• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Vladimir Putin

ఏ క్షణమైనా ఉక్రెయిన్‌ పతనం ! విశ్వగురువుగా మోడీ పాత్ర ఏమిటి ?

25 Friday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Narendra Modi Failures, NATO, Ukraine crisis, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


రష్యన్‌ దళాలు రెండవ రోజు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంవైపు కదులుతున్నాయి. రష్యా పోరుకు తాము దళాలను పంపేది లేదని అమెరికా, నాటో ప్రకటించాయి. అందువలన ఏ క్షణంలోనైనా అది పతనం కావచ్చు. తరువాత ఉక్రెయిన్‌ పాలకులను అదుపులోకి తీసుకుంటారా, మిలిటరీ లొంగిపోతుందా ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. కీవ్‌ తరువాత తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెస్కీ ప్రకటించాడు. తమను ముందుకు నెట్టి ఈ దేశాలు దూరం నుంచి చూస్తున్నాయని జెలెనెస్కీ అన్నాడు. ఇప్పుడు రష్యా వ్యతిరేక యుద్ద కూటమిని ఏర్పాటు చేయాలని కూడా అన్నాడు. ప్రపంచంలో శక్తివంతమైన దేశం దూరం నుంచి చూస్తోంది అని అమెరికానుద్దేశించి వాపోయాడు. పరస్పరం ఆంక్షల ఆంక్షల పర్వం కొనసాగుతోంది. మూడు వైపుల నుంచి రష్యా ముట్టడి, గగనతలంపై అదుపు సాధించిన కారణంగా అమెరికా, ఇతర నాటో దేశాల నుంచి గానీ ఉక్రెయిన్‌కు కొత్తగా ఆయుధాలు అందే అవకాశం లేదని, అందువలన అక్కడి మిలిటరీ పోరాడటమో లొంగిపోవటమో జరుగుతుందని సిఐఏ మాజీనేత పెట్రాస్‌ చెప్పాడు. పోలాండ్‌ వైపు నుంచి రోడ్డుద్వారా అందే అవకాశాలున్నా ఇప్పుడు పంపేదెవరు ?


ఉక్రెయిన్‌ అస్త్ర సన్యాసం చేస్తేనే చర్చలు జరుపుతామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ చెప్పాడు. తాము ఉక్రెయిన్‌ ఆక్రమణకు పాల్పడేందుకు నయా నాజీలం కాదని, అక్కడ ఎవరిని పాలకులుగా ఎన్నుకుంటారన్నది ఆ దేశ ప్రజల ఇష్టమని అన్నాడు. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా ఆక్రమణకు పాల్పడుతుందని, తనలో విలీనం చేసుకుంటుందని ప్రచారం మొదలెట్టాయి. ఉక్రెయిన్‌లో పోరాడేందుకు అమెరికా దళాలు వెళ్లటం లేదు, వెళ్లాలనుకోవటం లేదు, కానీ అమెరికా నాటో మిత్రదేశాలను రక్షించుకుంటామని మరోసారి హామీ ఇస్తున్నట్లు జోబైడెన్‌ స్పష్టంగా చెప్పాడు. ఆంక్షల విధింపు ఆత్మరక్షణ చర్యలేతప్ప తమకు రష్యాతో పోరుసల్పాలని లేదన్నాడు. ఒకరిపై ఒకరు కాల్చుకొనే ప్రపంచ యుద్దం ఉండదన్నాడు.నాటో కూటమి కూడా అదే చెప్పింది. అమెరికాలోని 52శాతం మంది ఉక్రెయిన్‌ వివాదంలో అమెరికా స్వల్ప పాత్ర పోషించాలని చెబితే, 20శాతం మంది అది కూడా వద్దని చెప్పినట్లు ఎపి-ఎన్‌ఓఆర్‌సి సర్వే వెల్లడించింది.ఇరవైఆరుశాతం మంది మాత్రం చురుకైనా పాత్రపోషించాలని చెప్పారు. బహుశా ఈ కారణంగానే జో బైడెన్‌ జోరు తగ్గించినట్లు చెప్పవచ్చు.ఆంక్షల ప్రకటనతో గురువారం నాడు పీపా ముడిచమురు ధర 106డాలర్లకు పెరిగింది. తరువాత ఇంధనాన్ని మినహాయించినట్లు ప్రకటించటంతో 99కి పడిపోయింది.శుక్రవారం నాడు తిరిగి 102 డాలర్ల వరకు పెరిగినా తిరిగి 98.74కు తగ్గింది.


మనది 138 కోట్ల జనాభాగల దేశం. దానికి నరేంద్రమోడీ ప్రధాని.ప్రపంచ నేతగా, విశ్వగురువుగా ఇంటా బయటా పొగడ్తలు అందుకుంటున్న స్ధితి.మన దేశం ప్రపంచ రాజకీయాల్లో పాత్ర వహించాలని అధికారానికి వచ్చిన రోజు నుంచీ నరేంద్రమోడీ చెబుతున్నారు, తహతహలాడుతున్నారు. తప్పులేదు, మన దేశానికి గౌరవాన్ని పెంచినా, మన ప్రయోజనాలను కాపాడినా సంతోషమే. ఎవరి చాణక్యమైనా, నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చేది కీలక పరిణామాలు జరిగినప్పుడే కదా ! ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన రష్యా-ఉక్రెయిన్‌ పరిణామాల్లో నరేంద్రమోడీ నాయకత్వం అలాంటి వాటిని ప్రదర్శించిందా ? అనేక దేశాల నేతల మాదిరి నరేంద్రమోడీ ఒక్క ప్రకటన కూడా బహిరంగంగా ఎందుకు చేయలేకపోయారు.


సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో మన ప్రతినిధి దేశ వైఖరిని వెల్లడించారు. ” అన్ని పక్షాలు ” ” పరిస్ధితి దిగజారకుండా” ” దౌత్యం ద్వారా ” పరిష్కరించుకోవాలనే ధ్వని, పరిధిలోనే మాట్లాడారు. ఇలా తటస్ధంగా ఉన్నందుకు రష్యా స్వాగతం పలికింది. జో బైడెను యంత్రాంగం గుర్రుగా ఉంది.ఉక్రెయిన్‌ తీవ్ర అసంతృప్తి వెల్లడించింది. అమెరికా మన సహజ భాగస్వామి అని పదే పదే చెప్పారు. ఏమోయి మోడీ అంటే ఏంటోయి బైడెన్‌ అంటూ భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడే బంధం ఉంది.( డోనాల్డ్‌ట్రంప్‌తో కౌగిలింతల గురించి చెప్పనవసరం లేదు.) అలాంటి వారు ఐరోపాలో ఇంత జరుగుతుంటే ముందుగానీ, పోరు ప్రారంభమైన తరువాత గానీ (ఇదిరాసిన సమయానికి) వారిరువురూ ఎందుకు సంప్రదింపులు జరపలేదు, అభిప్రాయ మార్పిడిగానీ ఎందుకు చేసుకోలేదన్నది పెద్ద ప్రశ్న. పోరు మొదలైన తరువాత పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడి దాడులను నివారించాలని కోరారు. ఇదే సమయంలో మరింతగా ఆజ్యం పోయవద్దు అని జో బైడెనుకు ఒక్క ముక్క చెప్పి ఫోన్‌పెట్టేసి ఉంటే మోడీ సర్కార్‌ నిజంగానే తటస్ధంగా ఉంది అనేది మరింతగా వెల్లడై ఉండేది. కానీ అది జరగలేదు, అన్నింటా మనకు మద్దతుగా ఉన్న నరేంద్రమోడీ ఈ అంశంలో మనతో మాట్లాడలేదు, ఏమైందో ఏమో పోనీ మనమే ఫోన్‌ చేద్దామని జో బైడెన్‌ కూడా అనుకోలేదు.


తీరా దాడులు మొదలైన తరువాత భారత్‌తో సంప్రదింపులు జరుపుతామని జో బైడెన్‌ గురువారం నాడు ప్రకటించారు. ఈ వివాదంలో మీ రక్షణ భాగస్వామి భారత్‌ పూర్తిగా మీ బృంద సభ్యురాలిగా ఉందా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భారత్‌తో సంప్రదింపులు జరపనున్నాం,ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మేము పూర్తిగా పరిష్కరించలేదు అని బైడెన్‌ చెప్పాడు.అందువలన నరేంద్రమోడీ నోరు విప్పి తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది. అంతకంటే ముందు భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి డాక్టర్‌ ఇగోర్‌ పోలిఖా విలేకర్లతో మాట్లాడుతూ ” ప్రస్తుతం మేము భారత్‌ నుంచి అన్ని రకాల రాజకీయ సాయం అందించాలని కోరుకుంటున్నాము.ప్రపంచంలోని శక్తివంతులైన నేతలలో ఒకరైన మోడీ గారికి రష్యాతో ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. కౌటిల్యుడు, చాణక్యుడి వంటివారితో దౌత్యంలో భారత్‌ ఎప్పుడో అర్హత సాధించింది. ఐరోపాలో నాగరికత లేని కొన్నివేల సంవత్సరాలనాడే భారత్‌లో ఈ స్ధితి ఉంది. అనేక సంవత్సరాలుగా ఇటీవల భారత్‌ ప్రభావం చూపే ప్రపంచ పాత్రధారిగా ఉంది. మహాభారతంలో మాదిరి మోడీ దౌత్యాన్ని ప్రదర్శించాలి ” అని కూడా చెప్పారు. అదే రాయబారి భారత వైఖరితో తాము తీవ్ర అసంతృప్తి చెందామని కూడా చెప్పాడు. ఇప్పుడు రష్యాదాడుల్లో 50 మంది మరణించినట్లు తెలిసింది, అదే వందలు, వేల మంది మరణించి ఉంటే ఏమై ఉండేది అంటూ భారత్‌ జోక్యం చేసుకోవాలని అన్నాడు. ఇదేదో కేవలం మా రక్షణ కోసమే కాదు, మీ దేశానికి చెందిన పదిహేనువేలమందికి పైగా ఉన్న విద్యార్దుల రక్షణ కూడా ఇమిడి ఉంది అని కూడా అన్నాడు. దీన్ని మొత్తంగా చూస్తే వారి అసంతృప్తి, అమెరికా అంతరంగాన్ని వెల్లడించటమే.భద్రతా మండలిలో భారత వైఖరిని ఎలా చూస్తున్నారన్న ప్రశ్నకు అమెరికన్‌ అధికారి సమాధానం చెప్పకుండా తప్పించుకోవటం కూడా దీన్ని నిర్దారించింది. తెరవెనుక అమెరికా మన వైఖరి మీద అసంతృప్తి ప్రకటించుతున్నట్లు వార్తలు వచ్చాయి.


నరేంద్రమోడీ చెప్పినట్లుగా జోబైడెన్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ వింటే సమస్య పరిష్కారం అవుతుందంటూ జాతీయ మీడియాలో కొంత మంది మోడీ గొప్పతనాన్ని చాటేందుకు ప్రయత్నించారు. అనేక హిందీ, ఆంగ్ల ఛానళ్లు కూడా అమెరికా మీడియా, లీకువార్తలను నిజమే అని నమ్మి ఇంకే ముంది ప్రపంచయుద్దం వచ్చేస్తోంది అన్నట్లు వార్తలను ప్రసారం చేశాయి, కానీ మోడీ వైపు నుంచి పోరు ప్రారంభానికి ముందు అలాంటి నివారణ చొరవ మనకు కనిపించదు.ఎక్కడా మన ప్రమేయం, పలుకుబడి కనిపించలేదు.తటస్ధం అంటే తప్పును తప్పని కూడా చెప్పకపోవటమా ?


ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో మన దేశం తటస్ధ వైఖరిని వెల్లడించింది. కానీ అంతర్జాతీయ విషయాల్లో అమెరికాకు లొంగిపోయిన అపఖ్యాతిని మోడీ సర్కార్‌ మన దేశానికి కలిగించింది. అణుపరీక్షల అంశంలో ఇరాన్‌ – అమెరికాకు, వామపక్ష వ్యతిరేకత కారణంగా లాటిన్‌ అమెరికాలో వెనెజులాతో అమెరికాకు పంచాయితీ తలెత్తింది. ఆ రెండు దేశాలూ మనకు మిత్రులే, రెండు చోట్ల నుంచీ మనం చమురు కొనుగోలు చేస్తున్నాము. కానీ వాటి మీద ఆంక్షలు విధిస్తూ ఎవరైనా వాటితో లావాదేవీలు జరిపితే ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. మన నరేంద్రమోడీ సర్కార్‌ వాటికి భయపడి చమురు కొనుగోలు నిలిపివేసింది. అమెరికాకు లొంగుబాటు తప్ప ఈ అంశాల్లో తటస్ధత ఎక్కడుంది. హాంకాంగ్‌ చైనాలో అంతర్భాగం, అక్కడ ఆందోళనలు దాని అంతర్గత అంశం. పశ్చిమదేశాలు దాన్ని రాజకీయం చేశాయి. వాటితో మనం గొంతు కలపకపోయినా అది వారి అంతర్గత వ్యవహారం అని మన దేశం చెప్పకపోగా ఐరాస మానవహక్కుల సంస్ధలో పశ్చిమ దేశాలకు సంతోషం కలిగే విధంగా ఆందోళన వెలిబుచ్చింది. ఇప్పుడు అమెరికా-ఇరాన్‌ అణు అంశంలో రాజీకుదుర్చుకోనున్నాయి, మన దేశం ఏముఖం పెట్టుకొని గతంలో ఇరాన్‌ ఇచ్చిన రాయితీధరలకు తిరిగి చమురు సరఫరా గురించి అడుగుతుంది ? ప్రపంచంలో మనం పలుచనకావటం లేదా ?


ఉక్రెయిన్‌ – రష్యా వివాదం గత కొద్ది నెలలుగా ముదురుతోంది. ఫిబ్రవరి 16న రష్యాదాడికి దిగనుందని అమెరికా ముందుగానే గడువు ప్రకటించింది.ఉక్రెయిన్లో దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్దులున్నారు. వారి సంక్షేమం, అవసరమైతే స్వదేశానికి రప్పించటం, దానిలో ఇమిడి ఉన్న సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం తగినంత ముందుగా పట్టించుకోని కారణంగా వారితో పాటు వారి కుటుంబాలు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన, అనిశ్చితికి గురవుతున్నారు. ఎందుకీ వైఫల్యం అంటే సమాధానం చెప్పేవారు లేరు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనాగ్రామాలు నిర్మించింది, లడక్‌లో మరొకటి చేసిందంటూ సమాచారం ఇచ్చిన అమెరికా ఎందుకు ఉక్రెయిన్లో పరిస్ధితి, పర్యవసానాల గురించి మనకు సమాచారం ఇవ్వలేదు ? మన కేంద్ర భద్రతా అధిపతి అజిత్‌దోవల్‌ను జేమ్స్‌బాండ్‌గా వర్ణిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లకు సలాం చేసి అమెరికా పారిపోవటాన్ని దోవల్‌ పసిగట్టలేదు. ఇప్పుడు వివిధ దేశాల నుంచి ఈ సంక్షోభం గురించిన సమాచారం సేకరించలేదా, అసలు పట్టించుకోలేదా ? పట్టించుకుంటే ఇప్పుడు విద్యార్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది కాదు కదా ? వారి తరలింపు గురించి తగినంత ముందుగానే ఏర్పాట్లు చేసి ఉంటే వారంతా తిరిగి వచ్చి ఉండేవారు, పరిస్ధితి చక్కబడిన తరువాత తిరిగి వెళ్లి ఉండేవారు.అలా జరగకపోవటానికి బాధ్యులెవరు ? ఉక్రెయిన్‌ ఉదంతం ప్రపంచదేశాలకు ఒక పాఠం నేర్పింది. అదేమంటే దాన్ని నమ్ముకొని మరొక దేశంతో తగాదా పెట్టుకోకూడదు, నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుంది. దీన్ని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటామా ? అమెరికా తోకపట్టుకు పోతామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : అమెరికా, రష్యా ఎత్తులకు పైఎత్తులు !

22 Tuesday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Joe Biden, NATO allies, RUSSIA, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ – రష్యా వివాదం కొత్త మలుపు తిరిగింది.ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులను గుర్తిస్తున్నట్లు సోమవారం నాడు రష్యా ప్రకటించింది. వెంటనే ఆ రిపబ్లిక్కులతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దంటూ ఆర్ధిక ఆంక్షలను అమెరికా అధినేత జోబైడెన్‌ ప్రకటించటంతో మరో రూపంలో వాటిని గుర్తించినట్లయింది. అంతకు ముందు వివాదం గురించి చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, రష్యా అధినేత పుతిన్‌ అంగీకరించారని, ఫిబ్రవరి 24న సమావేశం జరగవచ్చని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కార్యాలయం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఈ లోగా రష్యా దాడి జరపకపోతేనే తాను హాజరవుతానని బైడెన్‌ షరతు పెట్టారు.బైడెన్ను ఒప్పించటానికి పదిహేను నిమిషాలు పడితే పుతిన్‌తో మూడు గంటలు మాట్లాడాల్సి వచ్చిందని మక్రాన్‌ కార్యాలయం వెల్లడించింది. ఆ ప్రకటన ఇంకా చెవుల్లో గింగురు మంటుండగానే కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశం జరిగేదీ లేనిదీ చెప్పలేము. తాజా పరిణామాల గురించి చర్చించాలని భద్రతా మండలి సభ్యురాలు మెక్సికో, అమెరికా, ఉక్రెయిన్‌, ఐదు ఐరోపా దేశాలు భద్రతామండలిని కోరగా సోమవారం రాత్రి అత్యవసర భేటీ జరిగింది. పశ్చిమదేశాలన్నీ రష్యా చర్యను ఖండించగా మన దేశం తటస్ధ వైఖరి తీసుకొని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. తాజా పరిణామాలపై భద్రతా మండలి ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, తీసుకుంటే దాన్ని రష్యా వీటో చేస్తే జరిగేదేమిటి ? తాను గుర్తించిన రిపబ్లిక్కులతో స్నేహ ఒప్పందాలు చేసుకున్న రష్యా ఆ ప్రాంతాలకు శాంతి పరిరక్షక దళాలను పంపనున్నట్లు వార్తలు. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతానికి దళాలను పంపాలన్న పధకం ప్రస్తుతానికి లేదని ముప్పు తలెత్తితే ఆ పని చేస్తామని రష్యా ప్రకటించింది.


ఉక్రెయిన్‌పై దాడికి రష్యా పూనుకుందని నిర్ధారణగా తాము చెబుతున్నామని కొద్ది వారాలుగా మాట్లాడిన అమెరికా ఇప్పుడు భద్రతామండలి ద్వారా సరికొత్త పల్లవి అందుకుంది. డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులను గుర్తించటం ద్వారా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లయిందని,ఇది దాడేనని అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు గుండెలుబాదుకుంటున్నాయి. ఈ రెండు ప్రాంతాలూ 2014లోనే ఉక్రెయిన్‌ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకోసం అక్కడి జనం ఆయుధాలు పట్టారు. వారిని అణచివేసేందుకు ఉక్రెయిన్‌ పంపిన భద్రతా దళాలను తిప్పికొట్టి రిపబ్లికులుగా ప్రకటించుకున్నారు. ఇప్పటి వరకు అదే స్ధితి కొనసాగుతోంది.2014 బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి గతవారంలో ఉక్రెయిన్‌ మిలిటరీ కాల్పులు జరిపింది, ప్రతిగా తిరుగుబాటుదార్లు కూడా స్పందించారు.


గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ రిపబ్లిక్‌ల స్వాతంత్య్రప్రకటనను సాంకేతికంగా గుర్తించలేదు తప్ప అనేక అంశాలలో గుర్తింపు దేశాలతో మాదిరే రష్యా వ్యహరిస్తోంది.2014 మే నెలలో జరిపిన డాన్‌టెస్క్‌ ప్రజాభిప్రాసేకరణలో 75శాతం మంది పాల్గొనగా 89శాతం స్వయం పాలనకు మద్దతు ఇచ్చారు. 2016 నుంచి డాన్‌టెస్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ పేరుతో పాస్‌పోర్టులు జారీచేస్తున్నారు.2019 జూన్‌ నుంచి డాన్‌టెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కులోని జనాలకు రష్యా తన పాస్‌పోర్టులను జారీ చేయటం ప్రారంభించి ఇప్పటి వరకు ఆరులక్షల మందికి జారీ చేసింది. మానవతాపూర్వకమైన సాయంగా తామీ పని చేస్తున్నట్లు పేర్కొన్నది. ఈ రెండు రిపబ్లిక్కులలో ఉక్రెయిన్‌ పాస్‌పోర్టులను గుర్తించటం లేదని అదే ఏడాది ప్రకటించారు. ఉక్రెయిన్‌ రిజిస్ట్రేషన్‌ ఉన్న మోటారువాహనాలు తమ ప్రాంతాల్లోకి రావటాన్ని అక్రమం అని డాన్‌టెస్క్‌ ప్రకటించింది. 2014లో అధికార భాషలుగా ఉక్రేనియన్‌, రష్యన్‌ ఉంటాయని ప్రకటించిన డాన్‌టెస్క్‌ 2020లో రష్యన్‌ ఒక్కదాన్నే గుర్తిస్తున్నట్లు పేర్కొన్నది. ఇప్పుడు ఈ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది. ఇంతకాలం ఈ రిపబ్లిక్‌లను ఆక్రమించేందుకు రష్యా పధకం వేసినట్లు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ప్రచారం చేశాయి.
తాజాగా వెల్లడైన సమాచారాన్ని బట్టి నాటో విస్తరణ గురించి ఆ కూటమి దేశాలు గతంలో రష్యాకు ఇచ్చిన వాగ్దానం నుంచి వైదొలిగినట్లు జర్మన్‌ పత్రిక డెర్‌ స్పీగెల్‌ ఒక బ్రిటన్‌ పత్రాన్ని బయట పెట్టింది. నాటోను విస్తరించబోమని అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ మాస్కోకు వాగ్దానం చేసిన అంశం గురించి చర్చించినట్లు ఆ పత్రంలో ఉంది.1991 మార్చి ఆరవ తేదీన బాన్‌ పట్టణంలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో దీని గురించి చర్చించారు. ” అధికార లేదా అనధికారికంగా కూడా నాటోను తూర్పు వైపు విస్తరించకూడదు ” అని ఐరోపా, కెనడాలతో సంబంధాలు నెరిపే అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి రేమాండ్‌ సెట్జ్‌ ప్రకటనను దానిలో ఉటంకించారు. తూర్పు ఐరోపా దేశాలకు నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్న సాధారణ ఒప్పందం ఉనికిలో ఉన్న అంశాన్ని బ్రిటన్‌ ప్రతినిధి చర్చల్లో ప్రస్తావించినట్లు కూడా ఆ పత్రంలో ఉంది.” 2+4 సంభాషణల్లో నాటోను ఎల్‌బె నది ఆవలకు విస్తరించకూడదని మనం స్పష్టం చేశాం, కనుక పోలాండ్‌తో సహా ఇతరులెవరికీ నాటో సభ్యం ఇవ్వకూడదని ” నాటి పశ్చిమ జర్మనీ ప్రతినిధి జర్‌జెన్‌ హ్రౌబోగ్‌ అన్నాడు.


