• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

అమెరికాను వెన్నాడుతున్న సోషలిస్టు భూతం !

07 Thursday Feb 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

A specter is haunting US, American youth prefer socialism to capitalism, Donald Trump on Socialism, Failure of Capitalism, focus on Socialism, Socialism, the specter of socialism

ఎం కోటేశ్వరరావు

‘ఐరోపాను ఒక భూతం వెన్నాడుతోంది ! ఆ భూతం కమ్యూనిజం !! పాత ఐరోపాలోని అధికార కేంద్రాలైన పోప్‌, జార్‌, మెట్టర్‌నిచ్‌ (నాటి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి), గుయిజోట్‌(ఫ్రెంచి 17వ ప్రధాని) , ఫ్రెంచి తీవ్రవాదులు, జర్మన్‌ పోలీసు గూఢచారులు ఆ దయ్యాన్ని వదిలించుకొనేందుకు ఒక పవిత్ర కూటమిగా తయారయ్యారు.’ 1848లో ప్రచురితమైన కమ్యూనిస్టు మానిఫెస్టోను కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌లు పై మాటలతో ప్రారంభించారు. ఈనెల ఐదవ తేదీ రాత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తమ పార్లమెంట్‌ వుభయ సభల నుద్ధేశించి చేసిన రెండవ ప్రసంగాన్ని చూస్తే సోషలిజం అనే భూతం ట్రంప్‌ను అంటే అమెరికా పాలకవర్గాన్ని వెన్నాడుతోందని స్పష్టమైంది. అనేక మంది అమెరికా అధ్యక్షులు, సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా నానా చెత్త మాట్లాడారు. కొంత మంది విశ్లేషకుల సమాచారం ప్రకారం తొలిసారిగా ఒక అమెరికా అధ్యక్షుడు పార్లమెంట్‌లో సోషలిజం గురించి ప్రకటన చేయటం ఇదే ప్రధమం. బహుశా ఈ కారణంగానే కావచ్చు ఒక మీడియా సంస్ధ ‘సోషలిజం విజేత ‘ అని వుపశీర్షిక పెట్టింది. ట్రంప్‌ అనూహ్యంగా చేసిన ప్రస్తావనతో అనేక మంది మీడియా పండితులు దానికి భాష్యాలు చెప్పటం ప్రారంభించారు. ఇంతకీ ట్రంప మహాశయుడు చెప్పిందేమిటి?

Image result for A specter is haunting US , the specter of socialism

‘ ఇక్కడ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, మన దేశం సోషలిజాన్ని స్వీకరించాలన్న కొత్త పిలుపులు మనలను జాగరూకులను చేశాయి. అమెరికా స్వేచ్చ, స్వాతంత్య్రాలతో స్ధాపించబడింది తప్ప ప్రభుత్వ బలవంతం, ఆధిపత్యం, అదుపులతో కాదు. మనం స్వేచ్చతో జన్మించాం, స్వేచ్చగానే వుంటాం. అమెరికా ఎన్నడూ సోషలిస్టు రాజ్యంగా వుండేదిలేనే సంకల్పాన్ని ఈ రాత్రి పునరుద్ఘాటిస్తున్నా.’ ఎవరు అవునన్నా కాదన్నా ఎలా గింజుకున్నా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనూహ్యరీతిలో సోషలిజాన్ని అజెండాగా చేశాయి. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా తనకు మద్దతు ఇవ్వాలంటూ పోటీలోకి వచ్చిన సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ సోషలిస్టునని స్వయంగా ప్రకటించుకొని మరీ గోదాలోకి దిగాడు. గతేడాది జరిగిన మధ్యంతర ఎన్నికలలో డెమొక్రటిక్‌ సోషలిస్టు పార్టీ అభ్యర్ధులిరువురు సోషలిస్టులమని చెప్పుకొని మరీ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులుగా అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.

చరిత్ర పునరావృతం అవుతుంది అంటే అర్ధం కొత్త రూపంలో అని తప్ప గతంలో జరిగిన మాదిరే అని కాదు. గతంలోప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రంగా ఐరోపా వుంది గనుక అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు దాని కేంద్రం అమెరికాకు మారినందున అక్కడ నాంది పలికిందని చెప్పవచ్చు. నాడు ఐరోపాలో కమ్యూనిస్టు భావజాలం ప్రాచుర్యం పొందిన సమయంలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి దానిని వ్యతిరేకిస్తున్న వారే చెప్పారు. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్దిస్తున్న వారే అది వైఫల్యం చెందిందని, పని చేయటం లేదని బాహాటంగా చెప్పటం విశేషం. అమెరికాలో మీరు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధిస్తున్నారా, సోషలిజాన్ని సమర్ధిస్తున్నారా అంటూ ఇప్పుడు జరుగుతున్న సర్వేలవంటివి కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన సమయంలో లేవు. గత కొద్ది సంవత్సరాలుగా పెట్టుబడిదారీ వ్యవస్ధకు కట్టుబడి వున్న సంస్ధల సర్వేలు చెబుతున్నదేమిటి? అమెరికాలో పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందుతున్నదని, సోషలిజం కావాలని చెబుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందువలన అటు డెమోక్రటిక్‌ పార్టీ ఇటు రిపబ్లికన్‌ పార్టీలో కూడా కింది నుంచి వస్తున్న వత్తిడితో ట్రంప్‌ సోషలిజం గురించి భయపడటంలో ఆశ్చర్యం లేదు. అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండబోదని ప్రకటించిన సమయంలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మితవాది అయిన పార్లమెంట్‌ దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ సహజంగానే చప్పట్లతో తబ్బిబ్బు అయ్యారు. పురోగామి సెనెటర్‌గా ముద్ర పడిన ఎలిజబెత్‌ వారెన్‌ తన స్దానం నుంచి లేచి మరీ సోషలిజం మీద ప్రకటించిన ట్రంప్‌ ప్రకటించిన యుద్ధానికి చప్పట్లు చరిచారు.

Image result for A specter is haunting US , the specter of socialism

మరుసటి రోజు వుదయం అమెరికా విత్త మంత్రి స్టీవ్‌ నుచిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రీకృత ప్రణాళికాబద్ద ఆర్ధిక వ్యవస్ధ మీద రిపబ్లికన్లకు నమ్మకం లేదని సోషలిజానికి మరలేది లేదని చెప్పాడు. నిజానికి ట్రంప్‌ సోషలిజం గురించి మాట్లాడటం వెనుక అమెరికన్లను తప్పుదారి పట్టించే ఎత్తుగడ వుంది. వెనెజులాలో సైనిక జోక్యానికి ఐదువేల మంది సైనికులను పక్కనే వున్న కొలంబియాలో మోహరించిన ట్రంప్‌ ఒక సాకుకోసం చూస్తున్నాడు. సోషలిజం కారణంగానే వెనెజులాలో పరిస్ధితులు దిగజారాయని అరోపించిన వెంటనే అమెరికా సోషలిజం గురించి ట్రంప్‌ ప్రస్తావించాడు. నిజానికి అక్కడ ఆర్ధిక పరిస్దితి దిగజారటానికి అమెరికా, ఐరోపా ధనిక దేశాల ఆంక్షలు, దిగ్బంధనమే ప్రధాన కారణం. ముందే చెప్పుకున్నట్లు రోజు రోజుకూ పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాల గురించి జనం ప్రస్తావిస్తున్నారు. నిజానికి 80శాతం మంది అమెరికన్లు పని చేస్తే తప్ప గడవని స్ధితిలో వున్నారు. నిజవేతనాలు నాలుగు దశాబ్దాల నాటి కంటే తక్కువగా వున్నాయి. మెడికల్‌ బిల్లులు అనేక మందిని దివాలా తీయిస్తున్నాయి. విద్యార్దుల అప్పుల సంగతి సరేసరి. కోట్లాది మంది వుద్యోగ విరమణ తరువాత తమ పరిస్ధితి ఏమిటనే ఆందోళనలో వున్నారు. వెనెజులాను సాకుగా చూపి సోషలిజం మీద సైద్ధాంతిక దాడి చేస్తే అమెరికాలో పెరుగుతున్న ప్రాచుర్యాన్ని అరికట్టవచ్చని ట్రంప్‌ భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. ఇప్పుడు మరింతగా అమెరికాలో సోషలిజం గురించి చర్చ జరగటం అనివార్యం. మీడియాలో గత రెండు రోజులుగా వెలువడుతున్న విశ్లేషణలే అందుకు నిదర్శనం. ‘ అమెరికాలో సోషలిజం ఒకనాడు సమాజ ప్రధాన స్రవంతికి దూరమైన సిద్దాంతం. ట్రంప్‌ ప్రసంగానికి ముందే అది స్పష్టంగా మారుతోంది. అమెరికా సోషలిస్టు యువత ప్రమాదం గురించి భయపడుతున్న తగరగతులతో ఫాక్స్‌ న్యూస్‌ నడుస్తోంది. అయితే పార్లమెంట్‌ వుభయ సభల్లో జరిగిన దాడి తరువాత సోషలిజం సమయం వచ్చినట్లు అనుకోవచ్చు. అదిప్పుడు ప్రధాన స్రవంతి భావజాలం అధ్యక్షుడి ఆగ్రహానికి గురికావలసినదే. ఒక శత్రువు కలకు అంతగా తోడ్పడేందుకు ఎవరు సాహసిస్తారు ?’ అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.

సోషలిజంపై పార్లమెంట్‌లో ట్రంప్‌ దాడికి వారం రోజుల ముందు వెలువడిన ఒక సర్వే వివరాలు ట్రంప్‌ను భయపెట్టి వుంటాయి. సహస్రాబ్ది తరంతో(1981-1996 మధ్య పుట్టిన వారు) పాటు అనంతర జడ్‌ లేదా యూట్యూబ్‌ తరం(1996 తరువాత పుట్టినవారు) కూడా సోషలిజంవైపు ఎక్కువగా మొగ్గుతున్నారని దానిలో తేలాయి.పదింట ముగ్గురే ట్రంప్‌ సరిగా పని చేస్తున్నారని కూడా వెల్లడైంది. 2010లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింతగా ప్రయత్నించాలని సహస్రాబ్దితరంలో 53శాతం పేర్కొనగా ఇప్పుడు రెండుతరాల్లో అలా అభిప్రాయపడుతున్నవారు 64,70శాతం మంది వున్నారు. ముప్పై అయిదు సంవత్సరాల లోపు యువత సోషలిజం పట్ల ఎక్కువ మంది సానుకూలంగా వున్నారు. సర్వేల పేరుతో పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఒకవైపు జరుగుతోందని కూడా చెప్పువచ్చు. తాజా సర్వే ప్రకారం 18-24 మధ్య వయస్సు వారిలో 76శాతం, 25-44 వయస్సు వారిలో 60శాతం ప్రస్తుత ఆర్ధిక వ్యవస్ధ న్యాయంగా లేదని, ధనికులకే అనుకూలంగా వుందని అభిప్రాయపడుతున్నారని తేలింది.

అమెరికాలో సోషలిజం ఇంతగా ప్రాచుర్యం పొందటానికి కారణం ఏమిటంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే 2008లో తలెత్తిన ప్రపంచ సంక్షోభం అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.ఆ సంక్షోభం ఆర్దిక బాధను కలిగించటమే కాదు సామాజిక వ్యవస్ధను కూడా దెబ్బతీసింది.2016లో బ్రూకింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌ పేర్కొన్నదాని ప్రకారం 70లక్షల మంది అంటే 12శాతం పురుషులు పని చేయటం లేదని పేర్కొన్నది.1970దశ కంలో స్వేచ్చా వాణిజ్యం ఒక విధానంగా అమెరికాలో, ప్రపంచంలో ముందుకు వచ్చింది.2000 సంవత్సరంలో చైనా ప్రపంచ వాణిజ్య సంస్ధలో ప్రవేశించిన తరువాత అమెరికాలో 34లక్షల వుద్యోగాలు నష్టపోయినట్లు ఎకనమిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ అంచనా వేసింది. తరువాత నాలుగేండ్లకు వుత్తర అమెరికా స్వేచ్చావాణిజ్య ఒప్పందం (నాఫ్టా) వలన మరొక పదిలక్షల వుద్యోగాలు పోయినట్లు పేర్కొన్నది. వీటికి తోడు ఈ కాలంలో మరింత యాంత్రీకరణ జరగటంతో ఒకప్పుడు పాఠశాల విద్య చదువుకున్న వారికి కూడా మంచి వుద్యోగాలు దొరికిన అమెరికాలో నైపుణ్యం లేని, తక్కువ వేతనాలు లభించే వుద్యోగాలన్నింటినీ రోబోట్లు, ఇతర కృత్రిమ మేధ యంత్రాలు భర్తీ చేశాయి. దాంతో మరిన్ని లక్షల వుద్యోగాలు హరీమన్నాయి. మధ్యతరగతి అంతరించేదిశగా పరిణామాలున్నాయి. పర్మనెంటు స్ధానంలో తాత్కాలిక లేదా కాంట్రాక్టు వుద్యోగాలు గణనీయంగా పెరిగాయి. మానవ శ్రమ స్ధానంలో యంత్రాలను ఎంత ఎక్కువగా ప్రవేశపెడితే పెట్టుబడి పోగుపడటంతో పాటు లాభాలు పెరుగుతాయి. మరోవైపున కాంట్రాక్టు లేదా తాత్కాలిక కార్మికుల వేతనాలు పడిపోతాయి. ఇది ఆరోగ్య సంరక్షణ, పెన్షన్లు, కార్మిక భద్రత వంటి కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ పరిణామాలన్నింటినీ పెట్టుబడిదారీ విధాన వైఫల్యంగానూ, అది పనిచేయకపోవటంగానూ నూతన తరం చూస్తున్నది.

Image result for A specter is haunting USA , socialism

అమెరికా అంతా సజావుగా వుందని ఒకవైపు చెబుతూనే అసంతృప్తిని చల్లార్చేందుకు గత రెండు సంవత్సరాల కాలంలో ట్రంప్‌ చేయని యత్నం లేదు. అమెరికా వస్తువులను దిగుమతి చేసుకొనే విధంగా చైనాపై వత్తిడి తెస్తూ వాణిజ్య యుద్ధానికి దిగాడు. విదేశాల నుంచి వలసలు వచ్చేవారితో స్వదేశీ కార్మికులకు వుపాధి సమస్యతో పాటు వేతనాలు పడిపోతున్నాయంటూ వలసను ఆపేందుకు మెక్సికో సరిహద్దులో గోడ కట్టాలని ప్రచారం చేస్తున్నాడు. నాఫ్టా ఒప్పందం బదులు మరొక కొత్త ఒప్పందంతో అమెరికాలో వుపాధి అవకాశాలను పెంచుతానని నమ్మబలుకుతున్నాడు. 2008 నుంచి అంతకు ముందున్న పాలకులు కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసినా విఫలమయ్యారు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం పని చేయటానికి ప్రపంచంలో ఎక్కడా లేని అవకాశాలున్నాయి. అయితే ఆ వ్యవస్ధ సరిగా పనిచేయటం లేదని అసంతృప్తి చెందుతున్న యువతరమే కాదు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులే చెప్పటం గతంలో ఎన్నడూ వినలేదు. అమెరికాలో బ్రిడ్జివాటర్‌ అనే పెట్టుబడుల కంపెనీ అధిపతి రే డాలియో ‘ పెట్టుబడిదారీ వ్యవస్ధ మెజారిటీ పౌరులకోసం పని చేయటం లేదు. అది ఒక వాస్తవం’ అని గతేడాది నవంబరు నెలలో లాస్‌ ఏంజల్స్‌ నగరంలో జరిగిన సభకు పంపిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ‘నేడు జనాభాలోని ఒకశాతం ఎగువ వారిలో వున్న సంపద విలువ జనాభాలో 90శాతంగా వున్నవారితో సమంగా వుంది. 1930దశకంలో జరిగిన మాదిరే పరిస్ధితి వుంది. అత్యవసరం అయితే 40శాతం మంది పెద్దల చేతుల్లో నాలుగు వందల డాలర్లు వుండటం లేదు. ఈ పరిస్దితి మీకు ధ్రవణత గురించి ఒక అవగాహన కలిగిస్తుంది, అదే నిజమైన ప్రపంచం, అదొక సమస్య కూడా.’ అన్నారు. అయితే వాస్తవ సమస్య పెట్టుబడిదారీ విధానంతో కాదని సహజసిద్దమైన ముక్తాయింపు ఇచ్చారనుకోండి. జనంలో పెరుగుతున్న అసంతృప్తిని జోకొట్టేందుకు ధనవంతులు చేసే ఎదురుదాడి ఇది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరో ఆయుధ పోటీకి చిచ్చు రాజేస్తున్న అమెరికా !

06 Wednesday Feb 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Arms race, INF, INF Treaty, Intermediate-Range Nuclear Forces, The 1987 INF Treaty

Image result for arms race

ఎం కోటేశ్వరరావు

మూడు దశాబ్దాల క్రితం నాటి సోవియట్‌తో కుదుర్చుకున్న ఆయుధ నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలగనున్నట్లు గతేడాది మధ్యంతర ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినపుడు ఓట్ల కోసం అని అందరూ అనుకున్నారు. కానీ మరొక అడుగు ముందుకు వేస్తూ దాన్ని నిర్ధారిస్తూ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్లు గత శుక్రవారం నాడు అమెరికా అన్నంత పనీ చేసింది. వెంటనే మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ తామూ వైదొలుగుతున్నట్లు రష్యా చెప్పేసింది. అంతేకాదు మరొక అడుగు ముందుకు వేసి నిషేధిత భూ వుపరితలం నుంచి ప్రయోగించే క్షిపణుల తయారీకి పూనుకుంటున్నట్లు ప్రకటించింది. రెండు దేశాల మాటలు వాస్తవ రూపందాలిస్తే ఆరునెలల్లో పార్లమెంట్ల అనుమతితో ఆప్రక్రియ పూర్తి అవుతుంది. దీని మీద ఐరోపా వైఖరి బహిర్గతం కావాల్సి వుంది. ఈ ఒప్పందం మీద వుభయ దేశాలు ఆరోపణల, ప్రత్యారోపణల పూర్వరంగంలో 2014 నుంచి అనేక దఫాలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. అయితే రెండు దేశాలకూ, ఐరోపాను, మొత్తంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఈ పరిణామం గురించి రెండు దేశాలకు వున్న సమస్యల కారణంగా పునరాలోచించే అవకాశాలు కూడా లేకపోలేదు.ఒప్పందాన్ని రష్యా వుల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తూ ఒప్పందం నుంచి తాము వైదొలనున్నట్లు చెబుతోంది. ఫిబ్రవరి రెండవ తేదీ వరకు తాము గడువు ఇస్తున్నామని ఆలోగా సానుకూలంగా స్పందించకపోతే తాము వైదొలుగుతామని డిసెంబరులోనే పాంపియో సూచన ప్రాయంగా చెప్పారు.నిషేధిత పరిధిలోని క్షిపణులను తాము పరీక్షించలేదని, తాము వుల్లంఘించినట్లు ఆరోపణలు గాక రుజువులు చూపాలని రష్యా ప్రతిస్పందించింది. అమెరికాయే ఒప్పందానికి విరుద్ధంగా ఐరోపాలో క్షిపణులను మోహరించిందని పేర్కొన్నది.

ఎందుకీ ఒప్పందం అవసరమైంది?

ప్రచ్చన్న యుద్దంలో భాగంగా సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఐరోపా ధనిక దేశాలు అమెరికాతో చేతులు కలిపాయి. దాంతో తన వ్యూహంలో భాగంగా పశ్చిమ ఐరోపా దేశాల మీద దాడి చేయగల ఎస్‌ఎస్‌20 మధ్యంతర శ్రేణి క్షిపణులను సోవియట్‌ తన గడ్డమీద మోహరించింది. దానికి ప్రతిగా అమెరికన్లు ఇటలీ, బ్రిటన్‌, జర్మనీలో తమ ఆయుధాలను ఎక్కుపెట్టారు. ఈ మోహరింపును అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పూర్వరంగంలో మధ్య, స్వల్ప శ్రేణి అణు బలాల ఒప్పందం(ఐఎన్‌ఎఫ్‌) పేరుతో తమ వద్ద వున్న మధ్య,లఘు శ్రేణి క్షిపణులను తొలగించుకొనేందుకు 1987 డిసెంబరు ఎనిమిదిన గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌ మధ్య కాలపరిమితి లేని ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జూన్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. తరువాత సోవియట్‌ రద్దు కావటంతో దాని వారసురాలిగా రష్యా ఒప్పందంలోకి వచ్చింది.ఆ మేరకు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు వున్న లఘు, వెయ్యి నుంచి 5,500 కిలోమీటర్లకు వుండే మధ్య శ్రేణి అణు, సాంప్రదాయ క్షిపణులను రెండు దేశాలు తొలగించాల్సి వుంటుంది. సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణులు ఈ ఒప్పంద పరిధిలో లేవు. ఒప్పందం ప్రకారం 1991నాటికి అమెరికా 846 సోవియట్‌ లేదా రష్యా 1,846 క్షిపణులను నాశనం చేశాయి.

ఒప్పంద రద్దుకు అమెరికాను ప్రేరేపిస్తున్న అంశాలేమిటి?

