• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Ukraine war

వసుదేవుడిని అనుసరిస్తున్న అమెరికా జో బైడెన్‌ !

09 Wednesday Mar 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Fuel prices freezing, Joe Biden, NATO allies, Ukraine war, Ukraine-Russia crisis, US, US imperialism, Venezuela


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ లొంగుబాటు సూచనలు, మరోవైపు మంటను మరింత ఎగదోస్తూ అమెరికా, దాని మిత్రదేశాల చర్యలు. రష్యా చమురును అమెరికా దిగుమతి చేసుకోవటంపై జోబైడెన్‌ నిషేధం విధించాడు. బ్రిటన్‌ దాన్ని అనుసరించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో పీపా ధర 139 డాలర్లు తాకి తరువాత తగ్గింది. ఫిబ్రవరి 24న యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ధర ఒక్క రోజు కూడా నిలకడగా లేదు. మార్చి 9వ తేదీన 121.5 డాలర్లుగా ఉంది. తమ ఇంధనంపై ఆంక్షలు విధిస్తే మూడువందల డాలర్లకు పెరగవచ్చని రష్యా హెచ్చరిక. మరోవైపున వెనెజులా చమురుపై ఆంక్షల ఎత్తివేత ఆలోచనల్లో అమెరికా. తమపై ఆంక్షలను ఎత్తివేసినా లేకున్నా రష్యాకు ఇచ్చే మద్దతుపై వెనక్కు తగ్గేదేలే అంటున్న వెనెజులా.


రష్యా ఇంధన దిగుమతులపై ఆంక్షలు విధిస్తే సామాజిక ఐక్యత కుప్పకూలుతుందని జర్మనీ హెచ్చరించింది. తాము ఆంక్షలను వ్యతిరేకిస్తామని కూడా జర్మనీ మంత్రి రాబర్ట్‌ హాబెక్‌ చెప్పాడు. సరఫరాలు తగ్గటం సామాజిక ఐక్యతకు ముప్పు తెస్తుందని కూడా అన్నాడు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది ఇంతకు మించి కొత్తగా చేసేదేమీ లేదని తదుపరి చర్యల గురించి మరొక మంత్రి క్రిస్టియన్‌ లెండర్‌ స్పష్టం చేశాడు. ఆంక్షల నుంచి రష్యన్‌ ఇంధన సరఫరాలను కావాలనే ఐరోపా మినహాయించింది, ఈ క్షణంలో మరోమార్గంలో ఇంధన సరఫరాకు అవకాశం లేదని జర్మన్‌ ఛాన్సల్‌ ష్కోల్జ్‌ చెప్పాడు. ఈ కారణంగానే బైడెన్‌ ఐరోపాతో నిమిత్తం లేకుండా తమ దేశానికి మాత్రమే వర్తించే నిషేధాన్ని ప్రకటించాడు. ఐరోపాయునియన్‌ నుంచి విడిపోయిన బ్రిటన్‌ వేరుగా నిషేధాన్ని ప్రకటించింది.రష్యా ఇంధనంపై ఆంక్షలు విధించటాన్ని తాము సమర్ధించటం లేదని హంగరీ ఆర్ధిక మంత్రి ప్రకటించారు.అమెరికా, సౌదీ అరేబియా తరువాత చమురు ఉత్పత్తిలో రష్యా మూడవ స్ధానంలో ఉంది. దాని ఎగుమతుల్లో 60శాతం ఐరోపా ఆర్ధిక సహకార మరియు అభివృద్ధి సంస్ధ(ఓయిసిడి) దేశాలకే చేస్తున్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటే వెంటనే జరిగేది కాదు. ఇటలీ గాస్‌ దిగుమతుల నిలిపివేతకు రెండున్నర సంవత్సరాలు పట్టింది. గతేడాది ఐరోపా యూనియన్‌ తన అవసరాల్లో 45శాతం రష్యానుంచి దిగుమతి చేసుకుంది.రష్యా ప్రతి రోజు 50లక్షల పీపాలు ఎగుమతి చేస్తుండగా దానిలో సగం ఐరోపాకే వెళుతుంది.


నోర్డ్‌ స్ట్ర్రీమ్‌ ఒకటి ద్వారా సరఫరా అవుతున్న తమ ఇంధనంపై నిషేధం విధిస్తే చమురు ధరలు మూడువందల డాలర్ల వరకు పెరగవచ్చని రష్యా ఉపప్రధాని నోవాక్‌ హెచ్చరించాడు. రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నవాటిలో ముడిచమురు కంటే దానిఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయి. అందువలన నిషేధం ద్వారా ప్రచార వత్తిడి తప్ప పెద్ద ప్రభావం చూపదన్నది స్పష్టం. అమెరికా తన అవసరాల్లో రష్యా నుంచి ఎనిమిదిశాతం దిగుమతి చేసుకుంటుండగా దానిలో మూడుశాతం మాత్రమే ముడిచమురు, మిగిలినవి చమురు ఉత్పత్తులు. పశ్చిమ దేశాలు తమ మీద విధిస్తున్న ఆంక్షలకు ప్రతిగా రష్యా కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు ధరలు పెరుగుతున్నందున అమెరికా, ఐరోపా దేశాలు కూడా వాటి ప్రతికూల పర్యవసాలను అనుభవించాల్సి ఉంటుంది. రష్యన్‌ చమురుపై నిషేధం విధిస్తే సరఫరా తగ్గి పీపా ధర 200 డాలర్లకు పెరగవచ్చని బాంక్‌ ఆఫ్‌ అమెరికా విశ్లేషకులు పేర్కొన్నారు.


వసుదేవుడంతటి వాడే అవసరం తనది గనుక గాడిద కాళ్లను పట్టుకొనేందుకు సిద్ద పడిన కథ తెలిసిందే. ఇప్పుడు అమెరికా అదే చేస్తోంది.రష్యాను దెబ్బతీసేందుకు గతంలో తాను వ్యతిరేకించిన, తిట్టిపోసిన దేశాలతో ఇప్పుడు చమురు అమ్ముతారా అంటూ తెరవెనుక సంప్రదింపులు జరుపుతోంది. దీని వెనుక రెండు కారణాలున్నాయి. ఐరోపా, ఇతర ప్రాంతాల్లోని తన మిత్రరాజ్యాల ఇంధన అవసరాలకు ఆటంకం కలగకుండా చూడటం, చమురు ధరలు మరింత పెరిగితే యురోపియన్లలో అమెరికా పట్ల ప్రతికూలత పెరుగుతుంది. తన ఆర్ధిక వ్యవస్ధకు సైతం తలెత్తే ముప్పు నివారణ అవసరం. లేనట్లయితే ఇంటా బయటా ప్రతికూల పరిస్ధితులు బైడెన్‌కు ఎదురవుతాయి.అందువల్లనే అమెరికా ప్రతినిధులు గతవారంలో వెనెజులాను సందర్శించి చమురు సరఫరా గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకొని చమురు ఆంక్షలను ఎత్తివేసేందుకు సంసిద్దతను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉత్పత్తిని పెంచమని కోరేందుకు బైడెన్‌ స్వయంగా సౌదీ అరేబియాను సందర్శించవచ్చని వార్తలు వచ్చాయి. రష్యాపై విధించిన ఆంక్షలను సొమ్ము చేసుకొనేందుకు ఉత్పత్తి పెంచాలన్న సూచనలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు సౌదీ అందుకు సముఖత చూపలేదు. గతంలో రష్యాతో వచ్చిన అవగాహనకే కట్టుబడి ఉంటామని చెబుతోంది. అణు ఒప్పందం గురించి ఇరాన్‌తో రాజీకి వచ్చి ఆంక్షలు వెనక్కు తీసుకుంటే అక్కడి నుంచి కూడా సరఫరా పెరుగుతుంది.యుద్దం ప్రారంభమైన తరువాత అమెరికా ఒక మెట్టు దిగుతున్నట్లుగానే ఈ పరిణామాలను చూడవచ్చు. జర్నలిస్టు ఖషోగ్గీ హత్య తరువాత సౌదీ-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. సౌదీ రాజును హంతకుడని బైడెన్‌ వర్ణించాడు. ఇప్పుడు చమురు ఉత్పత్తి పెంచాలని కోరుతున్నాడు. వారి సమావేశం జరుగుతుందా లేదా అన్నది సందేహమే. తాలిబాన్లతోనే ఒప్పందం చేసుకున్నపుడు సౌదీతో సయోధ్య కుదుర్చుకోవటంలో ఆశ్చర్యం ఉండదు. చమురు ధరలు తగ్గటం ప్రతివారికీ ప్రయోజనకరమే నంటూ అధికారులు చర్చలు జరుపుతున్నారు గానీ, బైడెన్‌ పర్యటన గురించి ఇప్పటికైతే ఖరారు కాలేదని పత్రికా కార్యదర్శి జెస్‌ సాకీ చెప్పారు. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?


అనేక సంవత్సరాల తరువాత ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు వెనెజులా రాజధాని కారకాస్‌ వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను గద్దె దించేందుకు కుట్రపన్నినందుకు గాను 2017లో అమెరికా ఇంధన అధికారులను అరెస్టు చేశారు. 2019లో ఆంక్షలతో పాటు, కారకాస్‌లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. తమ వారిని వదలిపెట్టాలని కోరటంతో పాటు చమురు ఎగుమతి గురించి చర్చలు ప్రారంభించారు. అధికారులు వెళ్లటానికి ఒక రోజు ముందు వెనెజులాలో పెట్టుబడులు పెట్టిన రష్యా వ్యాపారి ఉస్మనోవ్‌ వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు తొలగించలేదు గానీ కంపెనీ లావాదేవీలు జరిపేందుకు అమెరికా ఆర్ధికశాఖ సాధారణ అనుమతి మంజూరు చేసింది. అతను పుతిన్‌ మద్దతుదారు. ఇది వెనెజులా పట్ల ఒక సానుకూల వైఖరి. దీనికి ప్రతిగా ఇద్దరు అమెరికన్లను వెనెజులా విడుదల చేసింది. బైడెన్‌ వైఖరి మార్చుకోవటాన్ని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ ఎంపీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారితో కొందరు డెమోక్రాట్లు కూడా గొంతు కలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు మదురో బహిరంగంగానే మద్దతు పలికాడు. ఇంతకాలం వెనెజులాను వ్యతిరేకించిన అమెరికా తన మాటలను తానే ఖండించుకున్నట్లయింది. దీంతో మదురో మరింత బలపడతారని, వ్యతిరేకుల నడుంవిరిచినట్లవుతుందని కొందరు వాపోతున్నారు.


చమురు ధరలు పెరగటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని అమెరికాలో వాటాదార్లతో నిమిత్తం లేకుండా కుటుంబ సంస్ధలుగా ఉన్న కొన్ని చిన్న షేల్‌ ఆయిల్‌ కంపెనీలు ఉత్పత్తికి సిద్దం అవుతున్నాయి.నూటపది డాలర్లుంటే తమకు గిట్టుబాటు అవుతుందని అంటున్నాయి. పెరుగుదల ఎంత కాలం ఉంటుందో తెలీని స్ధితిలో బడా కంపెనీలు ఉత్పత్తికి సిద్దం కావటం లేదు. కరోనా కారణంగా ఆ కంపెనీల్లో మదుపు చేసిన వారికి చేతులు కాలటంతో ఆచితూచి స్పందిస్తున్నాయి.


మన దేశంలో నవంబరు నాలుగవ తేదీ నుంచి స్ధంభింపచేసిన చమురు ధరలను ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏ రోజైనా తిరిగి సవరించే అవకాశం ఉంది. దీని గురించి ప్రభుత్వం రెండు నాలుకలతో మాట్లాడుతోంది. చమురు ధరలను నిర్ణయించేది చమురు కంపెనీలు తప్ప ప్రభుత్వం కాదని, అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి తగ్గటం, పెరగటం ఉంటుందని గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికన ధరల గురించి నిర్ణయం తీసుకుంటామని చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు విలేకర్లతో చెప్పారు. నవంబరు నుంచి ధరల స్ధంభనతో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు లేదని కూడా చెప్పారు. రోజువారీ ధరల సవరణ చేసే కంపెనీలు గతంలో ఎన్నికల తరుణంలో, తాజాగా నవంబరు నాలుగునుంచి ఎందుకు స్ధంభింపచేసినట్లో ఇంతవరకు ప్రకటించలేదు.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం : మీడియా ద్వంద్వ ప్రమాణాలు, జనంపై ప్రచారదాడి !

06 Sunday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 2 Comments

Tags

media bias, Media Double standards, Media Hypocrisy, Ukraine war, Ukraine-Russia crisis



ఎం కోటేశ్వరరావు


రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, శాంతి నెలకొనేందుకు ఎన్ని రోజులు పడుతుందో అని యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే అది వారూ వీరూ అనే తేడా లేకుండా అందరి మీద ప్రభావం చూపుతుంది. ఇప్పటికే మన దేశంతో సహా అన్ని చోట్లా అది కనిపిస్తోంది. ధరలు పెరుగుతున్నాయి, చమురు పిడుగు ఏక్షణంలో పడుతుందో తెలియదు. తమ దగ్గర చిక్కుకు పోయిన లేదా ఉక్రెయిన్‌ బందీలుగా చేసిన భారత్‌, ఇతర దేశాల విద్యార్ధుల భవిష్యత్‌ గురించి తలిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. సకాలంలో కేంద్ర ప్రభుత్వం మేలుకొని ఉంటే ఈ పరిస్ధితి ఉండేది కాదు. ఇక ఈ ఈ యుద్ధం గురించి మీడియా తీరు తెన్నులు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.


ప్రపంచ చట్టాలను, భద్రతా మండలి తీర్మానాన్ని లెక్క చేయటం లేదంటూ రష్యాను దోషిగా చూపుతూ ప్రచారం జరుగుతోంది.1995లో తొలిసారిగా నాటో కూటమి యుగ్లోసావియా మీద మార్చినెల 24 నుంచి జూన్‌ పది వరకు 78 రోజుల పాటు వైమానిక దాడులు జరిపింది. దీనికి భద్రతా మండలి అనుమతి లేదు. అప్పుడు దాడికి దిగిన ” ఐరోపా అపర ప్రజాస్వామిక దేశాలు ”, వాటికి మద్దతు పలికిన మీడియాకు అంతర్జాతీయ చట్టాలు, ప్రజాస్వామిక సూత్రాలు గుర్తుకు రాలేదు. కొసావోలో ఉన్న పరిస్ధితులు ప్రాంతీయ స్ధిరత్వానికి ముప్పు వచ్చిందని నాటో సమర్ధించుకుంది. దానికి మీడియా తాన తందానా అంది. అదే నిజమైతే ఇప్పటి మాదిరి ఐరాసలో ఎందుకు చర్చించలేదు? ఇప్పుడు ఉక్రెయినుకు నాటో సభ్యత్వం ఇచ్చే చర్యలు తన భద్రతకు, ప్రాంత దేశాలకు ముప్పు అని ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న రష్యా అభ్యంతరాలను ఎందుకు పట్టించుకోలేదు ? ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌బాస్‌ ప్రాంతంలో మెజారిటీగా ఉన్న రష్యన్‌ భాష మాట్లాడేవారిపై కిరాయి ఫాసిస్టు మూకలు, మిలిటరీ జరిపిన దాడులతో పదిహేను వేల మంది మరణించటం, ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్దం, జర్మనీ, ఫ్రాన్స్‌ కుదిర్చిన రెండవ మిన్‌స్క్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఉక్రెయిన్‌ ప్రభుత్వ తీరుతెన్నులు ఆ ప్రాంతంలో అస్ధిరతకు దారి తీయవా ? నాటో ఎందుకు పట్టించుకోలేదు ?


పశ్చిమ దేశాలు ఇరాక్‌, లిబియా, సిరియా, ఎమెన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలపై దాడులు జరిపాయి. ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యాదాడులు జరుపుతోంది. రెండు ఉదంతాలపై మీడియా స్పందించిన తీరేమిటి ? సిబిఎస్‌ అనే అమెరికా మీడియా కీవ్‌ నగర విలేకరి చార్లీ డి అగటా చెప్పిన వార్తలో ” ఈ ప్రాంతం దశాబ్దాల తరబడి విబేధాలు చెలరేగుతున్న ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ వంటిది కాదు, ఇది వాటితో పోలిస్తే నాగరికమైన ప్రాంతం, ఐరోపాకు చెందినది, ఈ నగరంలో యుద్దం జరుగుతుందని మీరు ఊహించలేరు..” అన్నాడు. అంటే పైన పేర్కొన్న ప్రాంతాలు అనాగరికమైనవన్న శ్వేతజాతి జాత్యహంకారం తప్ప ఆ మాటల్లో మరేమైనా ఉందా ? అమెరికా, ఐరోపా వంటి నాగరిక దేశాలు అనాగరికంగా ఇతర దేశాల మీద దాడులకు దిగటం ఏమిటి ? పశ్చిమ దేశాల్లోని జనాలు అడవుల్లో ఉంటూ సరిగా బట్టలు కట్టుకోవటం కూడా రాని కాలంలోనే ఇరాక్‌ వంటి దేశాలు నాగరికతను కలిగి ఉన్నాయి. అనేక గణిత, సైన్సు అంశాలను బోధించాయి.


మరో అమెరికా మీడియా ఎన్‌బిఎస్‌ విలేకరి హాలీ కోబిలే ఒక మహిళ అనికూడా మరచి మరింత దారుణంగా మాట్లాడింది.” మొహమాటం లేకుండా చెప్పాలంటే వీరు సిరియా నుంచి వచ్చిన నిర్వాసితులు కాదు, ఉక్రెయిన్‌ వారు. వారు క్రైస్తవులు, వారు తెల్లవారు, మన మాదిరే ఉంటారు.” అంటే సిరియన్లు, ఇతరులు ఏమైనా వారికి ఫరవాలేదన్నమాట. బిబిసిలో ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ ” నీలి కళ్లు, తెలుపు-రాగి రంగు జుట్టు కల ఐరోపా వారిని చంపుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను” అన్నాడు. మరొక యాంకర్‌ పీటర్‌ డోబీ మాట్లాడుతూ ” వారి దుస్తులను చూస్తుంటే వారంతా ధనికులు, మధ్యతరగతి వారిలా ఉన్నారు తప్ప మధ్య ప్రాచ్యం, లేదా ఉత్తరాఫ్రికా నుంచి పారిపోతున్న కాందిశీకుల్లా మాత్రం లేరు. మీ పక్కింటి యురోపియన్‌ వారిలానే ఉన్నారు. ” పశ్చిమాసియా,ఆఫ్రికా, ఆసియా ఖండాలలో జరిగిన యుద్ధాలకు పాల్పడిందీ, ప్రపంచాన్ని ఆక్రమించింది ఐరోపా సామ్రాజ్యవాదులే కదా !


