• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: UDF

ఏమి జిమ్మిక్కులురా బాబూ : ఓట్ల కోసం చర్చి ప్రార్ధనల్లో నరేంద్రమోడీ !

12 Wednesday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Christians, Kerala CPI(M), LDF, Narendra Modi, Narendra Modi Failures, Pinarayi Vijayan, RSS, sangh parivar, UDF


ఎం కోటేశ్వరరావు


వెంపలి చెట్టుకు(నేల మీద పాకే ఒక మొక్క) నిచ్చెన వేసి ఎక్కే రోజులు వస్తాయని పోతులూరి వీరబ్రహ్మం చెప్పారన్న ప్రచారం గురించి తెలిసిందే. అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఇంతకాలం మైనారిటీలను సంతుష్టీకరిస్తూ ఓటు బాంకుగా మార్చుకున్నట్లు ఇతర పార్టీలను మీద ధ్వజమెత్తిన బిజెపి, ప్రత్యేకించి నరేంద్రమోడీ ఇప్పుడు ఎంతవారలైనా అధికార కాంతదాసులే అని నిరూపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్రమోడీ ప్రధానిగా ఉంటారని మోడీ అంతరంగం అమిత్‌ షా చెప్పారు. మోడీ వేస్తున్న పిల్లి మొగ్గల గురించి కేరళ సిఎం పినరయి విజయన్‌ ఎద్దేవా చేశారు. రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా అని ఒక సభలో అన్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు అంటే ఏప్రిల్‌ తొమ్మిదవ తేదీన ఈస్టర్‌ పండగనాడు ప్రధాని నరేంద్రమోడీ తన మద్దతుదారులైన యావత్‌ హిందూత్వశక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అధికారం తరువాతే అన్నీ అన్న సందేశమిస్తూ ఢిల్లీలోని శాక్రెడ్‌ హార్ట్‌ చర్చ్‌ను సందర్శించి ప్రార్ధనల్లో పాల్గొన్నారు.మామూలుగా అయితే ఎవరైనా ప్రార్ధనా స్థలాలకు వెళ్లటాన్ని తప్పు పట్టనవసరం లేదు. అది వారి వ్యక్తిగత అంశం. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతవేత్త ఎంఎస్‌ గోల్వాల్కర్‌ తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” (ఆలోచనల గుత్తి ) అనే పుస్తకంలో దేశ అంతర్గత శత్రువులలో క్రైస్తవులు ఒకరు అని సెలవిచ్చారు. నరేంద్రమోడీ వంటి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకులు అవసరమైతే భగవద్గీతను పక్కన పెట్టి గోల్వాల్కర్‌ రచనను ప్రమాణంగా తీసుకొని పాటిస్తారన్నది తెలిసిందే. మరి ఇప్పుడు తమ గురువును పక్కన పెట్టి మోడీ చర్చికి వెళ్లి సామరస్యత గురించి సుభాషితం పలకటాన్ని చూసి దెయ్యాలు వేదాలను వల్లించినట్లుగా భావిస్తున్నారు.


గతంలో చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా చర్చికి వెళ్లి ఉంటే మంచిదే, ఇది అదేనా ? రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా, మరోదారిలో వెళుతుందా ? అని పినరయి విజయన్‌ ప్రశ్నించారు. బిజెపి నేతలు కేరళలోని బిషప్పుల ఇళ్లను సందర్శిస్తున్నారు. కేరళ వెలుపల క్రైస్తవుల మీద వేటసాగిస్తున్నారు. ఇక్కడ వారు అలాంటి వైఖరి తీసుకోలేరు, సంఘపరివార్‌కు ఇక్కడ మైనారిటీల మీద ఏదైనా ప్రత్యేక ప్రేమ ఉందా ? ఇక్కడ గనుక మతతత్వ వైఖరి తీసుకొని మతఘర్షణలను సృష్టిస్తే ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంటుంది, దీనిలో ఎలాంటి రాజీలేదు అని స్పష్టం చేశారు. సంఘపరివార్‌ అసలు రంగేమిటో జనం చూస్తున్నారు, క్రైస్తవ సమాజానికి తాము దగ్గర అవుతున్నట్లు చూపేందుకు నానా తంటాలు పడుతున్నారు. కేరళలో పాగా వేసేందుకు తమ పుస్తకంలోని అని జిమ్మిక్కులను ప్రయోగిస్తున్నారు అన్నారు. కేరళ టూరిజం మంత్రి మహమ్మద్‌ రియాజ్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియన్‌ మిషినరీ గ్రాహమ్‌ స్టెయిన్‌, అతని కుమారులు ఫిలిప్‌,తిమోతీలను సజీవ దహనం చేయటాన్ని సంఘపరివార్‌ ఇప్పటికీ సమర్ధిస్తున్నది అన్నారు.భజరంగ్‌ దళ్‌కు చెందిన దారా సింగ్‌కు కోర్టు శిక్ష విధించింది. అతను బిజెపిలో కూడా పని చేశాడు.కనీసం 89 మంది పాస్టర్ల మీద దాడులు, 68 చర్చ్‌ల విధ్వంసం, ప్రార్ధనల మీద దాడులు జరిగినట్లు కూడా రియాజ్‌ చెప్పారు. ఇవన్నీ ఒక పథకం ప్రకారం బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ పుస్తకంలో చెప్పిన భావజాలం మేరకే జరిగాయన్నారు. గత రెండు సంవత్సరాల్లో క్రైస్తవుల మీద జరిగిన దాడులకు సంబంధించి వెయ్యికిపైగా కేసుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరమ్‌(యుసిఎఫ్‌) వెల్లడించింది. నరేంద్రమోడీ చర్చ్‌ సందర్శన తరువాత అలాంటి దాడులు ఆగిపోతాయనే ఆశ క్రైస్తవుల్లో కలిగిందని క్రైస్తవ వార్తా సంస్థ యుసిఏ పేర్కొన్నది.హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ నేత 2014లో ప్రధాని అయిన తరువాత తొలిసారి చర్చిని సందర్శించినట్లు కూడా పేర్కొన్నది. ఇరవై ఐదు నిమిషాల పాటు నరేంద్రమోడీ చర్చిలో గడిపారు.


ఈస్టర్‌ ఆదివారం నాడు భారత ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఒక కాథలిక్‌ చర్చిని అసాధారణంగా సందర్శించారని క్రిస్టియన్‌ పోస్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. మైనారిటీ సామాజిక తరగతుల మీద దాడులకు పేరుమోసిన హిందూ జాతీయవాద పార్టీ నేత క్రైస్తవ ఓటర్లకు దగ్గరయేందుకు చూశారని అన్నది. ఢిల్లీ మైనారిటీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఏసి మైఖేల్‌ మోడీ సందర్శన సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. క్రైస్తవుల మీద హింసాత్మక దాడులు 2014లో వంద ఉంటే 2022 నాటికి ఆరువందలకు పెరిగినట్లు పేర్కొన్నారు.ఈ ఏడాది తొలి వంద రోజుల్లోనే 200 ఉదంతాలు జరిగినట్లు వెల్లడించారు. దేశమంతటా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల వివరాలను సమర్పించాలని 2022 సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి సుప్రీం కోర్టు పదే అడిగినా ఇప్పటి వరకు మూడుసార్లు గడువును పెంచాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారనే సాకుతో దాడులు జరుపుతున్నారని, బలవంతపు మతమార్పిడులకు తగిన ఆధారాలు దొరక్కపోవటమే దీనికి కారణమని అన్నారు. క్రైస్తవుల మీద దాడులు, వేధింపుల్లో భారత్‌ ప్రపంచంలోని అరవై దేశాల్లో పదవ స్థానంలో ఉందని అమెరికాకు చెందిన ఓపెన్‌ డోర్స్‌ అనే సంస్థ తన నివేదికలో పేర్కొన్నది.హిందూ ఉగ్రవాదులు దేశంలో క్రైస్తవులు, ఇతర మైనారిటీలను లేకుండా చేసి దేశాన్ని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారని కూడా చెప్పింది.
సంఘపరివార్‌కు చెందిన వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు, ప్రకటనలు చేయటంలో పేరుమోశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ రామేశ్వర శర్మ ఛాదర్‌ ముక్త్‌ – ఫాదర్‌ ముక్త్‌ (ముస్లిం, క్రైస్తవ పూజారులు) భారత్‌ కావాలని బహిరంగంగా చెప్పారు. దేశంలో చత్తీస్‌ఘర్‌ క్రైస్తవ విద్వేష ప్రయోగశాలగా మారింది. హిందువులు గొడ్డళ్లు ధరించి మతమార్పిడులకు పాల్పడుతున్న క్రైస్తవులకు బుద్ది చెప్పాలని ఆ రాష్ట్రానికి చెందిన పరమాత్మానంద మహరాజ్‌ పిలుపునిచ్చారు. ఆ సభలో బిజెపి నేతలు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని అదుపు చేయకుండా తాము మారినట్లు మైనారిటీలను నమ్మించేందుకు, సంతుష్టీకరించేందుకు బిజెపి నానా పాట్లు పడుతున్నది. కేరళ, క్రైస్తవులు ఉన్న ఇతర ప్రాంతాల్లో బీఫ్‌కు అనుకూలంగా మాట్లాడటమే కాదు, నాణ్యమైన మాంసాన్ని అందిస్తామని కూడా వాగ్దానం చేసిన పెద్దలు ఉన్నారు. కేరళలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సిఎం ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ ఆంటోనిని బిజెపి ఆకర్షించింది. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం ఏకె ఆంటోనీ ప్రభావమే పెద్దగా లేదు, అలాంటిది కొడుకు బిజెపిలో చేరి ఆ పార్టీని ఉద్దరిస్తారన్నది ఆ పార్టీ పేరాశతప్ప మరొకటి కాదు. తనకు 82 సంవత్సరాలని జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆంటోని చెప్పారు. తన కుమారుడు బిజెపిలో చేరటం బాధాకరమన్నారు.రబ్బరు మద్దతు ధరలను పెంచితే కేరళ క్రైస్తవులు మొత్తం బిజెపికి మద్దతుదార్లుగా మారతారని ఒక మతాధికారి గతంలో ప్రకటించారు. కానీ కేంద్రం వైపు నుంచి అలాంటి సూచనలేమీ లేవు.


