• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Farmers agitations

రైతు నేత దల్లేవాల్‌కు వైద్యం : ఫిబ్రవరి 14నచర్చలు ! మద్దతు ధరల చట్టబద్దతపై మోడీ దిగివచ్చేనా !!

19 Sunday Jan 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

BJP, farm crisis, Farmers agitations, Jagjit Singh Dallewal, MSP demand, Narendra Modi Failures, SKM

ఎం కోటేశ్వరరావు


నవంబరు 26వ తేదీ నుంచి రైతుల సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చారాజకీయ రహిత సంస్థ కన్వీనర్‌ జగత్‌సింగ్‌ దల్లేవాల్‌ జనవరి 18వ తేదీ అర్ధరాత్రి వైద్య చికిత్సకు అంగీకరించారు, ఆ మేరకు ప్రభుత్వ వైద్యులు తగిన చర్యలను ప్రారంభించారు. ఫిబ్రవరి 14వ తేదీన చండీఘర్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయ రహిత), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ప్రతినిధులతో కేంద్ర అధికారులు చర్చలు జరిపారు. ఏడు పదుల వయస్సున్న దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్న పూర్వరంగంలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు పోవాలని చర్చలు జరపటం, బిజెపికి కీలకమైన ఢల్లీి ఎన్నికలు, దల్లేవాల్‌కు మద్దతుగా మరో 121 మంది నిరవధిక దీక్షలకు పూనుకోవటం, కేంద్ర ప్రభుత్వంపై రోజు రోజుకూ వత్తిడి పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ మేరకు దిగివచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ రైతుల గురించి మాట్లాడరు, రైతు ప్రతినిధులతో మాట్లాడేందుకు సమయం లేదంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు.కోట్లాది మంది రైతుల గురించి చర్చించేందుకు సమయం లేదనటాన్ని బట్టి ఎవరి ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టం అయింది. బడ్జెట్‌పై చర్చలంటూ రైతు ప్రతినిధులను మినహా మిగిలిన వారందరినీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించి చర్చలను జరిపింది. వీటన్నింటినీ చూసినపుడు వచ్చే నెలలో జరిగే చర్చల్లో ఒరిగేదేమిటి అన్నది పెద్ద ప్రశ్న.ఈనెల 31న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇతర సమస్యలతో పాటు రైతుల గురించి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, గతంలో రైతు ఉద్యమం సందర్భంగా మరణించిన వారికి పరిహారం, లఖింపూర్‌ ఖేరీ హింసా కాండ బాధితులకు న్యాయం,2013 భూసేకరణ పరిహార చట్ట పునరుద్దరణ,రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌, రైతుల రుణమాఫీ వంటి అంశాలపై రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

బడ్జెట్‌ ప్రవేశపెట్టబోయే ముందు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వివిధ తరగతుల ప్రతినిధులతో చర్చలు జరపటం ఒక తంతుగా జరుగుతున్నది. అన్ని రోడ్లూ రోమ్‌కే అన్నట్లుగా ఏ పార్టీ చరిత్ర చూసినా గర్వకారణం ఏమీ లేదు. సంపదలలో పెద్ద పీట కార్పొరేట్‌ శక్తులకే వేస్తున్న కారణంగానే అసమానతలు ఏటేటా పెరుగుతున్నాయి. తంతుగా అయినా బడెట్‌ చర్చకు రైతు సంఘాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు. కొంత మంది కొన్ని పోలికలు తెస్తున్నారు. వాటిలో ఉద్యోగులకు వేతన కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయించిందిగానీ రైతులకు ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించటం లేదన్నది వాటిలో ఒకటి. దీనిలో రెండవది వాస్తవం, ఉద్యోగులకు పది సంవత్సరాల తరువాత వేతన కమిషన్‌ ఏర్పాటును దీనికి ముడి పెట్టనవసరం లేదు. పదేండ్లకు ఒకసారి వేతన సవరణ ద్వారా వారికి అన్యాయమే జరుగుతున్నది తప్ప న్యాయం కాదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, ఇతర అంశాల గురించి పరిశీలించేందుకు 2022 జూలైలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతవరకు అది ఏమి చేసిందో ఎవరికీ తెలియదు, వారు నివేదిక సమర్పించరు, ప్రభుత్వమూ అడగదు, అంతా ఒక నాటకంగా మారింది. ఈ లోగా 2021లో క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తీసుకున్న మూడు సాగు చట్టాలను మరో రూపంలో ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశంలో భూ కమతాలు పద్నాలుగు కోట్లకు పైగా ఉన్నాయి. వాటిలో 88శాతం రెండున్నర ఎకరాల లోపు కలిగిన రైతులే ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదంటూ వారందరినీ కార్పొరేట్లకు అప్పగించేందుకు తన బాధ్యతను వదిలించుకొనేందుకు కేంద్రం చూస్తున్నది.ఒకసారి అది జరిగితే రాష్ట్రాలు కూడా అదేబాట పడతాయి.పరిశ్రమలు, వాణిజ్యాలకు అనేక రక్షణలు, రాయితీలు ఉన్నాయి. వాటి మాదిరిగానే తమకూ కల్పించాలని రైతులు కోరటం గొంతెమ్మ కోర్కె కాదు. కనీస మద్దతు ధరను ఒక్క హక్కుగా చట్టబద్దం చేయాలని కోరుతున్నారు.

పారిశ్రామిక ఉత్పత్తులకు, ఎగుమతులకు, దిగుమతులకూ రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతులను ఎందుకు విస్మరిస్తున్నది, పోనీ వ్యవసాయం ఉపాధి కల్పించటం లేదా పరిశ్రమలు, సేవారంగాల కంటే ఎక్కువ 44శాతం మందికి కల్పిస్తున్నది. సంఘటితంగా పోరాడే స్థితిలో వారు లేకపోవటం తప్ప మరొకటి కనిపించటం లేదు. మనకు అవసరమైన వంట నూనెల్లో 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, దానికి ఎన్నో రాయితీలు ఇస్తున్నది ప్రభుత్వం కానీ ఇక్కడ నూనె గింజలు పండిరచేవారికి ధరల గురించి ఒక హామీ ఇవ్వటానికి ముందుకు రావటం లేదు.మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదలివేస్తున్నది. గతేడాది సోయా, ఆవ రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువే పొందారు. మరోవైపున బియ్యం, గోధుమలు, ఉల్లి, పంచదార వంటి వాటి ఎగుమతుల మీద నిషేధం పెట్టి మార్కెట్లో రైతులకు అన్యాయం చేశారు. వినియోగదారులకు మేలు చేయటం అంటే రైతుల నోట్లో మట్టికొట్టటం కాదు కదా ! ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే తక్కువకు రైతుల నుంచి చెరకును మిల్లులు కొనుగోలు చేయకూడదు(అది గిట్టుబాటు కావటం లేదు). అదే మాదిరి ఇతర పంటలకు ప్రభుత్వం ఎందుకు హామీ ఇవ్వటానికి నిరాకరిస్తున్నది ? కనీస వేతన చట్టాన్ని అమలు జరపకపోతే కార్మికులు కోర్టులకు ఎక్కే హక్కు ఉంది, కానీ రైతులకు కనీస మద్దతు ధరలకు అలాంటి అవకాశం లేదు. దాదాపు పదిహేను కోట్ల మంది రైతులు ఉండగా వారిలో తొమ్మిది కోట్ల మందికి ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి అదే మహాభాగ్యం అని చెబుతున్నది. తప్పుల తడకలతో కూడిన గణాంకాలు( వివిధ సూచికలను ప్రకటించినపుడు ప్రభుత్వమే అలా చెబుతున్నది. ఉదా : దేశ ఆకలి సూచిక) వెల్లడిరచినదాని ప్రకారం 2004-05లో వ్యవసాయ వాణిజ్య సూచిక 87.72గా ఉన్నది 2010-11 నాటికి 102.95కు పెరిగింది.దాని ప్రకారం పెట్టుబడుల కంటే పంటల అమ్మకం ద్వారా ఎక్కువ పొందారని భాష్యం చెప్పారు. అదే 202223లో ఆ సూచిక 97.21కి పడిపోయింది. అంటే రైతులు పొందుతున్నది తగ్గిపోయింది. అందుకే రైతుల కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కోరుతున్నారు.


రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మూడు సంవత్సరాల తరువాత కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన మరో రూపంలో ముందుకు తీసుకురావటం ఆందోళన కలిగించే అంశం. నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ పాలసీ(నాంప్‌)ని 2024 నవంబరు 25న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ఆధ్వర్యాన డిసెంబరు 23న దేశమంతటా నిరసన తెలిపారు. అనేక మంది నిపుణులు విమర్శించారు. దాని మీద అభిప్రాయాలు తెలిపేందుకు కేవలం పదిహేను రోజులు మాత్రమే కేంద్రం గడువు ఇచ్చింది. ఇప్పుడున్న మార్కెటింగ్‌ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని కాదు, దాన్ని సంస్కరించకూడదని ఎవరూ చెప్పటం లేదు. అయితే ఆ పేరుతో ఇప్పుడున్నదాని కంటే ప్రమాదకరమైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయద్రవ్య పెట్టుబడి సంస్థలు సూచించిన పద్దతిలో సమూల మార్పులు ప్రతిపాదించటం ఆందోళనకరం. దాని ప్రకారం దేశమంతటిని అనుసంధానించే ఒకే మార్కెట్‌ను ఏర్పాటు చేస్తారు. ఇదంతా చిన్న రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాల కంటే కార్పొరేట్లకే ప్రాధాన్యత ఇచ్చే వ్యవహారం.రైతులు ముడి సరకును సరఫరా చేసేవారిగా మాత్రమే ఉంటారు.వాటి నుంచి ఉత్పత్తులు తయారు చేయటం,వాణిజ్యం, ఎగుమతి అంతా కార్పొరేట్లదే. ఈ క్రమంలో తేలే మిగులులో రైతుల వాటా గురించి ఎక్కడా స్పష్టత లేదు. అంతే కాదు కనీస మద్దతు ధరలకు ఎలాంటి హామీ ప్రస్తావన కూడా లేదు.అలాంటి ఉద్దేశ్యం ఉంటే ఈ పాటికి కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఒక స్పష్టత ఇచ్చి ఉండేది. రైతాంగానికి గరిష్ట ప్రయోజనం, డిజిటల్‌, పారదర్శకత, జాతీయ మార్కెట్‌ సమాచారం వంటి పదజాలం ఎంతగా వల్లించినా వాటిని వినియోగించుకొనే అవకాశం ఎంత మంది రైతులకు ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పుడు అనేక నియంత్రణలు ఉన్నా వాటిని ఖాతరు చేయకపోవటం, దొడ్డిదారిన ఉల్లంఘిస్తున్న కంపెనీలపై అసలు ఎలాంటి నియంత్రణలు ఉండకూడదని ఈ ప్రతిపాదనల్లో ఉన్నది. వ్యవసాయ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఈ విధానంతో రాష్టాల హక్కులు, నియంత్రణలకు నీళ్లదులుకోవాల్సిందే. అమల్లోకి వచ్చిన తరువాత గానీ ఇతర మంచి చెడ్డలు వెల్లడి కావు.

ఫిబ్రవరి 14వ తేదీన కేంద్ర, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరిగే చర్చల అజెండా ఏమిటో తెలియదు. ఎవరెవరు పాల్గ్గొనేదీ ఇంకా స్పష్టం కాలేదు. ఒకటి మాత్రం స్పష్టం, ఇది ఒక రోజులో తేలే వ్యవహారం కాదు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని 2012లోనే సిఎంగా ఉండగా నరేంద్రమోడీ కమిటీ నాటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని గురించి తాజా పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసినా మోడీ మొరాయిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫార్సును అమలు చేయాలంటూ కేంద్రానికి సూచించాలని రైతు సంఘాల నేతలు సుప్రీం కోర్టును కోరారు. వ్యవసాయ గ్రాంట్లపై ఏర్పాటైన కమిటీ 202425 నివేదికను గతేడాది డిసెంబరు 20న పార్లమెంటుకు సమర్పించింది.దీన్ని కేంద్రం ఆమోదిస్తే అమలుకు ఉపక్రమించాలి తిరస్కరిస్తే కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటరీ కమిటీ చేసిస సిఫార్సు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజన మొత్తం రు. ఆరువేలను పన్నెండు వేలకు పెంచాలి.(దాన్ని చూసి కొంత మంది అమలు జరగనున్నట్లు ప్రచారం చేశారు) ఈ ప్రోత్సహకాన్ని కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు కూడా ఇవ్వాలి. కనీస మద్దతు ధరల చట్టబద్దతకు ఒక రోడ్‌ మాప్‌ను సాధ్యమైనంత త్వరలో ప్రకటించాలి. వ్యవసాయ కార్మికులకు కనీస జీవన వేతనాల నిమిత్తం జాతీయ కమిషన్‌ ఏర్పాటు. రైతులు, వ్యవసాయ కార్మికులకు రుణాల రద్దు పధకాన్ని ప్రవేశ పెట్టాలి.వ్యవసాయ శాఖ పేరులో వ్యవసాయ కార్మికుల పేరును కూడా చేర్చాలి.

కనీస మద్దతు ధరలకు అనుకూల వాదనల సారం ఇలా ఉంది. రైతులకు ధరల మీద ఒక చట్టబద్దత ఉంటుంది. మార్కెట్‌ వడిదుడుకుల నుంచి రక్షణ ఉంటుంది. మధ్యవర్తుల దోపిడీ నిరోధంగా ఉంటుంది.ఉత్పత్తి ఖర్చులను భరించేందుకు, ఆర్థిక పరమైన భద్రతను మెరుగుపరచుకొనేందుకు స్థిరమైన రాబడికి వీలు కలిగిస్తుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉత్పాదకత, సామర్ధ్యాలను పెంచుతుంది. ఆహార భద్రత, కొరతలను తీరుస్తుంది, దారిద్య్ర తగ్గింపుకు తోడ్పడుతుంది.రైతాంగ జీవనాన్ని మెరుగుపరుస్తుంది. మార్కెట్‌ వడిదుడుకులను తగ్గిస్తుంది. వ్యతిరేకించే వారేమంటారంటే.. మార్కెట్లో అసమతూకానికి దారితీస్తుంది, కొన్ని పంటలను అవసరాలకు మించి ప్రోత్సహిస్తుంది. సరఫరాఅవసరాల తీరు తెన్నులను విచ్చిన్నం చేస్తుంది.ప్రభుత్వాల మీద భారం మోపుతుంది, మిగులును కొని నిల్వచేయాల్సిన అవసరాన్ని పెంచుతుంది.వనరుల కేటాయింపులో అసమర్ధతకు దారి తీస్తుంది. పంటల వైవిధ్యానికి బదులు కొన్ని పంటలనే ప్రోత్సహిస్తుంది.అవినీతిని ప్రోత్సహిస్తుంది. మధ్యవర్తులు అవకాశంగా తీసుకొని రైతులకు లబ్దిని తగ్గిస్తారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలను అడ్డుకుంటుంది,ప్రతిదానికీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సి ఉంటుంది. మార్కెట్‌ వ్యవస్థలో పోటీని తగ్గిస్తుంది. రైతులు కొత్త పద్దతులవైపు చూడకుండా కనీస మద్దతు ధరల మీద ఆధారపడతారు,మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మారరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎనిమిదేండ్ల నరేంద్రమోడీ పాలన : జనంపై రణం – దేశానికి రుణం పెంపుదల !

16 Wednesday Feb 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ 1 Comment

Tags

BJP, Farmers agitations, india debt, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మన దేశ క్రమశిక్షణ గురించి పెద్దలు చెప్పిన అంశాలలో అప్పు చేయటం ఎంత చెడ్డపనో చెప్పనవసరం లేదు. తినటానికి లేకపోతే కడుపులో కాళ్లు ముడుచుకొని పడుకుంటాం గాని అప్పు చేసి పప్పుకూడు తినం అనే మాట ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. గతంలో అప్పులున్నవారెందరు అని వెతికితే ఇప్పుడు అప్పులేని వారెవరు అన్నది ప్రశ్న. భారతీయత గురించి లౌడ్‌ స్పీకర్లతో పని లేకుండానే గొంతెత్తి అరచి మాట్లాడేవారి పాలనలో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కలియుగ దైవం వెంకటేశ్వరుడే అప్పులు చేయగా లేనిది మనమెంత అని సమర్ధించుకొనే అవకాశం కూడా మనకు ఉంది. జనం నమ్ముతున్న దేవుడి వీధుల్లోకి లాగి రాజకీయం చేస్తున్న వారికి ఇదొక లెక్కా ! ఇంతకీ వడ్డీకాసుల వాడు ఎందుకు అప్పు చేసినట్లు ? మన పాలకులు దేనికి చేస్తున్నట్లు ?


మాటా మాటా వచ్చి లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తిని వదలి వెళ్లిపోయిందట. దాంతో దిక్కుతోచక ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ విష్ణుమూర్తి తిరుపతి ప్రాంతానికి రాగానే ఎందుకో కాస్త ప్రశాంతత దొరికినట్లు అనిపించి అక్కడే ఒక రూము తీసుకొని ఉన్నాడు. అప్పుడు మారు పేరుతో ఆకాశరాజు కూతురు పద్మావతి ప్రేమలో పడ్డాడు. వివాహం చేసుకొనేందుకు డబ్బు లేకపోతే కుబేరుడి దగ్గర భారీ వడ్డీ రేటుతో అప్పు చేశాడు. వడ్డీ చెల్లించటానికి కూడా వనరులేని వెంకటేశ్వరుడు తిరుమలను శాశ్వత నివాసంగా మార్చుకున్నప్పటి నుంచి తన భక్తులు హుండీరూపంలో ఇచ్చే కానుకలను వడ్డీగా చెల్లిస్తున్నాడు. అప్పు తీరటం లేదు ఇదీ కథ. మరి మన పాలకులు ఎందుకు అప్పు చేస్తున్నారు అనిఅడిగితే అప్పులోనే ఉంది అభివృద్ధి అని టక్కున చెప్పేస్తారు. ఎన్ని కానుకలు వేసినా వెంకటేశ్వరుడి అప్పు ఎలా తీరటం లేదో అలాగే ఎన్ని అప్పులు చేసినా అభివృద్ధి ఎక్కడా కనిపించటం లేదు.


తాజా బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.1,35,87,893 కోట్లుగానూ 2023 మార్చి ఆఖరుకు అది రు.1,52,17,910 కోట్లకు పెరుగుతుందని ఉంది. అంటే ఏడాది కాలంలో 16లక్షల 30వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కొత్తగా అప్పు చేయనుంది.వర్తమాన కరెన్సీ మారకపు విలువ, ఇబిఆర్‌, కాష్‌బాలన్సులను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తాలు 139, 155లక్షల కోట్లుగా ఉంటాయని ప్రభుత్వమే వివరణలో పేర్కొన్నది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన ఏడాది అంటే 2014 మార్చి ఆఖరుకు ఉన్న అప్పు రు.53,11,980 కోట్లు. ఎనిమిది సంవత్సరాల్లో కొత్త అప్పులు 99,05,930 కోట్లు. బహుశా దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణమని జనం చెవుల్లో ఎక్కించేందుకు పూనుకోవచ్చు.పోనీ ఇంత చేసినా అభివృద్ధి కరోనాతో నిమిత్తం లేకుండా సాధారణ పరిస్దితి ఉన్నపుడే ఎనిమిది నుంచి నాలుగుశాతానికి తగ్గింది. ఏమిటీ నిర్వాకం అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు దేశభక్తులేనా, ఇక్కడి తిండి తింటూ ఇక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అని దాడి చేస్తారు.


కేంద్రానికి వచ్చే ఆదాయం వంద రూపాయలనుకుంటే దానిలో అప్పుల ద్వారా 35, జిఎస్‌టి ద్వారా 16, ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను ద్వారా 15 చొప్పున, ఎక్సయిజ్‌ పన్ను ఏడు, కస్టమ్స్‌, పన్నేతర ఆదాయం ఐదేసి చొప్పున, ఇతరంగా రెండు రూపాయలు వస్తోంది. దీన్ని ఖర్చెలా చేస్తున్నారు ? వడ్డీ చెల్లింపులకు 20, రాష్ట్రాలకు పన్నుల వాటాగా 17, కేంద్ర పధకాలకు 15, ఆర్ధిక సంఘం, ఇతర బదిలీలకు 10, కేంద్ర ప్రాయోజిత పధకాలకు 9, ఇతర ఖర్చులకు 9, సబ్సిడీలు, రక్షణకు ఎనిమిది చొప్పున, పెన్షన్లకు నాలుగు వంతున ఖర్చు చేస్తున్నారు. అప్పులు తీసుకురావటాన్ని తప్పు పట్టాల్సినపనేమీ లేదు గానీ దాని వలన జరుగుతున్న వృద్ధి ఎంత అనేది మాత్రం ప్రశ్నార్ధకమే. పెట్టుబడి ఖర్చును పెంచినట్లు చెబుతున్నారు. రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేశారు. దీని వలన కలిగే మేలు ఏమంటే రోడ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, సిమెంట్‌, ఉక్కు, ఇతర ముడి సరకులకు గిరాకీ పెరుగుతుంది, ఆ పరిశ్రమలకు పని దొరుకుతుంది.గతంలో రోడ్ల నిర్మాణం అంటే మానవ శ్రమ గణనీయంగా ఉండేది, ఇప్పుడు యంత్రాలు ఆ పని చేస్తున్నాయి. ఇక ఈ రోడ్ల నిర్మాణానికి చమురు మీద సెస్‌లను విధించి జనాల నుంచే వసూలు చేస్తున్నారు. అదే జనాలు(ద్విచక్రవాహనాలు మినహా) రోడ్లను వినియోగిస్తే టోలు వసూలు చేస్తున్నారు. వాణిజ్యవాహనాలు చెల్లించే టోల్‌టాక్సు పరోక్షంగా తిరిగి జనం మీదనే రుద్దుతారు.


ఒక వైపు దేశాన్ని అప్పులపాలు చేయటంతో పాటు అనుసరిస్తున్న విధానాలు జనాలను కూడా అప్పుల ఊబిలో దింపుతున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వాలు, జనాలు ఇబ్బందులు, అప్పుల పాలయ్యారు, కుబేరులు మాత్రం మరింతగా పెరిగారు, బలపడ్డారు. ఇదెలా జరిగింది ? వారికి అనుకూలమైన విధానాలే కారణం, ఎవరినైనా ఇతర సహేతుక కారణాలు చెప్పమనండి. అనేక మంది పారిశ్రామికవేత్తలు కరోనా కారణంగా తమ సంస్ధలను మూసివేశారు, వాటిని పునరుద్దరించే పేరుతోనో మరొక సాకుతోనే ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందారు. పోనీ వాటిని తిరిగి పెట్టుబడిగా పెట్టి ఉపాధి కల్పించేందుకు పూనుకున్నారా అంటే అదెక్కడా కనిపించటం లేదు. కరోనా తొలి, ద్వితీయ తరంగాల్లో అనేక కుటుంబాలు ఆసుపత్రి ఖర్చుల కోసం ఉన్న ఆస్తులు అమ్మి, అప్పుల పాలైనా అనేక కుటుంబాల్లో ఆప్తులు దక్కలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచటం లేదు.


