• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Others

నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !

19 Friday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

BJP, Karnataka election 2023, Karnataka milk producers, Narendra Modi Failures


ఎం.కోటేశ్వరరావు


ఎవరమైనా ఏదో ఒక నాటికి పోవాల్సిన వాళ్లమే. ఒకరు ముందు ఇంకొకరు వెనుక అంతే తేడా ! అన్న శ్మశాన వైరాగ్యం గురించి అందరికీ తెలిసిందే. అమూల్‌ పాల కంపెనీ గుజరాత్‌ ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వాలు చేయాల్సింది పాలన తప్ప పాలు, నీళ్లు,చింతపండు, ఉల్లిపాయల వంటి వాటిని అమ్మటం కాదు. కనుక గతంలో ఏం జరిగినా ప్రభుత్వ రంగంలో ఉన్న వీటికి సంబంధించిన సంస్థలన్నింటినీ అమ్మి సొమ్ము చేసుకోవాలన్నది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ విధానం. అఫ్‌ కోర్స్‌ ఇది, కాంగ్రెస్‌ విధానమే, కాకపోతే తాను జన్మించింది దాని కోసమే అన్నట్లుగా దాన్నే మరింత భక్తి శ్రద్దలతో మోడీ అమలు జరుపుతున్నారు. అందువలన అన్నింటినీ తెగనమ్మిన తరువాత అమూల్‌ను కూడా అమ్మకుండా మరోసారి అధికారం అప్పగిస్తే నరేంద్రమోడీ లేదా వారసులు ఊరుకుంటారా ? ఒకసారి అపని జరిగాక విదేశాల నుంచి చౌకగా దొరికే పాలు, పాలపదార్ధాలను మన మీద రుద్దుతారు. పాలతో కొంత రాబడి కోసం ఆవులు, గేదెలను మేపే రైతుల నోట్లో అప్పుడు మట్టే. కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్‌కు మార్కెట్‌ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే జనాలకు రోజుకు అరలీటరు పాలు సరఫరా చేస్తామని బిజెపి నమ్మబలికింది. మీ పాల సంగతి తరువాత అంటూ ఆ బిజెపిని పాల రైతులు కావేరీ, కృష్ణ నీళ్లలో ముంచి గుణపాఠం చెప్పారు.


అమూల్‌ పేరు చెబితే లేదా దాని మార్కెటింగ్‌ అవకాశాలు పెంచితే నరేంద్రమోడీ దృష్టిలో పడి ప్రశంసలు పొందవచ్చని బిజెపి నేతలు భావించి అందుకు తెగించినట్లు చెప్పవచ్చు. గతేడాది డిసెంబరులో పాల రైతులు ఎక్కువగా ఉన్న మాండ్య జిల్లా కేంద్రంలో జరిపిన సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా పాల వివాదానికి తెరతీశారు.పాల రైతుల సంక్షేమానికి కర్ణాటక నందిని, గుజరాత్‌ అమూల్‌ పాల సంస్థలు కలసి పని చేయాలని చెప్పారు. ప్రభుత్వ రంగ పాల కంపెనీలన్నీ సమన్వయంతో పని చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి ఉంటే అదొక తీరు. కేవలం అమూల్‌ పేరే చెప్పటంతో నందిని పాలు కనుమరుగుకానున్నాయనే అనుమానం కర్ణాటక రైతుల్లో తలెత్తింది. అదేమీ కాదని 40శాతం కమిషన్‌ సిఎం బొమ్మై మొదలు ఎందరు బిజెపి పెద్దలు సంజాయిషీ ఇచ్చుకున్నా రైతులు నమ్మలేదు. అవకాశం కోసం ఎదురు చూశారు. చేయాల్సింది చేశారు. బెళగావి, హసన్‌, తుంకూరు, మైసూరు, మాండ్య జిల్లాలు పాల ఉత్పత్తికి ప్రసిద్ది. ఈ ఐదు జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్‌ 33 గెలుచుకుంది. గతంలో పదకొండు ఉన్నాయి. బిజెపి బలం 21 నుంచి 12కు తగ్గింది. జెడిఎస్‌ కూడా సీట్లను పొగొట్టుకుంది. గతంలో జరిగిన సర్వే ప్రకారం దేశంలోని 20 రాష్ట్రాల్లో పాల ఉత్పత్తిలో 9వ స్థానంలో ఉంది. గుజరాత్‌ తరువాత పాలను సహకార సంస్థలకు ఎక్కువగా అమ్మే రాష్ట్రంగా కర్ణాటక ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గతం కంటే ఏడుశాతం ఓట్లను అదనంగా పొందింది. రాష్ట్రమంతటా బిజెపి మద్దతుదారులుగా ఉన్న లింగాయత్‌ సామాజిక తరగతి ఓటర్లలో వచ్చిన మార్పు కూడా దీనికి దోహదం చేసింది.


జనాలకు పాలు సరఫరా చేస్తామని బిజెపి వాగ్దానం చేసింది. ఇతరులకు శుద్దులు చెప్పిందని తప్ప నిజానికి దానిలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. అది ఉచితం కాదు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు, పాల రైతులకు లబ్ది చేకూర్చేందుకు, మార్కెట్‌ను పెంచేందుకు అని బిజెపి నేతలు టీవీ చర్చల్లో సమర్ధించుకున్నారు. అదే పని గత మూడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉండగా కర్ణాటక బిజెపి గానీ, గుజరాత్‌తో సహా ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో గానీ ఎందుకు అమలు జరపటం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. కర్ణాటక ఎన్నికల ప్రచారం మొదలైనపుడే ఏప్రిల్‌ నాలుగవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన ఒక వార్త ప్రకారం గత దశాబ్ది కాలంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది కాలంలోనే 15శాతం పాలధరలు పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దోహదం చేసింది. దాంతో ధరల తగ్గించే పేరుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పాలు, పాల ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను రద్దు చేసింది. ఇది పాల వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించినా అదే విధానాన్ని కొనసాగిస్తే మన పాడి పరిశ్రమ మూతపడుతుంది. డాలర్లు చెల్లించి చమురుతో పాటు పాలు, పెరుగు కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. రైతులకు తగిన గిట్టుబాటు ధర రాకపోతే పాడి తగ్గుతుంది. ధర పెరిగితే పోషకాహారం కొనుగోలూ తగ్గుతుంది. మాంసం కోసం ఆవులను వధించారని ఆరోపిస్తూ మూక దాడులు చేసి ప్రాణాలు తీసేందుకు వెనుకాడని గో వంశ రక్షక, గో రక్షక దళాలను చూశాము. ఈ కాషాయ దళాలు మేతలేక కృశించే, రోగాలతో మరణించే ఆవుల సంరక్షణ గురించి మాట్లాడవు. పాలు ఇవ్వని వాటిని, మేపలేక ఎవరైనా వధశాలలకు అమ్ముకోవటానికి వీల్లేకుండా చేశారు. రోడ్ల మీద వదలివేస్తే కొత్త సమస్యలను ముందుకు తెచ్చాయి. మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ ఆవులకు సోకిన లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు లేవు. దాంతో 2022లోనే కనీసం మూడులక్షల ఆవులు మరణించటం లేదా ఈ రోగం కారణంగా వట్టిపోయినట్లు అంచనా. ఈ కారణంగా పాల ఉత్పత్తి తగ్గటంతో పాటు రైతాంగానికి ఆర్థికంగా విపరీత నష్టం వాటిల్లింది. ఆవు రాజకీయాలు చేసే వారికి ఇదేమీ పట్టలేదు.


ప్రపంచంలో అధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అవసరాలు-ఉత్పత్తికి జత కుదరటం లేదు. ఉత్పత్తి పెరుగుదల దిగజారింది. జాతీయపాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ సమాచారం మేరకు 2022-23లో మన దేశం 477 కోట్ల డాలర్ల విలువ గల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇది వెయ్యి శాతం ఎక్కువ. ప్రపంచంలో పెరిగిన నెయ్యి గిరాకీ కారణంగా మన దేశం గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు కాలంలో 47 కోట్ల డాలర్ల విలువగల ఎగుమతులు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గొప్పలు చెప్పుకొనేందుకు 19.45శాతం ఎక్కువే, కానీ భారీగా పెరిగిన దిగుమతుల మాటేమిటి ? దేశంలో నిల్వల పరిస్థితిని బట్టి పాలపొడి, వెన్న, నెయ్యితో సహా ఇతర పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు దిగుమతి పన్నులను సులభతరం చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగవచ్చని కేంద్ర పశుసంవర్థకశాఖ అధికారి రాజేష్‌ కుమార్‌ ఏప్రిల్‌ 5న చెప్పారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పాల ఉత్పత్తి ఒక్క శాతమే పెరిగింది. గత దశాబ్దికాలంలో వార్షిక సగటు 5.6శాతం ఉంది. ఈ ఏడాది పాల ఉత్పత్తుల డిమాండ్‌ ఏడుశాతం పెరగవచ్చని అంచనా.గోధుమ గడ్డి, ఇతర మేత లభ్యత తగ్గిన కారణంగా వాటి టోకు ధరలు ఏడాది కాలంలో 25శాతం పెరిగింది. మార్కెట్లో ఆవులు తగ్గిన కారణంగా గేదెల ధరలు బాగా పెరిగాయి.


ఇక కన్నడిగుల ఆరోగ్యం కోసం పాల సరఫరా వాగ్దానం చేసినట్లు వాదిస్తున్న బిజెపి నేతలను జనం నిలదీయాల్సి ఉంది. దేశమంతటా తమదే పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి జన ఆరోగ్యం గురించి పట్టించుకున్న తీరును ఒక్కసారి చూద్దాం. అజాగళ స్థనం వంటి నీతిఅయోగ్‌(ఎందుకంటే అది సూచించిన మేరకు కేంద్రం నిధులు ఇవ్వదు, కానీ కాగితాల మీద సిఫార్సులు మాత్రం అందంగా కనిపిస్తుంటాయి) నివేదికలను రూపొందించేందుకు మాత్రమే పనికి వస్తుంది. ప్రపంచ బాంకు, అది కలసి 2021 డిసెంబరులో మన దేశంలోని రాష్ట్రాల ఆరోగ్య సూచికలను విడుదల చేసింది.2019-20లో మొత్తంగా పందొమ్మిది పెద్ద రాష్ట్రాల పనితీరును మదింపు చేస్తూ రాంకులు ఇచ్చారు.దానిలో 82.2 మార్కులతో కేరళ మొదటి స్థానంలో ఉంది. దేశానికి నమూనాగా చెబుతూ ఆ విధానాన్ని దేశమంతటా అమలు జరుపుతామని మోడీ 2014లో చెప్పిన గుజరాత్‌ 63.59 మార్కులతో ఆరవ స్థానంలో ఉంది. అది రెండింజన్ల పాలనలో కూడా ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఇక యోగి ఆదిత్యనాధ్‌ పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ 30.57 మార్కులతో 19వ(చివరి) స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ 36.72తో దిగువ నుంచి మూడవ స్థానం, చాలాకాలం బిజెపి ఏలుబడిలో ఉన్న బీహార్‌ 31మార్కులతో ఉత్తర ప్రదేశ్‌ కంటే ఎగువున ఉంది. అక్కడ ఎక్కడా జనాలకు బిజెపి పాల వాగ్దానం చేయలేదు. దీని గురించి ఒక చర్చలో బిజెపి ప్రతినిధి చెప్పిన హాస్యాస్పద కారణం ఏమింటే యోగి ఆదిత్యనాధ్‌ శాంతి భద్రతల మీద కేంద్రీకరిస్తున్నందున పాల గురించి పట్టించుకోలేదట. దానికీ దీనికి సంబంధం ఏమిటి, ఇతర పధకాలన్నింటినీ పక్కన పెట్టారా ? పోనీ గుజరాత్‌, ఎంపీ సంగతేమిటి ? రక్తహీనత తల్లీ,పిల్లల మరణాలకు దారి తీస్తోంది. రక్తహీనత ముక్త భారత్‌ అంటూ కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రకటించిన పధకం తీరుతెన్నుల గురించి 2022 ఫిబ్రవరి నాలుగున ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం జనాభాను ఆరు తరగతులుగా విభజించి 2019-20 సంవత్సరంలో నిర్వహించిన ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం ఎవరిలో ఎంతశాతం రక్తహీనత ఉందో పేర్కొన్నారు. 19-49 సంవత్సరాల పురుషుల్లో 25, మహిళల్లో 57, గర్భవతుల్లో 52.2శాతం చొప్పున ఉంది. ఇక 15-19 సంవత్సరాల తరగతి బాలురలో 31.1, బాలికల్లో 59.1 శాతం ఐదేండ్లలోపు పిల్లల్లో 67.1 శాతం ఉంది. ఇవి దేశ సగటు అంకెలు. పిల్లలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో 66.4, మహారాష్ట్రలో 68.9, బీహార్‌లో 69.4 హర్యానాలో 70.4, రాజస్తాన్‌లో 71.5, కాశ్మీరు, మధ్యప్రదేశ్‌లో 72.7, గుజరాత్‌లో79.7,లడఖ్‌లో 92.5 శాతాల చొప్పున రక్తహీనత ఉంది. ఇక్కడంతా బిజెపి ఏలుబడే సాగింది, సాగుతోంది. అక్కడెక్కడా లేని పాల ఊసు కర్ణాటకలో ఎందుకు తెచ్చారంటే అమూల్‌ కోసం నందిని బలిపెడుతున్నారని రైతాంగం భావించటం తప్ప జనం మీద శ్రద్దకాదంటే ఏమంటారు ? దేశ పాడి పరిశ్రమకు ఎదురవుతున్న సవాళ్లను కేంద్రం పట్టించుకుంటుందా ? ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రైవేటు డైరీలకు పెద్ద పీట వేస్తున్నారు. రేపు దిగుమతులకూ అంగీకరిస్తే మన రైతుల గతేంగాను ?


ప్రపంచంలో పాల రైతులు రెండు తరగతులుగా ఉన్నారు. ఒకటి ఎగుమతుల కోసం పాడిని అమ్ముకొని లాభాలు పొందే వారు, రెండవది జీవనోపాధికోసం పాడిని నమ్ముకొని బతికేవారు. రెండవ తరగతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.న్యూజిలాండ్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని ఐరోపా దేశాలు పాడిని అమ్ముకొనేవి కాగా మన దేశం వంటి కొన్ని దేశాలు రెండవ తరగతిలో ఉన్నాయి. మన పాడి పరిశ్రమలోని రైతులు నిలదొక్కుకొనేందుకు జీవన పోరాటం చేస్తుండగా వారిని పడగొట్టి తమ ఉత్పత్తులను మన దేశంలో గుమ్మరించాలని పైన పేర్కొన్న దేశాలు చూస్తున్నాయి. మనది జీవనోపాధి, వారిది లాభాల వేట.ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికిలోకి వచ్చిన తరువాత మన మీద వత్తిడి పెరుగుతోంది. ఎగుమతులు చేస్తున్న దేశాలలో 2022లో న్యూజిలాండ్‌ 1,353 కోట్ల డాలర్ల మేర, అమెరికా 950, ఆస్ట్రేలియా(2021) 220, కెనడా 50, మన దేశం 2022లో 40 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు చేసింది. ఆస్ట్రేలియా తన పాల ఉత్పత్తులకు మార్కెట్‌ తెరవాలని మన మీద వత్తిడి తెస్తున్నది. భారత్‌లో ఉత్పత్తిగాని ఆహార ఉత్పత్తులను మాత్రమే అక్కడి నుంచి దిగుమతులకు అనుమతిస్తామని చెబుతున్న మన ప్రభుత్వం ఆ వైఖరికి ఎంతకాలం కట్టుబడి ఉంటుందో చూడాల్సి ఉంది. అమెరికా వత్తిడి కూడా తక్కువగా లేదు. న్యూజిలాండ్‌ ఉత్పత్తిలో 95శాతం ఎగుమతులకే ఉంటోంది. అమెరికా పెద్ద ఎత్తున ఎగుమతిదార్లకు సబ్సిడీ ఇచ్చి తన ఉత్పత్తులకు మార్కెట్‌ కోసం చూస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఓట్లకోసం ఇన్ని పాట్లు, కుట్రలా : హనుమంతుడిని రోడ్డు మీదకు లాగిన మోడీ, కర్ణాటకలో పాలు తాగిస్తాం అన్న బిజెపి !

06 Saturday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Bhajarangdal, BJP, Congress party, Freebies, Karnataka election 2023, Narendra Modi Failures, RSS, VHP


ఎం కోటేశ్వరరావు


అగ్గి పుల్లా సబ్బు బిళ్లా, కుక్క పిల్లా కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఓట్ల కోసం ఏ గడ్డి కరచినా తప్పులేదన్నట్లు విశ్వగురువు నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి తీరుతెన్నులు ఉన్నాయి.ఈనెల పదవ తేదీన జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్నది బిజెపి లక్ష్యంగా కనిపిస్తున్నది.చట్టాన్ని వ్యక్తులు, నిషేధిత b పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పిఎఫ్‌ఐ), భజరంగ్‌ దళ్‌ వంటి సంస్థలు ఉల్లంఘిస్తే వాటి మీద నిషేధంతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక కాంగ్రెస్‌ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్నారు. పదజాలం ఏదైనా నిషేధం విధిస్తామనే భావం దానిలో ఉంది. దీన్ని అవకాశంగా తీసుకొని ప్రధాని నరేంద్రమోడీ జై భజరంగ బలీ(జై హనుమాన్‌) అని నినాదమిస్తూ ఓటు వేయాలని ఎన్నికల సభల్లో పిలుపు ఇచ్చారు. మమ్మల్ని పిఎఫ్‌ఐ వంటి సంస్థలతో పోలుస్తారా, నిషేధిస్తామని అంటారా అంటూ సంఘపరివార్‌ సంస్థలు, బిజెపి దేశమంతటా వీధులకెక్కింది. కాంగ్రెస్‌ ఆఫీసుల మీదకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారు.ప్రజాస్వామ్య పద్దతిలో ఎవరైనా నిరసన ప్రకటనలు లేదా వేరే చోట్ల ఆందోళనలు చేయటం వేరు, ఆఫీసుల మీదకు వెళ్లటం మూకస్వామ్యం, ఫాసిస్టు లక్షణమే. దీన్ని బట్టే వారి స్వభావం, ప్రమాదం ఏమిటో స్పష్టం అవుతున్నది. హనుమంతుడిని వీధుల్లోకి తేవటంతో ఓటర్ల మీద ప్రభావం పడుతుందేమో అన్న భయంతో కాంగ్రెస్‌ నష్ట నివారణకు పూనుకొని నిషేధం తమ ఉద్దేశ్యం కాదని, అలాంటి చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్రాలకు లేదని ఆ పార్టీ నేతలు వివరణలు ఇచ్చారు. అయినప్పటికీ మత ఉద్రిక్తతలు, మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా లబ్ది పొందవచ్చనే ఎత్తుగడతో ఎన్నికల తేదీ వరకు బిజెపి రచ్చ చేసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మానిఫెస్టోలో పెట్టకపోయినా వారు చేసేది చేస్తారు. ఉచిత పథకాలను అమలు జరిపితే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయంటూ సుభాషితాలు పలికిన నరేంద్రమోడీ కర్ణాటక బిజెపి ఎన్నికల ప్రణాళిక భేషుగ్గా ఉందని కితాబునిచ్చినట్లు వార్తలు. ఒక సంస్థ మీద ఒక రాష్ట్రం ఎలా నిషేధం విధించలేదో అలాంటిదే ఉమ్మడి పౌరస్మృతి. దాన్ని ఒక రాష్ట్రం అమలు జరిపేది కాదు. అయినప్పటికీ అమలు జరుపుతామని కర్ణాటక బిజెపి తన మానిఫెస్టోలో పెట్టింది. ఇది క్రైస్తవ, ముస్లిం, ఇతర మైనారిటీ మతాల వారిని రెచ్చగొట్టేందుకు, హిందూత్వ శక్తులను సంతుష్టీకరించేందుకు చేసిన కసరత్తు. బిజెపి ఇన్ని పాట్లు పడినా ఎన్నికల్లో గట్టెక్కుతుందా అన్నది శేష ప్రశ్న.


నిజానికి భజరంగదళ్‌, ఇతర హిందూత్వ సంస్థల మీద నిషేధంతో సహా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ ఈ నాటిది కాదు. విద్వేషాన్ని రెచ్చగొట్టే శక్తుల మీద ఫిర్యాదు లేకున్నా పోలీసులు కేసులు నమోదు చేయాలని ఉన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఒకటికి రెండుసార్లు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాంటి నేరాలకు పాల్పడే వారు మెజారిటీ హిందూత్వ కావచ్చు మైనారిటీ మత శక్తులు కావచ్చు. భజరంగ్‌ దళ్‌ మీద నిషేధం విధించవచ్చు అని చెప్పిన కాంగ్రెస్‌ తనకు తానే హాని చేసుకుందని కొందరు విశ్లేషణల పేరుతో బిజెపి అనుకూల ప్రచారానికి దిగారు. ఈ అంశంతోనే కాంగ్రెస్‌ విజయావకాశాలు దెబ్బతింటాయా ? కర్ణాటక ఓటర్లు కాషాయ దళాల వలలో పడతారా ? నిషేధ ప్రతిపాదన లేదా డిమాండ్‌ లేకముందే హిజాబ్‌, లవ్‌ జీహాద్‌, ఇతర మతోన్మాద అజెండాతో మతవిద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, కర్ణాటకలో మెజారిటీ ఓటు బాంకు సృష్టికి బిజెపి ఎప్పటి నుంచో అనేక వివాదాలను ముందుకు తెచ్చింది. ఇప్పటి వరకు ఎక్కించిన మతోన్మాదం, కుల ఓటు బాంకు రాజకీయాలు తక్కువేమీ కాదు.వాటితో మతోన్మాద పులిని ఎక్కి వీరంగం వేస్తున్న వారు ఇప్పటికే ఉన్నారు. ఇన్ని తెచ్చిన తరువాత కూడా ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోనుందనే వాతావరణం ఏర్పడిందని గమనించాలి.


కేరళలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే ఖాతరు చేయని అపర ప్రజాస్వామికశక్తులుగా కాషాయదళాలు రుజువు చేసుకున్నాయి. ఆ కేసుకు కమ్యూనిస్టులకు ఎలాంటి సంబంధమూ లేదు. కోర్టును తీర్పును అమలు జరుపుతామని అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చెప్పింది. దాంతో ఇంకేముంది హిందూమతానికి ముప్పు వచ్చింది అంటూ రెచ్చగొట్టారు. మహిళలను ముందు పెట్టి ఆగమాగం చేశారు.దాడులకు పాల్పడ్డారు.2021లో జరిగే ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ను దెబ్బతీసేందుకు చూశారు. చివరకు బొక్కబోర్లా పడి ఉన్న ఒక్క సీటునూ పోగొట్టుకున్నారు.శబరిమలతో సహా ప్రముఖ దేవాలయాలున్న ప్రతిచోటా అంతకు ముందు ఉన్న ఓట్లనూ తెచ్చుకోలేకపోయారు. హనుమంతుడు కర్ణాటకలోని హంపిలో పుట్టినట్లు కాషాయ దళాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.


కర్ణాటకలో భజరంగదళ్‌ అంశం ఏమేరకు పని చేస్తుందో చూడాల్సి ఉంది. అక్కడ ఆ సంస్థ చరిత్రను చూసినపుడు అనేక ఉదంతాల్లో అది భాగస్వామిగా ఉంది. 2008లో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత కర్ణాటక కోస్తా ప్రాంతంలో చర్చ్‌లు, క్రైస్తవ సంస్థల మీద చేసిన దాడుల గురించి సిఎంగా ఉన్న ఎడియూరప్ప జస్టిస్‌ బికె సోమశేఖర కమిషన్‌ ఏర్పాటు చేశారు. మరుసటి ఏడాది సమర్పించిన మధ్యంతర నివేదికలో ఆ దాడుల్లో భజరంగదళ్‌ వంటి మితవాద బృందాలున్నట్లు పేర్కొన్నారు. మంగుళూరు ప్రాంతంలో చర్చ్‌ల మీద దాడులు తామే చేసినట్లు భజరంగ్‌దళనేతలు పత్రికా గోష్టి పెట్టిమరీ చెప్పారు. గతేడాది షిమోగాలో హలాల్‌ మాంసం అమ్మాడంటూ ఒక ముస్లిం వ్యాపారి మీద దాడి చేసిన కేసులు ఆ సంస్థకు చెందిన వారిని అరెస్టు చేశారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.ఒడిషా, కర్ణాటకల్లో జరిపిన హింసాకాండకు గాను విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌ దళ్‌ మీద నిషేధం విధించాలని 2013లో కేంద్ర మంత్రిగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ నేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ డిమాండ్‌ చేశారు. తరువాత అదే పెద్ద మనిషి బిజెపి చంకనెక్కి మంత్రిగా పని చేశారు.చివరిగా బిజెపి మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారు.


అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఉచితాల గురించి రచ్చ చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటకలో తమ పార్టీ ఉచితాలను సమర్ధించారు.కర్ణాటక కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలతో రాష్ట్రం అప్పుల వూబిలో మునుగుతుందన్నారు. ఉచితాల సంస్మృతి భవిష్యత్‌ తరాల వనరులను హరించి వేస్తుందని, తాము రానున్న పాతిక సంవత్సరాల గురించి ఆలోచిస్తాము తప్ప దగ్గరదారుల్లో వెళ్లం అన్నారు. ప్రతి రోజు బిపిఎల్‌ కుటుంబాలకు పాల సరఫరా హామీ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఆ రాష్ట్ర పాలరైతులకు మార్కెటింగ్‌ కల్పించి ఆదుకొనేందుకు అని బిజెపి నేతలు చెబుతున్నారు. మరి అధికారంలో ఇప్పటికే ఉన్న చోట్ల ఎందుకు ఇవ్వటం లేదు, కర్ణాటకలో కూడా ఇప్పటి వరకు ఎందుకు పాలు సరఫరా చేయలేదు ? కుటుంబ పాలన, అవినీతి గురించి మోడీ పెద్దగా ప్రస్తావించటం లేదు. ఎందుకంటే 40శాతం అవినీతి పాలన అని బిజెపి సర్కార్‌ గబ్బుపట్టింది. ఇక ఎడియూరప్పను పక్కన పెట్టుకొని కుటుంబపాలన గురించి చెబితే కన్నడిగులు ముఖం మీదే జనం నవ్వుతారు. మోడీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. కాశ్మీరులో భద్రతా దళాలకు అధికారం ఇవ్వలేదంటూ ఆర్టికల్‌ 370 రద్దు, ఏకంగా రాష్ట్రానే రద్దు చేసి కేంద్ర పాలన సాగిస్తోంది. అక్కడ ఒక వైపు ఉగ్రవాదులు భద్రతాదళాల ప్రాణాలు తీస్తుంటే మరోవైపు కర్ణాటకలో మోడీ ఉగ్రవాదం గురించి ఇతరుల మీద రాళ్లు వేస్తున్నారు. వారితో చేతులు కలిపిన వారి మీద చర్యలు తీసుకుంటే ఎవరు అడ్డుకున్నారు ? ఇంతవరకు ఎంత మందిని పట్టుకున్నారు, ఎన్నికేసులు పెట్టారు ?


ఉచితాలకు వ్యతిరేకంగా బిజెపి నేత అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో కేసు వేశారు. సంక్షేమ చర్యలు అంటే ప్రతిదాన్నీ ఉచితంగా ఇవ్వటం కాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు.కర్ణాటకలో ఉచిత పాలు, ఉచిత సిలిండర్లు, ఉచిత ఆహార ధాన్యాల సంగతేమిటి ? గత ఏడాది(2022) ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోక కల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరుపదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం ( కరోనా పేరుతో రైళ్లలో వృద్ద స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను , పేదలకు అందుబాటులో ఉన్న పాసింజరు రైళ్లను మోడీ సర్కార్‌ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకు తేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పధకం కింద హౌలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు, అన్న పూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి. ఇదే ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 2022-23 బడ్జెట్‌లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు.


అమ్‌దానీ ఆఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్రమోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు. ” ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం కింద 39లక్షల మందికి రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.” (డెక్కన్‌ హెరాల్డ్‌ 2022 నవంబరు 13). ” బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం, రెండు ఉచిత సిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటీలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమచల్‌ ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్‌ ఏప్రిల్‌ నెలలో ఇండ్ల అవసరాలకు గాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రు.250 కోట్లు లబ్ది చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ట్ర ఆర్టీసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 18-60 సంవత్సరాల మహిళలకు నెలకు రు.1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బిజెపి చేస్తే సంసారం, ఇతరులు చేస్తే మరొకటా ?


ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఒకవైపు నరేంద్రమోడీ చూస్తున్నారు.మరోవైపు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బాంకులు రు.10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రు.1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో, సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది.(2022, డిసెంబరు 13వ తేదీ వార్త). వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా ?


కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే. కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్రమోడీ కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22కు, 15శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా ? అది దేశానికి, జనానికి లబ్ది చేకూర్చుతున్నదా ? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటారా, దోచిపెడుతున్న సొమ్మంటారా ? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా ! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొకదాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితంగా ఏడాదికి ఆరువేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు. రైతులు ఆ సొమ్మును స్విస్‌ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగుమందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు. సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లే !


స్వేచ్చా మార్కెట్‌, ఏదీ ఉచితం ఇవ్వకూడదు అన్న నయా ఉదారవాదం పేరుతో కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టే విధానాలు వచ్చిన దగ్గర నుంచీ అసమానతల పెరుగుదలతో పాటు ఉచితాల మీద దాడి ప్రారంభమైంది. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చివేశారు. ఒకనాడు అపహాస్యం చేసిన పధకాలనే తరువాత జాతీయంగా అమలు చేశారు.తొలుత తమిళనాడు స్కూలు పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేసినపుడు అదే జరిగింది. ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఎన్టీర్‌ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎద్దేవా చేసిన వారున్నారు. ఆహార భద్రతా పధకం కింద ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఒడిషా, తెలంగాణాలో ముందుగా రైతు బంధును ప్రకటిస్తే తరువాత నరేంద్రమోడీ కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో దేశమంతటా అమలు చేస్తున్నారు. అందువలన ఈ రోజున ఉచితాలన్న వాటిని రేపు ఏం చేస్తారో చెప్పలేము. రాష్ట్రాల వనరులు తగ్గుతున్నట్లు ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ కేంద్ర పెద్దలు గుండెలు బాదుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పత్రాల ప్రకారం 2014లో కేంద్ర ప్రభుత్వ అప్పు 55 లక్షల కోట్లు, మోడీ పదేండ్ల పాలన గడిచే నాటికి అది 169లక్షల కోట్లకు చేరనుంది. ఇంత అప్పు దేనికి చేసినట్లు, ఎక్కడ నుంచి తెచ్చిందీ, దేనికెంత ఖర్చు చేసిందీ మోడీ చెబుతారా ? దోమలు దూరే కంతలను చూసి గుండెలు బాదుకొనే వారికి ఏనుగులు పోతున్న మహాద్వారాలు కనిపించవా ? పార్లమెంటులో 2017జూలై 21 నక్షత్ర గుర్తులేని ప్రశ్న 938కి ఇచ్చిన సమాధానం ప్రకారం 2004-05 కస్టమ్స్‌, ఎక్సైజ్‌, కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను రాయితీల వలన ప్రభుత్వం కోల్పోయిన రాబడి లక్షా 95వేల కోట్ల రూపాయలు. తరువాత అది ఏటేటా పెరుగుతూ వచ్చింది నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత జనానికి అర్ధంగాకుండా లెక్కలను తారుమారు చేసి సరికొత్త పద్దతుల్లో దోచి పెట్టటం ప్రారంభించారు.2014-15లో కస్టమ్స్‌, ఎక్సైజ్‌ పన్నుల రాబడిలో కోల్పోయిన మొత్తం రు.4,35,756 కోట్లుగా పేర్కొనగా మరుసటి ఏడాది నాటకీయంగా ఆ మొత్తాలను రు.1,48,442 కోట్లుగా చెప్పారు. దీని అర్ధం ఖజానాకు మోడీ గారు రు.2,87,314 కోట్లు మిగిల్చినట్లా ? నిజానికి అంత మిగిల్చి ఉంటే పెట్రోలు, డీజిలు మీద 2014-15లో ఎక్సైజ్‌ పన్ను ఖాతా కింద కేంద్రానికి వచ్చిన మొత్తం రు.99,068 కోట్ల మొత్తాన్ని మరుసటి ఏడాదికి రు.1,78,447 కోట్లకు, తరువాత క్రమంగా పెంచి 2020-21నాటికి రు.3,72,970 కోట్లకు చేర్చారు. ఇంత మొత్తం భారాన్ని మోపటంతో పాటు గాస్‌ సబ్సిడీని భారీగా తగ్గించి ముష్టి విదిల్చినట్లుగా మార్చివేశారు. పైన పేర్కొన్నట్లుగా అప్పు తడిచి మోపెడైంది ? ఎవరికోసం బిజెపి పని చేస్తున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాషాయ దేశభక్తుల బండారం : కమ్యూనిస్టు,చైనా వ్యతిరేక నోటితుత్తర జనం కోసం- కార్పొరేట్ల లాభాల కోసం దిగుమతులు !

26 Wednesday Apr 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, CPI(M), Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

ASEAN, BJP, Cross-border trade, India’s Imports From China, Indo - China trade, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


చైనా నుంచి తమ ఆర్థిక వ్యవస్థను విడగొట్టుకోవాలని కోరుకోవటం లేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి 2023 ఏప్రిల్‌ 20న జపాన్‌ రాజధాని టోకియోలో చెప్పారు.2022-23లో చైనా నుంచి మన దిగుమతులు 4.16శాతం పెరగ్గా ఎగుమతులు 28శాతం తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రాధమిక సమాచారం వెల్లడించింది.2022లో చైనా-భారత్‌ వాణిజ్య లావాదేవీలు 136 బిలియన్‌ డాలర్లు కాగా చైనా ఎగుమతులు 118, భారత్‌ ఎగుమతులు 18 బి.డాలర్ల చొప్పున ఉన్నట్లు ముంబైలోని చైనా కాన్సులేట్‌ జనరల్‌ కాంగ్‌ షియాన్‌ హువా ఏప్రిల్‌ 18న ముంబైలో చెప్పాడు. మరోవైపు మన దేశ ప్రధాన వాణిజ్య భాగస్వామిగా అమెరికా తయారైందని లావాదేవీల విలువ128 బి.డాలర్లని మరొక వార్త. ఆర్థిక రంగంలో భారత్‌ ఎలా చైనాను వెనక్కు నెడుతున్నదో చూడండి అంటూ ఒక విశ్లేషణ. మన ఇరుగుపొరుగు దేశాలతో 115 బి.డాలర్ల సరిహద్దు వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ 2021లో కేవలం 2.8 బి. డాలర్ల మేరకే జరిగిందని, పదిహేడు రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉన్నప్పటికీ తొమ్మిది మాత్రమే చురుకుగా లావాదేవీలు జరిపినట్లు మరొక విశ్లేషణ. ఇవన్నీ వారం, పదిరోజుల్లో వచ్చినవే. గత తొమ్మిది సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ సాధించినట్లు చెబుతున్న విజయాల మాలలో వీటిని ఎక్కడ అమర్చుతారో తెలియదు. ఉట్టికి ఎగరలేని వారు నేరుగా స్వర్గానికి ఎగురుతామని చెప్పినట్లుగా ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దు వాణిజ్యలావాదేవీలు జరపలేని స్థితిలో చైనాను వెనక్కు నెట్టేసి ప్రపంచ ఫ్యాక్టరీగా మన దేశాన్ని మార్చుతామంటే నమ్మేదెలా ? సరిహద్దు లావాదేవీలు భద్రతాపరమైన కారణాలతో జరపటం లేదని చెబుతున్నారు. ఇతర అంశాలతో పాటు విదేశాలు, స్వదేశంలో ఉన్న ఉగ్రవాదుల వెన్ను విరిచేందుకు పెద్ద నోట్ల రద్దుకు చెప్పిన కారణం ఒకటని గుర్తుకు తెచ్చుకోవాలి. అదే విధంగా దేశం సురక్షిత హస్తం చేతుల్లో ఉందని కూడా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అలాంటపుడు తగిన జాగ్రత్తలు తీసుకొని లావాదేవీలను ఎందుకు జరపటం లేదు ? చైనాకు ఇరుగుపొరుగుదేశాలతో అన్నీ విబేధాలే అని చెబుతున్నవారు మన దేశం కూడా అదే స్థితిలో ఉన్నట్లు ఈ పరిస్థితి చెప్పటం లేదా ? చైనా నుంచి నేరుగా దిగుమతులు చేసుకొంటే లేని భద్రతా అంశం సరిహద్దుల్లో లావాదేవీలకు ఎందుకు చెబుతున్నట్లు ? సరిహద్దు లావాదేవీలు ఆ ప్రాంతంలో ఉన్న పౌరుల ఆర్థిక వృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని తెలిసిందే.


ఇక్కడొక అంశాన్ని చెప్పాలి. లడక్‌ గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా వస్తుబహిష్కరణ గురించి నానా యాగీ చేసిన కాషాయ దళాలు, వాటి సమర్ధకులు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు.ఎగుమతులు-దిగుమతులను ఆయుధాలుగా మార్చుకోవాలన్న అమెరికా డోనాల్డ్‌ ట్రంప్‌ స్పూర్తి తప్ప ఈ తొలి ఉద్రేకం వెనుక మరేమీ లేదు. పోనీ దానికి కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు, తన రికార్డులను తానే మోడీ బద్దలు కొడుతున్నారు. చైనా వస్తుబహిష్కరణ అని దుస్తులు చించుకున్న వారే సరిహద్దు వివాదాలకు-వాణిజ్య లావాదేవీలకు లంకె పెడతారేమిటని ఎదురుదాడికి దిగుతున్నారు.ఇదే దేశభక్తులు, వీరి పూర్వీకులు చైనాతో వివాదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్న వైఖరిని చెప్పినందుకు సిపిఐ(ఎం) నేతలను దేశద్రోహులుగా చిత్రించారు. ఇప్పటికీ అదే దాడి చేస్తున్నారు. 1960దశకంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిని జైళ్లలో పెట్టిన సంగతిని కూడా మరచి పోరాదు. నరేంద్రమోడీతో చెట్టపట్టాలు వేసుకొని కౌగిలింతలతో తిరిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో చైనాతో వాణిజ్యపోరుకు తెరతీశాడు. ఐదేండ్ల తరువాత వెనక్కు తిరిగి చూస్తే అమెరికా ఎన్ని బెదిరింపులకు దిగినా, మరొకటి చేసినా చైనా ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గలేదు. పీటర్సన్‌ సంస్థ విశ్లేషకులు చెప్పిన అంశాలను చూస్తే చెరువు మీద అలిగినవాడి మాదిరి అమెరికా పరిస్థితి మారింది. దాని పరిస్థితే అలా ఉంటే మన నరేంద్రమోడీ ఏలుబడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఆత్మనిర్భరతలో భాగంగా ఓకల్‌ ఫర్‌ లోకల్‌ ( స్థానిక వస్తువులనే వాడండి ) మేకిన్‌ ఇండియా (భారత్‌లో ఉత్పత్తి చేయండి ) మేడిన్‌ ఇండియా (భారత తయారీ) ఇలా ఇచ్చిన పిలుపులు ఎంత మేరకు ఫలించిందీ ఎప్పుడైనా జనానికి చెప్పారా ?


అమెరికా తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం 2022లో అమెరికా ఎగుమతులు మరింతగా తగ్గినట్లు, దాని పోటీదారులు చైనా మార్కెట్లో వస్తువులను అమ్ముకుంటున్నట్లు తేలిందని, అమెరికా ఎగుమతులైన ఆటో మొబైల్స్‌, బోయింగ్‌ విమానాలు అదృశ్యమైనట్లు పీటర్సన్‌ విశ్లేషణ పేర్కొన్నది. సెమికండక్టర్ల ఎగుమతి విధానం కారణంగా వాటి ఎగుమతి తగ్గింది, కరోనా కాలంలో తగ్గిన సేవల ఎగుమతులు అంతకు పూర్వపు స్థాయికి ఇంకా చేరుకోలేదు. చైనాకు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినా చైనా మార్కెట్‌ మీద ఎక్కువగా ఆధారపడిన అమెరికాకు ఆందోళనకర సూచనలు వెలువడ్డాయి. చైనా ఇతర దేశాల నుంచి దిగుమతులకు పూనుకున్నట్లు పీటర్సన్‌ పేర్కొన్నది.


ఎగుమతులు-దిగుమతులను ఆయుధాలుగా మార్చినందున ఎవరికి వారు జాగ్రత్తలు పడుతున్నారు.రాజీ మార్గంగా రెండు సంవత్సరాల్లో అమెరికా నుంచి 200 బి.డాలర్ల మేరకు అదనంగా కొనుగోలు చేస్తామని 2020జనవరిలో చైనా అంగీకరించినా వివిధ కారణాలతో ఆ మేరకు దిగుమతులు జరగలేదు.చైనా వస్తువులు నాశిరకమని, కరోనా నిరోధ వాక్సిన్లు పని చేయలేదని ప్రచారం చేసిన వారి గురించి తెలిసిందే.ఇప్పుడు అమెరికా గతం కంటే ఎక్కువగా చైనా ఔషధాల మీద ఆధారపడుతోంది. గడచిన ఐదు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య మొత్తం లావాదేవీల్లో ఔషధాల వాటా విలువ 0.6 నుంచి మూడు శాతానికి పెరిగింది. అమెరికా 10.2 బి.డాలర్ల విలువ గలవి దిగుమతి చేసుకుంటే చైనా కాన్సర్‌,యాంటీబయటిక్స్‌ వంటి ఆధునిక ఔషధాలను 9.3బి. డాలర్ల మేర దిగుమతి చేసుకుంది. అమెరికా చేసుకుంటున్న మొత్తం ఔషధ దిగుమతుల్లో ఐర్లండ్‌ 19.8, జర్మనీ 10.8, స్విడ్జర్లాండ్‌ 10.7 చైనా నుంచి ఆరుశాతం ఉన్నాయి.రెండు సంవత్సరాల్లో చైనా వాటా 2.5శాతం నుంచి పెరిగింది. అమెరికా నుంచి చైనా చేసుకుంటున్న ఔషధాల దిగుమతులు కూడా అదే విధంగా పెరిగాయి. ఇతర వస్తువులు, సేవల అంశంలో భద్రత అంశాన్ని ముందుకు తెస్తున్న అమెరికా ఔషధాల గురించి మౌనంగా ఉంది. ఇలాంటి కొన్ని అవసరాల రీత్యా చైనా నుంచి తాము పూర్తిగా ఆర్థిక సంబంధాలను విడగొట్టుకోవటం లేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి చెప్పారన్నది స్పష్టం.


చైనా వస్తువులను బహిష్కరించి దానికి బుద్ది చెప్పాలన్న కాషాయదళాల గోడు నరేంద్రమోడీ పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు అవసరమైన నిధులు రావాలన్నా, అధికారాన్ని నిలుపుకోవాలన్నా కార్పొరేట్ల మద్దతు అవసరం. రాజకీయంగా బిజెపితో లడాయిలో ఉన్న ఢిల్లీ సిఎం కేజరీవాల్‌ కాషాయ దళాలు గతంలో లేవనెత్తి తరువాత నోరు మూసుకున్న ఈ అంశాన్నే ఇప్పుడు తవాంగ్‌ పేరుతో ముందుకు తెచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించి దానికి ఎందుకు బుద్ది చెప్పరంటూ ప్రశ్నించారు. చైనా వస్త్తువులను మన దేశంలో కూడా తయారు చేస్తున్నారని, దిగుమతులకు బదులు ఇక్కడే తయారు చేసి మన కార్మికులకు ఎందుకు పని కల్పించరంటూ నిలదీశారు. కేజరీవాల్‌ చేసే అన్ని విమర్శలకు సమాధానం చెప్పే కమలనాధులు దీని గురించి మౌనంగా ఉన్నారు. చైనా నుంచి భారత్‌ దిగుమతులు ఉత్తి పుణ్యానికి లేదా చైనా కార్మికులకు పని కల్పించేందుకు, అక్కడి కంపెనీలకు లాభాలు కట్టిపెట్టేందుకు కాదు. ముంబైలోని చైనా కాన్సులేట్‌ జనరల్‌ కాంగ్‌ షియాన్‌ హువా మన దేశంలోని పెట్టుబడిదారులతో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య జరుగుతున్న లావాదేవీల లెక్కలు డొక్కలు పూర్తి కథను వెల్లడించవంటూ అసలు సంగతి చెప్పారు. చైనా నుంచి భారత్‌ చేసుకుంటున్న దిగుమతులలో ఇంటర్‌మీడియట్‌లు (పూర్తిగా తయారు కాని, ముడిపదార్ధాలు, విడిభాగాల వంటివి. ఉదాహరణకు మనం వేసుకొనే ఔషధ గోళీలు మన దేశంలో తయారైనప్పటికీ వాటిలో నింపే పదార్ధాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవటం) ఎక్కువగా ఉంటాయని, వాటితో వస్తువులను తయారు చేసి భారత్‌ ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నదని, అందువలన మేక్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా సంపూర్ణం కావాలంటే చైనా మార్కెట్‌కు రావాలని మన పెట్టుబడిదారులను కోరాడు.ఐటి, సినిమా నిర్మాణ రంగాలలో ముందున్న భారతీయులు తమ మార్కెట్లోకి రావచ్చని కూడా చెప్పాడు. ఈ కారణంగానే సరిహద్దుల్లో ఘర్షణలు జరిగినా, ఏటా భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని చైనాకు సమర్పించుకోవాల్సి వచ్చినా మోడీ సర్కార్‌ కిమ్మనకుండా దిగుమతులలో రికార్డులను బద్దలు కొడుతున్నది.