నరేంద్రమోడీ చర్చి సందర్శన ఆటతీరునే మార్చివేస్తుందని కేరళ బిజెపి నేతలు సంబరపడిపోతున్నారు. తిరువనంతపురంలో జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో జరిపిన సమీక్షలో ఒకప్పుడు కేరళ కాంగ్రెస్‌ పక్షాలు పొందిన ప్రజామద్దతు ఇంకే మాత్రం వాటికి ఉండదని భావించినట్లు వార్తలు. పినరయి విజయన్‌ ముస్లిం సామాజిక తరగతుల్లోకి చొచ్చుకుపోయినట్లుగా తాము క్రైస్తవుల్లో చోటు సంపాదించినట్లు ఇంటింటికి తిరిగినపుడు వెల్లడైందని, చర్చి పెద్దలు కూడా సానుకూల సంకేతాలను పంపినట్లు వారు భావిస్తున్నట్లు ఒక పత్రిక రాసింది. తిరువనంతపురం, త్రిసూర్‌ జిల్లాల్లో క్రైస్తవులు గణనీయంగా ఉన్నారని ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు తమకు అనుకూలంగా ఉన్నట్లు , క్రైస్తవులు ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నట్లు, వచ్చే రోజుల్లో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని బిజెపి నేతలు అంచనా వేసుకుంటున్నారు. చర్చ్‌ల మీద దాడులు జరుపుతున్నది కొందరు వ్యక్తులని, వారికి ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపితో సంబంధం లేదని అనేక మంది గుర్తిస్తున్నారని, ఉగ్రవాద హిందూత్వ గ్రూపులకు చెందిన వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు బిజెపి నేతలు చెప్పుకున్నారు.తమను కేవలం మైనారిటీ మోర్చాల్లో కాకుండా బిజెపి, ఇతర ప్రధాన సంస్థల్లో భాగస్వాములుగా చేయాలని క్రైస్తవులు కోరినట్లు, తిరువనంతపురంలో ఒక లక్ష ఈస్టర్‌ శుభాకాంక్షల కార్డులను ముద్రించగా డిమాండ్‌ పెరగటంతో మరో 50వేలు అదనంగా ముద్రించాల్సి వచ్చిందని బిజెపి నేతలు సమావేశంలో చెప్పుకున్నారు.


క్రైస్తవులతో పాటు పసమండా ముస్లింలను కూడా ఆకర్షించేందుకు బిజెపి పూనుకుంది. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా ముస్లింలను నిలపని బిజెపి ఉత్తర ప్రదేశ్‌లో నలుగురు ప్రముఖులను శాసనమండలికి నామినేట్‌ చేసింది. హిందూత్వ పేరుతో జనాన్ని సమీకరించాలని చూసిన బిజెపి కొంత మేరకు సఫలీకృతమై కేంద్రంలో అధికారానికి వచ్చింది.ఇదే సమయంలో అటు సూర్యుడు ఇటు పొడిచినా మొత్తం హిందువులందరూ బిజెపి వెనుక సమీకృతులు కారని తేలిపోయింది. మరోవైపు తొమ్మిదేండ్ల బిజెపి పాలన వైఫల్యాలమయంగా మారింది. ఈ నేపధ్యంలో అధికారాన్ని నిలుపుకొనేందుకు మైనారిటీల సంతుష్టీకరణ తప్ప మరొక మార్గం లేదని భావించి లేదా ప్రపంచంలో హిందూమతోన్మాదశక్తిగా కనిపించకుండా మేకతోలు కప్పుకొనేందుకు గానీ బిజెపి కొత్త ఎత్తులు వేస్తోంది, కొత్త రాగాలు పలుకుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎల్‌డిఎఫ్‌కు అధికారం ఖాయం అన్న 16కు పదిహేను సర్వేలు !

26 Friday Mar 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala elections 2021, BJP, Kerala Assembly Elections pre-poll surveys, Kerala LDF, Kerala pre-poll surveys, UDF


ఎం కోటేశ్వరరావు


కేరళ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసి ప్రచారం పర్వం వేడెక్కుతున్నది. రాజకీయ వేడి రాజుకుంటున్నది. ఒక దఫా సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌, మరోదఫా కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ అధికారంలోకి రావటంగా ఉన్న రాజకీయ ఆనవాయితీకి తొలిసారిగా ఈ సారి తెరపడనున్నది. ఈ నేపధ్యంలో దీన్ని సహించలేని హిందూత్వ, క్రైస్తవ మత శక్తులు మరోసారి తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ముందుకు తెస్తున్నాయి. ఓటర్లను రెచ్చగొడుతున్నాయి. శబరిమల దేవాలయంలో వయస్సులో ఉన్న మహిళల ప్రవేశ అంశం సుప్రీం కోర్టు విచారణలో ఉండటంతో ఎవరైనా దాన్ని ప్రచార అంశంగా ముందుకు తెస్తే సమస్యలను ఎదుర్కొంటారు. వరుసగా రెండవ సారి ఎల్‌డిఎఫ్‌ అధికారం చేపట్టనున్నదంటూ ఇప్పటి వరకు జరిగిన పదహారు సర్వేలలో ఒకటి మాత్రమే ఏ కూటమికీ మెజారిటీ దక్కదని చెప్పగా మిగిలిన వన్నీ ఎల్‌డిఎఫ్‌కు మెజారిటీ సీట్లు రానున్నట్లు పేర్కొన్నాయి. వీటిలో మొదటిది గత ఏడాది జూలైలో జరగ్గా మిగిలినవన్నీ ఈ ఏడాదిలోనే జరిగాయి. మొత్తం 140 సీట్లకు గాను అధికారం దక్కాలంటే 71 స్దానాలు తెచ్చుకోవాలి. పదహారు సర్వేల సగటు ప్రకారం ఎల్‌డిఎఫ్‌కు కనిష్టంగా 76.3 సీట్లు గరిష్ట సగటు 82 రానున్నాయి. మెజారిటీలలో కనిష్టంగా 72 కాగా గరిష్టంగా 91 ఉన్నాయి. బిజెపి కూటమికి రెండు సర్వేలు 3-7 మధ్య వస్తాయని పేర్కొనగా మిగిలినవన్నీ ఒకటి రెండుగా తెలిపాయి.ఒక సర్వే మూడు వస్తాయని పేర్కొన్నది. గతేడాది చివరిలో జరిగిన స్ధానిక సంస్ధలలో పార్టీలకు వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఎల్‌డిఎఫ్‌కు 101 వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వెలువడింది. హంగ్‌ అని పేర్కొన్న సర్వే కూడా 68-78 మధ్య వస్తాయని పేర్కొన్నది.


ఈ ఎన్నికలలో 140 స్ధానాలకు గాను మొత్తం 957 మంది పోటీలో ఉన్నారు. ఫ్రంట్‌లు, పార్టీల వారీగా పోటీ చేస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌)లో పది పార్టీలున్నాయి. సిపిఐ(ఎం) మరియు అది బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధులు 86, సిపిఐ 25, కేరళ కాంగ్రెస్‌(ఎం) 12, జనతాదళ్‌ (సెక్యులర్‌) 4, ఎన్‌సిపి 3, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ 3, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ 3, కాంగ్రెస్‌(సెక్యులర్‌) 1, కాంగ్రెస్‌(బి) 1, జనాధిపత్య కేరళ కాంగ్రెస్‌ 1. యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(యుడిఎఫ్‌)లో ఎనిమిది పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్‌ 93,ముస్లిం లీగు 27, కేరళ కాంగ్రెస్‌ 10, ఆర్‌ఎస్‌పి 5, నేషనలిస్టు కాంగ్రెస్‌(కేరళ) 2, కేరళ కాంగ్రెస్‌(జాకబ్‌) 1,సిఎంపి 1,ఆర్‌ఎంపిఐ 1. నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డిఏ) బిజెపి 115, భారత ధర్మ జనసేన 21, అన్నాడిఎంకె 2, కామరాజ్‌ కాంగ్రెస్‌ 1, జనాధిపత్య రాష్ట్రీయ సభ 1, డెమోక్రటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ 1. ఈ కూటమిలో కామరాజ్‌ కాంగ్రెస్‌, జనాధిపత్య రాష్ట్రీయ పార్టీలు రెండూ బిజెపి గుర్తుమీదే పోటీ చేస్తున్నాయి.


శబరిమలై వివాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన నాయర్‌ సర్వీసు సొసైటీ(ఎఎస్‌ఎస్‌) ఒక వైపు నుంచి మరో వైపు నుంచి లాటిన్‌ కాథలిక్‌ చర్చి పెద్దలు ఎన్నికల్లో తామేంటో చూపుతామంటూ ఎల్‌డిఎఫ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శబరిమల వివాదం సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్నప్పటికీ హిందూత్వశక్తులు దాన్ని ఏదో ఒక రూపంలో ఎన్నికల అంశంగా చేసేందుకు పూనుకున్నాయి. విజయన్‌ ప్రభుత్వం జాలర్లకు హాని చేసేందుకు ప్రయత్నించిందంటూ వ్యతిరేకంగా ఓటు వేయాలన్న సందేశాలను చర్చి నేతలు ఇచ్చారు. ఈ సంస్దల యత్నాలు ఫలించబోవనే ధీమా ఎల్‌డిఎఫ్‌లో వ్యక్తమైంది. క్రైస్తవులు ప్రధానశక్తిగా ఉన్న కేరళ కాంగ్రెస్‌(ఎం) ఈ సారి ఎల్‌డిఎఫ్‌లో చేరటం మతశక్తులకు మింగుడు పడటం లేదు. మరోవైపు కొందరు బిజెపికి మద్దతు ఇస్తుండటంతో సామాన్య క్రైస్తవులలో మతాధికారులు ఇచ్చే పిలుపులకు పెద్దగా స్పందన కానరావటం లేదు. క్రైస్తవులు గణనీయంగా ఉన్న ప్రాంతాలలో సర్వేలు ఎల్‌డిఎఫ్‌ మెజారిటీనే సూచిస్తున్నాయి.