కుటుంబాలు కరోనాతో ఎలా దెబ్బతిన్నాయో, వత్తిడి ఎలా పెరిగిందో వారి బంగారం తాకట్టు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. రిజర్వుబాంకు నివేదిక ప్రకారం 2019 నవంబరు 22 నాటికి బాంకుల్లో బంగారు రుణాల మొత్తం రు.29,514 కోట్లు కాగా 2021 నవంబరు 19 నాటికి 65,630 కోట్లకు పెరిగాయి. ఇది అర్ధిక వ్యవస్ధ సజావుగా లేదనేందుకు ఒక సూచిక. వారు వ్యక్తులు లేదా చిన్న, సన్నకారు సంస్ధల వారు ఎవరైనా కావచ్చు.పత్రికల్లో ఏ రోజు చూసినా బంగారు తాకట్టు సంస్దల వేలం వార్తలు కనిపిస్తాయి. ఒక నాడు ఆర్ధిక భరోసా లేదా భద్రతగా భావించి కూడపెట్టుకున్న బంగారాన్ని ఒకసారి తాకట్టు పెట్టిన తరువాత విడిపించుకోవటం పెద్ద సమస్యగా మారుతోంది ఇప్పుడు. ముతూట్‌ ఫైనాన్స్‌ వంటి బంగారం తాకట్టు కంపెనీలు గత ఏడాది 21శాతం లాభాలు సంపాదించాయి. ఈ ఏడాది తాకట్టు రుణాలు 15శాతం పెరిగే అవకాశాలున్నట్లు అంచనా.


గృహ రుణాల్లో వినిమయ వస్తువుల కోసం చేసిన వాటి నుంచి అనేక రకాలు ఉంటాయి.2020లో జిడిపిలో ఈ అప్పు 12.6శాతం ఉంటే 2021 మార్చి నాటికి 14.5శాతానికి పెరిగింది. ఈ కాలంలో జనాలు విలాసవస్తువుల జోలికి పోలేదన్నది అందరికీ తెలిసిందే. 1999లో ఇది కేవలం 2.2శాతమే ఉంది. ఆ తరువాత జనాలతో అప్పులు చేయించి వస్తువుల కొనుగోలుకు ప్రోత్సహించిన అంశం తెలిసిందే.ఇదే కాలంలో కార్పొరేట్‌శక్తులు విద్య, వైద్యరంగాల్లో పెద్ద ఎత్తున విస్తరించటం, ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేసిన కారణంగా రుణగ్రస్త అంశాల్లో ఇవి కూడా ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి.2021 మార్చినాటికి గృహరుణ భారం 393 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు.మన కరెన్సీలో దాదాపు 30లక్షల కోట్ల రూపాయలు.


కరోనా లాక్‌డౌన్లు, మూసివేతలను ఎత్తివేసిన తరువాత అనేక సంస్దలు తిరిగి పాతవారికి అవకాశం ఇచ్చినప్పటికీ అనేక చోట్ల వేతనకోతలు ఉన్నాయి, అందువలన కుటుంబ అవసరాల కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎంత మంది విడిపించుకుంటారన్నది సందేహమే. కరోనాతో నిమిత్తం లేకుండానే గృహస్తుల పొదుపు తగ్గింది.2014-15లో జిడిపిలో 13శాతంగా ఉన్నది 2019-20కి పదకొండుశాతానికి, 2020-21 డిసెంబరు త్రైమాస కాలానికి 8.2శాతానికి పడిపోయింది. అంటే ఉన్న పొదుపును కరోనా ఖర్చు చేయించింది. కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఓ సమాచారం ప్రకారం గ్రామీణ కుటుంబాల సగటు అప్పు 2012-18 సంవత్సరాలలో 84, పట్టణాలలో 42శాతం చొప్పున పెరిగింది. 2021ఐసిఇ 360 సర్వే ప్రకారం 2015-16 నుంచి 2020-21తో పోలిస్తే దేశంలో దిగువన ఉన్న 20 పేద గృహస్తుల ఆదాయం 53శాతం తగ్గితే ఇదే కాలంలో 20శాతం ధనికులకు 39శాతం పెరిగింది. ఈ కాలమంతా నరేంద్రమోడీ అమలు చేసిన విధానాలే ఉన్నాయి.


రైతులపై 2021లో రణం సాగించిన నరేంద్రమోడీ సర్కార్‌ రానున్న రోజుల్లో కార్మికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుంది. లేబర్‌ కోడ్‌ పేరుతో ప్రతిపాదించిన అంశాలు ఇప్పుడున్న బేరమాడే శక్తిని, వారి హక్కులను మరింత హరిస్తాయి.యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసే బాటలో నడుస్తున్నారు. జనంపై రణం, దేశానికి రుణాన్ని పెంచటం తప్ప నరేంద్రమోడీ ఎనిమిది సంవత్సరాల పాలనలో చేసిందేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల పట్ల నరేంద్రమోడీ చిత్తశుద్దికి అగ్ని పరీక్ష !

15 Tuesday Feb 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

BJP, Farmers agitations, Fertilizers subsidies, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


2021 నరేంద్రమోడీ సర్కార్‌కు నిదురపట్టకుండా చేసింది. దిగిరాను దిగిరాను అంటూ భీష్మించుకు కూర్చున్న నరేంద్రమోడీ మెడలు వంచిన సంఘటిత శక్తి ఎంత బలమైనదో ప్రపంచానికి దేశ రైతులు చూపించారు.ఆదరాబాదరా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాతరవేసి మూడు సాగుచట్టాలను ఆమోదించటం, చివరకు రైతాంగానికి క్షమాపణ చెప్పి వాటిని ఉపసంహరించుకున్న తీరు తెలిసిందే. ఈ అధ్యాయంలో నరేంద్రమోడీ కంటే మోడీ తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోరని గుడ్డిగా నమ్మిన వారు ఎక్కువగా ఆశాభంగం చెందారు, అభాసుపాలయ్యారంటే అతిశయోక్తి కాదు. నిజానికి రైతాంగ ఉద్యమ విరమణ అంతం కాదు ఆరంభం- ఒక విరామం మాత్రమే !


రానున్న సంవత్సరాల్లో రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన అంశాలను కేంద్రం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరం.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశానికి సంబంధించి ఒక కమిటీని వేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దాని ఊసే ఎత్తటం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ప్రకటిస్తామని చెప్పారు. నిజానికి ఎన్నికలకు దానికి సంబంధం లేదు. కొద్ది నెలలైనా జాగు చేసేందుకే ఇలా చెప్పారన్నది స్పష్టం. దేశ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న కారణంగానే ఉన్న కొద్ది పాటి రక్షణలు కూడా రద్దు చేస్తున్నారనే ఆందోళనే రైతులు అసాధారణ రీతిలో ఉద్యమించటానికి కారణం. 2022-23 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌ కేటాయిలను చూస్తే రైతాంగం మరోసారి నిరాశకు గురయ్యారు.


కేంద్ర ప్రభుత్వం ఏడాదికేడాది సబ్సిడీలకు ఎసరు పెడుతున్నది.కేటాయింపు అంకెలు ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించటం లేదు. 2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని రకాల సబ్సిడీల విలువ రు.7,07,707 కోట్లు కాగా సవరించిన అంచనాల్లో ఆ మొత్తం రు.4,33,108 కోట్లకు అంటే 39శాతం కోతపడింది. పోనీ వచ్చే ఏడాది ఈ మొత్తమైనా ఇస్తున్నారా అంటే 2022-23 బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం రు.3,17,866 కోట్లు మాత్రమే. ఆకలిలో దేశ సూచిక మెరుగుపడిందేమీ లేదు.2020లో ప్రపంచ ఆకలి సూచికల్లో 107దేశాల్లో మనది 94వ స్ధానంలో ఉంది.2021లో 116దేశాలకు గాను 101వ స్ధానానికి దిగజారింది తప్ప మెరుగుపడలేదు. కానీ ఆహార సబ్సిడీని రు.5,41,330(2020-21) నుంచి 2022-23కు రు.2,86,469కోట్లకు కోత పెట్టారు.దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? వలస కార్మికులు పని స్దలాల నుంచి స్వస్ధలాలకు వెళ్లేందుకు కరోనా కాలంలో ఎన్ని ఇబ్బందులు పడిందీ దేశమంతా చూసింది. దాన్ని మరిచిపోయినట్లుగా వారే కరోనాను వ్యాప్తి చేసినట్లు నరేంద్రమోడీ తాజాగా ఆరోపించిన అంశం తెలిసిందే. వారికి, పనులు కోల్పోయిన వారికి అవసరమైన మొత్తంలో ఆహార ధాన్యాలను కూడా కేంద్రం సరఫరా చేయలేదు. మనిషికి నెలకు ఐదు కిలోలు ఇచ్చి వాటినే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. చమురు సబ్సిడీలు రు.38,455 నుంచి రు.6,517 కోట్లకు కోత పెట్టారు. వంటగాస్‌ సబ్సిడీ రు.14,073 కోట్లు ఇస్తామని చెప్పిన కేంద్రం ఆచరణలో రు.6,517 కోట్లకు కోత పెట్టింది.వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రు.5,813 కోట్లకు తగ్గించారు. ఇక ఎరువుల సబ్సిడీ తీరుతెన్నులను చూద్దాం. 2021-22లో రు.1,40,122 కోట్లు ఉంటుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని 2022-23లో రు.1,05,222 కోట్లుగా ప్రతిపాదించారు, 35వేల కోట్లు కోత పెట్టారు.


గతేడాది పట్టువదల కుండా రైతు ఉద్యమం జరగటం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాతావరణం, ఇదే తరుణంలో డిఏపి, మిశ్రమ ఎరువుల ధరలు గణనీయంగా పెరగటంతో కేంద్ర ప్రభుత్వం మరొకదారి లేక ఎరువుల సబ్సిడీని పెంచకతప్ప లేదు. గత పది సంవత్సరాలలో కేంద్రం ఎరువులపై రాయితీలను 70-80వేల కోట్ల రూపాయల మధ్యనే ఇచ్చింది. ప్రస్తుతం చమురు, గాస్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపధ్యంలో దిగుమతి ఖర్చు తడిచి మోపెడు అవుతుంది. దాన్ని రైతులు భరించాలా, కేంద్రం గతేడాది మాదిరి అదనపు కేటాయింపులతో భరిస్తుందా అన్నది తెలియదు. అంతర్జాతీయంగా వరుసగా రెండు సంవత్సరాల నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా గతం కంటే ఎక్కువగా పెరిగిన అంశం తెలిసినప్పటికీ కేంద్రం ఎరువుల సబ్సిడీకి కోత పెట్టిందంటే పెరిగిన మేరకు రైతులే భరించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మాదిరే దిగుమతి చేసుకుంటున్న ధరల మీద ప్రతిపాదించిన సబ్సిడీని పరిమితం చేస్తే ఆరేడు నెలలకు మించి రాదని విశ్లేషకులు చెబుతున్నారు. యురియా ధరలను పెంచటం ద్వారా సబ్సిడీని సర్దుబాటు చేసే అవకాశం కూడా ఉంది. గతేడాది బడ్జెట్‌లో రు.79,530 కోట్లు ప్రతిపాదించినా దిగుమతి,ఉత్పాదక ఖర్చు విపరీతంగా పెరిగినందున ఆ మొత్తాన్ని రు.1,40,122 కోట్లకు పెంచారు.


అంతర్జాతీయ మార్కెట్లో యురియా ధర 2021 ఏప్రిల్‌ ఒకటి 2022 జనవరి 28 మధ్య టన్ను ధర 357నుంచి 869డాలర్లకు పెరిగింది.(నవంబరు నెలలో 959 డాలర్లు పలికింది) డిఏపి ధర ఇదే కాలంలో 400 నుంచి 930 డాలర్లకు పెరిగింది. దాన్ని మొత్తంగా లేదా ముడిసరకులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే గతేడాది 46వేల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించాల్సివచ్చింది. ఇప్పుడు ధరలు తగ్గే సూచనలు లేవు.యురియా ఉత్పత్తికి అవసరమమైన గాస్‌ ధర దేశీయంగా కూడా పెరిగింది. మన దేశం 67శాతం ఎల్‌ఎన్‌జి దిగుమతి చేసుకుంటోంది. దాదాపు ఏడాది కాలంగా చైనా ఎరువుల ఎగుమతులపై అనేక ఆంక్షలు విధించటం కూడా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుదలకు ఒక కారణం. తమ అవసరాల్లో నాలుగోవంతు పొటాష్‌ ఎరువులు చైనా నుంచి ఇతర దేవాలు దిగుమతి చేసుకుంటున్నా యి. మన దేశంలో యురియా ధరలను మాత్రమే నియంత్రణ పరిధిలో ఉంచి మిగిలిన ఎరువులన్నింటీని మార్కెట్‌ శక్తులకు వదలివేశారు. వాటి మీద పరిమితంగా సబ్సిడీలు పోను భారమంతా రైతులమీదే పడుతోంది. మన దేశంలో ఏటా 18.7 మిలియన్‌ టన్నుల యురియా దిగుమతి లేదా దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. డిఏపి మూడు, మిశ్రమ(ఎన్‌పికె) ఎరువులు 6.8మి.టన్నులు దిగుమతి లేదా ఉత్పత్తి అవుతున్నాయి. గతేడాది రు.1.4లక్షల కోట్ల సబ్సిడీలో లక్ష కోట్ల వరకు యురియా సబ్సిడీకే కేటాయించారు.


మనది వ్యవసాయ ప్రధాన దేశం ఐనప్పటికీ రసాయన ఎరువుల వినియోగంలో చాలా వెనుకబడి ఉంది. 2018 సమాచారం ప్రకారం 162 దేశాల్లో హెక్టారుకు 393.2 కిలోలతో చైనా 12వ స్ధానంలో ఉండగా 49వ స్ధానంలో ఉన్న మన వినియోగం 175కిలోలు. రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ప్రకారం 2019-20లో సగటు వినియోగం 133.44 కిలోలు ఉంది. గతేడాది ప్రభుత్వ రంగ సంస్ధ ఇఫ్‌కో కొత్త స్టాక్‌ ఎరువుల ధరలను పెంచుతూ డీలర్లకు పంపిన సమాచారం మీద రైతాంగం గగ్గోలు పెట్టింది. గరిష్టంగా 58.33 డిఏపి, ఇతర ఎరువుల ధరలను 46 నుంచి 51.9శాతం వరకు పెంచుతున్నట్లు పేర్కొన్నది. అప్పటికే రైతుల ఉద్యమిస్తుండటంతో కంగారు పడిన సర్కార్‌ వత్తిడి తెచ్చి ధరల పెరుగుదలను తాము అనుమతించలేదని పేర్కొన్నది. నిజానికి యురియా తప్ప మిగతా ఎరువుల ధరలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. సబ్సిడీ ఇస్తున్నందున ఏ ఎరువును ఎంతకు అమ్మాలో మాత్రమే ప్రకటిస్తుంది. తమ దగ్గర అప్పటికే ఉన్న 11.26లక్షల టన్నుల ఎరువులకు పెంచిన ధరలు వర్తించవని, కొత్త ఉత్పత్తికి తాత్కాలిక ధరలను మాత్రమే సూచించామని ఇఫ్‌కో పేర్కొన్నది. ధరలపై నియంత్రణ లేదని కూడా ఆ సంస్ధ అధికారి గుర్తు చేశారు. తమ నిర్ణయంతో ప్రభుత్వానికి లేదా మరొక పార్టీకి గానీ సంబంధం లేదని చెప్పారు. ఉత్పత్తిదారుగా ఉన్నందున కొత్త స్టాకు సంచులపై పెరిగిన ధరలను ముద్రించాలంటే ముందుగానే ఆదేశించాల్సి ఉంటుందన్నారు. అంటే ధరల పెంపుదల తప్పదన్నది స్పష్టం. ఈ పెరిగే ధరల్లో కేంద్రం సబ్సిడీ ఇస్తుందా, మొత్తం రైతాంగం మీదనే మోపుతారా అన్నది చూడాల్సి ఉంది.

ఇఫ్‌కో సంస్ధ ప్రకటించిన దాని ప్రకారం ఎరువుల ధరల పెంపుదల ప్రతిపాదన ఇలా ఉంది.( యాభై కిలోల ధర రూపాయలలో )
ఎరువు రకం××××× పాత ధర×××× కొత్త ధర
10:26:26×××××× 1,175 ×××× 1,775
12:32:16×××××× 1,185 ×××× 1,800
20:0:13 ×××××× 925 ×××× 1,350
డిఏపి ×××××× 1,200 ×××× 1,900
కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు అందించిన సమాచారం ప్రకారం సగటున హెక్టారుకు 2015-16లో ఎరువుల వినియోగం 135.76కిలోలు ఉండగా మరుసటి ఏడాదికి 123.41కి తగ్గింది, 2019-20కి 133.44 కిలోలకు పెరిగింది.పైన పేర్కొన్న పట్టిక ప్రకారం నాలుగు ఎరువులను కలిపి 50కిలోల యూనిట్‌గా తీసుకుంటే సగటున పాత ధర రూ.1,121 ఉంది, పెంపుదల అమల్లోకి వస్తే రు.1,706 అవుతుంది. ఈ లెక్కన దేశ సగటు వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఒక హెక్టారుకు పెరిగే పెట్టుబడి భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరుగుతుంది. గరిష్ట స్ధాయిలో బీహార్‌లో హెక్టారుకు 245.25కిలోలు వినియోగిస్తుండగా అత్యల్పంగా కేరళలో 36.49 కిలోలు మాత్రమే వినియోగిస్తున్నారు. సగటున రెండువందల కిలోలు వినియోగిస్తున్న రాష్ట్రాలలో పంజాబ్‌, హర్యానా, తెలంగాణా ఉన్నాయి. దేశ సగటు కంటే తక్కువ వినియోగం ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ ఉన్నాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే బీహార్‌లో ఒక హెక్టారు ఉన్న రైతుకు భారం రు.2,991 నుంచి రు.4,553కు పెరిగితే అదే కేరళలోని రైతుకు రు.818 నుంచి రు.1,245కు పెరుగుతుంది.


అవసరానికి మించి యురియా వాడకం వలన భూమి ఆరోగ్యం దెబ్బతింటున్నదని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ సబ్సిడీ భారాన్ని తగ్గించుకొనేందుకు యురియా మీదనే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నది. దాంతో మిగతా ఎరువుల ధరలతో పోలిస్తే అది చౌకగా ఉండటంతో రైతాంగం అటే మొగ్గుతున్నది. అందువలన ఇతర ఎరువులకు సబ్సిడీని పెంచితే ఎరువుల వాడకంలో సమతుల్యత ఏర్పడుతుంది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ఇప్పుడున్న బిజెపి పాలకులకు అవేమీ పట్టటంలేదు. అసమతుల్యత కారణంగా ఆహారధాన్యాల ఉత్పాదకత తగ్గుతోందని కూడా విశ్లేషణలు చెబుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫిరోజ్‌పూర్‌లో పంజాబ్‌ రైతుల అనూహ్య నిరసన -సంయమనం కోల్పోయిన ప్రధాని నరేంద్రమోడీ ?

06 Thursday Jan 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Farmers agitations, Narendra Modi, Narendra Modi Failures, PM Modi security breach, Satya Pal Malik


ఎం కోటేశ్వరరావు


జనవరి ఐదు, బుధవారం నాడు జరిగిన అనూహ్యపరిణామాల మధ్య పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా హుసేనీవాలాలో జరగాల్సిన సభలో పాల్గొనకుండా ప్రధాని నరేంద్రమోడీ వెనక్కు వెళ్లిపోయారు. సభా స్ధలికి 30కిలోమీటర్ల దూరంలోని రోడ్డుమీద ఒక పైవంతెన(ఫ్లైఓవర్‌) సమీపంలో రైతులు నిరసన తెలపటంతో 15-20నిమిషాల పాటు ప్రధాని, వాహన శ్రేణి వంతెన మీద నిలిచిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి ముందుకు వెళ్లకుండానే వెనుదిరిగి భటిండా విమానాశ్రయానికి వచ్చి ఢిల్లీ వెళ్లిపోయారు. పంజాబ్‌ ప్రభుత్వ భద్రతాలోపాల కారణంగానే ఇలా జరిగిందని బిజెపి, కేంద్ర ప్రభుత్వం ఆరోపించాయి. గురువారం నాడు భద్రత అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై సమీక్షించింది. రాష్ట్రపతి రామానాధ్‌ కోవింద్‌ను కలిసి బుధవారం జరిగిన ఉదంతం గురించి ప్రధాని నరేంద్రమోడీ వివరించారు. రాష్ట్రపతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలను దీనికి బాధ్యులుగా చేయాలని సుప్రీం కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలైంది. నరేంద్రమోడీని కాంగ్రెస్‌ ద్వేషించింది, ఇప్పుడు హాని తలపెట్టాలని చూసిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. జరిగిన దాని మీద విచారం వ్యక్తం చేసిన పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ , కాంగ్రెస్‌ కూడా బిజెపి ఆరోపణను తోసిపుచ్చింది.తగు సంఖ్యలో బలగాలను దింపి ఏర్పాట్లు చేయలేదని కేంద్ర హౌంమంత్రిత్వశాఖ ఆరోపించింది. కాంగ్రెసే ఇది చేసినట్లు ఆరోపిస్తూ అందుకు క్షమాపణ చెప్పాలని అమిత్‌ షా అన్నారు.
పంజాబ్‌ పోలీసు యంత్రాంగ భద్రతాపరమైన లోపాల కారణంగానే ఇది జరిగిందని, అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ గనుక దాని నేతలు క్షమాపణ చెప్పాలంటూ బిజెపి డిమాండ్‌ చేసింది. కేంద్ర హౌంశాఖ సహజంగానే వివరణ ఇవ్వాలని, బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ఇద్దరితో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు గురువారం నాడు ప్రకటించింది.విశ్రాంత న్యాయమూర్తి మెహతాబ్‌ సింగ్‌ గిల్‌, హౌంశాఖ ముఖ్యకార్యదర్శి అనురాగ్‌ వర్మ దీనిలో సభ్యులు. ఈ ఉదంతంపై విచారణ జరపాలని కోరటం గానీ, విచారించటంపైగానీ విబేధించాల్సిందేమీ లేదు. పంజాబ్‌ పోలీసులు తగువిధంగా వ్యవహరించలేదా లేక రైతుల చిన్నపాటి నిరసనను సాకుగా చూపి నరేంద్రమోడీ జనం లేని సభను రద్దుచేసుకొన్నారా అన్నది జనానికి తెలియాలి. అంతే కాదు ప్రధాని భద్రతను చూసే ప్రత్యేక రక్షణ దళం(ఎస్‌పిజి), కేంద్ర గూఢచార విభాగం ఏమి చేసిందన్నది, రోడ్డు మార్గంలో వెళ్లాలని ఎప్పుడు తెలిపారన్నది ఆసక్తికరంగా మారింది.


