• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Prices

ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 1

05 Friday Mar 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP dangerous toolkits, BJP False Claims, India oil bonds, Toolkits


ఎం కోటేశ్వరరావు


దిశా రవి అనే రెండు పదుల యువతి మనం సమాజానికి టూల్‌కిట్టు అనే పదాన్ని ఎంతగానో పరిచయం చేసింది. అసలు టూల్‌కిట్టు అంటే ఏమిటి ? రోజూ మనం ఎక్కడో అక్కడ చూస్తూనే ఉంటాం. ఇవి అనేక రకాలు. స్ధల, కాలాలను బట్టి వాటి స్వభావం మారుతూ ఉంటుంది. ప్రధానంగా రెండు తరగతులుగా చూస్తే ఒకటి జనాలకు ఉపయోగపడేవి. రెండవ రకం హాని చేసేవి. చాకు వంటింట్లో ఉంటే పండ్లు, కూరలు, ఉల్లి వంటి వాటిని కోస్తాము. అదే సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లో ఉంటే ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలియదు.
పాండవుల అరణ్యవాసం ముగిసిన తరువాత ఏడాది అజ్ఞాతవాసం చేసే సమయంలో తమ ఆయుధాలన్నింటినీ కట్టగట్టి జమ్మి చెట్టు మీద పెట్టారని చదువుకున్నాము. అదీ టూల్‌కిట్టే. అందుకే దసరా రోజున అనేక ప్రాంతాలలో ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్దలలో వినియోగించే పరికరాలకు పూజలు కూడా చేస్తారు. పాత సినిమాలలో వైద్యులు ఒక పెట్టె లేదా సంచి వంటిదానిని తీసుకువస్తారు. అది వైద్యుల టూల్‌కిట్టు, కొన్నిదశాబ్దాల క్రితం క్షురకులు తమ టూల్‌కిట్టును తీసుకొని ఇండ్లకు వచ్చి క్షవరాలు చేసేవారు. ఇప్పుడు కూడా పెత్తందారులకు అలా చేస్తూ ఉండవచ్చు. దాన్నే పొది అని పిలిచేవారు. వివిధ సేవలు చేసే మెకానికల్‌లు తమ వెంట తెచ్చే పరికరాలను ఒక బాక్సులో లేదా సంచిలో వేసుకొని వస్తారు. అదీ టూలుకిట్టే. పాములను ఆడించే వారు తమ టూల్‌కిట్టులో పాములతో పాటు, నాగస్వరం వంటివి ఉంటాయి.ఒక మతోన్మాదుల టూల్‌కిట్టులో మిగతావాటితో పాటు ఆవు మాంసం ఉంటే, మరో మతోన్మాదుల దానిలో పంది మాంసం ఉంటుంది. రెండు మతాల వాటిలో కుట్ర సిద్దాంతాలు, విద్వేష, ఉన్మాద ప్రచార సామగ్రి కోకొల్లలు. పట్టణాలలో పెద్ద పెద్ద ఉత్సవాలు, బహిరంగ సభలు జరిగే సమయాల్లో ఏ మార్గాల్లో ప్రయాణించాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం లేదా నిర్వాహకులు ప్రకటిస్తారు. అది కూడా టూల్‌కిట్టే.

దిశ రవి టూలుకిట్టులో ఏముంది ?


రైతు ఉద్యమం సందర్భంగా దానికి మద్దతుగా దిశరవి, ఇతరులు రూపొందించిన అంశాలనే ప్రపంచవ్యాపితంగా తెలిసిన భాషలో టూల్‌కిట్‌ అన్నారు. దానిలో ఎక్కడా నరేంద్రమోడీ లేదా బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేయాలనే అంశాలే లేవు. అయినా దేశద్రోహ నేరం మోపి అన్యాయంగా దిశ రవితో పాటు మరికొందరిని కేసుల్లో ఇరికించారు. దిశ రవికి బెయిలు మంజూరు చేస్తూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అనేక మందికి కనువిప్పు కలిగించాయి. దేశంలో మతోన్మాద సంస్దలు అవి మెజారిటీ అయినా మైనారిటీ అయినా విద్వేషాలను ఎలా రెచ్చగొట్టాలి, ఘర్షణలు ఎలా సృష్టించాలి, దాడులు ఎలా చేయాలి తదితర అంశాలతో అనేక టూలుకిట్లను ఉపయోగిస్తున్నాయి. వాటికోసం రకరకాల సంస్దలను ఏర్పాటు చేస్తున్నాయి. అన్నింటినీ సమన్వయం పరిచేది ఒక కేంద్రమే. రాజకీయ పార్టీల టూలుకిట్లకు కొదవే లేదు. మరి అవన్నీ నేరం కానపుడు రైతు ఉద్యమానికి మద్దతుగా తయారు చేసిన టూలుకిట్టునే ఎందుకు దేశ ద్రోహంగా పాలకులు భావిస్తున్నారు ? అదే దేశద్రోహం అయితే రైతుల కోసం ఆ టూల్‌కిట్‌ను అందరూ ఇతరులకు పంచాలి. టూలుకిట్టు అంటే పరికరాలతో కూడిన ఒక సంచి లేదా పెట్టె అని అనుకున్నాం. ఇంద్రజాల-మహేంద్రజాల కనికట్టు విద్యలు ప్రదర్శించేవారి దగ్గర కూడా టూలుకిట్టు ఉంటుంది.

బిజెపి అబద్దాల అక్షయ టూలుకిట్టు !

ఇలాంటి కనికట్టు విద్యలో రాజకీయ పార్టీలు తలమునకలుగా ఉన్నాయి. వీటిలో వామపక్షాలు మినహా కాంగ్రెస్‌, బిజెపి, వైసిపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ ఇలాంటి పార్టీలన్నీ ఒకేతానులో ముక్కలు. వాటి దగ్గర పరికరాల కంటే ప్రచార అస్త్రాలు ఉంటాయి. వాటిలో బిజెపి ఒకటి. నిత్యం ఉదయం ఆరుగంటలకు చమురు ధరలు పెరిగితే పెంచే, తగ్గితే తగ్గించే ప్రకటన వెలువడుతుంది. ధరలు భారంగా మారుతున్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేనంత పన్ను మొత్తాన్ని మన దేశంలో విధిస్తున్నారు. ఆ చేదు గుళికను మింగించేందుకు బిజెపి తన అక్షయ తూణీరంలోని అబద్దాల ఆయుధాలను నిత్యం ప్రయోగిస్తున్నది. గతేడాది నవంబరు నుంచి అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న చమురు ధరల గురించి జనం ముందు గుండెలు బాదుకుంటూ మహా నటి నటులను మరపిస్తున్నది.వాటిని మనం ఎందుకు నిలదీయలేకపోతున్నాం ?
దిగువ ఇస్తున్న అంకెలన్నీ కేంద్ర పెట్రోలియం శాఖలోని పిపిఏసి విభాగ నివేదికల నుంచి సేకరించినవి.2014 మార్చి ఒకటవ తేదీ( నరేంద్రమోడీ ఏలుబడిలోకి రాక ముందు),2015 నవంబరు ఏడవ తేదీన, 2020నవంబరు ఒకటవ తేదీన న్యూఢిల్లీలో పెట్రోలు ధరల్లో ఏ భాగం ఎంత శాతం ఉన్నదో వివరాలు ఇలా ఉన్నాయి
వివరాలు ×× ఏడాది×× డీలరుకు లీటరు ధర ×××× చిల్లర ధరలో శాతం
సరకు ధర × 2014-49.50×67.6×2015- 26.73×44 × 2020×25.73× 31.74
కేందప్రన్ను×× 2014-9.48 × 13 × 2015-19.56 ×32.2× 2020-32.98×40.68
రాష్ట్రపన్ను ××× 2014-12.20× 16 × 2015-12.14 × 20 × 2020-18.71×23.1
మొత్తం పన్నులు ×2014-21.68×29.61×2015-31.70×52.2× 2020-52.2 ×63.76
2015 నవంబరు ఏడవ తేదీన న్యూఢిల్లీలో డీజిలు ధరల్లో ఏ భాగం ఎంత శాతం, బ్రాకెట్లలో ఉన్న అంకెలు 2020 నవంబరు ఒకటవ తేదీ నాటివని గమనించాలి. 2014లో డీజిలు మీద ఎనిమిది రూపాయల సబ్సిడీ ఉంది.
వివరాలు × సంవత్సరం×× డీలరుకు లీటరు ధర ××× చిల్లర ధరలో శాతం
సరకు ధర ×2014-44.31×2015-26.55×57.8×2020-25.75×36.5
కేందప్రన్ను×2014-3.56×6.4× 2015-11.16×24.29× 2020-31.83×45.17
రాష్ట్రపన్ను ×2014-6.41×11.55×2015-6.79×14.8 × 2020-10.36×14.7
మొత్తంపన్ను×2014-9.97×18 ×2015-17.95×39.1×2020-42.19 × 63.45

మధ్య ప్రదేశ్‌ సంగతి ఏమిటి ?


పైన పేర్కొన్న వివరాలను గమనించినపుడు ఏ రీత్యా చూసినా కేంద్ర పన్నుల భారం పెరిగింది.ఆ దామాషాలో రాష్ట్రాల భారం పెరగలేదన్నది స్పష్టం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కేంద్ర పన్నులు ఏక మొత్తం. వాటిని సవరించేంతవరకు ధరలతో నిమిత్తం లేకుండా స్ధిరంగా ఉంటాయి. రాష్ట్రాల పన్నులు శాతాల మేరకు పెరుగుతాయి. నెలలో కేంద్రం 30 రోజుల పాటు పెట్రోలు, డీజిలు ధరలు పెంచినా కేంద్ర పన్ను మొత్తం పెరగదు.ఈ మధ్య బిజెపి నేతలు పెట్రోలు ధర విషయంలో కాంగ్రెస్‌ పాలిత రాజస్ధాన్‌ రాష్ట్రాన్ని చూపి చూశారా అక్కడ ఎంత ఉందో అని చెబుతున్నారు. ఎదుటి వారి కంట్లో నలుసులను వెతికేవారు తమ సంగతి చూసుకోరు. కేంద్ర పెట్రోలియం శాఖ నివేదిక ప్రకారం 2020నవంబరు ఒకటవ తేదీన రాజస్ధాన్‌లో పెట్రోలు ధర రు.88.21 ఉంటే తమ ఏలుబడిలోని మధ్య ప్రదేశ్‌లో రు.88.70 ఉందని సదరు నివేదిక ఒక్కాణించి మరీ చూపింది. ఆ తరువాత ధరలు అదే స్ధాయిలో పెరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల వివరాలు తీసుకుంటే అసలు కథను కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. అనేక రాష్ట్రాలలో స్ధానిక ప్రభుత్వాలు స్దానిక సెస్‌లు, ప్రత్యేక పన్నులను విధిస్తున్నాయి.
మధ్య ప్రదేశ్‌ పెట్రోలు ×వ్యాట్‌ 33శాతం+లీటరుకురూ.4.50 వీటి మీద ఒకశాతం సెస్‌
రాజస్దాన్‌ పెట్రోలు ×వ్యాట్‌ 36శాతం+లీటరుకురూ.1.50 రోడ్‌ సెస్‌
మధ్య ప్రదేశ్‌ డీజిలు ×వ్యాట్‌ 23శాతం+లీటరుకురూ.3.00 వీటి మీద ఒకశాతం సెస్‌
రాజస్దాన్‌ డీజిలు ×వ్యాట్‌ 26శాతం+లీటరుకురూ.1.75 రోడ్‌ సెస్‌

చమురు బంకుల దగ్గర బోర్డులు పెడితే బండారం బయటపడుతుంది !

బిజెపి నేతలు చెప్పే మరొక అబద్దం, గారడీ ఏమంటే కేంద్రం వసూలు చేస్తున్న పన్నులలో రాష్ట్రాలకు 42శాతం(అది ఇప్పుడు 41శాతం) బదలాయిస్తున్నది కనుక కేంద్ర పన్నుల కంటే రాష్ట్రాలకే ఎక్కువ కనుక రాష్ట్రాలే ధరలు తగ్గించాలని చెబుతారు. మెజారిటీ రాష్ట్రాలు తమ ఏలుబడిలోనివేగా ఎన్ని తగ్గించాయి? ఈ వాదన వెనుక కూడా మోసం ఉంది. పైన చెప్పుకున్నట్లుగా కేంద్రం పెట్రోలు, డీజిలు మీద వసూలు చేస్తున్న రూ.32.98, 31.83లలో రాష్ట్రాలకు 41శాతం కేటాయిస్తే ఆ వాదనను సమర్ధించవచ్చు ? ఈ మొత్తాలలో రెండు భాగాలు ఉంటాయి. ఎక్సయిజు పన్ను మరియు సర్‌ఛార్జీలు,సెస్‌లు. వీటిలో పన్నుల్లోనే రాష్ట్రాలకు 41శాతం వాటా. రెండో భాగంలో ఇచ్చేదేమీ ఉండదు. అందుకే కేంద్రం ఏటేటా రెండో భాగాన్ని పెంచుతున్నది. రాష్ట్రాలు ఆందోళన చేస్తున్నాయి గనుక పన్ను వాటాను 32 నుంచి 42శాతానికి పెంచినట్లు అంకెల గారడీ చేశారు.


2017ఏప్రిల్‌-2020 మే నెల మధ్య కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద సెస్‌, సర్‌ఛార్జీ 150శాతం, డీజిలు మీద 350శాతం పెంచితే ఇదే సమయంలో పన్ను మొత్తాలు 69, 57శాతాలను మాత్రమే పెంచింది.తాజాగా బడ్జెట్‌లో పెట్రోలు మీద రూ.2.50, డీజిలుకు రు.4.00 వ్యవసాయ సెస్‌ విధించారు. ఇది అదనం కాదు, ఈ మేరకు పన్ను తగ్గించి దాన్ని సెస్‌గా చూపారు. వినియోగదారులకు భారం లేనప్పటికీ రాష్ట్రాలకు కోత పడుతుంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సెస్‌లు, సర్‌ఛార్జీల నుంచి రాష్ట్రాలకు వాటా లేదు. ఇలాంటి జిమ్మిక్కు కారణంగా ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేటాయింపులు పెరిగినట్లు కనిపించినా వాస్తవంలో రాష్ట్రాలకు బదలాయించిన నిధులు 2019తో పోల్చితే 2020లో 36.6 నుంచి 32.4శాతానికి పడిపోయాయి. అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలనే బిజెపి వాదన అసంబద్దం మోసపూరితం.

రోడ్డు సెస్‌-టోలు టాక్సు వెరసి గోడ దెబ్బ చెంపదెబ్బ !

చమురు మీద రోడ్డు సెస్‌ వసూలు చేస్తున్న కేంద్రం మరోవైపు ఆ రోడ్లను వినియోగించినందుకు టోలుపన్ను వసూలు చేస్తున్నది. అంటే మన నుంచి వసూలు చేసిన సొమ్ముతో రోడ్లు వేస్తూ తిరిగి మన నుంచి టోలు వసూలు చేయటం వినియోగదారులకు గోడదెబ్బ చెంపదెబ్బ కాదా ? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తమ నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధికి నాంది పలికారని బిజెపి గొప్పగా చెప్పుకుంటుంది. నిజమే, అదే వాజ్‌పేయి ఆ రోడ్లకు నిధులను జనం నుంచి వసూలు చేసే పధకానికి కూడా నాంది పలికారు.
ప్రస్తుతం మనకందరికీ మీడియాలో లేదా ప్రభుత్వం కూడా చెబుతున్న ఎక్సయిజు పన్ను పెట్రోల మీద లీటరుకు రు.32.98. దీనిలో వాస్తవానికి మౌలిక ఎక్సయిజ్‌ పన్ను(బెడ్‌) రు.2.98 మాత్రమే.మిగిలిన రూ.30లో ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ పన్ను(సీడ్‌) రూ.12, రోడ్డు మరియు మౌలిక సదుపాయాల పన్ను రు.18. తాజాగా విధించిన వ్యవసాయ సెస్‌ను సర్దుబాటు చేసేందుకు బెడ్‌ను రు.1.41కి సీడ్‌ను రూ.11కు తగ్గించారు. డీజిలు విషయానికి వస్తే వ్యవసాయ సెస్‌కోసం బెడ్‌ను రు.4.83 నుంచి రూ.1.80కి సీడ్‌ను 9నుంచి 8కి తగ్గించారు. బెడ్‌, సీడ్ల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఆమేరకు తగ్గిపోతుంది. కేంద్ర పన్నుల పెంపుదల రాష్ట్రాలకు వరమా శాపమా ?

బిజెపి పక్కా విదేశీ – లేకుంటే గోబెల్స్‌ను ఎలా అనుకరిస్తారు ?

దిశా రవి టూల్‌కిట్టు గురించి నానాయాగీ చేసిన సంఘపరివార్‌ మరుగుజ్జులు(ట్రోల్స్‌) చమురు బాండ్ల గురించి జనాల మెదళ్లను ఖరాబు చేశారంటే అతిశయోక్తి కాదు. పక్కా భారతీయతను పాటిస్తున్నామంటారు గాని నిజానికి పక్కా విదేశీ, అందునా నాజీ హిట్లర్‌ మంత్రి పక్కా అబద్దాలను ప్రచారం చేసిన గోబెల్స్‌ వీరికి ఆరాధ్యదైవం, నిత్యం కొలుస్తూ ఉంటారు. అసలు ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటే విదేశీ సంస్ధల అనుకరణ లేదా అరువు తెచ్చుకున్నది అనుకోండి.
గత కాంగ్రెస్‌ పాలకులు చమురు బాండ్లు చేసి చమురు ఖాతాను గుదిబండగా చేశారని, తమ నేత నరేంద్రమోడీ వచ్చి వాటన్నింటినీ తీర్చాల్సి వచ్చినందున కేంద్ర పన్నులు పెంచాల్సి వచ్చిందని ఒక పిట్టకథ వినిపిస్తారు. ఒక వేళ అదే నిజమనుకోండి. ఆయిల్‌ బాండ్‌ సెస్‌ అనే పేరుతో వసూలు చేసి వాటిని తీర్చివేయవచ్చు. అప్పు తీరగానే నిలిపివేయవచ్చు, కానీ ఆపని చేయలేదే ? అయినా ఒక ప్రభుత్వం చేసిన అప్పు తరువాత వచ్చే మరొక ప్రభుత్వానికి గుదిబండ ఎలా అవుతుంది. పార్టీలు, పాలకులు మారతారు తప్ప ప్రభుత్వం కొనసాగుతుంది కదా ?
అర్ధ సత్యాలను, అసత్యాలను చెప్పటంలో బిజెపి ఆరితేరింది. గత యుపిఏ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లకు గాను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందని గతంలో ప్రచారం చేశారు, చమురు మంత్రిగారయితే 1.5లక్షల కోట్లన్నారు. బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన దాని ప్రకారం 40వేల కోట్ల రూపాయల వడ్డీ, 1.3లక్షల కోట్ల అప్పుకు చెల్లించినట్లు ఒక బొమ్మను చూపారు. తీరా 2018లో రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇదే పాలకులు చెప్పిందేమిటి చెల్లించిన మొత్తం రూ.3,500 కోట్లు. గత ఏడు సంవత్సరాలుగా ఆ పేరుతో జనాల నుంచి వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలను ఏమి చేశారు ? కరోనా సమయంలో జనమంతా దివాలా తీస్తే బిలియనీర్లు మరింత బలిశారు, కొత్తగా 40 మంది చేరి 177కు చేరారు. జనాన్ని కొట్టి పోగేసిందంతా ఇలాంటి వారికి కట్టబెట్టకపోతే అది సాధ్యమయ్యేనా ? ఇంతకూ చమురు బాండ్ల అప్పును మొత్తం తీర్చినట్లేనా ? నిజం ఏమిటి ?


మిగతా – ప్రమాదకర బిజెపి టూల్‌కిట్టు – పసలేని చమురు బాండ్ల లోగుట్టు – 2 లో చదవండి

Share this:

  • Tweet
  • More
Like Loading...

చమురు ధరలు : పండుగాడి దెబ్బతో బిజెపి నేతల మైండ్‌ బ్లాక్‌ – జనానికి దరిద్రంగా మారిన నరేంద్రమోడీ అదృష్టం !

28 Sunday Feb 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

#Fuel Prices India, #narendra modi, BJP u turn on Fuel prices, India fuel tax


ఎం కోటేశ్వరరావు
” ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో వాడే పండు గాడు ” దీని గురించి వేరే చెప్పనవసరం లేదు కదా ! బిజెపి నేతలు, వారి అనుయాయులకు చమురు పండుగాడి దెబ్బ తగిలినట్లుంది. లేకపోతే చమురు ధరల మీద గతంలో ఒక మాట ఇప్పుడు ఒక మాట, ప్రధాని, ఆర్ధిక మంత్రి, చమురు మంత్రి ఇలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు తలా ఒక మాట ఎలా మాట్లాడతారు ? రాజకీయ పార్టీల నేతలు (వామపక్షాలు దీనికి మినహాయింపు-వారు కూడా అలాంటివి పెట్టినట్లు ఎవరైనా నిరూపిస్తే సవరించుకుంటానని మనవి) జనానికి చెవుల్లో పూలు పెట్టాలను కోవటం నిత్యకృత్యం. అందులోనూ కమలం పువ్వు బిజెపిదే కనుక వారికి మేథోపరమైన, ప్రత్యేక హక్కులు కూడా ఉంటాయి.
” చమురు బంకుల దగ్గర బోర్డులు పెట్టాలి. కేంద్రం, రాష్ట్రాలు ఎంతెంత పన్ను విధిస్తున్నాయో, కేంద్రం విధించే పన్నుల్లో తిరిగి రాష్ట్రాలకు ఎంత వస్తున్నదో వాస్తవ భారం ఎంతో వివరిస్తూ ఆ బోర్డుల్లో రాస్తే జనానికి అసలు విషయాలు తెలుస్తాయి.” అని కొంతకాలం క్రితం మోడీ భక్తులు ప్రచారం చేశారు. బారు గడ్డంతో చిదానంద స్వామిలా ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా ఉన్న నిలువెత్తు నరేంద్రమోడీ చిత్రంతో ప్రతి బంకు వద్ద ఇప్పటికైనా భక్తులు స్వచ్చందంగా పెట్టినా ఇబ్బంది లేదు.లేదా జియోకు ఎలాగూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు గనుక ముకేష్‌ అంబానీ లేదా అదానీ అయినా తమ ప్రచార అంశాన్ని కిందో పైనో పెట్టి చమురు గురించి బోర్డులు పెట్టి రుణం తీర్చుకోవాలి.జనానికి వాస్తవాలను తెలియపరచాలి.

చమురు ధర వందడాలర్ల గురించి చర్చ ప్రారంభం !

ఇక పండుగాడి దెబ్బ గురించి చూద్దాం.కొద్ది రోజుల క్రితం బ్రెంట్‌ ముడి చమురు ధర 67-68 డాలర్ల వరకు ఊగిసలాడి ఆదివారం సాయంత్రం 66.13డాలర్ల దగ్గర, మన చమురు 65.70 డాలర్ల వద్ద ఉంది. మరోవైపున 2022 నాటికి వందడాలర్ల గురించి వ్యాపారులు ఆలోచిస్తున్నారు. త్వరలో 75-80 డాలర్ల వరకు పెరగవచ్చని కొందరి జోశ్యం. పిల్లి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నది తెలిసిందే. చమురు ధరల చెలగాటం జనానికి అలవాటైపోయింది. ఎంత చెబితే అంత చెల్లించటం దేశభక్తిగా భావిస్తున్నారు.తాము చెల్లించేది కార్పొరేట్లకు రాయితీల రూపంలో సమర్పిస్తున్నారనేది తెలియటం లేదు. నరేంద్రమోడీ గారికి ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది. ఎందుకంటే ఆయన అధికారానికి వచ్చిన నాటి నుంచి బహుశా ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండానే అంతర్జాతీయ మార్కెట్‌ను నియంత్రించి ఉండాలి. లేకపోతే రికార్డు స్దాయిలో సంవత్సరాల తరబడి ధరలు ఎందుకు తగ్గి ఉంటాయి. ఇప్పుడు కాక మొదలైంది కనుక చమురు పండు గాడు గుర్తుకు వస్తున్నట్లుంది.

ఎవరేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా ! సమన్వయం ఉండదా !

ఫిబ్రవరి 17వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ చమురు ధరలు వందరూపాయలు(బ్రాండెడ్‌) దాటాయన్న వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ధరలు ఆకాశాన్ని తాకటానికి గత పాలకులే కారణమంటూ గడ్డాన్ని సవరించుకున్నారు. వారు గనుక (తమ నేత వాజ్‌పాయి గారు కూడా ఆరేండ్లు అధికారంలో ఉన్న విషయం గుర్తు లేనట్లుంది) దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రీకరించి ఉంటే మధ్యతరగతికి ఈ భారం ఉండేది కాదు అంటూనే అబ్బే నేను ఎవరినీ విమర్శించటానికి కాదు గానీ ఈ విషయం చెప్పక తప్పదు అన్నారు. ఏ స్కూలు విద్యార్ధిని అడిగినా గత ఏడు సంవత్సరాల కాలంలో చమురు దిగుమతులు పెరిగాయో తరిగాయో, స్వదేశీ ఉత్పత్తి ఎలా దిగజారిందో మోడీ గారికి పాఠంగా చెబుతారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కబుర్లు ఆయన గడ్డం పెరుగుదల కంటే ఎక్కువగా ఉన్నాయి.పెట్రోల్లో ఇథనాల్‌ను ప్రస్తుతం 8.5శాతం కలుపుతున్నామని, 2025 నాటికి దాన్ని 20శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించామని అది జరిగితే దిగుమతులు తగ్గుతాయి, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయాలు పెరుగుతాయి. మధ్యతరగతి గురించి తాము ఎంతో సున్నితంగా వున్నామన్నారు. అసలు విషయం ఏమంటే చక్కెర పరిశ్రమలు ఇథనాల్‌ సరఫరా చేస్తుంటే వాటిని నిల్వచేసే ట్యాంకులను కూడా చమురు సంస్దలు ఏర్పాటు చేయలేదు. మోడీ గారు ఏమి చేస్తున్నారో తెలియదు.


చలికాలం తరువాత చమురు ధరలు తగ్గుతాయని ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఫిబ్రవరి 26న చెప్పారు.అయినా ఇది అంతర్జాతీయ వ్యవహారం, గిరాకీ పెరిగిన కారణంగా ధరలు పెరిగాయని సెలవిచ్చారు. చలికాలంలో ధరలు పెరగటం తరువాత తగ్గటం మామూలే అన్నారు. గత ఏడు సంవత్సరాల కాలంలో అలా ఎప్పుడైనా జరిగిందా ? ఒక దేశంలో చలికాలం అయితే మరో దేశంలో మరో వాతావరణం ఉంటుందని జనానికి తెలియదా అని అడిగితే దేశద్రోహం కేసు బనాయిస్తారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో చమురు ధరలు అత్యంత కనిష్టానికి పడిపోయిన సమయంలో దానికి అనుగుణ్యంగా 86 రోజుల పాటు ధరలను ఎందుకు తగ్గించలేదో మంత్రిగారు చెబుతారా ? చమురేమైనా టమాటాల్లాంటివా ! సీజన్‌లో కొనేవారు లేక రైతులు పారపోస్తారు లేదా కిలో రూపాయికి లోపే అమ్ముకుంటారు. చమురు అలాంటిది కాదే.


మరోవైపున ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చమురు ధరలు తగ్గుతాయని తాను చెప్పలేనని,అదొక ధర్మ సంకటమని చెప్పారు. ఉల్లిధరల గురించి అడిగినపుడు నేను వాటిని తినను కనుక తెలియదని, జిఎస్‌టి నష్టాలకు దేవుడి విధి అని కేంద్రం ఏమీ చేయలేదని గతంలో చెప్పిన ఆమె నుంచి అంతకు మించి ఏమి ఆశించగలదు దేశం. ఇదే సమయంలో రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ చమురుపై పన్నులు తగ్గించేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలని కోరారు.ఎవరేం మాట్లాడుతున్నారో గమనించే స్ధితిలో ఉన్నారా ? పెట్రోలియం మంత్రి ఫిబ్రవరి పదవ తేదీన రాజ్యసభలో మాట్లాడుతూ గత మూడు వందల రోజుల్లో కేవలం 60 రోజులు మాత్రమే ధరలు పెంచామని పెట్రోలు ఏడు, డీజిలు 21 రోజులు తగ్గించామని, 250 రోజులు, పెంచలేదు తగ్గించలేదు అన్నారు. అంటే ఆ రోజుల్లో అంతర్జాతీయ ధరల్లో ఎలాంటి మార్పు లేదా ? ఎవరిని మభ్యపెట్టేందుకు ఇలాంటి మాటలు చెబుతారు.

మతిమరపు నటిస్తున్న బిజెపి పెద్దలు ! చంద్రబాబుకు మోకాళ్ల నొప్పులు !

ఇప్పుడు జనానికి సుభాషితాలు చెబుతున్న బిజెపి నేతలు గతంలో చమురు ధరలు పెరిగి నపుడు ఏమి సెలవిచ్చారో మతిమరపు నటిస్తున్న కారణంగా వారేమీ చెప్పలేరు గాని వారిని అభిమానించే వారు తెలుసుకోవాలి. వీధుల్లో వేసిన వేషాలు, చేసిన ప్రదర్శనలు, అన్నట్లు మరిచాను చంద్రబాబు నాయుడు కూడా బిజెపితో జతకట్టిన కారణంగా యుపిఏకు వ్యతిరేకంగా సైకిలు తొక్కి నిరసన తెలియచేశారు. ఇప్పుడు బహుశా మోకాళ్ల నొప్పులు వచ్చి ఉంటాయి అనుకుంటే కుర్రవాడైన కొడుకు లోకేష్‌ ఎందుకు తొక్కటం లేదు ?


2006లో ముడిచమురు ధర పీపా 55 నుంచి 70 డాలర్లకు పెరిగినపడు బిజెపి డ్రామాలను జనం చూశారు.లీటరుకు 4,2 రూపాయల చొప్పున పెట్రోలు, డీజిలు మీద పెంచిన యుపిఏ సర్కార్‌ దానికి చెప్పిన కారణం అలా పెంచకపోతే చమురు కంపెనీలు కుప్పకూలిపోతాయని.గత సంవత్సరం చమురు ధర 20 డాలర్లకు పడిపోయినపుడు తరువాత 40 డాలర్లయినపుడు కూడా అంతకు ముందు ఉన్న ధరలను తగ్గించలేదు. ఎందుకంటే కరోనా సమయంలో చమురు వినియోగం పడిపోయింది తప్ప కంపెనీల, పెట్రోలు బంకుల ఖర్చులు తగ్గలేదు కనుక తగ్గిన మేరకు ధరలు తగ్గించలేదని బిజెపి నేతలు చెప్పటం తెలిసిందే. మరి సామాన్య జన ఆదాయాలు తగ్గకుండా ఏం చేశారంటే మాత్రం నోరు పెగలదు. నాడు మాజీ ప్రధాని వాజ్‌పాయి గారు యుపిఏ సర్కార్‌ క్రూరమైన పరిహాస మాడుతోందన్నారు.కేంద్రం, రాష్ట్రాలు పన్నులు తగ్గించాలన్నారు. గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ రాజధర్మం పాటించాలని వాజ్‌పాయి చెప్పారు. ఆయన బతికి ఉండగానే ఆ మాటల మీద చల్‌ అన్నట్లుగా పట్టించుకోని నరేంద్రమోడీ ఇప్పుడు దివంగత నేతకు ప్రమాణాలు చేయటం తప్ప ఆయన మాటలను పట్టించుకుంటారా, పాటిస్తారా !


ఇప్పుడు బిజెపిఏతర పాలిత రాష్ట్రాలు పన్నులు తగ్గించవచ్చు కదా అంటున్న బిజెపి వారు అప్పుడు తమ ఏలుబడిలో ఎంత మేరకు తగ్గించారో చెప్పగలరా ? అప్పుడు పెట్రోలు లీటరు ధర 47.51, డీజిలు ధర 23.52 ఉండేది. నిజంగా క్రూరమైన పరిహాసం ఏమంటే వాజ్‌పారు నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ ఆరు సంవత్సరాలలో 33 సార్లు ధరలను పెంచింది. 2002-06 మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర 24 నుంచి 75 డాలర్లకు పెరిగింది. చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ ధరలను వసూలు చేయాలని నిర్ణయించింది. అధికారం పోగానే మర్యాదస్తుడని అనేక మంది భావించే వాజ్‌పేయి నాయకత్వంలోనే బిజెపి ధరల పెరుగుదల వ్యతిరేక నిరసన నాటకాలాడింది నిజం కాదా ?

పన్నుల విధింపులో ఔరంగజేబు ఆదర్శమా !


2020 ఏప్రిల్‌-నవంబరు మాసాల్లో (లాక్‌డౌన్‌ సమయం) కేంద్ర ఎక్సయిజు పన్ను చమురు ఖాతా నుంచి 1,96,342 కోట్లు వస్తే అంతకు ముందు సంవత్సరంలో అదే వ్యవధిలో వచ్చిన మొత్తం 1,32,899 కోట్లు మాత్రమే.చమురు కంపెనీలతో పాటు మోడీ సర్కార్‌ జనం నుంచి పిండిన తీరు ఇది. అంతకు ముందుతో పోల్చితే వినియోగం తగ్గినప్పటికీ ఔరంగజేబు మాదిరి పన్నులతో పీల్చిన ఫలితమిది.ఇదే సమయంలో జిఎస్‌టి ఆదాయం గణనీయంగా తగ్గి రాష్ట్రాలు ఎంతో ఇబ్బంది పడ్డాయి. నిద్రపోయే వారిని లేపి ఈ విషయాలన్నీ చెప్పగలం తప్ప నటించేవారికి చెప్పలేము.


జనానికి బుర్రలుండవని, ఉన్నా ఉపయోగించలేని బద్దకం బలిసిపోయిందని బిజెపికి అనుకుంటున్నట్లుగా మరొక పార్టీ భావించదని అంగీకరించకతప్పదు. లేకపోతే పెరిగిన ధరలను సమర్ధించేందుకు ఎంత ధైర్యం ఉండాలి. స్మృతి ఇరానీ పెద్ద నటి అన్న విషయం తెలిసిందే. ఆమె బిజెపి నేతగా 2011 జూన్‌ 24న గ్యాస్‌ బండ మీద 50 రూపాయల పెంపుదల మీద చేసిన ట్వీట్‌లో ఏమన్నారో తెలుసా ? మాది సామాన్యుల ప్రభుత్వం అని చెప్పుకుంటారు, గ్యాస్‌ ధర 50 పెంపా, ఎంత సిగ్గు చేటు అన్నారు. ఇప్పుడు ఆమె గౌరవనీయమైన కేంద్ర మంత్రి. డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 150 రూపాయలు పెంచారు. మంత్రిగారు గనుక ఆమె వంటశాలకు దూరంగా ఉంటారు గనుక తెలిసి ఉండదు. లేకపోతే గతంలో మాదిరి వీధుల్లో వచ్చి ఉండేవారు. బిజెపి ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ జగమెరిగిన ఫేకిస్టు.2012 అక్టోబరు ఆరున ఒక ట్వీట్‌ చేశారు. అదేమంటే అప్పటి యుపిఏ సర్కార్‌ గ్యాస్‌ బండమీద రు.11.42పైసలు పెంచింది. దానికి వ్యతిరేకంగా సామాన్యులు, మహిళల మీద కాంగ్రెస్‌ బ్యాండ్‌ మోత మోగించింది అన్నారు. ఇప్పుడు జరిగిందేమిటి ? లెక్కలు చెప్పాలా ?ఒక సంఖ్య చెబితే మరుసటి రోజుకో వారానికో మారిపోతున్నందున ఎవరికి వారు బండను బుక్‌ చేసినపుడు ఎంత ఉందో తెలుసుకొని మోడీ సర్కార్‌కు భజన చేయాలో బ్యాండ్‌ బజాయించాలో నిర్ణయించుకోవచ్చు.


సిఎంగా మోడీ నాడేమన్నారు-ప్రధానిగా నేడేం చేస్తున్నారు !


2012 మే నెలలో పెట్రోలు ధరను లీటరుకు రూ.7.54 పెంచారు. దాంతో ఢిల్లీలో రు.73.18కి పెరిగింది. దాని మీద నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ మండిపడ్డారు.అది కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వ వైఫల్యానికి ఒక ముఖ్య ఉదాహరణ అన్నారు.తొమ్మిది సంవత్సరాల తప్పుడు ఆర్ధిక విధానాల పర్యవసానం అన్నారు బిజెపి నేతలు. ఆర్ధిక వ్యవస్ధను బలంగా ఉంచే విధంగా సరైన విధానాలను యుపిఏ అనుసరించి ఉంటే అది చమురు సబ్సిడీలను ఇచ్చే స్ధితిలో ఉండేది అన్నారు. తరువాత వామపక్షాలతో పాటు బిజెపి కూడా చమురు ధరలకు వ్యతిరేకంగా భారత్‌ బంద్‌లో పాల్గొన్నది. ఇప్పుడు బిజెపి నేతలు ఏం చేస్తున్నారు ? సబ్సిడీలన్నీ ఎత్తివేశారు. మోడీ అధికారానికి రాక ముందు మే 2014లో 113 డాలర్లు ఉన్న ముడిచమురు ధర మరుసటి ఏడాది జనవరి నాటికి 50 డాలర్లకు పడిపోయింది.


2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనేమన్నారు. నిజమే నేను అదృష్టవంతుడనే, కానీ మీకు డబ్బు ఆదాఅవుతోంది. మోడీ అదృష్టం జనానికి లబ్ది చేకూర్చుతుంటే అంతకంటే కావాల్సిందేముంది ? నా అదృష్టం కారణంగా పెట్రోలు, డీజిలు ధరలు తగ్గితే సామాన్యుల పొదుపు ఎక్కువ అవుతుంది. అందువలన అదృష్టవంతులు కాని వారిని తీసుకురావాల్సిన(ఎన్నుకోవాల్సిన) అవసరం ఏముంది అంటూ కాంగ్రెస్‌ మీద వ్యాఖ్యానించారు. ఆ అదృష్టం ఇంకా పెరిగి 2016లో ఒక దశలో ముడిచమురు ధర 29 డాలర్లకు పడిపోయింది. సదరు అదృష్టవంతుడు చేసిందేమిటి ? వినియోగదారులకు దరిద్రాన్ని పట్టించటం కాదా ? 2014 మే నుంచి ఇప్పటి వరకు వరకు వంద రూపాయలు పెంచి ఒక్క రూపాయి తగ్గించిన మాదిరి ఉదారత్వాలను పరిగణనలోకి తీసుకుంటే భారం ఎలా ఉందో చూద్దాం.
సం ××సరకు ×× ఎక్సయిజ్‌×××డీలరు ధర××వినియోగదారు ధర
2014 ×× పెట్రోల్‌ ×××× 9.48 ××× 49.50 ××××× 73.20
2021 ×× పెట్రోల్‌ ×××× 32.98 ××× 27.75 ××××× 83.71
2014 ×× డీజిలు ×××× 3.56 ××× 52.68 ××××× 55.48
2021 ×× డీజిలు ×××× 31.80 ××× 33.74 ××××× 79.74
(గమనిక 2014డీజిలు, పెట్రోలు ధరలు మార్చి ఒకటవ తేదీ ఢిల్లీ, 2021 డీజిలు ధర ఫిబ్రవరి 16, పెట్రోలు ధర జనవరి ఒకటవ తేదీ ఢిల్లీకి చెందినవి, హిందూస్దాన్‌ పెట్రోలియం కంపెనీ ధరలుగా గమనించాలి.2014 మార్చిలో పెట్రోలు మీద సబ్సిడీ లేదు, డీజిలు మీద లీటరుకు రూ.8.37 సబ్సిడీ ఉంది.)

అమెజాన్‌ ”టూల్‌ కిట్‌ ” లో ప్రధాని నరేంద్రమోడీ గురించి ఉన్నది ఏమిటి ?


విదేశీయులు లేదా స్వదేశీయులు ఒక ప్రధాని లేదా ముఖ్యమంత్రులను పొగడుతున్నారు అంటే వారిలో రెండు రకాల అభిప్రాయాలు ఉంటాయి. దానికి ఎవరూ మినహాయింపు కాదు. ఒకటి ప్రయోజనం కోసం చెప్పే మెరమెచ్చు మాటలు, రెండోది అంతర్గతంగా ఉన్న అభిప్రాయం.2012 ఫిబ్రవరి 18వ తేదీన బిజినెస్‌ టుడే అనే పత్రిక రాయిటర్‌ సంస్ధ ఇచ్చిన వార్తను ప్రచురించింది. ” మోడీ ఒక మేథావి కాదు: ప్రధాని గురించి అంతర్గత పత్రాల్లో అమెజాన్‌ వర్ణణ ” అన్నది దాని శీర్షిక. ప్రముఖులు ఇతరులతో సంభాషించే సమయంలో మాట్లాడాల్సినవి ఏవి, మాట్లాడకూడనివి ఏవి, బలం ఏమిటి బలహీనతలు ఏమిటి అని కంపెనీ సిబ్బంది ఒక నోట్‌ తయారు చేస్తారు. దానికి అనుగుణ్యంగానే అమెరికాలోని భారత రాయబారితో 2019లో అమెజాన్‌ డాట్‌కామ్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ జే కార్నే మాట్లాడేందుకు వెళ్లినపుడు సిబ్బంది ఒక పత్రంలో కొన్ని విషయాలు రాశారు.అప్పుడు కార్నే మోడీని బహిరంగంగా ఇలా వర్ణించాడు ” సీదా సాదాగా, తర్కబద్దంగా, ముక్కుసూటిగా ఉంటారు” అని పేర్కొన్నాడు. అమెజాన్‌ కంపెనీ 2012 నుంచి 2019వరకు రూపొందించిన ఇలాంటి పత్రాలు రాయిటర్‌ వార్తా సంస్దకు దొరికాయి. ఒకదానిలో మోడీ ముక్కుసూటి తనం, ఆలోచించే తీరు ఆయన ఒక మేథావి స్దాయికి తగినదిగా ఉండదు అని పేర్కొన్నారు. ఒక మేథావీకాదు, ఒక పండితుడు కాదు గానీ బలమైన పాలనా, యంత్రాంగంతో విజయవంతమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు.అలాంటి పత్రాలను రూపొందించిన వారిలో మన దేశానికి చెందిన అమెజాన్‌ కంపెనీ ప్రతినిధి అమిత్‌ అగర్వాల్‌ వంటి స్వదేశీయులే ఉన్నారు. టూల్‌కిట్‌తో మన పరువు పోయిందని గగ్గోలు పెడుతున్నవారు ఇలాంటి టూల్‌కిట్ల గురించి కూడా తెలుసుకుంటే మంచిదేమో ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

20 Saturday Feb 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

#India oil taxes, India oil price, narendra modi bhakts, Narendra Modi Failures, Watsapp fake news


ఎం కోటేశ్వరరావు


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ! అది ఎప్పుడు సాధ్యం అవుతుంది ? మనం అంటే జనం బుర్రలకు పని పెట్టకుండా, చరిత్రను మర్చిపోతేనే అలాంటి వారు రెచ్చిపోతుంటారు. సమాజం పుచ్చిపోతుంది !
ఇపుడు అదే జరుగుతోంది. కారణాలు ఏవైనా, పేనుకు పెత్తనం ఇచ్చినట్లు మనం మెదళ్లను విదేశీ వాట్సాప్‌కు అప్పగించాం, ఇప్పుడు స్వదేశీ ”కూ ”కు అప్పగించమని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే తప్పు యాప్‌లది కాదు. విదేశీ అయినా, స్వదేశీ అయినా మనం వాటిలో దేన్ని ఉంచితే దాన్నే పదుగురిక పంచుతాయి. అందుకే పళ్లూడ గొట్టించుకొనేందుకు ఏ రాయి అయితేనేం ? బుర్రలను తాకట్టు పెట్టదలచుకుంటే ఎక్కడైతేనేం ! దాన్ని కూడా చూద్దాం !
వినేవాడికి బుర్రలేకపోతే చెప్పేవాడికి లోకువ ! నేనూ ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నాను గనుక మెదడుకు పని పెట్టమనే చెబుతున్నా. వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లుగా ఎవరు చెప్పినా వినండి. హంస పాలూ నీళ్లను వేరు చేస్తుందంటారు, మనమూ మంచీ-చెడును వేరు చేసి మంచిని స్వీకరించుదాం !


పెట్రోల్‌ ,డీజిల్‌, ఎల్పిజి ధరలేం ఖర్మ ! రాబోయే రోజుల్లో ప్రతి వస్తువు, సేవ ధర పెరుగుతుంది. ఏమంటే దేశభక్తి అంటారు ! నరేంద్రమోడీ గారి అచ్చేదిన్‌ ఆచరణ అదే కదా ! వాట్సాప్‌లో తిప్పుతున్న అనేక పోస్టులలో ఒక దాని ప్రకారం కేంద్రలోని పెద్దలకు అవగాహన ఉంది కనుకనే వాటిని పెంచుతున్నారట ! వారికి లేదని ఎవరన్నారు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డించేందుకు కావాలనే చేస్తున్నారు. సందేహం లేదు. తెగించిన వాడికి తెడ్డే లింగం ! ఇంతకు ముందు ధరలు పెంచితే జనం ఆగ్రహిస్తారనే భయం ఉండేది కనుక పాలకులు కాస్త వెనుకా ముందూ చూసే వారు. దున్నపోతు మీద వాన కురిసినట్లుగా పరిస్దితి ఉందని గ్రహించారు గనుకనే చెప్పి మరీ చేస్తున్నారు.


గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో డిమాండ్‌ లేకపోవటంతో ఒక దశలో ముడి చమురు ధర15 డాలర్లకు పడిపోయినా సౌదీ అరేబియా నుంచి మన దేశం పాత ధరకే కొనుగోలు చేసిందట ? డిమాండ్‌ తగ్గినా సౌదీ నుంచి కొనుగోళ్లను ఆపలేదట, డిమాండ్‌ లేనపుడు ఎందుకు కొనుగోలు చేసినట్లు ? అదీ పాత ధరకు ! స్వంత జనం మీద అంత కోపమెందుకు ? సౌదీ మీద అంత ప్రేమ ఎందుకబ్బా ! మనం చెవులప్పగిస్తే ఫ్రీగా ఉన్నాయి కదా అని ప్రతి చెత్త వాటిలో వేసిపోతారు !
అంతర్జాతీయ మార్కెట్లో ఏరోజు ఎంత ఉంటే ఆరోజు మన వినియోగదారుల నుంచి అంత వసూలు చేయాలన్నది మన విధానం. మన కొనుగోలు కూడా అలాగే ఉంటుంది తప్ప వచ్చే ఏడాది సరఫరా చేసే చమురుకు ముందు సంవత్సరమే ఒప్పందాలేమీ ఉండవు. ధర తగ్గినా సౌదీ నుంచి పాత ధరలకే కొనుగోలు చేయటం అంటే జనానికి శఠగోపం పెట్టటం, కుంభకోణం ఉన్నట్లే ! లేదా రాసిన వారికి అసలు విషయం పరిజ్ఞానం లేకపోయి ఉండాలి.


ఒపెక్‌ (చమురు ఎగుమతి దేశాలు) ధరలు పెంచే ఆలోచనలో ఉండగా మన దేశ విజ్ఞప్తి మేరకు ఆసియా ఖండం వరకు పాత ధరలకే ఇవ్వటానికి ఒప్పుకున్నాయట. అలాంటపుడు సెంచరీ దిశగా ప్రతి రోజూ ధరలను పెంచటం ఎందుకు ? పాత ధరలు ఎంతో ఇప్పుడు ఎంతకు కొంటున్నామో చెప్పమనండి, మన బండారం బయటపడుతుంది.


