• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Farmers

ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలన : జనంపై రణం – దేశానికి రుణం పెంపుదల !

16 Wednesday Feb 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ 1 Comment

Tags

BJP, Farmers agitations, india debt, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మన దేశ క్రమశిక్షణ గురించి పెద్దలు చెప్పిన అంశాలలో అప్పు చేయటం ఎంత చెడ్డపనో చెప్పనవసరం లేదు. తినటానికి లేకపోతే కడుపులో కాళ్లు ముడుచుకొని పడుకుంటాం గాని అప్పు చేసి పప్పుకూడు తినం అనే మాట ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. గతంలో అప్పులున్నవారెందరు అని వెతికితే ఇప్పుడు అప్పులేని వారెవరు అన్నది ప్రశ్న. భారతీయత గురించి లౌడ్‌ స్పీకర్లతో పని లేకుండానే గొంతెత్తి అరచి మాట్లాడేవారి పాలనలో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కలియుగ దైవం వెంకటేశ్వరుడే అప్పులు చేయగా లేనిది మనమెంత అని సమర్ధించుకొనే అవకాశం కూడా మనకు ఉంది. జనం నమ్ముతున్న దేవుడి వీధుల్లోకి లాగి రాజకీయం చేస్తున్న వారికి ఇదొక లెక్కా ! ఇంతకీ వడ్డీకాసుల వాడు ఎందుకు అప్పు చేసినట్లు ? మన పాలకులు దేనికి చేస్తున్నట్లు ?


మాటా మాటా వచ్చి లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తిని వదలి వెళ్లిపోయిందట. దాంతో దిక్కుతోచక ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ విష్ణుమూర్తి తిరుపతి ప్రాంతానికి రాగానే ఎందుకో కాస్త ప్రశాంతత దొరికినట్లు అనిపించి అక్కడే ఒక రూము తీసుకొని ఉన్నాడు. అప్పుడు మారు పేరుతో ఆకాశరాజు కూతురు పద్మావతి ప్రేమలో పడ్డాడు. వివాహం చేసుకొనేందుకు డబ్బు లేకపోతే కుబేరుడి దగ్గర భారీ వడ్డీ రేటుతో అప్పు చేశాడు. వడ్డీ చెల్లించటానికి కూడా వనరులేని వెంకటేశ్వరుడు తిరుమలను శాశ్వత నివాసంగా మార్చుకున్నప్పటి నుంచి తన భక్తులు హుండీరూపంలో ఇచ్చే కానుకలను వడ్డీగా చెల్లిస్తున్నాడు. అప్పు తీరటం లేదు ఇదీ కథ. మరి మన పాలకులు ఎందుకు అప్పు చేస్తున్నారు అనిఅడిగితే అప్పులోనే ఉంది అభివృద్ధి అని టక్కున చెప్పేస్తారు. ఎన్ని కానుకలు వేసినా వెంకటేశ్వరుడి అప్పు ఎలా తీరటం లేదో అలాగే ఎన్ని అప్పులు చేసినా అభివృద్ధి ఎక్కడా కనిపించటం లేదు.


తాజా బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.1,35,87,893 కోట్లుగానూ 2023 మార్చి ఆఖరుకు అది రు.1,52,17,910 కోట్లకు పెరుగుతుందని ఉంది. అంటే ఏడాది కాలంలో 16లక్షల 30వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కొత్తగా అప్పు చేయనుంది.వర్తమాన కరెన్సీ మారకపు విలువ, ఇబిఆర్‌, కాష్‌బాలన్సులను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తాలు 139, 155లక్షల కోట్లుగా ఉంటాయని ప్రభుత్వమే వివరణలో పేర్కొన్నది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన ఏడాది అంటే 2014 మార్చి ఆఖరుకు ఉన్న అప్పు రు.53,11,980 కోట్లు. ఎనిమిది సంవత్సరాల్లో కొత్త అప్పులు 99,05,930 కోట్లు. బహుశా దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణమని జనం చెవుల్లో ఎక్కించేందుకు పూనుకోవచ్చు.పోనీ ఇంత చేసినా అభివృద్ధి కరోనాతో నిమిత్తం లేకుండా సాధారణ పరిస్దితి ఉన్నపుడే ఎనిమిది నుంచి నాలుగుశాతానికి తగ్గింది. ఏమిటీ నిర్వాకం అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు దేశభక్తులేనా, ఇక్కడి తిండి తింటూ ఇక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అని దాడి చేస్తారు.


కేంద్రానికి వచ్చే ఆదాయం వంద రూపాయలనుకుంటే దానిలో అప్పుల ద్వారా 35, జిఎస్‌టి ద్వారా 16, ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను ద్వారా 15 చొప్పున, ఎక్సయిజ్‌ పన్ను ఏడు, కస్టమ్స్‌, పన్నేతర ఆదాయం ఐదేసి చొప్పున, ఇతరంగా రెండు రూపాయలు వస్తోంది. దీన్ని ఖర్చెలా చేస్తున్నారు ? వడ్డీ చెల్లింపులకు 20, రాష్ట్రాలకు పన్నుల వాటాగా 17, కేంద్ర పధకాలకు 15, ఆర్ధిక సంఘం, ఇతర బదిలీలకు 10, కేంద్ర ప్రాయోజిత పధకాలకు 9, ఇతర ఖర్చులకు 9, సబ్సిడీలు, రక్షణకు ఎనిమిది చొప్పున, పెన్షన్లకు నాలుగు వంతున ఖర్చు చేస్తున్నారు. అప్పులు తీసుకురావటాన్ని తప్పు పట్టాల్సినపనేమీ లేదు గానీ దాని వలన జరుగుతున్న వృద్ధి ఎంత అనేది మాత్రం ప్రశ్నార్ధకమే. పెట్టుబడి ఖర్చును పెంచినట్లు చెబుతున్నారు. రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు. దీని వలన కలిగే మేలు ఏమంటే రోడ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, సిమెంట్‌, ఉక్కు, ఇతర ముడి సరకులకు గిరాకీ పెరుగుతుంది, ఆ పరిశ్రమలకు పని దొరుకుతుంది.గతంలో రోడ్ల నిర్మాణం అంటే మానవ శ్రమ గణనీయంగా ఉండేది, ఇప్పుడు యంత్రాలు ఆ పని చేస్తున్నాయి. ఇక ఈ రోడ్ల నిర్మాణానికి చమురు మీద సెస్‌లను విధించి జనాల నుంచే వసూలు చేస్తున్నారు. అదే జనాలు(ద్విచక్రవాహనాలు మినహా) రోడ్లను వినియోగిస్తే టోలు వసూలు చేస్తున్నారు. వాణిజ్యవాహనాలు చెల్లించే టోల్‌టాక్సు పరోక్షంగా తిరిగి జనం మీదనే రుద్దుతారు.


ఒక వైపు దేశాన్ని అప్పులపాలు చేయటంతో పాటు అనుసరిస్తున్న విధానాలు జనాలను కూడా అప్పుల ఊబిలో దింపుతున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వాలు, జనాలు ఇబ్బందులు, అప్పుల పాలయ్యారు, కుబేరులు మాత్రం మరింతగా పెరిగారు, బలపడ్డారు. ఇదెలా జరిగింది ? వారికి అనుకూలమైన విధానాలే కారణం, ఎవరినైనా ఇతర సహేతుక కారణాలు చెప్పమనండి. అనేక మంది పారిశ్రామికవేత్తలు కరోనా కారణంగా తమ సంస్ధలను మూసివేశారు, వాటిని పునరుద్దరించే పేరుతోనో మరొక సాకుతోనే ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందారు. పోనీ వాటిని తిరిగి పెట్టుబడిగా పెట్టి ఉపాధి కల్పించేందుకు పూనుకున్నారా అంటే అదెక్కడా కనిపించటం లేదు. కరోనా తొలి, ద్వితీయ తరంగాల్లో అనేక కుటుంబాలు ఆసుపత్రి ఖర్చుల కోసం ఉన్న ఆస్తులు అమ్మి, అప్పుల పాలైనా అనేక కుటుంబాల్లో ఆప్తులు దక్కలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచటం లేదు.


కుటుంబాలు కరోనాతో ఎలా దెబ్బతిన్నాయో, వత్తిడి ఎలా పెరిగిందో వారి బంగారం తాకట్టు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. రిజర్వుబాంకు నివేదిక ప్రకారం 2019 నవంబరు 22 నాటికి బాంకుల్లో బంగారు రుణాల మొత్తం రు.29,514 కోట్లు కాగా 2021 నవంబరు 19 నాటికి 65,630 కోట్లకు పెరిగాయి. ఇది అర్ధిక వ్యవస్ధ సజావుగా లేదనేందుకు ఒక సూచిక. వారు వ్యక్తులు లేదా చిన్న, సన్నకారు సంస్ధల వారు ఎవరైనా కావచ్చు.పత్రికల్లో ఏ రోజు చూసినా బంగారు తాకట్టు సంస్దల వేలం వార్తలు కనిపిస్తాయి. ఒక నాడు ఆర్ధిక భరోసా లేదా భద్రతగా భావించి కూడపెట్టుకున్న బంగారాన్ని ఒకసారి తాకట్టు పెట్టిన తరువాత విడిపించుకోవటం పెద్ద సమస్యగా మారుతోంది ఇప్పుడు. ముతూట్‌ ఫైనాన్స్‌ వంటి బంగారం తాకట్టు కంపెనీలు గత ఏడాది 21శాతం లాభాలు సంపాదించాయి. ఈ ఏడాది తాకట్టు రుణాలు 15శాతం పెరిగే అవకాశాలున్నట్లు అంచనా.


గృహ రుణాల్లో వినిమయ వస్తువుల కోసం చేసిన వాటి నుంచి అనేక రకాలు ఉంటాయి.2020లో జిడిపిలో ఈ అప్పు 12.6శాతం ఉంటే 2021 మార్చి నాటికి 14.5శాతానికి పెరిగింది. ఈ కాలంలో జనాలు విలాసవస్తువుల జోలికి పోలేదన్నది అందరికీ తెలిసిందే. 1999లో ఇది కేవలం 2.2శాతమే ఉంది. ఆ తరువాత జనాలతో అప్పులు చేయించి వస్తువుల కొనుగోలుకు ప్రోత్సహించిన అంశం తెలిసిందే.ఇదే కాలంలో కార్పొరేట్‌శక్తులు విద్య, వైద్యరంగాల్లో పెద్ద ఎత్తున విస్తరించటం, ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేసిన కారణంగా రుణగ్రస్త అంశాల్లో ఇవి కూడా ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి.2021 మార్చినాటికి గృహరుణ భారం 393 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు.మన కరెన్సీలో దాదాపు 30లక్షల కోట్ల రూపాయలు.


కరోనా లాక్‌డౌన్లు, మూసివేతలను ఎత్తివేసిన తరువాత అనేక సంస్దలు తిరిగి పాతవారికి అవకాశం ఇచ్చినప్పటికీ అనేక చోట్ల వేతనకోతలు ఉన్నాయి, అందువలన కుటుంబ అవసరాల కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎంత మంది విడిపించుకుంటారన్నది సందేహమే. కరోనాతో నిమిత్తం లేకుండానే గృహస్తుల పొదుపు తగ్గింది.2014-15లో జిడిపిలో 13శాతంగా ఉన్నది 2019-20కి పదకొండుశాతానికి, 2020-21 డిసెంబరు త్రైమాస కాలానికి 8.2శాతానికి పడిపోయింది. అంటే ఉన్న పొదుపును కరోనా ఖర్చు చేయించింది. కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఓ సమాచారం ప్రకారం గ్రామీణ కుటుంబాల సగటు అప్పు 2012-18 సంవత్సరాలలో 84, పట్టణాలలో 42శాతం చొప్పున పెరిగింది. 2021ఐసిఇ 360 సర్వే ప్రకారం 2015-16 నుంచి 2020-21తో పోలిస్తే దేశంలో దిగువన ఉన్న 20 పేద గృహస్తుల ఆదాయం 53శాతం తగ్గితే ఇదే కాలంలో 20శాతం ధనికులకు 39శాతం పెరిగింది. ఈ కాలమంతా నరేంద్రమోడీ అమలు చేసిన విధానాలే ఉన్నాయి.


రైతులపై 2021లో రణం సాగించిన నరేంద్రమోడీ సర్కార్‌ రానున్న రోజుల్లో కార్మికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుంది. లేబర్‌ కోడ్‌ పేరుతో ప్రతిపాదించిన అంశాలు ఇప్పుడున్న బేరమాడే శక్తిని, వారి హక్కులను మరింత హరిస్తాయి.యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసే బాటలో నడుస్తున్నారు. జనంపై రణం, దేశానికి రుణాన్ని పెంచటం తప్ప నరేంద్రమోడీ ఎనిమిది సంవత్సరాల పాలనలో చేసిందేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల పట్ల నరేంద్రమోడీ చిత్తశుద్దికి అగ్ని పరీక్ష !

15 Tuesday Feb 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

BJP, Farmers agitations, Fertilizers subsidies, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


2021 నరేంద్రమోడీ సర్కార్‌కు నిదురపట్టకుండా చేసింది. దిగిరాను దిగిరాను అంటూ భీష్మించుకు కూర్చున్న నరేంద్రమోడీ మెడలు వంచిన సంఘటిత శక్తి ఎంత బలమైనదో ప్రపంచానికి దేశ రైతులు చూపించారు.ఆదరాబాదరా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాతరవేసి మూడు సాగుచట్టాలను ఆమోదించటం, చివరకు రైతాంగానికి క్షమాపణ చెప్పి వాటిని ఉపసంహరించుకున్న తీరు తెలిసిందే. ఈ అధ్యాయంలో నరేంద్రమోడీ కంటే మోడీ తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోరని గుడ్డిగా నమ్మిన వారు ఎక్కువగా ఆశాభంగం చెందారు, అభాసుపాలయ్యారంటే అతిశయోక్తి కాదు. నిజానికి రైతాంగ ఉద్యమ విరమణ అంతం కాదు ఆరంభం- ఒక విరామం మాత్రమే !


రానున్న సంవత్సరాల్లో రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన అంశాలను కేంద్రం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరం.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశానికి సంబంధించి ఒక కమిటీని వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దాని ఊసే ఎత్తటం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ప్రకటిస్తామని చెప్పారు. నిజానికి ఎన్నికలకు దానికి సంబంధం లేదు. కొద్ది నెలలైనా జాగు చేసేందుకే ఇలా చెప్పారన్నది స్పష్టం. దేశ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న కారణంగానే ఉన్న కొద్ది పాటి రక్షణలు కూడా రద్దు చేస్తున్నారనే ఆందోళనే రైతులు అసాధారణ రీతిలో ఉద్యమించటానికి కారణం. 2022-23 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌ కేటాయిలను చూస్తే రైతాంగం మరోసారి నిరాశకు గురయ్యారు.


కేంద్ర ప్రభుత్వం ఏడాదికేడాది సబ్సిడీలకు ఎసరు పెడుతున్నది.కేటాయింపు అంకెలు ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించటం లేదు. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని రకాల సబ్సిడీల విలువ రు.7,07,707 కోట్లు కాగా సవరించిన అంచనాల్లో ఆ మొత్తం రు.4,33,108 కోట్లకు అంటే 39శాతం కోతపడింది. పోనీ వచ్చే ఏడాది ఈ మొత్తమైనా ఇస్తున్నారా అంటే 2022-23 బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం రు.3,17,866 కోట్లు మాత్రమే. ఆకలిలో దేశ సూచిక మెరుగుపడిందేమీ లేదు.2020లో ప్రపంచ ఆకలి సూచికల్లో 107దేశాల్లో మనది 94వ స్ధానంలో ఉంది.2021లో 116దేశాలకు గాను 101వ స్ధానానికి దిగజారింది తప్ప మెరుగుపడలేదు. కానీ ఆహార సబ్సిడీని రు.5,41,330(2020-21) నుంచి 2022-23కు రు.2,86,469కోట్లకు కోత పెట్టారు.దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? వలస కార్మికులు పని స్దలాల నుంచి స్వస్ధలాలకు వెళ్లేందుకు కరోనా కాలంలో ఎన్ని ఇబ్బందులు పడిందీ దేశమంతా చూసింది. దాన్ని మరిచిపోయినట్లుగా వారే కరోనాను వ్యాప్తి చేసినట్లు నరేంద్రమోడీ తాజాగా ఆరోపించిన అంశం తెలిసిందే. వారికి, పనులు కోల్పోయిన వారికి అవసరమైన మొత్తంలో ఆహార ధాన్యాలను కూడా కేంద్రం సరఫరా చేయలేదు. మనిషికి నెలకు ఐదు కిలోలు ఇచ్చి వాటినే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. చమురు సబ్సిడీలు రు.38,455 నుంచి రు.6,517 కోట్లకు కోత పెట్టారు. వంటగాస్‌ సబ్సిడీ రు.14,073 కోట్లు ఇస్తామని చెప్పిన కేంద్రం ఆచరణలో రు.6,517 కోట్లకు కోత పెట్టింది.వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రు.5,813 కోట్లకు తగ్గించారు. ఇక ఎరువుల సబ్సిడీ తీరుతెన్నులను చూద్దాం. 2021-22లో రు.1,40,122 కోట్లు ఉంటుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని 2022-23లో రు.1,05,222 కోట్లుగా ప్రతిపాదించారు, 35వేల కోట్లు కోత పెట్టారు.