హుస్సేనీవాలా సభకు జనం చాలా తక్కువగా రావటంతో పాటు భారీ వర్షం, వాతావరణం కూడా అనుకూలించలేదని తెలియటంతో ఎన్నికల సభ కానప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపుతుందనే దూరాలోచనతో నరేంద్రమోడీ సభను రద్దు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. సాగు చట్టాల మీద ఉద్యమించిన సంఘాల వేదిక కిసాన్‌ ఏక్తా మోర్చా ఒకట్వీట్‌ చేస్తూ రైతులు, పంజాబు జనం పెద్ద ఎత్తున నిరసన తెలిపిన కారణంగానే మోడీ తన సభను రద్దు చేసుకున్నారని, సభా స్ధలిలో చాలా తక్కువ మంది ఉన్నారని, వారిని కూడా బలవంతంగా తీసుకువచ్చినట్లు, పంజాబీల నుంచి ప్రతికూల స్పందన కారణంగా సభ రద్దు జరిగినట్లు పేర్కొన్నది.
ఢిల్లీ నుంచి భటిండా వరకు విమానంలో వచ్చిన ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హుస్సేనీవాలా వెళ్లాలన్నది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం. మధ్యాహ్నం 1.30కు సభ ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం 10.20కి విమానశ్రయంలో దిగిన ప్రధాని వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేనీవాలా చేరాలంటే రెండు గంటలు పడుతుంది,వాతావరణం సరిగా లేని కారణంగా రోడ్డు మార్గాన వెళ్లాలని నిర్ణయించారు 11.50కి ప్రధాని రోడ్డు మార్గాన బయలు దేరారు.


ప్రధాని పర్యటనలకు ముందు ఎఎస్‌ఎల్‌(ముందస్తు పర్యవేక్షక సమావేశం) నిర్వహించి అనుకోని పరిస్ధితులు ఏర్పడినపుడు ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా చర్చిస్తారు. తగు ఏర్పాట్లు చేస్తారు. రక్షణ బాధ్యత ఎస్‌పిజి కమాండోలదే.ఎస్‌పి హౌదా కలిగిన కమాండెంట్‌, 40 నుంచి 60 మంది వరకు సిబ్బంది ఉంటారు.వీరు అంతర వలయంగా పని చేస్తారు. తరువాత ఇతర భద్రతా సిబ్బంది ఉంటారు. . ప్రధాని ఒక బహిరంగ సభలో, ఇతర కార్యక్రమంలో పాల్గొన్నా,ఈ అంతరవలయంలోకి రాష్ట్రపోలీసులను అనుమతించరు.ప్రధాని ప్రయాణించే మార్గాన్ని ఖరారు చేయటం, సిబ్బందిని ఏర్పాటు చేయటంలో స్ధానిక పోలీసులకు పాత్ర ఉన్నప్పటికీ ఆ మార్గాన్ని రక్షించేందుకు పారామిలిటరీని రంగంలోకి దించుతారు. ఏవైనా టవర్లు, ఎత్తైన భవనాల వంటివి ఆ మార్గంలో ఉంటే అక్కడ వారే ఉంటారు. రోడ్డు మీదకు ఎవరూ రాకుండా, పనులు చేయకుండా స్ధానిక పోలీసులు చూస్తారు. మూడు నాలుగు గంటల ముందే రోడ్లను శుభ్రపరచటం వంటివి చేస్తారు. బుధవారం నాటి ప్రధాని పర్యటనకు అవన్నీ చేసేందుకు స్ధానిక పోలీసులకు అవకాశం ఉందా అన్నది ప్రశ్న. భారీ వర్షం, వాతావరణం సరిగా లేని కారణంగా (బిపిన్‌ రావత్‌ ఇతర మిలిటరీ అధికారుల దుర్మరణం నేపధ్యంలో ప్రధానిని హెలికాప్టర్‌లో తీసుకు వెళ్లేందుకు భద్రతా సిబ్బంది తిరస్కరించి ఉండవచ్చు) రోడ్డు మార్గాన వెళ్లాలని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. ఏఎస్‌ఎల్‌ సమావేశంలో ప్రత్నామ్నాయ మార్గం గురించి ఆలోచించి ఉంటే ఆ దిశగా వేరే మార్గంలోకి ఎందుకు మళ్లించలేదు, రైతుల ఆందోళనను ఊహించి ఎందుకు అంచనా వేయలేదు అన్న ప్రశ్నలు, ఆ ప్రాంతంలో మరొక మార్గం లేదన్న వార్తలు వచ్చాయి. రైతులు ఆందోళనకు దిగితే కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్‌ ఎందుకు పసిగట్టలేకపోయిందన్న ప్రశ్నలూ ఉన్నాయి. ఒకవేళ పసిగట్టినా రైతులు తప్పించుకొని నిరసన తెలిపి రోడ్డును ఎలా దిగ్బంధించారు అన్నది తేలాల్సి ఉంది. పర్యటన గురించి ఎంతో ముందుగానే తెలిపినందున తగు భద్రతతో పాటు ప్రత్నామాయ ఏర్పాట్ల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నది కేంద్ర వాదన.


ప్రధాని వచ్చే మార్గం పంజాబ్‌ పోలీసులకు తెలుసని, వారే ఉప్పందించి ఉండకపోతే అప్పటికప్పుడు రైతులు ఎలా సమీకృతులౌతారంటూ బిజెపి నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు.ప్రధాని రోడ్డుమార్గాన వస్తున్నట్లు టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయని, వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా తెలిసిందని, హుస్సేనివాలా వెళ్లేందుకు ఒక్కటే రోడ్డు మార్గం ఉన్నందున తమకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని రైతులు చెబుతున్నారు. సోమవారం నుంచే రైతులు ఆందోళనకు దిగారని మంగళవారం రాత్రి రైతులతో మాట్లాడి నిరసన తెలపవద్దని కోరగా అంగీకరించారని, తాను తెల్లవారు ఝామున 3గంటల వరకు చర్చించానని, తెల్లవారే సరికి కొందరు ఎలా వచ్చారో తెలియ లేదని ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ చెప్పారు. వాతావరణం సరిగా లేకపోవటం, రైతుల ఆందోళన కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించామని, తొలుత హెలికాప్టర్‌ ద్వారా అనుకున్న కార్యక్రమానికి భిన్నంగా ఆక్మసికంగా మార్చుకున్న నిర్ణయం గురించి సమాచారం లేదని సిఎం చెప్పారు. ఏ పోలీసు అధికారి మీద చర్య తీసుకొనేది లేదని, పంజాబీల మీద లాఠీలు, తూటాలను ప్రయోగించేది లేని కూడా చెప్పారు. నిరసన తెలిపిన రైతులు సమీపంలోని మిస్రీవాలా, పైరేవాలా గ్రామాలకు చెందిన వారని, మూడు రైతు సంఘాల జెండాలను ఎగురవేసినట్లు, సభకు వెళుతున్న బిజెపి మద్దతుదార్ల వాహనాలను కూడా ఆపినట్లు ఇండియా టుడే విలేకరి రాశారు.ప్రధానికి నిరసన తెలపాలని నిర్ణయించిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి గజేంద్ర షెఖావత్‌ మంగళవారం రాత్రి చర్చలు జరిపిన తరువాత ఆందోళన కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేశారు. జనవరి పదిహేను నాటికి ఎంఎస్‌పికి చట్టబద్దతను పరిశీలించే కమిటీని ఏర్పాటు చేస్తామని, మార్చి 15న రైతులతో ప్రధాని కలుస్తారని మంత్రి వారికి చెప్పారు.


” భటిండా విమానాశ్రయానికి ప్రాణాలతో తిరిగి వచ్చాను, అందుకుగాను మీ ముఖ్యమంత్రికి నా కృతజ్ఞతలు తెలపండి ” అని ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్‌ అధికారులతో ఢిల్లీ తిరుగు ప్రయాణంలో అన్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్ధ పేర్కొన్నది. ఈ ఎత్తిపొడుపు లేదా వ్యంగ్యం గురించి ఎలాంటి వివరణ వెలువడనందున ఆ వ్యాఖ్య నిజమే అనుకోవాలి. ఓట్ల కోసం రాజకీయ నేతలు ఏ అవకాశాన్నీ వదులుకోరని గతంలోనే రుజువైనందున ప్రధాని మోడీ ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవటంలో ఆశ్చర్యం ఏముంటుంది ! దేశంలో తనకు ఎదురులేదని భావిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ఈ ఘటనను అవమానకరంగా భావించారా ? మయసభలో రారాజు మాదిరి మానసికంగా గాయపడ్డారా ?


నిజానికి ప్రధాని వెనక్కు కాకుండా ముందుకు సాగి నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు వెళ్లి వారెందుకు అలా చేశారో తెలుసుకొని భరోసా ఇచ్చి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. సాగు చట్టాల రద్దు చేస్తూ క్షమాపణలు కూడా చెప్పి వారి డిమాండ్ల పరిశీలనకు కమిటీ వేస్తానని హామీ ఇచ్చిన తరువాత ఇంకా ఎందుకు నిరసన తెలుపుతున్నారో తెలుసుకుంటే రైతాంగానికి దగ్గర కావాలన్న లక్ష్యం కొంత మేరకు నెరవేరి ఉండేదేమో ! ఒకటి మాత్రం స్పష్టం. ఫిరోజ్‌పూర్‌ ఉదంతాన్ని కాంగ్రెస్‌ మీద దాడి చేసేందుకు ఉపయోగించుకొని ఒక రాజకీయవేత్తగా నరేంద్రమోడీ ప్రయత్నించారు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు పంజాబ్‌లో బిజెపి, దానితో చేతులు కలిపిన మాజీ(కాంగ్రెస్‌)సిఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ పార్టీ, అకాలీదళ్‌ నుంచి వచ్చిన చిన్న చీలిక గ్రూపుకు గానీ దీంతో ఎలాంటి ప్రయోజనం కలగదు. కాంగ్రెస్‌కు ఆమ్‌ ఆద్మీపోటీ గట్టి పోటీదారుగా ఉందన్న వాతావరణం ఇప్పటికే ఏర్పడింది. ఫ్లైఓవర్‌ ఉదంతానికి ముందు జరిగిన పరిణామాలను చూస్తే సాగు చట్టాల అంశంలో రైతులు నరేంద్రమోడీ మీద ఇంకా ఆగ్రహంగానే ఉన్నారన్నది స్పష్టమైంది.

నోటిఫికేషన్‌ వెలువడక ముందే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అభివృద్ది పనుల పేరుతో పలు చోట్ల ఓటర్లను ఆకట్టుకొనేందుకు నరేంద్రమోడీ సభలు పెడుతున్నారు. దానిలో భాగంగానే రు.42,750 కోట్లతో రూపొందించిన పధకాలను పంజాబీలకు ఎరగా వేసేందుకు బుధవారం నాడు సభను ఏర్పాటు చేశారు. అదేమీ రహస్యసభ కాదు కనుక నిరసన తెలపాలని రైతులు నిర్ణయించారు.
రైతులను రెండు వార్తలు మరింతగా ప్రేరేపించినట్లు చెప్పవచ్చు. సాగు చట్టాల మార్పును పరిశీలించాలని తాను కలిసినపుడు మోడీతో చెప్పానని, చాలా పెడసరంగా మాట్లాడినపుడు ఐదు నిమిషాలు ఆ సందర్భంగా వాదనలు జరిగినట్లు ప్రస్తుతం మేఘాలయ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్‌ మాలిక్‌ చెప్పారు. రైతులు మరణిస్తున్నారని, చట్టాలను సవరించాలని తాను కోరగా వారేమైనా నా కోసం చచ్చారా అని మోడీ దురహంకారంతో అన్నట్లు మాలిక్‌ చెప్పారు. ఈ వార్త కూడా పంజాబ్‌ రైతులకు ఆగ్రహం కలిగించి నిరసనలకు ప్రేరేపించిందన్నది స్పష్టం. దీనికి తోడు లఖింపూర్‌ ఖేరీలో రైతులపై( వారంతా సిక్కు సామాజిక తరగతి వారు) కార్లను తోలి నలుగుర్ని బలితీసుకున్న ఉదంతంలో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఆషిష్‌ మిశ్రా ప్రధాన నిందుతుడని, ఆ దుర్మార్గం జరిగినపుడు అతడు అక్కడే ఉన్నట్లు దాఖలైన చార్జిషీట్‌ వార్త కూడా వచ్చిన అంశం తెలిసిందే. సదరు కేంద్రమంత్రిని పదవి నుంచి తొలగించాలని రైతు సంఘాలు చేసిన డిమాండ్‌ను నరేంద్రమోడీ పెడచెవిన పెట్టి కొనసాగిస్తున్నారు. సాగు చట్టాల రద్దు తరువాత ఎన్నికలు జరగాల్సిన పంజాబులో మోడీ తొలి పర్యటన అవమానకరంగా ముసిందని చెప్పవచ్చు.


ఈ ఉదంతం జరిగి ఉండాల్సింది కాదనటంలో మరోమాట లేదు. దేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని కొందరు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు, చరిత్రలో జరగనివి ఇటీవల అనేకం జరుగుతున్నాయి. రైతులు నిరసన తెలిపేందుకు తమ రాజధానికి వస్తే రోడ్ల మీద మేకులు కొట్టి, కాంక్రీటు దిమ్మలు పోసి నానాయాతనలకు గురి చేసింది నరేంద్రమోడీ కాదా ! ఒక ఇరవై నిమిషాలు నిలిచి పోవాల్సి వచ్చినందుకే అవమానంగా భావిస్తే రైతులు ఏడాది పాటు ఏం జరుగుతుందో తెలియని స్ధితిలో గడపారని మరచిపోవద్దు. వారిని ఉగ్రవాదులని, అసలు రైతులే కాదని చేసిన ప్రచారాలు, నిరసన శిబిరాల మీద దాడులకు పురికొల్పిన ఉదంతాలను అంత సులభంగా మరచిపోతారా? వాతావరణం బాగోలేనపుడు గతంలో అనేక కార్యక్రమాలను రద్దు చేసుకోలేదా ? బుధవారం నాడు కూడా అదే ఎందుకు చేయలేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత వ్యవసాయ రంగం – నరేంద్రమోడీ : ఇంతకాలం రైతు ఉద్యమం – ఇక కార్పొరేట్ల వత్తిడి ప్రారంభం !

09 Thursday Dec 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

agriculture in india, Farmers agitations, Minimum Support Prices, MSP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఏడాదికి పైగా సాగిన మహత్తర రైతు ఉద్యమం మూడు సాగు చట్టాల రద్దుతో ఘన విజయం సాధించింది. సింహం లాంటి నరేంద్రమోడీ ఎత్తుగడగా ఒక అడుగు వెనక్కు తగ్గారు తప్ప తగు సమయంలో తిరిగి అదే అజండాతో ముందుకు వస్తారని మోడీ అభిమానులు వెంటనే స్పందించటాన్ని చూశాము. వారికి రైతు ఉద్యమం మీద ఉన్న అవగాహన కంటే నరేంద్రమోడీ మీద పెంచుకున్న విశ్వాసం బలంగా ఉందన్నది స్పష్టం. రైతుల పోరాటం ముందుకు తెచ్చిన ఇతర ప్రధాన అంశాలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. కొన్నింటిపై ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీల మేరకు ఉద్యమ విరమణ ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి చర్చ, అవసరమైతే తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు జనవరి 15న సమావేశం జరపనున్నట్లుసంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతలు ప్రకటించారు. సమస్యల తీవ్రత, సంక్లిష్టత, అనుమానాల దృష్ట్యా 378 రోజుల పోరులో ఒక విరామంగానే దీన్ని చెప్పవచ్చు.


కనీస మద్దతు ధరల చట్టం గురించి ఒక కమిటీని వేస్తామని, దానిలో రైతు సంఘాల ప్రతినిధులు ఉంటారని కూడా చెప్పారు. ఆ కమిటీని వేస్తారు, వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోపు దాని నివేదిక వచ్చే అవకాశాలు లేవు. ఎన్నికల పబ్బం గడచిన తరువాత ఏం జరుగుతుందో చెప్పలేము.ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. కొన్ని అంశాలను చూద్దాం. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి టి.నందకుమార్‌ డిసెంబరు 8వ తేదీన రాసిన విశ్లేషణాభిప్రాయంలో వెంటనే ఎంఎస్‌పి డిమాండ్‌ను భరించగలిగే స్ధితి దేశానికి లేదని, అరాజకత్వం, దీర్ఘకాలిక నష్టం జరుగుతుందంటూ గుండెలు బాదుకున్నారు. ఇదేమీ అనూహ్యమైంది కాదు, ఇలాంటి వారు సాగు చట్టాలకు ముందు-తరువాత చర్చలో – రద్దు తరువాత కూడా ఇదే వైఖరిని వెల్లడించారు. వీరంతా స్వదేశీ-విదేశీ కార్పొరేట్‌ లాబీకి చెందిన పెద్దమనుషులు. రైతులను విభజించే వాదనలను కూడా నందకుమార్‌ ముందుకు తెచ్చారు. మిగులు పంటను అమ్ముకొనే తరగతి రైతులు ఎవరు ? ఏ ప్రాంతాల్లో సేకరణకు అవసరమైన సదుపాయాలున్నాయి ? వర్షాధారిత రైతులకు పెట్టుబడి సబ్సిడీలు అందకపోతే, సేకరణ వ్యవస్తలు అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుంది ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే ఆ మేరకు జరుగుతోందా లేదా అని ప్రతిలావాదేవీని తనిఖీ సిబ్బంది చూడాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన వారిని శిక్షించాలి.అప్పుడు వ్యాపారులెవరూ మార్కెట్లో ఉండరు, ప్రభుత్వ విక్రయాల కోసం ఎదురు చూస్తారు. అప్పుడు ప్రభుత్వం ఏకైక వ్యాపారి అవుతుంది.అది విపత్తుకు దారి తీస్తుంది. ప్రస్తుత డిమాండ్‌ను చూస్తే విశ్వాస ప్రాతిపదిక వ్యవస్ధ బదులు హక్కుల వ్యవస్ధను కోరుతున్నారు. అదే జరిగితే పంజాబ్‌ మరికొన్ని రాష్ట్రాలకు పరిమితమైన దానిని దేశమంతటా విస్తరించాల్సి ఉంటుంది. ఆహారభద్రత హక్కు మాదిరి రైతులకు సేకరణ హక్కు లభిస్తుంది. అదే జరిగితే అదొక సేకరణ పధకం లేదా మద్దతు ధరకంటే తక్కువకు అమ్ముకుంటే ఆ తేడాను చెల్లించేది లేదా రెండూ అమలు జరపాల్సి రావచ్చు. అప్పుడేం జరుగుతుంది అని నందకుమార్‌ ప్రశ్నించారు.


మిగులు పంటను అమ్ముకొనే వారా లేకా స్వంత అవసరాల కోసం పండించుకొనే వారా అన్నది అసంబద్ద వాదన. అసలు ఎవరికీ సాగు గిట్టుబాటు కావటం లేదన్నది అసలు సమస్య. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా 116 దేశాల్లో ఆకలిలో 101వ స్ధానంలో ఉన్నామనే అంశం ఇలాంటి వాదనలు చేసే వారికి తెలుసా ? ఎవరి అవసరాలకు సరిపడా వారు పండించుకుంటే మిగులు లేకుండా ఆకలిని తీర్చేదెవరు ? అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలని-అక్కడి కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలని చెబుతున్నారా ? వర్షాధారిత ప్రాంతాల రైతులను ఆదుకొనేందుకు అవసరమైన పధకాలను అమలు జరిపితే సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు మరొకరెవరైనా అడ్డుకున్నారా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు ధరలను నిర్ణయించే అవకాశం, హక్కు పారిశ్రామిక, వాణిజ్యసంస్ధలకు ఉన్నపుడు రైతులకు అలాంటి అలాంటి హక్కు ఎందుకు కలిగించకూడదు ? ప్రతి రైతుకు అలాంటి అవకాశం లేదు కనుక వారి తరఫున ఆ పని ప్రభుత్వమే చేయాలి. ఇన్నేండ్లుగా విశ్వాసాన్ని వమ్ము చేశారు కనుకనే రైతులు హక్కుల విధానాన్ని కోరుతున్నారు. పెట్టుబడులు రావాలంటే పారిశ్రామిక, వాణిజ్య సంస్దలకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయి, ఇష్టం వచ్చినపుడు కార్మికులను నియమించుకొనే, తీసివేసే స్వేచ్చ ఇవ్వాలన్న వత్తిడికి లొంగి ఆ చట్టాలకు ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే వ్యాపారులు మార్కెట్‌ నుంచి తప్పుకుంటారని చెప్పటం బెదిరింపు తప్ప మరొకటి కాదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధరలకంటే తక్కువ వెలకు వినియోగదారులకు అమ్మాలనే నిబంధనలేమీ లేనపుడు వారికి వచ్చే నష్టం ఏమిటి ?


నందకుమార్‌ ముందుకు తెచ్చిన మరికొన్ని వాదనలేమిటి ? ఇరవై మూడు పంటలకు ఇప్పటికే ఉన్న ఎంఎస్‌పికి చట్టబద్దమైన హామీ కల్పించాలని అడుగుతున్నారు. ఇతర రైతుల గురించి ఎలాంటి నిర్దిష్టత లేదు. అందువలన వారు కూడా ఎంఎస్‌పిని అడగరని ఏముంది ? (నిర్ధిష్టత లేకపోతే ప్రభుత్వం ఆ పని చేస్తే వద్దన్నదెవరు ? ఇతర పంటలకూ ఎంఎస్‌పి అడిగితే ఇవ్వాలి. సాగు చేయాలా వద్దా ? ఇతర పంటలు అవసరం లేదా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు అలాంటి పరిమితులేమీ లేవుగా !) ప్రస్తుతం ఎంఎస్‌పి పరిధిలో ఉన్న 23 పంటల విలువ ఏడులక్షల కోట్ల రూపాయలు.చట్టబద్దత కల్పిస్తే అదనపు ఖర్చు రు.47,764(2017-18 సమాచారం) అవుతుందని కిరన్‌ విస్సా, యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. వీరు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.వాటిలో ఆహార సబ్సిడీ రు.2,40,000 కోట్లున్నాయి.(ఇంత సబ్సిడీ ఇచ్చిన తరువాత కూడా దేశం ఆకలి సూచికలో 116 దేశాల్లో 101వదిగా దిగజారిన స్ధితిలో ఉంది, ఈ సబ్సిడిని తగ్గిస్తే మరింతగా అన్నార్తులు పెరగరా ?) అందులో ఎక్కువ భాగం వినియోగదారులకే చెందుతోంది. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సేకరణ విధానాన్ని, ఆహార సబ్సిడీ కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఎంఎస్‌పి పెరిగినపుడు సబ్సిడీ కూడా పెరుగుతుంది, జారీ ధరలు స్ధిరంగా ఉంటాయి.దీనికి ప్రతి ఏటా 50వేల కోట్లను జత చేస్తే మూడులక్షల కోట్లవుతాయి. గోధుమ, బియ్యం కాకుండా చిరు,పప్పు ధాన్యాలు, ఖాద్యతైలాలను కూడా సేకరించి బహిరంగ మార్కెట్‌ వేదికలద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తారు.కనీస మద్దతు ధరలలో 40-45శాతం మేరకు నష్టం రావచ్చు.కనుక ఏ సేకరణ చేపట్టినా విలువలో సబ్సిడీ భారం 30శాతానికి తగ్గదు.

