• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: February 2021

విశాఖ ఉక్కును ఎందుకు అమ్మాలనుకుంటున్నారు?

09 Tuesday Feb 2021

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Narendra Modi, Vizag steel agitation, Vizag Steel Plant, Vizag Steel Plant Privatisation


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్‌ నిర్ణయించింది. పెట్టుబడుల ఉపసంహరణద్వారా రూ.1.75 లక్షలకోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ప్రయత్నాలలో ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రజలు ఉవ్వెత్తున తమ వ్యతిరేకతను వెల్లడించారు. దాదాపు అన్నిపార్టీలు,ప్రజాసంఘాలు విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను అడ్డుకొంటామని శపధాలు చేశాయి. ఆంధ్రుల హక్కైన విశాఖఉక్కును ప్రైవేటుపరం చేయాలని చూస్తే మరో ఉక్కుఉద్యమం తప్పదని హెచ్చరించాయి. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని నేతలు ప్రకటించారు. ”వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లో ఒక్క అంగుళంకూడా ప్రయివేటుకి అమ్మనివ్వం, మా ఉక్కుజోలికొస్తే తొక్కేస్తాం, బీజేపీ మోడీ ఖబడ్దార్‌” అంటూ చేసిన నినాదాలతో విశాఖ నగరమంతా స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ నినాదాలతో దద్దరిల్లింది.
అసలు ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారు?. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ నష్టాలలో ఉన్నందువలననా? లేక ప్రభుత్వ ఆస్ధిని అమ్మి సొమ్ము చేసుకోవటానికా? ప్లాంటు సరిగ్గా పని చేయటంలేదా? ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టింది? తిరిగి ప్రభుత్వానికి ఏమైనా వచ్చిందా? నష్టాలలో ఉన్నపుడు అమ్మకుండా ఎట్లా ఉంటారు అని కొందరు అంటున్నారు. నిజంగా నష్టాలలో ఉందా? నష్టాలలో ఉంటే వాటికి కారణాలు ఏమిటి?

1. విశాఖ స్టీల్‌ ప్లాంటు నష్టాలలో లేదు. ప్రతి సంవత్సరం నగదు లెక్కలు తీస్తే లాభాలలోనే వుంది. ప్లాంటు విస్తరణకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. కార్మికుల కష్టంతో వచ్చిన లాభాలతోనూ, బ్యాంకు అప్పుల తోనూ ప్లాంటును విస్తరించారు. 63 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించారు. నష్టాలు ఉంటే వాటికి కారణం కేంద్ర ప్రభుత్వమే. 1971 సం. జనవరి 20 న శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాలసముద్రం వద్ద పైలాన్‌ ను ప్రారంభించి విశాఖస్టీల్‌ ప్లాంట్‌ స్ధాపన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏడు సంవత్సరాల పాటు నిధులు కేటాయించలేదు. 1978 లో కేంద్రంలోని జనతా ప్రభుత్వం విశాఖస్టీల్‌ కు రూ.1000కోట్లు కేటాయించి పనులు ప్రారంభించింది. 1979 జూన్‌ లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత 82 జనవరిలో మొదటి బ్లాస్ట్‌ ఫర్నెస్‌ , టౌన్‌ షిప్‌ శంకుస్ధాపనతో నిర్మాణం ఊపందుకుంది. 1992 ఆగస్టు 1 న ప్రధాని పీ.వీ.నరసింహరావు 32 లక్షల టన్నుల సామర్ధ్యంగల విశాఖ స్టీల్‌ ను జాతికి అంకితం చేశారు. తరువాత ్‌ ప్లాంటు విస్తరణకు ప్రభుత్వ పెట్టుబడులు ఆగిపోయాయి. బ్యాంకుల నుండి అప్పులను తీసుకుని స్టీల్‌ ప్లాంటు ను విస్తరించారు. ఉత్పత్తిని పెంచి కర్మాగారాన్ని లాభాలబాటలోకి తెచ్చారు. 2002 నుండి 2008 వరకు వరస లాభాలలోవుంది. 2004 సం.లో రూ. 2800 కోట్లు, రికార్డు స్ధాయి లాభాలను ఆరించింది. ప్లాంట్‌ విస్తరించితే , పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించితే ఎక్కువ ఉక్కును ఉత్పత్తి చేయవచ్చని 2006 సం.లో ప్లాంట్‌ విస్తరణకు ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శంఖుస్ధాపనచేశారు.32లక్షల టన్నులనుండి 63 లక్షల టన్నులకు ఉత్పత్తిని సాధించారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ సామర్ధ్యాన్ని గుర్తించి ”నవరత్న ” గా గుర్తించారు. ఏడాది గడవ కుండానే నవరత్నగా గుర్తించిన సంవత్సరం లోనే ప్లాంట్‌లో 10 శాతం వాటా అమ్మకానికి పెట్టారు.(2011 జనవరి )

కార్మికుల , ప్రజల ఆందోళన తరువాత కేంద్రం వెనక్కి తగ్గింది. వాటాలఉపసంహరణ ను ఆపేశామని కేంద్రం ప్రకటించింది. మరల 2014 సెప్టెంబర్‌ లో ప్లాంట్‌ అమ్మకానికి కేంద్రం తిరిగి ప్రతిపాదించింది. స్టీల్‌ ప్లాంట్‌ విలువను రూ. 4898 కోట్లుగా నిర్ణయించింది. 22 వేల ఎకరాల భూమిని, 63 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం గత అత్యంత ఆధునిక స్టీల్‌ ప్లాంట్‌ ను కారుచౌకగా అమ్మకానికి పెట్టారు. దక్షిణకొరియా కంపెనీ ”పోస్కో” కు కట్టబెట్టటానికి తయారయ్యారు. ఒక ఎకరం భూమి మార్కెట్‌ విలువ 10 కోట్ల రూ. పైననే వుంటే, 22 వేల ఎకరాల భూమి ఎంతఅవుతుందో తెలియదా? స్టీల్‌ ప్లాం ట్‌ నిర్మించటానికి ఎంత అవుతుందో తెలియదా? హిందూ పత్రిక అంచనా ప్రకారం 3.2 లక్షలకోట్లకన్నా తక్కువ వుండదు. ప్రభుత్వం ఇంత దివాళాతీసిందా? ఆస్ధులను అమ్ముకుని తింటానికి పూనుకున్నారా? లక్షల కోట్ల ప్రజల ఆస్ధిని అమ్ముకోవటానికేనా వీరికి అధికారం కట్టపెట్టింది.

2 )అన్ని స్టీల్‌ ప్లాంట్లకూ స్వంత ఇనప ఖనిజ గనులుంటాయి. ప్రభుత్వ సంస్ధ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు స్వంత గనులను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా రూ. 500, రవాణా ఖర్చులతో 1000 రూ. అయ్యే టన్ను ఇనప ఖనిజానికి 3 వేలు పెట్టి కొనుక్కోవలసివస్తోంది. ప్రతి టన్నుకీ అదనంగా 2వేలు ఖర్చు చేస్తున్నది. స్వంత గనులు వుంటే పరిశ్రమ నష్టాలలో పడే ప్రసక్తే లేదు. నాణ్యమైన స్టీల్‌ ను తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుంది. ప్రైవేటు కంపెనీలైన టాటా, మిట్టల్‌ లాంటి వారికి ఇనప ఖనిజ గనులను కేటాయించారు. అసలు కర్మాగారమే లేని బ్రాహ్మణీ స్టీల్స్‌కు గనులను కేటాయించారు. గాలి జనార్ధనరెడ్డికి గనులను కేటాయించి ఇతరదేశాలకు ఇనపఖనిజం అమ్ముకోవటానికి అన్ని అనుమతులనూ ఇచ్చి దేశ సంపదను దోచిపెట్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటుకు గనులను కేటాయించమని కార్మికులు నిరంతరం పోరు పెట్తున్నారు. అయినా తమ వర్గ మిత్రులైన పెద్దపెట్టుబడిదారులైన టాటా, మిట్టల్‌, గాలిజనార్ధనరెడ్డిగార్లకు, విదేశీ దోపిడీ మిత్రులైన పోస్కో లాంటి కంపెనీలకు సహజవనరైన ఇనప ఖనిజాన్ని దోచిపెట్తున్నారు. అదిగో నష్టం వచ్చిందికదాఅని అబద్ధాలు చెప్పి ప్లాంట్‌ అమ్మకానికి పెట్టి అదేమన్నవారిని బెదిరిస్తున్నారు.

విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ స్ధాపిస్తామన్న కేంద్ర మంత్రి సీ.సుబ్రమణ్యం, ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి వాగ్దానాలను, శాసనసభ ఏకగ్రీవ తీర్మానాల అమలును ఆంధ్రప్రజలు ప్రశ్నించారు. అమ తరావు నిరాహారదీక్షను పూర్తిగా బలపరిచారు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారి మాటవిని అమ తరావు అర్దంతరంగా నిరాహారదీక్షను విరమించినా, తెలుగు ప్రజలు పోరాటాన్నికొనసాగించారు. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే విశాఖ ఉక్కు సాధ్యమయింది.

విశాఖఉక్కు సాధన లో తెలుగు ప్రజలు వీరోచితంగా పోరాడారు. ప్రజల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం పరమ కిరాతకంగా అణచివేయప్రయత్నించింది. 32 మంది తెలుగు బిడ్డలను అన్యాయంగా పిట్టలను కాల్చినట్లు కాల్చేశారు. 100 మందికి పైగా ప్రజలను తుపాకీ గుళ్ళతో గాయపరిచారు. లాఠీ ఛార్జీలతో శరీరాన్నికుళ్ళపొడిచారు. వేలాదిమందిని బాష్పవాయువు ప్రయోగంతో బాధలు పెట్టారు. వెయ్యి మందికి పైగాఅరెస్టులు చేశారు. క్రిమినల్‌ కేసులు పెట్టి సంవత్సరాలతరబడి కోర్టుల చుట్టూ తిప్పారు. సైనికులను విమానాలద్వారా విశాఖలో దించి కవాతులు చేశారు. నెలల తరబడి సైనికులు, పోలీసులు పరిపాలించారు. తీవ్ర నిర్బంధాన్ని సైతం ప్రజలు ఎదిరించారు. అయిదేళ్ళ తరువాత విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ను ఇవ్వక తప్పలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది లో ప్రజాపోరాటాలదే కీలక పాత్ర. భూమి కోసం, భూమి పై హక్కుకోసం సామాన్య ప్రజలు సాగించిన పోరాటాలు, జమీందారీ వ్యతిరేక పోరాటాలు, రుణ విముక్తికోసం రైతుయాత్రలూ, నైజాం వ్యతిరేక సాయుధపోరాటం, నాగార్జున సాగర్‌ కోసం, విశాఖఉక్కు-ఆంధ్రులహక్కు అంటూ సాగిన పోరాటాల ఫలితంగానే సాధించబడింది. పోరాట ఫలాలను, భూమిని, కంపెనీలను మింగేయటానికి కోర్పోరేట్‌ కంపెనీలు కాచుకు కూర్చున్నాయి. ద్రవ్యపెట్టుబడి దెయ్యంలాగా జడలువిప్పుకుని నాట్యంచేస్తున్నది.

ఈ ప్లాంట్‌ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు కేవలం కోల్‌, ఐరన్‌ ఓర్‌ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి. 2006లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇలా అన్నారు. ”ఆధునీకరణ, పారిశ్రామీకరణ, అభివృద్ధి కోసం ప్రజలు పోరాడటం చాలా అరుదుగా వుంటుంది. కానీ ఇక్కడ ప్రజలు, కార్మికులు దాన్ని చేసి చూపారు.ఈ ప్లాంట్‌ ఇక్కడ నిర్మాణం అవ్వటానికి తమ ప్రాణాలను త్యాగం చేసినవారందరికీ నేను సెల్యూట్‌ చేస్తున్నాను. ఈ ప్లాంట్‌ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు -కోల్‌, ఐరన్‌ ఓర్‌ నుండి రావటంలేదు. తెలుగు ప్రజల రక్తమాంసాలు, స్వేదం, కన్నీరు దీనిలో ఇమిడివున్నాయి. విశాఖపట్నం సముద్రతీరంలో వుంది.ప్రపంచానికి ఇది ద్వారాలు తెరుస్తున్నది.బ్రహ్మాండమైన పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నది. స్టీల్‌ ప్లాంటు విస్తరణ విశాఖపట్నం అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది.” అన్నారు .

పోర్టు సిటీగా పేరు పడిన విశాఖ స్టీల్‌ సిటీగా మారింది. మూలపెట్టుబడి రూ. 4898 కోట్లతో ప్రారంభించిన పరిశ్రమ ఈ రోజున 3.2 లక్షల కోట్లకు మించిన విలువతో, 22 వేలఎకరాల భూమిలో, ఆధునిక సాంకేతికతను స్వంతంచేసుకుని అత్యంత నాణ్యమైన ఉక్కును అందిస్తున్నది. రిజర్వేషన్లను అమలుపరుస్తూ 35 వేలమందికి ఉపాధి కల్పిస్తున్నది. వీరిపై ఆధారపడి రెండు లక్షల మంది ప్రజలు బతుకుతున్నారు. కేంద్రం పెట్టుబడి పెట్టిన రూ.4898 కోట్లకు గాను – పన్నులు, డివిడెండ్ల రూపంలో 40 వేల కోట్ల రూపాయలను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్రప్రభుత్వానికి సమకూర్చింది. రూ.7977 కోట్ల ను రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించింది. ప్లాంట్‌ విస్తరణ అప్పులకు వడ్డీ గా రూ.18,000 కోట్లు చెల్లించింది.

గత డిసెంబరు నెలలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సాధించిన పనితీరు గమనిస్తే. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను లాభదాయకంగా నడపడం సాధ్యమేనని రుజువవుతోంది. 2020 డిసెంబరు నెలలో 98 శాతం ఉత్పత్తితో పని చేసి 2,100 కోట్ల రూపాయల టర్నోవర్‌ను, 170 కోట్ల రూపాయల నికర లాభాన్ని అర్జించింది.

అత్యంతవిలువైన ఈ కర్మాగారాన్ని కాజేయటానికి కోర్పోరేట్‌ కంపెనీలు గద్దల్లా కాచుకుని కూర్చున్నాయి. హారతి పళ్ళెంలో పెట్టి అందించటానికి ప్రభుత్వాలు సిద్దంగావున్నాయి. రక్తం ధారబోసి సాధించుకున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత ఆంధ్రప్రజలందరిదీ. విద్యార్ధుల, యువకుల, కార్మికుల ఐక్యపోరాటంవలననే ఇది సాధ్యమవుతుంది..

వ్యాస రచయిత గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేత, ఆనాటి విశాఖ ఉక్కు ఉద్యమ కార్యకర్త.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కులం పేరుతో కేరళ ముఖ్యమంత్రిని అవమానించిన కాంగ్రెస్‌కు బిజెపి మద్దతు !

07 Sunday Feb 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Bjp support to Congress caste slur on Chief Minister Pinarayi Vijayan, CPI(M), Kerala BJP, Kerala Politics, LDF, Pinarayi Vijayan, UDF


ఎం కోటేశ్వరరావు


ఏ రాజకీయ పార్టీ అయినా అధికారాన్ని కోరుకోవటంలో, అందుకోసం గౌరవ ప్రదమైన, ప్రజాస్వామిక పద్దతుల్లో పని చేjటం, ప్రవర్తించటంలో తప్పు లేదు. కేరళలో గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఒక సారి కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ అధికారానికి వస్తే తరువాత సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ అధికారానికి రావటాన్ని చూస్తున్నాము. తాజాగా పార్టీ ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లను బట్టి గత పరంపరకు భిన్నంగా వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్‌ అధికారానికి వస్తుందని అంకెలు చెబుతున్నాయి. మళయాల మనోరమ అనే పత్రిక 101 సీట్లు వస్తాయని విశ్లేషించింది. అదే పత్రిక సిపిఎం సమీక్షలో 98 వస్తాయనే అంచనాకు వచ్చినట్లు మరొక వార్తను రాసింది. ఇంతవరకు ఎల్‌డిఎఫ్‌ నేతలు మాకు ఇన్ని సీట్లు వస్తాయని ఎక్కడా చెప్పలేదు.

ఏప్రిల్‌ లేదా మే మాసాల్లో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్దమౌతున్నాయి. ఎల్‌డిఎఫ్‌ అన్నింటికంటే ముందు వుందని, ఓట్లు తగ్గిన, ఓడిపోయిన చోట ఎందుకలా జరిగిందో ప్రతిపార్టీ పరిశీలించుకుంటున్నది, సిపిఎం కూడా అదే చేస్తున్నదని మీడియాలో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. మొత్తంగా కేరళ పరిణామాలను చూసినపుడు సిపిఎం వ్యతిరేక రాజకీయ పార్టీల కంటే తన వ్యతిరేక ప్రచార శ్రమ వృధా అయింది, జనం ఎందుకు పట్టించుకోలేదనే ఉడుకుమోత్తనంతో మీడియా వుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో తిరిగి తన పాత అలవాట్లను ప్రదర్శిస్తోంది.
మరోవైపున పండుగాడి మాదిరి సిపిఎం కొట్టిన దెబ్బకు మైండ్‌ బ్లాంక్‌ అయిన కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు చౌకబారు, చివరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలకూ దిగజారాయి. గీత వృత్తిదారు కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉంది తప్ప వారి వ్యాఖ్యలను అవమానించేవిగా భావించటం లేదని విజయన్‌ ఎంతో హుందాగా ప్రతిస్పందించారు. కల్లుగీత కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి హెలికాప్టర్‌ను ఉపయోగించిన తొలి ముఖ్యమంత్రిగా గుర్తు పెట్టుకుంటారు అని కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ అయిన కె సురేంద్రన్‌ నోరు పారవేసుకున్నారు.