చైనా యాప్‌లను నిషేధించినా, వారి వస్తువులను కొనుగోలు చేయం అని బెదిరించినా సరిహద్దుల్లో చెట్టు చివరి ఆకు కూడా ఊగలేదు. మీరూ మూసుకోండి-మేమూ మూసుకుంటాం అన్నట్లుగా ఒప్పందం చేసుకొని సరిహద్దుల్లో చైనా-భారత్‌ సైన్యాలు గతంలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వెనక్కు వెళ్లాయి. కొండల దిగువన ఉన్న చైనా వారు వెనక్కు తగ్గారు, కంపు ట్రంప్‌ మాటలు నమ్మి ఏదో అనుకొని, ఏదో చేద్దామని కొండలెక్కిన మనం కాళ్లనొప్పులతో దిగాము తప్ప జరిగిందేమీ లేదు.
అలాంటిది కొనుగోలు దేశంగా ఉన్న మనం కోరితే లేదా బెదిరిస్తే ఒపెక్‌ దేశాలు ధరలు తగ్గించాయంటే, ఒక్కసారికేం ఖర్మ 56 అంగుళాల ఛాతీ రోజూ గడ్డం నిమురుకోవటం మాని ఆ పని మీద కేంద్రీకరిస్తే జనం మీద బాదుడు తగ్గుతుంది కదా ! మనం ఎప్పుడు ఏ దేశం నుంచి చమురును ఎంతకు కొనుగోలు చేశామో, అధికారికంగా శ్వేత పత్ర ప్రకటన లేదా ప్రభుత్వ ప్రకటన చేయమనండిి అసలు సంగతి బయటపడుతుంది ! టూల్‌కిట్టూ కాదు, దేశద్రోహం అంతకంటే కాదు. దీన్ని కూడా అడగలేక ఏమి చెప్పినా తలలు ఊపుతాం – ఎందుకంటే మనం గంగిరెద్దులం కదా !


” క్రూడ్‌ ధరలు నిలకడగానే ఉన్నా దేశంలో పెట్రోల్‌ , డీజిలు ధరల పెంపు ఎందుకంటే వీలు ఉన్నంత వరకు వీటి ద్వారా మళ్ళీ ఆర్ధికంగా నిలదొక్కుకోవడం కోసమేనట ! లాక్‌ డౌన్‌ సమయంలో ఆదాయం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం అల్పదాయ ప్రజల ఆరు నెలల పాటు ఉచిత రేషన్‌ ఇచ్చిందట.” కనుక చమురు ధరలు పెంచటం సమర్దనీయమే అని భజన చేయటం.
ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఆరు నెలల పాటు కుటుంబానికి నెలకు ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు ఇవ్వటానికి 90వేల కోట్ల రూపాయలు ఖర్చయిందట. అంటే కుటుంబానికి రూ.1,125 కేటాయించారు. ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేశారని సాధికారికంగా సమాచారం చెబితే సవరిస్తా ! కేంద్ర ప్రభుత్వం మార్చి నెల 14న కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలు మీద మూడేసి రూపాయలు, మే ఐదవ తేదీన రూ.10,13చొప్పున పెంచింది. తద్వారా కేంద్రానికి అదనంగా వస్తుందని చెప్పిన ఆదాయం ఎంత ? రెండు లక్షల కోట్ల రూపాయలు. అంతకు ముందు లీటరు పెట్రోలు మీద రూ.9.48గా ఉన్న పన్ను 22.98కి పెంచారు. అంటే మరో రెండులక్షల కోట్లు ఉంటుంది. మరి దాన్ని ఎందుకు పెంచినట్లు ? అప్పుడేమీ కరోనా, ఉచిత రేషన్‌ లేదే ? మనకు ఇచ్చింది ఎంత మన జేబుల నుంచి కొల్లగొట్టింది ఎంత ? దేశ భక్తి ఉండాల్సిందే గానీ అది మరీ మత్తులోకి దిగకూడదు. దిగితే మన ఒంటి మీద దుస్తులు కూడా మిగల్చరు ! ఏది చెబితే దాన్ని నమ్మేందుకు మనం గంగిరెద్దులమా ? అయినా తలలెందుకు ఊపుతున్నాం ?


చమురు ధరల పెంపుదలకు మరో అంశాన్ని మెదళ్లకు ఎక్కించే యత్నం జరుగుతోంది. కరోనా, ఉచిత రేషను అంటే ఎక్కువ కాలం నడవదు . మరి అదేమిటి ? ” 2020 ఏప్రిల్‌ నుండి ఇప్పటి వరకు లడాక్‌ దగ్గర 50,000 మంది సైనికులని మోహరించింది మన దేశం. యుద్ధ టాంకులు, ఆర్టీలరీ గన్స్‌ తో పాటు నిత్యం యుద్ధ విమానాలని గస్తీ లో ఉంచింది. కేవలం సైనికులని తరలించడానికే 10,000 కోట్లు ఖర్చు అయ్యింది. ఇక మీరేజ్‌ యుద్ధ విమానం ఒక గంట గాలిలో ఎగిరితే అయ్యే ఖర్చు 6 లక్షలు అవుతుంది. ఒక ఎస్‌యు మిగ్‌ అయితే ఒక గంటకి 10 లక్షల ఖర్చు అవుతుంది. ఒక సి-30 రవాణా విమానం లోడ్‌ తో గాల్లోకి లేచి దింపినందుకు అయ్యే ఖర్చు అక్షరాల 750 కోట్లు అవుతుంది. యావరేజ్‌ గా చూస్తే మొత్తం 10 నెలల కాలానికి రోజుకి 5 వేల కోట్లు ఖర్చు అయ్యింది. పూర్తి స్థాయి యుద్ధం కనుక వస్తే రోజుకి లక్ష కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది – ఇది రెండు లక్షల కోట్లకి కూడా పెరగవచ్చు. మీరేజ్‌, రాఫెల్‌ ల తో వాడే ఒక్కో మిసైల్‌ ఖరీదు 600 కోట్లు ఉంటుంది మరి ఈ ఖర్చు ఎవరు భరిస్తారు ? ఎక్కడా తగ్గకుండా కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో గట్టిగానే నిలబడ్డది. దేశ భద్రత ద ష్ట్యా ఇది తప్పని సరి ఖర్చు. ” అని సమర్ధన !


మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించలేదని గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు. తన ప్రకటనను వక్రీకరించారని అనలేదు కనుక ఇప్పటికీ అదే మాటతో ఉన్నారనుకుందాం ! ఒక్క అంగుళం ఆక్రమించినా ఊరుకునేది లేదని రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. చైనా పది సార్లు సరిహద్దులను అతిక్రమిస్తే మనం 50సార్లు అతిక్రమించాం అని మాజీ సైనికాధిపతి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వికె సింగ్‌ తాజాగా చెప్పారు. సరిహద్దుల వెంబడి మనం తిష్టవేశాం, అది చైనా మీద వత్తిడి పెంచుతోందని కూడా సింగ్‌ చెప్పారు.
ప్రధాని చెప్పినట్లు మన ప్రాంతాన్ని చైనా వారు ఆక్రమించలేదు, రాజనాధ్‌ చెప్పినట్లు ఒక్క అంగుళం కూడా కొత్తగా ఆక్రమించలేదు ,అయినా వికె సింగ్‌ గారు చెప్పినట్లు మనం వెళ్లి సరిహద్దులో కూర్చున్నాం. అందుకు గాను మనకు వదిలిన చమురు ఎంత. రోజుకు ఐదు వేల కోట్లంటే నెలకు లక్షా యాభై వేల కోట్లు, పది నెలలకు పదిహేను లక్షల కోట్లు ? ఇదంతా ఎందుకు చేసినట్లు ? అంత ఖర్చు భరించే స్దితిలో దేశం ఉందా ? ప్రతి పైసాకు జవాబుదారీ వహిస్తా అని చెబుతున్నవారు చేయాల్సిన పనేనా ఇది ? ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్న రామదాసు గుర్తుకు రావటం లేదూ ! తేడా ఏమిటంటే ఆయన నవాబు జైల్లో బందీగా ఉండి వాపోయాడు. మనం హిందూత్వ ప్రజాస్వామ్య బందీలుగా ఉండి నోరు విప్పలేకపోతున్నాం. రామదాసు రక్షణకు రాముడు వచ్చాడంటారు. మన రక్షణకు కనీసం జైల్లో పరామర్శించేందుకు సైతం రాముడు వచ్చే అవకాశం లేదు. వచ్చినా అధికారులు అనుమతించరు.
పోనీ చైనా వారు కొత్తగా మన ప్రాంతాన్ని ఒక్క అంగుళం అయినా ఆక్రమించినట్లు చెప్పి ఉంటే దాన్ని కాపాడుకొనేందుకు పదిహేను లక్షల కోట్లేమిటి, దేశం మొత్తాన్ని అమ్మివేసి ఆ సొమ్ముతో అమెరికా నుంచి తెచ్చుకొనే ఆయుధాలతో సదరు అంగుళాన్ని తిరిగి తెచ్చుకొనేందుకు పూనుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టరు. దేశభక్తిలో ఎవరూ ఎవరికి తీసిపోరు ! ఏమీ లేని దానికి కరోనా కాలంలో ఇంత ఖర్చా ? అనేక దేశాలకు సరిహద్దు సమస్యలున్నాయి. ఎవరైనా కరోనా కాలంలో ఇలాంటి పని చేశారా ? ఇది రాజనీతా – బాధ్యతా రాహిత్యమా ! ఏది చెబితే దానికి తలూపటానికి మనం గంగిరెద్దులమా ! అయినా తలలెందుకు ఊపుతున్నాం ?


” ఈ ఖర్చు అంతా కోవిడ్‌ టాక్స్‌ పేరు మీదనో లేదా యుద్ధ టాక్స్‌ పేరు మీదనో మన నుండి వసూలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఆయిల్‌ పూల్‌ ఖాతా మీదనే భారం వేస్తున్నది అది కూడా ఇంకో రెండు నెలలు మాత్రమే. మే నెల ఆరంభం నుండి మళ్ళీ పెట్రో రేట్లు తగ్గుతాయి. భయం అవసరం లేదు. ”
జనానికి బుర్రలేదనుకొనే అతి తెలివి వాదనతప్ప పైన పేర్కొన్న లక్షల కోట్ల ఖర్చును జనం నుంచి వసూలు చేయటం లేదట ? ఆయిల్‌ పూల్‌ ఖాతా నుంచి చేస్తున్నారట. దానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది? నరేంద్రమోడీ గారికి అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం ఏమైనా దొరికిందా ! జనాన్ని ఇంత వెర్రివారిగా జమకడుతున్నవారినా మనం నోరెత్తకుండా అంగీకరిస్తున్నది ? ఎందుకిలా ప్రశ్నించలేని స్ధితికి చేరుకున్నాం ? గంగిరెద్దులమా ?

ఆయిల్‌ పూల్‌ అనండి మరొకటనండి పేరేదైతేనేం గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రానికి రాష్ట్రాలకు వస్తున్న ఆదాయ వివరాలు కోట్ల రూపాయలలో దిగువ విధంగా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్నఅంకెలు కేంద్రం,రాష్ట్రాల పన్నులలో చమురు రంగం వాటాల శాతాలు.

సంవత్సరం 2013-14 ××××× 2014-15 ××××× 2015-16 ××××× 2016-17
కేంద్రం 1,04,163(38.0) ×× 1,22,925(39.2) ×× 2,13,995(57.4) ×× 2,37,388(52.6)
రాష్ట్రాలు 1,27,957(27.2) ×× 1,31,595(25.7) ×× 1,29,214(23.5) ×× 1,53,287(25.1)

కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను భారాన్ని ఈ అంకెలు చెబుతున్నాయి. మనం చెల్లిస్తున్నవే. ఇచ్చిన అంకెలన్నీ కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంవత్సరాలవే. ఈ పెంపుదల సమయంలో కరోనా లేదు, సరిహద్దుల్లో సరాగాలు, పనేమీ లేదు ఒకసారి వచ్చి పోండి అన్న ఆత్మీయ పిలుపులే తప్ప మరొకటి లేదు కదా ! ఎందుకు పెంచినట్లు ? పైన పేర్కొన్న అంకెలకు గత ఏడాది పెంచిన పన్నుల మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ఆదాయానికి కలుపుకోవాలి. కేంద్ర పన్నుల మీద కూడా రాష్ట్రాల వాట్‌ ఉంటుంది కనుక ఆ మేరకు కొంత మేరకు రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరుగుతుంది తప్ప శాతాలలో పెద్ద మార్పు ఉండదు.
ఒకవేళ ఆయిల్‌ పూల్‌ – మరొకటో ఏదో ఒకటి. కరోనా, సరిహద్దుల కోసమే పన్నులు పెంచా అని విలేకర్ల సమావేశం పెట్టి చెప్పే ధైర్యం ఎలాగూ నరేంద్రమోడీ గారికి లేదు కనుక కనీసం తన మన్‌కీ బాత్‌లో సెలవిమ్మనండి. పార్లమెంటులో చెప్పమనండి. కొద్ది నెలలే గనుక భరిద్దాం.
మనం చర్చిస్తున్న పోస్టులో రాసినట్లు ఆసియా ఖండానికి చమురు రేట్లు తగ్గించిన నరేంద్రమోడీ గారికి మిగతా దేశాల వారందరూ జేజేలు పలుకుతూ ఉండి ఉండాలి. లేకపోతే నేపాల్‌, శ్రీలంకతో సహా ఇరుగు పొరుగుదేశాల్లో కూడా బిజెపిని ఏర్పాటు చేసి అధికారానికి వచ్చేందుకు ప్రయత్నించాలని త్రిపుర పర్యటనలో హౌం మంత్రి అమిత్‌ షా ఎందుకు చెబుతారు, ఆ విషయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవదేవ్‌ ప్రపంచానికి ఎలా వెల్లడిస్తారు. బిజెపి నాయకులు జనాన్నే కాదు చివరికి స్వంత పార్టీ వారిని కూడా వెర్రి పుష్పాల కింద జమకడుతున్నారన్నమాట. లేకపోతే విదేశాల్లో బిజెపి ఏర్పాటు ఏమిటి ? నరేంద్రమోడీ ఘనత కారణంగా మన, ఇరుగు పొరుగుదేశాల్లో ఫిబ్రవరి 15న గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం పెట్రోలు, డీజిలు ధరలు, సెంట్లు, మన కరెన్సీలో(ఫిబ్రవరి 18 మారకపు రేటులో) ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది ఖలిస్తానీ లేదా చైనా, పాకిస్దాన్‌ టూలకిట్టులో భాగం కాదని మనవి.

దేశం ×××××× పెట్రోలు ×××× డీజిలు
భారత్‌ ××××× 126 (91.37) ×× 115 (83.39)
బంగ్లాదేశ్‌ ××× 105 (73.24) ×× 77 (55.84)
చైనా ×××××× 103 (74.69) ×× 90 (65.26)
నేపాల్‌ ××××× 95 (68.89) ×× 80 (58.04)
శ్రీలంక ×××× 83 (60.19) ×× 54 (39.16)
పాకిస్దాన్‌ ××× 70 (50.76) ×× 73 (52.93)
భూటాన్‌ ××× 68 (49.31) ×× 64 (46.41)
మయన్మార్‌× 67 (68.89) ×× 60 (43.51)

మనం కోరితే ఒపెక్‌ సంస్ద ఆసియా ఖండానికి ధరలు తగ్గించిందని చెబుతున్న పెద్దలకు ఒక ప్రశ్న. విదేశాలకే మన మాట మీద అంత ప్రేమ ఉండి అడిగిన మనకే గాక ఆసియా మొత్తానికి ఉదారంగా భారం తగ్గించేందుకు కారకులైన మాననీయ నరేంద్రమోడీ మన దేశంలో ఇంత ఎక్కువకు ఎందుకు అమ్మిస్తున్నారు ? మనకెందుకీ దరిద్రం పట్టుకుంది. ఎక్కడిదీ ఏలినాటి శని ? కరోనా అందరికీ ఉంది. సరిహద్దుల్లో వివాదానికి మనం పదిహేను లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నపుడు చైనా వారికీ అంతే మొత్తం ఖర్చు అవుతుంది కదా ? మరి వారెందుకు ఆయిల్‌పూల్‌లో పన్నులు వసూలు చేయటం లేదు ? గంగిరెద్దుల్లా తలాడించటం తప్ప మనం ఇవేవీ అడగకూడదు !

” 100 రూపాయలు ఉన్న బీరు 160 అయితే ఎవరూ కిక్కురుమనరు కానీ పెట్రోల్‌ లీటర్‌ 100 అయిపోతున్నది అని గగ్గోలు పెట్టేస్తున్నారు. ఒక కుటుంబం రెస్టారెంట్‌ కి వెళ్ళి భోజనం చేస్తే 2000 అవుతున్నది కానీ ఎవరికీ ఇబ్బంది అనిపించడం లేదు. స్టేట్‌ హైవే ల మీద టోల్‌ గెేట్‌లు పెట్టి వసూలు చేస్తుంటే మాత్రం కమ్మగా ఉంటున్నది. అసలు 10 ఖరీదు చేసే ఒక క్వార్టర్‌ విస్కీ ని 150 రూపాయాలకి అమ్ముతుంటే ఎవడూ ఆడగడు. కానీ దేశానికి అవసరం అయ్యే ఖర్చు మీద మాత్రం గొంతులు లేస్తాయి ఇది మన దౌర్భాగ్యం. ”
చమురు ధరలు ఎంత పెరిగినా జనం పట్టించుకోవటం లేదు అన్నది స్పష్టం. అప్పో సప్పో చేసి దేశం కోసం చమురు కొంటున్నవారు ఎక్కడా కనీసంగా నిరసన తెలిపిన పాపాన కూడా పోలేదు. ఒకవైపు రోడ్డు పేరుతో పెట్రోలు మీద సెస్‌ వేస్తున్నారు. మరో వైపు ద్విచక్ర వాహనాల మీద తప్ప మిగిలిన వాటన్నింటికీ ”తోలు” వసూలు చేస్తున్నారు. అయినా సరే నోరు మూసుకొని చెల్లించాల్సిందే ! గంగిరెద్దులం కదా మాట్లాడ కూడదు ! మనసులో కూడా ధరలు పెరిగాయి అనుకోకూడదు అన్నమాట ! ఎక్కడ నోరు తెరుస్తామో అని ముందుగానే మన నోరు మూయించేందుకు తిడుతున్నతిట్లు తప్ప ఇవి మరొకటి కాదు. ఒక వేళ ఎవరైనా చమురు ధరల మీద ఆందోళన చేశారో ! మీ వెనుక ఏపాకిస్ధానో, చైనానో ఉందనో, మీకు ఏదో ఒక ఉగ్రవాద సంస్ద నుంచి నిధులు అందుతున్నాయనో వెంటనే ముద్రవేస్తారు ! రైతులను చూస్తున్నాం కదా ! గంగిరెద్దులం కనుక తలెత్తటం లేదు !


వాట్సాప్‌లో తిరుగుతున్న మరో పోస్టు ఇరాన్‌కు చమురు బిల్లు చెల్లింపు గురించి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే చెబితే నిజం అవుతుందన్నగోబెల్స్‌ సూత్రాన్ని పక్కాగా అమలు జరుపుతున్నారు. యుపిఏ పాలనా కాలంలో చమురు ఖాతాలో ఇరవై లక్షల కోట్ల లోటు పెట్టారని, ఇరాన్‌కు అరవైవేల కోట్ల రూపాయల చెల్లింపు గురించి గత మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం దాచి పెట్టిందని, ఆ సొమ్మును ప్రభుత్వం వినియోగించుకుందని, మోడీ సర్కార్‌ మీద భారం మోపిందనే ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. వాస్తవం ఏమిటి ?
ఇరాన్‌పై పశ్చిమ దేశాల ఆంక్షలు అమలు జరుపుతున్న సమయంలో మన దేశంలోని మంగళూరు చమురు శుద్ది కర్మాగారం, హెచ్‌పిసిఎల్‌,ఐఓసి, హెచ్‌పిసిఎల్‌ మిట్టల్‌ ఎనర్జీ, ఎస్సార్‌ ఆయిల్‌ కంపెనీలు ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకున్నాయి. దానికి గాను నలభైశాతం మొత్తాన్ని మన రూపాయల్లో చెల్లించాయి. అయితే మన దేశం మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్దపడినప్పటికీ ఆంక్షల కారణంగా అంతర్జాతీయ బ్యాంకులు భయపడి సొమ్ము తీసుకొనేందుకు ముందుకు రాలేదు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది, ఆంక్షలను సడలించారు. టర్కీకి చెందిన హాక్‌బ్యాంక్‌ ముందుకు వచ్చింది, 6.5బిలియన్‌ డాలర్ల(మన కరెన్సీలో 43వేల కోట్లు) మొత్తాన్ని యూరోలలో చెల్లించాలని బ్యాంకు, ఇరాన్‌ కూడా కోరింది. ఆ మేరకు ప్రభుత్వం చెల్లించింది. అప్పటి వరకు ఆ సొమ్ము ఆయా కంపెనీల దగ్గరే ఉండిపోయింది తప్ప మన్మోహన్‌సింగ్‌ సర్కార్‌ వాడుకోలేదు, మోడీ సర్కార్‌ తన బొక్కసం నుంచి చెల్లించిందీ లేదు. అయితే ప్రభుత్వం ద్వారా చెల్లింపులు జరిగాయి. గత ప్రభుత్వం చమురు ఖాతాలోటు పూడ్చుకొనేందుకు గాను పన్ను భారం పెంచామని చెప్పుకొనేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేశారు. మనం గంగిరెద్దుల మాదిరి తలూపాలా ? నిజాల నిగ్గు తేల్చాలా ? మన గత చరిత్ర తలెత్తుకున్నది తప్ప తలూపింది కాదు మరి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల చేతుల్లో ముల్లు గర్రలు – ముళ్ల కంచెల ఏర్పాట్లలో మోడీ !

03 Wednesday Feb 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Budget 2021 Agriculture, Farmers agitations, India budget 2021-22, India budget-Farmers, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


రైెతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ శివార్లలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శాశ్వత ఆటంకాలు(బారికేడ్లు), ముళ్ల కంచెలు, గోడలు, రోడ్ల మీద ఇనుప ముళ్ల ఏర్పాట్లను చూస్తుంటే వారితో తాడోపేడో తేల్చుకొనేందుకే నరేంద్రమోడీ సర్కార్‌ సన్నద్దం అవుతున్న భావన కలుగుతోంది. అంతకు తెగిస్తారా ? రాజకీయ వ్యాపార లాభ నష్టాలను బేరీజు వేసుకొని తాత్కాలికంగా వెనక్కు తగ్గుతారా ? ముందుకు పోతే రాజకీయంగా రోజులు దగ్గర పడతాయి. వెనక్కు తగ్గితే మరిన్ని ఉద్యమాలు ముందుకు వస్తాయి. నరేంద్రమోడీ సంస్కరణల పులిని ఎక్కారు, ఏం చేస్తారో, ఏం జరగనుందో చూద్దాం !


గోముఖ వ్యాఘ్రాల నిజస్వరూపం అసలు సమయం వచ్చినపుడే బయటపడుతుంది. ఇక్కడ గోవు ప్రస్తావన తెచ్చినందుకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే క్షంతవ్యుడను. గోముఖ వ్యాఘ్రం అనే పదాన్ని సృష్టించిన వారికి వీరతాళ్లు వేస్తారో లేక మరణానంతరం దేశద్రోహ నేరం కింద శిక్షించమని సిఫార్సు చేస్తారో వారిష్టం. గోముఖ వ్యాఘ్రాల గురించి చెప్పటానికి ఈ పదం తప్ప ఆత్మనిర్భరత లేదా మేకిన్‌ ఇండియా, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ వంటి పదాలను సృష్టించిన వారు ప్రత్యామ్నాయం చూపేంత వరకు దాన్ని ఉపయోగించక తప్పటం లేదు.


