• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Left politics

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 3 : చైనా లక్షణాలతో సోషలిజం అంటే ఏమిటి !

24 Monday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ 1 Comment

Tags

china communist party, china reforms, Forty years of China Reforms, Socialism with Chinese Character

Image result for forty years china reforms

ఎం కోటేశ్వరరావు

మన దేశంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కమ్యూనిస్టు వుద్యమ సైద్ధాంతిక చర్చలో రష్యా మార్గం, చైనా మార్గం అనే మాటలు వినిపించేవి. సారాన్ని సులభంగా అర్ధం చేసుకొనేందుకు ఆ పదజాలాన్ని వాడినప్పటికీ దేశంలో సోషలిజాన్ని ఎలా తీసుకురావాలి అనేదే ఆ చర్చ. కొందరు మాది చైనా మార్గం మావోయే మా చైర్మన్‌ అనేంత వరకు వెళ్లగా మరికొందరు తమది రష్యా మార్గమన్నారు. వామపక్ష వుద్యమంలో ప్రధాన భాగంగా వున్న సిపిఐ(ఎ) తమది చైనా కాదు రష్యా కాదు భారత మార్గం అని స్పష్టం చేసింది. అంటే ఏ దేశంలో వున్న పరిస్ధితులను బట్టి దానికి అనుగుణ్యంగా విప్లవశక్తుల కార్యాచరణ వుండాలి తప్ప ఏదో ఒక దేశాన్ని అనుసరించటం కాదని చెప్పటమే. అయితే ఆ మార్గం మంచి చెడ్డలు, అనుసరిస్తున్న ఎత్తుగడలు, విధానాల గురించి ఎవరైనా విమర్శించవచ్చు, విబేధించవచ్చు, చర్చించి పరిపుష్టం చేయవచ్చు అది వారికి వున్న స్వేచ్చ. చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తరచూ చేసే వ్యాఖ్యానాలలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద నిర్మాణం, సమాజం వంటి అంశాలుంటాయి.

నిజానికి ఇది సైద్ధాంతిక అవగాహనకు సంబంధించినది. ఆచరణకు రానంత వరకు ఏ కొత్త భావజాలమైనా ఎంతగానో ఆకర్షిస్తుంది, ఆదర్శంగా వుంటుంది. దూరం నుంచి చూస్తే కొండలు ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. వాటి దగ్గరకు వెళ్లి ఎక్కాల్సివచ్చినపుడు ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతాయి. శక్తి రూపాలను మార్చుకున్నట్లుగానే దోపిడీ రూపాలు మారవచ్చు గానీ అనుమతించే వ్యవస్ధలున్న చోట దోపిడీ అంతం కాదు.మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతం-ఆచరణకు సంబంధించి శాస్త్రీయమైనది. ఈ సిద్ధాంతాన్ని ఆయా దేశ, కాల పరిస్ధితులకు అన్వయించుకోవాల్సి వుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ విప్లవం ద్వారా అధికారాన్ని పొంది నూతన వ్యవస్ధ నిర్మాణానికి పూనుకుంది. సుదీర్ఘంగా సాగిన విప్లవకాలంలోనూ తరువాత మూడు దశాబ్దాల వరకు మావోఆలోచనా విధానం పేరుతో చైనా పరిస్దితులకు అన్వయించిన అంశాలను అమలు జరిపారు. మావో బతికి వుండగానే వచ్చిన అనుభవాల ప్రాతిపదికగా మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్‌సియావో పింగ్‌ హయాంలో సంస్కరణల విధానాన్ని అనుసరించారు. అప్పటి నుంచి చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం అంటున్నారు. నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన చైనా సంస్కరణలు ఇప్పుడు 1980దశకం మాదిరే వుండవు. ఇప్పటి అవసరాలకు తగిన మార్పులు చేర్పులు వుండాలి. జనాభా అవసరాలకు అనుగుణంగా వుపాధి, కనీస అవసరాలు తీరాలంటే ఆర్ధిక వ్యవస్ధ వేగంగా అభివృద్ధి చెందాలి. కమ్యూనిస్టు పార్టీ రాజకీయ అధికారం కింద సోషలిజానికి కట్టుబడి వుంటూనే మార్కెట్‌ సంస్కరణలను అమలు జరిపేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రాజీలు పడ్డారు.

Image result for forty years china reforms

గతంలో ఏ సోషలిస్టు దేశంలోనూ ఇలాంటి ప్రయోగం జరపలేదు. మార్కెట్‌ విధానాలు పూర్తిగా పెట్టుబడిదారీ వ్యవస్ధ పద్దతుల్లో లేవు, ప్రణాళికలు పూర్తిగా సోషలిస్టు పద్దతిలోనూ లేవు. చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుంది, భౌతిక సంపద స్ధాయి తక్కువగా వుంది, సోషలిస్టు సమ సమాజం తరువాత కమ్యూనిస్టు సమాజానికి దారి తీయాలంటే ముందు ఆర్ధిక పురోగతి సాధించాలి, దానికి గాను మార్కెట్‌ ఆర్ధిక విధానాలు సాధనమని అధికారానికి వచ్చిన రెండున్నర దశాబ్దాల తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ అవగాహనకు వచ్చింది. నిజానికి చైనా సోషలిజం ప్రాధమిక దశలో వుందని 1950దశకం చివరిలోనే కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. పరివర్తన దశలో వుత్పాదక శక్తులు బలహీనంగా వున్నాయని ఆర్ధికవేత్తలు హెచ్చరించారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్దలలోనే సోషలిస్టు విప్లవం జయప్రదం అవుతుందన్న మార్క్సిస్టు తత్వవేత్తల అంచనా తప్పింది.పురోగామి వుత్పాదక సంబంధాలు వుత్పత్తిని పెంచుతాయన్న మావో ఆలోచన ఆచరణ రూపం దాల్చలేదు. సోవియట్‌ తరహా ప్రణాళికాబద్ద విధానాలు కూడా జయప్రదం కాలేదు. పెట్టుబడిదారీ విధానంలో లాభాలు వచ్చే వాటికే ప్రాధాన్యత వుంటుంది. సోషలిస్టు వ్యవస్దలో ప్రజల అవసరాలకు వుపయోగపడే వస్తూత్పతికి ప్రాధాన్యత వుంటుంది. ఈ రెండింటినీ మేళవించి అమలు జరిపిన విధానం కారణంగా చైనా శరవేగంతో అభివృద్ది చెందుతోంది.

చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ 1984చేసిన ఒక వుపన్యాసంలోచెప్పిన అంశాలను మననం చేసుకోవటం అవసరం. వాటి సారాంశం ఇలా వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసే నాటికి పాత చైనాను నాశమైన ఆర్ధికవ్యవస్ధను వారసత్వంగా తెచ్చుకున్నాము. పరిశ్రమలు దాదాపు లేవు. సోషలిజాన్ని ఎందుకు ఎంచుకున్నారని కొందరు అడుగుతారు. పెట్టుబడిదారీ విధానం చైనాలోని గందరగోళాన్ని లేదా దారిద్య్రం వెనుకబాటు తనాన్ని తొలగించదు. అందుకే మార్క్సిజానికి, సోషలిస్టు బాటకు కట్టుబడి వున్నామని పదే పదే చెబుతున్నాము. అయితే మార్క్సిజం అంటే మన అర్ధం చైనా పరిస్ధితులకు దానిని అసుసంధానించటం, సోషలిజం అంటే చైనా పరిస్ధితులకు అనుగుణ్యంగా ప్రత్యేకించి చైనా లక్షణాలతో రూపొందించుకోవటం. సోషలిజం, మార్క్సిజం అంటే ఏమిటి ? గతంలో దీని గురించి అంత స్పష్టత లేదు. వుత్పాదకశక్తుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతతో మార్క్సిజం ముడిపడి వుంది. కమ్యూనిజానికి ప్రాధమిక దశ సోషలిజం అని చెప్పాము. ఆ వున్నత దశలో ప్రతి ఒక్కరూ శక్తి కొద్ది పని చేయటం, అవసరం కొద్దీ వినియోగం వుంటుంది. దీనికి వున్నతంగా అభివృద్ధి చెందిన వుత్పాదకశక్తులు,సరిపడా సరకుల తయారీ అవసరం వుంది. ప్రజా రిపబ్లిక్‌ ఏర్పాటు చేసిన తరువాత వుత్పాద శక్తుల అభివృద్ధికి తగిన శ్రద్ధ పెట్టకపోవటం ఒక లోపం. సోషలిజం అంటే దారిద్య్రాన్ని తొలగించటం, బికారితనం సోషలిజం కాదు. పశ్చిమ దేశాలలో పారిశ్రామిక విప్లవం సంభవించినపుడు చైనా తన తలుపులు మూసుకున్న విధానం అనుసరించింది. విప్లవం తరువాత ఇతర దేశాలు చైనాను దిగ్బంధనం కావించాయి. ఈ స్ధితి ఇబ్బందులను కలిగించింది. చైనా జనాభా 80శాతం గ్రామాలలోనే వుంది. వాటి నిలకడమీదనే చైనా స్ధిరత్వం ఆధారపడి వుంది. విదేశీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పద్దతులకు స్వాగతం పలికాము. అవి సోషలిజాన్ని పూర్వపక్షం చేస్తాయా, అవకాశం లేదు, ఎందుకంటే చైనా ఆర్ధిక వ్యవస్ధలో సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ ప్రధాన భాగం.సహజంగానే విదేశీ పెట్టుబడులతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. సానుకూల అంశాలతో పోలిస్తే ప్రతికూల ప్రభావాలు అంత ముఖ్యమైనవి కాదు. మరొక సందర్భంలో మాట్లాడుతూ సోషలిజం-పెట్టుబడిదారీ వ్యవస్ధల మధ్య ప్రణాళికా బద్ద మరియు మార్కెట్‌ శక్తులనేవి అనివార్యమైన విభేదం కాదని చెప్పారు. సోషలిజం అంటే ప్రణాళికా బద్ద ఆర్ధిక వ్యవస్ధ అనే నిర్వచనమేమీ లేదని పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాదిరి ప్రణాళికాబద్ద మరియు మార్కెట్‌ శక్తుల ఆర్దిక వ్యవస్ధ సోషలిజంలో కూడా వుంటుందని రెండు శక్తులు ఆర్దిక వ్యవస్ధలను అదుపు చేస్తాయన్నారు.

ప్రపంచంలో సమసమాజం ఎలా స్ధాపించాలనే విషయంలో తలెత్తిన సైద్ధాంతిక సమస్యలు దోపిడీని ఎలా కొనసాగించాలనే అంశం మీద వ్యక్తం కాలేదు. ఈ కారణంగానే చైనాలో సాధించిన అభివృద్ధిని స్వాగతించేవారు కూడా ప్రస్తుతం అక్కడ పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు, బిలియనీర్లు, ధనికుల సంఖ్యలను చూసి వారెక్కడ విప్లవాన్ని వమ్ము చేస్తారో అని భయపడుతున్నారు. మరోవైపు పెట్టుబడిదారుల్లో చైనా నాయకత్వం గురించి భయ సందేహాలు ఎలా పెరుగుతున్నాయో చూడటం అవసరం. 2018 అక్టోబరు మూడవ తేదీన అమెరికాకు చెందిన న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ‘ఆధునిక చైనాను నిర్మించిన ప్రయివేటు వాణిజ్యాలు, ఇపుడు వెనక్కు నెడుతున్న ప్రభుత్వం ‘ అనే శీర్షికతో ఒక విశ్లేషణ ప్రచురించింది. ప్రయివేటు వాణిజ్యాలను అనుమతించే బీజింగ్‌ అనుజ్ఞార్ధకం గతకొద్ది సంవత్సరాలుగా అల్లుకుపోతూ ముందుకు సాగింది. నియంతృత్వం(పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు చైనా కమ్యూనిస్టు పాలనను అలాగే వర్ణిస్తారు) మరియు స్వేచ్చా మార్కెట్‌ మధ్య దీర్ఘకాలంగా వున్న వుద్రిక్తలు ఇప్పుడు సందిగ్దబిందువు వద్దకు చేరుకున్నాయని చైనాలో కొందరు చెప్పారని వక్కాణించారు. ఆ విశ్లేషణ ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

వ్యాఖ్యలు మెళకువతో కూడిన భాష వెనుక నక్కాయి, కానీ చైనా దిశ గురించిన హెచ్చరిక స్పష్టంగా వుంది. సంపదలతో పెరిగేందుకు తనలో భాగం మార్కెట్‌ శక్తులను ఆలింగనం చేసుకొన్నది. పొసగని గళాలతో ఇప్పుడు ప్రయివేటు సంస్ధలను ఖండిస్తున్నది. ఈ దృగ్విషయాన్ని గమనించాల్సివుంది అని మార్కెట్‌ అనుకూల ఆర్ధికవేత్త 88 ఏండ్ల వు జింగాలియన్‌ వ్యక్తం చేసిన అసాధారణ అధికారిక స్వరం చైనా వ్యాపార, ఆర్దికవేత్తలు, చివరికి కొంత మంది ప్రభుత్వ అధికారులలో కూడా పెరుగుతున్న ఆందోళనకు ప్రతిధ్వని. ప్రపంచంలో ఆర్ధికంగా రెండవ స్ధానంలోకి తీసుకుపోయిన స్వేచ్చా మార్కెట్‌, వాణిజ్య అనుకూల విధానాల నుంచి చైనా వెనక్కు తగ్గవచ్చు, గత నాలుగు దశాబ్దాలుగా నియంతృత్వ కమ్యూనిస్టు అదుపు మరియు స్వేచ్చగా తిరిగే పెట్టుబడిదారీ విధానం మధ్య చైనా వూగుతోంది. అక్కడ ఏమైనా జరగవచ్చు, లోలకం తిరిగి ప్రభుత్వంవైపే వూగవచ్చని కొందరికి కనిపిస్తోంది.

ఒకప్పుడు ప్రయివేటు వాణిజ్య సంస్దలు ముందుపీఠీన వున్న చోట పారిశ్రామిక వుత్పత్తి,మరియు లాభాలవృద్ధిలో రోజురోజుకూ ప్రభుత్వ అదుపులోని కంపెనీల వాటా పెరుగుతోంది. ఇంటర్నెట్‌ వ్యాపారం, రియలెస్టేట్‌, వీడియోగేమ్స్‌ను నియంత్రించేందుకు చైనా రంగంలోకి దిగింది. కంపెనీలు పన్నుల పెంపుదల, వుద్యోగులు పొందే లబ్ది ఖర్చును ఎక్కువగా భరించాల్సి రావచ్చు. కొందరు మేథావులు ప్రయివేటు సంస్ధలను పూర్తిగా రద్దు చేయాలని పిలుపులనిస్తున్నారు. అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రయివేటు సంస్ధలకు తమ ప్రభుత్వ మద్దతు వుంటుందని హామీ ఇస్తూ ప్రభుత్వరంగంలోని పెద్ద కంపెనీలకు పూర్తి స్ధాయి మద్దతు ప్రకటించటాన్ని ప్రయివేటు వాణిజ్యాలకు ఇంకచోటు లేదని చెప్పటమే అని అనేక మంది ఆర్ధికవేత్తలు నమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్ధ చైనా నేషనల్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ కేంద్రం ఒకదాని సందర్శన సందర్భంగా గ్జీ మాట్లాడుతూ ‘ ప్రభుత్వ రంగ సంస్ధలు వుండకూడదు, మనకు చిన్న ప్రభుత్వ సంస్ధలే వుండాలి’ అనే ప్రకటనలు తప్పు, ఏకపక్షమైనవి అన్నారు. చైనా అధ్యక్షుడు మిలిటరీ, మీడియా, పౌర సమాజం మీద పూర్తిగా పార్టీ అదుపు వుండాలని కోరతారు. ఇప్పుడు వాణిజ్యం మీద దృష్టి సారిస్తున్నారు. పెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో నేరుగా వాటాలు తీసుకోవటం గురించి పరిశీలిస్తోంది. విదేశీ కంపెనీలతో సహా అన్నింటిలో కమ్యూనిస్టు పార్టీ కమిటీలకు పెద్ద పాత్ర కల్పించేందుకు నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వామపక్ష పండితులు, బ్లాగర్స్‌(వివిధ అంశాల మీద విశ్లేషణలు, అభిప్రాయలు రాసేవారు) ప్రభుత్వ అధికారులు సిద్ధాంతపరమైన, ఆచరణాత్మకమైన మద్దతు తెలియచేస్తున్నారు. ప్రయివేటు యాజమాన్యాలను తొలగించాలని జనవరిలో(2018) బీజింగ్‌లోని రెనిమిన్‌ విశ్వవిద్యాలయ మార్క్సిజం ప్రొఫెసర్‌ జౌ గ్జిన్‌చెంగ్‌ కోరారు. అభివృద్ధి లక్ష్యాన్ని ప్రయివేటు రంగం పూర్తి చేసిందని ఇప్పుడు దానికి స్వస్తి పలకాలంటూ వు గ్జీయపింగ్‌ అనే అంతగా తెలియని బ్లాగర్‌ రాసిన అంశం ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున ప్రచారం పొందింది. మానవ వనరులు, సాంఘిక భద్రత వుప మంత్రి క్వి గ్జియపింగ్‌ ప్రయివేటు సంస్ధలలో ప్రజాస్వామిక యాజమాన్య పద్దతులు వుండాలని, యజమానులు-కార్మికులు సంయుక్తంగా వాటిని నడపాలని కోరారు. ప్రభుత్వ చర్యల వలన రుణాలపై ఆధారపడి నడిచే ప్రయివేటు కంపెనీలకు డబ్బు దొరకటం కష్టంగా మారింది, ఇదే సమయంలో ప్రభుత్వ రంగ కంపెనీలకు కొత్త రుణాలు పొందటంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవటం లేదు. ఒకప్పుడు అసలు వూహల్లోకి కూడా రాని వాటిని ఇప్పుడు కొన్ని ప్రయివేటు సంస్దలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఇంతవరకు 46 ప్రయివేటు కంపెనీలు సగానికిపైగా వాటాలను ప్రభుత్వానికి విక్రయించినట్లు వార్తలు వచ్చాయి.చైనా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే సంఖ్య చాలా చిన్నది అయినప్పటికీ ప్రయివేటు కంపెనీలకు వాటాలను విక్రయించే ప్రభుత్వ కంపెనీల రెండు దశాబ్దాల ధోరణికి ఇది వ్యతిరేకం.

Image result for forty years china reforms

కమ్యూనిస్టు పార్టీ ప్రచార విభాగానికి ప్రత్యక్ష పాత్ర కల్పించిన తరువాత కొత్త వీడియో గేమ్స్‌కు అనుమతులు స్ధంభించాయి. ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ, వీడియో గేమ్‌ల్లో పేరు ప్రఖ్యాతులున్న టెన్‌సెంట్‌ కంపెనీమార్కెట్‌ విలువ దాదాపు మూడోవంతు పడిపోయింది. కొత్తగా తెచ్చిన చట్ట ప్రకారం ఆన్‌లైన్‌ వ్యాపారం చేసే కంపెనీలు ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి, పన్నులు చెల్లించాలి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీలలో ఒకటైన అలీబాబా గ్రూప్‌ను దెబ్బతీస్తుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ కంపెనీలకు ఇది మంచి సంవత్సరం. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఏడాది తొలి ఏడునెలల్లో ప్రయివేటు కంపెనీలతో పోటీ పడి మూడురెట్లు లాభాలు సాధించాయి. అధిక సామర్ద్యం, కాలుష్యనివారణ చర్యలు ఎక్కువగా ప్రయివేటు కంపెనీల మీద మోపుతున్న ప్రభుత్వ ప్రయత్నాలు కూడా దీనికి కారణం.