కేరళ ఐశ్వర్య యాత్ర పేరుతో ప్రస్తుతం కాంగ్రెస్‌ రాజకీయ యాత్ర జరుపుతోంది. కేరళ అభివృద్ది మినహా మిగిలిన అంశాలన్నింటినీ ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆ సందర్భంగా కన్నూరు జిల్లా తలసెరీలో సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాయి.అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని వాటితో తమకు సంబంధం లేదని శాసనసభా పక్షనేత రమేష్‌ చెన్నితల వ్యాఖ్యానించగా, కాంగ్రెస్‌ ఏకైక మహిళా ఎంఎల్‌ఏ షనిమోల్‌ ఉస్మాన్‌ ఘాటుగా సురేంద్రన్‌ తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యల కంటే ఇవి మరింత నష్టదాయకంగా మారటంతో పాటు ముఠా తగాదాలు బయటకు వచ్చాయి. తన ప్రత్యర్ధుల ప్రోద్బలంతో ఎంఎల్‌ఏ అలా ప్రకటించారని సుధాకరన్‌ మండిపడ్డారు. దీంతో నష్ట నివారణ చర్యగా పూర్తిగా తెలుసుకోకుండా తాను వ్యాఖ్యానించానని రమేష్‌ చెన్నితల, ఎవరి ప్రమేయం లేకుండా తానే ఆ ప్రకటన చేశానని ఎంఎల్‌ఏ తన మాటలను తానే మింగారు. సుధాకరన్‌కు క్షమాపణ చెప్పారు. దీంతో రెచ్చి పోయిన సురేంద్రన్‌ తన వ్యాఖ్యలను పార్టీ సమర్ధించిందని, అన్నదానిలో తప్పులేదంటూ పదే పదే సమర్ధించుకుంటున్నారు.

” సురేంద్రన్‌ నాకు కాలేజీ రోజుల నుంచీ తెలుసు. నా తండ్రి ఒక కల్లుగీత కార్మికుడని నేను గతంలో కూడా చెప్పాను. మా అన్న కూడా గీత కార్మికుడే, వయస్సు మీద పడి వృత్తి మానుకున్నాడు. రెండో సోదరుడికీీ వృత్తి తెలుసు, అయితే ఒక బేకరీని పెట్టుకున్నాడు.మాది ఒక వ్యవసాయ కుటుంబం, సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలతో నేనేమీ నొచ్చుకోలేదు, వాటిని తిట్టుగా భావించటం లేదు.నేను ఒక గీత కార్మికుడి కొడుకును, అందుకు గర్విస్తాను ఎందుకంటే నేను ఒక కష్టజీవి కొడుకును.ఈ అంశాన్ని వివాదాస్పదం గావించారని అలపూజ ఎంఎల్‌ఏ షనిమోల్‌ ఉస్మాన్‌ మీద సుధాకరన్‌ మండి పడ్డారు. ఈ అంశంలో చివరికి రమేష్‌ చెన్నితల కూడా తన వైఖరిని మార్చుకున్నారు. నా జీవన శైలి ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలిసిందే.” అని విజయన్‌ విలేకర్లతో చెప్పారు.

బిజెపిలో చేరతానని బెదిరించి అధిష్టానాన్ని బెదిరించిన సురేంద్రన్‌ ?

సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టించటంతో వాటిని వ్యతిరేకించటం కంటే సమర్దించటమే మంచిదని కాంగ్రెస్‌ భావించింది. అందుకే మాట మార్చింది.కాంగ్రెస్‌ క్రమశిక్షణా వ్యవహారాల కమిటీ నేత కెసి వేణుగోపాల్‌ సమర్ధించారు. ఏదో వాడుక భాషలో అన్నారు. సుధాకరన్‌ అలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదని ఏదో సాధారణంగా చెప్పాను. తరువాత ఇది నిజమేనా అని ఆయనతో మాట్లాడితే కాదన్నారు. ఆయన ప్రజానాయకుడు, కాంగ్రెస్‌ పార్టీకి ఒక సంపద వంటి వారు అని చెన్నితల సమర్ధించారు. అయితే కాంగ్రెస్‌ నేతలు ఇలా మాట మార్చటం వెనుక తాను బిజెపిలో చేరతానని సురేంద్రన్‌ పార్టీ అధిష్టానాన్ని బెదిరించటమే కారణమని కొందరు చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రి విలాస జీవితం గురించి చెబుతూ ఆయన కుటుంబ వృత్తి పేరు ప్రస్తావించాను తప్ప మరొకటి కాదని ఢిల్లీలో కూడా సుధాకరన్‌ సమర్ధించుకున్నారు. అనేక మంది నేతలు తామూ కూలీ బిడ్డలమని చెప్పుకుంటారని ఇది కూడా అంతే అన్నారు. నేను వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తరువాత కూడా సిపిఎం స్పందించలేదని, వారికి బదులు తమ కాంగ్రెస్‌ వారే స్పందించారనే అదే సమస్య అన్నారు. అంతకు ముందు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వైఖరి ఏమిటో వివరించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.
కాంగ్రెస్‌ నేతల కుల దూషణను బిజెపి సమర్ధించింది. కల్లు గీసే వారు అన్ని కులాల్లో ఉన్నారని అందువలన ఒక కులాన్ని నిందించినట్లుగా తాము భావించటం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ సమర్ధించారు. సిపిఎం వారు దాన్నొక ఆయుధంగా చేసుకున్నారు తప్ప తప్పేమీ లేదన్నారు.

మరోసారి శబరిమలను ముందుకు తెచ్చిన కాంగ్రెస్‌ !

స్దానిక సంస్దల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతుగా మీడియా ఎల్‌డిఎఫ్‌ ప్రత్యేకించి సిపిఎంకు వ్యతిరేకంగా ముందుకు తెచ్చిన ఆరోపణలను జనం పట్టించులేదని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. దాంతో తిరిగి మరోసారి శబరిమల సమస్యను ముందుకు తెచ్చేందుకు కాంగ్రెస్‌ పూనుకుంది. మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు, దాన్ని అమలు చేసేందుకు పూనుకున్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, బిజెపి వివాదాస్పదం కావించి శాంతి భద్రల సమస్యను సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ తీర్పు మీద సుప్రీం కోర్టులో పునర్విచారణ పిటీషన్‌ ఉంది. అలాంటివే ఇతర వివాదాలు, పిటీషన్లను కలిపి కోర్టు విచారించింది. ఇంతవరకు ఎలాంటి తీర్పు వెలువడలేదు. సుప్రీం కోర్టు తీర్పుతో సమాజంలో సృష్టించిన గాయాలను మాన్పేందుకు తీర్పుకు వ్యతిరేకంగా చట్టం చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అంటూ కాంగ్రెస్‌ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాము అధికారానికి వస్తే చేయబోయే చట్టం ఇలా ఉంటుందంటూ ఒక ముసాయిదాను కూడా విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు పూనుకున్నారు. శబరిమల సంప్రదాయాలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయటంతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుదని దానిలో పేర్కొన్నారు.ఈ ప్రచారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు వెలువడిన తరువాత సమాజంలోని అన్ని తరగతుల అభిప్రాయాలను తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సుప్రీం కోర్టు ముందు ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని సమీక్షిస్తామని చెప్పింది అంతిమ నిర్ణయం వచ్చిన తరువాతే కదా జోక్యం చేసుకొనే సమస్య ఉదయించేది అని విజయన్‌ అన్నారు.


శబరిమల సమస్య ద్వారా లబ్దిపొందాలని చూస్తున్న మరో పార్టీ బిజెపి కూడా ఓట్లకోసమే కాంగ్రెస్‌ ఇలా చెబుతోందని విమర్శించింది. ఆ సమస్య మీద ఉద్యమించినపుడు కాంగ్రెస్‌ ఎక్కడుంది ? అప్పుడు ఎందుకు చట్టం గురించి మాట్లాడలేదు అని ప్రశ్నించింది. తాము అధికారానికి వస్తే దేవాలయ బోర్డులను రద్దు చేస్తామని బిజెపి చెప్పుకుంది.
తండ్రి వారసుడిగా రంగంలోకి వచ్చేందుకు సిద్దం అవుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కుమారుడు చాండీ ఊమెన్‌ క్రైస్తవ బిషప్పుల కౌన్సిల్‌ ఆగ్రహానికి గురయ్యాడు.అతగాడు చేసిన వ్యాఖ్యలను మరొకరు చేసి ఉంటే ఈ పాటికి రచ్చ రచ్చ గావించి ఉండే వారు.యూత్‌లీగ్‌ ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ ఐరోపాలో చర్చ్‌లు నృత్య కేంద్రాలు, మద్యం బార్లుగా మారిపోయాయని చాండీ అన్నారు. ఆ వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. చాండీకి అసలు కేరళ చర్చ్‌ల చరిత్ర తెలియదని బిషప్పుల సంఘం వ్యాఖ్యానించింది.


బిజెపి మిత్రపక్షమైన కేరళ భారత ధర్మ జనసేన(బిడిజెఎస్‌) పార్టీలో చీలిక వచ్చింది. బిజెపి నేతలు ఎల్‌డిఎఫ్‌తో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారని దానికి నిరసనగా తాము భారత జనసేన (బిజెఎస్‌) పేరుతో కొత్త పార్టీని పెట్టి యుడిఎఫ్‌ను సమర్ధించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే వీరికి బలమేమీ లేదని బిడిజెస్‌ నేతలు తోసి పుచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో అసలు ఉమ్మడిగా ఉన్న పార్టీకే బలమేమీ లేదని వెల్లడైంది.
స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు బిజెపి నేతల తీరు తెన్నులు చూస్తే కేరళలో వచ్చే ఎన్నికలలో తాము అధికారానికి రాకపోయినా గణనీయ సంఖ్యలో సీట్లు తెచ్చుకొని చక్రం ఇప్పుతామన్నట్లుగా ఉంది. ఫలితాలు వెలువడిన తరువాత కొన్ని సీట్లలో ఓట్లను గణనీయంగా ఎలా పెంచుకోవాలా అని చూస్తోంది, అదే పెద్ద గొప్ప అన్నట్లుగా మీడియా చిత్రిస్తోంది. నూట నలభై స్ధానాలకు గాను 48 చోట్ల 30వేలకు పైగా ఓట్లు వస్తాయని, వాటిలో కూడా 20 చోట్ల గెలిచే అవకాశాలున్నందున అలాంటి స్ధానాల మీద కేంద్రీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నిర్ణయించినట్లు మళయాళ మనోరమ వ్యాఖ్యాత పేర్కొన్నారు. కేరళలో బిజెపి ఎన్ని ఊపులు ఊపినా దాని ఓటింగ్‌ శాతం పదిహేనుశాతానికి లోపుగానే ఉంది తప్ప పెరగలేదు. ఈసారి చూడండి ఈ సారి చూడండి అంటూ ప్రతిసారీ కబుర్లు చెబుతూనే ఉంది. ఇప్పుడూ అదే పల్లవి, అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌కు తమకూ మధ్యనే పోటీ ఉంటుందని చెబుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత అనేక మంది నేతలు అసెంబ్లీ బరిలో దిగాలా వద్దా అని ఆలోచిస్తున్నారు, సాకులు వెతుకుతున్నారు. కొందరు వెనక్కు తగ్గినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రతిపక్షాలు, మీడియా ఎలాంటి కుయుక్తులు పన్నినా, వక్రీకరణలు చేసినా ఎల్‌డిఎఫ్‌ తన కార్యక్రమంతో ముందుకుపోతోంది. మరో విజయాన్ని స్వంతం చేసుకోగలమనే ధీమా వ్యక్తం అవుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శాస్త్ర మిత్రోం వద్దు – మూఢ మూత్రోం ముద్దు !

06 Saturday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Science

≈ Leave a comment

Tags

BJP pseudoscience, cow science exam, cow urine phenyl, love for pseudoscience, No to science, pseudoscience


ఎం కోటేశ్వరరావు


గ్రామం నుంచి సచివాలయం వరకు ప్రభుత్వ కార్యాలయాలను ఆవు మూత్రంతో తయారు చేసిన ఫినాయిల్‌తోనే శుద్ది చేయాలని మధ్య ప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వం జనవరి నెల చివరిలో ఆదేశాలు జారీ చేసింది. ఆవు మూత్ర ఫినాయిల్‌ తయారీకి ముందే గిరాకీని సృష్టించామని అందువలన మూత్రం వృధా కాకుండా యజమానులు ఒట్టి పోయిన ఆవులను ఇండ్ల దగ్గరే ఉంచుతారని తద్వారా ఆవుల పరిస్ధితి మెరుగుపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రేమ్‌ సింగ్‌ పటేల్‌ ప్రకటించారు. తమ ప్రభుత్వ చర్యను చూసి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన చర్యలు తీసుకుంటారని బిజెపి ప్రతినిధి రాహుల్‌ కొఠారీ సమర్ధించారు.


ఇప్పటికే రామ్‌ దేవ్‌ బాబా పతంజలి కంపెనీ గోనైల్‌ పేరుతో ఆవు మూత్ర ఫినాయిల్‌ తయారు చేస్తున్నది. దానికి లబ్ది చేకూర్చేందుకే ఈ చర్య తీసుకున్నారన్న ఆరోపణ కూడా ఉంది. అయితే పెద్ద ఎత్తున గోమూత్ర సేకరణ చేయాల్సి ఉన్నందున ప్రభుత్వమే గ్రామాల్లో పాలకేంద్రాల మాదిరి ఆవు మూత్ర కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సేకరించిన మూత్రంతో ఫినాయిల్‌ తయారీకి సహకరించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న భారతీయులకు సరఫరా చేసేందుకు బహుశా మేకిన్‌ ఇండియా పధకం కింద ఎగుమతులు కూడా చేసే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించవచ్చు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మధ్య ప్రదేశలో ప్రత్యేకంగా ” ఆవు మంత్రి వర్గం ” కూడా ఉంది. వాటి రక్షణ కోసం పశుసంవర్దక, అటవీ, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, హౌం మరియు రైతు సంక్షేమ శాఖల మంత్రులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గతేడాది నవంబరు 18న ప్రకటించారు. రాజు తలచుకోవాలే గానీ డబ్బులకు – దెబ్బలకూ కొదవేముంటుంది ! బిజెపి తలచుకోవాలే గానీ ఆశ్రితులకు జనం సొమ్ము అప్పగించేందుకు కొత్త పుంతలు ఎన్నో. చివరకు ఆవు మూత్రాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుంది. ఆవు మూత్రం తాగే జనం ఉన్న దేశం మనది.(ఎవరి మనోభావాన్ని కించపరచటం లేదు. ఎవరిష్టం వారిది) అలాంటిది అదీ దేశీయ ఆవు మూత్రంతో ఇండ్లు, ఆఫీసులను తుడిచే ఫినాయిల్‌ తయారు చేస్తామంటే ఎవరైనా అభ్యంతరపెడతారా ?


బిజెపి ప్రభుత్వ నిర్ణయం మీద సామాజిక మాధ్యమాల్లో జనాలు హాస్యాన్ని పండిస్తున్నారు.సంవాదాలు, రాజకీయ విసుర్లు, విమర్శించిన వారి మీద దాడి సరే సరి ! ప్రస్తుతం రసాయనాలతో ఫినాయిల్‌ తయారు చేస్తున్నారు. దానికి రకరకాల రంగులు, వాసనలు జోడిస్తున్నారు. ప్రపంచంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోంది. చిరుతిండ్లు దానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అందువలన వాటి వాడకాన్ని నిరుత్సాహపరచేందుకు ” కొవ్వు ” లేదా ఉప్పు పన్ను వేస్తున్నారు. ఈనేపధ్యంలో కొన్ని వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయో చూద్దాం !

తదుపరి ఫాస్ట్‌ ఫుడ్స్‌, డ్రింకులకు కృత్రిమ వాసనల బదులు విధిగా గో మూత్ర వాసన జోడించాలని ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యం లేదు. అలా చేస్తే పన్నుతో నిమిత్తం లేకుండానే జనాలు చిరుతిండ్లు మాని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. డబ్బుకు డబ్బు ఆదా !
ముందు గవర్నర్‌, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, ఇళ్లతో ప్రారంభించాలి ! మూత్ర తంత్రం ఎంత గొప్పగా ఉందో కదా !
తరువాత మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఉదయాన్నే టీ బదులు గోమూత్రం తాగాలనే ఆదేశాలు జారీ అవుతాయి !
ఇళ్ల నుంచి పని చేసేందుకు ఉద్యోగులకు ఇది పెద్ద ప్రోత్సాహం అవుతుంది !
ఉత్తర ప్రదేశ్‌కు మధ్య ప్రదేశ్‌ గట్టి పోటీనిస్తోంది ! చూద్దాం 2024నాటికి ఎవరు ఎక్కువ గోమూత్రం తాగుతారో !
ఎంపీ, యూపీలలో ఉన్న వారి పట్ల విచారంగా ఉంది !
ఇది ఆవు ప్రభుత్వం, ఆవుల కోసం ఆవులు పని చేస్తున్నాయి ! మోడీ-అమిత్‌ షా బ్రాండ్‌ ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు !
ప్రపంచంలో మన దేశాన్ని అపహాస్యం పాలు చేయటానికి ఈ పాలకులు రోజుకు ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు !
దానితో ఇబ్బంది ఏముంది ? రసాయన పరిశ్రమల కంటే కుటీర పరిశ్రమ వృద్ది చెందుతుంది !
మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆవు మూత్రంతో పాటు మనుషుల మూత్రంతో కూడా ఫినాయిల్‌ తయారు చేయించవచ్చు, సులభంగా కూడా దొరుకుతుంది !
మిత్రోం వద్దు – మూత్రోం ముద్దు ! ప్రతిదీ ఆవు పేడ వాసన రావాల్సిందే !
బీఫ్‌ తినే వారు ఆవు మూత్రం గురించి అభ్యంతర పెట్టే నైతిక హక్కులేదు !
నేను బీఫ్‌ తింటా దానికి ఉచ్చతో చేసిన సాస్‌ బదులు మిరియాల సాస్‌ వాడతా, ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే ఉచ్చ సాస్‌ పంపుతా !
జనానికి అభ్యంతరం లేనంత వరకు మనకు సమస్య ఏముంది ?
” పప్పు ” పార్టీ కంటే గోమూత్ర పార్టీలో మెదళ్లు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
పెట్రోలు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయబ్బా ! ఆవు మూత్రంతో వాహనాలు నడపవచ్చేమో అన్న ఆలోచన వస్తోంది !
ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ ఇది గోమూత్ర సర్కార్‌ అని వ్యాఖ్యానించారు.
వారేమీ దాచుకోవటం లేదని తెలుసుకోవటం సంతోషంగా ఉంది. మాకు అవకాశం వచ్చింది గనుక గోమూత్రాన్ని వాడుతున్నాం. మీకు అవకాశం వస్తే ఒంటె మూత్రాన్ని వాడండి, అది లౌకిక పద్దతి, మీరు కూడా తాగవచ్చు !


