• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Uncategorized

యువతరం శిరమెత్తితే, నవతరం గళమెత్తితే…..అమెరికా కార్మికోద్యమంలో కొత్త తరం !

04 Wednesday May 2022

Posted by raomk in Current Affairs, Economics, employees, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Amazon, Bernie Sanders, New American Union Movement, Starbucks, US labour movements, Young Workers


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలోని 80దేశాల్లో 40వేల వరకు కాఫీ దుకాణాలున్న అమెరికా కంపెనీ స్టార్‌బక్స్‌. అమెరికాలో పదిహేనువేలకుపైగా షాపులున్నాయి. కరడుగట్టిన యాజమాన్య ఆటంకాలను అధిగమించి వాటిలో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కార్మికులు ముందుకు రావటం ఒక పెద్ద పరిణామంగా చెబుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కార్మిక సంఘ ఉద్యమాలు తగ్గిపోతున్న నేపధ్యంలో స్టార్‌బక్స్‌ కార్మిక సంఘం ఏర్పాటు ఒక ఆశారేఖగా ఉంది. అమెజాన్‌ కంపెనీ కార్మిక సంఘానికి ఇక్కడి సంఘానికి ఎలాంటి సంబంధాలు గానీ అనుబంధాలుగానీ లేవు. రెండు చోట్లా సంఘాలను గుర్తించాలనే దరఖాస్తులు కార్మికశాఖకు అందచేశారు.2021 ఆగస్టులో బఫెలో, న్యూయార్క్‌లోని మూడు స్టార్‌బక్స్‌ దుకాణాల్లో కార్మిక సంఘాన్ని గుర్తించాలంటూ దరఖాస్తు చేశారు.డిసెంబరు తొమ్మిదవ తేదీన బఫెలోని దుకాణంలో జరిగిన ఎన్నికల్లో సంఘం తొలిసారిగా గుర్తింపు పొందింది. గత ఎనిమిది నెలల్లో 250 దుకాణాల నుంచి అలాంటి దరఖాస్తులు కార్మికశాఖకు వెళ్లాయి. ఇప్పటి వరకు 40 చోట్ల గుర్తింపు లభించింది. ఈ పరిణామం పెద్ద ఎత్తున అనేక వసతి, ఆహార, పానీయ సంస్ధల్లోని సిబ్బందిని కార్మిక సంఘాల వైపు ఆకర్షిస్తున్నది.అమెరికాలో కొత్త వరవడికి నాంది పలికిందంటే అతిశయోక్తి కాదు. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కార్మికులను బాగా దెబ్బతీసింది. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఇది కూడా కార్మికులను ఆలోచింప చేస్తున్నది.


అమెరికాలోని అమెజాన్‌ కంపెనీ కార్మిక సంఘంలో చేరాలా వద్దా అన్న ఎన్నికల్లో 28 ఏండ్ల కంపెనీ చరిత్రలో ఒక చోట విజయం, రెండు చోట్ల ఎదురు దెబ్బలు.మరో బహుళజాతి కంపెనీ స్టార్‌బక్స్‌లో పలు దుకాణాల్లో కార్మిక సంఘాల్లో చేరిక. ఈ రెండు పరిణామాలూ ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. ఇరవై ఎనిమిది సంవత్సరాల అమెజాన్‌ కంపెనీ తన సిబ్బందిని ఏ కార్మికసంఘంలోనూ చేరకుండా అడ్డుకుంటున్నది. కొద్ది వారాల క్రితం అమెజాన్‌ కార్మిక సంఘం(ఏఎల్‌య)లో చేరాలా వద్దా అనే అంశంపై కార్మికశాఖ జరిపిన ఎన్నికల్లో న్యూయార్క్‌లోని ఒక గోదాములో సంఘం పట్ల మొగ్గుచూపారు. ఇది ప్రపంచవ్యాపితంగా సంచలనం కలిగించింది. అలబామాలో మరో కార్మిక సంఘంలో చేరిక గురించి జరిపిన ఓటింగ్‌లో మెజారిటీ వద్దని తీర్పు చెప్పారు. ఒక చోట తన పన్నాగాలు పారకపోవటాన్ని యాజమాన్యం జీర్ణించుకోలేకపోతున్నది. ఆ ఎన్నిక చెల్లదంటూ వివాద పిటీషన్‌ దాఖలు చేసింది. అది విచారణకు రానుండగా న్యూయార్క్‌లోని రెండవ గోదాములో ఏప్రిల్‌ చివరి వారంలో జరిగిన ఓటింగ్‌లో కార్మిక సంఘం వద్దని మెజారిటీ సిబ్బంది ఓటు చేశారు. స్టాటన్‌ ఐలాండ్‌లోని ఎల్‌డిజె5 గోదాములో 618 మంది సంఘానికి వ్యతిరేకంగా 380 మంది అనుకూలంగా ఓటు చేశారు. సిబ్బందిలో 61శాతం మంది పాల్గన్నారు.


స్టేటెన్‌ ఐలాండ్‌లోని జెఎఫ్‌కె8 అనే అమెజాన్‌ గోదాములో ఎన్నిక తీర్పును వమ్ముచేసేందుకు సంఘాన్ని గుర్తించకుండా అడ్డుకొనేందుకు యాజమాన్యం రంగంలోకి దిగింది. నేతలు కార్మికులను బలవంత పెట్టి అనుకూలంగా ఓట్లు వేయించారని యాజమాన్యం చేసిన ఫిర్యాదును జాతీయ కార్మిక సంబంధాల బోర్డు విచారణకు స్వీకరించింది. బ్రూక్లిన్‌లోని కార్మిక కార్యాలయం కార్మిక సంఘానికి మద్దతు ఇచ్చే విధంగా ఉందని అందువలన వేరే చోటుకు విచారణను మార్చాలని కోరగా ఫోనిక్స్‌ కేంద్రానికి బదిలీ చేశారు. సదరు కేంద్ర డైరెక్టర్‌ మాట్లాడుతూ అమెజాన్‌ కంపెనీ సమర్పించిన ఆధారాలను చూస్తే ఓటింగ్‌ చెల్లకపోవచ్చని చెప్పటం గమనించాల్సిన అంశం. జెఎఫ్‌కె8 గోదాము సిబ్బంది 58శాతం మంది పోలింగ్‌లో పాల్గనగా వారిలో 55శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.అమెజాన్‌ ఫిర్యాదుపై మే 23వ తేదీ నుంచి విచారణ ప్రారంభమౌతుంది. తమ సిబ్బంది వైఖరి ఏమిటో వినాలని తాము కోరుతున్నామని, ఎన్నికల్లో అలాంటి అవకాశం రాలేదని గోదాములోని సిబ్బందిలో మూడోవంతు మాత్రమే కార్మిక సంఘానికి ఓటు వేశారని అమెజాన్‌ వాదిస్తోంది. ఎక్కువ మంది పాల్గనకుండా లేబర్‌ బోర్డు అడ్డుకుందని, కార్మిక నేతలు గంజాయి పంచినట్లు ఆరోపించింది. కార్మిక సంఘం వీటిని తీవ్రంగా ఖండించింది. ఇక్కడ ఓటింగ్‌ తక్కువగా ఉందికనుక తాము అంగీకరించేది లేదని చెబుతున్న కంపెనీ అలబామాలో తక్కువ మంది పాల్గని కార్మిక సంఘం వద్దని వేసిన ఓట్లను ఎలా పరిగణనలోకి తీసుకున్నదని ప్రశ్నించింది. నిజానికి రెండు చోట్లా కంపెనీ కార్మికులను బెదిరించినట్లు తెలిపింది. అమెజాన్‌ దాఖలు చేసిన కేసులో తీర్పు ఎలా వస్తుందో చెప్పలేము.


కార్మిక సంఘనేతలకు ఇది ఆశాభంగం కలిగించవచ్చునేమో గానీ అమెజాన్‌ కంపెనీ తీరు తెన్నులు తెలిసిన వారికి ఆశ్చర్యం కలిగించలేదు.ఈ ఎన్నిక అమెజాన్‌ కార్మిక సంఘం(ఎఎల్‌యు) కంటే యాజమాన్యానికి, పరోక్షంగా అమెరికన్‌ కార్పొరేట్లన్నింటికీ ప్రతిష్టాత్మకంగా మారిందంటే అతిశయోక్తి కాదు. అందుకే రెండవ గోదాములో వారాల తరబడి సిబ్బందిని అనేక రకాలుగా బెదిరించి వత్తిళ్లకు గురిచేసింది. అనేక మంది రోజుకు కొన్ని గంటలు మాత్రమే పని చేసే పాక్షిక సిబ్బంది కావటం, గంటకు 30 డాలర్ల వేతనాన్ని తమకు ఇస్తారా లేదా అన్న అనుమానాల వంటివి, ఈ మాత్రం పని ఇక్కడగాకపోతే మరోచోట దొరకదా, మనమెందుకు ఈ వివాదంలో తలదూర్చటం అనే భావం కూడా కొందరిని సంఘానికి దూరంగా ఓటువేసేందుకు దోహదం చేసింది.యాజమాన్యనిరంకుశ వైఖరి తెలిసినప్పటికీ గత నెలలో వందకు పైగా అమెజాన్‌ దుకాణాల్లోని కార్మికులు సంఘంలో చేరటం గురించి ఎఎల్‌యు నేతలతో సంప్రదింపులు జరిపారు. ఇది యాజమాన్యాన్ని కలవపరుస్తున్న అంశమిది. అందుకే న్యూయార్కులోని రెండవ గోదాము మీద కేంద్రీకరించి కార్మికులను బెదిరించి తన పంతాన్ని నెగ్గించుకుంది. ఓడిపోయిన చోటనే కాదు అన్ని చోట్లా కార్మికులను సంఘటిత పరచేందుకు పూనుకుంటామని ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని నేతలు ప్రకటించారు.


కార్మికులు సంఘాల్లో చేరటం తగ్గిపోతుండగా ఈ పరిణామం పునరుజ్జీవన చిగురు వంటిదని చెప్పవచ్చు. అమెరికాలో 1983లో 20శాతం మంది కార్మికులు సంఘాల్లో చేరగా ఇప్పుడు వారు 11శాతానికి తగ్గారు, 1940, 50దశకాల్లో 30శాతం వరకు ఉన్నట్లు పాత సమాచారం తెలుపుతోంది. అమెజాన్‌, స్టార్‌బక్స్‌, ఆపిల్‌ వంటి కంపెనీల్లో సంఘాల స్ధాపన అనేకమందిని ఆలోచింప చేస్తున్నది. దేశంలో 28.8 కోట్ల మంది కార్మికులుండగా వారిలో ఒక్కశాతం మంది సంఘాల్లో చేరినా 30లక్షల మంది పెరుగుతారు. కొన్ని చోట్ల చేరేందుకు సిద్దంగా ఉన్నా సంఘాలు లేవు. మరికొన్ని చోట్ల సంఘాలకు అనుకూలత లేదు. మొత్తంగా చూసినపుడు సంఘటితం కావటానికి అనువైన వాతావరణంఇప్పుడు ఉంది. ఇదే సమయంలో యజమానులు కూడా సంఘాలను లేకుండా చేసేందుకు తీవ్రంగా చూస్తున్నారు.


1936 గాలప్‌ సర్వేలో కార్మిక సంఘాలు ఉండాలా వద్దా అన్న ప్రశ్నకు 72శాతం మంది కావాలని చెప్పారు. 2021సెప్టెంబరులో అదే సంస్ధ అడిగిన అదే ప్రశ్నకు 68శాతం మంది కావాలని అన్నారు.1953, 57లో గరిష్టంగా 75శాతం మంది ఉన్నారు. ఈ అంకెలను చూసినపుడు పెద్ద మార్పులు లేవని చెప్పవచ్చు. మరోసారి కార్మిక సంఘాల ఏర్పాటు, వాటిలో చేరే వారు పెరిగేందుకు అనువైన పరిస్ధితి అమెరికాలో ఉందన్నది స్పష్టం. సంఘాల్లో కార్మికులు చేరకపోవటం దేశానికి మంచి కంటే చెడు చేస్తున్నదని అమెరికన్లు నమ్ముతున్నట్లు ఇటీవలి పూ సర్వే వెల్లడించింది. కార్మిక సంఘాలలో చేరాలా వద్దా అన్న అంశంలో రాజకీయ అనుబంధాలు కూడా పని చేస్తున్నాయి.2019 నుంచి 2021వరకు సర్వేల సమాచారాన్ని విశ్లేషించినపుడు 56శాతం మంది కార్మిక సంఘాల సభ్యులు డెమోక్రటిక్‌ పార్టీ అభిమానులు కాగా 39శాతం మంది రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదార్లున్నారు. సంఘటిత పరచే హక్కును రక్షించేందుకు ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టగా గతేడాది పార్లమెంటు దిగువ సభ ఆమోదించగా ఎగువ సభ సెనెట్‌ దాన్ని అడ్డుకుంది.


అమెజాన్‌లో కార్మిక సంఘం ఏర్పాటు జాతీయంగా ఒక విస్తృత ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని డెమొక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీశాండర్స్‌ వర్ణించాడు. కార్పొరేట్ల పేరాశకు కార్మికులు అశక్తులుగా అలసిపోయారని చెప్పాడు. ఇటీవల అమెజాన్‌ కార్మిక సంఘనేతలతో మాట్లాడుతూ అమెజాన్‌ కంపెనీలో కుర్రకారు ఇంతటి విజయం సాధించారంటే మేమూ అదే మాదిరి మేమూ చేయగలం అని అనేక మంది చెప్పారని అన్నాడు. రాజ్యాంగ హక్కైన కార్మిక సంఘ ఏర్పాటును అడ్డుకొనేందుకు కోట్లాది డాలర్లను ఖర్చు చేయటానికి బదులు సమస్యల గురించి దానితో చర్చించేందుకు అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ సిద్దం కావాలని డిమాండ్‌ చేశాడు.కార్మిక సంఘాలను లేకుండా చేయాలని చూస్తున్న అమెజాన్‌ కంపెనీ చట్టవిరుద్దమైన చర్యలను విరమించేంత వరకు సదరు కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు శాండర్స్‌ లేఖ రాశాడు. కార్మిక సంఘాల వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని రాతపూర్వకంగా రాసి ఇచ్చిన కంపెనీలకే ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు జరపాలని గుర్తు చేశాడు.


కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు అవసరమైన నివారణ ఏర్పాట్లు తగినన్ని చేయాలంటూ జెఎఫ్‌కె8 గోదాములో కార్మికులను సమీకరించి ఆందోళన చేసినందుకు 2020లో క్రిస్టియన్‌ స్మాల్‌ అనే కార్మికుడిని కంపెనీ తొలగించింది. అతని చొరవతో ఏర్పడిన కార్మిక సంఘాన్ని అదే గోదాములో కార్మికులు గుర్తించారు. వెబ్‌సైట్‌లో సలహాలు, సమాచారాన్ని అందుబాటులో ఉంచటం కాకుండా ముఖాముఖీ కార్మికులతో సమావేశం కావటం ద్వారానే సంఘాల అవసరం ఏమిటో బాగా వివరించగలమని స్మాల్‌ చెప్పాడు. అవసరమైతే పదే పదే చర్చలు జరపాలన్నాడు. అమెజాన్‌లో విజయం తరువాత మరో పెద్ద కంపెనీ స్టార్‌బక్స్‌లో అనేక చోట్ల కార్మిక సంఘానికి మద్దతుగా కార్మికులు ఓటువేశారు. దాంతో ఆ సంస్ద కూడా ఈ పరిణామాన్ని అడ్డుకొనేందుకు పూనుకుంది. గంటకు ప్రస్తుతం ఇస్తున్న 18 డాలర్లను 30 డాలర్లకు పెంచాలని, పని మధ్యలో భోజన, ఇతర విరామాలకు వేతనం ఇవ్వాలని కార్మిక సంఘం కోరుతోంది.గంటకు ఇన్ని వస్తువులను విధిగా చేరవేయాలనే చెల్లింపు పద్దతి రద్దుకావాలని కోరుతున్నారు.ఈ నిబంధన కారణంగా జరుగుతున్న ప్రమాదాలు ఇతర చోట్లతో పోలిస్తే అమెజాన్‌లో ఎక్కువగా ఉన్నాయి.


అమెరికాలోని కాలేజీ విద్యావంతులైన కార్మికులు గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఊహించినదానికి భిన్నంగా జీవితాలున్నాయి. గత తరాలు దిగువ నుంచి మధ్యతరగతిగా మారినట్లు తాము మారటం, ఆరంకెల ఆదాయానికి చేరటం ఎంతో కష్టమని వారు భావిస్తున్నారు. కార్మికోద్యమం పెరిగేందుకు ఈ పరిస్దితి దోహదం చేస్తోంది.1990దశకంలో కాలేజీ డిగ్రీలు ఉన్నవారు కార్మిక సంఘాలకు 55శాతం మంది మద్దతు ఇస్తే ఇప్పుడు వారి సంఖ్య 70శాతానికి పెరిగింది, తాజాగా డిగ్రీలు పొందిన వారిలో ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
భౌతిక పరిస్ధితులను బట్టే కార్మికవర్గ ఆలోచనలు ఉంటాయి. ఇటీవల పెద్ద ఎత్తున ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి అంతకంటే మెరుగైనదాని కోసం చూసిన ధోరణి వెల్లడైంది. ఇది ఒకరకమైన కార్మిక నిరసనకు ప్రతీకగా భావిస్తున్నారు. ఈ తీరును చూసిన కార్పొరేట్‌లు సిబ్బందిని నిలుపుకొనేందుకు మెరుగైన వేతనాలు, పని పరిస్దితులను కల్పించాల్సి అవసరాన్ని గుర్తించాల్సి వచ్చింది. లేనట్లయితే కార్మిక సంఘాల ఏర్పాటు, పోరాటాలకు అనువైన పరిస్ధితికి దారి తీస్తుందనే ఆందోళన వెల్లడైంది. పెద్ద వారితో పోల్చితే యువత కార్మిక సంఘాలపట్ల సానుకూల వైఖరితో ఉంది. ఇతరులతో పోల్చితే ఆఫ్రో-అమెరికన్లు, పురుషులతో చూస్తే మహిళలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నారు. బాగా తక్కువ లేదా ఎక్కువ ఆదాయాలు వస్తున్నవారి కంటే మధ్యస్ధంగా ఉన్నవారు సంఘాల పట్ల ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇది అక్కడి కార్మికోద్యమం మరింతగా పెరగటానికి దోహదం చేయనుంది. అది ప్రపంచాన్ని ప్రభావితం చేయకుండా ఉంటుందా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాషాయదళాల ముస్లిం వ్యతిరేక ప్రచారం -నిందలూ, నిజాలు !

29 Friday Apr 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, RSS, Saffron gang


ఎం కోటేశ్వరరావు


” 2029 ఎన్నికలలో ఒక ముస్లిం దేశ ప్రధాని అవుతాడు ” హిందువులారా బహుపరాక్‌, జాగ్రత్త పడండి,హిందూమతాన్ని రక్షించుకోండి ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని చేసేది సంఘపరివార్‌ లేదా హిందూత్వశక్తులు అన్నది స్పష్టం. వీరు ఇంకా చెప్పిందేమిటి ? హిందువులు విశాలదృక్పధం కలిగిన వారు కనుకనే ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు రాష్ట్రపతులుగా ఎన్నికయ్యారు, అదే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లో హిందువులెవరైనా ఉన్నత పదవులు అధిరోహించారా చూడండి అని ప్రచారం చేశారు. మరి వీరే 2029లో ఒక ముస్లిం ప్రధాని అవుతారంటూ ఎందుకు రెచ్చగొడుతున్నట్లు ? ఈ ప్రచారానికి ప్రాతిపదిక, లక్ష్యం ఏమిటి ? ఇప్పటికి దేశంలో జకీర్‌ హుసేన్‌, ఫకృద్దీన్‌ అలీ అహమ్మద్‌, అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌ రాష్ట్రపతులుగా పని చేసినపుడు అదే సామాజిక తరగతికి చెందిన వారు ప్రధాని అయితే వచ్చే ముప్పు ఏమిటి ? రాష్ట్రపతులుగా పని చేసిన వారు హిందూ మతానికి లేదా సమాజానికి చేసిన హాని ఏమిటో ఎవరైనా చెప్పగలరా ?