చైనా మ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన మార్గంలోనే సంస్కరణలు నడుస్తున్నాయా? లేదూ న్యూయార్క్‌ టైమ్స్‌ విశ్లేషకుడు చెబుతున్నట్లు ప్రభుత్వ రంగ అదుపులోకి తిరిగి చైనా అర్ధిక వ్యవస్ధ వెళ్ల నుందా? ఎంతకాలం పడుతుంది? వీటిన్నింటి గురించి చైనా వెలుపల కూడా చర్చించవచ్చు. అభిప్రాయాలను వెల్లడించవచ్చు. కోర్టు తీర్పులను విమర్శించవచ్చు గానీ న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు అన్నట్లుగా చైనా కమ్యూనిస్టు నాయకత్వానికి దురుద్ధేశ్యాలను ఆపాదించకుండా వారి విధాన మంచి చెడ్డలను సమీక్షించవచ్చు. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం మాదిరి చైనాలో కూడా తప్పిదాలకు పాల్పడితే అనే పెద్ద సందేహం ఎవరికైనా తలెత్తవచ్చు. ఇప్పటికైతే అది వూహాజనిత సమస్య. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు సోషలిజం అనే భావజాలానికి కాలం చెల్లిందని అమెరికా ప్రకటించింది. అదే చోట ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం పనికిరాదు, అది కాలం చెల్లిన సిద్ధాంతం అని నమ్ముతున్నవారు, సోషలిజాన్ని అభిమానిస్తున్నవారు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నారు. సమాజ మార్పుకోరే పురోగామి శక్తులకు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగలవచ్చు గాని చరిత్ర ముందుకే పోతుంది, అంతిమ విజయం వారిదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాలుగు దశాబ్దాల చైనా సంస్కరణలు 2 : అమెరికాకు 69 ఏండ్లు , చైనాలో 18కే సాధ్యమైంది !

23 Sunday Dec 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Forty years of China Reforms, Xi Jinping

Related image

ఎం కోటేశ్వరరావు

1929 మాంద్యం ప్రారంభంలో అమెరికా వాస్తవ జిడిపి 1.109 లక్షల కోట్ల డాలర్లు కాగా అది పన్నెండు లక్షల కోట్ల డాలర్లకు చేరేందుకు 69 ఏండ్లు తీసుకుంది. 2017లో 18లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి చేరటానికి 88 సంవత్సరాలు పట్టింది. చైనా జిడిపి 1999లో 1.09లక్షల కోట్ల డాలర్లుగా వున్నది 2017లో 12లక్షల కోట్ల డాలర్లకు చేరటానికి కేవలం 18 సంవత్సరాలే పట్టింది. అమెరికా ఆర్ధిక చరిత్రలో కనిపించే అనేక ఎగుడుదిగుడులు అది ఎదుర్కొన్న సమస్యలకు నిదర్శనం, అటువంటి పరిస్ధితి చైనా విషయంలో కనపడదు.1952-2017 మధ్య అమెరికాలో తొమ్మిది సంవత్సరాలు అంతకు ముందున్న జిడిపి కంటే తగ్గగా చైనాలో అటువంటి పరిస్ధితి ఐదు సంవత్సరాలలోనే కనిపించింది. 1978 సంస్కరణల ప్రారంభం తరువాత తిరుగులేకుండా సాగింది. అదే అమెరికాలో 1978 తరువాత ఐదు సంవత్సరాలు తరుగుదల వుంది. వీటిని మొత్తంగా చూసినపుడు అభివృద్ధిరేటులో కొద్ది హెచ్చు తగ్గులు వుండవచ్చుగానీ సంస్కరణల తరువాత చైనా ఎలాంటి పెట్టుబడిదారీ సంక్షోభాలను ఎదుర్కోలేదు.

ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ వునికిలోకి వచ్చి కొందరి అవగాహన ప్రకారం ఐదు వందల సంవత్సరాలు దాటింది. అమెరికాలో 1817లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రారంభాన్ని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రారంభంగా తీసుకుంటే దానికి రెండువందల సంవత్సరాలు నిండినట్లు. అంత అనుభవం వున్న అమెరికాను, సంస్కరణలు ప్రారంభించిన 50సంవత్సరాల నాటికి జిడిపిలో చైనా అధిగమించగలదని అంచనా వేస్తున్నారు. అయితే జనాభా రీత్యా తలసరి ఆదాయంలో మరికొన్ని దశాబ్దాల పాటు అమెరికాయే అగ్రస్ధానంలో కొనసాగుతుంది. రెండు వందల సంవత్సరాల సుదీర్ఘపెట్టుబడిదారీ విధాన అనుభం తరువాత కూడా ఇంకా అమెరికాలో స్వంత ఇల్లులేని వారు, అద్దె భరించలేక కారుల్లో కాపురాలు చేసే వారున్నారంటే, 140 కోట్ల జనాభా వున్న చైనాలో జనానికి కనీస ప్రాధమిక వసతులు కల్పించటానికి ఎంత వ్యవధి కావాలో చెప్పనవసరం లేదు. కొందరు చెబుతున్నట్లు చైనాలో నిజంగా పెట్టుబడిదారీ విధానమే అమలు జరిపితే ఆ వ్యవస్ధకు సహజంగా వుండే జబ్బులన్నీ రావాలి, రావటం లేదు. సంక్షోభాలు లేకుండా శరవేగంగా అభివృద్ధి చెందటం పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణం కాదు. అయితే చైనాలో పెట్టుబడిదారీ విధాన లక్షణాలు లేవా అంటే వున్నాయి.స్టాక్‌ ఎక్సేంజ్‌, ప్రయివేటు పెట్టుబడులు, లాభాలు తీసుకోవటం, ప్రయివేటు కంపెనీలను విస్తరించుకోవటం, బిలియనీర్ల పెరుగుదల వంటివి దాని లక్షణాలే. బలమైన పెట్టుబడిదారులు పెరిగిన తరువాత వారు సోషలిస్టు వ్యవస్దను అనుమతిస్తారా అని కొంత మంది వ్యక్తం చేస్తున్న సందేహాలను తీర్చటం అంతసులభమూ కాదు. తమ జనాభా అవసరాలు తీరాలంటే కొంతకాలం ఆ విధమైన విధానాలు తప్పవని చైనా కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. అధికారికంగానే అది ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానాన్ని 2050వరకు అనుమతిస్తామని ఎన్నడో చెప్పింది. సోషలిజం అంటే దారిద్య్రాన్ని పంచుకోవటం కాదు. పెట్టుబడిదారులను ఆహ్వానించటం, అనుమతించే వైఖరి మీద సందేహాలు కొత్తగా తలెత్తినవి కాదు. నాలుగు దశాబ్దాల నాడే వాటి గురించి చైనా నాయకత్వం చెప్పింది. గాలి కోసం కిటికీలు తెరిచినపుడు చెడుగాలితో పాటు, క్రిమి కీటకాలూ ప్రవేశిస్తాయని తెలుసు, వాటిని ఎలా అదుపు చేయాలో కూడా తమ గమనంలో వున్నదని చెప్పారు. ఈ నేపధ్యంలో అక్కడ అనుసరించిన విధానాలు ఎలా అద్భుతాలను సృష్టించాయో చూద్దాం.

Related image

1980లో చైనా జిడిపి 305బిలియన్‌ డాలర్లు కాగా 2017నాటికి 12.7ట్రిలియన్‌లకు పెరిగింది.(ఒక ట్రిలియన్‌ లక్ష కోట్లు) నాడు కేవలం 21 బిలియన్‌ డాలర్ల విలువగల వుత్పత్తులను ఎగుమతి చేసిన చైనా 2017నాటికి 2.49లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఎగుమతిదారుగా తయారైంది.1980-2016 మధ్య సగటు అభివృద్ధి రేటు 10.2శాతం.1980లో చైనాకు వచ్చిన విదేశీ పెట్టుబడులు దాదాపు లేవు, 2017లో 168 బిలియన్‌ డాలర్లు వచ్చాయి, 2016నాటికి ప్రపంచంలోని వివిధ దేశాలలో చైనా పెట్టుబడులు 216 బిలియన్‌ డాలర్లున్నాయి. ఈ కాలంలో చైనీయుల సగటు జీవిత కాలం 66 నుంచి 76 సంవత్సరాలకు పెరిగింది.22శాతంగా వున్న నిరక్షరాస్యులు 3.2శాతానికి తగ్గారు. చైనా కుటుంబాల వినియోగం 49 బిలియన్‌ డాలర్ల నుంచి 90రెట్లు పెరిగి 2016నాటికి 4.4లక్షల కోట్లకు చేరింది.

సిఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో చైనా 2.16లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేస్తే మనం 299.3బిలియన్‌ డాలర్ల దగ్గర వున్నాం.2016లో మనం 1.15లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్‌ వుత్పత్తి చేస్తే చైనాలో అది 6.14లక్షల కోట్ల యూనిట్లు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్ధ తెలిపిన వివరాల ప్రకారం 2016లో చైనా 244లక్షల కార్లు, 36లక్షల వాణిజ్య వాహనాలను తయారు చేస్తే మనం 36లక్షల కార్లు, 8.1లక్షల వాణిజ్య వాహనాలను వుత్పత్తి చేశాము. బ్రిక్స్‌ దేశాలలోని వంద అగ్రశ్రేణి కంపెనీలలో చైనాకు చెందినవి 87శాతం ఆదాయం, 85శాతం లాభాలను కలిగి వుండగా మనవి 4,3శాతాలుగా వున్నాయి. రైలు మార్గాల విషయంలో మనకూ చైనాకూ పెద్ద తేడా లేదు. అయితే అక్కడ 22వేల కిలోమీటర్ల హైస్పీడ్‌ రైలు మార్గం వుండగా మన దగ్గర అలాంటిది లేదు. పరిశోధన, అభివృద్దికి జిడిపిలో చైనా 2.1శాతం ఖర్చు చేస్తుండగా మన దగ్గర ఒకశాతానికిలోపుగానే వుంది.2016లో చైనాలో పదిలక్షల 34వేల పేటెంట్లకు దరఖాస్తు చేశారు. ప్రపంచం మొత్తం మీద ఇవి 42శాతం. మన దేశంలో దాఖలైనవి 45,057 మాత్రమే. మన దేశంలో రోజుకు 24కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మిస్తుండగా చైనాలో 1994-2000 మధ్య రోజుకు 1,200 కిలోమీటర్లునిర్మించారు.

ఇవన్నీ సానుకూల అంశాలైతే సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరగటం ప్రతికూల అంశం.సంస్కరణల ప్రారంభంలో జాతీయ సంపదలో జనాభాలో ఒకశాతంగా వున్న ధనికుల చేతిలో 6.4శాతంగా వున్న దేశ సంపద 2015లో 13.9శాతానికి పెరిగింది. ఏ దేశంలోనూ లేని విధంగా 620 మంది బిలియనీర్లు వున్నారు. పేదలలోని 50శాతం మంది చేతిలో వున్న 26.7శాతం సంపద 14.8శాతానికి తగ్గిపోయింది. దేశంలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ది చెందగా మరికొన్ని దూరంగా వున్నాయి. పట్టణ, గ్రామీణుల మధ్య వ్యత్యాసాలు కూడా వున్నాయి. నలభై సంవత్సరాలలో చైనా జనాభా 96 నుంచి 139 కోట్లకు పెరిగింది. అభివృద్ది క్రమంలో చైనా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలలో పట్టణీకరణ ఒకటి. పట్టణ ప్రాంతాలలో ఆదాయం, సౌకర్యాలు మెరుగ్గా వుండటంతో సహజంగానే యువతీ యువకులు పట్టణ ప్రాంతాలవైపు మొగ్గుచూపుతారు.

Image result for Forty years China Reforms

గత నాలుగు దశాబ్దాలలో 17.9శాతంగా వున్న చైనా పట్టణ జనాభా 58.5శాతానికి పెరిగింది. సంఖ్య రీత్యా 17 కోట్ల నుంచి 81 కోట్లకు పెరిగింది. అక్కడ జరుగుతున్న అభివృద్దికి అనుగుణ్యంగా 1980లో 54.5లక్షల మంది పట్టణాలకు వలస వెళ్లగా 1990నాటికి 65.5లక్షలకు, 1995 నుంచి ఏటా రెండు కోట్ల మందికి చేరింది. ఇటువంటి మార్పు ప్రపంచంలో మరే దేశంలోనూ జరగలేదు. గ్రామాల నుంచి రోజూ పట్టణాలకు వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే.2025 నాటికి పట్టణ జనాభా వంద కోట్లకు చేరుతుందని అంచనా. అందువలన చైనా ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో వుంది. ఈ కారణంగానే తమది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చైనా నాయకత్వం చెబుతోంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణంతో పాటు అధిగమించాల్సిన సమస్యలు కూడా చైనా తరహాలోనే వున్నాయని వేరే చెప్పనవసరం లేవు. వెనుకబడిన ఆఫ్రికా ఖండంలోనూ, అభివృద్ధి చెందిన అమెరికా ఖండంలోనూ కార్మికవర్గం వున్నప్పటికీ సమస్యల తీరుతెన్నులు ఒకే విధంగా వుండవు. ఒకే విధమైన సోషలిస్టు నిర్మాణం కుదరదు. ప్రతి దేశానికి విప్లవం దాని తరహాలోనే వస్తుందన్నది శాస్త్రీయ మార్క్సిస్టు సూత్రం. అందువలన సోషలిస్టు సమాజ నిర్మాణ లక్షణాలు కూడా ప్రత్యేకంగానే వుంటాయి. అమెరికా 69 ఏండ్లలో సాధించినదానిని చైనా 18 సంవత్సరాల్లోనే అధిగమించింది.రెండు చోట్లా వున్నది పెట్టుబడిదారీ విధానమే అయితే అంత తేడా ఎందుకున్నట్లు ? భారత్‌ ఎందుకు విఫలమైనట్లు ? అధ్యయనం చేయాల్సిన అవసరం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వక్రీకరణలను తిప్పికొట్టండి-సోషలిజం గొప్పతనాన్ని చెప్పండి !

29 Thursday Nov 2018

Posted by raomk in CPI(M), Current Affairs, Greek, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

100 years of the KKE, 20 IMCWP, 20th International Meeting of Communist and Workers’ Parties, Communist Party of Greece

Image result for 20th IMCWP

ఎం కోటేశ్వరరావు

కమ్యూనిస్టు , కార్మికోద్యమాలను బలపరిచే, సంరక్షించుకొనే కృషిలో భాగంగా 2019లో వచ్చే ముఖ్యమైన స్మారకోత్సవాల సందర్భంగా బహుముఖ కార్యక్రమాలను నిర్వహించాలని, వక్రీకరణలను తిప్పి కొట్టి సోషలిజం గొప్పతనాన్ని జనానికి చెప్పాలని గ్రీసు రాజధాని ఏథెన్స్‌లో జరిగిన 20వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల సమావేశం పిలుపు నిచ్చింది. గ్రీసు కమ్యూనిస్టు పార్టీ తన వందవ వార్షికోత్సవం సందర్భంగా నవంబరు 23-25 తేదీలలో ఆతిధ్యమిచ్చిన ఈ సమావేశానికి 73 దేశాల నుంచి 90 పార్టీల ప్రతినిధులు హాజరై తమ అనుభవాలను కలబోసుకున్నారు. ‘ వర్తమాన కార్మికవర్గం మరియు దాని మైత్రి(సమాశ్రయం). దోపిడీ మరియు సామ్రాజ్యవాదుల యుద్ధాల వ్యతిరేక పోరాటం, శాంతి, సోషలిజం కోసం, కార్మికులు మరియు పౌరుల హక్కుల పరిరక్షణ వుద్యమాల్లో ముందుండే కమ్యూనిస్టు మరియు కార్మిక పార్టీల రాజకీయ లక్ష్యాలు.’ అనే ఇతి వృత్తంతో జరిగిన ఈ సమావేశంలో పాల్గన్న ప్రతి పార్టీ అంతర్జాతీయ, ప్రాంతీయ, దేశీయ పరిస్ధితులపై తన అనుభవాలు, పాఠాలను సోదర పార్టీలతో పంచుకుంది. మన దేశం నుంచి సిపిఐ(ఎం), సిపిఐ పార్టీల ప్రతినిధి వర్గాలు పాల్గన్నాయి.

పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి లేదా సంక్షోభంలో బహుముఖాలుగా పెట్టుబడిదారీ దేశాలు వాటి కూటముల మధ్య పోటీ మరియు వైరుధ్యాలు తీవ్రమౌతున్నాయని, ఆ క్రమంలో బలాబలాల పునరేకీకరణ అంతర్జాతీయంగా ముందుకు వస్తున్నదని సమావేశం గుర్తించింది. సామ్రాజ్యవాదుల జోక్యం, దిగ్బంధాలు మరియు మధ్యవర్తిత్వాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ సిరియా, ఎమెన్‌, లిబియా అదే విధంగా అజర్‌బైజాన్‌లో యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రజావ్యతిరేక కీవ్‌ పాలకుల కారణంగా వుక్రెయిన్‌లో భాతృహత్యా సంబంధమైన యుద్ధం జరుగుతోంది. మిలిటరీ ఆయుధీకరణ మరియు యుద్ధ సన్నాహాలు పెరుగుతున్నాయి. అమెరికా, నాటో, ఐరోపా యూనియన్‌ మరియు వాటి మిత్ర సామ్రాజ్యవాదుల పధకాలు మరియు రాజకీయ వైఖరులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల నుంచి అనేక అనుభవాలు లభించాయి.

వైరుధ్యాలు తీవ్రతరం కావటంతో సంపదను వుత్పత్తి చేసే వనరులపై అదుపు, మార్కెట్లు, చమురుపైప్‌లైన్లపై ఆధిపత్యం కోసం సామ్రాజ్యవాదుల నూతన యుద్ధాల ముప్పు ఇమిడి వుంది. శాంతి, నిరాయుధీకరణ కోసం ఇది విశాలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని పటిష్టపరిచేందుకు వుపేక్షించరాని లక్ష్యాలను కమ్యూనిస్టులు మరియు శ్రామికోద్యమాల ముందుంచింది. బడా పెట్టుబడిదారుల లాభదాయకత కోసం పని చేసే బూర్జువా ప్రభుత్వాల వైఖరి మరియు సామాజ్రవాదుల దురాక్రమణ,యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాటాలను వుధృతం చేయాల్సి వుంది.

అక్టోబరు విప్లవ వందసంవత్సరాల వార్షికోత్సవం, కారల్‌మార్క్స్‌ 200వ జన్మదినోత్సవాల సందర్భంగా 2017,18 సంవత్సరాలలో తీసుకున్న చొరవను సమావేశం సానుకూలంగా విశ్లేషించింది. సిరియా, పాలస్తీనా, సైప్రస్‌, లెబనాన్‌, సూడాన్‌, క్యూబా, వెనెజులా, బ్రెజిల్‌, ఇరాన్‌ ఎదుర్కొంటున్న సామ్రాజ్యవాదుల దాడులు, బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి అంతర్జాతీయ సౌహార్ద్రతను పునురుద్ఘాటించింది. పోలాండ్‌, వుక్రెయిన్‌, సూడాన్‌, కజకస్తాన్‌, పాకిస్ధాన్లలో కమ్యూనిస్టు వ్యతిరేక మరియు ప్రజాస్వామిక హక్కులపై జరుగుతున్న దాడులను, రష్యా తదితర చోట్ల కమ్యూనిస్టులు ఎదుర్కొంటున్న చట్టపరమైన, రాజకీయ ఆటంకాలను సమావేశం ఖండించింది.

Image result for 20th IMCWP

2019లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ స్ధాపనవందేండ్ల వుత్సవం, చైనా విప్లవ 70, క్యూబా విప్లవ 60వ వార్షికోత్సవాల వంటి ముఖ్యమైన స్మారకోత్సవాలు వున్నాయి. ప్రజా విజయాలకు కమ్యూనిస్టు వుద్యమం ఇచ్చిన తోడ్పాటు, అంతర్జాతీయ కార్మికోద్యమాన్ని పటిష్టపరచాల్సిన అవసరం, చారిత్రక వాస్తవాలను వక్రీకరించి ఫాసిస్టుల అత్యాచారాలతో సమంగా కమ్యూనిజాన్ని చూపే యత్నాలు, తప్పుడు ప్రచారాలను ఎండగట్టటం, కార్మికుల, ఇతర తరగతుల సామాజిక విజయం కోసం జరిపే పోరాటాల పురోగతికి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సమావేశం పిలుపునిచ్చింది.

