్కరణ కాదంటూ కరోనాను కారణంగా న్యూజిలాండ్‌ చూపింది. మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అమెరికా తన పెరటితోటగా భావించే లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా కూడా హాజరవుతోంది. సముద్రంలోకి ప్రవహించే నదులను పర్వతాలు నిరోధించలేవని చైనా ఎద్దేవా చేసింది.


రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం క్రీడలను ఒక సాధనంగా వాడుకోచూడటం గర్హనీయం. చైనాలోని షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో ముస్లిం సామాజిక తరగతి మానవహక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ అమెరికా, దాని కూటమి దేశాలు యాగీ చేస్తున్నాయి. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ పట్టణంలో జరిగిన జి7 దేశాల విదేశాంగ, అభివృద్ధి మంత్రుల సమావేశం చైనా ఆర్థిక బలాత్కారం పేరుతో కొత్త పల్లవి అందుకుంది. పొద్దున లేస్తే తమకు లొంగని దేశాల మీద ఆర్థిక, దౌత్య, ఇతర ఆంక్షలను విధిస్తున్న అమెరికా, దానికి తందాన తాన అంటున్న దేశాలు చైనా మీద ప్రచారదాడి ప్రారంభించటంలో ఆశ్చర్యం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో అమెరికా ఇప్పటివరకు సాధించిందేమీ లేకపోగా నష్టపోయింది.

దొంగే దొంగని అరచినట్లుగా అమెరికా చేస్తున్న ఆర్థిక బలాత్కారాలకు అనేక ఉదంతాలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. దానికి తన మన పర బేధాలు లేవు. పసిఫిక్‌ సముద్రంలో నౌరు, కిరిబటి, మైక్రోనేసియా అనే మూడు చిన్న దీవుల దేశాలున్నాయి. ఇంటర్నెట్‌ సేవలను మెరుగుపరచేందుకు సముద్రంలో వైర్లద్వారా సమాచారాన్ని పంపే ప్రపంచబాంకు పథకాన్ని 7.25 కోట్ల డాలర్లతో రూపొందించి అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. దానిలో చైనా కంపెనీ ఒకటి 20శాతం తక్కువకు టెండరు వేసి కాంట్రాక్టు దక్కించుకుంది. చైనా కంపెనీకి గనుక పని అప్పగిస్తే భద్రతకు ముప్పు వస్తుందంటూ అమెరికా వత్తిడి తెచ్చి సదరు ప్రాజెక్టును అడ్డుకుంది. ఇది తాజా ఉదంతం. అంతకు ముందు హువెయి, టిక్‌టాక్‌, మూడు టెలికాం కంపెనీల మీద ఆంక్షలు విధించటం, వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టటం, వాటి ఉత్పత్తులు కొనుగోలు చేసిన, సేవలు పొందిన దేశాల మీద చర్యలు తీసుకుంటామని బెదిరించటం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి కంపెనీలను తొలగించటం, హువెయి కంపెనీ ఉన్నతాధికారిణిని కెనడాలో అరెస్టు చేయించటం తెలిసిందే. చైనా సంగతిని పక్కన పెడితే ఫ్రెంచి కంపెనీ అస్టోమ్‌పై 77.23 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. ఐరోపా విమానకంపెనీ ఎయిర్‌బస్‌పై 2020లో పన్నులు పెంచింది. అంతెందుకు మన నరేంద్రమోడీ కౌగిలించుకున్నా మరొకటి చేసినా మన ఎగుమతులపై రద్దు చేసిన పన్నుల రాయితీని రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌గానీ, తరువాత గద్దెనెక్కిన బైడెన్‌ గానీ వాటిని పునరుద్దరించలేదు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తే మన దేశం మీద కూడా చర్య తీసుకుంటామని అమెరికా చేసిన బెదిరింపులకు మన నరేంద్రమోడీ భయపడి నిలిపివేసిన అంశం తెలిసినదే.

