• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Left politics

దక్షిణాఫ్రికా త్రిపక్ష కూటమిలో సయోధ్య కొనసాగేనా !

21 Wednesday Feb 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

ANC, COSATU, Cyril Ramaphosa, Jacob Zuma, SACP

 

 ఎం. కోటేశ్వరరావు

అవినీతి ఆరోపణల పూర్వరంగంలో వెల్లడైన తీవ్ర వత్తిడి మేరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా తొలుత మొరాయించినా చివరకు తలొగ్గి రాజీనామా చేయక తప్పలేదు. గత గురువారం నాడు జుమా రాజీనామా వెంటనే ఉపాధ్యక్షుడిగా వున్న సిరిల్‌ రమఫోసా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పదవి నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవాలని దక్షిణాఫ్రికా పాలక కూటమి ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఏఎన్‌సీ) జాతీయ కార్యవర్గం చేసిన నిర్ణయాన్ని మరోదారి లేక అమలు జరిపిన తొలి అధ్యక్షుడు తాబో ఎంబెకీ కాగా, రెండవ అధ్యక్షుడిగా జాకబ్‌ జుమా చరిత్రకెక్కారు. 1994లో జాత్యహంకార పాలన అంతమైన 24ఏండ్లలో తొలి అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా అన్న విషయం తెలిసిందే. మరొకరు ఒక ఏడాదిపాటు తాత్కాలిక అధ్య క్ష బాధ్యతలలో వున్నారు. మండేలా తరువాత దీర్ఘకాలం పదవిలో వున్న ఎంబెకీ, జుమా రాజీనామాలతో ఇంటిదారి పట్టటం ఏఎన్‌సీ బలహీనతలు, బలాన్ని సూచిస్తున్నది.
జుమా రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకోవాలని పాలక త్రిపక్ష కూటమిలోని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ(ఎస్‌ఏసీపీ) గత కొద్ది డిమాండ్‌ చేస్తూ వస్తోంది. మరో పక్షమైన కార్మిక సంఘాల కూటమి(కొసాటు) కూడా రాజీనామా చేయాలని కోరింది. చివరకు ఏఎన్‌సీ కార్యవర్గం సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం జుమా రాజీనామా కోరుతూ తీర్మానించింది. జుమా పాలనలో అనేక అవినీతి ఆరోపణలు, ఆశ్రిత పక్షపాత వంటి ఆరోపణలతో పాటు అనేక రంగాలలో వైఫల్యం కారణంగా 2016లో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఏఎన్‌సీ అనేక పరాజయాలు చవిచూసింది. ఏఎన్‌సీ పరువు ప్రతిష్టలు నిలబడాలంటే, కార్పొరేట్‌ వ్యతిరేక చర్యలు తీసుకొనేందుకు గాను జుమా రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను ముందుగా కమ్యూనిస్టుపార్టీ లేవెనెత్తింది. దానితో ఆగ్రహించిన జుమా కమ్యూనిస్టు మంత్రి ఒకరిని తొలగించారు. జుమాపై చర్యతీసుకోని పక్షంలో తాము అధికార కూటమి నుంచి వైదొలుగుతామని, అవసరమైతే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో వంటరిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టులు హెచ్చరించారు. డిసెంబరులో ఏఎన్‌సీ పార్టీ అధ్యక్షుడిగా జుమాను తొలగించి సిరిల్‌ రాంఫొసా ఎన్నికైన తరువాత ఏఎన్‌సీ కార్యవర్గం ఏదో ఒక నిర్ణయం చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దానిలో భాగంగానే పదవి నుంచి మర్యాద పూర్వకంగా తప్పుకోవాలని కోరింది. దానికి జుమా తిరస్కరించటంతో అల్టిమేటం జారీ చేయాల్సి వచ్చింది.

Image result for Cyril Ramaphosa as president

సిరిల్‌ రాంఫొసా
జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరులో ఆయుధాలు పట్టిన జుమా అనేకమంది ఇతర నేతల మాదిరిగానే జైలు పాలయ్యారు. యువనేతగా దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన 1997లో ఏఎన్‌సీ ఉపాధ్యక్షుడిగా, 1999లో దేశ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత ఐరోపా కంపెనీతో జరిగిన ఆయుధ లావాదేవీలలో చోటు చేసుకున్న అక్రమాలతో జుమాకు సంబంధమున్నట్టు ఆరోపణలొచ్చాయి. జుమా ఆర్ధిక సలహాదారు నిందితుడిగా తేలాడు. జుమా2005లో పదవీచ్యుతుడయ్యాడు. తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అధ్యక్షుడు తాబో ఎంబెకీ అక్రమాలను వ్యతిరేకించినందుకు తనను కేసులలో ఇరికించారని చేసిన వాదనలను ఏఎన్‌సీ నాయకత్వం విశ్వసించింది. దాంతో ఎంబెకీని రాజీనామా చేయించి ఆ స్ధానంలో జుమాను 2009లో అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవల జుమాపై 18 అంశాలలో వచ్చిన అవినీతి, ఆరోపణలపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని ప్రతిపక్ష డెమోక్రటిక్‌ అలయన్స్‌ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు గతేడాది స్పష్టం చేసింది. తాను అమాయకుడిని అన్న జుమా వాదన కోర్టు కొట్టివేసింది. డిసెంబరు 13న ఇచ్చిన తీర్పులో జుమా, అతని అనుచరులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు జనవరిలో ఒక కమిషన్‌ ఏర్పడింది. ఒక అవినీతి నివేదికను తొక్కిపెట్టటంలో జుమా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు మరో కేసులో న్యాయస్ధానం స్పష్టం చేసింది. భారతీయ సంతతికి చెందిన గుప్తా కుటుంబం జుమాతో వున్న సంబంధాలను ఉపయోగించుకొని అనేక ప్రభుత్వ కాంట్రాక్టులను పొందినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కోర్టు తీర్పుల తరువాత వారం రోజులకే డిసెంబరు 18న జుమాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి సిరిల్‌ రాంఫొసాను ఎన్నుకున్నారు.

Image result for anc
ఏఎన్‌సీ జాత్యహంకార పాలన అంతం కోసం ఏర్పడిన ఒక బూర్జువా వేదిక. సోషలిస్టు సమాజ స్ధాపనలక్ష్యంగా ఏర్పడింది దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ (ఎస్‌ఏసీపీ). ఈ రెండు శక్తులు పని చేస్తున్న కార్మిక సంఘాలతో ఏర్పడిన సమాఖ్య (కొసాటు). దశాబ్దాల తరబడి ఒకే లక్ష్యంతో పనిచేసిన ఈ శక్తులు ఏఎన్‌సీలో భాగస్వాములు. 1994లో శ్వేతజాతి పాలన అంతమైన తరువాత ఏఎన్‌సీ పతాకం, గుర్తుపైనే వారందరూ ఎన్నికలలో పోటీ చేసి పాలనలో భాగస్వాములయ్యారు. అవినీతి ఆరోపణలతో ఇద్దరు అధ్యక్షులను అర్ధంతరంగా తొలగించటం ఏఎన్‌సీ బలహీనత. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో విఫలమైనప్పటికీ జనంలో ఇంకా విశ్వాసం ఉన్నకారణంగానే రాజీనామా చేసిన అధ్యక్షులు తోక ముడవటం దాని బలానికి చిహ్నం. గత 24ఏండ్లుగా ఏఎన్‌సీ అనుసరించినవి స్ధూలంగా నయా ఉదారవాద విధానాలు తప్ప మరొకటి కాదు. పర్యవసానంగా జనంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. జాత్యహంకార పాలన అంతమైన తరువాత జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని(ఎన్‌డీఆర్‌) సాధించాలన్నది త్రిపక్ష కూటమి అంగీకరించిన కార్యక్రమం. 1995లో కూటమి అంగీకరించిన ‘స్వేచ్ఛా ప్రణాళిక”లో దీనిని చేర్చారు.
అయితే ఆచరణలో దీనికి భాష్యాలు భిన్నంగా ఉన్నాయి. నల్లజాతి సాధికారత అంటే ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు చేసి గుత్తాధిపతులుగా వున్న శ్వేతజాతి పెట్టుబడిదారులతో సమంగా అవకాశాలు కల్పించటం అన్నది ఏఎన్‌సీ అవగాహనగా కనిపిస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేయటంతో పాటు ప్రత్యేకించి నల్లజాతీయులను, ఆఫ్రికన్లందరినీ తొలుత విముక్తి చేయాలని, జాతివివక్ష లేని సమాజాన్ని ఏర్పాటు చేసి సోషలిస్టు వ్యవస్థ స్థాపనకు దారి తీసే విధంగా ముందు దశగా ఎన్‌డీఆర్‌ను అమలు జరపాలన్నది కమ్యూనిస్టుపార్టీ అవగాహన. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్నికైన ఒకనాటి కార్మికనేత సిరిల్‌ రమఫోసా 1994 తరువాత వాణిజ్య, పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. అలాంటి వారు ఏఎన్‌సీలో ఎందరో ఉన్నారు. రాజీనామా చేసిన జుమా భారతీయ సంతతికి చెందిన గుప్తా సోదరులకు అండదండలిచ్చి అవినీతికి పాల్పడిన విషయం తెలిసినదే. స్థానిక నల్లజాతి, శ్వేతజాతి వ్యాపారులు తమ పోటీదార్లకు మద్దతు ఇవ్వటాన్ని సహించలేక జుమాపై వత్తిడి తేవటంలో వారు కూడా తమవంతు పాత్ర పోషించారనే అభిప్రాయాలున్నాయి. పన్నెండేండ్ల క్రితం జాతీయ ప్రజాస్వామిక విప్లవం గురించి సమీక్షించిన కమ్యూనిస్టుపార్టీ సాధించిన విజయాలను తక్కువ చేసి చూడనవసరం లేదని అయితే మొగ్గు పెట్టుబడిదారీ వ్యవస్ధను పటిష్టపరిచే వైపే ఉందని అభిప్రాయపడింది. అప్పటి నుంచి అక్కడి పరిణామాలలో పెద్ద మార్పులేమీ లేవు. జాత్యహంకార వ్యవస్థ రద్దయిన తరువాత నల్లజాతీయులలో విద్యావ్యాప్తి, గృహవసతి, తదితర సంక్షేమ చర్యలకు పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు కేటాయించినమాట వాస్తవం. ఒక అంచనా ప్రకారం 45శాతం కుటుంబాలు సామాజిక భద్రతా పధకాల కింద ఆర్థిక సాయం పొందుతున్నాయని చెబుతున్నారు. అయితే ఇవి పేదలకు ఉపశమనం కలిగించేవి తప్ప మరొకటి కాదు.
ఇప్పటికీ 95శాతం సంపదలు పదిశాతంగా వున్న శ్వేతజాతీయుల చేతుల్లో ఉన్నాయి. సారవంతమైన భూములు కూడా వారికిందే ఉన్నాయి. 14శాతం భూములు ప్రభుత్వానికి చెందినవి కాగా, 79శాతం వివిధ ట్రస్టులు, ఇతర రూపాలలో శ్వేతజాతీయుల ఆధిపత్యంలోనే వున్నాయి. వాటిని స్వాధీనం చేసుకొనేందుకు ఇంతవరకు సరైన చట్టాలను రూపొందించలేదు. వాటికి పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకోవాలా లేక ఇవ్వకుండా తీసుకోవాలా అనే చర్చ ఇంకా ఏఎన్‌సీలో నడుస్తూనే వుంది. అంటే సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే ఆచరణలో నీరుగార్చటం తప్ప మరొకటి కాదు.
1994 నుంచి గతేడాది జనవరి వరకు ప్రభుత్వం 49లక్షల హెక్టార్ల భూమి స్వాధీనం చేసుకుంది. దీనిలో 34లక్షల హెక్టార్లను పంపిణీ చేసింది. ఇదిగాక మరొక పథకం ప్రకారం స్వాధీనం చేసుకున్న భూమిలో సగానికి ప్రభుత్వం పరిహారం ఇచ్చి దానిని సమభాగస్వామ్య పద్ధతిలో నల్లజాతీయులు- శ్వేతజాతీయులతో సాగు చేయించటం కూడా చేస్తున్నది. ఇలాంటివి కొన్ని ఉన్నప్పటికీ మొత్తం మీద భూకేంద్రీకరణ దెబ్బతీసి మెజారిటీ ప్రజలకు అప్పగించి వారి ఆదాయాల పెంపుదలకు విప్లవాత్మక చర్యలేవీ తీసుకోలేదు. ఇలాంటి తీరుతెన్నుల కారణంగానే సమాజంలోని మెజారిటీ తరగతులలో అసంతృప్తి పెరుగుతోంది. అది పాలక కూటమిలో రాజకీయ సమస్యలకు దారితీస్తున్నది. దక్షిణాఫ్రికాలో అవినీతి ఒక పెద్ద సమస్యగా తయారైంది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో వస్తూత్పత్తితో పాటు అవినీతి ఒక ఉప ఉత్పత్తిగా వుంటుంది. అందువలన అధ్యక్షులు మారినప్పటికీ అవినీతి ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంటుంది. పైకి ఏమి చెప్పినప్పటికీ నయా ఉదారవాద విధానాలనే అమలు జరుపుతున్నందున రానున్న రోజులలో ఏఎన్‌సీలో అంతర్గత వైరుధ్యాలు తలెత్తటం అనివార్యం.

Image result for sacp
జాకబ్‌ జుమా రాజీనామాతో ఒక ఘట్టం ముగిసింది తప్ప అవినీతి సమస్య పరిష్కారం కాలేదు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంది. నాటకీయ పరిణామాల మధ్య జుమా స్ధానంలో రమాఫోసా వచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రమాఫోసా ఇంతవరకు మంత్రివర్గాన్ని ప్రకటించలేదు. మంత్రుల శాఖలు, సంఖ్యను కూడా తగ్గిస్తానని అధ్యక్షుడిగా పార్లమెంట్‌ తొలి ఉపన్యాసంలో చెప్పారు. ఏఎన్‌సీ ప్రతిష్ట పెంచాలంటే కొంతమంది మంత్రుల పేర్లను ఉటంకిస్తూ వారిని తిరిగి చేర్చుకోరాదని కొసాటు డిమాండ్‌ చేసింది. రమాఫోసా పాత వ్యవస్థతోనే ప్రయాణించాలని చూడటాన్ని మెజారిటీ జనం అంగీకరించరని, అది ఆయనను ఎక్కువ దూరం ప్రయాణించనివ్వదని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. మంత్రివర్గానికి కాయకల్ప చికిత్స చేయాలని, మంత్రిత్వశాఖలను పునర్విభజించాలని కూడా కోరింది.
రానున్న రోజులలో జాతీయ ప్రజాస్వామ్య విప్లవ కార్యాచరణ గురించి త్రిపక్ష కూటమిలో అంతర్గత పోరు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి ముదిరితే రాజకీయ పునరేకీకరణకు దారితీసినా ఆశ్చర్యం లేదు. అనివార్యమైన ఈ పరిణామం ఎప్పుడన్నదే సమస్య. అంగీకృత కార్యక్రమం నుంచి వైదొలుగుతున్న తీరు కనిపించినా ఏఎన్‌సీలో కమ్యూనిస్టుపార్టీ, కొసాటు ఇంతకాలం కొనసాగటమే ఆశ్చర్యం. వివిధ ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బలు, పలు తరగతులలో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా కమ్యూనిస్టుపార్టీ పునరాలోచనలో పడింది. ఏఎన్‌సీ నుంచి విడగొట్టుకోవాలనే ఆలోచన దానిలో ప్రారంభమైంది. డిసెంబరులో జరిగిన ఏఎన్‌సీ సభలో కమ్యూనిస్టు పార్టీ నేత జిమాండే జాతీయ కార్యవర్గానికి ఎన్నిక కాలేదు. పార్టీలు వేర్వేరుగా వున్నప్పటికీ చట్టసభలకు ఏఎన్‌సీ గుర్తుమీదే మూడు పక్షాలూ పోటీ చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల నాటికి ఈ కూటమి ఇలాగే వుంటుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. తాము వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టుపార్టీ నాయకులు చెబుతున్నారు. కింది శాఖలలో అలాంటి చర్చ అనుమతిస్తున్నారు. రానున్న ఎన్నికలలో విడిగా ప్రచారం చేయాలని కమ్యూనిస్టుపార్టీ మహాసభ గతేడాది నిర్ణయించింది. అవసరమైతే వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేసే దిశలో ఇదొక అడుగుగా చెప్పవచ్చు. ఏఎన్‌సీ పాలనలో అవినీతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు గళమెత్తుతున్నారు. తొమ్మిదేండ్ల క్రితం ఏ కమ్యూనిస్టుపార్టీ జాకబ్‌ జుమాను బలపరిచిందో అదే పార్టీ అతడిని తొలగించాలని ముందుగా గళమెత్తింది. అనేక అంశాలపై పార్టీ విభేదిస్తున్నది. అందువలన వచ్చే ఎన్నికల నాటికి అది దేశాన్ని నడిపించేందుకు తనదైన పంథాలో పయనిస్తుందా అన్నది ఆసక్తి కలిగించే అంశం. అదే అయితే కమ్యూనిస్టుపార్టీ, కొసాటు ఒకవైపు, ఏఎన్‌సీ మరోవైపు అధికారం కోసం పోటీపడినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో ఏం జరుగుతోంది, ఎందుకలా ?

31 Wednesday Jan 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

chinese communist party, Communist Party Groups, foreign companies in China, Xi Jinping

Image result for communist party vangaurd in china companeis

ఎం కోటేశ్వరరావు

చైనాలో ఏం జరిగినా అది కమ్యూనిస్టులకు, పెట్టుబడిదారులకూ ఆసక్తికరంగానే వుంటుంది. ఒకే దేశమైనా అక్కడ రెండు వ్యవస్ధలను అనుమతించే విధంగా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయం తీసుకుంది. తమకు అవసరమైన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశీ సంస్ధలు, పెట్టుబడులకు అనుమతివ్వాలని 1970దశకం చివరిలోనే చైనా కమ్యూనిస్టుపార్టీ నిర్ణయించింది. అందువలన ఆ తరువాత రెండు దశాబ్దాలకు బ్రిటీష్‌, పోర్చుగీసువారి కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనం కావాల్సిన హాంకాంగ్‌, మకావో ప్రాంతాలలోని పెట్టుబడిదారీ వ్యవస్ధను 2050 వరకు కొనసాగనిస్తామని హామీ ఇచ్చింది. హాంకాంగ్‌ అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ద వున్న ప్రాంతాలలో ఒకటి. ఎక్కడి నుంచో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నపుడు తనలో విలీనం అయ్యే ప్రాంతాలలో వారిని తిరస్కరించటంలో అర్ధం వుండదు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ గురించి తెలిసిందే. కమ్యూనిస్టుపార్టీ ఇచ్చిన వెసులుబాటును అవకాశంగా తీసుకొని ప్రపంచ పెట్టుబడిదారులు విలీన ప్రాంతాలలో శాశ్వతంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగించేందుకు లేదా చైనా నుంచి విడగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. వాటిని ఎదుర్కొంటూనే మరోవైపు చైనా తన దైన పద్దతులలో ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు కమ్యూనిస్టుపార్టీ గతంలోనే ప్రకటించింది.

స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌లో ఇటీవలనే పెట్టుబడిదారీ జలగల వార్షిక జాతర జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి మాదిరిగా బయటిలోకానికి పరిచయం అవుతున్న కెటిఆర్‌ ఆ జాతరకు వెళ్లి వచ్చారు. దేశంలో, తమ రాష్ట్రాలలో లాభాలను పీల్చుకొనేందుకు వున్న అవకాశాల గురించి వివరించి మరీ వచ్చారు. అక్కడికి వచ్చిన వారిలో మారియట్‌ ఇంటర్నేషనల్‌ సిఇఓ ఆర్నె సోరెన్సన్‌ ఒకరు. అంతర్జాతీయ ప్రయాణాలు తగ్గాయని దానిలో భాగంగానే ఈరోజు అమెరికాను ఆహ్వానించేవారు తగ్గిపోయారని దానికి కారణం డోనాల్డ్‌ ట్రంప్‌ అని చెప్పాడు. చైనాలో పూర్తిగా కమ్యూనిస్టు నిరంకుశత్వం వుందని కూడా ఆరోపించాడు. ప్రత్యక్షంగా ఘర్షణ పడటానికి సిద్దంగా లేనప్పటికీ చైనాను దెబ్బతీసేందుకు సామ్రాజ్యవాదులు చేయన్ని యత్నం లేదు. చైనాలో 300 హోటల్స్‌ నిర్వహిస్తున్న మారియట్‌ కొద్ది వారాల క్రితం ఒక ఇమెయిల్‌ సర్వే జరిపింది. దానిలో టిబెట్‌, హాంకాంగ్‌, మకావో, తైవాన్‌ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా పేర్కొన్నది. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే చైనా ప్రభుత్వం మారియట్‌ మొబైల్‌ ఆప్‌ను, తరువాత దాని వెబ్‌సైట్‌ను పనిచేయకుండా చేసింది. వెంటనే ఇందుకు పాల్పడిన తమ సిబ్బందిపై చర్యతీసుకుంటామని, మరోమారు అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని మారియట్‌ క్షమాపణలు చెప్పింది. సదరు ప్రాంతాలు చైనా నుంచి విడిపోవాలని కోరే శక్తులు, లేదా వ్యక్తులకు తమ మద్దతు వుండదని, సమస్య తీవ్రతను గుర్తించామని పేర్కొన్నది.