నాటో 70వ వార్షికోత్సవం సందర్భంగా దానికి వ్యతిరేకంగా అనేక రూపాలలో మరింత మిలిటరీ కేంద్రీకరణ జరుపుతున్న ఐరోపాయూనియన్‌ చర్యలకు వ్యతిరేకంగా 2019 ఏప్రిల్‌ నాలుగవ తేదీన, అణ్వాయుధాలు, విదేశీ సైనిక స్ధావరాలకు, హిరోషిమా-నాగసాకీ అణుమారణకాండకు వ్యతిరేకంగా ఆగస్టు ఆరు మరియు తొమ్మిదిన, రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమై 80సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సెప్టెంబరు ఒకటిన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం కోరింది. కమ్యూనిస్టు వుద్యమ చరిత్రను, అంతర్జాతీయ కార్మిక సౌహార్ద్రత విలువలను పరిరక్షిస్తూ, కమ్యూనిస్టు వ్యతిరేకత, కమ్యూనిస్టు, కార్మికోద్యమాల అణచివేతకు వ్యతిరేకంగా మార్చినెల రెండవ తేదీన వందేండ్ల కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ వుత్సవం సందర్భంగా, అక్టోబరు విప్లవ 102వ వార్షికోత్సవం సందర్భంగా సోషలిజం సాధించిన విజయాల గురించి ప్రచారం, పెట్టుబడిదారీ విధానం, దోపిడీ, అణచివేత వంటి అమానుష ధోరణులకు వ్యతిరేకంగా లోతైన సైద్ధాంతిక చర్చ, ఆచరణాత్మక కార్యక్రమాల గురించి బహుముఖ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.

సోషలిస్టు క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా అమలు జరుపుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, వెనెజులా బలివేరియన్‌ విప్లవాన్ని వమ్ము చేసేందుకు చేస్తున్న బెదిరింపులు, జోక్యాలకు వ్యతిరేకంగా పాలస్తీనా పౌరుల పోరాటం, కొరియాల ఐక్యతకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరింది. మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సం, మే డే, ఫాసిజం, నాజీజాల మీద ప్రజా విజయం రోజున తిరిగి తలెత్తుతున్న ఆ శక్తులకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు చేపట్టాలని ఏథెన్స్‌ సమావేశం పిలుపునిచ్చింది.

Related image

వంద సంవత్సరాల గ్రీసు కమ్యూనిస్టు పార్టీ 1918 నవంబరు 17న గ్రీసు సోషలిస్టు లేబర్‌ పార్టీగా ఏర్పడింది.పైరాస్‌ పట్టణంలో తొలి మహాసభ జరిగింది. 1924లో గ్రీసు కమ్యూనిస్టు పార్టీగా మారింది. నాజీల దురాక్రమణకు ప్రతిఘటన వుద్యమంలో గణనీయమైన పాత్ర పోషించింది.1967 ఏప్రిల్‌ 21న గ్రీసుకు కమ్యూనిస్టు ముప్పు తలెత్తిందనే పేరుతో మిలిటరీ తిరుగుబాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను నిషేధించింది. మరుసటి ఏడాది గ్రీసు కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చి ఒక వర్గం యూరోకమ్యూనిజం పేరుతో మితవాదబాట పట్టింది. మరొక వర్గం మిలిటరీ పాలకులపై సాయుధపోరుకు దిగింది.1974లో మిలిటరీ పాలన అంతమైన తరువాత తిరిగి కమ్యూనిస్టు పార్టీ బహిరంగ కార్యకార్యకలాపాల్లోకి వచ్చింది. వందవ వార్షికోత్సవ సభ మొదటి మహాసభ జరిగిన పైరాస్‌ పట్టణంలోనే శాంతి, స్నేహ స్టేడియంలో పెద్ద ఎత్తున రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో జరిగింది.తొంభై కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధుల సమక్షంలో వేలాది మంది గ్రీసు పార్టీకార్యకర్తలు, పౌరులు పాల్గన్నారు. గతంలో మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టిన యోధులు, ఎర్రజెండాను సమున్నతంగా నిలబెడుతున్న యువ కమ్యూనిస్టులు వేలాది మందిని ఈ సందర్భంగా గ్రీసు పార్టీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కౌటుసోంబస్‌ సన్మానించారు.

Image result for KKE, Dimitris Koutsoumbas

ఈ సందర్భంగా దిమిత్రిస్‌ మాట్లాడుతూ ‘మేం ఏటికి ఎదురీదాం, బిగ్గరగా చేసిన విమర్శలను తట్టుకోలేక చెవులు మూసుకున్నాం, మృదువుగా మృదువుగా వుందాం అని చెప్పిన కొందరు స్నేహితులు, కామ్రేడ్లను మేము కలవర పెట్టాము. వారు మమ్మల్ని రాజీపడమని కోరారు. మేమా పని చేయకపోవటమే సరైందని రుజువైంది. అలా చేసి వుంటే చివరకు రాజీ మాత్రమే మిగిలి వుండేది. మేమా పని చేయలేదు. ఎందుకంటే వంద సంవత్సరాల పార్టీ అనుభవం మమ్మల్ని తప్పులు చేయనివ్వలేదు. ఏటికి ఎదురీదిన కారణంగానే మేము ముందుకు పోవటానికి, ప్రతిదాడి చేసేందుకు, నూతన మిలిటెంట్ల సచేతనత్వం పొందటానికి తోడ్పడింది. యజమాని లేకుండా నడపవచ్చుగానీ కార్యకర్తలనే గొలుసు లేకుండా బండిని నడపలేము.’ అంటూ కార్యకర్తలను వుత్సాహపరిచారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోషలిజాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన అమెరికా మధ్యంతర ఎన్నికలు !

06 Tuesday Nov 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, Democratic Socialists of America, focus on Socialism, Karl Marx, rise of the left, socialists are coming, US midterm Elections

Image result for karl marx

ఎం కోటేశ్వరరావు

చివరి క్షణంలో అనూహ్య పరిస్ధితులు ఏర్పడితే తప్ప మంగళవారం నాటి అమెరికా పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ వుభయ సభల్లోనూ మెజారిటీ పక్షంగా అవతరించనున్నదని ఎన్నికల సర్వేలు చెప్పాయి. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రేలాపనలు కూడా ఓటర్లనాడి తమకు వ్యతిరేకంగా వుందని వెల్లడించటమే. అయితే పార్లమెంట్‌లో ఎవరికి మెజారిటీ వచ్చినా ఫలితం ఏమిటన్నది అసలు ప్రశ్న. గత ఎన్నికల ఫలితాలను చూస్తే అధికారంలో ఏ పార్టీ అధ్యక్షుడు వుంటే మధ్యంతర ఎన్నికల్లో సదరు పార్టీ ఓడిపోవటం అత్యధిక సందర్భాలలో జరిగింది. అందువల్లనే ప్రతి అధ్య క్షుడు తన సర్వశక్తులూ ఒడ్డి ఓటమిని తప్పించుకొనేందుకు, ప్రతిపక్ష మెజారిటీని బటాబటాగా అయినా వుంచేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు ట్రంప్‌ కూడా అలాంటి విఫల యత్నమే చేసినట్లు చెప్పవచ్చు. గత చరిత్రను చూసినపుడు ఎవరు అధికారంలో వున్నా పార్లమెంటులో ప్రతిపక్షానికి మెజారిటీ వున్నప్పటికీ అధ్యక్షులు లేదా పాలకవర్గం దేశీయంగా కార్మిక వ్యతిరేక, అంతర్జాతీయంగా వివిధ దేశాల పట్ల అనుసరించిన ప్రజాస్వామ్య వ్యతిరేక, స్వార్ధపూరిత, దుర్మార్గ , యుద్ధోన్మాద వైఖరుల్లో ఎలాంటి మార్పు లేదు. అందువలన ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికలు కూడా అలాంటివే అన్నది కొందరి అభిప్రాయం.

విప్లవం ! ఈ మాట వింటే కొందరికి భయం, అందువలన ఒక గుణాత్మక మార్పు అందాం. అది ఆలశ్యం అవుతోందని ప్రగతిశీలశక్తులు ఆవేదన చెందుతుంటే , ఆలశ్యంగా అయినా వస్తుందేమో అని దాని గురించి భయపడే వారు ఆందోళన చెందుతారు. ఎవరు అవునన్నా కాదన్నా మార్పు అని వార్యం. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది, ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికల ప్రత్యేకత కూడా అదే.సున్నా కంటే ఒకటి ఎంతో పెద్దది కదా ! సోషలిజం, కమ్యూనిజం అనే పదాలే వినపడకూడదు, అలాంటి భావజాలం వున్న వారు కనపడకూడదు అన్న అమెరికాలో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నారు. గతేడాది జార్జియాలోని ఓక్‌వుడ్‌ అనే చోట లానియర్‌ టెక్నికల్‌ కాలేజీలో ఆంగ్లబోధన టీచర్‌గా డాక్టర్‌ బిల్‌ ఎలెనెబర్గ్‌ అనే అతను దరఖాస్తు చేశాడు. అతని వివరాలు చూసిన యాజమాన్యం సాహిత్యం, ఇతర అంశాలలో అతని ప్రతిభాపాటవాలను చూసి ఇన్ని తెలివి తేటలున్నాయంటే ఎవడో కమ్యూనిస్టు అయి వుంటాడని భావించి నేను కమ్యూనిస్టును కాదు అని ప్రమాణ పత్రం ఇవ్వాల్సిందే అంటూ బలవంతంగా రాయించుకున్నారు.

అలాంటి చట్టవిరుద్దమైన, కమ్యూనిస్టు వ్యతిరేక పరిస్ధితి వున్న చోట ఈ ఎన్నికల సందర్భంగా అనేక మంది పురోగామివాదులు అంతకు ముందు పాతుకుపోయి వున్నవారిని పెకలించి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులుగా పోటీలోకి వచ్చారు. సంఖ్యరీత్యా వారెంత మంది అనటం కంటే ఓటర్లలో వచ్చిన, వస్తున్న మార్పు ముఖ్యం. ఒకవైపు లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి కొన్ని చోట్ల తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలినా అమెరికాలో సోషలిస్టు నినాదం పట్ల పెరుగుతున్న ఆకర్షణ తగ్గలేదు. దీనర్ధం అమెరికాలో వామపక్షాలు త్వరలో అధికారానికి వస్తాయని అతిశయోక్తి చెప్పటం కాదు.అమెరికాలో ఒక పార్టీ తరఫున అభ్యర్ధిగా ఎన్నిక కావాలంటే కొన్ని నెలల ముందే పోటీ చేయాలనుకునే వారు ఆయా నియోజకవర్గాలలో పార్టీ మద్దతు సంపాదించాలి. వాటినే ప్రైమరీలు అంటారు. పార్టీ అంతర్గత ఎన్నికలు జరుగుతాయి. వాటిలో నెగ్గిన వారిని సాధారణంగా అభ్యర్ధులుగా ఆయా పార్టీలు నిర్ణయిస్తాయి. మన దగ్గర మాదిరి కొన్ని పార్టీలలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ పేరుతో తమకు కావాల్సిన వ్యక్తిని అభ్యర్ధిగా పెట్టటం సాధారణంగా జరగదు.

జూలై నెలలో బ్రూకింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌ ప్రైమరీ ప్రాజక్టు అనే సంస్ధ ఆరువందల స్ధానాల అభ్యర్ధిత్వాలకోసం పోటీ పడిన 1600 మంది డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధుల గురించి విశ్లేషణ చేసింది. ముప్పై ఒక్క రాష్ట్రాలలో 2014ఎన్నికలలో తాము పురోగామి వాదులం అని స్వయంగా చెప్పుకున్న అభ్యర్ధులు కేవలం 60 మంది అయితే తాజా ఎన్నికలలో 280 మంది వున్నారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో పురోగామివాదులుగా బహిరంగంగా చెప్పుకొని అభ్యర్ధులుగా ఎన్నికైన వారు 24 మంది అయితే తాజా ఎన్నికలలో 81మంది విజయం సాధించటం లేదా విజయబాటలో వున్నట్లు ఆ విశ్లేషణ పేర్కొన్నది. ఇప్పుడు అమెరికాలో పరిస్ధితి ఎలా వుందంటే అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్ని బలపరచే వారందరికీ సోషలిస్టు ముద్రను తగిలిస్తున్నారు. దానికి వ్యతిరేకమా అనుకూలమా అనేది డెమోక్రటిక్‌ పార్టీలో ఒక ప్రధాన అంశం. అందరికీ ఆరోగ్యం కావాలనటమే సోషలిజం అయితే మాకది కావాలి, మేమూ సోషలిస్టులమే అని సాధారణ ఓటర్లు ఆ నినాదాన్ని బలపరిచిన వారికి మద్దతుదారులుగా మారుతున్నారంటే అతిశయోక్తి కాదు. డెమోక్రటిక్‌ పార్టీ అంటే గతంలో ప్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ వంటి కులీన వుదారవాదులది పైచేయిగా వుండేది. కానీ ఇప్పుడు వారి సంఖ్య తగ్గిపోతూ రంగు, నల్లజాతి వారి చురుకుదనం పెరుగుతున్నది. న్యూయార్క్‌ నగరంలోని ఒక ఎంపీ స్ధానంలో 20సంవత్సరాల నుంచీ గెలుస్తున్న జో క్రోలేను బార్‌లో పనిచేసిన అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ అనే 29సంవత్సరాల యువతి ఓడించి యావత్‌ అమెరికాను ఆశ్చర్యపరచింది. స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో కాంగ్రెస్‌లో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ మాదిరి డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీశాండర్స్‌ నాయకత్వంలోని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీలో ఆమె పని చేస్తున్నది. ఇది డెమోక్రటిక్‌ పార్టీలో అంతర్భాగంగానే వుంటుంది. తాము సోషలిస్టులమని బహిరంగంగా చెప్పుకొనే ఒకాసియో వంటి వారు ఆవిర్భవించటం డెమోక్రటిక్‌ పార్టీలోని యథాతధ వాదులకు, మితవాద రిపబ్లికన్లకు ఆందోళన కలిగించే అంశమే.

On the 200th anniversary of Karl Marx’s birth, the report breathlessly notes, ‘Detailed policy proposals from self-declared socialists are gaining support in Congress and among much of the electorate.’

‘కారల్‌ మార్క్స్‌ 200వ జన్మదినోత్సవ సంవత్సర సందర్భోచితంగా అమెరికా రాజకీయ చర్చలలో సోషలిజం తిరిగి చోటుచేసుకుంటున్నది. సోషలిస్టులం అని స్వయంగా చెప్పుకుంటున్నవారి నుంచి వచ్చిన వివరణాత్మక విధాన ప్రతిపాదనలకు పార్లమెంటులోమరియు ఎక్కువ మంది ఓటర్లలో మద్దతు పెరుగుతున్నది’ అని అమెరికా అధ్యక్ష భవనంలోని ఆర్ధిక సలహాదారుల మండలి అక్టోబరు 23న ఒక శ్వేతపత్రంలో పేర్కొన్నది. 1950దశకంలో అమెరికా నలుమూలల సోవియట్‌ యూనియన్‌ పట్ల పెరిగిన కమ్యూనిస్టు సానుభూతి అమెరికన్‌ పాలకవర్గాలను భయపెట్టినట్లుగా ఇప్పుడు సోషలిజం గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నదనటానికి ఈ నివేదిక ఒక సూచిక. ఓటర్లను భయపెట్టేందుకు, సోషలిస్టులుగా ప్రకటించుకున్నవారిని ఓడించేందుకే సరిగా ఎన్నికల ముందు దీనిని విడుదల చేశారని వేరే చెప్పనవసరం లేదు. దాని కొనసాగింపుగానే పోలింగ్‌కు ఇంకా కొద్ది గంటల వ్యవధి వుందనగా ట్రంప్‌ కుటుంబం ఓటర్ల ముందు సోషలిస్టు బూచిని చూపింది. డెమోక్రాట్లు గెలిస్తే అరాచకం, సోషలిజాలను తీసుకువస్తారనే యుగళగీతాన్ని వారు అలపించారు. టీవీ యాంకర్‌ మరియు ట్రంప్‌ కోడలైన లారా ట్రంప్‌ తన మామ ఎజండాను అడ్డుకొనేందుకు డెమోక్రాట్లు వూహించటానికి కూడా వీలు లేని అంశాలను ముందుకు తెచ్చారని ఆరోపించింది. వారు సోషలిజం గురించి మాట్లాడుతున్నారు, మనం దాన్ని మరిచిపోరాదు, అది చాలా భయంకరమైనది, ప్రతి ఒక్కరూ దీనిమీద దృష్టి సారించాలి అని సెలవిచ్చింది. నాన్సీ పెలోసీ, చుక్‌ స్కుమర్‌ వంటి వారు పార్లమెంటులో వుంటే రానున్న రెండు సంవత్సరాలూ అరాచకమే, మా నాన్నను అడ్డుకుంటారు, మూక పాలనను ప్రవేశపెడతారు. ఎవరైనా తమ దేశభక్తి సూచనలను వెల్లడిస్తూ కార్లమీద అమెరికా జండాలను కడితే కార్లను తగులబెడతారు, నా తండ్రి విధ్వంసానికి వ్యతిరేకంగా వుపాధి చూపేందుకు ప్రయత్నిస్తున్నాడు, వారు వస్తే పన్నులను రెట్టింపు చేస్తారు, అది మాంద్యానికి లేదా సంక్షోభానికి దారి తీయవచ్చు, వారు చట్టాల అమలును అడ్డుకొని దాడులు చేస్తారు. అందుకే రిపబ్లికన్లకు ఓట్లు వేయాలి. అని ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ ఆరోపించాడు.

సోషలిజం వాస్తవిక ముప్పు తెస్తోందనటానికి ఈ అధ్యయనం ఒక రుజువు అని ఫాక్స్‌ న్యూస్‌ యాంకర్‌ సీన్‌ హానిటీ వర్ణించాడు. అందరికీ ఆరోగ్యం అని డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ ప్రతిపాదించిన విధానాన్ని అమలు జరపాలంటే పదేండ్ల వ్యవధిలో 32.6లక్షల కోట్ల డాలర్ల వ్యయం అవుతుంది. అంత మొత్తాన్ని జనానికి ఖర్చు చేసేందుకు కార్పొరేట్‌ శక్తులు అంగకరించటం లేదు. అమలు జరిగితే జిడిపి పడిపోతుందని, పన్నులు పెరుగుతాయని, అమలు జరుగుతున్న ఇతర సంక్షేమ చర్యలకు కోతపడుతుందని రిపబ్లికన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియా సర్వేల ప్రకారం ఈ విధానానికి మద్దతు ఇస్తున్న వారు డెమోక్రటిక్‌ అభ్యర్ధులలో సగానికి మించి వున్నారు. వారు కనుక ఎన్నికైతే రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో అందుకోసం పట్టుబట్టటం అనివార్యం. ఒకవైపు సోషలిస్టు నినాదం పట్ల సామాన్య ఓటర్లు అకర్షితులౌతుంటే మితవాద ఓటర్లను నిలుపుకొనేందుకు, ఆకట్టుకొనేందుకు డెమోక్రటిక్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు నాన్సీ పెలోసీ వంటి వారు మేము పెట్టుబడిదారులం అదే సరైన మార్గం అని ప్రకటించుకున్నారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు ట్రంప్‌ రెచ్చగొట్టని అంశం లేదు, చేయని వక్రీకరణ, ఆడని అబద్దం లేదు. అయితే అధికారానికి వచ్చిన 649రోజుల్లో రోజుకు పది వంతున 6,420 వక్రీకరణలు, అబద్దాలు చెప్పినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ప్రకటించింది. డెమోక్రాట్లు రెట్టింపు లేదా మూడు రెట్లు పన్నులు పెంచాలని కోరుకుంటున్నారు, దేశం మీద సోషలిజాన్ని రుద్దాలని, అమెరికా సరిహద్దులను చెరిపివేయాలని చూస్తున్నారు. దేశంలోకి అక్రమంగా వలసలు వచ్చే వారిని బిడారులుగా ఒకదాని తరువాత ఒకదానిని ఆహ్వానిస్తున్నారు. అది మన దేశం మీద దండయాత్ర చేయటమే. ఇవి అలాంటి వాటిలో కొన్ని. గత కొద్ధి సంవత్సరాలుగా ముఖ్యంగా గత అధ్యక్ష ఎన్నికల నాటి నుంచి అమెరికాలో జరుగుతున్న అంతర్మధనాన్ని పరిశీలించితే డెమోక్రటిక్‌ పార్టీ నాయకుల కంటే దాని మద్దతుదార్లయిన ఓటర్లలోనే సోషలిస్టు భావజాలంవైపు ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. మరో రెండు సంవత్సరాలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో దాని ప్రభావం ఎలా వుంటుందోనని ఇప్పటి నుంచే కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.పలు మీడియా సంస్ధల ఎన్నికల సర్వేలు డెమోక్రాట్లకే మెజారిటీని చూపాయి. అయితే సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా, రిపబ్లికన్లు ఇతరులు రెచ్చగొట్టిన ప్రచారంతో డెమోక్రాట్లలోని మితవాదులు గనుక ప్రభావితమైతే అనూహ్యంగా రిపబ్లికన్లు బటాబటి మెజారిటీతో విజయం సాధించినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ నిజంగా అదే జరిగినా లేక ఈ ఎన్నికలలో డెమోక్రటిక్‌ సోషలిస్టులు గణనీయ విజయాలు సాధించినా అమెరికా రాజకీయ సమీకరణలు మరింత వేగవంతం కావటం అనివార్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా యువతలో సైద్ధాంతిక మధనం, పెట్టుబడిదారీ విధానంపై విముఖత !