డెర్‌ స్పీగల్‌ ప్రచురించిన పత్రాన్ని తొలుత అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ జాషువా షిఫ్రిన్స్‌న్‌ బ్రిటన్‌ నేషనల్‌ ఆర్కైవ్స్‌లో కనుగొన్నాడు. దాని మీద రహస్యం అనే ముద్ర ఉంది, తరువాత దాన్ని బహిర్గతం చేశారు. నాటోను విస్తరించకూడదనే వాగ్దానం లేదని సీనియర్‌ విధాన నిర్ణేతలు చెప్పవచ్చు కానీ ఈ పత్రం వాస్తవాన్ని చెబుతున్నదని షిఫ్రిన్స్‌న్‌ పేర్కొన్నాడు. ఎనిమిది సంవత్సరాల తరువాత నాటో విస్తరణ జరిగింది. ఒక్క అంగుళం మేరకు కూడా తూర్పు వైపు నాటో విస్తరణ జరగదని వాగ్దానం చేశారని డిసెంబరు నెలలో వ్లదిమిర్‌ పుతిన్‌ పత్రికా గోష్టిలో చెప్పారు. అలాంటిదేమీ లేదని, తెరవెనుక ఒప్పందాలేమీ లేవని నాటో సెక్రటరీ జనరల్‌ జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ అన్నాడు.1999లో పోలాండ్‌, హంగరీ, చెకియాలను, 2004లో మాజీ సోవియట్‌ రిపబ్లిక్కులు ఎస్తోనియా, లాత్వియా, లిధువేనియాలను చేర్చుకున్నారు. దీంతో నాటో దళాలు రష్యాలోని సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరానికి 135 కిలోమీటర్ల దూరంలోకి వచ్చినట్లయింది. మరోవైపు నుంచి ఇంకా దగ్గరకు వచ్చేందుకు ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వాలని నాటో నిర్ణయించింది. ఇదే ఉద్రిక్తతలకు మూలం.


ఉక్రెయిన్‌ పేరుతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆర్ధిక లబ్ది పొందేందుకు అమెరికా పధకం వేసిందనే తర్కం కూడా వినిపిస్తోంది. అక్కడి మిలిటరీ-పారిశ్రామికవేత్తలకు ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధం ఉంటేనే వారి ఉత్పత్తులు అమ్ముకొని లబ్ది పొందవచ్చు. ఐరోపాకు ముప్పును ఎదుర్కొనే పేరుతో ఏర్పాటు చేసిన నాటో ద్వారా జరుగుతున్నది అదే. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా రెచ్చగొట్టినన్ని ఉద్రిక్తతలు, యుద్ధాలు మరొక దేశం వైపు నుంచి లేవు. రేథియాన్‌ అనే అమెరికన్‌ కంపెనీ క్షిపణులు, ఇతర ఆయుధాల తయారు చేస్తుంది. జనవరి చివరిలో దాని సిఇఓ గ్రెగ్‌ హేస్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ లేదా ఇతర భద్రతా ముప్పులు అంతర్జాతీయ అమ్మకాలకు అవకాశాలను కల్పిస్తుందని చెప్పాడు. అమెరికాకు ఉద్రిక్తతలు కొనసాగినా లాభమే. గత కొద్ది నెలలుగా తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల నుంచి పెట్టుబడులు అమెరికా ద్రవ్య మార్కెట్‌కు తరలుతున్నాయి. దీని వలన ద్రవ్య సరఫరా పెరుగుతుంది, బాండ్ల రేటు స్ధిరపడుతుంది, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం అదుపులో ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా విదేశాంగ విధానాన్ని ఆయుధ కంపెనీలు నిర్దేశిస్తున్నాయి.


తీర్మానాలతో నిమిత్తం లేకుండానే అమెరికా, ఇతర నాటో దేశాలు గతంలో ఇరాక్‌ మీద దాడి చేసినప్పటికీ భద్రతామండలి చేసిందేమీ లేదు. అలాగే ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో అది చేసే తీర్మానం లేదా నిర్ణయం గురించి (ఇది రాస్తున్న సమయానికి ) ఇంకా తెలియదు. ఏ తీర్మానం చేసినా రష్యా వీటో చేస్తే వీగిపోతుంది. ఇప్పుడేం జరుగుతుంది అన్నది ఆసక్తికలిగించే అంశం. రష్యా గుర్తింపుతో నిమిత్తం లేకుండానే అంతకు ముందునుంచే డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్‌లపై ఉక్రెయిన్‌ దళాలు దాడులను ప్రారంభించాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ రిపబ్లిక్‌ల తిరుగుబాటుదార్లకు రష్యా మద్దతు బహిరంగ రహస్యమే. 2015లో కుదిరిన మిన్‌స్క్‌ ఒప్పందం ప్రకారం ఆ రెండు ప్రాంతాలు ఉక్రెయిన్లో స్వయం పాలిత ప్రాంతాలుగా ఉండవచ్చు. కానీ అది ఇంతవరకు అమలు జరగలేదు. 2008లో రష్యా-.జార్జియా యుద్ధానంతరం జార్జియాలోని అబ్కాజియా, దక్షిణ ఒసెటియా ప్రాంతాలు స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా, వెనెజులా, నికరాగువా, సిరియా, నౌరు గుర్తించాయి. ఆ రెండు ప్రాంతాలూ పరస్పరం గుర్తించుకున్నాయి. వాటికి ఇంతవరకు ఐరాస సభ్యత్వం లేదు.


ఐరాసలో చేరాలంటే ఐరాస నిబంధనలను అంగీకరిస్తున్నట్లు సంస్ధ సెక్రటరీ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును భద్రతామండలికి నివేదిస్తారు. పదిహేను మంది సభ్యులున్న మండలిలో కనీసం తొమ్మిది మంది దాన్ని ఆమోదించాలి. శాశ్వత సభ్య దేశాలైన చైనా, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యాలలో ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఓటు వేయకూడదు. అలా సిఫార్సు చేసిన తీర్మానాన్ని ఐరాస సాధారణ అసెంబ్లీకి నివేదిస్తారు. అక్కడ మూడింట రెండువంతుల దేశాలు ఆమోదించాలి. ఆ రోజు నుంచి సభ్యత్వం వస్తుంది. సాధారణ అసెంబ్లీ ప్రతి సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధుల అర్హతలను తొమ్మిది మంది సభ్యుల కమిటీ పరిశీలిస్తుంది. సదరు ప్రతినిధిని పంపిన ప్రభుత్వం చట్టబద్దమైనదా కాదా అని ఎవరైనా ప్రశ్నించినపుడు మెజారిటీ ఓటుతో నిర్ణయిస్తారు. ఈ నేపధ్యంలో స్వాతంత్య్రం ప్రకటించుకున్న దేశాలన్నీ ఐరాసలో చేరే అవకాశం లేదు. ఐరాసతో నిమిత్తం లేకుండా ఏ దేశమైనా గుర్తించి సంబంధాలు పెట్టుకోవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు.


డాంటెస్క్‌, లుహనస్క్‌ రిపబ్లిక్‌లను గుర్తించిన వెంటనే రష్యావాటితో స్నేహ ఒప్పందాలు కూడా చేసుకుంది.దాని మేరకు శాంతిపరిరక్షణకు కొన్ని దళాలను పంపింది. ఈ చర్య ఉక్రెయిన్‌పై దాడి అని పశ్చిమ దేశాలు వర్ణిస్తున్నాయి. రష్యా మీద మరిన్ని ఆంక్షలను ప్రకటిస్తామని చెప్పాయి. ఎలాంటి కారణం లేకుండా కూడా తమ మీద ఆంక్షలు విధించటం చూశామని, దీనిలో కొత్తేముందని రష్యా విదేశాంగ మంత్రి అన్నారు. తాము స్వంతంగా కొన్ని ఆంక్షలు ప్రకటిస్తామని అమెరికా చెప్పింది. బ్రిటన్‌ కొన్ని బాంకులపై ఆంక్షలు విధించింది. సముద్రగర్భం నుంచి వేసిన గాస్‌, చమురు గొట్టపు మార్గ పధకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ పేర్కొన్నది. తిరుగుబాటు రిపబ్లిక్‌లపై మిలిటరీతో పాటు కిరాయి మూకలను కూడా ఉక్రెయిన్‌ ప్రయోగిస్తున్నది. ఉక్రెయిన్‌ పూర్తి స్ధాయి దాడులకు దిగితే ఏం జరుగుతుందన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గడువుల పేరుతో అమెరికా అబద్దాలు – కొనసాగుతున్న ఉక్రెయిన్‌ ఉద్రిక్తత !

20 Sunday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#US Lies, Donbass, Joe Biden, Minsk agreements, NATO, RUSSIA, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరుపుతుంది, కాదు ఫిబ్రవరి 20వ తేదీన జరపనుంది, లేదు లేదు ఎప్పుడైనా డాడి జరపాలనే నిర్ణయించింది. ఇవన్నీ గత కొద్ది రోజులుగా అమెరికా చెబుతున్నమాటలు. ఇప్పటి వరకైతే జోబైడెన్‌ ఎత్తుగడ ఈ ఉదంతంలో అభాసుపాలైంది. చివరికి పశ్చిమదేశాలతో చేతులు కలిపిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోల్దోమిర్‌ జెలెన్‌స్కీ కూడా అసహనాన్ని వెలిబుచ్చాడు.” ఈ రోజు రష్యా దాడి చేస్తుంది, రేపు చేస్తుందీ అంటూ రోజుకొక తేదీని చెబుతారెందుకు ? మీరు నిజంగా మాకు సాయం చేయాలనుకుంటే తేదీలు చెప్పవద్దు. ఫిబ్రవరి 16, మార్చి ఒకటి, డిసెంబరు 31 ఏదైనా కావచ్చు, మా నేలను కాపాడుకొనే సత్తా మాకు ఉంది. మీరు ఎలాంటి షరతులు లేకుండా డబ్బు ఇవ్వండి. కొంత సొమ్మును కేటాయించిన ప్రతిసారీ ఒకటి ,రెండు, మూడు, నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది, పది సంస్కరణలు మేమెందుకు చేయాలి. రండి, మా మిలిటరీని పటిష్టపరిచేందుకు తోడ్పడండి, మరిన్ని ఆయుధాలు ఇవ్వండి, మా ఆర్ధిక రంగంలో పెట్టుబడులు పెట్టండి, మీ కంపెనీలతో పెట్టించండి. మాకు నిధులు, గ్రాంట్లు ఇవ్వండి. దానికి బదులు ఫలానా రోజు రష్యా దాడి చేస్తుంది అంటూ నిరంతరం చెప్పటం అవసరమా ” అని జెలెనెస్కీ ప్రశ్నించాడు. మ్యూనిచ్‌ నగరంలో జరిగిన ఐరోపా భద్రతా సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఏ క్షణమైనా దాడి జరగవచ్చు, తరువాత ఆంక్షలు ప్రకటిస్తే జరిగేదేమీ ఉండదు కనుక ముందుగానే ఆ పని చేయాలని ఆదివారం నాడు ఉక్రెయిన్‌ కోరింది. ఈ వారంలోనే దాడి జరగవచ్చు, అది రాజధాని కీవ్‌ పట్టణం మీదే అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నాడు. శనివారం నాడు రష్యా ఖండాంతర క్షిపణులతో విన్యాసాలు జరిపి నిర్ణీత లక్ష్యాాలను గురితప్పకుండా కొట్టింది. ఆదివారం నాడు ముగియాల్సిన రష్యాతో సైనిక విన్యాసాలను మరికొద్ది రోజులు పొడిగించనున్నట్లు బెలారస్‌ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిను తిరుగుబాటు ప్రాంతాల నుంచి ఆదివారం నాడు కూడా పౌరులు ముఖ్యంగా పిల్లలు రష్యాకు వెళుతున్నట్లు వార్తలు వచ్చాయి. తిరుగుబాటుదార్లు, మిలిటరీ పరస్పరం కాల్పులు జరిపినట్లు కూడా చెబుతున్నారు.


రేపేం జరుగుతుంది అన్నది అనిశ్చితం. ఇప్పటి వరకు ఉక్రెయిను మీద దాడి గురించి చెప్పిన మాటలు వాస్తవం కాదని, ప్రచార దాడి అని తేలింది. గతంలో ఇరాక్‌ మీద దాడి చేసేందుకు సద్దాం హుసేన్‌ ప్రభుత్వం మారణాయుధాలను గుట్టలుగా పోసి ఉంచిందంటూ తప్పుడు ప్రచారం చేసింది అమెరికా, వాటిని కనుకొని నాశనం చేసే పేరుతో ఏకంగా ఇరాక్‌ మీద దాడి చేసింది, సద్దాంను ఉరితీసింది. తీరా అక్కడ అలాంటి వాటి జాడలు కూడా లేవని అదే అమెరికా అధికారులు అంతా ముగిశాక ప్రకటించారు. ఇప్పుడు తిరిగి ఆ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నది. ఇది 1990 దశకం కాదు, రష్యా – ఇరాక్కు, సద్దాం హుసేన్‌, వ్లదిమిర్‌ పుతిన్‌కు పోలిలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే ఐరోపాలో అమెరికా పలుకుబడి మరింత తగ్గటానికి, దాని పరువు పోగొట్టటంలో పుతిన్‌ తన తెలివితేటలను ఉపయోగించాడనే చెప్పాలి.


ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతినెలా వివిధ దేశాల సైనిక విన్యాసాలు, ఆయుధ ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ యుద్దం చేసేందుకు కాదు, బల ప్రదర్శన మాత్రమే. ఉక్రెయిన్‌, రష్యా సరిహద్దులు కలిగిన బెలారస్‌తో కొద్ది రోజుల క్రితం రష్యా సైనిక విన్యాసాలు జరిపింది. వాటిని చూపి ఇంకేముంది అవి ముగియగానే పనిలో పనిగా ఉక్రెయిన్‌ మీద ఫిబ్రవరి 16న దాడి చేస్తారని అమెరికా చెప్పింది. అనేక మంది నిజమే అని నమ్మారు. కీవ్‌ నుంచి తమ రాయబార సిబ్బంది కుటుంబాలను వెనక్కు రప్పించే నాటకాన్ని కొన్ని దేశాలు రక్తి కట్టించాయి. సరిహద్దుల్లోని తమ దళాలను కొన్నింటిని ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించగానే మా దెబ్బకు దిగివచ్చిందని ఉక్రెయిన్‌ నేత తన జబ్బలను తానే చరుచుకున్నాడు. కానీ కొద్ది గంటల్లోనే పశ్చిమ దేశాలు రెండో ఎత్తుగడలో భాగంగా కొత్త కతలు చెప్పటం ప్రారంభించాయి. మరోవైపున స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కుల మీద అదేశ మిలిటరీ దాడులు జరిపి రష్యాను రెచ్చగొట్టింది.


2014 నుంచి ఆ రెండు ప్రాంతాల్లోని జనం తిరుగుబాటు చేస్తున్నారు. దాదాపు పదిహేనువేల మంది మరణించారు. మిలిటరీ సరిహద్దుల రక్షణ, ఇతర దేశాల దాడులను ఎదుర్కొనేందుకు తప్ప స్వంత జనం మీద దాడులు చేసేందుకు కాదు.2014 బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి.దీనిలో గమనించాల్సిన అంశం ఏమంటే స్వాతంత్య్రం ప్రకటించుకున్న రిపబ్లిక్కులు రష్యాసరిహద్దులో ఉన్నందున ఉక్రెయిన్‌ మిలిటరీని సరిహద్దు ప్రాంతాల్లో అనుమతించాల్సి ఉంది. ఈ ఒప్పందం కూడా సరిగా అమలు జరగనప్పటికీ అమల్లోనే ఉన్నాయి.


ఈ ఒప్పందాల అమలు గురించి కాకుండా, అమెరికా, నాటో కూటమిలోని కొన్ని దేశాలు ఉక్రెయినుకు ముప్పు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. నాటో విస్తరణలో భాగంగా జరిగిన కుట్రలో 2014లో జరిగిన ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని ఆ కూటమి గద్దెనెక్కించింది. ఏ క్షణంలోనైనా విస్తరణ జరగవచ్చని భావించిన రష్యా వెంటనే పావులు కదిపింది. ఒకప్పటి తన భూభాగమైన క్రిమియాలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో రష్యాలో విలీనం కావాలని మెజారిటీ పేర్కొనటంతో వెంటనే రష్యా ఆపని పూర్తి చేసింది. దీంతో కంగుతిన్న పశ్చిమ దేశాలు అప్పటి నుంచి రష్యామీద ఆంక్షలను అమలు జరుపుతున్నాయి. వాటి వలన ఫలితం లేకపోవటంతో అసలు మొత్తంగా ఉక్రెయిన్‌ ఆక్రమణ జరుపుతుందంటూ ప్రచారం, తేదీల నిర్ణయం చేశారు.


మిన్‌స్క్‌ ఒప్పందాల్లో రష్యా భాగస్వామి కనుక దానికి భిన్నంగా ఆ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తే ఆ పేరుతో దాడికి దిగాలని పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో కాచుకున్నాయి. పుతిన్‌ అందుకు అవకాశం ఇవ్వలేదు. గుర్తింపు ఇవ్వాలంటూ ఇటీవల కమ్యూనిస్టు ఎంపీలు ప్రతిపాదించిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించినప్పటికీ పుతిన్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. నాటో విస్తరణ-ఉక్రెయిన్‌ చేరిక గురించి మాట్లాడేదేమీ లేదని పుతిన్‌ చెబుతుండగా దానికి తాము సిద్దంగా లేమని అమెరికా చెబుతోంది. స్వాతంత్య్ర ప్రకటన చేసిన రిపబ్లిక్కులు రష్యాలో విలీనానికి కూడా సిద్దమే. అయితే అవి క్రిమియా వంటివి కాదు గనుక రష్యాతొందరపడటం లేదు. ఆ పని చేస్తే వెంటనే నాటో ఉక్రెయిన్లో తిష్టవేసి రోజువారి తలనొప్పి కలిగిస్తుంది. తన సభ్యదేశం కాని చోట నాటో దళాలను మోహరించే వీలు లేదు. ఐరోపాను మరింతగా తన కబంధ హస్తాల్లో బిగించేందుకు అమెరికా పావులు కదపటాన్ని జర్మనీ వంటి దేశాలు అంగీకరించటం లేదు.


నిబంధనలు, అవగాహనలకు విరుద్దంగా నాటో దేశాలు ఉక్రెయినుకు అన్ని రకాల సాయం చేస్తూ రష్యాను కవ్విస్తున్నాయి.2014 నుంచి 270 కోట్ల డాలర్ల మేర మిలిటరీ సాయం అందించగా ఒక్క 2021లోనే అమెరికా 65 కోట్ల డాలర్ల మేర అందించింది. ఈ ఏడాది ఇప్పటికి 20 కోట్ల మేరకు అందించారు. బ్రిటన్‌ 460టన్నుల మేరకు అనేక రకాల ఆయుధాలను చేరవేసింది. నిబంధనల మేరకు చూస్తే వీటిని చూపి రష్యా మిన్‌స్క్‌ ఒప్పందం నుంచి వైదొలిగి నేరుగా తిరుగుబాటు రిపబ్లికులకు అన్ని రకాల సాయం చేయవచ్చు గానీ దానికి పూనుకోలేదు.