మన దేశంతో 2022లో చైనా వాణిజ్య మిగులు 100 బి.డాలర్లు, 2021లో ఆ మొత్తం 69.38 బి.డాలర్లు. అంటే ఇంత మొత్తాన్ని డాలర్ల రూపంలో చైనాకు మనం సమర్పించుకున్నాం.ఇదంతా దేశభక్తి, సైనికుల త్యాగాల గురించి రోజూ జనాలకు మనోభావాలను గుర్తు చేస్తుండగానే, వారి కనుసన్నలలోనే జరుగుతోంది. చైనా చెప్పే లెక్కలు జనవరి నుంచి డిసెంబరు వరకు ఏడాదిగా పరిగణిస్తే మన ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా తీసుకుంటున్నందున అంకెల్లో కొంత గందరగోళం తలెత్తవచ్చు, వాస్తవాలు మారవు. మన ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 2022-23లో మన చైనా దిగుమతులు 4.16శాతం పెరిగి 98.51 బి.డాలర్లకు చైనాకు మన ఎగుమతులు 28శాతం తగ్గి 15.32 బి.డాలర్లుగా ఉన్నాయి. మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 72.91 నుంచి 83.2 బి.డాలర్లకు పెరిగింది. అమెరికాతో లావాదేవీలు 128.55 బి.డాలర్లకు చేరినందున చైనాను వెనక్కు నెట్టి అమెరికా ముందుకు వచ్చిందని చెబుతున్నారు. దాని వలన చైనాకు వచ్చే నష్టం లేదు. ఇక దేశభక్తులుగా చెలామణి అవుతున్న అదానీ వంటి కార్పొరేట్లు ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ దిగుమతి పన్ను ఎగవేసేందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.” దిగుమతి విలువ ఎక్కువ, ఎగుమతి విలువ తక్కువగా ఉండటం సాధారణ అంశం. కానీ భారత్‌లో అందుకు విరుద్దంగా చైనా-భారత్‌ లావాదేవీలు ఉన్నట్లు ” మింట్‌ పత్రిక పేర్కొన్నది.


ఆర్థిక రంగంలో చైనాను భారత్‌ ఎలా పక్కకు నెడుతున్నది అనే శీర్షికతో మేజర్‌ అమిత్‌ బన్సాల్‌ అనే రిటైర్డు అధికారి ఒక విశ్లేషణ చేశారు. ఏమిటి అంటే సింగపూర్‌కు చెందిన ఒక సంస్థ ఆసియన్‌ దేశాలలో ఇటీవల సింగపూర్‌కు చెందిన ఐఎస్‌ఇఏఎస్‌ అనే సంస్థ జరిపిన సర్వేలో భారత్‌ను ఆమోదించిన లేదా అంగీకరించిన వారు గత సర్వేతో పోల్చితే 5.1 నుంచి 11.3శాతానికి పెరిగారని తేలిందట.చైనా, అమెరికా తరువాత మూడో స్థానంలో ఉన్నాం గనుక ఇదే కొనసాగి చైనాను వెనక్కు నెట్టే దారిలో ఉన్నట్లు బన్సాల్‌ చెబుతున్నారు. ఎందుకటా అమెరికా-చైనా వివాదపడుతున్నాయి గనుక భారత్‌ దూరేందుకు అవకాశం వచ్చింది అంటున్నారు. మరోవైపున చైనా 700 బి.డాలర్ల మేరకు ఆసియన్‌ దేశాలతో లావాదేవీలు జరుపుతూ చైనా మొదటి స్థానంలో ఉందంటూనే మనం 2022లో 110 బి.డాలర్ల దగ్గర ఉన్నామని, అమెరికాను ఐదారు సంవత్సరాల్లో, పదేండ్లకు చైనాను వెనక్కు నెట్టేస్తామంటున్నారు.ఆసియన్‌ దేశాల లావాదేవీల్లో మన దిగుమతులు 68, ఎగుమతులు 42 బి.డాలర్లు అంటే మనం 26బి.డాలర్లు వారికి సమర్పించుకుంటున్నాం. వారికి లాభసాటిగా ఉంది గనుక మనతో లావాదేవీలకు మొగ్గుచూపుతున్నానర్నది స్పష్టం. అందమైన కలలు కనటాన్ని తప్పుపడతామా ? చైనాను వెనక్కు నెట్టే సంగతి తరువాత ముందు వారితో ఉన్న వాణిజ్యలోటును సమం చేస్తే అదే పదివేలు. 2021-22లో మన దేశం 612 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే చేసిన ఎగుమతుల విలువ 422బి.డాలర్లు. పెద్ద దేశాల్లో అమెరికా, బ్రిటన్‌తో మాత్రమే మన ఎగుమతులు ఎక్కువ, ఇక కొన్ని చిన్న దేశాలతో కూడా ఎక్కువే. మన మిగులు విలువ 59 బి.డాలర్లు పోను మన లోటు 192బి.డాలర్లు. అందువలన వచ్చే పదేండ్లలో దాన్ని సమం చేసినా ఘనవిజయమే. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 2014 మన వస్తు ఎగుమతుల విలువ 322.69 బి.డాలర్లు కాగా 2021లో 395.43 బి.డాలర్లు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు 2021-22లో 447బి.డాలర్లు. ద్రవ్యోల్బణం కారణంగా ఈ పెరుగుదల తప్ప గడచిన తొమ్మిదేండ్లలో పదే పదే విదేశాలు తిరిగిన నరేంద్రమోడీ మన సరకులకు సాధించిన మార్కెట్‌ ఏమిటి అన్నది ప్రశ్న. అదే ప్రపంచ బాంకు చైనా 2014లో 2.34లక్షల కోట్ల డాలర్ల మేర సరకులు ఎగుమతి చేస్తే 2021నాటికి 3.36లక్షల కోట్లకు పెరిగింది. ఇలాంటి అంకెలు మన కళ్ల ముందు ఉండగా చైనాను అధిగమిస్తామని ఎలా చెబుతారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అక్రమ ఆయుధాల నిలయం ఉత్తర ప్రదేశ్‌ : గురువు మోడీ ప్రజాస్వామ్య సుభాషితాల వల్లింపు – శిష్యుడు యోగి తద్విరుద్ద ఆటవిక పాలన !

17 Monday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Atiq Ahmed, Bhajarangdal, BJP, Jai Shri Ram’, Narendra Modi, Narendra Modi Failures, RSS, UP mafia, UP's Prayagraj, Uttar Pradesh Police Encounters, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


శనివారం రాత్రి పదిన్నర గంటలపుడు (2023 ఏప్రిల్‌ 15వ తేదీ) పటిష్టమైన పోలీసు బందోబస్తులో విలేకర్లతో మాట్లాడుతుండగా అతిక్‌ అహమ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌ అహమ్మద్‌ అనే నేరగాండ్లను ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఉత్తర ప్రదేశ్‌లో శాంతి భద్రతలకు ఇది చక్కటి ఉదాహరణ. సులభంగా ప్రాణాలు తీసేందుకు కొత్త దారి చూపింది. ఇది పూర్వపు అలహాబాద్‌ నేటి ప్రయాగ్‌ రాజ్‌లో జరిగింది. అంతకు రెండు రోజుల ముందు అతిక్‌ అహమ్మద్‌ 19 ఏండ్ల కుమారుడిని, అతని అనుచరుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ప్రజాస్వామ్య పుట్టినిల్లు భారత్‌ అని, ఇందుకు అనేక చారిత్ర ఆధారాలున్నాయని కావాలంటే పదకొండు వందల సంవత్సరాల నాటి తమిళశాసనాన్ని చూడవచ్చని చరిత్రకారుడి అవతారం కూడా ఎత్తిన ప్రధాని నరేంద్రమోడీ తమిళ సంవత్సరాది సందర్భంగా చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తుండగానే ఇది జరిగింది. శిష్యుడు యోగి ఏలుబడిలో ఆటవిక ఉదంతం. హంతకులు తుపాకులు కాల్చుతూ జై శ్రీరామ్‌ అని నినాదాలు చేశారట. ప్రస్తుతం అక్కడ ఏ నినాదమిస్తే ఏం చేసినా తప్పించుకోవచ్చని వారికి అవగతమై ఉందేమో !వారిలో ఒకడు భజరంగ్‌దళ్‌ జిల్లా నేత. ఒక పెద్ద గూండాను చంపి తాము పేరు తెచ్చుకోవాలని ఆ ముగ్గురు చిల్లర గూండాలు చెప్పారంటే బిజెపి రెండింజన్ల పాలన, ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధó్యవహిస్తున్న, యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడిలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో గూండాలకు, గూండాయిజానికి ఎంత పలుకుబడి, ఆరాధన ఉందో వెల్లడించింది.


అమెరికాలో తుపాకి తీసుకొని టపటపా మంటూ కాల్చిచంపిన వారిని తరువాత వచ్చే పోలీసులు అనేక ఉదంతాల్లో మట్టుపెట్టటం తెలిసిందే. తమ ముందే ఇద్దరిని కాల్చిచంపుతుంటే కళ్లప్పగించి ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు చూశారంటే వారి రాక గురించి ముందే ఉప్పంది ఉండాలి లేదా హంతకులు జై శ్రీరామ్‌ అన్నారు గనుక వారు అధికార పార్టీ వారైతే లేనిపోని తంటామనకెందుకని వదలివేశారా ? ఆ వచ్చిన దుండగులు జర్నలిస్టుల ముసుగులో వచ్చారు.పోలీసులకు వారెవరో తెలీదు.ఎవరినీ తనిఖీ జరపలేదు. ఇద్దరిని చంపిన తరువాత వారు మిగిలిన వారిని కూడా చంపుతారేమో అన్న అనుమానం కూడా వారికి రాలేదు. వారు పారిపోకుండా కనీసం కాళ్ల మీదనైనా కాల్పులు జరపలేదు. ఉత్తర ప్రదేశ్‌లో పరిణితి చెందిన ప్రజాస్వామ్యంలో పోలీసులకు ఇచ్చిన శిక్షణ ఎంత ఉన్నతమైనదో కదా !


అమెరికాలో నిందితులను కాల్చి చంపిన వెంటనే ఇంటర్నెట్‌ నిలిపివేతలు, ఒక చోట నలుగురు గుమికూడ కుండా ఆంక్షల విధింపు, పాలకులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకోవటం వంటివి జరిగినట్లు ఎప్పుడూ వినలేదు, కనలేదు. కానీ ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ ఆదివారం నాడు రాష్ట్రమంతటా ఆంక్షలు విధించి మిగిలిన పనులు కూడా చేసింది. గత ఆరు సంవత్సరాల్లో తన పాలనలో మాఫియా, గూండా గాంగులను అంతమొందించినట్లు చెప్పుకుంటున్న సిఎం అంతా సజావుగా ఉంటే ఈ పని ఎందుకు చేసినట్లు ? అవసరం ఏమి వచ్చింది ?


గూండాలను, గూండాయిజాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలనటంలో ఎవరికీ విబేధం లేదు. చట్టవిరుద్దమైన పనులు చేసినపుడే సమస్య. నిజంగా గూండాలు, తీవ్రవాదులు గానీ జనం మీద లేదా భద్రతా దళాల మీద దాడులకు దిగినపుడు జరిగే ఎన్‌కౌంటర్లలో వారిని చంపితే అదొక తీరు. నకిలీ ఎన్‌కౌంటర్లు జరిపితే అది ప్రజాస్వామ్యమా అన్నది నాగరికుల్లో కలిగే సందేహం. ఇటీవలి కాలంలో నకిలీ ఎన్‌కౌంటర్లను కూడా హర్షించే బాపతు రెచ్చిపోతున్నది.ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి కూడా కబుర్లు చెప్పేది వారే కావటం విషాదం. అతిక్‌ అహమ్మద్‌ కుమారుడు, మరొకరిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని వేరే చెప్పనవసరం లేదు. దాని కొనసాగింపుగానే అతిక్‌ సోదరులను ఒక పధకం ప్రకారం మట్టుబెట్టించారని అనేక మంది భావిస్తున్నారు.పేరు మోసిన గూండాలను కాల్చిచంపినా తప్పుపడితే ఎలా అని తక్షణ న్యాయం కావాలని కోరుకొనే కొందరు ప్రశ్నిస్తారు. ఇలా ప్రశ్నించటం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు మన దేశం అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీని అవమానించటం తప్ప మరొకటి కాదు. మతమార్పిడి, లౌజీహాద్‌ నిరోధ చట్టాల మాదిరి పేరు మోసిన నిందితులను కాల్చి చంపాలని ప్రభుత్వ పెద్దలు తమకు ఉన్న మెజారిటీని ఆసరా చేసుకొని చట్టాలను చేసి అందుకు పూనుకుంటే అది వేరే. ప్రజాస్వామ్య ముసుగులో ఎన్‌కౌంటర్లు సమాజానికి పీడగా ఉండే నేరగాండ్లకే పరిమితం కావు, తమకు నచ్చనివారిని సైతం అధికారంలో ఉన్న పెద్దలు ఏదో ఒకసాకుతో ఏరిపారవేస్తారు.తమదాకా వచ్చినపుడు గానీ ” తక్షణ న్యాయ ” వాదులకు ఈ అంశం అర్ధం కాదు. అలా కోరుకోవటం, అలాంటి ఉదంతాలకు మద్దతు ఇవ్వటం అంటే నిరంకుశ శక్తులను ప్రోత్సహించటమే.


ఉత్తర ప్రదేశ్‌లో యోగి అధికారానికి వచ్చిన తరువాతే నేరగాండ్లను మట్టుబెట్టి పీడ లేకుండా చేస్తున్నట్లుగా ప్రచారం పెద్దఎత్తున సాగుతున్నది. 2017 నుంచి ఇప్పటి వరకు ఎన్‌కౌంటర్లలో 183 మంది నేరగాండ్లను లేపివేసిన బాహుబలిగా వర్ణిస్తున్నారు. జాతీయ మానవహక్కుల సంస్థ సమాచారం ప్రకారం 2017 మార్చి నుంచి 2022 మార్చినెల వరకు దేశంలో ప్రతి మూడు రోజులకు ఒక ఎన్‌కౌంటర్‌, 813 మంది మరణించినట్లు వెల్లడించింది. ఇవన్నీ ఉత్తర ప్రదేశ్‌లో జరిగినవి కాదు.దుండగులు తమ వద్ద ఉన్న తుపాకులను లాక్కొనేందుకు, తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు, తనిఖీ జరుపుతుండగా కాల్పులు జరిపినపుడు ఆత్మరక్షణ కోసం కాల్చినట్లు పోలీసులు చెప్పటం తెలిసిందే.యోగి అధికారంలో లేనపుడు కూడా ఉత్తర ప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్లు జరిగాయి. సావర్కర్‌ అండమాన్‌ జైల్లో ఉన్నపుడు బుల్‌బుల్‌ పిట్ట రెక్కల మీద ఎక్కి వెలుపలికి వచ్చి దేశంలోని కొన్ని ప్రాంతాలను చూసి తిరిగి జైలుకు చేరుకున్నట్లు కర్ణాటక బిజెపి ప్రభుత్వ స్కూలు పుస్తకాల్లో రాసిన సంగతి తెలిసిందే.ఇతర పార్టీలు ప్రభుత్వంలో ఉండగా బహుశా గోరఖ్‌పూర్‌లోని తన మఠం నుంచి యోగి మారు రూపంలో వచ్చి పోలీసులను ఆవహించి ఎన్‌కౌంటర్లను జరిపించి తిరిగి మఠానికి వెళ్లారని కూడా భక్తులు భక్తులు చెబుతారేమో చూడాలి.


జాతీయ మానవహక్కుల సంస్థ సమాచారం ప్రకారం 2002 నుంచి 2008 వరకు దేశంలో 440 ఎన్‌కౌంటర్‌ కేసులు జరిగితే రాష్ట్రాల వారీ ఉత్తర ప్రదేశ్‌ 231, రాజస్తాన్‌ 33, మహారాష్ట్ర 31, ఢిల్లీ 26, ఆంధ్రప్రదేశ్‌ 22, ఉత్తరాఖండ్‌ 19 ఉన్నాయి. తరువాత 2009 అక్టోబరు నుంచి 2013 ఫిబ్రవరి వరకు 555 ఉదంతాలు జరగ్గా రాష్ట్రాల వారీ ఉత్తర ప్రదేశ్‌ 138, మణిపూర్‌ 62, అసోం 52, పశ్చిమ బెంగాల్‌ 35, ఝార్ఖండ్‌ 30 ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలలో ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు మరణించారు. ఈ కాలంలో యోగి అధికారంలో లేరు. ఉత్తర ప్రదేశ్‌లో వేర్పాటు వాదం లేదా నక్సల్‌ సమస్యలేదు. జరిగిన ఎన్‌కౌంటర్లలో అగ్రస్థానంలో ఎందుకు ఉన్నట్లు ? ఉత్తర ప్రదేశ్‌ పోలీసు కస్టడీ మరణాలకు పేరుమోసింది. దీని గురించి ఎక్కడా ప్రచారం జరగదు ఎందుకు ? వారంతా ఎవరు, నేరగాండ్లేనా ? టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 జూలై 26 నాడు ప్రచురించిన వార్త చెప్పిందేమిటి ? 2020 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2022 మార్చి 31 వరకు ఎన్‌హెచ్‌ఆర్‌సి సమాచారం ప్రకారం దేశంలో 4,484 పోలీసు కస్టడీ మరణాలు, 233 ఎన్‌కౌంటర్‌ మరణాలు జరిగినట్లు లోక్‌సభకు ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఉత్తర ప్రదేశ్‌ 952 మరణాలతో అగ్రస్థానంలో ఉంది. నరేంద్రమోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఈ దుర్మార్గం ఏమిటనిగానీ, ప్రజాస్వామ్య కబుర్లు చెపితే జనం ఏమనుకుంటారని గానీ ఎప్పుడైనా ఆత్మావలోకనం చేసుకున్నారా ?


ఒక పెట్టుబడిదారుడిని చంపినంత మాత్రాన దోపిడీ, ఒక భూస్వామిని చంపినంత మాత్రాన గ్రామాల్లో అణచివేత అంతరించదు. అలాగే గూండాలను చంపినంత మాత్రాన గూండాయిజం అంతం కాదు. అదే జరిగి ఉంటే 1990 దశకం నుంచి 2000 దశకం వరకు ముంబై,మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో గూండాలు, మాఫియాడాన్లను పోలీసులు చంపివేశారు. వాటితో అక్కడ ఇప్పుడు గూండాయిజం అంతరించిందా ? కొత్తవారు పుట్టుకువస్తూనే ఉంటారు. ఏప్రిల్‌ 13న ఎన్‌కౌంటర్‌లో చంపిన పందొమ్మిదేండ్ల అతిక్‌ అహమ్మద్‌ కుమారుడికి యోగి అధికారంలోకి వచ్చే నాటికి 13 సంవత్సరాలుంటాయి. అతను ఈ కాలంలో గూండాగా మారాడా ? నిజంగా మారితే ఎన్‌కౌంటర్లను, బాహుబలి యోగిని ఖాతరు చేయటం లేదనుకోవాలి, అలాగాకపోతే తండ్రి అతిక్‌ అహమ్మద్‌ మీద కసి తీర్చుకొనేందుకు పోలీసులు అతగాడిని హతమార్చి ఉండాలి.ఏది నిజం ? చట్టబద్ద పాలన సాగుతోందా, విరుద్దంగా ఉందా ?


అతిక్‌ అహమ్మద్‌ సోదరులను హతమార్చిన ముగ్గురు నేరగాండ్ల గురించి చూస్తే వారిలో లవలేష్‌ తివారీ అనే వాడు సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన భజరంగ్‌ దళ్‌ నేతగా ఉన్నాడని వార్తలు. తమకేం సంబంధం లేదని ఆ సంస్థలు ప్రకటించటం ఊహించనిదేమీ కాదు. ఫేస్‌బుక్‌లో తనను భజరంగ్‌ దళ్‌ జిల్లా సహ నేతగా వర్ణించినపుడే తమకే సంబంధం లేదని ప్రకటించి ఉంటే వేరు, ఇప్పుడు చెబుతున్నారంటే గాడ్సేను కూడా అలాగే తమవాడు కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పిన సంగతి గుర్తుకు వస్తోంది. నేరం చేసిన తరువాత జై శ్రీరామ్‌ అనటాన్ని బట్టి, ముగ్గురూ కలసి వచ్చారంటే మిగిలిన ఇద్దరు కూడా ఆ బాపతే లేదా తోడు తెచ్చుకున్న నేరగాండ్లన్నది స్పష్టం. వివిధ ప్రాంతాలకు చెందిన వారిని పోలీసులే ఒక దగ్గరకు చేర్చి ఉండాలి. గతంలో వారి మీద కేసులు ఉన్నప్పటికీ ముగ్గురు కలసి చేసినట్లు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. విధి నిర్వహణలో ఉన్న 17 మంది పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేసినట్లు వచ్చిన వార్తలు ఫేక్‌ అని ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని అదానీ ఆధీనంలోని ఎన్‌డిటివి పేర్కొన్నది.లవలేష్‌ తివారీతో తమకెలాంటి సంబంధం లేదని కుటుంబం చెప్పిందట. కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడటం లేదని కూడా తండ్రి చెప్పాడట.తాను బ్రాహ్మణుడనని శాస్త్రాలను గాక ఆయుధాలు పట్టుకు తిరుగుతానని లవలేష్‌ చెప్పేవాడట. సన్నీ అనే నేరగాడు రౌడీ షీటర్‌. పద్నాలుగు కేసులున్నాయి,ఎలా నేరగాడిగా మారిందీ తెలియదని సోదరుడు చెప్పాడు. మూడోవాడు అరుణ్‌ చిన్నపుడే ఇల్లువదలి వెళ్లాడు. తాము పేరు మోసిన నేరగాండ్లం కావాలనే కోరికతో అతిక్‌ సోదరులను కాల్చి చంపినట్లు పోలీసులకు చెప్పారట.యోగి పాలన ఇలాంటి ఉత్తేజాలకు దోహదం చేస్తున్నట్లే కదా ! ఇలాంటి గూండాలను ఒక దగ్గరకు చేరుస్తోందా ?