17 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, american youth, American youth prefer socialism to capitalism, ideological churning, prefer socialism to capitalism

Image result for american youth prefer socialism to capitalism

ఎం కోటేశ్వరరావు

5డబ్ల్యూస్‌ 1హెచ్‌ ఒక ఫార్ములా, దీని గురించి ఏ మాత్రం తెలియకపోయినా మానవ పరిణామ క్రమంలో వానరుడు నరుడుగా మారిన తరువాత యావత్‌ మానవ జాతిని గతంలో ముందుకు నడిపించింది, ఇప్పుడు నడిపిస్తున్నదీ, రాబోయే రోజుల్లో నడిపించేదీ ఇదే. ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? అన్నదే ఆ సూత్రం. అమెరికాలో తలెత్తిన వర్తమాన పరిస్ధితులు అక్కడి జనాన్ని మొత్తంగా, ప్రత్యేకించి మూడుపదుల లోపు యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడి సమాజంలో ఒక సరికొత్త మధనం ప్రారంభమైంది. వివిధ సర్వేల ఫలితాలు దాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

గతేడాది డిసెంబరు నాలుగున న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ‘సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానాన్ని అసహ్యించుకోవటంలో ఆశ్చర్యం లేదు’ అంటూ మిచెల్లీ గోల్డ్‌బర్గ్‌ రాసిన ఒక విశ్లేషణను ప్రచురించింది. అది ఇలా ప్రారంభం అయింది.’ మనం పెట్టుబడిదారీ విధానాన్ని రద్దు చేయాలా అనే అంశంపై గతనెలలో శుక్రవారం రాత్రి మాన్‌హట్టన్‌(న్యూయార్క్‌)లో జరిగిన ఒక చర్చను నేను సమన్వయం చేశాను. దానిని సోషలిస్టు పత్రిక జాకోబిన్‌ నిర్వహించింది. పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధిస్తూ వుదారవాద పత్రిక ‘ రీజన్‌ ‘ సంపాదకులు పాల్గొన్నారు. హాలులోని 450సీట్లకు ఒక రోజులోనే టికెట్లు అయిపోయాయి. దాంతో దానికి రెట్టింపు మంది పట్టే చోటుకు జాకోబిన్‌ పత్రిక వేదికను మార్చింది. అదనపు సీట్ల టిక్కెట్లు కేవలం ఎనిమిది గంటలలోనే అయిపోయాయి. నేను రాగానే ప్రవేశ ద్వారం వైపు వరుసలలో వెళుతూ జనం కనిపించారు. భూ గర్భంలోని ఒక నైట్‌ క్లబ్‌ పార్టీ ఆహ్వానితుల జాబితాలో నేనున్నానా అనిపించింది. హాజరైన వారిలో అత్యధికులు 20,30వ పడులలో వున్నారు. వారి పెద్దలు ఎలాంటి శషభిషలు లేకుండా విశ్వసించిన పెట్టుబడిదారీ విధానం పట్ల ఈ తరంలోని ఒక భాగం అసాధారణ రీతిలో అనుమానంతో వుంది.

సహస్రాబ్దియువతలో 44శాతం మంది ఒక సోషలిస్టు దేశంలో నివసించాలని కోరుకుంటున్నారని, దానితో పోల్చితే పెట్టుబడిదారీ విధానం కావాలని కోరుకొనే వారు 42శాతం మందే అని ఇటీవలి సర్వేలో కనుగొనటం గురించి కమ్యూనిస్టు వ్యతిరేక ‘కమ్యూనిజం బాధితుల స్మారక సంస్ధ ‘ హెచ్చరించింది. కమ్యూనిజం కుప్పకూలటం అంటే పెట్టుబడిదారీ విధానానికి మరొక ప్రత్యామ్యాయం లేనట్లుగా అమెరికాలోని పెద్దవారికి కనిపించింది. కానీ రాను రాను మన ఆర్ధిక వ్యవస్ధ కొద్ది మంది చేతిలో పోగుబడే స్వభావ రూపం పెట్టుబడిదారీ విధానం అంటే విఫలమైన దేవుడిగా ఎక్కువ మంది యువతకు కనిపించటంలో ఆశ్చర్యం లేదు. శనివారం తెల్లవారు ఝామున ఆమోదం పొందిన దిక్కుమాలిన పన్నుల బిల్లుతో ఇప్పుడు అది మరింత స్పష్టమైంది. ఆ బిల్లు ధనికులను మరింత ధనికులుగా పేదలను మరింత పేదలుగా చేస్తుంది. టాక్స్‌ పాలసీ కేంద్రం పేర్కొన్నదాని ప్రకారం 2027 ఆదాయంలో అగ్రభాగాన వున్న ఐదు శాతం మందికి పెద్ద మొత్తంలో పన్నుల తగ్గింపు, అధమ స్ధానంలో వున్నవారికి పెంపుదల వుంటుంది. ఇక్కడ ఒక వుదాహరణ చూద్దాం. ప్రయివేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపే తలిదండ్రులకు సెనేట్‌ బిల్లు పన్నుల రాయితీని ప్రకటించింది. సహస్రాబ్ది తరంలో అత్యధికులు ఎవరైతే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతారో ఈ చర్య వాటికి నిధుల లభ్యతను కష్టతరం గావిస్తుంది.’

ట్రంప్‌ ప్రతిపాదించిన ఈ పన్నుల రాయితీలు ధనికులను మరింతగా ధనికులను గావిస్తాయి, పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త థామస్‌ పికెటీ పేర్కొన్న ఆదాయ,సంపద అంతరాలను మరింతగా పెంచుతాయి. అలాంటపుడు వాటి గురించి యువత, మొత్తం సమాజం ఆలోచించకుండా ఎలా వుంటుంది. వారికి ముందుగా చెప్పుకున్న ఫార్ములా తప్ప మరొకటి దారి చూపదు. దానికి అనుగుణ్యంగానే సర్వేలు అక్కడి జనాల మనోభావాలను వ్యక్తీరిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఒక గాలప్‌ సర్వే ప్రకారం అమెరికాలో తొలిసారిగా సోషలిజం పట్ల మెజారిటీ యువతలో సానుకూల ధోరణులు వ్యక్తమయ్యాయి. పురోగామి శక్తులకు ఇది నిజంగానే ఎంతో వుత్సాహం, తిరోగామి వాదులకు నిరుత్సాహం కలిగించే అంశం. సోషలిజం, కమ్యూనిజం అంతరించింది, వాటికి భవిష్యత్‌ లేదు అని ప్రకటించిన పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకతకు నెలవైన చోటే ఈ పరిణామం జరుగుతోంది. 2010లో పెట్టుబడిదారీ విధానం పట్ల 18-29 సంవత్సరాల యువతలో 68శాతం సానుకూలత వ్యక్తం కాగా అది క్రమంగా దిగజారుతూ 2018లో 45కు పడిపోయింది, ఇదే సమయంలో తొలిసారిగా 51శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. డెమోక్రటిక్‌ పార్టీ, దానిని అభిమానించే స్వతంత్రులలో సోషలిజాన్ని అభిమానించే వారు 57శాతం వరకు వున్నారని కూడా తేలింది. అయితే అమెరికా సమాజంలో మొత్తంగా చూసుకున్నపుడు పెట్టుబడిదారీ విధానం పట్ల 56శాతం సానుకూలంగా వున్నప్పటికీ అది ఇప్పటి వరకు నమోదైన కనిష్ట సంఖ్య. సోషలిజం అంటే సానుకూలత పెరిగినప్పటికీ దాని సాధనకు ఒక విప్లవ పార్టీని ఏర్పాటు చేసే పరిస్ధితులు ఇంకా ఏర్పడలేదు. 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఏడాది కాలంలోనే అధిగమించామని అమెరికా పాలకులు ఎంతగా నమ్మబలికినప్పటికీ జనం దానిని నమ్మటం లేదని ఈ సర్వే నిర్దారించింది. ఎందుకంటే గత పది సంవత్సరాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలను కుదించటం లేదా నిధుల కోత పెట్టారు. గతంలో మాదిరి వాటిని అమలు జరుపుతారనే నమ్మకం పోతోంది.

1990 దశకంలో సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన సమయంలో తరుణ వయస్సు వచ్చిన వారికి, తరువాత పుట్టిన వారికి ఆధునిక ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం సహజమైనదిగా కనిపించింది. దాని వైఫల్యం, తమ కళ్ల ముందే ధనికులకు మరిన్ని అవకాశాలను కల్పించటంతో యువత ఆ విధానం సరైంది కాదని భావిస్తోంది. అన్నింటికీ మించి వారికి పొద్దున లేస్తే చైనా తయారీ వస్తువులు లేనిదే గడవదు. తమ దేశంలో మాదిరి సమస్యలు తలెత్తినట్లు చైనా గురించి వార్తలేమీ లేవు.అధికారంలో ఎవరున్నప్పటికీ చైనాతో పెరుగుతున్న వాణిజ్యలోటు గురించి నిత్యం చర్చ జరుగుతోంది. చైనాపై వ్యతిరేకతను కూడా రోజూ రెచ్చగొడుతున్నారు, అయినప్పటికీ జపాన్‌ను వెనక్కు నెట్టి తమతో పోటీ పడేవిధంగా చైనా అభివృద్ధి చెందుతోందనే వార్తలు వెలువడుతున్నాయి. అందువలన వారికి సోషలిస్టు వ్యవస్ద గురించి పూర్తి అవగాహన లేకపోయినా తమ విధానం కంటే సోషలిజమే మెరుగైనదని వారు భావించటం సహజం.

Image result for american youth prefer socialism to capitalism

యువతను పునరాలోచనకు పురికొల్పుతున్నదేమిటి?

నిజవేతనాలు పడిపోతున్నాయి, మెరుగైన వుద్యోగాలు లేవు, ఆదాయ అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో పరిస్ధితి మెరుగుపడుతుందనే ఆశ కనిపించటం లేదు. విద్యకోసం తీసుకున్న రుణాలు కొండలా పెరిగిపోతున్నాయి. గతంలో తమ వేతనాల్లో 18శాతం ఇండ్ల అద్దెలకు చెల్లిస్తే సరిపోయేది ఇప్పుడు అది 30శాతం దాటింది. మెరుగైన జీవనం గడవాలంటే వారానికి కనీసం 80గంటలు పని చేస్తే తప్ప అవసరమైన ఆదాయం రాదు. అన్ని గంటల పని దొరికే అవకాశాలు కూడా లేవు. స్వతంత్రంగా బతికే అవకాశాలు తగ్గిపోతుండటంతో తలిదండ్రుల మీద ఆధారపడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కాపిటలిజం ప్రతినిధులుగా డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారే కనిపిస్తున్నారు, ఇలాంటి వారు తమ జీవితాలను మెరుగుపరచే అవకాశాలు లేవని బలంగా నమ్ముతున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో శాండర్స్‌ వంటి వారు సోషలిజం గురించి గతం కంటే గట్టిగా మాట్లాడుతున్నారు.

ఏ సిద్ధాంతం లేదా రాజకీయాలు లేకపోవటం కంటే ఏదో ఒక సిద్ధాంతం, రాజకీయాల మీద చర్చ జరగటం మంచిది. సిద్ధాంత, రాజకీయ రాహిత్య ధోరణులను ప్రోత్సహించేది పాలకవర్గమే. అమెరికాలో జరుగుతున్న మధనం, పరిణామాల గురించి భిన్నాభిప్రాయాలు వున్నాయి. ట్రాట్క్సీయిస్టులుగా వున్న వారి వాదన ప్రకారం పెట్టుబడిదారీ విధానానికి జన సామాన్యంలో ఎదురవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, గందరగోళపరిచేందుకు మరొక మార్గంలో పాలకవర్గం బెర్నీ శాండర్స్‌ వంటి నకిలీ సోషలిస్టులను, వుద్యమాలను ప్రోత్సహిస్తున్నది. డెమోక్రటిక్‌ పార్టీలోని ఒక భాగం ఏర్పాటు చేసిన డెమోక్రటిక్‌ సోషలిస్ట్స్‌ ఆఫ్‌ అమెరికా(డిఎస్‌ఏ) అనే పార్టీ దాని అనుబంధ సంస్ధ తప్ప ఆ పార్టీని వ్యతిరేకించేది కాదు. దాని పెట్టుబడిదారీ, బూర్జువా రాజకీయాలకు అది ఆమోదయోగ్యమైనది. ఈ అవగాహనతో పూర్తిగా ఏకీభావం వుండకపోవచ్చు లేదా అంగీకరించవచ్చు. తాము చెప్పేదే నిజమైన సోషలిస్టు విప్లవ మార్గం అని చెప్పుకొనే ట్రాట్క్సీయిస్టులు ఎక్కడా బలమైన కమ్యూనిస్టు వుద్యమాలను నిర్మించిన లేదా సోషలిస్టు విప్లవాలకు నాయకత్వం వహించిన చరిత్రగానీ లేదు. తాము తప్ప మిగిలిన వారందరూ నకిలీలని వారు చెప్పుకుంటారు. సోషలిస్టులుగా, మార్క్సిస్టులుగా చెప్పుకొనే కొంత మంది చైనాలో జరుగుతున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం కాదు అంటారు. అందువలన నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను బయటకు రానివ్వండి అన్నట్లుగా చర్చ జరగనివ్వాలి, భిన్నాభిప్రాయలను వినటానికి ఇబ్బంది లేదు. ఆయా దశలను బట్టి కార్యాచరణను ప్రోత్సహించాలి. జనాల వివేచన మీద విశ్వాసం వుండాలి, దాన్ని మెరుగుపరచేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి. డెమోక్రటిక్‌ పార్టీలో వామపక్ష వాదులుగా వున్న వారు ఏర్పాటు చేసిన ఒక వేదిక తప్ప డిఎస్‌ఏ అనేది ఒక పార్టీ కాదని కూడా చెబుతారు. అయితే ఆ వేదిక సభ్యులం అని అనేక మంది సగర్వంగా చెప్పుకుంటారు. అలాంటి వారిని ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది.

Image result for american youth prefer socialism to capitalism

ఈ పూర్వరంగంలో అమెరికాలో జరుగుతున్న పరిణామాలను ఆహ్వానించాలా, వ్యతిరేకించాలా? మార్క్సిస్టు అవగాహన ప్రకారం కార్మికవర్గం తప్ప దోపిడీకి గురయ్యే వారందరూ సోషలిస్టు విప్లవం జయప్రదం అయ్యేంత వరకు దానికి నాయకత్వం వహించే పార్టీలతో వుండరు. తమ సమస్య పరిష్కారం కాగానే కొందరు ఆగిపోతారు. కమ్యూనిస్టు పార్టీలు దున్నేవానికి నినాదంతో రైతాంగాన్ని సమీకరిస్తాయి. ఆ సమస్య పాక్షికంగా పరిష్కారమై కొందరికి భూమి వచ్చిన తరువాత వారు వుద్యమంలో భాగస్వాములయ్యే తీరుకు, రాని వారి తీరుకు తేడా వుంటుంది. కమ్యూనిస్టులు గాని సోషలిస్టు పార్టీలు కూడా అంతే. సోషలిజం, కమ్యూనిజం అనే మాటే బూతుగా, సోషలిస్టును, కమ్యూనిస్టును అని చెప్పుకున్న వారిని వెలివేసినట్లుగా చూసే వాతావరణం వున్న అమెరికాలో అవును నేను సోషలిస్టును అని చెప్పుకోవటమే ఒక పెద్ద ముందడుగు. ఎన్నికలలో పోటీ చేసి ఒక మున్సిపల్‌ వార్డులో అయినా గెలవటం సామాన్య విషయం కాదు. అమెరికన్‌ యువతలో సోషలిజం పట్ల పెరుగుతున్న సానుకూలత ఒక మంచి పరిణామం. గతంలో కమ్యూనిజం సిద్ధాంతానికి ఆకర్షితులు అయిన వారందరూ సమగ్రంగా ఆ సిద్ధాంతం, ఆచరణలను అవపోసన పట్టిన తరువాతే కమ్యూనిస్టులుగా మారలేదు. ఇప్పుడున్న దుష్ట సమాజాన్ని మార్చాలని కోరుకుంటున్న వారికి కమ్యూనిస్టు నినాదమే ఆకర్షణీయంగా కనిపించింది కనుక ఆ వైపు మొగ్గారు. తరువాత రాటు దేలారు. అమెరికాలో అయినా మరొక చోట అయినా అదే క్రమం. అమెరికా డిఎస్‌ఏలో 2016లో ఏడువేల మంది సభ్యులుంటే గతేడాదికాలంలో ఆ సంఖ్య 47వేలకు చేరింది. నవంబరులో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ వేదికకు చెందిన ఇద్దరు విజయం సాధించబోతున్నారని వార్తలు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్దుల ఎంపిక పోటీలో న్యూయార్క్‌ నగరంలోని ఒక స్ధానంలో డిఎస్‌ఏ అభ్యర్ధి అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ ప్రస్తుతం సభ్యుడిగా వున్న జోసెఫ్‌ క్రోలేను ఓడించి అభ్యర్ధిగా ఎంపికయ్యారు. డెట్రాయిల్‌ 13వ నియోజకవర్గం డిఎస్‌ఏకు బలమైనది, ఆ బృందానికి చెందిన రషీదా లాయిబ్‌ అభ్యర్ధిగా ఎంపికయ్యారు. ఈ బృందం నడిపే జాకోబిన్‌ పత్రిక సంపాదకుడిగా ప్రవాస తెలుగు సంతతికి చెందిన సుంకర భాస్కర్‌ వున్నాడు. అమెరికాలో సోషలిజం పట్ల యువతలో పెరుగుతున్న సానుకూలతను సొమ్ము చేసుకొనేందుకు భాస్కర్‌ రచనలకు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కొద్దికాలంగా అవకాశం ఇస్తున్నది. ప్రపంచ సోషలిస్టు పార్టీల చరిత్ర చూసినపుడు అవి ప్రధానంగా సంస్కరణల మీద కేంద్రీకరించాయి తప్ప వ్యవస్ధలో మౌలిక మార్పులను కోరలేదు. మితవాద, తిరోగమన వాదం కంటే నిస్సందేహంగా ఇవి మెరుగైనవే. డిఎస్‌ఏను సంస్కరణవాద వేదికగా భావించవచ్చు.