గత ఐదు సంవత్సరాల పరిణామాలను చూసినపుడు ఒప్పందం రద్దు గురించి అమెరికన్ల గళమే ఎక్కువగా వినిపిస్తున్నది. రష్యా నుంచి అటువంటి ప్రకటనలు లేవు. తాజాగా ట్రంప్‌, విదేశాంగ మంత్రి పాంపియో ప్రకటనల వెనుక ఆంతర్యం గురించి కూడా పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి. 1987 ఒప్పందం తరువాత అమెరికా తయారు చేస్తున్న లేదా ఇప్పటికే తయారు చేసిన అధునాతన అణ్వాయుధాలను ప్రపంచం ముందుంచాలంటే రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ఆటంకంగా వుంది. రష్యా, చైనా వంటి సుదూర లక్ష్యాలను చేరగల క్షిపణిని తయారు చేస్తున్నట్లు అమెరికా ఇంధన శాఖ సూచన ప్రాయంగా ఇటీవలనే వెల్లడించింది.1987 ఒప్పందంలో చైనా లేని కారణంగా అది స్వంత అణ్వాయుధ మరియు అన్ని శ్రేణుల సాంప్రదాయ క్షిపణులను తయారు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చిందని, ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం ఐరోపా కేంద్రంగా చేసుకున్నదని అమెరికా-చైనా మిలిటరీ బలాబలాలను పరిగణనలోకి తీసుకోవలేదని, ఆ అంశం ఇటీవలి కాలంలో అమెరికా వ్యూహాత్మక లెక్కల్లో కేంద్ర స్ధానాన్ని ఆక్రమించిందని అమెరికాలో కొత్త వాదనలు లేవనెత్తారు. గత మూడు దశాబ్దాలలో అనేక దేశాలు అధునాతన అణ్వాయుధాలను తయారు చేశాయి. ఇది రెండు దేశాలకే పరిమితమైనందున వాటిని నియంత్రించే అవకాశం లేదు. అందువలన దానికి ఎందుకు కట్టుబడి వుండాలని, గతంలో కుదిరిన ఒప్పందాలన్నీ అమెరికాను అదుపు చేసే లక్ష్యంతోనే జరిగాయని, అందువలన వాటికెందుకు కట్టుబడి వుండాలని యుద్ధోన్మాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. దీనికి అనుగుణ్యంగానే అధికారానికి వచ్చినప్పటి నుంచి ట్రంప్‌ వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరోవైపు ఒబామా, ట్రంప్‌ ఎవరు అధికారంలో వున్నా ఏటేటా రక్షణ బడ్జెట్‌ పెంపుదల వెనుక నూతన ఆయుధాల తయారీ వుందన్నది స్పష్టం.ఒప్పందం నుంచి వైదొలుగుతామని ప్రకటించటంలో ముందుండటమే కాదు, దాని ప్రారంభంలోనే తూట్లు పొడిచింది. ఒప్పందం కుదిరిన నాలుగు సంవత్సరాల తరువాత 1991లో అమెరికా తన తొలి దీర్ఘశ్రేణి అణ్వాయుధాల తయారీకి పూనుకుంది. దాన్ని చూపి మిగతా దేశాలు కూడా తమ ప్రయత్నాల్లో తాము నిమగ్నమయ్యాయి.

ఒప్పంద రద్దు పర్యవసానాలేమిటి ?

ఒప్పందం రద్దు పర్యవసానాల గురించి కూడా చర్చ జరుగుతోంది.అమెరికా, రష్యా చర్యలు ప్రపంచంలో నూతన ఆయుధ పోటీకి తెరలేపుతాయని భయపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ పోటీ రెండు దేశాలకే పరిమితం కాగా నూతన పరిస్ధితుల్లో చైనా కూడా అనివార్యంగా రంగంలోకి దిగాల్సి వుంటుంది. నిజంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అమెరికా, రష్యా, చైనా మధ్య నూతన తరహా ప్రచ్చన్న యుద్ధం వంటి పరిస్ధితి తలెత్తుతుందని, గతం కంటే ఇప్పుడు రష్యా, చైనాలు మరింత సన్నిహితంగా వున్న విషయాన్ని మరచిపోరాదని అమెరికా గూఢచార సంస్ధలు హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.నిజంగానే రద్దు చేసుకుంటే రష్యాతో ఎలా వ్యవహరించాలన్నది తక్షణం అమెరికా ముందున్న సమస్య. 2021లో నూతన వ్యూహాత్మక అణ్వాయుధ ఒప్పందం(న్యూ స్టార్ట్‌) కుదిరే అవకాశాలు లేవు. అది లేకుండా అణ్వస్త్రవ్యాప్తి నిరోధ అమలు సాధ్యం కాదు. అన్నింటికీ మించి అణ్వాయుధాలు అనేక దేశాల దగ్గర వున్నందున వాటన్నింటినీ కట్టడి చేయటానికి అవసరమైన పెద్ద సంఖ్యలో ఆయుధాలు తయారు చేయటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వుత్పాదక శక్తి, ఆర్ధిక సామర్ధ్యం లేదన్నది ఒక అంచనా. వాటన్నింటినీ అధిగమించి అన్ని దేశాలకు వ్యతిరేకంగా అణ్వాయుధాలను మోహరిస్తే అమెరికా మరింతగా ఒంటరిపాటు కావటం ముఖ్య రాజకీయ పర్యవసానం అవుతుంది. ఆయుధాలను మోహరించటం తప్ప ప్రయోగించే పరిస్ధితి లేనపుడు ఇలాంటి పరిస్ధితిని కొని తెచ్చుకోవటం ఎందుకన్నది మౌలిక సమస్య. ఇప్పటికే అమెరికా తమ మీద పెత్తనం చేస్తున్నదని, తమ భద్రత తాము చూసుకోగలమని ఐరోపా ధనిక దేశాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు నాటో ఖర్చును ఐరోపా దేశాలే ఎక్కువగా భరించాలని అమెరికా వత్తిడి తెస్తోంది. ఇప్పుడు నూతన ఆయుధాలను మోహరించాలంటే అది రష్యాతో వైరాన్ని పెంచటమే గాక తమ జనాన్ని ఒప్పించటం ఐరోపా దేశాలకు అంత తేలిక కాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నపుడు గత అనుభవాల రీత్యా అవసరమైన నూతన ఆయుధాలను తయారు చేసుకొనే వరకు వున్న ఒప్పందాలను కొనసాగించక తప్పని స్ధితిలో అమెరికా వుంటుందన్నది ఒక అభిప్రాయం. ఒప్పందం నుంచి వైదొలిగితే ట్రంప్‌ ఎప్పటి నుంచో చెబుతున్నట్లు ఐరోపాలో అమెరికా మరిన్ని కొత్త ఆయుధాలను మోహరించటం, దానికి ప్రతిగా రష్యా చర్యలు వుంటాయి. నిజంగా ఒప్పందం రద్దయితే జర్మనీ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఐరోపా భద్రతకు, వ్యూహాత్మక సమతుల్యానికి ఒప్పందం కొనసాగటం అవసరమని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించగా, అమెరికా ఆయుధాల మోహరింపు బహుముఖ ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని చైనా పేర్కొన్నది.మధ్యంతర ఎన్నికల సమయంలో ట్రంప్‌ చేసిన ప్రకటనతో నాటో కూటమి దేశాలలో ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా వ్యక్తమైంది. తాజా పరిస్ధితికి రష్యాదే పూర్తి బాధ్యత అని అమెరికా నాయకత్వంలోని నాటో తాజాగా వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యం లేదు. డెమోక్రటిక్‌ పార్టీ సెనేటర్‌ ఎడ్వర్డ్‌ జె మార్కే మాట్లాడుతూ ప్రమాదకరమైన ఆయుధపోటీకి దారి కల్పిస్తూ ట్రంప్‌, అతని యుద్ధ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నదని విమర్శి ంచారు. నాటో విస్తరణ ముసుగులో పోలాండ్‌, ఇతర బాల్టిక్‌ దేశాలలో ఆయుధాలను మోహరించేందుకు అమెరికా పూనుకుంది. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం నుంచి వైదొలిగి ఆయుధాలను మోహరిస్తే అవి కొన్ని నిమిషాల్లోనే రష్యాలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. అందువలన వాటికి ప్రతిగా తాము వంద మెగాటన్నుల విధ్వంసక బాంబులను తీసుకుపోయే క్షిపణులను తయారు చేయక తప్పదని రష్యన్లు హెచ్చరించారు.

ఇటీవలి కాలంలో అమెరికా అంతర్జాతీయ వ్యవస్ధ నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నది. వాతావరణ మార్పులు, భూతాపం తదితర అంశాలున్న పారిస్‌ ఒప్పందం నుంచి, ఇరాన్‌తో అణు ఒప్పందం, అంతర్జాతీయ పోస్టల్‌ యూనియన్‌ నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అవన్నీ ఒక ఎత్తయితే తాజా ప్రకటన అత్యంత ప్రమాదకర చర్యల, అంతర్జాతీయ భద్రత మీద ఎంతో పభావం చూపనుంది. తమ వద్ద వున్న పాత తరం అణ్వాయుధాలను వదలించుకొనేందుకు ఒప్పందంలో అమెరికా భాగస్వామి అయిందనే ఒక అభిప్రాయం వుంది. ఇప్పుడు అంతకంటే అధునాతన ఆయుధాలున్నందున మరోసారి ప్రపంచాన్ని భయపెట్టేందుకు పూనుకుందని చెప్పాలి. రెండవ ప్రపంచ యుద్ధం దాదాపుగా ముగిసిన తరువాత ప్రపంచాన్ని భయపెట్టేందుకు అమెరికన్లు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై ప్రయోగించిన ‘లిటిల్‌ బోయ్‌, ఫాట్‌ మాన్‌ ‘ అణుబాంబులు ఇప్పటి వాటితో పోల్చితే చాలా చిన్నవి. అయినా అవెంత మారణకాండకు కారణమయ్యాయో ఇప్పటికీ ఆ ప్రాంతంలో అణుధార్మికత ఎలా వుందో చూస్తున్నాము.మరోసారి ప్రపంచ యుద్దమంటూ వస్తే మిగిలే దేశం ఒక్కటీ వుండదు.ప్రచ్చన్న యుద్దం 35వేల అణ్వాయుధాల తయారీకి దారితీసింది. వాటితో ప్రపంచాన్ని ఎన్నిసార్లు నాశనం చేయవచ్చో వూహించుకోవాల్సిందే. అలాంటి పోటీని మరింతగా పెంచేందుకు అమెరికా పూనుకుంది. ఇది అత్యంత దుర్మార్గం.నిజంగానే ఒప్పందం రద్దయితే ఆ చారిత్రాత్మక ఎదురుదెబ్బకు బాధ్యురాలు అమెరికానే అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులాలో మదురో సర్కార్‌పై సైనిక తిరుగుబాటుకు అమెరికా మద్దతు !

23 Wednesday Jan 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Caracas, Juan Guaidó, military coup, Nicolás Maduro, Socialists United of Venezuela (PSUV), USA, Venezuela president, Venezuelan military

ఎం కోటేశ్వరరావు

డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ లాటిన్‌ అమెరికాలోని వెనెజులాలో జోక్యం చేసుకో నుందా ? మరోసారి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన వామపక్ష మదురోను కూలదోసేందుకు ప్రత్యక్షంగా తన సైన్యాన్ని పంపుతుందా? పశ్చిమాసియా, ఇతర ప్రాంతాల్లో తగిలిన ఎదురు దెబ్బలను గుర్తుకు తెచ్చుకొని పరిసర దేశాల మిలిటరీతో తన లక్ష్యాన్ని నెరవేరుస్తుందా లేక వెనెజులా మిలిటరీని ప్రభావితం చేసి తిరుగుబాటు చేయిస్తుందా ? ప్రస్తుతం వెనెజులాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తలెత్తుతున్న ప్రశ్నలివి. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో వెనెజులాలో మిలిటరీ జోక్యం ఆ ఒక్క దేశానికే పరిమితం అవుతుందా? ప్రపంచవ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుందా ! అసలు వెనెజులాలో, దానికి సంబంధించి బయట ఏమి జరుగుతోంది?

బుధవారం నాడు అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సైనిక తిరుగుబాటుకు, ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన నేపధ్యంలో వునికిలో లేని పార్లమెంట్‌ అధ్యక్షుడు జువాన్‌ గుయైడోకు అమెరికా వుపాధ్యక్షుడు మైక్‌ పెనెస్‌ మద్దతు ప్రకటించి ప్రత్యక్ష జోక్యానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి తిరుగుబాటు చేసిన వారిలో 27 మందిని అరెస్టు చేశారని, మరికొందరని అరెస్టు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అధ్యక్ష భవనానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఒక సైనిక అవుట్‌ పోస్టును స్వాధీనం చేసుకున్న కొందరు సైనికులు రెండు మిలిటరీ ట్రక్కులు,కొన్ని ఆయుధాలు తీసుకొని బయలు దేరగా వారిని అరెస్టుచేసినట్లు తొలి వార్తలు తెలిపాయి. అంతకు కొన్ని గంటల ముందు సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చిన అనేక వీడియోలలో సైన్యంలోని నేషనల్‌ గార్డ్స్‌ తాము మదురోను అధ్యక్షుడిగా గుర్తించటం లేదని తమకు మద్దతుగా జనం వీధుల్లోకి రావాలని చెప్పినట్లుగా వుంది. అరెస్టులకు ముందు సామాజిక మాధ్యంలో దర్శనమిచ్చిన వీడియోలో పార్లమెంటు నేత, తాత్కాలిక అధ్యక్షుడంటూ ప్రకటించిన జువాన్‌ గుయైడో మాట్లాడుతూ తిరుగుబాటు చేయాలని, కాల్పులు జరపాలని తాము కోరటం లేదని, మన పౌరుల హక్కుల కోసం తమతో పాటు కలసి రావాలని కోరుతున్నామని సైనికులకు విజ్ఞప్తి చేశాడు. మదురోను వదలి వచ్చిన మిలిటరీ, ఇతర పౌర అధికారులకు తాము క్షమాభిక్ష పెడతామని పార్లమెంటు ప్రకటించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే సుప్రీం కోర్టు ఒక ప్రకటన చేస్తూ మదురో అధ్యక్ష స్వీకారం చెల్లదంటూ కొద్ది రోజుల క్రితం పార్లమెంట్‌ చేసిన తీర్మానం చెల్లదని, రాజ్యాంగ వుల్లంఘనకు పాల్పడిన పార్లమెంట్‌ నేతలు నేరపూరితంగా వ్యవహరించారో లేదో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. గతంలో కూడా ఇలాంటి చెదురుమదురు తిరుగుబాట్లు, మదురోపై హత్యాయత్నాల వంటివి జరిగాయి. ఈ వుదంతం కూడా అలాంటిదేనా అన్నది చూడాల్సి వుంది. రానున్న కొద్ది రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ శక్తుల కుట్రల పర్యవసానాలు మరింతగా వెల్లడి అవుతాయి.

లాటిన్‌ అమెరికాలో వామపక్షం అధికారంలోకి వచ్చిన దేశాలలో ఒకటి వెనెజులా ! హ్యూగో ఛావెజ్‌ బతికి వున్న సమయంలోనే ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఇంటా బయటి శక్తులు చేయని యత్నం లేదు. ఆయన రాజకీయ వారసుడిగా అధికారంలోకి వచ్చిన నికొలస్‌ మదురోకు వ్యతిరేకంగా కూడా అదే జరుగుతోంది. గత ఏడాది మేనెలలో జరిగిన ఎన్నికలలో మదురో మరో ఆరు సంవత్సరాలకు తిరిగి ఎన్నికయ్యారు. ఈనెల పదవ తేదీన తిరిగి అధికారాన్ని స్వీకరించారు. 2015లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రతిపక్షం మెజారిటీ సాధించింది. తరువాత మదురోను తొలగించాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.2017లో సుప్రీం ట్రిబ్యునల్‌ పార్లమెంట్‌ అధికారాలను రద్దు చేసింది. అధికారంలేని పార్లమెంట్‌ కొనసాగుతోంది. తరువాత నూతన రాజ్యాంగ రచనకు రాజ్యాంగపరిషత్‌కు ఎన్నికలు జరిగాయి.2018 మే నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రెండవసారి మదురో ఎన్నికను అమెరికా మరికొన్ని దేశాలు గుర్తించేందుకు నిరాకరించాయి. రెండవ సారి ప్రమాణ స్వీకారానికి బలీవియా అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డైయాజ్‌ కానెల్‌, నికరాగువా అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా, సాల్వడోర్‌ అధ్యక్షుడు సాల్వడోర్‌ శాంఛెజ్‌ సెరెన్‌ వంటి నేతలు హాజరు కాగా చైనా ప్రత్యేక ప్రతినిధిని పంపింది. మొత్తం 94దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మదురో మాట్లాడుతూ తమ పార్టీ 19ఏండ్ల పాలనా కాలంలో 25ఎన్నికలు జరిగాయని ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని చెప్పారు. వెనెజులా మిలిటరీ మదురోకు విధేయత ప్రకటించింది.

మదురో అధికార అపహర్త అంటూ అధికారాలు లేని పార్లమెంట్‌ జనవరి 11న ఒక తీర్మానం చేసి జువాన్‌ గుయైడోను అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించింది. అధికార వ్యవస్ధలో శూన్యం ఏర్పడినపుడు నూతన అధ్యక్షుడిని నియమించే అధికారం తమకుందని చెప్పుకుంది. ఈనెల 23న మదురోకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయాలని, సైన్యం తిరుగుబాటు చేసి పార్లమెంట్‌కు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరాయి. తదుపరి ఎన్నికలు జరిగే వరకు తనది ఆపద్ధర్మ ప్రభుత్వమని గుయైడో చెప్పుకున్నాడు. ప్రభుత్వ యంత్రాంగం, మిలిటరీలోని మధ్య, దిగువ సిబ్బంది తిరుగుబాటు చేసి తమకు మద్దతు ఇస్తారని ప్రతిపక్ష శిబిరం చెప్పుకుంటోంది. వెనెజులా ఆస్ధులు, ఖాతాలను స్దంభింప చేయాలంటూ పార్లమెంట్‌ 46దేశాలకు లేఖలు రాసింది. మరిన్ని ఆంక్షల అమలుకు తాము ప్రయత్నిస్తామని అమెరికా ప్రకటించింది. రెండోసారి మధురో అధికార స్వీకరణను అమెరికాతో పాటు లిమా బృందంగా పరిగణించబడే 13దేశాలు గుర్తించేందుకు నిరాకరించాయి. వాటికి కొలంబియా, బ్రెజిల్‌ నాయకత్వం వహిస్తున్నాయి.

బస్సు డ్రైవర్ల యూనియన్‌ నేతగా రాజకీయ జీవితం ప్రారంభించిన మదురో ఏడు సంవత్సరాల పాటు ఛావెజ్‌ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఛావెజ్‌ కాన్సర్‌ నుంచి కోలుకొనే అవకాశం లేని స్ధితిలో ఆయన తన రాజకీయ వారసుడిగా మదురోను గుర్తించారు. 2013లో తొలిసారి మదురో పోటీ చేసినపుడు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డాయి. పదకొండు మంది పాలకపార్టీ కార్యకర్తలను హత్యచేశాయి. 2015లో ప్రతిపక్షాలు పార్లమెంట్‌ ఎన్నికలలో మెజారిటీ సాధించిన వెంటనే ఆరునెలల్లో మదురోను పదవీచ్యుతుని గావిస్తామని ప్రకటించాయి. పార్లమెంట్‌ -అధ్యక్షుడి మధ్య తలెత్తిన వివాదం చివరకు 2017లో సుప్రీం కోర్టు పార్లమెంట్‌ అధికారాలను రద్దు చేయటంతో ముగిసింది. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ప్రతిపక్షాలు కుట్రలు చేస్తూనే వున్నాయి. పార్లమెంట్‌ స్ధానంలో ఎన్నికైన నూతన రాజ్యాంగ సభ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాల్సి వుంది.

మదురోను గద్దె దింపేందుకు తక్షణమే ట్రంప్‌, ఇతరులు కదలనట్లయితే ఇంకో అవకాశం వుండదని, మరొక క్యూబా మాదిరి మారిపోతుందని అమెరికా, లాటిన్‌ అమెరికాలోని వామపక్ష వ్యతిరేకశక్తులు తొందర పెడుతున్నాయి. అమెరికా, ఐరోపా యూనియన్‌, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలు ఇంతకు ముందే గతేడాది జరిగిన మదురో ఎన్నికను గుర్తించటం లేదని ప్రకటించాయి. ఇంత హడావుడి చేస్తున్నప్పటికీ ప్రతిపక్ష జువాన్‌ గుయైడో ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేసినట్లు ప్రకటించలేదు, తరువాత చేస్తానని మాత్రమే చెబుతున్నాడు. ఈనెల 23న మదురోకు వ్యతిరేకంగా జనాన్ని వీధుల్లో ప్రదర్శనలు చేయించాలని, ఈలోగా మిలిటరీలో తిరుగుబాటు రెచ్చగొట్టాలన్నది ప్రతిపక్షం రూపొందించిన అనేక పధకాలలో ఒకటి. సుప్రీం కోర్టు, మిలిటరీ మద్దతు లేని ఏ ప్రభుత్వమూ ఇప్పుడున్న స్దితిలో వెనెజులాలో నిలిచే అవకాశం లేదు. అయితే పధకంలో భాగంగా కెనడా, బ్రెజిల్‌, అమెరికా దేశాల సంస్ధ పార్లమెంట్‌ తీర్మానాన్ని అభినందిస్తున్నామని, గుర్తిస్తామని చెప్పటం ద్వారా గుయైడోను అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు పరోక్షంగా తెలిపాయి. అధికారిక ప్రకటన చేస్తే గుయైడోను వెంటనే అరెస్టు చేసే అవకాశం వుంది. దాని బదులు అతగాడు నియమించే రాయబారులను గుర్తిస్తూ మదురో సర్కార్‌ నియమించిన వారిని ఖాళీ చేయించటం ద్వారా తమ మద్దతును వెల్లడించవచ్చన్నది ఒక సమాచారం. ఒక వేళ అలా కానట్లయితే ఏదో ఒక దేశ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం కల్పించి అక్కడి నుంచి సమాంతర ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన చేయించే ఆలోచన కూడా లేకపోలేదు. అది చేస్తే మదురో సర్కార్‌ రాయబార కార్యాలయం మీదకు సైన్యాన్ని పంపకపోవచ్చని బ్రెజిల్‌ రాయబార కార్యాలయ ప్రతినిధి చెప్పారు. గుయైడో ద్వారా వెనెజులాకు మానవతా పూర్వక సాయ అభ్యర్ధన ప్రకటన చేయించి సరిహద్దులకు కొంత మొత్తం సాయాన్ని పంపితే మదురో సర్కార్‌ దానిని అనుమతించదని, ఆ చర్య జనంలో మదురో పట్ల వ్యతిరేకతను పెంచవచ్చని మదురో వ్యతిరేక శక్తులు ఆశిస్తున్నాయి.

