• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Women

ఉచితాలు – అనుచితాల చర్చ : నరేంద్రమోడీకి జ్ఞాపకశక్తి తగ్గుతున్నదా లేక బిజెపి చేస్తే సంసారం…. !

15 Thursday Dec 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Freebies, Narendra Modi, Narendra Modi Failures, Politics Of Freebies, Revadi Politics


ఎం కోటేశ్వరరావు


గుజరాత్‌లో వచ్చిన ఘన విజయంతో ప్రధాని నరేంద్రమోడీ మరోమారు ఉచితాలు – అనుచితాల చర్చకు తెరతీశారు. దేశ వృద్ధికి ప్రమాదకరమంటూ ఉచిత రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల మీద ధ్వజమెత్తారు. సదరు అజండాను ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు గనుకనే ఇటీవల నాగపూర్‌లో టికెట్‌ కొని మెట్రో రైలు ఎక్కి తాను ప్రధాని పదవిలో ఉన్నా ఉచితంగా రైలెక్కను అనే సందేశమిచ్చారు.ఏదీ ఊరికే రాదు అన్న ఒక నగల వర్తకుడి వాణిజ్య ప్రకటనను చాలా మంది చూసే ఉంటారు. మోడీ టికెట్‌ కౌంటర్‌లో ఉన్న ఫొటో మాదిరి ఉచితాల వ్యతిరేక చర్చ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఏది ఉచితం, ఏది కాదు అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతున్నది. ఇది ఇంతటితో ఆగేది కాదు. ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతున్నారు. విశ్వగురువు నరేంద్రమోడీ వివిధ సందర్భాలలో చేసిన ప్రవచనాల సారం ఏమిటి ? రివాదీ (ఉచితాలు) సంస్కృతి దేశానికి చాలా ప్రమాదకరం. ఈ రోజు దేశంలో ఉచితాల ద్వారా ఓట్లను దండుకొనేందుకు కొన్ని పార్టీల వారు చూస్తున్నారు. ప్రత్యేకించి యువత ఈ ఉచిత సంస్కృతి గురించి జాగ్రత్తగా ఉండాలి. జనాలకు ఉచితాలు ఇవ్వటం ద్వారా మీకు అవసరమైన రహదారులు, విమానాశ్రయాలు లేదా రక్షణ నిర్మాణాలు జరగవు. ఈ ఆలోచనలు చేసే వారిని ఓడించాల్సి ఉంది.


మోడీ గారి వయస్సు ఇప్పుడు 73 నడుస్తున్నది. బహుశా ఇతర మానవ మాత్రుల మాదిరి ఆయనకూ జ్ఞాపకశక్తి తగ్గుతున్నదా అన్న అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది(2022) ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోక కల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. దానిలో పేర్కొన్న అంశాలను చూస్తే ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరుపదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం ( కరోనా పేరుతో రైళ్లలో వృద్దు స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను మోడీ సర్కార్‌ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకు తేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పధకం కింద హౌలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు, అన్న పూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి. బహుశా బిజెపి నిఘంటువులో వీటికి వేరే అర్ధం ఏమన్నా ఉన్నట్లా లేక నరేంద్రమోడీ గారికి ఈ సంకల్పం గురించి గుర్తు లేదా లేక నటిస్తున్నారా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 2022-23 బడ్జెట్‌లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు.


ఈ ఏడాది మాదిరే 2017లో కూడా హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన పక్షం రోజులకు గుజరాత్‌ ఎన్నికలను ప్రకటించారు. ” హిమచల్‌ ఎన్నికల ప్రకటన తేదీ నుంచి గుజరాత్‌లో కురుస్తున్న ఉచితాల వాన ” అని సిఎన్‌ఎన్‌ – న్యూస్‌ 18 అక్టోబరు 26, 2017న ఒక వార్తను ప్రచురించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే 24 గంటల ముందు బిజెపి సర్కార్‌ నాలుగు పెద్ద పధకాలను ప్రకటించిందని దానిలో పేర్కొన్నారు.( మోడీ నైతిక విలువల వెలుగులో పెరిగిన బిజెపి కూడా ఇతర పార్టీల మాదిరే ఇలా చేస్తుందా అని ఆశ్చర్యపోవద్దు, ఎంతవారలైనా కాంతదాసులే అన్న కవి ఇప్పుడుంటే పార్టీలన్నీ అధికార దాసులే అనే వారు) డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాల కొనుగోలుపై రైతులకు 18శాతం జిఎస్‌టి రద్దు, రైతులకు సున్నా వడ్డీకి రుణాలు వాటిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతాంశానికి వస్తే అమ్‌దానీ ఆఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్రమోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి కేంద్ర ఆఫీసులో మాట్లాడుతూ దేశానికి తొలి ప్రాధాన్యత అన్నది బిజెపి విధానమని, ఏది తమకు అనుకూలంగా పని చేస్తుందో ఏది వ్యతిరేకమో ఓటర్లకు తెలుసునని, దగ్గరదారి రాజకీయాలు దేశానికి నష్టమని వారికి తెలుసు అన్నారు. దేశం బాగుపడితే ప్రతి ఒక్కరూ సంపదలు పొందుతారని చెప్పారు. ఉచితాలు కొనసాగితే ఈ రోజు మన పొరుగుదేశాల్లో జరుగుతున్న మాదిరే పరిస్థితి ఉంటుందని, అందువలన అలాంటి ఎత్తుగడలు ఎవరికీ లబ్ది ఉండదు అన్నారు. ఇలాంటి సుభాషితాలను ఒక వైపు వినిపిస్తూ మరోవైపు గుజరాత్‌ నేతలకు ఏ మార్గదర్శనం చేశారో చూడండి.


” ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం కింద 39లక్షల మందికి రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.” (డెక్కన్‌ హెరాల్డ్‌ 2022 నవంబరు 13). ” బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం, రెండు ఉచిత సిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటీలు కూడా ఉన్నాయి. బిజెపి కూడా ఉచితాల క్రీడా బరిలో ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్య తరగతిని ఆకర్షించేందుకు పూనుకుంది. గుజరాత్‌ ఆర్థిక వ్యవస్థను(జిఎస్‌డిపి) లక్ష కోట్ల డాలర్లకు పెంచుతామని(2022-23లో అంచనా రు.22 లక్షల కోట్లు, డాలర్లలో 280 బిలియన్లు.2018-19లో రు.15 లక్షల కోట్లు, అది గత ఐదేండ్లలో 22లక్షల కోట్లకే పెరిగింది. అలాంటిది ఐదేండ్లలో లక్షకోట్ల డాలర్లంటే 1000 బి.డాలర్లకు ఎలా చేరుతుంది.) 2036లో అహమ్మదాబాద్‌లో ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని పేర్కొన్నది.(గుజరాత్‌పై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2022 నవంబరు 27 తేదీ సంపాదకీయం). ఆలూ లేదూ చూలూ లేదు, 2036 ఒలింపిక్స్‌ నిర్వహణ ఎవరికి అప్పగిస్తారనేది 2025-29 సంవత్సరాల మధ్య ప్రకటించే అవకాశం ఉంది,మన దేశానికి అవకాశం వస్తుందో రాదో చెప్పలేము.అలాంటిది ఏకంగా నిర్వహిస్తామని ఇప్పుడే బిజెపి చెప్పటం జనాలను అమాయకులుగా పరిగణించటం తప్ప మరొకటి కాదు. తాను ప్రకటించే ఉచితాలు సాధికారతలో భాగమని, ఇతరులు ప్రకటించే వాటిని ప్రలోభాలని బిజెపి చిత్రిస్తోంది. మధ్య ప్రదేశ్‌లో రైతులకు విద్యుత్‌ సబ్సిడీగా రు.15,700 కోట్లు ఇస్తున్నట్లు 2021 అక్టోబరులో అక్కడి బిజెపి సర్కార్‌ ప్రకటించింది. అదేవిధంగా గృహాలకు 2021-22కు గాను రు.4,980 కోట్లు కేటాయించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమచల్‌ ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్‌ ఏప్రిల్‌ నెలలో ఇండ్ల అవసరాలకు గాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రు.250 కోట్లు లబ్ది చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ట్ర ఆర్టీసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 18-60 సంవత్సరాల మహిళలకు నెలకు రు.1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తమను తిరిగి ఎన్నుకుంటే వృద్దాప్య పెన్షన్‌ మొత్తాన్ని రు.200 నుంచి 1000కి పెంచుతామని మణిపూర్‌ బిజెపి ప్రకటించింది.


నేను తినను ఇతరులను తిననివ్వను అని చెప్పిన నరేంద్రమోడీ ప్రధానిగా ప్రతి పైసాకు జవాబుదారీ అన్న సంగతి తెలిసిందే. ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చూస్తున్నారు.గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బాంకులు రు.10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రు.1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో, సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది.(2022, డిసెంబరు 13వ తేదీ వార్త).ఇవన్నీ బడాబాబులు, కావాలని ఎగవేసిన రుణాలన్నది అందరికీ తెలిసిందే. పారు బాకీల రద్దు కాదు, వేరు ఖాతాల్లో చూపుతున్నామని అంటున్నారు. ఇంత తక్కువగా వారి నుంచి రాబట్టటంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిదన్నది స్పష్టం. అలాంటి పెద్ద మనుషుల పేర్లు వెల్లడిస్తే వారి మర్యాదలకు భంగం అని చెబుతున్నారు. వారితో బాంకులు ఉన్నతాధికారులు కుమ్మక్కు కాకుండా అలాంటి రుణాలు ఇచ్చే అవకాశం లేదు. అలాంటి వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా ?


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్ర రుణాలను తీసుకోవటం తప్ప తిరిగి చెల్లించనవసరం లేదనే అభిప్రాయం ఉంది. ఎగవేసిన వారు చిన్నవారా పెద్దవారా అని కాదు ఎలాంటి సందేశం జనాల్లోకి వెళుతున్నదనేది కీలకం.ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ప్రభుత్వ పధకాల కారణంగానే తిరిగి అధికారానికి వచ్చిందన్నది అనేక మంది చెబుతున్న అంశం. అక్కడ ముద్రా రుణాల కింద పద్దెనిమిదివేల కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఈ పధకం కింద ఇచ్చే రుణాలను క్రెడిట్‌ గారంటీ ఫండ్‌ ట్రస్ట్‌ ద్వారా మంజూరు చేస్తారు గనుక చెల్లించకున్నా బాంకులు ఎలాంటి ఇబ్బందులు పడవని బాంకు అధికారుల సంఘం పేర్కొన్నది. చిన్న, సన్నకారు సంస్థలకు ఇచ్చే ఈ రుణాల నిరర్ధక ఆస్తుల మొత్తం 2021 మార్చి 31నాటికి 11.98శాతం లేదా రు.2.84లక్షల కోట్లని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం వెల్లడించింది.2018 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పిఏలు కేవలం 5.38శాతమే. ఇదేమీ చిన్న మొత్తం కాదు, పైసల్లో అంతకంటే లేదు. ఇది కూడా పన్ను చెల్లించిన వారి సొమ్మే మరి.


కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే. కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్రమోడీ కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22కు, 15శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా ? అది దేశానికి, జనానికి లబ్ది చేకూర్చుతున్నదా ? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటారా, దోచిపెడుతున్న సొమ్మంటారా ? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా ! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొకదాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితంగా ఏడాదికి ఆరువేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు. రైతులు ఆ సొమ్మును స్విస్‌ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగుమందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు. సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లేగా ! తమిళనాడు ప్రభుత్వం కార్పొరేట్లకు రద్దు చేస్తున్న రుణాల గురించి సుప్రీం కోర్టు కేసులో ప్రస్తావించింది. మోడీ తొలి మూడేండ్ల పాలనలో అదానీ తీసుకున్న రుణాల్లో 75వేల కోట్లను మాఫీ చేసిందని పేర్కొన్నది, లేదూ పక్కన పెట్టామంటే ఎంత వసూలు చేసిందీ చెప్పాలి కదా ! ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా కొన్ని వేల కోట్లు పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది, ఏమంటే అవి ఎగుమతికి పనికి వస్తాయట. కాసేపు అంగీకరిద్దాం, రైతులు పండించే వరి, గోధుమలు, చెరకు నుంచి తీసే పంచదార కూడా ఎగుమతి చేస్తున్నాం, మరి వారికి ప్రోత్సాహకాలను ఎందుకు ఇవ్వటం లేదు.


దేశ సంపద పెరిగితే జనమూ ధనవంతులౌతారని నరేంద్రమోడీ చెబుతున్నారు. దానికి ఆధారాలుండాలి కదా ! సంపదల పంపిణీలో తీవ్ర అసమానలు ఉన్న దేశాల్లో మనది ఒకటి.1990 నుంచి 2020 నాటికి ధనికులుగా ఉన్న ఒకశాతం మంది వద్ద ఉన్న దేశ సంపద 10.4 నుంచి 21.7 శాతానికి పెరగ్గా, పేదల్లోని దిగువ 50శాతం మంది సంపద వాటా 22 నుంచి 14.7శాతానికి తగ్గింది. ఈ కారణంగానే కదా పేదలు ఉచితాల కోసం ఆకర్షితులౌతున్నది. స్వేచ్చా మార్కెట్‌, ఏదీ ఉచితం ఇవ్వకూడదు అన్న నయా ఉదారవాదం పేరుతో కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టే విధానాలు వచ్చిన దగ్గర నుంచీ అసమానతల పెరుగుదలతో పాటు ఉచితాల మీద దాడి ప్రారంభమైంది. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చివేశారు. ఏది ఉచితమో, ఏది సంక్షేమమో ఏది కాదో టీకా తాత్పర్యాలు చెప్పేవరకు ఇది సాగుతూనే ఉంటుంది. చెప్పేవారెవరు ? దాని మీద ఏకాభిప్రాయం ఎలా వస్తుంది ? ఒకనాడు అపహాస్యం చేసిన పధకాలనే తరువాత జాతీయంగా అమలు చేశారు.తొలుత తమిళనాడు స్కూలు పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేసినపుడు అదే జరిగింది. ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఎన్టీర్‌ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎద్దేవా చేసిన వారున్నారు. ఆహార భద్రతా పధకం కింద ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఒడిషా, తెలంగాణాలో ముందుగా రైతు బంధును ప్రకటిస్తే తరువాత నరేంద్రమోడీ కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో దేశమంతటా అమలు చేస్తున్నారు. అందువలన ఈ రోజున ఉచితాలన్న వాటిని రేపు ఏం చేస్తారో చెప్పలేము. రాష్ట్రాల వనరులు తగ్గుతున్నట్లు ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ కేంద్ర పెద్దలు గుండెలు బాదుకుంటున్నారు. ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల వాటాను 41శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పినా ఆచరణలో దక్కుతున్నది 29శాతమే అని చెబుతున్నారు. మరి దీని సంగతేమిటి ? ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోవటం కాదా ! ఉచితాల పేరుతో అందించే సేవలు లేక నగదు బదిలీగానీ అవి పొందిన వారి కొనుగోలు శక్తిని పెంచి దేశానికి తోడ్పడేవే తప్ప వేరు కాదు. వాటి వలన ప్రభుత్వాలకు జిఎస్‌టి లేదా మరో రూపంలో రాబడి, పారిశ్రామికవస్తువుల కొనుగోలు, తద్వారా ఉపాధి పెరుగుదలకు పరోక్షంగా తోడ్పడే వాటి మీద దాడికి దిగుతున్నారు. మరోవైపు అంతకు మించి కార్పొరేట్లకు సంపదలు దోచిపెడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మామ తిట్టినందుకా, తోడల్లుడు కిసుక్కుమన్నందుకా ? దేశ ఆకలి సూచికలపై మండిపడుతున్న కాషాయ దళాలు !

