• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

గోమూత్రం తాగుతూ, పేడ పూసుకుంటూ మనం- ఆధునిక పరిశోధనల చుట్టూ చైనా జనం !

12 Wednesday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment


ఎం కోటేశ్వరరావు
తన ప్రత్యేక లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్దను నిర్మిస్తున్నామని ప్రకటించిన చైనా తాజాగా మరో ముందడుగు వేసింది.శాస్త్ర పరిశోధనా పత్రాల సమర్పరణలో తొలిసారిగా అమెరికాను అధిగమించి మొదటి స్ధానంలో ఉన్నట్లు గతవారంలో వెల్లడైన సమాచారం తెలిపింది. సైంటిఫిక్‌ జర్నల్స్‌లో ఆయా దేశాలకు చెందిన వారు సమర్పించిన పత్రాల సమీక్షలో చైనా 19.9శాతంతో ప్రధమ స్ధానంలో ఉండగా అమెరికా 18.3శాతంతో ద్వితీయ స్ధానంలో ఉంది.
ఏ దేశంలో అయినా శాస్త్ర పరిశోధనాఅభివృద్ధికి ఇచ్చే ప్రోత్సాహం, అందుకు గాను ప్రభుత్వాలు చేసే ఖర్చు ఆ దేశ వాణిజ్య, మిలిటరీతో సహా అన్ని రకాల అభివృద్ధికి సోపానాలుగా మారతాయన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో చైనా సాధిస్తున్న విజయాలతో బెంబేలెత్తిన అమెరికా పాలకవర్గం మరో ప్రచ్చన్న యుద్ధానికి తెరలేపింది. దానిలో భాగంగానే రెండు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష వాణిజ్య పోరును ప్రారంభించింది. ఇటీవలి కాలంలో దక్షిణ చైనా సముద్రంలోకి తన విమానవాహక యుద్ద నౌకలు, ఇతర యుద్ద నౌకలను తరలించి చైనాను రెచ్చగొట్టేందుకు, ఆ ప్రాంత దేశాలన్నింటినీ కూడగట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. నిజానికి అమెరికా ఈ చర్యలను ఇప్పటికిప్పుడు ప్రారంభించలేదు. ఎప్పుడో పునాదులు వేసింది, ఇప్పుడు ప్రపంచానికి బాగా కనిపిస్తున్నాయి. ఒక వైపు రాజకీయంగా, మిలిటరీ రీత్యా తన చర్యలను తాను తీసుకుంటూనే అత్యంత కీలకమైన శాస్త్ర పరిశోధనా రంగాన్ని నిరంతరాయంగా అభివృద్ధి చేసేందుకు పూనుకోవటమే చైనా విజయ కారణంగా చెప్పవచ్చు.
2016-18 సంవత్సరాల మధ్య చైనా సగటున ఏడాదికి 3,05,927, అమెరికా 2,81,487 శాస్త్ర పత్రాలను ప్రచురించగా 67,041 పత్రాలతో (4.4శాతం) జర్మనీ మూడవ స్ధానంలో ఉంది. అమెరికాలోని క్లారివేట్‌ అనలిటిక్స్‌ సంస్ధ అందచేసిన సమాచారం ప్రాతిపదికన జపాన్‌ జాతీయ శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞాన విధాన సంస్ద పైన పేర్కొన్న విశ్లేషణ చేసింది. పరిశోధనా, శాస్త్ర పత్రాల సంఖ్య స్ధిరంగా ఉండదు, మూడు సంవత్సరాల సగటును తీసుకున్నారు. అయితే జపాన్‌ విశ్లేషణకు ముందే అమెరికా జాతీయ సైన్స్‌ ఫౌండేషన్‌ తమ దేశాన్ని చైనా అధిగమిస్తోందని అంచనా వేసింది. అయితే ఈ రంగంలో పోటీ కారణంగా ఒక దశలో ముందున్న దేశం మరొక దశలో వెనుకబడవచ్చు. మొత్తంగా పురోగమించే ధోరణి కొనసాగుతోందా లేదా అన్నదే ముఖ్యం. చైనాలో అది కనిపిస్తోంది.
జనాభాలో ప్రధమ స్ధానంలో ఉన్న చైనా తమ పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రారంభించిన మహత్తర సోషలిస్టు యజ్ఞంలో ఏ రంగాన్ని వదలకుండా తనదైన శైలిలో స్ధిరంగా ముందుకు పోతుండటమే ఈ పురోగతికి కారణం అని చెప్పవచ్చు. నల్లమందు భాయీలని ప్రపంచంలో ఒకనాడు అవమానాలు పొందిన చైనీయులు ఇప్పుడు నల్లమందు కాదు నవతరం భాయీలని రుజువు చేసుకుంటున్నారు. 1996-98 సంవత్సరాలతో పోలిస్తే శాస్త్రీయ పత్రాల సమర్పణ 18రెట్లు పెరగ్గా 2006-08 సంవత్సరాలతో పోల్చుకుంటే 3.6 రెట్లు పెరిగింది. పత్రాలు సమర్పించటం ఒక్కటే ప్రమాణంకాదు, వాటి నాణ్యత కూడా ముఖ్యమే. 2017లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన పదిశాతం పత్రాలలో అమెరికన్లు ప్రచురించినవి 24.7శాతం ఉండగా చైనీయులవి 22శాతం ఉన్నాయి. అదే తొలి ఒకశాతం పత్రాలలో కూడా ఈ దేశాల వాటా 29.3 మరియు 21.9శాతం చొప్పున ఉండటం విశేషమే కాదు, రెండు దేశాల మేథావుల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందో తెలియచేస్తున్నది.
చైనా పత్రాలను విశ్లేషించినపుడు భౌతిక శాస్త్రాలైన రసాయన, ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ మరియు గణితాల గురించి ఎక్కువగా ఉంటే అమెరికా నుంచి క్లినికల్‌ మెడిసిన్‌ మరియు మౌలిక జీవ శాస్త్రాలపై కేంద్రీకరణ కనిపిస్తోంది. 2018 వివరాలను పరిశీలించినపుడు అమెరికాలో పరిశోధన-అభివృద్ధికి 581 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఈ మొత్తం అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఐదుశాతం ఎక్కువ. అదే చైనాలో 554 బిలియన్‌ డాలర్లు ఉండగా అంతకు ముందు కంటే పదిశాతం ఎక్కువగా ఉంది.2000 సంవత్సరం నుంచి 2018 మధ్య విశ్వవిద్యాలయాల మీద చైనాలో చేసిన ఖర్చు 10.2 రెట్లు పెరగ్గా అదే అమెరికాలో ఇదే కాలంలో కేవలం 1.8రెట్లు మాత్రమే పెరిగింది.
పరిశోధనాఅభివృద్ధి రంగంలో పెడుతున్న భారీ ఖర్చు కారణంగా 2000 సంవత్సరం నుంచి మొత్తం పెరుగుదలకు చైనా 32శాతం, అమెరికా 20, ఐరోపా యూనియన్‌ 17శాతం వాటాను సమకూర్చాయి. ప్రస్తుతం చైనా ప్రపంచంలో అతిశక్తివంతమైన సూపర్‌ కంప్యూటర్‌, అతి పెద్ద రేడియో టెలిస్కోప్‌ తయారీలో ఉంది. జీన్స్‌ పరిశోధనకు పెద్ద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చైనాలో పరిశోధనకు చేస్తున్న భారీ ఖర్చు, అనేక నూతన ఆవిష్కరణలకు దారి తీస్తున్నప్పటికీ నోబెల్‌ బహుమతులు మాత్రం అమెరికా, ఇతర దేశాల వారికే ఇప్పటివరకు దక్కాయి. 2018లో ప్రపంచ వ్యాపితంగా పేటెంట్లకు దరఖాస్తు చేసిన వారిలో చైనీయులు 49శాతం ఉన్నారు.
వర్తమాన చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌ శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం ముందుకు పోవటానికి ప్రాధాన్యత ఇచ్చి జాతీయ లక్ష్యాల బాటను నిర్దేశించాడు. ఆ మేరకు 1993లో ఒక చట్టాన్ని కూడా రూపొందించారు. పరిశోధన-అభివృద్ధి కేటాయింపు ఒక శాతం కంటే తక్కువగా ఉండటాన్ని గమనించి చైనా ప్రభుత్వం 2001-05 మధ్య 1.5శాతం ఖర్చు చేయాలని నిర్దేశించింది.2020లో ఆ మొత్తం రెండున్నర శాతానికి పెరిగింది.
శాస్త్ర పరిశోధనలో జపాన్‌ వెనుకబడింది, 64,874 పత్రాలతో నాలుగో స్ధానంలో ఉంది. అయితే పత్రాల నాణ్యత విషయంలో తొమ్మిదో స్ధానం నుంచి నాలుగో స్ధానానికి పడిపోయింది.ప్రకటించిన లక్ష్యాల మేరకు పెట్టుబడుల పెట్టటంలో వైఫల్యమే దీనికి కారణం, పర్యవసానంగా పరిశోధకుల సంఖ్య కూడా పడిపోయింది.
చైనా మొత్తంగా పరిశోధనా పత్రాల సమర్పణలో ముందున్న స్ధితికి నిదర్శనంగా ఉన్నత స్ధాయి నాణ్యత గల రసాయన పరిశోధనా పత్రాల సమర్పణలో నేచర్‌ ఇండెక్స్‌లో కూడా తొలిసారిగా ఒకటవ స్ధానంలో నిలిచింది. అగ్రశ్రేణి పది దేశాల్లో అమెరికాను రెండవ స్ధానానికి నెట్టింది. మన దేశం తొలి పదింటిలో స్ధానం పొందినప్పటికీ సుదూరంగా ఉంది. 2018లో చైనా 6,183.75 పాయింట్లతో ముందుండగా వరుసగా అమెరికా 5,371.32, జర్మనీ 1,673.35, జపాన్‌ 1,275.58, బ్రిటన్‌ 1,023.58,ఫ్రాన్స్‌ 671.93, దక్షిణ కొరియా 615.12, భారత్‌ 501.38, కెనడా 464.62, స్పెయిన్‌ 460.21 చొప్పున సాధించాయి. ఎనభై రెండు పత్రికలలో ప్రచురితమైన అంశాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్ధానంలో ఉన్న అమెరికా తొలిసారిగా రెండవ స్ధానానికి పడిపోయింది. 2017చైనా అభివృద్ధి 17.9శాతం ఉంటే అమెరికా 6.2శాతం దిగజారింది. జపాన్‌ 12.6శాతం, బ్రిటన్‌ 10.8శాతం చొప్పున తగ్గుదల నమోదు చేశాయి.
క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో చైనా ఇతర దేశాలకంటే ఎంతో ముందుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెఫెయి విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 50కిలోమీటర్ల దూరంలోని ఆప్టికల్‌ ఫైబర్‌ సముదాయాలతో క్వాంటమ్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. అంటే ఒక సముదాయంలో ఏదైనా మార్పు జరిగితే మిగతా వాటిని అది ప్రభావితం చేస్తుంది. ఇంత దూరంలోని వాటిని అనుసంధానించటం ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఈ ప్రయోగం జయప్రదమైతే ఇంటర్నెట్‌ రంగంలో మరో విప్లవానికి దారి తీయనుంది. క్వాంటమ్‌ కమ్యూనికేషన్స్‌, కృత్రిమ మేథ, బయోటెక్నాలజీ, జనోమ్‌ ఇంజనీరింగ్‌లో చైనా ఎంతో పురోగతి సాధించింది. గతంలో చైనా దిక్సూచి, కాగితం, ముద్రణ, తుపాకి మందు విషయాల్లో ప్రపంచంలో ముందున్న విషయం తెలిసిందే.
సాంస్కృతిక విప్లవం పేరుతో 1960దశకంలో అమలు చేసిన కొన్ని దుందుడుకు చర్యల కారణంగా అనేక విశ్వవిద్యాలయాలను మూసివేశారు. పరిశోధన కుంటుపడింది. మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్‌సియావో పింగ్‌ 1978లో ప్రారంభించిన సంస్కరణల తరువాత తిరిగి పరిశోధన ఊపందుకుంది. తొలి రోజుల్లో ఇతర దేశాలను అనుసరించిన చైనా ఇప్పుడు కొన్ని రంగాలలో ఇతరులు తనను అనుసరించే స్ధితికి చేరుకుంది. ప్రపంచంలోని 137 పరిశోధనా రంగాలలో చైనా 33 చోట్ల ముందుంది.
చైనా తరువాత 1991లో మన దేశం కూడా నూతన ఆర్ధిక సంస్కరణల పేరుతో కొన్ని చర్యలను తీసుకుంది. అవి ఎలాంటి ఫలితాలను ఇచ్చాయో మనం చూస్తూనే ఉన్నాము. గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పరిశోధన గురించి కబుర్లు చెప్పటం తప్ప తీసుకుంటున్న చర్యలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయి. ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగిస్తున్నాయి. యువతలో శాస్త్రీయ ఆలోచనలను రేకెత్తించాల్సిన పాలకులు, వారికి మార్గదర్శకులుగా ఉన్నవారు వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. మన సంస్కృత గ్రంధాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొత్తం నిక్షిప్తమై ఉందని చెబుతారు. వాటిని చూసే అమెరికా నాసా, ఇతర సంస్దలు పరిశోధనల్లో ముందున్నాయని, చివరికి కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ను కూడా రాస్తున్నాయనే పోసుకోలు కబుర్లతో వాట్సాప్‌ను నింపివేస్తున్నారు. శాస్త్రీయ ఆలోచనలు, భావాలను ముందుకు తెచ్చేవారి మీద సామాజిక మాధ్యమంలో దాడులు చేస్తున్నారు. విద్యార్దుల్లో సృజనాత్మక శక్తులను మొద్డుబారేట్లు చేస్తున్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం చైనా ప్రారంభించిన సంస్కరణలు ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి నమ్మని వారు, వారు నిజం చెప్పటం లేదని భావించే వారు ఇప్పటికీ ఉండవచ్చు, ఇక ముందు కూడా ఉంటారు. నిత్య అనుమానితులతో ఏ సమాజం ముందుకు పోదు, వారిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. మాతాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటే కుదరదు. సంస్కృత గ్రందాల్లో అన్నీ ఉన్నాయని చెప్పే పండితులు వాటిని వెలికి తీసి దేశానికి ఎందుకు మేలు చేయరు ? గోమూత్రం తాగే వారిని తాగనివ్వండి-దేశానికి నష్టం లేదు. ఆవు పేడ పూసుకొనే వారిని పూసుకోనివ్వండి జనానికి నష్టం లేదు. మూత్రంలో బంగారం దాగుందని, పేడకు ఆరోగ్యం అంటుకొని ఉందని చెప్పి రుజువుకాని అంశాలను జనం మెదళ్లకు ఎక్కించవద్దు. శాస్త్రీయ ఆలోచనలను అణగదొక్కవద్దు. మేలు చేయకపోయినా కీడు చేయకండి ! గతంలో జరిగిందాన్ని పునరావృతం కానివ్వకండి !! దేశాన్ని, సమాజాన్ని మరికొన్ని శతాబ్దాలు వెనక్కు నెట్టకండి !!!

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన అంకుర సంస్ధలు అమెరికా ఎందుకు పోతున్నాయి !

09 Sunday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Indian startups, Silicon Valley, startup ecosystems, startups, unicorn startups


ఎం కోటేశ్వరరావు
ఒక బిలియన్‌ డాలర్లకు పైగా విలువ కలిగిన అంకుర సంస్ధలు( స్టార్టప్స్‌) మన దేశంలో 21 ఉన్నాయని, అవి చైనా సంస్దలలో కేవలం పదో వంతని ఆగస్టు మొదటి వారంలో పిటిఐ వార్తా సంస్ధ ఒక విశ్లేషణలో పేర్కొన్నది. అంకుర సంస్ధలు అనేకం ఉన్నప్పటికీ ఒక బిలియన్‌ డాలర్ల విలువ దాటిన వాటిని యూనీకార్న్‌ సంస్దలని పిలుస్తున్నారు. అలాంటి సంస్దలు భారతీయులు విదేశాల్లో నెలకొల్పినవి 40కి పైగా ఉన్నాయన్న సమాచారం ఆసక్తి కలిగించేది.
కరోనా వైరస్‌ కారణంగా చైనా నుంచి పెద్ద సంఖ్యలో కంపెనీలు, ఫ్యాక్టరీలు మన దేశానికి తరలివస్తున్నాయనే వార్తలు వచ్చాయి. ఏప్రిల్‌ చివరి వారంలో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ అలాంటి కంపెనీలను ఆకర్షించే విధంగా రాష్ట్రాలు అవసరమైన నైపుణ్యం, మౌలిక సదుపాయాలను కలిగించి చైనా నుంచి వచ్చే కంపెనీలకు ప్రత్యామ్నాయం మన దేశమే అనే పరిస్ధితిని కల్పించాలని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తెలంగాణా రాష్ట్ర సిఎం చంద్రశేఖరరావుతో సహా మంత్రులు, ఇతరులు సదరు కంపెనీలకు భూములను కూడా సిద్దం చేశామని, రావటమే తరువాయి అన్నట్లుగా ప్రకటనలు చేసిన అంశాన్ని గుర్తు చేయాలి. తెలంగాణా సిఎం ఒక్కరే కాదు, అనేక రాష్ట్రాల నుంచి ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. తరువాత అదే చైనాలో తిరిగి సాధారణ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని, వస్తాయని చెప్పిన కంపెనీలు అసలు బయటకు వచ్చాయో లేదో వచ్చినా ఏ దేశానికి వెళ్లాయో చెప్పిన వారు లేరు.
చైనా కంపెనీల గురించి పక్కన పెడితే మన దేశానికి చెందిన వారు అంకుర కంపెనీలను మన దేశంలో కాకుండా అమెరికా లేదా మరొక దేశంలో ఏర్పాటు చేయటానికి కారణాలు ఏమిటి అన్నది సమస్య. సరిహద్దు వివాదం తలెత్తిన తరువాత మన దేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు అనుమతులు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను చేసిన విషయం తెలిసిందే. అది చైనాను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెల వరకు ఏర్పాటు చేసిన చైనాకు చెందిన 227 అంకుర సంస్ధలలో విదేశాలలో స్ధాపించినవి కేవలం 16 మాత్రమే, మిగిలినవన్నీ చైనాలోనే పెట్టారు. అరవైకి పైగా సంస్ధలను మన వారు ఏర్పాటు చేస్తే ముందే చెప్పుకున్నట్లు వాటిలో 40 విదేశాల్లోనే అంటే మన ఐఐటిల్లో చదువుకొని కంపెనీలను మాత్రం విదేశాల్లో పెడతారు. వారిలో దేశభక్తిని నింపటంలో మన పాలకులు విఫలమయ్యారా లేక దేశంలోని పరిస్ధితులు బాగోలేవని విదేశాలకు వెళ్లిపోయారా ?
మన దేశంలోని 21 అంకుర సంస్ధల విలువ 73.2 బిలియన్‌ డాలర్లు. వీటిలోని పదకొండు కంపెనీలలో చైనాకు చెందిన ముగ్గురు పెట్టుబడులు పెట్టారు. విదేశాల్లో మన వారు ఏర్పాటు చేసిన సంస్దల విలువ 99.6బిలియన్‌ డాలర్లు. వీటిలో ఎక్కువ భాగం అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలోనే ఉన్నాయి. ప్రపంచంలోని 29 దేశాలలోని 145 నగరాల్లో 586 అంకుర సంస్ధలు ఉన్నాయి. మన దేశంలోని 21యూనీకార్న్‌ సంస్దలలో ఎనిమిది బెంగళూరులో ఉండటంతో అంకుర సంస్ధల రాజధానిగా దాన్ని పిలుస్తున్నారు. మన దేశంలో అలాంటి సంస్ధలలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్‌ను 2017లో ఏర్పాటు చేశారు. దాని తరువాత మరొక సంస్ధ లేదు. ఒక అంకుర సంస్ధ యూనీకార్న్‌ స్ధాయికి చేరుకోవాలంటే భారత్‌లో 7, అమెరికాలో 6.5, చైనాలో 5.5సంవత్సరాల వ్యవధిని తీసుకుంటున్నది. బహుశా ఈ కారణంగానే మన దేశానికి చెందిన వారు మన దేశం వెలుపలికి పోతున్నట్లు చెప్పవచ్చు.
చైనాకు చెందిన ఆలీబాబా 5, టెన్‌సెంట్‌, డిఎస్‌టి గ్లోబల్‌ మూడేసి భారత యూనీకార్న్‌ సంస్ధలలో పెట్టుబడులు పెట్టాయి.జపాన్‌కు చెందిన సాప్ట్‌బ్యాంక్‌ తొమ్మిదింటిలో, అమెరికా సంస్ధ టైగర్‌ గ్లోబల్‌ ఐదు కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. మన దేశానికి చెందిన యూనీకార్న్‌ అంకుర సంస్ధలను ఏర్పాటు చేసిన వారిలో 36 మంది ఐఐటియన్లు కాగా వారిలో ఎక్కువ మంది ఢిల్లీ ఐఐటికి చెందిన వారు ఉన్నారు. దేశంలోని మొత్తం 104 మంది యూనీకార్న్‌ సంస్ద స్ధాపకులు ఉంటే వారిలో కేవలం ఐదుగురు మాత్రమే మహిళలు.
అంకుర సంస్ధలలో తగ్గుతున్న పెట్టుబడులు !
మన దేశంలోని అంకుర సంస్ధలలో వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో తొలిసారిగా పెట్టుబడులు ఆగస్టు మొదటి వారంలో కేవలం 92లక్షల డాలర్లకు పడిపోయినట్లు యువర్‌ స్టోరీ.కామ్‌లో వచ్చిన ఒక విశ్లేషణ పేర్కొన్నది. జూలై చివరి వారంలో 6.3 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ వచ్చిన దగ్గర నుంచి పెట్టుబడులు బలహీనంగా ఉన్నప్పటికీ ఇంత తక్కువగా రావటం ఇదే తొలిసారి. ఈ వారంలో కేవలం తొమ్మిది సంస్దలకే పెట్టుబడులు వచ్చాయి. రుణ ఒప్పందం ఒక్కటీ లేదు.ఇతర సంస్ధలకు వచ్చిన పెట్టుబడులన్నీ గతంలో కుదిరిన ఒప్పందాల మేరకు వచ్చినవిగా ఉన్నాయి.
ప్రపంచంలో యూనీకార్న్‌ అంకుర సంస్ధల సంఖ్య మరియు విలువ రీత్యా అమెరికా తరువాత చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు రావటం, ప్రయివేటు రంగం నుంచి పెట్టుబడులు, ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం కారణాలుగా సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక ఒక విశ్లేషణలో పేర్కొన్నది. చైనాలో తొలి తరం అంకుర సంస్దలకు విదేశాలకు చెందిన సాప్ట్‌బ్యాంక్‌, యాహూ, నాస్పర్స్‌ వంటి సంస్ధలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. తరువాత గత దశాబ్ది నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్ధలు, విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం ప్రధానంగా ఉంది. ఆర్ధిక మద్దతు మాత్రమే కాకుండా సంస్దల నిర్వహణకు స్నేహపూర్వక వాతావరణం ఉందని కూడా ఆ పత్రిక వ్యాఖ్యాత పేర్కొన్నారు. అమెరికా నుంచి అధ్యయనం చేసిన ఎంబియే కార్యక్రమాలతో పాటు సాంప్రదాయక చైనా పద్దతులను మేళవించి అనేక కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా దాటి విదేశాల్లో కూడా దూసుకుపోతున్నాయి. విదేశాల్లో చదువుకున్న వారు స్వదేశానికి తిరిగి రావటంతో పాటు దేశీయంగా అనేక మంది కళాశాల గ్రాడ్యుయేట్లు ప్రతిఏటా ప్రతిభావంతుల సముదాయంలో చేరుతున్నారు. తొలి రోజుల్లో చైనా అంకుర సంస్దలు ఇతరులను కాపీ చేసినట్లు కనిపించినా తరువాత చైనా తరహాగా ప్రాచుర్యం పొందాయి. బైడు ( చైనా గూగుల్‌), దిదీ చుక్సింగ్‌( చైనా ఉబెర్‌) ఉరు చాట్‌ (చైనా వాట్సాప్‌) వాటిలో కొన్ని. ప్రపంచంలోని యూనీకార్న్‌ అంకుర సంస్దల విలువ 1.9లక్షల కోట్ల డాలర్లు, ఇది ఇటలీ జిడిపికి సమానం.
అనేక సంస్ధలు ఇప్పుడు చైనా నుంచి కాపీ చేస్తున్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. దానికి పెద్ద ఉదాహరణ టిక్‌టాక్‌.అలాంటి దానిని ప్రతి దేశం ఎందుకు తయారు చేసుకోకూడదు అన్నంతగా అది ప్రాచుర్యం పొందింది.అలాగే చైనా ఫోన్లు, గతంలో చౌకరకం ఫోన్లకు మారుపేరుగా చైనా ఉంటే ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దాని ఫోన్లు మన మార్కెట్‌ను ఎలా ఆక్రమించాయో తెలిసిందే. ఇప్పటి వరకు చైనా కంపెనీలుగా పేరు గాంచినవి అనేక అంతర్జాతీయ కంపెనీలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలోని తొలి ఐదు పెద్ద అంకుర సంస్దలలో చైనాకు చెందినవి నాలుగు ఉన్నాయి.అలీబాబాకు చెందిన యాంట్‌ గ్రూప్‌ 150 బిలియన్‌ డాలర్ల విలువతో ఈ ఏడాది హరున్‌ గ్లోబల్‌ యూనీకార్న్‌ సూచికలో అగ్రస్ధానంలో ఉంది. అగ్రస్దానంలో ఉన్న అమెరికాలో ఇలాంటి కంపెనీల సంఖ్య 233, చైనా కంటే ఆరు ఎక్కువ. ఈ ఏడాది అమెరికా 30, చైనా 21 కంపెనీలను జత చేశాయి. ఈ రెండు దేశాల మధ్య పోటీ తీవ్ర స్ధాయిలో ఉంది. ఒక వైపు రెండు దేశాలూ వాణిజ్య యుద్దం మరోవైపు సాంకేతిక పరిజ్ఞాన పోటీ యుద్దంలో నిమగమయ్యాయి. సెప్టెంబరు 15లోగా తమ కార్పొరేట్‌ కంపెనీలకు టిక్‌ టాక్‌ను విక్రయించని పక్షంలో అమెరికాలో నిషేధిస్తామని ట్రంప్‌ బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే. టిక్‌ టాక్‌ యాప్‌ ద్వారా సమాచారాన్ని చైనా తస్కరిస్తున్న దాఖలాలు లేవని సిఐఏ నివేదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చైనా సంస్ధలను ఏదో రక్షణ, చౌర్యం అంటూ ఏదో ఒక పేరుతో నిషేధించేందుకు అమెరికా లేదా మన వంటి మరొక దేశం పూనుకోవటం వెనుక చైనా సంస్ధలను ఆర్ధికంగా దెబ్బతీయాలన్న ఎత్తుగడ ఉంది. ప్రస్తుతం చైనాకు చెందిన 39 యూనీకార్న్‌ అంకుర సంస్ధలు ఇ కామర్స్‌ రంగంలో ఉన్నాయి.
యూనీకార్న్‌ అంకుర సంస్ధలు ఏ నగరంలో ఎన్ని ఉన్నాయన్నది చూస్తే 93తో బీజింగ్‌ అగ్ర స్ధానంలో ఉండగా శాన్‌ ఫ్రాన్సిస్కోలో 68, షాంఘైలో 47, న్యూయార్క్‌లో 33, షెంజెన్‌లో 20 ఉన్నాయి. ఒక ప్రాంతంగా చూస్తే అమెరికాలోని సిలికాన్‌ వాలీలో 121ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులను రాకుండా చూసేందుకు తీసుకున్న చర్యల ప్రభావం కనిపిస్తోంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీల(ఎన్‌బిఎఫ్‌సి) ఏర్పాటుకు పలు సంస్దలు చేసుకున్న దరఖాస్తులను రిజర్వుబ్యాంకు తాజాగా తిరస్కరించింది. మారిషస్‌లో నమోదైన చైనా వెంచర్‌ కాపిటల్‌ మరియు ప్రయివేటు ఈక్విటీ ఫండ్స్‌ ఈ దరఖాస్తులు చేసుకున్నాయి. ద్రవ్య లావాదేవీల అక్రమాలను నిరోధించటంలో మారిషస్‌ నిబంధనలు పటిష్టంగా లేవనే కారణంతో ఆ దరఖాస్తులను తిరస్కరించినట్లు చెబుతున్నారు. అయితే వీటిని తిరస్కరించలేదని సమీక్ష చేసేందుకు చాలా సమయం పడుతుందని పక్కన పెట్టినట్లు మరో వార్త.
అంకుర సంస్దలను ఏర్పాటు చేసే మన వారు మన గడ్డ మీద కాకుండా అమెరికా లేదా మరొక దేశానికి ఎందుకు పోతున్నారు ? అదే చైనాకు చెందిన వారు విదేశాల్లో చదువుకొని తిరిగి వచ్చి తమ స్వంత గడ్డమీద సంస్ధలను ఏర్పాటు చేసేందుకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మన పాలకుల మీద విశ్వాసం లేకనా లేక విధానాల్లో స్ధిరత్వం లేదా ? గత కాంగ్రెస్‌ పాలకుల కంటే తాము భిన్నమని బిజెపి చెబుతోంది, అయినా పరిస్దితిలో మార్పు ఎందుకు రాలేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాకిస్ధాన్‌ కొత్త మాప్‌ మర్మం, పర్యవసానాలు ఏమిటి ?