ఏకె ఆంటోని ముఖ్యమంత్రి విజయన్‌ పాద సేవ చేయాలి !


ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీద విరుచుకుపడుతున్న మాజీ ముఖ్యమంత్రి ఏకె ఆంటోని కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారో చెప్పాలని సిపిఎం నేత, మంత్రి ఎంఎం మణి ప్రశ్నించారు. కరోనా సమయంలో గనుక కాంగ్రెసే అధికారంలో ఉంటే ఎందరో పౌరులు మరణించి ఉండేవారని అన్నారు. తమ స్వంత ప్రభుత్వాలను దెబ్బతీస్తున్నా బిజెపి గురించి నోరెత్తని ఆంటోనికి వామపక్ష ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. కరోనా సమయంలో కనిపించని ఆంటోని ముఖ్యమంత్రికి పాదసేవ చేయాలన్నారు. ఏ పార్టీకి ఎందరు నాయర్లను కేటాయించాలనే పంపిణీ హక్కులు ఎన్‌ఎస్‌ఎస్‌ నేత సుకుమార్‌ నాయర్‌కు లేదని, ఆయన వాంఛలకు అనుగుణ్యంగా కొంత మంది ఓటు వేయవచ్చుగానీ మెజారిటీ నాయర్లు ఎల్‌డిఎఫ్‌ మద్దతుదార్లుగా ఉన్నారన్నారు.


బిజెపి ఓట్లు కావాలంటున్న చెన్నితల – వద్దు అంటున్న మరో కాంగ్రెస్‌ నేత !


బిజెపితో సహా తాము ఎవరి ఓట్లనూ వద్దు అనటం లేదని కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల ప్రకటించగా తమకు బిజెపి ఓట్లు అవసరం లేదని యుడిఎఫ్‌ కన్వీనర్‌, కాంగ్రెస్‌ నేత ఎంఎం హసన్‌ చెప్పారు. కన్నూరు జిల్లా తలసెరిలో గానీ మరోచోట గాని తమకు బిజెపి లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ ఓట్లు అవసరం లేదని పదే పదే చెప్పామని, వెల్ఫేర్‌ పార్టీ(ముస్లిం మతతత్వ)తో ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. ఎన్నికల జాబితా గురించి ఆరోపణలను కొనసాగిస్తున్న రమేష్‌ చెన్నితల తాజాగా మరొక చౌకబారు ఆరోపణను ఇసికి ఫిర్యాదుగా పంపారు. ఓటు వేసిన తరువాత వేలు మీద వేసే సిరాగుర్తును చెరిపివేసే రసాయనాలను అధికారపక్షం పంపిణీ చేసిందన్నది దాని సారం. ఆరోపణకు ఆధారాలు చూపాలని ఎన్నికల సంఘం కోరగా కొన్ని కేంద్రాల నుంచి తనకు ఫిర్యాదులందాయని చెన్నితల చెప్పారు. పలుచోట్ల దొంగ ఓట్లు చేర్పించారని సిపిఎం మీద రమేష్‌ చెన్నితల చేస్తున్న ఆరోపణలు ఆయనకే ఎదురు తగులుతున్నాయి. పెరుంబవూరు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ఎల్దోస్‌ కున్నపల్లి, ఆయన భార్య మరియమ్మకు రెండేసి చోట్ల ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది. కైపమంగళం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి సుబిన్‌కు మూడు చోట్ల ఓట్లు, గుర్తింపు కార్డులు ఉన్నట్లు బయటపెట్టిన సిపిఎం కార్యకర్తలు ఇప్పుడు ఎంఎల్‌ఎ, ఆయన భార్యకు రెండు చోట్ల ఉండటం గురించి ఏమి చెబుతారంటూ దీన్ని ఒక ప్రచార అంశంగా ముందుకు తెచ్చారు. రమేష్‌ చెన్నితల ఒక మహిళకు ఐదు చోట్ల ఓట్లు ఉండటాన్ని ఉదాహరణగా మీడియా ముందు చెప్పారు. అయితే సదరు మహిళ తాను కాంగ్రెస్‌ కార్యకర్తను అని చెప్పటంతో చెన్నితల నోట్లో వెలక్కాయపడింది.

ఇడిపై కేసు గురించి కేంద్ర బిజెపి మంత్రి గగ్గోలు !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఇతర ఎల్‌డిఎఫ్‌ నేతలను దొంగబంగారం కేసులో ఇరికించేందుకు నిందితులను బెదిరించి తప్పుడు ప్రకటనలు చేయించిన కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దానినే కోర్టుకు అఫిడవిట్‌గా సమర్పించి ఎన్నికల్లో దెబ్బతీసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు తనచేత బలవంతంగా ప్రకటన చేయించారని, ఇడి అధికారుల నుంచి ప్రాణహాని ఉందంటూ రాసిన లేఖ బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో తప్పుడు కేసు పెట్టిన ఇడి అధికారులపై కేరళ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దాన్ని ఎత్తివేయాలని ఇడి చేసిన వినతిని హైకోర్టు కొట్టివేసింది. ఈ ఉదంతంపై విచారణ న్యాయవిచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక విశ్రాంత న్యాయమూర్తితో ఒక కమిషన్‌ కూడా ఏర్పాటు చేసింది. ఇడిపై విచారణ కమిషన్‌ ఏర్పాటు, కేసు పెట్టటం ఏమిటంటూ కేరళకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ గగ్గోలు పెట్టారు. ఇది దేశంలో ఒక వింత అన్నారు.


దొంగబంగారం కేసులో నిందితురాలైన స్వప్న సురేష్‌ను ఇడి అధికారులు బెదిరించి వాంగ్మూలం తీసుకోవటాన్ని తాము విన్నామని ఆమెకు రక్షణగా ఉన్న ఇద్దరు కేరళ మహిళా పోలీసులు ఫిర్యాదు చేయటంతో ఈ ఉదంతంపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు నిర్ణయించింది. స్వప్న సురేష్‌కు రక్షణగా ఉన్న ఒక మహిళా పోలీసు అధికారి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ ముందు నమోదు చేయించాలని పోలీసులు నిర్ణయించారని వార్తలు వచ్చాయి. గతేడాది ఆగస్టు 12,13 తేదీలలో విధి నిర్వహణలో భాగంగా తాను స్వప్న వద్ద ఉన్నపుడు ఇడి అధికారులు ఆమెను బెదిరించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాంగ్మూలాన్ని నమోదు చేయటాన్ని తాను విన్నానని ఆ పోలీసు అధికారిణి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచారు. దాన్నే ఒక న్యాయమూర్తి ముందు నమోదు చేయాలని క్రైమ్‌ బ్రాంచికి న్యాయ విభాగం సలహా ఇచ్చింది.తమకు వ్యతిరేకంగా పోలీసు అదికారిణి ఫిర్యాదు, వాంగ్మూలం రాజకీయవత్తిడితో చేస్తున్నట్లు ఇడి ఆరోపించింది.


కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధుల సంస్ధ(కెఐఐఎఫ్‌బి)పై ఆదాయపన్నుశాఖ దాడి చేయటం దాదాగిరి తప్ప మరొకటి కాదని ఆర్ధిక మంత్రి థామస్‌ ఐజాక్‌ వర్ణించారు. అన్ని నిబంధనలను, చట్టాలను పాటిస్తున్న ఆ సంస్ధపై దాడులు చేయటం ద్వారా ఎలాంటి నష్టం చేయజాలరని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో నిర్మించిన అనేక ఆసుపత్రులు, విద్యా సంస్ధలను జనం చూస్తున్నారని, దాన్ని దెబ్బతీస్తుంటే రాష్ట్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే సంస్దను ఏర్పాటు చేశాము, రిజర్వుబ్యాంకు ఆమోదం తెలిపింది. దాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌-కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఆదాయపన్ను శాఖ అడిగిన సమాచారం, పత్రాలను గతంలోనే సమర్పించినప్పటికీ అధికారం ఉంది కదా అని ఇప్పుడు మరోసారి దాడి చేయటం తప్ప మరొకటి కాదని చెప్పారు.ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లటానికి ఎవరు హక్కు ఇచ్చారని, దీని వెనుక కేంద్ర మంత్రుల ప్రోద్బలం తప్ప అధికారులదేమీ లేదన్నారు.


విజయాలతో మామా-అల్లుడు చరిత్రను సృష్టిస్తారా !


అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి విజయన్‌తో పాటు డివైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్‌ రియాజ్‌ విజయం సాధిస్తే కేరళ అసెంబ్లీ చరిత్రలో అదొక రికార్డు అవుతుంది. విజయన్‌ అల్లుడు రియాజ్‌ అన్న విషయం తెలిసిందే. విజయన్‌ కన్నూరు జిల్లాలో పోటీ చేస్తుండగా రియాజ్‌ కోజికోడ్‌ జిల్లాలో పోటీచేస్తున్నారు. ఈ ఉదంతాన్ని మరికొన్ని చోట్ల జరుగుతున్న పోటీలలో బంధువులు పోటీ చేయటాన్ని చూపి సిపిఎంలో కూడా కుటుంబ పెత్తనం, వారసత్వం చోటు చేసుకున్నదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలో పనికి ప్రాధాన్యత తప్ప బంధుత్వాలకు కాదు అన్న విషయం తెలిసిందే. అనేక కుటుంబాలలో సభ్యులందరూ పార్టీ పనిలో పూర్తి కాలం పని చేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రియాజ్‌ విషయానికి వస్తే విజయన్‌ అల్లుడు గాక ముందే 2009 ఎన్నికల్లోనే సిపిఎం అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈనెల 28న ముఖ్యమంత్రి కోజికోడ్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఐదు కేంద్రాల్లో ప్రచారంలో పాల్గొంటారు. వాటిలో రియాజ్‌ పోటీ చేసే బైపూరు ప్రత్యేకంగా లేదు. దానితో పాటు నాలుగు నియోజకవర్గాల ప్రచారాన్ని కోజికోడ్‌లోనే ఏర్పాటు చేశారు. రియాజ్‌ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.


బంధుగణం పోటీచేస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ వారే ఎక్కువగా ఉన్నారు. ఒక కాంగ్రెస్‌ మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ కుమారులు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తుండగా దివంగత స్వతంత్ర ఎంఎల్‌ఏ కుమారుడు ఒకరు స్వతంత్ర అభ్యర్ధిగా ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ కుమారుడు,ఎంపీ అయిన మురళీధరన్‌, కుమార్తె పద్మజా వేణుగోపాల్‌ పోటీలో ఉన్నారు.ఎన్‌సిపి మాజీ మంత్రి సోదరుడు, ఎల్‌డిఎఫ్‌ కన్వీనరు విజయరాఘవన్‌ సతీమణి బిందు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్‌ అల్లుడు శ్రీనింజన్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులుగా ఉన్నారు. కేరళ కాంగ్రెస్‌ నేత దిగంగత మణి కుమారుడు జోస్‌ మణి ఎల్‌డిఎఫ్‌ తరఫున పోటీ చేస్తుండగా ఆయన బావమరిది, మాజీ అయ్యేఎస్‌ అధికారి జోసెఫ్‌ యుడిఎఫ్‌ అభ్యర్ధిగా వేరేచోట ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మరో ముగ్గురు మాజీ మంత్రులు, ఒక మాజీ స్పీకర్‌ కుమారుడు కూడా యుడిఎఫ్‌ తరఫున పోటీలో ఉన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కులం పేరుతో కేరళ ముఖ్యమంత్రిని అవమానించిన కాంగ్రెస్‌కు బిజెపి మద్దతు !

07 Sunday Feb 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, Bjp support to Congress caste slur on Chief Minister Pinarayi Vijayan, CPI(M), Kerala BJP, Kerala Politics, LDF, Pinarayi Vijayan, UDF


ఎం కోటేశ్వరరావు


ఏ రాజకీయ పార్టీ అయినా అధికారాన్ని కోరుకోవటంలో, అందుకోసం గౌరవ ప్రదమైన, ప్రజాస్వామిక పద్దతుల్లో పని చేjటం, ప్రవర్తించటంలో తప్పు లేదు. కేరళలో గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఒక సారి కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ అధికారానికి వస్తే తరువాత సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ అధికారానికి రావటాన్ని చూస్తున్నాము. తాజాగా పార్టీ ప్రాతిపదికన జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లను బట్టి గత పరంపరకు భిన్నంగా వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్‌ అధికారానికి వస్తుందని అంకెలు చెబుతున్నాయి. మళయాల మనోరమ అనే పత్రిక 101 సీట్లు వస్తాయని విశ్లేషించింది. అదే పత్రిక సిపిఎం సమీక్షలో 98 వస్తాయనే అంచనాకు వచ్చినట్లు మరొక వార్తను రాసింది. ఇంతవరకు ఎల్‌డిఎఫ్‌ నేతలు మాకు ఇన్ని సీట్లు వస్తాయని ఎక్కడా చెప్పలేదు.

ఏప్రిల్‌ లేదా మే మాసాల్లో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్దమౌతున్నాయి. ఎల్‌డిఎఫ్‌ అన్నింటికంటే ముందు వుందని, ఓట్లు తగ్గిన, ఓడిపోయిన చోట ఎందుకలా జరిగిందో ప్రతిపార్టీ పరిశీలించుకుంటున్నది, సిపిఎం కూడా అదే చేస్తున్నదని మీడియాలో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. మొత్తంగా కేరళ పరిణామాలను చూసినపుడు సిపిఎం వ్యతిరేక రాజకీయ పార్టీల కంటే తన వ్యతిరేక ప్రచార శ్రమ వృధా అయింది, జనం ఎందుకు పట్టించుకోలేదనే ఉడుకుమోత్తనంతో మీడియా వుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో తిరిగి తన పాత అలవాట్లను ప్రదర్శిస్తోంది.
మరోవైపున పండుగాడి మాదిరి సిపిఎం కొట్టిన దెబ్బకు మైండ్‌ బ్లాంక్‌ అయిన కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు చౌకబారు, చివరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలకూ దిగజారాయి. గీత వృత్తిదారు కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఉంది తప్ప వారి వ్యాఖ్యలను అవమానించేవిగా భావించటం లేదని విజయన్‌ ఎంతో హుందాగా ప్రతిస్పందించారు. కల్లుగీత కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి హెలికాప్టర్‌ను ఉపయోగించిన తొలి ముఖ్యమంత్రిగా గుర్తు పెట్టుకుంటారు అని కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ అయిన కె సురేంద్రన్‌ నోరు పారవేసుకున్నారు.


కేరళ ఐశ్వర్య యాత్ర పేరుతో ప్రస్తుతం కాంగ్రెస్‌ రాజకీయ యాత్ర జరుపుతోంది. కేరళ అభివృద్ది మినహా మిగిలిన అంశాలన్నింటినీ ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆ సందర్భంగా కన్నూరు జిల్లా తలసెరీలో సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాయి.అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని వాటితో తమకు సంబంధం లేదని శాసనసభా పక్షనేత రమేష్‌ చెన్నితల వ్యాఖ్యానించగా, కాంగ్రెస్‌ ఏకైక మహిళా ఎంఎల్‌ఏ షనిమోల్‌ ఉస్మాన్‌ ఘాటుగా సురేంద్రన్‌ తరఫున తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యల కంటే ఇవి మరింత నష్టదాయకంగా మారటంతో పాటు ముఠా తగాదాలు బయటకు వచ్చాయి. తన ప్రత్యర్ధుల ప్రోద్బలంతో ఎంఎల్‌ఏ అలా ప్రకటించారని సుధాకరన్‌ మండిపడ్డారు. దీంతో నష్ట నివారణ చర్యగా పూర్తిగా తెలుసుకోకుండా తాను వ్యాఖ్యానించానని రమేష్‌ చెన్నితల, ఎవరి ప్రమేయం లేకుండా తానే ఆ ప్రకటన చేశానని ఎంఎల్‌ఏ తన మాటలను తానే మింగారు. సుధాకరన్‌కు క్షమాపణ చెప్పారు. దీంతో రెచ్చి పోయిన సురేంద్రన్‌ తన వ్యాఖ్యలను పార్టీ సమర్ధించిందని, అన్నదానిలో తప్పులేదంటూ పదే పదే సమర్ధించుకుంటున్నారు.

” సురేంద్రన్‌ నాకు కాలేజీ రోజుల నుంచీ తెలుసు. నా తండ్రి ఒక కల్లుగీత కార్మికుడని నేను గతంలో కూడా చెప్పాను. మా అన్న కూడా గీత కార్మికుడే, వయస్సు మీద పడి వృత్తి మానుకున్నాడు. రెండో సోదరుడికీీ వృత్తి తెలుసు, అయితే ఒక బేకరీని పెట్టుకున్నాడు.మాది ఒక వ్యవసాయ కుటుంబం, సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలతో నేనేమీ నొచ్చుకోలేదు, వాటిని తిట్టుగా భావించటం లేదు.నేను ఒక గీత కార్మికుడి కొడుకును, అందుకు గర్విస్తాను ఎందుకంటే నేను ఒక కష్టజీవి కొడుకును.ఈ అంశాన్ని వివాదాస్పదం గావించారని అలపూజ ఎంఎల్‌ఏ షనిమోల్‌ ఉస్మాన్‌ మీద సుధాకరన్‌ మండి పడ్డారు. ఈ అంశంలో చివరికి రమేష్‌ చెన్నితల కూడా తన వైఖరిని మార్చుకున్నారు. నా జీవన శైలి ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలిసిందే.” అని విజయన్‌ విలేకర్లతో చెప్పారు.

బిజెపిలో చేరతానని బెదిరించి అధిష్టానాన్ని బెదిరించిన సురేంద్రన్‌ ?

సురేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టించటంతో వాటిని వ్యతిరేకించటం కంటే సమర్దించటమే మంచిదని కాంగ్రెస్‌ భావించింది. అందుకే మాట మార్చింది.కాంగ్రెస్‌ క్రమశిక్షణా వ్యవహారాల కమిటీ నేత కెసి వేణుగోపాల్‌ సమర్ధించారు. ఏదో వాడుక భాషలో అన్నారు. సుధాకరన్‌ అలాంటి మాటలు మాట్లాడి ఉండకూడదని ఏదో సాధారణంగా చెప్పాను. తరువాత ఇది నిజమేనా అని ఆయనతో మాట్లాడితే కాదన్నారు. ఆయన ప్రజానాయకుడు, కాంగ్రెస్‌ పార్టీకి ఒక సంపద వంటి వారు అని చెన్నితల సమర్ధించారు. అయితే కాంగ్రెస్‌ నేతలు ఇలా మాట మార్చటం వెనుక తాను బిజెపిలో చేరతానని సురేంద్రన్‌ పార్టీ అధిష్టానాన్ని బెదిరించటమే కారణమని కొందరు చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రి విలాస జీవితం గురించి చెబుతూ ఆయన కుటుంబ వృత్తి పేరు ప్రస్తావించాను తప్ప మరొకటి కాదని ఢిల్లీలో కూడా సుధాకరన్‌ సమర్ధించుకున్నారు. అనేక మంది నేతలు తామూ కూలీ బిడ్డలమని చెప్పుకుంటారని ఇది కూడా అంతే అన్నారు. నేను వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తరువాత కూడా సిపిఎం స్పందించలేదని, వారికి బదులు తమ కాంగ్రెస్‌ వారే స్పందించారనే అదే సమస్య అన్నారు. అంతకు ముందు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వైఖరి ఏమిటో వివరించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.
కాంగ్రెస్‌ నేతల కుల దూషణను బిజెపి సమర్ధించింది. కల్లు గీసే వారు అన్ని కులాల్లో ఉన్నారని అందువలన ఒక కులాన్ని నిందించినట్లుగా తాము భావించటం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ సమర్ధించారు. సిపిఎం వారు దాన్నొక ఆయుధంగా చేసుకున్నారు తప్ప తప్పేమీ లేదన్నారు.

మరోసారి శబరిమలను ముందుకు తెచ్చిన కాంగ్రెస్‌ !

స్దానిక సంస్దల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్‌, బిజెపి, వాటికి మద్దతుగా మీడియా ఎల్‌డిఎఫ్‌ ప్రత్యేకించి సిపిఎంకు వ్యతిరేకంగా ముందుకు తెచ్చిన ఆరోపణలను జనం పట్టించులేదని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. దాంతో తిరిగి మరోసారి శబరిమల సమస్యను ముందుకు తెచ్చేందుకు కాంగ్రెస్‌ పూనుకుంది. మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన మెజారిటీ తీర్పు, దాన్ని అమలు చేసేందుకు పూనుకున్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, బిజెపి వివాదాస్పదం కావించి శాంతి భద్రల సమస్యను సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ తీర్పు మీద సుప్రీం కోర్టులో పునర్విచారణ పిటీషన్‌ ఉంది. అలాంటివే ఇతర వివాదాలు, పిటీషన్లను కలిపి కోర్టు విచారించింది. ఇంతవరకు ఎలాంటి తీర్పు వెలువడలేదు. సుప్రీం కోర్టు తీర్పుతో సమాజంలో సృష్టించిన గాయాలను మాన్పేందుకు తీర్పుకు వ్యతిరేకంగా చట్టం చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అంటూ కాంగ్రెస్‌ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాము అధికారానికి వస్తే చేయబోయే చట్టం ఇలా ఉంటుందంటూ ఒక ముసాయిదాను కూడా విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు పూనుకున్నారు. శబరిమల సంప్రదాయాలను ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయటంతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుదని దానిలో పేర్కొన్నారు.ఈ ప్రచారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు వెలువడిన తరువాత సమాజంలోని అన్ని తరగతుల అభిప్రాయాలను తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సుప్రీం కోర్టు ముందు ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని సమీక్షిస్తామని చెప్పింది అంతిమ నిర్ణయం వచ్చిన తరువాతే కదా జోక్యం చేసుకొనే సమస్య ఉదయించేది అని విజయన్‌ అన్నారు.


శబరిమల సమస్య ద్వారా లబ్దిపొందాలని చూస్తున్న మరో పార్టీ బిజెపి కూడా ఓట్లకోసమే కాంగ్రెస్‌ ఇలా చెబుతోందని విమర్శించింది. ఆ సమస్య మీద ఉద్యమించినపుడు కాంగ్రెస్‌ ఎక్కడుంది ? అప్పుడు ఎందుకు చట్టం గురించి మాట్లాడలేదు అని ప్రశ్నించింది. తాము అధికారానికి వస్తే దేవాలయ బోర్డులను రద్దు చేస్తామని బిజెపి చెప్పుకుంది.
తండ్రి వారసుడిగా రంగంలోకి వచ్చేందుకు సిద్దం అవుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కుమారుడు చాండీ ఊమెన్‌ క్రైస్తవ బిషప్పుల కౌన్సిల్‌ ఆగ్రహానికి గురయ్యాడు.అతగాడు చేసిన వ్యాఖ్యలను మరొకరు చేసి ఉంటే ఈ పాటికి రచ్చ రచ్చ గావించి ఉండే వారు.యూత్‌లీగ్‌ ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ ఐరోపాలో చర్చ్‌లు నృత్య కేంద్రాలు, మద్యం బార్లుగా మారిపోయాయని చాండీ అన్నారు. ఆ వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. చాండీకి అసలు కేరళ చర్చ్‌ల చరిత్ర తెలియదని బిషప్పుల సంఘం వ్యాఖ్యానించింది.


బిజెపి మిత్రపక్షమైన కేరళ భారత ధర్మ జనసేన(బిడిజెఎస్‌) పార్టీలో చీలిక వచ్చింది. బిజెపి నేతలు ఎల్‌డిఎఫ్‌తో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారని దానికి నిరసనగా తాము భారత జనసేన (బిజెఎస్‌) పేరుతో కొత్త పార్టీని పెట్టి యుడిఎఫ్‌ను సమర్ధించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే వీరికి బలమేమీ లేదని బిడిజెస్‌ నేతలు తోసి పుచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో అసలు ఉమ్మడిగా ఉన్న పార్టీకే బలమేమీ లేదని వెల్లడైంది.
స్ధానిక సంస్ధల ఎన్నికలకు ముందు బిజెపి నేతల తీరు తెన్నులు చూస్తే కేరళలో వచ్చే ఎన్నికలలో తాము అధికారానికి రాకపోయినా గణనీయ సంఖ్యలో సీట్లు తెచ్చుకొని చక్రం ఇప్పుతామన్నట్లుగా ఉంది. ఫలితాలు వెలువడిన తరువాత కొన్ని సీట్లలో ఓట్లను గణనీయంగా ఎలా పెంచుకోవాలా అని చూస్తోంది, అదే పెద్ద గొప్ప అన్నట్లుగా మీడియా చిత్రిస్తోంది. నూట నలభై స్ధానాలకు గాను 48 చోట్ల 30వేలకు పైగా ఓట్లు వస్తాయని, వాటిలో కూడా 20 చోట్ల గెలిచే అవకాశాలున్నందున అలాంటి స్ధానాల మీద కేంద్రీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నిర్ణయించినట్లు మళయాళ మనోరమ వ్యాఖ్యాత పేర్కొన్నారు. కేరళలో బిజెపి ఎన్ని ఊపులు ఊపినా దాని ఓటింగ్‌ శాతం పదిహేనుశాతానికి లోపుగానే ఉంది తప్ప పెరగలేదు. ఈసారి చూడండి ఈ సారి చూడండి అంటూ ప్రతిసారీ కబుర్లు చెబుతూనే ఉంది. ఇప్పుడూ అదే పల్లవి, అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌కు తమకూ మధ్యనే పోటీ ఉంటుందని చెబుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత అనేక మంది నేతలు అసెంబ్లీ బరిలో దిగాలా వద్దా అని ఆలోచిస్తున్నారు, సాకులు వెతుకుతున్నారు. కొందరు వెనక్కు తగ్గినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రతిపక్షాలు, మీడియా ఎలాంటి కుయుక్తులు పన్నినా, వక్రీకరణలు చేసినా ఎల్‌డిఎఫ్‌ తన కార్యక్రమంతో ముందుకుపోతోంది. మరో విజయాన్ని స్వంతం చేసుకోగలమనే ధీమా వ్యక్తం అవుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

101 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎల్‌డిఎఫ్‌ ఆధిక్యత – వచ్చే ఎన్నికలలో నూతన అధ్యాయం !

20 Sunday Dec 2020

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Pinarayi Vijayan, Kerala BJP, Kerala CPI(M), Kerala Local Body Election Results 2020, LDF, UDF


ఎం కోటేశ్వరరావు
కేరళ స్ధానిక సంస్దల ఎన్నికలలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అటు కాంగ్రెస్‌, ఇటు బిజెపి కూటములు రెండూ శబరిమల వివాదం, ప్రమాదవశాత్తూ ఏనుగు మృతి, బంగారం స్మగ్లింగ్‌ ఉదంతం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ కుమారులు కేసుల్లో ఇరుక్కొని అరెస్టు కావటాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, రాజకీయంగా సొమ్ము చేసుకొనేందుకు, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన నేపధ్యంలో సాధించిన విజయం సామాన్యమైంది కాదు.


ప్రాధమికంగా వెల్లడైన విశ్లేషణలను బట్టి కరోనా సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు జరిపిన ఆహార కార్యక్రమం, కరోనా చికిత్సలో చూపిన ప్రత్యేక శ్రద్ద, అవకాశవాద రాజకీయాలకు పాల్పడకుండా మత శక్తుల పట్ల అనుసరించిన సూత్రబద్దవైఖరి జనామోదం పొందింది కనుకనే ఎల్‌డిఎఫ్‌ విజయం సాధ్యమైంది.పైన పేర్కొన్న అంశాలతో పాటు యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరిన కేరళ కాంగ్రెస్‌(ఎం) వర్గం కారణంగా దాని ప్రభావం కేరళ మధ్య జిల్లాల్లో విజయావకాశాలను పెంచింది. స్ధానిక సంస్ధల ఎన్నికలు కేరళలో సరికొత్త పరిణామాలకు తెరలేపినట్లు చెప్పవచ్చు. ప్రతిపక్షాలు చేసిన ప్రచారంతో ఊగిసలాడిన ఓటర్లు, గతంలో మద్దతుదార్లుగా ఉండి ఎల్‌డిఎఫ్‌కు దూరమైన వారు ఈ పరిణామంతో తిరిగి చేరువ కావచ్చు. ప్రజాభిప్రాయాన్ని మరింతగా కూడగట్టేందుకు వివిధ తరగతుల నుంచి సూచనలు పొందేందుకు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదమూడు జిల్లాల పర్యటన ఖరారైంది. మరొక జిల్లా కార్యక్రమాన్ని రూపొందించవలసి ఉంది. రానున్న రోజుల్లో ఎల్‌డిఎఫ్‌ మరిన్ని కార్యక్రమాలను రూపొందించి, అందరికంటే ముందుగానే ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దం అవుతోంది.


గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఒక సారి ఎల్‌డిఎఫ్‌ కూటమి అధికారానికి వస్తే మరోసారి యుడిఎఫ్‌ రావటం ఒక ఆనవాయితీగా మారింది. వచ్చే ఎన్నికలలో ఓటర్లు దానికి మంగళం పాడతారని ఇప్పటికే కొందరు వ్యాఖ్యానించటం ప్రారంభించారు. ఎన్నికల నాటికి అసాధారణ పరిస్దితులు ఏర్పడితే తప్ప ఎల్‌డిఎఫ్‌ ఇదే విజయ పరంపరను కొనసాగించవచ్చని, వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికారానికి రావచ్చని భావిస్తున్నారు. తాజా ఎన్నికలలో కొత్తగా కేరళ కాంగ్రెస్‌(ఎం) వచ్చి చేరింది. ఎల్‌డిఎఫ్‌లోని కొన్ని పార్టీలు తమ సీట్ల గురించి ఆందోళన చెంది కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికలలో సీట్ల పంపిణీ, ఐక్యంగా పని చేయటంలో అదెక్కడా కనిపించలేదు. ఇదే సర్దుబాటు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఉంటుందనే భావన వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రతిపక్ష యూడిఎఫ్‌లో కుమ్ములాటలు బజారున పడ్డాయి. ఫ్రంట్‌కు ఎవరు నాయకత్వం వహించాలో, ఏమి చేయాలో రెండవ భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్‌కు మార్గనిర్దేశనం చేయటం కాంగ్రెస్‌ దుస్దితిని తెలియ చేస్తోంది. మరోవైపు మత అజెండాను ముందుకు తెచ్చినా భంగపడిన బిజెపి తాను తిరిగి గెలుచుకున్న పాలక్కాడ్‌ మున్సిపల్‌ కార్యాలయంపై శ్రీరాముడి చిత్రం ముద్రించిన కాషాయ జెండాను ఎగురవేయటం, దానికి అభ్యంతరం తెలపటంపై అది చేస్తున్న వాదనల ద్వారా తన అజెండాను మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు నిర్ణయించిందన్నది స్పష్టం.

స్ధానిక సంస్ధల ఎన్నికలలో అత్యధిక చోట్ల పార్టీలు పూర్తి మెజారిటీ సాధించాయి. మరికొన్ని చోట్ల ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్ధితి ఏర్పడింది. ఎన్నికైన సభ్యులు పాలకవర్గాలను ఎన్నుకొనేందుకు ఈ నెల 21, 22 తేదీలలో సమావేశం కానున్నారు. కీలకంగా మారిన వార్డు సభ్యులు ఏ వైఖరి తీసుకుంటారనేదానిని బట్టి కొన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలపై ఎవరి ఆధిపత్యం ఏర్పడ నుందో తేలుతుంది. ఇప్పటి వరకు స్పష్టమైన మెజారిటీలు వచ్చిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి. రెండు కార్పొరేషన్లలో పెద్ద పక్షంగా ఎల్‌డిఎఫ్‌ ఉంది. కేరళ ఎన్నికల నిబంధనల ప్రకారం హంగ్‌ ఏర్పడినపుడు అవసరమైతే రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తొలుత సీట్లు సంపాదించిన పార్టీలన్నీ పోటీ చేయవచ్చు. సగం కంటే ఎక్కువ మెజారిటీ ఎవరికీ రాకపోతే మొదటి రెండు స్దానాలలో ఉన్న పార్టీలు రెండవ సారి పోటీ చేయాల్సి ఉంటుంది. పోటీలో లేని పార్టీలు ఓట్లు వేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగానూ ఉండవచ్చు. అప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికే పదవి దక్కుతుంది. కేరళలో ఉన్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో స్వతంత్రులు ఏ వైఖరి అయినా తీసుకోవచ్చు గానీ ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌, బిజెపి పార్టీలు ఒకరికి వ్యతిరేకంగా మరొకర్ని బలపరిచే పరిస్ధితి లేదు. ఈ కారణంగానే రెండు కార్పొరేషన్లలో ఎల్‌డిఎఫ్‌ పెద్ద పక్షంగా అవతరించినందున అక్కడ కూడా వారే విజయం సాధిస్తారనే భావనతో మీడియాలో ఎల్‌డిఎఫ్‌ ఐదు మేయర్‌ స్దానాలను గెలుచుకున్నట్లు రాస్తున్నారు. జిల్లా పంచాయతీలలో ఒక చోట ఎల్‌డిఎఫ్‌ పెద్ద పార్టీగా అవతరించగా మరొక చోట రెండు కూటములకు సమానంగా స్ధానాలు వచ్చాయి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌×××యుడిఎఫ్‌×××ఎన్‌డిఏ×××ఇతరులు×××హంగ్‌××× మొత్తం
గ్రామపంచాయతీలు×× 514(-2) ×××321(-51) ××19(+5) ×× 23(+15) ×× 64 ××× 941
బ్లాక్‌ పంచాయతీలు×× 108(+20)××× 38(-24) ×× 0(0) ×× 0(-5) ×× 6 ××× 152
జిల్లా పంచాయతీలు×× 10(+3) ××× 2(-3) ×× 0(0) ×× 0(0) ×× 2 ××× 14
మున్సిపాలిటీలు ×××× 35 ××× 39 ×× 2(+1) ×× 3 ×× 7 ××× 86
కార్పొరేషన్లు ×××× 3 ××× 1 ×× 0(0) ×× 0 ×× 2 ××× 6
వివిధ స్ధానిక సంస్ధలలో వార్డుల వారీగా వచ్చిన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌-××××యుడిఎఫ్‌×××××ఎన్‌డిఏ×××××ఇతరులు××× మొత్తం
గ్రామపంచాయతీలు×7,262(-361) ×5,893(-431) ×1,182(+249) ×1,620(+542) ×15,962
బ్లాక్‌ పంచాయతీలు ×1,266(+178) ××727(-190) ×× 37(+16) ×× 49(-4) ××× 2,080
జిల్లా పంచాయతీలు×× 212(+42) ××110(-35) ×× 2(-1) ××××× 6(+2) ×××× 331
మున్సిపాలిటీలు ××1,167(-96) ×× 1,173(-145) ×× 320(+84) ××416(+157) ××3,076
కార్పొరేషన్లు ××× 207(+11) ×× 120(-23 ×× 59(+8) ×× 27(+3) ××× 414
పై వివరాలను పరిశీలించినపుడు వెల్లడైన ధోరణులు ఇలా ఉన్నాయి. గ్రామ పంచాయతీలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ రెండూ 792 స్ధానాలు కోల్పోగా వాటిలో ఇతరులు 542 సాధించగా బిజెపికి పెరిగింది 249, బ్లాక్‌ పంచాయతీలలో కాంగ్రెస్‌ కోల్పోయిన 190లో ఎల్‌డిఎఫ్‌ 178, బిజెపి 16 అదనంగా సాధించింది. మున్సిపల్‌ వార్డులలో ఎల్‌డిఎఫ్‌, యూడిఎఫ్‌ కోల్పోయిన 241 స్ధానాలలో ఇతరులు 157 పొందగా బిజెపి 84 అదనంగా సాధించింది. కార్పొరేషన్‌ వార్డులలో యుడిఎఫ్‌్‌ 23 కోల్పోగా ఎల్‌డిఎఫ్‌ 11, బిజెపి 8, ఇతరులకు మూడు అదనంగా వచ్చాయి. ఈ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్‌తో పాటు పది మున్సిపాలిటీలు, 40 గ్రామ పంచాయతీలలో విజయం సాధిస్తామని బిజెపి చెప్పుకున్నది. ఏమి జరిగిందో చూశాము. ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తామని చెప్పిన బిజెపి కంటే ఇతరులు ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లు కోల్పోయిన స్ధానాలను ఎక్కువగా పొందారు. శబరిమల ప్రాంతంలోని పండలం మున్సిపాలిటీని బిజెపి అదనంగా సంపాదించింది. స్ధానిక ఎన్నికలలో గతంలో గెలిచిన స్ధానాలను కొన్నింటిని పోగొట్టుకోవటం, కొత్తవాటిని సాధించిన ఉదంతాల గురించి ప్రతి పార్టీ పరిశీలన జరుపుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో లోటు పాట్లను సరి చేసుకొనేందుకు ప్రయత్నించటం సహజం.
గత 2015స్దానిక సంస్ధలు, 2016 అసెంబ్లీ, 2019లోక్‌సభ ఎన్నికలు, తాజా 2020 స్ధానిక సంస్ధల ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం.
కూటమి××××× 2015 ×××× 2016×××× 2019×××× 2020
ఎల్‌డిఎఫ్‌×××× 37.4 ×××× 43.48 ××× 36.29 ××× 41.6
యుడిఎఫ్‌×××× 37.2 ×××× 38.81 ××× 47.48 ××× 37.1
బిజెపి ××× 13.3 ×××× 14.96 ××× 15.64 ××× 14.5
ఇతరులు ×××× 12.1 ×××× 2.75 ××× —– ××× 6.8
పైన పేర్కొన్న వివరాల ప్రకారం గత నాలుగు ఎన్నికలలో బిజెపి ఓట్లశాతాలలో పెద్ద మార్పు లేదు.(2011 అసెంబ్లీ ఎన్నికలలో 138 స్ధానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి 6.06శాతం ఓట్లు వచ్చాయి) అయినా స్ధానిక ఎన్నికలలో గతం కంటే అదనంగా వచ్చిన కొన్ని స్ధానాలను చూపి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పోటీ తమకు ఎల్‌డిఎఫ్‌కు మధ్యనే ఉంటుందని బిజెపి నేతలు చెప్పుకోవటం గమనించాల్సిన అంశం. శబరిమల ఉదంతం, బంగారం స్మగ్లింగ్‌ కేసులను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు అటు మతాన్ని, ఇటు కేంద్రంలోని అధికారాన్ని వినియోగించుకొని ఎల్‌డిఎఫ్‌పై బురద చల్లేందుకు చేసిన యత్నాలు బహిర్గతమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాల గురించి ఈ ఎన్నికలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలలో కూటముల వారీ సాధించిన స్ధానాలు, 2019 లోక్‌ ఎన్నికలు, 2020 స్ధానిక ఎన్నికలలో వచ్చిన ఓట్లను బట్టి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరిది పై చేయిగా ఉందో దిగువ చూద్దాం. 2016 వివరాలలో బ్రాకెట్లలో ఉన్న అంకెలు అంతకు ముందు అసెంబ్లీ స్ధానాలతో పోల్చితే అదనంగా తెచ్చుకున్నవీ, కోల్పోయినవని గమనించాలి.
ఏడాది ××××××× ఎల్‌డిఎఫ్‌ ××××× యూడిఎఫ్‌×××××× బిజెపి
2016 ×××××× 91(+23) ×××××× 47(-25) ×××××× 1(+1)
2019××××××× 16 ×××××× 123 ×××××× 1
2020××××××× 101 ×××××× 38 ××××××× 1
గత లోక్‌ సభ ఎన్నికలలో అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు చోట్ల బిజెపి రెండవ స్ధానంలో ఉంది, తాజా స్ధానిక ఎన్నికల్లో ఐదు చోట్ల రెండవ స్ధానంలో ఉంది.2016లో ఒక స్వతంత్ర అభ్యర్ధి ఎంఎల్‌ఏగా గెలిచారు. లోక్‌సభ ఎన్నికలకూ ఇప్పటికీ పరిస్ధితిలో వచ్చిన మార్పును, కాంగ్రెస్‌కు తగిలిన పెద్ద ఎదురుదెబ్బనూ ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. 2015 స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి యుడిఎఫ్‌ అధికారంలో ఉంది. ప్రతిపక్ష ఎల్‌డిఎఫ్‌కు యుడిఎఫ్‌ మధ్య ఓట్ల తేడా అసెంబ్లీ ఎన్నికలలో యుడిఎఫ్‌ కంటే ఎల్‌డిఎఫ్‌ ఓట్ల శాతం కేవలం 0.2శాతమే ఎక్కువ. తాజా ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ అధికారంలో ఉండి, ప్రతిపక్షాలు ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా యుడిఎఫ్‌ కంటే 4.5శాతం ఓట్లు ఎక్కువగా తెచ్చుకుంది. కనుకనే 101 అసెంబ్లీ సెగ్మెంట్లలో పై చేయి సాధించింది. ఇదే ఆదరణను ఎల్‌డిఎఫ్‌ నిలుపు కుంటే కొన్ని సీట్లు అటూ ఇటూ అయినా తిరిగి 2021 ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కేరళలో ఎల్‌డిఎఫ్‌ కొత్త చరిత్రకు నాంది పలికినట్లే అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ వామపక్షాలకు సవాలు విసిరిన ఓటింగ్‌ సరళి

