• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Uncategorized

మైనారిటీ స్కాలర్‌ షిప్‌ల సమస్య : కేరళ ప్రభుత్వ సూత్రబద్దవైఖరి !

19 Monday Jul 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, BJP-Kerala, Kerala LDF, Kerala Minority Scholarship issue, Muslim League, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ఓటు బ్యాంకు రాజకీయాలకు సిపిఎం ఆమడ దూరం అని మరోసారి నిరూపితమైంది. యుడిఎఫ్‌ ప్రభుత్వం 2016 అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకొని 2015లో మైనారిటీ తరగతులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లలో 80శాతం ముస్లింలు, ఇరవైశాతం క్రైస్తవులకు నిర్ణయిస్తూ ఉత్తరువులు జారీ చేసింది. దాన్ని హైకోర్టులో సవాలు చేశారు. సూత్రబద్ద వైఖరితో ఆ సమస్యను పరిష్కరించాలని సూచిస్తూ ఆ ఉత్తరువును కోర్టు కొట్టివేసింది. ఈ నేపధ్యంలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అనేక మంది నిపుణులను సంప్రదించి 2011 జనాభా ప్రాతిపదికన ఆ దామాషాలో స్కాలర్‌షిప్పులు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 26.56, క్రైస్తవులు 18.38, బౌద్దులు, సిక్కులు, జైనులు 0.01శాతం చొప్పున ఉన్నారు. స్కాలర్‌ షిప్పులు ఇప్పుడు అందరికీ అదే ప్రాతిపదికన లభిస్తాయి. ప్రస్తుతం స్కాలర్‌ షిప్‌లు పొందుతున్న వారికి లేదా మొత్తాలకు ఎలాంటి భంగం కలగదని, ఇతర మైనారిటీలకూ కొత్తగా లభిస్తాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈ విధానం, నిర్ణయాన్ని ప్రతిపక్షంగా ఉన్న యుడిఎఫ్‌లోని కాంగ్రెస్‌, కేరళ కాంగ్రెస్‌ సమర్దించాయి. అయితే తమ సామాజిక తరగతికి అన్యాయం జరిగిందంటూ ముస్లిం లీగు వ్యతిరేకించింది. ఆ పార్టీ వత్తిడికి లొంగిపోయిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు తాము సమర్ధించిన మాట నిజమే గానీ తాము సూచించిన దానిని ప్రభుత్వం పూర్తిగా అమలు జరపలేదని తరువాత అర్ధం అయిందని అందువలన వ్యతిరేకిస్తున్నట్లు మాట మార్చారు. అంతేకాదు భాగస్వామ్య పక్షాలేవీ బహిరంగంగా ఈ సమస్యపై ప్రకటనలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. టీవీ చర్చలలో మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ కె మురళీధరన్‌ మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చూసుకుంటుందన్నారు. దీని గురించి మాట్లాడేందుకు ఎల్‌డిఎఫ్‌ పక్షాలకు స్వేచ్చ లేదని ఆరోపించారు. తమ యుడిఎఫ్‌లో ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని ఎల్‌డిఎఫ్‌లో భూస్వామి-కౌలుదారు మాదిరి ఉంటుందన్నారు.


సచార్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ముస్లింల అభివృద్ది కోసం గత ప్రభుత్వం 80:20 దామాషా నిర్ణయించిందని ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగిందనే వాదనను ముస్లింలీగు ముందుకు తెచ్చింది.పభుత్వ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. ఎవరికీ అన్యాయం జరగదని సూత్రబద్దమైన వైఖరి అని ఎల్‌డిఎఫ్‌ పేర్కొన్నది. లీగు వైఖరి సమాజాన్ని విభజించేదిగా ఉందని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ రాఘవన్‌ విమర్శించారు. స్కాలర్‌ షిప్‌ల పధకం కేవలం ముస్లింల కోసమే ఏర్పాటు చేశారని ప్రభుత్వం దామాషా ప్రాతిపదికన ఇవ్వటం సరికాదని పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. గతంలో చేసిన నిర్ణయంలో 20శాతం వెనుకబడిన క్రైస్తవులకు కల్పించటమే తప్పిదమని, ముస్లింలకు తగ్గించకుండా ఇతరులకు కావాలంటే ఇచ్చుకోవచ్చని పేర్కొన్నది. సంఘపరివార్‌, కొన్ని క్రైస్తవ సంస్దలు సమాజంలో విభజన తెచ్చే విధంగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం అది మైనారిటీల కోసం ఉద్దేశించింది తప్ప కేవలం ముస్లింలకు మాత్రమే అని ఎక్కడా లేదు. ఈ కారణంగానే 80:20శాతం దామాషాను హైకోర్టు కొట్టివేసింది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కొత్త విధానంలో ముందే చెప్పినట్లు జనాభాను బట్టి దామాషాను నిర్ణయించింది.

సమీప భవిష్యత్‌లో ఎన్నికలు లేవు. అసలు ఎన్నికలకు దానికి సంబంధం లేదు. అయినప్పటికీ మీడియాలో ఓటుబ్యాంకు రాజకీయాల ప్రాతిపదికన కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ విధానంపై యుడిఎఫ్‌ పక్షాలలో విబేధాలు ఎల్‌డిఎఫ్‌కు లాభమన్నది వాటిలో ఒకటి. కాంగ్రెస్‌లో మిగిలి ఉన్న క్రైస్తవులు మరింత ఎక్కువగా ఎల్‌డిఎఫ్‌కు మద్దతు ఇస్తారన్నది రెండవది. అన్యాయం జరిగిందని నిరూపించే స్దితిలో యుడిఎఫ్‌ లేదన్నది మరొకటి. ఇక్కడ గమనించాల్సిందేమంటే యుడిఎఫ్‌ కూటమి గతంలో ఎన్నికల కోసమే స్కాలర్‌షిప్పుల విధానాన్ని రూపొందించి అది లబ్దిపొందింది లేదు. ఒక సూత్రబద్ద వైఖరి తీసుకున్న కారణంగా ఎల్‌డిఎఫ్‌ లబ్దిపొందితే పొందుతుందా లేదా అన్నది వేరే అంశం. మీడియా విశ్లేషకులకు కడుపు మంట ఎందుకో తెలియదు.

బక్రీద్‌ సందర్భంగా కరోనా ఆంక్షల సడలింపు వివాదం !


డెబ్బయి ఒక్క రోజుల తీవ్ర ఆంక్షల తరువాత బక్రీద్‌ సందర్భంగా కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు దుకాణాలను తెరిచేందుకు షరతులతో ఆంక్షలను సడలించింది. కేరళలో ఉన్న జనాభా పొందికను చూసినపుడు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలను అనుసరించే వారి ప్రధాన పండగల రోజుల్లో వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. బక్రీద్‌ సందర్భంగా దుకాణాల్లో పాటించాల్సిన నిబంధనల అమలుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. యజమానులకు గట్టి ఆదేశాలను జారీ చేశారు. ప్రార్ధనా స్ధలాల్లో అనుమతించిన దానికి మించి గుమి కూడదనే షరతు విధించారు. మసీదులతో పాటు దేవాలయాలు, చర్చ్‌లకు అలాంటి ఆంక్షలతోనే అనుమతులు ఇచ్చారు. కన్వర్‌ యాత్ర నిర్వహణ తప్పన్నపుడు బక్రీద్‌కు ఇవ్వటం కూడా తప్పే అని కాంగ్రెస్‌ జాతీయ ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి అభ్యంతరం చెప్పారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా వ్యతిరేకత తెలిపింది. ప్రస్తుతం దేశంలో కేసులు ఎక్కువ ఉన్న కేరళలో ఇలాంటి అనుమతులు ఇవ్వకూడదన్నది దాని వాదన. ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళకు చెందిన బిజెపి మంత్రి వి మురళీధరన్‌ రాజకీయ ప్రయోజనాలకోసం తీసుకున్నదిగా ఆరోపించారు. శాస్త్రీయ పద్దతిలో కరోనా నిరోధ చర్యలను తీసుకోవాలన్నారు.

బక్రీద్‌ సందర్భంగా మసీదుల్లో పరిమిత సంఖ్యలో ప్రార్ధనలకు తప్ప బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేదు. రాష్ట్రాన్ని ఏబిసిడి తరగతులుగా విభజించారు. డి తరగతి ప్రాంతాల్లో ఒక్క రోజు మాత్రమే వస్తువుల కొనుగోలుకు అవకాశం ఇచ్చారు.
మసీదులో వంద మందికి మాత్రమే అనుమతి, ఆరు అడుగుల దూరం పాటించాలి. ఎవరి దుప్పటి లేదా చాప వారే తెచ్చుకోవాలి. ఒక వేళ అంత మంది పట్టే అవకాశం లేకపోతే సంఖ్యను తగ్గించుకోవాలి.అరవై అయిదు సంవత్సరాలు దాటిన పది సంవత్సరాల లోపు వారిని ప్రార్ధనలకు అనుమతించరు. మాస్కుతప్పని సరి, చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి, మసీదులో ప్రవేశించే ముందు శరీర ఉష్ణ్రోగ్రతను చూస్తారు. ప్రార్ధనలకు వచ్చిన వారి చిరునామా, ఫోను నంబర్లు లేదా వారిని కనుగొనేందుకు అవసరమైన సమాచారాన్ని మసీదు నిర్వాహకులు నమోదు చేయాలి. జంతుబలి సమయంలో ఐదుగురికి మించి ఉండకూడదు. కరోనా నిబంధనలకు విరుద్దంగా ఎవరూ గుమికూడవద్దని ముస్లిం మత పెద్దలు బహిరంగ ప్రకటన చేశారు. ఆయా జిల్లాల యంత్రాంగాలు నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. మలప్పురం జిల్లాలో ప్రార్ధన స్దలాల్లో 40 మందికి మించి అనుమతించేది లేదని, రెండు విడతల వాక్సిన్‌ తీసుకున్నట్లు, కరోనా లేదనే ధృవీకరణ పత్రాలు ఉన్నవారినే అనుమతించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీదు సందర్భంగా ఆది, సోమ, మంగళ వారాల్లో దుకాణాలను తెరిచేందుకు అనుమతించి రాష్ట్ర ప్రభుత్వం మనుషు ప్రాణాలతో ఆడుకుంటున్నదంటూ అనుమతి రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఢిల్లీ నివాసి పికెడి నంబియార్‌ ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. దాని మీద ఈ రోజే సమాధానం ఇవ్వాలని కేరళ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీం కోర్టు కోరింది. మంగళవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే ఈ కేసును చేపట్టనున్నట్లు డివిజన్‌ బెంచ్‌ పేర్కొన్నది.


బక్రీద్‌ సందర్భంగా మూడు రోజుల పాటు నిబంధనల సడలింపు మీద మిశ్రమ స్పందన వెలువడింది. ప్రభుత్వ చర్యను సమర్ధించే వారు చెబుతున్న అంశాల సారాంశం ఇలా ఉంది. కేరళలో ఓనం-బక్రీదు తరుణంలో వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతుంది. గత ఏడాది ఐదులక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తే 3,62,620 కోట్లు మాత్రమే జరిగాయి. ప్రభుత్వానికి 75వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. ఓనం సమయంలో 25వేల కోట్లని అంచనా వేస్తే వచ్చింది రు.18,131 కోట్లు. గత మూడు సంవత్సరాలుగా ఓనం పండగ సందర్భంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. వరదల కారణంగా 2018,19 సంవత్సరాల్లో దెబ్బతింటే గతేడాది కరోనా వచ్చింది. కేరళ వ్యాపార వ్యవసాయి ఏకోపన సమితి అంచనా ప్రకారం ఇరవై వేల మంది వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పదిమంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇరవై వేల కోట్ల రూపాయల సరకు పనికిరాకుండా పోయింది. ప్రస్తుత పరిస్ధితుల్లో కొత్త సరకు తెచ్చేందుకు భయపడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రాణాలు తీస్తున్న అధిక పని గంటలు -పనిలేక నిరుద్యోగుల ఆత్మహత్యలు !

18 Sunday Jul 2021

Posted by raomk in Current Affairs, Economics, employees, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, Women

≈ 1 Comment

Tags

#workers Health, extreme work weeks, ILO, Long working hours, Occupational diseases, overwork in India, WHO


ఎం కోటేశ్వరరావు


పని సందర్భంగా వడదెబ్బ సంబంధిత అత్యధిక గాయాలు, సమస్యలు పరిగణనలోకి రావటం లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక జూలై 15న ఒక విశ్లేషణ ప్రచురించింది. వడగాలులు శ్రమ జీవులను ప్రత్యేకించి పేదవారిని అనూహ్య పద్దతులలో ఎలా గాయపరుస్తాయో తాజా సమాచారం వెల్లడించిందని పేర్కొన్నది. దాని సారాంశం ఇలా ఉంది. తీవ్ర వడగాడ్పులు సంభవించినపుడు పెద్ద సంఖ్యలో వడదెబ్బలే కాదు పడిపోవటం, యంత్రాలను సరిగా పనిచేయించలేకపోవటం, వాహనాల మధ్య ఇరుక్కుపోవటం వంటివి కూడా గణనీయంగా ఉంటున్నాయి. పని స్ధలాల్లో ఇతర కారణాలతో తగిలే గాయాలకు కాలిఫోర్నియాలోనే అదనంగా ప్రతి సంవత్సరం వడదెబ్బ గాయాలు ఇరవై వేలు తోడవుతున్నాయి. వీటి వలన పని మీద కేంద్రీకరించటం కష్టం అవుతోంది. పశ్చిమ అమెరికా, బ్రిటీష్‌ కొలంబియాలో ఇటీవలి వడగాడ్పులకు 800 మంది మరణించారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు ఉత్పాదక యంత్రాలు, గోడవున్లలో పని చేసే వారికి కూడా వడగాడ్పులు ముప్పు తెస్తున్నాయి. వడగాడ్పు గాయాల వలన వేతనాలను కోల్పోవటం, వైద్య ఖర్చు పెరగటం, ఉష్ట్రోగ్రతలు పెరిగే కొద్దీ వేతన వ్యత్యాసం కూడా పెరుగుతోంది. 2001 నుంచి 2018వరకు కాలిఫోర్నియాలో గాయాలకు పరిహారం చెల్లించిన కోటీ పదిలక్షల నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. తేదీలు, పని ప్రాంతాలు, వడగాడ్పుల తీవ్రత, గాయాల సంఖ్య తీరుతెన్నులను విశ్లేషించగా వేడి ఎక్కువగా ఉన్నపుడు గాయాలు ఎక్కువగా నమోదైనట్లు తేలింది. అధికారికంగా సగటున 850 గాయాలైనట్లు నివేదికలు చూపాయి. అయితే వాస్తవ గాయాలతో పోల్చితే ఇవి చాలా తక్కువ. అరవై డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉన్నపుడు తగిలిన గాయాలతో పోల్చితే 85-90 డిగ్రీలు ఉన్నపుడు ఐదు నుంచి ఏడుశాతం, వంద డిగ్రీలకు పెరిగినపుడు పది నుంచి 15శాతం పెరిగాయి. వడ దెబ్బ గాయాలు గరిష్ట వేతనాలు పొందే వారితో పోల్చితే కనిష్ట వేతనాలు పొందే కార్మికులకు ఐదు రెట్లు ఎక్కువ ఉన్నాయి.వడదెబ్బ తగల కుండా కొన్ని చర్యలు తీసుకున్న తరువాత కేసులు సంఖ్య తగ్గింది తప్ప తీరుతెన్నులు మాత్రం అలాగే ఉన్నాయి.


మనది ఉష్టమండల ప్రాంతం. ఉష్ణోగ్రతలు అమెరికా కంటే ఎక్కువ నమోదౌతున్నాయి.వేసవిలో 110-115 మధ్య ఉన్న సందర్భాలు ఎన్నో. రికార్డు స్ధాయిలో రాజస్దాన్‌లో 124 కూడా నమోదైంది. అధిక ఉష్ణోగ్రత నమోదైనపుడు వడదెబ్బ తగలకుండా నివారణ చర్యలు తీసుకున్న సంస్దలు ఎన్ని ఉన్నాయన్నది ప్రశ్నార్దకం. అమెరికా మాదిరి మన దేశంలో కూడా పరిశోధన చేస్తే తప్ప తీవ్రత బయటకు రాదు. వడదెబ్బ ఒక్కటే కాదు కష్టజీవుల జీవితాలను దెబ్బతీస్తున్న వృత్తి రుగ్మత అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఓవర్‌టైమ్‌ కూడా ఒకటి.ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్‌ఓ) తొలిసారిగా అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ)తో కలసి దీర్ఘపని గంటల మీద నిర్వహించిన సర్వే ప్రకారం ఏడాదికి ఆ కారణంగా మరణిస్తున్నవారు 7,45,000 మంది(ఇది 2016 సంఖ్య) ఉన్నారట. గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులు దీనికి కారణం. ఆగేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంత దేశాలలోని కార్మికులు ఎక్కువగా ప్రభావితులౌతున్నారు.ఆసియాలో గుండెపోటు ముప్పు మామూలుగానే ఎక్కువ, దీనికి అధిక పని గంటల సమస్య మరింత పెంచుతోంది. వారానికి 35-40 గంటల పాటు పని చేసేవారితో పోల్చితే 55 గంటలు, అంతకు మించి పని చేసే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు 35శాతం, గుండె సంబంధ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయే ముప్పు 17శాతం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతులు మధ్యవయస్కులు లేదా వృద్దులు ఎక్కువగా ఉన్నారు. రోజుకు ఎక్కువ గంటలు పని చేసిన వారిలో ఇది పని మానేసిన తదుపరి జీవితంలో, కొన్ని సందర్భాలలో దశాబ్దాల తరువాత కూడా ప్రభావం చూపుతోంది. అధిక పని గంటలు అంటే భౌతిక శ్రమే చేయనవసరం లేదు, ఇతరత్రా పనిలో ఎక్కువ గంటలు ఉన్నా ముప్పు ఉంటుంది.పిల్లలతో సహా అధిక గంటలు పని చేస్తున్నవారు ప్రపంచ జనాభాలో తొమ్మిదిశాతం ఉన్నారు.2000 సంవత్సరం తరువాత వీరి సంఖ్య పెరుగుతోంది.


వృత్తిపరంగా తలెత్తే రుగ్మతలకు కారణాలు అనేక వాటిలో సింహభాగం అధిక పని గంటలే అని తేలింది. ఎక్కువ సేపు భౌతిక శ్రమ చేయటం ముప్పు కారణమైతే, అది లేకుండా ఇతరంగా ఎక్కువ గంటలు పని చేసే వారు మద్యం, పొగాకు వినియోగం, తక్కువ సేపు నిద్రపోవటం, వ్యాయామం లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వంటి అంశాలు కూడా ముప్పును పెంచుతున్నాయి. దీర్ఘకాలం పనిచేసే వారి సంఖ్య ప్రపంచ వ్యాపితంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి సమయంలో అది మరింత పెరిగింది. అధికపని చేసినందుకు ప్రతిఫలం కూడా అన్ని సందర్భాలలో ఉండటం లేదు. ఇంటి నుంచి పని చేసే వారు సగటున 3.6 గంటలు ఎక్కువ సేపు విధి నిర్వహణలో ఉంటున్నారని తేలింది. యజమానులు వృత్తి రుగ్మతలను పరిగణనలోకి తీసుకోవాలని, తక్కువ పని గంటలు ఉంటే ఉత్పత్తి ఎక్కువ వస్తుందని గ్రహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్ద పేర్కొన్నది. అప్పగించిన ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువులోగా పూర్తికావాలనే లక్ష్యాలు నిర్ణయిస్తున్నందున వాటికోసం ఇంట్లో లేదా పని స్ధలాల్లో ఎక్కువ సేపు పని చేయటంతో పాటు వత్తిడి సమస్య కూడా తలెత్తుతోంది. అధిక పని గంటల కారణంగా గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతుల మందికి గుండెకు రక్త ప్రసరణ తగ్గిన కారణంగా తలెత్తే ఇస్కీమిక్‌ హృదయ వ్యాధి మూలం అని తేలింది. దీనికి వత్తిడి, అధికరక్తపోటు కారణం.ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 15శాతం మంది కార్మికులకు మాత్రమే వృత్తిపరమైన రుగ్మతల చికిత్స ప్రత్యేక సేవలు అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులోని తిర్పూరు-కోయంబత్తూరు ప్రాంతంలోని నూలు, వస్త్ర, దుస్తుల పరిశ్రమలో వెలువడే పత్తి ధూళి కారణంగా కార్మికుల్లో బ్రోంకైటిస్‌, టీవి, బరువు తగ్గటం, వినికిడి శక్తి నష్టపోవటం వంటి రుగ్మతలు తలెత్తుతున్నాయని విశ్లేషణలో తేలింది. ఈ పరిశ్రమల్లో పని చేసే వారి జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ 2018 సర్వే ప్రకారం 83శాతం మంది కార్మికులకు ఆరోగ్య బీమా లేదు.