07 Friday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

India-Pak relations, Pakistan new political map


ఎం కోటేశ్వరరావు


పాకిస్ధాన్‌ ప్రభుత్వం కొత్త రాజకీయ చిత్ర పటాన్ని రూపొందించి మన దేశంతో సరికొత్త వివాదానికి దిగింది. ఆక్రమిత కాశ్మీరును ఇప్పటికే తనదిగా చూపుతున్న పాక్‌ కొత్తగా జమ్మూకాశ్మీరు, లడఖ్‌ ప్రాంతాలను గుజరాత్‌లోని జునాఘడ్‌, సర్‌ క్రీక్‌ ప్రాంతాలను కూడా తనవిగా చూపుతూ కొత్త చిత్రపటాన్ని ప్రచురించింది. లడఖ్‌లో తమవిగా చైనా చెబుతున్న ప్రాంతం, గిల్గిట్‌్‌-బాల్టిస్ధాన్‌లో పాకిస్దాన్‌ 1963లో చైనాకు అప్పగించిన ప్రాంతం వీటిలో లేవు. నిజానికి ఈ మాప్‌లు కొత్తవి కాదు, స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే ఈ ప్రాంతాలు, నాటి తూర్పు పాకిస్దాన్‌(నేటి బంగ్లాదేశ్‌)ను కలిపి నాటి పాక్‌ ప్రభుత్వం ముద్రించింది.తరువాత వాటిని వెనక్కు తీసుకుంది. కాశ్మీర్‌ సమస్యను ఇరు దేశాలు పరిష్కరించుకోవాలన్న 1972 సిమ్లా ఒప్పందం తరువాత 1999 నాటి లాహౌర్‌ ప్రకటనకు విరుద్దం. పాక్‌ చర్య రాజకీయ మూఢత్వమని మన దేశం వ్యాఖ్యానించింది.
పాక్‌ కొత్త చిత్రపటాన్ని తయారు చేసినంత మాత్రాన ఆ ప్రాంతాలు దానివి కావు, మన నుంచి పోవు. ప్రతి దేశం తనవి అని భావించే ప్రాంతాలను చూపుతూ రాజకీయ చిత్ర పటాలను తయారు చేస్తుంది, ప్రచారంలో పెడుతుంది. సరిహద్దుల గురించి వివాదం ఉన్నపుడు వాటిని ఇరుగు పొరుగు దేశాలు అంగీకరించవు. ఉదాహరణకు చైనా ముద్రించే చిత్ర పటాల్లో మన ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ను తన టిబెట్‌లో భాగంగా చూపింది. అదే విధంగా మన చిత్ర పటాల్లో మనవిగా చూపుతున్న ఆక్సారుచిన్‌, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలు మన ఆధీనంలో లేవు.


మన ప్రధాని నరేంద్రమోడీ లేదా బిజెపి నేతలు అమెరికా అడుగులకు మడుగులొత్తుతున్నారు. మనకు ఎంతో కావలసిన దేశం అమెరికా అంటారు, అన్ని అంశాల్లో మనకు మద్దతు ఇస్తూ ముందుకు పొమ్మని చెబుతోంది అని చెబుతారు. చైనాకు వ్యతిరేకంగా మనకు మద్దతు ఇస్తోందని ఇటీవల ఎక్కువగా చెబుతున్నారు. భద్రతా మండలిలో మనకు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు చిత్తశుద్దితో పని చేస్తున్న మిత్ర దేశం అని కొనియాడతారు. అయినా సరే కాశ్మీరును మన అంతర్భాగంగా అమెరికా ఇంతవరకు గుర్తించలేదు అనే విషయం ఎంత మందికి తెలుసు. కాశ్మీర్‌ను ప్రస్తావించాల్సి వస్తే గతంలో భారత ఆక్రమిత ప్రాంతం అని పిలిచే అమెరికన్లు ఇటీవలి కాలంలో భారత పాలిత కాశ్మీరు అని సవరించారు తప్ప మరొక మార్పు చేయలేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ను నరేంద్రమోడీ పదే పదే కౌగలించుకున్నారు-దానికి ప్రతిగా నరేంద్రమోడీ భారత దేశ పిత అని ట్రంప్‌ బిరుదు ఇచ్చాడు తప్ప కాశ్మీరు మనదే అని గుర్తించలేదు.
అరుణాచల్‌ ప్రదేశ్‌ తనది అని చైనా తన పటాల్లో ముద్రించినా, కాశ్మీరు మనది అని అమెరికా గుర్తించకపోయినా వాటితో విబేధిస్తున్నామని చెబుతూనే రెండు దేశాలతో దౌత్య సంబంధాలు కొనసాగించటానికి మనకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయింది. పాకిస్ధాన్‌ తన చిత్ర పటాల్లో తాజాగా మార్పులు చేసినా ఇదే వైఖరి కొనసాగుతుంది.


పాకిస్ధాన్‌ తన చిత్రపటాన్ని ఇప్పుడెందుకు సవరించింది ?
కాశ్మీర్‌ తమదే అని చెబుతున్నప్పటికీ ఆక్రమిత ప్రాంతాన్ని ఆజాద్‌ కాశ్మీరు అని ప్రత్యేకంగా చూపుతోంది తప్ప మిగతా కాశ్మీరు, జునాఘడ్‌ను తమ అంతర్భాగాలుగా ఇంతవరకు చూపలేదు. ఇప్పుడు సవరించింది అంటే కొత్త వివాదానికి తెరలేపినట్లు అనుకోవాల్సి వస్తోంది. కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, దానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి ఏడాది గడచిన సందర్భంగా పాక్‌ ఈ చర్యకు పాల్పడింది. దీని గురించి జాతీయంగా, అంతర్జాతీయంగా వెలువడుతున్న విశ్లేషణలు మీడియా కథనాలను చూస్తే పాక్‌ చర్య వెనుక చైనా హస్తం ఉంది అన్నది ఒక ఆరోపణ. గతంలో నేపాల్‌ విషయంలోనూ అదే ఆరోపణను చైనా మీద చేశారు. గతంలో కుదిరిన ఒప్పందాలకు అనుగుణ్యంగా బంగ్లాదేశ్‌ వస్తువుల దిగుమతులపై చైనా పన్ను రాయితీలు ఇచ్చినపుడు కూడా దాన్ని భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ను బుట్టలో వేసుకొనే చర్యగా వర్ణించారు. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌ యుద్ద విమానాలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఆల్‌ దఫ్రా వైమానిక కేంద్రంలో ఆగిన సమయంలో ఇరాన్‌ వైపు నుంచి మూడు క్షిపణులు బయలు దేరాయని, అవి ఆల్‌ దఫ్రా వైపే వస్తున్నట్లు సమాచారం అందిందని అమెరికాలోని సిఎన్‌ఎన్‌, ఫాక్స్‌ న్యూస్‌ టీవీ ఛానల్స్‌ వార్తలను ప్రసారం చేశాయి. ఇరాన్‌ క్షిపణులు వచ్చినట్లు అవి సమీపంలోని సముద్రంలో పడినట్లు కూడా అవి చెప్పాయి. ఇవి అమెరికా అల్లిన కట్టుకథలు, ఇరాన్‌తో మన సంబంధాలను చెడగొట్టే చర్య తప్ప మరొకటి కాదు. మీడియాలో వస్తున్న వర్ణణలు, అధికారయంత్రాంగం అనధికారికంగా వదులుతున్న లీకు వార్తలను బట్టి ఎలాంటి నిర్దారణలకు రాకూడదు. మీడియాలో వచ్చిన వార్తలకు విరుద్దంగా చైనా ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్‌ చర్య వెనుక చైనా ఉందని అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.

అయితే పాక్‌ చర్య వెనుక చైనా హస్తం లేదా ?
అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కినపుడు, సంక్లిష్టంగా మారినపుడు ప్రతి పరిణామం వెనుక ఏదో ఒక దేశ హస్తం ఉన్నట్లు అనుమానాలు తలెత్తటం సహజం. అవి దాయాదులు లేదా శత్రుదేశాల మధ్యనే కాదు మిత్రదేశాల వ్యవహారాల్లో కూడా కనిపిస్తుంది. కొన్ని పరిణామాల వెనుక చైనా హస్తం ఉందని అనుకొనే వారికి ఆ స్వేచ్చ ఉంది. అయితే మరికొన్ని పరిణామాల వెనుక అమెరికా హస్తం ఉందని దాని ప్రభావానికి మన దేశం లొంగిపోతోందనే కోణంలో కూడా వారితో పాటు అందరూ ఆలోచించాల్సి ఉంది.
ఉదాహరణకు మన దేశంతో కుదుర్చుకున్న ఒక రైల్వే లైన్‌ నిర్మాణం నుంచి ఇరాన్‌ మనలను తప్పించిందని మన మీడియాలో వార్తలు వచ్చాయి. చాబహర్‌ రేవు నుంచి ఆప్ఘనిస్తాన్‌ సరిహద్దు వరకు నిర్మించ తలపెట్టిన కొత్త రైలు మార్గ నిర్మాణంలో భాగస్వామ్యం గురించి భారత్‌తో చర్చలు జరిగాయి తప్ప ఒప్పందం వరకు రాలేదని ఇరాన్‌ ప్రకటించింది. భవిష్యత్‌లో ఇరాన్‌ మీద అమెరికన్లు ఆంక్షలను తీవ్రతరం చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే భయం మన దేశానికి కలిగినందున ఆ ప్రాజెక్టు నుంచి మన దేశాన్ని ఇరాన్‌ తప్పించిందనే రీతిలో వార్తలు వెలువడ్డాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోక పోవటానికి, ఆంక్షల గురించి భయపడటం వెనుక అమెరికా హస్తం ఉన్నట్లేనా ? అమెరికా బెదిరింపులకు మన 56 అంగుళాల ఛాతీ ఉన్న నరేంద్రమోడీ సర్కార్‌ భయపడినట్లా ?


ఇరాన్‌ చాబహార్‌ రేవు అభివృద్ధికి 2016లో మన నరేంద్రమోడీ సర్కార్‌ ఒప్పందం చేసుకుంది. ఐదుదశల్లో ఈ రేవు సామర్ద్యాన్ని పెంచాలన్నది పధకం. తొలి దశలో మన దేశం చేసుకున్న ఒప్పందాన్ని సకాలంలో అమలు చేయలేకపోయిందని ఇరాన్‌ చెబుతోంది. దానికి అమెరికా వత్తిళ్లే కారణం అని ఇరాన్‌ విమర్శిస్తోంది. అది వాస్తవం కానట్లయితే సకాలంలో పధకాన్ని పూర్తి చేయలేని మన అసమర్ధత అయినా అయ్యుండాలి. తదుపరి చర్యలకు భారత్‌కోసం తాము వేచి చూడలేమని ఇతర దేశాల పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామని ఇరాన్‌ చెబుతున్నది. అయితే ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలు తీవ్రం అవుతున్న కారణంగా మరొక దేశమేదీ ముందుకు రానపుడు అమెరికాను ఖాతరు చేయని చైనా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది. అందుకే మన విశ్లేషకులు మన దేశం ఇరాన్‌ను తీసుకుపోయి చైనా చేతిలో పెట్టిందని, దీనికి మనల్ని మనమే నిందించుకోవాలని వ్యాఖ్యానించారు. చైనాను ఒంటరిపాటు చేయటం దేవుడెరుగు మనకు మనమే ఒంటరి అవటానికి అమెరికా వలలో మనం చిక్కుకోవటం కారణం కాదా ?
ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకో కూడదు అన్నది అందరూ అంగీకరించే సాధారణ సూత్రం. అదే సమయంలో అంతర్జాతీయ రాజకీయాలు సరైన దారిలో లేవు కనుక వివాదాలు తలెత్తినపుడు ప్రతి దేశం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం నిత్యకృత్యంగా మారింది. తమ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా జోక్యం చేసుకున్నట్లు స్వయంగా అమెరికాలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అనేక దేశాల ఎన్నికల్లో, ఎవరు అధికారంలోకి రావాలో ఎవరు రాకూడదో అమెరికా నిర్ణయిస్తోందన్న అంశం కూడా బహిరంగ రహస్యమే.


మన దేశంలో ఉగ్రవాదదాడులు, విచ్చిన్న చర్యలు జరిగినపుడు వాటి వెనుక పాకిస్ధాన్‌ హస్తం ఉందని మన ప్రభుత్వం చెప్పటం తెలిసిందే. పాకిస్ధాన్‌లోని బెలూచిస్తాన్‌, కరాచీ తదితర ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరి ఉగ్రవాద చర్యలు, దాడులు జరిగినపుడు పాక్‌ ప్రభుత్వం కూడా వాటి వెనుక మన హస్తం ఉందనే ఆరోపిస్తున్నది. పశ్చిమాసియాలోని అరబ్బు ప్రాంతాల్లో జరిగే దాడులకు ఇజ్రాయెల్‌ కారణమని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిగే చర్యలకు అరబ్బులు కారణమనే వార్తలు కూడా వస్తాయి. అత్యధిక సందర్భాలలో వీటికి ఆధారాలు ఉండవు అందువనల వీటిలో వాస్తవాలు ఏమిటి అన్నపుడు ఒక ఆరోపణ నిజమే అని అంగీకరించినపుడు రెండవదాన్ని కూడా నిజమే అనుకోవాలా లేదా ?


లడఖ్‌ ప్రాంతాన్ని కాశ్మీరు నుంచి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మన ప్రభుత్వం ప్రకటించింది. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని కూడా లడఖ్‌ అంతర్భాగమని భారత్‌ చెప్పటాన్ని తాము అంగీకరించటం లేదని భారత చర్య చట్టవిరుద్దమని చైనా ఏడాది క్రితమే భద్రతా మండలిలో అభ్యంతరాన్ని లేవనెత్తింది. మధ్యలో ఒకసారి తాజాగా ఆ చర్యకు ఏడాది నిండిన సందర్భంగా మరోసారి భద్రతా మండలిలో ఇష్టాగోష్టి చర్చకు చైనా లేవనెత్తింది. నిజానికి లడఖ్‌ను పూర్తిగా మనదే అని మనం చెప్పటం లేదా చైనా తన ఆధీనంలో ఉన్నదని చెప్పటం కొత్తగా తలెత్తలేదు. రెండు దేశాల మధ్య సమస్యలు, అనుమానాలు తలెత్తినపుడు మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటారనే కారణంతో లాంఛనంగా అభ్యంతరాలను లేవనెత్తుతారు. ఏడాది క్రితం తొలిసారి చైనా లడఖ్‌ గురించి అదే చేసినపుడు మన అధికారులు చైనా వెళ్లి యథాతధ స్థితి గురించి తాము ఎలాంటి చర్య తీసుకోలేదని, అంతర్గత వ్యవహారాల్లో భాగంగా కొన్ని చర్యలు తీసుకున్నట్లు ఇచ్చిన వివరణతో చైనా తదుపరి పొడిగించలేదు. అయితే తరువాత సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో తాజాగా చైనా మరోసారి భద్రతా మండలిలో దీన్ని చర్చకు పెట్టింది.