కారల్‌ మార్క్స్‌-ఫె˜డరిక్‌ ఎంగెల్స్‌ కంటే ముందే రకరాల సోషలిస్టు భావాలు కలిగిన వారున్నారు. వారంతా సమాజాన్ని సంస్కరించాలని, మార్చాలని కోరుకున్నారు. మార్పును కోరుకుంటే రాదు. తత్వవేత్తలు వివిధ మార్గాలలో ప్రపంచానికి వ్యాఖ్యానాలు చెప్పారు. అసలు సమస్య దానిని మార్చటం ఎలా అన్నదే అన్న మార్క్స్‌-ఎంగెల్స్‌లు తమ కమ్యూనిస్టు ప్రణాళికలో ఒక శాస్త్రీయ మార్గాన్ని చెప్పిన తరువాతే వారికీ సోషలిస్టులకు వున్న తేడాను ప్రపంచశ్రామికవర్గం గ్రహించింది. ట్రాట్క్సీయిస్టులు లేదా మరొకరో అంటున్నట్లు అమెరికాలో ఇప్పుడు సోషలిస్టులుగా చెప్పుకుంటున్నవారు కేవలం సంస్కరణలకే పరిమితం అయితే కావచ్చు. పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు పూర్తిగా పోయాయని ఎవరూ చెప్పటం లేదు. అలాంటి వారు సంస్కరణల ద్వారా మంచి భవిష్యత్‌ నిర్మాణం చేసుకోవచ్చని అనుకోవచ్చు. తమ అనుభవంలో వాటికి వున్న పరిమితులను అర్ధం చేసుకొని అక్కడి యువత,శ్రామికవర్గం ఆ తదుపరి ఏం చేయాలో, ఏ బాటను పయనించాలో నిర్ణయించుకోలేదా ? విప్లవ పార్టీని నిర్మించుకోలేదా ? పాలకవర్గ నిజరూపాన్ని గుర్తించలేదా ? అందువలన అనుమానాలు, ఎలాంటి సందేహాలు అవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మెక్సికో ఎన్నికల విజేత వామపక్షమా, సోషల్‌ డెమోక్రసీయా !

04 Wednesday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

AMLO, Andres Manuel Lopez Obrad, Lopez Obrador, Mexican Lopez Obrador, MORENA, The 2018 Mexican election

Image result for 2018 mexico election, amlo

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు మెక్సికోలో జరిగిన ఎన్నికలలో వామపక్షవాది ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రాడార్‌ (ఆమ్లో) ఘన విజయం సాధించినట్లు మీడియా ప్రకటించింది. తొంభై మూడు శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి అధ్యక్ష ఎన్నికలలో లోపెజ్‌కు 53శాతం, సమీప ప్రత్యర్ధులకు వరుసగా 22.5,16.4,5.1,0.1 ఓట్లు వచ్చాయి. మొత్తం ఐదుగురు అభ్యర్ధులలో ముగ్గురు మూడు కూటముల తరఫున పోటీ చేయగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు. ఓట్ల లెక్కింపు పూర్తయితే దాదాపు ఇదే శాతాలు ఖరారు కావచ్చు లేదా స్వల్పతేడాలుండవచ్చు. పార్లమెంట్‌ వుభయ సభలలో కూడా లోపెజ్‌ నాయకత్వంలోని ‘కలసి కట్టుగా మేము చరిత్రను సృష్టిస్తాం’ అనే పేరుతో ఏర్పడిన కూటమి ఐదువందల స్ధానాలున్న ఛాంబర్‌ డిప్యూటీస్‌(మన లోక్‌సభ మాదిరి)లో 312, 128 సీట్లున్న సెనెట్‌(రాజ్యసభ మాదిరి)లో 69 స్ధానాలతో సంపూర్ణమెజారిటీ సాధించవచ్చునని విశ్లేషణలు వెలువడ్డాయి. లోపెజ్‌ను ‘మెక్సికో బెర్నీశాండర్స్‌’ అని కొందరు వర్ణించారు, అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్‌సైట్‌లో ‘సంస్కరణవాది’ అని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికలు, పార్లమెంట్‌, మున్సిపల్‌ ఎన్నికలు అన్నీ ఒకేసారి జరిగాయి. అన్నింటా ఈ కూటమి ఘన విజయం సాధించింది. అధ్యక్షుడు ఐదు సంవత్సరాల పది నెలలు, పార్లమెంటు దిగువ సభ మూడు సంవత్సరాలు, ఎగువ సభ ఆరు సంవత్సరాల పాటు వుంటుంది.

ఈ కూటమిలో జాతీయ పునరుజ్జీవన పార్టీ,మావోయిస్టులతో కూడిన వర్కర్స్‌ పార్టీ, క్రైస్తవ మత మితవాదులతో నిండిన సోషల్‌ ఎన్‌కౌంటర్‌ పార్టీ వున్నాయి. పార్లమెంటులో వీటికి వరుసగా 193,54,58 వస్తాయని ఓటింగ్‌ సరళి తెలిపింది. మున్సిపల్‌ ఎన్నికలలో 80శాతంపైగా స్ధానాలు తెచ్చుకుంది. జాతీయ పునరుజ్జీవన పార్టీ నేత లోపెజ్‌ మన దేశంలో సోషలిస్టులుగా జీవితం ప్రారంభించి వివిధ పార్టీలు మారిన జార్జిఫెర్నాండెజ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌ వంటి పాలకవర్గాలకు చెందిన వారితో పోల్చదగిన రాజకీయ నేపధ్యం వుంది. మెక్సికోలో 1929 నుంచి 2000 వరకు ఎలాంటి విరామం లేకుండా అధికారంలో వున్న పిఆర్‌ఐ పార్టీ కార్యకర్తగా 1976లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ పార్టీపోకడలు నచ్చక దాన్నుంచి విడివడిన వారు 1986లో డెమోక్రటిక్‌ రివల్యూషన్‌ పార్టీ(పిఆర్‌డి)గా ఏర్పడ్డారు. లోపెజ్‌ 1989లో దానిలో చేరి 1994లో ఒక రాష్ట్ర గవర్నర్‌గా పోటీ చేశారు.2000 సంవత్సరంలో మెక్సికో నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 2005లో మేయర్‌ పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ తరఫున పిఆర్‌డి, పౌర వుద్యమం, లేబర్‌ పార్టీ కూటమి తరఫున 2006 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేశారు.స్వల్పతేడాతో ఓడిపోయారు. పిఆర్‌ఐ పార్టీ అక్రమాలకు పాల్పడిందని, అందువలన తాను ఓటమిని అంగీకరించనంటూ కొన్ని నెలలపాటు ఆందోళన నిర్వహించారు. తరువాత 2012 ఎన్నికలలో కూడా అదే కూటమి తరఫున పోటీచేసి రెండవ స్ధానం తెచ్చుకున్నారు. ఆ సందర్భంగా తనకు మద్దతు కూడగట్టేందుకు జాతీయ పునరుజ్జీవన వుద్యమం(మొరెనా) పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. ఓటమి తరువాత పిఆర్‌డి నుంచి విడిపోయి, అంతకు ముందు ఏర్పాటు చేసిన సంస్ధను 2014లో రాజకీయ పార్టీగా నమోదు చేశారు. ఇప్పుడు దాని నాయకత్వాన ఏర్పడిన కూటమి తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు.

విద్యార్ధులు, వృద్ధులకు ఆర్ధిక సాయాన్ని పెంచాలని, కొంత మంది మాదక ద్రవ్య నేరగాండ్లకు క్షమాభిక్ష ప్రసాదించాలని, ప్రభుత్వ కాలేజీలలో అందరికీ ప్రవేశం కల్పించాలని, నూతన అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేయాలని, ఇంధన సంస్కరణలు చేపట్టాలని, ప్ర భుత్వ రంగ చమురు సంస్ధ గుత్తాధిపత్యాన్ని తొలగించాలని, వ్యవసాయానికి వుద్దీపన కలిగించాలని, ఎన్నికలు ముగిసే వారకు నాఫ్టా గురించి చర్చలు నిలిపివేయాలని, కొత్తగా చమురుశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయటం, సాంఘిక సంక్షేమానికి ఖర్చు పెంచటం, ప్రజాప్రతినిధుల వేతనాల తగ్గింపు లేదా పన్నుల పెంపుదల, అధికారాల వికేంద్రీకరణ, రాష్ట్రాలకు బదలాయింపు వంటి అంశాలను లోపెజ్‌ ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు ప్రచారం, వాగ్దానాలు చేశారు.

ఈ ఎన్నికలలో మొరెనా, పిఆర్‌డి,పిటి, సిటిజన్స్‌ వుద్యమం(ఎంసి) కలసి పోటీ చేయటం గురించి ప్రతిపాదనలు వచ్చాయి. గతేడాది మెక్సికో రాష్ట్ర ఎన్నికల సమయంలో తలెత్తిన విబేధాల కారణంగా ఆ కూటమిని లోపెజ్‌ వ్యతిరేకించారు. తాము ఎన్నికలలో కలసి పోటీ చేసే అవకాశం వుందని గతేడాది చివరిలో క్రైస్తవ మతవాద సోషల్‌ ఎన్‌కౌంటర్‌ పార్టీ(పిఇఎస్‌), మొరేనా ప్రకటించాయి. చివరకు ఈ రెండు పార్టీలతో పాటు మావోయిస్టులతో కూడిన వర్కర్స్‌ పార్టీ కలసి ఐక్యంగా మేము చరిత్రను సృష్టిస్తాం అనే పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. వర్కర్స్‌, పిఇఎస్‌ పార్టీలు దిగువ సభలో 75, ఎగువ సభలో 16స్ధానాల చొప్పున పోటీ చేసేందుకు మిగిలిన వాటిలో మొరేనా బరిలో నిలిచేందుకు ఒప్పందం కుదిరింది. పిఇఎస్‌తో కూటమి కట్టడంపై విమర్శలు వచ్చాయి.

వాయిస్‌ ఆఫ్‌ అమెరికా ఎన్నికలకు ముందు చేసిన విశ్లేషణ సారాంశం ఇలా వుంది.ట్రంప్‌కు వ్యతిరేకంగా ధృడ వైఖరి అనుసరించాలనే ప్రజాకర్షక వామపక్ష వాది అధ్యక్ష ఎన్నికల రంగంలో ముందున్నాడు. ఆయన విజయం సాధిస్తే మెక్సికో త్వరలో ఒక వామపక్ష, ప్రజాకర్షక, జాతీయవాది అధికారంలో వుంటారు. విజయం తధ్యమని ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. ప్రస్తుతం అధికారంలో వున్న పిఆర్‌ఐ అధ్యక్షుడు అవినీతి పట్ల మెతక వైఖరిని తీసుకున్నకారణంగా ఓటర్లు పెను మార్పులకు సిద్ధంగా వున్నారు. మెక్సికోలో ఇవి అతి పెద్ద ఎన్నికలు. అన్ని స్ధాయిలలో 3,400 మందిని ఎన్నుకుంటారు.భవిష్యత్‌లో పెద్ద మార్పులు తీసుకు వస్తానని లోపెజ్‌ వాగ్దానం చేసినందున సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతున్నది.మెక్సికో గురించి మీరు(అమెరికన్లు) తెలుసు కోవాల్సిందేమంటే అతను ఒక జాతీయ వాద వామపక్ష అభ్యర్ధి.ఏమైనా సరే సంస్కరణలు కావాలనే ధోరణిలో ఓటర్లు వున్నందున ముగ్గురు ప్రత్యర్ధుల కంటే ఎంతో ముందంజలో వున్నారు. అతను ఇంతకు ముందు రెండుసార్లు పోటీ చేసినప్పటి కంటే ఓటర్లు ఇప్పుడు ఓటర్లు ప్రభుత్వంతో విసిగిపోయి వున్నారు. మొత్తం మీద ప్రజాస్వామ్యం మీదే ఆశాభంగం కనిపిస్తున్నదని కొలంబియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ పాబ్లా పికాటో అన్నారు.అసమానతలు, అవినీతి మీద పోరు సలుపుతానని లోపెజ్‌ వాగ్దానం చేశాడు. విప్లవాత్మక చర్యలని నేనంటున్నానంటే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవినీతి, అన్యాయాల వేళ్లను పెకలిస్తాను అని ఆయన ఒక సభలో చెప్పాడు.నలుగురు అభ్యర్ధులు ఒక విషయంలో ఒకే విధంగా వున్నారు. వారు నిజంగా, నిజంగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను ఇష్టపడటం లేదు. ఆర్ధిక ప్రగతికి అమెరికాతో కలసి పని చేస్తూనే ట్రంప్‌ జగడాల మారి విధానాల పట్ట ధృడ వైఖరి తీసుకుంటామని వాగ్దానం చేశారు. వుత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా)పై సమీక్ష జరపాలని ట్రంప్‌ చెప్పారు.లోపెజ్‌ వైఖరి ఇప్పుడు అనుకూలంగానే వున్నప్పటికీ అతని జాతీయవాదభావాలు భవిష్యత్‌లో కీడును సూచిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే బలమైన అధ్య క్షుడు కావాలని మెక్సికో ఓటర్లు కోరుకుంటున్నారు.

Image result for The 2018 Mexican election,amlo

ఎన్నికల ఫలితాల గురించి న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఇలా వ్యాఖ్యానించింది.’ దశాబ్దాల కాలంలో తొలిసారిగా లోపెజ్‌ ఒబ్రడోర్‌ విజయం లాటిన్‌ అమెరికాలోని రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధ ఆధికార కేంద్రంలో ఒక వామపక్ష వాదిని కూర్చోబెట్టింది. దేశంలోని వున్నత వర్గ భీతి, కోట్లాది మంది మెక్సికన్ల ఆశాభావం కారణంగా ఇది జరిగింది. గత పాతిక సంవత్సరాలుగా మధ్యేవాద హద్దులలో నడక మరియు ప్రపంచీకరణ అమలు తమకేమీ ఒరగబెట్టలేదనే భావానికి గురైన మెక్సికన్లు దేశంలోని యధాతధ స్ధితిని స్పష్టంగా తిరస్కరిస్తున్నారని ఫలితం సూచిస్తున్నది.’ ఆర్ధిక విధానాలు దేశంలో అసమానతలను తీవ్రంగా పెంచాయి.శాంతి భద్రతలు దిగజారాయి. ఈ ఎన్నికలు మెక్సికో చరిత్రలో అత్యంత హింసాత్మకమైనవిగా మారాయి. నలభై ఎనిమిది మంది అభ్యర్ధులతో సహా 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక రోజే ముగ్గురు మహిళా అభ్యర్ధులను కాల్చి చంపారు.మున్సిపల్‌ స్ధాయిలో నేరస్ధ గుంపులు రెచ్చిపోయాయి.బెదిరింపుల కారణంగా ఆరువందల మంది పోటీ నుంచి వెనక్కు తగ్గారు. వీటికి తోడు తమ దేశంలో ప్రవేశించిన మెక్సికన్ల గురించి యూదుల గురించి హిట్లర్‌, నాజీల మాదిరి డోనాల్డ్‌ ట్రంప్‌, అమెరికన్లు చులకనగా మాట్లాడటం, వాణిజ్య యుద్ధం ప్రకటించటం, లోపెజ్‌ ట్రంప్‌ వ్యతిరేకి అనే భావం బలంగా వ్యాపించటం కూడా ఈ ఎన్నికలలో బాగా పని చేసినట్లు కనిపిస్తోంది. అమెరికా మీద ఆధారపడకుండా మెక్సికో ఆర్ధిక స్వాతంత్య్ర సాధనకు తద్వారా వుపాధి కల్పనకు కృషి చేస్తాననే జాతీయవాద భావాన్ని కూడా లోపెజ్‌ ప్రచారం చేశారు. ఒక ఏడాదిలోపే తనను గద్దెదించటం ఎలా అనే కర్తవ్యాన్ని అమెరికా గూఢచార సంస్ధలకు లక్ష్య నిర్దేశం చేస్తారని లోపెజ్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే పేర్కొన్నారు.మెక్సికో నగర మేయర్‌గా లోపెజ్‌ పని చేసిన కాలంలో వృద్దాప్య పెన్షన్లు పెంచటం, రోడ్ల విస్తరణతో రద్దీ తగ్గించటం, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య పద్దతిలో పాతనగర అభివృద్ధి వంటి చర్యల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొనటం అమెరికాలో సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ను గుర్తుకు తెచ్చిందని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానించారు. లాటిన్‌ అమెరికాలో వెనుక పట్టు పట్టిన గులాబి అలలను ఆమ్లో విజయం పునరుద్ధరిస్తుందని గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ అధ్యక్షుడు గ్లెసిస్‌ హాఫ్‌మన్‌ ఈ ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తూ లాటిన్‌ అమెరికాలో పురోగామి గాలుల పునరాగమనానికి ఇది చిహ్నమని పేర్కొన్నారు. ఇది ఒక్క మెక్సికో విజయం మాత్రమే కాదు మొత్తం లాటిన్‌ అమెరికాదని బ్రెజిల్‌ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ వ్యాఖ్యానించారు. మొత్తం ఈ ప్రాంత ఆశలకు ఆమ్లో ప్రతినిధి అని అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా కిర్చినర్‌ పేర్కొన్నారు.

అమెరికాతో సంబంధాల కారణంగా దెబ్బతిని ప్రధాన పార్టీలకు దూరమైన చిన్న తరహా వాణిజ్యవేత్తలు, ఒక తరగతి మేథావులు, కొందరు బడా వాణిజ్యవేత్తల మద్దతును కూడగట్టటం కూడా లోపెజ్‌ విజయానికి దోహద పడింది. దేశ జనాభాలో 46శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన వుండటం, అనేక ప్రాంతాలను మాదకద్రవ్యమాఫియా ముఠాలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవటం, వాటికి అధికారగణం, పాలక పిఆర్‌ఐ, మితవాద పాన్‌ పార్టీల మద్దతు కారణంగా గత పది సంవత్సరాలలో మాదక ద్రవ్య మాఫియా చేతుల్లో రెండులక్షల మంది హతులు కావటం మరో 30వేల మంది అదృశ్యమయ్యారు.2014లో 43 మంది విద్యా ర్ధుల అదృశ్యం, హత్యకు ఎవరు కారకులో ఇప్పటికీ అధికారికంగా నిర్ధారించలేదు. స్కాలర్‌షిప్పులు పొందే విద్యార్ధులు కావాలి తప్ప కాంట్రాక్టు హంతకులు మనకు వద్దని ఇచ్చిన లోపెజ్‌ నినాదం బహుళ ఆదరణ పొందింది.

మెక్సికో ఎన్నికలలో ఎవరు గెలిచినప్పటికీ నష్టపోయేది కార్మికులే అని ఎన్నికలకు ముందే మెక్సికో కమ్యూ నిస్టుపార్టీ వ్యాఖ్యానించింది. పెట్టుబడిదారీ వ్యవస్ధ పరిధిలో బూర్జువా పార్టీల మధ్య అధికార కుమ్ములాటలు తప్ప ఆ వ్యవస్ధ కొనసాగింపునకే లోపెజ్‌ నాయకత్వంలోని సోషల్‌ డెమోక్రటిక్‌ మొరేనా, మావోయిస్టులు ఏర్పాటు చేసిన వర్కర్స్‌ పార్టీకూడా తోడ్పడుతున్నాయని పేర్కొన్నది. ప్రగతి వాదులమని చెప్పుకొనే పిఆర్‌డి, మొరేనా, పిటి పార్టీలు మితవాదులతో కలవటానికి సైద్ధాంతిక ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నిస్తూ అవి నిజమైన వామపక్షాలు కాదని స్పష్టం చేసింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో వున్న సంక్షోభ పరిష్కారం గురించి కొన్ని తేడాలు వుండవచ్చు తప్ప అవి ముందుకు తెచ్చే నయా వుదారవాదం లేదా నయా కీనీసియనిజం(పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర సంక్షోభం లేదా మాంద్యానికి గురైనపుడు ప్రభుత్వ పెట్టుబడులు పెంచటం, వస్తువినిమయ డిమాండ్‌ పెంచేందుకు అవసరమైన చర్యల గురించి కీన్స్‌ సూచించిన పరిష్కార మార్గం) కార్మికవర్గ జీవన పరిస్ధితులను మెరుగుపరచదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. సోషల్‌ డెమోక్రసీ తురుపు ముక్కలను ప్రయోగిస్తామని చెప్పటమే తప్ప ఆట అడదని గ్రీసులోని సిరిజా, స్పెయిన్‌లోని పొడెమాస్‌ లక్షణాలు మొరేనాలో వున్నాయని వ్యాఖ్యానించింది. 2000సంవత్సరాలో మెక్సికో నగర మేయర్‌ ఎన్నికల్లో లోపెజ్‌ పోటీ చేసినపుడు కమ్యూనిస్టు పార్టీ భాగస్వామిగా వుందని, ఎన్నిక తరువాత కూటమి పట్ల విశ్వాసాన్ని కనపరచలేదని, తన వర్గ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడని గుర్తు చేసింది. గుత్తాధిపతులకు ఇష్టమైనవారిలో ఒకరిగా లోపెజ్‌ వున్నారని, ఇదే సమయంలో ఆకలి, దారిద్య్రాలతో అలమటించుతూ విసిగిపోయిన వారిలో ఆశను కూడా కలిగిస్తున్నాడని, తరువాత అసంతృప్తికి గురవుతారని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. మెక్సికో కార్మికవర్గ సమస్య పెట్టుబడిదారీ విధానం, దానిని మార్చేందుకు లోపెజ్‌ ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోగా దానిని బలపరచాలని కోరుకుంటున్నారని, అందువలన ఓటు వేసినా వేయకపోయినా ఒరిగేదేమీ లేదని, అయితే జరుగుతున్న పరిణామాలలో కార్మికవర్గం జోక్యం చేసుకోవాలని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది.