యోగి ఆదిత్యనాధ్‌ అధికారానికి వచ్చిన తరువాత ఇప్పటి వరకు పదివేలకు పైగా ఎన్‌కౌంటర్లు జరిపారని వార్తలు.దీనితో నేరాలు అదుపులోకి వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. కానీ నేరాల వివరాలను చూసినపుడు అలాంటి దాఖలాలు లేవు.కేంద్ర ప్రభుత్వ జాతీయ గణాంకాలను చూద్దాం.
రాష్ట్రం ××2016×××××2017××××2018××××2019××××2020
ఉత్తరప్రదేశ్‌ ××494025××600082××585157××628578××657925
అన్ని రాష్ట్రాలు ×4575746×4722642×4769681×4801091×6291485
ఎగువన ఉన్న వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లో యోగి అధికారానికి రాక ముందు 2016లో నమోదైన అన్ని రకాల కేసులు 4,94,025 ఉంటే 2020లో అవి 6,57,925 కు పెరిగాయి. దేశంలో 45,75,746 నుంచి 62,91,485కు చేరాయి.దేశంలో పెరిగినట్లుగానూ ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఉన్నాయి.మొత్తం కేసులలో అక్రమంగా ఆయుధాలు కలిగినవి 2021లో దేశంలో వందకు 3.3 ఉంటే ఉత్తర ప్రదేశ్‌ 11.8 శాతంతో అగ్రస్థానంలో ఉంది. రెండంకెలు గల రాష్ట్రం మరొకటి లేదు. అలాంటి స్థితిలో అక్కడి జనం సుఖంగా నిద్రపోతారా ? యోగి ఆదిత్యనాధ్‌కు రెండు తుపాకులకు లైసెన్సు కూడా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సర్వసంగ పరిత్యాగి, నిరంతరం భద్రతా వలయంలో ఉండే యోగి పరిస్థితి ఇది. గూండాలను అణచివేస్తే అన్ని అక్రమ ఆయుధాలు ఎలా ఉంటాయి ?


ఎన్‌కౌంటర్ల గురించి ప్రచారం మీద చూపిన శ్రద్ద ఇతర అంశాల మీద లేదు. తమకు విధించిన జీవితకాల శిక్ష గురించి చేసుకున్న అప్పీళ్లు సంవత్సరాల తరబడి విచారణకు రావటం లేదంటూ 18మంది నేరస్థులు సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన విన్నపంలో అలహాబాద్‌ హైకోర్టులో 160 మంది జడ్జీలకు గాను 93 మందే ఉన్నారని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు వారికి బెయిల్‌ ఇచ్చింది.” బలహీన వర్గాలకు చెందిన వారు ఎప్పటికీ కస్టడీలోనే ఉంటున్నారు. మా అనుభవంలో అలాంటి వారు జైళ్లలో ఉంటున్నారు.ఉన్నత సమాజానికి చెందిన ఒక నేరగాడు శిక్ష పడే సమయానికి దేశం నుంచి తప్పించుకున్నాడని ” ఆ సందర్భంగా సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఇది యోగి సర్కార్‌ సిగ్గుపడాల్సిన అంశం. 2021 ఆగస్టు నాటికి 1.8లక్షల క్రిమినల్‌ అప్పీళ్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. రెండువేల సంవత్సరం నుంచి కేవలం 31,044 కేసులనే హైకోర్టు పరిష్కరించింది. పదేండ్లకు ముందు అప్పీలు చేసిన ఖైదీలు 7,214 మంది జైల్లో ఉన్నారు.2017 మార్చి నుంచి 2021 ఆగస్టు వరకు ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు జరిపిన 8,472 ఎన్‌కౌంటర్లలో 3,302 మంది నేరారోపణలు ఉన్నవారు గాయపడ్డారు.వారిలో 146 మంది మరణించారు. పోలీసు ఎన్‌కౌంటర్లు పెద్ద ఎత్తున జరగటం అంటే అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ యంత్రాంగం, న్యాయాన్ని అందించాల్సిన వ్యవస్థ వైఫల్యానికి చిహ్నం. పోలీసు యంత్రాంగాన్ని ఎన్‌కౌంటర్ల విభాగంగా మార్చితే జవాబుదారీతనాన్ని లోపించిన దాన్ని సంస్కరించటం అంత తేలిక కాదు, ఏకుమేకై కూర్చుంటుంది. చివరకు పెంచి పోషించిన వారికే తలనొప్పిగా మారుతుంది. అధికారం మారితే అదే పోలీసు యంత్రాంగం పాలకులు ఎవరి మీద గురి పెట్టమంటే వారి మీదే తుపాకులను ఎక్కు పెడుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమి జిమ్మిక్కులురా బాబూ : ఓట్ల కోసం చర్చి ప్రార్ధనల్లో నరేంద్రమోడీ !

12 Wednesday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Christians, Kerala CPI(M), LDF, Narendra Modi, Narendra Modi Failures, Pinarayi Vijayan, RSS, sangh parivar, UDF


ఎం కోటేశ్వరరావు


వెంపలి చెట్టుకు(నేల మీద పాకే ఒక మొక్క) నిచ్చెన వేసి ఎక్కే రోజులు వస్తాయని పోతులూరి వీరబ్రహ్మం చెప్పారన్న ప్రచారం గురించి తెలిసిందే. అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఇంతకాలం మైనారిటీలను సంతుష్టీకరిస్తూ ఓటు బాంకుగా మార్చుకున్నట్లు ఇతర పార్టీలను మీద ధ్వజమెత్తిన బిజెపి, ప్రత్యేకించి నరేంద్రమోడీ ఇప్పుడు ఎంతవారలైనా అధికార కాంతదాసులే అని నిరూపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్రమోడీ ప్రధానిగా ఉంటారని మోడీ అంతరంగం అమిత్‌ షా చెప్పారు. మోడీ వేస్తున్న పిల్లి మొగ్గల గురించి కేరళ సిఎం పినరయి విజయన్‌ ఎద్దేవా చేశారు. రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా అని ఒక సభలో అన్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు అంటే ఏప్రిల్‌ తొమ్మిదవ తేదీన ఈస్టర్‌ పండగనాడు ప్రధాని నరేంద్రమోడీ తన మద్దతుదారులైన యావత్‌ హిందూత్వశక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అధికారం తరువాతే అన్నీ అన్న సందేశమిస్తూ ఢిల్లీలోని శాక్రెడ్‌ హార్ట్‌ చర్చ్‌ను సందర్శించి ప్రార్ధనల్లో పాల్గొన్నారు.మామూలుగా అయితే ఎవరైనా ప్రార్ధనా స్థలాలకు వెళ్లటాన్ని తప్పు పట్టనవసరం లేదు. అది వారి వ్యక్తిగత అంశం. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతవేత్త ఎంఎస్‌ గోల్వాల్కర్‌ తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” (ఆలోచనల గుత్తి ) అనే పుస్తకంలో దేశ అంతర్గత శత్రువులలో క్రైస్తవులు ఒకరు అని సెలవిచ్చారు. నరేంద్రమోడీ వంటి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకులు అవసరమైతే భగవద్గీతను పక్కన పెట్టి గోల్వాల్కర్‌ రచనను ప్రమాణంగా తీసుకొని పాటిస్తారన్నది తెలిసిందే. మరి ఇప్పుడు తమ గురువును పక్కన పెట్టి మోడీ చర్చికి వెళ్లి సామరస్యత గురించి సుభాషితం పలకటాన్ని చూసి దెయ్యాలు వేదాలను వల్లించినట్లుగా భావిస్తున్నారు.


గతంలో చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా చర్చికి వెళ్లి ఉంటే మంచిదే, ఇది అదేనా ? రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా, మరోదారిలో వెళుతుందా ? అని పినరయి విజయన్‌ ప్రశ్నించారు. బిజెపి నేతలు కేరళలోని బిషప్పుల ఇళ్లను సందర్శిస్తున్నారు. కేరళ వెలుపల క్రైస్తవుల మీద వేటసాగిస్తున్నారు. ఇక్కడ వారు అలాంటి వైఖరి తీసుకోలేరు, సంఘపరివార్‌కు ఇక్కడ మైనారిటీల మీద ఏదైనా ప్రత్యేక ప్రేమ ఉందా ? ఇక్కడ గనుక మతతత్వ వైఖరి తీసుకొని మతఘర్షణలను సృష్టిస్తే ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంటుంది, దీనిలో ఎలాంటి రాజీలేదు అని స్పష్టం చేశారు. సంఘపరివార్‌ అసలు రంగేమిటో జనం చూస్తున్నారు, క్రైస్తవ సమాజానికి తాము దగ్గర అవుతున్నట్లు చూపేందుకు నానా తంటాలు పడుతున్నారు. కేరళలో పాగా వేసేందుకు తమ పుస్తకంలోని అని జిమ్మిక్కులను ప్రయోగిస్తున్నారు అన్నారు. కేరళ టూరిజం మంత్రి మహమ్మద్‌ రియాజ్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియన్‌ మిషినరీ గ్రాహమ్‌ స్టెయిన్‌, అతని కుమారులు ఫిలిప్‌,తిమోతీలను సజీవ దహనం చేయటాన్ని సంఘపరివార్‌ ఇప్పటికీ సమర్ధిస్తున్నది అన్నారు.భజరంగ్‌ దళ్‌కు చెందిన దారా సింగ్‌కు కోర్టు శిక్ష విధించింది. అతను బిజెపిలో కూడా పని చేశాడు.కనీసం 89 మంది పాస్టర్ల మీద దాడులు, 68 చర్చ్‌ల విధ్వంసం, ప్రార్ధనల మీద దాడులు జరిగినట్లు కూడా రియాజ్‌ చెప్పారు. ఇవన్నీ ఒక పథకం ప్రకారం బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ పుస్తకంలో చెప్పిన భావజాలం మేరకే జరిగాయన్నారు. గత రెండు సంవత్సరాల్లో క్రైస్తవుల మీద జరిగిన దాడులకు సంబంధించి వెయ్యికిపైగా కేసుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరమ్‌(యుసిఎఫ్‌) వెల్లడించింది. నరేంద్రమోడీ చర్చ్‌ సందర్శన తరువాత అలాంటి దాడులు ఆగిపోతాయనే ఆశ క్రైస్తవుల్లో కలిగిందని క్రైస్తవ వార్తా సంస్థ యుసిఏ పేర్కొన్నది.హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ నేత 2014లో ప్రధాని అయిన తరువాత తొలిసారి చర్చిని సందర్శించినట్లు కూడా పేర్కొన్నది. ఇరవై ఐదు నిమిషాల పాటు నరేంద్రమోడీ చర్చిలో గడిపారు.


ఈస్టర్‌ ఆదివారం నాడు భారత ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఒక కాథలిక్‌ చర్చిని అసాధారణంగా సందర్శించారని క్రిస్టియన్‌ పోస్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. మైనారిటీ సామాజిక తరగతుల మీద దాడులకు పేరుమోసిన హిందూ జాతీయవాద పార్టీ నేత క్రైస్తవ ఓటర్లకు దగ్గరయేందుకు చూశారని అన్నది. ఢిల్లీ మైనారిటీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఏసి మైఖేల్‌ మోడీ సందర్శన సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. క్రైస్తవుల మీద హింసాత్మక దాడులు 2014లో వంద ఉంటే 2022 నాటికి ఆరువందలకు పెరిగినట్లు పేర్కొన్నారు.ఈ ఏడాది తొలి వంద రోజుల్లోనే 200 ఉదంతాలు జరిగినట్లు వెల్లడించారు. దేశమంతటా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల వివరాలను సమర్పించాలని 2022 సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి సుప్రీం కోర్టు పదే అడిగినా ఇప్పటి వరకు మూడుసార్లు గడువును పెంచాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారనే సాకుతో దాడులు జరుపుతున్నారని, బలవంతపు మతమార్పిడులకు తగిన ఆధారాలు దొరక్కపోవటమే దీనికి కారణమని అన్నారు. క్రైస్తవుల మీద దాడులు, వేధింపుల్లో భారత్‌ ప్రపంచంలోని అరవై దేశాల్లో పదవ స్థానంలో ఉందని అమెరికాకు చెందిన ఓపెన్‌ డోర్స్‌ అనే సంస్థ తన నివేదికలో పేర్కొన్నది.హిందూ ఉగ్రవాదులు దేశంలో క్రైస్తవులు, ఇతర మైనారిటీలను లేకుండా చేసి దేశాన్ని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారని కూడా చెప్పింది.
సంఘపరివార్‌కు చెందిన వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు, ప్రకటనలు చేయటంలో పేరుమోశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ రామేశ్వర శర్మ ఛాదర్‌ ముక్త్‌ – ఫాదర్‌ ముక్త్‌ (ముస్లిం, క్రైస్తవ పూజారులు) భారత్‌ కావాలని బహిరంగంగా చెప్పారు. దేశంలో చత్తీస్‌ఘర్‌ క్రైస్తవ విద్వేష ప్రయోగశాలగా మారింది. హిందువులు గొడ్డళ్లు ధరించి మతమార్పిడులకు పాల్పడుతున్న క్రైస్తవులకు బుద్ది చెప్పాలని ఆ రాష్ట్రానికి చెందిన పరమాత్మానంద మహరాజ్‌ పిలుపునిచ్చారు. ఆ సభలో బిజెపి నేతలు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని అదుపు చేయకుండా తాము మారినట్లు మైనారిటీలను నమ్మించేందుకు, సంతుష్టీకరించేందుకు బిజెపి నానా పాట్లు పడుతున్నది. కేరళ, క్రైస్తవులు ఉన్న ఇతర ప్రాంతాల్లో బీఫ్‌కు అనుకూలంగా మాట్లాడటమే కాదు, నాణ్యమైన మాంసాన్ని అందిస్తామని కూడా వాగ్దానం చేసిన పెద్దలు ఉన్నారు. కేరళలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సిఎం ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ ఆంటోనిని బిజెపి ఆకర్షించింది. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం ఏకె ఆంటోనీ ప్రభావమే పెద్దగా లేదు, అలాంటిది కొడుకు బిజెపిలో చేరి ఆ పార్టీని ఉద్దరిస్తారన్నది ఆ పార్టీ పేరాశతప్ప మరొకటి కాదు. తనకు 82 సంవత్సరాలని జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆంటోని చెప్పారు. తన కుమారుడు బిజెపిలో చేరటం బాధాకరమన్నారు.రబ్బరు మద్దతు ధరలను పెంచితే కేరళ క్రైస్తవులు మొత్తం బిజెపికి మద్దతుదార్లుగా మారతారని ఒక మతాధికారి గతంలో ప్రకటించారు. కానీ కేంద్రం వైపు నుంచి అలాంటి సూచనలేమీ లేవు.


నరేంద్రమోడీ చర్చి సందర్శన ఆటతీరునే మార్చివేస్తుందని కేరళ బిజెపి నేతలు సంబరపడిపోతున్నారు. తిరువనంతపురంలో జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో జరిపిన సమీక్షలో ఒకప్పుడు కేరళ కాంగ్రెస్‌ పక్షాలు పొందిన ప్రజామద్దతు ఇంకే మాత్రం వాటికి ఉండదని భావించినట్లు వార్తలు. పినరయి విజయన్‌ ముస్లిం సామాజిక తరగతుల్లోకి చొచ్చుకుపోయినట్లుగా తాము క్రైస్తవుల్లో చోటు సంపాదించినట్లు ఇంటింటికి తిరిగినపుడు వెల్లడైందని, చర్చి పెద్దలు కూడా సానుకూల సంకేతాలను పంపినట్లు వారు భావిస్తున్నట్లు ఒక పత్రిక రాసింది. తిరువనంతపురం, త్రిసూర్‌ జిల్లాల్లో క్రైస్తవులు గణనీయంగా ఉన్నారని ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు తమకు అనుకూలంగా ఉన్నట్లు , క్రైస్తవులు ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నట్లు, వచ్చే రోజుల్లో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని బిజెపి నేతలు అంచనా వేసుకుంటున్నారు. చర్చ్‌ల మీద దాడులు జరుపుతున్నది కొందరు వ్యక్తులని, వారికి ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపితో సంబంధం లేదని అనేక మంది గుర్తిస్తున్నారని, ఉగ్రవాద హిందూత్వ గ్రూపులకు చెందిన వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు బిజెపి నేతలు చెప్పుకున్నారు.తమను కేవలం మైనారిటీ మోర్చాల్లో కాకుండా బిజెపి, ఇతర ప్రధాన సంస్థల్లో భాగస్వాములుగా చేయాలని క్రైస్తవులు కోరినట్లు, తిరువనంతపురంలో ఒక లక్ష ఈస్టర్‌ శుభాకాంక్షల కార్డులను ముద్రించగా డిమాండ్‌ పెరగటంతో మరో 50వేలు అదనంగా ముద్రించాల్సి వచ్చిందని బిజెపి నేతలు సమావేశంలో చెప్పుకున్నారు.


క్రైస్తవులతో పాటు పసమండా ముస్లింలను కూడా ఆకర్షించేందుకు బిజెపి పూనుకుంది. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా ముస్లింలను నిలపని బిజెపి ఉత్తర ప్రదేశ్‌లో నలుగురు ప్రముఖులను శాసనమండలికి నామినేట్‌ చేసింది. హిందూత్వ పేరుతో జనాన్ని సమీకరించాలని చూసిన బిజెపి కొంత మేరకు సఫలీకృతమై కేంద్రంలో అధికారానికి వచ్చింది.ఇదే సమయంలో అటు సూర్యుడు ఇటు పొడిచినా మొత్తం హిందువులందరూ బిజెపి వెనుక సమీకృతులు కారని తేలిపోయింది. మరోవైపు తొమ్మిదేండ్ల బిజెపి పాలన వైఫల్యాలమయంగా మారింది. ఈ నేపధ్యంలో అధికారాన్ని నిలుపుకొనేందుకు మైనారిటీల సంతుష్టీకరణ తప్ప మరొక మార్గం లేదని భావించి లేదా ప్రపంచంలో హిందూమతోన్మాదశక్తిగా కనిపించకుండా మేకతోలు కప్పుకొనేందుకు గానీ బిజెపి కొత్త ఎత్తులు వేస్తోంది, కొత్త రాగాలు పలుకుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండు డిగ్రీల అసలు కతేంటి : ఏకత, శీలము కబుర్లు జనానికేనా ! నోరు విప్పరేం అంటున్న నరేంద్రమోడీ భక్తులు !

04 Tuesday Apr 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, Education, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Arvind Kejriwal, BJP, Modi’s Educational Qualifications, Modi’s Two Degrees, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీకి రెండు డిగ్రీలు ఉన్నాయట, అవి నకిలీవని కొందరంటున్నారు. అయితే ఏమిటటా ? ఈ దేశంలో వివాదం కానిది ఏముంది ! కొందరికి ప్రతిదాన్నీ రచ్చ చేయకపోతే నిదుర పట్టదు. ఇదీ అంతే, మోడీ నిజం, మోడీ పాలన నిజం, ప్రపంచంలోని పలు దేశాల నేతలతో పోలిస్తే జనాదరణలో మోడీకి 76శాతం మంది నీరాజనం పడుతున్నట్లు తాజాగా ఒక అమెరికా సంస్థ మోర్నింగ్‌ కన్సల్ట్‌ వెల్లడించింది చూడలేదా ! చూడకేం, మనల్ని విమర్శిస్తేనేమో చూడండి విదేశీ సంస్థలు మన జాతీయవాదుల మీద ఎలా దాడి చేస్తున్నాయో అంటారు. పొగిడితేనేమో చూడండి ఆహా విదేశాల వారే మనల్ని పొగుడుతుంటే మన దేశంలోని వారు ఎలా విమర్శిస్తున్నారో అని కూడా రుసరుసలాడతారు. అంటే మాకు రెండు నాలికలు ఉన్నాయంటున్నారా ? రామ రామ అలా అని బతకటమే, ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి(డు) అన్నారు కదండీ. చర్చలు ఇలా సాగుతున్నాయి. కనుక ఇప్పుడు ప్రధాని రెండు డిగ్రీలు, రెండు భారత్‌లు, ఇతర అంశాల గురించి చూద్దాం !


నరేంద్రమోడీ రెండు డిగ్రీల వివాదం గురించి మీడియాలో, రాజకీయనేతల ప్రకటనల్లో చర్చ జరుగుతోంది.వీటిని ఎందరు విద్యావంతులు పట్టించుకున్నారు, అసలు పట్టించుకోని వారు ఎందరు ? ఒకటి మాత్రం చేదు నిజం, అదేమిటంటే పట్టించుకొనేది ఒక చిన్న భారత్‌, అసలు దాని జోలికి వెళ్లనిది పెద్ద భారతం. అందుకే కొందరు ఏం చెప్పినా తాత్కాలికంగానైనా సాగుతోంది. అసలు వివాదం ఏమిటి ? దేశంలో అనేక మంది దొంగ డిగ్రీలు సమర్పించి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరే వారి గురించి తెలిసిందే. నరేంద్రమోడీ చిన్న తనంలోనే టీ అమ్ముతూ తండ్రికి తోడ్పడినట్లు చెప్పారు గనుక చదువు కోలేదు. అనేక మంది కాలేజీకి వెళ్లకుండానే దూరవిద్య ద్వారా పరీక్షలు రాసి డిగ్రీలు పొందారు. వారిలో తాను ఒకరిని అని మోడీ చెప్పారు. ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌కు నరేంద్రమోడీ ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించిన డిగ్రీల మీద అనుమానం వచ్చింది. అదేమీ నేరం కాదు.సమాచార హక్కు చట్టం కింద మోడీ గారు ఢిల్లీ, గుజరాత్‌ విశ్వవిద్యాలయాల నుంచి పొందిన డిగ్రీలకు సంబంధించి ఏ రోల్‌ నంబరు, ఏ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిందీ వివరాలు కావాలని అడిగారు. కేంద్ర సమాచార కమిషన్‌ దానికి స్పందించి ఆ వివరాలు సమర్పించాలని ప్రధాని కార్యాలయాన్ని కోరింది.తద్వారా జనాలకు వాటి గురించి తెలుసుకోవటానికి సాయపడుతుందని కూడా పేర్కొన్నది. కేజరీవాల్‌ మాదిరే అనేక మంది సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు అడిగితే ప్రధాని కార్యాలయం, విశ్వవిద్యాలయాలు కూడా తిరస్కరించాయి. నరేంద్రమోడీ డిగ్రీలు దేశ రక్షణకు సంబంధించిన అంశాలు కనుక వాటిని వెల్లడించకూడదని చెప్పి ఉంటే అసలు గొడవే ఉండేది కాదు.అలాంటి అంశాలకు సమాచార హక్కుచట్టం వర్తించదు. తన ఎన్నికల అఫిడవిట్‌లో నరేంద్రమోడీ తాను దూరవిద్యద్వారా 1978లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి 1983లో ఎంఎ పట్టా పొందినట్లు పేర్కొన్నారు. కనుక అవి దేశ రహస్యాలు కాదు.


