• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: WAR

గడువుల పేరుతో అమెరికా అబద్దాలు – కొనసాగుతున్న ఉక్రెయిన్‌ ఉద్రిక్తత !

20 Sunday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#US Lies, Donbass, Joe Biden, Minsk agreements, NATO, RUSSIA, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి జరుపుతుంది, కాదు ఫిబ్రవరి 20వ తేదీన జరపనుంది, లేదు లేదు ఎప్పుడైనా డాడి జరపాలనే నిర్ణయించింది. ఇవన్నీ గత కొద్ది రోజులుగా అమెరికా చెబుతున్నమాటలు. ఇప్పటి వరకైతే జోబైడెన్‌ ఎత్తుగడ ఈ ఉదంతంలో అభాసుపాలైంది. చివరికి పశ్చిమదేశాలతో చేతులు కలిపిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోల్దోమిర్‌ జెలెన్‌స్కీ కూడా అసహనాన్ని వెలిబుచ్చాడు.” ఈ రోజు రష్యా దాడి చేస్తుంది, రేపు చేస్తుందీ అంటూ రోజుకొక తేదీని చెబుతారెందుకు ? మీరు నిజంగా మాకు సాయం చేయాలనుకుంటే తేదీలు చెప్పవద్దు. ఫిబ్రవరి 16, మార్చి ఒకటి, డిసెంబరు 31 ఏదైనా కావచ్చు, మా నేలను కాపాడుకొనే సత్తా మాకు ఉంది. మీరు ఎలాంటి షరతులు లేకుండా డబ్బు ఇవ్వండి. కొంత సొమ్మును కేటాయించిన ప్రతిసారీ ఒకటి ,రెండు, మూడు, నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది, పది సంస్కరణలు మేమెందుకు చేయాలి. రండి, మా మిలిటరీని పటిష్టపరిచేందుకు తోడ్పడండి, మరిన్ని ఆయుధాలు ఇవ్వండి, మా ఆర్ధిక రంగంలో పెట్టుబడులు పెట్టండి, మీ కంపెనీలతో పెట్టించండి. మాకు నిధులు, గ్రాంట్లు ఇవ్వండి. దానికి బదులు ఫలానా రోజు రష్యా దాడి చేస్తుంది అంటూ నిరంతరం చెప్పటం అవసరమా ” అని జెలెనెస్కీ ప్రశ్నించాడు. మ్యూనిచ్‌ నగరంలో జరిగిన ఐరోపా భద్రతా సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఏ క్షణమైనా దాడి జరగవచ్చు, తరువాత ఆంక్షలు ప్రకటిస్తే జరిగేదేమీ ఉండదు కనుక ముందుగానే ఆ పని చేయాలని ఆదివారం నాడు ఉక్రెయిన్‌ కోరింది. ఈ వారంలోనే దాడి జరగవచ్చు, అది రాజధాని కీవ్‌ పట్టణం మీదే అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నాడు. శనివారం నాడు రష్యా ఖండాంతర క్షిపణులతో విన్యాసాలు జరిపి నిర్ణీత లక్ష్యాాలను గురితప్పకుండా కొట్టింది. ఆదివారం నాడు ముగియాల్సిన రష్యాతో సైనిక విన్యాసాలను మరికొద్ది రోజులు పొడిగించనున్నట్లు బెలారస్‌ ప్రకటించింది. తూర్పు ఉక్రెయిను తిరుగుబాటు ప్రాంతాల నుంచి ఆదివారం నాడు కూడా పౌరులు ముఖ్యంగా పిల్లలు రష్యాకు వెళుతున్నట్లు వార్తలు వచ్చాయి. తిరుగుబాటుదార్లు, మిలిటరీ పరస్పరం కాల్పులు జరిపినట్లు కూడా చెబుతున్నారు.


రేపేం జరుగుతుంది అన్నది అనిశ్చితం. ఇప్పటి వరకు ఉక్రెయిను మీద దాడి గురించి చెప్పిన మాటలు వాస్తవం కాదని, ప్రచార దాడి అని తేలింది. గతంలో ఇరాక్‌ మీద దాడి చేసేందుకు సద్దాం హుసేన్‌ ప్రభుత్వం మారణాయుధాలను గుట్టలుగా పోసి ఉంచిందంటూ తప్పుడు ప్రచారం చేసింది అమెరికా, వాటిని కనుకొని నాశనం చేసే పేరుతో ఏకంగా ఇరాక్‌ మీద దాడి చేసింది, సద్దాంను ఉరితీసింది. తీరా అక్కడ అలాంటి వాటి జాడలు కూడా లేవని అదే అమెరికా అధికారులు అంతా ముగిశాక ప్రకటించారు. ఇప్పుడు తిరిగి ఆ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నది. ఇది 1990 దశకం కాదు, రష్యా – ఇరాక్కు, సద్దాం హుసేన్‌, వ్లదిమిర్‌ పుతిన్‌కు పోలిలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే ఐరోపాలో అమెరికా పలుకుబడి మరింత తగ్గటానికి, దాని పరువు పోగొట్టటంలో పుతిన్‌ తన తెలివితేటలను ఉపయోగించాడనే చెప్పాలి.


ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతినెలా వివిధ దేశాల సైనిక విన్యాసాలు, ఆయుధ ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ యుద్దం చేసేందుకు కాదు, బల ప్రదర్శన మాత్రమే. ఉక్రెయిన్‌, రష్యా సరిహద్దులు కలిగిన బెలారస్‌తో కొద్ది రోజుల క్రితం రష్యా సైనిక విన్యాసాలు జరిపింది. వాటిని చూపి ఇంకేముంది అవి ముగియగానే పనిలో పనిగా ఉక్రెయిన్‌ మీద ఫిబ్రవరి 16న దాడి చేస్తారని అమెరికా చెప్పింది. అనేక మంది నిజమే అని నమ్మారు. కీవ్‌ నుంచి తమ రాయబార సిబ్బంది కుటుంబాలను వెనక్కు రప్పించే నాటకాన్ని కొన్ని దేశాలు రక్తి కట్టించాయి. సరిహద్దుల్లోని తమ దళాలను కొన్నింటిని ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించగానే మా దెబ్బకు దిగివచ్చిందని ఉక్రెయిన్‌ నేత తన జబ్బలను తానే చరుచుకున్నాడు. కానీ కొద్ది గంటల్లోనే పశ్చిమ దేశాలు రెండో ఎత్తుగడలో భాగంగా కొత్త కతలు చెప్పటం ప్రారంభించాయి. మరోవైపున స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని డాంటెస్క్‌, లుహానస్క్‌ రిపబ్లిక్కుల మీద అదేశ మిలిటరీ దాడులు జరిపి రష్యాను రెచ్చగొట్టింది.


2014 నుంచి ఆ రెండు ప్రాంతాల్లోని జనం తిరుగుబాటు చేస్తున్నారు. దాదాపు పదిహేనువేల మంది మరణించారు. మిలిటరీ సరిహద్దుల రక్షణ, ఇతర దేశాల దాడులను ఎదుర్కొనేందుకు తప్ప స్వంత జనం మీద దాడులు చేసేందుకు కాదు.2014 బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ నగరంలో రెండు రిపబ్లిక్కుల తిరుగుబాటుదార్లు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం పన్నెండు అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రాంతాల్లోని బందీలను పరస్పరం మార్పిడి చేసుకోవటం, అక్కడి భారీ ఆయుధాలను వెనక్కు తీసుకోవటం, మానవతా పూర్వక సాయానికి అనుమతి వంటి అంశాలున్నాయి. ఆ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఉల్లంఘించటంతో 2015లో అదే నగరంలో మరొక ఒప్పందం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంలో ఇది కుదిరింది. దీనిపై రష్యా, ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓఎస్‌సిఇ) కూడా సంతకాలు చేశాయి.దీనిలో గమనించాల్సిన అంశం ఏమంటే స్వాతంత్య్రం ప్రకటించుకున్న రిపబ్లిక్కులు రష్యాసరిహద్దులో ఉన్నందున ఉక్రెయిన్‌ మిలిటరీని సరిహద్దు ప్రాంతాల్లో అనుమతించాల్సి ఉంది. ఈ ఒప్పందం కూడా సరిగా అమలు జరగనప్పటికీ అమల్లోనే ఉన్నాయి.


ఈ ఒప్పందాల అమలు గురించి కాకుండా, అమెరికా, నాటో కూటమిలోని కొన్ని దేశాలు ఉక్రెయినుకు ముప్పు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. నాటో విస్తరణలో భాగంగా జరిగిన కుట్రలో 2014లో జరిగిన ఎన్నికల్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని ఆ కూటమి గద్దెనెక్కించింది. ఏ క్షణంలోనైనా విస్తరణ జరగవచ్చని భావించిన రష్యా వెంటనే పావులు కదిపింది. ఒకప్పటి తన భూభాగమైన క్రిమియాలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో రష్యాలో విలీనం కావాలని మెజారిటీ పేర్కొనటంతో వెంటనే రష్యా ఆపని పూర్తి చేసింది. దీంతో కంగుతిన్న పశ్చిమ దేశాలు అప్పటి నుంచి రష్యామీద ఆంక్షలను అమలు జరుపుతున్నాయి. వాటి వలన ఫలితం లేకపోవటంతో అసలు మొత్తంగా ఉక్రెయిన్‌ ఆక్రమణ జరుపుతుందంటూ ప్రచారం, తేదీల నిర్ణయం చేశారు.


మిన్‌స్క్‌ ఒప్పందాల్లో రష్యా భాగస్వామి కనుక దానికి భిన్నంగా ఆ రిపబ్లిక్కులను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తే ఆ పేరుతో దాడికి దిగాలని పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో కాచుకున్నాయి. పుతిన్‌ అందుకు అవకాశం ఇవ్వలేదు. గుర్తింపు ఇవ్వాలంటూ ఇటీవల కమ్యూనిస్టు ఎంపీలు ప్రతిపాదించిన తీర్మానాన్ని పార్లమెంటులో ఆమోదించినప్పటికీ పుతిన్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. నాటో విస్తరణ-ఉక్రెయిన్‌ చేరిక గురించి మాట్లాడేదేమీ లేదని పుతిన్‌ చెబుతుండగా దానికి తాము సిద్దంగా లేమని అమెరికా చెబుతోంది. స్వాతంత్య్ర ప్రకటన చేసిన రిపబ్లిక్కులు రష్యాలో విలీనానికి కూడా సిద్దమే. అయితే అవి క్రిమియా వంటివి కాదు గనుక రష్యాతొందరపడటం లేదు. ఆ పని చేస్తే వెంటనే నాటో ఉక్రెయిన్లో తిష్టవేసి రోజువారి తలనొప్పి కలిగిస్తుంది. తన సభ్యదేశం కాని చోట నాటో దళాలను మోహరించే వీలు లేదు. ఐరోపాను మరింతగా తన కబంధ హస్తాల్లో బిగించేందుకు అమెరికా పావులు కదపటాన్ని జర్మనీ వంటి దేశాలు అంగీకరించటం లేదు.


నిబంధనలు, అవగాహనలకు విరుద్దంగా నాటో దేశాలు ఉక్రెయినుకు అన్ని రకాల సాయం చేస్తూ రష్యాను కవ్విస్తున్నాయి.2014 నుంచి 270 కోట్ల డాలర్ల మేర మిలిటరీ సాయం అందించగా ఒక్క 2021లోనే అమెరికా 65 కోట్ల డాలర్ల మేర అందించింది. ఈ ఏడాది ఇప్పటికి 20 కోట్ల మేరకు అందించారు. బ్రిటన్‌ 460టన్నుల మేరకు అనేక రకాల ఆయుధాలను చేరవేసింది. నిబంధనల మేరకు చూస్తే వీటిని చూపి రష్యా మిన్‌స్క్‌ ఒప్పందం నుంచి వైదొలిగి నేరుగా తిరుగుబాటు రిపబ్లికులకు అన్ని రకాల సాయం చేయవచ్చు గానీ దానికి పూనుకోలేదు.


అమెరికా, ఐరోపాలోని నాటో దేశాలకు రష్యన్లు కొన్ని అంశాలను స్పష్టం చేశారు. గత కొద్ది నెలలుగా అమెరికా, దాని మిత్రదేశాలు చెబుతున్నట్లుగా ఉక్రెయిను మీద ఎలాంటి దాడి ఉండదు. ఆశ్చర్యకర పరిణామాలూ జరగవచ్చు. మూడవది చర్యకు ప్రతి చర్య ఉంటుంది. అమెరికాకు పంపిన ఒక పత్రంలో నిర్దిష్ట ప్రతిపాదనలను చేశారు. వాటిలో ఒకదానిలో ఇలా ఉంది. ” ఉక్రెయిన్‌, జార్జియాలను నాటోలో చేర్చుకోవటమే కాదు, నామమాత్ర సభ్యత్వం కూడా ఇవ్వకూడదు. సభ్యులు కాని దేశాలలో అమెరికా మిలిటరీ కేంద్రాలు, ఆయుధ నిల్వల వంటి మిలిటరీ చర్యలు, రష్యాను లక్ష్యంగా చేసుకొనే ద్విపక్ష మిలిటరీ ఒప్పందాలు ఉండకూడడు ”. రుమేనియా, పోలాండ్‌లో ఉన్న మధ్యంతర, స్వల్పశ్రేణి అణుక్షిపణులను, బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలోని యుద్దనావలు, రష్యాగగన తలానికి సమీపంలోని అణుబాంబర్లను తొలగించాలని కూడా కోరింది. మిన్‌స్క్‌ ఒప్పందాలను అమలు జరపాలి, ఆ మేరకు డాన్‌బాస్‌ ప్రాంతానికి ప్రత్యేక హౌదా ఇవ్వాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్‌ చెప్పారు. ఈ ఒప్పందాల ప్రకారం తిరుగుబాటు ప్రాంతాలకు రష్యా ఎలాంటి ఆయుధాలను పంపకూడదు. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ ప్రాంతాలపై ఉక్రెయిన్‌ మిలిటరీ దాడి చేస్తే తిరుగుబాటుదార్లకు మద్దతుగా రష్యా రంగంలోకి దిగేట్లుగా ఇప్పుడు కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి. ఇవి ఏ రూపం తీసుకుంటాయన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకే దెబ్బతో చైనా, రష్యాలను కొట్టాలన్న అమెరికా ఆత్రం !

12 Saturday Feb 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China Threat, Quad, Quadrilateral Security Dialogue, RUSSIA, Two-front wars’ with China and Russia, Ukraine war


ఎం కోటేశ్వరరావు
ఆత్రగాడికి బుద్ది మట్టు(తక్కువ లేదా పరిమితం) అన్నారు పెద్దలు.లేకపోతే రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘన్‌ తాలిబాన్లనే అదుపు చేయలేక సలాం చేసి తోకముడిచిన అమెరికన్లు ఒకేసారి చైనా, రష్యాలను మింగేస్తాం అంటుంటే ఏమనుకోవాలి మరి ! ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో అమెరికా, భారత్‌, జపాన్‌,ఆస్ట్రేలియాతో కూడిన చతుష్టయ(క్వాడ్‌) విదేశాంగ మంత్రుల నాలుగవ సమావేశం శుక్రవారం నాడు జరిగింది. ఇటీవలి కాలంలో అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన ఒక ప్రధాన మార్పు ఏమంటే తన చేతికి మట్టి అంటకుండా ఇతరులతో పని జరిపించుకోవటం. కొద్ది నెలల క్రితం దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం ఏమిటంటూ ఆ ప్రాంత దేశాలను రెచ్చగొట్టింది. ఇప్పుడు ఇంకేముంది రష్యన్లు ఉక్రెయిన్‌ ఆక్రమణకు నడుంకట్టారు, మీ వెనుక మేముంటాం అందరం పోరాడుదాం , ముందుకు పదండితోసుకు అని హడావుడి చేస్తోంది. చతుష్టయ కూటమికి ఉక్రెయిన్‌ వివాదానికి సంబంధం లేదు, ఐనా మెల్‌బోర్న్‌లో దాని గురించి ప్రస్తావించారు. ప్రతిదానికి ప్రతిదేశ జుట్టును ముడివేయాలని అమెరికా చూస్తోంది. ఈ కూటమిలోని వారందరూ ఉక్రెయిన్‌ వెళ్లి రష్యా మీద దాడులకు దిగుతారా ? అంతసత్తా ఉందా ? ఆసియాకు చైనా నుంచి, ఐరోపాకు రష్యా నుంచి ముప్పు ఉందనే తన దుష్ట పన్నాగంలోకి అన్ని దేశాలనూ లాగేందుకు అమెరికా పూనుకుంది.


భారత్‌ ఎదుగుదలకు, ప్రాంతీయ నాయకురాలిగా నాయకత్వం వహించేందుకు మద్దతు ఇస్తాం అని మెల్‌బోర్న్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మనకు చెప్పారు. మనం ఏ దేశాలకు నాయకత్వం వహించాలి? ప్రపంచ పెత్తనం కోసం అమెరికా పడరాని పాట్లు పడుతోంది. మింగటం దానివల్ల కావటం లేదు. ఒక్కొక్క ఖండంలో ఒక్కో జూనియర్‌ భాగస్వామికోసం ఎదురు చూస్తోంది. మనం దాని ఏజంటుగా మారాలని కోరుకుంటోంది. అసలు భారత ఉపఖండంలో మన కోసం ఎదురు చూస్తున్నవారెవరైనా ఉన్నారా ? అందరిని, కాస్త దూరంలో ఉన్న ఇరాన్‌ వంటి మిత్రదేశాలను దూరం చేయటంలో అమెరికా జయప్రదమైంది. చిన్న దేశమైన భూటాన్‌ కూడా మనతో చెప్పకుండా డోక్లాం ప్రాంత వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనాతో చర్చలు జరిపింది కదా ! మనలిన్న తన పట్టునుంచి పోకుండా అమెరికా బిగించింది.మీ ఊరు చుట్టుపక్కల 66 ఊళ్లకు పోతుగడ్డ అని పొగిడినట్లుగా మనలను మునగచెట్టు ఎక్కిస్తోంది. తన దక్షిణ చైనా సముద్ర ఆధిపత్య ఎత్తుగడలో భాగంగా గాల్వన్‌ రూపంలో మనకూ చైనాకు లడాయి పెట్టింది.

మరోవైపున ఆస్ట్రేలియాను చైనా మీదకు ఉసిగొల్పింది, జపాన్‌లో తానే తిష్టవేసింది గనుక జపాన్ను ప్రత్యేంగా రెచ్చగొట్టాల్సిన పనిలేదు. చైనా విస్తరణ వాదాన్ని అడ్డుకుందామనే పేరుతో భారత విస్తరణ వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. అది జరిగేదేనా ?
ఈ కాలంలో జరిగిందేమిటి ? ఆస్ట్రేలియా తోకలను కత్తిరించేందుకు చైనా వాణిజ్య ఆయుధాన్ని వాడుతున్నది.2021 తొలి తొమ్మిది నెలల కాలంలో ఆస్ట్రేలియా నుంచి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చైనా 17.3బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతులను తగ్గించింది. అదే వస్తువులను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుందంటే, అమెరికా నుంచి 6.3, కెనడా నుంచి 1.5, న్యూజిలాండ్‌ నుంచి 1.1బి.డాలర్ల మేరకు అదనంగా చైనా దిగుమతి చేసుకుంది. అంటే ఆస్ట్రేలియాను ఫణంగా పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంది. ఇప్పుడు చైనాతో అమెరికాకు ఉన్న లడాయి ఏమిటి ? తన వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయటం లేదన్నదే, చైనా దిగుమతులు పెరిగితే దక్షిణ చైనా సముద్రమూ ఉండదు, భారత్‌కు నాయకత్వమూ ఉండదు. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి బెదిరింపులకు దిగుతోంది.


నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు ఎన్నికల్లోపు ఓటర్ల ముందు ఏదో ఒకటి సాధించినట్లు లేదా మరొక మహత్తర కార్యక్రమంలో ఉన్నట్లు ఓటర్లకు జోబైడెన్‌ కనిపిస్తేనే ఓట్లు పడతాయి.అందుకే ఈ తిప్పలు. ప్రస్తుతం అమెరికా-చైనా వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి.2020లో కుదిరిన ఒప్పందం మేరకు మా దగ్గర నుంచి సరకులు కొంటారా లేదా అని అమెరికా వత్తిడి తెస్తోంది. మీరు మాత్రం మా మీద అనేక ఆంక్షలు విధిస్తారు, చుట్టూ మంటపెడతారు, తగ్గించాల్సిన పన్నుల గురించి మాట్లాడరు, కరోనా కారణంగా తలెత్తిన సమస్యల గురించి మాట్లాడకుండా మా మీద నిందలు వేస్తే కుదరదు అని చైనా అంటోంది. ఆ ఒప్పందం ప్రకారం 2020లో అమెరికా నుంచి 260, 2021లో 310బి.డాలర్ల విలువగల వస్తువులు, సేవలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దానికి ప్రతిగా అమెరికా చైనా నుంచి వచ్చే 120బి.డాలర్ల విలువగల వస్తువులపై పన్నును 15నుంచి 7.5శాతానికి తగ్గించాలి.2021లో రెండు దేశాల మధ్య 755.6బి.డాలర్ల మేర వాణిజ్యం జరగా అమెరికా నుంచి దిగుమతులు 179.53 బి.డాలర్లు మాత్రమే ఉన్నాయి. చైనా వార్షిక విదేశీ వాణిజ్య విలువ ఆరులక్షల కోట్ల డాలర్లుండగా అమెరికా వాటా పన్నెండుశాతంగా ఉంది.


మెల్‌బోర్న్‌ సమావేశం సందర్భంగా అమెరికా విడుదల చేసిన పత్రం భారత్‌ – చైనాల మధ్య మంటను మరింతగా ఎగదోసేదిగా ఉంది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్నాయని ఈ ప్రాంతంలో భద్రతను సమకూర్చే భారత పాత్రకు తాము మద్దతు ఇస్తామని అమెరికా పేర్కొన్నది. క్వాడ్‌లో భారత్‌ భావ సారూప్యత కలిగిన భాగస్వామి, చోదకశక్తి అని వర్ణించింది. చైనా నుంచి సవాళ్లు పెరుగుతున్న కారణంగానే తాము ఈ ప్రాంతంపై కేంద్రీకరించామని, ఆస్ట్రేలియా మీద ఆర్ధిక బలాత్కారం, వాస్తవాధీన రేఖ వెంట భారత్‌తో ఘర్షణ, తైవాన్‌ మీద పెంచుతున్న వత్తిడి, తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలపై బెదరింపులు వంటి చర్యలతో తమ మిత్రులు, భాగస్వాములు మూల్యం చెల్లించాల్సి వస్తోందని అమెరికా పత్రం పేర్కొన్నది. చైనాను మార్చటంలో తమకు పరిమితులు ఉన్నట్లు ఒక అమెరికా అధికారి ఈసందర్భంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి.


మెల్‌బోర్న్‌ సమావేశంలో రష్యాగురించి భిన్నంగా మాట్లాడినప్పటికీ చైనా విషయంలో దాదాపు ఒకే అభిప్రాయం వ్యక్తమైంది.క్వాడ్‌ బృందం విబేధాల గురించి గాక సహకారం, చేతులు కలపటం మీద కేంద్రీకరించాలని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఉక్రెయిన్‌ వివాదం గురించి చెప్పారు. అమెరికా ఆంక్షలు, బెదిరింపులను ఖాతరు చేయ కుండా రష్యానుంచి క్షిపణి వ్యవస్దలను మనదేశం కొనుగోలు చేసింది. ఇప్పటికీ మిలిటరీ సరఫరాలపై వారి మీదే ప్రధానంగా ఆధారపడి ఉన్నాము. రష్యా మిలిటరీ బెదరింపులు ముప్పు తెస్తున్నాయని అమెరికా మంత్రి బ్లింకెన్‌ ఆరోపించగా ఈ వివాదంలోకి తాము దలదూర్చటం లేదని జైశంకర్‌ పేర్కొన్నారు. ఒక దేశంతో ఎవరితో కలవాలో లేదో మరొక దేశం నిర్ణయించరాదని అమెరికా మంత్రి రష్యామీద ధ్వజమెత్తారు.నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోరాదని రష్యా డిమాండ్‌ చేస్తుండగా చేర్చుకొని ఉక్రెయినుకు మిలిటరీని తరలించి రష్యా మెడమీద కత్తిలా మారాలని అమెరికా ఎత్తువేసింది. నా సహచరులు చెప్పినట్లుగా మేము కొన్నింటికోసం ఉన్నప్పటికీ కొందరికి వ్యతిరేకం కాదని జైశంకర్‌ అన్నారు. ఇటీవలి భద్రతామండలి సమావేశంలో కూడా రష్యాను విమర్శించేందుకు మన దేశం తిరస్కరించింది. జపాన్‌-రష్యా మధ్య సరిహద్దు సమస్యలున్నప్పటికీ ఘర్షణకు జపాన్‌ సిద్దంగా లేదు. అమెరికా వత్తిడి మేరకు కొన్ని ప్రకటనలు చేసినప్పటికీ చైనాతో వాణిజ్య మిగులు ఉన్న జపాన్‌ తెగేవరకు లాగేందుకు సిద్దంగా లేదు. దక్షిణ కొరియా కూడా చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటోంది.

మన దేశం గాల్వన్‌ ఉదంతాల సమయంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ గతేడాది రికార్డు స్దాయిలో వస్తువులను దిగుమతి చేసుకొని సానుకూల సందేశాన్ని పంపింది. కోవీషీల్డ్‌ కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను, పరికరాలను సరఫరా చేసేందుకు అమెరికా నిరాకరించి నిషేధం విధించిన అంశం తెలిసిందే. కేంద్రంలో ఉన్న అధికారపార్టీ రాజకీయాలను ఖాతరు చేయకుండా మన దిగుమతిదారులు లావాదేవీలు జరిపారు. చైనా నుంచి నిర్ణీత పరిమాణంలో వస్తువులను విధిగా కొనుగోలు చేయాలనే ఒప్పందాలేవీ లేవు, అగత్యమూ లేదు. అమెరికన్లు చెబుతున్నట్లు వారు మనకు సహజభాగస్వాములే ఐతే, జపాన్‌, ఆస్ట్రేలియా మన మంచి కోరుకున్నట్లయితే మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను వారు సరఫరా చేయవచ్చు, చేేయగలరు కానీ వారు చెప్పిన ధరలను మనం చెల్లించాలి. ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదు. ఆ వెలతో దిగుమతి చేసుకుంటే మన జనాల జేబులు కొట్టి అమెరికా, ఇతర దేశాలకు సమర్పించాలి. తక్కువ ధరలకు వస్తువులు వస్తున్నందున దిగుమతిదారులు మొగ్గుచూపుతున్నారు తప్ప చైనా మీద వారికేమీ ప్రత్యేక ప్రేమ ఉండికాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయినే ముందుగా దాడికి దిగుతుందా ? చమురు ధరల పెరుగుదలతో బలపడుతున్న రష్యా !

08 Tuesday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

NATO allies, NATO war threats against Russia, RUSSIA, Ukraine attack on Donbass, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఆయుధ ఉత్పత్తిదారులు, వారికి మద్దతు ఇచ్చే అంతర్జాతీయ మీడియా ఉన్మాదులు తప్ప యుద్దాలు జరగాలని ఏ ఒక్కదేశమూ కోరుకోదు, ఎవరూ సిద్దంగా కూడా లేరు. ఉక్రెయిన్‌ యుద్ధం వస్తుందా రాదా, రేటింగులు పెరుగుతాయా లేదా అని కొందరు ఉగ్గపట్టుకొని చూస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి, రష్యా గత కొద్ది వారాలుగా ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దులకు తమ మిలిటరీలను తరలిస్తున్నాయి. వాస్తవంగా అక్కడేం జరుగుతోందో చెప్పలేము గాని ఏ క్షణంలోనైనా రష్యాదాడులకు దిగవచ్చని పశ్చిమ దేశాల, ముఖ్యంగా అమెరికన్‌ వార్తా సంస్దలు రెచ్చిపోయాయి.


తాజాగా వస్తున్న ఊహాగానాలు, వార్తల స్వభావం ఏమంటే రష్యా సంగతేమోగానీ దాని మద్దతు ఉన్న ఉక్రెయిన్‌ తిరుగుబాటు ప్రాంతాలలో ఒకటైన డాన్‌బాస్‌పై అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్‌ దళాలే దాడులకు దిగి రష్యాను కవ్వించవచ్చని చెబుతున్నారు. ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. రోజులు గడిచే కొద్దీ నాటో కూటమిలోని విబేధాలు మరింతగా వెల్లడి అవుతున్నాయి. వీటికి తోడు ముడి చమురు ధర ఇప్పటికే 93డాలర్లు దాటింది. వంద దిశగా వెళతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికా-ఐరోపా దేశాలలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల భయపెడుతున్నాయి.యుద్దం వస్తుందో లేదో, ఎవరు గెలుస్తారో, వస్తే ఎంతకాలం జరుగుతుందో తెలియదు గానీ రష్యానుంచి చమురు, గాస్‌ ఆగిపోతే ఏమి చేయాలా అని పశ్చిమ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.నలభైశాతం గాస్‌ అక్కడి నుంచే వస్తున్నది.


ప్రస్తుతం ఐరోపా యునియన్‌ అధ్యక్ష స్ధానంలో ఉన్న ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మాస్కోలో పుతిన్‌తో భేటీ జరిపారు.సంప్రదింపుల ద్వారా ఉద్రిక్తతలను నివారించవచ్చనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వాన్ని అంగీకరించే సమస్యే లేదని పుతిన్‌ మరోసారి తెగేసి చెప్పారు.పూర్వం తనలో భాగమై తరువాత పాలనా పరంగా ఉక్రెయిన్‌కు అప్పగించిన క్రిమియా ప్రాంతాన్ని అక్కడి ప్రజాభిప్రాయ సేకరణ తీర్పు ప్రకారం 2014లో రష్యా తనలో విలీనం చేసుకున్న అంశం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఆంక్షలు అమలు జరుపుతున్నాయి. ఆ తరువాత రష్యా సరిహద్దులోని ఉక్రెయిన్‌ స్వయపాలిత ప్రాంతాలు కొన్నింటిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అవి కూడా రష్యాతో విలీనానానికి మొగ్గుచూపాయి. ఉక్రెయిన్‌ పాలకులు అంగీకరించకపోవటంతో అక్కడ అంతర్యుద్ధం సాగుతోంది. వాటిలో ఒకటే డాన్‌బాస్‌. అది భౌతికంగా ఉక్రెయిన్లో ఉన్నా తిరుగుబాటుదార్లదే పెత్తనం, వారికి రష్యామద్దతు బహిరంగ రహస్యం.


తనది గాకపోతే తాటిమట్టతో అన్నట్లుగా అమెరికా, ఇతర దేశాలను చూసి చేతులు కాల్చుకొనేందుకు ఉక్రెయిన్‌ సిద్దంగా ఉందా అన్నది సందేహమే. 2015లో తిరుగుబాటుదార్ల చేతిలో జరిగిన పరాభవాన్ని అక్కడి పాలకులు మరచిపోలేదు. ఇతరులు ఇచ్చిన ఆయుధాలతో ఈసారి దెబ్బతీయవచ్చని కొందరు రెచ్చగొడుతున్నారు. ఇదే సమయంలో తిరుగుబాటుదార్లకూ మెరుగైన ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి,వాటికి రష్యా అండ కూడా ఉంది. అమెరికాకు యుద్దం ఎందుకు ?


2008 ఆర్దిక సంక్షోభం నుంచి అమెరికా, ఇతర ఐరోపాధనిక దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ద ఇంకా కోలుకోలేదు.కరోనాకు ముందే మరో మాంద్యంలోకి కూరుకుపోనుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. కరోనాతో ప్రపంచ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున లబ్దిపొందారు. అది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు గనుక కొత్తగా లాభాల కోసం దారులు వెతుకుతున్నారు.2008 సంక్షోభం తరువాత అమెరికా కేంద్రీకరించిన దేశాల్లో చమురు ఎగుమతి చేసే ఇరాన్‌, వెనెజులా,రష్యా, ఇరాక్‌, సిరియా వంటివి ఉన్నాయి. వాటిపై ఆంక్షలు విధించిన అమెరికా ఈ కాలంలో మనవంటి దేశాలకు చమురు ఎగుమతిదేశంగా ముందుకు వచ్చి సొమ్ము చేసుకున్న అంశం తెలిసిందే. రష్యానుంచి ఐరోపాకు గాస్‌ను సరఫరా చేసే రెండవ పైప్‌ లైన్‌ నోర్డ్‌ స్ట్రీమ్‌ దాదాపు పూర్తి కావచ్చంది. దాన్ని అడ్డుకొనేందుకు ఉక్రెయిన్‌ పేరుతో అమెరికా రాజకీయాలు చేస్తోంది.


యుద్దం లేదా యుద్దవాతావరణం నాటోలోని ప్రధాన దేశాలకు లాభాల పండిస్తోంది.1991-2014 మధ్య ఉక్రెయిన్‌కు అమెరికా నాలుగుబిలియన్‌ డాలర్లు కేటాయించగా, గత ఎనిమిది సంవత్సరాల్లో 2.5బిడాలర్లు ఇచ్చింది. అదిగాక ఇతర దేశాలు కూడా 10బి.డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. ఉక్రెయిన్‌ నౌకాదళాన్ని నవీకరించే పేరుతో బ్రిటన్‌ 1.7బి.పౌండ్లను పెట్టుబడిగా పెట్టింది. ఇవన్నీ బ్రిటన్‌, ఇతర కంపెనీలకు లబ్ది చేకూర్చేవే. నాటో దేశాల ఆయుధ కంపెనీలను మేపేందుకు 2014-22 మధ్య ఉక్రెయిన్‌ జిడిపిలో మూడు నుంచి ఆరుశాతానికి మిలిటరీ ఖర్చు 11బి.డాలర్లకు పెంచింది. అనేక ఐరోపా దేశాలు అమెరికా మీద ఆధారపడటం కూడా మరోవైపు అవి ఇష్టం లేకున్నా రష్యామీద పోరుకు సిద్దం అనాల్సి వస్తోంది.బ్రిటన్‌ ప్రపంచాధిపత్యంలో జూనియర్‌ వాటాదారుగా అమెరికాతో చేతులు కలుపుతోంది. రష్యామీద ఆంక్షలను వ్యతిరేకించే దేశాల్లో ఇటలీ ఒకటి. దాని పెట్టుబడులు అక్కడ ఉండటమే కారణం.


ఐరోపా దేశాలు ముఖ్యంగా జర్మనీ ఇప్పుడు యుద్దాన్ని కోరుకోవటం లేదు.దానికి రష్యా హీటింగ్‌ చమురు, గాస్‌ అవసరం. ఒకవేళ పోరు జరిగితే అమెరికా నుంచి అధిక ధరలకు వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందన్నది వారి భయం. ఇదే పరిస్ధితి మిగతా దేశాలకూ దాపురిస్తుంది. తమ కంపెనీల లాభం కోసం అమెరికా సృష్టించిన ఈ సంక్షోభానికి పావులుగా మారటమా లేదా అన్నది వాటి ముందున్న సమస్య. ఘర్షణలో ఉన్న పక్షాలకు ఆయుధాలు అందించ కూడదన్న తమ రెండవ ప్రపంచ యుద్ద అనంతర విధానానికి అనుగుణంగా బ్రిటన్‌ నుంచి ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాల రవాణాను తమ గగన తలం మీద నుంచి అనుమతించటం లేదని జర్మనీ ప్రకటించింది. దాంతో బ్రిటన్‌ విమానాలు అనేక గంటల పాటు అదనంగా వేరే మార్గంలో వెళ్లాల్సివచ్చింది. అంతే కాదు తాను సరఫరా చేసిన హొవిట్జర్లను ఉక్రెయిన్‌కు దారి మళ్లించరాదని ఎస్తోనియాకు జర్మనీ స్పష్టం చేసింది.ప్రపంచవ్యాపిత బాంకుల ఆర్ధిక సమాచార వ్యవస్ధ (స్విఫ్ట్‌) నుంచి రష్యాను దూరంగా పెట్టాలన్న అమెరికాకు ఐరోపా దేశాల నుంచే ఎదురుదెబ్బతగిలింది. ఇప్పుడున్న స్ధితిలో అమెరికా ఎన్నికబుర్లు చెప్పినా తన శత్రుదేశాల నుంచి చమురు, గాస్‌ దిగుమతులను నిరోధించేశక్తి దానికి లేదు. స్లోవేకియా, హంగరీ, చెక్‌ రిపబ్లిక్‌ వంటి దేశాల్లోని చమురుశుద్ది కర్మాగారాలకు, జర్మనీకి రష్యాగొట్టపు మార్గాల ద్వారానే చమురు సరఫరా జరగాలి. అందువలన చెల్లింపులు జరపాలంటే స్విఫ్ట్‌నుంచి రష్యాను పక్కన పెడితే కుదరదు.


గత కొద్ది సంవత్సరాలుగా నయా నాజీ కిరాయి ముఠాలకు దేశభక్తి ముద్రవేసి అమెరికా పెద్ద ఎత్తున పెంచి పోషిస్తోంది. సిఐఏకు కిరాయి మూకలను సరఫరా చేసే బ్లాక్‌ వాటర్‌ వంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వారిని, ఉక్రెయిన్‌ మిలిటరీని జతచేసి డాన్‌బాస్‌ వంటి ప్రాంతాల మీద దాడులు చేయించాలని చూస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపిన స్టెఫాన్‌ బందేరాను ఇప్పుడు ఉక్రెయిన్‌ ప్రభుత్వం జాతీయ యోధుడిగా గుర్తించి నీరాజనాలు పడుతోంది. ఎనిమిది సంవత్సరాల నాడు క్రిమియా విలీనాన్ని అడ్డుకోలేని నాటో కూటమి ఇప్పుడు దాన్ని విముక్తి చేస్తామని దాడులకు దిగితే యుద్దాన్ని ప్రారంభించిన నేరం దానిదే అవుతుంది. నెపం రష్యామీద నెట్టాలి గనుక పశ్చిమ దేశాలు సాకుకోసం చూస్తున్నాయి.


ఒకవైపు రష్యాను బూచిగా చూపుతున్న పశ్చిమ దేశాలు మరోవైపు మరోకారణంతో నిజంగానే భయపడుతున్నట్లు కనిపిస్తోంది.చమురు ధరల పెరుగుదలతో రష్యా ఆర్ధికంగా బలపడటమే దానికి కారణం. అది పశ్చిమ దేశాల ఆంక్షలను తట్టుకొనేశక్తి ఇస్తుంది. చమురు ధరల పెరుగుదల కారణంగా దాని విదేశీమారక ద్రవ్య నిల్వలు 640బి.డాలర్లకు పెరిగాయి. ప్రభుత్వ రుణం జిడిపిలో 12శాతానికి తగ్గింది. ముడి చమురు ధర కనీసం వందడాలర్లకు చేరుతుందని అమెరికా వాల్‌స్ట్రీట్‌ భావిస్తున్నది.వివిధ కారణాలతో ఈఏడాది చివరికి 125 డాలర్లవుతుందని జెపి మోర్గాన్‌ అంచనా. నిత్యం రష్యామీద ఆంక్షల గురించి చెప్పే అమెరికన్లు అదే రష్యానుంచి మూడేండ్ల గరిష్ట స్ధాయిలో ప్రస్తుతం డీజిల్‌ దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం 1.55 మిలియన్‌ పీపాల డీజిలు ఈనెలాఖరుకు అమెరికా చేరనుంది. అమెరికా తూర్పు కోస్తాలోని చమురుశుద్ధి కర్మాగారాలకు లాభాలు తక్కువగా ఉండటంతో శుద్దిని పరిమితం చేశాయని, ఒక కర్మాగారంలో పేలుడు జరిగినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. కెనడా ఒక కర్మాగారాన్ని మూసివేయటం, ఐరోపా దేశాలే ప్రత్నామ్నాయం కోసం వెతుకున్నందున రష్యామీద ఆధారపడక తప్పటం లేదని తెలిపింది. దీనికి తోడు టెక్సస్‌లో చలి కారణంగా ఉత్పత్తికూడా తగ్గనుంది.