ఐరోపాలో, ఆసియాలో తలెత్తిన జాతీయవాదాలు భిన్నమైన నేపధ్యాలు, లక్ష్యాలతో ముందుకు వచ్చాయి. ప్రతి చోటా వినాశనానికే దారి తీశాయి. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తలెత్తిన జాతీయవాదం కులాలు, మతాలు, భాషా, ప్రాంతీయతలకు అతీతంగా జరిగింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివారం, హిందూమహాసభలు ముందుకు తెచ్చిన జాతీయవాదానికి ప్రాతిపదిక పరమత విద్వేషం – హిందూత్వ. జర్మనీలో జర్మన్‌ జాతి పవిత్రతను కాపాడేపేరుతో యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టారు, అది ఐరోపా అంతటినీ ప్రభావితం చేసింది. అనేక దేశాల్లో యూదుల ఊచకోతకు దారి తీసింది. మన దేశంలో రెచ్చగొడుతున్న హిందూత్వ జాతీయవాదం ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను, ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. దానిలో భాగమే 2029లో ముస్లిం ప్రధాని అనే ప్రచారం.


” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ సర్వే లేదా విశ్లేషణ వెల్లడించిన సమాచారం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని సామాజిక మాధ్యమంలో వీడియోలు, పోస్టుల రూపంలో గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాము. వాటి ప్రకారం 2041నాటికి దేశంలో ముస్లిం జనాభా 84శాతానికి పెరుగుతుందట. ముస్లిం జనాభా పెరుగుదల తీరుతెన్నులను పేర్కొంటూ 1948లో 6, 1951లో 9.8, 2011లో 22.6, 2017లో 27.1 ఉందని, 2021లో 32.8, 2031లో 38.1, 2037లో 43.6, 2040లో 66.9, 2041లో 84.5 శాతానికి పెరుగుతుందని, అప్పటికి హిందువుల జనాభా 11.2శాతంగా ఉంటుందని సదరు సంస్ధ అంచనా వేసినట్లు చెబుతూ ఇంకేముంది హిందువులు అంతరించిపోతారంటూ రెచ్చగొడుతూ ప్రచారం సాగుతోంది. గత వంద సంవత్సరాలుగా హిందూత్వ శక్తులు నాటుతున్న విషబీజాలు ఇప్పుడు మర్రి ఊడల్లా విస్తరిస్తున్నాయి. నిరంతరం అదే పనిగా ఇలాంటి ప్రచారం కొనసాగుతుండటంతో జనాల్లో ఏమో అనే అనుమానం తలెత్తి దాన్ని నివృత్తి చేసుకోకుండానే అనేక మంది నిజమే అని నమ్ముతున్నారు. దాంతో విద్వేష ముఠాలు తమ ఉత్పత్తులతో వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాలను ముంచి వేస్తున్నాయి.


వాస్తవం ఏమిటి ? మన జనాభాలెక్కల ప్రకారం 1951లో 84.1శాతంగా ఉన్న హిందువులు 2011లో 78.35శాతంగా ఉండగా ఇదే కాలంలో ముస్లింలు 9.8 నుంచి 14.2శాతానికి మాత్రమే పెరిగారు. నాలుగుదశాబ్దాల్లో పెరిగింది 5.4 కాగా, వచ్చే నాలుగు దశాబ్దాల్లో 70శాతం ఎలా పెరుగుతారు ? అమెరికా పరిశోధనా సంస్ధ ” పూ ” వేసిన అంచనా ప్రకారం 2050 నాటికి మన దేశంలో ముస్లిం జనాభా 18.4 శాతం ఉంటుంది. ఇంతకీ అసలు విషయం ఏమంటే గజం మిధ్య అన్నట్లుగా అసలు సదరు ” ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ డెమోగ్రాఫిక్‌ రిసర్చ్‌ ” అనే సంస్ధ ఉనికిలోనే లేదని గూగుల్‌ తల్లి చెప్పినట్లు 2019లోనే ఫాక్ట్‌లీ డాట్‌ ఇన్‌ అనే సంస్ధ ప్రతినిధి వెల్లడించారు. అందువలన హిందూమతానికి వచ్చిన ముప్పు అన్నది కూడా అవాస్తవం, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పట్టుకొని ప్రచారం చేసే సాధ్వులు, యోగులు చెప్పేది పచ్చి అబద్దాలే. బిజెపి ఎంపీలు పార్లమెంటులో జనాభా నియంత్రణ బిల్లులను ప్రవేశపెట్టినా, వాటి గురించి ప్రచారం చేసినా ప్రచారదాడిలో భాగమే తప్ప మరొకటి కాదు. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పధకాలను వర్తింప చేయకూడదనే ప్రచారం, ఉత్తర ప్రదేశ్‌, అసోం బిజెపి ప్రభుత్వాల బిల్లులు ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఒక వేళ అవి చట్టరూపం దాల్చితే 80శాతంగా ఉన్న హిందువులే ఎక్కువ నష్టపోతారు. సాధ్వి రితంబర వంటి వారు ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కని ఇద్దర్ని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా భజరంగదళ్‌కు ఇవ్వాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దర్ని ఏం చేస్తారు, వారితో ఏమి చేయిస్తారు ? బిజెపి విధానాలను, హిందూత్వను వ్యతిరేకించే వామపక్ష, లౌకిక వాదులు, ఇతర మతాలవారి మీద దాడి చేసే మూకలుగా తయారు చేస్తారా ?


” బిజెపి ఇంకొక దశాబ్దం దేశాన్నేలితే ఏదో ఒక రోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం, కానీ కాంగ్రెస్‌ వచ్చిందా జెండాపై రంజాన్‌ చంద్రుడే గతి, ఎప్పటికీ గుర్తుంచుకో ! ” అంటూ మరొక ప్రచారం జరుగుతున్నది. ఇదీ ముస్లిం విద్వేష ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. ఒక వైపు దేశంలో ముస్లిం జనాభా పెరిగి హిందువులు మైనారిటీగా మారనున్నారనే ప్రచారం చేస్తూనే అదే శక్తులు మరోవైపు చేస్తున్న ప్రచారాన్ని చూద్దాం. ” కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విష జంతువులు ఉన్న కాంగ్రెస్‌ అనే పెద్ద మర్రి చెట్టును మోడీ పెకలించి వేస్తున్నాడు ” మార్క్‌తులి అనే బిబిసి మాజీ విలేకరి ఈ ప్రకటన ఇచ్చాడు అని అదే పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు సారం ఏమంటే విషసర్పాలన్నింటికీ మోడీ పొగపెట్టారు గనుక అవి దేశం మీద పడ్డాయి. వాటిని జనాలకు చూపి మోడీ అప్రమత్తంగావించటం మంచిదైంది. లేకపోతే అవి ఈ భారత భూమిని, హిందువులను మింగివేసేవి. మోడీ భవిష్యత్‌ తరాల మతమార్పిడులకు అడ్డుకట్టవేశారు. మోడీగారు చాలా కష్టపడాలి, పడతారు కూడా. అయితే ఈ దేశ ప్రజలంతా ముఖ్యంగా హిందువులంతా నరేంద్రమోడీ గారికి అండగా నిలవాలి. అని పేర్కొన్నారు. ఒక పోస్టులోనేమో ముస్లింలు మెజారిటీగా మారనున్నారని భయపెడతారు, మరో పోస్టులో హిందూమత రక్షకుడు నరేంద్రమోడీ వచ్చినట్లు, ముప్పు తప్పించినందుకు మద్దతు ఇవ్వాలని చెబుతారు. ముస్లిం జనాభా పెరుగుదల గురించి ఉనికిలో లేని సంస్ధ పేరు చెప్పి జనాలను తప్పుదారి పట్టించినట్లుగానే మార్క్‌తులి పేరు చెప్పి మరో పచ్చి అబద్దం ప్రచారంలో పెట్టారు. నరేంద్రమోడీకి అనుకూలంగా కొన్ని అంశాలను రాసి అవి మార్క్‌తులి పుస్తకంలోనివిగా పేర్కొంటూ గత ఐదు సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


ఇక దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందన్న ప్రచారం గురించి నిజానిజాలేమిటో చూద్దాం. 2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ” నేనేం చేయాలి ? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ? ” 2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ”నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి ” అని చెప్పారు.
విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్‌ తొగాడియ గుజరాత్‌లోని బహరుచ్‌ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.” హిందూ పురుషులూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.” ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుసంచాలక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు.” ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగ కూడదని ఏ చట్టం చెప్పింది ” అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్‌ మరోనేత దత్తాత్రేయ హౌసబలే ” చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.” అన్నారు. 2018లో రాజస్తాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ బన్వారీలాల్‌ సింగ్‌ సింఘాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. హిందువులు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు.


1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ? ముస్లింల్లో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది.


దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి ? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదుశాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌(20లక్షలు), మిజోరం(పది లక్షలు), మేఘాలయ(30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. .2011లెక్కల ప్రకారం హిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబనియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా ? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా ? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా ? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946,911గానూ జమ్మూకాశ్మీరులో 889,862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా ? చిత్రం ఏమంటే దేశంలో అనుమతి ఉన్న ముస్లింల్లో బహుభార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8శాతం ఉంది. దీన్నేమంటారు ?


2035నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. అసలు ఇది ఎక్కడ పుట్టింది ? ఒకరాయి వేద్దాం మనల్ని అడగొచ్చేదెవరులే అనే ధైర్యంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. 2017ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ” 2035 నాటికి ముస్లిం పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది ” అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి ? ప్రపంచంలో 2075నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2035నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వశక్తులు ఇక్కడి ముస్లింలకు వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు.


ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ” అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌(విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు. ” ఇది 2018లో రాజస్తాన్‌లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ), మేక్‌ ఇండియా(భారత్‌ తయారీ) పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమిది. హిట్లర్‌ను, వాడి మంత్రి గోబెల్స్‌ను ఎవరు ఆదర్శంగా తీసుకున్నదీ వేరే చెప్పాలా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రోలు ధరలు : రావణదేశంలో 89, సీత పుట్టింట్లో 100, రామరాజ్యంలో 120 !

28 Thursday Apr 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


కేేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేశారు. దేశ ప్రయోజనాల కోసం పన్ను తగ్గించాలన్నారు. ఇలాంటి సుభాషితాలు చెప్పటానికి మోడీ గారికి సర్వహక్కులూ ఉన్నాయి. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్నది తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలు నవంబరులో తగ్గించాయి.ఆమ్‌ ఆద్మీ ఢిల్లీ సర్కార్‌ కొద్ది రోజుల తరువాత తగ్గించింది. ఇతర రాష్ట్రాలను అడిగేందుకు ఆరు నెలలుగా ప్రధానికి అవకాశమే దొరకలేదా ? దేశ ప్రయోజనాల కోసం ఒక రోజు లేదా ఒక గంట తీరిక చేసుకోలేని పరిస్దితి ఉందా అన్న సందేహం రావటం సహజం. పన్ను తగ్గించని రాష్ట్రాలు ప్రజలకు అన్యాయం, పొరుగు రాష్ట్రాలకు హాని కలిగించటమే అని, ఆరునెలలు గడిచింది ఇప్పటికైనా తగ్గించండి అంటూ జనంలో ప్రతిపక్ష పార్టీలపై వ్యతిరేకతను రేకెత్తించేందుకు ఒక రాజకీయ నేతగా తన చాణక్యాన్ని ప్రదర్శించారు. ఎనిమిది సంవత్సరాలుగా ఏదో ఒకసాకుతో వీరబాదుడు కొనసాగిస్తున్న ప్రధాని రాష్ట్రాల మీద ఎదురుదాడికి దిగారు.


ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్రం నామమాత్రంగా సెస్‌ను, కొన్ని రాష్ట్రాలు వాట్‌ తగ్గించటంతో పాటు చమురు కంపెనీలు 137 రోజులు చమురు ధరలను స్థంభింప చేశాయి. ఇవన్నీ దేశ లేదా ప్రజల కోసమే అనుకుందాం. ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న స్ధితిలో అవి మరింతగా పెరిగేంతగా పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచినపుడు గుర్తులేని దేశ ప్రజలు ఇప్పుడు గుర్తుకు రావటం గమనించాల్సిన అంశం. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నెల నెలా ప్రభుత్వం విడుదల చేసే అశాస్త్రీయ గణాంకాలు కూడా పెరుగుదలను చూపుతున్నాయి. వాటిని కొంత మేరకైనా అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చమురుపై పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలు చెబుతున్న తరుణంలో నరేంద్రమోడీ దాన్ని ప్రస్తావించకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద పడ్డారు. ఏప్రిల్‌ 27వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక సమాచారం ప్రకారం ఆ రోజు బిజెపి ఏలుబడిలోని భోపాల్‌లో లీటరు పెట్రోలు రు.118.14, పాట్నాలో రు.116.23, బెంగలూరులో రు.111.09, లక్నోలో రు.105.25 ఉంది. ఒకే పార్టీ పాలిత ప్రాంతాల్లో ఇంత తేడా ఎందుకున్నట్లు ? ముందు వాటిని సరి చేస్తారా లేదా ? గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం పక్కనే ఉన్న రావణరాజ్యం శ్రీలంక ఆర్ధిక సంక్షోభంతో అతలాకుతలం అవుతున్నది. అక్కడ ఏప్రిల్‌ 25న పెట్రోలు రేటు రు.373, అదే మన కరెన్సీలోకిి మార్చితే రు.80.39.సీతాదేవి పుట్టిన నేపాల్లో రు.100 ఉంది.మన రామరాజ్యంలో రు.105 నుంచి 120 వరకు ఉంది. ఇక పాకిస్తాన్లో రు.61.41, బంగ్లాదేశ్‌లో రు.79.09 ఉందంటే ప్రజాప్రయోజనం గురించి మాట్లాడేవారికి ఆగ్రహం రావటం సహజం.


పన్నులు అసలే వద్దని ఎవరూ అనరు. గత ఎనిమిది సంవత్సరాల్లో కార్పొరేట్లకు పన్ను తగ్గింపు, రాయితీలు పెంపు. సామాన్యులకు సబ్సిడీల కోత-పన్నుల వాత తెలిసిందే. కాంగ్రెస్‌ ఏలుబడిలో చమురు సంస్ధలకు పెట్టిన బకాయిలను తీర్చేందుకు తాము పన్ను మొత్తాన్ని పెంచవలసి వచ్చిందని చెప్పారు. నిజం ఏమిటి ? ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా చమురు కంపెనీలకు ప్రభుత్వం ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీ కూడా చెల్లించాలి. ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించే అవకాశం ఉంది. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.ఈ బాండ్లను చమురు కంపెనీలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు లేదా ఇతర సంస్ధలకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. చమురు బాండ్లను వాజ్‌పేయి సర్కార్‌ కూడా జారీ చేసింది ? జనానికి ఇచ్చిన దానికి ఏడుపెందుకు ?


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తం వినియోగదారులకు ఇచ్చిన రాయితీ తప్ప మరొకటి కాదు. జనానికి ఇచ్చిన ఈ మొత్తం గురించి బిజెపి మంత్రి చెప్పిన తీరు జనం నుంచి వసూలు చేసే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు.ఈ మొత్తాన్ని చెల్లించేశాము అని చెప్పటం పెద్ద అబద్దం. తొలుత కాంగ్రెస్‌ అప్పులను తీర్చటం కోసమే పన్నులు పెంచామన్నారు. తరువాత బాణీ మార్చి సరిహద్దులో చైనాతో వివాదం కారణంగా తలెత్తిన ఖర్చు జనం గాక ఎవరు భరించాలి ? అందుకే పన్నులను కొనసాగించక తప్పదు అని వాదించారు. ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నట్లు అంటే అభివృద్ది పనులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే వారని చెప్పాల్సి వస్తోంది. మన భూభాగాన్ని చైనీయులు ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అలాంటపుడు సరిహద్దుల్లో లక్షల కోట్లు ఖర్చు చేసి అమెరికా,ఇజ్రాయెల్‌, రష్యా తదితర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి జనాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టినట్లు ? ఇప్పటి వరకు చెల్లించింది పోగా 2023 నవంబరు, డిసెంబరు మాసాల్లో మరో 26,150 కోట్లు, 2024 ఫిబ్రవరి-డిసెంబరు మాసాల మధ్య 37,306.33 కోట్లు, 2025లో 20,553.84 కోట్లు, చివరిగా 2026లో 36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది.


ఈ బాండ్ల పేరుతో పెంచిన పన్నులతో కేంద్రానికి వచ్చిన రాబడి ఎలా ఉందో చూడండి. 2014-15నుంచి 2021-22 వరకు కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన డివిడెండ్‌, ఆదాయపన్ను మొత్తం రు.4,07,190 కోట్లు. ఇవిగాక కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన ఇతర పన్ను ఆదాయం రు.21,82,198 కోట్లు, రెండింటినీ కలిపితే రు.25,89,388 కోట్లు ? కాంగ్రెస్‌ ఏలుబడిలో జారీ చేసిన బాండ్ల మొత్తం ఎంత ? అ పేరుతో జనాన్ని బాదింది ఎంత ? గుండెలు తీసే బంట్లకు తప్ప ఇది మరొకరికి సాధ్యమా ?


ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఉంది.2014-15లో కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రు.1,26,025 కోట్లు కాగా 2020-21కి అది రు.4,19,884 కోట్లకు చేరింది. ఖరారు కాని వివరాల ప్రకారం 2021-22లో అది రు.3,10,155 కోట్లు. దీనికి కేంద్రం తగ్గించిన సెస్‌ కారణం కావచ్చు. ప్రధాని కాంగ్రెసేతర రాష్ట్రాలను పన్ను తగ్గించాలని కోరారు. ఇక్కడ రాష్ట్రాలు రాష్ట్రాలే, బిజెపివా, ఇతర పార్టీలవా అని కాదు. కేంద్రం తగ్గించిన స్వల్ప మొత్తాల గురించి చెబుతున్నది తప్ప పెంచిన భారాన్ని తెలివిగా తెరవెనక్కు నెట్టాలని చూస్తున్నది. ఇదే కాలంలో రాష్ట్రాలన్నింటికి చమురు మీద వచ్చిన వాట్‌ మొత్తం రు.13,70,295 కోట్లు, అంటే కేంద్రానికి వస్తున్నదానిలో సగం.2014-15లో రాష్ట్రాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రు.1,60,526 కోట్లు కాగా కేంద్రానికి వచ్చింది రు.1,26,025 కోట్లు మాత్రమే. 2020-21కి రాష్ట్రాలకు రు.2,17, 221 కోట్లకు పెరగ్గా అదే కేంద్రానికి రు.4,19,884 కోట్లకు చేరింది. ఇవన్నీ ప్రతిపక్షాలు చెప్పిన అంకెలు కాదు, కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ సెల్‌(పిపిఏసి) విడుదల చేసినవే. కేంద్ర పన్నులలో 41శాతం తిరిగి రాష్ట్రాలకు ఇస్తున్నాము కదా అని బిజెపి నేతలు వాదిస్తారు. అది గతంలోనూ 32శాతం వాటా ఉందిగా. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు మోడీ సర్కారు పెట్టిన టోపీ ఏమిటంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన పన్ను కాకుండా ఇవ్వనవసరం లేని సెస్సులను పెంచి అన్యాయం చేశారు. బిజెపి పాలిత నేతలు నోరు మూసుకున్నారు. ఏప్రిల్‌ 27 నాటి సిఎంల సమావేశంలో ప్రధాని మోడీ పన్ను తగ్గించిన తమ పార్టీ పాలిత కర్ణాటకకు ఐదువేల కోట్లు గుజరాత్‌లకు 3,500-4,000 కోట్ల మేరకు ఆదాయం తగ్గిందని చెప్పారు.బిజెపి ఏతర పాలిత రాష్ట్రాలు తగ్గించకపోవటం వలన ప్రజలకు అన్యాయం, ఇతర రాష్ట్రాలకు హాని జరుగుతున్నదని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సెస్‌లో వాటా ఎగవేసి కేంద్రం కలిగించిన నష్టం గురించి కూడా చెబితే నిజాయితీగా ఉండేది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద దాడి ప్రారంభించి అసలు అంశాన్ని మరుగుపరచారు.


ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే సంస్ధల నుంచి చిల్లర ధరల కంటే ఎక్కువ వసూలు గురించి కేరళ హైకోర్టులో కేసు నడుస్తున్నది. అక్కడి ఆర్టీసికీ చిల్లర ధరలకే డీజిల్‌ సరఫరా చేయాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సవాలు చేశాయి. రెండు రకాల ధరలను వసూలు చేయటం వెనుక ఉన్న తర్కం, కారణాలను చెప్పాలని ఇద్దరు సభ్యులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించింది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగిన మేరకు సాధారణ జనానికి చిల్లర ధరలను పెంచితే అశాంతి ఏర్పడుతుందని తాము ఆ మేరకు పెంచలేదని, క్రమంగా పెంచుతామని చమురు కంపెనీలు పేర్కొన్నాయి. ఇక ధరల నిర్ణయానికి ప్రపంచ మార్కెట్‌ ధరలు, భవిష్యత్‌లో పెరిగే ముడి చమురు ధరలు,రవాణా ఖర్చులు, స్ధానిక పన్నుల వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపాయి. ధరల నిర్ణయం విధానపరమైనదని దాన్ని ప్రశ్నించరాదని వాదించాయి. ఆర్టీసికి వారి వద్దకు తీసుకుపోయి అందచేస్తామని, చిల్లర వినియోగదారులకు అలా కాదని, ఆర్టీసికి 45 రోజుల తరువాత డబ్బు చెల్లించే వెసులు బాటు ఇచ్చామని, ఈ ఏడాది జనవరి వరకు వారికి చిల్లర ధరకంటే తక్కువకే సరఫరా చేశామని, అప్పుడు మౌనంగా ఉండి పెంచిన తరువాత వివాదం చేస్తున్నారని పేర్కొన్నాయి. కేరళ ఆర్టీసి లేదా మరొక రాష్ట్ర సంస్ధకైనా, రిటైల్‌ డీలర్లకైనా చమురు కంపెనీలు ఒప్పందం ప్రకారం వాని వద్దకే తీసుకుపోయి సరఫరా చేస్తాయి. ఏదో ఒక పేరుతో జనాన్ని బాదటం తప్ప వేరు కాదు. ఏదైనా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దోహదం చేసేదే. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న తమకు ధరలు పెంచినందున రోజుకు 85లక్షల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోందని,ప్రైవేటు బస్సులకు ఒక ధర, ఆర్‌టిసికి ఒక ధర వివక్ష చూపటమే అని కేరళ ఆర్‌టిసి వాదించింది. మిగతా రాష్ట్రాల ఆర్టీసిలకూ పెంచినప్పటికీ ఎక్కడా సవాలు చేయలేదు, డీజిలు పేరుతో ప్రయాణీకుల మీద అదనపు భారం మోపుతున్నారు. ఈ కేసులో చమురు సంస్ధలకు అనుకూల తీర్పు వస్తే అది ఆర్‌టిసీలన్నింటికీ పెనుభారమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికల్లో బలం పెంచుకున్న ఫాసిస్టు నేషనల్‌ పార్టీ !

27 Wednesday Apr 2022

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

emmanuel macron, Far Right, French Left, marine le pen



ఎం కోటేశ్వరరావు


ఆదివారం నాడు(ఏప్రిల్‌ 24) జరిగిన తుది విడత ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మాక్రాన్‌ విజయం సాధించాడు. ప్రత్యర్ధి పచ్చిమితవాది లేదా ఫాసిస్టుగా పిలుస్తున్న మారినే లీపెన్‌ 41.5శాతం ఓట్లు తెచ్చుకోగా మక్రాన్‌కు 58.5శాతం వచ్చాయి. గత (2017)ఎన్నికల్లో పదకొండు మంది తొలి దఫా ఎన్నిక పోటీ పడగా తొలి నలుగురికి 24.01 నుంచి 19.58శాతం మధ్య రాగా మిగిలిన వారెవరికీ ఒక అంకెకు మించి ఓట్లు రాలేదు. తాజా ఎన్నికల్లో పన్నెండు మంది పోటీ పడగా మక్రాన్‌కు 27.85, మారినే లీపెన్‌కు 23.15, వామపక్ష మెలాంచన్‌కు 21.95శాతం ఓట్లు వచ్చాయి. మిగిలిన వారందరూ ఒక అంకెతోనే సరిపెట్టుకున్నారు. ఫ్రెంచి నిబంధనల ప్రకారం తొలి రెండు స్దానాల్లో ఉన్న వారు తుదివిడతలో పోటీపడాల్సి ఉంది. అర్హత కోల్పోయిన పార్టీల మద్దతుదారులు తుది విడత ఎవరో ఒకరిని ఎంచుకొని ఓటు వేస్తారు. 2022 ఎన్నికల్లో, అంతకు ముందు కూడా మక్రాన్‌, లీపెన్‌లే తుది విడత పోటీ పడ్డారు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఉన్నంతలో తక్కువ హాని చేసే వారిని ఎన్నుకుందామనే వైఖరిని ఇతర పార్టీలు తీసుకున్నాయి. దానిలో భాగంగానే ఈ ఎన్నికల్లో ఇటీవలి కాలంలో తొలిసారిగా పోటీ చేసిన ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్ష , హరిత పార్టీలు కూడా మక్రాన్‌కు మద్దతు ప్రకటించాయి. లీపెన్‌కు మితవాదశక్తులు బాసటగా నిలిచాయి.


తొలి విడత కమ్యూనిస్టు పార్టీ పోటీకి దిగకుండా దానికి వచ్చిన 2.28శాతం ఓట్లను మెలాంచన్‌కు బదలాయించి ఉంటే 24,13 శాతంతో రెండవ స్దానంలో ఉండి తుది విడత మక్రాన్‌తో పోటీ జరిగేదని, మితవాద-వామపక్ష శక్తుల పోటీగా నిలిచేదని కొందరు పేర్కొన్నారు.ఇదే సూత్రం పచ్చి మితవాద పార్టీలకూ వర్తిస్తుంది. ఎరిక్‌ జుమౌర్‌ అనే పచ్చి మితవాదికి 7.07శాతం వచ్చాయి, ఆ రెండు పార్టీలు కలిసినా వారే మొదటి స్ధానంలో ఉండేవారు. గ్రీన్స్‌, మరో వామపక్ష అభ్యర్ధికి వచ్చిన ఓట్లను కూడా కలుపు కుంటే మొత్తం 30శాతం వరకు ఉన్నాయి. వామపక్షశక్తుల మధ్యరాజకీయ విబేధాల కారణంగానే ఎవరికి వారు తమ వైఖరిని ఓటర్ల ముందుంచి పోటీ చేశాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే పోటీ మక్రాన్‌-వామపక్ష అభ్యర్ధి మధ్య జరిగినా గెలుపు మక్రాన్‌దే అన్నది స్పష్టం. మితవాద, పచ్చిమితవాద శక్తులు అధికారం కోసం కుమ్ములాడుకోవటం తప్ప వారి విధానాల్లో పెద్ద తేడాలేమీ లేవు. మక్రాన్‌ ఐరోపా సమాఖ్యలో ఉండాలనే వైఖరి, లీపెన్‌ దానికి భిన్నమైన విధానం కలిగి ఉన్నారు తప్ప దేశ ఆర్ధిక విధానాల్లో వారి మధ్యపెద్ద తేడాలేమీ లేవు.


తనకు వామపక్ష అభిమానులు ఓటు వేశారని తెలుసునని, వారు లీపెన్‌న్ను అడ్డుకున్నారని ఫలితాల అనంతరం చెప్పిన మక్రాన్‌ తనకు ఓటు వేసిన వారందరూ తన మద్దతుదారులు కాదని కూడా చెప్పారు. తాను ప్రకటించిన విధానాలకే కట్టుబడి ఉంటాను తప్ప వామపక్ష అభిమానులు తనకు ఓటేసినంత మాత్రాన ఆ శక్తులు ముందుకు తెచ్చిన విధానాలను తాను అమలు జరపాల్సిన అవసరం లేదనే సందేశం కూడా దీనిలో ఇమిడి ఉంది. మక్రాన్‌కు ఓటు వేసినంత మాత్రాన అతగాడి విధానాల మీద భ్రమలుండి కాదని, ఇద్దరు శత్రువులలో ఉన్నంతలో తక్కువ హాని చేసే వారినే ఎంచుకొని వేశామని, తమ ఉద్యమాలకు ఎలాంటి విరామం ఉండదని కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు ప్రకటించాయి. గత ఐదు సంవత్సరాల మక్రాన్‌ ఏలుబడిని చూసినపుడు ఒకశాతం ధనికులకు మాత్రమే తగిన ప్రతినిధిగా, 99శాతం మందిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టిన పెద్దమనిషిగా దర్శనమిచ్చాడు. కొత్తగా ఉపాధి లేకపోగా ఉన్న కార్మికులను సులభంగా వదిలించుకొనేందుకు యజమానులకు వీలు కల్పించాడు. ఫలితంగా తక్కువ వేతనాలకు పని చేస్తారా ఉద్యోగాల నుంచి ఊడగొట్టమంటారా అంటూ ఓనర్లు ఉన్నవారికి, కొత్తగా తీసుకున్న వారికి వేతనాలను తగ్గించారు. వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు పన్నులను తగ్గించాడు, ఆ మేరకు సామాన్యుల సంక్షేమ పధకాలకు కోత పెట్టాడు. దానికి తోడు మిలిటరీ ఖర్చును కూడా పెంచాడు.దేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపారులు 35శాతం మంది దివాలా తీసినట్లు అంచనా.ప్రస్తుతం 1,07,000 దివాలా కేసులు నడుస్తున్నాయి. ఈ పరిణామాలను చూసిన తరువాత మక్రాన్‌ విధానాల మీద అనేక మందికి భ్రమలు తొలిగి అసంతృప్తితో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు, లేదా ఖాళీ బాలట్‌ పత్రాలను వేశారు.


గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ఉన్న పార్టీ ప్రస్తుతం నేషనల్‌ రాలీ పార్టీగా పేరు మార్చుకుంది. తాజా అభ్యర్ధి మారినే లీపెన్‌ తండ్రి జీన్‌ మారీ లీపెన్‌ తొలిసారిగా 2002 ఎన్నికల్లో పోటీ చేసి 18శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. గత ఎన్నికల్లో కూతురు మారినే లీపెన్‌ 33.9శాతానికి, తాజాగా 41.5శాతానికి పెంచుకుంది.ఈ పరిణామాన్ని తన గెలుపుగా భావిస్తున్నాను తప్ప ఓడినట్లు భావించటం లేదని, జనానికి ఒక ఆశాభావం కల్పించినట్లు ఆమె అన్నారు. ఫ్రాన్స్‌లోకి వలస కార్మికులను అనుమతించరాదని, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొడుతూ నేషనల్‌ పార్టీ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తోంది. మక్రాన్‌తో పోలిస్తే ఈ పార్టీ కార్పొరేట్లకు మరింతగా అనుకూలమని, అయితే ఈ సారి ఎన్నికల్లో దేశంలో పెరిగిన ద్రవ్యోణం, ధరలు, జీవన వ్యయం, పన్నుల అంశాలను కూడా ప్రచార అంశం చేసింది. ఇది కూడా ఓట్లు పెరిగేందుకు దోహదం చేసిందని చెబుతున్నారు.పెన్షన్‌ చెల్లింపులను తప్పించుకొనేందుకు ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచుతానని మాక్రాన్‌ చెబితే 62 సంవత్సరాలకు మించకూడదని నేషనల్‌ పార్టీ పేర్కొన్నది. అంతే కాదు, దిగజారిన ఆర్ధిక పరిస్ధితులను గమనంలో ఉంచుకొని తాము వస్తే చమురు మీద పన్నులు తగ్గిస్తామని,ఆహారం, ఇతర అత్యవసర వస్తువుల కోసం కొన్ని నిధులు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది. తాము విస్మరణకు గురైనట్లు భావిస్తున్న వారు ఈ నినాదాలకు ఆకర్షితులైనట్లు భావిస్తున్నారు. పలు చోట్ల స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓట్లు వేసినప్పటికీ జాతీయంగా అధికారానికి వచ్చే స్ధితి లేనందున వారు కూడా మక్రాన్‌ లేదా నేషనల్‌ పార్టీలవైపు మొగ్గుతున్నారు.
ఈ ఎన్నికలను కూడా అమెరికా మీడియా ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముడిపెట్టేందుకు ప్రయత్నించింది.గతంలోను, ఇటీవల తమ ప్రచారానికి అవసరమైన రుణాలను రష్యన్‌ బాంకుల నుంచి తీసుకోవటం వంటి ఉదంతాలు, గతంలో పుతిన్‌కు నేషనల్‌ పార్టీ మద్దతు ప్రకటించిన వాటిని పట్టుకొని ఫ్రెంచి అధ్యక్ష ఎన్నికలు నాటో వ్యతిరేక-పుతిన్‌ అనుకూల మారినె లీపెన్‌ వైఖరిపై తీర్పుగా ఉంటాయని చిత్రించింది.

అధ్యక్ష ఎన్నికల్లో వచ్చిన అనుభవాలు, ఫలితాలను గమనంలోకి తీసుకున్న వామపక్ష శక్తులు జూన్‌లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో ఓట్లు చీలకుండా చూడాలనే ఆకాంక్షను వెలిబుచ్చాయి. అటువంటి సర్దుబాటు కుదిరితే కొన్ని చోట్ల వాటికి మొత్తంగా 30శాతం ఓట్లు ఉండటం, స్ధానికంగా జరిగే ఎన్నికలు గనుక ఇతర పార్టీలకు ఓటు చేసిన వాటి అభిమానులు తిరిగి వామపక్షాలకు ఓట్లు వేసే అవకాశం ఉన్నందున మంచి ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. తొలి దఫా ఎన్నికల్లో వామపక్షాలకు వచ్చిన ఓట్లను చెదరకుండా చూస్తే మక్రాన్‌ – మారినె లీపెన్‌ ప్రాతినిధ్యం వహించే శక్తులను దెబ్బతీయ గలమని అధ్యక్ష ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఫాబియన్‌ రౌసెల్‌ చెప్పాడు. మే దినోత్సవ నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించటం ద్వారా వామపక్ష ఐక్యతాయత్నాలకు శ్రీకారంచుడతామని అన్నాడు. మక్రాన్‌ గెలిచినంత మాత్రాన అతని విధానాలకు మద్దతు ఇచ్చినట్లు కాదని అలాగే నేషనల్‌ పార్టీ ఓడినంత మాత్రాన పచ్చి మితవాద శక్తుల ప్రమాదం తప్పినట్లు కాదని అన్నాడు. వామపక్ష నేత మెలాంచన్‌ కూడా ఐక్యతాయత్నాలను ప్రారంభించాడు. గతంలో అధికారాన్ని చలాయించిన సోషలిస్టులు కూడా సుముఖంగానే ఉన్నట్లు వార్తలు. మితవాద శక్తులు కూడా పెరిగిన ఓట్లశాతంతో పార్లమెంటులో మెజారిటీ సాధించాలని ముందుకు పోతున్నారు. కార్మికవర్గానికి ముప్పు ముంచుకువస్తున్నదని కార్మిక సంఘం సిజిటి ముందే హెచ్చరించింది. పార్లమెంటులో ఈ రెండు శక్తులది పై చేయికాకుండా చూడాలని 66శాతం మంది ఓటర్లు పేర్కొన్నట్లు ఒక సర్వే వెల్లడించింది.మరొక సర్వేలో కూడా అదే తేలింది.


ఒక నాటో సభ్యదేశంగా ఫ్రాన్సు కూడా రష్యా మీద ఆంక్షలను సమర్ధించినప్పటికీ అమెరికా,బ్రిటన్‌ అనుసరించే వైఖరితో పూర్తి ఏకీభావం లేదు. ఆ ప్రభావం తన మీద పడకుండా చూసుకొనేందుకు మక్రాన్‌ ప్రయత్నించాడు. ఇప్పుడు ఎన్నిక ముగిసింది కనుక అమెరికాతో కలసి శత్రుపూరితంగా ముందుకు పోతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. జూన్‌లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు తెచ్చుకోవటం కూడా అవసరమే కనుక అవి ముగిసే వరకు వైఖరిలో మార్పు ఉండదు. ప్రతిపక్షాలకు మెజారిటీ వస్తే ఇబ్బందుల్లో పడతాడు. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం ఇప్పటికే ఇతర పశ్చిమ దేశాలతో పాటు ఫ్రాన్సు మీద కూడా పడింది. అది కొనసాగితే కార్మికవర్గ ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుంది. తీవ్ర అసంతృప్తి కారణంగానే తొలి దఫా ఎన్నికల్లో 73.69శాతం మంది ఓట్లు వేయగా తుది దఫా 71.99శాతం మాత్రమే పోలైనట్లు భావిస్తున్నారు.


మక్రాన్‌ గెలిచినందుకు సంతోషం వెలువడినా లీపెన్‌కు ఆ స్దాయిలో ఓట్లు రావటం ఆందోళన కలిగించే పరిణామంగా కూడా అభిప్రాయాలు వచ్చాయి. దేశంలో ప్రజాస్వామ్యానికి ఉచ్చు బిగుస్తున్నదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. గత ఐదు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తక్కువగా(72శాతం) పొల్గన్న తొలి ఎన్నిక ఇది. మక్రాన్‌ కార్మిక వ్యతిరేక వైఖరి, లీపెన్‌ మితవాద విధానాలు ఎవరికి ఓటు వేసినా ఉపయోగం ఏముందనే నిర్లిప్తత కారణంగా ఓటర్లు ఉత్సాహం చూపటంలేదని ఓటింగ్‌కు ముందే అభిప్రాయ సేకరణ సర్వేల్లో వెల్లడైంది. ఉదారవాదిగా పేరున్న మక్రాన్‌ మితవాదిగా మారుతుండగా, పచ్చిమితవాది మారినే లీపెన్‌ ప్రజల మనిషిగా కనిపించేందుకు పూనుకున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడించినట్లు కొందరు వ్యాఖ్యానించారు. గతంలో ఆమెను ఒక దయ్యంగా వర్ణించిన మీడియా ఇప్పుడు ఆమెను ఒక కలుపుగోలు, సాధారణ మహిళగా పేర్కొంటున్నది. మక్రాన్‌ అనుసరించిన విధానే పచ్చిమితవాద లీపెన్‌కు ఆదరణ పెరిగేందుకు తోడ్పడిందని భావిస్తున్నారు. ఇది ఐరోపాకే కాదు, ప్రపంచ మొత్తానికి ఆందోళన కలిగించే అంశమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రతి ఘనతా నరేంద్రమోడీ ఖాతాకే, ఓకే ! ధరల పెరుగుదలను ఎవరి మెడకు చుడదాం ?