Image result for us supported military coup against venezuela president nicolas maduro

తాజా పరిణామాల్లో వెనెజులా వ్యవహారాలలో కెనడా ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో తన పట్టు పెంచుకోవాలని గత కొంతకాలంగా కెనడా పాలకవర్గం అవకాశాల కోసం చూస్తోంది. దానిలో భాగంగానే మదురో రెండవ సారి ప్రమాణ స్వీకారం చేయకముందే మదురో పాలన చట్టబద్దమైనదిగా తాము పరిగణించటం లేదని ప్రకటించింది. లిమా బృందంలో మెక్సికో కూడా సభ్యురాలిగా వున్నప్పటికీ తాత్కాలికంగా అయినా అది మదురో వ్యతిరేక వైఖరికి దూరంగా వుంది. మెక్సికోలో నూతనంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌ వెనెజులా నేత మదురోకు ఆహ్వానం పంపారు. అమెరికా విషయానికి వస్తే నిరంతరం వెనెజులా మిలిటరీలో తిరుగుబాటు, చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. తన చేతికి మట్టి అంటకుండా వ్యవహరించాలని అమెరికా చూస్తున్నది. అందుకే కెనడా వంటి వాటిని ముందు పెడుతున్నది. అమెరికా దేశాల సంస్ధ ప్రధాన కార్యదర్శి ఆల్మగారో కుట్రను ప్రోత్సహిస్తున్నవారిలో ఒకడు. గుయైడో తానేమిటో చెప్పుకోక ముందే వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడంటూ స్వాగతం పలికాడు. ఈనెల పదిన మదురో ప్రమాణ స్వీకార సమయంలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ఒక ప్రకటన చేస్తూ తక్షణమే తిరుగుబాటు ద్వారా మదురోను బర్తరఫ్‌ చేయాలని వెనెజులా మిలిటరీని బహిరంగంగా కోరాడు. మరుసటి రోజు గుయైడోకు ఫోన్‌ చేసి మద్దతు ప్రకటించాడు.ఈ నెల 12న విదేశాంగశాఖ ఒక ప్రకటన చేస్తూ పాలకుల మార్పులో భాగంగా మిలిటరీ తిరుగుబాటుకు తమ మద్దతు వుంటుందని ప్రకటించింది. గూఢచార సంస్ద సిఐఏ సంగతి సరేసరి. అధికారులను ప్రలోభాలకు గురిచేయటం, బ్లాక్‌మెయిల్‌ చేయటం, అనేక పుకార్లను వ్యాపింపచేయటంలో తన పని తాను చేస్తున్నది.

లాటిన్‌ అమెరికాలో పచ్చి నియంతలను నిస్సిగ్గుగా సమర్ధించిన అమెరికా నిర్వాకాన్ని అక్కడి జనం అంత తేలికగా మరచిపోతారనుకుంటే వారి చైతన్యాన్ని తక్కువగా అంచనా వేయటమే. నియంతలకు వ్యతిరేకంగా పోరాడి అధికారానికి వచ్చిన వామపక్ష శక్తులు నయావుదారవాద విధానాల పునాదుల మీద సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపి గతకొన్ని సంవత్సరాలుగా ప్రజాభిమానం పొందారు. అయితే అది దీర్ఘకాలం సాగదని, దోపిడీ సంబంధాలను తెంచివేసి ప్రత్నామ్నాయ విధానాలను అమలు జరిపినపుడే జనం మద్దతు వుంటుందని స్పష్టమైంది. కొన్ని చోట్ల వామపక్ష ప్రభుత్వాల మీద తలెత్తిన అసంతృప్తితో జనం అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల మితవాద, ఫాసిస్టు శక్తులను గద్దెనెక్కించారు. అచిర కాలంలోనే వాటి విధానాల మీద జనం వీధులకు ఎక్కుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి నిరంతరం కబుర్లు చెప్పే అమెరికా, కెనడా వంటి దేశాలు, అమెరికా దేశాల సంస్ధ వెనెజులా లేదా మరొక చోట మిలిటరీ చర్యలు, మిలిటరీ తిరుగుబాట్లను ప్రోత్సహించి సమర్ధించుకోవటం అంత తేలిక కాదు. అయితే వైరుధ్యాలు ముదిరినపుడు సామ్రాజ్యవాదులకు మీన మేషాల లెక్కింపు, ఎలాంటి తటపటాయింపులు వుండవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

క్యూబా సేంద్రీయ సాగు ప్రాధాన్యత, పరిమితులు !

19 Saturday Jan 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Agriculture, cuba organic agriculture, cuba organic agriculture importance and limitations, organic agriculture

Image result for cuba organic agriculture

ఎం కోటేశ్వరరావు

చమురు నుంచి తయారయ్యే రసాయనాలు అందుబాటులో వున్నప్పటికీ అవి లేకుండా వ్యవసాయం చేస్తున్నారా ? అవి లేకుండా వ్యవసాయాన్ని మీరు ఎంచుకుంటారా ? అని హవానా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను అమెరికాకు చెందిన వ్యవసాయ పరిశోధకులు, విద్యార్దులు, రైతులతో కూడిన 13 మంది బృందం అడిగిన ప్రశ్న. హవానా శాస్త్రవేత్తలు సేంద్రీయ వ్యవసాయ రంగంలో తాము కనిపెట్టిన అంశాలను అమెరికన్లకు వివరించిన తరువాత వేసిన ప్రశ్న ఇది. ఆ బృందంలోని ముగ్గురు రైతులు తప్ప మిగతావారికి నిరంతర వ్యవసాయ అధ్యయనం ప్రధానం. ఆ బృందానికి ఆతిధ్యం ఇచ్చిన క్యూబన్లకు జీవన్మరణ సమస్య. అప్పటికే సోవియట్‌ కూలిపోయి పది సంవత్సరాలు గడుస్తున్నది. ఆ కాలాన్ని ప్రత్యేకమైనదిగా పిలిచారు. కోటీ పదిలక్షల మంది జనాభాకు ఆకస్మికంగా చమురు లభ్యత నిలిచిపోయింది. వ్యవసాయం రంగంతో సహా వాటితో నడిచే యంత్రాలన్నీ మూతబడ్డాయి. చేతిలో పంచదార తప్ప ఆహార పదార్ధాలను కొనుగోలు చేసేందుకు డబ్బు లేదు. మరొక దేశం నుంచి గతంలో మాదిరి ఆహారం, ఇతర అవసరాలు వచ్చే స్ధితి లేదు. ఆ నేపధ్యంలోంచే ఆహార సరఫరాకు నిరంతర వ్యవసాయ పద్దతుల పాటింపు ఒక అనివార్య పర్యవసానం. అనేక దేశాలలో ప్రాచుర్యంలో వున్న సేంద్రీయ వ్యవసాయానికి, క్యూబాలో చేస్తున్నదానికి తేడా వుంది. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల దుష్ఫలితాలకు దూరంగా వుండాలన్న ధనిక తరగతి అవసరాల కోసం స్వచ్చమైన వుత్పత్తుల సాగు ఒకటి. దానికి భిన్నంగా రసాయన ఎరువులు, పురుగు మందులు కొనటానికి డబ్బులేని పరిస్ధితుల్లో జనానికి సాధారణ ఆహార సరఫరా కోసం క్యూబా సోషలిస్టు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మరొకటి. ఆ దిశగా అక్కడ సాధించిన విజయం గురించి అనేక మందిలో ఆసక్తి తలెత్తింది. అయినప్పటికీ ఈ విధానం ఎంతో సంక్లిష్టమైనదని మేము చెప్పదలచాము అని ఒకటిన్నర దశాబ్దాల తరువాత అమెరికా బృంద సభ్యుడొకరు క్యూబా వ్యవసాయం గురించి రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. సిద్ధాంత నిబద్దతతో సాధించిన పురోగతిగాక మరేమిటని ప్రశ్నించారు.

నిరంతర అభివృద్ధి సామాజిక పురోగమనానికి తోడ్పడుతుంది. కానీ తమకు అది సాధ్యమే కాదు అవసరం అని కూడా క్యూబన్లు నిరూపించారు. చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికిన చేపలు ఎదురీదుతాయి. ప్రతికూలతలను అధిగమించేందుకు సోషలిస్టు భావజాలం ఎలా వుత్తేజం కలిగిస్తుందో క్యూబాను చూస్తే అర్దం అవుతుంది. విప్లవానికి ముందు, తరువాత కూడా క్యూబా అంటే చెరకు,పంచదారకు మారుపేరు. సోషలిస్టు విప్లవం తరువాత అది సోవియట్‌ సాయంతో చెరకుతో సహా ఇతర పంటలను ఆధునిక యంత్రాల సాయంతో సాగు చేసింది.1991లో సోవియట్‌ కూలిపోయిన తరువాత ఒక్కసారిగా ఆ యంత్రాలన్నీ మూలనపడితే, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కారణం అందరికీ తెలిసిందే, సోవియట్‌ నుంచి సాయంగా అందిన చమురు సరఫరా ఆగిపోయింది, ఎరువులు, పురుగుమందులు లేవు. తిరిగి గుర్రాలతో వ్యవసాయం చేసే స్ధితికి తిరోగమించింది. దానికి తోడు కరవు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు. పంచదారను కొనే వారు లేరు. కనీస అవసరాలను దిగుమతి చేసుకుందామంటే అమెరికా దిగ్బంధం, అంక్షలు. ఈ పరిస్ధితి మరొక విప్లవానికి దారి తీసిందంటే అతిశయోక్తి కాదు. అదే చమురు, యంత్రాలు, పురుగు మందులు, రసాయనిక ఎరువులతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసి జనాల కడుపు నింపటం ఎలా అన్నదే ఆ విప్లవ లక్ష్యం. సోషలిస్టు భావజాలంతో వుత్తేజితులై, దానికి కట్టుబడి వున్న నాయకత్వం, తమ బాటలో జనాన్ని నడిపించిన తీరు క్యూబాలో సేంద్రీయ వ్యవసాయ విప్లవానికి దారితీసింది. దీని అర్ధం క్యూబా సమస్యలన్నింటినీ పరిష్కరించింది అని కాదు. విప్లవానికి ముందు, తరువాత కూడా క్యూబాలో ఆహారధాన్యాల స్వయం సమృద్ధి లేదు. అరవై నుంచి ఎనభై శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఇప్పటికీ విదేశాల మీద ఆధారపడుతున్నప్పటికీ ఆహార రంగంలో గణనీయ పురోగతి సాధించింది.

ముందే చెప్పుకున్నట్లు సోవియట్‌ కూలిపోయిన దగ్గర నుంచి క్యూబాలో ప్రత్యేక పరిస్ధితి ఏర్పడింది. శాంతి సమయంలో ప్రేత్యేక కాలమిది అని కాస్ట్రో వర్ణించారు. పంచదార ఎగుమతులతో విదేశీమారక ద్రవ్యం సంపాదించాలంటే ఎవరినీ కొనుగోలు చేయనివ్వకుండా అమెరికన్‌ ఆంక్షలు. వున్నంతలో పొదుపు చేసి చమురు, ఇతర అవసరాలను దిగుమతి చేసుకొందామంటే డబ్బు లేదు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా చమురు, యంత్రాలు, ఎరువులు, పురుగుమందులు లేకుండా పంటలు పండించే పద్దతులను కనుగొనేందుకు పూనుకున్నారు. అవసరమైన సేంద్రీయ పద్దతుల మీద శాస్త్రవేత్తలు పని చేశారు. భూమి ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే వుంది. సంస్కరణల ఫలితంగా పండించి, పంటలను అమ్ముకొనే హక్కు మాత్రమే జనానికి వుంది. వంద ఎకరాలకు తక్కువగా వున్న కమతాలలో సేంద్రీయ సాగు పద్దతులను ప్రవేశపెట్టి అనేక విజయాలను సాధించారు. దిగుమతులను గణనీయంగా తగ్గించగలిగారు.

సేంద్రీయ వ్యవసాయం ఒక ఎండమావి కాదు, మా దేశ పంచదార కర్మాగారాలలో సగాన్ని మూసివేయటం మా ఆహార స్వయం ఆధారదిశగా వేసి తొలి అడుగు అని వ్యవసాయ పరిశోధకుడు ఫెర్నాండో ఫ్యూన్స్‌ మోంనోజోట్‌ అన్నారు. సోవియట్‌ నుంచి చమురు, ఎరువులు, పురుగు మందులు వచ్చే నావలు ఆకస్మికంగా ఆగిపోయాయి, అవింకేమాత్రం వచ్చే అవకాశం లేదు, మనకు ఈ రసాయనాలన్నీ అవసరమా అని జనం అడగటం ప్రారంభించారు అని ఒక సేంద్రీయ క్షేత్ర యజమాని మిగుయెల్‌ ఏంజెల్‌ సాల్సిని చెప్పారు . ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించింది. వుత్పత్తులను స్ధానికంగా విక్రయించేందుకు అనుమతించింది. సేంద్రీయ పద్దతి జయప్రదం అవుతుందనే హామీ లేకపోయినప్పటికీ, నెమ్మదిగా జరిగినప్పటికీ ఆర్ధిక వ్యవస్ధ మెరుగైంది. మంత్లీ రివ్యూ అనే పత్రిక జరిపిన ఒక అధ్యయనంలో తేలిన అంశాల ప్రకారం 1988-2007 మధ్య కాలంలో పురుగుమందుల వినియోగం 72శాతం తగ్గింది, కూరగాయల వుత్పత్తి 145శాతం పెరిగింది. ఫ్రెంచి వ్యవసాయ శాస్త్రవేత్త రెనె డ్యూమోంట్‌ తగిన యాజమాన్య పద్దతులతో క్యూబా ప్రస్తుతం వున్న జనాభాకంటే ఐదు రెట్ల మందికి తగిన విధంగా తిండిపెట్టగలదు అన్నారు. 2010లో తన జనానికి అది కడుపునింపే స్ధితిలో లేదు, అది వినియోగించే ఆహారంలో 80శాతం దిగుమతి చేసుకొనేది, దానిలో 35శాతం అమెరికా నుంచి వచ్చేది. అన్నింటికి మించి క్యూబాలోని సగం భూమి వ్యవసాయానికి పనికి రానిది లేదా వృధాగా వుంది.

నియంత బాటిస్టా, అంతకు ముందున్న పాలకుల హయాంలో సారవంతమైన భూమిని చెరకుసాగుకు వుపయోగించారు. పంచదారను అమెరికా, ఇతర దేశాలకు ఎగుమతి చేశారు.ఆరుదశాబ్దాల క్రితం విప్లవం తరువాత ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అనివార్య పరిస్ధితులలో అంతకు ముందు మాదిరే పంచదారను తయారు చేసి అమెరికా బదులు సోవియట్‌, ఇతర దాని మిత్ర దేశాలకు ఎగుమతి చేశారు. సోవియట్‌ కూలిపోయిన తరువాత 1990-94 మధ్య వ్యవసాయ వుత్పత్తి గణనీయంగా పడిపోయింది. పెద్ద క్షేత్రాలలో యంత్రాలతో వ్యవసాయం చేసే స్ధితి లేదు. చిన్న రైతాంగం వాటిని నిర్వహించలేరు. అమెరికా దిగ్బంధం మరింత పెరిగింది. ఆహార వినియోగం తగ్గి సగటున ప్రతి ఒక్కరు పది కిలోల వరకు బరువు తగ్గారు. ఈ పూర్వరంగంలో ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ క్షేత్రాల యాజమాన్య పద్దతులను మార్చింది. స్వతంత్ర సహకార క్షేత్రాలతో పాటు ప్రయివేటు క్షేత్రాలను కూడా అనుమతించింది. స్వతంత్ర వ్యవసాయ క్షేత్రాలు వేటిని వుత్పత్తి చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చింది. అయితే వుత్పత్తులను నిర్ణీత ధరలకు ప్రభుత్వానికి విక్రయించాల్సి వుంటుంది. ఇప్పుడు 70శాతం మేరకు ప్రయివేటు క్షేత్రాలలో వుత్పత్తి అవుతోంది. వుత్పత్తిలో 80శాతం ప్రభుత్వానికి, మిగిలినదానిని ప్రయివేటుగా విక్రయించుకోవచ్చు. ఇటీవల చేసిన మార్పుల ప్రకారం 35లక్షల ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కమతాలుగా విభజించి వుచితంగా రైతులకు కౌలుకు ఇచ్చారు. దానిని వారి వారసులకు బదలాయించే వీలు కల్పించారు. స్ధానిక కమిటీలకు వుత్పత్తి విషయాలలో స్వయంప్రతిపత్తి, అధికారాలను ఎక్కువగా కల్పించారు. ప్రయివేటు సహకార సంస్ధలు కూడా ఇప్పుడు ఆహారపంపిణీలో భాగస్వాములు కావచ్చు. ఇన్ని చేసినప్పటికీ దేశంలో ఆహార సమస్య వుంది.

వుష్ణమండల పర్యావరణంలో తెగుళ్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఇతర వ్యాధులు ఎక్కువే.భూ సారం, మంచినీటి నిర్వహణ కూడా అంతతేలిక కాదు. చిన్న, పెద్ద పట్టణ ప్రాంతాలలో అందుబాటులో వున్న ప్రతి నేలలో సేంద్రీయ పద్దతిలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు.గణనీయ భాగం ఇక్కడ వుత్పత్తి అవుతోంది. ఒకే పంటకు బదులు బహుళ పంటల సాగును ప్రోత్సహించారు. పంటలు ఆరోగ్యంగా పెరిగేందుకు సహజ పద్దతులను అనుసరించారు. పరపరాగ సంపర్కాన్ని జరిపే కీటకాలను ఆకర్షించేందుకు బంతిపూలను వినియోగించారు.నత్రజని వున్న బీన్స్‌ను సేంద్రియ ఎరువుగా వుపయోగించారు. హానికారక క్రిమి, కీటకాలను దూరంగా వుంచేందుకు మిత్ర కీటకాలను ప్రయోగించారు. పోషక పదార్ధాలున్న కంపోస్టును పెద్ద ఎత్తున తయారు చేశారు. 1988లో వినియోగించిన రసాయనాలలో నాలుగోవంతుతోనే 2007లో మరింత ఆహారాన్ని వుత్పత్తి చేయటం నిజమైన వ్యవసాయ విజయమే. గత కొద్ది సంవత్సరాలలో మారిన పరిస్ధితులలో వెనెజులా రసాయన ఎరువులను పంపుతోంది. దాంతో సేంద్రీయ వ్యవసాయం ఎందుకు అనే అభిప్రాయం కూడా కొంత మందిలో తలెత్తింది. వాటితో పని లేకుండానే గణనీయ విజయాలు సాధించినపుడు తిరిగి వెనుకటి కాలానికి వెళ్లటం ఎందుకు అనేవారు కూడా గణనీయంగా వున్నారు. ప్రభుత్వ వుద్యోగాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పట్టణ ప్రాంతాలలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువగా వుండటంతో అనేక మంది వుద్యోగాలకు రాజీనామా చేసి వ్యవసాయానికి పూనుకున్నారు.

Image result for cuba organic agriculture

సేంద్రియ వ్యవసాయ పద్దతి క్యూబన్ల కడుపు నింపుతుందా అన్నది ఒక ప్రశ్న. గత్యంతరం లేని స్ధితిలో ఏటికి ఎదురీదినట్లుగా సోషలిస్టు చైతన్యంతో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జనం సేంద్రీయ పద్దతుల్లో చిన్నతరహా కమతాలలో సాగు చేస్తూ అనేక దేశాలకు తమ అనుభవాలను పంచుతున్నారంటే అతిశయోక్తి కాదు. అనేక మందికి చెరకు తోటలు, పంచదార ఫ్యాక్టరీల్లో పని చేయటం తప్ప మరొకటి రాదు అలాంటి వారు నేడు ఇతర వుత్పాదక రంగంలో భాగస్వాములు అవుతున్నారు. క్యూబా ప్రస్తుతం మొక్క జన్నలను బ్రెజిల్‌, బియ్యాన్ని వియత్నాం, రొట్టెలను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. పట్టణాలలో పెరటి తోటలు, ఇండ్లపైన కోళ్ల పెంపకం వంటివి గతంలో వుండేవి. ఇప్పుడు పాడుపడిన పట్ణణ, పంచదార ఫ్యాక్టరీల ప్రాంతాలలో కూరగాయలు, పండ్లవంటి వాటిని ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ సాగు చేస్తున్నారు. క్యూబాను సందర్శించే పర్యాటకులకు కొన్ని చోట్ల అవి దర్శనీయ స్ధలాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు. తాము సాధించిన విజయాల గురించి క్యూబన్లు అతిశయోక్తులు చెప్పుకోవటం లేదు. ‘ సేంద్రీయ వ్యవసాయం పెద్ద మొత్తాలలో దిగుబడులు సాధించటానికి తోడ్పడదు, మా సమస్యలన్నింటినీ పరిష్కరించదు, కానీ అనేక సమస్యలను అది పరిష్కరించింది. అసలు ఆ పద్దతిని ప్రారంభించటమే ప్రాధాన్యత సంతరించుకుంది. దడాలున తగిలిన దెబ్బ వాస్తవం నుంచి తేరుకొనేందుకు పర్యావరణ వ్యవసాయ సాగు తలెత్తింది.సోవియట్‌ కూలిపోవటమే ఆ వాస్తవం, ఆ రోజులు ఎంతో కష్టమైనవి, ఏదో విధంగా ఎక్కడో ఒక చోట ఆహారాన్ని వుత్పత్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది ‘ అని వ్యవసాయ శాఖ అధికారి జాన్‌ జోస్‌ లియోన్‌ చెప్పారు. సేంద్రీయ సాగు అంటే పాటించాల్సిన ప్రమాణాలేమిటో తెలియదు, స్ధానికంగా పండిన దానిని సాగు చేయటమే సోషలిస్టు క్యూబా భవిష్యత్‌ అవసరం అని కొందరు భావిస్తే మరి కొందరు పుదీనా వంటి అమెరికా, ఐరోపా మార్కెట్లకు అవసరమైనవి సాగు చేసే అవకాశంగా కొందరు భావించారు. మొత్తంగా సాగు మీద ఆసక్తిని కలిగించటంలో ప్రభుత్వం జయప్రదమైంది. ప్రభుత్వం కేటాయించిన భూమిలో సేంద్రీయ వ్యవసాయమే చేయాలి, ఫలానా పంటలనే పండించాలనే నిబంధనలేమీ పెట్టలేదు. స్ధానిక వ్యవసాయ పద్దతులను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది, ప్రభుత్వ మార్గదర్శనం, సంస్ధాగత నియంత్రణ, సోషలిస్టు చైతన్యంతో పాటు ఈ కార్యక్రమానికి సానుభూతిపరులైన విదేశీయుల సాయం కూడా తీసుకున్నారు. కెనడా, ఐరోపా యూనియన్‌కు చెందిన అనేక ధార్మిక సంస్ధలు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చాయి. ఈ కార్యక్రమం, సహకారంలో భాగంగా సేంద్రియ సాగు మెళకువలు, నాణ్యమైన విత్తనాల అందచేత, వుత్పిత్తి విక్రయాలకు కొనుగోలుదార్లతో సంబంధాలను ఏర్పాటు చేయటం వంటి అంశాలున్నాయి.