అమెరికా, ఐరోపాలోని నాటో దేశాలకు రష్యన్లు కొన్ని అంశాలను స్పష్టం చేశారు. గత కొద్ది నెలలుగా అమెరికా, దాని మిత్రదేశాలు చెబుతున్నట్లుగా ఉక్రెయిను మీద ఎలాంటి దాడి ఉండదు. ఆశ్చర్యకర పరిణామాలూ జరగవచ్చు. మూడవది చర్యకు ప్రతి చర్య ఉంటుంది. అమెరికాకు పంపిన ఒక పత్రంలో నిర్దిష్ట ప్రతిపాదనలను చేశారు. వాటిలో ఒకదానిలో ఇలా ఉంది. ” ఉక్రెయిన్‌, జార్జియాలను నాటోలో చేర్చుకోవటమే కాదు, నామమాత్ర సభ్యత్వం కూడా ఇవ్వకూడదు. సభ్యులు కాని దేశాలలో అమెరికా మిలిటరీ కేంద్రాలు, ఆయుధ నిల్వల వంటి మిలిటరీ చర్యలు, రష్యాను లక్ష్యంగా చేసుకొనే ద్విపక్ష మిలిటరీ ఒప్పందాలు ఉండకూడడు ”. రుమేనియా, పోలాండ్‌లో ఉన్న మధ్యంతర, స్వల్పశ్రేణి అణుక్షిపణులను, బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలోని యుద్దనావలు, రష్యాగగన తలానికి సమీపంలోని అణుబాంబర్లను తొలగించాలని కూడా కోరింది. మిన్‌స్క్‌ ఒప్పందాలను అమలు జరపాలి, ఆ మేరకు డాన్‌బాస్‌ ప్రాంతానికి ప్రత్యేక హౌదా ఇవ్వాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్‌ చెప్పారు. ఈ ఒప్పందాల ప్రకారం తిరుగుబాటు ప్రాంతాలకు రష్యా ఎలాంటి ఆయుధాలను పంపకూడదు. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ ప్రాంతాలపై ఉక్రెయిన్‌ మిలిటరీ దాడి చేస్తే తిరుగుబాటుదార్లకు మద్దతుగా రష్యా రంగంలోకి దిగేట్లుగా ఇప్పుడు కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి. ఇవి ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయినే ముందుగా దాడికి దిగుతుందా ? చమురు ధరల పెరుగుదలతో బలపడుతున్న రష్యా !

08 Tuesday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

NATO allies, NATO war threats against Russia, RUSSIA, Ukraine attack on Donbass, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఆయుధ ఉత్పత్తిదారులు, వారికి మద్దతు ఇచ్చే అంతర్జాతీయ మీడియా ఉన్మాదులు తప్ప యుద్దాలు జరగాలని ఏ ఒక్కదేశమూ కోరుకోదు, ఎవరూ సిద్దంగా కూడా లేరు. ఉక్రెయిన్‌ యుద్ధం వస్తుందా రాదా, రేటింగులు పెరుగుతాయా లేదా అని కొందరు ఉగ్గపట్టుకొని చూస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి, రష్యా గత కొద్ది వారాలుగా ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దులకు తమ మిలిటరీలను తరలిస్తున్నాయి. వాస్తవంగా అక్కడేం జరుగుతోందో చెప్పలేము గాని ఏ క్షణంలోనైనా రష్యాదాడులకు దిగవచ్చని పశ్చిమ దేశాల, ముఖ్యంగా అమెరికన్‌ వార్తా సంస్దలు రెచ్చిపోయాయి.


తాజాగా వస్తున్న ఊహాగానాలు, వార్తల స్వభావం ఏమంటే రష్యా సంగతేమోగానీ దాని మద్దతు ఉన్న ఉక్రెయిన్‌ తిరుగుబాటు ప్రాంతాలలో ఒకటైన డాన్‌బాస్‌పై అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్‌ దళాలే దాడులకు దిగి రష్యాను కవ్వించవచ్చని చెబుతున్నారు. ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. రోజులు గడిచే కొద్దీ నాటో కూటమిలోని విబేధాలు మరింతగా వెల్లడి అవుతున్నాయి. వీటికి తోడు ముడి చమురు ధర ఇప్పటికే 93డాలర్లు దాటింది. వంద దిశగా వెళతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికా-ఐరోపా దేశాలలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల భయపెడుతున్నాయి.యుద్దం వస్తుందో లేదో, ఎవరు గెలుస్తారో, వస్తే ఎంతకాలం జరుగుతుందో తెలియదు గానీ రష్యానుంచి చమురు, గాస్‌ ఆగిపోతే ఏమి చేయాలా అని పశ్చిమ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.నలభైశాతం గాస్‌ అక్కడి నుంచే వస్తున్నది.


ప్రస్తుతం ఐరోపా యునియన్‌ అధ్యక్ష స్ధానంలో ఉన్న ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మాస్కోలో పుతిన్‌తో భేటీ జరిపారు.సంప్రదింపుల ద్వారా ఉద్రిక్తతలను నివారించవచ్చనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వాన్ని అంగీకరించే సమస్యే లేదని పుతిన్‌ మరోసారి తెగేసి చెప్పారు.పూర్వం తనలో భాగమై తరువాత పాలనా పరంగా ఉక్రెయిన్‌కు అప్పగించిన క్రిమియా ప్రాంతాన్ని అక్కడి ప్రజాభిప్రాయ సేకరణ తీర్పు ప్రకారం 2014లో రష్యా తనలో విలీనం చేసుకున్న అంశం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఆంక్షలు అమలు జరుపుతున్నాయి. ఆ తరువాత రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్‌ స్వయపాలిత ప్రాంతాలు కొన్నింటిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అవి కూడా రష్యాతో విలీనానానికి మొగ్గుచూపాయి. ఉక్రెయిన్‌ పాలకులు అంగీకరించకపోవటంతో అక్కడ అంతర్యుద్ధం సాగుతోంది. వాటిలో ఒకటే డాన్‌బాస్‌. అది భౌతికంగా ఉక్రెయిన్లో ఉన్నా తిరుగుబాటుదార్లదే పెత్తనం, వారికి రష్యామద్దతు బహిరంగ రహస్యం.


తనది గాకపోతే తాటిమట్టతో అన్నట్లుగా అమెరికా, ఇతర దేశాలను చూసి చేతులు కాల్చుకొనేందుకు ఉక్రెయిన్‌ సిద్దంగా ఉందా అన్నది సందేహమే. 2015లో తిరుగుబాటుదార్ల చేతిలో జరిగిన పరాభవాన్ని అక్కడి పాలకులు మరచిపోలేదు. ఇతరులు ఇచ్చిన ఆయుధాలతో ఈసారి దెబ్బతీయవచ్చని కొందరు రెచ్చగొడుతున్నారు. ఇదే సమయంలో తిరుగుబాటుదార్లకూ మెరుగైన ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి,వాటికి రష్యా అండ కూడా ఉంది. అమెరికాకు యుద్దం ఎందుకు ?


2008 ఆర్దిక సంక్షోభం నుంచి అమెరికా, ఇతర ఐరోపాధనిక దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ద ఇంకా కోలుకోలేదు.కరోనాకు ముందే మరో మాంద్యంలోకి కూరుకుపోనుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. కరోనాతో ప్రపంచ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున లబ్దిపొందారు. అది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు గనుక కొత్తగా లాభాల కోసం దారులు వెతుకుతున్నారు.2008 సంక్షోభం తరువాత అమెరికా కేంద్రీకరించిన దేశాల్లో చమురు ఎగుమతి చేసే ఇరాన్‌, వెనెజులా,రష్యా, ఇరాక్‌, సిరియా వంటివి ఉన్నాయి. వాటిపై ఆంక్షలు విధించిన అమెరికా ఈ కాలంలో మనవంటి దేశాలకు చమురు ఎగుమతిదేశంగా ముందుకు వచ్చి సొమ్ము చేసుకున్న అంశం తెలిసిందే. రష్యానుంచి ఐరోపాకు గాస్‌ను సరఫరా చేసే రెండవ పైప్‌ లైన్‌ నోర్డ్‌ స్ట్రీమ్‌ దాదాపు పూర్తి కావచ్చంది. దాన్ని అడ్డుకొనేందుకు ఉక్రెయిన్‌ పేరుతో అమెరికా రాజకీయాలు చేస్తోంది.


యుద్దం లేదా యుద్దవాతావరణం నాటోలోని ప్రధాన దేశాలకు లాభాల పండిస్తోంది.1991-2014 మధ్య ఉక్రెయిన్‌కు అమెరికా నాలుగుబిలియన్‌ డాలర్లు కేటాయించగా, గత ఎనిమిది సంవత్సరాల్లో 2.5బిడాలర్లు ఇచ్చింది. అదిగాక ఇతర దేశాలు కూడా 10బి.డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. ఉక్రెయిన్‌ నౌకాదళాన్ని నవీకరించే పేరుతో బ్రిటన్‌ 1.7బి.పౌండ్లను పెట్టుబడిగా పెట్టింది. ఇవన్నీ బ్రిటన్‌, ఇతర కంపెనీలకు లబ్ది చేకూర్చేవే. నాటో దేశాల ఆయుధ కంపెనీలను మేపేందుకు 2014-22 మధ్య ఉక్రెయిన్‌ జిడిపిలో మూడు నుంచి ఆరుశాతానికి మిలిటరీ ఖర్చు 11బి.డాలర్లకు పెంచింది. అనేక ఐరోపా దేశాలు అమెరికా మీద ఆధారపడటం కూడా మరోవైపు అవి ఇష్టం లేకున్నా రష్యామీద పోరుకు సిద్దం అనాల్సి వస్తోంది.బ్రిటన్‌ ప్రపంచాధిపత్యంలో జూనియర్‌ వాటాదారుగా అమెరికాతో చేతులు కలుపుతోంది. రష్యామీద ఆంక్షలను వ్యతిరేకించే దేశాల్లో ఇటలీ ఒకటి. దాని పెట్టుబడులు అక్కడ ఉండటమే కారణం.


ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ ఇప్పుడు యుద్దాన్ని కోరుకోవటం లేదు.దానికి రష్యా హీటింగ్‌ చమురు, గాస్‌ అవసరం. ఒకవేళ పోరు జరిగితే అమెరికా నుంచి అధిక ధరలకు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందన్నది వారి భయం. ఇదే పరిస్ధితి మిగతా దేశాలకూ దాపురిస్తుంది. తమ కంపెనీల లాభం కోసం అమెరికా సృష్టించిన ఈ సంక్షోభానికి పావులుగా మారటమా లేదా అన్నది వాటి ముందున్న సమస్య. ఘర్షణలో ఉన్న పక్షాలకు ఆయుధాలు అందించ కూడదన్న తమ రెండవ ప్రపంచ యుద్ద అనంతర విధానానికి అనుగుణంగా బ్రిటన్‌ నుంచి ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాల రవాణాను తమ గగన తలం మీద నుంచి అనుమతించటం లేదని జర్మనీ ప్రకటించింది. దాంతో బ్రిటన్‌ విమానాలు అనేక గంటల పాటు అదనంగా వేరే మార్గంలో వెళ్లాల్సివచ్చింది. అంతే కాదు తాను సరఫరా చేసిన హొవిట్జర్లను ఉక్రెయిన్‌కు దారి మళ్లించరాదని ఎస్తోనియాకు జర్మనీ స్పష్టం చేసింది.ప్రపంచవ్యాపిత బాంకుల ఆర్ధిక సమాచార వ్యవస్ధ (స్విఫ్ట్‌) నుంచి రష్యాను దూరంగా పెట్టాలన్న అమెరికాకు ఐరోపా దేశాల నుంచే ఎదురుదెబ్బతగిలింది. ఇప్పుడున్న స్ధితిలో అమెరికా ఎన్నికబుర్లు చెప్పినా తన శత్రుదేశాల నుంచి చమురు, గాస్‌ దిగుమతులను నిరోధించేశక్తి దానికి లేదు. స్లోవేకియా, హంగరీ, చెక్‌ రిపబ్లిక్‌ వంటి దేశాల్లోని చమురుశుద్ది కర్మాగారాలకు, జర్మనీకి రష్యాగొట్టపు మార్గాల ద్వారానే చమురు సరఫరా జరగాలి. అందువలన చెల్లింపులు జరపాలంటే స్విఫ్ట్‌నుంచి రష్యాను పక్కన పెడితే కుదరదు.


గత కొద్ది సంవత్సరాలుగా నయా నాజీ కిరాయి ముఠాలకు దేశభక్తి ముద్రవేసి అమెరికా పెద్ద ఎత్తున పెంచి పోషిస్తోంది. సిఐఏకు కిరాయి మూకలను సరఫరా చేసే బ్లాక్‌ వాటర్‌ వంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వారిని, ఉక్రెయిన్‌ మిలిటరీని జతచేసి డాన్‌బాస్‌ వంటి ప్రాంతాల మీద దాడులు చేయించాలని చూస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపిన స్టెఫాన్‌ బందేరాను ఇప్పుడు ఉక్రెయిన్‌ ప్రభుత్వం జాతీయ యోధుడిగా గుర్తించి నీరాజనాలు పడుతోంది. ఎనిమిది సంవత్సరాల నాడు క్రిమియా విలీనాన్ని అడ్డుకోలేని నాటో కూటమి ఇప్పుడు దాన్ని విముక్తి చేస్తామని దాడులకు దిగితే యుద్దాన్ని ప్రారంభించిన నేరం దానిదే అవుతుంది. నెపం రష్యామీద నెట్టాలి గనుక పశ్చిమ దేశాలు సాకుకోసం చూస్తున్నాయి.


ఒకవైపు రష్యాను బూచిగా చూపుతున్న పశ్చిమ దేశాలు మరోవైపు మరోకారణంతో నిజంగానే భయపడుతున్నట్లు కనిపిస్తోంది.చమురు ధరల పెరుగుదలతో రష్యా ఆర్ధికంగా బలపడటమే దానికి కారణం. అది పశ్చిమ దేశాల ఆంక్షలను తట్టుకొనేశక్తి ఇస్తుంది. చమురు ధరల పెరుగుదల కారణంగా దాని విదేశీమారక ద్రవ్య నిల్వలు 640బి.డాలర్లకు పెరిగాయి. ప్రభుత్వ రుణం జిడిపిలో 12శాతానికి తగ్గింది. ముడి చమురు ధర కనీసం వందడాలర్లకు చేరుతుందని అమెరికా వాల్‌స్ట్రీట్‌ భావిస్తున్నది.వివిధ కారణాలతో ఈఏడాది చివరికి 125 డాలర్లవుతుందని జెపి మోర్గాన్‌ అంచనా. నిత్యం రష్యామీద ఆంక్షల గురించి చెప్పే అమెరికన్లు అదే రష్యానుంచి మూడేండ్ల గరిష్ట స్ధాయిలో ప్రస్తుతం డీజిల్‌ దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం 1.55 మిలియన్‌ పీపాల డీజిలు ఈనెలాఖరుకు అమెరికా చేరనుంది. అమెరికా తూర్పు కోస్తాలోని చమురుశుద్ధి కర్మాగారాలకు లాభాలు తక్కువగా ఉండటంతో శుద్దిని పరిమితం చేశాయని, ఒక కర్మాగారంలో పేలుడు జరిగినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. కెనడా ఒక కర్మాగారాన్ని మూసివేయటం, ఐరోపా దేశాలే ప్రత్నామ్నాయం కోసం వెతుకున్నందున రష్యామీద ఆధారపడక తప్పటం లేదని తెలిపింది. దీనికి తోడు టెక్సస్‌లో చలి కారణంగా ఉత్పత్తికూడా తగ్గనుంది.


అమెరికా మీడియా అంతటా ప్రజాస్వామ్యం, ఐరోపాకు ముప్పు తక్షణం ఉక్రెయిన్‌ మీద దాడి జరగబోతున్నదంటూ పెద్ద ఎత్తున ఊదరగొడుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా మరో ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్లో రష్యన్లు మెజారిటీగా ఉన్న డాన్‌బాస్‌ ఇతర స్వయం పాలిత ప్రాంతాలపై ఉక్రెయిన్‌, నాటో, కిరాయి మూకలు దాడులు చేయనున్నట్లు రష్యా మీడియాలో రాస్తున్నారు.2014లో ఉక్రెయిన్‌ మిలిటరీ దాడులను డాన్‌బాస్‌ తిరుగుబాటుదార్లు తిప్పికొట్టారు.రష్యా సైనిక సమీకరణ చేస్తోందని చెబుతున్నవారు దశాబ్దాల తరబడి దానికి వ్యతిరేకంగా ఐరోపాలో 64వేల మందిని అమెరికా నిలిపివుంచిందని, మరో ఎనిమిదిన్నరవేల మందిని దింపుతోందని, అవసరమైతే మరో 50వేల మందిని దించేందుకు నిర్ణయించిందనే అంశాలను చెప్పటం లేదు. రష్యా లక్ష మందిని సరిహద్దులకు తరలించినట్లు గుండెలుబాదుకుంటున్నారు. నిజమే, రెండోవైపు ఉక్రెయిన్‌ తన మిలిటరీలో సగం అంటే లక్షా 25వేల మందిని రష్యా ముంగిట్లోకి తరలించింది.డాన్‌బాస్‌తో పాటు తిరుగుబాటు ప్రాంతాలైన డాన్‌టెస్క్‌, లుగాన్‌స్క్‌ ప్రాంతాలలోనే వారిని మోహరించింది. అక్కడి తిరుగుబాటుదార్లపై మిలిటరీ చర్యకు దిగి రష్యాను రెచ్చగొట్టి రంగంలోకి దింపాలన్నది అమెరికా ఎత్తుగడ. అదే జరిగితే ఆ పేరుతో మరిన్ని కఠినమైన ఆంక్షలు,నాటో విస్తరణ, మరిన్ని ఆయుధాలు అమ్ముకోవచ్చని, యుద్దంలోకి దిగవచ్చన్నది వ్యూహం. దాని దురూహలు ఫలిస్తాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాటో బలగాల సమీకరణ ఉక్రెయిన్‌లో పోరుకు దారి తీస్తుందా ?

25 Tuesday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, NATO massive arms buildup, RUSSIA, Ukraine war, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


మంగళవారం తెల్లవారేసరికి రెండు ప్రధాన అంతర్జాతీయ వార్తలు. ఒకటి రష్యాదిశగా నాటో నావిక, వైమానిక దళాల తరలింపు. తూర్పు ఐరోపా దేశాలకు 50వేల మందివరకు సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సర్కార్‌ చర్చలు. భద్రతా చర్యల్లో భాగంగా తైవాన్‌ ప్రాంతంపై చక్కర్లు కొట్టిన చైనా వైమానిక దళ విమానాలు. ఉక్రెయిన్‌ నుంచి అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తమ దౌత్యసిబ్బంది, కుటుంబాలను స్వదేశాలకు రావాలని ఆదేశించాయి. ఈ పరిణామాలకు పూసల్లో దారం మాదిరి సంబంధం ఏమైనా ఉందా ? అంతర్జాతీయ రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తుల్లో భాగంగా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.కార్యాకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. చైనా గనుక తైవాన్‌ ప్రాంతాన్ని బలవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే తాము సాయుధ జోక్యం చేసుకుంటామని అంతకు ముందు డోనాల్డ్‌ట్రంప్‌, ఇప్పుడు బైడెన్‌ పదే పదే హెచ్చరించిన అంశం తెలిసిందే. అలాగే దక్షిణచైనా సముద్రం, తైవాన్‌ జలసంధిలోకి అమెరికా యుద్ద నావలను నడిపించిన అంశం తెలిసిందే. ఒక్క చిన్న యుద్ద రంగంలోనే గెలుపెరగని అమెరికా, దాని అనుచర దేశాలు ఒకేసారి రెండు చోట్ల యుద్ధానికి – అదీ బలమైన రష్యా, చైనాలతో తలపడతాయా ?


ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే రష్యాను రెచ్చగొట్టేందుకు పశ్చిమ దేశాలు కవ్వింపులకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తొలి దశలో వెయ్యి నుంచి ఐదువేల మంది వరకు మిలిటరీని రుమేనియా, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియా దేశాలకు పంపాలని తరువాత 50వేలు, అంతకు మించి కూడా మోహరించాలని అమెరికన్లు చర్చలు జరుపుతున్నారు. బాల్టిక్‌, నల్లసముద్ర ప్రాంతంలోని ఈ దేశాల నుంచి కొద్ది నిమిషాల్లోనే రష్యాపై క్షిపణి దాడులు జరిపేందుకు వీలు కలుగుతుంది. పశ్చిమ దేశాల కదలికలు, ప్రకటనలను గమనించిన రష్యా సరిహద్దులకు లక్ష మంది సైనికులను తరలించినట్లు వార్తలు. ఐరోపా గడ్డమీద రెండవ ప్రపంచ పోరు తరువాత అతి పెద్ద యుద్ధం అవుతుంది కనుక తాము ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని ఇంత పెద్ద ఎత్తున ఆయుధ తరలింపును తాము చూడలేని అమెరికా ప్రతినిధి విండ్‌మాన్‌ చెప్పాడు.


నిజంగా యుద్ధం జరుగుతుందా ? అసలెందుకీ హూంకరింపులు ? ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యం, జాతీయ సమగ్రత పరిరక్షణకోసమే ఇది అంటున్నారు. ఇదొక పెద్ద అబద్దం. రష్యాను దెబ్బతీయాలంటే దాని సరిహద్దులకు నాటోను విస్తరించాలన్నది అమెరికా ఎత్తుగడ.2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌ పాలకులను కుట్ర చేసి గద్దెదింపారు. తాజా ఉద్రిక్తతలకు మూలం, రష్యా-ఉక్రెయిన్‌ విబేధాలకు 2013 పరిణామాలు నాంది. ఐరోపా యునియన్‌తో ఆర్ధిక సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్న ప్రతిపాదనను నాటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ యనుకోవిచ్‌ తిరస్కరించాడు. 2013 నవంబరులో దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శకులకు అమెరికా, ఐరోపా దేశాలు, యనుకోవిచ్‌కు రష్యామద్దతు ఇచ్చింది. ఆర్ధిక సంబంధాల ముసుగుతో నాటోలో చేర్చుకోవాలని అమెరికా చూస్తే, వ్యతిరేకించి నిలువరించాలన్నది రష్యాఎత్తుగడ. మరుసటి ఏడాది ఫిబ్రవరిలో యనుకోవిచ్‌ దేశం వదలిపారిపోయాడు. మార్చినెలలో క్రిమియా ప్రాంతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ జనం రష్యాతో కలవాలని తీర్పు చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకొని రష్యా తనతో విలీనం చేసుకుంది.(గతంలో రష్యా రిపబ్లిక్‌లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని నాటి సోవియట్‌ పాలకులు పాలనా సౌలభ్యత కోసం ఉక్రెయిన్‌లో కలిపారు.) మరో రెండు నెలల తరువాత తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటు వాదులు డోన్‌టెస్క్‌, లుహాన్‌స్క్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా వేరుపడాలని జనం చెప్పారు. దాన్ని ఉక్రెయిన్‌ తిరస్కరించింది. తరువాత అక్కడి వేర్పాటు వాదులు ఆయుధాలు పట్టి అనేక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఇప్పటికీ అదే స్ధితి కొనసాగుతోంది. వారికి రష్యా మద్దతు ఇస్తోంది.2015లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ఎవరూ దానికి కట్టుబడిలేరు. అంతర్యుద్దంలో 15వేల మంది మరణించారని అంచనా.