19 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Women

≈ Leave a comment

Tags

BJP, GHI, Global Hunger Report 2022, hunger, India’s GHI-2022, Narendra Modi Failures, RSS, Saffron gangs Furiousness


ఎం కోటేశ్వరరావు


తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగజారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. ఇంకేముంది ! సామాజిక మాధ్యమాల్లో, ఇతరంగా కొందరు పెద్ద గగ్గోలు. గుండెలు పగిలేట్లు బాదుకుంటున్నారు, నివేదిక ఇచ్చిన వారిని శాపనార్ధాలు పెడుతున్నారు. తప్పుడు లెక్కలంటున్నారు, దేశ(నరేంద్రమోడీ) ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదని కుట్ర సిద్దాంతాన్ని ముందుకు తెచ్చినవారు కొందరు. 2020 ఏప్రిల్‌లో తొలి కరోనా లాక్‌డౌన్‌ నాటి నుంచి 2022 సెప్టెంబరు వరకు ప్రతి నెలా ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా 80కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం అందిస్తే ఇంకా ఆకలి ఏమిటి అని నటనా చక్రవర్తులను తలపించిన వారు ఉన్నారు. మహానుభావులారా ఆకలి సూచిక రూపొందించేందుకు తీసుకున్న అంశాలను, వాటిలో ఒకదాని గురించి మాననీయ ప్రధాన మంత్రి నరేంద్రమోడీజీ ఆగస్టు నెల మన్‌కీ బాత్‌లో పోషకాహార లేమి మీద ప్రజా ఉద్యమం జరపాలని పిలుపునిచ్చారని తెలుసుకోండిి అని చెప్పాల్సి వస్తోంది. ఇన్ని నెలలుగా బియ్యం లేదా గోధుమలు, పప్పులు ఇస్తే ఇంకా పోషకాహారం లేదంటారేమిటి అని ఆ పెద్దమనిషి చెప్పలేదని గ్రహించండి.మీరు చెబుతున్నదే సరైనదనుకుంటే ప్రజా ఉద్యమం జరపాలని ఎందుకు పిలుపునిచ్చారో ప్రశ్నించండి ! బియ్యం ఇస్తే సరిపోతున్నపుడు అంతకు ఎంతో ముందు నుంచే పోషణ్‌, ఐసిడిఎస్‌ పధకాలు వాటి కింద అంగన్‌వాడీలు గట్రా ఎందుకు నిర్వహిస్తున్నట్లు ?


గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పుపడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్దతే తప్పు, పరిగణనలోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు(ఎన్‌జిఓ) చెప్పేవాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడువేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింప చేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే, ఇలాంటి వాదనలను ప్రభుత్వం కూడా చేస్తున్నది, ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121మాత్రమే. అది స్వచ్చందం తప్ప ఇవ్వకపోతే తలతీసేదేమీ ఉండదు. అమెరికా, ఐరోపా దేశాల్లో సమాచారం ఇవ్వకపోతే మీడియాలో విమర్శించే స్వేచ్చను అక్కడి జర్నలిస్టులు వినియోగించుకుంటున్నారు. మన దగ్గర ఇంకా అలాంటి అవకాశాలు మిణుకుమిణుకు మంటూ కనిపిస్తున్నా అడిగే దమ్మున్న జర్నలిస్టులు లేరు, అడిగేవారున్నా ఇంతవరకు మనది అపర ప్రజాస్వామిక దేశం గనుక మన నరేంద్రమోడీ ఎవరికీ ప్రశ్నించే అవకాశమే ఇవ్వలేదు. అందువలన మనం కూడా అసలు అధికారిక సమాచారం ఇవ్వటం మానేస్తే సూచికల ప్రసక్తి ఉండదు, వాటి మీద విమర్శలు, ఉక్రోషాలు, ఉడుక్కోవటాలు, కుట్ర సిద్దాంతాల ప్రచారం వంటివి ఉండదు. కాషాయదళాలు వేరేపని చూసుకుంటాయి కదా ! మరి ప్రభుత్వం ఆపని ఎందుకు చేయదు ? లేదా ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేసి వివిధ దేశాల నుంచి సమాచారాన్ని సేకరించి సరైన విశ్లేషణలు అందించవచ్చు, సూచికలు ప్రకటించవచ్చు. దేశానికి మచ్చతెచ్చే వారికి బుద్ది చెప్పవచ్చు. ఈ రోజు ప్రపంచంలో ఉన్న పరిస్థితిలో నరేంద్రమోడీ అడిగితే సమాచారం ఇవ్వని దేశం ఉంటుందా ? నిధుల కొరత లేదే, ఎందుకు చేయరు ? కావాలంటే అప్పులు తీసుకురావచ్చు, 55.87లక్షల కోట్లు (జిడిపిలో 52.16శాతం) అప్పులతో దేశాన్ని నరేంద్రమోడికి అప్పగించారు. దాన్ని 2023 మార్చి నాటికి రు.152.19 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వమే అంచనా వేసింది, కనుక మరో లక్ష కోట్లు అప్పుచేసి సరైన సూచికలు వెల్లడిస్త్తే మన ప్రతిభ లోకానికి తెలుస్తుంది. అప్పు తీర్చేది జనమే, ఎవరి జేబుల్లోంచి పెట్టటం లేదు కదా !


ఇక ఐరాస సంస్థలకు సమాచారం ఇవ్వకపోతే మచ్చపడుతుంది, అక్కడ మనం సుభాషితాలు మాట్లాడే అవకాశం ఉండదు, అవి టీవీ చర్చలు కాదు గనుక వాటిలో మాదిరి మాట్లాడితే మర్యాద దక్కదు. పవన్‌ కల్యాణ్‌ భాషలో చెప్పాలంటే కొడకా అంటూ తాటతీస్తారు. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అప్పులు తెచ్చుకోవాలి, వాటికి సమాచారం ఇవ్వకపోతే తిప్పలు తెచ్చుకున్నట్లే ! ప్రపంచవాణిజ్య సంస్థకూడా అంతకంటే ఎక్కువ. అమెరికా వంటి మన ” సోదర ” దేశాలు మనం సమాచారం ఇస్తున్నా అక్కడ కేసులు పెడుతున్నాయి. మన దేశంలో ఆకలి సంబంధిత అంశాల గురించి స్వచ్చంద సంస్థలు ఏమి చెబుతున్నాయో, మన ప్రభుత్వ సంస్థలు ఎలాంటి నివేదికలిస్తున్నాయో ఆకలి సూచికలను తప్పుపడుతున్నవారు జనానికి చెబుతున్నారా ? వారి నిజాయితీ ప్రశ్నార్దకం కాదా ! మన దేశం తప్ప ఈ నివేదికను ఆమోదించటం లేదని గానీ, తప్పుడు పద్దతుల్లో రూపొందించారని గానీ ఎన్నిదేశాలు స్పందించిందీ సమాచారం లేదు, ఎవరైనా అలాంటి వివరాలు అందచేస్తే ఈ విశ్లేషణలో వాటిని చేర్చవచ్చు. ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్‌ లేదా దాని మద్దతుదార్లు అంగీకరించారా ? లేదు, ఎందుకంటే అన్నింటా అధమస్థానాలే.


మోడీ సర్కార్‌, మద్దతుదార్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న సులభతర వాణిజ్య సూచిక గురించి చూద్దాం.2014లో 142లో ఉన్నదాన్ని 2020 నాటికి 63కు తీసుకువచ్చామని, 79 స్థానాలు ఎగబాకిందని చెప్పారు. చివరికి ఈ సూచికలు రూపొందించిన తీరు పెద్ద కుంభకోణమని, సమాచారాన్ని తారు మారు చేశారని, ప్రపంచ బాంకు పెద్దలు, సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని చెబుతూ మరుసటి ఏడాది నుంచి ఏకంగా సూచికల రూపకల్పనకే స్వస్థి పలికారు. పోనీ మన దేశం ఇప్పుడు నిజాలు మాత్రమే చెప్పే సత్యహరిశ్చంద్రుల వారసులని చెబుతున్నారు గనుక సరైన సమాచారమే ఇచ్చారని, నిజంగానే అంత ప్రగతి సాధించిందనే అనుకుందాం, మరి ఆ మేరకు మన దేశానికి ఆ స్థాయిలో ఎందుకు పెట్టుబడులు రాలేదు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా ఎందుకు విఫలమైనట్లు ? సూచికను ఎగబాకించి సాధించిందేమిటి ? రాంకులను చూపినంత మాత్రాన పెట్టుబడులు పెట్టే అమాయకులు ఉండరని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రపంచానికి రుజువు చేసింది.


ఆకలి సూచికలను రూపొందించేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింప చేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. ఆ ప్రాతిపదికను మన దేశానికి మాత్రమే వర్తింప చేస్తే తప్పే, అన్ని దేశాలకూ ఒకటే పద్దతిని అనుసరించారు కదా ! పోషకాహార లేమికి గాను కేవలం మూడువేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశాలకూ ఒకటే పద్దతి. ఏ సర్వేకైనా జనాభాలో ఎంత మందిని తీసుకుంటే సరైన వాస్తవాలు వెల్లడౌతాయో ఎవరైనా చెప్పగలరా ? మన ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు ఎంతమంది మీద జరుపుతున్నారో చెప్పి ప్రభుత్వం ఒప్పించగలదా ? ఒక పద్దతి ప్రకారం మన దేశం గురించి తప్పుగా చూపేందుకు ప్రతి ఏటా తప్పుడు సమాచారమిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అదే నిజమైతే ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్‌ డిమాండ్‌ చేసినట్లు సదరు సూచికలు ఇచ్చే సంస్థలను అంతర్జాతీయ కోర్టుకు లాగి బోనులో నిలబెట్టి వాస్తవాలేమిటో వెల్లడించాలి. ఒట్టి అరుపులెందుకు ? నివేదికను రూపొందించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడువేల మంది సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ). అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. దాని సమాచారాన్నే నివేదికను రూపొందించిన జర్మనీకి చెందిన ” వెల్ట్‌ హంగర్‌ హిల్‌ఫీ ” ఐర్లండ్‌లోని ” కన్సరన్‌ వరల్డ్‌వైడ్‌ ” తీసుకున్నాయి, అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకున్నాయి.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అశ్వనీ మహాజన్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌గా పని చేస్తున్నారు. 2021 ఆకలి సూచిక నివేదిక తప్పుల తడక అంటూ 2021నవంబరు పదవ తేదీ పయనీర్‌ ఆంగ్ల పత్రికలో పెద్ద వ్యాసం రాశారు. దాన్లో దేశంలో కూరగాయలు, గుడ్లు, పండ్లు, పాలు ఇతర ఆహార ఉత్పత్తులు ఎలా పెరిగాయో పేర్కొంటూ ఇవన్నీ ఉన్నపుడు పోషకాహార లోపం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.( వాటిని కొనుగోలు చేసి రోజూ తినేవారెందరో ఆ పెద్దమనిషి చెప్పి ఉంటే అసలు నిజాలు తెలిసేవి. ) ఆకలి సూచికల రూపకల్పనకు నేషనల్‌ శాంపుల్‌ సర్వే సంస్థ(ఎన్‌ఎన్‌ఎస్‌ఓ) నుంచి ఆహార వినియోగ సమాచారాన్ని తీసుకోవాలని చెప్పారు. 2011-12 తరువాత అసలు అలాంటి సమాచారాన్ని ప్రచురించలేదని, 2015-16 సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నందున అసలు దాన్ని ప్రచురించకుండా వెనక్కు తీసుకున్నారని, అందువలన 2021 ఆకలి సూచిని 2011-12 సమాచారంతో రూపొందించారని మహాజన్‌ ఆరోపించారు. దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. సరైన సర్వే నిర్వహించలేదు, పోనీ మా దగ్గర తాజా సమాచారం లేనందున మా దేశాన్ని జాబితాలో చేర్చవద్దని ఎందుకు కోరలేదు. సమాచారాన్ని సేకరించేందుకు మోడీ సర్కార్‌ ఎందుకు శ్రద్ద చూపలేదు ? 2019 ఎన్నికలకు ముందు నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టిందని ప్రభుత్వ సమాచారం వెల్లడిస్తే ఎన్నికలు ముగిసేవరకు దాన్ని వెలుడకుండా అడ్డుకున్నారు, అది వాస్తవం కాదన్నారు, తరువాత అదే వాస్తవమని అధికారికంగా అంగీకరించారు.


గతంలో ఎఫ్‌ఏఓ మన దేశంలో ఆహార వినియోగం గురించి జాతీయ పౌష్టికాహార పర్యవేక్షణ బోర్డు (ఎన్‌ఎన్‌ఎంబి) సమాచారం మీద ఆధారపడేది. 2011 తరువాత గ్రామీణ ప్రాంతాల్లో, 2016 తరువాత పట్టణ ప్రాంతాల్లో తాము ఎలాంటి సర్వేలు జరపలేదని ఎన్‌ఎన్‌ఎంబి చెప్పిందని కూడా మహాజన్‌ పేర్కొన్నారు.( ప్రభుత్వం దగ్గర సమాచారం లేనపుడు గాలప్‌పోల్‌ వంటి సంస్థల మీద ఆధారపడి దాన్ని విశ్లేషణకు తీసుకున్నట్లు చెప్పవచ్చు. దానికి ఎవరిది బాధ్యత ఎవరిది ?)
అశ్వనీ మహాజన్‌ సరికొత్త అంశాన్ని ముందుకు తెచ్చారు. జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) 2016లో చేసిన సర్వే ప్రకారం 16 రాష్ట్రాల్లో కార్లు, ఇళ్లు ఉన్న ధనికుల పిల్లల్లో కూడా 17.6శాతం మంది గిడసబారి ఉన్నారని, 13.6 శాతం మంది బలహీనంగా ఉన్నారని పేర్కొన్నట్లు చెబుతూ, ధనికులకు ఆహారం అందుబాటులో ఉంటుంది కదా ఇలా ఎందుకున్నట్లు అని ప్రశ్నించారు. అధిక బరువు, ఊబకాయం ఉన్న మహిళలకు పుట్టే పిల్లల్లో 22 శాతం మంది గిడసబారటం, 11.8 శాతం బలహీనంగా ఉంటారని చెప్పారు. ఈ వాదన ఎందుకు చేశారంటే డబ్బున్న వారు కూడా సరిగా పిల్లల్ని పెంచటం లేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదు దీనికి ప్రభుత్వం ఏమి చేస్తుంది, నరేంద్రమోడీ ఏమి చేస్తారని వాదించటం, వాస్తవాన్ని వక్రీకరించటం, వైఫల్యాన్ని అంగీకరించకపోవటమే.
వాస్తవం ఏమిటి ? కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4ను 2014-15లో ఐదవ సర్వేను 2019-20లో నిర్వహించారు. ఈ సర్వేల మధ్య వచ్చిన మార్పు, ఆకలి సూచికల్లో 2014-2022 కాలంలో వచ్చిన మార్పులు ఏమిటి ? దిగువ పట్టికలో చూద్దాం. అంకెలను శాతాలుగా గమనించాలి.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రక్తహీనత అంశంలో ఒక్క కేరళ తప్ప మిగతా రాష్ట్రాలన్నింటా పరిస్థితి తీవ్రంగా ఉంది.
అంశం××××××× సర్వే 4 ××× సర్వే 5×× 2014××2022
గిడసబారినపిల్లలు×× 38 ××× 36 ××××× 38.7 ×× 35.5
బలహీన పిల్లలు ×× 21 ××× 19 ××××× 15.1 ×× 19.3
శిశుమరణాలు ×× 22.7 ××× 25 ××××× 4.6 ×× 3.3
పోషకాహారలేమి ×× 00 ××× 00 ××××× 14.8 ×× 16.3
బరువు తక్కువపి.×× 36 ××× 32 ××××× 000 ×× 000
రక్తహీన పిల్లలు ×× 58.6 ×× 67 ××××× 000 ×× 000
రక్తహీనమహిళలు×× 53.1 ××× 57 ×××× 000 ×× 000
రక్తహీనపురుషులు×× 22.7 ××× 25 ×××× 000 ×× 000

పైన పేర్కొన్న అంకెల్లో 2014 నుంచి 2022 వివరాలను ఆకలి సూచికల విశ్లేషణలో పేర్కొన్నారు.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు మన ప్రభుత్వం ప్రకటించినవే. దశాబ్దాల పాటు ఎలాంటి సర్వేలు నిర్వహించని మన ప్రభుత్వాలు, పాలకులకు, వారి మద్దతుదార్లకు సూచికలను రూపొందించే సంస్థలను విమర్శించేందుకు ఉన్న నైతిక అర్హత ఏమిటి ? తాజా ఆకలి సూచిక విశ్లేషణకు 2017 నుంచి 2021వరకు ఉన్న ఐదేండ్ల సమాచారాన్ని విశ్లేషించారు. వచ్చే ఏడాది 2018 నుంచి 2022 వరకు తీసుకుంటారు. ప్రతి ఏటా ఇలాగే మారుతుంది.2022 నివేదికలో మన దేశం సాధించిన మార్కులు 29.1 కాగా ఐదు శాతం లోపు మార్కులతో చైనాతో సహా 17 దేశాలు ఒకటవ స్థానంలో ఉన్నాయి. అమెరికా,బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అసలు ఈ జాబితాలోనే లేవు. మన దేశం కూడా వాటి సరసన చేరితే అసలు రాంకుల గొడవ ఉండదు కదా !