లివర్‌పూల్‌లో జరిగిన జి7దేశాల సమావేశం చేసిన ప్రకటనల్లో ప్రస్తావించిన షిన్‌జాంగ్‌, హాంకాంగ్‌, టిబెట్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలన్నీ చైనా అంతర్గత విషయాల్లో వేలు పెట్టటమే. మానవహక్కులలో ఆరోగ్యం కూడా ఒకటి. ప్రపంచ జనాభాలో అమెరికా, బ్రిటన్‌ జనాభా కేవలం ఐదుశాతం, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలున్నాయి, అయినా ప్రపంచ కరోనా కేసుల్లో 23శాతం, మరణాల్లో 18శాతం అక్కడే అంటూ జీవించే హక్కును కాపాడాలని చైనా డిమాండ్‌ చేసింది. ఆపని చేయకుండా మిగతా దేశాల్లో మానవహక్కులు, ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతున్నాయని పేర్కొన్నది. ప్రపంచవ్యాపితంగా రెండులక్షలకు పైగా సైన్యాలను, అణ్వాయుధాలతో సహా ఆధునిక క్షిపణులను మోహరించి నిత్యం ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. ఎవరు ఏ ఆయుధాలు కొనాలో, కొనకూడదో నిర్దేశిస్తోంది. రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన మన దేశంపై ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు దిగిన అంశం కూడా తెలిసిందే.

చైనాను గుర్తించకుండా తైవానే అసలైనా చైనాగా చిత్రించి 1948 నుంచి 1971వరకు ఐక్యరాజ్య సమితిలో, 2001వరకు ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రవేశించకుండా అడ్డుకొన్నది అమెరికా. ప్రస్తుతం అది కానసాగిస్తున్న వాణిజ్య యుద్ధం ఆర్థిక బలాత్కారం కాదా? తనకంట్లో దూలాలు పెట్టుకొని ఎదుటివారి కంట్లో నలుసులను వెతుకుతోంది. మానవహక్కుల పరిరక్షణ అన్నది తన డీఎన్‌ఏలోనే ఉన్నదని అమెరికా చెప్పుకుంటోంది. ఆచరణలో మానవహక్కుల హరణమే దాని డీఎన్‌ఏ అని రుజువు చేస్తోంది. వందల ఏండ్ల క్రితం ఆఫ్రికా నుంచి జనాలను బానిసలుగా పట్టుకువచ్చింది అమెరికన్లు, వారిని కాపలా కాసేందుకు ఏర్పాటు చేసుకున్నదే అమెరికా పోలీసు వ్యవస్థ, దాని అవశేషాలే ఇప్పటికీ ఆఫ్రో-అమెరికన్లను హతమారుస్తున్న దురంతాలు. అమెరికా పొలాలు, కార్ఖానాల్లో పని చేసిన ఆఫ్రికన్‌ బానిసలకు పరిహారం చెల్లించాల్సి వస్తే ఆమొత్తం ఇప్పుడు 97లక్షల కోట్ల డాలర్లని జాక్‌ కోపే అనే ఆర్థికవేత్త అంచనా.

రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబులు వేసి 66వేల మందిని హిరోషిమాలో, 39వేల మందిని నాగసాకిలో పొట్టన పెట్టుకుంది. తరువాత కూడా దాని పర్యవసానాలకు ఎందరో బలయ్యారు. ఇలాంటి అమెరికా ప్రజాస్వామ్యం, మానవహక్కుల గానాలాపన చేస్తుంటే దానికి కెనడా, బ్రిటన్‌, జపాన్‌ వంతపాడటం సహజమే. ఎందుకంటే ఈ దేశాలు కూడా మానవహక్కుల హరణంలో తక్కువ తినలేదు. ఇక ఐరోపా సామ్రాజ్యవాద వారసులే కనుక ఆస్ట్రేలియా వారి వెనుక నడవటంలో ఆశ్చర్యం లేదు. ఇరాక్‌లో మారణాయుధాలను వెతికే పేరుతో దాడిచేసి పదిలక్షల మందిని, ఉగ్రవాదం మీద పోరు పేరుతో ఆప్ఘనిస్తాన్‌లో రెండున్నర లక్షలు, ఎమెన్‌లో నాలుగు లక్షలు, సిరియా, సోమాలియా, లిబియాల్లో మరికొన్ని లక్షల మందిని హతమార్చిన అమెరికా అండ్‌కో హంతక ముఠా చైనాలో షిన్‌జాంగ్‌లోని ముస్లింల గురించి మొసలి కన్నీరు కారుస్తోంది. మన కాశ్మీరులో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టింది అమెరికా, దానికి సాధనంగా పని చేసింది పాకిస్థాన్‌. అదే మాదిరి చైనాలో చిచ్చుపెట్టేందుకు షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో రెచ్చగొట్టింది. అక్కడి ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాల ద్వారా ఆయుధాలు, డబ్బు అందచేసింది అమెరికా. మెక్సికో, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాల నుంచి అక్రమంగా వలసలను ప్రోత్సహించి వారిని ఎక్కడా అధికారికంగా నమోదు చేయకుండా సామాజిక రక్షణ కల్పించకుండా తక్కువ వేతనాలకు పని చేయించుకుంటున్న అమెరికా మానవత నిజస్వరూపం తెలియందెవరికి? లాటిన్‌ అమెరికాలో నిత్యం ఏదో ఒక దేశంలో మానవహక్కులను హరించే శక్తులకు మద్దతు ఇస్తున్న అమెరికా ప్రజాస్వామ్య బండారం తెలిసిందే. ప్రపంచమంతటా అమెరికాకు చిన్నవీ, పెద్దవీ 800 వందల సైనిక కేంద్రాలు ఉన్నాయి. చైనాకు ఉన్నది ఒక్కటి, అదీ నాలుగు వందల అమెరికా కేంద్రాల మధ్య ఉంది.