ఆవులను మోసం చేసేందుకే వ్యాఘ్రాలు గోముఖాలతో వస్తాయి. ఇప్పుడు రైతులనే ఆమాయకులను మోసం చేసేందుకు అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అదే. అన్నీ మీరే చేశారు అని కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నట్లుగానే అన్నీ రైతుల కోసమే అనేట్లుగా రైతు ఉద్యమ నేపధ్యంలో బడ్జెట్‌ ప్రసంగం, భాష్యాలు సాగాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోత పెట్టటం ఒకటైతే పెట్రోలియం ఉత్పత్తులు, బంగారం, ఇతర దిగుమతులపై వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ది సెస్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతుల ఉత్పత్తులకు అధిక ధరలు వస్తాయని ఆర్ధిక మంత్రి చెప్పారు. మరొకటి వచ్చే ఏడాదిలో రూ.16.5లక్షల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు నిర్మలమ్మ చెప్పారు. చాలా మంది దీన్ని బడ్జెట్‌ కేటాయింపు అనుకున్నారు. బడ్జెట్‌ మొత్తమే 34.83లక్షల కోట్లయితే దానిలో దాదాపు సగం రైతులకు రుణాలుగా ఇస్తారా ? బ్యాంకుల నుంచి ఇప్పించే అప్పులు మాత్రమే అవి. మాట్లాడే మేక అంటూ ఎలా బురిడీ కొట్టిస్తారో అందరికీ తెలిసిందే. ఏప్రిల్‌ తరువాత వచ్చే నెల ఏదీ-జూన్‌కు ముందు వచ్చే నెల ఏదీ అని అడిగి మేకను గిల్లిలే ” మే ” అని అరుస్తుంది.రైతుల ఆదాయాలు పెంచే యత్నంలో భాగంగా ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులను జాతీయం చేసినప్పటి నుంచి రైతులకు ఇస్తూనే ఉన్నారు, అవేవీ రైతుల ఆదాయాలను పెంచలేదు. గత సంవత్సరం పదిహేను లక్షల కోట్లుగా నిర్ణయించారు, అంతకు ముందు పదమూడున్నర లక్షల కోట్లు ఉంది. ఈ లెక్కన శాతాల్లో చూస్తే వచ్చే ఏడాది తగ్గినట్లా – పెరిగినట్లా !


ఎంతైనా నిర్మలమ్మ తెలుగింటి ఆడపడుచు కనుక తక్కువే అని చెప్పి ఆమెను తప్పుపట్టదలచ లేదు. అధికారులు రాసి ఇచ్చింది చదువుతారు తప్ప ఆమె రాసి ఉండరు అనుకోవాలి. రైతులకు చేకూర్చిన ప్రయోజనాల గురించి నిర్మలా సీతారామన్‌ చాలా కబుర్లు చెప్పారు. బహుశా రాత్రి ఇంటికి వెళ్లి ఇదేంటబ్బా ఇలా మాట్లాడాను అనుకొని ఉంటారు. ఎందుకంటే గతంలో మాదిరి ప్రసంగం చదువుతుంటే బల్లలు చరచటాలు, ఆహా ఓహౌ అంటూ అధికార పక్ష ప్రశంశలూ లేవు. గతేడాది కంటే మొత్తం బడ్జెట్లో పెంపుదల కేవలం 33వేల కోట్ల రూపాయలు మాత్రమే. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ బడ్జెట్‌ తగ్గుతుంది అనే ఊహ ఆమెకు నిద్రను దూరం చేసి ఉండాలి.

స్వామినాధన్‌ కమిషన్‌ నివేదికను గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చెత్తబుట్టలో వేస్తే తాము బయటకు తీసి అమలు జరిపామని బిజెపి వారు చెబుతున్నారు. ఎంత మోసం !! ఇదే నరేంద్రమోడీ సర్కార్‌ దాన్ని అమలు జరపలేమంటూ సుప్రీం కోర్టుకు నివేదించిన విషయం జనం మరచి పోతారా ? 2019-20 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 130వేల కోట్లు చూపి ఖర్చు చేసింది రూ.94,251 కోట్లు మాత్రమే. గత ఏడాది 134వేల కోట్లు చూపి దాన్ని 117వేలకోట్లకు సవరించారు. తాజా బడ్జెట్‌లో 123వేల కోట్లను చూపి తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ప్రధాని కిసాన్‌ నిధి పేరుతో ఏటా ఆరువేల రూపాయలు ఇస్తున్నదానిని పదివేలకు పెంచుతారనే లీకు వార్తలు వచ్చాయి. దానికి బదులు గత ఏడాది ఉన్న 75వేల కోట్ల బడ్జెట్‌ను 65వేలకు కుదించారు. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పది వేల కోట్లు పెంచారని జబ్బలు చరుచుకున్నారు బానే ఉంది మరి ఈ తగ్గింపు సంగతేమిటి ? కొత్తగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి 900 కోట్లు కేటాయించామని చెబుతూనే వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పధకానికి 1700 కోట్లు, ధరల స్ధిరీకరణ నిధికి 500 కోట్ల కోత పెట్టారు. మొత్తంగా చూసినపుడు వ్యవసాయ సంబంధ బడ్జెట్‌ మొత్తాలను 8.5శాతం తగ్గించినట్లు తేలింది. అయినా రైతులకు ఎంతో మేలు చేశామని ప్రసంగంలో ఊదరగొట్టారు. నిజానికి వ్యవసాయ లేదా గ్రామీణ మౌలిక సదుపాయాల నిధులు కొత్తవేమీ కాదు, గతంలో ఉన్నవే. వాటి ద్వారా రైతులకు కలిగించిన లబ్ది ఏమిటో చెప్పరు.

కనీస మద్దతు ధరల కొనుగోలు ద్వారా రైతులకు 2020-21లో 2.47లక్షల కోట్లు చెల్లించామని ఆర్దిక మంత్రి గొప్పగా చెప్పారు.ఉత్తిపుణ్యానికే చెల్లించారా ? వరి, గోధుమలను తీసుకొని వాటికేగా చెల్లించారు. దీన్ని కూడా గొప్పగా చెప్పుకుంటారా ? ఫసల్‌ బీమా యోజన ఎంత మందికి కల్పించారని కాదు, ఎంత మందికి ఉపయోగపడిందనన్నది ముఖ్యం.2018-19లో 5.76 కోట్ల మందికి కల్పించామని చెప్పారు. మరుసటి ఏడాది లబ్దిదారులు 2.15 కోట్లన్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో లబ్దిపొందింది 70లక్షల మంది అని ఆర్ధిక సర్వేలో చెప్పారు. కిసాన్‌ నిధి కింద సన్న, చిన్నకారు రైతులు 9.43కోట్ల మంది ఆరువేల రూపాయల చొప్పున పొందారని చెబుతున్నారు. అంటే బీమా పధకం ఎంత మందికి ఉపయోగపడుతున్నదో దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు.ధాన్యసేకరణ ద్వారా లబ్ది పొందింది 2.2 కోట్ల మంది అన్నారు. ఇవన్నీ చెబుతున్నదేమిటి ? ప్రచారం ఎక్కువ ప్రయోజనం తక్కువ అనే కదా ! వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి లక్ష కోట్లు, పశుసంవర్ధక మౌలిక సదుపాయాల నిధి పదిహేను వేల కోట్ల రూపాయలు కరోనా ఉద్దీపన పేరుతో ఇప్పటికే ఉంది. దాన్నుంచి రుణాలుగా సూత్రరీత్యా మంజూరు చేసిన మొత్తం జనవరి నాటికి రూ.2,991 కోట్లు మాత్రమే.


భారత ఆహార సంస్ద(ఎఫ్‌సిఐ)కి జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధి(ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌) నుంచి రుణం తీసుకోవటాన్ని నిలిపివేస్తున్నామని ఆర్దిక మంత్రి తన ప్రసంగంలో ప్రకటించారు. ఇదేమీ విప్లవాత్మక నిర్ణయం కాదు. అసలు ప్రభుత్వ నియంత్రణ, నిధులతో నడిచే సంస్ద మరొక ప్రభుత్వ సంస్ద నుంచి రుణం తీసుకోవాల్సిన అగత్యం ఏమి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అతి పెద్ద సంస్కరణగా కార్పొరేట్‌ ప్రతినిధులు వర్ణించారు. నిజమే వారి లెక్కలు వారికి ఉన్నాయి. మనకు అర్ధం కావాల్సింది ఏమిటి ? ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ విధించిన షరతుల్లో భాగంగా రుణాలు, ద్రవ్యలోటు వంటి అంశాలకు సంబంధించి పరిమితులు విధించారు. వాటిని తప్పించుకొనేందుకు దొడ్డి దారులు వెతికారు. ప్రభుత్వ రుణాల మొత్తాన్ని తక్కువగా చూపేందుకు గాను ప్రభుత్వ సంస్ధలు తీసుకొనే రుణాలను విడిగా చూపుతున్నారు. రెండవది ఈ రుణం, దానికయ్యే ఖర్చును చూపి ఎఫ్‌సిఐని అసమర్ధమైందిగా చిత్రించి దాన్ని వదిలించుకొనే ఎత్తుగడ దీని వెనుక ఉంది. ఎఫ్‌సిఐలో అవినీతి లేదని కాదు, ఆ మాటకు వస్తే పోలీసు, మిలిటరీ కొనుగోళ్లలోనే అవినీతి జరుగుతోంది.


ఎఫ్‌సిఐ సేకరించే ఆహార ధాన్యాలు, పప్పు, నూనె గింజలను ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ ధరలకు వినియోగదారులకు అందించాల్సి ఉంది. ఈ సబ్సిడీ మొత్తాలతో పాటు సంస్ధ నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆహార సబ్సిడీ పేరుతో ప్రతి ఏటా అందచేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మొత్తాలను సకాలంలో విడుదల చేయని కారణంగా ఎఫ్‌సిఐకి నిధుల సమస్య ఏర్పడింది. దాంతో అవసరమైన మొత్తాలను తాత్కాలిక సర్దుబాటుగా ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ నుంచి రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సకాలంలో, పూర్తిగా సబ్సిడీ మొత్తాలను విడుదల చేయని కారణంగా బకాయిల మొత్తం పెరిగిపోయింది.ఈ మొత్తాలపై 8.8శాతం వడ్డీ చెల్లించాలి. ప్రభుత్వ చేతగాని తనం కారణంగా ఈ భారాన్ని కూడా జనానికి ఇచ్చే ఆహార సబ్సిడీ ఖాతాలో చూపుతున్నారు.2019-20 సంవత్సరానికి ఎఫ్‌సిఐకి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.3,17,905 కోట్లకు చేరింది. దీనికి గాను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.75వేల కోట్లు మాత్రమే.2020మార్చి 31నాటికి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌కు ఎఫ్‌సిఐ చెల్లించాల్సిన రుణం రు.2,54,600 కోట్లు. ఈ రుణానికి హామీదారు ప్రభుత్వమే అయినా ఈ మొత్తం ప్రభుత్వ రుణఖాతాలో కనిపించదు.2020-21బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ద్రవ్యలోటు మొత్తం రూ.7.96లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అయితే అప్పటికి ఎఫ్‌సిఐ అప్పు రూ.3,08,680 కోట్లుగా ఉన్నప్పటికీ బడ్జెట్‌లో సబ్సిడీ పేరుతో ప్రతిపాదించింది రూ.1.16లక్షల కోట్లు మాత్రమే. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రుణం లేదా ద్రవ్యలోటులోనూ చూపలేదు. ద్రవ్యలోటును ప్రభుత్వం అప్పులు చేయటం లేదా అదనపు కరెన్సీ ముద్రించటం ద్వారా పూడ్చుకొంటుంది. గతేడాది కరోనా కారణంగా ద్రవ్యలోటు పైన పేర్కొన్న రూ.7.96 నుంచి 18.49లక్షల కోట్లకు పెరిగింది. కరోనా సహాయచర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందచేసిన ఉచిత ఆహార ధాన్యాల కారణంగా ఎఫ్‌సిఐ సబ్సిడీ మొత్తం 2020-21లో పాతబకాయిలతో సహా రూ.4,22,618 కోట్లకు పెరిగింది. దీన్ని 281 శాతం పెరపుదలగా గొప్పగా చెప్పుకున్నారు. 2021-22 బడ్జెట్లో ఎఫ్‌సిఐ సబ్సిడీగా రూ.2,06,616 కోట్లను ప్రతిపాదించారు.

ఆర్ధిక మంత్రి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ రుణాలకు స్వస్ధి చెబుతున్నామని ప్రకటించటం వెనుక అప్పులన్నీ ఒక్కసారిగా తీర్చివేసి భారాన్ని తగ్గించటం అనుకుంటే తప్పులో కాలేసినట్లే ? రాబోయే రోజుల్లో ఎఫ్‌సిఐ సిబ్బందిని గణనీయంగా తగ్గించి ఆహార ధాన్యాల నిల్వల నిర్వహణ బాధ్యతను ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించబోతున్నారు. తెలివి తక్కువ వాడు ఇల్లు కట్టుకుంటాడు – తెలివిగల వాడు ఆ ఇంట్లో అద్దెకు ఉంటాడన్న లోకోక్తిని ఇక్కడ అమలు చేయబోతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన గోడవున్లను తక్కువ అద్దె రేట్లకు ప్రయివేటు వారికి అప్పగించనున్నారు. ఈ చర్య ద్వారా మిగిలే మొత్తంతో రైతులను ఉద్దరిస్తామని చెబుతారన్నది తెలిసిందే.

ఎఫ్‌సిఐ బకాయిలను తీర్చి దాన్నే పెద్ద సాయంగా చెప్పినట్లుగానే ఎరువుల సబ్సిడీని కూడా గొప్పగా చిత్రించారు. గత బడ్జెట్‌లో చూపిన రూ.71,309 కోట్లను రూ.1,33,947 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. మరి అంతపెంచిన వారు తాజా బడ్జెట్లో రూ.79,530 కోట్లకు ఎందుకు తగ్గించినట్లు ? పాత బకాయిలు తీర్చారు తప్ప బడ్జెట్‌ను పెంచలేదు. గత ఏడు సంవత్సరాలుగా ఎరువుల సబ్సిడీ 70-80వేల కోట్ల మధ్యనే ఉంటోంది. భారత ఆహార సంస్ధను వదిలించుకొనే చర్యల్లో భాగంగానే దానికి ఉన్న అప్పులన్నీ తీర్చేందుకు పెద్ద మొత్తంలో గతేడాది బడ్జెట్లో కేటాయించారు. అదే బాటలో ఎరువుల సబ్సిడీ విధానంలో కూడా పెద్ద మార్పును తలపెట్టారు. అందుకే కంపెనీలకు పాతబకాయిలను పూర్తిగా చెల్లించారు. ఇప్పుడు రైతులు ఎంత వినియోగిస్తే అంత మేరకు సబ్సిడీ పొందుతున్నారు. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం రాబోయే రోజుల్లో భూయజమానులకు నేరుగా సబ్సిడీ మొత్తాలను భూమిని బట్టి వారి ఖాతాల్లో వేయాలనే ప్రతిపాదన ఉంది. ఇది కొన్ని రాష్ట్రాల రైతాంగం మీద పెనుభారం మోపుతుంది. కౌలురైతులకు మొండి చేయి చూపుతుంది. ఎరువుల వాడకం తక్కువగా ఉన్న రైతులకు- ఎక్కువగా ఉన్నవారికీ ఒకే రకంగా పంపిణీ అవుతుంది. పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హెక్టారుకు సగటున 224.5కిలోల ఎరువులు(2018-19) వాడగా ఒడిషాలో 70.6, కాశ్మీరులో 61.9కిలోలు మాత్రమే ఉంది. అందువలన అందరికీ ఒకే పద్దతి అయితే పంజాబ్‌, హర్యానా రైతులు నష్టపోతారు. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరు సాగుతోంది గనుక మోడీ సర్కార్‌ సమయం కోసం చూస్తోంది తప్ప లేకుంటే నిర్మలమ్మ నోట ఇవి కూడా వెలువడి ఉండేవి. గతంలో బడ్జెట్ల సమయంలో కొత్త పన్నులు, విధాన నిర్ణయాలు ప్రకటించేవారు. ఇప్పుడు ఇతర రోజుల్లో చేస్తున్నారు. అందువలన ఎప్పుడైనా వెలువడవచ్చు.


అన్ని రంగాలలో పరిశోధన-అభివృద్ధికి పెద్ద పీటవేస్తేనే జనానికి, దేశానికి లాభం ఉంటుంది. వ్యవసాయ రంగంలో సంక్షోభానికి అనేక దేశాలతో పోల్చుకున్నపుడు మన దిగుబడులు, ఉత్పత్తుల నాణ్యత తక్కువగా ఉండటం ఒక కారణం. చైనా వంటి దేశాలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. మనం మాత్రం ఆవు మూత్రం-పేడ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం. పరిశోధనకు కేటాయిస్తున్నదే తక్కువ అయితే దానిలో ఆవు మూత్రంలో ఏముందో కనుగొనేందుకు మళ్లింపు ఒకటి. బేయర్‌ కంపెనీ ఏటా ఇరవైవేల కోట్ల రూపాయలు వ్యవసాయ పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే 2023 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని చెబుతున్న మోడీ సర్కార్‌ గతేడాది రూ.7,762 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.8,514 కోట్లు ప్రతిపాదించింది.


చివరిగా ఒక్క మాట. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను నిలువరించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలు, నేల మీద పాతిన ఇనుప ముళ్లు, పోలీసుల చేతుల్లో ఇనుపరాడ్లను చూస్తుంటే రైతాంగాన్ని అణచివేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారా అనిపిస్తోంది.సరిహద్దుల్లో శత్రువును ఎదుర్కొనేందుకు కూడా బహుశా ఇంత సన్నద్దత లేదేమో ! ఉంటే పాకిస్ధాన్‌ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రవేశించి మన సైనిక స్ధావరాల మీద దాడులు, సరిహద్దుల్లో సొరంగాలు తవ్వటం సాధ్యమై ఉండేది కాదు.


త్వరలో జరగబోయే నాలుగు ముఖ్యమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాదిన రగిలిపోతున్న రైతన్నలను చూసి గౌరవ ప్రదంగా వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటారా అనే ఆశతో ఉన్నవారు కూడా లేకపోలేదు. ఇప్పటికే రైతాంగం నిరాశతో ఉన్న అనేక మందిని ఉద్యమాలకు ఉద్యుక్తులను గావిస్తోంది. తమ మెడకు ఉరిగా మారనున్న సంస్కరణలకు వ్యతిరేకంగా కార్మికులు తదుపరి పోరుబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో రైతు యువకులకు కూడా ముల్లుగర్రల గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎద్దులు, దున్నలతో వ్యవసాయం బాగా తగ్గిపోయింది. వాటితో వ్యవసాయ చేసే సమయంలో దున్నకం వేగంగా సాగేందుకు సన్నటి వెదురు కర్రల చివరన ఇనుప ముల్లు వంటి ఇనుప మేకు గుచ్చి దానితో ఎద్దులు, దున్నల వెనుక భాగాల మీద సున్నితంగా పొడిచి వేగంగా కదిలేట్లు చేసే వారు. ఇప్పుడు మోడీ సర్కార్‌ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న ఇనుప ముళ్లను చూస్తుంటే ఇంకా ఉద్యమాలకు కదలకుండా ఉన్న రైతాంగాన్ని పొడిచి కదిలించేందుకు పూనుకున్నట్లుగా అనిపిస్తోంది. చరిత్రను చూసినపుడు తిరుగుబాట్లకు కారణం పాలకుల చర్యలే తప్ప ఎల్లవేళలా ప్రశాంతతను కోరుకొనే పౌరులు కాదు. ఇప్పుడూ అదే జరుగుతోందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బడ్జెట్‌ పదనిసలు1: కేంద్ర సెస్‌ల మోత – రాష్ట్రాల నిధుల కోత !

02 Tuesday Feb 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

cesses, India budget 2021-22, state finances, surcharges


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారు తన మూడవ, దేశ వందవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్‌ను రూపొందించేందుకు చేసిన కసరత్తు గతంలో ఎన్నడూ జరగలేదని ఆమె చెప్పారు. తీరా బడ్జెన్‌ను చూస్తే ఆరునెల్లు సాము గరిడీలు నేర్చుకొని పాతకుండలు పగలగొట్టారన్న సామెత గుర్తుకు వచ్చింది. దీన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు క్రియాశీల బడ్జెట్‌ అని వర్ణించారు.గతంలో ప్రతి ప్రధాని ప్రతి బడ్జెట్‌ను ఇలాగే పొగిడిన స్వంత డబ్బాల గురించి వేరే చెప్పనవసరం లేదు. గత బడ్జెట్‌ రూ.34,50,305 కోట్లుగా సవరిస్తే తాజా బడ్జెట్‌ను రూ.34,83,236 కోట్లతో ప్రతిపాదించారు. తేడా రూ.32,931 కోట్లు.విపరీతం గాకపోతే ఈ మాత్రానికి అంత ఆయాసపడాలా ?


బడ్జెట్‌లో చర్చించాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. ఈ బడ్జెట్‌లో కొట్ట వచ్చినట్లు కనిపించిన ఒక అంశానికి పరిమితం అవుదాం. కోవిడ్‌ సెస్‌ వేస్తారని బడ్జెట్‌కు ముందు వచ్చిన ఊహాగానాలకు తెరదించి కొత్త సెస్‌లను ముందుకు తెచ్చారు. అనేక పధకాలకు ప్రధాని అని తగిలించారు గనుక వీటికి కూడా ప్రధాని లేదా మోడీ సెస్‌లని పెట్టి ఉంటే అతికినట్లు ఉండేది. జనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఉదాహరణకు పెట్రోలు మీద లీటరుకు రూ.2.50, డీజిల్‌ మీద రూ.4.00ల కేంద్ర ఎక్సయిజ్‌ పన్ను తగ్గించి ఆ మేరకు సెస్‌ విధించారు. నిర్మలమ్మ చెప్పినట్లు ఈ మాత్రం దానికి అంత మల్లగుల్లాలు పడాలా ? ఇలాగే బంగారం దిగుమతుల మీద కస్టమ్స్‌ సుంకాన్ని పన్నెండు నుంచి ఏడు శాతానికి తగ్గించి రెండున్నరశాతం సెస్‌ విధించారు. ఇలాగే మద్యం మరికొన్నింటి మీద ఇలాంటి కసరత్తే చేశారు. వినియోగదారుల మీద పెద్దగా ప్రభావం పడదు. అని చెబుతున్నారు. అసలు పెంచిన పన్నులు తగ్గించటమే చిల్లి కాదు తూటు అన్నట్లు కొత్త పేరుతో అవే భారాలను కొనసాగిస్తున్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో ఎందుకు తీసుకున్నట్లు ? పనీపాటాలేక ఇలాంటి పిచ్చిపని చేస్తున్నారా ?


కానే కాదు, కేంద్ర ప్రభుత్వ తెలివి, ఇంకా చెప్పాలంటే అతి తెలివితో రాష్ట్రాలకు శఠగోపం పెట్టే వ్యవహారం. ఎలా ? దీని గురించి చెప్పుకోబోయే ముందు కేంద్ర ప్రభుత్వం కాశ్మీరుకు మాత్రమే వర్తించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి తన దుశ్చర్యను బయటపెట్టుకుంది. నిజానికి దాని బదులు ఆర్టికల్‌ 270ని రద్దు లేదా రాష్ట్రాల కోరికలకు అనుగుణంగా సవరించి ఉంటే అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అభినందించి ఉండేవి. సదరు ఆర్టికల్‌లో కేంద్రం-రాష్ట్రాలు పంచుకోవాల్సిన పన్నుల జాబితా ఉంది. వాటిలో సెస్‌లు, సర్‌ఛార్జీలు లేవు. అందువలన ఆ పేరుతో పన్ను విధిస్తే మోడీ భక్తులతో సహా జనం అందరి జేబులు ఖాళీ అవుతాయి గాని రాష్ట్రాలకు వాటిలో వాటా ఇవ్వనవసరం లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని గతంలో కాంగ్రెస్‌ పాలకులు ప్రారంభించిన రాష్ట్రాల వ్యతిరేక చర్యను ఇప్పుడు బిజెపి ఏలికలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు.