చైనాలో వ్యాపారం చేస్తూ ఆ దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలో విదేశీ కంపెనీలు ఎలాంటి పాత్ర నిర్వహిస్తాయో ఈ వుదంతం చెప్పకనే చెప్పింది. కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయని, వాటిని ఎలా అదుపు చేయాలో తమకు తెలుసని సంస్కరణలకు ఆద్యుడిగా భావిస్తున్న డెంగ్‌సియావో పింగ్‌ ప్రారంభంలోనే చెప్పిన విషయం తెలిసిందే. చైనాలో విదేశీ కంపెనీలను ఎలా అదుపు చేస్తున్నారనేది సహజంగానే ఆసక్తి కలిగించే అంశం. దీనికి సంబంధించి బహిరంగంగా చైనా చేసిన ప్రకటనలు లేదా విధానాల వివరాలు మనకు అందుబాటులో లేవు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై విదేశీ సంస్ధలు, వ్యక్తులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు కొన్ని సందర్భాలలో రామునితోక పివరుండు అన్నట్లుగా వుంటాయి కనుక యధాతధంగా తీసుకోనవసరం లేదు. అయితే ఆ సమాచారం కొన్ని విషయాలను వెల్లడిస్తున్నది. వాటి మంచి చెడ్డలు, పర్యవసానాలను పక్కన పెట్టి వాటిని చూద్దాం.

చైనా జనజీవితంలో కమ్యూనిస్టు పార్టీ పాత్రను పెంచటానికి, అగ్రగామిగా వుంచటానికి అక్కడి నాయకత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. విదేశీ సంస్ధలకు ద్వారాలు తెరిచిన తరువాత అన్యవర్గ ధోరణులైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పార్టీ , సోషలిస్టు వ్యతిరేక ధోరణులు చైనా సమాజంపై పడకుండా చూసేందుకు అవి అన్నది స్పష్టం. వాషింగ్టన్‌ పోస్టు అనే అమెరికా పత్రిక కొద్ది రోజుల క్రితం విదేశీ కంపెనీలలోకి ప్రవేశించేందుకు, అదుపు చేసేందుకు కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తున్నది అనే పేరుతో అది ఒక విశ్లేషణ రాసింది. దాని భాష్యాన్ని మనం యధాతధంగా తీసుకోనవసరం లేదు. చైనా సర్కారుతో కలసి సంయుక్త భాగస్వామ్య సంస్ధలను నెలకొల్పిన అమెరికా మరియు ఐరోపా కంపెనీలు వాటిలోని నిర్ణయాత్మక కమిటీలు, ఎగ్జిక్యూటివ్‌లు, వాణిజ్య బృందాలలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని ఇటీవల చైనా కోరిందన్నది వార్త సారం. చైనాలోని అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షుడు జేమ్స్‌ జిమర్‌మన్‌ ‘ కమ్యూనిస్టు పార్టీ యంత్రాంగం ఇంతవరకు విదేశీ పెట్టుబడులున్న సంస్ధలలోకి పెద్ద ఎత్తున పాకి చొరబడినట్లు కనిపించటం లేదు గాని జరుగుతున్న విషయాలను చూస్తే అదే మార్గంలో పయనిస్తున్నాయి’ అన్నారు. విదేశీ కంపెనీల యాజమాన్య నిర్ణయాలలో పాత్రను కమ్యూనిస్టుపార్టీ కోరటం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని, ఇదే సమయలో ఇంటర్నెట్‌పై సెన్సార్‌షిప్‌ విదేశీ కంపెనీలపై ప్రభావితం చేయటానికి నాంది అని, తాను ఆర్ధికంగా బలంగా వున్నందున పశ్చిమ దేశాల వాణిజ్యాన్ని తగ్గించేయవచ్చని చైనా భావిస్తున్నట్లు ఆ పత్రిక వ్యాఖ్యాత పేర్కొన్నారు. కంపెనీల నిర్వహణలో మరొక దొంతరను ప్రవేశపెట్టటం సంయుక్త భాగస్వామ్య కంపెనీల స్వతంత్ర నిర్ణయాలు చేసే సామర్ద్యాన్ని దెబ్బతీస్తాయని, పెట్టుబడులకు ఆటంకం అవుతుందని చైనాలోని యూరోపియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొన్నది. విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే అనేక ఆర్ధిక రంగాలలో సంయుక్త భాగస్వామ్యం వున్న కంపెనీలలో చేరాలని చైనా చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.

ఇంటర్నెట్‌ను విదేశీ కంపెనీలు వినియోగించుకోవాలంటే ‘ చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన ఏడు నిబంధనలకు కట్టుబడి వుంటామని, సోషలిస్టు వ్యవస్ధ, ప్రజాభద్రత, సామాజిక నైతికతను దెబ్బతీయబోమని, దేశ ప్రయోజనాలను వుల్లంఘించబోమని ఒక హమీ పత్రాన్ని ఇవ్వాల్సి వుంటుంది. గతేడాది జూన్‌ నుంచి చైనాలో అమలులోకి వచ్చిన ఇంటర్నెట్‌ భద్రతా చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అయితే తమ వ్యాపార రహస్యాలు, మేథాసంపత్తి బహిర్గతం అవుతాయనే పేరుతో ప్రభుత్వ నియంత్రణను విదేశీ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. చైనాలో వున్న అన్ని విదేశీ కంపెనీలలో శాఖలను ఏర్పాటు చేసేవిధంగా కమ్యూనిస్టుపార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నదని ఆక్స్‌ఫర్డ్‌ అనలిటికా అనే బ్రిటీష్‌ కంపెనీ తాజాగా ఒక నివేదికను తన కెనడా ఖాతాదారులకు పంపింది.దానిలోని అంశాలపై కెనడా మీడియా వ్యాఖ్యానాలు చేస్తున్నది. ఆ మేరకు ఆ నివేదికలోని అంశాల సారాంశం ఇలా వుంది.

వ్యాపార, వాణిజ్యాలు స్వతంత్రరంగానికి చెందినవి కాదు. ఇప్పటి వరకు ప్రయివేటు వాణిజ్యాన్ని రాజ్యమే క్రమబద్దీకరించింది తప్ప పార్టీ కాదు, కానీ ఇప్పుడు గ్జీ జింపింగ్‌ వాణిజ్యాన్ని పార్టీ అదుపు చేయాలని కోరుతున్నారు.ముఖ్యంగా టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ల కంపెనీలపై పార్టీ ప్రభావం, అదుపు వుండాలి. విదేశీ కంపెనీలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేయటం ద్వారా వాణిజ్య నిర్ణయాలపై పార్టీ ప్రభావం ఏమిటో తెలుసుకోవటానికి వీలుకలుగుతుంది. మారియట్‌ హోటల్స్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో టిబెట్‌, తైవాన్‌, హాంకాంగ్‌, మకావోలను వేరే దేశాలుగా పేర్కొనటాన్ని పార్టీ శాఖలే కనుగొన్నాయి. ప్రతి రంగంలోనూ పార్టీ ప్రమేయం వుండాలని గతేడాది జరిగిన పార్టీ మహాసభ చేసిన నిర్ణయానికి అనుగుణంగా వందలాది ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రధాన నిర్ణయాలపై పార్టీ కమిటీలను సంప్రదించే విధంగా మార్గదర్శకాలను సవరించాయి.

ఏ సంస్ధలో అయినా ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పార్టీ సభ్యులుంటే అక్కడ పార్టీ విధానం, సూత్రాలు అమలు జరుగుతున్నదీ లేనిదీ వారు చూడాలని పార్టీ నిబంధనావళి పేర్కొంటున్నది. అయితే 1980వ దశకంలో సంస్కరణల కారణంగా దీని అమలును సడలించారు. తరువాత రెండు దశాబ్దాల కాలంలో వ్యూహాత్మకం కాని ప్రభుత్వ రంగ సంస్ధలపై ప్రత్యక్ష నియంత్రణలను సడలించారు. ప్రభుత్వ, పార్టీ అదుపును సవాలు చేసే స్ధితిలో లేని చిన్న ప్రయివేటు, మరియు ప్రభుత్వ రంగ సంస్దలపై కమ్యూనిస్టు పార్టీ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే 2001లో ప్ర పంచవాణిజ్య సంస్ధలో చేరేందుకు గాను వ్యాపార, వాణిజ్య రంగాలలో వున్నవారిని కూడా పార్టీలో చేరేందుకు అనుమతించారు. ఈ చర్యతో అనేక కొత్త కంపెనీలను ఆశ్రిత పక్షపాతంతో పార్టీలో వున్నవారి బంధువులు, ఆశ్రితులతో ఏర్పాటు చేయించారు. ఆ సమయంలో కేవలం మూడుశాతం ప్రయివేటు కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలున్నాయి.తరువాత కాలంలో చైనా ఆర్ధిక వ్యవస్ధలో ప్రయివేటు కంపెనీలు, వాటిలో కమ్యూనిస్టుపార్టీ శాఖల సంఖ్య కూడా పెరిగింది. 2015 నుంచి ఏర్పాటయిన 36లక్షల ప్రయివేటు సంస్దలలో మెజారిటీ సంస్ధలలో పార్టీ శాఖలున్నాయి. సభ్యులు అనేక కంపెనీలలో అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో కమ్యూనిస్టు పార్టీ సభ్యులు వుండటం పెరిగింది. టెన్సెంట్‌ అనే ఇంటర్నెట్‌ కంపెనీ సిబ్బందిలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులు 23శాతం అయినప్పటికీ 60శాతం కీలక బాధ్యతలలో వారున్నారు. 2002లో చైనాలోని 17శాతం విదేశీ కంపెనీలలో మాత్రమే పార్టీ శాఖలుంటే అక్కడున్న ఏడున్నర లక్షల విదేశీ కంపెనీలలో 70శాతంలో పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు.

చైనా మాదిరే మన దేశం కూడా సంస్కరణలకు తెరతీస్తే ఇక్కడి కమ్యూనిస్టులు అక్కడ బలపరుస్తూ ఇక్కడ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించటం తెలిసిందే. చైనాలో ప్రయివేటు కంపెనీలను విచ్చలవిడిగా అనుమతించిన తరువాత అది సోషలిజం ఎలా అవుతుందని కమ్యూనిస్టు అభిమానుల్లో సందేహాలు వున్నాయి. అందువలన అక్కడ జరుగుతున్న తీరుతెన్నులను రేఖా మాత్రంగా తెలిపే ఈ సమాచారం సోషలిస్టు వ్యవస్ధను బలపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లెనిన్‌ దేవదూత, బైబిల్‌ నుంచే కమ్యూనిజం :పుతిన్‌

17 Wednesday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, Bible, communist manifesto, Democratic party, Lenin a saint, Pavel Grudinin, russian elections, Soviet communist ideas, v.i.lenin, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు

గత వారంలో కమ్యూనిస్టులకు, ఇతరులకు ఆసక్తి కలిగించే రెండు వుదంతాలు జరిగాయి. ఒకటి మార్చి18న జరిగే ఎన్నికలలో మరోసారి పీఠం ఎక్కేందుకు పోటీ పడుతున్న రష్యన్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ కమ్యూనిస్టు భావజాలం బైబిల్‌ నుంచే వచ్చిందని, లెనిన్‌ దేవదూత వంటి వ్యక్తి అని చెప్పాడు. అమెరికాలోని అమీ హరోవిట్జ్‌ అనే ఒక మితవాద వీడియో గ్రాఫర్‌ న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధులకు చదివి వినిపించిన నాలుగు ప్రకటనలు ఎవరివి అంటే కమ్యూనిస్టులవి అనే దిమ్మతిరిగే సమాధానం రావటం రెండో వుదంతం.

న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం వుదారవాద భావాల నిలయంగా ప్రసిద్ధి. హారోవిట్జ్‌ తాను నాలుగు వాక్యాలను చదివి వినిపిస్తానని అవి కమ్యూనిస్టులవో డెమోక్రటిక్‌ పార్టీవో చెప్పాలని విద్యార్ధులను కోరాడు. మొదటిది ‘మేము సామాజిక మార్పునే పురికొల్పుతాము’. సమాధానం చెప్పిన నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టోలో భాగం అని ఏక కంఠంతో చెప్పారు. ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అది ఎక్కువగా కమ్యూనిస్టు ప్రకటనగానే కనిపిస్తోంది అని చెప్పగా ఒక్కరు మాత్రమే డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటన అని సరిగా చెప్పారు.

‘మేము నూతన వర్గాలను, అణచివేత నూతన పరిస్దితులను, పాతవాటిని తొలగించేందుకు నూతన పోరాట పద్దతులను పాదుకొల్పాము’ అనే ప్రకటన డెమోక్రటిక్‌ పార్టీదే అని అందరూ సమాధానం చెబుతారని నేను అనుకొంటున్నాను అని ఒక యువతి చెప్పగా ఇద్దరిలో ఒకరు అది కమ్యూనిస్టుమానిఫెస్టోలో భాగం అని చెప్పారు.

‘ ప్రజలపట్ల వివక్షను చూపే విధానాల ఫలితమే జాతి, సంపద, ఆదాయ అసమానతలు ‘ అన్న ప్రకటన డెమోక్రటిక్‌ పార్టీది అని ముగ్గురిలో ఇద్దరు సరిగానే చెప్పారు. అయితే కొందరు ఇది నిజంగా కమ్యూనిస్టు పార్టీ ప్రకటన కాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘స్వేచ్చామార్కెట్‌ పద్దతుల ద్వారా సంపద అసమానతలను పరిష్కరించలేము’ ఈ ప్రకటనపై నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టో చెప్పిన అంశ మే అన్నారు. ఇది డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటనలో భాగం. చిత్రంగా వుందే అది కమ్యూనిస్టు మానిఫెస్టో అంశం మాదిరి ధ్వనిస్తోందే అని ఆశ్చర్యపోయారు ఒకరు.

‘ఈ వ్యవస్ధ పని చేయటం లేదు, ఆర్ధికానికి బంధనాలు వేశాము’ అన్న వ్యాక్యం డెమోక్రటిక్‌ పార్టీది అని ఇద్దరిలో ఒకరు చెప్పారు. అమెరికన్‌ విద్యార్ధులు కమ్యూనిస్టు ప్రణాళిక-డెమొక్రటిక్‌ పార్టీ 2016 ఎన్నికలలో చెప్పినదానికి తేడాను గుర్తించటంలో ఎందుకు గందరగోళపడుతున్నారు అన్నది ఒక ప్రశ్న. అమెరికా పరిణామాలను గమనిస్తున్న వారికి ఇది సహజంగా కనిపిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, తరువాత కాలంలో అమెరికాలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు ప్రణాళిక-డెమోక్రటిక్‌ పార్టీ చెబుతున్న అంశాలకు తేడాను జనం గుర్తించలేని కారణంగా, డెమోక్రటిక్‌ పార్టీని ఒక తీవ్రవాద వామపక్ష సంస్ధగా పరిగణించినందున 2010 నుంచి ఇప్పటి వఅసరకు రాష్ట్రాలు, కేంద్రంలోని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు వెయ్యింటిలో, మెజారిటీ రాష్ట్రాల గవర్నర్‌ ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోయిందని ఒక విశ్లేషణ తెలిపింది. బరాక్‌ ఒబామా పదవిలో వున్న ఎనిమిది సంవత్సరాల పాటూ అతనొక కమ్యూనిస్టు అనే ప్రచారం సాగుతూనే వుంది. డెమోక్రటిక్‌ పార్టీని కొందరు కమ్యూనిస్టు లేదా తీవ్రవాద వామపక్ష సంస్ధగా చిత్రించటాన్నీ చూశాము. 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా కార్మికవర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న స్ధితి, అమెరికాను, యావత్‌ పెట్టుబడిదారీ వ్యవస్ధను కుదిపిన 2011 సెప్టెంబరు వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం వంటి పరిణామాల పూర్వరంగంలో డెమోక్రటిక్‌ పార్టీ నినాదాలు, నాయకుల ప్రసంగాలలో పెద్ద మార్పు వచ్చింది. దానికి పరాకాష్టంగా అవును నేను సోషలిస్టును అంటూ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యుడు బెర్నీ శాండర్స్‌ ఆర్ధిక అసమానతల గురించి ఎండగట్టిన తీరు, సోషలిస్టును నన్ను బలపరచండి అంటూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వంకోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీపడి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తీరును చూశాము. లక్షలాది మంది యువత శాండర్స్‌తో గొంతు కలుపుతూ అవును మేమూ సోషలిస్టులటే అంటూ ప్రచారం చేసిందీ విదితమే. అందుకే నేడు అమెరికాలో సోషలిజం అంటే తిట్టుపదం కాదు. డెమోక్రటిక్‌ పార్టీ అస్ధిత్వరాజకీయాలు ఆ పార్టీని రాడికల్‌ నినాదాలు చేయిస్తున్నాయి. అయితే దాని స్వభావం అది కాదని సదా గుర్తుంచుకోవాలి. రెండు ప్రధాన పార్టీలలో ఏది ఎక్కువ హానికరమైనది అని ఎంచుకోవాల్సి వచ్చినపుడు డెమోక్రటిక్‌ పార్టీ కూడా కార్పొరేట్లకే అనుకూలం అయినప్పటికీ ఇంతవరకూ కార్మికవర్గం, నల్లజాతీయుల మొగ్గు ఆ పార్టీవైపే వుంది. అలాంటి వారంతా రోజువారీ, ఆందోళనల సందర్భంగా కమ్యూనిస్టులు మాట్లాడినట్లే దోపిడీ,జాతి వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతుంటారు. అందువలన యువత డెమోక్రటిక్‌ పార్టీ – కమ్యూనిస్టు ప్రణాళిక చెప్పిన అంశాల గురించి గందరగోళపడుతున్నారు. ఇది ఒక విధంగా మంచిదే. కమ్యూనిస్టు వ్యతిరేకత నరనరానికి ఎక్కి వున్న స్ధితిలో దోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా ఎంతవరకు కలసి అంత మేరకు వామపక్ష భావజాలం వ్యాప్తి చెందినట్లే, సోషలిజం, కమ్యూనిజాలకు ఆమేరకు వ్యతిరేకత తగ్గుతుంది.

అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ రాడికల్‌ నినాదాల కారణంగా సోషలిస్టు, కమ్యూనిస్టు పదజాలం యువతకు పరిచయం కావటం అక్కడి పాలకవర్గానికి ఆందోళన కలిగించే అంశం. రష్యాలో పాతిక సంవత్సరాల క్రితం కూల్చివేసిన సోషలిస్టు వ్యవస్ధ గురించి 56శాతం మందిలో బెంగ తలెత్తిందని ఒక సర్వే పేర్కొన్న విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే స్టాలిన్‌, లెనిన్‌ పట్ల జనంలో క్రమంగా సానుకూల అభిప్రాయాలూ పెరుగుతున్నాయని కూడా సర్వేలు తెలుపుతున్నాయి. మార్చినెలలో జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవికి కమ్యూనిస్టు పార్టీ నిలబెట్టిన పార్టీ సభ్యుడు కాని లెనిన్‌ వ్యవసాయ క్షేత్ర అధిపతి పావెల్‌ గ్రడినిన్‌ దేశవ్యాపితంగా ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పుతిన్‌ మినహా మరొకరెవరూ గెలిచే అవకాశం లేదని ఎన్నికల పట్ల నిరాసక్తతతో వున్న వారిలో కూడా వుత్సాహం నింపుతున్నట్లు, నెల రోజుల క్రితంతో పోల్చితే మద్దతు ఇచ్చేవారు రెట్టింపు అయినట్లు మీడియా పేర్కొన్నది. ప్రజల సొమ్ము తస్కరించటాన్ని ఆపండి, జనం మంచిజీవితాలను గడుపుతున్నారనే అబద్దాలకు సమాధికట్టండి, విద్య, వైద్యం వుచితంగా అందచేయాలని, పెన్షనర్లు గౌరవ ప్రద జీవితం గడపాలని కోరుతున్న రష్యన్‌ రాజ్యాంగాన్ని అమలు చేయటం ప్రారంభించండి అని వుపన్యాసాలలో అడుగుతున్న గ్రడినిన్‌ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది.ఆయన వుపన్యాసం తరువాత తన ఆధ్వర్యంలోని లెనిన్‌ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వారి జీవన పరిస్ధితులపై రూపొందించిన వీడియోను ప్రదర్శి ంచి రష్యన్లందరికీ అలాంటి పరిస్థితులు వుండాలని, తనకు అవకాశం ఇస్తే అమలు చేస్తానని చేస్తున్న ప్రచారతీరు కొత్తగా వుంది. గతంలో సహకార వ్యవసాయ క్షేత్రంగా వున్నదానిని ప్ర యివేటీకరించిన సమయంలో దానిలో పనిచేస్తున్న గ్రడినిన్‌ 1995లో దాదాపు సగం వాటాలను కొనుగోలు చేశారు. గతేడాది నాలుగువందల కోట్ల రూబుళ్ల మేర స్ట్రాబెర్రీ ఇతర తాజా పండ్లను మాస్కో మార్కెట్లో విక్రయించారు. వచ్చిన లాభాలలో ఎక్కువ భాగం తిరిగిదానిలోనే పెట్టుబడి పెట్టటం, కార్మికుల సంక్షేమ చర్యలకు వినియోగిస్తూ ఎడారిలో ఒయాసిస్‌ మాదిరి సోషలిజాన్ని కాలదన్నుకున్న రష్యాలో సోషలిస్టు పద్దతులలో క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆధునిక నివాస గృహాలతో పాటు వుచిత పాఠశాలలు, ఆరోగ్య, ప్రసూతి కేంద్రాల నిర్వహణ, పెన్షన్‌ సదుపాయాలను కలిగిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధ లేకపోయినా కార్మికులకు సంక్షేమ చర్యలు అమలు జరపటం సాధ్యమే అని నిరూపించారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమపధకాల కంటే ఎక్కువ లబ్ది చేకూరుతోంది. వ్యవసాయక్షేత్రంలో పని చేసే కార్మికులకు రష్యన్‌ సగటు కంటే రెట్టింపుగా 78వేల రూబుళ్ల మేరకు నెలవారీ వేతనం ఇస్తున్నారు. అక్కడ పనిచేసే డ్రైవర్లు నివశించే భవనంలోనే గ్రడినిన్‌ కూడా వుంటున్నారు. మీరు ఇలా ఎందుకు నిర్వహిస్తున్నారు అని తరచూ అనేక మంది నన్ను అడుగుతూ వుంటారు. రష్యాలో అందరూ ఇలానే వుండాలని నేను కోరుకుంటున్నాను, అది సాధ్యమే అని చెబుతాను అని గ్రడినిన్‌ చెప్పారు. ఆయన మీసాలు, జుట్టు, రూపు రేఖలు స్టాలిన్‌ను పోలివుండటంతో కొంత మంది ఆయనలో స్టాలిన్‌ను చూస్తున్నారని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యా నించింది. యజమానిగా ఆయన వేతనం లెనిన్‌ క్షేత్రంలో పనిచేసే ట్రాక్టర్‌ డ్రైవర్ల కంటే 26రెట్లు ఎక్కువ అని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాలు వెల్లడించినట్లు ఆ పత్రిక తెలిపింది.

గ్రడినిన్‌ పట్ల ఓటర్లలో ఆసక్తి జనించిన పూర్వరంగంలో లెనిన్‌ ఒక దేవదూత అని, బైబిల్‌ నుంచే సోవియట్‌ కమ్యూనిస్టు భావన వచ్చిందని పుతిన్‌ చెప్పటం దానిని ప్రభుత్వరంగంలోని టీవీ ప్రసారం చేయటం ఎన్నికల ప్రచారంలో భాగమే అని చెప్పవచ్చు. ఫిన్లండ్‌ సరిహద్దులోని వాలమ్‌ మొనాస్టరీ పునరుద్దరణ సందర్భంగా తీసిన డాక్యుమెంటరీ కోసం పుతిన్‌ మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. గతంలో పుతిన్‌ అనేక సందర్భాలలో చర్చిని సమర్దించారు. ‘కమ్యూనిజం-క్రైస్తవం భావనలు ఒకదానికి ఒకటి పొసగదు అని నేను నమ్మటం లేదు. నేను చెబుతున్నది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కానీ నేను అనుకుంటున్నది నేను చెబుతాను’ అన్నారు. ‘ముందుగా ఒకటి చెప్పాలి, ఎల్లవేళలా విశ్వాసం మనతోనే వుంటోంది. మన దేశ ప్రజలకు కష్టాలు వచ్చినపుడు అది బలపడింది.ఆ చర్యలు ఎంతో కఠినంగా వున్నాయి. దేవునితో యుద్ధం చేసిన సంవత్సరాలలో చర్చ్‌లను నాశనం అయ్యాయి, పూజారులను లేకుండా చేశారు. అయితే అదే సమయంలో సోవియట్‌లు ఒక నూతన మతాన్ని సృష్టించాయి.నిజంగానే కమ్యూనిస్టు భావజాలం క్రైస్తవానికి చాలా దగ్గర పోలిక వుంది. క్రైస్తవం, కమ్యూనిజం రెండూ కూడా స్వేచ్చ, సోదరత్వం, సమానత్వాన్ని ప్రబోధించాయి. లెనిన్‌ భౌతిక కాయ్యాన్ని మసోలియంలో వుంచారు. ఆర్ధడాక్స్‌ లేదా క్రైస్తవుల దేవదూతల అవశేషాలకూ దానికి తేడా ఏముంది’ అని పుతిన్‌ డాక్యుమెంటరీ నిర్వాహకులతో ప్రశ్నించారు.

రష్యాలో లెనిన్‌, స్టాలిన్‌, సోషలిజం, కమ్యూనిజాల పట్ల ఇప్పటికీ అక్కడి జనంలో వున్న అభిమానాల పూర్వరంగంలో వాటిపై మొరటుగా దాడిచేస్తే ఫలితం లేదని గ్రహించిన వ్యక్తిగా ఓటర్లలో గందరగోళం కలిగించేందుకు, తాను లెనిన్‌, కమ్యూనిజాలను వ్యతిరేకించినప్పటికీ వాటిపట్ల గౌరవం వుందని చెప్పుకొనేందుకు చేసిన ఒక ప్రయత్నంగా చెప్పవచ్చు. తాను అధికారంలో వున్నంత వరకు లెనిన్‌ భౌతిక కాయాన్ని మసోలియంలోనే వుంచుతానని గతంలో చెప్పాడు. ఎన్నికల సమయం గనుక లెనిన్‌ గురించి సానుకూలంగా మాట్లాడి దానిని ప్రచారంలోకి పెట్టారు. గతంలో అనేక సందర్భాలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను వ్యక్తం చేసిన పుతిన్‌ ఒక బూర్జువారాజకీయవేత్త. అవసరం కొద్ది అలాంటి వారు ఏమైనా చెబుతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిలీ ఎన్నికలు వామపక్షాలకు మరో హెచ్చరిక !

21 Thursday Dec 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Chile Elections 2017, Latin America’s Left, Latin America’s Right, Latin America’s Rightward Shift

ఎం కోటేశ్వరరావు

డిసెంబరు 17న లాటిన్‌ అమెరికాలోని చిలీ అధ్యక్ష తుది ఎన్నికలు జరిగాయి. మితవాద అభ్యర్ధి సెబాస్టియన్‌ పినెరా గెలిచాడు అనటం కంటే వామపక్ష అభ్యర్ధి అలెజాండ్రో గలియర్‌ ఓటమి పాలయ్యాడని చెప్పాలి. ఆశ్చర్యంగా వుంది కదూ ! సగానికిపైగా ఓటర్లు అసలు ఎన్నికల్లో పాల్గనలేదు, మొదటి దఫా పోలైన ఓట్లలో 64శాతం ఓట్లు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులుగా వున్న అభ్యర్ధులకే వచ్చాయి. తుదివిడత పోటీలో వారి మధ్య ఐక్యత లోపించిన కారణంగా వామపక్ష అభ్యర్ధి ఓటమి పాలయ్యారు. జనాభాలో 45శాతంగా వున్న ఆదివాసులు ఎక్కువ మంది మితవాద పినేరా వైపు మొగ్గుచూపినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.తొలి విడత పోలింగ్‌లో ఓటర్లు కేవలం 46.72 శాతం మాత్రమే ఓటర్లు పాల్గన్నారు. తుది విడతలో 49శాతం వరకు పెరిగినప్పటికీ ఎన్నికలకు దూరంగా వున్న ఓటర్లను సమీకరించటంలో వామపక్ష కూటమి పెద్దగా చేసిందేమీ లేనట్లు స్పష్టమైంది. ఓటింగ్‌ శాతం తగ్గిన అత్యధిక సందర్భాలలో మితవాద, ప్రజావ్యతిరేక శక్తులే చురుకుగా వుంటాయన్నది ప్రపంచ అనుభవం.

ఎన్నికల గడువు దగ్గర పడిన తరువాత నూతన వామపక్ష కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌లోని పార్టీలు, తొలిదశలో పోటీ పడిన ఇతర అభ్యర్ధులు గులియర్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ అప్పటికే సమయం మించిపోయింది. వారికి వచ్చిన ఓట్లన్నీ గులియర్‌కు పడి వుంటే ఎంతో సులభంగా విజయం లభించి వుండేది. అలా జరగలేదు. సోషలిస్టుపార్టీ నేత బాచ్‌లెట్‌ ప్రభుత్వం పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య ఒప్పందం వైపు మొగ్గు చూపటం, వెనెజులాపై ఆరోపణల దాడి జరపటం వంటి అంశాలు కొత్తగా ముందుకు వచ్చిన వామపక్ష కూటమివైపు వామపక్ష అభిమానులు గణనీయంగా మొగ్గు చూపేందుకు దోహదం చేశాయి. బ్రాడ్‌ ఫ్రంట్‌ నేతలు కూడా ప్రచారంలో మితవాద పినేరా కంటే గులియర్‌పై దాడిని ఎక్కుపెట్టటం కూడా దాని మద్దతుదారులు రెండో విడత ఎన్నికలలో ఓటింగ్‌కు దూరం కావటమో లేక నామమాత్రంగా గులియర్‌కు వేసి వుండటమో జరిగింది.

లాటిన్‌ అమెరికాలో ఒక మార్క్సిస్టుగా ఎన్నికలలో ఎన్నికైన ఒక దేశాధ్యక్షుడిగా సాల్వెడార్‌ అలెండీ చరిత్రకు ఎక్కారు. ప్రజాస్వామ్యబద్దంగా 1970లో చిలీ అధ్యక్షుడిగా ఎన్నికైన అలెండీని కొనసాగనిస్తే లాటిన్‌ అమెరికా అంతటా అదే పరిణామం పునరావృతం అవుతుందని భయపడిన అమెరికా కుట్ర చేసి మిలిటరీ జనరల్‌ పినోచెట్‌ నాయకత్వంలో తిరుగుబాటుకు తెరదీసింది. దానిని ఎదుర్కొనేందుకు స్వయంగా తుపాకి పట్టి కుట్రదారుల చేతుల్లో బలైన నేత అలెండీ.

      నవంబరు 19న జరిగిన పోలింగ్‌లో ఎనిమిది మంది పోటీ పడగా వారిలో పినెరాకు 36.64, గలియర్‌కు 22.7, మరో వామపక్ష అభ్యర్ధి బియాట్రిజ్‌ సాంఛెజ్‌కు 20.27శాతం ఓట్లు వచ్చాయి. ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాని కారణంగా తొలి రెండు స్ధానాలలో వున్నవారి మధ్య తుది పోటీ జరిగింది. గలియర్‌ న్యూ మెజారిటీ పేరుతో వున్న అధికార వామపక్ష ప్రజాతంత్ర కూటమి అభ్యర్ధి. ఈ కూటమిలో చిలీ అనగానే గుర్తుకు వచ్చే సాల్వెడార్‌ అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీ నాయకురాలు కాగా కమ్యూనిస్టుపార్టీ, సోషలిజం- పెట్టుబడిదారీ విధానాలలోని మంచిని అమలు జరపాలని చెప్పే విరుద్ద విధానాల క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఇతర చిన్న పార్టీలు వున్నాయి.. మొదటి ఇద్దరి మధ్య తుదివిడత పోటీలో పినేరా 54.58 శాతం ఓట్లతో విజయం సాధించాడు. ఈ ఎన్నికలకు దూరంగా మెజారిటీ ఓటర్లు 51.5శాతం వున్నారు. అధికారంలో వున్న న్యూ మెజారిటీ కూటమి అనుసరించిన విధానాలతో ఓటర్లు ఎంతగా విసిగిపోయారో ఈ అంకె వెల్లడించింది. ఈ కారణంగానే చిలీలో ఇద్దరు ప్రజాభిమానం లేని అభ్యర్ధుల మధ్య పోటీ అనే శీర్షికతో ఒక మీడియా వార్తనిచ్చింది. అధికార కూటమి అభ్యర్ధి ఓటమిని అనేక మంది ముందే సూచించారు. ఎన్నికలకు నెల రోజుల ముందే క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధికార కూటమి నుంచి వైదొలగి తన అభ్యర్ధిని పోటీకి పెట్టింది. ఆరు సంవత్సరాల క్రితం వువ్వెత్తున ఎగిసిన విద్యార్ధి వుద్యమానికి నాయకత్వం వహించిన వారితో పాటు కొన్ని చిన్న వామపక్ష పార్టీలతో ఈ ఏడాది ప్రారంభంలో బ్రాడ్‌ ఫ్రంట్‌ పేరుతో ఏర్పడిన కూటమి అభ్యర్ధే రెండవ స్ధానంలో వుంటారా అన్న వాతావరణం నవంబరు ఎన్నికల సమయంలో ఏర్పడింది. సోషలిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అమలు జరిపిన విధానాలపై విబేధాల కారణంగా అన్ని వామపక్ష పార్టీలు,శక్తుల మధ్య ఐక్యత కుదిరేది కాదని ముందే తేలిపోయింది.

ఈ పూర్వరంగంలో జరిగిన తుది విడత ఎన్నికలలో మితవాది పినేరా విజయం సాధించాడు. పార్లమెంట్‌ దిగువ సభలోని 155 స్ధానాలకు గాను పినేరా నాయకత్వంలోని కూటమి72 సాధించగా న్యూ మెజారిటీ కూటమి 43, బ్రాడ్‌ ఫ్రంట్‌ 20, క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌పార్టీ కూటమి 14 స్ధానాలు సాధించాయి. ఇతర పార్టీలకు 6 వచ్చాయి. న్యూ మెజారీటీ కూటమిగతం కంటే ఒక సీటును కోల్పోగా దాని భాగస్వామి కమ్యూనిస్టు పార్టీ ఆరు నుంచి ఎనిమిది సీట్లకు పెంచుకుంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన, మరోసారి గెలిచిన పినేరా చిలీ నియంత పినోచెట్‌ అనుచరుడు. అతనికి దేశంలోని 15 రాష్ట్రాలలో 13చోట్ల ఆధిక్యత లభించింది. తుది విడత పోటీ పడిన ఇద్దరు అభ్యర్ధుల పట్ల ఓటర్లు అనాసక్తి కనపరచటానికి కారణం వివిధ తరగతుల జీవితాలు చిన్నా భిన్నం కావటానికి కారణమైన స్వేచ్చామార్కెట్‌ లేదా నయా వుదారవాద విధానాలపై ఇద్దరూ వ్యతిరేకంగా మాట్లాడకపోవటమే. తాను గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తానని గలియర్‌ ప్రకటించగా, తాను కార్పొరేట్‌లాభాలపై పన్నులు తగ్గిస్తానని పినేరా వాగ్దానం చేశాడు. వామపక్ష ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో వున్నప్పటికీ నియంత పినోచెట్‌ హయాంలో రూపొందించిన ప్రజావ్యతిరేక రాజ్యాంగాన్ని మార్చటానికి పెద్దగా ప్రయత్నించలేదు. తనను ఎన్నుకుంటే ఆ పని చేస్తానని వామపక్ష కూటమి అభ్యర్ధి గలియర్‌ ప్రకటించినప్పటికీ జనంలో విశ్వాసం కలగలేదని ఓటర్ల అనాసక్తి వెల్లడించింది. గతంలో తాము కోల్పోయిన భూములను తిరిగి పొందేందుకు పోరాడుతున్న ఆదివాసులపై బాచ్‌లెట్‌ ప్రభుత్వం నియంత పాలనలో చేసిన వుగ్రవాద చట్టాన్ని ప్రయోగించి మిగతాపార్టీలకూ వామపక్షాలకు తేడా లేదన్న విమర్శలను మూటగట్టుకుంది. విద్యారంగంలో కూడా జనం కోరిన విధంగా విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రయత్నం చేయలేదు.మిగతా లాటిన్‌ అమెరికా దేశాల మాదిరే ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయని కారణంగా పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభ ప్రభావం చిలీపై కూడా ఎన్నికలకు ముందు బాచ్‌లెట్‌ ప్రభుత్వానికి జనాదరణ అత్యంత తక్కుగా వున్నట్లు సర్వేలు వెల్లడించాయి.

ప్రపంచ సాంప్రదాయ పెట్టుబడిదారీ, ఇటీవలి కాలపు ద్రవ్య పెట్టుబడిదారీ విధానాలు, వాటికి వున్నత రూపమైన సామ్రాజ్యవాద ప్రయోగశాలగా లాటిన్‌ అమెరికాను మార్చారు. పోరాట సాంప్రదాయం కలిగిన లాటిన్‌ అమెరికాలో తమ దోపిడీకి అడ్డులేకుండా చేసుకొనేందుకు, వామపక్ష, ప్రజావుద్యమాలను వుక్కుపాదంతో అణచివేసేందుకు ప్రజాస్వామిక వ్యవస్ధలను ప్రహసన ప్రాయంగా మార్చి ప్రతి దేశంలోనూ మిలిటరీ నియంతలను రంగంలోకి తెచ్చిన చరిత్ర తెలిసిందే. ‘చికాగో పిల్లలు’గా పిలిపించుకున్న అమెరికన్‌ సలహాదారులు అందచేసిన దివాలాకోరు నయా వుదారవాద విధానాల అమలు ఫలితంగా ఆర్ధికంగా దివాలా, అప్పులపాలైన ఆ ప్రాంత దేశాలలో మిలిటెంట్‌ వుద్యమాలు, తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. తీవ్రమైన అమెరికా వ్యతిరేకత పెల్లుబికింది. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అమెరికా ప్రతిష్టించిన పాలకులను సమర్ధించటానికి జంకే పరిస్ధితులు ఏర్పడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసి ప్రచ్చన్న యుద్ధంలో తాము విజయం సాధించామని ప్రకటించుకుంది అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి. అంత పెద్ద విజయం సాధించిన తరువాత తమ పెరటితోటలో నియంతల స్ధానంలో నయా వుదారవాద విధానాలను అమలు జరిపే సరికొత్త శక్తులను రంగంలోకి తెచ్చేందుకు అమెరికా అనుమతించింది. ఆక్రమంలో ఆ పాలకుల వైఫల్యం, ఆ కారణంగా ఏర్పడే ఖాళీలో వామపక్ష శక్తులు విజయం సాధిస్తాయన్నది సామ్రాజ్యవాద శక్తులు వూహించని పరిణామం. ఆ క్రమాన్ని అడ్డుకోవటం అంటే తిరిగి సైనిక, మితవాద నియంతలను ప్రతిష్టించటం లేదా మరోసారి ప్రజాస్వామ్య పీకనులిమినట్లు ప్రపంచానికి తెలియచెప్పటమే. అందువలన తనను వ్యతిరేకించే శక్తులను అనుమతించటం తప్ప వారికి మరొక తక్షణ మార్గం లేకపోయింది.