15 Friday Apr 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Inflation, Inflation in India, Narendra Modi Failures, price rise in india


ఎం కోటేశ్వరరావు


ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29శాతం ఉంది. ఏప్రిల్‌ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి. ఉపాధి ఉన్న వారికి కూడా వేతనాల పెరుగుదల ఉండటం లేదు. 2004-05 నుంచి 2011-12 వరకు కాజువల్‌, రెగ్యుల కార్మికుల వేతన పెరుగుదల 5.2శాతం ఉంటే 2011-12 నుంచి 2018-18 వరకు 1.05శాతానికి తగ్గిందని(ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌ మెంట్‌ వర్కింగ్‌ పేపర్‌ 1-2020) తేలింది. కరోనా కాలంలో పరిస్ధితి ఎలా దిగజారిందో, తరువాత ఎలా ఉందో తెలిసిందే. 2021 మార్చినెలతో పోలిస్తే 2022 మార్చినెలలో ఆహార ధరల పెరుగుదల రేటు రెట్టింపు అంటేే నమ్ముతారా ? ఇవి ఏప్రిల్‌ 12న ప్రకటించిన మోడీ ప్రభుత్వ లెక్కలే.గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల ఆహార ధరల ద్రవ్యోల్బణం 2021 మార్చినెలలో 3.94శాతం ఉంటే, ఈ ఏడాది 8.04శాతానికి పెరిగింది. ఇదే మాదిరి ధరల సూచిక 4.61 నుంచి 7.66శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చినెలల్లో 5.81 నుంచి 8.04శాతానికి చేరింది. దేశం మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో 4.87 నుంచి 7.68శాతానికి, మొత్తంగా ధరల సూచిక గత పదిహేడు నెలల్లో గరిష్టంగా 6.95శాతానికి ఈ ఏడాది మార్చిలో పెరిగింది. ఆహార వస్తువుల్లో నూనెల ధరల సూచిక ఏడాది క్రితంతో పోలిస్తే 18.79 పెరిగింది.
ధరలు పెరిగితే ఏమౌతుంది ? ప్రతి ఒక శాతం ఆహార ధరల పెరుగుదల కోటి మందిని దుర్భర దారిద్య్రంలోకి నెడుతుందని ప్రపంచ బాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్‌పాస్‌ చెప్పాడు. ధనికులు తట్టుకుంటారు, పేదలు ఓపలేరు, పోషకాహరలేమితో పిల్లలు గిడసబారతారు అని కూడా చెప్పాడు.

ద్రవ్యోల్బణ పెరుగుదల ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచమంతటా ఉంది, అమెరికా,బ్రిటన్‌, చైనా, శ్రీలంక, పాకిస్తాన్లో కూడా ఉంది అని కొంత మంది కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని వెనకేసుకు వచ్చేందుకు పూనుకున్నారు. అంటే మన ఏలికలు దేశాన్ని లంక, పాకిస్తాన్‌గా మార్చబోతున్నారా ? నరేంద్రమోడీ విధానాల ఘనత ఎక్కడికి పోయినట్లు ? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఇతర సందర్భాల్లో వాటితో మనలను పోల్చటం ఏమిటని అంటారు. బ్రిటన్‌లో గాస్‌, విద్యుత్‌ ఛార్జీలు ఇటీవలి కాలంలో 54శాతం పెంచిన కారణంగా అక్కడ ఏడుశాతం ద్రవ్యోల్బణం ఉంది. మరి మన దేశంలో కూడా అదే స్దాయిలో ఎందుకున్నట్లో మోడీ సమర్ధకులు చెప్పాలి. అమెరికాలో ధరల సూచిక 8.5శాతం పెరిగింది. చైనాలో ఫిబ్రవరి నెలలో 0.9శాతం వినియోగదారుల సూచి పెరగ్గా మార్చినెలలో 1.5శాతం ఉన్నట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.దక్షిణ కొరియాలో 4.1శాతం ఉంది. పాకిస్తాన్‌లో మార్చి నెలలో 12.7, శ్రీలంకలో 18.7 శాతం చొప్పున ఉంది. మనం ఎవరి బాటలో నడవబోతున్నాం ? చైనా మార్గమా ? ఇతర దేశాల వెంటా ? ఎవరి మార్గం అనుసరిస్తారో మనకు అనవసరం, ధరలు తగ్గకపోతేమానే పెరగకుండా చూడండి మహా ప్రభో అంటున్నారు జనం.


ప్రతిదానికీ ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఒక సాకుగా చూపటం, జనాన్ని వెర్రివాళ్లను గావించటం మామూలైంది. మనం కూడా గుడ్డిగా నమ్ముతున్నామనుకోండి ! సదరు యుద్దం ప్రారంభమైంది ఫిబ్రవరి 24న, కానీ ఆ నెలలో మన దేశ పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధి 1.7శాతమే, కానీ అంతకు గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 4.7శాతం తగ్గింది. ఈ కాలంలో అంతా బాగుందన్నారు, నవంబరు నాలుగు నుంచి 137 రోజులు చమురు ధరలను మన సర్కారు పెంచలేదు. ఇతరంగా ప్రభావాలేమీ లేవు, ఈ కాలంలో కార్మికుల సమ్మెలు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది.మరి ఉత్పత్తి ఎందుకు పడిపోయినట్లు ? ఎలక్ట్రానిక్స్‌ వంటి గృహౌపకరణాలు, ఇతర పరికరాల ఉత్పత్తి 8.2, 5.5శాతాల చొప్పున తిరోగమనంలో ఉంది. మార్చి నెల, తరువాత రోజుల్లో యుద్ద ప్రభావాల గురించి నిపుణులు చెబుతున్న అంశాలను చూస్తే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ది మరింతగా పడిపోనుంది.


ప్రపంచ గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్‌ వాటా 30,20శాతాల చొప్పున ఉంది. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే దేశాల్లో కొరత ఏర్పడి ధరలు పెరిగాయంటే అర్ధం చేసుకోవచ్చు, మన దేశంలో ఎందుకు పెరగాలి? ఆహార ధాన్యాలు అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్నట్లు కొందరు చెబుతారు. అదే నిజమైతే ధరలెందుకు తగ్గటం లేదు. దేశంలో 23-25మిలియటన్నుల ఖాద్యతైలాల వినియోగం ఉండగా స్ధానికంగా ఉత్పత్తి పదిమిలియటన్నులు. మిగతాదంతా దిగుమతే. మన దేశం దిగుమతి చేసుకొనే ఖాద్య తైలాల్లో పామాయిల్‌ 62శాతం ఉంది. పొద్దుతిరుగుడు గింజల నూనె వాటా 14శాతమే. అది ఫిబ్రవరి వరకు సజావుగానే వచ్చింది. అక్టోబరుతో ముగిసిన ఏడాదిలో మనం 1.89మిలియన్‌ టన్నుల పొద్దుతిరుగుడు నూనె దిగుమతి చేసుకున్నాం. మన దిగుమతుల్లో ఉక్రెయిన్నుంచి 74, రష్యా, అర్జెంటీనాల నుంచి 12శాతాల చొప్పున జరుగుతోంది. ఉక్రెయిన్నుంచి మార్చినెలలో దిగుమతులు నిలిచినా ఇతర దేశాల నుంచి ఆ మేరకు పామాయిల్‌ దిగుమతులు పెరిగినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. అలాంటపుడు నూనెల ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరగాల్సిన అవసరం ఏముంది?


ధరల మీద పాలకుల నియంత్రణ కొరవడిందన్నదే అసలు కారణం. పర్యవసానంగా రు.120 నుంచి 190 వరకు నూనెల ధరలు పెరిగాయి. మన దేశం దిగుమతి చేసుకొనే నూనెల మీద విధించిన పన్నుల ద్వారా ఏటా రు.35వేల కోట్లు కేంద్రానికి రాబడి వస్తున్నది. నూనె గింజల సాగు గిట్టుబాటు కాని కారణంగానే రైతాంగం వరి, గోధుమల వైపు మొగ్గుతున్నారు. సగటున ఏటా పదిబిలియన్‌ డాలర్లను దిగుమతులకు వెచ్చిస్తున్నారు తప్ప రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు లేవు. తొలి ఐదేండ్లలో అన్ని లోపాలను సరిదిద్దారు అని గతంలో నరేంద్రమోడీ గురించి చెప్పారు.మరి ఇప్పుడు ఎనిమేదేండ్లుగడచినా ఈ లోపాన్ని ఎందుకు సరిచేయలేదన్నది ప్రశ్న. 2013-14లో మన దేశం 11.82 మి.టన్నులు దిగుమతి చేసుకోగా ఇప్పుడు 15మి.టన్నులకు పెరిగిందే తప్ప తరగలేదు.


ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతన పెరుగుదల ఉండదు, దాంతో కొనుగోలు శక్తి పడిపోతుంది. అది వస్తువినిమయం తగ్గటానికి, ఉత్పత్తి తగ్గేందుకు. అది ఉపాధి కోల్పోవటానికి దారితీస్తుంది. ఇదంతా ఒక విషవలయం. పట్టణ ప్రాంతాల్లో గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో నిరుద్యోగం12.6శాతానికి చేరింది. అంతకు ముందు మూడు నెలలతో పోలిస్తే ఉపాధి పొందుతున్న 15ఏండ్లకు పైబడిన వారి శాతం 43.1 నుంచి 40.9శాతానికి తగ్గింది.
కొంత మంది నమ్మిక ప్రకారం ఏ జన్మలో చేసుకున్న ఖర్మ ఫలితమో ఇప్పుడు జనం అనుభవిస్తున్నారు.ధరల పెరుగుదల గురించి బిజెపి నేతలేమంటున్నారో చూద్దాం. పిటిఐ వార్తా సంస్ధ 2021 ఆగస్టు ఒకటిన ఇచ్చిన కధనం ప్రకారం మధ్య ప్రదేశ్‌ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ కాంగ్రెస్‌ నిరసన మీద మండిపడుతూ అసలు దేశంలో ద్రవ్యోల్బణ సమస్య ఒకటి రెండు రోజుల్లో వచ్చింది కాదని, 1947 ఆగస్టు 15న ఎర్రకోట దగ్గర ప్రధాని నెహ్రూ చేసిన ప్రసంగంతో ప్రారంభమైందని సెలవిచ్చారు. వాక్సిన్లు ఉచితంగా వేయటం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసిందని బిజెపి ఎంపీ మనోజ్‌ తివారీ చెప్పారు. 2014లో అధికారానికి రాక ముందు పార్టీ పెద్దలు పలికిన సుభాషితాలను చూద్దాం. పెట్రోలు ధరలు పెంచటం యుపిఏ సర్కార్‌ ప్రాధమిక వైఫల్యానికి నిదర్శనమని,సమావేశాలు ముగిసిన తరువాత చేయటం పార్లమెంటును అగౌరవ పరచటమే అని, పెంపుదల వలన గుజరాత్‌ జనాలపై వందల కోట్ల భారం పడుతుందని 2012 మే 23వ తేదీన గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ ట్వీట్‌ చేశారు. ఇప్పుడు అదే మోడీ ఏలుబడిలో ధరల పెంపుదలకు అసలు పార్లమెంటుతోనే పనిలేదు.


గాస్‌ సిలిండర్లు పట్టుకొని వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేసిన బిజెపి నేత, ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ గారేమన్నారంటే 2011 జూన్‌ 24న ఒక ట్వీట్‌ చేస్తూ ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ అని చెప్పుకొనే యుపిఏ సర్కార్‌ గాస్‌ బండ మీద రు. 50 పెంపు ఎంత సిగ్గుచేటు అన్నారు.2012 డిసెంబరు 24న మరొక ట్వీట్‌లో యుపిఏ దృష్టిలో జిడిపి వృద్ది అంటే గాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రశ్నించిన వారి మీద ఆమె మండిపడుతున్నారు. ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చకపోతే పొలిటీషియన్లు కాదన్న గిరీశాన్ని బిజెపి నేతలు గుర్తుకు తెస్తున్నారు. ధరల పెరుగుదల ప్రభుత్వ వైఫల్యమని 2014కు ముందు చెప్పిన వారు ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితుల మీద నెపాన్ని మోపుతున్నారు. మధ్య ప్రదేశ్‌ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ను ఆదర్శంగా తీసుకున్న ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గారు కూడా నెహ్రూను వదలిపెట్టలేదు. కాంగ్రెస్‌ వారిని ఎద్దేవా చేస్తూ ” చివరికి 1951లో కూడా పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ భారత ద్రవ్యోల్బణాన్ని కొరియా యుద్ధం ప్రభావితం చేసిందని చెప్పి ఉండేవారు….. కానీ ఇప్పుడు ప్రపంచం విశ్వవ్యాప్తంగా అనుసంధానమై ఉంది కనుక ఉక్రెయిన్‌ మనలను ప్రభావితం చేస్తోందని చెబుతున్నాం, అంగీకరించరా ” అన్నారు. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి మాట్లాడుతూ మధ్యతరగతి వారు కష్టాలను భరించి కరోనా వాక్సిన్లు అందచేసేందుకు ప్రభుత్వానికి తోడ్పడాలని చెప్పారు. టాక్సులు లేకపోతే చమురు ధరలు ఎక్కువ కాదు. మీరు మాత్రం ఉచితంగా వాక్సిన్లు పొందాలి, మరి వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మీరేమీ చెల్లించలేదు, అందుకే ఈ విధంగా వసూలు చేస్తున్నాం ” అన్నారు. జనానికి తెలివితేటలుంటాయని వారు గనుక భావించి ఉంటే ఇంతగా బరితెగించి అడ్డగోలు వాదనలు చేసే వారు.


గత ఎనిమిది సంవత్సరాలుగా దేశంలో ఏం జరిగినా ఆ ఘనత నరేంద్రమోడీదే, చివరికి పొద్దు పొడుస్తుందన్నా, చీకటి పడుతుందన్నా మోడీ అధికారానికి వచ్చిన నాటి నుంచే జరుగుతోందని చెప్పే వారు మనకు కనిపిస్తారు. నిజమైన స్వాతంత్య్రం 2014లోనే వచ్చిందని పద్మశ్రీ కంగన రనౌత్‌ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. పోనీ భక్తుల కోరిక మేరకు జరిగిన వాటన్నింటినీ నరేంద్రమోడీ ఖాతాలోనే వేద్దాం. మరి ఇప్పుడు ధరల పెరుగుదలను ఎవరి మెడకు చుడదాం ? 1947 నుంచే ప్రారంభమైందని, గాంధీ, నెహ్రూలే కారణం అని బిజెపి పెద్దలు సెలవిచ్చినా జనం నమ్మక తప్పదు, కాదంటే తంటా కొని తెచ్చుకోవటమే. అచ్చేదిన్‌ కనుక మౌనంగా భరిస్తున్నారు, ఏడవలేక నవ్వుతున్నారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆత్మగౌరవం, అమెరికా వ్యతిరేకత ఇమ్రాన్‌ ఖాన్‌ కొత్త నినాదమా ?

13 Wednesday Apr 2022

Posted by raomk in Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

imran khan, Narendra Modi, Pakistan political crisis, Shehbaz Sharif


ఎం కోటేశ్వరరావు


క్రికెట్‌లో కీలకమైన చివరి ఓవర్‌, బంతి మాదిరి తన ప్రభుత్వాన్ని కాపాడు కొనేందుకు మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా శ్రమించినా రాజకీయ క్రీడలో ఓడిపోయాడు. ఏప్రిల్‌ తొమ్మిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల తరువాత అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ప్రతిపక్షం నెగ్గింది. పదకొండవ తేదీన నూతన ప్రధాని ఎన్నిక ఓటింగ్‌కు ముందే పాకిస్తాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌ (పిటిఐ) సభ్యులందరూ పార్లమెంట్‌ నుంచి వాకౌట్‌ చేశారు. సామూహికంగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. పాకిస్తాన్‌ చరిత్రలో తొలిసారిగా అవిశ్వాస తీర్మానంతో ఒక సర్కార్‌ పతనమైంది. గత ఏడాది నవంబరు 28న ప్రారంభమైన ఉత్కంఠకు ఏప్రిల్‌ తొమ్మిదిన తెరపడింది. మరుసటి రోజు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా కొత్త సర్కార్‌ ఏర్పడింది. రాజ్యాంగ సంక్షోభం ముగిసినా రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. తదుపరి ఎన్నికలు 2023 ఆగస్టు 13- అక్టోబరు 12 మధ్య జరగాల్సి ఉంది. అప్పటి వరకు ప్రతిపక్షం లేకుండా పార్లమెంట్‌ నడుస్తుందా ? కొత్త ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. ముస్లింలీగ్‌ నేత షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా, ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పిటిఐ సభ్యుడు షా మహమ్మద్‌ ఖురేషీ కూడా నామినేషన్‌ వేసినప్పటికీ ఆ పార్టీ సభ్యులు రాజీనామా చేయటంతో షెహబాజ్‌ షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.


జాతీయ అసెంబ్లీలోని 342 మందికి గాను పిటిఐకి 155 మంది సభ్యులుండగా వారిలో 135 మంది రాజీనామా చేశారు. తిరస్కరించిన 20 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వ పతనం మీద దేశ ప్రజల్లో మిశ్రమ స్పందన వెల్లడైనట్లు ఒక సర్వే వెల్లడించింది. సంతోషం వెలిబుచ్చిన వారు 57శాతం, ఆగ్రహించిన వారు 43శాతం ఉన్నట్లు గాలప్‌ పేర్కొన్నది.జనం ఆగ్రహిస్తున్నారని గ్రహించే పిటిఐ సభ్యులు రాజీనామాలకు సిద్దపడినట్లు వార్తలు వచ్చాయి. రాజీనామా లేఖను ఉపసభాపతి ఖాశింకు అందచేశామని ఆమోదించవచ్చని పిటిఐ నేతలు చెప్పారు గానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశీ కుట్ర లేఖపై పార్లమెంటరీ కమిటీ విచారణను తాము అంగీకరించటం లేదని, సుప్రీం కోర్టు విచారణ జరపాలని పిటిఐ డిమాండ్‌ చేసింది.