సాధించిన విజయాలతో పాటు సేంద్రియ సాగుతో క్యూబన్‌ రైతులు సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఆశించిన స్ధాయిలో ఆహార వుత్పత్తి పెరగటం లేదు. దిగుబడులు తక్కువగా వుంటున్నాయి. దశాబ్దం క్రితం నామ మాత్రంగా వున్న వుత్పత్తి ఇప్పుడు మొత్తం వుత్పత్తిలో 20శాతం వరకు సేంద్రియ సాగు వాటా వుంది. ‘విదేశాల్లో వున్నవారు నిరంతర వ్యవసాయం సాగించే ఒక స్వర్గంగా మమ్మల్ని చూస్తున్నారు. మేము అలా అనుకోవటం లేదు. ఒక చెడు వ్యవసాయ పద్దతి నుంచి బయటపడుతూ అంతకంటే మెరుగైన దానిని అనుసరిస్తున్నాము అని హవానా జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేస్తున్న మైకేల్‌ మార్కెవెజ్‌ వ్యాఖ్యానించాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా, చైనా, చైనా – రెచ్చగొట్టిన అమెరికా నూతన రక్షణ మంత్రి

04 Friday Jan 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

china china china, Message to Compatriots in Taiwan., patrick shanahan, Taiwan, Taiwan independence, US provocation, Xi Jinping

Image result for china china china patrick shanahan

ఎం కోటేశ్వరరావు

జనవరి రెండవ తేదీన ప్రపంచంలో జరిగిన పరిణామాలలో రెండు ఆసక్తికరంగా వున్నాయి. ఒకటి అమెరికా రక్షణశాఖ తాత్కాలిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే పాట్రిక్‌ షహనాహన్‌ పెంటగన్‌ అధికారులతో మాట్లాడుతూ మనం ఒకవైపు సిరియా, ఆఫ్ఘనిస్తాన్లలో ఇస్లామిక్‌ తీవ్రవాదులతో పోరాడుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో కేంద్రీకరించాల్సింది చైనా, చైనా, చైనా అని వ్యాఖ్యానించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని మీడియా సంస్ధలు అదే శీర్షికతో వార్తలను ఇచ్చాయి. దానికి కొద్ది సేపటి ముందే చైనా రాజధాని బీజింగ్‌లో మాట్లాడిన దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. తోటి తైవాన్‌ సోదరులకు ఒక విన్నపం అంటూ 1979లో చైనా చేసిన ప్రకటన 40వ వార్షికోత్సవం సందర్భంగా రెండు ప్రాంతాల మధ్య ఇంతకాలం నెలకొన్న స్ధిరమైన సంబంధాల దశ నుంచి పునరేకీకరణకు చొరవ చూపాల్సిన సమయమాసన్నమైందని చెప్పారు. బలవంతంగా విలీనం చేసుకొనేందుకు తమకు అవకాశం వున్నా శాంతియుత పద్దతులకే ప్రాధాన్యత ఇస్తామని జింపింగ్‌ చెప్పారు. నిజానికి ఇది తైవాన్‌ కంటే అమెరికాకు చేసిన హెచ్చరికగానే తీసుకోవాల్సి వుంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న వుద్రిక్తతలకు ఇది ఒక సూచికగా కూడా చెప్పవచ్చు.

ఏడు దశాబ్దాల క్రితం చైనాలో విప్లవం జయప్రదమై కమ్యూనిస్టులు అధికారానికి వచ్చే సమయానికి తైవాన్‌ అనే రాష్ట్రం, కమ్యూనిస్టుల ఆధీనంలోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ దాదాపు రెండున్నర కోట్ల మంది జనం వున్నారు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంగా వున్న హాంకాంగ్‌ బ్రిటీష్‌ వారి కౌలు కింద, మకావో దీవులు పోర్చుగీసు కౌలు కింద వున్నాయి. చుట్టూ సామ్రాజ్యవాదుల కుట్రలు. ఇంటా బయటి శత్రువుల కుట్రలను అధిగమించి ప్రధాన భూభాగం చైనాలో కమ్యూనిస్టులు నిలదొక్కుకోవటానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది.ఈలోగా జరిగిన అనేక పరిణామాల పర్యవసానంగా తైవాన్‌ విలీనం సంక్లిష్టంగా మారింది. కొత్త సమస్యలను ముందుకు తెచ్చింది.

చైనా సంస్కరణలతోపాటు కమ్యూనిస్టు చైనా ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించి, తైవాన్‌కు సాంకేతికంగా గుర్తింపు రద్దు చేసి కూడా 40సంవత్సరాలు గడిచాయి. 1978 డిసెంబరు 15న తాము చైనాను గుర్తిస్తున్నట్లు, తైవాన్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం 1979 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఆ రోజు నుంచి తైవాన్‌ సంబంధాల చట్టం పేరుతో అమెరికా తైవాన్‌తో నూతన సంబంధాలకు కూడా నాలుగు దశాబ్దాలు నిండాయి. ఆ చట్టం ప్రకారం అమెరికా ఒక దేశాన్ని అధికారికంగా గుర్తించినపుడు ఎలాంటి సంబంధాలుంటాయో ఒక్క రాయబారకార్యాలయం, రాయబారి నియామకం తప్ప ఆయుధాల విక్రయంతో సహా మిగిలినవన్నీ అనధికారికంగా కొనసాగుతాయి. అందుకుగాను తైవాన్‌లో అమెరికన్‌ సంస్ధ పేరుతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకాలం ఆధునిక ఆయుధాలు, విమానాలు, జలాంతర్గాములతో సహా అన్నింటినీ తైవాన్‌కు విక్రయించిన అమెరికా గతేడాది తైవాన్‌లో జోక్యానికి ప్రాతిపదికవేసుకుంది. తైపే లోని అమెరికన్‌ సంస్ద రక్షణకు మెరైన్‌ దళాలను పంపాలని అమెరికా విదేశాంగశాఖ ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరింది. అంతకు ముందు తొలిసారిగా 2017లో రెండు యుద్ధనౌకలను తైవాన్‌ జలసంధిలోకి అమెరికా తరలించింది. మరోసారి జెట్‌ యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా పూనుకుంది. ఈ పూర్వరంగంలో గ్జీ జింపింగ్‌ ప్రకటన, హెచ్చరికలను చూడాల్సి వుంది.

1949లో చైనాలో మావో జెడాంగ్‌ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలుఐక్యరాజ్యసమితి కూడా నిరాకరించింది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ మూడు దశాబ్దాల పాటు అసలైన చైనాగా కొనసాగింది. అయితే 1960 దశకంలో సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్ధాంతిక విబేధాలు తలెత్తిన నేపధ్యం, విదేశీ పెట్టుబడులు అవసరమని చైనా నాయకత్వం భావించిన తరుణంలో ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్‌లో ప్రవేశానికి అవకాశాలు వచ్చాయని అంచనా వేసిన అమెరికా పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వత్తిడి మేరకు 1970దశకం రెండవ అర్ధభాగంలో కమ్యూనిస్టు చైనాతో సయోధ్యకు అమెరికా సిద్దపడింది. రాజకీయంగా సోవియట్‌ మీద వత్తిడి పెంచే లక్ష్యం కూడా దాగి వుండటంతో అమెరికా నేతలు చైనాకు దారితీశారు. పరస్పరం లాభదాయకమని గుర్తించి 1979 జనవరి ఒకటి నుంచి దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకే చైనాను సాంకేతికంగా గుర్తించినప్పటికీ తైవాన్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేంత వరకు, తైవాన్‌ పౌరులు ఆమోదించే వరకు తైవాన్‌పై చైనా సార్వభౌమత్వాన్ని గుర్తించటం లేదని, యథాతధ స్ధితిని మార్చేందుకు తైవాన్‌ లేదా చైనా ప్రయత్నించకూడదని, చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే తైవాన్‌కు మద్దతు ఇస్తామని తన చట్టంలో రాసుకుంది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో అవాంఛనీయ జోక్యమే అని ఆ చట్టం మీద చైనా వ్యాఖ్యానించింది.

అంతర్భాగమైన తైవాన్‌ దీవులను విలీనం చేసుకొనే అవకాశం వున్నప్పటికీ చైనా తన అధికారాన్ని వుపయోగించలేదు. దీనికి వివిధ అంశాలు దోహదం చేశాయి. 1949లో చైనా పాలకుడిగా వున్న చాంగ్‌కై షేక్‌ తైవాన్‌కు పారిపోతూ తనతో పాటు మొత్తం బంగారు నిల్వలను త్రిదళాలకు చెందిన ఇరవైలక్షల మంది సైనికులను కూడా తరలించాడు. అంతర్యుద్ధ సమయంలో బర్మా సరిహద్దులతో సహా అనేక చోట్ల నిధుల కోసం నల్లమందు సాగును ప్రోత్సహించి పెద్ద మొత్తంలో నిధులు పోగేశాడు. దాదాపు పన్నెండువేల మంది సైనికులు బర్మా సరిహద్దు ప్రాంతాలలో తిష్టవేసి అమెరికా సాయంతో 1954వరకు తిరుగుబాట్లు చేయించాడు. చైనా అధికారం తనదే అని ప్రకటించుకున్నాడు. తైవాన్‌ను సైనిక పరంగా విలీనం చేసుకొనేందుకు మావో నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో 1950లో వుత్తర కొరియాపై అమెరికా నాయకత్వంలోని సేనలు దక్షిణ కొరియా రక్షణ పేరుతో దాడులకు దిగాయి. వుత్తర కొరియాను కాపాడుకొనేందుకు నాటి సోవియట్‌ యూనియన్‌, చైనా తన సైనికబలగాలను ఇటువైపు మళ్లించాల్సి వచ్చింది. దాంతో తైవాన్‌ విలీనం వాయిదా పడింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా అండతో నాడున్న బలాబలాల్లో చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని ప్రభుత్వాన్నే అధికారికమైనదిగా గుర్తింపును కొనసాగించారు. తరువాత అమెరికన్లు తైవాన్‌ను ఒక బలీయమైన సైనికశక్తిగా నాటి నుంచి నేటి వరకు తయారు చేస్తూనే వున్నారు.

తైవాన్‌ వెన్నుదన్నుగా అమెరికా వున్న పూర్వరంగంలో దాన్ని ఎదిరించి తైవాన్‌ను విలీనం చేసుకోగలిగిన శక్తి చైనాకు ఇటీవలి వరకు లేదన్న విశ్లేషకుల అంచనా వాస్తవానికి దగ్గరగా వుంది. ఇప్పుడు అజెండా, మార్గాన్ని నిర్దేశించే శక్తి వచ్చినట్లు గ్జీ ప్రకటనను బట్టి భావిస్తున్నారు.హాంకాంగ్‌లో 1992లో పాక్షిక అధికారాలు కలిగిన చైనా-తైవాన్‌ ప్రతినిధులు జరిపిన సమావేశంలో చైనా అంటే ఒక్కటే అనే ఒక ఏకాభిప్రాయం వ్యక్తమైంది. రెండు ప్రాంతాల మధ్య సంబంధాల పునరుద్దరణకు నాంది పలికింది. అయితే దానిని గుర్తించేందుకు తైవాన్‌లోని డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ నిరాకరిస్తోంది. భిన్న భాష్యాలు చెబుతోంది. చైనా ఒక్కటే, అవిభక్త దేశానికి ఏకైక ప్రతినిధి పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(పిఆర్‌సి), ఒకే దేశంలో రెండు వ్యవస్ధలు, విలీనం శాంతియుతంగా జరగాలి, తప్పని సరి అయితే బలప్రయోగం తప్పదు అన్నది బీజింగ్‌ భాష్యం. తైవాన్‌ కేంద్రంగా వున్న డెమోక్రటిక్‌ పార్టీ, మరికొందరి భాష్యం ప్రకారం చైనా ఒక్కటే, దాని అసలైన ప్రతినిధి రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(ఆర్‌ఓసి), జలసంధికి రెండువైపులా వున్న ఒకే దేశం. రెండు ముక్కలూ సార్వభౌమత్వం కలిగినవే. రెండు దేశాలూ సంప్రదించుకోవచ్చు. విలీనానికి బల ప్రయోగం జరపబోమని మేము వాగ్దానం చేయటం లేదు, అన్ని రకాల అవసరమైన పద్దతులను కలిగి వుంటాం. తైవాన్‌ స్వాతంత్య్రం అనేది చరిత్ర ధోరణికి వ్యతిరేకం, మరొక మార్గం లేని చోటుకు అది తీసుకుపోతుంది. శాంతియుత విలీనం తరువాత తైవాన్‌ సోదరుల సామాజిక వ్యవస్ధను జీవన విధానాన్ని పూర్తిగా గౌరవిస్తాం, ప్రయివేటు ఆస్ధులు, మతవిశ్వాసాలను, న్యాయమైన హక్కులు, ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తాం అని జనవరి రెండవ తేదీన గ్జీ స్పష్టం చేశారు. గతేడాది జరిగిన స్ధానిక ఎన్నికలలో 1992ఏకాభిప్రాయాన్ని గుర్తించని, వ్యతిరేకించే డిపిపి, కొమింటాంగ్‌ పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాధారణ ఎన్నికలు 2020లో జరగనున్నాయి. హాంకాంగ్‌, మకావూల విలీనం సమయంలో అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధలను 2049 డిసెంబరు 31వరకు కొనసాగిస్తామని చైనా ప్రభుత్వం పేర్కొన్నది.ఇదే అంశాన్ని తైవాన్‌కు కూడా వర్తింప చేస్తామన్నదే గ్జీ తాజా సందేశ అంతరార్ధం.

Image result for angry  patrick shanahan

చైనా పట్ల కఠిన వైఖరిని తీసుకోవాలనే వైఖరి కలిగిన షహనాహన్‌ పెంటగన్‌లో మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించదు. బస్తీమే సవాల్‌ అంటూ చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగిన డోనాల్డ్‌ ట్రంప్‌కు సై అంటే సై అనే రక్షణ మంత్రి తోడయ్యాడు. 2018 జాతీయ రక్షణ వ్యూహం పేరుతో పెంటగన్‌ రూపొందించిన పత్రంలో వ్యూహాత్మక పోటీదారు చైనా అని పేర్కొన్నారు. చైనా, రష్యాల నుంచి తలెత్తుతున్న ముప్పులు అగ్రభాగాన వున్నాయని, వారినియంత్రత్వ వైఖరులకు అనుగుణ్యంగా ప్రపంచాన్ని మలచాలని, పెంటగన్‌ ప్రాధాన్యతల్లో వాటిని ప్రధానమైనవిగా చేర్చాలని పేర్కొన్నారు. అమెరికా రక్షణ ఖర్చులో సింహభాగాన్ని పొందుతున్న ఐదు అగ్రశ్రేణి ఆయుధ కంపెనీల్లో ఒకటైన బోయింగ్‌లో మూడు దశాబ్దాలపాటు వున్నత అధికారిగా షహనాహన్‌ పని చేశాడు. సిరియా నుంచి సేనల వుపసంహరణ ప్రకటనకు నిరసనగా రక్షణ మంత్రి మాటిస్‌ రాజీనామా చేసిన తరువాత వుప మంత్రిగా వున్న షహనాహన్‌ తాత్కాలిక మంత్రిగా వుంటారని ప్రకటించిన రోజే ట్రంప్‌ సర్కార్‌ బోయింగ్‌ నుంచి యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అతగాడిని వుప మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారని వచ్చిన వార్తల గురించి సెనెట్‌ కమిటీ అధ్యక్షుడిగా వున్న జాన్‌ మెకెయిన్‌ వ్యాఖ్యానిస్తూ కోళ్ల గూటిలో నక్కను పెడతారని అనుకోవటం లేదన్నాడు.

షహనాహన్‌ మాటలను బట్టి రానున్న రోజుల్లో ఒకవైపు వాణిజ్య యుద్ధంతో పాటు మిలిటరీ రీత్యా మరింతగా చైనాపై కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వున్న బలాబలాను బట్టి అమెరికాను అతిక్రమించే శక్తి చైనాకు లేదు. అయితే అమెరికా అలాంటి దుస్సాహసానికి ఒడిగడితే తగిన మూల్యం చెల్లించే విధంగా ప్రతిఘటించే శక్తి చైనా సంతరించుకుంది. అమెరికా ఖండాంతర అణు క్షిపణులతో సమానమైన డాంగ్‌ఫెంగ్‌ 41క్షిపణి చైనా అమ్ములపొదిలో 2017లో చేరింది. అణుయుద్ధమే సంభవిస్తే విజేతలంటూ ఎవరూ వుండరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ నోట మరో పచ్చి అబద్దం !

01 Tuesday Jan 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

another big lie from Donald Trump, Donald trump, donald trump motormouth, policing the world, U.S. Military Bases Worldwide, US World Police Cap

Image result for donald trump , us world police

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే ! అమెరికా పాలకవర్గమూ అలాంటిదే ! వారికి యుద్ధమూ లాభమే, పోరు నిలిపివేతా లబ్ది చేకూర్చేదే అయితే దేనికైనా సిద్ధపడతారు ! అది ఆసియా ఖండమా, ఐరోపానా అన్నదానితో నిమిత్తం లేదు ! అందుకు డెమోక్రాట్లు- రిపబ్లికన్లూ అన్న తేడా లేదు ! అవసరమైతే పార్లమెంటులో రెండు పార్టీలు కలసి ఎవరు అధ్యక్షుడిగా వున్నా అడ్డుకుంటాయి లేదా మద్దతు ఇస్తాయి ! ఆ రెండు పార్టీల మధ్య తగాదా అధికారం దగ్గర తప్ప కార్పొరేట్ల ప్రయోజనాల గురించి కాదు. తమ లక్ష్యాన్ని చేరుకొనేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలు, అనుసరించాల్సిన మార్గాల మీద తప్ప లక్ష్యం మార్పు రద్దు గురించి కాదు. అమెరికా రాజకీయాలు, విధానాలను నిర్ణయించేది అక్కడి గుత్త సంస్ధలు తప్ప సామాన్యులు కాదు. రాజకీయ నేతలు వాటి తోలుబమ్మలే. అందుకే వారు ఎలా ఆడిస్తే అలా ఆడతారు. అమెరికా ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అన్నింటా అగ్రస్ధానం తమదే అనే దాని ఆటలు సాగటం లేదు. అదిరింపు, బెదిరింపు, బుజ్జగింపు, లాలింపు, తప్పదనుకుంటే రాజీ ఇదీ ఇప్పటి దాని స్ధితి. ఇలా చెప్పటం అంటే అమెరికా పని అయిపోయిందని కాదు. అగ్రరాజ్యానికి కూడా అనువుగాని పరిస్ధితులు ఎదురైనపుడు సింహం కూడా ఒకడుగు వెనక్కు వేయకత తప్పదు. ఏమిటా పరిస్ధితి, ఎందుకీ పరిణామాలు !

సిరియా నుంచి పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సగం మంది సైనికులను వుపసంహరించనున్నట్లు ట్రంప్‌ సంచలన ప్రకటన, దానికి నిరసనగా దేశ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ రాజీనామా, ఆ తరువాత మెక్సికో సరిహద్దులో గోడకు నిధుల కేటాయింపుపై పార్లమెంట్‌లో వ్యతిరేకత, అది ప్రభుత్వ స్ధంభనకు దారితీత, ఇది కొనసాగుతుండగానే ఆకస్మికంగా ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరంలో తిష్టవేసిన అమెరికన్‌ దళాల వద్దకు వెళ్లి ఇంకేమాత్రం అమెరికా ప్రపంచ పోలీసుగా వుండబోదని ఒక ప్రకటన. ఇవన్నీ పక్షం రోజుల్లో వరుసగా జరిగిన పరిణామాలు. అమెరికా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సంక్షోభం, సమస్యల తీవ్రతకు ప్రతిబింబాలు. ఒక వారంలో ఒకదాన్ని సంచలనాంశంగా మారిస్తే మరో వారంలో మరో అంశాన్ని ముందుకు తెస్తున్న ట్రంప్‌ తీరుతెన్నులు ప్రపంచానికి పజిల్‌గా వుంటున్నాయి. ఒక ప్రకటన చేయటం దాని మీద స్పందనలు ఎలా వుంటాయో చూడటం, దానికి అనుగుణ్యంగా తదుపరి చర్యలు. వీటిలో ప్రపంచ పోలీసుగా అమెరికా పాత్ర గురించి వివరంగా పరిశీలించుదాం. చరిత్రలో తొలి ప్రపంచ పోలీసుగా బ్రిటన్‌ వ్యవహరిస్తే తదుపరి ఆ పాత్రను అమెరికా పోషిస్తోంది. కర్రవున్నవాడిదే గొర్రె అన్నట్లుగా ప్రపంచంపై పెత్తనం కోసం తమకు తాముగా కర్రపెత్తనం చలాయించటం తప్ప ఈ దేశాలకు ఎవరూ ఆ బాధ్యతను అప్పగించలేదు. ఆ పాత్రలో తామింక వుండలేమని ట్రంప్‌ చెప్పటం వెనుక పరమార్ధం ఏమిటి?

రేపటి నుంచి మిమ్మల్ని తినబోనని పులి చెబితే మేకలు నమ్ముతాయా, ట్రంప్‌ మారుమనస్సు పుచ్చుకున్నాడా ? ఎందుకింత పెద్ద అబద్దం చెప్పాడు. అమెరికా సమాజానికి ఇది ఒక ప్రజాకర్షక అంశంగా తయారైంది. అందుకే ఇటీవలి కాలంలో ఎవరు అధికారంలో వున్నా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాల్సివస్తోంది. ప్రపంచ పోలీసు పాత్రలో వుండాలనుకోవటం లేదు అన్న మాటలు కాదు, కొనసాగింపు అంశం ముఖ్యం. ‘ భారం మొత్తం మేమే భరించటం సముచితం కాదు. మమ్మల్ని, నిస్సందేహమైన మా మిలిటరీని తమ రక్షణకు వుపయోగించుకోవాలని ఇతర దేశాలు చూడటాన్ని ఇంకేమాత్రం మేము కోరుకోవటం లేదు.’ అన్నాడు.ప్రస్తుత స్ధాయిలో అమెరికా మిలిటరీ ఖర్చు వెర్రి తప్ప మరొకటి కాదు, అదుపులేని ఆయుధపోటీగా మారినందున అర్ధవంతమైన ముగింపు పలకాలి, ఒక రోజు తాను, చైనా, రష్యా నాయకులు దీని గురించి చర్చ ప్రారంభించకతప్పదు అని గతంలో ట్రంప్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు.జనాభాలో సగం, జిడిపిలో పదోవంతు కలిగిన పొరుగుదేశం వుత్తర కారియానుంచి రక్షణ కోసం దక్షిణ కొరియాను అమెరికా ఎందుకు కాపాడాలి. అమెరికా కంటే రష్యాకు మరింతదగ్గరగా వుంది జర్మనీ, తూర్పు నుంచి (రష్యా) నుంచి వస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అది జిడిపిలో ఒక శాతం కూడా ఖర్చు చేయటం లేదు వాటికోసం అమెరికా ఎందుకు ఖర్చు చేయాలి అని కూడా ప్రశ్నించాడు. గత కొద్ది సంవత్సరాలుగా తమ మిలిటరీ రక్షణ పొందాలని చూసే దేశాలు అందుకయ్యే ఖర్చులో అధికభాగం భరించాలని అమెరికా సందర్భం వచ్చినపుడల్లా చెబుతోంది, వత్తిడి తెస్తోంది. దక్షిణ కొరియాలో ఏటా మూడున్నర బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి తమ సైన్యాన్ని అక్కడ ఎందుకు కొనసాగించాలని ట్రంప్‌ గతేడాది ప్రశ్నించాడు. మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా వుండాలంటే కొనసాగించక తప్పదని సిరియానుంచి సైనిక దళాల వుపసంహరణను వ్యతిరేకిస్తూ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మాటిస్‌ స్పష్టం చేశాడు. ఇస్లామిక్‌ తీవ్రవాదులను అణచే పేరుతో సిరియాలో ఏటా 15, ఆఫ్ఘనిస్తాన్‌లో 45 బిలియన్‌ డాలర్లను ఏటా అమెరికా ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చు చేసి సాధించేదేమిటి? అనే ప్రశ్నకు పాలకులు సూటిగా సమాధానం చెప్పే స్ధితిలో లేరు.

పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల విశ్లేషణ, అవగాహన ప్రకారం ఒక దేశ రక్షణ ఖర్చు కంటే అప్పుల చెల్లింపు ఎక్కువైన దేశాలు కుప్పకూలిపోతాయి. గతంలో కమ్యూనిజాన్ని, తరువాత ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని అణచే పేరుతో లేదా వాటి నుంచి దేశాలను రక్షించే సాకుతో ప్రపంచ వ్యాపితంగా అమెరికా తన సేనలను మోహరించింది. ప్రత్యక్షంగా ఆయా దేశాల గడ్డమీద లేదా ఏ క్షణంలో అయినా జోక్యం చేసుకొనేందుకు వీలుగా సమీప ప్రాంతాలలో వేసిన తిష్టవలన గానీ 150 దేశాల్లో అమెరికా సైన్యాలు వున్నట్లు లెక్క. ప్రస్తుతం అమెరికా జాతీయ రుణ భారం 21లక్షల కోట్ల డాలర్లు.2012లో ఫెడరల్‌ లోటు బడ్జెట్‌ లక్ష కోట్లు దాటగా 2018లో 779 బిలియన్‌ డాలర్లుంది.2020 నాటికి ఐదుశాతం రక్షణతో సహా ప్రతి శాఖ కోత విధించాలని ట్రంప్‌ కోరాడు. రుణ చెల్లింపులు రక్షణ ఖర్చుకంటే ఎక్కువైన కారణంగానే రోమన్‌ సామ్రాజ్యం, సోవియట్‌ యూనియన్‌ దివాలా తీశాయని, అమెరికా ఇప్పుడు దానికి దగ్గరగా వస్తోందని హార్వర్లు ప్రొఫెసర్‌ నియాల్‌ ఫెర్గూసన్‌ హెచ్చరించాడు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా సైనిక కేంద్రాలు వివిధ ప్రాంతాలు, సముద్రాలలో ఐరోపాలో 330, ఆసియాలో 210, మధ్య ప్రాచ్యంలో 73, లాటిన్‌ అమెరికాలో 71, పసిఫిక్‌లో 66, ఆఫ్రికాలో 24,కెనడా లేదా గ్రీన్‌లాండ్‌లో నాలుగు, అట్లాంటిక్‌లో రెండు చొప్పున మొత్తం 750 వున్నాయి.

ఇటీవల పార్లమెంట్‌ బడ్జెట్‌ కార్యాలయం(సిబిఓ) తెలిపిన సమాచారం ప్రకారం 2018లో జాతీయ అప్పు మీద చెల్లించిన వడ్డీ 371బిలియన్‌ డాలర్లు, ఇది రక్షణ బడ్జెట్‌లో సగం. ప్రస్తుత బడ్జెట్‌ పోకడలను బట్టి ఐదు సంవత్సరాలలో రక్షణ కంటే వడ్డీ చెల్లింపులకు కేటాయించాల్సిన మొత్తం పెరగనుంది. పది సంవత్సరాలలో వడ్డీ,సామాజిక భద్రత వంటి పధకాలకు పన్ను వసూళ్లలో 85శాతం ఖర్చు అవుతుందని, జిడిపిలో 2018లో 3.1శాతంగా వున్న రక్షణ బడ్జెట్‌ 2028నాటికి 2.6శాతానికి తగ్గనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఐరోపాలోని ధనిక దేశాల రక్షణ ఖర్చు గణనీయంగా పెరగనుంది. వడ్డీ రేట్ల పెరుగుదల అంచనా కంటే వేగంగా వుంటే ఇంకా ముందే ఏడాదికి వడ్డీ చెల్లింపులు 900బిలియన్‌ డాలర్లకు చేరి రక్షణ ఖర్చును మించి పోవచ్చు. చైనా, ఐరోపా యూనియన్‌ దేశాల రక్షణ ఖర్చు జిడిపిలో రెండుశాతానికి చేరితే త్వరలోనే అమెరికాతో సమం కావచ్చు. ఇప్పుడున్న తీరు తెన్నులను బట్టి 2035నాటికి చైనా, ఐరోపా యూనియన్‌లు అమెరికాను అధిగమించనున్నాయి.

సామ్రాజ్యం అంటే వలసలు లేదా అధీన రాజ్యాలు కలిగి వుండటం అన్నది సాంప్రదాయ అర్ధం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆ పరిస్ధితి అంతరించింది కనుక ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ఎన్ని సైనిక కేంద్రాలు, ఎందరు సైనికులున్నారన్నది సామ్రాజ్యవాదానికి తాత్పర్యంగా చెప్పవచ్చు.దీనికి ముందే చెప్పుకున్న సైనిక కేంద్రాలే నిదర్శనం. చమురు రవాణా సక్రమంగా జరిగేందుకు నావల ప్రయాణించే మార్గాలు, పైపులైన్ల రక్షణ మొదలు అనేక వ్యూహాత్మక అవసరాలకు అమెరికా ఈ కేంద్రాలను, సైన్యాన్ని వినియోగిస్తున్నది. వీటికి ఏటా 156 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతున్నది. సాంప్రదాయక సామ్రాజ్యవాదం అది బ్రిటన్‌ లేదా ఫ్రెంచి, డచ్‌, పోర్చుగీసు, స్పెయిన్‌ ఏదైనా కావచ్చు, వందల సంవత్సరాలు వలస దేశాలలో తిష్టవేసి ప్రధానంగా వాటిని తమ పరిశ్రమలకు ముడివస్తువులను సరఫరా చేసే దేశాలుగానూ, పారిశ్రామిక వస్తువులకు మార్కెట్లగానూ వినియోగించుకున్నాయి. కానీ అమెరికా సామ్రాజ్యవాదం వీటితో పాటు అంతకు ముందు లేని కమ్యూనిజం వ్యాప్తి నిరోధం, కమ్యూనిస్టు దేశాల అణచివేతను కూడా జోడించి వివిధ ప్రాంతాలలో కుట్రలకు తెరలేపింది, నియంతలను బలపరిచింది, యుద్ధాలను, వాటికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తూ ఆర్ధికంగా లబ్దిపొందుతున్నది. ఈ కారణంగానే మిలిటరీ పారిశ్రామిక కార్పొరేట్‌లు అవతరించాయి.వుదాహరణకు మనకందరకు తెలిసిన బోయింగ్‌ కంపెనీ ప్రయాణీకుల విమానాలతో పాటు యుద్ధ జెట్‌ విమానాలతో పాటు అనేక మారణాయుధాలను కూడా తయారు చేస్తున్నది. అవి నిత్యం పని చేస్తూ వుండాలంటే ప్రపంచంలో నిత్యం ఏదో ఒక మూల ఒక దేశం మరొక దేశంతో కొట్లాడుకోవాలి లేకపోతే అమెరికాయే ప్రత్యక్షంగా ఎక్కడో ఒక చోట దాడులకు తెగబడుతూ వుండాలి. రక్షణ ఒప్పందాలు, ముప్పు పేరుతో అనేక దేశాలను తన గుప్పెటలోకి తెచ్చుకొని నిరంత ఆయుధ విక్రయాలతో దోపిడీ సాగిస్తున్నది. అలాంటి దేశం తెల్లవారేసరి తాను ప్రపంచ పోలీసు పాత్రనుంచి తప్పుకోవాలను కుంటుందా ? తన ఆయుధ పరిశ్రమలను మూసివేసుకుంటుందా ? లాభాలను వదులుకుంటుందా ?

Image result for donald trump on us world police cartoons

విదేశాలలోని సైనిక స్ధావరాలలో అమెరికా లక్షన్నర మంది సైనికులను మోహరించింది. నిజానికి పాతికేండ్ల క్రితం ప్రచ్చన్న యుద్ధంలో విజయం సాధించామని, కమ్యూనిజం అంతరించిందని చెప్పిన అమెరికా విదేశాల్లోని సగం సైనిక కేంద్రాలనైనా తక్షణమే మూసి వుండాల్సింది. కానీ కేంద్రాల సంఖ్యతో పాటు సైనికులను మోహరించిన దేశాల సంఖ్య కూడా 40 నుంచి 80కి పెరిగింది.సహజంగానే ఖర్చు కూడా తడిచి మోపెడు అవుతుంది. ఈ ఖర్చు ఎంతో నిజానికి బయటి ప్రపంచానికి తెలియదు. విదేశీ స్ధావరాల వార్షిక ఖర్చు ఎంత అని పార్లమెంట్‌ కోరితే 21 లేదా 22 బిలియన్‌ డాలర్లని పేర్కొన్నారు. అయితే దీన్నెవరూ నమ్మటం లేదు, ఏడాదికి కనీసం 250 బిలియన్‌ డాలర్లని కొందరి అంచనా. పైకి చెప్పకపోయినప్పటికీ జపాన్‌లో 113, దక్షిణ కొరియాలోని 83 సైనిక కేంద్రాలు నిజానికి ఏక్షణంలో అయినా చైనా లేదా రష్యాతో యుద్ధానికి తలపడే సన్నద్దతతో గత ఏడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. దీని వలన సామాన్యజనానికి భారం తప్ప వారికి ఒరుగుతున్నదేమీ లేదు. ఆయుధ పరిశ్రమలకు నిరంతరం లాభాలు వస్తున్నాయి.నిరంతరం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అమెరికా 33 అప్రజాస్వామిక దేశాలలో సైనిక కేంద్రాలను నడుపుతున్నదని ఒక మాజీ అధికారి పేర్కొన్నాడు. ఇవే కాదు సైనిక స్ధావరం వున్న ప్రతి దేశం అమెరికా ఆయుధాలు, వస్తువులకు అవి మార్కెట్లుగా వున్నాయని వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే ట్రంప్‌ మరో పచ్చి అబద్దం ఆడాడని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 3 : చైనా లక్షణాలతో సోషలిజం అంటే ఏమిటి !

24 Monday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ 1 Comment

Tags

china communist party, china reforms, Forty years of China Reforms, Socialism with Chinese Character

Image result for forty years china reforms

ఎం కోటేశ్వరరావు

మన దేశంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కమ్యూనిస్టు వుద్యమ సైద్ధాంతిక చర్చలో రష్యా మార్గం, చైనా మార్గం అనే మాటలు వినిపించేవి. సారాన్ని సులభంగా అర్ధం చేసుకొనేందుకు ఆ పదజాలాన్ని వాడినప్పటికీ దేశంలో సోషలిజాన్ని ఎలా తీసుకురావాలి అనేదే ఆ చర్చ. కొందరు మాది చైనా మార్గం మావోయే మా చైర్మన్‌ అనేంత వరకు వెళ్లగా మరికొందరు తమది రష్యా మార్గమన్నారు. వామపక్ష వుద్యమంలో ప్రధాన భాగంగా వున్న సిపిఐ(ఎ) తమది చైనా కాదు రష్యా కాదు భారత మార్గం అని స్పష్టం చేసింది. అంటే ఏ దేశంలో వున్న పరిస్ధితులను బట్టి దానికి అనుగుణ్యంగా విప్లవశక్తుల కార్యాచరణ వుండాలి తప్ప ఏదో ఒక దేశాన్ని అనుసరించటం కాదని చెప్పటమే. అయితే ఆ మార్గం మంచి చెడ్డలు, అనుసరిస్తున్న ఎత్తుగడలు, విధానాల గురించి ఎవరైనా విమర్శించవచ్చు, విబేధించవచ్చు, చర్చించి పరిపుష్టం చేయవచ్చు అది వారికి వున్న స్వేచ్చ. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తరచూ చేసే వ్యాఖ్యానాలలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద నిర్మాణం, సమాజం వంటి అంశాలుంటాయి.

నిజానికి ఇది సైద్ధాంతిక అవగాహనకు సంబంధించినది. ఆచరణకు రానంత వరకు ఏ కొత్త భావజాలమైనా ఎంతగానో ఆకర్షిస్తుంది, ఆదర్శంగా వుంటుంది. దూరం నుంచి చూస్తే కొండలు ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. వాటి దగ్గరకు వెళ్లి ఎక్కాల్సివచ్చినపుడు ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతాయి. శక్తి రూపాలను మార్చుకున్నట్లుగానే దోపిడీ రూపాలు మారవచ్చు గానీ అనుమతించే వ్యవస్ధలున్న చోట దోపిడీ అంతం కాదు.మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం-ఆచరణకు సంబంధించి శాస్త్రీయమైనది. ఈ సిద్ధాంతాన్ని ఆయా దేశ, కాల పరిస్ధితులకు అన్వయించుకోవాల్సి వుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ విప్లవం ద్వారా అధికారాన్ని పొంది నూతన వ్యవస్ధ నిర్మాణానికి పూనుకుంది. సుదీర్ఘంగా సాగిన విప్లవకాలంలోనూ తరువాత మూడు దశాబ్దాల వరకు మావోఆలోచనా విధానం పేరుతో చైనా పరిస్దితులకు అన్వయించిన అంశాలను అమలు జరిపారు. మావో బతికి వుండగానే వచ్చిన అనుభవాల ప్రాతిపదికగా మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్‌సియావో పింగ్‌ హయాంలో సంస్కరణల విధానాన్ని అనుసరించారు. అప్పటి నుంచి చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అంటున్నారు. నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన చైనా సంస్కరణలు ఇప్పుడు 1980దశకం మాదిరే వుండవు. ఇప్పటి అవసరాలకు తగిన మార్పులు చేర్పులు వుండాలి. జనాభా అవసరాలకు అనుగుణంగా వుపాధి, కనీస అవసరాలు తీరాలంటే ఆర్ధిక వ్యవస్ధ వేగంగా అభివృద్ధి చెందాలి. కమ్యూనిస్టు పార్టీ రాజకీయ అధికారం కింద సోషలిజానికి కట్టుబడి వుంటూనే మార్కెట్‌ సంస్కరణలను అమలు జరిపేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రాజీలు పడ్డారు.

Image result for forty years china reforms

గతంలో ఏ సోషలిస్టు దేశంలోనూ ఇలాంటి ప్రయోగం జరపలేదు. మార్కెట్‌ విధానాలు పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్ధ పద్దతుల్లో లేవు, ప్రణాళికలు పూర్తిగా సోషలిస్టు పద్దతిలోనూ లేవు. చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుంది, భౌతిక సంపద స్ధాయి తక్కువగా వుంది, సోషలిస్టు సమ సమాజం తరువాత కమ్యూనిస్టు సమాజానికి దారి తీయాలంటే ముందు ఆర్ధిక పురోగతి సాధించాలి, దానికి గాను మార్కెట్‌ ఆర్ధిక విధానాలు సాధనమని అధికారానికి వచ్చిన రెండున్నర దశాబ్దాల తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ అవగాహనకు వచ్చింది. నిజానికి చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుందని 1950దశకం చివరిలోనే కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. పరివర్తన దశలో వుత్పాదక శక్తులు బలహీనంగా వున్నాయని ఆర్ధికవేత్తలు హెచ్చరించారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్దలలోనే సోషలిస్టు విప్లవం జయప్రదం అవుతుందన్న మార్క్సిస్టు తత్వవేత్తల అంచనా తప్పింది.పురోగామి వుత్పాదక సంబంధాలు వుత్పత్తిని పెంచుతాయన్న మావో ఆలోచన ఆచరణ రూపం దాల్చలేదు. సోవియట్‌ తరహా ప్రణాళికాబద్ద విధానాలు కూడా జయప్రదం కాలేదు. పెట్టుబడిదారీ విధానంలో లాభాలు వచ్చే వాటికే ప్రాధాన్యత వుంటుంది. సోషలిస్టు వ్యవస్దలో ప్రజల అవసరాలకు వుపయోగపడే వస్తూత్పతికి ప్రాధాన్యత వుంటుంది. ఈ రెండింటినీ మేళవించి అమలు జరిపిన విధానం కారణంగా చైనా శరవేగంతో అభివృద్ది చెందుతోంది.

చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ 1984చేసిన ఒక వుపన్యాసంలోచెప్పిన అంశాలను మననం చేసుకోవటం అవసరం. వాటి సారాంశం ఇలా వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసే నాటికి పాత చైనాను నాశమైన ఆర్ధికవ్యవస్ధను వారసత్వంగా తెచ్చుకున్నాము. పరిశ్రమలు దాదాపు లేవు. సోషలిజాన్ని ఎందుకు ఎంచుకున్నారని కొందరు అడుగుతారు. పెట్టుబడిదారీ విధానం చైనాలోని గందరగోళాన్ని లేదా దారిద్య్రం వెనుకబాటు తనాన్ని తొలగించదు. అందుకే మార్క్సిజానికి, సోషలిస్టు బాటకు కట్టుబడి వున్నామని పదే పదే చెబుతున్నాము. అయితే మార్క్సిజం అంటే మన అర్ధం చైనా పరిస్ధితులకు దానిని అసుసంధానించటం, సోషలిజం అంటే చైనా పరిస్ధితులకు అనుగుణ్యంగా ప్రత్యేకించి చైనా లక్షణాలతో రూపొందించుకోవటం. సోషలిజం, మార్క్సిజం అంటే ఏమిటి ? గతంలో దీని గురించి అంత స్పష్టత లేదు. వుత్పాదకశక్తుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతతో మార్క్సిజం ముడిపడి వుంది. కమ్యూనిజానికి ప్రాధమిక దశ సోషలిజం అని చెప్పాము. ఆ వున్నత దశలో ప్రతి ఒక్కరూ శక్తి కొద్ది పని చేయటం, అవసరం కొద్దీ వినియోగం వుంటుంది. దీనికి వున్నతంగా అభివృద్ధి చెందిన వుత్పాదకశక్తులు,సరిపడా సరకుల తయారీ అవసరం వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసిన తరువాత వుత్పాద శక్తుల అభివృద్ధికి తగిన శ్రద్ధ పెట్టకపోవటం ఒక లోపం. సోషలిజం అంటే దారిద్య్రాన్ని తొలగించటం, బికారితనం సోషలిజం కాదు. పశ్చిమ దేశాలలో పారిశ్రామిక విప్లవం సంభవించినపుడు చైనా తన తలుపులు మూసుకున్న విధానం అనుసరించింది. విప్లవం తరువాత ఇతర దేశాలు చైనాను దిగ్బంధనం కావించాయి. ఈ స్ధితి ఇబ్బందులను కలిగించింది. చైనా జనాభా 80శాతం గ్రామాలలోనే వుంది. వాటి నిలకడమీదనే చైనా స్ధిరత్వం ఆధారపడి వుంది. విదేశీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పద్దతులకు స్వాగతం పలికాము. అవి సోషలిజాన్ని పూర్వపక్షం చేస్తాయా, అవకాశం లేదు, ఎందుకంటే చైనా ఆర్ధిక వ్యవస్ధలో సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ ప్రధాన భాగం.సహజంగానే విదేశీ పెట్టుబడులతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. సానుకూల అంశాలతో పోలిస్తే ప్రతికూల ప్రభావాలు అంత ముఖ్యమైనవి కాదు. మరొక సందర్భంలో మాట్లాడుతూ సోషలిజం-పెట్టుబడిదారీ వ్యవస్ధల మధ్య ప్రణాళికా బద్ద మరియు మార్కెట్‌ శక్తులనేవి అనివార్యమైన విభేదం కాదని చెప్పారు. సోషలిజం అంటే ప్రణాళికా బద్ద ఆర్ధిక వ్యవస్ధ అనే నిర్వచనమేమీ లేదని పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాదిరి ప్రణాళికాబద్ద మరియు మార్కెట్‌ శక్తుల ఆర్దిక వ్యవస్ధ సోషలిజంలో కూడా వుంటుందని రెండు శక్తులు ఆర్దిక వ్యవస్ధలను అదుపు చేస్తాయన్నారు.

ప్రపంచంలో సమసమాజం ఎలా స్ధాపించాలనే విషయంలో తలెత్తిన సైద్ధాంతిక సమస్యలు దోపిడీని ఎలా కొనసాగించాలనే అంశం మీద వ్యక్తం కాలేదు. ఈ కారణంగానే చైనాలో సాధించిన అభివృద్ధిని స్వాగతించేవారు కూడా ప్రస్తుతం అక్కడ పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు, బిలియనీర్లు, ధనికుల సంఖ్యలను చూసి వారెక్కడ విప్లవాన్ని వమ్ము చేస్తారో అని భయపడుతున్నారు. మరోవైపు పెట్టుబడిదారుల్లో చైనా నాయకత్వం గురించి భయ సందేహాలు ఎలా పెరుగుతున్నాయో చూడటం అవసరం. 2018 అక్టోబరు మూడవ తేదీన అమెరికాకు చెందిన న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ‘ఆధునిక చైనాను నిర్మించిన ప్రయివేటు వాణిజ్యాలు, ఇపుడు వెనక్కు నెడుతున్న ప్రభుత్వం ‘ అనే శీర్షికతో ఒక విశ్లేషణ ప్రచురించింది. ప్రయివేటు వాణిజ్యాలను అనుమతించే బీజింగ్‌ అనుజ్ఞార్ధకం గతకొద్ది సంవత్సరాలుగా అల్లుకుపోతూ ముందుకు సాగింది. నియంతృత్వం(పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు చైనా కమ్యూనిస్టు పాలనను అలాగే వర్ణిస్తారు) మరియు స్వేచ్చా మార్కెట్‌ మధ్య దీర్ఘకాలంగా వున్న వుద్రిక్తలు ఇప్పుడు సందిగ్దబిందువు వద్దకు చేరుకున్నాయని చైనాలో కొందరు చెప్పారని వక్కాణించారు. ఆ విశ్లేషణ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

వ్యాఖ్యలు మెళకువతో కూడిన భాష వెనుక నక్కాయి, కానీ చైనా దిశ గురించిన హెచ్చరిక స్పష్టంగా వుంది. సంపదలతో పెరిగేందుకు తనలో భాగం మార్కెట్‌ శక్తులను ఆలింగనం చేసుకొన్నది. పొసగని గళాలతో ఇప్పుడు ప్రయివేటు సంస్ధలను ఖండిస్తున్నది. ఈ దృగ్విషయాన్ని గమనించాల్సివుంది అని మార్కెట్‌ అనుకూల ఆర్ధికవేత్త 88 ఏండ్ల వు జింగాలియన్‌ వ్యక్తం చేసిన అసాధారణ అధికారిక స్వరం చైనా వ్యాపార, ఆర్దికవేత్తలు, చివరికి కొంత మంది ప్రభుత్వ అధికారులలో కూడా పెరుగుతున్న ఆందోళనకు ప్రతిధ్వని. ప్రపంచంలో ఆర్ధికంగా రెండవ స్ధానంలోకి తీసుకుపోయిన స్వేచ్చా మార్కెట్‌, వాణిజ్య అనుకూల విధానాల నుంచి చైనా వెనక్కు తగ్గవచ్చు, గత నాలుగు దశాబ్దాలుగా నియంతృత్వ కమ్యూనిస్టు అదుపు మరియు స్వేచ్చగా తిరిగే పెట్టుబడిదారీ విధానం మధ్య చైనా వూగుతోంది. అక్కడ ఏమైనా జరగవచ్చు, లోలకం తిరిగి ప్రభుత్వంవైపే వూగవచ్చని కొందరికి కనిపిస్తోంది.