ఫలానా పదవికి ఫలానా విద్యార్హత ఉండాలని రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టంలో గానీ నిర్దేశించలేదు కదా మరి మోడీ డిగ్రీల గురించి ఇంత రచ్చ ఎందుకు అని సందేహం రావచ్చు.నాది వానాకాలం చదువు అని మోడీ రాసి ఉంటే గొడవ ఉండకపోను.తప్పుడు సమాచారమిచ్చారన్నదే అరోపణ.డిగ్రీ ఉంటే చూపాలి, లేకుంటే ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు గనుక అది అనర్హత కిందికి వస్తుంది. మోడీ గుజరాత్‌ అసెంబ్లీకి పోటీ చేసినపుడు తాను అవివాహితుడనని అఫిడవిట్లలో పేర్కొన్నారు.కానీ 2014 లోక్‌సభ ఎన్నికలపుడు తాను యశోదాబెన్‌ అనే ఆమెను వివాహం చేసుకున్నట్లు రాశారు. జాతికి ఏకత, శీలము నేర్పుతామని చెప్పుకొనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పని చేసిన మోడీ నిజాలను దాచవచ్చా ? వివాహం గురించే నిజాలు దాచారు గనుక డిగ్రీల గురించి కూడా అనుమానం తలెత్తింది.అది పెనుభూతం అవుతోంది.ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ చెప్పుకోవాలి. కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అసలేం చదివారో తెలీదు గానీ ఆమె పెద్ద చదువులు చదువుకున్న వారికి మార్గదర్శకత్వం వహించే మానవవనరుల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. పూర్తిగా రాజకీశాస్త్ర పాఠాలే చదివి ఎంఎ డిగ్రీ చదివినట్లు చెప్పిన ప్రధాని అనేక మందికి పెద్ద ఆర్థికవేత్తగా కనిపిస్తారు. అందుకే మోడినోమిక్స్‌ అనే పదం ప్రచారంలోకి వచ్చింది. అదంతా వైఫల్యాల మయం అని విమర్శకులు అనవచ్చు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ప్రజాస్వామ్య గొప్పదనం అది.


స్మృతి ఇరానీ ఒక ఎన్నికల అఫిడవిట్‌లో తాను 1996లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కరస్పాండెన్స్‌ కోర్సు ద్వారా బిఏ డిగ్రీ పొందినట్లు రాశారు.మరొక ఎన్నికలో బికాం డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొన్నారు.2014లో కేంద్ర మంత్రిగా ఉండగా తాను అమెరికాలోని ఏలే విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందినట్లు చెప్పారు.2017లో ఆమె డిగ్రీ గురించి సమాచారహక్కు కింద అడగ్గా వెల్లడించవద్దని ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని కోరారు.ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసును కొట్టివేశారు.చివరకు విధిలేక 2019లో తనకు డిగ్రీ లేదని ఆమె అంగీకరించారు. అసలింతకీ ఆమె ఏలే కథ ఎలా చెప్పారంటే 2013లో భారత్‌ నుంచి వెళ్లిన పదిమంది ఎంపీల బృందంలో ఆమె ఒకరు. సదరు సంస్థలో ఆరు రోజుల పాటు నాయకత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి వాటికి హాజరైతే సర్టిఫికెట్లు ఇస్తారు. దాన్నే డిగ్రీగా బుకాయించేందుకు చూశారు. ఇక ప్రధాన కథలోకి వస్తే ఎవరెలాంటి సమాధానాలిచ్చారో చూద్దాం. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఒక దరఖాస్తుకు ప్రధాని కార్యాలయం ” ప్రధాని విద్యార్హతల వివరాలు ప్రధాని కార్యాలయ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.మీ ప్రధాని గురించి తెలుసుకోండి అన్నదానిలో దొరుకుతాయి.కోరిన సమాచారం కావాలంటే ఎన్నికల కమిషన్ను అడగండి ” అని సమాధానం చెప్పింది. దానికి ఇసి ఏమి చెప్పిందంటే ఈ సమాచారం మా వద్దలేదని, సిసిఐ.ఎన్‌ఐసి.ఇన్‌లో అభ్యర్ధుల అఫిడవిట్లు అన్న విభాగంలో చూడవచ్చు అని పేర్కొన్నది. మోడీ ఎంఎ డిగ్రీ గురించి సమాచారం అడిగితే గుజరాత్‌ విశ్వవిద్యాలయం ఒక్క ముక్కలో ” ఆర్‌టిఐ చట్టం 2005 ప్రకారం ఈ సమాచారాన్ని బహిర్గతపరచకూడదు ” అని జవాబిచ్చింది.


మోడీ డిగ్రీల వ్యవహారం మరో మలుపు తిరిగింది.తమకు కావాల్సిన సమాచారం ఇవ్వలేదంటూ కమిషన్‌ అప్పిలేట్‌ అధికారులకు దరఖాస్తు చేశారు. దాన్ని విచారించిన కమిటీ ఏం చెప్పిందటే ” ప్రజా సంబంధ అధికార వ్యవస్థ తమ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఆఫీసు రికార్డులో లేనిదాన్ని ఇవ్వలేరు. ప్రధాని కార్యాలయం కూడా అదే వివరాలను ఇవ్వాలనటం సరైంది కాదు.సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 2(జె) ప్రకారం ఈ సమాచారాన్ని ప్రధాని కార్యాలయ విడుదల చేయనవసరం లేదు. ప్రధాన మంత్రి కావటానికి కనీస అర్హతలను నిర్వచించలేదు గనుక మోడీ డిగ్రీల గురించిన వివరాలను ప్రధాని కార్యాలయం కలిగి ఉండాల్సిన అవసరం లేదు ” అని పేర్కొన్నది. అడిగిన సమాచారం సాధారణంగా ఉందని, రోల్‌ నంబరు లేకుండా తాము ఎలాంటి సమాచారం ఇవ్వలేమని ఢిల్లీ విశ్వవిద్యాలయం చేసిన వాదనను అంగీకరించింది. ఈ పరిణామం తరువాత అరవింద్‌ కేజరీవాల్‌ కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులకు లేఖ రాశారు. దాన్నే సమాచార హక్కు దరఖాస్తుగా పరిగణించి నరేంద్రమోడీ డిగ్రీల రోల్‌ నంబర్లు అందచేస్తే వివరాలను తెలుసుకోవచ్చునంటూ ప్రధాని కార్యాలయాన్ని శ్రీధర్‌ కోరారు.


రెండు విశ్వవిద్యాలయాలు కూడా నరేంద్రమోడీకి ఎలాంటి డిగ్రీలు ఇవ్వలేదని చెబితే ఏమౌతుంది ? ప్రస్తుతం ఉన్న శిక్షాస్మృతి లోని సెక్షన్‌ 191 ప్రకారం ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇవ్వటం నేరపూరితమైన తప్పిదం. దానికి శిక్ష ఏమిటో స్పష్టంగా లేదు. ప్రజాస్వామిక సంస్కరణల కోసం పనిచేసే సంస్థ(ఏడిఆర్‌) 1999లో వేసిన ప్రజాప్రయోజన దావా, తరువాత కోర్టులు ఇచ్చిన తీర్పులతో ఎన్నికల్లో పోటీ చేసే వారు తమ నేర, ఆర్థిక, విద్యకు సంబంధించిన వివరాలను నామినేషన్‌ పత్రాల్లో విధిగా సమర్పించాలి. వాటిలో అక్రమాలుంటే నేరపూరితం అవుతుంది. ఈ వివరాలు వాస్తవమా కాదా అన్నది ఎన్నికల కమిషన్‌ విచారించదు, తప్పని తేలినా శిక్షించే అధికారం దానికి లేదు. అందుకే కోర్టులకు వెళుతున్నారు. అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలను ఇంటిలిజెన్సీ సంస్థల ద్వారా తనిఖీ చేయించవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. అలా చేయ కూడదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. స్వల్పకాలంలో తనిఖీ చేసే అవకాశం లేదని ఎన్నికల కమిషన్‌ కూడా పేర్కొన్నది. తరువాత కనీసం గెలిచిన వారి వివరాలను ఆరు నెలల్లో తనిఖీ చేయించాలని ఏడిఆర్‌ కోరినా ఎన్నికల కమిషన్‌ పట్టించుకోవటం లేదు, అఫిడవిట్లన్నీ ఆదాయపన్ను శాఖకు పంపుతున్నామని మాత్రమే చెప్పింది, ఐటి శాఖ చేస్తున్నదేమీ లేదు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన వివాహ స్థితి గురించి నరేంద్రమోడీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ సునీల్‌ సరవాగి దాఖలు చేసిన పిటీషన్‌పై 2013లో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ ఎన్నికల కమిషన్‌ కోరిన వివరాలను ఇవ్వని వారి నామినేషన్లను తిరస్కరించాలని పేర్కొన్నది. దాంతో విధిలేక నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో తనకు యశోదాబెన్‌తో వివాహం జరిగినట్లు నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనవలసి వచ్చింది. క్రమశిక్షణకు మారుపేరు సంఘపరివార్‌ అని చెప్పుకొనే వారు కూడా కోర్టు ఆదేశిస్తే తప్ప నిజాలు చెప్పరన్నమాట !


ప్రజాస్వామిక వ్యవస్థలను పటిష్ట పరుస్తామని చెప్పుకొనే బిజెపి, కేంద్ర ప్రభుత్వం లా కమిషన్‌ చేసిన ఒక చక్కటి సిఫార్సును పక్కన పడేశాయి. తప్పుడు అఫిడవిట్లు ఇస్తే అనర్హత వేటు వేయాలని, ఇప్పుడున్న ఆరు నెలల శిక్షను రెండు సంవత్సరాలకు పెంచాలని, ఈ కేసులను రోజు వారీ విచారించాలని, నామినేషన్ల దాఖలు ఆఖరి గడువుకు తనిఖీకి వారం రోజుల వ్యవధి ఉంటే ఎవరైనా తప్పుడు సమాచారమిస్తే వాటి మీద అభ్యంతరాలు దాఖలు చేసేందుకు తగినంత వ్యవధి ఉంటుందని చెప్పింది. కానీ గత తొమ్మిదేండ్లుగా మోడీ సర్కార్‌ పట్టించుకోలేదు, అలాంటి ఆలోచనలో ఉన్నట్లు కూడా కనిపించటం లేదు. ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ డిగ్రీల గురించి వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది, అనేక అనుమానాలకు తెరలేపింది. ఏడు సంవత్సరాల క్రితం కేంద్ర సమాచార కమిషన్‌ ఇచ్చిన ఆదేశానికి సంబంధించిన ఉదంతంలో నరేంద్రమోడీ డిగ్రీ వివరాలను ఢిల్లీ సిఎం కేజరీవాల్‌కు అందచేయాలని గుజరాత్‌ విశ్వవిద్యాలయాన్ని కోరటం చెల్లదని గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పటమే కాదు కేజరీవాల్‌ రు.25వేల జరిమానా కూడా విధించింది. దీని మీద కేజరీవాల్‌ ధ్వజమెత్తారు. మోడీ డిగ్రీల మీద అనుమానాలను పెంచిందన్నారు. తమ సంస్థలలో మోడీ డిగ్రీలు పొందినందుకు పండగ చేసుకోవాల్సిన గుజరాత్‌ లేదా ఢిల్లీ విశ్వవిద్యాలయాలు సమాచారాన్ని దాచేందుకు చూస్తున్నాయన్నారు.


ఇక గుజరాత్‌ హైకోర్టులో కేసుకు సంబంధించి వాదనలను చూద్దాం. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌(సిఐసి) ఉత్తరువులు జారీ చేశారు.కేజరీవాల్‌ ఎన్నికల గుర్తింపు కార్డు మీద వచ్చిన దరఖాస్తును పరిష్కరించకుండానే తమకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నది.తన వివరాలు అందచేసేందుకు సిద్దమేనని, మోడీ డిగ్రీ వివరాలను కూడా సమర్పించాలని కమిషన్‌ అడగాలని కేజరీవాల్‌ కమిషన్‌ ముందు వాదించారు. తమ దగ్గర ఉన్న రికార్డులను పరిశీలించామని నరేంద్రమోడీ పొందిన 1978 డిగ్రీ వాస్తవమైనదేనని ఢిల్లీ విశ్వవిద్యాయం వాదించింది. ఆ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించాలన్న సిఐసి ఉత్తరువును 2017లో ఢిల్లీ కోర్టులో సవాలు చేసింది. ఆ కేసు ఇంకా తేలలేదు. గుజరాత్‌ విశ్వవిద్యాలయం తరఫున గుజరాత్‌ హైకోర్టులో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు.ప్రత్యర్ధుల మీద క్షక్ష తీర్చుకొనేందుకు సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేయటం పిల్లచేష్టలన్నారు.విశ్వవిద్యాలయం మోడీ డిగ్రీని బహిరంగంగా అందుబాటులో ఉంచిందన్నారు.ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్‌ 8(1) జె ప్రకారం వివరాలను వెల్లడించనవసరం లేదన్నారు. ఏదైనా బహిరంగ కార్యకలాపం లేదా ప్రజాప్రయోజనం కాని లేనపుడు, ఒక వ్యక్తి గోప్యతలో అనవసరంగా చొరబడినపుడు, సమాచార వెల్లడిద్వారా విస్తృత ప్రజాప్రయోజనం కలుగుతుందని సబంధిత అధికారులు సంతృప్తి చెందితే తప్ప సమాచారం పొందలేరు.విశ్వవిద్యాలయం విశ్వాసపాత్రను పోషించేదిగా ఉన్నందున చట్టంలోని పై సెక్షన్‌ ప్రకారం సమాచారం ఇవ్వనవసరం లేదు అని వాదించారు.దాన్ని గుజరాత్‌ హైకోర్టు అంగీకరించింది.


” కొంత మంది జనాలు గౌరవనీయ ప్రధాని డిగ్రీలు నకిలీవని అంటున్నారు. పూర్తి రాజకీయ శాస్త్రంలో మోడీ పొందిన డిగ్రీ చారిత్రాత్మకమైనది, విప్లవాత్మకమైనదని నేను నిజంగా నమ్ముతున్నాను. కనుక దానిని కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవన ప్రధాన ప్రవేశద్వారం వద్ద ప్రదర్శించాలి, తద్వారా దాని గురించి సందేహాలు లేవనెత్తే వారి నోళ్లను మూయించవచ్చని శివసేన(ఉద్దావ్‌ థాకరే) నేత సంజయ రౌత్‌ అన్నారు.డిగ్రీలు నకిలీవని తేలితే ఉన్న లోక్‌సభ్యత్వం రద్దవుతుంది, వచ్చే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉండదని ఆప్‌ ఎంపీ సంజయ సింగ్‌ అన్నారు. నరేంద్రమోడీ పొందిన డిగ్రీలంటూ బిజెపి నేతలు గతంలో ప్రదర్శించిన కాపీలలో రోల్‌ నంబరు గానీ, తండ్రిపేరు గానీ లేదు. అందువలన అవి నకిలీ అని అనేక మంది భావిస్తున్నారు.1978లో డిగ్రీలను చేతిరాత ద్వారా జారీచేసేవారు. కానీ బిజెపి నేతలు చూపిన వాటిని కంప్యూటర్‌ అక్షరాలతో ప్రచురించినట్లుగా ఉంది.1994లో ఆ అక్షరాలకు మైక్రోసాప్ట్‌ పేటెంట్‌ హక్కు పొందింది. అలాంటిది 1978 డిగ్రీలో ఎలా ముద్రించారన్నది ప్రశ్న. అవీ తప్పుల తడకలు. ఎంఏ మొదటి భాగంలో నరేంద్రకుమార్‌ దామోదరదాస్‌ మోడీ అని ఉంటే రెండవ భాగంలో నరేంద్ర దామోదర్‌దాస్‌ మోడీ అని ఉంది.
ఇంత రచ్చ జరుగుతున్నా నరేంద్రమోడీ నోరు మెదపటం లేదు. నిబంధనలకు భాష్యం,వాటిని కోర్టు ఆమోదించటం ద్వారా రక్షణ పొందుతున్నట్లుగా కనిపిస్తున్నది. అనేక మంది మోడీ భక్తులకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. నిందల పాలైన సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి పునీతగా వెలికివచ్చినట్లుగా నరేంద్రమోడీ కూడా వాస్తవాలు చెప్పి విమర్శకుల నోళ్లు ఎందుకు మూయించటం లేదని వారిలో వారు మధనపడుతున్నారు. కోర్టులు, నిబంధనలు ఎలా ఉన్నా నైతిక బాధ్యతగా ఎందుకు వెల్లడించరు,ఎందుకు పిరికిబారుతున్నారు అన్నది ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏ గూట్లో ఉంటే ఆ గూటి పలుకే అన్న నటి కుష్‌బూ – మోడీలపై జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్న సంధించిన ప్రకాష్‌ రాజ్‌ !

26 Sunday Mar 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, CM Adityanath, Hate-Speech, J P Nadda, Kushboo Sunder, Narendra Modi Failures, Prakash Raj, Rahul gandhi, RSS


ఎం కోటేశ్వరరావు


మాజీ హీరోయిన్‌ కుష్‌బూ తన పార్టీ బిజెపి నేతలను మెప్పించేందుకు తంటాలు పడ్డారు. గతంలో తాను కాంగ్రెస్‌ ప్రతినిధిగా మాట్లాడిన మాటలు పార్టీ నేతలవే తప్ప తనవి కాదని, అందువలన వాటిని ఇప్పుడు తాను వెనక్కు తీసుకోవాలను కోవటం లేదని చెప్పారు. మోడీలపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూరత్‌ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించటం, వెంటనే లోక్‌సభ సచివాలయం రంగంలోకి దిగి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయటం తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా కాంగ్రెస్‌ నేతలు గతంలో కుష్‌బూ కూడా రాహుల్‌ మాదిరి వ్యాఖ్యలు చేశారని, ఆమె ఇప్పుడు బిజెపిలో ఉన్నారని గుర్తు చేశారు. వాటి మీద కుషఉ్బ మండి పడ్డారు. ఆమె ప్రస్తుతం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, జాతీయ మహిళా కమిషన్‌ మెంబర్‌గా ఉన్నారు. 2018 ఫిబ్రవరి 15న కాంగ్రెస్‌ ప్రతినిధిగా కుష్‌బూ చేసిన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. ” ఇక్కడ మోడీ, అక్కడ మోడీ, ఎక్కడ చూస్తే అక్కడ మోడీ… లేకపోతే ఏమిటి ? మోడీ అనే పదానికి ముందు అవినీతి పరుల పేర్లు ఉంటున్నాయి.దాని అర్ధం తెలియటం లేదు. కనుక మోడీ అంటే అవినీతి పరులని అర్ధం మార్చుదాం. నీరవ్‌, లలిత్‌, నమో అంటే అవినీతి పరులంటే తగినట్లుగా ఉంటుంది.” అని ఉంది.


దీని గురించి కుష్‌బూ పిటిఐ విలేకరితో మాట్లాడుతూ ” నేను కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఒక కాంగ్రెస్‌ ప్రతినిధిగా నా బాధ్యత మాత్రమే నిర్వహించాను. అలాంటి భాషలోనే మేము మాట్లాడాల్సి ఉండేది, నేను సరిగ్గా అదే చేశాను. నేను పార్టీ నేతను అనుసరించాను.ఇది అతని భాష. కాంగ్రెస్‌ పార్టీ ఎంత తెంపరితనంతో ఉందో చూపటమే కాదు, ఈ అంశాన్ని లేవనెత్తటం ద్వారా వారి అమాయకత్వం ఏ స్థాయిలో ఉందో కూడా వెల్లడిస్తున్నది. నా ఖాతా నుంచి నేను ఏ ఒక్క ట్వీట్‌ను కూడా తొలగించలేదు. ఇప్పుడు నేనా పని చేయను. నా పేరును ప్రస్తావించటం ద్వారా కాంగ్రెస్‌ నేతలు ఏం చేస్తున్నారు ? నన్ను రాహుల్‌ గాంధీతో సమానంగా చూస్తున్నారా ? మోడీలను దొంగలు అని పిలిచే స్థాయికి రాహుల్‌ గాంధీ దిగజారారు, నేను అవినీతి అనే పిలిచాను. తేడాను చూసే సామర్ధ్యం కాంగ్రెస్‌కు లేదు. కానీ వారికి దమ్ముంటే నా మీద కేసును దాఖలు చేయాలని సవాలు చేస్తున్నాను. చట్టపరంగా దాన్ని ఎదుర్కొంటాను. నేను నా ట్వీట్‌ను తొలగించను.అది అక్కడే ఉంది, ఇంకా అనేకం ఉన్నాయి. కాంగ్రెస్‌కు పని లేదు. మీ సమయాన్ని వెచ్చింది మరిన్ని ట్వీట్లను వెలికి తీయండి. ” అని. పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీతో తనను సమంగా చూసినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అని కుష్‌బూ ట్వీట్‌ చేశారు.