జాతీయ అసెంబ్లీలోని 342 మందికి గాను 174 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అంతకు ముందు ఇమ్రాన్‌ఖాన్‌పై తిరుగుబాటును ప్రకటించిన పిటిఐ పార్టీ సభ్యులు ఓటింగ్‌ సమయంలో అధికాపక్షం వైపే కూర్చున్నారు. సాధారణ మెజారిటీకి అవసరమైన 172కు గాను అదనంగా మరో రెండు ఓట్లు మాత్రమే ప్రతిపక్షాలకు వచ్చాయి. అధికారపక్ష సభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించారు. గతేడాది నవంబరు 28న పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీనేత ఖుర్షీద్‌ ఖాన్‌ ఒక ప్రకటన చేస్తూ ఇమ్రాన్‌ ఖానున్న పదవీచ్యుతుడ్ని చేసేందుకు ప్రతిపక్షాలకు మెజారిటీ ఉందని చెప్పాడు. డిసెంబరు 24న పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌(ఎన్‌) నేత అయాజ్‌ సాదిక్‌ కూడా అదే చెప్పాడు. ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ లేదని జనవరి 11న అదే పార్టీ నేత ఖ్వాజా అసిఫ్‌ ప్రకటించాడు. ఇమ్రాన్‌ ఖాన్ను ఇంటికి పంపేందుకు తాము సెనేట్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని పీపుల్స్‌ పార్టీ నేత బిలావల్‌ భుట్టో జరదారీ ప్రకటించాడు.అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్దమని జనవరి 21న అయాజ్‌ సాదిక్‌ చెప్పాడు. ఫిబ్రవరి ఏడున ముస్లింలీగ్‌-పీపుల్స్‌ పార్టీ అధికారికంగానే దీని గురించి చర్చించాయి. పదకొండున ప్రతిపక్షాల తరఫున అవిశ్వాస తీర్మానం గురించి పిడిఎం పార్టీ నేత మౌలానా ఫజులుర్‌ రహ్మాన్‌ ప్రకటించాడు. మార్చి ఎనిమిదిన పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. మార్చి 12న అధికార పిటిఐ పార్టీ అసంతృప్త నేత అలీమ్‌ ఖాన్‌ లండన్‌లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో చర్చించాడు. విదేశీ నిధులతో జరిగిన కుట్ర తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెనుక ఉందని మార్చి 27న ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక బహిరంగ సభలో చెప్పాడు. మరుసటి రోజు ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం నోటీస్‌ ఇచ్చింది. ముప్పై ఒకటవ తేదీన దాన్ని చర్చకు తీసుకొని ఏప్రిల్‌ 3కు పార్లమెంటును వాయిదా వేశారు. ఆ రోజు డిప్యూటీ స్పీకర్‌ తీర్మానం చెల్లదని తిరస్కరించాడు. వెంటనే సభ రద్దు, అధ్యక్షుడి ఆమోద ముద్ర, సుమోటోగా సుప్రీం కోర్టు స్వీకరణ వెంటవెంటనే జరిగాయి.ఏడవ తేదీన స్పీకర్‌ చర్య, సభ రద్దు చెల్లదంటూ పునరుద్దరించిన సుప్రీం కోర్టు తొమ్మిదవ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరపాలని ఆదేశించింది. విదేశీ ప్రభుత్వ ఏర్పాటును తాను సహించబోనని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆమేరకు ఓటింగ్‌ జరిగి నెగ్గటంతో ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కార్‌ పతనమైంది.


ఏప్రిల్‌ తొమ్మిది-పదవ తేదీ పార్లమెంట్‌ సమావేశంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన సమావేశంలో అడుగడుగునా ప్రభుత్వ ప్రతిపక్షాలు కత్తులు దూశాయి. అర్దరాత్రి పన్నెండు గంటలకు కొద్ది నిమిషాల ముందు పాలకపక్షం ఎన్నుకున్న స్పీకర్‌ అసాద్‌ ఖ్వైజర్‌ రాజీనామా చేశాడు,ప్రతిపక్ష సభ్యుడు అయాజ్‌ సాదిక్‌కు సభాధ్యక్ష బాధ్యతను అప్పగించాడు. సాదిక్‌ వెంటనే ఓటింగ్‌ జరిపాడు.ప్రతిపక్షాలకు చెందిన 174 మంది అనుకూలంగా ఓట్లు వేశారు. ప్రతికూలంగా ఎవరూ వేయలేదు.


పదవిలో ఉండగా తన ప్రభుత్వ పతనానికి అమెరికా, భారత్‌, ఇజ్రాయల్‌ ప్రతిపక్షాలతో కలసి కుట్రపన్నిట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ విమర్శించాడు.దక్షిణాసియా వ్యవహారాల సహాయ మంత్రి డోనాల్డ్‌ లు తన ప్రభుత్వాన్ని బెదిరిస్తూ పంపిన లేఖ అంటూ బహిరంగసభలో ప్రదర్శించాడు. మన దేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించాడు, విదేశీ వత్తిళ్లకు భారత్‌ లొంగలేదని చెప్పాడు. మహమ్మదాలీ జిన్నా తరువాత తాను తప్ప పాక్‌ పాలకులుగా ఉన్నవారందరూ సిఐఏ ఏజంట్లు లేదా భారత్‌, ఇజ్రాయల్‌కు అమ్ముడు పోయిన బాపతేనని కూడా చెప్పాడు. స్వతంత్ర విదేశాంగ విధానం అవలంభించాలని పదే పదే చెప్పిన ఇమ్రాన్‌ ఖాన్‌ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల సారాన్ని చూస్తే రానున్న రోజుల్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా, గడువు ప్రకారమే జరిగినా విదేశాంగ విధాన ఆత్మగౌరవ అంశంతో జనం ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పవచ్చు. ఇది ప్రధాన ప్రత్యర్ధి పార్టీలను ఇరుకున పెట్టే అవకాశం ఉంది. భారత్‌ను తన అక్కున చేర్చుకొనే ఎత్తుగడలో భాగంగా అమెరికా తమ భుజాల మీద నుంచి తుపాకులు పేల్చిందని, ఇప్పుడు అది దగ్గర కాగానే తమను పట్టించుకోవటం లేదనే అభిప్రాయం పాకిస్తాన్‌ జనంలో రోజు రోజుకూ పెరుగుతున్నట్లు ఒక అభిప్రాయం.2018 జనవరి ఒకటిన నాటి అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్‌లో గత పదిహేను సంవత్సరాల్లో పాకిస్తాన్‌కు ఇచ్చిన 33 బిలియన్‌ డాలర్లకు ప్రతిగా అమెరికాకు దక్కింది అబద్దాలు, వంచన తప్ప మరొకటి కాదన్నాడు. పాకిస్తాన్‌లో ఏముంటాయంటే మూడు ”ఏ” లు (అల్లా, ఆర్మీ, అమెరికా) ఉంటాయని గతంలో కొందరు ఎద్దేవా చేశారు.
అగ్రరాజ్యమేదీ భారత్‌ను శాసించలేదని, ఆత్మగౌరవాన్ని అక్కడి నుంచి నేర్చుకోవాలని ఖాన్‌ అన్నాడు. అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందు దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాప్రయోజనాలు తమకు ముఖ్యమంటూ భారత్‌ తీసుకున్న వైఖరిని ఏ దేశమూ నిరోధించలేకపోయిందన్నాడు.” రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఐరోపా దౌత్యవేత్తలు పాకిస్తాన్‌ మీద వత్తిడి చేస్తున్నారు కానీ భారత్‌ విషయంలో వారా ధైర్యం చేయలేరు.మరొక దేశం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేను, మన విదేశాంగ విధానం సర్వసత్తాకమైనదిగా ఉండాలి. నా రష్యా పర్యటన పట్ల అమెరికా సంతోషంగా లేదు. మనది ఒక మిత్ర దేశంగా ఉన్నప్పటికీ నాలుగు వందల డ్రోన్‌ దాడులు చేసింది. నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసింది. ఇమ్రాన్‌ఖాన్ను పదవీచ్యుతుడిని చేసిన తరువాతే పాకిస్తాన్ను అమెరికా క్షమిస్తుందని ఒక అమెరికా ప్రతినిధి చెప్పాడు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని నేను అంగీకరించను. న్యాయవ్యవస్ధను నేను గౌరవిస్తాను, కానీ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆశాభంగం చెందాను. విదేశీ కుట్ర సాక్ష్యాన్ని కనీసం చూసి ఉండాల్సింది, ఆరోపణలపై విచారణకు ఆదేశించి ఉండాల్సింది. పాకిస్తాన్ను విదేశాలు ఒక తుడుచుకొని పారవేసే కాగితపు ముక్కలా ఉపయోగించకూడదు. ” అన్నాడు.


దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది, కానీ విదేశీ కుట్రలతో ప్రభుత్వమార్పిడికి వ్యతిరేకంగా మరోసారి స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమైందని, దేశ ప్రజాస్వామ్యం,సార్వభౌమత్వాన్ని ఎల్లవేళలా ప్రజలే కాపాడుకుంటారు” అని పేర్కొన్నాడు. రాజీనామా చేసిన 135 మంది పిటిఐ సభ్యుల లేఖలను ఆమోదిస్తే ఆ స్ధానాలన్నింటికీ ఉప ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అది మరొక ఎన్నికల పోరాటంగా మారుతుంది. ఇది కొత్త ప్రభుత్వం మీద, పార్టీల మీద వత్తిడిని పెంచుతుంది. ఎన్నికలు జరిగే వరకు రాజకీయ మధనానికి దారి తీస్తుంది. ఉప ఎన్నికల్లో తిరిగి పిటిఐ అభ్యర్ధులు నెగ్గితే తదుపరి జరిగే ఎన్నికల మీద మరింత వత్తిడిని పెంచుతుంది. లేదా దానికి అవకాశం ఇవ్వకుండా, దేశంలో మరింతగా అమెరికా వ్యతిరేకత పెరగక ముందే ముందస్తు ఎన్నికలకు పోవటమా అన్నది కొత్త కూటమి ముందున్న ప్రశ్న.


పాకిస్తాన్‌లో అధికారం ప్రధానంగా మిలిటరీ కనుసన్నలలో నడవటం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు సహకరించినట్లు భావించిన మిలిటరీ ఇప్పుడు వైరంతో ఉందని వార్తలు. కొత్త ప్రభుత్వం పట్ల ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పటికీ పాక్‌ మిలిటరీ మీద అమెరికా ప్రభావం తీవ్రంగా ఉందన్నది స్పష్టం. ఇటీవలి కాలంలో అమెరికన్లు మన దేశానికి పెద్ద పీటవేస్తుండటంతో జనంలో అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. భారత్‌ తన ఒళ్లోవాలుతున్నందున మన దేశాన్ని సంతుష్టీకరించేందుకు, చైనాకు వ్యతిరేకంగా మనలను నిలబెట్టే ఎత్తుగడకు ప్రాధాన్యత ఇస్తున్నందున పాకిస్తాన్‌తో గతం మాదిరి అమెరికా ఉండటం లేదు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న స్ధితిలో ఆదుకొనేందుకు ముందుకు రావటం లేదు. దీంతో రష్యా,చైనాల వైపు పాకిస్తాన్‌ మొగ్గుతున్నది. బహిరంగంగా అమెరికా వ్యతిరేక వైఖరిని తీసుకున్న ఇమ్రాన్‌ ఖాన్‌పై అమెరికా కక్షగట్టి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు వివిధ శక్తులను ఏకం చేయవచ్చుగానీ దాని విదేశాంగ విధానంలో మార్పులను అమెరికా రుద్దగలదా అన్నది ప్రశ్న. గతం మాదిరి తిరిగి ఇస్లామాబాద్‌ను తన కౌగిలిలోకి అమెరికా తెచ్చుకోదలచుకుంటే, అందుకు పాక్‌ సమ్మతిస్తే పాక్‌ వ్యతిరేకతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందుతున్న నరేంద్రమోడీ పరిస్ధితి ఏమిటి అన్నది ప్రశ్న. ఒకే వరలో పాక్‌-భారత్‌ అనే కత్తులను ఇమడ్చాలని అమెరికా చూస్తున్నది. కాశ్మీరు సమస్య కొనసాగినంతకాలం అది కుదరదు.


తనను నమ్ముకున్న దేశాలను అమెరికా నట్టేట ముంచుతుందని గతంలో అనేక మంది హెచ్చరించినా జనాలు పట్టించుకోలేదు. ఆప్ఘనిస్తాన్లో అమెరికాకు ఎదురైన పరాజయం, దానికంటే ఉక్రెయిన్ను ముందుకు తోసి చేతులెత్తేసిన తీరుతో మన దేశంలో అమెరికా భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.చైనా బూచిని చూపినా జనం నమ్మే స్ధితి లేదు. ఐరోపాలో నాటో కూటమి పేరుతో తిష్టవేసిన తన సైన్యాలను రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయినుకు పంపటానికి కొన్ని గంటలు చాలు, అయినా అమెరికా లేదా ఇతర ఐరోపా దేశాలేవీ ఆపని చేయలేదు. పెద్ద మొత్తంలో ఆయుధాలు పంపుతున్నాయి. కొంత మంది చెబుతున్నట్లుగా(ఈ రచయిత కాదు) చైనా-భారత్‌ మధ్య యుద్దమే గనుక జరిగితే చతుష్టయ కూటమిలోని అమెరికా లేదా జపాన్‌, ఆస్ట్రేలియా తమ మిలిటరీని మన సరిహద్దులకు పంపుతాయా ? అది సాధ్యమేనా ! కాస్త బుర్రతో ఆలోచించేవారికి కాదని స్పష్టంగా తెలుసు. నేటి భారత్‌ 1962నాటి భారత్‌ కాదని మన నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో చైనా 1962 నాటి మాదిరే ఉందని అనుకుంటున్నారా ? మనం ఇతర దేశాల దగ్గర ఆయుధాలు కొని పోరుకు దిగాలి. అదే చైనా ఇతర దేశాలకు ఆయుధ ఎగుమతులు చేసే స్ధితిలో ఉందని మరచిపోరాదు. ఆర్ధికంగా అమెరికానే సవాలు చేస్తోంది. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌తో సహా భారత ఉపఖండంలోని దేశాలన్నీ చైనాకు దగ్గరగా ఉన్నాయి. అందువలన చైనాతో ఉన్న వివాదాలను పరిష్కరించుకొనేందుకు పూనుకోవాలే తప్ప అమెరికా ఇచ్చిన తాయత్తులు కట్టుకొని బస్తీమే సవాల్‌ అని రంగంలోకి దిగితే జరిగే ఏం జరుగుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.పాక్‌ మిలిటరీతో తమ సంబంధాలు కొనసాగుతాయని అమెరికా మిలిటరీ బుధవారం నాడు ప్రకటించింది.అధికారానిన స్వీకరించి రెండు రోజులు గడిచినా ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మంత్రివర్గాన్ని ప్రకటించలేదు.భారత్‌ గనుక కాశ్మీరుకు 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తే మనమేం చేయాల్సి ఉంటుందని ప్రధానిగా తన తొలి ప్రసంగంలో షెహబాజ్‌ ప్రశ్నించాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శ్రీలంక సంక్షోభానికి చైనా కారణమా ! నిజానిజాలేమిటి !!

08 Friday Apr 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Prices, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

‘China debt trap’, Disinformation campaign, Hambantota Port, Propaganda War, Sri Lanka debt, Sri Lanka economic crisis


ఎం కోటేశ్వరరావు


శ్రీలంక తీవ్రమైన విదేశీ రుణ చెల్లింపుల సంక్షోభంలో ఉంది. దాంతో జనజీవితం అతలాకుతలం అవుతున్నది. అధికారపక్షానికి మద్దతు ఇచ్చే కొన్ని పార్టీలు, అదే పార్టీకి చెందిన కొందరు ఎంపీలు కూడా మద్దతు ఉపసంహరించుకొని స్వతంత్రులుగా ఉంటామని ప్రకటించారు. ఇది రాసిన సమయానికి తమ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ ఉందని, అధ్యక్షుడు, ప్రధాని గానీ రాజీనామా చేసేది లేదని మంత్రులు ప్రకటిస్తున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ప్రభుత్వ అసమర్ధత పట్ల జనం తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా తలెత్తిన రాజకీయ అశాంతి ఎలా పరిష్కారం అవుతుందో ఊహించలేము. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) నుంచి రుణం తీసుకొని చెల్లింపుల సమస్యనుంచి బయటపడేందుకు పూనుకుంది. అసలు లంకలో ఇలాంటి పరిస్ధితి తలెత్తటానికి కారణం ఏమిటి అనే చర్చ జరుగుతోంది. అమెరికా, బ్రిటన్‌, మన దేశంలోని మీడియా చైనా వైపు వేలెత్తి చూపుతోంది. ఎంతవరకు వాస్తవం, అసలు నిజానిజాలేమిటి ?


శ్రీలంకలోని హంబంటోటా రేవును చైనా నిధులతో అభివృద్ది చేశారు. రుణాన్ని లంక సర్కార్‌ చెల్లించకపోవటంతో ఆ రేవును 99 సంవత్సరాలకు చైనా కౌలుకు తీసుకోవటం ఆక్రమించటమే కదా, బిఆర్‌ఐ పేరుతో అనేక దేశాలను ఇలానే ఆక్రమిస్తున్నది అని చెబుతారు. ఇదంతా అమెరికా, ఇతర పశ్చిమదేశాల మీడియా కట్టుకధ. దున్న ఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా మన పత్రికలు, టీవీలు వెంటనే అందుకుంటాయి. లంకలో చైనా నిర్మిస్తున్న విద్యుత్‌ పధకాలు మన దేశ భద్రతకు ముప్పు అని ముక్తాయింపు ఇస్తాయి. చైనా నిర్మిస్తున్నది కనుక ఇలా అంటున్నాయా లేక లంకలో నిర్మాణం జరుగుతున్నందుకా? అదే నిజమైతే తమిళనాడులో మనం నిర్మిస్తున్న పధకాలు కూడా తమ భద్రతకు ముప్పే అని లంక భావిస్తే తప్పుపడతామా ? ఇదే తర్కాన్ని ఇతర మన ఇరుగుపొరుగుదేశాలు కూడా ముందుకు తెస్తే ఏంచెబుతారు ?


శ్రీలంకకు రుణాలు ఇచ్చిన అంతర్జాతీయ సంస్ధలు దేశాల వరుసలో చైనా నాలుగవ స్ధానంలో ఉంది. హంబంటోటా రేవు నిర్మాణం తమ ప్రభుత్వ ఆలోచన తప్ప చైనాది కాదు అని 2020అక్టోబరులో అధ్యక్షుడు రాజపక్స ప్రకటించాడు. చైనా నిర్మిస్తున్న పధకాలు అజాగళ స్ధనాల వంటివి అలంకార ప్రాయం తప్ప వాటి నుంచి పెద్దగా ఆదాయం రాదని ఒక పాటపాడతారు.తొలుత దీన్ని బ్రిటీష్‌ గూఢచార సంస్ధ, బిబిసి ప్రచారంలోకి తెచ్చింది. అలాంటి పధకాల నిర్మాణాన్ని చైనా, మరొకదేశం ఏదైనా ఒక స్వతంత్ర దేశం మీద రుద్దగలవా ? చైనా నిర్మిస్తున్న పధకాలలో కొలంబో పోర్టు సిటీ ఒకటి. ఈ ప్రత్యేక ఆర్ధిక ప్రాంతంలో పెట్టే సంస్ధలకు నాలుగు దశాబ్దాల పాటు పన్ను రాయితీలుంటాయి. దీని గురించి ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌(పిడబ్ల్యుసి) చెప్పిందేమిటి ? రానున్న ఇరవై సంవత్సరాల్లో 12.7బిలియన్‌ డాలర్ల అదనపు పెట్టుబడులు వస్తాయి, లంక ఆర్ధిక వ్యవస్ధకు 13.8బి.డాలర్లు తోడవుతాయని ఏడాది క్రితం పేర్కొన్నది. ఇది లండన్‌ కేంద్రంగా పని చేసే బహుళజాతి సంస్ధ. అదేమీ చైనా సంస్ధ కాదు కదా !