Image result for The 2018 Mexican election

సోషల్‌ డెమోక్రాట్లు తమను వామపక్షవాదులుగా పిలుచుకోవటం, మీడియా కూడా అదే ప్రచారం చేస్తున్నది. ఫ్రాన్స్‌లో సోషలిస్టు పార్టీ, బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ, అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ వంటి వన్నీ ఈకోవకే వస్తాయి. వాటిలో కొంత మంది సంస్కరణవాదులు,కొందరు వామపక్ష వాదులు వుండవచ్చు తప్ప మౌలికంగా అవి పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడేవే తప్ప వ్యతిరేకించేవి కాదని ఇప్పటికే రుజువు చేసుకున్నాయి. బూర్జువావర్గంలో అధికారంకోసం జరిగే పెనుగులాటలో ఇలాంటి పార్టీలు అనేకం పుట్టుకు వస్తాయి, అంతరించి, కొత్త రూపాలలో రావటం తప్ప మౌలిక స్వభావంలో మార్పు వుండదు. మెక్సికో మొరేనా పార్టీ నాయకత్వంలోని కూటమి కూడా అలాంటిదే. దాని మీద భ్రమలు పెట్టుకోనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

CPI(M) for proportional representation with partial list system in the elections

25 Monday Jun 2018

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Others

≈ 1 Comment

Tags

Communist Party of India (Marxist), CPI(M), INDIAN LEFT, Kerala LDF

Image result for cpim

The Central Committee of the Communist Party of India (Marxist) met in New
Delhi from June 22 to 24, 2018. It has issued the following statement:

CC Lauds Kerala LDF Govt.
The Central Committee congratulated the LDF government in Kerala for the manner in which they could contain the dreaded Nipah virus from spreading.The efforts of the state government have earned accolades from international agencies including the World Health Organisation.

Four Years of Modi Government
The Central Committee took stock of the four years of the Modi Government.These four years of Modi Government has seen unprecedented attacks on people’s livelihood, the sharpening of communal polarization accompanied by murderous assaults on Muslims and the Dalits, severe undermining of institutions of parliamentary democracy and independent constitutional authorities. The relentless rise in the prices of petroleum products apart from burdening crores of consumers is leading to a cascading inflationary spiral with the inflation rate now going up despite the weak economic activity as a consequence of demonetization and GST. During these four years the BJP
government had hiked the excise duty on petroleum products eleven times. Agrarian distress continues to mount with no respite in the distress suicides of the farmers. Consequent to the big agitations and militant movements by the peasantry the BJP governments in various states had made several promises but none of these have been implemented. A further round of militant actions and struggles are in the offing. There is an alarming increase in the overall atmosphere of hate engendering violence across the country especially in BJP ruled states. Apart from the violence perpetrated by private armies in the name of `cow protection’ and `moral policing’, incidents of mob lynchings and horrendous gang rapes and murders of minors are on the rise. The latest is the gruesome gangrape of five women in Jharkhand. The BJP state government refused to register a case and punish the guilty. This amounts to patronizing such private armies, thus encouraging the dehumanization of our society.There is a complete breakdown of law and order under the BJP government.People’s constitutional rights are being allowed to be violated with impunity.The Central Committee called upon all Party units to organize protest actions on these issues.

Loot of Public Money
The Central Committee took note of the massive loot of public money by certain corporate houses. In addition to the over 2.5 lakh crore waiving off of defaulting loans by corporates from public sector banks in the first three years of the Modi government, it is now reported that an additional Rs. 1,44,993 crores were written off. The Governor of the Reserve Bank of India has now stated that the RBI is not equipped to monitor the over 1.6 lakh branches of the banks all across the country. The RBI is a regulator of the Indian banking system and formulates the monetary policy for the country. The central government must strengthen the RBI to discharge its constitutional responsibility. It is clear that in the four years of this Modi government massive loot of people’s money is taking place and the perpetrators are allowed to leave the country and the government remains virtually a spectator.

Atrocities Against Dalits
The Central Committee noted with serious concern that there has been a concerted attack on organisations and individuals championing the rights of Dalits and those who had participated in the April 2 all India bandh called by various dalit organisations, particularly in BJP ruled states of Madhya
Pradesh, Uttar Pradesh and Rajasthan. The CC decided that the Party at all levels shall actively associate with these protests and take these movements forward.The CC demanded that a Bill should be introduced in the forthcoming session of parliament, to nullify the effect of the Supreme Court judgment that rendered the provisions of the SC/ST Prevention of Atrocities (POA) Act
ineffective. In the interregnum an ordinance should be promulgated so that the situation existing prior to the SC judgment is restored and the sense of insecurity of these communities about their constitutional rights is addressed. The RSS-BJP has coined a new terminology of “urban Maoists”. Five activists have so far been arrested under this garb for supporting the Dalit agitation. BJP state government of Maharashtra has also invoked the dreaded UAPA. The CC underlined that such actions will only lead to further the alienation of the Dalits.

Citizenship Act
The CC felt that the proposed amendment to the Citizenship Act on the basis of religious affinity of the people is straining the already fragile unity of the people in the state of Assam. Religious and linguistic minorities are under severe pressure due to incomplete and deliberate discrimination in the process of the updating of the national register of citizens (NRC) and the category of doubtful voters.The unity of the people belonging to different religions, languages and ethnicity must be the foremost objective. Playing with emotive issues for electoral gains by the BJP/RSS is worsening the situation.The CPI(M) opposes any amendment based on the religious affiliation of the people to determine their citizenship.

Jammu & Kashmir:Total Failure of BJP’s Political Approach Taking stock of the emerging situation in Jammu & Kashmir, the CC is of the view that the decision of the BJP to withdraw from the coalition government with the PDP in Jammu & Kashmir at this particular moment has the potential of creating greater political instability in the state. It signifies the total political failure of the BJP’s approach in Jammu & Kashmir.This alliance was untenable since the beginning. It was an alliance between forces that never saw eye to eye on any issue but came together in an act of sheer opportunism to share the spoils of office.The BJP was party to all decisions of the state government during the past three years and hence cannot absolve any responsibility for contributing to a further deterioration in the state and towards deepening the alienation of the people. The central government should implement the assurances it had made earlier to urgently enforce confidence building measures and start a political process through dialogue with all stakeholders. The Central Government must initiate talks with Pakistan to ensure cross border terrorism is stopped by a mutually agreed ceasefire along the Line of Control. The situation in Jammu & Kashmir cannot be allowed to deteriorate further.With Governor’s rule now imposed, there is a widespread apprehension that the RSS-BJP will embark on a more hardline position under the pretext of combating terrorism. There are apprehensions of growing dangers of human rights abuses and violations of democratic rights of the people. The effort appears to be to sharpen communal polarisation not only in Jammu & Kashmir but to aid the process of consolidating the Hindutva communal vote bank elsewhere in the country in the run-up to the general elections.

Assembly & Bye-Election Results
The BJP has suffered a setback in the recently held elections to the Karnataka assembly as well as the other bye elections to the Lok Sabha and assemblies. Out of the total fourteen seats it has been able to win only two. Of the bye-elections to four Lok Sabha constituencies held last month the BJP was able to win in Palghar (Maharashtra only) in a five cornered contest. Out of the ten assembly bye-elections it could win only one. Its defeat in Kairana in Uttar Pradesh is significant as it follows its earlier defeat in the bye-elections in its sitting Phulpur and Gorakhpur Lok Sabha seats. In Kairana the RLD candidate was backed by the Congress, SP & the BSP.
Kerala: The Central Committee congratulated the CPI(M) & the LDF in Kerala for retaining the Chengannur assembly constituency by a big majority of 20,956 votes, in the bye-election held following the death of our sitting legislator. The LDF got 36.37 per cent of the polled votes in 2016 while it is 44.2 cent now. While the UDF performance remained more or less the same the BJP’s vote share reduced from 29.26 to 23.19 per cent.
Karnataka Elections: In the recently held elections to the Karnataka assembly, the Congress lost its sitting government. People’s verdict delivered a hung assembly. Though the BJP with 36.2 per cent of the polled votes came out as the single largest party, the Congress-JD(S) combine which fought the elections separately together polled 56.6 per cent. The CPI(M) candidate in Bagepalli constituency, G V Sreerama Reddy, came second polling 51,697 votes as compared to 35,472 polled in 2013.The BJP/RSS’s attempts to cobble a majority through horse-trading were thwarted and a JD(S)-Congress government has assumed office. In the light of the obnoxious role played by the Governor in this as well in other instances over the last four years, the demand for abolition of this office needs to be reiterated.

Further Cementing Military Ties with USA
In preparation for the two plus two Indo-US dialogue (foreign and defence ministers of both countries) in Washington next month, India is negotiating the draft Communications, Compatibility and Security Agreement (COMCASA).Overriding some defence ministry reservations that fear US intrusive access to Indian military communication systems, the Modi government is proceeding to further strengthen its status of a subordinate ally of US imperialism.This comes after the strategic defense agreement, Logistics Exchange Memorandum of Agreement (LEMOA). The CPI(M)strongly protests against such surrender of India’s sovereignty.

Division of Responsibilities
The Central Committee decided on the division of responsibilities amongst the Polit Bureau and Central Committee members. It also finalized the road map for the implementation of the tasks before the Party as decided by the 22nd Party Congress.

CC Calls Mazdoor-Kisan Rally: The Central Committee extended its support to the joint call for a march to parliament on September 5 given by the working class and the peasant organisations including agricultural labour. The Party also extended its support to the signature campaign and the joint worker-peasant jail bharo on August 9.Campaign for Urgent Electoral Reforms: The Central Committee decided to conduct a nationwide campaign and organize seminars/conventions/public meetings demanding urgent electoral reforms. This will include the propagation of the CPI(M) stand for proportional representation with partial list system in the elections, curbing the growing influence of money power and the deepening of an atmosphere of hate creating animosity among different sections of our people which needs to be checked through proper changes in the existing electoral system. This campaign will also highlight the need for making funding of political parties transparent and demand the withdrawal of the electoral bonds introduced by the Modi government as also the amendment made to the FCRA which is only legalizing political corruption. This campaign for electoral reforms will be conducted in the coming three months all across the country. The Central Committee decided to hold a national level protest against the murder of democracy in the state of West Bengal and Tripura in the month of July.The Central Committee decided that on the grave situation emerging in Jammu & Kashmir a national level convention will be organized for popular interventions to restore peace and normalcy in the state.

Cooption to CC
The 22nd Congress had directed the newly elected Central Committee to fill up one vacancy in the Central Committee by a woman comrade. The Central Committee decided to coopt A.R. Sindhu against this vacancy.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరోమారు విజయం సాధించిన వెనెజులా సోషలిస్టు నికొలస్‌ మదురో !

21 Monday May 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Nicolás Maduro, Venezuela elections, Venezuela votes 2018, venezuelan chavista

ఎం కోటేశ్వరరావు

‘మేం ఇంతవరకు 92 ఎన్నికలను పర్యవేక్షించాం, వెనెజులా ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే వుత్తమమైనది అని నేను చెబుతా’ ఈ మాటలన్నది అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌. ఆదివారం నాడు జరిగిన ఆ దేశ ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్‌ మదురో ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపు పూర్తిగాక ముందే ఈ ఎన్నికలను తాము గుర్తించటం లేదని, అక్టోబరులో తిరిగి ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష అభ్యర్ధులు ప్రకటించారు. పోలైన ఓట్ల 86లక్షల ఓట్లలో 92.6శాతం లెక్కింపు జరిగిన సమయానికి మదురోకు 58, సమీప అభ్యర్ధి హెన్రీ ఫాల్కన్‌కు 18లక్షలు వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆంక్షలు, ప్రచారదాడి, వత్తిడి, ఆర్ధిక ఇబ్బందుల మధ్య జరిగిన ఈ ఎన్నికలలో పాలక సోషలిస్టు పార్టీ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత వుంది. అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో అమెరికా అనుకూల, మితవాద శక్తులు జనాన్ని తప్పుదారి పట్టించుతున్న తరుణంలో వెనెజులాలో వాటి ఆటలు సాగనివ్వలేదు. దాంతో తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఒకవైపు ప్రకటించిన ప్రతిపక్షాలు మరోవైపు స్వతంతత్రుల ముసుగులో అభ్యర్దులను నిలిపాయి. వారు ఓటమి తధ్యమని తేలగానే ఫలితాల ప్ర కటనకు ముందే ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ కొత్త పల్లవి అందుకున్నారు. డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను ముందుగానే జరపటం అక్రమాలలో ఒకటని పేర్కొన్నారు. తాను విజయం సాధిస్తే దేశ కరెన్సీని అమెరికా డాలరుగా మార్చివేస్తానని ప్రకటించిన ప్రధాన ప్రత్యర్ధి హెన్రీ ఫాల్కన్‌ ఫలితాలను తాను గుర్తించనని పేర్కొంటూ చేసిన ప్రకటనలో ప్రతిపక్షంలోని కొంత మంది ఓటింగ్‌కు రాకపోవటం తన ఓటమికి కారణమని పేర్కొన్నాడు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో ఎర్ర కేంద్రాలను ఏర్పరచి ఓటర్లపై బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించాడు. నమోదైన ఓటర్లలో 46శాతం పోలింగ్‌కు వచ్చారు.

నికొలస్‌ మదురోపై పోటీ చేసిన వారిలో ప్రధాన ప్రత్యర్ధి న్యాయవాది అయిన హెన్రీ ఫాల్కన్‌ గతంలో ఛావెజ్‌ నాయకత్వంలోని సోషలిస్టు పార్టీలో లారా రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశాడు. ఛావెజ్‌ బ్రతికి వుండగానే 2010లో పార్టీ నుంచి వెళ్లిపోయాడు. 2013 ఎన్నికలలో మదురో ప్రత్యర్ధి హెన్రిక్‌ కాప్రిల్స్‌ ప్రచార సారధిగా పని చేశాడు.ఈ ఎన్నికలలో ప్రతిపక్షం నుంచి విడిపోయి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశాడు. ఎన్నికల బహిష్కరణ పనిచేయలేదు, అందుకే ఆ ప్రక్రియకు దూరంగా వుండదలచుకున్నాను. ఒక దేశం తరువాత మరొక దేశంలో బహిష్కరణ పిలుపులతో ప్రతిపక్షాలు ఎన్నికల రంగానికి దూరమై పాలకులు పటిష్టం కావటానికి అవకాశమిచ్చాయని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికలో రాసిన వ్యాసంతో ఫాల్కన్‌ పేర్కొన్నాడు. దేశ కరెన్సీ బలివర్‌ స్ధానంలో అమెరికా డాలర్‌ను ప్రవేశ పెట్టి దేశ ఆర్ధిక వ్యవస్ధను స్ధిరీకరించేందుకు పని చేస్తానని, ఐఎంఎఫ్‌ నుంచి సాయం పొందేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. మరొక ప్రత్యర్ధి క్రైస్తవ మత పాస్టర్‌ అయిన జేవియర్‌ బెర్టూసీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని స్వతంత్రుడనని ప్రకటించుకున్నాడు. కరెన్సీ మార్పిడిపై నియంత్రణలను ఎత్తివేస్తానని, విదేశీ పెట్టుబడులను పెంచుతానని, ఛావెజ్‌ ప్రారంభించిన సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తానని వాగ్దానం చేశాడు. మరో అభ్యర్ధి రెనాల్డో క్విజాడా తను ఛావిస్టా(ఛావెజ్‌) వుద్యమాన్ని కొనసాగిస్తానని, అయితే మదురో ప్రభుత్వానికి వ్యతిరేకినని ప్రకటించుకున్నాడు. వీరికి వరుసగా 21.1, 10.8,0.4శాతాల చొప్పున ఓట్లు వచ్చాయి. మదురో 67.7శాతం పొందారు.

హ్యూగో ఛావెజ్‌ రాజకీయ వారసుడిగా 2013లో అధికారానికి వచ్చిన నికొలస్‌ మదురో గత ఆరు సంవత్సరాలుగా ఇంటా బయటా అనేక ఆటంకాలను ఎదుర్కొన్నాడు. ప్రధాన ఆదాయ వనరైన చమురు రేట్లు గణనీయంగా పడిపోవటంతో దేశం ఆర్ధికంగా అనేక ఇబ్బందులపాలైంది. చమురు ధరల పతనం కారణంగా జిడిపి 45శాతం పడిపోయిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ప్రకటించింది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకులైన వాణిజ్యవేత్తలు బ్లాక్‌మార్కెటింగ్‌ వంటి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వంతో ప్రత్యక్ష ఘర్షణకు దిగారు. ద్రవ్యోల్బణం పెరుగుదల, అనేక వస్తువుల కొరత ఏర్పడింది. బ్యాలట్లు కావాలా బుల్లెట్లు కావాలా, మాతృభూమిగా వుండాలా వలస దేశంగా మారాలా, శాంతా లేక హింసా కాండా, స్వాతంత్య్రమా, పారతంత్య్రమా నిర్ణయించేది ఈ ఓటు అన్నట్లుగా తాము పరిగణించామని కార్మిక సంఘనేత అయిన ఒక బస్‌ డ్రైవర్‌ వ్యాఖ్యానించాడు. ఓటింగ్‌ ప్రారంభం కాగానే వెనెజులా ఎన్నికలు ఒక బూటకం అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించాడు. ముఫ్పై దేశాల నుంచి 150 మంది పరిశీలకులు వెనెజులా ఎన్నికల పర్యవేక్షణకు వచ్చారు. వారిలో ఒకరైన స్పెయిన్‌ మాజీ ప్రధాని జోస్‌ లూయిస్‌ రోడ్రిగజ్‌ జపాటెరో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మీద నాకెలాంటి సందేహాలు లేవు, ఆధునిక ఆటోమాటాక్‌ ఓటింగ్‌ పద్దతిని అనుసరిస్తున్నారు. జనం తమంతట తాము ఓటింగ్‌కు వస్తున్నారా లేదా తమ విచక్షణకు అనుగుణంగా ఓట్లు వేస్తున్నారా లేదా అని పరిశీలించటానికి వచ్చాం. మేం ఇప్పుడంతా చూశాం అని పేర్కొన్నారు. ఎటువంటి సంఘటనలు లేకుండా ఎన్నికలు జరిగాయని ఇతర ప్రతినిధులు కూడా వ్యాఖ్యానించారు.

అనేక మంది ముందుగా వూహించినట్లుగానే వెనెజులా ఎన్నికల ఫలితాలను తాము గుర్తించటం లేదని ప్రకటించటం ద్వారా లాటిన్‌ అమెరికాలో తన కుట్రలను కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నదని స్పష్టమైంది. అర్జెంటీనా రాజధాని బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జి20విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గనేందుకు వచ్చిన అమెరికా డిప్యూటీ మంత్రి జాన్‌ సులివాన్‌ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలను గుర్తించేది లేదని చెబుతూనే చమురుపై ఆంక్షలు విధించటం గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

ఛావెజ్‌ హయాంలో, తరువాత మదురోకు వ్యతిరేకంగా పని చేసిన ప్రతిపక్ష పార్టీలు ఇటీవలి కాలంలో డెమోక్రటిక్‌ యూనిటీ రౌండ్‌ టేబుల్‌ పేరుతో ఒకటిగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలలో పాల్గనాలా వద్దా అనే విషయంలో దానిలో రెండు అభిప్రాయాలు వెల్లడయ్యాయి. పోటీ చేస్తే మదురో పాలన చట్టబద్దమైనదే అని అంగీకరించినట్లు అవుతుందని కొందరు, మార్పుకోసం వచ్చిన అవకాశాన్ని పోటీ చేసి వినియోగించుకోవాలని కొందరు వాదించినా అంతిమంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అది ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన హెన్రిక్‌ కాప్రిల్స్‌ గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా పదిహేను సంవత్సరాలు ఎన్నికలలో పోటీ చేయటానికి అనర్హుడయ్యాడు. మరోనేత లియోపాల్డో లోపెజ్‌ పలుకేసులలో నిందితుడిగా వుండటంతో గృహనిర్బంధంలో వున్నాడు. ఈ పూర్వరంగంలో ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని హెన్రీ ఫాల్కన్‌ వ్యతిరేకించి బయటకు వచ్చి స్వతంత్రుడిగా పోటీ చేశాడు. బహిష్కరణ పిలుపు తన విజయాన్ని దెబ్బతీసిందని చెప్పుకున్నాడు.