కుష్‌బూ రాజకీయ ప్రయాణం 2010లో డిఎంకెతో ప్రారంభమైంది. మరుసటి ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, 2014లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. తనకు పార్టీలో తగినంత గుర్తింపు ఇవ్వలేదంటూ అదే ఏడాది రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేదని ఆరోపించారు. తరువాత బిజెపిలో చేరారు.వందకు పైగా సినిమాల్లో నటించిన 52 సంవత్సరాల కుష్‌బూ గత పోకడలను బట్టి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేము. కాంగ్రెస్‌లో ఉన్నపుడు ఆ పార్టీ నేత భాషనే మాట్లాడాను తప్ప ఆ విమర్శలు తనవి కాదని చెప్పుకున్న కుష్‌బూ విశ్వసనీయత ఎంత అన్నది ప్రశ్న. బిజెపిలో చేరిన తరువాత ఆమె చెప్పిన మాటలు కూడా ఆ పార్టీ నేతకు అనుగుణంగా మాట్లాడినట్లు భావించాల్సి ఉంటుంది. అలా మాట్లాడాలని (కాంగ్రెస్‌లో ఉన్నపుడు అలా మాట్లాడాల్సి వచ్చేదని ఆమే చెప్పారు గనుక) బిజెపి నిర్దేశించి ఉంటుంది గనుక నరేంద్రమోడీని పొగుడుతూ కుషఉ్బ మాట్లాడారన్నది స్పష్టం. బిజెపిలో చేరటాన్ని ఖరారు చేసుకున్న తరువాత ఆమె ఏం మాట్లాడిందీ చూద్దాం.” పార్టీ నాకేమి చేస్తుంది అన్నదాన్ని గురించి నేనేమీ ఆశించటం లేదు. కానీ దేశ ప్రజలకు పార్టీ ఏమి చేస్తుందీ అని చూస్తాను.నూట ఇరవై ఎనిమిది కోట్ల మంది ఒక మనిషిని అదే మన ప్రధానిని నమ్ముతున్నారు. వారు చేస్తున్నది పూర్తిగా సరైనదే అని భావిస్తున్నాను.” అని ఎఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పారు. అధికార బిజెపిలో చేరే అవసరం కోసం తప్ప ఈ మాటలు నిజాయితీగా చెప్పినట్లు ఆధారం ఏమిటి ?


ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ రాహుల్‌ గాంధీ ఉదంతంపై తనదైన శైలిలో స్పందించి ఆదివారం నాడు ఒక ప్రశ్నను సంధించారు.తన ట్వీట్‌కు ఒక ఫొటోను జత చేశారు. దానిలో ఎడమవైపు లలిత్‌ మోడీ, మధ్యలో నరేంద్రమోడీ, కుడివైపున లలిత్‌ మోడీ చిత్రం ఉంది. అటూ ఇటూ ఉన్నవారు అక్రమాలకు పాల్పడి దేశం వదలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఫొటో పైన ” జనరల్‌ నాలెడ్జ్‌- ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏకైక అంశం ఏమిటి అని కేవలం అడుగుతున్నా అంతే ” అన్న వ్యాఖ్యను పెట్టారు. ముగ్గురి పేరులోనూ మోడీ ఉండటం అన్నది దాని భావం అని వేరే చెప్పనవసరం లేదు.” దొంగలందరికీ మోడీ అనే ఒకే ఇంటి పేరు ఎలా వచ్చింది ” అంటూ రాహుల్‌ గాంధీ కర్ణాటకలో ఒక ఎన్నికల సభలో అన్న మాటలు మోడీ కులం అంతటికీ పరువు నష్టం కలిగించినట్లు సూరత్‌ కోర్టులో బిజెపి నేత దాఖలు చేసిన కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడింది. మోడీ కులంతో సహా ఒబిసి లందరినీ రాహుల్‌ గాంధీ అవమానించారు అని బిజెపి ఒబిసిలను రెచ్చగొడుతూ ప్రచారం చేస్తున్నది. తెలుగు ప్రాంతాల్లో ఒకే ఇంటి పేరు కలిగిన వారు అన్ని కులాల్లో ఉన్నారు. ఒకే కులంలో అనేక ఇంటి పేర్లు గలవారు ఉన్నారు. ఒబిసిల్లో మోడీ అనే కులమే లేదు. నరేంద్రమోడీ తెలీ ఘంచీ లేదా మోధ్‌ ఘంచీ అనే కులానికి చెందిన వారు. కొన్ని చోట్ల ఘంచీ అని కూడా పిలుస్తారు.(ఈ పేరుతో ముస్లింలు కూడా ఉన్నారు) ఈ కులానికి చెందిన వారు నూనె గానుగ ఆడించటం, నూనెను అమ్మటం ప్రధాన వృత్తిగా చేస్తారు. వీరిని వైశ్యుల్లో ఒక ఉపకులంగా కూడా పరిగణిస్తారు. కర్ణాటకలో ఈ పని చేసే వారిని గనిగ అని పిలుస్తారు.ఇక అవినీతికి పాల్పడి దేశం వదలి పారిపోయిన నీరవ్‌ మోడీదీ నరేంద్రమోడీది ఒకే కులం, మతం కూడా కాదు. నీరవ్‌ మోడీ జైన మతంలో పాలంపూరీ జైన్స్‌ కులానికి చెందిన వ్యక్తి.లలిత్‌ మోడీ వెనుకబడిన కులానికి చెందిన వారు కాదు. బీహార్‌కు చెందిన బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోడీ వైశ్య, బిసి కాదు. గుజరాత్‌లో పార్వతికి మరో పేరు మోదేశ్వరీ దేవి. అందువలన గుజరాతీలు అనేక మంది ఆమె పేరు కలసి వచ్చేట్లుగా మోడీ అని అడా మగా అందరూ పెట్టుకుంటారు.


మోడీ ఇంటి పేరు గలవారిని అవమానపరిచినట్లు రాహుల్‌ గాంధీ మీద ధ్వజమెత్తుతున్న బిజెపి, సంఘపరివార్‌కు చెందిన వారు మొత్తం ముస్లిం సామాజిక తరగతినే ఉగ్రవాదులు అనే అర్ధం వచ్చేట్లు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ” ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు గానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే ” అంటున్నారా లేదా ?కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఒక సందర్భంగా మాట్లాడుతూ ” నేను ఒక సామాజిక తరగతిని నిందించటం లేదు గానీ ఉగ్రవాద చర్యలలో పట్టుబడిన వారందరూ ఒక సామాజిక తరగతికే చెందిన వారన్నది నిజం కాదా ? లౌకిక పార్టీలం అని చెప్పుకొనేవి ఎందుకు మౌనం పాటిస్తున్నట్లు ? ” అని ప్రశ్నించారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా 2022 మే ఆరవ తేదీన కోజికోడ్‌లో మాట్లాడుతూ ముస్లిం ఉగ్రవాదుల ఉత్పత్తి కేంద్రంగా కేరళ మారినట్లు మాట్లాడారు. ఇది మొత్తం కేరళనే అవమానించినట్లు కాదా ? దీన్లో పరువు నష్టం అంశం లేదా ? ఎవరైనా కేసు వేసినా లేకున్నా సూరత్‌ కోర్టు తీర్పు స్ఫూర్తితో నడ్డాను రాజ్యసభ సచివాలయం అనర్హుడిగా ప్రకటిస్తుందా ?


బిజెపిలో నోటి తుత్తర మనుషులు ఎక్కడ చూసినా కనిపిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న గిరిరాజ్‌ కిషోర్‌ ఒక సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ గనుక ఒక తెల్లమహిళను కాకుండా ఒక నైజీరియన్‌ మహిళను చేసుకొని ఉండి ఉంటే ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్‌ ఆమోదించి ఉండేదా అని ప్రశ్నించారు.నిజానికి ఇది ఒక్క నైజీరియన్‌ మహిళలనే కాదు, మొత్తం మహిళలను అవమానించినట్లు ? జాత్యహంకార ప్రదర్శన తప్ప మరొకటి కాదు. దీని గురించి తాము నిరసన తెలపటం లేదంటూ, ప్రధాని నరేంద్రమోడీ దీన్ని సరిచేయగలరని భావిస్తున్నట్లు మన దేశంలో నైజీరియన్‌ రాయబారి ఓబి ఓకోంగొర్‌ ఎంతో హుందాగా స్పందించాడు. కానీ నరేంద్రమోడీ సరి చేసినట్లు గానీ, గిరిరాజ్‌ సింగ్‌ తన ప్రకటనను సవరించుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు.ఈ పెద్దమనిషి నోటి నుంచి ఇలాంటి సుభాషితాలకు కొదవ లేదు. నరేంద్రమోడీని వ్యతిరేకించే వారందరూ పాకిస్తాన్‌ పోవాల్సిందే అని 2014 ఎన్నికల ప్రచారం సెలవిచ్చారు.కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత 2014 నవంబరులో నాడు సిఎంగా ఉన్న నితీష్‌ కుమార్‌ను విమర్శిస్తూ నరేంద్రమోడీని చూసి ఓర్చుకోలేక ”పల్లెటూరి ఆడదానిలా” పోట్లాడుతున్నట్లు వర్ణించారు. ఇది గ్రామీణ ప్రాంతాల మహిళలు అందరినీ అవమానించినట్లే కదా ! షహరాన్‌ పూర్‌లోని ముస్లిం మత కేంద్రం దారులు ఉలుం దేవబంద్‌ను ఉగ్రవాద దేవాలయం అని ఇదే మంత్రి వర్ణించారు. బాబరీ మసీదు భూమి కేసులో సుప్రీం కోర్టు తీర్పు వాయిదా వేసినపుడు మంత్రికి కోపం వచ్చింది.” ఈ వంద కోట్ల మంది హిందువులు కూడా మీ సోదరులే అని గుర్తించాలని ముస్లింలను కోరుతున్నాను. మీరు మూడు లక్షల మసీదులను ఏర్పాటు చేస్తే ఎవరూ అడ్డుకోలేదు. ఇప్పుడు హిందువుల సహనాన్ని పరీక్షించవద్దు.రాముడి మీద నాకు విశ్వాసం, ఆయన ఆలయాన్ని ఆయోధ్యలో నిర్మించాలి.హిందువుల విశ్వాసానికి రాముడు మూలం.దీన్ని హిందూ – ముస్లిం సమస్యగా మార్చాలని చూసింది.హిందువుల్లో సహనం నశిస్తున్నది” అని అన్నారు. హిందువేతరులందరూ అక్రమ సంతానమే అంటూ నోరు పారవేసుకున్న సాధ్వి నిరంజన గురించి తెలిసిందే. పాలకులుగా రాముడిని అనుసరించే వారు కావాలో అక్రమ సంతానానికి పుట్టిన వారు కావాలో తేల్చుకోవాలని 2014 ఎన్నికల సభలో మాట్లాడారు. ఆ మాటలను మోడీ తప్పు పట్టటంతో ఆమె క్షమాపణ చెప్పారు గానీ ఆమెకు కేంద్ర మంత్రిపదవి బహుమానంగా దక్కింది.


ఉగ్రవాదానికి సంబంధించి సౌత్‌ ఆసియన్‌ టెర్రరిజం పోర్టల్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం ఎవరి చేతుల్లో ఎందరు మరణించింది దిగువ విధంగా ఉంది. కాశ్మీర్‌ మరణాలను మొత్తంగా ఇస్లామిక్‌ ఉగ్రవాదుల ఖాతాలో వేసినా, మావోయిస్టు, ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదులందరూ హిందువులు, క్రైస్తవులే కదా ? వారిలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారన్నది తెలిసిందే.
సం××ఈశాన్య ××మావోయిస్టు×× కాశ్మీర్‌
2011 ×× 246 ×× 602 ×× 225
2012 ×× 326 ×× 367 ×× 206
2013 ×× 252 ×× 421 ×× 193
2014 ×× 465 ×× 314 ×× 193
ఈ వివరాలను చూసిన తరువాత ఎవరైనా ఉగ్రవాదులందరూ ఒక సామాజిక తరగతి లేదా ముస్లింలే అని ఎలా చెప్పగలరు ? ఉగ్రవాదానికి ముస్లిం మతానికి ముడి పెట్టి విశ్లేషణలు చేస్తున్నవారి సంగతేమిటి ? అనేక ముస్లిం దేశాల్లో ఉగ్రవాద చర్యలను ఎలా వర్ణిస్తారు ?


విద్వేషపూరిత ప్రసంగాలకు కాషాయదళాలు పెట్టింది పేరు. కొందరి నోళ్ల నుంచి వెలువడిన ఆ మాటలు పరువు తీసేవిగానూ, సమాజంలో కలతలు రేపేవిగానూ ఉన్నాయి. ఎందరి మీద కేసులు నమోదు చేశారు, ఎందరికి శిక్షలు వేసి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేశారు ? కోర్టులు కూడా తమంతట తాముగా తీసుకోవచ్చు, ఎన్ని ఉదంతాల్లో తీసుకున్నట్లు ? ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాధ్‌ 34 సందర్భాలలో ముస్లిం విద్వేష ప్రసంగాలు చేసినట్లు వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ నమోదు చేసి ప్రచురించింది. మధ్య ప్రదేశ్‌లో గడ్డం ఉన్న ఒక భవర్‌లాల్‌ జైన్‌ అనే వృద్దుడిని నువ్వు ముస్లిమ్‌వా, ఆధార్‌ కార్డుచూపమంటూ దాడి చేసిన బిజెపి నేత గురించి తెలిసిందే. తరువాత జైన్‌ శవం కనిపించింది. రావణుడ్ని దహనం చేసినట్లు ముస్లింలను కూడా చేయాలని బీహార్‌ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ బచువల్‌ చెప్పారు. వారికి ఓటింగ్‌ రద్దు చేయాలని రెండో తరగతి పౌరులుగా చూడాలన్నారు. బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్‌ అశ్వనీ ఉపాధ్యాయ ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు పోలీసు అరెస్టు చేస్తే తనను అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. చేసింది కేంద్ర ప్రభుత్వం కింద పని చేసే ఢిల్లీ పోలీసులు అని గమనించాలి. అతన్ని లాయర్‌గా పనికి రాడని ప్రకటించలేదు. ” ఏ హిందువైనా నాకు ఓటు వేయకపోతే వారి నరాల్లో మియా(ముస్లిం) రక్తం ఉన్నట్లే. అతను ఒక ద్రోహి. విద్రోహి జయ చంద్రుడికి పుట్టిన అక్రమ సంతానం.వాడి తండ్రి పాపపు కొడుకే.ఈ సారి నేను హెచ్చరిస్తున్నాను.హిందూ మత ద్రోహులను నాశనం చేస్తాం” ఈ మాటలన్నది బిజెపి ఉత్తర ప్రదేశ్‌ ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌. ఎంతో గౌరవ ప్రదమైన మాటలు గనుకనే అతని ఎంఎల్‌ఏ గిరి నిలిచిందనుకోవాలి. అదే రాష్ట్రానికి చెందిన మరొక బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర సింగ్‌ ” హిందువులు గనుక మేలుకుంటే మేము మీ మీగడ్డాలను లాగి గట్టిగా ముడివేస్తాం.మీరు హిందూస్తాన్‌లో ఉండాలంటే రాధే రాధే అనాలి ” అన్నారు. బక్రీద్‌ సందర్భంగా అమాయకపు జంతువులను కాదు మీ పిల్లలను బలి ఇవ్వాలంటూ 2020లో మరో బిజెపి ఎంఎల్‌ఏ నంద కిషోర్‌ గుజార్‌ అన్నారు. ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి.వాటి మీద ఎలాంటి కేసులు లేవు, ఉన్నా శిక్షలు పడిన దాఖలాల్లేవు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ : నరేంద్రమోడీ అచ్చేదిన్‌,అమృత కాలం కాదు, యువత భవిష్యత్‌కు ముప్పు !

24 Friday Mar 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

#India jobless growth, BJP, India’s GDP, Narendra Modi, Narendra Modi Failures, Narendra Modi problem


ఎం కోటేశ్వరరావు


” భారత్‌కు కలసి వచ్చిన కాలం పేదలకు తోడ్పడుతోందా ?” అంటూ మార్చినెల రెండవ తేదీన బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్ట్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. ” భారత నరేంద్రమోడీ సమస్య : అధిక వృద్ది రేటు, కానీ ఉద్యోగాలు తక్కువ ” మార్చినెల 19వ తేదీ ఆదివారం నాడు లండన్‌ నుంచి వెలువడే మరో పత్రిక ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తన విశ్లేషణకు పెట్టిన శీర్షిక.” ఏడాది కాలంగా వారానికి మూడువేల కోట్లు కోల్పోతున్న గౌతమ్‌ అదానీ, గరిష్ట స్థాయి నుంచి 60శాతం పడిన సంపద ” అని ఎకనమిక్‌ టైమ్స్‌ మార్చి 22న ఒక విశ్లేషణను పాఠకులకు అందించింది. జాతీయవాదం పేరుతో తెలిసో తెలియకో ఊగిపోతున్నవారికి, మోడీ ఏలుబడిలో అచ్చేదిన్‌, అమృత కాలం అని నిజంగా నమ్ముతున్నవారికి లండన్‌ పత్రికల విశ్లేషణలు రుచిస్తాయా ? ఎవరేమి రాశారు ఎందుకు రాశారు అన్నది కాసేపు పక్కన పెట్టి నిజానిజాల గురించి లేవనెత్తిన అంశాల గురించి ఉద్రేకానికి లోనుకాకుండా ఆలోచించాలి.


” కష్టాల్లో కూరుకుపోయిన శతకోటీశ్వరుడు గౌతమ్‌ అదానీకి గత ఏడాది కాలంగా వారానికి మూడువేల కోట్ల రూపాయలమేర దెబ్బతగిలింది. అతని సంపద 53 బిలియన్‌ డాలర్లకు పడిపోయిందని (మార్చి 22న విడుదల చేసిన) ఎం3ఎం హరూన్‌ గ్లోబల్‌ రిచ్‌ జాబితా 2023లో చూపారు ” అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషకుడు ఒకరు విశ్లేషణను ప్రారంభించారు. ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. ఎన్ని రోజులైనా పార్లమెంటు జరగకపోయినా సరే అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంటరీ కమిటీ విచారణకు అంగీకరించేది లేదంటూ భీష్మించుకున్న ప్రధాని నరేంద్రమోడీ పట్టుదల పట్టుదల ఒకవైపు. ఎలాగైతేనేం ఎంత డబ్బు సంపాదించారనేదే ముఖ్యం అన్నట్లుగా ఆలోచిస్తున్న సమాజం మరొక వైపు కనిపిస్తున్నపుడు తరిగిపోతున్న అదానీ సంపదల గురించి గుండెలు బాదుకోక ఏమి చేస్తారు.


2022 సెప్టెంబరు చివరి వారంలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా రిచ్‌ జాబితా వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో అదానీ కుటుంబం రోజుకు రు.1,612 కోట్లు, ముకేష్‌ అంబానీ రు.210 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నది. ఒక దశలో అదానీ కంటే అంబానీ సంపద రు. రెండు లక్షల కోట్లు ఎక్కువ, అలాంటిది ఏడాది కాలంలోనే అంబానీని వెనక్కు నెట్టి అదానీ మూడులక్షల కోట్లు ఎక్కువ, అంటే ఏడాదిలో ఐదులక్షల కోట్లు సంపాదించాడు. అబ్రకదబ్ర, మాయలు మంత్రాలు చేసే గంధర్వులకు, మిత్రమా ఏమి నీ కోరిక, తథాస్తు అనే పైవారు ఉంటే తప్ప మానవ మాత్రులకు సాధ్యమా ? 2012లో అంబానీ సంపదతో పోలిస్తే అదానీ దగ్గర ఆరోవంతు మాత్రమే ఉంది. 2014లో కేవలం ఎనిమిది బిలియన్‌ డాలర్ల సంపద ఉన్న అదానీ 2022 నాటికి 137 బి.డాలర్లకు ఎదిగారు. వందల సంవత్సరాలుగా ఆ రంగంలో ఉన్నవారికి సాధ్యం కానిది ఇంత స్వల్పకాలంలో అదానీకి ఎలా వచ్చింది, ఇతరులకు ఎందుకు రాలేదు అన్నది ఎప్పుడైనా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్లేషించిందా ? మిగతా పత్రికల తీరుతెన్నులు కూడా అవే. బ్లూమ్‌బెర్గ్‌ తాజా బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ ఏడాది జనవరి 24న 119 బి.డాలర్ల సంపద ఉన్న అదానీ ఇప్పుడు 57.2 బి.డాలర్లకు దిగజారారు.హరూన్‌ సంస్థ అంచనా 53బి.డాలర్లుగా ఉంది. ముకేష్‌ అంబానీ 82బి.డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు.


దేశం వృద్ది చెందటం లేదని ఎవరూ చెప్పరు. దాని ఫలాలు ఎవరికి దక్కుతున్నాయన్నదే చర్చ. వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగాలు పెరుగుతున్నది కొన్నే. పోనీ పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు చెబుతున్న ఊటసిద్దాంతం ప్రకారం పెరిగిన సంపదలు దిగువ వారికి చేరుతున్నాయా అంటే చివరికి అచ్చేదిన్‌, తాజాగా అమృత కాలం అని చెప్పిన నరేంద్రమోడీ తొమ్మిదేండ్ల పాలన తరువాత మన్‌కీ బాత్‌లో కూడా చెప్పే ధైర్యం చేయలేదు.దేశంలో జనవరిలో 7.14శాతంగా ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరిలో 7.45శాతానికి పెరిగిందన్న సిఎంఐఇ సమాచారాన్ని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఉటంకించింది. నైపుణ్య శిక్షణ పథకాన్ని మన్మోహన్‌ సింగ్‌ కాలంలోనే ప్రారంభించారు. దానికి ఒక మంత్రిని, కేటాయింపులను పెంచి అసలు దానికి ఆద్యుణ్ణి తానే అన్నట్లుగా నరేంద్రమోడీ ప్రచారం చేసుకున్నారు. నిజం ఏమిటి ? ” మనది ప్రధానంగా కార్పొరేట్‌ వృద్ది మాత్రమే. ఒక యూనిట్‌ ఉత్పాదనకు భారత కార్పొరేట్లు ఎక్కువ మంది జనాలను నియమించటం లేదు.ఒక వైపు యువతకు ఉద్యోగాలు రావటం లేదు. మరోవైపు తమకు నిపుణులైన జనాలు దొరకటం లేదని కంపెనీలు ఫిర్యాదు చేస్తున్నాయి. జీవితకాల ఉపాధికి ప్రభుత్వ ఉద్యోగం అవసరమని ఆకాంక్షిస్తున్నారు, నూటనలభై కోట్ల మంది జనాభాతో పోలిస్తే అవి చాలా తక్కువ.” అని ప్రణాళికా సంఘ మాజీ ప్రధాన సలహాదారు ప్రణబ్‌ సేన్‌ చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ” నైపుణ్యాలు దొరకటం మరొక సమస్య. అనేక కంపెనీలు ఇప్పటికే డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలను వృద్ధి చేసుకున్న వారిని తీసుకుంటున్నాయి.భారత్‌లో ఫైనాన్స్‌, బీమా, రియలెస్టేట్‌, పొరుగుసేవలు, టెలికాం, ఐటి రంగాలలో ఎక్కువ వృద్ది ఉంది. కానీ ఇవి ఉపాధిని సృష్టించేవి కాదు ” అని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర ఫ్రొఫెసర్‌ అమిత్‌ భోసలే చెప్పినట్లు కూడా ఆ పత్రిక పేర్కొన్నది.