రాష్ట్రాలలో స్ధానిక సంస్ధలు పన్నులతో పాటు గ్రంధాలయ సెస్‌ను వసూలు చేస్తాయి. ఎందుకు ? గ్రంధాలయాలను ఏర్పాటు చేసి జనానికి పత్రికలు, పుస్తకాలను అందుబాటులోకి తేవటానికి. తెలంగాణాలో గత ఏడు సంవత్సరాలుగా ఆ సెస్‌ మొత్తాలతో ఒక్క పుస్తకమూ కొనలేదని పుస్తక ప్రచురణకర్తలు గ్రంధాలయ సంస్ధ చైర్మన్‌తో మొరపెట్టుకున్నారు. అంటే సదరు మొత్తాన్ని వేరే అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇది చట్టవ్యతిరేకం. ఇదే పని కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ ఖాతాల లావాదేవీలను తనిఖీ చేయగా 2018-19లో వసూలు చేసిన సెస్‌ మొత్తంలో 40శాతం మొత్తాన్ని దేనికోసం వసూలు చేస్తున్నారో దానికి కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వ ఖాతాకు మరలించుకుంటున్నట్లు తేలింది. ఇదీ చట్టవ్యతిరేకమే. సెస్‌ అంటే పన్ను మీద విధించే పన్ను. సర్‌ఛార్జీ కూడా ఇలాంటిదే.2018వరకు కేంద్ర ఇలాంటివి 42సెస్‌లను విధించింది. తరువాత మరికొన్నింటిని జత చేసింది. తొలి సెస్‌ అగ్గిపెట్టెల మీద తరువాత ఉప్పు మీద కూడా విధించారు. అంటే ఆయా పరిశ్రమల అభివృద్ధితో పాటు కొన్ని రంగాలలో పని చేసే కార్మిక సంక్షేమానికి కూడా కొన్ని సెస్‌లను విధిస్తున్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిని తెచ్చిన తరువాత సెస్‌లన్నీ దానిలో కలసిపోయాయి.ప్రస్తుతం 35వరకు ఉన్నాయి. వాటిలో ఎగుమతులు, ముడిచమురు, ఆరోగ్యం-విద్య, రోడ్డు మరియు మౌలిక సదుపాయాలు, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం, జాతీయ విపత్తు, పొగాకు, దాని ఉత్పత్తులు, జిఎస్‌టి పరిహార సెస్‌, ఆరోగ్య పరికరాల సెస్‌, తాజాగా బడ్జెట్‌లో ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల వంటివి ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2013లో ” చట్ట విధాన నిమిత్త కేంద్రం పేరుతో- విధి ” అనే లాభాలతో నిమిత్తం లేని ఒక మేథో కంపెనీని ఏర్పాటు చేసింది. అది తయారు చేసి పదిహేనవ ఆర్ధిక సంఘానికి ఇచ్చిన వివరాల ప్రకారం 2012-13 నుంచి 2018-19 వరకు మొత్తం కేంద్ర పన్ను ఆదాయంలో సెస్‌ మరియు సర్‌ఛార్జీల మొత్తం 7-2శాతాల నుంచి 11.9-6.4శాతాలకు పెరిగాయి. 2002 తరువాత అప్పటికి ఇవి గరిష్ట మొత్తాలు. నగదు మొత్తాలలో చెప్పాలంటే 2017-18 నుంచి 2018-19 మధ్య సెస్‌ మొత్తం 2.2(11.1శాతం) లక్షల రూపాయల నుంచి రూ.2.7లక్షలకు, సర్‌ఛార్జీ రూ.99,049(5శాతం) నుంచి రూ.1.4లక్షలకు పెరిగింది.1980-81 కేంద్ర పన్ను ఆదాయంలో సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా కేవలం 2.3శాతం మాత్రమే ఉండేది.


సెస్‌లు, సర్‌ఛార్జీలు పెరుగుతున్న కారణంగా తమ నిధుల వాటా తగ్గుతోంది కనుక ఆర్టికల్‌ 270ని సవరించి వీటిలో కూడా వాటా కల్పించాలని రాష్ట్రాలు ఆర్ధిక సంఘాన్ని కోరాయి. తాజా సమాచారం ప్రకారం పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం 42శాతం పన్ను ఆదాయాన్ని అందచేస్తున్నది. పదిహేనవ ఆర్దిక సంఘం సిఫార్సు ప్రకారం ఈ మొత్తం 41శాతానికి తగ్గింది. అయితే వివరాల్లోకి వెళ్లినపుడు వాస్తవంగా మొత్తం పన్ను ఆదాయంలో 35శాతం కంటే తక్కువే బదలాయిస్తున్నట్లు తేలింది. ఇంతే కాదు కాగ్‌ నివేదిక ప్రకారం 2018-19 సంవత్సరానికి లెవీల ద్వారా రూ.2.7లక్షల కోట్ల రూపాయలకు గాను కేవలం రూ.1.64లక్షల రూపాయలు మాత్రమే దేనికోసమైతే సెస్‌,సర్‌ఛార్జీలు విధించారో అందుకు కేటాయించారని పేర్కన్నది. మిగిలినవి కేంద్ర నిధిలో వేసుకున్నది. ముడి చమురు మీద వసూలు చేసిన రూ.1.25లక్షల కోట్ల రూపాయలను చమురు పరిశ్రమ అభివృద్దికి ఖర్చు చేయలేదు. అదే విధంగా ఐదు శాతంగా వసూలు చేస్తున్న ఆరోగ్య మరియు విద్యా సెస్సులో పరిమితంగా విద్యకు కేటాయించారు తప్ప ఆరోగ్యానికి లేదని కాగ్‌ పేర్కొన్నది. పన్నులలో ఇస్తున్న వాటా మాదిరి సెస్‌ మరియు సర్‌చార్జీగా వసూలు చేస్తున్న మొత్తాన్ని కూడా రాష్ట్రాలు ఆయా రంగాలలో మాత్రమే ఖర్చు చేసే విధంగా కేటాయించాలి. జిఎస్‌టిని ప్రవేశపెట్టినపుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఐదు సంవత్సరాల పాటు నిర్ణీత జిఎస్‌టి మొత్తం రాష్ట్రాలకు వసూలు కానట్లయితే ఆయా సంవత్సరాలలో ఎంత తగ్గితే అంత చెల్లించేందుకు కేంద్రం జిఎస్‌టి సెస్‌ వసూలు చేస్తున్నది.

2018లో కేంద్రం లీటరుకు రెండు రూపాయల పన్ను తగ్గించి ఆ మేరకు సెస్‌ను పెంచింది. వినియోగదారుడికి ధరలో ఎలాంటి మార్పులేదు గానీ రాష్ట్రాలకు వచ్చే నిధులు తగ్గిపోయాయి. రెండు రూపాయల్లో 42శాతం అంటే లీటరుకు రూ.0.84పైసలు తగ్గింది. ఇప్పుడు పెట్రోలుకు రూ.2.50, డీజిలుకు రూ.4.00 అదే విధంగా మార్చారు దీని ఫలితంగా కాత్తగా నిర్ణయించిన 41శాతం వాటా ప్రకారం పెట్రోలు మీద రూ.1.03, డీజిలు మీద రూ.1.64 రాష్ట్రాలకు తగ్గుతుంది. ఇదే పద్దతి మిగతా సెస్‌లకూ వర్తిస్తుంది. 2017 ఏప్రిల్‌-2020 మే మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజు పన్నులో పెట్రోలు మీద సెస్‌ మరియు సర్‌ఛార్జీ 150శాతం పెంచితే, డీజిలు మీద 350శాతాన్ని పెంచింది. ఇదే సమయంలో పన్ను మొత్తాలు 69 మరియు 57శాతాలు మాత్రమే పెరిగాయి. ఇలాంటి గారడీ కారణంగా గతేడాది కరోనా సమయంలో ఏప్రిల్‌-నవంబరు మధ్య చమురు వినియోగం 18శాతం తగ్గినప్పటికీ కేంద్రానికి వచ్చిన ఆదాయంలో ఎనిమిది శాతం మాత్రమే తగ్గగా రాష్ట్రాలకు 21శాతం పడిపోయింది.కేంద్రం చేస్తున్న ఇలాంటి గారడీలే పద్నాలుగ ఆర్ధిక సంఘం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 32శాతం వాటాను 42శాతానికి పెంచటంలో ప్రభావం చూపాయనే అభిప్రాయం ఉంది.


కేంద్రం ఇలా రాష్ట్రాలకు తొండి చేయి చూపుతున్న మొత్తం తక్కువేమీ కాదు. ఈ తొండి బిజెపి పాలిత రాష్ట్రాలకూ జరుగుతోంది. వివిధ రకాల కేంద్ర సెస్‌లు, సర్‌ఛార్జీల మొత్తం వసూలు 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో రూ.58,797 కోట్ల నుంచి 256శాతం పెరిగి రూ.2,09,577 కోట్లకు చేరాయి. 2020-21లో జిఎస్‌టి, విద్య, ఆరోగ్య సెస్‌లు మినహా మిగిలిన సెస్‌ల మీద రూ.3,04,485 కోట్లు వస్తుందని అంచనా వేశారంటే వాటి పెరుగుదల ఎంత వేగంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.జిఎస్‌టి సెస్‌ విషయానికి వస్తే డిసెంబరు చివరి నాటికి బడ్జెట్‌ అంచనాలో 53.5శాతం రూ.59,081 కోట్లు వసూలైంది. ఐదేండ్ల పాటు వసూలైన మొత్తం నుంచి అవసరమైనపుడు రాష్ట్రాలకు పరిహారంగా చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని గడువు మీరిన తరువాత రాష్ట్రాలకు పంచాలన్నది నిర్ణయం. ఒక్క సెస్‌లే కాదు సర్‌ఛార్జీల మొత్తం కూడా రూ.31,879 కోట్ల నుంచి రూ.1,42,530 కోట్లకు పెరిగింది. 2020-21లో రూ.1,76,277 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.
కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌ఛార్జీల వైపు మొగ్గుచూపుతున్న కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల బదలాయింపు మొత్తం క్రమంగా తగ్గిపోతోంది.2019 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2020లో బదిలీ అయిన నిధుల శాతం 36.6 నుంచి 32.4కు తగ్గిపోయింది. జిఎస్‌టి ఉనికిలోకి వచ్చిన తరువాత రాష్ట్రాల పన్నుల వనరులు పరిమితం అవటంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


రానున్న ఐదు సంవత్సరాలలో 15వ ఆర్ధిక సంఘం కేటాయింపులలో తెలంగాణాకు కేంద్ర పన్ను వాటా 2.47 నుంచి 2.1శాతానికి తగ్గింపు కారణంగా ఆరువేల కోట్ల రూపాయల నష్టం జరగనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు నివేదించినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విధమైన తగ్గుదల ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. కేంద్రం ఇదే మాదిరి పన్నుల స్ధానంలో సెస్‌లను పెంచుకుంటూ పోయినట్లయితే మరోసారి రాష్ట్రాల హక్కుల సమస్య ముందుకు రావటం అనివార్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

16 Saturday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

FIMI, iron ore, Iron Ore Exports, ISA, steel companies, steel prices in India, Trading with China



ఎం కోటేశ్వరరావు


దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒక పాట గుర్తుకు వస్తోంది. నేను పుట్టాను లోకం మెచ్చిందీ-నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది..నాకింకా లోకంతో పని ఏముంది… అలా సాగుతూ ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి… ఐ డోన్ట్‌ కేర్‌ ….అని బాగా ప్రాచుర్యం పొందిన ప్రేమనగర్‌ సినిమాలోని యాభై సంవత్సరాల నాటి పాట ఇది.


ఈ మధ్య కార్పొరేట్‌లు దేశభక్తులు, వారు లేకపోతే సెల్‌ఫోన్లు లేవు, ఉపాధి లేదు, అసలు మన జీవితమే లేదు, వారిని విమర్శించేవారు దేశద్రోహులు అనే ధోరణి పెరిగిపోతోంది. కార్పొరేట్లే అన్నింటినీ జనానికి అందుబాటులోకి తెచ్చాయి అన్నది వారి వాదన. అరే నీకు తెలుసా లండన్‌లో చిన్న పిల్లలు, చివరికి కూరగాయలు అమ్మేవారు, రోడ్లు ఊడ్చేవారు కూడా ఇంగ్లీషు మాట్లాడతారంట అంటే అవునా అని చిన్న తనంలో ఎబిసిడిలు నేర్చుకోవటానికి కష్టపడిన సమయంలో ఆశ్చర్యపోయిన రోజులు గుర్తుకు వచ్చాయి. అందువలన ఇప్పుడా స్దితి కాదు గనుక అన్నీ కార్పొరేట్లే చేశారు అనే దానితో ఏకీభవించినా లేకున్నా వారి మనోభావాలను గాయపరచకూడదు కదా ! కనుక కార్పొరేట్‌లను, వారికి వెన్నుదన్నుగా ఉన్న వారిని దేశభక్తులుగా పేర్కొంటున్నాను. అలాంటి దేశభక్తులు నువ్వు ద్రోహం చేస్తున్నావంటే అసలు నువ్వు పెద్ద ద్రోహివని వీధులకు ఎక్కుతున్నారు. జనానికి తెలియని విషయాలను చెబుతున్నారు. కోవాక్స్‌ పేరుతో విదేశాల్లో రూపొందించిన కరోనా వాక్సిన్‌ను మన దేశంలో తయారు చేస్తున్న సీరం సంస్ధ-స్వయంగా రూపొందించి తయారు చేస్తున్న భారత బయోటెక్‌ యజమానులు ఎలా అసలు విషయాలు చెప్పిందీ చూశాము. నీది హానిలేని నీటితో సమానమైందని ఒకరంటే, అసలు నీ వాక్సిన్‌తో వచ్చే దుష్ప్రభావాల గురించి నువ్వు దాచి పెట్టలేదా అని ఇద్దరూ గోదాలోకి దిగారు. మీ రెండు వాక్సిన్లను జనానికి అంటగట్టేందుకు మై హూనా అంటూ మీలో మీకు గొడవెందుకని తెరవెనుక ఉన్న కేంద్రంలోని పెద్దలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. దాంతో ఇద్దరం గొడవ పడకుండా ఎవరిది వారు అమ్ముకుందా అని రాజీపడ్డారు. జనం కళ్ల ముందే ఇది ఇద్దరు కార్పొరేట్‌ కరోనా వాక్సిన్‌ దేశభక్తులు-వారికి వెన్నుదన్నుగా ఉన్న వారి వాస్తవ కధ !


ఇటీవల సిమెంట్‌, ఇనుము ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వస్తున్నవార్తల గురించి తెలిసిందే. ముడి ఇనుప ఖనిజపు ధరలు రెట్టింపు అయ్యాయి. పదేండ్ల నాటి రికార్డులతో పోటీ పడ్డాయి. ఎగుమతిదార్లతో పాటు ఆ పేరు చెప్పి ఉక్కు ఉత్పత్తిదారులూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ ధరలు ఎంతకాలం ఉంటాయో తెలియదు. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే కార్పొరేట్‌ కంపెనీలు పోటీ పడి వినియోగదారుడి కాళ్లను నెత్తిమీద పెట్టుకుంటాయని కథలు చెప్పినవారు, దానికి ఉదాహరణగా సెల్‌ ఫోన్‌ కంపెనీలను ఉదాహరించే వారు గానీ మనకు ఎక్కడా కనిపించటం లేదు. కంపెనీలన్నీ కుమ్మక్కై ధరలు పెంచేశాయని ఏకంగా కేంద్ర మంత్రులే గగ్గోలు పెడుతున్నారు. ఇక గృహనిర్మాణ కంపెనీల దేశభక్తులు సిమెంట్‌, ఉక్కు కంపెనీలే కారణమని గగ్గోలు పెడుతుంటే మీరు మాత్రం తక్కువగా మీ నిర్మాణంలో మా సిమెంటు పాలెంత మీరు ఎంతకు అమ్ముతున్నారో ఎలా సొమ్ము చేసుకుంటున్నారో మాకు తెలియదా, లెక్కలు చెప్పమంటారా అని సిమెంట్‌ దేశభక్తులు ఎదురుదాడికి దిగారు. ఇది ఇంతటితో ఆగలా !


ఇనుప ఖనిజం తవ్వకం,ఎగుమతి-ఉక్కుతయారీ దేశభక్తులు కూడా తక్కువ తినలేదు. రాజకీయ నేతలు మనోభావాలను వాడుకుంటున్నపుడు మనం ఎందుకు తగ్గాలంటూ వారు కూడా నీ దేశభక్తి ఎంత అంటే నీది ఎంత అని దెబ్బలాడుకున్నారు. ఇద్దరూ తమ కోవెల అయినా ప్రధాని కార్యాలయంలో కొలువు తీరిన పెద్దాయనకు లేఖలు రాస్తున్నారు. తమ దేశభక్తిని శంకించటం ఉక్కుకు( ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌-ఐఎస్‌ఏ) తగని పని అని ఇనుపఖనిజం (భారతీయ ఖనిజ పరిశ్రమల ఫెడరేషన్‌-ఫిమి) మండిపండింది. ఒకవైపు చైనాతో వాణిజ్యం సాగిస్తున్న ఉక్కుగాళ్లు మేము ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేస్తున్నామంటూ మా దేశభక్తిని శంకించటం తగిని పని అని ఫిమి పేర్కొన్నది. లడఖ్‌ సరిహద్దులో తలెత్తిన వివాదం తరువాత చైనాతో లావాదేవీల విషయంలో అనేక ఆంక్షలు ఉండగా గనుల యజమానులు ఏప్రిల్‌-ఆగస్టు మధ్య 92శాతం ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేశారని ప్రధానికి ఉక్కు రాసిన లేఖలో మనోభావాన్ని గుర్తు చేసింది.

ఇనుప ఖనిజం నుంచి వేరు చేసిన ముడి ఇనుప గుళికలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్ద కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీకి మాత్రమే అనుమతి ఉంది. గత ఏడాది అక్టోబరు-నవంబరు మాసాల్లో 7.52 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని గనుల యజమానులు ఎగుమతి చేశారు. వాటిపై నిషేధం విధించాలంటున్న ప్రాధమిక ఉక్కు తయారీ(గుళికలు)దారులు గతేడాది అక్రమంగా 10.63 మిలియన్‌ టన్నులు ఎగుమతి చేశారని, ఇనుప ఖనిజానికి దేశంలో కొరత లేదని ఇది వెల్లడించటం లేదా అని ఫిమి వాదించింది. ఏప్రిల్‌-అక్టోబరు మధ్య ఎగుమతి చేసిన 33 మిలియన్‌ టన్నుల ఖనిజంలో 19మి.టన్నులు 58శాతం లోపు ఇనుము ఉండే ముడి ఖనిజం ఎగుమతి అయిందని, మన ఉక్కు కంపెనీలు 63శాతంపైగా ఇనుము ఉన్న ఖనిజాన్నే వినియోగిస్తాయని అందువలన తాము ఎగుమతి చేయటం వలన కొరత అనటం అర్ధం లేదని ఫిమి చెబుతోంది. అంతేనా గత ఆరునెలల్లో ఇనుప ఖనిజం ధరలు టన్నుకు రూ.1,950 నుంచి 4,110కి పెరిగితో మరోవైపు ఉక్కు రూ.16,700 నుంచి 51,590కి పెరగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది.ఉక్కు పరిశ్రమ యజమానులు తమ స్వంత లేదా స్దానిక గనుల నుంచి ఉన్నతస్దాయి ఖనిజాన్ని పొందుతూ ధరలు మాత్రం అంతర్జాతీయ స్ధాయిలో వసూలు చేస్తూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారని ఫిమి పేర్కొన్నది.

ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది ? ఎవరు చెబుతున్నది, ఏది నిజం ? జనం జేబుల ఖాళీ పచ్చినిజం. మేం ఇటు జనానికి దేశభక్తి , లవ్‌ జీహాద్‌, హిందూత్వను ఎక్కిస్తుంటాం, వారు వెంటనే ఈ మత్తునుంచి తేరుకోలేరు గనుక మీరు అటు చైనాతో ఎగుమతి వ్యాపారం ద్వారా, ఇటు జనానికి ధరలు పెంచి రెండు చేతులా లాభాలు పిండుకోండి, ఎన్నికల సమయంలో మా సంగతి చూడండి అని ఖనిజ,ఉక్కు కార్పొరేట్‌ దేశభక్తులకు చెప్పారన్నది అర్ధం కావటం లేదూ !


ఇలాంటి పరిస్ధితి ఉంటే ఏమౌతుంది ? రికార్డు స్ధాయిలో పెట్రోలు, డీజిలు ధరలు పెరిగాయి, ఏమైంది ? మోడీభక్తితో సమర్పించుకోవటంలా ? ఉక్కు ధరలు పెరగటం, తరచూ మారటం ఒక సమస్య అని వీల్స్‌ ఇండియా( ఆటోమొబైల్స్‌ పరిశ్రమకు అవసరమైన ఉక్కు విడిభాగాలు తయారు చేసే కంపెనీ) ఎండీ శ్రీవత్స రామ్‌ అంటున్నారు. వాణిజ్య పధకాల్లో అనిశ్చితి ఏర్పడుతుంది, మోడీగారి ఎగుమతి పధకమైన మేకిన్‌ ఇండియా మూలనపడుతుంది. ప్రాజెక్టులు, ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతాయి, నిరుద్యోగం పెరుగుతుంది,కొనుగోలు శక్తి తగ్గుతుంది. దరిద్రం పెరుగుతుంది. ఇంతకంటే ఏం జరగదు. కార్పొరేట్‌ లాభాలకు కరోనా కాలంలోనే ఢోకా లేదు గనుక ఇప్పుడు ఏమీ కాదు.


చైనా ప్రపంచమంతటి నుంచి చేసుకుంటున్న వస్తు దిగుమతులు 2020 సంవత్సరాన్ని కాపాడాయని, ఇదొక చారిత్రక పాఠం, హెచ్చరికగా తీసుకోవాలని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రపంచమంతటా గిరాకీ పడిపోతే ఒక పెద్ద దేశంగా సహజ వనరులను కొనుగోలు చేసిన తీరు చరిత్ర. అయితే చైనా తాజాగా విడుదల చేసిన డిసెంబరు గణాంకాలను చూస్తే దాని కొనుగోళ్లు తగ్గిపోయే అవకాశాలు వెల్లడయ్యాయి. ఇది వస్తుమార్కెట్‌కు పొంచి ఉన్న ముప్పుగా పరిణమిస్తున్నారు. నవంబరుతో పోలిస్తే డిసెంబరులో దిగుమతులు తగ్గిపోయాయి. వీటిలో చమురు, రాగితో పాటు ఇనుప ఖనిజం కూడా ఉంది. చైనా వారు ఆకలితో మాడుతున్నారు గనుక మన దేశం నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేవారు మనకు కోకొల్లలుగా కనిపిస్తారు. ఆకలితో మాడేవారు ఇనుపఖనిజం ఏం చేసుకుంటారు అంటే ఏం చెబుతారో తెలియదు.

ఇక మన ఇనుప ఖనిజ ఎగుమతి దేశ భక్తులు ఖజానాకు చెల్లించాల్సిన 7,08,000 కోట్ల రూపాయల డ్యూటీ ఎగవేసి చైనాకు ఎగుమతులు చేశారని, 61 సంస్ధల నుంచి ఆ మొత్తాలను వసూలు చేయాలని సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజం దాఖలైంది. న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ కేంద్ర ప్రభుత్వానికి, ఎగుమతి సంస్ధలకు నోటీసులు జారీ చేసి చేసింది. డ్యూటీని ఎగవేసేందుకు తప్పుడు టారిఫ్‌ కోడ్‌ను చూపి 2015 నుంచి ఇప్పటి వరకు అక్రమాలకు పాల్పడిన సంస్దలలో ఎస్సార్‌ స్టీల్‌, జిందాల్‌ స్టీలు మరియు పవర్‌ కంపెనీ ఉన్నాయని, 30శాతం డ్యూటీ వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షించి ఈ అక్రమాలకు పాల్పడిన వారి మీద నిర్ణీత వ్యవధిలోపల విచారణ పూర్తి చేయాలని వారి నుంచి ఎగవేసిన డ్యూటీ, జరిమానా వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. ఇప్పుడున్న విధాన ప్రకారం ముడిఖనిజంలో 58శాతం లోపు ఇనుము ఉంటే ఎలాంటి పన్నులు లేకుండా చైనా, జపాన్‌, కొరియా వంటి దేశాలకు ఎగుమతులు చేయవచ్చు. అంతకు మించితే 30శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.