అధిక గంటలు పని చేస్తున్న వారు ఆసియాలో ఎక్కువగానూ ఐరోపాలో తక్కువగానూ ఉన్నారు. తగిన ప్రతిఫలం లేదా ఆదాయం లేని కారణంగా ఆసియాలోని అనేక ప్రాంతాలలో రోజుకు ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తున్నవారెందరో. పని గంటల పరిమితులు ఉన్నప్పటికీ వాటికి వక్రభాష్యాలు, మరొక కారణమో చెప్పి ఎక్కువ పని గంటలు చేయిస్తున్నారు. అదొక లాభసాటి వ్యవహారంగా కూడా ఉంటోంది. ఒకరిని అదనంగా నియమించుకొని పని చేయించుకోవటం కంటే ఆ మేరకు ఇద్దరో ముగ్గురి చేతో ఓవర్‌ టైమ్‌ చేయించుకోవటం యజమానికి లాభం కనుకనే ఆ పని చేస్తున్నారు.


పని చేయటంలో జపనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కొంత మంది చెబుతారు. అక్కడి కార్మికులు నిరసన తెలియచేయాలంటే సమ్మెల కంటే అదనంగా ఉత్పత్తి చేసి యజమానుల మీద వత్తిడి చేస్తారనే కథలు కూడా బాగానే వినిపిస్తారు.సెలవులు తీసుకోవాలంటే సిగ్గుపడతారని ఆకాశానికి ఎత్తుతారు. 1970దశకంలో చమురు సంక్షోభం తలెత్తినపుడు అక్కడి కార్మికవర్గం మీద పెట్టుబడిదారులు 70గంటల పనిని రుద్దారు.అలా పని చేయటం గర్వకారణం, జపనీయుల దేశభక్తికి నిదర్శనం అన్నట్లు ప్రచారం చేసి సాధారణం కావించారు. ఇప్పుడు అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం అదే చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ కార్మిక సంస్ధ చేసిన సర్వే అంశాలవే. అయితే జపాన్‌లో 70గంటల పని రుద్దుడు పర్యవసానం ఏమిటి ? అక్కడి పని సంస్కృతికి మరోపేరు ” కరోషి ” అంటే అధికపనితో చావు. ఇలాంటి చావులు పెరిగిన కారణంగా పని గంటల గురించి అక్కడ పునరాలోచన ప్రారంభమైంది. అనేక మంది కార్మికులు పని వత్తిడి తట్టుకోలేక కార్యాలయాల మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారు. ఇదొక సామాజిక సమస్యగా మారింది. ప్రతి ఏటా కరోషీ బాధితులు పెరుగుతున్నారు. ఏటా పదివేల మంది మరణిస్తున్నారని అంచనా. కానీ ప్రభుత్వ లెక్కల్లో రెండు వందలు మాత్రమే ఉంటున్నాయి. మరీ ఎక్కువ వత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుందని లేదా పరిహారం చెల్లించాల్సిన కారణాల వలన గానీ ఇటీవలి కాలంలో కొందరు యజమానులు తమ సిబ్బందికి బలవంతంగా సెలవులను ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. సెలవులకు వేతనాలు పొందుతున్న కార్మికులు 2018లో 52.4శాతం మందే ఉన్నారు. సెలవు తీసుకుంటే వేతనం ఇవ్వరు గనుక అనేక మంది వాటి జోలికి పోరు. చూశారా జపాను వారు సెలవులు కూడా తీసుకోకుండా పని చేస్తారని బయటి ప్రపంచం సుద్దులు చెబుతుంది.


ఆర్ధిక సహకార మరియు అభివృద్ది సంస్ధ (ఓయిసిడి) సభ్య దేశాలలో పదకొండు చోట్ల వారానికి 50 గంటల కంటే ఎక్కువే పని చేస్తున్నారు.నాలుగు దేశాల్లో అధిక గంటలు పని చేసే వారు టర్కీలో 33, మెక్సికోలో 29, కొలంబియాలో 26.6, దక్షిణ కొరియాలో 25.2, జపాన్‌లో 17.9శాతం మంది ఉన్నారని ఓయిసిడి చెబుతోంది.పని-కుటుంబం, వ్యక్తిగత జీవితాలను సమన్యయ పరచుకోవటంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారీ వ్యవస్ధ సృష్టించిన సమస్య తప్ప మరొకటి కాదు.


తాజాగా మాన్‌పవర్‌ గ్రూప్‌ సంస్ధ జరిపిన సర్వే ప్రకారం అధిక గంటలు పని చేసే దేశాల్లో మనం ప్రధమ స్దానంలో ఉన్నాం.1981-1996 మధ్య కాలంలో పుట్టిన వారిని మిలీనియల్స్‌ అంటున్నారు.వీరు మన దేశంలో 52, చైనాలో 48, అమెరికాలో 45, బ్రిటన్‌లో 41 గంటలు పని చేస్తున్నారని సర్వేలో తేలింది. తీవ్ర పోటీ, పని చేయకపోతే ఉద్యోగం ఊడుతుందన్న భయం వంటి అంశాలు రోజుకు పది గంటల కంటే ఎక్కువ సేపు పనిలో ఉండేట్లు చేస్తున్నాయి. ఫోర్డ్‌ కంపెనీ చేసిన సర్వే ప్రకారం వారానికి 12 గంటలు ఉద్యోగులు వాహనాలు నడపటానికి వెచ్చిస్తున్నారు. అంటే పని గంటలకు ఇది అదనం. ఉదాహరణకు 52 పని గంటలైతే అందుకోసం మరోపన్నెండు గంటల పాటు ప్రయాణంలో వెచ్చించాల్సి వస్తోంది.


మన దేశంలో సంభవిస్తున్న ఆత్మహత్యలలో పదిశాతం నిరుద్యోగం, దారిద్య్రం, దివాలా వంటి కారణాలతో జరుగుతున్నాయి. ఒకవైపు అధిక గంటలు పని చేసే వారు అత్యధికులుండగా మరో వైపు అసలు పనే లేని నిరుద్యోగులు కనిపిస్తారు. అధిక గంటలు పనిచేసే దేశాలలో మనది ఐదవ స్ధానమని ఐఎల్‌ఓ తెలిపింది. 2020-21 ప్రపంచ వేతన నివేదికలో అతి తక్కువ కనీస వేతనాలు చెల్లిస్తున్న దేశాల్లో మనది ఒకటని కూడా వెల్లడించింది. 2019 మన జాతీయ గణాంక సంస్ద సర్వే ప్రకారం రోజులో పదో వంతు కూడా దేశ ప్రజలు తీరుబడి కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కార్మికశక్తిలో మహిళల శాతం తగ్గిపోతున్నదని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది, గత సంవత్సరం 20.3శాతమే ఉన్నారని, అంతకు ముందుకంటే గణనీయంగా తగ్గినట్లు తెలిపింది. మన దేశంలో వారానికి నాలుగు దినాలు, రోజుకు పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది యజమానుల లబ్ది కోసం తప్ప మరొకటి కాదు. ఓవర్‌టైమ్‌కు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయటమే ఇది. అధిక పని గంటలు, వృత్తి రుగ్మతల కారణంగా తలెత్తే పర్యవసానాల గురించి మన దేశంలో సమగ్రమైన చట్టాలు చేయాల్సి ఉంది. ఉన్న చట్టాలనే నీరుగార్చేందుకు పూనుకుంటున్న పాలకుల హయాంలో అది జరిగేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీ భక్తుడు మోడీ పాలనలో అచ్చేదిన్‌ కాదు తిప్పలు, అప్పులే రామచంద్రా !

17 Saturday Jul 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Indian Economy, BJP’s trolling army, indian household debt, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోందో, పాలన ఎలా సాగుతోందో మనం(జనం) పట్టించుకుంటున్నామా ? చాలా మందికి ఇది అంతుచిక్కని ప్రశ్న. కమ్యూనిస్టులు ఏదైనా చెబితే దాన్లో కొత్తేముంది, వారు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు, అందుకే పుట్టారు అనే వారు ఎందరో. పోనీ అలా వ్యాఖ్యానించేవారు దేశం గురించి పట్టించుకుంటున్నారా అని అడిగితే మనోభావాలు దెబ్బతింటాయి. ఎలా చావాలి ? కరోనాతో మరణించిన వారు అటు స్వర్గంలోనో, నరకంలోనో, అటూ ఇటూ కాకుండానో ఎందుకంటే ఆ రెండు చోట్ల కూడా కరోనా వారిని అనుమతించరు గనుక ఏదో వారి తిప్పలు వారు పడుతూ ఉండి ఉంటారు. బతికి ఉన్నవారు చెప్పలేని బాధలు అనుభవిస్తున్నారు. ఉద్యోగాలు పోయాయి, ఆదాయాలు లేవు, సంపాదించే వారి ఆకస్మిక మరణాలు, ఎప్పుడు పరిస్ధితి బాగుపడుతుందో తెలియని అయోమయం. ఆస్తులు అమ్మి, లక్షలు ఖర్చు చేసి కరోనా నుంచి బతికి బయటపడ్డా ప్రాణం మిగిలిందనే తృప్తి తప్ప చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న పెద్ద బాధ వారిని వెన్నాడుతోంది. అంతచేసినా ప్రాణాలు దక్కని వారి కుటుంబాల పరిస్ధితి చెప్పనలవి కావటం లేదంటే అతిశయోక్తి కాదు. ఎటు చూసినా అప్పులు అప్పులు తిప్పలు తిప్పలు !


గతంలో యుపిఏ హయాంలో చేసిన అప్పులన్నింటినీ నరేంద్రమోడీ గారు తీర్చారని ప్రచారం చేశారు.ముందుగా కేంద్రం చేసిన అప్పుల గురించి చూద్దాం.ఏడు సంవత్సరాల కాలంలో 55లక్షల కోట్ల దేశీయ అప్పును 117లక్షల కోట్లకు పెంచారు, దీనికి విదేశీ అప్పును కూడా కలిపితే 2021 మార్చి ఆఖరుకు 121లక్షల కోట్లు. వచ్చే ఏడాది అది 136లక్షల కోట్లు అవుతుందని అంచనా.ఏం చేశారని అడగొద్దు. అత్మనిర్భరలో జనానికి ఏం చేశారని అసలే అడగొద్దు. ఈ అప్పుకు ఏటా ఏడు లేదా ఎనిమిది శాతం వడ్డీ చెల్లించాలి అనుకుంటే పది లక్షల కోట్ల వడ్డీయే అవుతుంది. ఈ భారాన్ని జనమే భరించాలి. ఇవి గాక కుటుంబాల అప్పులు కూడా పెద్ద సమస్యగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు.2019-20లో ప్రతి వ్యక్తికి సగటున రు.34,304 అప్పు ఉండగా 2020-21లో రు.52,273కు పెరిగింది.2017-18లో మన జిడిపిలో గృహరుణాలు 30.1శాతం ఉండగా 2020-21లో 37.3శాతానికి పెరిగాయి.కేంద్ర బడ్జెట్‌ పత్రాల ప్రకారం 2020-21లో జిడిపి విలువ రు.194.81లక్షల కోట్లు. దీనిలో 37.3శాతం అంటే 72.66లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లు.దాన్ని జనాభాతో భాగిస్తే సగటు అప్పు తెలుస్తుంది. అయితే జిడిపిలో ఎగుడుదిగుడులు ఉన్నపుడు సంఖ్యలు మారుతుంటాయి. 2017-18లో తలసరి గృహరుణం రు.29,385 ఉంది. ఇప్పుడు ఉన్నదానితో పోల్చితే గత నాలుగు సంవత్సరాలలో 78శాతం భారం పెరిగింది.


హౌమ్‌ క్రెడిట్‌ ఇండియా అనే సంస్ధ ఏడు నగరాల్లో ఒక సర్వే నిర్వహించింది. 2019లో అప్పు చేసేందుకు వంద కారణాల్లో 33 వినిమయ వస్తువుల కొనుగోలుకు, వ్యక్తిగత అవసరాలకు 23, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు 20 ఉండేవి. అదే మరుసటి ఏడాది కరోనా కాలంలో 46 ఇంటి నిర్వహణకు, 27 వాయిదాల చెల్లింపు, ఉపాది లేదా వ్యాపార నష్టాలు తీర్చేందుకు 14 చేస్తున్నట్లు తేలింది. అంటే ఏడాది కాలంలో జీవన విధానంలో ఎంత తేడా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. బ్యాంకులు పదిశాతం రుణాలను బలహీనవర్గాలకు ఇవ్వాలన్నది విధానపరమైన నిర్ణయం. అయితే ప్రయివేటు బ్యాంకుల్లో 52.4శాతం బ్యాంకులు అంతమేరకు ఇవ్వలేదని ఒక సర్వేలో వెల్లడైంది. అంటే ఆ మేరకు అధికవడ్డీలకు వారు ప్రయివేటు రుణాలను తీసుకోవాల్సి వచ్చినట్లే.


గత నాలుగు సంవత్సరాల్లో గృహరుణాలు ఎందుకు పెరిగాయి ? ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు దిగజారి జనాలు కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సి రావటం రుణ భార కారణాల్లో ఒక ప్రధానమైనదిగా మారింది. అదే విధంగా విద్యారంగం కూడా తయారైంది. మతిమాలిన చర్య పెద్ద నోట్ల రద్దు, తరువాత తగినంత కసరత్తు చేయకుండా అమల్లోకి తెచ్చిన జిఎస్‌టి పర్యవసానాలు కూడా రుణభారాన్ని పెంచిన అంశాల్లో చేరాయి. ఇవిగాక ఇతర కారణాలను చూద్దాం.2017లో నిరుద్యోగులశాతం 3.4, అది 2020 మార్చినాటికి 8.8, 2021జూన్‌కు 9.17శాతానికి చేరింది. ఇదే విధంగా ద్రవ్యోల్బణం రేటు 2.41నుంచి 2021 జూన్‌ నాటికి 7.39శాతానికి చేరింది. అంటే నిరుద్యోగం వలన ఆదాయం తగ్గటం, ఖర్చులు పెరగటం, ద్రవ్యోల్బణం వలన ధరల పెరుగుదల కుటుంబాలను అప్పుల పాలు చేస్తున్న కారణాలలో చేరాయి.

అయితే కొంత మంది గృహరుణాలు పెరగటం మన దేశం ఒక్కదానిలోనే కాదు. అనేక దేశాల్లో ఉందని చెబుతారు. దక్షిణ కొరియాలో 103.8, హాంకాంగ్‌లో 91.2, బ్రిటన్‌లో 90, అమెరికాలో 79.5, చైనాలో 61.7శాతం ఉంది. అయితే ఈ దేశాలతో మనం దేనితోనూ పోల్చులేము.మిగతా దేశాలు ఈ సమస్యను ఎలా అధిగమిస్తాయో తెలియదు గానీ సమీప భవిష్యత్‌లో మన కుటుంబాలు తీవ్ర పరిస్ధితిని ఎదుర్కోనున్నాయని ఆర్ధిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ మూడవ తరంగం కూడా వచ్చేట్లయితే ఇప్పటి వరకు గోచిపాతలతో మిగిలిన జనాలు వాటిని కూడా కోల్పోయినా ఆశ్చర్యం లేదు.


ప్రపంచ రేటింగ్‌ సంస్ధ ఎస్‌ అండ్‌ పి మన దేశాన్ని కనిష్ట పెట్టుబడి బిబిబిమైనస్‌ గ్రేడ్‌లో పెట్టింది. వృద్ది రేటు అంచనాలను అందుకోలేకపోయినా, ద్రవ్యలోటు మరియు రుణభారం జోశ్యాలకు మించి పెరిగినా భారత రేటింగ్స్‌ను తగ్గించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దెబ్బతిన్న భారత ఆర్ధిక వ్యవస్ద స్వస్ధత అసంపూర్తిగా ఉందని ఇక్రా రేటింగ్‌ సంస్ధ పేర్కొన్నది. వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో రెండంకెల వృద్ధి నమోదైనా అది 2019 తొలి త్రైమాసికంతో పోలిస్తే తక్కువే అని చెప్పింది. కరోనాకు ముందే కుదేలైన ఆర్ధిక వ్యవస్ధ తరువాత మరింత దిగజారింది.ఇది తిరిగి పూర్వపు స్ధాయికి అయినా ఎప్పుడు చేరుతుందో తెలియని అయోమయంలో ఉన్నాం.కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని జోశ్యం చెబుతున్నారు. ముఖ్యంగా యువత ఉపాధి గురించి కనుచూపు మేరలో దారి కనిపించటం లేదు. ఇరవై-ఇరవైనాలగు సంవత్సరాల మధ్య ఉన్నవారిలో 37.9శాతం మంది పని లేకుండా ఉన్నారని సిఎంఐయి తాజా విశ్లేషణ వెల్లడించింది. ముఖ్యంగా యువతులు తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నారు. డిగ్రీ చదివిన నలుగురిలో ఒకరు, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివిన వారిలో ఐదుగురిలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు. దేశంలో రెండు కోట్ల మంది డిగ్రీ చదివే వారిలో కాలేజీ, విశ్వవిద్యాలయాల్లో 85శాతం మంది ఉంటే ఇంజనీరింగ్‌, వైద్య సంస్దల్లో 15శాతం ఉన్నారు.ఐఐటి, ఐఐఎంలలో చదివిన వారికి కూడా వెంటనే ఉద్యోగాలు రావటం లేదు. ఏ సర్వే వివరాలు చూసినా ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవటం కష్టం, దీర్ఘకాలం పడుతుందనే చెబుతున్నాయి. ఉద్యోగ మార్కెట్లో ఏటా చేరుతున్న కోటి మంది ఉద్యోగాల కోసం చూస్తుంటారు. నైపుణ్యం లేని వారి పరిస్ధితి చెప్పనలవి కాదు. గత ఏడు సంవత్సరాలుగా నైపుణ్య అభివృద్ది పేరుతో తీసుకున్న చర్యలు, చేసిన ఖర్చు ఏమైందో అర్ధం కావటం లేదు.


సంస్కరణలు అంటే కరడు గట్టిన పెట్టుబడిదారీ సంస్కరణలు అమలు జరపాలని కోరుకొనే వారు కార్మికులనే కాదు యజమానులను కూడా విమర్శిస్తారు. వేగంగా దూసుకుపోయి, వృద్ధిచెందిన అమెరికా, ఐరోపా దేశాల కార్పొరేట్లతో పోటీ పడలేరని దెప్పుతారు. ఎలాంటి మార్పూ లేకుండా ఎంతసేపూ ప్రభుత్వ సాయం, సబ్సిడీలు పొందేందుకు వెనక్కి తిరిగి చూస్తుంటారని ఈసడించుకుంటారు. అలాంటివారిని వదిలించుకున్నప్పటికీ ఇప్పటి ప్రభుత్వం కూడా కొత్తగా రంగంలోకి వచ్చిన వారికి, సాయం కోసం వెనక్కి చూసే వారికి, పోటీ పడలేని దేశీయ మార్కెట్‌ కోసం ఉత్పత్తి చేసే కంపెనీలకు నిధులిస్తోందనే వాదనను కొందరు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పారిశ్రామిక ఉత్పత్తి చేస్తేనే ప్రతినెలా పెరుగుతున్న పది లక్షల మంది యువతీ యువకులకు పని కల్పించటం సాధ్యమని ఎందరో చెప్పారు. గతంలో అతల్‌ బిహారీ వాజపాయి నాయకత్వంలోని ఎన్‌డిఏ, తరువాత పదేండ్లు అధికారంలో ఉన్న మన్మోహన్‌ సింగూ ఆపని చేయలేకపోయారు. ఇప్పుడు మోడీ సర్కార్‌ కూడా అదే బాటలో నడుస్తోంది. ప్రధానిగా తొలి ప్రసంగంలోనే ఆయన ” ప్రపంచ వ్యాపితంగా ఉన్న వారికి నేనొక విజ్ఞప్తి చేయదలచాను. మీరు రండి భారత్‌లో తయారు చేయండి, ప్రపంచంలో వాటిని ఎక్కడైనా అమ్ముకోండి కానీ తయారీ ఇక్కడ మాత్రం చేయండి ” అన్నారు. ఆహ్వానం పలకటమే తరువాయి గుంపులు గుంపులుగా వస్తారని నిజంగానే మోడీతో సహా అనేక మంది భావించారు. సులభతర వాణిజ్య వాతావరణం సృష్టించాలన్నారు, విదేశీ పెట్టుబడుల వరద పారనుంది గేట్లు ఎత్తివేయాలన్నారు. ఇంకా ఎన్నో ఊసులు చెప్పారు.ఐదు సంవత్సరాల తరువాత చూస్తే పరిస్దితి ఏమిటి ? ప్రపంచ జిడిపిలో మన దేశ తయారీ రంగం వాటా 2019లో ఇరవై ఏండ్ల కనిష్టానికి పడిపోయింది. వచ్చిన విదేశీ పెట్టుబడులు స్టాక్‌మార్కెట్లో వాటాలు కొనుగోలు చేయటానికి, టెలికాం, చిల్లర వాణిజ్యం వంటి సేవా రంగంలోకి వెళ్లాయి. ఇంతవరకు ఎప్పుడైనా మేక్‌ ఇండియా లేదా మేకిన్‌ ఇండియా పిలుపులు విఫలమైనట్లు అంగీకరించారా ? దాని బదులు స్ధానిక వస్తువులను కొనండి వంటి కొత్త నినాదాలు ఇచ్చారు.