భారత్‌లో ఉపాధి సమస్య పరిష్కారం కావాలంటే ఇరవై సంవత్సరాల పాటు వార్షిక వృద్ది రేటు పద్దెనిమిది శాతం ఉండాలని ఐదేండ్ల క్రితం ప్రపంచబాంకు అంచనా వేసింది. చిత్రం ఏమిటంటే తన విధానాలతో ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా జిడిపి వృద్ది రేటును తమ ప్రభుత్వం సాధిస్తున్నట్లు మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్నది. మోడీ అధికారానికి వచ్చిన తొలి సంవత్సరాల్లో ఐదుశాతానికి అటూ ఇటూగా ఉన్న నిరుద్యోగ రేటు ప్రస్తుత 7-8శాతం మధ్య ఉంటున్నది. శ్రామిక శక్తి భాగస్వామ్య అంశంలో రెండు వందల దేశాల సమాచారాన్ని గ్లోబల్‌ ఎకానమీ డాట్‌కామ్‌ విశ్లేషించింది. దాని ప్రకారం 2021లో 87.3శాతంతో కతార్‌ ఒకటవ స్థానంలో ఉంది. మన దేశంతో సమంగా జనాభా ఉన్న చైనా 68.6శాతంతో 42వది కాగా మన దేశం 45.57 శాతంతో 159వ స్థానంలో ఉంది. కరోనా కాలంలో 40శాతంలోపుకు పడిపోయింది. ఇరవై -ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు వారిలో 2022 అక్టోబరులో పట్టణ నిరుద్యోగం 42శాతం ఉండగా అదే చైనాలో 16-24 తరగతిలో 18శాతమే ఉంది. ప్రస్తుతం దేశంలో 30 ఏండ్ల లోపు వారు సగం మంది ఉన్నారు. అంటే ఉపాధి అవసరం ఎంత ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడున్న ధోరణుల ప్రకారం 2040నాటికి 59 ఏండ్లు పైబడిన వారు దేశంలో ఎక్కువ మంది ఉంటారని అంచనా.2024లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తామని కేంద్ర ప్రకటించింది. ఇవన్నీ సంవత్సరాల తరబడి నింపకుండా ఉంచిన ఖాళీలు.మెకెన్సీ సంస్థ అంచనా ప్రకారం 2030 నాటికి దేశంలో తొమ్మిది కోట్ల మేరకు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.


దేశంలో ఉపాధి రహిత వృద్ది ఆందోళన కలిగిస్తోందని, వృద్ధికి అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్రా కూడా చెప్పారు. అమెరికాలో కార్మిక శక్తి భాగస్వామ్యం 62శాతం కాగా మన దేశంలో 40శాతమని(2022) చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2020 ఆర్థిక సర్వేలో 2025 నాటికి మంచి వేతనాలు ఉండే ఉద్యోగాలను నాలుగు కోట్లు, 2030నాటికి ఎనిమిది కోట్లు కల్పించగలమని, చైనా తరహా వృద్ది విధానాన్ని అనుసరించాలని కూడా దానిలో పేర్కొన్నారు. దేశంలోని పెద్ద పట్టణాల్లో స్విగ్గి, జొమాటో వంటి కాలక్షేప ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.గ్రామాల్లో అలాంటి అవకాశాలు కూడా ఉండటం లేదు.వృద్ధికి అనుగుణంగా ఉపాధి లేదు, ఉన్న ఉపాధికి పొందుతున్న వేతనం కూడా నామమాత్రంగా ఉంది. తగినంత వేతనం లేకుండా కొనుగోలు శక్తి పెరగదు. స్థానిక కొనుగోలు శక్తి పెరుగుతున్న కారణంగానే ఎగుమతి మార్కెట్లో తేడాలు వచ్చినా చైనా తట్టుకోగలుగుతోంది. మన దేశంలో ఆ పరిస్థితి ఉందా ?


ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అమెరికాలోని యుబిఎస్‌ సంస్థ ప్రపంచంలో ధరలు, రాబడి గురించి విశ్లేషణ వెల్లడిస్తుంది. న్యూయార్క్‌ నగరాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రపంచంలోని ఇతర నగరాల్లో పరిస్థితిని అది పోలుస్తుంది. దాని తాజా నివేదిక ప్రకారం కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.నగదు డాలర్లని, కార్‌మెకానిక్‌, భవన నిర్మాణ కార్మికుల మొత్తాలను వార్షిక వేతనంగానూ, బ్రాకెట్లలో ఉన్న అంకెలు వారంలో పనిగంటలుగా గమనించాలి. న్యూయార్క్‌లో వంద డాలర్ల వేతనం ఉంది అనుకుంటే చైనాలోని షాంఘైలో 20.9, బీజింగ్‌లో 17, ముంబైలో 8.5, ఢిల్లీలో ఏడుగా ఉంది.
నగరం పేరు××వేతన స్థాయి ×× గంటవేతనం×× ఏడాది పనిగంటలు×× కార్‌మెకానిక్‌××నిర్మాణ కార్మికుడు
న్యూయార్క్‌ ×× 100 ×× 25.2 ×× 2,062 ×× 50,000(43) ×× 69,300
షాంఘై ×× 20.9 ×× 5.4 ×× 1,967 ×× 9,300 (40) ×× 6,700
బీజింగ్‌ ×× 17 ×× 4.5 ×× 1,979 ×× 8,500 (40) ×× 7,600
ముంబై ×× 8.5 ×× 2.3 ×× 2,251 ×× 2,100 (70) ×× 1,300
ఢిల్లీ ×× 7 ×× 2.1 ×× 2,265 ×× 1,900 (51) ×× 1,300
ఒక దేశ వృద్ధి రేటును నిర్దేశించే అంశాలలో వేతనాలు, కొనుగోలు శక్తి కూడా పాత్ర పోషిస్తాయి. మెరుగైన వేతనం లేకపోతే అంతర్గత డిమాండ్‌ పెరగదు. మన దేశం, చైనాల్లో కనీస వేతనాల పెరుగుదల తీరుతెన్నుల గురించి కంట్రీ ఎకానమీ డాట్‌కామ్‌ ఇచ్చిన సమాచార వివరాలు ఇలా ఉన్నాయి.వేతనాలు యూరో కరెన్సీలో ఉన్నాయి. మార్చి 24వ తేదీన ఒక యూరో రు.88.67గా ఉంది. మన దేశంలో 2020తో పోలిస్తే 2023 నాటికి కనీసవేతనం తగ్గినట్లు విశ్లేషణలో ఉంది.
కనీసవేతనం××2000×× 2010×× 2015×× 2020 ×× 2023
చైనా ×× 49.5 ×× 88 ×× 202.4×× 228.9×× 268.2
భారత్‌ ××26.8 ×× 38.8 ×× 54.2 ×× 57.7 ×× 55
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే చైనాలో వేతనాలు పెరుగుతున్న కారణంగా అక్కడి నుంచి కొన్ని విదేశీ కంపెనీలు వెళుతున్నాయని కొన్ని వార్తలు.చైనా నుంచి వెలుపలికి వెళ్లే కంపెనీలు అవి ఎన్నైనా ఇతర దేశాలకు వెళుతున్నాయి తప్ప మన ప్రభుత్వం ఎగుమతి ప్రోత్సాహక పథకాల ఆశ చూపినా మన వైపు చూడటం లేదు. కంపెనీలకు ఎక్కడ వేతనాలు తక్కువగా ఉంటే అక్కడకు వెళతాయని వేరే చెప్పనవసరం లేదు. కానీ మన దేశానికి ఆ మేరకు రావటం లేదు, వచ్చిన దాఖల్లాలేవు.ఎందుకు రావటం లేదో, అనేక కంపెనీలు మన దేశం నుంచి ఎందుకు తరలిపోతున్నాయో ఆలోచించుకోవాలి. భారత అధిక వృద్ది రేటు, ఉద్యోగాలు తక్కువ నరేంద్రమోడీ సమస్య కాదు. కార్పొరేట్లకు అమృతకాలం, అచ్చేదిన్‌, దేశ యువత భవిష్యత్‌కు ముప్పు. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేయలేని వాటిని తాను ఐదు సంవత్సరాల్లోనే చేసినట్లు 2019 ఎన్నికల్లో నరేంద్రమోడీ చెప్పుకున్నారు. దిశ, దశ తెలుసుకొనేందుకు తొమ్మిదేండ్లు తక్కువ కాదు. దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారో, ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలోకి నెట్టారు. ఎన్నికల వాతావరణం ఏర్పడింది కనుక దీని గురించి మోడీ భక్తులు ఎలా స్పందిస్తారో చెప్పనవసరం లేదు. నిజానికి ఇది నరేంద్రమోడీ వ్యక్తిగత సమస్య కాదు. తమది కాంగ్రెస్‌కు భిన్నమైన పార్టీ అని జనాన్ని నమ్మించేందుకు చేసిన ప్రచారం తప్ప వాజ్‌పాయి ఏలుబడిలో గానీ ఇప్పుడు నరేంద్రమోడీ పాలనలో అనుసరిస్తున్న దివాళాకోరు విధానాలు గానీ గతంలో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టినవే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచ బాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) మన దేశం మీద రుద్దిన విధానాలకు భారతీయ ముద్ర వేసి అమలు జరుపుతున్న ఫలితమే. మరి కాంగ్రెస్‌కు బిజెపికి తేడా లేదా అంటే ఉంది. ఆర్థిక విధానాల వైఫల్యాలకు తోడు గోబెల్స్‌ సమాచారాన్ని జనాలకు అందించే వాట్సాప్‌ విశ్వవిద్యాలయం, మత విద్వేషాన్ని బిజెపి బోనస్‌గా ఇచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తోడేళ్లను బుజ్జగిస్తున్న మేకలు : కేరళలో వివాదంగా మారిన ఆర్‌ఎస్‌ఎస్‌ – జమాతే చర్చలు !

23 Thursday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), JIH, Kerala LDF, Muslim League, RSS, UDF Kerala


ఎం కోటేశ్వరరావు


ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమదారికి తెచ్చుకోవటం అసాధ్యమా ? కొద్ది వారాల క్రితం ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌తో కొన్ని ముస్లిం సంస్థల ప్రతినిధుల సమావేశం ఇప్పుడు కేరళలో వేడిపుట్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కేరళ పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అక్కడి సిపిఐ(ఎం) ఫిబ్రవరి 21 నుంచి నెల రోజులు సాగే జాతాను కోజికోడ్‌లో సిఎం పినరయి విజయన్‌ ప్రారంభించారు. ఆ సందర్భంగా సిఎం ముస్లింలను బుజ్జగించేందుకు చూసినట్లు బిజెపి ధ్వజమెత్తింది. అంతకు ముందే ఆర్‌ఎస్‌ఎస్‌తో కేరళకు చెందిన జమాయతే ఇస్లామిక్‌ హింద్‌ సంస్థ ప్రతినిధులు దేన్ని గురించి చర్చించారో చెప్పాలంటూ పినరయి విజయన్‌ లేవనెత్తిన ప్రశ్న వేడిపుట్టించింది.దాన్ని పక్కదారి పట్టించేందుకు బిజెపి ఎదురుదాడికి పూనుకుంది. సదరు సమావేశం గురించి ఇంతవరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తమంత తాముగా వెళ్లి కలవలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానం మేరకు వెళ్లినట్లు జమాతే వివరణ ఇచ్చుకుంది. అది వాస్తవం కాదని వార్తలు చెబుతున్నాయి.


జమాతే సంస్థ ప్రధాన కార్యదర్శి టి ఆరిఫ్‌ జనవరిలో ఆర్‌ఎస్‌ఎస్‌తో జరిపిన చర్చల గురించి వెల్లడించారు.దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న మూక వధలు, అట్టడుగున ఉన్న తరగతుల అణచివేత అంశాలను చర్చించినట్లు పేర్కొన్నారు. ఇది జమాతే వంచన తప్ప మరొకటి కాదని విజయన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు.” ఆర్‌ఎస్‌ఎస్‌తో విబేధించే అంశాలున్నప్పటికీ చర్చలు జరపాల్సి ఉందని జమాతే చెప్పటం దాని వంచనను వెల్లడిస్తున్నది. ఏమి చర్చించారో, సమావేశం ఏ అంశం మీద జరిగిందో వివరించాలి. జమాతే తర్కం ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సంస్థ, చర్చల ద్వారా దాన్ని సంస్కరించవచ్చు, మార్చవచ్చు. ఇదెలా అంటే తోడేలు మచ్చలను నీటితో కడిగి పోగొట్టవచ్చు అన్నట్లుగా ఉంది. భారతలోని మైనారిటీలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలను దేశ యంత్రాంగాన్ని అదుపు చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుంచుతామన్న వాదన చేస్తున్న జమాతేకు అసలు దేశ మైనారిటీల ప్రతినిధిగా ఎవరు అధికారమిచ్చారు.ఏ అంశం గురించి చర్చించినప్పటికీ అది దేశంలోని మైనారిటీలకు సాయపడదు.మైనారిటీల రక్షణ అంటే మత స్వేచ్చకు రక్షణ. దాన్ని విచ్చిన్నం చేస్తున్నదెవరో చర్చల్లో పాల్గొన్నవారికి తెలియదా? అలాంటి వారితో చర్చించి లౌకికవాదాన్ని, మైనారిటీలను ఎలా రక్షించగలం ? సంఘపరివార్‌ తీవ్రవాద హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేడు దేశంలోని లౌకిక శక్తులు పోరాడుతున్నాయి. ఇటువంటి దశలో అలాంటి చర్చలు ఆర్‌ఎస్‌ఎస్‌ అజండాకు మద్దతు ఇస్తాయి.మతశక్తులు కుమ్మక్కై ఐక్యంగా లౌకికవాదాన్ని, ప్రజాస్వామిక విలువలను అణచివేస్తున్నాయనేందుకు ఇంతకంటే రుజువు అవసరం లేదు.లౌకిక శక్తులకు ఇదొక సవాలు ” అని విజయన్‌ పేర్కొన్నారు. జమాతే వైఖరిని కేరళలోని కేరళ ముస్లిం జమాత్‌, సమస్త కేరళ జమైతుల్‌ ఉలేమా, ముస్లిం లీగ్‌, కేరళ నదవతుల్‌ ముజాహిదీన్‌, సున్నీ యువజన సంఘం విమర్శించాయి.


ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడి దానితో సఖ్యత కోరుకుంటున్నట్లు, స్వార్ధ ప్రయోజనాలున్నట్లు కొందరు జమాతేను విమర్శించారు. స్నేహపూర్వక చర్చల ద్వారా జమాతే చారిత్రక తప్పిదం చేసిందని కేరళ ముస్లిం జమాత్‌ కాంతాపురం ఏపి అబూబకర్‌ ముస్లియార్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌కు, దేశ లౌకిక విలువలకు శత్రువని అటువంటి సంస్థతో చర్చలు శత్రువును కౌగలించుకోవటంతో సమానమని ముస్లిం జమాత్‌ పేర్కొన్నది.మతవాదం ఈ రెండు బృందాలను ముడివేస్తున్నది.భారత వ్యతిరేక ఫాసిస్టు శక్తుల నిజరూపాన్ని కప్పి పుచ్చేందుకు జమాతే ఇస్లామీ హింద్‌ ఒక పనిముట్టుగా మారుతున్నది ” అని విమర్శించింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చించాల్సినంత ప్రత్యేక పరిస్థితులేమీ లేవని ముస్లింలీగ్‌ నేతలు పికె కున్హాలీకుట్టి, ఎంకె మునీర్‌ పేర్కొన్నారు.


ముస్లిం సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌ జరిపిన రహస్య సమావేశం గురించి జనవరి 26న హిందూ పత్రిక వెల్లడించింది. సంఘపరివార్‌ నేతలు ఇంద్రేష్‌ కుమార్‌, రామ్‌లాల్‌, కృష్ణ గోపాల్‌ మూడు గంటల పాటు ఢిల్లీలోని మాజీ లెప్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ నివాసంలో జరిపిన భేటీలో అనేక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హింద్‌, జమాతే ఉలేమా ఇ హింద్‌, అజ్మీర్‌ దర్గా సల్మాన్‌ చిస్తీ, తదితరులు ఉన్నారు. గతేడాది ఆగస్టులో ఇలాంటి సమావేశమే జరగ్గా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌, నజీబ్‌ జంగ్‌, మాజీ ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ, ప్రముఖ హౌటల్‌ ఓనరు సయిద్‌ షెర్వానీ, జర్నలిస్టు షాహిద్‌ సిద్దికీ, మరికొందరు పాల్గొన్నారు. దాని కొనసాగింపుగా జరిగిన జనవరి సమావేశంలో భగవత్‌ మినహా మిగిలిన ముస్లిం ప్రతినిధులంతా పాల్గొన్నట్లు కూడా హిందూ పత్రిక పేర్కొన్నది. ఇలాంటి సమావేశాలను తరచూ జరపటం ద్వారా సానుకూల సందేశాన్ని పంపటం ముఖ్యమని భాగాస్వాములైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు భావించారు.ఈ దశలో సంస్థల అధిపతులు, సీనియర్‌ నేతలు రావటం మంచిది కాదని భావించినట్లు, సమావేశాలను తరువాత కూడా కొనసాగించాలని భావించినట్లు కూడా వెల్లడించింది.అనేక అంశాలను ముస్లిం నేతలు లేవనెత్తితే వాటికి సమాధానంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గోవుల అంశాల్లో హిందువుల మనోభావాలను గమనించాలని కోరినట్లు వెల్లడించింది.


ఆర్‌ఎస్‌ఎస్‌-జమాతే ఇస్లామీ హింద్‌ ప్రతినిధుల చర్చలు వెల్ఫేర్‌ పార్టీ బుర్రలో పుట్టిన ఆలోచనకాదా అని సిఎం విజయన్‌ కోజికోడ్‌ సభలో విమర్శించారు. కాంగ్రెస్‌లోని కొంత మంది ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల సానుకూల వైఖరితో ఉంటారు. వెల్ఫేర్‌ పార్టీ, జమాతే పట్ల ముస్లింలీగ్‌లోని కొందరు అదే విధంగా ఉంటారని అందువలన ఆ మూడు పార్టీల మధ్య ఉన్న ప్రత్యేక బంధం ఏమిటో, చర్చల గురించి జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రానికి కేరళ అభివృద్ది పట్టదు, ప్రతిపక్ష కూటమి మౌనంగా ఉంటుంది, కేంద్రం మీద ఒక్క మాట కూడా మాట్లాడదు అన్నారు. ఈ సభలో సిఎం పినరయి విజయన్‌ ప్రస్తావించిన మూడు సార్ల తలాక్‌ అంశంపై బిజెపి, కొన్ని మీడియా సంస్థలు వక్రీకరణలకు పూనుకున్నాయి. మూడు సార్లు తలాక్‌ చెప్పి భార్యను వదలి వేయటానికి సిపిఎం వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. అది చెల్లదని సుప్రీం కోర్టు కూడా చెప్పింది కనుక దాని మీద వేరే చట్టం అవసరం లేదన్నది సిపిఎం వైఖరి. అందువలన దాని మీద చట్టం చేసేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేయటాన్ని సిపిఎం ఖండించింది. తరువాత పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దాని ప్రకారం అలా ఎవరైనా విడాకులు తీసుకుంటే మూడు సంవత్సరాల వరకు శిక్ష వేయవచ్చు. ఇతర మతాలకు చెందిన వారి విడాకుల వివాదాన్ని సివిల్‌ కేసులుగా పరిగణించి ముస్లిం పట్ల క్రిమినల్‌ కేసుగా పరిగణించటాన్ని మాత్రమే సిపిఎం వ్యతిరేకిస్తున్నది తప్ప మూడుసార్ల తలాక్‌ను సమర్ధించలేదు.సిఎం పినరయి విజయన్‌ దాన్నే చెప్పారు తప్ప ముస్లింలను సంతుష్టీకరించలేదు.


ఖురాన్‌లో మూడుసార్లు తలాక్‌ అనే పద్దతే లేదని చెబుతున్నారు. అనేక దేశాల్లో అది లేని మాట నిజం. ఖురాన్‌లోని లేని దాని మీద మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేసినట్లు ? అన్ని మతాల్లో అనేక అంశాలను కొత్తగా చొప్పించినట్లుగా మూడు సార్లు తలాక్‌ అనేదాన్ని కూడా చొప్పించారు. దాన్ని ఎవరూ సమర్ధించటం లేదు.వేదకాలంలో కులాలు లేవని చెబుతారు, చేసే వృత్తిని బట్టి కులం అన్నారు అంటారు. ఇప్పుడు కులవృత్తులు లేకున్నా, సదరు వృత్తులు చేయకున్నా అదే కులాలతో పిలుస్తున్నారు, కించపరుస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సెలవిచ్చినట్లుగా కులాలను సృష్టించింది పండితులు(బ్రాహ్మలు కాదు మేథావులని తరువాత వివరణ ఇచ్చుకున్నారు) అన్నదాని ప్రకారం ఉనికిలో ఉన్న కులాలను ఏం చేస్తారో కూడా చెప్పాలి కదా ! వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు. వాటి మీద చట్టాలను ఎందుకు చేయటం లేదు.కులాలను, వివక్షను, కొందరిని కించపరిచే వాటిని సమర్ధించే మనుస్మృతి, ఇతర పురాణాలను సమర్ధించటాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారా ? వాటిని ప్రచురించి ప్రచారం చేసే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?