ఎంఎస్‌పికి హామీ ఇస్తే పరిమితంగా కొనుగోలు చేయాలి.పౌరపంపిణీ వ్యవస్ధతో సేకరణకు ఉన్న లంకె, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మితే కష్టం, ఎంతో ఖర్చవుతుంది కనుక వాటి లంకెను విడగొట్టాల్సిన తరుణం వచ్చింది.కనీస మద్దతు ధరలేని పంటలను సాగు చేసేందుకు రైతులను ఒప్పించాలి, లేకపోతే వారు ఇతరులు కూడా ఎంఎస్‌పి పంటలను సాగు చేస్తారు. కొత్త సమస్యలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు పిఎం కిసాన్‌, ఎరువులు, ఇతర సబ్సిడీలతో పాటు ఆహార సబ్సిడీని రు.2,40,000 కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచగలదా ?(వీటిని నష్టాలుగా పరిగణించి గుండెలుబాదుకుంటున్నవారు, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఇస్తున్న ఇతర అనేక రాయితీల గురించి ఏమి చెబుతారు ? వారి సంపదలను పెంచితే జనానికి వచ్చేదేమిటి ? తిండి కలిగితే కండకలదోయి-కండకలవాడేను మనిషోయి అన్న గురజాడను మరిస్తే ఎలా ? కార్మికులు ఆరోగ్యంగా ఉంటే అది వారికే కాదు దేశానికీ లాభమే.) తాజా దారిద్య్రసమాచారం ప్రకారం ఆహార భద్రత వర్తింపును నలభైశాతానికి కుదించటం, చౌకదుకాణాల ద్వారా విక్రయించే వాటి ధరలను పెంచగలదా ? రైతుల ఆదాయాన్ని పెంచే ప్రాధమిక బాధ్యను తీసుకొనే విధంగా రాష్ట్రాలకు ప్రమేయం కల్పించాల్సిన అవసరం లేదా ?( రాష్ట్రాలను సంప్రదించుకుండా సాగు చట్టాలను మార్చినపుడు నందకుమార్‌ లాంటి వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆ చర్చను ఎందుకు ముందుకు తెస్తున్నారు? )


నందకుమార్‌ లేదా జయప్రకాష్‌ నారాయణ లాంటి వారు చేస్తున్న వాదనలు ప్రపంచ వాణిజ్య సంస్ధకు అనుగుణ్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు. కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా తదితర దేశాలు వేసిన కేసులు, వాదనల తీరు తెన్నుల గురించి మరో విశ్లేషణలో చూద్దాం. వాటికి అనుగుణ్యంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలను సంతుష్టీకరించేందుకు, వాటి కార్పొరేట్లకు ద్వారాలు తెరిచేందుకు సంస్కరణలు-రైతుల పేరుతో హడావుడిగా నరేంద్రమోడీ సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కనీస మద్దతు ధరల మీద కమిటీ వేయగానే ఏదో జరిగిపోతుందనే భ్రమలకు లోను కానవసరం లేదు. ఆందోళనకు నాయకత్వం వహించిన ఎస్‌కెఎం ప్రతిపాదించిన వారిని మాత్రమే రైతు ప్రతినిధులుగా పరిగణించాలన్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించలేదు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు సంఘం, ప్రభుత్వ కనుసన్నలలో నడిచేవారిని రైతుల పేరుతో నియమించనున్నారన్నది స్పష్టం.అలాంటి వారితో కూడిన సుప్రీం కోర్టు కమిటీ రూపొందించిన నివేదికను నెలలు గడిచినా బహిర్గతం చేయలేదు, ఏముందో తెలియదు. బహుశా అది రైతులకు అనుకూలంగా లేనందున జనానికి అందుబాటులోకి రాకపోవచ్చు. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. ఎస్‌కెఎంతో వాగ్దాన-ఒప్పంద భగ్నానికి పాల్పడితే మరింత తీవ్ర రూపంలో ఉద్యమం తిరిగి ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు తమకు వ్యతిరేకమైన చర్యల మీద రైతాంగం ఉద్యమించింది. అందినట్లే అంది చేజారిన వ్యవసాయ మార్కెట్‌ను తిరిగి చేజిక్కించుకొనేందుకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్‌ శక్తులు కేంద్ర ప్రభుత్వం మీద రైతులకంటే తీవ్రంగా వత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. నరేంద్రమోడీ తమకు ఉపయోగపడే అవకాశాలు లేవనుకుంటే ఆ స్ధానంలో మరొకరిని రంగంలోకి తెచ్చినా లేదా తమ హిందూత్వ అజెండాకే ప్రమాదం ముంచుకువచ్చిందని సంఘపరివార్‌ భావించినా దాన్ని అమలు జరపగల సమర్ధుడిగా భావిస్తున్న నరేంద్రమోడీ మరో రూపాన్ని ప్రదర్శించినా ఆశ్చర్యం లేదు.


రైతులు డిమాండ్‌ చేస్తున్న అంశాలలో కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్నది ఒకటి. అదేమీ వారు కొత్తగా కోరిన గొంతెమ్మ కోరిక కాదు. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలలో ఒకటే. నెలవులు మారిన తరువాత పాతవాటిని మరచిపోయినట్లు నటించటం కొందరిలో చూస్తాము. కానీ మోడీ గారి విషయంలో అలా అనుకోలేము. అసలు కథవేరే ఉంది. అది బయటకు చెప్పలేరు-రైతులను మెప్పించలేరు, అందుకే అనేక మంది పాలకుల మాదిరే బలవంతంగా రుద్దేందుకు పూనుకొని మూడు సాగు చట్టాలను తెచ్చారు. అనుకున్నది ఒకటి-అయింది ఒకటి. చివరకు క్షమాపణలు చెప్పి మరీ వాటిని వెనక్కు తీసుకున్నారు. నిజానికి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించేందుకు కాబినెట్‌లో చర్చించి ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదం పొందటం క్షణంలో పని. జమ్ము- కాశ్మీరు రాష్ట్రం, ఆర్టికల్‌ 370ని ఒక్క రోజులో వేగంగా రద్దు చేయటంలో చూపిన సామర్ధ్యం జగమెరిగిందే. అలాంటిది కనీస మద్దతు ధరల చట్టం తేలేరా ?

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కూలుతున్న హిందూత్వ గోడలు :ఆర్‌ఎస్‌ఎస్‌ను ఠారెత్తిస్తున్న సిక్కు-ముస్లిం-జాట్‌ల ఐక్యత !

26 Friday Nov 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

#Hindutva, BJP, farm acts repeal, farm laws, Farmers agitations, Hindutva groups, Jats, Muslims, Narendra Modi, Narendra Modi Failures, RSS, Sikhs


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పారు. సాధించిన మహత్తర విజయం తో యావత్‌ కష్టజీవులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.దీనిలో భాగస్వాములు కాని వారు కార్పొరేట్‌లు, వారికి మద్దతు ఇస్తున్న స్వదేశీ జాగరణ మంచ్‌ వంటి సంస్ధలను పుట్టించిన సంఘపరివారం, దాని ఇతర ప్రత్యక్ష -పరోక్ష సంతతి, సాగు చట్టాలకు మద్దతు ఇచ్చిన వారు మాత్రమే. ఈ మద్దతుదార్ల పరిస్ధితి మరీ ఘోరం. చట్టాల రద్దు గురించి నోరెత్తలేరు. తప్పు తెలుసుకున్నా సంతోషంలో భాగస్వాములు కాలేరు.ఇంకా సాధించాల్సిన డిమాండ్ల గురించి తదుపరి కార్యాచరణ గురించి రైతులు ఆలోచిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా రైతులు, ఇతర తరగతుల డిమాండ్లకు మద్దతు ఇవ్వకపోతే వారికి దూరం, సంఘీభావం తెలిపితే నరేంద్రమోడీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది కనుక రాజకీయ మేథోమద్దతుదారులు దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. ఇక నరేంద్రమోడీ వెనుకడుగుకు కారణాలు ఏమిటి అన్న చర్చ పరిపరివిధాలుగా సాగుతోంది. వాటిలో ఒకటి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) మీదకు మళ్లింది. ఒక నాటకం లేదా సినిమాలో మనకు తెర మీద తైతక్కలాడే నటీ నటులు మాత్రమే కనిపిస్తారు.దర్శకత్వం, మాటలు, పాటలు, నేపధó్య నిపుణులు మనకు దర్శనమివ్వరు. బిజెపి నేతలు అగ్ర నటులైతే, ఇతరులు సహాయ, జూనియర్‌ ఆర్టిస్టులు కాగా తెరవెనుక నిపుణులు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు అన్నది తెలిసిందే. హిట్‌ అనుకున్న ” సాగు చట్టాలు – నరేంద్రమోడీ క్షమాపణ ” అనే మహా ప్రదర్శన ఫట్‌ మంది.


ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు సంఘపరివారానికి చెమటలు పట్టిస్తున్నట్లు చెప్పవచ్చు. అది రైతులు, దేశం గురించి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పలువురు ముందుకు తెచ్చిన అంశాలను చూస్తే వారికి తమ హిందూత్వ పధకానికి ఎసరు వస్తోందన్నదే అసలైన ఆందోళన కారణంగా చెప్పవచ్చు. ఇండియా టుడే హిందీ పత్రిక మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌ దిలీప్‌ మండల్‌ అభిప్రాయం ప్రకారం సాగు చట్టాల రద్దు ఎందుకు అన్నదానికి సమాధానం ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల కంటే సావర్కర్‌ రాసిన అంశాల్లో దాగుంది. దిలీప్‌ మండల్‌ రాసినదాని సారాంశం ఇలా ఉంది. సాగు చట్టాల రద్దు ప్రకటనకు మోడీ సిక్కులు పవిత్రంగా పరిగణించే గురుపూర్ణిమ రోజును ఎంచుకుంటే అదే రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చత్తీస్‌ఘర్‌ రాజధాని రాయపూర్‌ లోని ఒక గురుద్వారాలో ప్రణమిల్లారు. పంజాబ్‌ ఎన్నడూ ఎన్నికల రంగంలో బిజెపికి ముఖ్యం కాదు, దేశ విభజన సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని తెరాయి, పశ్చిమ ప్రాంతంలోని అరడజను జిల్లాలో భూములు పొందిన సిక్కులు పరిమిత ప్రభావమే చూపుతారు. ఎన్నికల కంటే వి.డి. సావర్కర్‌ ఊహించిన హిందూత్వ భావనే హిందూత్వ దళానికి ముఖ్యం. మిమ్మల్ని మేము(ఆర్‌ఎస్‌ఎస్‌) మరో ముస్లింగా చూడటం లేదని సిక్కులకు చెప్పటమే సాగు చట్టాల రద్దు సందేశం. హిందూత్వలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి సిక్కుల అవసరం తప్పనిసరి. ” హిందూత్వ అనివార్యతలు ” అనే తన పుస్తకంలో భారత్‌లో విమర్శకు అతీతులైన సామాజిక తరగతి హిందువుల తరువాత ఏదైనా ఉందంటే వారు పంజాబ్‌లోని మన సిక్కు సోదరులు మాత్రమే. సప్త సింధు ప్రాంతంలోని సింధు లేదా హిందువుల ప్రత్యక్ష వారసులు సిక్కులు మాత్రమే అని రాశారు. నేటి సిక్కులు నిన్నటి హిందువులు, నేటి హిందువులు రేపటి సిక్కులు కావచ్చు. దుస్తులు, సంప్రదాయాలు, రోజువారీ జీవనంలో మార్పులుండవచ్చు తప్ప వారి రక్తం, జన్యువులు మారవని చెప్పారు. తన పుస్తకంలో అరవైసార్లు సిక్కులను సావర్కర్‌ ప్రస్తావించారు.


దిలీప్‌ ఇంకా ఇలా చెప్పారు. ” అన్ని మతాలకు చెందిన రైతులు ఈ ఉద్యమంలో భాగస్వాములు, వారి డిమాండ్లన్నీ ఆర్ధికపరమైనవి, ప్రభుత్వ విధానాలతో సంబంధం కలిగినవే.హిందూ, ముస్లిం నేతలను అన్ని ప్రతినిధి వర్గాలు, పత్రికా సమావేశాలలో భాగస్వాములను చేయటం ద్వారా రైతుల ఆందోళన మతపరమైనదిగా కనిపించకుండా చూసేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక అభిప్రాయాన్ని సృష్టించారు-ఉద్ధేశ్యపూర్వకంగా చేసిన దానిలో భాగం కావచ్చు – అదేమంటే ప్రభుత్వం సిక్కులను అణచివేస్తున్నది. బిజెపి దీన్ని ఎన్నడూ కోరుకోలేదు.ఒక పరిమితిని దాటి సిక్కులు దూరం కావటం హిందుత్వ భావం, ఆర్‌ఎస్‌ఎస్‌కు విరుద్దమైనది కనుక బిజెపి అంతిమంగా సన్నిహితం కావటానికి నిర్ణయించింది.ఈ నిర్ణయం తీసుకొనేందుకు బిజెపి ఎందుకు ఇంత సమయం తీసుకుందని ఎవరైనా అడగవచ్చు. అర్ధిక అజెండా-భావజాలం మధ్య వైరుధ్యం ఉంది కనుకనే బిజెపి నిర్ణయం చేసేందుకు వ్యవధి తీసుకుంది. కచ్చితంగా చెప్పలేము గానీ గురుగ్రామ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన నిర్ణయాత్మకం గావించి ఉండవచ్చు. అక్కడ శుక్రవారం నాడు బహిరంగ స్ధలంలో నమాజు చేయటం గురించి వివాదం ఉంది. పట్టణంలోని సాదర్‌ బజార్‌ గురుద్వారా కమిటీ తమ ప్రాంగణంలో నమాజ్‌ చేసుకోవచ్చని స్వాగతం పలికింది. ఆ మేరకు నమాజైతే జరగలేదు గానీ సిక్కులు-ముస్లింలు దగ్గర అవుతున్నారనే భావన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను వణికించి ఉండవచ్చు. 2020 ప్రారంభంలో అలాంటి సౌహార్ధ్రత ఢిల్లీలోని షహీన్‌ బాగ్‌లో జరిగిన సిఎఎ-ఎన్‌ఆర్‌సి వ్యతిరేక నిరసన సందర్భంగా స్పష్టంగా వ్యక్తమైంది. నిరసనకారులకు వండిన ఆహారాన్ని తాజాగా అందించేందుకు సిక్కులు ఒక వంటశాలను అక్కడ ఏర్పాటు చేశారు. రైతు ఉద్యమంలో ప్రధానమైన సిక్కులు తమకు దూరం కావటం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను గడగడలాడించింది.” అని దిలీప్‌ పేర్కొన్నారు.


పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో జాట్‌ – ముస్లిం మతపరమైన విభజన గోడ కూలిపోతుండటాన్ని బిజెపి గమనించటం మోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొనేట్లు చేసిందని మానవహక్కుల కార్యకర్త విద్యాభూషణ్‌ రావత్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. దానిలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. సాగు చట్టాల రద్దుకు సాగిన ఆందోళనతో బిజెపి తన దీర్ఘకాల మిత్రపక్షాలలో ఒకటైన అకాలీదళ్‌ను కోల్పోయింది. రైతుల్లో కనిపించిన రాజకీయ అవగాహన పట్టణాల్లో ఆంగ్లం మాట్లాడే మధ్యతరగతి వారికంటే ఎంతో ఉన్నతంగా ఉంది.2013లో తెచ్చిన భూసేకరణ చట్టంలో సహేతుకమైన పరిహారంతో పాటు, కఠిన నిబంధనలు, రైతుల సమ్మతి వంటి అంశాలు ఆ తరువాత దేశంలో రైతుల నిరసనలు తగ్గటానికి ఒక కారణంగా విశ్లేషణలు వెల్లడించాయి.గత రెండు సంవత్సరాల్లో అనేక జాతీయ సమ్మెలు, రైల్‌, రోడ్డు రోకో, బందులు జరిగాయి. పోలీసులు అణచివేతకు పాల్పడినా కూడా శాంతియుతంగా జరిగాయి.లఖింపూర్‌ ఖేరీలో మోటారు వాహనాలను ఎక్కించి రైతులను చంపిన ఉదంతంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తరువాతే నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఎంత విలువ ఇస్తుందో ఈ ఉదంతం వెల్లడించింది.


సాగు చట్టాల రద్దు ప్రకటన చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం, రాజ్యాంగ వ్యతిరేకం. ప్రధాని లేదా ఏ మంత్రైనా విధానపరమైన అంశాలను పార్లమెంట్‌ వెలుపల ప్రకటించకూడదు.( ప్రధాని ప్రకటన నాటికే పార్లమెంటు సమావేశాల నోటిఫికేషన్‌ వెలువడింది. కాబినెట్‌ ఆమోదమూ లేదు) మోడీ, బిజెపి ప్రతిదాన్నీ తమ రాజకీయ లాభనష్టాల అంకెల మేరకు చేస్తారు. సాగు చట్టాల రద్దు రైతులపై ప్రేమతో తీసుకున్న చర్య కాదని, ఎన్నికలకోసం చేసిందని ఎవరూ మరిచి పోకూడదు.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ప్రత్యేకించి జాట్లు గత రెండు దశాబ్దాలలో బిజెపి మద్దతుదార్లుగా మారారు. దేశ రాజకీయాలను మండలీకరణ గావించిన తరువాత జాట్లు మరింతగా అగ్రకుల పార్టీల వైపు మొగ్గారు, బిజెపి వారికి సహజమైనదిగా కనిపించింది. 2013 ముజఫర్‌నగర్‌ ఘర్షణల ద్వారా వ్యవసాయ ప్రాంతంలో బిజెపి హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోయింది. ఆ ఉదంతంలో ఆప్రాంతంలో ముస్లింలను వేరు చేశారు, అవాంఛనీయమైన వారిగా చేశారు. ఈ సమీకరణను బిజెపి తన అధికార క్రీడలో ఎల్లవేళలా ఉపయోగించుకుంది. అయితే ఈక్రమంలో జాట్‌లు రాజకీయంగా ఆరోవేలుగా మారిపోయారు.దానికి తోడు జాట్‌లు బిజెపికి ఓటు చేసిన హర్యానాలో ఖత్రి సామాజిక తరగతికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేశారు. రైతు ఉద్యమం జాట్‌ల పూర్వపు ఔన్నత్యం, ముస్లింతో మమేకం కావటాన్ని ముందుకు తెచ్చింది.వాస్తవానికి జాట్‌-ముస్లిం ఐక్యత బిజెపి ఆలోచనలో ఆఖరాంశం. అది పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పార్టీకి తీవ్ర విపత్కర పరిస్ధితిని సృష్టిస్తుంది, అక్కడ పార్టీనేతలు తమ నియోజకవర్గాలకు వెళ్లలేనిదిగా మారింది.


మోడీ నిర్ణయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ దాగుందని అవుట్‌లుక్‌ పత్రిక విశ్లేషకుడు స్నిగ్దేందు భట్టాచార్య పేర్కొన్నారు. సారాంశం ఇలా ఉంది.” సాగు చట్టాలపై సిక్కు సామాజిక తరగతిలో తలెత్తిన వేదన వారిని ముస్లింలకు సన్నిహితం చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గమనించారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలే సాగు చట్టాలు వెనక్కు తీసుకొనేందుకు కారణం అనుకుంటే గురునానక్‌ జయంతి రోజునే ప్రకటనకు ఎందుకు ఎంచుకుంటారు ? బిజెపి సైద్దాంతిక మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ లేదా హిందూ సాంస్కృతిక జాతీయవాదంలో సిక్కిజం అంతర్భాగం కనుక ఈ పని చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్దాంతవేత్త ఒకరు తన గుర్తింపును వెల్లడించవద్దనే షరతుతో అవుట్‌లుక్‌ ప్రతినిధికి చెప్పారు. సాగు చట్టాలపై సిక్కుల వేదన వారిని ముస్లింలకు సన్నిహితులను చేస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వ్యతిరేకించే ఆందోళన నిర్వాహకులు సాగు చట్టాల నిరసనకారులకు ఎలా దగ్గర అవుతున్నారనే అంశంపై మాకు నిర్దిష్ట సమాచారం ఉంది. గురుగ్రామ్‌లోని గురుద్వారా నిర్వాహకులు తమ ప్రాంగణంలో నమాజు చేసుకోవచ్చన్న ఇటీవలి ఉదంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాము.దేశంలో ఉద్భవించిన అన్ని రకాల విశ్వాసులను ఏకం చేయాలన్న మా దీర్ఘకాలిక ప్రణాళికకు ఇవి ఆందోళన కలిగించే ధోరణులు ‘ అని సిద్దాంతవేత్త చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ విశ్వహిందూపరిషత్‌తో సహా ఇతర సంస్ధలన్నీ భారత్‌లో జన్మించిన మతాలు అంటే బౌద్దం, జైనం, సిక్కు అన్నీ హిందూ సాంస్కృతిక గుర్తింపులో భాగమే అని, దురాక్రమణదారుల మతమైన ఇస్లాం దానికి విరుద్దమని భావిస్తున్నాయి. బిజెపి సారధ్యంలోని ప్రభుత్వ విధానాలపై తన ప్రభావం ఏమీ ఉండదని లాంఛనంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతుంది. విష్ణుమూర్తి పదవ అవతారమే బుద్దుడని, ముస్లిందురాక్రమణదారుల మీద సిక్కులు తమ శౌర్యాన్ని ప్రదర్శించారన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ సాహిత్యంలో చిత్రించారు. సిక్కులతో వైరానికి ముగింపు పలికేందుకు వెనక్కు తగ్గుతున్నాము, సిక్కులు ముస్లింలతో సన్నిహితం కావటంలో ఆర్ధిక ప్రయోజనం తప్ప మరొకటి లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘనేత చెప్పినట్లు అవుట్‌లుక్‌ పేర్కొన్నది.ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం కలిగిన బిజెపి నేత ఒకరు మాట్లాడుతూ రైతు ఉద్యమ సమయంలో ప్రభుత్వ విధానాలను సమర్ధించేవారిలో కొందరు అత్యుత్సాహపరులు నిరసనకారులను ఖలిస్తానీలని చిత్రించారు. అది సిక్కులలో ఒక పెద్ద భాగాన్ని హిందూత్వను ప్రబోధించే వారికి వ్యతిరేకులను చేసింది. మా హిందూ భావజాలంలో సిక్కులు కూడా ఉన్నారు. ప్రతి నిజమైన సిక్కు హృదయంలో చూస్తే హిందువే అని గురూజీ గోల్వాల్కర్‌ చెప్పేవారు. ఈ ఆందోళన హిందువులందరినీ ఏకం చేయాలన్న మా ముఖóó్య అజెండాకు ఈ నిరసన హాని చేసింది. సంస్ధల ఉన్నతనేతలు ఈ అంశాన్ని చూస్తున్నందున తాము బహిరంగంగా అభిప్రాయాలను చెప్పలేమని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు చెప్పినట్లు ఆవుట్‌లుక్‌ పేర్కొన్నది.


సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం కేవలం ఉత్తర ప్రదేశ్‌లో బిజెపికి సవాలు మాత్రమే కాదని ది ఫెడరల్‌ డాట్‌ కామ్‌ ప్రతినిధి పునీత్‌ నికోలస్‌ యాదవ్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను వికాస పురుషుడిగా చిత్రిస్తూ ప్రచారం ప్రారంభమైంది. సాగు చట్టాల రద్దుపై మోడీ ప్రకటనకు కొద్ది రోజుల ముందు రెండు భిన్న బృందాలు సర్వేలు నిర్వహించాయి. సిఓటర్‌-ఎబిపి సర్వే ప్రకారం 403 స్ధానాల్లో 2017లో బిజెపి తెచ్చుకున్న 312లో వంద సీట్లు తగ్గుతాయి చెప్పగా పోల్‌స్టార్ట్‌-టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం 213-245 మధ్యవస్తాయని పేర్కొన్నారు.1989 తరువాత ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి నెగ్గని ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి తిరిగి అధికారంలోకి రావటం పెద్ద అసాధారణ కృత్యమే. ఇప్పటి వరకు మోడీ విధానాలు, రాజకీయాలను ఎవరూ మార్చలేరని అనుకొనే వారు, సాగు చట్టాలను రద్దు చేసిన తరువాత రోడ్ల మీద జనం ఇప్పుడు మోడీ భయపడ్డారని అనుకుంటున్నారు, కొద్ది నెలలో ఎన్నికలు జరగనుండగా ఇది మాకు మంచిది కాదని ఉత్తర ప్రదేశ్‌ మంత్రి ఒకరు చెప్పారు. లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్‌ వంటి మా నోటి తుత్తర నేతలు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముగిసిన తరువాత సాగు చట్టాలను తిరిగి తీసుకువస్తారని బహిరంగంగా ప్రకటించారు, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసమే వెనక్కు తీసుకున్నారని అనుకుంటుండగా మేము రైతుల విశ్వాసాన్ని తిరిగి పొందగలమని మీరెలా అనుకుంటారని ఒక ఎంఎల్‌ఏ ప్రశ్నించినట్లు ఫెడరల్‌ పేర్కొన్నది. . ఈ దిగజారిన పరిస్దితిలో రైతుల మీద కార్లను తోలి నలుగురు రైతులను చంపిన లఖింపూర్‌ ఖేరీ ఉదంతానికి బాధ్యుడిని చేస్తూ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను తొలగించాలన్న డిమాండును నెరవేర్చకపోవచ్చు.అదే జరిగితే ఆదిత్యనాధ్‌ ఠాకూర్లకు ప్రాధాన్యత ఇచ్చి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తున్న బ్రాహ్మణులను మరింతగా కలవర పెట్టవచ్చు.(తొలగించకపోతే రైతులు తేల్చుకుంటారు) ఏడాది క్రితం వరకు బిజెపి, యోగి నడక నల్లేరు మీద బండిలా ఉంటుందని మొత్తం మీద అందరూ అనుకున్నారు.రైతుల ఆందోళన, హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య,కరోనా రెండవ తరంగం,బిజెపి 2014లో ఏర్పాటు చేసిన కులాల కుంపటిలో కుమ్ములాటలు పరిస్ధితిని మార్చివేశాయని ఫెడరల్‌ పేర్కొన్నది.


సంఘపరివార్‌ బహిరంగంగా ఎన్నడూ సాగు చట్టాలను వ్యతిరేకించటం లేదా చట్టాల రద్దును సమర్ధించటం గానీ చేయ లేదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో దీప్తిమన్‌ తివారీ పేర్కొన్నారు.హిందువు-సిక్కుల మధ్య గండి ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ భయపడిందని, సమస్యను పరిష్కరించలేని కేంద్ర అసమర్ధత గురించి హెచ్చరిస్తూ ఇబ్బందికి గురైందని కూడా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి మాట్లాడుతూ సామాజిక ఐక్యత మీద చూపుతున్న ప్రభావం గురించి ఆందోళన చెందారు. ఇలాంటి చట్టాలను ఏ దేశంలోనూ వెనక్కు తీసుకోలేదని అన్నారు. గతేడాది దసరా ఉపన్యాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సాగు చట్టాలను సమర్ధించారు.


భిన్నమైన సామాజిక తరగతులు ఐక్యంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు పూనుకోవటం సర్వాంగీకార స్వభావాన్ని సంతరించుకోవటం ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి కూటమికి మనస్తాపాన్ని కలిగించిందని జర్నలిజం ప్రొఫెసర్‌ నళిన్‌ వర్మ పేర్కొన్నారు. రైతుల నిరసన బిజెపి హిందూత్వ రాజకీయాలకు సవాలుగా మారిందని, నిరసనకారులు ఇతర జీవన్మరణ సమస్యలపై సామాజిక న్యాయం నుంచి పౌరహక్కుల వరకు ఉద్యమాన్ని విస్తరించేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద ఇప్పటికీ రైతుల్లో అనుమానాలు పెద్ద ఎత్తున ఉండగా వాటిని మరింతగా పెంచేరీతిలో రాజస్తాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, ఎంపీ సాక్షి మహరాజ్‌ మాట్లాడుతూ ఈ చట్టాలను తిరిగి చేస్తారని చెప్పారు. రైతులు కోరుతున్న డిమాండ్లను ఆచరణ సాధ్యం కానివని, అరాచకాన్ని పెంచుతాయని ఇప్పుడు అమితాసక్తిగల ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి మద్దతుదారులు చిత్రించుతున్నారు. నిజానికి వారు కొత్తగా జతచేసిన డిమాండ్లేవి లేవు. ఎంఎస్‌పి డిమాండు మూడు చట్టాలకంటే పాతదే, దానికి చట్టబద్దత కల్పించాలన్న కోరిక 2011లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ సంతకం చేసి అందచేసిన మెమోరాండంలో ఉన్న అంశమే. 2014లో ఓట్ల కోసం అనేక సభల్లో మోడీ చెప్పినదే.


1974నాటి జయప్రకాష్‌ నారాయణ సంపూర్ణ విప్లవానికి, ఇప్పుడు రైతు ఉద్యమానికి కొన్ని పోలికలు ఉన్నాయి. గుజరాత్‌లో ఒక హాస్టల్లో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా తలెత్తిన నిరసన జెపి ఉద్యమానికి నాంది. రైతులు తొలుత పంజాబ్‌లోనే ఆందోళనకు దిగారు. విద్యార్ది ఆందోళన ఉత్తరాదిన అనేక ప్రాంతాలకు విస్తరించినట్లుగానే రైతు ఉద్యమం హర్యానా,హిమచల ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్తాన్‌,మధ్యప్రదేశ్‌లకు విస్తరించి దక్షిణాదిన మద్దతు పొందింది. జెపి ఉద్యమం తొలుత విద్యార్దులతో ఉన్నప్పటికీ తరువాత జనసంఫ్‌ు(బిజెపి పూర్వరూపం) లోక్‌దళ్‌, డిఎంకెపి, ఇతర సోషలిస్టు, మితవాద పార్టీలన్నీ చేరాయి. చివరకు అవన్నీ జనతా పార్టీగా ఏర్పడ్డాయి.


జాగ్రత్తగా రూపొందించిన హిందూత్వ భావజాలానికి తగిన సామాజిక విభజనపై మోడీ-అమిత్‌షా రాజకీయాలు వృద్ది చెందాయి. హర్యానాలో జాట్‌-జాటేతర కులాల ప్రాతిపదికన బిజెపి రాజకీయాలు చేసింది, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కొట్లాటలతో జాట్లకు పోటీగా ముస్లింలను నిలిపారు.ములాయం సింగు యాదవ్‌ కుటుంబాన్ని చీల్చారు. లాలూ యాదవ్‌ ఇంట్లో తగాదాలు పెట్టారు అని రాకేష్‌ తికాయత్‌ దీని గురించి వక్కాణించారు. హిందూత్వ ఆధిపత్య రాజకీయాలకు సవాలుగా జీవన సమస్యలపై చివరికి రాజకీయ పార్టీలు ఏకమౌతాయా అన్నది చూడాల్సి ఉంది. సాగు చట్టాల రద్దు తరువాత నవంబరు 22న గోరఖ్‌పూర్‌లో జరిపిన సభలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో మహమ్మదాలీ జిన్నా (పాకిస్తాన్‌) మద్దతుదార్లను వ్యతిరేకించాల్సిన బాధ్యత జాతీయవాదుల మీద ఉందని పిలుపునిచ్చారని నళిన్‌ వర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.


నరేంద్రమోడీ సర్కార్‌ చర్య పర్యవసానాలు పరిణామాల గురించి వెలువడిన మరికొన్నింటిని స్ధలాభావం వలన సృజించటం లేదు. రానున్న రోజుల్లో మరిన్ని విశ్లేషణలు వెలువడుతాయి. బిజెపి కనుసన్నలలో నడిచే మీడియా వాటికి తగిన చోటు కల్పించినా కల్పించకపోయినా అవి జనంలో ఏదో ఒక రూపంలో వెళతాయి. హిందూత్వ రాజకీయాలు, ఎత్తుగడలను మరింతగా బట్టబయలు చేస్తాయి. నీవు జనాలందరినీ కొంతకాలం వాజమ్మలుగా చేయవచ్చు,కొందరిని ఎల్లకాలం చేయవచ్చు గానీ, అందరినీ అన్ని వేళలా చేయలేవన్న అబ్రహాం లింకన్‌ మాటలను, ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ బోధను ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా సదా గుర్తుంచుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల చారిత్రాత్మక పోరాట విజయం-ఎంతటి ప్రభుత్వాలైనా దిగిరాక తప్పదు !

25 Thursday Nov 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Farmers agitations, Indian farmers historic win, Narendra Modi, Narendra Modi Failures, RSS


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


ఉక్కు సంకల్పంతో 2020 నవంబర్‌ 26 నుండి చేస్తున్న రైతులు చేస్తున్న చారిత్రాత్మక పోరాటానికి విజయం లభించింది. పోరాడితే ఎంతటి ప్రభుత్వాలైనా దిగిరాక తప్పదని నిరూపించారు. పార్లమెంటులో మెజారిటీ ఉందన్న అహంకారానికి వ్యతిరేకంగా దఢసంకల్పం సాధించిన విజయం. విపరీతమైన వేగంతో నయా ఉదారవాదాన్ని పెంచి పోషిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎదుర్కొన్న మొదటి ముఖ్యమైన ఎదురుదెబ్బ.మనం ఏమీచేయలేము, ప్రభుత్వం బలమైనది , మొండిగా వున్నది అంటూన్నవారి మాటలను వమ్ము చేశారు.ప్రజలలో ఉన్న నిరాశ,నిస్పహలను పఠాపంచలు చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయకతప్పలేదు.స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించవలసివచ్చింది. ఎట్టకేలకు 3 రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని కేబినెట్‌ ఆమోదించింది. ఉపఎన్నికలలో ప్రజలు చూపించిన శాంపిల్‌ దెబ్బకే పెట్రోల్‌, డీజిల్‌ రేట్‌ను కొద్దిగా తగ్గించారు.
అయితే ఇప్పటికి కూడా ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకోవటంలేదు. చట్టాలు మంచివే కానీ ప్రజలను ఒప్పించుటంలో వైఫల్యం చెందామంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ ల లో రాబోయే ఎన్నికల లో చావుదెబ్బ తినబోతున్నామనే సర్వేల సంకేతాలు భాజపా కు మింగుడు పడలేదు. ఉత్తర భారత దేశంలో తీవ్రంగా ప్రజావ్యతిరేకత రాజుకుంటుందని అర్ధమౌతున్నది. దేశ అధికార పీఠానికి ఉత్తర భారతదేశం కీలకం. అక్కడనే నిప్పు రాజుకుంది. ఎవరితోనైనా పెట్టుకో కానీ.. రైతు కూలీలతో పెట్టుకుంటే నీకు పుట్టగతులుండ వని భారత రైతులు చరిత్రను పునరావత్తం చేస్తున్నారు.


ఈ నిర్ణయం వెనుక అపర చాణుక్య నీతే కారణం అని కొంతమంది సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఇది మాస్టర్‌ స్ట్రోక్‌ అనీ ఈ దెబ్బతో రైతు ఉద్యమం ఖాళీ అనీ డబ్బాకొట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌,పంజాబ్‌ ల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ ఎత్తుగడ గా తాత్కాలిక వెనుకడుగేనంటున్నారు. అవకాశవాదం తప్ప ఉద్యమ ప్రభావంకాదంటున్నారు.
చట్టాలరద్దునిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాలు
1) పెరుగుతున్న ఉద్యమ స్పూర్తి-తరుగుతున్న మత విద్వేషం. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌ లో సెప్టెంబర్‌ 5 న, 10 లక్షల మంది ప్రజలతో భారీ సభ దిగ్విజయంగా జరిగింది.. మహాపంచాయత్‌ పేరున రైతులు, కార్మికులుఒకచోట గుమికూడి రైతువ్యతిరేక నల్లచట్టాలను రద్దుచేయాలని కోరటం నూతన సామాజికచైతన్యానికి దారితీసింది. ఇదే ముజఫర్‌ నగర్‌ లో 2013లో మతపరపమైన అల్లర్లను భాజపా రెచ్చగొట్టింది.మతవిద్వేషాలను పక్కనపెట్టి లౌకికఐక్యతను సాధించుతూరైతులు ఉద్యమంలోకి రావటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది.
2) సంవత్సరంపాటుసాగిన రైతుల పోరాటంలో 3సార్లు భారత్‌ బంద్‌ కు రైతుసంఘాలు పిలుపునిచ్చాయి.సెప్టెంబర్‌ 27న భారత్‌ బంద్‌ పిలుపు అపూర్వ విజయాన్ని సాధించింది. దేశం నలుమూలలనుండి లక్షలాదిమంది. రైతులు, కార్మికులు,యువకులు, విద్యార్ధులు, మహిళలు,వ్యాపారులు, ఉద్యోగులు వీధుల్లోకి రావటమే భాజపా కు ప్రమాదసంకేతాలనుఇచ్చింది.
3) లఖింపూర్‌ ఖేరీ లో భాజపా జరిపిన దారుణమారణకాండ దేశప్రజలనందరినీ కదిలించింది.కేంద్ర హౌంశాఖ సహాయమంత్రి అజయమిశ్రా ఆదేశాలనుఅనుసరించి గుమికూడిన ప్రజలపైకారును తోలి నలుగురు రైతులను, ఒక జర్నలిస్టును చంపిన ఘటన యావద్భారత ప్రజలందరికీ కోపంతెప్పించింది. భాజపా ను అప్రతిష్టపాలుచేసింది. అక్టోబర్‌ 15,దసరా రోజున దేశవ్యాపితంగా బీజేపీ అగ్రనేతల దిష్చిబొమ్మలను తగలెట్టారు. రైళ్ళను ఆపేసి ఆందోళనలను నిర్వహించారు.
4) దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, ఆకలికేకల సూచికలు, అసమానతలు, అసంతప్తి, ఆర్ధిక సంక్షోభం, ఆందోళనలు భాజపా పతనానికి దారిచూపుతున్నాయి. మతవిద్వేష ప్రచారం ఒక్కటే ప్రభుత్వాన్ని రక్షించేటట్లు లేదు. పాకిస్ధాన్‌, చైనా వ్యతిరేక జాతీయఉన్మాదాన్ని రెచ్చగొట్టే అవకాశాలు ప్రస్తుతం లేవు.
5)రైతు ఉద్యమ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో షేర్‌ చేస్తూ, పాప్‌ స్టార్‌ రిహన్నా” మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోకూడదు” అంటూ ట్విట్టర్‌ లోనూ గూగుల్‌ లోనూ లేవనెత్తిన ప్రశ్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు తెచ్చింది.యువ పర్యావరణవేత్త గ్రేటా ధెన్‌ బర్గ్‌ రైతుఉద్యమానికిఎలామద్దతు తెలపాలో సలహఇస్తూ ”టూల్‌ కిట్‌” కార్యాచరణప్రణాలికను దిశా రవి షేర్‌ చేసింది.అందుకు ప్రతిఫలంగా నేరపూరితకుట్ర, శత్రుత్వాన్నిప్రోత్సహించారన్నఆరోపణలతోప్రభుత్వం ఆమెపై కేసు నమోదు చేసింది. కెనడా ప్రధానితో సహా, అమెరికాలోని 80 సంఘాలు, లాయర్‌ మీనాహారిస్‌, అంతర్జాతీయ మీడియా,సెలిబ్రిటీలు, సౌహార్ధ్రతను వెలిబుచ్చారు. పెరుగుతున్న అంతీర్జాతీయ మద్దతు భారత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.
6) రాబోయే ఎన్నికలలో పరాజయం తప్పదని సర్వేలు సూచిస్తున్నాయి. మూడు చట్టాలపై వెనకడుగువేసి రాజకీయంగా భారతీయ జనతా పార్టీ భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతు కార్యకర్తలకు ప్రజాదరణ, విశ్వసనీయత పెరిగింది.
అంతా తమ ప్రయోజకత్వం అనే అంబానీ అదానీలకు మద్దతుగా మోడీ నిలబడి వ్యవసాయంలో కార్పొరేట్‌ సామ్రాజ్యాలను స్థాపించాలని చేస్తున్నప్రయత్నానికి ఆదిలోనే గండిపడింది. కార్పొరేట్‌ వ్యవసాయక్షేత్రాలను స్ధాపించాలనే పేక మేడలను కూల్చిన ఘనత రైతులకు చెందుతుంది. కార్పొరేట్‌ శక్తులకు నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వంతో సంఘర్షించి రైతు ఉద్యమ చరిత్రను సష్టించారు.

రాజకీయ కోణమా లేక రైతు ఉద్యమ ఉధతా?

ప్రధాని తీసుకున్న నిర్ణయం వెనుక నూటికి నూరు పాళ్ళు రాజకీయకోణం ఉందనీ రైతుల ఉద్యమ ఉధతి కాదని కొంతమంది మేధావులు విశ్లేషిస్తున్నారు. మోడీ అపర చాణక్యనీతితో వ్యూహాత్మకంగా వ్యవసాయచట్టాల రద్దుపై కీలక నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ లతోపాటుఅయిదురాష్ట్రాల లో కీలకమైన ఎన్నికలు జరగబోతునందున వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతా మనే భయానికి కారణం అన్నదాతల ఉద్యమ ఉధతి అన్న సంగతిని గుర్తించ నిరాకరిస్తున్నారు.భాజపా పార్టీనాయకులు ప్రజలలోకి వెళ్ళలేని పరిస్ధితిని మర్చిపోతున్నారు. పట్టుదలతోప్రాణత్యాగాలకు నిలబడ్డ రైతుల పోరాటాన్ని తక్కువ చేయచూస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలవలననే ప్రజలు భాజపా కు దూరమౌతున్నారనే సంగతిని విస్మరిస్తున్నారు. ప్రజలు పోరాటాలలో రాటుదేలి చైతన్యవంతులౌతున్నారు.


మొక్కవోని దీక్షతో సాగించిన రైతుల పోరాటం కొన్నివిలువైన గుణపాఠాలను నేర్చుకుంది. ఉద్యమాలు అలలు లాగానే కాకుండా నిశ్చలప్రవాహంలాగా ఉధతంగా కూడాసాగించవచ్చని అనుభవం నేర్పింది. ప్రజా పక్షంవహించటమే పార్టీల ఎజెండా కావాలని ఉద్యమం డిమాండ్‌ చేసింది. అందుకనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని సష్టించింది.పార్టీల జెండాలు కాదు ఎజండా ముఖ్యమని చెప్పింది. పదవులు,రాజ్యాధికారమే పరమావధిగావున్నరాజకీయపక్షాలను ఉద్యమ వేదికలకు దూరంగా వుంచవలసిన అవసరాన్ని తెలియచెప్పింది.

”అంతా తమ ప్రయోజకత్వం, తామే భువి కధినాధులమని,

స్థాపించిన సామ్యాజ్యాలూ , నిర్మించిన కత్రిమచట్టాల్‌,

ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేక మేడలై,

పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను.

చిరకాలం జరిగిన మోసం,బలవంతుల దౌర్జన్యాలూ,

ధనవంతుల పన్నాగాలు ఇంకానా! ఇకపై చెల్లవు” – అన్న శ్రీశ్రీ స్ఫూర్తి మరింతగా పోరాటాలను ముందుకు తీసుకుపోనుంది.