బ్రిటన్‌ టెలిగ్రాఫ్‌ పత్రిక జర్నలిస్టు డేనియన్‌ హానన్‌ ఉక్రెయిన్‌ పరిస్ధితిని చూసి దిగ్భ్రాంతి చెందాడట. ఎందుకటా అది ఐరోపా దేశమట. నిజమే రెండు ప్రపంచ యుద్దాలను ప్రారంభించిందీ, అంతకు ముందు ఐరోపాలో, అమెరికాలో కొట్టుకు చచ్చిందీ, యుద్దాలకు పాల్పడిందీ, ఆఫ్రికన్లను బానిసలుగా చేసుకున్నదీ ” ఐరోపా నాగరికులే ” అని మర్చిపోతే ఎలా, అందుకే తమ కింత ఉన్న పెద్ద మచ్చను ఒకసారి చూసుకోమని చెప్పాల్సి వస్తోంది. ఐదు లక్షల మంది ఉక్రెయినియన్లు నిర్వాసితులుగా మారటం, ఇతర దేశాలకు పోవటం దురదృష్టకరమని ఐరాస అధికారి ఫిలిప్పో వాపోయారు. 1948 నుంచి తమ మాతృదేశం నుంచి వెళ్ల గొట్టిన కారణంగా ఏడున్నరలక్షల మందితో ప్రారంభమై ప్రస్తుతం 56లక్షలకు చేరిన పాలస్తీనియన్లు అప్పటి నుంచి పరాయి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కాందిశీకుల శిబిరాల్లోనే పుట్టి కాందిశీకులుగా అక్కడే మరణించిన వారే కొన్ని లక్షల మంది ఉన్నారు. పిల్లలకు దాడుల భయం తప్ప మరొకటి తెలియదు. వారి గురించి నాగరికులకు పట్టదు, దానికి కారణమైన ఇజ్రాయల్‌కు మద్దతు ఇస్తున్నారు.2019 నాటికి 7.95 కోట్ల మంది ప్రపంచంలో నిరాశ్రయులు కాగా వారిలో 2.04 కోట్ల మంది 18 ఏండ్ల లోపువారున్నారు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులెవరు అంటే 99శాతం ఐరోపా, అమెరికా అనాగరికులే.


ఉక్రెయిన్లో రష్యన్‌ సైన్యాన్ని వ్యతిరేకిస్తున్న వారి గురించి కథ కథలుగా చెబుతున్న పశ్చిమ దేశాల మీడియా ఎన్నడైనా పాలస్తీనియన్లు, వియత్నాం తదితర చోట్ల సామాన్యులు చూపిన తెగువ, అమెరికన్లను మూడు చెరువుల నీళ్లు తాగించి సలాం కొట్టించిన ఉదంతాలను ఎప్పుడైనా చెప్పిందా ? అంతెందుకు, మమ్మల్ని ప్రాణాలతో వెళ్లి పోనివ్వండ్రాబాబూ అని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని అమెరికన్లు పారిపోకముందు వరకు వారిని అణచివేశామనే కట్టుకథలనే ప్రపంచానికి వినిపించిన సంగతి మరచిపోగలమా ! ఉక్రెయిన్లో బాంబులు తయారు చేసి ఉపయోగించి చూపటాన్ని దేశభక్తిగా చూపుతున్న మీడియా పాలస్తీనాలో అదే పని చేస్తున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించి అణచివేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ఇలా ద్వంద్వ ప్రమాణాలు, మోసకారితనం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్లు అమెరికా సిఎన్‌ఎన్‌ విలేకరి బెర్నీ గోరెస్‌ను ఉరితీసి చంపారని గతంలో ప్రపంచాన్ని నమ్మించారు. ఇప్పుడు అదే బెర్నీ ఉక్రెయిన్లో దర్శనమిచ్చి పిట్ట, కట్టుకథలను రాసి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నాడు. ఐరోపా యూనియన్నుంచి బ్రిటన్‌ విడిపోవటానికి ప్రణాళికను రూపొందించాడన్న పేరు తెచ్చుకున్న ” నాగరిక ” నిగెల్‌ ఫారాజి గతంలో బ్రిటన్‌ నుంచి పోలిష్‌ జాతివారిని బయటకు పంపాలని కోరాడు, ఇప్పుడు రష్యన్లను తరిమివేయాలని చెబుతున్నాడు.


గత ఏడు సంవత్సరాలుగా పశ్చిమ దేశాల తరఫున వకాల్తా పుచ్చుకొని ఎమెన్‌పై దాడులు చేస్తున్న సౌదీ అరేబియా, ఇతర దేశాల దాడుల్లో 80వేల మంది పిల్లలతో సహా ఐదు లక్షల మంది మరణిస్తే ఐరోపా మానవతావాదులు, వారికి మద్దతు ఇచ్చే మీడియాకు చీమకుట్టినట్లుగా లేదు. రష్యన్ల ఆస్తులను స్ధంభింపచేయాలని నిర్ణయించిన ” నాగరికులు ” సౌదీ అరేబియా, ఇతర దేశాల మీద అలాంటి చర్యలెందుకు తీసుకోలేదు, బ్రిటన్‌లో అది రెండు ఫుట్‌బాల్‌ క్లబ్బులను నడుపుతోంది. భద్రతా మండలిలో తటస్ధంగా ఉన్న యుఏయి బ్రిటన్‌లో అత్యంత ధనవంతమైన మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ భాగస్వామి, ఉక్రెయిన్‌పై బాంబు దాడులను నిరసిస్తూ సదరు క్లబ్బులో సభ నిర్వహించింది. దాని తటస్ధత ఎక్కడ ? రష్యన్లు ఉక్రెయిన్‌ తరువాత మిగతా దేశాలను కూడా ఆక్రమించుకుంటారు అని అమెరికా, ఐరోపా దేశాలన్నీ ఊదరగొడుతున్నాయి. ఐరాస తీర్మానం మేరకు ఏర్పడాల్సిన పాలస్తీనా ప్రాంతాలను గత ఏడు దశాబ్దాలుగా ఆక్రమించుకొని స్ధిరపడాలని చూస్తున్న ఇజ్రాయల్‌కు అవి తిరుగులేని మద్దతు ఇస్తున్నాయి. ఉక్రేనియన్లు తమ దేశం వెళ్లి పోరాడేందుకు అన్ని రకాల సాయం చేస్తామని బ్రిటీష్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ ప్రకటించారు. కానీ అదే బ్రిటన్‌ పశ్చిమాసియాకు చెందిన వారిని ఉగ్రవాదులుగా చిత్రించి జైళ్లలో పెట్టింది. ఫుట్‌బాల్‌ స్టేడియాల వద్ద పాలస్తీనా పతాకాలను ఎగురవేయటాన్ని బ్రిటన్‌ నిషేధించింది, ఎందుకంటే క్రీడలకు రాజకీయాలకు ముడి పెట్టకూడదని చెప్పింది, అదే ఇప్పుడు ఉక్రెయిన్‌ పతాకాలను ఎగురవేయిస్తున్నది.అమెరికాతో కలసి తనకు సంబంధం లేకపోయినా అనేక దేశాల మీద దాడులకు దిగిన బ్రిటన్‌ ఇప్పుడు రష్యాను చూపి గుండెలు బాదుకుంటోంది.


పశ్చిమ దేశాల మీడియా పోకడలను అమెరికాలోని అరబ్‌ మరియు మధ్యప్రాచ్యదేశాల జర్నలిస్టుల సంఘం ఒక ప్రకటనలో ఖండించింది. ఆ దేశాల దుష్టమనస్తత్వానికి వారి జర్నలిజం ప్రతీకగా ఉందని, మధ్యప్రాచ్యదేశాలలో విషాదాలు సర్వసాధారణమే అన్నట్లు చిత్రిస్తున్నదని పేర్కొన్నది.యుద్ద బాధితులు ఎవరైనా ఒకటేనని, అయితే మధ్యప్రాచ్యదేశాల బాధితుల పట్ల అమానుషత్వాన్ని ప్రదర్శిస్తున్నదని సంఘ అధ్యక్షురాలు హుదా ఉస్మాన్‌ విమర్శించారు. పశ్చిమ దేశాల జర్నలిస్టులు ఇతర దేశాల పట్ల అలవోకగా, సాదాసీదాగా వివక్షను వెల్లడించటం వృత్తికి తగనిపని అన్నారు.


ఇక మన మీడియా విషయానికి వస్తే ఒక మంచి రేటింగుల అవకాశాన్ని కోల్పోయినట్లుగా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది.రష్యా పట్ల మన దేశం తటస్ధవైఖరిని ప్రదర్శించటం దానికి ఒక కారణం. అయినప్పటికీ పశ్చిమ దేశాల మీడియా కథనాలను కొత్త పాకింగులో అందిస్తున్నది. భక్తి ప్రపత్తులతో తమ పని చేసిపెడుతున్నందున పశ్చిమ దేశాలు మాట్లాడటం లేదు. భారత మీడియా వివక్ష పూరితంగానూ, తప్పుదారి పట్టించే వార్తలను అందిస్తున్నదని రష్యా విమర్శించింది. ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ వాస్తవ సమాచారాన్ని భారత పౌరులకు అందించాలని హితవు చెప్పింది. ఉక్రెయిన్లోని అణువిద్యుత్‌ కేంద్రాలు, చర్చల గురించి తప్పుడు సమాచారాన్ని భారత మీడియా అందించిదని విమర్శించింది. ” రష్యా దురాక్రమణ ” గురించి భారత మీడియా విమర్శించటం లేదెందుకంటూ బిబిసి ఒక కథనాన్ని రాసింది. యుద్దాన్ని ఆసరా చేసుకొని రేటింగులను పెంచుకొనేందుకు, తద్వారా సొమ్ము చేసుకొనేందుకు చూస్తున్న అత్యధిక పశ్చిమ దేశాల మీడియా సంస్ధలు ఇల్లు కాలుతుంటే చుట్టకాల్చుకొనే వారిని గుర్తుకు తెస్తున్నాయి.జనాలను కించపరుస్తున్నాయి, ఏకపక్ష వార్తలు, వ్యాఖ్యానాలతో తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ విషయంలో మన మీడియా కూడా తక్కువ తినటం లేదు. తప్పును తప్పని ఖండించలేని నరేంద్రమోడీ సర్కారు మాదిరి యుద్దానికి అసలు కారకులైన అమెరికా దాని నేతృత్వంలోని నాటో కూటమి కుట్రలు, ద్వరద్వ ప్రమాణాలను వెల్లడించటంలో మ్యావ్‌ మ్యావ్‌ మంటున్నాయి. జనం మీద జరిగే ప్రచారదాడికి జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్ధలు అణ్వస్త్రాల క్షిపణుల మాదిరి ఉపయోగపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘ మహా రష్యన్‌ దురహంకారం ‘ – పొసగని రంగనాయకమ్మ సూత్రీకరణలు !

04 Friday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joseph v Stalin, Lenin, RUSSIA, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు


నూరు పూవులు పూయనీయండి – వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్న స్ఫూర్తితో ఎవరు ఏమైనా చెప్పవచ్చు, రాయవచ్చు. దానిలో భాగంగానే ఎవరైనా వాటితో విబేధించవచ్చు కూడా. తొలుత ప్రముఖ రచయిత్రిగా తెలుగునాట పేరు తెచ్చుకున్న రంగనాయకమ్మ తరువాత మార్క్సిస్టు సిద్దాంతవేత్తగా కూడా మారారు. మార్క్సిజం- లెనినిజం లేదా దానికి మావోయిజాన్ని తోడు చేసి వాటి మీద వ్యాఖ్యానాలు చేసేందుకు ఎవరికీ మేథోసంపత్తి హక్కులేమీ లేవు, కనుక ప్రతివారికీ అవకాశం ఉంది, అనేక మంది రాస్తున్నారు. అలాంటి వారిలో రంగనాయకమ్మ ఒకరు. ‘ మహా రష్యన్‌ దురహంకారం ‘ అనే శీర్షికతో మార్చి రెండవ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన అంశాలలో కొన్నింటి గురించి చూద్దాం. బోల్షివిక్‌ పార్టీ సారధిగా, తొలి సోషలిస్టు విప్లవానికి నేతృత్వం వహించి అనేక అంశాలపై మార్క్సిజాన్ని మరింతగా పరిపుష్టం చేసిన కారణంగానే లెనిన్‌కు చరిత్రలో ఒక ప్రత్యేక స్ధానం ఉంది. అదెంతటి మహత్తరమైనదంటే తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజంగా ప్రతి కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శనంగా చేసుకొనేంతగా అన్నది స్పష్టం.


రంగనాయకమ్మగారు ప్రస్తావించిన జాతుల సమస్య మీద ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ జరగనన్ని చర్చలు, వాదోపవాదాలు అక్కడి భౌతిక పరిస్ధితుల కారణంగా విప్లవానికి ముందు తరువాత రష్యన్‌ పార్టీలో జరిగాయి. లెనిన్‌ ప్రతిపాదించిన వాటితో తీవ్రంగా విబేధించిన వారున్నారు, లెనిన్‌ విబేధించినవీ రాజీపడినవీ ఉన్నాయి. ఆ చర్చ జోలికి పోదలచలేదు. బోల్షివిక్‌ పార్టీ ఒక ప్రజాస్వామిక సంస్ధ. మెజారిటీ నిర్ణయాన్ని మైనారిటీ కూడా అంగీకరించి అమలు జరపాలనే కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రాలతో పని చేసింది. అందువలన పార్టీలో లెనిన్‌ప్రతిపాదించినా, స్టాలిన్‌ ప్రతిపాదించినా తప్పయినా ఒప్పయినా చర్చల తరువాత ఆమోదం పొందిన వాటినే అమలు చేశారు. అందువలన వాటిని వ్యక్తులకు ఆపాదించటం తగనిపని.ఉమ్మడి óాకమ్యూనిస్టు పార్టీ సైద్దాంతిక విబేధాలతో చీలిన తరువాత తెలుగునాట రెండు పార్టీలను కొందరు సుందరయ్య పార్టీ, రాజేశ్వరరావు పార్టీ అని పిలవటాన్ని ఆమె గుర్తుకు తెచ్చారు. ” లెనిన్‌ వ్యతిరేకించిన జాతుల విధానమే స్టాలిన్‌ ఆధిపత్యంలో కొనసాగింది ” అని చెప్పటం అలాంటిదే. బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైనపుడు రష్యాలో అనేక మైనారిటీ జాతులు ఉన్నాయి. తొలి శ్రామిక రాజ్యం పేరు ” రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌ఎస్‌ఆర్‌) ”. తరువాత 1924లో వివిధ రిపబ్లిక్‌ల మధ్య ఒప్పందం జరిగి ”యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(యుఎస్‌ఎస్‌ఆర్‌)గా పేరు మార్చారు.


జారు కాలంలో మైనారిటీ జాతులను అణచివేసింది నిజం, అందుకే విప్లవం సంభవించక ముందే సోషలిస్టు దేశంలో జాతుల సమస్య పరిష్కారం గురించి పార్టీలో చర్చ జరిగింది. ఐనప్పటికీ రష్యన్‌ రిపబ్లిక్‌ అని నామకరణం చేసింది లెనిన్‌ నాయకత్వంలో ఉన్న పార్టీ, ప్రభుత్వమే కదా పెట్టింది. దాని అర్ధం మహా రష్యన్‌ దురహంకారానికి లెనిన్‌ లోనైనట్లా ? రిపబ్లిక్‌లకు స్వయం నిర్ణయాధికారం ఉండాలన్న లెనిన్‌ వైఖరిని కొందరు ఆమోదించకపోయినా మెజారిటీ అంగీకరించారు.1917 నవంబరు ఏడున రష్యన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ ఏర్పడితే, స్వయం నిర్ణయాధికార అవకాశాన్ని వినియోగించుకొని అంతకు ముందు స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ఫిన్లండ్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంటే లెనిన్‌ ఆమోదించాల్సి వచ్చింది. దీని మీద భిన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయి, తరువాత కూడా అలాంటి అవకాశం కల్పించినా మరొకటేదీ విడిపోలేదు. స్టాలిన్‌ కాలం నుంచి అనుసరించిన ఆధిపత్య విధానాలు 1991లో వేరుపడి పోవటానికి ఒక ముఖ్యకారణం అని రంగనాయకమ్మ చేసిన సూత్రీకరణకు స్టాలిన్‌ పట్ల గుడ్డి వ్యతిరేకత తప్ప తర్కబద్దత కనిపించదు. అమెరికా ఇతర శక్తుల కుట్రలను గుర్తించేందుకు నిరాకరించటమే. ఆమెతో సహా కొందరు చెప్పే స్టాలిన్‌ ఆధిపత్యానికి తలొగ్గి రిపబ్లిక్కులు విధిలేక కలసి ఉన్నాయనుకుందాం, స్టాలిన్‌ 1953లో మరణించిన తరువాత ఎక్కడి నుంచీ స్వయం నిర్ణయాధికార కాంక్ష లేదా డిమాండ్‌ ఎందుకు తలెత్తలేదు. రిపబ్లిక్కులకు అసమాన అధికారాలు ఉంటే మన దేశంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల సమస్య మాదిరి అక్కడ కూడా తలెత్తి ఉండేవి.లెనిన్‌ వ్యతిరేకించిన లేదా స్టాలిన్‌ అమలు పరచిన విధానాలు అనే పదప్రయోగాలు కూడా తప్పే. అవేవీ ఏకపక్షమైనవి కాదు, తప్పయినా ఒప్పయినా పార్టీ తీసుకున్న వైఖరిని అమలు చేశారు. తప్పనుకుంటే గుణపాఠాలు తీసుకోవచ్చు, అభిప్రాయాలు వెల్లడించవచ్చు. రంగనాయకమ్మకు ఆ స్వేచ్చ ఉంది. ఆమె ఆలోచనా బడిలొ చదువుకుంటున్నవారికి, అనుసరిస్తున్నవారికి అవే తిరుగులేనివిగా అనిపించవచ్చు, ఇతరులు విబేధించవచ్చు.