ఈ ఏడాది విదేశీ అప్పులకు గాను లంక చెల్లించాల్సిన కిస్తీ 4.5బి.డాలర్లు.గడువులోగా చెల్లించకపోతే దివాలా తీసినట్లు భావిస్తారు. ఇదిగాక దిగుమతులు, ఇతర అవసరాలకు మరో 20బి.డాలర్లు అవసరం అని అంచనా. శ్రీలంక 2007 నుంచి విదేశీ బాండ్ల రూపంలో రూపంలో తీసుకున్నది 35బి.డాలర్ల (ఇది 51బి.డాలర్లని కొందరు చెప్పారు) మొత్తం విదేశీ అప్పులో 47శాతం ఉంది. దీనిలో ఎక్కువ భాగం డాలర్లుగా చెల్లించాల్సింది ఉంది. ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బాంకునుంచి 14.3శాతం, జపాన్నుంచి 10.9, చైనా నుంచి తీసుకున్నది 10.8శాతం ఉంది. మిగతా రుణాలను మన దేశం, ప్రపంచబాంకు, ఇతర సంస్ధలు, దేశాల నుంచి తీసుకున్నది.శ్రీలంక బాండ్ల రుణాల్లో ఎక్కువ మొత్తం అమెరికా సంబంధిత సంస్ధల నుంచి తీసుకున్నదే, అంటే వాటిలో మదుపు చేసే వారందరూ అమెరికన్లే, ఆ రీత్యా ఎక్కువ అప్పులిచ్చింది అమెరికానే కదా ! గతేడాది డిసెంబరు ఆఖరు నాటికి లంక వద్ద 3.1 బి.డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంటే దానిలో చైనా సర్దుబాటు చేసి మొత్తం 1.5బి.డాలర్లుంది.వాస్తవాలు ఇలా ఉంటే చైనా కారణంగా లంక ఇబ్బందులు పడుతున్నదని ఎలా చెబుతారు ?


చైనా నుంచి శ్రీలంక ఎందుకు రుణాలు తీసుకుంది అన్నది అసక్తికరం.హంబంటోటా రేవు నిర్మాణం కోసం భారత్‌, అమెరికాలతో పోలిస్తే చైనాతో లావాదేవీలు మెరుగైనవిగా ఉండటమే కారణమని అమెరికాకు చెందిన అట్లాంటిక్‌ పత్రిక పేర్కొన్నది.2007లో లంక తొలుత ఈ రెండు దేశాలనే పెట్టుబడులు, రుణాలను కోరగా అవి తిరస్కరించాయి.2009లో లంకలో అంతర్యుద్దం ముగిసింది, ఆర్ధిక రంగం ఇబ్బందుల్లో పడటంతో విదేశాల నుంచి రుణాలు తీసుకోవటం ప్రారంభించింది. పదిహేను సంవత్సరాల వ్యవధి ఉన్న 30.7కోట్ల డాలర్ల రుణాలను 6.3శాతం వడ్డీతో చైనా ఇచ్చింది. తరువాత చైనా నుంచే మరో 75.7 కోట్ల డాలర్లను రెండు శాతం వడ్డీతో లంక తీసుకుంది. విదేశీ చెల్లింపుల సమస్యను అధిగమించేందుకు 2018లో చైనా అభివృద్ది బాంకు నుంచి వందకోట్ల డాలర్లను ఎనిమిదేండ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికన లండన్‌ ఇంటర్‌ బాంక్‌ రేటు(లిబోర్‌) ప్రకారం 2.56శాతానికి తీసుకుంది. తరువాత 2020మార్చినెలలో అంతకు ముందు కంటే తక్కువ వడ్డీకి అదే బాంకును మరో 50కోట్ల డాలర్లు తీసుకుంది. ఈ ఏడాది మరో 150కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. చైనా మెరుగైన షరతులతో రుణాలు ఇవ్వటం వల్లనే దానివైపు లంక మొగ్గినట్లు ఈ లావాదేవీలు వెల్లడిస్తున్నాయని అట్లాంటిక్‌ పేర్కొన్నది.


హంబంటోటా రేవు ద్వారా ఆశించిన మేరకు ఆదాయం రాకపోవటం, 2015నాటికి రుణ కిస్తీ చెల్లించకలేకపోవటంతో 70శాతం వాటాలను చైనా కంపెనీకి విక్రయించింది. తరువాత రేవు, పరిసరాల్లో ఉన్న 15వేల ఎకరాల భూమిని 99 సంవత్సరాల కౌలుకు ఇచ్చింది. దీంతో ఆ రేవును హిందూమహాసముద్రంలో చైనా మిలిటరీ అవసరాల కోసం వినియోగించనుందనే ప్రచారాన్ని అమెరికా, మన దేశం ప్రారంభించాయి. అదే నిజమనుకుంటే ఆ రేవు నిర్మాణానికి మన దేశం, అమెరికా తొలుత ఎందుకు తిరస్కరించినట్లు ? నిర్మాణం తరువాత విదేశీ సంస్ధలకు ఇవ్వాలనుకున్నపుడైనా చైనా నుంచి ముప్పు ఉందనుకున్నపుడు మనం లేదా అమెరికా ఎందుకు తీసుకోలేదు ?


ఒకరి దగ్గర రుణం తీసుకొని దాన్ని తీర్చేందుకు తిరిగి వారి దగ్గరే రుణం తీసుకోవటాన్ని రుణవల అని చైనా విమర్శకులు వర్ణిస్తున్నారు. ఇచ్చేవారుంటే ఇతర దేశాల దగ్గర తీసుకొని రుణాలు తీరిస్తే ఇబ్బందేముంది. ఆదుకోని ఇతర దేశాలను వదలిపెట్టి సాయం చేస్తున్న చైనాను విమర్శించటం దురుద్ధేశ్యపూరితం తప్ప మరొకటి అవుతుందా ? గిట్టుబాటు గాని రేవు నిర్మాణానికి రుణమిచ్చి తీర్చలేదనే పేరుతో అక్కడ పాగావేసేందుకు చైనా ఆ పని చేసిందని, అన్ని పేద దేశాల్లో ఇదే చేస్తోందని చెప్పే అమెరికా ప్రబుద్దులు, దానికి వంతపాడేవారు పుట్టుకువచ్చారు. ఇది నిజమా ?


చైనాతో నిమిత్తం లేకుండానే హంబంటోటా రేవును అభివృద్ధి చేసేందుకు లంక సర్కార్‌ నిర్ణయించింది. దాన్ని తొలుత ప్రోత్సహించింది చైనా కాదు కెనడా. దశాబ్దాలుగా ఆ ప్రతిపాదన ఉంది. తాము అధికారానికి వస్తే రేవు నిర్మాణం చేస్తామని యునైటెడ్‌ నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ 2001 ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ మేరకు ప్రభుత్వం 2002లో కెనడియన్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఏజన్సీకి సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే బాధ్యతను అప్పగించగా అది తమ దేశానికే చెందిన ఎన్‌ఎన్‌సి-లావలిన్‌ కంపెనీకి ఇచ్చింది. 2003 నాటికి అది వెయ్యిపేజీల నివేదిక ఇచ్చింది. దాన్ని ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మించాలని సిఫార్సు చేసింది. సదరు ప్రాజెక్టును ఐరోపా దేశాలు దక్కించుకోవచ్చనే ఆందోళనను కూడా వెలిబుచ్చింది. అప్పటి లంక పరిస్ధితుల కారణంగా కెనడా ముందుకు రాలేదు.మహింద రాజపక్స సోదరుల ఏలుబడిలో 2005-15 మధ్యదానికి ఒక రూపు ఇచ్చారు. కెనడా కంపెనీ తరువాత డెన్మార్క్‌ కంపెనీ రామ్‌బోల్‌ 2006లో రెండవ సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించింది. అది కూడా దాదాపుగా కెనడా కంపెనీ చెప్పిన అంశాలనే పేర్కొన్నది.దశలవారీ వృద్ధి చేయాలని చెప్పింది. ఏ నివేదిక కూడా ఆ రేవు నిర్మాణం గిట్టుబాటు కాదని చెప్పలేదు. రామ్‌బోల్‌ నివేదికను తీసుకొని లంక సర్కార్‌ అమెరికా, భారత్‌ల వద్దకు వెళ్లగా కుదరదని చెప్పిన తరువాతే దాని గురించి తెలుసుకొని చైనా కంపెనీ కంపెనీ రంగంలోకి దిగింది, కాంట్రాక్టును దక్కించుకుంది. జరిగింది ఇదైతే లంకను రుణ ఊబిలోకి దింపింది చైనా అని ఏ నోటితో చెబుతారు.


ఒప్పందం ప్రకారం మొదటి దశ మూడు సంవత్సరాల్లోనే పూర్తయింది.సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే సమయానికి ఉన్న పరిస్ధితులు మారిపోయాయి. మొదటి దశలో ఆశించిన రాబడి రాక ముందే 2012లో లంక సర్కార్‌ రెండవ దశను ముందుకు తెచ్చింది. దానికి గాను రెండుశాతం వడ్డీతో చైనా ఎగ్జిమ్‌ బాంకు 75.7 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. 2008లో ధనికదేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో ప్రపంచంలో వడ్డీరేట్లు తగ్గాయి. తొలుత రేవు నిర్వహణ ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. 2014లో అనుభవం ఉన్న కంపెనీతో కలసి ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించారు. చైనా మర్చంట్స్‌ గ్రూప్‌ కంపెనీ అప్పటికే కొలంబో రేవులో ఒక జట్టీ నిర్వహిస్తున్నది కనుక దానితోనే ఒప్పందం చేసుకున్నారు.


2015 మధ్యంతర ఎన్నికల్లో అధికారపక్షంలో తిరుగుబాటు చేసిన ఆర్ధిక మంత్రి మైత్రీపాల సిరిసేన అధ్యక్షపదవిని కైవసం చేసుకున్నాడు. ఆ ఎన్నికల ప్రచారంలో రేవు లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, అనవసరంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు చేశారని ప్రచారం చేశాడు. సిరిసేన పదవి స్వీకరణ తరువాత విదేశీ అప్పుల చెల్లింపుల సమస్య ముందుకు వచ్చింది. మొత్తం విదేశీ అప్పులో 40శాతం బాండ్ల రూపంలో ఉంది. అప్పటికి విదేశీ అప్పులో జపాన్‌, ప్రపంచబాంకు, ఏడిబి ఇచ్చినవే ఎక్కువ.2017లో చెల్లించాల్సిన 450 కోట్ల డాలర్ల విదేశీ రుణంలో హంబంటోటా రేవుకు తెచ్చిన మొత్తం కేవలం ఐదుశాతమే. ఆ ఏడాదే ఆ రేవును చైనా కంపెనీకి అప్పగించారు. అది చెల్లించిన 120 కోట్ల డాలర్లను విదేశీ చెల్లింపులకు సర్కార్‌ వినియోగించింది. అజాగళ స్దనం వంటిది అని చెబుతున్న రేవును తీసుకున్న చైనా కంపెనీ దాని లాభనష్టాలను భరించేందుకు సిద్దపడినపుడు అది లంకకు ఉపశమనం కలిగించేదే కదా ? సర్కార్‌ చేతులెత్తేసిన తరువాత చైనా కంపెనీ తీసుకుంది, దానిలో బలవంతం ఎక్కడ ? చైనా మిలిటరీ దాడి చేసి రేవును ఆక్రమించలేదు కదా ! అప్పటి వరకు ఆ రేవు వ్యూహాత్మక ప్రాధాన్య గురించి ఎక్కడా ప్రస్తావించని అమెరికా ఒక్కసారిగా ఇంకేముంది చైనా మిలిటరీ కోసమే తీసుకున్నారంటూ మన దేశాన్ని రెచ్చగొట్టేందుకు దొంగేడుపులు ప్రారంభించింది.


2012-18 మధ్య చైనా ఎగ్జిమ్‌ బాంకు నుంచి తీసుకున్న 310 కోట్ల డాలర్ల రుణాలన్నీ రెండుశాతం వడ్డీ రేటువే. 2014లో చైనా డెవలప్‌మెంట్‌ బాంకు నుంచి తీసుకున్న 40కోట్ల డాలర్లకు మాత్రం మూడు నుంచి ఐదుశాతం వరకు ఉంది. ఇతరంగా విదేశాల నుంచి తీసుకున్న రుణాలన్నీ ఐదుశాతం కంటే ఎక్కువ రేటున్నవే. శ్రీలంకలో మన దేశం కూడా ఒక ప్రాజెక్టు నిర్మించింది.మెడెవాచచియా నుంచి మన్నార్‌ రైల్వేలైనుకు మన దేశం మూడు శాతం వడ్డీతో 16.4 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.ఆ మార్గంలో తిరిగే రైల్లో రోజుకు రెండు వందల మంది కూడా ప్రయాణించటం లేదని, పెట్టుబడి వృధా అయిందనే విమర్శలు వచ్చాయి. ఏ దేశంలో ఏ ప్రాజక్టు నిర్మించినా దాని బాగోగులకు అక్కడి ప్రభుత్వానిదే బాధ్యత తప్ప రుణమిచ్చిన వారు, నిర్మించిన సంస్దలది బాధ్యత ఎలా అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికన్లకు యుద్దం ఒక లాభసాటి బేరం !

29 Tuesday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

politics of war, Ukraine war, US imperialism, war cost, wh war is a profitable business for US


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక చర్య ఇంకా ఎన్ని రోజులో సాగుతుందో, జనాలకు ఎన్ని ఇబ్బందులను తెస్తుందో అన్న ఆందోళన చెందుతున్నవారెందరో ! అలా ఆలోచించటం, దాడులను ఆపాలని కోరుకోవటంలో సహజం అదేమీ గొంతెమ్మ కోరిక కాదు. కానీ అమెరికా, నాటో దేశాల పాలకులు అలా అనుకోవటం లేదు. వాటికి వంతపాడే పశ్చిమ దేశాల మీడియా రాస్తున్న కథనాలన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయి. మన దేశంలోని టీవీలు, పత్రికలు వాటినే మనకూ అందిస్తున్నాయి. ఉక్రెయిన్‌ జనం కన్నీళ్ళు, మానవహక్కులు, ఇతర అంశాలను ముందుకు తెస్తున్న మీడియా అమెరికా, దాని కనుసన్నలలో నడుస్తున్న ఐరోపా ధనిక దేశాలు దశాబ్దాల తరబడి ఇతర దేశాలపై చేస్తున్న దాడులు, దుర్మార్గాలు, మానవహననం గురించి విస్మరిస్తున్నది.
ఇటీవలి ఉదంతాలను చూస్తే పశ్చిమాసియాలోని సిరియాపై 2009 నుంచి ఇప్పటికీ అమెరికా, దానితో చేతులు కలిపిన కిరాయి మూకలు దాడులు జరుపుతున్నాయి. బరాక్‌ ఒబామా, డోనాల్డ్‌ ట్రంప్‌, ఇప్పుడు జో బైడెన్‌ ఎవరు అమెరికా గద్దెపై ఉన్నా దాడులు ఆపటం లేదు.లిబియా మీద 2009 నుంచి 2021జనవరి వరకు దాడులు చేసిన పుణ్యం, నాటో, బరాక్‌ ఒబామా, ట్రంప్‌కు దక్కింది. ఇరాక్‌ మీద రెండవసారి దాడులు 2009 నుంచి 2021వరకు ఏదో రూపంలో కొనసాగాయి.2001 నుంచి సోమాలియాలో జోక్యం చేసుకొని ఏదో ఒకసాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. జార్జి డబ్ల్యు బుష్‌ ఏలుబడిలో ప్రారంభమయ్యాయి. ఎమెన్‌లో 2001 నుంచి అమెరికా, దాని మిత్రపక్షం సౌదీ అరేబియా నాయకత్వంలోని దేశాలు ఇప్పటికీ దాడులు జరుపుతూనే ఉన్నాయి.2001 నుంచి 2021వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా, ఇతర దేశాల దాడుల గురించి తెలిసిందే.వీటి గురించి మీడియాకు ఎందుకు పట్టటం లేదు. ఎందుకీ వివక్ష ? ఆ దేశాల్లోని వారు మనుషులు కాదా, వారికి శాంతి అవసరం లేదా ?


తాజ్‌మహల్‌ నిర్మించిందెవరు కాదు, దాని నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరన్నది ముఖ్యమని శ్రీశ్రీ అన్నట్లుగా యుద్ధానికి ఎంత మూల్యం చెల్లిస్తున్నారని కాదు అడగాల్సింది దాని వలన లబ్ది పొందిందెవరన్నది కీలకమైన ప్రశ్న.2001 సెప్టెంబరు 11న న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్యకేంద్రంపై ఉగ్రవాదదాడి జరిగింది. అదేనెల 18న ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులకు జార్జి డబ్ల్యు బుష్‌ ఆదేశాలు జారీ చేశాడు. అక్కడి నుంచి జో బైడెన్‌ ఏలుబడిలో అమెరికన్‌ మిలిటరీ స్వదేశానికి పారిపోయి వచ్చేంతవరకు సగటున రోజుకు 30 కోట్ల డాలర్ల వంతున అమెరికా చేసిన ఖర్చు మొత్తం 2.26లక్షల కోట్ల డాలర్లు. ఉగ్రవాదంపై పోరు పేరుతో సాగించిన ఈ దాడుల ప్రత్యేకత ఏమంటే ప్రయివేటు కాంట్రాక్టర్లపై ఆధారపడటం.చిత్రం ఏమంటే చివరికి 2021 ఆగస్టులో అమెరికన్‌ సేనలు బతుకుజీవుడా అంటూ అఫ్ఘనిస్తాన్‌ నుంచి స్వదేశం చేరేందుకు కూడా 37 హెలికాప్టర్ల కోసం ప్రయివేటు కంపెనీలకు 45 కోట్ల డాలర్లు చెల్లించింది. వాటిని లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ తయారు చేసింది.


ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌పై దాడులకు అమెరికా చేసిన ఖర్చు మొత్తం ఐదు లక్షల కోట్ల డాలర్లని అంచనా. ఆఫ్ఘనిస్తాన్‌లో దాడుల్లో పాల్గొన్నవారిలో ప్రయివేటు వారే ఎక్కువ మంది ఉన్నారు. ఆయుధ కంపెనీలతో పాటు దాడులకు అవసరమైన వారిని,ఆయుధాలను సరఫరా చేసేందుకు అవసరమైన చమురును కూడా ప్రయివేటు వారే సరఫరా చేసి లబ్ది పొందారు. ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సిరియాలో జరిపిన దాడుల్లో అమెరికా రక్షణశాఖ 27వేల మంది కాంట్రాక్టర్లను వినియోగించింది. 2008-2018 మధ్య 380 మంది ఉన్నత స్ధాయి అధికారులు ఇలాంటి వారి అవతారమెత్తారని తేలింది.రెండు దశాబ్దాల క్రితం ఐదు అగ్రశ్రేణి ఆయుధ కంపెనీల వాటాలను పదివేల డాలర్ల విలువగలవి కొంటే ఇప్పుడు వాటి విలువ లక్ష డాలర్లకు పెరిగినట్లు అంచనా. అమెరికా దాడులకు చేస్తున్న ఖర్చులో లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియన్‌, జనరల్‌ డైనమిక్స్‌, బోయింగ్‌, నార్తరప్‌ గ్రుమ్మన్‌ అనే ఐదు కంపెనీలకు 60శాతం మొత్తం దక్కింది.గతంలో పని చేసిన ఐదుగురు అమెరికా రక్షణ మంత్రుల్లో నలుగురు ఈ కంపెనీలతో లావాదేవీల్లో ఉన్నవారే అంటే కుమ్మక్కు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రజల సొమ్ముతో ఆయుధాలు, ఇతర పరికరాలను కొనుగోలు చేయిస్తారు.