ఇప్పుడు ఆ వేర్పాటువాదులు కోరుతున్నట్లుగా వారిని రష్యా గుర్తించినా లేదా వారికి మద్దతుగా సైన్యాన్ని పంపినా ఆ పేరుతో రష్యా మీద దాడికి దిగాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకుగాను పచ్చి అవాస్తవాలను ప్రచారంలో పెట్టారు. మధ్యధరా సముద్రంలో నాటో కూటమి ఇప్పుడు ” నెప్ట్యూన్‌ స్ట్రైక్‌ 22” పేరుతో ఫిబ్రవరి నాలుగు వరకు సైనిక విన్యాసాలు జరుపుతున్నది. ఇంకా డైనమిక్‌ మంటా 22, డైనమిక్‌ గార్డ్‌, కోల్డ్‌ రెస్పాన్స్‌ 22 పేరుతో కూడా సైనిక విన్యాసాలు జరపనున్నాయి. ఇవన్నీ బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, విదేశాంగశాఖ చేసిన ప్రకటనలో ఉక్రెయిన్‌లో తన అనుకూల మాజీ ఎంపీ మురాయెవ్‌ను గద్దెమీద నిలిపేందుకు రష్యాకుట్ర పన్నినట్లు ఆరోపించింది. దీని మీద స్పందించిన అతగాడు బ్రిటన్‌ గాలితీశాడు. బ్రిటన్‌ విదేశాంగశాఖ గందరగోళంలో ఉన్నట్లుంది.రష్యా నామీద నిషేధం విధించింది, అంతేకాదు నాతండ్రి సంస్ధ నుంచి డబ్బుతీసుకోకుండా ఆ సంస్ధనే స్వాధీనం చేసుకుందని చెప్పాడు. అయినా సరే ప్రచారం ఆపలేదు, అమెరికా దాన్ని లంకించుకుంది. నాటో దేశాల్లో 20లక్షల మందికి పైగా కరోనాతో మరణించినా వారికి పట్టలేదు. ఉక్రెయిన్‌ ప్రజాస్వామ్యం పేరుతో కవ్వింపులకు దిగుతున్నారు.ప్రజారోగ్యరక్షణ ఖర్చును ఆయుధాల మీద ఖర్చు చేస్తున్నారు.


సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసి, స్వాతంత్య్రం ప్రకటించుకున్న తరువాత ఉక్రెయిన్‌ కుక్కలు చింపిన విస్తరిలా మారింది. ఎవరికి దొరికిన ప్రజాసంపదలను వారు స్వంతం చేసుకున్నారు. నడమంత్రపు సిరిగాళ్లు ముందుకు వచ్చారు. ఇప్పుడు అన్ని రంగాలను వారే శాసిస్తున్నారు.మీడియా, అధికారులు, న్యాయమూర్తులు, ఎంపీలు అందరూ సంతలోని సరకులుగా మారారు. ఎవరికి వారు స్వంత సాయుధ ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. ఫాసిస్టు శక్తులు రాజకీయాల్లోకి వచ్చాయి. 2014లో రష్యా అనుకూల యనుకోవిచ్‌ను గద్దె దించేందుకు ఐదు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు అమెరికా విదేశాంగ సహాయమంత్రి విక్టోరియా న్యూలాండ్‌ స్వయంగా చెప్పారు.నాటి జర్మన్‌ మంత్రి స్వయంగా ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపాడు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులతో తలపడేందుకు ఏర్పాటు చేసిన అజోవ్‌ రెజిమెంట్‌ అనే కిరాయి సాయుధమూకకు 2014 కుట్రలో జైలు నుంచి విడుదలైన నేరగాడు ఆండ్రీ బిలెట్‌స్కీ నేత. పచ్చి నాజీ. ఇలాంటి ముఠాలను ఉక్రెయిన్‌ మిలిటరీతో సమన్వయం చేసి వేర్పాటువాదుల మీదకు వదులుతున్నారు. ఈ రెజిమెంట్‌కు మీడియా,రాజకీయపార్టీ, సాయుధ శిక్షణా కేంద్రాలు, ఆయుధాలు ఉన్నాయి.


వివిధ కారణాలతో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తమ స్వంత మిలిటరీ సిబ్బంది పాత్ర నామమాత్రం గావించి కిరాయి మూకలను దించటం ఇటీవలి కాలంలో నానాటికీ పెరుగుతోంది. సిరియాలో అది స్పష్టంగా కనిపించింది. గత కొద్ది సంవత్సరాలుగా అలాంటి మూకలకు కేంద్రంగా ఉక్రెయిన్‌ మారింది.గత ఆరు సంవత్సరాలుగా 50దేశాల నుంచి 17వేల మందికి పైగా కిరాయి మూకలు అక్కడకు వచ్చినట్లు ఎఫ్‌బిఐ మాజీ ఏజంట్‌ అలీ సౌఫాన్‌ చెప్పినట్లు గతేడాది టైమ్‌ పత్రిక రాసింది. వీరందరికి అక్కడి అమెరికా అనుకూల ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.అజోవ్‌ సంస్ధను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధగా ప్రకటించాలన్న 40 మంది ఎంపీల వినతిని అమెరికా సర్కార్‌ బుట్టదాఖలు చేసింది.ఇలాంటి నయా నాజీ మూకలకు అమెరికా శిక్షణ, ఆయుధాలను అందచేస్తోంది. ఇది బరాక్‌ ఒబామా ఏలుబడి నుంచీ జరుగుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన సరిహద్దు రక్షణ దళాలతో పాటు ప్రయివేటు సాయుధ ముఠాలకూ శిక్షణ ఇస్తున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక గతేడాది డిసెంబరు 26న రాసింది. ఇప్పుడు మిలిటరీతో పాటు ఇలాంటి ముఠాలను కూడా సన్నద్దం చేయటాన్ని బట్టి వారిని ఎలా ఉపయోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాన్ని, ఉద్యమించే కార్మికవర్గాన్ని అణచేందుకు, రష్యాతో గిల్లి కజ్జాలు పెట్టుకొనేందుకు వీరిని ముందుకు నెట్టే అవకాశం ఉంది. ఉక్రెయిన్లోని డోన్‌టెస్క్‌,లుహానస్క్‌ ప్రాంతాలలో వేర్పాటు వాదులపైకి వీరిని ఉసిగొల్పితే వారికి మద్దతుగా రష్యా రంగంలోకి దిగవచ్చని, దాన్ని సాకుగా చూపి నాటో దేశాలు దాడులకు పూనుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇది ఒక అంశం మాత్రమే.


మరో రెండు దశాబ్దాల వరకు నాటో కూటమిలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వబోమని రష్యాను నమ్మించేందుకు అమెరికా పూనుకుంది. అమెరికా కడుపులో దుష్టాలోచన లేకపోతే ఇప్పుడు ఆయుధ సమీకరణ ఎందుకు అని అనుమానించిన రష్యా రిజర్వు దళాలు, క్షిపణులను మోహరిస్తున్నది.పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికన్‌ మీడియా యుద్దోన్మాదంతో ఊగిపోతున్నది.జనానికి ఎక్కిస్తున్నది. ఏక్షణమైనా దాడులు జరగవచ్చంటూ వర్ణిస్తున్నది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఉక్రెయిన్‌లో మూడు లక్షల మందికి ఆయుధ శిక్షణ ఇచ్చామని వారికి ఆయుధాలు, డబ్బు అందచేస్తే వారే రష్యా సంగతి చూసుకుంటారని తన మిత్రదేశాలకు అమెరికా చెప్పినట్లు వార్తలు. నాటో కూటమి దేశాలన్నింటా మీ చావు మీరు చావండి, కరోనాతో సహజీవనం చేయండి అంటూ వదిలేసిన పాలకుల మీద కార్మికవర్గం ఆగ్రహంగా ఉంది. అటువంటపుడు యుద్ధానికి మద్దతు ఏమేరకు ఇవ్వగలరన్నది సందేహమే. ఇదే విధంగా రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌ స్ధితి కూడా అంత సానుకూలంగా లేదు. అందువలన రెండు పక్షాలూ బేరసారాలు తప్ప తెగే దాగా లాగే పరిస్ధితి ఉండకపోవచ్చు.

పుతిన్‌ మాటకు గౌరవం, విలువ ఇవ్వాలంటూ ఢిల్లీలో మాట్లాడిన జర్మన్‌ నౌకాదళాధిపతికి స్వదేశం వెళ్లే సరికి ఇక చాలు ఇంటికి దయచెయ్యండి అనే వర్తమానం సిద్దంగా ఉంది. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని విచారం వెలిబుచ్చినా పదవి ఊడింది. మరోవైపు ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఎస్తోనియాకు తాము అందచేసిన వాటిని కూడా ఉక్రెయిన్‌కు తరలించరాదని షరతు పెట్టింది. రష్యాతో సంబంధాల అంశంలో జర్మనీలో భిన్న వైఖరులున్నట్లు ఈ పరిణామాలు వెల్లడించాయి.ఆర్ధిక ఆంక్షలపై జర్మనీ అంగీకరించటంలేదు. రష్యానుంచి పెద్ద గాస్‌ సరఫరా ప్రాజెక్టుకు జర్మనీ మద్దతు ఇస్తున్నది. ఐరోపా యునియన్‌ నుంచి వెళ్లిపోయిన బ్రిటన్‌ మాత్రం అమెరికాకు పూర్తి మద్దతు ఇస్తోంది.ఇప్పటికే ఆర్ధిక ఆంక్షలకు అలవాటు పడిన రష్యా ఇంతకంటే తమను చేసేదేముందనే తెగింపుతో ఉంది.
ఉక్రెయిన్‌ వేర్పాటు వాద ప్రాంతాలను స్వతంత్రదేశాలుగా రష్యా గుర్తిస్తే స్వల్పవివాదం తలెత్తవచ్చు. అది కూడా వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ మిలిటరీకే పరిమితం కావచ్చు తప్ప నాటో రష్యా పోరుగా మారే అవకాశాలు పరిమితం. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, ఉక్రెయిన్‌కు అందచేసిన ఆయుధాలను వెనక్కు తీసుకోవాలని రష్యాకోరుతోంది. అమెరికా నిరాకరిస్తోంది.ఉక్రెయిన్‌ నాటో కూటమికి దగ్గరగా ఉన్నప్పటికీ దానిలో సభ్యురాలు కాదు. గతంలో జార్జియాలో రెండు ప్రాంతాలు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నపుడు రష్యాగుర్తించింది. రెండు దేశాల మధ్య 2008లో స్వల్పపోరు జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరి పరిణామాలు ఉంటాయా ? ప్రతి మేఘం వర్షించదుా ప్రతి ఉరుముకూ పిడుగులు పడవు. ప్రతి పరిణామమూ వినాశకర పోరుకు దారితీయదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సామ్రాజ్యవాదులను వణికిస్తున్న రష్యన్‌ కమ్యూనిస్టులు !

03 Wednesday Nov 2021

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti-Putin Communist star, Imperialist worry, Naredra Modi, Russia’s Communist Comeback, Valery Rashkin, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


రష్యాలో ఏం జరుగుతోంది ? వందేండ్ల క్రితం బోల్షివిక్‌ విప్లవం జరిగినపుడు జారు చక్రవర్తి ఒక సామ్రాజ్యవాది, ఇతర సామ్రాజ్యవాదులతో విబేధాలు ఉన్నాయి. ఇప్పుడు పుతిన్‌ నాయకత్వంలోని రష్యా పెత్తనాన్ని కోరుకొంటోంది. అందుకోసం అమెరికా-ఐరోపా పోటీదారులతో లడాయిలో ఉంది. కొన్ని అంశాలలో వాటికి వ్యతిరేకంగా సోషలిస్టు చైనాతో చేతులు కలుపుతోంది. అంతర్గతంగా ఆర్ధికంగా అనుసరిస్తున్న విధానాలు సమాజంలో అశాంతిని రేపుతున్నాయి. ప్రతిపక్షాలను బతకనివ్వటం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. తోటి బూర్జువా పార్టీల నేతలను తప్పుడు కేసులతో ఇరికించి తనకు ఎదురులేదనే స్ధితిని కల్పించేందుకు పూనుకున్నాడు. ఈ నేపధ్యంలో కమ్యూనిస్టులు కొరకరాని కొయ్యలుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. దాంతో వారి మీద కూడా దాడికి పూనుకున్నట్లు కొన్ని పరిణామాలు వెల్లడిస్తున్నాయి. మాస్కో కమ్యూనిస్టు నేత, 1999 నుంచి వరుసగా పార్లమెంట్‌కు ఎన్నికవుతున్న వలెరీ రష్కిన్‌పై ఒక తప్పుడు కేసును నమోదు చేయటం దానిలో భాగంగానే భావిస్తున్నారు.


వచ్చే అధ్యక్ష ఎన్నికలలో ప్రతిపక్ష అభ్యర్ధిగా పుతిన్‌ మీద రష్కిన్‌ తలపడతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీ అధినేత జుగనోవ్‌ తరువాత ప్రముఖనేతగా ఎదిగిన వలెరీ రష్కిన్‌ మీద పుతిన్‌ సర్కార్‌ తప్పుడు కేసు అంతర్జాతీయదృష్టిని ఆకర్షించింది. సెప్టెంబరు నెలలో జరిగిన ఎన్నికలలో అధికార పార్టీని ఎదిరించటం,యువతను ఆకర్షించటంలో ప్రముఖుడిగా ముందుకు వచ్చిన రష్కిన్‌ వంటి వారి మీద ప్రభుత్వం అణచివేతకు పాల్పడనుందని ఎన్నికలు జరిగినప్పటి నుంచీ ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తనకు బలమైన ప్రత్యర్ధులు లేకుండా చూసుకొనేందుకు పుతిన్‌ పావులు కదుపుతున్నాడు.జింకల జాతికి చెందిన ఒక కణుజు మృతకళేబరాన్ని చూపి రష్కిన్‌ అక్రమంగా వేటాడినట్లు, పోలీసులు కోరినపుడు మద్య పరీక్షకు అంగీకరించలేదని ఒక కథనాన్ని అల్లారు.


సరటోవ్‌ అనే పట్టణ సమీపంలోని గ్రామంలో తన స్నేహితులను కలిసేందుకు వెళ్లి తిరిగి వస్తూ సమీప అడవిలో నడుస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా వెళ్లిందని, అది ఆగిన చోటికి వెళ్లి చూడగా తీవ్రంగా గాయపడిన స్ధితిలో ఉన్న కణుజు కనిపించిందని, వెనక్కు వెళ్లి ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పి తిరిగి వచ్చి కణుజు మరణించిన అంశాన్ని అధికారులకు తెలిపేందుకు దాన్ని తన కారులో తీసుకు వెళుతుండగా వచ్చిన పోలీసులు, అటవీ సిబ్బంది తనను పట్టుకొని తానే వేటాడినట్లు కేసు నమోదు చేశారని రష్కిన్‌ చెప్పాడు. అడవిలో తుపాకి మోతలు వినిపించగా వెళ్లిన తమకు కణుజు కళేబరంతో రష్కిన్‌ కనిపించాడని, మద్యం సేవించారా లేదా అనేది తెలుసుకొనేందుకు పరీక్షించబోగా తిరస్కరించినట్లు అధికారులు ఆరోపించారు. అలాంటిదేమీ లేదని రష్కిన్‌ అన్నారు. సెప్టెంబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అక్రమాలకు నిరసన తెలుపుటంలో రష్కిన్‌ ప్రముఖ పాత్ర పోషించిన నేపధ్యంలో ఈ కేసు నమోదైంది. సరటోవ్‌ జైలులో సిబ్బంది అక్రమాలపై పార్లమెంటరీ దర్యాప్తు జరపాలనీ కమ్యూనిస్టు ఎంపీలు పట్టుబట్టిన కారణంగా కూడా ఈ కేసు నమోదైనట్లు చెబుతున్నారు. ప్రభుత్వ అనుకూల టీవీల్లో దీని గురించి ప్రముఖంగా చూపారు. రష్యాలో జరుగుతున్న పరిణామాల గురించి వివిధ పత్రికలు విశ్లేషణలు,వ్యాఖ్యానాలు రాస్తున్నాయి.


” ఒకనాడు నెమ్మదిగా ఉన్న కమ్యూనిస్టుపార్టీ ప్రతిపక్ష శక్తిగా ఎదుగుతున్నది ” అంటూ ప్రముఖ పత్రిక ఎకానమిస్టు అక్టోబరు 30వ తేదీన ఒక విశ్లేషణ రాసింది. దానిలో కమ్యూనిస్టు పార్టీ, నాయకత్వం గురించి అనేక తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పటికీ వర్తమాన పరిణామాలు, పరిస్ధితి గురించి చేసిన కొన్ని ఆసక్తికర అంశాలు ఇలా ఉన్నాయి.” కమ్యూనిస్టుల పెరుగుదల పరిణామాన్ని చూసి ప్రభుత్వం, దాని నేత పుతిన్‌ ఆందోళన పడ్డారు. పుతిన్ను వ్యతిరేకించే ప్రతిపక్ష నేత అలెగ్నీ నవాల్నేను తప్పుడు కేసులతో పుతిన్‌ జైలు పాలు చేశాడు. ఆ చర్యను గట్టిగా వ్యతిరేకించిన అనేక మంది కమ్యూనిస్టులపై కూడా కేసులు పెట్టారు. ఈ పరిణామాలతో నిజమైన ప్రతిపక్షం కమ్యూనిస్టులే అని ప్రభుత్వ వ్యతిరేకులు భావించి తాజా ఎన్నికల్లో ఓటు వేయటం పుతిన్‌కు ఆందోళన కలిగిస్తోంది. ౖ” 1996 అధ్యక్ష ఎన్నికల్లో బోరిస్‌ ఎల్సిన్‌ మీద పోటీ చేసిన కమ్యూనిస్టు జుగనోవ్‌ ఓడిపోయాడు. గెలిస్తే కమ్యూనిస్టులు పగతీర్చుకుంటారేమో అని భయపడిన వారు, ఉదారవాదులు, వ్యాపారులు తమ వనరులన్నింటినీ మరణశయ్య మీద ఉన్న ఎల్సిన్‌కోసం వెచ్చించారు. ఎల్సిన్‌ శవానికైనా ఓటు వేస్తాం కానీ బతికి ఉన్న జుగనోవ్‌ను ఎన్నుకొనేది లేదని ఒక టీవీ అధిపతి ఆ నాడు చెప్పాడు. జుగనోవ్‌ ఓడారు…… నేడు అనేక మంది రష్యన్‌ ప్రజాస్వామిక వాదులు క్రెమ్లిన్‌(రష్యా అధికార కేంద్రం)నుంచి ఎల్సిన్‌ వారసుడిని గెంటివేయాలని కోరుకుంటూ ఓటు వేసేందుకు కమ్యూనిస్టులను ఎంచుకున్నారు. ఎంత కఠినంగా ఉండబోతున్నారో వారికి బాగా తెలుసు. రష్యన్‌ ప్రతిపక్ష మీడియా విమర్శకుడు ఎవగెని ఆల్‌బట్స్‌ మాట్లాడుతూ ఈ ప్రభుత్వ తోడేలు మాకు మరొక అవకాశం లేకుండా చేసిందన్నారు……సెప్టెంబరులో జరిగిన ఎన్నికలలో ఓట్లను సక్రమంగా లెక్కించి ఉంటే దాదాపు యునైటెడ్‌ రష్యాతో సమంగా ఓట్లు పొంది ఉండేవారు. అన్ని రకాల రిగ్గింగులు చేసినప్పటికీ 2016లో వచ్చిన 13శాతం కంటే కమ్యూనిస్టులు 19శాతం ఓట్లు పొందారు…ప్రపంచంలో ఎక్కువ చోట్ల వామపక్షవాదం ముందుకు పోతున్నది, ఈ లోకరీతి రష్యాలో వచ్చేందుకు ఎంతకాలం పట్టిందో కనిపిస్తోంది.ప్రత్యేకించి పుతిన్‌ పాలనలో పాతుకు పోయిన అసమానత దీనికి అవకాశమిచ్చింది….. ఆరు సంవత్సరాలుగా పడిపోతున్న ఆదాయాలు వామపక్ష రాజకీయాలను మరోసారి పరిగణనలోకి తీసుకొనే విధంగా అనేక మంది రష్యన్లను పురికొల్పాయి…..ప్రభుత్వం ఇప్పుడు యువకమ్యూనిస్టులకు స్టాలినిస్టులనే ముద్రవేసి అణచివేసేందుకు పూనుకుంది.ఇదిలా ఉండగా జైళ్లలో జరిగిన చిత్రహింసల గురించి దర్యాప్తు జరపాలనే మానవహక్కుల గురించి కమ్యూనిస్టులు కేంద్రీకరించారు. పుతిన్‌ రష్యా నిజంగా అద్దాల మేడలా కనిపిస్తోంది.” అని పేర్కొన్నది.