2014లో పేర్కొన్న76 దేశాల్లో మనది 55వ రాంకు వాస్తవం కాదు అని కొందరు చెబుతున్నారు. మరి ఎంత ? ఆ జాబితాలో ఐదు కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న 44 దేశాలను సూచికలో చూపలేదు. వాటిని కలుపుకుంటే మొత్తం దేశాలు 122 మన రాంకు 99 అవుతుంది. తాజా రాంకుల్లో అలాంటి దేశాలన్నింటినీ కలిపితే 121లో మనది 107 పెరిగినట్లా దిగజారినట్లా ? మనం తెచ్చుకున్న మార్కులను చూస్తే 2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 మాత్రమే ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. మన కంటే మెరుగుదల ఎక్కువ ఉన్న దేశాలు మనల్ని వెనక్కు నెట్టాయి. మామ తిట్టినందుకు కాదు తోడల్లు తొంగి చూసి కిసుక్కుమన్నందుకు అన్నట్లుగా మనం అధ్వాన్నంగా ఉన్నందుకు కాదు, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మన కంటే మెరుగ్గా ఉండటమే కాషాయ దళాల గగ్గోలుకు అసలు కారణం, తక్కువ ఉంటే చూశారా మన ప్రతిభ అని తమ భుజాలను తామే చరుచుకొనే వారు !


చివరిగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం గురించి చూద్దాం. సమగ్ర శిశు అభివృద్ధి పధకం(ఐసిడిఎస్‌) అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మన్మోహన్‌ పాలన చివరి ఏడాది బడ్జెట్‌ 2013-14లో ఈ పధకానికి రు.16,312 కోట్లు కేటాయించారు. తరువాత నరేంద్రమోడీ పాలన తొలి ఏడాది 2014-15లో రు. 16,561, 2015-16లో రు.8,336, 2016-17లో 14,850, 2017-18లో 16,745 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌ 2022-23లో రు.20,263 కోట్లుగా ప్రతిపాదించారు.2013-14 బడ్జెట్‌ ఖర్చు అంచనా రు.16,65,297 కోట్లు కాగా 2022-23 లో అది రు.39,44,909 కోట్లుగా ప్రతిపాదించారు. దీన్ని బట్టి తొమ్మిది సంవత్సరాల నాడు ఐసిడిఎస్‌కు మొత్తం ఖర్చులో 0.98 శాతం కేటాయిస్తే 2022-23 నాటికి అచ్చేదిన్‌ స్వర్ణయుగంలో అది 0.51 శాతానికి తగ్గింది. కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు మాత్రం భీముడిలా ఉండాలి అనుకోవటం కాదా ఇది ? నేటి బాలలే రేపటి పౌరులు అని కబుర్లు చెప్పటం కాదు, ఆచరణ కావాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుప్రీం మాజీ జస్టిస్‌ ఇందు మల్హోత్రా నోట వాస్తవాల వక్రీకరణ, కమ్యూనిస్టు వ్యతిరేకత !

02 Friday Sep 2022

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Anti communist, BJP, CPI(M), LDF, Pinarai Vijayan, RSS, Sabarimala Entry Case, SC Justice Indu Malhotra, Sree Padmanabhaswamy Temple Case


ఎం కోటేశ్వరరావు


సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా మాదిరిగా ఉన్న ఒక మహిళ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియో వైరల్‌గా మారిందంటూ దాని గురించి మీడియాలో ప్రముఖంగా 2022 ఆగస్టు చివరి వారంలో వార్తలు వచ్చాయి. దాని గురించి వివరణ ఇవ్వాలని మీడియా సంస్థలు కోరగా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ మహిళను ఇందు మల్హోత్రాగానే భావించిన కేరళ ప్రభుత్వం ఆమె మాట్లాడిన తీరును తప్పు పట్టింది. ఇందు మల్హోత్రాను కొందరు తప్పుదారి పట్టించి ఉంటారు, వాస్తవాలను సరి చూసుకొని ఆమె మాట్లాడి ఉండాల్సిందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి కెటి థామస్‌ అన్నారు. ఆమె మాట్లాడిందాన్లో తప్పు లేదని బిజెపి, దాని అభిమానులు సమర్ధించారు. ఆమె తీరు ఆందోళన కలిగిస్తోందని అనేక మంది సామాజిక మాధ్యమంలో స్పందించారు. భక్తులతో మాట్లాడినపుడు ఇందు మల్హోత్రా మాస్క్‌ ధరించి ఉన్నారు, వీడియో అధికారికమైనది కాదు, ఆమె వివరణ తీసుకొనేందుకు ఫోన్‌, వర్తమానం, మెయిల్‌ ద్వారా ప్రయత్నించగా ఫలించలేదని ” ద ఫెడరల్‌ ” న్యూస్‌ పోర్టల్‌, వివరణ రాలేదని టెలిగ్రాఫ్‌ పత్రిక పేర్కొన్నది.

ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలేమిటి ?2022 ఆగస్టు 28న ఆమె తిరువనంతపురం పద్మనాభ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా భక్తులలో ఒకరు ఆలయం వెలుపల ఆమెతో మాట్లాడుతూ పద్మనాభస్వామి ఆలయ కేసులో మంచి తీర్పు ఇచ్చారని ప్రశంసించినపుడు స్పందించిన ఇందు మల్హోత్రా వారితో మాట్లాడుతూ ” ఈ కమ్యూనిస్టు ప్రభుత్వాలతో జరుగుతున్నది అదే. కేవలం దేవాలయాలకు వస్తున్న ఆదాయం కారణంగానే వారు దేవాలయాలను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. అన్ని చోట్లా వారు స్వాధీనం చేసుకున్నారు….. అన్ని చోట్లా, కేవలం హిందూ దేవాలయాలనే. కాబట్టే జస్టిస్‌ (యుయు) లలిత్‌ నేను కుదరదని చెప్పాం, మేము దాన్ని అనుమతించం. మేం అడ్డుకోకుండా ఉండి ఉంటే ఇంకా కొనసాగేవి ” అని మాట్లాడినట్లుగా వీడియోలో ఉంది.మీ గురించి మేము ఎంతో గర్విస్తున్నాం, మీరు అలాంటి అద్భుతమైన పని చేశారు అన్న కొందరి మాటలు కూడా సదరు వీడియోలో ఉన్నాయి. పద్మనాభ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దేవాలయం తమ నిర్వహణలోనే కొనసాగాలన్న పూర్వపు రాజవంశీకుల అప్పీలుపై 2020 జూలై 13న జస్టిస్‌లు యుయు లలిత్‌, ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్‌ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.2021 మార్చి 13న ఇందు మల్హోత్రా పదవీ విరమణ చేయగా జస్టిస్‌ లలిత్‌ ప్రస్తుతం సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంగతి తెలిసిందే.


నిజంగా కేరళ ప్రభుత్వం దేవాలయాలను స్వాధీనం చేసుకోవాలనుకున్నదా ?2007లో ఆనంద పద్మనాభన్‌ అనే ఒక లాయరు రాజకుటుంబ వారసత్వ హక్కులను సవాలు చేస్తూ తిరువనంతపురం కోర్టులో ఒక కేసును దాఖలు చేశారు. ఆలయ ఆస్తుల పరిరక్షణకు కొత్త ట్రస్టీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆలయం, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. శతాబ్దాలుగా ఉన్న తమహక్కును రద్దు చేసేందుకు లేదంటూ రాజకుటుంబం హైకోర్టుకు అప్పీలు చేసింది. 1950నాటి చట్టంలోని ఒక సెక్షన్‌ ప్రకారం సంస్థాన విలీన ఒప్పందంలో గుర్తించిన చివరి రాజు 1991లో మరణించిన తరువాత వారసులు స్వతసిద్దంగా ఆలయ నిర్వహణ హక్కులను పొందలేరని అందువలన ప్రభుత్వం వెంటనే ఆలయ స్వాధీనానికి ఒక కొత్త ట్రస్టును లేదా చట్టపరమైన అధారిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీని మీద రాజు, నాటి ఆలయ అధికారి సుప్రీం కోర్టులో విడిగా అప్పీలు చేశారు. పద్మనాభ స్వామి దేవస్థానాన్ని స్వాధీనం చేసుకొనే ఆలోచన తమకు లేదని, ప్రస్తుత యాజమాన్యం గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవని ప్రభుత్వం (ముఖ్యమంత్రి విఎస్‌ ఆచ్యుతానందన్‌) తిరువనంతపురం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.(2010 మార్చి 16, హిందూ పత్రిక). 1949లో కేంద్ర ప్రభుత్వం-తిరువాన్కూర్‌-కొచ్చిన్‌ సంస్థానం చేసుకున్న విలీన ఒప్పందంలో రాజు వారసులు దేవాలయ యాజమాన్యంలో కొనసాగవచ్చనే నిబంధన ఉంది. సుప్రీం కోర్టు దాన్ని గుర్తించి ఆ మేరకు తీర్పు ఇచ్చింది.1950 చట్టం ప్రకారం కేరళలోని దేవాలయాలన్నీ దేవస్థానాల బోర్డుల అజమాయిషీల కిందకు వచ్చినప్పటికీ సంస్థాల విలీన ఒప్పందం ప్రకారం పద్మనాభ స్వామి ఆలయం మాత్రం రాజు వారసుల నిర్వహణలోనే ఉంటుందని పేర్కొన్నారు.కార్యనిర్వహణ అధికారిని, ముగ్గురు సలహాదారులను కూడా నియమించే అధికారం ఉంది.1965లో రాజు మేనేజింగ్‌ ట్రస్టీగా, నలుగురు సభ్యులతో పద్మనాభ స్వామి ఆలయ ట్రస్టును ఏర్పాటు చేశారు.


హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం కోర్టు రాజకుటుంబం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ముగ్గురితో ఒక సలహా కమిటీ ఏర్పాటు, దానికి అధ్యక్షత వహించేందుకు ఒక రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి, రాజు నియమించిన ఒక ప్రముఖ వ్యక్తి, రాజుతో సంప్రదించి అధ్యక్షుడు నియమించే ఒక చార్టెడ్‌ ఎకౌంటెంట్‌ ఉండాలి. ఆలయపాలనకు ఐదుగురితో ఒక కమిటీ, దానిలో రాజు వారసుల అదుపు, పర్యవేక్షణకు లోబడి పని చేసే విధంగా జిల్లా జడ్జి, రాజు ప్రతినిధి, ప్రధాన పూజారి, కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు ఉండాలని సుప్రీం కోర్టు పేర్కొన్నది. ఈ తీర్పును సవాలు చేయరాదని సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.


పద్మనాభ స్వామి ఆలయంలోని ఐదు నేలమాళిగల్లో లక్షల కోట్ల విలువ గల వజ్రాలు, కిరీటాలు, సింహాసనాలు, బంగారు నగలు,నాణాలు, ఇతర వస్తువులు ఉన్నట్లు 2011లో వెల్లడైన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన అమికస్‌ క్యూరీ గోపాల సుబ్రమణియం, కాగ్‌ మాజీ అధిపతి వినోద్‌ రాయి వాటిని తనిఖీ చేసి ఒక నివేదికను సమర్పించారు. మరో నేలమాళిగను తెరిస్తే ప్రళయం సంభవిస్తుందని రాజకుటుంబం, భక్తుల పేరుతో కొందరు వాదించారు. 1990 తరువాత అనేక సార్లు దాన్ని తెరిచారని ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదని కోట్లాది విలువైన వస్తువులు మాయమైనట్లు వినోద్‌ రాయి తన నివేదికలో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు దాన్ని తెరవటం గురించి ఆలయ యాజమాన్యకమిటీ నిర్ణయానికే వదలి వేసింది.


హిందూ దేవాలయాలను కమ్యూనిస్టు ప్రభుత్వం దోచుకుంటున్నదని చేస్తున్న ప్రచారం అబద్దమని అనేకసార్లు గతంలో వెల్లడైంది. అక్కడ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే మరో ఐదు సంవత్సరాలు సిపిఎం ఉన్న చరిత్ర తెలిసిందే.తొలిసారిగా వరుసగా రెండవ సారి గతేడాది సిపిఎం అధికారానికి వచ్చి చరిత్ర సృష్టించింది. 2014 ఏప్రిల్‌ 22న కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ విటి బలరాం బిజెపి నేత ఎఎన్‌ రాధాకృష్ణన్‌కు సమాధానమిస్తూ ఫేస్‌బుక్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం మలబార్‌ దేవస్థానం బోర్డుకు అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం వేతనాల కోసం రు.22 కోట్లు చెల్లించింది. పద్మనాభ స్వామి దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం 1970 నుంచి ఏటా రు.ఇరవైలక్షలు చెల్లిస్తున్నది.2011 నుంచి 2014వరకు శబరిమల ఆలయం రు. 60కోట్లు పొందింది.2015 డిసెంబరు ఏడున కేరళ అసెంబ్లీకి నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.” శబరిమలతో వివిధ ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖర్చుల కోసం ఖజానాకు జమ చేస్తున్నారన్నది ఆధారం లేని ఆరోపణ. తిరువాన్కూర్‌, కొచ్చిన్‌, మలబార్‌, గురువాయుర్‌ దేవస్థానం బోర్టుల పరిధిలోని ఆలయాల ఆదాయం నేరుగా వాటి బాంకు ఖాతాలకే జమ అవుతుంది. తిరువాన్కూర్‌, కొచ్చిన్‌ బోర్డుల లావాదేవీలను హైకోర్టు నేరుగా నియమించే ఆడిటర్లే తనిఖీ చేస్తారు, ఇతర వాటిని లోకల్‌ ఫండ్‌ డిపార్ట్‌మెంట్లు తనిఖీ చేస్తాయి. ఆ నివేదికలను ఎవరైనా చూడవచ్చు.2011 నుంచి 2015వరకు ప్రభుత్వ నిధుల నుంచి వివిధ ఆలయాలకు రు.231 కోట్లు ఖర్చు చేసింది.”