దేశంలో కొరత ఏర్పడిన కారణంగా ఇనుప ఖనిజ ఎగుమతులపై స్వల్పకాలం పాటు నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నవంబరు చివరివారంలో చెప్పారు. సిమెంట్‌, ఉక్కు ఉత్పత్తిదారులు కూటములుగా ఏర్పడి ధరలు పెంచారని మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. దీని వలన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రోడ్ల వంటి మౌలికసదుపాయాల ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోతుందన్న విషయం తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సిందేమంటే నాణ్యత తక్కువ ఉన్న ఖనిజం నుంచి కూడా గరిష్టంగా ఇనుము ఉత్పత్తి చేయగల నైపుణ్యం చైనాతో సహా విదేశాల్లో ఉందన్నది ఒక అంశం. టెక్నాలజీలో ఎంతో ముందున్నాం అని చెప్పుకొనే మనం ఎందుకు వినియోగించటం లేదు ? అభివృద్ది గురించి చైనా చెప్పే లెక్కలను నమ్మలేం అని చెప్పే నిత్య శంకితులు ప్రతి తరంలోనూ శాశ్వతంగా ఉంటారు. అదే నిజమైతే మన దేశం నుంచి ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేసి వారేమి చేసుకుంటారు అంటే నోరు విప్పరు. 2020లో కూడా గణనీయంగా దిగుమతులు చేసుకున్నదంటే అక్కడ కరోనాను కట్టడి చేసి సాధారణ కార్యకలాపాలను పునరుద్దరించటం, డిమాండ్‌ పెరగటమే కారణం. ప్రపంచ ఉక్కు సమాఖ్య సమాచారం ప్రకారం గతేడాది జనవరి-నవంబరు మధ్య 64దేశాల్లో ఉక్కు ఉత్పత్తి 1.3శాతం తగ్గితే చైనాలో 5.5శాతం పెరిగింది. చైనా తీసుకున్న ఉద్దీపన చర్యలు కూడా దీనికి దోహదం చేశాయి. అనేక దేశాలు కూడా ఉద్దీపన ప్రకటించినా అక్కడ డిమాండ్‌ పెరగలేదు.


నీతి, దేశభక్తి, దేశద్రోహం వంటివి ఇప్పుడు మన దేశంలో బాగా అమ్ముడు పోతున్న సరకులు. అంటే లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అవి ఎంతకాలం అనేది వేరే విషయం. చైనాను వ్యతిరేకించటం దేశభక్తుడి విధి. చైనాను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవటం నేటి మహత్తర కర్తవ్యం అంటూ సామాజిక మాధ్యమంలో, సంప్రదాయ మాధ్యమాల్లో మనం వింటున్నామా-చూస్తున్నామా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా కుమ్మరిస్తున్నారు. గతేడాది జూన్‌లో లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో భారత-చైనా సైన్యం మధ్య జరిగిన సంఘటనలో మన సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ఇది మరీ ఎక్కువైంది. మధ్యలో మన నరేంద్రమోడీ కౌగిలింతల భాగస్వామి అమెరికా ట్రంపు కంపు కారణంగా కాస్త తగ్గింది గానీ లేకపోతేనా…..రేటింగ్స్‌ కోసం టీవీ ఛానల్స్‌ ఇంకా రెచ్చిపోతుండేవి.

చైనా వస్తువుల దిగుమతులు నిలిపివేసి చైనీయులను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చెప్పటాన్ని దేశభక్తిగా చిత్రిస్తున్నారు. చైనాతో ఇనుప ఖనిజం ఎగుమతులకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవు.అడ్డా మీదకు వచ్చి మాకు ఇనుప ఖనిజం ఎంతకు సరఫరా చేస్తారు అని ఎప్పటికప్పుడు బేరమాడి చైనీయులు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్‌లో మన అవసరాలకు ఖనిజాన్ని నిల్వ చేసుకోవటం అవసరమా లేక చైనా నుంచి వచ్చే నాలుగు డాలర్లు ముఖ్యమా ? చైనా మాదిరి ఉక్కు తయారీ మనకు చేతకాదా ? మనం ఎగుమతులు చేయలేమా ? వారికి అవసరమైన ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసి మరింతగా బలపడేట్లు చేస్తున్నట్లా కాదా ? చైనాకు ఎగుమతులు చేయటం ఎందుకు ? దాంతో మన దేశంలో ఉక్కు ధరలు పెరగటం ఎందుకు ? జనం గగ్గోలు పెడుతుంటే అచేతనంగా చూస్తూ కూర్చోవటం శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్న బిజెపికి మేలు చేస్తుందా ?తనదైన ప్రత్యేక ఆర్ధిక శాస్త్రం(మోడినోమిక్స్‌)తో దేశాన్ని నడిపిస్తున్న నరేంద్రమోడీ గారికి ఈ చిన్న లాజిక్కు తెలియదా లేక కార్పొరేట్ల చేతిలో బందీ అయ్యారా ? అనేక మంది అంటున్నట్లు ఆయనకు గడ్డం, జులపాల మీద శ్రద్ద పెరిగిపోయి దేశం మీద తగ్గిందా ? దేశ భక్తి నీతులు కేవలం సామాన్యులకేనా ? కార్పొరేట్లకు ఉండవా ? అసలేం జరుగుతోంది ? అర్ధం కావటం లేదా, కానట్లు నటిస్తున్నారా ? సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ! ఎంతకాలమో !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !

11 Monday Jan 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, STATES NEWS

≈ Leave a comment

Tags

Farmers agitations, India - 1991 Country economic memorandum, India-World Bank, indian farmers, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరూతూ ప్రారంభమైన ఆందోళన సోమవారం నాటికి 48 రోజులు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేయాలని ఉన్నత న్యాయ స్ధానం అదే రోజు సలహాయిచ్చింది, లేనట్లయితే తాము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే చేసిన చట్టాల ప్రకారం రెండువేల మంది రైతులు ఒప్పందాలు చేసుకున్నారని, వాటిని నిలిపివేస్తే వారికి నష్టం జరుగుతుంది కనుక నిలిపివేయటం కుదరదని, నిలిపివేసే అధికారం కోర్టులకు లేదని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ వాదించారు. అయితే 2018లో మహారాష్ట్ర చేసిన చట్టాన్ని నిలిపివేసిన విషయాన్ని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఉటంకించింది.


సుప్రీం కోర్టు ముందు ఉన్న ఈ కేసు ఏ విధంగా పరిష్కారం అవుతుంది, కోర్టు హితవును నరేంద్రమోడీ సర్కార్‌ పట్టించుకుంటుందా ? ఒక వేళ ఏదో ఒక కారణాన్ని పేర్కొని ఆందోళనను విరమించాలని కోర్టు గనుక తీర్పు ఇస్తే రైతులు విరమించుకుంటారా ? పరిష్కారం ఏమిటి ? ఇలా అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఏదైనా జరగవచ్చు. తమ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల మేళ్ల గురించి చెప్పేందుకు హర్యానా బిజెపి ప్రభుత్వం కర్నాల్‌ జిల్లా కైమ్లా గ్రామంలో ఆదివారం నాడు ఒక సభను ఏర్పాటు చేసింది.కిసాన్‌ పంచాయత్‌ పేరుతో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పాల్గొనాల్సిన ఆ సభ జరగకుండా రైతులు అడ్డుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లే వారి మీద పోలీసులు నీటిఫిరంగులు, బాష్పవాయు ప్రయోగం జరిపి అడ్డుకోవాలని చూసినా రైతులు వెనక్కు తగ్గలేదు. సభా ప్రాంగణం, హెలిపాడ్‌ను స్వాధీనం చేసుకోవటంతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తాను సవరించిన చట్టాలను ఎలాగైనా అమలు జరిపేందుకు కేంద్రం- వాటిని ఎలాగైనా సరే అడ్డుకోవాలని రైతులు పట్టుదలగా ఉన్నారని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో జరుపుతున్న తతంగం ఈనెల 15వ తేదీన కూడా జరగనుంది. రైతులను రహదారుల మీద నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి తాజాగా మరొక పిటీషన్‌ వేశాడు. ఢిల్లీలో షాహిన్‌బాగ్‌ ఆందోళన కారులను తొలగించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రైతుల విషయంలో కూడా అమలు జరపాలని కోరాడు. సుప్రీం కోర్టు ఏమి చేయనుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఇక్కడ న్యాయమూర్తులు, న్యాయవ్యవస్ధకు దురుద్ధేశ్యాలను అంటకట్టటం లేదు, ఈ రచయితకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. అయితే గతంలో వివిధ ఉద్యమాల సమయంలో ఇలాంటి పిటీషన్లే దాఖలైనపుడు వివిధ కోర్టుల న్యాయమూర్తులు విచారణ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ తీర్పుల విషయానికి వస్తే ఆందోళన చేస్తున్నవారికి వ్యతిరేకంగానే వచ్చాయి. రైతుల విషయంలో కూడా అదే పునరావృతం అవుతుందా, రైతులు అంగీకరిస్తారా, ప్రభుత్వం బలప్రయోగానికి పూనుకుంటుందా? అన్నవి ఊహాజనిత ప్రశ్నలే.


కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అని పదే పదే ప్రశ్నలు వేస్తున్నా సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్‌ మొండి పట్టుదలను అర్ధం చేసుకోలేము. దేశానికి కాంగ్రెస్‌నుంచి విముక్తి కలిగించామని పదే పదే చెప్పుకుంటుంది బిజెపి, కానీ దాని విధానాలను మరింత పట్టుదలతో అమలు జరుపుతోందన్నది నమ్మలేని నిజం.


ప్రపంచబ్యాంకుతో ఒప్పందాలు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, గతంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా బ్యాంకు పధకాలను తమవిగానే నమ్మించేందుకు నానా పాట్లు పడ్డాయి, పడుతున్నాయి. ఆక్రమంలోనే అందుకే పలు కమిటీలను వేసి సిఫార్సులను ఆహ్వానించాయి. వాటిలో అనేకం ఉంటాయి, కానీ తమకు అనుకూలమైన వాటినే తీసుకుంటారు, మిగిలిన వాటి గురించి అసలు ఏమాత్రం తెలియనట్లు అమాయకంగా ఫోజు పెడతారు.


2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్‌ సేన్‌ కమిటీ, హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీ నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అని దానిలో అడిగారు.ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల సారాంశం ఇలా ఉంది. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, విపత్తు యాజమాన్య కార్యక్రమాలు ఎఫ్‌సిఐ పనిగా ఉండకూడదు. వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి, నిల్వపద్దతులను నవీకరించాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్‌ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.


దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్‌ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్‌లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.

గతంలో ప్రపంచ షరతులలో భాగంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి సర్కార్‌ ముందుకు తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా సాగిన పెద్ద ఉద్యమం గురించి తెలిసినదే.డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్‌ సేన్‌, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్‌ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది.


ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్‌ మెమోరాండం( రిపోర్ట్‌ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్‌ 12న బహిర్గతం చేశారు. వీటిలో ఉన్న అన్ని అంశాలను ఇక్కడ ఉటంకించటం సాధ్యం కాదు కనుక ముఖ్యమైన సిఫార్సుల గురించే చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో గతేడాది జూన్‌లో ఆర్డినెన్స్‌, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు.

1991లో అమలు ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాలు పారిశ్రామిక రంగంలో తీవ్ర సమస్యలకు దారి తీయటంతో మిగిలిన సిఫార్సుల అమలుకు తటపటాయించటం, ఒక్కొక్కదాన్ని అమలు జరుపుతున్నారు తప్ప వెనక్కు తగ్గటం లేదు. వాటిలో భాగమే ప్రయివేటీకరణ. ముందు నష్టాలు వచ్చే కంపెనీలని జనానికి చెప్పి సరే అనిపించారు. అవి పూర్తయిన తరువాత ప్రభుత్వాలు పాలనా వ్యవహారాలు చూడాలే తప్ప వ్యాపారాలు చేయకూడదు అనే సన్నాయి నొక్కులతో లాభాలు వచ్చేవాటిని ఇప్పుడు వదిలించుకోచూస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. తాజా వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు.


మన దేశీ కార్పొరేట్‌లు, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలలో వివిధ రూపాలలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. వాటి అవసరాలకు అనుగుణ్యంగా ప్రభుత్వాలు మన మార్కెట్లను తెరుస్తున్నాయి. వాటి ద్వారా ఉపాధి రాదా, దేశానికి ప్రయోజనం కలగదా అనే వాదనలు ముందుకు వస్తున్నాయి. ఒకసారి అమలు జరిపి చూస్తే పోలా అంటున్నారు. కరవులు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా లబ్ది కలిగే వారు ఉన్నారు. అంతమాత్రాన వాటిని కోరుకుంటామా ? నిప్పును ముట్టుకున్నా, నీళ్లలో మునిగినా, కొండ మీద నుంచి దూకినా చస్తామని తెలిసినా ఒకసారి ఎలా ఉంటుందో చూస్తే పోలా అని ఎవరైనా అంటే ఆపని చేస్తారా ? విదేశీ పెట్టుబడులు, ద్రవ్యపెట్టుబడులు పెట్టేవారికి – వినియోగించుకొనే దేశాలకూ లబ్ది చేకూరే విధంగా ఉంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. స్ధూలంగా చెప్పాలంటే చైనాలో జరుగుతున్నది అదే. మన దేశంలో సామాన్యుల కంటే ధనికులు, కార్పొరేట్లే బాగుపడుతున్నారు. సంపదతారతమ్యాలు పెరుగుతున్నాయి. అందుకే వ్యతిరేకత.ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ?


అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్‌, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి.( అనివార్యమైన స్దితిలో కేంద్ర ప్రభుత్వం 1991లో జిడిపిలో 0.85శాతంగా ఉన్న ఎరువుల సబ్సిడీని 2008-09నాటికి 1.52శాతానికి పెంచాల్సి వచ్చింది. ఆ తరువాత చూస్తే ” రైతు బంధు ” నరేంద్రమోడీ గారి ఏలుబడి ప్రారంభంలో 2014నాటికి 0.6శాతానికి తగ్గింది.2016లో 0.5, తరువాత 2019వరకు 0.4శాతానికి పడిపోయింది. తరువాత సంవత్సరం కూడా కేటాయింపుల మొత్తం పెరగని కారణంగా జిడిపిలో శాతం ఇంకా తగ్గిపోతుంది తప్ప పెరగదు.)
బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.( తాజాగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్దలు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది కనుక, ఇప్పటికే ఉన్న ప్రయివేటు బ్యాంకులకు, వాటికి ప్రాధాన్యతా రంగాలు ఉండవు)
సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.
డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.
ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.
ఎఫ్‌) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్‌ ఛార్జీలను కూడా పెంచాలి.
2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.
ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.
సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు.
డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి.

పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్‌ శక్తులు గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ వ్యవహరించిన తీరేమిటో తెలుసు గనుక మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము. ఇక్కడ మోడీగారు లేదా బిజెపి, కేంద్రప్రభుత్వ చర్యలను గుడ్డిగా బలపరుస్తున్న ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఒక్కటే. భారత రైతు ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే కల్మషం, కాపట్యం లేని వ్యక్తి కావచ్చుగానీ ఆమాయకుడు కాదు ! జిమ్మిక్కులు ప్రదర్శిస్తే చెల్లవు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిసిఐకి వచ్చే నష్టం- పత్తి రైతులకు ఇస్తున్న సబ్సిడీ అట !

08 Friday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

CCI, Cotton Corporation of India, cotton farmers, Cotton MSP, cotton subsidies


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతాంగం ఉద్యమం సాగిస్తున్నది. రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ తీరును గమనించి ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ప్రదర్శనకు రైతులు సన్నద్దం అవుతున్నారు.వారికి వ్యతిరేకంగా పాలకులు, కార్పొరేట్‌లు, వత్తాసుగా వాస్తవాలను మూసిపెట్టాలని గోడీ మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.మూసిపెడితే పాచిపోతుందన్నది తెలిసిందే. వాస్తవాలను వక్రీకరిస్తున్నకొద్దీ ఏదో ఒక రూపంలో కొన్ని అంశాలైనా వెలుగు చూస్తున్నాయి. కేంద్రం ఎందుకు మొండిగా ఉందన్న చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది.


ఉపాధి కల్పిస్తున్నాయనే పేరుతో కార్పొరేట్లకు పాలకులు ఎన్నో రాయితీలు ఇస్తున్నారు. మరోవైపు వాటికి రక్షణ కల్పించాలంటూ విదేశీ దిగుమతులపై పన్నులు, ఇతర ఆంక్షలతో కాపు కాస్తున్నారు. నిజంగా మేలు జరిగితే ఇవ్వండి, ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాకులను కొట్టి గద్దలకు వేయవద్దని చెప్పటం తప్పు కాదు కదా ! చైనా నుంచి దిగుమతుల మన కొర్పొరేట్లు, పారిశ్రామికవేత్తల లాభాలకు గండిపెడుతున్నాయంటూ అనేక ఉత్పత్తులను నిలిపివేశారు. దానికి గాల్వాన్‌ లోయ ఉదంతాన్ని సాకుగా చూపి దేశభక్తి మేకప్‌ వేశారు. చైనా ఉత్పత్తులు నరేంద్రమోడీ హయాంలో ఇబ్బడి ముబ్బడి అయ్యాయన్నది వేరే విషయం. కరోనాకు ముందే పారిశ్రామిక, వాణిజ్య రంగాలు దిగజారటం ప్రారంభమైంది. నిలకడగా ఉన్నది వ్యవసాయ రంగమే. దాన్నుంచి లాభాలు పిండుకోవాలన్న కార్పొరేట్ల కన్ను పడింది కనుకనే వ్యవసాయ చట్టాలను సవరించారు. రైతుల ఉత్పత్తులకు ఆంక్షలు లేని స్వేచ్చా మార్కెట్‌ కబుర్లు చెబుతున్నారు. అన్ని రక్షణలు ఉన్నకారణంగానే కార్పొరేట్‌లు ఎక్కడా రోడ్ల మీద కనిపించరు.నోరు మెదపరు. రైతులు మాత్రం వీధులకు ఎక్కాల్సి వస్తోంది. గళం విప్పక తప్పటం లేదు.


వరుసగా రైతులకు ఉన్న రక్షణలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. సబ్సిడీలను ఎత్తివేస్తున్నారు. కార్పొరేట్లకు లేని ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు రైతుల విషయాలకు మాత్రమే గుర్తుకు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల పేరుతో 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి 50శాతం ఉన్న పన్నును తగ్గించి కేవలం 15శాతంతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువకే గిట్టుబాటు అవుతున్న కారణంగా వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపున మన దేశం నుంచి బంగ్లాదేశ్‌కు మన కనీస మద్దతు ధరల కంటే తక్కువకు బంగ్లాదేశ్‌కు మన వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,850 కాగా ఎగుమతి ద్వారా తాము 1500 నుంచి 1550వరకు పొందుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వారు వివిధ రాష్ట్రాలలో రైతుల నుంచి 12 నుంచి 1400 మధ్య కొనుగోలు చేస్తున్నారు(డిసెంబరు 25 మనీకంట్రోలు వార్త). దేశమంతటా ఇదే స్ధితి, ఏ ఒక్క ప్రయివేటు వ్యాపారీ వచ్చి కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. ఏ రైతూ తన పంటను పరాయి రాష్ట్రాలకు తీసుకుపోయి తనకు గిట్టుబాటు ధరకు అమ్ముకొనే పరిస్దితీ లేదు. ఎగుమతి చేస్తున్నా ధరలు రావటం లేదన్నది చేదునిజం.


2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో 2019 ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం మొక్కజొన్నలు, గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు.చైనా నుంచి వస్తున్న పారిశ్రామిక వస్తువులకు అది వర్తించదా ? రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? పప్పుధాన్యాల రైతులను ప్రోత్సహిస్తున్నామని ఒక వైపు చెబుతారు. మరోవైపు వాటి మీద ఉన్న దిగుమతి పన్నును 30 నుంచి 20శాతానికి తగ్గించారు.అది విదేశీ రైతులకు ఉపయోగపడింది తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా విదేశీ పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై పన్ను పదిశాతం తగ్గించారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఉనికిలోకి రాక ముందు ఉనికిలో ఉన్న పన్నులు, వాణిజ్యాలపై సాధారణ ఒప్పందం(గాట్‌) ఉరుగ్వే దఫా చర్చలకు ముందు వ్యవసాయం లేదు. ఆ దఫా చర్చలలోనే ముందుకు తెచ్చారు. దాని ప్రకారం ధనిక దేశాలు తమ రైతాంగానికి ఇచ్చే ఎగుమతి రాయితీలు, సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలి. ఇదే సమయంలో మిగిలిన దేశాలు దిగుమతులపై ఉన్న పన్నులు, ఇతర ఆంక్షలను ఎత్తివేయాలి, విదేశాలకు మార్కెట్లను తెరవాలి, రైతాంగానికి మద్దతు ధరల, ప్రజాపంపిణీ వ్యవస్దలను నిలిపివేయాలి. అయితే అమెరికా, ఐరోపా యూనియన్‌ ధనిక దేశాలు గ్రీన్‌ బాక్స్‌ పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి. మిగతా దేశాలు ఒప్పందాన్ని అమలు చేయాలని వత్తిడి చేస్తున్నాయి. ఆ వివాదమే గత రెండు దశాబ్దాలుగా దోహా దఫా ఒప్పందం కుదరకపోవటానికి కారణం.


బిల్‌క్లింటన్‌ హయాంలో రైతాంగానికి 1530 కోట్ల డాలర్ల మొత్తాన్ని నేరుగా అందించారు. ఎలా అంటే టన్ను సోయా ధర మార్కెట్లో 155 డాలర్లు ఉంటే ప్రభుత్వం 193 డాలర్లు చెల్లించింది. వాటిని మన వంటి దేశాలకు ఎగుమతి చేయటంతో మన రైతాంగం నాశనమైంది. అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికా వత్తిడికి లొంగిపోయి 2001లో 719 వస్తువులపై పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేశారు. గత ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా రైతులకు 4600 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇచ్చాడు. అయితే వీటిలో ఎక్కువ మొత్తం బడా రైతులకు, కార్పొరేట్లకు చేరాయన్నది మరో అంశం. ఒక శాతం కంపెనీలు 26శాతం పొందితే, పదిశాతం పెద్ద బడా రైతులు, కంపెనీలకు 78శాతం దక్కాయి.