అమెరికా మీడియా అంతటా ప్రజాస్వామ్యం, ఐరోపాకు ముప్పు తక్షణం ఉక్రెయిన్‌ మీద దాడి జరగబోతున్నదంటూ పెద్ద ఎత్తున ఊదరగొడుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా మరో ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్లో రష్యన్లు మెజారిటీగా ఉన్న డాన్‌బాస్‌ ఇతర స్వయం పాలిత ప్రాంతాలపై ఉక్రెయిన్‌, నాటో, కిరాయి మూకలు దాడులు చేయనున్నట్లు రష్యా మీడియాలో రాస్తున్నారు.2014లో ఉక్రెయిన్‌ మిలిటరీ దాడులను డాన్‌బాస్‌ తిరుగుబాటుదార్లు తిప్పికొట్టారు.రష్యా సైనిక సమీకరణ చేస్తోందని చెబుతున్నవారు దశాబ్దాల తరబడి దానికి వ్యతిరేకంగా ఐరోపాలో 64వేల మందిని అమెరికా నిలిపివుంచిందని, మరో ఎనిమిదిన్నరవేల మందిని దింపుతోందని, అవసరమైతే మరో 50వేల మందిని దించేందుకు నిర్ణయించిందనే అంశాలను చెప్పటం లేదు. రష్యా లక్ష మందిని సరిహద్దులకు తరలించినట్లు గుండెలుబాదుకుంటున్నారు. నిజమే, రెండోవైపు ఉక్రెయిన్‌ తన మిలిటరీలో సగం అంటే లక్షా 25వేల మందిని రష్యా ముంగిట్లోకి తరలించింది.డాన్‌బాస్‌తో పాటు తిరుగుబాటు ప్రాంతాలైన డాన్‌టెస్క్‌, లుగాన్‌స్క్‌ ప్రాంతాలలోనే వారిని మోహరించింది. అక్కడి తిరుగుబాటుదార్లపై మిలిటరీ చర్యకు దిగి రష్యాను రెచ్చగొట్టి రంగంలోకి దింపాలన్నది అమెరికా ఎత్తుగడ. అదే జరిగితే ఆ పేరుతో మరిన్ని కఠినమైన ఆంక్షలు,నాటో విస్తరణ, మరిన్ని ఆయుధాలు అమ్ముకోవచ్చని, యుద్దంలోకి దిగవచ్చన్నది వ్యూహం. దాని దురూహలు ఫలిస్తాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్రలను అధిగమించి పురోగమనంలో వెనెజులా !

02 Wednesday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#viva Venezuela, Chavez, crude oil price, Maduro, President Maduro, Venezuela, Venezuela’s economy, Yandamuri, Yandamuri Veerendranath


ఎం కోటేశ్వరరావు


వెనెజులా మరోసారి వార్తల్లోకి వస్తోంది. దానిపై మీడియా సంస్ధలు, ప్రముఖులుగా ఉన్న కొందరు చేయని ప్రచారం లేదు. అక్కడ సమస్యల్లేవని ఎవరూ చెప్పలేదు. కాకపోతే కాళిదాసు కవిత్వానికి కొంత తమపైత్యాన్ని జోడించే వారి గురించి పట్టించుకోనవసరం లేదు. వెనెజులా సెంట్రల్‌(రిజర్వు)బాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో 686.4శాతం ద్రవ్యోల్బణం ఉంది. అంతకు ముందు సంవత్సరం 2,959.8 శాతం ఉంది. గతేడాది సెప్టెంబరు నుంచి నెలవారీ ద్రవ్యోల్బణం ఒక అంకెకు పరిమితం అవుతోంది. వందలు,వేలశాతాల్లో నమోదైన ద్రవ్యోల్బణం అంటే అర్ధం ఏమిటి ? ఒక వస్తువు ధర ఈ క్షణంలో ఉన్నది మరోక్షణంలో ఉంటుందన్న హమీ ఉండదు. చేతిలో ఉన్న కరెన్సీతో ఫలితం ఉండదు. రాయిటర్స్‌ వార్తా సంస్ధ కథనం ప్రకారం కరెన్సీ మారకపురేటును స్ధిరంగా ఉంచేందుకు తీసుకున్న చర్యలతో ఫలితాలు కనిపించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్ధ సరఫరాదార్లకు విదేశీ కరెన్సీ(డాలర్లలో) చెల్లింపులు చేస్తోంది. ఒక ఆశావహ పరిస్ధితి ఏర్పడింది.దీని అర్ధం అంతా బాగుందని కాదు. ప్రభుత్వ టీవీలో దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు నడిచిన హైపర్‌ ద్రవోల్బణం గత చరిత్రే అని, ఐతే ఇప్పటికీ ఈ సమస్య తీవ్రమైనదే అన్నారు.


లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు చెందిన ఐరాస ఆర్ధిక కమిషన్‌ వచ్చే ఏడాది ఈ ప్రాంతదేశాల జిడిపి వృద్ధిరేటు సగటున 2.1శాతం కాగా, వెనెజులా రేటు 3 శాతంగా పేర్కొన్నది. గత ఏడు సంవత్సరాలలో ఇది తొలిసానుకూల సంవత్సరం కావటం గమనించాల్సిన అంశం, 2014 నుంచి ఇటీవలి వరకు దేశ జిడిపి 75శాతం పతనమైంది. మరొక దేశం ఏదైనా ఈ స్థితిని తట్టుకొని నిలిచిందా ? వెనెజులా వామపక్ష పార్టీల ఏలుబడిలో ఉంది తప్ప అమలు జరుపుతున్న విధానాలన్నీ సోషలిస్టు పద్దతులు కావు.ఇటీవలి కాలంలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ, పాలక సోషలిస్టు పార్టీ మధ్యవిభేదాలు కూడా తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. వాటిని అంతర్గతంగా అక్కడే పరిష్కరించుకుంటారు. జనాన్ని ఆదుకొనేందుకు ఉపశమన చర్యలు వేరు, దీర్ఘకాలిక సోషలిస్టు సంస్కరణలు వేరు. సోషలిస్టు క్యూబా, దానికి మద్దతు ఇస్తున్న వెనెజులా వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, బిజెపి పాలిత ప్రాంతాల్లో అధికారపక్షాలు ప్రతిపక్షాలను దెబ్బతీసి తమకు ఎదురు లేదని జనం ముందు కనిపించేందుకు చేస్తున్నదేమిటో తెలిసిందే. లాటిన్‌ అమెరికాలో వామపక్ష పార్టీలు, ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు అమెరికా,కెనడా, ఐరోపా ధనికదేశాలు ఇంతకంటే ఎక్కువగా ప్రాణాలు తీసే దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి.2018లో డ్రోన్‌తో దాడి చేసి మదురోను హత్య చేయాలని చూశారు. అంతర్గత తిరుగుబాట్లను రెచ్చగొట్టి అసలు ప్రభుత్వాన్నే గుర్తించలేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని బహిరంగా ఇచ్చిన పిలుపులు వెనెజులా వ్యతిరేకులకు వీనుల విందుగా ధ్వనించి ఉండాలి.


మన దేశంలో వెయ్యిమంది జనాభాకు 44 కార్లు ప్రపంచంలో కార్లసాంద్రతలో మనం 132వ స్ధానంలో ఉండగా అదే వెనెజులా 96వ స్థానంలో ఉండి 145కలిగి ఉంది.ఐరాస మానవాభివృద్ధి సూచికలో 2021లో మనం 131 స్ధానంలో ఉంటే వెనెజులా 113లో ఉంది. ఈ అంకెల దేముంది అని తోసిపుచ్చవచ్చు, అలాంటి వారిని ప్రమాణంగా తీసుకోవాలా ? వారి నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి ? వారికి నచ్చితే, విలువ లేకపోతే లేదు, ఎంత బాధ్యతా రాహిత్య వైఖరి ? 2021లో ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం 116 దేశాల్లో 101కాగా వెనెజులా 82లో ఉంది. ఎనిమిదేండ్ల మన ఘనమైన పాలన చేసిందేమిటి ?


2014 చమురు మార్కెట్లు పతనం కావటంతో ఎగుమతుల మీద ఆధారపడిన వెనెజులా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా తదితర దేశాల ఆంక్షలతో చమురును వెలికితీసే కంపెనీ ముఖం చాటేశాయి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. ఒక సమాచారం ప్రకారం 2021 ప్రారంభంలో దేశంలో ఉన్న 41లక్షలకు పైగా ఉన్న కార్లలో సగానికి మాత్రమే అక్కడ ఉత్పత్తి జరిగే పెట్రోలు, డీజిలు సరిపోతుంది. గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం జనవరి 24న అక్కడ లీటరు పెట్రోలు ధర రు.1.87. ఇటీవలి కాలంలో తిరిగి ముడి చమురు ఉత్పత్తితో పాటు ధరలు పెరగటం దానికి ఎంతగానో ఉపశమనం కలిగించింది. డిసెంబరు 2021నాటికి రోజుకు పదిలక్షల పీపాలకు ఉత్పత్తి పెరిగింది. ఆంక్షల కారణంగా ఇప్పటికీ శుద్ధి కర్మాగారాలు మరమ్మతులకు నోచుకోలేదు.


ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వెనెజులాకు ఉపశమనం కలిగిస్తున్నాయి.చైనా, రష్యా, ఇరాన్‌తో చమురు రంగంలో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు కీలకమైనవి.అమెరికా ఆంక్షల కారణంగా దాదాపు వెనెజులా చమురు ఉత్పత్తి నిలిపివేసిన తరుణంలో ఒప్పందం చేసుకున్న ఇరాన్‌ ఆహారం, చమురుటాంక్లను పంపి ఎంతగానో ఆదుకుంది. చాలా మందికి అర్ధంగాని అంశం ఏమంటే వామపక్షాలు అధికారానికి రాకముందే అక్కడి చమురు పరిశ్రమ అమెరికా, ఐరోపా ధనికదేశాల సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైంది. అందువలన దానికి అవసరమైన విడిభాగాలు కావాలంటే పశ్చిమ దేశాల నుంచి, వాటి అనుమతితోనే తెచ్చుకోవాలి. దీన్ని అవకాశంగా తీసుకొని వెనెజులాను అవి దెబ్బతీస్తున్నాయి. రష్యా, ఇరాన్‌ ఇటీవలి కాలంలో ఆ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రత్నామ్నాయం కనుగొనటంతో పశ్చిమ దేశాల ఆటలు సాగటం లేదు. భారీ సాంద్రత కలిగిన వెనెజులా ముడిచమురును శుద్ది సమయంలో పలుచన గావించేందుకు అవసరమైన డైల్యూటెంట్‌ను ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది.వీటికి తోడు చమురు తవ్వకరంగంలో పోటీ కూడా వెనెజులాకు కలసివచ్చింది. చిన్న డ్రిల్లింగ్‌ సంస్ధలు ముందుకు వచ్చాయి. అనేక ఆంక్షలను పక్కన పెట్టి తనకు అవసరమైన చమురు కొనుగోలు ద్వారా మరోరూపంలో చైనా పెద్ద ఎత్తున తోడ్పడింది.

అమెరికా చంకలో దూరిన మనవంటి దేశాలపై అమెరికా వత్తిడి తెచ్చి వెనెజులా నుంచి చమురుకొనుగోలును నిలిపివేయించాయి. లాయడ్‌ లిస్ట్‌ ఇంటర్నేషనల్‌ ప్రకారం 2020లో 150ఓడలు మలేసియా మీదుగా చైనా, ఇండోనేషియాలకు వెనెజులా చమురును సరఫరా చేశాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు పుట్టుకు వస్తాడన్నట్లు అమెరికా ఆంక్షలు విధిస్తున్నకొద్దీ ఇతర మార్గాలు అనేక వచ్చాయి. ఈ ఏడాది 17లక్షల పీపాలు అదనంగా ఉత్పత్తి జరగవచ్చని భావిస్తున్నారు. ఇరాన్‌, వెనెజులా నుంచి చమురు చౌకగా లభించనుండటంతో పాటు సరఫరా హామీ ఉంటుంది. 1990లో రోజుకు 32లక్షల పీపాల చమురు వెలికి తీసిన వెనెజులా రిగ్గులు అమెరికన్ల దుర్మార్గం కారణంగా దాదాపు నిలిపివేసిన స్ధితికి చేరుకున్నాయి. ఇరాన్‌ తోడ్పాడుతూ రోజుకు నాలుగున్నరనుంచి ఐదులక్షల పీపాల చమురు ఉత్పత్తికి పధకాలు వేశారు.


వెనెజులా ఇబ్బందుల గురించి ఎకసెక్కాలాడటం అపర మానవతావాదులకు ఒక వినోదం. అక్కడి సమస్యలేమిటి ? వాటికి ఎవరు కారకులు అన్నది వారికి పట్టదు.అంగవైకల్యం మీద హాస్యాన్ని పండించి వండి వార్చుకు తినేందుకు అలవాటు పడ్డ చౌకబారు స్దాయికి ఎప్పుడో మనం దిగజారాం. ఒక రొట్టె ముక్క కోసం ఒళ్లప్పగించేందుకు సిద్ద పడుతున్న వెనెజులా పడతులని,సిగిరెట్‌ పీక కోసం దేవురించే వృద్దులున్నారని వర్ణించిన మహానుభావులను చూశాము. ఇక్కడా వక్రదృష్టే. అనేక ఆఫ్రికా దేశాల్లో ఎండు డొక్కలతో కనిపించే పిల్లలు అడుక్కోవటాన్ని, పిల్లలకోసం మానం అమ్ముకొనే తల్లులను ఈ మానవతావాదులు బహుశా చూడలేరు. చూసినా తాగిన ఖరీదైన విస్కీ మత్తు వదలి, అందమైన వర్ణనలు రావు. ఇలాంటి పెద్దలకు మాదాపూర్‌, కొండాపూర్‌ పబ్బుల్లో తాగితందనాలతున్న కొందరు చిన్న పెగ్గు, బిర్యానీ, ఇతర విలాసాల కోసం రాత్రంగా కాలక్షేపసరకుగా మారుతున్న వారు కనిపించరు. వీరు ఏ పేదరికం నుంచి వచ్చినట్లు ? కరోనా లాక్‌డౌన్‌ తరుణంలో అనేక మంది యువతులు ఆధునిక దస్తులు వేసుకొని వైన్‌ షాపుల ముందు వరుసలు కట్టింది కనిపించలేదా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనెజులాతో పోల్చుకొనే పరిస్ధితులేమీ లేవు కదా ? చీకటిపడితే చాలు వెలుతురులేని సందులు, గోడలు, లైటు స్థంభాలపక్కన కడుపు కక్కుర్తి కోసం కనిపించే అభాగినులు చేయితిరిగిన రచయితలకు కథావవస్తువులౌతారు. వారిపట్ల సానుభూతో మరొక పేరుతో సొమ్ము చేసుకుంటారు. వెనెజులాలో సంక్షేమ పధకాలే ఈ స్ధితికి తెచ్చాయట, ఎంత కుతర్కం.


ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ పేరుతో 2019 నుంచి ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, వుచిత సర్వీసుల ఆఫర్‌ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు. అది చరిత్రా కాదు, రాసిన వీరేంద్రనాథ్‌ చరిత్ర కారుడూ కాదు అంటూ అప్పుడే ఈ రచయిత స్పందించాడు. ఇన్నేండ్ల తరువాత కూడా అదే ప్రచారం అటూ ఇటూ మారి జరుతోంది. ఎంత పెద్ద అబద్దాలను అలోకగా ఆడతారంటే 1970లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి’ అని రాశారు. నిజమా అమెరికా లెక్కల ప్రకారం 210, ఐఎంఎఫ్‌ అంచనా మేరకు 191, ఎక్కడనా పోలీక ఉందా ?


అమెరికాకు వెనెజులా అంటే ఎందుకు పడదు ? ఎక్కడన్నా గట్టు తగాదా ఉందా లేదే ? సైద్దాంతిక, అదీ వామపక్ష ప్రభావం పెరటాన్ని తట్టుకోలేకపోతోంది. ప్రపంచీకరణలో అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్ధలోకి ప్రవేశించకుండా వెనిజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త రాయలేని పత్రికా స్వేచ్చ మనది మరి., వెెనిజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ చర్య చట్టవిరుద్దం, లేదా దోచుకోవటం అని రాయటం కూడా కష్టమే అంటూ జర్నలిస్టు జాన్‌ పిల్గర్‌ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చినిజాలు ఇవి. ‘2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధరపెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు’ ఇది హ్యూగో ఛావెజ్‌ గురించి రాశారు.(అసలు ఆ ఏడాది ఎన్నికలే జరగలేదు)
ఎవరీ ఛావెజ్‌ ? 1977లో ఒక సైనికుడిగా ఒక వామపక్ష తీవ్రవాద సంస్ధను అణచివేసేందుకు వెళ్లిన ఆయన, వారెందుకు తీవ్రవాదులుగా మారారు, రాజ్యం వారినెందుకు అణచివేస్తున్నది అనే అంతరంగ మధనంతో వామపక్ష వాదిగా మారిన వ్యక్తి. 1989లో కార్లోస్‌ అండ్రెజ్‌ పెరోజ్‌ అనే పెద్ద మనిషి తాను ఎన్నికైతే అమెరికా వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకుంటానని, ఐఎంఎఫ్‌ విధానాలను వ్యతిరేకిస్తాననే వాగ్దానాలతో అధికారానికి వచ్చి అందుకు వ్యతిరేకంగా వ్యవహించాడు. అతని విధానాలు నచ్చని మిలిటరీ అధికారిగా వున్న ఛావెజ్‌ 1992లో విఫల తిరుగుబాటు చేశాడు. అందుకుగాను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1994లో అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం ఛావెజ్‌ను, ఆయనతో పాటు జైల్లో పెట్టిన ఇతర తిరుగుబాటుదార్లను విడుదల చేసింది. మిలిటరీలో తిరిగి చేరకూడదని ఆంక్షలు విధించింది. 1998 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో, వామపక్ష, వుదారవాద, ప్రజాస్వామిక అభిప్రాయాలు కలిగిన వివిధ సంస్ధలు, పార్టీలతో ఏర్పడిన వెనిజులా ఐక్యసోషలిస్టు పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. నూతన రాజ్యాంగం మేరకు 1999లో మరోసారి ఎన్నికలు జరిపి రెండోసారి అధికారానికి వచ్చారు. 2006 డిసెంబరులోనే జరిగాయి, మరుసటి ఏడాది జనవరిలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. నాలుగోసారి 2012లో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే కాన్సర్‌ కారణంగా ఆసుపత్రిలో వున్నందున ప్రమాణస్వీకారం చెయ్యలేదు. అయితే అధికారంలో వుండి తిరిగి గెలిచినందున ప్రమాణస్వీకారం మరోసారి చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది.అయితే ఆరోగ్యం విషమించి 2013 మార్చి ఐదున మరణించారు. వుపాధ్యక్షుడిగా వున్న నికొలస్‌ మదురో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. తరువాత ఎన్నికల్లో మదురో గెలుస్తున్నారు.

వెనెజులాలో వున్నది వామపక్ష ప్రభుత్వం. అంతకు ముందు అక్కడ అనుసరించిన నయా వుదారవాద విధానాలను పూర్తిగా మార్చకుండా జనానికి వుపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నది. దాని ఆదాయం నూటికి 95శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే పరిమితం అమ్ముకుంటున్నదానికి అయినా నాలుగు డాలర్లు వస్తాయి లేకపోతే ఇబ్బందే. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటినుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు.సంక్షమే పధకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్‌. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనిజులాను సాకుగా చూపటమే అభ్యంతరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాటో బలగాల సమీకరణ ఉక్రెయిన్‌లో పోరుకు దారి తీస్తుందా ?

25 Tuesday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, NATO massive arms buildup, RUSSIA, Ukraine war, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


మంగళవారం తెల్లవారేసరికి రెండు ప్రధాన అంతర్జాతీయ వార్తలు. ఒకటి రష్యాదిశగా నాటో నావిక, వైమానిక దళాల తరలింపు. తూర్పు ఐరోపా దేశాలకు 50వేల మందివరకు సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సర్కార్‌ చర్చలు. భద్రతా చర్యల్లో భాగంగా తైవాన్‌ ప్రాంతంపై చక్కర్లు కొట్టిన చైనా వైమానిక దళ విమానాలు. ఉక్రెయిన్‌ నుంచి అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తమ దౌత్యసిబ్బంది, కుటుంబాలను స్వదేశాలకు రావాలని ఆదేశించాయి. ఈ పరిణామాలకు పూసల్లో దారం మాదిరి సంబంధం ఏమైనా ఉందా ? అంతర్జాతీయ రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తుల్లో భాగంగా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.కార్యాకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. చైనా గనుక తైవాన్‌ ప్రాంతాన్ని బలవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే తాము సాయుధ జోక్యం చేసుకుంటామని అంతకు ముందు డోనాల్డ్‌ట్రంప్‌, ఇప్పుడు బైడెన్‌ పదే పదే హెచ్చరించిన అంశం తెలిసిందే. అలాగే దక్షిణచైనా సముద్రం, తైవాన్‌ జలసంధిలోకి అమెరికా యుద్ద నావలను నడిపించిన అంశం తెలిసిందే. ఒక్క చిన్న యుద్ద రంగంలోనే గెలుపెరగని అమెరికా, దాని అనుచర దేశాలు ఒకేసారి రెండు చోట్ల యుద్ధానికి – అదీ బలమైన రష్యా, చైనాలతో తలపడతాయా ?


ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే రష్యాను రెచ్చగొట్టేందుకు పశ్చిమ దేశాలు కవ్వింపులకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తొలి దశలో వెయ్యి నుంచి ఐదువేల మంది వరకు మిలిటరీని రుమేనియా, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియా దేశాలకు పంపాలని తరువాత 50వేలు, అంతకు మించి కూడా మోహరించాలని అమెరికన్లు చర్చలు జరుపుతున్నారు. బాల్టిక్‌, నల్లసముద్ర ప్రాంతంలోని ఈ దేశాల నుంచి కొద్ది నిమిషాల్లోనే రష్యాపై క్షిపణి దాడులు జరిపేందుకు వీలు కలుగుతుంది. పశ్చిమ దేశాల కదలికలు, ప్రకటనలను గమనించిన రష్యా సరిహద్దులకు లక్ష మంది సైనికులను తరలించినట్లు వార్తలు. ఐరోపా గడ్డమీద రెండవ ప్రపంచ పోరు తరువాత అతి పెద్ద యుద్ధం అవుతుంది కనుక తాము ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని ఇంత పెద్ద ఎత్తున ఆయుధ తరలింపును తాము చూడలేని అమెరికా ప్రతినిధి విండ్‌మాన్‌ చెప్పాడు.


నిజంగా యుద్ధం జరుగుతుందా ? అసలెందుకీ హూంకరింపులు ? ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యం, జాతీయ సమగ్రత పరిరక్షణకోసమే ఇది అంటున్నారు. ఇదొక పెద్ద అబద్దం. రష్యాను దెబ్బతీయాలంటే దాని సరిహద్దులకు నాటోను విస్తరించాలన్నది అమెరికా ఎత్తుగడ.2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌ పాలకులను కుట్ర చేసి గద్దెదింపారు. తాజా ఉద్రిక్తతలకు మూలం, రష్యా-ఉక్రెయిన్‌ విబేధాలకు 2013 పరిణామాలు నాంది. ఐరోపా యునియన్‌తో ఆర్ధిక సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్న ప్రతిపాదనను నాటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ యనుకోవిచ్‌ తిరస్కరించాడు. 2013 నవంబరులో దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శకులకు అమెరికా, ఐరోపా దేశాలు, యనుకోవిచ్‌కు రష్యామద్దతు ఇచ్చింది. ఆర్ధిక సంబంధాల ముసుగుతో నాటోలో చేర్చుకోవాలని అమెరికా చూస్తే, వ్యతిరేకించి నిలువరించాలన్నది రష్యాఎత్తుగడ. మరుసటి ఏడాది ఫిబ్రవరిలో యనుకోవిచ్‌ దేశం వదలిపారిపోయాడు. మార్చినెలలో క్రిమియా ప్రాంతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ జనం రష్యాతో కలవాలని తీర్పు చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకొని రష్యా తనతో విలీనం చేసుకుంది.(గతంలో రష్యా రిపబ్లిక్‌లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని నాటి సోవియట్‌ పాలకులు పాలనా సౌలభ్యత కోసం ఉక్రెయిన్‌లో కలిపారు.) మరో రెండు నెలల తరువాత తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటు వాదులు డోన్‌టెస్క్‌, లుహాన్‌స్క్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా వేరుపడాలని జనం చెప్పారు. దాన్ని ఉక్రెయిన్‌ తిరస్కరించింది. తరువాత అక్కడి వేర్పాటు వాదులు ఆయుధాలు పట్టి అనేక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఇప్పటికీ అదే స్ధితి కొనసాగుతోంది. వారికి రష్యా మద్దతు ఇస్తోంది.2015లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ఎవరూ దానికి కట్టుబడిలేరు. అంతర్యుద్దంలో 15వేల మంది మరణించారని అంచనా.


ఇప్పుడు ఆ వేర్పాటువాదులు కోరుతున్నట్లుగా వారిని రష్యా గుర్తించినా లేదా వారికి మద్దతుగా సైన్యాన్ని పంపినా ఆ పేరుతో రష్యా మీద దాడికి దిగాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకుగాను పచ్చి అవాస్తవాలను ప్రచారంలో పెట్టారు. మధ్యధరా సముద్రంలో నాటో కూటమి ఇప్పుడు ” నెప్ట్యూన్‌ స్ట్రైక్‌ 22” పేరుతో ఫిబ్రవరి నాలుగు వరకు సైనిక విన్యాసాలు జరుపుతున్నది. ఇంకా డైనమిక్‌ మంటా 22, డైనమిక్‌ గార్డ్‌, కోల్డ్‌ రెస్పాన్స్‌ 22 పేరుతో కూడా సైనిక విన్యాసాలు జరపనున్నాయి. ఇవన్నీ బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, విదేశాంగశాఖ చేసిన ప్రకటనలో ఉక్రెయిన్‌లో తన అనుకూల మాజీ ఎంపీ మురాయెవ్‌ను గద్దెమీద నిలిపేందుకు రష్యాకుట్ర పన్నినట్లు ఆరోపించింది. దీని మీద స్పందించిన అతగాడు బ్రిటన్‌ గాలితీశాడు. బ్రిటన్‌ విదేశాంగశాఖ గందరగోళంలో ఉన్నట్లుంది.రష్యా నామీద నిషేధం విధించింది, అంతేకాదు నాతండ్రి సంస్ధ నుంచి డబ్బుతీసుకోకుండా ఆ సంస్ధనే స్వాధీనం చేసుకుందని చెప్పాడు. అయినా సరే ప్రచారం ఆపలేదు, అమెరికా దాన్ని లంకించుకుంది. నాటో దేశాల్లో 20లక్షల మందికి పైగా కరోనాతో మరణించినా వారికి పట్టలేదు. ఉక్రెయిన్‌ ప్రజాస్వామ్యం పేరుతో కవ్వింపులకు దిగుతున్నారు.ప్రజారోగ్యరక్షణ ఖర్చును ఆయుధాల మీద ఖర్చు చేస్తున్నారు.


సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసి, స్వాతంత్య్రం ప్రకటించుకున్న తరువాత ఉక్రెయిన్‌ కుక్కలు చింపిన విస్తరిలా మారింది. ఎవరికి దొరికిన ప్రజాసంపదలను వారు స్వంతం చేసుకున్నారు. నడమంత్రపు సిరిగాళ్లు ముందుకు వచ్చారు. ఇప్పుడు అన్ని రంగాలను వారే శాసిస్తున్నారు.మీడియా, అధికారులు, న్యాయమూర్తులు, ఎంపీలు అందరూ సంతలోని సరకులుగా మారారు. ఎవరికి వారు స్వంత సాయుధ ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. ఫాసిస్టు శక్తులు రాజకీయాల్లోకి వచ్చాయి. 2014లో రష్యా అనుకూల యనుకోవిచ్‌ను గద్దె దించేందుకు ఐదు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు అమెరికా విదేశాంగ సహాయమంత్రి విక్టోరియా న్యూలాండ్‌ స్వయంగా చెప్పారు.నాటి జర్మన్‌ మంత్రి స్వయంగా ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపాడు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులతో తలపడేందుకు ఏర్పాటు చేసిన అజోవ్‌ రెజిమెంట్‌ అనే కిరాయి సాయుధమూకకు 2014 కుట్రలో జైలు నుంచి విడుదలైన నేరగాడు ఆండ్రీ బిలెట్‌స్కీ నేత. పచ్చి నాజీ. ఇలాంటి ముఠాలను ఉక్రెయిన్‌ మిలిటరీతో సమన్వయం చేసి వేర్పాటువాదుల మీదకు వదులుతున్నారు. ఈ రెజిమెంట్‌కు మీడియా,రాజకీయపార్టీ, సాయుధ శిక్షణా కేంద్రాలు, ఆయుధాలు ఉన్నాయి.


వివిధ కారణాలతో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తమ స్వంత మిలిటరీ సిబ్బంది పాత్ర నామమాత్రం గావించి కిరాయి మూకలను దించటం ఇటీవలి కాలంలో నానాటికీ పెరుగుతోంది. సిరియాలో అది స్పష్టంగా కనిపించింది. గత కొద్ది సంవత్సరాలుగా అలాంటి మూకలకు కేంద్రంగా ఉక్రెయిన్‌ మారింది.గత ఆరు సంవత్సరాలుగా 50దేశాల నుంచి 17వేల మందికి పైగా కిరాయి మూకలు అక్కడకు వచ్చినట్లు ఎఫ్‌బిఐ మాజీ ఏజంట్‌ అలీ సౌఫాన్‌ చెప్పినట్లు గతేడాది టైమ్‌ పత్రిక రాసింది. వీరందరికి అక్కడి అమెరికా అనుకూల ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.అజోవ్‌ సంస్ధను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధగా ప్రకటించాలన్న 40 మంది ఎంపీల వినతిని అమెరికా సర్కార్‌ బుట్టదాఖలు చేసింది.ఇలాంటి నయా నాజీ మూకలకు అమెరికా శిక్షణ, ఆయుధాలను అందచేస్తోంది. ఇది బరాక్‌ ఒబామా ఏలుబడి నుంచీ జరుగుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన సరిహద్దు రక్షణ దళాలతో పాటు ప్రయివేటు సాయుధ ముఠాలకూ శిక్షణ ఇస్తున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక గతేడాది డిసెంబరు 26న రాసింది. ఇప్పుడు మిలిటరీతో పాటు ఇలాంటి ముఠాలను కూడా సన్నద్దం చేయటాన్ని బట్టి వారిని ఎలా ఉపయోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాన్ని, ఉద్యమించే కార్మికవర్గాన్ని అణచేందుకు, రష్యాతో గిల్లి కజ్జాలు పెట్టుకొనేందుకు వీరిని ముందుకు నెట్టే అవకాశం ఉంది. ఉక్రెయిన్లోని డోన్‌టెస్క్‌,లుహానస్క్‌ ప్రాంతాలలో వేర్పాటు వాదులపైకి వీరిని ఉసిగొల్పితే వారికి మద్దతుగా రష్యా రంగంలోకి దిగవచ్చని, దాన్ని సాకుగా చూపి నాటో దేశాలు దాడులకు పూనుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇది ఒక అంశం మాత్రమే.


మరో రెండు దశాబ్దాల వరకు నాటో కూటమిలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వబోమని రష్యాను నమ్మించేందుకు అమెరికా పూనుకుంది. అమెరికా కడుపులో దుష్టాలోచన లేకపోతే ఇప్పుడు ఆయుధ సమీకరణ ఎందుకు అని అనుమానించిన రష్యా రిజర్వు దళాలు, క్షిపణులను మోహరిస్తున్నది.పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికన్‌ మీడియా యుద్దోన్మాదంతో ఊగిపోతున్నది.జనానికి ఎక్కిస్తున్నది. ఏక్షణమైనా దాడులు జరగవచ్చంటూ వర్ణిస్తున్నది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఉక్రెయిన్‌లో మూడు లక్షల మందికి ఆయుధ శిక్షణ ఇచ్చామని వారికి ఆయుధాలు, డబ్బు అందచేస్తే వారే రష్యా సంగతి చూసుకుంటారని తన మిత్రదేశాలకు అమెరికా చెప్పినట్లు వార్తలు. నాటో కూటమి దేశాలన్నింటా మీ చావు మీరు చావండి, కరోనాతో సహజీవనం చేయండి అంటూ వదిలేసిన పాలకుల మీద కార్మికవర్గం ఆగ్రహంగా ఉంది. అటువంటపుడు యుద్ధానికి మద్దతు ఏమేరకు ఇవ్వగలరన్నది సందేహమే. ఇదే విధంగా రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌ స్ధితి కూడా అంత సానుకూలంగా లేదు. అందువలన రెండు పక్షాలూ బేరసారాలు తప్ప తెగే దాగా లాగే పరిస్ధితి ఉండకపోవచ్చు.

పుతిన్‌ మాటకు గౌరవం, విలువ ఇవ్వాలంటూ ఢిల్లీలో మాట్లాడిన జర్మన్‌ నౌకాదళాధిపతికి స్వదేశం వెళ్లే సరికి ఇక చాలు ఇంటికి దయచెయ్యండి అనే వర్తమానం సిద్దంగా ఉంది. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని విచారం వెలిబుచ్చినా పదవి ఊడింది. మరోవైపు ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఎస్తోనియాకు తాము అందచేసిన వాటిని కూడా ఉక్రెయిన్‌కు తరలించరాదని షరతు పెట్టింది. రష్యాతో సంబంధాల అంశంలో జర్మనీలో భిన్న వైఖరులున్నట్లు ఈ పరిణామాలు వెల్లడించాయి.ఆర్ధిక ఆంక్షలపై జర్మనీ అంగీకరించటంలేదు. రష్యానుంచి పెద్ద గాస్‌ సరఫరా ప్రాజెక్టుకు జర్మనీ మద్దతు ఇస్తున్నది. ఐరోపా యునియన్‌ నుంచి వెళ్లిపోయిన బ్రిటన్‌ మాత్రం అమెరికాకు పూర్తి మద్దతు ఇస్తోంది.ఇప్పటికే ఆర్ధిక ఆంక్షలకు అలవాటు పడిన రష్యా ఇంతకంటే తమను చేసేదేముందనే తెగింపుతో ఉంది.
ఉక్రెయిన్‌ వేర్పాటు వాద ప్రాంతాలను స్వతంత్రదేశాలుగా రష్యా గుర్తిస్తే స్వల్పవివాదం తలెత్తవచ్చు. అది కూడా వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ మిలిటరీకే పరిమితం కావచ్చు తప్ప నాటో రష్యా పోరుగా మారే అవకాశాలు పరిమితం. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, ఉక్రెయిన్‌కు అందచేసిన ఆయుధాలను వెనక్కు తీసుకోవాలని రష్యాకోరుతోంది. అమెరికా నిరాకరిస్తోంది.ఉక్రెయిన్‌ నాటో కూటమికి దగ్గరగా ఉన్నప్పటికీ దానిలో సభ్యురాలు కాదు. గతంలో జార్జియాలో రెండు ప్రాంతాలు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నపుడు రష్యాగుర్తించింది. రెండు దేశాల మధ్య 2008లో స్వల్పపోరు జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరి పరిణామాలు ఉంటాయా ? ప్రతి మేఘం వర్షించదుా ప్రతి ఉరుముకూ పిడుగులు పడవు. ప్రతి పరిణామమూ వినాశకర పోరుకు దారితీయదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమ ప్రయోగాలకు నల్లజాతి అమెరికన్లు, దళితులను కమ్యూనిస్టులు వాడుకుంటున్నారా !

23 Sunday Jan 2022

Posted by raomk in CHINA, CPI(M), Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Black Americans, communism, discrimination against dalits india, Left politics, US anti communism


ఎం కోటేశ్వరరావు


” కమ్యూనిజం ప్రయోగాల కోసం నల్లజాతి అమెరికన్లను ఉపయోగించుకుంటున్న పురోగామివాదులు ” అనే శీర్షికతో ఇటీవల ఒక విశ్లేషణను అమెరికా మీడియాలో చదివాను. వెంటనే మన దేశంలో దళితులను కమ్యూనిస్టులు ఉపయోగించుకుంటున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం గుర్తుకు వచ్చింది. అమెరికాలో లేదా మన దేశం, మరెక్కడైనా ఇలాంటి ప్రచారం చేస్తున్న వారు రెండు రకాలు. ఒకటి ఒక పధకం ప్రకారం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసే మేథావులు, రెండో తరగతి వారి ప్రచారదాడి బాధితులుగా మారిన వారు. కమ్యూనిజం, పురోగామివాదులపై చేసిన దాడికి పాల్పడిన ఆడమ్‌ బి కోల్‌మన్‌ ” బ్లాక్‌ విక్టిమ్‌ టు బ్లాక్‌ విక్టర్‌ ” అనే పుస్తక రచయిత కూడా, ఆఫ్రో-అమెరికన్‌ అని వేరే చెప్పనవసరం లేదు.


ఏమంటాడు ఇతను ? ” అమెరికాలో నేడు నల్లవారు ఫుట్‌బాల్‌ బంతుల్లా ఉన్నారు. వారిని ఎవరు ఎప్పుడు ఎటు తంతారో తెలియదు. నల్లవారికి తమ మీద అదుపు ఉండదు. ఆధునిక రాజకీయాల్లో రాణించాలంటే నల్లజాతి వారికి సాయం అనే అంశాన్ని సోపానంగా చేసుకుంటున్నారు. సాయం చేస్తున్నట్లు చెప్పుకోవటం వేరు నిజంగా సాయం చేయటం వేరు. పురోగామివాదులు ఊహాజనిత కమ్యూనిస్టు జ్వర ప్రేలాపనలో నల్లజాతి అమెరికన్లను ఒక ప్రయోగశాలలో మాదిరి వాడుతున్నారు. అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని ఉపయోగించుకొని నల్లజాతీయులను ధనికులు కాకుండా అడ్డుకుంటున్నారు.” అన్నం ఉడికిందో లేదో చూసేందుకు ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలు అన్నట్లుగా అతగాడు రాసిందాన్ని మొత్తం పునశ్చరణ చేయాల్సిన అవసరం లేదు. నల్లజాతీయుడై ఉండి ఒక వైపు జాత్యహంకార వివక్ష ఉంది, దాడులు నిజమే అని సన్నాయి నొక్కులు నొక్కుతూ అక్కడి దోపిడీ వ్యవస్ధకు మద్దతు ఇచ్చే, కమ్యూస్టు వ్యతిరేకతను అడుగడుగునా వెల్లడించిన కోల్‌మన్‌ వాదనల గురించి ఎంత చెప్పుకున్నా వాటి చుట్టూనే తిరుగుతుంటాయి.


కోల్‌మన్‌ ఇంకా ఎంత కుతర్కం చేశాడో చూడండి ” అమెరికా చరిత్రలో నల్లజాతీయులు హతులయ్యారా ? నిస్సందేహంగా ఎలాంటి మినహాయింపుల్లేవు. పోలీసులు నల్లజాతీయులను అన్యాయంగా కాల్చి చంపారా ? అవును. కానీ జాత్యహంకారం ఉనికిలో ఉండటం, జాత్యహంకార అన్యాయం జరుగుతుండటాన్ని ఉపయోగించుకొని సర్వకాలాల్లో అందరిని సమానంగా చూస్తారు, ప్రతిభతో నిమిత్తం లేకుండా అందరికీ సమంగా ఉత్పత్తిని పంచుతారు అనే ఊహాజనితమైన వైఖరివైపు అమెరికా జనాన్ని వామపక్షం లాగుతున్నది. ఇది కేవలం ప్రహసన ప్రాయమైన అసాధ్యం. సమాజం పని చేసేందుకు అవసరమైన ప్రతిదాన్నీ నాశనం చేయాలని, దానిలోనే జీవించాలని, అదే సరైనదని చెబుతారు… అమెరికా అంతటా పట్టణాల్లో జరుగుతున్నదాన్ని మీరు చూడవచ్చు.శాన్‌ఫ్రాన్సిస్‌కోలో చివరికి పట్టపగలు కూడా దొంగతనాలు జరగటం సర్వసాధారణం. ఇళ్లు లేని వారు నగరమంతటా ఎక్కడబడితే అక్కడ వారు అనుకున్న చోట గుడారాలు వేస్తున్నారు, అనుకున్న ప్రతిదాన్నీ అపరిశుభ్రంగావిస్తున్నారు. తప్పుడు విధానాలు దీనికి కారణం కావచ్చు గానీ ఇదంతా మన సమాజాన్ని నిర్వీర్యం చేసేందుకే పధకం ప్రకారం చేస్తున్నది. మార్క్సిస్టు భావజాలపు ప్రత్యక్ష ప్రభావం ఇది ”


1950దశకంలో ఆంధ్రదేశంలో కమ్యూనిస్టుల ప్రభావం బలంగా ఉన్న సమయంలో వ్యతిరేకులు ఇలాంటి ప్రచారాలే చేశారు. మనకు ఐదువేళ్లు సమంగా ఉండవు కదా, కమ్యూనిస్టులు వస్తే అన్నింటినీ సమంగా నరికేస్తారు. మీకు రెండు చొక్కాలు, పంచెలు ఉంటే ఒకటి లాక్కుని లేనివారికి ఇస్తారు. ఇంటిని సగం చేసి మిగతాది లేని వారికి అప్పగిస్తారు. ఎవరైనా వ్యతిరేకిస్తే నెత్తిమీద సుత్తితో కొట్టి కాడవలితో గొంతు కోస్తారు, ఇంకా నోరుబట్టని ప్రచారాలతో జనాన్ని రెచ్చగొట్టారు. అన్నింటినీ ధ్వంసం చేస్తామని కమ్యూనిస్టులు ఎక్కడ చెప్పారు. మనిషిని మనిషి దోచుకొనే పద్దతిని నాశనం చేస్తామన్నారు, దోపిడీకి రక్షణగా , జనానికి వ్యతిరేకంగా ఉండేవారి సంగతి చూస్తామన్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలోనో మరొక నగరంలో జనానికికందరికీ ఇంటి వసతి కల్పిస్తే రోడ్లమీద గుడారాలు ఎందుకు వేస్తారు. పని, ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తే ఎవరైనా దొంగతనాలు చేస్తారా ? నల్లవారు కనిపించగానే ఉట్టిపుణ్యానికే రెచ్చిపోతున్న పోలీసులను అదుపు చేస్తే ఎందుకు తిరగబడతారు ? అలాంటి పరిస్ధితులను నివారిస్తే కమ్యూనిస్టులు, మరొక పురోగామి, ప్రజాస్వామ్యవాదులతో పనేముంటుంది ?


మన దేశంలో కూడా దళితుల పేరుతో ఇలాంటి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగారు. దీనికి అమెరికాలోని కోల్‌మన్‌ వంటి వారి ప్రభావం ఒక కారణంగా చెప్పవచ్చు. అమెరికాలోని నల్లజాతివారు, దళితులకు అనేక పోలికలు కనిపిస్తాయి. ఇరువురూ బాధితులే. రాబిన్‌హుడ్‌ మాదిరి ఒక వీరుడు వచ్చి వారిని విముక్తి చేస్తాడని, దోపిడీ, వివక్ష నుంచి రక్షిస్తాడని ఎవరూ చెప్పలేదు. తామే విముక్తి చేస్తామని కమ్యూనిస్టులూ వకాల్తాపుచ్చుకోలేదు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నారు అంటే ఎవరి విముక్తికి వారు ముందుకు రావాలనే తప్ప మీరు అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండండి మేమే పోరాడతాం అనటం లేదు. జనం జరిపే పోరాటాల్లో ముందుంటాం అని దారి చూపుతున్నారు. అణగారిన తరగతులు వారు ఎవరైనప్పటికీ వారినందరినీ కమ్యూనిస్టులు వినియోగించుకుంటూ వారిని జెండాలు మోసేవారిగానే పరిమితం చేస్తున్నారనే ఆరోపణలు, వక్రీకరణలు తెలిసిందే. మహత్తర తెలంగాణా సాయుధ పోరాటంలో నైజాం, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు ? మల్లు స్వరాజ్యం వంటి వారంతా దొరల కుటుంబాలనుంచి వచ్చి తుపాకి పట్టిన వారే కదా ! వారితో పాటు వెట్టి,అణచివేతకు గురైన వారందరూ కూడా బందూకులు పట్టారు. ఆ పోరాటంలో ఎవరు అమరులైందీ ఆ గ్రామాలు, పట్టణాల్లో ఎవరిని అడిగినా చెబుతారు.కమ్యూనిస్టులు వాడుకుంటారు అని చెప్పేవారు కేరళలో వరుసగా రెండోసారి సిఎంగా చరిత్ర సృష్టించిన పినరయి విజయన్‌ గురించి ఏమి చెబుతారు ? ఒక గీత కార్మికుడి కుమారుడు కదా !


కుల వివక్ష సమస్యను కమ్యూనిస్టులు గుర్తించలేదు అన్నది ఒక విమర్శ. ఇది కూడా వక్రీకరణే, వాస్తవం కాదు. అంబేద్కర్‌ కంటే ముందే నారాయణ గురు, అయ్యంకలి వంటి సంస్కరణవాదులెందరో కులవివక్ష పోవాలని చెప్పి ఎంతో కృషి చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎకె గోపాలన్‌ వంటి ఎందరో కమ్యూనిస్టులు దళితుల దేవాలయ ప్రవేశం వంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సోషలిస్టు వ్యవస్ధలో ఆర్ధిక అంతరాలను రూపుమాపితే తప్ప కుల సమస్య పరిష్కారం కాదని భావించిన కారణంగానే మొదటిదానికే ప్రాధాన్యత ఇచ్చారనిపిస్తుంది. ప్రతి సంఘసంస్కరణ ఉద్యమాన్ని సొంతం చేసుకున్న కమ్యూనిస్టులు దళిత కులవివక్షను పట్టించుకోలేదనటం వక్రీకరణే. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాటితో పోలిస్తే సిపిఎం నేతలు ఆ సమస్యను మకింత స్పష్టంగా గుర్తించారు గనుక కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐనా వర్గ సమస్యకు ఇచ్చినంత ప్రాధాన్యతను వర్ణ అంశానికి కూడా ఇచ్చి పోరాడలేదని సానుకూలంగా విమర్శిస్తే అదొకదారి. అందుకు సూచనలు చేయవచ్చు. శత్రుపూరిత దాడికి దిగితే ఏమనాలి ?


వర్గ శత్రువు కంటికి కనిపించేది, వర్ణశత్రువు స్వభావం అలాంటిది కాదు. ముందు కులాన్ని నిర్మూలించిన తరువాత వర్గ నిర్మూలన చేపట్టాలని చెప్పేవారు కమ్యూనిస్టులతో నిమిత్తం లేకుండా అంబేద్కర్‌ కాలం నుంచి ఇప్పటి వరకు ఎంత మేరకు జనాన్ని కూడగట్టారో, ఎంత పురోగతి సాధించారో ఒక్కసారి నెమరువేసుకోవాలి. చివరికి అంబేద్కర్‌ను సైతం ఒక కులానికి ప్రతినిధిగా దిగజార్చారనే విమర్శ ఉంది కదా ! కులవివక్షనే వ్యతిరేకించేందుకు మద్దతు తెలపని స్ధితిలో కుల నిర్మూలనకు పిలుపు ఇవ్వటం నేలవిడిచి సాము కాదా ! చట్టాలు, సంస్కరణలతో వెంటనే సామాజిక మార్పులు రావని అనేక దురాచారాల అంశంలో రుజువైంది. రిజర్వేషన్లను అనుభవించేందుకు కులాలవారీ వర్గీకరణ చేయాలనే ఒక ప్రజాస్వామిక డిమాండ్‌నే దళితులలో కొందరు అంగీకరించకుండా వీధులకు ఎక్కుతున్న స్ధితి ఉంది. దేశంలో కులనిచ్చెనమెట్లు అన్ని కులాల్లో ఉన్నాయి. ఇలాంటి వాటినే పరిష్కరించలేని స్ధితిలో మొత్తంగా కులనిర్మూలన అంశాన్ని చేపట్టాలనే వాదన ఆచరణాత్మకóమా ? లేదూ సాధ్యమే అని నమ్మేవారు అందుకోసం పోరాడితే ఎవరూ తప్పు పట్టరు. ఆర్ధిక సమస్యల మీద పోరాడేందుకే జనం ముందుకు రావటం లేదన్నది ఒక కఠోరవాస్తవం. నరనరాన వేల సంవత్సరాలుగా జీర్ణించుకుపోయిన కులవివక్ష అంశం ఎక్కడైనా ముందుకు వచ్చినపుడు దాని మీద పోరాడటం, మిగతా సమయాల్లో ఈ అంశాన్ని ప్రచారం చేస్తూ వర్గ సమస్యతో జమిలిగా చేపట్టటం ఆచరణాత్మక అంశం అవుతుంది.


ఇక్కడ ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఆఫ్రికా నుంచి అమెరికాకు అక్కడి జనాలను బానిసలుగా తీసుకురావటం 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. మన దేశంలో దళితులను కొన్ని వేల సంవత్సరాల నాడే సృష్టించారు. అనేక దేశాలలో ఆఫ్రికన్‌ బానిసల వారసులు గానీ, దళితులు గానీ లేరు. కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ గానీ, వారికి ముందున్న ఊహాజనిత సోషలిస్టులు కానీ నల్లజాతీయులు లేదా దళితుల కోసమే కమ్యూనిస్టు సిద్దాంతం అని గానీ, వారితోనే ప్రయోగాలు చేయాలని గానీ ఎక్కడా చెప్పలేదు. భవిష్యత్‌లో కమ్యూనిస్టు సిద్దాంతం పుడుతుందని, దాని ప్రయోగాలకు వీరిని సిద్దం చేసి ఉంచాలని వారిని వందలు, వేల ఏండ్లక్రితమే సృష్టించారా మరి ? సృష్టిస్తే ఎవరు వారు ? ఒక వేళ తమ ప్రయోగాల కోసమే ఈ సామాజిక తరగతులను లేదా కార్మికవర్గాన్ని సృష్టించి ఉంచారని మార్క్స్‌-ఎంగెల్స్‌లకు తెలుసా ? తెలిసినా, వారు అనుకున్నా తమ కార్యకలాపాలను అమెరికా లేదా లాటిన్‌ అమెరికాలోని స్పానిష్‌ వలస దేశాలు, భారత్‌కు వెళ్లి ప్రయోగాలు చేయకుండా జర్మనీ, బ్రిటన్‌కు ఎందుకు వెళ్లారు ? 1871లో జరిగిన పారిస్‌ కమ్యూన్‌ తిరుగుబాటులో అక్కడి ఆఫ్రో-ఫ్రెంచి జాతీయులు పాల్గని ఉండవచ్చు గానీ నాయకత్వం ఫ్రెంచి కార్మికవర్గమే కదా ? రష్యా,చైనా, వియత్నాం, క్యూబా, కొరియాలో ఎవరిని వినియోగించి విప్లవాలను తీసుకువచ్చారు ? ఎవరు లబ్ది పొందారు ?


ఇక కమ్యూనిస్టు నేతలు, వారి కుటుంబసభ్యులు త్యాగాలు చేయరు, సామాన్యకార్యకర్తలనే బలిపెడతారు అన్న దుర్మార్గమైన నిందలు కూడా వేసేవారున్నారు. జనం కోసం త్యాగాలకు సిద్దపడి ఏటికి ఎదురీదేవారు కమ్యూనిస్టులు తప్ప మరొకరు లేరు. ఎక్కడైనా పార్టీనేతలుగా ఉండి అక్రమాలకు పాల్పడేవారు వేళ్లమీద లెక్కించగలిగిన వారు లేరని ఎవరూ చెప్పరు. వారిని మాత్రమే చూపుతున్నారంటే ఏమనుకోవాలి ? ఎన్నో కుటుంబాలు అసమాన త్యాగాలు చేశాయి. ఆ వివరాలన్నీ పేర్కొనటం ఇక్కడ సాధ్యం కాదు. రెండు మూడు ఉదంతాలు చూద్దాం.


హిట్లర్‌ అంతు చూసిన స్టాలిన్‌ కుమారుడు ఎకోవ్‌ జర్మన్లకు చిక్కి వారి చేతిలో మరణించిన అంశం తెలిసిందే. అధినేతగా తలచుకుంటే తన కుమారుడిని ఏదో ఒక ఉద్యోగంలో పెట్టటం కష్టమేమీ కాదు. కానీ సైన్యంలో చేరాలని కోరాడు. రెండవ ప్రపంచ యుద్దంలో జర్మన్లకు బందీగా చిక్కాడు. తమ వారిని విడిచిపెడితే ఎకోవ్‌ను అప్పగిస్తామని హిట్లర్‌ మూకలు చేసిన ప్రతిపాదనను స్టాలిన్‌ అంగీకరించలేదు. కుమారుడి కోసం నరహంతక నాజీలను వదిలేదని తిరస్కరించాడు. తరువాత ఎకోవ్‌ను జర్మన్లు కాల్చి చంపారు. స్టాలిన్‌ తరువాత అధికారానికి వచ్చిన నికితా కృశ్చేవ్‌ కుమారుడు లియోనిద్‌ కృశ్చేవ్‌ ఆర్టిలరీ బాటరీ కమాండర్‌. అదే యుద్దంలో వీరమరణం పొందాడు. ఇలాంటి వారెందరో ఉన్నారు. సోవియట్‌ వెలుపల యుగోస్లావియా నేత టిటో కుమారుడు జర్‌కో బ్రోజ్‌ తన చేతిని పొగొట్టుకున్నాడు. స్పెయిన్‌ కమ్యూనిస్టు నేత డోలోర్స్‌ గోమెజ్‌ కుమారుడు రూబెన్‌ రూయిజ్‌ స్టాలిన్‌గ్రాడ్‌ పోరులో కమాండర్‌గా వీరత్వం పొందాడు.


చైనా అగ్రనేత మావో సంతానంలో మావో అనీయింగ్‌ ఒకడు. తల్లి యాంగ్‌ కైహుయి విప్లవకారిణి.1930 అక్టోబరులో కొమింటాంగ్‌ యుద్దప్రభువు హి షియాన్‌ ఆమెను బందీగా పట్టుకున్నాడు. మావోకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన చేస్తే వదలివేస్తామని చెప్పాడు. నిరాకరించినందుకు చిత్రహింసలు పెట్టారు. చివరకు నవంబరు 14న ఆమెను ఉరితీశారు. ఆ నాటికి ఆమె వయసు 29 సంవత్సరాలు. మావో ఎక్కడున్నాడో తెలియదు, ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు.మావో అనీయింగ్‌కు అప్పుడు ఎనిమిది సంవత్సరాలు. షాంఘైవీధుల్లో అడుక్కొని పొట్టపోసుకున్నాడు.1936లో అతన్ని కనుగొన్న మావో రష్యా పంపాడు. మావో కుమారుడు కనుక అతన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. సెర్గీ మయవ్‌ అని కొత్త పేరు పెట్టారు. 1942లో తనను రెడ్‌ ఆర్మీలో చేర్చుకోవాలంటూ స్టాలిన్‌కు సెర్గీ లేఖ రాశాడు.” ప్రియమైన కామ్రేడ్‌ స్టాలిన్‌ ! నేను ఒక చైనా యువకుడిని. మీ నేతృత్వంలోని సోవియట్ల దేశంలో ఐదు సంవత్సరాలు చదువుకున్నాను. నేను చైనాను ఎంతగా ప్రేమిస్తానో యుఎస్‌ఎస్‌ఆర్‌ను కూడా అంతగొప్పగా ఆరాధిస్తాను. మీ దేశం జర్మన్‌ ఫాసిస్టుల పదఘట్టనల కింద నలిగిపోతుంటే నేను చూస్తూ కూర్చోలేను. లక్షలాది మంది సోవియట్‌ పౌరులను చంపినదానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ముందు పీఠీన నిలిచి పోరాడేందుకు పూర్తి సంసిద్దంగా ఉన్నాను. దయచేసిన నా వాంఛను మన్నించాలని కోరుతున్నాను.” అని రాసిన లేఖకు సమాధానం రాలేదు. తరువాత ఒక అధికారి వచ్చి ” తండ్రి ఒక హీరో, కుమారుడు ఆయన ఒడిలో పెరిగిన బలశాలి ” అంటూ సైనిక శిక్షణకు పంపాడు.1944లో టాంకుల కమాండర్‌గా పోలాండ్‌, జర్మనీ రంగాలలో పోరాడాడు. అయితే అతను రష్యన్‌ భాష బాగా మాట్లాడుతుండటంతో తోటివారెవరూ మావో కుమారుడని గుర్తించలేదు. తరువాత 1945లో సోవియట్‌ -జపాన్‌ యుద్దంలో కూడా పాల్గొన్నాడు. అతని ధైర్యసాహసాలకు మెచ్చి స్టాలిన్‌ స్వయంగా తన సంతకంతో కూడిన ఒక ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చాడు. 1946లో చైనాకు తిరిగి వచ్చాడు.1950లో కొరియాలో పోరాడేందుకు వెళ్లాడు. అక్కడ అమెరికా వైమానిక దాడిలో ప్రాణాలు అర్పించాడు.


మన దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఇతర దేశాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో కమ్యూనిస్టులు కాని వారు కూడా ఎందరో అసమాన త్యాగాలు చేసిన చరిత్ర ఉంది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఆ పోరాటాల్లో ఎందరో నేతలతో పాటు వారి అడుగుజాడల్లో నడిచిన సామాన్యులు కూడా అమరులైనారు. స్వాతంత్య్రం పేరుతో సామాన్యులను బలిపెట్టారని ఎవరైనా నాటి నేతలను నిందించగలమా ? చౌకబారుతనం, పాలకవర్గాల ప్రచారాన్ని భుజానవేసుకొనే బానిస బుద్ది తప్ప అది సంస్కారమేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కొందరు అమెరికన్ల ఉన్మాదం : చైనా దాడికి వస్తే తైవాన్‌ చిప్స్‌ కంపెనీల నాశనం !

10 Monday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Chinese Invasion Plan, Taiwan Matters, TSMC, US warmongers


ఎం కోటేశ్వరరావు


చైనా గనుక బలవంతంగా స్వాధీనం చేసుకొనేందుకు పూనుకుంటే తైవాన్‌ తన సెమికండక్టర్‌ పరిశ్రమను (TSMC),పూర్తిగా ధ్వంసం చేయాలని అమెరికన్‌ మిలిటరీ పత్రిక ” పారామీటర్స్‌” సూచించింది. జార్‌డ్‌ మెకెనీ, పీటర్‌ హారిస్‌ అనే జంట రచయితలు ఈ సలహా ఇచ్చారు. ఎందుకటా ! తైవాన్‌లో ఉన్న వనరులను పనికి రాకుండా చేస్తే తైవాన్‌ అనావశ్యకమైనదిగా చైనాకు కనిపిస్తుందట. ఒకవేళ ఆక్రమించుకున్నా దానికి పనికి రాకుండా చేయటం చైనాను అడ్డుకొనే ఎత్తుగడల్లో ఒకటవుతుందట.తనకు దక్కని అమ్మాయి వేరెవరికీ దక్క కూడదంటూ యాసిడ్‌ పోసే, హత్యలు చేసే బాపతును ఈ సలహా గుర్తుకు తేవటం లేదూ ! చైనాను దారికి తెచ్చుకొనేందుకు ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించక అమెరికాలో పెరిగిపోతున్న అసహనం, దుష్ట ఆలోచనలకు ఇది నిదర్శనం. ఒక వేళ తైవాను పాలకులు ఆ పని చేయకపోయినా సిఐఏ వారే ఆపని చేయగల దుర్మార్గులు. తైవాన్‌లో రెండున్నర కోట్ల మంది జనాభా ఉన్నారు. వారేమైనా అమెరికన్లకు పట్టదు, కావలసిందల్లా చైనాను అడ్డుకోవటమే. పారా మీటర్స్‌ పత్రికలో ఈ సలహా ఇచ్చిన వారు చిన్నవారేమీ కాదు. అమెరికా ఎయిర్‌ విశ్వవిద్యాలయంలోని భద్రత, వ్యూహాత్మక అధ్యయన కేంద్ర అధిపతిగా మెకనీ, కొలరాడో స్టేట్‌ విశ్వవిద్యాలయ రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్‌గా పీటర్‌ హారిస్‌ ఉన్నాడు.


ఎలక్ట్రానిక్స్‌లో కీలకమైన చిప్స్‌ తయారీలో తైవాన్‌ ప్రాంతం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.అనేక ఇతర దేశాలతో పాటు వాటిని ప్రధాన భూభాగమైన చైనాకు సరఫరా చేస్తోంది.తైవాన్‌ గనుక సెమికండక్టర్‌ పరిశ్రమను నాశనం చేస్తే అమెరికా మిత్రదేశంగా ఉన్న దక్షిణ కొరియాలోని శాంసంగ్‌ ఒక్కటే చిప్స్‌ రూపకల్పనలో ప్రత్నామ్నాయంగా మారుతుందని, చిప్స్‌ లేకపోతే చైనాలోని హైటెక్‌ పరిశ్రమలేవీ పనిచేయవని,అప్పడు చైనీయులు తమ నేతల యుద్ధ ప్రయత్నాలపై తిరగబడతారని, ఒక వేళ స్వాధీనం చేసుకున్పప్పటికీ ఆర్ధిక మూల్యం సంవత్సరాల తరబడి ఉంటుందని, చైనా కమ్యూనిస్టు పార్టీపై జన సమ్మతి తగ్గుతుందంటూ ఒక ఊహా చిత్రాన్ని సదరు పెద్దమనుషులు ఆవిష్కరించారు. చైనా మిలిటరీ అలా వస్తున్నట్లుగా తెలియగానే ఇలా మీటనొక్కగానే వాటంతట అవే సెమికండక్టర్‌ పరిశ్రమలు పేలిపోయేవిధంగా చిప్స్‌ తయారు చేయాలన్నట్లుగా హాలీవుడ్‌ సినిమాల స్క్రిప్ట్‌ను వారు సూచించారు. ఈ రంగంలో పని చేస్తున్న తైవాన్‌ నిపుణులను త్వరగా వెలుపలికి తరలించే పధకాలను సిద్దం చేయాలని, వారికి అమెరికాలో ఆశ్రయం కల్పించాలని కూడా వారు చెప్పారు. తాము చేస్తున్న ప్రతిపాదన తైవానీస్‌కు నచ్చదని, సెమికండక్టర్‌ పరిశ్రమలను నాశనం చేస్తే నష్టం చాలా స్వల్పమని అదే అమెరికా యుద్ధానికి దిగితే పెద్ద ఎత్తున, దీర్ఘకాలం సాగుతుందని అమెరికన్‌ రచయితలు పరోక్షంగా తైవానీస్‌ను బెదిరించారు.


చైనాలోని ఒక తిరుగుబాటు రాష్ట్రం తైవాన్‌ . ఐక్యరాజ్యసమితిలో రెండు చైనాలు లేవు, తైవాన్‌కు ఒక దేశంగా గుర్తింపు లేదు.తైవాన్‌లోని కొందరు స్వతంత్ర దేశంగా మార్చాలని చూస్తున్నారు. అధికారికంగా తైవాన్‌ ప్రాంతం కూడా చైనాలో విలీనం గురించే మాట్లాడుతుంది తప్ప మరొకటి కాదు. విలీనం అవుతాము గానీ అది కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చైనాలో కాదు అంటూ నాటకం ఆడుతోంది. అమెరికా సైతం ఒకే చైనా భావనను అంగీకరిస్తూనే విలీనం బలవంతంగా జరగకూడదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మరోవైపు దానికి ఆయుధాలు సమకూరుస్తూ, దొడ్డి దారిన అక్కడ కార్యాలయం తెరిచింది. బలవంతంగా ఆక్రమించుకుంటే చైనాను అడ్డుకుంటామని పదే పదే చెబుతోంది. ఐరాస తీర్మానానికి వ్యతిరేకంగా తైవాన్ను కొన్ని అమెరికా తొత్తు దేశాలు గుర్తిస్తున్నట్లు ప్రకటించి చైనాను రెచ్చగొడుతున్నాయి. ఆ ప్రాంతం తమదే అని, విలీనం సెమికండక్టర్‌ పరిశ్రమ కోసం కాదని చైనా స్పందించింది. ఒకవేళ తైవాన్ను ఆక్రమించదలచుకుంటే చైనాకు 14గంటల సమయం చాలునని, దాన్ని అడ్డుకొనేందుకు అమెరికా, జపాన్‌ రావాలంటే 24 గంటలు పడుతుందని కొందరు చెప్పారు.


తమ దేశాన్ని బాగు చేసుకోవటం గురించి ఇలాంటి పెద్దలు కేంద్రీకరించకుండా ఎదుటి వారిని దెబ్బతీయాలని దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు చేస్తున్నట్లు ? రెండు కారణాలున్నాయి. చైనా మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించాలన్నది అమెరికా కార్పొరేట్ల ఆలోచన. రకరకాల ఎత్తుగడలు వేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నకొద్దీ కొరకరాని కొయ్యగా మారుతోంది. ఆంక్షలను విధించటం, అమెరికా యుద్దనావలను తైవాన్‌ జలసంధిలో దించినప్పటికీ చైనా అదరలేదు బెదరలేదు. తాజాగా చైనా స్వంతంగా చిప్స్‌ తయారీకి పూనుకుంది.2049 నాటికి ఒక దేశం- రెండు వ్యవస్ధల ప్రత్యేక పాలిత ప్రాంతాలుగా ఉన్న హాంకాంగ్‌, మకావు దీవులు ప్రధాన ప్రాంతలో పూర్తిగా విలీనం అవుతాయి. అప్పటికి తైవాన్‌ విలీనం కూడా పూర్తి కావాలని చైనా భావిస్తోంది. ధనిక దేశాల స్ధాయికి తమ జనాల జీవన ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతో ఉంది. హాంకాంగ్‌ను స్వతంత్ర దేశంగా మార్చాలనే అమెరికా ఎత్తుగడలు విఫలం కావటంతో ఇప్పుడు తైవాన్‌ అంశం మీద రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.


మన దేశంలో కూడా ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తున్నవారు లేకపోలేదు.ఆర్‌సి పాటియల్‌ అనే మాజీ సైనికాధికారి తాజాగా రాసిన వ్యాసంలో అమెరికా ఎత్తుగడలకు అనుగుణంగా ప్రతిపాదించారు. దాని సారాంశం ఇలా ఉంది. అడ్డుకొనే వారు లేకపోతే వివిధ దేశాల పట్ల చైనా కప్పగంతులు వేస్తూ ముందుకు సాగుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో మిత్రరాజ్యాలు జపాన్‌ మీద దాడి చేసినపుడు భారీ ఎత్తున మిలిటరీ ఉన్న దీవులను వదలి ఇతర వాటిని పట్టుకున్నాయని ఇప్పుడు చైనా కూడా అదే పద్దతులను అనుసరించవచ్చని పేర్కొన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు దిగువ సూచనలు పాటించాలని పాటియల్‌ పేర్కొన్నారు. చైనా బలవంతానికి గురైన దేశాలు ముందు స్వంతంగా పోరాడాలి, తరువాత ఉమ్మడిగా పధకం వేయాలి. చైనా వాణిజ్య, ఇతర వత్తిళ్లకు ఇప్పటికై గురైన వాటిని, భవిష్యత్‌లో అవకాశం ఉన్న దేశాలన్నింటినీ అమెరికా, భారత్‌ ఒక దగ్గరకు చేర్చాలి. చైనాలో టిబెట్‌ అంతర్భాగమంటూ 1954లో నెహ్రూ ప్రభుత్వం గుర్తించినదానిని రద్దు చేయాలి. ముందుగా దేశ రాజకీయనేతలు ఆ పని చేసేందుకు భయపడకూడదు. తైవాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలి, దాని తరఫున అమెరికా నిలవాలి. కొత్త దలైలామాను ఎన్నుకొనేందుకు సాంప్రదాయ పద్దతి పాటించేందుకు ప్రస్తుత దలైలామాను అనుమతించాలని భారత్‌ వత్తిడి తేవాలి. ఈ అంశంలో చైనా వైఖరిని గట్టిగా ఎదుర్కోవాలి. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న ఉఘిర్స్‌ ఈస్ట్‌ టర్కిస్తాన్‌ ప్రభుత్వాన్ని(చైనాలోని షిన్‌జియాంగ్‌ రాష్ట్ర తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసినది. వారికి మానవహక్కులు లేవంటూ ప్రచారం చేస్తున్న అంశం తెలిసిందే) గుర్తించే విధంగా ముస్లిం దేశాలను ఒప్పించాలి. అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలతో ఉన్న చతుష్టయం(క్వాడ్‌) ప్రస్తుతం మిలిటరీ కూటమి కాదు, రాబోఏ రోజుల్లో అలా మార్చాలి. మరిన్ని దేశాలతో విస్తరించాలి.అమెరికా, ఇజ్రాయెల్‌,భారత్‌, ఐక్య అరబ్‌ దేశాలతో రెండవ చతుష్టయాన్ని ఏర్పరచాలి.చైనాతో అన్ని దేశాలూ వాణిజ్యాన్ని తగ్గించుకోవాలి.ఆస్ట్రేలియా,బ్రిటన్‌, అమెరికాలతో కూడిన అకుస్‌ మాదిరి భారత్‌, ఫ్రాన్స్‌, జపాన్‌ భద్రతా కూటమిని ఏర్పాటు చేయాలి. ఇండో-పసిఫిక్‌, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని దేశాలన్నింటికీ అమెరికా రక్షణ కల్పించాలి. చైనాను అగ్రరాజ్యంగా ఎదగకుండా చూడాలి.భావ సారూప్యత కలిగిన దేశాలు ముప్పును ఎదుర్కొనేందుకు సిద్దపడి చైనా కప్పగంతు పధకాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి.


అమెరికా అజెండాకు అనుకూలమైన ఎత్తుగడలతో మన దేశాన్ని ఎక్కడకు తీసుకుపోదామనుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లనే అదుపు చేయలేని అమెరికా మిలిటరీ చైనాను నిలువరించగలదా ? తన మిలిటరీని తానే రక్షించుకోలేక తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని దేశం విడిచిన వారు మన దేశం, మరొక దేశం కోసం పోరాడతారా? అసలు అమెరికా తాను స్వయంగా ప్రారంభించిన ఏ యుద్దంలో ఐనా గెలిచిన ఉదంతం ఉందా? దురద తనది కాదు గనుక ఇతరులను తాటి మట్టతో గోక్కోమన్నట్లుగా పడక కుర్చీలకు పరిమితమైన ఇలాంటి యుద్దోన్మాదులు చెప్పే ఉచిత సలహాలను అనుసరిస్తే వారికేమీ పోదు, సామాన్య జనజీవితాలు అతలాకుతలం అవుతాయి.చైనాతో మనకు పరిష్కారం కావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. శుభకార్యానికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు ఇలాంటి పనులు చేస్తే ఫలితం ఉంటుందా ? కావాల్సింది సరిహద్దు సమస్య పరిష్కారమా ? చైనాతో వైరమా ? దాన్ని గురించి ఒక్కటంటే ఒక్క సూచన కూడా ఈ పెద్దమనిషి చేయలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా గ్రామాల నిర్మాణం నిజానిజాలేమిటి : మీడియా పాత్ర దేశభక్తా – దేశ ద్రోహమా ?

12 Friday Nov 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, CDS Rawat, China- India dispute, Line of Actual Control, Narendra Modi, Pentagon on China military, RSS


ఎం కోటేశ్వరరావు


” భారత భూభాగాల్లో అరుణాచల్‌ సమీపంలో చైనా అక్రమంగా గ్రామాలను నిర్మిస్తున్నది ” అమెరికా పార్లమెంట్‌కు అక్కడి రక్షణ శాఖ పెంటగన్‌ ఇటీవల వార్షిక నివేదికలో చేసిన వ్యాఖ్యలలో ఒకటి. ఇంకేముంది దున్న ఈనిందని చెప్పగానే గాటన కట్టేయమన్నట్లుగా మీడియా మన జనాలకు ఆ వార్తను అందించింది. ఇంత ఘోరమా అని అనేక మంది ఆగ్రహించారు. చైనాకు అడ్డు అదుపూ లేకుండా పోయింది, ఏదో ఒకటి చేయాలని జనాలు కొందరు ఊగి ఊగిపోయారు. చుట్టుముడుతున్న సమస్యల నుంచి జనాన్ని ఎలా పక్కదారి పట్టించాలా అని నిరంతరం మార్గాలు వెతికే పాలకులకు కాగల పని గంధర్వులు తీర్చారు అన్నట్లుగా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టి పెంటగన్‌, మీడియా తమ పాత్రలను తాము చక్కగా పోషించాయి. నివేదిక, వార్తలు వెలువడిన కొద్ది రోజుల తరువాత తాపీగా ప్రభుత్వం, మిలిటరీ అధికారి రంగంలోకి దిగారు. ఆ చెప్పేదేదో మరుసటి రోజే చెబితే జనాలకు అనవసర ఆయాసం తప్పేది కదా ! బుర్రలు ఖరాబు చేసుకొని ఉండేవారు కదా కదా !! ఎందుకు ఆలశ్యం చేసినట్లు ?


కావాలనే ఆలశ్యంగా స్పందించారన్నది స్పష్టం. పెంటగన్‌ ప్రచారాన్ని కొనసాగనిస్తే చైనా వారు ఏకంగా గ్రామాలనే నిర్మిస్తుంటే మన ప్రభుత్వం ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నది అని ఆవేశం నుంచి తేరుకున్న జనం ప్రశ్నిస్తారు, వాడెవడో అమెరికా వాడు చెప్పేంతవరకు మన సరిహద్దుల్లో ఏం జరుగుతోందన్న సంగతులే తెలియకుండా లేదా తెలుసుకోకుండా మన ముసలి జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌ ఏం చేస్తున్నట్లు ? దేశ రక్షణ బాధ్యత తనదే అని పదే పదే ప్రకటించుకున్న ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోవద్దా అని జనం అడుగుతారు. రెండోవైపు నుంచి పెంటగన్‌ చెప్పినదాని మీద మీరు మాట్లాడలేదంటే అది నిజమే అని మీరు నమ్మినట్లే అని మేం భావించవచ్చా అని చైనా వారు కూడా అడుగుతారు. అందుకే స్పందించారు. ఏమన్నారు ?


భారత భూభాగంలో చైనా వారు గ్రామాలు నిర్మిస్తున్నారన్నది వాస్తవం కాదు అని మన రక్షణ దళాల ప్రధాన అధికారి (సిడిఎస్‌) బిపిన్‌ రావత్‌ గురువారం నాడు అన్నీ పుకార్లే అని చెప్పారు. వాస్తవాధీన రేఖ అన్న దానికి మన ప్రస్తుత అవగాహనకు విరుద్దంగా ఎలాంటి చొరబాట్లు లేవు, గ్రామాల నిర్మాణం కోసం రేఖను దాటి రాలేదు, ఆ వార్తలు వాస్తవం కాదు, నిర్మించారని చెబుతున్న గ్రామాలు వాస్తవాధీన రేఖకు చైనా వైపే ఉన్నాయి అని రావత్‌ చెప్పారు. మాకు తెలిసినంత వరకు అలాంటి గ్రామ అభివృద్ధి వాస్తవాధీన రేఖకు మన వైపున జరగలేదు. కొత్త గ్రామాన్ని నిర్మించేందుకు చైనా వారు రేఖను దాటి మన ప్రాంతంలోకి వచ్చి నిర్మాణం చేశారన్న వార్తమీద ప్రస్తుత వివాదం తలెత్తింది. బహుశా ప్రత్యేకించి ఇటీవల మనతో తలపడిన తరువాత వాస్తవాధీన రేఖ వెంట వారి సైనికులు, పౌరుల కోసం లేదా భవిష్యత్‌లో మిలిటరీ అవసరాల కోసం గ్రామాలను నిర్మిస్తుండవచ్చు అని కూడా రావత్‌ చెప్పారు. రెండు దేశాలూ వాస్తవాధీన రేఖ వెంట దళాలను నియమిస్తున్నాయి. చైనీయులు తమవైపు కొత్త పోస్టులను ఏర్పాటు చేసినపుడు అక్కడ కొన్ని శిధిలమైన, పాత గుడిసెలను మనం చూస్తున్నాము. కాబట్టి కొన్ని దెబ్బతిన్నపుడు కొత్త వాటిని నిర్మించవచ్చు, ఆధునిక నిర్మాణాలు జరుపుతుండవచ్చు, వాటిలో కొన్ని గ్రామాలు కూడా ఉండవచ్చు, ఉన్నవాటిని విస్తరించి ఉండవచ్చు, చైనా సైనికులు తమ ప్రధాన ప్రాంతం నుంచి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు, మన సైనికులు సంతోషంగా ఉండటాన్ని వారు చూస్తున్నారు, మన పౌరులు ఆప్రాంతాలకు వెళతారు, మన కుటుంబాలు ఆప్రాంతాలను సందర్శిస్తాయి, వీటన్నింటినీ వారు చూస్తారు. అందువలన వారి సైనికుల కుటుంబాలు ఆ ప్రాంతాలకు వచ్చేందుకు కూడా వాటిని నిర్మిస్తుండవచ్చు, మన సైనికులు వాస్తవాధీన రేఖ నుంచి ఏడాదిలో కనీసం రెండు మూడు సార్లు తమ కుటుంబాలను చూసేందుకు స్వస్ధలాలకు వెళతారు, చైనీయులకు అలాంటి అవకాశం లేదు అని రావత్‌ అన్నారు.


వాస్తవాధీన రేఖ అంటే అనేక అవగాహనలు ఉన్నాయి. మన సైనికులకు వాస్తవాధీన రేఖ ఎక్కడ ఉందో తెలుసు ఎందుకు అంటే ఇది రేఖ, ఈ ప్రాంతాన్ని మనం రక్షించాలి అని వారు నిర్విహించాల్సిన విధుల గురించి వారికి చెబుతాము కనుక వారికి తెలుసు. ఒక అవగాహన ఉంది. చైనా వారికి కొన్ని ప్రాంతాల గురించి అవగాహన ఉందని మనకు తెలుసు. కొన్ని ప్రాంతాల గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. ఎందుకంటే వారికి వాస్తవాధీన రేఖ గురించిన అవగాహనను వారికి చెప్పకపోవచ్చు.వాస్తవాధీన రేఖ వెంట గ్రామాల నిర్మాణం కండబల ప్రదర్శన అన్నదాన్ని కచ్చితంగా కాదంటాను, బలప్రదర్శన అని నేను వర్ణించను, ఈ గ్రామాల ద్వారా వారు తమ సరిహద్దులకు సులభంగా చేరుకొనేట్లు చూసుకుంటున్నారు, మనం కూడా అదే చేయాల్సి ఉంది, మన ప్రభుత్వం కూడా సరిహద్దు ఏరియా అభివృద్ది కార్యక్రమ పధకానికి (బిఏడిపి) నిధులు విడుదల చేసింది. నిజానికి మనం సరిహద్దు ప్రాంతాలకు తిరిగి వెళ్లండి అని పౌరులను మనం ప్రోత్సహిస్తున్నాం ఎందుకంటే వాస్తవాధీన సరిహద్దు రేఖ వెంట అనేక గ్రామాలవారు ఖాళీ చేశారు అని రావత్‌ వెల్లడించారు. ఎందుకు వారు ఖాళీ చేస్తున్నారంటే లోపలి ప్రాంతాలలో వారికి మరింతగా విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రావత్‌ చెప్పారు.


మన విదేశాంగశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పిందేమిటి ? ” దశాబ్దాల క్రితం అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతో సహా కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల్లో చైనా నిర్మాణకార్యకలాపాలు నిర్వహిస్తోంది. మన భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకోవటాన్ని గానీ లేదా చైనా చెబుతున్న అంశాలను గానీ భారత్‌ అంగీకరించలేదు. దౌత్యపద్దతుల్లో ఎప్పుడూ అలాంటి కార్యకలాపాలకు నిరసన తెలుపుతూనే ఉన్నాము. భవిష్యత్‌లో కూడా అదే కొనసాగిస్తాము.భారత భద్రత, భూభాగాన్ని కాపాడుకొనేందుకు నిరంతరం పరిణామాలను గమనిస్తూనే ఉంటాము, తగిన చర్య తీసుకుంటాము. అమెరికా పార్లమెంట్‌కు ఆ దేశ రక్షణశాఖ సమర్పించిన నివేదికలో పేర్కొన్న అంశాలను ప్రత్యేకించి తూర్పు రంగంలోని అంశాలను గమనంలోకి తీసుకున్నాము. చైనాతో ఉన్న సరిహద్దు ఆప్రాంతాన్ని కలుపుతూ రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నాము” అని చెప్పారు.


పెంటగన్‌ నివేదిక, బిపిన్‌ రావత్‌, అరిందమ్‌ బాగ్చీ చేసిన ప్రకటనల్లో తేడా గురించి, ఏది వాస్తవమో ప్రధాని నరేంద్రమోడీ చెప్పాలంటూ కాంగ్రెస్‌ స్పందించింది. ఈ నివేదిక గురించి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం లేదా పార్టీ ప్రతినిధులుగానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.చైనా అక్రమ ఆక్రమణలను అంగీకరించేది లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెబుతారు, సైనికదళాల సిడిఎస్‌ చైనా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటారు, గతంలో అఖిలపక్ష సమావేశంలో మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. దీనిలో ఏది వాస్తవమో జనానికి మోడీ సర్కార్‌ చెబుతుందా అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. నిజానికి రావత్‌-అరిందమ్‌ బాగ్చీ చెప్పిందాన్లో పరస్పర విరుద్దతేమీ లేదు. ఎప్పటి నుంచో చెబుతున్న అంశాలను అరిందమ్‌ చెప్పారు. అక్కడి వాస్తవ పరిస్ధితి గురించి బిపిన్‌ రావత్‌ వెల్లడించారు. రెండు దేశాల మధ్యసరిహద్దు వివాదం బ్రిటీష్‌ వారు సృష్టించింది. వారు గీసిన గీతలకు భిన్నంగా మన దేశానికి చెందినవిగా చూపినవి చైనా ఆధీనంలో, చైనాలో భాగంగా చూపినవి మన ఆధీనంలో ఉన్నాయి. లడక్‌ ప్రాంతంలో ఆక్సాయిచిన్‌, మరికొన్నింటిని మనవి అని మన దేశం చెబుతోంది. తూర్పున అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా అంటోంది. రెండు దేశాలూ వాస్తవాధీన రేఖను అనుసరిస్తున్నాయి. ఈ వివాదాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప మరొక పద్దతిలో సాధ్యం కాదు. దీన్ని మరింతగా రాజేయాలని అమెరికా చూస్తోంది.


ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే అజెండాతో ముందుకు పోతున్న అమెరికా ఎక్కడిక్కడ దేశాల మధ్య తంపులు పెట్టేందుకు చేయని తప్పుడు పనులులేవు. తప్పుడు నివేదికలను రూపొందించటం, వాటి మీద మీడియాలో కట్టుకథలు-పిట్టకథలు రాయించటం దాని నిరంతర కార్యక్రమం. వాటిని పట్టుకొని మన మీడియా రెచ్చిపోతోంది.ఏ దేశంతో అయినా సమస్యలు వచ్చినపుడు జనాలకు వాస్తవాలను వివరించేందుకు భిన్న అభిప్రాయాలతో అంశాలను అందించటం తప్పుకాదు. ఇరుగుపొరుగు దేశాలతో నిరంతరం గిల్లికజ్జాలు పెట్టుకొనే ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖల్లాలేవు. ఆ దిశగా రెచ్చగొట్టే మీడియా ఏ విధంగానూ దేశానికి మేలు చేసేది కాదు. అమెరికా తన గోతిని తానే తవ్వుకొని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఎంత అవమానకరంగా బయట పడిందీ తెలిసిందే, అది ఆడించినట్లు ఆడే దేశాలన్నీ సర్వనాశనం అయ్యాయి. అందుకు ఇరాన్‌-ఇరాక్‌లే పక్కా నిదర్శనం. అక్కడి చమురు సంపదలపై కన్నేసిన అమెరికా రెండు దేశాలకూ ఆయుధాలు అమ్మి పదేండ్ల పాటు తలపడేట్లు చేసిన చరిత్ర, చివరకు ఇరాక్‌ను ఆక్రమించిన దుర్మార్గం, లొంగని ఇరాన్‌పై ఆంక్షల అమలు తెలిసిందే. అలాంటి ప్రమాదకరమైన అమెరికా తప్పుడు నివేదికలను ఆధారం చేసుకొని తప్పుడు వార్తలను జనాల మెదళ్లకు ఎక్కించటాన్ని మీడియా దేశభక్తిగా భావిస్తోందా ? ఇంతకు మించి సంచలనాలు, రేటింగ్‌లు పెంచుకొనే సత్తా లేదా ? మీడియాను గుడ్డిగా నమ్మి రెచ్చిపోకూడదని జనం గ్రహించాలి.

పరిస్ధితులు బాగోలేవు, నరేంద్రమోడీ గారు చెప్పిన మంచి రోజుల గురించి ఇంకా భ్రమలతో జనం ఎదురు చూస్తున్నారు. లక్షలాది కుటుంబాలు కరోనా కల్లోలం నుంచి కోలుకోలేదు.పూర్వపు స్ధాయికి ఆదాయాలు రాలేదు.ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినపుడు మానసిక బలహీనతకు లోనుకావటాన్ని ఆసరా చేసుకొని పాలకపార్టీలకు చెందిన మరుగుజ్జు దళాలు వాట్సప్‌ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పటికే మరమ్మతు చేయటానికి కూడా వీల్లేనంతగా ఎందరో బుర్రలను ఖరాబు చేశాయి.ఇలాంటి ప్రచారానికి పాల్పడేందుకు ఇప్పుడు సాంప్రదాయ మీడియా-సామాజిక మాధ్యమం పరస్పర ఆధారితంగా మారుతున్నాయి. వాస్తవాల కంటే సంచలనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది దేశభక్తా, దేశద్రోహమా ? దేశమంటే మట్టికాదోయి-దేశమంటే మనుషులోయి అని మహాకవి గురజాడ చెప్పిందాని ప్రకారం జనాలను తప్పుదారి పట్టించి ఉన్మాదానికి లోను చేయటం ప్రజాద్రోహం- దేశద్రోహం కాదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా అబద్దాల అమ్ముల పొదిలో మరో అస్త్రం !

05 Friday Nov 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Left politics, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China's growing nuclear arsenal, New Pentagon report, nuclear triad’, PRC, Taiwan


ఎం కోటేశ్వరరావు


చైనా – అమెరికా మధ్య యుద్ధం జరుగుతుందా ? ఇప్పటి వరకు అమెరికా జరిపిన యుద్దాలలో ఒక్కటంటే ఒక్కదానిలో కూడా చెప్పుకొనేందుకు విజయం లేదు. అవమానాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో జరిగిన ఏ యుద్ధమైనా ముందు ప్రచార దాడితోనే ప్రారంభమైంది. అదేమంటే నిజాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెట్టటం. ఇప్పుడు చైనా మీద అమెరికా, దాని మిత్రపక్షాల నుంచి ముప్పేట ప్రచారదాడి మొదలైంది. అమెరికా, జపాన్‌, ఐరోపా యూనియన్‌, వాటితో జట్టుకట్టిన దేశాలన్నీ తమ తమ పాత్రలను పోషిస్తున్నాయి. మన దేశంతో సహా అనేక దేశాల్లో ఉన్న యుద్ధోన్మాదులు ఈ పరిణామాలను చూసి రెచ్చిపోతున్నారు, చంకలు కొట్టుకుంటున్నారు. పర్యవసానాలను పట్టించుకోవటం లేదు. తాజాగా అమెరికా రక్షణ శాఖ పెంటగన్‌ వార్షిక నివేదికలో ఒక ప్రచార అస్త్రాన్ని వదిలింది. దాన్ని పట్టుకొని అనేక మంది పండితులు అది నిజమే అని జనాన్ని నమ్మించేందుకు, చైనాను ఒక బూచిగా చూపేందుకు ఒళ్లుదాచుకోకుండా పని చేస్తున్నారు.


ఇంతకీ పెంటగన్‌ చెప్పిందేమిటి ? చైనా వద్ద రెండువందల వరకు అణ్వాయుధాలు ఉన్నట్లు, దశాబ్ది చివరికి అవి రెట్టింపు కావచ్చని గతేడాది అమెరికా రక్షణ అంచనా వేసిందట. అప్పటి నుంచి చైనా తన అస్త్రాలను విస్తరించటం ప్రారంభించటంతో 2027నాటికి ఏడువందలకు, 2030 నాటికి 1000కి పెరగవచ్చని, దీంతో ప్రపంచానికి ముప్పు పెరుగుతుందని ఈ ఏడాది పెంటగన్‌ చెప్పింది. ఆధారం లేని అంశాలను, అబద్దాలను చెప్పటంలో పెంటగన్‌ పేరు మోసింది. ఎగిరే పళ్లాలు లేదా గ్రహాంతర వాసులంటూ కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా మీడియా అల్లిన కట్టు-పిట్ట కథలను జనం నమ్మారు, ఇప్పటికీ నమ్మే వారున్నారు. నిజానికి అలాంటి వేమీ లేవు. వియత్నాం యుద్దం గురించి అది ఎలాంటి నివేదికలను రూపొందించిందో, మిలిటరీ, పౌర అధికారులు, విధాన నిర్ణేతలు ఎన్ని అబద్దాలు చెప్పి పార్లమెంటు, స్వంత పౌరులను , ప్రపంచాన్ని తప్పుదారి పట్టించారో తరువాత వివరాలు బయటపడ్డాయి. అందరూ కలిసి చేసిన ఈ దారుణానికి లక్షలాది మంది వియత్నాం పౌరులు దెబ్బతిన్నారు. సైగాన్‌ వంటి నగరాలు, పంట పొలాలను నాశనం చేశారు. ఎందరో మానవతులను చెరబట్టారు. చివరికి ఆ దాడుల్లో ఉత్తిపుణ్యానికి తమ 58వేల మంది సైనికులు మరణించారని, లక్షలాది మంది భౌతికంగా, మానసికంగా దెబ్బతిన్నారంటూ ఆ దాడులను ఆపివేయాలని అమెరికా జనం వీధుల్లోకి వచ్చి ఉద్యమించిన అంశం తెలిసిందే.వియత్నాం టాస్క్‌ ఫోర్స్‌ పేరుతో రక్షణశాఖ మంత్రిత్వ కార్యాలయం రూపొందించిన నివేదికను పత్రికలు ప్రచురించరాదని అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ప్రభుత్వం వత్తిడి తెచ్చింది. అటార్నీ జనరల్‌ జాన్‌ డబ్ల్యు మిచెల్‌ టైమ్‌ పత్రికకు ఒక టెలిగ్రాం పంపాడు. ఆ నివేదిక ప్రచురణ అమెరికా రక్షణ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని వాదించాడు.(ఈ ప్రబుద్దుడు తరువాత నిక్సన్‌ పాల్పడిన వాటర్‌గేట్‌ కుంభకోణంలో పోషించిన పాత్రకు జైలు పాలయ్యాడు, సదరు నిక్సన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.) తరువాత ఈ అంశం సుప్రీం కోర్టుకు వెళ్లింది. పత్రికలకు ప్రచురించే హక్కుందని తీర్పు వచ్చింది.


ఇరాన్‌కు ఆయుధాల సరఫరాపై నిషేధం ఉన్నప్పటికీ రీగన్‌ ప్రభుత్వం రహస్యంగా విక్రయించటమే గాక ఆ సొమ్మును నికరాగువాలో వామపక్ష శాండినిస్టా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తయారు చేసిన కిరాయి మూక కాంట్రాలకు అందచేసింది. వారికి నిధులు ఇవ్వటాన్ని పార్లమెంట్‌ నిషేధించింది. దీని గురించి కూడా పెంటగన్‌ పచ్చి అబద్దాలు, అతకని వాదనలు వినిపించింది. తరువాత జార్జి బుష్‌ పాలనాకాలంలో ఇరాక్‌ మీద దాడి చేసేందుకు అల్లిన అబద్దాలు ఇంకా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. సద్దాం హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా నిలవ చేశాడని ప్రచారం చేసిన అంశం, తరువాత అలాంటివేమీ దొరకలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇండోచైనా దేశాలైన వియత్నాం, లావోస్‌, కంపూచియాలను ఆక్రమించుకొనేందుకు, కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు జపాన్‌, ఫ్రాన్స్‌, అమెరికా వరుసగా దాడులు చేశాయి. చివరిగా పాల్గొన్న అమెరికన్లు అవమానకర రీతిలో అక్కడి నుంచి తోకముడిచారు. ఆ ఉదంతం నుంచి అమెరికన్లు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరు పేరుతో జోక్యం చేసుకున్నారు. అక్కడా పరాభవాలు ఎదురైనా రెండు దశాబ్దాల పాటు విజయం సాధిస్తున్నట్లు అమెరికన్లను, యావత్‌ ప్రపంచాన్ని ఎలా నమ్మించారో, చివరకు ఆ తాలిబాన్ల కాళ్లు పట్టుకొని బతుకు జీవుడా అంటూ పారిపోయిన దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి.


సోవియట్‌ యూనియన్నుంచి పశ్చిమ ఐరోపాకు ముప్పువస్తుందనే ముసుగులో నాటో కూటమి ఏర్పాటు చేశారు. ఆ సోవియట్‌ ఇప్పుడు ఉనికిలో లేదు. తూర్పు ఐరోపా రాజ్యాలన్నీ ఇప్పుడు రష్యాతో కూడా లేవు, అయినా అమెరికన్లు నాటోను కొనసాగిస్తూ మరింతగా విస్తరిస్తున్నారు ? ఐరోపాకు ముప్పు అని కథలు చెబుతూనే ఉన్నారు. పెంటగన్‌ తన సేనలను కొనసాగిస్తూనే ఉంది.తమ ఆయుధాలను అమ్ముకొని లాభాలు గడిస్తూనే ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆసియాలో విస్తరించేందుకు, ఇక్కడ కూడా నాటో మాదిరి ఆసియా కూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. దానిలో భాగమే మన దేశం, జపాన్‌,ఆస్ట్రేలియాలను కలుపుకొని చతుష్టయ(క్వాడ్‌) కూటమి, తరువాత బ్రిటన్‌,ఆస్ట్రేలియాలతో చేరి అకుస్‌ ఏర్పాటు సంగతి తెలిసిందే.వాటిని మరింత ముందుకు తీసుకుపోవాలనే ఎత్తుగడతోనే చైనా అణ్వాయుధాల బూచిని చూపటం, ఖండాంతర క్షిపణుల ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం, అంతరిక్షం నుంచి ప్రయోగించే మహావేగ క్షిపణి పరీక్ష అనే తప్పుడు వార్తలు, తైవాన్‌ పేరుతో రెచ్చగొడుతున్నది. దక్షిణ చైనా సముద్రంలో తిష్టవేసేందుకు అమెరికన్లకు ఒక సాకు కావాలి. దాన్లో భాగమే పెంటగన్‌ ప్రచారదాడి.


ఆయుధాలు కలిగి ఉండే హక్కు తమకు మాత్రమే ఉందన్నట్లుగా, తమ దగ్గర ఉంటే లోక కల్యాణం, ఇతరులు సమకూర్చుకుంటే వినాశనానికి, కనుక అందరం కలిసి అలాంటి వారిని దెబ్బతీద్దాం, అందుకు గాను మా దగ్గర మీరు ఆయుధాలు కొనుగోలు చేయండి అన్నట్లుగా ఉంది అమెరికన్ల తీరు. అమెరికా సైనిక దళాల అధికారుల చైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిలే ఒక మీడియా సంస్ధతో మాట్లాడుతూ చైనా గురించి చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో చూడండి.” మీరు గనుక మరోసారి చూస్తే, నాలుగుదశాబ్దాల క్రితం వారికి ఉపగ్రహాలు అసలు లేవు. ఈ రోజు ఎన్ని ఉన్నాయో చూడండి. వారికి ఖండాంతర క్షిపణులు లేవు, ఈ రోజు వారికి ఎన్నున్నాయో చూడండి. వారికి అణ్వాయుధాలు లేవు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి. వారికి నాలుగవ లేదా ఐదవ తరం లేదా చివరికి ఆధునిక యుద్ద విమానాలు కూడా లేవు. మరలా చూడండి వారి దగ్గరెన్ని ఉన్నాయో. వారికి నౌకాదళం లేదు, జలాంతర్గాములు లేవు, వారికి ఈ రోజు ఎన్ని ఉన్నాయో చూడండి.” ఇవన్నీ కలిగి ఉండటం ప్రపంచానికి ప్రమాదమైతే తొలి ముప్పు అమెరికా నుంచే వస్తుంది. వారి దగ్గర ఉన్నన్ని మరొక దేశానికి లేవు. పోనీ ఇవన్నీ ఒక్క చైనాకేనా మిగతా దేశాల దగ్గర లేవా ? వాటిని నుంచి మిగతా దేశాలకు ముప్పు లేదా ? ఇదంతా చైనాను దెబ్బతీసే, అనుమానాలు కలిగించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.


ఈ ఏడాది మొదట్లో ప్రపంచానికి తెలిసిన అంచనా ప్రకారం అమెరికా దగ్గర 5,500 అణ్వాయుధాలున్నాయి.ప్రతి ఏటా లక్షల కోట్ల డాలర్లతో నూతన బాంబర్లు, కొత్త ఆయుధాలను రూపొందిస్తోంది. ఖండాంతర క్షిపణి వ్యతిరేక ఒప్పందం, మధ్య శ్రేణి అణ్వాయుధాల నిరోధ ఒప్పందాల నుంచి వైదొలిగింది.ప్రపంచమంతటా ఏదో ఒక పేరుతో తన క్షిపణులను మోహరిస్తూనే ఉంది. అకుస్‌ ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియాకు దొడ్డిదారిన అణుపరిజ్ఞానాన్ని కూడా అంద చేసేందుకు బ్రిటన్‌తో కలసి ఒప్పందం చేసుకుంది. మరి చైనా ఆయుధాలను తయారు చేయటం లేదా ? ప్రతి ఏటా తన వద్ద ఉన్న వాటిని చైనా బహిరంగంగానే ప్రదర్శిస్తోంది. ప్రతిదేశం అదే చేస్తోంది. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన దేశం కూడా ఆయుధాల ప్రదర్శన, ఇతర దేశాలతో కలసి మిలిటరీ విన్యాసాలు చేస్తున్నది. అమెరికన్లు ప్రపంచ పెత్తనం కోసం ఆయుధాలను వినియోగిస్తుంటే మిగిలిన దేశాలు ఆత్మ రక్షణ కోసం తయారు చేసుకుంటున్నాయి. తొలిసారిగా అణుబాంబులు వేసి ప్రపంచాన్ని భయ పెట్టింది అమెరికా తప్ప మరో అణుశక్తి ఏదీ అలాంటి దుర్మార్గానికి పాల్పడలేదు. తాముగా ఎవరి మీద ముందుగా అణుబాంబులను ప్రయోగించబోమని చైనా ప్రకటించింది.


కాశ్మీరు మన దేశంలో అంతర్భాగం ఎలాగో తైవాన్‌ దీవి చైనాలో అంతర్భాగమని అమెరికాతో సహా ప్రతిదేశం అధికారికంగా గుర్తించింది. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినపుడు అది తిరుగుబాటు ప్రాంతంగా కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల చేతిలో ఉండి, ఇప్పటికీ కొనసాగుతోంది. ఐరాసలో చైనా అంటే తైవాన్‌తో కూడినది తప్ప మరొకటి కాదు. కానీ అమెరికా, ఐరోపాయూనియన్‌, తదితర కొన్ని దేశాలు తైవాన్ను బలప్రయోగంతో ఆక్రమించేందుకు చైనా చూస్తోందని, దాన్ని తాము అడ్డుకుంటామని చెబుతున్నాయి. శాంతియుత పద్దతిలోనే విలీనం జరగాలని చైనా చెబుతోంది. గత నెల 27న అమెరికా నావలు తైవాన్‌ తీరంలో సంచరించాయి.తైవాన్‌ మిలిటరీకి ఆధునిక ఆయుధాలను విక్రయిస్తున్నది. పదమూడు మంది సభ్యులున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంటరీ కమిటీ తైవాన్‌కు రావటం అమెరికా పధకంలో భాగమే. గత పది నెలల్లో ఐరోపా యూనియన్‌ పార్లమెంటు పన్నెండు తైవాన్‌ అనుకూల తీర్మానాలు చేసింది. ఇవన్నీ చైనాను రెచ్చగొట్టే ఎత్తుగడలు తప్ప మరొకటి కాదు. ఒకవైపు ఇలాంటి పనులు చేస్తూ వాటిని కప్పి పుచ్చేందుకు చైనా గురించి కట్టుకధలను ప్రచారం చేస్తున్నది. ఇలాంటివి ఇదే ప్రారంభం కాదు, ఇంతటితో ఆగేవి కాదు. 2049 నాటికి చైనాలో కమ్యూనిస్టు పాలనకు వందేళ్లు పూర్తి అవుతాయి. అప్పటికి హాంకాంగ్‌, మకావూ, తైవాన్‌ దీవులను పూర్తిగా ప్రధాన చైనా భూభాగంలో విలీనం చేసేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. దాన్ని కొనసాగనివ్వకుండా చూసేందుకు అమెరికా, ఇతర కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు పూనుకున్నాయి.పెంటగన్‌ నివేదిక దానిలో భాగమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా మహావేగ క్షిపణి ప్రయోగం – అయోమయంలో అమెరికా ?

22 Friday Oct 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Arms race, China hypersonic missile, Hypersonic missile, spacecraft


ఎం కోటేశ్వరరావు


ఇప్పుడు అమెరికా, ఇతర దేశాల మిలిటరీ నిపుణులను చైనా శాస్త్రవేత్తలు అయోమయంలో పడవేశారా ! లేక ఆయుధాల పోటీకి ఒక సాకుగా అమెరికన్లు ప్రచారదాడి ప్రారంభించారా ? సినిమాలకే పరిమితమైన స్టార్‌వార్స్‌ నిజం అవుతాయా ? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ! ఏదైనా జరిగేందుకు ఆస్కారముంది.చైనా ప్రయోగం నిజమైనా కాకున్నా ఈ పరిణామం అంతరిక్షాన్ని ఆయుధమయం గావిస్తుంది. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక రాసిన ఒక కథనంతో అమెరికా మిలిటరీ నిపుణులు, పశ్చిమ దేశాల మీడియా గుండెలు బాడుకుంటూ ఇంకేముంది అంతా అయిపోయింది మిలిటరీ రంగంలో కూడా చైనా పైచేయి సాధించింది, అణు ముప్పు తలెత్తింది అంటూ నానాయాగీ చేస్తున్నారు. మరోవైపు భయ పడాల్సిందేమీ లేదంటూ తమ వీపును తామే తట్టుకుంటున్నారు. వార్తలో రాసిందేమిటి ?

చైనా వ్యోమ నౌకతో అనుసంధానం చేసిన అణ్వాయుధం అమర్చగలిగిన క్షిపణి విపరీత వేగంతో భూమికి దగ్గర కక్ష్యలో ప్రదక్షిణం చేసిందని, దాన్ని నిర్ణీత ప్రాంతంలో జారవిడిచిందని పేర్కొన్నది. ఈక్షిపణి అన్నివైపుల నుంచి అమెరికా మీద దాడి చేస్తుందని, రాడార్లను తప్పించుకుంటుందని రాసింది. హైపర్‌సోనిక్‌ క్షిపణిని ఆగస్టునెలలో ప్రయోగించిందని లక్ష్యానికి నలభై కిలోమీటర్ల దూరంలో బాంబును వేసిందని, అసలు అలాంటి పరిజ్ఞానం సాధించిన తరువాత నిర్ధిష్టంగా లక్ష్యాన్ని చేరుకొనే విధంగా లోపాలను సవరించటం పెద్ద పని కాదంటూ కిందు మీదవుతున్నారు.(ధ్వని వేగంతో సమంగా ప్రయాణించే వాటిని సూపర్‌ సోనిక్‌ అనీ ఐదు రెట్లు అంతకంటే ఎక్కువ వేగం ఉన్న వాటిని హైపర్‌సోనిక్‌ అంటున్నారు)


దీని మీద చైనా చెబుతున్నదేమిటి ? ఒక సారి ప్రయోగించిన వ్యోమనౌకను మరోసారి వినియోగించటం ద్వారా ఖర్చు తగ్గింపు గురించి జరిపిన ప్రయోగం తప్ప క్షిపణి కాదని చెబుతోంది. సదరు నౌక భూమి మీదకు తిరిగి వచ్చే క్రమంలో దానికి అనుసంధానించిన పరికరాలు విడిపోయి సముద్రంలో మండిపోయినట్లు పేర్కొన్నది. కాదు క్షిపణి అని అమెరికా అందించిన సమాచారం ఆధారంగా ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక రాసిన కథనం సంచలనం సృష్టించింది. దాని కొనసాగింపుగా మిగతా మీడియా అందుకుంది. రెండూ వాస్తవం కావచ్చు. అనేక దేశాలు తాము చేస్తున్న ప్రయోగాలను బహిరంగ పరచటం లేదు.


ప్రస్తుతం ప్రపంచంలో ఆయుధ పోటీ నడుస్తోందన్నది వాస్తవం. నిత్యం ప్రపంచాన్ని తన అమ్ములపొదిని చూపి బెదిరిస్తున్నది అమెరికా. తన నూతన ఆయుధాల ప్రయోగశాలగా ఇరాక్‌ యుద్ధాన్ని వినియోగించుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అణ్వస్త్రాలు ఉన్న దేశాలుగా అధికారికంగా గుర్తించినవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాత్రమే.ఈ ఏడాది జనవరి నాటికి వాటి వద్ద ఉన్నట్లు అంచనా వేస్తున్న అణ్వస్త్రాల సంఖ్య దేశాల వారీ ఇలా ఉంది. అమెరికా 5,550, రష్యా 4,495, చైనా 350, ఫ్రాన్స్‌ 290, బ్రిటన్‌ 225, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేయని పాకిస్తాన్‌ 165, భారత్‌ 156, ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా 40-50 కలిగి ఉన్నట్లు అంచనా. ఇక ఏక్షణంలో అయినా బాంబులను తయారు చేయగలిగిన, కార్యక్రమం ఉన్న దేశాలుగా ఇరాన్‌, సిరియా ఉన్నాయి. అణుకార్య క్రమాన్ని నిలిపివేసిన జాబితాలో బెలారస్‌, కజకస్తాన్‌, ఉక్రెయిన్‌, దక్షిణాఫ్రికా, ఇరాక్‌, లిబియా,అర్జెంటీనా, బ్రెజిల్‌, దక్షిణ కొరియా ఉన్నాయి. ఇక్కడ ఎవరి దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయన్నది కాదు, అవి మారణహౌమం సృష్టిస్తాయన్నదే అసలు సమస్య. పరస్పర విశ్వాసం లేనందున ఎవరు ప్రయోగించినా వాటిని అడ్డుకొనే కొత్త క్షిపణులను, వాహకాలను తయారు చేసేందుకు పోటీ పడుతున్నారు. చైనా తయారు చేసిందని చెబుతున్న హైపర్‌సోనిక్‌ క్షిపణి రగడ అదే.


మిలిటరీ రంగంలో రష్యా పోటా పోటీగా ఉందికనుకనే ఇంతకాలం అమెరికా కొంత మేరకు అదుపులో ఉంది. ఇటీవలి కాలంలో ఆర్ధికంగా చైనా సవాలు విసురుతోంది. ఈదశాబ్ది అంతానికి అమెరికాను అధిగమిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. భారీ సంఖ్యలో అణ్వాయుధాలు లేకున్నా వాటిని అంతరిక్షం నుంచి ప్రయోగించగలిగే పరిజ్ఞానాన్ని చైనా సంతరించుకుందనే భయం పట్టుకుందిప్పుడు. దీనిలో రెండు అంశాలున్నాయి. ఇరాక్‌ను ఆక్రమించుకొనేందుకు దానికి ఏదో ఒక సాకు చూపాలి, దానిలో భాగంగా అక్కడ మారణాయుధాలను సద్దామ్‌ హుసేన్‌ గుట్టలుగా పోశారనే ప్రచారం చేసి దురాక్రమణకు పాల్పడ్డారు. ఇప్పుడు చైనా విషయంలో దాన్నొక బూచిగా చూపి ఇతర దేశాలను భయపెట్టటం, ఆ సాకుతో తన ఆయుధాలను మెరుగుపరచుకొనే ఎత్తుగడ ఉంది. ఒక వైపున చైనా అంటే చౌకవస్తువులను ఉత్పత్తి చేయటం తప్ప ఆధునిక పరిజ్ఞానం వారి దగ్గర ఎక్కడుందని చెబుతారు. మరొక వైపు అరే మనకు తెలియకుండా ఇప్పుడు ఇంత పరిజ్ఞానం ఎప్పుడు సంపాదించుకుందని ఆశ్చర్యపోతున్నట్లు, అతిశయోక్తుల కథలు చెబుతారు. భారత్‌, చైనా ఏ దేశమైనా తన భద్రతను తాను చూసుకోవాలి. అందుకే భారత్‌ అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంలో చేరలేదు.అలాగే అమెరికా కవ్వింపులను ఎదుర్కొనేందుకు చైనా పూనకుంటుందనటంలో సందేహం ఉండనవసరం లేదు.


మరోవైపున అమెరికా చేస్తున్నదేమిటి ? దాని దగ్గర అత్యాధునిక బాంబర్లు ఉన్నాయి. వాటిలో ఒకటైన బి-52హెచ్‌ బాంబరుకు హైపర్‌సోనిక్‌ క్షిపణి ఎజిఎం 183ఏ(ఎఆర్‌ఆర్‌డబ్ల్యు)కు రాకెట్‌ను జతచేసి ప్రయోగాలు జరుపుతోంది. జూలై నెలలో రెండవ ప్రయోగం విఫలమైనట్లు, దాన్ని విశ్లేషిస్తున్నట్లు అధికారులే చెప్పారు. మరి వీటి సంగతేమిటి ? అమెరికా చేస్తే ఒప్పు చైనా చేస్తే ముప్పా ? ఈ ప్రయోగంలో ఆయుధం బాంబరు నుంచి విడిపోయి నప్పటికీ రాకెట్‌ మోటార్‌ పనిచేయక విఫలమైంది. అంతకు ముందు చేసిన తొలి ప్రయోగంలో క్షిపణి విడిపోలేదు. దీనికి సంబంధించి అనేక ప్రయోగాలు అంతకు ముందు జరిగాయి. ఇవి ఎందుకు చేస్తున్నారు ? ఆయుధ వ్యాపారి లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ కోసమేకదా ! ఈ ప్రయోగం ఇతర దేశాలను భయపెట్టేందుకు గాక ఏ లోక కల్యాణం కోసం జరుపుతున్నట్లు ? బ్రిటన్‌తో కలసి ఆస్ట్రేలియాకు అణుపరిజ్ఞానంతో పని చేసే జలాంతర్గాములను అందచేసేందుకు ఒప్పందం(అకుస్‌) చేసుకుంది. ఇది ఎన్‌పిటిని ఉల్లంఘించటం కాదా ? ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే మిగతా దేశాలు ఏం చేయాలి ?


తన నేరాలు, ఘోరాలను కప్పి పుచ్చుకొనేందుకు ఇతర దేశాలపై నిందలు వేయటం, మీడియా ద్వారా ప్రచారం చేయించటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య.గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో అణ్వాయుధాలను ప్రయోగించేందుకు చైనా గోతులు తీసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో రాశారు.పత్రికల వార్తలను పట్టుకొని అమెరికాలోని కొందరు రెచ్చిపోతున్నారు. సాయుధ దళాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడైన రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘెర్‌ వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగాలన్నాడు.లేనట్లైతే ఈ దశాబ్దిలోనే ప్రచ్చన్నయుద్దంలో కమ్యూనిస్టు చైనాతో అమెరికా ఓడిపోనుందని చెప్పాడు.
హైపర్‌సోనిక్‌ క్షిపణులను పరీక్షించటం కొత్తగా జరుగుతున్నదేమీ కాదు, బహిరంగ రహస్యమే.చైనా తొలిసారిగా 2014లో రష్యా 2016లో పరీక్షించింది, అమెరికా చేస్తున్నదీ అదే. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్ధలను కూడా తప్పించుకొని నిర్దేశిత లక్ష్యాన్ని చేధించే దాన్ని చైనా రూపొందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిజ్ఞానం అమెరికా దగ్గర లేదని కూడా కొందరు చెప్పారు. ఇదే గనుక నిజమైతే తామెంతో ముందున్నామని చెప్పుకుంటున్న అమెరికా తన మిత్రదేశాలను, తన జనాన్ని ఏ విధంగా సమాధానపరుస్తుంది ? ఆప్ఘనిస్తాన్‌లో పొందిన పరాభవం గురించి ఇంకా చర్చ జరుగుతుండగానే ఈ వార్త అమెరికా సామర్ధ్యం మీద మరింత అనుమానాలను రేకెత్తించదా ? అయినా ప్రచారం చేస్తున్నారంటే ఏదో దాని వెనుక ఏదో ఉండి ఉండాలి.


అమెరికా దూకుడును అడ్డుకునేందుకు 1960దశకంలో నాటి సోవియట్‌ ఇలాంటి వ్యవస్ధలను ఏర్పాటు చేసేందుకు పూనుకున్నప్పటికీ తరువాత నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి అమెరికా తెగబడుతున్నందున ఇతర దేశాలు అందుకు పూనుకొనే అగత్యం ఏర్పడింది. అనేక రంగాల్లో దూసుకుపోతున్న చైనా నిజంగా అధునాతన క్షిపణిని పరీక్షించినా ఆశ్చర్యం లేదు. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ కధనం ప్రకారం చైనా పరీక్షించిన క్షిపణి వేగం గంటకు 33,800కిలోమీటర్లు, గాలిలో ధ్వని కంటే 27 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీన్ని పసిగట్టటం లేదా అడ్డుకోవటం కష్టం. అమెరికా వద్ద ఉన్న ఖండాంతర క్షిపుణులు 23రెట్ల వేగంతో దూసుకుపోతాయి. కొందరు నిపుణులు మరోవాదన వినిపిస్తున్నారు. ఉపగ్రహాల వినియోగం పెరగటం, భూమి, అంతరిక్షంలోని వస్తువులను పసిగట్టే పరికరాలుఉన్నందున హైపర్‌సోనిక్‌ క్షిపణులతో పెద్దగా ప్రయోజనం లేదని ఖండాంతర క్షిపణులే మెరుగని చెబుతున్నారు. అదే నిజమైతే అమెరికన్లు ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏముంది ? అమెరికా నిపుణుడు మార్కో వాదన మరో విధంగా ఉంది.అమెరికా రూపొందించిన బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్ధ( బిఎండి)ను, అమెరికా నగరాలను దెబ్బతీసే శక్తి హైపర్‌సోనిక్‌ క్షిపణికి ఉంటుందని చెబుతున్నాడు. ఇదే అమెరికన్లను భయపెడుతోందన్నది మరొక వాదన. ఒక క్షిపణి ప్రయోగం జరిపినంత మాత్రానే చైనా వద్ద అలాంటివి ఉన్నట్లు కాదని మరొకరు చెప్పారు. అసలు చైనా వారెలా చేశారో తమకు అర్దం కావటం లేదని ఒక అధికారి చెప్పినట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. ఈ పత్రిక విశ్వసనీయత గురించి చర్చించటంలో అర్ధం లేదని కొన్ని కీలకమైన మిలిటరీ సాంకేతిక పద్దతుల్లో అమెరికాతో ఉన్న దూరం తగ్గుతోందని, చైనాను ఎవరూ ఆపలేరని గ్రహించాలని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రాసింది. బిఎండి ఉంది కదా మనకు ఇబ్బంది లేదనుకుంటే ఇప్పుడు కుదరదని, ఉపగ్రహాలను కూల్చివేసే క్షిపణులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ఒక అమెరికన్‌ సూచించాడు.


అణుబాంబును తయారు చేయటమే గాక దాన్ని ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది, మిగతాదేశాలను రెచ్చగొట్టిందీ అమెరికా. దాన్ని అడ్డుకొనేందుకు ఎవరైనా కొత్త అస్త్రాలను సమకూర్చుకుంటే అమెరికాను రెచ్చగొట్టేందుకే ఆ పని చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. అమెరికా ఖండాంతర క్షిపణులకు ధీటుగా రష్యా ఆర్‌ఎస్‌-28 సరమాట్‌ పేరుతో కొత్త క్షిపణి తయారు చేస్తోంది. అది ఈ ఏడాదే సిద్దం అవుతుందనే వార్తలు వచ్చాయి. అది సూపర్‌ ఖండాంతర క్షిపణి అంటున్నారు. దాదాపు పదహారువేల కిలోమీటర్ల వేగంతో, ఒకేసారి అనేక బాంబులను మోసుకుపోయి ఒకేసారి నిర్ణీత ప్రాంతాల మీద జారవిడుస్తుందని చెబుతున్నారు.

అక్టోబరు తొలివారంలో చైనా విమానాలు తైవాన్‌ దీవి మీద అనేక చక్కర్లు కొట్టటాన్ని ప్రపంచ మీడియా కథలు కథలుగా వర్ణించింది. చైనా చర్యకు పోటీగా, కవ్విస్తూ అమెరికా, కెనడాలు క్షిపణి విధ్వంసక నావ, ఫ్రైగేట్‌ను తైవాన్‌ జలసంధిలో తిప్పాయి. ఆ తరువాతే ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ప్రపంచాన్ని రెచ్చగొట్టే విధంగా చైనా హైపర్‌సోనిక్‌ క్షిపణి గురించి కథ అల్లింది. అమెరికా క్షిపణి విధ్వంసక వ్యవస్ధను రూపొందించినప్పటికీ దాని అవసరం కలగలేదు. అది ఎలా పనిచేస్తుందో పరీక్షలు జరుపుతున్నారు. ఎవరైనా అమెరికా మీదకు దీర్ఘశ్రేణి క్షిపణిని వదిలితే దాన్ని మధ్యలోóనే అడ్డుకొనేందుకు రూపొందించారు. ఇప్పటి వరకు 19సార్లు పరీక్షించగా పన్నెండుసార్లు విజయవంతమైంది. గత రెండున్నర సంవత్సరాలుగా పరీక్షలు లేవు. దాని మీద ఇంకా అనుమానాలు తొలగలేదు. ప్రస్తుతం ఉన్న ఖండాంతర క్షిపణులు వంద మీటర్లకు అటూ ఇటుగా లక్ష్యాన్ని చేరతాయి. ఇటీవలి కాలంలో చైనా అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యాతో పోటీ పడుతోంది. ఈ నేపధ్యంలో చైనా పరీక్ష ఇప్పుడు నిజం కాకపోయినా త్వరలో చేసినా ఆశ్చర్యలేదు. అమెరికన్లు అదుపులో ఉంటారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d