ఇక ” ఉక్రెయిన్‌ ముందుగా దాడి చేయనపుడు రష్యాకు ఆత్మరక్షణ ప్రశ్న ఏమిటి ” అని రంగనాయకమ్మ అడుగుతున్నారు. ఇది అమాయకత్వమో లేక కొందరి టీకా తాత్పర్యాల ప్రభావమో తెలియదు. అసలు రష్యా ఆ మాట ఎక్కడ చెప్పింది ? చెప్పలేదు, కనుక ఇతరులు చెప్పినదాన్ని ప్రమాణంగా తీసుకోవటం ఏమిటి ? ” ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తరువాత….అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీతో సంబంధాలు పెట్టుకుంది ” అన్నారు. ఇది వాస్తవ విరుద్దం. ఒక స్వతంత్ర దేశంగా ప్రతిదేశంతో దౌత్య సంబంధాలు పెట్టుకోవటం వేరు, ఒక దేశం లేదా కూటమికి వ్యతిరేకంగా మరో కూటమి వైపు మొగ్గి ఇతర సంబంధాలు పెట్టుకోవటం వేరు. 2013లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ ఎన్‌కోవిచ్‌ ఒక ప్రకటన చేశాడు. ఐరోపా యూనియన్‌తో ఆర్ధిక అనుసంధాన ఒప్పందానికి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాడు. తొలుత ఆర్ధికం పేరుతో సంబంధాలు, తరువాత నాటోలో చేర్చుకోవాలని తద్వారా రష్యా ముంగిటకు తమ సేనలను చేర్చాలన్నది అమెరికా పధకం. దానికి ఎదురుదెబ్బ తగలటంతో సిఐఏ రంగంలోకి దిగి ప్రతిపక్ష పార్టీలతో ప్రదర్శనలు చేయించి తిరుగుబాటును రెచ్చగొట్టింది. ఎనుకోవిచ్‌ రష్యాలో తలదాచుకున్నాడు. తరువాత ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. అసలు సమస్య ఇక్కడినుంచే ప్రారంభం కాగా స్వతంత్రదేశంగా ఏర్పడిన వెంటనే అమెరికా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకున్నదని రాయటం వక్రీకరణ కాదా ?


” రెండవ ప్రపంచ యుద్దం తరువాత నుంచీ ప్రపంచం మీద పెత్తనం చేసే విషయంలో అమెరికాకి రష్యా ప్రధాన పోటీదారు.అందుకే అమెరికా, రష్యాలను అగ్రరాజ్యాలు అంటారు ఇతర దేశాల వారు. అసలు అనవలసింది రెండూ పెద్ద బందిపోటు ముఠాలు అని….” ఇది రంగనాయకమ్మ వంటి సీనియర్‌ కలం నుంచి వెలువడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రాధమిక అంశాలను కూడా విస్మరిస్తే అమెకు ఉన్న పేరును బట్టి చదువరులు నిజమే అని భావించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకొనే అవకాశం ఉంది.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ ఉంది. దానిలో రష్యాతో సహా 15 రిపబ్లిక్కులున్నాయి.1991 వరకు అదే కొనసాగింది. సోవియట్‌ ప్రపంచ పెత్తనం కోసం చూసిందని అమెరికా కూటమి, దాన్ని అనుసరించే వారు చేసిన ప్రచారాన్ని రంగనాయకమ్మ కూడా వంటపట్టించుకున్నారా ? మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తరువాత అంతకు ముందు చేసిన తన రచనల్లో కొన్ని పదాలను సవరించారు. కానీ సోవియట్‌ గురించి పూర్వపు వైఖరితోనే ఉన్నట్లున్నారు. లేకపోతే అమెరికాతో అంటగట్టి రెండూ ఒకటే అనటం ఏమిటి ? అమెరికా పెత్తనానికి, దుర్మార్గాలకు బలైన కొరియా, వియత్నాం, ఇరాక్‌, లిబియా, సిరియా వంటి ఉదంతాలున్నాయి. వీటిలో ఏ ఒక్కదేశమైనా అమెరికాను ఆహ్వానించిందా, ఏకపక్ష దాడులకు గురయ్యాయా ?అటువంటి చరిత్ర సోవియట్‌ లేదా దాని తరువాత రష్యాకు గానీ ఉందా ? ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ ఎందుకు జోక్యం చేసుకుందో రంగనాయకమ్మకు తెలీదనుకోవాలా లేక అమెరికా దాడులకు దీనికి తేడా లేదని అనుకుంటున్నారా ? ఆఫ్ఘన్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా చేసిన కుట్రల్లో భాగంగా తాలిబాన్లను తయారు చేసి ఉసిగొల్పారు. వారి నుంచి రక్షణకు ఆ ప్రభుత్వం సోవియట్‌ సాయం కోరింది.


శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు యుద్దం పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి అని ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ చెప్పిన అంశాలు ఆ దృక్పధాన్ని ప్రతిబింబించలేదు. రష్యా పెట్టుబడిదారీ దేశమే, అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు. గత మూడు దశాబ్దాల్లో రష్యాకు అలాంటి చరిత్ర లేదు. అమెరికా కుట్రలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్లో ప్రత్యేక సైనిక చర్యకు పూనుకుంది. ప్రపంచాధిపత్యం కోసం పూనుకున్న అమెరికా కుట్రలను ఎదిరించేందుకు ఒక పెట్టుబడిదారీ దేశంగా రష్యా లేదా మరొకటి ముందుకు వస్తే శ్రామికవర్గ దృక్పధం కలిగిన వారు ఎదిరించిన వారిని బలపరచాలి. మొదటి ప్రపంచ యుద్దంలో జర్మనీతో లెనిన్‌ బ్రెస్ట్‌-లిటోవస్క్‌ సంధి కుదుర్చుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో స్టాలిన్‌ ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోంది. కనుక దాన్ని ఎదుర్కొనేవారిని బలపరచాలి. వర్తమాన ఉదంతంలో ఐరాసలో చైనా తటస్ధ వైఖరిని తీసుకుంది. అదే సమయంలో పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు, గోధుమల వంటి వాటిని దిగుమతి చేసుకుంటోంది. రంగనాయకమ్మగారు వర్ణించినట్లు ” ఒక బందిపోటు ”ను చైనా సమర్ధిస్తున్నట్లుగా అనుకోవాలా, అమెరికాతో పోరాడేశక్తికి తోడ్పాటు ఇస్తున్నట్లుగా భావించాలా ? ఆమె కళ్లతో చూస్తే అమెరికా బందిపోట్లతో 50 సంవత్సరాల క్రితం సోషలిస్టు చైనా ఒప్పందం చేసుకుంది.దానిలో భాగంగా పెట్టుబడులను ఆహ్వానించింది. దాని వలన చైనా శ్రామికులకు మేలు జరిగినట్లా కీడు జరిగిందా ? దీనికి ఏ భాష్యం చెబుతారు. అదే విధంగా రష్యాతోనూ ఒప్పందాలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. దీని అర్ధం రెండు పెద్ద బందిపోటు దేశాలతో చైనా చేతులు కలిపినట్లా ?


తన ప్రధాన పోటీదారైన అమెరికా అడుగుజాడల్లోనే నడుస్తోందనే కారణంతోనే ఉక్రెయిన్‌ మీద రష్యా దురాక్రమణకు పాల్పడిందని రంగనాయకమ్మ చెప్పారు. తన వర్గం ఏదో మరచిపోయి ఒక ఫ్యాక్టరీ కార్మికుడు, వ్యవసాయ కార్మికుడు తమ యజమానులవైపు కొమ్ముకాస్తే పర్యవసానాలను అనుభవించకతప్పదు. అదే ఇక్కడా వర్తిస్తుంది. ఐరోపాలో ఉక్రెయిను కంటే అనేక చిన్న దేశాలు అదే పని చేస్తున్నాయి, మరి వాటి మీద ఎందుకు దాడికి దిగలేదు ? యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల గురించి ప్రస్తావించారు, అవి జరిగే కారణాలు వేరు, అవన్నీ విముక్తి మార్గ బాటలో ఉన్నట్లు భావిస్తున్నారా ? గతంలో అమెరికా, అనేక ఐరోపా దేశాల్లో ఇంతకంటే పెద్ద ఎత్తున జరిగాయి. వాటికీ విముక్తికీ ముడిపెట్టటం ఏమిటి ?


ఇక శ్రామికవర్గ చైతన్యం గురించి, ఐరాస గురించి చెప్పిందానితో విబేధించాల్సిందేమీ లేదు.తాను శ్రామికవర్గ పక్షపాతినని ఆమె పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు. అందుకు అభినందించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. అయితే, పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు మార్క్సిజాన్ని ఔపోసన పట్టినట్లు కనిపించే రంగనాయకమ్మగారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమె రచనలను అనుసరించేవారు తర్కబద్దంగా ఆలోచించి సరైనవో కాదో నిర్ధారించుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యాపై నాటో కూటమి దేశాలు, ఇతరుల ఆర్ధిక దాడి !

01 Tuesday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Joe Biden, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


అమెరికా ఆధ్వర్యంలోని నాటో కూటమి కుట్రల కారణంగా ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య తలెత్తిన వివాదం విచారకరమైన యుద్ధానికి దారి తీసి బుధవారం నాటికి ఏడవ రోజులో ప్రవేశించింది. రష్యా సైనిక పాటవం ముందు ఉక్రెయిన్‌ నిలిచే అవకాశం లేదని, త్వరగానే పతనం అవుతుందన్న అంచనాలు తప్పాయి. ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తున్నారు. వస్తున్న వార్తలను బట్టి సామాన్య జన నష్టం జరగకుండా చూసేందుకు రష్యన్‌ దళాలు కేవలం నిర్దేశిత సైనిక కేంద్రాల మీదనే కేంద్రీకరించటం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నాటో అందచేసిన ఆధునిక ఆయుధాలు కూడా ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతిఘటన శక్తిని పెంచాయి. ఉక్రెయిన్‌ దళాల ప్రతిఘటన ఊహించలేదని పశ్చిమ దేశాల సంస్ధలు వార్తలు ఇచ్చాయి. బైలోరస్‌ మధ్యవర్తిత్వంలో జరిగిన బేషరతు చర్చలు ఎలాంటి ఫలితం తేలకుండానే సోమవారం ముగిశాయి.భద్రతా కారణాల రీత్యా ఈ చర్చలు సరిగ్గా ఎక్కడ జరిగాయన్నది అధికారికంగా ప్రకటించలేదు. బెలారస్‌-ఉక్రెయిన్‌ సరిహద్దులో ” మత్స్యకారుడి గుడిసె ”లో అని గుప్తనామం చెప్పారు. ఈ చర్చలు సరిహద్దులో తమవైపే జరపాలని పట్టుబడిన ఉక్రెయిన్‌ మెట్టుదిగి బెలారస్‌ వైపుకే తన ప్రతినిధులను పంపింది. రెండవ దఫా సంప్రదింపులు బెలోరస్‌- పోలాండ్‌ సరిహద్దులో జరపాలని నిర్ణయించారు. వీటి ఫలితం గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఈ రెండు దేశాల వివాదంతో ఇప్పటికే చమురు ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్ధలకు అంతరాయం, పరస్పర ఆంక్షల కారణంగా ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు, పర్యవసానాలను ప్రపంచం చవి చూస్తోంది. మంగళవారం నాడు జరిగిన దాడుల్లో ఉక్రెయిన్‌లో రెండవ పెద్ద పట్టణమైన ఖర్‌కివ్‌ నగరంలో కర్ణాటకకు చెందిన విద్యార్ధి నవీన్‌ శేఖరప్ప మరణించటం తీవ్ర విచారకరం.


శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇరు పక్షాలూ సంయమనం, కాల్పులకు విరామం పాటించటం సాధారణంగా జరుగుతుంది. ఇక్కడ అటువంటి అవకాశాలు కనిపించలేదు. చర్చలు చర్చలే, దాడులు దాడులే అని రష్యా చెప్పటం కొంత మందికి విపరీతంగా అనిపించవచ్చు. ఉక్రెయిన్ను రెచ్చగొట్టి ముందుకు తోసిన పశ్చిమ దేశాలు ప్య్రత్యక్షంగా దాడులకు దిగలేదు తప్ప రష్యాను దెబ్బతీసేందుకు భద్రతా మండలిని సాధనంగా చేసుకొని ప్రచారదాడి, ప్రతిరోజూ కొత్త ఆంక్షలు, చర్యలను ప్రకటిస్తూనే పరోక్షదాడులను పెంచుతున్నాయి. ఇదంతా ఉక్రెయినుకు మద్దతుగానే అన్నది తెలిసిందే. ఈ నేపధ్యంలోనే తన అణుదళాలను సిద్దంగా ఉండాలని పుతిన్‌ ఆదేశించాడు, చర్చల సమయంలో దాడులను ఆపేది లేదని కూడా ప్రకటించాడు. ఇవన్నీ వత్తిడిని పెంచే ఎత్తుగడలే.


రెండు దేశాల మధ్య చర్చలు ఎన్నిసార్లు జరిగినా కీలక సమస్యపై అంగీకారం కుదిరితేనే సంధి తప్ప మరొకమార్గం లేదు.ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి ఆ ముసుగులో రష్యా సరిహద్దుల్లో తిష్టవేయాలన్న అమెరికా ఎత్తుగడను పక్కన పెట్టేందుకు సిద్దం కావటం లేదు. అందువలన భౌతికంగా దాడి ఉక్రెయిన్‌ మీద జరుపుతున్నప్పటికీ అసలు లక్ష్యం నాటో కూటమి, దాని పెద్ద అమెరికా అన్నది స్పష్టం. నాటోలో చేరకుండా తటస్ధదేశంగా ఉంటామని ఉక్రెయిన్‌ హామీ ఇవ్వాలని రష్యా పట్టుపడుతోంది. ఒకవైపు తమను ముందుకు తోసి నట్టేట ముంచారని ఉక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీ చెబుతూనే ఇంకా దింపుడు కల్లం ఆశమాదిరి పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యాను దారికి తెస్తాయనే భ్రమలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయ మీరు మా వైపు ఉన్నారో లేదో రుజువు చేయాలంటూ ఐరోపాయునియన్ను మంగళవారం నాడు డిమాండ్‌ చేశాడు. రష్యాను ఖండిస్తూ భద్రతా మండలిలో పెట్టిన తీర్మానాలు వీగిపోతాయని తెలుసు. ఐనా ప్రచారదాడిలో భాగంగా ఆ తతంగం నడిపించిన తరువాత కొనసాగింపుగా ఇప్పుడు సోమవారం నుంచి ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు తెరతీశారు. దాని మీద ఓటింగ్‌ జరగనుంది. దాని ఫలితం ఏమైనప్పటికీ నిబంధనల ప్రకారం దాన్నెవరూ అమలు జరపాల్సిన అవసరం లేదు. గతంలో యుగోస్లావియాపై భద్రతా మండలి అనుమతి లేకుండానే నాటో దళాలు 78 రోజుల పాటు దాడులు చేశాయి. దాన్ని మూడు ముక్కలు చేసి బోస్నియా, హెర్జ్‌గోవినా, సెర్బియాగా విడతీసి ప్రత్యేక రాజ్యాలుగా గుర్తించాయి. అల్బేనియా నుంచి కొసావోను విడగొట్టి గుర్తింపునిచ్చాయి. ఇప్పుడు అవే నాటో దేశాలు ఉక్రెయిన్లో స్వాతంత్య్రం కోరుకుంటున్న డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లను రష్యాగుర్తిస్తే ఇంకేముంది చట్టబద్దతకు ముప్పు వాటిల్లిందంటూ గుండెలు బాదుకుంటున్నాయి. చైనా అంతర్భాగాలైన తైవాన్‌, హాంకాంగ్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలన్న కుట్రను బలపరుస్తున్నాయి.


ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదన్న ప్రధాన డిమాండ్‌తో పాటు రష్యా మరికొన్ని అంశాలను కూడా ముందుకు తెచ్చింది. 2015మిన్‌స్క్‌ ఒప్పందాన్ని అమలు జరపాలని అది డిమాండ్‌ చేస్తోంది. డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లను స్వయంపాలిత ప్రాంతాలుగా ఉక్రెయిన్‌ గుర్తించాలని, ఆ ప్రాంతాల నుంచి మిలిటరీ సామగ్రిని తొలగించాలన్న వాటితో పాటు పన్నెండు అంశాలున్నాయి. దాన్ని ఉక్రెయిన్‌ ఉల్లంఘించింది. ఆ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన నాటోలోని జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు కూడా పట్టించుకోకుండా చోద్యం చూశాయి. ఇప్పుడు ఆ రిపబ్లిక్‌లను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించటంతో అవి కూడా గగ్గోలు పెడుతున్నాయి. రష్యా ముందుకు తెచ్చిన అంశాలను అంగీకరించేందుకు ఉక్రెయిన్‌ సిద్దంగా ఉన్నప్పటికీ అమెరికా, నాటో కూటమి పడనిచ్చేట్లు కనిపించటం లేదు. అవి విధించిన ఆంక్షలు రష్యాకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తి జనంలో పుతిన్‌ మీద వ్యతిరేకతను రేకెత్తించాలన్న పధకం కూడా ఉందన్నది స్పష్టం. రష్యన్‌ ఆర్ధిక వ్యవస్ధను కుప్పకూల్చివేస్తామని ఫ్రాన్స్‌ ఆర్ధిక మంత్రి బ్రూనో లీ మారీ చెప్పాడు. రష్యామీద పూర్తి స్ధాయిలో ఆర్ధిక యుద్ధం చేయనున్నట్లు, ఆ మేరకు ఆర్ధిక రంగాన్ని దెబ్బతీస్తామని ఒక రేడియోలో మాట్లాడుతూ చెప్పాడు.ఈ అంశాలు పుతిన్‌కు తెలియనివేమీ కాదు కనుకనే ప్రతి ఆంక్షలు, తీవ్ర వత్తిడికి పూనుకున్నాడు. ఇప్పటికి ఐదు దఫాలుగా నాటోను విస్తరించి రష్యా ముంగిట తిష్టవేసేందుకు అమెరికా పూనుకుంది. ఈ వివాదానికి మూలం అదే అన్నది తెలిసిందే.రష్యా భద్రత అంశాన్ని విస్మరించి ఏకపక్షంగా ముందుకు సాగితే కుదరదని పుతిన్‌ పశ్చిమ దేశాలకు స్పష్టం చేశాడు. దానిలో భాగంగానే క్రిమియాను తమ అంతర్భాగంగా గుర్తించాలని, ఉక్రెయిన్లోని నయానాజీ మూకలను వదిలించుకోవాలని కూడా కోరుతున్నాడు.