అనేక దేశాలలో పాలకుల మాదిరి తనకు రాజకీయ ప్రత్యర్ధులు లేకుండా చేసుకొనేందుకే ఇప్పటి వరకు పుతిన్‌ ప్రయత్నించాడు. కమ్యూనిస్టుల మీద చేసిన తప్పుడు ప్రచారం కారణంగా సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత ముందే చెప్పుకున్నట్లు అనేక మంది ఇతర పార్టీలవైపే చూశారు. అలాంటి ఏ పార్టీని కూడా పుతిన్‌ బతకనివ్వలేదు. మూడు దశాబ్దాల తరువాత పుతిన్‌కు నిఖరమైన ప్రత్యామ్నాయ పార్టీగా ఇప్పుడు కమ్యూనిస్టులు ముందుకు వస్తున్నందున దాడి ఇప్పుడు వారి మీద కేంద్రీకరించవచ్చు. మన దేశంలో నరేంద్రమోడీ విధానాలను విమర్శించేవారందరికీ దేశద్రోహులు, విదేశీతొత్తులు, ఉగ్రవాదులు అని ముద్రవేస్తున్నట్లుగానే పుతిన్‌ కూడా చేస్తున్నాడు. ఎన్నికల రిగ్గింగు అనేది ప్రారంభం నుంచీ జరుగుతోంది. వాటన్నింటినీ ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో పుతిన్‌కు పోటీగా అన్ని పార్టీలను కమ్యూనిస్టులు ఏకం చేయగలరా అనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత నవాల్నే ప్రారంభించిన సంస్ధకు ఉగముద్రవేసి నిషేధం విధించాడు.జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు, సంస్ధలకు విదేశీ ఏజంట్లు, అవాంఛనీయ శక్తులనే ముద్రవేస్తున్నారు. ఒక ఏడాది కాలంగా ఈ ధోరణి పెరిగింది. ప్రభుత్వాన్ని, అధ్యక్షుడు పుతిన్‌ మీద విమర్శతో కూడిన ట్వీట్‌ను ఎవరైనా తిరిగి చేసినా అలాంటి వారిని విదేశీ ఏజంట్లుగా పరిగణిస్తున్నారు.

2012లో ఒక చట్టం చేసి విదేశీ ఏజంటు అనే ముద్రవేసేందుకు పూనుకున్న తరువాత ఇంతవరకు 88 మంది మీడియా, వివిధ సంస్ధలకు చెందిన వారితో సహా 359 మందిని విదేశీ ఏజంట్లు, అవాంఛనీయ శక్తులని ముద్రవేయగా ఈ ఏడాది ఇంతవరకు 101 మందిని చేర్చారంటే దాడి తీవ్రతను వెల్లడిస్తున్నది. వారంతా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారట. ఈ దాడులన్నింటినీ తట్టుకొని నిలిచిందీ, నిలవగలిగిందీ కమ్యూనిస్టులనే అభిప్రాయాలు బలపడటంతో పాటు ఎవరు అధికార పార్టీని ఓడించగలిగితే వారికి ఓటు వేయాలని జైలుపాలైన నవాల్నే ఇచ్చిన పిలుపుతో అది మరింత బలపడింది. సెప్టెంబరు ఎన్నికల్లో కమ్యూనిస్టులకు 18.9శాతం వచ్చినట్లు ప్రకటించినా రిగ్గింగు జరపకపోతే వాస్తవంగా 30శాతం, అధికార పార్టీకి 49.8శాతం అని చెప్పినా 35శాతానికి మించి వచ్చి ఉండేవి కాదన్నది అనేక మంది పరిశీలకుల అభిప్రాయం. ఈ పరిణామంతో అనేక మంది రష్యన్లకు పుతిన్‌ కంటే కమ్యూనిస్టులు మరింత గౌరవనీయులైనట్లు కొందరు పేర్కొన్నారు, ఇప్పుడు కమ్యూనిస్టులు పుంజుకుంటున్న తీరుతెన్నులు1917లో బోల్షివిక్‌లు జనం మద్దతు పొందిన తీరును గుర్తుకు తెస్తున్నట్లు ఒక వ్యాఖ్యాత వర్ణించారు. దేశంలో స్ధిరత్వాన్ని తాను కోరుకుంటున్నట్లు చెబుతున్న పుతిన్‌ తన విధానాలు, అసహనం ద్వారా నిజానికి అస్ధిరతకు బాటలు వేస్తున్నాడు. చట్టాలకు తన చిత్తం వచ్చినట్లు భాష్యాలు చెబుతూ ఉదారవాదుల పట్ల అనుచితంగా వ్యవహరించిన మాదిరి కమ్యూనిస్టులతో కూడా ప్రవర్తిస్తే వారిని అజ్ఞాతవాసంలోకి నెట్టినట్లు అవుతుంది. సామాజిక అశాంతి బద్దలవుతుంది అది అణచివేతకు దారితీస్తే కమ్యూనిస్టులు ఏమాత్రం విస్మరించరాని శక్తిగా మారతారు అనే హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇతర దేశాల్లో మాదిరి పెట్టుబడిదారీ విధానాలను సమర్ధించే వారిలో ఒకరి స్ధానంలో మరొకరిని బలపరిచే అవకాశాలు రష్యాలో లేవు. పుతిన్‌కు పోటీగా కమ్యూనిస్టులు తప్ప మరొక పార్టీ ఏదీ నిలదొక్కుకోలేకపోయింది.ఇవన్నీ ప్రపంచ పెట్టుబడిదారీ శక్తులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అక్టోబరు విప్లవం పునరావృతం అవుతుందా ? పశ్చిమ దేశాల యువత సోషలిజం వైపు మొగ్గుతోందా ?

29 Friday Oct 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Bolshevik Revolution, Communists, october revolution, Vladimir i Lenin, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


రష్యా నవంబరు విప్లవం గురించి ప్రపంచాన్ని కుదిపివేసిన ఆ పదిరోజులు అంటూ అమెరికన్‌ జర్నలిస్టు జాన్‌ రీడ్‌ రాశారు. 1917 నవంబరు ఏడవ తేదీ( పాత కాలెండరు ప్రకారం అక్టోబరు 25)న జారు చక్రవర్తిని కూల్చివేసి కమ్యూనిస్టులు ప్రధమ శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు.1991లో దాన్ని కూల్చివేశారు.అయినా ఆ విప్లవం ఇప్పటికీ,ఎప్పటికీ శ్రమజీవుల పోరాటాలకు ఉత్తేజం కలిగించేదే, గుణపాఠాలు నేర్పేదే. దాని గురించి ఎంత రాసినా, ఎన్నిసార్లు రాసినా తరిగేది కాదు. 2017నవంబరు ఆరవ తేదీన అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసిన విశ్లేషణకు ” వందేండ్ల తరువాత తిరిగి వచ్చిన బోల్షివిజం, మనం ఆందోళన పడాలి ” అని శీర్షిక పెట్టారు. నాలుగేండ్లు గడిచాయి. దాని ప్రకారం అక్టోబరు విప్లవం పునరావృతం అవుతుందా ? రష్యాలో తిరిగి సోషలిజం వస్తుందా ? అమెరికాలో కుర్రకారు పెట్టుబడిదారీ విధానాన్ని ఎందుకు తిరస్కరిస్తోంది ? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు.చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా, లావోస్‌, కంపూచియా సోషలిస్టు దేశాలుగా నిలిచి కొనసాగుతున్నప్పటికీ సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలకు తగిలిన ఎదురు దెబ్బలతో అనేక మంది నిరాశ చెందారు. తరువాత లాటిన్‌ అమెరికా, ఇతర అనేక దేశాల్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు వామపక్ష శక్తులకు ఉత్తేజమిస్తున్నాయి. నవంబరు విప్లవదినం సోషలిస్టు దేశాలకు ఉత్సవ రోజైతే మిగిలిన వారికి దీక్షాదినం. ఒక్కసారి తాజా పరిణామాలను అవలోకిద్దాం.


తమకు నచ్చనివారిని, విబేధించేవారిని దేశద్రోహులు, అర్బన్‌నక్సల్స్‌, తుకడేతుకడే గాంగ్‌, హిందూవ్యతిరేకులని ముద్రవేయటం మన దేశంలో ఒక పధకం ప్రకారం చేస్తున్న ప్రచారం. నిత్యం స్వదేశీ కబుర్లు చెబుతూ విదేశాల నుంచి తెచ్చుకున్న అనుకరణ ఇది. దీన్ని మెకార్ధిజం అంటారు. అమెరికాలో 1947 నుంచి 1957వరకు జోసెఫ్‌ మెకార్ధీ అనే సెనెటర్‌ ఉండేవాడు. నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. మీడియాలో అందరూ వామపక్ష భావజాలం ఉన్నవారే కనుక ఇలాంటి వార్తలు ఎక్కడా రావు అంటూ కల్పిత అంశాలను వాట్సాప్‌లో పంపే అబద్దాల కోర్లు మనకు నిత్యం దర్శనమిస్తుంటారు. వీరికి ఎల్లవేళలా మెకార్ధీ ఉత్తేజమిస్తుంటాడు. వారి స్నేహితుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నపుడూ, ఇప్పుడు పదవి పోయిన తరువాత మెకార్ధీని అనుసరిస్తున్నాడు. మెకార్ధీ బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు, నచ్చని వారికి కమ్యూనిస్టు ముద్రవేసేవాడు.రచయితలు, జర్నలిస్టులు, సినిమాతారలు, వాణిజ్యవేత్తలు ఒకరేమిటి లొంగని ప్రతివారినీ బెదిరించేవాడు. అలాంటి వారందరినీ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసేది. ఎంతగా వాడి ప్రభావం పెరిగిందంటే ఎన్నికల్లో వాడు సమర్ధించిన వారు గెలిచి, వ్యతిరేకించిన వారు ఓడారు. వాడి ఉపన్యాలకు మీడియా విపరీత ప్రచారమిచ్చేది.చివరికి వాడు చెప్పిన అబద్దాలకు సెనెట్‌ మందలించింది. అబద్దాలు, అవలక్షణాలన్నీ విచారణలో బహిర్గతమయ్యాయి.నలభై ఎనిమిది సంవత్సరాలకే పచ్చి తాగుబోతుగా మారి జబ్బులతో దిక్కులేని చావు చచ్చాడు. ఇప్పుడు అమెరికాలో మెకార్ధీలు తామరతంపరగా పుట్టుకువచ్చారు. డెమోక్రాట్లు, పురోగామివాదులు, తమను ఆక్షేపించేవారిని సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా ముద్రవేసి గతాన్ని పునరావృతం చేసేందుకు పూనుకున్నారు.అయితే బెర్నీశాండర్స్‌ వంటి ప్రముఖులు అవును మేము సోషలిస్టులమే అని ముందుకు రావటంతో లక్షల మంది యువత తాము కూడా సోషలిస్టులమే,కమ్యూనిస్టులమే అని ప్రకటించుకోవటం పెరుగుతోంది.

నవంబరు విప్లవ సమయంలో సోషలిజం ఒక ఊహ. దానికి వ్యతిరేకంగా సైద్దాంతిక చర్చ జరిగింది. పెట్టుబడిదారులు సవాళ్లు విసిరారు. తరువాత సోవియట్‌ , సోషలిస్టు శిబిరం ఏర్పడింది. వైఫల్యాలు ఎదురయ్యాయి. గత వందేళ్లుగా సోషలిజం వైఫల్యం గురించి ప్రచారం చేశారు, దానికి అమెరికా ప్రధాన కేంద్రం. చిత్రం ఏమంటే ఇప్పుడు అక్కడ సోషలిజం వైఫల్యం బదులు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చర్చ జరుగుతోంది. ఇదొక అనూహ్య పరిణామం. పెట్టుబడిదారీ సమర్ధకులు మింగా కక్కలేని స్ధితిలో ఉన్నారు. అక్కడ మీడియా సోషలిజానికి అనుకూలం కాదు, బలమైన కమూనిస్టుపార్టీ లేదు. అయినా అక్కడి విదార్ధులు సోషలిజం మంచిది, ప్రైవేటు ఆస్తిహక్కులు రద్దవుతాయి అని చెబుతున్నారు. ఎంత మాట అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా ఇది, వేదంలా విలువైన మాట అనేవారు రోజురోజుకూ పెరుగుతున్నారు.కాబట్టి ప్రైవేటు ఆస్తి హక్కులను తీసివేసే వారిని ఎన్నుకోవాలని మీరు కోరుకుంటున్నారు అని ఒక విలేకరి ఒక విద్యార్ధితో అన్నాడు. దానికి లేదు కేవలం పన్ను ఎగవేతకు మాత్రమే ఆస్తి హక్కులు కాదు అన్నాడు విద్యార్ది. డబ్బు అంటే ఆస్తేకదా అని విలేకరి రెట్టించాడు. పన్ను ఎగవేత ఆస్తి హక్కు అనేట్లైతే కచ్చితంగా దాన్ని రద్దు చేయాల్సిందే అని విద్యార్ధి సమాధానమిచ్చాడు. అమెరికా అంతటా ఇలాంటి ఉదంతాలు రోజురోజుకూ పెరుగుతున్నా. అసమానతలు, తమ రుణాలు కొండల్లా పెరగటం, తీరే దారి కనిపించకపోవటంతో విద్యార్దులు, యువతలో ఇలాంటి ఆలోచనలు పెరుగుతున్నాయి.


గత వంద సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పుడు 40శాతం మంది అమెరికన్లలో, 49శాతం మంది యువతలో సోషలిజం పట్ల సానుకూలత ఉంది. అమెరికాలో స్కూలు విద్యాకమిటీలు చురుకుగా పని చేస్తున్నాయి. వాటి సమావేశాలు కమ్యూనిస్టు వ్యతిరేకులకు దడపుట్టిస్తున్నాయి. ఆ సమావేశాల్లో రాజకీయాలను చర్చించకూడదనే వారు కొందరైతే, రద్దు కోరుతున్నారు కొందరు. అది ఎంతగా అంటే ఆ కమిటీల ద్వారా తదుపరి అక్టోబరు విప్లవాన్ని త్వరలో కమ్యూనిస్టులు ప్రారంభించనున్నారని ఒక జర్నలిస్టు తాజాగా తన అక్కసును వెళ్లగక్కాడు. వాస్తవాన్ని చూస్తే దేశమంతటి నుంచి డెమోక్రటిక్‌ సోషలిస్టులు వందమంది ఎన్నికయ్యారని, బెర్లిన్‌ గోడ పతనంతో సోషలిజాన్ని వ్యతిరేకించే వారికి నోరుపడిపోయిందని, తరువాత ఒక మంచి అంశంగా తీవ్రవాద ముస్లిం జీహాద్‌ ప్రచారం వచ్చింది. మార్క్సిస్టు టీచర్లు మీ పిల్లల లింగమార్పిడి చేస్తున్నారని మధ్యతరగతి అమెరికన్లను నమ్మించటం కంటే ఉగ్రవాదంపై పోరులో మనం విజయం సాధించామని చెప్పటం కష్టమని, ఎందుకంటే అవమానకర రీతిలో ఉగ్రవాదంపై మన ప్రపంచ పోరు ముగిసిందని వాపోయాడు. అమెరికా కమ్యూనిజం వైపు పయనిస్తోందని జనాన్ని రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.చివరకు కరోనా కారణంగా క్రిస్మస్‌ సందర్భంగా ఎక్కువ మంది గుమికూడవద్దని అమెరికా అంటువ్యాధుల నివారణ సంస్ద డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంటోనీ ఫౌసీ సలహా ఇవ్వటం కూడా కమ్యూనిజం దిశగా ప్రయాణంలో భాగమే అని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ జిమ్‌ జోర్డాన్‌ ఆరోపించాడు. పాఠశాల విద్యాకమిటీలు వామపక్ష అధికార కేంద్రాలుగా ఉన్నాయని, వాటి సమావేశాలకు వెళ్లే వారిని స్ధానిక ఉగ్రవాదులుగా ఎఫ్‌బిఐ పరిగణించాలని సెలవిచ్చాడు.


కమ్యూనిజానికి వ్యతిరేకంగా గూఢచారిగా పని చేసిన ఒక మాజీ అధికారి అమెరికాలో కమ్యూనిస్టుల కార్యక్రమం ఇదీ అంటూ పత్రికల్లో రాశాడు. ఏమిటట,యువతను సెక్స్‌, మాదక ద్రవ్యాలు, వీడియో గేమ్‌లకు బానిసలుగా చేసి వారి ధృడత్వాన్ని దెబ్బతీసి 17-24 ఏండ్ల వయసున్నవారిలో 71శాతం మందిని మిలిటరీకి పనికి రాకుండా చేయటం.ప్రస్తుతం 1,500 దినపత్రికలు, 1,100 వార,పక్ష,మాసపత్రికలు, 1,500 టీవీ ఛానళ్లు, 9,000వేల రేడియో స్టేషన్లు, 2,400 ప్రచురణ సంస్దలుండగా అవన్నీ కేవలం ఆరు కార్పొరేషన్ల ఆధీనంలో ఉన్నాయి, వీటిన్నింటి ప్రచారం మీద అదుపుసాధించటం, జనాలను శత్రుబృందాలుగా విడదీయటం, తమ నేతల మీద విశ్వాసం లేకుండా చేయటం, ప్రజాస్వామ్యం గురించి ప్రబోధించి నిర్దాక్షిణ్యంగా, అక్రమాలతో వేగంగా అధికార స్వాధీనం,ప్రభుత్వంతో ఇష్టం వచ్చినట్లు వివిధ పధకాలకు ఖర్చు చేయించటం, ప్రజల్లో అశాంతిని ప్రోత్సహించటం, నైతిక విలువలను కుప్పకూల్చటం, మారణాయుధాలను కొనిపించాలి, తరువాత వాటిని తిరిగి తీసుకొని జనాన్ని ఇబ్బందుల్లో పడేయటం. ఈ కార్యక్రమంతో కమ్యూనిస్టులున్నారు గనుక మన దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, 2022లో వాటిని తొలగించాలంటూ రాశాడు. ఊరూపేరూ లేకుండా లేదా ఏదో ఒక సంస్ద పేరుతో ముస్లింల అజెండా లేక హిందువుల అజెండా ఇది అని రెచ్చగొడుతూ రాసి పంచే కరపత్రాల గురించి మనకు తెలిసిందే. అమెరికా, ఇతర దేశాల్లో కూడా ఇలాంటివే జరుగుతుంటాయి.


అమెరికాలో మాదిరి బ్రిటన్‌ యువతలో కూడా పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు తగ్గుతున్నాయి. ఇటీవల జరిగిన సర్వేల్లో 80శాతం మంది కుర్రకారు తమ ఇబ్బందులకు పెట్టుబడిదారీ విధానమే కారణమన్నారు. మూడింట రెండువంతుల మంది సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ కావాలన్నారు.పద్దెనిమిదవ శతాబ్దిలో తత్వవేత్త జీన్‌ జాక్విస్‌ రౌసియవు చెప్పిన అంశాలను ఒక విశ్లేషకుడు ఉటంకించారు. ” తినేందుకు జనానికి ఏమీ మిగలనపుడు వారు ధనికులను తింటారు” అన్నాడు. దీనికి సూచికగానే బ్రిటన్‌ సామాజిక మాధ్యమంలో దర్శనమిస్తున్న టిక్‌టాక్‌, ఇతర వీడియోలలో యువత ఏదైనా తినే సమయంలో వినియోగించే ఫోర్కులతో కార్లలో ఉన్నవారు, ఫ్రిజ్‌ల దగ్గర ఉన్నవారిని చూపుతూ ఇవి మాకు లేకపోవటానికి మీరే కారకులు అనే అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కనుక ధనికులు నిద్రించేటపుడు ఒకకన్ను తెరవటాన్ని ప్రారంభించాలన్న మాట అని ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. లండన్‌ కేంద్రంగా పని చేసే ఎకనమిక్‌ ఎఫైర్స్‌ అనే సంస్ధ జూలైలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం దేశంలో గృహ సంక్షోభానికి కారణం పెట్టుబడిదారీ విధానమే అని 80శాతం యువత భావిస్తోంది. వాతావరణ అత్యవసర పరిస్ధితి ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్ధ సమస్య అని75శాతం మంది చెప్పారు. సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధలో జీవించాలని కోరుకుంటున్నట్లు 67శాతం చెప్పారు పెట్టుబడిదారీ విధాన సమర్ధకులకు ఇది హెచ్చరిక అని సదరు సంస్ధ పేర్కొన్నది. ఈ లెక్కల గురించి కొందరికి చిన్న చూపు ఉండవచ్చు, వీటిని చెప్పింది వామపక్షవాదులు కాదని గమనించాలి.2019లో బర్నార్డో సంస్ధ జరిపిన సర్వేలో పాతికేండ్ల లోపు వారిలో మూడింట రెండువంతుల మంది తమ తలిదండ్రులతో పోలిస్తే తమ జీవితాలు అధ్వాన్నంగా ఉంటాయనే భయాన్ని వ్యక్తం చేశారు.ఆర్ధిక పరిస్ధితులే యువతను వామపక్ష అభిమానులుగా మారుస్తున్నాయని ” జనరేషన్‌ లెఫ్ట్‌ ” అనే పుస్తక రచయిత కెయిర్‌ మిల్‌బరన్‌ అన్నారు.