ఒకప్పుడు ప్రయివేటు వాణిజ్య సంస్దలు ముందుపీఠీన వున్న చోట పారిశ్రామిక వుత్పత్తి,మరియు లాభాలవృద్ధిలో రోజురోజుకూ ప్రభుత్వ అదుపులోని కంపెనీల వాటా పెరుగుతోంది. ఇంటర్నెట్‌ వ్యాపారం, రియలెస్టేట్‌, వీడియోగేమ్స్‌ను నియంత్రించేందుకు చైనా రంగంలోకి దిగింది. కంపెనీలు పన్నుల పెంపుదల, వుద్యోగులు పొందే లబ్ది ఖర్చును ఎక్కువగా భరించాల్సి రావచ్చు. కొందరు మేథావులు ప్రయివేటు సంస్ధలను పూర్తిగా రద్దు చేయాలని పిలుపులనిస్తున్నారు. అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రయివేటు సంస్ధలకు తమ ప్రభుత్వ మద్దతు వుంటుందని హామీ ఇస్తూ ప్రభుత్వరంగంలోని పెద్ద కంపెనీలకు పూర్తి స్ధాయి మద్దతు ప్రకటించటాన్ని ప్రయివేటు వాణిజ్యాలకు ఇంకచోటు లేదని చెప్పటమే అని అనేక మంది ఆర్ధికవేత్తలు నమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్ధ చైనా నేషనల్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ కేంద్రం ఒకదాని సందర్శన సందర్భంగా గ్జీ మాట్లాడుతూ ‘ ప్రభుత్వ రంగ సంస్ధలు వుండకూడదు, మనకు చిన్న ప్రభుత్వ సంస్ధలే వుండాలి’ అనే ప్రకటనలు తప్పు, ఏకపక్షమైనవి అన్నారు. చైనా అధ్యక్షుడు మిలిటరీ, మీడియా, పౌర సమాజం మీద పూర్తిగా పార్టీ అదుపు వుండాలని కోరతారు. ఇప్పుడు వాణిజ్యం మీద దృష్టి సారిస్తున్నారు. పెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో నేరుగా వాటాలు తీసుకోవటం గురించి పరిశీలిస్తోంది. విదేశీ కంపెనీలతో సహా అన్నింటిలో కమ్యూనిస్టు పార్టీ కమిటీలకు పెద్ద పాత్ర కల్పించేందుకు నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వామపక్ష పండితులు, బ్లాగర్స్‌(వివిధ అంశాల మీద విశ్లేషణలు, అభిప్రాయలు రాసేవారు) ప్రభుత్వ అధికారులు సిద్ధాంతపరమైన, ఆచరణాత్మకమైన మద్దతు తెలియచేస్తున్నారు. ప్రయివేటు యాజమాన్యాలను తొలగించాలని జనవరిలో(2018) బీజింగ్‌లోని రెనిమిన్‌ విశ్వవిద్యాలయ మార్క్సిజం ప్రొఫెసర్‌ జౌ గ్జిన్‌చెంగ్‌ కోరారు. అభివృద్ధి లక్ష్యాన్ని ప్రయివేటు రంగం పూర్తి చేసిందని ఇప్పుడు దానికి స్వస్తి పలకాలంటూ వు గ్జీయపింగ్‌ అనే అంతగా తెలియని బ్లాగర్‌ రాసిన అంశం ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. మానవ వనరులు, సాంఘిక భద్రత వుప మంత్రి క్వి గ్జియపింగ్‌ ప్రయివేటు సంస్ధలలో ప్రజాస్వామిక యాజమాన్య పద్దతులు వుండాలని, యజమానులు-కార్మికులు సంయుక్తంగా వాటిని నడపాలని కోరారు. ప్రభుత్వ చర్యల వలన రుణాలపై ఆధారపడి నడిచే ప్రయివేటు కంపెనీలకు డబ్బు దొరకటం కష్టంగా మారింది, ఇదే సమయంలో ప్రభుత్వ రంగ కంపెనీలకు కొత్త రుణాలు పొందటంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవటం లేదు. ఒకప్పుడు అసలు వూహల్లోకి కూడా రాని వాటిని ఇప్పుడు కొన్ని ప్రయివేటు సంస్దలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఇంతవరకు 46 ప్రయివేటు కంపెనీలు సగానికిపైగా వాటాలను ప్రభుత్వానికి విక్రయించినట్లు వార్తలు వచ్చాయి.చైనా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే సంఖ్య చాలా చిన్నది అయినప్పటికీ ప్రయివేటు కంపెనీలకు వాటాలను విక్రయించే ప్రభుత్వ కంపెనీల రెండు దశాబ్దాల ధోరణికి ఇది వ్యతిరేకం.

Image result for forty years china reforms

కమ్యూనిస్టు పార్టీ ప్రచార విభాగానికి ప్రత్యక్ష పాత్ర కల్పించిన తరువాత కొత్త వీడియో గేమ్స్‌కు అనుమతులు స్ధంభించాయి. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ, వీడియో గేమ్‌ల్లో పేరు ప్రఖ్యాతులున్న టెన్‌సెంట్‌ కంపెనీమార్కెట్‌ విలువ దాదాపు మూడోవంతు పడిపోయింది. కొత్తగా తెచ్చిన చట్ట ప్రకారం ఆన్‌లైన్‌ వ్యాపారం చేసే కంపెనీలు ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి, పన్నులు చెల్లించాలి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో ఒకటైన అలీబాబా గ్రూప్‌ను దెబ్బతీస్తుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ కంపెనీలకు ఇది మంచి సంవత్సరం. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఏడాది తొలి ఏడునెలల్లో ప్రయివేటు కంపెనీలతో పోటీ పడి మూడురెట్లు లాభాలు సాధించాయి. అధిక సామర్ద్యం, కాలుష్యనివారణ చర్యలు ఎక్కువగా ప్రయివేటు కంపెనీల మీద మోపుతున్న ప్రభుత్వ ప్రయత్నాలు కూడా దీనికి కారణం.

చైనా మ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన మార్గంలోనే సంస్కరణలు నడుస్తున్నాయా? లేదూ న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషకుడు చెబుతున్నట్లు ప్రభుత్వ రంగ అదుపులోకి తిరిగి చైనా అర్ధిక వ్యవస్ధ వెళ్ల నుందా? ఎంతకాలం పడుతుంది? వీటిన్నింటి గురించి చైనా వెలుపల కూడా చర్చించవచ్చు. అభిప్రాయాలను వెల్లడించవచ్చు. కోర్టు తీర్పులను విమర్శించవచ్చు గానీ న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు అన్నట్లుగా చైనా కమ్యూనిస్టు నాయకత్వానికి దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారి విధాన మంచి చెడ్డలను సమీక్షించవచ్చు. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం మాదిరి చైనాలో కూడా తప్పిదాలకు పాల్పడితే అనే పెద్ద సందేహం ఎవరికైనా తలెత్తవచ్చు. ఇప్పటికైతే అది వూహాజనిత సమస్య. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు సోషలిజం అనే భావజాలానికి కాలం చెల్లిందని అమెరికా ప్రకటించింది. అదే చోట ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం పనికిరాదు, అది కాలం చెల్లిన సిద్ధాంతం అని నమ్ముతున్నవారు, సోషలిజాన్ని అభిమానిస్తున్నవారు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నారు. సమాజ మార్పుకోరే పురోగామి శక్తులకు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగలవచ్చు గాని చరిత్ర ముందుకే పోతుంది, అంతిమ విజయం వారిదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 2 : అమెరికాకు 69 ఏండ్లు , చైనాలో 18కే సాధ్యమైంది !

23 Sunday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Forty years of China Reforms, Xi Jinping

Related image

ఎం కోటేశ్వరరావు

1929 మాంద్యం ప్రారంభంలో అమెరికా వాస్తవ జిడిపి 1.109 లక్షల కోట్ల డాలర్లు కాగా అది పన్నెండు లక్షల కోట్ల డాలర్లకు చేరేందుకు 69 ఏండ్లు తీసుకుంది. 2017లో 18లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి చేరటానికి 88 సంవత్సరాలు పట్టింది. చైనా జిడిపి 1999లో 1.09లక్షల కోట్ల డాలర్లుగా వున్నది 2017లో 12లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి కేవలం 18 సంవత్సరాలే పట్టింది. అమెరికా ఆర్ధిక చరిత్రలో కనిపించే అనేక ఎగుడుదిగుడులు అది ఎదుర్కొన్న సమస్యలకు నిదర్శనం, అటువంటి పరిస్ధితి చైనా విషయంలో కనపడదు.1952-2017 మధ్య అమెరికాలో తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందున్న జిడిపి కంటే తగ్గగా చైనాలో అటువంటి పరిస్ధితి ఐదు సంవత్సరాలలోనే కనిపించింది. 1978 సంస్కరణల ప్రారంభం తరువాత తిరుగులేకుండా సాగింది. అదే అమెరికాలో 1978 తరువాత ఐదు సంవత్సరాలు తరుగుదల వుంది. వీటిని మొత్తంగా చూసినపుడు అభివృద్ధిరేటులో కొద్ది హెచ్చు తగ్గులు వుండవచ్చుగానీ సంస్కరణల తరువాత చైనా ఎలాంటి పెట్టుబడిదారీ సంక్షోభాలను ఎదుర్కోలేదు.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ వునికిలోకి వచ్చి కొందరి అవగాహన ప్రకారం ఐదు వందల సంవత్సరాలు దాటింది. అమెరికాలో 1817లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రారంభాన్ని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రారంభంగా తీసుకుంటే దానికి రెండువందల సంవత్సరాలు నిండినట్లు. అంత అనుభవం వున్న అమెరికాను, సంస్కరణలు ప్రారంభించిన 50సంవత్సరాల నాటికి జిడిపిలో చైనా అధిగమించగలదని అంచనా వేస్తున్నారు. అయితే జనాభా రీత్యా తలసరి ఆదాయంలో మరికొన్ని దశాబ్దాల పాటు అమెరికాయే అగ్రస్ధానంలో కొనసాగుతుంది. రెండు వందల సంవత్సరాల సుదీర్ఘపెట్టుబడిదారీ విధాన అనుభం తరువాత కూడా ఇంకా అమెరికాలో స్వంత ఇల్లులేని వారు, అద్దె భరించలేక కారుల్లో కాపురాలు చేసే వారున్నారంటే, 140 కోట్ల జనాభా వున్న చైనాలో జనానికి కనీస ప్రాధమిక వసతులు కల్పించటానికి ఎంత వ్యవధి కావాలో చెప్పనవసరం లేదు. కొందరు చెబుతున్నట్లు చైనాలో నిజంగా పెట్టుబడిదారీ విధానమే అమలు జరిపితే ఆ వ్యవస్ధకు సహజంగా వుండే జబ్బులన్నీ రావాలి, రావటం లేదు. సంక్షోభాలు లేకుండా శరవేగంగా అభివృద్ధి చెందటం పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం కాదు. అయితే చైనాలో పెట్టుబడిదారీ విధాన లక్షణాలు లేవా అంటే వున్నాయి.స్టాక్‌ ఎక్సేంజ్‌, ప్రయివేటు పెట్టుబడులు, లాభాలు తీసుకోవటం, ప్రయివేటు కంపెనీలను విస్తరించుకోవటం, బిలియనీర్ల పెరుగుదల వంటివి దాని లక్షణాలే. బలమైన పెట్టుబడిదారులు పెరిగిన తరువాత వారు సోషలిస్టు వ్యవస్దను అనుమతిస్తారా అని కొంత మంది వ్యక్తం చేస్తున్న సందేహాలను తీర్చటం అంతసులభమూ కాదు. తమ జనాభా అవసరాలు తీరాలంటే కొంతకాలం ఆ విధమైన విధానాలు తప్పవని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అధికారికంగానే అది ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానాన్ని 2050వరకు అనుమతిస్తామని ఎన్నడో చెప్పింది. సోషలిజం అంటే దారిద్య్రాన్ని పంచుకోవటం కాదు. పెట్టుబడిదారులను ఆహ్వానించటం, అనుమతించే వైఖరి మీద సందేహాలు కొత్తగా తలెత్తినవి కాదు. నాలుగు దశాబ్దాల నాడే వాటి గురించి చైనా నాయకత్వం చెప్పింది. గాలి కోసం కిటికీలు తెరిచినపుడు చెడుగాలితో పాటు, క్రిమి కీటకాలూ ప్రవేశిస్తాయని తెలుసు, వాటిని ఎలా అదుపు చేయాలో కూడా తమ గమనంలో వున్నదని చెప్పారు. ఈ నేపధ్యంలో అక్కడ అనుసరించిన విధానాలు ఎలా అద్భుతాలను సృష్టించాయో చూద్దాం.

Related image

1980లో చైనా జిడిపి 305బిలియన్‌ డాలర్లు కాగా 2017నాటికి 12.7ట్రిలియన్‌లకు పెరిగింది.(ఒక ట్రిలియన్‌ లక్ష కోట్లు) నాడు కేవలం 21 బిలియన్‌ డాలర్ల విలువగల వుత్పత్తులను ఎగుమతి చేసిన చైనా 2017నాటికి 2.49లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారుగా తయారైంది.1980-2016 మధ్య సగటు అభివృద్ధి రేటు 10.2శాతం.1980లో చైనాకు వచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు లేవు, 2017లో 168 బిలియన్‌ డాలర్లు వచ్చాయి, 2016నాటికి ప్రపంచంలోని వివిధ దేశాలలో చైనా పెట్టుబడులు 216 బిలియన్‌ డాలర్లున్నాయి. ఈ కాలంలో చైనీయుల సగటు జీవిత కాలం 66 నుంచి 76 సంవత్సరాలకు పెరిగింది.22శాతంగా వున్న నిరక్షరాస్యులు 3.2శాతానికి తగ్గారు. చైనా కుటుంబాల వినియోగం 49 బిలియన్‌ డాలర్ల నుంచి 90రెట్లు పెరిగి 2016నాటికి 4.4లక్షల కోట్లకు చేరింది.

సిఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో చైనా 2.16లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేస్తే మనం 299.3బిలియన్‌ డాలర్ల దగ్గర వున్నాం.2016లో మనం 1.15లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్‌ వుత్పత్తి చేస్తే చైనాలో అది 6.14లక్షల కోట్ల యూనిట్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్ధ తెలిపిన వివరాల ప్రకారం 2016లో చైనా 244లక్షల కార్లు, 36లక్షల వాణిజ్య వాహనాలను తయారు చేస్తే మనం 36లక్షల కార్లు, 8.1లక్షల వాణిజ్య వాహనాలను వుత్పత్తి చేశాము. బ్రిక్స్‌ దేశాలలోని వంద అగ్రశ్రేణి కంపెనీలలో చైనాకు చెందినవి 87శాతం ఆదాయం, 85శాతం లాభాలను కలిగి వుండగా మనవి 4,3శాతాలుగా వున్నాయి. రైలు మార్గాల విషయంలో మనకూ చైనాకూ పెద్ద తేడా లేదు. అయితే అక్కడ 22వేల కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు మార్గం వుండగా మన దగ్గర అలాంటిది లేదు. పరిశోధన, అభివృద్దికి జిడిపిలో చైనా 2.1శాతం ఖర్చు చేస్తుండగా మన దగ్గర ఒకశాతానికిలోపుగానే వుంది.2016లో చైనాలో పదిలక్షల 34వేల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. ప్రపంచం మొత్తం మీద ఇవి 42శాతం. మన దేశంలో దాఖలైనవి 45,057 మాత్రమే. మన దేశంలో రోజుకు 24కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మిస్తుండగా చైనాలో 1994-2000 మధ్య రోజుకు 1,200 కిలోమీటర్లునిర్మించారు.

ఇవన్నీ సానుకూల అంశాలైతే సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరగటం ప్రతికూల అంశం.సంస్కరణల ప్రారంభంలో జాతీయ సంపదలో జనాభాలో ఒకశాతంగా వున్న ధనికుల చేతిలో 6.4శాతంగా వున్న దేశ సంపద 2015లో 13.9శాతానికి పెరిగింది. ఏ దేశంలోనూ లేని విధంగా 620 మంది బిలియనీర్లు వున్నారు. పేదలలోని 50శాతం మంది చేతిలో వున్న 26.7శాతం సంపద 14.8శాతానికి తగ్గిపోయింది. దేశంలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ది చెందగా మరికొన్ని దూరంగా వున్నాయి. పట్టణ, గ్రామీణుల మధ్య వ్యత్యాసాలు కూడా వున్నాయి. నలభై సంవత్సరాలలో చైనా జనాభా 96 నుంచి 139 కోట్లకు పెరిగింది. అభివృద్ది క్రమంలో చైనా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలలో పట్టణీకరణ ఒకటి. పట్టణ ప్రాంతాలలో ఆదాయం, సౌకర్యాలు మెరుగ్గా వుండటంతో సహజంగానే యువతీ యువకులు పట్టణ ప్రాంతాలవైపు మొగ్గుచూపుతారు.

Image result for Forty years China Reforms

గత నాలుగు దశాబ్దాలలో 17.9శాతంగా వున్న చైనా పట్టణ జనాభా 58.5శాతానికి పెరిగింది. సంఖ్య రీత్యా 17 కోట్ల నుంచి 81 కోట్లకు పెరిగింది. అక్కడ జరుగుతున్న అభివృద్దికి అనుగుణ్యంగా 1980లో 54.5లక్షల మంది పట్టణాలకు వలస వెళ్లగా 1990నాటికి 65.5లక్షలకు, 1995 నుంచి ఏటా రెండు కోట్ల మందికి చేరింది. ఇటువంటి మార్పు ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు. గ్రామాల నుంచి రోజూ పట్టణాలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే.2025 నాటికి పట్టణ జనాభా వంద కోట్లకు చేరుతుందని అంచనా. అందువలన చైనా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది. ఈ కారణంగానే తమది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చైనా నాయకత్వం చెబుతోంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంతో పాటు అధిగమించాల్సిన సమస్యలు కూడా చైనా తరహాలోనే వున్నాయని వేరే చెప్పనవసరం లేవు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలోనూ, అభివృద్ధి చెందిన అమెరికా ఖండంలోనూ కార్మికవర్గం వున్నప్పటికీ సమస్యల తీరుతెన్నులు ఒకే విధంగా వుండవు. ఒకే విధమైన సోషలిస్టు నిర్మాణం కుదరదు. ప్రతి దేశానికి విప్లవం దాని తరహాలోనే వస్తుందన్నది శాస్త్రీయ మార్క్సిస్టు సూత్రం. అందువలన సోషలిస్టు సమాజ నిర్మాణ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే వుంటాయి. అమెరికా 69 ఏండ్లలో సాధించినదానిని చైనా 18 సంవత్సరాల్లోనే అధిగమించింది.రెండు చోట్లా వున్నది పెట్టుబడిదారీ విధానమే అయితే అంత తేడా ఎందుకున్నట్లు ? భారత్‌ ఎందుకు విఫలమైనట్లు ? అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై అమెరికా టెక్‌ వార్‌లో భారత్‌ ఎటువైపు !

19 Wednesday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

5G, Huawei, us china tech war, US-CHINA TRADE WAR

Image result for  us china tech war

ఎం కోటేశ్వరరావు

మూడు నెలలపాటు వాణిజ్య యుద్ధ దాడులకు విరామం ఇద్దామని అమెరికా-చైనా నిర్ణయించాయి. ఇంతలోనే అమెరికా మరో యుద్దానికి తెరలేపింది. అదే టెక్నాలజీ యుద్ధం. చైనాలోని ప్రముఖ హైటెక్‌ సెల్‌ఫోన్ల తయారీ కంపెనీ హువెయి యజమాని కుమార్తె, కంపెనీ సిఎఫ్‌ఓ మెంగ్‌ వాన్‌జౌ అరెస్టు దానికి నాంది అని కొందరంటుంటే పర్యవసానాలపై గత ఇరవై రోజులుగా అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు కెనడాలో అరెస్టు చేసిన మెంగ్‌ను కోర్టుకు హాజరుపరిచారు. తమను రెచ్చగొట్టే ట్రంప్‌ సర్కార్‌ చర్యమీద చైనా ఇప్పటి వరకు ఎంతో సంయమనంతో వ్యవహరించింది. మెంగ్‌ అరెస్టు అయిన నాటి నుంచి తన కనుసన్నలలో వ్యవహరించే దేశాల మీద అమెరికా వత్తిడి తెస్తోంది. హువెయి కంపెనీ పరికరాలు, ఫోన్లు కొనవద్దని కోరుతోంది. దానిలో భారత్‌ కూడా ఒకటి. ఈ వ్యవహారం నరేంద్రమోడీ సర్కార్‌కు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే చైనాతో వాణిజ్యలోటు కొండలా పెరిగిపోతోంది.మన వస్తువులను మరింతగా కొనుగోలు చేయాలంటూ చైనాతో సర్కారు సంప్రదింపులు జరుపుతోంది. ఆవు పేడను తయారు చేయటం తప్ప మోడీ మేకిన్‌ ఇండియా పధకం ముందుకు సాగటం లేదు. అమెరికా ఆదేశాల మేరకు హువెయి కంపెనీ వుత్పత్తుల కొనుగోలు నిలివి పేస్తే మరొక అగ్రదేశం తయారు చేసే ఐదవ తరం పరికరాల కోసం ఎదురు చూడటం తప్ప మనకు మరొక మార్గం లేదు. అదే చేస్తే చైనాకు ఇప్పుడు మనం చేస్తున్న ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఈ చర్య కారణంగా మరింతగా స్వదేశీయ పరిజ్ఞానం మీద ఆధారపడాలనే కసితో చైనా వ్యవహరించకూడదు అని హాంకాంగ్‌ నుంచి వెలువడే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. చైనాకు ఎదురైన చేదు అనుభవాలంటూ కొన్ని అంశాలను పేర్కొని టెక్నో జాతీయవాదం తెలివితక్కువ తనమని, వాణిజ్యదారులను మూసివేస్తుందని, భద్రతను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మెంగ్‌ అరెస్టుపై నోరు మూసుకొని గత నాలుగు దశాబ్దాలుగా మార్కెట్‌ను తెరిచినట్లుగానే రాబోయే రోజుల్లో కూడా వ్యవహరించకపోతే ఇప్పటి వరకు సాధించిన ప్రగతి దెబ్బతింటుందని పరోక్షంగా బెదిరించిందని చెప్పవచ్చు. ప్రపంచ కార్పొరేట్ల ప్రతినిధి అయిన మీడియా సంస్ధ నుంచి ఇలాంటివి వెలువడటంలో ఆశ్చర్యం లేదు.

డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలోని వాంకోవర్‌లో మెంగ్‌ ఒక విమానం నుంచి మరో విమానంలోకి మారుతున్న సమయంలో కెనడా పోలీసులు ఎలాంటి కారణాలు చూపకుండా అమెరికా వినతి మేరకు అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చర్య ఆమె మానవ హక్కులను హరించటమే అని చైనా పేర్కొనగా, ఆ చర్య కిడ్నాపింగ్‌ తప్ప మరొకటి కాదని చైనా మీడియా వర్ణించింది. అరెస్టులో తమ సర్కార్‌ ప్రమేయం లేదని కొద్ది రోజుల ముందే నోటీసు ఇచ్చామని కెనడా ప్రధాని ట్రడేవ్‌ ఆరు రోజుల తరువాత ప్రకటించారు. కొద్ది నెలల ముందే అరెస్టు వారంటు జారీ చేసినట్లు అమెరికా చెప్పింది. అమెరికా ఆంక్షలను వుల్లంఘిస్తూ ఇరాన్‌తో వ్యాపారం చేసేందుకు హువెయి కంపెనీ స్కైకామ్‌ అనే హాంకాంగ్‌ సంస్ధను అనధికార అనుబంధ సంస్ధగా వుపయోగించుకొని ద్య్రవ్య సంస్ధలను మోసం చేసేందుకు కుట్రపన్నిందని, తమ దేశ భద్రతకు ముప్పు కలిగించేవిగా దాని చర్యలున్నాయని బెయిలు విచారణ సమయంలో అమెరికా చేసిన ఆరోపణలను కెనడా సర్కార్‌ వల్లించింది.అరెస్టయిన పదకొండవ రోజున వాంకోవర్‌లోని ఆమె ఇంటి నుంచి బయటకు పోకుండా షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. ఇదే సమయంలో ఇద్దరు కెనడియన్లను భద్రతా కారణాలతో అరెస్టుచేసినట్లు చైనా అధికారులు ప్రకటించారు. అరెస్టు చేసిన మెంగ్‌ను తమకు అప్పగించాలని అమెరికా కోరింది. ఈ కేసులో 30సంవత్సరాల శిక్షపడే అవకాశం వుంది. అదే జరిగితే అమెరికా-చైనా సంబంధాలు ఏ మలుపులు తిరుగుతాయో చెప్పలేము.

ఇటీవలి కాలంలో హైటెక్‌ వుత్పత్తులలో ఇతర దేశాలకు చైనా కంపెనీలు పోటీ ఇస్తున్నాయి. మనందరికీ తెలిసిన శాంసంగ్‌ కంపెనీ సెల్‌ఫోన్లు, టెలికమ్యూనికేషన్ల పరికరాల తయారీలో మొదటి స్ధానంలో వుండగా చైనా హువెయి కంపెనీ రెండవ స్ధానానికి ఎదిగింది. ఇప్పుడు అది 5జి సాంకేతిక రంగంలో ముందున్నదని, ఒకటవ స్ధానానికి ఎదగ నుందని వార్తలు వచ్చాయి. వ్యాపారంలో తలెత్తిన పోటీయే కంపెనీ సిఎఫ్‌ఓ అరెస్టుకు అసలు కారణమని చెబుతున్నారు. చైనాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్‌ చైనా కంపెనీల పరికరాలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆరోపించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే అమెరికా పౌరులు హువెయి కంపెనీ సెల్‌ఫోన్లు, సంస్ధలు పరికరాలను వాడవద్దనే నిషేధాలను విధించారు. అమెరికా కనుసన్నలలో కెనడా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కూడా నిషేధం విధించాయి.ఈ ఐదు దేశాలకు చెందిన గూఢచార సంస్ధలు ‘ఫైవ్‌ ఐస్‌’ (ఐదు నేత్రాలు) పేరుతో చైనా కంపెనీ పరికరాలలో రహస్య పరికరాలు వున్నట్లు నివేదికలను రూపొందించాయి. జూలై 17న ఐదుగురు గూఢచార అధిపతులతో కెనడా ప్రధాని కెనడాలోని అట్టావాలో ఒక రహస్య సమావేశం నిర్వహించారు. దీనిలో సిఐఏ డైరెక్టర్‌ గినా హాస్పెల్‌, బ్రిటన్‌ ఎం16 అధిపతి మైఖేల్‌ యంగర్‌ పాల్గన్నారు. ఈ సమావేశం గురించి ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ దీన్నొక సాదాసీదా సమావేశంగా వార్తను ప్రచురించింది. ఆ తరువాతే చైనా, రష్యాల మీద పెద్ద ఎత్తున ప్రచార దాడిని ప్రారంభించారు. హువెయి కంపెనీ పరికరాలను కొన వద్దనే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. కంపెనీ అధికారిణి అరెస్టు దానికొనసాగింపు.జపాన్‌ ప్రభుత్వం, మూడు టెలికాం కంపెనీలు కూడా హువెయి పరికరాల కొనుగోలు నిలిపివేసినట్లు ప్రకటించాయి.

Image result for us china tech war cartoons

ప్రపంచంలో అన్ని దేశాలలో గూఢచర్యం జరిపే అమెరికాకు ఇప్పుడు తన నీడను చూస్తే తానే భయపడుతున్నట్లుగా వుంది. తమ అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలు దానిలో భాగమే. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆధునిక పరికరాలతో గూఢచర్యం ఎలా జరపవచ్చో అమెరికాకు వేరొకరు చెప్పనవసరం లేదు. అవే అస్త్రాలతను తమ మీద కూడా ప్రయోగిస్తున్నారని అది కంగారు పడుతోంది. ఈ రోజు ప్రతి దేశం తన అవసరాల కోసం, ఇతరుల కుట్రల గురించి జాగ్రత్తలు తీసుకొనేందుకు గూఢచర్యం జరపటం సాధారణ విషయం. దానిలో చైనా, మరొక దేశానికి ఎలాంటి మినహాయింపులు వుండవు. ఇప్పుడు అమెరికాలోని టెలికాం కంపెనీలు ఇబ్బందుల్లో వున్నాయి. స్మార్ట్‌ ఫోన్లను అక్కడ తయారు చేయటం లేదు. చైనా ఫోన్లమీదే అమెరికన్లు ఆధారపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో డెలాయిట్‌ కన్సల్టింగ్‌ విడుదల చేసిన ఒక నివేదికలో ఐదవ తరం(5జి) నెట్‌వర్క్‌ ఏర్పాటు పరుగులో అమెరికా మీద చైనా విజయం సాధించనున్నది.అమెరికా వెంటనే రంగంలోకి దిగకపోతే భవిష్యత్‌లో నూతన కంపెనీల ఏర్పాటులో తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించింది. ఈ రంగంలో ముందున్న వారికి వెనుకబడినవారితో పోల్చితే ఎంతో ఆర్ధిక ప్రయోజనం వుంటుందని కూడా వ్యాఖ్యానించింది. ఇంకా అనేక కంపెనీలు ఇలాంటి హెచ్చరికలనే చేశాయి.

రెండుసార్లు సిఐఏ తాత్కాలిక డైరెక్టర్‌గా పని చేసిన మైఖేల్‌ మోరెల్‌ వాషింగ్టన్‌ పోస్టుకు రాసిన వ్యాఖ్యానంలో ఇది వాణిజ్య యుద్దం కాదు, సాంకేతిక యుద్ధం, ఐదవతరం పోటీలో మైలు దూరంలో అమెరికా వెనుకంజలో ఓడిపోతోందని మరింత స్పష్టంగా పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్షుడు తరచుగా వాణిజ్య యుద్ధం గురించి చెబుతాడు, నిజానికి అమెరికా సాంకేతికపరమైన ప్రచ్చన్న యుద్దం చేస్తోంది. ఐదవతరం నెట్‌వర్క్‌లతో గతంలో ఎన్నటి కంటే వేగంగా ఎక్కువ సమాచారాన్ని సేకరించవచ్చు, ఈ నెట్‌వర్క్‌ల ద్వారా గూఢచర్యమే కాదు, విద్రోహానికి కూడా పాల్పడవచ్చు, ఈ రంగంలో పై చేయి సాధించిన వారు ఆర్ధికంగా ముందుంటారు, తమ రహస్యాలను పదిలపరుచుకోవటంతో పాటు ఇతరుల వాటిని తెలుసుకోవటంలో ముందుంటారు. వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్నపుడు అమెరికా ఆందోళనపడక తప్పదని హెచ్చరించాడు.

ఐదవతరం ఇంటర్నెట్‌ సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన, అభివృద్దిలో హువెయి కంపెనీ ఏటా 14బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తూ అమెరికా కంటే ముందున్నది. చైనా మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరిచిన సమయంలో అమెరికాకు చెందిన మైక్రోసాప్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఐఫోన్‌ వంటి సంస్దలు తమ పరికరాల ద్వారా పెద్ద ఎత్తున చైనా గూఢచర్యానికి పాల్పడ్డాయి. నిజానికి అమెరికన్లు అన్ని దేశాలలో అలాంటి చర్యలకు పాల్పడ్డారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఫోన్‌ వర్తమానాలను దొంగిలించారు. చైనా అధ్యక్షుడు ప్రయాణించే బోయింగ్‌ 737 విమానంలో అమర్చిన రహస్య పరికరాన్ని చైనీయులు తొలగించారు. అమెరికా పరికరాలనే వుపయోగించి ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికా రహస్య సమాచారాన్నే పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. చైనా తమ పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్నదంటూ పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే ఐదవ తరం పరిజ్ఞానంలో అమెరికా ఎందుకు వెనుకబడిపోయినట్లు? చైనాలో పరిశోధనలు చేయకుండా అది ముందుకు ఎలా పోయినట్లు ? నిజానికిది ప్రచార దాడి తప్ప ఒకసారి తస్కరించినట్లు తేలితే ఏ దేశమైనా జాగ్రత్తలు తీసుకోకుండా వుంటుందా ?

Image result for  us china tech war

గతేడాది అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగింది. మేడిన్‌ చైనా 2025 పేరుతో అది కొన్ని లక్ష్యాలను దేశం ముందుంచింది. దాని కొనసాగింపుగానే అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అనేక చర్యలను చేపట్టారు. అన్ని రంగాలలో సాంకేతిక పరంగా పై చేయి సాధించాలన్నదే ఆ లక్ష్యాల, చర్యల సారాంశం. అది యుద్ధ ప్రాతిపదిక మీద అమలు జరుగుతోందా సాదాసీదాగా జరుగుతోందా అంటే గత నాలుగు దశాబ్దాల చైనా అభివృద్ధిని చూసినపుడు వారు ఏ లక్ష్యాన్ని సాదాసీదాగా అమలు జరపలేదు. నిర్ణీత వ్యవధిలో లక్ష్యాన్ని చేరేందుకు ప్రతి అంశంలోనూ యుద్ధం మాదిరి పని చేశారు. గతంలో సూపర్‌ కంప్యూటర్లంటే అమెరికా తప్ప మరొకపేరు వినపడేది కాదు. గత రెండు దశాబ్దాల్లో పరిస్ధితి మారిపోయింది. టాప్‌ 500 పేరుతో ఒక సంస్ధ రూపొందించిన సమాచారం ప్రకారం ప్రపంచంలోని 500 వేగవంతమైన కంప్యూటర్లలో 206 చైనా వద్ద, 124 అమెరికా వద్ద వున్నాయి. నాలుగు అగ్రశ్రేణి కంప్యూటర్లలో రెండు చైనా వద్ద వున్నాయి, ఇటీవలనే అమెరికా మూడవదానిని రూపొందించి మొదటి స్దానం తిరిగి పొందింది. పోటీలో నువ్వానేనా అన్నట్లుగా అమెరికా-చైనా వున్నాయి. మైక్రోచిప్స్‌ విషయంలో చైనా ఎంతో వెనుకబడి వుంది. అమెరికా పది తయారు చేస్తే చైనాలో ఒకటి మాత్రమే వుత్పత్తి అవుతోంది. 2025నాటికి అమెరికాతో ఢీకొనేందుకు చైనా 30బిలియన్‌ డాలర్లు కేటాయించింది.ప్రపంచమంతా ఇపుడు కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతోంది. 2030నాటికి ప్రపంచంలో అగ్రస్ధానంలో వుండేందుకు చైనా 150బిలియన్‌ డాలర్లను కేటాయించి పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ఈ పరిజ్ఞానం రెండంచుల పదును కలది అటు మానవ కల్యాణానికి, వినాశకరమైన మిలిటరీ అవసరాలకు రెండింటికీ వినియోగపడుతుంది. ఐదవ తరం టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటులో అమెరికా ఇంకా ఆలోచనలోనే వుండగా చైనా దూసుకుపోయి కీలకమైన సాంకేతిక ప్రమాణాలను ప్రపంచం ముందుంచింది. మిగతా ప్రపంచం చైనాను అసుసరించటం తప్ప మేం కూడా వచ్చేంతవరకు మీరు ముందుకు పోవటానికి వీల్లేదంటే కుదరదు. క్వాంటమ్‌ కంప్యూటర్‌ తయారీకి ఇప్పుడు అగ్రరాజ్యాలు పోటీపడుతున్నాయి. దానిలో కూడా చైనా వెనుకబడి లేదు. ఇప్పటికే పది బిలియన్‌ డాలర్లతో పని ప్రారంభించింది. అదే అమెరికా రానున్న ఐదు సంవత్సరాలలో 1.25 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఖర్చు చేయనున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా దుష్ట స్వభావం గురించి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్ధికవేత్త జెఫ్రీ శాచస్‌ సిబిసి టీవీతో చెప్పిన మాటలతో ఈ విశ్లేషణను ముగిద్దాం.

‘ మెంగ్‌ అరెస్టు మరో ప్రచ్చన్న యుద్దానికి నాంది అవుతుంది, అందుకు అమెరికాను కెనడా ప్రేరేపించింది. ఎట్టి పరిస్ధితుల్లో అయినా చైనా ఎదుగుదలను అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నది.ప్రత్యర్ధి ఆర్ధిక ఎదుగుదలను దెబ్బతీసేందుకు తన అధికారాన్ని వుపయోగించే అమెరికా వైఖరి బాగా తెలిసిందే, ఇది చాలా చెడ్డది, ప్రమాదకరమైంది, వాస్తవానికి ప్రపంచానికి మరొక కొత్త ప్రచ్చన్న యుద్ధాన్ని తెచ్చేది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తప్పుడు లెక్కలతో పత్తి, చెరకు రైతులకు హాని తలపెట్టిన అమెరికా, ఆస్ట్రేలియా !

06 Thursday Dec 2018

Posted by raomk in Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

cotton farmers, cotton subsidies, sugarcane, WTO

Image result for usa, australia stand against india farmers at wto

ఎం కోటేశ్వరరావు

అమెరికా, ఆస్ట్రేలియా వంటి ధనిక దేశాలు దౌత్యపరంగా మనకు మిత్ర దేశాలే. మన యువతీ యువకులు తెల్లారి లేస్తే ఏదో ఒక చోటికి వెళ్లాలని తహతహలాడుతుంటారు. మన పాలకులు అక్కడికి వెళ్లినపుడు, వారు ఇక్కడికి వచ్చినపుడు భారత దేశమా చుట్టుపక్కల 66 దేశాలకు పోతుగడ్డ అన్నట్లుగా మాట్లాడతారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లు, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా ఇంటికొస్తూ మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా తమ దేశాల కార్పొరేట్ల ప్రయోజనాల విషయంలో మనకు ముఖ్యంగా రైతాంగానికి అవి శత్రుదేశాలే. ప్రపంచీకరణ పేరుతో మన పెట్టుబడిదారులు ఇతర దేశాలకు విస్తరించేందుకు, ఇప్పటికే విస్తరించిన బహుళజాతి కంపెనీలతో జత కట్టేందుకు మన పాలకవర్గం ప్రపంచీకరణ పేరుతో వాటికి ప్రాతినిధ్యం వహించే సంస్ధల సలహాలు, ఆదేశాలతో నడుస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పటికే మన పాలకులు ఒక్కొక్క వలువ తీసివేసి చివరకు గోచి మీద నిలబెట్టినట్లు నామ మాత్ర రాయితీలు మిగిల్చాయి. ఇప్పుడు రైతాంగానికి మిగిలిన ఆ గోచిని కూడా తీసేయాల్సిందేనని ధనిక దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయంటే నమ్ముతారా? ఇప్పుడు ఆ పంచాయతీ ప్రపంచ వాణిజ్య సంస్ధలో నడుస్తోంది.

అమెరికాాచైనా మధ్య జూలైలో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం గురించి మాత్రమే మనకు తెలుసు. ఆ యుద్దంలో దెబ్బతినే తన రైతాంగానికి ఇప్పటికే ఇస్తున్న సబ్సిడీలకు తోడు అదనంగా పత్తి, సోయా వంటి అనేక ఎగుమతి పంటలకు 12బిలియన్‌ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించింది అమెరికా. అలాంటి దేశం గతంలో వరి, గోధుమలపై ఇప్పుడు మన మీద పత్తి రాయితీలు పరిమితికి మించి ఇస్తున్నారంటూ కనీస మద్దతు ధరకు ఎసరు పెట్టింది. తప్పుడు లెక్కలతో ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)కు ఫిర్యాదు చేసింది. చెరకు రైతులకు, పంచదార ఎగుమతులకు ఇస్తున్న సబ్సిడీలు తమ రైతాంగాన్ని, మొత్తంగా ప్రపంచ పంచదార మార్కెట్‌ను దెబ్బతీశాయంటూ ఆస్ట్రేలియా కూడా అదే పని చేసింది. ఆ వాదన లేదా మనపై దాడికి ప్రాతిపదిక ఏమిటి? మన దేశంలో వున్న విభిన్న వాతావరణ పరిస్ధితుల కారణంగా అటు వుష్ణ మండల పంటలతో పాటు ఇటు శీతల మండల, సమశీతల మండల ప్రాంతాలలో సాగు చేసే పంటలలో కొన్ని మినహాదాదాపు అన్నింటినీ పండించే అవకాశం వుంది. అందుకే మన దేశాన్ని తన పరిశ్రమలకు ముడిసరకు సరఫరా చేసే ప్రాంతంగా పారిశ్రామిక విప్లవం తరువాత ఐరోపా ధనిక దేశాలు గుర్తించాయి. అందుకే ఆక్రమణ పోటీలో బ్రిటన్‌ది పైచేయి అయింది.మారిన పరిస్ధితుల్లో తమ అన్ని రకాల వ్యాపారాలు, వస్తుమార్కెట్లకు మన దేశం అనువుగా వుంది కనుక, భౌతికంగా ఆక్రమించుకొనే అవకాశం లేదు గనుక మన మార్కెట్‌ను ఆక్రమించుకొనేందుకు, తమకు అనుకూలంగా మన విధానాలను రూపుదిద్దేందుకు పూనుకున్నాయి. అందుకోసం ప్రపంచీకరణ, సరళీకరణ, సంస్కరణలు అంటూ ముద్దుపేర్లను ముందుకు తెచ్చాయి. ప్రస్తుతాంశం వ్యవసాయ సబ్సిడీలు కనుక వాటి గురించి చూద్దాం.

గత రెండు దశాబ్దాలలో మన వ్యవసాయ పెట్టుబడులు కనీసంగా నాలుగింతలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలో వచ్చి జనవరి ఒకటిన 24వ సంవత్సరంలో అడుగిడబోతోంది. ముఫ్పై సంవత్సరాల నాటి లెక్కల ఆధారంగా వర్ధమాన దేశాలకు నిర్ణయించిన పదిశాతం సబ్సిడీ పరిమితిని, వ్యవసాయ వుత్పత్తుల ధరలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు భారత్‌లో సబ్సిడీలు పరిమితికి మించి ఇస్తున్నారని అమెరికా, ఆస్ట్రేలియాలు ఫిర్యాదు చేశాయి. కనీస మద్దతు ధర ఆ నిబంధనను వుల్లంఘించేదిగా వుందని, తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సరే అసలు ఎత్తివేయాలని కూడా మరోవైపు వత్తిడి తెస్తున్నాయనుకోండి. దీన్ని సులభంగా అర్ధం చేసుకోవాలంటే మన దేశంలో వుత్పత్తి అయ్యే మొత్తం పత్తి విలువ వెయ్యికోట్ల రూపాయలు అనుకుందాం. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపాయూనియన్‌ వంటి ధనిక దేశాల వాదన ప్రకారం పత్తి మీద సబ్సిడీ మొత్తం విలువలో పదిశాతం అంటే వంద కోట్ల రూపాయలకు మించి ఇవ్వకూడదు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల వందకోట్ల రూపాయలకు మించకూడదు.(ప్రత్యక్షంగా ఇచ్చే సబ్సిడీ మొత్తాలకు, కనీస మద్దతు ధరల సబ్సిడీ అవగాహనకు వున్న తేడా తెలిసిందే) మిగతా పంటలకూ ఇదే సూత్రం. ప్రపంచ వాణిజ్య సంస్ధ వునికిలోకి రాక ముందు దాని విధి విధానాలను రూపొందించే కసరత్తులో భాగంగా 1986-88 సంవత్సరాలలో ప్రపంచ మార్కెట్లో వున్న సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకొని ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వకూడదని నిర్ణయించారు.