ఆగస్టు 29(2022) అసెంబ్లీలో చర్చకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, ఇతర అంశాల గురించి ప్రభత్వం వివరాలను ఇచ్చింది. దేవస్థానాల మంత్రి కె రాధాకృష్ణన్‌ ఇచ్చిన సమాచారం మేరకు కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించేందుకు గత ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం వివిధ దేవాలయాలకు రు.165 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది జూలై 31వరకు తిరువాన్కూర్‌ బోర్డుకు 20 కోట్లు , మలబార్‌ బోర్డుకు రు.44 లక్షలు ఇచ్చింది.” మితవాద హిందూత్వ శక్తులు పదే పదే చేసిన ప్రచారం రిటైర్డ్‌ న్యాయమూర్తిని ప్రభావితం చేసి ఉండవచ్చు. ప్రభుత్వం ఏ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోలేదు.2018 నుంచి 2022 వరకు ఐదేండ్లలో వివిధ బోర్డులకు కరోనా, వరదలపుడు ఆదుకొనేందుకు రు.449 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందని,30 కోట్లతో శబరిమల మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు పూనుకున్నదని, రిటైర్డ్‌ న్యాయమూర్తి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రాధాకృష్ణన్‌ మీడియాకు చెప్పారు. మాజీ ఆర్ధిక మంత్రి, సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ స్పందిస్తూ కేరళ ప్రభుత్వ నిధుల గురించి జస్టిస్‌ ఇందు మల్హోత్రాకు తెలియదని, ఆమెకు కమ్యూనిస్టుల గురించి తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లున్నదని అన్నారు.


కరోనా పేరుతో ఆలయాలను మూసివేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ప్రచారం చేసిన శక్తులే తరువాత రాబడి కోసం తెరిచారని, కానుకలు ఇవ్వవద్దని పిలుపులు ఇచ్చాయి. పూజారులుగా కేవలం బ్రాహ్మలు మాత్రమే ఉంటూ, దళితులను అసలు ఆలయ దరి చేరనివ్వని రోజుల సంగతి తెలిసిందే. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని కోరుతూ కేరళలో జరిగిన ఉద్యమాలకు ఏకె గోపాలన్‌ వంటి కమ్యూనిస్టు నేతలు సారధ్యం వహించారు.2017లో పినరయి విజయన్‌ ప్రభుత్వం తిరువాన్కూర్‌ దేవస్థానం బోర్డులోని ఆలయాల్లో ఆరుగురు దళితులతో సహా 36 మంది బ్రాహ్మణేతర పూజారులను నియమించిన సంగతి తెలిసిందే.రుతు క్రమం జరిగే వయస్సులో ఉన్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కూడదని దాఖలైన పిటీషన్లను కొట్టి వేస్తూ ఎవరైనా దర్శించవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు గురించి తెలిసిందే. ఆ కేసును విచారించిన ఐదుగురు ధర్మాసనంలో ఒకరుగా ఉన్న ఇందు మల్హోత్రా నలుగురి మెజారిటీ అభిప్రాయాన్ని తిరస్కరిస్తూ తన అసమ్మతిని తెలపటమే గాక రుతు క్రమ వయస్సులో ఉన్న మహిళలు ఆలయంలో ప్రవేశించరాదన్న వాదనను సమర్ధించారు. ఇప్పుడు ఆ తీర్పు మీద కొందరు పునర్విచారణకు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. దానితో పాటు బోహ్రా ముస్లింలలో మహిళలకు అంగచ్ఛేదము, ముస్లిం మహిళలకు మసీదుల ప్రవేశనిషిద్దం, వేరే మతం వారిని చేసుకున్న పార్సీ మహిళలకు వారి మత దేవాలయ ప్రవేశ నిషిద్దం వంటి పెద్ద అంశాలన్నింటినీ కలిపి విచారించాలని సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదింకా తేలలేదు.


జస్టిస్‌ ఇందు మల్హోత్రా వీడియో వైరల్‌ కాగానే బిజెపి నేతలు మరోసారి దాడికి దిగారు.కేరళ బిజెపి నేత కెస్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ మార్క్సిస్టు నేతలు ఆలయ నిధులను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఇందు మల్హోత్రా చెప్పిందాన్లో తప్పేమీ లేదన్నారు. జర్మన్‌ నాజీ ప్రచార మంత్రి గోబెల్స్‌ను ఆరాధ్య దైవంగా భావిస్తూ కాషాయదళాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి జస్టిస్‌ ఇందు మల్హోత్రా మాట్లాడినట్లుంది తప్ప కేసు పూర్వపరాలను లోతుగా పరిశీలించినట్లు లేదు. ఇది నిజంగా విచారకరం, అంతకు మించి ఆందోళనకరం. తీర్పుల మీద తప్పుడు ప్రచారాల ప్రభావం ఉంటుందని జనాలు భావించేందుకు ఆస్కారం ఉంది. పద్మనాభస్వామి ఆలయ కేసులో తాను ఇచ్చిన తీర్పులో ఏమి చెప్పారో కూడా కూడా ఇందు మల్హోత్రా మరిచిపోవటం పరిహాసమని లైవ్‌ లా వెబ్‌సైట్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌, మను సెబాస్టియన్‌ ఒక ట్వీట్‌లో విమర్శించారు.ఆలయానికి ప్రభుత్వం చేసిన ఖర్చుకు గాను పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ కమిటీ రు.11.70 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్నది. తమ ముందుకు వచ్చిన ఒక కేసులో దిగువ కోర్టుల్లో దాఖలైన అఫిడవిట్లలో ఏమున్నదో కూడా చూడకుండా ఉన్నత కోర్టులు తీర్పు ఇస్తాయా ?ఒక న్యాయవాదిగా ఉంటూ నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎంపికైన తొలి మహిళగా ఇందూ మల్హోత్రా చరిత్రకెక్కారు. వాస్తవాలతో నిమిత్తం లేకుండా పదవి విరమణ చేసిన న్యాయమూర్తులు తాము ఇచ్చిన తీర్పుల గురించి బహిరంగంగా చర్చించటం, వాటిలోనూ మతాన్ని గురించి వక్కాణించటం, ఒక భావజాలంపై విద్వేషాన్ని వెల్లడించటం తగనిపని. ఇది ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నది ? బహుశా ఇలాంటి ఉదంతం మన దేశంలో ఇదే ప్రధమమేమో !


.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గుజరాత్‌ హిందూత్వ రేపిస్ట్‌ ఫైల్స్‌ – నేరగాళ్లు సంస్కార బ్రాహ్మలన్న బిజెపి !

26 Friday Aug 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Gujarat, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ 1 Comment

Tags

Bilkis Bano gangrape, BJP, CPI()M, Gujarat hindutva rapist files, Kushboo Sunder, Narendra Modi Failures, RSS, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


ఆ పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావటంతో కోర్టు జీవితకాల శిక్ష విధించింది. బేటీ పఢావో-బేటీ బచావో అని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ స్వంత రాష్ట్రం, మోడీ కనుసన్నలలో నడిచే గుజరాత్‌ బిజెపి ప్రభుత్వం సత్పవర్తనపేరుతో స్వాతంత్య్రదినోత్సవం రోజున స్వేచ్చ నిచ్చి వారిని సభ్య సమాజంలోకి వదిలింది. అదే రోజు నరేంద్రమోడీ మహిళా సాధికారత గురించి కూడా ఎర్రకోట మీద నుంచి ఆజాదీ కా అమృత మహౌత్సవ ప్రవచనాలు పలకటం కొసమెరుపు. ఖైదీల విడుదలకు ఏకగ్రీవ సిఫార్సు చేసిన పదిమంది కమిటీలో ఇద్దరు బిజెపి మహిళలు కూడా ఉన్నారు. జైలు నుంచి వెలుపలికి రాగానే నేరస్తులకు పూలదండలు వేసి, మిఠాయిలు పంచి ఘనమైన స్వాగతం పలికారు. కొందరు మహిళలైతే వారికి వీర తిలకాలు దిద్దారు. విశ్వగురువుల ఏలుబడిలో మనపుణ్య భారత దేశం ఎలా మారుతోందో కదా ! ఆహా మేకిన్‌ ఇండియాలో ఎలాంటి సరకు తయారవుతోంది !


ఇదంతా గోద్రా బిజెపి ఎంఎల్‌ఏ సికె రావుల్జీ సమక్షంలో జరిగినట్లు వార్తలు. అంతే కాదు ” వారు బ్రాహ్మలు, బ్రాహ్మలకు మంచి సంస్కారం (విలువలు) ఉంటుందని తెలిసిందే. కొంత మంది దుష్ట వాంఛ ప్రకారం వారిని శిక్షించాలని వారి మీద నేరాన్ని నెట్టి ఉండవచ్చు ” అని కూడా సదరు గౌరవనీయ ఎంఎల్‌ఏ సెలవిచ్చారు. దీని మీద దేశమంతటా తీవ్ర అభ్యంతరాలు, నిరసన వెలువడినా ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు అన్నట్లుగా అతన్ని కనీసం మందలించిన వారు కూడా లేరు. ఇదంతా ఒక ఎత్తయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే వారిని విడుదల చేశారంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ అసెంబ్లీలో చెప్పారు.
2002లో జరిగిన గోద్రా మారణకాండలో భాగంగా జరిగిన దుండగాల్లో బిల్కిస్‌ బానుపై సామూహిక అత్యాచారం, మూడు సంవత్సరాల కుమార్తెతో సహా 14 మంది కుటుంబ సభ్యుల హత్యకేసులో ముంబై సిబిఐ కోర్టు 2008 జనవరి 21న నిందితులకు శిక్ష విధించింది. దాన్ని హైకోర్టుకూడా నిర్ధారించింది. ఈ కేసులో ఏడుగురు బిల్కిస్‌ బాను కుటుంబ సభ్యులను హతమార్చారు. మరో ఏడుగురు బంధువులను కూడా చంపారని బిల్కిస్‌ చెబుతుండగా వారు కనిపించటం లేదని పోలీసులు చెప్పారు. వారి ఆచూకీ ఇంతవరకు లేదు.దారుణం జరిగినపుడు 21 ఏండ్ల బిల్కిస్‌ ఐదు నెలల గర్భవతిగా ఉంది. తమ శిక్షను తగ్గించాలని నేరస్తులు దాఖలు చేసిన పిటీషన్ను విచారించిన సుప్రీం కోర్టు సదరు వినతిని పరిశీలించాలని గుజరాత్‌ ప్రభుత్వానికి సూచింది. దాన్ని అవకాశంగా తీసుకొని విడుదల చేశారు.


అత్యాచార నేరగాండ్లను విడుదల చేయాలని తాము ఆదేశించలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వి రమణ గురువారం నాడు చెప్పారు. నేరగాండ్ల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై స్పందిస్తూ ” నిర్దేశిత విధానం ప్రకారం శిక్షను తగ్గించే వినతిని పరిశీలించండి అని మాత్రమే కోర్టు చెప్పింది.దాని మీద బుర్రను ఉపయోగించారా లేదా అన్నదాన్ని చూడాల్సి ఉంది. విధానం ప్రకారం అనేక మందికి ప్రతి రోజు శిక్షలు తగ్గిస్తున్నారు. ” అన్నారు. రెండు వారాల తరువాత తదుపరి విచారణ జరుపుతామని కేంద్ర ప్రభుత్వం, గుజరాత్‌ ప్రభుత్వం, పదకొండు మంది నేరస్తులను కక్షిదారులుగా చేస్తూ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.
బిల్కిస్‌ బాను కేసులో నేరగాండ్ల శిక్ష తగ్గించి విడుదల చేసిన అంశాన్ని మహారాష్ట్ర శాసన మండలిలో ఎన్‌సిపి ప్రస్తావించింది.ఈ అంశాన్ని సభలో చర్చించాల్సిన అవసరం లేదని బిజెపి నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ చెబుతూ పద్నాలుగేండ్ల శిక్షను గడిపిన తరువాత వారిని విడుదల చేశారు.నేరగాండ్లు నేరగాండ్లే వారిని సన్మానించటం తప్పు, అలాంటి వాటిని సమర్ధించకూడదు అన్నారు. ఆ కేసులో నిందితులకు శిక్షలు విధించిన మాజీ జడ్జి ఉమేష్‌ సాల్వీ మాట్లాడుతూ శిక్ష తగ్గింపు చట్టబద్దమే కానీ వారికి తగ్గించటం తగని పని అన్నారు. బిల్కిస్‌ బాను కావచ్చు, మరొకరు కావచ్చు రాజకీయాలు, భావజాలాలు, కాలాలకు అతీతంగా వారికి మద్దతునివ్వాలి. నిందితులకు శిక్షను తగ్గించటం మానవత్వం, స్త్రీత్వాలకే అవమానం అని బిజెపి నాయకురాలు కుషఉ్బ ట్వీట్‌ చేశారు.


ఈ కేసులో నిబంధనలకు తమకు అనువైన భాష్యం చెప్పి నేరగాండ్లను బిజెపి ప్రభుత్వ విడుదల చేసిందన్నది విమర్శ. వచ్చిన వార్తల ప్రకారం 1992 విధానం ప్రకారం తమ శిక్షను తగ్గించాలని నేరగాండ్లు గుజరాత్‌ ప్రభుత్వాన్ని కోరారు. 2014లో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం మానభంగం,హత్య ఉదంతాలలో శిక్షను తగ్గించకూడదంటూ గుజరాత్‌ సర్కార్‌ తిరస్కరించింది. తరువాత వారు గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లగా శిక్ష విధించింది బాంబే హైకోర్టు గనుక తమ పరిధిలోకి రాదని పిటీషన్‌ కొట్టివేసింది.తరువాత వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నేరం జరిగింది 2002లో అప్పటికి 1992 శిక్ష తగ్గింపు నిబంధనలు అమల్లో ఉన్నందున ఇలాంటి కేసుల్లో గతంలో అనుసరించిన వాటిని పరిగణనలోకి తీసుకొని వారి అర్జీపై గుజరాత్‌ ప్రభుత్వమే మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నది కొందరి భాష్యం. ఆమేరకు గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిశీలన కమిటి నిర్ణయం మేరకు విడుదల చేశారని సమర్ధిస్తున్నారు. గురువారం నాడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ బుర్రను(వివేకాన్ని) ఉపయోగించారా లేదా అన్నదాన్ని చూడాల్సి ఉంది అన్న మాటలను గమనించాలి. నిజంగా సుప్రీం కోర్టు శషభిషలకు తావు లేకుండా తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ పిటీషన్ను పరిష్కరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. పరిశీలించాలని గుజరాత్‌ ప్రభుత్వానికి సూచించటాన్ని అవకాశంగా తీసుకొని నేరగాండ్లను విడుదల చేశారన్నది స్పష్టం. సిపిఎం నేత సుభాషిణీ ఆలీ మరికొందరు సుప్రీం కోర్టులో విడుదల నిర్ణయాన్ని సవాలు చేసినందున అసలేం జరిగింది, సుప్రీం ఏం చెప్పింది అన్నది విచారణలో వెల్లడికానుంది.


ఈ ఉదంతంలో బిజెపి ఎంఎల్‌ఏ సికె రావుల్జీ తీరును పార్టీ ఇంతవరకు తప్పు పట్టనందున ఆ పార్టీ ఎలాంటిదో వెల్లడించింది. రేపిస్టులు బ్రాహ్మలని వారికి మంచి విలువలు ఉంటాయని చెప్పారు. శిక్షా కాలంలో వారు సత్ప్రవర్తనతో మెలిగారని కూడా కితాబు నిచ్చారు. సదరు ఎంఎల్‌ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలోని ఇద్దరు బిజెపి ఎంఎల్‌ఏలలో ఒకరు. పదకొండు మంది రేపిస్టులలో ముగ్గురు బ్రాహ్మలు కాగా ఐదుగురు ఓబిసి, ఇద్దరు ఎస్‌సి, ఒక బనియా ఉన్నట్లు ది ప్రింట్‌ పత్రిక విలేకర్లు వెల్లడించారు. ఎవరు ఏ కులస్తులన్నది పేర్లు కూడా ఇచ్చారు. ఇక్కడ ఏ కులంవారు ఎందరన్నది కాదు, వారు చేసిన దుర్మార్గం ఏమిటన్నది కీలకం. కాశ్మీరులోని కధువా ఉదంతంలో రేపిస్టులకు బిజెపి ఎంఎల్‌ఏలు, మంత్రులు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో ప్రభుత్వమే నిందితులకు రక్షణ ఇచ్చిందనే విమర్శలు వచ్చాయి.