క్రీడలపై బహిష్కరణ అస్త్రం పెద్దగా పనిచేయకపోయినా దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కొందరు చెబుతున్నారు. చైనా సహకారం, ప్రమేయం లేకుండా నేడు అంతర్జాతీయ రాజకీయాలు ముందుకు పోవు. గతంలో 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికాతో సహా 66దేశాలు బహిష్కరించాయి. తైవాన్‌కు గుర్తింపు ఇచ్చిన కారణంగా 1956 నుంచి 1980వరకు చైనా అసలు మొత్తంగా ఒలింపిక్స్‌ను బహిష్కరించింది. తరువాత 1984 లాస్‌ ఏంజల్స్‌ క్రీడలలో సోవియట్‌, పదమూడు తూర్పు ఐరోపా దేశాలు పాల్గొనలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని 1980లో అమెరిరా సాకుగా చూపింది. కానీ అదే అమెరికా, దాని మిత్రదేశాలు తరువాత వివిధ దేశాల్లో మారణకాండ సాగించినా ఎవరూ క్రీడలకూ-వాటికి పోటీ పెట్టలేదు. బీజింగ్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ సభకు అందిన ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చెప్పారు. క్రీడలను రాజకీయం చేయకూడదని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ అన్నాడు.


అమెరికా దౌత్యపరమైన బహిష్కరణకే పరిమితం కావటం వెనుక అక్కడి మీడియా సంస్థల వాణిజ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. క్రీడలను చూపేందుకు ఎన్‌బిసి సంస్థ ఒలింపిక్స్‌ కమిటీకి బిలియన్ల డాలర్లు చెల్లించింది. పోటీల్లో అమెరికన్‌ క్రీడాకారులు లేకపోతే దానికి పెద్ద నష్టం వాటిల్లుతుంది. మిగతా దేశాలకూ అదే సమస్యలున్నాయి. 2014లో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన కారణంగా రష్యాలోని సోచిలో జరిగిన శీతాకాల క్రీడలను నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఉపాధ్యక్షుడు జోబైడెన్‌, ప్రధమ మహిళ మిషెల్లీ ఒబామా మాత్రమే వాటిని బహిష్కరించారు. ప్రస్తుత అమెరికా కూటమి చర్యకు ప్రతీకారంగా 2028 లాస్‌ ఏంజల్స్‌, 2032 బ్రిస్‌బేన్‌ (ఆస్ట్రేలియా) ఒలింపిక్స్‌ను చైనా బహిష్కరించ వచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా లేకపోలేదు. చైనా వైపు నుంచి అలాంటి సూచనలైతే లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్రలతో క్యూబా ప్రభుత్వాన్ని కూలదోసే అమెరికా యత్నం !