దశాబ్దాల తరబడి లేని ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించటం, తక్షణం వుపశమనం కలిగించే చర్యలు, కొన్ని సంక్షేమ పధకాలను అమలు జరిపిన కారణంగా వెనెజులా, బ్రెజిల్‌, అర్జెంటీనా, బలీవియా వంటి చోట్ల వరుసగా వామపక్ష శక్తులు విజయాలు సాధించటం అది ఇతర దేశాలకు వ్యాపించిన చరిత్ర తెలిసిందే. అయితే నయావుదారవాదం, ద్రవ్యపెట్టుబడిదారీ విధానాల ప్రాతిపదికన ఏర్పడిన దోపిడీ వ్యవస్ధ మూలాలను దెబ్బతీయకుండా వాటి పెరుగుదలను అనుమతిస్తూనే మరోవైపు సంక్షేమ చర్యలను అమలు జరపటం ఎంతో కాలం సాధ్యం కాదని గుర్తించటంలో లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల వైఫల్యం కనిపిస్తోంది. నయా వుదారవాద విధానాల చట్రం నుంచి బయటపడని కారణంగా ఆ ప్రభుత్వాలు కూడా ప్రజల అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి తోడు వామపక్షాలుగా వున్న కొన్ని పార్టీల నేతల అవినీతి అక్రమాలు, విధానపరమైన వైఫల్యాల కారణంగా మితవాద, కార్పొరేట్‌ శక్తులు జనాన్ని రెచ్చగొట్టటంలో కొంత మేర జయప్రదం అయ్యాయి. అర్జెంటీనా, బ్రెజిల్‌లో మితవాదులు అధికారానికి రాగా వెనెజులా పార్లమెంట్‌లో ఆధిక్యతను సాధించారు. చిలీలోని వామపక్ష శక్తులు కూడా నయావుదారవాద పునాదుల మీదే పాలన సాగించటం, అధ్యక్షురాలు బాచ్‌లెట్‌ కుటుంబ సభ్యులపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలపై విచారణ వంటివి అక్కడ ఓటమికి కారణం. మితవాది పినేరా విజయం సాధించటానికి దారితీసిన పూర్వరంగాన్ని నెమరువేసుకోవటం అవసరం. చిలీ రాజ్యాంగం ప్రకారం ఒక దఫా అధ్యక్షపదవికి ఎన్నికైన వారు తదుపరి ఎన్నికలలో పాల్గనటానికి అవకాశం లేదు. తాజా ఎన్నికలలో విజయం సాధించిన సెబాస్టియన్‌ పినేరా 2010-14 మధ్య అధ్యక్షుడిగా పని చేశాడు. తరువాత అధ్యక్షురాలిగా ఎన్నికైన మిచెల్లీ బాచ్‌లెట్‌ అంతకు ముందు ఒకసారి అధ్యక్షరాలిగా పని చేశారు. అంటే గత పదమూడు సంవత్సరాలలో బాచ్‌లెట్‌-పినేరా పాలనా తీరుతెన్నులను చూసిన చిలీ ఓటర్లు పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయినా ఒకటే అనే నిర్వేదానికి లోనయ్యారంటే అతిశయోక్తి కాదు. నియంత పినోచెట్‌ పాలన 1990లో అంతరించినా వాడి హయాంలో రూపొందించిన కార్పొరేట్‌ అనుకూల, ప్రజావ్యతిరేక రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు లేకుండా గత 27 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఎవరు అధికారంలోకి వచ్చినా ఒకటే అని ఓటర్లు భావిస్తున్నందున ఇటీవలి ఎన్నికలలో మెజారిటీ ఓటర్లు పోలింగ్‌ బూత్‌లవైపు చూడటం లేదు. తాజా ఎన్నికలకు ముందు జరిగిన ఒక సర్వేలో కేవలం 29శాతం మంది మాత్రమే రాజకీయ పార్టీల పట్లవిశ్వాసం వెలిబుచ్చగా సగం మంది తమకు రాజకీయాలంటే ఆసక్తిలేదని పేర్కొన్నారు. పినోచెట్‌ నియంతృత్వానికి గురైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా మిచెల్లీ బాచ్‌లెట్‌పై వున్న గౌరవం, అధ్యక్షుడిగా పినేరా అవినీతి అక్రమాలతో విసిగిపోయిన జనం గత ఎన్నికలలో బాచ్‌లెట్‌వైపు మొగ్గారు. ఈసారి ఆమె పోటీకి అనర్హురాలు కావటంతో జర్నలిస్టు అయిన గులియర్‌ను అభ్యర్ధిగా నిలిపారు. అయితే అతనిని బయటి వ్యక్తిగా చూశారని విశ్లేషకులు చెబుతున్నారు. తాను ప్రజలందరి అధ్యక్షుడిని అని ప్రచారం చేసుకోవటం కూడా దెబ్బతీసి వుండవచ్చు.

ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా అర్జెంటీనా, బ్రెజిల్‌లో ఇటీవల పెద్ద ఎత్తున అక్కడి మితవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జనం తిరిగి వీధులలోకి వస్తున్నారు. అందువలన ఇప్పటికీ అధికారంలో వున్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులుగానీ, అధికారం కోల్పోయిన దేశాల్లోని శక్తులుగానీ నయావుదారవాద మూలాలను దెబ్బతీసి దోపిడీ నుంచి కార్మికవర్గాన్ని కాపాడే ప్రత్యామ్నాయ అర్ధిక విధానాలకు రూపకల్పన చేసి ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనటం తప్ప మరొక దగ్గర మార్గం కనిపించటం లేదు. గత రెండు దశాబ్దాలలో సాధించిన విజయాలు,తాజాగా ఎదురవుతున్న అపజయాలను సమీక్షించుకొని ముందుకు ఎలా పోవాలా అన్న మధనం ఇప్పటికే అక్కడి వామపక్ష శక్తులలో ప్రారంభమైంది. నయా వుదారవాద పునాదులపై నిర్మించిన వ్యవస్ధలను కూల్చకుండా ప్రత్యామ్నాయ నిర్మాణాలు చేయలేమని తేలిపోయింది. ప్రపంచ సోషలిస్టు శక్తులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన సమయంలోనే లాటిన్‌ అమెరికాలో అరుణపతాక రెపరెపలు ప్రారంభమయ్యాయి. సోషలిస్టు శిబిరానికి తగిలిన ఎదురుదెబ్బల కంటే ప్రస్తుతం లాటిన్‌ అమెరికాలో ఎదురవుతున్న ఓటములు పెద్దవేమీ కాదు. ఇప్పటికే వెనెజులాలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మిగతా దేశాలలో కూడా ఆ క్రమం అనివార్యం. కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ వూహించినట్లుగా తమకాలంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో విప్లవం సంభవించలేదు. అనూహ్యంగా ఇతర చోట్ల వచ్చింది. లాటిన్‌ అమెరికాలో తదుపరి దశ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు, కార్పొరేట్‌, మితవాద శక్తుల పునాదులను కూల్చివేయటమే కనుక వాటి నుంచి ప్రతిఘటన గతం కంటే తీవ్రంగా వుంటుంది. ఆ పరిణామాలు ఎలా వుంటాయన్నది జోశ్యం చెప్పే అంశం కాదు.చుంచెలుక భూమిలో నిరంతరం తవ్వుతూ అప్పుడప్పుడు బయటికి కనిపించినట్లుగా విప్లవ క్రమం అంతర్గతంగా నిరంతరం జరుగుతూనే వుంటుంది. అది ఎప్పుడు, ఎలా,ఎక్కడ బయటకు వస్తుందో చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పార్లమెంట్‌, రాష్ట్రాలలో నేపాల్‌ కమ్యూనిస్టు ఐక్యకూటమి ఘనవిజయం !

13 Wednesday Dec 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

cpn uml, kp sharma oli, Nepal communists, Nepal elections, prachanda

మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ యుఎంఎల్‌ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కమ్యూనిస్టులకు ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో నేపాల్‌ కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు.ఒక నాడు ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ప్రకటించిన నేపాల్‌లో అన్ని మతాలకు సమాన గుర్తింపు నిచ్చే లౌకిక, ప్రజాస్వామ్య నూతన రాజ్యాంగం రచనలో కమ్యూనిస్టులు భాగస్వాములు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన స్ధానాలలో మూడింట రెండు వంతులపైగా మెజారిటీ ఇప్పటికే సాధించారు. దామాషా స్ధానాలను కలిపినపుడు కూడా అదే మెజారిటీ పొందే అవకాశాలున్నాయి. కమ్యూనిస్టులే సంపూర్ణ మెజారిటీతో ఏర్పాటు చేసే ప్రభుత్వం నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాతే ఇదే ప్రధమం. నవంబరు 26, డిసెంబరు ఏడవ తేదీన రెండు విడతలుగా 275 సీట్లకు జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టుల విజయం హిమాలయ దేశంపై ఆసక్తి చూపుతున్న అన్ని దేశాలలో ముఖ్యంగా కమ్యూనిస్టులు అధికారానికి రావద్దని కోరుకుంటున్న వారిలో వేడిపుట్టించిందంటే అతిశయోక్తికాదు.

పార్లమెంట్‌లోని 275 స్ధానాలు ఏడు రాష్ట్రా( ప్రాంతాలు)లలో విస్తరించి వున్నాయి. వాటిలో 165 నియోజకవర్గాలకు మనదేశంలో మాదిరి ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్ధానాలకు పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి దామాషా పద్దతిలో ఎన్నికలు జరిగాయి.  165కు గాను 116 చోట్ల కమ్యూనిస్టులు విజయం సాధించారు. మొత్తం ఓట్లు లెక్కింపు పూర్తి అయిన తరువాత పదిహేనవ తేదీన దామాషా ప్రాతిపదికన వచ్చిన సీట్లను పార్టీలకు కేటాయిస్తారు. బుధవారం నాటికి జరిగిన లెక్కింపు వివరాల మేరకు దామాషా ఓట్లలో నేపాలీ కమ్యూనిస్టుపార్టీ యుఎంఎల్‌ 35.35శాతం ఓట్లతో ముందుండగా నేపాలీ కాంగ్రెస్‌ 33.62శాతంతో రెండవ స్ధానంలో, 13.63 శాతంతొ మావోయిస్టు సెంటర్‌ మూడవ స్ధానంలో కొనసాగుతోంది. మరో మూడు పార్టీలు సాధించాల్సిన కనీస మూడుశాతం కంటే ఎక్కువ తెచ్చుకొని దామాషా సీట్లలో ప్రాతినిధ్యం పొందనున్నాయి. మొత్తం స్ధానాలలో 33శాతం మహిళలకు కేటాయించారు. ఏడు ప్రాంతాల శాసనసభకు జరిగిన ఎన్నికలలోనూ నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ యుఎంఎల్‌ అభ్యర్ధులు ఆరు చోట్ల మెజారిటీలో వున్నారు. ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. రాష్ట్రాల శాసన సభలలో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల స్ధానాలలో యుఎంఎల్‌ 166,మావోయిస్టు సెంటర్‌ 73, నేపాలీ కాంగ్రెస్‌ 45, ఇతర పార్టీలు 45 తెచ్చుకున్నాయి. దామాషా సీట్లకు గాను నమోదైన పార్టీలు కనీసంగా ప్రతి రాష్ట్రంలో 1.5శాతం ఓట్లు తెచ్చుకుంటే ప్రాతినిధ్యం పొందుతాయి.

మావోయిస్టు సెంటర్‌ నేత ప్రచండ

తమ కూటమి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందనే విశ్వాసాన్ని ఎన్నికల ముందు వ్యక్తపరచిన యుఎంఎల్‌ నాయకుడు కెపి శర్మ ఓలీ మాటలను అతిశయోక్తిగా వర్ణిస్తూ మహా అయితే స్వల్ప మెజారిటీ సాధించవచ్చునేమో అని అనేక మంది కొట్టిపారేశారు. మావోయిస్టులు అధికారంలో కొనసాగుతూనే ప్రతిపక్షంలో వున్న యుఎంఎల్‌ పార్టీతో అవగాహనకు రావటంపై సహజంగానే వుభయ పార్టీలలో కొంత అసంతృప్తి రేపింది. సీట్లు కోల్పోయిన వారు, రాని వారు కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తారేమోనని సందేహించారు. కమ్యూనిస్టు పార్టీల మధ్య అవగాహనను దెబ్బతీసేందుకు మావోయిస్టు సెంటర్‌ నేత ప్రచండకు చివరి క్షణంలో నేపాలీ కాంగ్రెస్‌నేతలు ప్రధాని పదవిని ఎరవేసినా ఆశ్చర్యం లేదని కొందరు వూహించారు. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కమ్యూనిస్టులు విజయకేతనం ఎగుర వేశారు. మూడింట రెండువంతుల కంటే ఎక్కువగా సీట్లను పొందారు.

అక్టోబరు రెండవ తేదీన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(యుఎంఎల్‌) నేపాలీ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు సెంటర్‌) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 60:40 దామాషా పద్దతిలో రెండు పార్టీలు పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత పార్టీల ఐక్యతా క్రమాన్ని ప్రారంభిస్తారు. యుఎంఎల్‌ పార్టీ 80, మావోయిస్టు సెంటర్‌ 36 సీట్లు గెలుచుకుంది. రద్దయిన పార్లమెంటులో పెద్ద పార్టీగా వున్న నేపాలి కాంగ్రెస్‌కు 23, ఇతర పార్టీలకు 26 సీట్లు వచ్చాయి. మావోయిస్టు సెంటర్‌ నుంచి విడిపోయి నయాశక్తి పార్టీ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని బాబూరామ్‌ భట్టారాయ్‌ని తమ గుర్తుపై పోటీ చేసేందుకు మావోయిస్టు సెంటర్‌ నిరాకరించింది. దాంతో ఆయన నేపాలీ కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చి పార్లమెంటుసీటులో విజయం గెలిచారు. వచ్చిన వార్తలను బట్టి యుఎంఎల్‌ పార్టీ అధ్యక్షుడు కెపి శర్మ ఓలి ప్రధానిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. నేపాల్‌ నూతన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన 30 రోజుల లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వుంది. ఎన్నికల తరువాత రెండు పార్టీల విలీనం జ రుగుతుందని గతంలో ప్రకటించారు.

. రాచరిక వ్యవస్ధ అంతరించిన తరువాత నేపాల్‌ రాజకీయ అవనికపై నేపాలీ కాంగ్రెస్‌, యుఎంఎల్‌, మావోయిస్టు సెంటర్లే ప్రధాన పాత్ర పోషించాయి. వాటి మధ్యే సంకీర్ణ కూటమి అవగాహనలు కుదిరాయి, ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి, విడిపోయాయి. అందువలన వైఫల్యాలకు మూడు పార్టీలను బాధ్యులను చేయాల్సి వుంటుంది. అసలే పేద దేశం దానికి తోడు దశాబ్దాల పాటు ఫూడల్‌ రాచరిక వ్యవస్ధలో ప్రజాస్వామ్యం, ఎలాంటి అభివృద్ధి లేని దేశంలో రాచరికానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం సాగిన అంతర్యుద్ధం, అది ముందుకు తెచ్చిన అంశాలు, వేర్పాటు వాదం వంటి సమస్యలు నూతన ప్రభుత్వం ముందున్నాయి.చైనాతో సన్నిహిత సంబంధాలతో పాటు ఆ దేశ పెట్టుబడులను ఆహ్వానించాలని కమ్యూనిస్టులు కోరుకుంటున్న కారణంగానే జలవిద్యుత్‌ ప్రాజక్టుల వంటివి ఆలశ్యమయ్యాయని విమర్శకులు ఆరోపించారు. అదే సమయంలో నేపాలీ కాంగ్రెస్‌కు గతంలో భారత్‌తో వున్న సంబంధాల కారణంగా భారత్‌తో స్నేహంగా వుండాలనే వైపు మొగ్గు చూపారని కూడా విశ్లేషకులు పేర్కొన్నారు.

రాచరిక వ్యవస్ధ కూలిపోయిన తరువాత ఏర్పడిన అనేక సంకీర్ణ ప్రభుత్వాలు, భాగస్వామ్య పక్షాల మధ్య తలెత్తిన సమస్యలు, నూతన రాజ్యాంగంపై ఏర్పడిన ప్రతిష్ఠంభన, కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకత వ్యక్తం కావటం, ఇరుగు పొరుగు దేశాలజోక్యం, ప్రభావం,పేదరికం, దారిద్య్రం, ప్రజల ఆకాంక్షల వంటి అనేక సమస్యలు నూతన ప్రభుత్వం ముందున్నాయి. ఈ పూర్వరంగంలో నూతన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగటమే ఒక ముఖ్యాంశంగా చెప్పాల్సి వుంటుంది. రిపబ్లికన్‌, ఫెడరల్‌ లక్షణాలతో కూడిన నూతన రాజ్యాంగాన్ని 2015 సెప్టెంబరులో ఆమోదించారు. 2018జనవరిలోగా కొత్త రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాలన్నది ఆదేశం. రద్దయిన పార్లమెంట్‌లో అధికార కూటమిలో వున్న నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు సెంటర్‌) ప్రధాన ప్రతిపక్షంగా వున్న నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(యుఎంఎల్‌)తో అవగాహనకు రావటం దేశ రాజకీయాలలో నూతన వుత్తేజాన్ని నింపటంతో పాటు ప్రజామోదం పొందినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.

ఎన్నికలకు ముందు నేపాల్‌లో కొన్ని ఆసక్తికర పరిణామాలు సంభవించాయి. నేపాలీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వంలో మావోయిస్టు సెంటర్‌ భాగస్వామి. దాని మంత్రులు రాజీనామా చేయకుండానే ప్రతిపక్ష యుఎంఎల్‌ పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. దీంతో నేపాలీ కాంగ్రెస్‌ దేశంలోని కమ్యూనిస్టేతర పార్టీలన్నింటినీ ప్రభుత్వంలోకి ఆహ్వానించటమే గాక కొత్త మంత్రులను కొందరిని చేర్చుకొని వారికి మావోయిస్టు మంత్రుల శాఖలను కేటాయించారు. రాచరిక వ్యవస్ధను సమర్ధించే రాష్ట్రీయ ప్రజాతంత్రపార్టీ, మధేశీపార్టీల వంటి వాటిని చేరదీశారు. అయితే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా వాటి మధ్య ఐక్యత కానరాలేదు. మధేశీ పార్టీలలో ఒకటైన ఎన్‌డిఎఫ్‌ మాత్రమే నేపాలీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఎన్నికల ప్రచార తీరు తెన్నులను చూస్తే కమ్యూనిజమా లేక ప్రజాస్వామ్యమా అన్న పద్దతిలో మార్చివేసిన కమ్యూనిస్టేతర పార్టీలు దేశంలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టచూశాయి. ఇదే సమయంలో ఎన్నికలను విచ్చిన్నం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. అసంతృప్తి చెందిన మావోయిస్టులు, ఇతరులు కొందరు కొన్ని చోట్ల బాంబుల దాడులు కూడా జరిపారు. కొన్ని చోట్ల సైన్యాన్ని దింపాల్సి వచ్చింది. మొత్తం మీద ఎన్నికలు జరగటం ఒక విశేషంగానే పరిశీలకులకు కనిపించింది.

మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ యుఎంఎల్‌ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ విజయోత్సవ సభలో మాట్లాడుతూ ప్రజలు మా కార్యక్రమాన్ని ఆమోదించారు. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు అభివృద్ధికోసం ప్రతిపక్షాలను కూడా కలుపుకుపోతాం, దేశాభివృద్ధికి ఏకాభిప్రాయం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇతర శక్తులను విమర్శించే లేదా నిందించే రోజులు పోయాయి, ఇప్పుడు దేశం స్ధిరత్వాన్ని చూడనుంది, మేం అభివృద్ధి గురించి తప్ప రాజకీయాలు మాట్లాడబోం అన్నారు.పార్లమెంటరీ మెజారిటీ సాధించటంతోనే స్ధిరత్వం రాదని అభివృద్ధి, సంపదల సృష్టికి నేతలు సుముఖత చూపితేనే సాధ్యమని చెప్పారు.

ఎన్నికల తరువాత దేశం రాజకీయ స్ధిరత్వం మరియు అభివృద్ధి బాటలో ప్రవేశించిందని మావోయిస్టు సెంటర్‌ అధ్యక్షుడు పుష్ప కమాల్‌ దహాల్‌( ప్రచండ) వ్యాఖ్యానించారు.చిటవాన్‌ మూడవ నంబరు పార్లమెంటరీ స్ధానం నుంచి విజయం సాధించిన సందర్భంగా ఎన్నికల సంఘ అధికారి ధృవీకరణ పత్రం అందచేసే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రచండ పాల్గన్నారు. దేశం ఇంకేమాత్రం గందరగోళ పరిస్ధితులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని వామపక్ష కూటమికి ప్రజలిచ్చిన బాధ్యతను వమ్ముకానివ్వబోమని చెప్పారు. ఈ విజయం ప్రపంచవ్యాపితంగా వివిధ కారణాలతో నీరసపడి వున్న పురోగామివాదులు, కమ్యూనిస్టులలో ఎంతో వుత్సాహాన్ని నింపుతుందని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా తలచుకుంటే అక్రమాలకు కొదవా-హొండురాస్‌లో మరోసారి ప్రజాస్వామ్యం ఖూనీ !