బ్రిటన్‌లో సుఖవంతమైన జీవితం గడపాలంటే చేతిలో మంచి జీతం తెచ్చే ఒక డిగ్రీ ఉండాలని చెప్పిన రోజులున్నాయి.2020లో జరిపిన సర్వే ప్రకారం డిగ్రీ ఉన్న-లేని వారి వేతన తేడా గణనీయంగా తగ్గినట్లు తేలింది. మరోవైపు విద్యార్ధుల అప్పులు సగటున ఒకరికి 40,280 పౌండ్లకు చేరాయి.మూడోవంతుకు పైగా డిగ్రీ ఉన్న వారు డిగ్రీతో పనిలేని ఉద్యోగాలు చేస్తున్నట్లు తేలింది.దీనికి తోడు మొత్తంగానే వేతనాలు పడిపోతున్నాయి.మన దేశంలో రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని పాలకులు చెబుతున్నట్లుగానే బ్రిటన్‌ నేతలు కూడా మీకు ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం ఏముంది ” స్వయం ఉపాధి పధకంలో చేరండి ” అని చెప్పారు. మూడోవంతు మంది పాతికేండ్ల లోపు కార్మికులు వారానికి ఎంత వేతనం వస్తుందో తెలియని పనులు చేస్తున్నారు. స్వయం ఉపాధి పేరుతో నమోదైన వారిలో ఎక్కువ మంది కాంట్రాక్టర్లవద్ద కనీసవేతనాలు, వేతనంతో కూడిన సెలవులు లేని పనులు చేస్తున్నారు. స్వేచ్చ దొరికింది గానీ పనికి భద్రత లేమి వారికి బహుమతిగా దక్కింది.యువత సోషలిజం వైపు మొగ్గుతున్నదంటే దాని అర్దం వారంతా విప్లవకారులుగా మారుతున్నారని కాదు. ఎలాంటి సంక్షోభాలు లేని సోషలిస్టు చైనా, అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న సరకులను వారు నిత్యం చూస్తున్నారు గనుక అలాంటి విధానం మంచిదనే సానుకూలతవైపు మొగ్గుతున్నారు. అవసరమైతే తరువాత విప్లవకారులుగా మారతారు.యువ రచయిత్రి సాలీ రూనే తాజా నవల ” ఇన్‌ ద బ్యూటిఫుల్‌ వరల్డ్‌ వేర్‌ యు ఆర్‌ ” (అందమైన లోకంలో మీరెక్కడున్నారు)లో ఒక పాత్ర చేత ఇలా పలికించారు. ” తొలుత నేను మార్క్సిజం గురించి మాట్లాడినపుడు జనాలు నన్ను చూసి నవ్వారు, ఇప్పుడు అది అందరి నోటా నానుతోంది” దీని అర్ధం ఏమిటి ప్రచ్చన్న యుద్దంలో తాము విజయం సాధించినట్లు పెట్టుబడిదారులు ప్రకటించుకున్న మూడు దశాబ్దాల తరువాత కుర్రకారు మరింత స్వేచ్చగా పెట్టుబడిదారీ విధానం, సోషలిజం గురించి చర్చిస్తున్నారనే కదా ! అందుకే ఆర్ధికవేత్త జేమ్స్‌ మిడ్‌వే ఇటీవల ఒక తన వ్యాసానికి ” జనరేషన్‌ లెఫ్ట్‌ మైట్‌ నాట్‌ బి దట్‌ లెఫ్ట్‌ ఆఫ్టరాల్‌ ” ( ఆ వామపక్ష వాదులా… వారెంత అని ఉపేక్షించిన మాదిరి కాదు కుర్ర వామపక్షవాదులు ” అని శీర్షిక పెట్టారు.


రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ అక్కడి ప్రభుత్వం పట్ల దూకుడుగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. ఇది ఎవరూ తీర్పు ఇచ్చే అంశం కాదు. ” తాజాగా జరిగిన డ్యూమా(పార్లమెంట్‌) ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్లు,యువ కమ్యూనిస్టులు, పార్టీతో కలసిన ఇతర వామపక్ష శక్తులు అధ్యక్షుడు పుతిన్‌కు అనూహ్య సవాలు విసురుతున్నారు. పాత తరం అంతరిస్తున్నది, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కొత్త పటాలం, సామాజిక మాధ్యమంతో పనిచేసే కమ్యూనిస్టులు ఎదుగుతున్నారు. వారు సిద్దాంత ఉపన్యాలు చేయకపోవచ్చు, ఎర్రజెండాలను ఊపకపోవచ్చు, వారు పుతిన్‌ ప్రభుత్వ అవినీతి, దేశంలో దారిద్య్రం గురించి నిరసన తెలుపుతున్నారు ” అని ఒకరు పేర్కొనగా, ” ఇది నిజంగా రష్యన్‌ రాజకీయాలలో శక్తివంతమైన టెక్టోనిక్‌ ప్లేట్ల (భూమి ఖండాలుగా విడిపోయి కోట్ల సంవత్సరాలు గడచినా ఆ ముక్కలు సముద్రంలో ఇంకా కుదురుకోలేదు, వాటి కదలికలు సునామీలు, భూకంపాలకు దారితీస్తున్నాయి. వాటినే శిలావరణం అంటున్నారు-రష్యన్‌ యువ వామపక్ష వాదులు రాజకీయ సునామీలు, భూకంపాలు సృష్టించగలిగిన వారని భావం) వంటివి, మార్పునకు ఇది ప్రారంభం ” అని లండన్‌ విశ్లేషకుడు మార్క్‌ గలియోటి అన్నాడు. సెప్టెంబరు పార్లమెంటు ఎన్నికల్లో అధికారికంగా ప్రకటించిన వాటి కంటే కమ్యూనిస్టులకు ఎక్కువ, అధికార పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయని కూడా గలియోటి అన్నాడు. ” అధికార యునైటెడ్‌ రష్యా పార్టీకి వెల్లడైన మద్దతు స్ధాయి గురించి రష్యన్‌ కులీనులకు ఎలాంటి భ్రమలు లేవు ” అని ఆర్‌ పోలిటిక్స్‌ అనే రాజకీయ సలహా సంస్ధను ఏర్పాటు చేసిన తాతియానా స్టానోవయా చెప్పింది. రష్యా రాజకీయాలలో కమ్యూలను ఇంకేమాత్రం విస్మరించకూడదని, వారిని అణచివేస్తే అజ్ఞాతవాసానికి వెళతారని కొందరు పేర్కొన్నారు. ఇంకా అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలు ఉన్నప్పటికీ స్ధలాభావం వలన మరోసారి చర్చించవచ్చు.


చరిత్ర పునరావృతం అవుతుందని పెద్దలు చెప్పారు, దాని అర్ధం గతం మాదిరే జరుగుతుందని కాదు. ప్రతి తరంలోనూ నిరంకుశ పాలకులు తలెత్తినపుడు వారిని ఎదిరించేవారు కూడా అదేమాదిరి తయారవుతారు. ఒకానొక కాలంలో ప్రత్యక్షంగా తలపడ్డారు, కర్రలు, విల్లంబులు, కత్తులతో తిరుగుబాట్లు జరిపారు. తుపాకులు వచ్చిన తరువాత అలాంటి అవసరం లేదు. పద్దతి మారింది తప్ప తిరుగుబాటు లక్ష్యం ఒక్కటే -అదే అణచివేత, దోపిడీ నిర్మూలన, ఇప్పుడూ అదే జరుగుతోంది. ” ఐరోపాను ఒక భూతం వేటాడుతోంది-అది కమ్యూనిస్టు భూతం. పాత ఐరోపాలోని అధికారశక్తులన్నీ ఈ దయ్యాన్ని వదిలించుకొనేందుకు అపవిత్ర కూటమి గట్టాయి. పోప్‌, జార్‌, మెట్రినిచ్‌, గుయిజోట్‌, ఫ్రెంచి విప్లవకారులు, జర్మన్‌ పోలీసు గూఢచారులు చేతులు కలిపారు.” అనే పదాలతో 1848 ఫిబ్రవరి 21న తొలిసారిగా ప్రచురితమైన కమ్యూనిస్టు ప్రణాళిక (మానిఫెస్టో) ప్రారంభ పదాలవి. తరువాత పరిస్దితి మారింది. ఆ కమ్యూనిస్టు భూతం అన్ని ఖండాలకు విస్తరించింది. అందువలన ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో దాన్ని అంతమొందించాలని చూస్తూనే ఉన్నారు. ఒక దుర్మార్గుడు మరణిస్తే మరొకడు పుట్టుకువచ్చినట్లుగా ఒక విప్లవకారుడిని అంతమొందిస్తే వేయి మంది కొత్తవారు రంగంలోకి వస్తున్నారు. దోపిడీ శక్తులను ప్రతిఘటించే, పీచమణిచే కమ్యూనిస్టులూ అవతరిస్తున్నారు. ఇరు పక్షాల ఎత్తుగడలూ, రూపాలు అన్నీ మారాయి.


ఈ నేపధ్యంలో చూసినపుడు మహత్తర నవంబరు(పాత కాలెండర్‌ ప్రకారం అక్టోబరు) విప్లవం గతం. అది ఒక్క రష్యాలోనే కాదు, దోపిడీ జరిగే ప్రతిచోటా అనివార్యం. దాని అర్ధం నవంబరులోనే జరగాలని, జరుగుతుందనీ కాదు. నవంబరు విప్లవం అంటే నరజాతి చరిత్రలో తొలిసారిగా రష్యా శ్రామికులు జారు చక్రవర్తి రూపంలో ఉన్న దోపిడీ శక్తులను కూల్చివేసి శ్రామిక రాజ్యఏర్పాటుకు నాందిపలికిన ఉదంతం. తరువాత చైనా విప్లవం అక్టోబరులోనే జయప్రదమైంది. రష్యాలో ఇప్పుడు జారు చక్రవర్తి లేడు. వాడి స్ధానంలో ఇప్పుడు ఉన్న శక్తులు వేరే ముసుగులు ధరించి ఉన్నాయి. ఆ లెనిన్‌, స్టాలిన్లు లేరు, నూతన తరం కమ్యూనిస్టులున్నారు. తిరిగి సోషలిజం స్ధాపన అనివార్యం అని నమ్ముతున్నారు. అయితే గతంలో మాదిరే వింటర్‌ పాలెస్‌ ముట్టడిస్తే కుదరదు. ఎందుకంటే అక్కడ జారు చక్రవర్తి లేడు. అధికార కేంద్రం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నుంచి మాస్కోకు మారింది. అందువలన మరోపద్దతి, మరో రూపం అనుసరించాల్సిందే. విప్లవ కాలంలో రష్యాలో కార్మికులు, రైతులూ, చైనాలో రైతులు ఎక్కువగా కార్మికులు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల్లో రైతులు నామమాత్రం. దోపిడీ కొనసాగుతూనే ఉంది, దాన్ని అంతమొందించాల్సిందే. అందువలన అక్కడ విప్లవం రావాలంటే పాత పద్దతులు, ఎత్తుగడలూ పనికి రావు. విప్లవం చుంచెలుక వంటిది. అది నిరంతరం నేలను తవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా బయటకు వస్తుందో తెలియదు, విప్లవం కూడా అలాంటిదే నిత్యం జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ, ఎలా బయట పడుతుందో చెప్పలేము.


వలసవాద కాలంలో శత్రువు ప్రత్యక్షంగా కనిపించేవాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పరిస్ధితులు మారాయి. కార్మికులకు తమ శ్రమను దోచుకుంటున్నవాడు ప్రత్యక్షంగా కనిపించడు, అసలు ఫ్యాక్టరీలే లేకుండా కూడా దోపిడీ సాగుతోంది. అందువలన ఎక్కడికక్కడ స్ధానిక పద్దతులు, ఎత్తుగడలు అనుసరించాల్సిందే. ఒక నమూనా అనేది లేదు, సాధ్యం కాదు. ఇప్పుడు కమ్యూనిస్టులతో పాటు వ్యతిరేకించేశక్తులూ, సవాళ్లూ పెరిగాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామాలను వివరించటం సాధ్యం కాదు. అందుకే అమెరికా, బ్రిటన్‌, రష్యాలలో జరుగుతున్న కొన్ని పరిణామాలనే పరిమితంగా సృజించాల్సి వచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యాలో ఏం జరుగుతోంది, పుతిన్‌కు సవాలుగా మారుతున్న కమ్యూనిస్టులు ?

03 Sunday Oct 2021

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

2021 Duma elections, Alexei Navalny, Gennady Zyuganov, Russia Communists, United Russia, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


కొందరి దృష్టిలో కమ్యూనిస్టుల తప్పిదాలతో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయింది. మరొక కోణం ప్రకారం కుట్రతో సామ్రాజ్యవాదం కూల్చివేసింది. దేని పాత్ర ఎంత అనేది ఎవరికి వారు గుణపాఠాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆ ఉదంతం జరిగి మూడు దశాబ్దాలు దాటింది. ఇంతకాలం తరువాత అక్కడ కమ్యూనిస్టులు ఏమి చేస్తున్నారు, ఉద్యమం ఎలా ఉంది అనేది వామపక్ష అభిమానులు, వ్యతిరేకులకూ ఆసక్తికరమైన అంశమే. పుతిన్‌కు తలనొప్పిగా మారుతున్న కమ్యూనిస్టులు అనే శీర్షికతో అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఒక సమీక్ష రాసింది. రష్యాను మరోసారి కమ్యూనిస్టు భూతం వెంటాడుతోందా అనే వాక్యంతో అది ప్రారంభమైంది.నిజమేనా -అతిశయోక్తా ? అసలు అక్కడేం జరుగుతోంది ?


సెప్టెంబరు 17-19 తేదీలలో రష్యన్‌ డ్యూమా(పార్లమెంటు ) ఎన్నికలు జరిగాయి.నాలుగు వందల యాభై స్ధానాలకు గాను 225 దామాషా ప్రాతినిధ్యం పద్దతిలో మిగిలిన 225 నియోజకవర్గాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అధికార యునైటెడ్‌ రష్యా పార్టీకి 49.82 శాతం ఓట్లు, 324 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షంగా మొదటి స్ధానంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి 18.93శాతం ఓట్లు, 57 సీట్లు వచ్చాయి. జస్ట్‌ రష్యా పార్టీకి 7.46 శాతం ఓట్లు 27 సీట్లు, ఎల్‌డిపిఆర్‌కు 7.55శాతం ఓట్లు 21 సీట్లు,న్యూపీపుల్‌ పార్టీకి 5,32శాతం ఓట్లు 13 సీట్లు, మరో మూడు పార్టీలకు ఒక్కొక్కసీటు, స్వతంత్రులకు ఐదు వచ్చాయి. మాస్కో తదితర ప్రాంతాలో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడటంతో ప్రత్యక్ష ఎన్నికలలో కమ్యూనిస్టులు కొందరు ఓడిపోయారు.వాటి మీద కోర్టులో కేసులు దాఖలు చేశారు. గత పార్లమెంట్‌ ఎన్నికలలో మొత్తం ఓట్లలో 47.8శాతం పోలుకాగా ఈ సారి 45.15శాతానికి తగ్గాయి. అధికారపక్ష ఓట్లు 54.20శాతం నుంచి 49.82శాతానికి తగ్గాయి.

కమ్యూనిస్టులతో సహా ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది అభ్యర్ధులపై తప్పుడు కేసులు బనాయించి పోటీలో లేకుండా చేసుకోవటం, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ అక్రమాలకు పాల్పడటంలో పుతిన్‌ అధికార యంత్రాంగం పేరు మోసింది. వాటన్నింటినీ అధిగమించి కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా ముందుకు రావటం, అక్రమాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగటంతో అసలు సిసలు ప్రతిపక్షం కమ్యూనిస్టులే అని పరిశీలకులు, సామాన్యజనం కూడా గుర్తించారు. అనేక మంది చురుకైన యువ కమ్యూనిస్టులు ఈ ఎన్నికలలో పని చేయటం, జనం ఆదరించటం గతం కంటే ఆరుశాతం ఓట్లు 15 సీట్లు పెరగటాన్ని చూసి రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులతోనే పుతిన్‌కు సవాలు ఎదురవుతుందని భావిస్తున్నారు.వాషింగ్టన్‌ పోస్టు విశ్లేషణ సారాంశమిదే.


కమ్యూనిస్టు పార్టీ ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న ఎత్తుగడలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను సంఘటితం చేసేందుకు చేసిన యత్నాలు ఫలిస్తున్నట్లు ఈ ఎన్నికలు నిరూపించాయి.గత అధ్యక్ష ఎన్నికలలో (2018) కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా పురోగామి భావాలు కలిగిన స్ట్రాబెరీ వాణిజ్యవేత్త పావెల్‌ గ్రుడినిన్‌ పోటీ చేశారు.గ్రుడినిన్‌కు విదేశాల్లో ఆస్తులున్నాయని, పుతిన్‌ మీద పోటీ చేసిన ఆయనకు 90లక్షల మంది మద్దతుదారుల లేరనే పేరుతో ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించారు. ప్రాంతీయ అసెంబ్లీలలో ఈ విధంగా ఐదుగురు ప్రముఖ కమ్యూనిస్టునేతలను అనర్హులుగా ప్రకటించారు. కమ్యూనిస్టు మద్దతుదారులే కాదు, పుతిన్‌ విధానాలను వ్యతిరేకించే ఇతర ఓటర్లు కూడా ఈ ఎన్నికలలో కమ్యూనిస్టులవైపు మొగ్గటం స్పష్టంగా కనిపించింది. ఇది వచ్చే అధ్యక్ష ఎన్నికలలో కూడా పుతిన్‌ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగతా ప్రతిపక్ష పార్టీనేతలను తప్పుడు కేసులతో, ఏదో ఒకసాకుతో జైలు పాలు చేసి, కమ్యూనిస్టుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే అది ఎదురుతన్నే అవకాశం ఉందనే అంశం పుటిన్‌కు తెలియంది కాదు.

కమ్యూనిస్టులకు ఈ ఎన్నికలలో కోటీ ఆరులక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. దేశంలోని 41 ప్రాంతాల(మన రాష్ట్రాల మాదిరి)లో నాలుగు చోట్ల ు 30 నుంచి 36శాతం ఓట్లతో కమ్యూనిస్టు పార్టీ పెద్ద పక్షంగా అవతరించింది. మిగతా చోట్ల 20 నుంచి 30శాతం ఓట్లు వచ్చాయి.38 ప్రాంతీయ శాసనసభల్లో గతంలో 158 స్ధానాలుండగా ఇప్పుడు 254వచ్చాయి. ఇవన్నీ అనేక చోట్ల అధికారపక్షం అక్రమాలకు పాల్పడిన నేపధ్యంలో వచ్చిన విజయాలు అని గ్రహించాలి. మూడు రోజుల పాటు ఎందుకు ఎన్నికలు జరిపారు అంటే కరోనా అని సాకులు చెప్పారు. అధికారపక్షానికి ఎదురుగాలి వీస్తున్నదనే సూచికలు ఎన్నికల ముందు సర్వేలు వెల్లడించాయి. దాంతో ఓటింగ్‌కు రాని ప్రభుత్వ రంగ కార్మికులు,ఇతరులను పెద్ద ఎత్తున సమీకరించటం, పరోక్ష ఎలక్ట్రానిక్‌ పద్దతిలో అధికారపక్షానికి ఓటు వేయించారు.


మీడియా కేంద్రీకరణ మొత్తం అధికారపక్షం వైపు తప్ప ప్రతిపక్షాలను ముఖ్యంగా కమ్యూనిస్టులను విస్మరించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మాయాజాలం గురించి చెప్పాలంటే మాస్కో నగరం, పరిసరాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. సెప్టెంబరు 19వ తేదీ రాత్రి ఏడు గంటల సమయంలో ప్రత్యక్ష ఓట్ల లెక్కింపులో కమ్యూనిస్టు-అధికార యునైటెడ్‌ రష్యా పోటాపోటీగా ఓట్లు తెచ్చుకున్నట్లు వెల్లడైంది. తరువాత పరోక్ష ఎలక్ట్రానిక్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఒక గంటలోనే పరిస్ధితి తారుమారైంది. ఇది రిగ్గింగుతప్ప మరొకటి కాదు. అనేక పోలింగ్‌ కేంద్రాలలో పెద్ద ఎత్తున ఏదో ఒకసాకుతో వేలాది ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. ఇలాంటి అక్రమాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీలేవీ ఎక్కడా ఆందోళన జరపలేదు. పోలీసులు, అధికార యంత్రాంగం కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలలో ప్రవేశించి బెదిరించటం, అరెస్టులు చేయటం, ప్రదర్శనలను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. పార్టీ వెబ్‌సైట్‌ను నిరోధిస్తామని చెప్పారు. ఎన్నికల అక్రమాలపై కేసులు దాఖలు చేసేందుకు వివరాలను సేకరిస్తున్న లాయర్లను బెదిరించారు.పదిరోజుల పాటు జైలుపాలు చేశారు.

ఎన్నికలకు ముందు ఆల్‌ రష్యన్‌ సెంటర్‌ అనే ప్రజాభిప్రాయసేకరణ సంస్ధ జరిపిన సర్వేలో కమ్యూనిస్టు నేత జుగనోవ్‌ మీద విశ్వాసం ప్రకటించిన వారు 30.7శాతం ఉన్నట్లు ప్రకటించింది. కమ్యూనిస్టులకు ఎన్నికలలో 16.6, రష్యన్‌ ఫెడరేషన్‌లో 23.3శాతం వస్తాయని పేర్కొన్నది. ఎన్నికలలో అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. పార్టీ సిద్దాంతాలు, ఆచరణకు జనం మద్దతు పెరిగినట్లు ఫలితాలు వెల్లడించాయని కమ్యూనిస్టు పార్టీ సమీక్షలో పేర్కొన్నది. అక్రమాలు చోటు చేసుకోనట్లయితే ఇంకా ఓటింగ్‌ శాతం, సీట్లు పెరిగి ఉండేవి.కమ్యూనిస్టు పార్టీని ప్రధాన ప్రతిపక్షంగానే కాదు, అసలైన ఏకైక ప్రతిపక్షంగా జనం భావించారు. అందువల్లనే ప్రభుత్వ వ్యతిరేకులు కమ్యూనిస్టుల వైపు మొగ్గారు.