15 Thursday Jul 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

cuba, Fidel Castro, U.S. embargo, US imperialism


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

క్యూబాలో కొంతమంది పౌరులు ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేశారు.ఈ సందర్భంగా ఒక వ్యక్తి మరణించినట్లు, వందమందిని అరెస్టు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. క్యూబా కమ్యూనిస్టు నియంత త్వాన్నుండి విముక్తి కావాలనీ , స్వేఛ కావాలనీ ప్రదర్శనకారులు కోరినట్లు వార్తలు వచ్చాయి. పోలీసు కార్లను ధ్వంసంచేసి షాపులను లూటీ చేశారు. ప్రదర్శనలు జరిపిన వారికి అమెరికా ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. క్యూబా ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారనడానికి ఈ నిరసనలు ఒక నిదర్శనమని వ్యాఖ్యానించింది.ప్రభుత్వమే ఈ అశాంతికి కారణమని ఆరోపించింది. విదేశాంగ మంత్రి రోడ్రిగజ్‌ అమెరికా ప్రకటనను సవాలుచేశారు. ”నిన్నటివరకూ క్యూబాలో ఎలాంటి అశాంతి లేదు. కానీ కొంతకాలంగా అమలు చేస్తున్నప్రచార కార్యక్రమం వల్లనే ఈ కల్లోలం అశాంతి తలెత్తాయి” అన్నారు.

క్యూబా అధ్యక్షుడు డియాజ్‌ కానెల్‌ శాన్‌ఆంటోనియా డీ బావోస్‌ ప్రాంత పర్యటన సందర్భంగా అమెరికా ప్రేరేపిత గ్రూపులు ఈ ప్రదర్శన చేశాయి. కానెల్‌ ప్రదర్శకులతో మాట్లాడారు. అమెరికా ఆంక్షలవలన తలెత్తిన అశాంతిగా వ్యాఖ్యానించారు. ఆహారకొరత, కరంటు కోత ప్రజల ఆగ్రహానికి కారణమని పాశ్చాత్య మీడియా అభిప్రాయంగావుంది. ప్లోరిడా పదవ జిల్లా డెమోక్రటిక్‌ పార్టీ నేత వాల్‌ డెమింగ్స్‌ ”క్యూబా ప్రజలు నియంత్త త్వానికి, పేదరికానికి వ్యతిరేకంగా స్వేఛాస్వాతంత్రాల కోసం చేసే పోరాటానికి అమెరికా ప్రభుత్వం క్యూబాలో వెంటనే జోక్యం చేసుకోవాలని ” డిమాండ్‌ చేసింది.
ఒక ప్రభుత్వంపై విధించగలిగిన కఠినమైన ఆర్ధిక ఆంక్షలనన్నిటినీ అమెరికా ప్రభుత్వం విధించింది. ఇక మిగిలింది మిలిటరీ జోక్యమే. ఇదివరకు1961లో ఒకసారి ప్రత్యక్షంగా సైనికులను క్యూబా దేశంలో దింపి భంగపడింది. ”బే ఆఫ్‌ ఫిగ్స్‌” గా పేరుపొందిన దాడి తో అధ్యక్షుడు కెనడీ అంతు లేని ఆపఖ్యాతిని మూటకట్టుకున్నాడు. తాజాగా ఆఫ్గనిస్ధాన్‌ లో ఇరవై సంవత్సరాల యుద్దాన్ని కొనసాగించలేక తాలిబాన్లతో రాజీపడి సేనలను ఉపసంహరించుకుంటున్నది. 1960 దశకంలో వియత్నాం యుద్దంలో 5 లక్షల అమెరికా సైన్యం చవిచూసిన పరాజయాలను,యుద్ద వ్యతిరేక అమెరికాప్రజల పోరాటాల చరిత్ర ను, ఇరాక్‌ లో సద్దాంహుస్సేన్‌ హత్యను ప్రజలింకా మరచిపోలేదు.,మిలిటరీ ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌ కార్పోరేట్‌ కంపెనీల కోసం చేస్తున్న యుధాలను అమెరికా ప్రజలు అనుమతించే పరిస్ధితి లేదు.