06 Wednesday Dec 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Honduras, Honduras democracy hijaked, Salvador Nasralla, Tegucigalpa, yankees

ఎం కోటేశ్వరరావు

ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయటాన్ని అంగీకరించబోమన్న హొండురాన్లపై పాలకులు వుక్కుపాదాన్ని మోపేందుకు పూనుకున్నారు. దేశమంతటా పది రోజుల పాటు కర్ఫ్యూ ప్రకటించి రక్తాన్ని కండ్ల చూస్తున్నారు. తెలియందేముంది, మేమున్నాం అంటూ సకల అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇచ్చే అమెరికన్లు తాజా దుండగానికీ మద్దతు ఇస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. రాజకీయ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం నాటి వరకు 11మంది మరణించినట్లు మానవహక్కుల సంఘం ప్రకటించింది. మరోవైపు పోలీసు బలగాలు తాము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదని తిరుగుబాటును ప్రకటించాయి. కర్ఫ్యూను వుల్లంఘించి ప్రదర్శనలు జరుపుతున్న వారిపై బల ప్రయోగానికి నిరాకరించాయి. ప్రదర్శనల్లో పాల్గొన్నవారిని సురక్షితంగా ఇండ్లకు చేర్చేందుకు ముందుకు వస్తున్నాయి. అనేక చోట్ల పోలీసులు కూడా ప్రదర్శకులతో కలసి అధ్యక్షుడు హెర్నాండెజ్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దక్షిణ అమెరికా ఖండంలోని మధ్య అమెరికాగా పిలిచే కరీబియన్‌ దేశాలలో ఒకటైన హొండురాస్‌కు ఈశాన్యంలో నికరాగువా, నైరుతిలో ఎల్‌ సాల్వెడార్‌, పశ్చిమాన గౌతమాలా, దక్షిణాన పసిఫిక్‌, వుత్తరాన కరీబియన్‌ సముద్రాల మధ్యలో తొంభైలక్షల మంది జనాభా వున్న దేశమది.నవంబరు 26న ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు మితవాది జువాన్‌ ఆర్లొండో హెర్నాండెజ్‌ తిరిగి ఎన్నికౌతాడని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు బలపరిచిన టీవీ జర్నలిస్టు సాల్వెడార్‌ నసరల్లా విజయం సాధించే దిశగా వున్నట్లు ఓట్ల లెక్కింపు సరళి వెల్లడించింది. పోలైన ఓట్లలో 58శాతం లెక్కించిన సమయానికి ఐదుశాతం మెజారిటీతో నసరల్లా ముందున్నారు. అయితే సాంకేతిక కారణాలు చూపి ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. రెండు రోజుల తరువాత ప్రారంభించగా నాటకీయంగా నసరల్లా మెజారిటీ తగ్గిపోయి హెర్నాండెజ్‌ స్వల్పమెజారిటీకి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపును నిలిపివేయగానే ఓటర్ల తీర్పును వమ్ము చేయనున్నారని గ్రహించిన నసరల్లా ఎన్నికలలో తాను గెలిచానని, తీర్పును వమ్ముచేసేందుకు పూనుకున్నందున నిరసన తెలపాలని తన మద్దతదార్లకు పిలుపునిచ్చారు.

టీవీ జర్నలిస్టు సాల్వెడార్‌ నసరల్లా

ఇదే సమయంలోే ఎన్నికల పరిశీలకురాలిగా వున్న అమెరికా దేశాల సంస్ధ(ఓఏఎస్‌) హొండూరాస్‌ ప్రతినిధి బృందం నాయకుడు జార్జ్‌ క్విరోగా ఒక ప్రకటన చేస్తూ ఓట్ల లెక్కింపులో అక్రమాలు, తప్పిదాలు, వ్యవస్ధా పరమైన సమస్యలున్నందున ఫలితాన్ని గురించి చెప్పలేమని, తిరిగి లెక్కింపు జరపాలని ప్రకటించారు. ఈ పూర్వరంగంలో అనుమానాలున్న వెయ్యి పోలింగ్‌ కేంద్రాల ఓట్లను తిరిగి లెక్కించిన తరువాత మొత్తం 99.98శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని, హెర్నాండెజ్‌ 42.98, నసరల్లా 41.39 శాతం చొప్పున పొందినట్లు సోమవారం నాడు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. అయితే విజేత ప్రకటన చేయలేదు. శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూ ప్రకటించి ఈ ఓట్ల లెక్కింపు తతంగం జరిపారు. తాజా ఓటింగ్‌ ఫలితాన్ని ప్రకటించకముందే వాటిని తాము అంగీకరించేది లేదని అన్ని పోలింగ్‌ కేంద్రాల ఓట్లను తిరిగి పార్టీల ప్రతినిధుల, పరిశీలకుల సమక్షంలో జరపాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాపితంగా జనం ప్రదర్శనలకు దిగారు. భద్రతా దళాలు వారిపై భాష్పవాయు, నీటి ఫిరంగులను ప్రయోగించాయి.కొన్ని చోట్ల కాల్పులు జరిపాయి. దేశంలోని మొత్తం 5,179 పోలింగ్‌ బూత్‌ల ఓట్లను తిరిగి లెక్కించాలని, లేనట్లయితే నిరసన తెలుపుతామని నసరల్లా నాయకత్వంలోని అలయన్స్‌ పార్టీ ప్రకటించింది.

రాజధాని టెగు(టెగుసియాగల్పా)తో సహా ఎక్కడా పోలీసులు ప్రస్తుత అధ్యక్షుడు ప్రకటించిన కర్ఫ్యూ ఆజ్ఞలను అమలు జరపరని, రాజకీయ సంక్షోభం పరిష్కారమయ్యే వరకు తాము యూనిట్లకే పరిమితం అవుతామని పోలీసు ప్రతినిధి ప్రకటించారు.’ మాకు రాజకీయ సిద్ధాంతాలు లేవు, మేము శాంతిని కోరుకుంటున్నాము, మేము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదు, ఈ విషయంలో మేము అలసిపోయాము.మేము జనంతో ఘర్షణ కొనసాగించలేము, అణచివేతను కోరుకోవటం లేదు, దేశ ప్రజల మానవహక్కులను వుల్లంఘించజాలం’ అని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ప్రతినిధి ప్ర కటించాడు. అంతకు ముందు కొట్లాటల నిరోధ కోబ్రా దళ సభ్యుడు మాట్లాడుతూ ‘ఇదేమీ సమ్మె కాదు, వేతనాలు లేదా డబ్బు గురించి కాదు, మా విధి దేశ ప్రజలకు శాంతి, భద్రత కల్పించటం, వారిని అణచివేయటం కాదు, దేశ ప్రజలందరూ సురక్షితంగా వుండాలని కోరుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ ప్రకటనల పరంపర కొనసాగుతుండగానే మరో పోలీసు ప్రతినిధి ఒక టీవీలో మాట్లాడుతూ కొంత మంది పోలీసులు నిరాహారదీక్షకు పూనుకుంటారని ప్రకటించారు. ‘మేము మానవహక్కుల వుల్లంఘనలో భాగస్వాముల కాబోం, మేమా పని చేస్తే త్వరలోనో తరువాతో అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుంది. వాస్తవానికి గతంలో మా వున్నతాధికారుల హక్కుల వుల్లంఘన కారణంగా మేము ఇప్పటికే పరిహారం చెల్లిస్తున్నాము.యూనిఫాంలో వున్న సిబ్బంది మెరుగైన పని పరిస్ధితులు వుండాలని కోరుతున్నారు, వాటిని మా డిప్యూటీ డైరెక్టర్‌ తిరస్కరించారు. మాకు కావాల్సింది యజమానులు కాదు, నాయకులు, మా కమిషనర్‌ నాయకుల కోవకు చెందుతారు. వీధులలో గస్తీ తిరిగే సిబ్బందికి నిరాకరించి అనుబంధంగా వుండే వారికి మాత్రమే వేతనాలు ఎందుకు పెంచారు.ఇది సరైనది కాదు. అని చెబుతూ తమ డిమాండ్లు ఇవి అని టీవీలో ఒక ప్రకటన చదివారు. మరోవైపు భద్రతా దళాలు అనేక మంది విదేశీ జర్నలిస్టులను అదుపులోకి తీసుకొని స్వదేశాకు పంపివేయటం ప్రారంభించాయి.

ఇదిలా వుండగా హొండురాస్‌లో ఎన్నికల కమిషన్‌ క్రమపద్దతిలో ఓట్ల లెక్కింపు జరిపిందని అమెరికా వున్నతాధికారి ఒకరు కితాబునిచ్చారు.హెర్నాండెజ్‌ అమెరికాకు అత్యంత సన్నిహితుడు. ఈక్రమంలోనే అతగాడిని రక్షించేందుకు పూనుకుంది.హొండురాస్‌ సర్కార్‌ అవినీతి వ్యతిరేకత పోరాటం, మానవ హక్కుల పరిరక్షణకు మద్దతు ఇస్తోందంటూ అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రక ప్రకటనలో పేర్కొన్నది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే ఇలాంటి శక్తులకు మద్దతు ఇవ్వకపోతేనే ఆశ్చర్యం. లాటిన్‌ అమెరికాలో నియంతలకు వ్యతిరేకంగా అనేక దేశాలలో పోరాడిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అధికారంలోకి రావటాన్ని అమెరికా తొలి రోజుల్లో అడ్డుకోలేకపోయింది. ఇటీవలి కాలంలో చట్టబద్దమైన కుట్రలకు తెరతీసి అనేక దేశాలలో మితవాదులకు పెద్దపీట వేసి తన మద్దతుదార్లుగా మారుస్తున్నది. హొండురాస్‌లో కూడా అదే పునరావృతం అవుతోంది.

అటు వుత్తర అమెరికా ఖండానికి ఇటు దక్షిణ అమెరికా ఖండానికి మధ్యలో కీలకమైన ప్రాంతంలో వున్న హొండూరాస్‌లో ప్రజాస్వామ్యం ఒక మేడి పండు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగంలోని ప్రతి వ్యవస్ధ ఆమోద ముద్రవేయాల్సిందే. అది నందంటే నంది పందంటే పంది. రాజ్యాంగాన్ని సవరించటం అన్నది అప్రజాస్వామికమని ఇంతవరకు ఏ కోర్టూ చెప్పలేదు.2009లో నాటి అధ్యక్షుడు మాన్యువల్‌ జెలయా రాజ్యాంగసవరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు నిర్ణయించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపటం రాజ్యాంగ బద్దమేనని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలిపివేసింది తప్ప రాజ్యాంగ సవరణ రాజ్యాంగ బద్దమా కాదా అన్న విషయం చెప్పలేదు. ఈ లోగా పార్లమెంట్‌, అటార్నీ జనరల్‌, ఎన్నికల సంఘం జెలయా నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని ప్రకటించాయి.వాటిని ఖాతరు చేయని జెలయా బ్యాలట్‌ పత్రాలు, బాక్సులను పోలింగ్‌ కేంద్రాలకు తరలించాలని జారీ చేసిన ఆదేశాన్ని మిలిటరీ అధిపతి తిరస్కరించాడు. ఈ సమయంలో తమ ఆదేశాన్ని పాటించలేదనే పేరుతో జెలయాను పదవి నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మిలిటరీ ఆయనను నిదుర మంచం మీద నుంచి తీసుకు పోయి పక్కనే వున్న కోస్టారికా దేశంలో విడిచి వచ్చింది. ఒక దేశ పౌరుడిని మరొక దేశంలో అక్రమంగా వదలి రావటం ఏ చట్టం ప్రకారం సమర్ధనీయమో, మిలిటరీ చేసిన పని తప్పోకాదో కూడా సుప్రీం కోర్టు విచారించలేదంటే ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో చూడవచ్చు. జెలయా, కుటుంబ సభ్యులు కోస్టారికా నుంచి బయలు దేరి రహస్యంగా కాలినడకన తిరిగి హొండూరాస్‌ చేరుకొని బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. తరువాత ఆయన మీద కేసులు ఎత్తివేసి దేశంలో కొనసాగనిచ్చారు.

రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకసారి పదవీ బాధ్యతలలో వున్న తరువాత రెండసారి అధ్యక్షపదవికి పోటీ చేయటానికి అర్హత లేదు. ఆ రీత్యా చూసినపుడు తాజా ఎన్నికలలో అధికారంలో వున్న అధ్యక్షుడు హెర్నాండెజ్‌ పోటీ చేయటానికి లేదు.అయినా కేంద్ర ఎన్నికల సంఘం మూడింట రెండు ఓట్ల మెజారిటీతో ఆమోదం తెలపటంతో పోటీ చేసినా సుప్రీం కోర్టు, ఇతర రాజ్యాంగ సంస్ధలు నోరు మెదపలేదు. అనుకున్నదొకటీ అయింది ఒకటి అన్నట్లుగా సులభంగా విజయం సాధిస్తాడని అనుకున్న హెర్నాండెజ్‌ వెనుకబడటంతో ఆయన నియమించిన ఎన్నికల సంఘం సాంకేతిక సమస్యలు తలెత్తాయనే సాకు చూపి ఓట్ల లెక్కింపును రెండు రోజుల పాటు నిలిపివేసి మెజారిటీతో వున్న ప్రతిపక్ష అభ్యర్ధికంటే హెర్నాండెజ్‌కు స్వల్ప మెజార్టీ వచ్చిందని ప్రకటించి ఎన్నికలను బూటకంగా మార్చివేసింది. ప్రస్తుతం మెజారిటీ ఓట్లు సాధించి విజయం సాధించిన ప్రతిపక్ష అభ్యర్ధి జర్నలిస్టు అయిన సాల్వెడార్‌ నసరల్లా ఓ ప్రజాస్వామికవాది, గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి ప్రజామద్దతు పొందిన వ్యక్తి. ఆయనను మాజీ అధ్యక్షుడు, వామపక్షాలతో సహా పురోగామి పార్టీలు, శక్తులు బలపరిచాయి. నసరుల్లాకు వున్న అనర్హత ఏమంటే అమెరికాకు బంటుగా పనిచేస్తాడనే హమీ లేకపోవటమే. అందుకే ఓట్ల లెక్కింపు మధ్యలోనే ఫలితాన్ని తారుమారు చేశారు. అమెరికా తలచుకుంటే అక్రమాలకు కొదవా ?ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగినందున మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలి లేదా ఎన్నికను రద్దు చేసి తిరిగి జరపాలని ప్రతిపక్ష అభ్యర్ధి సాల్వెడార్‌ నసరల్లా డిమాండ్‌ చేశారు. గురు, శుక్రవారాలలో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం వుందని వార్తలు వచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఎన్నికను తొత్తడం గావించి, మరింతగా అణచివేతకు పూనుకుంటే పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్క్సిజానికి క్రైస్తవం వ్యతిరేకమా, అనుకూలమా ?

16 Thursday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RELIGION, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, bible teachings, Bolshevik Revolution, communism, communist manifesto, Pope Francis

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-5

ఎం కోటేశ్వరరావు

మతాలన్నీ ఏదో ఒక తత్వశాస్త్ర ప్రాతిపదికన ఏర్పడినవే. చరిత్రలో ప్రతి మతం అంతకు ముందున్నది సామాన్య జనం నుంచి దూరమైనపుడు దాని మీద తిరుగుబాటుగా వుద్భవించిందే. అందువల్లనే ప్రతిదీ ప్రారంభంలో ప్రజల పక్షమే,పురోగామి వైఖరినే కలిగి వుంటుంది. కాల క్రమంలో దోపిడీ వర్గం ప్రతిమతాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటం కనిపిస్తుంది. అందువల్లనే ప్రతి మతం ఆయా సమాజాలలో వున్న దోపిడీ వర్గానికే మద్దతుపలికిందన్నది చరిత్ర సారం. ఆ దోపిడీ సమాజాన్ని అంతం చేసేందుకు శాస్త్రీయ అవగాహనతో ముందుకు వచ్చిందే మార్క్సిస్టు తత్వశాస్త్రం. మతాలకు దీనికి వున్న ప్రధాన తేడా ఏమంటే ప్రతికొత్త మతం అంతకు ముందున్న ఏదో ఒక మతంపై తిరుగుబాటుగా వస్తే మార్క్సిస్టు తత్వశాస్త్రం అన్ని మతాలను ఒకేగాటన కట్టి ప్రతిదాన్నీ వ్యతిరేకించింది. మతం జనం పాలిట మత్తు మందు అని సాధారణ సూత్రీకరణ చేసింది. సహజంగానే దోపిడీ శక్తులకు కొమ్ముగాసే మతం, మతాలకు వెన్నుదన్నుగా నిలిచే దోపిడీశక్తులు పరస్పరం ఆధారపడటం, సహకరించుకోవటం జగమెరిగిన సత్యం. ఆందువల్లనే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మార్క్స్‌,170 సంవత్సరాల నాడు వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక, 150 సంవత్సరాల నాడు జనానికి అందుబాటులోకి వచ్చిన కాపిటల్‌ గ్రంధం మొదటి భాగాలపై దోపిడీవర్గం, అన్ని రకాల మతశక్తులు దాడులు చేస్తూనే వున్నాయి.

కమ్యూనిస్టు ప్రణాళిక 1848 ఫిబ్రవరి చివరిలో 23పేజీల పుస్తకంగా జర్మన్‌ భాషలో లండన్‌లోని బిషప్స్‌ గేట్‌లో వెలువడింది. దానిని రహస్యంగా వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ప్రచురించింది. బ్రిటన్‌లోని జర్మన్‌ల కోసం ప్రచురితమయ్యే డచ్‌ లండనర్‌ జీటుంగ్‌ పత్రిక సీరియల్‌గా ప్రచురణలో తొలి భాగాన్ని మార్చినెల మూడవ తేదీన అచ్చువేసింది. మరుసటి రోజే బెల్జియంలో వున్న మార్క్స్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మార్చి 20నాటికి దానిని మూడుసార్లు అచ్చువేశారు. వాటిలో వెయ్యి కాపీలు ఏప్రిల్‌ మొదటి వారానికి పారిస్‌ చేరాయి, అక్కడి నుంచి జర్మనీ చేర్చారు. ఏప్రిల్‌- మే మాసాలలో ఆ పుస్తకంలోని అచ్చుతప్పులను సరిదిద్దారు. తరువాత అది 30పేజీలకు పెరిగింది. సంచలనం కలిగించించిన ఈ పరిణామంతో చర్చ్‌ వులిక్కి పడింది. మరుసటి ఏడాది 1849 డిసెంబరు ఎనిమిదిన నాటి పోప్‌ తొమ్మిదవ పయస్‌ ఇటాలియన్‌ ద్వీపకల్పంలోని తన పాలిత దేశాలైన ఇటలీ, వాటికన్‌ సిటీ, ఇటలీ ఆధీనంలోని శాన్‌మారినోలో వున్న ఆర్చిబిషప్‌లు, బిషప్‌లకు పంపిన సర్క్యులర్‌లో సోషలిజం, కమ్యూనిజాల గురించి తొలి హెచ్చరిక చేశారు. సోషలిజం, కమ్యూనిజాలనే నూతన సిద్ధాంతాల పేరుతో మత విశ్వాసులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.కాథలిక్‌ చర్చ్‌ ఐహిక అధికారాన్ని కూలదోసేందుకు విప్లవకారులు, హేతువాదులు పన్నుతున్న కుట్రలు,కూహకాలను గమనించాలని కోరారు. మత వ్యవహారాలలో నిరాసక్తతగా వుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటాలియన్లు తమ న్యాయబద్దమైన రాజకీయ అధికారులకు బద్దులై వుండాలని నిజమైన స్వేచ్చ, సమానత్వాన్ని క్రైస్తవం మాత్రమే రక్షించగలదని, అందువలన విప్లవాలు పనికిమాలినవని పోప్‌ పయస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఆస్ట్రియా సామ్రాజ్యం నుంచి ఇటలీ స్వాతంత్య్రం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. తరువాత వెయ్యి సంవత్సరాల పోప్‌ ఆధిపత్యాన్ని అంతం చేస్తూ 1861 రెండవ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఇటలీ రాజుగా ప్రకటించుకున్నాడు. అందువలన పోప్‌ అధికారాన్ని తొలిసారిగా సవాలు చేసింది రాజరికం తప్ప కమ్యూనిస్టులు కాదని గుర్తించటం అవసరం.

1917లో బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైన తరువాత రష్యన్‌ ఆర్ధడాక్స్‌ చర్చి అధికారులు పైకి కొన్ని సందర్భాలలో తటస్ధంగా వుంటున్నట్లు ప్రకటించినా 1922 వరకు విప్లవ వ్యతిరేకులు జరిపిన తిరుగుబాటులో అభ్యుదయగాములుగా వున్న కొద్ది మంది చర్చ్‌ అధికారులు మినహా అత్యధికులు బోల్షివిక్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఇటలీ ఎన్నికలలో కమ్యూనిస్టులు 31శాతం ఓట్లు సాధించారు. అనేక దేశాలలో విప్లవ, జాతీయోద్యమాలు వూపందుకొని విజయాలు సాధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చైనాలో కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది. ఈ పూర్వరంగంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే కుట్రలో భాగంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదులు కాథలిక్‌ చర్చిని కూడా భాగస్వామిగా చేసుకున్నారు. దానిలో భాగంగా పోప్‌ పన్నెండవ పయస్‌ 1949లో ఒక ప్రకటన చేస్తూ కమ్యూనిజాన్ని బోధించిన వారిని మత వ్యతిరేక తిరుగుబాటుదారులుగా పరిగణించి మతం నుంచి వెలివేయాలని ఆదేశించి కమ్యూనిజంపై ప్రత్యక్ష దాడికి నాంది పలికారు.