రైతు సంఘాలన్నీ ఏకమై కనీసమద్దతుధర కోసం..ఉద్యమ క్రమం
2018 నవంబర్‌లో 217 రైతు సంఘాలన్నీ ఏకమై ఐక్యపోరాటానికి పిలుపునిచ్చాయి.నవంబర్‌ లో లక్షలాదిమంది రైతులుఢిల్లీ నగరవీధులలో కదంతొక్కారు. లక్షలాది మంది రైతులు అరుదైన ప్రదర్శన చేసి కనీసమద్దతుధరకు చట్టబధత ను కల్పించి, ఋణవిముక్తిని కల్పించమన్నారు. మరుసటి సంవత్సరం నవంబర్‌ లో రైతు పార్లమెంటును నిర్వహించారు. కనీసమద్దతు ధరకు, ఋణవిముక్తికి ముసాయిదా చట్టాలను తయారుచేసి పార్లమెంటులో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రధాన డిమాండ్లైన కనీసమద్దతు ధరను, ఋణవిముక్తి అంశాలను పక్కనపెట్టి 2020, జూన్‌ 5న మూడుసాగు చట్టాలు తీసుకొస్తున్నట్టు కేంద్రంఆర్డినెన్స్‌ జారీ చేసింది. అప్పటినుండి రైతు కి న్యాయం చేయాలంటూ అన్నంపెట్టే అన్నదాతలు, రైతుసంఘాలు పంజాబ్‌ లోగ్రామగ్రామాన ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్య పరిచారు.. ఐక్యంగా రోడ్డెక్కారు. రైలు పట్టాలపై పడుకున్నారు.సెప్టెంబర్‌ 17 న గందరగోళపరిస్ధితులమధ్య, విపక్షాల నిరసనలమధ్య లోక్‌ సభలో భాజపా కి వున్నమెజారిటీతో ఆమోదంపొందింది. సెప్టెంబర్‌ 20న రాజ్యసభలో బిల్లులను ఆమోదించామని అప్రజాస్వామ్యంగా ప్రకటించుకున్నారు. కనీసం వోటింగ్‌ జరపమన్న డిమాండ్‌ ను కూడా అంగీకరించలేదు. రైతుసంఘాలన్నీ ఏకమై నవంబర్‌ 26 న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. పశుబలంతో ఢిల్లీ సరిహద్దులలోనే ఆపిన ప్రభుత్వ బలగాలను ఎదిరించారు. రోడ్లపై కొట్టిన మేకులు, ముళ్ళకంచెలు రైతుల ప్రస్ధానాన్ని ఆపలేకపోయాయి. నల్ల చట్టాలను రద్దుచేయాలని పట్టువదలకుండా ఉక్కు సంకల్పంతో ప్రభుత్వాన్ని వణికించారు.


ఎముకలు కొరికే చలిని, చండ్ర నిప్పులుకక్కే ఎండలను, భీకర వర్షాలను లెక్కచేయలేదు.ది గజారుతున్న ఆర్ధిక పరిస్థి తుల్లో దేశవ్యాప్తంగా జయప్రదమైన బందులు, సమ్మెలు ప్రభుత్వాన్ని అందోళనకు గురిచేసాయి. రాబోయే ఎన్నికలు మరింత భయాన్ని కలిగించాయి. దిగజారుతున్న ఆర్ధిక పరిస్థి తుల్లో దేశవ్యాప్తంగా జయప్రదమైన బంధ్‌ లు, సమ్మెలు కు ప్రభుత్వాన్ని అందోళనకు గురిచేసాయి. రాబోయే ఎన్నికలు మరింత భయాన్ని కలిగించాయి. ఘోరమైన కోవిడ్‌-19 వేవ్‌ కాలంలో కూడా నిరసనకారులు తమ గుడారాల్లోనే ఉన్నారు.టాక్టర్లనే నివాసాలుగా మార్చుకున్నారు. రోడ్ల పైనే వండుకొని తిన్నారు. సంవత్సరం రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి నూతన తరహాలో చారిత్రక పోరాటాన్ని నిర్మించారు. రైతుల మనోధైర్యాన్ని దెబ్బకొట్టి ప్రజలలో వారిని అభాసుపాలు చేయడానికి రకరకాల అసత్య ప్రచారాలను లేవదీశారు. స్థానికులను రెచ్చగొట్టారు. హింసను సష్టించారు. ప్రభుత్వం ఆందోళనకారులను ఆందోళన జీవులనీ,పరాన్న జీవులనీ,ఖలీస్ధానీవాదులనీ, టెర్రరిస్టులనీ, దేశద్రోహులనీ పలు పేర్లతో నిందించారు.జనవరి 26, రిపబ్లిక్‌ డేరోజున రైతులు ట్రాక్టర్ల పెరెడ్‌ ను విజయవంతంగా నిర్వహించారు. కొంతమంది ఎర్రకోటపై జెండాను ఎగరేశారు. లఖింపుర్‌ ఖేరిలో అక్టోబరు 3న శాంతియతంగా నిరసన తెలుపుతున్న అన్నదాతలపై కేంద్రమంత్రి కుమారుడు కారును పోనిచ్చిరైతులను హత్యచేశాడు.నల్గురు రైతులు ఒక జర్నలిస్టు హత్యకుఅశిష్‌ మిశ్రా కారణమయ్యాడు. ఏడు వందల అరవై మంది రైతులు ప్రాణాలను అర్పించి పోరాటం కొనసాగించారు.


నల్ల చట్టాలను చట్టబద్ధంగా రద్దు చేసేంతవరకూ,కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేంత వరకూతమ నిరసన కొనసాగుతుందని పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సంఘర్షణ సమితి ప్రకటించింది. ఉదాహరణకు వరిధాన్యానికి కనీసమద్దతు ధర హామీ అమలులేకపోవడంతోఎకరానికి పదివేల పైగా నష్టపోతున్నారు.రైతు వరిధాన్యాన్ని75 కిలోల బస్తాను రు.1000- 1,200కి విక్రయించవలసి వస్తుంది.కనీస మద్దతు ధర క్వింటాలుకు రు.1960 అంటే 75 కేజీ లో బస్తాకు రు.1470 రావాలి.కనీసమద్దతు ధరకు చట్టబధత ఉంటే బస్తా దాన్యాన్ని 1470 కన్నా తక్కువకు కొంటానికి చట్ట ప్రకారం వీలు లేదు. ఒక్క బస్తాకు రు.300 నుండి 400 నష్టపోతున్నాడు. ఎకరానికి సగటున 30 బస్తాలు దిగుబడి ఉంటుందనుకుంటే, 9000 నుండి 12000 వరకు నష్టపోతున్నాడు. ఢిల్లీ లో రైతుల పోరాటంలో 2018 నుండీ ప్రధాన డిమాండ్‌ ఇదే. నల్ల చట్టాలు, చట్టాల రద్దు కోసం పోరాటం, పోలీసు కేసుల రద్దు,లఖింపుర్‌ ఖేరిలోహత్యలు, 760 మంది రైతుల మరణం – నష్టపరిహారం -అన్నీప్రభుత్వ రైతు వ్యతిరేక కార్పొరేట్‌ అనుకూల దుర్మార్గపు విధానాల ఫలితమేనని మరువరాదు.చట్టాలను రద్దు చేశారని సందడిలో పడి అసలు డిమాండ్లను వదలరాదు.కనీసమద్దతు ధరకు చట్టభద్దత కల్పించేవరకూ పోరాడుతూనేవుండాలి.. ఆ పోరాటంలో భాగంకావటం మనందరి కర్తవ్యం.

రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘం నేత.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అడకత్తెరలో నరేంద్ర మోడీ : అటు రైతులు, కార్మికులు – ఇటు కార్పొరేట్‌ బకాసురులు !

24 Wednesday Nov 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

BJP, Farmers agitations, India labour reform, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మొరటుగా ఉన్న ఇనుము కొలిమిలో బాగా కాలి ఉన్నపుడే కమ్మరి దాన్ని సాగదీసేందుకు లేదా అనువైన పరికరంగా మార్చేందుకు పూనుకుంటాడు. ఇది చాలా మందికి తెలిసిన అంశం. రైతులు, కార్మికులకు ఇప్పుడు మరింత స్పష్టమైంది. ప్రధాని నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పారు. అందువలన మరోవైపు రైతులు,కార్మికులు మరోపోరాటానికి సిద్దం అవుతున్నారు. మరోవైపు రైతు వ్యతిరేక చట్టాలను భుజాన వేసుకొని ఆహా ఓహౌ అంటూ భజన చేసిన వాటిని వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించటంతో కంగుతిన్నారు. వారే ఇప్పుడు మరోపల్లవి అందుకున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ తదుపరి సంస్కరణలపై వెనక్కు తగ్గవద్దని నరేంద్రమోడీ మీద వత్తిడి ప్రారంభించారు. నరేంద్రమోడీ ఎవరి పక్షాన ఉండేది రానున్న రోజుల్లో మరింత స్పష్టం కానుంది. ఇక వంది మాగధుల తీరు తెన్నులను చూస్తే ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొని ప్రతిపక్షాలకు ఒక ఆయుధం లేకుండా చేసి తన చాణక్యాన్ని ప్రదర్శించారట, క్షమాపణలు చెప్పి మనసులను చూరగొన్నారట, పట్టువిడుపులు తెలిసిన వారట. ఉచితంగా చెవుతున్నారు కదా అని బుర్ర తలుపులు మూసి చెవులప్పగించే జనాలున్నపుడు ఏమైనా చెబుతారు. వెంపలి చెట్టుమీద నుంచి ఒక్క గంతుతో ఎగిరి దూకగలిగిన ప్రతిభావంతులని కూడా చెప్పగలరు. జనాల బుర్రలు పని చేయటం లేదని, కొన్ని సరిగా ఉన్నా వాటిని ఉపయోగించరనే ప్రగాఢ విశ్వాసం కలిగిన వాట్సప్‌ విశ్వవిద్యాలయ పండితులు, ఇతరులూ ఇంతకంటే ఏమి చెబుతారు.


రైతులను వీధుల్లోకి రప్పించింది, ఢిల్లీలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు కొట్టించి, కాంక్రీటుతో ఆటంకాలు కల్పించింది, వాటినే ఆయుధాలుగా మార్చుకొనేట్లు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చింది నరేంద్రమోడీ గారే కదా ? నిజానికి పట్టువిడుపులుంటే సాగు చట్టాలను ఆర్డినెన్సులుగా తేవటం ఎందుకు, సెలెక్టు కమిటీకి పంపమంటే తిరస్కరించటం ఎందుకు, చర్చలేకుండా ఆమోదం ఎందుకు పొందారు ? నోరా చెంపకు చేటుతేకే అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.రైతులను నిందించాలని తన అనుచరగణాన్ని పురికొల్పినపుడు ఏమైంది వివేకం.తొలుత రైతులు ఆ చట్టాలను వెనక్కు తీసుకోవాలనే ఏకైక డిమాండ్‌ను తెచ్చినపుడే చాణక్యం ప్రదర్శిస్తే క్షమాపణ చెప్పుకోవాల్సిన దుస్ధితి ఉండేది కాదు, పరువు నిలిచేదికదా ! ఇప్పుడు వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. దీని వెనుకా ఎత్తుగడ ఉంది, మోడీని తక్కువ అంచనా వేయ వద్దని భక్తులు మాట్లాడుతున్నారు. రైతులను తక్కువ అంచనా వేసే కదా ఇంతదాకా వచ్చింది. మరోపిచ్చి పని చేస్తే మరింతగా ఉద్యమిస్తారని ఈ పెద్దలకు తలకు ఎక్కటం లేదు. పండుగాడి దెబ్బ అలా తగిలింది మరి !


అంతం కాదిది ఆరంభం.సంస్కరణల పేరుతో జనాన్ని కార్పొరేట్ల దోపిడీకి అప్పగించే ప్రక్రియను కాంగ్రెస్‌ పాలకులు ప్రారంభిస్తే దాన్ని మరింత వేగంగా నడిపేందుకు నరేంద్రమోడీ పూనుకున్నారు. నీరు మరగటం ప్రారంభమైనపుడే ఆవిరి రూపం మనకు కనిపించదు, వంద డిగ్రీల వేడి తరువాతే తెలుస్తుంది. అది ఇప్పుడు రైతుల ఆందోళన రూపంలో వెల్లడైంది. వారి చారిత్రాత్మక విజయం కొత్త పోరాటాలకు నాంది. ఆ సెగ అప్పుడే ప్రధాని నరేంద్రమోడీకి తగిలినట్లు వార్తలు. రైతుల ఉద్యమాన్ని అపర చాణుక్యులు ఊహించలేదు. భాగస్వాములైన రైతు సంఘాల నేతలను చీల్చేందుకు చేయని పని లేదు. సామ,దాన,భేద,దండోపాయాలన్నింటినీ ఉపయోగించారు. మెెత్తబడిన నేతలు కూడా రైతుల దీక్ష, పట్టుదలను చూసిన తరువాత మోడీకి భజన చేసేందుకు భయపడ్డారు. రైతు ఉద్యమం సాధించిన విజయాల్లో అదొకటి. రానున్న రోజుల్లో సాగే ఐక్య పోరాటాల్లో విభీషణులకు ఒక ముందస్తు హెచ్చరిక. రైతులు కొద్ది నెలలు వేచి చూసి విసుగుపుట్టి వెనక్కు వెళతారని, తరువాత కార్మిక, విద్యుత్‌ తదితర సంస్కరణలను ముందుకు తీసుకుపోవాలని భావించారు.


అనుకున్నదొకటి అయింది ఒకటి. ఐదు రాష్ట్రాల, ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, రైతు ఉద్యమంలో వివిధ సామాజిక తరగతుల మధ్య పెంపొందిన ఐక్యత, అన్నింటికీ మించి వివిధ రంగాలలో మోడీ సర్కార్‌ వైఫల్యాలు, జనంలో తొలుగుతున్న భ్రమలు మహాభారతంలో రారాజును గుర్తుకు తెస్తున్నాయి. భీముడి నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు ధుర్యోధనుడు చివరకు మడుగులో దాక్కున్నట్లుగా శ్రామిక భీముల నుంచి కాపాడుకొని రాజకీయంగా బతికి బట్టకట్టేందుకు నరేంద్రమోడీ దారులు వెతుకుతున్నారు. దానిలో సాగు చట్టాలు వెనక్కి, క్షమాపణ ఒకటి మాత్రమే. తాజాగా వస్తున్న వార్తలు, అధికారవర్గాల అంతరంగం మేరకు కార్మిక, విద్యుత్‌ సంస్కరణలను కూడా వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసేవరకు వాటి జోలికి పోవద్దని నిర్ణయించినట్లు చెబుతున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను విదేశీ-స్వదేశీ కంపెనీలు ఏర్పాటు చేసే సంస్దలలో పని చేసే కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసేందుకు, యజమానుల చిత్తానికి వారిని అప్పగించేందుకు కేంద్ర కార్మిక చట్టాలను మార్చివేసేందుకు పూనుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఇదిగో ఇప్పుడే అన్నట్లుగా మాట్లాడినప్పటికీ ముందుకు రాలేదు. మరోవైపు వాటిని ప్రతిఘటించేందుకు కార్మిక సంఘాలు కూడా సన్నద్దం అవుతున్నాయి. రైతు ఆందోళనకు కార్మికులు మద్దతు ప్రకటించటంతో రైతులు కూడా తమ డిమాండ్లలో కార్మిక అంశాలను కూడా చేర్చారు. సాగు చట్టాలతో పాటు లేబర్‌ కోడ్‌ల రద్దు కోరారు. ఇప్పటికి చేసింది చాలు మొదటికే మోసం తేవద్దు అని కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి దిశానిర్దేశం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పినట్లు చెబుతున్నారు.


సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న తీరు కార్మికోద్యమానికి ఎంతో విశ్వాసాన్నిచ్చిందని చెప్పవచ్చు. రైతు-కార్మిక ఐక్యతను ముందుకు తీసుకుపోవాలనే సంకల్పం మరింత గట్టిపడింది.నరేంద్రమోడీ ప్రకటనకు ముందే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సమయంలో రెండు రోజుల సాధారణ సమ్మె జరపాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సాగు చట్టాలను నిరసిస్తూ గతేడాది నవంబరు 26న ఢిల్లీ చలో పిలుపు ఇచ్చిన రైతులను సరిహద్దుల్లోనే అడ్డుకోవటంతో వారు సింఘు,టిక్రి, ఘాజీపూర్‌ వద్ద తిష్టవేసి నిరవధిక ఆందోళన ప్రారంభించిన అంశం తెలిసిందే. కార్మిక సంస్కరణలను రుద్దితే అదే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. సాగు చట్టాల రద్దు రైతులదే కాదు తమకూ విజయమే అని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ వర్ణించారు. రైతులు మోడీ సర్కార్‌ను వెనక్కు కొట్టగా లేనిది కార్మికులకు ఎందుకు కుదరదని హింద్‌ మజ్దూర్‌ సభ నేత నారాయణ సింగ్‌ ప్రశ్నించారు.


ఎక్కడ బడితే అక్కడ, తమకు ఇష్టమైన ధరకు పంటలను అమ్ముకొనే అవకాశాలను రైతులకు కల్పించేందుకే సాగు చట్టాల మార్పు అని చెప్పింది కేంద్రం. అసలు లక్ష్యం కార్పొరేట్లకు రైతాంగాన్ని అప్పగించటం. అదే విధంగా కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసేందుకు లేబర్‌ కోడ్‌లను రూపొందించారు. ఐఏఎన్‌ఎస్‌-సి ఓటర్‌ సర్వే ప్రకారం ఎన్‌డిఏ-ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు కూడా సాగు చట్టాల రద్దు కార్మిక సంస్కరణలను వ్యతిరేకించేందుకు ప్రేరేపణ కలిగిస్తున్నట్లు 43శాతం మంది, ప్రయివేటీకరణను ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని 48శాతం చెప్పారు. ఇరవై ఐదుశాతం మంది కార్మిక చట్టాల గురించి, ప్రయివేటీకరణ గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలు వెల్లడించలేదు.భారత్‌లో సంస్కరణలు జరగటం లేదనే సందేశం భారత-విదేశీ పెట్టుబడిదారులకు వెళ్లినట్లేనా అన్న ప్రశ్నకు 36శాతం మంది అవునని, అంతేశాతం కాదని చెప్పగా 29శాతం ఎటూ చెప్పలేదు. దీన్ని బట్టి సంస్కరణల గురించి సాధారణ జనానికి విశ్వాసం లేదని తేలుతోందని సర్వే విశ్లేషణ పేర్కొన్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద సాగు చట్టాల రద్దు ప్రభావం ఉంటుందని 55.1శాతం మంది చెప్పినట్లు ఎఎన్‌ఎస్‌-సిఓటర్‌ సర్వే తెలిపింది. ఎన్‌డిఏ మద్దతుదారుల్లో 53శాతం మంది కూడా ప్రభావం ఉంటుందని చెప్పారు.


కార్మిక చట్టాలు రాజ్యాంగ ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువలన పార్లమెంటు, రాష్ట్రాలు రెండూ చట్టాలను చేయవచ్చు. లేబర్‌ కోడ్‌లను ఆమోదించక ముందు నలభైకి పైగా కేంద్ర, వందకు పైగా రాష్ట్రాల చట్టాలు ఉన్నాయి. రెండవ జాతీయ లేబర్‌ కమిషన్‌ (2002) చేసిన సిఫార్సు ప్రకారం 2019లో 29 కేంద్ర చట్టాలను నాలుగు కోడ్‌లుగా బిల్లులను ప్రతిపాదించింది.వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన రక్షణ-ఆరోగ్యం-పని పరిస్ధితులుగా వర్గీకరించారు. మొదటిదానిని 2019లోనే ఆమోదించారు. మిగిలిన మూడింటిని స్టాండింగ్‌ కమిటీకి నివేదించి కొన్ని సవరణలతో 2020 సెప్టెంబరులో ప్రతిపాదించి, వెంటనే ఆమోదించారు. నాలుగింటినీ ఒకేసారి నోటిఫై చేయవచ్చు. కార్మికుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే భయంతో ఆపని చేయలేదు. వేతన కోడ్‌ను రాష్ట్రాలకు పంపి తరువాత దాని ముసాయిదాను ఖరారు చేయకుండా, అమలు నిలిపివేశారు.


గతంలో ఉన్న అసందిగ్దతలను తొలగిస్తామని చెప్పిన పాలకులు ఆమోదించిన వేతన కోడ్‌, ఇతర వాటి మీద వచ్చిన విమర్శల తీరు చూస్తే అవెలాంటివో అర్ధం చేసుకోవచ్చు. కనీస వేతనాల నిర్ణయానికి ప్రాతిపదికల గురించి, ఎవరు నిర్ణయిస్తారనే స్పష్టత లేదు.ప్రాంతాలు, నైపుణ్యం, పనిలో ఇబ్బందుల స్ధాయి, తదితర అంశాల ప్రాతిపదికన కనీసవేతన నిర్ణయం జరపాలన్నారు. ఈ అంశాలకు కొలబద్దలేమీ ఉండవు కనుక నిర్ణయించే అధికారుల విచక్షణకు వదలివేస్తారు. అది లాబీయింగు,ప్రలోభాల వంటి ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుంది. వేతన తగ్గింపు నిబంధన నిరంకుశమైనది, కార్మికులను సంఘాల్లో చేరకుండా నిరోధించేందుకు ఆయుధంగా మారుతుంది. ఇప్పుడు అత్యధిక కార్మికులు కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు. వారు వేతనాల చెల్లింపులో విఫలమైతే యజమానిని అడిగే హక్కు కార్మికులకు ఎంతో కష్టం అవుతుంది.యజమానులు వేతన చెల్లింపు ఉల్లంఘనకు పాల్పడినపుడు పరిమిత అధికారాలున్న అప్పీలు అధారిటీకి విన్నవించుకోవటం తప్ప కోర్టులకు వెళ్లే హక్కు లేదు. కార్మికులను ఇష్టమొచ్చినపుడు తీసుకోవటం లేనపుడు తొలగించటం సులభం అవుతుంది. అరవై రోజుల సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది, వివాదం విచారణలో ఉన్నపుడు సమ్మె హక్కు ఉండదు.త్రిపక్ష విచారణ పూర్తైన రెండు నెలల తరువాతే సమ్మెకు వెళ్లవచ్చు.మూడు వందల లోపు సిబ్బంది పని చేసే సంస్దలలో కార్మిక హక్కులు నీరుగారతాయి. అనేక సంస్దలను ఫ్యాక్టరీ నిర్వచనం నుంచి తొలగించారు.మహిళలు రాత్రుళ్లు కూడా పని చేసే విధంగా నిబంధనలు మార్చారు. ఇలా మొత్తం మీద చూసినపుడు కార్మికులకు వ్యతిరేకంగానూ, యజమానులకు అనుకూలంగానూ మార్చివేశారు. ఈ సంస్కరణల పట్ల కఠినంగా ఉండాలని వెనక్కు తగ్గవద్దని కార్పొరేట్‌ లాబీ చెబుతున్నది.