గతేడాది పట్టువదల కుండా రైతు ఉద్యమం జరగటం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాతావరణం, ఇదే తరుణంలో డిఏపి, మిశ్రమ ఎరువుల ధరలు గణనీయంగా పెరగటంతో కేంద్ర ప్రభుత్వం మరొకదారి లేక ఎరువుల సబ్సిడీని పెంచకతప్ప లేదు. గత పది సంవత్సరాలలో కేంద్రం ఎరువులపై రాయితీలను 70-80వేల కోట్ల రూపాయల మధ్యనే ఇచ్చింది. ప్రస్తుతం చమురు, గాస్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపధ్యంలో దిగుమతి ఖర్చు తడిచి మోపెడు అవుతుంది. దాన్ని రైతులు భరించాలా, కేంద్రం గతేడాది మాదిరి అదనపు కేటాయింపులతో భరిస్తుందా అన్నది తెలియదు. అంతర్జాతీయంగా వరుసగా రెండు సంవత్సరాల నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా గతం కంటే ఎక్కువగా పెరిగిన అంశం తెలిసినప్పటికీ కేంద్రం ఎరువుల సబ్సిడీకి కోత పెట్టిందంటే పెరిగిన మేరకు రైతులే భరించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మాదిరే దిగుమతి చేసుకుంటున్న ధరల మీద ప్రతిపాదించిన సబ్సిడీని పరిమితం చేస్తే ఆరేడు నెలలకు మించి రాదని విశ్లేషకులు చెబుతున్నారు. యురియా ధరలను పెంచటం ద్వారా సబ్సిడీని సర్దుబాటు చేసే అవకాశం కూడా ఉంది. గతేడాది బడ్జెట్‌లో రు.79,530 కోట్లు ప్రతిపాదించినా దిగుమతి,ఉత్పాదక ఖర్చు విపరీతంగా పెరిగినందున ఆ మొత్తాన్ని రు.1,40,122 కోట్లకు పెంచారు.


అంతర్జాతీయ మార్కెట్లో యురియా ధర 2021 ఏప్రిల్‌ ఒకటి 2022 జనవరి 28 మధ్య టన్ను ధర 357నుంచి 869డాలర్లకు పెరిగింది.(నవంబరు నెలలో 959 డాలర్లు పలికింది) డిఏపి ధర ఇదే కాలంలో 400 నుంచి 930 డాలర్లకు పెరిగింది. దాన్ని మొత్తంగా లేదా ముడిసరకులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే గతేడాది 46వేల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించాల్సివచ్చింది. ఇప్పుడు ధరలు తగ్గే సూచనలు లేవు.యురియా ఉత్పత్తికి అవసరమమైన గాస్‌ ధర దేశీయంగా కూడా పెరిగింది. మన దేశం 67శాతం ఎల్‌ఎన్‌జి దిగుమతి చేసుకుంటోంది. దాదాపు ఏడాది కాలంగా చైనా ఎరువుల ఎగుమతులపై అనేక ఆంక్షలు విధించటం కూడా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుదలకు ఒక కారణం. తమ అవసరాల్లో నాలుగోవంతు పొటాష్‌ ఎరువులు చైనా నుంచి ఇతర దేవాలు దిగుమతి చేసుకుంటున్నా యి. మన దేశంలో యురియా ధరలను మాత్రమే నియంత్రణ పరిధిలో ఉంచి మిగిలిన ఎరువులన్నింటీని మార్కెట్‌ శక్తులకు వదలివేశారు. వాటి మీద పరిమితంగా సబ్సిడీలు పోను భారమంతా రైతులమీదే పడుతోంది. మన దేశంలో ఏటా 18.7 మిలియన్‌ టన్నుల యురియా దిగుమతి లేదా దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. డిఏపి మూడు, మిశ్రమ(ఎన్‌పికె) ఎరువులు 6.8మి.టన్నులు దిగుమతి లేదా ఉత్పత్తి అవుతున్నాయి. గతేడాది రు.1.4లక్షల కోట్ల సబ్సిడీలో లక్ష కోట్ల వరకు యురియా సబ్సిడీకే కేటాయించారు.


మనది వ్యవసాయ ప్రధాన దేశం ఐనప్పటికీ రసాయన ఎరువుల వినియోగంలో చాలా వెనుకబడి ఉంది. 2018 సమాచారం ప్రకారం 162 దేశాల్లో హెక్టారుకు 393.2 కిలోలతో చైనా 12వ స్ధానంలో ఉండగా 49వ స్ధానంలో ఉన్న మన వినియోగం 175కిలోలు. రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ప్రకారం 2019-20లో సగటు వినియోగం 133.44 కిలోలు ఉంది. గతేడాది ప్రభుత్వ రంగ సంస్ధ ఇఫ్‌కో కొత్త స్టాక్‌ ఎరువుల ధరలను పెంచుతూ డీలర్లకు పంపిన సమాచారం మీద రైతాంగం గగ్గోలు పెట్టింది. గరిష్టంగా 58.33 డిఏపి, ఇతర ఎరువుల ధరలను 46 నుంచి 51.9శాతం వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నది. అప్పటికే రైతుల ఉద్యమిస్తుండటంతో కంగారు పడిన సర్కార్‌ వత్తిడి తెచ్చి ధరల పెరుగుదలను తాము అనుమతించలేదని పేర్కొన్నది. నిజానికి యురియా తప్ప మిగతా ఎరువుల ధరలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. సబ్సిడీ ఇస్తున్నందున ఏ ఎరువును ఎంతకు అమ్మాలో మాత్రమే ప్రకటిస్తుంది. తమ దగ్గర అప్పటికే ఉన్న 11.26లక్షల టన్నుల ఎరువులకు పెంచిన ధరలు వర్తించవని, కొత్త ఉత్పత్తికి తాత్కాలిక ధరలను మాత్రమే సూచించామని ఇఫ్‌కో పేర్కొన్నది. ధరలపై నియంత్రణ లేదని కూడా ఆ సంస్ధ అధికారి గుర్తు చేశారు. తమ నిర్ణయంతో ప్రభుత్వానికి లేదా మరొక పార్టీకి గానీ సంబంధం లేదని చెప్పారు. ఉత్పత్తిదారుగా ఉన్నందున కొత్త స్టాకు సంచులపై పెరిగిన ధరలను ముద్రించాలంటే ముందుగానే ఆదేశించాల్సి ఉంటుందన్నారు. అంటే ధరల పెంపుదల తప్పదన్నది స్పష్టం. ఈ పెరిగే ధరల్లో కేంద్రం సబ్సిడీ ఇస్తుందా, మొత్తం రైతాంగం మీదనే మోపుతారా అన్నది చూడాల్సి ఉంది.

ఇఫ్‌కో సంస్ధ ప్రకటించిన దాని ప్రకారం ఎరువుల ధరల పెంపుదల ప్రతిపాదన ఇలా ఉంది.( యాభై కిలోల ధర రూపాయలలో )
ఎరువు రకం××××× పాత ధర×××× కొత్త ధర
10:26:26×××××× 1,175 ×××× 1,775
12:32:16×××××× 1,185 ×××× 1,800
20:0:13 ×××××× 925 ×××× 1,350
డిఏపి ×××××× 1,200 ×××× 1,900
కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు అందించిన సమాచారం ప్రకారం సగటున హెక్టారుకు 2015-16లో ఎరువుల వినియోగం 135.76కిలోలు ఉండగా మరుసటి ఏడాదికి 123.41కి తగ్గింది, 2019-20కి 133.44 కిలోలకు పెరిగింది.పైన పేర్కొన్న పట్టిక ప్రకారం నాలుగు ఎరువులను కలిపి 50కిలోల యూనిట్‌గా తీసుకుంటే సగటున పాత ధర రూ.1,121 ఉంది, పెంపుదల అమల్లోకి వస్తే రు.1,706 అవుతుంది. ఈ లెక్కన దేశ సగటు వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక హెక్టారుకు పెరిగే పెట్టుబడి భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరుగుతుంది. గరిష్ట స్ధాయిలో బీహార్‌లో హెక్టారుకు 245.25కిలోలు వినియోగిస్తుండగా అత్యల్పంగా కేరళలో 36.49 కిలోలు మాత్రమే వినియోగిస్తున్నారు. సగటున రెండువందల కిలోలు వినియోగిస్తున్న రాష్ట్రాలలో పంజాబ్‌, హర్యానా, తెలంగాణా ఉన్నాయి. దేశ సగటు కంటే తక్కువ వినియోగం ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ ఉన్నాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే బీహార్‌లో ఒక హెక్టారు ఉన్న రైతుకు భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరిగితే అదే కేరళలోని రైతుకు రు.818 నుంచి రు.1,245కు పెరుగుతుంది.


అవసరానికి మించి యురియా వాడకం వలన భూమి ఆరోగ్యం దెబ్బతింటున్నదని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ సబ్సిడీ భారాన్ని తగ్గించుకొనేందుకు యురియా మీదనే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నది. దాంతో మిగతా ఎరువుల ధరలతో పోలిస్తే అది చౌకగా ఉండటంతో రైతాంగం అటే మొగ్గుతున్నది. అందువలన ఇతర ఎరువులకు సబ్సిడీని పెంచితే ఎరువుల వాడకంలో సమతుల్యత ఏర్పడుతుంది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ఇప్పుడున్న బిజెపి పాలకులకు అవేమీ పట్టటంలేదు. అసమతుల్యత కారణంగా ఆహారధాన్యాల ఉత్పాదకత తగ్గుతోందని కూడా విశ్లేషణలు చెబుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా రైతాంగానికి పత్తి ధర ఎక్కువ-పాకిస్ధాన్‌ కంటే మన దగ్గర తక్కువ !

11 Friday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, cotton farmers, Narendra Modi, WTO-Agriculture, WTO-India


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది పత్తికి మంచి ధర వచ్చిందని రైతులు సంతోషపడ్డారు. వివిధ కారణాలతో పంట దిగుబడి తగ్గింది, ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. కనుక ధర పెరిగినా రైతులకు సంతోషం లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా గణనీయంగా ధరలు పెరిగాయి. ఇప్పుడున్న ధరలు వచ్చే ఏడాది ఉంటాయనే సూచనలు లేవు. తాజా మార్కెట్‌ సమాచారం ప్రకారం అమెరికా ముందస్తు మార్కెట్‌లో మార్చి నెలలో ఒక పౌండు(454 గ్రాములు) దూది ధర 125.66 సెంట్లు(ఒక డాలరుకు వందసెంట్లు)గా ఉంది. మే నెలలో 123.20, వచ్చే ఏడాది జూలైలో 120.51, అక్టోబరులో 109.75, డిసెంబరులో 105.27 సెంట్లుగా ఉంది. ఉత్పత్తి, గిరాకీ, వినియోగం తదితర అంశాల ఆధారంగా అంతర్జాతీయ, జాతీయ మార్కెట్‌ శక్తులు ధరలను నిర్ణయిస్తాయి.


న్యూయార్క్‌ ముందస్తు మార్కెట్లో మార్చినెల ధర 115 నుంచి 127 సెంట్ల వరకు పెరిగింది. చైనాలో 160-163 సెంట్ల మధ్యఉంది. మన దేశంలో నాణ్యమైన పొడవు పింజరకం శంకర్‌ – 6రకం ధర 126 నుంచి 133 సెంట్లకు పెరిగింది. పాకిస్ధాన్‌లో 127 నుంచి 140 డాలర్లకు పెరిగింది. పంజాబ్‌ ఒక మండ్‌ (37.324కిలోలు) ధర ఎనిమిదివేల రూపాయలకు అటూ ఇటూగా ఉంది. అదే పాకిస్థాన్‌లో రు.8,900 వరకు ఉంది. పత్తి పండించే ప్రధాన దేశాలన్నింటినీ పోల్చినపుడు మన దేశంలోనే ధరలు తక్కువగా ఉన్నాయి. మార్కెట్‌ ధరలను బట్టే రైతులకూ చెల్లింపు ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఎగుమతులకు డిమాండ్‌ ఉండటంతో నూలు మిల్లర్లు ఎగబడి కొనుగోలు చేశారు.


అమెరికా వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం ప్రపంచ పత్తి ఉత్పత్తి 8,03,000 బేళ్లు తగ్గి 120.2 మిలియన్‌ బేళ్ల వద్ద ఉంది. ఇదే సమయంలో మిల్లు వినియోగం 1,86,000 పెరిగి 124.4మి.బేళ్లని పేర్కొన్నది.2021-22 88.7మి.బేళ్ల నిల్వలతో ప్రారంభమై 84.3మి.బేళ్లతో ముగియనున్నట్లు అంచనా వేసింది. ఈ కారణంగానే ప్రపంచమంతటా పత్తి ధరలు పెరిగాయి. భారత్‌లో ఐదులక్షల బేళ్లు తగ్గి ఉత్పత్తి 27మి.బేళ్లుగా ఉందని అమెరికా పేర్కొన్నది.ప్రపంచంలో పత్తి దిగుమతులు 46.4 మి.బేళ్లని, చైనా దిగుమతులు రెండున్నర లక్షలు తగ్గి 9.5మి.బేళ్లు దిగుమతి ఉంటుందని పేర్కొన్నది. వివిధ దేశాల్లో పత్తి చేతికి వచ్చే తరుణం ఒకే విధంగా లేనందున అంతిమంగా లెక్కల ఖరారులో అంకెలు మారతాయి. మన దేశంలో ధరలు పెరుగుతున్న కారణంగా ధనిక రైతులు మరింతగా పెరుగుదలను ఆశించి మార్కెట్‌కు పూర్తిగా తీసుకురావటం లేదని వ్యాపారులు చెబుతున్నారు.చెనాలో కూడా ఇదే పరిస్ధితి ఉంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరిగి గిరాకి తగ్గినందున పత్తి ధరలు అదుపులో ఉన్నాయని లేనట్లయితే మరికొంత పెరిగేవన్నది ఒక అభిప్రాయం. గతంతో పోలిస్తే ప్రస్తుతం ధరలు పెరిగినందున 2022-23లో ప్రపంచమంతటా సాగు పెరగవచ్చని జోశ్యం చెబుతున్నారు.


స్ధానికంగా ఉత్పత్తి తగ్గటం, మిల్లు డిమాండ్‌ పెరగటంతో ఈ ఏడాది మన పత్తి ఎగుమతులు పెద్దగా లేవు. దాంతో సాంప్రదాయంగా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే దేశాలు వేరే మార్కెట్లనుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం నుంచి పరిమితంగా బంగ్లాదేశ్‌కు ఎగుమతులు జరుగుతున్నాయి. ఒక పౌను ధర 135 సెంట్ల వరకు ఉంది. గతేడాది మన దేశం 78లక్షల బేళ్లను ఎగుమతి చేయగా ఈ ఏడాది 40లక్షల వరకు ఉండవచ్చని అంచనా.గతేడాది పత్తి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం పదిశాతం దిగుమతి పన్ను విధించింది. పన్ను ఎత్తివేస్తే పెద్ద మొత్తంలో దిగుమతులు పెరిగి స్ధానిక ధరలు పడిపోయి ఉండేవి. దిగుమతి పన్ను ఎత్తివేయాలని మిల్లర్లు వత్తిడి తెస్తున్నారు. ముడిసరకుల ధరలు పెరుగుతున్నందున పత్తిపై దిగుమతి పన్ను రద్దుతో పాటు దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలను తొలగించాలని కోరుతున్నారు.


వ్యాపారుల అంచనా ప్రకారం సెప్టెంబరు 30తో ముగిసిన పత్తి సంవత్సరంలో గతేడాది కంటే పదిలక్షల బేళ్లు తగ్గింది. ఉత్పత్తి 350లక్షల బేళ్లకు అటూ ఇటూగా ఉంటుండగా ప్రతి ఏడాది 40-45లక్షల బేళ్లు వినియోగానికి పనికి రాదని, ఈ ఏడాది ఈ సమస్యతో పాటు దిగుబడి తగ్గిందని, గతేడాది అక్టోబరు ఒకటిన కాండీ ధర 43,300ఉంటే జనవరికి 57వేలకు తరువాత 80వేలకు చేరినట్లు దక్షిణాది మిల్లుల ప్రతినిధి రవిశామ్‌ చెప్పారు.పన్నులేని పత్తిని 30లక్షల బేళ్ల వరకు దిగుమతికి అనుమించాలని అన్నారు. ఈ ఏడాది ధరల కారణంగా వచ్చే సంవత్సరం పత్తి సాగు 20-25శాతం పెరగవచ్చని కాటన్‌ అసోసిఏషన్‌ పేర్కొన్నది. పొడవు పింజ రకాలకు కనీస మద్దతు ధర 25శాతం, ఇతర రకాలకు 3-5శాతం మాత్రమే పెంచాలని మిల్లుల వారు చెబుతున్నారు.2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మధ్యరకం పింజరకాల మద్దతు ధరను క్వింటాలుకు రు.5,726, పొడవు పింజకు రు.6,025గా నిర్ణయించింది. ఇవి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రు.211, 200 ఎక్కువ.