ప్రచ్చన్న యుద్ధం పేరుతో అమెరికా సాగించిన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలలో ఎక్కడ ఏమతం పెద్దదిగా వుందో అక్కడదానిని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వినియోగించారు. ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీ వున్నారు కనుక అక్కడ ఇస్లామిక్‌ మతోన్మాదులను రంగంలోకి దించి మిలిటరీతో జతకట్టించి పదిలక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోయించిన విషయం తెలిసిందే. తూర్పు ఐరోపాలో రోనాల్డ్‌ రీగన్‌ పాలనా కాలంలో సోషలిస్టు దేశాలలో తిరుగుబాట్లు, కూల్చివేతలకు తెరతీసిన కుట్రలో సిఐఏ, పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి తెలిసిందే. సాలిడారిటీ పేరుతో జరిపిన సమీకరణల వెనుక సిఐఏ నిధులు, వాటికన్‌ బ్యాంకు నిధులు, చర్చి అధికారుల మద్దతు బహిరంగ రహస్యం.

తూర్పు ఐరోపా, సోవియట్‌లో అమలు జరిపిన కుట్రకంటే ముందు చర్చిద్వారా కమ్యూనిజం, కమ్యూనిస్టులపై ప్రపంచవ్యాపితంగా దాడి చేసేందుకు జరిపిన ఒక ప్రయత్న వివరాలను గతనెల(అక్టోబరు) 25న లైఫ్‌ సైట్‌ న్యూస్‌ తొలిసారిగా ఆంగ్ల తర్జుమాను ప్రచురించింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత మారిన పరిస్ధితులలో చర్చి పాత్ర, సంస్కరణల గురించి, గడచిన వంద సంవత్సరాలలో తలెత్తిన మత సంబంధ సిద్ధాంతాల పరిష్కారానికి రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ అవసరమని 1959లో భావించారు. ఆమేరకు అది 1962 నుంచి 1965వరకు కొనసాగింది.

లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనంలోని అంశాలు ఇలా వున్నాయి. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌లో ఇతర విషయాలతో పాటు కమ్యూనిస్టులు, కమ్యూనిజానికి దండనా విధి నిర్ణయానికి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసేందుకు కొందరు నిర్ణయించారు. తరువాత దానిని పక్కన పెట్టారు. మార్క్సిజం, కమ్యూనిజం ప్రభావానికి ప్రతిగా, వాటి తెంపరితనాన్ని బహిర్గతపరిచేందుకు, ఓడించేందుకు ప్రపంచవ్యాపితంగా ఎలా సమన్వయంతో వ్యవహరించాలో పెద్ద ప్రణాళికను రూపొందించారు. అయితే కౌన్సిల్‌ కమిషన్లను రైన్‌ గ్రూప్‌ (రైన్‌ నదీ పరివాహక దేశాల)బిషప్పులు ఆక్రమించటంతో కమ్యూనిజం, మార్క్సిజాలను నేరుగా ఖండించాలనే ప్రయత్నాలన్నింటినీ వారు తిరస్కరించి పక్కన పెట్టారు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ ముగిసిన తరువాత ఆ పత్రాలన్నీ అధికారిక తయారీ పత్రాల రికార్డు రూముకు చేరాయి. లాటిన్‌(స్పానిష్‌)భాషలో రాసిన ఆపత్రాలకు గత కొన్ని దశాబ్దాలుగా దుమ్ముపట్టింది.

వాటిలో మూడు రకాల ప్రకటనలను రూపొందించారు.మార్క్సిజం తీవ్రమైన, ప్రపంచవ్యాపిత ప్రమాదం, కమ్యూనిజం దేవుడితో నిమిత్తం లేని ఒక మతం వంటిది, క్రైస్తవ నాగరికతల పునాదుల కూల్చివేతను కోరుకొంటుంది. ఇలాంటి కమ్యూనిజం నుంచి మానవాళిని రక్షించేందుకు వున్నత స్ధాయిలో ప్రపంచవ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది.ఈ అంశాలతో కూడిన పత్రాలను వుదారవాదులైన రైన్‌ గ్రూప్‌ బిషప్పులు కౌన్సిల్‌ తొలి నెలల్లోనే తిరస్కరించి పక్కన పెట్టారని లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనం పేర్కొన్నది.

క్రైస్తవ మతంలో కొందరు మార్క్సిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేందుకు అమెరికా సిఐఏ, ఇతర గూఢచార, వాటి ముసుగు సంస్ధలతో చేతులు కలిపారు. అదే సమయంలో లాటిన్‌ అమెరికాలో కొందరు క్రైస్తవ మతాధికారులు దారిద్య్రం, సామాజిక సమస్యలను మతవ్యవహారాలతో సమన్వయంచేసి విముక్తి వాదం లేదా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అలాంటి వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించలేదు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించాలంటూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించేవారిని ప్రతిఘటించారు కూడా. అలాంటి వారిలో ఒకరే కమ్యూనిస్టు పోప్‌గా కొందరు చిత్రించిన పోప్‌ ఫ్రాన్సిస్‌.అర్జెంటీనాకు చెందిన ఆయన 2013 నుంచి వాటికన్‌ అధిపతిగా కొనసాగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఆయనను ఇలా అడిగారు.’ కాబట్టి మీరు సమానత్వానికి పెద్ద పీటవేసే సమాజం కావాలని కాంక్షిస్తున్నారు. అది మీకు తెలిసినదే మార్క్సిస్టు సోషలిజం తరువాత కమ్యూనిజపు కార్యక్రమం. కాబట్టి మీరు మార్క్సిస్టు తరహా సమాజం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు.

దానికి పోప్‌ ఇలా సమాధానం చెప్పారు.’ దీని గురించి అనేకసార్లు చెప్పాను, నా స్పందన ఎల్లవేళలా అదే, ఏదైనా వుంటే కమ్యూనిస్టులు కూడా క్రైస్తవుల మాదిరే ఆలోచిస్తారు’ అని చెప్పారు.మార్క్సిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన విమర్శలను తోసిపుచ్చుతూ మార్క్సిస్టు సిద్దాంతం తప్పు, అయితే నా జీవితంలో అనేక మంది ఎంతో మంచివారైన మార్క్సిస్టులను ఎరుగుదును, కనుక నేను తప్పుచేసినట్లుగా భావించటం లేదు’ అని పోప్‌గా ఎన్నికైన కొత్తలోనే చెప్పారు. మార్క్సిజానికి తాను వ్యతిరేకం కాదని పరోక్షంగా చెప్పేందుకు గాను బలీవియాలో వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ నుంచి సుత్తీ,కొడవలి చిహ్నంగా వున్న శిలువను బహుమతిగా స్వీకరించటం తెలిసిందే. ఆయన జారీచేసిన లాడాటో సి సర్క్యులర్‌ తయారీకి మార్క్సిజంతో స్ఫూర్తి పొందిన విముక్త మత సిద్ధాంత వాదిగా పేరుబడిన లియోనార్డో బోఫ్‌ వంటి వారితోడ్పాటును స్వీకరించారని వార్తలు వచ్చాయి. ఇటీవల కొత్త సుపీరియర్‌ జనరల్‌గా ఎన్నికైన వెనెజులాకు చెందిన ఆర్ధరో సోసా అబాస్కల్‌ మార్క్సిజంతో క్రైస్తవం సమాధానపడాలని బహిరంగంగా చెప్పారు.

మన దగ్గర దేవాలయాల కింద వేలాది ఎకరాల భూములు వున్నట్లుగానే పశ్చిమ దేశాలలో చర్చ్‌లకు అంతకంటే ఎక్కువ ఆస్ధులున్నాయి. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిన కారణంగా వాటిని స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్న ఎన్‌టి రామారావు పెద్ద దైవభక్తుడు, కమ్యూనిస్టు కాదు. రష్యా, ఐరోపాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత పెద్ద మొత్తాలలో వున్న చర్చి ఆస్ధులను ప్రజల పరం చేశారు. అంతే తప్ప చారిత్రక ప్రాధాన్యత వున్న ఏ ఒక్క చర్చిని కూల్చివేయలేదు. కమ్యూనిస్టులు అధికారంలో వున్నంత కాలం వాటిని కూల్చివేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఆయా దేశాలలోని చర్చ్‌లకు ఎలాంటి హాని జరగలేదని తేలిపోయిన తరువాత వారంతా తేలు కుట్టిన దొంగల మాదిరి మిన్నకుండిపోయారు.ఇప్పుడు చైనాలో బైబిల్‌ పఠించిన కారణంగా శిక్షలు వేస్తున్నట్లు కొందరు క్రైస్తవులతో పాటు నిత్యం క్రైస్తవులను ద్వేషించే మనువాదులు కూడా కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.చైనా చట్టాల ప్రకారం దేవుడిని ఇంటికే పరిమితం చేయాలి తప్ప వీధులకు ఎక్కించకూడదు. వీధులలో బైబిలే కాదు, ఏ మత గ్రంధ పఠనాన్ని ప్రోత్సహించినా, పఠించినా, అనుమతి లేకుండా ప్రార్ధనా మందిరాలను నిర్మించినా అది నేరమే.దానికి అనుగుణంగానే శిక్షలు వేస్తున్నారు తప్ప మరొకటి కాదు.దీనిలో మనోభావాల సమస్య వుత్పన్నం కాదు. మన దేశంలో తెల్లవారే సరికి నడిరోడ్లమీద, వివాదాస్పద స్ధలాల్లో దేవుళ్లు, దేవతలు వెలుస్తుంటారు. చైనా వంటి చోట్ల అది కుదరదు. మెజారిటీ, మైనారిటీ ఎవరైనా అలాంటి పనులు చేస్తే కటకటాల వెనక్కు పోవాల్సిందే.

కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన ప్రారంభంలో వెల్లడైన వ్యతిరేకతకు, నేటికి వచ్చిన మార్పులను చూస్తే క్రైస్తవ మతాన్ని కూడా సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా పాలకవర్గాలు ఎలా వుపయోగించుకోచూశాయో చూశాము. తొలుత ఒక సిద్ధాంతంగా పనికిరాదని విమర్శ చేశారు. తరువాత బోల్షివిక్‌ విప్లవ సమయంలో రష్యాలో ప్రత్యక్షంగా కమ్యూనిస్టు వ్యతిరేక తిరుగుబాటులో భాగస్వాములయ్యారు. తరువాత ప్రచ్చన్న యుద్ధంలో తమ వంతు పాత్రను మరింతగా పోషించేందుకు కమ్యూనిజం మతానికి వ్యతిరేకమని ప్రకటించటమే కాదు, సోవియట్‌, తూర్పు ఐరోపాలో జరిగిన కుట్రలో భాగస్వాములయ్యారు. ఇప్పటికీ అనేక చోట్ల అటువంటి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

ఇదే సమయంలో క్రైస్తవమతంలో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపేందుకు నిరాకరించేశక్తులు కూడా వున్నాయని స్పష్టమైంది. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే మతాధిపతులు చెప్పిన భాష్యాలకు ఏ బైబిల్‌ అంశాలు ఆధారమయ్యాయో అదే గ్రంధంలోని అంశాలను మార్క్సిజంతో మతాన్ని సఖ్యత పరిచేందుకు కమ్యూనిజపు సానుభూతిపరులైన మతాధిపతులు కూడా తమ భాష్యాలకు వుపయోగించారు. మొదటి వారు మారణకాండను ప్రోత్సహించిన వారి తరఫున వుంటే రెండో తరగతివారు మానవ కల్యాణాన్ని కోరుకున్న వారి పక్షాన నిలిచారు. మరి మనం ఎటు వుండాలి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

యాభయ్యేళ్ల నక్సలిజం – పాఠాలు

15 Wednesday Nov 2017

Posted by raomk in AP NEWS, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

50 years of naxalism, left adventurism, Left politics, left wing extremism, naxalism

కొండూరి వీరయ్య

నక్సలిజం ఒక సైద్ధాంతిక ఆచరణాత్మక ధోరణిగా మొదలై యాభయ్యేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నక్సలిజం సాఫల్య వైఫల్యాలపై విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వస్తున్నాయి. సమాజాన్ని మార్చాలన్న లక్ష్యంతో మొదలైన ఉద్యమ స్రవంతి ఆ లక్ష్య సాధన దిశగా సమాజాన్ని నడిపించగలిగిందా లేదా అన్నది అర్థం చేసుకోవటానికి దేశంలో విప్లవ సాధనకు అవసరమైన వ్యూహం, ఎత్తుగడల కోణంలో చర్చించాలి. విప్లవోద్యమానికి నాయకత్వం వహించే శక్తులు అనుసరించే సైద్ధాంతిక, ఆచరణాత్మక వైఖరి తప్పు అయితే అటువంటి సైద్ధాంతిక అవగాహన ప్రాతిపదికగా రూపొందించే వ్యూహాలు ఆశించిన ప్రయోజనం కంటే ప్రతికూల ప్రయోజనాన్ని సాధిస్తాయి. యాభయ్యేళ్ల నక్సల్బరీ అనుభవాలు విముక్తి ఉద్యమాలకు నేర్పుతున్న పాఠాలు ఇవే.

దేశంలో నక్సలిజం ఒక సైద్ధాంతిక స్రవంతిగా మొదలైంది అన్న నిర్ధారణను అవగాహన సరైనది కాదు. స్వాతంత్య్రోద్యమం నాటి నుండీ దేశ విముక్తికి సంబంధించి కమ్యూనిస్టులు ప్రత్యామమ్నాయ సైద్ధాంతిక స్రవంతిని ముందుకు తెచ్చారు. నక్సలిజంతో ముందుకొచ్చింది కేవలం ఆచరణకు సంబంధించిన కోణం మాత్రమే. స్వతంత్ర భారతదేశంలో పెట్టుబడిదారీ వర్గపు ఆధిపత్యాన్ని సంఘటితం చేసుకోవటానికి సామ్రాజ్యవాద శక్తులు సహకరిస్తాయని ఆశించిన వారికి శృంగభంగమైంది. పాలకవర్గాలు అనుసరించిన పెట్టుబడిదారీ అభివృద్ధి పంథా 1960 దశకంలో తొలి సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. స్వాతంత్య్రోద్యమ ఆకాంక్షలు ప్రజల మదిలో మెదులుతున్న ఈ సమయంలో ఆ లక్ష్యాలు సాధించటంలో పాలకవర్గం వైఫల్యం పట్ల సహజాంగానే ఆగ్రహావేశాలుకు దారితీశాయి. ఈ ఆగ్రహావేశాలను ఆధారం చేసుకుని ప్రజలు వ్యవస్థ మార్చటానికి సంపూర్ణ రాజకీయ చైతన్యవంతులై ఉద్యమిస్తున్నారన్న అంచనాకు నక్సలిజం పునాది పురుషులు వచ్చారు. స్వతంత్ర భారతదేశం తొలి దఫా సంక్షోభంలోకి అడుగుపెట్టింది. ఈ సంక్షోభం నుండి బయటకు రావటానికి భూసంబంధాల పున:నిర్మాణం తక్షణ పరిష్కారం. స్వాతంత్య్రం వచ్చిన పదిహేనేళ్లు గడుస్తున్నా భూసంబంధాల పునర్నిర్మాణాన్ని పాలకవర్గాలు నెరవేర్చేందుకు సిద్ధం కాలేదు. దాంతో సాగుచేయని యజమానులకు వేలాది ఎకరాల భూమిపై ఆధిపత్యం (ఆబ్సెంటీ లాండ్‌లార్డిజం) – కౌలు దోపిడీ పరస్పర పోషకాలుగా గ్రామీణ సామాజిక ఆర్థిక జీవితాన్ని నియంత్రించే ప్రధాన లక్షాలుగా ఉన్నాయి. ఆ సమయంలో వ్యవసాయ సంబంధాలను సమూలంగా మార్చటానికి దున్నేవానికే భూమి నినాదం అర్థవంతంగా ఉండటమే కాదు. ప్రజలను సమీకరించే సాధనంగా మారింది. ఈ నినాదం ప్రధానంగా భూమిపై సాగు చేస్తున్న కౌలు రైతులను భూములపై హక్కులు దఖలు పడేలా చేసింది. మరోవైపున పాలకవర్గాలు ఎదుర్కొంటున్న తొలి రాజకీయ సంక్షోభం వ్యవస్థాగతమై కాంగ్రెస్‌ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలికింది. ఆ క్రమంలో బెంగాల్‌లో తొలి సంకీర్ణ ప్రభుత్వం ఉనికిలోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న సిపిఐ(ఎం) దున్నేవాడికే భూమి నినాదానికి రాజ్యాంగ పరిమితుల్లోనైనా ఆచరణ రూపం ఇవ్వటానికి నిర్ణయించింది. సాగు చేయని భూస్వాములు భూములు ఆక్రమించుకోవటం, సాగు హక్కులతో పాటు భూమిపై హక్కు కోసం ఉద్యమించటం ఈ కాలంలో గ్రామీణ బెంగాల్‌లో కనిపించిన సార్వత్రిక దృశ్యం. పార్టీ ఇచ్చిన పిలుపునందుకు గ్రామీణ బెంగాల్‌లో పెద్దఎత్తున భూ ఆక్రమణలు సాగాయి. సాధారణంగా పేదలు ఎక్కడన్నా భూమిని ఆక్రమించుకుంటే పోలీసు యంత్రాంగం యజమాని పక్షాన రంగ ప్రవేశం చేయటం మనకు కనిపించే సాధారణ లక్షణం. ప్రజాస్వామిక వ్యవస్థలో తటస్థమైనదిగా మనకు కనిపించే పోలీసు వ్యవస్థ, రాజ్యాంగ యంత్రాల ప్రధాన లక్ష్యం ప్రైవేటు ఆస్థిని కాపాడటం. దీనికి భిన్నంగా బెంగాల్‌లో యజమానుల తరపున పోలీసులు రంగ ప్రవేశం చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించటంలో కీలక భాగస్వామిగా ఉన్న సిపిఐ(ఎం) ముఖ్యమైన పాత్ర పోషించింది.

ఈ పరిస్థితుల్లో నక్సల్బరీలో పార్టీ నిర్ణయాలకు భిన్నంగా చారుమజుందార్‌ నాయకత్వంలో వర్గపోరాటాన్ని వర్గాలకు ప్రతినిధులుగా ఉన్న వ్యక్తుల మీద పోరాటంగా మార్చి వ్యక్తిగత హింసావాదం విప్లవ చర్యల్లో భాగం అన్న అవగాహనను ముందుకు తెచ్చింది. దీన్ని పార్టీ నాయకత్వం తిరస్కరించటంతో స్వీయమానసిక వాదానికి లోనైన కొద్ది మంది నాయకులు సిపిఐ(ఎం) నుండి బయటకొచ్చి స్వతంత్ర పంధా అనుసరించటం మొదలు పెట్టారు. దానికి గ్రామీణ ప్రాంతాలను విముక్తి చేసుకుంటూ విప్లవ ప్రస్థానం సాగించిన చైనా విప్లవాన్ని, మావో వ్యూహరచనను ఆదర్శనంగా తీసుకున్నారు. నిజానికి 1940 దశకం నాటి చైనాకు, 1970 దశకం నాటి భారతదేశానికి ఉన్న మౌలిక వ్యత్యాసాలు గమనించటంలో నక్సల్బరీ నాయకత్వం విఫలమైంది.