తాజాగా డిసెంబరు చివరి వారంలో ప్రపంచ పత్తి సలహా కమిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఒక్క పత్తికే 2018-19లో వివిధ దేశాలు ఇచ్చిన పలు రకాల రాయితీల మొత్తం 570 బిలియన్‌ డాలర్ల నుంచి 2019-20లో ఈమొత్తం 800కోట్ల డాలర్లకు పెరిగింది.గడచిన నాలుగు సంవత్సరాలలో పత్తి ధరలు తగ్గిన కారణంగా సబ్సిడీల మొత్తం 450 నుంచి 800 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతకు ముందు సంవత్సరాలలో గరిష్టంగా 1,700 కోట్లు చెల్లించిన రికార్డు ఉంది.2010-11 సంవత్సరాలలో ప్రపంచ పత్తి మార్కెట్లో ధర పౌండుకు(454 గ్రాముల గింజలు తీసిన దూది) 165 సెంట్లు పలకగా 2019-20లో 72సెంట్లకు తగ్గింది. ప్రస్తుతం 80 సెంట్లకు అటూ ఇటూగా కదలాడుతోంది.2019-20లో వివిధ దేశాలు ఇచ్చిన రాయితీల మొత్తాలు ఇలా ఉన్నాయి. ఆయా దేశాల పత్తి ఉత్పత్తిని సబ్సిడీ మొత్తాలతో భాగిస్తే సెంట్ల వారీ చూస్తే కొన్ని దేశాల స్ధానాలు మారతాయి.
దేశం×× కోట్ల డాలర్లు ×× పౌనుకు సెంట్లలో
చైనా×××× 471.1 ××××× 37
అమెరికా×× 202.2 ××××× 21
భారత్‌×××× 59 ××××× 4.4
టర్కీ ×××× 23.2 ××××× 13
గ్రీస్‌ ××××× 20.7 ××××× 32
మాలి ×××× 8.2 ××××× 12
స్పెయిన్‌ ××× 6.7 ××××× 46
కోట్‌ డి ఐవరీ × 3.8 ××××× 13
బుర్కినాఫాసో×× 2.4 ××××× 6
మన దేశ సబ్సిడీ విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన పత్తికి చెల్లించిన మొత్తం- దాన్ని తిరిగి మిల్లర్లకు లేదా ఎగుమతులు చేయగా వచ్చిన మొత్తాలకు ఉన్న తేడాను సబ్సిడీగా పరిగణిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలలో సిసిఐ నామ మాత్రపు కొనుగోళ్లు జరిపింది. కొన్ని సంవత్సరాలలో దానికి ఎలాంటి నష్టాలు లేవు. అందువలన దీన్ని ప్రాతిపదికన తీసుకుంటే సబ్సిడీ అసలు లేనట్లే అని చెప్పవచ్చు. ఉదాహరణకు 2017-18 పత్తి సంవత్సరంలో సిసిఐ 66,313 టన్నులు కొనుగోలు చేయగా 2018-19లో 1,81,970 టన్నులు, 2019-20లో (గడచిన ఐదేండ్లలో రికార్డు స్ధాయిలో) 17.9లక్షల టన్నులు సిసిఐ కొనుగోలు చేసింది. 2018-19లో సిసిఐకి వచ్చిన నష్టం 4.6 కోట్ల డాలర్లు, కాగా 2019-20లో 2020 నవంబరు నాటికి 12లక్షల టన్నులు విక్రయించగా మిగిలిన మొత్తం నిల్వ ఉంది. అయితే అమ్మినదాని మీద వచ్చిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని మొత్తంగా నష్టం 59 కోట్ల డాలర్లు ఉండవచ్చని అంతర్జాతీయ పత్తి సలహా సంస్ద తన నివేదికలో పేర్కొన్నది. దీన్ని సబ్సిడీగా పరిగణించింది.నిజానికి దీన్ని పత్తి రైతులకు ఇచ్చిన సబ్సిడీగా పరిగణించాలా లేక మిల్లర్లకు, ఎగుమతులకు ఇచ్చిన రాయితీలు మరియు సిసిఐ అవినీతి, అక్రమాల మొత్తంగా చూడాలా ?


పత్తితో పాటు ఇతర కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలను సబ్సిడీలుగా అమెరికా తదితర దేశాలు పరిగణిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసులు దాఖలు చేశాయి. ఆ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఓయిసిడి సంస్ధ ప్రకటించిన వివరాల ప్రకారం అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌ ధనిక దేశాల రైతాంగ ఆదాయాల్లో 40 నుంచి 65శాతం మొత్తాలు ఆయా ప్రభుత్వాలు అందచేస్తున్న సబ్సిడీల ద్వారా సమకూరుతున్నవే.
ఈ ఏడాది పత్తి రైతాంగం కనీస మద్దతు ధరలను పొందటం లేదని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలు వెల్లడించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో క్వింటాలుకు ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయవరకు తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా సిసిఐ కేంద్రాలకు పెద్ద మొత్తంలో పత్తి వస్తోంది. కొనుగోలును తగ్గించేందుకు అనేక నిబంధనలు పెట్టటంతో పాటు పెద్ద మొత్తంలో ఒకేసారి తీసుకు రావద్దని, ఈ ఏడాది సెప్టెంబరు వరకు ( ప్రతి ఏటా అక్టోబరు ఒకటవ తేదీన పత్తి సంవత్సరం ప్రారంభమై మరుసటి ఏడాది సెప్టెంబరులో ముగుస్తుంది) కొనుగోళ్లు జరుపుతూనే ఉంటామని సిసిఐ ప్రకటించింది. చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది సాధ్యమేనా ? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా ? పంజాబ్‌లో ప్రతి రోజూ మండీలకు 50వేల క్వింటాళ్ల పత్తి వస్తుంటే తాము రోజుకు పన్నెండున్నరవేలకు మించి కొనుగోలు చేసేది లేదని సిసిఐ చెబుతున్నదని ప్రయివేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదలి వేస్తున్నదని అకాలీదళ్‌నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆమె కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రైతులు భయపడుతున్నది న్యాయమే అని ఈ పరిణామం వెల్లడిస్తున్నదన్నారు.

పత్తికి కనీస మద్దతు ధరలు ఉంటాయని తెలిసిన రైతాంగం 25శాతంలోపే అని, ప్రధానంగా పత్తి పండించే రాష్ట్రాలలో వారు 12 నుంచి 27శాతంగా ఉన్నారని పరిశోధకులు తెలిపారు. తెలిసిన వారిలో కూడా 34.34 నుంచి 37.5 శాతం మాత్రమే సేకరణ సంస్ధలకు విక్రయిస్తున్నారని తేలింది. అందుకే కాస్త ఎక్కువ తెలిసిన ప్రాంతాల రైతులు ముందుగా మేలుకున్నారు, తెలియని వారు తెలుసుకొని రంగంలోకి దిగుతారు. వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఒరగబెడతామని చెబుతున్న పాలకులు, వారికి వంత పాడుతున్న మేధావులూ ఈ అంశాల గురించి ఏమంటారో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

డిసెంబరు 27: నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ -నిరసనగా రైతుల తాలీ బజావ్‌ !

25 Friday Dec 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi agitation, Narendra Modi on Farmers


ఎం కోటేశ్వరరావు
” సానుభూతి పరులుగా దగ్గరకు చేరి రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్న వారికి భవిష్యత్‌లో జనం పాఠం చెబుతారు ” ఈ మాటలు చెప్పింది పోతులూరి వీరబ్రహ్మంగారు కాదు. మన ప్రధాని నరేంద్రమోడీ కొలువులోని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పని ఎవరు చేస్తే వారికి నిజంగానే జనం బుద్ది చెబుతారు. అది మోడీ నాయకత్వంలోని బిజెపి నేతలకూ, వారి ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీల పెద్దలూ, ఇతర భజన బృందం ఎవరైనా కావచ్చు. డిసెంబరు 25నాటికి రైతాంగ నిరవధిక ఆందోళనకు నెల రోజులు నిండాయి. మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని ” సుపరిపాలనా రోజు ”గా పాటిస్తూ రైతులు దుష్పరిపాలనా చర్యగా పరిగణిస్తున్న వ్యవసాయ చట్టాలను సమర్ధించుకొనేందుకు నరేంద్రమోడీ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఒక విడత పంపిణీ పేరుతో ఆరు రాష్ట్రాల రైతులు కొందరిని పోగుచేసి ప్రధాని నరేంద్రమోడీ, ఆయన గణం రైతుల ఉద్యమం మీద దాడి చేశారు. ఎవరి పాత్రను వారు రక్తికట్టించారు. మరోవైపు నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ వినిపించే సమయంలో జన్‌కీ బాత్‌ను జనం దృష్టికి తెచ్చేందుకు డిసెంబరు 27వ తేదీన తాలీ బజావ్‌ (చప్పట్లు కొట్టటం) కార్యక్రమానికి రైతులు పిలుపు నిచ్చారు. అంబానీ-అదానీ ఉత్పత్తులను బహిష్కరించటం, ఇంకా మరికొన్ని కార్యక్రమాలను రైతు సంఘాలు ప్రకటించాయి.


సంస్కరణల పేరుతో జనానికి వ్యతిరేకమైన చర్యలకు పూనుకోవటం నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. అంతకంటే ముందు అనేక దేశాల్లో పాలకులు అదేపని చేశారు. జనం చేత పాఠాలు చెప్పించుకొని ఇంటిదారి పట్టారు. నిజానికి ఇది తెలుసుకొనేందుకు ఇతర దేశాలకు పోనవసరం లేదు. ఏ నినాదాలు ఇచ్చినా పేర్లు ఏమి పెట్టినా కాంగ్రెస్‌ పాలనలో జరిగిందంతా ప్రజావ్యతిరేకమైన చర్యలే, అనుసరించినవి దివాలాకోరు విధానాలే.దీని అర్ధం నూటికి నూరూ అవే అని కాదు. బేరీజు వేసినపుడు త్రాసు ఎటు మొగ్గిందన్నదే గీటు రాయి. కొన్ని క్రతువుల సమయంలో మేకలు, గొర్రెలు, ఇతర పశువులను బలి ఇవ్వబోయే ముందు వాటిని ఎన్నడూ లేని విధంగా మేత పెట్టి, శుభ్రం చేసి, అలంకరించి, పూజలు మరీ చేసి బలి ఇస్తారు. ఇక్కడ బలి క్రతువు ముఖ్యం. ప్రభుత్వ విధానాలూ, సంక్షేమ చర్యలు కూడా అంతే.


నరేంద్రమోడీ గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ 50ఏండ్లలో చేయలేని వాటిని తాము ఐదేండ్లలో చేశామని ప్రాసకోసం ప్రసంగాలు చేశారు. అంతవేగంగా పని చేస్తున్నవారికి జనం మరో యాభైయేండ్లు అవకాశం ఇవ్వరు. అందువలన కేంద్రమంత్రి తోమర్‌ చెప్పినట్లుగా రైతులు తమకు మద్దతు ఇచ్చిన వారికా లేదా తమను ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు, కమిషన్‌ వ్యాపారుల సొమ్ముతీసుకొని కిరాయి ఉద్యమం నడుపుతున్నారని నిందించిన బిజెపికా ఎవరికి పాఠం చెబుతారో తొందరపడనవసరం లేదు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పంపిణీని గతంలో ఎన్నడూ ఇలా ఆర్భాటంగా జరపలేదు. ఇదేదో అదనపు మొత్తం అని రైతులు భ్రమ పడేవిధంగా హడావుడి చేసి రైతులతో మాట్లాడే పేరుతో ప్రధాని, మంత్రులు రైతు ఉద్యమం మీద విరుచుకుపడ్డారు. పోనీ కొత్త విషయాలు ఏమైనా చెప్పారా ? పాడిందే పాడరా అన్నట్లుగా వేసిన నిందనలే వేశారు, పసలేని వాదనలే చేశారు. వ్యవసాయ చట్టాల మీద వెనక్కు తగ్గేది లేదని చెప్పకనే చెప్పారు. నిజానికి కేంద్రానికి, బిజెపికి చిత్తశుద్ది ఉంటే మరోసారి చర్చలకు ఆహ్వానించి ఇలా చేయటాన్ని ఏమంటారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎదుటి వారికి ఇంకా మండుతుంది అన్న విషయం తెలిసిందే.


కొన్ని పార్టీలు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తమ రాజకీయ అజెండాను ముందుకు తెస్తున్నాయని ప్రధాని చెప్పారు. నిన్నగాక మొన్న బీహార్‌ ఎన్నికల సందర్భంగా తమకు ఓటేస్తే కరోనా వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పి కరోనాను కూడా రాజకీయం చేసిన పార్టీ నేత మోడీ. ఇలా చెప్పటానికి ఆయనకు 56 అంగుళాల ఛాతీతో పాటు దానితో పాటు పెంచుకుంటున్న బారు గడ్డం, జులపాలు ఉండటమే అన్నది స్పష్టం. రైతు ఉద్యమాన్ని సమర్ధిస్తున్న ఏ పార్టీ అయినా ఆ పేరుతో ఎక్కడైనా ఓట్లడిగిందా ? కేంద్ర ప్రభుత్వం తర్కబద్దమైన పరిష్కారానికి సిద్దంగా ఉందని, ఇతర సమస్యలేవైనా ఉంటే చెప్పాలని మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి రైతు సంఘాలకు లేఖ రాశారు. తర్క వితర్కాలు జరపాల్సిన సర్వోన్నత ప్రజాప్రతినిధుల సభ పార్లమెంటులో అలాంటి అస్కారం ఇవ్వకుండా ఆమోదతతంగం జరిపిన ప్రభుత్వం, కరోనా పేరుతో ఏకంగా శీతాకాల సమావేశాలనే రద్దు చేసిన పాలకులు తర్కానికి తావిస్తారంటే నమ్మేదెలా ? అసలు దానిలో తర్కం ఏముంది. సావిత్రీ నీపతి ప్రాణంబుదక్క వరాలు కోరుకో అన్నట్లుగా చట్టాల గురించి మాట్లాడుతున్నారు.


గతంలో రైతులు అనేక సమస్యలను ముందుకు తెచ్చారు. ఇతర సమస్యలుంటే రైతులు సందర్భం వచ్చినపుడు చెబుతారు. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్‌గా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత చేకూర్చాలని చేసిన సిఫార్సును ఇప్పుడెందుకు తిరస్కరిస్తున్నారో చెప్పేందుకు నోరెత్తరా ? కౌలు మొత్తాన్ని కూడా మద్దతు ధర నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోవాలన్న స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సు సంగతి తెలియని అమాయకుల్లా ఫోజు పెడతారా ? వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే ఎత్తుగడలో భాగంగా ఎవరికైనా విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి రాయితీ ఇవ్వకూడదన్న ప్రతిపాదన గురించి అసలేమీ ఎరగని నంగనాచిలా ప్రవర్తిస్తారా ? రైతులు ఏడుదశాబ్దాల క్రితం మట్టి పిసుక్కొనే స్ధితిలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేరు, అంత అమాయకులు కాదని తెలుసుకుంటే మంచిది.

కేంద్ర మంత్రులు ఏమి మాట్లాడుతున్నారో,ఎందుకు మాట్లాడుతున్నారో తెలియటం లేదు. ముందు ఒక ఏడాది పాటు అమలు జరగనివ్వండి, ఫలితం లేదనుకుంటే అప్పుడు సవరించుకుందాం అని రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ సెలవిచ్చారు. దీని అర్ధం ఏమిటి ? వారు చేసిన దాని మీద వారికే నమ్మకం లేకపోవటం, రైతుల ఉద్యమాన్ని నీరు కార్చే వాదన. ఈ ప్రయోగం చేసేందుకు ఆర్డినెన్స్‌, చర్చ కూడా లేకుండా పార్లమెంటులో ఆమోద ముద్రకోసం ఎందుకు తాపత్రయపడినట్లు ? ఎవరి మెప్పుకోసం ఇది ? కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అవాస్తవాలు చెబుతున్నారని, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా చెప్పారు. అవేంటో నిజమేమిటో చెప్పకుండా మీ బావ రైతుల భూమిని ఆక్రమించుకున్నాడు, మీరు మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా ఆ మాట అంటే కేంద్ర మంత్రి సూటిగానే ఆరోపించారు. నిజంగా అదే జరిగితే చర్య తీసుకోండి-దానికి రైతుల సమస్యకు సంబంధం ఏమిటి ?


తాము అమలు జరుపుతున్న రైతు అనుకూల విధానాలను 2019 కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదా అని మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ నడుపుతున్న ఉద్యమం కాదు, అందువలన ఆ పార్టీ ఏమి చెప్పిందన్నది రైతులకు అనవసరం. ఆ పార్టీని రైతులు ఇందుకే తిరస్కరించారని, రైతులకు అనుకూలంగా ఉంటారని బిజెపిని ఎన్నుకున్నారని అనుకోవచ్చు కదా ! కాంగ్రెస్‌ సంస్కరణల గురించి చెప్పింది తప్ప చట్టాలు ఇలా ఉంటాయని నమూనాను ప్రదర్శించలేదే. పోనీ ఇలాంటి చట్టాలను తెస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళికలో చెప్పి ఉంటే ఫలితాలు ఎలా ఉండేవో బిజెపి నేతలు ఆదిత్య 369 చూస్తే మంచిది.


గతంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు రైతులను వారి పాటికి వారిని వదలి వేశారని ప్రధాని చెప్పారు. నిజమే, వారు వదలివేశారు. కానీ మోడీగారు తమను తీసుకుపోయి కార్పొరేట్‌ బకాసురులకు అప్పగిస్తున్నారని కదా ఇప్పుడు రైతులు భయపడుతోంది. అసలు మార్కెట్‌ కమిటీలే లేని కేరళలో అధికారంలో ఉన్న వారు ఫొటోల కోసం పంజాబ్‌ రైతులతో చేతులు కలుపుతున్నారని మరొక విసురు. అసలు కేరళలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల వ్యవస్ధ లేదు.బీహార్‌లో ఉన్న కమిటీలను రద్దు చేయటాన్ని బిజెపి సమర్ధించింది. దేశంలో మిగతా చోట్ల ఉన్నవాటిని నామమాత్రం చేసేందుకు, పనికిరాకుండా చేసేందుకు పూనుకున్న పెద్దలు కేరళలో మార్కెట్‌ యార్డుల కోసం ఎందుకు ఆందోళన చేయటం లేదని ప్రశ్నించటమే అసలు రాజకీయం. అనేక రాష్ట్రాలలో అనేకం లేవు. కేరళ స్ధానిక సంస్ధలకు ఇచ్చిన అధికారాలు మరొక రాష్ట్రంలో లేవని అందరూ చెబుతున్నారు. ఆరు సంవత్సరాలుగా, అంతకు ముందు ఒక దఫా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం లేదా పార్టీ ఎన్నడైనా కేరళలో మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎందుకు అడగలేదో చెప్పగలవా ?


కేంద్రం సవరించిన మూడు చట్టాలు కేవలం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు సంబంధించినవే కాదు, అదొక ముఖ్య అంశం మాత్రమే, కనుక ప్రధాని ఢిల్లీ నుంచి గల్లీ స్ధాయికి దిగి విమర్శ చేశారనుకోవాలి. చట్టాలలోని అంశాలు రైతులకు హానికరం కనుక కేరళ ప్రభుత్వం ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ను కోరింది. రాష్ట్ర మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్దంగా గవర్నర్‌ తిరస్కరించారు. కేరళ గురించి చెప్పే ముందు ఎవరైనా కొన్ని విషయాలు గమనంలో ఉంచుకోవాలి. గతేడాది అక్కడి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,695 రూపాయలు చెల్లించగా ఈ సంవత్సరం రూ.2,748 రూపాయలకు పెంచి రైతుల నుంచి కొనుగోలు చేసింది. కేంద్రం నిర్ణయించిన ధర రూ.1,868 కాగా అదనంగా ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ రూ.880 అదనంగా ఇస్తోంది. ఎక్కడైనా ఇంతధర ఇస్తున్నారా ?( ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలకు కొనుగోలు చేస్తే అందుకయ్యే వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని, ఎఫ్‌సిఐకి ఇవ్వాల్సిన కోటా మేరకే మద్దతు ధరకు తీసుకుంటారని, మిగతా సేకరణతో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు 18న ఎఫ్‌సిఐ చైర్మన్‌కు పంపిన ఫైల్‌లో స్పష్టం చేసింది.) మార్కెట్‌ కమిటీలు లేవని, మాకేమీ సంబంధం లేదని, నిధుల కొరత అనిగానీ వదలివేయలేదు, రైతాంగాన్ని ఆదుకోవటం ముఖ్యం.


నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్ని రైతువ్యతిరేక చర్యలు తీసుకున్నా తమను ఆదుకొనే వామపక్ష ప్రభుత్వం ఉందన భరోసా అక్కడి రైతుల్లో ఉండవచ్చు. అయినా ఆందోళన చేస్తున్న రైతాంగానికి మద్దతు తెలపటం తప్పెలా అవుతుంది. అన్నింటికీ మించి కేరళలో ప్రధానమయిన పంటలు వరి, గోధుమలు కాదు.అక్కడి భౌగోళిక పరిస్ధితుల్లో తోట పంటలు, టీ, కాఫీ, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాల పంటలు ఎక్కువ. వాటికోసం దేశమంతటి నుంచి వ్యాపారులే రావటం లేదా తమ ఏజంట్లను ఏర్పాటు చేసుకొని కొనుగోలు చేస్తారు. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ దిగుమతి, పన్ను విధానాలు రైతాంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ వ్యవసాయ మార్కెట్‌ యార్డులు లేవు. మోడీ సర్కార్‌ చెబుతున్నదాని ప్రకారం కార్పొరేట్‌ సంస్దలు లేదా వ్యాపారులు పోటీపడి అక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అలాంటి ప్రత్యేక లావాదేవీలేమీ అక్కడ లేవు. కేరళ లేదా యార్డులను రద్దు చేసిన బీహారుకు గానీ ప్రయివేటు పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. రబ్బరు పారిశ్రామికవేత్తల వత్తిడి కారణంగా పన్నుతగ్గింపుతో రబ్బరు దిగుమతులు రబ్బరు ధరల పతనానికి, ఖాద్య తైలాల దిగుమతులతో కొబ్బరి ధర పతనం, వేరేదేశాల నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న సుగంధ ద్రవ్యాల కారణంగా వాటి ధరలు పడిపోతున్నాయి. ఇవేవీ మార్కెట్‌ యార్డుల పరిధిలోని అంశాలు కాదు. అందుకే అక్కడి రైతులకు మార్కెట్‌ యార్డులు ఉన్నాయా లేవా అన్నదాని కంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే ముఖ్యం. కేంద్రానికి చిత్తశుద్ది, శ్రద్ద ఉంటే నరేంద్రమోడీ వాటి గురించి మాట్లాడి ఉంటే విస్వసనీయత ఉండేది.


తాను తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల ఫలితాలు రావటం ఆరంభమైందని నరేంద్రమోడీ చెబుతున్నారు. రైతుల్ని నమ్మమంటున్నారు. నెల రోజుల క్రితం క్వింటాలు బంగాళాదుంపలను రూ.3,400కు అమ్ముకున్న రైతులు ఇప్పుడు 700కు అమ్ముకుంటున్నారు. మొక్కజొన్నల కనీస మద్దతు ధర 1850 ఉండగా కొన్ని చోట్ల నాలుగైదు వందలకు తక్కువకు రైతులు అమ్ముకుంటున్నారిప్పుడు.పత్తి కూడా తక్కువకే ఆమ్ముకున్నారు. ఈ కారణంగానే కనీస మద్దతు ధరలకంటే ఎవరూ తక్కువకు కొనకూడదు, కొంటే నేరం అనే విధంగా చట్టం చేయాలని రైతులు అడుగుతున్నారు. నిజానికి ఇప్పుడు చేసిన చట్టసవరణలు నిజంగా కార్పొరేట్లు,ఇతర వ్యాపారుల మధ్య పోటీని పెంచి రైతాంగానికి కనీస మద్దతు ధరల కంటే ఎక్కువే వస్తే రైతుల కంటే ఎక్కువ లబ్ది పొందేది ప్రభుత్వాలే. పంటల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టనవసరం లేదు, వాటిని నిలువ చేసేందుకు గోదాములతో పని లేదు, సిబ్బందీ అవసరం ఉండదు. కనీస మద్దతు ధరలకంటే మార్కెట్లో ధరలు తక్కువ ఉన్నపుడే, చట్టబద్దత కల్పించిన చట్టంతో పని ఉంటుంది తప్ప ఎక్కువ ఉంటే దాని అమలు కోసం ఏ రైతూ ముట్టడి ఉద్యమాలకు పూనుకోరు కదా ? అలాంటపుడు కనీస మద్దతు ధరల చట్టం కుదరదు అని కేంద్రం అడ్డం తిరిగి ఎందుకు మాట్లాడుతోంది ? పోనీ ఆటంకం ఏమిటో చెప్పాలి కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నవంబరు 26 సార్వత్రిక సమ్మె – దేశాన్ని మాంద్యంలోకి నెట్టిన నరేంద్రమోడీ సర్కార్‌ !

23 Monday Nov 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

India recession, modinomics, November 26 India general strike 2020


ఎం. కోటేశ్వరరావు


ఒక వైపు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సంస్కరణల పేరుతో ప్రజావ్యతిరేక చర్యలను వేగిరపరచేందుకు, సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకుంది. మరోవైపు దానికి ప్రతిఘటన కూడా రూపుదిద్దుకుంటోంది. దానిలో భాగంగానే నవంబరు 26వ తేదీన దేశవ్యాపిత సమ్మెకు కార్మికులు-కర్షకులు సిద్దం అవుతున్నారు. దీనిలో ఎంత మంది పాల్గొంటారు, ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేదాని మీద ముందు లేదా తరువాత గానీ ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకోవచ్చు. ప్రజావ్యతిరేక చర్యలకు జనం నిరసన గళం ఎత్తుతున్నారా లేదా అన్నది ప్రధాన అంశం. మహానదులు సైతం ప్రారంభంలో పిల్లకాలువల మాదిరే ఉంటాయన్నది తెలిసిందే. ప్రజా ఉద్యమాలైనా అంతే. రెండు సీట్లు ఉన్న స్దాయి నుంచి దేశంలో అదికారాన్ని సంపాదించే స్దితికి ఎదిగామని బిజెపి చెబుతున్నది. దీనికి పరిస్ధితులు అనుకూలించటమే కారణం. కేంద్రంలో, రాష్ట్రాలలో అదే పార్టీ పాలనలో జన జీవనం దిగజారటం ఎక్కువ అవుతున్న కొద్దీ ఇదే సూత్రం ప్రజా ఉద్యమాలకు మాత్రం ఎందుకు వర్తించదు ?
సంస్కరణలతో దిగజారిన పరిస్ధితులను మెరుగుపరుస్తామని బిజెపి చెబుతోంది. అవి రెండు రకాలు, ఒకటి సామాన్యులకు అనుకూలమైనవి, రెండవది కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించేవి. ఇప్పటి వరకు అనుసరించిన విధానాలు జనానికి అనుకూలంగా లేవు కనుకనే కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందే దేశ అభివృద్ధి రేటు దిగజారింది, అంటే సామాన్యుల బతుకులు దెబ్బతిన్నాయి. జనం పేరుతో కార్పొరేట్లకు అనుకూల విధానాలను ఎంత త్వరగా గ్రహిస్తారన్నదాని మీద ప్రజా ఉద్యమాల ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.


నవంబరు 20వ తేదీ నాటికి విదేశీ సంస్ధాగత మదుపుదార్లు గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత ఎక్కువగా నవంబరు మాసంలో పెట్టుబడులు పెట్టారని విశ్లేషకులు ప్రకటించారు. ఇవి మన విదేశీమారక ద్రవ్య నిల్వలను గణనీయంగా పెంచుతాయి. చూశారా నరేంద్రమోడీ గారు విదేశాల్లో మన ప్రతిష్టను పెంచిన కారణంగానే ఇది సాధ్యమైందని మరుగుజ్జు సైన్యం(ట్రోల్స్‌) సామాజిక మాధ్యమంలో ప్రచారం మొదలు పెట్టవచ్చు. అభివృద్ధి లేకుండా డాలర్లు పెరగటం అది కూడా రూపాయి విలువ పతనం అవుతున్న స్ధితిలో అది వాపా బలమా అన్నదానితో వారికి నిమిత్తం ఉండదు.
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువారు ధన్యుడు సుమతీ అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో బిజెపి పెద్దల మాటలు, వారి మరుగుజ్జుల సామాజిక మాధ్యమ ప్రచారంలో కొన్ని పదాలు వినిపించటం లేదు. రైతుల ఆదాయాల రెట్టింపు, ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి వాటిలో కొన్ని. కరోనాను సమర్దవంతంగా ఎదుర్కొన్నామని చెప్పుకొనేందుకు ఎలాంటి వెనుకా ముందూ చూడటం లేదు. ఎవరితో పోల్చుకొని అలా మాట్లాడుతున్నారో, అసలు ఎదుర్కోవటం అంటే ఏమిటో ఎంత మంది ఆలోచిస్తున్నారు ?

కరోనా ఉద్దీపన 3.0 ప్రకటన తరువాత నవంబరు 12న ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినట్లుగా మొత్తం ఉద్దీపనల విలువ రూ.29,87,641 కోట్లు. అంటే 30లక్షల కోట్లు అనుకుందాం. ఇది జిడిపిలో 15శాతం, ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన విలువే జిడిపిలో 9శాతం అన్నారు. అయితే అంతర్జాతీయ సంస్ధ స్టాటిస్టా డాట్‌కామ్‌ వెల్లడించిన సమాచారం వేరుగా ఉంది. అక్టోబరు 12 నాటికి జి20 దేశాలు ప్రకటించిన ఉద్దీపనలు జిడిపిశాతాల్లో 21.1శాతంతో జపాన్‌ అగ్రస్ధానంలో ఉంది. మన దేశ ఉద్దీపన 6.9, చైనా ఏడుశాతాలుగా ఉన్నట్లు అది పేర్కొన్నది. తరువాత ప్రకటించిన మూడవ విడత ఉద్దీపనను కూడా కలుపుకుంటే ఒకటో రెండోశాతం పెరగవచ్చు తప్ప 15శాతం అయి ఉండే అవకాశం లేదు. అందువలన ఇక్కడ ఉద్దీపన అంటే మన పాలకులు చెబుతున్న భాష్యానికి, అంతర్జాతీయ సంస్దలు చెబుతున్న, పరిగణనలోకి తీసుకుంటున్న అంశాలు భిన్నంగా ఉన్నట్లు చెప్పవచ్చు.

మూడు సార్లు ఉద్దీపన ప్రకటించిన తరువాత ప్రపంచంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశంగా భారత్‌ ఉండనున్నదని ఆక్స్‌ ఫర్డ్‌ ఎకనమిక్స్‌ ప్రకటించటమే చర్చించాల్సిన అంశం.2020-25 సంవత్సరాల మధ్య ఆర్ధిక వ్యవస్ధ పురోగతి గతంలో వేసిన అంచనా 6.5శాతానికి బదులు 4.5శాతం ఉంటుందని తన జోశ్యాన్ని సవరించింది. గతంలో అంతర్జాతీయ అర్ధిక సంస్ధలు చెప్పిన అనేకం నిజం కాలేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద వర్తమాన సంవత్సరంలో మన ఆర్ధిక వ్యవస్ధలో 4.5శాతం తిరోగమనాన్ని అంచనా వేస్తే కొందరు 15శాతం అని చెప్పారు. అంతిమంగా ఎంత ఉంటుందో చూడాల్సి ఉంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో తిరోగమనం పదిశాతానికి అటూ ఇటూగా ఉండవచ్చని వివిధ తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. 2024 నాటికి మోడినోమిక్స్‌ ద్వారా భారత ఆర్ధిక వ్యవస్ధను ఐదులక్షల కోట్ల డాలర్ల స్ధాయికి తీసుకుపోతానని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జరిగేనా ?


ఏడాదికి 11.6శాతం చొప్పున అభివృద్ధి రేటు ఉంటే 2021 నుంచి 2026-27 నాటికి ఐదులక్షల డాలర్ల స్ధాయికి జిడిపి చేరుతుందని కొందరు చెబుతున్నారు. దీనికి గాను ఈ కాలంలో 500లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం. మరి అక్స్‌ఫర్డ్‌ అంచనా 4.5శాతం ప్రకారం ఎప్పటికి చేరేను ? ఇలాంటి అంచనాలు కొన్ని అంశాలు స్ధిరంగా ఉంటాయనే భావనతో తయారవుతాయి. ఉదాహరణకు 2018-19 సంవత్సర అంచనా ప్రకారం దేశ జిడిపి 2.7లక్షల కోట్ల డాలర్లు. దీన్ని ఐదు సంవత్సరాలలో ఐదులక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. దీనికి గాను ఐదు సంవత్సరాలలో ఉత్పత్తి 84శాతం లేదా పదమూడు శాతం చొప్పున పెరగాల్సి ఉంటుంది.వార్షిక ధరల పెరుగుదల నాలుగుశాతం ఉంటుందని, వృద్ధి రేటు 9శాతం చొప్పున ఉండాలని పేర్కొన్నారు. అయితే అంతకు ముందు ఐదు సంవత్సరాలలో సగటు వృద్ధి రేటు 7.1శాతానికి మించలేదు. ఎన్నడూ తొమ్మిదిశాతానికి చేర లేదు. ఈ స్ధాయికి చేరాలంటే పొదుపు రేటు 39, పెట్టుబడి రేటు 41.2శాతం చొప్పున ఉండాలి. 1951-2019 మధ్య మన దేశ సగటు పొదుపు రేటు 18.6 శాతం. కనిష్టంగా 1954 మార్చినెలలో 7.9శాతం, గరిష్టంగా 2008లో 37.8శాతం ఉంది. 2018లో 32.4 శాతం ఉండగా మరుసటి ఏడాది 30.1శాతానికి పడిపోయింది. కరోనా కారణంగా ఈ ఏడాది ఎంతకు దిగజారుతుందో ఇప్పుడే చెప్పలేము. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్ధ 2025 వరకు సగటు వృద్ది రేటు 4.5శాతం ఉంటుందని చెప్పింది. అంతకంటే ఎక్కువ ఉన్న సమయంలోనే పొదుపు రేటు పడిపోయింది కనుక రాబోయే రోజుల్లో దిగజారటం తప్ప పెరిగే అవకాశం లేదు. ఈ అంచనా వెలువడిన తరువాత దాని మీద కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందనలూ వెలువడలేదు.


మన ఆర్ధిక వ్యవస్ధ ప్రయివేటు వినియోగం, పెట్టుబడుల మీద ఆధారపడి ఉంది. గత ఏడాది తొలి మూడు మాసాల్లో ఈ మొత్తం రూ.43లక్షల కోట్లు కాగా ఈ ఏడాది అదే కాలంలో 14లక్షల కోట్లకు పడిపోయింది. మరోవైపు ప్రభుత్వ ఖర్చు రూ.1.2లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. ఇది ఆర్ధిక వ్యవస్ధకు ఏ మాత్రం ఊతం ఇవ్వలేదు అన్నది వేరే చెప్పనవసరం లేదు. మన విదేశీమారక ద్రవ్యనిల్వలు రికార్డు స్ధాయికి పెరిగాయని కొందరు సంబర పడుతున్నారు. కరోనా కారణంగా మన ఎగుమతులతో పాటు ఎక్కువగా దిగుమతులు పెద్ద మొత్తంలో తగ్గాయి. ఈ కారణంగా కొంతమేర ఆదా జరిగి పెరిగినట్లు కనిపించవచ్చు.


విదేశీ సంస్ధాగత మదుపుదారులు నవంబరు మూడవ వారం నాటికి రికార్డు స్ధాయిలో రూ.43,732 కోట్ల రూపాయల విలువగల మన కంపెనీల వాటాలను స్టాక్‌ మార్కెట్లో కొనుగోలు చేశారు. ఐరోపా ధనిక దేశాల్లో మరోసారి కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుండటం, అమెరికాలో ఎన్నికలు ముగియటం, ఏప్రిల్‌ నుంచి డాలరు బలహీనపడుతున్న నేపధ్యంలో ఇది జరిగిందని చెబుతున్నారు. అక్కడ పరిస్ధితి కుదుటపడిన తరువాత లేదా డాలరు విలువ పెరిగితే వారంతా పొలోమని వెనక్కు వెళ్లిపోతారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.
మన జిడిపి ఈ ఏడాది పదిశాతంపైగా తిరోగమనంలో ఉంటుందని రేటింగ్‌ సంస్దలు ప్రకటించాయి. వచ్చే ఐదేండ్ల వరకు సగటున 4.5శాతానికి మించి వృద్ధి రేటు ఉండదని ఆక్స్‌ఫర్డ్‌ చెప్పింది. అయినా విదేశీ మదుపుదార్లు ఎగబడి మన కంపెనీల వాటాలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు ? కరోనా కాలంలో మన కంపెనీలు ఎలా లాభాలు పొందాయో తెలుసుకుంటే అసలు కిటుకు అర్ధం అవుతుంది. సిఎంఐయి నివేదిక ప్రకారం సెప్టెంబరు నెలతో ముగిసిన త్రైమాస కాలంలో 1,897 కంపెనీలు రూ.1,33,200 కోట్ల రూపాయల మేరకు నిఖర లాభాలు ఆర్జించాయి. ఇవే కంపెనీలు 2019 జూన్‌తో ముగిసిన మూడు మాసాల కాలంలో ఆర్జించిన లాభాలు 1,06,600 కోట్లు మాత్రమే. ఈ ఏడాది మార్చి నెలతో ముగిసిన త్రైమాస కాలంలో రూ.32,000 కోట్లు, జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో 44,100 కోట్లు లాభాలను ఆర్జించగా గత నాలుగు త్రైమాస కాలాల్లో వాటి సగటు లాభం రూ.50,200 కోట్లు ఉంది. ఉద్దీపనల పేరుతో జనానికి ఏమూలకూ చాలని బియ్యం, కందిపప్పు, కొంత నగదు తప్ప మరేమీ లేదు. ఉపాధి కల్పన, ఆర్ధికవ్యవస్ధ పునరుద్దరణ వంటి అకర్షణీయమైన పేర్లతో ఉద్దీపనలన్నీ కార్పొరేటు సంస్దలకే ఇచ్చినందువల్లనే వాటికి ఆ లాభాలు వచ్చాయి. అందువలన తమ దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున విదేశీమదుపుదార్లు మన వాటాలు కొనుగోలు చేస్తున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వల గురించి జనానికి చెప్పటానికి, ప్రచారం చేసుకోవటానికి తప్ప ఆ మదుపు సొమ్ము పెట్టుబడులుగా పెట్టేందుకు పనికిరాదు. పెట్టుబడిదారులు ఎప్పుడు వాటాలు అమ్ముకుంటే అప్పుడు వారికి లాభాలతో సహా అసలు సొమ్మును మనం డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలో బిలియనీర్ల సంపద కరోనా కాలంలో 27.5శాతం పెరిగితే, మన దేశంలో అది 35శాతం ఉంది. అందుకే విదేశీ కంపెనీల ఆసక్తి అని వేరే చెప్పనవసరం లేదు.

ఈ ఏడాది తిరోగమనంలో ఉన్నప్పటికీ వచ్చే ఏడాది పరిస్ధితి మరింతగా మెరుగుపడనుందనే అంచనాలు వెలువడటం కూడా ఒక కారణం. లాభాలను చూసి విదేశీ మదుపుదార్లు పెట్టుబడులు పెడుతుంటే మరోవైపు స్వదేశీ మదుపుదార్లు తమ వాటాలను విక్రయించుకొని లాభాలు తీసుకుంటున్నారు. ఇదే కాలంలో వారు 32వేల కోట్ల రూపాయల విలువైన వాటాలను విక్రయించారు.
ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ను కార్యస్దానంగా ఎలా మార్చారో అదే మాదిరి కార్మిక సంస్కరణలకు రాజస్దాన్ను ఎంచుకున్నారు. సంస్కరణలకు ముందు, తరువాత ఏమి జరిగిందో చూడండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్ధి సర్వేలలో చెబుతున్నది. సరళీకృత కార్మిక చట్టాలు అమలు జరిగిన తరువాత, ముందు రాజస్ధాన్‌, సడలింపులు లేని రాష్ట్రాల తీరుతెన్నులను పోల్చి చూడమంటోంది. దాని ప్రకారం వంద మందికి పైగా సిబ్బంది ఉన్న ఫ్యాక్టరీలు రాజస్ధాన్‌లో 3.65 నుంచి 9.33శాతానికి పెరిగితే మిగతా దేశంలో 4.56 నుంచి 5.52శాతానికి పెరిగాయి. ఉత్పత్తి రాజస్ధాన్‌లో 3.13 నుంచి 12శాతానికి పెరిగితే దేశంలో 4.8 నుంచి 5.71శాతానికి పెరిగింది. కార్మికుల సంఖ్య విషయానికి వస్తే రాజస్ధాన్‌లో ఉండాల్సిన వారి కంటే 8.89 తక్కువ నుంచి 4.17శాతానికి పెరిగింది, దేశంలో అది 2.14 నుంచి 2.6 శాతానికి మాత్రమే పెరిగింది. అంటే రాజస్ధాన్‌లో కార్మిక చట్టాలను సరళీకరించినందువలన ఉపాధి 13.06శాతం పెరిగిందని చెబుతున్నారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.ఇది నిజమైతే, దీనికి కారణాలేమిటో పరిశీలించవచ్చు. దాని కంటే ముందు మరోవైపున ఏమి జరిగిందో చూద్దాం.

2017లో విడుదల అయిన అంతర్జాతీయ కార్మిక సంస్ద నివేదిక ప్రకారం ఉత్పాదక రంగంలో ఉత్పత్తి, జత అయిన విలువలో వేతనాల శాతం 1980-81లో ఉన్న 43.9నుంచి 2012-13 నాటికి 23.6శాతానికి పడిపోయింది.రాజస్ధాన్‌లో ఇది 23 నుంచి 14.4శాతంగా ఉంది. అంటే అక్కడ వేతనాలు సంస్కరణలకు ముందే ఎంత తక్కువగా ఉన్నాయో వెల్లడి అవుతోంది. 2014-15కు ముందు వేతనాల పెరుగుదల శాతం 14-15శాతం ఉన్నట్లు పరిశ్రమల వార్షిక సర్వే వెల్లడించింది. బిజెపి పాలకుల సంస్కరణల తరువాత 2014-15లో 11.5శాతం ఉండగా తరువాత రెండు సంవత్సరాలలో 6.1, 3.5శాతాలకు పడిపోయాయి. యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలి వేసి చట్టాలకు కోరలు లేకుండా చేయటంతో కార్మికులకు బేరమాడేశక్తి తగ్గిపోయినట్లు ఇది వెల్లడిస్తోంది. సంస్కరణల తరువాత కాంట్రాక్టు కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది, దీనర్ధం ఏమిటి శాశ్వత కార్మికుడికి ఇచ్చే వేతనంలో సగంతో కాంట్రాక్టు కార్మికులు దొరుగుతున్నారు. వారికి అలవెన్సులు, ఇఎస్‌ఐ వంటి పరిమిత రక్షణలు ఉండవు, యజమానులు చెల్లించాల్సిన అగత్యమూ లేదు. అందువలన కార్మికుల సంఖ్యను పెంచుకొని ఉత్పత్తినీ పెంచుకొనేందుకు యజమానులకు అన్ని అవకాశాలు కల్పించారు. ఇంతగా ఉపాధి అవకాశాలు పెరిగాయని చెబుతున్న రాజస్ధాన్‌లో దేశ సగటు కంటే నిరుద్యోగం ఎందుకు ఎక్కువగా ఉన్నట్లు ? సిఎంఐయి సమాచారం ప్రకారం 2019 జూలైలో దేశంలో 7.5శాతం ఉంటే రాజస్ధాన్‌లో 10.6శాతం నిరుద్యోగం ఉంది. అందువలన ఒక వైపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల సంపదలు పెరుగుతుండగా కార్మికులు వారిమీద ఆధారపడుతున్నవారి జీవితాలు దిగజారుతున్నాయి. కొనుగోలు శక్తి పడిపోయేందుకు ఇది కూడా ఒక కారణం. వినిమయం మీద ఆధారపడి ఆర్ధిక వ్యవస్ధలను అభివృద్ధి చేయాలని చూసే విధానంలో అంతర్గతంగా ఉన్న ఈ వైరుధ్యం కారణంగా కరోనాతో నిమిత్తం లేకుండానే ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది.

కరోనా పూర్తిగా అంతరించిన తరువాత కూడా పూర్వస్ధాయి కంటే ఉత్పత్తి 12శాతం తగ్గుతుందని మన దేశం గురించి ఆక్స్‌ఫర్డ్‌ అంచనా కట్టింది. మరోవైపు మన దేశం నవంబరు 27న ప్రకటించే వివరాలతో సాంకేతికంగా మాంద్యంలో ప్రవేశించనున్నట్లు రిజర్వుబ్యాంకు ముందే ప్రకటించింది. నిజానికి ఇప్పుడు మనం మాంద్యంలోనే ఉన్నాం. సరైన వివరాలు లేని కారణంగా తొలి, రెండవ త్రైమాస వృద్ధి వివరాలను సకాలంలో ప్రకటించటంలో మోడీ సర్కార్‌ విఫలమైంది. ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా ఆరునెలల పాటు తిరోగమన వృద్ధి నమోదు అయితే మాంద్యంలో ప్రవేశించినట్లు పరిగణిస్తారు. మూడవ త్రైమాసం కూడా డిసెంబరుతో ముగియనుంది.
వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం మోపే భారాలను మోసేందుకు సిద్దంగా ఉన్నారా లేక దిక్కుతోచక భరిస్తున్నారా ? పెట్రోలు, డీజిలు మీద పన్నులు, ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం ఆదాయవనరుగా మార్చుకుంది. గతంలో బిజెపి మరుగుజ్జులు కేంద్రం మోపుతున్న భారాల కంటే రాష్ట్రాలు మోపే పన్నుల భారం ఎక్కువ అని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి భారాలను సమర్ధించారు. 2014 మార్చి నుంచి 2020 సెప్టెంబరు మధ్య పెట్రోలు మీద పన్ను భారం లీటరుకు రూ.10.38 నుంచి రూ.32.98( రెండువందల శాతానికి పైగా), డీజిలు మీద ఇదే కాలంలో రూ.4.58 నుంచి రూ.31.83కు(ఆరువందల శాతంపైగా) పెంచినా దేశభక్తిగా భావించి చెల్లిస్తున్నాము. రాష్ట్రాల పెంపుదల్లో తేడాలు ఉండవచ్చు గానీ ఏ రాష్ట్రమూ ఇంత భారీగా పెంచలేదు. ఉదాహరణకు ఢిల్లీలో పెట్రోలు మీద 60, డీజిలు మీద 68శాతం వ్యాట్‌ పెరిగింది.

2014-15 నుంచి 2019-20వరకు చూస్తే పెట్రోలు, డీజిల్‌ మీద కేంద్ర ప్రభుత్వానికి ఎక్సయిజు పన్ను ఆదాయం రూ. 1,72,000 కోట్ల నుంచి రూ.3,34,300 కోట్లకు పెరిగింది. ఇదే సయయంలో రాష్ట్రాల ఆదాయం రూ.1,60,500 కోట్ల నుంచి రూ. 2,21,100 కోట్లకు పెరిగింది. ఈ కారణంగానే బిజెపి మరుగుజ్జులు ఇటీవలి కాలంలో దీని గురించి నోరుమూసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరను బట్టి రోజు వారీ వినియోగదారులకు సవరిస్తామని చెప్పిన కేంద్రం దానికి విరుద్దంగా ప్రస్తుతం పెంచటమే తగ్గించటం లేదు. వినిమయం తగ్గినా కంపెనీల లాభాలు, కేంద్ర, రాష్ట్రాల ఆదాయం తగ్గకుండా చూసేందుకే ఈ పని చేస్తున్నారు. అయినా వినియోగదారులు కిమ్మనటం లేదు.


2017-18 నాటి వివరాల ప్రకారం దేశంలో ఒక వ్యక్తి రోజువారీ సగటు జిడిపిలో 25శాతం మొత్తాన్ని పెట్రోలు మీద ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఇది రాష్ట్రాలలో బీహార్‌లో 94శాతం, యుపిలో 50శాతం ఉండగా చైనాలో నాలుగు, వియత్నాంలో 8, పాకిస్ధాన్‌లో 17శాతం ఉంది. ఇది పెరిగే కొద్దీ వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆర్ధిక వ్యవస్ధ మీద ప్రతికూల ప్రభావం చూపి ఆర్ధిక వ్యవస్ధ పునరుద్దరణ మందగిస్తుంది. చమురు మీద పన్నును ప్రభుత్వం బంగారు బాతుగా పరిగణిస్తున్నది. ఎక్కువ గుడ్ల కోసం ప్రయత్నిస్తే ఏమౌతుందో తెలిసిందే.
నవంబరు 26వ తేదీ ఆందోళన నరేంద్రమోడీ ఆరున్నర సంవత్సరాల పాలనా కాలంలో ఐదవది. కష్టజీవులు ముందుకు తెచ్చిన అంశాలను నిర్లక్ష్యం చేసినకొద్దీ ఇలాంటి ఆందోళనలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవు. మోడీ సర్కార్‌ వాటిని నివారిస్తుందా ? మరింతగా పెంచుతుందో తేల్చుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d