దేశంలో నూతన ఆర్ధిక విధానాలు ప్రారంభమై మూడు దశాబ్దాలు గడిచాయి.ఈ కాలంలో పాలకుల మొగ్గు ఎటు ఉంది ? ప్రభుత్వ రంగ అభివృద్ది నిలిపివేత, అప్పటికే ఏర్పాటు చేసిన వాటిని విక్రయించటం, మొత్తం ప్రయివేటు రంగంపై ఆధారపడటం, మోడీ గారి రాకతో అంతకు ముందు ఉన్న ప్రణాళికల రద్దు. నిజానికి ప్రభుత్వ రంగం లేకపోయిన తరువాత లేదా అన్ని రంగాల నుంచి ప్రభుత్వం వైదొలుగుతున్న క్రమంలో ప్రణాళికల వలన ప్రయోజనం కూడా ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల ప్రకారం ప్రయివేటు రంగం పని చేయదు, అసలు ప్రయివేటు వారి మీద ఆంక్షలే ఉండకూడదు అన్న తరువాత వారికి లక్ష్యనిర్దేశం ఎలా చేస్తారు. ప్రణాళికల వైఫల్యం, నరేంద్రమోడీ మీద ఉన్న మోజు కారణంగా వాటిని ఎత్తివేసినా జనానికి పట్టలేదు. అవి ఉన్నపుడు తమకు ఒరగబెట్టిందేమిటన్న వారి ప్రశ్నకు జవాబు లేదు.


తమ పిలుపులు విఫలమైన తరువాత కేంద్ర పాలకులు కొత్త దారి తొక్కారు. జట్కా గుర్రం కళ్ల ముందు గడ్డి కట్ట పెట్టినట్లు ఉత్పాదకత, ఎగుమతులతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల విధానాన్ని ముందుకు తెచ్చారు. కరోనా వచ్చి జనం నానా యాతనలు పడుతున్నా అరకొర సాయం తప్ప పరిశ్రమలకు రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు సబ్సిడీలు ఇచ్చినట్లు కొందరి అంచనా. అందుకే ఆర్ధిక వ్యవస్ధ దిగజారినా కంపెనీల వాటాలను కొనుగోలు చేసి డివిడెండ్లు, ఇతరంగా లాభాలను తరలించుకుపోయేందుకు విదేశీ సంస్దలు ముందుకు వచ్చాయి. ఈ సబ్సిడీలు, ఉత్పాదకత, ఎగుమతులతో ముడిపడిన ప్రోత్సాహక రాయితీలు ఎక్కువ భాగం ఉపాధి కల్పించే రంగాలు, పరిశ్రమలకు ఇవ్వలేదు. ఉపాధి పడిపోవటానికి ఇదొక కారణం.

చైనాకు పోటీగా మన దేశాన్ని తయారు చేయాలనటంలో తప్పు లేదు. దాని అర్ధం జనానికి ఉపాధి కల్పించటం. మన విధానాలు ఆ దిశలో లేవు. నీకిది నాకది అన్నట్లుగా కొన్ని రంగాలు, కొన్ని గ్రూపుల కార్పొరేట్‌ సంస్దల మీదనే మన పాలకులు, యంత్రాంగ దృష్టి ఉందనే విమర్శ ఉంది. ఉత్పత్తి, ఎగుమతి ఆధారిత ప్రోత్సాహకాలకు విధించిన నిబంధనలను సడలించి గడువు పొడిగించటం దానిలో భాగమే. చైనాలో స్ధానిక పరిశ్రమలకు సబ్సిడీలు ఇచ్చారు, మనం కూడా సబ్సిడీలు ఇవ్వకుండా ఎలా అనేవారు కొందరు. చైనా సబ్సిడీలు ఇచ్చింది-ప్రపంచానికి ఎగుమతులు చేస్తోంది, తన జనానికి ఉపాధి కల్పిస్తోంది, ఆదాయాలు, జీవన ప్రమాణాలను పెంచుతోంది. మన దేశంలో సబ్సిడీలు ఇస్తున్నా మిగతావి ఎందుకు జరగటం లేదు ? పన్ను చెల్లించే జనానికి చమురు వదలటం తప్ప మేకిన్‌ ఇండియా ఎందుకు విఫలమైంది ? నిత్యం రాముడిని స్మరించే బిజెపి వారు వస్తే నిజంగా రామరాజ్యం వస్తుందని నమ్మిన వారెందరో ఉన్నారు. ఏడేండ్లలో జరిగింది, జనానికి మిగిలింది ఏమిటి ? తిప్పలు – అప్పులు, కాదంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆఫ్ఘన్‌ పరిణామాలు అయోమయం – తాలిబాన్లతో మోడీ సర్కార్‌ తెరవెనుక చర్చలు !

11 Sunday Jul 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Afghanistan news, Joe Biden, talibans, US quitting Afghanistan


ఎం కోటేశ్వరరావు


చరిత్రకు జాలి, దయ ఉండవు, అదే సమయంలో అది వింతైనది కూడా. అందుకే చాలా మందికి చరిత్ర అంటే భయం. చెప్పింది విను తప్ప చరిత్ర అడక్కు అంటారు. లేకపోతే ఏమిటి చెప్పండి ! తాము పెంచి పోషించిన తాలిబాన్ల చేతుల్లోనే అమెరికా పరాభవాన్ని ఎవరైనా ఊహించారా ? ఉగ్రవాదం మీద పోరు అని చెప్పి ఇంతకాలం అమెరికాతో చేతులు కలిపిన మోడీ సర్కార్‌ కూడా ఆ తాలిబాన్లతోనే తెరవెనుక సంబంధాలను కొనసాగించిందని తెలుసా ? తాలిబాన్లు రష్యా,చైనాలతో సర్దుబాటుకు సిద్దం అవుతారని ఎప్పుడైనా భావించారా ? అసలు ఆఫ్ఘనిస్ధాన్‌లో జోక్యం, యుద్దానికి ఎందుకు దిగారు, ఇప్పుడెందుకు వెళ్లిపోతున్నారంటే అమెరికా దగ్గర సమాధానం ఉందా ? అక్కడ ఏకరూప ప్రభుత్వం ఉండే అవకాశం లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం పతనమైతే అమెరికా చేయగలిగిందీ, చేయాల్సిందీ ఏమీ లేదు. అక్కడి జనం, దాని ఇరుగు పొరుగు దేశాలు ఏం చేసుకుంటాయో వాటి ఇష్టం అని బైడెన్‌ చెప్పాడు.


ఒక అగ్రరాజ్య అధిపతి నుంచి ఇలాంటి బాధ్యతా రహితమైన వ్యాఖ్య వెలువడిందంటే అమెరికాను నమ్ముకున్న దేశాలు తమ పరిస్ధితి ఏమిటని ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాలి. ఇక్కడే కాదు, ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటిదే జరిగితే దాన్ని నమ్ముకున్న వారు ముఖ్యంగా మన నరేంద్రమోడీ వంటి వారు పునరాలోచన చేయాల్సిన అవసరం లేదా ! అమెరికా ఇప్పుడు తప్పుకున్నంత మాత్రాన మిలిటరీ రీత్యా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఆ ప్రాంతంలో శాశ్వతంగా జోక్యం చేసుకోదా ? మరో రూపంలో, కొత్త ఎత్తుగడతో రంగంలోకి దిగుతుందా ? కొంత మంది చెబుతున్నట్లుగా రాబోయే రోజుల్లో అక్కడ చైనా పలుకుబడి పెరుగుతుందా ? ఇవన్నీ ఇప్పటికి సమాధానం లేని ప్రశ్నలే.


ఆఫ్ఘన్‌ కమ్యూనిస్టు ప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టినవారు ముజాహిదిన్లు, వారి వారసులైన తాలిబాన్లు ఇప్పుడు మాస్కోలో రష్యా నేతలతో చర్చలు జరిపారు. తమ గడ్డమీద నుంచి ఇతర దేశాల మీద దాడులు చేయాలనుకొనే శక్తులకు అవకాశం ఇచ్చేది లేదని మాస్కోలో ప్రకటించారు. మరోవైపున చైనా తమకు మిత్ర దేశమని, దానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఉగ్రవాదులకు తమ గడ్డమీద ఇంకేమాత్రం ఆశ్రయం కల్పించేది లేదని కూడా వారు ప్రకటించారు. ఇది రాస్తున్న సమయానికి మన దేశంతో సంబంధాల గురించి వారెలాంటి ప్రకటనా చేయలేదు. మొదటి రెండు సానుకూల ప్రకటనలు అయితే మన దేశం గురించి చెప్పకపోవటం ప్రతికూలమని భావించాలా ? ఇంకా అవగాహన కుదరలేదా ? వేచి చూద్దాం !

అసలు ఆఫ్ఘనిస్ధాన్‌లో ఏం జరుగుతోంది ? ఎవరికీ తెలియదు. ఏం జరగబోతోంది ? అది అనూహ్యం ! తాలిబాన్ల పేరుతో అనేక గ్రూపులు ఉన్నాయి. వాటిలో వాటికి పడనివీ కొన్ని. తాము దేశంలోని 85శాతం ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చుకున్నామని తాలిబాన్లు చెబుతున్నారు. ఇరాన్‌, తజకిస్తాన్‌, చైనా సరిహద్దు ద్వారాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించుకున్నారు. దాని గురించి ప్రభుత్వ స్పందన గురించి తెలియదు. అదెలా సాధ్యం అని జోబైడెన్‌ అనటం తప్ప అమెరికన్లు కూడా అక్కడి పరిస్ధితి గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. అక్కడి అస్ధిర, అస్తవ్యస్ధ పరిస్ధితి కారణంగా చైనా, మన దేశం కూడా దౌత్య సిబ్బందిని వెనక్కు రప్పించాయి. తమ దౌత్య సిబ్బంది రక్షణ కోసం వెయ్యి మంది వరకు తమ సిపాయిలు అక్కడే ఉంటారని అమెరికా ప్రకటించింది. పొరుగుదేశాలైన తుర్కుమెనిస్ధాన్‌, తజకిస్తాన్‌, ఉజ్బెకిస్ధాన్‌ ఆహ్వానం మేరకు పరిస్ధితిని సమీక్షించేందుకు జూలై 12-16 తేదీలలో చైనా విదేశాంగ మంత్రి ఆ దేశాల పర్యటన జరపనున్నారు.


కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ తొత్తు పాలన ఏర్పాటు చేయాలనుకున్న అమెరికన్లు ముజాహిదిన్లు, తాలిబాన్లను సృష్టించి చివరకు వారి దెబ్బకు తట్టుకోలేక రాజీ చేసుకొని తట్టాబుట్ట సర్దుకొని వెళ్లిపోతున్నారు. కుక్కలు చింపిన విస్తరిలా వివిధ తాలిబాన్‌ ముఠాల చేతుల్లో చిక్కిన ఆ దేశం ఏమౌతుందో ఎవరూ చెప్పలేని స్ధితి.1978లో తిరుగుబాటు ద్వారా అధికారానికి వచ్చిన కమ్యూనిస్టు-ఇతరులతో కూడిన ప్రభుత్వానికి ప్రారంభం నుంచే అమెరికన్లు ఎసరు పెట్టారు. దాంతో 1979లో ప్రభుత్వానికి మద్దతుగా సోవియట్‌ యూనియన్‌ జోక్యం చేసుకుంది. నాటి నుంచి ముజాహిదిన్ల పేరుతో అనేక తిరుగుబాట్లు వాటి వెనుక పాకిస్దాన్‌, అమెరికా, సౌదీ అరేబియా హస్తాలున్నాయి. పదేండ్ల తరువాత సోవియట్‌ ఉపసంహరించుకుంది. తరువాత ముజాహిదీన్లే తాలిబాన్లుగా రూపాంతరం చెందారు. అమెరికన్ల పట్టు పెరిగిన తరువాత ఇరాన్‌ రంగంలోకి దిగి తనకు అనుకూలమైన తాలిబాన్లను పెంచి పోషించింది.


దేశంలో 85శాతం తమ వశమైందని ప్రకటించుకున్న తాలిబాన్‌ నేతలు మాస్కో వెళ్లి రష్యా, మధ్య ఆసియాలోని పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లైన తజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, తుర్కిస్ధాన్‌లు, రష్యా మీద దాడి చేసేందుకు తమ దేశాన్ని స్ధావరంగా వినియోగించుకోనిచ్చేది లేదని రష్యా ప్రభుత్వానికి హామీ ఇచ్చి వచ్చారు. ఆ దేశాల మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం ఉంది. దానిలో భాగంగా తజకిస్తాన్‌లో రష్యా మిలిటరీ స్ధావరం ఉంది. ఒక వేళ ఏదైనా దాడి జరిగితే ప్రతిఘటించేందుకు తజకిస్తాన్‌ కూడా 20వేల మంది మిలిటరీని సిద్దం చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి తప్పుకొనేందుకు తాలిబాన్లతో రాజీ చేసుకున్న అమెరికా నిర్ణయంతో రష్యా కూడా వెంటనే రంగంలోకి దిగింది. గత ఏడాది ట్రంప్‌ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మే ఆఖరు నాటికి అమెరికన్‌ సేనలు వెనక్కు వెళ్లి పోవాల్సి ఉంది. అయితే బైడెన్‌ ఆ గడువును సెప్టెంబరు వరకు పొడిగించినందున కొత్త అనుమానాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో రష్యా మార్చి నెల నుంచే తాలిబాన్లతో చర్చలు ప్రారంభించింది. దాని పర్యవసానమే మాస్కో పర్యటన, ప్రకటన. గత ఆరు సంవత్సరాలుగా రష్యన్లు తాలిబాన్లతో సంబంధాలను కలిగి ఉన్నారు. ఖొరసాన్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌కె) పేరుతో సమీకృతం అవుతున్న సాయుధ ముఠాలను ఎదుర్కొనేందుకు తాలిబాన్లకు సాయం అందించినట్లు కూడా చెబుతారు.


మరోవైపు చైనాను తమ స్నేహదేశంగా పరిగణిస్తామని కూడా తాలిబాన్లు ప్రకటించారు. తమకు సరిహద్దుగా ఉన్న గ్జిన్‌జియాన్‌ రాష్ట్రంలో ఉఘిర్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేది లేదని కూడా చెప్పారు. చైనా-ఆప్ఘనిస్ధాన్‌ మధ్య 80 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. అమెరికా అండతో తూర్పు తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ ఉద్యమం పేరుతో ఆల్‌ఖైదా గ్జిన్‌గియాంగ్‌ రాష్ట్రంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నది. ఇప్పటి వరకు వారికి ఆఫ్ఘనిస్తాన్‌ ఒక ఆశ్రయంగా ఉంది. తామింకేమాత్రం వారికి మద్దతు ఇచ్చేది లేదని, తమ దేశ పునర్‌నిర్మాణం కోసం చైనా పెట్టుబడుల గురించి త్వరలో చర్చలు జరుపుతామని, రక్షణ కూడా కల్పిస్తామని తాలిబాన్ల ప్రతినిధి హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్ట్‌ పత్రిక విలేకరితో చెప్పాడు. గతంలో తమ ప్రతినిధి వర్గాలతో చైనా చర్చలు జరిపిందని గుర్తు చేశాడు.

తాలిబాన్లలో వివిధ ముఠాలు ఉన్నాయి. అవి అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలకు దిగితే పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్నార్దకం. కొంతమందిని పాకిస్ధాన్‌ చేరదీయగా మరికొంత మంది ఇరాన్‌ మద్దతు పొందుతున్నారు. అమెరికన్లు కూడా తమకు అనుకూలమైన ముఠాలను తయారు చేసుకున్నారని కూడా చెబుతున్నారు. వీటికి తోడు తెగలవారీ విబేధాలు కూడా ఉన్నాయి. అవి ఎవరి మద్దతు పొందినప్పటికీ మతం తప్ప మరొక ఏకీభావం లేదు. పెత్తనం గురించి కుమ్ములాటలు ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలపై పట్టు తప్ప మొత్తం దేశ అధికారం లేనందున ఎలా వ్యవహరించినప్పటికీ ఉన్న ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం ఎవరి హస్తగతం అవుతుందో తెలియదు. దాన్ని మిగతావారు అంగీకరిస్తారా ? అందువల్లనే కొత్త ప్రభుత్వాన్ని గుర్తించాలంటే ఇరుగు పొరుగుదేశాల సహకారం అవసరం కనుక ఇప్పుడేం మాట్లాడినా రష్యా, చైనా, ఇరాన్‌ తదితర దేశాలు పరిణామాలను ఆచితూచి గమనిస్తున్నాయి. అమెరికన్లు దేశం విడిచి వెళ్లినప్పటికీ తాలిబాన్లలో తమకు అనుకూలమైన శక్తులతో సంబంధాలు, సహాయాన్ని కొనసాగిస్తారన్నది స్పష్టం. కొంత మంది సైనికులు తాలిబాన్ల దాడికి తట్టుకోలేక పొరుగుదేశాలకు పారిపోయినట్లు చెప్పటమే తప్ప వారి సంఖ్య ఎంతన్నది తెలియదు. దేశమిలిటరీ కంటే వారేమీ శక్తివంతులు కాదని అందువలన ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ దేశం వారి హస్తగతం కావటం అంత తేలిక కాదనే వాదనలూ ఉన్నాయి.


తాలిబాన్లను పెంచి పోషించిన అమెరికాకు చివరకు వారే ఏకు మేకయ్యారు. ఆల్‌ఖైదా నేత బిన్‌లాడెన్‌ రూపొందించిన పధకం ప్రకారం న్యూయార్క్‌ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం మీద దాడి చేసిన తరువాత అమెరికా కొత్త పల్లవి అందుకుంది.ఉగ్రవాదం మీద పోరు పేరుతో ప్రత్యక్ష దాడులకు దిగింది. గత రెండు దశాబ్దాలలో పాకిస్ధాన్‌లో ఉన్న బిన్‌లాడెన్‌ను పాక్‌ సాయంతో మట్టుబెట్టటం తప్ప అది సాధించిందేమీ లేకపోగా ఉగ్రవాదులను మరింతగా పెంచింది. అనేక దేశాలకు విస్తరించింది. జనానికి చెప్పరాని బాధలను తెచ్చి పెట్టింది. అన్ని చోట్లా అమెరికా, దాని ఐరోపా మిత్రపక్షాలకు ఎదురుదెబ్బలే. ఆప్ఘనిస్తాన్‌లో ఎన్ని రోజులు కొనసాగితే అన్ని రోజులు ఆర్ధిక నష్టాలతో పాటు తన, నాటో కూటమి దేశాల సైనికుల ప్రాణాలు పోగొట్టటం తప్ప సాధించేదేమీ లేదని డోనాల్డ్‌ట్రంప్‌కు జ్ఞానోదయం అయింది. అందుకే తప్పుకుంటామని ఒప్పందం చేసుకున్నాడు, జోబైడెన్‌ దాన్ని అమలు జరుపుతున్నాడు.