పశ్చిమ దేశాల కవ్వింపు చర్యలు, సమీప దేశాల్లో ఆయుధమోహరింపును ఎదుర్కొనేందుకు రష్యాకూడా పావులు కదిపింది. దానిలో భాగంగానే బెలారస్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అవసరమైతే అణ్వాయుధాలు, క్షిపణులను మోహరించేందుకు, రష్యాదళాలను శాశ్వతంగా దేశంలో కొనసాగించేందుకు రాజ్యాంగబద్ద ఆమోదం పొందారు. రష్యా మీద ప్రకటించిన ఆంక్షలు అణుదాడి కంటే తక్కువేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే రూబుల్‌ విలువిలువ కుప్పకూలింది.ద్రవ్యోల్బణం పెరిగింది. జనం బాంకుల ముందు వరుసలు కట్టారు. ఇతర దేశాల నుంచి నగదు బదిలీకి వీల్లేకుండా కొన్ని రష్యన్‌ బాంకులను స్విఫ్ట్‌ నుంచి తొలగించారు.పుతిన్‌తో సహా అనేక మంది వ్యక్తిగత ఆస్తులపై ఆంక్షలు విధించారు. విదేశాల్లో ఉన్నవారి ఆస్తుల విలువ 800 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఆంక్షల నుంచి గాస్‌, చమురు, ఎరువులు, గోధుమల వంటి వాటి లావాదేవీలకు చెల్లింపులను మినహాయించారు. ఇరాన్‌, వెనెజులా మీద ఇలాంటి ఆంక్షలనే అమెరికా విధించింది. క్యూబామీద దశాబ్దాలుగా ఇంతకంటే తీవ్ర అష్టదిగ్బంధనం గావించినప్పటికీ అవి తట్టుకొని నిలిచాయి. అందువలన తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ రష్యాకు తట్టుకొనే శక్తి ఉంది. ఐరోపాలో అమెరికా అణ్వాయుధాల మోహరింపు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యన్‌ విదేశాంగ మంత్రి లావరోవ్‌ మంగళవారం నాడు చెప్పాడు. ప్రస్తుత పరిస్ధితిలో నూతన ఆయుధపోటీ తగదని, నిరోధించాలని అన్నాడు.ఐరోపాలో స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల మోహరింపుపై మారటోరియం ప్రకటించాలని ప్రతిపాదించాడు. అమెరికా అణ్వాయుధాలు కొన్ని దేశాల్లో ఉన్నాయని ఇది అణ్వస్త్రవ్యాప్తి నిరోధ ఒప్పందానికి విరుద్దమని జెనీవాలో జరుగుతున్న నిరాయుధ సభలో వీడియో ద్వారా మాట్లాడుతూ లావరోవ్‌ చెప్పాడు.


తమ గడ్డమీద అణ్వాయుధాలను ఉంచేందుకు బెలారస్‌ తీర్మానించటాన్ని బట్టి పశ్చిమ దేశాల నుంచి వచ్చే ముప్పు కనిపిస్తున్నది. బహుశా అందుకే రష్యా అణుదళాలు సన్నద్దంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు చెప్పవచ్చు. అణ్వాయుధాల గురించి ముందుగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఫిబ్రవరి 24న ప్రస్తావించాడు. అణుదాడి గురించి పుతిన్‌ బెదిరిస్తున్నాడని బైడెన్‌ విలేకర్లతో చెప్పాడు. అదేమిటో వివరిస్తారా అని అడిగితే అతనేమనుకుంటున్నాడో తనకు తెలియదని సమాధానాన్ని దాటవేశాడు. పశ్చిమ దేశాలన్నీ ఐక్యంగా ఉంటాయా లేదా అని పుతిన్‌ పరీక్షించాలనుకుంటున్నాడని కూడా అన్నాడు. అణుదళాల సన్నద గురించి పుతిన్‌ చెప్పటాన్ని అణుదాడికి దిగుతాడని భావించనవసరం లేదు.


ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడినపుడల్లా అణ్వాయుధ అగ్రదేశాలు హెచ్చరికలు, కొత్త పరీక్షలు, అణు సామర్ధ్య క్షిపణుల పరీక్షలు చేయటం సాధారణంగా జరుగుతోంది తప్ప రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఎవరూ ప్రయోగించలేదు. గతంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు జరిపినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హడావుడి, తరువాత మౌనంగా ఉండటం తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్‌ వ్యవహారంలో పుతిన్‌ కూడా అదే ఎత్తుడను అనుసరించాడు. దాడికి రెండునెలల ముందు నుంచి అనేక విధాలుగా తమ దేశ భద్రతకు హామీ గురించి ఐరాసకు, నాటో దేశాలకు మొరపెట్టుకున్నా పట్టించుకున్నవారు లేకపోగా మరింతగా రెచ్చగొట్టిన అంశం తెలిసిందే.ఉక్రెయిన్‌ అణుశక్తి దేశం కాదు. కేవలం బెదిరింపు, వత్తిడికి మాత్రమే పరిమితం అని విశ్లేషకులు చెఋన్నారు. ఐతే ప్రస్తుతం జరుగుతున్న ప్రచార యుద్దంలో ఏ దేశం ఎటువంటి వైఖరి తీసుకుంటుందో ఎలాంటి తెగింపులకు పాల్పడుతుందో చెప్పలేము. ఉక్రెయిన్‌కు నాటో తీర్ధం ఇవ్వనంత మాత్రాన గత మూడు దశాబ్దాలుగా ఆదేశానికి వచ్చిన ముప్పేమీ లేదు. అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఎప్పుడైతే తన అనుకూల శక్తులను గద్దెనెక్కించి రష్యాను కవ్విస్తోందో అప్పటి నుంచే అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు పశ్చిమ దేశాలు అనుసరించే వైఖరిపైనే అనేక అంశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రతిదేశం తన రక్షణను తాను చూసుకోవాల్సిన పరిస్ధితిని అమెరికా, నాటో కూటమి కల్పించింది. అందువలన ఇప్పుడు ఎక్కడా మనకు శాంతిదూతలు కనపడరు.పశ్చిమదేశాల తీరు తెన్నులను చూస్తుంటే మరోసారి ఐరోపా ఆయుధ మోహరింపు కేంద్రంగా మారే అవకాశాలు లేకపోలేదు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒక వైపు రష్యా మరోవైపు ఉంటాయి. తగులుతున్న ఎదురుదెబ్బలు, దెబ్బకుదెబ్బ తీస్తామని చేస్తామని హెచ్చరికల కారణంగానే అమెరికా అదుపులో ఉంటోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏ క్షణమైనా ఉక్రెయిన్‌ పతనం ! విశ్వగురువుగా మోడీ పాత్ర ఏమిటి ?

25 Friday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Narendra Modi Failures, NATO, Ukraine crisis, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


రష్యన్‌ దళాలు రెండవ రోజు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంవైపు కదులుతున్నాయి. రష్యా పోరుకు తాము దళాలను పంపేది లేదని అమెరికా, నాటో ప్రకటించాయి. అందువలన ఏ క్షణంలోనైనా అది పతనం కావచ్చు. తరువాత ఉక్రెయిన్‌ పాలకులను అదుపులోకి తీసుకుంటారా, మిలిటరీ లొంగిపోతుందా ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. కీవ్‌ తరువాత తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెస్కీ ప్రకటించాడు. తమను ముందుకు నెట్టి ఈ దేశాలు దూరం నుంచి చూస్తున్నాయని జెలెనెస్కీ అన్నాడు. ఇప్పుడు రష్యా వ్యతిరేక యుద్ద కూటమిని ఏర్పాటు చేయాలని కూడా అన్నాడు. ప్రపంచంలో శక్తివంతమైన దేశం దూరం నుంచి చూస్తోంది అని అమెరికానుద్దేశించి వాపోయాడు. పరస్పరం ఆంక్షల ఆంక్షల పర్వం కొనసాగుతోంది. మూడు వైపుల నుంచి రష్యా ముట్టడి, గగనతలంపై అదుపు సాధించిన కారణంగా అమెరికా, ఇతర నాటో దేశాల నుంచి గానీ ఉక్రెయిన్‌కు కొత్తగా ఆయుధాలు అందే అవకాశం లేదని, అందువలన అక్కడి మిలిటరీ పోరాడటమో లొంగిపోవటమో జరుగుతుందని సిఐఏ మాజీనేత పెట్రాస్‌ చెప్పాడు. పోలాండ్‌ వైపు నుంచి రోడ్డుద్వారా అందే అవకాశాలున్నా ఇప్పుడు పంపేదెవరు ?


ఉక్రెయిన్‌ అస్త్ర సన్యాసం చేస్తేనే చర్చలు జరుపుతామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ చెప్పాడు. తాము ఉక్రెయిన్‌ ఆక్రమణకు పాల్పడేందుకు నయా నాజీలం కాదని, అక్కడ ఎవరిని పాలకులుగా ఎన్నుకుంటారన్నది ఆ దేశ ప్రజల ఇష్టమని అన్నాడు. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా ఆక్రమణకు పాల్పడుతుందని, తనలో విలీనం చేసుకుంటుందని ప్రచారం మొదలెట్టాయి. ఉక్రెయిన్‌లో పోరాడేందుకు అమెరికా దళాలు వెళ్లటం లేదు, వెళ్లాలనుకోవటం లేదు, కానీ అమెరికా నాటో మిత్రదేశాలను రక్షించుకుంటామని మరోసారి హామీ ఇస్తున్నట్లు జోబైడెన్‌ స్పష్టంగా చెప్పాడు. ఆంక్షల విధింపు ఆత్మరక్షణ చర్యలేతప్ప తమకు రష్యాతో పోరుసల్పాలని లేదన్నాడు. ఒకరిపై ఒకరు కాల్చుకొనే ప్రపంచ యుద్దం ఉండదన్నాడు.నాటో కూటమి కూడా అదే చెప్పింది. అమెరికాలోని 52శాతం మంది ఉక్రెయిన్‌ వివాదంలో అమెరికా స్వల్ప పాత్ర పోషించాలని చెబితే, 20శాతం మంది అది కూడా వద్దని చెప్పినట్లు ఎపి-ఎన్‌ఓఆర్‌సి సర్వే వెల్లడించింది.ఇరవైఆరుశాతం మంది మాత్రం చురుకైనా పాత్రపోషించాలని చెప్పారు. బహుశా ఈ కారణంగానే జో బైడెన్‌ జోరు తగ్గించినట్లు చెప్పవచ్చు.ఆంక్షల ప్రకటనతో గురువారం నాడు పీపా ముడిచమురు ధర 106డాలర్లకు పెరిగింది. తరువాత ఇంధనాన్ని మినహాయించినట్లు ప్రకటించటంతో 99కి పడిపోయింది.శుక్రవారం నాడు తిరిగి 102 డాలర్ల వరకు పెరిగినా తిరిగి 98.74కు తగ్గింది.


మనది 138 కోట్ల జనాభాగల దేశం. దానికి నరేంద్రమోడీ ప్రధాని.ప్రపంచ నేతగా, విశ్వగురువుగా ఇంటా బయటా పొగడ్తలు అందుకుంటున్న స్ధితి.మన దేశం ప్రపంచ రాజకీయాల్లో పాత్ర వహించాలని అధికారానికి వచ్చిన రోజు నుంచీ నరేంద్రమోడీ చెబుతున్నారు, తహతహలాడుతున్నారు. తప్పులేదు, మన దేశానికి గౌరవాన్ని పెంచినా, మన ప్రయోజనాలను కాపాడినా సంతోషమే. ఎవరి చాణక్యమైనా, నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చేది కీలక పరిణామాలు జరిగినప్పుడే కదా ! ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన రష్యా-ఉక్రెయిన్‌ పరిణామాల్లో నరేంద్రమోడీ నాయకత్వం అలాంటి వాటిని ప్రదర్శించిందా ? అనేక దేశాల నేతల మాదిరి నరేంద్రమోడీ ఒక్క ప్రకటన కూడా బహిరంగంగా ఎందుకు చేయలేకపోయారు.


సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో మన ప్రతినిధి దేశ వైఖరిని వెల్లడించారు. ” అన్ని పక్షాలు ” ” పరిస్ధితి దిగజారకుండా” ” దౌత్యం ద్వారా ” పరిష్కరించుకోవాలనే ధ్వని, పరిధిలోనే మాట్లాడారు. ఇలా తటస్ధంగా ఉన్నందుకు రష్యా స్వాగతం పలికింది. జో బైడెను యంత్రాంగం గుర్రుగా ఉంది.ఉక్రెయిన్‌ తీవ్ర అసంతృప్తి వెల్లడించింది. అమెరికా మన సహజ భాగస్వామి అని పదే పదే చెప్పారు. ఏమోయి మోడీ అంటే ఏంటోయి బైడెన్‌ అంటూ భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడే బంధం ఉంది.( డోనాల్డ్‌ట్రంప్‌తో కౌగిలింతల గురించి చెప్పనవసరం లేదు.) అలాంటి వారు ఐరోపాలో ఇంత జరుగుతుంటే ముందుగానీ, పోరు ప్రారంభమైన తరువాత గానీ (ఇదిరాసిన సమయానికి) వారిరువురూ ఎందుకు సంప్రదింపులు జరపలేదు, అభిప్రాయ మార్పిడిగానీ ఎందుకు చేసుకోలేదన్నది పెద్ద ప్రశ్న. పోరు మొదలైన తరువాత పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడి దాడులను నివారించాలని కోరారు. ఇదే సమయంలో మరింతగా ఆజ్యం పోయవద్దు అని జో బైడెనుకు ఒక్క ముక్క చెప్పి ఫోన్‌పెట్టేసి ఉంటే మోడీ సర్కార్‌ నిజంగానే తటస్ధంగా ఉంది అనేది మరింతగా వెల్లడై ఉండేది. కానీ అది జరగలేదు, అన్నింటా మనకు మద్దతుగా ఉన్న నరేంద్రమోడీ ఈ అంశంలో మనతో మాట్లాడలేదు, ఏమైందో ఏమో పోనీ మనమే ఫోన్‌ చేద్దామని జో బైడెన్‌ కూడా అనుకోలేదు.


తీరా దాడులు మొదలైన తరువాత భారత్‌తో సంప్రదింపులు జరుపుతామని జో బైడెన్‌ గురువారం నాడు ప్రకటించారు. ఈ వివాదంలో మీ రక్షణ భాగస్వామి భారత్‌ పూర్తిగా మీ బృంద సభ్యురాలిగా ఉందా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భారత్‌తో సంప్రదింపులు జరపనున్నాం,ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మేము పూర్తిగా పరిష్కరించలేదు అని బైడెన్‌ చెప్పాడు.అందువలన నరేంద్రమోడీ నోరు విప్పి తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది. అంతకంటే ముందు భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి డాక్టర్‌ ఇగోర్‌ పోలిఖా విలేకర్లతో మాట్లాడుతూ ” ప్రస్తుతం మేము భారత్‌ నుంచి అన్ని రకాల రాజకీయ సాయం అందించాలని కోరుకుంటున్నాము.ప్రపంచంలోని శక్తివంతులైన నేతలలో ఒకరైన మోడీ గారికి రష్యాతో ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. కౌటిల్యుడు, చాణక్యుడి వంటివారితో దౌత్యంలో భారత్‌ ఎప్పుడో అర్హత సాధించింది. ఐరోపాలో నాగరికత లేని కొన్నివేల సంవత్సరాలనాడే భారత్‌లో ఈ స్ధితి ఉంది. అనేక సంవత్సరాలుగా ఇటీవల భారత్‌ ప్రభావం చూపే ప్రపంచ పాత్రధారిగా ఉంది. మహాభారతంలో మాదిరి మోడీ దౌత్యాన్ని ప్రదర్శించాలి ” అని కూడా చెప్పారు. అదే రాయబారి భారత వైఖరితో తాము తీవ్ర అసంతృప్తి చెందామని కూడా చెప్పాడు. ఇప్పుడు రష్యాదాడుల్లో 50 మంది మరణించినట్లు తెలిసింది, అదే వందలు, వేల మంది మరణించి ఉంటే ఏమై ఉండేది అంటూ భారత్‌ జోక్యం చేసుకోవాలని అన్నాడు. ఇదేదో కేవలం మా రక్షణ కోసమే కాదు, మీ దేశానికి చెందిన పదిహేనువేలమందికి పైగా ఉన్న విద్యార్దుల రక్షణ కూడా ఇమిడి ఉంది అని కూడా అన్నాడు. దీన్ని మొత్తంగా చూస్తే వారి అసంతృప్తి, అమెరికా అంతరంగాన్ని వెల్లడించటమే.భద్రతా మండలిలో భారత వైఖరిని ఎలా చూస్తున్నారన్న ప్రశ్నకు అమెరికన్‌ అధికారి సమాధానం చెప్పకుండా తప్పించుకోవటం కూడా దీన్ని నిర్దారించింది. తెరవెనుక అమెరికా మన వైఖరి మీద అసంతృప్తి ప్రకటించుతున్నట్లు వార్తలు వచ్చాయి.


నరేంద్రమోడీ చెప్పినట్లుగా జోబైడెన్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ వింటే సమస్య పరిష్కారం అవుతుందంటూ జాతీయ మీడియాలో కొంత మంది మోడీ గొప్పతనాన్ని చాటేందుకు ప్రయత్నించారు. అనేక హిందీ, ఆంగ్ల ఛానళ్లు కూడా అమెరికా మీడియా, లీకువార్తలను నిజమే అని నమ్మి ఇంకే ముంది ప్రపంచయుద్దం వచ్చేస్తోంది అన్నట్లు వార్తలను ప్రసారం చేశాయి, కానీ మోడీ వైపు నుంచి పోరు ప్రారంభానికి ముందు అలాంటి నివారణ చొరవ మనకు కనిపించదు.ఎక్కడా మన ప్రమేయం, పలుకుబడి కనిపించలేదు.తటస్ధం అంటే తప్పును తప్పని కూడా చెప్పకపోవటమా ?


ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో మన దేశం తటస్ధ వైఖరిని వెల్లడించింది. కానీ అంతర్జాతీయ విషయాల్లో అమెరికాకు లొంగిపోయిన అపఖ్యాతిని మోడీ సర్కార్‌ మన దేశానికి కలిగించింది. అణుపరీక్షల అంశంలో ఇరాన్‌ – అమెరికాకు, వామపక్ష వ్యతిరేకత కారణంగా లాటిన్‌ అమెరికాలో వెనెజులాతో అమెరికాకు పంచాయితీ తలెత్తింది. ఆ రెండు దేశాలూ మనకు మిత్రులే, రెండు చోట్ల నుంచీ మనం చమురు కొనుగోలు చేస్తున్నాము. కానీ వాటి మీద ఆంక్షలు విధిస్తూ ఎవరైనా వాటితో లావాదేవీలు జరిపితే ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. మన నరేంద్రమోడీ సర్కార్‌ వాటికి భయపడి చమురు కొనుగోలు నిలిపివేసింది. అమెరికాకు లొంగుబాటు తప్ప ఈ అంశాల్లో తటస్ధత ఎక్కడుంది. హాంకాంగ్‌ చైనాలో అంతర్భాగం, అక్కడ ఆందోళనలు దాని అంతర్గత అంశం. పశ్చిమదేశాలు దాన్ని రాజకీయం చేశాయి. వాటితో మనం గొంతు కలపకపోయినా అది వారి అంతర్గత వ్యవహారం అని మన దేశం చెప్పకపోగా ఐరాస మానవహక్కుల సంస్ధలో పశ్చిమ దేశాలకు సంతోషం కలిగే విధంగా ఆందోళన వెలిబుచ్చింది. ఇప్పుడు అమెరికా-ఇరాన్‌ అణు అంశంలో రాజీకుదుర్చుకోనున్నాయి, మన దేశం ఏముఖం పెట్టుకొని గతంలో ఇరాన్‌ ఇచ్చిన రాయితీధరలకు తిరిగి చమురు సరఫరా గురించి అడుగుతుంది ? ప్రపంచంలో మనం పలుచనకావటం లేదా ?


ఉక్రెయిన్‌ – రష్యా వివాదం గత కొద్ది నెలలుగా ముదురుతోంది. ఫిబ్రవరి 16న రష్యాదాడికి దిగనుందని అమెరికా ముందుగానే గడువు ప్రకటించింది.ఉక్రెయిన్లో దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్దులున్నారు. వారి సంక్షేమం, అవసరమైతే స్వదేశానికి రప్పించటం, దానిలో ఇమిడి ఉన్న సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం తగినంత ముందుగా పట్టించుకోని కారణంగా వారితో పాటు వారి కుటుంబాలు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన, అనిశ్చితికి గురవుతున్నారు. ఎందుకీ వైఫల్యం అంటే సమాధానం చెప్పేవారు లేరు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనాగ్రామాలు నిర్మించింది, లడక్‌లో మరొకటి చేసిందంటూ సమాచారం ఇచ్చిన అమెరికా ఎందుకు ఉక్రెయిన్లో పరిస్ధితి, పర్యవసానాల గురించి మనకు సమాచారం ఇవ్వలేదు ? మన కేంద్ర భద్రతా అధిపతి అజిత్‌దోవల్‌ను జేమ్స్‌బాండ్‌గా వర్ణిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లకు సలాం చేసి అమెరికా పారిపోవటాన్ని దోవల్‌ పసిగట్టలేదు. ఇప్పుడు వివిధ దేశాల నుంచి ఈ సంక్షోభం గురించిన సమాచారం సేకరించలేదా, అసలు పట్టించుకోలేదా ? పట్టించుకుంటే ఇప్పుడు విద్యార్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది కాదు కదా ? వారి తరలింపు గురించి తగినంత ముందుగానే ఏర్పాట్లు చేసి ఉంటే వారంతా తిరిగి వచ్చి ఉండేవారు, పరిస్ధితి చక్కబడిన తరువాత తిరిగి వెళ్లి ఉండేవారు.అలా జరగకపోవటానికి బాధ్యులెవరు ? ఉక్రెయిన్‌ ఉదంతం ప్రపంచదేశాలకు ఒక పాఠం నేర్పింది. అదేమంటే దాన్ని నమ్ముకొని మరొక దేశంతో తగాదా పెట్టుకోకూడదు, నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుంది. దీన్ని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటామా ? అమెరికా తోకపట్టుకు పోతామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా చెలగాటం భారత్‌కు ప్రాణ సంకటం : రూపాయి పతనం, చమురు, గాస్‌ ధరల పెరుగుదల !

23 Wednesday Feb 2022

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, Fuel Price in India, India economy, Narendra Modi, RUSSIA, Russia-Ukraine tensions Impact on India, Ukraine war


ఎం కోటేశ్వరరావు


నాటో కూటమిలోని యుద్దోన్మాద దేశాలు ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌ సృష్టించిన ఉక్రెయిన్‌-రష్యా వివాద ప్రతికూల పర్యవసానాలు అనేక దేశాలను కలవరపెడుతున్నాయి.వాటిలో మన దేశం ఒకటి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే ఈ వివాదం తలెత్తింది. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో మన దేశం సరైన వైఖరినే వెల్లడించింది. ఈ వివాదం వలన తలెత్తే ఆర్ధిక ఇబ్బందుల గురించి మంత్రులు లేదా పాలకపార్టీల నేతలెవరూ నోరు విప్పటం లేదు. కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద ప్రభావం పడకూడదనే. ఎంతకాలం మౌనవ్రతం పాటిస్తారు.మార్చి ఏడవతేదీతో ఆఖరు దశ పోలింగ్‌ ముగుస్తుంది, పదవ తేదీన ఫలితాలు వెలువడతాయి. వాటితో నిమిత్తం లేకుండానే గత నవంబరు నాలుగు నుంచి ఉన్న చమురు ధరల స్ధంభన ఎత్తివేసి సుప్రభాత చమురు ధరల పెరపుదలకు తిరిగి శ్రీకారం చుడతారు. ఇతర పర్యవసానాలు దాని వెంటే ఉంటాయి.


అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 99.5 డాలర్లు దాటి 2014 తరువాత కొత్త రికార్డు స్దాపించింది. ఆర్ధిక విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు, రూపాయి విలువ పతనానికి దారితీస్తుంది. ప్రస్తుతం ఒక డాలరుకు 75కు అటూ ఇటూగా ఉన్న విలువ రు.80కి పడిపోవచ్చని చెబుతున్నారు.రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటే సహజవాయు, నిత్యావసర వస్తువులు, లోహాలు, ఇతర వస్తువుల ధరలు మన దేశంలో కూడా పెరుగుతాయని చెబుతున్నారు. జెపి మోర్గాన్‌ చెబుతున్నదాని ప్రకారం 150 డాలర్ల వరకు ముడిచమురు ధర పెరగవచ్చు. అదే జరిగితే ప్రపంచ జిడిపి వృద్ది రేటు కేవలం 0.9శాతానికి పడిపోతుంది. మన దేశ టోకు ధరల సూచికలో చమురు సంబంధిత ఉత్పత్తులు తొమ్మిదిశాతం ఉంటాయి. చమురుధరలు పెరిగితే ద్రవ్యోల్బణం 0.9శాతం పెరుగుతుందని అంచనా. మరోవైపున కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీ మరింత పెరుగుతుంది. ఎరువులు, వంటగాస్‌ ధరలను పెంచనట్లైతే ఆ మేరకు అదనంగా సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కేంద్రం భరిస్తుందా జనం మీదే మోపుతుందా అన్నది చూడాల్సి ఉంది. మన దిగుమతుల్లో ఒక్క చమురే నాలుగోవంతు ఉన్నందున దాని ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మోటారు వాహనాలు, మొబైల్‌ ఫోన్లకు అవసరమైన పల్లాడియం అనే లోహపు ధర ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది, ఇప్పుడు మరింతగా పెరగటం, లభ్యత సమస్యలు కూడా తలెత్తవచ్చు.
ఈ ఏడాది ఆగస్టు-డిసెంబరు నాటికి రెండు సార్లు వడ్డీ రేట్లు పెరగవచ్చని భావిస్తున్నారు. గతేడాది ధరల పెరుగుదలను అదుపులో ఉంచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఐదు, పది వంతున సెస్‌లను తగ్గించగా కొన్ని రాష్ట్రాల్లో వాట్‌ను తగ్గించారు. అప్పటికీ ఇప్పటికీ చమురు ధరల పెరుగుదల తేడా చాలా ఉంది. సెస్‌లను మరింతగా తగ్గించకపోతే ధరల పెరుగుదలను అరికట్టలేరు.


మన దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాల్లో ఎక్కువ భాగం తేలిక రకం ముడిచమురును మాత్రమే శుద్ది చేస్తాయి. రష్యా చమురు సాంద్రత ఎక్కువ కనుక మనం పరిమితంగా దిగుమతి చేసుకుంటున్నాము. ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయినా మన దిగుమతుల్లో ఒకశాతమే కనుక ఇబ్బంది లేదు. మన అవసరాల్లో 63.4శాతం పశ్చిమాసియా నుంచి తెచ్చుకుంటున్నాము. చమురు ధరల పెరుగుదలే అసలు సమస్య.బుధవారం నాడు ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం 97.19 డాలర్లు ఉంది. ప్రపంచ ఎగుమతుల్లో రష్యా వాటా 11-12శాతాలుగా ఉంది. దీనిలో 60శాతం చమురును ఆంక్షలను ఖాతరు చేయని చైనా, బెలారస్‌, మరికొన్ని దేశాలు కొనుగోలు చేస్తున్నాయి.రోజుకు మూడు మిలియన్‌ పీపాల మేరకు ఆంక్షల కారణంగా సరఫరా ఉండదు. దీని వలన చమురు ధర 110 డాలర్లకు పెరుగుతుందని జోశ్యం చెబుతున్నారు.ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకోనుందన్న వార్తలు వాస్తవరూపం దాల్చితే ఒకటిన్నర మిలియన్‌ పీపాల చమురు అందుబాటులోకి వస్తుంది. ఐనప్పటికీ ఈ ఏడాదిలో ఎక్కువ భాగం వంద డాలర్లకంటే తగ్గదని అంటున్నారు. ఉక్రెయిన్‌లో పరిస్ధితి విషమిస్తే 120 డాలర్లు కావచ్చు. ఏడాదికి ప్రస్తుతం 25లక్షల టన్నుల ఎల్‌ఎన్‌జిని రష్యా నుంచి మన గెయిల్‌ దిగుమతి చేసుకుంటున్నది. ప్రస్తుతం రష్యా చమురు కంపెనీల్లో మన దేశం నుంచి 13.63 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. అమెరికా, ఐరోపా ఆంక్షలు మనకూ వర్తింప చేస్తే మన సర్కార్‌ వాటికి లొంగిపోతే వాటి పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్న. గతంలో క్షిపణి వ్యవస్దలను కొనుగోలు చేయరాదన్న అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా కొనుగోలు చేశాము. ఇదే ఇరాన్‌ చమురు అంశంలో మోడీ సర్కార్‌ లొంగిపోయి కొనుగోలు నిలిపివేసింది.


ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరంలో మన చమురు డిమాండ్‌ 214.5 మిలియన్‌ టన్నులని అంచనా. ఇది గతేడాది కంటే 5.5శాతం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం పంచదార, ఆహారధాన్యాలు, ఇతరంగా బయో ఇంధనాన్ని భారీగా తయారు చేసి దిగుమతుల భారాన్ని తగ్గించాలని చూస్తున్నది. ధరలు పెరిగితే దాని వలన కలిగే ఆదా కూడా హరించుకుపోతుంది.2022-23లో మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర 70-75 డాలర్ల మధ్య ఉండవచ్చని ఆర్ధిక సర్వే అంచనా వేసింది. జోశ్యాలు చెబుతున్నట్లు వంద లేదా 90 డాలర్లు ఉన్నా మన బడ్జెట్‌ అంకెలన్నీ మారిపోతాయి, లేదా జనం మీద భారాలు పెరుగుతాయి. మన దేశం నుంచి ఐరోపాకు ఎగుమతులు చేసే కంపెనీల వాటాల ధరలు స్వల్పంగా తగ్గటాన్ని బట్టి ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మన టీ ఎగుమతుల్లో 18శాతం రష్యాకే జరుగుతున్నాయి.


ప్రస్తుతం రష్యా సోషలిస్టు దేశం కాదు, పెట్టుబడిదారీ విధానానికి మారింది. ఇటీవలి కాలంలో రాజకీయంగా మనం అమెరికాకు దగ్గర లేదా జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు చూపుతున్న తహ తహ గతంలో ఎన్నడూ లేదు. ముందే చెప్పుకున్నట్లు ఇరాన్‌, వెనెజులా చమురు కొనుగోలు అంశంలో అమెరికా వత్తిడికి లొంగిన మోడీ సర్కార్‌ ఎస్‌-400 క్షిపణి వ్యవస్దలపై ఆంక్షలను ఖాతరు చేయలేదు. గతంలో సోవియట్‌ కాలంలో, తరువాత రష్యా ఆయుధాలే మనకు ఆలంబన. ఇప్పుడు వాటిని పూర్తిగా మాని అమెరికా నుంచి కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నప్పటికీ ఆచరణాత్మక సమస్యలు అడ్డుపడుతున్నాయి. అమెరికా తనకు పనికిరాని, ఇతర దేశాలకూ అమ్మే వాటినే మనకూ విక్రయిస్తోంది. ఎస్‌-400 వంటి క్షిపణి వ్యవస్దలు అమెరికా దగ్గర లేక కాదు, ఇవ్వటం ఇష్టం లేకనే. రష్యన్‌ ఆయుధ ఎగుమతుల్లో మనం 23శాతం దిగుమతి చేసుకుంటున్నాం. వాటిలో కొత్తవాటితో పాటు పాతవాటికి విడిభాగాలూ ఉన్నాయి. రెండు దేశాల సంబంధాలు కేవలం అమ్మకందారు-కొనుగోలు దారు మాదిరిగాక బ్రహ్మౌస్‌ వంటి ఖండాంతర క్షిపణులను రెండు దేశాలూ కలసి తయారు చేస్తున్నాయి. గతంలో మన ఇస్రోకు క్రయోజెనిక్‌ ఇంజన్ల సాంకేతిక పరిజ్ఞానం అందచేసినట్లుగానే ఇప్పుడు ఐదవ తరం ఫైటర్‌ విమానాల రూపకల్పన, వృద్ది, బహుముఖ కార్యకలాపాలకు పనికి వచ్చే విమానాల మీద కూడా రెండు దేశాలూ పని చేస్తున్నాయి. ఇటువంటి ప్రాజెక్టులు అమెరికాతో లేవు. ఐనా దేశభక్తులం అని నామాలు పెట్టుకున్న కొందరు అమెరికాతో అంటకాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే అమెరికా వైపు మనసు లాగుతున్నా రష్యా వైపు మాట్లాడకపోయినా తటస్ధత పాటిస్తున్నది మన దేశం. ఈ వైఖరిని వచ్చే రోజుల్లో అమెరికా తప్పు పట్టినా ఆశ్చర్యం లేదు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలపాలన్న ఎత్తుగడ కారణంగానే అమెరికా కాస్త తగ్గి వ్యవహరిస్తున్నది.


ప్రపంచీకరణతో ప్రపంచం ఒక గ్రామంగా మారిందని చెప్పుకుంటున్నాము. ఒక ప్రాంతంలో తలెత్తే తీవ్ర సమస్యలు మొత్తం గ్రామాన్ని ఏదో విధంగా ప్రభావితం చేయకుండా ఎలా ఉంటాయి. వసుధైక కుటుంబం అని అందరూ చెబుతున్నా ఎవరి రాజకీయాలు వారు చేయటం, స్వప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్న రోజులివి. ఐరోపాలో తలెత్తిన ఉద్రిక్తతలు ప్రతిదేశాన్ని ఉలిక్కిపడేట్లు చేశాయి. వీటి ప్రభావాలు చమురు ధర వంటి తక్షణ పర్యవసానాలకు దారితీస్తే పరోక్షంగా ఏ రంగం మీద ఎంత ప్రభావం పడేది పరిస్ధితిని బట్టి మారుతుంది. వాటి తీవ్రతను వెంటనే బేరీజు వేయటం కష్టం. ఉక్రెయిన్‌ – రష్యా ఉద్రిక్తతలు ఎలా పరిష్కారమైనప్పటికీ చమురు ధరలు మన సామాన్యజనాల నడ్డి విరవటం ఖాయం. ఆర్‌టిసి, రైల్వే వంటి ప్రజారవాణా వ్యవస్దలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే డీజిలు ధరలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆ మేరకు భారం ప్రయాణీకుల మీద మోపటం ఖాయం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : అమెరికా, రష్యా ఎత్తులకు పైఎత్తులు !

22 Tuesday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Joe Biden, NATO allies, RUSSIA, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ – రష్యా వివాదం కొత్త మలుపు తిరిగింది.ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులను గుర్తిస్తున్నట్లు సోమవారం నాడు రష్యా ప్రకటించింది. వెంటనే ఆ రిపబ్లిక్కులతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దంటూ ఆర్ధిక ఆంక్షలను అమెరికా అధినేత జోబైడెన్‌ ప్రకటించటంతో మరో రూపంలో వాటిని గుర్తించినట్లయింది. అంతకు ముందు వివాదం గురించి చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, రష్యా అధినేత పుతిన్‌ అంగీకరించారని, ఫిబ్రవరి 24న సమావేశం జరగవచ్చని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఈ లోగా రష్యా దాడి జరపకపోతేనే తాను హాజరవుతానని బైడెన్‌ షరతు పెట్టారు.బైడెన్ను ఒప్పించటానికి పదిహేను నిమిషాలు పడితే పుతిన్‌తో మూడు గంటలు మాట్లాడాల్సి వచ్చిందని మక్రాన్‌ కార్యాలయం వెల్లడించింది. ఆ ప్రకటన ఇంకా చెవుల్లో గింగురు మంటుండగానే కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశం జరిగేదీ లేనిదీ చెప్పలేము. తాజా పరిణామాల గురించి చర్చించాలని భద్రతా మండలి సభ్యురాలు మెక్సికో, అమెరికా, ఉక్రెయిన్‌, ఐదు ఐరోపా దేశాలు భద్రతామండలిని కోరగా సోమవారం రాత్రి అత్యవసర భేటీ జరిగింది. పశ్చిమదేశాలన్నీ రష్యా చర్యను ఖండించగా మన దేశం తటస్ధ వైఖరి తీసుకొని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. తాజా పరిణామాలపై భద్రతా మండలి ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, తీసుకుంటే దాన్ని రష్యా వీటో చేస్తే జరిగేదేమిటి ? తాను గుర్తించిన రిపబ్లిక్కులతో స్నేహ ఒప్పందాలు చేసుకున్న రష్యా ఆ ప్రాంతాలకు శాంతి పరిరక్షక దళాలను పంపనున్నట్లు వార్తలు. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతానికి దళాలను పంపాలన్న పధకం ప్రస్తుతానికి లేదని ముప్పు తలెత్తితే ఆ పని చేస్తామని రష్యా ప్రకటించింది.