అందువలన అమెరికా, బ్రిటన్‌ వంటి సామ్రాజ్యవాదులు జరిపే యుద్దాలకు మూలం లాభార్జనే. గతంలో దేశాలకు దేశాలను ఆక్రమించుకుంటే ఇప్పుడు అది సాధ్యం కావటం లేదు గనుక ఏదో ఒకసాకుతో దేశాలను ఆక్రమించుకొని అక్కడ తమ తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న ఉదంతాలు(ఉదా ఇరాక్‌, లిబియా) కొన్ని కాగా, సంస్కరణల పేరుతో మార్కెట్లను ఆక్రమించుకోవటం ఒకటి. వీటికి తోడు ఇలా యుద్దాలను సృష్టించి అలా లబ్దిపొందేందుకు దగ్గరదారినెంచుకున్నాయి అమెరికన్‌ కార్పొరేట్‌ రాబందులు. దానికి అనుగుణంగానే దేశ విధానాలను రూపొందించి అమలు చేయిస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్దసమయంలో ముందుకు వచ్చిన ఈ వ్యవస్ధకు ఏదో ఒక మూల ఏదో ఒక ఉద్రిక్తత లేకపోతే గడవదు. దీనిలో కార్పొరేట్‌లు, మిలిటరీ, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు ఉంటారు. అందుకే అమెరికాకు యుద్దం ఒక లాభదాయక వాణిజ్యం, దానికోసం అదెంతకైనా తెగిస్తుంది. అందుకే అమెరికాలో నాలుగువేలకు పైగా లాబీలు(అన్ని రకాలుగా ప్రభావితం చేసే బృందాలు) మిలిటరీ-పారిశ్రామిక సంస్ధల కోసం నేడు పని చేస్తున్నాయి. ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఏదో ఒక లాబీలో ఉంటారన్నది బహిరంగ రహస్యం. అందుకే రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నా ఏదో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధాలకు కారకులు ఆయుధకంపెనీల యజమానులే. వారు నిర్దేశించిన మేరకే అమెరికా స్వదేశీ, విదేశీ విధానాలు ఉంటాయి. దశాబ్దాలుగా ఎలాంటి ఘర్షణలు లేని మన దేశం-చైనా మధ్య ఉద్రిక్తతలను సృష్టించి మన దేశానికి పెద్ద మొత్తంలో ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఎత్తుగడ ఇప్పటికే ఫలించింది. అదింకా కొనసాగుతోంది. గతంలో పాకిస్దాన్ను మనమీదకు ఉసిగొల్పిన అంశం తెలిసిందే. చైనా వారు అమెరికా, ఇతర దేశాల వద్ద ఆయుధాలు కొనాల్సినపని లేదు. వారే ఎగుమతులు చేసే స్ధితిలో ఉన్నారు.


అంతర్జాతీయ పోలీసు బాధ్యతను ఐరాస లేదా మరొక సంస్ధగానీ అమెరికాకు అప్పగించలేదు. తన ఆర్ధిక, మిలిటరీ శక్తితో ప్రపంచంలో ప్రజాస్వామ్యపరిరక్షణ, కమ్యూనిజవ్యాప్తి నిరోధం, ఉగ్రవాదంపై పోరు మరొకసాకుతో ఆధిపత్యకోసం చూస్తున్నది. అమెరికా కార్పొరేట్లకు యుద్దాలు ఎలా లాభాలు చేకూర్చుతున్నాయో చాలా మందికి అర్ధం కావటం లేదు. గతంలో సోవియట్‌ను బూచిగా చూపి ఆయుధాల అమ్మకాల కోసం ఉద్రిక్తతలను సృష్టిస్తే ఇప్పుడు చైనాను చూపి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకొనేందుకు చూస్తున్నారు. ఇతర దేశాలనే కాదు, అమెరికా రక్షణ బడ్జెట్‌నూ పెంచుతున్నారు. నౌకదళంలో ఇప్పుడున్న 300పెద్ద ఓడలను 350కి పెంచాలని ప్రతిపాదించారు. ఎఫ్‌35 విమానాల కొనుగోలు సంగతి చెప్పనవసరం లేదు. అణ్వాయుధాలను నవీకరించేందుకు 1.5లక్షల కోట్ల డాలర్లతో పధకాన్ని రూపొందించారు. ఇప్పుడున్న త్రివిధ దళాలకు అదనంగా అంతరిక్ష సేన ఏర్పాటుకు, దానికి శిక్షణ,ఆయుధాల పేరుతో పెద్ద ఎత్తున ఖర్చుపెట్టనున్నారు.ఇదంతా ప్రయివేటు కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు, ప్రపంచాధిపత్యం కోసమే అన్నది స్పష్టం.


నిజానికి అమెరికా రెండవ ప్రపంచయుద్ధం నుంచే కుట్రలు మొదలు పెట్టింది. చైనాలో కమ్యూనిస్టులు సాధిస్తున్న విజయాలు అమెరికా,బ్రిటన్‌లకు దడపుట్టించాయి. చైనా పాలకుడిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ను పటిష్టపరచాలని చూసి విఫలమయ్యాయి. పక్కనే ఉన్న మయన్మార్‌లో అధికారానికి వచ్చిన జాతీయవాది అంగసాన్‌ (అంగసాన్‌ సూకీ తండ్రి)తో మొత్తం మంత్రులను హతమార్చిన కుట్రలో బ్రిటన్‌ హస్తం ఉంది. రెండు కొరియాల విలీనాన్ని అడ్డుకొనేందుకు అమెరికా యుద్దానికి తలపడిన సంగతి తెలిసిందే. ఇండో చైనాలో వందేండ్ల ఫ్రెంచి పాలనకు కమ్యూనిస్టులు స్వస్తిపలికారు.1954లో హౌచిమిన్‌ సారధిగా కమ్యూనిస్టులు ఫ్రెంచి సేనలను ఓడించారు. రెండుగా చీల్చిన వియత్నాం విలీనానికి 1956ను గడువుగా నిర్ణయించారు. అంతకు ముందే తెరవెనుక ఉన్న అమెరికా నేరుగా రంగంలోకి వచ్చి దక్షిణ వియత్నాంను కేంద్రంగా చేసుకొన్నది. దక్షిణ వియత్నాంలోని మిలిటరీ, కమ్యూనిస్టు వ్యతిరేకులకు శిక్షణ, ఆయుధాలను సరపరా చేసి ఉత్తర వియత్నాంను దెబ్బతీసేందుకు చూసింది. వారివల్ల కాదని తేలటంతో 1964లో టోంకిన్‌ గల్ఫ్‌లో తన నౌకలపై ఉత్తర వియత్నాం దాడి చేసిందనే కట్టుకధను ముందుకు తెచ్చి నేరుగా దాడులకు దిగింది.1975 ఏప్రిల్‌ 29-30 తేదీలలో అక్కడి నుంచి అమెరికా సేనల్లో చివరి బృందం పారిపోవటంతో ఆ దురాక్రమణ యుద్దం ముగిసింది.


వియత్నాం కమ్యూనిస్టులు అమెరికాకు పెద్ద గుణపాఠం నేర్పారు. వియత్నాంపై దాడులకు అమెరికా 5,43,000 మంది సైనికులను పంపింది. దక్షిణ వియత్నాంలో ప్రజాస్వామికశక్తులకు మద్దతు పేరుతో ఈదారుణానికి పాల్పడింది. ఈ సైనికుల్లో 58,200 మంది దాడుల్లో, ఇతరత్రా మరో 32వేల మంది మరణించారు. గాయపడిన వారు 3.03,000 మంది ఉన్నట్లు అంచనా. వీరుగాక రెండున్నరలక్షల మంది వరకు దక్షిణ వియత్నాం సైనికులు మరణించారు. ఇది ఒక వైపే మరో వైపు అమెరికా, దక్షిణ వియత్నాం మిలిటరీని ఎదిరించేందుకు జరిగిన పోరులో 20లక్షల మంది సామాన్య పౌరులు మరణించారు. తొమ్మిదిన్నరలక్షల మంది వియత్నాం మిలిటరీ,దక్షిణ వియత్నాం గెరిల్లాలు ప్రాణాలను త్యాగం చేశారు, ఆరులక్షల మంది గాయపడ్డారు. ఇరవై ఒక్క సంవత్సరాలు అమెరికా జరిపిన దాడుల్లో ఒక్క అణ్వాయుధాలు తప్ప అన్ని రకాల మారణ, రసాయన ఆయుధాలను పెద్ద ఎత్తున ప్రయోగించిన దుర్మార్గానికి పాల్పడింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు సాగుకు పనికిరాకుండా కలుషితమయ్యాయి.


ఇరాన్‌ – ఇరాక్‌ దేశాల మధ్య ఉన్న వివాదాలను ఆసరా చేసుకొని అమెరికా వాటి మధ్యతంపులు పెట్టింది. రెండు దేశాలకూ ఒకరికి తెలియకుండా ఒకరికి ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంది. పరస్పర దాడులతో రెండు దేశాలూ బలహీనపడితే వాటి మీద పెత్తనం, రెండు చోట్లా ఉన్న చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవాలన్నది దాని ఆలోచన. ఏడు సంవత్సరాల పదకొండునెలల పాటు సాగిన ఆ యుద్ధంలో ఇరాన్‌ వైపున ఆరులక్షల మంది ఇరాక్‌ వైపున ఐదులక్షల మంది సైనికులు మరణించారని అంచనా. విజేతలు లేరు. కొరియా యుద్దంలో పదిహేనున్నరలక్షల మంది ఉత్తర కొరియన్లు, పదిలక్షల మంది దక్షిణ కొరియన్లు మరణించారు. పదిలక్షల మంది ఉత్తర కొరియా, రెండు లక్షల మంది దక్షిణ కొరియా సైనికులు మరణించారు. ఈ దుర్మార్గాలు, మానవ నష్టాలకు కారణం అమెరికా ఆధిపత్యకాంక్షే అన్నది స్పష్టం. ఇప్పుడు అమెరికా, నాటో కూటమి దేశాలు రష్యాకు ముప్పు తెచ్చేందుకు ఉక్రెయిన్ను పావుగా వాడుకుంటూ రెచ్చగొట్టి రష్యాను ఉసిగొల్పిదాడులకు కారణమయ్యాయి. ఉక్రెయిన్‌ పౌరులను, ఇతర దేశాల వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్న వాటి దుష్ట రాజకీయాన్ని విరమించాలని వత్తిడి తేవాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : కార్పొరేట్ల కోసం సృష్టించిన యుద్దమిది, కాదంటారా !

26 Saturday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

corporate loves a good war, Fuel Price in India, profiting from war, Ukraine-Russia crisis, US imperialism, US military-industrial complex


ఎం కోటేశ్వరరావు


అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో సైనిక చర్య మొదలై నెల రోజులు దాటింది. అది ఉక్రెయిన్‌ పౌరులకు ప్రత్యక్షంగా నరకం చూపుతోంది. మూడున్నర మిలియన్ల మంది ఇరుగు పొరుగుదేశాలకు వెళ్లారు, దాదాపు కోటి మంది కొలువులు, నెలవులు తప్పినట్లు వార్తలు. మరోవైపు ప్రపంచ వ్యాపితంగా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నాటో కూటమి దేశాల్లోని వారు బావుకున్నదేమీ లేదు. అయినప్పటికీ వివాదాన్ని ఇంకా కొనసాగించాలని అమెరికా కూటమి చూస్తోంది. మే నెల తొమ్మిదవ తేదీ రెండవ ప్రపంచయుద్ధంలో జర్మనీపై విజయం సాధించిన రోజని అందువలన అప్పటిలోగా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని రష్యా నేతలు ఆదేశించినట్లు ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతినిధులు చెప్పారు. అంటే అప్పటి వరకు పశ్చిమ దేశాలు ఈ వివాదాన్ని మరింతగా ఎగదోస్తూనే ఉంటాయా? ఉక్రెయిన్‌, ఇతర దేశాల పౌరులను యాతనలకు గురి చేస్తాయా ?


వాస్తవాల పత్రం పేరుతో మార్చి 16వ తేదీన అమెరికా ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు శాంతిని కోరుకుంటున్నట్లు, నిత్యం మానవహక్కుల గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్న అమెరికా కూటమిలోని 30దేశాలు అగ్నికి ఆజ్యం పోస్తూ మంటలను ఎగదోస్తున్నాయి. జో బైడెన్‌ తాజాగా ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయంతో బైడెన్‌ గత పనిహేను నెలల కాలంలో ఉక్రెయినుకు ఇచ్చినది రెండువందల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఇదంతా అమెరికా యుద్ద పరిశ్రమల వారికి కట్టబెట్టిన మొత్తమే. మూడో దేశం ద్వారా సరఫరా చేసిన వాటితో సహా ఏఏ ఆయుధాలు, ఎంత మందుగుండు సరఫరా చేసిందీ దానిలో ఉన్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. లాభం లేకుండా పశ్చిమ దేశాలు భారీసాయం చేస్తే వాటికి వచ్చేదేముంటుంది ?
చైనా, పాకిస్తాన్లను బూచిగా చూపి మన దేశంతో ఆయుధాలకు ఎలా ఖర్చు పెట్టిస్తున్నదో తద్వారా అమెరికా ఎంతగా లాభపడుతున్నదో తెలిసిందే. ఇప్పుడు రష్యాను బూచిగా చూపుతూ నాటో దేశాలన్నింటితో తమ తమ ఆయుధాలను కొనిపిస్తున్నది. ఉక్రెయిను ఒక్కదానికే 350 కోట్లతో సహా తూర్పు ఐరోపా దేశాలకు 650 కోట్ల డాలర్లను ఆయుధాల కోసం బైడెన్‌ బడ్జెట్‌ కేటాయించాడు. ఐదుసార్లు ఇప్పటి వరకు ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. ఒప్పందం కుదిరితే, శాంతి నెలకొంటే ఈ బడ్జెట్‌ నిధులు అవసరం ఉండదు కనుక కనీసం వాటిని ఖర్చు చేసేంత వరకైనా వివాదం-దాడులు కొనసాగాలని అమెరికా కోరుకుంటున్నది. ఉక్రెయిన్నుంచి తరువాత ఆ మొత్తాన్ని ఏదో ఒక రూపంలో వసూలు చేస్తుంది, ఈలోగా తానే ఆయుధాలు కొని కార్పొరేట్ల ఆకలి తీరుస్తుంది.టాంకులను ధ్వంసం చేసే 2,600 జావెలిన్‌(ఈటె) క్షిపణులను ఉక్రెయిన్‌ మిలిటరీకి అమెరికా సరఫరా చేసింది. వాటిని తయారు చేసేది లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియన్‌ అనే కంపెనీలు. పెద్ద అలలు వచ్చినపుడు నౌకలన్నీపైకి లేస్తాయి అన్నట్లుగా ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు పోటీ పడుతున్నాయి. మిలిటరీ మాజీ అధికారులే సలహాదారులు, మధ్యవర్తులుగా ఉంటారు.యుద్దాలు లేకపోతే ఈ కంపెనీలన్నీ మూతపడతాయి కదా !


రష్యాదాడులను సాకుగా చూపి లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ తయారు చేసే ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లు 35 కొనుగోలు చేయాలని జర్మనీ నిర్ణయించింది. నాటో దేశాలన్నీ ఇదే బాటలో ఉండటంతో ఆయుధకంపెనీల వాటాల ధరలు ఈ ఏడాది ఇప్పటికే గణనీయంగా పెరుగుతున్నాయి. ఐరోపా, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల కారణంగా తమ పంట పండుతున్నదని సిఇఓలు నిస్సిగ్గుగా చెబుతున్నారు. అనేక దేశాలు గతంలో కొనుగోలు చేసినవి ఉపయోగించకపోవటం లేదా పాతపడటంతో పనికిరానివిగా పక్కన పడేసి కొత్తవి కొంటున్నాయి. ఫ్రాన్స్‌,బ్రిటన్‌ వంటి దేశాల్లో కూడా ఆయుధకంపెనీలున్నా సింహభాగం అమెరికన్లకే పోతోంది. అందుకే నేషనల్‌ డిఫెన్స్‌ ఇండిస్టియల్‌ అసోసియెషన్‌ జనవరిలోనే అమెరికా పార్లమెంట్‌ సభ్యుల మీద వత్తిడి చేసింది.” రక్షణ ఖర్చు పద్దుల ఆమోదంలో వైఫల్యం ” ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ, తూర్పు ఆసియా, దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలకు ప్రతిచర్యలు తీసుకోవటంలో, సమర్దత, తీవ్రంగా పరిగణించకపోవటం ముప్పును సూచిస్తున్నదని ” పేర్కొన్నది.ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ రాజీకి సంసిద్దను ప్రకటించినా బైడెన్‌, ఇతర దేశాలు పడనీయకుండా సంక్షోభాన్ని కొనసాగించేందుకు పూనుకోవటం వెనుక ఎవరి వత్తిడి, లబ్ది ఉందో అరటితొక్క వలచి పండు పెట్టినట్లుగా చెప్పాల్సిన పని లేదేమో ! ఒక్క ఆయుధకంపెనీలేనా లబ్ది పొందుతున్నది ?


గత నెల రోజుల్లో అమెరికా ఇంధన కంపెనీల విలువ పదిశాతం పెరిగింది. ఆ మొత్తం 239 బిలియన్‌ డాలర్లని అంచనా. ఈ కాలంలో బ్రెంట్‌ రకం ముడిచమురు ధరలు 32శాతం పెరిగాయి. దానితో బాటే ఇతర రకాల ధరలూ పెరిగి కార్పొరేట్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక కంపెనీ యజమాని ప్రపంచంలోని ఐదువందల మంది ధనికుల జాబితాలో చేరాడు. హరోల్డ్‌ హామ్‌ అనే కాంటినెంటల్‌ రిసోర్సెస్‌ కంపెనీ కుబేరుడి ఆస్తి విలువ 19.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికి కంపెనీ వాటాల ధరలు పెరిగి మూడు నెలలు కూడా గడవక ముందే 5.75బి.డాలర్లు(41.2శాతం) పెరిగింది. దీంతో బ్లూమ్‌బెర్గ్‌ ధనవంతుల జాబితాలో అతని స్దానం 84నుంచి 37కు పెరిగింది. జెఫ్రీ హిల్డెబ్రాండ్‌ సంపద విలువ ఇదే కాలంలో 6.63 బి.డాలర్లు (101శాతం) పెరిగి 13.2 బి.డాలర్లకు చేరింది. అందరి సంపదల్లో ఇలాంటి పెరుగుదల లేకున్నా మొత్తం మీద ఇంథన కంపెనీలన్నీ లబ్దిపొందాయి.


మన దేశంలో చమురు కంపెనీలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. రిలయన్స్‌, బిపి వంటి కొన్ని కంపెనీలు రంగంలో ఉన్నా పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదు. ముడి చమురు ధరలు పెరిగినదానికి అనుగుణంగా ప్రభుత్వ కంపెనీలు నవంబరు నాలుగు నుంచి మార్చి 21వరకు ధరలను పెంచకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి లబ్దికి స్ధంభింప చేసిన సంగతి తెలిసిందే. దీంతో అపరదేశ భక్తులలైన అంబానీలు తమ బంకులను మూసివేశారు. వారికోసం, ప్రభుత్వ కంపెనీల నష్టాలు తగ్గించేందుకు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారికి డీజిలు ధరలను లీటరుకు రు. 25 వరకు పెంచిన సంగతి తెలిసిందే. దీని వెనుక మరొక ఎత్తుగడ కూడా ఉంది. ఆ మేరకు సాధారణ వినియోగదారులను కూడా భరించేందుకు మానసికంగా సిద్దం చేయటమే అది. కొత్త పద్దతులను కనుగొనటంలో బిజెపి సర్కార్‌ తీరు అనితరసాధ్యం. ఇప్పుడు ప్రతి రోజూ వడ్డించటం ప్రారంభించారు.జనం కూడా కిక్కురు మనకుండా ఇంకా దేశభక్తి మత్తులోనే ఉన్నందున కొనుగోలు చేస్తున్నారు. ఇహలోకంలో పరమ దరిద్రాన్ని అనుభవించి పుణ్యం చేసుకుంటే పరలోకంలో స్వర్గం ప్రాపిస్తుందని నమ్మే మనకు చమురు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల, ఇబ్బందులు పెట్టే ప్రభుత్వ విధానాలు ఒక లెక్కా ! ఏ జన్మలోనో చేసుకున్న పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం, మోడీ మాత్రం ఏం చేస్తారు, మనం వస్తువులను కొనకుండా ఉంటే పోయె, అంత ధరలకు కొనాలని మనల్నేమైనా వత్తిడి చేశారా అనే వేదాంతాన్ని జనం వల్లిస్తున్నారు.