ప్రజా పునాది లేని పాలకవర్గంపై ప్రజా పునాది సమీకరించుకుంటూ సాగించిన సాయుధ పోరాటం మావోయిజం మౌలిక లక్షణం. భారతదేశంలో మావో ఆలోచనా ధోరణి పేరుతో అమలు జరిగిన నక్సల్బరీ విధానాలు విస్తృత ప్రజా పునాదిని సమీకరించుకోవటంలో విఫలమయ్యాయి. చారిత్రక పరిణామం కీలక దశలో ఉనికిలో వచ్చిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దోపిడీ వర్గాల పాలనకు అవసరమైన చట్టబద్ధత (లెజిటిమెసీ)ని కల్పించే సాధనంగా మారింది. దోపిడీ వర్గాలకు ఆమోదయోగ్యత సాధించటంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పాత్ర. ఐదేళ్లకొకసారి జరిగే ఎన్నికలు. లాంగ్‌ మార్చ్‌తో పోల్చి దేశంలో విముక్తి ప్రాంతాలను గుర్తించటం, కార్యాచరణ రూపొందించటంలో ఉన్న సత్యదూరమైన, వాస్తవ విరుద్ధమైన పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో మావోయే మా చైర్మన్‌ అన్న నినాదాలు అప్పుడప్పుడే ప్రజల్లో పట్టు సాధిస్తున్న వామపక్ష శ్రేణుల విస్తరణను అడ్డుకోవటంలో పాలక వర్గాలకు సాధనాలుగా మారాయి. కమ్యూనిస్టులందరినీ దేశ ద్రోహులుగానూ, విదేశీ శక్తుల పనుపున పనిచేసే వారిగానూ ముద్ర వేయటానికి అవకాశం అందించాయి. దాంతో కమ్యూనిస్టు ఆలోచన స్రవంతి అభివృద్ధికి ఆటంకం అన్న నానుడి ఘనీభవించటానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దోహదం చేశాయి. మరోవైపున 1960-70 దశకాల్లో దేశాన్ని మరోమారు ఉద్యమాల బాట పట్టిన తక్షణ సమస్య వ్యవసాయక సంబంధాలు అని గుర్తించిన పాలకవర్గాలు 1973లో తామే భూసంస్కరణలను అమలు చేస్తామని దేశానికి హామీ ఇవ్వటానికి ప్రణాళిక సంఘం ద్వారా భూసంబంధాలపై ఒక అధ్యయనం జరిపించింది. దాని ప్రాతిపదికన వరుసగా భూసంస్కరణ చట్టాలు ఆమోదిస్తూ వచ్చింది. దీంతో అప్పటి వరకు భూ సమస్య నేపథ్యంలో కమ్యూనిస్టులను అక్కున చేర్చుకున్న గ్రామీణ పేదలు క్రమంగా ఉద్యమాలు వదిలి పాలకవర్గాలు పీడిత వర్గాలను లోబర్చుకునే విధానాలకు (ఎకామడేటివ్‌ పాలిటిక్స్‌) బలయ్యారు. ఈ చర్యలన్నీ ఒక పాలకవర్గాలపై భ్రమలు పెంచి పోషించటంతో పాటు మరోవైపు ప్రజలు కమ్యూనిస్టు స్రవంతి నుండి దూరంకావటానికి దారితీశాయి.

అటువంటి సమయంలో ప్రజలకు దగ్గరకావటానికి వ్యూహాత్మక చర్యలు చేపట్టాల్సిన నక్సలిజం తప్పుడు నిర్మాణపద్ధతులు, ఆచరణ, ఎత్తుగడలు, వ్యక్తిగత సాహస చర్యల పట్ల సాధారణంగా ఉండే ఆసక్తి, క్రేజ్‌ను సొమ్ము చేసుకునే ధోరణిలో చర్యలు అనుసరించటంతో దేశం కోసం ప్రాణత్యాగం చేయటానికి సిద్ధమైన దేశభక్తుల ప్రాణాలకు, త్యాగాలకు విలువ లేకుండా పోయింది. ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు కానవసరం లేదు, ఉద్యమకారులు ప్రజల అవసరాలు తీర్చి పెడతారు. మన తరపున త్యాగాలు చేసి పెడతారు. మనం కేవలం ఆ ఫలితాలను అనుభవించటానికి సిద్ధమైతే చాలు అన్న ధోరణికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో స్థానిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు అటు బూర్జువా పార్టీల ద్వారాగానీ ఇటు వామపక్ష శక్తుల ద్వారాగానీ తమ సమస్యలు పరిష్కరించుకోవటం వరకే పరిమితమయ్యారు తప్ప తద్వారా అందుకోవాల్సిన వర్గ చైతన్యానికి దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో నిజమైన విప్లవోద్యమం వ్యూహం, ఆచరణ,నిర్మాణం, సమీక్షించుకోకుండా లక్ష్య సాధన దిశగా ప్రయాణం సాగదు. బూర్జువా ప్రజాతంత్ర వ్యవస్థ పరిధిలో అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగించుకోవటం, బూర్జువా ప్రజాస్వామ్యం పరిమితుల పట్ల చైతన్యంకలిగించకుండా జనతా ప్రజాస్వామ్యంపట్ల ఆసక్తిని సృష్టించలేము. నిర్దిష్ట పరిస్థితుల గురించి నిర్దిష్ట అంచనాకు లేకుండా క్యాకర్తలను త్యాగాలకు పురికొల్పటం విప్లవోద్యమ నాయకత్వ దక్షత కాబోదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోషలిజంపై చిత్త భ్రమణ తంత్ర విద్య ప్రయోగం !

06 Monday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Bolshevik Revolution, CAPITALISM, capitalist crisis, China, communist, Communist Revolution, Mind Games, new American socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -2

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కొన్ని సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన తీవ్ర ఎదురుదెబ్బలు ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇదే సమయంలో విద్య, సమాచార వ్యవస్ధ కొత్త పుంతలు తొక్కి అరచేతిలోకి అందుబాటులోకి రావటం వంటి పరిణామాలతో కమ్యూనిస్టు సిద్ధాంతంపై దాడి కగతం కంటే తీవ్రంగా జరుగుతోంది. కొత్త ఎత్తుగడలు అనుసరించటాన్ని అన్ని రంగాలలో చూడవచ్చు. గతంలో మాదిరి కమ్యూనిజాన్ని నేరుగా వ్యతిరేకిస్తే లాభం వుండదని గత వంద సంవత్సరాల అనుభవాలు దోపిడీ వర్గానికి నేర్పాయి. అంటే దొంగ దెబ్బలకు పూనుకున్నాయి, దీంతో కమ్యూనిస్టుల పనిని మరింత సంక్లిష్టం గావించాయని చెప్పాలి. శత్రువును చంపదలచుకుంటే ప్రత్యక్ష పోరాటంలో ఎంతో కష్టపడాలి, అదే తీపి మాటలతో వెన్నుపోటు పొడిచి అంతం చేయటం ఎంతో సులభం. ఈ కుటిల నీతిని కమ్యూనిస్టు వ్యతిరేకులు బాగా ప్రయోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో నవతరం సోషలిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితులు కావటం గతం మాదిరి సులభం కాదు. అయితే దోపిడీ వ్యవస్ధ ఎప్పటికపుడు తనకు తెలియకుండానే యువతరాన్ని ఆవైపు నెడుతోంది. పీడితులు కూడా తమ ఆయుధాలను సన్నద్దం చేసుకోవటం అనివార్యం.

అమెరికాలోని కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ అనే సంస్ధ తన వార్షిక నివేదికలో భాగంగా యు గవ్‌ అంటే మీ ప్రభుత్వం అనే ఒక పరిశోధనా సంస్ధతో కలసి అక్టోబరు చివరి వారంలో ఒక సర్వే నివేదికను విడుదల చేసింది. ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సంస్ధ ప్రమేయంతో ఇలాంటి నివేదికల తయారీకి రూపొందించే ప్రశ్నావళి స్వభావం,లక్ష్యం ఎలా వుంటుందో తెలిసిందే. వెన్నుపోటు ఎత్తుగడలో ఇదొక భాగం. ఈ సర్వే సెప్టెంబరు 28 అక్టోబరు 5 మధ్య జరిగింది. అమెరికా ప్రధాన మీడియా అంతటా ఆ సమయంలో అమెరికా దృష్టిలో ధూర్త దేశంగా వున్న సోషలిస్టు-కమ్యూనిస్టు వుత్తర కొరియా జపాన్‌ మీదుగా, అమెరికా తీరంలోని దీవులలో కూడా పడే ఖండాంతర క్షిపణి ప్రయోగాలను జరిపిందని, అమెరికన్లకు ముప్పు తెచ్చిందంటూ ముమ్మరంగా ప్రచార దాడి జరిపిన సమయమది. సర్వేపై దాని ప్రభావం పడకుండా ఎలా వుంటుంది. అందువలన దానికి వుండే పరిమితులను గమనంలో వుంచుకోవాలి. ఈ నివేదికలో కొన్ని అసంబద్దతలు, తర్కానికి నిలబడని అంశాలున్నాయి.

ప్రపంచానికి కమ్యూనిజం ఇప్పటికీ ఒక సమస్యగానే వుందని నమ్ముతున్న అమెరికన్లు 75శాతం వున్నారని, గతేడాది కంటే ఐదుశాతం ఎక్కువంటూ సర్వే తొలి అంశంగా ఆ నివేదిక ప్రారంభమైంది. ప్రతి పదిమందిలో ఏడుగురు అమెరికన్లకు కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకపోవటం లేదా తప్పుగా గుర్తించారట. ఇదే సమయంలో నూతన సహస్రాబ్ది యువతరంగా పరిగణించబడేవారిలో సోషలిజం పట్ల సానుకూలత పెరుగుతోంది. జనాభా మొత్తంగా చూసినపుడు 63శాతం పెట్టుబడిదారీ, నాలుగు శాతం ఫాసిస్టు దేశంలో జీవించాలన్న అభిలాషను వ్యక్తం చేయగా సోషలిస్టు-కమ్యూనిస్టు దేశంలో నివశించాలన్న కోర్కె 37 శాతం మందిలో వ్యక్తమైంది. ఇదే సహస్రాబ్ది యువతలో 49, 51శాతం వున్నారు. ప్రస్తుతం అమెరికా జనాభాలో సహస్రాబ్దితరంగా పరిగణించబడేవారు ఎక్కువగా వున్నారు. నివేదిక మొత్తంలో కమ్యూనిస్టు వ్యతిరేకతనే ప్రధానంగా చూపినప్పటికీ ఈ ఒక్క అంశంపై కమ్యూనిస్టు వ్యతిరేకులు కలవర పడుతున్నారు. గతంలో విదేశాలలో పెరుగుతున్న సోషలిస్టు అభిమానులను చూసి భయపడిన అమెరికన్‌ కమ్యూనిస్టు వ్యతిరేకులు ఇప్పుడు తమ యువతను చూసి తామే భయపడుతున్నారన్నమాట. ఎంతలో ఎంత మార్పు? సహస్రాబ్ది యువతలో ఇటువంటి భావాలు ఏర్పడటానికి కారణం 53శాతం మంది అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అభిప్రాయం పడటం కావచ్చని సర్వే రచయితలు వ్యాఖ్యానించారు.

‘ ప్రస్తుతం అమెరికాలో సహస్రాబ్ది తరం అతి పెద్ద సమూహంగా వుంది. ఆందోళన కలిగించే కొన్ని ధోరణులు తీవ్ర ఆందోళన కలిగించటాన్ని చూస్తున్నాం. సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు మళ్లటం పెరుగుతోంది, చివరికి కమ్యూనిజం కూడా ఆచరణీయ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు’ అని కమ్యూనిజం బాధితుల స్మార ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.ఇదే సమయంలో 1946-64 మధ్య పుట్టిన వారు ఎక్కువగా పెట్టుబడిదారీ విధానానికి,26శాతం మందే సోషలిజానికి మద్దతు ఇస్తున్నారు. అమెరికాలో స్టాలిన్‌ను ప్రతి ఐదుగురిలో ఒకరు హీరోగా భావిస్తుండగా, లెనిన్‌, వుత్తరకొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌లను అభిమానించే వారు ప్రతి నలుగురిలో ఒకరు వున్నారని తేలింది. సోషలిజం, కమ్యూనిజాలకు తేడాతో పాటు అసలు వాటి గురించి తెలియని కారణం, కమ్యూనిస్టు పాలిత దేశాలలో చంపివేయబడిన జనం గురించి తక్కువ అంచనా వేయటం వల్లనే యువత ఈ బాటలో వున్నారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు ‘ఎర్ర శతాబ్దం’ పేరుతో రాసిన సానుకూల వ్యాసాలు కూడా కమ్యూనిజం వెనుక వున్న నిజాన్ని పట్టించుకోకుండా చేశాయని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు.’ సోషలిజం, కమ్యూనిజాల విషయంలో అమెరికన్‌ సమాజంలో చారిత్రక పాండిత్యం ఎంత తక్కువగా వుందో అలజడి వైపు తిప్పుతున్న ఈ పరిణామం వెలుగులోకి తెస్తోంది.వంద సంవత్సరాల క్రితం జరిగిన బోల్షివిక్‌ విప్లవం తరువాత కమ్యూనిజం కారణంగా జరిగిన మారణహోమం, వినాశనం, దుఖం గురించి విద్యార్ధులకు బోధించటంలో వ్యవస్ధ వైఫల్యం గురించి కూడా ఇది వెల్లడించింది.’ అని కూడా మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.

కమ్యూనిస్టుల పాలనలో రోమన్‌ కాధలిక్‌ మతగురువులతో సహా చంపిన వారి సంఖ్య పది లక్షలలోపే అని సర్వేలో పాల్గన్నవారిలో పదిశాతం, 1-250లక్షలని 21, 250-500లక్షలని 15, 500-750లక్షలని 12, 750-1000లక్షలని 11, పది కోట్లకు పైగా అని31శాతం చొప్పున నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఈ అంకెలకు ఎలాంటి ఆధారాలు లేవు. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా వీటిని తిప్పుతున్నారు. ఈ అతిశయోక్తులను మొత్తంగా 69శాతం మంది తక్కువ చేసి చూశారు. సహస్రాబ్ధి యువతలో గతేడాది మాదిరే తప్ప మార్పు లేదు. గత కొద్ది కాలంగా ముఖ్యంగా 2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం తరువాత అమెరికన్‌ యువతలో సోషలిజం, కమ్యూనిజం గురించి సానుకూల వైఖరి వ్యక్తమౌతోంది. అందువలన వారిని గందరగోళంలో పడేయటానికి ఇలాంటి సర్వేలతో ఒకవైపు వారిలో తలెత్తిన మార్పును చెబుతూనే మరోవైపు వెనక్కు లాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు మనం చూడవచ్చు. అయితే ఇవి ఎంతవరకు ఫలిస్తాయి? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం, బకెట్లతో సముద్రనీటిని తోడటం ఎలా సాధ్యం కాదో భావజాల వ్యాప్తిని, అసంతృప్తిని అణచివేయటం, పక్కదారి పట్టించటం కూడా అలాంటిదే.

సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం నిజానికి ఒక ప్రయోగం. దాని ఫలితాలు ప్రపంచానికి తెలియవు. అందువలన నిర్మాణంలో ఏవైనా లోపాలుంటే వాటిని స్నేహపూర్వకంగా లేదా సైద్ధాంతికంగా చెప్పటం వేరు. గతంలో సోవియట్‌ యూనియన్‌ను సోషల్‌ సామ్రాజ్యవాదంగా వర్ణించిన నక్సల్స్‌ తాము కూడా కమ్యూనిస్టులమే అని చెప్పుకున్నారు. అలాగే ఇప్పుడు చైనా అనుసరిస్తున్న విధానాలపై కూడా కొంతమంది అదే రకమైన దాడి చేస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు సామ్రాజ్యవాదులుగా మారినవి వున్నాయి. అదే విధంగా పెట్టుబడిదారీ పంధాలో పయనిస్తూ అభివృద్ధిలో బాగా వెనుకబడిన దేశాలూ వున్నాయి. అటువంటి దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలు వస్తే ఎంతకాలం అనేది ఎవరూ చెప్పలేకపోవచ్చుగాని కొంత కాలం అదే మాదిరి తేడాలు లేకుండా ఎలా వుంటాయి? చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ అనేది బూటకం, పేరుకే కమ్యూనిస్టు పార్టీ, అక్కడ ఆర్ధిక అంతరాలు చాలా ఎక్కువగా వున్నాయి, ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా దాడి జరుగుతోంది. ఇక్కడ సోషలిజం పట్ల కారుస్తున్న మొసలి కన్నీరును కడవలతో కొలవజాలం. నిజమైన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణ జరగటం లేదని తీవ్ర విచార ప్రదర్శన. ఇదంతా కమ్యూనిస్టు వ్యతిరేకులు, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు కూడా కొందరు చేస్తున్నారు. ఇదంతా సమాజంలోని ఒక భాగం లేదా వ్యక్తులను మానసికంగా తిమ్మినిబమ్మిని చేసి ఇబ్బందులకు గురిచేసే చిత్త భ్రమణ తంత్ర విద్యలో భాగమే.

Image result for US youth, socialism

బ్రెజిల్‌కు చెందిన లూయీస్‌ కార్లోస్‌ బ్రెస్సెర్‌ పెరీరా అనే సామాజిక, ఆర్ధికవేత్త పెట్టుబడిదారీ విధానంలో ఐదు నమూనాలు వున్నాయని విశ్లేషించారు. ఆయనతో ఏకీభవించాలనేమీ లేదు. ధనిక దేశాలలో వుదారవాద ప్రజాస్వామిక లేదా ఆంగ్లో-శాగ్జన్‌ నమూనా, సామాజిక లేదా ఐరోపా, అంతర్జన్య లేదా జపాన్‌, వర్ధమాన దేశాలలో వుదారవాద ఆధారిత నమూనాలు ఆసియాలో ఒక విధంగా, బ్రెజిల్‌తో సహా ఇతర దేశాల నమూనాలు భిన్నంగా వుంటాయని ఆయన చెప్పారు. ఇదే సూత్రం సోషలిస్టు దేశాలకు మాత్రం ఎందుకు వర్తించదు? అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గ నాయకత్వాన విప్లవాలు జయప్రదమౌతాయని మార్క్స్‌-ఎంగెల్స్‌ అంచనా వేశారు. ఆ తరువాత బోల్షివిప్లవానికి ముందు సైద్ధాంతిక చర్చ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం గురించి తప్ప నమూనా, విప్లవ మార్గం గురించి పెద్ద సమస్యలు ముందుకు రాలేదు. బోల్షివిక్‌ విప్లవం తరువాతే ఆచరణలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ తెల్లవారే సరికి పరిష్కారిస్తామని, పరిష్కారమౌతాయని గానీ ఏ కమ్యూనిస్టూ చెప్పజాలరు. వాటిని కూడా దోపిడీ శక్తులు తమ కమ్యూనిస్టు వ్యతిరేక భావజాల అమ్ముల పొదిలో చేర్చుకున్నాయి. పద్దతులను కూడా మార్చుకున్నాయి. గతంలో మాదిరి సోవియట్‌ను వ్యతిరేకించినట్లుగా నేడు చైనాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగేందుకు ముందుకు రావటం లేదు. ఎందుకంటే గతంలో సోవియట్‌ తయారీ వస్తువులతో పాశ్చాత్య దేశాల మార్కెట్లను నింపలేదు, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మేడిన్‌ చైనా దర్శనమిస్తోంది.అయితే అదే సమయంలో సోవియట్‌ను తొక్కివేసేందుకు, కూల్చివేసేందుకు చేసిన కుట్రలకు ఏమాత్రం తీసిపోకుండా చైనాకు వ్యతిరేకంగా చేయాల్సినవి చేస్తున్నాయని మర్చిపోరాదు. అధికారికంగా సంబంధాలు, అనధికారికంగా చైనా, కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిజం మీద విషపూరిత దాడి జరుగుతోంది.

గత వంద సంవత్సరాలలో ఫాసిస్టు శక్తులను అణచివేయటంలో కమ్యూనిస్టులు ఎంతటి త్యాగాలకు పాల్పడతారో, ఎలా సన్నద్దమౌతారో లోకానికి తెలియ చెప్పటంలో సోవియట్‌ యూనియన్‌ జయప్రదమైంది. సోషలిజాన్ని కాపాడుకుంటూ అచిర కాలంలోనే ఒక నూతన అభివృద్ది నమూనాను ప్రపంచం ముందుంచటంలో చైనా జయప్రదమైంది. చైనాలో సమస్యలేమీ లేవా అంటే కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమల వంటివి కూడా జరబడతాయని వాటిని అదుపు చేయాల్సి వుంటుందని కూడా తమకు తెలుసునని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ చెప్పారు. సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని ఇప్పుడు అధికారికంగా వారే చెబుతున్నపుడు లేవని ఎవరంటారు? అన్ని పెట్టుబడిదారీ దేశాలూ ఒకే విధంగా అభివృద్ధి ఎందుకు చెందలేదు, అన్ని ఖండాలలో ఒకేసారి పారిశ్రామిక విప్లవం ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలకు సమాధానంలోనే సోషలిజానికి కూడా జవాబు దొరుకుతుంది.