ఆఫ్ఘనిస్తాన్‌ మీద అమెరికా ఎందుకు ఆసక్తి చూపింది, ఇప్పుడు ఎందుకు తప్పుకుంటున్నది ? అక్కడ కమ్యూనిస్టులు, ఇతరులు తిరుగుబాటు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్కడేమైనా అమెరికా పెట్టుబడులుంటే వాటిని కాపాడుకొనేందుకు జోక్యం అనుకోవచ్చు.అదేమీ లేదు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ను తన స్ధావరంగా ఏర్పాటు చేసుకుంటే ఇరాన్‌, మధ్య ఆసియా, రష్యా, చైనాల మీద అది దాడులు చేయలేదు. అందుకు అనువైన ప్రాంతం ఆప్ఘనిస్తాన్‌. అక్కడ కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు గనుక వారు స్ధిరపడితే అది సోవియట్‌కు అనుకూల దేశంగా మారుతుందన్నదే అసలు దుగ్ద. దానితో పాటు ఆప్రాంతలో వెలికి తీయని విలువైన ఖనిజ సంపదమీద కూడా అమెరికా కంపెనీల కన్ను పడింది. అందుకే 1978 నుంచి 2021వరకు అది కొన్ని అంచనాల ప్రకారం రెండులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. వేలాది మంది తన సైనికులను బలిపెట్టింది, లక్షలాది మంది ఆఫ్ఘన్‌ పౌరుల ప్రాణాలను తీసింది. అయినా దానికి పట్టుదొరక లేదు. డబ్బూ పోయి శని పట్టె అన్నట్లు పరువూ పోయింది. గతంలో ప్రత్యర్ధిగా ఉన్న సోవియట్‌ యూనియన్‌ ఇప్పుడు లేదు. దేశంలో ఆర్ధిక పరిస్ధితి సజావుగా లేదు. చైనాతో వాణిజ్య లడాయి పెట్టుకొని దాన్నుంచి ఎలా బయట పడాలో తెలియని స్ధితిలో పడిపోయింది. దానికి తోడు కరోనా సంక్షోభం.

ఇప్పుడు ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు అమెరికా వాడు పోతూ మన దేశానికి ప్రమాదం తెచ్చిపెట్టాడు. మనం స్వతంత్ర విదేశాంగ విధానం నుంచి వైదొలిగి అమెరికా మిత్రులం అయ్యాం గనుక తాలిబాన్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అమెరికా రక్షణలో మనం కూడా కొన్ని పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు వారు ఉండరు కనుక అవేమౌతాయో తెలియదు. ఇరాన్‌ లేదా పాక్‌ ప్రభావంలోని తాలిబాన్లు అధికారానికి వచ్చినా, అస్ధిర పరిస్ధితి ఏర్పడినా మనకు ఇబ్బందులే. అమెరికన్లు వెళ్లాలని నిర్ణయించుకున్న తరువాత పాకిస్ధాన్‌ మీద మన పాలకుల దాడి నెమ్మదించింది. అంతే కాదు పైకి సంఘపరివార్‌, బిజెపి వారు జనంలో పాక్‌ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నా తెరవెనుక మంతనాలు జరపబట్టే ఈ ఏడాది ఫిబ్రవరిలో నాటకీయ పరిణామాల మధ్య 2003 ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. ఇది ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమా !


మరోవైపు మా దేశంలో జోక్యం చేసుకోవద్దని కోరుతూ మన అధికారులు తాలిబాన్లతో చర్చలు జరిపారంటూ వచ్చిన వార్తలను మన విదేశాంగ శాఖ తోసి పుచ్చినప్పటికీ వివిధ వర్గాలతో సంబంధాలలో ఉన్నట్లు అంగీకరించింది. క్వెట్టా, క్వటారీ కేంద్రాలుగా ఉన్న తాలిబాన్ల ప్రతినిధులు కూడా ఈ వార్తలను నిర్ధారించారు. ఇరాన్‌, పాకిస్ధాన్లతో సంబంధాలు లేని తాలిబాన్‌ గ్రూపులతో మన అధికారులు సంబంధాలను కొనసాగిస్తున్నారు. పది సంవత్సరాల క్రితం మన ఇంజనీర్లను కిడ్నాప్‌ చేసినపుడు కొన్ని తాలిబాన్‌ గ్రూపులతో సంబంధాలు పెట్టుకొని వారిని విడిపించినప్పటి నుంచీ తెరవెనుక సంబంధాలు కొనసాగుతున్నాయి. అమెరికా తప్పుకోవాలని నిర్ణయించిన తరువాత మన దేశం తాలిబాన్లతో చర్చలకు సుముఖత తెలిపింది. గతేడాది దోహాలో జరిగిన చర్చలలొ మన ప్రతినిధి బృందం వీడియో ద్వారా పాల్గొన్నది. మన ప్రతినిధులు ఇరాన్‌, రష్యాతో కూడా తెరవెనుక చర్చలు జరిపారని దాని వలన ఎలాంటి ఫలితం కనపడలేదని కూడా వార్తలు వచ్చాయి.లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ వంటి మన దేశ వ్యతిరేక బృందాలకు తావు ఇవ్వవద్దని మన దేశం తాలిబాన్లను కోరుతోంది. వారిని సంతుష్టీకరించేందుకు, మద్దతు సంపాదించేందుకే కాశ్మీరుకు తిరిగి రాష్ట్ర హౌదా ఇస్తామని కేంద్రం లీకు వార్తలను వదలిందని కూడా కొందరి అభిప్రాయం. చైనా ప్రారంభించి సిల్క్‌ రోడ్‌ ప్రాజెక్టులో పాకిస్ధాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌ కీలకమైన దేశాలు. ఆ పధకాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం గనుక అక్కడ ఏర్పడే లేదా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగినా చైనాకు అనుకూల పరిస్ధితి ఉంటుంది.


ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ గురించి ఏమి విశ్లేషణలను చేసినప్పటికీ అక్కడ ఏర్పడే ప్రభుత్వ తీరు తెన్నులను బట్టి పరిణామాలు ఉంటాయి. అందువల్లనే రష్యా, చైనా, ఇరాన్‌, పాకిస్దాన్‌, మన దేశం కూడా ఎవరి ప్రయత్నాలను వారు చేస్తున్నాయి. తాలిబాన్లు ఉగ్రవాదులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. వారే అధికారాన్ని చేపడితే దౌత్యపరమైన సంబంధాలను నెలకొల్పుకోవటంలో లేదా తిరస్కరించటంలో ఆయా దేశాల ప్రయోజనాలతో పాటు ప్రపంచ రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిష్తాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆమెరికా నాయకత్వాన ఆయుధ, చైనా చొరవతో అభివృద్ది చతుష్టయ ప్రతిపాదన !

09 Friday Jul 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA

≈ 1 Comment

Tags

Africa Quad, Quad, Quadrilateral Security Dialogue


మన చుట్టూ జరుగుతున్నదేమిటి -6

ఎం కోటేశ్వరరావు


జర్మనీ, ఫ్రాన్స్‌తో కలసి ఆఫ్రికా అభివృద్దికి పనిచేసేందుకు చైనా సిద్దంగా ఉందని చైనా అధినేత గ్జీ జింపింగ్‌ ప్రతిపాదించినట్లు జపాన్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.చైనాకు వ్యతిరేకంగా సమీకృతం అవుతున్న అమెరికా నాయకత్వంలోని చతుష్టయ కూటమి సమావేశాలు అక్టోబరులో జరగనున్నట్లు వార్త. ఒక వైపు అమెరికా దూకుడును అడ్డుకొనేందుకు చైనా కూడా పావులు కదుపుతున్నట్లు ఈ పరిణామం వెల్లడిస్తున్నది. జర్మనీ, ఫ్రాన్స్‌ గతంలో ఆఫ్రికాలోని కొన్ని దేశాలను వలసలుగా చేసుకున్న విషయం తెలిసిందే. గ్జీ చేసిన ప్రతిపాదన మీద రెండు దేశాల నుంచి స్పందన వెలువడలేదు. అయితే ఫ్రెంచి అధ్యక్ష భవనం చేసిన ప్రకటనలో చతుష్టయ ప్రతిపాదనను ప్రస్తావించనప్పటికీ అవసరమైన దేశాలకు రుణాల పునర్వ్యవస్తీకరణ చేసేందుకు చైనా ముందుకు రావటాన్ని ఫ్రాన్స్‌,జర్మనీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.బ్రిటన్‌లో జరిగిన బి3డబ్ల్యు ప్రకటన తరువాత చైనా వైపు నుంచి ఈ ప్రతిపాదన వెలువడింది.


అమెరికా నాయకత్వంలోని చతుష్టయ కూటమి, ఐరోపా యూనియన్‌ ఇంకా కలసి వచ్చే దేశాలతో చైనాను దెబ్బతీయాలన్న ఆలోచన బహిరంగంగానే సాగుతోంది. ఎవరూ దాచుకోవటం లేదు. కానీ అదే అమెరికా మాటను మనం మాత్రం అది గీసిన గీతను జవదాటకుండా ఆర్‌సిఇపికి దూరంగా ఉన్నాము. జపాన్‌,ఆస్ట్రేలియా దేశాలు ఖాతరు చేయలేదు, తోటి సభ్యురాలైన మన దేశానికి విలువ ఇవ్వలేదు. చైనా భాగస్వామిగా ఉన్న ఆర్‌సిఇపి(ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం)కూటమిలో చేరాయి. మనం చెబుతున్న ఇండో-పసిఫిక్‌ మరియు మన దేశ ఈశాన్య ప్రాంత అభివృద్దికి వాటి చర్య విఘాతం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం అమెరికా మోజుల్లో ఖాతరు చేయటం లేదు. ఒకవైపు అమెరికాతో కలసి చైనాకు వ్యతిరేకంగా మిలిటరీ ప్రతిఘటనకు ఆ రెండు దేశాలు సిద్దం అంటున్నాయి, మరోవైపు చైనాతో కలసి వ్యాపారాన్ని చేస్తామని చెబుతున్నాయి. ఒకేసారి ఇది ఎలా సాధ్యం ? మనమేమో చైనాతో వ్యాపారం చేయం, దాని సంగతి చూస్తామన్నట్లుగా మాట్లాడుతున్నాం. ఇది జరిగేదేనా ? అమెరికా తోక పట్టుకొని గంగానదిని ఈదగలమా ? అమెరికాను నమ్మి ఆర్‌సిఇపికి దూరంగా ఉన్నాం. పోనీ దానికి బదులు ప్రపంచ వాణిజ్య సంస్ధలో మనకు వ్యతిరేకంగా అమెరికా వేసిన కేసులు తప్ప ఇతర ” ప్రయోజనాలేమైనా ” పొందామా ? గతంలో మనకు ఇచ్చిన రాయితీలను కూడా రద్దు చేశారు. ఒకవైపు స్వేచ్చా వాణిజ్యం గురించి నరేంద్రమోడీ చెబుతారు. మరోవైపు ప్రపంచంలో అతి పెద్ద స్వేేచ్చావాణిజ్య కూటమి ప్రపంచ జిడిపిలో 30,జనాభాలో 30శాతం కలిగిన దేశాలకు మనం దూరం అంటారు. ఆ కూటమిలో చేరితే మనకు దెబ్బ అన్న పెద్దలు దాని బదులు సాధించిందేమిటి ?


చైనా ఉన్న కూటమిలో చేరితే దాని వస్తువులను మనం కొనాల్సి ఉంటుంది అంటారు. నిజమే, ఇప్పుడు కొనటం లేదా ? కరోనాకు ముందు 2019-20లో మన దేశ మొత్తం వాణిజ్య లోటు 161 బిలియన్‌ డాలర్లు, కరోనా కారణంగా మరుసటి ఏడాది 98బి.డాలర్లకు తగ్గిందనుకోండి. ఈలోటులో చైనా వాటా 55-60 బి.డాలర్ల మధ్య ఉంటోంది. మరి మిగతా లోటు సంగతి ఏమిటి ? మన పరిశ్రమలు, వ్యవసాయానికి రక్షణ కల్పించాల్సిందే. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏడు సంవత్సరాల నుంచి మేకిన్‌ ఇండియా పేరుతో మన దేశాన్ని కూడా చైనాకు పోటీగా ప్రపంచ ఫ్యాక్టరీగా తయారు చేయాలని నరేంద్రమోడీ పిలుపు నిచ్చారు. ఇప్పుడు చైనాతో పోటీ పడేందుకు భయపడుతున్నామంటే వైఫల్యాన్ని అంగీకరించినట్లే కదా ?సమీప భవిష్యత్‌లో కూడా చైనాతో పోటీపడలేమని చెప్పినట్లే కదా ? మన దేశ వస్తూత్పత్తికి అవసరమైన యంత్రాలను కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకోకుండా గడవని స్ధితి.


ఆర్‌సిఇపి ఒప్పందానికి అమెరికా దూరంగా ఉంది. దాని అనుయాయి దేశాలు కూడా ఇప్పుడు చైనాకు దగ్గర అవుతున్నాయని వాయిస్‌ ఆఫ్‌ అమెరికాయే విశ్లేషణలో వాపోయింది. మన కోడి కూయకపోతే తెల్లవారదు అనుకున్న అమెరిన్లకు జ్ఞానోదయం అవుతున్నట్లా ? పదిహేను దేశాల ఈ కూటమి ఒప్పందం అమలుకు ఇప్పటికే చైనా, జపాన్‌ ఆమోదం తెలిపాయి.మరో నాలుగు ఆసియన్‌, ఒక ఆసియనేతర దేశ చట్టసభలు ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది. ఒకసారి అంగీకరించిన తరువాత వెనుకో ముందో అది జరుగుతుంది. లేదూ అమెరికా అడ్డుపడితే ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. ఆర్‌సిఇపికి పోటీగా లేదా ప్రత్యామ్నాయంగా చైనా లేకుండా పసిఫిక్‌ దేశాల భాగస్వామ్య ఒప్పందం(టిపిపి) చేసుకోవాలంటూ చర్చలు ప్రారంభించిన అమెరికాయే దాన్నుంచి వైదొలిగింది. దాంతో ఆర్‌సిఇపి ముందుకు సాగింది. దాని అనుయాయి దేశాల్లో విశ్వాసం సన్నగిల్లింది. ఆర్‌సిఇపిలో చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనవసరంగా అమెరికా భయపడిందనే అభిప్రాయం ఇప్పుడు కొంత మంది అమెరికన్లలోనే వెల్లడి అవుతోంది.తమ దేశంలో టిపిపికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కాగా ఆర్‌సిఇపిని ఎవరూ వ్యతిరేకించలేదని న్యూజిలాండర్స్‌ చెప్పారు. అమెరికా తమకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అయినప్పటికీ ప్రపంచంలో ఉన్నాం గనుక ఆర్‌సిఇపిలో చేరటం తమకు ముఖ్యమని ఆస్ట్రేలియన్‌ ఎంపీ చెప్పాడు.


అంతర్జాతీయ వాణిజ్యంలో భారత నష్టాలు చైనాకు లాభాలుగా మారుతున్నాయని మన దేశానికి చెందిన విశ్లేషకులు కొందరు చెబుతున్నారు.మనకు చిరకాలంగా మిత్ర దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ ఇప్పుడు చైనాకు దగ్గర అవుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నూరు సంవత్సరాల ఉత్సవం సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం చైనా మీద రెండు నాణాలను విడుదల చేసింది. మరి మోడీ గారు ఏమి చేస్తున్నట్లు ? ఇరాన్‌ మరింత స్పష్టమైన ఉదాహరణ. మన రూపాయిని ప్రపంచంలో స్వీకరించే వేళ్ల మీద లెక్కించే దేశాలలో ఇరాన్‌ ఒకటి. అమెరికా బెదిరింపులకు లొంగి మనం దాన్నుంచి చమురు కొనుగోలు చేయటం మాని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దాంతో ఇరాన్‌ సహజంగానే చైనాకు మరింత దగ్గరైంది. చాబహార్‌ రేవు అభివృద్ది పధకాన్ని మనం కోల్పోయాము, చైనా చేపట్టింది. రష్యా-అమెరికా మధ్య వివాదం ముదురుతుండటంతో రష్యన్లు చైనాకు దగ్గర అవుతున్నారు. భారత ఉపఖండ దేశాల మీద దీని ప్రభావం పడకుండా ఉండదు.


ప్రపంచంలో అమెరికా ఆర్ధికంగా అగ్రరాజ్యం అన్నది తెలిసిందే. అక్కడ రోడ్లు ఊడ్చేవారు కూడా సూటూ బూటూ వేసుకొని కార్లలో వచ్చి ఊడ్చిపోతారని దాన్ని అభిమానించే వారు లొట్టలు వేసుకుంటూ చెబుతారు, అక్కడి ఇండ్లలో మరుగుదొడ్లు మన పడక గదుల్లా ఉంటాయని చెప్పిన పెద్దలు ఉన్నారు. అలాంటి అమెరికాను చూసి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా ? అంతటి ధనిక దేశం కూడా కరోనాతో కకావికలైంది.ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఈ ఏడాది మూడువేల డాలర్ల మేరకు సాయం చేయాలని జో బైడెన్‌ సర్కార్‌ నిర్ణయించింది. మన ప్రధాని మూడు వేలు కాదు కదా ఈ ఏడాది పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పేశారు. ఈ నెల 15 నుంచి అమెరికాలో ఆ పధకం అమలు చేయనున్నారు. కనీసంగా మూడువేల డాలర్లు , కొందరికి 3,600 డాలర్లు కూడా లభిస్తాయని వార్తలు. ఏడాదికి భార్యాభర్తకు లక్షా 50వేల డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చే వారు, ఒంటరిగా ఉన్నట్లయితే లక్షా 12వేల ఐదు వందల డాలర్లకంటే తక్కువగా వచ్చేవారు ఈ సాయం పొందేందుకు అర్హులు. వారికి ఆరు నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ప్రతి నెలా 250 డాలర్ల చొప్పున ఆరునెలల పాటు ఇస్తారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలుంటే మూడు వందల డాలర్లు ఇస్తారు. ఇంతే కాదు వారికి ప్రతి బిడ్డకు వచ్చే ఏడాది 1,500 నుంచి 1,800 డాలర్ల పన్ను రాయితీ కూడా ఇవ్వనున్నారు. ఇదంతా అక్కడ జనాల కొనుగోలు శక్తిని పెంచేందుకే, మరి మన దేశంలో జనం దగ్గర డబ్బు లేకుండా వస్తువులు ఎలా అమ్ముడు పోతాయి. ఆర్ధిక వ్యవస్ధ ఎలా ముందుకు పోతుంది. అందుకే భారత పరిశ్రమల సమాఖ్య వారు అవసరమైతే నోట్లను అదనంగా అచ్చువేసి మూడు లక్షల కోట్ల రూపాయల మేర జనానికి డబ్బు పంచాలని చెప్పారు. వారేమీ కమ్యూనిస్టులు కాదు. వారు తయారు చేసే వస్తువులను జనం కొంటేనే కదా పరిశ్రమలు నడిచేది. నరేంద్రమోడీకి ఈ మాత్రం ఆలోచన కూడా తట్టలేదా ?


బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా జరిపిన సర్వేలో మన దేశంలో 77శాతం మంది కార్మికులు ఉద్యోగం పోయింది లేదా ఆదాయానికి కోత పడిందని చెప్పారు, ఇరవైశాతం మంది ఉద్యోగాలు కోల్పోతే 57శాతానికి వేతనాల కోత పడింది. పరిస్ధితి ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. కార్పొరేట్లకు ఆత్మనిర్భరత – కష్టజీవులకు బతుకు దుర్భరత అన్నట్లుగా తయారైంది. చైనాకు సమంగా జనాభా మన దేశంలో ఉంది. గతేడాది మన దేశంలో ఎలక్ట్రానిక్‌ వాణిజ్య విలువ 38 బిలియన్‌ డాలర్లని రెడ్‌సీర్‌ విశ్లేషణ పేర్కొన్నది. అదే చైనాలో 1.8లక్షల కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. అందువలన మన దేశంలో ఉన్న ఉపాధి, వాటి మీద వస్తున్న ఆదాయం ఎంత తక్కువో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు ఏమి చూసి ముందువస్తారు ? కార్పొరేట్లకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో కట్టబెడుతోంది కనుక ఆర్ధిక కార్యకలాపాలు లేకపోయినా కంపెనీల లాభాలను పంచుకొనేందుకు విదేశీ సంస్ధలు మన కంపెనీల వాటాలను కొనేందుకు ముందుకు వస్తున్నాయి తప్ప ప్రత్యక్ష పెట్టుబడులకు కాదు.


