• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Japan

చైనా మీద కోపం, కట్టడి పేరుతో మనం చేతులు కాల్చుకోవాలా ?

22 Friday Jul 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China’s dominance, European Union, FTA, India-EU ties, Narendra Modi Failures, RSS, Trade talks


ఎం కోటేశ్వరరావు


” నవంబరులో షీ జింపింగ్‌తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు – భారత్‌కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది ” తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ” తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్‌ – ఐరోపా సమాఖ్య వాణిజ్య చర్చల పునరుద్దరణ వెనుక ” అసాధారణ అత్యవసరం ” ముందుకు నెట్టి ఉండవచ్చు ” అన్నది మరొక విశ్లేషణ శీర్షిక. ఏం జరుగుతోంది ? ఒక వైపు ప్రపంచ వాణిజ్య సంస్థలో అన్ని దేశాలకూ సభ్యత్వం ఉంది. దాన్ని పక్కన పెట్టి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ? గతంలో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాల సారాంశాన్ని చెప్పాల్సి వస్తే సాఫ్టా( దక్షిణాసియా దేశాల స్వేచ్చా వాణిజ్య ఒప్పందం)తో మాత్రమే మన దేశం లబ్దిపొందింది. మిగతావాటితో మన ఎగుమతులు పెరిగిందేమీ లేకపోగా దిగుమతులు ఎక్కువగా జరిగాయి. అందువలన మరోసారి ఒప్పందాలతో చేతులు కాల్చుకొనేందుకు సిద్దపడుతున్నామా ? గతం కంటే నరేంద్రమోడీ హయాంలో దేశ పరిస్థితి మెరుగుపడిందంటూ మనకు అనుకూలంగా ఉందని చెబుతారా ? అదే నిజం అనుకుంటే మన దిగుమతులు ఎందుకు తగ్గలేదు, ఎగుమతులు ఎందుకు పెరగలేదు ? ఉనికిలో ఉన్న ఒప్పందాలనే ఉపయోగించుకోవచ్చు కదా !


కరోనా కారణంగా కొన్ని కుదుపులు, వృద్ధి రేటు తగ్గినప్పటికీ చైనా కడుపు నిండిన స్థితిలో ఉంది. కనుక మనల్ని లేదా మరొక దేశాన్ని చూసి పశ్చిమ దేశాలు చైనాను వదలి మనవెంటపడతాయని భ్రమించకూడదు. కఠినమైన కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తొలి అంచనా 5.5శాతాన్ని అందుకోకపోవచ్చుగానీ జిడిపి పురోగమనం మూడు- నాలుగుశాతం మధ్య ఉంటుందని వార్తలు. అమెరికాతో సహా అనేక దేశాలు ఇప్పటికీ చైనా సరఫరాల మీద ఆధారపడుతున్నాయి. చైనాకు జలుబు చేస్తే మిగతా దేశాలు చీదాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాంకాంగ్‌ ఎక్సేంజస్‌, క్లియరింగ్‌(హెచ్‌కెఇఎక్స్‌) సిఇఓ నికోలస్‌ అగుజిన్‌ ఇటీవల లోహాల గురించి జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ 45 -57శాతం ప్రపంచ లోహ వినియోగం చైనాలో జరుగుతోందని,2021 ప్రపంచ ఉత్పత్తిలో 35 నుంచి 55శాతం వరకు లోహాలను చైనాలో శుద్ది చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లనే చైనాలో మందగిస్తే అది ప్రపంచానికి మాంద్యం, ద్రవ్యోల్బణానికి కారణం అవుతుందని అన్నారు.


పశ్చిమ దేశాలు మానవహక్కుల గురించి శుద్దులు చెబుతూ తమ దగ్గరకు వచ్చే సరికి వాటిని హరించే దేశాలు, వాటి నేతలతో చెట్టపట్టాలు వేసుకొనే మోసకారితనాన్ని చూస్తున్నాం. మన దేశంలోని కొన్ని శక్తులు వాటి బాటనే నడుస్తున్నాయి. సరిహద్దు వివాదాన్ని చూపి ఇప్పటికీ ఒక వైపు చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతూనే ఉన్నారు. మరో వైపు అక్కడి నుంచి దిగుమతుల్లో నరేంద్రమోడీ సర్కార్‌ రికార్డులను సృష్టిస్తున్నది. ఇది జనాన్ని మోసం చేయటం కాదా ? వరుసగా రెండవ సంవత్సరం కూడా వంద బిలియన్‌ డాలర్లకు పైగా లావాదేవీలు నమోదు కానున్నాయి. జనవరి నుంచి జూన్‌ ఆరు నెలల కాలంలో 67.08 బి.డాలర్లు జరిగింది. దీనిలో మన దిగుమతులు గతేడాది కంటే 34.5శాతం పెరిగి 57.51 బి.డాలర్లకు చేరాయి. మన ఎగుమతులు 35.3శాతం తగ్గినట్లు చైనా కస్టమ్స్‌ శాఖ ప్రకటించింది. మన వాణిజ్యలోటు 47.94 బి.డాలర్లు. గతేడాది 125బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా తొలి ఆరునెలల తీరుతెన్నులను బట్టి చూస్తే అంతకంటే పెరగటం తప్ప తగ్గే పరిస్థితి కనిపించటం లేదు. గతేడాది మన ఎగుమతులు 28.14 బి.డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు 97.52 బి.డాలర్లు. రెండు దేశాలూ లెక్కించే పద్దతిలో తేడాలు ఉన్నందున మన దేశం ప్రకటించే అంకెలు భిన్నంగా ఉండవచ్చు గానీ ధోరణి తెలుస్తున్నది. చైనా మొత్తం విదేశీ వస్తు వాణిజ్య ఆరునెలల్లో 2.94 లక్షల కోట్ల డాలర్లు.


” ప్రభుత్వం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయదు ” అనే శీర్షికతో 2020 నవంబరు 17న ఒక వార్తను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. గతంలో చేసుకున్న ఒప్పందాలతో సబ్సిడీలతో కూడిన వస్తువులను మన దేశంలోకి అనుమతించారని, నష్టం జరిగిందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ విమర్శించినట్లు, ఒప్పందాలను కుదుర్చుకోబోమని కూడా చెప్పినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. అదే ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఒప్పందాలకు ఉత్సాహపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతలోనే మార్పుకు కారణం ఏమిటి ? చైనాను ఒక బూచిగా చూపే దేశాలతో ఇటీవలి కాలంలో మన దేశ సంబంధాలు పెరిగిన కారణంగానే చైనాను అడ్డుకొనేందుకు ఒక మార్గంగా వాణిజ్య ఒప్పందాల కోసం తొందర పడుతున్నట్లు కొందరు చెబుతున్నదాన్ని తోసిపుచ్చగలమా ? 2014-15లో మన వాణిజ్యలోటు 118.37 బిలియన్‌ డాలర్లు ఉండగా 2021-22కి అది 192 బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సర తీరు తెన్నులను చూస్తే 250కి పెరగవచ్చు. మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాలు మనకు లబ్దిచేకూర్చలేదనేందుకు ఇది ఒక సూచిక.కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా బలమైన దేశాలే లబ్ది పొందుతాయి. సాప్టా ఒప్పందంతో మనకు లబ్ది, వాణిజ్య మిగులు కలిగిందంటే దానిలో ఉన్న దేశాల్లో మనది బలమైనది కావటమే. ఆసియన్‌ దేశాలతో ఉన్న ఒప్పందాల కారణంగా 2009-10లో మన వాణిజ్యలోటు ఎనిమిది బిలియన్‌ డాలర్లుండగా 2018-19నాటికి అది 22 బి.డాలర్లకు పెరిగింది.


స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో మన జిడిపి ఐదు లక్షల కోట్ల డాలర్లకు సులభంగా చేరుతుందని కొందరు నరేంద్రమోడీ సర్కార్‌కు బిస్కెట్లు వేస్తున్నారు. వాటి వలన విదేశాల నుంచి సరకులను మన మార్కెట్లో గుమ్మరిస్తే ఇక్కడి పరిశ్రమలు, వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. తనను మింగేస్తుందనే భయంతోనే అమెజాన్‌ కంపెనీ విస్తరణను అంబానీ అడ్డుకోవటాన్ని చూస్తున్నాము. జర్మనీ కంపెనీ మెట్రో కూడా తన బిజినెస్‌ను ఎవరికో ఒకరికి అమ్మేసి తనదారి తాను చూసుకోవాలని చూస్తోంది. అందువలన చైనా మీద కోపంతో ఇతర ధనికదేశాలతో ఒప్పందాలు చేసుకుంటే మన చేతులు మరింతగా కాలుతాయి. అందుకే ఆర్‌సిఇపిలో చేరేందుకు మనం వెనుకడుగువేశాము. మన దేశంలో చౌకగా శ్రమశక్తి లభిస్తుందని తెలిసినా, నిపుణులైన పనివారున్నారని ఎరిగినా ఐరోపా, అమెరికా నుంచి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు రాలేదు, చైనా మాదిరి ఎగుమతి వస్తూత్పత్తి జరగటం లేదు.


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కారణంగా చైనాతో ఐరోపా సమాఖ్య(ఇయు) సంబంధాలు సజావుగా లేవు గనుక ఇప్పుడు మనం చైనా స్థానాన్ని ఆక్రమించేందుకు అవకాశం వచ్చిందని చెబుతున్నారు. అమెరికా, ఐరోపాలకు కావాల్సింది చౌకగా వస్తువులను అందించటం, వారి ఉత్పత్తులకు మార్కెట్లను తెరవటం. ఆ పని ఎవరు చేస్తే వారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పటి వరకు అది మనవల్ల కాలేదు. ఐరోపా నేతలను నవంబరులో రావాలని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని చైనా విదేశాంగశాఖ పేర్కొన్నది.కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా రాకపోకలు లేవు. ఒకవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగవచ్చని చెబుతుండగా దాని ప్రతికూల పర్యవసానాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో అమెరికా కోసం ఆసియాలో చైనాతో కూడా లడాయి పెట్టుకొనేందుకు ఐరోపా సిద్దంగా లేదనే వార్తలు మరోవైపున వెలువడుతున్నాయి. చైనా నుంచి విదేశీ కంపెనీలన్నీ చైనా నుంచి వెలుపలికి పోతున్నట్లుగా జరిగిన ప్రచారం తెలిసిందే.ఇప్పుడు చైనాను బెదిరించేందుకు, రాయితీలు పొందేందుకు పూనుకోవచ్చు తప్ప విస్మరించే అవకాశం లేదు. గాల్వన్‌ ఉదంతం తరువాత మన దేశంలోని కొన్ని శక్తులు చేసిన హడావుడి తరువాత చైనా నుంచి రికార్డు స్థాయిలో మన దిగుమతుల గురించి తెలిసిందే. మరి ఐరోపా, అమెరికా చైనాను ఎలా వదులుకుంటాయి. ఇప్పటికీ వాటి పెట్టుబడులు చైనాలో పెద్ద మొత్తంలో ఉన్నాయి. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలిపేందుకు అవి మరింతగా వివాదాన్ని ఎగదోయవచ్చు, వాణిజ్య ఆశలు చూపవచ్చు. ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా అవి తమలాభాల దగ్గర రాజీపడవు. ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు చైనా మీద దూకుడును తగ్గించాయి.


చైనా నుంచి ఆహ్వానాలు అందిందీ లేనిదీ ఇంతవరకు ఐరోపా దేశాలేవీ తిరస్కరించలేదు, నిర్ధారించలేదు. ఒకవేళ ఆహ్వానం వస్తే ఏమి చేయాలా అని పారిస్‌లో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు వార్తలు. అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ సభల తరువాతనే భేటీ జరగవచ్చు.ఆహ్వానమే గనుక వస్తే తిరస్కరించటం కష్టమని ఐరోపా అధికారులు అంటున్నారు.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చైనా-ఇయు వాణిజ్య లావాదేవీల విలువ గతేడాది కంటే పదిశాతం పెరిగి 205బి.డాలర్లకు చేరాయి. 2018లో చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ, చైనా నుంచి దిగుమతులను నిలిపివేయలేదు. చైనా వస్తువులపై విధించిన దిగుమతి పన్నుల భారం అమెరికన్‌ వినియోగదారుల మీదనే పడుతోంది. చైనా దారికి వచ్చే వైఖరిలో లేదు, కొనసాగిస్తే జనం మీద భారం, తొలగిస్తే ప్రపంచ దృష్టిలో పలుచన అవుతామనే సందేహం అమెరికా నేతల్లో ఉంది.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన వాణిజ్యలోటు 250 బిలియన్‌ డాలర్లకు లేదా జిడిపిలో 7.3శాతానికి చేరనున్నట్లు అంచనా. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో గతేడాది లోటు 31.4బి.డాలర్లు కాగా ఈ ఏడాది 70.8కి పెరిగింది.మన దేశం ఆర్ధికంగా పెరిగితే చైనాను అరికట్టవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారు, ఎవరు ఇక్కడ కావాల్సింది మనం పెరగటమా చైనాను అరికట్టటమా ? మన ఎగుమతులకు చైనా ఏ విధంగానూ పోటీ కాదు. ఎనిమిదేండ్ల నుంచి నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా అన్నా ఆ బ్రాండ్‌ పేరును పక్కన పెట్టి తాజాగా ఆత్మనిర్భర్‌ అని మార్చినా మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అమెరికా వాడి మాటలను నమ్మి చైనా ఆక్రమణకు వస్తోందనే అంచనాతో లడఖ్‌ ప్రాంతంలో కొండలను ఎక్కించిన మన మిలిటరీని ఇప్పుడు దించలేము, కొనసాగించలేని స్థితి. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని గాల్వన్‌ ఉదంతం తరువాత స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.గాల్వన్‌ తరువాత ఇప్పటి వరకు 278 చైనా యాప్‌లను మన దేశం నిషేధించింది. దాని వలన కొంత మన దేశంలో కొంత మందికి మానసిక తృప్తి తప్ప చైనాకు కలిగిన ఆర్ధిక నష్టం ఏమిటో ఎవరూ చెప్పరు. వాటిని నిషేధించినా మన దేశంలోని అనేక సంస్థలలో చైనా పెట్టుబడులు పెద్ద మొత్తంలో ఉన్న వాస్తవాన్ని మూసిపెడితే దాగదు. చైనా జిడిపిలో దాని విదేశీ వాణిజ్య వాటా 35శాతం ఉంది. అమెరికానే అది అన్ని రంగాలలో ముప్పు తిప్పులు పెడుతున్నది.

చైనాఅమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యమే, కానీ దానికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అమెరికన్లను నమ్మి దిగితే కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్లే. మమ్మల్ని వెళ్లనివ్వండిరా బాబూ మీకు పుణ్యం ఉంటుంది అని తాలిబాన్ల కాళ్లు పట్టుకొని అమెరికా మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోయిన తీరును కళ్లారా చూశాము. తరువాత ఉక్రెయిన్ను రెచ్చగొట్టి గోదాలోకి దించారు. కావాలంటే ఎన్ని ఆయుధాలనైనా అమ్ముతాం తప్ప మా సైనికులెవరూ యుద్దానికి రారు అంటూ అమెరికా, నాటో దేశాలు చేతులెత్తేసిన తీరునూ చూశాము. ఉక్రెయిన్‌ కాదు గానీ తైవాన్ను గనుక చైనా ఆక్రమిస్తే సైన్యాన్ని పంపుతామంటూ జో బైడెన్‌ ప్రగల్భాలు పలికాడు. వాటినెవరూ నమ్మటం లేదు. చైనా అంతర్భాగమే తైవాన్‌ అని అమెరికా అంగీకరించింది, దాన్ని ఎప్పుడు విలీనం చేసుకోవటం అన్నది చైనా అంతర్గత అంశం. విలీనం చేసుకుంటే అడ్డుకొనేశక్తి ఏ దేశానికీ లేదన్నది వాస్తవం., పాకిస్తాన్‌ మరొక దేశం ఏదైనా మన రక్షణ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే.వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మూడూ అణుశక్తి దేశాలే గనుక ఎవరిని ఎవరూ లొంగదీసుకోలేరు, ఎవరి మీద ఎవరూ విజయం సాధించలేరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !

30 Thursday Jun 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

48th G7 summit, G7 summit 2022, Joe Biden, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


జూన్‌ 26 నుంచి 28వ తేదీ వరకు జర్మనీలోని బవేరియా ఆల్ఫ్స్‌ ప్రాంతంలోని ఎలమౌ కాజిల్‌ రిసార్ట్‌లో 48వ జి7 శిఖరాగ్ర సమావేశం జరిగింది. ” ధర్మ బద్ధ ప్రపంచం వైపు పురోగమనం ” అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. ఈ సభ కొనసాగింపుగా 29-30 తేదీల్లో స్పెయిన్లోని మాడ్రిడ్‌ నగరంలో నాటో కూటమి సమావేశాలను ఏర్పాటు చేశారు. జి7 సమావేశానికి మన ప్రధాని నరేంద్రమోడీతో పాటు అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియా, సెనెగల్‌ దేశాధినేతలను కూడా ఆహ్వానించారు. ఎడతెగని, ఎప్పుడూ ఉండే,ఎవరూ పాటించని పర్యావరణం, ఉగ్రవాద నిరోధం, ఆహార భద్రత వంటి అంశాల గురించి ఈ సమావేశంలో సుభాషితాలను పక్కన పెడితే రెండు కీలక అంశాల మీద అమెరికా పెత్తనంలోని ఈ కూటమి కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అవి రష్యా మీద మరిన్ని ఆంక్షలు, చైనాను నిలువరించే పధకాలు. ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఐదవ నెలలో ప్రవేశించింది. ఇప్పటికే తూర్పున ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని, కీలక రేవులు, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ, దానితో కలసి ప్రతిఘటిస్తున్న కిరాయి మూకలను ఆ ప్రాంతం నుంచి రష్యా తరిమివేసింది. కొత్త ప్రాంతాలకు దాడులను విస్తరించింది.చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలు పెద్దగా ప్రభావం చూపకపోవటంతో బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని జి7 కూటమి పిలుపునిచ్చింది. దీంతో పాటు మరిన్ని ఆయుధాలను పంపాలని నిర్ణయించింది.


నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీకి దెబ్బతగుల నుందన్న వార్తల నేపధ్యంలో లబ్దిపొందేందుకు జో బైడెన్‌ ఈ సమావేశాలను వినియోగించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక అంశం మాత్రమే అని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ మిలిటరీ అనేక ప్రాంతాల నుంచి వెనుదిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు పునరాలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నందున నాటో కూటమి, ఇతర దేశాలను నిలువరించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధం కేవలం ఒక ప్రచార అస్త్రం తప్ప రష్యా మీద పెద్దగా ప్రభావం పడదని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది 15.5బిలియన్‌ డాలర్ల మేరకు అక్కడి నుంచి ఎగుమతులు జరిగాయి. ప్రపంచంలో పదిశాతం( 2021లో 333.4 టన్నులు) బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ రష్యా రెండవ స్థానంలో ఉండగా 370 టన్నులతో చైనా ప్రధమ స్థానంలో ఉంది.రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాల్లో మనది కూడా ఒకటి. దాని ఎగుమతులపై నిషేధం వలన చమురు ధరలు పెరిగినట్లుగానే బంగారం ధరలు, వాటితో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరగవచ్చు. చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లుగానే బంగారానికి కూడా మార్కెట్లను రష్యా చూసుకుంటుందని చెబుతున్నారు.


తాము సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు తప్ప పరిష్కరించేందుకు జి7 సమావేశం ఎలాంటి చొరవ చూపలేదు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో లాభాలు వచ్చే పధకాలపై పెట్టుబడులకు 600బిలియన్‌ డాలర్లు సేకరించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది తప్ప అనేక దేశాల్లో తలెత్తిన ఆకలి మంటల గురించి ధనిక దేశాలు పట్టించుకోలేదు. ఆసాధారణ ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ప్రపంచ ఆహార మార్కెట్‌ను స్థిరంగా ఉండేట్లు చూడాలని, ధరల ఒడిదుడుకులను నివారించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్‌ జి7 కూటమిని కోరారు. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో 29శాతం వాటా కలిగిన ఉక్రెయిన్‌, రష్యాల నుంచి ఎగుమతుల పునరుద్దరణకు ప్రభావశీలమైన పరిష్కారాన్ని కనుగొనకపోతే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. నేతలు తమ ప్రసంగాల్లో ఆహార భద్రత గురించి ప్రస్తావించటం తప్ప నిర్దిష్ట చర్యలు లేవు. ఉక్రెయిన్‌ రేవుల్లో నిలిచిన రవాణా పునరుద్దరణ, తమ దేశం నుంచి ఎరువులు, ఆహార ధాన్యాల ఎగుమతులకు విధించిన ఆంక్షల ఎత్తివేతతో పాటు సముద్రాల్లో ఉక్రెయిన్‌ ఏర్పాటు చేసిన మందుపాతరలను తొలగించాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది.


ప్రపంచంలో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆరువందల బిలియన్‌ డాలర్లు సేకరించాలని జి7 కూటమి నిర్ణయింది. ఈ మొత్తం చైనాను అడ్డుకొనేందుకు అని ఎక్కడా చెప్పకపోయినా దాని బిఆర్‌ఐ పధకాన్ని అడ్డుకొనేందుకే అని మీడియా పేర్కొన్నది. ప్రపంచ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కోసం భాగస్వామ్యం(పిజిఐఐ) అనే పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని గతేడాది లండన్‌ సమావేశంలోనే ఒక పధకాన్ని ఈ కూటమి ప్రకటించింది. ఇప్పుడు 2027నాటికి ఆరువందల బిలియన్లతో ఒక నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పం చెప్పుకున్నారు. ఇది చైనా 2013 నుంచి అమలు చేస్తున్న బిఆర్‌ఐ పధకానికి పోటీగా పరిగణిస్తున్నారు. ఇదేదో దయా-ధర్మం కాదు దీనిలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ అమెరికన్లతో సహా అందరికీ ఫలితాలు ఉండాల్సిందే అని స్పష్టం చేస్తున్నా అని జో బైడెన్‌ చెప్పారు.అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవసరమైన మౌలిక, ఆధునిక వసతుల కల్పనకు 40లక్షల కోట్ల డాలర్లు అవసరమని అంచనా. తాము 200 బిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా చెబుతుండగా తాము 317బి.డాలర్లు సమకూర్చుతామని ఐరోపా సమ్యాఖ్య పేర్కొన్నది.


అసలు జి 7 అంటే ఏమిటన్న ప్రశ్న కొంతమందికైనా తలెత్తటం సహజం.అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం. నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు తొలి సమావేశం జరిపారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. ఇప్పటి వరకు గత ఎనిమిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. గత ఎనిమిదేండ్లలో మూడు సార్లు ఆహ్వానించటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు.


ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తిన తరువాత రష్యా సైనిక చర్యను ఖండించటమా లేదా అన్న అంశంపై ప్రపంచ దేశాలు మూడు శిబిరాలుగా మారాయి. ఒకటి అమెరికా బాటలో ఖండించే, రెండవది రష్యాను సమర్ధించే, మూడవది తటస్థంగా ఉండే దేశాలు. మనది, చైనా మూడవ తరగతిలో ఉన్నాయి. ఖండించని దేశాలన్నీ రష్యాను సమర్ధించినట్లేనని అమెరికా కూటమి చిత్రిస్తోంది. జర్మనీ సభకు భారత్‌ను ఆహ్వానించటం గురించి అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్‌ కిర్బీ మాట్లాడుతూ లోతైన, భిన్నమైన అజెండా ఉన్న కారణంగానే భారత్‌ను ఆహ్వానించారు తప్ప రష్యా నుంచి వేరు చేసేందుకు కాదన్నారు. ఆహ్వానించాలా లేదా అని జర్మనీ మల్లగుల్లాలు పడినట్లు వార్తలు వచ్చాయి తప్ప నిజానికి అందుకే పిలుస్తున్నట్లు ఎవరూ ఎక్కడా చెప్పలేదు. కానీ అమెరికా ప్రతినిధి కడుపు ఉబ్బరాన్ని ఆపుకోలేక అంతరంగాన్ని మరో రూపంలో వెల్లడించాడు. ఇతివృత్తం ఒకటైతే నిజానికి అక్కడ జరిగిన ప్రధాన చర్చ అంతా చైనా, రష్యాలను దెబ్బతీయటం ఎలా అన్నదాని చుట్టూనే తిరిగింది. ఆర్ధిక స్థిరత్వం, మార్పు, ప్రపంచ ఆరోగ్యమెరుగుదల, ప్రపంచ పర్యావరణ రక్షణ, నిరంతర పెట్టుబడుల వంటి వన్నీ మాయపుచ్చే అంశాలే. ప్రపంచ చట్టబద్ద సంస్థలు చేసిన నిర్ణయాలు, లక్ష్యాలనే ఈ దేశాలు ఖాతరు చేయటం లేదు. తొలి రోజు సమావేశంలో రష్యా చమురు ధరలను ఎలా అదుపు చేయాలన్న అంశం మీద, ఉక్రెయినుకు మరిన్ని ఆయుధాలిచ్చి ఎలా నిలబెట్టాలా అన్నదాని మీద కేంద్రీకరించారు తప్ప తమతో సహా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోలేదు. గోధుమలపై మన దేశం నిషేధం విధించినపుడు పశ్చిమ దేశాలు విమర్శించాయి, తరువాత దాన్ని పంచదారకు పొడిగించారు. మోడీ జర్మనీ వెళుతుండగా బియ్యం ఎగుమతులపై నిషేధ ఆలోచన ఉన్నట్లు వార్తలొచ్చాయి.


ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో మన ప్రధానులు తొమ్మిది సార్లు అతిధులుగా పాల్గొన్నారు.అతిధులుగా వెళ్లిన వారు ఎవరైనప్పటికీ ధర్మోపన్యాసాలు చేయటం, ఆతిధ్యాన్ని పుచ్చుకోవటం తప్ప అజెండాను నిర్ణయించే అవకాశం ఉండదు. హాజరైన దేశాధినేతలు, సంస్థల ప్రతినిధులతో తాను అభిప్రాయ మార్పిడి చేసుకుంటానని జర్మనీ వెళ్లే ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కూటమి దేశాల నేతలు ఒక వైపు ఇలాంటి శిఖరాగ్ర సమావేశాల్లో గొప్ప ప్రకటనలు చేస్తూనే మరోవైపు తమ స్వంత అజెండాలతో వివిధ దేశాలతో వ్యవహరించటం తెలిసిందే. ఇతర దేశాల మీద దాడులు, ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయటంలో దాదాపు అన్నీ ఒక గూటి చిలుకలుగానే ఉంటాయి. ఉక్రెయిను సంక్షోభం గురించి ఈ బృందనేతలు మాట్లాడుతున్న సమయంలో మన ప్రధానిగా ఎవరున్నా మౌన ప్రేక్షుకుడిగా ఉండటం లేదా ఏదో ఒకమిషతో వెలుపలికి రావాల్సిందే తప్ప మన వైఖరిని వెల్లడించే లేదా సమర్ధించుకొనే అవకాశం ఉండదు. అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబాలను మినహాయించిన అమెరికా దుశ్చర్యను అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌ ఆ సమావేశంలో సభ్య హౌదాలో ఉతికి ఆరేశారు. అదే జి7 సమావేశంలో ఆహ్వానితుడిగా ఉన్నందున ఆ విధంగా మాట్లాడలేరు. ఎవరికైనా ఈ పరిమితులు ఉంటాయి. ఉక్రెయిను వివాదంలో మన దేశాన్ని తమవైపు తిప్పుకొనేందుకు అమెరికా కూటమి ఎప్పటికప్పడు గాలాలు వేస్తూనే ఉంటుంది.చైనాను బూచిగా చూపి మనలను తమవైపు తిప్పుకొనేందుకు చేయని యత్నం లేదు. వర్తమాన రాజకీయ అంశం ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమ దేశాలతో చేతులు కలపకపోయినా మిగతా అంశాలలో మీతోనే ఉంటామనే సందేశాన్ని ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చింది. దాని కొనసాగింపుగానే ఈ సమావేశానికి హాజరైనట్లు చెప్పవచ్చు.


జర్మనీ జి7 సమావేశాల్లో నరేంద్రమోడీని అమెరికా అధినేత జో బైడెన్‌ పలుకరించిన తీరును మీడియా ప్రత్యేకంగా చూపింది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌తో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చి నరేంద్రమోడీ భుజం తట్టి మరీ జో బైడెన్‌ పలుకరించారు. ఇది నరేంద్రమోడీ ఘనతగా చిత్రిస్తున్నారు.మన దేశాన్ని తమ కూటమిలో చేర్చుకొనేందుకు ఎలాంటి గాలం వేస్తారో డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు తెన్నులు వెల్లడించాయి.జి 7 కూటమి కాలం చెల్లిన దేశాలతో ఉంది, దాన్ని విస్తరించాలని ట్రంప్‌ ఒకసారి చెప్పాడు.ఆస్ట్రేలియా,భారత్‌, దక్షిణ కొరియా, రష్యాలతో విస్తరించాలని అందుకే 2020 సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. నరేంద్రమోడీకి ఫోన్‌ చేసి మరీ ఆహ్వానం పలికాడు. నిజమే అనుకొని మన దేశం జి7లో చేరినట్లుగానే కొందరు కలలు కన్నారు. అమెరికా తరువాత పెద్ద ఆర్ధికశక్తిగా ఉన్న చైనాను పక్కన పెట్టి ధనికదేశాల బృందాన్ని విస్తరించటం అంటే అది చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. ఇప్పుడు జి7 సమావేశానికి వెళ్లి సాధించిందేమిటో నరేంద్రమోడీ దేశానికి చెప్పాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా, రష్యాలను బూచిగా చూపేందుకే బైడెన్‌ ఆసియా పర్యటన !

26 Thursday May 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Joe Biden Asia tour, Narendra Modi, Quad, Quadrilateral Security Dialogue, Taiwan Matters, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


వార్తలద్వారా ఎలా రెచ్చగొట్టవచ్చో ఒక మంచి ఉదాహరణను చూద్దాం.” ప్రధాని మోడీ పాల్గొన్న చతుష్టయ సమావేశానికి దగ్గరగా చైనా, రష్యా యుద్ద విమానాలు : జపాన్‌ మంత్రి ” అన్నది ఒక వార్త శీర్షిక. జపాన్‌ రాజధాని టోకియోలో జరిగిన ఆ సమావేశంలో అమెరికా,జపాన్‌,ఆస్ట్రేలియా దేశాధినేతలు కూడా ఉన్నారు. నరేంద్రమోడీ ఉన్నందున అనే అర్ధం వచ్చేట్లు శీర్షిక పెట్టటం చైనా, రష్యాలతో మన దేశానికి తంపులు పెట్టే లేదా పెంచే వ్యవహారం తప్ప మరొకటి కాదు. చతుష్టయ దేశాలను హెచ్చరించేందుకే ఈ చర్య అని మన దేశంలో కొన్ని పత్రికల సంపాదకీయాలు రాయటం సరేసరి.ఇది తీవ్ర ఆందోళన కలిగించేది అని జపాన్‌ రక్షణ మంత్రి నోబు కిషి గుండెలు బాదుకున్నాడు. ఇలా జపాన్‌ సరిహద్దుల వరకు చైనా-రష్యా విమానాలు రావటం గతేడాది నవంబరు నుంచి నాలుగవసారి అని కూడా కిషి చెప్పాడు. మరి అప్పుడే సమావేశాలు జరిగినట్లు ? ఎవరిని హెచ్చరించేందుకు వచ్చినట్లు ?వాటిలో నరేంద్రమోడీ గారు లేరు కదా ! మా మంత్రిగారు ఏం చెప్పారన్నది వేరే గానీ ఆ విమానాలు తమ గగనతలాన్ని అతిక్రమించలేదని జపాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ చెప్పినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్ద పేర్కొన్నది. జపాన్‌ సముద్రం మీద రెండు చైనా విమానాలతో జత కలసిన మరో రెండు రష్యా విమానాలు తూర్పు చైనా సముద్రం నుంచి పసిఫిక్‌ సముద్రం వైపు వెళ్లినట్లు జపాన్‌ మంత్రి చెప్పాడు. గూఢచార సమాచారాన్ని సేకరించేందుకు రష్యా విమానం ఒకటి కూడా జపాన్‌ వైపు వచ్చినట్లు, ఈ చర్యలు రెచ్చగొట్టేందుకే అని ఆరోపించాడు. అంతర్జాతీయ నిబంధనలను పాటించి మరొక దేశ గగనతలాన్ని అతిక్రమించకుండా విమానాలు తిరగటం సర్వసాధారణం.


ఇలా తమ విమానాలు సంయుక్తంగా తిరగటం నిరంతర గస్తీలో భాగమే అని చైనా, రష్యా పేర్కొన్నాయి.వార్షిక మిలిటరీ సహకార ఒప్పందంలో భాగంగా తిరిగినట్లు చైనా రక్షణశాఖ నిర్ధారించింది.టోకియో చతుష్టయ సమావేశాల సందర్భంగా తన రెచ్చగొట్టుడు చర్యలను సమర్దించుకొనేందుకు జపాన్‌ ఇలాంటి ఆరోపణలను చేస్తోందని చైనా పేర్కొన్నది. అమెరికా, జపాన్‌ రెచ్చగొడుతున్న తరుణంలో రెండు యుద్ద నౌకలను జపాన్‌ సమీపంలోని రెండు జలసంధులకు చైనా పంపింది. పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలోని చైనా విమానవాహక నౌక నుంచి గత ఇరవై రోజుల్లో కనీసం మూడువందల సార్లు విమానాలు చక్కర్లు కొట్టినట్లు, తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే తమ సత్తా ఏమిటో చూపేందుకే ఇలా చేసినట్లు వార్తలు వచ్చాయి.


జపాన్‌ పార్లమెంటు వెలుపల చతుష్టయ సమావేశాలు జరిగే చోట ఏర్పాటు చేసిన బానర్లు, పోస్టర్లలో ” హాంకాంగ్‌ స్వాతంత్య్రం, విప్లవం, ఉఘిర్‌లో మారణకాండను ఆపండి ” అని రాయటం చైనాను రెచ్చగొట్టటమే అన్నది స్పష్టం. ఇక జపాన్‌ సంగతికొస్తే 2021లో ఇరుగు పొరుగు దేశాలు తన గగనతలాన్ని అతిక్రమిస్తున్నాయనే అనుమానంతో తానే రికార్డు స్ధాయిలో ఎగబడి పట్టుకొనేందుకు ప్రయత్నించటం లేదా తానే గస్తీ తిరగటం వంటి పనులు చేసింది.ఇది ఆప్రాంతంలో తలెత్తిన తీవ్ర పరిస్ధితికి అద్దం పడుతోంది. ఇదంతా చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమి చర్యలు ముమ్మరం అయిన తరువాతే అన్నది స్పష్టం. 2020లో 279లో సార్లు , 2021లో 1,004 సార్లు జపాన్‌ విమానాలు తిరిగాయి. అంతకు ముందు 2016లో గరిష్టంగా 1,168సార్లు వెంటపడినట్లు అధికారికంగా వెల్లడించారు. దానికి 2012లో జపాన్‌ జనావాసం లేని మూడు దీవులను ప్రయివేటు వారినుంచి కొనుగోలు చేసింది, అవి తమవని చైనా చెప్పటంతో వాటి చుట్టూ జపాన్‌ తన విమానాలను గస్తీ తిప్పింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో చైనా చర్యలు ఆందోళన కలిగిస్తున్నట్లు చైనా తన శ్వేతపత్రంలో ఆరోపించింది.