గత అరవై ఏళ్ళకుపైగా అమెరికా నాయకత్వం అత్యంత కఠినమైన రీతిలో ఆంక్షలను అమలుచేస్తున్నది.దీంతో క్యూబా ఆర్ధికప్రగతి నిలిచిపోయింది. అయినా మానవాభివ ద్ది సూచికలలో , పర్యావరణ పరిరక్షణలో ముందుంది. సామాజికన్యాయం అమలుపరుస్తున్నదేశంగా ప్రజల మన్నన పొందింది. విద్య, వైద్యం, సామాజిక భద్రత, సమానత్వం అమలులో ఖ్యాతి పొందింది. సామాజిక విప్లవంలోప్రజలను భాగస్వామ్యం చేయటంవలన కాస్ట్రో, చే గువేరా అందించిన చైతన్యంతో కష్టాలను ఎదుర్కొంటున్నారు. తన చుట్టూ వున్న క్యాపిటలిజం నుంచి పొంచివున్నప్రమాదాన్ని అత్యంత ప్రతిభావంతంగా, పట్టుదల. నిరంతర క షితో అన్ని రంగాలలో ఎదుర్కొంటున్నారు. విప్లవ ప్రభావం ఎంత తీవ్రంగావుంటే పాత వ్యవస్ధ పునరుద్దరణ అంత కష్టమవుతుంది అనేది వాస్తవం. మా క్యూబా పర్యటనలో ఎక్కడా వ్యాపారాన్ని ప్రోత్సహించే ప్రకటన బోర్డులను చూడలేదు. టీకాలు వేయించుకోవాలనీ, తల్లులను పాలివ్వమనీ పెద్ద పెద్ద బోర్డులు కనపడతాయి. ఒక బోర్డు లో ”ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 20 కోట్లమంది చిన్నారులు వీధుల్లో నిద్రిస్తారు. వారిలో క్యూబన్లు ఒక్కరు కూడా లేరు”.ఈ మాటలు 1996 లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో క్యూబా ఉపాధ్యక్షుడి ఉపన్యాసం నుండి రాశారు. మరోచోట విప్లవం గురించి, కాస్ట్రో ”సోషలిజం లేదా మరణం ” అనే మాటలున్న బోర్డులున్నాయి. ప్రతి అవకాశాన్నీ ప్రజలను చైతన్యపరచటానికి ఉపయోగిస్తున్న సంస్క తినుండి వినియోగ సంస్క తి లోకి మార్చాలని అమెరికా ప్రజలను రెచ్చకొడుతుప్నది.

అమెరికా ఆంక్షలే పేదరికానికి కారణం

ఆంక్షల ఫలితంగా ప్రజలు కష్టాలపాలయి ప్రభుత్వంపై తిరగ పడాలనేదే అమెరికా కోరిక. క్యూబా ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలనే లక్ష్యంతో ఆంక్షలను పెంచుతున్నారు.కరోనా సమయంలో ఈ ఆంక్షలను మరింత కఠినంగా అమలుపరుస్తున్నారు. ట్రంప్‌ ప్రభుత్వం అదనంగా విధించిన 243 ఆంక్షలను జో బైడన్‌ ప్రభుత్వం కొనసాగిస్తూనేవున్నది. ఇతర దేశాల స్వాతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తానని ఎన్నికల సమయంలోచేసిన వాగ్దానాన్ని బైడన్‌ మరచాడు . కోవిడ్‌ కాలంలో తన నిర్లక్ష్యం వలన లక్షలాదిమంది ప్రజల మరణానికి కారణమైనందున బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనారో సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటున్నాడు. అమెజాన్‌ అడవులను కార్పోరేట్‌ అనుకూలంగా నాశనం చేసి ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నాడు. అతను కూడా క్యూబా వ్యతిరేక ప్రదర్శనకారులకు సంఘీభావం తెలిపి తన నైజాన్ని నిరూపించుకున్నాడు. .క్యూబాలో ఆంక్షలవలన కష్టాలు పడుతున్న ప్రజలను రెచ్చగొట్టి సోషలిస్టు ప్రభుత్వాన్ని కూలదోయపూనుకున్నారు. అదనంగా విధించిన ఆంక్షల ఫలితంగా ప్రధాన ఆదాయవనరైన చక్కెర ఎగుమతులు దెబ్బతిన్నాయి. అమెరికా ఆంక్షలతో పాటుగా కర్షోనా తోడవటంతో టూరిజం వలన వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. అత్యంత అమానవీయ రీతిలో ఆహారపదార్ధాలను, ప్రాణాధార మందులను కూడా దిగుమతి చేసుకోనివ్వటంలేదు. వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్ధాలను కూడా కొనుక్కోనివ్వటంలేదు. అయినా, అమెరికా కంపెనీలు ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్లకు దీటుగా, పోటీగా స్వంతంగా అయిదు రకాల వ్యాక్సిన్లను అభివ ద్ధి చేసింది. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ప్రజలకు, కావాలంటే అమెరికాకు కూడా వ్యాక్సిన్ల ను ఇస్తామన్నారు. కోవిడ్‌ సమయంలో 23 దేశాలకు డాక్టర్లను ,నర్సులను పంపి ప్రపంచ ప్రజలకు అండగా నిలిచింది.

ఒక చిన్నదేశంపై ప్రపంచంలోనే అత్యంత బలవంతమైన దేశం తన శక్తి నంతా ఉపయోగించి ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నది. జూన్‌ 23 న ఐక్యరాజ్య సమితి సర్వ సభ్యసమావేశాలలో క్యూబా పై ఆంక్షలను ఎత్తివేయాలని 184 దేశాలు తీర్మానించాయి.. 1992 సం. నుంచీ ఆంక్షలను ఎత్తివేయాలని ఐక్యరాజ్య సమితి లో మెజారిటీ దేశాలు తీర్మానాలు చేస్తూనే వున్నాయి. అమెరికా ప్రభుత్వం లెక్కచేయటంలేదు. 2020 సం .లో ఆర్ధిక దిగ్బంధనంవలన 9.1 మిలియన్‌ డాలర్ల ను క్యూబా నష్టపోయిందని, వైరస్‌ లాగానే ఆంక్షలు, దిగ్బంధనం ఊపిరి పీల్చుకోకుండాచేసి హతమార్చుతాయని విదేశాంగ మంత్రి రోడ్రిగజ్‌ అన్నారు.

క్యూబా కు 90 మైళ్ళ దూరంలో వున్న ఆమెరికా లోని ఫ్లోరిడా రాష్ట్రం కేంద్రంగా చేసుకుని అసమ్మతిని రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను రెచ్చకొడుతూ మరొక పక్క బూటకపు వార్తలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందుకు పావులుగా క్యూబా దేశంనుండి పారిపోయివచ్చిన వారిని వాడుకుంటున్నారు. వారి ద్వారా క్యూబా లోవున్న ప్రజలను, వారి బంధువులను, స్నేహితులను లోబరచుకునే ప్రయత్నంచేస్తున్నారు. అసమ్మతివాదులకు ధన సహాయం, సామాజిక మాధ్యమాలకు అవసరమయిన సాంకేతిక సహాయాన్నిస్తున్నారు. మీడియాలో రకరకాల కధనాలను ప్రచారం చేస్తున్నారు.

క్యూబా ప్రజల ప్రియతమ నాయకుడు కాస్ట్రో పై 634 సార్లు హత్యాప్రయత్నం చేశారు. సార్వభౌమత్వం కలిగిన ఒక దేశ అంతరంగిక వ్యవహారాలలో బయటిదేశాల జోక్యం లేదా విచ్చిన్నకర చర్యలను ప్రోత్సహించడం అంటే క్యూబాను అస్ధిరపరచటమేనని , ఇది తమకు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యంకాదని రష్యా ప్రకటించింది. క్యూబాలో ఇతర దేశాల జోక్యందారీ విధానాలను తాము గట్టిగా వ్యతిరేకిస్తున్నామని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యువల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌ హెచ్చరించారు. క్యూబా ప్రభుత్వానికి, ప్రజలకు లాటిన్‌ అమెరికా ప్రజలు, సంస్ధలు, సంఘాలు తమ సంపూర్ల మద్దతును ప్రకటించాయి. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న మరొక లాటిన్‌ అమెరికా దేశం వెనెజులా. క్యూబా లో అమెరికా జోక్యాన్నిసహించేది లేదని అధ్యక్షుడు మదురో హెచ్చరించారు. ప్రపంచ మానవాళికి వ్యతిరేకంగా సాగే అత్యాచారాలకు, విద్వేషచర్యలకు, అధర్మయుధాలకు కారణమైన అమెరికాకు క్యూబా లో హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. క్యూబా ప్రజల పేదరికానికి కారణమైన అమెరికా ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని, క్యూబా ప్రభుత్వాన్ని కూలదోసె ప్రయత్నాలను ఆపాలని ప్రపంచ ప్రజలందరం కోరదాం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d