సిపిఐ(ఎం) ప్రారంభించిన నెల రోజుల యాత్రలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని జనం ముందుకు తీసుకువెళుతున్నారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో చర్చలు ఆ మూడు పార్టీలకు తెలిసే జరిగినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, యాత్ర సారధి ఎంవి గోవిందన్‌ పేర్కొన్నారు.లేకుంటే ఆర్‌ఎస్‌ఎస్‌తో జమాతే మాట్లాడితే తప్పేముందని కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ ఎలా అంటారు ? ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు సిపిఎం ముందుకు తెచ్చిన అనవసర వివాదం అని ముస్లింలీగ్‌ నేత కున్హాలీ కుట్టి చెప్పటం ఏమిటని ప్రశ్నించారు.చర్చలు జరపటంలో ఆ రెండు పార్టీలకు ఎలాంటి తప్పు కనిపించటం లేదన్నారు. గాంధీ మహాత్ముడిని చంపిన, బాబరీ మసీదు కూల్చివేసిన భావజాలం గలవారితో సంప్రదింపులు తప్పులేదని కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ ఎలా చెప్పగలుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ యాత్రకు పికె బిజు మేనేజర్‌, సిఎస్‌ సుజాత, ఎం స్వరాజ్‌, కెటి జలీల్‌, జేక్‌ సి థామన్‌ సారధులుగా ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏడాది కాలంగా రావాల్సిన రు.40వేల కోట్ల గురించి ఏ మీడియా మాట్లాడదు. పదవ ప్రణాళికలో కేరళకు కేంద్రం నుంచి 3.9శాతం నిధులు వస్తే ఇప్పుడు 1.9శాతానికి తగ్గినా మౌనంగా ఉంటుంది. జిఎస్‌టి పరిహారం రు.9,000 కోట్లు, రెవెన్యూలోటు పరిహారం రు.6,716 కోట్లు ఇవ్వటం లేదని, రుణాలు తీసుకోవటం మీద పరిమితి విధిస్తే సాంఘిక సంక్షేమ పధకాలను ఎలా అమలు జరపాలని సిపిఎం ప్రశ్నిస్తోంది.రాజకీయ కారణాలతోనే ఇదంతా జరుగుతోందని విమర్శించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపిని భయపెడుతున్న తులసీదాన్‌ ” రామ చరిత మానస్‌ ” !

17 Friday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Literature., NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


” మీరు ఎల్లవేళలా కొంత మందిని, అందరినీ కొంత కాలం వెర్రి వాళ్లను చేయవచ్చు. కానీ మీరు అందరినీ అన్ని వేళలా వెర్రి వాళ్లను చేయలేరు ” ఇది అమెరికా నేత అబ్రహాం లింకన్‌ చెప్పిన సుభాషితం.” ఏ పదజాలం వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగుందో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు ” కమ్యూనిస్టు నేత లెనిన్‌ చేసిన హెచ్చరిక ఇది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా ఇది వర్తిస్తుంది.మన దేశంలో ఇదే జరుగుతోందా అంటే అవుననే చెప్పాలి. మరి జనం ఎల్లవేళలా మోసపోతారా ? తెలివిగా ఉంటున్నారా ? తమ తెంపరితనాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మోసకారులు మండిపడతారు. తరువాత దెబ్బలాట, అణచివేతలకు పూనుకుంటారు. జనం దాన్ని సహిస్తారా ? లేదు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రజలకు తెలియని భాష, లిపిలో రాసిన గ్రంధాల్లో ఉన్నదాన్ని కొంత మంది ఏ విధంగా చెబితే దాన్ని జనం నిజమని నమ్మారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీకా తాత్పర్యాలను విడదీసి అర్ధాలను వెల్లడించేవారు భిన్న కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు.వాస్తవాన్ని జీర్ణించుకోలేని వారు తమకు అనువైన భాష్యాలను చెబుతూ వివక్షను, గతాన్ని సమర్ధించేందుకు పూనుకున్నారు.


తులసీదాస్‌ రచన రామచరిత మానస్‌లో వెనుకబడిన తరగతులు, మహిలు, దళితులను కించపరిచే భాగాలు, భావాలు ఉన్నట్లు సమాజవాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్‌ మౌర్య, అయోధ్య హనుమాన్‌ దేవాలయపూజారి రాజు దాస్‌, అయోధ్య తపస్విచావని మహంత్‌ పరమహంస దాస్‌ గురువారం నాడు దాడులకు పాల్పడినట్లు పరస్పరం కేసులు దాఖలు చేశారు.రామచరిత మానస్‌ గ్రంధంలోని వివాదాస్పద అంశాలపై లక్నోలోని ఒక హౌటల్‌లో ఒక టీవీ ఛానల్‌ ఏర్పాటు చేసిన ఒక చర్చలో పాల్గొనేందుకు వారు వచ్చారు.చర్చ ముగిసిన తరువాత తాను హౌటల్‌ నుంచి వెళుతుండగా మౌర్య, అతని అనుచరులు తన మీద దాడిచేసినట్లు రాజుదాస్‌ ఆరోపిస్తూ ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. పూజారి, మహంత్‌ తన మీద కత్తి, గొడ్డలితో దాడికి పాల్పడగా తన అనుచరుల కారణంగా తప్పించుకున్నానని ఆ మేరకు కేసు దాఖలు చేస్తున్నట్లు మౌర్య ప్రకటించారు.తనకు అదనపు రక్షణ కల్పించాలని కూడా పోలీసు కమిషనర్‌ను కోరారు. చర్చలో టీవీ యాంకర్‌ తన మీద దాడికి రెచ్చగొట్టినట్లు కూడా విమర్శించారు. అభ్యంతరకర భాగాలను రామచరిత మానస్‌ గ్రంధం నుంచి తొలగించాలి లేదా దాన్ని నిషేధించాలని మౌర్య కోరుతున్నారు. అలాంటివాటిని తాము అంగీకరించేది లేదని సాధు, సంతులు చెబుతున్నారు. చర్చ పక్కదారి పట్టి భౌతికదాడుల వైపు మళ్లటం ఒక ప్రమాదకర సూచన.మౌర్యను విమర్శిస్తూ పోస్టులు పెట్టినందుకు రిచా సింగ్‌, రోలీ తివారీ అనే ఇద్దరు మహిళా ప్రతినిధులను పార్టీ నుంచి సమాజవాది పార్టీ బహిష్కరించింది.సమాజవాదీ ఎంఎల్‌ఏ రాకేష్‌ సింగ్‌ ఈ వివాదంతో స్వంత పార్టీనేతపై ధ్వజమెత్తారు. మౌర్యకు మతి తప్పిందని అన్నారు.అతను సనాతనీ లేదా సోషలిస్టు కానీ కాదన్నారు.ఈ వివాదం జనవరిలో బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌,మౌర్య ప్రకటనలతో మొదలైంది.క్షమాపణలు చెప్పాలన్న బిజెపి నేతల స్పందనకు చెప్పేదే లే అంటూ స్వామి ప్రసాద్‌ మౌర్య జవాబిస్తూ రామచరిత మానస్‌కు ఎవరూ ఎవరూ వ్యతిరేకం కాదు, రామ ప్రభువుకూ కాదు, కొన్ని చరణాలకు మాత్రమే వ్యతిరేకం అన్నారు.మౌర్యను ఉరితీయాలని బిజెపి నేత నందకిషోర్‌ గుజార్‌ సుప్రీం కోర్టుకు లేఖరాశారు.

ప్రతి తరంలోనూ సమాజాన్ని వెనక్కు నడిపించాలని చూసిన వారు మనకు కనిపిస్తారు. కానీ సమాజం ముందుకు, మున్ముందుకు పోతున్నదే తప్ప తలకిందులుగా నడవటం లేదు. పనికిరాని వాటిని విసర్జిస్తూనే ఉంది. మానవ శరీరంలో ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చే భాగం క్రిమిక(అపెండిసైటిస్‌). అలాంటి శక్తులు రెచ్చిపోతున్న తరుణమిది. ఏ అంబేద్కరైతే భారత నాగరికత, సమాజానికి మాయనిమచ్చగా ఉందని మనుస్కృతిని దగ్దం చేశారో ఆ మహానుభావుడిని ఒకవైపు గౌరవిస్తున్నామని చెబుతున్నారు కొందరు. ఆ అంబేద్కర్‌ అధ్యక్షతన రూపొందించిన రాజ్యాంగ రచనకు ఆ మనుస్మృతిని పరిగణనలోకి తీసుకోలేదు. దానిలో ఉన్న అంశాలకు విరుద్దంగా సమానత్వాన్ని అమలు చేసే నిబంధనలు, స్ఫూర్తితో ఉన్న రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. సదరు మనుస్మృతిని భారత పురాతన రాజ్యాంగంగా వర్ణిస్తూ దాని తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించేందుకు పూనుకున్న తిరోగమన వాదులకు ఎదురుదెబ్బ తగిలింది.హైదరాబాద్‌ నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా ఒక సభలో ఆవిష్కరించేందుకు అభ్యంతరాలు వెల్లువెత్తటంతో ఇచ్చిన అనుమతిని అధికారులు రద్దు చేశారు. దాంతో నిర్వాహకులు తరువాత దాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ఏదో ఒక ప్రైవేటు స్థలంలో ఆ పని చేస్తారు, అది వేరే అంశం. మూడున్నర కిలోల బరువు, రు.2,100 విలువగల పుస్తకాన్ని అచ్చువేసేందుకు అవసరమైన భారీ పెట్టుబడితో ఆ పుస్తకాన్ని జనాలతో చదివించి తిరోగమనంవైపు నెట్టేందుకు పడుతున్న ప్రయాస స్పష్టంగా కనిపిస్తున్నది.


ఒకవైపు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే దానికి ప్రతిఘటన ఉండటం సహజం.మనువు చెప్పినట్లుగా బతకటానికి జనం సిద్దంగా లేరు. ఆ బోధనలను బలవంతంగా అమలు జరిపే అవకాశమూ లేదు. ఇస్లాం మత ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో షరియాను అమలు జరిపేందుకు పూనుకున్నవారికి , మన దేశంలో మనుస్మృతిని రుద్దాలని చూసే వారికి పెద్ద తేడా లేదు. దేశంలో అనేక మంది రామాయణాన్ని తిరగ రాశారు. వాటిలో పదహారవశతాబ్దినాటి తులసీదాన్‌ రచన ఒకటి.హిందీకి దగ్గరగా ఉండే అవధీ భాషలో రాసినందున జనానికి సులభంగా అర్ధం కావటంతో ప్రాచుర్యం పొందింది.తులసీదాస్‌ కలం నుంచి వెలువడిన రామచరిత మానస్‌ గ్రంధంలోని మనుస్మృతిలో చెప్పిన అంశాలు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలలో వివాదాన్ని రేపాయి. నల్లేరు మీద బండిలా తమ పథకాన్ని అమలు జరపాలని చూస్తున్న హిందూత్వశక్తులకు ఇది మింగుడు పడక మండిపడుతున్నాయి.శాపాలు పెట్టే శక్తి లేకపోవటం లేదా పని చేయవని తెలిసి గానీ అభ్యంతర అంశాలను విమర్శించిన బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌ నాలుక కోస్తే రు. పదికోట్ల బహుమానం ఇస్తామని అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య ప్రకటించారు. స్వామి ప్రసాద్‌ మౌర్య తలనరికితే 21 లక్షలు ఇస్తానని హనుమాన్‌ గుడి పూజారి రాజు దాస్‌ ప్రకటించారు.ఈ ప్రకటనలను చూసిన తరువాత బాబాలు,సాధువులు, సంత్‌లు ఉగ్రవాదులు, కసాయిలుగా మారారని స్వామి ప్రసాద్‌ విమర్శించారు. గతంలో బాబాలు అంటే సన్యాసులుగా ఉండేవారు. గతంలో బాబాలు,సాధువులకు కోపం వచ్చేది కాదు, వచ్చినా శాపాలు పెట్టేవారు. నేటి బాబాలకు అలాంటి తపస్సు లేదు.వారికి నిజంగా శక్తి ఉంటే చైనాను భస్మం చేయమనండి, ఈ రోజు బాబాలు, సాధువులు ఉగ్రవాదులుగా మారారు. కొంత మంది ముక్కులు, నాలుకలు కోసేయమని, తలలు తీసేయమంటూ కసాయిలుగా మారుతున్నారు అని ప్రసాద్‌ అన్నారు. ఈ పూర్వరంగంలోనే గురువారం నాడు లక్నోలో ఇరువర్గాలకు చెందిన అనుచరులు గొడవకు దిగినట్లు చెప్పవచ్చు.


రామచరిత మానస్‌, మనుస్మృతి, పురాణాలు, ఇతర గ్రంధాల్లో ఉన్న అవాంఛనీయ వర్ణనలు, బోధల గురించి దశాబ్దాల క్రితమే తెలుగునాట హేతువాదులు, నాస్తికవాదులు ఎత్తి చూపిన అంశం తెలిసిందే.ఇప్పుడు ఉత్తరాదిన అలాంటి పరిణామం జరుగుతోంది. నాడు ఆ విమర్శ, సమర్థనలు ఎన్నికలతో నిమిత్తం లేవు. ఇప్పుడు వాటితో మిళితం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బిసిలను కించపరిచే భాగాలను నిషేధిస్తామని స్వామి ప్రసాద్‌ చెప్పారు.


సమాజవాదీ ఎంఎల్‌ఏ ఆర్‌కె వర్మ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. దానిలో ” తులసీదాస్‌ వివక్ష, అంటరానితనం,అసమానతను తలకు ఎక్కించుకున్న ఒక కవి. అతని రామచరిత మానస్‌లో రాజ్యాంగానికి విరుద్దమైన అనేక చరణాలున్నాయి.అవి వెనుబడిన తరగతులు, మహిళలు, దళితులు, సంత్‌ సమాజాన్ని అవమానిస్తున్నాయి.ఆ చరణాలను తొలగించాలి ” అని పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ బిజెపి యువమోర్చా వారు ఎంఎల్‌ఏ శవయాత్ర జరిపి బొమ్మను దగ్దం చేశారు. రామచరిత మానస్‌ను అవమానించినందుకు ఆర్‌జెడి,సమాజవాది పార్టీల గుర్తింపును రద్దు చేయాలని విశ్వహిందూపరిషత్‌ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. హిందూ సమాజంలో అపనమ్మకాన్ని కలిగించేందుకు ఆ పార్టీల నేతలు చూస్తున్నారని ఆరోపించింది.


ఉత్తరాదిలో 120లోక్‌ సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌లో తలెత్తిన ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం ఉంది.మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికలపై దీని ప్రభావం పడుతుందేమో అని కంగారు పడుతున్న బిజెపి ఇతర సంస్థలు, సాధు సంతులను రంగంలోకి దింపి ఆచితూచి మాట్లాడుతున్నది.సున్నితమైన, మనోభావాలతో ముడిపడిన ఈ వివాదం పెరిగితే తన బిసి ఓటు బాంకుకు గండిపడుతుందన్న భయం దానిలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సంఘపరివార్‌ సంస్థలకు చెందిన అగ్రవర్ణాలుగా అనుకుంటున్న కులాలకు చెందిన వారు హిందూత్వ అజెండాను దెబ్బతీసే ఈ పరిణామంపై మండిపడుతుండగా వారిని మాట్లాడవద్దని బిజెపి ఆదేశించినట్లు వార్తలు. రామచరిత మానస్‌లో తమను కులపరంగా కించపరిచినా తమకేమీ ఇబ్బంది లేదు అని చెప్పగల స్థితి లేనందున వెనుక బడిన తరగతుల నేతలు, మద్దతుదారులు నోరు మెదపలేని స్థితి ఏర్పడింది. వెనుకబడిన తరగతుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ చాలా కాలం నుంచి ఉంది. ఆ జనాభా ఎంత అన్నది తాజా లెక్కలు లేవు. అందువలన కులపరమైన లెక్కలు తేల్చాలన్న డిమాండ్‌ను బిజెపి అంగీకరించటం లేదు. బీహార్‌లో గణాంకాల సేకరణకు ఆర్‌జెడి-జెడియు కూటమి నిర్ణయించటంతో ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఆ డిమాండ్‌కు మద్దతు పెరుగుతున్నది. దాని కోసం ఆందోళన ప్రారంభిస్తామని సమాజవాదీ పార్టీ ప్రకటించింది. రామచరిత మానస్‌ వివాదం గురించి సిఎం యోగి ఆదిత్యనాధ్‌ను అడగ్గా వివాదం రేపే వారికి దాని గురించి తెలియదని, బిసి లెక్కల గురించి నిర్ణయించాల్సింది కేంద్రమని తప్పించుకున్నారు.


1980దశకంలో ఉత్తరాదిన మండలమా ా కమండలమా అన్న ప్రాతిపదికన ఓటర్లు చీలారు. మండల్‌ కమిషన్‌ నివేదికను సమర్ధించిన పార్టీలు ఒక వైపు బిజెపి మరోవైపు తారసిల్లాయి. తరువాత జరిగిన పరిణామాల్లో 2014 నాటికి ఎంబిసీలు బిజెపికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికీ అదే కొనసాగుతున్నది. ఎంబిసిలు, కొందరు దళితులను ఆకట్టుకున్న బిజెపి మిగతావారిని కూడా తన వైపు తిప్పుకొనేందుకు పూనుకున్నప్పటికీ అది జరగలేదు. బిసి జనాభా గణనకు తిరస్కరించటంతో అనేక మంది బిజెపి మద్దతుదారుల్లో కూడా పునరాలోచన ప్రారంభమైన దశలో రామచరిత మానస్‌ వివాదం ముందుకు వచ్చింది. ఆ గ్రంధాన్ని లక్నోలో తగులబెట్టిన వారి మీద మీసాతో సహా ఇతర చట్టాల కింద మౌర్యతో సహా పది మందిపై బిజెపి సర్కార్‌ కేసులు పెట్టింది. ఈ వివాదం తలెత్తిన తరువాత సమాజవాదీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తాను కూడా శూద్రుడనే అని అంటూ బిజెపి మీద అనేక ప్రశ్నలను సంధించారు. అసెంబ్లీలో సిఎం యోగి తులసీదాస్‌ రచనలో ఉన్నవాటిని అనువదించి చదివి శూద్రులు ఎవరో తేల్చాలని సవాలు చేశారు. దళితులను శూద్రులుగా బిజెపి వారు పరిగణిస్తున్నారా లేక మమ్మల్ని బిసిలుగానూ దళితులను శూద్రులుగా పరిగణిస్తున్నారా అన్నది తేల్చాలి అన్నారు.ఇదిలా ఉండగా లక్నోలోని సమాజవాదీ ఆఫీసు సమీపంలో పెద్ద బోర్డు వెలసింది. ” 6,743 కులాలు, శూద్ర సమాజం గర్వంతో చెబుతున్నాం మేం శూద్రులం, జై శూద్ర సమాజం, జై రాజ్యాంగం ” అని దాని మీద రాసి ఉంది. దాన్ని ఆలిండియా కుర్మీ క్షత్రియ మహాసభ( ముంబై) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శూద్ర ఉత్తమ్‌ ప్రకాష్‌ సింగ్‌ పటేల్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


పాము పాలు తాగితే విషంగా మారినట్లుగా దిగువ కులాల వారు విద్యనేర్చుకుంటే విషపూరితం అవుతారని దానిలో రాసినట్లు బీహార్‌ మంత్రి చంద్రశేఖర్‌ చెప్పారు.సకల గుణ హీనుడైనా బ్రాహ్మణుడిని పూజించాలి, వేద ప్రవీణులైనా శూద్రులను గౌరవించకూడదని, తెలీ, కుమ్‌హార్‌, కహార్‌,దళితులు, ఆదివాసీలు అధములని పేర్కొన్నట్లు కూడా చెప్పారు. మహిళలు, దళితుల గురించి తులసీదాస్‌ కించపరిచే విధంగా రాశారు, అవి ఒకటో రెండో వాక్యాలు కాదు అనేక చరణాలు రాశారు. ఒక దానిలో ఒక బ్రాహ్మణుడి నిండా చెడు లక్షణాలు ఉన్నా అతన్ని పూజించాలి. ఒక దళితుడు వేద పండితుడైనా అతన్ని గౌరవించకూడదు అని రాశారని, అంత వివక్షతో కూడిన వాటిని ఎలా అంగీకరించాలని జామియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ హేమలత మహేశ్వర్‌ ప్రశ్నించారు.డోలు వాయించేవారు,నిరక్షరాస్యులు, మహిళలు,పశువులు, దళితులు దండనార్హులని రామచరిత మానస్‌లో తులసీదాస్‌ చెప్పినట్లు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ 2018 ఆగస్టులో ఒక పోస్టులో పేర్కొన్నదాని మీద పెద్ద చర్చ జరిగింది. ఇది గృహ హింస చట్టం, ఎస్‌సి ఎస్‌టి చట్టాలను ఉల్లంఘించాలని ప్రోత్సహించటం కిందికి రాదా అని కట్జూ ప్రశ్నించారు.దళితులు,ఓబిసిలను శూద్రులని వర్ణించటం పట్ల బిఎస్‌పి నాయకురాలు మాయావతి నిరసన తెలిపారు.సమాజవాదీ వారిని శూద్రులని అప్రతిష్టపాలు చేస్తున్నదా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదా అని ప్రశ్నించారు.వారిని ఓటు బాంకుగా పరిగణిస్తున్నదని విమర్శించారు.


తులసీదాస్‌ను సమర్ధించే కొందరు విపరీత తెలివిని ప్రదర్శిస్తున్నారు. అతనేమీ సంస్కర్తకాదు, కనుక అతనిలో వివక్ష ఉంటుంది. వివాదాస్పద అంశాలను అతను సృష్టించిన పాత్రలు చెప్పినవి తప్ప అతని స్వంత అభిప్రాయాలు కాదని వితండవాదం చేస్తున్నారు. అసందర్భంగా ప్రస్తావిస్తున్నారని, వాటి అసలు అర్ధం వారికి అవగతం కాలేదని చెబుతున్నారు.శూద్రులు లేదా బ్రాహ్మలు అనేది చేసే పనులను బట్టి తప్ప పుట్టుకనుబట్టి కాదని కొందరు చెబుతున్నారు. అలాంటి పరిగణన గతంలో ఉందో లేదు తెలీదు ఇప్పుడు ఉనికిలో లేదు. పుట్టుకతోనే కులం, మతం వస్తున్నది. ఆ మేరకు గౌరవ మర్యాదలు, హీనంగా చూడటం జరుగుతున్నది. మొత్తంగా చెప్పాలంటే నల్లేరు మీద బండిలా తమ హిందుత్వ అజెండాను అమలు జరపాలన్న కాషాయ దళాలను ఎదుర్కొనే శక్తులు సదరు హిందూత్వ భావజాలంలో ఉన్న అసంబద్దతలనే ఆయుధాలు చేసుకుంటుంటే మింగా కక్కలేని స్థితిలో బిజెపి గిలగిల కొట్టుకుంటున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d