యధాతధ స్ధితిని బలవంతంగా మార్చేందుకు పూనుకుంటే సహించేది లేదని ఏ దేశం పేరు పెట్టకుండా టోకియో చతుష్టయ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నప్పటికీ అది చైనా, రష్యాల గురించే అన్నది స్పష్టం. పేరుకు తమది మిలిటరీ కూటమి కాదంటూనే ఆ దిశగా దాన్ని మార్చేందుకు పూనుకున్నారు.దానికి విరుగుడుగా చైనా కూడా జాగ్రత్తపడుతోంది.దానిలో భాగంగానే తన మిలిటరీని పటిష్టపరుస్తోంది.దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని అనేక చిన్న దేశాలతో సంబంధాలను పటిష్టపరుచుకుంటోంది. 2017వరకు ఒక భావనగానే ఉన్న ఈ కూటమి గడచిన రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు సమావేశం కావటం గమనించాల్సిన అంశం. ఆ తరువాతే లడఖ్‌లోని గాల్వన్‌ లోయ ఉదంతం జరిగినట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెప్పారు. ఆస్ట్రేలియా-చైనా మధ్య వాణిజ్యపోరు మొదలైంది. సోలోమన్‌ దీవుల ప్రభుత్వంతో చైనా కుదుర్చుకున్న భద్రతా ఒప్పందం తమకు వ్యతిరేకంగానే అని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. చైనా నావలు ఆ దీవుల్లో లంగరువేసేందుకు వీలుకలుగుతుందని అంటోంది.దీనికి ప్రతిగా బ్రిటన్‌, అమెరికాతో కలసి అకుస్‌ పేరుతో మిలిటరీ ఒప్పందం చేసుకుంది. బ్రిటన్‌ నుంచి అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దాదాపు శతాబ్దికాలంగా జపాన్‌-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న కొన్ని దీవుల అంశమై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు తైవాన్‌ దీవిని చైనా అంతర్భాగంగా గుర్తిస్తున్నామని చెబుతూనే దాన్ని సైనికంగా బలపరిచేందుకు అమెరికా పూనుకుంది.ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని పూనుకుంటే తాము మిలిటరీతో రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసియా పర్యటనలో బెదిరించిన అంశం తెలిసిందే.


చతుర్ముఖ భద్రతా మాటామంతీ( ద క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) పేరుతో 2007లో జపాన్‌ చొరవతో భారత్‌,ఆస్ట్రేలియా, అమెరికా చర్చలు ప్రారంభించాయి. దీన్నే క్వాడ్‌(చతుష్టయం) అంటున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవటమే దీని లక్ష్యం. అదే ఏడాది ఆస్ట్రేలియా వెనక్కు తగ్గటంతో ఆ కూటమి ముందుకు సాగలేదు.2017లో మనీలాలో జరిగిన ఆసియన్‌ కూటమి సమావేశాల సందర్భంగా ఈ కూటమిని పునరుద్దరించాలని నాలుగు దేశాలు నిర్ణయించాయి.ఆ ప్రాంతంలో నౌకలను అడ్డుకున్న ఉదంతం ఒక్కటీ లేకున్నా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో స్వేచ్చగా నౌకా రవాణా ఉండే పరిస్ధితి కల్పించాలనే పేరుతో ఒక అజెండాను ముందుకు తెచ్చాయి.పైకి ఏమి చెప్పినా చైనాను అడ్డుకోవటమే అసలు ఎత్తుగడ. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం గురించే తమ కేంద్రీకరణ అని చెప్పిన చతుష్టయ కూటమి క్రమంగా ఇతర అంశాల మీద కూడా దృష్టి సారిస్తోంది.టోకియో భేటీతో పాటు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి చర్చించింది.
ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసినపుడు వివిధ కారణాలతో మిలిటరీతో ఆదుకోలేదు, తైవాన్‌ విషయంలో కూడా చైనా దాడి చేస్తే అలాగే ఉంటారా లేక రక్షణకు వస్తారా అని టోకియోలో విలేకరి అడిగిన ప్రశ్నకు వెంటనే జో బైడెన్‌ అవసరమైతే తైవాన్‌లో మిలిటరీతో ఎదుర్కొంటామని చెప్పాడు. ఒకే చైనా విధానాన్ని అమెరికా అంగీకరించింది నిజం, ఆ మేరకు ఒప్పందంపై సంతకాలు కూడా చేశాము. దానిలో ఎలాంటి మార్పూ లేదు. కానీ తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం సబబు కాదు. అందుకు పూనుకుంటే మిలిటరీతో ఎదుర్కొంటాం అన్నాడు. బలప్రయోగం చేసే హక్కు చైనాకు లేదన్నాడు. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటుందని తాను అనుకోవటం లేదని, అది ప్రపంచం ఎంత గట్టిగా స్పందస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుందని, దురాక్రమణకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నాడు. అంతకు ముందు జపాన్‌ ప్రధాని కిషిడాతో కలసి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఏకపక్షంగా యధాతధ స్ధితిని మార్చేందుకు ఎవరైనా పూనుకుంటే సహించేది లేదని, రష్యా దాడి ప్రపంచ వ్యవస్ధ పునాదులను కదలించిందని బైడెన్‌ అన్నాడు.

బైడెన్‌ ప్రకటనల మీద చైనా తీవ్రంగా స్పందించింది. ఏదో అనుకోకుండా మాట్లాడినట్లుగా తాజా స్పందనను పరిగణించలేమని, అంగీకరించిన ఒకే చైనా విధానం నుంచి వెనక్కు తగ్గుతున్నదనేందుకు సూచిక, మరొక అడుగు ముందుకు వేసినట్లు చైనా భావిస్తోంది. ఉక్రెయిన్‌ ముసుగులో తైవాన్‌ స్వాతంత్య్రం గురించి అమెరికా, జపాన్‌ తమ పధకాలతో ముందుకు పోతే వాటిని గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్లో మాదిరి బలప్రయోగంతో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కూడా ఏకపక్షంగా యధాతధ స్దితిని మార్చితే చూస్తూ ఊరుకోబోమని జపాన్‌ ప్రధాని కిషిదా కూడా చెప్పటాన్ని చైనా పరిశీలకులు గుర్తు చేశారు. తైవాన్‌ తమ అంతర్గత అంశమని, దానిలో విదేశీ శక్తుల జోక్యాన్ని అనుమతించబోమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకర్లతో స్పష్టం చేశాడు. అమెరికా సైనికులను తైవాన్‌కు తరలించనప్పటికీ ఏదో ఒకముసుగులో ఆయుధాలను పెద్ద ఎత్తున అందచేస్తున్నది. అందువలన సైనికులను పంపటం ఒక్కటే మిలిటరీ జోక్యం కాదని ఆయుధాల అందచేత కూడా మిలిటరీ జోక్యమే అని చైనా పరిగణిస్తున్నప్పటికీ సంయమనం పాటిస్తున్నది. చైనా మీదకు పోవాలని బైడెన్‌ కోరుకున్నట్లయితే చైనా-అమెరికా సంబంధాలు టైటానిక్‌ ఓడ మంచుకొండను ఢకొీన్నపుడు జరిగిన మాదిరే జరుగుతుందని చైనా పరిశీలకులు వర్ణించారు. ఉక్రెయిన్‌ అంశాన్ని తైవాన్‌ సమస్యతో కలిపి చూపటం వెనుక తైవాన్‌ దీవిపై చైనా సార్వభౌమత్వాన్ని తిరస్కరించే ఎత్తుగడ ఉంది.అంతేకాదు తైవాన్ను చూపుతూ ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి చైనా ముప్పు ఉందని ఈ ప్రాంత దేశాలను నమ్మించటం,తప్పుదారి పట్టించటం కూడా తెలిసిందే.


జో బైడెన్‌ ఆసియా పర్యటనను మొత్తంగా చూసినట్లయితే ప్రధానంగా రెండు లక్ష్యాలతో సాగినట్లు చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా ఆసియా పర్యటన జరిపిన అమెరికా నేతలందరూ చైనాను సందర్శించారు. తొలిసారిగా జోబైడెన్‌ చైనాలో అడుగుపెట్టలేదు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) పేరుతో ఏర్పడిన అతి పెద్ద ఆర్ధిక కూటమిలో అమెరికా లేదు. దానికి పోటీగా ఇండో పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపిఇఎఫ్‌) పేరుతో కొత్త కూటమిని ఉనికిలోకి తెచ్చి ఆ ప్రాంత దేశాలను ఆకర్షించటం, తద్వారా తనపెత్తనాన్ని నిలుపుకొనేందుకు పూనుకోవటం. దీని వలన మనకు కలిగే లబ్ది ఏమిటో తెలియకుండానే మన దేశం సిద్దం సుమతీ అన్నది. ఆర్‌సిఇపిలోని మరికొన్ని దేశాలు కూడా దీనిలో చేరుతున్నట్లు ప్రకటించాయి.ఈ కూటమిలో అమెరికా మార్కెట్లో ప్రవేశించే అవకాశాలు పరిమితమని ఇప్పటికే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది కూడా చైనాను దూరంగా పెట్టే ఎత్తుగడే. రెండవదాని కొస్తే ఉక్రెయిన్‌ విషయంలో తాము మిలిటరీని పంపేది లేదని అమెరికా చెప్పటంతో దాన్ని నమ్ముకుంటే అంతే సంగతులని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాకు రాజకీయంగా ఎంతో నష్టం కలిగించింది. తన ప్రయోజనాలకోసం రెచ్చగొట్టి ముందుకు తోసి తాను తప్పుకుంటుందనే భావం ఎల్లెడలా కలిగింది. దాన్ని పోగొట్టేందుకు, మద్దతుదార్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు తైవాన్‌ అంశంలో తాము సైనికంగా జోక్యం చేసుకుంటామని బైడెన్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

06 Friday May 2022

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures, OPEC+, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగింది. మే ఆరవ తేదీన ఇది రాసిన సమయంలో బ్రెంట్‌ రకం ధర 113.49 డాలర్లు ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యానుంచి ఇంథన దిగుమతులపై పూర్తి ఆంక్షలు విధించాలని ఐరోపా సంఘం(ఇయు) అధికారికంగా ప్రతిపాదించటంతో చమురు ధర పెరిగింది. ఈలోగా సభ్యదేశాలు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. దీన్ని బట్టి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాతో అమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్దపడుతున్నాయని భావించాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని ఆరనివ్వకుండా చూస్తారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.దీని పర్యవసానాలు ఎలా ఉండేదీ చెప్పలేము. కేంద్రం పన్నులు తగ్గించకపోతే మన దేశంలో మరింతగా చమురు ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరగటం ఖాయం.


కొన్ని దేశాలు పూర్తిగా దాని మీదే ఆధారపడి ఉన్నందున రష్యా ఇంథనంపై పూర్తి నిషేధం అంత సులభం కాదని తెలుసుకోవాలి, ఇదే తరుణంలో ప్రత్నామ్నాయం చూసుకోవాలని ఐరోపా కమిషన్‌ అధ్యక్షరాలు ఉజులా వాండర్‌ లెయన్‌ ఐరోపా పార్లమెంటులో చెప్పారు. సముద్రం ద్వారా, పైప్‌లైన్‌, ముడి లేదా శుద్ధి చేసినదీ ఏ రూపంలోనూ, ఏ విధంగానూ అక్కడి నుంచి దిగుమతి చేసుకోరాదని, ఆరునెలల్లో ముడి చమురు, ఏడాదికి చివరికి శుద్ది చేసిన సరకు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని తద్వారా రష్యాపై గరిష్టంగా వత్తిడి తేగలమన్నారు. పుతిన్‌ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుదన్నారు.ఐరోపా పార్లమెంటు నిర్ణయాన్ని సభ్యదేశాలు ఆమోదించాల్సి ఉంది. తమ వల్ల కాదని జపాన్‌ చెప్పేసింది. హంగరీ, స్లోవేకియా ఈ నిర్ణయాన్ని వీటో చేస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రష్యా నుంచి ఇంథన దిగుమతులను నిలిపివేసే అవకాశం లేదని జపాన్‌ పరిశ్రమల మంత్రి కొషి హగిఉదా తేల్చి చెప్పారు. అమెరికా ఇంథనశాఖ మంత్రితో భేటీలో దీనిప్రస్తావన వచ్చింది. ఇంథన భద్రత ఒక్కో దేశానికి ఒకో విధంగా ఉంటుందని, అమెరికాకు అనుగుణంగా తాము ఉండలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన అవసరాల్లో నాలుగుశాతం చమురు, తొమ్మిది శాతం ఎల్‌ఎన్‌జిని జపాన్‌ దిగుమతి చేసుకుంటున్నది.


జర్మనీలో పెద్ద మొత్తంలో గాస్‌ దిగుమతి చేసుకొనే యునిపర్‌ సంస్ధ రష్యాకు రూబుళ్లలో చెల్లించాలని నిర్ణయించింది. తమ నుంచి ఇంథనాన్ని కొనుగోలు చేసే వారు రూబుళ్లలోనే చెల్లించాలని గత నెలలో పుతిన్‌ చేసిన ప్రకటనను అంగీకరించరాదని ఐరోపా కమిషన్‌ ప్రకటించినప్పటికీ జర్మన్‌ సంస్ధ దానికి భిన్నంగా పోతున్నది. రష్యా నిర్ణయం ప్రకారం దాని స్నేహితులు కాని దేశాల సంస్ధలు గాజ్‌ప్రోమ్‌ బాంకులో రెండు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒక ఖాతాలో తాము చెల్లించే విదేశీ కరెన్సీని జమచేస్తే దాన్ని బాంకు రూబుళ్లలోకి మార్చి బాంకు రూబుల్‌ ఖాతాకు బదిలీ చేస్తుంది. రూబుళ్లలో చెల్లించని పక్షంలో ఇంథన సరఫరా నిలిపివేస్తామని పోలాండ్‌, బల్గేరియాకు గాజ్‌ప్రోమ్‌ చెప్పేసింది.యునిపర్‌ చర్య ఆంక్షలను ఉల్లంఘించటమే అని ఐరోపా కమిషన్‌ చెప్పింది.
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు,బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన కరెన్సీలో చెల్లింపుల గురించి సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ చెల్లింపుల్లో అమెరికా డాలరు వాటా 40శాతం ఉంది. 2021 డిసెంబరులో చైనా కరెన్సీ 2.7శాతం ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 3.2శాతానికి పెరిగింది. జపాన్‌ ఎన్‌ను వెనక్కు నెట్టి నాలుగవ స్ధానానికి ఎదిగింది. ఈ ఏడాది జనవరిలో ఇతర కరెన్సీల చెల్లింపులు 6.48శాతం తగ్గితే చైనా కరెన్సీ 11శాతం పెరిగినట్లు స్విఫ్ట్‌ వెల్లడించింది.2030నాటికి ప్రపంచంలో రిజర్వు కరెన్సీలో చైనా మూడవ స్దానంలో ఉంటుంది.


ఉక్రెయిన్‌ పరిణామాలతో అమెరికా పెద్దగా ప్రభావితం కాలేదు. కానీ అక్కడ మే ఐదవ తేదీన సహజవాయువు ధర (ఎంఎంబిటియు) 8.32 డాలర్లకు పెరిగింది. ఇది పదమూడు సంవత్సరాల నాటి రికార్డును అధిగమించింది. రానున్న కొద్ది వారాల్లో పది డాలర్లకు చేరవచ్చని భావిస్తున్నారు. 2008లో గరిష్టంగా 14డాలర్లు దాటింది.2020లో కనిష్టంగా 2.10 డాలర్లు నమోదైంది. పీపా చమురును 70 డాలర్లకంటే తక్కువకు సరఫరా చేయాలని మన దేశం రష్యాతో బేరమాడుతోందని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. రవాణా, ఆంక్షలు, నిధుల వంటి ఇబ్బందులను గమనంలో ఉంచుకొని రాయితీ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపింది. ఒప్పందం కుదిరితే మే నెలలో 15మిలియన్‌ పీపాలు దిగుమతి చేసుకోవచ్చని, ఇది భారత్‌ దిగుమతుల్లో పదిశాతానికి సమానమని కూడా వెల్లడించింది.
ఒకవైపు అమెరికా బెదిరిస్తున్నప్పటికీ మన దేశం రష్యా చమురు కోసం బేరసారాలాడటంలో ఆర్ధికాంశంతో పాటు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఉన్నాయి.2013-14లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఏసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.
సంవత్సరం×××× డాలర్లలో ధర
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.56
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.47
2020-21××× 44.82
2021-22××× 79.18
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్రమోడీ సర్కార్‌ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించలేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం. వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్రమోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.


ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు ఐరోపా సంఘ(ఇయు) దేశాలు చమురు,గాస్‌, బొగ్గు దిగుమతులకు గాను రష్యాకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాయి. ఒపెక్‌ మరియు దానితో అనుసంధానం ఉన్న మొత్తం 23దేశాలు ప్రతి నెలా సమావేశమై మార్కెట్‌ను సమీక్షిస్తాయి. ఇవి 40శాతం చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా జరిపిన సమీక్షలో ఇంతకు ముందే నిర్ణయించిన మేరకు స్వల్పంగా తప్ప ఉత్పత్తిని పెంచరాదని తీర్మానించాయి. రోజుకు పది మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేసే రష్యా మీద ఆంక్షల కారణంగా సరఫరా తగ్గితే గిరాకీ మేరకు ధరలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఇదే జరిగితే మన వంటి దేశాల మీద భారం పెరుగుతుంది. ఒపెక్‌ దేశాలు రోజుకు 28మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది మొత్తం ఉత్పత్తిలో 30శాతానికి సమానం.ఐరోపాలోని రష్యా మార్కెట్‌ను ఆక్రమించేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. తన దగ్గర ఉన్న నిల్వల నుంచి ఇప్పుడు ఎగుమతులు చేస్తున్నది. అవి తగ్గిపోతున్నందున ఆమేరకు ఉత్పత్తిని పెంచాల్సి ఉంది.ఐరోపా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలంటే అందుకు పెట్టుబడులు, పరికరాలు, సిబ్బంది కూడా అవసరమే. తీరా ఆ మేరకు పెట్టుబడులు పెట్టిన తరువాత ఎగుమతి అవకాశాలు తగ్గితే ఎలా అన్న గుంజాటనలో అమెరికా కంపెనీలు ఉన్నాయి.


ఒపెక్‌, దానితో సమన్వయం చేసుకుంటున్న దేశాలు ఉత్పత్తి నియంత్రణ, ధరల పెంపుదలకు కుమ్మక్కు అవుతున్నాయని, అందువలన అలాంటి దేశాల మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పిస్తూ ఒక బిల్లును అమెరికా సెనెట్‌ న్యాయ కమిటీ ఆమోదించింది. దీనికి నోపెక్‌ (నో ఆయిల్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్‌ ఎక్స్‌పోర్టింగ్‌ కార్టెల్స్‌) అని పేరు పెట్టారు. దీన్ని పార్లమెంటు ఆమోదిస్తే తప్ప చట్టం కాదు. ఇలాంటి బిల్లు గురించి గత రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు వస్తున్నా పార్లమెంటులోల ప్రవేశపెట్టలేదు. అమెరికాలో కూడా చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శ్రీలంక సంక్షోభానికి చైనా కారణమా ! నిజానిజాలేమిటి !!