ఈ ఏడాది పత్తి మార్కెట్‌ ధరలతో పోల్చి చూస్తే కనీస మద్దతు ధరలు తక్కువే అన్నది స్పష్టం. అవి సాగు ఖర్చులను ప్రతిబింబించటం లేదు. ఈ ధరలను కూడా ప్రకటించటానికి వీల్లేదని మన సహజభాగస్వామిగా నరేంద్రమోడీ వర్ణించిన అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్దలో మన దేశం మీద కేసులు దాఖలు చేశాయి. వాటిని సంతుష్టీకరించేందుకు గాను కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు మోడీ సర్కార్‌ మొరాయిస్తున్నది. అసలు మొత్తంగా ఎంఎస్‌పిని నీరు గార్చేందుకు మూడు సాగు చట్టాలను తెచ్చి రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు పూనుకున్న అంశం తెలిసిందే. అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీలతో మనతో పాటు చిన్న దేశాలైన ఆఫ్రికన్‌ రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది.2020 లెక్కల ప్రకారం ప్రపంచ పత్తి ఎగుమతుల్లో అమెరికా వాటా 35శాతం. అక్కడ జరిగే ఉత్పత్తిలో 85.6శాతం ఎగుమతులు చేస్తున్నది. అందువలన తనకు పోటీ వచ్చే మనవంటి దేశాలను దెబ్బతీసేందుకు అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల పేరుతో దాడి చేస్తున్నది. కనీస మద్దతు ధర నిర్ణయాన్ని సబ్సిడీ చెల్లించటంగా చిత్రిస్తున్నది. నిజానికి మార్కెట్లో అంతకంటే ఎక్కువ ధరలు ఉన్నపుడు ప్రభుత్వ సంస్ధ సిసిఐ కొనుగోళ్లు జరపటం లేదు. జరిపినా ఎంఎస్‌పికి కొనుగోలు చేస్తున్నది తప్ప కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బోనస్‌ ఇవ్వటం లేదు.


అమెరికాలో ఒక్కొక్క పత్తి రైతుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీ 1,17,494 డాలర్లు కాగా మన దేశంలో ఇస్తున్న పరోక్ష సబ్సిడీ కేవలం 27డాలర్లు మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా ఇవ్వకూడదని వత్తిడి తెస్తోంది. అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం మద్దతు ధర, మార్కెట్లో దాని కంటే రైతులకు తక్కువ వస్తే ఆ మేరకు ప్రభుత్వం లెక్క కట్టి నగదు చెల్లిస్తుంది. అదిగాక రైతులకు సబ్సిడీలతో కూడిన రుణాలు, బీమా సబ్సిడీ, నేరుగా ఇచ్చే రాయితీలు ఇలా ఉన్నాయి.1995-2020 సంవత్సరాలలో 40.10బిలియన్‌ డాలర్లు సబ్సిడీల రూపంలో చెల్లించారు. రైతులకు జిన్నింగ్‌ ఖర్చు తగ్గించే పేరుతో 3.16 బిలియన్‌ డాలర్లు ఇచ్చారు. ఈ సబ్సిడీల కారణంగా ప్రపంచంలో పత్తి ధరలు పతనమయ్యాయి.1995లో పౌను పత్తి ధర 98 సెంట్లు ఉండగా 2001లో 48 సెంట్లకు తగ్గి 2020లో 70 సెంట్లు ఉంది. అంటే పాతిక సంవత్సరాల్లో మొత్తంగా పత్తి ధరలు తగ్గాయి. ఎగుమతులపై ఆధారపడిన అమెరికాలో ఏ పత్తి రైతూ బలవన్మరణానికి పాల్పడిన ఉదంతాలు లేవు.


అమెరికా ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని 2003 నుంచి అనేక దేశాలు వత్తిడి చేస్తున్నా ఫలితం కనిపించటం లేదు.1986-88లో ఉన్న సబ్సిడీల ఆధారంగా ఇప్పటికీ సబ్సిడీలను లెక్కిస్తున్నారు. అమెరికా తన సబ్సిడీలను డాలర్లలో చెబుతుండగా మన సబ్సిడీలను రూపాయల్లో లెక్కించి చూశారా ఎంత ఎక్కువ ఇస్తున్నారో అని కేసులు దాఖలు చేశారు. నాడు మన దేశంలో కనీస మద్దతు ధర అంతర్జాతీయ ధరల కంటే తక్కువగా ఉంది.1986-88 మధ్య తమ పత్తి సబ్సిడీ 2,348 మి.డాలర్లని గాట్‌ చర్చల్లో అమెరికా చెప్పింది. కానీ 1986లో 1,702 మి.డాలర్లని దాన్నే ప్రమాణంగా తీసుకోవాలని తొండి చేస్తోంది. ఈ తప్పుడు లెక్కల కారణంగా 19బి.డాలర్లు అదనంగా ఇచ్చిన సొమ్మును దాచి పెడుతోంది. ఈ వివాదం ఇంకా తేలలేదు. ప్రపంచ వాణిజ్య సంస్ధను, అమెరికా వంటి ధనిక దేశాలను సంతృప్తిపరచేందుకు మోడీ సర్కార్‌ చూపుతున్న శ్రద్ద మన రైతాంగం మీద కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యోగి ఆదిత్యనాధ్‌కు రెండు తుపాకులు అవసరమా ?

06 Sunday Feb 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, BJP, BSP’s Jatav vote bank, Farmers, Lakhimpur Kheri killings, Mayawati, RSS, UP CM, UP election 2022, YogiAdityanath


ఎం కోటేశ్వరరావు


మఠాల్లో ఉంటూ సర్వసంగ పరిత్యాగులైనట్లు చెప్పుకొనే యోగులు, యోగినులకు తుపాకులు అవసరమా ? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాధ్‌కు ఉన్న వ్యక్తిగత ఆస్తి రు.1.5 కోట్లలో లక్ష రూపాయల విలువైన ఒక రివాల్వరు, రు.80వేల ఖరీదైన ఒక రైఫిల్‌, రుద్రాక్షలతో కూడిన రెండు బంగారు గొలుసులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.యోగులు రుద్రాక్షలు కలిగి ఉండటంలో అబ్బురం ఏమీ లేదు, తుపాకులెందుకని ? సిఎం గాక ముందు ఐదు దఫాలు ఎంపీగా పని చేసిన యోగికి అవసరమైన భద్రతను అధికారికంగా కల్పిస్తారు.ఐనా స్వంతంగా రెండు మారణాయుధాలను ఎందుకు వెంట ఉంచుకుంటున్నట్లు ? రాత్రుళ్లు ప్రాణభయం ఉందా ? 2017 ఎంఎల్‌సి ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నాలుగు కేసులు, రెండు కార్లు ఉన్నట్లు పేర్కొన్న యోగి తాజా అఫిడవిట్‌లో కేసులేమీ లేవని,స్వంత వాహనాలేమీ లేవని తెలిపారు.
గోరఖ్‌పూర్‌ అర్బన్‌ స్ధానం నుంచి పోటీలో ఉన్న ఆదిత్యనాధ్‌పై తాను పోటీ చేయనున్నట్లు గత 26సంవత్సరాలుగా నిరవధిక ధర్నా చేస్తున్న మాజీ టీచర్‌ విజయ సింగ్‌ ప్రకటించారు.ముజఫర్‌నగర్‌లో భూమాఫియా మీద చర్య తీసుకోవాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. యోగి మీద పోటీతో పాటు ఎస్‌పి నేత అఖిలేష్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న చోట వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు.


ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో బ్రాహ్మణ సామాజిక తరగతి కీలకపాత్ర పోషిస్తున్నారు.1989 తరువాత వారి నుంచి సిఎం గద్దెనెక్కిన వారు లేరు. కారణం తరువాత కాలంలో ఓబిసి కులాలు, రాజకీయాలు ముందుకు వచ్చాయి.మండల్‌ (కమిషన్‌) ఆందోళన తరువాత ఈ తరగతి నుంచి ఎవరూ సిఎం కాలేదు. కులాలు, మతాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 21 మంది సిఎంలుగా పని చేస్తే వారిలో ఆరుగురు గోవిందవల్లభ పంత్‌, సుచేతా కృపలానీ,కమలాపతి త్రిపాఠీ, శ్రీపతి మిశ్రా, హెచ్‌ఎన్‌ బహుగుణ, ఎన్‌డి తివారీ ఈ సామాజిక తరగతికి చెందినవారే.పదిశాతంపైగా ఓటర్లుగా కూడా ఉన్నందున వీరు మొగ్గినవైపు అధికారం చేతులు మారుతూ వస్తోంది. విధాన సభలోని 403 స్ధానాలకు గాను 115 చోట్ల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారని అంచనా. ఆ రీత్యానే గతంలో బిఎస్‌పి నేత మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌, గత ఎన్నికల్లో యోగి గద్దెనెక్కారన్నది కొందరి సూత్రీకరణ. దానిలో భాగంగానే ఇప్పుడు యోగి పట్ల ఆగ్రహంగా ఉన్నందున బిజెపి ఇంటిదారి పట్టవచ్చని చెబుతున్నారు.నిజానికి దీనికంటే ఇతర అంశాలు బలంగా పని చేస్తున్నాయి.


ఈ సామాజిక తరగతి సమాజవాది పార్టీకి మద్దతు ఇచ్చినపుడు యాదవులు వీరిని చిన్నచూపు చూశారని బిజెపి, ఇతర పార్టీలు రెచ్చగొట్టాయి. ఇప్పుడు అదే ఆయుధాన్ని బిజెపి మీద ఇతరులు ప్రయోగిస్తున్నాయి. ఠాకూర్ల మోచేతి నీళ్లు తాగాల్సి వస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. యోగి పాలనలో కనీసం ఐదువందల మంది బ్రాహ్మలను హత్య చేశారని,20 మందిని నకిలీ ఎన్‌కౌంటర్లలో చంపినట్లు విమర్శలున్నాయి. దీని తీవ్రతను గమనించే అనేక మంది బ్రాహ్మణనేతలకు బిజెపి పెద్దపీటవేస్తోంది. ఇతర పార్టీల నుంచి ఆహ్వానిస్తోంది.లఖింపూర్‌ ఖేరీలో రైతుల మీద వాహనాలను తోలి హత్యకావించిన కేసులో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఉన్నట్లు విచారణలో తేలినా మంత్రి మీద చర్య తీసుకొనేందుకు బిజెపి వణికి పోవటానికి ఇదే కారణం. అంతేకాదు బ్రాహ్మలతో ఏర్పాటుచేసిన కమిటీలో కూడా మంత్రిని చేర్చారు.


ఈ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్ల కోసం పార్టీల పాట్లు ఇన్నిన్ని కావు. లక్నో నగరంలో పరశురాముడి విగ్రహాన్ని సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. గండ్రగొడ్డలితో కూడిన పరశురాముడు-అఖిలేష్‌ చిత్రాలు తరువాత దర్శనమిచ్చాయి.యాదవులు, బ్రాహ్మలు మాతోనే ఉన్నారని అఖిలేష్‌ చెప్పారు. బిఎస్‌పి నేత మాయావతి ఎన్నికల ప్రచారంలో దిగకపోయినా ఆ పార్టీ అగ్రనేత సతీష్‌ చంద్ర మిశ్రాను రంగంలోకి దించి బ్రాహ్మల ఓట్లకోసం తిప్పుతున్నారు. ప్రతిపక్షాల దాడికి తట్టుకోలేక బ్రాహ్మలను సంతృప్తి పరచేందుకు బిజెపి 16మందితో ఒక కమిటీని వేసి సమస్యలను గుర్తిస్తామంటూ బుజ్జగింపులకు దిగింది. గాంగస్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ సమయంలో మరణించిన అమర్‌దూబే భార్య ఖుషీ దూబే, ఆమెతో పాటు తల్లి గాయత్రీ తివారీకి సీట్లు ఇచ్చిన కాంగ్రెస్‌ తనవంతు తిప్పలు పడుతోంది.


ఆదిత్యనాధ్‌ తప్పక గెలవాలని తాము కోరుకుంటున్నామని, ఎందుకంటే అసెంబ్లీలో బలమైన ప్రతిపక్ష నేత అవసరం కనుక అని రైతు ఉద్యమనేత రాకేష్‌ తికాయత్‌ జోక్‌ వేశారు. పోటీ 80శాతం, 20శాతం మధ్యనే అంటూ హిందూ-ముస్లిం పోటీగా రెచ్చగొట్టేందుకు బిజెపి వేసిన ఎత్తుగడ దానికే నష్టకరంగా మారుతున్నట్లు వార్తలు రావటంతో నష్టనివారణ చర్యలకు పూనుకుంది. బిజెపి చేసిన ప్రచారంతో వివిధ పార్టీల వెనుక చీలిన ముస్లిం సామాజిక తరగతి బిజెపిని ఓడించేందుకు మొత్తంగా సమాజవాదికి మద్దతు ఇవ్వాలని వార్తలు వచ్చాయి. దాంతో మొదటిదశ ఎన్నికలు కూడా ప్రారంభంగాక ముందే 80-20 కాస్తా 90-10శాతంగా మారినట్లు స్వయంగా యోగి ఎన్నికల ప్రచారంలో చెప్పటం ప్రారంభించారు.మతంతో సంబంధం లేని ఎన్నికలని, ముస్లింలతో సహా అందరూ తమ వెనుకే ఉన్నారని చెప్పటమే ఇది.


రెండు ఇంజిన్లతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామని చెప్పిన బిజెపి ఇప్పుడు ఎన్నికల్లో తానే చెమటలు కారుస్తోంది. పండిన గోధుమల్లో 15శాతం, బియ్యంలో 32శాతం మాత్రమే మద్దతు ధరకు రాష్ట్రంలో సేకరించారు. మిగిలిన మొత్తాన్ని రైతులు అంతకంటే తక్కువకే అమ్ముకొని నష్టపోయారు. రైతుల ఉద్యమం, ఎన్నికల కారణంగా గత ఏడాది కంటే 10 నుంచి 15శాతానికి గోధుల సేకరణ పెరిగినప్పటికీ 2018-19లో 16శాతం సేకరణతో పోలిస్తే తక్కువే. బియ్యం సేకరణ మరీ ఘోరంగా ఉంది. గత ఐదేండ్ల సగటు 34.8శాతం కాగా, గతేడాది 43 నుంచి ఈ ఏడాది 32శాతానికి దిగజారింది. కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించే అంశం గురించి ఒక కమిటీని వేస్తామని సాగు చట్టాల రద్దు ప్రకటనతో పాటు చెప్పారు. ఇంతవరకు దాని ఊసే లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత అంటూ ఇప్పుడు కొత్త కబుర్లు చెబుతున్నారు.


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయరాదంటూ 57రైతుల సంఘాల పిలుపు మేరకు ఎస్‌కెఎం మిషన్‌ ఉత్తర ప్రదేశ్‌ అనే కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ప్రతి గ్రామాన్ని సందర్శించి బిజెపి పాల్పడిన విద్రోహం గురించి రైతులు, ఇతర జనాలకు వివరిస్తామని నేతలు తెలిపారు. తాము ఏ పార్టీకి ఓటు వేయాలన్నది చెప్పటం లేదని, మోసం చేసిన బిజెపిని ఓడించాలని కోరతామన్నారు. జనవరి 15న సమావేశమైన ఎస్‌కెఎం కమిటీ ఎంఎస్‌పి కమిటీ ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడవు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటికీ ఏర్పాటును ప్రకటించకపోతే జనవరి 31న దేశమంతటా విద్రోహదినంగా పాటించాలని పిలుపు ఇచ్చారు. ఆ మేరకు పలుచోట్ల పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఆందోళన పునరుద్దరణలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలల్లో బిజెపి ఓటమికి పిలుపు ఇచ్చారు.


ఉత్తర ప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతంలో సమాజవాది-ఆర్‌ఎల్‌డి కూటమి ప్రచారం బిజెపికి చెమటలు పట్టిస్తున్నట్లు వార్తలు. విజయ రధం పేరుతో బస్సు ద్వారా అఖిలేష్‌ యాదవ్‌ – జయంత్‌ చౌదరి చేస్తున్న పర్యటన యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది.జాట్‌ – ముస్లిం ఐక్యతను ముందుకు తెస్తున్నారు. తరచుగా జయంత్‌ చౌదరి సభలకు హాజరైన యువతను ఇలా అడుగుతున్నారు ” ఇక్కడున్న అందరికీ వివాహమైందా ? మీరు పెండ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా ? గుర్తు పెట్టుకోండి, వివాహం కావాలంటే మీరు ఇంట్లో సామరస్యతను పాటించాలి. ఇంట్లో ప్రశాంతత లేదని ఇతరులకు తెలిస్తే వివాహానికి ఎవరూ ముందుకు రారు ” అని చెబుతున్నారు. అఖిలేష్‌ రైతులను ఆకర్షించేందుకు ఇలా మాట్లాడుతున్నారు.” మీకు వికాసం కావాలా లేక రోడ్ల మీద తిరిగే పశువులు కావాలా ?” గో సంరక్షణ పేరుతో ఒట్టిపోయిన పశువులను అమ్ముకోనివ్వకుండా రైతులను బిజెపి సర్కార్‌ అడ్డుకుంటున్నది. వాటిని మేపటం దండగ అని రైతులు రోడ్ల మీదకు వదలి వేయటంతో వాటిని నుంచి రైతులు పంటలను కాపాడుకోవటం మరొక సమస్యగా మారుతోంది. దాంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తుతోంది.


ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందన్నట్లుగా అసెంబ్లీ ఎన్నికలు బిఎస్‌పి చావుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. దళితుల్లో జాతావులు మాయావతి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. దాన్ని అవకాశంగా తీసుకొని బిజెపి ఇతరులను రెచ్చగొట్టి కొంత మేరకు తమవైపు తిప్పుకోగలిగింది. ఇప్పుడు బిఎస్‌పి ఎక్కడా రంగంలో కనిపించకపోవటంతో జాతావులు, ఇతర దళితులను తమ వైపు ఆకర్షించేందుకు బిజెపి, ఎస్‌పి పూనుకున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లలో దళితులు 21శాతం కాగా వారిలో జాతావులు తొమ్మిదిశాతం ఉన్నారు.గత ఎన్నికల్లో 84రిజర్వుడు స్ధానాల్లో బిజెపికి 69, దానితో జతకట్టిన పార్టీలకు మరోఐదు వచ్చాయి. గిరిజనులకు ఉన్న మరో రెండుతో మొత్తం 86 స్ధానాల్లో బిఎస్‌పికి వచ్చింది కేవలం రెండంటే రెండు మాత్రమే. ఎస్‌పి ఎనిమిది చోట్ల గెలిచింది. ఈ సారి బిజెపి జాతావు సామాజిక తరగతికి చెందిన మాజీ ఉన్నతాధికారులతో పాటు ఉత్తరాఖండ్‌ మాజీ గవర్నర్‌ను కూడా రంగంలోకి దించి ఓటర్లను ఆకట్టుకొనేందుకు పూనుకుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫిరోజ్‌పూర్‌లో పంజాబ్‌ రైతుల అనూహ్య నిరసన -సంయమనం కోల్పోయిన ప్రధాని నరేంద్రమోడీ ?

06 Thursday Jan 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Farmers agitations, Narendra Modi, Narendra Modi Failures, PM Modi security breach, Satya Pal Malik


ఎం కోటేశ్వరరావు


జనవరి ఐదు, బుధవారం నాడు జరిగిన అనూహ్యపరిణామాల మధ్య పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా హుసేనీవాలాలో జరగాల్సిన సభలో పాల్గొనకుండా ప్రధాని నరేంద్రమోడీ వెనక్కు వెళ్లిపోయారు. సభా స్ధలికి 30కిలోమీటర్ల దూరంలోని రోడ్డుమీద ఒక పైవంతెన(ఫ్లైఓవర్‌) సమీపంలో రైతులు నిరసన తెలపటంతో 15-20నిమిషాల పాటు ప్రధాని, వాహన శ్రేణి వంతెన మీద నిలిచిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండానే వెనుదిరిగి భటిండా విమానాశ్రయానికి వచ్చి ఢిల్లీ వెళ్లిపోయారు. పంజాబ్‌ ప్రభుత్వ భద్రతాలోపాల కారణంగానే ఇలా జరిగిందని బిజెపి, కేంద్ర ప్రభుత్వం ఆరోపించాయి. గురువారం నాడు భద్రత అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై సమీక్షించింది. రాష్ట్రపతి రామానాధ్‌ కోవింద్‌ను కలిసి బుధవారం జరిగిన ఉదంతం గురించి ప్రధాని నరేంద్రమోడీ వివరించారు. రాష్ట్రపతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలను దీనికి బాధ్యులుగా చేయాలని సుప్రీం కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలైంది. నరేంద్రమోడీని కాంగ్రెస్‌ ద్వేషించింది, ఇప్పుడు హాని తలపెట్టాలని చూసిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. జరిగిన దాని మీద విచారం వ్యక్తం చేసిన పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ , కాంగ్రెస్‌ కూడా బిజెపి ఆరోపణను తోసిపుచ్చింది.తగు సంఖ్యలో బలగాలను దింపి ఏర్పాట్లు చేయలేదని కేంద్ర హౌంమంత్రిత్వశాఖ ఆరోపించింది. కాంగ్రెసే ఇది చేసినట్లు ఆరోపిస్తూ అందుకు క్షమాపణ చెప్పాలని అమిత్‌ షా అన్నారు.
పంజాబ్‌ పోలీసు యంత్రాంగ భద్రతాపరమైన లోపాల కారణంగానే ఇది జరిగిందని, అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ గనుక దాని నేతలు క్షమాపణ చెప్పాలంటూ బిజెపి డిమాండ్‌ చేసింది. కేంద్ర హౌంశాఖ సహజంగానే వివరణ ఇవ్వాలని, బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ఇద్దరితో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు గురువారం నాడు ప్రకటించింది.విశ్రాంత న్యాయమూర్తి మెహతాబ్‌ సింగ్‌ గిల్‌, హౌంశాఖ ముఖ్యకార్యదర్శి అనురాగ్‌ వర్మ దీనిలో సభ్యులు. ఈ ఉదంతంపై విచారణ జరపాలని కోరటం గానీ, విచారించటంపైగానీ విబేధించాల్సిందేమీ లేదు. పంజాబ్‌ పోలీసులు తగువిధంగా వ్యవహరించలేదా లేక రైతుల చిన్నపాటి నిరసనను సాకుగా చూపి నరేంద్రమోడీ జనం లేని సభను రద్దుచేసుకొన్నారా అన్నది జనానికి తెలియాలి. అంతే కాదు ప్రధాని భద్రతను చూసే ప్రత్యేక రక్షణ దళం(ఎస్‌పిజి), కేంద్ర గూఢచార విభాగం ఏమి చేసిందన్నది, రోడ్డు మార్గంలో వెళ్లాలని ఎప్పుడు తెలిపారన్నది ఆసక్తికరంగా మారింది.


హుస్సేనీవాలా సభకు జనం చాలా తక్కువగా రావటంతో పాటు భారీ వర్షం, వాతావరణం కూడా అనుకూలించలేదని తెలియటంతో ఎన్నికల సభ కానప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపుతుందనే దూరాలోచనతో నరేంద్రమోడీ సభను రద్దు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. సాగు చట్టాల మీద ఉద్యమించిన సంఘాల వేదిక కిసాన్‌ ఏక్తా మోర్చా ఒకట్వీట్‌ చేస్తూ రైతులు, పంజాబు జనం పెద్ద ఎత్తున నిరసన తెలిపిన కారణంగానే మోడీ తన సభను రద్దు చేసుకున్నారని, సభా స్ధలిలో చాలా తక్కువ మంది ఉన్నారని, వారిని కూడా బలవంతంగా తీసుకువచ్చినట్లు, పంజాబీల నుంచి ప్రతికూల స్పందన కారణంగా సభ రద్దు జరిగినట్లు పేర్కొన్నది.
ఢిల్లీ నుంచి భటిండా వరకు విమానంలో వచ్చిన ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హుస్సేనీవాలా వెళ్లాలన్నది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం. మధ్యాహ్నం 1.30కు సభ ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం 10.20కి విమానశ్రయంలో దిగిన ప్రధాని వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేనీవాలా చేరాలంటే రెండు గంటలు పడుతుంది,వాతావరణం సరిగా లేని కారణంగా రోడ్డు మార్గాన వెళ్లాలని నిర్ణయించారు 11.50కి ప్రధాని రోడ్డు మార్గాన బయలు దేరారు.


ప్రధాని పర్యటనలకు ముందు ఎఎస్‌ఎల్‌(ముందస్తు పర్యవేక్షక సమావేశం) నిర్వహించి అనుకోని పరిస్ధితులు ఏర్పడినపుడు ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా చర్చిస్తారు. తగు ఏర్పాట్లు చేస్తారు. రక్షణ బాధ్యత ఎస్‌పిజి కమాండోలదే.ఎస్‌పి హౌదా కలిగిన కమాండెంట్‌, 40 నుంచి 60 మంది వరకు సిబ్బంది ఉంటారు.వీరు అంతర వలయంగా పని చేస్తారు. తరువాత ఇతర భద్రతా సిబ్బంది ఉంటారు. . ప్రధాని ఒక బహిరంగ సభలో, ఇతర కార్యక్రమంలో పాల్గొన్నా,ఈ అంతరవలయంలోకి రాష్ట్రపోలీసులను అనుమతించరు.ప్రధాని ప్రయాణించే మార్గాన్ని ఖరారు చేయటం, సిబ్బందిని ఏర్పాటు చేయటంలో స్ధానిక పోలీసులకు పాత్ర ఉన్నప్పటికీ ఆ మార్గాన్ని రక్షించేందుకు పారామిలిటరీని రంగంలోకి దించుతారు. ఏవైనా టవర్లు, ఎత్తైన భవనాల వంటివి ఆ మార్గంలో ఉంటే అక్కడ వారే ఉంటారు. రోడ్డు మీదకు ఎవరూ రాకుండా, పనులు చేయకుండా స్ధానిక పోలీసులు చూస్తారు. మూడు నాలుగు గంటల ముందే రోడ్లను శుభ్రపరచటం వంటివి చేస్తారు. బుధవారం నాటి ప్రధాని పర్యటనకు అవన్నీ చేసేందుకు స్ధానిక పోలీసులకు అవకాశం ఉందా అన్నది ప్రశ్న. భారీ వర్షం, వాతావరణం సరిగా లేని కారణంగా (బిపిన్‌ రావత్‌ ఇతర మిలిటరీ అధికారుల దుర్మరణం నేపధ్యంలో ప్రధానిని హెలికాప్టర్‌లో తీసుకు వెళ్లేందుకు భద్రతా సిబ్బంది తిరస్కరించి ఉండవచ్చు) రోడ్డు మార్గాన వెళ్లాలని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. ఏఎస్‌ఎల్‌ సమావేశంలో ప్రత్నామ్నాయ మార్గం గురించి ఆలోచించి ఉంటే ఆ దిశగా వేరే మార్గంలోకి ఎందుకు మళ్లించలేదు, రైతుల ఆందోళనను ఊహించి ఎందుకు అంచనా వేయలేదు అన్న ప్రశ్నలు, ఆ ప్రాంతంలో మరొక మార్గం లేదన్న వార్తలు వచ్చాయి. రైతులు ఆందోళనకు దిగితే కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్‌ ఎందుకు పసిగట్టలేకపోయిందన్న ప్రశ్నలూ ఉన్నాయి. ఒకవేళ పసిగట్టినా రైతులు తప్పించుకొని నిరసన తెలిపి రోడ్డును ఎలా దిగ్బంధించారు అన్నది తేలాల్సి ఉంది. పర్యటన గురించి ఎంతో ముందుగానే తెలిపినందున తగు భద్రతతో పాటు ప్రత్నామాయ ఏర్పాట్ల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నది కేంద్ర వాదన.


ప్రధాని వచ్చే మార్గం పంజాబ్‌ పోలీసులకు తెలుసని, వారే ఉప్పందించి ఉండకపోతే అప్పటికప్పుడు రైతులు ఎలా సమీకృతులౌతారంటూ బిజెపి నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు.ప్రధాని రోడ్డుమార్గాన వస్తున్నట్లు టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయని, వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా తెలిసిందని, హుస్సేనివాలా వెళ్లేందుకు ఒక్కటే రోడ్డు మార్గం ఉన్నందున తమకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని రైతులు చెబుతున్నారు. సోమవారం నుంచే రైతులు ఆందోళనకు దిగారని మంగళవారం రాత్రి రైతులతో మాట్లాడి నిరసన తెలపవద్దని కోరగా అంగీకరించారని, తాను తెల్లవారు ఝామున 3గంటల వరకు చర్చించానని, తెల్లవారే సరికి కొందరు ఎలా వచ్చారో తెలియ లేదని ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ చెప్పారు. వాతావరణం సరిగా లేకపోవటం, రైతుల ఆందోళన కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించామని, తొలుత హెలికాప్టర్‌ ద్వారా అనుకున్న కార్యక్రమానికి భిన్నంగా ఆక్మసికంగా మార్చుకున్న నిర్ణయం గురించి సమాచారం లేదని సిఎం చెప్పారు. ఏ పోలీసు అధికారి మీద చర్య తీసుకొనేది లేదని, పంజాబీల మీద లాఠీలు, తూటాలను ప్రయోగించేది లేని కూడా చెప్పారు. నిరసన తెలిపిన రైతులు సమీపంలోని మిస్రీవాలా, పైరేవాలా గ్రామాలకు చెందిన వారని, మూడు రైతు సంఘాల జెండాలను ఎగురవేసినట్లు, సభకు వెళుతున్న బిజెపి మద్దతుదార్ల వాహనాలను కూడా ఆపినట్లు ఇండియా టుడే విలేకరి రాశారు.ప్రధానికి నిరసన తెలపాలని నిర్ణయించిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి గజేంద్ర షెఖావత్‌ మంగళవారం రాత్రి చర్చలు జరిపిన తరువాత ఆందోళన కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేశారు. జనవరి పదిహేను నాటికి ఎంఎస్‌పికి చట్టబద్దతను పరిశీలించే కమిటీని ఏర్పాటు చేస్తామని, మార్చి 15న రైతులతో ప్రధాని కలుస్తారని మంత్రి వారికి చెప్పారు.


” భటిండా విమానాశ్రయానికి ప్రాణాలతో తిరిగి వచ్చాను, అందుకుగాను మీ ముఖ్యమంత్రికి నా కృతజ్ఞతలు తెలపండి ” అని ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్‌ అధికారులతో ఢిల్లీ తిరుగు ప్రయాణంలో అన్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్ధ పేర్కొన్నది. ఈ ఎత్తిపొడుపు లేదా వ్యంగ్యం గురించి ఎలాంటి వివరణ వెలువడనందున ఆ వ్యాఖ్య నిజమే అనుకోవాలి. ఓట్ల కోసం రాజకీయ నేతలు ఏ అవకాశాన్నీ వదులుకోరని గతంలోనే రుజువైనందున ప్రధాని మోడీ ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవటంలో ఆశ్చర్యం ఏముంటుంది ! దేశంలో తనకు ఎదురులేదని భావిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఈ ఘటనను అవమానకరంగా భావించారా ? మయసభలో రారాజు మాదిరి మానసికంగా గాయపడ్డారా ?


నిజానికి ప్రధాని వెనక్కు కాకుండా ముందుకు సాగి నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు వెళ్లి వారెందుకు అలా చేశారో తెలుసుకొని భరోసా ఇచ్చి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. సాగు చట్టాల రద్దు చేస్తూ క్షమాపణలు కూడా చెప్పి వారి డిమాండ్ల పరిశీలనకు కమిటీ వేస్తానని హామీ ఇచ్చిన తరువాత ఇంకా ఎందుకు నిరసన తెలుపుతున్నారో తెలుసుకుంటే రైతాంగానికి దగ్గర కావాలన్న లక్ష్యం కొంత మేరకు నెరవేరి ఉండేదేమో ! ఒకటి మాత్రం స్పష్టం. ఫిరోజ్‌పూర్‌ ఉదంతాన్ని కాంగ్రెస్‌ మీద దాడి చేసేందుకు ఉపయోగించుకొని ఒక రాజకీయవేత్తగా నరేంద్రమోడీ ప్రయత్నించారు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు పంజాబ్‌లో బిజెపి, దానితో చేతులు కలిపిన మాజీ(కాంగ్రెస్‌)సిఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ పార్టీ, అకాలీదళ్‌ నుంచి వచ్చిన చిన్న చీలిక గ్రూపుకు గానీ దీంతో ఎలాంటి ప్రయోజనం కలగదు. కాంగ్రెస్‌కు ఆమ్‌ ఆద్మీపోటీ గట్టి పోటీదారుగా ఉందన్న వాతావరణం ఇప్పటికే ఏర్పడింది. ఫ్లైఓవర్‌ ఉదంతానికి ముందు జరిగిన పరిణామాలను చూస్తే సాగు చట్టాల అంశంలో రైతులు నరేంద్రమోడీ మీద ఇంకా ఆగ్రహంగానే ఉన్నారన్నది స్పష్టమైంది.

నోటిఫికేషన్‌ వెలువడక ముందే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అభివృద్ది పనుల పేరుతో పలు చోట్ల ఓటర్లను ఆకట్టుకొనేందుకు నరేంద్రమోడీ సభలు పెడుతున్నారు. దానిలో భాగంగానే రు.42,750 కోట్లతో రూపొందించిన పధకాలను పంజాబీలకు ఎరగా వేసేందుకు బుధవారం నాడు సభను ఏర్పాటు చేశారు. అదేమీ రహస్యసభ కాదు కనుక నిరసన తెలపాలని రైతులు నిర్ణయించారు.
రైతులను రెండు వార్తలు మరింతగా ప్రేరేపించినట్లు చెప్పవచ్చు. సాగు చట్టాల మార్పును పరిశీలించాలని తాను కలిసినపుడు మోడీతో చెప్పానని, చాలా పెడసరంగా మాట్లాడినపుడు ఐదు నిమిషాలు ఆ సందర్భంగా వాదనలు జరిగినట్లు ప్రస్తుతం మేఘాలయ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్‌ మాలిక్‌ చెప్పారు. రైతులు మరణిస్తున్నారని, చట్టాలను సవరించాలని తాను కోరగా వారేమైనా నా కోసం చచ్చారా అని మోడీ దురహంకారంతో అన్నట్లు మాలిక్‌ చెప్పారు. ఈ వార్త కూడా పంజాబ్‌ రైతులకు ఆగ్రహం కలిగించి నిరసనలకు ప్రేరేపించిందన్నది స్పష్టం. దీనికి తోడు లఖింపూర్‌ ఖేరీలో రైతులపై( వారంతా సిక్కు సామాజిక తరగతి వారు) కార్లను తోలి నలుగుర్ని బలితీసుకున్న ఉదంతంలో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఆషిష్‌ మిశ్రా ప్రధాన నిందుతుడని, ఆ దుర్మార్గం జరిగినపుడు అతడు అక్కడే ఉన్నట్లు దాఖలైన చార్జిషీట్‌ వార్త కూడా వచ్చిన అంశం తెలిసిందే. సదరు కేంద్రమంత్రిని పదవి నుంచి తొలగించాలని రైతు సంఘాలు చేసిన డిమాండ్‌ను నరేంద్రమోడీ పెడచెవిన పెట్టి కొనసాగిస్తున్నారు. సాగు చట్టాల రద్దు తరువాత ఎన్నికలు జరగాల్సిన పంజాబులో మోడీ తొలి పర్యటన అవమానకరంగా ముసిందని చెప్పవచ్చు.