బిల్కిస్‌ కేసును విచారించిన మాజీ జడ్జి ఉమేష్‌ సాల్వీ ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఇలా చెప్పారు. ” ఎవరైనా హిందూత్వ గురించి మాట్లాడేవారు ఇలాంటి నీచమైన నేరానికి పాల్పడ్డవారిని ఈ విధంగా సత్కరిస్తారా ? అది హిందూత్వను నిందించటమే.అది కానట్లయితే, రాజకీయపక్షాలకు అలాంటి ఉద్దేశ్యం లేనట్లైతే వ్యవస్థ శిక్షించిన వారి పట్ల అలా ప్రవర్తించరు. నేరగాండ్లు నేరానికి పాల్పడలేదని చెప్పటమే, న్యాయవ్యవస్థ మీద తిరుగుబాటు చేయటమే. ఈ పదకొండు మంది నేరగాండ్లకు స్వాగతం పలకటం తగనిపని.కొంత మంది ఇది హిందూత్వలో భాగం అనుకుంటున్నారు లేదా ఒక హిందువుగా ఇలా చేశారు.అది తప్పు.కొంతమంది వారు బ్రాహ్మలని చెబుతున్నారు, అలా చెప్పటం సరైంది కాదు. వారు కమిటీ గురించి ఏమి చెబుతారు ?దాన్లో సభ్యులు బిజెపి నుంచి కాంగ్రెస్‌ నుంచి ఎవరైనా కావచ్చు తేడా ఏముంటుంది.తొలుత వారు మానవమాత్రులుగా ఉండాలి, అది ముఖ్యం. ఈ కేసును విచారించిన జడ్జిని వారేమైనా అడిగారా ? అలాంటిదేమీ లేదని నేను చెప్పగలను.కేసును విచారించింది సిబిఐ, అలాంటి ఉదంతాలలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సలహా కోరాలి.వారాపని చేశారా, నాకు తెలియదు, కోరి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పింది ? శిక్షను తగ్గించేటపుడు ప్రభుత్వం బాధితురాలిని అదే విధంగా నేరానికి పాల్పడిన వారినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఆ విధంగా చేశారని నేను అనుకోవటం లేదు. విడుదలైన నేరస్తులు అపరాధ భావన వెలిబుచ్చారా లేదా క్షమాపణ కోరారా ? వారు తమకు స్వాగతం పలకటాన్ని, పూలదండలు వేయటాన్ని అంగీకరించారు. దీన్ని చూస్తుంటే వారు చేసిందేమిటో, అపరాధభావంతో ఉన్నట్లు కనిపించటం లేదు.” అన్నారు.


శిక్ష తగ్గింపు మీద సిఫార్సు కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఒక పెద్ద ప్రహసనం. పది మంది కమిటికీ జిల్లా కలెక్టర్‌ అధ్యక్షుడు. పంచమహల్‌ జిల్లా ఎస్‌పి, గోద్రా జిల్లా జడ్జి, గోద్రా జైలు సూపరింటెండెంట్‌, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, బిజెపికి చెందిన ఎంఎల్‌ఏలు సికె రావుల్జీ, సుమన్‌ బెన్‌ చౌహాన్‌, గోద్రా తాలుకా బిజెపి నేత సర్దార్‌ సింV్‌ా బారియా, గోద్రా బిజెపి మహిళానేత వినితాబెన్‌ లీలీ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవన్‌ సోనీ ఉన్నారు. ఈ కమిటీ ఏకగ్రీవంగా నేరగాండ్ల విడుదలకు సిఫార్సు చేసింది.
2012నాటి నిర్భయపై జరిగిన అత్యాచారం,హత్య కేసులో దేశం పెద్ద ఎత్తున స్పందించింది. నలుగురు నిందితులకు ఉరిశిక్ష పడింది.బిల్కిస్‌ బానుపై అత్యాచారం, నేరగాండ్ల విడుదలపుడు నిర్భయ మాదిరి నిరసన, స్పందన ఎందుకు వెల్లడికాలేదని అనేక మంది ప్రశ్నిస్తున్నారు.బిల్కిస్‌ బాను ఒక మైనారిటీ మతానికి చెందినవ్యక్తిగా చూడాలా లేక ఒక మహిళగా పరిగణించాలా అన్న ప్రశ్న కూడా ముందుకు వచ్చింది. దేశంలో ముస్లిం విద్వేషాన్ని తీవ్రంగా రెచ్చగొడుతున్న పూర్వరంగంలో ఇలాంటి ప్రశ్న తలెత్తటం సహజం.తమకు నచ్చిన దుస్తులు వేసుకొనే స్వేచ్చ ఉండాలని కోరుతున్న వారిలో కొందరు హిజబ్‌,బుర్ఖాలను ధరించే స్వేచ్చ తమకు ఉండాలని కోరుతున్న మహిళల డిమాండ్‌ను వ్యతిరేకిస్తుండటం ఒక సామాజిక వైరుధ్యమే కాదు, ఆందోళనకర పరిణామం.హిందూ బాలికలవైపు ముస్లిం కుర్రాళ్లు కన్నెత్తి చూసినా సరే ముస్లిం మహిళలపై అత్యాచారాలు చేసి కడుపులు చేయాలంటూ రెచ్చిపోయిన సాధ్వి విభానంద గిరి, ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపురిలో ముస్లిం మహిళలపై అత్యాచారాలు జరపాలంటూ బహిరంగంగా పిలుపు ఇచ్చిన మహంత భజరంగ మునిదాస్‌లు స్వేచ్చగా తిరుగుతున్న పవిత్ర నేల ఇది. కోర్టులో శిక్షలు పడిన నేరగాండ్లు సంస్కారవంతులని కితాబులిచ్చిన పాలకులు ఏలుతున్న గడ్డ ఇది.తోటి మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నేరగాండ్లకు శిక్ష తగ్గించాలన్న బిజెపి శీలవతుల సంస్కారంతో భారత మాత మురిసిపోతున్నదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిల్లర గాళ్ల దురుసు మాటలు – నోరు విప్పని నరేంద్రమోడీ !

10 Friday Jun 2022

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Fringe elements, Narendra Modi, Narendra Modi Failures, Nupur Sharma, Qatar, RSS

ఎం కోటేశ్వరరావు


బిజెపి నాయకురాలు, ఓ ఇప్పుడు మాజీ అంటున్నారు కదా ! కానీ పార్టీ వారు సస్పెన్షన్‌ అన్నారు తప్ప బహిష్కరించలేదు కనుక ఆమెను ఇంకా ఆ పార్టీనేతగానే చూడాలి. ఆమె అంటే నూపుర్‌ శర్మ, మహమ్మద్‌ ప్రవక్త గురించి మాట్లాడిన మాటలు ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌వి తప్ప పార్టీ వైఖరి కాదు అని బిజెపి చెప్పుకుంది. క్రమశిక్షణకు గురైన వారు అలాంటి వారా కాదా అన్నది ఎక్కడా చెప్పలేదు. అసలు ఫ్రింజ్‌ అంటే ఏమిటి ? నిఘంటువులో వివరించినదాని ప్రకారం కొంగు, అంచు, జాలరు, పట్టిక అని ఉంది. సులభంగా చెప్పుకోవాలంటే చీర అంతా ఒకటిగా ఉండి-కొంగులు మరొక విధంగా ఉండటం తెలిసిందే కదా. కొంగును చూసి అదే చీర అనుకోవద్దు అని బిజెపి చెబుతోంది.


ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే మరికొన్ని అర్ధాలు కూడా ఉన్నాయి. సూది కోసం సోదికి పోతే పాత బండారమంతా బయటపడిందన్నట్లుగా నూపుర్‌ శర్మ ఉదంతం తరువాత బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివార సంస్థల నేతల మాటలన్నింటినీ అడిగిన వారందరికీ గూగులమ్మతల్లి టూల్‌కిట్లుగా అందిస్తోంది. ఆమె వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతోంది. ఇంతకూ గూగుల్‌ మతం ఏమిటి? ఈ చర్చ-సమాచారం కూడా రెచ్చిపోతున్న మెజారిటీ-మైనారిటీ మతోన్మాదశక్తుల గురించి ఎంత మందికి జ్ఞానోదయం కలిగిస్తుందో చెప్పలేము గానీ కొందరిలోనైనా ఆలోచన రేకెత్తిస్తుంది. ఫ్రింజ్‌ ఎలిమెంట్స్‌ అంటే తీవ్రవాదులు, ఆచారవిరోధులు, ఎడ్డెమంటే తెడ్డెమనే బాపతు వంటి వివరణలు ఉన్నాయి. అంతే కాదు తెలుగు ప్రాంతాల్లో వాడుకలో ఉన్న అమాంబాపతు, చిల్లరగాండ్లు, అణాకానీ స్వభావం, నోటితుత్తర, నోటి దూలను ప్రదర్శించేవారు ఇదే కోవకు చెందుతారు. బిజెపి చర్యతీసుకున్న నూపుర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌, వారిని సమర్ధిస్తూ రంగంలోకి దిగిన వారిని ఏ బాపతు కింద పరిగణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే, దాన్ని బట్టే మనమెలాంటి వారమో కూడా జనానికి తెలుస్తుంది.


జకీర్‌ నాయక్‌ అనే ముస్లిం బోధకుడు ఏం చెప్పాడో దాన్నే ధైర్యంగా నూపుర్‌ శర్మ పునశ్చరణ చేశారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక పాంచజన్య తన సంపాదకీయంలో మద్దతు పలికింది. సదరు జకీర్‌ ఒక వివాదాస్పద వ్యక్తి, విద్వేషపూరిత ప్రసంగాలు చేసి 2016లో దేశం విడిచి పారిపోయాడు. అతగాడి మాటలు పాంచజన్యానికి సముచితంగా, వినసొంపుగా ఉన్నాయి. మరి నూపుర్‌ శర్మ కూడా ఇప్పుడు అదేబాటపడతారా ? హిందువులు అసహనపరులుగా తయారైనట్లు చెబుతూ భారత పేరును దెబ్బతీసేందుకు కొందరు పూనుకున్నారని కూడా పాంచజన్య రాసింది. శుభానికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వంటి బాపతును ఇంతకాలం తమ ప్రతినిధులుగా చేసిన బిజెపి, ఇతర సంఘపరివార్‌ సంస్థల సంగతేమిటి ? ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేత రామ్‌ మాధవ్‌ స్పందన ఆ పార్టీ అంతరంగాన్ని వెల్లడించింది.” కొంత మంది పార్టీ ప్రతినిధులు చేసిన ప్రకటనల వివాదాలు నరేంద్రమోడీకి కొత్తేమీ కాదు. దశాబ్దాల తరబడి అలాంటి బురద నుంచి బయటకు వచ్చారు. వాటిని తన రాజకీయాలకు అనువుగా మార్చుకోవటంలో ఆయన దిట్ట ” అని చెప్పారు. అందుకే నూపుర్‌ శర్మ మీద చర్య ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.
బిజెపిలో నూపుర్‌ శర్మ అచిర కాలంలోనే రామబాణంలా దూసుకువచ్చి పార్టీలో ప్రముఖస్థానాన్ని పొందారు. అమిత్‌ షా ఆమెకు వెన్నుదన్నుగా ఉన్నారంటారు. ఆమె మాటలు నోటిదూల బాపతు, మాకు సంబంధం లేదని బిజెపి అనేసింది. ఆమె మాట్లాడిన మరుసటి రోజో రెండోరోజో ఆపని చేసి ఉంటే అదొకదారి. ముస్లిం దేశాలు తీవ్ర నిరసన తెలిపిన తరువాత చేశారు. సంతుష్టీకరణలో నరేంద్రమోడీ కూడా తక్కువ తినలేదని నిరూపించుకున్నారు. వసుదేవుడికే గాడిద కాళ్లు పట్టుకోక తప్పలేదంటారు కదా !


నోటి దూల మతోన్మాదశక్తులకు మాత్రమే కాదు. బాబరీ మసీదు వివాద సమయంలో ఉత్తరాది పత్రికలు కొన్ని అదే బాటలో నడవగా ఇప్పుడు కొన్ని టీవీ ఛానళ్లకూ పాకింది. ఇటీవలి ముస్లిం విద్వేష ప్రచారంలో చేర్చిన కొత్త అస్త్రం ముస్లింలు తమ దుకాణాలు, హౌటళ్లలో తయారు చేసే ఆహార పదార్ధాల మీద వారు ఉమ్మిన తరువాత విక్రయిస్తారంటూ ” థూక్‌ జిహాద్‌ ” పేరుతో ప్రచారం చేస్తున్నారు.అలాంటి ఒక నకిలీ వీడియోను తీసుకొని న్యూస్‌ 18 ఛానల్లో అమన్‌ శర్మ అనే యాంకర్‌ ఒక చర్చనే నడిపారు. దాన్ని చూసి హిందూ రక్షాదల్‌ పేరుతో ఉన్న వారు హనుమాన్‌ చాలీసా పఠనం పేరుతో కొన్ని ప్రాంతాల్లో మాంస దుకాణాలనే మూసివేయాలంటూ రోడ్లెక్కారు. టీవీ ఛానళ్ల తీరు తెన్నులను చూస్తే చర్చలను నిర్వహించే యాంకర్లు, మోడరేటర్లు తాము అభిమానించే పార్టీల ప్రతినిధులు, మతశక్తుల కంటే మరింతగా రెచ్చిపోతుండటం గమనించవచ్చు. కొన్ని ఛానళ్లలో అభిమాన పార్టీల మీద విమర్శలకు అవకాశం ఇవ్వరు. మొత్తంగా చూసినపుడు టీవీల రేటింగ్‌లు పెంచటమే వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మహమ్మద్‌ ప్రవక్త అయినా మరొక అంశమైనా వారికి కావాల్సింది తమ ఛానల్‌కు లాభం ఎంత అని మాత్రమే. తెలుగులో కొన్ని ఛానళ్లకు ఉన్న రంగుల గురించి, వాటిలో మాట్లాడే రంగుల విశ్లేషకుల గురించి తెలిసిందే. గతంలో ఛానళ్లు, పత్రికలతో రాజకీయ పార్టీలు, శక్తుల పాకేజ్‌ల గురించే తెలుసు ఇప్పుడు కొన్ని ప్రాంతీయ, జాతీయ ఛానళ్లలో విశ్లేషకులపేరుతో వచ్చే వారికి కూడా పాకేజ్‌లు ఉన్నాయంటున్నారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా కొందరు విశ్లేషకులకు, ఛానళ్లకు మినహాయింపు ఉందని మనవి.