08 Friday Apr 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Prices, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

‘China debt trap’, Disinformation campaign, Hambantota Port, Propaganda War, Sri Lanka debt, Sri Lanka economic crisis


ఎం కోటేశ్వరరావు


శ్రీలంక తీవ్రమైన విదేశీ రుణ చెల్లింపుల సంక్షోభంలో ఉంది. దాంతో జనజీవితం అతలాకుతలం అవుతున్నది. అధికారపక్షానికి మద్దతు ఇచ్చే కొన్ని పార్టీలు, అదే పార్టీకి చెందిన కొందరు ఎంపీలు కూడా మద్దతు ఉపసంహరించుకొని స్వతంత్రులుగా ఉంటామని ప్రకటించారు. ఇది రాసిన సమయానికి తమ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ ఉందని, అధ్యక్షుడు, ప్రధాని గానీ రాజీనామా చేసేది లేదని మంత్రులు ప్రకటిస్తున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ప్రభుత్వ అసమర్ధత పట్ల జనం తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఆర్ధిక సంక్షోభం కారణంగా తలెత్తిన రాజకీయ అశాంతి ఎలా పరిష్కారం అవుతుందో ఊహించలేము. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) నుంచి రుణం తీసుకొని చెల్లింపుల సమస్యనుంచి బయటపడేందుకు పూనుకుంది. అసలు లంకలో ఇలాంటి పరిస్ధితి తలెత్తటానికి కారణం ఏమిటి అనే చర్చ జరుగుతోంది. అమెరికా, బ్రిటన్‌, మన దేశంలోని మీడియా చైనా వైపు వేలెత్తి చూపుతోంది. ఎంతవరకు వాస్తవం, అసలు నిజానిజాలేమిటి ?


శ్రీలంకలోని హంబంటోటా రేవును చైనా నిధులతో అభివృద్ది చేశారు. రుణాన్ని లంక సర్కార్‌ చెల్లించకపోవటంతో ఆ రేవును 99 సంవత్సరాలకు చైనా కౌలుకు తీసుకోవటం ఆక్రమించటమే కదా, బిఆర్‌ఐ పేరుతో అనేక దేశాలను ఇలానే ఆక్రమిస్తున్నది అని చెబుతారు. ఇదంతా అమెరికా, ఇతర పశ్చిమదేశాల మీడియా కట్టుకధ. దున్న ఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా మన పత్రికలు, టీవీలు వెంటనే అందుకుంటాయి. లంకలో చైనా నిర్మిస్తున్న విద్యుత్‌ పధకాలు మన దేశ భద్రతకు ముప్పు అని ముక్తాయింపు ఇస్తాయి. చైనా నిర్మిస్తున్నది కనుక ఇలా అంటున్నాయా లేక లంకలో నిర్మాణం జరుగుతున్నందుకా? అదే నిజమైతే తమిళనాడులో మనం నిర్మిస్తున్న పధకాలు కూడా తమ భద్రతకు ముప్పే అని లంక భావిస్తే తప్పుపడతామా ? ఇదే తర్కాన్ని ఇతర మన ఇరుగుపొరుగుదేశాలు కూడా ముందుకు తెస్తే ఏంచెబుతారు ?


శ్రీలంకకు రుణాలు ఇచ్చిన అంతర్జాతీయ సంస్ధలు దేశాల వరుసలో చైనా నాలుగవ స్ధానంలో ఉంది. హంబంటోటా రేవు నిర్మాణం తమ ప్రభుత్వ ఆలోచన తప్ప చైనాది కాదు అని 2020అక్టోబరులో అధ్యక్షుడు రాజపక్స ప్రకటించాడు. చైనా నిర్మిస్తున్న పధకాలు అజాగళ స్ధనాల వంటివి అలంకార ప్రాయం తప్ప వాటి నుంచి పెద్దగా ఆదాయం రాదని ఒక పాటపాడతారు.తొలుత దీన్ని బ్రిటీష్‌ గూఢచార సంస్ధ, బిబిసి ప్రచారంలోకి తెచ్చింది. అలాంటి పధకాల నిర్మాణాన్ని చైనా, మరొకదేశం ఏదైనా ఒక స్వతంత్ర దేశం మీద రుద్దగలవా ? చైనా నిర్మిస్తున్న పధకాలలో కొలంబో పోర్టు సిటీ ఒకటి. ఈ ప్రత్యేక ఆర్ధిక ప్రాంతంలో పెట్టే సంస్ధలకు నాలుగు దశాబ్దాల పాటు పన్ను రాయితీలుంటాయి. దీని గురించి ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్‌(పిడబ్ల్యుసి) చెప్పిందేమిటి ? రానున్న ఇరవై సంవత్సరాల్లో 12.7బిలియన్‌ డాలర్ల అదనపు పెట్టుబడులు వస్తాయి, లంక ఆర్ధిక వ్యవస్ధకు 13.8బి.డాలర్లు తోడవుతాయని ఏడాది క్రితం పేర్కొన్నది. ఇది లండన్‌ కేంద్రంగా పని చేసే బహుళజాతి సంస్ధ. అదేమీ చైనా సంస్ధ కాదు కదా !


ఈ ఏడాది విదేశీ అప్పులకు గాను లంక చెల్లించాల్సిన కిస్తీ 4.5బి.డాలర్లు.గడువులోగా చెల్లించకపోతే దివాలా తీసినట్లు భావిస్తారు. ఇదిగాక దిగుమతులు, ఇతర అవసరాలకు మరో 20బి.డాలర్లు అవసరం అని అంచనా. శ్రీలంక 2007 నుంచి విదేశీ బాండ్ల రూపంలో రూపంలో తీసుకున్నది 35బి.డాలర్ల (ఇది 51బి.డాలర్లని కొందరు చెప్పారు) మొత్తం విదేశీ అప్పులో 47శాతం ఉంది. దీనిలో ఎక్కువ భాగం డాలర్లుగా చెల్లించాల్సింది ఉంది. ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బాంకునుంచి 14.3శాతం, జపాన్నుంచి 10.9, చైనా నుంచి తీసుకున్నది 10.8శాతం ఉంది. మిగతా రుణాలను మన దేశం, ప్రపంచబాంకు, ఇతర సంస్ధలు, దేశాల నుంచి తీసుకున్నది.శ్రీలంక బాండ్ల రుణాల్లో ఎక్కువ మొత్తం అమెరికా సంబంధిత సంస్ధల నుంచి తీసుకున్నదే, అంటే వాటిలో మదుపు చేసే వారందరూ అమెరికన్లే, ఆ రీత్యా ఎక్కువ అప్పులిచ్చింది అమెరికానే కదా ! గతేడాది డిసెంబరు ఆఖరు నాటికి లంక వద్ద 3.1 బి.డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంటే దానిలో చైనా సర్దుబాటు చేసి మొత్తం 1.5బి.డాలర్లుంది.వాస్తవాలు ఇలా ఉంటే చైనా కారణంగా లంక ఇబ్బందులు పడుతున్నదని ఎలా చెబుతారు ?


చైనా నుంచి శ్రీలంక ఎందుకు రుణాలు తీసుకుంది అన్నది అసక్తికరం.హంబంటోటా రేవు నిర్మాణం కోసం భారత్‌, అమెరికాలతో పోలిస్తే చైనాతో లావాదేవీలు మెరుగైనవిగా ఉండటమే కారణమని అమెరికాకు చెందిన అట్లాంటిక్‌ పత్రిక పేర్కొన్నది.2007లో లంక తొలుత ఈ రెండు దేశాలనే పెట్టుబడులు, రుణాలను కోరగా అవి తిరస్కరించాయి.2009లో లంకలో అంతర్యుద్దం ముగిసింది, ఆర్ధిక రంగం ఇబ్బందుల్లో పడటంతో విదేశాల నుంచి రుణాలు తీసుకోవటం ప్రారంభించింది. పదిహేను సంవత్సరాల వ్యవధి ఉన్న 30.7కోట్ల డాలర్ల రుణాలను 6.3శాతం వడ్డీతో చైనా ఇచ్చింది. తరువాత చైనా నుంచే మరో 75.7 కోట్ల డాలర్లను రెండు శాతం వడ్డీతో లంక తీసుకుంది. విదేశీ చెల్లింపుల సమస్యను అధిగమించేందుకు 2018లో చైనా అభివృద్ది బాంకు నుంచి వందకోట్ల డాలర్లను ఎనిమిదేండ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికన లండన్‌ ఇంటర్‌ బాంక్‌ రేటు(లిబోర్‌) ప్రకారం 2.56శాతానికి తీసుకుంది. తరువాత 2020మార్చినెలలో అంతకు ముందు కంటే తక్కువ వడ్డీకి అదే బాంకును మరో 50కోట్ల డాలర్లు తీసుకుంది. ఈ ఏడాది మరో 150కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. చైనా మెరుగైన షరతులతో రుణాలు ఇవ్వటం వల్లనే దానివైపు లంక మొగ్గినట్లు ఈ లావాదేవీలు వెల్లడిస్తున్నాయని అట్లాంటిక్‌ పేర్కొన్నది.


హంబంటోటా రేవు ద్వారా ఆశించిన మేరకు ఆదాయం రాకపోవటం, 2015నాటికి రుణ కిస్తీ చెల్లించకలేకపోవటంతో 70శాతం వాటాలను చైనా కంపెనీకి విక్రయించింది. తరువాత రేవు, పరిసరాల్లో ఉన్న 15వేల ఎకరాల భూమిని 99 సంవత్సరాల కౌలుకు ఇచ్చింది. దీంతో ఆ రేవును హిందూమహాసముద్రంలో చైనా మిలిటరీ అవసరాల కోసం వినియోగించనుందనే ప్రచారాన్ని అమెరికా, మన దేశం ప్రారంభించాయి. అదే నిజమనుకుంటే ఆ రేవు నిర్మాణానికి మన దేశం, అమెరికా తొలుత ఎందుకు తిరస్కరించినట్లు ? నిర్మాణం తరువాత విదేశీ సంస్ధలకు ఇవ్వాలనుకున్నపుడైనా చైనా నుంచి ముప్పు ఉందనుకున్నపుడు మనం లేదా అమెరికా ఎందుకు తీసుకోలేదు ?


ఒకరి దగ్గర రుణం తీసుకొని దాన్ని తీర్చేందుకు తిరిగి వారి దగ్గరే రుణం తీసుకోవటాన్ని రుణవల అని చైనా విమర్శకులు వర్ణిస్తున్నారు. ఇచ్చేవారుంటే ఇతర దేశాల దగ్గర తీసుకొని రుణాలు తీరిస్తే ఇబ్బందేముంది. ఆదుకోని ఇతర దేశాలను వదలిపెట్టి సాయం చేస్తున్న చైనాను విమర్శించటం దురుద్ధేశ్యపూరితం తప్ప మరొకటి అవుతుందా ? గిట్టుబాటు గాని రేవు నిర్మాణానికి రుణమిచ్చి తీర్చలేదనే పేరుతో అక్కడ పాగావేసేందుకు చైనా ఆ పని చేసిందని, అన్ని పేద దేశాల్లో ఇదే చేస్తోందని చెప్పే అమెరికా ప్రబుద్దులు, దానికి వంతపాడేవారు పుట్టుకువచ్చారు. ఇది నిజమా ?


చైనాతో నిమిత్తం లేకుండానే హంబంటోటా రేవును అభివృద్ధి చేసేందుకు లంక సర్కార్‌ నిర్ణయించింది. దాన్ని తొలుత ప్రోత్సహించింది చైనా కాదు కెనడా. దశాబ్దాలుగా ఆ ప్రతిపాదన ఉంది. తాము అధికారానికి వస్తే రేవు నిర్మాణం చేస్తామని యునైటెడ్‌ నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ 2001 ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ మేరకు ప్రభుత్వం 2002లో కెనడియన్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఏజన్సీకి సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే బాధ్యతను అప్పగించగా అది తమ దేశానికే చెందిన ఎన్‌ఎన్‌సి-లావలిన్‌ కంపెనీకి ఇచ్చింది. 2003 నాటికి అది వెయ్యిపేజీల నివేదిక ఇచ్చింది. దాన్ని ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మించాలని సిఫార్సు చేసింది. సదరు ప్రాజెక్టును ఐరోపా దేశాలు దక్కించుకోవచ్చనే ఆందోళనను కూడా వెలిబుచ్చింది. అప్పటి లంక పరిస్ధితుల కారణంగా కెనడా ముందుకు రాలేదు.మహింద రాజపక్స సోదరుల ఏలుబడిలో 2005-15 మధ్యదానికి ఒక రూపు ఇచ్చారు. కెనడా కంపెనీ తరువాత డెన్మార్క్‌ కంపెనీ రామ్‌బోల్‌ 2006లో రెండవ సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించింది. అది కూడా దాదాపుగా కెనడా కంపెనీ చెప్పిన అంశాలనే పేర్కొన్నది.దశలవారీ వృద్ధి చేయాలని చెప్పింది. ఏ నివేదిక కూడా ఆ రేవు నిర్మాణం గిట్టుబాటు కాదని చెప్పలేదు. రామ్‌బోల్‌ నివేదికను తీసుకొని లంక సర్కార్‌ అమెరికా, భారత్‌ల వద్దకు వెళ్లగా కుదరదని చెప్పిన తరువాతే దాని గురించి తెలుసుకొని చైనా కంపెనీ కంపెనీ రంగంలోకి దిగింది, కాంట్రాక్టును దక్కించుకుంది. జరిగింది ఇదైతే లంకను రుణ ఊబిలోకి దింపింది చైనా అని ఏ నోటితో చెబుతారు.


ఒప్పందం ప్రకారం మొదటి దశ మూడు సంవత్సరాల్లోనే పూర్తయింది.సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించే సమయానికి ఉన్న పరిస్ధితులు మారిపోయాయి. మొదటి దశలో ఆశించిన రాబడి రాక ముందే 2012లో లంక సర్కార్‌ రెండవ దశను ముందుకు తెచ్చింది. దానికి గాను రెండుశాతం వడ్డీతో చైనా ఎగ్జిమ్‌ బాంకు 75.7 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. 2008లో ధనికదేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో ప్రపంచంలో వడ్డీరేట్లు తగ్గాయి. తొలుత రేవు నిర్వహణ ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. 2014లో అనుభవం ఉన్న కంపెనీతో కలసి ఉమ్మడిగా నిర్వహించాలని నిర్ణయించారు. చైనా మర్చంట్స్‌ గ్రూప్‌ కంపెనీ అప్పటికే కొలంబో రేవులో ఒక జట్టీ నిర్వహిస్తున్నది కనుక దానితోనే ఒప్పందం చేసుకున్నారు.


2015 మధ్యంతర ఎన్నికల్లో అధికారపక్షంలో తిరుగుబాటు చేసిన ఆర్ధిక మంత్రి మైత్రీపాల సిరిసేన అధ్యక్షపదవిని కైవసం చేసుకున్నాడు. ఆ ఎన్నికల ప్రచారంలో రేవు లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, అనవసరంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు చేశారని ప్రచారం చేశాడు. సిరిసేన పదవి స్వీకరణ తరువాత విదేశీ అప్పుల చెల్లింపుల సమస్య ముందుకు వచ్చింది. మొత్తం విదేశీ అప్పులో 40శాతం బాండ్ల రూపంలో ఉంది. అప్పటికి విదేశీ అప్పులో జపాన్‌, ప్రపంచబాంకు, ఏడిబి ఇచ్చినవే ఎక్కువ.2017లో చెల్లించాల్సిన 450 కోట్ల డాలర్ల విదేశీ రుణంలో హంబంటోటా రేవుకు తెచ్చిన మొత్తం కేవలం ఐదుశాతమే. ఆ ఏడాదే ఆ రేవును చైనా కంపెనీకి అప్పగించారు. అది చెల్లించిన 120 కోట్ల డాలర్లను విదేశీ చెల్లింపులకు సర్కార్‌ వినియోగించింది. అజాగళ స్దనం వంటిది అని చెబుతున్న రేవును తీసుకున్న చైనా కంపెనీ దాని లాభనష్టాలను భరించేందుకు సిద్దపడినపుడు అది లంకకు ఉపశమనం కలిగించేదే కదా ? సర్కార్‌ చేతులెత్తేసిన తరువాత చైనా కంపెనీ తీసుకుంది, దానిలో బలవంతం ఎక్కడ ? చైనా మిలిటరీ దాడి చేసి రేవును ఆక్రమించలేదు కదా ! అప్పటి వరకు ఆ రేవు వ్యూహాత్మక ప్రాధాన్య గురించి ఎక్కడా ప్రస్తావించని అమెరికా ఒక్కసారిగా ఇంకేముంది చైనా మిలిటరీ కోసమే తీసుకున్నారంటూ మన దేశాన్ని రెచ్చగొట్టేందుకు దొంగేడుపులు ప్రారంభించింది.


2012-18 మధ్య చైనా ఎగ్జిమ్‌ బాంకు నుంచి తీసుకున్న 310 కోట్ల డాలర్ల రుణాలన్నీ రెండుశాతం వడ్డీ రేటువే. 2014లో చైనా డెవలప్‌మెంట్‌ బాంకు నుంచి తీసుకున్న 40కోట్ల డాలర్లకు మాత్రం మూడు నుంచి ఐదుశాతం వరకు ఉంది. ఇతరంగా విదేశాల నుంచి తీసుకున్న రుణాలన్నీ ఐదుశాతం కంటే ఎక్కువ రేటున్నవే. శ్రీలంకలో మన దేశం కూడా ఒక ప్రాజెక్టు నిర్మించింది.మెడెవాచచియా నుంచి మన్నార్‌ రైల్వేలైనుకు మన దేశం మూడు శాతం వడ్డీతో 16.4 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.ఆ మార్గంలో తిరిగే రైల్లో రోజుకు రెండు వందల మంది కూడా ప్రయాణించటం లేదని, పెట్టుబడి వృధా అయిందనే విమర్శలు వచ్చాయి. ఏ దేశంలో ఏ ప్రాజక్టు నిర్మించినా దాని బాగోగులకు అక్కడి ప్రభుత్వానిదే బాధ్యత తప్ప రుణమిచ్చిన వారు, నిర్మించిన సంస్దలది బాధ్యత ఎలా అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : కార్పొరేట్ల కోసం సృష్టించిన యుద్దమిది, కాదంటారా !

26 Saturday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

corporate loves a good war, Fuel Price in India, profiting from war, Ukraine-Russia crisis, US imperialism, US military-industrial complex


ఎం కోటేశ్వరరావు


అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో సైనిక చర్య మొదలై నెల రోజులు దాటింది. అది ఉక్రెయిన్‌ పౌరులకు ప్రత్యక్షంగా నరకం చూపుతోంది. మూడున్నర మిలియన్ల మంది ఇరుగు పొరుగుదేశాలకు వెళ్లారు, దాదాపు కోటి మంది కొలువులు, నెలవులు తప్పినట్లు వార్తలు. మరోవైపు ప్రపంచ వ్యాపితంగా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నాటో కూటమి దేశాల్లోని వారు బావుకున్నదేమీ లేదు. అయినప్పటికీ వివాదాన్ని ఇంకా కొనసాగించాలని అమెరికా కూటమి చూస్తోంది. మే నెల తొమ్మిదవ తేదీ రెండవ ప్రపంచయుద్ధంలో జర్మనీపై విజయం సాధించిన రోజని అందువలన అప్పటిలోగా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని రష్యా నేతలు ఆదేశించినట్లు ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతినిధులు చెప్పారు. అంటే అప్పటి వరకు పశ్చిమ దేశాలు ఈ వివాదాన్ని మరింతగా ఎగదోస్తూనే ఉంటాయా? ఉక్రెయిన్‌, ఇతర దేశాల పౌరులను యాతనలకు గురి చేస్తాయా ?


వాస్తవాల పత్రం పేరుతో మార్చి 16వ తేదీన అమెరికా ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు శాంతిని కోరుకుంటున్నట్లు, నిత్యం మానవహక్కుల గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్న అమెరికా కూటమిలోని 30దేశాలు అగ్నికి ఆజ్యం పోస్తూ మంటలను ఎగదోస్తున్నాయి. జో బైడెన్‌ తాజాగా ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయంతో బైడెన్‌ గత పనిహేను నెలల కాలంలో ఉక్రెయినుకు ఇచ్చినది రెండువందల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఇదంతా అమెరికా యుద్ద పరిశ్రమల వారికి కట్టబెట్టిన మొత్తమే. మూడో దేశం ద్వారా సరఫరా చేసిన వాటితో సహా ఏఏ ఆయుధాలు, ఎంత మందుగుండు సరఫరా చేసిందీ దానిలో ఉన్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. లాభం లేకుండా పశ్చిమ దేశాలు భారీసాయం చేస్తే వాటికి వచ్చేదేముంటుంది ?
చైనా, పాకిస్తాన్లను బూచిగా చూపి మన దేశంతో ఆయుధాలకు ఎలా ఖర్చు పెట్టిస్తున్నదో తద్వారా అమెరికా ఎంతగా లాభపడుతున్నదో తెలిసిందే. ఇప్పుడు రష్యాను బూచిగా చూపుతూ నాటో దేశాలన్నింటితో తమ తమ ఆయుధాలను కొనిపిస్తున్నది. ఉక్రెయిను ఒక్కదానికే 350 కోట్లతో సహా తూర్పు ఐరోపా దేశాలకు 650 కోట్ల డాలర్లను ఆయుధాల కోసం బైడెన్‌ బడ్జెట్‌ కేటాయించాడు. ఐదుసార్లు ఇప్పటి వరకు ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. ఒప్పందం కుదిరితే, శాంతి నెలకొంటే ఈ బడ్జెట్‌ నిధులు అవసరం ఉండదు కనుక కనీసం వాటిని ఖర్చు చేసేంత వరకైనా వివాదం-దాడులు కొనసాగాలని అమెరికా కోరుకుంటున్నది. ఉక్రెయిన్నుంచి తరువాత ఆ మొత్తాన్ని ఏదో ఒక రూపంలో వసూలు చేస్తుంది, ఈలోగా తానే ఆయుధాలు కొని కార్పొరేట్ల ఆకలి తీరుస్తుంది.టాంకులను ధ్వంసం చేసే 2,600 జావెలిన్‌(ఈటె) క్షిపణులను ఉక్రెయిన్‌ మిలిటరీకి అమెరికా సరఫరా చేసింది. వాటిని తయారు చేసేది లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియన్‌ అనే కంపెనీలు. పెద్ద అలలు వచ్చినపుడు నౌకలన్నీపైకి లేస్తాయి అన్నట్లుగా ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు పోటీ పడుతున్నాయి. మిలిటరీ మాజీ అధికారులే సలహాదారులు, మధ్యవర్తులుగా ఉంటారు.యుద్దాలు లేకపోతే ఈ కంపెనీలన్నీ మూతపడతాయి కదా !


రష్యాదాడులను సాకుగా చూపి లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ తయారు చేసే ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లు 35 కొనుగోలు చేయాలని జర్మనీ నిర్ణయించింది. నాటో దేశాలన్నీ ఇదే బాటలో ఉండటంతో ఆయుధకంపెనీల వాటాల ధరలు ఈ ఏడాది ఇప్పటికే గణనీయంగా పెరుగుతున్నాయి. ఐరోపా, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల కారణంగా తమ పంట పండుతున్నదని సిఇఓలు నిస్సిగ్గుగా చెబుతున్నారు. అనేక దేశాలు గతంలో కొనుగోలు చేసినవి ఉపయోగించకపోవటం లేదా పాతపడటంతో పనికిరానివిగా పక్కన పడేసి కొత్తవి కొంటున్నాయి. ఫ్రాన్స్‌,బ్రిటన్‌ వంటి దేశాల్లో కూడా ఆయుధకంపెనీలున్నా సింహభాగం అమెరికన్లకే పోతోంది. అందుకే నేషనల్‌ డిఫెన్స్‌ ఇండిస్టియల్‌ అసోసియెషన్‌ జనవరిలోనే అమెరికా పార్లమెంట్‌ సభ్యుల మీద వత్తిడి చేసింది.” రక్షణ ఖర్చు పద్దుల ఆమోదంలో వైఫల్యం ” ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ, తూర్పు ఆసియా, దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలకు ప్రతిచర్యలు తీసుకోవటంలో, సమర్దత, తీవ్రంగా పరిగణించకపోవటం ముప్పును సూచిస్తున్నదని ” పేర్కొన్నది.ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ రాజీకి సంసిద్దను ప్రకటించినా బైడెన్‌, ఇతర దేశాలు పడనీయకుండా సంక్షోభాన్ని కొనసాగించేందుకు పూనుకోవటం వెనుక ఎవరి వత్తిడి, లబ్ది ఉందో అరటితొక్క వలచి పండు పెట్టినట్లుగా చెప్పాల్సిన పని లేదేమో ! ఒక్క ఆయుధకంపెనీలేనా లబ్ది పొందుతున్నది ?


గత నెల రోజుల్లో అమెరికా ఇంధన కంపెనీల విలువ పదిశాతం పెరిగింది. ఆ మొత్తం 239 బిలియన్‌ డాలర్లని అంచనా. ఈ కాలంలో బ్రెంట్‌ రకం ముడిచమురు ధరలు 32శాతం పెరిగాయి. దానితో బాటే ఇతర రకాల ధరలూ పెరిగి కార్పొరేట్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక కంపెనీ యజమాని ప్రపంచంలోని ఐదువందల మంది ధనికుల జాబితాలో చేరాడు. హరోల్డ్‌ హామ్‌ అనే కాంటినెంటల్‌ రిసోర్సెస్‌ కంపెనీ కుబేరుడి ఆస్తి విలువ 19.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికి కంపెనీ వాటాల ధరలు పెరిగి మూడు నెలలు కూడా గడవక ముందే 5.75బి.డాలర్లు(41.2శాతం) పెరిగింది. దీంతో బ్లూమ్‌బెర్గ్‌ ధనవంతుల జాబితాలో అతని స్దానం 84నుంచి 37కు పెరిగింది. జెఫ్రీ హిల్డెబ్రాండ్‌ సంపద విలువ ఇదే కాలంలో 6.63 బి.డాలర్లు (101శాతం) పెరిగి 13.2 బి.డాలర్లకు చేరింది. అందరి సంపదల్లో ఇలాంటి పెరుగుదల లేకున్నా మొత్తం మీద ఇంథన కంపెనీలన్నీ లబ్దిపొందాయి.


మన దేశంలో చమురు కంపెనీలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. రిలయన్స్‌, బిపి వంటి కొన్ని కంపెనీలు రంగంలో ఉన్నా పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదు. ముడి చమురు ధరలు పెరిగినదానికి అనుగుణంగా ప్రభుత్వ కంపెనీలు నవంబరు నాలుగు నుంచి మార్చి 21వరకు ధరలను పెంచకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి లబ్దికి స్ధంభింప చేసిన సంగతి తెలిసిందే. దీంతో అపరదేశ భక్తులలైన అంబానీలు తమ బంకులను మూసివేశారు. వారికోసం, ప్రభుత్వ కంపెనీల నష్టాలు తగ్గించేందుకు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారికి డీజిలు ధరలను లీటరుకు రు. 25 వరకు పెంచిన సంగతి తెలిసిందే. దీని వెనుక మరొక ఎత్తుగడ కూడా ఉంది. ఆ మేరకు సాధారణ వినియోగదారులను కూడా భరించేందుకు మానసికంగా సిద్దం చేయటమే అది. కొత్త పద్దతులను కనుగొనటంలో బిజెపి సర్కార్‌ తీరు అనితరసాధ్యం. ఇప్పుడు ప్రతి రోజూ వడ్డించటం ప్రారంభించారు.జనం కూడా కిక్కురు మనకుండా ఇంకా దేశభక్తి మత్తులోనే ఉన్నందున కొనుగోలు చేస్తున్నారు. ఇహలోకంలో పరమ దరిద్రాన్ని అనుభవించి పుణ్యం చేసుకుంటే పరలోకంలో స్వర్గం ప్రాపిస్తుందని నమ్మే మనకు చమురు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల, ఇబ్బందులు పెట్టే ప్రభుత్వ విధానాలు ఒక లెక్కా ! ఏ జన్మలోనో చేసుకున్న పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం, మోడీ మాత్రం ఏం చేస్తారు, మనం వస్తువులను కొనకుండా ఉంటే పోయె, అంత ధరలకు కొనాలని మనల్నేమైనా వత్తిడి చేశారా అనే వేదాంతాన్ని జనం వల్లిస్తున్నారు.


అంతర్జాతీయ మార్కెట్లో మన దేశం కొనుగోలు చేసే ముడి చమురు ధర 2021నవంబరు నెల సగటు 81.51 డాలర్లు, మార్చి 24న 117.71 ఉంది. మార్చి 26వ తేదీన ఇది రాసిన సమయానికి ముడిచమురు బ్రెంట్‌ రకం ధర 120.65 డాలర్లు. మనం కొనుగోలు చేసేది దానికి ఒక డాలరు తక్కువగా ఉంటుంది. పీపా 81.51 డాలర్లు ఉన్నపుడు నిర్ణయించిన ధరల మీద ప్రతిరోజూ కొంత పెంచుతున్నారు. మొత్తం పాతిక రూపాయలా, ఇంకా ఎక్కువగా ఉంటుందా అన్నది చెప్పలేము. చమురు ధరల పెరుగుదల వృద్ది రేటును దెబ్బతీస్తుంది. నోట్ల ముమ్మరాన్ని(ద్రవ్యోల్బణం) పెంచుతుంది, అది ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దీన్నే స్టాగ్‌ఫ్లేషన్‌ అంటున్నారు. ఇది జనజీవితాలను అతలాకుతలం చేస్తుంది. జనాల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది, తద్వారా వృద్ధి రేటు మరింత పడిపోతుంది. అది వేతనాల మీద పడి కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఒకదాన్ని మరొకటి దెబ్బతీసే ఒక వలయం ఇది.

చమురుతో పాటు గృహావసరాలకు వాడే గాస్‌ ధరను రు.50 పెంచి వెయ్యిదాటించారు. ఇది 70శాతం గృహస్తులను ప్రభావితం చేస్తుంది. వీరిలో ఆమ్‌ ఆద్మీ నుంచి అంబానీల వరకు అందరూ ఉంటారు. సమస్య సామాన్యులకే స్వంత విమానాలను కలిగి ఉన్నవారికి ఏముంటుంది. సౌదీ ఆరామ్‌ కో కంపెనీ టన్ను గాస్‌ ధరను తాజాగా 729 నుంచి 769 డాలర్లకు పెంచింది. గతేడాది నవంబరులో ధర 376డాలర్లు మాత్రమే. అందువల్లనే అప్పటి నుంచి మన దేశంలో కూడా విపరీతంగా ధర పెరిగింది. గాస్‌ మీద ఇస్తున్న సబ్సిడీని రు.40కి తగ్గించి ఎంత పెరిగితే అంత వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. తాజాగా పెంచినప్పటికీ చమురు కంపెనీలకు ఒక్కో సిలిండరుకు ఇంకా రు.100-125 నష్టమే అని చెబుతున్నందున ఆ మేరకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి కోసం పెట్రోలు, డీజిలు ధరలను స్ధంభింప చేసిన కారణంగా 137 రోజుల్లో మూడు చమురు సంస్ధలకు వచ్చిన నష్టమే రు.19,000 కోట్లని అంచనా, వాటికి రావాల్సిన లాభాలను కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆ మొత్తాలను జనాల నుంచి వసూలు చేసేందుకు పూనుకున్నారు. ఎంత తెలివి ?


ధరల పెరుగుదలను ఆరుశాతంలోపుకు పరిమితం చేయాలన్నది రిజర్వుబాంకు లక్ష్యం. జనవరిలో 6.01గా ఉన్నది ఫిబ్రవరిలో 6.07శాతానికి పెరిగింది. ఫిబ్రవరితో ముగిసిన ఏడాదిలో పదకొండు నెలల పాటు రెండంకెలకు మించి టోకు ధరలు పెరిగి ఫిబ్రవరిలో 13.11శాతంగా నమోదైంది. కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా ద్రవ్యోల్బణం మదింపులోనే లోపం ఉందన్నది ఒకటైతే, వాటిని కూడా తొక్కి పెట్టి తక్కువగా చూపుతున్నారన్న విమర్శలున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో చెబుతారు. సంక్షోభానికి కారణంగా అమెరికా, నాటో కూటమి అనుసరించిన దేశాలే అన్నది అందరికీ తెలుసు. కానీ వారి వైఖరి తప్పని చెప్పటానికి మాత్రం నోరు రాదు. ఎందుకటా దేశ ప్రయోజనాల రీత్యా ఎవరినీ నొప్పించకూడదట. మరి ధరల పెరుగుదల సంగతేమిటి ? జన ప్రయోజనాలు ప్రభుత్వాలకు పట్టవా ? ఏమి రాజకీయం నడుస్తోందో మనం గమనిస్తున్నామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తోటకూరనాడే…. నరేంద్రమోడీ గట్టిగా చెప్పి ఉంటే ఇప్పుడిలా జరిగేదా !

20 Sunday Mar 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Diplomacy Matters, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, Ukraine-Russia crisis, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ రాజకీయాల్లో భారత్‌ కీలక పాత్ర పోషించాలి. విశ్వగురువుగా నరేంద్రమోడీ, ప్రపంచమంతా మోడీవైపే చూస్తోంది. అమెరికాకు మన అవసరం ఉంది తప్ప మనకు అది లేకున్నా నడుస్తుంది. చైనా నుంచి మనం దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్‌ మనతో కాళ్ల బేరానికి వస్తుంది. నరేంద్రమోడీ మాత్రమే ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపగలరు. ఇలాంటి కబుర్లన్నీ వాట్సాప్‌ విశ్వవిద్యాలయ పండితుల మొదలు వివిధ మాధ్యమాల ద్వారా మన చెవుల తుప్పు వదిలించారు, మెదళ్లను ఖరాబు చేశారు. ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వీటిని నిజమే అని నిజంగానే నమ్మిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఉక్రెయిన్‌ వివాదంలో మనలను ప్రతివారూ బెదిరించేవారే తప్ప ఇతరత్రా పట్టించుకొనే వారే లేరు. అనేక చిన్న దేశాలనేతలు గళం విప్పినా మన ప్రధానికి నోరు పెగలటం లేదు. చైనా నుంచి దిగుమతులను నిలివేస్తారా అనుకున్నవారికి రికార్డులను బద్దలు కొడుతూ కొనసాగించటం మింగుడుపడటం లేదు.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన ఫిబ్రవరి 24కు ముందు మన నేతలు, అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. మన జేమ్స్‌బాండ్‌గా ప్రచారంలో ఉన్న అజిత్‌ దోవల్‌ ఉక్రెయిన్‌ పరిణామాలను పసిగట్టలేకపోయారు. తరువాత ఆపరేషన్‌ గంగ పేరుతో అక్కడ చిక్కుకు పోయిన మన విద్యార్ధులను వెనక్కు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలంటూ నష్ట నివారణ చర్యగా నరేంద్రమోడీ సమీక్షల గురించి మన మీడియా చేసిన హడావుడి కూడా ముగిసింది. కేంద్ర మంత్రులను పంపటం, ఇతరత్రా చేసిన ప్రయత్నాల కంటే అసలు నరేంద్రమోడీ గారే వెళ్లి కూర్చుని ఉంటే ఇంకా తొందరగా పూర్తయి ఉండేది, తలిదంద్రుల ఆవేదన పరిమితంగా ఉండేది. ముందే ఆనందం వెల్లివిరిసేది. ఎందుకంటే ఏదేశంలో ఏది ఎక్కడుందో, ఎక్కడకు ఎలా చేరాలో మోడీగారికి తెలిసినంతంగా ఎవరికీ తెలియదు. సీజన్‌ టికెట్‌ తీసుకున్నట్లుగా స్వల్పకాలంలో ఏ ప్రధాని కూడా చేయనన్ని విదేశీ పర్యటనలు చేశారు, అందుకే ప్రతిదేశం కొట్టినపిండి మరి. సరే అది జరగలేదు, ఎందుకంటే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముఖ్యగనుక ! ఇంటగెలిచి రచ్చ గెలవమన్నారు కదా !


ఎన్నికలు ముగిశాయి, మొత్తం మీద సామ,దాన,బేధ,దండోపాయాలను ప్రయోగించి అనుకున్నది సాధించారు.యుద్ధం, ప్రేమలో గెలిచేందుకు సాధారణ సూత్రాలు, నీతినియమాలు వర్తించవు అంటారు గనుక ఉత్తర ప్రదేశ్‌లోనూ అదే జరిగిందని అనుకుందాం. ఇప్పుడేమిటి ? ఆపరేషన్‌ గంగ సమయంలో ప్రధాని జరిపిన సమీక్షల గురించి వార్తలేని రోజు లేదు. ఇప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆర్ధిక రంగంలో ఆందోళనకర పరిస్ధితి, చమురు ధరల పిడుగు ఎప్పుడు ఎలా పడుతుందో అని బిక్కుబిక్కు మంటున్న జనం గురించి కూడా రోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా జనాన్ని ఎలా రక్షించాలి అన్న ఆతృత, కార్యాచరణ ఎక్కడా కనిపించటం లేదు. ఎందుకని ?


ఉక్రెయిన్‌ వివాదంలో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు.అందుకే బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు-బుజ్జగింపులకు తెరతీశాడు. మార్చి 18వ తేదీన అమెరికా-చైనా అధిపతులు జో బైడెన్‌- షీ జింపింగ్‌ వీడియో కాన్ఫరెన్సుద్వారా చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక చర్య మీద మనమూ, చైనా భద్రతా మండలిలో తటస్ధవైఖరినే ప్రకటించాయి. అమెరికా మన సహజ భాగస్వామి, ఒకటే మాట, ఒకటే బాట లేదా ఒకటే మంచం ఒకటే కంచం అన్నట్లుగా రోజురోజుకూ మరింత సన్నిహితం అవుతున్నట్లు చెబుతున్నారు. అలాంటపుడు అమెరికా నేత బైడెన్‌ మన ప్రధాని మోడీతో మాట్లాడకుండా షీ జింపింగ్‌తో చర్చించటం ఏమిటి ? విశ్వగురువుగా విశ్వరూపం ప్రదర్శించే అవకాశాన్ని మోడీ చేజేతులా పోగొట్టుకున్నారా ? లేక మనకు అంతసీన్‌ లేదా ? మన బలం గురించి అతిగా అంచనా వేసుకున్నామా ? ఇవన్నీ కాస్త ఆలోచించేవారిలో ఎవరికైనా తలెత్తే ప్రశ్నలు. కాదంటారా ?


ఉక్రెయిన్‌ వివాదంలో జో బైడెన్‌కు చైనా నేత జింపింగ్‌ స్పష్టం చేసిందేమిటి ? మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు. వివాద పరిష్కారానికి అమెరికా, నాటో కూటమి రష్యాతో చర్చలు జరపాలి. రష్యా సైనిక చర్యపేరుతో దానిపై విచక్షణా రహితంగా ఆంక్షలను ప్రకటించటాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. ఈవివాదాన్ని మేం కోరుకోవటం లేదు.యుద్ద రంగలో చేతులు కలుపుకోవటాన్ని చూడకూడదనుకున్నాం. వివాదం, ఘర్షణ ఎవరికీ ప్రయోజనకరం కాదు అని కుండబద్దలు కొట్టారు.మరి మన దేశం అలాంటి స్పష్టమైన వైఖరిని ఎందుకు తీసుకోవటం లేదు అన్నది ప్రశ్న. మన, చైనా తటస్ధ వైఖరుల్లో ఉన్న తేదా ఇదే. ఆంక్షలను వ్యతిరేకించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా మీద, అదే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న మన మీద అమెరికా వైఖరిలో కూడా తేడా ఉంది. చైనా మీద ప్రతీకార చర్యలుంటాయని బహిరంగంగానే అమెరికా బెదిరించింది.దానిపై దాడికి అనేక దేశాలను సమీకరిస్తున్న అమెరికాకు మన అవసరం గనుక రష్యానుంచి చమురు కొనుగోలు చేసినా, ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేసినా మింగా కక్కలేకుండా ఉంది. తెరవెనుక బెదిరింపులకు దిగుతోంది.


ఉక్రెయిన్‌ వివాదంలో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు. తన పట్టునుంచి ఎటూ కదలకుండా మన దేశాన్ని ఒక్కొక్కటిగా బిగిస్తున్నది. అమెరికాతో బంధం కారణంగా అనేక దేశాలకు మనం దూరమయ్యాం. అందువలన తనకు తాన తందాన అనకుండా ఎలా ఉంటుందనే భరోసాతో ఉంది. చైనాకు వ్యతిరేకంగా చతుష్టయ(క్వాడ్‌) కూటమిలోకి మనలను లాగి రెండు దేశాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పరస్పర అనుమానాలు తలెత్తేట్లు అమెరికా చేసింది. మన సరిహద్దుల్లో కదలికలను కూడా అది ఇచ్చిన సమాచారం మీద ఆధారపడేట్లు చేసుకుంది. ఇంత చేస్తే మమ్మల్ని అనుసరించరా అంటూ బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు-బుజ్జగింపులకు తెరతీశాడు. చమురు కొనుగోలు గురించి బైడెన్‌ మీడియా కార్యదర్శి జెన్‌ సాకీ చెప్పిందేమిటి? చమురు కొనుగోలు మా ఆంక్షలను ఉల్లంఘించినట్లు భావించటం లేదు గానీ వర్తమాన పరిణామాల గురించి చరిత్రను లిఖించినపుడు మీరెక్కడ ఉంటారో కూడా ఆలోచించుకోవాలి.రష్యన్‌ నాయకత్వానికి మద్దతు ఇవ్వటం అంటే( చమురు, ఇతర కొనుగోళ్ల ద్వారా అని అర్ధం) దురాక్రమణకు మద్దతు ఇచ్చినట్లే, అది సహజంగానే వినాశకర ప్రభావాన్ని కలిగిస్తుందని సాకీ హెచ్చరించారు.

ఒక స్వతంత్ర, సర్వసత్తాక దేశానికి ఇటువంటి బెదిరింపులు వచ్చినపుడు కూడా మోడీ నోరు విప్పకపోతే ఏమనాలి. దేశాన్ని సురక్షితంగా ఉంచుతారని మోడీ చేతుల్లో పెట్టిన జనానికి విశ్వాసం ఎలా ఉంటుంది.యుద్దం చేయమని అడగటం లేదుగా ఇలాంటి బెదిరింపులు తగవని మోడీగాక పోతే ఎవరు చెప్పాలి ? ఇలాంటి బలహీనత లేదా పిరికిబారిన వారు విశ్వగురువులు, ప్రపంచ నేతలు ఎలా అవుతారు ? ఇక బుజ్జగింపుల గురించి చెప్పాల్సి వస్తే మార్చి 19వ తేదీన ఢిల్లీ పర్యటనను జపాన్‌ ప్రధాని కిషిదా 15వ తేదీన ఖరారు చేసుకొని రావటం వెనుక అమెరికా హస్తం లేదా ? ఇరు దేశాల వార్షిక సమావేశాలు ఉన్నప్పటికీ వాటికి కిషిదా వస్తాడని ముందుగా ఎలాంటి ప్రకటనలు లేవు. సహజంగా ఇలాంటి రాకపోకలు ఎంతో ముందుగానే ఖరారవుతాయి. మన దేశంలో 42బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామంటూ మనకు కిషిదా ఒక బిస్కెట్‌ వేశాడు.


ఐరాసలో తటస్ధంగా ఉన్న మన దేశం దానికి కట్టుబడి ఉందా అంటే లేదు. ప్రపంచ కోర్టులో రష్యాకు వ్యతిరేకంగా మన దేశం నుంచి ఎన్నికైన జడ్జి దల్వీర్‌ బండారి అమెరికా కూటమి దేశాల వారితో కలసి ఓటు వేశారు. ఇది అమెరికాను సంతుష్టీకరించేదిగా లేదా ? 2017లో రెండవ సారి దల్వీర్‌ ఎన్నిక నరేంద్రమోడీ సర్కార్‌ దౌత్యవిజయానికి ప్రతీక అని అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు ఇదేమిటి అంటే దల్వీర్‌ వ్యక్తిగత హౌదాలో తన వాంఛను బట్టి ఓటు వేశారని విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణ రష్యాను సంతృప్తి పరుస్తుందా ? దేశ విధానాన్ని బట్టి నడుచుకోవాలా వ్యక్తిగత ఇష్టాఅయిష్టాల ప్రకారమా ? దీని ద్వారా మన దేశం ఏమి సందేశం పంపినట్లు ?
తైవాన్‌ సమస్య మీద కూడా జింపింగ్‌ అమెరికాకు గట్టి హెచ్చరిక చేశాడు. తైవాన్‌ అంశం మీద నిప్పుతో చెలగాటాన్ని కొనసాగించినా, చైనా ముఖ్య ప్రయోజనాలను ఉల్లంఘించినా రెండు దేశాల మధ్య స్నేహ లేదా సానుకూల మాటలు ఉండవని కూడా స్పష్టం చేశాడు.

మనకు అమెరికాతో అలాంటి పరిస్ధితి లేదు కనుక రష్యా అంశంలో మా ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని తెగేదాకా లాగవద్దని ఎందుకు చెప్పకూడదు ? బైడెన్‌-జింపింగ్‌ భేటీ తరువాత కొందరు మీడియా వ్యాఖ్యాతలు అమెరికా దిక్కుతోచని స్ధితిలో ఉందని రాశారు.” పుతిన్‌ వ్యవహారంలో చైనా సాయం కొరకు చూస్తున్న బైడెన్‌ ” అన్న శీర్షికతో బ్లూమ్‌బెర్గ్‌ రాసింది. రష్యా చేసినదానికి అమెరికా, దాని ఐరోపా మిత్రులు పెను ముప్పును ఎదుర్కోవలసి రావచ్చని దానిలో పేర్కొన్నారు. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ వేర్పాటును అమెరికా కోరుతున్న సంగతి పదే పదే చెప్పనవసరం లేదు. అలాంటిది షీ జింపింగ్‌తో భేటీలో బైడెన్‌ చెప్పిందేమిటి? ” చైనాలోని వ్యవస్ధను మార్చేందుకు లేదా చైనాకు వ్యతిరేకంగా కూటమికి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేసేందుకు,చైనాతో కొత్త ప్రచ్చన్న యుద్దాన్ని కోరుకోవటం లేదు. తైవాన్‌ స్వాతంత్య్రాన్ని సమర్ధించటం లేదు, చైనాతో ఘర్షణను కోరుకోవటం లేదు” అని బైడెన్‌ చెప్పిన అంశాన్ని షీ జింపింగ్‌ ముఖ్యఅంశంగా పరిగణించినట్లు చెప్పారు. ప్రాణ,విత్త,మాన భంగములందు ఆడితప్ప వచ్చని పెద్దలు సెలవిచ్చారు కదా ! అందుకే అమెరికా దానికి కట్టుబడి ఉంటుందా అన్నది ప్రశ్న.


ఉక్రెయిన్‌ వివాద నేపధ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటాన్ని సమర్ధించేందుకు మన అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపాం తప్ప రాజకీయనాయకత్వం ఎందుకు నోరు మెదపటం లేదు. పాకిస్తాన్‌, చైనాల విషయంలో అలా లేరే, సూటిగా కాకున్నా బహిరంగంగా, పరోక్షంగా నైనా హెచ్చరికలు చేశారు కదా ? అమెరికా, నాటో కూటమి పట్ల అంత అణకువ ఎందుకు ? అమ్మా నీకు తోటకూరను దొంగతనంగా తెచ్చి ఇచ్చినపుడే తప్పని చెప్పి ఉంటే ఇప్పుడు నాకీ దుస్ధితి తప్పేది కదా అని జైలు పాలైన కొడుకు అన్న కథ తెలిసిందే. ఇక్కడ దొంగతనం కాదు గానీ అమెరికా, పశ్చిమదేశాల వత్తిడికి గతంలో లొంగిపోకుండా గట్టిగా ఉండి ఉంటే ఇప్పుడు చివరికి జో బైడెన్‌ మీడియా అధికారికి అంత సాహసం ఉండేదా ?


గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలులో తగ్గేదేలే అని ఆ నాడు నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది ? ఇరాన్‌ ఎవరి మీదా దాడులకు దిగలేదే ! మన మాదిరే తన రక్షణ కోసం అణుకార్యమం చేపట్టింది తప్ప మరొకటి కాదు. ఆంక్షలతో నిమిత్తం లేకుండానే ఎంతో కాలంగా మనతో ఉన్న సంబంధాల కారణంగా మన రూపాయలు తీసుకొనేందుకు, చెల్లింపు గడువు ఎక్కువ ఇచ్చేందుకు కూడా వెసులుబాటు కల్పించినా మన సర్కార్‌ ఇరాన్నుంచి చమురు కొనుగోలును ఎందుకు నిలిపివేసింది ? మనసుంటే మార్గం దొరికేది కాదా ? ఇదే మాదిరి వెనెజులా నుంచి కూడా నిలిపివేశాము. గతంలో ఎన్నడూ లేనిది అమెరికా నుంచి కొనుగోళ్లకు మరలాం. ఒకసారి మనబలహీనత తెలిసింతరువాత ప్రతివారూ బెదిరిస్తారు. తమ వ్యూహాత్మక ఉద్ధేశ్యాల మీద తప్పుడు అంచనాలకు వచ్చారని షీ జింపింగ్‌ చెప్పినట్లుగా రష్యాతో తమ సంబంధాలను తక్కువ అంచనా వేశారని అమెరికన్లకు మోడీ ఎందుకు చెప్పలేకపోతున్నారు ? అమెరికాను నమ్ముకుంటే ఐరోపాలో ఉక్రెయిన్‌కు ఏమైందో చూస్తున్నాము. తన లబ్దికోసం ఎవరినైనా బలిపెట్టేందుకు అది సిద్దం.ఇప్పటికైనా మించి పోయింది లేదు, మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవటం అవసరం.దీనిలో రాజకీయాలు కాదు,దేశ గౌరవ, ప్రతిష్ట, ప్రయోజనాలు ముఖ్యం. ఎవరు అంగీకరించినా లేకున్నా, విమర్శించినా అభిమానించినా ప్రధానిగా నరేంద్రమోడీ వాటికోసం తగిన విధంగా వ్యవహరించకపోతే చరిత్రలో విమర్శలకు గురవుతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తటస్ధ దేశంగా ఉక్రెయిన్‌ – ఒప్పందానికి చేరువలో చర్చలు !

16 Wednesday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Russia- Ukraine peace plan, Russia-Ukraine tensions Impact on India, Ukraine war, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


రష్యా -ఉక్రెయిన్‌ పోరుకు స్వస్తి పలికేలా ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరినట్లు బుధవారం నాడు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. దీని మేరకు నాటోలో చేరాలనే ఆకాంక్షలకు స్వస్తి పలికినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించాలి.దాని సాయుధ దళాలను పరిమితం చేసుకోవాలి. దీనికి అంగీకరిస్తే రష్యా సైనిక చర్యనిలిపివేస్తుంది. దీనికి ముందు ఉక్రెయిన్‌ తటస్ధ దేశంగా ఉండాలని ప్రతిపాదించినట్లు వచ్చిన వార్తలకు అనుగుణంగానే ఈ పరిణామం ఉంది.అయితే సంభావ్యమైన ( సంభవించగల) ఒప్పందాల వివరాలను వెల్లడించటం తొందరపాటవుతుందని రష్యా ప్రతినిధి దిమిత్రి సెకోవ్‌ చెప్పాడు. మరోవైపున దాడులను నిలిపివేయాలని బుధవారం నాడు అంతర్జాతీయ న్యాయ స్ధానం రష్యాను కోరింది. ఇదిలా ఉండగా రష్యాకు లొంగిపోతున్నట్లు జెలెనెస్కీ ఒక ప్రకటన చేసినట్లు ఉక్రెయిన్‌ 24 అనే టీవీ ఛానల్‌ ప్రసారం చేసింది. వెంటనే జెలెనెస్కీ ఒక ప్రకటన చేస్తూ తానలాంటి ప్రకటన చేయ లేదని ఖండించాడు. తమ నెట్‌వర్క్‌ను హాక్‌ చేసి తప్పుడు వార్తను చొప్పించారని తరువాత ఆ ఛానల్‌ వివరణ ఇచ్చింది. రష్యా దాడులను తీవ్రతరం చేసిన నేపధ్యంలో అనేక కుహనా వార్తలు వస్తున్నాయి.


చర్చలు చర్చలే – దాడులు దాడులే – రెండునోళ్లతో మాట్లాడుతున్న జెలెనెస్కీ. రష్యా ప్రతిపాదనలు వాస్తవికంగా ఉన్నాయంటాడు ఒకనోటితో. మరోవైపు తమ తరఫున యుద్దం చేయాలని పశ్చిమ దేశాలకు వినతుల మీద వినతులు. ఎవరి ఎత్తుగడలు వారివే, 30లక్షల మంది నిర్వాసితులుగా మారినా, ఇంకా ఎందరు ఉక్రెయిన్‌ వదలిపోయినా దుష్ట రాజకీయాల నుంచి వెనక్కు తగ్గేదేలే అంటున్నారు పశ్చిమ దేశాల మానవతామూర్తులు.అగ్గిని మరింతగా ఎగదోసేందుకు పూనుకున్నారు. ప్రపంచ ఆర్ధిక రంగం అతలాకుతలం అవుతుందని ఐఎంఎఫ్‌ ఆందోళన. ఇదీ మార్చి 16 నాటికి ఉన్న పరిస్ధితి. వివాదం ఎప్పుడు సమసిపోతుందో తెలియదు. రక్తపోటు అదుపులోకి రాకపోతే పరిస్ధితి ఎలా ఉంటుందో ప్రపంచ చమురు మార్కెట్‌లో ధరలు ఎందుకు ఒక రోజు విపరీతంగా పైకి ఎగబాకుతున్నాయో,ఎందుకు మరోరోజు పడిపోతున్నాయో తెలీటం లేదు.మన వంటి చమురు దిగుమతి దేశాలకు నిదురపట్టటం లేదు.నవంబరు నాలుగు నుంచి స్ధంభింపచేసిన చమురు ధరల కళ్లెం విప్పితే ఏమౌతుందో లేకపోతే ఎంత బండపడుతుందో అన్న ఆందోళన కేంద్ర ప్రభుత్వానికి పట్టుకుంది. ఉక్రెయిన్‌ తటస్ధ దేశంగా ఉండేట్లు ఒప్పందం కుదరవచ్చని వార్తలు, పశ్చిమదేశాలు దాన్ని పడనిస్తాయా అన్న సందేహాలు సరేసరి !


ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల తీరు రాజీకుదిరేందుకు కొంత ఆశాభావాన్ని కలిగించాయని రష్యా విదేశాంగ మంత్రి లావరోవ్‌ చెప్పాడు.ఆస్ట్రియా, స్వీడన్‌ మాదిరి తటస్ధ దేశంగా ఉక్రెయిన్‌ ఉండవచ్చని, మిలిటరీని కూడా కలిగి ఉండవచ్చని రష్యా ప్రతిపాదించింది. అదే జరిగితే ఆ ప్రాంత దేశాలకు లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు. రష్యా ప్రతిపాదించినట్లుగాక తమకు అంతర్జాతీశక్తుల హామీ కావాలని ఉక్రెయిన్‌ చెప్పింది. తాము నేరుగా రష్యాతో పోరులో ఉన్నాం గనుక తమ పద్దతిలోనే పరిష్కారం ఉండాలని అంటోంది. బాధ్యత కలిగిన దేశాలతో కూడిన కొత్త కూటమి శాంతికోసం పని చేయాలని జెలెనెస్కీ బుధవారం నాడు అమెరికా పార్లమెంట్‌ను ఉద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో కోరాడు. ఐరోపా దేశాలు చాలా కాలంగా రష్యా ముప్పు గురించి పట్టించుకోలేదన్నాడు. మరిన్ని ఆంక్షలను విధించాలని కోరాడు. మేమూ మీలాంటి వారిమే, మా ప్రాణాలను రక్షించాలని కోరటం చాలా ఇబ్బందిగా ఉందన్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో పెరల్‌ హార్బర్‌ మీద దాడి, 2011లో న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడిని ఉటంకిస్తూ తాము మూడువారాలుగా అలాంటి దాడులను అనుభవిస్తున్నాం అన్నాడు. అంతకు ముందు రోజు కెనడా పార్లమెంటునుద్దేశించి కూడా జెలెనెస్కీ మాట్లాడాడు.


పోలాండ్‌, చెక్‌, స్లోవేనియా దేశాల ప్రధానులు కీవ్‌ను సందర్శించి జెలెనెస్కీతో చర్చలు జరిపి మద్దతు ప్రకటించి వెళ్లారు. ఇలాగే ఇతర దేశాల నేతలు కూడా వచ్చి రష్యా మీద వత్తిడి తేవాలని జెలెనెస్కీ కోరాడు. ప్రస్తుత దశలో తమ అధ్యక్షుడు మక్రాన్‌ కీవ్‌ పర్యటన జరిపే ఆలోచనేదీ లేదని ఫ్రెంచి ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించాడు.ప్రచారదాడిలో భాగంగా తూర్పు ఐరోపాలో మిలిటరీ సన్నద్దంగా ఉండాలని నాటో కమాండర్లను కోరినట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌ తరువాత ఇతర దేశాల మీద కూడా రష్యా దాడులు జరపనుందని ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగిన సన్నద్దత గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఇబ్బంది కనుక ఇలాంటి ప్రచార విన్యాసాలు జరుపుతున్నట్లు చెప్పవచ్చు.


రష్యా గనుక అడ్డం తిరిగి విదేశాల నుంచి తీసుకున్న అప్పులను మేము ఇచ్చేది లేదని ప్రకటిస్తే ఏమిటన్న బెంగ ఇప్పుడు రుణాలు ఇచ్చిన వారికి పట్టుకుంది. బుధవారం నాటికి వడ్డీ కింద 11.7కోట్ల డాలర్లను చెల్లించాల్సి ఉంది. తమపై విధించిన ఆంక్షల కారణంగా డాలర్లలో కాకుండా తమ కరెన్సీ రూబుళ్లలో చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని పుతిన్‌ ప్రకటించాడు. ప్రభుత్వమే అప్పులను చెల్లించేది లేదని ప్రకటిస్తే అక్కడి కంపెనీలు కూడా అదే బాటపడతాయనే భయం పట్టుకుంది. ప్రస్తుతం పుతిన్‌ సర్కార్‌ జారీ చేసిన బాండ్లను మార్కెట్లో అమ్ముకోవచ్చు గానీ మన కరెన్సీలో చెప్పాలంటే రూపాయికి ఇరవై పైసలు కూడా అప్పులిచ్చిన వారికి వచ్చే అవకాశాలు లేవు. అందువలన ఆంక్షలు ఎత్తివేసి తమను ఆదుకోవాలని రుణాలిచ్చిన వారు పశ్చిమదేశాల మీద వత్తిడి తేవచ్చు. గతేడాది వెల్లడించిన సమాచారం ప్రకారం రష్యా అంతర్గత రుణాలు జిడిపిలో కేవలం 13శాతమే ఉన్నాయి. విదేశీరుణం 150 బిలియన్‌ డాలర్లు కాగా దానిలో ప్రభుత్వం తీసుకున్నది కేవలం 45 బి.డాలర్లే, మిగతాదంతా కంపెనీలు తీసుకున్నది. రష్యా వద్ద 630బి.డాలర్ల నిల్వలున్నాయి.కనుక చెల్లింపులకు ఇబ్బంది లేదు. ఆంక్షలే అడ్డుపడుతున్నాయి.


రష్యాకు వర్తింప చేస్తున్న అత్యంత సానుకూల హౌదా రాయితీని ఎత్తివేస్తున్నట్లు జపాన్‌ ప్రకటించింది.మరోవైపు మరిన్ని ఆంక్షలను అమలు జరిపేందుకు జి7 దేశాలు సమావేశం కానున్నాయని వార్తలు వచ్చాయి. తాము నాటోలో చేరటం లేదనే అంశాన్ని గుర్తించండి మహా ప్రభో అని జెలెనెస్కీ నాటోదేశాలకు స్పష్టంచేశాడు. బ్రిటన్‌ ప్రతినిధి వర్గంతో మాట్లాడుతూ ” ఉక్రెయిన్‌ నాటో సభ్యురాలు కాదు. దానికోసం ద్వారాలు తెరిచి ఉన్నట్లు చాలా సంవత్సరాలుగా మేం వింటున్నాం, ఇదే సమయంలో మేం చేరకూడదని కూడా విన్నాం. ఇది ఒక వాస్తవం దీన్ని గుర్తించాల్సి ఉంది. మా జనం దీన్ని అర్ధం చేసుకోవటం ప్రారంభించారు, స్వశక్తితో నిలబడాలనుకుంటున్నారు, అలాగే మాకు సాయం చేస్తున్నవారు కూడా గుర్తిస్తున్నందుకు సంతోషంగా ఉంది” అన్నాడు.నాటోలో ఉక్రెయిన్‌ చేరకూడదని, తమ భద్రతకు తలపెడుతున్న ముప్పును కూడా గమనించాలని రష్యా ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న అంశాన్ని పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిణామాలన్నది తెలిసిందే.


ఉక్రెయిన్‌పై రష్యాదాడి కారణంగా దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధలో మౌలిక మార్పులు వస్తాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) పేర్కొన్నది. పౌరుల ఇబ్బందులు, నిర్వాసితులు కావటంతో పాటు ఆహార, ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతుందని, జనాల కొనుగోలుశక్తి పడిపోతుందని, ప్రపంచ వాణిజ్య, సరఫరా వ్యవస్ధలు దెబ్బతింటాయని కూడా చెప్పింది. మదుపుదార్లలో అనిశ్చిత పరిస్ధితి ఏర్పడటంతో పాటు ఆస్తుల విలువలు పడిపోతాయని, వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని కూడా చెప్పింది. ఉక్రెయిన్‌ గగనతలంపై ఆంక్షలు విధించకుండానే నాటో కూటమి వేరే విధంగా ఆయుధాలతో ఎంతో తోడ్పడవచ్చని నాటోలో అమెరికా మాజీ రాయబారి కర్ట్‌వాల్కర్‌ చెప్పాడు. నల్లసముద్రం మీద నుంచి రష్యా వదులుతున్న క్షిపణులను, టాంకులను కూల్చివేసేందుకు అవసరమైన సాయం అందించవచ్చన్నాడు.


యుద్దం ముగిసే సూచనలు కనిపించకపోవటంతో ఐరోపా దేశాల్లో అనేక చోట్ల జనం ఆహార పదార్దాలను పెద్ద ఎత్తున కొనుగోలు నిల్వచేసుకుంటున్నారు. స్లీపింగ్‌ బాగ్స్‌, పాలపొడి, డబ్బాల్లో నిల్వ ఉండే ఆహారం, బాటరీలు, టార్చిలైట్లు, ప్లాస్టిక్‌ డబ్బాల వంటివి ఒక్కసారిగా ఆరురెట్లమేరకు అమ్మకాలు పెరిగాయి. రేడియోల అమ్మకాలు కూడా ఇరవైశాతం పెరిగాయి. వీటిలో నిర్వాసితులుగా వచ్చిన వారు కొనుగోలు చేసినవి కూడా ఉన్నాయి. రష్యా మీద విధించిన ఆంక్షల కారణంగా తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు 26 బిలియన్‌ యురోలు అవసరమౌతాయని ఫ్రెంచి ఆర్ధిక మంత్రి ప్రకటించాడు. రష్యా, బెలారస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న పొటాష్‌ ఎరువులకు మన దేశంలో కొరత ఏర్పడే అవకాశం ఉందని వార్తలు. రష్యా నుంచి గోధుమల ఎగుమతులకు ఆటంకం ఏర్పడటంతో మన దేశ గోధుమల ఎగుమతికి అవకాశాలున్నట్లు రాయిటర్‌ పేర్కొన్నది.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తరువాత వంతు తైవాన్‌దే అంటూ తప్పుడు ప్రచారం – జలసంధిలో అమెరికా యుద్ద నౌక !

27 Sunday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, China, Narendra Modi, Propaganda War, RSS, Taiwan Next propaganda, US warship transit in Taiwan Straits


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ తరువాత వంతు తైవాన్‌దే అంటూ అంతర్జాతీయ మీడియా మరోసారి కథనాలను వండి వడ్డిస్తోంది. గతంలో హాంకాంగ్‌ వేర్పాటువాదులపై చైనా చర్య తీసుకోగానే ఇంకేముంది తరువాత వంతు తైవాన్‌దే అంటూ ఇలాంటి ఊహాగానాలే రాసింది. ఒకవైపు తన కనుసన్నల్లో పని చేసే మీడియా ఇలాంటి కథనాలను రాయిస్తూ మరోవైపు చైనాను రెచ్చ గొట్టేందుకు తైవాన్‌ జలసంధిలో శనివారం నాడు అమెరికా తన యుద్ధ నౌక రాల్ఫ్‌ జాన్సన్ను నడిపింది. అంతర్జాతీయ జలాల్లో నౌకలను నడిపే హక్కు తమకుందని అమెరికా చెప్పటంతో పాటు తైవాన్‌కు మద్దతుగా తామున్నామనే సందేశాన్నివ్వటం దీనిలో ఉంది. ఈ నౌక మామూలుగానే అటువచ్చినట్లు కనిపిస్తున్నా చెడు సంకేతాలను ఇచ్చిందని చైనా నిపుణులు చెప్పారు. ఈ నౌకను అనుసరిస్తూ ఒక అమెరికా నిఘావిమానం కూడా చక్కర్లు కొట్టింది. చైనా వైపు నుంచి ఉన్న కదలికలు, చర్యలను కనిపెట్టటమే దాని లక్ష్యం. డిసెంబరు, జనవరి మాసాల్లో కూడా అమెరికా నౌకలు ఇదే మాదిరి రాకపోకలు సాగించాయి. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్ల చేతిలో పరాభవం తరువాత తాము ఒకేసారి రెండు రంగాల్లో సత్తా చూపగలమని ప్రపంచానికి చాటేందుకు అమెరికా పూనుకుంది.దానిలో భాగంగానే ఉక్రెయినుకు ఆయుధాలు ఇచ్చింది. ఇటు చైనాను రెచ్చగొట్టేందుకు ఇలాంటి కవ్వింపు చర్యలు, తప్పుడు ప్రచారానికి పూనుకుంది.ఐరోపాలో ఆరవ, ఐరోపా కమాండ్‌ నౌకాదళాలను దించితే చైనాను బెదరించేందుకు ఇండో-పసిఫిక్‌ సముద్రంలో సప్తమ నౌకాదళాన్ని మోహరించింది.


ఆఫ్ఘనిస్తాన్‌లో పరాభవంతో అమెరికా బలహీనత ఏమిటో ప్రపంచానికి స్పష్టమైంది. ఇప్పుడు కొండంత రాగం తీసి కీచుమన్నట్లు ఉక్రెయిన్లో వ్యవహరించిన తీరు దాని డొల్లతనాన్ని(దీని అర్ధం అమెరికా పూర్తిగా బలహీనపడింది అని కాదు) వెల్లడించింది. దాని దగ్గర ఎన్ని అణ్వాయుధాలు, ఆధునిక జెట్‌, యుద్ద విమానాలు, క్షిపణులు ఉన్నా తమను నమ్ముకున్న వారిని నట్టేట ముంచి తన ప్రయోజనం తాను చూసుకుంటుందని స్వయంగా నిరూపించుకుంది. మరొక దేశం చేతులు కాల్చుకోకుండా ఒక గుణపాఠం నేర్పింది. తాను ఆడించినట్లు ఐరోపా ధనిక దేశాలు ఆడవన్న వాస్తవాన్ని ప్రపంచం చూసింది. ఉక్రెయిన్‌ యుద్దం ముగిసిన తరువాత చైనా, రష్యా మరింతగా అమెరికా, దాని మిత్రపక్షాల మీద వత్తిడి పెంచుతాయి.దాని కూటములు బీటలు వారతాయని, రాజగురుత్వం పలుచనవుతుందనే విశ్లేషణలు ఇప్పటికే వెలువడ్డాయి.


ఇక తదుపరి వంతు తైవాన్‌దే అనే ప్రచారం ప్రారంభమైంది. ఉక్రెయిన్‌ ఉదంతాన్ని చూసిన తరువాత తైవాన్ను విలీనం చేసుకొనేందుకు చైనా గనుక బలప్రయోగానికి పాల్పడితే ఇక్కడికి కూడా అమెరికా తన దళాలను పంపదా అంటూ ఊహాగానాలు రాస్తున్నారు. ఇది విలీనాన్ని మరింత క్లిష్టతరం గావించే ఎత్తుగడలో భాగం. అసలు ఉక్రెయిన్‌ సమస్యకు, తైవాన్‌, హాంకాంగ్‌లకు సంబంధమే లేదు. చైనా గురించి రాస్తున్న పశ్చిమ దేశాల మీడియా కాశ్మీరు గురించి ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? అది తైవాన్‌ కంటే ముందే తలెత్తింది. ఈ దశలో నరేంద్రమోడీ సర్కార్‌ను చర్చలోకి లాగితే అమెరికా, పశ్చిమ దేశాలకే నష్టం కనుకనే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆక్రమిత కాశ్మీరును స్వాధీనం చేసుకుంటామని, అవసరమైతే మిలిటరీ చర్యకు పూనుకుంటామని కూడా బిజెపి పదే పదే చెప్పింది. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ఇతరులు కూడా కాశ్మీరు గురించి మాట్లాడటం అంటే ఆక్రమిత కాశ్మీరు స్వాధీనం గురించే అని చెప్పారు. ఆక్రమిత కాశ్మీరు మన దేశ అంతర్భాగమే అన్నది నిస్సందేహం.


పాకిస్ధాన్‌ – భారత్‌ మధ్య కాశ్మీరు అనే స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసి భారత్‌, చైనాలను దెబ్బతీసే కుట్రకు అమెరికా, బ్రిటన్‌ తెరతీశాయి. అందుకే కాశ్మీరును ఆక్రమించుకొనేందుకు దేశవిభజన తరువాత పాకిస్తాన్ను పురికొల్పాయి. దానిలో భాగంగానే కాశ్మీరు ఒక స్వతంత్రదేశం కనుకనే దాన్ని తమలో విలీనం చేసుకోలేదని ఆజాద్‌ కాశ్మీర్‌ (స్వతంత్ర కాశ్మీరు) అని పాక్‌చేత చెప్పించటమే కాదు, పాకిస్తాన్‌లో విలీనం చేయకుండా దాని పర్యవేక్షణలో ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉంచారు. అందుకే పాక్‌ పార్లమెంటులో కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యకల్పించలేదు. అమెరికా, ఇతర ఐరోపా దేశాలు తమ దుష్టపధకంలో భాగంగా కాశ్మీరును భారత ఆక్రమిత ప్రాంతమని వర్ణిస్తాయి. ఇటీవల అమెరికా మనతో మిత్రత్వం నెరపుతోంది కనుక చిల్లికాదు తూటు అన్నట్లు భారత పాలిత అని చెబుతున్నాయి తప్ప మన అంతర్భాగంగా ఇప్పటికీ గుర్తించటం లేదు. దానికి ప్రతిగా మన దేశం కాశ్మీరు మన అంతర్భాగమని ప్రకటించింది. ఆక్రమిత కాశ్మీరు కూడా ఎప్పటికైనా విలీనం కావాల్సిందేనని, ఆ ప్రాంతానికి కాశ్మీరు అసెంబ్లీలో కొన్ని స్దానాలను కూడా కేటాయించింది. ఆక్రమిత్‌ కాశ్మీరును వెనక్కు తీసుకురావటంలో కాంగ్రెస్‌ విఫలమైందని, తాము అధికారానికి అధికారానికి వస్తే ఆ పని చేసి చూపుతామని బిజెపి చెప్పిన అంశం తెలిసిందే.


ఉక్రెయిన్‌ మాదిరి తైవాన్‌ గురించి ఇటీవలి కాలంలో ఎక్కడైనా చర్చ జరిగిందా ? రష్యా మాదిరి చైనా తన మిలిటరీని మోహరించిందా అంటే లేదు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 16న రష్యా దురాక్రమణకు పాల్పడనున్నదని అమెరికా చెప్పింది. అలాంటి గడువులను తైవాన్‌ అంశంలో చెప్పలేదు. మరి అమెరికన్‌ మీడియా తదుపరి తైవానే అంటూ ప్రచారం ఎందుకు మొదలు పెట్టినట్లు ? చైనాను రెచ్చగొట్టటం, ప్రపంచదృష్టిని మరల్చటం తప్ప మరొకటి కనిపించటం లేదు.


తైవాన్‌, హాంకాంగ్‌, మకావో దీవులు చైనాలో అంతర్భాగాలు అన్నది ఐరాసతో పాటు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలన్నీ అంగీకరించినదే. తైవాన్‌కు ఐరాస గుర్తింపులేదు. అక్కడి జనాలకు ఆమోదమైనపుడు చైనాలో విలీనం జరగాలని అమెరికా చెబుతున్నది. అదే సమయంలో స్వాతంత్య్రం కావాలంటూ కొందరితో నాటకం ఆడిస్తూ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నది, జెట్‌ విమానాలతో సహా అన్ని రకాల ఆయుధాలను అందిస్తున్నది.బ్రిటన్‌ కౌలు గడువు తీరగానే 1997లో హంకాంగ్‌ , పోర్చుగీసు కౌలు గడువు తీరగానే మకావూ దీవులు1999లో చైనా ఆధీనంలోకి వచ్చాయి. ఈ రెండు ప్రాంతాల్లోని వ్యవస్ధలను 50 సంవత్సరాల పాటు కొనసాగనిస్తామని చైనా ఒప్పందం చేసుకుంది. అందువల్లనే అవి ప్రత్యేక పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక 1949లో కమ్యూనిస్టులు దీర్ఘకాల సాయుధ పోరాటం తరువాత చైనాలో అధికారానికి వచ్చినపుడు అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ మొత్తం నాటి మిలిటరీ, ఆయుధాలన్నింటినీ తైవాన్‌ దీవికి తరలించి అక్కడ తిష్టవేశాడు. దాన్ని కాపాడేందుకు అప్పుడే అమెరికా, బ్రిటన్‌ అన్ని రకాల సాయం అందించి పటిష్టపరిచాయి. మిగతా దేశంలో అధికారాన్ని సుస్దిరం చేసుకున్న తరువాత తైవాన్‌ సంగతి చూద్దాంలెమ్మని కమ్యూనిస్టులు కేంద్రీకరించారు. అదే సమయంలో అమెరికా ఎత్తుగడలో భాగంగా అప్పటికే భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనాకు అసలైన ప్రతినిధిగా ఐరాసలో చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వాన్నే గుర్తించి తైవాన్‌ కేంద్రంగా ఉన్న పాలకులు నియమించిన అధికారులనే అనుమతించారు.1970దశకం వరకు అదే కొనసాగింది. తరువాత అమెరికా-కమ్యూనిస్టు చైనా మధ్యకుదిరిన ఒప్పందం మేరకు అసలైనా చైనాగా ప్రధాన భూభాగాన్ని గుర్తించారు. అంతకు ముందు ఒకే చైనా ఉంది కనుక తరువాత కూడా తైవాన్‌తో సహా అంతా ఒకే చైనా అని కూడా గుర్తించాల్సి వచ్చింది. అప్పటి నుంచి తైవాన్ను బలవంతంగా చైనాలో విలీనం చేయకూడదనే కొత్త పల్లవి అందుకున్నారు.హాంకాంగ్‌ అంశానికి వస్తే 99 సంవత్సరాల పాటు బ్రిటన్‌ ఏలుబడిలో ఉన్న అక్కడ అసలు ఎన్నికలే లేవు, ఎవరూ స్వాతంత్య్ర అంశాన్నే ఎత్తలేదు. చైనా ఆధీనంలోకి వచ్చిన తరువాతనే తొలిసారి ఎన్నికలు జరిగాయి.అమెరికా ఇతర దేశాలు రెచ్చగొట్టి వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టాయి.


చైనా సంస్కరణలు, ఆర్ధికాభివృద్ది మీద కేంద్రీకరించింది.ముందే చెప్పుకున్నట్లు హాంకాంగ్‌, మకావూల్లో ఐదు దశాబ్దాల పాటు అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్దలను కొనసాగించేందుకు అంగీకరించినందున ఆ గడువు నాటికి వాటితో పాటు తైవాన్ను కూడా విలీనం చేసుకోవాలన్నది చైనా ఆలోచన. అందుకే అక్కడ కూడా అనుమతిస్తున్నది. నిజానికి తైవాన్ను స్వాధీనం చేసుకోవటం చైనాకు పెద్ద సమస్యకాదు. అది శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నది కనుకనే సహనంతో ఉంది. పశ్చిమ దేశాలు దాని స్వాతంత్య్రం గురించి మాట్లాడినపుడల్లా తన అధికారాన్ని గుర్తు చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నది. అందువలన పశ్చిమ దేశాలు అధికారికంగా మాట్లాడే వీలు లేదు, మాట్లాడితే చైనాతో సంబంధాలు దెబ్బతింటాయి. దాని బదులు మీడియా ద్వారా కథనాలు వెల్లడిస్తుంటాయి. ఉక్రెయిన్‌ పరిణామాలు జరిగినా జరగకున్నా చైనాలో తైవాన్‌ విలీనం అనేది ముందే రాసిపెట్టి ఉంది. అది ఎప్పుడు ఎలా అన్నది చూడాల్సి ఉంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి రష్యా ముంగిట ఆ ముసుగులో తన సైన్యాన్ని, ఆయుధాలను మోహరించి మెడమీద కత్తిలా మారాలన్న అమెరికా దురాలోచన అక్కడి తాజా పరిణామాలకు మూలం. అదే మాదిరి తైవాన్ను, హాంకాంగ్‌ను స్వతంత్ర రాజ్యాలుగా చేసి చైనాకు రెండు వైపులా ఎసరు పెట్టాలన్నది అమెరికా, జపాన్‌ తదితర దేశాల దుష్టాలోచన. దాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ చైనా అంగీకరించదు, సాగనివ్వదు. ఎవరికీ ఎలాంటి భ్రమలు, ఈ అంశాల మీద తప్పుడు అంచనాలకు లోనుకాకూడదని చైనా పదే పదే హెచ్చరిస్తోంది. అమెరికా, జపాన్‌, ఇతర దేశాలను హెచ్చరించేందుకు చైనా కూడా శనివారం నాడు తైవాన్‌ జలసంధికి వైపు జలాంతర్గాములను దెబ్బతీసే విమానాలు, ఇతర విమానాలను చైనా పంపింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకే దెబ్బతో చైనా, రష్యాలను కొట్టాలన్న అమెరికా ఆత్రం !

12 Saturday Feb 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China Threat, Quad, Quadrilateral Security Dialogue, RUSSIA, Two-front wars’ with China and Russia, Ukraine war


ఎం కోటేశ్వరరావు
ఆత్రగాడికి బుద్ది మట్టు(తక్కువ లేదా పరిమితం) అన్నారు పెద్దలు.లేకపోతే రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘన్‌ తాలిబాన్లనే అదుపు చేయలేక సలాం చేసి తోకముడిచిన అమెరికన్లు ఒకేసారి చైనా, రష్యాలను మింగేస్తాం అంటుంటే ఏమనుకోవాలి మరి ! ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో అమెరికా, భారత్‌, జపాన్‌,ఆస్ట్రేలియాతో కూడిన చతుష్టయ(క్వాడ్‌) విదేశాంగ మంత్రుల నాలుగవ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఇటీవలి కాలంలో అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన ఒక ప్రధాన మార్పు ఏమంటే తన చేతికి మట్టి అంటకుండా ఇతరులతో పని జరిపించుకోవటం. కొద్ది నెలల క్రితం దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం ఏమిటంటూ ఆ ప్రాంత దేశాలను రెచ్చగొట్టింది. ఇప్పుడు ఇంకేముంది రష్యన్లు ఉక్రెయిన్‌ ఆక్రమణకు నడుంకట్టారు, మీ వెనుక మేముంటాం అందరం పోరాడుదాం , ముందుకు పదండితోసుకు అని హడావుడి చేస్తోంది. చతుష్టయ కూటమికి ఉక్రెయిన్‌ వివాదానికి సంబంధం లేదు, ఐనా మెల్‌బోర్న్‌లో దాని గురించి ప్రస్తావించారు. ప్రతిదానికి ప్రతిదేశ జుట్టును ముడివేయాలని అమెరికా చూస్తోంది. ఈ కూటమిలోని వారందరూ ఉక్రెయిన్‌ వెళ్లి రష్యా మీద దాడులకు దిగుతారా ? అంతసత్తా ఉందా ? ఆసియాకు చైనా నుంచి, ఐరోపాకు రష్యా నుంచి ముప్పు ఉందనే తన దుష్ట పన్నాగంలోకి అన్ని దేశాలనూ లాగేందుకు అమెరికా పూనుకుంది.


భారత్‌ ఎదుగుదలకు, ప్రాంతీయ నాయకురాలిగా నాయకత్వం వహించేందుకు మద్దతు ఇస్తాం అని మెల్‌బోర్న్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మనకు చెప్పారు. మనం ఏ దేశాలకు నాయకత్వం వహించాలి? ప్రపంచ పెత్తనం కోసం అమెరికా పడరాని పాట్లు పడుతోంది. మింగటం దానివల్ల కావటం లేదు. ఒక్కొక్క ఖండంలో ఒక్కో జూనియర్‌ భాగస్వామికోసం ఎదురు చూస్తోంది. మనం దాని ఏజంటుగా మారాలని కోరుకుంటోంది. అసలు భారత ఉపఖండంలో మన కోసం ఎదురు చూస్తున్నవారెవరైనా ఉన్నారా ? అందరిని, కాస్త దూరంలో ఉన్న ఇరాన్‌ వంటి మిత్రదేశాలను దూరం చేయటంలో అమెరికా జయప్రదమైంది. చిన్న దేశమైన భూటాన్‌ కూడా మనతో చెప్పకుండా డోక్లాం ప్రాంత వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనాతో చర్చలు జరిపింది కదా ! మనలిన్న తన పట్టునుంచి పోకుండా అమెరికా బిగించింది.మీ ఊరు చుట్టుపక్కల 66 ఊళ్లకు పోతుగడ్డ అని పొగిడినట్లుగా మనలను మునగచెట్టు ఎక్కిస్తోంది. తన దక్షిణ చైనా సముద్ర ఆధిపత్య ఎత్తుగడలో భాగంగా గాల్వన్‌ రూపంలో మనకూ చైనాకు లడాయి పెట్టింది.

మరోవైపున ఆస్ట్రేలియాను చైనా మీదకు ఉసిగొల్పింది, జపాన్‌లో తానే తిష్టవేసింది గనుక జపాన్ను ప్రత్యేంగా రెచ్చగొట్టాల్సిన పనిలేదు. చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకుందామనే పేరుతో భారత విస్తరణ వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. అది జరిగేదేనా ?
ఈ కాలంలో జరిగిందేమిటి ? ఆస్ట్రేలియా తోకలను కత్తిరించేందుకు చైనా వాణిజ్య ఆయుధాన్ని వాడుతున్నది.2021 తొలి తొమ్మిది నెలల కాలంలో ఆస్ట్రేలియా నుంచి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చైనా 17.3బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతులను తగ్గించింది. అదే వస్తువులను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుందంటే, అమెరికా నుంచి 6.3, కెనడా నుంచి 1.5, న్యూజిలాండ్‌ నుంచి 1.1బి.డాలర్ల మేరకు అదనంగా చైనా దిగుమతి చేసుకుంది. అంటే ఆస్ట్రేలియాను ఫణంగా పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంది. ఇప్పుడు చైనాతో అమెరికాకు ఉన్న లడాయి ఏమిటి ? తన వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయటం లేదన్నదే, చైనా దిగుమతులు పెరిగితే దక్షిణ చైనా సముద్రమూ ఉండదు, భారత్‌కు నాయకత్వమూ ఉండదు. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి బెదిరింపులకు దిగుతోంది.


నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు ఎన్నికల్లోపు ఓటర్ల ముందు ఏదో ఒకటి సాధించినట్లు లేదా మరొక మహత్తర కార్యక్రమంలో ఉన్నట్లు ఓటర్లకు జోబైడెన్‌ కనిపిస్తేనే ఓట్లు పడతాయి.అందుకే ఈ తిప్పలు. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి.2020లో కుదిరిన ఒప్పందం మేరకు మా దగ్గర నుంచి సరకులు కొంటారా లేదా అని అమెరికా వత్తిడి తెస్తోంది. మీరు మాత్రం మా మీద అనేక ఆంక్షలు విధిస్తారు, చుట్టూ మంటపెడతారు, తగ్గించాల్సిన పన్నుల గురించి మాట్లాడరు, కరోనా కారణంగా తలెత్తిన సమస్యల గురించి మాట్లాడకుండా మా మీద నిందలు వేస్తే కుదరదు అని చైనా అంటోంది. ఆ ఒప్పందం ప్రకారం 2020లో అమెరికా నుంచి 260, 2021లో 310బి.డాలర్ల విలువగల వస్తువులు, సేవలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దానికి ప్రతిగా అమెరికా చైనా నుంచి వచ్చే 120బి.డాలర్ల విలువగల వస్తువులపై పన్నును 15నుంచి 7.5శాతానికి తగ్గించాలి.2021లో రెండు దేశాల మధ్య 755.6బి.డాలర్ల మేర వాణిజ్యం జరగా అమెరికా నుంచి దిగుమతులు 179.53 బి.డాలర్లు మాత్రమే ఉన్నాయి. చైనా వార్షిక విదేశీ వాణిజ్య విలువ ఆరులక్షల కోట్ల డాలర్లుండగా అమెరికా వాటా పన్నెండుశాతంగా ఉంది.


మెల్‌బోర్న్‌ సమావేశం సందర్భంగా అమెరికా విడుదల చేసిన పత్రం భారత్‌ – చైనాల మధ్య మంటను మరింతగా ఎగదోసేదిగా ఉంది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్నాయని ఈ ప్రాంతంలో భద్రతను సమకూర్చే భారత పాత్రకు తాము మద్దతు ఇస్తామని అమెరికా పేర్కొన్నది. క్వాడ్‌లో భారత్‌ భావ సారూప్యత కలిగిన భాగస్వామి, చోదకశక్తి అని వర్ణించింది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్న కారణంగానే తాము ఈ ప్రాంతంపై కేంద్రీకరించామని, ఆస్ట్రేలియా మీద ఆర్ధిక బలాత్కారం, వాస్తవాధీన రేఖ వెంట భారత్‌తో ఘర్షణ, తైవాన్‌ మీద పెంచుతున్న వత్తిడి, తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలపై బెదరింపులు వంటి చర్యలతో తమ మిత్రులు, భాగస్వాములు మూల్యం చెల్లించాల్సి వస్తోందని అమెరికా పత్రం పేర్కొన్నది. చైనాను మార్చటంలో తమకు పరిమితులు ఉన్నట్లు ఒక అమెరికా అధికారి ఈసందర్భంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి.


మెల్‌బోర్న్‌ సమావేశంలో రష్యాగురించి భిన్నంగా మాట్లాడినప్పటికీ చైనా విషయంలో దాదాపు ఒకే అభిప్రాయం వ్యక్తమైంది.క్వాడ్‌ బృందం విబేధాల గురించి గాక సహకారం, చేతులు కలపటం మీద కేంద్రీకరించాలని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఉక్రెయిన్‌ వివాదం గురించి చెప్పారు. అమెరికా ఆంక్షలు, బెదిరింపులను ఖాతరు చేయ కుండా రష్యానుంచి క్షిపణి వ్యవస్దలను మనదేశం కొనుగోలు చేసింది. ఇప్పటికీ మిలిటరీ సరఫరాలపై వారి మీదే ప్రధానంగా ఆధారపడి ఉన్నాము. రష్యా మిలిటరీ బెదరింపులు ముప్పు తెస్తున్నాయని అమెరికా మంత్రి బ్లింకెన్‌ ఆరోపించగా ఈ వివాదంలోకి తాము దలదూర్చటం లేదని జైశంకర్‌ పేర్కొన్నారు. ఒక దేశంతో ఎవరితో కలవాలో లేదో మరొక దేశం నిర్ణయించరాదని అమెరికా మంత్రి రష్యామీద ధ్వజమెత్తారు.నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోరాదని రష్యా డిమాండ్‌ చేస్తుండగా చేర్చుకొని ఉక్రెయినుకు మిలిటరీని తరలించి రష్యా మెడమీద కత్తిలా మారాలని అమెరికా ఎత్తువేసింది. నా సహచరులు చెప్పినట్లుగా మేము కొన్నింటికోసం ఉన్నప్పటికీ కొందరికి వ్యతిరేకం కాదని జైశంకర్‌ అన్నారు. ఇటీవలి భద్రతామండలి సమావేశంలో కూడా రష్యాను విమర్శించేందుకు మన దేశం తిరస్కరించింది. జపాన్‌-రష్యా మధ్య సరిహద్దు సమస్యలున్నప్పటికీ ఘర్షణకు జపాన్‌ సిద్దంగా లేదు. అమెరికా వత్తిడి మేరకు కొన్ని ప్రకటనలు చేసినప్పటికీ చైనాతో వాణిజ్య మిగులు ఉన్న జపాన్‌ తెగేవరకు లాగేందుకు సిద్దంగా లేదు. దక్షిణ కొరియా కూడా చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటోంది.

మన దేశం గాల్వన్‌ ఉదంతాల సమయంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ గతేడాది రికార్డు స్దాయిలో వస్తువులను దిగుమతి చేసుకొని సానుకూల సందేశాన్ని పంపింది. కోవీషీల్డ్‌ కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను, పరికరాలను సరఫరా చేసేందుకు అమెరికా నిరాకరించి నిషేధం విధించిన అంశం తెలిసిందే. కేంద్రంలో ఉన్న అధికారపార్టీ రాజకీయాలను ఖాతరు చేయకుండా మన దిగుమతిదారులు లావాదేవీలు జరిపారు. చైనా నుంచి నిర్ణీత పరిమాణంలో వస్తువులను విధిగా కొనుగోలు చేయాలనే ఒప్పందాలేవీ లేవు, అగత్యమూ లేదు. అమెరికన్లు చెబుతున్నట్లు వారు మనకు సహజభాగస్వాములే ఐతే, జపాన్‌, ఆస్ట్రేలియా మన మంచి కోరుకున్నట్లయితే మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను వారు సరఫరా చేయవచ్చు, చేేయగలరు కానీ వారు చెప్పిన ధరలను మనం చెల్లించాలి. ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు. ఆ వెలతో దిగుమతి చేసుకుంటే మన జనాల జేబులు కొట్టి అమెరికా, ఇతర దేశాలకు సమర్పించాలి. తక్కువ ధరలకు వస్తువులు వస్తున్నందున దిగుమతిదారులు మొగ్గుచూపుతున్నారు తప్ప చైనా మీద వారికేమీ ప్రత్యేక ప్రేమ ఉండికాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d