చైనా అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకుంటున్నామా ?
మన కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసినపుడు, ఆర్టికల్‌ 370 రద్దు చేసినపుడు పాకిస్ధాన్‌ విమర్శలు చేసింది. చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ సమయంలో అది మా అంతర్గత వ్యవహారం ఇతర దేశాల జోక్యం తగదని మన ప్రభుత్వం ప్రకటించింది.
ఇదే మాదిరి మన మీద చైనా అలాంటి ప్రకటనలే చేస్తున్నది. అవి అధికార ప్రతినిధులు లేదా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వ్యాఖ్యల రూపంలో ఉండవచ్చు. ఉదాహరణకు తైవాన్‌ సమస్య. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఐక్యరాజ్యసమితి స్వయంగా గుర్తించింది. మన దేశం, అమెరికా కూడా అదే వైఖరిని కలిగి ఉంది. అయితే చైనాలో తైవాన్‌ విలీనం అయ్యేందుకు తగిన వాతావరణం లేదనే పేరుతో అమెరికన్లు జోక్యం చేసుకుంటున్నారు. తైవాన్‌కు ఆయుధాలు అందిస్తున్నారు, చైనా వ్యతిరేక శక్తులకు అన్ని రకాల సాయం అందిస్తున్నారు. దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం లేనందున దొడ్డిదారిన ఆఫీసులను ఏర్పాటు చేసి నిత్యం అక్కడి చైనా వ్యతిరేక శక్తులతో సంబంధాలను కలిగి ఉంది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రభావానికి గురై భారత్‌ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటోందని చైనా విమర్శిస్తోంది.
కరోనా లాక్‌డౌన్‌కు ముందు తైవాన్‌లో జరిగిన ఎన్నికలలో చైనాలో విలీనాన్ని వ్యతిరేకించే శక్తులు విజయం సాధించాయి. వారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపగా బిజెపి తన ఇద్దరు ఎంపీలను ఎంపిక చేసింది. విమానాల రద్దు కారణంగా వారు భౌతికంగా వెళ్లి అక్కడి పాలకులను అభినందించలేకపోయారు గానీ ఆన్‌లైన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆపని చేశారు. ఈ చర్యను తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా చైనా పరిగణిస్తోంది.
కాశ్మీరులో ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి తగినన్ని అధికారాలు కల్పించే చర్యల్లో భాగంగా ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అదే మాదిరి చైనాలో అంతర్భాగమైన హాంకాంగ్‌లో కొన్ని శక్తులు 2047లో చైనాలో పూర్తిగా విలీనం కావాలన్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ స్వాతంత్య్రం కావాలని ఆందోళన చేస్తున్నాయి. చైనా అధికారాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నాయి. అలాంటి శక్తుల వలన ముప్పు వచ్చిందని భావించిన చైనా సర్కార్‌ తన అంతర్గత భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌కు వర్తింప చేసింది. ఈ చర్యను వ్యతిరేకించే వారికి పరోక్షంగా మద్దతు తెలియచేస్తూ మన ప్రతినిధి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌ వేదిక మీద లేవనెత్తారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వైఖరిని తీసుకోలేదు. ఇది కూడా తమ అంతర్గత వ్యహారాల్లో జోక్యమే అని చైనా చెబుతోంది.
దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని కొన్ని దీవుల గురించి చైనాతో సహా ఆ ప్రాంత దేశాల మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. వాటికి మనకూ ఎలాంటి సంబంధమూ లేదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా జోక్యం చేసుకోవటమే కాదు, ఆప్రాంతానికి యుద్ద నౌకలను తరలించి ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. దాని ఎత్తుగడకు అనుగుణ్యంగా ఆ వివాదంలో మన దేశం జోక్యం చేసుకోవటాన్ని చైనా తప్పుపడుతున్నది.
ఇక టిబెట్‌ విషయం గురించి తెలిసిందే. చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దలైలామాను అమెరికా రూపొందించిన పధకం ప్రకారం మన దేశానికి రప్పించటం, ఆశ్రయం కల్పించటం, ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు చేయటం, తిరుగుబాటుదార్లకు మన దేశంలో కొన్ని చోట్ల నివాసాలను ఏర్పాటు చేయటం తెలిసిందే. ఇదంతా దలైలామా మతాధికారి కనుక మానవతా పూర్వక వైఖరితో చేశాము. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా అభ్యంతర పెడుతున్నది. దానిలో భాగంగానే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పట్టణ పర్యటనకు దలైలామాను అనుమతించవద్దని గతంలో చైనా అభ్యంతర పెట్టిన విషయం కూడా తెలిసిందే. వీటన్నింటిలో చైనా వ్యవహారాలలో మన జోక్యం ఉన్నట్లా లేనట్లా ? మనం ఏమి చేసినా మనకు సరైనదిగా కనిపిస్తే చైనా ఏమి చేసినా చైనీయులకూ సరైనదిగానే కనిపిస్తుంది. ఏదేశానికైనా వాటి పర్యవసానాలు ఏమిటి అన్నది ముఖ్యం.


పాకిస్ధాన్‌ ఉగ్రవాది మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకోవటం. ప్రపంచ అణు సరఫరా దేశాల బృందంలో మన దేశం చేరటాన్ని చైనా అభ్యంతరం పెట్టటం, లడఖ్‌ విషయంలో భద్రతా మండలికి ఫిర్యాదు చేయటం వంటివి చైనా జోక్యంగా పరిగణించే వాటిలో కొన్ని.
పాకిస్దాన్‌కు గతంలో అమెరికా ప్రధాన మద్దతుదారుగా ఉంది. ఎఫ్‌16 యుద్ద విమానాలను అందించి మనలను పరోక్షంగా బెదిరించిన చరిత్ర అందరికీ తెలిసిందే. మన ప్రాంతాలను పాక్‌ తన అంతర్భాగాలుగా చూపుతూ చిత్ర పటాలను రూపొందిస్తే చైనాకు ప్రత్యక్షంగా కలిగే లాభం ఏమీ లేదు. మనకు వ్యతిరేకంగా పాక్‌ను చైనా రెచ్చగొడుతోంది అనే అభిప్రాయం ఒకటి ఉంది. గత చరిత్రను చూసినపుడు కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు పాకిస్దాన్‌ను పురికొల్పింది బ్రిటన్‌, అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. తరువాత జరిగిన యుద్దాల సమయంలో మనకు వ్యతిరేకంగా ఆయుధాలు అందించింది అమెరికా అన్నదీ తెలిసిందే. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ద సమయంలో మనం బంగ్లా దేశ్‌లో జరుగుతున్న ఊచకోతను నివారించేందుకు జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని నిలువరించాము. స్వల్ప యుద్దం కూడా చేశాము. ఆ సమయంలో మనకు వ్యతిరేకంగా సైనిక చర్య తీసుకొనేందుకు అమెరికా తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాత ప్రాంతానికి తరలించిన విషయం తెలిసిందే.అలాంటి అమెరికాతో, బ్రిటన్‌, ఇతర పశ్చిమ దేశాలతో రాసుకుపూసుకు తిరగటానికి మనకు ఎలాంటి పేచీ అభ్యంతరం కనిపించటం లేదు. పాకిస్ధాన్‌ పాలకులు అమెరికాతో చేతులు కలిపినపుడు అమెరికాను బహిరంగంగా విమర్శించటానికి మన మీడియాకు ధైర్యం చాలలేదు. ఒక వేళ ఇప్పుడు పాకిస్దాన్‌ను మన మీదకు చైనా ఎగదోస్తోంది అనుకుంటే, ఇంతకాలం అలాంటి చర్యలకు పాల్పడని చైనా ఇప్పుడు ఎందుకు ఆ పని చేస్తోందో రెండో కోణం కూడా పాఠకులకు అందించాలి. చైనాతో పాటు మన పాలకుల తప్పిదాలు, విధానాల్లో లోపాలు ఉంటే వాటిని కూడా ధైర్యంగా విమర్శించాలి. ఇరాక్‌ మీద అమెరికా దాడి, సిరియా మీద ఆల్‌ఖైదా ఉగ్రవాదులతో కలసి దాడులు చేసిన తమ పాలకుల గురించి అక్కడి మీడియాలో అనేక మంది తీవ్రంగా విమర్శించారు. వియత్నాం మీద దురాక్రమణ యుద్దానికి పాల్పడితే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన చరిత్ర అమెరికా ప్రజలకు ఉంది. మనం ఇతరులను కెలక్కపోతే ఇతరులూ మనలను కెలకరు అనే విషయాన్ని గ్రహించాలి. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్దంలో మనం ఒక పక్షం వహించటం ఏమాత్రం క్షేమకరం కాదు అని పాలకులు గ్రహించాలి. అది సరైనదే అనుకుంటే వచ్చే పర్యవసానాలకూ బాధ్యత వారిదే అవుతుంది.


వెలువడుతున్న వ్యాఖ్యానాలు, పర్యవసానాలేమిటి ?
పాకిస్ధాన్‌ రూపొందించిన కొత్త చిత్ర పటంతో తలెత్తే ఇతర పర్యవసానాల గురించి మన దేశంలో చర్చ జరుగుతోంది. జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలు తమవి అని చెప్పటం ద్వారా కాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు, లేదా ఆక్రమిత కాశ్మీర్‌లోని స్వతంత్ర కాశ్మీర్‌ వాదులకు ఎదురు దెబ్బ తగిలినట్లే అన్నది ఒక అభిప్రాయం. ఇప్పటి వరకు పాక్‌ పాలకులు కాశ్మీర్‌ సమస్య మీద ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, కాశ్మీరీలు స్వతంత్ర దేశంగా ఉంటే తాము మద్దతు ఇస్తామని చెప్పిన మాటలకు ఇక ముందు ఆస్కారం ఉండదు. పాక్‌ మాటలు నమ్మి వేర్పాటును కోరుతున్న వారి పరిస్ధితి అగమ్యగోచరంగా మారుతుంది అని కొన్ని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ,లిపులేక్‌,లిమియాధురా ప్రాంతాలు తనవే అంటూ కొద్ది వారాల క్రితం నేపాల్‌ ప్రకటించటం, ఇప్పుడు అదే పని పాక్‌ చేయటం కాకతాళీయంగా జరిగినవి కాదని వాటి వెనుక రెండు దేశాలకూ పెద్ద మొత్తంలో సాయం చేస్తున్న చైనా హస్తం ఉందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి.
” చైనాతో కలుపుతూ పాకిస్ధాన్‌ కాగితాల మీద తన చిత్ర పటాన్ని రూపొందించినందున రెండు దేశాలతో యుద్దం ఉండవచ్చేమో అన్న భారత్‌ భయాన్ని తాజా పరిణామం ఎక్కువ చేస్తున్నది. అయితే ఆచరణలో అది పని చేస్తుందనేందుకు ఆధారాలు చాలా పరిమితంగా ఉన్నాయి, అయితే దేశీయ రాజకీయాలు ఈ చిత్రపటం వెనుక ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నట్లు ” హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ మై హూనా అంటే నమ్మని జనం : బ్రిటన్‌ యు గవ్‌ సర్వే వెల్లడి

06 Thursday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

modinomics, world economy recession 2020, YouGov survey


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు ఏ దేశం మాంద్యంలోకి కూరుకుపోయిందో అనే వార్త వినాల్సి వస్తుందో తెలియటం లేదు. వరుసగా ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా జిడిపి వృద్ధి రేటు తిరోగమనాన్ని సూచిస్తే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయినట్లుగా పరిగణిస్తారు. బ్రిటన్‌కు చెందిన సంస్ధ యు గవ్‌ జరిపిన తాజా సర్వే వివరాల ప్రకారం మన ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉన్నవారి శాతం చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. దీన్నే మరో విధంగా చెప్పాలంటే మీకు నేను ఉన్నాను అని మన ప్రధాని నరేంద్రమోడీ ధీమా మీద ఆర్ధిక వ్యవస్ధ విషయంలో జనంలో విశ్వాసం లేదు అని సర్వే ఫలితం సూచిస్తోంది.
తాజాగా ఫిలిఫ్పైన్స్‌ 29 సంవత్సరాల తరువాత తొలిసారిగా మాంద్యంలోకి జారింది. తొలి త్రైమాస కాలంలో 0.7 శాతం తిరోగమనాన్ని సూచించగా ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో 9శాతం ఉండవచ్చన్న అంచనాలను తారు మారు చేసి 16,5 దిగజారింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అనేక దేశాల తిరోగమనం గత ఏడాదే ప్రారంభమైంది. కరోనా మహమ్మారి పతన వేగాన్ని పెంచింది. గత ఏడునెలలుగా ప్రపంచాన్ని కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తున్నది. ఫిలిఫ్పైన్స్‌లో ఇది రాసిన సమయానికి లక్షా 16వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాపితంగా కోటీ 90లక్షల మందికి సోకింది, కోటీ 22లక్షల మంది కోలుకున్నారు, ఏడు లక్షల 12 మందికి పైగా మరణించారు.49.73లక్షల మందితో అమెరికా, 28.62లక్షల మందితో బ్రెజిల్‌ ఒకటి రెండు స్దానాల్లో ఉంటే మన దేశంలో 19.64 లక్షల మందికి పైగా సోకింది. తొలి రోజుల్లో పాకిస్దాన్‌ కేసులు మనలో సగం వరకు ఉండేవి ఇప్పుడు 2.81లక్షలతో 14వ స్ధానంలో, 2.46లక్షలతో బంగ్లాదేశ్‌ 16, చైనా 84వేల కేసులతో 29వ స్ధానంలో ఉంది.

ఆర్ధిక వ్యవస్ధ, తమ భవిష్యత్‌ గురించి ప్రపంచంలోని జన ఆలోచనా ధోరణి ఎలా ఉంది ?
బ్రిటన్‌కు చెందిన యు గవ్‌ అనే ఒక సంస్ధ తాజాగా నిర్వహించిన సర్వే వివరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దాని ప్రకారం అతి పెద్ద ఆందోళనకర అంశం ప్రపంచ వ్యాపిత ఆర్దిక మాంద్యం. అయితే ఇది అన్నిదేశాలలో ఒకే తీవ్రతతో లేదు. ప్రపంచంలో మెక్సికన్లు తీవ్ర నిరాశ, ఆందోళన చెందుతుండగా, సోషలిస్టు వియత్నాం, చమురు సంపదలున్న మధ్య ప్రాచ్య దేశాల జనం తమ ఆర్దిక వ్యవస్ధ గురించి ఎక్కువ మంది ఆశాభావంతో ఆదుర్దాలేకుండా ఉన్నారు.

దేశాల ఆర్ధిక వ్యవస్ధల కుంగుబాటు ఎలా ఉంది ?
మన దేశ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ ఒకటితో ప్రారంభం అవుతుంది.అనేక దేశాల్లో జనవరి నుంచి ఆరంభం. మనకు మూడు నెలలు గడిస్తే అనేక దేశాలకు ఆరునెలలు గడిచింది. ప్రతి మూడు నెలలకు ఆర్ధిక ఫలితాలను మదింపు వేయటం దాదాపు అన్ని చోట్లా ఉన్నది. మన ఆర్ధిక వ్యవస్ధకు సంబంధించి లాక్‌డౌన్‌ కారణంగా సమాచార సేకరణ సిబ్బంది బయటకు వెళ్లలేని కారణంగా సమాచారం సమగ్రమైంది కాదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అంచనాలు తప్ప వాస్తవాలు ఇంకా బయటకు రావటం లేదు. మిగతా దేశాలు కూడా పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తున్న సూచనలు కనిపించటం లేదు. అరకొరగా వస్తున్నాయి. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ అనే పత్రిక ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు సగటున ఏడుశాతం, వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది రెండున్నరశాతం తిరోగమనంలో ఉండవచ్చని అంచనా వేసింది.
ఇప్పటి వరకు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఎన్ని సార్లు మాంద్యంలోకి పోయింది, వాటి తీవ్రత ఎలా ఉంది ?
1876 నుంచి ఇప్పటి వరకు 14సార్లు ప్రపంచం మాంద్యానికి గురైంది. వీటిలో కొన్ని దేశాలకు మినహాయింపు ఉన్నా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను మొత్తంగా చూసినపుడు ఈ నిర్ధారణకు వచ్చారు.1930-32 సంవత్సరాలలో 17.6, 1945-46లో 15.5, 1914లో 6.7శాతాలు గరిష్టంగా నమోదు కాగా 2020లో 6.2శాతం ఉండవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత 2009లో వచ్చిన ఆర్ధిక మాంద్యం 2,9శాతమే తిరోగమనం అయినా చాలా పెద్దదని ఆర్ధికవేత్తలు చెప్పారు, ఇప్పుడు దానికి రెండు రెట్లు 6.2శాతం అని అంచనా, ఇంకా దిగజారినా ఆశ్యర్యం లేదు. అనేక దేశాలో 2009 నాటి మాంద్య ప్రభావం ఇంకా కొనసాగుతుండగా మరో మాంద్యం ముప్పు ఉందని కరోనాకు ముందే అనేక మంది హెచ్చరించారు. ఇప్పుడు జమిలిగా మరో పెద్ద సంక్షోభం రానున్నది, దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందో చెప్పలేని స్ధితి.

వివిధ దేశాల్లో అభివృద్ధి రేటు పతనాల తీరు ఎలా ఉంది ?
సమగ్రమైన సమాచారం ఇంకా రావటం లేదు, అంచనాలు, తాత్కాలిక గణాంకాలు మాత్రమే వెలువడుతున్నాయి. వాటిలో సింగపూర్‌ ఆర్ధిక వ్యవస్ధ చిన్నదే అయినా తొలి మూడు మాసాల్లో 3.3శాతం పతనం కాగా రెండవ త్రైమాసంలో 41.2శాతం మైనస్‌లో పడింది. అమెరికా రెండవ త్రైమాసంలో 33శాతం, యూరో జోన్‌లో 12.1శాతం అయితే స్పెయిన్‌లో 18.5 జర్మనీ 10.1, స్పెయిన్‌ స్వీడన్‌లో 8.6 శాతాల చొప్పున తిరోగమనంలో చైనాలో తొలి మూడు మాసాల్లో 6.8శాతం మైనస్‌ అయితే రెండవ త్రైమాసంలో 3.2శాతం అభివృద్ధిలోకి వచ్చింది. దక్షిణ కొరియాలో మొదటి మూడు నెలల్లో 3.3శాతం తిరోగమనం కాగా రెండవ త్రైమాసంలో 1.3శాతం నమోదు కావటంతో సాంకేతికంగా మాంద్యం ముంగిట ఉన్నట్లే భావిస్తున్నారు. మన దేశం తొలి త్రైమాస వివరాలు ఇంకా ప్రకటించలేదు గానీ వివిధ సంస్ధలు 6.1శాతం మైనస్‌ అని అంచనా వేశాయి. రానున్న ఏడాది కాలంలో తమ వ్యవస్ధలు ఆర్ధిక మాంద్యంలోకి పోతాయని మెక్సికో, ఫ్రాన్స్‌ దేశాలు, చైనాలో పెట్టుబడిదారీ వ్యవస్ధ ఉన్న హాంకాంగ్‌ ప్రాంత పౌరుల్లో నాలుగింట మూడువంతుల మంది భావిస్తున్నారు.

చైనా, మన, ఇతర దేశాల గురించి యు గవ్‌ సర్వే ఏమి చెప్పింది ?
రెండుదేశాల మధ్య నెలకొన్న పరిస్ధితుల్లో ఆర్ధికం గురించి జనం ఏమనుకుంటున్నారన్నది నిజంగా ఆసక్తి కలిగించేదే. మన దేశంలో 54శాతం మంది మాంద్యంలోకి పోనున్నామని చెప్పగా ఇప్పుడున్న స్దితే కొనసాగుతుందని చెప్పిన వారు 21, అచ్చేదిన్‌ అని చెప్పిన వారు 14శాతం మంది ఉన్నారు. దీనికి కారణం ఏమిటన్నది మరొక ప్రశ్నకు వచ్చిన సమాధానం వెల్లడిస్తోంది. సర్వేకు ముందు నెలతో పోల్చితే సర్వే సమయంలో తమ ఆదాయం తగ్గిందని చెప్పిన వారి సంఖ్య మెక్సికోలో 58శాతం కాగా రెండవ స్ధానంలో ఫిలిప్పీన్స్‌లో 51, మూడవ స్ధానంలో ఉన్న మన దేశంలో 50శాతం మంది చెప్పారు. ఆదాయాలు పడిపోవటం ఎక్కువగా ఉన్న కారణంగానే యథాతధ స్ధితి కొనసాగుతుందని చెప్పిన వారి సంఖ్య తక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన పధకం తమను ఉద్దరిస్తుందన్న విశ్వాసం జనంలో కలిగించలేదని కూడా సర్వేలో వెల్లడైన అభిప్రాయం సూచిస్తున్నది.
మాంద్య భయం ఎక్కువగా ఉన్న అమెరికా, ఫ్రాన్స్‌తో సహా ఐరోపా దేశాల్లో ఆదాయం తగ్గినవారి శాతం కనిష్టంగా ఉంది. చైనా విషయానికి వస్తే ఆదాయం తగ్గిన వారు 29, వియత్నాంలో 25శాతం ఉన్నారు. స్ధిరంగా ఉన్న వారు మన దేశంలో 34శాతం అయితే చైనాలో 52 శాతం ఉన్నారు. వియత్నాంలో స్ధిరంగా ఉన్న వారి శాతం41 అయితే ఆదాయం పెరిగిన వారు 33శాతం ఉన్నారు కనుక అక్కడి వారిలో ఆందోళన లేదని సర్వేలో వెల్లడైంది.
చైనాలో మాంద్యం గురించి చెప్పిన వారు 30, యథాతధ స్ధితి కొనసాగుతుందన్న వారు 50, మెరుగుపడుతుందని 12శాతం మంది చెప్పారు. అమెరికాలో 47శాతం మంది ఆర్ధిక మాంద్యం గురించి భయపడుతున్నారు. స్ధిరంగా ఉంటుందని 16శాతం, అభివృద్ధి పధంలో ఉంటామని 20శాతం చెప్పారు. సోషలిస్టు వియత్నాంలో మాంద్యం గురించి భయపడుతున్నవారు 24, యథాతధంగా ఉంటుందన్న వారు 56, మరింత పురోగమిస్తామని ఆశాభావం వెలిబుచ్చిన వారు 15శాతం మంది ఉన్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ జనంలో ప్రపంచంలో అత్యధికంగా 27శాతం మంది తమ ఆర్దిక వ్యవస్ధలు పురోగమిస్తాయనే ఆశాభావం వెల్లడైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ భవితవ్యం : కరోనా ఇంటికి పంపుతుందా- వాక్సిన్‌ వైట్‌ హౌస్‌కు రప్పిస్తుందా !

28 Tuesday Jul 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#Donald Trump, Future of Donald Trump, US President election


ఎం కోటేశ్వరరావు


నవంబరు మూడవ తేదీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సిన రోజు. కరోనా వైరస్‌ పరిస్ధితి మరింతగా దిగజారి ఎన్నికలు జరగకపోతే ఏం కానుందో తెలియదు గానీ, పోలింగ్‌ సక్రమంగా జరిగితే దేశ 46 అధ్యక్షుడిగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జో బిడెన్‌ ఎన్నిక ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడి అయినా తిమ్మిని బమ్మిని చేసి రెండవ సారి పదవిలోకి వచ్చేందుకు ట్రంప్‌ నానా అగచాట్లు పడుతున్నారని మరోవైపు వార్తలు వస్తున్నాయి. అత్యంత గొప్ప ప్రజాస్వామిక దేశమని చెప్పుకొనే అక్కడ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చేయని ప్రయత్నం, ప్రత్యర్దులను దెబ్బతీసేందుకు చేయని కుట్రలు తక్కువేమీ కాదు. ఇక డబ్బు ఖర్చు సంగతి సరే సరి. పార్టీల్లో అభ్యర్ధిత్వం కోసం పోటీ పడటం నుంచి ఖరారై ఎన్నికలు ముగిసే వరకు బీరు ప్రాయంగా ఖర్చు చేస్తారు.


” ఘనమైన మన దేశ చరిత్రలో అనేక మంది చెబుతున్నదాని ప్రకారం ఏ యితర ప్రచారం కంటే ఉత్సాహ పూరితంగా ట్రంప్‌ ప్రచారం ఉంది – అది 2016 కంటే ఎక్కువగా ఉంది. బిడెన్‌ సోదిలో లేడు. మౌనంగా ఉండే మెజారిటీ జనం నవంబరు మూడున తమ గళం విప్పుతారు.కృత్రిమంగా ఎన్నికల అణచివేత, కుహనా వార్తలు తీవ్రవాద వామపక్షాన్ని రక్షించలేవు.” అని స్వయంగా ట్రంప్‌ తన గురించి తాను ట్వీట్‌ డబ్బాకొట్టుకున్నాడు. కానీ ఆచరణలో అనేక ఎన్నికల సర్వేలు, జోశ్యాల ప్రకారం ట్రంప్‌ కంటే జో బిడెన్‌ సంతృప్తికరమైన మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ట్రంప్‌ పలుకుబడి అత్యంత కనిష్ట స్ధాయికి పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయినా ఏదో అద్బుతం చేసి ట్రంప్‌ గెలుస్తాడు అని నమ్ముతున్నవారు కూడా అక్కడ ఉన్నారు.


1924 నుంచి 96 సంవత్సరాల ఎన్నికల చరిత్రను చూసినట్లయితే ఫ్లోరిడా రాష్ట్రంలో వెనుకబడిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి ఎవరూ ఇంతవరకు విజయం సాధించలేదు. ఇప్పుడు అక్కడ డెమోక్రటిక్‌ పార్టీ బిడెన్‌ 13 శాతం పాయింట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ఇది ట్రంప్‌కు రాగల కీడును సూచిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. క్విన్‌నిపియాక్‌ విశ్వవిద్యాలయ సర్వేలో బిడెన్‌ 51శాతం, ట్రంప్‌ 38శాతంతో పోటీ పడుతున్నారని వెల్లడికాగా సిఎన్‌ఎన్‌ సర్వేలో 51-46శాతాల చొప్పున ఉన్నారు. దీనిలో కొత్త ఏముంది మార్చి నెలనుంచి జరుపుతున్న ఏ సర్వేలోనూ ఫ్లోరిడాలో ట్రంప్‌ది పైచేయిగా ఉన్నట్లు వెల్లడి కాలేదని ఆయన మద్దతుదార్లు చెబుతున్నారు. అయితే బిడెన్‌కు అనుకూలత వ్యక్తం కావటం ట్రంప్‌కు పెద్ద హెచ్చరికగా చెబుతూ ఎట్టి పరిస్ధితిల్లోనూ ఫ్లోరిడాలో పై చేయిసాధించాలని విశ్లేషకులు చెబుతున్నారు. అందువలన రానున్న రోజుల్లో ప్రచారం యుద్దం మరింత ముదరటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ట్రంప్‌ ఓడిపోతే అది బిడెన్‌ విజయం కంటే ట్రంప్‌ చారిత్రక ఓటమి అవుతుంది. జూన్‌ ఒకటవ తేదీ నుంచి చూస్తే ఫ్లోరిడాలో ట్రంప్‌ సగటున ఎనిమిదిశాతం వెనుకబడి ఉన్నట్లు తేలింది.


అమెరికా ఎన్నికల విధానం ప్రకారం పరోక్ష పద్దతిలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం యాభై రాష్ట్రాలకు వంద సెనెట్‌ (మన రాజ్యసభ మాదిరి) సభ్యులు, కాంగ్రెస్‌లో (మన లోక్‌సభ వంటిది) 435 ప్రజాప్రతినిధులు ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలలో వాషింగ్టన్‌ డిసి నుంచి ముగ్గురితో సహా మొత్తం 538 మంది ఎలక్టరల్‌ కాలేజీ ప్రతినిధులను ఎన్నుకుంటారు. వీరిలో 270 మంది మద్దతు పొందిన వారు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నిక అవుతారు. ఒక వేళ ఆ మేరకు పూర్తి మెజారిటీ రాని పక్షంలో అధ్యక్షుడిని పార్లమెంట్‌లోని ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌, ఉపాధ్యక్షుడిని సెనెట్‌ సభ్యులు ఎన్నుకుంటారు.


ఫ్లోరిడా రాష్ట్ర ఫలితాలతో నిమిత్తం లేకుండానే ప్రస్తుతం డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోబిడెన్‌కు 270 ఓట్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మిషిగాన్‌, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలలో బిడెన్‌ ముందంజలో ఉన్నారు. 2016 ఎన్నికలను ప్రాతిపాదికగా తీసుకుంటే నాటి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిని హిల్లరీ క్లింటన్‌కు 232 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల ఓట్లను కూడా బిడెన్‌ ఖాతాలో వేస్తే అవి 278 అవుతాయి. అలాగాక గత ఎన్నికల ప్రకారం బిడెన్‌కు 232ఓట్లు మాత్రమే ఈసారి కూడా మిగతా చోట్ల వచ్చి ఫ్లోరిడాలో ప్రస్తుతం ఉన్న ముందంజ కొనసాగి అక్కడి 29 ఓట్లను తెచ్చుకుంటే 261 అవుతాయి, పూర్తి మెజారిటీకి తొమ్మిది తక్కువ ఉంటాయి. ఫ్లోరిడాలో కరోనా సమస్య మీద జరిపిన సర్వేలో ట్రంప్‌కు 42శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఈ రాష్ట్ర మెజారిటీ ఓటర్లను తనవైపు తిప్పుకోవటంతో పాటు దేశం మొత్తంగా ఉన్న వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చుకోవటం ట్రంప్‌ వల్ల అవుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.


ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగులు పదకొండుశాతం ఉన్నారు.కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయటం, తగు నివారణ చర్యలను తీసుకోవటంలో ట్రంప్‌ నిర్లక్ష్యం గురించి తెలిసిందే. ఇది రాస్తున్న సమయానికి ప్రపంచంలో కోటీ 66లక్షల మందికి కరోనా వైరస్‌ సోకితే వారిలో 44లక్షల మంది అమెరికన్లే, అలాగే మరణించిన ఆరులక్షల 57వేల మందిలో అమెరికాలో లక్షా 50వేల మంది ఉన్నారు. దీనికి ట్రంప్‌ నిర్లక్ష్యం ప్రధాన కారణం. మరోవైపు ఆర్ధిక సమస్యలు, చైనాతో జరుపుతున్న వాణిజ్యపోరు వంటి అనేక ప్రతికూల అంశాల కారణంగా ప్రస్తుతం ట్రంప్‌కు జనంలో ఆదరణ 38శాతానికి పడిపోయినట్లు సర్వేలు చెబుతున్నాయి. 1948 నుంచి చూసినపుడు ప్రజాదరణ 40శాతంలోపు ఉన్న పదవిలోని అధ్యక్ష అభ్యర్ధులెవరూ రెండవ సారి గెలిచిన దాఖలాలు లేవు.


అయితే ట్రంప్‌ ప్రస్తుతానికి వెనుకబడి ఉన్నప్పటికీ ఓడిపోయే ఖాతాలో వేయకూడదనే అభిప్రాయం కూడా కొంత మందిలో ఉంది. అక్టోబరు నాటికి ఆర్ధిక వ్యవస్ధ కోలుకొని ఓటర్లను ట్రంప్‌ ఆశ్చర్యపరుస్తారని చెబుతున్నారు. అనేక కారణాలతో ఓటర్లు ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించగలరనే ఆశాభావాన్ని కలిగిన వారు సగం ముంది ఉండటాన్ని వారు ఉదహరిస్తున్నారు.


గత ఎన్నికల్లో ట్రంప్‌కు మెజారిటీ వచ్చిన మిషిగాన్‌, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలలో ఈసారి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధికి మెజారిటీ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే గత ఎన్నికల సమయంలో కూడా తొలుత హిల్లరీ క్లింటన్‌ ఆ రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నట్లు సర్వేలు తెలిపినా తీరా ఓటింగ్‌లో ట్రంప్‌ స్వల్ప మెజారిటీ తెచుకున్నాడు, అది పునరావృతం కాదని చెప్పలేము కదా అన్నది కొందరి వాదన. సర్వేలన్నీ కాలేజీ విద్యావంతులనే ఎక్కువగా ఎంచుకుంటాయని వారే మొత్తం సమాజానికి ప్రతినిధులు కాదన్నది వారి తర్కం.


ట్రంప్‌ నిత్యం ట్వీట్లు, తెలివి తక్కువ ప్రకటనలు, చర్యలకు పాల్పడుతున్నప్పటికీ రోజంతా జనం నోళ్లలో నానుతున్న విషయాన్ని తక్కువగా చూడకూడదని, అది కూడా పెద్ద సానుకూల అంశమే అని కొందరు చెబుతున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో అభ్యర్ధిత్వం కోసం పోటీపడిన బెర్నీశాండర్స్‌ను కుట్రతో వెనక్కు నెట్టిన కారణంగా ఆయన మద్దతుదారులు ఓటింగ్‌కు రాకపోవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతూ అది ట్రంప్‌కు సానుకూలం అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కరోనా కారణంగా అనేక చోట్ల పోలింగ్‌ కేంద్రాలను తగ్గించారు. ఇది ఓటింగ్‌శాతం తగ్గటానికి దారి తీయవచ్చని, పట్టణాలలో బిడెన్‌ మద్దతుదారులు ఎక్కువగా ఉన్నారని, పోలింగ్‌ కేంద్రాలలో ఎక్కువ సేపు వేచి ఉండేందుకు వారు ఇచ్చగించరని తద్వారా ప్రత్యర్ధి ఓట్లు తగ్గటం ట్రంప్‌కు కలసి వచ్చే అవకాశం ఉందని ఒక అభిప్రాయం. అక్టోబరు నాటికి కరోనాకు వ్యాక్సిన్‌ రావచ్చని ఆ నాటకీయ ప్రకటనతో ట్రంప్‌ అప్పటి వరకు వచ్చిన ప్రతికూలతలను అధిగమిస్తారన్నది ట్రంప్‌ మద్దతుదారుల ఆశ.


జూలై 15 నాటి వాషింగ్టన్‌ పోస్టు-ఎబిసి సర్వేలో 55శాతం మద్దతుతో బిడెన్‌ ముందుండగా ట్రంప్‌కు 40శాతమే వెల్లడైంది. మార్చినెలలో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉంది. అది కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు, తరువాత పరిస్ధితి మారిపోయింది. వైరస్‌ను ఎదుర్కోవటంలో ట్రంప్‌ విఫలమయ్యారని 60శాతం మంది పేర్కొనగా సక్రమంగానే వ్యవహరించినట్లు 39శాతం చెప్పారు. తానుగా ముఖానికి తొడుగు ధరించేది లేదని ప్రకటించిన ట్రంప్‌ జనంలో దాని మీద తలెత్తిన విమర్శలకు తలొగ్గి తాను కూడా ధరించి సంతృప్తి పరచేందుకు ప్రయత్నించటాన్ని చూశాము. మితవాద ఓటర్లను ఆకర్షించేందుకు నాజీ చిహ్నాలను ఉపయోగించుకొనేందుకు కూడా ప్రయత్నించాడు. ఇది ట్రంప్‌లో తలెత్తిన అపనమ్మకాన్ని సూచిస్తున్నదని కొందరి భాష్యం.


ఓటింగ్‌ సమయానికి నిరుద్యోగం పదిశాతానికి మించి ఉంటే కరోనా మహమ్మారి అదుపులేదనేందుకు సూచిక అవుతుంది. అది ప్రతికూలంగా మారుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రంప్‌ ఓటమి ఖాయం అని అందరూ చెబుతున్నారు. తమనేత విజయం సాధించటం అత్యంత ముఖ్య అంశమని ట్రంప్‌ మద్దతుదారులు 72శాతం మంది భావిస్తుండగా, ట్రంప్‌ను ఓడించటం బిడెన్‌కు ఎంతో ముఖ్యమని ఆయన మద్దతుదారులు 67శాతం భావిస్తున్నారు.


సోమవారం నాడు ట్రంప్‌ విలేకర్లతో మాట్లాడిన తీరును చూస్తే త్వరలో పరీక్షలు పూర్తి చేసుకొని అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దాన్లో భాగంగానే రెండువారాల్లోనే ఒక శుభవార్తను ప్రకటిస్తానని చెప్పాడు. ఒకవైపు ట్రంప్‌ ఇలా చెప్పుకుంటున్న సమయంలోనే మరోవైపు ఆ పెద్దమనిషి నాయకత్వంలో దేశం తప్పుడు మార్గంలో పయనిస్తోందని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేలు వెలువడ్డాయి. ఏపి వార్తా సంస్ద చికాగో విశ్వవిద్యాలయ సంస్ధతో కలసి నిర్వహించిన సర్వేలో కరోనా వైరస్‌ వ్యవహారంలో సక్రమంగా వ్యవహరించినట్లు చెప్పిన వారి సంఖ్య 32శాతానికి పడిపోయింది. దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపించారని భావించిన వారు 80శాతం ఉన్నట్లు, ఆర్ధిక వ్యవహారాలు సక్రమంగా ఉన్నట్లు కేవలం 38శాతం మంది భావిస్తున్నట్లు వెల్లడైంది. సర్వేలు వెల్లడిస్తున్న ఈ ప్రతికూల వార్తల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు ట్రంప్‌ ఎలాంటి ఎత్తుగడలను ముందుకు తెస్తారో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో ప్రచ్చన్న యుద్ధాన్ని తీవ్రం చేసిన అమెరికా !

25 Saturday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Communist China, Mike Pompeo, US cold war with China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


” స్వేచ్చా ప్రపంచం చైనాను మార్చాలి(కూల్చాలి) లేనట్లయితే అదే మనల్ని మారుస్తుంది” అన్నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో. హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించాలన్న అంతర్జాతీయ అంగీకారాన్ని చైనా ఉల్లంఘించింది, దక్షిణ చైనా సముద్రం, మరియు ప్రభుత్వ మద్దతుతో మేథోసంపత్తి దోపిడీని ఆపాలి అని కూడా చెప్పాడు. దేశీయంగా చైనా రోజు రోజుకూ నియంతృత్వాన్ని పెంచుతోంది, అంతర్జాతీయంగా స్వేచ్చకు వ్యతిరేకంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ కొత్త ప్రజోపద్రవాన్ని తెచ్చిందని కాలిఫోర్నియాలోని యోర్బా లిండాలో ఈ వారంలో చేసిన ఒక ప్రసంగంలో చైనాకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని రెచ్చగొట్టాడు.పాంపియో మాటలు ఒక చీమ ఒక చెట్టును ఊపేందుకు చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదని చైనాకు వ్యతిరేకంగా ప్రారంభించిన నూతన యుద్దం నిష్ఫలం అవుతుందని చైనా విదేశాంగశాఖ కొట్టివేసింది.


గత నాలుగు దశాబ్దాల కాలంలో రెండు దేశాల సంబంధాల్లో వచ్చిన పెను మార్పును ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. 1970 దశకంలో చైనాతో దౌత్య సంబంధాలకు నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ తెరతీశాడు.” చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రపంచాన్ని తెరవటం ద్వారా తాను ఒక ప్రాంకెస్టయిన్‌ను సృష్టించానేమో అని నిక్సన్‌ ఒకసారి భయాన్ని వ్యక్తం చేశాడు, ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం” అంటూ పాంపియో చైనాను ఒక వికృతాకార అసహజ జంతువుగా వర్ణించాడు. మేరీ షెల్లీ అనే బ్రిటీష్‌ యువరచయిత్రి 1818లో ఫ్రాంకెస్టయిన్‌ అనే ఒక నవలను రాసింది. దానిలో విక్టర్‌ ఫ్రాంకెస్టయిన్‌ అనే యువశాస్త్రవేత్త ఒక వికృతాకార అసహజ జంతువును సృష్టించటం, దాని పర్యవసానాల గురించి ఆ నవల సాగుతుంది. అనేక ఆధునిక సినిమాలకు అది మూలకథావస్తువు అయింది. అమెరికన్లు కమ్యూనిస్టులను, సోషలిస్టు దేశాలను అలాంటి జంతువుతో పోల్చి ప్రచారం చేశారు.
రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ, సైద్దాంతిక మౌలిక విబేధాలను మనమింకే మాత్రం విస్మరించరాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నడూ అలా చేయలేదు మనం కూడా అంతే ఉండాలి అని కూడా పాంపియో చెప్పాడు. ఎంతగా చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంతగా నవంబరులో జరిగే ఎన్నికలలో తమ నేత ట్రంప్‌కు ఓట్లు వచ్చి తిరిగి అధికారం వస్తుందనే ఎత్తుగడ కూడా పాంపియో ప్రసంగ లక్ష్యం కావచ్చు. వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్ధి కావాలనే వ్యూహంతో పాంపియో ఉండటం కూడా ఆ దూకుడుకు కారణం కావచ్చు.


నాలుగు దశాబ్దాల క్రితం -అమెరికా, సోవియట్‌ యూనియన్‌ నాయకత్వంలో ఉన్న సోషలిస్టు కూటమి దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం, సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు కూడా తీవ్రంగానే కొనసాగుతున్న సమయమది. అమెరికా తోడేలు అయితే అది తినదలచుకున్న మేక పిల్లలుగా సోషలిస్టు దేశాలు ఉన్నాయి. అప్పుడు కూడా జనాభారీత్యా పెద్దది అయినా చైనా కూడా ఆర్ధికంగా ఒక మేకపిల్ల వంటిదే. అలాంటి చైనాతో దోస్తీ అంటూ అమెరికా తోడేలు ముందుకు రావటమే కాదు, ఏకంగా కావలించుకుంది. ఇప్పుడు మింగివేసేందుకు పూనుకుంది. ఎంతలో ఎంత తేడా !


అది జరిగేనా ? చైనాతో పోల్చితే పసిగుడ్డు వియత్నాంనే ఏమీ చేయలేక తోకముడిచిన అమెరికా గురించి తెలియంది ఏముంది ! నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికా ఎక్కడ కాలుబెడితే అక్కడి నుంచి తోకముడవటం తప్ప పైచేయి సాధించింది లేదు. కొంత మంది చెబుతున్నట్లు అమెరికాలోని ఆయుధ పరిశ్రమలకు లాభాలు తప్ప మరొకటి కాదన్నది కూడా వాస్తవమే. అందుకోసం సాధ్యమైన మేరకు ఉద్రిక్తతలను తానే సృష్టించటం, ఇతర దేశాలను ఎగదోయటం వంటి అనేక పద్దతులను అనుసరిస్తున్నది. నాలుగు దశాబ్దాల నాడు ఉన్నంత బలంగా అమెరికా ఇప్పుడు లేదన్నది ఒక అభిప్రాయం( అయినా ఇప్పటికీ అదే అగ్రరాజ్యం). ఇదే విధంగా చైనా స్ధితి కూడా అంతే, ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా నాటికీ నేటికి ఎంతో తేడా !
సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీలు ఒకరి ముఖం ఒకరు చూసుకొనేందుకు సుముఖంగా లేని స్ధితిని వినియోగించుకొని సోవియట్‌ను దెబ్బతీయాలన్నది నాటి అమెరికా ఎత్తుగడ. ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని పూనుకున్న దేశమది. అప్పటికే ప్రపంచంలో అతి పెద్ద దేశమే కాదు, సోషలిస్టు వ్యవస్ధను కూడా కలిగి ఉన్న చైనాతో సయోధ్యకు రావటం వెనుక అమెరికన్లు మారు మనస్సు పుచ్చుకున్న దాఖలాలేమీ లేవు. ఇప్పుడు ఆ సోవియట్‌ యూనియన్‌ లేదు. చైనాను తన ప్రత్యర్ధిగా అమెరికా భావిస్తోంది. తన 140 కోట్ల జనాభా జీవన స్ధాయిని పెంచేందుకు చైనా సర్వశక్తులను వినియోగిస్తోంది. అమెరికా, దాని అనుయాయి దేశాలు చేస్తున్న కుట్రలు, రెచ్చగొడుతున్న కారణంగా, తాను సాధించిన విజయాలను పదిల పరుచుకొనేందుకు అది స్పందించాల్సి వస్తోంది తప్ప, తానుగా కాలుదువ్వటం లేదు. కొన్ని సందర్భాలలో రాజీ పడిందనే విమర్శలను కూడా ఎదుర్కొన్నది.


సోవియట్‌ వారసురాలిగా ఐరాసలో శాశ్వత సభ్యత్వం రష్యాకు దక్కింది. నాడు అలీన రాజ్యంగా ఉన్నప్పటికీ అనేక అంశాలలో సోవియట్‌కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా భారత్‌ ఉంది. నేడు రష్యా -చైనాల మధ్య విరోధం లేదు, సైద్ధాంతిక బంధమూ లేదు. కానీ అమెరికాను ఎదుర్కోవాలంటే చైనా లేకుండా సాధ్యం కాదన్నది ఇప్పటి రష్యా వైఖరి (భవిష్యత్‌ గురించి చెప్పలేము). అలీన వైఖరి అనేది పాతబడిపోయింది, ఇంక ఆ మాట గురించి మరచిపోండి, మేము ఏ కూటమిలోనూ చేరటం లేదని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. అయితే ఆచరణలో మనం అమెరికా కౌగిలిలో మరింతగా ఒదిగిపోతున్నామన్నది అందరికీ కనిపిస్తున్న వాస్తవం. లేకుంటే మీరు చైనా మీద యుద్దం ప్రకటించండి మీవెనుక మేము ఉన్నామన్నట్లుగా అమెరికా, దాని అనుంగుదేశాలు బహిరంగంగా ఎలా చెబుతాయి. ప్రపంచ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల్లో వచ్చిన ఈ ప్రధాన మార్పును గమనంలోకి తీసుకోకుండా లడఖ్‌ వంటి వర్తమాన పరిణామాలను అర్ధం చేసుకోలేము.
హౌడీ మోడీ పేరుతో అమెరికాలో ట్రంప్‌-మోడీ చెట్టపట్టాలు వేసుకు తిరిగిన హూస్టన్‌ నగరంలో ఉన్న చైనా తొలి కాన్సులేట్‌ కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది. మా ఊరు మీకు ఎంత దూరమోా మీ ఊరూ మాకూ అంతే దూరం అన్నట్లు తమ చెంగుడూ నగరంలో ఉన్న అమెరికా కార్యాలయాన్ని మూసివేయాలని చైనా ఆదేశించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో తెలియని ఒక అనిశ్చితి ఏర్పడిందన్నది స్పష్టం. రానున్న అధ్యక్ష ఎన్నికలను గమనంలో ఉంచుకొని ట్రంప్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా ? అదే అయితే తాత్కాలికమే. కానీ వాటిలో భాగంగానే ఆసియాలో భారత్‌ పోతుగడ్డ అని రెచ్చగొడుతున్న దానిని మనం నిజమే అనుకుంటే మనకు కొత్త సమస్యలు వస్తాయని గ్రహించాలి. లేదూ అమెరికన్లు చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దపడినా రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు మనం నలిగిపోతాము.


అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి నినాదం. చైనాలో కమ్యూనిస్టులు లాంగ్‌ మార్చ్‌తో ఒక్కో ప్రాంతాన్ని విముక్తి చేస్తూ జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో అమెరికన్లు నాటి కొమింటాంగ్‌ పార్టీనేత చాంగ్‌కై షేక్‌కు అన్ని రకాల మద్దతు ఇచ్చారు.కొమింటాంగ్‌ మిలిటరీ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడ స్ధావరాన్ని ఏర్పాటు చేసుకుంది. కమ్యూనిస్టులు ప్రధాన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికన్లు తైవాన్‌లోని తిరుగుబాటుదార్ల ప్రభుత్వాన్నేే అసలైనా చైనాగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితిలో రెండు దశాబ్దాల పాటు కథనడిపించారు.
చైనాకు స్నేహ హస్తం చాచినా అమెరికన్లు తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎన్నడూ దాచుకోలేదు.దాన్ని దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. అమెరికాతో సహా అనేక దేశాలకు తమ మార్కెట్‌ను తెరిచిన చైనీయులు తమవైన ప్రత్యేక సంస్కరణలు అమలు జరిపి అసాధారణ విజయాలను సాధించటంతో పాటు అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు ధీటుగా తయారయ్యారు. అమెరికన్లు తలచింది ఒకటి, జరిగింది మరొకటి. ఒకవైపు తైవాన్‌ ప్రాంతం చైనాకు చెందినదే అని గుర్తిస్తూనే మరోవైపు అమెరికా అక్కడి పాలకులు, మిలిటరీని మరింత పటిష్టం గావిస్తూ చైనాను నిరంతరం రెచ్చగొడుతున్నది.
తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామన్నట్లుగా దాదాపు ప్రతి రోజూ చైనా మిలిటరీ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయని తైవాన్‌ మంత్రి జోసెఫ్‌ వు ఈనెల 22న ఆరోపించాడు.నేడు తైవాన్‌తో ఏ దేశమూ అధికారిక సంబంధాలను కలిగి లేదు. పరోక్షంగా అమెరికా, మరికొన్ని దేశాలు రోజువారీ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఏ క్షణంలో అయినా మిలిటరీని ప్రయోగించి తైవాన్‌ను తనలో విలీనం చేసుకోవచ్చని చైనా విలీన వ్యతిరేక శక్తులు నిత్యం స్ధానికులను రెచ్చగొడుతుంటాయి. అంతర్జాతీయంగా చైనా మీద వత్తిడి తెచ్చే వ్యూహంలో భాగమిది. 1996లో హెచ్చరికగా చైనీయులు కొన్ని క్షిపణులను తైవాన్‌ వైపు ప్రయోగించారు. దీన్ని సాకుగా తీసుకొని అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి తన విమానవాహక యుద్ద నౌకను పంపి చైనాను బెదిరించింది. 2001లో అమెరికా నిఘా విమానం ఒకటి చైనా స్ధావరంలో అత్యవసరంగా దిగింది. సిబ్బందిని, విమానాన్ని కొద్ది రోజుల పాటు చైనా నిర్బంధించింది. ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా తనకు పోటీగా చైనా ఎదుగుతున్నదనే భయం అమెరికాలో మొదలైన నాటి నుంచి రెండు దేశాల సంబంధాలు ఏదో ఒక రూపంలో దిగజారుతూనే ఉన్నాయి. వాణిజ్య మిగులుతో ఉన్న చైనా తన వస్తువులను కొనాలంటూ 2018లో ట్రంప్‌ వాణిజ్య యుద్దానికి తెరతీసిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతున్నది, ఈ లోగా కరోనా సమస్య ముందుకు వచ్చింది. తమ జనాన్ని గాలికి వదలివేసిన ట్రంప్‌ ప్రపంచ ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు.ఎన్నికల రాజకీయాలకు తెరలేపినా దాని వెనుక ఇతర అజెండా కూడా ఉందన్నది స్పష్టం.


చైనాను కట్టడి చేయాలన్న అమెరికా పధకంలో భాగంగా ఒక వైపు మన దేశాన్ని మరోవైపు రష్యాను అమెరికన్లు దువ్వుతున్నారు.మన రక్షణ ఏర్పాట్లలో భాగంగా రష్యా నుంచి ఎస్‌-400 సంచార క్షిఫణి ప్రయోగ వ్యవస్ధలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించటాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు, బెదిరింపులకు దిగింది. చివరకు మనం గట్టిగా ఉండటంతో పులిలా బెదిరించిన వారు పిల్లిలా మారిపోయారు. మరోవైపున అనేక చోట్ల రష్యాతో ఘర్షణ పడుతున్న అమెరికన్లు చైనాను కట్టడి చేసే ఎత్తుగడలో భాగంగా రష్యాను కూడా దువ్వేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా ప్రారంభించిన దౌత్యకార్యాలయాల మూసివేత యుద్దంలో చైనా కూడా కంటికి కన్ను-పంటికి పన్ను అన్నట్లుగా స్పందించింది. నిజానికి ఈ వారంలో ప్రారంభమైనట్లు కనిపించినా గత ఏడాది అక్టోబరులోనే దానికి ట్రంప్‌ తెరలేపాడు. చైనా దౌత్య సిబ్బంది సంఖ్యపై ఆంక్షలు విధించాడు. ప్రస్తుతం రెండు దేశాలూ పరస్పరం కాన్సులేట్‌ కార్యాలయాలను మూయాలని ఆదేశించాయి. తరువాత వుహాన్‌, హాంకాంగ్‌, మకావులలో మూసివేతలకు చైనా ఆదేశించవచ్చని వార్తలు వచ్చాయి. వాటితో పాటు దౌత్యవేత్తల బహిష్కరణ, వారి మీద ఆరోపణల పర్వం ఎలాగూ ఉంటుంది. పరిశోధకుల పేరుతో అమెరికా వచ్చిన నలుగురు తమకు చైనా మిలిటరీతో సంబంధాలు ఉన్న విషయాన్ని దాచారంటూ వారిలో ముగ్గురిని అమెరికా అరెస్టు చేసింది. ఒక పరిశోధకురాలు శాన్‌ ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌కు వెళ్లి రక్షణ పొందింది. తమ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరించేందుకు వారు వచ్చినట్లు అమెరికా ఆరోపించింది. వారికి పది సంవత్సరాల జైలు శిక్ష, రెండున్నరలక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని చైనా వ్యాఖ్యానించింది.


వర్తమాన పరిణామాల్లో హాంకాంగ్‌కు వర్తింప చేస్తూ చైనా చేసిన ఒక చట్టాన్ని ఆధారం చేసుకొని అమెరికా, దానికి మద్దతుగా బ్రిటన్‌, ఇతర మరికొన్ని దేశాలు రంగంలోకి దిగి అక్కడ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నట్లు నానా యాగీ చేస్తున్నాయి.తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసిన చైనా హంకాంగ్‌లోని బ్రిటీష్‌ మరియు ఇతర దేశాలకు చెందిన వారిని విదేశీ పౌరులుగా గుర్తిస్తూ గతంలో బ్రిటన్‌ జారీ చేసిన పాస్‌పోర్టుల గుర్తింపును రద్దు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది. విదేశాంగశాఖ ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ హాంకాంగ్‌ పౌరులు విదేశీ ప్రయాణాలు చేసేందుకు అది చెల్లుబాటయ్యే పత్రం కాదని త్వరలో తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చైనా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారికి అవసరమైతే తాము భద్రత కల్పిస్తామనే అర్ధంలో బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా కొన్ని వివరాలను ప్రకటించింది. ఈ పాస్‌పోర్టులు ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు 2021జనవరి తరువాత బ్రిటన్‌ సందర్శించవచ్చని, అక్కడ ఐదు సంవత్సరాల పాటు విద్య, ఉద్యోగాలు చేయవచ్చని, తరువాత కావాలనుకుంటే బ్రిటన్‌లో శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో తాము వాటి గుర్తింపు రద్దు చేయనున్నట్లు చైనా సూచన ప్రాయంగా తెలిపింది. హాంకాంగ్‌ చైనాలో భాగమని, అంతర్గత భద్రతకు తీసుకొనే చట్టాలను బ్రిటన్‌ గుర్తించాల్సి ఉందని, దానికి భిన్నంగా వ్యవహరిస్తే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని చైనా స్పష్టం చేసింది. అంతే కాదు హాంకాంగ్‌ పౌరులు చైనా ప్రధాన భూభాగంలో ప్రవేశించాలంటే బ్రిటీష్‌ వారు జారీ చేసిన పాస్‌పోర్టులను చైనా గుర్తించదు, చైనా యంత్రాంగం ఇచ్చిన అనుమతి పత్రాలతోనే ప్రవేశించాల్సి ఉంటుంది. హాంకాంగ్‌ జనాభా 75లక్షలు కాగా తాజాగా బ్రిటన్‌ వెల్లడించిన నిబంధనల ప్రకారం 30లక్షల మంది వరకు బ్రిటన్‌లో స్ధిరపడేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అంత మందిని బ్రిటన్‌ అనుమతిస్తుందా, వారందరికీ ఉపాధి, వసతి చూపుతుందా అన్న అంశం పక్కన పెడితే చైనా పౌరులకు బ్రిటన్‌ పాస్‌పోర్టులు ఇవ్వటం ఏమిటన్న సమస్య ముందుకు వస్తోంది.


రెండు దేశాలు దౌత్య పరమైన చర్యలు, ప్రతిచర్యలకు పాల్పడటం సాధారణంగా జరగదు. అమెరికా వైపు నుంచి జరుగుతున్న కవ్వింపులు ట్రంప్‌ ఎన్నికల విజయం కోసమే అని చైనా భావిస్తున్నప్పటికీ ట్రంప్‌ తిరిగి వచ్చినా లేదా మరొకరు ఆ స్ధానంలోకి వచ్చినా రాగల పర్యవసానాల గురించి కూడా చైనా ఆలోచిస్తున్నది. అందువలన నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు ఇలాంటి చర్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చైనా తాత్కాలిక చర్యలకు ఉపక్రమించినప్పటికీ దీర్ఘకాలిక వ్యూహం ఎలా ఉంటుందన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కరోనా బారి నుంచి బయట పడి తిరిగి పూర్వపు స్ధాయికి ఆర్ధిక కార్యకలాపాలను తీసుకురావాలని కోరుకుంటున్న చైనా ఏ దేశంతోనూ గిల్లికజ్జాలకు సిద్దంగా లేదని చెప్పవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో, ఇతర చోట్ల అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, దాని వలలో పడిన దేశాలు చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా దానికి అనుగుణ్యంగానే చైనా స్పందన ఉంటుంది.


మన దేశ విషయానికి వస్తే లడఖ్‌లో జరిగిన పరిణామాల తరువాత పూర్వపు స్థితిని పునరుద్దరించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.అయితే పరస్పరం అనుమానాలు, గతంలో ఉన్న స్ధితి గతుల గురించి ఎవరి భాష్యాలకు వారు కట్టుబడి ఉంటే అది వెంటనే నెరవేరకపోవచ్చు. అంగీకారాన్ని అమలు జరిపేందుకు మరిన్ని చర్చలు, సంప్రదింపులు అవసరం కావచ్చు.ౖౖ అమెరికా మాటలు నమ్మి చైనాను దెబ్బతీసేందుకు మనం సహకరిస్తే ఆ స్ధానంలో మనం ప్రవేశించవచ్చని ఎవరైనా కలలు కంటే అంతకంటే ఆమాయకత్వం మరొకటి ఉండదు. చైనాను దెబ్బతీసి తాను లాభపడాలని చూసిన ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకే సాధ్యం కాలేదు. మన నిక్కర్ల నుంచి పాంట్స్‌( దేశ భక్తి గురించి చెప్పేవారికి ఎంత భావ దారిద్య్రం నిక్కరూ మనది కాదు, పాంట్సూ మనవి కాదు.) కు మారిన వారు అమెరికా మాటలు నమ్మి వ్యవహరిస్తే, వారి సూత్రీకరణలను జనం నమ్మితే కుక్కతోకను పట్టుకొని గోదావరిని ఈదిన చందమే అవుతుంది.


చీమ చెట్టును ఊపే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా వైఖరి ఉంది అని చైనీయులు మాట మాత్రంగా పాంపియో గురించి చెప్పినప్పటికీ ఆచరణలో అంత తేలికగా సామ్రాజ్యవాదాన్ని దానికి కేంద్రంగా ఉన్న అమెరికా గురించి చైనా భావించటం లేదు. ఇదే సమయంలో చైనాను ఒంటరిపాటు చేయటం అమెరికాకు అంత తేలిక కాదు. రెండవ ప్రపంచయుద్దం తరువాత బ్రిటన్‌ స్ధానాన్ని అమెరికా ఆక్రమించింది.దాని ప్రతి చర్యలోనూ అమెరికాకు అగ్రస్ధానం ఉండాలన్నట్లు వ్యవహరించింది. అదే పెట్టుబడిదారీ వ్యవస్ధలోని అనేక దేశాలతో దానికి సమస్యలు తెచ్చింది, మిగతా దేశాలను భయానికి గురి చేసింది. ఇప్పుడు అవే దాని ప్రపంచ పెత్తనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి.


అమెరికా వ్యూహకర్తలు అనేక తప్పిదాలు చేశారు లేదా అంచనాలు తప్పి బొక్కబోర్లా పడ్డారు. అదిరించి బెదిరించి తమ పబ్బంగడుపుకోవాలంటే ఎల్లకాలం కుదరదు అనే చిన్న తర్కాన్ని విస్మరించారు.ఐక్యరాజ్యసమితిని ఉపయోగించుకొని ప్రపంచ పెత్తనాన్ని సాగించాలని చూసిన వారు ఇప్పుడు బెదిరింపులకు దిగి ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక ఐరాస విభాగాల నుంచి వైదొలుగుతున్నారు. దానితో ఏ దేశమూ అమ్మో అయితే ఎలా అని ఆందోళనకు గురికాలేదు. పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్యం పేరుతో అమెరికా ఒక వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. అది తనకు లాభసాటి కాదు అని వెనక్కు తగ్గింది. అయితే దాని మాటలు నమ్మి ముందుకు పోయిన వారు తరువాత మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదే విధంగా అమెరికా ప్రారంభించిన ఆయుధ నియంత్రణ వంటి చర్చలను ట్రంప్‌ యంత్రాంగం ముందుకు తీసుకుపోలేదు. ప్రపంచం తలకిందులు కాలేదు. ఇలాంటి ఉదంతాలను అనేక దేశాలు అమెరికా బలహీనతగా చూస్తున్నాయి. అటువంటపుడు ఆచి తూచి వ్యవహరిస్తాయి తప్ప అమెరికా ఏది గుడ్డిగా చెబితే దాన్ని అనుసరించే అవకాశాలు లేవు. ఉదాహరణకు రెండు సంవత్సరాల క్రితం చైనాతో ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో ఇతర ధనిక దేశాలు అమెరికా వెనుక నిలిచే అవకాశాలు ప్రస్తుతం లేవు.దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. రెండవది ప్రతి పెట్టుబడిదారీ దేశమూ తన కార్పొరేట్ల ప్రయోజనాల కోసం జాతీయవాదాన్ని, ఏకపక్ష వైఖరిని ముందుకు తెస్తున్నది.


అమెరికా ఎంతగా రెచ్చగొడుతున్నా, దక్షిణ చైనా సముద్రంలోకి తన నౌక, వైమానిక దళాలను దించుతున్నా, అనేక దేశాలు తమను ఒంటరిపాటు చేసేందుకు పావులు కదుపుతున్నా చైనా నాయకత్వ వైఖరిలో ఎక్కడా ఆందోళన కనిపించకపోవటానికి, హాంకాంగ్‌తో సహా అనేక అంశాలపై పట్టుబిగింపు, భారత్‌ విధించిన ఆర్ధిక ఆంక్షలు, దేన్నయినా ఎదుర్కొనేందుకు దేనికైనా సిద్దమనే సంకేతాలకు కారణాలు ఏమిటనే వెతుకులాట పశ్చిమ దేశాల పండితుల్లో మొదలైంది.కొద్ది రోజుల క్రితం గ్జీ జింపింగ్‌ అసాధారణ రీతిలో బీజింగ్‌లో వాణిజ్యవేత్తలతో ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడైతే జీవం ఉంటుందో ఆశకూడా అక్కడే ఉంటుంది, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఐక్యంగా పరిస్ధితిని ఎదుర్కొన్నంత కాలం ఎలాటి ముప్పు లేదని వారికి భరోసా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. చైనీయుల మాటలను ప్రపంచం మొదటి నుంచీ అనుమానంతో చూస్తూనే ఉంది. అది సాధించిన అసాధారణ ఆర్ధిక విజయం, తాజాగా కరోనా వైరస్‌ సహా దేన్నీ ఒక పట్టాన నమ్మలేదు.


కరోనా వైరస్‌ గురించి అమెరికా, మరికొన్ని దేశాలు ఎలాంటి తప్పుడు ప్రచారం చేసినా అవి మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి తప్ప చైనా విజయవంతంగా బయట పడింది. కరోనా మహమ్మారి కారణంగా తమకు ఆర్ధికంగా ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూసుకొనే స్ధితిలోనే ఇంకా మిగతా దేశాలు ఉంటే, దాన్ని అధిగమించి ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టే దశలో చైనా ఉంది. అమెరికా శాండియోగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లోని చైనా డాటా లాబ్‌ వెయ్యి మంది పట్టణ వాసులపై జరిపిన అధ్యయనంలో చైనా కేంద్ర ప్రభుత్వం మీద జనంలో విశ్వాసం మరింత పెరిగినట్లు వెల్లడైంది. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న సమయం ఫిబ్రవరిలో పదిమందిలో 8.65 మంది విశ్వాసాన్ని వ్యక్తం చేయగా మేనెలలో 8.87కు పెరిగింది, అదే 2019 జూన్‌ నెలలో 8.23 ఉన్నట్లు బ్రిటన్‌ గార్డియన్‌ పత్రిక తెలిపింది. నిర్ణయాలలో ప్రజలు భాగస్వాములైనపుడు వాటికి ఎంత మూల్యం చెల్లించాలో వారికి తెలుసు, చెల్లించేందుకు కూడా సుముఖంగా ఉంటారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. చైనా నాయకత్వం బలం అదే అని చెప్పుకోవచ్చేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కంపల్సరీ లైసెన్స్‌తో కరోనా మందులు, టీకాలను అందుబాటులో ఉంచాలి !

24 Friday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Compulsory licensing, compulsory licensing of patented drugs, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


కొద్ది రోజులుగా కోవిడ్‌ 19 కి మందులను కనుగొన్నట్లుగా వార్తలు పెరిగాయి, ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి. మందులున్నాయికదా అని ముందు జాగ్రత్తలను వదిలేసి కరచాలనాలు, కౌగిలింతలూ, కేరింతలూ, మొదలయ్యే ప్రమాదం వుంది. ఇక కరోనా వ్యాధి మనల్నేమీ చేయలేదనే ధైర్యం ప్రజలలో పెరుగుతున్నది. కొన్నివందల కంపెనీలు మందుల తయారీలో పోటీలు పడుతున్నాయి. అందరికన్నా ముందు మార్కెట్‌ లో ప్రవేశించి త్వరగా అమ్ముకోవాలని పరుగెత్తుతున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నచిన్న కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి.

కొత్తగా వచ్చే మందులన్నీ కొత్తవేనా? ప్రభావమెంత ?
క్వారంటైన్‌తో ఇపుడు వైద్యం మొదలవుతున్నది. వ్యాధి లక్షణాలు ప్రబలే కొద్దీ రోగులను కోవిడ్‌ హాస్పిటల్‌కి మార్చి ప్రాణాన్ని నిలపటానికి ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ ద్వారా ఇస్తున్నారు. చికిత్సలో భాగంగా అందుబాటులోవున్న యాంటీ వైరల్‌ , 30 రకాల మందులను కాంబినేషన్లలో ఇంతవరకూ వాడారు. ఇప్పటివరకూ వున్న మందులలో కరోనావైరస్‌ ను విజయవంతంగా సంహరించే మందు ఒక్కటి కూడా లేదనే వాస్తవాన్నిగ్రహించాలి. ఫలానా మందు పనిచేస్తుందని విశ్వసనీయవర్గాలు చెప్తే, వాడి చూడండని ఐసీయమ్‌ఆర్‌ ప్రొటోకాల్‌లో లేని మందులకు కూడా అనుమతులను ఇస్తున్నది. అత్యవసర సందర్భాలలో మాత్రమే వాడే రెమిడెసివీర్‌ అనేమందు నుండి మలేరియాకు, రుమటాయిడ్‌ ఆర్దరైటిస్‌కు వాడే క్లోరోక్విన్‌, లో మాలిక్యులార్‌ వైట్‌ హెపారిన్‌ డీప్‌ వైన్‌ త్రంబోసిస్‌ రాకుండా దేశీయ ట్రెడిషనల్‌ మందుల వరకూవాటిచూస్తున్నారు.
ఒక దశాబ్దం క్రితం కనిపెట్ట్టిన రెమిడెసివీర్‌ అనేమందును మొదట హెపటైటిస్‌ చికిత్సకు అభివృద్ధి చేశారు. ఆఫ్రికాలో ఎబోలా వ్యాధిని నియంత్రించటానికి మందుగా ప్రయోగించారు. తగ్గించటంలో ఉపయోగపడలేదు. అయినా ట్రయల్స్‌లో దుష్పలితాలేమీ కలగనందున కోవిడ్‌-19 చికిత్సలో క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలెట్టారు. రెమిడెస్విర్‌ జనరిక్‌ మందును తయారు చేయటానికి డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ ) అనుమతిని ఇచ్చారు. హెటిరో , సిప్లా, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ కాడిలా కంపెనీలతో గిలియాడ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది .కోవిఫర్‌ బ్రాండ్‌ పేరున 100 మి.గ్రా.ఇంజెక్షన్గను ఒకరు విడుదలచేశారు. మన దేశంతోపాటు, 127 దేశాలలో విక్రయించుకోవటానికి ఈ కంపెనీలకు అనుమతి లభించింది.
రెమ్డెసీవీర్‌ అందుబాటులోకివచ్చిన తరువాత కూడా మరణాల రేటు తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే రోగి శరీరంలోని వైరస్‌ లోడ్‌ తగ్గటం ప్రోత్సాహకరంగా వుంది. కోలుకోవడానికి సమయం15 నుంచి 11 రోజులకు తగ్గించటంలో స్పష్టమైన ప్రభావం చూపింది. అయిదురోజుల చికిత్సకు మందు ఖర్చు 40 వేల రూపాయలు అంటున్నారు, కానీ అపుడే బ్లాక్‌ మార్కెట్లో 3-4 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. ఢిల్లీ వంటి చోట్ల రూ.5,400 కు ఇవ్వవలసిన ఒక డోసు మందును రూ. 30,000 వేలకు అమ్ముతున్నారు. ధనవంతులు కరోనా వ్యాధిని అందరికీ పంచారు, ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు, పేదప్రజలు కరోనాతో సహజీవనం చేస్తున్నారు.
అమెరికన్‌ కంపెనీ ఐన గిలియాడ్‌ సైన్సెస్‌ కు రెమిడెసీవీర్‌ మందుల పై పేటెంట్‌ హక్కు ఉన్నది. రాబోయే మూడు నెలలలో ఉత్పత్తి చేసిన రెమిడెసీవీర్‌ మందులన్నీ అమెరికాకే ఫస్ట్‌ ఇవ్వాలని ట్రంప్‌ దురహంకారంతో ఆదేశించాడు. సెప్టెంబరు వరకు తయారయ్యే మందులన్నీ అమెరికా ప్రజలకే అంటున్నాడు. మా సంగతేంటని యూరప్‌ నాయకులు అడుగుతున్నారు. ఉత్పత్తిని పెంచి అందరికీ మందును అందిస్తామని గిలియాడ్‌ కంపెనీ చెప్తున్నది. రెమిడెసీవీర్‌ మందును ఇంజెక్షన్‌ గా తయారుచేయటానికి 3 డాలర్లుఱర్చవుతుంది. 3000 డాలర్లకు అమ్మటానికి కంపెనీ నిశ్చయించింది.

2) ఇటోలిజుమాబ్‌ మరియు టోసిలిజుమాబ్‌ మందులను ఇన్వెస్టిగేటివ్‌ ధెరపీ గా ఉపయోగించటానికి అధికారులు అనుమతినిచ్చారు. శరీరంలో కరోనా వైరస్‌ ప్రవేశించినపుడు , ఈ మందులవలన కత్రిమంగా తయారైన యాంటీబాడీస్‌ వైరస్‌ని ఎదుర్కొంటాయనే ప్రతిపాదనతో బెంగుళూరులో వున్న బయోకాన్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఫేజ్‌-2 పరిశోధనలో మరణాలను గణనీయంగా తగ్గించిందని కంపెనీ పత్రికలకు వెళ్ళడించింది. ఐసీయమ్‌ఆర్‌ డైరక్టర్‌ భార్గవ గారు ఈ మందులు మరణాలను తగ్గించలేదనీ, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చన్నారు. ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమన్నారు. అయితే ఈ మందులు మంచికంటే ఎక్కువ హాని చేయవచ్చని కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టోసిలాజుమాబ్‌ ను వాడాలంటే రోగి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లో వుండాలి, 3) ఫావిపిరవిర్‌అనే యాంటీవైరల్‌ మందును మైల్డ్‌, మోడరేట్‌ లక్షణాలున్నకోవిడ్‌ 19 కేసులలో వాడవచ్చని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించారు. ఇన్‌ ఫ్లూయంజాను నియంత్రించటానికి ఈ మందును గ్లిన్‌ మార్క్‌ అనే జపాన్‌ కంపెనీ కనిపెట్టింది. 150 మంది మనుష్యులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తున్నట్లుగా గ్లిన్‌ మార్క్‌ కంపెనీ ప్రకటించింది. ఒక టేబ్లెట్‌ ను రూ.103 రేటు ప్రకటించి రూ 75 కి తగ్గించారు. దారుణంగా బ్లాక్‌ మార్కెట్‌ నడుస్తున్నది.

4) హైడ్రాక్సీ క్లోరోక్విన్‌: మార్చి 19 న డోనాల్డ్‌ ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను ”చాలా ప్రోత్సాహకరమైనది” ,” చాలా శక్తివంతమైనది” మరియు ”గేమ్‌ ఛేంజర్‌” అని పత్రికా విలేఖరుల సమావేశంలో అభివర్ణించారు. తరువాత ప్రపంచవ్యాపితంగా అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది.
5) ప్లాస్మా ధెరపీుప్లాస్మా ధెరపీ అంటే రోగనిరోధక శక్తి బాగావున్నవారి రక్తంనుండి ప్లాస్మాను వేరుచేసి రోగనిరోధక శక్తి తక్కువగావున్నవారికి ఇవ్వటాన్ని ప్లాస్మా ధెరపీ అంటారు. కోవిడ్‌-19 వ్యాధినుండి పూర్తిగా కోలుకున్నవారికి కరోనా వైరస్‌ ను ఎదుర్కొనే రోగనిరోధకణాలు యాంటీబాడీస్‌ ఎక్కువగావుంటాయి. వారి ప్లాస్మాను వేరుచేసి కరోనాతో బాధపడుతున్న రోగులకు ఇచ్చి పరిశోధనలు జరుపుతున్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్నాయంటున్నారు. కోలుకున్నరోగులనుండి రక్తాన్ని సేకరించి రోగులకు ఇవ్వటం కొత్తేమీకాదు. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు కూడా ప్లాస్మాధెరపీ ద్వారా చికిత్సచేశారు.
6) క్యూబా లో 1980 లో కనిపెట్టిన ”ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2” వైరస్‌ వ్యాధుల చికిత్స లో ప్రముఖమైనది. ప్రాధమిక దశలో వైరస్‌ వ్టాధులన్నిటిలోను ఉపయోగపడ్తుందని, అమెరికా తో సహా ప్రపంచవ్యాపిత పరిశోధనలు నిరూపించాయి. చైనా తో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న ఈ మందును 40 దేశాలలో వాడుతున్నారు. వూహాన్‌లో కోవిడ్‌-19 ప్రబలినపుడు ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2 ను వాడి సత్ఫలితాలను సాధించారు.
కరోనా మందులకు, వ్యాక్సిన్‌ కు కంపల్సరీ లైసెన్సింగ్‌ (తప్పనిసరిలైసెన్స్‌) ఇవ్వాలి. ఎక్కువ కంపెనీలకు మానుఫ్యాక్చరింగ్‌ లైసెన్సు ఇచ్చిప్రభుత్వం ధరలను నియంత్రించాలి. ప్రభుత్వాధీనంలో కరోనా మందులను అవసరమయిన ప్రజలందరికీ అందుబాటులో వుంచాలి.
కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు. ఆ ఖర్చులు భరించిన కంపెనీలు ఆ ఔషధాన్ని మరే కంపెనీ తయారుచేయకుండా పేటెంట్‌ తీసుకుంటాయి. 20 సంవత్సరాలు ఆ మందును తమ ఇష్టమొచ్చిన రేటుకి ప్రపంచంలో ఎక్కడైనాఅమ్ముకోవచ్చు. పోలియో వ్యాధినిరోధక మందును డాక్టర్‌ జోనాస్‌ సాల్క్‌ 1955 లో కనుగొన్నారు. ‘ పోలియో వాక్సిన్‌ పై పేటెంట్‌ ఎవరిది” అని అడిగితే ”ప్రజలది’ అని చెప్తూ ” సూర్యుని పేటెంట్‌ చేయగలమా” అన్నారు.

కరోనా టీకాల తయారీ.
ఇప్పటివరకూ కోవిడ్‌-19 కి వాక్సీన్‌ ను రూపొందించటానికి 200 పరిశోధనా బందాలు పోటీపడుతున్నాయి. కొన్ని సంవత్సరాలు పట్టే పరిశోధనలను కొన్ని నెలలకు కుదించారు. కంపెనీలన్నీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోవున్నాయి. పరుగు పందెంలో ముందుగా వచ్చి మార్కెట్‌ను శాసించి అంతులేని లాభాలను పొందాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి.
బ్రిటన్‌ ఆక్సఫర్డ్‌ జెన్నర్‌ ఇన్స్టిట్యూట్‌లో అసాధారణ వేగంతో ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తి చేశారని, ప్రఖ్యాత మెడికల్‌ పత్రిక లాన్సెట్‌ ప్రకటించింది. మూడవ దశలో బ్రిటన్‌లో పది వేలమంది వాలంటీర్లపై ఆగస్టునెలలో ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు. వాక్సిన్‌ను ఆస్ట్రా జనికాతో కలిసి పూనేలో తయారు చేయటానికి సీరమ్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంవత్సరం చివరకు వంద కోట్ల డోసులను మార్కెట్‌లోకి తేవటానికి పూర్తిస్ధాయిలో తయారవుతున్నారు.

కోవిడ్‌-19 కొరకు వ్యాక్సిన్ల తయారీలో చైనా లోని సినోఫార్మా , సినోవాక్‌ బయోటెక్‌ సంస్ధలు ఫేజ్‌-2 ట్రయల్స్‌ ను పూర్తిచేశాయని లాన్సెట్‌ పత్రిక ప్రకటించింది. ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలలోని వేలాదిమంది వాలంటీర్లపై ఫేజ్‌-3 వ దశ పరిశోధనలకు తయారవుతున్నారు. ఆరు బ్రెజిలియన్‌ రాష్ట్రాలలో 9000 మంది పై అధ్యయనం ప్రారంభమయిందని గవర్నర్‌ జోవా డోరియా తెలిపారు. టీకా సమర్ధవంతమైనదని రుజువయితే 120 మిలియన్‌ డోసులను ఉత్పత్తి చేయబోతున్నామని గవర్నరు అన్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ , చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కూడావ్యాక్సిన్‌ పరిశోధనలలో ముందున్నదంటున్నారు, అడినోవైరల్‌ ఆధారిత వ్యాక్సిన్‌ లను కొన్ని చైనా కంపెనీలు అభివద్ది చేస్తున్నాయి.
విజయవంతమౌతున్న చైనా వ్యాక్సిన్లను చూసిన తరువాత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ , చైనాతో కలిసి పనిచేయటానికి సుముఖత వ్యక్తంచేసాడు.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ , ఐ సీ యమ్‌ ఆర్‌ సంయుక్తంగా కొరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీలో ముందున్నాయి. భారత్‌ బయోటిక్‌ అభివద్ది చేసిన” కోవాగ్జిన్‌ ” ఇంజెక్షన్‌ రూపంలో ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌ ను ప్రారంభించారు. ఢిల్లీ లోని ఎయిమ్స్‌, హైదరాబాద్‌ నిమ్స్‌, విశాఖ కేజీ హెచ్‌ తోపాటుగా12 ఆసుపత్రులను గుర్తించారు.
కరోనాకు ప్రపంచంలో అందరికన్నా ముందు తొలి టీకాను బయటకు తీసుకురావాలని రష్యా ప్రయత్నిస్తోంది. క్లినికల్‌ ప్రయోగాలు పూర్తయ్యాయని, టీకా సురక్షితమైనదనీ, ఆగస్టు నెల ఆరంభంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలను రష్యాతోపాటు ఆరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలలో వేలమందిపై నిర్వహించనున్నారు. మూడోదశ ప్రయోగాలకు సమాంతరంగా టీకాల ఉత్పత్తికి ప్రణాలికలు రచించారు. ఈ ఏడాది 3 కోట్ల డోసులను రష్యాఉత్పత్తి చేస్తుందని, విదేశాలలో 17 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయ ప్రయత్నిస్తున్నామన్నారు.

అత్యవసర పరిస్ధితులలో ” కంపల్సరీ లైసెన్సు ”, కరోనా మహమ్మారికి మించి అత్యవసరం ఏమున్నది.?
డబ్లు టీ ఓ నిబంధనలను తయారుచేసేటపుడు ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. ఆ ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్ధితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్‌ ఇవ్వటానికి అవకాశంవున్నది. పేటెంట్‌ చట్టం సెక్షన్‌ 84 ప్రకారం ప్రజల అవసరాలను తీర్చలేనపుడు మందు అందుబాటులో లేకపోతే, మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, స్ధానిక మార్కెట్‌ లో అందుబాటులో లేకపోతే పెటెంట్‌ ఆఫీసర్‌ స్ధానిక ఉత్పత్తి దారునికి తప్పనిసరిగా లైసెన్సును ఇవ్వవచ్చు. ఛాలా తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించవచ్చు. పేటెంట్‌ చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. కానీ శక్తివంతమైన, దుర్మాగ్గమైన, నీతీ జాతీ లేని బహుళజాతి కార్పోరేట్‌ కంపెనీలకెదురొడ్డి నిలిచేదెవరు. సెక్షన్‌ 92 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చు . చాలా ఖర్చుపడి పరిశోధన జరిపినందుకు పేటెంట్‌ కంపెనీ కి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో వుంది.
2012 మార్చినెలలో ఇండియన్‌ పెటెంట్‌ ఆఫీసర్‌ పీ హెచ్‌ కురియన్‌ మొదటిసారి ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్‌ ఆర్డరును ఇచ్చి చరిత్రలో నిలిచారు. భారతదేశంలో నెలకు సరిపోయే ఆ నెక్సావార్‌ మందును రూ.8800కు అమ్మేటట్లుగానూ బేయర్‌ కంపెనీకి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగా ఇండియన్‌ పేటెంట్‌ యాక్ట్‌ 2005 క్రింద పేటెంట్‌ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది.
అంతకు ముందు నెలకు సరిపోయే ఆ మందును రూ 2లక్షల80 వేలకు విక్రయించే వారు.
ఇపుడు ఉపయోగిస్తున్న మందులన్నీ పాతవే. కోవిడ్‌-19 కి కాకపోయినా వైరస్‌ వ్యాధులైన సార్స్‌
( యస్‌.ఈ,ఆర్‌.యస్‌.), మెర్స్‌ ( ఎమ్‌.ఇ,ఆర్‌.యస్‌,), ఎబోలా, ఇన్‌ ఫ్లూయంజా. హెపటైటిస్‌-సీ, హెచ్‌.ఐ.వీ. వ్యాధుల కోసం అభివద్ధిచేశారు. కోవిడ్‌-19 ని కట్టడికి కొత్త మందులేవీ లేవు కనుగొనలేదు కాబట్టి పాత మందులను కారుణ్య కారణాలతో అనుమతిస్తున్నారు. పాత మందులకు కొత్త ఇండికేషన్స్‌, రీ పర్పస్‌ అంటే నూతన ప్రయోజనాలను, ఉపయోగాలను కనుగొని, క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి పాత పేటెంట్‌ మందులను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నది.
వంద సంవత్సరాలక్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు భారత ప్రజలు 1 కోటి 70 లక్షల మంది మరణించారు. ప్రపంచంలో 10 కోట్ల మంది చనిపోయారని అంచనా. గంగా నది శవాలతో ఉప్పొంగిందంటారు. అమెరికాలో మూతికి మాస్క్‌ ధరించని వ్యక్తులకు 100 డాలర్ల జరిమానాను వందసంవత్సరాలనాడే విధించారు. కానీ ఈనాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నేను మాస్క్‌ ధరించనన్నాడు. మాస్క్‌ ధరించటం కంపల్సరీ చేయనన్నాడు. ప్రపంచం కరోనా కేసుల లెక్కలలో అమెరికాకు ప్రధమ స్ధానాన్నిసాధించాడు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనోరొ కూడ మాస్క్‌ ధరించనన్నాడు. బ్రెజిల్‌ కు ద్వితీయ స్ధానాన్ని తేవటమే కాకుండా తను కొరోనా జబ్బు బారిన పడ్డాడు.
స్పానిష్‌ ఫ్లూ తరువాత అధికారంలోకి వచ్చిన శ్రామికవర్గ సోవియట్‌ సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం , ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం ( యూనివర్సల్‌ హెల్త్‌ ) అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శమయింది. అందరికీ విద్యనందించి ప్రజలకు ప్రాధమిక ఆరోగ్యసూత్రాలను నేర్పి చైతన్యపరచింది. ఆ ఒరవడిలో పయనిస్తూ ప్రపంచప్రజలందరి ఆరోగ్యం తన ధ్యేయంగా క్యూబా ముందుకెళ్తూవుంది. అందరికీ ఆరోగ్యం( యూనివర్సల్‌ హెల్త్‌ ) ఆచరించే దేశాలే కరోనా కట్టడి లో ముందున్నాయి. క్యూబా , వియత్నాం, న్యూజిలాండ్‌,కేరళ లాంటి చోట్ల ప్రజలను చైతన్యపరిచారు. రోగంగురించి ప్రజలకు తెలియచేశారు. ప్రభుత్వం ఏంచేస్తున్నదో ప్రజలేమి చేయాలో చెప్పారు. చెప్పింది చేశారు. ప్రభుత్వ నాయకులు- ప్రజలు సైంటిస్టుల మాటలను విన్నారు. తు.చ తప్పకుండా పాటించారు. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించారు.అందువలననే వియత్నాంలో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కేరళ రాష్టంలో ప్రభుత్వం-ప్రజలు ఒకటై మహమ్మారిని అదుపులో వుంచారు.

పేద ప్రజలకు మందులు, టీకాలు దొరుకుతాయా? మాస్కులతోనే ప్రాణాలను కాపాడుకోవాలా?

ఇపుడు సైన్స్‌ అభివధ్ధిచెందింది. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వైరస్‌ వలన జబ్బు పడిన వారిని త్వరగా టెస్టులు చేసి గుర్తిస్తున్నారు, అందుబాటులోవున్నమందులను ఉపశమనానికి ప్రతిభావంతంగా వాడుతున్నారు. వెంటిలేటర్‌ ద్వారా కత్రిమంగా ప్రాణవాయువును అందించి ప్రాణాన్ని నిలుపుతున్నారు. ఈ లోగా శరీరం తన రోగనిరోధకశక్తితోనూ, ఉపశమన మందుల ప్రభావంతోనూ, మెరుగైన. వైద్యసేవలతోనూ బతికిబయటపడుతున్నారు. చనిపోయేవారిసంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వంద సంవత్సరాలనాడు స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు మాస్కు ధరించి, భౌతికదూరం పాటించి, రోగనిరోధక శక్తివున్నవారే బతికి బట్టకట్టారు. ఇపుడు కూడా మందులున్నా లేకపోయినా కరోనా రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
1) మాస్క్‌ ఖచ్చితంగా ధరించాలి. 2) ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి,3) సబ్బుతో చేతులు కడుక్కోవాలి.4) ఉన్నంతలో సమీకత పౌష్టికాహారం తీసుకోవాలి.5) శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి.

ఎబోలా, హెచ్‌ ఐ వీ, ఏవియన్‌ ఫ్లూ, నిఫా, స్వైన్‌ ఫ్లూ, సార్స్‌, మెర్స్‌, ఈ వ్యాధులన్నిటికీ మూలం పూసలో దారంలాగా వున్న రహస్యాన్ని గమనించాలి. వన్యజీవులనుండి మానవులకు సంక్రమిస్తున్నజూనోటిక్‌ వ్యాధుల్లో అది దాగివున్నది. ఈ రకమైన వైరస్‌ వ్యాధులతో 1981 నుండి 3 కోట్ల మంది మరణించారు. అడవి లో వుండే వైరస్‌,లేడి,జింక,కోతి, ఏనుగు లాంటి ప్రాణులు మామూలుగా మనుష్యుల మధ్య వుండవు. సహజ వనరుల కోసం అడవులను నరకటం, కొండలను తవ్వటం, భూమిపొరలలో దాగున్న చమురు ను పిండటం లాంటి చర్యల వలన జీవసమతుల్యత నాశనమయి వైరస్‌ లు మానవ నివాసాలవద్దకుచేరుతున్నాయి. అభివద్ది పేరున జరుగుతున్న పర్యావరణ విధ్వంస వలన వైరస్‌లు , వన్యజీవులు స్ధానభ్రంశం చెంది మరొక నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో మనిషిలో చేరిన వైరస్‌లు అల్లకల్లోలం సష్టించి మానవ వినాశనానికి కారణమౌతున్నాయి.
ధనం-లాభం-పెట్టుబడి-ధనం, తప్ప మరే విలువలూ లేని పెట్టుబడి దారీ వ్యవస్ధలో భూమాత ముడిపదార్ధాల గనిగా , మనుష్యులు వినియోగదారులుగా . కార్మికుడు ఉత్పత్తిశక్తిగా మారారు. ప్రకతిని నాశనం చేసిన కార్పోరేట్‌ శక్తులు వ్యాధి అంటకుండా దూరంగా వుండగలరు. ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు. ఎంతఖరీదైనా మందులు వాడుకోగలరు. వాక్సిన్‌ రాగానే కొనుక్కోగలరు. జనాభాలో సగంపైగావున్నపేదప్రజలకు వైద్యం, మందులు, టీకాలు అందుతాయా? రెక్కాడితే డొక్కాడని పేదప్రజల ఉనికికే ప్రమాదం తెచ్చిన ఈ వ్యవస్ధ మార్పుకోసం పోరాడాలి. తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, వాక్సిన్‌ లను కంపల్సరీ లైసెన్సుక్రిందకు తెచ్చి ప్రజలందరికీ అందుబాటులోకి తేవటంకోసం ఆందోళన చేయాలి. సైన్సు ఫలితాలు అందరికీ అందేవరకూ పోరాడాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేతగా కూడా పని చేస్తున్నారు. ఫోన్‌-9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తత : అమెరికా-చైనా యుద్దానికి దారి తీస్తుందా !

14 Tuesday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#South China Sea, Mike Pompeo, south china sea conflict, War Drills In South China Sea


ఎం కోటేశ్వరరావు
దక్షిణ చైనా సముద్రంలో నౌకల స్వేచ్చా రాకపోకల పేరుతో అమెరికా యుద్ధానికి తలపడుతుందా? అమెరికా నౌకా దళాన్ని ఎదుర్కొనేందుకు చైనా అనివార్యంగా సాయుధ సమీకరణకు పూనుకోవాల్సి వస్తోందా ? ఇది ఏ కొత్త పరిణామాలకు నాంది కానుంది ? భారత్‌కు మద్దతుగా అమెరికా సైనిక బలగాలను తరలించిందా ? ఆ ప్రాంతంలో తలెత్తిన పరిణామాల ఫలితంగా వెలువడుతున్న అనేక ఊహాగానాలలో ఇవి కొన్ని మాత్రమే.
అమెరికాకు అగ్రాధిపత్యం అన్నది డోనాల్డ్‌ ట్రంప్‌ నినాదం. నవంబరులో ఎన్నికలంటూ జరిగితే తనకే అధికార పీఠం మరోసారి దక్కాలని కోరుతున్న ట్రంప్‌ ఓట్లకోసమే ఇదంతా చేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ రోజు రోజుకూ మరింతగా అమెరికాను చుట్టుముడుతోంది. మిన్నువిరిగి మీద పడ్డా తాను ముఖతొడుగు ధరించేది లేదని ఇన్నాళ్లూ భీష్మించుకున్న ట్రంప్‌ ఆపని కూడా చేసి జనాల కళ్లు కప్పేందుకు పూనుకున్నారు. దక్షిణ చైనా సముద్రం, ఆ ప్రాంతంలో ఉన్న సంపదలన్నీ తనవే అని చైనా బెదిరింపులకు దిగిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఈనెల పదమూడవ తేదీన ఒక ప్రకటనలో ఆరోపించాడు. తన తీరం నుంచి పన్నెండు నాటికల్‌ మైళ్లు(22కిలోమీటర్లు) దూరానికి ఆవల ఉన్నవాటి మీద అధికారం తనదే అని చైనా అంటే కుదరదని, మలేషియాకు దగ్గరగా చైనాకు 1,852 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేమ్స్‌ షావోల్‌ వంటి ప్రాంతాలు కూడా తనవే అని చైనా అంటోందని పాంపియో ఆరోపించాడు.
వాస్తవాలను, సముద్ర అంతర్జాతీయ చట్టాలను అమెరికా వక్రీకరిస్తోందని, పరిస్దితిని బూతద్దంలో చూపుతోందని చైనా విమర్శించింది. ఆ ప్రాంత దేశాలతో వివాదాలను నేరుగా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనేందుకు చైనా సిద్దంగా ఉన్నదని, వాటిలో అమెరికా లేదని పేర్కొన్నది. దక్షిణ చైనా సముద్రంలో పరిస్ధితి ప్రశాంతంగా ఉందని తెలిపింది.
ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికాకు ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ ఆ ప్రాంత దేశాల ప్రయోజనాల పేరుతో అమెరికా తన యుద్ద నావలను దక్షిణ చైనా సముద్రంలోకి దింపి రెచ్చగొట్టేందుకు పూనుకుంది. దాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా తన ప్రయత్నాలను తాను చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికాకు చెందిన అణుశక్తితో పనిచేసే రెండు విమాన వాహక యుద్ద నౌకలు ఉన్నాయి. మూడవది దారిలో ఉంది. ఇవిగాక నాలుగు యుద్ద నౌకలు పరిసరాల్లో సంచరిస్తున్నాయి. ఆ సముద్రంలోని పార్సెల్‌, స్పార్టలే దీవుల ప్రాంతంలో చైనా కృత్రిమ దీవులను నిర్మించి తరచూ పెద్ద ఎత్తున తన నౌకా దళ విన్యాసాలను నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలో తమ మిత్రదేశాల నౌకలు స్వేచ్చగా తిరిగేందుకు మద్దతుగా, ప్రాంతీయ భద్రత కోసమే తమ యుద్ద నౌకలు ఉన్నాయి తప్ప వేరే కాదని అమెరికా చెప్పుకుంటోంది. అమెరికా విమానవాహక, ఇతర యుద్ద నౌకల సంచారం తమ ప్రజావిముక్తి సైన్యానికి(చైనా మిలిటరీ) సంతోషం గలిగించేదేనని, క్షిపణులను కూల్చివేసే విమాన వాహక నౌకలతో సహా అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చైనా వ్యాఖ్యానించింది.ఈ ప్రాంతానికి చెందని వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్ని దేశాలు బల ప్రదర్శన చేస్తున్నాయని పేర్కొన్నది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం నుంచి నౌకలు, వైమానిక మార్గాల ద్వారా ఏటా ఐదులక్షల కోట్లడాలర్ల మేర వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా.
జూన్‌ నెలలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, జపాన్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. (జపాన్‌కు అధికారికంగా మిలిటరీ లేనప్పటికీ ఆత్మ రక్షణ దళాల పేరుతో ఉన్న వాటిని సాయుధం గావిస్తున్నది. ఏక్షణంలో అయినా పూర్తి మిలిటరీగా మార్చేందుకు వీలుగా ఉంది.)ఈనెల ఒకటి నుంచి ఐదు వరకు వార్షిక విన్యాసాల్లో భాగంగా చైనా సైనిక విన్యాసాలు నిర్వహించిన గ్జిషా(పార్సెల్‌) దీవుల చుట్టూ అమెరికా యుద్ద నౌకలు తిరుగుతున్నాయి. ఈ దీవులు, స్పార్టలే దీవులలో తమకూ వాటా ఉందని వియత్నాం, బ్రూనీ, ఫిలిప్పైన్స్‌, మలేషియా కూడా చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో చైనా సైనిక విన్యాసాల గురించి తాము దౌత్య పరమైన నిరసన తెలిపినట్లు ఈనెల రెండున వియత్నాం వెల్లడించింది. ఒక వేళ మిలిటరీ మధ్య ఘర్షణలు ప్రారంభమైతే అమెరికాకు మద్దతుగా జపాన్‌, ఆస్ట్రేలియా వస్తాయని, తమతో ఉన్న సంబంధాల రీత్యా వియత్నాం పాల్గొనకపోవచ్చని అయితే, తన అమెరికా సేనల రాకపోకలకు తమ సముద్ర ప్రాంతాన్ని అనుమతించవచ్చని చైనా అంచనా వేస్తోంది. ఏ దేశమూ పూర్తి విజయం సాధించలేదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో రాసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. చైనా తన భద్రత, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో సమతూకాన్ని పునరుద్దరించేందుకు చైనా చేయాల్సిందంతా చేస్తోందని కూడా తెలిపారు. కృత్రిమ దీవులలో కొద్ది వారాల క్రితమే రెండు పరిశోధనా కేంద్రాలను వాటికి మద్దతుగా రక్షణ, మిలిటరీ ఏర్పాట్లు కూడా చేసింది. తాము అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని చైనా చెబుతోంది.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు పనేమిటి అన్న ప్రశ్నకు మేము ఇక్కడ ఉన్నాం లేదా చైనా నౌకలను అడ్డుకొనేందుకు అని చెప్పటమే అని సింగపూర్‌కు చెందిన నిపుణుడు ఇయాన్‌ స్టోరే వ్యాఖ్యానించాడు.తమ యుద్ద నౌకలు నిర్దిష్టంగా ఎక్కడ ఉన్నాయి అన్నది వెల్లడి కాకుండా అమెరికా జాగ్రత్తలు తీసుకుంది. అయితే మలేషియా తీరానికి రెండు వందల నాటికల్‌ మైళ్ల దూరంలో అవి ఉండవచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటిని ఆస్ట్రేలియా ఫ్రైగేట్‌ పరమటా అనుసరిస్తున్నది. ముందుగా రూపొందించిన పధకం ప్రకారమే ఏడాది క్రితం నుంచి అది అమెరికా నౌకలను అనుసరిస్తున్నదని ఆస్ట్రేలియా మాజీ రక్షణ అధికారి జెన్నింగ్స్‌ చెప్పారు. ఆ ప్రాంతం మీద తమకు హక్కు ఉన్నట్లు మలేసియా, చైనా, వియత్నాం వాదిస్తున్నాయి. అమెరికా విమాన వాహక నౌక థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ ఈ ఏడాది ప్రారంభం నుంచే తిరుగుతున్నది, అయితే కరోనా వైరస్‌ కారణంగా ఒక నావికుడు మరణించటం, వందలాది మంది బాధితులుగా మారటంతో ప్రయాణం నిలిచిపోయింది. ఇతర అమెరికా యుద్ద నౌకల పరిస్ధితి కూడా అదే విధంగా ఉంది.
గాల్వాన్‌ లోయలో భారత-చైనా మిలటరీ వివాదం తరువాత భారత్‌కు మద్దతుగా తాముంటామని అమెరికా ముందుకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నావలు దానిలో భాగమే అన్నట్లుగా ఒక భాగం మీడియా చిత్రించింది. నిజానికి వాటికీ గాల్వాన్‌ లోయ వివాదానికి సంబంధం లేదు. అయితే ఆసియాలో ప్రాంతీయ శక్తిగా రూపొందాలంటే చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌ ముందుకు రావాలని అప్పుడు అమెరికా మద్దతు ఇస్తుందని, ఇందుకు గాను అమెరికా సాయం, సాంకేతిక పరిజ్ఞానం పొందితేనే సాధ్యమని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేసే ఒక అమెరికన్‌ సంస్ధ డైరెక్టర్‌ అపర్ణా పాండే రెండు వారాల క్రితమే సలహా ఇచ్చారు.
రెండవ ప్రపంచయుద్ద సమయంలో చైనా అత్యంత బలహీనమైన మిలిటరీతో ఉన్నది. జపాన్‌ దురాక్రమణనే అది ఎదిరించలేకపోయింది. ఇంతవరకు సముద్రంలో అమెరికా-చైనా నౌకా యుద్దంలో తారసిల్లిన ఉదంతం లేదు.అమెరికా ఒక మిలిటరీ శక్తిగా ఇప్పటికీ అగ్రస్ధానంలో ఉన్నప్పటికీ ప్రాంతీయ యుద్దాలలో దానికి చావుదెబ్బలు తగిలాయి తప్ప విజయాలేమీ లేవు. కొరియా యుద్దంలో చైనా సత్తా ఏమిటో అమెరికాకు తెలిసి వచ్చింది. అప్పటితో పోల్చుకుంటే ఎంతో బలపడిన చైనాతో ఇప్పుడు తలపడుతుందా అన్నది ఒక ప్రశ్న. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత దశాబ్దిలో చైనా వైమానిక, నౌకాదళంలో చోటు చేసుకున్న మార్పులు, బలం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. అయితే చైనాకు పెద్దగా యుద్ద అనుభవం లేదు, అందువలన దానికి బలం ఉన్నా తామే పైచేయి సాధిస్తామని అమెరికా అనుకుంటోంది. అమెరికా పెద్ద ఆర్దిక శక్తిగా ఉన్నా వేల మైళ్ల దూరం నుంచి చైనాను ఎదుర్కొని తమను ఆదుకొంటుందని ఆసియా ప్రాంత దేశాలు భావించటం లేదు. అందువల్లనే అటుచైనా ఇటు అమెరికా వైపు మొగ్గేందుకు జంకుతున్నాయని చెప్పాలి. దానికి తోడు అనేక దేశాలతో ఇటీవలి కాలంలో చైనా కుదుర్చుకున్న ఒప్పందాలు, మిలిటరీ కేంద్రాల ఏర్పాటును చూసిన తరువాత అమెరికాను నమ్మి ప్రస్తుతానికైతే ఘర్షణ పడేందుకు సిద్దంగా లేవు. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా ఎన్ని యుద్ద నావలను దించిందో దాని ధీటుగా చైనా బలగాలు కూడా ఉన్నాయని, పరిస్ధితి ఎంత పోటా పోటీగా ఉందంటే ఒక సందర్భంలో చైనా నావకు అత్యంత సమీపానికి అమెరికా నావ వచ్చినపుడు రెండువైపులా ఎంతో సంయమనం పాటించినట్లు ఒక చైనా మిలిటరీ అధికారి వెల్లడించారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో కూడా అమెరికా రెచ్చగొడుతున్న తీరును దాని తెగింపుకు నిదర్శనమని చైనా భావిస్తోంది. మన దేశంతో చైనా సరిహద్దు వివాదం ప్రారంభంగాక ముందే ఏప్రిల్‌, మే నెలల్లోనే దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికన్‌ నౌకల రాక ప్రారంభమైంది. సాధారణంగా కొన్ని నెలల ఏర్పాట్ల తరువాత గానీ అలాంటివి చోటు చేసుకోవు. అయితే ఈ నౌకల రాక నేపధ్యంలోనే మే నెలలో చైనాాభారత సరిహద్దు వివాదం చెలరేగటం వెనుక ఆంతర్యం ఏమిటన్నది సమాధానం లేని సందేహమనే చెప్పాలి.
అమెరికాాచైనా మధ్య పెరుగుతున్న వివాదం వివాదాస్పద దీవుల విషయంలో తాము చైనా మీద వత్తిడి తీసుకురాగలమని, ఆ పరిస్ధితి తమకు ప్రయోజనకరమే అని కొన్ని దేశాలు భావించవచ్చు గానీ అదే సమయంలో అవి యుద్దాన్ని కోరుకోవటం లేదు. ప్రపంచ వ్యాపితంగా కరోనా తెచ్చిన ఆర్ధిక సంక్షోభ భయం కూడా దీనికి తోడవుతున్నది కనుక అంతగా ఉత్సాహంగా లేవు. ప్రస్తుత పరిస్ధితుల్లో యుద్దం తమకు లాభమా నష్టదాయకమా అన్న అమెరికా యుద్ద పరిశ్రమల అంచనాను బట్టి కూడా పరిణామాలు ఉంటాయి. కరోనా వైరస్‌ సమస్యతో తీవ్ర ఆర్ధిక వడిదుడుకులకు గురైన చైనా అనివార్యమై అమెరికాను ఎదుర్కొనేందుకు తన జాగ్రత్తలు తాను తీసుకొంటోంది తప్ప యుద్ధానికి అది కూడా సిద్దం కాదనే చెప్పాలి.
సంచలనాత్మక కథనాలతో వీక్షకులను, పాఠకులను పెంచుకొనేందుకు మీడియా రాస్తున్న, చూపుతున్న కథనాలు, కొందరి విశ్లేషణలను చూస్తే ముంగిట యుద్దం ఉన్నదా అనే భ్రమ కలుగుతోంది. ఇప్పుడున్న స్ధితిలో కరోనా, దానితో కలసి వస్తున్న ఆర్ధిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అని ప్రతి దేశ పౌరుడూ ఎదురు చూస్తున్న తరుణంలో ఎవరైనా యుద్ధాన్ని కోరుకుంటారని అనుకోజాలం. అలాంటి యుద్దోన్మాదం, ఉన్మాదులను సమాజం సహించదు. ట్రంప్‌ సర్కార్‌ ఎంతగా రెచ్చగొట్టినా అది అధ్యక్ష ఎన్నికల లబ్ది కోసమే అన్నది బలమైన అభిప్రాయం, అందువలన ప్రస్తుతం యుద్దం వచ్చే అవకాశాలు పరిమితమే అని చెప్పవచ్చు.యుద్ద భేరీలు, నాదాలు చేసినంత మాత్రాన, మీడియా రెచ్చగొట్టుళ్లతో యుద్ధాలు జరగవు. అవన్నీ ఎత్తుగడల్లో భాగం కూడా కావచ్చు. అయితే సామ్రాజ్యవాద దేశాల తీరుతెన్నులను చూస్తే తాము సంక్షోభంలో పడినపుడు దాన్ని జనం మీద, ఇతర దేశాల మీద నెట్టివేసేందుకు యుద్ధాలకు పాల్పడినట్లు చరిత్ర చెబుతోంది. అందువలన అమెరికా ఆంతర్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాజ్‌పేయిని అవమానిస్తున్న బిజెపి-సిక్కింను భారత్‌ ఆక్రమించిందా !

11 Saturday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

AB Vajpayee, Five fingers of Tibet, RSS Outfits anti china feets, Sikkim, Sikkim annexation facts, Tibet


ఎం కోటేశ్వరరావు
టిబెట్‌ దలైలామా : అమెరికా వదిలించుకుంది-భారత్‌ తగిలించుకుంది ! అనే శీర్షికతో నేను రాసిన విశ్లేషణ మీద సామాజిక మాధ్యమంలో సంఘపరివార్‌ శక్తులు తూలనాడాయి. వారికి ఏకత, శీలము, సభ్యతలపై ఇచ్చిన ”శిక్షణ ” అలాంటిది మరి. వారు తిడుతున్నది నన్ను కాదు వారి గౌరవనీయ నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయిని అని తెలియని అజ్ఞానంతో ఉన్నారని చెప్పాలి. టిబెట్‌ స్వయం పాలిత ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తిస్తూ 2003లో ప్రధాని వాజ్‌పాయి-చైనా ప్రధాని వెన్‌ జియాబావో ఒప్పందం మీద సంతకాలు చేశారని తెలుసా ! అని గుర్తు చేసిన తరువాత ఎవరు చేసినా తప్పే అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అనేక దేశాలలో ఉన్న పరిస్ధితులకు అనుగుణ్యంగా స్వయం పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. టిబెట్‌తో సహా ఐదు స్వయం పాలిత ప్రాంతాలు చైనాలో ఉండగా, మన దేశంలో త్రిపుర స్వయంపాలిత గిరిజ ప్రాంతం, గూర్ఖాలాండ్‌(డార్జిలింగ్‌) వంటివి పది ఉన్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వం టిబెట్‌ను లాంఛనంగా చైనాకు చెందినదిగా గుర్తిస్తే, అదే ఒప్పందంలో సిక్కిం మన దేశంలో అంతర్భాగమని చైనా గుర్తించిన చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు టిబెట్‌ సమస్యను తిరగదోడటం, దాన్ని తురుపు ముక్కగా వాడుకోవాలని బిజెపి మేథావి శేషాద్రి చారి సలహా ఇవ్వటాన్ని, ఐదు వేళ్ల పేరుతో సిక్కింను స్వాధీనం చేసుకొనేందుకు చైనా పూనుకొన్నదని ప్రచారం చేయటాన్ని ఏమనాలి. సదరు పెద్ద మనిషి 2003లో వాజ్‌పాయి ప్రధానిగా చైనాతో ఒప్పందం చేసుకున్నపుడు ఆర్‌ఎసెస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకుడిగా ఉన్నారు. ఆయనకు వాస్తవాలేమిటో తెలియవా ? ఎవరి పాటకు అనుగుణ్యంగా వారు ఈ నృత్యం చేస్తున్నట్లు ? వాజ్‌పారు అంత అమాయకంగా, సంఘపరివార్‌ అనుమతి లేకుండానే చైనాతో ఒప్పందం చేసుకున్నారని భావించాలా ? ఒక వేళ అనుమతి లేకపోతే ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి వాజ్‌పాయి ఒప్పందాన్ని ఆనాడే బహిరంగంగా ఎందుకు ఖండించలేదు? తిరగదోడాలనుకుంటే దానికి కారణాలేమిటో చెప్పి ఆ పని చేయవచ్చు. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీకి ఇదొక లెక్కా !
వాజ్‌పేయి చైనా పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందం సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో భారత గడ్డమీద టిబెట్‌ నుంచి పారిపోయి వచ్చిన వారు సాగించే చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించేది లేదని స్పష్టంగా ఉంది. అదే ఒప్పందంలో బౌద్ద దలైలామా (టిబెట్‌ అధినేతగా కాదు ) స్ధితి యథాతధంగా కొనసాగుతుందని కూడా పేర్కొన్నారు. ఆ కారణంగానే దలైలామా మన దేశంలో ఇప్పటికీ ఉండగలుగుతున్నారు.టిబెట్‌లో ఏమి జరిగిందో పైన పేర్కొన్న వ్యాసంలో వివరించిన కారణంగా ఇంతకు మించి చెప్పనవసరం లేదు. టిబెట్‌ చైనాలోని స్వయం పాలిత ప్రాంతం అంటే దాని అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోకూడదని అర్ధమంటూ కొందరు స్వయం సేవకులు విపరీత టీకా తాత్పర్యాలు చెబుతున్నారు. అదే సూత్రం మన దేశంలోని స్వయం పాలిత ప్రాంతాలకూ వర్తిస్తుందా ? నిర్ధిష్ట అంశాలకు సంబంధించి ఆయా ప్రాంతాల పాలక మండళ్లకు ఆయా దేశాల రాజ్యాంగం ప్రకారమే అధికారాలు ఇచ్చారు. వాటిలో ఆయా రాష్ట్రాల లేదా కేంద్ర ప్రభుత్వం రోజువారీ జోక్యం చేసుకోకూడదు, దాని అర్ధం అక్కడ ఉగ్రవాదం, వేర్పాటువాదం, ఇతర అవాంఛనీయ పరిణామాలు జరిగినా జోక్యం చేసుకోకూడదని కాదు.
టిబెట్‌ చరిత్రను చూసినపుడు చైనా పాలకులకు సామంత రాజ్యంగా లేదా స్వయంపాలిత ప్రాంతంగా ఉండటం తప్ప ఎన్నడూ స్వతంత్ర రాజ్యంగా లేదు. సిక్కిం విషయం అలా కాదు. అది బ్రిటీష్‌ వారు మన దేశాన్ని, ఆక్రమించే సమయానికే స్వతంత్ర రాజ్యంగా ఉంది. అంతకు ముందు నుంచే సిక్కిం పాలకులకు నేపాల్‌, భూటాన్‌ రాజులతో వైరం ఉంది. దాంతో నేపాల్‌ నుంచి రక్షణ పొందేందుకు గాను సిక్కిం రాజు బ్రిటన్‌తో ఒప్పందం చేసుకొని దాని రక్షణ దేశంగా ఉండేందుకు అంగీకరించారు. బ్రిటీష్‌ వారు మన దేశం నుంచి వెళ్లిపోయిన సమయంలో సిక్కిం స్వతంత్ర రాజ్యం. అయితే మన నాయకులు ఇతర సంస్ధానాలను విలీనం చేసుకున్న సమయంలో సిక్కింను కూడా విలీనం కమ్మని అడిగారు. అక్కడి రాజు అంగీకరించలేదు. దాంతో 1950లో భారత రక్షిత రాజ్యం లేదా సామంత రాజ్యంగా ఉండేట్లు ఒప్పందం కుదిరింది.
1962లో చైనాతో సరిహద్దు వివాదం తరువాత మన దేశ సహకారంతో చైనాకు వ్యతిరేకంగా సిఐఏ కార్యకలాపాలు ప్రారంభించింది. 1964లో చైనా తొలి అణుపరీక్ష జరిపింది. దాంతో చైనా మీద నిఘావేయాలని నిర్ణయించిన అమెరికన్‌ సిఐఏ మన ప్రభుత్వాన్ని సంప్రదించింది. చైనా మీద ఉన్న కోపంతో అది మన ప్రయోజనాలకూ నష్టమే అనే ముందు చూపు లేకుండా అంగీకరించింది. ఇంటిలిజెన్స్‌ బ్యూరో అధికారి కెప్టెన్‌ మన్మోహన్‌ సింగ్‌ కోహ్లి ఆధ్వర్యంలో సిఐఏ అధికారులతో కలసి హిమాలయాల్లోని నందదేవి శిఖరం మీద అణుశక్తితో పని చేసే ఒక గూఢచార పరికరాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఎలా అమర్చాలో 1965 జూన్‌ 23న అమెరికాలోని అలాస్కా మౌంట్‌ మెకెన్లీ శిఖరం మీద ట్రయల్‌ వేసి తరువాత నందదేవి మీద పెట్టేందుకు తీసుకుపోయారు. అయితే వాతావరణం అనుకూలించకపోవటంతో దాన్ని అక్కడే వదలి వెనక్కు వచ్చారు. తరువాత దాన్ని అమర్చేందుకు 1966లో వెళ్లినపుడు ఎక్కడుందో కనపడలేదు, 1967లో కూడా వెతికారు, చివరకు 1968లో దాని మీద ఆశవదులుకున్నారు. ఉష్ణోగ్రతను ఎక్కువగా వెలువరించే పరికరం మంచులో కూరుకుపోయినపుడు రాయి తగిలేంతవరకు లోపలికి పోతూనే ఉంటుందని, ఆ అణుపరికరం వంద సంవత్సరాలు ప్రభావం చూపుతుందని, అది రిషి గంగలో కలిస్తే నీరు కలుషితమై జనం మరణించే అవకాశం కూడా ఉందని అయితే, ప్రధాన గంగా జలాల్లో కలిస్తే నీరు కలుషితం అవుతుంది, కొందరు ఇబ్బంది పడవచ్చు తప్ప ప్రాణాలు తీస్తుందని తాను అనుకోవటం లేదని ఢిల్లీలో నివసిస్తున్న 88 ఏండ్ల నాటి కెప్టెన్‌ మన్మోహన్‌ సింగ్‌ కోహ్లీ చెప్పినట్లు 2018 ఆగస్టు పదిన ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఇప్పటికీ దాన్ని వెతికితే ఉపయోగమే అని, ఇదంతా తాము దేశం కోసమే చేశామని సింగ్‌ చెప్పారు. ఉత్తరా ఖండ్‌ పర్యాటకశాఖ మంత్రి సత్పాల్‌ మహరాజ్‌ ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకు వచ్చి నీటి కాలుష్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరికరాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ రాసింది. ఇక్కడ దీని ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అదే అమెరికా సిఐఏ సిక్కింలో పాగా వేసి మన దేశం, చైనాను రెండింటినీ దెబ్బతీసేందుకు కూడా పధకం వేసింది.
హౌప్‌ కోక్‌ అనే కుర్రదాన్ని సిక్కిం పన్నెండవ రాజు(చోగ్యాల్‌) పాల్డెన్‌ తొండుప్‌ నామగ్యాల్‌కు ఎరగా వేసి, చివరికి 1963లో వివాహం చేసి సిక్కిం యువరాణిగా ప్రకటించారు.డార్జిలింగ్‌లోని ఒక హౌటల్‌లో హౌప్‌ కలిసే నాటికి చోగ్యాల్‌ వయస్సు 36, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది, భార్యతో విడాకులు తీసుకొని ఉన్నాడు. వివాహమైన తరువాత తన సిఐఏ బంధు గణాన్ని హౌప్‌ సిక్కింకు రప్పించింది. భారత రక్షిత రాజ్యాలుగా ఉన్న సిక్కిం, భూటాన్‌లను స్వతంత్ర రాజ్యాలుగా మార్చేందుకు పూనుకున్నారు.1971లో భూటాన్‌ ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటం జరిగింది. పోరాడుతున్న వారికి మద్దతుగా మన దేశం మిలిటరీని దించింది. దాంతో పాకిస్ధాన్‌కు మద్దతుగా తమ సప్తమ నౌకాదళాన్ని పంపుతున్నట్లు అమెరికా బెదిరించింది. ఈ పరిణామం తరువాత మన దేశం నాటి సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొని పాక్‌ మిలిటరీతో తలపడి బంగ్లా విముక్తికి చేయాల్సింది చేసింది. ఈ పూర్వరంగంలో సిక్కింలో సిఐఏ కార్యకలాపాలు, సిక్కిం కూడా స్వతంత్ర రాజ్యంగా ఐక్యరాజ్యసమితిలో చేరితే అక్కడ అమెరికన్లు తిష్టవేసి మనకు ప్రమాదకరంగా మారతారనే ముందు చూపుతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న చర్యలతో సిక్కింలో రాజుకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వచ్చారు. వారి వెనుక మన ”రా” గూఢచారులు ఉన్నారు. సిక్కింలో రాజు బౌద్దమతస్ధుడు. మెజారిటీ జనాభా నేపాలీ హిందువుల వారసులు. రాజు తమ పట్ల వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం ఉండటాన్ని ఆసరాగా తీసుకొని సిక్కిం విలీనానికి 1971లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ 1975వరకు అది సాధ్యం కాలేదు.
ప్రజల వత్తిడికి తట్టుకోలేక 1974 ఏప్రిల్‌ సిక్కిం రాజు పార్లమెంట్‌ ఎన్నికలు జరిపాడు. వాటిలో మన దేశంతో స్నేహాన్ని కోరుకొనే సిక్కిం జాతీయ కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆ తీర్పును ఆమోదించేందుకు రాజు తిరస్కరించి అణచివేతకు పూనుకున్నాడు.అయితే మేనెలలో పార్లమెంట్‌ ఒక చట్టాన్ని చేసి భారత్‌తో మరింత సన్నిహితంగా ఉండాలని తీర్మానించింది. తరువాత జూలై నెలలో సిక్కిం కొత్త రాజ్యాంగాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. దాని ప్రకారం సిక్కిం భారత్‌లో ఒక రాష్ట్రంగా చేరేందుకు వీలు కలిగింది. మన దేశ వత్తిడితో రాజు దాన్ని ఆమోదించకతప్పలేదు.సెప్టెంబరు నాలుగున మన పార్లమెంట్‌ సిక్కింను సహ రాష్ట్రంగా ఆమోదిస్తూ ఒక తీర్మానం చేసింది. అదే వారంలో సిక్కిం రాజు దీని మీద ప్రజాభిప్రాయాన్ని కోరాడు.1975 మార్చినెల ఐదున సిక్కిం పార్లమెంట్‌ మరోసారి భారత్‌తో అనుసంధానాన్ని కోరింది. తిరిగి రాజు ప్రజాభిప్రాయాన్ని కోరాడు. మన దేశంతో విలీనాన్ని కోరుకొనే నేతలను హత్య చేయించేందుకు రాజు ఆదేశించినట్లు ఉప్పందటంతో ఏప్రిల్‌ తొమ్మిదిన మన మిలిటరీ గ్యాంగ్‌టక్‌లో ప్రవేశించి అక్కడి సాయుధ దళాలను నిరాయుధులను గావించి, రాజును గృహనిర్బంధంలో ఉంచింది.ఏప్రిల్‌ 14న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 97.55 శాతం మంది భారత్‌లో విలీనానికి అనుకూలంగా ఓటు వేశారు. దాంతో నాటి సిక్కిం ముఖ్యమంత్రి భారత ప్రధాని ఇందిరాగాంధీకి ఒక వినతిని పంపుతూ విలీనానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్‌ 26న మన పార్లమెంట్‌ ఒక రాజ్యాంగ సవరణను ఆమోదించి సిక్కింను 22 రాష్ట్రంగా ఆమోదించింది. మే 15న రాష్ట్రపతి ఆమోద ముద్రవేసి సిక్కింలో రాజరికానికి స్వస్తి పలికారు. సిక్కిం ప్రజాభిప్రాయం సక్రమంగా జరగలేదని, భారత్‌ దాన్ని ఆక్రమించుకుందని కొందరు విమర్శించారు. తరువాత ప్రధాన మంత్రి అయిన మొరార్జీ దేశారు సిక్కిం విలీనం అనైతికం, అన్యాయం అని వ్యాఖ్యానించారు. అయితే వ్యవహారం మొత్తం సిక్కింలోనూ, మనదేశంలోనూ చట్టబద్దంగానే జరిగింది. నాడు ఇందిరగాంధీ ఆపని చేయనట్లయితే సిక్కిం ఒక స్వతంత్ర రాజ్యంగా అమెరికా చేతిలోకి పోయి ఉండేది. మన నెత్తిమీద కూర్చొని మనకూ అటు చైనాకూ ముప్పు తెచ్చి ఉండేదన్నది జగమెరిగిన సత్యం.
అయితే మన దేశంతో నాడున్న విబేధాల నేపధ్యంలో భారత్‌ చర్యను చైనా తప్పు పట్టింది. సిక్కిం విలీనాన్ని గుర్తించేందుకు నిరాకరించింది.2003లో జరిగిన భారత్‌-చైనా ఒప్పందాల ప్రకారం సిక్కింను భారత ప్రాంతంగా చైనా గుర్తించింది. అదింకేమాత్రం రెండు దేశాల మధ్య వివాదాస్పదం కాదని చైనా ప్రధాని వెన్‌ జియాబావో 2005లో ప్రకటించాడు. ఆ ఒప్పందంలోనే టిబెట్‌ను చైనా అంతర్భాగంగా మన దేశం గుర్తించింది. ఇప్పుడు బిజెపి నేతలు కొందరు టిబెట్‌ సమస్యను తిరగదోడటం, ఐదువేళ్ల ఆక్రమణ అంటూ ప్రచారం చేయటం, దలైలామా పేరుతో రాజకీయాలు చేయాలని చూడటం వలన ప్రయోజనం ఉందా ? ఎవరి తరఫున ఎవరికోసం పని చేస్తున్నట్లు ? సద్దుమణిగిన వివాదాన్ని తిరిగి రేపటం, మిగిలి ఉన్న వివాదం మరింత సంక్లిష్టం కావటానికి దోహదం చేయదా ? కాశ్మీర్‌ సమస్యపై తనకు పాకిస్ధాన్‌ మిత్రదేశంగా ఉన్నపుడు ఒక వైఖరి, ఇప్పుడు మన దేశం తన కౌగిల్లోకి వచ్చింది కనుక మరొక వైఖరితో వ్యవహరిస్తున్నది అమెరికా. టిబెట్‌ విషయంలో కూడా తమకు చైనా దగ్గర అవుతుంది అనుకున్నపుడు దాన్ని వదలివేసింది. ఎప్పుడైతే చైనాయే తనకు ఏకు మేకైందని గ్రహించిందో అప్పటి నుంచి పరోక్షంగా టిబెట్‌, ఇతర అంశాల మీద అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. అందువలన దాని పాటకు అనుగుణ్యంగా మనం నృత్యం చేయటమా ? చైనాతో సహా అనేక అంశాలపై స్వతంత్ర వైఖరిని అనుసరించటమా అన్నది తేల్చుకోవాలి. ఎప్పుడైతే మనం అమెరికాకు దగ్గర అవుతున్నామో అదే సమయంలో పాకిస్ధాన్‌ చైనాకు దగ్గర అయింది. అందువలన కాశ్మీరు, ఇతర వ్యవహారాల గురించి చైనాలో మార్పులు ఉంటున్నాయి. చైనా వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకున్నా, మన వ్యవహారాల్లో చైనా అదే తప్పు చేసినా వివాదాలు పరిష్కారం గావు. అలా రావణాకాష్టంలా మండుతూనే ఉంటే తాము లబ్ది పొందవచ్చన్న అమెరికా గుంటకాడ నక్కలా కూర్చుంది. దానికి అవకాశం ఇద్దామా ? విజ్ఞులు ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

టిబెట్‌ దలైలామా :అమెరికా వదిలించుకుంది- భారత్‌ తగిలించుకుంది ‌ !

10 Friday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

14th Dalai Lama, Dalai Lama, Five fingers of Tibet, Tibet


ఎం కోటేశ్వరరావు


బిజెపి నేత, ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ” ఆర్గనైజర్‌ ” మాజీ సంపాదకుడు శేషాద్రి చారి (లడఖ్‌ ఉదంతం జరగక ముందు ) డెబ్బరు సంవత్సరాలుగా టిబెట్‌ సందిగ్దత, నెహ్రూ చేయలేనిదానిని మోడీ చేయగలరు అంటూ జూన్‌లో ఒక విశ్లేషణ రాశారు. టిబెట్‌ కుడి అరచేతికి ఉన్న సిక్కిం, భూటాన్‌, నేపాల్‌, లడఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ అనే ఐదు వేళ్లను ఆక్రమించాలని చైనా నేత గ్జీ జింపింగ్‌ కోరుతున్నారంటూ ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచంలో చైనా వ్యతిరేకత కనిపిస్తోందని, మన దేశం టిబెట్‌ తురుపు ముక్కను వినియోగించుకోవాలని నరేంద్రమోడీకి సలహా ఇచ్చారు. టిబెట్‌ స్వాతంత్య్రాన్ని గుర్తించాలని, దలైలామాకు భారత రత్న ఇవ్వాలన్నది మొత్తం వ్యాస సారాంశం.
టిబెట్‌ను చైనా నుంచి వేరు చేసి అక్కడ పాగా వేసి మన దేశాన్ని, చైనాను దెబ్బతీయాలని చూసింది అమెరికా. అందుకు గాను బౌద్దమత నేత, అధికారాన్ని చెలాయించే దలైలామాను తిరుగుబాటుకు రెచ్చగొట్టటమే కాదు, అనుచరులకు ఆయుధాలిచ్చి విఫల తిరుగుబాటు చేయించింది. విధిలేని స్ధితిలో కొత్త ఎత్తుగడల్లో భాగంగా దలైలామాను వదిలించుకున్న అమెరికన్లు చైనాతో సయోధ్యకు వచ్చారు. ఐక్యరాజ్యసమితిలో అసలైన ప్రతినిధిగా కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు దిగి వచ్చారు. అలాంటి దలైలామాను మనం తలకెక్కించుకొన్నాం. దీంతో సాధించేదేమిటి ? గుడ్డి చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత జబ్బుతో ప్రేలాపనలు తప్ప అంత పెద్ద అమెరికాయే వదలి పెట్టిన టిబెట్‌ సమస్యను తురుఫు ముక్కగా వాడు కోవటం ఏమిటి ? పర్యవసానాలను ఆలోచించే, అసలు ఆట తెలిసిన వారు ఇచ్చే సలహాయేనా ఇది !
టిబెట్‌ తిరుగుబాటుదార్లను సృష్టించి వారికి ఆయుధాలు, శిక్షణ ఇచ్చిన వారిలో ఒకడైన సిఐఏ అధికారి జాన్‌ కెన్నెత్‌ నాస్‌ రాసిన పుస్తకంలో 1950దశకం నుంచి రెండున్నర దశాబ్దాల పాటు టిబెట్‌లో అమెరికా నిర్వాకం గురించి వివరించాడు. మావో జెడాంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టులను నిలువరించి సోషలిస్టు దేశంగా మారకుండా చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీ ప్రభుత్వం చైనాను కాపాడుతుందన్న అంచనాకు వచ్చిన అమెరికా, అది అసాధ్యమని చాలా ఆలస్యంగా గ్రహించింది. దాంతో దింపుడు కళ్లం ఆశ మాదిరి టిబెట్‌లో దలైలామాతో తిరుగుబాటుకు కుట్ర చేసింది. టిబెట్‌ సరిహద్దులోని నేపాల్‌ ముస్టాంగ్‌ కేంద్రంగా చేసుకొని సిఐఏ ఆయుధాలను అందచేసి తిరుగుబాటు దార్లను టిబెట్‌లోకి ప్రవేశ పెట్టేందుకు చేసిన ప్రయత్నాలను చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వమ్ము చేసింది.1969 వరకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేసింది. అమెరికన్ల మాటలు, అంచనాలను నమ్మి దలైలామా నాయకత్వంలోని తిరుగుబాటుదార్లు టిబెట్‌ను స్వాధీనం చేసుకుంటారని భావించిన నెహ్రూ, తరువాత అధికారానికి వచ్చిన లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరా గాంధీ కూడా టిబెటన్లకు సాయం చేశారు. చివరికి అది సాధ్యం కాదని అమెరికా చేతులెత్తేసింది. తిరుగుబాటుదార్లకు ఆశ్రయం కల్పించిన నేపాల్‌ కూడా చివరకు గెరిల్లాలు ఆయుధాలను అప్పగించి లొంగిపోవాలని వత్తిడి తీసుకు వచ్చింది.1974జూలై 23న విధిలేని పరిస్ధితుల్లో దలైలామా తన అనుచరులు లొంగిపోవాలని వర్తమానం పంపాడు. అయితే దాన్ని ఉల్లంఘించిన ఒక బృందం భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా నేపాలీ దళాలు హతమార్చాయి. దాంతో దలైలామా తిరుగుబాటు ముగిసినట్లయింది.
అప్పటికే అంటే 1970దశకం ప్రారంభం నాటికే అమెరికన్లు చైనాతో సయోధ్యకు వచ్చారు. ఐక్యరాజ్యసమితిలో కమ్యూనిస్టు చైనాను అనుమతించేందుకు అంగీకరించారు. కమ్యూనిస్టుల నాయకత్వంలోనిదే అసలైన చైనా అని, తైవాన్‌, టిబెట్‌తో సహా చైనా ఒక్కటే అని గుర్తించారు. కమ్యూనిస్టుల లాంగ్‌ మార్చ్‌లో అనేక విజయాలు సాధిస్తూ ఒక్కో ప్రాంతం మీద పట్టుసాధిస్తున్న సమయంలో రెండవ ప్రపంచ యుద్దం తరువాత చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని మిలిటరీకి నేపాల్‌, సిక్కిం, భారత్‌ ద్వారా టిబెట్‌ మీదుగా ఆయుధాలు చేరవేయాలని కొల్‌కతా రాయబార కార్యాలయం కేంద్రంగా అమెరికా పధకాలు వేసింది. టిబెట్‌ను ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించేందుకు అవసరమైన కుట్ర చేసింది. అయితే చాంగ్‌కై షేక్‌ దాన్ని అడ్డుకున్నాడు. టిబెట్‌లోని శక్తులు స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ అది చైనాలో టిబెట్‌ అంతర్భాగమే అనే వైఖరిని తొలి నుంచీ కొమింటాంగ్‌ పార్టీ తీసుకుంది. టిబెట్‌కు స్వాతంత్య్రం ప్రకటించితే తీరా కమ్యూనిస్టులను ఓడించి చాంగ్‌కై షేక్‌ చైనాపై ఆధిపత్యం సాధిస్తే ఆ స్వాతంత్య్రం నిలవదని అమెరికాకు తెలుసు. అందుకే తొందరపడలేదు. ఎప్పుడైతే కమ్యూనిస్టుల ఆధిపత్యానికి తిరుగులేదని, వారిని అడ్డుకొనే సత్తా కొమింటాంగ్‌ సేనలకు లేదని తేలిపోయిందో, టిబెట్‌ను కూడా విముక్తి చేసేందుకు కమ్యూనిస్టు దళాలు ప్రవేశించాయో అప్పుడు అమెరికన్లు టిబెట్‌కు స్వాతంత్య్రం, చైనా ఆక్రమణ వంటి ఆరోపణలతో తిరుగుబాటును రెచ్చగొట్టారు. ఇదంతా 1950 తరువాతే జరిగింది. అప్పటికి చైనాలో అనేక చోట్ల కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు తమ సంపూర్ణ అధికారాన్ని ఇంకా నెలకొల్పని స్ధితి ఉంది. ముందు ప్రధాన భూభాగంలో అధికారాన్ని స్ధిరపరచుకొని తైవాన్‌లో తిష్ట వేసిన చాంగ్‌కై షేక్‌ సేనల సంగతి చూడవచ్చని కమ్యూనిస్టులు భావించారు. ఈ నేపధ్యంలో తమ పని సులువు అవుతుందనే అంచనాతో అమెరికన్లు తమ కుట్రలతో ముందుకు పోయి భంగపడ్డారు.
అమెరికా పధకాలకు అనుగుణ్యంగా మన పాలకులు ద్వంద్వ వైఖరిని అనుసరించారు. టిబెట్‌ ప్రాంతంతో సహా చైనా ఒక్కటే అని గుర్తిస్తూనే అమెరికన్ల సలహామేరకు దలైలామాకు మతపెద్ద పేరుతో ఆశ్రయం కల్పించటం, ప్రవాస తిరుగుబాటు ప్రభుత్వం కొనసాగటానికి అనుమతి, వారి అవసరాలను చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అమెరికన్లు టిబెట్‌ సమస్యను ఐక్యరాజ్యసమితిలో చర్చనీయాంశంగా చేసేందుకు సర్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మానవహక్కులకు భంగం కలుగుతోందనే పేరుతో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు.న్యూయార్క్‌, లండన్‌, జెనీవాలలో కార్యాలయాల ఏర్పాటుకు దలైలామాకు సాయం చేశారు.
సోవియట్‌ యూనియన్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య 1960 దశకంలో తలెత్తిన వివాదాలను సాకుగా తీసుకొని చైనాతో చేతులు కలిపి సోవియట్‌ను దెబ్బతీయాలని అమెరికన్లు పధకం వేశారు. దానిలో భాగంగానే చైనాకు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపు, చైనాతో అమెరికన్లు దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారన్నది ఒక అభిప్రాయం. 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ బీజింగ్‌ పర్యటన జరిపాడు. ఇరు దేశాల చర్చలలో ఎక్కడా టిబెట్‌ ప్రస్తావన లేదు. అంతకు ముందు నిక్సన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసేందుకు విదేశాంగ మంత్రి హెన్రీకిసింజర్‌ రాక సమయంలో చైనా నాయకత్వం టిబెట్‌ అంశాన్ని కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. 1975లో డెంగ్‌సియావో పింగ్‌ తనదైన శైలిలో న్యూయార్క్‌లో దలైలామా ఒక చిన్న కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్లు విన్నాం అన్నట్లుగా అమెరికన్లతో ప్రస్తావించారట. అప్పుడు అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌ మాట్లాడుతూ టిబెట్‌కు సంబంధించినంత వరకు ప్రభుత్వ పరంగా మేము ఎలాంటి చర్యలనైనా వ్యతిరేకిస్తాం, మద్దతు ఇవ్వం. అంతే కాదు టిబెట్‌కు సంబంధించి భారతీయులు తీసుకొనే చర్యలను కూడా మేము సమర్ధించం అని స్పష్టం చేశాడు.దాంతో డెంగ్‌ నవ్వుతూ అయితే దలైలామా అక్కడ ఉండటం భారతీయులకు భారంగా మారుతుందన్నమాట అంటూ ఆ ప్రస్తావనను ముగించారు.
ఆ తరువాతే దలైలామా దూకుడు తగ్గించారు. దలైలామాను చైనాకు అనుమతించటం గురించి డెంగ్‌ సియావో పింగ్‌ మాట్లాడుతూ ఆయన చైనా పౌరుడిగా తిరిగి రావాలి, అదే దేశభక్తి అని చెప్పారు. అయితే ఎలాంటి షరతులు విధించకుండా ఉంటేనే తాను చైనా వెళతానని దలైలామా చెప్పారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం దలైలామాతో రాజకీయం చేయాలని చూస్తున్నది. దానివలన మన దేశానికి ఒరిగేదేమీ లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఒక పెద్ద బౌద్ధ కేంద్రం ఉన్న తవాంగ్‌ ప్రాంతం నుంచే దలైలామా టిబెట్‌ నుంచి పారిపోయి మన దేశంలో ప్రవేశించాడు. దలైలామా ఆ పట్టణాన్ని సందర్శించటాన్ని తాము అభ్యంతర పెడుతున్నామని చైనా మోడీ సర్కార్‌కు తెలియచేసింది. మక్‌మోహనరేఖ ప్రకారం తవాంగ్‌తో సహా కొన్ని ప్రాంతాలు తమ టిబెట్‌లోని దక్షిణ భూభాగాలని చైనా చెబుతున్నది. అయితే అవి ఎన్నడూ చైనాలో లేవు. చైనా అభ్యంతరాలను తోసి పుచ్చి అరుణాచల్‌పై ఆధిపత్యం మనదే అని స్పష్టం చేసే ప్రక్రియలో భాగంగా దలైలామా పర్యటనను మోడీ సర్కార్‌ ఏర్పాటు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సమస్యకు, దలైలామా పర్యటనకు ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నది ఒక అభిప్రాయం.
దలైలామా మన దేశంలో ఎంతకాలం ఉంటారు, కాందిశీకులుగా మనం గుర్తించని ఏ దేశానికీ చెందని వారిగా పరిగణిస్తున్న టిబెటన్లు ఎంతకాలం చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవిస్తారు ? వంటి సమస్యలు దలైలామా, ఆయన గణం ముందు ఉన్నాయి. ఎక్కువకాలం వారు బతకలేరన్నది వాస్తవం. టిబెట్‌ మీద చైనా సార్వభౌమత్వాన్ని అంగీకరించనంత వరకు వారి పరిస్ధితి అగమ్యగోచరమే. అమెరికా వదిలించుకున్న దలైలామాను కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పుడు బిజెపి పాలకులు తగిలించుకొని భుజాల మీద ఎక్కించుకొని మోస్తున్నారు. బిజెపి నేతలు మరొక అడుగు ముందుకు వేసి ఆయనకు భారత రత్న ఇవ్వాలని మోడీ సర్కార్‌కు వినతులు పంపారు. తమ చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను తమకు తామే సంతుష్టీకరించుకొనేందుకు తప్ప దీని వలన సాధించేదేమీ ఉండదని వారికి చెప్పినా ప్రయోజనం లేదు ! దలైలామాకు మద్దతు ఇచ్చిన సమయంలో అమెరికన్లు చెప్పిన మాటలు, సమాచారాన్ని ఇంకా వదలని సంఘపరివార్‌ శక్తులు ఆ పాతబడిన అంశాలనే పట్టుకు వేలాడుతుంటాయి. వాస్తవ, వర్తమానాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు.
అసాధ్యమైన అంశాన్ని తలకెత్తుకొని చైనాతో తలపడి సాధించేదేమిటి ? చైనాతో తలెత్తిన సరిహద్దు సమస్య వేరు, టిబెట్‌ వేరు. అరుణాచల్‌ ప్రదేశ్‌తో సహా సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిజంగానే కోరుకుంటే టిబెట్‌తో లంకె పెట్టటం తగని పని ? చైనా తిరుగుబాటు దారు దలైలామాకు, ఖలిస్ధాన్‌ లేదా వేర్పాటు కాశ్మీర్‌ పేరుతో విదేశాల్లో తిష్టవేసిన మన దేశ వేర్పాటు వాదులకు పెద్ద తేడా ఏముంది ? మత పెద్ద పేరుతో ఆశ్రయం కల్పించటమే ఒక తప్పిదం. ప్రతిదానికి జవహర్‌లాల్‌ నెహ్రూ విధానాన్ని విమర్శించే బిజెపి దలైలామా విషయంలో తప్పిదం చేసిన అదే నెహ్రూ బూట్లలో కాళ్లు పెట్టి నడవటం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d