” సంస్కరణలను ఆలశ్యం చేస్తే దేశ ఆర్ధిక రంగానికి నిస్సందేహంగా అది ఒక ఎదురుదెబ్బ. వాణిజ్యం, పెట్టుబడులకు భారత మనోహరత్వము తగ్గుతుంది.ఇటీవలి ఉదంతాలు సాగు, కార్మిక సంస్కరణల గురించి ప్రకటించటానికి-అమలు చేసేందుకు ఉన్న తేడాను వెల్లడించాయని” బెంగలూరులోని సొసైటీ జనరల్‌ సంస్ద ఆర్ధికవేత్త కునాల్‌ కుందు చెప్పారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కార్పొరేట్ల కనుసన్నలలో పనిచేసే పత్రిక. అది రాసిన సంపాదకీయంలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.” ఇతర డిమాండ్లను సాధించుకొనేందుకు నిరసన కొనసాగిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రకటించింది. దాని డిమాండ్ల కలగూర గంపలో అత్యంత ప్రమాదకరమైనది కనీస మద్దతు ధరలకు చట్టబద్ద హామీ మరియు విద్యుత్‌ చట్టానికి ప్రతిపాదించిన సవరణలను వెనక్కు తీసుకోవాలన్నది అత్యంత దారుణమైన కోరిక.. .. ఎస్‌కెఎం ఇప్పుడు పూర్తిగా అసహేతుకమైన మార్పులను కోరుతున్నది, అవి భారత్‌ ఆర్ధిక వ్యవస్దను దిగజారేదిగా మారుస్తాయి….. భారత విద్యుత్‌ రంగం విచ్చిన్నమైంది. ఒక సంక్షోభం తరువాత మరొక సంక్షోభంలోకి నెడుతున్నది…. ఉచిత లేదా చౌకగా విద్యుత్‌ను కొనసాగించాలని ఎస్‌కెఎం పట్టుబడుతున్నది…. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం సదుద్ధేశ్యంతోనే చేసింది, ఇప్పుడు వెనక్కు తగ్గింది. అసహేతుకమైన కోరికల విషయమై ప్రభుత్వం ఒక గిరి గీసుకోవాలి. సాగు చట్టాలను ఆమోదించిన పార్లమెంట్‌ సమావేశాల్లోనే మూడు లేబర్‌ కోడ్‌లను కూడా ఆమోదించారు. వాటిని ఇంకా పూర్తిగా అమలు జరపలేదు. ప్రభుత్వం సంస్కరణలపై గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది లేదా దుర్బలమైన ప్రభుత్వంగా మారే అవకాశం ఉంది. సంస్కరణల మీద ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది, అదే సమయంలో అసహేతుకతను ఎదుర్కోవాల్సి వచ్చినపుడు కఠిన వైఖరిని కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం.” పదాలు కొన్ని అటూ ఇటూ మారినా పెరిగినా తరిగినా మొత్తం మీద స్వదేశీ-విదేశీ కార్పొరేట్ల వైఖరికి ఈ సంపాదకీయం అద్దం పట్టింది. కనుక తమ జీవితాలను మరింత దుర్భరం చేసుకోవటమా, మెరుగుపరచుకోవటమా, దానికి అనుసరించాల్సిన బాటను తేల్చుకోవాల్సింది ఇక రైతులు, కార్మికులే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీకి యావత్‌ దేశం ” కృతజ్ఞతలు ” చెప్పాలి మరి !

21 Sunday Nov 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

BJP, farm laws, Farmers agitations, Farmers Delhi agitation, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఒక ధుర్యోధనుడు, ఒక రావణుడు, ఒక ముస్సోలినీ, ఒక హిట్లర్‌, ఒక జారు చక్రవర్తి, ఒక ఇందిరాగాంధీ, ఒక నరేంద్రమోడీ చరిత్రను మలుపుతిప్పే మహానుభావుల పరంపర ఇది. కొంత మంది నమ్ముతున్నట్లు విధి లిఖితం ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. ఇలాంటి ప్రతినాయకుల జన్మ ప్రతి కాలంలోనూ పునరావృతం అవుతున్నందున ఆ క్రమంలోనే ప్రజా నాయకులు కూడా పుట్టుకువస్తారు. ఇప్పుడు రైతుల రూపంలో అదే జరిగింది. కొందరు త్యాగధనులు ఉద్యమాలకు ఊపిరిలూదుతారు. రైతు ఉద్యమం అనేక పోరాటాలకు ఊతమిచ్చింది. యాభై ఆరుగాదు 112 అంగుళాల గుండెలున్నవారిని కూడా పిండిచేయగలమని, దిగివచ్చేట్లు చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బ్రిటీష్‌ వారిని పారద్రోలాలనే ఏకైక లక్ష్యం భిన్న రాజకీయ ధోరణులు కలిగిన వారిని ఒక దగ్గరకు చేర్చింది. ఆ తరువాత అత్యవర పరిస్ధితి విధింపు కొంత మేరకు అందుకు దోహదం చేసింది. ఇప్పుడు అంతకంటే మరింత ప్రాముఖ్యత కలిగినదిగా దేశంలో రైతుల ఆందోళన ఒక మహత్తర దృశ్యానికి తెరతీసింది. అందుకు పురికొల్పిన ” మహానుభావుడు” ప్రధాని నరేంద్రమోడీకి యావత్‌ జాతి కృతజ్ఞతలు చెప్పాలి కదా !


చరిత్రలోని ప్రతినాయకులందరికీ వారి తీరుతెన్నులను చూసి ఇది తగదు, అది తగని పని అంటూ వారి మంచి కోరుకొనే వారు చెప్పినా వినిపించుకోలేదన్నది చరిత్ర, సాహిత్యం చెప్పిన సత్యం. విధి లేదా తలరాత అలా రాసి ఉంటుంది మరి. ముస్లింలపై గుజరాత్‌లో జరిగిన మారణకాండ సమయంలో రాజధర్మాన్ని అనుసరించాలని నాటి ప్రధాని అతల్‌బిహారీ వాజ్‌పాయి హితవు చెప్పారు. వాజ్‌పాయిగారు ఏదైతే చెప్పారో సరిగ్గాదాన్నే పాటిస్తున్నా అని అదే వేదిక మీద ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. పూర్వకాలపు మనిషి గనుక వాజ్‌పాయి మరోదారి లేక అవును ఆయన అదే చేస్తున్నారు అని చెప్పకతప్పలేదు.సీత గీత దాటకపోతే రామాయణమే లేదు. పాండవులకు ఐదూళ్లు ఇచ్చి ఉంటే మహాభారతమే ఉండేది కాదు. సాగు రాష్ట్రాల అంశమైనా వాటితో సంప్రదించకుండా కరోనా తాండవిస్తుంటే ఆర్డినెన్సుల రూపంలో రుద్దటం, తరువాత వాటి మీద పార్లమెంటులో చర్చ లేకుండా ఆమోదం, రాష్ట్రపతి ముద్ర వెనుక ఏదో ఒక మహత్తరశక్తి లేకపోతే మానవమాత్రులను అలా చేయిస్తుందా ? అందుకుగాను ” నిమిత్తమాత్రుడైన ” నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పకపోవటం తప్పుకదా !


కరోనా నివారణకు చప్పట్లు, కంచాలు, గిన్నెలు మోగించాలంటే ఆ పని చేశారు. దివ్వెలు వెలిగించమంటే గౌరవభావంతో వెలిగించారు. ఏ కతలు చెబితే వాటిని నమ్మారు కదా అని బతుకు దీపాలనే ఆర్పుతాం అంటే రైతులు సహిస్తారా ? సాగు చట్టాల గురించి కూడా నరేంద్రమోడీకి హితవు చెప్పిన వారు లేకపోలేదు. జనంతో సంబంధం లేని, కార్పొరేట్లకు సేవలు చేసే జయప్రకాష్‌లు, జనాల మీదకు ఎక్కే ఆర్నాబ్‌లు, గుడ్డిగా సమర్ధించే ప్రాంతీయ పార్టీల నేతలమద్దతు, కార్పొరేట్‌లు కళ్ల ముందు కనిపిస్తుంటే రైతుగోడు వినిపించుకొనే తీరిక ఎక్కడుంటుంది పాపం ! విదురనీతి, హితవచనాలు విని ఉంటే రైతు భారతం ఎలా జరుగుతుంది? మోడీ క్షమాపణలు చెప్పేంతవరకు ఉద్యమం గురించి పట్టని ఇతర రైతులు, తలకు ఎక్కించుకోని ఇతర జనాలకు కిక్కు దిగేది కాదు, యావత్‌ ప్రపంచానికి తెలిసేది కాదు కదా ! అంతటి కనువిప్పు కలిగించి మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పకపోవటం ” క్షంతవ్యం ” కాదేమో !


సంచలనాలు సృష్టించటం బలవంతులకే కాదు బలహీనులకూ, పిరికిబారిన వారికీ సాధ్యమే. తిరుగులేని రామబాణం కలిగినట్లు చెప్పే రాముడూ పరువు కోసం సీతను కష్టాల పాలు చేసిన బలహీనతకు గురైన సంగతి తెలిసిందే. రామాయణంలో రాముడు, రావణ పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉందో రాముడిని తప్పుపట్టిన రజకుడికీ అంతే ఉంది ! నరేంద్రమోడీలో చాలా మందికి వారు రాజకీయంగా వ్యతిరేకించే లేదా అనుకూలించే వారికి ఇప్పటి వరకు ఒక రూపమే కనిపించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా తాను చేయదలచుకున్నదానిని చేస్తారని గుజరాత్‌ మారణకాండ సమయంలో అభిమానుల్లో పేరు తెచ్చుకున్నారు. ఇతరుల్లో భయం పుట్టించారు. తాము కోరుకున్న సంస్కరణలను అమలు జరిపేందుకు జనాన్ని అవసరమైతే అణచివేసే బాహుబలుడిని కార్పొరేట్లకు నరేంద్రమోడీలో చూపింది కూడా అదే. కట్టుకున్న ఇల్లాలిని కూడా విస్మరించి దేశం కోసం సంఘపరివార్‌ పెంచిన బిడ్డగా నరేంద్రమోడీకి రెండు బాధ్యతలున్నాయి. ఒకటి సమాజాన్ని వెనక్కు నడపాలనే తిరోగామి హిందూత్వ కాగా, రెండవది దానికి అధికారం, అందుకోసం అవసరమైన కార్పొరేట్ల ఆసరా. రెండూ సాధించారు గానీ రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు.

హిందూత్వను అమలు జరిపేందుకు స్వమతమౌఢ్యం-పరమత ద్వేషం నింపాలి. మన దేశంలో అది చాలా ప్రమాదకరం. కార్పొరేట్లకు అంగీకారం కాదు, కొంత మేరకు వారు రాజీపడతారు తప్ప వాటిది పైచేయి కానివ్వరు. ఐరోపాలో ఫ్యూడల్‌ ప్రభువులను, ప్రభుత్వాల మీద పెత్తనం చేస్తున్న చర్చిని వదిలించుకున్న చరిత్ర తెలిసిందే. మన దేశంలో ఉన్న పరిస్ధితులను బట్టి కార్పొరేట్లు గుళ్లూ గోపురాలను కట్టించారు, మత, ఉదారశక్తులకూ మద్దతు ఇచ్చారు, భూస్వాములు, ధనిక రైతులతో రాజీపడ్డారు. భూమి కేంద్రీకరణ వారి లాభాలను అడ్డుకుంటుంది కనుక భూ సంస్కరణలను ముందుకు తెచ్చారు. గ్రామాల్లో ఉన్న భూస్వాములను, వారి కండబలాన్ని వదులుకొనేందుకు కాంగ్రెస్‌ సిద్దంగా లేనందున వాటిని నీరుగార్చింది. ధనిక రైతులను సంతుష్టీకరించే చర్యలను తీసుకుంది.

ఇప్పుడు గ్రామాల్లో కూడా పరిస్ధితులు మారాయి. ఓట్లకొనుగోలులో అక్రమాలను సహించేది లేదని హూజారాబాద్‌లో మహిళలు రోడ్డెక్కే విధంగా పరిణామాలు పురోగమించటాన్ని చూశాము.దళారీలు లేకుండా నేరుగా ఓట్లు కొనుగోలు, అందరికీ ఒకే రేటు ఇవ్వాలని కోరారు. భూస్వాముల పెత్తనం సాగదింక, అంటే కార్పొరేట్ల డబ్బుతోనే ఇక ముందు పార్టీలకు పని. కనుకనే కార్పొరేట్ల కన్ను వ్యవసాయ రంగం మీద పడింది. దీనికి తోడు బహుళజాతి గుత్త సంస్దల వత్తిడి కూడా తోడైంది. అవసరమైతే ధనిక రైతులను వదులు కొనేందుకు మోడీ సర్కార్‌ సిద్దమైంది కనుకనే ఆదరాబాదరా మూడు సాగు చట్టాలు. ఇప్పుడు వాటికి మంగళం పాడుతూ అధికారానికి ఎసరు రాకుండా చూసుకొనేందుకు కొత్త నాటకానికి తెరతీశారు. దీనివలన కార్పొరేట్లలో మోడీ మీద ఉన్న భ్రమలు తొలుగుతాయి. కొత్త బొమ్మను వెతుకుతారు. ఏడాది కాలంగా మోడీ తీరుతెన్నులను చూసిన ఏ రైతూ అంత తేలికగా బిజెపిని బలపరచడు. ఏమైనా సరే దేశాన్ని వెనక్కు నడుపుతారు, హిందూత్వను ఏర్పాటు చేస్తారని హిందూ హృదయ సామ్రాట్‌గా భావిస్తున్న శక్తులలోనూ మోడీ అనుమానాలు రేకెత్తించారు. లేదూ అలాంటిదేమీ లేదు, వ్యూహాత్మకంగానే తమ నేత వెనక్కు తగ్గినట్లు, మరింత గట్టిగా తాను చేయదలచుకున్నది చేస్తారని భక్తులు చెబుతున్నారు. కనుక ఏది జరిగినా తలెత్తే అనూహ్యపరిణామాలకు కచ్చితంగా మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.


తమ నేత ఓట్ల కోసం జనాన్ని సంతుష్టీకరించరు, దేశం కోసం అవసరమైతే కఠిన చర్యలను తీసుకొనేందుకూ వెనుకాడరంటూ ప్రజావ్యతిరేక చర్యలను సమర్ధించేందుకు పూనుకున్న వారున్నారు. మోడీ వెనక్కు తగ్గినా వారు తగ్గేట్లు లేరని సాగు చట్టాల రద్దు ప్రకటన తరువాత సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్న తీరు వెల్లడిస్తున్నది. ఒకసారి పులిని ఎక్కిన తరువాత అంత తేలికగా దిగుతారా ! మోడీ నిర్ణయంతో తమకు నిమిత్తం లేదు, ఆ చట్టాలు సరైనవే అని కొందరు ప్రబుద్దులు కొత్త వాదన మొదలు పెట్టారు. నరంలేని నాలికలు, అద్దె నోళ్లు ఏమైనా మాట్లాడగలవు. ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రైతులు తమకు వ్యతిరేకమైన మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు తప్ప ఎవరూ క్షమాపణ కోరలేదే ! ఎవరైనా ఎప్పుడు అలాంటి పని చేస్తారు. తప్పుచేసి తప్పించుకొనే దారిలేక అడ్డంగా దొరికినపుడు, లేదా తీవ్రమైన తప్పిదానికి పాల్పడినపుడు చెబుతారు.

” నేను దేశ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను..సాగు చట్టాల గురించి రైతులను ఒప్పించలేకపోయాము. మూడు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. దేశ అవసరాలకు అనుగుణంగా పంటల మార్పిడి, కనీస మద్దతు ధరలను మరింత సమర్దవంతంగా, పారదర్శకంగా చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం” అని మోడీ చెప్పారు. నరేంద్రమోడీ తరువాత ప్రధాని పదవికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి అదిత్య నాధ్‌ స్పందిస్తూ ” బహుశా మావైపు నుంచి లోపం ఉన్న కారణంగా మేము చెప్పదలచుకున్నదాన్ని జనాలకు చెప్పటంలో మేము విఫలమయ్యాము ” అన్నారు.సాగు చట్టాలకు రైతాంగంలో ఎక్కువ మంది మద్దతు ఇచ్చారని కూడా సెలవిచ్చారు. గతంలో చట్టాలు చేసినపుడు వాటిని చారిత్రాత్మకమైనవని వర్ణించిన ఈ పెద్దమనిషి ఇప్పుడు రద్దును కూడా చారిత్రాత్మకంగానే వర్ణించారు. జనానికి మతిమరపు ఎక్కువని భావించేవారే ఇలా సమర్ధించుకోగలరు. మొత్తం మీద సాగు చట్టాలు తేవటం తప్పన్న మాట పెద్దల నోట రాలేదు. అందుకే జనంలో మోడీకి పెద్దగా సానుకూలత రాలేదు. కొంత మందిని కొంతకాలం మోసం చేయ గలరు తప్ప అందరినీ ఎల్లకాలం చేయలేరు. తన పదజాలం వెనుక ఉన్న మర్మాన్ని జనం గ్రహించేట్లు చేసినందుకు నరేంద్రమోడీకి కృతజ్ఞత చెప్పాలి మరి !


సాగు చట్టాలు దేశానికి వెన్నెముకగా ఉన్న రైతాంగాన్ని ప్రభావితం చేసేవి. వాటి దుష్ఫరిణామాలు తక్కువ కాదు. ముందుగా ఉప్పందుకున్న వేళ్లమీద లెక్కించదగిన అధికారపార్టీ పెద్దలు, ఆశ్రితులైన వారు తప్ప మోడీగారి పెద్ద నోట్ల రద్దు దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసింది, జనాన్ని నానా యాతనల పాలు చేసింది-ఘోరంగా విఫలమైంది. అలాంటి పిచ్చిపని ప్రకటించిన లక్ష్యం నెరవేరలేదు, దానికి గాను జనాన్ని ఇబ్బంది పెట్టాను, ఆర్ధిక రంగాన్ని చెప్పరాని ఇబ్బందులపాలు చేశాను అని ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి ఉంటే ఇప్పుడు చేసిన ప్రకటనను జనం నమ్మి ఉండేవారు.తమకళ్ల ముందే జరిగిన పెద్ద నోట్ల రద్దు వైఫల్యాన్ని అంగీకరించకపోగా డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి, పన్ను చెల్లింపుదార్లు పెరిగారంటూ కొత్త కతలు చెప్పారు. పొద్దున్నే రైతులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని తరువాత ఉత్తర ప్రదేశ్‌లో ప్రవేశించగానే వేరే శక్తి అవాహనలోకి వెళ్లారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని మహూబా జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ కొంత మంది రైతులను పావులుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఇది ప్రతిపక్షాన్ని విమర్శించటం కంటే రైతులను తెలివితక్కువ దద్దమ్మలుగా నిందించటం తప్ప వేరు కాదు. ఇది కూడా రైతాంగాన్ని చైతన్యపరిచేదే, మరింత కసి పెంచేదే కనుక అందుకూ మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే ?


వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో చట్టాల రద్దుకు అవసరమైన తతంగం పూర్తి చేస్తామని చెప్పారు. ఐనా సంయుక్త కిసాన్‌ మోర్చా నమ్మలేదు. ముందుగా ప్రకటించిన ఆందోళనా కార్యక్రమంతో ముందుకు పోవాలని ప్రకటించింది. నెలాఖరులో మరోసారి సమావేశమై మిగతా అంశాల గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. విదేశీ-స్వదేశీ కార్పొరేట్ల వత్తిడికి లొంగి ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు చేసిన చట్టాలను పార్లమెంటు ఎంత ప్రహసన ప్రాయంగా ఆమోదించిందీ ప్రపంచం చూసింది. 2020జూన్‌లో ఆర్డినెన్స్‌ల ద్వారా వాటిని తెచ్చారు. ఎలాంటి చర్చ లేకుండా మూజువాణీ ఓటుద్వారా ఆమోదముద్ర వేశారు. తరువాత వాటిని వెనక్కు తీసుకొనేందుకు ససేమిరా అన్న పాలకులు రైతాంగాన్ని అపహాస్యంపాలు చేశారు. వారు అసలు రైతులే కాదన్నారు, దళారీలన్నారు, ఖలిస్తానీలు, ఉగ్రవాదులు అని ముద్రవేశారు. విదేశీ నిధులతో ఆందోళనలు చేశారని నిందించారు. చర్చలను ప్రహసన ప్రాయంగా మార్చారు. రైతుల మీద భౌతికంగా దాడులు చేశారు, రెచ్చగొట్టేందుకు చూశారు. తరువాత సుప్రీం కోర్టు వాటి అమలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒక కమిటీని ఏర్పాటు చేసింది, నివేదిక ఇమ్మంది. ఇంతవరకు ఆ నివేదిక వెలుగు చూడలేదు. దాన్ని కూడా మూసిపెట్టారు.

సాగు చట్టాల రద్దు రైతుల విజయం అని వేరే చెప్పనవసరం లేదు. దానికెంత ప్రాధాన్యత ఉందో రద్దు, మోడీ క్షమాపణల ప్రకటన ఆ చట్టాలను నిస్సిగ్గుగా సమర్దించటానికి తమ మేధాశక్తి నంతటినీ రంగరించి రైతుల మీద రుద్దటానికి ప్రయత్నించిన ప్రబుద్దులకు చెప్పుకోవటానికి వీల్లేని చోట నరేంద్రమోడీ కొట్టిన తిరుగులేని దెబ్బగా కూడా చెప్పవచ్చు.సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు, అంతకు ముందు చట్టాలను సమర్ధించిన షేత్కారీ సంఘటన నేత అనిల్‌ గన్వట్‌ గోడు మామూలుగా లేదు. వాటిని రద్దు చేసినంత మాత్రాన ఆందోళనకు తెరపడదు, బిజెపి ఆశించినట్లుగా ఆ పార్టీకి రాజకీయంగా ఉపయోగపడదని చెప్పారు. ఆ నివేదికలో ప్రభుత్వ చర్యను గుడ్డిగా సమర్ధించి ఉండకపోవచ్చు, అది ఎప్పటికైనా వెలుగులోకి వస్తే చట్టాలను వెనక్కు తీసుకోవాలని సుప్రీం కోర్టు సలహా ఇస్తే మోడీ సర్కార్‌ పరువు మరింతగా పోతుంది, అందువలన మరింత నష్టం జరగకుండా విధిలేక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసం ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. మోడీ వెనక్కు తగ్గే అవకాశం లేదని గట్టిగా నమ్మి అతని కంటే ఘనులు అన్నట్లు ఎక్కువగా సమర్ధించిన వారు మోడీ తమను వెన్నుపోటు పొడిచినట్లు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.అందువలన ఇక ముందు మోడీ లేదా మరొకరు ఎవరు ప్రకటించిన లేదా అమలు జరిపే విధానాలనైనా గుడ్డిగా సమర్ధించకూడదని ఇప్పటికే అనే మంది మనసులోనే చెంపలు వేసుకుంటున్నారు. వారిలో అలాంటి మారుమనసు తెచ్చినందుకు నరేంద్రమోడీని అభినందించకుండా ఉండగలమా ?