ఉక్రెయిన్‌పై దాడికి రష్యా పూనుకుందని నిర్ధారణగా తాము చెబుతున్నామని కొద్ది వారాలుగా మాట్లాడిన అమెరికా ఇప్పుడు భద్రతామండలి ద్వారా సరికొత్త పల్లవి అందుకుంది. డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులను గుర్తించటం ద్వారా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లయిందని,ఇది దాడేనని అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు గుండెలుబాదుకుంటున్నాయి. ఈ రెండు ప్రాంతాలూ 2014లోనే ఉక్రెయిన్‌ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకోసం అక్కడి జనం ఆయుధాలు పట్టారు. వారిని అణచివేసేందుకు ఉక్రెయిన్‌ పంపిన భద్రతా దళాలను తిప్పికొట్టి రిపబ్లికులుగా ప్రకటించుకున్నారు. ఇప్పటి వరకు అదే స్ధితి కొనసాగుతోంది.2014 బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి గతవారంలో ఉక్రెయిన్‌ మిలిటరీ కాల్పులు జరిపింది, ప్రతిగా తిరుగుబాటుదార్లు కూడా స్పందించారు.


గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ రిపబ్లిక్‌ల స్వాతంత్య్రప్రకటనను సాంకేతికంగా గుర్తించలేదు తప్ప అనేక అంశాలలో గుర్తింపు దేశాలతో మాదిరే రష్యా వ్యహరిస్తోంది.2014 మే నెలలో జరిపిన డాన్‌టెస్క్‌ ప్రజాభిప్రాసేకరణలో 75శాతం మంది పాల్గొనగా 89శాతం స్వయం పాలనకు మద్దతు ఇచ్చారు. 2016 నుంచి డాన్‌టెస్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ పేరుతో పాస్‌పోర్టులు జారీచేస్తున్నారు.2019 జూన్‌ నుంచి డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులోని జనాలకు రష్యా తన పాస్‌పోర్టులను జారీ చేయటం ప్రారంభించి ఇప్పటి వరకు ఆరులక్షల మందికి జారీ చేసింది. మానవతాపూర్వకమైన సాయంగా తామీ పని చేస్తున్నట్లు పేర్కొన్నది. ఈ రెండు రిపబ్లిక్కులలో ఉక్రెయిన్‌ పాస్‌పోర్టులను గుర్తించటం లేదని అదే ఏడాది ప్రకటించారు. ఉక్రెయిన్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న మోటారువాహనాలు తమ ప్రాంతాల్లోకి రావటాన్ని అక్రమం అని డాన్‌టెస్క్‌ ప్రకటించింది. 2014లో అధికార భాషలుగా ఉక్రేనియన్‌, రష్యన్‌ ఉంటాయని ప్రకటించిన డాన్‌టెస్క్‌ 2020లో రష్యన్‌ ఒక్కదాన్నే గుర్తిస్తున్నట్లు పేర్కొన్నది. ఇప్పుడు ఈ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది. ఇంతకాలం ఈ రిపబ్లిక్‌లను ఆక్రమించేందుకు రష్యా పధకం వేసినట్లు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ప్రచారం చేశాయి.
తాజాగా వెల్లడైన సమాచారాన్ని బట్టి నాటో విస్తరణ గురించి ఆ కూటమి దేశాలు గతంలో రష్యాకు ఇచ్చిన వాగ్దానం నుంచి వైదొలిగినట్లు జర్మన్‌ పత్రిక డెర్‌ స్పీగెల్‌ ఒక బ్రిటన్‌ పత్రాన్ని బయట పెట్టింది. నాటోను విస్తరించబోమని అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ మాస్కోకు వాగ్దానం చేసిన అంశం గురించి చర్చించినట్లు ఆ పత్రంలో ఉంది.1991 మార్చి ఆరవ తేదీన బాన్‌ పట్టణంలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో దీని గురించి చర్చించారు. ” అధికార లేదా అనధికారికంగా కూడా నాటోను తూర్పు వైపు విస్తరించకూడదు ” అని ఐరోపా, కెనడాలతో సంబంధాలు నెరిపే అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి రేమాండ్‌ సెట్జ్‌ ప్రకటనను దానిలో ఉటంకించారు. తూర్పు ఐరోపా దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్న సాధారణ ఒప్పందం ఉనికిలో ఉన్న అంశాన్ని బ్రిటన్‌ ప్రతినిధి చర్చల్లో ప్రస్తావించినట్లు కూడా ఆ పత్రంలో ఉంది.” 2+4 సంభాషణల్లో నాటోను ఎల్‌బె నది ఆవలకు విస్తరించకూడదని మనం స్పష్టం చేశాం, కనుక పోలాండ్‌తో సహా ఇతరులెవరికీ నాటో సభ్యం ఇవ్వకూడదని ” నాటి పశ్చిమ జర్మనీ ప్రతినిధి జర్‌జెన్‌ హ్రౌబోగ్‌ అన్నాడు.


డెర్‌ స్పీగల్‌ ప్రచురించిన పత్రాన్ని తొలుత అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ జాషువా షిఫ్రిన్స్‌న్‌ బ్రిటన్‌ నేషనల్‌ ఆర్కైవ్స్‌లో కనుగొన్నాడు. దాని మీద రహస్యం అనే ముద్ర ఉంది, తరువాత దాన్ని బహిర్గతం చేశారు. నాటోను విస్తరించకూడదనే వాగ్దానం లేదని సీనియర్‌ విధాన నిర్ణేతలు చెప్పవచ్చు కానీ ఈ పత్రం వాస్తవాన్ని చెబుతున్నదని షిఫ్రిన్స్‌న్‌ పేర్కొన్నాడు. ఎనిమిది సంవత్సరాల తరువాత నాటో విస్తరణ జరిగింది. ఒక్క అంగుళం మేరకు కూడా తూర్పు వైపు నాటో విస్తరణ జరగదని వాగ్దానం చేశారని డిసెంబరు నెలలో వ్లదిమిర్‌ పుతిన్‌ పత్రికా గోష్టిలో చెప్పారు. అలాంటిదేమీ లేదని, తెరవెనుక ఒప్పందాలేమీ లేవని నాటో సెక్రటరీ జనరల్‌ జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ అన్నాడు.1999లో పోలాండ్‌, హంగరీ, చెకియాలను, 2004లో మాజీ సోవియట్‌ రిపబ్లిక్కులు ఎస్తోనియా, లాత్వియా, లిధువేనియాలను చేర్చుకున్నారు. దీంతో నాటో దళాలు రష్యాలోని సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరానికి 135 కిలోమీటర్ల దూరంలోకి వచ్చినట్లయింది. మరోవైపు నుంచి ఇంకా దగ్గరకు వచ్చేందుకు ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వాలని నాటో నిర్ణయించింది. ఇదే ఉద్రిక్తతలకు మూలం.


ఉక్రెయిన్‌ పేరుతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆర్ధిక లబ్ది పొందేందుకు అమెరికా పధకం వేసిందనే తర్కం కూడా వినిపిస్తోంది. అక్కడి మిలిటరీ-పారిశ్రామికవేత్తలకు ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధం ఉంటేనే వారి ఉత్పత్తులు అమ్ముకొని లబ్ది పొందవచ్చు. ఐరోపాకు ముప్పును ఎదుర్కొనే పేరుతో ఏర్పాటు చేసిన నాటో ద్వారా జరుగుతున్నది అదే. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా రెచ్చగొట్టినన్ని ఉద్రిక్తతలు, యుద్ధాలు మరొక దేశం వైపు నుంచి లేవు. రేథియాన్‌ అనే అమెరికన్‌ కంపెనీ క్షిపణులు, ఇతర ఆయుధాల తయారు చేస్తుంది. జనవరి చివరిలో దాని సిఇఓ గ్రెగ్‌ హేస్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ లేదా ఇతర భద్రతా ముప్పులు అంతర్జాతీయ అమ్మకాలకు అవకాశాలను కల్పిస్తుందని చెప్పాడు. అమెరికాకు ఉద్రిక్తతలు కొనసాగినా లాభమే. గత కొద్ది నెలలుగా తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల నుంచి పెట్టుబడులు అమెరికా ద్రవ్య మార్కెట్‌కు తరలుతున్నాయి. దీని వలన ద్రవ్య సరఫరా పెరుగుతుంది, బాండ్ల రేటు స్ధిరపడుతుంది, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా విదేశాంగ విధానాన్ని ఆయుధ కంపెనీలు నిర్దేశిస్తున్నాయి.


తీర్మానాలతో నిమిత్తం లేకుండానే అమెరికా, ఇతర నాటో దేశాలు గతంలో ఇరాక్‌ మీద దాడి చేసినప్పటికీ భద్రతామండలి చేసిందేమీ లేదు. అలాగే ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో అది చేసే తీర్మానం లేదా నిర్ణయం గురించి (ఇది రాస్తున్న సమయానికి ) ఇంకా తెలియదు. ఏ తీర్మానం చేసినా రష్యా వీటో చేస్తే వీగిపోతుంది. ఇప్పుడేం జరుగుతుంది అన్నది ఆసక్తికలిగించే అంశం. రష్యా గుర్తింపుతో నిమిత్తం లేకుండానే అంతకు ముందునుంచే డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లపై ఉక్రెయిన్‌ దళాలు దాడులను ప్రారంభించాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ రిపబ్లిక్‌ల తిరుగుబాటుదార్లకు రష్యా మద్దతు బహిరంగ రహస్యమే. 2015లో కుదిరిన మిన్‌స్క్‌ ఒప్పందం ప్రకారం ఆ రెండు ప్రాంతాలు ఉక్రెయిన్లో స్వయం పాలిత ప్రాంతాలుగా ఉండవచ్చు. కానీ అది ఇంతవరకు అమలు జరగలేదు. 2008లో రష్యా-.జార్జియా యుద్ధానంతరం జార్జియాలోని అబ్కాజియా, దక్షిణ ఒసెటియా ప్రాంతాలు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా, వెనెజులా, నికరాగువా, సిరియా, నౌరు గుర్తించాయి. ఆ రెండు ప్రాంతాలూ పరస్పరం గుర్తించుకున్నాయి. వాటికి ఇంతవరకు ఐరాస సభ్యత్వం లేదు.


ఐరాసలో చేరాలంటే ఐరాస నిబంధనలను అంగీకరిస్తున్నట్లు సంస్ధ సెక్రటరీ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును భద్రతామండలికి నివేదిస్తారు. పదిహేను మంది సభ్యులున్న మండలిలో కనీసం తొమ్మిది మంది దాన్ని ఆమోదించాలి. శాశ్వత సభ్య దేశాలైన చైనా, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యాలలో ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఓటు వేయకూడదు. అలా సిఫార్సు చేసిన తీర్మానాన్ని ఐరాస సాధారణ అసెంబ్లీకి నివేదిస్తారు. అక్కడ మూడింట రెండువంతుల దేశాలు ఆమోదించాలి. ఆ రోజు నుంచి సభ్యత్వం వస్తుంది. సాధారణ అసెంబ్లీ ప్రతి సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధుల అర్హతలను తొమ్మిది మంది సభ్యుల కమిటీ పరిశీలిస్తుంది. సదరు ప్రతినిధిని పంపిన ప్రభుత్వం చట్టబద్దమైనదా కాదా అని ఎవరైనా ప్రశ్నించినపుడు మెజారిటీ ఓటుతో నిర్ణయిస్తారు. ఈ నేపధ్యంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్న దేశాలన్నీ ఐరాసలో చేరే అవకాశం లేదు. ఐరాసతో నిమిత్తం లేకుండా ఏ దేశమైనా గుర్తించి సంబంధాలు పెట్టుకోవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు.


డాంటెస్క్‌, లుహనస్క్‌ రిపబ్లిక్‌లను గుర్తించిన వెంటనే రష్యావాటితో స్నేహ ఒప్పందాలు కూడా చేసుకుంది.దాని మేరకు శాంతిపరిరక్షణకు కొన్ని దళాలను పంపింది. ఈ చర్య ఉక్రెయిన్‌పై దాడి అని పశ్చిమ దేశాలు వర్ణిస్తున్నాయి. రష్యా మీద మరిన్ని ఆంక్షలను ప్రకటిస్తామని చెప్పాయి. ఎలాంటి కారణం లేకుండా కూడా తమ మీద ఆంక్షలు విధించటం చూశామని, దీనిలో కొత్తేముందని రష్యా విదేశాంగ మంత్రి అన్నారు. తాము స్వంతంగా కొన్ని ఆంక్షలు ప్రకటిస్తామని అమెరికా చెప్పింది. బ్రిటన్‌ కొన్ని బాంకులపై ఆంక్షలు విధించింది. సముద్రగర్భం నుంచి వేసిన గాస్‌, చమురు గొట్టపు మార్గ పధకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ పేర్కొన్నది. తిరుగుబాటు రిపబ్లిక్‌లపై మిలిటరీతో పాటు కిరాయి మూకలను కూడా ఉక్రెయిన్‌ ప్రయోగిస్తున్నది. ఉక్రెయిన్‌ పూర్తి స్ధాయి దాడులకు దిగితే ఏం జరుగుతుందన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గడువుల పేరుతో అమెరికా అబద్దాలు – కొనసాగుతున్న ఉక్రెయిన్‌ ఉద్రిక్తత !

20 Sunday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#US Lies, Donbass, Joe Biden, Minsk agreements, NATO, RUSSIA, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరుపుతుంది, కాదు ఫిబ్రవరి 20వ తేదీన జరపనుంది, లేదు లేదు ఎప్పుడైనా డాడి జరపాలనే నిర్ణయించింది. ఇవన్నీ గత కొద్ది రోజులుగా అమెరికా చెబుతున్నమాటలు. ఇప్పటి వరకైతే జోబైడెన్‌ ఎత్తుగడ ఈ ఉదంతంలో అభాసుపాలైంది. చివరికి పశ్చిమదేశాలతో చేతులు కలిపిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోల్దోమిర్‌ జెలెన్‌స్కీ కూడా అసహనాన్ని వెలిబుచ్చాడు.” ఈ రోజు రష్యా దాడి చేస్తుంది, రేపు చేస్తుందీ అంటూ రోజుకొక తేదీని చెబుతారెందుకు ? మీరు నిజంగా మాకు సాయం చేయాలనుకుంటే తేదీలు చెప్పవద్దు. ఫిబ్రవరి 16, మార్చి ఒకటి, డిసెంబరు 31 ఏదైనా కావచ్చు, మా నేలను కాపాడుకొనే సత్తా మాకు ఉంది. మీరు ఎలాంటి షరతులు లేకుండా డబ్బు ఇవ్వండి. కొంత సొమ్మును కేటాయించిన ప్రతిసారీ ఒకటి ,రెండు, మూడు, నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది, పది సంస్కరణలు మేమెందుకు చేయాలి. రండి, మా మిలిటరీని పటిష్టపరిచేందుకు తోడ్పడండి, మరిన్ని ఆయుధాలు ఇవ్వండి, మా ఆర్ధిక రంగంలో పెట్టుబడులు పెట్టండి, మీ కంపెనీలతో పెట్టించండి. మాకు నిధులు, గ్రాంట్లు ఇవ్వండి. దానికి బదులు ఫలానా రోజు రష్యా దాడి చేస్తుంది అంటూ నిరంతరం చెప్పటం అవసరమా ” అని జెలెనెస్కీ ప్రశ్నించాడు. మ్యూనిచ్‌ నగరంలో జరిగిన ఐరోపా భద్రతా సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఏ క్షణమైనా దాడి జరగవచ్చు, తరువాత ఆంక్షలు ప్రకటిస్తే జరిగేదేమీ ఉండదు కనుక ముందుగానే ఆ పని చేయాలని ఆదివారం నాడు ఉక్రెయిన్‌ కోరింది. ఈ వారంలోనే దాడి జరగవచ్చు, అది రాజధాని కీవ్‌ పట్టణం మీదే అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నాడు. శనివారం నాడు రష్యా ఖండాంతర క్షిపణులతో విన్యాసాలు జరిపి నిర్ణీత లక్ష్యాాలను గురితప్పకుండా కొట్టింది. ఆదివారం నాడు ముగియాల్సిన రష్యాతో సైనిక విన్యాసాలను మరికొద్ది రోజులు పొడిగించనున్నట్లు బెలారస్‌ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిను తిరుగుబాటు ప్రాంతాల నుంచి ఆదివారం నాడు కూడా పౌరులు ముఖ్యంగా పిల్లలు రష్యాకు వెళుతున్నట్లు వార్తలు వచ్చాయి. తిరుగుబాటుదార్లు, మిలిటరీ పరస్పరం కాల్పులు జరిపినట్లు కూడా చెబుతున్నారు.


రేపేం జరుగుతుంది అన్నది అనిశ్చితం. ఇప్పటి వరకు ఉక్రెయిను మీద దాడి గురించి చెప్పిన మాటలు వాస్తవం కాదని, ప్రచార దాడి అని తేలింది. గతంలో ఇరాక్‌ మీద దాడి చేసేందుకు సద్దాం హుసేన్‌ ప్రభుత్వం మారణాయుధాలను గుట్టలుగా పోసి ఉంచిందంటూ తప్పుడు ప్రచారం చేసింది అమెరికా, వాటిని కనుకొని నాశనం చేసే పేరుతో ఏకంగా ఇరాక్‌ మీద దాడి చేసింది, సద్దాంను ఉరితీసింది. తీరా అక్కడ అలాంటి వాటి జాడలు కూడా లేవని అదే అమెరికా అధికారులు అంతా ముగిశాక ప్రకటించారు. ఇప్పుడు తిరిగి ఆ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నది. ఇది 1990 దశకం కాదు, రష్యా – ఇరాక్కు, సద్దాం హుసేన్‌, వ్లదిమిర్‌ పుతిన్‌కు పోలిలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే ఐరోపాలో అమెరికా పలుకుబడి మరింత తగ్గటానికి, దాని పరువు పోగొట్టటంలో పుతిన్‌ తన తెలివితేటలను ఉపయోగించాడనే చెప్పాలి.


ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతినెలా వివిధ దేశాల సైనిక విన్యాసాలు, ఆయుధ ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ యుద్దం చేసేందుకు కాదు, బల ప్రదర్శన మాత్రమే. ఉక్రెయిన్‌, రష్యా సరిహద్దులు కలిగిన బెలారస్‌తో కొద్ది రోజుల క్రితం రష్యా సైనిక విన్యాసాలు జరిపింది. వాటిని చూపి ఇంకేముంది అవి ముగియగానే పనిలో పనిగా ఉక్రెయిన్‌ మీద ఫిబ్రవరి 16న దాడి చేస్తారని అమెరికా చెప్పింది. అనేక మంది నిజమే అని నమ్మారు. కీవ్‌ నుంచి తమ రాయబార సిబ్బంది కుటుంబాలను వెనక్కు రప్పించే నాటకాన్ని కొన్ని దేశాలు రక్తి కట్టించాయి. సరిహద్దుల్లోని తమ దళాలను కొన్నింటిని ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించగానే మా దెబ్బకు దిగివచ్చిందని ఉక్రెయిన్‌ నేత తన జబ్బలను తానే చరుచుకున్నాడు. కానీ కొద్ది గంటల్లోనే పశ్చిమ దేశాలు రెండో ఎత్తుగడలో భాగంగా కొత్త కతలు చెప్పటం ప్రారంభించాయి. మరోవైపున స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కుల మీద అదేశ మిలిటరీ దాడులు జరిపి రష్యాను రెచ్చగొట్టింది.


2014 నుంచి ఆ రెండు ప్రాంతాల్లోని జనం తిరుగుబాటు చేస్తున్నారు. దాదాపు పదిహేనువేల మంది మరణించారు. మిలిటరీ సరిహద్దుల రక్షణ, ఇతర దేశాల దాడులను ఎదుర్కొనేందుకు తప్ప స్వంత జనం మీద దాడులు చేసేందుకు కాదు.2014 బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి.దీనిలో గమనించాల్సిన అంశం ఏమంటే స్వాతంత్య్రం ప్రకటించుకున్న రిపబ్లిక్కులు రష్యాసరిహద్దులో ఉన్నందున ఉక్రెయిన్‌ మిలిటరీని సరిహద్దు ప్రాంతాల్లో అనుమతించాల్సి ఉంది. ఈ ఒప్పందం కూడా సరిగా అమలు జరగనప్పటికీ అమల్లోనే ఉన్నాయి.


ఈ ఒప్పందాల అమలు గురించి కాకుండా, అమెరికా, నాటో కూటమిలోని కొన్ని దేశాలు ఉక్రెయినుకు ముప్పు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. నాటో విస్తరణలో భాగంగా జరిగిన కుట్రలో 2014లో జరిగిన ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని ఆ కూటమి గద్దెనెక్కించింది. ఏ క్షణంలోనైనా విస్తరణ జరగవచ్చని భావించిన రష్యా వెంటనే పావులు కదిపింది. ఒకప్పటి తన భూభాగమైన క్రిమియాలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో రష్యాలో విలీనం కావాలని మెజారిటీ పేర్కొనటంతో వెంటనే రష్యా ఆపని పూర్తి చేసింది. దీంతో కంగుతిన్న పశ్చిమ దేశాలు అప్పటి నుంచి రష్యామీద ఆంక్షలను అమలు జరుపుతున్నాయి. వాటి వలన ఫలితం లేకపోవటంతో అసలు మొత్తంగా ఉక్రెయిన్‌ ఆక్రమణ జరుపుతుందంటూ ప్రచారం, తేదీల నిర్ణయం చేశారు.


మిన్‌స్క్‌ ఒప్పందాల్లో రష్యా భాగస్వామి కనుక దానికి భిన్నంగా ఆ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తే ఆ పేరుతో దాడికి దిగాలని పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో కాచుకున్నాయి. పుతిన్‌ అందుకు అవకాశం ఇవ్వలేదు. గుర్తింపు ఇవ్వాలంటూ ఇటీవల కమ్యూనిస్టు ఎంపీలు ప్రతిపాదించిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించినప్పటికీ పుతిన్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. నాటో విస్తరణ-ఉక్రెయిన్‌ చేరిక గురించి మాట్లాడేదేమీ లేదని పుతిన్‌ చెబుతుండగా దానికి తాము సిద్దంగా లేమని అమెరికా చెబుతోంది. స్వాతంత్య్ర ప్రకటన చేసిన రిపబ్లిక్కులు రష్యాలో విలీనానికి కూడా సిద్దమే. అయితే అవి క్రిమియా వంటివి కాదు గనుక రష్యాతొందరపడటం లేదు. ఆ పని చేస్తే వెంటనే నాటో ఉక్రెయిన్లో తిష్టవేసి రోజువారి తలనొప్పి కలిగిస్తుంది. తన సభ్యదేశం కాని చోట నాటో దళాలను మోహరించే వీలు లేదు. ఐరోపాను మరింతగా తన కబంధ హస్తాల్లో బిగించేందుకు అమెరికా పావులు కదపటాన్ని జర్మనీ వంటి దేశాలు అంగీకరించటం లేదు.


నిబంధనలు, అవగాహనలకు విరుద్దంగా నాటో దేశాలు ఉక్రెయినుకు అన్ని రకాల సాయం చేస్తూ రష్యాను కవ్విస్తున్నాయి.2014 నుంచి 270 కోట్ల డాలర్ల మేర మిలిటరీ సాయం అందించగా ఒక్క 2021లోనే అమెరికా 65 కోట్ల డాలర్ల మేర అందించింది. ఈ ఏడాది ఇప్పటికి 20 కోట్ల మేరకు అందించారు. బ్రిటన్‌ 460టన్నుల మేరకు అనేక రకాల ఆయుధాలను చేరవేసింది. నిబంధనల మేరకు చూస్తే వీటిని చూపి రష్యా మిన్‌స్క్‌ ఒప్పందం నుంచి వైదొలిగి నేరుగా తిరుగుబాటు రిపబ్లికులకు అన్ని రకాల సాయం చేయవచ్చు గానీ దానికి పూనుకోలేదు.


అమెరికా, ఐరోపాలోని నాటో దేశాలకు రష్యన్లు కొన్ని అంశాలను స్పష్టం చేశారు. గత కొద్ది నెలలుగా అమెరికా, దాని మిత్రదేశాలు చెబుతున్నట్లుగా ఉక్రెయిను మీద ఎలాంటి దాడి ఉండదు. ఆశ్చర్యకర పరిణామాలూ జరగవచ్చు. మూడవది చర్యకు ప్రతి చర్య ఉంటుంది. అమెరికాకు పంపిన ఒక పత్రంలో నిర్దిష్ట ప్రతిపాదనలను చేశారు. వాటిలో ఒకదానిలో ఇలా ఉంది. ” ఉక్రెయిన్‌, జార్జియాలను నాటోలో చేర్చుకోవటమే కాదు, నామమాత్ర సభ్యత్వం కూడా ఇవ్వకూడదు. సభ్యులు కాని దేశాలలో అమెరికా మిలిటరీ కేంద్రాలు, ఆయుధ నిల్వల వంటి మిలిటరీ చర్యలు, రష్యాను లక్ష్యంగా చేసుకొనే ద్విపక్ష మిలిటరీ ఒప్పందాలు ఉండకూడడు ”. రుమేనియా, పోలాండ్‌లో ఉన్న మధ్యంతర, స్వల్పశ్రేణి అణుక్షిపణులను, బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలోని యుద్దనావలు, రష్యాగగన తలానికి సమీపంలోని అణుబాంబర్లను తొలగించాలని కూడా కోరింది. మిన్‌స్క్‌ ఒప్పందాలను అమలు జరపాలి, ఆ మేరకు డాన్‌బాస్‌ ప్రాంతానికి ప్రత్యేక హౌదా ఇవ్వాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్‌ చెప్పారు. ఈ ఒప్పందాల ప్రకారం తిరుగుబాటు ప్రాంతాలకు రష్యా ఎలాంటి ఆయుధాలను పంపకూడదు. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ ప్రాంతాలపై ఉక్రెయిన్‌ మిలిటరీ దాడి చేస్తే తిరుగుబాటుదార్లకు మద్దతుగా రష్యా రంగంలోకి దిగేట్లుగా ఇప్పుడు కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి. ఇవి ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకే దెబ్బతో చైనా, రష్యాలను కొట్టాలన్న అమెరికా ఆత్రం !

12 Saturday Feb 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China Threat, Quad, Quadrilateral Security Dialogue, RUSSIA, Two-front wars’ with China and Russia, Ukraine war


ఎం కోటేశ్వరరావు
ఆత్రగాడికి బుద్ది మట్టు(తక్కువ లేదా పరిమితం) అన్నారు పెద్దలు.లేకపోతే రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘన్‌ తాలిబాన్లనే అదుపు చేయలేక సలాం చేసి తోకముడిచిన అమెరికన్లు ఒకేసారి చైనా, రష్యాలను మింగేస్తాం అంటుంటే ఏమనుకోవాలి మరి ! ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో అమెరికా, భారత్‌, జపాన్‌,ఆస్ట్రేలియాతో కూడిన చతుష్టయ(క్వాడ్‌) విదేశాంగ మంత్రుల నాలుగవ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఇటీవలి కాలంలో అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన ఒక ప్రధాన మార్పు ఏమంటే తన చేతికి మట్టి అంటకుండా ఇతరులతో పని జరిపించుకోవటం. కొద్ది నెలల క్రితం దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం ఏమిటంటూ ఆ ప్రాంత దేశాలను రెచ్చగొట్టింది. ఇప్పుడు ఇంకేముంది రష్యన్లు ఉక్రెయిన్‌ ఆక్రమణకు నడుంకట్టారు, మీ వెనుక మేముంటాం అందరం పోరాడుదాం , ముందుకు పదండితోసుకు అని హడావుడి చేస్తోంది. చతుష్టయ కూటమికి ఉక్రెయిన్‌ వివాదానికి సంబంధం లేదు, ఐనా మెల్‌బోర్న్‌లో దాని గురించి ప్రస్తావించారు. ప్రతిదానికి ప్రతిదేశ జుట్టును ముడివేయాలని అమెరికా చూస్తోంది. ఈ కూటమిలోని వారందరూ ఉక్రెయిన్‌ వెళ్లి రష్యా మీద దాడులకు దిగుతారా ? అంతసత్తా ఉందా ? ఆసియాకు చైనా నుంచి, ఐరోపాకు రష్యా నుంచి ముప్పు ఉందనే తన దుష్ట పన్నాగంలోకి అన్ని దేశాలనూ లాగేందుకు అమెరికా పూనుకుంది.


భారత్‌ ఎదుగుదలకు, ప్రాంతీయ నాయకురాలిగా నాయకత్వం వహించేందుకు మద్దతు ఇస్తాం అని మెల్‌బోర్న్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మనకు చెప్పారు. మనం ఏ దేశాలకు నాయకత్వం వహించాలి? ప్రపంచ పెత్తనం కోసం అమెరికా పడరాని పాట్లు పడుతోంది. మింగటం దానివల్ల కావటం లేదు. ఒక్కొక్క ఖండంలో ఒక్కో జూనియర్‌ భాగస్వామికోసం ఎదురు చూస్తోంది. మనం దాని ఏజంటుగా మారాలని కోరుకుంటోంది. అసలు భారత ఉపఖండంలో మన కోసం ఎదురు చూస్తున్నవారెవరైనా ఉన్నారా ? అందరిని, కాస్త దూరంలో ఉన్న ఇరాన్‌ వంటి మిత్రదేశాలను దూరం చేయటంలో అమెరికా జయప్రదమైంది. చిన్న దేశమైన భూటాన్‌ కూడా మనతో చెప్పకుండా డోక్లాం ప్రాంత వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనాతో చర్చలు జరిపింది కదా ! మనలిన్న తన పట్టునుంచి పోకుండా అమెరికా బిగించింది.మీ ఊరు చుట్టుపక్కల 66 ఊళ్లకు పోతుగడ్డ అని పొగిడినట్లుగా మనలను మునగచెట్టు ఎక్కిస్తోంది. తన దక్షిణ చైనా సముద్ర ఆధిపత్య ఎత్తుగడలో భాగంగా గాల్వన్‌ రూపంలో మనకూ చైనాకు లడాయి పెట్టింది.

మరోవైపున ఆస్ట్రేలియాను చైనా మీదకు ఉసిగొల్పింది, జపాన్‌లో తానే తిష్టవేసింది గనుక జపాన్ను ప్రత్యేంగా రెచ్చగొట్టాల్సిన పనిలేదు. చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకుందామనే పేరుతో భారత విస్తరణ వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. అది జరిగేదేనా ?
ఈ కాలంలో జరిగిందేమిటి ? ఆస్ట్రేలియా తోకలను కత్తిరించేందుకు చైనా వాణిజ్య ఆయుధాన్ని వాడుతున్నది.2021 తొలి తొమ్మిది నెలల కాలంలో ఆస్ట్రేలియా నుంచి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చైనా 17.3బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతులను తగ్గించింది. అదే వస్తువులను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుందంటే, అమెరికా నుంచి 6.3, కెనడా నుంచి 1.5, న్యూజిలాండ్‌ నుంచి 1.1బి.డాలర్ల మేరకు అదనంగా చైనా దిగుమతి చేసుకుంది. అంటే ఆస్ట్రేలియాను ఫణంగా పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంది. ఇప్పుడు చైనాతో అమెరికాకు ఉన్న లడాయి ఏమిటి ? తన వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయటం లేదన్నదే, చైనా దిగుమతులు పెరిగితే దక్షిణ చైనా సముద్రమూ ఉండదు, భారత్‌కు నాయకత్వమూ ఉండదు. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి బెదిరింపులకు దిగుతోంది.


నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు ఎన్నికల్లోపు ఓటర్ల ముందు ఏదో ఒకటి సాధించినట్లు లేదా మరొక మహత్తర కార్యక్రమంలో ఉన్నట్లు ఓటర్లకు జోబైడెన్‌ కనిపిస్తేనే ఓట్లు పడతాయి.అందుకే ఈ తిప్పలు. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి.2020లో కుదిరిన ఒప్పందం మేరకు మా దగ్గర నుంచి సరకులు కొంటారా లేదా అని అమెరికా వత్తిడి తెస్తోంది. మీరు మాత్రం మా మీద అనేక ఆంక్షలు విధిస్తారు, చుట్టూ మంటపెడతారు, తగ్గించాల్సిన పన్నుల గురించి మాట్లాడరు, కరోనా కారణంగా తలెత్తిన సమస్యల గురించి మాట్లాడకుండా మా మీద నిందలు వేస్తే కుదరదు అని చైనా అంటోంది. ఆ ఒప్పందం ప్రకారం 2020లో అమెరికా నుంచి 260, 2021లో 310బి.డాలర్ల విలువగల వస్తువులు, సేవలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దానికి ప్రతిగా అమెరికా చైనా నుంచి వచ్చే 120బి.డాలర్ల విలువగల వస్తువులపై పన్నును 15నుంచి 7.5శాతానికి తగ్గించాలి.2021లో రెండు దేశాల మధ్య 755.6బి.డాలర్ల మేర వాణిజ్యం జరగా అమెరికా నుంచి దిగుమతులు 179.53 బి.డాలర్లు మాత్రమే ఉన్నాయి. చైనా వార్షిక విదేశీ వాణిజ్య విలువ ఆరులక్షల కోట్ల డాలర్లుండగా అమెరికా వాటా పన్నెండుశాతంగా ఉంది.


మెల్‌బోర్న్‌ సమావేశం సందర్భంగా అమెరికా విడుదల చేసిన పత్రం భారత్‌ – చైనాల మధ్య మంటను మరింతగా ఎగదోసేదిగా ఉంది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్నాయని ఈ ప్రాంతంలో భద్రతను సమకూర్చే భారత పాత్రకు తాము మద్దతు ఇస్తామని అమెరికా పేర్కొన్నది. క్వాడ్‌లో భారత్‌ భావ సారూప్యత కలిగిన భాగస్వామి, చోదకశక్తి అని వర్ణించింది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్న కారణంగానే తాము ఈ ప్రాంతంపై కేంద్రీకరించామని, ఆస్ట్రేలియా మీద ఆర్ధిక బలాత్కారం, వాస్తవాధీన రేఖ వెంట భారత్‌తో ఘర్షణ, తైవాన్‌ మీద పెంచుతున్న వత్తిడి, తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలపై బెదరింపులు వంటి చర్యలతో తమ మిత్రులు, భాగస్వాములు మూల్యం చెల్లించాల్సి వస్తోందని అమెరికా పత్రం పేర్కొన్నది. చైనాను మార్చటంలో తమకు పరిమితులు ఉన్నట్లు ఒక అమెరికా అధికారి ఈసందర్భంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి.


మెల్‌బోర్న్‌ సమావేశంలో రష్యాగురించి భిన్నంగా మాట్లాడినప్పటికీ చైనా విషయంలో దాదాపు ఒకే అభిప్రాయం వ్యక్తమైంది.క్వాడ్‌ బృందం విబేధాల గురించి గాక సహకారం, చేతులు కలపటం మీద కేంద్రీకరించాలని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఉక్రెయిన్‌ వివాదం గురించి చెప్పారు. అమెరికా ఆంక్షలు, బెదిరింపులను ఖాతరు చేయ కుండా రష్యానుంచి క్షిపణి వ్యవస్దలను మనదేశం కొనుగోలు చేసింది. ఇప్పటికీ మిలిటరీ సరఫరాలపై వారి మీదే ప్రధానంగా ఆధారపడి ఉన్నాము. రష్యా మిలిటరీ బెదరింపులు ముప్పు తెస్తున్నాయని అమెరికా మంత్రి బ్లింకెన్‌ ఆరోపించగా ఈ వివాదంలోకి తాము దలదూర్చటం లేదని జైశంకర్‌ పేర్కొన్నారు. ఒక దేశంతో ఎవరితో కలవాలో లేదో మరొక దేశం నిర్ణయించరాదని అమెరికా మంత్రి రష్యామీద ధ్వజమెత్తారు.నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోరాదని రష్యా డిమాండ్‌ చేస్తుండగా చేర్చుకొని ఉక్రెయినుకు మిలిటరీని తరలించి రష్యా మెడమీద కత్తిలా మారాలని అమెరికా ఎత్తువేసింది. నా సహచరులు చెప్పినట్లుగా మేము కొన్నింటికోసం ఉన్నప్పటికీ కొందరికి వ్యతిరేకం కాదని జైశంకర్‌ అన్నారు. ఇటీవలి భద్రతామండలి సమావేశంలో కూడా రష్యాను విమర్శించేందుకు మన దేశం తిరస్కరించింది. జపాన్‌-రష్యా మధ్య సరిహద్దు సమస్యలున్నప్పటికీ ఘర్షణకు జపాన్‌ సిద్దంగా లేదు. అమెరికా వత్తిడి మేరకు కొన్ని ప్రకటనలు చేసినప్పటికీ చైనాతో వాణిజ్య మిగులు ఉన్న జపాన్‌ తెగేవరకు లాగేందుకు సిద్దంగా లేదు. దక్షిణ కొరియా కూడా చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటోంది.