నోట్లను ముద్రించి ప్రభుత్వానికి నగదు ఇవ్వటం రిజర్వుబ్యాంకుల పని అని నైజీరియా రిజర్వుబ్యాంకు గవర్నర్‌ ఎంఫిలీ చెప్పాడు.(మన దేశంలో దేశమంతటికీ చెందిన రిజర్వుబ్యాంకు లాభాలను కేంద్రం తన ఖాతాకు మరలించుకొని లోటును పూడ్చుకుంటున్నది) నైజీరియా రిజర్వుబ్యాంకు ముద్రించిన 60బిలియన్‌ నైరాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంచటంపై వచ్చిన విమర్శలను ఎంఫిలీ తిప్పి కొట్టారు. నోట్ల ముద్రణకు తిరస్కరించటం బాధ్యతా రాహిత్యం అన్నాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రియమైన భారతీయులకు మీ నరేంద్రమోడీ రాసిన లేఖార్ధములు !

06 Tuesday Jul 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP’s trolling army, narendra modi bhakts, Narendra Modi Failures, Seven years Narendra Modi Government


హలో ప్రియమైన భారతీయులారా !
నేను భారత ప్రధాని నరేంద్రమోడీని,


మిత్రోం ఈ మధ్య నేను రాసిన లేఖ పేరుతో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. నా భక్తులు, అభిమానులు లేదా నా వ్యతిరేకులు గానీ వాటిని రాసి ఉండవచ్చు. అభిమానులు అయితే నాకు మద్దతుగా, వ్యతిరేకులు అయితే నా మీద తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు కావచ్చు. ఏమైనప్పటికీ నేను మీకు అదే పద్దతిలో కొన్ని విషయాలు చెప్పదలిచాను. నా పేరుతో అనధికారికంగా తిరుగుతున్న అంశాల మాదిరే వీటిని కూడా అనధికారికంగానే పరిగణించాలన్నది నా మనుసులోని మాట. నాపేరుతో ఉన్న లేఖ అంశాలకు సంబంధించి కొన్ని వివరణలు ఇస్తామరి !


” మీరు నాకు బాధ్యతలను అప్పగించి ఏడు సంవత్సరాలైంది.ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు ముళ్ల సింహాసనం ఎదురైంది ”


మిత్రోం మనలో మాట, నేను ఇప్పుడు కొన్ని తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాను గనుక నా అభిమానులు నాకు దక్కింది ముళ్ల సింహాసనం అని చెప్పవచ్చుగాని నేనుగా ఎప్పుడూ నోరు విప్పి ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు. మిత్రోం పెళ్లి కాగానే హనీమూన్‌ ఉంటుంది. నాకు అలాంటిదేమీ అవసరం లేదని నేను అప్పుడే చెప్పాను. నాకు ముందున్న ప్రభుత్వాలు వంద రోజులు కాదు అంతకంటే ఎక్కువే హానీమూన్‌ గడిపాయి, వంద రోజులు కాదు కదా వంద గంటలు కూడా గడవక ముందే నా మీద విమర్శలు ప్రారంభమయ్యాయి.


” గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అస్త్యస్ధ పాలన కారణంగా అన్ని ప్రభుత్వ వ్యవస్ధలూ చిన్నాభిన్నం అయ్యాయి.పెద్ద మొత్తంలో విదేశీ అప్పు పేరుకు పోయింది, భారతీయ కంపెనీలు నష్టాల పాలయ్యాయి.”

మిత్రోం ఇలాంటి వాటిని నా పేరుతో లేదా ఇతర పేర్లతో రాసేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని మా వాళ్లకు పదే పదే చెప్పాను గానీ వారికి అది ఎక్కినట్లు లేదు. కంపెనీలకు నష్టాలు వస్తున్నాయంటే నేనేదో కంపెనీల గురించి తప్ప జనాలకు కలిగిన నష్టాలను పట్టించుకోలేదనుకుంటారు. అందుకే కదా అచ్చే దిన్‌ , గుజరాత్‌ మోడల్‌ అని చెప్పాను. అయితే ఇన్నేండ్ల తరువాత వాటిని గుర్తు చేస్తే జనం నా పీక ఎక్కడ పట్టుకుంటారో అని చెప్పి ఉండరు. నా సంగతి తెలుసుగా ఒకసారి చెప్పిన మాట తిరిగి చెప్పటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అయినా జనానికి ఎప్పుడూ కొత్త కబుర్లు చెప్పాలి తప్ప పాత చింతకాయ పచ్చడి ఎందుకు ? అర్ధం చేసుకోరూ !


మిత్రోం అరవై సంవత్సరాల గతపాలనలో విదేశీ అప్పు 446 బిలియన్‌ డాలర్లు అయితే ఏడు సంవత్సరాలలోనే దానికి నేను 124 బిలియన్‌ డాలర్లు అదనంగా చేర్చాను. దేశీయ అప్పు ఇదే కాలంలో 55 లక్షల కోట్ల నుంచి 117 లక్షల కోట్లకు పెంచాను అంటున్నారు. రెండూ కలిపితే 2021 మార్చి ఆఖరుకు రు.121లక్షల కోట్లు, అవును చేశాను, ముందే చెబుతున్నా వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు అది 136లక్షల కోట్లకు పెరుగుతుంది. ఇదంతా నా సరదా కోసం చేశానా, నేనేమైనా వెనుకేసుకున్నానా ? దేశం అంటే మీ కోసమే కదా ! నన్ను నమ్మాలి మరి !!


మిత్రోం రాహుల్‌ గాంధీ, సీతారామ్‌ ఏచూరీ వంటి వారు ఎంత సేపూ కరోనా, జనం చేతికి డబ్బు ఇవ్వాలి డబ్బు ఇవ్వాలీ అంటారు. మీరు చెప్పండి జనం చేతికి కొన్ని వేలిస్తాం, వాటితో వారేమన్నా పరిశ్రమలు పెడతారా, వాణిజ్యం చేస్తారా, పది మందికి ఉపాధి కల్పిస్తారా ? కరోనా కాలంలో జనం దివాలా తీశారు – కార్పొరేట్లు బలిశారని అంటున్నారు. మన ఎస్‌బిఐ వారిని అన కూడదు గానీ అస్సలు బుర్రుందా ? ఎప్పుడేం చెప్పాలో తెలిసినట్లు లేదు. కరోనా కారణంగా వ్యక్తిగత అప్పులు జిడిపిలో 32.5 నుంచి 37.3శాతానికి పెరిగాయని చెబుతారా ? లెక్కలు సరిగా వేసినట్లు లేదు.


మిత్రోం రెండు సంవత్సరాల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు నిరుద్యోగం గురించి లెక్కలు సరిగా వేయలేదని, పకోడీలు అమ్ముకోవటం కూడా ఉపాధి కల్పనే అని, అలాంటి వన్నీ లెక్కల్లో రాలేదని చెప్పాం గుర్తుంది కదా ! ఇప్పుడు కరోనా అప్పుల్లో ప్రతిదాన్నీ కలిపినట్లున్నారు, అందుకే సంఖ్య పెరిగింది. బి పాజిటివ్‌గా చూసినపుడు ఇలాంటి పరిస్దితి వచ్చినపుడే జనం పొదుపు చేస్తారు. అదే అసలైన దేశభక్తి. ఇక కరోనా కాలంలో కార్పొరేట్లు బలిశారు అంటున్నారు. మంచిదే కదా వారు బలిస్తే పెట్టుబడులు పెడతారు, పది మందికి ఉపాధి కల్పిస్తారు. అందుకే కదా గతేడాది 20లక్షల కోట్ల ఆత్మనిర్భరత, ఈ ఏడాది 6.209లక్షల కోట్ల తాయిల పొట్లం. అయినా అందరినీ ఒకేసారి బాగు చేయగలమా, ముందు కంపెనీలను బలపడేట్లు చేద్దాం – తరువాత జనం సంగతి చూద్దాం.


” ఇరాన్‌ అప్పు 48వేల కోట్లు వదలిపోయారు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు అప్పు 40వేల కోట్లు ”


మిత్రోం వీటి గురించి పదే పదే ఎక్కువగా ప్రచారం చేయకండిరా గోబెల్స్‌ కూడా సిగ్డుపడతాడు మన పరువే పోతుంది అని నెత్తీ నోరు కొట్టుకొని చెబుతున్నా మా వారికి, అయినా వినటంలా. ఇరాన్‌ నుంచి మనం చమురు కొన్నాం. దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకొని మన ఖజానాలో వేసుకున్నాం. మనకేం నష్టం లేదు. ఆ చమురుకు డబ్బు చెల్లించే సమయానికి అమెరికా వారు ఆంక్షలు పెట్టారు. బ్యాంకు ఖాతాలను స్ధంభింప చేశారు. మనమేం చేస్తాం. మీరు చెప్పండి ! ఇరాన్ను వదులుకోగలం గానీ అమెరికాకు ఆగ్రహం వస్తే తట్టుకోగలమా ? అందుకే మన్మోహన్‌ సింగ్‌ హయాంలో చెల్లించటం కుదరలేదు కనుక నా హయాంలో చెల్లించా. తరువాత మాకు అమెరికా ముఖ్యం తప్ప మీరు కాదు అంటూ ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లనే ఏకంగా నిలిపివేశాం. దాని బదులు అమెరికా నుంచి కొంటున్నాం.ఈ విషయంలో డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎంత సంతోషం కలిగిందో నేను వర్ణించలేనబ్బా !

మిత్రోం ఇరాన్‌కు మనకూ ఎలాంటి పేచీ లేదు. అయినా అమెరికా కోసం దాని దగ్గర చమురు కొనటం ఆపాం. కానీ అదేంటో ఈ చర్యతో వారు చైనాకు దగ్గరైనట్లు, ఆ పనేదో నేనే చేసినట్లు కొందరు అర్ధాలు తీస్తున్నారు. ఇక యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు ఉన్న బాకీల గురించి అవి మన దేశానికి చెందిన సంస్దలు అక్కడ చేసిన అప్పులు. వాటికి తిప్పలో మరో కారణంతోనో అవి చేతులెత్తేశాయి. అవి కూడా మన మీద పడ్డాయి.


” భారతీయ చమురు కంపెనీలకు వచ్చిన నష్టాల మొత్తం రు.1,33,000 కోట్లు ”


మిత్రోం ఇంత మొత్తం మన కంపెనీలకు నష్టం వచ్చిందని నేనెక్కడా చెప్పినట్లు లేదు. గత ప్రభుత్వాలు చమురు బాండ్లుగా ఇచ్చిన మొత్తం నా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని మా మంత్రులు చెప్పారు. ఇప్పటికే వాటిని తీర్చేశామని అత్యుత్సాహంతో చెప్పి ఉండవచ్చు.ప్రతిపక్షాలకు పనీ పాటా లేదు. 2026 నాటికి తీర్చాల్సిన ఈ అప్పుల పేరుతో నేను గత ఏడు సంవత్సరాలుగా చమురు పన్ను పేరుతో జనాల జేబులు కొల్లగొట్టానని ఆడిపోసుకుంటున్నారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా చెప్పండి ! నా జేబులో వేసుకున్నానా !

” ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ నష్టాలు రు.58,000,భారతీయ రైల్వేల నష్టాలు రు.22,000, బిఎస్‌ఎన్‌ నష్టాలు రు.1,500 ”


మిత్రోం ఇలాంటి వాటిని నా పేరుతో పోస్టు చేస్తున్న వారు నా భక్తుల ముసుగులో ఉన్న వ్యతిరేకులు తప్ప మరొకటి, కాదు ఇప్పటి ఎప్పటివో ఎందుకు వచ్చాయో చెప్పకపోతే పోయేది నా పరువే కదా !


” సైనికులకు కనీస ఆయుధాలు లేవు, వారికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లు లేవు, ఆధునిక యుద్ద విమానాలు లేవు, సైన్యాలు నాలుగు రోజులు కూడా నిలవలేవు ”


మిత్రోం మనలో మాట. నిజానికి మన సైన్యం అంత దుస్దితిలో ఉందంటే మా గురువు గారు అతల్‌ బిహారీ వాజ్‌పారుకి, అంతకంటే పెద్ద గురువు ఎల్‌కె అద్వానీకి అవమానం. వారి పాలన ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది.మన సైన్యం నాలుగు రోజుల్లోనే చేతులెత్తేసేట్లుంటే కార్గిల్‌ యుద్దంలో రెండు నెలల మూడు వారాల రెండు రోజులు ఎలా యుద్దం చేసి విజయం సాధించారు. ఉత్తినే, మా అమిత్‌ షా అప్పుడప్పుడు అంటుంటాడు కదా జుమ్లా అని అందుకే ఏదో అలా చెబుతుంటాం. సరే మా వాళ్లు నా పేరుతో చేస్తున్న ప్రచారం గురించి చెప్పాను, నా మనసులోని మాటలు కూడా చెప్పాను. పరిస్ధితి ఇలా ఉండగా బాధ్యతలు స్వీకరించిన నేను నిర్ణయించుకున్నదేమిటంటే….


” ఆ సమయంలో వ్యవస్ధలన్నింటినీ సరి చేయటం నా ప్రధాన బాధ్యత అనుకున్నాను. అదృష్టం కొద్దీ భారతీయుల కోసం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దిగి వచ్చాయి. అయితే తగ్గిన ధరలమేరకు మీరు పూర్తిగా లబ్ది పొందలేదు. ప్రభుత్వం తప్పు చేసిందని మీరు తప్పకుండా భావిస్తూ ఉండి ఉంటారు. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు.అయితే చమురు ధరల కారణంగా నామీద మీకు కొద్దిగా కోపంగా ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు, కానీ నేనేమీ చేయలేను. ఎందుకంటే నేను నా భవిష్యత్‌ తరాల కోసం పనిచేస్తున్నాను. అంతకు ముందున్న ప్రభుత్వ తెలివితక్కువ తనం మనకు శాపంగా మారింది. వారు అప్పు తెచ్చి చమురు కొనుగోలు చేశారు, అయినప్పటికీ పౌరుల ఆగ్రహాన్ని తప్పించుకొనేందుకు వారు ధరలను పెంచలేదు. అప్పుడు ఆయన విదేశాల నుంచి రెండున్నరలక్షల కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఇందుకోసం మనం ప్రతి సంవత్సరం వడ్డీ కింద ఇరవై అయిదు వేల కోట్ల రూపాయలు చెల్లించాం. మన దేశానికి పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చారు. రుణం తీర్చాలని మనకు చెప్పారు, అలా చేస్తేనే ఎలాంటి ఆటంకాలు లేకుండా మన దేశానికి చమురు దొరుకుతుందన్నారు.”

మిత్రోం ఇవన్నీ స్వయంగా నేనే మీకు చెబుతున్నట్లుగా ఉంది కదూ, ఉత్తినే. అసలు నేనెక్కడా ఈ మాటలు చెప్పలేదు. అయితే నేను చెప్పినట్లుగా ప్రచారం చేస్తుంటే మనకు వాటంగా ఉన్నాయి కదా అని మౌనంగా ఉన్నా. మీరు కూడా అదే చేస్తారు కదా. సరే,


” చమురు మీద పన్నులు వేసిన కారణం ఏమిటంటారు. మనం వడ్డీతో సహా రెండున్నరలక్షల కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించాం అని ఈ రోజు గర్వంగా చెప్పవచ్చు ”


మిత్రోం ఇలా చెబుతున్నానంటే ఈ అప్పువేరు, చమురు బాండ్ల అప్పు వేరా, అయితే ఎక్కడా అధికారికంగా అలా చెప్పలేదేం అని మీరు అడగవచ్చు. దేశభక్తులం, దేశ రహస్యాలను ఎలా చెబుతాం, చమురు బాండ్ల చెల్లింపు గడువు 2026 వరకు ఉందని బడ్జెట్‌ పత్రాల్లో ఉంది కదా అని మీరు నిలదీయవచ్చు. బడ్జెట్‌ పత్రాల్లో రాసినవన్నీ నిజం అనుకుంటే నేనేం చేయలేను. జుమ్లా, ఏదో రాస్తుంటాం. మీరు నిజంగా దేశభక్తులే అయితే అప్పు తీరిందంటున్నారు కదా పెంచిన పన్ను తగ్గిస్తారా అని మాత్రం అడగవద్దు,

” రైల్వేలు ఎంతో నష్టం కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వాలు ప్రారంభించిన పధకాలన్నింటినీ పూర్తి చేశాం, అవన్నీ సక్రమంగా నడుస్తున్నాయి.గతం కంటే వేగంగా అన్ని రైలు మార్గాల విద్యుదీకరణ పూర్తి చేశాం. అదే విధంగా 18,500 గ్రామాలను విద్యుదీకరించాం. ఐదు కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు పేదలకు ఉచితంగా ఇచ్చాం. వందలాది కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం చేశాం. యువకులకు ఒకటిన్నరలక్షల కోట్ల రుణాలు ఇచ్చాం. ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో 50 కోట్ల మందికి వైద్య బీమాకోసం లక్షా 50వేల కోట్లతో పధకాన్ని ప్రారంభించాం”


మిత్రోం, భూమికి గొడుగు తొడిగించాం, పగలే లైట్లు వెలిగించాం, ఎడా పెడా చేతికి వచ్చిన బంగారం అంతా జనానికి ఇచ్చాం చివరకు అన్నీ పొగొట్టుకుని మాకు తినేందుకు తిండిలేక ఇలా అడుక్కునేందుకు వచ్చాం అనే తుపాకి రాముడి లేదా పిట్టల దొర మాటల్లా ఉన్నట్లు మీకు అనిపిస్తున్నాయి కదూ, నాకు తెలుసు. ఇన్ని పధకాలకు ఇంతంత భారీ మొత్తాలను ఖర్చు చేసిన మీరు కరోనా రోగులకు ఆక్సిజన్‌ కూడా అందించలేకపోయారెందుకని అడుగుతారు. ఉచితంగా వాక్సిన్‌ వేస్తామని మడమ తిప్పారెందుకుని కూడా అడుగుతారు. కరోనా మరణాలకు పరిహారం ఇవ్వలేమని చేతులెత్తేశారెందుకు అని నిలదీయవచ్చు.అసలు ఈ కోర్టులున్నాయి చూశారూ….ఒక్కోసారి ఏం చేస్తాయో తెలియదు.


” మన సైనికులకు అన్ని అధునాతన ఆయుధాలను, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్లను, రాఫెల్‌ యుద్ద విమానాలను, ఇంకా అనేక రకాల మారణాయుధాలు మరియు ఇతర సౌకర్యాలు కల్పించాం. వీటన్నింటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు. అ సొమ్ము మీరిచ్చిందే, మీరంతా పెట్రోలు, డీజిలు కొని దేశానికి డబ్బు ఇచ్చారు. పెట్రోలు, డీజిలు మీద పన్ను రద్దు చేస్తే మనం అప్పులను తీర్చటం సాధ్యమా ? మనం అప్పులను తీర్చగలం, అదే విధంగా కొత్త పధకాలను తీసుకురాగలం. కాబట్టి పరోక్షంగా ప్రతిదాని మీద పన్నులు పెంచాల్సిందే. నూటముప్పయి కోట్ల మంది పౌరుల బాధ్యత వాహన యజమానిదిగా మాత్రమే ఉండకూడదు.”

మిత్రోం చమురు ధర లీటరుకు ఏడు పైసలు పెంచినందుకు మన నేత అతల్‌ బిహారీ వాజ్‌పాయి గతంలో ఢిల్లీలో ఎడ్లబండి మీద ఊరేగి నిరసన తెలిపారు కదా అని కొంత మంది పాత వీడియోను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తిప్పుతున్నారు. దేశభక్తులు మీరు అలా ప్రచారం చేస్తే, నిలదీస్తే నా మనోభావాలు గాయపడతాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ చమురు మీద ఇంతగా పన్నులు లేవు కదా అని కొందరంటున్నారు. మన దేశ పరువును బజారుకీడ్చటం తప్ప దీనిలో దేశభక్తి ఉందా ? మనం ఇతర దేశాల గురించి పోల్చుకోవటం అంటే టూల్‌కిట్‌ను విదేశాలకు అందించటమే. అది దేశద్రోహం కదా !