పార్టీ ఒక్కటే కాదు చివరికి ప్రభుత్వం కూడా బిజెపి నేతలు మాట్లాడిన, ట్వీట్‌ చేసిన వాటిని నోటిదూల గలవారిగా వర్ణించింది. వారి మీద చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేదు అని విదేశాలను సంతృప్తిపరచేందుకు చూసింది. విద్వేష పూరితమైన, రెచ్చగొట్టేట్లు మాట్లాడకపోతే కొందరు జనానికి కిక్కు ఎక్కించలేని స్థితికి వచ్చారు.దాని ఫలితాలను చూస్తూనే ఉన్నాం. మధ్యప్రదేశ్‌లో మతిస్థిమితం సరిగా లేని భవర్‌లాల్‌ జైన్‌ అనే 65ఏండ్ల వ్యక్తి ఒక వివాహానికి వెళ్లి వస్తుండగా దారితప్పాడు. మూడు రోజుల తరువాత శవమైకనిపించాడు. కిక్కు ఎక్కిన దినేష్‌ కుష్వహా అనే బిజెపి కార్యకర్త సదరు వృద్దుడిని కొడుతూ నీ పేరేమిటి ? మహమ్మదేనా, ఆధార్‌కార్డు చూపు అంటూ మాట్లాడిన వీడియో ప్రచారంలోకి వచ్చింది. సదరు దినేష్‌ తమ పార్టీవాడేనని బిజెపి అంగీకరించగా, అతని భార్య బిజెపి మాజీ కార్పొరేటర్‌ అని పోలీసులు చెప్పారు. మూర్ఛరోగులమని మెడలో బిళ్లలు వేసుకొని తిరిగినట్లుగా ఇక ముందు ఎవరైనా – ఎందుకంటే అనేక మంది గడ్డాలు పెంచుతున్నారు గనుక – తమ పేరు, మతం, ఆధారకార్డు వివరాలను తగిలించుకొని తిరగకపోతే బిజెపి జనాలు అలాంటి వారిని ముస్లింలుగా పరిగణించి చావచితకకొడతారని భావించాల్సి వస్తోంది. ” దసరా సందర్భంగా హిందువులు రావణబొమ్మలను దహనం చేసినట్లుగా ముస్లింలను తగులబెట్టాలంటూ ” ఒకసారి, వారికి ఓటింగ్‌ హక్కు రద్దు చేయాలని, రెండవ తరగతి పౌరులుగా చూడాలని మరోసారి బీహార్‌ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ బచువల్‌ సెలవిచ్చారు.


అశ్వనీ ఉపాధ్యాయ బిజెపి నేత, సుప్రీం కోర్టు లాయర్‌ కూడా. ఉమ్మడి పౌరస్మృతి కావాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర జరిపిన ప్రదర్శనలో ముస్లిం వ్యతిరేక నినాదాలు చేసినందుకు అరెస్టు చేశారు.ముస్లింలను హతమార్చాలంటూ నినాదాలిచ్చినట్లు కేసు నమోదైంది. ఈ పెద్దమనిషి హరిద్వార్‌ ధర్మసంసద్‌గా పేరుమోసిన విద్వేష సభలో దర్శనమిచ్చినట్లు వార్తలు వచ్చాయి. మయన్మార్‌లో రోహింగ్యాలను హతమార్చినట్లుగా మన దేశంలో కూడా ముస్లింలను ఊచకోత కోయాలన్న ప్రసంగాలు ఆ సభలో అనేక మంది చేసిన సంగతి తెలిసిందే.హిందూత్వ ప్రభాకరన్‌గా మారే వారికి ఏడాదికి వంద కోట్లు ఇస్తానని యతి నరసింగానంద ప్రకటించారు.హిందూ మతానికి ముప్పుగా మారతారనే తలపు వచ్చినా వారిని సహించకూడదన్నారు. అతగాడి మీద వెంటనే కనీసం కేసు పెట్టలేదు, పెట్టిన తరువాత వెంటనే బెయిలు వచ్చింది. పూజా షుకున్‌ పాండే అనే హిందూ మహాసభ నాయకురాలు ” మనలో వంద మంది సిద్దమైనా సరే 20లక్షల మంది వారిని(ముస్లింలను) చంపి విజయంతో జైలుకు పోవచ్చు ” అని పిలుపునిచ్చారు.హిందూమతానికి ముప్పుగా పరిణమించిన వారి నుంచి మతరక్షణకు గాను ఏ విధంగానైనా సరే పూనుకోవాల్సిందే అని అదే సభలో ప్రతిజ్ఞ చేశారు.ఈ సభలోనే బిజెపి మహిళామోర్చా నేత ఉదిత త్యాగి ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ మయంకేశ్వర్‌ సింగ్‌ ఏమన్నాడో తెలుసా ” హిందూస్తాన్‌లోని హిందువులు గనుక మేలుకుంటే గడ్డాలను లాగి జడలుగా మార్చివేస్తారు. హిందూస్తాన్‌లో జీవించాలంటే రాధే రాధే అని చెప్పాలి, లేకపోతే దేశవిభజన సమయంలో మాదిరి పాకిస్తాన్‌ వెళ్లాలి, మీ వలన ఇక్కడ ప్రయోజనం లేదు ” అని మాట్లాడిన వీడియోలున్నాయి.


కర్ణాటకలోని కొడుగు జిల్లాలో భజరంగ్‌ దళ్‌ నిర్వహించిన ఆయుధ శిక్షణ శిబిరంలో ముగ్గురు బిజెపి ఎంఎల్‌ఏలు కెజి బోపయ్య, అప్పాచురంజన్‌, సుజా కుషాలప్ప ఉన్నారు.వారి మీద కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని లోకాయక్త ఆఫీసుకు బదిలీ చేసి కసి తీర్చుకున్నారు.” తనకు ఓటు వేయని హిందువుల నరాల్లో ముస్లింల రక్తం ఉన్నట్లే. అలాంటి వాడు ద్రోహి, జైచంద్‌కు పుట్టినవాడే, హిందూ వ్యతిరేకులను నాశనం చేస్తా” అంటూ ఉత్తర ప్రదేశ్‌ బిజెపి ఎంఎల్‌ఏ రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ చెలరేగారు. ఇంకా ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు ముస్లింల మీద కూడా చేశారు. ఇలా చెప్పాలంటే అనేక నోటి దూల ఉదంతాలున్నాయి..వారిమీద ఎలాంటి చర్యలూ లేవు, వారివి దూల నోళ్లనీ చెప్పలేదు.నూపూర్‌ శర్మలో మాత్రమే నోటి దూల కనిపించింది. ద వైర్‌ పోర్టల్‌ నమోదు చేసిన వివరాల ప్రకారం 2021 అక్టోబరు నుంచి నాలుగు నెలల్లో ఆరు ఉత్తరాది రాష్ట్రాల్లో 89 ఉదంతాల్లో వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు చేసినట్లు తేలింది. వాస్తవానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. అక్టోబరు నెలలో పండుగల తరుణంలో 29 విద్వేష నేరాలు జరగ్గా అవన్నీ ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినవే. హర్యానాలో ముస్లింలు ప్రార్ధనలు చేసే స్థలంలో గోవర్ధన పూజల పేరుతో పోటీగా నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో నమాజ్‌ చేసుకొనేందుకు గతంలో అంగీకరించిన ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ తరువాత రద్దు చేశారు. నవరాత్రుల పేరుతో మాంసం దుకాణాలను బందు చేశారు.


ధర్మ సంసద్‌ తరువాత సుదర్శన్‌ న్యూస్‌ అధినేత సురేష్‌ చవాణ్కే భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు అవసరమైతే పోరాడాలి, చావాలి, చంపాలి అని పిలుపునిచ్చాడు. నూతన పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో నిరసనలు తెలుపుతున్నవారి గురించి ఝార్ఖండ్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ ముస్లింల గురించి పరోక్షంగా మాట్లాడిందేమిటి ? ” అగ్గిని వ్యాపింప చేస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టి గుర్తించవచ్చు ” అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లింలను చెదపురుగులని, వారిని బంగాళాఖాతంలో కలపాలని అమిత్‌ షా బిజెపి అధ్యక్షుడిగా ఉన్నపుడు మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు 2020లో బిజెపి ఎంపీ పర్వేష్‌ వర్మ మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.” ఢిల్లీ పౌరులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి.వారు(ముస్లింలు) మీ ఇండ్లలోకి వస్తారు, మీ సోదరి, కూతుళ్లను మానభంగం చేస్తారు.వారిని చంపివేయండి. మీకు ఇంకా వ్యవధి ఉంది. రేపు మిమ్మల్ని రక్షించేందుకు మోడీగారు, అమిత్‌ షా రారు.” 2014 ఎన్నికలకు ముందు ఫతేపూర్‌ బిజెపి ఎంపీగా ఉన్న నిరంజన్‌ జ్యోతి ఢిల్లీ సభలో మాట్లాడుతూ మీకు రాముడి సంతానం కావాలో జారుల సంతానపు ప్రభుత్వం కావాలో తేల్చుకోండి అని రెచ్చగొట్టారు. ఆమె తిరిగి 2019లో గెలిచారు. సాక్షి మహరాజ్‌ అనే మరోబిజెపి ఎంపీ 2015లో మాట్లాడుతూ ” ఇక్కడ నలుగురు భార్యలు-40 మంది సంతానాన్ని కనటం భారత్‌లో కుదరదు.అయితే హిందూమతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు సంతానాన్ని కనాలి ” అన్నారు.


నూపూర్‌ శర్మ మాట్లాడింది తప్పే అంతమాత్రాన మానభంగం చేస్తామని, హతమారుస్తామని బెదిరించటం ఏమిటని చాలా మంది ఆందోళన్యక్తం చేస్తున్నారు. నిజమే చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు, స్వంత చట్టాలను ముందుకు తేగూడదు. ఆమె నోటిదూల కారణంగా గుర్తుతెలియని సంస్థలు, వ్యక్తుల పేరుతో బెదిరింపులు వచ్చినట్లు చెబుతున్నారు. అవి నిజం కావచ్చు లేదా నకిలీవి కావచ్చు. పోలీసులు గుర్తు తెలియని వారి పేరుతోనే కేసు నమోదు చేశారు. కానీ ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్‌లో భజరంగ్‌ మునిదాస్‌ అనే ఒక ఆశ్రమ పెద్ద బహిరంగంగా ముస్లిం మహిళలను కిడ్నాప్‌ చేసి బహిరంగంగా మానభంగం చేయిస్తానంటూ వేసిన వీరంగం, దానికి పెద్ద ఎత్తున మద్దతు పలికి హర్షం వెల్లడించిన జనాలను చూస్తే దేశంలో ఎలాంటి శక్తులు చెలరేగుతున్నాయో, జనం ఎలా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్‌ రెండవ తేదీన పోలీసుల కాపలాతో ఒక మసీదు ముందు రెచ్చగొట్టిన ఈ ప్రబుద్దుడి మీద కేసు నమోదు చేసేందుకు పోలీసులు కొన్ని వారాలు తీసుకున్నారు. నూపుర్‌ శర్మ మాదిరి ఏ ముస్లిం మహిళైనా నోరు పారవేసుకుంటే ఆమెను మానభంగం చేయిస్తానని ఎవరైనా అంటే అదొక తీరు, అది ఆధునిక హిందూ సంస్కృతి అని సరిపెట్టుకోవచ్చు. మొత్తం ముస్లిం మహిళలేమి తప్పుడు మాటలు మాట్లాడారు లేదా ఏ నేరం చేశారని మునిదాస్‌ నోరుపారవేసుకున్నట్లు ? బిజెపి నేత ఉమాభారతి మరొక అడుగు ముందుకు వేసి ” నూపుర్‌ శర్మను మా పార్టీ శిక్షించింది, అంతమాత్రాన ఆమెను తోడేళ్లకు అప్పగించలేము కదా ! ఆమెకు బెదిరింపులు మన దేశ సంస్కృతి కాదు ” అని చెప్పారు. మరి మునిదాస్‌ ప్రవర్తన గురించి, మొత్తం ముస్లింలనే అంతం చేయాలనే ధర్మ సంసద్‌ ప్రబోధకులను ఆమె ఎందుకు ఖండించలేదు ? అప్పుడు సంస్కృతి గుర్తుకు రాలేదా ?


నూపూర్‌శర్మ చిల్లర మాటల తరువాత సామాజిక మాధ్యమంలో సరికొత్త ప్రచారం మొదలైంది. ఆమె మాటలకు నిరసన తెలిపిన దేశాల్లో కతార్‌ ఒకటి. పట్టుమని ముఫ్పైలక్షల జనాభా కూడా లేని ఒక చిన్న దేశం మనకు పాఠాలు చెప్పటమా అని దురహంకారంతో కొందరు రెచ్చగొడుతున్నారు. చిన్నదా పెద్దదా అని కాదు దేశమా కాదా అన్నదే గీటు రాయి. మరి అంత చిన్న దేశమైతే నరేంద్రమోడీ సర్కార్‌ అంత పెద్ద సంజాయిషీ ఎందుకు ఇచ్చుకున్నట్లు ? ఆ కతార్‌లోనే ఆప్ఘన్‌తాలిబాన్లతో తెరచాటు మంతనాలు ఎందుకు జరిపినట్లు ? రాజీకుదర్చమని ఎందుకు ప్రాధేయపడినట్లు ? అసలు కథనడిపింది కతార్‌ కాదు, దాని వెనుక అమెరికా ఉంది అంటూ వాట్సాప్‌ పండితులు ప్రచారం మొదలు పెట్టారు. ఎందుకటా ఉక్రెయిను వివాదంలో అమెరికా మాట విననందుకట. అలాంటపుడు అదే అమెరికా నేతలు అంతకు ముందు తనను అవమానించినా, అబద్దాలు చెప్పినా కిమ్మనకుండా చెట్టపట్టాలేసుకొని తిరిగేందుకు విశ్వగురువు అంటున్న నరేంద్రమోడీ ఎందుకు తహతహలాడుతున్నట్లు ? ఇంత రచ్చ జరిగినా నోరు ఎందుకు విప్పటం లేదు, అమెరికా అంటే భయమా, ఏమిటీ బలహీనత ? దేశంలోని 70-80శాతం గోరక్షకులు నకిలీలని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన ఉదంతం తెలిసిందే.2016 జూలై, ఆగస్టు నెలల్లో గో రక్షకులుగా అవతారమెత్తిన వారు కొందరు దళితుల మీద జరిపిన దాడులతో వారెక్కడ పార్టీకి దూరమౌతారో అన్న భయంతో అప్పుడు అలా మాట్లాడారు. ఇప్పుడు దేశమంతటా చర్చకు తెరలేపి, ముస్లిం దేశాల్లో తలెత్తిన నిరసనకు కారణమైన పార్టీ నేతల వ్యాఖ్యల మీద మౌనం దాలుస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఎవరి గురించీ నోరు విప్పలేదు. నూపూర్‌ శర్మ మాటల వలన కొత్తగా దూరమయ్యే ఓటర్లు లేరు, తాత్కాలికంగా తలెత్తిన నిరసన సద్దుమణిగిన తరువాత ముస్లిం విద్వేషాన్ని తలకు ఎక్కించుకున్నవారు మరింత గట్టి మద్దతుదార్లుగా మారతారనే ఎత్తుగడతోనే ఈ మౌనమా ! రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ! గత ఎనిమిది సంవత్సరాల్లో ఎందరికి సాధికారత వచ్చిందో లేదో తెలియదు గానీ చిల్లరగాళ్లు చెలరేగటాన్ని బట్టి వారికి వచ్చిందని చెప్పవచ్చు. బిజెపి సర్కార్‌ లేదా మేథావులు ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో ఫ్రింజ్‌ అనే పదానికి కొత్త అర్ధాన్ని చేరిస్తే తప్ప అప్పటి వరకు ఇలాంటి వారందరినీ చిల్లర, నోటి దూలగాళ్లుగానే భావించాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి బుకాయింపులు – అసలు రంగు !

15 Tuesday Mar 2022

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics, RELIGION, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, BSP, Narendra Modi, RSS, Samajwadi Party, UP election 2022


ఎం కోటేశ్వరరావు


ఎంతో ఆసక్తి కలిగించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. తమకు ఇంక 2024లో కూడా తిరుగులేదని బిజెపి ఢంకా బజాయిస్తోంది. కాంగ్రెస్‌, ఇతర పార్టీలు ఆత్మశోధనలో పడ్డాయి. ఎవరి సూత్రీకరణలు వారు చేసుకుంటున్నారు. ఇంకా కొత్త ప్రభుత్వాలు కొలువు తీరలేదు. పలు కోణాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇవన్నీ సహజం.వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అన్నట్లుగా రాజకీయ పార్టీలు చెప్పిన వాటికి ప్రతిదానికీ తలూపాల్సిన అవసరంలేదు. జనం ఇచ్చిన తీర్పును గౌరవించటం వేరు. చరిత్రలో ఇచ్చిన తీర్పులన్నీ సరైనవే అని ఆమోదించాల్సిన అవసరం లేదు. హిట్లర్‌ వంటి నియంతలకు కూడా జనమే ఓట్లు వేసి గెలిపించారు. అంతమాత్రాన వారి తీర్పు సరైనదే అంటామా ? ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి కొన్ని అంశాల తీరు తెన్నులను చూద్దాం.