మన దేశం గాల్వన్‌ ఉదంతాల సమయంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ గతేడాది రికార్డు స్దాయిలో వస్తువులను దిగుమతి చేసుకొని సానుకూల సందేశాన్ని పంపింది. కోవీషీల్డ్‌ కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను, పరికరాలను సరఫరా చేసేందుకు అమెరికా నిరాకరించి నిషేధం విధించిన అంశం తెలిసిందే. కేంద్రంలో ఉన్న అధికారపార్టీ రాజకీయాలను ఖాతరు చేయకుండా మన దిగుమతిదారులు లావాదేవీలు జరిపారు. చైనా నుంచి నిర్ణీత పరిమాణంలో వస్తువులను విధిగా కొనుగోలు చేయాలనే ఒప్పందాలేవీ లేవు, అగత్యమూ లేదు. అమెరికన్లు చెబుతున్నట్లు వారు మనకు సహజభాగస్వాములే ఐతే, జపాన్‌, ఆస్ట్రేలియా మన మంచి కోరుకున్నట్లయితే మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను వారు సరఫరా చేయవచ్చు, చేేయగలరు కానీ వారు చెప్పిన ధరలను మనం చెల్లించాలి. ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు. ఆ వెలతో దిగుమతి చేసుకుంటే మన జనాల జేబులు కొట్టి అమెరికా, ఇతర దేశాలకు సమర్పించాలి. తక్కువ ధరలకు వస్తువులు వస్తున్నందున దిగుమతిదారులు మొగ్గుచూపుతున్నారు తప్ప చైనా మీద వారికేమీ ప్రత్యేక ప్రేమ ఉండికాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయినే ముందుగా దాడికి దిగుతుందా ? చమురు ధరల పెరుగుదలతో బలపడుతున్న రష్యా !

08 Tuesday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

NATO allies, NATO war threats against Russia, RUSSIA, Ukraine attack on Donbass, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఆయుధ ఉత్పత్తిదారులు, వారికి మద్దతు ఇచ్చే అంతర్జాతీయ మీడియా ఉన్మాదులు తప్ప యుద్దాలు జరగాలని ఏ ఒక్కదేశమూ కోరుకోదు, ఎవరూ సిద్దంగా కూడా లేరు. ఉక్రెయిన్‌ యుద్ధం వస్తుందా రాదా, రేటింగులు పెరుగుతాయా లేదా అని కొందరు ఉగ్గపట్టుకొని చూస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి, రష్యా గత కొద్ది వారాలుగా ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దులకు తమ మిలిటరీలను తరలిస్తున్నాయి. వాస్తవంగా అక్కడేం జరుగుతోందో చెప్పలేము గాని ఏ క్షణంలోనైనా రష్యాదాడులకు దిగవచ్చని పశ్చిమ దేశాల, ముఖ్యంగా అమెరికన్‌ వార్తా సంస్దలు రెచ్చిపోయాయి.


తాజాగా వస్తున్న ఊహాగానాలు, వార్తల స్వభావం ఏమంటే రష్యా సంగతేమోగానీ దాని మద్దతు ఉన్న ఉక్రెయిన్‌ తిరుగుబాటు ప్రాంతాలలో ఒకటైన డాన్‌బాస్‌పై అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్‌ దళాలే దాడులకు దిగి రష్యాను కవ్వించవచ్చని చెబుతున్నారు. ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. రోజులు గడిచే కొద్దీ నాటో కూటమిలోని విబేధాలు మరింతగా వెల్లడి అవుతున్నాయి. వీటికి తోడు ముడి చమురు ధర ఇప్పటికే 93డాలర్లు దాటింది. వంద దిశగా వెళతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికా-ఐరోపా దేశాలలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల భయపెడుతున్నాయి.యుద్దం వస్తుందో లేదో, ఎవరు గెలుస్తారో, వస్తే ఎంతకాలం జరుగుతుందో తెలియదు గానీ రష్యానుంచి చమురు, గాస్‌ ఆగిపోతే ఏమి చేయాలా అని పశ్చిమ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.నలభైశాతం గాస్‌ అక్కడి నుంచే వస్తున్నది.


ప్రస్తుతం ఐరోపా యునియన్‌ అధ్యక్ష స్ధానంలో ఉన్న ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మాస్కోలో పుతిన్‌తో భేటీ జరిపారు.సంప్రదింపుల ద్వారా ఉద్రిక్తతలను నివారించవచ్చనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వాన్ని అంగీకరించే సమస్యే లేదని పుతిన్‌ మరోసారి తెగేసి చెప్పారు.పూర్వం తనలో భాగమై తరువాత పాలనా పరంగా ఉక్రెయిన్‌కు అప్పగించిన క్రిమియా ప్రాంతాన్ని అక్కడి ప్రజాభిప్రాయ సేకరణ తీర్పు ప్రకారం 2014లో రష్యా తనలో విలీనం చేసుకున్న అంశం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఆంక్షలు అమలు జరుపుతున్నాయి. ఆ తరువాత రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్‌ స్వయపాలిత ప్రాంతాలు కొన్నింటిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అవి కూడా రష్యాతో విలీనానానికి మొగ్గుచూపాయి. ఉక్రెయిన్‌ పాలకులు అంగీకరించకపోవటంతో అక్కడ అంతర్యుద్ధం సాగుతోంది. వాటిలో ఒకటే డాన్‌బాస్‌. అది భౌతికంగా ఉక్రెయిన్లో ఉన్నా తిరుగుబాటుదార్లదే పెత్తనం, వారికి రష్యామద్దతు బహిరంగ రహస్యం.


తనది గాకపోతే తాటిమట్టతో అన్నట్లుగా అమెరికా, ఇతర దేశాలను చూసి చేతులు కాల్చుకొనేందుకు ఉక్రెయిన్‌ సిద్దంగా ఉందా అన్నది సందేహమే. 2015లో తిరుగుబాటుదార్ల చేతిలో జరిగిన పరాభవాన్ని అక్కడి పాలకులు మరచిపోలేదు. ఇతరులు ఇచ్చిన ఆయుధాలతో ఈసారి దెబ్బతీయవచ్చని కొందరు రెచ్చగొడుతున్నారు. ఇదే సమయంలో తిరుగుబాటుదార్లకూ మెరుగైన ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి,వాటికి రష్యా అండ కూడా ఉంది. అమెరికాకు యుద్దం ఎందుకు ?


2008 ఆర్దిక సంక్షోభం నుంచి అమెరికా, ఇతర ఐరోపాధనిక దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ద ఇంకా కోలుకోలేదు.కరోనాకు ముందే మరో మాంద్యంలోకి కూరుకుపోనుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. కరోనాతో ప్రపంచ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున లబ్దిపొందారు. అది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు గనుక కొత్తగా లాభాల కోసం దారులు వెతుకుతున్నారు.2008 సంక్షోభం తరువాత అమెరికా కేంద్రీకరించిన దేశాల్లో చమురు ఎగుమతి చేసే ఇరాన్‌, వెనెజులా,రష్యా, ఇరాక్‌, సిరియా వంటివి ఉన్నాయి. వాటిపై ఆంక్షలు విధించిన అమెరికా ఈ కాలంలో మనవంటి దేశాలకు చమురు ఎగుమతిదేశంగా ముందుకు వచ్చి సొమ్ము చేసుకున్న అంశం తెలిసిందే. రష్యానుంచి ఐరోపాకు గాస్‌ను సరఫరా చేసే రెండవ పైప్‌ లైన్‌ నోర్డ్‌ స్ట్రీమ్‌ దాదాపు పూర్తి కావచ్చంది. దాన్ని అడ్డుకొనేందుకు ఉక్రెయిన్‌ పేరుతో అమెరికా రాజకీయాలు చేస్తోంది.


యుద్దం లేదా యుద్దవాతావరణం నాటోలోని ప్రధాన దేశాలకు లాభాల పండిస్తోంది.1991-2014 మధ్య ఉక్రెయిన్‌కు అమెరికా నాలుగుబిలియన్‌ డాలర్లు కేటాయించగా, గత ఎనిమిది సంవత్సరాల్లో 2.5బిడాలర్లు ఇచ్చింది. అదిగాక ఇతర దేశాలు కూడా 10బి.డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. ఉక్రెయిన్‌ నౌకాదళాన్ని నవీకరించే పేరుతో బ్రిటన్‌ 1.7బి.పౌండ్లను పెట్టుబడిగా పెట్టింది. ఇవన్నీ బ్రిటన్‌, ఇతర కంపెనీలకు లబ్ది చేకూర్చేవే. నాటో దేశాల ఆయుధ కంపెనీలను మేపేందుకు 2014-22 మధ్య ఉక్రెయిన్‌ జిడిపిలో మూడు నుంచి ఆరుశాతానికి మిలిటరీ ఖర్చు 11బి.డాలర్లకు పెంచింది. అనేక ఐరోపా దేశాలు అమెరికా మీద ఆధారపడటం కూడా మరోవైపు అవి ఇష్టం లేకున్నా రష్యామీద పోరుకు సిద్దం అనాల్సి వస్తోంది.బ్రిటన్‌ ప్రపంచాధిపత్యంలో జూనియర్‌ వాటాదారుగా అమెరికాతో చేతులు కలుపుతోంది. రష్యామీద ఆంక్షలను వ్యతిరేకించే దేశాల్లో ఇటలీ ఒకటి. దాని పెట్టుబడులు అక్కడ ఉండటమే కారణం.


ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ ఇప్పుడు యుద్దాన్ని కోరుకోవటం లేదు.దానికి రష్యా హీటింగ్‌ చమురు, గాస్‌ అవసరం. ఒకవేళ పోరు జరిగితే అమెరికా నుంచి అధిక ధరలకు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందన్నది వారి భయం. ఇదే పరిస్ధితి మిగతా దేశాలకూ దాపురిస్తుంది. తమ కంపెనీల లాభం కోసం అమెరికా సృష్టించిన ఈ సంక్షోభానికి పావులుగా మారటమా లేదా అన్నది వాటి ముందున్న సమస్య. ఘర్షణలో ఉన్న పక్షాలకు ఆయుధాలు అందించ కూడదన్న తమ రెండవ ప్రపంచ యుద్ద అనంతర విధానానికి అనుగుణంగా బ్రిటన్‌ నుంచి ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాల రవాణాను తమ గగన తలం మీద నుంచి అనుమతించటం లేదని జర్మనీ ప్రకటించింది. దాంతో బ్రిటన్‌ విమానాలు అనేక గంటల పాటు అదనంగా వేరే మార్గంలో వెళ్లాల్సివచ్చింది. అంతే కాదు తాను సరఫరా చేసిన హొవిట్జర్లను ఉక్రెయిన్‌కు దారి మళ్లించరాదని ఎస్తోనియాకు జర్మనీ స్పష్టం చేసింది.ప్రపంచవ్యాపిత బాంకుల ఆర్ధిక సమాచార వ్యవస్ధ (స్విఫ్ట్‌) నుంచి రష్యాను దూరంగా పెట్టాలన్న అమెరికాకు ఐరోపా దేశాల నుంచే ఎదురుదెబ్బతగిలింది. ఇప్పుడున్న స్ధితిలో అమెరికా ఎన్నికబుర్లు చెప్పినా తన శత్రుదేశాల నుంచి చమురు, గాస్‌ దిగుమతులను నిరోధించేశక్తి దానికి లేదు. స్లోవేకియా, హంగరీ, చెక్‌ రిపబ్లిక్‌ వంటి దేశాల్లోని చమురుశుద్ది కర్మాగారాలకు, జర్మనీకి రష్యాగొట్టపు మార్గాల ద్వారానే చమురు సరఫరా జరగాలి. అందువలన చెల్లింపులు జరపాలంటే స్విఫ్ట్‌నుంచి రష్యాను పక్కన పెడితే కుదరదు.


గత కొద్ది సంవత్సరాలుగా నయా నాజీ కిరాయి ముఠాలకు దేశభక్తి ముద్రవేసి అమెరికా పెద్ద ఎత్తున పెంచి పోషిస్తోంది. సిఐఏకు కిరాయి మూకలను సరఫరా చేసే బ్లాక్‌ వాటర్‌ వంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వారిని, ఉక్రెయిన్‌ మిలిటరీని జతచేసి డాన్‌బాస్‌ వంటి ప్రాంతాల మీద దాడులు చేయించాలని చూస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపిన స్టెఫాన్‌ బందేరాను ఇప్పుడు ఉక్రెయిన్‌ ప్రభుత్వం జాతీయ యోధుడిగా గుర్తించి నీరాజనాలు పడుతోంది. ఎనిమిది సంవత్సరాల నాడు క్రిమియా విలీనాన్ని అడ్డుకోలేని నాటో కూటమి ఇప్పుడు దాన్ని విముక్తి చేస్తామని దాడులకు దిగితే యుద్దాన్ని ప్రారంభించిన నేరం దానిదే అవుతుంది. నెపం రష్యామీద నెట్టాలి గనుక పశ్చిమ దేశాలు సాకుకోసం చూస్తున్నాయి.


ఒకవైపు రష్యాను బూచిగా చూపుతున్న పశ్చిమ దేశాలు మరోవైపు మరోకారణంతో నిజంగానే భయపడుతున్నట్లు కనిపిస్తోంది.చమురు ధరల పెరుగుదలతో రష్యా ఆర్ధికంగా బలపడటమే దానికి కారణం. అది పశ్చిమ దేశాల ఆంక్షలను తట్టుకొనేశక్తి ఇస్తుంది. చమురు ధరల పెరుగుదల కారణంగా దాని విదేశీమారక ద్రవ్య నిల్వలు 640బి.డాలర్లకు పెరిగాయి. ప్రభుత్వ రుణం జిడిపిలో 12శాతానికి తగ్గింది. ముడి చమురు ధర కనీసం వందడాలర్లకు చేరుతుందని అమెరికా వాల్‌స్ట్రీట్‌ భావిస్తున్నది.వివిధ కారణాలతో ఈఏడాది చివరికి 125 డాలర్లవుతుందని జెపి మోర్గాన్‌ అంచనా. నిత్యం రష్యామీద ఆంక్షల గురించి చెప్పే అమెరికన్లు అదే రష్యానుంచి మూడేండ్ల గరిష్ట స్ధాయిలో ప్రస్తుతం డీజిల్‌ దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం 1.55 మిలియన్‌ పీపాల డీజిలు ఈనెలాఖరుకు అమెరికా చేరనుంది. అమెరికా తూర్పు కోస్తాలోని చమురుశుద్ధి కర్మాగారాలకు లాభాలు తక్కువగా ఉండటంతో శుద్దిని పరిమితం చేశాయని, ఒక కర్మాగారంలో పేలుడు జరిగినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. కెనడా ఒక కర్మాగారాన్ని మూసివేయటం, ఐరోపా దేశాలే ప్రత్నామ్నాయం కోసం వెతుకున్నందున రష్యామీద ఆధారపడక తప్పటం లేదని తెలిపింది. దీనికి తోడు టెక్సస్‌లో చలి కారణంగా ఉత్పత్తికూడా తగ్గనుంది.


అమెరికా మీడియా అంతటా ప్రజాస్వామ్యం, ఐరోపాకు ముప్పు తక్షణం ఉక్రెయిన్‌ మీద దాడి జరగబోతున్నదంటూ పెద్ద ఎత్తున ఊదరగొడుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా మరో ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్లో రష్యన్లు మెజారిటీగా ఉన్న డాన్‌బాస్‌ ఇతర స్వయం పాలిత ప్రాంతాలపై ఉక్రెయిన్‌, నాటో, కిరాయి మూకలు దాడులు చేయనున్నట్లు రష్యా మీడియాలో రాస్తున్నారు.2014లో ఉక్రెయిన్‌ మిలిటరీ దాడులను డాన్‌బాస్‌ తిరుగుబాటుదార్లు తిప్పికొట్టారు.రష్యా సైనిక సమీకరణ చేస్తోందని చెబుతున్నవారు దశాబ్దాల తరబడి దానికి వ్యతిరేకంగా ఐరోపాలో 64వేల మందిని అమెరికా నిలిపివుంచిందని, మరో ఎనిమిదిన్నరవేల మందిని దింపుతోందని, అవసరమైతే మరో 50వేల మందిని దించేందుకు నిర్ణయించిందనే అంశాలను చెప్పటం లేదు. రష్యా లక్ష మందిని సరిహద్దులకు తరలించినట్లు గుండెలుబాదుకుంటున్నారు. నిజమే, రెండోవైపు ఉక్రెయిన్‌ తన మిలిటరీలో సగం అంటే లక్షా 25వేల మందిని రష్యా ముంగిట్లోకి తరలించింది.డాన్‌బాస్‌తో పాటు తిరుగుబాటు ప్రాంతాలైన డాన్‌టెస్క్‌, లుగాన్‌స్క్‌ ప్రాంతాలలోనే వారిని మోహరించింది. అక్కడి తిరుగుబాటుదార్లపై మిలిటరీ చర్యకు దిగి రష్యాను రెచ్చగొట్టి రంగంలోకి దింపాలన్నది అమెరికా ఎత్తుగడ. అదే జరిగితే ఆ పేరుతో మరిన్ని కఠినమైన ఆంక్షలు,నాటో విస్తరణ, మరిన్ని ఆయుధాలు అమ్ముకోవచ్చని, యుద్దంలోకి దిగవచ్చన్నది వ్యూహం. దాని దురూహలు ఫలిస్తాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d