అంకెలతో ఎన్నో గారడీలు చేయవచ్చు. స్వామినాధన్‌ కమిటి సిఫార్సుల ప్రకారం వుత్పాదక ఖర్చుకు అదనంగా సగం కలిపి అంటే 150 గా కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వుత్పాదక ఖర్చులో కొన్నింటిని కలపలేదని మనం విమర్శిస్తున్నాం. అంతకంటే ముందే మన మద్దతు ధరలను వ్యతిరేకిస్తున్న అమెరికా ఏమి చెబుతోందో చూద్దాం. మన గోధుమలు, వరికి ప్రకటిస్తున్న మద్దతు ధర పదిశాతం పరిమితికి మించి 60,70 శాతం వుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేశాడు. గాజు కొంపలో కూర్చొని ఎదుటివారి మీద రాళ్లు వేస్తున్నది అమెరికా. మన దేశం వరికి 60శాతం అదనంగా ఇస్తున్నట్లు యాగీ చేస్తున్న ఆ దేశం తన రైతాంగానికి 82శాతం, ఐరోపా యూనియన్‌ 66శాతం ఇస్తున్నది. ప్రపంచ వాణిజ్య సంస్ధ సూత్రాల ప్రకారం మొత్తం వ్యవసాయ పంటల విలువలో ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతం పరిమితికి సబ్సిడీలు మించకూడదు. అయితే దీన్ని వక్రీకరించి కొన్ని పంటలకు కొన్ని సంవత్సరాలలో విపరీతమైన సబ్సిడీలను ఇచ్చి మొత్తం పంటల విలువకు దాన్ని వర్తింప చేసి ధనిక దేశాలు తప్పించుకుంటున్నాయి. అందుబాటులో వున్న సమాచారం మేరకు కొన్ని సంవత్సరాలలో అమెరికాకు అర్హత వున్న సబ్సిడీ మొత్తం వంద రూపాయలు అనుకుంటే 90రూపాయలను పాలు, పంచదార రైతులకే ఇచ్చింది, అలాగే ఐరోపా యూనియన్‌ 64రూపాయలను గోధుమ, వెన్నకే ఇచ్చింది.

గత ఇరవై ఏండ్లలో ఏడు సంవత్సరాల సమాచారాన్ని చూసినపుడు అమెరికాలో కొన్ని వుత్పత్తులకు వూలు 215, మేక బచ్చుతో చేసే శాలువలకు 141, వరి 82, పత్తి 74, పంచదార 66, కనోలా 61, ఎండు బఠాణీలకు 57శాతం, ఐరోపా యూనియన్‌లో పట్టుపురుగులకు 167, పొగాకు 155, పంచదార 120, కీరా 86, పియర్స్‌ పండ్లకు 82, ఆలివ్‌ ఆయిల్‌ 76, వెన్న 71,ఆపిల్స్‌ 68,పాలపొడి 67,టమాటా 61శాతాల చొప్పున ఇచ్చారు. ఇలా ప్రత్యేకించి ఒక వుత్పత్తికి ఇచ్చిన రాయితీలు సబ్సిడీల పరిధిలో చూపటం లేదు.

మన దేశం 53ా81శాతం మధ్య పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేసిన కొనుగోళ్లను మాత్రమే సబ్సిడీలుగా భారత్‌ చూపుతున్నది.2015ా16లో 120 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ప్రపంచ వాణిజ్య సంస్ధకు భారత్‌ తెలిపిందని అయితే 50,400 కోట్ల రూపాయలు చెల్లించినట్లు అమెరికా ఆరోపించింది. అంటే మొత్తం పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసినట్లు రైతులకు సబ్సిడీ ఇచ్చినట్లు చిత్రించింది. పంచదారను ప్రభుత్వం సేకరించే విధానం లేనప్పటికీ మద్దతు ధర నిర్ణయించటమే సబ్సిడీ చెల్లించటంగా ఆస్ట్రేలియా ఆరోపించింది. తాము నిర్ణయిస్తున్న మద్దతు ధరలను డబ్ల్యుటిఓ ఏర్పాటుకు ముందు 1986ా88 నాటి ధరలతో పోల్చి ఎక్కువగా వుంటున్నట్లు అమెరికా తప్పుడు లెక్కలు వేస్తోందని మన దేశం గతంలోనే సమాధానమిచ్చినా ఖాతరు చేయకుండా ఫిర్యాదు చేశారు. భారత్‌ డాలర్లలో లెక్కలు వేస్తుంటే అమెరికన్లు భారతీయ కరెన్సీలో గుణిస్తున్నారని అందువలన ఇరు దేశాలు చెప్పేదానికి పొంతన వుండదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1990లో ఒక డాలరుకు 18 రూపాయలుండగా ఇప్పుడు 72 తాకింది. అందువలన రూపాయల్లో లెక్కవేసినపుడు నాలుగు రెట్లు ఎక్కువగా కనిపించటం సహజం. భారత, చైనా వంటి దేశాల వ్యవసాయ సబ్సిడీల గురించి అభ్యంతర పెడుతున్న ధనిక దేశాలు తాము ఇస్తున్నవాటి గురించి దాస్తున్నాయి. పలు ఖాతాల ద్వారా అందచేస్తూ వాటిని సబ్సిడీలుగా పరిగణించకుండా జాగ్రత్త పడుతున్నాయి.

అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ 2018 నవంబరులో విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్న అంశాలను గమనించటం అవసరం. కనీస మద్దతు ధరలు, ప్రత్యక్ష వుత్పాదక సబ్సిడీ, బీమా, తదితర రాయితీలన్నింటినీ కలిపి మొత్తంగా పత్తి సబ్సిడీలని పిలుస్తున్నారు.ప్రపంచ వ్యాపితంగా ఇవి 2016-17లో 4.4బిలియన్‌ డాలర్లుండగా 2017-18నాటికి 5.9బిలియన్లకు( ఒక బిలియన్‌ వంద కోట్ల డాలర్లు) 33శాతం పెరిగాయి. ఒక పౌను(453) దూదికి ఇచ్చిన సబ్సిడీ 17 నుంచి 18 సెంట్లకు(నవంబరు 27 విలువ ప్రకారం రు.12.03 నుంచి రు.12.74కు పెరిగాయి) 1997-98 నుంచి ఇప్పటి వరకు వున్న ధోరణుల ప్రకారం పత్తి ధరలు ఎక్కువగా వున్నపుడు సబ్సిడీలు తగ్గటం, తగ్గినపుడు పెరుగుదల వుంది.

పత్తి ధరల విషయానికి వస్తే 2013-14లో సగటున పౌనుకు 91సెంట్లు లభిస్తే 2014-16లో 70కి తగ్గి 2016-17లో 83కు, 2017-18లో 88 సెంట్లకు పెరిగింది.బ్రెజిల్‌,భారత్‌,పాకిస్ధాన్‌ వంటి అనేక దేశాలలో 2017-18లో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్లో ఎక్కువ ధరలు వున్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాలు ఎరువులు, రవాణా, గ్రేడింగ్‌, నిల్వ, ఇతర మార్కెటింగ్‌ ఖర్చులను సబ్సిడీగా ఇచ్చాయి.కొన్ని చోట్ల పంటల బీమా సబ్సిడీ పెరిగింది.1998-2008 మధ్య ప్రత్యక్ష, ఇతర సబ్సిడీల మొత్తం సగటున 55శాతం పెరిగింది, మరుసటి ఏడాది 83శాతానికి చేరింది, 2010-14 మధ్య 48శాతానికి తగ్గింది, తదుపరి రెండు సంవత్సరాలలో సగటున 75శాతానికి పెరిగి తదుపరి రెండు సంవత్సరాలలో 47శాతానికి తగ్గాయి. ఈ పూర్వరంగంలో చూసినపుడు మన దేశం గురించి అమెరికా చేసిన ఫిర్యాదు దురుద్దేశపూరితం, కనీస మద్దతు ధర వంటి కనీస రక్షణ కూడా ఎత్తివేయాలని వత్తిడి చేయటం తప్ప మరొకటి కాదు. చైనా, అమెరికాలలో మాదిరి వివిధ పధకాల కింద ఇస్తున్న రాయితీలు మన పత్తి రైతాంగానికి లేవు. ఎరువులు, పురుగు మందుల ధరల మీద నియంత్రణ ఎత్తివేయటం, పెరిగిన ధరలకు అనుగుణంగా సబ్సిడీ మొత్తాన్ని పెంచకపోవటం వంటి చర్యల కారణంగా పత్తి రైతాంగానికి ఏటే వుత్పాదక ఖర్చు పెరిగిపోతోంది. కనీస మద్దతు ధరకంటే పడిపోయినపుడు రంగంలోకి వస్తున్న సిసిఐ పరిమితంగానే కొనుగోళ్లు చేస్తూ ప్రయివేటు వ్యాపారులకు ఎక్కువగా తోడ్పడుతోంది. అనేక సందర్భాలలో రైతుల పేరుతో వ్యాపారుల నుంచే కొనుగోలు చేసిన కుంభకోణాల గురించి పత్తి రైతాంగానికి తెలిసిందే.

అమెరికా అభ్యంతర పెడుతున్న కనీస మద్దతు ధరల ప్రహసనం ఏమిటో మనకు తెలియంది కాదు. అంతర్జాతీయ పత్తి సలహా సంస్ధ నివేదిక రహస్యమేమీ కాదు. దానిలో మన దేశం గురించి పేర్కొన్న అంశాలు ఇలా వున్నాయి.’ భారత్‌లో కనీస మద్దతు ధర పద్దతి వుంది. 2014-15 మరియు 2015-16 సంవత్సరాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్‌ ధరలు తక్కువగా వున్నందున కొద్ది కాలమైనా ప్రభుత్వం నేరుగా పత్తి కొనుగోలు చేసింది.2016-17,2017-18లో మార్కెట్‌ ధరలు ఎక్కువగా వున్నందున మద్దతు ధరల వ్యవస్ధ కొనుగోలు అవసరం లేకపోయింది. మధ్యరకం పింజ రకమైన జె34 రకానికి 2017-18లో మద్దతు ధరగా క్వింటాలుకు రు.4,020 నిర్ణయించారు. అది పౌను దూది ధర 83సెంట్లకు సమానం. భారత్‌లో పత్తి రైతులు ప్రభుత్వ రుణ మాఫీ మరియు ఎరువుల సబ్సిడీ వలన లబ్ది పొందారు. పంటల బీమా ద్వారా కూడా కొంత మేర మద్దతు ఇచ్చారు. అయితే దీని విలువ ఎంతో తెలియదు. ఇది కాకుండా నాణ్యమైన విత్తనాల వుత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. టెక్నాలజీ మిషన్‌ ద్వారా జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ యూనిట్ల నవీకరణకు, పత్తి మార్కెటింగ్‌కు ఇటీవల తోడ్పడింది. వీటి గురించి బహిరంగంగా తెలిపే సమాచారం లేదు. ఇవి గాకుండా జౌళి రంగానికి ప్రత్యక్ష మద్దతు, చౌక రుణాల ద్వారా కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.’ రుణాల రద్దును, నూలు, వస్త్ర మిల్లులకు ఇస్తున్న రాయితీలను కూడ పత్తి రైతులకు ఇస్తున్న రాయితీగా చిత్రించారు.

చైనా పత్తి రైతులకు ఇస్తున్న రాయితీల గురించి చూద్దాం. 2017-18లో అంతకు ముందు ఏడాది ఇచ్చిన 3.3బిలియన్‌ డాలర్ల సబ్సిడీని 4.3బిలియన్‌ డాలర్లకు పెంచారు(పౌనుకు 30సెంట్లు). ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం దిగుమతి చేసుకోవాల్సిన నిర్దేశిత వంతుకు మించి అదనంగా దిగుమతి చేసుకొనే పత్తి మీద 40శాతం పన్నుతో సహా రైతాంగానికి పలు రక్షణలు కల్పిస్తున్న కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌ ధరకంటే రైతాంగానికి ఎక్కువ గిట్టుబాటు అవుతున్నది. దిగుమతి చేసుకున్న పత్తి ధర, చైనా మిల్లులకు చేరిన ధరకు మధ్య వున్న వ్యత్యాసం రైతులకు నష్టదాయకంగా వుండకుండా చూసేందుకు చెల్లించిన లబ్ది మొత్తం 201-17లో ఒక బిలియన్‌ డాలర్లు వుండగా మరుసటి ఏడాది అది 1.5బిలియన్లకు పెరిగింది. ఇంతేగాకుండా మన దగ్గర కనీస మద్దతు ధర మాదిరిగా ప్రతి ఏటా రైతాంగానికి ఒక లక్షిత ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ ఏడాది మార్కెట్‌లో వచ్చిన సగటు ధరతో దానిని పోల్చి తక్కువ వస్తే ఆ మేరకు రైతులకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తుంది. ఆ మేరకు 2015,16,17 సంవత్సరాలలో చెల్లింపులు చేసింది. 2018 సంవత్సరానికి ఒక టన్నుకు 18,600 యువాన్లుగా నిర్ణయించింది. ఇది పౌనుకు 130 సెంట్లకు సమానం. దాని ప్రకారం అంతకు ముందు సంవత్సరం చెల్లించిన 1.6బిలియన్ల నుంచి 2.1బిలియన్లకు మొత్తాన్ని పెంచింది. అంతే కాదు ప్రతి ఏటా 15క్లో డాలర్ల మేర నాణ్యమైన విత్తన సబ్సిడీ, మరో 15కోట్ల డాలర్లను దూర ప్రాంత రవాణా ఖర్చుల కింద రైతాంగానికి చెల్లించింది. ప్రపంచ వాణిజ్య సంస్ధలో సభ్యత్వం కోసం చైనా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఒక ఏడాదికి 8,94,000 టన్నుల పత్తి దిగుమతి చేసుకుంటే దాని మీద పన్ను ఒక శాతమే విధించాలి. అంతకు మించి దిగుమతులు వుంటే పరిమాణాన్ని బట్టి ఒక శాతం నుంచి 40శాతం వరకు పన్ను విధించవచ్చు. గత మూడు సంవత్సరాలుగా నిర్దేశిత మొత్తం మేరకే దిగుమతులు చేసుకుంటున్నది.

Image result for cotton picking in india

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సిసిఐ) వార్షిక నివేదికలను ఆ సంస్ధ వెబ్‌ సైట్‌లో ఎవరైనా చూడవచ్చు. వాటిలో పేర్కొన్నదాని ప్రకారం 2014-15 సంవత్సరానికి పత్తి కనీస మద్దతు ధర అంతకు ముందు సంవత్సరం కంటే పెంచింది రు.50, ఇది ఒక శాతానికి దగ్గరగా వుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పడిపోయిన కారణంగా ఆ ఏడాది దేశీయ మార్కెట్లో ముడిపత్తి ధరలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 19 నుంచి 30శాతం వరకు, అదే విధంగా దూది ధర 25 నుంచి 30శాతం వరకు పతనమైందని సిసిఐ నివేదిక తెలిపింది. ఇలాంటి సందర్భాలలో చైనా, అమెరికాలలో రైతాంగానికి ఆయా ప్రభుత్వాలు సబ్సిడీల రూపంలో నష్టం రాకుండా చూశాయి. మన దేశంలో అలాంటి విధానం లేదు. కనీస మద్దతు ధరకంటే మార్కెట్లో తక్కువ వున్నపుడు ఇష్టం లేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా సిసిఐ కొనుగోళ్లు వుంటున్నాయి. అవి కూడా మద్దతు ధరకు మించటం లేదు. పైన చెప్పుకున్నట్లు ఒక ఏడాది ధరలు భారీగా పడిపోయినా రైతాంగం అప్పులపాలు కావాల్సిందే. ఈ ఏడాది ప్రస్తుతం మార్కెట్లో కనీస మద్దతు ధరల కంటే తక్కువ ధరలకే అధిక మొత్తాలను కొనుగోలు చేస్తున్నట్లు వివిధ మార్కెట్ల సమాచారం వెల్లడిస్తున్నది.

1966 నాటి చెరకు నియంత్రణ విధానం ప్రకారం మన ప్రభుత్వాలు చెరకు ధరను సూచిస్తున్నాయి. ఈ విధానం, పంచదార ఎగుమతులకు ఇస్తున్న రాయితీల కారణంగా ధరలు తగ్గి తమతో పాటు ప్రపంచ రైతాంగానికి, వ్యాపారులకు నష్టం జరుగుతోందంటూ ఆస్ట్రేలియా ప్రపంచ వాణిజ్య సంస్ధకు మన దేశం మీద చేసిన పరోక్ష ఫిర్యాదును ఇప్పుడు విచారిస్తున్నారు.’ చెరకు వుత్పాదనా సామర్ధ్యాన్ని పెంచేందుకు భారతీయ రైతులకు అధిక మూల్యం చెల్లిస్తున్నారు.దీంతో పంచదార మిల్లులకు ప్రభుత్వం అదనంగా చెల్లించేందుకు వీలు కలుగుతోంది. ప్రపంచ వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత్‌ సబ్సిడీలను తగ్గించే జాబితాలో చెరకు లేదు ‘ అని ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. చెరకు సబ్సిడీలను తగ్గిస్తామని అంగీకరించిన దేశాలలో మన దేశం లేదు. ధనిక దేశాలు కోరుతున్న పద్దతిలో వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలనటాన్ని మనదేశం, చైనా వుమ్మడిగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో వ్యతిరేకించాయి, ఈ అంశం మీద చర్చలు జరపాలని డిమాండ్‌ చేశాయి. అయితే అమెరికా, ఐరోపాయూనియన్‌, జపాన్‌, నార్వే, స్విడ్జర్లాండ్‌ తదితర దేశాలు చర్చను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2011-17 మధ్య అంగీకరించిన సబ్సిడీ మొత్తాలకు మించి చెరకు సబ్సిడీలను భారత్‌లో ఇచ్చారని ఆస్ట్రేలియా వాదించింది. భారత చెరకు, పంచదార గురించి అమెరికా తయారు చేసిన తప్పుడు లెక్కలను వుదహరించి ఆస్ట్రేలియా కేసు దాఖలు చేసింది. ఒక్క చెరకు పంట మీదే కాదు, పప్పుధాన్యాలకు కూడా భారత్‌ ఇస్తున్న సబ్సిడీ వలన కూడా ప్రపంచ వాణిజ్యం ప్రభావితం అవుతోందని ఆరోపిస్తోంది.ఈ వైఖరి ఒక విధంగా మన దేశ సార్వభౌమత్వాన్నే సవాలు చేయటంగా కూడా చెప్పవచ్చు.

ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల కారణంగా ఈ ఏడాది భారత్‌లో పంచదార వుత్పత్తి ఏకంగా 20 నుంచి 35 మిలియన్‌ టన్నులకు పెరిగిందని ఆస్ట్రేలియా ఆరోపించింది. భారత్‌ 85కోట్ల డాలర్ల మేర సబ్సిడీ ఇచ్చి ఐదులక్షల టన్నుల పంచదారను ప్రపంచ మార్కెట్లో కుమ్మరిస్తున్నదని, తమ దేశంలో టన్ను పంచదార వుత్పత్తికి 440-450 డాలర్ల వరకు ఖర్చవుతుండగా మార్కెట్లో 500డాలర్లుగా వున్న ధర పడిపోయి 400కు మించి రావటం లేదని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. మరోవైపు మన దేశంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న ధరలు రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదని పెంచాలని కోరుతున్నారు. దీన్నే సబ్సిడీ చెల్లించటంగా చిత్రిస్తున్నారు.నిజానికి రాష్ట్రం లేదా కేంద్రంగానీ రైతులకు ఇస్తున్న ప్రోత్సాహక ధరలు లేదా రాయితీలు చెరకు-దాని వుత్పత్తుల మీద వచ్చే ఆదాయం, పన్నులతో పోల్చుకుంటే తక్కువే. ఈ మాత్రపు రక్షణ కూడా లేకుండా మార్కెట్‌ శక్తులకు వదలి వేయాలని అంతర్జాతీయ బడా పంచదార వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు.

గత పదహారు సంవత్సరాలలో తొలిసారిగా భారత్‌ పంచదార వుత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి 35.9 మిలియన్‌ టన్నులతో ప్రధమ స్ధానంలోకి వచ్చింది. అయితే ఇది తాత్కాలికమే అని చెప్పవచ్చు. బ్రెజిల్‌లో ప్రతికూల వాతావరణం నెలకొనటం ఒక కారణమైతే, చమురు ధరలు 85డాలర్లకు పెరిగినందున పంచదార బదులు ఎథనాల్‌ తయారు చేయటం లాభసాటిగా వున్నందున పంచదార వుత్పత్తిని కావాలనే తగ్గించారు. చమురు ధరలు 60డాలర్లకు పడిపోయినందున ఎథనాల్‌ బదులు పంచదారకు మరలితే మన పరిస్థితి ఇబ్బందుల్లో పడుతుంది. ప్రపంచ వ్యాపితంగా 188.3మిలియన్‌ టన్నుల పంచదార వుత్పత్తి అవుతుందని అంచనా.

మన మార్కెట్‌ను బహుళజాతి గుత్త సంస్ధలకు తెరిచిన కారణంగా ఇప్పటికే పత్తి, ఇతర విత్తన రంగం,పురుగు మందుల రంగం విదేశీ, స్వదేశీ గుత్త సంస్ధల ఆధిపత్యంలోకి పోయింది.వారు నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. కార్గిల్‌ వంటి బహుళజాతి గుత్త సంస్ధలు కనీస మద్దతు ధరలను దెబ్బతీసే విధంగా పరోక్షంగా కొనుగోళ్లు జరుపుతూ మార్కెట్లను నిర్దేశిస్తున్నాయని 2017 జనవరిలో వార్తలు వచ్చాయి. లోపాలతో కూడినదే అయినప్పటికీ ఆ విధానం కూడా వుండకూడదని, అప్పుడే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగవచ్చని అవి భావిస్తున్నాయి. దానిలో భాగంనే పారిశ్రామిక రంగానికి ఇచ్చే రాయితీలను కూడా రైతుల ఖాతాలో వేసి అమెరికా వంటి దేశాలు కనీస మద్దతు ధరల విధానం మీద దాడి చేస్తున్నాయన్నది స్పష్టం. దీని వెనుక అంతర్జాతీయ వ్యవసాయ కార్పొరేట్ల ప్రయోజనాలు తప్ప మరొకటి లేదు. ధనిక దేశాల లాబీ, వత్తిడికి లంగి వాటికి అనుకూలమైన విధానాలు అమలు జరుపుతున్న పాలకవర్గాల మీద, అదే విధంగా కార్పొరేట్‌ శక్తుల కుట్రల మీద రైతాంగం చైతన్యవంతులై ఆ విధానాలను తిప్పికొట్టకపోతే వున్న రాయితీలు కూడా వూడ్చిపెట్టుకుపోయే ప్రమాదం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d