ఈ ఉదంతం జరిగి ఉండాల్సింది కాదనటంలో మరోమాట లేదు. దేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని కొందరు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు, చరిత్రలో జరగనివి ఇటీవల అనేకం జరుగుతున్నాయి. రైతులు నిరసన తెలిపేందుకు తమ రాజధానికి వస్తే రోడ్ల మీద మేకులు కొట్టి, కాంక్రీటు దిమ్మలు పోసి నానాయాతనలకు గురి చేసింది నరేంద్రమోడీ కాదా ! ఒక ఇరవై నిమిషాలు నిలిచి పోవాల్సి వచ్చినందుకే అవమానంగా భావిస్తే రైతులు ఏడాది పాటు ఏం జరుగుతుందో తెలియని స్ధితిలో గడపారని మరచిపోవద్దు. వారిని ఉగ్రవాదులని, అసలు రైతులే కాదని చేసిన ప్రచారాలు, నిరసన శిబిరాల మీద దాడులకు పురికొల్పిన ఉదంతాలను అంత సులభంగా మరచిపోతారా? వాతావరణం బాగోలేనపుడు గతంలో అనేక కార్యక్రమాలను రద్దు చేసుకోలేదా ? బుధవారం నాడు కూడా అదే ఎందుకు చేయలేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

2022 ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు : నరేంద్రమోడీ,యోగి ఓదార్పు – లఖింపూర్‌ ఖేరీ నేరం మధ్య నలుగుతున్న బిజెపి విధి రాత !

04 Tuesday Jan 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, 2022 UP polls, BJP, BSP, Lakhimpur Kheri killings, Narendra Modi Failures, Samajavadi party, UP BJP poll fate, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


ఉత్తర ప్రదేశ్‌ విధాన సభ ఎన్నికల్లో చరిత్రను తిరగరాసేందుకు బిజెపి నేతలు గంగకు ఎదురీదుతున్నారు.కరోనా శవాలను తనలోకి నెట్టిన వారిని గంగామాత ఏం చేస్తుందో చెప్పలేము. గడచిన నాలుగు దశాబ్దాలలో 1985 తరువాత ఇక్కడ ఒకసారి అధికారానికి వచ్చిన పార్టీ వరుసగా రెండవసారి గద్దెనెక్కలేదు.దాన్ని చరిత్రలోకి నెట్టివేసేందుకు నరేంద్రమోడీ ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రాన్ని ఒకేసారి రెండు ఇంజన్లు (కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో యోగి) లాగుతూ అభివృద్ది పరుగుపెట్టిస్తున్నామని చెప్పుకొనే బిజెపి నేతలు కొత్త రికార్డు నెలకొల్పుతారా ? ఎన్నికల ముందు అనేకం అంటాం, అనుకుంటాంగానీ గానీ సంప్రదాయం కొనసాగింది తప్ప ఇది మా ఓటమి కాదు అని చెప్పే పరిస్ధితి వస్తుందా లేక చూశారా మా తడాఖా మల్లయోధుడి పార్టీ(సమాజవాది- ములాయం సింగ్‌ యాదవ్‌ రాజకీయాల్లోకి రాక ముందు మల్లయోధుడు, ఆయన కుమారుడే ప్రస్తుత పార్టీ నేత, మాజీ సిఎం అఖిలేష్‌ యాదవ్‌ )ని మట్టి కరిపించాం అని జబ్బలు చరుచుకుంటారా ? చూద్దాం, తినబోతూ రుచెందుకు ?


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందు బిజెపిని ఇరుకున పెడుతుందని భావిస్తున్న లఖింపూర్‌ ఖేరీ కేసులో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. అక్టోబరు మూడవ తేదీన లఖింపూర్‌ ఖేరీ వద్ద సాగు చట్టాలకు నిరసన తెలుపుతున్న రైతులపై మోటారు వాహనాలను తోలి రైతులను హత్యచేసిన ఉదంతంలో నలుగురు రైతులు మరణించారు. ఒక జర్నలిస్టు ప్రాణాలు కూడా తీశారు. ఆగ్రహించిన రైతుల చేతిలో వాహనాల్లో ఉన్న ముగ్గురు బిజెపి కార్యకర్తలు కూడా మరణించారు. రైతుల మీదకు కార్లను తోలిన వారిలో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఆషిష్‌ మిశ్రా తదితరులు ఉన్నారని వచ్చిన వార్తలను అప్పుడు బిజెపి తోసి పుచ్చింది. అప్పుడు అతగాడు వేరే చోట ఉన్నట్లు కతలు చెప్పింది. కేసును నీరు కార్చేందుకు పూనుకోవటంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. మూడు నెలల తరువాత పోలీసులు దాఖలు చేసిన ఐదువేల పేజీల ఛార్జి షీట్‌లో మంత్రి కుమారుడు ఆషిష్‌ మిశ్రా ప్రధాన నిందితుడని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న రైతులను హత్యచేసేందుకు పధకం ప్రకారం కుట్రపన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేర్కొన్నది. ఉదంతం జరిగిన సమయంలో ఆషిష్‌ మిశ్రా ఘటనా స్ధలిలో ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఆషిష్‌ బంధువు కూడా సహనిందుడని పేర్కొన్నారు. తాను ఆ సమయంలో అక్కడ లేనంటూ కొన్ని వీడియోలు, పది మందితో అఫిడవిట్‌లను పోలీసులకు అంద చేశారు. ఘటన జరిగినపుడు ధీరేంద్ర శుక్లా అనే అతను ఉన్నాడని, అతని కారు ఆషిష్‌ మిశ్రా కారువెనుకే ఉందని ఈ వాస్తవాన్ని ధీరేంద్ర దాచినట్లు సిట్‌ పేర్కొన్నది. ఈ కేసు తరువాత ఏమౌతుందో చెప్పలేము గానీ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను మంత్రి వర్గం నుంచి తొలగించాలనే డిమాండ్‌ మరింత ఊపందుకోవటంతో పాటు ఎన్నికల్లో ప్రచార అంశంగా మారనుంది. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎంపిక చేసిన పార్టీ ఎంపీలతో ప్రధాని నరేంద్రమోడీ జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా ఉంచినట్లు వార్తలు వచ్చాయి.


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి తాజాగా టైమ్స్‌ నౌ నవభారత్‌కు వీటో సంస్ధ నిర్వహించిన సర్వేలో 403 స్ధానాలకు గాను బిజెపి 230-249 మధ్య తెచ్చుకొని సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందని తేలినట్లు ప్రకటించారు. సమీప సమాజవాది పార్టీకి 137-152, బిఎస్‌పికి 9-14, కాంగ్రెస్‌కు 4-7 మధ్య రావచ్చని పేర్కొన్నారు. బిజెపి ఏడు పార్టీలతో కూటమిగా పోటీలోకి దిగుతోంది. సమాజవాది , కాంగ్రెస్‌, బిఎస్‌పి, ఆప్‌ పార్టీ విడివిడిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించాయి. వాటితో ఏ పార్టీలు జత కట్టేది చూడాల్సి ఉంది. టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం బిజెపి కూటమికి 38.6శాతం, సమాజవాదికి 34.4, బిఎస్‌పికి 14.1 శాతం ఓట్లు రావచ్చని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు, ఓట్లు, వచ్చే ఎన్నికల్లో అంచనాల పోలిక ఇలా ఉంది.2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి 311, మిత్రపక్షం కాంగ్రెస్‌ 114 చోట్ల పోటీ చేసింది. 2019లో ఎస్‌పి, బిఎస్‌పి ఒక కూటమిగా, కాంగ్రెస్‌ విడిగా పోటీ చేసింది.
పార్టీ××××××× 2017×× శాతం×× 2019××శాతం ×× 2022××శాతం
బిజెపి కూటమి×× 325 ×× 40.78× 64 ××× 51.19×× 230-49×× 38.6
ఎస్‌పి కూటమి×× 48 ××× 21.82× 5 ×××18.11 ××137-152×× 34.4
బిఎస్‌పి×××××× 19 ××× 22.23× 10 ××× 19.43 ×× 9-14 ××× 14.4
కాంగ్రెస్‌ ××××× 7 ××× 6.25 × 1 ××× 6.41 ×× 4-7 ×××× 5
ఈ అంకెలను చూసినపుడు బిజెపి ఓటింగ్‌ 2017-2019 మధ్య పదిశాతంపైగా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో 2017 కంటే తగ్గవచ్చని సర్వేలు చెబుతున్నాయి. సమాజవాది పార్టీ ఓటింగ్‌ 2017, 2019లో పెద్దగా మారలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుతో పోలిస్తే రెట్టింపు కావచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వే లఖింపూర్‌ ఖేరీ కేసులో చార్జిషీటు దాఖలు చేయక ముందు చేసినది. ప్రధాన సవాలు సమాజవాది నుంచే అనే వాతావరణం వచ్చిన తరువాత బిజెపి వ్యతిరేక ఓటర్లు సహజంగానే కొన్ని ఓట్లు ఎస్‌పికే పడతాయి.బిజెపిని ఓడించాలని కోరుకొనే బిఎస్‌పి, కాంగ్రెస్‌ అభిమానులు కూడా ఎస్‌పి వైపే మొగ్గవచ్చు. ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలవచ్చనే వాతావరణం ఉన్నందున బిజెపి తన మత, కుల అజెండాను మరింతగా ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. కరోనా రెండవ తరంగం నివారణలో వైఫల్యం, శవాలను గంగలోకి నెట్టివేసిన నిర్వాకం, లఖింపూర్‌ ఖేరీ ఉదంతం, రైతు ఉద్యమ ప్రతికూలతలన్నింటినీ అధిగమించి రామాలయ నిర్మాణం వంటి అంశాలు తమను గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నమ్ముతోంది.
ఎన్నికల నోటిఫికేషన్‌తో నిమిత్తం లేకుండానే బిజెపి మాదిరి సమాజవాది కూడా జరుపుతున్న సభలకు పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు.తాము అధికారంలోకి వస్తే 300యునిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇస్తామని ఎస్‌పి, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించాయి. రైతులకు ఉచితంగా ఇస్తామని ఎస్‌పి పేర్కొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు రకాల రేట్లు వసూలు చేస్తున్నారు. గ్రామాలలో వంద యూనిట్లకు రు. 3.35, 101నుంచి 150కి రు.3.85, 151 నుంచి 300కు రు.5, ఆ పైన రు. 6 కాగా పట్టణాల్లో 150 వరకు రు.5.50, 151 నుంచి 300 వరకు రు.6, 301 నుంచి 500వరకు రు.6.50, ఆ పైన రు.7 ఉంది.


పార్టీని బూత్‌ స్ధాయివరకు విస్తరించి ఉంటే వచ్చే ఎన్నికల్లో 325కు మించి గెలుస్తామని సిఎం యోగి ఆదిత్యనాధ్‌ చెబుతున్నారు. సోదరి మాయావతి ఎన్నికలంటే భయపడుతున్న కారణంగానే ప్రచారం ప్రారంభించలేదని,చలిని వదిలించుకోవాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యను ఆమె ఖండించారు. ప్రభుత్వ సొమ్ముతో బిజెపి నేతలు జనాన్ని చలికాలంలో కూడా వెచ్చగా ఉంచుతున్నారని తిప్పికొట్టారు. తాము ఇతర పార్టీలను అనుకరించబోమని, తమ శైలి తమకు ఉందన్నారు. ఎన్నికల ముందు అధికారంలో ఉన్న వారు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల పేరు చెప్పి ప్రభుత్వ సొమ్ముతో సభలు పెడతారని, తమ వంటి వారికి సాధ్యం కాదన్నారు.తమను అపహాస్యం చేసినా తమ వైఖరి మారదని, ఇతర పార్టీలు తమ గురించి ఆందోళన చెందాల్సినపని లేదన్నారు.


కులాల సమీకరణలు,మత ధోరణుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉత్తర ప్రదేశ్‌ ఒకటి. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి చేయని పని లేదు. రామ మందిర సమస్యను ముందుకు తెచ్చి గతంలో లబ్ది పొందిన ఆ పార్టీకి ఒక సర్వే అంశాలు ఆందోళన కలిగించక మానవు. కుల, మత ప్రాతిపదికన ఓటు వేస్తున్నామని 24శాతం మంది చెప్పగా వచ్చే ఎన్నికల్లో రామ మందిరం ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెప్పిన వారు ఒక్కశాతమే అని ఇండియా న్యూస్‌ జన్‌కీ బాత్‌ సర్వే పేర్కొన్నది. బిజెపికి వస్తాయని చెబుతున్న ఓట్లలో యాదవేతర బిసి, బ్రాహ్మణ ఓట్లలో ఎక్కువ భాగం ఉంటాయని, ఎస్‌పికి ముస్లింలు, యాదవుల ఓట్లు గణనీయంగా వస్తాయని చెబుతున్నారు.


గో రక్షణ, గొడ్డుమాంసం పేరుతో బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వట్టిపోయిన వాటిని అమ్ముకొనే వీలు లేకపోవటంతో యజమానులు వాటిని వదలి వేయటంతో పంటలను కాపాడుకొనేందుకు రైతులు కాపలాలు కాయాల్సి వస్తోంది.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున చెరకు బకాయిలు పేరుకు పోయాయి. అత్యంత వెనుకబడిన తరగతుల వారిని యాదవులు పైకి రానివ్వటం లేదనే పేరుతో బిజెపి ఇతర వెనుకబడిన తరగతుల వారిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తమకు ఒరిగిందేమీ లేదని యాదవుల బదులు ఠాకూర్ల పెత్తనం కిందికి వచ్చామని వారు ఇప్పుడు భావిస్తున్నారు. మత ప్రాతిపదికన బిజెపి పరివారం జనాన్ని చీల్చితే, రైతు ఉద్యమం ఐక్యం చేసేందుకు బాటలు వేసిందని వార్తలు వచ్చాయి. నామినేషన్లు వేసి, ఎవరెటో తేలిన తరువాత ఎన్నికల తీరు తెన్నులపై మరింత స్పష్టత వస్తుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సాగు చట్టాల పునరుద్దరణకు కొత్త ఎత్తుగడ – ఆందోళన పేరుతో బికెఎస్‌ను దించిన ఆర్‌ఎస్‌ఎస్‌ !

24 Friday Dec 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Bharatiya Kisan Sangh (BKS), BJP, farm laws, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


అనేక మంది ఊహించినట్లుగానే సాగు చట్టాల పునరుద్దరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ తనదైన శైలిలో రంగంలోకి దిగింది. రద్దు చేసిన మూడు సాగు చట్టాలను కొన్ని మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలంటూ దాని అనుబంధ భారతీయ కిసాన్‌ సంఫ్‌ు(బికెఎస్‌) జనవరిలో ఆందోళన చేస్తామని ప్రకటించింది. రద్దు చేసిన చట్టాలు 90శాతం రైతులకు లబ్ది చేకూర్చుతాయని, ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోవాలని కోరుకున్న వారికి సంతోషం కలగటం తప్ప రద్దు తరువాత రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నది. అందువలన కొన్ని మార్పులతో తిరిగి వాటిని ప్రవేశపెట్టాలని కోరుతూ తాము దేశవ్యాపిత ఆందోళన చేస్తామని సంఘ ప్రధాన కార్యదర్శి బదరీ నారాయణ చౌదరి ప్రకటించారు. జై జవాన్‌-జైకిసాన్‌ పిలుపు ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి వర్ధంతి రోజైన జనవరి 11న దేశమంతటా తహసీల్దారు కార్యాలయాల ముందు నిరసన, బహిరంగ సభలు జరుపుతామని వెల్లడించారు. అంతకు ముందు ఒకటవ తేదీ నుంచి పది వరకు గ్రామగ్రామాన రైతులను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సాగు చట్టాల రద్దు కోసం సాగించామని చెబుతున్న ఉద్యమం సాధించిందేమీ లేదని, తొలుత తాము కూడా దానికి మద్దతు ఇచ్చామని తరువాత హింసా కాండ, దేశ. సంఘ వ్యతిరేక చర్యల కారణంగా ఉపసంహరించుకున్నామని చెప్పారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతూ గతంలో 20వేల గ్రామాల నుంచి వినతులు పంపామని, 513 జిల్లాల్లో సెప్టెంబరు ఎనిమిదిన ధర్నాలు చేసినట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


మూడు సాగు చట్టాల్లో మార్పుల్లో భాగంగా కనీస మద్దతు ధరలకు హామీతో సహా కొనుగోలు దార్ల నమోదుకు ఒక పోర్టల్‌, రైతుల ఫిర్యాదుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తూ సవరించాలని కోరుతున్నామన్నారు. తమ సంఘం సన్న, చిన్నకారు రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నదని రద్దైన చట్టాలు 90శాతం మంది రైతులకు మేలు చేసేవన్నారు. వాటి రద్దు తమకు ఆశ్చర్యం, ఆశాభంగం కలిగించిందని,విచ్చిన్నం, హింసను సృష్టించిన వారి మాటలనే ప్రభుత్వం వినటం, తమ వంటి శాంతియుత, ప్రజాస్వామికంగా ఉండే వారు చెప్పేవాటిని పట్టించుకోకపోవటం విచారకరమని చెప్పారు. ప్రస్తుత కనీస మద్దతు ధర విధానం దేశమంతటా రైతులకు తోడ్పడేదిగా లేదన్నారు. ఎంఎస్‌పిగా ఇస్తున్న మొత్తాలు నైపుణ్యం లేని కార్మికులకు సైతం చాలదని గిట్టుబాటు ధర ఇవ్వాలని సంఫ్‌ు జాతీయ కార్యదర్శి కె.శాయిరెడ్డి చెప్పారు.రైతులకు గిట్టుబాటు కావాలంటే సహజ వ్యవసాయ పద్దతులు అనుసరించాలని రసాయన ఎరువుల బదులు ఆవు పేడ వంటి వాటిని వాడాలన్నారు.