” చివరిగా ఒక మాట… మీరు కుటుంబ పెద్ద అయితే మీ కుటుంబం మీద పెద్ద అప్పుల భారం ఉంటే ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తారా లేక అప్పులు తీరుస్తారా ? రుణం దాని మీద వడ్డీ జాగ్రత్తగా తీర్చకపోతే కుటుంబ భవిష్యత్‌ ఏమౌతుంది ? ప్రత్యర్ధుల వలలో పడకండి.. ఈ దేశభక్తుడైన పౌరుడిగా మీరు దేశ అభివృద్దిలో భాగస్వాములు కండి.ఈ నిరసన అంతా ఎల్లవేళలా ఓట్ల కోసమే, కొంత మంది రాజకీయవేత్తలు తప్పుడు ప్రచారంతో పౌరులను తప్పుదారి పట్టిస్తున్నారు.భారతీయులుగా మీరు ఈ వాస్తవాలను అందరితో పంచుకోవాలని నేను కోరుతున్నాను.”


మిత్రోం, ఇన్ని విషయాలు చెప్పిన తరువాత మీకు తత్వం తలకెక్కిందని భావిస్తున్నాను. మీరు నిజంగా దేశభక్తులే , బాధ్యతగల పౌరులే అయితే, దేశం మనకేమిచ్చిందని గాక దేశానికి మనమేం ఇచ్చామని ఆలోచించే వారయితే ఏడు సంవత్సరాల కాలంలో 55లక్షల కోట్ల దేశీయ అప్పును 117లక్షల కోట్లకు ఎందుకు పెంచారు, ఏం చేశారని అడగొద్దు. అత్మనిర్భరలో జనానికి ఏం చేశారని అసలే అడగొద్దు. గత ప్రభుత్వం రెండున్నరలక్ష కోట్ల రూపాయల అప్పుకే పాతివేల కోట్ల వడ్డీ చెల్లించామని చెప్పాను. ముందే చెప్పినట్లు ఈ ఏడాది 121లక్షల కోట్ల దేశీయ, విదేశీ అప్పుకు గాను ఈ ఏడాది వడ్డీ పన్నెండు లక్షల 10వేల కోట్లు, వచ్చే ఏడాది 136లక్షల కోట్లకు గాను పదమూడు లక్షల 60వేల కోట్ల వడ్డీయే చెల్లించాల్సి ఉంటుంది. అదంతా ఎవరు చెల్లిస్తారు. మీకోసం అప్పు చేసినపుడు మీదే బాధ్యత ! నా దగ్గర గడ్డం జులపాలు తప్ప వేరే ఏమీ లేవని తెలిసిందే. అందువలన మీరే చెల్లించాలి. ముందుగానే చెబుతున్నా, ఎవరేమనుకున్నా ఏదీ ఊరికే రాదు అని టీవీల్లో ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు కదా, కనుక రాబోయే రోజుల్లో ఇంకా పన్నులు వేయక తప్పదు, దేశభక్తులుగా మీరు భరించకా తప్పదు.
మీ
నరేంద్రమోడీ,
మాతా నీకు వందనం,
భారత మాత వర్దిల్లుగాక ,
జై హింద్‌.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇక చాలు నరేంద్రమోడీ గారూ – మీ వైఫల్య భారాన్ని ఇంకేమాత్రం మోయలేం !

04 Sunday Jul 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ 1 Comment

Tags

BJP’s trolling army, india debt, India debt matters, narendra modi bhakts, Narendra Modi Failures, RBI on Debt


ఎం కోటేశ్వరరావు


‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ ఆగండి ఆగండి నరేంద్రమోడీ అభిమానులారా ! ఈ మాటలన్నది రాహుల్‌ గాంధీయో, సీతారామ్‌ ఏచూరో కాదు. ఒక్కసారి గతంలోకి వెళితే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గారి నోటి నుంచి వెలువడిన సుభాషితాలే ఇవి అని మీరు ఇట్టే గ్రహించేస్తారు.


ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే రూపాయి విలువ పతనం కారణంగా మన విదేశీ అప్పు గణనీయంగా పెరిగి పోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ రిజర్వుబ్యాంకే తాజాగా చెప్పింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన విదేశీ అప్పు 570 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. గతేడాది మార్చి నాటికి జిడిపిలో విదేశీ అప్పుశాతం 20.6శాతం ఉంటే ఈ ఏడాదికి అది 21.1శాతానికి ” అభివృద్ధి ” చెందింది. గతేడాది మన విదేశీ అప్పు 11.5బిలియన్‌ డాలర్లు పెరిగింది. మన రూపాయి విలువ పతనం కానట్లయితే ఆ పెరుగుదల 4.7 బిలియన్‌ డాలర్లు ఉండేది, పతనం కారణంగా 6.8బి.డాలర్లు అదనం అయింది. మనందరికీ తెలిసిన సాధారణ విషయం ఏమంటే ఒప్పందం ప్రకారం వడ్డీ నెల నెలా కట్టకపోతే అది అసలులో కలిసి అప్పు భారం పెరుగుతుంది. మనం కొత్తగా అప్పులు తీసుకోకపోయినా, వడ్డీ సకాలంలో చెల్లించినా రూపాయి విలువ తగ్గితే మన అప్పు పెరిగి పోతుంది. అందువలన మోడీ గారు చెప్పినట్లు రూపాయి విలువ తగ్గుదల-పెరుగుదల ప్రభుత్వాలదే గనుక ఆ పుణ్యం మన నరేంద్రమోడీ ఖాతాలోకే వేయాలి మరి. మన్మోహన్‌ సింగ్‌కు ఒక న్యాయం నరేంద్రమోడీకి ఒక న్యాయం ఉండదు కదా !


మా నరేంద్రమోడీ గారు అప్పులే చేయలేదు, గతంలో చేసిన అప్పులు తీర్చారు అని బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) సామాజిక మాధ్యమంలో ఊదరగొట్టారు. మరి రిజర్వు బ్యాంకు చెబుతున్న వివరాల సంగతేమిటి ? అప్పులు తీరిస్తే ఎందుకు పెరుగుతున్నాయి ? 2014లో 446.2 బిలియన్‌ డాలర్ల అప్పుంటే ఇప్పుడు 570బి.డాలర్లకు పెరిగింది. గత ఏడాది చెల్లించిన అసలు , వడ్డీ కలిపి 8.2శాతం ఉండగా అంతకు ముందు 6.5శాతం ఉంది. గత ఏడు సంవత్సరాలలో అది 5.9 నుంచి 8.2శాతం మధ్య ఉంది తప్ప మోడీ భక్తులు చెబుతున్నట్లుగా ఏ ఒక్క ఏడాదిలోనూ అసాధారణంగా అప్పు తీర్చిన దాఖలా లేదు. ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఇదే కాలంలో 79 బిలియన్‌ డాలర్ల నుంచి 107కు పెరిగాయి. అందువలన గత ప్రభుత్వం మాదిరే మోడీ సర్కార్‌ కూడా అప్పులు తీసుకుంటున్నదీ, చెల్లిస్తున్నది తప్ప 56 అంగుళాల ఆర్ధిక నైపుణ్య ప్రత్యేకత ఏమీ లేదు.


గత ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్ల భారం తమ మోడీ సర్కార్‌ భరించాల్సి వస్తున్నది కనుక సమీప భవిష్యత్‌లో చమురు ధరలు లేదా పన్ను తగ్గించే అవకాశం లేదని అభిమానులు చెబుతారు.మన్‌కీ బాత్‌ అంటూ ప్రతి నెలా మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఏ నెలలో అయినా ఆ విషయం చెప్పారా అందువలన ఏదో ఒక సమయంలో ఆ ముక్కేదో నరేంద్రమోడీ గారినే చెప్పమనండి ! చెప్పలేరు ? ఎందుకని ? మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌, అంతకు ముందు వాజ్‌పారు సర్కార్‌ జారీ చేసిన బాండ్లకు గాను చెల్లించాల్సిన మొత్తం లక్షా 30వేల కోట్ల రూపాయలు. వాటి గడువు ఇంకా ఉంది. అది కూడా వినియోగదారులకు సబ్సిడీగా ఇచ్చిన మొత్తం తప్ప మరొకటి కాదు. ఈ మొత్తానికి గుండెలు బాదుకుంటూ చమురు ధర తగ్గించలేరని చెబుతున్న వారు మోడీ సర్కార్‌ చేసిన అప్పుల గురించి మాట్లాడరు. విదేశీ అప్పు గురించి పైన చెప్పుకున్నాం. గత ఏడు సంవత్సరాల కాలంలో చేసిన అప్పు ఎంతో తెలుసా ! 2014లో ఉన్న అప్పు 54,90,763 కోట్లు. అది 2021మార్చి 31 నాటికి 116.21 లక్షల కోట్లకు పెరిగింది. చమురు బాండ్లు ఈ మొత్తంలో వందో వంతు కంటే తక్కువే కదా ? మరి ఇంత అప్పు ఎందుకు చేసినట్లు ? ఈ మొత్తంతో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ? దాని వలన వచ్చిన ఫలితాలేమిటో ఎవరైనా చెప్పేవారున్నారా ?


ఏడు సంవత్సరాల క్రితం ఒక లీటరు పెట్రోలు మీద రు. 9.48 ఎక్సైజ్‌ పన్ను ఉంది. అది ఇప్పుడు 32 రూపాయలకు పెరిగింది. ఒక రూపాయి పన్ను పెరిగితే కేంద్ర ప్రభుత్వానికి ఏటా పద్నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా. అంటే ఏడు సంవత్సరాల కాలంలో ఆదాయం లక్షా 30వేల కోట్ల నుంచి నాలుగున్నర లక్షల కోట్లకు పెరిగింది. యుపిఏ చమురు బాండ్ల పేరుతో ఇంత బాదుడా ? జనాన్ని అంత ఆమాయకంగా చూస్తున్నారా ?
2014 మేనెలలో మనం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా ధర డాలర్లలో 107.7 ఉండగా మన రూపాయల్లో చెల్లించిన మొత్తం 6,326. ఇప్పుడు జూన్‌ నెలలో 71.40 డాలర్లు కాగా రూపాయల్లో 5,257, జూలై రెండవ తేదీ ధర 74.75 కాగా రూపాయల్లో 5,560 ఉంది. ఏడు సంవత్సరాల క్రితం అంత తక్కువ ఎందుకు చెల్లించాము, ఇప్పుడు ఇంత ఎక్కువ ఎందుకు చెల్లిస్తున్నాము. అంటే మోడీ గారి ఏలుబడిలో రూపాయి విలువ పతనం కావటమే కారణం. మరి రూపాయి విలువ గురించి గతంలో చెప్పిన మాటలేమైనట్లు ? ఇలా పతనం అవుతుంటే ఎవరు లాభపడుతున్నట్లు ? గోడదెబ్బ-చెంపదెబ్బ మాదిరి వినియోగదారులకు పన్ను పోటు-రూపాయి పోటు రెండూ ఎడాపెడా తగులుతున్నాయి. సమర్ధవంతమైన పాలన ఎక్కడ, అనుభవం ఏమైనట్లు ?


మోడీ పాలనలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అంత పెరిగాయి, ఇంత పెరిగాయి చూడండి అంటూ గొప్పలు చెబుతారు. మన వాణిజ్యం ప్రతి సంవత్సరం లోటులోనే నడుస్తున్నది. మరి ఈ నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయి ? గతేడాది కరోనా కారణంగా వినియోగం తగ్గి దిగుమతులు పడిపోయి వాణిజ్య మిగులు ఉంది తప్ప ఎప్పుడూ మనకు చైనా, జపాన్‌ మాదిరి డాలర్లు మిగల్లేదు. మరి మన దగ్గర ఉన్న డాలర్‌ నిల్వలు ఏమిటి అంటే మన స్టాక్‌ మార్కెట్లో విదేశీయుల పెట్టుబడులు, చేస్తున్న అప్పులు, ప్రవాస భారతీయులు దాచుకుంటున్న నిల్వలు మాత్రమే. మరో విధంగా చెప్పాలంటే మన జేబులో సొమ్ము తప్ప బీరువా ఖాళీయే. మన రూపాయి విలువ తక్కువ, ఎక్కువ ఉండటం గురించి మన వాణిజ్య వేత్తల్లో విబేధాలు ఉన్నాయి. విదేశాల నుంచి రుణాలు తీసుకున్నా లేదా విదేశీ పెట్టుబడిదారులు స్టాక్‌ మార్కెట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినా మన దగ్గర డాలర్‌ నిల్వలు పెరుగుతాయి, దాంతో రూపాయి విలువ పెరుగుతుంది. ఇది ఎగుమతి దారుల లాభదాయకతను దెబ్బ తీస్తుంది. విదేశీ మార్కెట్లో మన వస్తువులు పోటీ పడలేవు. అందువలన రూపాయి బలంగా ఉండటాన్ని ఎగుమతిదారులు వ్యతిరేకిస్తారు.ఇప్పుడున్న దాని మీద రూపాయి విలువ 20శాతం తగ్గిస్తే మన ఎగుమతులు ఇబ్బడి ముబ్బడి అవుతాయని వారు చెబుతారు.


మన రూపాయి బలంగా ఉంటే చమురు, ఇతర దిగుమతుల ధరలు తగ్గుతాయి. వినియోగదారుల మీద భారం తగ్గుతుంది. కనుక రూపాయి విలువ పతనాన్ని అరికట్టాలని దిగుమతిదారులు డిమాండ్‌ చేస్తారు. 2011 నుంచి మన ఎగుమతులు 300 నుంచి 314 బిలియన్‌ డాలర్ల మధ్యనే ఉన్నాయి. ఒక సంవత్సరం మాత్రం 330 బి.డాలర్లు ఉన్నాయి.ఇదే సమయంలో దిగుమతులు పెరగటమే తప్ప తరగటం లేదు. ఏడు సంవత్సరాలుగా మేకిన్‌ ఇండియా పేరుతో ప్రధాని మోడీ వస్తు తయారీకి పిలుపులు ఇస్తున్నా ఎగుమతులూ లేవు, దిగుమతులూ తగ్గలేదు. అంటే మనకు అవసరమైన వస్తువులను కూడా మనం తయారు చేసుకోలేకపోతున్నాం. మొత్తం మీద చెప్పవచ్చేదేమంటే మోడీ సర్కార్‌ వైఫల్యాలు జనం మీద భారాలు పెంచుతున్నాయి. మునిగే పడవ గడ్డిపోచను కూడా భరించలేదన్నట్లుగా పరిస్ధితి దిగజారుతోంది. అందుకే మోడీ గారు మీ భారాలు మోయలేకున్నాం అని చెప్పాల్సి వస్తోంది. వినిపించుకుంటారా ! అధికారంలో ఉన్నవారు అలాంటి మంచి పని చేసిన దాఖలా లేదు మరి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిలీ అధ్యక్ష పోటీలో ముందున్న కమ్యూనిస్టు అభ్యర్ధి !

03 Saturday Jul 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Chile Presidential Election 2021, Communist Party of Chile(pcch), Daniel Jadue


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది నవంబరు 21న జరగనున్న చిలీ అధ్యక్ష ఎన్నికలలో అభ్యర్ధిగా అనూహ్యంగా కమ్యూనిస్టు పార్టీ నేత డేనియల్‌ జాడ్యు ముందుకు దూసుకు వస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. వివిధ పార్టీల అభ్యర్ధులను ఇంకా ఖరారు చేయనప్పటికీ కాగల అభ్యర్ధులను ఊహించి సర్వేలు చేస్తున్నారు. మే నెలలో జరిగిన రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికలలో విజయం సాధించిన రెండు వామపక్ష సంఘటనలు, మరొక వామపక్ష పార్టీ అభ్యర్ధులు కూడా అధ్యక్ష పదవికి పోటీలో ఉంటారని వార్తలు వచ్చాయి. వారిలో అంతిమంగా జాడ్యు అభ్యర్దిగా నిర్ణయం అవుతారని భావిస్తున్నారు. అదే జరుగుతుందా, మరో వామపక్ష అభ్యర్ధి రంగంలో ఉంటారా అన్నది త్వరలో తేల నుంది. ఈనెల 18న వివిధ పార్టీలు,కూటములు అభ్యర్ధులను ఖరారు చేయనున్నాయి.


రాజధాని శాంటియాగో మహానగరంలో ఉన్న రికొలెటా ప్రాంత కార్పొరేషన్‌ మేయర్‌గా ఇటీవల జాడ్యు తిరిగి ఎన్నికయ్యారు. పాలస్తీనా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన జాడ్యు తొలి దశలో పోటీ ఎలా జరిగినప్పటికీ మెజారిటీ రాకపోతే రెండవ దఫా ఎన్నికలో అయినా విజేతగా కాబోయే అధ్యక్షుడంటూ వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.లాటిన్‌ అమెరికాలోని వెనెజులా, బొలీవియా, బ్రెజిల్‌, అర్జెంటీనా తదితర దేశాలలో వామపక్ష అధ్యక్షులుగా ఎన్నికైన వారందరూ వామపక్షాలకు చెందిన వారు, మార్క్సిజం-లెనిజం పట్ల విశ్వాసం ప్రకటించిన వారే అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారు కాదు. ఆయా దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. సామ్రాజ్యవాదులు కుట్రలకు పాల్పడి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పిస్తే ఏం జరుగుతుందో చెప్పలేము గానీ లేనట్లయితే లాటిన్‌ అమెరికాలో మరో ఎర్రమందారం వికసించటం ఖాయంగా కనిపిస్తోంది.తొలి దశలోనే మెజారిటీ సంపాదిస్తారా లేక రెండవ పోటీలోనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నూతన రాజ్యాంగ పరిషత్‌, రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తున్న కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష శక్తులు పార్లమెంట్‌, అధ్యక్ష ఎన్నికలలో అదే పరంపరను కొనసాగించనున్నాయి. ప్రస్తుతం పచ్చి మితవాది సెబాస్టియన్‌ పినేరా అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికల్లో వామపక్ష శక్తులు, వారిని బలపరిచే వారే మెజారిటీగా ఎన్నికైన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు జాడ్యుతో పాటు మితవాద పార్టీలైన ఇండిపెండెంట్‌ డెమ్రోక్రటిక్‌ యూనియన్‌ అభ్యర్ధి జాక్విన్‌ లావిన్‌, క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన యాసనా ప్రొవోటే మధ్య ప్రధాన పోటీ ఉండవచ్చని భావిస్తున్నారు.
లాటిన్‌ అమెరికాలో మరోసారి వామపక్ష తరంగం వస్తున్నది. గతనెల ఆరున పెరూలో జరిగిన ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి పెడ్రో కాస్టిలో నలభైవేలకు పైగా మెజారిటీతో గెలుపొందినప్పటికీ ఇంతవరకు ఎన్నికల సంఘం ఖరారు చేయలేదు. అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష మితవాద అభ్యర్ధి చేసిన ఫిర్యాదును విచారించే పేరుతో కాలయాపన చేస్తున్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో బ్రెజిల్‌లో తిరిగి వామపక్ష నేత లూలా డ సిల్వా తిరిగి ఎన్నిక కానున్నారని, నికరాగువాలో అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా తిరిగి విజయం సాధించనున్నారనే వాతావరణం ఉంది. దానికి అనుగుణ్యంగానే చిలీ పరిణామాలు ఉంటాయని భావిస్తున్నారు.


ప్రజల ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెట్టటం, వివిధ సేవల ప్రయివేటీకరణ చర్యలతో లాటిన్‌ అమెరికా దేశాల్లో అమలు జరిపిన నూతన ఆర్ధిక లేదా నయా ఉదారవాద విధానాలు సామాన్య జనజీవితాలను దిగజార్చాయి. ధనికుల మీద పన్ను భారం పెంచటం, పెన్షన్‌ వ్యవస్ధను పునర్వ్యస్తీకరించటం, ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వ ప్రమేయం పెంపు, పన్నులు ఎగవేసేందుకు కంపెనీలు సరిహద్దులు దాటి పోవటాన్ని నిరోధించటం వంటి చర్యలను కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించింది. ప్రపంచంలో అత్యధిక రాగి నిల్వలను కలిగి ఉన్న చిలీ సంపదను బహుళజాతి గుత్త సంస్ధల పాలు చేయకుండా ప్రజల కోసం వినియోగించాలని చెప్పింది. ఖనిజ సంపదకు రాజ్యం యజమాని గనుక అన్ని కార్యకలాపాలలో అది భాగస్వామిగా ఉండాలని కోరింది. సమస్యలపై ఉద్యమించిన ప్రజా సమూహాలపై మాజీ నియంత పినోచెట్‌ తరువాత ప్రస్తుత అధ్యక్షుడు పినేరా మిలిటరీని ప్రయోగించిన తాజా నిరంకుశుడిగా చరిత్రకెక్కాడు.