చైనాలో వున్నది పెట్టుబడిదారీ విధానం అనే వాదనలతో విబేధిస్తున్నవారు ముందుకు తెస్తున్న అంశాలేమిటో చూద్దాం.పెట్టుబడిదారీ పాలనా విధానంలో అప్రయత్న పూర్వకమైన సంబంధాలతో వస్తూత్పత్తి లాభాల కోసం జరుగుతుంది.లాభాల రేటు పెట్టుబడుల వర్తులాను నిర్దేశించటంతో పాటు ఆర్ధిక సంక్షోభ ఆవర్తనాలను కూడా వుత్పత్తి చేస్తుంది. ఇది చైనాకు ఇంతవరకు వర్తించలేదు. ప్రణాళిక, ప్రభుత్వరంగంలో వుత్పత్తిపై యాజమాన్య పద్దతే ఇప్పటికీ ఆధిపత్యం వహిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ అధికార పునాదివేళ్లు ప్రజాయాజమాన్యంలోనే వున్నాయి.పెట్టుబడిదారీ తరహా వుత్పత్తి పద్దతి లేకుండానే చైనా ఆర్ధికంగా ఎదుగుదలను సాధించింది. కీలకమైన 102 ప్రభుత్వ రంగ సంస్దల విలువ ఏడున్నరలక్షల కోట్ల డాలర్లు. వీటిని ప్రయివేటీకరిస్తారని ఎవరైనా ఆశపడుతుంటే అలాంటిదేమీ వుండదని పరోక్షంగా హెచ్చరిస్తూ ప్రధానమైన ప్రజాయాజమాన్య స్ధితి, ప్రభుత్వ రంగ ఆర్ధిక వ్యవస్ధ నాయకత్వ పాత్రపై ఎలాంటి డోలాయమానం వుండదని అధ్యక్షుడు గీ జింగ్‌ పింగ్‌ గతేడాది స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల వారు గత మూడున్నర దశాబ్దాలుగా చైనా ఆ బాటను వీడి స్వేచ్చా మార్కెట్‌,ప్రయివేటు రంగం నాయకత్వ పాత్ర వహించాలని కోరుతూనే వున్నారు.లాభాపేక్షలేని ప్రణాళికా బద్దమైన ప్రభుత్వరంగ పాత్ర నాయకత్వంలో తలెత్తే సమస్యలను పెద్దవిగా చూపుతూ వాటిని అవకాశంగా మార్చుకోవాలని కంటున్న కలలు ఇంతవరకు కల్లలుగానే మిగిలిపోయాయి. సామాజిక-ఆర్ధిక అంశాల రూపకల్పన, జయప్రదంగా అమలు చేయటంపై నిజానికి చైనా కమ్యూనిస్టుపార్టీ ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నది.

2008లో పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత కూడా చైనా అభివృద్ధి రేటు ఏడుశాతం కొనసాగుతున్నది. తమ తరువాత సంక్షోభంలోకి కూరుకుపోవటం చైనా వంతు అని చెప్పిన వారి జోస్యం వాస్తవం కాదని తేలిపోయింది. కొన్ని వడిదుడుకులు తప్ప గత పదిసంవత్సరాలుగా సజావుగా పురోగమిస్తోంది. ఇది కమ్యూనిస్టుపార్టీ, సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకత. ఇప్పుడు పెట్టుబడిదారీ ధనిక దేశాలలోని యువతను ఆకర్షించే అంశం ఇది. ఏ స్టోర్‌లో చూసినా చైనా వస్తువులే, పశ్చిమ దేశాల వుద్యోగాలను హరించి చైనా తన వారికి పని కలిపిస్తున్నదన్న వార్తలు ఏదో ఒక రూపంలో వారిని చేరుతూనే వున్నాయి. ఈ నేపధ్యంలో పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అనేదే గీటు రాయి అనుకుంటే ఇప్పటి వరకు పెట్టుబడిదారీ విధానం ఒరగబెట్టిందేమీ లేదు, రాబోయే రోజుల్లో ఏదో చేస్తుందనే ఆశ కనిపించటం లేదు, అందువలన సోషలిజమే మెరుగు, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అన్న ఆలోచన తలెత్తుతోంది. సోషలిస్టు భావన వునికిలోకి వచ్చిన తరువాత సాధించిన పెద్ద విజయాలలో ఇదొకటి అంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ సిద్ధాంత వేత్తలు సోషలిస్టు వ్యవస్ధల వైఫల్యాలను బూతద్దంలో పెట్టి చూపటం,అవాస్తవాలను ప్రచారం చేసి సోషలిజం గురించి చిత్త భ్రమణ తంత్ర విద్యను( మైండ్‌ గేమ్‌ ఆడటం) ప్రయోగించి తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు తప్ప పెట్టుబడిదారీ విధానం ఎలా మెరుగైనదో దానికి పోతుగడ్డ అంటున్న అమెరికా యువతకు చెప్పలేకపోతున్నారు. అదే పెద్ద బలహీనత. దీన్ని దెబ్బకొట్టి యువతను సోషలిజం వైపు మళ్లించటమే కమ్యూనిస్టుల ముందున్న పెద్ద సవాలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆకర్షణ తగ్గని సోషలిజం, కమ్యూనిజం !

05 Sunday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Aurora, Bolshevik Revolution, Bolshevik Revolution warship, Lenin, Russia’s 1917 Bolshevik Revolution, winter palace

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -1

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఏడు, ప్రపంచవ్యాపితంగా ఎందరో విప్లవదీక్షకు పునరంకితమయ్యే రోజు. విప్లవాలకు దారితీస్తాయని భావించిన, భయపడిన వుద్యమాలను ఏడు నిలువుల లోతున పాతివేయాలన్న దోపిడీదార్ల కసిని మరింతగా పెంచే రోజు. అంతకు ముందు కూడా పెట్టుబడిదారీ వర్గం అణచివేతకు పాల్పడినప్పటికీ అక్టోబరు విప్లవం తరువాత మరింత అప్రమత్తమై గత వంద సంవత్సరాలుగా దాడిని మరింతగా పెంచుతోంది. కమ్యూనిస్టు తత్వశాస్త్రానికి ఒక స్పష్టమైన శాస్త్రీయ భాష్యం చెప్పిన మార్క్స్‌-ఎంగెల్స్‌ ద్వయంలో కారల్‌ మార్క్స్‌ ద్విశత జయంతి,(మార్క్స్‌పేరు నుంచి విడదీయజాలని ఆయన స్నేహితుడు, వుద్యమ సహచరుడు ఎంగెల్స్‌కు వయస్సులో తేడా రెండున్నర సంవత్సరాలే) మార్క్స్‌ రచన కాపిటల్‌ మొదటి సంపుటి వెలువడి 150, సంవత్సరాలు, దానిని ఆచరణలోకి తెచ్చి తొలి సోషలిస్టు రాజ్య స్ధాపనకు నాంది పలికిన రష్యన్‌ బోల్షివిక్‌ విప్లవానికి వంద సంవత్సరాలు నిండాయి. దాన్ని కూల్చివేయటంలో సామ్రాజ్యవాదుల కుట్ర,హస్తం వున్నప్పటికీ, అంతర్గత కారణాలు కూడా వున్నందున వందేండ్ల వార్షికోత్సవం అనటం సముచితంగా అనిపించటం లేదు. అందుకే సింహావలోకనం చేసుకోవాల్సిన సందర్భమిది. బోల్షివిక్‌ విప్లవం వునికిలోకి తెచ్చిన ప్రధమ సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ ప్రగతిశీల వాదులు, కమ్యూనిస్టులు సహజంగానే తమ సిద్ధాంతం, ఆచరణ, అనుభవాల గురించి మదింపు వేసుకొని పునరంకిత మయ్యేందుకు ఈ సందర్భాలను వినియోగించుకుంటున్నారు. మరోవైపు తమ దోపిడీని అంతమొందించే కమ్యూనిస్టు తత్వశాస్త్రాన్ని అణగదొక్కేందుకు దోపిడీదార్లు తమ ఆయుధాలకు మరింతగా పదునుపెట్టుకుంటున్న తరుణమిది. తమ లక్ష్యాలను సాధించుకొనేందుకు ఏం చెయ్యాలి? ఎక్కడ మొదలు పెట్టాలి అనే తర్జన భర్జన రెండు వర్గాలలోనూ జరుగుతోంది.

అది బానిస సమాజమైనా, ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ సమాజంలో కూడా దోపిడీ నిరాఘాటంగా కొనసాగటానికి ఆ వర్గాలు ఎన్నో ఆయుధాలను కనుగొన్నాయి, నవీకరించుకున్నాయి. ఇదే సమయంలో ప్రతి చోటా సర్వేజనా సుఖినోభవంతు అని సర్వజన సంక్షేమాన్ని కోరుకున్నవారెందరో వుద్భవించారు. వారంతా సంస్కర్తలుగానే మిగిలిపోయారు. ఆ క్రమంలోనే మరెందరో దోపిడీ వ్యతిరేక పోరులో తమ ప్రాణాలనే అర్పించారు.తమ కాలపు దోపిడీ నగ్న స్వరూపాన్ని గమనించి, సమ సమాజమార్పును తమ ముందుతరాల వారి తత్వం,భావజాలం, త్యాగనిరతిని ఆపోసన పట్టిన వారిలో ఒక రైన మార్క్స్‌ వర్గాల వేల సంవత్సరాలుగా దోపిడీకి గురవుతున్న వర్గానికి దీనిలో జయాపజయాలు ఎవరివి?

అది 1917 అక్టోబరు 25 రాత్రి, సెంట్‌పీటర్స్‌బర్గ్‌లోని రష్యా అధికార కేంద్రమైన వింటర్‌ పాలెస్‌. ఎప్పుడేం జరుగుతుందో, ఒకవైపు కెరెన్క్సీ ప్రభుత్వ నాయకత్వంలోని జార్‌ సేనలు, మరోవైపు బోల్షివిక్‌ తిరుగుబాటుదారులు వుత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సాయంత్రమే అందాల్సిన సంకేతం రాక బోల్షివిక్‌లలో క్షణ క్షణానికి పెరుగుతున్న ఆతృత…. సరిగ్గా 9.45 బాల్టిక్‌ సముద్రతీరంలోని సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ రేవులో మరమ్మతుల కోసం లంగరు వేసిన అరోరా యుద్ధ నౌక నుంచి ఫిరంగి పేలుడు. ఏ రష్యన్‌ సామ్రాజ్యవాదుల తరఫున జపాన్‌ సామ్రాజ్యవాదులపై దాడి జరిపిందో అదే యుద్ద నౌకలోని నావికులు తిరుగుబాటు చేసి శ్రామికుల పక్షాన అదే ఫిరంగి పేల్చారు.(పెట్టుబడిదారులు తమకు లాభాలను చేకూర్చే కార్మికులతో పాటు తమ దోపిడీని అంతం చేసే శ్రామికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేయటం అంటే ఇదే. విప్లవ పరిస్ధితులే వస్తే శ్రామికవర్గం ఆయుధాల కోసం తడుముకోనవసరం లేదు) అంతే బోల్షివిక్‌ యోధులు దాడి ప్రారంభించారు. తెల్లవారు ఝామున అంటే 26వ తేదీ వుదయం రెండు గంటలకు వింటర్‌ పాలెస్‌ పూర్తిగా కమ్యూనిస్టుల వశమైంది. ఎర్రజెండా రెపరెపలాడింది. తిరుగబాటు సైరన్‌ మోగిన అక్టోబరు 25 తరువాత కాలంలో సవరించిన రష్యన్‌ కాలండర్‌ ప్రకారం నవంబరు ఏడవ తేదీ అయింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే అక్టోబరు విప్లవం, నవంబరు విప్లవం అన్నా రెండూ ఒకటే.(పదకొండు సంవత్సరాల క్రితం ఈ వ్యాస రచయితకు వింటర్‌ పాలెస్‌ పరసరాలు, అరోరా నౌక, నెవా నది తదితర ప్రాంతాలను సందర్శించే అవకాశం వచ్చిందని తెలపటానికి సంతోషంగా వుంది)

పెద్ద కుదుపుతో చరిత్ర గతిని మరో మలుపు తిప్పిన సందర్భమది. అందుకే ప్రఖ్యాత అమెరికన్‌ జర్నలిస్టు జాన్‌ రీడ్‌ ఆ సమయంలో ప్రత్యక్షంగా చూసిన పరిణామాలను వర్ణిస్తూ ‘ప్రపంచాన్ని కుదిపివేసిన పది రోజులు’ అనే పేరుతో గ్రంధస్థం చేశారు. దోపిడీని శాశ్వతం చేసుకొనేందుకు దోపిడీదార్లకు ఆ వర్గం నేర్పిన పాఠాలు అపారం. దోపిడీకి మతం, కులం, ప్రాంతం, భాష, రంగు, ఆడమగా తేడా లేదు. అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే. కానీ దోపిడీదార్లను, దోపిడీని అంతం చేసే శ్రామికవర్గ ఐక్యతను దెబ్బతీసేందుకు పైన చెప్పుకున్న సకల అవకాశాలనూ వాడుకోవటాన్ని మనం గమనించవచ్చు. కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడక ముందే మన దేశంలో ప్రవేశించిన ఆంగ్లేయ పెట్టుబడిదారులు, పాలకులు, వారిని అనుసరించిన స్వదేశీ పెట్టుబడిదారులు పైన చెప్పుకున్న అంశాలన్నింటినీ వినియోగించుకున్నారు. ఇప్పటికీ వాటిని ప్రయోగిస్తున్నారు. అందువల్లనే శ్రామికుల మధ్య ఐక్యమత్యం సాధించటానికి, తామంతా ఒక్కటే అనే చైతన్యం కలిగించటానికి ఎంత సమయం పడుతుందో, ఆ తరుణం కోసం ఎంతకాలం వేచి చూడాలో ఎవరు జోస్యం చెప్పగలరు. అందులోనూ అనేక కులాలు,భాషలు, సంప్రదాయాలు, సామాజిక అసమానతలు, వివక్షతో కూడిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ వేల సంవత్సరాలుగా వేళ్లూనుకొని నర నరాన జీర్ణించుకుపోయిన మన దేశంలో శ్రామికవర్గ ఐక్యతను సాధించటానికి ఇంకా ఎక్కువ శ్రమపడటం తప్ప దగ్గరదారులు లేవు.

మొత్తం సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతానికి తీవ్ర ఎదురు దెబ్బలు తగిలి, పురోగమనానికి అనేక ఆటంకాలు ఏర్పడిన సమయమిది. అందువలన పురోగామి వాదులు తలా ఒక చేయి వేసి ఈ మహోద్యామాన్ని ముందుకు తీసుకుపోయేందుకు పూనుకోవాల్సిన అవసరం వుంది. కమ్యూనిజం అంతమైంది, తిరిగి లేవకుండా దాన్ని పూడ్చిపెట్టాం, చరిత్ర ముగిసింది అని చెప్పినవారికి గతంలో లేని కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వంద సంవత్సరాలకు ముందు ముందు వరకు పెట్టుబడిదారీ, భూస్వామిక వ్యవస్ధ కంటే వూహాజనితమైన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యవస్ధలు ఎలా మెరుగ్గా వుంటాయో చెప్పి జనాన్ని ఒప్పించేందుకు కమ్యూనిస్టులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఈ వందసంవత్సరాలలో సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలు విఫలమైనప్పటికీ అచిర కాలంలోనే అవిసాధించిన విజయాలను అంతసులభంగా తుడిచిపెట్టలేరని తేలిపోయింది. కొంత కాలం సోషలిస్టు వ్యవస్ధలో జీవనం గడిపి, తిరిగి పెట్టుబడిదారీ వ్యవస్ధలోకి పోయిన చోట్ల కొంత మంది అయినా సోషలిస్టు వ్యవస్ధ గురించి బెంగ పెట్టుకున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అదే పెట్టుబడిదారీ విధానం గురించి దోపిడీ శక్తులు తప్ప సామాన్యులు బెంగపెట్టుకున్నట్లు మనకు ఎక్కడా కనపడదు. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్ధలో పునరావృతం అవుతున్న సంక్షోభాలు పూర్వం వచ్చిన వాటికంటే తీవ్రంగా వుండటంతో పాటు, అనేక తీవ్ర సమస్యలను ముందుకు తెస్తున్నాయి. కొత్త సమాజం గురించి ఆశలేకపోయినా వున్న సమాజం ఎంత త్వరగా పోతే అంత మంచిదని ప్రతి పెట్టుబడిదారీ దేశంలోని శ్రామికులు భావిస్తున్నారు. వంద సంవత్సరాలకు ముందు ఒక్క పెట్టుబడిదారీ సమాజం తప్ప దానితో పోల్చుకొనేందుకు మరొక వ్యవస్ధ లేదు. పెట్టుబడిదారీ వ్యవస్ధలతో పోల్చినపుడు సోషలిస్టు వ్యవస్ధలు తక్కువకాలంలోనే అభివృద్ది చెందుతాయి అనటానికి విఫలమైనప్పటికీ గతంలో సోవియట్‌ యూనియన్‌, వర్తమానంలో చైనా మన కళ్ల ముందున్నాయి. అందువలన ఇప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్ధలతో పాటు, ఎక్కడేం జరిగినా క్షణాల్లో ప్రపంచమంతా తెలుసుకోగలిగిన ఆధునిక సమాచార వ్యవస్ధ అందుబాటులోకి వచ్చింది.

రొడీషియా పేరుతో గుర్తింపు లేని బ్రిటీష్‌ వారి స్వయం పాలిత వలస రాజ్యంగా వున్న ఆఫ్రికా ఖండంలోని నేటి జింబాబ్వేలో తొలిసారిగా ఈ ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. అనేక కమ్యూనిస్టుపార్టీల మాదిరే అది దక్షిణాఫ్రికాలోని జింబాబ్వే ప్రవాస కార్మికులతో అది ఏర్పడింది.గతంలో రొడీషియా వలస పాలకులకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు కూడా భాగస్వాములుగా వున్నారు.1940వ దశకంలో ఏర్పడిన కమ్యూనిస్టుపార్టీని నాటి పాలకులు నిషేధించారు. దాంతో కమ్యూనిస్టులు జాతీయోద్యమానికి ప్రాతినిధ్యం వహించిన రెండు పార్టీలలో భాగస్వాములుగా పని చేశారు.1980లో స్వతంత్ర జింబాబ్వే ఏర్పడిన తరువాత ప్రజాస్వామిక మార్పు కొరకు వుద్యమం( మువ్‌మెంట్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ ఛేంజ్‌(ఎండిసి) పేరుతో సాగిన సంస్ధలో పని చేశారు.

అనేక అనుభవాల తరువాత ఎండిసి, ప్రవాసంలో దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీలోసభ్యులుగా వున్న జింబాబ్వియన్లు తాజాగా కమ్యూనిస్టుపార్టీని ఏర్పాటు చేశారు.అదింకా బాల్యావస్ధలోనే వుంది. వచ్చే ఏడాది అక్కడ జరిగే ఎన్నికలలో తాము పాల్గనటం లేదని, ఇతర ప్రతిపక్షపార్టీల మాదిరి అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబేను గద్దెదింపే లక్ష్యం తమ ముందు లేదని, గత కొద్ది సంవత్సరాలుగా గిడసబారిపోయిన దేశ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించి ప్రజలకోసం వుపయోగపడే విధంగా చేసే అంశాలను చర్చకు పెడతామని కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నకబుతో మహెబినా ప్రకటించారు. ప్రపంచంలో తాజాగా ఏర్పడిన కమ్యూనిస్టుపార్టీ ఇదని చెప్పవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన తరువాత కూడా కార్మికులను విముక్తి చేయగలిగేది కమ్యూనిజం ఒక్కటే అనే విశ్వాసం ప్రపంచంలో ప్రతి మూలా నిత్యం వ్యక్తమౌతుందటం.

ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిజాన్ని అంతం చేస్తామంటూ కత్తి పట్టుకు తిరుగుతున్న అమెరికాలోనే నూతన సహస్రాబ్ది యువతలో 42శాతం మంది సోషలిస్టు వ్యవస్తే సురక్షితంగా వుంటుందని నమ్ముతుండగా, ఏడుశాతం మంది ఎలాంటి శషభిషలు లేకుండా తాము సోషలిస్టు వ్యవస్ధలోనే జీవించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేసినట్లు తాజాగా జరిగిన సర్వేలో వెల్లడైందని ఒక సంస్ధ వెల్లడించింది. అమెరికా యువతలో ఇలాంటి ధోరణులు వెల్లడి కావటం పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించేదైతే, అభ్యుదయ వాదులకు అంతకంటే ఆనందం కలిగించేదేముంటుంది? వివరాల కొరకు వచ్చే భాగం వరకు వేచి చూడండి.

(గమనిక:సోషలిస్టు దేశాలలో సంభవిస్తున్న మార్పులు, అనుభవాలు, గుణపాఠాల గురించి తద్దినం మాదిరి ఆరోజుకు స్మరించుకొని మరుసటి రోజు నుంచి మరచి పోవటం కాకుండా నిరంతర మధనం కొనసాగించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా తరువాయి భాగాలలో మరికొన్ని అంశాలను రేఖా మాత్రంగా అయినా ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తాను.)

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • పారేసుకున్న చోటే వెతుక్కుంటున్న డోనాల్డ్‌ ట్రంప్‌ – ఇరాన్‌పై ఆగని దాడులు !
  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d