బికెఎస్‌ నేతలు గత ఏడాది కాలంగా ఉద్యమించిన రైతుల మీద బిజెపి మోపిన నిందలనే మరోసారి పునశ్చరణ కావించించారు తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. ఆందోళన ప్రారంభమైన నాటి నుంచి బిజెపి, కేంద్ర మంత్రులు చేసిన ఆరోపణలు, నిందలకు తందాన తాను అంటూ వాటినే బికెఎస్‌ వల్లె వేసింది. ఆ సంస్ధ ఇప్పుడు చెబుతున్న అంశాల మీదనే వేరు దుకాణం పెట్టి ఆందోళన చేసి ఉంటే అదొక తీరు. మొక్కుబడిగా ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదు. పోనీ వారు చేసిన పోరాటం లేదా ఆరాటం నిజంగా జరిగి ఉంటే మోడీ సర్కార్‌ సదరు అంశాలకు సానుకూలంగా ఎందుకు మాట్లాడలేదు ? ఎంఎస్‌పికి చట్టబద్దతకు ఇప్పటికీ కేంద్రం ఆమోదం చెప్పకుండా కమిటీ వేసి పరిశీలిస్తామని అంటోంది. కొన్ని మార్పులతో పాత వాటినే పునరుద్దరించాలని బికెఎస్‌ చెప్పటం వెనుక ఉన్న ఎత్తుగడ, ప్రభుత్వ హస్తం గురించి తెలియనంత అమాయకంగా ఇప్పుడు రైతులు లేరు. ఏడాది పాటు ఉద్యమం సాగిన సమయంలో బికెఎస్‌ వ్యవహరించిన తీరు, ప్రభుత్వానికి అనుకూలంగా రైతులను సమీకరించేందుకు చేసిన విఫల యత్నాలు ఎవరికి తెలియనివి. అవన్నీ విఫలం అయిన కారణంగానే తప్పనిసరై మోడీ వెనక్కు తగ్గారు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు బికెఎస్‌ చెబుతున్నవి కొత్త ప్రతిపాదనలేమీ కాదు, ఎంఎస్‌పికి చట్టబద్దత కుదరదంటే కుదరదని ఏడాది పాటు మొండికేసిన మోడీ ఇప్పుడు సానుకూలంగా ఉండేట్లయితే కమిటీ పేరుతో కాలయాపన ఎందుకు ? బికెఎస్‌ను ఏర్పాటు చేసిందే ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నది బహిరంగ రహస్యం. మరణించేంత వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా ఉన్న దత్తోపంత్‌ టేంగిడీ 1979లో దీన్ని ఏర్పాటు చేశారు.

ఢిల్లీ శివార్లలో రైతుల నిరవధిక ఆందోళనకు పోటీగా బిజెపి రైతు సంపర్క యాత్రల పేరుతో తన మద్దతుదార్లను సమీకరించేందుకు అనేక చోట్ల విఫల యత్నం చేసింది. ప్రత్యేకించి కీలకమైన ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్‌లో రైతులను ప్రసన్నం చేసుకొనేందుకు పడని పాట్లు లేవు.డిసెంబరు 23వ తేదీ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌ జన్మదినం సందర్భంగా బిజెపి ఎక్కడలేని శ్రద్ద చూపింది. చరణ్‌ సింగ్‌ కుటుంబ, రాజకీయ వారసులు ఆర్‌ఎల్‌డి పార్టీలో ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఆ పార్టీని గద్దె దించేందుకు సమాజవాది పార్టీతో జతకట్టారు. చరణ్‌ సింగ్‌ జన్మదినాన్ని రైతుదినోత్సవంగా బిజెపి పాటించింది.లఖింపూర్‌ ఖేరీలో కేంద్రమంత్రి అజయ మిశ్రా తనయుడు, అనుచరులు చేసిన దుర్మార్గంతో అవన్నీ కొట్టుకపోయాయి. బిజెపి నేతలు గ్రామాలకు వెళ్లలేని స్ధితి కొన్ని చోట్ల ఏర్పడింది. దాని సెగ ఎంతగా ఉందంటే ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎన్నికైన బిజెపి ఎంపీలతో జరిపిన సమావేశానికి అజయ మిశ్రాను దూరంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బికెఎస్‌ను రంగంలోకి దించారు.


లఖింపూర్‌ ఖేరీలో పధకం ప్రకారమే రైతుల మీదకు మోటారు వాహనాలను నడిపి హత్యచేసినట్లు విధిలేని పరిస్ధితిలో దర్యాప్తు సంస్ధ కూడా నివేదిక ఇచ్చింది. ఆ ఉదంతం గురించి బికెఎస్‌ నేతలు చెప్పిందేమిటి ? తమ మీదకు వాహనాలు నడిపి తోటి వారిని చంపి దొరికిన హంతకులను రైతులు రాచమర్యాదలలో సాగనంపుతారా ? వారు రైతులు కాదు, హత్యలే రోజువారీ పనిగా ఉన్న వారని, వామపక్ష పద్దతుల్లో చేశారని, గుమికూడిన వారు రాజకీయ పార్టీల మద్దతుదారులు తప్ప రైతులు కాదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని నిందిస్తూనేే జరిగిన సంఘటనలు దురదృష్టకరం అని సన్నాయి నొక్కులు నొక్కింది. పధకం ప్రకారం జరిపిన హత్యాకాండను ఘర్షణలు అని వర్ణించింది. రైతుల మీదకు కార్లను తోలి చంపిన బిజెపి మద్దతుదారులు అమాయకులన్నట్లు, రైతులు హంతకులైనట్లు చిత్రించటం రైతు సంఘం పేరుతో ఊరేగుతున్నవారికి తగినపనేనా ? ఇంతగా నిందించిన వారు చట్టాలను పునరుద్దరించాలని రోడ్లెక్కుతామనటంలో ఆశ్చర్యం ఏముంది ! బిజెపికి కార్పొరేట్లు అందచేస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులతో రైతుల ముసుగులో తన మద్దతుదార్లను సమీకరించి కృత్రిమ ఆందోళనలు చేయించినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మద్దతు ధర చట్టబద్దతకు మోడీ మొరాయింపు వెనుక అసలు కథేంటి !

11 Saturday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Agricultural Produces, Farmers Delhi agitation, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, WTO-Agriculture, WTO-India


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలు, అవగాహన మేరకు మన దేశంలో 23 పంటలకు అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలు ఆహార భద్రతా చర్యల్లో భాగం. దానిలో భాగమే సేకరణ, పంపిణీ నిర్వహణ. ఈ విధానం మేరకు వర్దమాన దేశాలకు అనుమతించిన పరిమితులకంటే ఎక్కువగా మన దేశం సబ్సిడీ ఇస్తున్నదని డబ్ల్యుటిఓలో మన మిత్ర, సహజ భాగస్వామి అని చంకలు కొట్టుకుంటున్న అమెరికా, కెనడా కేసు దాఖలు చేశాయి. మన మీద ఐక్యంగా దాడి చేస్తున్న ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటమే కాదు, కేసులు కూడా దాఖలు చేస్తున్నాయి. మన మీదే కాదు చైనా మీద కూడా అమెరికా అలాంటి కేసునే దాఖలు చేసింది. పరిమితికి మించి చైనా రైతులకు సబ్సిడీలు ఇస్తున్నదని డబ్ల్యుటిఓ 2019 మార్చినెలలో తీర్పు చెప్పింది. దాని మీద చైనా వినతి మేరకు ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నారు. దానిలో తృతీయ పక్షంగా మన దేశం మరికొన్ని దేశాలు చేరాయి. అది ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పరిష్కారం అవుతుందో చెప్పలేము.ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) ఇది ప్రపంచ వ్యవసాయదారుల సంస్ధ కాదు. పారిశ్రామిక, సేవ, వ్యవసాయ రంగాలన్నిటినీ వాణిజ్యంగా పరిగణించి ఆ దృక్పధంతోనే వాటి విధిని నిర్ణయిస్తోంది. అందువలన దానికి యజమానులు తప్ప ఆ రంగాల్లో పనిచేసే వారి గురించి పెద్దగా పట్టదని వేరే చెప్పనవసరం లేదు.


అమెరికా లేవనెత్తిన అంశాలు మనకూ ఆసక్తి-ఆందోళన కలిగించేవే. బరాక్‌ ఒబామా హయాంలో ఈ కేసు దాఖలైంది. చైనా ఇస్తున్న సబ్సిడీల కారణంగా తమ మొక్కజొన్న, గోధుమ, వరి రైతులు నష్టపోతున్నారని, ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేరిన సమయంలో అంగీకరించిన మొత్తాలకంటే ఎక్కువ మొత్తాలు ఇస్తున్నట్లు ఆరోపణ. ఈ కారణంగా చైనాలో అధికంగా ఉత్పత్తి చేస్తున్నారని, ఫలితంగా ప్రపంచ స్ధాయి నాణ్యత కలిగిన ఉత్పత్తులను తమ రైతులు చైనాకు ఎగుమతి చేయలేకపోతున్నారని, ఇది వాణిజ్య నిబంధనలకు విరుద్దమని ఫిర్యాదు చేసింది. ఒక బుషెల్‌ (25.4కిలోలు) గోధుమలకు మద్దతు ధరగా పది డాలర్లను(మన కరెన్సీలో రు.750,మన ప్రభుత్వం 2021-22కు ప్రకటించింది క్వింటాలుకు రు.2015) చైనా మద్దతు ఇస్తోందని, ఇది ప్రపంచ ధరల కంటే చాలా ఎక్కువన్నది అమెరికా ఆరోపణ. మన దేశంలో వరి, గోధుమలకు గరిష్టపరిమితిగా ఉన్న పదిశాతానికి మించి 60,70శాతం వరకు మద్దతు ధరల రూపంలో సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా చిత్రిస్తున్నది.


ఆయా దేశాలకు ఇచ్చిన సబ్సిడీలను పరిమిత వ్యవధిలోపల ఎత్తివేయకపోతే కేసులో గెలిచిన దేశాలు ప్రతికూల పన్నులు విధించవచ్చునని డబ్ల్యుటిఓ నిబంధనలు చెబుతున్నాయి. పంటల విలువలో 8.5శాతానికి మించకుండానే తమ సబ్సిడీలు ఉంటాయని అంగీకరించిన చైనా అంతకు మించి అదనంగా వంద బిలియన్‌ డాలర్లు ఇచ్చిందన్నదే వివాదం. నిబంధనల మేరకు వర్ధమాన దేశాలు పదిశాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు. చైనా అధిక ఉత్పత్తి మరియు రక్షణ చర్యలు దీర్ఘకాలం కొనసాగుతున్న కారణంగా అమెరికా రైతులు దెబ్బతింటున్నారు. చైనా సబ్సిడీల కారణంగా ఏడాదికి 70కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నారని అమెరికా గోధుమ ఎగుమతిదారు విన్స్‌ పీటర్సన్‌ ఆరోపించాడు. గోధుమలు, వరికి కనీస మద్దతు ధర ఉన్నకారణంగానే రైతులు వాటివైపు మొగ్గుచూపుతున్నారని వాదించేవారి గురించి తెలిసిందే. ఆ మద్దతు ధర గురించి అదే అమెరికా మన మీద కూడా దాడి చేస్తోంది.
అమెరికా, ఇతర ధనిక దేశాల దాడులు, వత్తిడి నుంచి తప్పుకొనేందుకు రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎగుమతి చేసుకోవచ్చు అంటూ కొత్త పల్లవి అందుకొని మోడీ సర్కార్‌ హడావుడిగా మూడు సాగు చట్టాలను తెచ్చిన అంశం తెలిసిందే. చైనా ఇస్తున్న మద్దతు ధర చెల్లదని ప్రపంచ వాణిజ్య సంస్ధ ఇచ్చిన తీర్పు తమకు మంచి అవకాశమని అమెరికా రైస్‌ అనే వ్యాపార సంస్ధ చైర్మన్‌ చార్లీ మాథ్యూస్‌ చెప్పాడు. ఏ ఏడాదైనా తమ పంటలో సగాన్ని ఎగుమతి చేస్తామని ఇతర దేశాలు కూడా అదనంగా ఇస్తున్న మద్దతు ధరను తగ్గిస్తే అంతర్జాతీయంగా మంచి అవకాశాలు వస్తాయని అన్నాడు. దీని అర్ధం ఏమిటి ? భారత్‌, చైనా వంటి దేశాల రైతులకు ధర గిట్టుబాటుగాక సాగుమానేస్తే తమ పంటలను మనవంటి దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.


అమెరికా, కెనడా మన మీద ప్రధానంగా పప్పుధాన్యాలకు మద్దతు ఇవ్వటాన్ని సవాలు చేశాయి.2018-19 సంవత్సరానికి ప్రకటించిన మద్దతు ధరలు అనుమతించినదానికంటే 26రెట్లు అదనంగా ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాయి. పప్పుధాన్యాల విలువను మన దేశం రు.2,677 కోట్లుగా లెక్కిస్తే అమెరికా, కెనడా దాన్ని రు.69,923 కోట్లుగా చూపాయి. ఎందుకీ తేడా వచ్చింది ? మద్దతు ధర పధకం కింద కేంద్రం లేదా రాష్ట్రాలు సేకరిస్తున్న పరిమాణానికే మనం విలువ కడుతుండగా, అమెరికా, కెనడాలు మొత్తం ఉత్పత్తిని తీసుకొని దాని మీద చూపుతున్నాయి. మరొకటేమంటే మన దేశం విలువను డాలర్లలో లెక్కిస్తుండగా మన మీద ఫిర్యాదు చేసిన దేశాలు రూపాయల్లో లెక్కించాయి. అమెరికన్లు చైనా మీద మొక్కజొన్న, గోధుమ, వరి మీద ఫిర్యాదు చేయగా మన మీద పప్పుధాన్యాల మీద వేయటానికి కారణం వాటిని ప్రత్యేకించి బఠానీలను మనకు ఎగుమతి చేయాలని చూస్తున్నాయి. తరువాత మిగతావాటి మీదా వేస్తాయి. చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఈ రోజు మనల్ని కౌగిలించుకుంటున్న దేశాలన్నీ ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా మన మీద ఫిర్యాదు చేసినవే. చెరకు రైతులకు రాష్ట్రాలు ప్రకటించే సూచిక ధరలను రైతులకు ఇస్తున్న సబ్సిడీలుగా చూపుతూ ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. సౌరపలకలు, గోధుమలు, వరి, పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా, ఉక్కు ఉత్పత్తులపై జపాన్‌ అదేపని చేశాయి.


ఇతర దేశాల మీద విరుచుకుపడుతున్న అమెరికా తాను చేస్తున్నదేమిటి ? డబ్ల్యుటిఓలో వ్యవసాయంపై కుదిరిన ఒప్పందం మేరకు ధనిక దేశాలు తమ సబ్సిడీలను ఐదుశాతానికి, మిగతాదేశాలు పదిశాతానికి పరిమితం చేయాలి. అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే నిబంధనలను ఉల్లంఘించే మార్గాలను వెతికారు. సబ్సిడీల్లో మూడు రకాలు. ఒకటి గ్రీన్‌ బాక్స్‌, రెండు అంబర్‌బాక్స్‌, మూడవది బ్లూబాక్స్‌. గ్రీన్‌ బాక్సు తరగతి సబ్సిడీలు వ్యాపారాన్ని వికృతీకరించకూడదు, లేదా పరిమితంగా ఉండాలి. అవి ప్రభుత్వం ఇచ్చేవిగా, మద్దతు ధర ప్రమేయం లేనివిగా ఉండాలి.పర్యావరణాన్ని, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉంటే వాటికి ఎలాంటి పరిమితులు లేవు. గ్రీన్‌, బ్లూబాక్స్‌ సబ్సిడీలు కానివన్నీ అంబర్‌బాక్సు తరగతిలోకి వస్తాయి. ఉత్పత్తి పరిమాణంతో నేరుగా సంబంధం ఉండే సబ్సిడీలు లేదా మద్దతు ధరల వంటివి దీనిలో ఉన్నాయి. బ్లూబాక్స్‌ అంటే షరతులతో కూడిన అంబర్‌ బాక్సు సబ్సిడీలు, వికృతీకరణను తగ్గించేవిగా ఉండాలి. అంటే రైతులు ఉత్పత్తిని పరిమితం చేసేవిగా ఉండాలి.ప్రస్తుతం ఈ సబ్సిడీలకు కూడా ఎలాంటి పరిమితులు లేవు.