యోగి ఆదిత్యనాధ్‌ అభివృద్దిని చూసి తిరిగి గెలిపించి చరిత్ర సృష్టించారు. ఇటీవలి సంవత్సరాల్లో వరుసగా రెండవసారి పార్టీ అధికారానికి రాని చరిత్రను బిజెపి తిరగరాసింది.రెండవది నిజమే. ఇక మొదటి అంశం, అభివృద్ధి అంటే ఏమిటి ? అందునా యోగి చిన్న ఇంజనైతే పెద్ద ఇంజను నరేంద్రమోడీ కూడా తోడయ్యారు అన్నారు. జరిగిందేమిటి ? 2016-21 కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో ఉపాధి రేటు 38.5 నుంచి 32.79(2021 సెప్టెంబరు-డిసెంబరు)శాతానికి పడిపోయింది.కార్మికశక్తి భాగస్వామ్యం కూడా ఇదే కాలంలో 46.32 నుంచి 34.45 శాతానికి తగ్గింది. నీతిఆయోగ్‌ సంస్ధ వెల్లడించిన వివరాల ప్రకారం దారిద్య్రంలో బీహార్‌, ఝార్ఖండ్‌ తరువాత ఉత్తర ప్రదేశ్‌ మూడవ స్ధానంలో ఉంది. అందుకే బిజెపి చెప్పే అభివృద్ధి అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తోంది. అయినా జనం ఎందుకు ఓట్లు వేశారనే ప్రశ్న తలెత్తుతుంది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నపుడు మరొక ప్రత్నామ్నాయం లేక జనం పదే పదే ఓట్లు వేశారు, దానినేమందాం ?ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజవాది మీద తగినంత విశ్వాసం లేకపోవటం ఒకటిగా కనిపిస్తోంది. రెండవది బిజెపి బి టీమ్‌లుగా పేరు తెచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌ పార్టీలు చీల్చిన ఓట్లు బిజెపికి తోడ్పడ్డాయి. పోటీ 80-20శాతాల(హిందూ-ముస్లిం) మధ్య అనే బిజెపి మత సమీకరణల నినాదం కూడా పని చేసింది.


2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 49.98, దాని మిత్రపక్షానికి 1.21శాతం కలుపుకుంటే ఉత్తర ప్రదేశ్‌లో రెండు ఇంజన్లకు కలిపి వచ్చిన ఓట్లు 51.19 శాతం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమిలోని మూడు పార్టీలకు వచ్చిన ఓట్లు 43.82శాతమే, మోడీ మంత్రం పని చేయనట్లేనా ? 2019లో సమాజవాది పార్టీ-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి ఒక కూటమిగా పోటీ చేస్తే 39.23శాతం వచ్చాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజవాదీ కూటమికి 36.32శాతం వచ్చాయి. విడిగా పోటీచేసిన బిఎస్‌పి 12.88శాతం తెచ్చుకుంది.దీని అర్ధం ఏమిటి గతంలో బిజెపి, బిఎస్‌పి, కాంగ్రెస్‌కు పడిన ఓట్లలో కొన్ని సమాజవాది కూటమికి రాబట్టే ఓట్లశాతం పెరిగింది. బిజెపి సర్కార్‌ మీద ఉన్న వ్యతిరేకతే తమను గద్దె నెక్కిస్తుందని సమాజవాది అతి అంచనా వేసుకొని చేయాల్సిన కృషి లేకపోవటం ఓటమికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సర్వేలు చేసిన వాటిలో ఒకటైన ఏబిపి-సి ఓటర్‌ సంస్ధ 2021 మార్చి నెల నుంచి 2022 జనవరి వరకు చేసిన ఆరు సర్వేల్లో బిజెపి కూటమి సగటు ఓట్ల శాతం 41.11శాతం కాగా చివరి సర్వేలో 41.5శాతంగా పేర్కొన్నది. ఇదే సంస్ద సమాజవాది కూటమి సగటు ఓట్లశాతాన్ని 30.8గానూ, తొలి సర్వేలో 24.4శాతంగానూ చివరి సర్వేలో 33.3శాతంగా పేర్కొన్నది.


యోగి సర్కార్‌ గూండాయిజాన్ని, నేరగాండ్లను బుల్‌డోజర్లతో అణచివేసింది, రెండవ సారి గద్దె నెక్కితే మిగతావారిని కూడా తొక్కివేస్తుంది. మంచిదే. వాస్తవ అలా ఉందా ? ఇదే ఉత్తర ప్రదేశ్‌ను గతంలో బిజెపి, బిఎస్‌పి, ఎస్‌పి పార్టీలు ఏలాయి, గూండాయిజం, మాఫియా ముఠాల పెరుగుదలకు ఎవరివంతు తోడ్పాటు వారు ఇచ్చారన్నది తిరుగులేని నిజం.ఇక 2022 ఎన్నికల్లో గెలిచిన నేరచరిత గలిగిన వారి మీద బుల్డోజర్లను ఎలా నడిపిస్తారో తరువాత చూద్దాం.


2022లో అసెంబ్లీకి ఎన్నికైన 403 మందిలో 205 మంది మీద క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. గత అసెంబ్లీలో అలాంటి వారు 143 మంది మాత్రమే ఉన్నారు. ప్రజాస్వామిక సంస్కరణల సంస్ధ(ఏడిఆర్‌) వెల్లడించిన నివేదిక ప్రకారం తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నవారు అంటే హత్య, హత్యాయత్నం, కిడ్నాప్‌, మహిళల మీద నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నవారు 158 మంది, వీరిలో ఒకరి మీద అత్యాచారయత్నం కేసు కూడా ఉంది. గతంలో ఇలాంటి ఘనులు 117 మాత్రమే. పార్టీల వారీగా చూస్తే తమ పార్టీ ప్రత్యేకం అని చెప్పుకొనే బిజెపి అగ్రస్దానంలో అంటే 255కు గాను 111 మందిని కలిగి ఉంది. సమాజవాది పార్టీలో 111 మందికిగాను 71 మంది ఉన్నారు. ఐదేండ్ల తరువాత అభివృద్ధిని చూపి ఓట్లడిగామని చెప్పుకొనే వారు మరింత మంది నేర చరితులను ఎందుకు రంగంలోకి దింపినట్లు ? ఎన్నికైన ఎంఎల్‌ఏల్లో గతంలో 322 మంది కోటీశ్వరులుంటే ఇప్పుడు వారి వృద్ది 366కు పెరిగింది. బిజెపి తరఫున గెలిచిన 255 మంది సగటు 8.14 కోట్లు, అదే సమాజవాది సగటు రు.7.39 కోట్లు ? ఎవరిది డబ్బు, కండబలం ఉన్న పార్టీ ? గెలిచిన ఇద్దరు కాంగ్రెస్‌ వారి ఆస్తి రు.19.71 కోట్లు.


ఉత్తర ప్రదేశ్‌ చట్టసభలో మెజారిటీ 205 మంది నేర చరితులు ఉన్న తరువాత వారి అనుచరులు, అభిమానులు వేరే దారిలో నడుస్తారా ? చట్టాలను అమలు జరిపే యంత్రాంగాన్ని సక్రమంగా నడవనిస్తారా ? చరిత్రలో ఎక్కడా అలాంటి ఉదంతాలు లేవు. హత్రాస్‌ దుర్మార్గం జరిగింది, లఖింపూర్‌ ఖేరీ దారుణం తెలిసిందే. ఇప్పుడు బిజెపి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అవసలు జరగలేదు, ప్రతిపక్షాల కుట్ర లేదా ప్రచారమని చెబుతారా ? చెప్పండి ! మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేసినట్లు చెబుతున్నారు.నిజం కూడా కావచ్చు, దీని అర్ధం ఉత్తర ప్రదేశ్‌ మహిళలకు స్వర్గంగా ఉన్నట్లా ? 2015-19(రెండు సంవత్సరాలు అఖిలేష్‌, రెండు సంవత్సరాలు యోగి ఏలుబడి) సంవత్సరాలలో అక్కడ మహిళలపై నేరాలు 66.7శాతం పెరిగాయి. దేశ సగటు 23శాతం మాత్రమే.2019లో దేశంలో నమోదైన కేసుల్లో 15శాతం యోగి ఖాతాలో పడ్డాయి. సామూహిక మానభంగాలలో 2019లో రాజస్తాన్‌ 902 కేసులతో ముందుంటే ఉత్తర ప్రదేశ్‌ 301, మధ్యప్రదేశ్‌ 162తో రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయి. ఉన్నత విలువలు నేర్పుతామని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ సంస్ధలకు ఈ మూడు రాష్ట్రాల్లో ఎంతో పట్టు ఉందన్నది తెలిసిందే. వారు తెచ్చిన సామాజిక మార్పు ఏమిటి ?


పైన చెప్పుకున్న నాలుగు సంవత్సరాల్లో దళితులపై జరిగిన దారుణాల కేసుల్లోనూ ఉత్తర ప్రదేశ్‌ అగ్రస్ధానంలో ఉంది. తరువాత స్ధానాల్లో సంఘపరివారం బలంగా ఉన్న రాజస్తాన్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో 2015లో 8,357 నమోదు కాగా 2019లో 11,829కి చేరాయి.2018 – 2020 (పూర్తిగా యోగి స్వర్ణయుగంలో) మూడు సంవత్సరాల్లో 36,467 కేసులు నమోదయ్యాయి, అంటే సగటున ఏడాదికి 12,155, వేద గణితం ప్రకారం లెక్కలు వేసినా యోగి ఏలుబడిలో తగ్గినట్లు ఎవరైనా చెప్పగలరా ? 2019లో దేశంలో పదిహేను శాతం కేసులు ఉత్తరప్రదేశ్‌లో ఉంటే అవి 2020నాటికి 26శాతానికి పెరిగాయి.
సబ్‌కాసాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అంటే అందరినీ కలుపుకుపోతాం, అందరి వృద్ధి, అందరి విశ్వాసం అన్నది బిజెపి నినాదం. బిజెపికి మింగుడుపడినా పడకున్నా ఉత్తర ప్రదేశ్‌ జనాభాలో 20శాతం ముస్లింలు ఉన్నారు. ఆ సామాజిక తరగతికి చెందిన వారికి ఒక్కటంటే ఒక్క సీటూ ఇవ్వలేదు. అంటే బిజెపి ఇచ్చే నినాదం మోసపూరితం కాదా ?మత ప్రాతిపదికన ఓటర్లను సమీకరించేందుకు వేసిన ఎత్తుగడకాదా ? హిందూ పత్రిక-సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి సంస్ధలు సంయుక్తంగా ఎన్నికల అనంతర సర్వే వివరాల ప్రకారం బిజెపి ముందుకు తెచ్చిన మతపరమైన రెచ్చగొట్టుడు పని చేసింది.2017 బిజెపికి హిందువులు 47శాతం ఓటు వేస్తే 2022లో 54శాతానికి పెరిగింది. అదే సమాజవాది పార్టీకి 19 నుంచి 26శాతానికి పెరిగింది. బిఎస్‌పికి 23 నుంచి 14శాతానికి, కాంగ్రెస్‌కు నాలుగు నుంచి రెండుశాతానికి తగ్గింది. ఈ ఓట్లు బిజెపి-సమాజవాది పార్టీలకు వెళ్లాయి. ఇక సమాజవాది పార్టీ కూటమి సీట్ల సంఖ్యపెరగటానికి బిజెపి చేసిన విద్వేష ప్రచారంతో ముస్లింలు ఆ వైపు మొగ్గటమే అన్నది స్పష్టం.గత ఎన్నికల్లో 46శాతంగా ఉన్నవి ఈసారి 79శాతం మంది ఎస్‌పి కూటమివైపు మొగ్గారు. బిఎస్‌పి ఓట్లు 19 నుంచి ఆరు, కాంగ్రెస్‌ ఓట్లు 23 నుంచి మూడు, ఇతరుల ఓట్లు పది నుంచి నాలుగుశాతానికి తగ్గాయి. ఇదే సమయంలో ముస్లిం ఓట్లు బిజెపికి ఐదు నుంచి ఎనిమిదిశాతానికి పెరిగాయి.


యోగి సర్కార్‌ అభివృద్దే గెలిపిస్తుందని చెప్పుకుంటూనే బిజెపి173 మంది కొత్త ముఖాలను రంగంలోకి దించి పాత వారి మీద జనంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు చూసింది. వారిలో 99 మాత్రమే గెలిచారు.గత ఎన్నికల్లో బిజెపి కూటమి ఓడిన 85 స్దానాల్లో ఈసారి 69 మంది కొత్తవారిని రంగంలోకి దించినా గెలిచింది 19 మాత్రమే. పాతవారిలో 104 మంది సిట్టింగులకు సీట్లు ఇవ్వలేదు. అక్కడ కొత్తవారిని పెట్టగా 80 మంది గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిన 16 మందిని ఈ సారి కూడా పోటీకి నిలిపితే కేవలం నలుగురు మాత్రమే గెలిచారు.


మజ్లిస్‌ పార్టీ ఓట్లు చీల్చిన కారణంగా సమాజవాది ఓడింది అన్నది ఒక అభిప్రాయం.ఆ పార్టీ బిజెపికి బిటీమ్‌ అన్నది, దాని అధినేత మీద జరిగిన దాడి బూటకం అన్నది నిజం. కానీ ఇక్కడ ఆ పార్టీ పోటీచేసిన 94 స్ధానాల్లో వచ్చిన ఓట్లు 4,50,929(0.49శాతం) మాత్రమే అయినా అనేక చోట్ల బిజెపికి తోడ్పడింది. మొత్తంగా చూసినపుడు మూడవ స్దానంలో ఉన్న బిఎస్‌పి పోటీ బిజెపికి తోడ్పడిందన్నది గమనించాలి. తిరుగులేదు అని చెప్పుకున్న బిజెపికి ఉత్తర ప్రదేశ్‌లో మూడు చోట్ల డిపాజిట్లు రాలేదు.399 చోట్ల పోటీ పడిన కాంగ్రెస్‌ 387 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. రెండు చోట్ల గెలవగా నాలుగు చోట్ల రెండవ స్ధానంలో ఉంది. తనబలాన్ని అతిగా అంచనా వేసుకొని పోటీ చేసిన కాంగ్రెస్‌ సగటున ఒక్కో చోట 5,391 ఓట్లు తెచ్చుకొంది, ఆ విధంగా కూడా బిజెపికి తోడ్పడినట్లే. బిఎస్‌పి పోటీ చేసిన 403 స్ధానాల్లో 290 చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుంది.ఒక చోట గెలవగా 14చోట్ల రెండవ స్దానంలో ఉంది.