తమ దేశంలో వున్న చమురు సంపదలను కొల్లగొట్టేందుకు, తమ సంక్షేమ చర్యలకు స్వస్తి పలికేందుకు అమెరికా ఒక అంతర్జాతీయ కుట్ర చేస్తోందని అధ్యక్షుడు మదురో ప్రచారం చేశారు. ఛావెజ్‌ నాయకత్వంలో సోషలిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత వెనెజులా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిపోయిందని అంతర్జాతీయ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చమురు సంపదలతో వున్న ఆదేశం 1998లో ఛావెజ్‌ అధికారానికి రాకముందు తీవ్ర అసమానతలు, పట్టణాలలో దారిద్య్రం తాండవించిందని, దానికి ఐఎంఎఫ్‌ సూచించిన విధానాలే కారణమనే వాస్తవాలను దాచిపెడుతోంది. ఛావెజ్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ చమురు సంస్ధను పటిష్టపరచి చమురు సంపదను దేశ అంటే ప్రజాప్రయోజనాల కోసం వినియోగించటం ప్రారంభించటంతో అప్పటి వరకు ఆ రంగాన్ని పీల్చిపిప్పి చేసి లాభపడిన అమెరికా, దేశీయ కార్పొరేట్‌ సంస్ధలు వ్యతిరేకతను పెంచుకున్నాయి. అప్పటి నుంచి ఏదో ఒక కుట్ర చేస్తూనే వున్నాయి.2002లో ఛావెజ్‌పై విఫల కుట్ర చేశారు. ఆయనకు అనుకూలంగా వున్న మిలిటరీ, కార్మికుల మద్దతుతో తిరిగి అధికారానికి వచ్చారు.

అమెరికా విధించిన ఆంక్షలు, సరకులు బ్లాక్‌మార్కెట్లోకి పోవటం, చట్టవిరుద్ధమైన కరెన్సీ చలామణిలోకి రావటం, చమురు ధరలు పతనం కావటంతో అక్కడి ప్రభుత్వానికి కొన్ని తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. ప్రజలలో కొంత అసంతృప్తి కూడా తలెత్తింది. గత పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రతిపక్షాలకు మెజారిటీ సీట్లు వచ్చాయి. తరువాత మదురో తన స్ధానాన్ని పటిష్ట పరుచుకొనేందుకు చర్యలు తీసుకున్నారు. దాంతో గతేడాది దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు, అంతర్జాతీయ ఏజన్సీలు పెద్ద కుట్ర చేశాయి. ప్రభుత్వ ఆస్ధులను విధ్వంసం చేయటం, అధికారపార్టీ మద్దతుదారులను సజీవ దహనం చేయటం, ఆయుధాలతో జనం మీద, భద్రతా సిబ్బందిపై దాడులకు దిగటం వంటి చర్యలకు పాల్పడ్డాయి. వాటిని సాకుగా చూపి వెంటనే ఎన్నికలు జరపాలని అమెరికా, తదితర దేశాలు పిలుపుల నిచ్చాయి. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ యూనిటీ రౌండ్‌ టేబుల్‌ ప్రభుత్వంతో చర్చించి కుదుర్చుకున్న అవగాహన ప్రకారం డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను ఏప్రిల్‌లోనే జరపాల్సి వుంది. ఆమేరకు అనూహ్యంగా వెనెజులా ఎన్నికల సంఘం మధ్యంతర ఎన్నికల ప్రకటన చేయటంతో అది అక్రమం అంటూ అమెరికా, ప్రతిపక్షాలు మాట మార్చాయి. మదురో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్‌ను తాము గుర్తించటం లేదని ప్రకటించాయి. ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు రౌండ్‌ టేబుల్‌ ప్రకటించింది. ఇది జరిగిన రెండు రోజుల తరువాత వెనెజులా మిలిటరీ తిరుగుబాటు చేసి నియంత మదురోను అధికారం నుంచి కూలదోస్తే తాము మద్దతు ఇస్తామని అమెరికా రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ మార్కో రుబియో ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. అదే వారంలో టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో మాట్లాడిన అప్పటి విదేశాంగశాఖ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ పాలకులు ఏమాత్రం ప్రజలకు సేవచేయలేనపుడు, పరిస్ధితులు దిగజారినపుడు లాటిన్‌ అమెరికాలో తరచుగా మార్పులను తెచ్చింది మిలిటరీయే అని చరిత్ర చెబుతోందని వ్యాఖ్యానించాడు. అంతెందుకు స్వయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ వెనెజులా విషయంలో అవసరం అయితే మిలిటరీని వుపయోగించుకుంటా అని విలేకర్లతో చెప్పాడు. అంటే మిలిటరీ కుట్రలను నిస్సిగ్గుగా సమర్ధించటం తప్ప మరొకటికాదు.

లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలకు నిత్యం అమెరికా కుట్రలు, కూహకాల ముప్పు వెన్నాడుతూనే వుంటుంది. దోపిడీ వ్యవస్ధలను విధ్వంసం చేయకుండా వాటిని అలాగే కొనసాగనిస్తూ తమకున్న వెసులు బాటు మేరకు అమలు జరుపుతున్న సంక్షేమ చర్యలకు ప రిమితులు వచ్చినపుడు జనాలలో అసంతృప్తి తలెత్తటం, దానిని మితవాద శక్తులు వినియోగించుకోవటం ఇటీవలి కాలంలో చూశాము. అందువలన పెట్టుబడిదారీ వ్యవస్ధ సంస్కరణబాటను వదలి విప్లవాత్మక చర్యలు తీసుకొనేందుకు పూనుకుంటేనే లాటిన్‌ అమెరికా వామపక్షాలకు భవిష్యత్‌ వుంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే కార్మికులకు మరో ఆయుధమేముంది !

28 Wednesday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ 1 Comment

Tags

communist, communist manifesto, karal marx, Karl Marx and Friedrich Engels, Raoul Peck, The Young Karl Marx

యంగ్‌ కారల్‌ మార్క్సు దృశ్యం

ఎం కోటేశ్వరరావు

తుపాకి చేతబట్టిన ఒక చెడ్డవాడిని ఆపాలంటే మరో మంచివాడు తుపాకి పట్టటమే ఏకైక మార్గం అని గతంలో సెలవిచ్చిన అమెరికా జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ అధిపతి వేనె లాపిరే తాజాగా మరో మారు రెచ్చి పోయాడు.తుపాకులను అదుపు చేయాలనే వారందరూ కమ్యూనిస్టులని, ఆచర్య స్వేచ్చను అడ్డుకోవటమే అంటూ చిందులేశాడు. ఇటీవల ఫ్లోరిడాలోని ఒక స్కూల్లో 17 మంది విద్యార్దులు, టీచర్లు ఒక దుండగుడి తుపాకి కాల్పులకు బలైన విషయం తెలిసిందే. ఇలాంటి వుదంతాలు పునరావృతం కాకూడదంటే టీచర్లందరికీ తుపాకులు ఇవ్వటమే మార్గం అని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. తుపాకులపై ఆంక్షలు విధించాలనే వారందరూ స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించాలని చూసే కమ్యూనిస్టులు తప్ప మరొకరు కాదని వేనె లాపిరే అన్నాడు. ట్రంప్‌-లాపిరే ఇద్దరూ లాభాల కోసం తుపాకులు తయారు చేసే కార్పొరేట్లకు వంత పాడుతున్నారు తప్ప వాటితో పోయే ప్రాణాల గురించి వారికి ఎలాంటి చింత లేదని నిరూపించుకున్నారు.

‘అమెరికా కాలేజీలలోె ఎక్కువగా ఇచ్చే నియోజిత పఠనం, అధ్యయనాలలో కమ్యూనిస్టు మానిఫెస్టో, ఆర్ధికవేత్తలలో కారల్‌ మార్క్స్‌ వుంటున్నారు. అనేక విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు వందకు పైగా అమెరికా యువ ప్రజాస్వామ్య సోషలిస్టు శాఖలున్నాయి. సోషలిస్టు భావజాలాన్ని పెంపొందించుతున్నందుకు విద్యార్ధులు పాండిత్య ప్రదర్శక అభినందనలు కూడా పొందుతున్నారు.మీ పిల్లల్ని పాఠశాలలకు పంపే నిర్ణయం తీసుకోబోయే ముందు దీన్ని గురించి ఆలోచిస్తారని నాకు తెలుసు. అమెరికా రాజ్యాంగాన్ని పట్టించుకోవటం లేదు, దానికి వక్రభాష్యం చెబుతున్నారు. రెండవ సవరణ ద్వారా ఈ దేశంలో ప్రసాదించిన స్వేచ్చ విస్మరించబడుతోంది. వారు గనుక అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారంటే అమెరికా స్వేచ్చలు పోతాయి, మన దేశం శాశ్వతంగా మారిపోతుంది.సోషలిజం రక్తాన్ని ఇష్టపడుతుంది’. ఇలా సాగింది వెనె లాపిరే వాచాలత్వం.

చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌

పెట్టుబడిదారీ వ్యవస్ధలో వెల్లడవుతున్న అవాంఛనీయ పోకడలను ఎలా సమర్ధించుకోవాలో తెలియని శక్తులు స్వేచ్చా, స్వాతంత్య్రాలపదజాలంతో సోషలిస్టు, పురోగామి శక్తులే కాదు, వాటితో సంబంధం లేని వారి అభిప్రాయాలపై కూడా దాడి చేస్తున్నారు. తుపాకి సంస్కృతికి గోరీ కట్టాలనేందుకు కమ్యూనిస్టులే కానవసరం లేదు. ప్రముఖ చిత్ర దర్శకుడు రావుల్‌ పీక్‌ తాజా చిత్రం ”ద యంగ్‌ కారల్‌ మార్క్స్‌ ‘ (యువ కారల్‌ మార్క్స్‌) ఫిబ్రవరి 23న అమెరికాలో విడుదల అయింది. ఆ సందర్భంగా డెమోక్రసీ నౌ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో వెనె లాపిరే వాచాలత్వం గురించి రావుల్‌ పీక్‌ స్పందించారు. గతంలో ఆయన ‘ అయామ్‌ నాట్‌ యువర్‌ నీగ్రో, లుముంబా, డెత్‌ ఆఫ్‌ ఏ ఫ్రాఫెట్‌, హైతీ, ద సైలెన్స్‌ ఆఫ్‌ ద డాగ్స్‌, సమ్‌ టైమ్స్‌ ఇన్‌ ఏప్రిల్‌ ‘ వంటి చిత్రాలను నిర్మించాడు. ‘ నేను స్పందించాల్సి వుంటుందని అనుకోలేదు, ఒక విషయం చెబుతాను. అనేక మంది టీచర్లు, అనేక సంస్ధలు ఆయన చెబుతున్నట్లుగా కారల్‌ మార్క్స్‌ను బోధన ప్రణాళికలో చేర్చుతున్నట్లయితే వారు కొంతమేరకు మంచి చేస్తున్నట్లే భావించాలి. కారల్‌ మార్క్స్‌ అంటే ఎవరు, ఒక గొప్ప తత్వవేత్త, ఆర్ధికవేత్త, ఒక విధంగా చరిత్రగతినే మొత్తంగా మార్చటం గురించి, వర్గం, కార్మికవర్గం, బూర్జువాలు, పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి వంటి ఆయన చుట్టూ వున్న విషయాలు చర్చించటానికి వుపయోగపడుతుంది.

ఆయన ప్రస్తావిస్తున్న పుస్తకం కమ్యూనిస్టు మానిఫెస్టో మొదటి అధ్యాయాన్ని చదివితే ఇప్పుడు జరుగుతున్నదానిని ఎక్కువ తక్కువ లేకుండా వర్ణించటం కనిపిస్తుంది. లాభమే ధ్యేయం గల ఒక వ్యవస్ధగా ఆయన సంస్ద(ఎన్‌ఆర్‌ఏ) జాబితా మొదట్లో వుంటుంది. మీ జీవితంలో ఎప్పుడైతే లాభానిది పైచేయి అయిందంటే దాని అర్ధం తరుణ వయస్కుల్ని చంపటం, దానిని ఇంకా సమర్ధించుకోవటం వంటి అనంగీకృతమైన వాటిని అంగీకరించే స్ధితిలో మీరు వున్నట్లే. ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోలో వున్నది అదే. యువతరం దానిని చదవటం ప్రారంభించి, దాని మీద చక్కటి చర్చ చేస్తే అది చాలా మంచిది.’ రావుల్‌ పీక్‌ చెప్పిన ఈ అంశం ఒక్క అమెరికా రైఫిల్‌ అసోసియేషన్‌కే కాదు, యావత్‌ ప్రపంచంలో లాభాలవేటలో వున్న ప్రతి వ్యవస్ధకూ,అన్ని జీవన రంగాలకూ ఇది వర్తిస్తుంది. యంగ్‌ కారల్‌ మార్క్సు అనే పీక్‌ సినిమాలో మార్క్స్‌ ఒక ఫౌండరీ యజమానితో చేసిన సంభాషణ దృశ్యం ఇలా సాగుతుంది.

కారల్‌ మార్క్స్‌ : ఎలా సాగుతోంది మీ పని ?

యజమాని: మిమ్మల్ని కలుసుకోవటం సంతోషంగా వుంది.

నేపధ్య వ్యాఖ్యాత :జునేలాకు ఫ్యాక్టరీలున్నాయి, పిల్లలతో సహా అనేక మందిని కార్మికులుగా నియమించాడు.

మార్క్స్‌ : మీ ఫ్యాక్టరీల్లో బాలకార్మికులున్నట్లున్నారు ?

యజమాని: మాకు వేరే గత్యంతరం లేదు, బాల కార్మికులు లేకపోతే మేం మార్కెట్లో అమ్ముకోలేము.

మార్క్స్‌ : మీ వంటి వారు లేకుండా దోపిడీ లేని ఒక సమాజం ఎక్కడ వుంటుంది, మీరు కూడా పని చేస్తున్నారు, ఇది దుర్భరంగా అనిపించటం లేదా ?

వ్యాఖ్యాత : వ్యవస్ధతో మనం పోరాడాలి, త్వరలో పాత వ్యవస్ధ కూలిపోతుంది.

మార్క్స్‌: రెండు రకాల మనుషులున్నారు. ఒకరు కష్టించి పని చేసే వారు, మరొకరు ఆ కష్టార్జిత ఫలం నుంచి లబ్ది పొందేవారు.

యజమాని : దీన్ని ఆపాల్సిందే, సహించకూడదు, మీరెంత అదృష్టవంతులో చూడండి, నేను మిమ్మల్ని తొలగించలేను.

మార్క్స్‌ : నేను పెద్ద మనుషులను ద్వేషిస్తాను, తృణీకరిస్తాను, కార్మికుల స్వేదంతో బజ్జలు పెంచే పందులు వారు.

యజమాని : మేము చెత్తబుట్టలోకి నెట్టదగిన వారమనేగా మీరు చెబుతోంది.

వ్యాఖ్యాత : ఆయన చెప్పింది విన్నారుగా దయచేయండి. వారు మనల్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. కానీ వారు మన బుర్రలను నిరోధించలేరు.

వ్యాఖ్యాత : కారల్‌ , ఫెడరిక్‌ ఎంగెల్స్‌ను పరిచయం చేసేందుకు నన్ను అనుమతించండి.

ఎంగెల్స్‌ : మీ రచనలను నేను చదివాను, నా వాటిని మీరు చదివారా ? మనకాలపు గొప్ప మేధావులలో మీరు ఒకరు !

వ్యాఖ్యాత : తిరుగుబాటుకు సంతోషం అవసరం !

మార్క్స్‌ : ప్రతిదీ మారుతుంది, ఏదీ శాశ్వతంగా వుండదు, పాత వ్యవస్ధను మనం తోసివేయాలి.

ఎంగెల్స్‌ : మేలుకోవాల్సిన సమయమిది !

మార్క్స్‌ : ఇప్పటి వరకు తత్వవేత్తలు ప్రపంచానికి భాష్యం చెప్పారు. కానీ దాన్ని మార్చాల్సి వుంది.

వ్యాఖ్యాత : బూర్జువాలు, కార్మికులు సోదరులా ?

కార్మికులు : కాదు !

ఎంగెల్స్‌ : కాదు, వారు సోదరులు కాదు, శత్రువులు !

Image result for the young karl marx

తన సినిమా బాక్సాఫీసు వద్ద ఆర్ధికంగా విజయం సాధించటం కంటే ప్రపంచంలో నేడు పెరిగిపోతున్న మితవాద, పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా వున్న రకరకాల వామపక్ష, పురోగామిశక్తుల సమీకరణ కేంద్రంగా తన సినిమా పనిచేస్తే అది పెద్ద విజయమని పీక్‌ భావిస్తున్నారు. ప్రముఖ పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ తన చిత్రం పట్ల ఫ్రాన్స్‌లో వెల్లడైన స్పందనను వివరిస్తూ రాజకీయ విబేదాలతో ఏకీభావం లేని పార్టీల వారందరినీ తన చిత్రం ఒక దగ్గరకు చేర్చిందని, ఇతివృత్తం గురించి చర్చలకు దోహదం చేసిందన్నారు. మార్క్స్‌ పిడివాది కాదు, మీవర్తమాన, చారిత్రక పరిస్ధితులను పున:సమీక్షించుకోవాలని మార్క్స్‌ ఎల్లవేళలా చెప్పేవారని అన్నారు. ‘ నా జీవిత పాఠం, రాజకీయాల అనుభవం కారణంగా ఒక వ్యక్తి ఏ ఒక్కరినీ రక్షించలేరని నేను నమ్ముతాను. అలాంటివి ఎన్నికలలో ప్రజాకర్షణకు బాగుంటాయని మనం చూడవచ్చు, దీని నుంచి బయటపడి నూతన వుమ్మడి సమూహాలను నిర్మించాలి. మీకు ఓటు వేయాలని కొంత మందిని మీరు బలవంతం చేయలేరు. వారిని ఒప్పించాలి. అది చర్చల ద్వారా మీరు చెబుతున్నదానిని రుజువు చేసుకోవాలి. కనుక అది దీర్ఘమైన బాట, దీనిలో రహస్యమేమీ లేదు. ఈ రోజు మనకు అపురూప వ్యక్తి మన ముందు ప్రత్యక్షమైన మనలను వెలుగులోకి తీసుకుపోవాలని వూహించుకోవచ్చు, కానీ అలాంటిదెన్నడూ జరగలేదు, అదొక క్రమం. నేడు సమాజాన్ని అవగాహన చేసుకోవాలనుకొనే వారందరికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ వారి సమయంలో అందించిన పరికరాలు – దీర్ఘకాల చరిత్ర అందించిన సూచనలు- ఇప్పటికీ లభ్య మౌతున్నాయి. సినిమా ఒక హీరో కేంద్రంగా నడిచేది కాదు. భావవిప్లవం, సామాజికమార్పు కోసం నూతన రాజకీయ సంఘటనల నిర్మాణం, సుదీర్ఘచర్చలు, ఒక యంత్రాంగ నిర్మాణం, అంతర్గత విభేదాలు, పిలుపులతో కూడిన ఒక వాస్తవం ఆధారంగా సాగింది ‘ అన్నారు.