గత పదిసంవత్సరాలుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పుతిన్‌కు అసలైన ప్రతిపక్షం ఉదారవాదులు తప్ప కమ్యూనిస్టులు కాదని జనాల మెదళ్లలో ఎక్కించేందుకు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తికాదు. అమెరికాలో మాదిరి ఎవరు అధికారంలో ఉన్నా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలను అనుసరించే శక్తులతోనే రాజకీయ రంగాన్ని నింపాలన్నది ఎత్తుగడ. తన అధికారాన్ని సుస్ధిరం చేసుకొనే యత్నాలలో భాగంగా వ్లదిమిర్‌ పుతిన్‌ ఏ పెట్టుబడిదారి విధాన సమర్ధపక్షాన్ని కూడా బతకనివ్వలేదు. గతేడాది చేసిన రాజ్యాంగ సవరణల ప్రకారం అధ్యక్ష పదవిని ఎవరు ఎన్నిసార్లయినా అధిరోహించవచ్చు. దాని ప్రకారం 2036వరకు ఆరోగ్యం సహకరించి అన్నీ అనుకూలిస్తే పుతిన్‌ అధికారంలో కొనసాగవచ్చు. అయితే ఉదారవాద పార్టీలకు బదులు కమ్యూనిస్టులే అసలైన ప్రతిపక్షం అని ఈ ఎన్నికలు నిరూపించటం గమనించాల్సిన ముఖ్య అంశం.


ఆగస్టు నెలలో లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్‌ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్‌, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నట్లుగా మంచి పెట్టుబడిదారీ విధానానికి బదులు తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. మరోవైపున తమ కళ్ల ముందే అమెరికా, ఐరోపా దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ధలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని రష్యన్‌ యువతరం గ్రహించకుండా ఎలా ఉంటుంది. సోషలిస్టు వ్యవస్ధ లేకపోయినా అమెరికా నుంచి రష్యాకు ముప్పు ఉందనే జాతీయ భావాలను కూడా ముందుకు తెచ్చారు. అయితే ఇటీవలి కాలంలో అమెరికా కేంద్రీకరణ రష్యామీద కంటే చైనావైపు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రచారం రష్యన్లలో అంతగా ఎక్కే అవకాశం లేదు. అనేక దేశాలలో తమకు అనుకూలమైన శక్తులను ప్రతిష్టించేందుకు అమెరికా అంతర్గత అంశాలు, ఎన్నికలలో జోక్యం చేసుకొంటోంది. పుతిన్‌ బదులు మరొకరిని ప్రోత్సహించాలని చూసినా అందుకు తగిన శక్తులు రష్యాలో కనిపించటం లేదు. పురోగామి సోషలిస్టు మార్గాన పయనించటానికి తాము కట్టుబడి ఉన్నామని వెనక్కి తగ్గేది, లొంగిపోయేది లేదని, జన ధోరణి తమకు అనుకూలంగా మారుతోందని కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికల ఫలితాల విశ్లేషణ తరువాత ప్రకటించింది.


” ఓటర్లు మేం చెప్పింది విన్నారు. ఓటర్లు మమ్మల్ని నమ్మారు. మాకు ఓట్లు వేశారు ” అని పార్టీ అగ్రనేత గెన్నడీ జుగనోవ్‌ చెప్పారు. నియోజవర్గ ప్రాతిపదికన ప్రత్యక్ష ఓటింగ్‌ జరిగిన 225 స్ధానాల్లో కమ్యూనిస్టులకు తొమ్మిది రాగా అధికారపక్షానికి 198వచ్చాయి. ఈ సీట్లలో అనేక అక్రమాలు జరిగాయనే విమర్శలు వచ్చాయి. మొత్తగా 50శాతం కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న అధికారపార్టీ నియోజకవర్గ ప్రాతిపదికన జరిగిన చోట అత్యధిక సీట్లు గెలిచిన కారణంగా మొత్తం సీట్లలో 72శాతం వచ్చాయి. అదే కమ్యూనిస్టులకు 19శాతం ఓట్లు వచ్చినా సీట్లు 12.7శాతమే వచ్చాయి. స్వతంత్ర విశ్లేషకుడు సెర్గీ షిఫిల్‌కిన్‌ అంచనా ప్రకారం కమ్యూనిస్టులకు వాస్తవంగా 31-33 శాతం మధ్య ఓట్లు వచ్చాయని అన్నాడు.మాస్కో ప్రాంతంలోని పదిహేను నియోజకవర్గాలలో అధికారపక్షం రిగ్గింగుకు పాల్పడిన కారణంగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్దులు ఓడిపోయారన్నది స్పష్టం. ప్రత్యక్షంగా వేసిన ఓట్ల లెక్కింపు జరిగినంతసేపూ అధికారపక్షం, కమ్యూనిస్టులు పోటా పోటీగా ఓట్లు తెచ్చుకున్నట్లు ప్రకటించిన అధికారులు ఎలక్ట్రానిక్‌ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితాలు మారు చేశారన్నది అభియోగం. కమ్యూనిస్టులు గట్టి పోటీ ఇచ్చిన ప్రతి చోటా ఇదే జరిగినట్లు చెబుతున్నారు.


కమ్యూనిస్టు పార్టీలో పెరుగుతున్న యువత రానున్న రోజుల్లో మరింతగా మిలిటెంట్‌ పోరాటాలకు సిద్దమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జైలు పాలైన ఒక ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నవల్నీ అధికారపక్షాన్ని ఓడించే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చాడు. అతని మద్దతుదారులు కొందరు కమ్యూనిస్టులకు ఓటు వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. సోవియట్‌ అంతరించి మూడు దశాబ్దాలు గడచింది. కమ్యూనిస్టు పార్టీలో ఉన్న నలభై ఏండ్ల లోపు వారికి నాటి విషయాలు వినటం తప్ప ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదు. అలాంటి వారు అనేక మంది జాతీయ పార్లమెంట్‌, స్ధానిక అసెంబ్లీలకు ఎన్నికయ్యారు. దేశంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాలకు, పెట్టుబడిదారీ వ్యవస్ధ దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. గతంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి ఇప్పటి కమ్యూనిస్టు పార్టీకి తేడా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ముందుకుపోతామని అనేక మంది యువనేతలు చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఆర్ధిక రంగంలో పుతిన్‌ వైఫల్యాల కారణంగా ఇటీవలి కాలంలో కార్మికవర్గంలో అసంతృప్తి పెరుగుతున్నది. మరొక ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేనందున కమ్యూనిస్టు పార్టీ ముందుకు పోవటానికి ఇది కూడా దోహదం చేస్తుందన్నది తెలిసిందే.లెనిన్‌ జన్మించిన ఉల్యనోవస్క్‌ పట్టణం, పరిసరాలలో కమ్యూనిస్టులు 30శాతంపైగా ఓట్లు సాధించారు. ఆ నియోజకవర్గంలో గత ఎన్నికలలో విజయం సాధించిన కమ్యూనిస్టులను అడ్డుకొనేందుకు అధికారపక్షం అనేక ప్రయత్నాలు చేసినా తిరిగి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. లెనిన్‌ పదిహేడు సంవత్సరాల వయస్సులో ఉల్యనోవస్క్‌ను విడిచి వెళ్లిన తరువాత తిరిగి అక్కడికి వెళ్లలేదు. అయినా అంతటి మహానేత జన్మించిన ప్రాంతం తమదని అక్కడి వారు గర్వపడతారు. తిరిగి తమ జీవిత కాలంలో రష్యన్‌ సోషలిజాన్ని చూస్తామనే విశ్వాసం కమ్యూనిస్టు కార్యకర్తల్లో ఉంది.


మాస్కోలోని మాక్రో అడ్వైజరీ సంస్ధ అధిపతి క్రిస్‌ వీఫర్‌ ఎన్నికల గురించి విశ్లేషిస్తూ ” జనాభాలో మారుతున్న నిష్పత్తి పుతిన్ను భయపెడుతున్న అసలైన సమస్య, సోవియట్‌ యూనియన్‌ అంతరించిన తరువాత జన్మించిన జనాభా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఓటర్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ఈ తరం పెద్ద ఎత్తున ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నది, అనేక దేశాలు తిరిగి వస్తున్నది. దేశం స్ధిరపడాలనే పుతిన్‌ కబుర్లను వినేందుకు వీరు సిద్దంగా లేరు. మెరుగైన జీవనం, ఆదాయం, సామాజిక భద్రత, మెరుగైన భవిష్యత్‌ను కోరుకుంటున్నారు. వీరి ఆకాంక్షలను నెరవేర్చుతూ అధికారంలో కొనసాగటం అనేది పుతిన్‌ ముందున్న పెద్ద సవాలు. ప్రస్తుత వైఫల్యాలు వచ్చే ఎన్నికల్లో ఎవరు అధ్యక్ష అభ్యర్ధిగా ఉన్నా వారికి గుదిబండలుగా మారతాయి” అన్నాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లెనిన్‌ దేవదూత, బైబిల్‌ నుంచే కమ్యూనిజం :పుతిన్‌

17 Wednesday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, Bible, communist manifesto, Democratic party, Lenin a saint, Pavel Grudinin, russian elections, Soviet communist ideas, v.i.lenin, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు

గత వారంలో కమ్యూనిస్టులకు, ఇతరులకు ఆసక్తి కలిగించే రెండు వుదంతాలు జరిగాయి. ఒకటి మార్చి18న జరిగే ఎన్నికలలో మరోసారి పీఠం ఎక్కేందుకు పోటీ పడుతున్న రష్యన్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ కమ్యూనిస్టు భావజాలం బైబిల్‌ నుంచే వచ్చిందని, లెనిన్‌ దేవదూత వంటి వ్యక్తి అని చెప్పాడు. అమెరికాలోని అమీ హరోవిట్జ్‌ అనే ఒక మితవాద వీడియో గ్రాఫర్‌ న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధులకు చదివి వినిపించిన నాలుగు ప్రకటనలు ఎవరివి అంటే కమ్యూనిస్టులవి అనే దిమ్మతిరిగే సమాధానం రావటం రెండో వుదంతం.

న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం వుదారవాద భావాల నిలయంగా ప్రసిద్ధి. హారోవిట్జ్‌ తాను నాలుగు వాక్యాలను చదివి వినిపిస్తానని అవి కమ్యూనిస్టులవో డెమోక్రటిక్‌ పార్టీవో చెప్పాలని విద్యార్ధులను కోరాడు. మొదటిది ‘మేము సామాజిక మార్పునే పురికొల్పుతాము’. సమాధానం చెప్పిన నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టోలో భాగం అని ఏక కంఠంతో చెప్పారు. ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అది ఎక్కువగా కమ్యూనిస్టు ప్రకటనగానే కనిపిస్తోంది అని చెప్పగా ఒక్కరు మాత్రమే డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటన అని సరిగా చెప్పారు.

‘మేము నూతన వర్గాలను, అణచివేత నూతన పరిస్దితులను, పాతవాటిని తొలగించేందుకు నూతన పోరాట పద్దతులను పాదుకొల్పాము’ అనే ప్రకటన డెమోక్రటిక్‌ పార్టీదే అని అందరూ సమాధానం చెబుతారని నేను అనుకొంటున్నాను అని ఒక యువతి చెప్పగా ఇద్దరిలో ఒకరు అది కమ్యూనిస్టుమానిఫెస్టోలో భాగం అని చెప్పారు.

‘ ప్రజలపట్ల వివక్షను చూపే విధానాల ఫలితమే జాతి, సంపద, ఆదాయ అసమానతలు ‘ అన్న ప్రకటన డెమోక్రటిక్‌ పార్టీది అని ముగ్గురిలో ఇద్దరు సరిగానే చెప్పారు. అయితే కొందరు ఇది నిజంగా కమ్యూనిస్టు పార్టీ ప్రకటన కాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘స్వేచ్చామార్కెట్‌ పద్దతుల ద్వారా సంపద అసమానతలను పరిష్కరించలేము’ ఈ ప్రకటనపై నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టో చెప్పిన అంశ మే అన్నారు. ఇది డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటనలో భాగం. చిత్రంగా వుందే అది కమ్యూనిస్టు మానిఫెస్టో అంశం మాదిరి ధ్వనిస్తోందే అని ఆశ్చర్యపోయారు ఒకరు.

‘ఈ వ్యవస్ధ పని చేయటం లేదు, ఆర్ధికానికి బంధనాలు వేశాము’ అన్న వ్యాక్యం డెమోక్రటిక్‌ పార్టీది అని ఇద్దరిలో ఒకరు చెప్పారు. అమెరికన్‌ విద్యార్ధులు కమ్యూనిస్టు ప్రణాళిక-డెమొక్రటిక్‌ పార్టీ 2016 ఎన్నికలలో చెప్పినదానికి తేడాను గుర్తించటంలో ఎందుకు గందరగోళపడుతున్నారు అన్నది ఒక ప్రశ్న. అమెరికా పరిణామాలను గమనిస్తున్న వారికి ఇది సహజంగా కనిపిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, తరువాత కాలంలో అమెరికాలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు ప్రణాళిక-డెమోక్రటిక్‌ పార్టీ చెబుతున్న అంశాలకు తేడాను జనం గుర్తించలేని కారణంగా, డెమోక్రటిక్‌ పార్టీని ఒక తీవ్రవాద వామపక్ష సంస్ధగా పరిగణించినందున 2010 నుంచి ఇప్పటి వఅసరకు రాష్ట్రాలు, కేంద్రంలోని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు వెయ్యింటిలో, మెజారిటీ రాష్ట్రాల గవర్నర్‌ ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోయిందని ఒక విశ్లేషణ తెలిపింది. బరాక్‌ ఒబామా పదవిలో వున్న ఎనిమిది సంవత్సరాల పాటూ అతనొక కమ్యూనిస్టు అనే ప్రచారం సాగుతూనే వుంది. డెమోక్రటిక్‌ పార్టీని కొందరు కమ్యూనిస్టు లేదా తీవ్రవాద వామపక్ష సంస్ధగా చిత్రించటాన్నీ చూశాము. 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా కార్మికవర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న స్ధితి, అమెరికాను, యావత్‌ పెట్టుబడిదారీ వ్యవస్ధను కుదిపిన 2011 సెప్టెంబరు వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం వంటి పరిణామాల పూర్వరంగంలో డెమోక్రటిక్‌ పార్టీ నినాదాలు, నాయకుల ప్రసంగాలలో పెద్ద మార్పు వచ్చింది. దానికి పరాకాష్టంగా అవును నేను సోషలిస్టును అంటూ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యుడు బెర్నీ శాండర్స్‌ ఆర్ధిక అసమానతల గురించి ఎండగట్టిన తీరు, సోషలిస్టును నన్ను బలపరచండి అంటూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వంకోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీపడి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తీరును చూశాము. లక్షలాది మంది యువత శాండర్స్‌తో గొంతు కలుపుతూ అవును మేమూ సోషలిస్టులటే అంటూ ప్రచారం చేసిందీ విదితమే. అందుకే నేడు అమెరికాలో సోషలిజం అంటే తిట్టుపదం కాదు. డెమోక్రటిక్‌ పార్టీ అస్ధిత్వరాజకీయాలు ఆ పార్టీని రాడికల్‌ నినాదాలు చేయిస్తున్నాయి. అయితే దాని స్వభావం అది కాదని సదా గుర్తుంచుకోవాలి. రెండు ప్రధాన పార్టీలలో ఏది ఎక్కువ హానికరమైనది అని ఎంచుకోవాల్సి వచ్చినపుడు డెమోక్రటిక్‌ పార్టీ కూడా కార్పొరేట్లకే అనుకూలం అయినప్పటికీ ఇంతవరకూ కార్మికవర్గం, నల్లజాతీయుల మొగ్గు ఆ పార్టీవైపే వుంది. అలాంటి వారంతా రోజువారీ, ఆందోళనల సందర్భంగా కమ్యూనిస్టులు మాట్లాడినట్లే దోపిడీ,జాతి వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతుంటారు. అందువలన యువత డెమోక్రటిక్‌ పార్టీ – కమ్యూనిస్టు ప్రణాళిక చెప్పిన అంశాల గురించి గందరగోళపడుతున్నారు. ఇది ఒక విధంగా మంచిదే. కమ్యూనిస్టు వ్యతిరేకత నరనరానికి ఎక్కి వున్న స్ధితిలో దోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా ఎంతవరకు కలసి అంత మేరకు వామపక్ష భావజాలం వ్యాప్తి చెందినట్లే, సోషలిజం, కమ్యూనిజాలకు ఆమేరకు వ్యతిరేకత తగ్గుతుంది.

అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ రాడికల్‌ నినాదాల కారణంగా సోషలిస్టు, కమ్యూనిస్టు పదజాలం యువతకు పరిచయం కావటం అక్కడి పాలకవర్గానికి ఆందోళన కలిగించే అంశం. రష్యాలో పాతిక సంవత్సరాల క్రితం కూల్చివేసిన సోషలిస్టు వ్యవస్ధ గురించి 56శాతం మందిలో బెంగ తలెత్తిందని ఒక సర్వే పేర్కొన్న విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే స్టాలిన్‌, లెనిన్‌ పట్ల జనంలో క్రమంగా సానుకూల అభిప్రాయాలూ పెరుగుతున్నాయని కూడా సర్వేలు తెలుపుతున్నాయి. మార్చినెలలో జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవికి కమ్యూనిస్టు పార్టీ నిలబెట్టిన పార్టీ సభ్యుడు కాని లెనిన్‌ వ్యవసాయ క్షేత్ర అధిపతి పావెల్‌ గ్రడినిన్‌ దేశవ్యాపితంగా ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పుతిన్‌ మినహా మరొకరెవరూ గెలిచే అవకాశం లేదని ఎన్నికల పట్ల నిరాసక్తతతో వున్న వారిలో కూడా వుత్సాహం నింపుతున్నట్లు, నెల రోజుల క్రితంతో పోల్చితే మద్దతు ఇచ్చేవారు రెట్టింపు అయినట్లు మీడియా పేర్కొన్నది. ప్రజల సొమ్ము తస్కరించటాన్ని ఆపండి, జనం మంచిజీవితాలను గడుపుతున్నారనే అబద్దాలకు సమాధికట్టండి, విద్య, వైద్యం వుచితంగా అందచేయాలని, పెన్షనర్లు గౌరవ ప్రద జీవితం గడపాలని కోరుతున్న రష్యన్‌ రాజ్యాంగాన్ని అమలు చేయటం ప్రారంభించండి అని వుపన్యాసాలలో అడుగుతున్న గ్రడినిన్‌ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది.ఆయన వుపన్యాసం తరువాత తన ఆధ్వర్యంలోని లెనిన్‌ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వారి జీవన పరిస్ధితులపై రూపొందించిన వీడియోను ప్రదర్శి ంచి రష్యన్లందరికీ అలాంటి పరిస్థితులు వుండాలని, తనకు అవకాశం ఇస్తే అమలు చేస్తానని చేస్తున్న ప్రచారతీరు కొత్తగా వుంది. గతంలో సహకార వ్యవసాయ క్షేత్రంగా వున్నదానిని ప్ర యివేటీకరించిన సమయంలో దానిలో పనిచేస్తున్న గ్రడినిన్‌ 1995లో దాదాపు సగం వాటాలను కొనుగోలు చేశారు. గతేడాది నాలుగువందల కోట్ల రూబుళ్ల మేర స్ట్రాబెర్రీ ఇతర తాజా పండ్లను మాస్కో మార్కెట్లో విక్రయించారు. వచ్చిన లాభాలలో ఎక్కువ భాగం తిరిగిదానిలోనే పెట్టుబడి పెట్టటం, కార్మికుల సంక్షేమ చర్యలకు వినియోగిస్తూ ఎడారిలో ఒయాసిస్‌ మాదిరి సోషలిజాన్ని కాలదన్నుకున్న రష్యాలో సోషలిస్టు పద్దతులలో క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆధునిక నివాస గృహాలతో పాటు వుచిత పాఠశాలలు, ఆరోగ్య, ప్రసూతి కేంద్రాల నిర్వహణ, పెన్షన్‌ సదుపాయాలను కలిగిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధ లేకపోయినా కార్మికులకు సంక్షేమ చర్యలు అమలు జరపటం సాధ్యమే అని నిరూపించారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమపధకాల కంటే ఎక్కువ లబ్ది చేకూరుతోంది. వ్యవసాయక్షేత్రంలో పని చేసే కార్మికులకు రష్యన్‌ సగటు కంటే రెట్టింపుగా 78వేల రూబుళ్ల మేరకు నెలవారీ వేతనం ఇస్తున్నారు. అక్కడ పనిచేసే డ్రైవర్లు నివశించే భవనంలోనే గ్రడినిన్‌ కూడా వుంటున్నారు. మీరు ఇలా ఎందుకు నిర్వహిస్తున్నారు అని తరచూ అనేక మంది నన్ను అడుగుతూ వుంటారు. రష్యాలో అందరూ ఇలానే వుండాలని నేను కోరుకుంటున్నాను, అది సాధ్యమే అని చెబుతాను అని గ్రడినిన్‌ చెప్పారు. ఆయన మీసాలు, జుట్టు, రూపు రేఖలు స్టాలిన్‌ను పోలివుండటంతో కొంత మంది ఆయనలో స్టాలిన్‌ను చూస్తున్నారని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యా నించింది. యజమానిగా ఆయన వేతనం లెనిన్‌ క్షేత్రంలో పనిచేసే ట్రాక్టర్‌ డ్రైవర్ల కంటే 26రెట్లు ఎక్కువ అని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాలు వెల్లడించినట్లు ఆ పత్రిక తెలిపింది.