20 Friday May 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ 2 Comments

Tags

BJP, Congress, CPI(M), INDIAN LEFT, LDF, LEFT FRONT, UDF

ఎం కోటేశ్వరరావు

    ఐదు సంవత్సరాల తరువాత కేరళలో తిరిగి అధికారానికి రావటంతో సిపిఎంతో సహా అన్ని వామపక్షాలు, శక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తిరిగి అధికారానికి రాకపోయినా గతం కంటే మెరుగైన ఫలితాలను అయినా వామపక్షాలు సాధిస్తాయని ఆశించిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. గతంలో వున్న స్ధానాలను కోల్పోయాయి. అందువలన కేరళ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేవు. ఇది భౌతిక వాస్తవం. కేరళలో మూడింట రెండు వంతుల మెజారిటీకి కేవలం రెండు స్ధానాలు మాత్రమే తగ్గాయి. దేశంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) విజయానికి వున్న ప్రాధాన్యతను ఎవరూ తగ్గించజాలరు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు కడుపు మంటతో ఏడవలేక నవ్వు ముఖం పెడతారు. అది సహజమే, అర్ధం చేసుకోవాలి అంతే. ఇదే సందర్భంలో మరో కోణం నుంచి కూడా ఫలితాలను విశ్లేషించటం అవసరం.అది ఈ దేశంలో అభ్యుదయ పురోగామి శక్తులు మరింతగా పెరగాలని కోరుకొనే వారందరూ చేయాలి. ఓటమి చెందినపుడు ఎంత తీవ్రంగా అంతర్మధనం చేయాలో గెలిచినపుడు దానిని కొనసాగించటానికి అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సి వుంటుంది.

     కేరళలో ఎగ్జిట్‌ పోల్స్‌ కంటే ఎక్కువగా సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమికి సీట్లు  వచ్చాయి.ఎల్‌డిఎఫ్‌ ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం తెచ్చుకుంది. కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుపొందింది. త్రిసూర్‌, పథ్థానం తిట్ట, అలప్పూజ, వైనాడ్‌ జిల్లాలో ఒక సీటు మినహా , కన్నూరు, కాలికట్‌ జిల్లాలో రెండేసి తప్ప అన్నింటినీ గెలుచుకుంది. ఇదే సమయంలో ఓటింగ్‌ తీరు తెన్నులు సిపిఎంకు ఒక పెద్ద సవాలును కూడా విసిరాయి.

1.గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎల్‌డిఎఫ్‌కు దాదాపు ఒక శాతం తక్కువగా 43.1శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలలో అధికారం రానప్పటికీ కాసరగోడ్‌, కోజికోడ్‌, ఇడుక్కి, కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఒక్క కొల్లం జిల్లాలోనే ఆ విజయాన్ని కొనసాగించింది.

2. అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు పెద్ద మొత్తంలో ఓట్లు తగ్గి 45 నుంచి 38.78శాతానికి పడిపోయాయి. పోటా పోటీగా కేరళలో జరిగే ఎన్నికలలో రెండు కూటముల మధ్య ఇంత పెద్ద మొత్తంలో ఓట్ల తేడా వుండటం, రెండు కూటములకూ ఓటింగ్‌ శాతం తగ్గటం కూడా ఇదే ప్రధమం.

3.బిజెపి నాయకత్వంలోని కూటమి గత ఎన్నికలలో వచ్చిన ఆరుశాతాన్ని 15కు పెంచుకుంది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలు, కొద్ది నెలల కితం జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికల కంటే కూడా అదనంగా ఓట్లు తెచ్చుకొంది. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో ఒక సీటు గెలుచుకోవటంతో పాటు ఏడు చోట్ల రెండవ స్ధానంలో నిలిచింది.

     కాంగ్రెస్‌ మీద వున్న వ్యతిరేకతతో పాటు బిజెపి గణనీయంగా ఓట్లు చీల్చటం కూడా ఎల్‌డిఎఫ్‌కు కలసి వచ్చి ఘన విజయం సాధించిందని ఓటింగ్‌ తీరుతెన్నులను బట్టి కొందరు విశ్లేషించారు. గతంలో అనేక సందర్బాలలో కమ్యూనిస్టులను అధికారానికి రానివ్వకూడదన్న గుడ్డి వ్యతిరేకతతో బిజెపి తన ఓట్లను కాంగ్రెస్‌కు బదలాయించిందన్నది బహిరంగ రహస్యం.ఈ సారి ఎలాగైనా బిజెపి పర్మనెంటు అభ్యర్ధిగా పేరు తెచ్చుకున్న ఓ రాజగోపాలన్‌ను గెలిపించేందుకు తోడ్పడటం ద్వారా బిజెపి హిందూత్వ ఓటర్ల మద్దతు పొందేందుకు కాంగ్రెస్‌ ఆయనపై బలహీనమైన అభ్యర్ధిని నిలిపి పరోక్ష సందేశం పంపింది. అయితే బిజెపి కాంగ్రెస్‌ మద్దతు పొంది తొలిసారిగా కేరళ అసెంబ్లీలో అడుగు పెట్టింది తప్ప మొత్తం మీద తన ఓట్లను బదలాయించినట్లు కనిపించటం లేదు. అయితే గతంలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అనేక చోట్ల ఈ సారి బిజెపి ఓట్లు తగ్గాయి. అంటే అక్కడ ఆ ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయించారా ? చూడాల్సి వుంది. కాంగ్రెస్‌, బిజెపి చేసిన తప్పుడు ప్రచారాల కారణంగా సిపిఎంకు హిందువుల ఓట్లతో పాటు అనేక చోట్ల మైనారిటీలు కూడా మద్దతు ఇచ్చినట్లు ఫలితాల తీరు తెన్నులపై విశ్లేషకులు చెబుతున్నారు.’ సాంప్రదాయంగా సిపిఎంకు ఓటు చేసే హిందువులలో చీలిక తెచ్చేందుకు చివరి దశలో బిజెపిఏ తనకు ప్రధాన ప్రత్యర్ధి అని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. కానీ ఫలితాలను చూస్తే హిందువులు మెజారిటీ వున్న ప్రాంతాలతో పాటు బిజెపి పెరుగుదల కారణంగా మైనారిటీలు ఎక్కువగా వున్న కొన్ని చోట్ల కూడా సిపిఎం తన ఓట్లను పెంచుకున్నట్లు వెల్లడి అవుతోందని’ డెక్కన్‌ క్రానికల్‌ కేరళ ఎడిషన్‌ సంపాదకుడు కెజె జాకబ్‌ అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు కారణంగానే ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ మెజారిటీ 70వేల నుంచి 27వేలకు పడిపోయిందన్నారు.