మన మద్దతు ధరలపై వేసిన కేసు విచారణ, తీర్పు వచ్చే వరకు వ్యవధి పట్టవచ్చు. చైనా మాదిరి మనకూ వ్యతిరేకంగా తీర్పు రావచ్చు. ఈ లోగా కేసు వేసిన దేశాలతో మనదేశం సంప్రదింపుల ప్రక్రియ ఉంటుంది. ఈలోగా మన దేశం కూడా కొన్ని మార్పులు చేయవచ్చు. చైనా వివాదం రెండున్నర సంవత్సరాలు పట్టింది. మరికొన్ని దేశాలు కూడా మన మీద కేసులో చేరవచ్చు. మన దేశం ఇస్తున్న మద్దతు ధరలను ఆహార భద్రతా చర్యల్లో భాగంగా చూపుతున్నాము గనుక అవి గ్రీన్‌ బాక్సు తరగతిలోకి వస్తాయని మన నిపుణులు భావిస్తున్నారు. గోధుమల మద్దతు ధరల వివాదంలో చైనాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తరువాత 2019లో నరేంద్రమోడీ రెండవ సారి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. బహుశా ఈ తీర్పు నేపధ్యంలో మద్దతు ధరలకు మంగళం పాడే ఉద్దేశ్యంతో లేదా మార్పులు చేశామని చూపేందుకు, సబ్సిడీ మొత్తాలకు కోత పెట్టేందుకు నేరుగా నగదు అందచేసే పేరిట ఏటా ఆరువేల రూపాయల సాగు లేదా ఆదాయ మద్దతు పేరుతో కిసాన్‌ సమ్మాన్‌ పధకాన్ని ప్రకటించారనుకోవాలి. ఇది ప్రపంచ బాంకు ఆదేశాల్లో భాగమే. తెలంగాణాలో, దేశంలో ధాన్య ఉత్పత్తి పెరిగిందనే వాదనలు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనే పల్లవి, పాట అందుకున్నారు.ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం అంటే కొనాలని మేము అడగం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవటం, వరి సాగు వద్దని, ఇతర పంటలు వేసుకోవాలని చెప్పటాన్ని చూస్తుంటే వీటన్నింటికీ సంబంధం లేదని ఎవరైనా చెప్పగలరా ? చైనా సర్కార్‌ ఇస్తున్న మద్దతు ధరల కారణంగానే అక్కడ ఉత్పత్తి పెరిగిందని, అది తమ ఎగుమతులను దెబ్బతీసిందని అమెరికా చేసిన వాదన మనకూ, మనలాంటి ఇతర దేశాలకూ వర్తించదా ?


విడదీసి పాలించాలనే బ్రిటీష్‌ వారి ఎత్తుగడను అమెరికా అమలు చేస్తోంది. దానిలో భాగంగానే మనకూ-చైనాకు మరోసారి తగదా పెట్టటంలో జయప్రదమైంది. రైతులకు మద్దతు ఇచ్చే అంశంలో మనమూ-చైనా కూడా ప్రపంచవాణిజ్య సంస్ధలో ఒకే వాదనను ఐక్యంగా ముందుకు తెస్తున్నాము. సవాలు చేసేందుకు వీలు లేని గ్రీను బాక్సు సబ్సిడీల పేరుతో అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు అమలు చేస్తున్న అంబర్‌ బాక్సు సబ్సిడీల సంగతేమిటని నిలదీస్తున్నాయి. అవి మన దేశంలో అమలు చేస్తున్న మద్దతు ధరలతో పోలిస్తే చాలా ఎక్కువ. గోధుమ రైతులకు చైనా ఇస్తున్న మద్దతు ధరలతో అంతర్జాతీయంగా ధరలు తగ్గి తమకు నష్టం వస్తోందని వాదించిన అమెరికా చేసిందేమిటి ? అమెరికా సర్కార్‌ పత్తి రైతులకు ఇస్తున్న మద్దతు ప్రపంచ మార్కెట్‌ను వక్రీకరిస్తోందంటూ 2002లో బ్రెజిల్‌ సవాలు చేసింది.1995-2002 మధ్య పత్తి ధరలు గణనీయంగా పడిపోవటానికి, అదే కాలంలో అమెరికా పత్తి ఎగుమతులు రెట్టింపు కావటానికి సబ్సిడీలే కారణమని ప్రపంచ వాణిజ్య సంస్ధ విచారణలో నిర్ధారణైంది. పశ్చిమ ఆఫ్రికాలోని పేద దేశాల పత్తి రైతులు నష్టపోయినట్లు కూడా తెలిపింది. మార్కెట్‌ సహాయ రుణాలు, మార్కెట్‌ నష్టాన్ని పూడ్చే పేరుతో అమెరికా రాయితీలు ఇచ్చింది.


ఈ తీర్పు తరువాత అమెరికా రాజీకి వచ్చి బ్రెజిల్‌ పత్తి రంగ సామర్ధ్యం పెరుగుదలకు తన ఖర్చుతో శిక్షణ ఇస్తామని ప్రకటించింది. దీనికి తోడు 2014 అమెరికా వ్యవసాయ బిల్లులో కొన్ని మార్పులు చేయటంతో బ్రెజిల్‌ మౌనం దాల్చింది. అయితే అమెరికా ఆ బిల్లును 2019లో సవరించి పది సంవత్సరాలలో వివిధ రూపాలలో 867బిలియన్‌ డాలర్ల మేరకు రైతుల పేరుతో రాయితీలు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో ఉన్న అనూహ్య అంశం ఏమిటో తెలుసా ! పొలంలో పని చేయకపోయినా రైతు మేనళ్లు, మేన కోడళ్లు,ఇతర బంధువులు కూడా రైతుల పేరుతో సబ్సిడీలను పొందవచ్చు. ధనిక దేశాల ఉత్పత్తులకు మనమూ, చైనా వంటి దేశాలు మార్కెట్లను తెరిచి దిగుమతులు చేసుకుంటే ఎలాంటి కేసులూ ఉండవు. మనం దిగుమతులకు అనుమతిస్తే పారిశ్రామిక రంగం విదేశీ సరకులతో కుదేలైనట్లే వ్యవసాయం కూడా మరింత సంక్షోభానికి లోనవుతుంది.


ప్రపంచ వాణిజ్య సంస్ధలో తొలిసారిగా బాలీ సంధికాల నిబంధనను గతేడాది, ఈ ఏడాది ఉపయోగించుకున్న దేశం మనదే. వరికి ఇస్తున్న రాయితీ పదిశాతం దాటటమే దీనికి కారణం.2019-20లో బియ్యం ఉత్పత్తి విలువ 46.07బిలియన్‌ డాలర్లు కాగా ఇచ్చిన రాయితీ 6.31బి.డాలర్లని ఇది 13.7శాతానికి సమానమని మన దేశం డబ్ల్యుటిఓకు తెలిపింది. అయినప్పటికీ ఇది సమర్దనీయమే అంటూ సంధికాల నిబంధనను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఎఫ్‌సిఐ ద్వారా సేకరణను కొనసాగించవచ్చు. రాయితీలు తమ అంతర్గత ఆహార భద్రత కోసం ఇచ్చినవి గనుక వాణిజ్య వికృతీకరణ జరగలేదు. ప్రభుత్వం సేకరించిన నిల్వల నుంచి విదేశాలకు వాణిజ్యపరమైన ఎగుమతులు జరపలేదు. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం విక్రయిస్తున్న వాటిని కొనుగోలు చేసిన వారు ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేయకూడదనే షరతు ఉన్నందున ఎవరికీ నష్టం జరగలేదు, అందువలన భారత్‌పై చర్యలు తీసుకోకూడదన్నది మన వాదన. దీన్ని సమర్ధించుకొనేందుకే కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత బియ్యాన్ని ఆహార భద్రత పధకం కింద చూపారు. వాటి సరఫరాను విరమించినట్లు ప్రకటించిన కేంద్రం తిరిగి కొంత కాలం కొనసాగించనున్నట్లు ప్రకటించిన అంశం తెలిసిందే. ఈ కారణాలను ఎవరూ సవాలు చేసేందుకు వీలులేదు. ఈ నిబంధన ఒక్క బియ్యానికే కాదు, ఇతర పంటలకూ వర్తిస్తుంది.


మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే సంభవించే పర్యవ సానాల గురించి ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం తలచుకుంటే దాన్ని సాధించటం అసాధ్యం కాదు. ఇప్పటికే చెరకు పంటకు ఒక చట్టబద్దత ఉంది. ప్రభుత్వం సూచించిన ధరకంటే తక్కువకు కొనుగోలు చేసేందుకు మిల్లులకు అవకాశం లేదు. ఆ ధర ఎక్కువా తక్కువా, రికవరి లెక్కల్లో మోసాలు వేరే అంశం. పేరుకు ఇరవై మూడు పంటలైనా ఆచరణలో అన్నింటినీ ప్రభుత్వం సేకరించే అవసరం రావటం లేదు, నిర్ణీత ధరలకంటే ఎక్కువ లేదా వాటికి దరిదాపుల్లో ఉన్నందున రైతులు ప్రభుత్వం మీద ఆధారపడటం లేదు. గతేడాది బియ్యం ఉత్పత్తిలో 49శాతం, గోధుమలను 40శాతమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉత్పత్తి పెరిగితే ఇంకాస్త పెరుగుతుంది తప్ప అసాధారణంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో పత్తి సేకరణ అవసరమే ఉండటం లేదు. మద్దతు ధరలు ప్రకటిస్తున్న 23 పంటల మొత్తం విలువ పన్నెండులక్షల కోట్ల రూపాయలని (2020-21) అంచనా. కుటుంబ అవసరాలకు, పశుదాణాకు పోను మార్కెట్‌కు వస్తున్నదానిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదాని విలువ రు.నాలుగులక్షల కోట్లు. మరొక ఐదులక్షల కోట్ల మేరకు బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. కోట్లాది మంది రైతులు, కూలీలతో, ఇతరంగా ఆధారపడే వారికి సంబంధించిన దీనికి హామీ ఇవ్వటానికి ప్రభుత్వానికి సత్తా, అవకాశాలు లేవా ?


ఒక అంచనా ప్రకారం మన దేశంలో ఏటా ప్రతి రైతుకూ సగటున 260డాలర్ల మేర సబ్సిడీలు ఇస్తున్నారు. అదే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 100రెట్లు ఎక్కువ. మరొక అంచనా ప్రకారం భారత్‌లో 200 డాలర్లు ఇస్తుంటే అమెరికాలో 50వేల డాలర్లు ఇస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం చట్టవిరుద్దం. మన కార్పొరేట్‌ మేథావులు ఈ వాదనను భుజానవేసుకొని దాన్నే వల్లిస్తున్నారు.నిజానికి మనకు ఆ హక్కు నిబంధనలకు లోబడే ఉంటుందన్నది మరొక అభిప్రాయం. మరి నరేంద్రమోడీ సర్కార్‌ ఏదో ఒక వాదనను తన వైఖరిగా తీసుకుంటే అదొక తీరు. రైతు ఉద్యమం సాగిన ఏడాది కాలంలో చెప్పిందేమిటి ? గతంలో చట్టబద్దత లేదు కదా, కొనసాగిస్తామని రాతపూర్వకంగా ఇస్తామంటున్నాం కదా, ఏటా ధరలను సవరిస్తూనే ఉన్నాం అని అటూ ఇటూ తిప్పటం తప్ప చట్టబద్దత కుదురుతుందో లేదో కుదరకపోతే కారణాలేమిటో చెప్పకుండా నాటకం ఎందుకు ఆడినట్లు , ఇప్పుడు ఒక కమిటీ వేస్తామని ఎందుకు చెప్పినట్లు ? అసలు సంగతేమంటే అన్ని రంగాలనుంచి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొంటున్న మాదిరే వ్యవసాయాన్ని కూడా ప్రయివేటు రంగానికి అప్పగించాలనే తాపత్రయమే. అందుకే రైతు ఉద్యమంలో ఐక్యత కీలకమైన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కారణంగా మోడీ సర్కార్‌ క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గింది తప్ప మారుమనసు కలిగి కాదన్నది స్పష్టం. అందుకే కనీస మద్దతు ధరల చట్టబద్దతపై కమిటీ వేసినా దానికి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. అందుకే రైతుల ఆందోళన అంతం కాదు, మరో ఆరంభానికి విరామమే అని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత వ్యవసాయ రంగం – నరేంద్రమోడీ : ఇంతకాలం రైతు ఉద్యమం – ఇక కార్పొరేట్ల వత్తిడి ప్రారంభం !

09 Thursday Dec 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

agriculture in india, Farmers agitations, Minimum Support Prices, MSP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఏడాదికి పైగా సాగిన మహత్తర రైతు ఉద్యమం మూడు సాగు చట్టాల రద్దుతో ఘన విజయం సాధించింది. సింహం లాంటి నరేంద్రమోడీ ఎత్తుగడగా ఒక అడుగు వెనక్కు తగ్గారు తప్ప తగు సమయంలో తిరిగి అదే అజండాతో ముందుకు వస్తారని మోడీ అభిమానులు వెంటనే స్పందించటాన్ని చూశాము. వారికి రైతు ఉద్యమం మీద ఉన్న అవగాహన కంటే నరేంద్రమోడీ మీద పెంచుకున్న విశ్వాసం బలంగా ఉందన్నది స్పష్టం. రైతుల పోరాటం ముందుకు తెచ్చిన ఇతర ప్రధాన అంశాలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. కొన్నింటిపై ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీల మేరకు ఉద్యమ విరమణ ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి చర్చ, అవసరమైతే తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు జనవరి 15న సమావేశం జరపనున్నట్లుసంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతలు ప్రకటించారు. సమస్యల తీవ్రత, సంక్లిష్టత, అనుమానాల దృష్ట్యా 378 రోజుల పోరులో ఒక విరామంగానే దీన్ని చెప్పవచ్చు.


కనీస మద్దతు ధరల చట్టం గురించి ఒక కమిటీని వేస్తామని, దానిలో రైతు సంఘాల ప్రతినిధులు ఉంటారని కూడా చెప్పారు. ఆ కమిటీని వేస్తారు, వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోపు దాని నివేదిక వచ్చే అవకాశాలు లేవు. ఎన్నికల పబ్బం గడచిన తరువాత ఏం జరుగుతుందో చెప్పలేము.ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. కొన్ని అంశాలను చూద్దాం. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి టి.నందకుమార్‌ డిసెంబరు 8వ తేదీన రాసిన విశ్లేషణాభిప్రాయంలో వెంటనే ఎంఎస్‌పి డిమాండ్‌ను భరించగలిగే స్ధితి దేశానికి లేదని, అరాజకత్వం, దీర్ఘకాలిక నష్టం జరుగుతుందంటూ గుండెలు బాదుకున్నారు. ఇదేమీ అనూహ్యమైంది కాదు, ఇలాంటి వారు సాగు చట్టాలకు ముందు-తరువాత చర్చలో – రద్దు తరువాత కూడా ఇదే వైఖరిని వెల్లడించారు. వీరంతా స్వదేశీ-విదేశీ కార్పొరేట్‌ లాబీకి చెందిన పెద్దమనుషులు. రైతులను విభజించే వాదనలను కూడా నందకుమార్‌ ముందుకు తెచ్చారు. మిగులు పంటను అమ్ముకొనే తరగతి రైతులు ఎవరు ? ఏ ప్రాంతాల్లో సేకరణకు అవసరమైన సదుపాయాలున్నాయి ? వర్షాధారిత రైతులకు పెట్టుబడి సబ్సిడీలు అందకపోతే, సేకరణ వ్యవస్తలు అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుంది ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే ఆ మేరకు జరుగుతోందా లేదా అని ప్రతిలావాదేవీని తనిఖీ సిబ్బంది చూడాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన వారిని శిక్షించాలి.అప్పుడు వ్యాపారులెవరూ మార్కెట్లో ఉండరు, ప్రభుత్వ విక్రయాల కోసం ఎదురు చూస్తారు. అప్పుడు ప్రభుత్వం ఏకైక వ్యాపారి అవుతుంది.అది విపత్తుకు దారి తీస్తుంది. ప్రస్తుత డిమాండ్‌ను చూస్తే విశ్వాస ప్రాతిపదిక వ్యవస్ధ బదులు హక్కుల వ్యవస్ధను కోరుతున్నారు. అదే జరిగితే పంజాబ్‌ మరికొన్ని రాష్ట్రాలకు పరిమితమైన దానిని దేశమంతటా విస్తరించాల్సి ఉంటుంది. ఆహారభద్రత హక్కు మాదిరి రైతులకు సేకరణ హక్కు లభిస్తుంది. అదే జరిగితే అదొక సేకరణ పధకం లేదా మద్దతు ధరకంటే తక్కువకు అమ్ముకుంటే ఆ తేడాను చెల్లించేది లేదా రెండూ అమలు జరపాల్సి రావచ్చు. అప్పుడేం జరుగుతుంది అని నందకుమార్‌ ప్రశ్నించారు.


మిగులు పంటను అమ్ముకొనే వారా లేకా స్వంత అవసరాల కోసం పండించుకొనే వారా అన్నది అసంబద్ద వాదన. అసలు ఎవరికీ సాగు గిట్టుబాటు కావటం లేదన్నది అసలు సమస్య. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా 116 దేశాల్లో ఆకలిలో 101వ స్ధానంలో ఉన్నామనే అంశం ఇలాంటి వాదనలు చేసే వారికి తెలుసా ? ఎవరి అవసరాలకు సరిపడా వారు పండించుకుంటే మిగులు లేకుండా ఆకలిని తీర్చేదెవరు ? అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలని-అక్కడి కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలని చెబుతున్నారా ? వర్షాధారిత ప్రాంతాల రైతులను ఆదుకొనేందుకు అవసరమైన పధకాలను అమలు జరిపితే సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు మరొకరెవరైనా అడ్డుకున్నారా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు ధరలను నిర్ణయించే అవకాశం, హక్కు పారిశ్రామిక, వాణిజ్యసంస్ధలకు ఉన్నపుడు రైతులకు అలాంటి అలాంటి హక్కు ఎందుకు కలిగించకూడదు ? ప్రతి రైతుకు అలాంటి అవకాశం లేదు కనుక వారి తరఫున ఆ పని ప్రభుత్వమే చేయాలి. ఇన్నేండ్లుగా విశ్వాసాన్ని వమ్ము చేశారు కనుకనే రైతులు హక్కుల విధానాన్ని కోరుతున్నారు. పెట్టుబడులు రావాలంటే పారిశ్రామిక, వాణిజ్య సంస్దలకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయి, ఇష్టం వచ్చినపుడు కార్మికులను నియమించుకొనే, తీసివేసే స్వేచ్చ ఇవ్వాలన్న వత్తిడికి లొంగి ఆ చట్టాలకు ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే వ్యాపారులు మార్కెట్‌ నుంచి తప్పుకుంటారని చెప్పటం బెదిరింపు తప్ప మరొకటి కాదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధరలకంటే తక్కువ వెలకు వినియోగదారులకు అమ్మాలనే నిబంధనలేమీ లేనపుడు వారికి వచ్చే నష్టం ఏమిటి ?