అంతర్జాతీయ మార్కెట్లో మన దేశం కొనుగోలు చేసే ముడి చమురు ధర 2021నవంబరు నెల సగటు 81.51 డాలర్లు, మార్చి 24న 117.71 ఉంది. మార్చి 26వ తేదీన ఇది రాసిన సమయానికి ముడిచమురు బ్రెంట్‌ రకం ధర 120.65 డాలర్లు. మనం కొనుగోలు చేసేది దానికి ఒక డాలరు తక్కువగా ఉంటుంది. పీపా 81.51 డాలర్లు ఉన్నపుడు నిర్ణయించిన ధరల మీద ప్రతిరోజూ కొంత పెంచుతున్నారు. మొత్తం పాతిక రూపాయలా, ఇంకా ఎక్కువగా ఉంటుందా అన్నది చెప్పలేము. చమురు ధరల పెరుగుదల వృద్ది రేటును దెబ్బతీస్తుంది. నోట్ల ముమ్మరాన్ని(ద్రవ్యోల్బణం) పెంచుతుంది, అది ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దీన్నే స్టాగ్‌ఫ్లేషన్‌ అంటున్నారు. ఇది జనజీవితాలను అతలాకుతలం చేస్తుంది. జనాల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది, తద్వారా వృద్ధి రేటు మరింత పడిపోతుంది. అది వేతనాల మీద పడి కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఒకదాన్ని మరొకటి దెబ్బతీసే ఒక వలయం ఇది.

చమురుతో పాటు గృహావసరాలకు వాడే గాస్‌ ధరను రు.50 పెంచి వెయ్యిదాటించారు. ఇది 70శాతం గృహస్తులను ప్రభావితం చేస్తుంది. వీరిలో ఆమ్‌ ఆద్మీ నుంచి అంబానీల వరకు అందరూ ఉంటారు. సమస్య సామాన్యులకే స్వంత విమానాలను కలిగి ఉన్నవారికి ఏముంటుంది. సౌదీ ఆరామ్‌ కో కంపెనీ టన్ను గాస్‌ ధరను తాజాగా 729 నుంచి 769 డాలర్లకు పెంచింది. గతేడాది నవంబరులో ధర 376డాలర్లు మాత్రమే. అందువల్లనే అప్పటి నుంచి మన దేశంలో కూడా విపరీతంగా ధర పెరిగింది. గాస్‌ మీద ఇస్తున్న సబ్సిడీని రు.40కి తగ్గించి ఎంత పెరిగితే అంత వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. తాజాగా పెంచినప్పటికీ చమురు కంపెనీలకు ఒక్కో సిలిండరుకు ఇంకా రు.100-125 నష్టమే అని చెబుతున్నందున ఆ మేరకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి కోసం పెట్రోలు, డీజిలు ధరలను స్ధంభింప చేసిన కారణంగా 137 రోజుల్లో మూడు చమురు సంస్ధలకు వచ్చిన నష్టమే రు.19,000 కోట్లని అంచనా, వాటికి రావాల్సిన లాభాలను కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆ మొత్తాలను జనాల నుంచి వసూలు చేసేందుకు పూనుకున్నారు. ఎంత తెలివి ?


ధరల పెరుగుదలను ఆరుశాతంలోపుకు పరిమితం చేయాలన్నది రిజర్వుబాంకు లక్ష్యం. జనవరిలో 6.01గా ఉన్నది ఫిబ్రవరిలో 6.07శాతానికి పెరిగింది. ఫిబ్రవరితో ముగిసిన ఏడాదిలో పదకొండు నెలల పాటు రెండంకెలకు మించి టోకు ధరలు పెరిగి ఫిబ్రవరిలో 13.11శాతంగా నమోదైంది. కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా ద్రవ్యోల్బణం మదింపులోనే లోపం ఉందన్నది ఒకటైతే, వాటిని కూడా తొక్కి పెట్టి తక్కువగా చూపుతున్నారన్న విమర్శలున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో చెబుతారు. సంక్షోభానికి కారణంగా అమెరికా, నాటో కూటమి అనుసరించిన దేశాలే అన్నది అందరికీ తెలుసు. కానీ వారి వైఖరి తప్పని చెప్పటానికి మాత్రం నోరు రాదు. ఎందుకటా దేశ ప్రయోజనాల రీత్యా ఎవరినీ నొప్పించకూడదట. మరి ధరల పెరుగుదల సంగతేమిటి ? జన ప్రయోజనాలు ప్రభుత్వాలకు పట్టవా ? ఏమి రాజకీయం నడుస్తోందో మనం గమనిస్తున్నామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెద్దన్న జో బైడెన్‌ చివాట్లు పెట్టినా చీమకుట్టినట్లు లేని చిన్నన్న నరేంద్రమోడీ !

24 Thursday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Biden shaky comment, BJP, Joe Biden, Narendra Modi, RSS, RUSSIA, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


ప్రధానిగా మా నరేంద్రమోడీ ఉన్నారు కనుక సరిపోయింది. మన దేశం రష్యాను చూసి వణుకుతున్నదని అమెరికా అధినేత జో బైడెన్‌ అన్నాడు, అదే మరొకరు ఆ పదవిలో ఉండి ఉంటే భారత్‌ బట్టలు తడుపుకుంటున్నదని అనే వాడు అని ఒక బిజెపి మిత్రుడు చలోక్తి విసిరారు.నిజమే అనిపించింది. వారే కాదు, ఇప్పటికీ చాలా మంది నిజంగానే మోడీ గొప్పతనం గురించి అలాగే అనుకుంటున్నారు. దేశాన్ని అంతమాట అన్నా అని మోడీ మౌనం పాటించటాన్ని చూస్తే ఒక వేళ అంతమాట అన్నా మాట్లాడి ఉండేవారు కాదన్నది కూడా నిజమే కదా ! నిజానికి వణుతున్నదని అన్నా ఆత్మగౌరవం గలవారికి అభ్యంతరకరమే, అవమానంగా భావిస్తారు, అదేమీ గౌరవ ప్రదమైన వ్యాఖ్య కాదు. సరే, నరేంద్రమోడీ గారికి ఆ మాత్రం తట్టదా ? మహానుభావులైన పెద్దల మౌనానికి పలు అర్ధాలుంటాయి మరి. ఎందుకొచ్చిన తంటా అంటారు ? ….” మోడీ ఏది చేసినా దేశం కోసమే ” అంటున్నారు కదా భక్తులు, మనమూ అందాం !


ఇదిగో ట్రంపూ కాశ్మీరు సమస్యలో కాస్త మధ్యవర్తిగా ఉండి ఒకదారి చూపకూడదూ, బాబ్బాబూ నీ పుణ్యం ఊరికే పోదులే అని నరేంద్రమోడీ అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగా చెప్పిన అంశం తెలిసిందే.2019 జూలై 22న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాషింగ్టన్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ను కలుసుకున్నాడు. ఆ సందర్భంగా ఖాన్‌తో కలసి ట్రంప్‌ విలేకర్లతో మాట్లాడాడు. భారత ఉపఖండంలో శాంతి స్దాపనకు అమెరికా పోషించాల్సిన పాత్ర ఏదైనా ఉందా అని ఇద్దరు నేతలను ఉద్దేశించి ఒక విలేకరి అడిగాడు. శాంతి చర్చల కోసం మేం ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ముందు సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఆపాలంటూ భారత్‌ మావైపుకు బంతిని తోసి చర్చల పునరుద్దరణకు అంగీకరించటం లేదు, ట్రంప్‌ ఆ క్రమాన్ని ముందుకు నెట్టగలరని ఇమ్రాన్‌ చెప్పాడు. వెంటనే ట్రంప్‌ మాట్లాడుతూ ఒసాకా జి20 సమావేశాలలో రెండు వారాల క్రితం నేను మోడీతో భేటీ జరిపినపుడు కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం లేదా తీర్పరి పాత్ర వహించమని నన్ను అడిగారు, మీరు కోరుకుంటే నేనా పని చేస్తా అన్నాడు. దీని మీద అబ్బే అలాంటిదేమీ జరగలేదని అధికారులు చెప్పారు తప్ప నరేంద్రమోడీ నోరు విప్పలేదు.


రెండవ సారి ఎన్నికల్లో పోటీ చేస్తూ 2020 అక్టోబరు 22న చర్చలో ట్రంప్‌ మాట్లాడాడు. పర్యావరణంపై 2016పారిస్‌ ఒప్పందం నుంచి ఉపసంహరించుకోవటం సరైనదే అని సమర్ధించుకున్నాడు. అది వారిష్టం అని సరిపెట్టుకుందాం, కానీ ఆ సందర్భంగా చైనా, భారత దేశాల్లో గాలిని చూడండి ఎంత రోతగా ఉంటుందో అలాంటి దేశాలకు ఆ ఒప్పందం ఉపయోగం అని నోరుపారవేసుకున్నాడు. అంతకు ముందు నెలలోనే హూస్టన్‌ నగరంలో హౌడీమోడీ సభలో ట్రంప్‌-మోడీ చెట్టపట్టాలు వేసుకొని కౌగిలింతలతో తామెంత దగ్గరో అని ప్రవాసభారతీయుల ముందు ఒయ్యారాలను ఒలికించారు. అప్పుడు అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని మోడీ ఓటర్లను ప్రభావితం చేశారు. అలాంటి ట్రంప్‌ దేశాన్ని అవమానించినా నరేంద్రమోడీ నోరు విప్పలేదు.చిత్రం ఏమంటే ప్రభుత్వం కూడా నోరుమెదపలేదు.
తాజాగా రష్యాను చూసి భారత్‌ వణుకుతున్నదని జో బైడెన్‌ అన్నా అదే మౌనం. చైనాను దెబ్బతీసే తమ దీర్ఘకాలిక పధకంలో భారత్‌ కీలక పాత్రపోషించాలని కోరుకుంటున్నది అమెరికా. బైడెన్‌ ప్రకటనతో నరేంద్రమోడీని ఇరుకున పెట్టినట్లయిందని, మరీ తెగేదాకా లాగకూడదనీ కావచ్చు. మరుసటి రోజు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ విలేకర్లతో మాట్లాడుతూ నష్ట నివారణకు ప్రయత్నించాడు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చతుష్టయ(క్వాడ్‌) పధకంలో భారత్‌ తమకు అనివార్యభాగస్వామి అంటూ ఉబ్బేశాడు. రష్యాతో చారిత్రాత్మక రక్షణ సంబంధం ఉన్నప్పటికీ భారత్‌ను తమ భాగస్వామిగా ఎంచుకొనేందుకు అదేమీ ఆటంకం కాలేదన్నాడు. పాతికేళ్లుగానో ఇంకా ఎక్కువో మా రెండు దేశాల మధ్య రక్షణ మరియు భద్రత సంబంధాలు మరింతగా పెరిగాయి, ఉమ్మడి ప్రయోజనాలలో భారత్‌ ఎంచుకున్న భాగస్వాములం మేము అన్నాడు. అంతకు ముందు రోజు జో బైడెన్‌ అమెరికన్‌ కార్పరేట్ల సిఇఓలతో మాట్లాడుతూ చతుష్టయ దేశాల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడుల గురించి మన వైఖరిని చెప్పనవసరం లేదు. ఒక్క భారత్‌ తప్ప, అది కొంతమటుకు వణుకుతోంది, జపాన్‌ ఎంతో గట్టిగా ఉంది, అదే విధంగా ఆస్ట్రేలియా, నాటో, పసిఫిక్‌ ప్రాంతంలో మేమంతా గట్టిగా ఉన్నాం అన్నాడు.


అమెరికా నేతలు ఇన్ని మాట్లాడుతున్నా నరేంద్రమోడీ మౌనం దాల్చటం భారత ప్రతిష్టకే భంగం. మూడు రోజులు దాటినా ఎలాంటి స్పందన లేదు. దీని గురించి కొందరు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూద్దాం.రష్యాను చూసి భారత్‌ వణుకుతున్నదని బైడెన్‌ అనటం ”ఒక చిన్న చివాటు( మందలింపు)” అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి చిదానంద రాజఘట్ట ఒక విశ్లేషణలో వర్ణించారు.( అంతేగా మరి ఇష్టమైన వారు చావు దెబ్బలు కొట్టినా అబ్బే ప్రేమతో కొట్టిన తియ్యని దెబ్బ అనిపిస్తుంది.) దానిలోనే వ్యూహాత్మక వ్యవహారాల వ్యాఖ్యాత బ్రహ్మ చెల్లానే చెప్పిన మాటలను ఉటంకించారు. ” ఇక్కడొక వైరుధ్యం ఉంది. పూర్తి స్ధాయి యుద్ద ముప్పుతో సహా చైనా సరిహద్దు దురాక్రమణను భారత్‌ ఎదుర్కొంటున్న సమయంలో ఆ దురాక్రమణ గురించి బైడెన్‌ తన నోరు విప్పడు.ఇంతే కాదు రెచ్చగొట్టేందుకు స్వయంగా తోడ్పడి ఎక్కడో దూరంగా జరుగుతున్న యుద్దం గురించి భారత స్పందనను వణుకుతున్నదిగా మందబుద్ది బైడెన్‌ వర్ణించాడు.” అని చెల్లానే పేర్కొన్కారు. ” భారత్‌ మీద బైడెన్‌ చేసింది అవాంఛనీయ వ్యాఖ్య.ప్రచ్చన్న యుద్దం ముగిసిన తరువాత రష్యా మీద అమెరికా విధానం ఊగిసలాడే పునాదుల మీద పడిపోనున్న కట్టడంలా ఉంది. ఇప్పుడది కూలిపోతున్నది.నాటోలోకి ఉక్రెయిన్ను రప్పించే అమెరికా అవివేకానికిి భారత్‌ ఎందుకు మూల్యం చెల్లించాలి ? అమెరికా ఆంక్షలు మనలను దెబ్బతీస్తున్నాయి వారిని మనం బలపరచాలా ” అని విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి కన్వల్‌ సిబల్‌ అన్నారు.


మౌనం గురించి మన దేశంలో పెద్ద చర్చే నడిచింది. మన్మోహన్‌ సింగ్‌ను మౌన ముని అన్నారు. సింగ్‌ ఎందుకు మాట్లాడలేదంటే రిమోట్‌ కంట్రోల్లో ఉన్నారు గనుక అని కొందరు చెప్పారు. మరి నరేంద్ర మోడీ అలాకాదే ! ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా పెద్ద మౌన మునిలా ఉంటున్నారు. తన సేనలను ఉసిగొల్పుతారు. ఎవరైనా ఏదైనా తప్పు మాట్లాడితే మోడీ మంచి వారే మంత్రులకే నోరుకుదరటం లేదు అనిపిస్తారు. అదొక ఎత్తుగడ అన్నది స్పష్టం. అంతర్జాతీయంగా పరువుపోతున్న అంశాలే కాదు, దేశీయంగానూ ఎవరేమనుకుంటే నాకేటి అన్నట్లుగా అనేక అంశాలపై మౌనం. బిజెపి నేతలకు మన్మోహన్‌ సింగ్‌కు మౌనముని అని పేరు పెట్టి నిందించారు. అది తనకూ వర్తిస్తుందని తెలిసినా ఆ వైఖరికి తనకు నష్టం కంటే లాభాన్నే కలిగిస్తుందని భావిస్తున్నారు. తాను మీడియాకు జవాబుదారీ కాదు, ఏదైనా ఉంటే జనానికే చెబుతా అనే సందేశాన్ని జనంలో చొప్పించేందుకు విలేకర్లతో మాట్లాడటమే మానుకున్నారు.నిపుణులు రూపొందించిన కొన్ని పధకాల్లో భాగంగా చేసిన అనేక విన్యాసాలను దేశం చూసింది. ఎంపిక చేసిన విలేకర్లతో, ఎంపిక చేసిన ప్రశ్నలతో ఎంపిక చేసిన పద్దతిలో మాట్లాడటం కూడా దానిలో భాగమే. అంతే కాదు, ప్రధాని నరేంద్రమోడీ పనిలో ఉన్నారు. అనవసర ప్రశ్నలతో విలేకర్లు దాన్ని చెడగొట్టవద్దు అనే సందేశం ఇస్తున్నారు. మోడీ స్నేహితుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏడాదికి సగటున 22 సార్లు విలేకర్లతో మాట్లాడితే జోబైడెన్‌ ఇంతరకు 15నెలల కాలంలో 11 సార్లు మాట్లాడాడు. ఇవి అధికారిక సమావేశాలు, ఇతరత్రా వేరే సందర్భాలలో మాట్లాడిన వాటిని కలిపితే ఎక్కువే ఉంటాయి వారు పనీపాటా లేక విలేకర్లతో మాట్లాడుతున్నారా ? ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న ఏ దేశంలోనూ ఇలాంటి ప్రజాప్రతినిధి ఇంతవరకు లేరంటే అతిశయోక్తి కాదు.


2021 సెప్టెంబరులో నరేంద్రమోడీ వాషింగ్టన్‌లో జోబైడెన్‌తో భేటీ జరిపారు. ఆ సందర్భంగా విలేకర్లు వచ్చారు. అమెరికా విలేకర్ల కంటే భారతీయ విలేకరులే మెరుగు అని బైడెన్‌ అన్నాడు. అంతేకాదు మోడీవైపు చూస్తూ మీకు అంగీకారమైతే మనం వారి ప్రశ్నలకు మన సమాధానం చెప్పనవసరం లేదు, ఎందుకంటే వారు ఒక అంశం గురించి అడగరు అన్నాడు.ప్రధాని నరేంద్రమోడీని పక్కన కూర్చో పెట్టుకొని తమ మీడియాను కించపరిచాడు. అసలు మోడీగారు ప్రధానిగా ఉన్నంతవరకు మీడియాతో మాట్లాడనని భారత, గోమాతల మీద ఒట్టు వేసిన లేదా ఆత్మసాక్షిగా శపధం చేసిన సంగతి బైడెన్‌కు తెలిసి ఉండదు. దేశం వణుకుతున్నదని అంటే ఎందుకు స్పందించటం లేని ప్రశ్నించుకొనే వారికి విసుగు పుట్టి ఆలోచించటం మానుకోవాలే తప్ప మోడీ మాట్లాడరని తేలిపోయింది. అమెరికా రెచ్చగొడితే మనం రెచ్చిపోవాలా అని ఎవరైనా అనవచ్చు, ఇక్కడ రెచ్చిపోవటం కాదు, మనకూ 56అంగుళాల ఛాతీ ఉందన్న సందేశం అన్నవారికి ఇవ్వాలా వద్దా ? ఇక్కడ వైపరీత్యం ఏమంటే సంఘపరివార్‌ బిజెపితో సహా దాని అనుబంధ సంస్దలేవీ మాట్లాడలేదు. వాటికి పెద్దన్న జో బైడెన్‌ అంటే వణుకుపుడుతోందా అని సందేహం కలిగితే తప్పుకాదు కదా !
.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d