    బెంగాల్లో ఫలితాలు వామపక్షాలను తీవ్రంగా పునరాలోచనలో పడవేస్తాయి. రెండు సంవత్సరాల క్రితం పార్లమెంట్‌ ఎన్నికలలో 16శాతం ఓట్లు పొందిన బిజెపి అసెంబ్లీలో 10శాతానికి పడిపోయింది.అవి తృణమూల్‌ కాంగ్రెస్‌కు బదిలీ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటమికి కారణాలుగా చెబుతూ వస్తున్న కొన్ని వ్యాఖ్యలను వామపక్షాలు నిశితంగా పరిశీలించాల్సి వుంది. మమతాబెనర్జీ కిలో రెండు రూపాయల బియ్యం పధకం ప్రవేశపెట్టి శారద, నారద వ్యతిరేకతను అధిగమించారన్నది ఒకటి. దేశవ్యాపితంగా ఆహార భద్రత కావాలని డిమాండ్‌ చేసిన వామపక్షాలు బెంగాల్‌లో తమ మూడున్నర దశాబ్దాల పాలనలో సబ్సిడీ బియ్యం పధకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. బాలికలకు స్కాలర్‌ షిప్పులు, సైకిళ్లు ఇచ్చారని మరికొన్ని ఇలాంటివే వున్నాయి. అన్నింటినీ ప్రజాకర్షక పధకాలుగా కొట్టివేయలేము. సిపిఎం కార్యక్రమం జనతా ప్రజాస్వామిక విప్లవ దశకు చేరటం తప్ప నేరుగా సోషలిజం కాదు. అటువంటిది ఒక రాష్ట్రంలో మౌలిక మార్పులను చేయలేని పరిస్థితులలో వున్నంతలో ప్రజలకు వుపశమనం కలిగించటం అవసరమా లేదా ? అందువలన బెంగాల్లో గతంలో ఏం జరిగింది అని అంతర్గతంగా మధించుకోవటంతప్ప ఇప్పుడు బహిరంగంగా చర్చించి ప్రయోజనం లేదు. అధికారంలో వున్న త్రిపుర, కేరళలో అయినా అలాంటి వైఫల్యాలు, లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది.

    రెండవది కాంగ్రెస్‌ ఓటింగ్‌ పూర్తిగా బదిలీకాలేదన్న వాదన. దీని గురించి ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. బదిలీ అవుతాయి అని ఎవరైనా భావిస్తేనే భ్రమలకు లోనయినట్లుగా పరిగణించాలి. వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, ఇతర వామపక్షపార్టీలతో కలిగిన అనుభవం ఏమిటి? సిపిఎం ఓట్లు పూర్తిగా, నిజాయితీగా బదిలీ అయ్యాయి తప్ప ఇతర పార్టీల నుంచి అవి మిత్రపక్షాలుగా వున్నపుడే పూర్తిగా బదిలీ జరగలేదని తేలింది. అలాంటిది బెంగాల్లో గత ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ వ్యతిరేకతతో పనిచేసిన కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌ ఓట్లు పూర్తిగా బదిలీ అవుతాయని భావించటం అత్యాశే అవుతుంది. సాధారణ పరిస్థితులలో పార్టీ పనిచేయటానికి కూడా అవకాశం లేని స్ధితిలో ప్రజాస్వామ్య పరిస్ధితుల పునరుద్దరణకోసం చేసుకున్న సర్దుబాటు తప్ప అది మరొకటి కాదు. కమ్యూనిస్టులు ప్రపంచంలో అనేక చోట్ల అంతకంటే తీవ్ర నిర్బంధం, ప్రతికూల పరిస్థితులలో పనిచేస్తున్నారు. అందువలన బెంగాల్లో వామపక్షాలు రాబోయే అయిదు సంవత్సరాలలో మరిన్ని దాడులకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. నూతన పరిస్ధితులకు అనుగుణంగా పని చేసి తిరిగి ప్రజల విశ్వాసం పొందటం తప్ప మరొక మార్గం లేదు. అది ఎలాగన్నదే సమస్య.

     ఫలితాలకు సంబంధించి ఇంకా లోతైన విశ్లేషణలు రాబోయే రోజుల్లో వెలువడతాయి. వామపక్షాల ముందున్న ఒక తీవ్ర సవాలును అవి ఎలా అధిగమిస్తాయన్నదే ప్రశ్న. అదే మిటంటే గత ఎన్నికల ఓటింగ్‌ తీరుతెన్నులను చూస్తే స్పష్టం అవుతుంది. వర్గరీత్యా ఒక శాతం పెట్టుబడిదారులు, భూస్వాములు అయితే 99శాతం కార్మికవర్గం, ఇతర కష్టజీవులే. అటువంటపుడు కమ్యూనిస్టులు పొందుతున్న ఓటింగ్‌ శాతం దానిని ప్రతిబింబించటం లేదు. అనేక మంది శ్రామికులు కమ్యూనిస్టులు కాని పార్టీల, కుల మత శక్తుల వెనుక వున్నారు. ఓడిపోయిన ప్రతి సారీ కమ్యూనిస్టులు ఆత్మశోధన చేసుకొని బలహీనతను అధిగమిస్తామని చెబుతూనే వున్నారు. కానీ తరువాత అది ప్రతిబింబించటం లేదు. కమ్యూనిస్టుల బలం ఒక పరిధికి మించి పెరగటం లేదు. అలాగని దీన్ని గురించి గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు గానీ తీవ్రంగా పరిశీలించకతప్పదు. వివరాలు చూడండి. కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌,బిజెపి ఓట్ల శాతాలు ఇలా వున్నాయి.

                1987      1991      1996     2001     2006     2011     2016

ఎల్‌డిఎఫ్‌    44.65     45.80    44.69    43.70     48.60    44.83   43.10

యుడిఎఫ్‌    44.04     48.07    43.58    49.27    42.98     45.90   38.78

బిజెపి                                                5.20       4.75      6.00    15.00

     గత ఏడు ఎన్నికలలో తొలిసారిగా 2016లో అటు ఎల్‌డిఎఫ్‌ ఇటు యుడిఎఫ్‌ రెండు కూటములు అతి తక్కువ ఓట్లు పొందాయి.ఏడు ఎన్నికల సగటు ఎల్‌డిఎఫ్‌కు 45, యుడిఎఫ్‌కు 44.6శాతంగా వున్నాయి. ఎల్‌డిఎఫ్‌ గరిష్టంగా 2006లో 48.6శాతం, యుడిఎఫ్‌ 2001లో 49.27 శాతం ఓట్లు పొందాయి.

     పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2006 వరకు జరిగిన ఎన్నికలలో వామపక్ష సంఘటన సగటున 49.82 శాతం ఓట్లు పొందింది. ఏడు ఎన్నికలలో రెండు సార్లు మాత్రమే 50 శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది. బెంగాల్‌, కేరళలో రెండు చోట్లా సగం మంది కంటే తక్కువ ఓటర్ల మద్దతు మాత్రమే వామపక్షాలు ఇంతకాలం పొందగలిగాయి. బెంగాల్లో గత రెండు ఎన్నికలలో వామపక్ష ఓటింగ్‌ గణనీయంగా తగ్గిపోయింది. తిరిగి ప్రజా మద్దతు పొందటం ఎలా అన్నది ఆ పార్టీలు చూసుకుంటాయి, అది వేరే విషయం. బాగా వున్న రోజులలో కూడా వాటి బలం అంతకు మించి పెరగ లేదు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో బెంగాల్లో పోయిన పునాదిని తిరిగి సంపాదించటం ఒక సవాలైతే కేరళలో పునాదిని మరింత పెంచుకోవటం అంతకంటే పెద్ద సవాలు. కేరళలో వున్న సామాజిక పరిసిస్థితులలో 43శాతం మైనారిటీ జనాభాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగాన్ని మరిచి పోరాదు. మైనారిటీలందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కానప్పటికీ వారు మెజారిటీగా వున్న ప్రాంతాలలో ఎన్నికల ఫలితాలను చూసినపుడు మతశక్తుల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాటిని బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతశక్తిగా మారేందుకు ప్రయత్నిస్తోంది.అదే సమయంలో కమ్యూనిస్టులను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌తో రాజీపడటం, కుమ్మక్కు కావటమే ఇప్పటివరకు దాని చరిత్రగా వుంది. ప్రపంచంలో మత ధోరణులతో పాటు నయా వుదార వాద విధానాల ప్రభావం అన్ని తరగతులలో బలంగా వ్యాపిస్తున్న తరుణమిది.అందుకే మన దేశంలో మైనారిటీ మతాలకు చెందిన కొన్ని శక్తులు బిజెపిని చూసి ఒకవైపు భయపడుతూనే మరోవైపు దానిని సమర్ధించటానికి కూడా పరిమితంగానే అయినప్పటికీ వెనుకాడటం లేదు. ఆ తరగతులలో మధనం జరుగుతోంది. దీనికి కేరళ మినహాయింపు అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d