నందకుమార్‌ ముందుకు తెచ్చిన మరికొన్ని వాదనలేమిటి ? ఇరవై మూడు పంటలకు ఇప్పటికే ఉన్న ఎంఎస్‌పికి చట్టబద్దమైన హామీ కల్పించాలని అడుగుతున్నారు. ఇతర రైతుల గురించి ఎలాంటి నిర్దిష్టత లేదు. అందువలన వారు కూడా ఎంఎస్‌పిని అడగరని ఏముంది ? (నిర్ధిష్టత లేకపోతే ప్రభుత్వం ఆ పని చేస్తే వద్దన్నదెవరు ? ఇతర పంటలకూ ఎంఎస్‌పి అడిగితే ఇవ్వాలి. సాగు చేయాలా వద్దా ? ఇతర పంటలు అవసరం లేదా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు అలాంటి పరిమితులేమీ లేవుగా !) ప్రస్తుతం ఎంఎస్‌పి పరిధిలో ఉన్న 23 పంటల విలువ ఏడులక్షల కోట్ల రూపాయలు.చట్టబద్దత కల్పిస్తే అదనపు ఖర్చు రు.47,764(2017-18 సమాచారం) అవుతుందని కిరన్‌ విస్సా, యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. వీరు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.వాటిలో ఆహార సబ్సిడీ రు.2,40,000 కోట్లున్నాయి.(ఇంత సబ్సిడీ ఇచ్చిన తరువాత కూడా దేశం ఆకలి సూచికలో 116 దేశాల్లో 101వదిగా దిగజారిన స్ధితిలో ఉంది, ఈ సబ్సిడిని తగ్గిస్తే మరింతగా అన్నార్తులు పెరగరా ?) అందులో ఎక్కువ భాగం వినియోగదారులకే చెందుతోంది. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సేకరణ విధానాన్ని, ఆహార సబ్సిడీ కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఎంఎస్‌పి పెరిగినపుడు సబ్సిడీ కూడా పెరుగుతుంది, జారీ ధరలు స్ధిరంగా ఉంటాయి.దీనికి ప్రతి ఏటా 50వేల కోట్లను జత చేస్తే మూడులక్షల కోట్లవుతాయి. గోధుమ, బియ్యం కాకుండా చిరు,పప్పు ధాన్యాలు, ఖాద్యతైలాలను కూడా సేకరించి బహిరంగ మార్కెట్‌ వేదికలద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తారు.కనీస మద్దతు ధరలలో 40-45శాతం మేరకు నష్టం రావచ్చు.కనుక ఏ సేకరణ చేపట్టినా విలువలో సబ్సిడీ భారం 30శాతానికి తగ్గదు.

ఎంఎస్‌పికి హామీ ఇస్తే పరిమితంగా కొనుగోలు చేయాలి.పౌరపంపిణీ వ్యవస్ధతో సేకరణకు ఉన్న లంకె, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మితే కష్టం, ఎంతో ఖర్చవుతుంది కనుక వాటి లంకెను విడగొట్టాల్సిన తరుణం వచ్చింది.కనీస మద్దతు ధరలేని పంటలను సాగు చేసేందుకు రైతులను ఒప్పించాలి, లేకపోతే వారు ఇతరులు కూడా ఎంఎస్‌పి పంటలను సాగు చేస్తారు. కొత్త సమస్యలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు పిఎం కిసాన్‌, ఎరువులు, ఇతర సబ్సిడీలతో పాటు ఆహార సబ్సిడీని రు.2,40,000 కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచగలదా ?(వీటిని నష్టాలుగా పరిగణించి గుండెలుబాదుకుంటున్నవారు, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఇస్తున్న ఇతర అనేక రాయితీల గురించి ఏమి చెబుతారు ? వారి సంపదలను పెంచితే జనానికి వచ్చేదేమిటి ? తిండి కలిగితే కండకలదోయి-కండకలవాడేను మనిషోయి అన్న గురజాడను మరిస్తే ఎలా ? కార్మికులు ఆరోగ్యంగా ఉంటే అది వారికే కాదు దేశానికీ లాభమే.) తాజా దారిద్య్రసమాచారం ప్రకారం ఆహార భద్రత వర్తింపును నలభైశాతానికి కుదించటం, చౌకదుకాణాల ద్వారా విక్రయించే వాటి ధరలను పెంచగలదా ? రైతుల ఆదాయాన్ని పెంచే ప్రాధమిక బాధ్యను తీసుకొనే విధంగా రాష్ట్రాలకు ప్రమేయం కల్పించాల్సిన అవసరం లేదా ?( రాష్ట్రాలను సంప్రదించుకుండా సాగు చట్టాలను మార్చినపుడు నందకుమార్‌ లాంటి వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆ చర్చను ఎందుకు ముందుకు తెస్తున్నారు? )


నందకుమార్‌ లేదా జయప్రకాష్‌ నారాయణ లాంటి వారు చేస్తున్న వాదనలు ప్రపంచ వాణిజ్య సంస్ధకు అనుగుణ్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు. కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా తదితర దేశాలు వేసిన కేసులు, వాదనల తీరు తెన్నుల గురించి మరో విశ్లేషణలో చూద్దాం. వాటికి అనుగుణ్యంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలను సంతుష్టీకరించేందుకు, వాటి కార్పొరేట్లకు ద్వారాలు తెరిచేందుకు సంస్కరణలు-రైతుల పేరుతో హడావుడిగా నరేంద్రమోడీ సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కనీస మద్దతు ధరల మీద కమిటీ వేయగానే ఏదో జరిగిపోతుందనే భ్రమలకు లోను కానవసరం లేదు. ఆందోళనకు నాయకత్వం వహించిన ఎస్‌కెఎం ప్రతిపాదించిన వారిని మాత్రమే రైతు ప్రతినిధులుగా పరిగణించాలన్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించలేదు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు సంఘం, ప్రభుత్వ కనుసన్నలలో నడిచేవారిని రైతుల పేరుతో నియమించనున్నారన్నది స్పష్టం.అలాంటి వారితో కూడిన సుప్రీం కోర్టు కమిటీ రూపొందించిన నివేదికను నెలలు గడిచినా బహిర్గతం చేయలేదు, ఏముందో తెలియదు. బహుశా అది రైతులకు అనుకూలంగా లేనందున జనానికి అందుబాటులోకి రాకపోవచ్చు. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. ఎస్‌కెఎంతో వాగ్దాన-ఒప్పంద భగ్నానికి పాల్పడితే మరింత తీవ్ర రూపంలో ఉద్యమం తిరిగి ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు తమకు వ్యతిరేకమైన చర్యల మీద రైతాంగం ఉద్యమించింది. అందినట్లే అంది చేజారిన వ్యవసాయ మార్కెట్‌ను తిరిగి చేజిక్కించుకొనేందుకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్‌ శక్తులు కేంద్ర ప్రభుత్వం మీద రైతులకంటే తీవ్రంగా వత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. నరేంద్రమోడీ తమకు ఉపయోగపడే అవకాశాలు లేవనుకుంటే ఆ స్ధానంలో మరొకరిని రంగంలోకి తెచ్చినా లేదా తమ హిందూత్వ అజెండాకే ప్రమాదం ముంచుకువచ్చిందని సంఘపరివార్‌ భావించినా దాన్ని అమలు జరపగల సమర్ధుడిగా భావిస్తున్న నరేంద్రమోడీ మరో రూపాన్ని ప్రదర్శించినా ఆశ్చర్యం లేదు.


రైతులు డిమాండ్‌ చేస్తున్న అంశాలలో కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్నది ఒకటి. అదేమీ వారు కొత్తగా కోరిన గొంతెమ్మ కోరిక కాదు. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలలో ఒకటే. నెలవులు మారిన తరువాత పాతవాటిని మరచిపోయినట్లు నటించటం కొందరిలో చూస్తాము. కానీ మోడీ గారి విషయంలో అలా అనుకోలేము. అసలు కథవేరే ఉంది. అది బయటకు చెప్పలేరు-రైతులను మెప్పించలేరు, అందుకే అనేక మంది పాలకుల మాదిరే బలవంతంగా రుద్దేందుకు పూనుకొని మూడు సాగు చట్టాలను తెచ్చారు. అనుకున్నది ఒకటి-అయింది ఒకటి. చివరకు క్షమాపణలు చెప్పి మరీ వాటిని వెనక్కు తీసుకున్నారు. నిజానికి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించేందుకు కాబినెట్‌లో చర్చించి ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదం పొందటం క్షణంలో పని. జమ్ము- కాశ్మీరు రాష్ట్రం, ఆర్టికల్‌ 370ని ఒక్క రోజులో వేగంగా రద్దు చేయటంలో చూపిన సామర్ధ్యం జగమెరిగిందే. అలాంటిది కనీస మద్దతు ధరల చట్టం తేలేరా ?

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగాళాదుంప విత్తన హక్కు కేసులో పెప్సీకి ఎదురుదెబ్బ !

05 Sunday Dec 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Farmers, patent for a potato, PepsiCo, potato


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


పెప్సీకంపెనీ ” లేస్‌ ” బంగాళాదుంప ”చిప్స్‌” రకంపై హక్కులను కోల్పోయింది. ప్లాంట్‌ వెరైటీస్‌ ప్రొటెక్షన్‌ అధారిటీ పెప్సీ రిజిస్ట్రేషన్‌ను డిసెంబర్‌ 3న రద్దుచేసింది. ఇది విత్తనంపై హక్కును నిలుపుకోవటంలో భారత రైతులు సాధించిన ఘనవిజయం. బంగాళాదుంప పంటలో ఉపయోగించే ఈ వంగడాలను 2009 లో భారత్‌ లోకి తీసుకువచ్చారు. రైతులకు అందించి బంగాళదుంపలను కొనేలా పెప్సీకో ఒప్పందాలు కుదుర్చుకున్నది, 2016 సం.ఫిబ్రవరి 2 న ఈ రకపు వంగడం పిపిఇవిఆర్‌-2001 చట్టం 64,65 సెక్షన్ల క్రింద అధికారికంగా పెప్సీ కంపెనీ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నది.” చిప్స్‌” కోసం ఉపయోగించే ప్రత్యేకమైన బంగాళాదుంప పై పూర్తి హక్కులు తమవేనని పెప్సీ కంపెనీ విర్రవీగుతున్నది. ”పెప్సీకో ఇండియా హౌల్డింగ్‌ యఫ్‌. యల్‌.2027 ” అని పిలవబడే బంగాళాదుంప రకాలను పేటెంట్‌ చట్టం క్రింద నమోదు చేసుకున్నాం కాబట్టి ఈ వంగడం పై పూర్తి హక్కులు తమ స్వంతం అని పెప్సీకో దబాయిస్తున్నది. తమ అనుమతి లేకుండా ఎవరూ ఆ రకాన్ని పండించటానికి వీలు లేదని పెప్సీ కంపెనీ అంటున్నది. ఈ ప్రత్యేక రకమైన బంగాళాదుంపలను ఉపయోగించి ” లేస్‌ ” అనే బ్రాండ్‌ పేరుతో ”చిప్స్‌” తయారుచేసి అమ్ముకుంటున్నది. . చిరుతిళ్ళు, కూల్‌ డ్రింకులు తయారుచేసే పెప్సీకో ఒక పెద్ద మల్టీనేషనల్‌ ఫుడ్‌ కంపెనీ, 200 దేశాలలోవ్యాపారాన్ని చేస్తున్నది. గతసంవత్సరం అమ్మి మన దేశాన్నుండి 4.52 లక్షల కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. దేశంలో 12 రాష్ట్రాలలో 24 వేల మంది రైతులకి బంగాళాదుంప విత్తనాలను ఇచ్చి తిరిగి బంగాళాదుంపలు కొనేటట్లుగా కాంట్రాక్ట్‌ వ్యవసాయం చేస్తున్నది. చట్టాల పేరున సాంప్రదాయక రైతు విత్తన హక్కు పై దాడి చేస్తున్నది. రైతు తన విత్తనాన్ని తనే తయారుచేసుకుని వాడుకోకుండా అడ్డుకుంటున్నది.

ఒక్కొక్క రైతు నుండి ఒక కోటి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారాన్నిడిమాండ్‌ చేసిన పెప్సీ

రెండు సంవత్సరాల క్రితం గుజరాత్‌ లో నలుగురు రైతులపై 4.2 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టారు. 2018 ఏప్రియల్‌ 8 న అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు రైతులను విచారించకుండానే, వారి లాయర్‌ లేకుండానే కంపెనీకి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులనిచ్చింది. అయితే రైతులు, ప్రజాస్వామిక వాదులు రైతు విత్తన హక్కు కోసం నిలబడ్డారు. కోర్టు కేసులు రద్దు చేయాలని దేశ వ్యాపిత ఆందోళనలు చేశారు. గుంటూరు దగ్గర తుమ్మలపాలెంలోకూడా పెప్సీ కంపెనీ వద్ద రైతు సంఘాలన్నీ ఆందోళన చేశాయి. పెప్సీకంపెనీ చిరుతిళ్ళను, కూల్‌ డ్రింకులను బహిస్కరించాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఎన్నికల ముందు దేశ వ్యాపిత ఆందోళనల ఫలితంగా కంపెనీ కేసులన్నీ వెనక్కి తీసుకున్నది.

పెప్సీ కంపెనీకి విత్తనం పై హక్కు

కానీ విత్తనం పై హక్కు నాదే అని పెప్సీ ఇప్పుడు కూడా అంటున్నది. తాత్కాలికంగా వెనక్కితగ్గానంటున్నది. చట్టం ప్రకారం రైతులకు విత్తనం తయారుచేసుకునే హక్కులేదని కంపెనీ వాదిస్తూనే వుంది. ఇందుకు ప్రతిగా కవిత కురుగంటి రైతుల విత్తన హక్కుకోసం పిటీషన్‌ వేశారు. రైతుల విత్తన హక్కు ను పెప్సీ కంపెనీ ఉల్లంఘిస్తున్నదని ,పిపిఇవిఆర్‌-2001 చట్టం ప్రకారం వారికిచ్చిన రిజిస్ట్రేషన్‌ చెల్లదని పిటీషన్‌ దాఖలుచేశారు. చట్టంలోని సెక్షన్‌ 64 ను పెప్సీ ఉపయోగించుకున్నది. రైతులు అదేచట్టం లోని సెక్షన్‌ 39(1) ను ఉదహరించారు. ఈ సెక్షన్‌ ప్రకారం వ్యవసాయానికి విత్తనాలను నాటటం, తిరిగి నాటటం, విత్తనాలను మార్చుకోవటం, పంచుకోవటం లేదా విక్రయించటానికి రైతులకు అవకాశంవున్నది. ఈ చట్టం అమలులోకి రాకముందులాగానే రైతులకు హక్కులన్నీ వుంటాయని కూడా సెక్షన్‌ 39 చెప్తున్నది. కాకపోతే రైతులు బ్రాండులతో విత్తనాలను అమ్మకూడదు. ఈ రక్షణ నిబంధనలు విత్తన రకాలపై పేటెంట్‌ ను అనుమతించటంలేదని , పెప్సీ యొక్క యఫ్‌ సీ 5 బంగాళదుంప రకానికి మంజూరు చేసిన మేధోరక్షణను రద్దు చేయాలని చేసిన వాదనను పిపిఇవి అధారిటీ అంగీకరించింది. రైతులకు విత్తనాలను తయారు చేసుకునే హక్కు ఉన్నదన్నారు. బ్రాండు లేని విత్తనాలను అమ్మకునే హక్కుకూడా రైతుకు వుందన్నారు.

పెప్సీ కంపెనీ దబాయింపులకు కోర్టు అడ్డుకొట్టింది. ఆ బంగాళాదుంప వంగడం పై హక్కులు పూర్తిగా పెప్సీకో కంపెనీవి కావని కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్‌ హక్కులను రద్దుచేస్తూ మొక్కల రకాల పరిరక్షణ, రైతు హక్కుల పరిరక్షణ అధారిటీ , శుక్రవారం తీర్పుఇచ్చి సందిగ్దాన్ని తొలగించింది. రైతులను నిలవరించటం కుదరదన్నారు. గతంలో కంపెనీకి ఇచ్చిన పేటెంట్‌ హక్కుల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తమ పేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఇతర రైతులు ఎవరూ పండించటానికి వీలులేదని పెప్సీకంపెనీ వాదిస్తూవుంది

ఈ తీర్పువలన మన రైతులకు చారిత్రక విజయం లభించింది. ఏ కోర్పోరేట్‌ కంపెనీ ఐనా విత్తనం పై సంపూర్ణ హక్కును పొందే అవకాశం లేకుండా స్పష్టమైన తీర్పును, పీపీవీ యఫ్‌ఆర్‌ఏ ఛైర్‌ పర్సన్‌ శ్రీ కే వీ ప్రభు గారు ఇచ్చారు. రైతులోకం స్వాగతించవలసిన తీర్పును సాధించిన కవితా కురుగంటి అభినందనీయులు.
డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, గుంటూరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d