రైతుల ఆందోళనకు ఏడాది పూర్తి కావస్తుండగా నవంబరు 26వ తేదీ తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న బిజెపి వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే మరో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పరాభవం ఎదురుకానుందనే వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో నరేంద్రమోడీ సర్కార్‌ వెనక్కు తగ్గింది. తాను నోరు విప్పినా విప్పకపోయినా, పరోక్షంగా రైతులను పరిహసించినా రాజును మించి రాజభక్తిని ప్రదర్శించి సాగు చట్టాలను సమర్ధించిన వారికి వెన్నుపోటు పొడిచి తన లబ్దిని తాను చూసుకున్నారు. మోడీ మొండి వైఖరి కారణంగా కొందరు రైతుల్లో తమ పోరాటం ఫలిస్తుందా అన్న అనుమానాలు తలెత్తటం అసాధారణం కాదు, అలాంటి వారి సంశయం-ఇటు తన మద్దతుదారుల ధృడవిశ్వాసానికి భిన్నంగా రైతు చట్టాల మీద మోడీ తోకముడిచారు. వ్రతం చెడినా ఫలందక్కదు. సాగు చట్టాలకు దారి సుగమం చేసుకొని కార్మిక చట్టాలను దెబ్బతీసేందుకు, ఆర్ధిక రంగంలో పెను మార్పులకు మోడీ సర్కార్‌ అస్త్రాలను ప్రయోగించాలని కాచుకు కూర్చున్నది.వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చూస్తున్న వారికి సాగు చట్టాల రద్దు ఎంతో ఊపునిస్తుంది.రైతుల ఆందోళన వెలుగులో దీర్ఘకాలిక పోరాటాలకు సిద్దం అవుతారు. అందుకు దోహదం చేసిన ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పకపోవటం అన్యాయం కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల చేతుల్లో ముల్లు గర్రలు – ముళ్ల కంచెల ఏర్పాట్లలో మోడీ !

03 Wednesday Feb 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Budget 2021 Agriculture, Farmers agitations, India budget 2021-22, India budget-Farmers, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


రైెతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ శివార్లలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శాశ్వత ఆటంకాలు(బారికేడ్లు), ముళ్ల కంచెలు, గోడలు, రోడ్ల మీద ఇనుప ముళ్ల ఏర్పాట్లను చూస్తుంటే వారితో తాడోపేడో తేల్చుకొనేందుకే నరేంద్రమోడీ సర్కార్‌ సన్నద్దం అవుతున్న భావన కలుగుతోంది. అంతకు తెగిస్తారా ? రాజకీయ వ్యాపార లాభ నష్టాలను బేరీజు వేసుకొని తాత్కాలికంగా వెనక్కు తగ్గుతారా ? ముందుకు పోతే రాజకీయంగా రోజులు దగ్గర పడతాయి. వెనక్కు తగ్గితే మరిన్ని ఉద్యమాలు ముందుకు వస్తాయి. నరేంద్రమోడీ సంస్కరణల పులిని ఎక్కారు, ఏం చేస్తారో, ఏం జరగనుందో చూద్దాం !


గోముఖ వ్యాఘ్రాల నిజస్వరూపం అసలు సమయం వచ్చినపుడే బయటపడుతుంది. ఇక్కడ గోవు ప్రస్తావన తెచ్చినందుకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే క్షంతవ్యుడను. గోముఖ వ్యాఘ్రం అనే పదాన్ని సృష్టించిన వారికి వీరతాళ్లు వేస్తారో లేక మరణానంతరం దేశద్రోహ నేరం కింద శిక్షించమని సిఫార్సు చేస్తారో వారిష్టం. గోముఖ వ్యాఘ్రాల గురించి చెప్పటానికి ఈ పదం తప్ప ఆత్మనిర్భరత లేదా మేకిన్‌ ఇండియా, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ వంటి పదాలను సృష్టించిన వారు ప్రత్యామ్నాయం చూపేంత వరకు దాన్ని ఉపయోగించక తప్పటం లేదు.


ఆవులను మోసం చేసేందుకే వ్యాఘ్రాలు గోముఖాలతో వస్తాయి. ఇప్పుడు రైతులనే ఆమాయకులను మోసం చేసేందుకు అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అదే. అన్నీ మీరే చేశారు అని కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నట్లుగానే అన్నీ రైతుల కోసమే అనేట్లుగా రైతు ఉద్యమ నేపధ్యంలో బడ్జెట్‌ ప్రసంగం, భాష్యాలు సాగాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోత పెట్టటం ఒకటైతే పెట్రోలియం ఉత్పత్తులు, బంగారం, ఇతర దిగుమతులపై వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ది సెస్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతుల ఉత్పత్తులకు అధిక ధరలు వస్తాయని ఆర్ధిక మంత్రి చెప్పారు. మరొకటి వచ్చే ఏడాదిలో రూ.16.5లక్షల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు నిర్మలమ్మ చెప్పారు. చాలా మంది దీన్ని బడ్జెట్‌ కేటాయింపు అనుకున్నారు. బడ్జెట్‌ మొత్తమే 34.83లక్షల కోట్లయితే దానిలో దాదాపు సగం రైతులకు రుణాలుగా ఇస్తారా ? బ్యాంకుల నుంచి ఇప్పించే అప్పులు మాత్రమే అవి. మాట్లాడే మేక అంటూ ఎలా బురిడీ కొట్టిస్తారో అందరికీ తెలిసిందే. ఏప్రిల్‌ తరువాత వచ్చే నెల ఏదీ-జూన్‌కు ముందు వచ్చే నెల ఏదీ అని అడిగి మేకను గిల్లిలే ” మే ” అని అరుస్తుంది.రైతుల ఆదాయాలు పెంచే యత్నంలో భాగంగా ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులను జాతీయం చేసినప్పటి నుంచి రైతులకు ఇస్తూనే ఉన్నారు, అవేవీ రైతుల ఆదాయాలను పెంచలేదు. గత సంవత్సరం పదిహేను లక్షల కోట్లుగా నిర్ణయించారు, అంతకు ముందు పదమూడున్నర లక్షల కోట్లు ఉంది. ఈ లెక్కన శాతాల్లో చూస్తే వచ్చే ఏడాది తగ్గినట్లా – పెరిగినట్లా !


ఎంతైనా నిర్మలమ్మ తెలుగింటి ఆడపడుచు కనుక తక్కువే అని చెప్పి ఆమెను తప్పుపట్టదలచ లేదు. అధికారులు రాసి ఇచ్చింది చదువుతారు తప్ప ఆమె రాసి ఉండరు అనుకోవాలి. రైతులకు చేకూర్చిన ప్రయోజనాల గురించి నిర్మలా సీతారామన్‌ చాలా కబుర్లు చెప్పారు. బహుశా రాత్రి ఇంటికి వెళ్లి ఇదేంటబ్బా ఇలా మాట్లాడాను అనుకొని ఉంటారు. ఎందుకంటే గతంలో మాదిరి ప్రసంగం చదువుతుంటే బల్లలు చరచటాలు, ఆహా ఓహౌ అంటూ అధికార పక్ష ప్రశంశలూ లేవు. గతేడాది కంటే మొత్తం బడ్జెట్లో పెంపుదల కేవలం 33వేల కోట్ల రూపాయలు మాత్రమే. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ బడ్జెట్‌ తగ్గుతుంది అనే ఊహ ఆమెకు నిద్రను దూరం చేసి ఉండాలి.

స్వామినాధన్‌ కమిషన్‌ నివేదికను గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చెత్తబుట్టలో వేస్తే తాము బయటకు తీసి అమలు జరిపామని బిజెపి వారు చెబుతున్నారు. ఎంత మోసం !! ఇదే నరేంద్రమోడీ సర్కార్‌ దాన్ని అమలు జరపలేమంటూ సుప్రీం కోర్టుకు నివేదించిన విషయం జనం మరచి పోతారా ? 2019-20 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 130వేల కోట్లు చూపి ఖర్చు చేసింది రూ.94,251 కోట్లు మాత్రమే. గత ఏడాది 134వేల కోట్లు చూపి దాన్ని 117వేలకోట్లకు సవరించారు. తాజా బడ్జెట్‌లో 123వేల కోట్లను చూపి తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ప్రధాని కిసాన్‌ నిధి పేరుతో ఏటా ఆరువేల రూపాయలు ఇస్తున్నదానిని పదివేలకు పెంచుతారనే లీకు వార్తలు వచ్చాయి. దానికి బదులు గత ఏడాది ఉన్న 75వేల కోట్ల బడ్జెట్‌ను 65వేలకు కుదించారు. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పది వేల కోట్లు పెంచారని జబ్బలు చరుచుకున్నారు బానే ఉంది మరి ఈ తగ్గింపు సంగతేమిటి ? కొత్తగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి 900 కోట్లు కేటాయించామని చెబుతూనే వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పధకానికి 1700 కోట్లు, ధరల స్ధిరీకరణ నిధికి 500 కోట్ల కోత పెట్టారు. మొత్తంగా చూసినపుడు వ్యవసాయ సంబంధ బడ్జెట్‌ మొత్తాలను 8.5శాతం తగ్గించినట్లు తేలింది. అయినా రైతులకు ఎంతో మేలు చేశామని ప్రసంగంలో ఊదరగొట్టారు. నిజానికి వ్యవసాయ లేదా గ్రామీణ మౌలిక సదుపాయాల నిధులు కొత్తవేమీ కాదు, గతంలో ఉన్నవే. వాటి ద్వారా రైతులకు కలిగించిన లబ్ది ఏమిటో చెప్పరు.

కనీస మద్దతు ధరల కొనుగోలు ద్వారా రైతులకు 2020-21లో 2.47లక్షల కోట్లు చెల్లించామని ఆర్దిక మంత్రి గొప్పగా చెప్పారు.ఉత్తిపుణ్యానికే చెల్లించారా ? వరి, గోధుమలను తీసుకొని వాటికేగా చెల్లించారు. దీన్ని కూడా గొప్పగా చెప్పుకుంటారా ? ఫసల్‌ బీమా యోజన ఎంత మందికి కల్పించారని కాదు, ఎంత మందికి ఉపయోగపడిందనన్నది ముఖ్యం.2018-19లో 5.76 కోట్ల మందికి కల్పించామని చెప్పారు. మరుసటి ఏడాది లబ్దిదారులు 2.15 కోట్లన్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో లబ్దిపొందింది 70లక్షల మంది అని ఆర్ధిక సర్వేలో చెప్పారు. కిసాన్‌ నిధి కింద సన్న, చిన్నకారు రైతులు 9.43కోట్ల మంది ఆరువేల రూపాయల చొప్పున పొందారని చెబుతున్నారు. అంటే బీమా పధకం ఎంత మందికి ఉపయోగపడుతున్నదో దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు.ధాన్యసేకరణ ద్వారా లబ్ది పొందింది 2.2 కోట్ల మంది అన్నారు. ఇవన్నీ చెబుతున్నదేమిటి ? ప్రచారం ఎక్కువ ప్రయోజనం తక్కువ అనే కదా ! వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి లక్ష కోట్లు, పశుసంవర్ధక మౌలిక సదుపాయాల నిధి పదిహేను వేల కోట్ల రూపాయలు కరోనా ఉద్దీపన పేరుతో ఇప్పటికే ఉంది. దాన్నుంచి రుణాలుగా సూత్రరీత్యా మంజూరు చేసిన మొత్తం జనవరి నాటికి రూ.2,991 కోట్లు మాత్రమే.


భారత ఆహార సంస్ద(ఎఫ్‌సిఐ)కి జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధి(ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌) నుంచి రుణం తీసుకోవటాన్ని నిలిపివేస్తున్నామని ఆర్దిక మంత్రి తన ప్రసంగంలో ప్రకటించారు. ఇదేమీ విప్లవాత్మక నిర్ణయం కాదు. అసలు ప్రభుత్వ నియంత్రణ, నిధులతో నడిచే సంస్ద మరొక ప్రభుత్వ సంస్ద నుంచి రుణం తీసుకోవాల్సిన అగత్యం ఏమి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అతి పెద్ద సంస్కరణగా కార్పొరేట్‌ ప్రతినిధులు వర్ణించారు. నిజమే వారి లెక్కలు వారికి ఉన్నాయి. మనకు అర్ధం కావాల్సింది ఏమిటి ? ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ విధించిన షరతుల్లో భాగంగా రుణాలు, ద్రవ్యలోటు వంటి అంశాలకు సంబంధించి పరిమితులు విధించారు. వాటిని తప్పించుకొనేందుకు దొడ్డి దారులు వెతికారు. ప్రభుత్వ రుణాల మొత్తాన్ని తక్కువగా చూపేందుకు గాను ప్రభుత్వ సంస్ధలు తీసుకొనే రుణాలను విడిగా చూపుతున్నారు. రెండవది ఈ రుణం, దానికయ్యే ఖర్చును చూపి ఎఫ్‌సిఐని అసమర్ధమైందిగా చిత్రించి దాన్ని వదిలించుకొనే ఎత్తుగడ దీని వెనుక ఉంది. ఎఫ్‌సిఐలో అవినీతి లేదని కాదు, ఆ మాటకు వస్తే పోలీసు, మిలిటరీ కొనుగోళ్లలోనే అవినీతి జరుగుతోంది.


ఎఫ్‌సిఐ సేకరించే ఆహార ధాన్యాలు, పప్పు, నూనె గింజలను ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ ధరలకు వినియోగదారులకు అందించాల్సి ఉంది. ఈ సబ్సిడీ మొత్తాలతో పాటు సంస్ధ నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆహార సబ్సిడీ పేరుతో ప్రతి ఏటా అందచేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మొత్తాలను సకాలంలో విడుదల చేయని కారణంగా ఎఫ్‌సిఐకి నిధుల సమస్య ఏర్పడింది. దాంతో అవసరమైన మొత్తాలను తాత్కాలిక సర్దుబాటుగా ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ నుంచి రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సకాలంలో, పూర్తిగా సబ్సిడీ మొత్తాలను విడుదల చేయని కారణంగా బకాయిల మొత్తం పెరిగిపోయింది.ఈ మొత్తాలపై 8.8శాతం వడ్డీ చెల్లించాలి. ప్రభుత్వ చేతగాని తనం కారణంగా ఈ భారాన్ని కూడా జనానికి ఇచ్చే ఆహార సబ్సిడీ ఖాతాలో చూపుతున్నారు.2019-20 సంవత్సరానికి ఎఫ్‌సిఐకి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.3,17,905 కోట్లకు చేరింది. దీనికి గాను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ.75వేల కోట్లు మాత్రమే.2020మార్చి 31నాటికి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌కు ఎఫ్‌సిఐ చెల్లించాల్సిన రుణం రు.2,54,600 కోట్లు. ఈ రుణానికి హామీదారు ప్రభుత్వమే అయినా ఈ మొత్తం ప్రభుత్వ రుణఖాతాలో కనిపించదు.2020-21బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ద్రవ్యలోటు మొత్తం రూ.7.96లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అయితే అప్పటికి ఎఫ్‌సిఐ అప్పు రూ.3,08,680 కోట్లుగా ఉన్నప్పటికీ బడ్జెట్‌లో సబ్సిడీ పేరుతో ప్రతిపాదించింది రూ.1.16లక్షల కోట్లు మాత్రమే. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రుణం లేదా ద్రవ్యలోటులోనూ చూపలేదు. ద్రవ్యలోటును ప్రభుత్వం అప్పులు చేయటం లేదా అదనపు కరెన్సీ ముద్రించటం ద్వారా పూడ్చుకొంటుంది. గతేడాది కరోనా కారణంగా ద్రవ్యలోటు పైన పేర్కొన్న రూ.7.96 నుంచి 18.49లక్షల కోట్లకు పెరిగింది. కరోనా సహాయచర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందచేసిన ఉచిత ఆహార ధాన్యాల కారణంగా ఎఫ్‌సిఐ సబ్సిడీ మొత్తం 2020-21లో పాతబకాయిలతో సహా రూ.4,22,618 కోట్లకు పెరిగింది. దీన్ని 281 శాతం పెరపుదలగా గొప్పగా చెప్పుకున్నారు. 2021-22 బడ్జెట్లో ఎఫ్‌సిఐ సబ్సిడీగా రూ.2,06,616 కోట్లను ప్రతిపాదించారు.

ఆర్ధిక మంత్రి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ రుణాలకు స్వస్ధి చెబుతున్నామని ప్రకటించటం వెనుక అప్పులన్నీ ఒక్కసారిగా తీర్చివేసి భారాన్ని తగ్గించటం అనుకుంటే తప్పులో కాలేసినట్లే ? రాబోయే రోజుల్లో ఎఫ్‌సిఐ సిబ్బందిని గణనీయంగా తగ్గించి ఆహార ధాన్యాల నిల్వల నిర్వహణ బాధ్యతను ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించబోతున్నారు. తెలివి తక్కువ వాడు ఇల్లు కట్టుకుంటాడు – తెలివిగల వాడు ఆ ఇంట్లో అద్దెకు ఉంటాడన్న లోకోక్తిని ఇక్కడ అమలు చేయబోతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన గోడవున్లను తక్కువ అద్దె రేట్లకు ప్రయివేటు వారికి అప్పగించనున్నారు. ఈ చర్య ద్వారా మిగిలే మొత్తంతో రైతులను ఉద్దరిస్తామని చెబుతారన్నది తెలిసిందే.

ఎఫ్‌సిఐ బకాయిలను తీర్చి దాన్నే పెద్ద సాయంగా చెప్పినట్లుగానే ఎరువుల సబ్సిడీని కూడా గొప్పగా చిత్రించారు. గత బడ్జెట్‌లో చూపిన రూ.71,309 కోట్లను రూ.1,33,947 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. మరి అంతపెంచిన వారు తాజా బడ్జెట్లో రూ.79,530 కోట్లకు ఎందుకు తగ్గించినట్లు ? పాత బకాయిలు తీర్చారు తప్ప బడ్జెట్‌ను పెంచలేదు. గత ఏడు సంవత్సరాలుగా ఎరువుల సబ్సిడీ 70-80వేల కోట్ల మధ్యనే ఉంటోంది. భారత ఆహార సంస్ధను వదిలించుకొనే చర్యల్లో భాగంగానే దానికి ఉన్న అప్పులన్నీ తీర్చేందుకు పెద్ద మొత్తంలో గతేడాది బడ్జెట్లో కేటాయించారు. అదే బాటలో ఎరువుల సబ్సిడీ విధానంలో కూడా పెద్ద మార్పును తలపెట్టారు. అందుకే కంపెనీలకు పాతబకాయిలను పూర్తిగా చెల్లించారు. ఇప్పుడు రైతులు ఎంత వినియోగిస్తే అంత మేరకు సబ్సిడీ పొందుతున్నారు. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం రాబోయే రోజుల్లో భూయజమానులకు నేరుగా సబ్సిడీ మొత్తాలను భూమిని బట్టి వారి ఖాతాల్లో వేయాలనే ప్రతిపాదన ఉంది. ఇది కొన్ని రాష్ట్రాల రైతాంగం మీద పెనుభారం మోపుతుంది. కౌలురైతులకు మొండి చేయి చూపుతుంది. ఎరువుల వాడకం తక్కువగా ఉన్న రైతులకు- ఎక్కువగా ఉన్నవారికీ ఒకే రకంగా పంపిణీ అవుతుంది. పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హెక్టారుకు సగటున 224.5కిలోల ఎరువులు(2018-19) వాడగా ఒడిషాలో 70.6, కాశ్మీరులో 61.9కిలోలు మాత్రమే ఉంది. అందువలన అందరికీ ఒకే పద్దతి అయితే పంజాబ్‌, హర్యానా రైతులు నష్టపోతారు. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరు సాగుతోంది గనుక మోడీ సర్కార్‌ సమయం కోసం చూస్తోంది తప్ప లేకుంటే నిర్మలమ్మ నోట ఇవి కూడా వెలువడి ఉండేవి. గతంలో బడ్జెట్ల సమయంలో కొత్త పన్నులు, విధాన నిర్ణయాలు ప్రకటించేవారు. ఇప్పుడు ఇతర రోజుల్లో చేస్తున్నారు. అందువలన ఎప్పుడైనా వెలువడవచ్చు.


అన్ని రంగాలలో పరిశోధన-అభివృద్ధికి పెద్ద పీటవేస్తేనే జనానికి, దేశానికి లాభం ఉంటుంది. వ్యవసాయ రంగంలో సంక్షోభానికి అనేక దేశాలతో పోల్చుకున్నపుడు మన దిగుబడులు, ఉత్పత్తుల నాణ్యత తక్కువగా ఉండటం ఒక కారణం. చైనా వంటి దేశాలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. మనం మాత్రం ఆవు మూత్రం-పేడ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాం. పరిశోధనకు కేటాయిస్తున్నదే తక్కువ అయితే దానిలో ఆవు మూత్రంలో ఏముందో కనుగొనేందుకు మళ్లింపు ఒకటి. బేయర్‌ కంపెనీ ఏటా ఇరవైవేల కోట్ల రూపాయలు వ్యవసాయ పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే 2023 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని చెబుతున్న మోడీ సర్కార్‌ గతేడాది రూ.7,762 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.8,514 కోట్లు ప్రతిపాదించింది.


చివరిగా ఒక్క మాట. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను నిలువరించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలు, నేల మీద పాతిన ఇనుప ముళ్లు, పోలీసుల చేతుల్లో ఇనుపరాడ్లను చూస్తుంటే రైతాంగాన్ని అణచివేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారా అనిపిస్తోంది.సరిహద్దుల్లో శత్రువును ఎదుర్కొనేందుకు కూడా బహుశా ఇంత సన్నద్దత లేదేమో ! ఉంటే పాకిస్ధాన్‌ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రవేశించి మన సైనిక స్ధావరాల మీద దాడులు, సరిహద్దుల్లో సొరంగాలు తవ్వటం సాధ్యమై ఉండేది కాదు.


త్వరలో జరగబోయే నాలుగు ముఖ్యమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాదిన రగిలిపోతున్న రైతన్నలను చూసి గౌరవ ప్రదంగా వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటారా అనే ఆశతో ఉన్నవారు కూడా లేకపోలేదు. ఇప్పటికే రైతాంగం నిరాశతో ఉన్న అనేక మందిని ఉద్యమాలకు ఉద్యుక్తులను గావిస్తోంది. తమ మెడకు ఉరిగా మారనున్న సంస్కరణలకు వ్యతిరేకంగా కార్మికులు తదుపరి పోరుబాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో రైతు యువకులకు కూడా ముల్లుగర్రల గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎద్దులు, దున్నలతో వ్యవసాయం బాగా తగ్గిపోయింది. వాటితో వ్యవసాయ చేసే సమయంలో దున్నకం వేగంగా సాగేందుకు సన్నటి వెదురు కర్రల చివరన ఇనుప ముల్లు వంటి ఇనుప మేకు గుచ్చి దానితో ఎద్దులు, దున్నల వెనుక భాగాల మీద సున్నితంగా పొడిచి వేగంగా కదిలేట్లు చేసే వారు. ఇప్పుడు మోడీ సర్కార్‌ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న ఇనుప ముళ్లను చూస్తుంటే ఇంకా ఉద్యమాలకు కదలకుండా ఉన్న రైతాంగాన్ని పొడిచి కదిలించేందుకు పూనుకున్నట్లుగా అనిపిస్తోంది. చరిత్రను చూసినపుడు తిరుగుబాట్లకు కారణం పాలకుల చర్యలే తప్ప ఎల్లవేళలా ప్రశాంతతను కోరుకొనే పౌరులు కాదు. ఇప్పుడూ అదే జరుగుతోందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d