కమ్యూనిస్టు నేత జాడ్యు ప్రజాదరణ పొందుతున్నట్లు సర్వేలు వెల్లడి చేస్తుండటంతో మితవాద శక్తులు ఆయన్ను ఒక బూచిగా చూపేందుకు పూనుకున్నాయి. కమ్యూనిస్టును ఎన్నుకుంటే ప్రమాదమని జనాన్ని రెచ్చగొడుతున్నాయి. అధ్యక్షపదవి అభ్యర్ధిగా ఉన్న జాడ్యు పాఠశాల్లో చదువుకొనే రోజుల్లో యూదు వ్యతిరేకిగా ఉన్నాడని అభిశంసిస్తూ పార్లమెంట్‌లోని మితవాద ఎంపీలు ఒక తీర్మానంలో ధ్వజమెత్తారు. అనుకూలంగా 79 వ్యతిరేకంగా 47 వచ్చాయి. చిలీలో యూదులు ఇరవై వేలకు మించి లేనప్పటికీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ తీర్మానాన్ని ఆయన కొట్టిపారవేశారు. చిలీలో పాలస్తీనా మూలాలు కలిగిన వారు ఐదు లక్షల మంది ఉన్నారు. జాడ్యు క్రైస్తవమతానికి చెందిన వ్యక్తి. ఆయన తాతల కాలంలో పాలస్తీనా నుంచి చిలీకి వలస వచ్చారు. చిలీ రాజధాని శాంటియాగోలో 1967 జూన్‌ 28జన్మించిన జాడ్యు పాఠశాల విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచి ఇజ్రాయెల్‌ యూదుల దురంతాలను వ్యతిరేకించాడు. పాలస్తీనా విముక్తికి మద్దతుగా చిలీ లోని పాలస్తీనియన్‌ విద్యార్ధి సంఘం, తరువాత కమ్యూనిస్టు విద్యార్ధి సంఘ నేతగా, పని చేశారు. నియంత పినోచెట్‌కు మద్దతుదారు అయిన తండ్రిని ఎదిరించి కుటుంబం నుంచి బయటకు వచ్చాడు.1993లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు.2012 నుంచి రికొలెటా కార్పొరేషన్‌ మేయర్‌గా పని చేస్తున్నారు. పేదలకు అవసరమైన జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చొరవ చూపి ప్రశంసలు పొందారు.


జాడ్యు పాఠశాలలోనే ఇజ్రాయెల్‌ దురహంకారం, పాలస్తీనియన్లపై జరుపుతున్న దురాగతాలను వ్యతిరేకించేవాడు. ప్రతి సంవత్సరం ప్రచురించే పాఠశాల ప్రత్యేక సంచికలో జాడ్యు స్నేహితులు సరదాగా అనేక వ్యాఖ్యలు రాస్తుండేవారు.వాటిలో ” అతని వాంఛ యూదుల నగరాన్ని శుద్ధి చేయటం, అతని లక్ష్య సాధన కసరత్తుకు తగిన బహుమానం ఒక యూదును ఇవ్వటమే ” వంటి వ్యాఖ్యలు చేసే వారు. అతని రికార్డులో పాఠశాల తనిఖీ అధికారి జాడ్యు యూదు వ్యతిరేకి అని రాశాడు. చిలీ యూదుల నేత ఒకరు ఈ విషయాలున్న పత్రాల కాపీని ట్వీట్‌ద్వారా ఎంపీలు, ఇతరులకు పంపాడు. దాన్ని పట్టుకొని పార్లమెంటు అభిశంసన తీర్మానం చేసింది. ఇదంతా అతను ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్ధిగా ముందుకు వస్తున్న నేపధ్యంలోనే జరిగింది.


పార్లమెంట్‌ తీర్మానాన్ని జాడ్యు కొట్టిపారవేశాడు.” దేశం ఇప్పుడు ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా సంక్షోభంతో ఉంది. వందలాది మంది మరణిస్తున్నారు, కుటుంబాలు అవసరాలు తీర్చుకోలేకపోతున్నాయి. కానీ మితవాద ఎంపీలు 35 సంవత్సరాల క్రితం ఇతరులు స్కూలు పత్రికలో నా గురించి రాసినదాన్ని వివరించటానికి తీవ్రంగా శ్రమించారు. పాఠశాల తనిఖీ అధికారి రాసిన వాటిని నేను అప్పుడే ఖండించాను ” అని చెప్పాడు. తాజాగా వెలువడిన ఒక సర్వే ప్రకారం జాడ్యుకు 38శాతం మద్దతు ఉండగా అతని సమీప ప్రత్యర్ధికి 33శాతం ఉంది.


చిలీ సోషలిస్టు పార్టీ (మార్క్సిస్టు భావజాలంతో పని చేసింది) నేత సాల్వెడార్‌ అలెండీ లాటిన్‌ అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వామపక్షవాది.1970 నవంబరు మూడు నుంచి 1973 సెప్టెంబరు 11న సైనిక తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయేంతవరకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అలెండీ కొనసాగితే లాటిన్‌ అమెరికాలో వామపక్ష ఉద్యమాలు ఊపందుకుంటాయనే భయంతో అమెరికా సిఐఏ కుట్రలో భాగంగా మిలిటరీ అధికారి పినోచెట్‌ తిరుగుబాటు చేశాడు. మిలిటరీని ఎదుర్కొనే క్రమంలో అలెండీ స్వయంగా, అనుచరులు కూడా ఆయుధాలు చేపట్టారు. అయితే తగిన విధంగా పార్టీ నిర్మాణం, సన్నద్దత లేకపోవటంతో మిలిటరీదే పైచేయి అయింది. తరువాత అమెరికా చికాగో విశ్వవిద్యాలయంలో చదివిన ఆర్ధికవేత్తలను చిలీతో పాటు దాదాపు అన్ని లాటిన్‌ అమెరికా దేశాలకు అమెరికా పంపటమే గాక ఉదారవాద విధానాల అమలుకు ఆ ఖండాన్ని ప్రయోగశాలగా చేసింది. అందువలనే ఆ విధాన ఆర్ధికవేత్తలందరినీ ” చికాగో బాలురు ” అని పిలిచారు. రాజ్యాంగాల రచనల నుంచి అన్నింటా వారి ముద్ర ఉండేది. తాజా రాజ్యాంగ ఎన్నికలలో వామపక్ష, అభ్యుదయవాదులు విజయం సాధించటంతో చిలీలో వారి శకం అంతరించినట్లే అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అలెండీ నాయకత్వం వహించిన పార్టీలో తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. ఆ పార్టీ ఇప్పుడు వామపక్షాలతో లేదు.


నూటతొమ్మిది సంవత్సరాల క్రితం 1912 జూన్‌ నాలుగున ఏర్పడిన చిలీ కమ్యూనిస్టు పార్టీ అనేక నిర్బంధాలను తట్టుకొన్నది.. డెమోక్రటిక్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు 1912లో సోషలిస్టు వర్కర్స్‌ పార్టీని ఏర్పాటు చేశారు. పది సంవత్సరాల తరువాత అదే కమ్యూనిస్టు పార్టీగా మారింది.1938లో పాపులర్‌ ఫ్రంట్‌ నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. తరువాత డెమోక్రటిక్‌ కూటమిలో ఉంది. పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి బలం పుంజుకుంటున్న తరుణంలో 1948 నుంచి 58వరకు పార్టీపై నిషేధం విధించారు.1960 దశకంలో తిరిగి బహిరంగంగా పని చేయటం ప్రారంభించింది. పాబ్లో నెరూడా వంటి నోబెల్‌ బహుమతి గ్రహీత కవి, తదితర ప్రముఖులు పార్టీలో పని చేశారు.1970లో అలెండీ నాయకత్వంలో పాపులర్‌ యూనిటీ కూటమిలో భాగస్వామిగా ప్రభుత్వంలో చేరింది. అలెండీ సర్కార్‌ను కూలదోసిన మిలిటరీ నియంత పినోచెట్‌ 1973 నుంచి 1990 వరకు పార్టీపై నిషేధం అమలు జరిపాడు. మరోసారి కమ్యూనిస్టులు అజ్ఞాతవాసానికి వెళ్లారు.1977లో గెరిల్లా దళాన్ని కూడా ఏర్పాటు చేశారు.2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో సోషలిస్టు రికార్డో లాగోస్‌ ఎన్నిక వెనుక కమ్యూనిస్టులు ఉన్నారు. తరువాత 2006లో జరిగిన ఎన్నికలలో సోషలిస్టు మిచెల్లీ బాచెలెట్‌ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చారు. ఈ ఏడాది జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజధాని శాంటియాగోతో సహా అనేక చోట్ల మేయర్లుగా ఎన్నికయ్యారు.1927-31, 1948-1958, 1973-1990 సంవత్సరాల మధ్య నిర్బంధాలకు గురికావటంతో పాటు పినోచెట్‌ పాలనలో పలువురు నేతలతో సహా వేలాది మంది కమ్యూనిస్టులు హత్యలకు గురయ్యారు. తిరుగుబాటు సమయంలో అలెండీని మిగతా వామపక్షాలు వదలి వేసినప్పటికీ కమ్యూనిస్టులు ఆయనతో భుజం కలిపి పినోచెట్‌ను ఎదుర్కొన్నారు. పినోచెట్‌ హయాంలో తీవ్ర కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టారు. కమ్యూనిస్టులు రహస్యంగా పని చేశారు.


చిలీలో గతంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేకత, భయం తగ్గిపోతున్నదని 31 ఏండ్ల యువతి, శాంటియాగో నగరంలోని ముగ్గురు కమ్యూనిస్టు మేయర్లలో ఒకరైన జవీరా రేయాస్‌ చెప్పారు. డేనియల్‌ జాడ్యూ మేయర్‌గా ఒక ఆదర్శం అన్నారు. కార్పొరేషన్‌ తరఫున ఔషధ దుకాణాలు, కండ్లజోళ్ల షాపులు, పుస్తకాల షాపులు, రియలెస్టేట్‌ తదితర సంస్దలను నడుపుతూ ప్రజల మన్ననలను పొందారన్నారు. ఆరోగ్యం, విద్య వంటి అంశాలతో కమ్యూనిస్టు మేయర్లు మున్సిపల్‌ సోషలిజాన్ని (పేదల పక్షపాతం) అమలు జరుపుతారని అన్నారు. 2006లో విద్య ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన విద్యార్దుల నాయకురాలిగా ఆమె ప్రస్తానం ప్రారంభమైంది. ఆ సమయంలోనే ఆమెతో పాటు మరో మేయర్‌ హాస్లర్‌తో పాటు అనేక మంది విద్యార్ధి నేతలు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. గతంలో 1931, 32, 1999లో కమ్యూనిస్టు పార్టీ తరఫున అభ్యర్ధులు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఇప్పుడు ఎన్నికలు సక్రమంగా జరిగితే చిలీ తొలి కమ్యూనిస్టు అధ్యక్షుడిగా డేనియల్‌ జాడ్యు చరిత్రకెక్కుతాడు. ఆయన కూడా విద్యార్ధినేతగానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా 5జిపై బెదిరింపుల నుంచి ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగిన అమెరికా !

01 Thursday Jul 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Chinese 5G, G7, US fight against Chinese 5G, US-China Tech war

మన చుట్టూ జరుగుతున్నదేమిటి : ఐదవ భాగము

ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఒక కంపెనీ తమ కంపెనీ ఉత్పత్తులు ఎంత గొప్పవో లేదా తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఎలా వస్తాయో చూడండి అంటూ దేశ విదేశాల్లో రోడ్‌ షోలను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇప్పుడు దానికి భిన్నంగా చైనా 5జి పరిజ్ఞానం, పరికరాలను గనుక మీరు తీసుకోకపోతే మేమిచ్చే శిక్షణ, రాయితీల గురించి తెలుసుకోండి అంటూ అమెరికా ఇప్పుడు రోడ్‌ షోలను నిర్వహిస్తోంది. ఇతర ధనిక దేశాలు కూడా అదే యోచనలో ఉన్నాయి. చైనా దగ్గర తీసుకుంటే జరిగే నష్టాలు ఇతర కంపెనీల నుంచి తీసుకుంటే కలిగే లాభాలు ఇవి అని రాజకీయ నేతలు, నియంత్రణ అధికారులు, ప్రభుత్వాలకు వివరించేందుకు అమెరికా యంత్రాంగం పుస్తకాల పంపిణీ, సమావేశాలను నిర్వహిస్తున్నదని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది. చైనా హువెయి, జట్‌టిఇ తదితర కంపెనీల పరికరాలను కొనవద్దని గతంలో బెదిరించిన అమెరికా ఇప్పుడు ప్రలోభాలు, బుజ్జగింపులకు దిగింది. చైనా పరికరాల్లో ఆయా దేశాల సమాచారాన్ని తస్కరించే దొంగ చెవులు ఉన్నాయని ఇతర దేశాలను భయపెడుతోంది.


బ్రిటన్‌లో జూన్‌ 11-13వ తేదీలలో జరిగిన 47వ జి7 సమావేశాలు బి3డబ్ల్యు పధకాన్ని అమలు జరపాలని నిర్ణయించాయి. ఇది చైనా అమలు చేస్తున్న బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పధకానికి పోటీగా అని చెప్పారు గనుక ప్రపంచం మరింత పురోగమిస్తుందని అందరూ భావించారు. వివరాలు ఇంకా వెల్లడిగాకున్నా కానీ దాని తీరు చూస్తే చైనా చొరవను నీరుగార్చే వ్యవహారంగా కనిపిస్తోంది. జి7 దేశాలు ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. దానిలో భాగంగా చైనా,రష్యా,బ్రెజిల్‌, మన దేశాన్ని పక్కన పెట్టాయి. వాటి భాషలో ఈ విషయాన్ని అంత సూటిగా చెప్పవు. ఆ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో ఒక్క చైనా మీద మాత్రమే దాడి చేశారు. అక్కడ మానవహక్కులు లేవని, కరోనా మూలాలు అక్కడే, పర్యావరణాన్ని దెబ్బతీస్తోందంటూ దాడి సాగింది. అందరం కలసి కట్టుగా చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని సూటిగానే చెప్పాయి. జి7 దేశాలు మన సహజ భాగస్వాములని మన ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు గనుక మనకూ ” ఆ మహత్తర కార్యక్రమం ” లో ఏదో ఒక పాత్ర ఉంటుందన్నది స్పష్టం.


మధ్య, తూర్పు ఐరోపా దేశాలు గనుక చైనా బదులు ఇతర దేశాల టెలికాం పరికరాలు కొనుగోలు చేస్తే ఆర్ధిక సాయం చేసేందుకు వీలు కల్పించే బిల్లును మే నెలలో అమెరికా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మీరు గనుక చైనా హువెయి పరికరాలను కొనుగోలు చేస్తే మిత్ర దేశాలైనప్పటికీ మా గూఢచారులు సేకరించిన సమాచారాన్ని అందచేయబోమని అమెరికా ఇతర దేశాలను బెదిరించింది. అయితే అది పని చేయకపోవటంతో బుజ్జగింపులకు పూనుకుంది, ఇప్పుడు ప్రలోభాలకూ పాల్పడుతోంది. అమెరికా వత్తిడికి లొంగిన జర్మనీ చాలా కాలం పాటు చైనా పరికరాలను తీసుకొనేందుకు ముందుకు రాలేదు. అయితే హువెయికి పోటీ కంపెనీలైన ఎరిక్స్‌న్‌, ఏబి, నోకియాలు అందచేసే పరికరాల ధర చాలా ఎక్కువగా ఉండటంతో అనేక దేశాలు ఎటూ మొగ్గకుండా తటపటాయిస్తున్నాయి. దీంతో అలాంటి దేశాల దగ్గర తగినంత సొమ్ము లేకపోతే అప్పులిస్తామంటూ అమెరికా ముందుకు వస్తోంది. అమెరికా చట్టాలు అభివృద్ది చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వటానికి అంగీకరించవు, అయినప్పటికీ మినహాయింపు సవరణలు చేసి 50 కోట్ల డాలర్ల మేరకు రుణాలు ఇచ్చేందుకు సిద్దం చేశారు. అయితే హంగరీ, సెర్బియా వంటి దేశాలు చైనా కంపెనీ కేంద్రాలను తెరిచేందుకు అనుమతించాయి.


అమెరికా వత్తిళ్లను ఖాతరు చేయని జర్మనీ రెండు సంవత్సరాల తరువాత తమకు అన్ని కంపెనీలు ఒకటే అంటూ ఏప్రిల్‌ ఆఖరులో ఒక చట్టాన్ని చేసింది. తమ భద్రతా ప్రమాణాలను పాటించిన ఏ కంపెనీ ఉత్పత్తి అయినా తమకు సమ్మతమే, రక్షణ గురించి ఎలాంటి భయం లేదని ప్రకటించింది. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి చైనా కంపెనీలకు వ్యతిరేకంగా అమెరికా చెప్పినట్లు నడుచుకోజాలమని జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించాడు. జర్మనీ-చైనా తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పాడు. కొన్ని ఐరోపా దేశాలు సంయక్తంగా టెలికాం సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకొనేందుకు ఏర్పాటు చేసిన పధకంలో పెట్టుబడి పెట్టిన జర్మనీ దాని వలన ఫలితం లేదని గ్రహించింది.


అభివృద్దిలో పోటీ బదులు చైనా నియంత్రణపై కేంద్రీకరించాలట !


ప్రపంచ సాంకేతిక పరిజ్ఞాన పరుగులో చైనాను నిరోధించేందుకు చతుష్టయ దేశాలు (అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌) ఉమ్మడిగా పని చేయాలని ముంబైలోని గేట్‌వే హౌస్‌ ఎకానమీ మరియు టెక్నాలజీ కార్యాచరణ సంస్ధ ప్రతినిధులు లిసా కర్టిస్‌, సూర్జిత్‌భల్లా సలహా ఇచ్చారు. చైనా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, కొన్ని ముఖ్యమైన ఖనిజ సంపదతో ప్రపంచ సరఫరా వ్యవస్ధలను నియంత్రించాలని చూస్తోందన్నది వారి ఆరోపణ. దానికి పోటీగా ఆర్ధిక, సాంకేతిక రంగాలలో నాలుగు దేశాలు, సహరించుకొని ఇతర దేశాలను కలుపుకోవాలని సలహా ఇస్తున్నారు. 5జి గురించి రెండు దేశాలూ సహకరించుకోవాలని డోనాల్డ్‌ట్రంప్‌-నరేంద్రమోడీ ఇద్దరూ గతంలో కబుర్లు చెప్పినా అడుగు గడపదాటలేదు. అసలు చతుష్టయ దేశాల దగ్గర ఆ పరిజ్ఞానమే లేదు, మరోవైపు చైనా ఆరవ తరం పరిజ్ఞానం గురించి ఆలోచనలు చేస్తున్నది. కీలకమైన సెమికండక్టర్ల రంగంలో అమెరికా వెనుకబడింది. మన దేశంలో సాంకేతిక నిపుణులు ఉన్నప్పటికీ వారికి పని లేదు, పెట్టుబడి పెట్టేవారూ లేరు. మన మేథావులు అమెరికా వెళితే వారికి వ్యక్తిగతంగా, అమెరికాకు లాభం తప్ప మనకు ప్రయోజనం లేదని గతం స్పష్టం చేసింది. మన వారిని ఆకర్షించటం తప్ప ముందే చెప్పుకున్నట్లు ఉమ్మడి పరిశోధనలకు అమెరికా వైపు నుంచి ఎలాంటి చొరవ లేదు. చైనా మాదిరి పరిశోధన-అభివృద్దికి కేటాయింపుల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాము.