గ్రడినిన్‌ పట్ల ఓటర్లలో ఆసక్తి జనించిన పూర్వరంగంలో లెనిన్‌ ఒక దేవదూత అని, బైబిల్‌ నుంచే సోవియట్‌ కమ్యూనిస్టు భావన వచ్చిందని పుతిన్‌ చెప్పటం దానిని ప్రభుత్వరంగంలోని టీవీ ప్రసారం చేయటం ఎన్నికల ప్రచారంలో భాగమే అని చెప్పవచ్చు. ఫిన్లండ్‌ సరిహద్దులోని వాలమ్‌ మొనాస్టరీ పునరుద్దరణ సందర్భంగా తీసిన డాక్యుమెంటరీ కోసం పుతిన్‌ మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. గతంలో పుతిన్‌ అనేక సందర్భాలలో చర్చిని సమర్దించారు. ‘కమ్యూనిజం-క్రైస్తవం భావనలు ఒకదానికి ఒకటి పొసగదు అని నేను నమ్మటం లేదు. నేను చెబుతున్నది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కానీ నేను అనుకుంటున్నది నేను చెబుతాను’ అన్నారు. ‘ముందుగా ఒకటి చెప్పాలి, ఎల్లవేళలా విశ్వాసం మనతోనే వుంటోంది. మన దేశ ప్రజలకు కష్టాలు వచ్చినపుడు అది బలపడింది.ఆ చర్యలు ఎంతో కఠినంగా వున్నాయి. దేవునితో యుద్ధం చేసిన సంవత్సరాలలో చర్చ్‌లను నాశనం అయ్యాయి, పూజారులను లేకుండా చేశారు. అయితే అదే సమయంలో సోవియట్‌లు ఒక నూతన మతాన్ని సృష్టించాయి.నిజంగానే కమ్యూనిస్టు భావజాలం క్రైస్తవానికి చాలా దగ్గర పోలిక వుంది. క్రైస్తవం, కమ్యూనిజం రెండూ కూడా స్వేచ్చ, సోదరత్వం, సమానత్వాన్ని ప్రబోధించాయి. లెనిన్‌ భౌతిక కాయ్యాన్ని మసోలియంలో వుంచారు. ఆర్ధడాక్స్‌ లేదా క్రైస్తవుల దేవదూతల అవశేషాలకూ దానికి తేడా ఏముంది’ అని పుతిన్‌ డాక్యుమెంటరీ నిర్వాహకులతో ప్రశ్నించారు.

రష్యాలో లెనిన్‌, స్టాలిన్‌, సోషలిజం, కమ్యూనిజాల పట్ల ఇప్పటికీ అక్కడి జనంలో వున్న అభిమానాల పూర్వరంగంలో వాటిపై మొరటుగా దాడిచేస్తే ఫలితం లేదని గ్రహించిన వ్యక్తిగా ఓటర్లలో గందరగోళం కలిగించేందుకు, తాను లెనిన్‌, కమ్యూనిజాలను వ్యతిరేకించినప్పటికీ వాటిపట్ల గౌరవం వుందని చెప్పుకొనేందుకు చేసిన ఒక ప్రయత్నంగా చెప్పవచ్చు. తాను అధికారంలో వున్నంత వరకు లెనిన్‌ భౌతిక కాయాన్ని మసోలియంలోనే వుంచుతానని గతంలో చెప్పాడు. ఎన్నికల సమయం గనుక లెనిన్‌ గురించి సానుకూలంగా మాట్లాడి దానిని ప్రచారంలోకి పెట్టారు. గతంలో అనేక సందర్భాలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను వ్యక్తం చేసిన పుతిన్‌ ఒక బూర్జువారాజకీయవేత్త. అవసరం కొద్ది అలాంటి వారు ఏమైనా చెబుతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా ఎన్నికలలో పశ్చిమ దేశాల జోక్యం !

04 Thursday Jan 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Communist Party of the Russian Federation, russian elections, Vladimir Putin, western countries intervention, western countries intervention in russian elections

ఎం కోటేశ్వరరావు

మార్చి 18న జరిగే రష్యా ఏడవ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం మొదలైంది. నామినేషన్లు దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్ధులు తమ అర్హత పత్రాలను ఈనెల ఏడు, పార్టీల అభ్యర్ధులు పన్నెండవ తేదీలో సమర్పించాల్సి వుంది. ఎన్నికల ప్రచారం అధికారికంగా డిసెంబరు18న ప్రారంభమైంది. అప్పటి నుంచి 25 రోజుల లోగా అంటే జనవరి పదహారవ తేదీలోపు తాము ఫలానా వారిని అభ్యర్ధులుగా నియమించినట్లు పార్టీలు సమావేశాలలో అధికారికంగా చేసిన తీర్మానాలను ఎన్నికల కమిషన్‌కు అందచేయాలి. అధ్యక్ష పదవికి ఎన్నికవ్వాలంటే యాభైశాతంపైగా ఓట్లు తెచ్చుకోవాలి. ఎవరికీ ఆమేరకు రానట్లయితే మూడు వారాల్లోపు మొదటి రెండు స్ధానాలలో వున్న అభ్యర్ధుల మధ్య తుది పోటీ నిర్వహించాల్సి వుంది.

అధ్యక్ష పదవికోసం మరోసారి పోటీ పడుతున్న వ్లదిమిర్‌ పుతిన్‌, కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధిగా లెనిన్‌ వ్యవసాయ కంపెనీ పారిశ్రామికవేత్త పావెల్‌ గ్రడినిన్‌, ఇతర పార్టీల తరఫున వ్లదిమిర్‌ జిరినోవస్కీ, గ్రిగొరీ యెవలిన్‌స్కీ,సెనియా సోబ్‌చెక్‌ తదితరులు వున్నారు. రష్యా నిబంధనల ప్రకారం పార్టీల అభ్యర్ధులుగా పార్టీ సభ్యులు కాని వారిని కూడా నియమించవచ్చు.దానికి అనుగుణ్యంగానే కమ్యూనిస్టు పార్టీ తొలిసారిగా పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని పార్టీ అభ్యర్ధిగా ఎంపిక చేసింది. ప్రస్తుతం రష్యాలో నమోదైన పార్టీలు 69 వున్నాయి. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలంటే మూడులక్షల సంతకాలను సేకరించాల్సి వుంది, అయితే ఏ ఒక్క రాష్ట్రంలోనూ అవి ఏడున్నరవేలకు మించకూడదు. అంటే దేశమంతటా పలుకుబడి కలిగిన వారే పోటీకి అర్హులు అవుతారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేని పార్టీల అభ్యర్ధులు లక్ష సంతకాలను సమీకరించాల్సి వుంది. ఏరాష్ట్రంలోనూ అవి రెండున్నరవేలకు మించకూడదు.ఒక ఓటరు ఒక అభ్యర్ధికి మాత్రమే మద్దతుగా సంతకం చేయాలి. ఫిిబ్రవరి మొదటి వారంలో నామినేషన్ల పరిశీలన, ఖరారు చేస్తారు.

పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వున్న కమ్యూనిస్టు పార్టీ తొలిసారిగా పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని అధ్యక్షపదవికి అభ్యర్ధిగా నిర్ణయించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. డిసెంబరు 23న కమ్యూనిస్టు పార్టీ వార్షిక ప్లీనరీ సమావేశంలో పావెల్‌ గ్రడినిన్‌ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. పార్టీ అధినేత జుగనోవ్‌ అభ్యర్ధి గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు.’ ఆయనొక శక్తి వంతుడు, అనుభవశాలి. సోషలిస్టు పద్దతులలో తన సంస్ధను నిర్మించారు. గ్రడినిన్‌ను బలపరిస్తే ఈ అనుభవాన్ని ప్రతిచోటా వ్యాపింపచేయవచ్చు. ఆయన వ్యాపారే, మాటలు చెప్పరు, వ్యాపారాన్ని జాతీయ దృక్పధంతో చేస్తున్నారు. సోవియట్‌ విలువలకు మద్దతు ఇస్తారు. ఆయన సంస్ధ అత్యుత సాంకేతిక పరిజ్ఞానంతో కూడి వుంది. ఒక బ్యాంకు చైర్మన్‌ మాదిరి గాక ఒక కమ్యూనిస్టు డైరెక్టర్‌లా వ్యవహరిస్తారు. నిరంకుశుడు కాదు, జన సేవకుడు. రష్యన్‌ ప్రభుత్వం అన్నింటినీ వదిలించుకోవాలనే కార్యక్రమం కలిగి వుంది. ఆ సవాలును దేశభక్తులు స్వీకరించారు. వారి ప్రధాన లక్ష్యం జనం గురించిన ఆందోళనే. సొమ్మును దోచుకోలేదు, విదేశాల్లో దాచుకోలేదు,పెట్టుబడులు పెట్టాడు. ప్రజల మనిషిగా అన్ని పరీక్షలు నెగ్గాడు. పార్టీ మద్దతు, దేశభక్తుల విశాల కూటమితో పనిచేశాడు. గ్రామీణ సామాజిక జీవనాన్ని పటిష్టం గావించారు. మార్కెట్‌ శక్తులు, దోపిడీదారులు, అవినీతి పరుల మధ్య పోటీలో ఒక స్ధిరమైన సంస్ధను నిర్మించారు. ఆయనకు వుత్పత్తి ఎలా చేయాలో మాత్రమే కాదు గౌరవ ప్రదమైన వేతనాలు, పెన్షన్లు ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. గరిష్ట వేతనాలు, సిబ్బంది సంరక్షణ చూశారు.వుచిత గృహవసతి, విద్య, వైద్యం కల్పించారు. సోవియట్‌ కాలం నాటి కార్మిక నిబంధనలన్నీ పాటించారు. పార్టీ మొత్తంగా ఆయన విజయానికి పని చేయాలి.మన అభ్యర్ధి ఒక మంచి, విలువైన వ్యక్తి అని మనం రుజువు చేయాలి, ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా ఆయన విజయానికి కృషి చేయాలి.’ అని జుగనోవ్‌ చెప్పారు.

యాభైఏడు సంవత్సరాల గ్రడినిన్‌ మెకానికల్‌ ఇంజనీరు, మాస్కో సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో 1990 దశకం నుంచి పనిచేస్తున్నారు.ఆయన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించగానే రష్యన్‌ మీడియా ఆసక్తితో పాటు దాడులు కూడా ప్రారంభించింది. కమ్యూనిస్టు పార్టీ తన పలుకుబడిని పెంచుకొనేందుకు పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని పోటీకి నిలిపినట్లు అనేక మంది వ్యాఖ్యానించారు.జుగనోవ్‌ ఇతర కమ్యూనిస్టు పార్టీ నేతలతో కలసి వేసిన నామినేషన్‌ కార్యక్రమానికి పెద్ద ప్రచారం కల్పించారు.

ఎన్నికల ప్రచారం లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ ఇంకా వూపందుకోలేదు.పోలింగ్‌కు సరిగ్గా నెల రోజు ముందు మీడియాలో అభ్యర్ధుల ప్రచారం ప్రారంభం అవుతుంది. గతంలో జరిగిన ఎన్నికలపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సారి ఎలా జరుగుతాయో వూహించటం కష్టం కాదు. 2016 అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందన్న తీవ్ర విమర్శలు, ఆరోపణల నేపధ్యంలో ఈ సారి దానికి పోటీగా అమెరికా జోక్యం చేసుకుంటుందా అన్నది ప్రశ్న.ప్రస్తుతం వెల్లడవుతున్న అభిప్రాయాల ప్రకారం పుతిన్‌ తిరిగి విజయం సాధించటం ఖాయం అనే వాతావరణం వుంది. డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా రష్యన్లు జోక్యం చేసుకున్నారనే విమర్శల నేపధ్యంలో ఇపుడు రష్యా ఎన్నికలలో జోక్యం అనే వార్తలు వస్తున్నాయి. అవినీతి కేసులలో శిక్షపడిన అలెక్సీ నవాల్నే పోటీకి అనర్హుడని ప్రకటించటంతో రష్యన్‌ ఎన్నికలను బహిష్కరించాలని అతడు పిలుపునిచ్చాడు. తను రంగంలో వుంటే పుతిన్‌ అవకాశాలు దెబ్బతింటాయనే కారణంతోనే తనను తప్పించారని చేసిన ఆరోపణను అమెరికన్‌ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ చర్య తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని పుతిన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఖండించారు. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేయటమే తమ ముఖ్య లక్ష్యంగా ఎంచుకున్న సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికన్లు తదుపరి పర్యవసానాలను పూర్తిగా అంచనా వేయలేకపోయారా అన్నది ఒక అంశం. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత రష్యా కూడా ఐరోపాలోని ఇతర దేశాల మాదిరి తనకు లొంగి వుంటుందని అమెరికన్లు భావించి వుండవచ్చు. కానీ ఆచరణలో అది కూడా పోటీదారుగా మారుతుందని, ప్రపంచ రాజకీయాలలో తన పట్టు పెంచుకొనేందుకు ముందుకు వస్తుందని సామ్రాజ్యవాద దేశాలు అంచనా వేసి వుంటే పరిణామాలు కచ్చితంగా మరో విధంగా వుండేవి. మార్కెట్ల వేట పోటీలో సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసికొత్తగా ముందుకు వచ్చిన రష్యా సహజంగానే తన వాటాను డిమాండ్‌ చేయటమే మిగతా పశ్చిమ దేశాలు, దానికి వున్న వివాదం.

దీనిలో పశ్చిమ దేశాలను సవాలు చేసేంతగా రోజు రోజుకూ అన్ని రకాలుగా బలం పెంచుకుంటున్న సోషలిస్టు చైనా అనేక అంశాలలో రష్యాతో చేయి కలుపుతోంది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, సైనిక సమీకరణలు లేకపోవటం వుభయులకు ప్రయోజనకరమైన అంశం. అందువల్లనే అమెరికా, దాని మిత్ర దేశాలతో ఆసియాలో, ఐరోపాలో రష్యన్లు ఏకు మేకై కూర్చున్నారు. రష్యా పక్కనే వున్న వుక్రెయిన్‌లో పాగా వేసేందుకు నాటో కూటమి నిరంతరం ప్రయత్నిస్తున్నది.రష్యా అడ్డుకుంటున్నది. క్రిమియా ప్రాంతాన్ని తనలో కలిపివేసుకోవటం ద్వారా ఆ ప్రాంతంలో తమకు ఎదురులేదని రష్యా లోకానికి చాటింది. ఆ పేరుతోనే వుక్రెయిన్‌లో పాగా వేసేందుకు పశ్చిమ దేశాలు పావులు కదుపుతున్నాయి, పోటీ పడుతున్నాయి. వుక్రెయిన్‌ పరిరక్షణకు తాము టాంకులను ధ్వంసం చేసే క్షిపణులతో సహా అధునాతన మారణాయుధాలు అందచేసేందుకు సిద్దంగా వున్నామని తొలిసారిగా కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రకటించింది రష్యా. వాటిని ఆత్మరక్షణ కోసమే వాడతాం తప్ప ఎదురుదాడికి కాదని వుక్రెయిన్‌ చెబుతున్నది. అమెరికా ప్రకటనను తప్పు పడుతున్న జర్మనీ అదనపు ఆయుధ విక్రయాల గురించి ప్రశ్నిస్తున్నది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయుధాలతో పనేముంది వేరే మార్గం వుందన్నట్లుగా జర్మనీ రంగంలోకి దిగింది. ఎన్నికలలోపే వుక్రెయిన్‌లో ఐరాస శాంతి దళాలను ఏర్పాటు చేయాలని బుధవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రి వుక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో కోరటం దానిలో భాగమే. వుక్రెయిన్‌లో ఐరాస దళాల ఏర్పాటుకు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ఫ్రాన్స్‌తో కలసి జర్మనీ ప్రయత్నిస్తోంది. రష్యా ఎన్నికలను సాకుగా చూపరాదని కోరుతోంది. వుక్రెయిన్‌ విషయంలో తనకు పెద్దన్న పాత్ర వుండాలని అమెరికా కోరుకుంటుండగా అటువంటి అవకాశం ఇవ్వరాదని జర్మనీ, ఫ్రాన్స్‌ సహజంగానే కోరుకుంటాయి. ఐరోపా సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, ఇతరుల పాత్ర వుండరాదని అవి చెబుతున్నాయి. ఈ రెండు పరిణామాలు పరోక్షంగా రష్యన్‌ ఎన్నికలలో జోక్యం చేసుకోవటమే అవుతుంది. తమకు కొరకరాని కొయ్యగా తయారైన పుతిన్‌ మీద పశ్చిమ దేశాలకు సానుకూల వైఖరి వుండదు. అయితే తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించగల బలమైన మరొక నాయకుడు, శక్తి పశ్చిమ దేశాలకు దొరకటం లేదు. అధికారపక్ష బలంతో పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ గత పాతిక సంవత్సరాలుగా అక్కడ కమ్యూనిస్టుపార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా వుంటోంది. వర్గ స్వభావ రీత్యా పశ్చిమ దేశాలు కమ్యూనిస్టులను బలపరిచే సమస్యే లేదు. ఇదొక విచిత్ర పరిస్ధితి. ఇతర పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌ దేశాలలో పశ్చిమ దేశాలు తమకు అనుకూలమైన శక్తులను సంపాదించటంలో కొంత మేరకు జయప్రదమయ్యాయి. అనేక సందర్భాలలో రష్యాను వ్యతిరేకించే, పశ్చిమ దేశాల అనుకూల శక్తులే ఎన్నికలలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

నిజానికి పుతిన్‌ అధికార రాజకీయాలలో తలపండిన వ్యక్తి. తన ఎన్నికకు మార్గం సుగమం చేసుకొనేందుకు గత ఏడాది కాలంగా ఇంటా బయటా అనేక చర్యలు తీసుకున్నాడు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తారనే అనుమానం వున్న గవర్నర్లను తొలగించటం,బదిలీ చేయటం వంటి వాటిని కొద్దినెలల ముందుగానే పూర్తి చేశాడు.విదేశాలలో సొమ్ము దాచుకున్నవారిపై కఠిన చర్యలంటూ ఆర్భాటం చేసినప్పటికీ ఎన్నికల నేపధ్యంలో వారికి అనుకూలమైన చర్యలు తీసుకున్నాడు. ఆర్ధికశాఖ నిషేధజాబితాలో వున్న దేశాలలో తప్ప ఇతర దేశాలలో దాచుకున్న సొమ్మును రష్యా తీసుకురానవసరం లేదని, పన్నులు చెల్లించక్కరలేదని లెక్కలు ప్రకటిస్తే చాలనే వెసులుబాటు కల్పించాడు. నిధుల వివరాలు వెల్లడించిన వారి మీద ఒకటి రెండుశాతం పన్ను విధించి క్షమించి వదలి వేయాలనే ఆలోచన వున్నట్లు వార్తలు రాయించారు. జనవరి ఒకటి నూతన సంవత్సరాది సందర్భంగా చిన్న సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ పుతిన్‌ పలు చర్యలు ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల అక్రమాలు తప్ప మరొకటి కాదు.

అంతర్జాతీయంగా రష్యా తన పట్టునిలుపుకొనే క్రమంలో అమెరికాను వ్యతిరేకిస్తున్నప్పటికీ దాని ఆర్ధిక పరిస్ధితి అంత సజావుగా లేదు. ఇతర ధనిక దేశాల మాదిరే ఆర్ధిక సంక్షోభప్రభావం తీవ్రంగా పడింది. గత కొంత కాలంగా దాని అభివృద్ధి రేటు గిడసబారింది. గతేడాది అభివృద్ధి రేటు 1.8-2.2శాతం మధ్య వుండవచ్చని డిసెంబరు మధ్యలో రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంకు ప్రకటించింది. దాని అంచనా ప్రకారం 2018లో 1.5-2శాతం మధ్య వుంటుందని పేర్కొన్నది. రానున్న పది సంవత్సరాలలో రష్యా ఆర్ధిక పరిస్ధితి నిరాశాజనకమే అని బ్లూమ్‌బెర్గ్‌ విశ్లేషించింది. 2021నాటికి చమురు పీపా ధర 20డాలర్లకు పడిపోతుందని, రష్యన్‌ప్రభుత్వం బడ్జెట్‌ సమస్యలతో పాటు కార్మికుల సమ్మెలతో తలెత్తే పరిస్ధితిని ఎదుర్కోవాల్సి వుంటుందని పేర్కొన్నది.2024నాటికి చమురు ధర పదిడాలర్లకు పడిపోతుందని,2028నాటికి రాజకీయ రంగం నుంచి పుతిన్‌ కనుమరుగవుతారని జోస్యం చెప్పింది.ఈ జోస్యం ఫలించినా లేదా ఇప్పుడున్న ఆర్ధిక మాంద్యం కొనసాగినా పుతిన్‌కు ఇవే చివరి ఎన్నికలైనా ఆశ్చర్యం లేదు. గతంతో పోలిస్తే చమురు ధరలో పెద్దగా పెరుగుదల లేకపోయినా దివాలాకోరు ఆర్ధిక విధానాల కారణంగా రష్యన్‌ ఆర్ధిక వ్యవస్ధకున్న పరిమితులు వెల్లడయ్యాయి.

ఈ పూర్వరంగంలో జరుగుతున్న ఎన్నికలను ఆర్ధిక స్ధితి పెద్దగా ప్రభావితం చేయబోదని పుతిన్‌ విజయం సాధిస్తారని మీడియా పండితులు చెబుతున్నారు. ఆర్ధిక పరిస్ధితి ఇలాగే కొనసాగితే రష్యన్‌ సమాజంలో ఎలాంటి అసంతృప్తి తలెత్తుతుందనేది ఇప్పుడే జోస్యం చెప్పలేము. అయితే సోషలిజాన్ని పోగొట్టుకున్న పాతికేండ్ల తరువాత సాధించిందేమిటి అని నెమరువేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బోల్షివిక్‌ విప్లవం జరిగి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 58శాతం మంది సోవియట్‌ను కోల్పోయినందుకు విచారం వెలిబుచ్చుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. గతం మాదిరే చరిత్ర పునరావృతం కాదుగాని ముందుకే పోతుంది, అది పురోగమనం వైపే అన్నది చరిత్ర చెప్పిన సత్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d