నువ్వానేనా అన్నట్లుగా అధికారం కోసం పోటీపడిన సమాజవాది పార్టీ 376 చోట్ల పోటీ చేసింది, ఆరు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. నూటపదకొండు సీట్లు గెలిచి 231 చోట్ల రెండవ స్దానంలో ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన ఆర్‌ఎల్‌డి 33 చోట్ల పోటీ చేసి మూడు డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది చోట్ల గెలిచింది.చెల్లిన ఓట్లలో 16.66శాతం తెచ్చుకుంటే డిపాజిట్‌ దక్కుతుంది. పురుషుల్లో కేవలం నాలుగుశాతం మాత్రమే సమాజవాది కంటే బిజెపికి ఎక్కువగా ఓట్లు వేయగా మహిళల్లో బిజెపికి 16శాతం మంది అధికంగా ఓటు వేసినట్లు సర్వేలు పేర్కొన్నాయి. ఇది కూడా బిజెపికి తోడ్పడిన అంశంగా భావిస్తున్నారు. కొన్ని సంక్షేమ పధకాలు వీరిని ఆకర్షించినట్లు చెబుతున్నారు. ఇక రైతులు కూడా బిజెపికి గణనీయంగా ఓటు చేశారు. ఏడాదికి ఆరువేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజనం పధకం, ఎన్నికలలో బిజెపి చేసిన కొన్ని వాగ్దానాలు ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆకర్షించినట్లు వెల్లడైంది.లఖింపూర్‌ ఖేరీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కూడా తాము గణనీయంగా రైతుల మద్దతు పొందినట్లు బిజెపి చెప్పుకొంటోంది. అంగీకరిద్దాం, క్షమాపణలు చెప్పి రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి నరేంద్రమోడీ ప్రవేశపెడతారా ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు వేస్తామన్న కమిటీని ఉత్తిదే అంటారా ? చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

హరిద్వార్‌ ధర్మ సంసద్‌ : పరస్పర అవగాహనతోనే హిందూ- ముస్లిం మతోన్మాదుల ప్రసంగాలు !

25 Saturday Dec 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

#Haridwar hate speeches, AIMIM, ‘Hate’ speeches at Dharma Sansad, BJP, Haridwar hate speeches, Hinduthwa, RSS


ఎం కోటేశ్వరరావు


ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబరు 17-19 తేదీల్లో ధర్మ సంసద్‌ పేరుతో ధర్మవిరుద్ద, పరమత విద్వేష సభ జరిగింది. హిందూమత నేతలుగా చెప్పుకొనే యోగులు, యోగినులు అక్కడ చేరారు. వారు హిందూమతం మంచి చెడ్డల గురించి ఏమి చర్చించారో తీర్మానించారో తెలియదు. ముస్లింలు, ఇతర మైనారిటీ మతాల వారి మీద మారణకాండ జరపాలని పిలుపు ఇస్తూ చేసిన ప్రసంగాల వీడియోలు సామాజిక మాధ్యమంలో తిరుగుతూ మరింత విద్వేషాన్ని జనాల బుర్రల్లో నింపుతున్నాయి. ఈ సమావేశాల్లో మాట్లాడిన వారు తమను సమర్ధించుకున్నారు, తప్పు చేశామనే భావన ఏ కోశానా కనిపించలేదు. పోలీసులు తమనేమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేశారు. ఎవరి అండ చూసుకొని ఇలా బరితెగించినట్లు ? కొందరి ప్రసంగాంశాలు ఇలా ఉన్నాయి.


”ముస్లింలను చంపటానికి కత్తులు చాలవు, దిమ్మిసలాంటి ఆయుధాలు కావాలి” అన్న యతి నరసింగానంద, నాగరికత (సంస్కృతి) యుద్దంలో హిందువులను రక్షించేవి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనటం, మెరుగైన ఆయుధాలు మాత్రమే అని కూడా సెలవిచ్చారు. ఎవరైనా హిందూ ప్రభాకరన్‌(శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారితే వారికి ఒక కోటి రూపాయల అవార్డు ఇస్తామని ప్రకటించారు.బహిరంగ ప్రదేశాల్లో నమాజులు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఒక వక్త మాట్లాడుతుండగా నరసింగానంద జోక్యం చేసుకొని ” మనకు అవసరమైనపుడు హిందూ సమాజం సాయం చేయదు, ఎవరైనా యువకార్యకర్త ముందుకు వచ్చి హిందూ ప్రభాకరన్‌ (శ్రీలంక ఎల్‌టిటిఇ నేత)గా మారేందుకు సిద్దమైతే నేను కోటి రూపాయలు ఇస్తాను, ఒక ఏడాది కొనసాగితే కనీసం వంద కోట్లు సేకరిస్తానని” చెప్పారు.


స్వామి సాగర్‌ సింధు మహరాజ్‌ మాట్లాడుతూ హిందువులు కనీసంగా కత్తులను కలిగి ఉండాలి అన్నారు. మనం ఉపయోగించే సెల్‌ఫోన్‌ విలువ ఐదువేల రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ హిందువులు ప్రతి ఒక్కరు కనీసం ఒక లక్ష రూపాయల విలువగల ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో ప్రవేశిస్తే సజీవంగా బయటకు పోలేరు అన్నారు. స్వామి ధర్మదాస్‌ మహరాజ్‌ మాట్లాడుతూ తన దగ్గర గనుక తుపాకి ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేగా మారి ఉండేవాడిని.మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు జాతీయ వనరుల మీద తొలి హక్కు మైనారిటీలకే తొలి హక్కు ఉండేది, నేను గనుక పార్లమెంటులో ఉండి ఉంటే నాధూరామ్‌ గాడ్సేను అనుసరించి తుపాకితో ఆరుసార్లు మన్మోహన్‌ సింగ్‌ గుండెల మీద కాల్చివుండేవాడిని అన్నారు. స్వామి ప్రబోధానంద మాట్లాడుతూ మయన్మార్‌లో మాదిరి మన పోలీసు, మన రాజకీయవేత్తలు, మన మిలిటరీ, ప్రతి హిందువు ఆయుధాలు తీసుకొని తుడిచిపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించాలి, అంతకు మించి మరొక మార్గం లేదు అన్నారు. (ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి(బిజెపి) వేరే సందర్భంగా ఈ స్వామీజీ కాళ్లకు మొక్కిన చిత్రాలు ఈ సందర్భంగా దర్శనమిచ్చాయి.)


ప్రతి మతానికి చెందిన వారు తమ మంచి చెడ్డల గురించి సభలు జరుపుకోవచ్చు, ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు. కానీ ఈ విద్వేషం, రెచ్చగొట్టే పనులేమిటి ? ఐతే ఇలా రెచ్చగొట్టే ఇతర మతాలవారి సంగతేమిటని వెంటనే కొందరు ప్రశ్నిస్తారు. ఎవరు రెచ్చగొట్టినా అది మైనారిటీ-మెజారిటీ ఎవరైనా కావచ్చు. అలాంటి వారిని నోరెత్తకుండా జైళ్లలో పెట్టాల్సిందే. వారి ఉపన్యాసాల వలన విద్వేషం తప్ప ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ లేదా మేడిన్‌ ఇండియా పధకాల్లో ఒక్క వస్తువైనా ఉత్పత్తి అవుతుందా ? మనం మతంపేరుతో కుత్తుకలు ఉత్తరించిన మధ్యయుగాల్లో ఉన్నామా నాగరిక సమాజంలో బతుకుతున్నామా ?


విద్వేషపూరిత ప్రసంగాలు చేయటం, రెచ్చగొట్టటంలో మజ్లిస్‌ లేదా కొందరు ఇతర పార్టీల ముస్లిం నేతలు, మత పెద్దలు కూడా తక్కువేమీ కాదు.వారి రెచ్చగొట్టే మాటలు, నమోదైన కేసుల గురించి చూద్దాం. కొద్ది నెలల క్రితం 2021లో ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీలో మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ విద్వేష ప్రసంగంతో పాటు నరేంద్రమోడీ మీద అనుచిత భాషను ఉపయోగించారని, కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టారు.2020లో కర్ణాటకలో సిఎఎ వ్యతిరేక సభలో ముంబై మజ్లిస్‌ పార్టీ నేత వార్సి పఠాన్‌ విద్వేష పూరిత ప్రచారం చేశారని కేసు పెట్టారు. పదిహేను కోట్ల మంది ముస్లింలకు వందకోట్ల మంది హిందువులు సరితూగరంటూ రెచ్చగొట్టినట్లు పేర్కొన్నారు.సిఎఎ, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా మా ఆడవారు ముందుకు వస్తేనే చెమటలు పడుతున్నాయి, అదే పురుషులు వస్తే అంటూ రెచ్చగొట్టినట్లు ఆరోపణ.తన మాటలను వక్రీకరించారని, ఎవరినైనా బాధిస్తే వెనక్కు తీసుకుంటానని అతగాడు తరువాత చెప్పినట్లు వార్తలు వచ్చాయి.అతని ప్రసంగ తీరుతెన్నులను తాము సమర్ధించటం లేదని మజ్లిస్‌ నేత ఒవైసీ, మహారాష్ట్ర మజ్లిస్‌ అధ్యక్షుడు, ఔరంగాబాద్‌ ఎంపీ జలీల్‌ ప్రకటించారు. మజ్లిస్‌ నేతల మాదిరి హిందూత్వశక్తులు లేరు. దీని అర్ధం మజ్లిస్‌ నేతలు నిజాయితీతో ఆ ప్రకటనలు చేశారని కాదు.


టైమ్స్‌ నౌ టీవీ ఛానల్‌ చర్చలో ఇరవైలక్షల మందిని హతమార్చాలని పిలుపు ఇవ్వటం మతాలు చేసే పనేనా అన్న యాంకర్‌ ప్రశ్నకు అవును ఇది మా విధి అని సాధ్వి అన్నపూర్ణ చెప్పారు.మా మతాన్ని వ్యతిరేకించే వారిని ఎవరినైనా హతమారుస్తాం అన్నారు. అన్నపూర్ణ మాతగా పిలిపించుకొనే ఈమె హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శిగానూ, నిరంజనీ అఖారా మహామండలేశ్వర్‌గానూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈమె నోటి వెంట వెలువడిందేమిటి ? ” మీరు వారిని(ముస్లింలను) అంతం చేయ దలచుకొంటే వారిని హతమార్చండి.వారిలో ఒక ఇరవై లక్షల మందిని చంపటానికి మనకు వంద మంది సైనికులు చాలు ” అన్నారు. హరిద్వార్‌లో తాము చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉన్నామని స్వామి ఆనంద స్వరూప్‌ తదితరులు పునరుద్ఘాటించారు, సమర్దించుకున్నారు.
ప్రబోధానంద ఎన్‌డిటివీతో మాట్లాడుతూ నేను చెప్పిన మాటలకు సిగ్గుపడటం లేదు, పోలీసులను చూసి భయ పడటమూలేదు. చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా. మీ ఆలోచనకు నాకూ తేడా ఉంది. రాజ్యాంగాన్ని చదవండి, నా మాటలు ఏ విధంగానూ రెచ్చగొట్టేవి కాదు. ఎవరైనా నన్ను చంపేందుకు పూనుకుంటే నేను పోరాడతాను. నేను చట్టానికి భయ పడటం లేదు. ” అన్నారు. ప్రబోధానంద ముస్లిం వ్యతిరేకత కొత్తదేమీ కాదు.హిందూత్వను, సమాజాన్ని రక్షించుకొనేందుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది మంది పిల్లల్ని కనాలని 2017లో పిలుపిచ్చారు. ముస్లింలు మాత్రమే హిందూ మహిళల మీద అత్యాచారాలు చేస్తారని రెచ్చగొట్టారు. జీహాదీలను తుడిచిపెట్టాలని 2021జూన్‌లో ఇతరులతో కలసి రెచ్చగొట్టారు. అన్నపూర్ణ మాత ఎన్‌డిటీవితో మాట్లాడుతూ తన మాటలను మరింతగా సమర్ధించుకున్నారు.” భారత రాజ్యాంగం తప్పు, భారతీయులు నాధూరామ్‌ గాడ్సే(మహాత్మాగాంధీ హంతకుడు) కోసం ప్రార్ధనలు జరపాలి, నేను పోలీసుల గురించి భయపడను ” అన్నారు.


ముస్లిం వ్యతిరేక, బిజెపి అనుకూల ప్రచారానికి పేరు మోసిన సుదర్శన ఛానల్‌తో మాట్లాడుతూ దేశం వేగంగా ముస్లిం రాజ్యంగా మారుతోంది దాన్ని నిరోధించి సనాతన వేద దేశంగా మార్చాలని నరసింగానంద చెప్పారు. అదే ఇంటర్వ్యూలో మాట్లాడిన స్వామి దర్శన భారతి ఉత్తరాఖండ్‌లో ముస్లింలు భూమి కొనుగోలు చేయ కుండా లాండ్‌ జీహాద్‌ను పాటించాలని సెలవిచ్చారు.( ఇలాంటి వారంతా కాశ్మీరులో స్ధానికేతరులు భూముల కొనుగోలుకు వీలు కల్పించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని ముందుకు తెచ్చారు) నరసింగానంద మాట్లాడుతూ స్వామి దర్శన భారతి గొప్పతనం అంటూ గత ఐదు సంవత్సరాలుగా ఉత్తరాఖండ్‌లో మసీదు, మదార్సాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని, అలాంటి యోధుడికి మనం మద్దతు ఇవ్వాలన్నారు. ధర్మ సంసద్‌లో హఠ యోగి మహరాజ్‌ మనకు ఒక ప్రభాకరన్‌ కావాలని చెప్పారు.నేను అన్నాను ఒక ప్రభాకరన్‌, ఒక భింద్రన్‌వాలే( పంజాబ్‌ తీవ్రవాది), ఒక జనరల్‌ సాహెబ్‌ సింగ్‌ (భింద్రన్‌వాలేకు సలహదారు, శిక్షకుడు) కావాలి. ప్రతి హిందూ దేవాలయానికి అలాంటి ఒకరు కావాలి, లేనట్లైతే హిందూమతానికి రక్షణ ఉండదు, రక్షించేవారు ఎవరూ ఉండరు.” అన్నారు. సత్యమేవ జయతే (సత్యమే ఎప్పటికీ జయిస్తుంది) అన్న సూక్తిని ఈ పెద్దమనిషి శస్త్రమేవ జయతే (ఆయుధమే జయిస్తుంది) అంటూ ముస్లింల మీద దాడులకు పురికొల్పారు.


తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే (కల్లు కోసం అని చెప్పకుండా ) దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని ఎవరో చెప్పారట. స్వామీజీలకు బిజెపికి ఉన్న బంధం కొత్తదేమీ కాదు. హరిద్వార్‌ సభకు మీరెందుకు వెళ్లారు అన్న ప్రశ్నకు వారికి హిందీలో దేశ రాజ్యాంగ ప్రతులను సేకరించటం కష్టం కనుక వారికి వాటిని అందచేసేందుకు, వివరించేందుకు తాను పాల్గొన్నట్లు బిజెపి నేత అశ్వనీ ఉపాధ్యాయ చెప్పారు. ” అది మూడు రోజుల సభ, నేను ఒక రోజు ఉన్నాను.నేను అక్కడ ఉన్న సమయంలో 30నిమిషాలు వేదిక మీద ఉన్నాను. రాజ్యాంగం గురించి మాట్లాడాను. నాకంటే ముందు, తరువాత ఇతరులు మాట్లాడినదానికి నేను బాధ్యుడిని కాదు” అని కూడా అన్నారు. తరువాత తానే ఒక వీడియో ప్రకటన చేస్తూ తాను హరిద్వార్‌ సభలో చివరి రోజు పదినిమిషాలు ఉన్నానని, రాజ్యాంగంలో అసంపూర్ణంగా ఉన్న జనాభా అదుపు, అక్రమ వలసదార్ల అదుపు, మతమార్పిడుల అదుపు వంటి గురించి ప్రసంగించానని వివరణ ఇచ్చారు. రాజ్యాంగ ప్రతులు పంచటం, దాని గురించి మాట్లాడటం నేరమే అయితే నేను ఆ నేరం చేశాను అని చెప్పుకున్నారు. రోగి కోరుకున్నదే వైద్యుడు రాసి ఇచ్చాడన్నట్లుగా ఇవన్నీ ముస్లింల గురించే అన్నది వేరే చెప్పనవసరం లేదు.అశ్వనీ ఉపాధ్యాయ విద్వేష పూరిత ప్రసంగం చేసిన ఒక కేసులో ప్రస్తుతం బెయిలు మీద ