• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

బిజెపికి చమురు సెగ : ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం – చమురుపై మూడేండ్లు పన్నులు పెంచం !

09 Wednesday Feb 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


బిజెపికి చమురు సెగ తగిలింది. తమను గెలిపిస్తే ఏడాదికి ప్రతి ఇంటికి మూడు గాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మూడు సంవత్సరాల పాటు చమురుపై పన్నులు పెంచబోమని గోవా బిజెపి ఓటర్లకు వాగ్దానం చేసింది. తమను గెలిపిస్తే లీటరు పెట్రోలు ధర రు.80కి మించి పెరగనివ్వం అని వాగ్దానం చేసింది.దీని మీద బిజెపి మానిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ త్వరలో వాహనాలకు అమర్చే ఇంజన్లను ఇథనాల్‌తో నడిపించవచ్చని, అది లీటరు ధర రు.62కు మించదని, అందువలన కాంగ్రెస్‌ రు.80 పరిమితి విధించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. అంతపరమ రహస్యం తెలిసిన పెద్దలు తామే ఆ ముక్క వాగ్దానంగా చెప్పవచ్చు, అంత సంతోషకరమైన వార్తను కేంద్రమే ఒక ప్రకటనగా చేయవచ్చు. ఇంక బిజెపి పెద్దలు గోవాలో అమెరికా ప్రమాణాలతో కూడిన రోడ్డు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా సెలవిచ్చారు.


అమెరికా – ఇరాన్‌ మధ్య అణుచర్చలు జరుగుతాయనే వార్తలు రాగానే ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి.సఫలమైతే మరికొంత తగ్గవచ్చు, విఫలమైతే పెరగవచ్చు. అంటే అమెరికా చర్యలు అంతర్జాతీయ మార్కెట్‌ మీద ప్రభావం చూపుతున్నాయి. అనేక దేశాలు అణు పరీక్షలు జరుపుతున్నా అమెరికాకు పెద్దగా పట్టదు, అదే ఇరాన్‌ జరిపితే దానికి నొప్పి ఏమిటి ? ఏ దేశాన్నీ ప్రశాంతంగా ఉండనివ్వదా ? దాని రాజకీయం, లబ్ది కోసం ప్రపంచమంతా బలి కావాలా ? అలాంటి అమెరికా తోకపట్టుకొని మనం పోవాలా ?


గత ఏడు సంవత్సరాలలో తొలిసారిగా ఫిబ్రవరి ఏడున బ్రెంట్‌ రకం ముడిచమురు 94 డాలర్లను తాకింది(దానికి ఒక డాలరు తక్కువగా మన దేశం దిగుమతి చేసుకొనే చమురు ధర ఉంటుంది) అమెరికా-ఇరాన్‌ పరోక్షంగా చర్చలను ప్రారంభించనున్నాయి.దీంతో బుధవారం నాడు 90.6 డాలర్ల వద్ద మార్కెట్‌ ఉంది. గతంలో అంగీకరించిన ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగిన కారణంగా తాను అణు కార్యక్రమాన్ని పునరుద్దరిస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. దాన్ని సాకుగా తీసుకొని మన దేశంతో సహా ఎవరూ ఇరాన్‌ చమురు కొనుగోలు చేయకూడని అమెరికా ఆంక్షలు విధించింది. ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు మనం తలొగ్గి మిత్రదేశమైన ఇరాన్‌ నుంచి చమురుకొనుగోలు నిలిపివేశాము. ఇరాన్‌పై కొన్ని ఆంక్షలను అమెరికా తొలగించటంతో ధరలు పరిమితంగా తగ్గాయి. చమురుకు డిమాండ్‌ పెరుగుతున్నందున ఇది తాత్కాలికమే అని చెబుతున్నారు.


గతంలో ఆసియా దేశాలకు సరఫరా చేసే చమురు ధరలను సౌదీ అరేబియా స్వల్పంగా తగ్గించినపుడు చూశారా నరేంద్రమోడీ పలుకుబడి అంటూ డబ్బాకొట్టారు. ఇప్పుడు ధరలను పెంచుతున్నట్లు సౌదీ ప్రకటించింది. నోరు మూతపడింది. నిజానికి గతంలో కూడా ఒక్క మన దేశానికే కాదు, ఇతర ఆసియా దేశాలకూ తగ్గించింది. ఇప్పుడు గిరాకీ ఉంది కనుక ఎంతైనా కొనుగోలు చేయక తప్పదు. వెనెజులా కూడా మనకు మిత్రదేశమే.దాని దాడికి దిగిన అమెరికా ఆంక్షల కారణంగా అక్కడి నుంచి కూడా మనం చమురు కొనుగోలు నిలిపివేశాము. పేరుకు స్వతంత్ర దేశం ఆచరణలో అమెరికా అడుగులకు మడుగులొత్తటం.వెనెజులా బదులు మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇప్పుడు దానికి మెక్సికో కోత పెట్టింది.గతేడాది రోజుకు 98వేల పీపాలను దిగుమతి చేసుకోగా ఈ ఏడాది తొలి రెండు నెలల్లో దాన్ని 15వేలకు తగ్గించారు. దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే విధానంలో భాగంగా ఈ చర్యతీసుకున్నట్లు చెబుతున్నారు. మనకు చమురును విక్రయించే దేశాలు సమంజసమైన ధరలకు చమురు సరఫరా చేయాలని కోరుతున్నట్లు మన చమురుశాఖ సహాయ మంత్రి రామేశ్వర తేలి ఫిబ్రవరి ఏడున రాజ్యసభలో చెప్పారు. గతంలో ఇరాన్‌ మనకు రవాణా రాయితీతో పాటు, ప్రపంచంలో ఎక్కడా చెల్లని మన రూపాయిలను తీసుకొనేందుకు కూడా ఇరాన్‌ వీలు కల్పించింది. ఇప్పుడు దానితో పరోక్షంగా వైరం తెచ్చుకున్నాం. జర కాస్త చూసి ధరవేసుకోండి అంటూ ఇతర దేశాలను బతిమాలుకుంటున్నాం.

మనం దిగుమతి చేసుకొనే చమురు ధర డిసెంబరు ఒకటిన 71.32 డాలర్లు ఉండగా జనవరి 31న 89.41డాలర్లని మరోమంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. ఇంత పెరుగుదల ఉన్నప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా పెట్రోలు, డీజిలు ధరలను పెంచకుండా నిలిపివేశారు.ఎన్నికలు ముగియగానే ఈ మొత్తాలను వసూలు చేసే విధంగా ధరలను పెంచనున్నారు.
అనేక దేశాల్లో చమురు ధరల పెరుగుల సెగతగలటం ప్రారంభమైంది.ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కనిపిస్తోంది.న్యూజిలాండ్‌లో ఏడాది కాలంలో 30శాతం చమురు ధరలు పెరిగాయి.ద్రవ్యోల్బణం 5.9శాతానికి పెరగటంలో చమురు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. కాలుష్యనివారణలో భాగంగా పెట్రోలు మీద లీటరుకు ఎనిమిది నుంచి 16సెంట్ల వరకు పన్ను విధిస్తున్నారు. ఐరోపా యునియన్‌ దేశాల్లో జీవన వ్యయం పెరిగిపోతోంది. దాంతో జనం పొదుపు చర్యలకు పూనుకున్నారు. దానికి పెట్రోలు టూరిజం అని ముద్దుపేరు పెట్టారు. తన జనం మీద భారం తగ్గించాలని పోలెండ్‌ సర్కార్‌ చమురు, గాస్‌ మీద పన్ను తగ్గించింది. దాంతో లీటరుకు 25 నుంచి 35సెంట్ల భారం తగ్గింది. ఐతే ఈ చర్య ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇరుగుపొరుగుదేశాలైన హంగరీ, జర్మనీ, స్లోవేకియా, చెక్‌ తదితర దేశాల వారందరూ పెద్ద కాన్లతో వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో దేశంలో కొరత ఏర్పడింది. ఎవరూ 60లీటర్ల కాన్లు నాలుగుకు మించి విడిగా తీసుకుపోకూడదంటూ రోడ్ల మీద తనిఖీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.స్లోవాక్‌లు సరిహద్దుదాటి వచ్చి 50లీటర్ల కారు టాంకు నింపుకుంటే దూరాన్ని బట్టి 10 నుంచి 18 యురోలు మిగుల్చుకుంటున్నారు. పోలెండ్‌లో ఇతర సరకులపై కూడా పన్ను తగ్గించటంతో పెట్రోలు, డీజిలుతో పాటు సరకులను కూడాకొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. అనేక చోట్ల చమురు, గాస్‌ బంకులు సరఫరా లేక మూసివేస్తున్నారు. పోలెండ్‌తో ఇతర దేశాల్లోని సరిహద్దు సమీప బంకుల వారు పెట్రోలు టూరిజంతో భారీగా నష్టపోతున్నారు. వారి వద్ద కొనుగోలు చేసే వారు లేకుండా పోయారు.(మన దేశంలో ఢిల్లీ చుట్టూ ఉన్న హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాలు పన్ను తగ్గించటంతో ఢిల్లీ పరిధిలోని బంకులకూ అదే పరిస్దితి ఎదురైంది. ఢిల్లీ నుంచి సమీపంలోని రాష్ట్రాల బంకుల్లో కొనుగోలు లేదా ఇతర మార్గాల్లో సమకూర్చుకోవటంతో కేజరీవాల్‌ కూడా పన్ను తగ్గించాల్సి వచ్చింది)


చమురు, గాస్‌, విద్యుత్‌ ధరల పెరుగుదల ఐరోపా దేశాల పర్యాటక రంగం మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.బ్రిటన్‌లో ఏప్రిల్‌ నాటికి 54శాతం వరకు ఇంధన బిల్లులు పెరగవచ్చని అంచనా. కార్లలో విహార యాత్రలకు వచ్చే కుటుంబాలకు ఒక టాంకు పెట్రోలు నింపుకునేందుకు గతంలో 60యురోలు చెల్లించాల్సి వస్తే ఇప్పుడు 85కు పెరిగాయి, అందువలన ప్రయాణ దూరాలపై కూడా పరిమితులు విధించుకుంటున్నారు. మార్చి ఏడవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని చివరి దశ ఎన్నికలు ముగుస్తాయి, ఆ మరుసటి రోజునుంచే ధరల పెరుగుదల ప్రారంభం కానుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యోగి ఆదిత్యనాధ్‌కు రెండు తుపాకులు అవసరమా ?

06 Sunday Feb 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Akhilesh Yadav, BJP, BSP’s Jatav vote bank, Farmers, Lakhimpur Kheri killings, Mayawati, RSS, UP CM, UP election 2022, YogiAdityanath


ఎం కోటేశ్వరరావు


మఠాల్లో ఉంటూ సర్వసంగ పరిత్యాగులైనట్లు చెప్పుకొనే యోగులు, యోగినులకు తుపాకులు అవసరమా ? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాధ్‌కు ఉన్న వ్యక్తిగత ఆస్తి రు.1.5 కోట్లలో లక్ష రూపాయల విలువైన ఒక రివాల్వరు, రు.80వేల ఖరీదైన ఒక రైఫిల్‌, రుద్రాక్షలతో కూడిన రెండు బంగారు గొలుసులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.యోగులు రుద్రాక్షలు కలిగి ఉండటంలో అబ్బురం ఏమీ లేదు, తుపాకులెందుకని ? సిఎం గాక ముందు ఐదు దఫాలు ఎంపీగా పని చేసిన యోగికి అవసరమైన భద్రతను అధికారికంగా కల్పిస్తారు.ఐనా స్వంతంగా రెండు మారణాయుధాలను ఎందుకు వెంట ఉంచుకుంటున్నట్లు ? రాత్రుళ్లు ప్రాణభయం ఉందా ? 2017 ఎంఎల్‌సి ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నాలుగు కేసులు, రెండు కార్లు ఉన్నట్లు పేర్కొన్న యోగి తాజా అఫిడవిట్‌లో కేసులేమీ లేవని,స్వంత వాహనాలేమీ లేవని తెలిపారు.
గోరఖ్‌పూర్‌ అర్బన్‌ స్ధానం నుంచి పోటీలో ఉన్న ఆదిత్యనాధ్‌పై తాను పోటీ చేయనున్నట్లు గత 26సంవత్సరాలుగా నిరవధిక ధర్నా చేస్తున్న మాజీ టీచర్‌ విజయ సింగ్‌ ప్రకటించారు.ముజఫర్‌నగర్‌లో భూమాఫియా మీద చర్య తీసుకోవాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. యోగి మీద పోటీతో పాటు ఎస్‌పి నేత అఖిలేష్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న చోట వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు.


ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో బ్రాహ్మణ సామాజిక తరగతి కీలకపాత్ర పోషిస్తున్నారు.1989 తరువాత వారి నుంచి సిఎం గద్దెనెక్కిన వారు లేరు. కారణం తరువాత కాలంలో ఓబిసి కులాలు, రాజకీయాలు ముందుకు వచ్చాయి.మండల్‌ (కమిషన్‌) ఆందోళన తరువాత ఈ తరగతి నుంచి ఎవరూ సిఎం కాలేదు. కులాలు, మతాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 21 మంది సిఎంలుగా పని చేస్తే వారిలో ఆరుగురు గోవిందవల్లభ పంత్‌, సుచేతా కృపలానీ,కమలాపతి త్రిపాఠీ, శ్రీపతి మిశ్రా, హెచ్‌ఎన్‌ బహుగుణ, ఎన్‌డి తివారీ ఈ సామాజిక తరగతికి చెందినవారే.పదిశాతంపైగా ఓటర్లుగా కూడా ఉన్నందున వీరు మొగ్గినవైపు అధికారం చేతులు మారుతూ వస్తోంది. విధాన సభలోని 403 స్ధానాలకు గాను 115 చోట్ల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారని అంచనా. ఆ రీత్యానే గతంలో బిఎస్‌పి నేత మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌, గత ఎన్నికల్లో యోగి గద్దెనెక్కారన్నది కొందరి సూత్రీకరణ. దానిలో భాగంగానే ఇప్పుడు యోగి పట్ల ఆగ్రహంగా ఉన్నందున బిజెపి ఇంటిదారి పట్టవచ్చని చెబుతున్నారు.నిజానికి దీనికంటే ఇతర అంశాలు బలంగా పని చేస్తున్నాయి.


ఈ సామాజిక తరగతి సమాజవాది పార్టీకి మద్దతు ఇచ్చినపుడు యాదవులు వీరిని చిన్నచూపు చూశారని బిజెపి, ఇతర పార్టీలు రెచ్చగొట్టాయి. ఇప్పుడు అదే ఆయుధాన్ని బిజెపి మీద ఇతరులు ప్రయోగిస్తున్నాయి. ఠాకూర్ల మోచేతి నీళ్లు తాగాల్సి వస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. యోగి పాలనలో కనీసం ఐదువందల మంది బ్రాహ్మలను హత్య చేశారని,20 మందిని నకిలీ ఎన్‌కౌంటర్లలో చంపినట్లు విమర్శలున్నాయి. దీని తీవ్రతను గమనించే అనేక మంది బ్రాహ్మణనేతలకు బిజెపి పెద్దపీటవేస్తోంది. ఇతర పార్టీల నుంచి ఆహ్వానిస్తోంది.లఖింపూర్‌ ఖేరీలో రైతుల మీద వాహనాలను తోలి హత్యకావించిన కేసులో కేంద్ర మంత్రి అజయ మిశ్రా కుమారుడు ఉన్నట్లు విచారణలో తేలినా మంత్రి మీద చర్య తీసుకొనేందుకు బిజెపి వణికి పోవటానికి ఇదే కారణం. అంతేకాదు బ్రాహ్మలతో ఏర్పాటుచేసిన కమిటీలో కూడా మంత్రిని చేర్చారు.


ఈ ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్ల కోసం పార్టీల పాట్లు ఇన్నిన్ని కావు. లక్నో నగరంలో పరశురాముడి విగ్రహాన్ని సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. గండ్రగొడ్డలితో కూడిన పరశురాముడు-అఖిలేష్‌ చిత్రాలు తరువాత దర్శనమిచ్చాయి.యాదవులు, బ్రాహ్మలు మాతోనే ఉన్నారని అఖిలేష్‌ చెప్పారు. బిఎస్‌పి నేత మాయావతి ఎన్నికల ప్రచారంలో దిగకపోయినా ఆ పార్టీ అగ్రనేత సతీష్‌ చంద్ర మిశ్రాను రంగంలోకి దించి బ్రాహ్మల ఓట్లకోసం తిప్పుతున్నారు. ప్రతిపక్షాల దాడికి తట్టుకోలేక బ్రాహ్మలను సంతృప్తి పరచేందుకు బిజెపి 16మందితో ఒక కమిటీని వేసి సమస్యలను గుర్తిస్తామంటూ బుజ్జగింపులకు దిగింది. గాంగస్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ సమయంలో మరణించిన అమర్‌దూబే భార్య ఖుషీ దూబే, ఆమెతో పాటు తల్లి గాయత్రీ తివారీకి సీట్లు ఇచ్చిన కాంగ్రెస్‌ తనవంతు తిప్పలు పడుతోంది.


ఆదిత్యనాధ్‌ తప్పక గెలవాలని తాము కోరుకుంటున్నామని, ఎందుకంటే అసెంబ్లీలో బలమైన ప్రతిపక్ష నేత అవసరం కనుక అని రైతు ఉద్యమనేత రాకేష్‌ తికాయత్‌ జోక్‌ వేశారు. పోటీ 80శాతం, 20శాతం మధ్యనే అంటూ హిందూ-ముస్లిం పోటీగా రెచ్చగొట్టేందుకు బిజెపి వేసిన ఎత్తుగడ దానికే నష్టకరంగా మారుతున్నట్లు వార్తలు రావటంతో నష్టనివారణ చర్యలకు పూనుకుంది. బిజెపి చేసిన ప్రచారంతో వివిధ పార్టీల వెనుక చీలిన ముస్లిం సామాజిక తరగతి బిజెపిని ఓడించేందుకు మొత్తంగా సమాజవాదికి మద్దతు ఇవ్వాలని వార్తలు వచ్చాయి. దాంతో మొదటిదశ ఎన్నికలు కూడా ప్రారంభంగాక ముందే 80-20 కాస్తా 90-10శాతంగా మారినట్లు స్వయంగా యోగి ఎన్నికల ప్రచారంలో చెప్పటం ప్రారంభించారు.మతంతో సంబంధం లేని ఎన్నికలని, ముస్లింలతో సహా అందరూ తమ వెనుకే ఉన్నారని చెప్పటమే ఇది.


రెండు ఇంజిన్లతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామని చెప్పిన బిజెపి ఇప్పుడు ఎన్నికల్లో తానే చెమటలు కారుస్తోంది. పండిన గోధుమల్లో 15శాతం, బియ్యంలో 32శాతం మాత్రమే మద్దతు ధరకు రాష్ట్రంలో సేకరించారు. మిగిలిన మొత్తాన్ని రైతులు అంతకంటే తక్కువకే అమ్ముకొని నష్టపోయారు. రైతుల ఉద్యమం, ఎన్నికల కారణంగా గత ఏడాది కంటే 10 నుంచి 15శాతానికి గోధుల సేకరణ పెరిగినప్పటికీ 2018-19లో 16శాతం సేకరణతో పోలిస్తే తక్కువే. బియ్యం సేకరణ మరీ ఘోరంగా ఉంది. గత ఐదేండ్ల సగటు 34.8శాతం కాగా, గతేడాది 43 నుంచి ఈ ఏడాది 32శాతానికి దిగజారింది. కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించే అంశం గురించి ఒక కమిటీని వేస్తామని సాగు చట్టాల రద్దు ప్రకటనతో పాటు చెప్పారు. ఇంతవరకు దాని ఊసే లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత అంటూ ఇప్పుడు కొత్త కబుర్లు చెబుతున్నారు.


ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయరాదంటూ 57రైతుల సంఘాల పిలుపు మేరకు ఎస్‌కెఎం మిషన్‌ ఉత్తర ప్రదేశ్‌ అనే కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ప్రతి గ్రామాన్ని సందర్శించి బిజెపి పాల్పడిన విద్రోహం గురించి రైతులు, ఇతర జనాలకు వివరిస్తామని నేతలు తెలిపారు. తాము ఏ పార్టీకి ఓటు వేయాలన్నది చెప్పటం లేదని, మోసం చేసిన బిజెపిని ఓడించాలని కోరతామన్నారు. జనవరి 15న సమావేశమైన ఎస్‌కెఎం కమిటీ ఎంఎస్‌పి కమిటీ ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడవు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటికీ ఏర్పాటును ప్రకటించకపోతే జనవరి 31న దేశమంతటా విద్రోహదినంగా పాటించాలని పిలుపు ఇచ్చారు. ఆ మేరకు పలుచోట్ల పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఆందోళన పునరుద్దరణలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలల్లో బిజెపి ఓటమికి పిలుపు ఇచ్చారు.


ఉత్తర ప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతంలో సమాజవాది-ఆర్‌ఎల్‌డి కూటమి ప్రచారం బిజెపికి చెమటలు పట్టిస్తున్నట్లు వార్తలు. విజయ రధం పేరుతో బస్సు ద్వారా అఖిలేష్‌ యాదవ్‌ – జయంత్‌ చౌదరి చేస్తున్న పర్యటన యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది.జాట్‌ – ముస్లిం ఐక్యతను ముందుకు తెస్తున్నారు. తరచుగా జయంత్‌ చౌదరి సభలకు హాజరైన యువతను ఇలా అడుగుతున్నారు ” ఇక్కడున్న అందరికీ వివాహమైందా ? మీరు పెండ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా ? గుర్తు పెట్టుకోండి, వివాహం కావాలంటే మీరు ఇంట్లో సామరస్యతను పాటించాలి. ఇంట్లో ప్రశాంతత లేదని ఇతరులకు తెలిస్తే వివాహానికి ఎవరూ ముందుకు రారు ” అని చెబుతున్నారు. అఖిలేష్‌ రైతులను ఆకర్షించేందుకు ఇలా మాట్లాడుతున్నారు.” మీకు వికాసం కావాలా లేక రోడ్ల మీద తిరిగే పశువులు కావాలా ?” గో సంరక్షణ పేరుతో ఒట్టిపోయిన పశువులను అమ్ముకోనివ్వకుండా రైతులను బిజెపి సర్కార్‌ అడ్డుకుంటున్నది. వాటిని మేపటం దండగ అని రైతులు రోడ్ల మీదకు వదలి వేయటంతో వాటిని నుంచి రైతులు పంటలను కాపాడుకోవటం మరొక సమస్యగా మారుతోంది. దాంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తుతోంది.


ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందన్నట్లుగా అసెంబ్లీ ఎన్నికలు బిఎస్‌పి చావుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. దళితుల్లో జాతావులు మాయావతి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. దాన్ని అవకాశంగా తీసుకొని బిజెపి ఇతరులను రెచ్చగొట్టి కొంత మేరకు తమవైపు తిప్పుకోగలిగింది. ఇప్పుడు బిఎస్‌పి ఎక్కడా రంగంలో కనిపించకపోవటంతో జాతావులు, ఇతర దళితులను తమ వైపు ఆకర్షించేందుకు బిజెపి, ఎస్‌పి పూనుకున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లలో దళితులు 21శాతం కాగా వారిలో జాతావులు తొమ్మిదిశాతం ఉన్నారు.గత ఎన్నికల్లో 84రిజర్వుడు స్ధానాల్లో బిజెపికి 69, దానితో జతకట్టిన పార్టీలకు మరోఐదు వచ్చాయి. గిరిజనులకు ఉన్న మరో రెండుతో మొత్తం 86 స్ధానాల్లో బిఎస్‌పికి వచ్చింది కేవలం రెండంటే రెండు మాత్రమే. ఎస్‌పి ఎనిమిది చోట్ల గెలిచింది. ఈ సారి బిజెపి జాతావు సామాజిక తరగతికి చెందిన మాజీ ఉన్నతాధికారులతో పాటు ఉత్తరాఖండ్‌ మాజీ గవర్నర్‌ను కూడా రంగంలోకి దించి ఓటర్లను ఆకట్టుకొనేందుకు పూనుకుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ అవినీతి నిరోధ ప్రహసనం – 2014లో ఎక్కడో ఇప్పుడూ అక్కడే !

05 Saturday Feb 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, CORRUPTION PERCEPTIONS INDEX 2021, Narendra Modi Failures, Transparency International, Transparency International INDIA


ఎం కోటేశ్వరరావు


మా నేత మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. మీ గొడవ భరించలేక కాసేపు అంగీకరిద్దాం, ఐతే ఏమిటి ? దాన్లో గొప్పేముంది ? లాల్‌బహదూర్‌ శాస్త్రి, మొరార్జీ దేశాయి, చరణ్‌ సింగ్‌, విపి సింగ్‌, ఐకె గుజ్రాల్‌ , చంద్రశేఖర్‌, దేవె గౌడ, మన్మోహన్‌ సింగ్‌ వీరి మీద ఉన్న మచ్చలేమిటో ఎవరైనా చెప్పగలరా ? వారి వెనుక చేరిన వారు అవినీతికి పాల్పడి ఉండవచ్చు. మన్మోహన్‌ సింగ్‌ మీద ఉన్న విమర్శ అదే కదా ! మోడీని ఆశ్రయించిన వారు అవినీతికి దూరంగా లేరని ఎవరైనా నిర్ధారించగలరా? మతోన్మాద అంశంలో మోడీతో ఎవరూ ఎవరూ పోటీ పడలేరు తప్ప మిగతా అంశాల్లో నరేంద్రమోడీ -మన్మోహన్‌ సింగ్‌లకు వ్యక్తిగతంగా పెద్ద తేడా ఏముంది ? అర్ధశాస్త్రం చదువుకున్నా మన్మోహనుడికి ఆర్ధికరంగంలో విదేశీ అవార్డులు రాలేదు. ఏం చదువుకున్నారో తెలియని నరేంద్రమోడీకి సియోల్‌ అవార్డు వచ్చింది. మచ్చలేని స్వచ్చ పాలన అందించాలనే కదా ఎవరినైనా ఎన్నుకొనేది. మచ్చ ల్లేవు చూడండి రచ్చల్లేవు చూడండి అని ఎంతకాలం బోరుకొట్టిస్తారు ? మతోన్మాదం పెద్ద మచ్చ కాదా ! అయినా అధికారాంత మందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు తొందర ఎందుకు ! మోడీ గారి ఏలుబడి ఇంకా ఉంది, కనుక ముందస్తు ధృవీకరణ పత్రాలు ఇచ్చుకోవటం ఏమిటి ?
నేతకున్న మచ్చల సంగతి చరిత్ర చెబుతుంది. మనకు మనం స్వంత సర్టిఫికెట్‌లు ఇచ్చు కోకూడదు. పాలకుడు అవినీతి పరుడుగాక పోతే అది కొంతకాలం పాలకపార్టీకి పెట్టుబడిగా పని చేస్తుంది తప్ప శాశ్వత పాలనకు పాస్‌ పోర్టు, వీసా కాదు. దేశాన్ని అవినీతి ఊబి నుంచి వెలికి తీసి పులుకడిగిన ముత్యం అన్న పేరు తీసుకువస్తానని 2014లో నరేంద్రమోడీ చెబితే చాలా మంది నిజమే అనుకున్నారు. తొలి సారి ఎన్నికైనపుడు అన్ని విదేశీ ప్రయాణాలు ఎందుకంటే విదేశీ పెట్టుబడుల కోసం, ప్రపంచంలో పోయిన భారత ప్రతిష్టను పెంచటం కోసమే అన్నారు. నిజమే కామోసనుకున్నారు జనం !


ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్‌(టిఐ) అనే సంస్ధ ప్రతి ఏటా అవినీతి అవినీతి గోచరత సూచిక పేరుతో ఒక నివేదికను వెల్లడిస్తుంది. దాన్లో ఎగువన ఉన్న దేశాలు ఛాతీ విరుచుకుంటాయి, దిగువన ఉన్నవి సిగ్గుతో తలదించుకుంటాయి. ఎనిమిదేండ్లుగా మోడీ అధికారంలో ఉన్నా ఒక్క ఏడాదంటే ఒక్కసారి కూడా తల ఎత్తుకోలేని పని తీరును కనపరిచారు.ఈ నివేదికను గీటురాయిగా తీసుకుంటే మోడీ ఏలుబడి ప్రపంచంలో మనల్ని తలతెత్తుకొనేట్లు చేసిందో, దించుకోనేట్లు ఉంచిందో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. లేదూ లెక్కలు తప్పు, చూసిన తీరు సరిగా లేదనుకుంటే ఈ సంస్ధ లెక్కలు, చూపుల నుంచి మమ్మల్ని మినహాయించండి అని ఈ పాటికి కేంద్ర ప్రభుత్వం టిఐకి రాసి ఉండాల్సింది. అదేమీ జరగలేదు.


2021 టిఐ సూచిక ప్రకారం 180దేశాల అవినీతి మార్కుల సగటు 43. మన దేశం 40 మార్కులతో 85వ స్ధానంలో ఉంది. 2014 సూచిక ప్రకారం 38 మార్కులతో 85వ స్ధానంలో ఉన్నాము. ఈ అంకెల తరువాత కూడా మచ్చలేని నరేంద్రమోడీని చూసి ప్రపంచం మెచ్చి మేకతోలు కప్పుతుందా ? దేశమచ్చను చూసి నవ్వుకుంటుందా ? ఈ వివరాలను మనం మూసిపెట్టుకోవచ్చు, గోడీ మీడియా మసిపూసి మారేడుకాయ చేయవచ్చు తప్ప ప్రపంచానికి తెరిచిన పుస్తకమే కదా ? అందువలన దేశభక్తులంగా మన కొందరు వ్యక్తులకు భజనలు చేయాలా ? చేస్తే ఎంతకాలం ? దేశం గురించి పట్టించుకోవాలా ? ఒక్క ఈ సూచికే కాదు, దేన్లో దేశానికి ఎన్‌డిఏ సర్కార్‌ పేరు తెచ్చిందో, ఏమి సాధించిందో ఎవరైనా చెప్పగలరా ? ఈ ప్రశ్న అడిగిన వారి మీద వెంటనే బూతుల క్షిపణులు పేలతాయి. గతంలో కాంగ్రెస్‌ ఏలుబడి గురించి ఇలాగే మాట్లాడారా ? దేశపరువు తీస్తారా ? మీరు ఈ దేశంలో పుట్టలేదా ఈ దేశ తిండితినలేదా అంటారు. వారి సంగతి తరువాత చూద్దాం. ఇలా అడిగేవారు ముందు తాము తింటున్నది ఏమిటో తిన్నదానికి గాను దేశానికి వారేం చేశారో, పెంచిన పరువు ప్రతిష్టలేమిటో చెప్పండి!


బీజింగ్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ సభకు రెండు రోబోలతో సహా 1,200 మందితో క్రీడా జ్యోతిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వారిలో గాల్వన్‌ ఉదంతాల్లో పాల్గొన్న సైనికుడు ఒకడు ఉన్నాడంటూ మన దేశం ప్రారంభసభను బహిష్కరించటమే కాదు, ప్రారంభ సభ ప్రసారాన్ని కూడా చేయరాదని దూరదర్శన్‌ నిర్ణయించింది. దేశభక్తికి గీటురాళ్లు ఇవేనా ? కాసేపు అంగీకరిద్దాం. ఈ ఆగ్రహం చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తు దిగుమతుల పట్ల ఏమైనట్లు ? అవి ఒక రోజులో జరిగినవి కాదే ? అప్పుడు కళ్ల ముందు డాలర్లు, లాభాలు తప్ప గాల్వన్‌లో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, వారి కుటుంబాలు గుర్తుకు రాలేదా ? పాలూ, పెరుగులు ఎవరి నుంచైనా తీసుకోవచ్చు, వాటికి అంటూ సొంటూ ఉండదు అన్నట్లు చైనా వస్తువులకు దేశభక్తి నుంచి మినహాయింపులు ఉన్నాయా ?
గాల్వన్‌కు ముందు, తరువాత కూడా చైనా వస్తు బహిష్కరణే అసలు సిసలు దేశభక్తి, మేం ఇన్ని సరకులు బహిష్కరించాం, ఇన్ని బహిష్కరించాం అని చెప్పిన వాణిజ్య సంఘాలు ఇప్పుడెక్కడా కనిపించవేం ? వస్తుదిగుమతుల్లో తలమునకలుగా ఉన్నాయా ? సంఘపరివార్‌ సంస్ధ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? సరిహద్దు వివాదానికి, ఇతర సంబంధాలకు ముడిపెట్టకూడదని ఒకవైపు నీతులు చెబుతారా ? అది క్రీడలకు వర్తించదా ? ఏమిటీ వంచన ! జనాన్ని ఎంతకాలం మోసం చేస్తారు ? 2021లో మన దేశం 126బిలియన్‌ డాలర్ల మేరకు చైనాతో లావాదేవీలు జరిపి సరికొత్త రికార్డు నెలకొల్పిన అంశం మన ప్రధాని కార్యాలయం, విదేశాంగశాఖకు తెలియదా ? ఎందుకు అనుమతించినట్లు ? ఏమైందీ దేశభక్తి ?


ఇక అవినీతి సూచిక సంగతి చూస్తే దాన్లో అధమ స్ధానంలో ఉండటం దేశానికి తలవంపులే.టిఐ నివేదిక చెప్పిందేమిటి ? ” ఇదేమీ కాకతాళీయం కాదు. అవినీతి మానవహక్కుల దుర్వినియోగానికి వీలు కల్పిస్తుంది. దిగజారే ఒక విషవలయాన్ని ఏర్పాటు చేస్తుంది.హక్కులు, స్వేచ్చలు దిగజారతాయి, ప్రజాస్వామ్యం క్షీణించి దాని స్ధానంలో నియంతృత్వం చోటుచేసుకుంటుంది. అది ఉన్నత స్ధాయి అవినీతి పెచ్చరిల్లటానికి దోహదం చేస్తుంది. దీనికి సంబంధించి ఆందోళనకరమైన ఉదాహరణలను గత సంవత్సరం ముందుకు తెచ్చింది. మానవహక్కుల మద్దతుదార్లను హతమార్చటం, మీడియా సంస్ధలను మూసివేయటం నుంచి ప్రభుత్వాల దొంగకళ్ల కుంభకోణాలైన పెగాసస్‌ ప్రాజెక్టువంటి వాటి వరకు వాటిలో ఉన్నాయి.
వ్యవస్ధాపరమైన అవినీతి, బలహీనమైన సంస్ధలు ఉన్న దేశాల్లోనే కాదు, స్ధిరపడిన ప్రజాస్వామిక దేశాలుగా చెబుతున్నవాటిలో కూడా హక్కులు దిగజారుతున్నాయి, దుర్వినియోగ నియంత్రణ-నిరోధ నిబంధనావళిని కూడా తుంగలో తొక్కుతున్నారు.మానవహక్కులను గౌరవించటం అవినీతి అదుపునకు తప్పనిసరి, ఎందుకంటే అనాయాన్ని సవాలు చేసేందుకు పౌరులకు వీలు కల్పించే సాధికారతను కల్పిస్తుంది. మౌలిక స్వాతంత్య్రాలు,దుర్వినియోగ నియంత్రణ-నిరోధ నిబంధనావళిని అమలు జరిపే చర్యలను అడ్డుకొనేందుకు కరోనా మహమ్మారిని ప్రపంచ వ్యాపితంగా ఒక సాకుగా చూపారు. గుర్తు తెలియని డొల్లకంపెనీలకు స్వస్ధిపలకాలని అంతర్జాతీయంగా కదలిక వచ్చినప్పటికీ మిగతావాటితో పోలిస్తే శుద్దమైన ప్రభుత్వరంగం ఉండి ఎక్కువ మార్కులు వచ్చిన దేశాలలో కూడా బహుళజాతి అవినీతి కొనసాగుతూనే ఉంది.” అని నివేదిక పేర్కొన్నది. 2012 వరకు అవినీతి మార్కుల ప్రపంచ సగటు 43గానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25దేశాలు తమ మార్కులను గణనీయంగా మెరుగుపరచుకోగా 23 చోట్ల అదే విధంగా దిగజారింది. అత్యధిక మార్కులు తెచ్చుకున్న ప్రజాస్వామిక దేశాల్లో అవినీతి నిరోధక ప్రయత్నాలు దిగజారుతున్నాయి.వీటిలోని అనేక దేశాలు విదేశీ అవినీతి, అక్రమార్కులకు సురక్షిత స్వర్గాలుగా ఉన్నాయిని కూడా టిఐ నివేదిక చెప్పింది.


దేశంలో అవినీతి నల్లధనం ఎలా పెరిగిపోతోందో ఏ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద నిఘావేసినా రోజుకు ఎంత మంది నుంచి ఎంత నల్లధనం చేతులు మారుతోందో ఎవరైనా తెలుసుకోవచ్చు.2016లో పెద్ద నోట్ల రద్దుతో పెద్ద మొత్తంలో 3-4లక్షల కోట్ల మేరకు నల్లధనం వెలికి తీస్తామని చెప్పిన సర్కార్‌ నిర్వాకం ఏమిటి ? ప్రభుత్వం రద్దుచేసిన కరెన్సీ నోట్ల విలువ రు.15.41లక్షల కోట్లు. తిరిగివచ్చిన నోట్ల విలువ మొత్తం రు.15.31లక్షల కోట్లు. రానిది పదివేల కోట్లు మాత్రమే. అనేక మందికి నోట్ల రద్దు తెలియక, బయటపెడితే సంసారాల్లో ఎక్కడ తగాదాలు వస్తాయో అని భయపడి బయటకు రాని సొమ్ము అంతకంటే ఎక్కువే ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే దొంగనోట్లు కూడా మోడీ సర్కార్‌కు ఇచ్చి అసలైన నోట్లు తీసుకున్నపెద్దలున్నారు.పెద్ద నోట్ల రద్దుతో సహా తమ సర్కార్‌ వివిధ పద్దతుల్లో వెలికి తీసిన మొత్తం రు.1.3లక్షల కోట్లని 2019 ఫిబ్రవరిలో నాటి ఆర్ధిక మంత్రి పియుష్‌ గోయల్‌ చెప్పారు.


పెద్ద నోట్లు రద్దు చేసిన 2016లో 6.32లక్షల నకిలీ నోట్లను పట్టుకున్నారు. తదుపరి నాలుగు సంవత్సరాల్లో 18.87లక్షల కోట్లకు చేరాయి. అంటే దొంగనోట్లు అచ్చువేసే ముఠాలు తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత పట్టుబడిన దొంగనోట్లలో వంద విలువగలవి ఎక్కువ ఉన్నాయి. తరువాత పట్టుబడిన వాటిలో కొత్త రెండువందలు, ఐదువందల విలువగల నోట్లు గణనీయంగా ఉన్నాయి.డిజిటల్‌ చెల్లింపుల గురించి ఎన్నికబుర్లు చెప్పినా ఇప్పటికీ నగదే నడుస్తోంది.2021అక్టోబరు 29న రు.29.17లక్షల కోట్ల నగదు చెలామణి ఉండగా 2016లో రు.16.4లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్‌బిఐ సమాచారం వెల్లడించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాజ్యాంగాన్ని నిలువునా పాతిపెట్టిన వారికి పద్మ అవార్డులా ! దేశం ఎటుపోతోంది !!

03 Thursday Feb 2022

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, Buddhadeb Bhattacharjee, CPI(M), Padma Awards, Padma Awards 2022, RSS


ఎం కోటేశ్వరరావు


బుద్దదేవ్‌ భట్టాచార్యకు పద్మ విభూషణ్‌ ప్రకటించటం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ సాధించదలచుకున్న లక్ష్యం ఏమిటి ? ఒక రాజకీయ పార్టీగా సిపిఐ(ఎం)ను, భావజాల పరంగా కమ్యూనిజాన్ని అంతంగావించాలన్న దాని బహిరంగ లక్ష్యం, కేరళ వంటి చోట్ల దాని హత్యాకాండ గురించి పదే పదే వివరించాల్సిన అవసరం లేదు. ఏ గల్లీ నేతను గిల్లినా వరదలా అదే ద్వేషం పారుతుంది. అలాంటిది బుద్దదేవ్‌ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకువచ్చినట్లు ? వివిధ రంగాలలో ప్రముఖులైన వారితో పాటు వివాదాస్పద కాంగ్రెస్‌ నేత గులాం నబీ అజాద్‌, బిజెపి మత చిహ్నాలలో ఒకరైన కల్యాణ సింగ్‌, మచ్చలేని మార్క్సిస్టు బుద్దదేవ్‌ భట్టాచార్యలకు కేంద్ర ప్రభుత్వం 73వ రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా పద్మవిభూషన్‌ ప్రకటించింది. ప్రజాజీవితంలో జీవితంలో వీరి అసమానకృషికి ఇది గుర్తింపు అని చెప్పారు. రాజకీయ నేతలకు పద్మ అవార్డులు ఇవ్వటం ఇదేమీ కొత్త కాదు బుద్ధదేవ్‌ మాదిరి తిరస్కరించటమూ మొదటిసారే జరగలేదు. పాలకపార్టీకి అమ్ముడుపోయినట్లుగా గత కొంత కాలంగా వార్తలు వస్తున్న నేపధ్యంలో గులాంనబీ అజాద్‌కు అవార్డు ప్రకటించటంపై కాంగ్రెస్‌ నేత జయరామ్‌ రమేష్‌ చురక అంటించారు. బుద్దదేవ్‌ మంచి పని చేశారు అజాద్‌గా మరాలనుకున్నారు గులాముగా కాదు అన్నారు. కాంగ్రెస్‌లో చిచ్చును కొనసాగించాలన్నదే గులాంనబీ అజాద్‌ పేరు వెనుక ఉన్న అసలు కథ.


గతంలో నంబూద్రిపాద్‌కు కాంగ్రెస్‌ హయాంలోనే ప్రకటించారు. అది ఆయన మీద గౌరవమా ? తొలిసారిగా దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్ధలను ప్రహసన ప్రాయంగా మార్చివేసింది కాంగ్రెస్‌ పెద్దలే కదా ! తొలిసారిగా రాజ్యాంగాన్నే సాధనంగా మార్చుకొని దానితోనే కేరళలో నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. తరువాత అదే నేతకు అదే రాజ్యాంగం పేరుతో అవార్డును ప్రకటించారు. ఇఎంఎస్‌ తొలుత గాంధీజీ భావజాలంతో ప్రభావితుడై తరువాత పక్కా కమ్యూనిస్టుగా మారారు. పూర్వపు అనుబంధం కారణంగా కాంగ్రెస్‌ పాలకులు అవార్డు ప్రకటించారనుకుందాం! మరి ఆఎస్‌ఎస్‌ ఆధిపత్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏ అనుబంధంతో బుద్దదేవ్‌కు ప్రకటించినట్లు? అసలు బుద్దదేవ్‌ పేరును ఎవరు సిఫార్సు చేశారని ఒక తెలంగాణా బిజెపి నేతను ఒకటీవీ చర్చలో అడిగితే ఎవరూ సిఫార్సు చేయనవసరం లేదు, ఇప్పుడు నిబంధనలు సులభం ఎవరైనా పేరు పంపి అవార్డు ఇవ్వండి అంటే అవార్డుల కమిటీ పరిశీలించి సిఫార్సు చేస్తుందని సమాధానం చెప్పారు. బుద్దదేవ్‌ అనుమతి లేకుండా పంపిన వారి చిరునామా ఇస్తారా అంటే తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు, అవన్నీ ఎందుకు అని ఎదురుదాడి. రాజకీయాలు రాజకీయాలే, ఏ పార్టీలో ఉన్నా నేతలంటే గౌరవం గౌరవమే కనుక బుద్దదేవ్‌ను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే అంతకంటే సీనియర్‌ కేరళ నేత విఎస్‌ అచ్యుతానందన్‌ను ఎందుకు ఎంచుకోలేదని అవుట్‌లుక్‌ పత్రిక ప్రశ్నించింది.


కొందరు జర్నలిస్టులు, ఆ పేరుతో ఉంటూనే పార్టీల ప్రతినిధులుగా మారిన వారు అవసరమైనపుడు పార్టీలకు అనుకూలంగా కచేరీలకు దిగుతారు. ఇప్పుడు అదే బాటలో కొందరు పద్మ అవార్డును బుద్దదేవ్‌ తిరస్కరించటాన్ని దేనితోనో ముడిపెట్టేందుకు తెగఆయాస పడ్డారు.” ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అనే 1950 నినాదం నుంచి బుద్దదేవ్‌ పద్మ అవార్డు తిరస్కరణ వరకు ” వరకు అంటూ ఒక జర్నలిస్టు దాడికి దిగారు.1950 దశకపు నినాదం ఒక తప్పిదం అన్నట్లుగా పద్మ అవార్డు తీరస్కరణను కూడా తప్పిందంగా భవిష్యత్‌ కమ్యూనిస్టులు అంగీకరిస్తారా అంటూ ఒక సవాలు విసిరారు. కమ్యూనిజానికి భవిష్యత్తే లేదు, కమ్యూనిస్టులే ఉండరనే ప్రచారదాడి తరుణంలో సదరు జర్నలిస్టు భవిష్యత్‌లో కమ్యూనిస్టులు ఉంటారని చెప్పినందుకు వారి పోషకులు ఏమంటారో !

చరిత్రను విస్మరించాలని నియంతలు, శాశ్వతంగా అధికారంలో నిలిచిపోవాలని కోరుకొనే శక్తులు, వాటి మద్దతుదారులు తప్ప మిగతావారెవరూ కోరుకోరు.గత చరిత్ర నూతన తరాలకు మార్గదర్శి.స్పార్టకస్‌ తిరుగుబాటును విస్మరిస్తే తదుపరి బానిసల తిరుబాట్లు జరిగేవా ? బానిసత్వం లేని సమాజం ఉనికిలోకి వచ్చేదా ? అణచివేతకు గురైన 1857నాటి ప్రధమ స్వాతంత్య్ర తిరుగుబాటును విస్మరిస్తే మరో పోరాటం జరిగి తెల్లవారి పాలన అంతరించేదా ? బ్రిటీష్‌ వారికి భజన చేసిన వారిని చూసిన జనం నీరుగారి పోయి ఉంటే కొత్తవెల్లువలు వచ్చి ఉండేవా ? బుద్దదేవ్‌ పద్మఅవార్డు తిరస్కరణను అవకాశంగా తీసుకొని మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకదాడి జరిగింది.1940-1950 దశకంలో దేశంలో కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక పరిణామాలు జరిగాయి. వాటిని సైద్దాంతిక, ఆచరణాత్మక అంశాలకు సంబంధించిన మధనంలో భాగంగా చూడాలి. వాటిలో అనేక కోణాలున్నాయి. తాత్కాలిక రాజీలు, ఎవరి అభిప్రాయం సరైనదో తరువాత చూద్దాం అనే వాయిదాలు ఏవైనా కావచ్చు.


ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అని అప్పుడే కాదు, ఇప్పటికీ కొందరు చెబుతున్నారు. వచ్చేంతవరకు చెబుతూనే ఉంటారు. వారు కమ్యూనిస్టులే కానవసరం లేదు. ఒకవైపు నిజాం సర్కార్‌దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా పోరుసల్పుతున్న సంస్ధాన కమ్యూనిస్టులకు మద్దతుగా పక్కనే ఉన్న తెలుగువారు తాము సైతం బందూకులు పట్టి ప్రాణాలు అర్పించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. కమ్యూనిస్టులు తప్ప ఎందరు కాంగ్రెస్‌ వాదులు, ఇతర పార్టీల వారూ అలాంటి త్యాగాలకు పాల్పడ్డారో ఎవరినైనా చెప్పమనండి ? నెహ్రూ సర్కార్‌ నైజామ్‌ సర్కార్‌ను అణచివేస్తే అదొక తీరు. దానికి బదులుగా తిరుగుబాటు చేసిన జనం మీదనే ఏండ్ల తరబడి దాడులకు దిగి వేలాది మందిని బలితీసుకుంది. భూస్వాములను గ్రామాలకు రప్పించింది. కోస్తా ప్రాంతాలలో అనేక గ్రామాలను పోలీసు చిత్రహింసల శిబిరాలుగా మార్చివేసింది, అనేక మంది మానవతుల మీద అత్యాచారాలు జరిపించింది, వందలాది మంది ప్రాణాలు తీసింది. వేలాది మీద కేసులు, జైళ్ల పాలు చేసింది. అలాంటి స్ధితిలో వాటిని మరచిపోయి జండా పండగవచ్చింది, స్వాతంత్య్ర సంబంరాల్లో bాల్గొనాలని, అక్కడ పెట్టే పప్పు బెల్లాలు తినాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇవ్వగలదా ? ఉద్యమానికి విద్రోహం చేసి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన కాషాయ దళాలు తమ హిందూత్వకు అనుకూలంగా లేదనే కారణాలతో స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని ఆమోదించలేదనేది బహిరంగ రహస్యం.


స్వాతంత్య్రతీరు తెన్నుల గురించి పార్టీలు, సంస్ధల చర్చలో కొన్ని అభిప్రాయాలు వెల్లడించటం వేరు.అదేమీ దేశద్రోహమూ కాదు, రాజాంగ వ్యతిరేకమూ కాదు. ఒకసారి రాజ్యాంగాన్ని ఆమోదించిన తరువాత దానికి కట్టుబడి ఉన్నాయా లేదా అన్నదే గీటు రాయి. న్యూస్‌ 18 టీవీ చర్చల్లో మాట్లాడిన బిజెపి నేతగా మారిన జర్నలిస్టు స్వపన్‌దాస్‌ గుప్తా విపరీత వ్యాఖ్యానం చేశారు. రాజ్యగౌరవాన్ని బుద్దదేవ్‌ తిరస్కరించటాన్ని చూస్తే వారి రాజ్యాంగబద్దత ప్రశ్నార్దకంగా మారింది.అలా చేయటం రాష్ట్రపతినే అవమానించటంతో సమానం. వారు లెనిన్‌ శాంతి బహుమతి తీసుకుంటారు కానీ భారత రిపబ్లిక్‌ ఇచ్చేదానితో మాత్రం సమస్య వస్తుంది. ఈ స్వాతంత్రం నిజమైంది కాదు అన్నది వారి వైఖరి. ఇది రాజకీయంగా సంకుచితమైన వైఖరి ” అని అరోపించారు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలా అడిస్తే అలా ఆడాలన్నమాట.దేశం తోలుబొమ్మలాట తెరకాదు. అసలు ఈ ఎంపికే దురుద్దేశంతో కూడుకుంది కనుక బిజెపి నేతల నుంచి ఏది సంకుచిత వైఖరో ఏది విశాలమైనదో తెలుసుకోవాల్సినంత దుస్ధితిలో బుద్దదేవ్‌ లేరు.


తీసుకొనేవారి అంగీకారంతో నిమిత్తం లేకుండా ప్రకటించటమే ఒక అప్రజాస్వామిక లక్షణం. కేంద్రం ఇచ్చే అవార్డు విధిగా పుచ్చుకోవాలి లేకపోతే అది దేశద్రోహం అని రాజ్యాంగం నిర్దేశిస్తే అదొక తీరు. కానపుడు తిరస్కరించే హక్కు ఉంటుంది. తిరస్కరించిన వారిలో కమ్యూస్టులకంటే ముందే ఇతరులున్నారు. ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అన్న నినాదాన్ని ప్రస్తావించిన తరుణమే వంకబుద్ధి, అసందర్భమూ. పద్మ అవార్డులు స్వాతంత్య్రం,శాంతి గురించి ఇస్తున్నవి కాదు. అందువలన దానితో ముడిపెట్టటం సంస్కారహీనత. ” ఇప్పటికీ ఆర్ధిక స్వాతంత్య్రం లేదుకనుక ఈ స్వాతంత్య్రం నిజమైంది కాదు అని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. మేము రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నట్లుగా మరేపార్టీ చేయటం లేదు. అలాంటి అవార్డులను తిరస్కరించకూడదని ఎక్కడ రాసి ఉందో చూపమనండి. దీనిలో రాజకీయాలు ప్రభుత్వ దురుద్ధేశ్యాలను చూడాలని ” సిపిఎం రాజ్యసభ ఎంపీ వికాష్‌ భట్టాచార్య అన్నారు.
అవార్డులతో నిమిత్తం లేకుండానే ప్రజాజీవనంలో కొన్ని విలువలకు కట్టుబడి పని చేయాలని ఎవరైనా భావిస్తారు. అసలు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని చేసిన ప్రమాణానికే కట్టుబడని వ్యక్తి కల్యాణ సింగ్‌. బాబరీ మసీదు కట్టడానికి ఎలాంటి హాని జరగకుండా కాపాడతానని ఉత్తర ప్రదేశ్‌ ముఖమంత్రిగా సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చిన పెద్దమనిషి. దానికి ఏమైంది ? కూల్చివేస్తున్నంతసేపూ అచేతనంగా అవకాశమిచ్చి తరువాత ఎలాగూ చర్యతప్పదని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తికి అదే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పురస్కారమా ? ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకోసం కాకపోతే రాజ్యాంగాన్ని పరిహసించేందుకు ఇంతకంటే ఏమిచేయాలి ?ఆర్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేసిన కె బి హెగ్డెవార్‌, సిద్దాంతవేత్త ఎంఎస్‌ గోల్వాల్కర్‌కు భారత రత్న అవార్డులు ప్రకటించనంతవరకు తాను పద్మఅవార్డు స్వీకరించలేనని 2003లో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత దత్తోపంత్‌ టేంగిడీ ప్రతిజ్ఞ చేశారు.వీరి వారసులు, రాజ్యాంగ వ్యవస్ధలను దిగజారుస్తున్న వారు రేపు చివరకు సావర్కర్‌, గాడ్సేలను కూడా జాతి రత్నాలుగా అందలమెక్కించినా ఆశ్చర్యం ఏముంటుంది ? ఆ క్రమంలోనే ఇదంతా జరుగుతోందేమో ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్రలను అధిగమించి పురోగమనంలో వెనెజులా !

02 Wednesday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#viva Venezuela, Chavez, crude oil price, Maduro, President Maduro, Venezuela, Venezuela’s economy, Yandamuri, Yandamuri Veerendranath


ఎం కోటేశ్వరరావు


వెనెజులా మరోసారి వార్తల్లోకి వస్తోంది. దానిపై మీడియా సంస్ధలు, ప్రముఖులుగా ఉన్న కొందరు చేయని ప్రచారం లేదు. అక్కడ సమస్యల్లేవని ఎవరూ చెప్పలేదు. కాకపోతే కాళిదాసు కవిత్వానికి కొంత తమపైత్యాన్ని జోడించే వారి గురించి పట్టించుకోనవసరం లేదు. వెనెజులా సెంట్రల్‌(రిజర్వు)బాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో 686.4శాతం ద్రవ్యోల్బణం ఉంది. అంతకు ముందు సంవత్సరం 2,959.8 శాతం ఉంది. గతేడాది సెప్టెంబరు నుంచి నెలవారీ ద్రవ్యోల్బణం ఒక అంకెకు పరిమితం అవుతోంది. వందలు,వేలశాతాల్లో నమోదైన ద్రవ్యోల్బణం అంటే అర్ధం ఏమిటి ? ఒక వస్తువు ధర ఈ క్షణంలో ఉన్నది మరోక్షణంలో ఉంటుందన్న హమీ ఉండదు. చేతిలో ఉన్న కరెన్సీతో ఫలితం ఉండదు. రాయిటర్స్‌ వార్తా సంస్ధ కథనం ప్రకారం కరెన్సీ మారకపురేటును స్ధిరంగా ఉంచేందుకు తీసుకున్న చర్యలతో ఫలితాలు కనిపించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్ధ సరఫరాదార్లకు విదేశీ కరెన్సీ(డాలర్లలో) చెల్లింపులు చేస్తోంది. ఒక ఆశావహ పరిస్ధితి ఏర్పడింది.దీని అర్ధం అంతా బాగుందని కాదు. ప్రభుత్వ టీవీలో దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు నడిచిన హైపర్‌ ద్రవోల్బణం గత చరిత్రే అని, ఐతే ఇప్పటికీ ఈ సమస్య తీవ్రమైనదే అన్నారు.


లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు చెందిన ఐరాస ఆర్ధిక కమిషన్‌ వచ్చే ఏడాది ఈ ప్రాంతదేశాల జిడిపి వృద్ధిరేటు సగటున 2.1శాతం కాగా, వెనెజులా రేటు 3 శాతంగా పేర్కొన్నది. గత ఏడు సంవత్సరాలలో ఇది తొలిసానుకూల సంవత్సరం కావటం గమనించాల్సిన అంశం, 2014 నుంచి ఇటీవలి వరకు దేశ జిడిపి 75శాతం పతనమైంది. మరొక దేశం ఏదైనా ఈ స్థితిని తట్టుకొని నిలిచిందా ? వెనెజులా వామపక్ష పార్టీల ఏలుబడిలో ఉంది తప్ప అమలు జరుపుతున్న విధానాలన్నీ సోషలిస్టు పద్దతులు కావు.ఇటీవలి కాలంలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ, పాలక సోషలిస్టు పార్టీ మధ్యవిభేదాలు కూడా తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. వాటిని అంతర్గతంగా అక్కడే పరిష్కరించుకుంటారు. జనాన్ని ఆదుకొనేందుకు ఉపశమన చర్యలు వేరు, దీర్ఘకాలిక సోషలిస్టు సంస్కరణలు వేరు. సోషలిస్టు క్యూబా, దానికి మద్దతు ఇస్తున్న వెనెజులా వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, బిజెపి పాలిత ప్రాంతాల్లో అధికారపక్షాలు ప్రతిపక్షాలను దెబ్బతీసి తమకు ఎదురు లేదని జనం ముందు కనిపించేందుకు చేస్తున్నదేమిటో తెలిసిందే. లాటిన్‌ అమెరికాలో వామపక్ష పార్టీలు, ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు అమెరికా,కెనడా, ఐరోపా ధనికదేశాలు ఇంతకంటే ఎక్కువగా ప్రాణాలు తీసే దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి.2018లో డ్రోన్‌తో దాడి చేసి మదురోను హత్య చేయాలని చూశారు. అంతర్గత తిరుగుబాట్లను రెచ్చగొట్టి అసలు ప్రభుత్వాన్నే గుర్తించలేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని బహిరంగా ఇచ్చిన పిలుపులు వెనెజులా వ్యతిరేకులకు వీనుల విందుగా ధ్వనించి ఉండాలి.


మన దేశంలో వెయ్యిమంది జనాభాకు 44 కార్లు ప్రపంచంలో కార్లసాంద్రతలో మనం 132వ స్ధానంలో ఉండగా అదే వెనెజులా 96వ స్థానంలో ఉండి 145కలిగి ఉంది.ఐరాస మానవాభివృద్ధి సూచికలో 2021లో మనం 131 స్ధానంలో ఉంటే వెనెజులా 113లో ఉంది. ఈ అంకెల దేముంది అని తోసిపుచ్చవచ్చు, అలాంటి వారిని ప్రమాణంగా తీసుకోవాలా ? వారి నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి ? వారికి నచ్చితే, విలువ లేకపోతే లేదు, ఎంత బాధ్యతా రాహిత్య వైఖరి ? 2021లో ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం 116 దేశాల్లో 101కాగా వెనెజులా 82లో ఉంది. ఎనిమిదేండ్ల మన ఘనమైన పాలన చేసిందేమిటి ?


2014 చమురు మార్కెట్లు పతనం కావటంతో ఎగుమతుల మీద ఆధారపడిన వెనెజులా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా తదితర దేశాల ఆంక్షలతో చమురును వెలికితీసే కంపెనీ ముఖం చాటేశాయి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. ఒక సమాచారం ప్రకారం 2021 ప్రారంభంలో దేశంలో ఉన్న 41లక్షలకు పైగా ఉన్న కార్లలో సగానికి మాత్రమే అక్కడ ఉత్పత్తి జరిగే పెట్రోలు, డీజిలు సరిపోతుంది. గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం జనవరి 24న అక్కడ లీటరు పెట్రోలు ధర రు.1.87. ఇటీవలి కాలంలో తిరిగి ముడి చమురు ఉత్పత్తితో పాటు ధరలు పెరగటం దానికి ఎంతగానో ఉపశమనం కలిగించింది. డిసెంబరు 2021నాటికి రోజుకు పదిలక్షల పీపాలకు ఉత్పత్తి పెరిగింది. ఆంక్షల కారణంగా ఇప్పటికీ శుద్ధి కర్మాగారాలు మరమ్మతులకు నోచుకోలేదు.


ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వెనెజులాకు ఉపశమనం కలిగిస్తున్నాయి.చైనా, రష్యా, ఇరాన్‌తో చమురు రంగంలో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు కీలకమైనవి.అమెరికా ఆంక్షల కారణంగా దాదాపు వెనెజులా చమురు ఉత్పత్తి నిలిపివేసిన తరుణంలో ఒప్పందం చేసుకున్న ఇరాన్‌ ఆహారం, చమురుటాంక్లను పంపి ఎంతగానో ఆదుకుంది. చాలా మందికి అర్ధంగాని అంశం ఏమంటే వామపక్షాలు అధికారానికి రాకముందే అక్కడి చమురు పరిశ్రమ అమెరికా, ఐరోపా ధనికదేశాల సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైంది. అందువలన దానికి అవసరమైన విడిభాగాలు కావాలంటే పశ్చిమ దేశాల నుంచి, వాటి అనుమతితోనే తెచ్చుకోవాలి. దీన్ని అవకాశంగా తీసుకొని వెనెజులాను అవి దెబ్బతీస్తున్నాయి. రష్యా, ఇరాన్‌ ఇటీవలి కాలంలో ఆ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రత్నామ్నాయం కనుగొనటంతో పశ్చిమ దేశాల ఆటలు సాగటం లేదు. భారీ సాంద్రత కలిగిన వెనెజులా ముడిచమురును శుద్ది సమయంలో పలుచన గావించేందుకు అవసరమైన డైల్యూటెంట్‌ను ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది.వీటికి తోడు చమురు తవ్వకరంగంలో పోటీ కూడా వెనెజులాకు కలసివచ్చింది. చిన్న డ్రిల్లింగ్‌ సంస్ధలు ముందుకు వచ్చాయి. అనేక ఆంక్షలను పక్కన పెట్టి తనకు అవసరమైన చమురు కొనుగోలు ద్వారా మరోరూపంలో చైనా పెద్ద ఎత్తున తోడ్పడింది.

అమెరికా చంకలో దూరిన మనవంటి దేశాలపై అమెరికా వత్తిడి తెచ్చి వెనెజులా నుంచి చమురుకొనుగోలును నిలిపివేయించాయి. లాయడ్‌ లిస్ట్‌ ఇంటర్నేషనల్‌ ప్రకారం 2020లో 150ఓడలు మలేసియా మీదుగా చైనా, ఇండోనేషియాలకు వెనెజులా చమురును సరఫరా చేశాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు పుట్టుకు వస్తాడన్నట్లు అమెరికా ఆంక్షలు విధిస్తున్నకొద్దీ ఇతర మార్గాలు అనేక వచ్చాయి. ఈ ఏడాది 17లక్షల పీపాలు అదనంగా ఉత్పత్తి జరగవచ్చని భావిస్తున్నారు. ఇరాన్‌, వెనెజులా నుంచి చమురు చౌకగా లభించనుండటంతో పాటు సరఫరా హామీ ఉంటుంది. 1990లో రోజుకు 32లక్షల పీపాల చమురు వెలికి తీసిన వెనెజులా రిగ్గులు అమెరికన్ల దుర్మార్గం కారణంగా దాదాపు నిలిపివేసిన స్ధితికి చేరుకున్నాయి. ఇరాన్‌ తోడ్పాడుతూ రోజుకు నాలుగున్నరనుంచి ఐదులక్షల పీపాల చమురు ఉత్పత్తికి పధకాలు వేశారు.


వెనెజులా ఇబ్బందుల గురించి ఎకసెక్కాలాడటం అపర మానవతావాదులకు ఒక వినోదం. అక్కడి సమస్యలేమిటి ? వాటికి ఎవరు కారకులు అన్నది వారికి పట్టదు.అంగవైకల్యం మీద హాస్యాన్ని పండించి వండి వార్చుకు తినేందుకు అలవాటు పడ్డ చౌకబారు స్దాయికి ఎప్పుడో మనం దిగజారాం. ఒక రొట్టె ముక్క కోసం ఒళ్లప్పగించేందుకు సిద్ద పడుతున్న వెనెజులా పడతులని,సిగిరెట్‌ పీక కోసం దేవురించే వృద్దులున్నారని వర్ణించిన మహానుభావులను చూశాము. ఇక్కడా వక్రదృష్టే. అనేక ఆఫ్రికా దేశాల్లో ఎండు డొక్కలతో కనిపించే పిల్లలు అడుక్కోవటాన్ని, పిల్లలకోసం మానం అమ్ముకొనే తల్లులను ఈ మానవతావాదులు బహుశా చూడలేరు. చూసినా తాగిన ఖరీదైన విస్కీ మత్తు వదలి, అందమైన వర్ణనలు రావు. ఇలాంటి పెద్దలకు మాదాపూర్‌, కొండాపూర్‌ పబ్బుల్లో తాగితందనాలతున్న కొందరు చిన్న పెగ్గు, బిర్యానీ, ఇతర విలాసాల కోసం రాత్రంగా కాలక్షేపసరకుగా మారుతున్న వారు కనిపించరు. వీరు ఏ పేదరికం నుంచి వచ్చినట్లు ? కరోనా లాక్‌డౌన్‌ తరుణంలో అనేక మంది యువతులు ఆధునిక దస్తులు వేసుకొని వైన్‌ షాపుల ముందు వరుసలు కట్టింది కనిపించలేదా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనెజులాతో పోల్చుకొనే పరిస్ధితులేమీ లేవు కదా ? చీకటిపడితే చాలు వెలుతురులేని సందులు, గోడలు, లైటు స్థంభాలపక్కన కడుపు కక్కుర్తి కోసం కనిపించే అభాగినులు చేయితిరిగిన రచయితలకు కథావవస్తువులౌతారు. వారిపట్ల సానుభూతో మరొక పేరుతో సొమ్ము చేసుకుంటారు. వెనెజులాలో సంక్షేమ పధకాలే ఈ స్ధితికి తెచ్చాయట, ఎంత కుతర్కం.


ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ పేరుతో 2019 నుంచి ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, వుచిత సర్వీసుల ఆఫర్‌ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు. అది చరిత్రా కాదు, రాసిన వీరేంద్రనాథ్‌ చరిత్ర కారుడూ కాదు అంటూ అప్పుడే ఈ రచయిత స్పందించాడు. ఇన్నేండ్ల తరువాత కూడా అదే ప్రచారం అటూ ఇటూ మారి జరుతోంది. ఎంత పెద్ద అబద్దాలను అలోకగా ఆడతారంటే 1970లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి’ అని రాశారు. నిజమా అమెరికా లెక్కల ప్రకారం 210, ఐఎంఎఫ్‌ అంచనా మేరకు 191, ఎక్కడనా పోలీక ఉందా ?


అమెరికాకు వెనెజులా అంటే ఎందుకు పడదు ? ఎక్కడన్నా గట్టు తగాదా ఉందా లేదే ? సైద్దాంతిక, అదీ వామపక్ష ప్రభావం పెరటాన్ని తట్టుకోలేకపోతోంది. ప్రపంచీకరణలో అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్ధలోకి ప్రవేశించకుండా వెనిజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త రాయలేని పత్రికా స్వేచ్చ మనది మరి., వెెనిజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ చర్య చట్టవిరుద్దం, లేదా దోచుకోవటం అని రాయటం కూడా కష్టమే అంటూ జర్నలిస్టు జాన్‌ పిల్గర్‌ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చినిజాలు ఇవి. ‘2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధరపెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు’ ఇది హ్యూగో ఛావెజ్‌ గురించి రాశారు.(అసలు ఆ ఏడాది ఎన్నికలే జరగలేదు)
ఎవరీ ఛావెజ్‌ ? 1977లో ఒక సైనికుడిగా ఒక వామపక్ష తీవ్రవాద సంస్ధను అణచివేసేందుకు వెళ్లిన ఆయన, వారెందుకు తీవ్రవాదులుగా మారారు, రాజ్యం వారినెందుకు అణచివేస్తున్నది అనే అంతరంగ మధనంతో వామపక్ష వాదిగా మారిన వ్యక్తి. 1989లో కార్లోస్‌ అండ్రెజ్‌ పెరోజ్‌ అనే పెద్ద మనిషి తాను ఎన్నికైతే అమెరికా వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకుంటానని, ఐఎంఎఫ్‌ విధానాలను వ్యతిరేకిస్తాననే వాగ్దానాలతో అధికారానికి వచ్చి అందుకు వ్యతిరేకంగా వ్యవహించాడు. అతని విధానాలు నచ్చని మిలిటరీ అధికారిగా వున్న ఛావెజ్‌ 1992లో విఫల తిరుగుబాటు చేశాడు. అందుకుగాను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1994లో అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం ఛావెజ్‌ను, ఆయనతో పాటు జైల్లో పెట్టిన ఇతర తిరుగుబాటుదార్లను విడుదల చేసింది. మిలిటరీలో తిరిగి చేరకూడదని ఆంక్షలు విధించింది. 1998 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో, వామపక్ష, వుదారవాద, ప్రజాస్వామిక అభిప్రాయాలు కలిగిన వివిధ సంస్ధలు, పార్టీలతో ఏర్పడిన వెనిజులా ఐక్యసోషలిస్టు పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. నూతన రాజ్యాంగం మేరకు 1999లో మరోసారి ఎన్నికలు జరిపి రెండోసారి అధికారానికి వచ్చారు. 2006 డిసెంబరులోనే జరిగాయి, మరుసటి ఏడాది జనవరిలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. నాలుగోసారి 2012లో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే కాన్సర్‌ కారణంగా ఆసుపత్రిలో వున్నందున ప్రమాణస్వీకారం చెయ్యలేదు. అయితే అధికారంలో వుండి తిరిగి గెలిచినందున ప్రమాణస్వీకారం మరోసారి చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది.అయితే ఆరోగ్యం విషమించి 2013 మార్చి ఐదున మరణించారు. వుపాధ్యక్షుడిగా వున్న నికొలస్‌ మదురో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. తరువాత ఎన్నికల్లో మదురో గెలుస్తున్నారు.

వెనెజులాలో వున్నది వామపక్ష ప్రభుత్వం. అంతకు ముందు అక్కడ అనుసరించిన నయా వుదారవాద విధానాలను పూర్తిగా మార్చకుండా జనానికి వుపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నది. దాని ఆదాయం నూటికి 95శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే పరిమితం అమ్ముకుంటున్నదానికి అయినా నాలుగు డాలర్లు వస్తాయి లేకపోతే ఇబ్బందే. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటినుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు.సంక్షమే పధకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్‌. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనిజులాను సాకుగా చూపటమే అభ్యంతరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమ ప్రయోగాలకు నల్లజాతి అమెరికన్లు, దళితులను కమ్యూనిస్టులు వాడుకుంటున్నారా !

23 Sunday Jan 2022

Posted by raomk in CHINA, CPI(M), Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Black Americans, communism, discrimination against dalits india, Left politics, US anti communism


ఎం కోటేశ్వరరావు


” కమ్యూనిజం ప్రయోగాల కోసం నల్లజాతి అమెరికన్లను ఉపయోగించుకుంటున్న పురోగామివాదులు ” అనే శీర్షికతో ఇటీవల ఒక విశ్లేషణను అమెరికా మీడియాలో చదివాను. వెంటనే మన దేశంలో దళితులను కమ్యూనిస్టులు ఉపయోగించుకుంటున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం గుర్తుకు వచ్చింది. అమెరికాలో లేదా మన దేశం, మరెక్కడైనా ఇలాంటి ప్రచారం చేస్తున్న వారు రెండు రకాలు. ఒకటి ఒక పధకం ప్రకారం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసే మేథావులు, రెండో తరగతి వారి ప్రచారదాడి బాధితులుగా మారిన వారు. కమ్యూనిజం, పురోగామివాదులపై చేసిన దాడికి పాల్పడిన ఆడమ్‌ బి కోల్‌మన్‌ ” బ్లాక్‌ విక్టిమ్‌ టు బ్లాక్‌ విక్టర్‌ ” అనే పుస్తక రచయిత కూడా, ఆఫ్రో-అమెరికన్‌ అని వేరే చెప్పనవసరం లేదు.


ఏమంటాడు ఇతను ? ” అమెరికాలో నేడు నల్లవారు ఫుట్‌బాల్‌ బంతుల్లా ఉన్నారు. వారిని ఎవరు ఎప్పుడు ఎటు తంతారో తెలియదు. నల్లవారికి తమ మీద అదుపు ఉండదు. ఆధునిక రాజకీయాల్లో రాణించాలంటే నల్లజాతి వారికి సాయం అనే అంశాన్ని సోపానంగా చేసుకుంటున్నారు. సాయం చేస్తున్నట్లు చెప్పుకోవటం వేరు నిజంగా సాయం చేయటం వేరు. పురోగామివాదులు ఊహాజనిత కమ్యూనిస్టు జ్వర ప్రేలాపనలో నల్లజాతి అమెరికన్లను ఒక ప్రయోగశాలలో మాదిరి వాడుతున్నారు. అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని ఉపయోగించుకొని నల్లజాతీయులను ధనికులు కాకుండా అడ్డుకుంటున్నారు.” అన్నం ఉడికిందో లేదో చూసేందుకు ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలు అన్నట్లుగా అతగాడు రాసిందాన్ని మొత్తం పునశ్చరణ చేయాల్సిన అవసరం లేదు. నల్లజాతీయుడై ఉండి ఒక వైపు జాత్యహంకార వివక్ష ఉంది, దాడులు నిజమే అని సన్నాయి నొక్కులు నొక్కుతూ అక్కడి దోపిడీ వ్యవస్ధకు మద్దతు ఇచ్చే, కమ్యూస్టు వ్యతిరేకతను అడుగడుగునా వెల్లడించిన కోల్‌మన్‌ వాదనల గురించి ఎంత చెప్పుకున్నా వాటి చుట్టూనే తిరుగుతుంటాయి.


కోల్‌మన్‌ ఇంకా ఎంత కుతర్కం చేశాడో చూడండి ” అమెరికా చరిత్రలో నల్లజాతీయులు హతులయ్యారా ? నిస్సందేహంగా ఎలాంటి మినహాయింపుల్లేవు. పోలీసులు నల్లజాతీయులను అన్యాయంగా కాల్చి చంపారా ? అవును. కానీ జాత్యహంకారం ఉనికిలో ఉండటం, జాత్యహంకార అన్యాయం జరుగుతుండటాన్ని ఉపయోగించుకొని సర్వకాలాల్లో అందరిని సమానంగా చూస్తారు, ప్రతిభతో నిమిత్తం లేకుండా అందరికీ సమంగా ఉత్పత్తిని పంచుతారు అనే ఊహాజనితమైన వైఖరివైపు అమెరికా జనాన్ని వామపక్షం లాగుతున్నది. ఇది కేవలం ప్రహసన ప్రాయమైన అసాధ్యం. సమాజం పని చేసేందుకు అవసరమైన ప్రతిదాన్నీ నాశనం చేయాలని, దానిలోనే జీవించాలని, అదే సరైనదని చెబుతారు… అమెరికా అంతటా పట్టణాల్లో జరుగుతున్నదాన్ని మీరు చూడవచ్చు.శాన్‌ఫ్రాన్సిస్‌కోలో చివరికి పట్టపగలు కూడా దొంగతనాలు జరగటం సర్వసాధారణం. ఇళ్లు లేని వారు నగరమంతటా ఎక్కడబడితే అక్కడ వారు అనుకున్న చోట గుడారాలు వేస్తున్నారు, అనుకున్న ప్రతిదాన్నీ అపరిశుభ్రంగావిస్తున్నారు. తప్పుడు విధానాలు దీనికి కారణం కావచ్చు గానీ ఇదంతా మన సమాజాన్ని నిర్వీర్యం చేసేందుకే పధకం ప్రకారం చేస్తున్నది. మార్క్సిస్టు భావజాలపు ప్రత్యక్ష ప్రభావం ఇది ”


1950దశకంలో ఆంధ్రదేశంలో కమ్యూనిస్టుల ప్రభావం బలంగా ఉన్న సమయంలో వ్యతిరేకులు ఇలాంటి ప్రచారాలే చేశారు. మనకు ఐదువేళ్లు సమంగా ఉండవు కదా, కమ్యూనిస్టులు వస్తే అన్నింటినీ సమంగా నరికేస్తారు. మీకు రెండు చొక్కాలు, పంచెలు ఉంటే ఒకటి లాక్కుని లేనివారికి ఇస్తారు. ఇంటిని సగం చేసి మిగతాది లేని వారికి అప్పగిస్తారు. ఎవరైనా వ్యతిరేకిస్తే నెత్తిమీద సుత్తితో కొట్టి కాడవలితో గొంతు కోస్తారు, ఇంకా నోరుబట్టని ప్రచారాలతో జనాన్ని రెచ్చగొట్టారు. అన్నింటినీ ధ్వంసం చేస్తామని కమ్యూనిస్టులు ఎక్కడ చెప్పారు. మనిషిని మనిషి దోచుకొనే పద్దతిని నాశనం చేస్తామన్నారు, దోపిడీకి రక్షణగా , జనానికి వ్యతిరేకంగా ఉండేవారి సంగతి చూస్తామన్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలోనో మరొక నగరంలో జనానికికందరికీ ఇంటి వసతి కల్పిస్తే రోడ్లమీద గుడారాలు ఎందుకు వేస్తారు. పని, ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తే ఎవరైనా దొంగతనాలు చేస్తారా ? నల్లవారు కనిపించగానే ఉట్టిపుణ్యానికే రెచ్చిపోతున్న పోలీసులను అదుపు చేస్తే ఎందుకు తిరగబడతారు ? అలాంటి పరిస్ధితులను నివారిస్తే కమ్యూనిస్టులు, మరొక పురోగామి, ప్రజాస్వామ్యవాదులతో పనేముంటుంది ?


మన దేశంలో కూడా దళితుల పేరుతో ఇలాంటి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగారు. దీనికి అమెరికాలోని కోల్‌మన్‌ వంటి వారి ప్రభావం ఒక కారణంగా చెప్పవచ్చు. అమెరికాలోని నల్లజాతివారు, దళితులకు అనేక పోలికలు కనిపిస్తాయి. ఇరువురూ బాధితులే. రాబిన్‌హుడ్‌ మాదిరి ఒక వీరుడు వచ్చి వారిని విముక్తి చేస్తాడని, దోపిడీ, వివక్ష నుంచి రక్షిస్తాడని ఎవరూ చెప్పలేదు. తామే విముక్తి చేస్తామని కమ్యూనిస్టులూ వకాల్తాపుచ్చుకోలేదు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నారు అంటే ఎవరి విముక్తికి వారు ముందుకు రావాలనే తప్ప మీరు అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండండి మేమే పోరాడతాం అనటం లేదు. జనం జరిపే పోరాటాల్లో ముందుంటాం అని దారి చూపుతున్నారు. అణగారిన తరగతులు వారు ఎవరైనప్పటికీ వారినందరినీ కమ్యూనిస్టులు వినియోగించుకుంటూ వారిని జెండాలు మోసేవారిగానే పరిమితం చేస్తున్నారనే ఆరోపణలు, వక్రీకరణలు తెలిసిందే. మహత్తర తెలంగాణా సాయుధ పోరాటంలో నైజాం, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు ? మల్లు స్వరాజ్యం వంటి వారంతా దొరల కుటుంబాలనుంచి వచ్చి తుపాకి పట్టిన వారే కదా ! వారితో పాటు వెట్టి,అణచివేతకు గురైన వారందరూ కూడా బందూకులు పట్టారు. ఆ పోరాటంలో ఎవరు అమరులైందీ ఆ గ్రామాలు, పట్టణాల్లో ఎవరిని అడిగినా చెబుతారు.కమ్యూనిస్టులు వాడుకుంటారు అని చెప్పేవారు కేరళలో వరుసగా రెండోసారి సిఎంగా చరిత్ర సృష్టించిన పినరయి విజయన్‌ గురించి ఏమి చెబుతారు ? ఒక గీత కార్మికుడి కుమారుడు కదా !


కుల వివక్ష సమస్యను కమ్యూనిస్టులు గుర్తించలేదు అన్నది ఒక విమర్శ. ఇది కూడా వక్రీకరణే, వాస్తవం కాదు. అంబేద్కర్‌ కంటే ముందే నారాయణ గురు, అయ్యంకలి వంటి సంస్కరణవాదులెందరో కులవివక్ష పోవాలని చెప్పి ఎంతో కృషి చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎకె గోపాలన్‌ వంటి ఎందరో కమ్యూనిస్టులు దళితుల దేవాలయ ప్రవేశం వంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సోషలిస్టు వ్యవస్ధలో ఆర్ధిక అంతరాలను రూపుమాపితే తప్ప కుల సమస్య పరిష్కారం కాదని భావించిన కారణంగానే మొదటిదానికే ప్రాధాన్యత ఇచ్చారనిపిస్తుంది. ప్రతి సంఘసంస్కరణ ఉద్యమాన్ని సొంతం చేసుకున్న కమ్యూనిస్టులు దళిత కులవివక్షను పట్టించుకోలేదనటం వక్రీకరణే. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాటితో పోలిస్తే సిపిఎం నేతలు ఆ సమస్యను మకింత స్పష్టంగా గుర్తించారు గనుక కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐనా వర్గ సమస్యకు ఇచ్చినంత ప్రాధాన్యతను వర్ణ అంశానికి కూడా ఇచ్చి పోరాడలేదని సానుకూలంగా విమర్శిస్తే అదొకదారి. అందుకు సూచనలు చేయవచ్చు. శత్రుపూరిత దాడికి దిగితే ఏమనాలి ?


వర్గ శత్రువు కంటికి కనిపించేది, వర్ణశత్రువు స్వభావం అలాంటిది కాదు. ముందు కులాన్ని నిర్మూలించిన తరువాత వర్గ నిర్మూలన చేపట్టాలని చెప్పేవారు కమ్యూనిస్టులతో నిమిత్తం లేకుండా అంబేద్కర్‌ కాలం నుంచి ఇప్పటి వరకు ఎంత మేరకు జనాన్ని కూడగట్టారో, ఎంత పురోగతి సాధించారో ఒక్కసారి నెమరువేసుకోవాలి. చివరికి అంబేద్కర్‌ను సైతం ఒక కులానికి ప్రతినిధిగా దిగజార్చారనే విమర్శ ఉంది కదా ! కులవివక్షనే వ్యతిరేకించేందుకు మద్దతు తెలపని స్ధితిలో కుల నిర్మూలనకు పిలుపు ఇవ్వటం నేలవిడిచి సాము కాదా ! చట్టాలు, సంస్కరణలతో వెంటనే సామాజిక మార్పులు రావని అనేక దురాచారాల అంశంలో రుజువైంది. రిజర్వేషన్లను అనుభవించేందుకు కులాలవారీ వర్గీకరణ చేయాలనే ఒక ప్రజాస్వామిక డిమాండ్‌నే దళితులలో కొందరు అంగీకరించకుండా వీధులకు ఎక్కుతున్న స్ధితి ఉంది. దేశంలో కులనిచ్చెనమెట్లు అన్ని కులాల్లో ఉన్నాయి. ఇలాంటి వాటినే పరిష్కరించలేని స్ధితిలో మొత్తంగా కులనిర్మూలన అంశాన్ని చేపట్టాలనే వాదన ఆచరణాత్మకóమా ? లేదూ సాధ్యమే అని నమ్మేవారు అందుకోసం పోరాడితే ఎవరూ తప్పు పట్టరు. ఆర్ధిక సమస్యల మీద పోరాడేందుకే జనం ముందుకు రావటం లేదన్నది ఒక కఠోరవాస్తవం. నరనరాన వేల సంవత్సరాలుగా జీర్ణించుకుపోయిన కులవివక్ష అంశం ఎక్కడైనా ముందుకు వచ్చినపుడు దాని మీద పోరాడటం, మిగతా సమయాల్లో ఈ అంశాన్ని ప్రచారం చేస్తూ వర్గ సమస్యతో జమిలిగా చేపట్టటం ఆచరణాత్మక అంశం అవుతుంది.


ఇక్కడ ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఆఫ్రికా నుంచి అమెరికాకు అక్కడి జనాలను బానిసలుగా తీసుకురావటం 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. మన దేశంలో దళితులను కొన్ని వేల సంవత్సరాల నాడే సృష్టించారు. అనేక దేశాలలో ఆఫ్రికన్‌ బానిసల వారసులు గానీ, దళితులు గానీ లేరు. కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ గానీ, వారికి ముందున్న ఊహాజనిత సోషలిస్టులు కానీ నల్లజాతీయులు లేదా దళితుల కోసమే కమ్యూనిస్టు సిద్దాంతం అని గానీ, వారితోనే ప్రయోగాలు చేయాలని గానీ ఎక్కడా చెప్పలేదు. భవిష్యత్‌లో కమ్యూనిస్టు సిద్దాంతం పుడుతుందని, దాని ప్రయోగాలకు వీరిని సిద్దం చేసి ఉంచాలని వారిని వందలు, వేల ఏండ్లక్రితమే సృష్టించారా మరి ? సృష్టిస్తే ఎవరు వారు ? ఒక వేళ తమ ప్రయోగాల కోసమే ఈ సామాజిక తరగతులను లేదా కార్మికవర్గాన్ని సృష్టించి ఉంచారని మార్క్స్‌-ఎంగెల్స్‌లకు తెలుసా ? తెలిసినా, వారు అనుకున్నా తమ కార్యకలాపాలను అమెరికా లేదా లాటిన్‌ అమెరికాలోని స్పానిష్‌ వలస దేశాలు, భారత్‌కు వెళ్లి ప్రయోగాలు చేయకుండా జర్మనీ, బ్రిటన్‌కు ఎందుకు వెళ్లారు ? 1871లో జరిగిన పారిస్‌ కమ్యూన్‌ తిరుగుబాటులో అక్కడి ఆఫ్రో-ఫ్రెంచి జాతీయులు పాల్గని ఉండవచ్చు గానీ నాయకత్వం ఫ్రెంచి కార్మికవర్గమే కదా ? రష్యా,చైనా, వియత్నాం, క్యూబా, కొరియాలో ఎవరిని వినియోగించి విప్లవాలను తీసుకువచ్చారు ? ఎవరు లబ్ది పొందారు ?


ఇక కమ్యూనిస్టు నేతలు, వారి కుటుంబసభ్యులు త్యాగాలు చేయరు, సామాన్యకార్యకర్తలనే బలిపెడతారు అన్న దుర్మార్గమైన నిందలు కూడా వేసేవారున్నారు. జనం కోసం త్యాగాలకు సిద్దపడి ఏటికి ఎదురీదేవారు కమ్యూనిస్టులు తప్ప మరొకరు లేరు. ఎక్కడైనా పార్టీనేతలుగా ఉండి అక్రమాలకు పాల్పడేవారు వేళ్లమీద లెక్కించగలిగిన వారు లేరని ఎవరూ చెప్పరు. వారిని మాత్రమే చూపుతున్నారంటే ఏమనుకోవాలి ? ఎన్నో కుటుంబాలు అసమాన త్యాగాలు చేశాయి. ఆ వివరాలన్నీ పేర్కొనటం ఇక్కడ సాధ్యం కాదు. రెండు మూడు ఉదంతాలు చూద్దాం.


హిట్లర్‌ అంతు చూసిన స్టాలిన్‌ కుమారుడు ఎకోవ్‌ జర్మన్లకు చిక్కి వారి చేతిలో మరణించిన అంశం తెలిసిందే. అధినేతగా తలచుకుంటే తన కుమారుడిని ఏదో ఒక ఉద్యోగంలో పెట్టటం కష్టమేమీ కాదు. కానీ సైన్యంలో చేరాలని కోరాడు. రెండవ ప్రపంచ యుద్దంలో జర్మన్లకు బందీగా చిక్కాడు. తమ వారిని విడిచిపెడితే ఎకోవ్‌ను అప్పగిస్తామని హిట్లర్‌ మూకలు చేసిన ప్రతిపాదనను స్టాలిన్‌ అంగీకరించలేదు. కుమారుడి కోసం నరహంతక నాజీలను వదిలేదని తిరస్కరించాడు. తరువాత ఎకోవ్‌ను జర్మన్లు కాల్చి చంపారు. స్టాలిన్‌ తరువాత అధికారానికి వచ్చిన నికితా కృశ్చేవ్‌ కుమారుడు లియోనిద్‌ కృశ్చేవ్‌ ఆర్టిలరీ బాటరీ కమాండర్‌. అదే యుద్దంలో వీరమరణం పొందాడు. ఇలాంటి వారెందరో ఉన్నారు. సోవియట్‌ వెలుపల యుగోస్లావియా నేత టిటో కుమారుడు జర్‌కో బ్రోజ్‌ తన చేతిని పొగొట్టుకున్నాడు. స్పెయిన్‌ కమ్యూనిస్టు నేత డోలోర్స్‌ గోమెజ్‌ కుమారుడు రూబెన్‌ రూయిజ్‌ స్టాలిన్‌గ్రాడ్‌ పోరులో కమాండర్‌గా వీరత్వం పొందాడు.


చైనా అగ్రనేత మావో సంతానంలో మావో అనీయింగ్‌ ఒకడు. తల్లి యాంగ్‌ కైహుయి విప్లవకారిణి.1930 అక్టోబరులో కొమింటాంగ్‌ యుద్దప్రభువు హి షియాన్‌ ఆమెను బందీగా పట్టుకున్నాడు. మావోకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన చేస్తే వదలివేస్తామని చెప్పాడు. నిరాకరించినందుకు చిత్రహింసలు పెట్టారు. చివరకు నవంబరు 14న ఆమెను ఉరితీశారు. ఆ నాటికి ఆమె వయసు 29 సంవత్సరాలు. మావో ఎక్కడున్నాడో తెలియదు, ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు.మావో అనీయింగ్‌కు అప్పుడు ఎనిమిది సంవత్సరాలు. షాంఘైవీధుల్లో అడుక్కొని పొట్టపోసుకున్నాడు.1936లో అతన్ని కనుగొన్న మావో రష్యా పంపాడు. మావో కుమారుడు కనుక అతన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. సెర్గీ మయవ్‌ అని కొత్త పేరు పెట్టారు. 1942లో తనను రెడ్‌ ఆర్మీలో చేర్చుకోవాలంటూ స్టాలిన్‌కు సెర్గీ లేఖ రాశాడు.” ప్రియమైన కామ్రేడ్‌ స్టాలిన్‌ ! నేను ఒక చైనా యువకుడిని. మీ నేతృత్వంలోని సోవియట్ల దేశంలో ఐదు సంవత్సరాలు చదువుకున్నాను. నేను చైనాను ఎంతగా ప్రేమిస్తానో యుఎస్‌ఎస్‌ఆర్‌ను కూడా అంతగొప్పగా ఆరాధిస్తాను. మీ దేశం జర్మన్‌ ఫాసిస్టుల పదఘట్టనల కింద నలిగిపోతుంటే నేను చూస్తూ కూర్చోలేను. లక్షలాది మంది సోవియట్‌ పౌరులను చంపినదానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ముందు పీఠీన నిలిచి పోరాడేందుకు పూర్తి సంసిద్దంగా ఉన్నాను. దయచేసిన నా వాంఛను మన్నించాలని కోరుతున్నాను.” అని రాసిన లేఖకు సమాధానం రాలేదు. తరువాత ఒక అధికారి వచ్చి ” తండ్రి ఒక హీరో, కుమారుడు ఆయన ఒడిలో పెరిగిన బలశాలి ” అంటూ సైనిక శిక్షణకు పంపాడు.1944లో టాంకుల కమాండర్‌గా పోలాండ్‌, జర్మనీ రంగాలలో పోరాడాడు. అయితే అతను రష్యన్‌ భాష బాగా మాట్లాడుతుండటంతో తోటివారెవరూ మావో కుమారుడని గుర్తించలేదు. తరువాత 1945లో సోవియట్‌ -జపాన్‌ యుద్దంలో కూడా పాల్గొన్నాడు. అతని ధైర్యసాహసాలకు మెచ్చి స్టాలిన్‌ స్వయంగా తన సంతకంతో కూడిన ఒక ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చాడు. 1946లో చైనాకు తిరిగి వచ్చాడు.1950లో కొరియాలో పోరాడేందుకు వెళ్లాడు. అక్కడ అమెరికా వైమానిక దాడిలో ప్రాణాలు అర్పించాడు.


మన దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఇతర దేశాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో కమ్యూనిస్టులు కాని వారు కూడా ఎందరో అసమాన త్యాగాలు చేసిన చరిత్ర ఉంది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఆ పోరాటాల్లో ఎందరో నేతలతో పాటు వారి అడుగుజాడల్లో నడిచిన సామాన్యులు కూడా అమరులైనారు. స్వాతంత్య్రం పేరుతో సామాన్యులను బలిపెట్టారని ఎవరైనా నాటి నేతలను నిందించగలమా ? చౌకబారుతనం, పాలకవర్గాల ప్రచారాన్ని భుజానవేసుకొనే బానిస బుద్ది తప్ప అది సంస్కారమేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేడ కొంటామమ్మ పేడ,ఆవు పేడ అంటున్న ప్రియాంక – నరేంద్రమోడీ రూపంలో కృష్ణుడు పుట్టాడన్న బిజెపి !

21 Friday Jan 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment


ఎం కోటేశ్వరరావు


ఉదరపోషణార్ధం బహుకృతవేషాలు అన్నట్లుగా అధికారం కోసం పార్టీలు, నేతలు ఎన్ని మాటలు చెబుతున్నారో కదా ! తాము అధికారంలోకి వస్తే ఆవు పేడ కొనుగోలు చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ రైతులకు వాగ్దానం చేసింది. ఆవు రాజకీయంలో ఇదో కొత్త కోణం. తమ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌ఘర్‌లో ఇప్పటికే ఈ పధకాన్ని అమలు జరుపుతున్నామని, తమను ఎన్నుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో కూడా అమలు చేస్తామని చెప్పింది. అవినీతి అక్రమాలను అంతం చేసేందుకు కృష్ణుడే నరేంద్రమోడీ అవతారంలో జన్మించారని ఉత్తర ప్రదేశ్‌ బిజెపి మంత్రి ఒకరు చెప్పారు. తనకు కృష్ణుడు ప్రతిరోజూ కలలోకి వచ్చి ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ పోరు పెడుతున్నట్లు సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ చెప్పారు. ఎన్నికలు భలే వినోదాన్ని కలిగిస్తాయి కదా !


గౌధన్‌ న్యాయ యోజన పధకం కింద కిలో రు.1.50 వంతున ఆవు పేడ కొని సేంద్రియ ఎరువులను తయారు రైతులకు అందచేస్తామని గతేడాది జూలైలో చత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆచరణ సాధ్యం కాదని ప్రతిపక్ష బిజెపి అప్పుడు విమర్శించింది. అదే పార్టీకి చెందిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తమ ప్రభుత్వం ఆవుపేడను సేకరించి ఎరువులు, ఇతర ఉత్పత్తుల తయారీ తలపెట్టినట్లు గతేడాది నవంబరులో ప్రకటించారు. అంతే కాదు పశువులకు సుస్తీ చేసినపుడు 109నంబరుకు ఫోన్‌ చేస్తే వైద్యులు ఇంటికి వచ్చి చికిత్స చేస్తారని కూడా ప్రకటించారు. పశువుల పేడతో ఎరువును రైతులు తయారు చేసుకోవటం కొత్తేమీ కాదు. ఆవు పేరు జోడించటమే గమనించాల్సిన అంశం. ఆవు, ఎద్దు, దున్న, గేదె-బర్రెలకు పెట్టే మేత అంతా ఒకటే, అవి వేసే పేడ సేమ్‌ టు సేమ్‌. పాలివ్వటం ఆగిపోయిన ఆవులను రైతులు వదలివేస్తున్నారని, అవి వేసే పేడను ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకోవాలని చత్తీస్‌ఘర్‌ సిఎం భూపేష్‌ భాగెల్‌ చెప్పారు. వాటికి పెట్టే మేత, నిర్వహణ ఖర్చుకు తగ్గ ఆదాయం పేడ అమ్మకం ద్వారా వస్తుందా అన్నదే సమస్య. రాష్ట్రంలో రైతులెవరూ పేడ అమ్మరని బిజెపి మాజీ మంత్రి అజయ చక్రధర్‌ అన్నారు. డిసెంబరు నాటికి రెండు లక్షల మంది రైతుల నుంచి 59లక్షల క్వింటాళ్ల ( రు.114 కోట్ల ) ఆవు పేడను కొనుగోలు చేసినట్లు, పదిలక్షల క్వింటాళ్ల వర్మీకంపోస్టు తయారు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.


కాంగ్రెస్‌ అవినీతిని అంత మొందించేందుకు, ఆ పార్టీ నాశనం చేసిన సంస్కృతి పరిరక్షణ కృష్ణుడు నరేంద్రమోడీ అవతారమెత్తి జన్మించినట్లు ఉత్తర ప్రదేశ్‌ వ ్యవసాయ మంత్రి కమల్‌ పటేల్‌ చెప్పారు.భారత్‌కు ముప్పు తలెత్తినపుడల్లా భగవంతుడు ఏదో ఒక అవతారమెత్తుతున్నాడని ఇప్పుడు మోడీ రూపంలో ఉన్నారని చెప్పారు. మధుర నియోజకవర్గంనుంచి సిఎం యోగి ఆదిత్యనాధ్‌ను పోటీకి నిలపాలని ఎందుకంటే కృష్ణుడు కలలోకి వచ్చి మధుర నుంచి పోటీ చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి విజయం సాధిస్తారని చెప్పారంటూ బిజెపి రాజ్యసభ సభ్యుడు హరనాధ్‌ సింగ్‌ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశారు. అయితే కృష్ణుడి జన్మ స్ధలంగా చెప్పుకొనే మధుర, రాముడి జన్మకేంద్రంగా చెప్పే అయోధ్యను కాదని గోరఖ్‌పూర్‌ నుంచి యోగి పోటీ చేస్తున్నారు. మరి కృష్ణుడు, రాముడికి కోపం వస్తుందా రాదా అన్నది చూడాల్సి ఉంది. హరనాధ్‌ సింగ్‌ లేఖ వార్తలను చూసిన తరువాత సమాజవాది నేత అఖిలేష్‌ యాదవ్‌ స్పందిస్తూ కృష్ణుడు తనకు ప్రతి రోజూ కలలోకి వస్తూ సమాజవాది పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తనకు చెబుతున్నారని ప్రకటించారు.


గతంలో అధికారంలో ఉన్న సమాజవాది నేతలు ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ కుటుంబ పాలన కేంద్రాలుగా మారినట్లు బిజెపి ధ్వజమెత్తింది. ఇప్పుడు అలాంటి ఆరోపణలు-విమర్శలకు గురైన కుటుంబ సభ్యులను బిజెపి చేరదీసింది. ములాయం సింగ్‌ రెండో భార్య కోడలైన అపర్ణా యాదవ్‌, రెండో భార్య బావమరిది, మాజీ ఎంఎల్‌ఏ ప్రమోద్‌ గుప్తాను పార్టీలో చేర్చుకుంది. దీంతో తనకు కుటుంబ భారాన్ని బిజెపి తగ్గించిందని అఖిలేష్‌ యాదవ్‌ చమత్కరించారు. అపర్ణా యాదవ్‌ బిజెపిలో చేరిన కొద్ది రోజుల తరువాత శుక్రవారం నాడు ములాయం సింగ్‌ యాదవ్‌ను కలసి ఆశీస్సులు అందుకున్నట్లు తెలుపుతూ కలసినప్పటి ఫొటో అంటూ ఒక చిత్రాన్ని ట్విటర్‌ద్వారా విడుదల చేశారు.ములాయం సింగ్‌ కోడళ్లు ఇద్దరూ ఠాకూర్‌ సామాజిక తరగతికి చెందిన వారు తప్ప యాదవులు కాదు. అందువలన అపర్ణ బిజెపిలో చేరినంత మాత్రాన ఆ పార్టీకి కలిగే లాభమూ సమాజవాదికి వచ్చే నష్టమూ ఏమీ ఉండదని చెబుతున్నారు. ములాయం రాజకీయ వారసుడిగా తన కుమారుడిని ప్రకటించాలని రెండో భార్య సాధన చేసిన వత్తిడి ఫలించలేవు. ములాయం సోదరుడు శివపాల్‌ తిరుగుబాటు చేసి వేరే పార్టీని పెట్టినా ఫలితం లేకపోవటంతో ఇప్పుడు అఖిలేష్‌తో రాజీకి వచ్చినట్లు వార్తలు.


కాంగ్రెస్‌ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి మీకు మరొకరి ముఖం ఎక్కడైనా కనిపిస్తోందా ? ప్రతి చోటా మీకు నా ముఖమే కనిపిస్తోందని ప్రియాంక గాంధీ స్పందించారు. శుక్రవారం నాడు తన సోదరుడు రాహుల్‌ గాంధీతో కలసి యువజన ప్రణాళికను విడుదల చేసిన సందర్భంగా విలేకర్లతో ఆమె మాట్లాడారు.తాను పోటీ చేసేది లేనిదీ ఇంకా నిర్ణయించలేదన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి ఎన్నికల లబ్దికే చమురు ధరల స్ధంభన – మార్చి ఏడు తరువాత బాదుడే బాదుడు !

19 Wednesday Jan 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ప్రకటిత విధానాలను తుంగలో తొక్కటంలో కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీల వారి గురించి ఎవరికీ తేడా లేదు. మాది మిగతా పార్టీలకు భిన్నం అని చెప్పుకున్న బిజెపిని ఏర్పాటు చేసింది ఆర్‌ఎస్‌ఎస్‌, కనుక అనేక మంది అది నిజమే అనుకున్నారు. క్రమంగా మా మీద అలాంటి భ్రమలేవీ పెట్టుకోవద్దని బిజెపి తన చర్యల ద్వారా పదే పదే జనాలకు చెబుతోంది. దానికి తాజా ఉదాహరణే చమురు ధరల స్ధంభన.


నవంబరు నాలుగవ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు దేశంలో చమురు ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. తరువాత కూడా మార్చి ఏడవ తేదీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ చివరి దశ ముగిసేవరకు ఇదే స్ధితి కొనసాగుతుంది. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రు.91.17, మరుసటి రోజు రు.90.99, 25 నుంచి 29వరకు పెట్రోలు రేటు రు.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14వరకు రు.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రు.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి?


ఫిబ్రవరినెల 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్నది పీపా ధర నెల సగటున 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగినా ధర ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23వరకు ఒకే ధర(రు.91.17) ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడిచమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గింది 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం ? మరి ఫిబ్రవరి-మార్చినెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు ? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్చేదినాలు అన్నది స్పష్టం.


ఇప్పుడు జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్చేదిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. సంతోషం. బిజెపి పాలిత రాష్ట్రాలు నరేంద్రమోడీగారిని ఆదర్శంగా తీసుకొని వాట్‌ను తగ్గించాయి. ఇంకా సంతోషం. జరుగుతున్నదేమిటి ? అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34రోజుల్లో 28 సార్లు సవరించారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌( పిపిఎసి) సమాచారం ప్రకారం సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 27వరకు సగటున పీపా ముడి చమురు దిగుమతి ధర 81.54 డాలర్లు, అక్టోబరు 28 నుంచి నవంబరు 26వరకు 81.51 కాగా నవంబరు 27 నుంచి డిసెంబరు 29వరకు 72.93 డాలర్లకు తగ్గింది. దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నవంబరు నాలుగవ తేదీ నుంచి ఇది రాసిన జనవరి 20వరకు 75 రోజులుగా తమ ధరలను ఎందుకు సవరించలేదు ? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా ? ముడిచమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం ఏమైంది ? పాలకులు కంపెనీలను ఎందుకు ప్రశ్నించటం లేదు ? సమాధానం చెప్పే జవాబుదారీ తనం ఉందా ? అసలు కథేమిటి ?


అక్టోబరు 25న గరిష్టంగా మన ముడి చమురు కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది.తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది.పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. డిసెంబరు సగటు ధర ముందే చెప్పుకున్నట్లు 72.93 డాలర్లు. చంబల్‌ బందిపోట్లు ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం ఎవరినీ వదలటం లేదు, అంతకంటే పెద్ద దోపిడీ సాగుతోందా లేదా ? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు కొన్ని తిరిగి తెరుచుకున్నాయి.ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపికి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. ఓకే రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తోంది అనుకుందాం, మరి ప్రభుత్వ కంపెనీలు ?


ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా బిజెపికి సానుకూలతను సృష్టించేందుకు తమ వంతు చేస్తున్నాయి. దీని వలన ఇతర సరకుల ధరలు కూడా తాత్కాలికంగా కొంత మేరకు అదుపులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఆమేరకు జనానికి తగ్గించలేదు. డిసెంబరు ఐదు నుంచి ముడి చమురు ధరలు మనం దిగుమతి చేసుకొనేది జనవరి 18వరకు 69.52 డాలర్ల నుంచి 87.03పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలో ఇది సరికొత్త రికార్డు. జనవరి 20వ తేదీన బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 88.68 డాలర్లకు చేరింది, త్వరలో వంద డాలర్లకు చేరవచ్చని అంచనా.


అక్టోబరు 25న మన దిగుమతి రకం 84.77 డాలర్లు ఒక రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఐనా ధరలు పెంచలేదు.మార్చి ఏడవ తేదీన ఎన్నికల చివరి దశ ముగుస్తుంది. అంటే ఆ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా అప్పటి వరకు ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయి. ఆ తరువాతే అసలు కథ మొదలౌతుంది. నవంబరు 4- మార్చి ఏడవ తేదీ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఉందనుకోండి, ఆమేరకు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. ఈ లోగా బిజెపి తన ప్రచారం తాను చేసుకుంటుంది. కంపెనీలకు వచ్చే ఆర్ధిక నష్టం ఏమీ ఉండదు. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.


తమ పాలిత రాష్ట్రాల మాదిరి ఇతర పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాల్సిందే అని బిజెపి డిమాండ్‌ చేసింది. రాష్ట్రాలను దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడ కారణంగా ఇప్పటికే రాష్ట్రాలు ఎక్సయిజు పన్ను వాటాను గణనీయంగా కోల్పోయాయి, వాటిలో మెజారిటీ బిజెపి పాలనలో ఉన్నవే. కేంద్రంలో అధికారం ఉంది కనుక ఆ మేరకు వేరే రూపంలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అలాంటి అవకాశం లేదు.2017లో పెట్రోలు మీద ఎక్సయిజు పన్ను లీటరుకు రు.9.48, డీజిలు మీద రు.11.33 ఉండగా 2021 ఫిబ్రవరిలో ఆ మొత్తాలను కేంద్రం రు.1.40-1.80కి తగ్గించింది. ఆ మేరకు, తరువాత అదనంగా సెస్‌లను విధించింది. వినియోగదారులకు ఎలాంటి మార్పు లేనందున వారికి ఈ మతలబు అర్దం కాలేదు. దీపావళి పేరుతో తగ్గించిన మేరకు రాష్ట్రాలకు వాట్‌ శాతం తగ్గి రాబడి తగ్గింది. పరోక్షంగా అవీ తగ్గించినట్లే. బిజెపి పాలిత రాష్ట్రాలకు ఏదో ఒక రూపంలో కేంద్రం సొమ్ము ముట్టచెబుతుంది.


ఢిల్లీ చుట్టూ హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడి బంకుల్లో ధరలు తక్కువగా ఉన్నపుడు ఢిల్లీ వాహనదారులందరూ కొద్ది కిలోమీటర్లు వెళ్లి అక్కడే కొనుగోలు చేస్తారు. అది బంకుల వారికి, ఢిల్లీ ప్రభుత్వానికి నష్టమే కనుక కొద్ది రోజు తరువాత ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం పెట్రోలుపై వాట్‌ను 30నుంచి 19.4శాతానికి తగ్గించటంతో డిసెంబరు ఒకటిన రు.104.01గా ఉన్న రేటు నాలుగవ తేదీన రు.95.41కి తగ్గింది. డీజిలు మీద అంతకు ముందే వాట్‌ 16.75శాతం ఉన్నందున డీజిలు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ఇప్పుడు డీజిలుపై కేంద్ర పన్నులు, సెస్‌ల మొత్తం రు.21.80కాగా రాష్ట్ర పన్ను రు.12.69 మాత్రమే. పెట్రోలు మీద కేంద్ర పన్ను రు.27.90 కాగా ఢిల్లీ రాష్ట్రపన్ను రు.15.60 మాత్రమే. కేంద్ర పన్నులు అన్ని చోట్లా ఒకే విధంగా ఉంటాయి. రాష్ట్రాలలో వాట్‌ రేట్లు భిన్నంగా ఉన్నందున వాటికి అనుగుణంగా మొత్తాలు మారతాయి.


బిజెపి నేతలు, వారికి వంతపాడే నోళ్లు చేసే వాదనల గురించి తెలిసిందే. కేంద్రం విధించే పన్నుల్లో 41శాతం వాటా రాష్ట్రాలకు వస్తుంది. కేంద్రం చేసే ఖర్చు కూడా రాష్ట్రాలలోనే కనుక రాష్ట్రాలకే ఎక్కువ దక్కుతోందని, అందువలన రాష్ట్రాలే పన్ను తగ్గించాలనే కుతర్కాన్ని ముందుకు తెచ్చారు. ఇది జనాలను మోసం చేసే ప్రక్రియ. పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసర్చ్‌ సంస్ద వెల్లడించిన వివరాల మేరకు 2017 ఏప్రిల్‌లో పెట్రోలు మీద కేంద్రం విధించిన ఎక్సయిజు పన్ను (రాష్ట్రాలకు వాటా ఇచ్చేది) రు.9.48, సెస్‌,సర్‌ఛార్జీలు రు.12. కేంద్ర పన్నుల్లో వీటి శాతాలు 44-56, కాగా 2021ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.40 – 31.50గా ఉన్నాయి, శాతాలు 4-96 మారాయి. ఇదే డీజిలు సంగతి చూస్తే ఎక్సయిజు – సెస్‌,సర్‌ఛార్జీలు 2017 ఏప్రిల్‌లో రు.11.33- రు.6 శాతాల వారీ 65-35గా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నాటికి ఇవి రు.1.80- రు.30 కాగా శాతాలు 6-94కు మారాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన వాటాకు మోడీ సర్కార్‌ ఎలా కోత పెట్టిందో స్పష్టం. కేంద్రం పన్నుల పేరుతో వసూలు చేసిన మొత్తాలు 2014 తరువాత గణనీయంగా పెరిగాయి.2019-20లో ఆ మొత్తాలు రు.2.38లక్షల కోట్లుండగా 2020-21కి అవి 3.84లక్షల కోట్లకు పెరిగాయి.2020 మేనెలలో పెట్రోలు మీద పది, డీజిలు మీద రు. 13 చొప్పున భారం మోపటమే దీనికి కారణం. ఇదే కాలంలో సెస్‌ను సవరించిన కారణంగా రాష్ట్రాలకు వచ్చే వాటా మొత్తం తగ్గింది. కేంద్రం తగ్గించిన ఐదు, పది వలన కేంద్రానికి ఆదాయం ఎంత తగ్గిందన్నది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యువతలో పెరుగుతున్న అసంతృప్తి, అప్పులు దేశానికి ముప్పు- ప్రపంచ ఆర్ధికవేదిక హెచ్చరిక

17 Monday Jan 2022

Posted by raomk in BJP, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Disillusionment among youth, Global Risk Report, India Youth, Narendra Modi, Narendra Modi Failures, World Economic Forum


ఎం కోటేశ్వరరావు


దవోస్‌ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశాలు గత నెలలో జరగాల్సినవి కరోనా కారణంగా జనవరి 17-21 తేదీలలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఏటా ప్రపంచ ముప్పు నివేదికను వెలువరించటం ఆనవాయితీగా వస్తోంది. వివిధ దేశాలలో గడచిన ఏడాది కాలంలో సంభవించిన సంక్షోభాలను దీనిలో విశ్లేషిస్తారు.ఆర్ధిక వేదిక సమావేశాల్లో వాటికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రపంచ నేతలు చర్చిస్తారు. ఈ సారి ఏమి చర్చిస్తారో, ఏం జరుగుతుందో సమావేశాల తరువాత చూద్దాం. గతేడాది మాదిరే ఈ సారి కూడా కరోనా సంక్షోభం మీదే ప్రధానంగా కేంద్రీకరణ ఉంది. ప్రతిదేశం ఎదుర్కొంటున్న ముప్పుల గురించి దీనిలో చర్చించారు.
మన దేశం ఐదు ప్రధాన ముప్పులను ఎదుర్కొంటున్నదని 2022 నివేదికలో పేర్కొన్నారు. ఒకటి యువత అసంతృప్తి,రుణభారం, డిజిటల్‌ అసమానత, అంతర్రాష్ట సంబంధాలు దెబ్బతినటం, సాంకేతిక పాలన వైఫల్యంగా పేర్కొన్నారు. పని కోసం అడ్డాల మీదకు వస్తున్న వారికి ఉపాధి చూపకపోతే పక్కదార్లు పడతారు. అనేక సామాజిక సమస్యలు తలెత్తుతాయి. పర్యవసానాలను ఊహించలేము. జి-20 కూటమిలోని మన దేశంలో ఇది పెద్ద ముప్పుగా ఉంది. దేశంలో కార్మికశక్తి భాగస్వామ్యం 2020లో 46.29శాతం ఉండగా చైనాలో 66.82శాతం ఉంది. గతేడాది డిసెంబరులో సిఎంఐఇ సమాచారం ప్రకారం దేశం మొత్తంగా 7.91శాతం, పట్టణాల్లో 9.3,గ్రామాల్లో 7.28శాతం నిరుద్యోగులున్నారు. పరిస్ధితి ఎప్పుడు మెరుగుపడుతుందో అర్ధంగాని స్ధితిలో యువత ఉంది. కరోనాకు ముందే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల రికార్డును అధిగమించిందన్న సమాచారాన్ని లోక్‌సభ ఎన్నికల ముందు ప్రభుత్వం తొక్కిపెట్టింది. అనధికార మార్గం ద్వారా వెల్లడైన అంశాలను వాస్తవం కాదని తోసి పుచ్చి లెక్కలు సరిగా లేవని చెప్పింది. ఎన్నికలు ముగిశాక ఆ నివేదికనే గుట్టుచప్పుడు కాకుండా అంగీకరించింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్ధితి ఇంకా దిగజారింది.వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో నిరుద్యోగం ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగా ఉన్నట్లు వివరాలు చెబుతున్నాయి.


1975అత్యవసర పరిస్ధితికి ముందున్న నిరాశా, నిస్పృహలు కనిపిస్తున్నాయి.2014, 2019లో రెండు సార్లు మంచి రోజులను తెస్తానన్న నరేంద్రమోడీ వాగ్దానం,రేకెత్తించిన ఆశలకు ఇది విరుద్దం. వెనుకా ముందూ ఆలోచించకుండా, కుల, మతాలను అధిగమించి మద్దతు ఇచ్చిన వారు హతాశులౌతున్నారు. ఒకసారి అధికారంలో అన్నీ చేయటం ఎవరికైనా కష్టమే, రెండోసారి అవకాశం ఇద్దాం అనుకున్నవారు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచీ ఊహించని పరిణామాలను చూస్తున్నారు.


నైపుణ్యశిక్షణ ఉంటే ఇంకేముంది ఉద్యోగం సిద్దం అన్నారు. డిగ్రీలు పుచ్చుకున్నవారు కాలేజీల నుంచి వెలుపలికి రాగానే వేలాది రూపాయలు వెచ్చించి పొందిన శిక్షణలు ఉపాధికి పనికి రాకుండా పోతున్నాయి. అసమానతలు, ఆర్ధిక రంగ పునరుద్దరణ, కరోనా పర్యవసానాలు కనీసం పదేండ్ల పాటు ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే నిపుణుల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబాలు, దేశం అప్పుల పాలు కావటం కూడా యువత మీద ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. పాలకులు చేసిన అప్పులకు వడ్డీ, అసలు మొత్తాలకు వచ్చిన ఆదాయాలను ఖర్చు చేస్తారా లేక ఉపాధికి అవసరమైన పెట్టుబడులు పెడతారా అంటే మొదటి దానికే మొగ్గు. రెండవ దానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే వనరుల వృద్ది జరిగి అపులు చేయాల్సి వచ్చినా పరిమితంగా ఉండేవి. కరోనా పేరుతో ఒకవైపు జనాల మీద భారాలు మోపుతూ అప్పులకు సైతం వాటినే కారణాలుగా చూపుతున్నారు. అసలు కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలకే ఎక్కువగా మళ్లిస్తున్నారు.కరోనా కారణంగా అసమానతలు మరింత పెరిగినట్లు ప్రపంచబాంకు కూడా చెప్పింది. ప్రపంచంలోని ధనికుల్లో ఎగువన ఉన్న 20శాతం మంది 2021లో తమ నష్టాలలో సగాన్ని తిరిగి పొందగలిగితే, దిగువ 20శాతం మంది ఐదుశాతంపైగా ఆదాయాలను కోల్పోయారు. కరోనా ముందున్న పరిస్ధితితో పోల్చితే 2030 నాటికి 5.1 కోట్ల మంది ఎక్కువగా దుర్భరదారిద్య్రంలో ఉంటారని అంచనా.


ఒక్క యువతే కాదు, గత ఎనిమిది సంవత్సరాల మోడీ పాలన చూసినపుడు ఏ రంగంలోనూ ఆశాజనక పరిస్ధితి కనిపించటం లేదు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లు ఏ రంగంలో చూసినా దిగజారుడు లేదా గిడసబారుడే.చెప్పుకొనే గొప్పలకు తక్కువ లేదు. దేశాన్ని అవినీతి నుంచి రక్షిస్తానని నేను తినను ఎవరినీ తిననివ్వను అని నరేంద్రమోడీ చెప్పినపుడు సంసార బంధాలు, బాధ్యతలు లేవు గనుక నిజంగానే చేస్తారని జనం నమ్మారు, ఇప్పటికీ నమ్ముతున్నారు. తన ఆశ్రితులకు అప్పనంగా జన సంపదలను అప్పగించటం ఏమిటన్నది ప్రశ్న. ఎవరి మేలుకోసం ఇది చేస్తున్నట్లు ?ప్రపంచ వాణిజ్య లంచాల ముప్పు సూచికలో మన దేశ స్ధానం 2021లో 82లో ఉంది, అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఏడు స్ధానాలు దిగజారింది. మొత్తంగా ఎనిమిదేండ్ల పాలన చూసినపుడు 2014లో ఉన్న 82వ స్ధానమే ఇప్పుడూ ఉంది. మరి అవినీతిని అరికట్టిందెక్కడ ? ట్రేస్‌ అనే అంతర్జాతీయ సంస్ధ 194 దేశాలతో రూపొందించిన జాబితాలో మన స్ధానం అది. 2020లో 45 మార్కులు వస్తే 2021నాటికి 44కు తగ్గాయి.2014లో కూడా అన్నే మార్కులొచ్చాయి. ప్రభుత్వంతో వాణిజ్యలావాదేవీలు, అవినీతి నిరోధక చర్యలు, పౌరయంత్రాంగ పారదర్శకత, మీడియాతో సహా పౌరసమాజ నిష్ట సామర్ధ్యం తదితర అంశాల ప్రాతిపదికన దీన్ని మదింపువేస్తారు. ముడుపుల డిమాండ్‌ ఎక్కువగా ఉందంటే విదేశీ సంస్ధలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేసిన వాటిని తాము ఐదు సంవత్సరాల్లోనే చేసినట్లు చెప్పుకున్న పాలకుల ఏలుబడిలో ఉన్నాము. అనేక సూచికలను చూస్తే వివిధ అంశాలలో మనం ఎక్కడున్నాం అన్నది అవలోకనం చేసుకోవాల్సి ఉంది. వైఫల్యాలను కాంగ్రెస్‌ మీదో మరొకరి మీదో నెడితే ఇంకేమాత్రం కుదరదు. స్వాతంత్య్రం తరువాత అత్యంతబలమైన ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ మాత్రమే నెలకొల్పారని చెబుతున్నపుడు ఫలితాలు కూడా అలాగే ఉండాలి కదా ! లంచాల సూచికలో పని తీరు ఏమిటో చూశాము. మరికొన్నింటిలో ఏ స్ధానంలో ఉన్నామో పరిశీలించుదాం.
ప్రపంచ వాణిజ్య లంచాల ముప్పు సూచిక 82(2021)
నిరంతర అభివృద్ధిసూచిక(ఎస్‌డిజి) 120 (2021)
మానవాభివృద్ధి సూచిక(యుఎన్‌డిపి) 131 (2020)
ప్రపంచ లింగవివక్ష(ప్రపంచ ఆర్ధికవేదిక) 140 (2021)
ప్రపంచ ఆకలి సూచిక 94(2020)
ప్రపంచ యువత ఆభివృద్ధి సూచిక 122(2020)
ప్రపంచ ఆరోగ్య భద్రత సూచిక 57(2019)
ప్రపంచ ముప్పు సూచిక 89(2020)
ప్రపంచ పర్యావరణ ముప్పు సూచిక 7(2021)
ప్రపంచ ఉగ్రవాద ముప్పు సూచిక 8 (2020)
ప్రపంచ ప్రజాస్వామ్య (ఇఐయు) సూచిక 53(2020)
ప్రపంచ మానవ స్వేచ్చ (కాటో) సూచిక 111(2020)
ప్రపంచ ఆర్ధిక స్వేచ్చ సూచిక 105(2020)
ప్రపంచ అవినీతి దృష్టి సూచిక 86(2020)
ప్రపంచ పత్రికా స్వేచ్చ సూచిక 142(2021)
ప్రపంచ సుపరిపాలన సూచిక 49(2021)
ప్రపంచ సులభతర వాణిజ్య సూచిక 63(2019)
ప్రపంచ పోటీతత్వ సూచిక 43(2021)
ప్రపంచ నవకల్పన సూచిక 48(2020)
ప్రపంచ పిల్లల హక్కుల సూచిక 112(2021)
ప్రపంచ అసమానతల నివారణ నిబద్దత సూచిక 129(2020)
ప్రపంచ ఇంటర్నెట్‌ సూచిక 49(2021)
ప్రపంచ ప్రతిభ పోటీతత్వ సూచిక 72(2021)
ప్రపంచ శాంతి సూచిక 135(2021)
ప్రపంచ విద్యా సూచిక 135(2020)


దేశ రుణ భారం ఆకస్మికంగా పెరిగింది. ఇది అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం ప్రపంచ రుణం 226లక్షల కోట్ల డాలర్లు.2019 కంటే 27లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ. కరోనా తరువాత విపరీతంగా పెరిగింది. మన జిడిపిలో అప్పు మొత్తం 90.6శాతం ఉంది. మన అప్పులు 2016లో 68.9శాతం కాగా 2020 నాటికి 89.6, మరుసటి ఏడాదికి 90.6శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. తరువాత మొత్తంగా చూస్తే అప్పు పెరిగినప్పటికీ జిడిపి పెరుగుదల కూడా ఉంటుంది కనుక దానితో పోలిస్తే 2022లో 88.8 నుంచి 2026 నాటికి 85.2శాతానికి చేరుతుందని అంచనా. అంటే కరోనా ముందు స్ధితికి చేరే అవకాశమే లేదు. రుణాల పెరుగుదల వలన సామాజిక అశాంతి పెరుగుతుందని ఐఎంఎఫ్‌ నివేదిక హెచ్చరించింది. పాలకులు ఇప్పటికైనా పట్టించుకొని పరిష్కారాలను చూస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మతవిశ్వాసులపై లెనిన్‌ చెప్పిందేమిటి ? కేరళలో కమ్యూనిస్టు వ్యతిరేకత !

16 Sunday Jan 2022

Posted by raomk in Communalism, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

Anti communist, anti communist resolution, CPI(M), IUML, Samastha Kerala Jamayat Ulema, Vi Lenin on believers


ఎం కోటేశ్వరరావు


శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసింది సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం. దానిపై జనాన్ని రెచ్చగొట్టి లబ్దిపొందేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి సంబంధిత సంస్ధలు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, కుట్రలను జనం వమ్ము చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అంతకు ముందు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చారు. ఇప్పుడు ముస్లిం లీగు పార్టీ, కొన్ని మత సంస్ధలు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, చర్యలకే పూనుకున్నాయి. హిందూత్వ శక్తులకు బుద్ది చెప్పిన జనాలు ముస్లింమతశక్తులను సహిస్తారా ?


సమస్త కేరళ జమాయతుల్‌ ఉలేమా(ఎస్‌కెజెయు) మలప్పురం గోల్డెన్‌ జూబిలీ సమావేశంలో ఇటీవల కమ్యూనిస్టు ఉద్యమం, భావజాలానికి వ్యతిరేకంగా చేసిన ఒక తీర్మానం ఆ సంస్ధలోను, వెలుపలా వివాదం రేపింది. తనకు తెలియకుండా చేసిన దానితో తనకు సంబంధం లేదని, తన ఫొటోను జత చేసి ఆ తీర్మానాన్ని ప్రచారం చేయటం పట్ల తన అసంతృప్తిని వెల్లడిస్తూ సంస్ధ అధ్యక్షుడు సయద్‌ మహమ్మద్‌ జిఫ్రీ ముతుకోయా తంగల్‌ తమ పత్రిక సుప్రభాతంలో ప్రకటించారు. ముస్లింలు కేరళలో కమ్యూనిస్టు భావజాలం, ఉద్యమం పట్ల జాగరూకులై ఉండాలని నాస్తికవాదం, దేవుడున్నాడో లేడో తెలియదనే ధోరణిని పధకం ప్రకారం మత విశ్వాసుల్లో కలిగించేందుకు చేసే ప్రయత్నాల పట్ల జాగరూకులై ఉండాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వటం, వారితో కలవటం ప్రమాదకరమని నూరిపోయటం తప్ప మరొకటి దాని లక్ష్యం కాదన్నది స్పష్టం. ఆ తీర్మానం తనకు తెలియకుండా చేయటమే కాదు అనుమతి కూడా లేదని తంగల్‌ పేర్కొన్నారు.


మత విశ్వాసులైన పార్టీ సభ్యులు ఆరాధనా స్ధలాలకు వెళ్లటం, క్రతువుల్లో పాల్గొనటాన్ని పార్టీ వ్యతిరేకించటం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. ఏ విశ్వాసానికి, నమ్మకానికి పార్టీ వ్యతిరేకం కాదు, అలాంటి వారికి పార్టీ సభ్వత్వం ఇవ్వకూడదని నిబంధనావళిలో ఎక్కడా లేదు అన్నారు. పూజారులు కూడా పార్టీలో చేరవచ్చని ఒక సందర్భంలో మార్క్సిస్టు మహౌపాధ్యులలో ఒకరైన లెనిన్‌ చెప్పారని కోజికోడ్‌ జిల్లా సిపిఎం మహాసభలో చెప్పారు. నాస్తికత్వాన్ని పాటించటం, మతానికి పార్టీ వ్యతిరేకమని కొన్ని శక్తులు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఓట్ల కోసం విమర్శలు చేశారు. మతాన్ని దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులు పూనుకున్నారని ఒక వైపు మతశక్తులు ధ్వజమెత్తుతుంటే మరోవైపు మరికొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఒకేసారి రెండు పరిణామాలు ఎలా జరుగుతాయి. శాస్త్ర, తర్కవిరుద్దం, ఏదో ఒకటే వాస్తవం కావాలి. సిపిఎంపై విమర్శలు చేసే వారు రెండు రకాలు. కమ్యూనిస్టు, లౌకిక భావాజాలాలకు ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే సానుకూల వైఖరితో ఆందోళన చెందేవారు, విమర్శలు చేసే వారు కొందరైతే, సందట్లో సడేమియా అన్నట్లుగా రాళ్లేసే వ్యతిరేకులు రెండవ తరగతి.


పార్టీ సభ్వత్వానికి కావలసిన అర్హతల గురించి సిపిఎం కార్యక్రమం, నిబంధనావళి అనే పుస్తకాల్లో స్పష్టంగా ఉంది. అవేమీ రహస్యపత్రాలు కావు. ఎవరైనా పుస్తకాల్లో షాపుల్లో కొనుగోలు చేసి లేదా పార్టీ వెబ్‌సైట్‌లో చదువుకోవచ్చు. నాస్తికులైనే సభ్వత్వం అని లేదు. అలాగే దిద్దుబాటు కార్యక్రమం చేపట్టి అనుసరించాల్సిన పద్దతులు, పార్టీ సభ్యులకు ఉండకూడని అంశాల గురించి కూడా సిపిఎం చెప్పింది. ఇవేవీ పరస్పర విరుద్దంగా కనిపించటం లేదు. ఒకసారి పార్టీ సభ్వత్వాన్ని అంగీకరించిన తరువాత అనుసరించాల్సి ప్రవర్తన గురించి చెప్పిన అంశాలే దిద్దుబాటు. దీని అర్దం ఏదో ఘోరమైన తప్పిదం చేశారని కాదు. పార్టీ ఆమోదించిన ప్రవర్తనా నియమావళిని ఏ స్ధాయిలో ఉన్న వారైనా పాటిస్తున్నారా లేదా అన్నదాన్ని పరిశీలించేందుకు ప్రపంచంలోని ప్రతి పార్టీ అనుసరించిన పద్దతే అది. దానికి ఇమడలేని వారు సభ్యులుగా వైదొలగి మద్దతుదారులుగా ఉండవచ్చు. ఇక పార్టీ సభ్యులు- మత విశ్వాసాల గురించి లెనిన్‌ చెప్పిన సందర్భం ఏమిటి ? ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం. లెనిన్‌ కాలంలో మొదటి ప్రపంచ యుద్దంలో టర్కీ కేంద్రంగా ఉన్న ఒట్టోమన్‌ సామ్రాజ్య కూల్చివేతలో నాటి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు ప్రధాన పాత్రధారులు. అందువలన అనేక మంది ముస్లింలు బ్రిటీష్‌ వ్యతిరేకతతో ముందుకు వచ్చారు. అదే విధంగా రష్యాలో జారుచక్రవర్తిని వ్యతిరేకించిన మత పూజారులు, విశ్వాసుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాంటి సందర్భంలో అనేక మంది అనేక అభిప్రాయాలు వెల్లడించారు.


ఒక క్రైస్తవ పూజారీ,మత విశ్వాసుడైన కార్మికుల పట్ల పార్టీ ఏ వైఖరి అనుసరించాలనే అంశం గురించి లెనిన్‌ వివరణ ఇచ్చారు. ” ఒక పూజారి పార్టీ లక్ష్యాలను ఆమోదించి వాటి కోసం పార్టీలో చురుకుగా పని చేస్తానని ముందుకు వస్తే అతను పార్టీలో చేరవచ్చు. అతని మతవిశ్వాసం-కమ్యూనిజం మధ్య వైరుధ్యం వస్తే అది అతనికి మాత్రమే సంబంధించిన అంశం. కానీ పూజారి పార్టీలో చేరి ఇతరులను మతంలోకి ప్రోత్సహిస్తే, తన మతభావాలను ఇతరుల మీద రుద్దితే, మతం పట్ల పార్టీ కలిగివున్న అంగీకృత వైఖరికి కట్టుబడి ఉండకపోతే అప్పుడు సభ్వత్వాన్ని కోల్పోతాడు. ఇదే సూత్రం విశ్వాసుడైన ఒక కార్మికుడు పార్టీలో చేరినపుడు కూడా వర్తిస్తుంది. పార్టీలో చేరి తన మత భావాలను ఇతరుల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తే పార్టీ నుంచి తొలగించాల్సి ఉంటుంది.” అన్నారు. ఇలా చెబుతున్నపుడు అసలు మత విశ్వాసులను పార్టీలోకి చేర్చుకోవటం ఎందుకు ? అనే ప్రశ్న వస్తుంది.


విప్లవాన్ని సాధించాలన్నా, అందుకు అవసరమైన సాధనం పార్టీ నిర్మాణం జరగాలన్నా సభ్యులను ఎక్కడి నుంచి తేవాలి. ప్రతి వారికీ సమాజంలో ఉన్న వాటిలో ఏదో ఒక బలహీనత, విశ్వాసం ఉంటుంది. వారి నుంచే విప్లవ సైనికులను తయారు చేసుకోవాలి. వివిధ ఆందోళనలు, పోరాటాల సమయంలో చురుకుగా ఉన్న వారిని పార్టీ గుర్తిస్తుంది. అదే విధంగా వివిధ అంశాలపై పార్టీ తీసుకొనే సూత్రబద్ద వైఖరి, పోరాటాల సమయంలో పార్టీ కార్యకర్తలు చూపిన తెగువ, త్యాగాలను చూసి సాధారణ కార్మికులు, జనాలు తాము కూడా పార్టీలో చేరాలని అనుకోవచ్చు. అలాంటి వారిని కొంత కాలం రెండు మూడు దశల్లో తీరుతెన్నులను గమనించి బలహీనతలను సరిదిద్దుకొంటే వారిని సభ్యులుగా తీసుకుంటారు. తరువాత పార్టీ వైఖరికి అనుగుణంగా వారిని మరింతగా తీర్చిదిద్దేందుకు పూనుకుంటారు. ఆ సమయంలో దిద్దుబాటు అంశాలు ముందుకు వస్తాయి.ఒక స్త్రీ లేదా పురుషుడికి అన్నీ మంచి లక్షణాలు ఉండి, మత విశ్వాసాలు ఉన్నాయను కోండి. వారు పార్టీలో చేరతామని ముందుకు వస్తే ముందు మీరు కులాన్ని, మతాన్ని, దేవుడు, దేవతల మీద విశ్వాసాలను వదులుకొని రండి అప్పుడు పరిశీలిస్తాం అంటే కుదురుతుందా ? మతం, విశ్వాసాలు కుటుంబాలు, వ్యక్తిగతం అని చెప్పే కమ్యూనిస్టులు వాటికి కట్టుబడి ఉండేవారికి ఇతర అన్ని అర్హతలు ఉన్నపుడు పార్టీలో చేర్చుకోకపోతే నష్టం ఎవరికి? పార్టీలో చేరిన తరువాత అన్యవర్గ ధోరణులు, మత, మూఢవిశ్వాసాలను పోగొట్టేందుకు తగిన కృషి చేయకపోతే అది పార్టీ లేదా నాయకత్వ తప్పిదం అవుతుంది. సకాలంలో దిద్దుబాటు జరగకపోతే పార్టీలు దెబ్బతింటాయి.


కమ్యూనిజానికి మన మతం వ్యతిరేకం అని ప్రతి మతం వారు చెబుతారు. అలాగని ఏ మతం చెప్పింది. పురాతన మతమైన హిందూ, తరువాత వచ్చిన క్రైస్తవం దాన్నుంచి పుట్టిన తాజా మతం ఇస్లాం ప్రవక్తలు, దేవదూతలు గానీ ఎక్కడా కమ్యూనిజం గురించి చెప్పలేదు, అప్పటికీ అసలా భావనే లేదు కదా ! ఆ మతాలు పుట్టి పెరిగిన సమయంలో కూడా హేతువాదులు, నాస్తికులు ఉన్నారు. పార్టీలో చేరిన వారిని కమ్యూనిస్టులు మార్చి వేస్తారని, దోపిడీ శక్తులకు మద్దతు ఇచ్చే, తమ తిరోగమన, జనాన్ని తమ అదుపులో ఉంచుకొనే అజెండాలు సాగవనే భయంతోనే హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల పెద్దలు అభ్యుదయ, కమ్యూనిస్టు భావజాలాన్ని, పార్టీలను వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిస్టులు రాజీపడితే, భావజాలాన్ని పలుచన చేస్తే మతవాదులకు పేచీ ఉండదు కదా ?
సమస్త మలప్పురం సమావేశ తీర్మానం గురించి చర్చ జరుగుతోంది. తమ సమస్త సమావేశాలు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయాలు చేసేందుకు వేదికలు కాదని జిఫ్రీ కోయా తంగల్‌ స్పష్టం చేశారు. సమావేశాలను ముస్లిం లీగు హైజాక్‌ చేసిందని, రాజకీయ ప్రచారం కోసం వాడు కుంటున్నదని, వాస్తవానికి దీనిలో అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నవారున్నారని చెప్పారు. సమస్త ప్రభుత్వంతో సహకరిస్తుందని, దాని అర్ధం చేతులు కలిపినట్లు కాదని సమస్త సున్నీ యువజన సంఘం నేత అబ్దుస్‌ సమద్‌ పూకొత్తూర్‌ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలలో ముస్లిం మతవిశ్వాసులకు స్ధానం ఉండదని, అంత మాత్రాన ఆ పార్టీలతో సంబంధాలు ఉన్న వారందరూ నాస్తికులు,లు, మతవ్యతిరేకులు కాదన్నారు.ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంలో అనేక పార్టీలు ఉన్నాయని, ప్రభుత్వంతో విరోధ పంధాను ఎంచుకోవటం గాక సహకరించాలని తాము కోరుతున్నట్లు పూకొత్తూర్‌ చెప్పారు.


వక్ఫ్‌బోర్డులో ఉద్యోగుల నియామకాన్ని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారపు నమాజు సందర్భంగా మసీదులలో ప్రచారానికి పిలుపు ఇచ్చిన ముస్లింలీగ్‌ వైఖరిని సమస్త వ్యతిరేకించింది. దాంతో లీగ్‌ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతకు ముందు కోజికోడ్‌ బీచ్‌లో లీగ్‌ నిర్వహించిన సభలో మాట్లాడిన అబ్దుర్‌ రహమాన్‌ కల్లాయి ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై అవాంఛనీయ పదజాలం ప్రయోగించినందుకు ఇతర లీగ్‌ నేతలు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. రాష్ట్రమంత్రి, డివైఎఫ్‌ఐ నేతగా ఉన్న మహమ్మద్‌ రియాజ్‌తో విజయన్‌ కుమార్తె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అది అక్రమ సంబంధం అంటూ కల్లాయి నోరుపారవేసుకున్నాడు. అదే సభలో మరో లీగ్‌ నేత కెఎం షాజీ మాట్లాడుతూ మతం మాకు సంబంధించిన అంశం, మతమే మాకు గుర్తింపు, మా చివరి శ్వాసవరకు మతమే మాకు పునాది ” అన్నారు. మతోన్మాదులు తప్ప మరొకరి నోటి నుంచి ఇలాంటి మాటలు రావు. మరుసటి రోజు సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభ మాటలను ప్రస్తావిస్తూ ముస్లింలీగ్‌ ఒక రాజకీపార్టీనా లేక మత సంస్తో నిర్ణయించుకోవాలని అన్నారు. లీగ్‌ను మతోన్మాద జమాతే ఇస్లామీ నడిపిస్తున్నదని సిపిఎం పేర్కొన్నది.


వరుసగా రెండవ సారి ఎల్‌డిఎఫ్‌ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ నేతలకు పాలుపోవటం లేదు. ముస్లింమతోన్మాద ఎస్‌డిపిఐ, ఆర్‌ఎస్‌ఎస్‌తో ముస్లింలీగు పోటీ పడి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ తమ పునాదిని నిలుపుకోవాలని చూస్తోంది. నిజానికి వక్ఫ్‌బోర్డు వ్యవహారాలలో ఎల్‌డిఎఫ్‌ చేసిందేమీ లేదు. బోర్డు పాలకవర్గమే సిబ్బంది నియామకాలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరపాలని చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది. నియామక నిబంధనలను కూడా మార్చింది లేదు. ముస్లిమేతరులను సిబ్బందిగా నియమిస్తారంటూ ముస్లింలీగ్‌ రాజకీయ దాడికి, ముస్లింల్లో అనుమానాలను రేకెత్తించటానికి, సిపిఎంపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఈ నేపధ్యంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ముస్లిం సంస్ధలతో సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను వివరించిన తరువాత సమస్త నేతలు ఆందోళన మార్గం నుంచి విరమించారు, మసీదుల్లో లీగు ప్రచారాన్ని వ్యతిరేకించారు. మరింతగా చర్చలు జరిపిన తరువాతే అంతిమంగా నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు యధాతధ స్ధితి కొనసాగుతుందని సిఎం ప్రకటించారు.ఆశించిన విధంగా అధికారం దక్కకపోవటంతో లీగు తన మద్దతుదార్లు చెదరకుండా ఉండేందుకు మతోన్మాదాన్ని ముందుకు తెస్తోంది. అది నెరవేరేనా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d