వివిధ రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.అయినప్పటికీ చైనా కంటే ఎంతో వెనుకబడే ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎనిమిది సంవత్సరాలలో ఉపాధి కల్పనకు వివిధ రంగాలలో 2.25లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. ఇది ఏడాదికి 280 కోట్ల డాలర్లు. అయితే ఈ ఏడాది చైనా ప్రభుత్వం, స్ధానిక సంస్ధల ద్వారా 556 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. రానున్న సంవత్సరాలలో ఇదే ధోరణి కొనసాగినా అమెరికా కంటే ఎంతో ముందుంటుంది.పరిశోధన-అభివృద్ధికి గాను 180 బిలయన్‌ డాలర్లని అమెరికా పేర్కొన్నది, అయితే ఇవి ఏమూలకన్నది ప్రశ్న. అయితే అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ఇప్పటికే మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి, వాటికి పెద్ద ఎత్తున మరమ్మతులు తప్ప కొత్తగా ఏర్పాటు చేయాల్సినవి పెద్దగా ఉండవు. కనుక సహజంగానే చైనాలో ఏడాది కేడాది పెరుగుదల ఉంటుంది. అయితే మరి చైనా ప్రత్యేకత ఏమిటి అంటే గతేడాదినాటికి అక్కడ 38వేల కిలోమీటర్ల హై స్పీడు రైలు మార్గాలు ఉన్నాయి. ఇతర దేశాలతో పోల్చితే మూడవ వంతు ఖర్చుతో అక్కడ నిర్మిస్తున్నట్లు 2019లో ప్రపంచబ్యాంకు చెప్పింది.ఈ వ్యవస్ధ రవాణా ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. అమెరికాతో పోల్చితే తలసరి ఉత్పత్తిలో చైనాలో ఆరోవంతు మాత్రమే ఉంది, అందువలన దాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం పరిశోధన-అభివృద్ధికి చైనా పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.

చైనా వద్దు గానీ లాభాలు మాత్రం ముద్దు !


చైనా విషయంలో అమెరికాతో జతకట్టిన ఐరోపా ధనిక దేశాలన్నీ ఒకటే. చైనా వద్దుగానీ దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం ముద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇటలీలోని బార్సిలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఇది వెల్లడైంది. ఫ్రాన్స్‌లో అతి పెద్ద టెలికాం కంపెనీ పేరు ఆరెంజ్‌. చైనా పరికరాలను తమ దేశంలో వినియోగించవద్దని నిర్ణయించాం గానీ ఆఫ్రికాలో మాతో సంబంధాలున్న కంపెనీల్లో వాటిని వినియోగించటానికి సిద్దమే అని కంపెనీ స్టీఫెన్‌ రిచర్డ్‌ రాయిటర్‌ వార్తా సంస్దతో చెప్పాడు. ఆఫ్రికాలో యూరోపియన్లు పెట్టుబడులు పెట్టేందుకు విముఖంగా ఉన్నారు, చైనీయులు పెడుతున్నారు అని చెప్పాడు. ఆ ఖండంలోని అనేక దేశాల టెలికాం ఆపరేటర్లు చైనా పరికరాల మీద ఆధారపడుతున్నారు.అందువలన మేము చైనా కంపెనీలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నామని దాపరికం లేకుండా చెప్పాడు. ఐరోపాలో ఇప్పుడు చైనా కంపెనీలతో కలసి 5జి నెట్‌వర్క్‌లను అభివృద్ది చేయటం ఎంతో కష్టం అన్నది వాస్తవం అన్నాడు. ఆరెంజ్‌ కంపెనీలో ఫ్రెంచి ప్రభుత్వానికి 23శాతం భాగస్వామ్యం ఉంది.


5జి గురించి ధనిక దేశాలు ఎందుకు ఇంతగా చైనాను దెబ్బతీయాలని చూస్తున్నాయి ? దీనిలో రాజకీయంంతో పాటు ఆర్ధికం కూడా ఇమిడి ఉంది. 2030 నాటికి ప్రపంచ జీడిపిలో 5జి ద్వారా 1.3లక్షల కోట్ల డాలర్ల ఆదాయం తోడవుతుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ తాజా నివేదికలో పేర్కొన్నది.ఆరోగ్య, వినియోగదారుల, ఆర్ధికసేవలు, వస్తు తయారీ, మీడియా రంగాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉత్తర అమెరికా ఖండ దేశాల లబ్ది ఎక్కువగా ఉంటుంది. చైనా ఆర్ధిక వ్యవస్ధకు 220 బిలియన్‌ డాలర్లు తోడవుతాయని పేర్కొన్నది. ఎవరైనా అభివృద్ది చెందాలనుకుంటే చూసి నేర్చుకోమన్నారు తప్ప ఎదుటివారిని చూసి ఏడవమని, చెడగొట్టేందుకు ప్రయత్నించమని మన పెద్దలెవరూ చెప్పలేదు. అలాంటి వారు బాగుపడిన దాఖాలాలు కూడా లేవు. వారి శక్తుయుక్తులన్నీ తమ బాగుకోసం గాక ఇతరులను చెడొట్టేందుకు ఉపయోగిస్తే ఫలితం ఏముంటుంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నిర్మలమ్మ తాయిల పొట్లంలో ఏముంది ? ఎంత మేరకు ప్రయోజనం !

29 Tuesday Jun 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Health, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

CPI(M), Narendra Modi Failures, Nirmala Sitaraman stimulus package, SITARAM YECHURY


ఎం కోటేశ్వరరావు


కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ గారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారితో ఒక తాయిల పొట్లాన్ని పంపారు. దాని విలువ 6.29లక్షల కోట్ల రూపాయలని చేసిన ప్రకటనపై మిశ్రమ స్పందన వెలువడింది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు స్వాగతించారు.గతంలో ప్రకటించిన అంశాలనే కొత్త రంగు కాగితాల్లో చుట్టి చూపటం తప్ప కేంద్ర ప్రభుత్వం చేసే అదనపు ఖర్చేమీ లేదని సిపిఎంనేత సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యానించారు. ఇంకా మరికొన్ని వ్యాఖ్యలు కూడా వెలువడ్డాయి. గత ఏడాది ప్రకటించిన 20లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజ్‌ వలన జనానికి, పారిశ్రామిక వాణిజ్య రంగాలకు జరిగిన మంచేమిటో ఇంతవరకు చెప్పిన వారెవరూ లేరు. ఇప్పుడు ఇది కూడా అలాంటి వట్టి విస్తరి మంచినీళ్లేనా ?


నిర్మలమ్మ దేశం ముందుంచిన పొట్లంలో ఏముందో విప్పి చూద్దాం. 1.కరోనా ప్రభావిత రంగాలకు రుణ హామీ నిమిత్తం రు.1.10లక్షల కోట్లు.2.అత్యవసర రుణాల హామీగా రు.1.5లక్షల కోట్లు. 3. విద్యుత్‌ పంపిణీదార్లకు ఆర్ధిక సాయం రు.97,631 కోట్లు, 4. ఉచిత ఆహార ధాన్యాలకు రు.93,869 కోట్లు, 5.ఎగుమతి బీమా నిమిత్తం రు.88,000 కోట్లు, 6.ఎగుమతుల ప్రోత్సాహం కోసం రు.33,000 కోట్లు, 7. అదనపు ఎరువుల సబ్సిడీ రు.14,775 కోట్లు, 8.నూతన ఆరోగ్య పధకం రు.15,000 కోట్లు, 9. గ్రామీణ ఇంటర్నెట్‌కోసం రు.19,041 కోట్లు,10. విదేశీ పర్యాటకులకు ఉచిత వీసాల నిమిత్తం రు.100 కోట్లు, 11.ఈశాన్య ప్రాంత వ్యవసాయ కార్పొరేషన్‌కు రు.77 కోట్లు దీనిలో ఉన్నాయి. వీటిలో గతంలో ప్రకటించిన ఆహార సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ రు.1,08,644 కోట్లు పోతే ఐదు లక్షల 21వేల కోట్లే కొత్తవి.


మహమ్మారి అయినా మాంద్యం వచ్చినా రెండు రకాల పనులు చేయాల్సి ఉంటుందని అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. మన ప్రభుత్వానికి అవేమైనా పట్టాయా అన్నదే అర్ధంగాని విషయం. తక్షణమే ఉపశమనం కలిగించేవి, దీర్ఘకాలంలో ఉపయోగపడే వృద్ధికి అవసరమైనవి. జనానికి నగదు అందచేస్తే తక్షణ గిరాకీ పెరుగుతుంది. ఉచిత నగదు అంటే దాని అర్దం అది వస్తు డిమాండ్‌ను పెంచేదే తప్ప సోంబేరులను తయారు చేసేది కాదు. అత్మనిర్భర, తాజా తాయిలంలో అవి ఉన్నాయా అంటే లేవు. జనాలకు ఉచితంగా కొన్ని కిలోల బియ్యం లేదా గోధుమలు ఇస్తే చాలదు. కేరళలో మాదిరి బియ్యంతో పాటు వంటకు అవసరమైన పప్పులు, నూనెలు, ఇతర వస్తువులను కూడా అందచేసినపుడే ప్రయోజనం ఉంటుంది.


విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఐదు లక్షల మందికి వీసాలు ఉచితంగా ఇస్తాం రమ్మంటున్నారు. వీసా ఉచితంగా వచ్చింది కదా అని ఎవరైనా వచ్చి ఖరీదైన కరోనాను తగిలించుకుంటారా ? అనేక రాష్ట్రాలు పరీక్షలను సమగ్రంగా లేదా పెద్ద సంఖ్యలో చేయటం లేదు. వ్యాధిగ్రస్తులు, మరణాలను లెక్కల్లో చూపటం లేదు. కొత్త రకం వైరస్‌ వ్యాప్తి జరుగుతున్న నేపధ్యం. పోనీ వాక్సిన్లు వేసి వ్యాధి నిరోధక చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. మన దేశంలోని జనాలే మరో చోటుకు పోవాలంటే భయపడుతున్న స్ధితిలో పొలో మంటూ విదేశీయులు వస్తారా ? అందువలన పర్యాటక రంగానికి 60వేల కోట్లు అప్పులిప్పిస్తామంటున్నారు. ఇప్పటికే కుదేలైన ఈ రంగం వాటిని తీసుకొని ఏమి చెయ్యాలి అన్నది సమస్య.


మన ప్రజారోగ్య వ్యవస్ధను ఎంత పటిష్టం గావించాలో కరోనా మహమ్మారి వెల్లడించింది. దానికి అవసరమైన చర్యలు తీసుకోవటం ద్వారా జనాల జేబులు గుల్లకాకుండా చూడవచ్చు. రాష్ట్రాలకు ఆమేరకు నిర్ధిష్టంగా సాయం ప్రకటించి ఉంటే అది వేరు. మూడవ తరంగం, అది పిల్లలను ప్రభావితం చేయనుందనే భయాల నేపధ్యంలో అత్యవసర ఏర్పాట్లకు ప్రకటించింది కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలే అవి ఏమూలకు వస్తాయి. వైద్య రంగంలో పెట్టుబడులకు వడ్డీ రేటు తక్కువకు 50వేల కోట్ల రూపాయలను చిన్న పట్టణాలలో ఆసుపత్రుల ఏర్పాటుకు అప్పులిప్పిస్తామని నిర్మలమ్మ హామీ ఇచ్చారు. దాని వలన జనానికి ఆరోగ్య ఖర్చు పెరుగుతుంది తప్ప తగ్గేదేమీ ఉండదు. అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులు కొంత శాతం పేదలకు ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పి రాయితీలు పొంది వాటిని ఎగనామం పెట్టటమే గాకుండా వారు కొనుగోలు చేసిన వైద్య యంత్రాలకు అవసరమైన సమిధలుగా రోగులను మార్చటాన్ని, లాభాలు పిండటాన్ని చూస్తున్నాము.


మన ఆర్ధిక వ్యవస్ధలో ఎంఎస్‌ఎంఇల ప్రాధాన్యత గురించి చెప్పనవసరం లేదు. గతేడాది ఆత్మనిర్భర పధకం ప్రకటించే సమయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి దగ్గర కొనుగోలు చేసిన వస్తువులకే లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికీ వాటికి ఎంత బకాయి ఉన్నదీ, ఏడాది కాలంలో ఎంత చెల్లించిందీ స్పష్టత లేదు. రెండు నుండి మూడులక్షల కోట్ల మేరకు బకాయి ఉన్నట్లు చెబుతుంటే కేంద్ర ప్రభుత్వం చెల్లించినట్లు చెబుతున్న మొత్తం పదిశాతం కూడా లేదు. ఇంకా బకాయిలు పన్నెండువేల కోట్లకు మించి లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ప్రకటించిన పాకేజ్‌ కూడా ఇప్పటికే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రికార్డు ఉన్నవారికే హమీ అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరోవైపు కొనుగోలు శక్తి పడిపోయిన స్దితిలో గిరాకీయే లేదంటుంటు రుణాలు ఎవరు తీసుకుంటారు, ఉత్పత్తి చేసిన సరకులను ఎక్కడ అమ్ముకుంటారు ?

రుణ హామీ పధకాల గత ఏడాది ప్రకటించిన పరిమితుల విస్తరణే తప్ప కొత్తవేమీ లేవు. అదే విధంగా కొత్తగా ఉపాధి కల్పించే సంస్ధలకు ప్రభుత్వమే రెండు సంవత్సరాల పాటు పిఎఫ్‌ చెల్లించే పధకాన్ని మరో తొమ్మిది నెలలు పాడిగించారు. రానున్న ఐదు సంవత్సరాలలో ఎగుమతుల ప్రోత్సాహకానికి 88వేల కోట్లు ప్రకటించారు. ఉత్పత్తి, ఎగుమతులతో ముడిపడిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల కోసం ప్రవేశపెట్టిన ఈ పధకం కొత్తదేమీ కాదు. దాని వలన ఇప్పటి వరకు నిర్ధిష్టంగా పెరిగిన ఎగుమతులేమిటో తెలియదు.


ఎంఎస్‌ఎంఇ రంగం పన్నెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.జిడిపిలో 30శాతం, ఎగుమతుల్లో 40శాతం ఈ రంగం నుంచే ఉన్నాయి. ఈ రంగంలోని కన్సార్టియం ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌(సిఐఏ) జూన్‌ 24న ప్రకటించిన సర్వే ప్రకారం 88శాతం మైక్రో లేదా చిన్న సంస్ధలు గతేడాది ప్రకటించిన పాకేజ్‌ను ఉపయోగించుకోలేదని తేలింది. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారు నాలుగు కోట్ల మంది ఉన్నారు.వారికి భవిష్యత్‌ మీద ఆశలేదు.ప్రపంచ బ్యాంకు చెప్పిన దాని ప్రకారం 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఇ సంస్దలుంటే వాటిలో కేవలం 50లక్షలు మాత్రమే ప్రభుత్వ పధకాల నుంచి ఆర్ధిక సాయం పొందాయి.పొందాయి.కరోనా రెండవ తరంగంలో కేవలం ఐదోవంతు సంస్దలు మాత్రమే బతికి బట్టకడతాయని లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడించింది. నలభైశాతం సంస్దలు నెల రోజుల కంటే బతకలేవని తేలింది.

కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న ఈ కాలమంతా లక్షలాది ప్రజలు తమ ఆదాయాలను, జీవనోపాధిని కోల్పోయారు. ఈ సమయంలో ప్రపంచంలోని చాలా ప్రభుత్వాలు తమ దేశాల్లో సార్వత్రిక నగదు బదిలీ ద్వారా ప్రజలను ఆదుకున్నాయి. అమెరికా ప్రభుత్వం తాజాగా ఆరులక్షల కోట్ల డాలర్ల పాకేజ్‌ను అమలు జరపాలని ప్రతిపాదించింది. దానిలో నగదు బదిలీతో పాటు శాశ్వత ఆస్ధుల కల్పన వంటి చర్యలున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి ఆలోచనలో లేదు.


ద్రవ్యలోటును అదుపులో ఉంచే పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ ఆదేశించిన మేరకు కొన్ని స్వయం పరిమితులు విధించుకుంది. అయినా మే 2021లో టోకుధరలు 12.94 శాతం, రిటైల్‌ ధరలు 6.3 శాతం పెరిగాయి. జనానికి నగదు బదులు ఆ మొత్తాన్ని కార్పొరేట్‌ రంగానికి పన్ను రాయితీగా ఇస్తే లాక్‌డౌన్‌ అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఆస్కారం కలుగుతుందని గతేడాది ప్రభుత్వం చెప్పింది. కాని ఏప్రిల్‌ నెలలో 4.3 శాతం వ ద్ధి రేటు ఉన్న పారిశ్రామిక వస్తూత్పత్తి రంగం మే నెల వచ్చేసరికి 3.1 శాతానికి పడిపోయింది. ఈ కాలంలో రూపాయి మారకపు రేటు మరింత తగ్గిపోయింది. ప్రభుత్వం చెప్పిందో, దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఫలితాలు వస్తున్నాయి.

నగదు బదిలీ వామపక్షాలో, లేదా ఇతర మేథావులో చెబుతున్నదే కాదు, సిఐఐ చైర్మన్‌ నరేంద్రన్‌ రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన పథకాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అందులో నగదుబదిలీ కూడా ఒక అంశం. కాబట్టి నగదు బదిలీ అనేది ఇప్పుడు ఆర్థికవేత్తలు, ప్రతిపక్షపార్టీలు, పౌర సంఘాలు మాత్రమే గాక పెట్టుబడిదారులు కూడా సమర్ధిస్తున్న ప్రతిపాదన. దీని వలన వస్తు డిమాండ్‌ పెరిగితేనే వారి ఉత్పత్తులకు మార్కెట్‌ ఉంటుందన్నది దీని వెనుక ఉన్న భావం. కొటాక్‌ మహింద్రా బ్యాంక్‌ యజమాని ఉదయ కొటాక్‌ ద్రవ్యలోటు పెంచాలని గట్టిగా చెప్పడమే గాక, అందుకోసం అదనంగా కరెన్సీని కూడా ముద్రించాలని సూచించారు. కోవిడ్‌-19 కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించేది లేదని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్కలనే ప్రమాణంగా తీసుకుంటే కోవిడ్‌ మరణాలు దేశంలో 4 లక్షలకు మించవు. ఒక్కొక్క మరణానికి రు. 4 లక్షల పరిహారం చెల్లించాలంటే రూ.16,000 కోట్లు అవుతుంది.ఈ మాత్రం సొమ్ము కేంద్రం దగ్గర లేదా ?


సిఎంఐఇ అధ్యయనం ప్రకారం, జూన్‌ 13తో ముగిసిన వారంలో నిరుద్యోగిత రేటు 12 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో, రేటు చాలా అధికంగా దాదాపు 15 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది దాదాపు 11 శాతంగా ఉంది. జనవరిలో ఉద్యోగుల సంఖ్య 40.1 కోట్లుగా అంచనా. మే నాటికి 36.6 కోట్లకు తగ్గింది. 2021లో లాక్‌డౌన్ల వల్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారిలో అత్యధికులు రోజువారీ ఆదాయంపై ఆధారపడిన పేదలే. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలలో రోజువారీ వేతన కార్మికులు 1.72 కోట్లకు పైగా ఉద్యోగాలు, ఆదాయాలు కోల్పోయారు. వేతనాలు, వ్యాపారరంగంపై ఆధారపడిన వారు ఈ రెండు నెలల్లో 90 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారు. ఇవన్నీ ప్రధానంగా పట్టణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.


గత ఏడాది మాదిరిగానే వ్యవసాయ రంగంలోనూ ఉద్యోగావకాశాలు కుంచించుకుపోయాయి. నిర్మాణ రంగంపై ఆధారపడిన తక్కువ వేతనంతో పనిచేసే అసంఘటితరంగ కార్మికులు గత రెండు నెలల్లో 88 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సిఎంఐఇ అంచనా వేసింది. దీంతోపాటు తీవ్రంగా ప్రభావితమైన తయారీరంగంలో 42 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఆతిథ్య రంగంలో 40 లక్షలు, వాణిజ్య రంగంలో 36 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.


ప్రజల కోసం ప్రభుత్వ నిధులను ఖర్చు చేయాలని వామపక్షాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అనేక ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌ కూడా డిమాండ్‌ చేసింది. పన్ను చెల్లించని అన్ని కుటుంబాలకు ప్రతి నెలా కనీసం రూ.7,500 చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. ఇది ప్రస్తుతం అందజేస్తున్న రేషన్‌కు అదనంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం 10 కిలోల ఆహార ధాన్యం, పప్పుధాన్యాలు, ఇతర సరకులు ఇవ్వటం ద్వారా జనాలు తక్షణం ఉపశమనం పొందుతారు, కొనుగోలు శక్తి పెరుగుతుంది. నిర్మలమ్మ తాయిలాల పొట్లంలో అలాంటివేమీ లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d