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హానికరమైన రేడియో ధార్మికశక్తిని ఆవు పేడ 60శాతం మేరకు నిరోధిస్తుందని తమ పరిశోధనల్లో తేలినట్లు గుజరాత్‌లోని సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం జనవరి చివరిలో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధ అయిన రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరిపినట్లు ప్రకటించారు. దీని గురించి గత అక్టోబరులోనే సంస్ధ అధ్యక్షుడు, క్యాన్సర్‌ చికిత్స నిపుణుడైన డాక్టర్‌ వల్లభారు కథిరియా ప్రకటించారు. దాన్ని అప్పుడే దేశంలోని ఆరువందల మంది శాస్త్రవేత్తలు సవాలు చేశారు. దాన్ని నిర్ధారిస్తూ ఇటీవల విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర అధ్యాపకుల నుంచి ప్రకటన రావటం విచారం కలిగిస్తున్నదని కొందరు శాస్త్రవేత్తలు తాజాగా ఒక ప్రకటనలో విమర్శించారు. ఆవు పేడ ప్రతి ఒక్కరినీ రక్షిస్తుంది. దానికి రేడియో ధార్మికతను నిరోధించే గుణం ఉంది.అది ఇంట్లో ఉంటే రేడియేషన్‌ ఉండదు, ఇది సైన్సులో రుజువైందని వల్లభారు గతంలో చెప్పారు. విలేకర్ల సమావేశంలో ఒక పరికరాన్ని చూపుతూ సెల్‌ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్‌ను అది నిరోధిస్తుందన్నారు.

సౌరాష్ట్ర విశ్వవిద్యాలయ ప్రకటనను సవాలు చేసిన శాస్త్రవేత్తలు అసలా పరిశోధనా పద్దతిలోనే లోపం ఉందన్నారు. రేడియేషన్‌ కొలవటానికి వీలైనది, భిన్నమైన మందాలు గల ఆవు పేడ పిడకలతో ఎంత తేడాతో రేడియేషన్‌ ఉన్నదో కొలవ వచ్చు, కానీ ఆపని చేయకుండా ఒకసారి మాత్రమే కొలిస్తే అసలు పరిశోధన ఎలా అవుతుందన్నారు. ఆవు పేడ కాకుండా ఒంటె లేదా గాడిద పెంటతో ప్రయోగాలు చేసి ఉంటే ఏమి జరిగేదో చెప్పాలన్నారు. పరిశోధనలో లోపాల గురించి వారికి తెలిసి ఉండకపోవచ్చు లేదా ఎవరికోసమో తప్పుడు సమాచారాన్ని తయారు చేసి ఇచ్చి ఉండవచ్చన్నారు. బోధనా రంగంలో ఉన్న కొంత మంది కుహనా శాస్త్రాన్ని బలవంతంగా రుద్దటాన్ని తాము నిరసిస్తున్నామన్నారు. ఆవు పేడ రేడియేషన్‌ నిరోధకత కలిగి ఉందని శాస్త్రవేత్తల ముసుగు వేసుకున్న కుహనా బృందాల నుంచి నుంచి గాక ప్రభుత్వ సంస్ధ నుంచి వచ్చినందున దీన్ని తేలికగా తీసుకో కూడదని కొల్‌కతాలోని ఐఐఎస్‌ఇఆర్‌ సంస్ధ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌ సౌమిత్ర బెనర్జీ అన్నారు. ఆవు పేడ మీద పరిశోధనలకు నిధులు పొందటం సులభమని కొంత మంది శాస్త్రవేత్తలు దృష్టి మళ్లిస్తారని అయితే ఇది శాస్త్ర ఆరోగ్యానికే హానికరమని అన్నారు.


ఆవు సైన్సును ప్రోత్సహించే పేరుతో ఫిబ్రవరి 25న దేశవ్యాపితంగా తొలిసారిగా ఆలిండియా ఆన్‌లైన్‌ కామధేను గో విజ్ఞాన ప్రచార-ప్రసార పరీక్ష పెడుతున్నారు. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు, చదువు సంధ్యలతో, వయస్సుతో పనిలేదు. ఆవు గురించి తెలిస్తే చాలు. పరీక్ష రాసిన వారందరికీ అందరికీ ఆవు ” శాస్త్రవేత్తలు ” గా సర్టిఫికెట్లు ఇస్తారు, అధిక మార్కులు వచ్చిన వారికి అదనంగా బహుమతులు ఇస్తారు. పశుసంవర్ధన ఆధునిక, శాస్త్రీయ పద్దతుల్లో నిర్వహించేందుకు గాను రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఆచరణలో అది కుహనా శాస్త్ర ప్రచారాన్ని చేస్తున్నది. ఆ సంస్ధ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్‌ వల్లభారు కథిరియా రాసిన ఒక బహిరంగలేఖలో ఒక వ్యాక్యం చదివితే అదేం చేస్తున్నదో అర్దం చేసుకోవచ్చు. ” ఈ రోజు మనం రామాయణం, మహాభారత్‌, కృష్ణ, చాణక్య, ఉపనిషత్‌ గంగ వంటి సీరియల్స్‌ను చూసినపుడు సామాజిక జీవనంలో మన ఊహకు సైతం అందని అసమాన సాంకేతిక ప్రక్రియలను ఉపయోగించినట్లు తెలుసుకోవచ్చు ” అని పేర్కొన్నారు. అంతేకాదు నేను క్యాన్సర్‌ ఆపరేషన్ల గురించి చెప్పగలను గానీ ఇతర విషయాలు నాకు తెలియవు, అలాగే ఆవు శాస్త్రం గురించి అందరికీ తెలియకపోవచ్చు అన్నారు.

ఒక వైపు ఆధునిక శాస్త్ర పరిశోధనలు అవసరమని లోకం కోడై కూస్తున్నది.మరోవైపు మన దేశంలో శాస్త్ర పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కోత పెడుతున్నారు.ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 1996లో మన జిడిపిలో 0.64 శాతం కేటాయించారు. అది 2008 నాటికి 0.86శాతానికి పెరిగింది. నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలో 2018లో 0.65శాతానికి దిగజారింది. తాజాగా ఆర్ధిక సర్వేలో ఖర్చును 0.7 నుంచి రెండుశాతానికి పెంచాలని వ్యాఖ్యానించారు. తాజా బడ్జెట్‌లో అలాంటి సూచనలేమీ లేవు. ప్రపంచ నవకల్పన 2020 సూచీలో మనదేశం 131దేశాలలో 48వ స్ధానంలో ఉందని పేర్కొన్నది. కొందరైతే 2014లో 76వ స్దానంలో ఉన్నదానిని నరేంద్రమోడీ 28 స్ధానాలు పెంచి 48కి తెచ్చారని పొగడ్తలు కురిపించారు. మనతో సమానమైన వారితో పోటీ-పోలిక గౌరవంగా ఉంటుంది.మన దేశం 2014లో 33.7 పాయింట్లతో 76వ స్ధానంలో ఉంది. అది 2020కి 48లోకి వచ్చినా పాయింట్లు 35.6 మాత్రమే. ఇదే కాలంలో చైనా 46 నుంచి 29వ స్ధానానికి 17 స్ధానాలు మెరుగుపరచుకుంది, పాయింట్ల వారీ చూస్తే 46.6 నుంచి 53.3కు పెంచుకుంది. పైకి పోతున్న కొద్దీ పోటీ తీవ్రత పెరుగుతుందన్నది తెలిసిందే. సౌమిత్ర బెనర్జీ చెప్పినట్లు మన పరిశోధనలన్నీ ఆవు పేడ, మూత్రం చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలలో దాని పట్ల మక్కువ ఉన్న పాలకులు ఉన్న కారణంగా నిధుల కోసం అలాంటి పరిశోధనల చుట్టూ కొందరు శాస్త్రవేత్తలు ప్రదక్షణలు చేస్తున్నారు. గోమాతలను ప్రార్ధిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎంత పని చేస్తివే ట్వీటా : కంగనా రనౌత్‌ నోటి తుత్తర – తాప్సీ పన్ను తాషా మార్ఫా !

05 Friday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

#i stand with farmers, Farmers Delhi agitation, Kangana ranaut, Taapsee pannu, tweets war on farmers agitation


ఎం కోటేశ్వరరావు
కాలం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. ఇప్పుడు బిజెపిలో తిరుగులేని నేత, ప్రధాని నరేంద్రమోడీకి కూడా అదే జరుగుతోందా ?ఎవరికి ఎలా తోస్తే అలా అనుకోవచ్చు, ఇబ్బంది లేదు. లేకపోతే ఏమిటి ? వ్యవసాయ చట్టాల సవరణకు ఏ దయ్యాల ముహూర్తంలో శ్రీకారం చుట్టారో తెలియదు గానీ అనూహ్యమైన ప్రతిఘటన ఎదురైంది. దాన్ని ఇతర దేశాల్లో నియంతల మాదిరి అణచివేస్తారా ? ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నవారి మాదిరి గౌరవ ప్రదంగా ఉపసంహరించుకుంటారా, ఏం జరుగుతుంది అన్నది చెప్పలేము. ఈ లోగా ప్రపంచ వ్యాపితంగా రైతు ఉద్యమం గురించి విదేశీ నేతల ఆరా, మరింతగా చర్చ జరగటం మాత్రం ఖాయం.
దేశీయంగా దెబ్బమీద దెబ్బ తగులుతోంది. వ్యవసాయ చట్టాల మీద చర్చలు లేవన్నారు. దిగి వచ్చారు. సావిత్రీ నీపతి ప్రాణంబు తప్ప అన్న యముడి మాదిరి చట్టాల ఉపసంహరణ మినహా దేన్నయినా చర్చిస్తామన్నారు. రైతులు కోరకపోయినా ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తామన్నారు. జనవరి 26 రైతుల పరేడ్‌ మీద కోర్టు ద్వారా అనుమతి రాకుండా చూడాలనుకున్నారు. అనుమతి ఇవ్వక తప్పలేదు. కొంత మంది రైతు ఉద్యమ వ్యతిరేకులతో ఎర్రకోట దగ్గర జెండాలు ఎగుర వేయించి రైతుల మీద నెపాన్ని మోపాలని చూశారు. అదెలా ఎదురు తన్నిందో తెలిసిందే. మీడియా అనివార్యంగా చర్చించాల్సి వచ్చింది, దాంతో అనేక మంది కొత్తగా రైతు ఉద్యమం గురించి-కేంద్ర పాలకుల నిజస్వరూపం తెలుసుకోగలిగారు. తాజాగా అన్నింటికీ మించి, నిజం- ఏమాట కామాటే చెప్పుకోవాలి. ట్వీటా ఎంత పని చేశావే అని బిజెపి నేతలు తలపట్టుకొనే పరిస్ధితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

స్వీట్లు – ట్వీట్లు ఇంత పని చేస్తాయనుకోలేదు నాయనో !
వర్తమాన చరిత్రలో సాంప్రదాయ మీడియాను-సామాజిక మాధ్యమాన్ని మన దేశంలో నరేంద్రమోడీ, బిజెపి ఉపయోగించుకున్నంతగా మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయంలో మోడీకి సాటి రాగలిగింది ఆయనకు అత్యంత ఆప్తుడు, అధికారం పోయిన తరువాత కూడా భుజాల మీద చేతులు వేసుకొని తిరగ్గలిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రమే. ట్వీట్లతో అతగాడు ఎంత ప్రాచుర్యం – గబ్బు పట్టాడో యావత్‌ ప్రపంచం చూసింది. చివరికి ట్విటర్‌ శాశ్వతంగా ఖాతా మూసివేసినట్లు ప్రకటించగా మిగిలినవి పరిమితం కాలం, రకరకాలుగా ఆంక్షలు విధించాయి.చరిత్ర చెత్తబుట్టలో పడిన అతనికి తరువాత పునరుద్దించినా ఒకటే లేకున్నా ఒకటే.
సామాజిక మాధ్యమం ఎంత శక్తివంతమైనదో తాజాగా రైతు ఉద్యమం కూడా నిరూపించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం, మన ప్రధాన స్రవంతి మీడియా మూసిపెట్టాలని చూసి పాచిపోయేట్లు చేసింది. జనవరి 26 పరేడ్‌కు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు వెనుదిరిగి పోతుంటే ఇంకేముంది ఉద్యమాన్ని ముగించేశారని పదే పదే ప్రసారం చేశారు. ఇది రైతులను రెచ్చగొట్టింది. దానికి తోడు రైతు నేత రాకేష్‌ తికాయత్‌ కన్నీళ్ల వీడియో వైరల్‌ కావటంతో కొత్తగా రైతులు ఢిల్లీ సరిహద్దులకు రావటం ప్రారంభించారు. స్వీట్లు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో చక్కెర వ్యాధి ఉన్నవారికే కాదు లేని వారికి కూడా తెలుసు. ఇప్పుడు ట్విటర్‌లో ఉన్నవారికే కాదు లేని వారికి కూడా అవెంత పని చేస్తాయో తెలుస్తోంది. వ్యాసాలు చేయలేని పనిని నాలుగు ముక్కల ట్వీట్లు చేస్తున్నాయి. అందుకే కొందరు ఎంత పని చేశావే ట్వీటూ అని నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

రైతులు పొలాల్లో విత్తనాలు- రోడ్ల మీద మోడీ ఇనుప మేకులు నాటిస్తున్నారు !
తాజా విషయానికి వస్తే రైతులు పొలాల్లో విత్తనాలు నాటుతుంటే నరేంద్రమోడీ రోడ్ల మీద మేకులు నాటిస్తున్నారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అవి ఆగ్రహానికి కారణం కావటంతో వాటిని తొలగించారు. ప్రభుత్వం తోక ముడిచిందంటూ సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావటంతో లేదు లేదు, వేరే విధంగా అమర్చేందుకు తొలగించాం తప్ప మరొకటి కాదని ప్రకటించారు. ఇదిలా ఉండగా రైతుల ఆందోళన గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు అంటూ అంతర్జాతీయంగా పేరున్న ప్రఖ్యాత పాప్‌ గాయని, నటి రీఅనే చేసిన ట్వీట్‌ కేంద్ర ప్రభుత్వానికి కాక పుట్టించింది. రైతుల నిరసన ప్రాంతంలో ఇంటర్నెట్‌ను ఎందుకు నిలిపివేశారని కూడా ఆమె ప్రశ్నించారు. సామాజిక మాధ్యమంలో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అనుచరులను కలిగి ఉన్న తొలి 50 మందిలో 6.5 కోట్ల మందితో మన నరేంద్రమోడీ పన్నెండవ స్ధానంలో ఉన్నారు. పది కోట్ల పది లక్షల మందితో మోడీ కంటే ఎగువన రీఆనె నాలుగవ స్ధానంలో ఉన్నారు. అందువలన ఆమె ట్వీట్‌తో రైతు ఉద్యమం గురించి ప్రపంచ వ్యాపితంగా చర్చించే వారు పెరిగారు.

పర్యావరణమే కాదు, రైతులూ నాకు ముఖ్యమే అంటున్న గ్రేటా టన్‌బెర్జ్‌ !
రీఆనె ట్వీట్‌ ఒక సంచలనం అయితే అంతకంటే స్వీడన్‌కు చెందిన 18 ఏండ్ల గ్రేటా టన్‌బెర్జ్‌ ట్వీట్‌ ప్రచారాన్ని మరో మలుపు తిప్పింది.ఆమె తన ట్వీట్‌తో పాటు రైతు ఉద్యమానికి సంబంధించిన సమాచారంతో ఒక కిట్‌ను కూడా తోడు చేసింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం మండి పడింది. అంతేనా ఢిల్లీ పోలీసులు ఒక కేసును కూడా నమోదు చేశారు. అయినా ఖాతరు చేయకుండా కిట్‌ను సవరించి మరో ట్వీట్‌ చేస్తూ తాను ఉద్యమానికి ప్రకటించిన మద్దతుకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేసింది. విద్యార్దినిగా పర్యావరణ పరిరక్షణ కోరుతూ ఆమె ప్రారంభించిన సామాజిక మాధ్యమ ప్రచారం ప్రపంచనేతలను ఆకర్షించింది. అతి చిన్న వయస్సులోనే ఒక ప్రముఖ వ్యక్తిగా మారింది. 2019 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీకి కూడా వీడియో ద్వారా ఇతర దేశాధినేతలతో పాటు తన వినతిని పంపింది. దానిలో ఇలా ఉంది.” ప్రియమైన మోడీ గారూ, వాతావరణ సంక్షోభానికి సంబంధించి మీరు చర్య తీసుకోవాలి. కేవలం దాని గురించి మాట్లాడితే చాలదు, ఎందుకంటే మీరు ఇప్పటి మాదిరే మాట్లాడుతూ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తే, పరిమితమైన విజయాల గురించి బేరమాడుతుంటే మీరు వైఫల్యం చెందుతారు. మరియు మీరు గనుక విఫలమైతే భవిష్యత్‌ మానవ చరిత్రలో మిమ్మల్ని కూడా ఒక ప్రతినాయకుడిగా చూస్తారు. మీరు దాన్ని కోరుకోవద్దు ” ఇప్పుడు అదే నరేంద్రమోడీ గారిని ఉద్దేశించి ఇంకా ట్వీట్‌ లేదా వీడియో వినతి చేయకపోయినా రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించటమంటే మోడీ గారిని ఒక విధంగా నిలదీసినట్లే !
రీఆనె, గ్రేటా టన్‌బెర్జ్‌ ట్వీట్లు వివాదాస్పదం గాక మందు వారి గురించి మన దేశంలో కొద్ది మందికి మాత్రమే తెలుసు. నరేంద్రమోడీ సర్కార్‌ చర్యతో ఎవర్రా ఆ ఆమ్మాయిలు అని రైతులు చర్చించుకొనేట్లు చేశారు. విదేశీ యువతులకు కలిగిన స్పందన మనకెందుకు రాలేదు అని ఉద్యమం గురించి పట్టని యువతులు కొందరైనా ఆలోచిస్తున్నారు. రీఆనె ట్వీట్‌తో దిమ్మతిరిగిన కాషాయ మరుగుజ్జులు తమ సాధారణ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆమె గతంలో వెస్టీండీస్‌ క్రికెట్‌ పతాకాన్ని ప్రదర్శించిన ఫొటోను పాకిస్ధాన్‌తో పతాకంగా మార్చి సామాజిక మాధ్యమంలో తిప్పుతున్నారు. విమర్శిస్తే ప్రతి విమర్శ చేయటం వేరు. మహిళల మాన మర్యాదల గురించి నిత్యం ప్రవచనాలు పలికే కాషాయ దళం నోరు పట్టని బూతులతో ఆమె ట్వీట్లు పెడుతున్నారు. భారతీయులు ఇంత లేకిగా కూడా స్పందిస్తారా అని ప్రపంచ నోరు వెళ్లబెట్టేట్లు చేస్తున్నారు.

కంగన నోటి తుత్తర – వాతలు వేసిన తాప్పీ !
గతంలో రైతులను ఉగ్రవాదులంటూ తూలనాడిన సినిమా హీరోయిన్‌ కంగనా రనౌత్‌ నోటి తుత్తర ట్వీట్ల రచ్చలో లేకుండా ఉంటుందా ? బూతు నటి అంటూ రీఅనెను తిట్టిపోసింది. వామపక్ష పాత్రకు ఆదర్శం అంది. ఆమె స్పందనకు అభినందనగా ఒక పాటను అంకితం చేసిన పంజాబీ గాయకుడు, రచయిత దల్జీత్‌ దోసాంజ్‌ మీద విరుచుకుపడుతూ ఖలిస్తానీ అని తిట్టిపోసింది. అంతేనా అనేక మంది క్రెకెటర్లను ఉద్దేశించి ” రజకుడి కుక్కలు ” అంటూ నోరు పారవేసుకుంది. దాంతో ట్విటర్‌ నిర్వాహకులకే సిగ్గువేసి దాన్ని తొలగించారు. మీరు ఎటువైపో (నరేంద్రమోడీకి అనుకూలమో వ్యతిరేకమో ) తేల్చుకోలేకపోతే రజకుడి కుక్క మాదిరి అటు ఇంట్లోనో ఇటు చాకిరేవు దగ్గరో కాకుండా అటూ ఇటూ తిరుగుతుంటారు అన్నది దాని అర్ధం. ఎవరైనా కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తే వారి మీద దేశద్రోహ ముద్ర వేస్తున్నారు. దాంతో మనకెందుకులే నోరు మూసుకుంటే పోలా అన్నట్లు అనేక మంది మేథావులు- ప్రముఖులు దేశంలో జరుగుతున్న పరిణామాలను గుడ్లప్పగించి చూడటం తప్ప స్పందించటం లేదు. అలాంటి వారిని కూడా వారి మానాన వారిని ఉండనివ్వరు. తమకు మద్దతు ప్రకటించకపోవటం కూడా దేశద్రోహమే అని దాడి చేసే రోజులు ముందున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కంగన రనౌత్‌ ట్వీట్‌ భావమదే, ఎటూ తేల్చుకోని వారిని తూలనాడటమే. మేథావుల మౌనం ఏ సమాజానికీ మంచిది కాదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు మేథావులలో ఏటికి ఎదురీదే వారూ ఉన్నారు. చచ్చిన చేపల మాదిరి నీటి వాలున కొట్టుకుపోయే వారూ ఉంటారు. ఇలాంటి సమయాలలో ఎవరెటు ఉన్నారో జనానికి స్పష్టంగా తెలుస్తుంది.
వృత్తి వైరమో లేక రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటమో తెలియదు గానీ మరో హీరోయిన్‌ తాప్సీ కంగనాను పరోక్షంగా ట్వీట్లతో ఆడుకుంది.మనం ఇతరులకు ప్రబోధం చేసే బోధకులుగా మారకూడదు అని వ్యాఖ్యానించారు. ” ఒక ట్వీట్‌ మీ ఐక్యతకు దడ పుట్టించినా, ఒక జోక్‌ లేదా ఒక ప్రదర్శన మీ మతవిశ్వాసాన్ని దడదడలాడించినా మీ విలువల వ్యవస్ధను పటిష్టపరుచుకొనేందుకు పని చేసుకోవాలి గానీ ఇతరులకు ప్రబోధించే టీచరుగా మారకూడదు ” అని తన ట్వీట్లలో పేర్కొన్నారు.

అవి నోళ్లా ? మురికి కాలువలా ?
కొందరివి నోళ్లో మురిక్కాలువలో తెలియదు, తెరిస్తే కంపు భరించలేము. రీఆనె గురించి కంగనా చేసిన ట్వీట్లో ” ఆమె ప్రత్యేకత ఏమిటంటా పాటలు పాడుతూ కెమెరా ముందు తన పిరుదులు కదిలిస్తుంది-ముందున్న…ని ప్రదర్శిస్తుంది. అంతకు మించి ఏముంది ? ఇక గ్రేటా అదొక ఎలుక, బడికి పోవాలనుకోదు, చదువంటే ద్వేషం, అంతర్జాతీయ కుట్రలో ఆమె ఒక భాగం అని పేర్కొన్నది. నేను కంగన సినిమాలను చూడలేదు కనుక ఆమె ఏమి చూపిందో తెలియదు, ఒక వేళ చూసినా ఆ స్ధాయికి దిగజారలేను.
ట్వీట్ల మీద మండిపడిన కంగన పరోక్షంగా తాప్సీని తూలనాడుతూ ” చౌకబారు వ్యక్తి, బుద్దిలేని, ఊరికే తినిపోయే రకం ” అంటూ విరుచుకుపడింది. ” అవన్నీ కొంత మంది డిఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ మౌలిక లక్షణాలు లేదా చివరికి రక్తకణాలైనా మనం ఏం చేయగలం ” అంటూ తాప్సీ బదులిచ్చింది. ఈ వివాదాన్ని గమనించిన వారిలో మీరు ” క్వీన్‌ ” అండీ అని ఒకరు తాప్సీని వర్ణించారు. ” హ హ హ అరె ఉంగరాల జుత్తు, నోరేసుకొని పడిపోవటం మాదిరి ఈ పదం ఒకరి స్వంతం కదా ” అని తాప్సీ స్పందించింది. క్వీన్‌ అనే సినిమాలో కంగన హీరోయిన్‌, ఆమెకు ఉంగరాల జుట్టు ఉన్న విషయం తెలిస్తే తాప్సీ చెప్పిందేమిటో వివరించనవసరం లేదు.
గుక్క తిప్పుకోలేని కంగన హిందీలో తిట్టిపోసింది.(తరువాత వాటిని సిగ్గుపడి లేదా మరొక కారణంతో తానే ట్విటర్‌ నుంచి తొలగించింది) ” నేను జాతీయ వేదికల మీ అమ్మను అవమానిస్తే నీ విశ్వాసం గడగడలాడుతుందే బుద్దిలేని దానా, పెంపుడు జంతువుల మాదిరి రొట్టె ముక్కల కోసం నీవు ప్రేమను చూపుతావని నాకు తెలుసు. అవి అంతకు మించి మరేమీ చెయ్యవు, నోరు మూసుకుంటే మంచిది ” అని వ్యాఖ్యానించింది. అంతటితో ఆగలేదు ” చౌకబారు వారి ఆలోచన కూడా అదే విధంగా ఉంటుంది. ఎవరైనా మాతృదేశం మీద కుటుంబం మీద విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అది మన పెద్ద బాధ్యత, దేశానికి భారం కావద్దు, అందుకే అలాంటి వారిని నేను చౌకబారు అని పిలుస్తాను… ఇలాంటి ఊరికే తినే రకాలను పట్టించుకోవద్దు ” అని కూడా సెలవిచ్చింది.
ఒక సారి ఎవరైనా ప్రజా జీవితంలో వ్యాఖ్యానించటం మొదలు పెట్టిన తరువాత మిగతావారికీ స్పందించే హక్కుంది. రాణికి ఎదురు దెబ్బ తగిలింది అంటూ పరోక్షంగా కంగన గురించి మరో నటి కుబ్రా సేథ్‌ ట్వీట్‌ చేసింది. గతేడాది కుబ్రా చేసిన ట్వీట్‌ మీద ఆగ్రహించిన కంగనా ఆమెను తన జాబితాలో లేకుండా నిలిపివేసింది. ముంబై పర్యటన సమయంలో కేంద్ర ప్రభుత్వం కంగనకు వై ప్లస్‌ తరగతిలో భద్రతా సిబ్బందిని కేటాయించిన విషయం తెలిసిందే. దాని మీద స్పందిస్తూ వేరే ఏమీ లేదు నేను చెల్లించిన పన్ను నుంచి అందుకోసం ఏమైనా ఖర్చు చేస్తున్నారా అని తనిఖీ చేస్తున్నా అంటూ కుబ్రా సేథ్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది.

సినిమాల్లో నిషేధించినా సరే మద్దతు ప్రకటిస్తా అంటున్న అమందా !
అమందా చెర్నీ అనే హాలీవుడ్‌ నటి కూడా రైతులకు మద్దతుగా ట్వీట్‌ చేసింది. అలా చేసినందుకు నేను క్షమాపణ చెప్పను. మీరు సినిమాలను అభిమానించండి. కనీస మానవ హక్కుల అవసరం గురించి గళమెత్తినందుకు గాను బాలీవుడ్‌ (హిందీ) నిషేధించాలనుకుంటే నన్ను సినిమాల్లో చూడలేరు అని ఊహించుకోగలను.తన మద్దతును పునరుద్ఘాటిస్తూ మరో ట్వీట్‌ చేసింది. అంతే కాదు భారత్‌ను నాశనం చేసేందుకు డబ్బు తీసుకొని కొందరు ప్రముఖులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ మీద మండి పడింది.రీఆనె చేసిన ట్వీట్లకు సొమ్ము పుచ్చుకుందన్న ఆరోపణలను తిప్పికొట్టింది. ఆమె ఇప్పటికే ధనవంతురాలు, మీరు చెబుతున్నజాబితాలోని వారందరికీ సొమ్ము చెల్లించినట్లయితే నేను కూడా సమాచారం వెల్లడించేందుకు డబ్బు తీసుకొనేందుకు సిద్దమే, వెంటనే అందుకు ఏర్పాట్లు చేయండి అని ట్వీటింది. అంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో రైతుల ఉద్యమ స్ధలంలో ఉన్న ఒక వృద్దురాలి ఫొటోను షేర్‌ (పంచటం) చేస్తూ సమస్యను అర్ధం చేసుకోవటానికి మీరు ఇండియన్‌, పంజాబీ లేదా దక్షిణ ఆసియన్‌ అయి ఉండనవసరం లేదు. మీరంతా మానవత్వాన్ని పట్టించుకోండి. పౌర హక్కులు, సమానత్వం, కార్మికులకు గౌరవం,మరియు కనీస మానవ హక్కుల కోసం భావ ప్రకటనా, పత్రికా స్వేచ్చను డిమాండ్‌ చేయండి అని అమందా పేర్కొన్నది.
రైతు ఉద్యమానికి మద్దతుగా రీఆనె చేసిన ట్వీట్ల మీద దేశంలో కాషాయ మరుగుజ్జు దళాలు దాడి చేస్తుంటే ట్విటర్‌ సిఇఓ జాక్‌ డోర్సే ప్రశంసించటం కొసమెరుపు. వాషింగ్టన్‌ పోస్టు జర్నలిస్టు కరేన్‌ అటియా దీని గురించి రాస్తూ గతంలో సూడాన్‌, నైజీరియా, ఇప్పుడు భారత్‌, మయన్మార్‌లో సామాజిక న్యాయ ఉద్యమాల గురించి రీఆనె స్పందించారని, నిజమైన కార్యకర్త అని ఆమె పేర్కొన్నారు. రైతుల ఉద్యమం చారిత్రాత్మక అంతర్జాతీయ నిరసనగా మారినందున దానికి సూచికగా ఒక ఎమోజీ (చిత్రాన్ని) రూపొందించాలని ట్విటర్‌ యాజమాన్యాన్ని కోరారు.

అక్షయ కుమార్‌ ఇప్పుడు భారతీయుడే కాదు ! ట్వీట్‌కు డబ్బు తీసుకున్నాడా ?
బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తొలిసారిగా రైతుల ఉద్యమం మీద స్పందించారు. కొద్ది రోజుల క్రితం దాని మీద మీ వైఖరి ఏమిటని మీడియా వెంటపడింది. ” మంచి పని తప్పకుండా చేయాలి. అత్యంత సరైన పని చేయాలి. అత్యంత మహత్తరమైన దానిని చేయాలి” అని చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. అటో ఇటో తెలియకుండా ఉంది అని చెప్పవచ్చు. దీని మీద కూడా కంగన్‌ స్పందిస్తారేమో తెలియదు.
ప్రభుత్వానికి మద్దతుగా రైతులకు వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటులు అక్షయ కుమార్‌, అజయ దేవగన్‌, కరణ్‌ జోహార్‌, సునీల్‌ షెట్టి వంటి వారు రీఆనె ట్వీట్ల మీద ద్వజమెత్తారు. అక్షయ కుమార్‌ ఇప్పుడు అసలు భారతీయుడు కాదు, కెనడా పౌరుడు, మన అంతర్గత వ్యవహారాల మీద అతనికి పనేమిటి ? సినిమాల్లో నటించినందుకు పారితోషికం తీసుకున్నట్లుగానే ప్రభుత్వానికి మద్దతుగా ట్వీట్లు, ప్రకటన చేసినందుకు డబ్బు తీసుకుంటున్నాడా ? ఇలాంటి వారు ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన ప్రకటనను సినీ రంగానికి చెందిన తాప్సీ పన్ను, స్వర భాస్కర్‌, సోనాక్షి సిన్హా, ఓనిర్‌, అర్జున్‌ మాధుర్‌ వంటి వారు ఖండించారు.

మన చేస్తే సంసారం -ఇతరులు చేస్తే మరొకటా ! అసలు మనం మడి కట్టుకున్నామా !
మన అంతర్గత విషయాల మీద స్పందించటానికి బయటి వారెవరు అని జాతీయ ఉన్మాదాన్ని రేపేందుకు పెద్ద ప్రయత్నం జరుగుతోంది. మీడియా తన రేటింగ్‌ పెంచుకొనేందుకు పూనుకుంది. రైతు ఉద్యమాన్ని అంతర్జాతీయం గావించింది ప్రభుత్వమూ, బిజెపి అన్నది తెలిసిందే. దీని వెనుక విదేశాల్లోని ఖలిస్తానీ సంస్ధలు ఉన్నాయని ఆరోపించింది తొలుత బిజెపి నేతలే కదా ! మన అంతర్గత విషయాల గురించి విదేశాలు, విదేశీయుల కెందుకు అన్న ప్రశ్నను ముందుకు తెస్తున్నారు. లక్ష ట్రాక్టర్లతో ప్రపంచంలో ఏదేశ రాజధానిలో అయినా రైతులు ప్రదర్శన జరిపారా ? అది ఢిల్లీలో జరిగింది, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించకుండా ఎలా ఉంటుంది.అమెరికా ఎన్నికలకు ముందు మన ప్రధాని నరేంద్రమోడీ హౌడీమోడీ కార్యక్రమం పేరుతో హూస్టన్‌ నగరంలో ఏర్పాటు చేసిన సభలో అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బహిరంగంగా ప్రకటించటం అమెరికా ఎన్నికలు, అంతర్గత వ్యహారాల్లో జోక్యం చేసుకోవటం కాదా ? ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నవారు అప్పుడు నరేంద్రమోడీ చేసింది తప్పని ఎందుకు చెప్పలేకపోయారు ?
హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్న సమయంలో ఐక్యరాజ్యసమితి వేదిక మీద మన ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. అంతెందుకు తాజాగా పక్కనే ఉన్న మయన్మార్‌లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అది ఆ దేశ అంతర్గత వ్యవహారం. మరి మన విదేశాంగ శాఖ ఆందోళన ప్రకటిస్తూ ప్రకటన ఎందుకు చేసినట్లు ? అక్కడేం జరిగితే మనకేంటి ?
చైనాలో అంతర్భాగం టిబెట్‌. అక్కడ ఉంటున్న మతాధికారి దలైలామా చైనా సర్కారు మీద తిరుగుబాటు చేశాడు.పారిపోయి మనదేశం వస్తే మనం ఎందుకు ఆశ్రయం కల్పించినట్లు ? ఒక్క ఆశ్రయమేనా ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలన్నీ సమకూర్చామా లేదా ? గత ఆరు దశాబ్దాలుగా దలైలామా, అతగాడి పరివారాన్ని పోషిస్తున్నామా లేదా ? ఇది చైనా అంతర్గత వ్యవహారంలో వేలు పెట్టటం కాదా ?

మన వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు జోక్యం కాదా ?
వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన చట్టాలు మన అంతర్గత విషయాలు అనుకుందాం కాసేపు. వాటి మీద ఇంత ఆందోళన, రచ్చ జరుగుతున్న సమయంలో వాటికి తాము మద్దతు ఇస్తున్నట్లు అమెరికా ఎందుకు ప్రకటించింది. ఇది ప్రభుత్వ అనుకూల జోక్యం కాదా ? దీనికి మోడీ సర్కార్‌ ఏ రూపంలో ప్రతిఫలం చెల్లించినట్లు ? ఇదే ప్రకటన గతేడాది ఆర్డినెన్స్‌ ద్వారా సవరణలు తెచ్చినపుడు వెంటనే అమెరికా ఆ విధంగా స్పందించి ఉంటే అదొక దారి. మరి ఇప్పుడెందుకు ప్రకటించినట్లు ? రైతుల ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రకటన కాదా ? ఒక వేళ జోక్యంగా పరిగణిస్తే దాన్ని మన ప్రభుత్వం, కంగనా రనౌత్‌, సచిన్‌ టెండూల్కర్‌, సామాజిక మాధ్యమ మరుగుజ్జులు కానీ ఎందుకు ఖండించటం లేదు. మనం తీసుకున్న చర్యలు దేశ మార్కెట్ల సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తాయని, ప్రయివేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తాయని అమెరికా ఆహ్వానించింది అని మన విదేశాంగ శాఖ ప్రతినిధి సమర్ధించారు. ఒక్క అమెరికానే కాదు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద కూడా వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించింది. దానికేం పని ? అది జోక్యం కాదా ?

రైతులకు మద్దతు తప్ప మోడీ సర్కార్‌ను కూల్చాలని ఎవరూ చెప్పలేదే !
అమెరికా చేసిన వ్యాఖ్యలను మొత్తంగా చూడాలి తప్ప విడి విడిగా చూడకూడని మన విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఇదే వైఖరిని రైతులకు మద్దతు ప్రకటించిన వారి విషయంలో ఎందుకు చూడటం లేదు ? వారు కూడా ప్రజాస్వామ్యానికి అనుగుణ్యంగానే రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు తప్ప మోడీ సర్కార్‌ను కూల్చివేయాలని రెచ్చగొట్టలేదే ? దాన్ని కూడా సహించరా ? ఆ మాటకు వస్తే అనేక మంది అమెరికా పార్లమెంటు సభ్యులు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మేనకోడలు మీనా హారిస్‌ కూడా రైతుల ఉద్యమంపై ప్రభుత్వ వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ? ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని మీనా హారిస్‌ వ్యాఖ్యానించారు. ఇంతకంటే మోడీ సర్కార్‌కు అవమానం మరేమి ఉంటుంది ? మరి వారి మీద కూడా కేసులు పెడతారా ?
అమెరికా ప్రభుత్వం ఏమి చెప్పింది ? విబేధాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, శాంతియుత నిరసన ప్రజాస్వామ్యానికి ప్రామాణికమని చెప్పింది. ఇది జోక్యం కాదా ? ఎలా పరిష్కరించుకోవాలో వారు చెప్పకపోతే మన నరేంద్రమోడీకి తెలియదా ? మోడీ నాయకత్వం కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని బిజెపి వారు చెబుతారు, అలాంటపుడు అమెరికాతో, అదీ తాను వ్యతిరేకించిన జో బైడెన్‌ యంత్రాంగంతో చెప్పించుకోవటం ఏమిటి ? ఇంతవరకు మోడీ స్వయంగా చర్చలకు పూనుకోలేదని ఎత్తిపొడవటంగా ఆ ప్రకటనను చూడాలా ?
ట్వీట్లు చేసిన వారు జత చేసి కిట్‌ ఎక్కడ తయారైందో తెలుసుకొనేందుకు కేసు పెట్టామని, కెనడా, అమెరికా సాయం కోరుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇదంతా సమస్యను పక్కదారి పట్టించే వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఎర్రకోట వద్ద ఒక మత జెండాను ఎగురవేస్తుంటే ప్రేక్షకపాత్ర వహించిన నరేంద్రమోడీ పోలీసుల మీద చర్యలు తీసుకోలేదు, అందుకు బాధ్యులైన వ్యక్తులను పట్టుకోవాల్సిన పోలీసులు దానికి బదులు రోడ్ల మీద మేకులు కొడుతూ కూర్చున్నారు. అలాంటి వారు మరింతగా ఈ సమస్యను రచ్చ చేసి ప్రపంచ మీడియాలో గబ్బు పట్టటం తప్ప బార్బడోస్‌, స్వీడన్‌, ఇతర దేశాలకు చెందిన వారి ట్వీట్ల మీద తీసుకొనే చర్యలేమిటి ? సాధించేదేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల చేతుల్లో ముల్లు గర్రలు – ముళ్ల కంచెల ఏర్పాట్లలో మోడీ !

03 Wednesday Feb 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Budget 2021 Agriculture, Farmers agitations, India budget 2021-22, India budget-Farmers, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


రైెతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ శివార్లలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శాశ్వత ఆటంకాలు(బారికేడ్లు), ముళ్ల కంచెలు, గోడలు, రోడ్ల మీద ఇనుప ముళ్ల ఏర్పాట్లను చూస్తుంటే వారితో తాడోపేడో తేల్చుకొనేందుకే నరేంద్రమోడీ సర్కార్‌ సన్నద్దం అవుతున్న భావన కలుగుతోంది. అంతకు తెగిస్తారా ? రాజకీయ వ్యాపార లాభ నష్టాలను బేరీజు వేసుకొని తాత్కాలికంగా వెనక్కు తగ్గుతారా ? ముందుకు పోతే రాజకీయంగా రోజులు దగ్గర పడతాయి. వెనక్కు తగ్గితే మరిన్ని ఉద్యమాలు ముందుకు వస్తాయి. నరేంద్రమోడీ సంస్కరణల పులిని ఎక్కారు, ఏం చేస్తారో, ఏం జరగనుందో చూద్దాం !


గోముఖ వ్యాఘ్రాల నిజస్వరూపం అసలు సమయం వచ్చినపుడే బయటపడుతుంది. ఇక్కడ గోవు ప్రస్తావన తెచ్చినందుకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే క్షంతవ్యుడను. గోముఖ వ్యాఘ్రం అనే పదాన్ని సృష్టించిన వారికి వీరతాళ్లు వేస్తారో లేక మరణానంతరం దేశద్రోహ నేరం కింద శిక్షించమని సిఫార్సు చేస్తారో వారిష్టం. గోముఖ వ్యాఘ్రాల గురించి చెప్పటానికి ఈ పదం తప్ప ఆత్మనిర్భరత లేదా మేకిన్‌ ఇండియా, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ వంటి పదాలను సృష్టించిన వారు ప్రత్యామ్నాయం చూపేంత వరకు దాన్ని ఉపయోగించక తప్పటం లేదు.


ఆవులను మోసం చేసేందుకే వ్యాఘ్రాలు గోముఖాలతో వస్తాయి. ఇప్పుడు రైతులనే ఆమాయకులను మోసం చేసేందుకు అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అదే. అన్నీ మీరే చేశారు అని కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నట్లుగానే అన్నీ రైతుల కోసమే అనేట్లుగా రైతు ఉద్యమ నేపధ్యంలో బడ్జెట్‌ ప్రసంగం, భాష్యాలు సాగాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోత పెట్టటం ఒకటైతే పెట్రోలియం ఉత్పత్తులు, బంగారం, ఇతర దిగుమతులపై వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ది సెస్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతుల ఉత్పత్తులకు అధిక ధరలు వస్తాయని ఆర్ధిక మంత్రి చెప్పారు. మరొకటి వచ్చే ఏడాదిలో రూ.16.5లక్షల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు నిర్మలమ్మ చెప్పారు. చాలా మంది దీన్ని బడ్జెట్‌ కేటాయింపు అనుకున్నారు. బడ్జెట్‌ మొత్తమే 34.83లక్షల కోట్లయితే దానిలో దాదాపు సగం రైతులకు రుణాలుగా ఇస్తారా ? బ్యాంకుల నుంచి ఇప్పించే అప్పులు మాత్రమే అవి. మాట్లాడే మేక అంటూ ఎలా బురిడీ కొట్టిస్తారో అందరికీ తెలిసిందే. ఏప్రిల్‌ తరువాత వచ్చే నెల ఏదీ-జూన్‌కు ముందు వచ్చే నెల ఏదీ అని అడిగి మేకను గిల్లిలే ” మే ” అని అరుస్తుంది.రైతుల ఆదాయాలు పెంచే యత్నంలో భాగంగా ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులను జాతీయం చేసినప్పటి నుంచి రైతులకు ఇస్తూనే ఉన్నారు, అవేవీ రైతుల ఆదాయాలను పెంచలేదు. గత సంవత్సరం పదిహేను లక్షల కోట్లుగా నిర్ణయించారు, అంతకు ముందు పదమూడున్నర లక్షల కోట్లు ఉంది. ఈ లెక్కన శాతాల్లో చూస్తే వచ్చే ఏడాది తగ్గినట్లా – పెరిగినట్లా !


ఎంతైనా నిర్మలమ్మ తెలుగింటి ఆడపడుచు కనుక తక్కువే అని చెప్పి ఆమెను తప్పుపట్టదలచ లేదు. అధికారులు రాసి ఇచ్చింది చదువుతారు తప్ప ఆమె రాసి ఉండరు అనుకోవాలి. రైతులకు చేకూర్చిన ప్రయోజనాల గురించి నిర్మలా సీతారామన్‌ చాలా కబుర్లు చెప్పారు. బహుశా రాత్రి ఇంటికి వెళ్లి ఇదేంటబ్బా ఇలా మాట్లాడాను అనుకొని ఉంటారు. ఎందుకంటే గతంలో మాదిరి ప్రసంగం చదువుతుంటే బల్లలు చరచటాలు, ఆహా ఓహౌ అంటూ అధికార పక్ష ప్రశంశలూ లేవు. గతేడాది కంటే మొత్తం బడ్జెట్లో పెంపుదల కేవలం 33వేల కోట్ల రూపాయలు మాత్రమే. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ బడ్జెట్‌ తగ్గుతుంది అనే ఊహ ఆమెకు నిద్రను దూరం చేసి ఉండాలి.

స్వామినాధన్‌ కమిషన్‌ నివేదికను గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చెత్తబుట్టలో వేస్తే తాము బయటకు తీసి అమలు జరిపామని బిజెపి వారు చెబుతున్నారు. ఎంత మోసం !! ఇదే నరేంద్రమోడీ సర్కార్‌ దాన్ని అమలు జరపలేమంటూ సుప్రీం కోర్టుకు నివేదించిన విషయం జనం మరచి పోతారా ? 2019-20 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 130వేల కోట్లు చూపి ఖర్చు చేసింది రూ.94,251 కోట్లు మాత్రమే. గత ఏడాది 134వేల కోట్లు చూపి దాన్ని 117వేలకోట్లకు సవరించారు. తాజా బడ్జెట్‌లో 123వేల కోట్లను చూపి తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ప్రధాని కిసాన్‌ నిధి పేరుతో ఏటా ఆరువేల రూపాయలు ఇస్తున్నదానిని పదివేలకు పెంచుతారనే లీకు వార్తలు వచ్చాయి. దానికి బదులు గత ఏడాది ఉన్న 75వేల కోట్ల బడ్జెట్‌ను 65వేలకు కుదించారు. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పది వేల కోట్లు పెంచారని జబ్బలు చరుచుకున్నారు బానే ఉంది మరి ఈ తగ్గింపు సంగతేమిటి ? కొత్తగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి 900 కోట్లు కేటాయించామని చెబుతూనే వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పధకానికి 1700 కోట్లు, ధరల స్ధిరీకరణ నిధికి 500 కోట్ల కోత పెట్టారు. మొత్తంగా చూసినపుడు వ్యవసాయ సంబంధ బడ్జెట్‌ మొత్తాలను 8.5శాతం తగ్గించినట్లు తేలింది. అయినా రైతులకు ఎంతో మేలు చేశామని ప్రసంగంలో ఊదరగొట్టారు. నిజానికి వ్యవసాయ లేదా గ్రామీణ మౌలిక సదుపాయాల నిధులు కొత్తవేమీ కాదు, గతంలో ఉన్నవే. వాటి ద్వారా రైతులకు కలిగించిన లబ్ది ఏమిటో చెప్పరు.

కనీస మద్దతు ధరల కొనుగోలు ద్వారా రైతులకు 2020-21లో 2.47లక్షల కోట్లు చెల్లించామని ఆర్దిక మంత్రి గొప్పగా చెప్పారు.ఉత్తిపుణ్యానికే చెల్లించారా ? వరి, గోధుమలను తీసుకొని వాటికేగా చెల్లించారు. దీన్ని కూడా గొప్పగా చెప్పుకుంటారా ? ఫసల్‌ బీమా యోజన ఎంత మందికి కల్పించారని కాదు, ఎంత మందికి ఉపయోగపడిందనన్నది ముఖ్యం.2018-19లో 5.76 కోట్ల మందికి కల్పించామని చెప్పారు. మరుసటి ఏడాది లబ్దిదారులు 2.15 కోట్లన్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో లబ్దిపొందింది 70లక్షల మంది అని ఆర్ధిక సర్వేలో చెప్పారు. కిసాన్‌ నిధి కింద సన్న, చిన్నకారు రైతులు 9.43కోట్ల మంది ఆరువేల రూపాయల చొప్పున పొందారని చెబుతున్నారు. అంటే బీమా పధకం ఎంత మందికి ఉపయోగపడుతున్నదో దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు.ధాన్యసేకరణ ద్వారా లబ్ది పొందింది 2.2 కోట్ల మంది అన్నారు. ఇవన్నీ చెబుతున్నదేమిటి ? ప్రచారం ఎక్కువ ప్రయోజనం తక్కువ అనే కదా ! వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి లక్ష కోట్లు, పశుసంవర్ధక మౌలిక సదుపాయాల నిధి పదిహేను వేల కోట్ల రూపాయలు కరోనా ఉద్దీపన పేరుతో ఇప్పటికే ఉంది. దాన్నుంచి రుణాలుగా సూత్రరీత్యా మంజూరు చేసిన మొత్తం జనవరి నాటికి రూ.2,991 కోట్లు మాత్రమే.


భారత ఆహార సంస్ద(ఎఫ్‌సిఐ)కి జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధి(ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌) నుంచి రుణం తీసుకోవటాన్ని నిలిపివేస్తున్నామని ఆర్దిక మంత్రి తన ప్రసంగంలో ప్రకటించారు. ఇదేమీ విప్లవాత్మక నిర్ణయం కాదు. అసలు ప్రభుత్వ నియంత్రణ, నిధులతో నడిచే సంస్ద మరొక ప్రభుత్వ సంస్ద నుంచి రుణం తీసుకోవాల్సిన అగత్యం ఏమి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అతి పెద్ద సంస్కరణగా కార్పొరేట్‌ ప్రతినిధులు వర్ణించారు. నిజమే వారి లెక్కలు వారికి ఉన్నాయి. మనకు అర్ధం కావాల్సింది ఏమిటి ? ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ విధించిన షరతుల్లో భాగంగా రుణాలు, ద్రవ్యలోటు వంటి అంశాలకు సంబంధించి పరిమితులు విధించారు. వాటిని తప్పించుకొనేందుకు దొడ్డి దారులు వెతికారు. ప్రభుత్వ రుణాల మొత్తాన్ని తక్కువగా చూపేందుకు గాను ప్రభుత్వ సంస్ధలు తీసుకొనే రుణాలను విడిగా చూపుతున్నారు. రెండవది ఈ రుణం, దానికయ్యే ఖర్చును చూపి ఎఫ్‌సిఐని అసమర్ధమైందిగా చిత్రించి దాన్ని వదిలించుకొనే ఎత్తుగడ దీని వెనుక ఉంది. ఎఫ్‌సిఐలో అవినీతి లేదని కాదు, ఆ మాటకు వస్తే పోలీసు, మిలిటరీ కొనుగోళ్లలోనే అవినీతి జరుగుతోంది.


ఎఫ్‌సిఐ సేకరించే ఆహార ధాన్యాలు, పప్పు, నూనె గింజలను ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ ధరలకు వినియోగదారులకు అందించాల్సి ఉంది. ఈ సబ్సిడీ మొత్తాలతో పాటు సంస్ధ నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆహార సబ్సిడీ పేరుతో ప్రతి ఏటా అందచేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మొత్తాలను సకాలంలో విడుదల చేయని కారణంగా ఎఫ్‌సిఐకి నిధుల సమస్య ఏర్పడింది. దాంతో అవసరమైన మొత్తాలను తాత్కాలిక సర్దుబాటుగా ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ నుంచి రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సకాలంలో, పూర్తిగా సబ్సిడీ మొత్తాలను విడుదల చేయని కారణంగా బకాయిల మొత్తం పెరిగిపోయింది.ఈ మొత్తాలపై 8.8శాతం వడ్డీ చెల్లించాలి. ప్రభుత్వ చేతగాని తనం కారణంగా ఈ భారాన్ని కూడా జనానికి ఇచ్చే ఆహార సబ్సిడీ ఖాతాలో చూపుతున్నారు.2019-20 సంవత్సరానికి ఎఫ్‌సిఐకి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.3,17,905 కోట్లకు చేరింది. దీనికి గాను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.75వేల కోట్లు మాత్రమే.2020మార్చి 31నాటికి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌కు ఎఫ్‌సిఐ చెల్లించాల్సిన రుణం రు.2,54,600 కోట్లు. ఈ రుణానికి హామీదారు ప్రభుత్వమే అయినా ఈ మొత్తం ప్రభుత్వ రుణఖాతాలో కనిపించదు.2020-21బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ద్రవ్యలోటు మొత్తం రూ.7.96లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అయితే అప్పటికి ఎఫ్‌సిఐ అప్పు రూ.3,08,680 కోట్లుగా ఉన్నప్పటికీ బడ్జెట్‌లో సబ్సిడీ పేరుతో ప్రతిపాదించింది రూ.1.16లక్షల కోట్లు మాత్రమే. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రుణం లేదా ద్రవ్యలోటులోనూ చూపలేదు. ద్రవ్యలోటును ప్రభుత్వం అప్పులు చేయటం లేదా అదనపు కరెన్సీ ముద్రించటం ద్వారా పూడ్చుకొంటుంది. గతేడాది కరోనా కారణంగా ద్రవ్యలోటు పైన పేర్కొన్న రూ.7.96 నుంచి 18.49లక్షల కోట్లకు పెరిగింది. కరోనా సహాయచర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందచేసిన ఉచిత ఆహార ధాన్యాల కారణంగా ఎఫ్‌సిఐ సబ్సిడీ మొత్తం 2020-21లో పాతబకాయిలతో సహా రూ.4,22,618 కోట్లకు పెరిగింది. దీన్ని 281 శాతం పెరపుదలగా గొప్పగా చెప్పుకున్నారు. 2021-22 బడ్జెట్లో ఎఫ్‌సిఐ సబ్సిడీగా రూ.2,06,616 కోట్లను ప్రతిపాదించారు.

ఆర్ధిక మంత్రి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ రుణాలకు స్వస్ధి చెబుతున్నామని ప్రకటించటం వెనుక అప్పులన్నీ ఒక్కసారిగా తీర్చివేసి భారాన్ని తగ్గించటం అనుకుంటే తప్పులో కాలేసినట్లే ? రాబోయే రోజుల్లో ఎఫ్‌సిఐ సిబ్బందిని గణనీయంగా తగ్గించి ఆహార ధాన్యాల నిల్వల నిర్వహణ బాధ్యతను ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించబోతున్నారు. తెలివి తక్కువ వాడు ఇల్లు కట్టుకుంటాడు – తెలివిగల వాడు ఆ ఇంట్లో అద్దెకు ఉంటాడన్న లోకోక్తిని ఇక్కడ అమలు చేయబోతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన గోడవున్లను తక్కువ అద్దె రేట్లకు ప్రయివేటు వారికి అప్పగించనున్నారు. ఈ చర్య ద్వారా మిగిలే మొత్తంతో రైతులను ఉద్దరిస్తామని చెబుతారన్నది తెలిసిందే.

ఎఫ్‌సిఐ బకాయిలను తీర్చి దాన్నే పెద్ద సాయంగా చెప్పినట్లుగానే ఎరువుల సబ్సిడీని కూడా గొప్పగా చిత్రించారు. గత బడ్జెట్‌లో చూపిన రూ.71,309 కోట్లను రూ.1,33,947 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. మరి అంతపెంచిన వారు తాజా బడ్జెట్లో రూ.79,530 కోట్లకు ఎందుకు తగ్గించినట్లు ? పాత బకాయిలు తీర్చారు తప్ప బడ్జెట్‌ను పెంచలేదు. గత ఏడు సంవత్సరాలుగా ఎరువుల సబ్సిడీ 70-80వేల కోట్ల మధ్యనే ఉంటోంది. భారత ఆహార సంస్ధను వదిలించుకొనే చర్యల్లో భాగంగానే దానికి ఉన్న అప్పులన్నీ తీర్చేందుకు పెద్ద మొత్తంలో గతేడాది బడ్జెట్లో కేటాయించారు. అదే బాటలో ఎరువుల సబ్సిడీ విధానంలో కూడా పెద్ద మార్పును తలపెట్టారు. అందుకే కంపెనీలకు పాతబకాయిలను పూర్తిగా చెల్లించారు. ఇప్పుడు రైతులు ఎంత వినియోగిస్తే అంత మేరకు సబ్సిడీ పొందుతున్నారు. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం రాబోయే రోజుల్లో భూయజమానులకు నేరుగా సబ్సిడీ మొత్తాలను భూమిని బట్టి వారి ఖాతాల్లో వేయాలనే ప్రతిపాదన ఉంది. ఇది కొన్ని రాష్ట్రాల రైతాంగం మీద పెనుభారం మోపుతుంది. కౌలురైతులకు మొండి చేయి చూపుతుంది. ఎరువుల వాడకం తక్కువగా ఉన్న రైతులకు- ఎక్కువగా ఉన్నవారికీ ఒకే రకంగా పంపిణీ అవుతుంది. పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హెక్టారుకు సగటున 224.5కిలోల ఎరువులు(2018-19) వాడగా ఒడిషాలో 70.6, కాశ్మీరులో 61.9కిలోలు మాత్రమే ఉంది. అందువలన అందరికీ ఒకే పద్దతి అయితే పంజాబ్‌, హర్యానా రైతులు నష్టపోతారు. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరు సాగుతోంది గనుక మోడీ సర్కార్‌ సమయం కోసం చూస్తోంది తప్ప లేకుంటే నిర్మలమ్మ నోట ఇవి కూడా వెలువడి ఉండేవి. గతంలో బడ్జెట్ల సమయంలో కొత్త పన్నులు, విధాన నిర్ణయాలు ప్రకటించేవారు. ఇప్పుడు ఇతర రోజుల్లో చేస్తున్నారు. అందువలన ఎప్పుడైనా వెలువడవచ్చు.


అన్ని రంగాలలో పరిశోధన-అభివృద్ధికి పెద్ద పీటవేస్తేనే జనానికి, దేశానికి లాభం ఉంటుంది. వ్యవసాయ రంగంలో సంక్షోభానికి అనేక దేశాలతో పోల్చుకున్నపుడు మన దిగుబడులు, ఉత్పత్తుల నాణ్యత తక్కువగా ఉండటం ఒక కారణం. చైనా వంటి దేశాలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. మనం మాత్రం ఆవు మూత్రం-పేడ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం. పరిశోధనకు కేటాయిస్తున్నదే తక్కువ అయితే దానిలో ఆవు మూత్రంలో ఏముందో కనుగొనేందుకు మళ్లింపు ఒకటి. బేయర్‌ కంపెనీ ఏటా ఇరవైవేల కోట్ల రూపాయలు వ్యవసాయ పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే 2023 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని చెబుతున్న మోడీ సర్కార్‌ గతేడాది రూ.7,762 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.8,514 కోట్లు ప్రతిపాదించింది.


చివరిగా ఒక్క మాట. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను నిలువరించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలు, నేల మీద పాతిన ఇనుప ముళ్లు, పోలీసుల చేతుల్లో ఇనుపరాడ్లను చూస్తుంటే రైతాంగాన్ని అణచివేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారా అనిపిస్తోంది.సరిహద్దుల్లో శత్రువును ఎదుర్కొనేందుకు కూడా బహుశా ఇంత సన్నద్దత లేదేమో ! ఉంటే పాకిస్ధాన్‌ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రవేశించి మన సైనిక స్ధావరాల మీద దాడులు, సరిహద్దుల్లో సొరంగాలు తవ్వటం సాధ్యమై ఉండేది కాదు.


త్వరలో జరగబోయే నాలుగు ముఖ్యమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాదిన రగిలిపోతున్న రైతన్నలను చూసి గౌరవ ప్రదంగా వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటారా అనే ఆశతో ఉన్నవారు కూడా లేకపోలేదు. ఇప్పటికే రైతాంగం నిరాశతో ఉన్న అనేక మందిని ఉద్యమాలకు ఉద్యుక్తులను గావిస్తోంది. తమ మెడకు ఉరిగా మారనున్న సంస్కరణలకు వ్యతిరేకంగా కార్మికులు తదుపరి పోరుబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో రైతు యువకులకు కూడా ముల్లుగర్రల గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎద్దులు, దున్నలతో వ్యవసాయం బాగా తగ్గిపోయింది. వాటితో వ్యవసాయ చేసే సమయంలో దున్నకం వేగంగా సాగేందుకు సన్నటి వెదురు కర్రల చివరన ఇనుప ముల్లు వంటి ఇనుప మేకు గుచ్చి దానితో ఎద్దులు, దున్నల వెనుక భాగాల మీద సున్నితంగా పొడిచి వేగంగా కదిలేట్లు చేసే వారు. ఇప్పుడు మోడీ సర్కార్‌ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న ఇనుప ముళ్లను చూస్తుంటే ఇంకా ఉద్యమాలకు కదలకుండా ఉన్న రైతాంగాన్ని పొడిచి కదిలించేందుకు పూనుకున్నట్లుగా అనిపిస్తోంది. చరిత్రను చూసినపుడు తిరుగుబాట్లకు కారణం పాలకుల చర్యలే తప్ప ఎల్లవేళలా ప్రశాంతతను కోరుకొనే పౌరులు కాదు. ఇప్పుడూ అదే జరుగుతోందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ స్ఫూర్తి : మయన్మార్‌లో మిలిటరీ తిరుగుబాటు !

02 Tuesday Feb 2021

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Aung San Suu Kyi, Myanmar, Myanmar Crisis, Myanmar’s Military Coup


ఎం కోటేశ్వరరావు


మన పొరుగు దేశమైన మయన్మార్‌( గతంలో బర్మా అని పిలిచేవారు)లో ఫిబ్రవరి ఒకటవ తేదీన తిరుగుబాటు చేసిన మిలిటరీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. నవంబరు 8న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినందున నూతన పార్లమెంట్‌ను ఏర్పాటు చేయవద్దని చేసిన హెచ్చరికలను ఖాతరు చేయనందున ఏడాది పాటు అత్యవసర పరిస్ధితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏడాది తరువాత ఎన్నికలు జరుపుతామని విజేతలకు అధికారాన్ని అప్పగిస్తామని పేర్కొన్నది. అధికార పార్టీ ఎన్‌ఎల్‌డి నేత, ప్రధాని పదవితో సమానమైన రాజ్య కౌన్సిలర్‌గా ఉన్న అంగ్‌సాన్‌ సూకీ, అధ్యక్షుడు యు విన్‌ మైయింట్‌ తదితరులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగంపై అనేక ఆంక్షలు విధించారు. సాధారణ జనజీవితం సాఫీగానే సాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు అక్కడేం జరుగుతోందో పూర్తిగా తెలియటం లేదు.


మిలిటరీ ప్రధాన కమాండర్‌ మిన్‌ అంగ్‌ లైయింగ్‌ అధికారాన్ని చేపట్టారని మిలిటరీ టీవీ ప్రకటించింది. ఏడాదిలోపల ఎన్నికల సంస్కరణలు తీసుకు వస్తామని తరువాత ఎన్నికలు జరపనున్నట్లు వెల్లడించింది. గత నవంబరు ఎనిమిదిన జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయని మిలిటరీ మద్దతు ఉన్న డెవలప్‌మెంట్‌ పార్టీ ఆరోపించింది. మిలిటరీ కూడా అదే ఆరోపణలు చేసింది. ఈ నేపధ్యంలోనే కొత్త పార్లమెంట్‌ కొలువు తీరటాన్ని వాయిదా వేయాలని కోరామని అంగీకరించకపోవటంతో అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నట్లు, గత ఎన్నికలను రద్దు చేసినట్లు మిలిటరీ ప్రకటించింది. ఎన్నికల అక్రమాల ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది.


మయన్మార్‌ పరిణామాల గురించి పలు వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ అక్కడ జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, విజేత జో బైడెన్‌ విజయాన్ని గుర్తించేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. బైడెన్‌ విజయాన్ని ఖరారు చేసే పార్లమెంట్‌ సమావేశం మీద జనవరి ఆరున తన మద్దతుదారులతో దాడి చేయించి ఎన్నికను వమ్ము చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ట్రంప్‌ స్ఫూర్తితో మయన్మార్‌ మిలిటరీ కూడా సరిగ్గా కొత్త పార్లమెంట్‌ తొలి సమావేశమై పదవీ బాధ్యతలు చేపట్టే రోజునే తిరుగుబాటు చేసిందనే వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. తమ చర్యకు ఎన్నికల అక్రమాలే కారణమని మిలిటరీ ప్రకటించింది.


నవంబరు ఎనిమిదిన జరిగిన ఎన్నికలలో ప్రజా ప్రతినిధుల సభలోని 440కిగాను 315, జాతులకు ప్రాతినిధ్యం వహించే ఎగువ సభలోని 224కిగాను 161స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్దానాలను ఎన్‌ఎల్‌డి సాధించింది. ప్రజాప్రతినిధుల సభలో 258, జాతుల సభలో 138 సీట్లు పొంది పూర్తి మెజారిటీని సాధించింది. మిలిటరీ మద్దతు ఉన్న డెవలప్‌మెంట్‌ పార్టీకి 26, 7 రాగా మిగిలిన స్ధానాలను చిన్న పార్టీలు పొందాయి.రాష్ట్ర, ప్రాంతీయ ఎన్నికల్లో కూడా ఎన్‌ఎల్‌డి ఇదే మాదిరి ఘనవిజయం సాధించింది.


అక్కడి రాజ్యాంగం ప్రకారం ఎన్నికలలో మయన్మార్‌ పౌరులు మాత్రమే అర్హులు. జాతీయ, రాష్ట్రాల చట్ట సభల్లో మూడోవంతు సీట్లు మిలిటరీకి రిజర్వు చేశారు. ఎన్నికల అనంతరం ఏర్పడే జాతీయ ప్రభుత్వంలో రక్షణ, సరిహద్దులు, హౌం శాఖల మంత్రులుగా మిలిటరీ నియమించిన వారే ఉండాలి. కొత్త పార్లమెంటు కొలువు తీరిన తరువాత అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులను ఎన్నుకొనేందుకు ఎలక్ట్రరల్‌ కాలేజిని ఏర్పాటు చేస్తారు. ఉభయ సభల నుంచి, అదే విధంగా మిలిటరీ నియమించిన సభ్యులతో మూడు కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో కమిటీ నుంచి ఒకరిని ఎన్నుకుంటారు. వారిలో అత్యధిక ఓట్లు వచ్చిన వారిని అధ్యక్షుడిగా, మిగిలిన రెండు కమిటీలలో వచ్చిన ఓట్లను బట్టి ఎక్కువ తెచ్చుకున్న ప్రతినిధి తొలి ఉపాధ్యక్షుడు, రెండవ ఉపాధ్యక్షుడు అవుతారు. మయన్మార్‌ జాతీయులను కాని వారిని వివాహం చేసుకున్న వారు,మయన్మార్‌ పౌరసత్వం లేని వారి పిల్లలు గానీ ఈ పదవులకు అనర్హులు. ఈ నిబంధన కారణంగా బ్రిటీష్‌ జాతీయుడిని వివాహం చేసుకున్న అంగ్‌సాన్‌ సూకీ ఎంపీగా, ఇతర పదవులను మాత్రమే చేపట్టవచ్చు తప్ప అధ్యక్షురాలయ్యే అవకాశం లేదు. ఆమె పిల్లలకు మయన్మార్‌ పౌరసత్వం లేనందున వారు కూడా అనర్హులే. ఈక్రమంలో ఎన్నికైన వారు మార్చి 21న పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అలాంటి ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని మిలిటరీ చేసిన సూచనను మెజారిటీ సీట్లు తెచ్చుకున్న ఎన్‌ఎల్‌డి తిరస్కరించి పార్లమెంటు సమావేశ నిర్వహణకు పూనుకున్నది. దీంతో తాము అధికారాన్ని హస్తగతం చేసుకున్నట్లు మిలిటరీ ప్రకటించింది.

మయన్మార్‌ చరిత్రను చూసినా దాని ప్రస్తుతం రాజ్యాంగాన్ని చూసినప్పటికీ మిలిటరీదే పైచేయిగా ఉందని చెప్పవచ్చు.1948 జనవరి నాలుగవ తేదీ బ్రిటీష్‌ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత 1962వరకు పౌరపాలనలో ఉంది. ఆ ఏడాది మార్చి రెండవ తేదీన తిరుగుబాటుతో మిలిటరీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అస్ధిర పరిస్ధితులు, మిలిటరీ పట్టులోనే ఉంది.1988 వరకు మిలిటరీ లేదా దాని మద్దతు ఉన్న ఏకపార్టీ పాలనే కొనసాగింది. దీనికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి అంగ్‌సాన్‌ సూకీ నాయకత్వం వహించారు. ఆమె తండ్రి అంగ్‌సాన్‌ జాతీయవాది. బర్మా కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలను ఏర్పాటు చేశారు. అధికారాన్ని అప్పగించేందుకు అంగీకరించిన బ్రిటీష్‌ ప్రభుత్వం కుట్ర చేసి స్వాతంత్య్రానికి ఆరునెలల ముందు అంగ్‌సాన్‌ నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వ మంత్రివర్గ సభ్యులను మొత్తంగా సామూహికంగా హత్య చేయించింది. అంగ్‌సాన్‌ను బర్మా జాతిపితగా పరిగణిస్తారు.


1945లో జన్మించిన సూకీ తండ్రి మరణించినప్పటికీ రెండు సంవత్సరాల పసిపిల్ల. బాల్యమంతా బ్రిటన్‌లోనే గడిచింది. అక్కడే విద్యాభ్యాసం తరువాత తండ్రి వారసత్వాన్ని కొనసాగించిన సూకీ దేశంలో ప్రజాస్వామ్యం కోసం సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. విధిలేని పరిస్ధితిలో మిలిటరీ ఎన్నికలకు అంగీకరించింది. 1990లో మూడు దశాబ్దాల తరువాత జరిగిన ఎన్నికల్లో సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి 492 స్దానాలకు 392 సాధించింది. ఆ ఎన్నికలను మిలిటరీ గుర్తించలేదు.దాని పాలనే కొనసాగింది.2010లో జరిగిన ఎన్నికలలో మిలిటరీ అనుకూల పార్టీకి అత్యధిక స్దానాలు వచ్చినట్లు ప్రకటించారు. దాన్ని ఎవరూ గుర్తించలేదు. చివరకు 2011లో మిలిటరీ ఆ ఎన్నికను రద్దు చేసింది. తరువాత అంగ్‌సాన్‌ సూకీని గృహనిర్బంధం నుంచి విడుదల చేయటంతో పాటు కొంత మేరకు మిలిటరీ చర్యలను సడలించింది.2015లో జరిగిన ఎన్నికలు స్వేచ్చగా నిర్వహించటంతో అంగ్‌సానీ సూకీ నాయకత్వంలోని పార్టీ అధికారానికి వచ్చింది.ఆమె దేశపాలనా పగ్గాలు చేపట్టేందుకు అనర్హురాలు కావటంతో 2016లో ప్రధానితో సమానమైన రాజ్య కౌన్సిలర్‌ అనే పదవిని సృష్టించి ఆమెను ఎన్నుకున్నారు. అప్పటి నుంచి తాజాగా అరెస్టు అయ్యేంతవరకు దానిలో కొనసాగుతున్నారు.

తాజాగా జరిగిన పరిణామాలు మయన్మార్‌ ప్రజాస్వామ్య ప్రక్రియకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి జనంలో నిరసన వ్యక్తం అయినట్లు తెలియదు, అయితే మిలిటరీ ఆధిపత్యాన్ని అంగీకరిస్తారని చెప్పలేము. ప్రభుత్వ టీవి ప్రసారాలను మిలిటరీ నిలిపివేసింది. రాజ్యాంగం ప్రకారం ఒక ఏడాది పాటు మాత్రమే అత్యవసర పరిస్ధితి విధించేందుకు అవకాశం ఉంది. మిలిటరీ అధిపతికి ఆమేరకు ఏడాది పాటు మిలిటరీ, న్యాయ, కార్యనిర్వాహక అధికారాలు దఖలు పడ్డాయి. ప్రస్తుతం మిలిటరీ ప్రతిపాదించిన ఉపాధ్యక్షుడు మిలిటరీ మాజీ జనరల్‌ అయిన యు మియింట్‌ స్వే ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. నూతన ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసి కొత్తగా ఎన్నికలను నిర్వహిస్తామని కూడా ప్రకటించారు.


అంతర్గతంగా తలెత్తిన సమస్యలను బయటి జోక్యం లేకుండా మయన్మార్‌ పరిష్కరించుకోగలదని చైనా వ్యాఖ్యానించింది. సరిహద్దుతో పాటు వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న మయన్మార్‌ పరిణామాల మీద ఆచితూచి వ్యాఖ్యానించింది. తక్షణమే మిలిటరీ తన అధికారాన్ని వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ డిమాండ్‌ చేశారు. లేనట్లయితే తీవ్రమైన కొత్త ఆంక్షలను విధిస్తామని హెచ్చరించారు.మయన్మార్‌లో జరిగిన పరిణామాలకు చైనా మద్దతు ఉన్నట్లు చిత్రించే యత్నం కనిపిస్తోంది. మూడు వారాల క్రితం మిలిటరీ కమాండర్‌ ఒకరు చైనా ప్రతినిధి వాంగ్‌ ఇతో మయన్మార్‌ రాజధానిలో సమావేశమయ్యారని, ఒక వేళ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తే తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు, నవంబరుఎనిమిదిన జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు నివేదించారనే వార్తలు వచ్చాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో అమెరికా నాయకత్వంలో జపాన్‌, ఆస్ట్రేలియా, మన దేశమూ క్వాడ్‌పేరుతో వివాదపడుతున్న విషయం తెలిసిందే. మయన్మార్‌ ఒక కీలక ప్రాంతంలో ఉన్నందున అక్కడ జరిగే ప్రతిపరిణామానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపధ్యంలో పశ్చిమ దేశాలు, వాటి కనుసన్నలలో నడిచే మీడియా ఇచ్చే వార్తల పట్ల జాగ్రత్త వహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచంలో అరుదైన రైతుల ప్రదర్శన

02 Tuesday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Delhi farmers agitation, Farmers agitations, unique farmers tractors rally


డాక్టర్‌ కొల్లారాజమోహన్‌

రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్స్‌ పెరేడ్‌ లో లక్షకు పైగా ట్రాక్టర్లతో , అంతకుమించిన సంఖ్యలో రైతులు ప్రశాంతంగా పాల్గొని అపూర్వ ప్రదర్శన చేశారు. రైతువ్యతిరేక చట్టాలను రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులు ఢిల్లీ నగర వీధులలో కదం తొక్కారు. ఢిల్లీ నగరవాసులు ఈ అపూర్వ ప్రదర్శనకు సంఘీభావంగా పూలవర్షం కురిపించారు. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినప్పటినుండీ పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేష్‌, రాజస్ధాన్‌, బీహార్‌ లలో తీవ్ర స్ధాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఉద్యమం ఏఒక్క రైతు సంఘమో లేక ఏ ఒక్కరి నాయకత్వం కాకుండా 500 రైతుసంఘాలన్నీ సమైక్యంగా పోరాడుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులలో ఎముకలు కొరికే చలి ని ఎదుర్కొంటూ, రోడ్డు పై గుడారాలలో 2 నెలలుగా చేస్తున్నఆందోళనను ప్రభుత్వం ఆలకించనందున, ప్రభుత్వం పై వత్తిడి తేవటానికి రిపబ్లిక్‌ దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్లతో మహా ప్రదర్శన తలపెట్టారు. ఈ మహా ప్రదర్శనను విఫలం చేయడానికి, ఉద్యమాన్ని విచ్చిన్నం చేయటానికి ప్రభుత్వం పన్నిన కుట్రలను కుతంత్రాలను రైతాంగం అడుగడుగునా తిప్పికొట్టింది. జనవరి 26 న వివిధ రాష్ట్రాల రాజధానులలో, జిల్లా కేంద్రాలలో భారీ ప్రదర్శనలు జరిగాయి.

రిపబ్లిక్‌ డే ట్రాక్టర్స్‌ పెరేడ్‌ ను అప్రతిష్టపాలు చేయటానికి ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనకు చాలా ఎక్కువ ప్రచారంచేశారు. ట్రాక్టర్లను సామూహిక విధ్వంస ఆయుధాలుగా ”టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా” పత్రిక చిత్రించింది. ట్రాక్టర్‌ లు ఎక్కడా విధ్వంసానికి పాల్పడలేదు. రోడ్లను ధ్వంసం చేయలేదు. ప్రభుత్వ సంస్ధలను, ప్రైవేటు సంస్ధలను ఎక్కడా తాకలేదు. అల్లర్లను, భయోత్పాతాన్ని స ష్టించలేదు. పౌరుల ఆస్దులను ధ్వంసం చేయలేదు. దొంగిలించలేదు. అనుమతించిన మార్గాలలో కూడా రైతులు ఢిల్లీ లోకి రాకుండా బారికేడ్డ్లను ఎందుకు పెట్టారు ?. పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్డ్లను తొలగించటానికి ట్రాక్టర్లను ఉపయోగించారు. వారు హింసాత్మకంగా వుంటే ప్రజలు పువ్వులతో స్వాగతించేవారా ?

దీప్‌ సింగ్‌ సిధ్దు ఎవరు?
రిపబ్లిక్‌ డే ట్రాక్టర్స్‌ పెరేడ్‌ ను అప్రతిష్టపాలు చేయాలని ఫ్రభుత్వం ప్రయత్నించింది. సినీ నటుడు, గాయకుడు ఐన దీప్‌ సింగ్‌ సిద్దును సాధనంగా ఎన్నుకున్నారు. బీజేపీ యమ్‌ పీ. సన్నీ డయోల్‌ కి దీపు సిద్దు సన్నిహితుడు. 2019 ఎన్నికలలో సన్నీ డయోల్‌ గెలుపు కోసం క షిచేశాడు. ప్రధానమంత్రి మోడీ గారితో ఫొటోలు దిగేటంత సాన్నిహిత్యం వుంది. ”ఆందోళనకారులను రెచ్చగొట్టి దారి తప్పించి ఎర్రకోట వైపు నడిపించాడు ” అని హర్యానా బీకేయూ నాయకుడు గుర్నామ్‌ సింగ్‌ ఛాదుని అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి సన్నిహితుడైన బీజేపీ సభ్యుడొకరు ఏజెంట్‌ ప్రొవోకేటర్‌ గా ఎర్రకోట వద్ద అల్లర్లను రెచ్చగొట్తున్న వార్తను పరిశీలించమని ఉదయం 10 గంటలకే ట్విట్టర్‌ లో రాజ్యసభసభ్యులు శ్రీ సుబ్రమణ్యస్వామి గారు పేర్కొన్నారు.

రిపబ్లిక్‌ డే పెరేడ్‌ పూర్తయిన తరువాత రైతుల ట్రాక్టర్‌ రాలీ ప్రారంభంకావాలని రైతు సంఘాలన్నీ అంగీకరించాయి. మార్గాన్ని కూడా నిర్దేశించాయి. సింఘూ సరిహద్దు వద్ద నుండి నిర్దేశించిన సమయానికన్నా ముందే, ఉదయం 8గంటలకే దీప్‌ సింగ్‌ సిద్దూనాయకత్వాన ఒక చిన్న బ ందం బయల్దేరింది. నిర్దేశించిన మార్గాన్ని వదిలేసి ఎర్రకోట వైపు దూసుకెళ్ళారు. కిసాన్‌ సంయుక్త కమిటీ వద్దని నివారించినా వారిమాటను వినలేదు.ఎర్రకోట వైపు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు ముందురాత్రే తెలుసు. అయినాపోలీసులు వారిని నివారించే ప్రయత్నాలు చేయలేదని యోగేంద్రయాదవ్‌ తెలిపారు. రైతుల ట్రాక్టర్‌ రాలీలకు అడుగడుగునా అడ్డంకులను సృష్టించిన పోలీసులు దీపు సిద్దూ బ ందానికి ఎర్రకోటకు దారి చూపారు. ట్రాఫిక్‌ అంతరాయాలు లేకుండా ఎర్రకోట వైపు దూసుకెళ్ళారు. జాతీయ జెండాకు దగ్గరలో ఒక మతానికి చెందిన నిషాన్‌ జెండాను ఎర్రకోటపై ఎగరేశారు.టీవీ ఛానల్స్‌ జెండా ఎగరవేసిన ఘటనను పదే పదే చూపించాయి. ఈ ఘటన జరిగే సమయంలో అక్కడనే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మిలిటరీ, పారామిలిటరీ దళాల నిరంతర పర్యవేక్షణ క్రింద వుండే ఎర్రకోటను ఎక్కి, ఒక జెండాను ఎగరవేయటానికి ముందే అనుమతిని పొందారా ? లేక ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇలా చేశారా? అనేది చర్చనీయాంశం. వారి తప్పు లేకపోయినా రైతుసంఘాల సమన్వయ సమితి నైతిక బాధ్యత వహించింది. ఎర్రకోట సంఘటన మినహాయించి మరెక్కడా చెప్పుకోదగ్గ ఘటనలు జరగలేదన్న సంగతి గుర్తించాలి.

మంచి నీరు, కరెంటు, ఇంటర్నెట్‌, ట్విట్టర్‌ అకౌంట్లను ఆపేశారు. కర్రలతో, రాళ్ళతో దాడులు చేసినా ఉద్యమాన్ని ఆపలేకపోయారు. రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్ల పెరేడ్‌ విజయవంతం కావటం ఒక చారిత్రాత్మక ఘటన. రైతాంగ ఆందోళనను అప్రతిష్ట పరచటానికి ఎర్రకోట ఘటనను సాకుగా ఛూపించిన మీడియా కొంతమందిని గందరగోళపరచగల్గింది. త్రివర్ణ పతాకాన్ని తొలగించారనే తప్పుడు వార్తలు కూడా ప్రచారమయ్యాయి. లక్షలాదిమంది రైతుల ప్రదర్శనను మీడియా చూపలేదు. సోషల్‌ మీడియా ద్వారా రైతులు కొన్నివార్తలనందుకున్నారు. క్రమశిక్షణ తో విజయవంతంగా చేసిన రైతుల ప్రదర్శనను చూసి కేంద్ర ప్రభుత్వ కళ్ళు తిరిగాయి. చర్చలకు స్వస్తిచెప్పి సామ దాన బేధ దండోపాయాలలో చివరి అస్త్రాన్ని ఉపయోగించ పూనుకున్నారు. దాడులు, అరెస్టులు, కేసులు మొదలుపెట్టారు. శిబిరాలలో ఉన్నవారికి కనీస సౌకర్యాలు అందకుండా చేస్తున్నారు.రైతు ఉద్యమకారుల శిబిరాలపై దాడులు చేసి గుడారాలను ధ్వంసం చేస్తున్నారు. సైనికుల కవాతులను నిర్వహిస్తున్నారు. ఆందోళనకారులను భయభ్రాంతులను చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఎర్రకోటవద్ద జరిగిన ఘటనలపై 44 మంది రైతు నాయకులపై దేశద్రోహ కేసులను బనాయించారు. రైతులు నివసిస్తున్న సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌ ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా పోలీసులు ఆపేశారు. మంచి నీటి వాహనాలను కూడాఆపేశారు. అర్ధరాత్రిలోగా ఖాళీచేయాలంటూ అల్టిమేటంను ప్రభుత్వ అధికారులు జారీ చేశారు. అక్కడినుండి వెళ్ళిపోని పక్షంలో తామే తొలగిస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రకటించాడు.ప్రజలు గుమికూడకుండా సెక్షన్‌ 144 విధించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారు. మూడు సరిహద్దుప్రాంతాలలో ఇంటర్నేట్‌ ను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆపేసింది. రైతులు సమాచారాలను పంచుకోవటానికి వీలులేకుండా ఇంటర్నెట్‌ కట్‌ చేశారు. ప్రవాహంగా వస్తున్న రైతులు రాకుండా సింఘూ వద్ద ప్రభుత్వం బారికేడ్లతోపాటు ముళ్ళకంచె వేసి తాత్కాలికంగా గోడను నిర్మిస్తున్నారు.ప్రజలు అందోళనా ప్రాంతాలకు రాకుండా రైళ్లను దారి మళ్ళించారు. రైతులను, జర్నలిస్టులను అరెస్టు చేస్తున్నారు.

స్ధానికుల పేరున గూండాల దాడి- బీబీసీ ప్రత్యక్ష కధనం.

స్ధానికుల పేరున కొంతమంది వాహనాలలో తరలివస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. పోలీసుల కళ్ళముందే గుడారాలను పీకేస్తుంటే నివారించటానికి ప్రయత్నించలేదు. పైగా రైతులపై లాఠీఛార్జి చేశారు. స్ధానికుల పేరున వచ్చిన బీజేపీ కార్యకర్తలు రాళ్ళతోనూ కర్రలతోనూ రైతులపై దాడిచేశారు. రైతులు వారి ప్రాణాలను కాపాడుకోవటానికి ప్రతిఘటించారు. అయినా నాయకుల మాటలు విని ప్రశాంతంగా దెబ్బలు తిన్నారు. ఆందోళనను ఎట్టిపరిస్ధితులలోనూ విరమించేది లేదని తేలిó చెప్పారు.

. సింఘూ ప్రాంతాన్ని సందర్శించిన బీబీసీ ప్రతినిధి దిలీప్‌ సింగ్‌ టిక్రీ గ్రామస్ధులతో మాట్లాడాడు. ” మరి వాళ్ళు నిజంగా స్దానికులేనా? అని అడిగితే .. ఈ రోజు వచ్చిన వాళ్ళంతా బీజేపీ పంపించిన గూండాలే” అని గ్రామస్ధులు చెప్పారు. ” ఉద్యమం శాంతియుతంగా సాగుతోంది. క్రమశిక్షణతో సాగుతోంది. స్ధానికులు వ్యతిరేకిస్తున్నారనేది అబద్ధం. టిక్రీ గ్రామ పంచాయితీ ప్రజలందరూ వచ్చి మద్దతు ప్రకటించి వెళ్ళారు.ఏది అవసరమయినా మేమున్నామని టిక్రీ గ్రామంరైతులు హామీ ఇచ్చి వెళ్ళారు. ఇప్పటికి 51 వేల రూపాయలు విరాళంఇచ్చారు. ఇంకా పాలు, లస్సీ ,డబ్బులు, ఏది కావాలన్నా సేకరించి ఇస్తామన్నారు. చుట్టుపక్కలగ్రామాల ప్రజలకు ఈ ధర్నాతో ఎలాంటి సమస్యా లేదు. తాము పస్తులుండైనా సరే ,రోడ్డుపక్కన పూరిగుడెసెలలో వుండే పేదలకు మూడుపూటలా అన్నందొరికేలా చూస్తున్నారు.ఈ నల్లచట్టాలను వెనక్కి తీసుకునేంతవరకూ రైతులు వెనక్కి వెళ్ళరు. మేంకూడా వెనక్కి వెళ్ళేదిలేదు.” అని ఒక పెద్దాయన చెప్పాడు. ” నేను రైతు బిడ్డను. కొందరు జాతీయజెండాలను పట్టుకు రావటం కనిపించింది.ఇందులో మాప్రాంతం వారు ఎవరున్నారో చూద్దామని అక్కడకు వెళ్ళాను. అక్కడ బీజేపీ కార్యకర్త గజేంద్రసింగ్‌ కన్పించాడు. నీకు సిగ్గు అనిపించటంలేదా నువ్వు ఈ ప్రాంతం వాడివికూడాకాదు,ద్వారకా వాడివి, రైతువి కాదు , ప్రాపర్టీ డీలర్‌ వి కదా? చెడగొట్టటానికే వచ్చావా? అని అతనిని మందలించాను.అంతలో ఒక యువకుడు నేను గేవ్రా గ్రామంవాడినన్నాడు..అబద్ధం చెప్పకు ఈప్రాంతంలో ప్రతి ఒక్కవ్యక్తీ నాకు తెలుసు అన్నాను.ఈ ప్రాంతం వాళ్ళు ఒక్కళ్ళుకూడాలేరు. ఉంటే చూపండి అని సవాల్‌ చేశాను.ఈ మోసాలు సాగవు. మేం సహించము అని హెచ్చరించాను” అని ఒక స్థానిక రైతు చెప్పాడు. మరొక మహిళ ఇలా చెప్పింది,”ఎవరికీ ఏసమస్యాలేదు. ఉద్యమంవలన ఎవరూ ఇబ్బందిపడటంలేదు. ఇక్కడ టిక్రీ, లేకారాం పార్క్‌,మమా చౌక్‌, చోటూరామ్‌ నగర్‌,గ్రామాలన్నీ మార్కెట్‌ కోసం ఇక్కడికే వస్తురీంటారు. కానీ ఈ గ్రామాలలో ఎవరికీ ఇబ్బందిలేదు” అని ఆమెచెప్పింది

ఘాజీపూర్‌ బోర్డర్‌ -బీ బీ సీ. వార్త
ఘాజీపూర్‌ బోర్డర్‌ లో ధర్నా ఎలా కొనసాగుతోందో బీబీసీ ప్రతినిది సమీర్‌ ఆత్మ మిశ్రా ఇలా వివరించారు.
” గురువారం ఘాజీపూర్‌ బోర్డర్‌ లో రైతులను ఖాళీ చేయించటానికి అధికారయంత్రాంగం ప్రయత్నించింది. రాకేష్‌ తికాయత్‌ పైకేసు నమోదయంది. అరెస్టుకావటానికి కూడా తయారయ్యారు.” స్ధానికులపేరున కొంతమందిని తెచ్చి ఖాళీచేయించ ప్రయత్నంపై తికాయత్‌ ఆవేదన పొందారు. మంచినీటిని కూడా ఆపేశారు. దానికి స్పందనగా రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ”మావూరునుండి మంచినీరు వచ్చిందాకా మంచినీరు ముట్టనని ” శపధం చేసి, నిరాహార దీక్షకు కూర్చున్నారు. అప్పటికపుడు మహాపంచాయత్‌ నిర్వహణకు పిలుపునిచ్చారు. ముజఫర్పూర్‌ లో రైతు సంఘాల నేతలు రైతులతో మహా పంచాయతీ నిర్వహించారు. ఢిల్లీకి 150 కి మీ దూరంలో వున్న ఈ ప్రాంతం రైతాంగఉద్యమాలకు పెట్టని కోట. రైతునేత మహేంద్ర తికాయత్‌ స్వస్ధలం సిసోలీ గ్రామం. మహేంద్రతికాయత్‌ కుమారుడు నరేష్‌ తికాయత్‌ బీకేయూకి అధ్యక్షుడిగా వున్నాడు. రాకేష్‌ తికాయత్‌ మరొక కుమారుడు. ఇద్దరూ ప్రస్తుతం రైతు ఉద్యమంలో భారత్‌ కిసాన్‌ యూనియన్‌ కి నాయకత్వం వహిస్తున్నారు.ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని మహా పంచాయత్‌ నిర్ణయం తీసుకున్నది. మీరట్‌, షామ్లీ, షాహన్పూర్‌ పశ్చిమ ఉత్తర ప్రదేశ్ల లోని రైతులందరూ ఘాజీపూర్‌ సరిహద్దు లో జరుగుతున్న ధర్నా లో ఇక పై ప్రతిరోజూ పాల్గొనాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని, ప్రతి ఇంటినుంచీ ధర్నాలో పాల్గోవాలని నిర?యమైంది. ధర్నా ముగిసిపోయినట్లు కనిపించిన స్ధలం ప్రజలతో కిటకిట లాడుతోంది. నినాదాలతో హౌరెత్తిపోతోంది.ప్రధాన రోడ్డులకు అడ్డంగా బస్సులు నిలిపారు. పోలీసులకు ఇనుప లాఠీలను సరఫరా చేస్తున్నారు. అయినా పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ ల తోపాటుగా ఉత్తరప్రదేశ్‌ రైతులు తికాయత్‌ సోదరుల నాయకత్వాన ఉద్యమం లోకి ఉరుకుతున్నారు. పంజాబ్‌- హర్యానా లనుంచి ప్రయాణించే పంజాబ్‌ మెయిల్‌ తో సహా రెండు రైళ్ళను దారి మళ్ళించారు.

అధికారుల వేధింపులకు, నిర్భంధాలకు నిరసనగా , కనీస మద్దతు ధర కావాలనీ, రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ దేశవ్యాప్తంగా ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలనుండి 3 గంటలవరకు రహదారులను దిగÄంధించాలని రైతుసంఘాల సమన్వయ సంఘం పిలిపునిచ్చింది. ప్రజలందరూ పాల్గొన ప్రార్ధన.
వ్యాసరచయిత డాక్టర్‌ కొల్లారాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, గుంటూరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బడ్జెట్‌ పదనిసలు1: కేంద్ర సెస్‌ల మోత – రాష్ట్రాల నిధుల కోత !

02 Tuesday Feb 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

cesses, India budget 2021-22, state finances, surcharges


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారు తన మూడవ, దేశ వందవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్‌ను రూపొందించేందుకు చేసిన కసరత్తు గతంలో ఎన్నడూ జరగలేదని ఆమె చెప్పారు. తీరా బడ్జెన్‌ను చూస్తే ఆరునెల్లు సాము గరిడీలు నేర్చుకొని పాతకుండలు పగలగొట్టారన్న సామెత గుర్తుకు వచ్చింది. దీన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు క్రియాశీల బడ్జెట్‌ అని వర్ణించారు.గతంలో ప్రతి ప్రధాని ప్రతి బడ్జెట్‌ను ఇలాగే పొగిడిన స్వంత డబ్బాల గురించి వేరే చెప్పనవసరం లేదు. గత బడ్జెట్‌ రూ.34,50,305 కోట్లుగా సవరిస్తే తాజా బడ్జెట్‌ను రూ.34,83,236 కోట్లతో ప్రతిపాదించారు. తేడా రూ.32,931 కోట్లు.విపరీతం గాకపోతే ఈ మాత్రానికి అంత ఆయాసపడాలా ?


బడ్జెట్‌లో చర్చించాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. ఈ బడ్జెట్‌లో కొట్ట వచ్చినట్లు కనిపించిన ఒక అంశానికి పరిమితం అవుదాం. కోవిడ్‌ సెస్‌ వేస్తారని బడ్జెట్‌కు ముందు వచ్చిన ఊహాగానాలకు తెరదించి కొత్త సెస్‌లను ముందుకు తెచ్చారు. అనేక పధకాలకు ప్రధాని అని తగిలించారు గనుక వీటికి కూడా ప్రధాని లేదా మోడీ సెస్‌లని పెట్టి ఉంటే అతికినట్లు ఉండేది. జనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఉదాహరణకు పెట్రోలు మీద లీటరుకు రూ.2.50, డీజిల్‌ మీద రూ.4.00ల కేంద్ర ఎక్సయిజ్‌ పన్ను తగ్గించి ఆ మేరకు సెస్‌ విధించారు. నిర్మలమ్మ చెప్పినట్లు ఈ మాత్రం దానికి అంత మల్లగుల్లాలు పడాలా ? ఇలాగే బంగారం దిగుమతుల మీద కస్టమ్స్‌ సుంకాన్ని పన్నెండు నుంచి ఏడు శాతానికి తగ్గించి రెండున్నరశాతం సెస్‌ విధించారు. ఇలాగే మద్యం మరికొన్నింటి మీద ఇలాంటి కసరత్తే చేశారు. వినియోగదారుల మీద పెద్దగా ప్రభావం పడదు. అని చెబుతున్నారు. అసలు పెంచిన పన్నులు తగ్గించటమే చిల్లి కాదు తూటు అన్నట్లు కొత్త పేరుతో అవే భారాలను కొనసాగిస్తున్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో ఎందుకు తీసుకున్నట్లు ? పనీపాటాలేక ఇలాంటి పిచ్చిపని చేస్తున్నారా ?


కానే కాదు, కేంద్ర ప్రభుత్వ తెలివి, ఇంకా చెప్పాలంటే అతి తెలివితో రాష్ట్రాలకు శఠగోపం పెట్టే వ్యవహారం. ఎలా ? దీని గురించి చెప్పుకోబోయే ముందు కేంద్ర ప్రభుత్వం కాశ్మీరుకు మాత్రమే వర్తించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి తన దుశ్చర్యను బయటపెట్టుకుంది. నిజానికి దాని బదులు ఆర్టికల్‌ 270ని రద్దు లేదా రాష్ట్రాల కోరికలకు అనుగుణంగా సవరించి ఉంటే అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అభినందించి ఉండేవి. సదరు ఆర్టికల్‌లో కేంద్రం-రాష్ట్రాలు పంచుకోవాల్సిన పన్నుల జాబితా ఉంది. వాటిలో సెస్‌లు, సర్‌ఛార్జీలు లేవు. అందువలన ఆ పేరుతో పన్ను విధిస్తే మోడీ భక్తులతో సహా జనం అందరి జేబులు ఖాళీ అవుతాయి గాని రాష్ట్రాలకు వాటిలో వాటా ఇవ్వనవసరం లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని గతంలో కాంగ్రెస్‌ పాలకులు ప్రారంభించిన రాష్ట్రాల వ్యతిరేక చర్యను ఇప్పుడు బిజెపి ఏలికలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు.

రాష్ట్రాలలో స్ధానిక సంస్ధలు పన్నులతో పాటు గ్రంధాలయ సెస్‌ను వసూలు చేస్తాయి. ఎందుకు ? గ్రంధాలయాలను ఏర్పాటు చేసి జనానికి పత్రికలు, పుస్తకాలను అందుబాటులోకి తేవటానికి. తెలంగాణాలో గత ఏడు సంవత్సరాలుగా ఆ సెస్‌ మొత్తాలతో ఒక్క పుస్తకమూ కొనలేదని పుస్తక ప్రచురణకర్తలు గ్రంధాలయ సంస్ధ చైర్మన్‌తో మొరపెట్టుకున్నారు. అంటే సదరు మొత్తాన్ని వేరే అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇది చట్టవ్యతిరేకం. ఇదే పని కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ ఖాతాల లావాదేవీలను తనిఖీ చేయగా 2018-19లో వసూలు చేసిన సెస్‌ మొత్తంలో 40శాతం మొత్తాన్ని దేనికోసం వసూలు చేస్తున్నారో దానికి కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వ ఖాతాకు మరలించుకుంటున్నట్లు తేలింది. ఇదీ చట్టవ్యతిరేకమే. సెస్‌ అంటే పన్ను మీద విధించే పన్ను. సర్‌ఛార్జీ కూడా ఇలాంటిదే.2018వరకు కేంద్ర ఇలాంటివి 42సెస్‌లను విధించింది. తరువాత మరికొన్నింటిని జత చేసింది. తొలి సెస్‌ అగ్గిపెట్టెల మీద తరువాత ఉప్పు మీద కూడా విధించారు. అంటే ఆయా పరిశ్రమల అభివృద్ధితో పాటు కొన్ని రంగాలలో పని చేసే కార్మిక సంక్షేమానికి కూడా కొన్ని సెస్‌లను విధిస్తున్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిని తెచ్చిన తరువాత సెస్‌లన్నీ దానిలో కలసిపోయాయి.ప్రస్తుతం 35వరకు ఉన్నాయి. వాటిలో ఎగుమతులు, ముడిచమురు, ఆరోగ్యం-విద్య, రోడ్డు మరియు మౌలిక సదుపాయాలు, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం, జాతీయ విపత్తు, పొగాకు, దాని ఉత్పత్తులు, జిఎస్‌టి పరిహార సెస్‌, ఆరోగ్య పరికరాల సెస్‌, తాజాగా బడ్జెట్‌లో ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల వంటివి ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2013లో ” చట్ట విధాన నిమిత్త కేంద్రం పేరుతో- విధి ” అనే లాభాలతో నిమిత్తం లేని ఒక మేథో కంపెనీని ఏర్పాటు చేసింది. అది తయారు చేసి పదిహేనవ ఆర్ధిక సంఘానికి ఇచ్చిన వివరాల ప్రకారం 2012-13 నుంచి 2018-19 వరకు మొత్తం కేంద్ర పన్ను ఆదాయంలో సెస్‌ మరియు సర్‌ఛార్జీల మొత్తం 7-2శాతాల నుంచి 11.9-6.4శాతాలకు పెరిగాయి. 2002 తరువాత అప్పటికి ఇవి గరిష్ట మొత్తాలు. నగదు మొత్తాలలో చెప్పాలంటే 2017-18 నుంచి 2018-19 మధ్య సెస్‌ మొత్తం 2.2(11.1శాతం) లక్షల రూపాయల నుంచి రూ.2.7లక్షలకు, సర్‌ఛార్జీ రూ.99,049(5శాతం) నుంచి రూ.1.4లక్షలకు పెరిగింది.1980-81 కేంద్ర పన్ను ఆదాయంలో సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా కేవలం 2.3శాతం మాత్రమే ఉండేది.


సెస్‌లు, సర్‌ఛార్జీలు పెరుగుతున్న కారణంగా తమ నిధుల వాటా తగ్గుతోంది కనుక ఆర్టికల్‌ 270ని సవరించి వీటిలో కూడా వాటా కల్పించాలని రాష్ట్రాలు ఆర్ధిక సంఘాన్ని కోరాయి. తాజా సమాచారం ప్రకారం పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం 42శాతం పన్ను ఆదాయాన్ని అందచేస్తున్నది. పదిహేనవ ఆర్దిక సంఘం సిఫార్సు ప్రకారం ఈ మొత్తం 41శాతానికి తగ్గింది. అయితే వివరాల్లోకి వెళ్లినపుడు వాస్తవంగా మొత్తం పన్ను ఆదాయంలో 35శాతం కంటే తక్కువే బదలాయిస్తున్నట్లు తేలింది. ఇంతే కాదు కాగ్‌ నివేదిక ప్రకారం 2018-19 సంవత్సరానికి లెవీల ద్వారా రూ.2.7లక్షల కోట్ల రూపాయలకు గాను కేవలం రూ.1.64లక్షల రూపాయలు మాత్రమే దేనికోసమైతే సెస్‌,సర్‌ఛార్జీలు విధించారో అందుకు కేటాయించారని పేర్కన్నది. మిగిలినవి కేంద్ర నిధిలో వేసుకున్నది. ముడి చమురు మీద వసూలు చేసిన రూ.1.25లక్షల కోట్ల రూపాయలను చమురు పరిశ్రమ అభివృద్దికి ఖర్చు చేయలేదు. అదే విధంగా ఐదు శాతంగా వసూలు చేస్తున్న ఆరోగ్య మరియు విద్యా సెస్సులో పరిమితంగా విద్యకు కేటాయించారు తప్ప ఆరోగ్యానికి లేదని కాగ్‌ పేర్కొన్నది. పన్నులలో ఇస్తున్న వాటా మాదిరి సెస్‌ మరియు సర్‌చార్జీగా వసూలు చేస్తున్న మొత్తాన్ని కూడా రాష్ట్రాలు ఆయా రంగాలలో మాత్రమే ఖర్చు చేసే విధంగా కేటాయించాలి. జిఎస్‌టిని ప్రవేశపెట్టినపుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఐదు సంవత్సరాల పాటు నిర్ణీత జిఎస్‌టి మొత్తం రాష్ట్రాలకు వసూలు కానట్లయితే ఆయా సంవత్సరాలలో ఎంత తగ్గితే అంత చెల్లించేందుకు కేంద్రం జిఎస్‌టి సెస్‌ వసూలు చేస్తున్నది.

2018లో కేంద్రం లీటరుకు రెండు రూపాయల పన్ను తగ్గించి ఆ మేరకు సెస్‌ను పెంచింది. వినియోగదారుడికి ధరలో ఎలాంటి మార్పులేదు గానీ రాష్ట్రాలకు వచ్చే నిధులు తగ్గిపోయాయి. రెండు రూపాయల్లో 42శాతం అంటే లీటరుకు రూ.0.84పైసలు తగ్గింది. ఇప్పుడు పెట్రోలుకు రూ.2.50, డీజిలుకు రూ.4.00 అదే విధంగా మార్చారు దీని ఫలితంగా కాత్తగా నిర్ణయించిన 41శాతం వాటా ప్రకారం పెట్రోలు మీద రూ.1.03, డీజిలు మీద రూ.1.64 రాష్ట్రాలకు తగ్గుతుంది. ఇదే పద్దతి మిగతా సెస్‌లకూ వర్తిస్తుంది. 2017 ఏప్రిల్‌-2020 మే మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజు పన్నులో పెట్రోలు మీద సెస్‌ మరియు సర్‌ఛార్జీ 150శాతం పెంచితే, డీజిలు మీద 350శాతాన్ని పెంచింది. ఇదే సమయంలో పన్ను మొత్తాలు 69 మరియు 57శాతాలు మాత్రమే పెరిగాయి. ఇలాంటి గారడీ కారణంగా గతేడాది కరోనా సమయంలో ఏప్రిల్‌-నవంబరు మధ్య చమురు వినియోగం 18శాతం తగ్గినప్పటికీ కేంద్రానికి వచ్చిన ఆదాయంలో ఎనిమిది శాతం మాత్రమే తగ్గగా రాష్ట్రాలకు 21శాతం పడిపోయింది.కేంద్రం చేస్తున్న ఇలాంటి గారడీలే పద్నాలుగ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 32శాతం వాటాను 42శాతానికి పెంచటంలో ప్రభావం చూపాయనే అభిప్రాయం ఉంది.


కేంద్రం ఇలా రాష్ట్రాలకు తొండి చేయి చూపుతున్న మొత్తం తక్కువేమీ కాదు. ఈ తొండి బిజెపి పాలిత రాష్ట్రాలకూ జరుగుతోంది. వివిధ రకాల కేంద్ర సెస్‌లు, సర్‌ఛార్జీల మొత్తం వసూలు 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో రూ.58,797 కోట్ల నుంచి 256శాతం పెరిగి రూ.2,09,577 కోట్లకు చేరాయి. 2020-21లో జిఎస్‌టి, విద్య, ఆరోగ్య సెస్‌లు మినహా మిగిలిన సెస్‌ల మీద రూ.3,04,485 కోట్లు వస్తుందని అంచనా వేశారంటే వాటి పెరుగుదల ఎంత వేగంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.జిఎస్‌టి సెస్‌ విషయానికి వస్తే డిసెంబరు చివరి నాటికి బడ్జెట్‌ అంచనాలో 53.5శాతం రూ.59,081 కోట్లు వసూలైంది. ఐదేండ్ల పాటు వసూలైన మొత్తం నుంచి అవసరమైనపుడు రాష్ట్రాలకు పరిహారంగా చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని గడువు మీరిన తరువాత రాష్ట్రాలకు పంచాలన్నది నిర్ణయం. ఒక్క సెస్‌లే కాదు సర్‌ఛార్జీల మొత్తం కూడా రూ.31,879 కోట్ల నుంచి రూ.1,42,530 కోట్లకు పెరిగింది. 2020-21లో రూ.1,76,277 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.
కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌ఛార్జీల వైపు మొగ్గుచూపుతున్న కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల బదలాయింపు మొత్తం క్రమంగా తగ్గిపోతోంది.2019 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2020లో బదిలీ అయిన నిధుల శాతం 36.6 నుంచి 32.4కు తగ్గిపోయింది. జిఎస్‌టి ఉనికిలోకి వచ్చిన తరువాత రాష్ట్రాల పన్నుల వనరులు పరిమితం అవటంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


రానున్న ఐదు సంవత్సరాలలో 15వ ఆర్ధిక సంఘం కేటాయింపులలో తెలంగాణాకు కేంద్ర పన్ను వాటా 2.47 నుంచి 2.1శాతానికి తగ్గింపు కారణంగా ఆరువేల కోట్ల రూపాయల నష్టం జరగనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు నివేదించినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విధమైన తగ్గుదల ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. కేంద్రం ఇదే మాదిరి పన్నుల స్ధానంలో సెస్‌లను పెంచుకుంటూ పోయినట్లయితే మరోసారి రాష్ట్రాల హక్కుల సమస్య ముందుకు రావటం అనివార్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d