‘ మెరిసిన జుట్టు పెరిగిన గడ్డం వుండే వృద్ధుడైన రాజకీయవేత్తగా కాదు, ఒక అసాధారణ తత్వవేత్తగా చూపించినప్పటికీ ఒక యువకుడిగా, అప్పులతో ఇబ్బందులు పడిన మార్క్స్‌ను, వుద్యమం నుంచి వుద్భవించిన కమ్యూనిస్టు మానిఫెస్టో ఎలా వచ్చిందో ఈ చిత్రంలో చూస్తారు. కేటుంబం, ముఖ్యంగా భార్యజెన్నీ, స్నేహితుల మధ్య మార్క్స్‌ ఎలా పెరిగారో చూపటం దీనిలో నా తొలి అంశం. మేం ధనికులం, మేం మధ్యతరగతి లేదా పారిశ్రామిక కుటుంబాలకు చెందినవారం అయినప్పటికీ మా చుట్టూ జరుగుతున్నదానిని మేం అంగీకరించం అని చెప్పిన ముగ్గురు యువకుల జీవితాలను యువతరం చూడాలని కోరుకున్నాను. మానవులుగా వారికి నేనెంతో సన్నిహితం, వారు కేవలం పోరాటం మాత్రమే చేయలేదు, వాటితోనే జీవించారు. తమకు ప్రమాదకరమైన నిర్ణయాలను వారు తీసుకున్నారు, సర్వం కోల్పోయారు. వారు పేదలయ్యారు అయినప్పటికీ వారిది పెద్ద జీవితం, మేథావులుగా తయారయ్యారు.యువకులుగా స్పందించారు, ప్రతిదీ మార్చదగినదిగానే వారికి కనిపించింది. పశ్చిమ దేశాలలో మార్క్సు గురించి మరో చిత్రం లేకపోవటం ఈ చిత్ర నిర్మాణానికి ఒక కారణం.’ అన్నారు పీక్‌.

మార్క్స్‌పై చిత్ర నిర్మాణానికి పీక్‌ పది సంవత్సరాలు పని చేశారు. డబ్బు సమస్యలెదురయ్యాయి.ౖ ‘ నేను మూలాల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.కమ్యూనిస్టు మానిఫెస్టో వంటి ఒక ముఖ్యమైన పుస్తకం మీరు చదివినపుడు అది సులభమార్గంలో వారి పోరాటాలు, జీవితాలను అర్ధం చేసుకొనేందుకు కార్మికుల కోసం రాసిన ఒక పుస్తకం అని అర్ధం అవుతుంది. దానిలో తొలి అధ్యాయం చదివితే గత మూడుదశాబ్దాలలో జరిగినదానిని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది. పెట్టుబడిదారీవిధాన విస్తరణ, వూహాకల్పన(స్పెక్యులేషన్‌) మీద సంపూర్ణ వెర్రి, మొత్తం భూగోళంపై దాని దాడి. సరిగ్గా అదే జరిగింది, కనుక మన చరిత్రను తెలుసుకోవటం ఎంతో ముఖ్యమైంది. లేనట్లయితే మీకు స్వర్గాన్ని చూపించే తదుపరి ప్రజాకర్షకకులను అనుసరించే ఒక కీలుబమ్మ అవుతావు.’ అని రావుల్‌ పీక్‌ చెప్పారు.

ఈ చిత్రం న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ నగరాలలో ఫిబ్రవరి 23న విడుదల అయింది. రెండు గంటల నిడివి వున్న ఈ చిత్రాన్ని జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియంలలో చిత్రీకరించారు. కారల్‌ మార్క్స్‌గా అగస్ట్‌ డిహెల్‌, ఎంగెల్స్‌గా స్టెఫాన్‌ కోనార్సకె, జెన్నీగా వికీ క్రిప్స్‌ నటించారు. మార్క్స్‌-ఎంగెల్స్‌ తమ కాలంలో ప్రబలంగా వున్న పలు రాజకీయ, తాత్విక ఆలోచనా ధోరణుల నుంచి శాస్త్రీయ సోషలిజాన్ని ఎలా వేరు పరచారన్నదే ప్రధానాంశంగా ఈ చిత్రంలో వున్నదని కొన్ని సమీక్షలలో పేర్కొన్నారు. చిత్ర దర్శక నిర్మాత రావుల్‌ పీక్‌ బెర్లిన్‌ విశ్వవిద్యాలయంలో నాలుగు సంవత్సరాల అధ్యయనంలో దాస్‌ కాపిటల్‌ ఒక భాగంగా అభ్యసించారు.

ప్రపంచ గతినే మలుపు తిప్పిన కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి ప్రచురణకు 170 ఏండ్లు. ఈగ్రంధ ముద్రణ 1848 ఫిబ్రవరి చివరి వారంలో లండన్‌లోని ఒక అజ్ఞాత ప్రాంతంలో జరిగింది. వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ పేరుతో దానిని ప్రచురించారు. తొలుత దానికి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అని పేరు పెట్టారు. 2008 ఆర్ధిక సంక్షోభం తరువాత ఈ గ్రంధ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. బ్రిటన్‌లో వాటర్‌ స్టోన్స్‌ అనే విక్రేత 2015 ఫిబ్రవరిలో వారం రోజుల్లోనే 30వేల కాపీలు విక్రయించారు. ప్రత్యేకించి పెట్టుబడిదారీ సంక్షోభం నెలకొని వున్న ప్రస్తుత సమయంలో మార్క్సిజం పట్ల ఆసక్తి తిరిగి రేకెత్తించటానికి, పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించేందుకు ప్రత్యేకించి యువకులకు అది తోడ్పడుతుందని 2012లో బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ పేర్కొన్నది.’మనకు తెలిసిన పెట్టుబడిదారీ వ్యవస్ధ జవాబుదారీతనం లేని పెద్ద ప్రపంచవ్యాపిత బ్యాంకులు, కార్పొరేషన్ల ఆధిపత్యంలో వుంది. అది నాలుగు రోడ్ల కూడలిలో వుంది, దాన్ని సంస్కరించి, నవీకరించాల్సి వుంది’ అని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. బ్రిటన్‌లో పెట్టుబడిదారీ విధానం చితికిపోయింది, దానిని తక్షణమే సంస్కరించటం అవసరం, ఎందుకంటే తలిదండ్రుల కంటే వారి పిల్లలను దుర్భరస్ధితిలో వదలి వేస్తున్నదని టెలిగ్రాఫ్‌ పత్రిక గతేడాది సెప్టెంబరు 5న పేర్కొన్నది.

అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో జనం సోషలిజానికి అనుకూలంగా మాట్లాడేందుకు వీలుగా అక్కడి పరిస్ధితి వుంది. 2016లో యు గవ్‌ అనే సంస్ధ జరిపిన సర్వేలో 32శాతం బ్రిటీషర్లు సోషలిజాన్ని వ్యతిరేకించగా 36శాతం మంది అనుకూలం అని తేలింది. నూతన సహస్రాబ్దిలో పుట్టిన వారిలో 40శాతం అమెరికన్లు సోషలిజానికి అనుకూలంగా వున్నట్లు గతేడాది నవంబరులో జరిగిన సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే 83శాతం మంది బ్రిటీషర్లు నీటి సరఫరా సంస్దల ప్రయివేటీకరణ బదులు ప్రభుత్వ ఆధీనంలోనే వుండాలని, విద్యుత్‌, గ్యాస్‌ కంపెనీలను తిరిగి జాతీయం చేయాలని 77శాతం, రైల్వేలను తిరిగి ప్రభుత్వఆధీనంలోకి తీసుకోవాలని 76శాతం కోరుతున్నారు. 170 ఏండ్ల నాటి కమ్యూనిస్టు మానిఫెస్టో తొలి చిత్తు ప్రతితో పాటు, మార్క్స్‌, ఎంగెల్స్‌ల చేతిరాత ప్రతులు అనేక నెదర్లాండ్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ హిస్టరీ(ఐఐఎస్‌హెచ్‌)లో వున్నాయి.’ 1990 దశకంలో మార్క్స్‌ ఇంకేమాత్రం పనికిరాడు అని కొంత మంది చెప్పారు. అమెరికా, ఐరోపాలలో తరువాత సంభవించిన అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభం,స్పెక్యులేషన్‌, బుడగలు పేలిపోయిన తరువాత జనాలు ఆకస్మికంగా ఇది గతంలో ఒకసారి జరిగింది, దాన్ని పరిశోధించారు, మరోసారి మార్క్సును చదివితే ఏమౌతుంది, అది ఇప్పటికీ పనికొస్తుందా, అవును ఇది పనికొచ్చేట్లే కనిపిస్తోంది అనే ఆలోచనలో పడ్డారని’ సంస్ద అధిపతి మారియన్‌ వాన్‌డెర్‌ హెజ్డన్‌ వ్యాఖ్యానించారు.

సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు ఎన్ని విధాలుగా కుత్సిత వ్యాఖ్యానాలు చేసినా వాస్తవాన్ని కాదనలేరు. కమ్యూనిస్టు మానిఫెస్టోను రాసిన నాటికీ నేటికీ ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చిన మాట వాస్తవం. దోపిడీ తీవ్రత, ఆర్ధిక అసమానతల్లో ఎలాంటి మార్పు లేదు. దోపిడీ కొనసాగుతూనే వుంది. అందువలన దానిని అంతం చేయాలని కోరిన కమ్యూనిస్టు మానిఫెస్టో కంటే మరొక మెరుగైన సిద్ధాంతం, కార్మికవర్గ అస్త్రం మరొకటి కనిపించటం లేదు. లేదు ఎవరైనా అంతకంటే త్వరగా దోపిడీని అంతం చేసే భావజాలం,అస్త్రాలను కార్మికవర్గానికి అందచేస్తే అంతకంటే కావాల్సింది లేదు. అవి లేకుండా అందుబాటులో వున్న ఆయుధాలు పనికి రావు అని చెప్పటం అంటే కార్మికవర్గాన్ని నిరాయుధం చేసే మోసపు ఎత్తుగడతప్ప మరొకటి కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నేపాల్‌ కమ్యూనిస్టు వుద్యమంలో నూతన అధ్యాయం !

21 Wednesday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Nepal, nepal communist movement, Nepal communist party, Nepal communists

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమానికి వుత్తేజం కలిగించే మరో పుట చరిత్రకు తోడైంది. ఇటీవలి పార్లమెంట్‌, రాష్ట్రాల ఎన్నికలలో ఐక్యంగా పోటీచేసిన నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ(యుఎంఎల్‌), నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ( మావోయిస్టు సెంటర్‌)లను ఒకే పార్టీగా విలీనమైంది. ఈ మేరకు లాంఛనంగా రెండు పార్టీల నేతలు ఏడు అంశాల ఒప్పందంపై సోమవారం నాడు సంతకాలు చేశారు. దీని ప్రకారం కొత్త పార్టీకి నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(సిపిఎన్‌) నామకరణం చేశారు. మార్క్సిజం-లెనిజం వేగుచుక్కగా పార్టీ పని చేస్తుంది. యుఎంఎల్‌ అధ్య క్షుడు, ప్రధాని అయిన కెపి శర్మ ఓలి, ఝాలా నాధ్‌ ఖనాల్‌, మాధవ కుమార్‌ నేపాల్‌, వామ్‌దేవ్‌ గౌతమ్‌, ఈశ్వర్‌ పోఖరెల్‌, మావోయిస్టు సెంటర్‌ తరఫున పార్టీ అధ్యక్షుడు పుష్పకమల్‌ దహాల్‌( ప్రచండ) నారాయణ్‌ కాజీ శ్రేష్ట, రామ్‌ బహదూర్‌ థాపా సంతకాలు చేశారు. ఐక్యపార్టీ మహాసభ జరిగే వరకు పార్టీకి కెపి శర్మ ఓలీ, ప్రచండ ఇద్దరూ అధ్యక్షులు వుంటారు, ఇద్దరూ అధికారంలో పాలుపంచుకుంటారు. దిగువ స్ధాయిలో కూడా రెండు పార్టీల కమిటీలు విలీనం అవుతాయి. అంగీకరించిన ఏడు అంశాలు ఇలా వున్నాయి.1.పార్టీపేరు నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ.2.పార్టీ సిద్ధాంతాలను అంతిమంగా పార్టీ మహాసభ నిర్ణయిస్తుంది.3. అప్పటి వరకు మార్క్సిజం-లెనినిజం వుమ్మడి పార్టీ సిద్ధాంత అంశంగా వుంటుంది.4. వుమ్మడి పార్టీ స్టాండింగ్‌ కమిటీ, పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీలు చిన్నవిగా వుంటాయి.5. ప్రధానిగా కెపిశర్మ ఓలి, ప్రపండ రెండు సమానవంతుల వారీ పని చేస్తారు.6. పార్లమెంట్‌ అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్‌గా యుఎంఎల్‌, స్పీకర్‌, వుపాధ్యక్షులుగా మావోయిస్టు సెంటర్‌ ప్రతినిధులు వుంటారు.7.మంత్రుల సంఖ్యను తరువాత ఖరారు చేస్తారు.(15 మందితో కాబినెట్‌ వుండాలని సమన్వయ కమిటీ సిఫార్సు చేసింది). మార్చినెల అయిదవ తేదీన ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశ కొత్త దేశాధ్యక్షుడు, వుపాధ్యక్షుడిని ఎన్నుకొంటుంది.

పదిరోజుల క్రితం ప్రధానిగా కెపి శర్మ ఓలి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసినదే.మార్చి ఐదవ తేదీన పార్లమెంట్‌ తొలి సమావేశం జరుగుతుంది. వుభయ సభలలోనూ నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ మెజారిటీ సభ్యులను కలిగి వుంది. చట్టపరమైన లాంఛనాలు కూడా పూర్తి కావాల్సి వున్నందున విలీన ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరో నెల రోజులు పట్టవచ్చు.ఈ లోగా రెండు పార్టీల కేంద్రకమిటీలు సమావేశమై విలీన తీర్మానాలను అమోదించాల్సి వుంది. విభిన్న నేపధ్యాలు కలిగిన ఈ రెండు పార్టీల విలీనం అనేక మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది, అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు. రెండువందల నలభయి సంవత్సరాల హిందూరాజ్య పాలన సాగిన నేపాల్‌లో గత రెండు దశాబ్దాలుగా రాజరికానికి వ్యతిరేకంగా పోరాడిన శక్తులు అక్కడి రాజకీయాలలో ప్రధాన పాత్రపోషిస్తున్నాయి. కమ్యూనిస్టులు, నేపాలీ కాంగ్రెస్‌ కలిసి రాచరిక వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కాగా మావోయిస్టు సెంటర్‌ పార్టీ సాయుధపోరు బాటను అనుసరించింది.2006లో కుదిరిన శాంతి ఒప్పందం ప్రకారం మావోయిస్టులు ఆయుధాలను విసర్జించారు. ఆ పార్టీ నేత ప్రచండ ప్రధాని అయ్యారు. అయితే ఇటీవలి కాలంలో మావోయిస్టు పార్టీ ప్రభావం తగ్గిపోయింది. తాజా ఎన్నికలలో సంఖ్యరీత్యా అది మూడో స్ధానానికి పరిమితమైంది. నేపాల్‌ మావోయిస్టు పోరాటాన్ని ‘ ద బుల్లెట్‌ అండ్‌ బాలట్‌ బాక్సు’ పేరుతో గ్రంధస్తం చేసిన ఆదిత్య అధికారి విలీనం అసాధారణమైనదని వర్ణించారు. వారు ఐక్యతకు కట్టుబడి వుంటే అది నేపాల్‌ రాజకీయ భవితవ్యాన్నే మార్చివేస్తుందని, అయితే అధికారాన్ని పంచుకోవటంలో వుమ్మడి పార్టీలో కూడా వారు రెండు పక్షాలుగా వ్యవహరించే అవకాశం వుందని అన్నారు. గత పదకొండు సంవత్సరాలలో తొమ్మిది సంకీర్ణాలను చూసి విసుగెత్తిన నేపాలీ ఓటర్లు తాజా ఎన్నికలలో కమ్యూనిస్టులకు పార్లమెంట్‌ వుభయ సభలు, రాష్ట్రాలలో తిరుగులేని మెజారిటీని కట్టబెట్టి అస్ధిరతకు తెరదించారు. అందువలన వుమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సి వుంది. తాము అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నామని, శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు, పూజలకు మాత్రమే పరిమితమైతే కుదరదని పార్టీ నాయకులు చెబుతున్నారు.

పార్లమెంట్‌ ఎగువ సభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులు మెజారిటీ సీట్లు గెలుచుకున్నారు. ఎగువ సభను కలిగి వుండటం నేపాల్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంట్‌, రాష్ట్రాల శాసనసభ్యులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్ధానిక సంస్ధల అధ్యక్షులు, వుపాధ్యక్షులతో కూడిన ఎలక్ట్రొరల్‌ కాలేజీ 59 సభ్యులుండే ఎగువ సభలో 56 మందిని ఎన్నుకుంటుంది. ముగ్గురిని దేశాధ్యక్షుడు నియమిస్తారు. ఏడు రాష్ట్రాలు సమాన ప్రాతిపదికన ఒక్కొక్క చోట నుంచి ఎనిమిది మందిని ఎన్నుకోవాల్సి వుంది. వీరిలో ముగ్గురు మహిళలు, ఒకరు దళితులు, ఒకరు వికలాంగుల ప్రతినిధి వుండాలి. ఈ మేరకు సోమవారం నాడు అధ్యక్షుడు విద్యాదేవి భండారి ప్రభుత్వం సిఫార్సు చేసిన ముగ్గురిని నియమించారు. ఒకరు జాతీయ ప్రణాళికా సంఘ మాజీ వుపాధ్యక్షుడు, మరొకరు ప్రణాళికా సంఘమాజీ సభ్యుడు కాగా మరొకరు న్యాయవాది. ఎగువ సభలో అధికార పక్షానికి చెందిన యుఎంఎల్‌కు 27, మావోయిస్టు సెంటర్‌కు 12, ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌కు 13, రాష్ట్రీయ జనతా పార్టీ, ఫెడరల్‌ సోషలిస్టు పార్టీ రెండేసి స్ధానాల చొప్పున కలిగి వున్నాయి.

నేపాల్‌ రాజ్యాంగం ప్రకారం వుభయ సభలలో 33శాతం మహిళలు సభ్యులుగా వుండాలి. దిగువ సభలోని 275 స్ధానాలకు గాను 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్ధానాలకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీ నుంచి అయినా రెండు తరగతులలో ఎన్నికైన వారు 33శాతం విధిగా వుండాలి. ప్రత్యక్ష ఎన్నికలలో కేవలం ఆరుగురు మాత్రమే ఎన్నికయ్యారు. వీరిలో ముగ్గురు మావోయిస్టు సెంటర్‌, ఇద్దరు యుఎంఎల్‌, మరొకరు మరొకపార్టీ నుంచి ఎన్నికయ్యారు. దాంతో 33శాతం వుండే విధంగా పార్టీలు దామాషా నియోజకవర్గాల జాబితాలను అందచేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు యుఎంఎల్‌ పార్టీకి దామాషా కోటాలో వచ్చిన 41 స్ధానాలలో మహిళలు 37, నేపాలీ కాంగ్రెస్‌కు వచ్చిన 40లో 20, మావోయిస్టు సెంటర్‌ 17లో పదహారు మంది మొత్తం 84 మంది మహిళలు ఎన్నికయ్యారు. మొత్తంగా చూసినపుడు అన్ని పార్టీల తరఫున దిగువ సభలో 90 మంది, ఎగువ సభలో 21 మంది ఎన్నికయ్యారు. దామాషా పద్దతిలో కొన్ని సీట్లు వుండటం, రెండింటిలో కలిపి 33శాతం విధిగా ఎన్నిక అవాలన్న నిబంధన కారణంగానే ఇంత మంది మహిళలకు అవకాశం వచ్చింది. ఒక వేళ దామాషా పద్దతిలో ఆశాతం పూర్తి కానట్లయితే ఆమేరకు ప్రత్యక్ష ఎన్నికలో వచ్చిన సీట్లు పార్టీ కోల్పోవాల్సి వుంటుంది. దిగువ సభ ఎన్నికలలో కనీసం మూడుశాతం ఓట్లు వచ్చిన పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది. కేవలం ఐదు పార్టీలు మాత్రమే ఆ మేరకు ఓట్లు పొందాయి, 44 విఫలమయ్యాయి. చట్ట సభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల గురించి మన దేశంలో ప్రధాన పార్టీలు కబుర్లు చెప్పటం తప్ప ఆచరణలో అడుగు ముందుకు వేయటం లేదు. పక్కనే వున్న నేపాల్‌లో అది కార్యరూపం దాల్చటానికి కమ్యూనిస్టులు ప్రధాన పాత్రధారులుగా వుండటమే కారణం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d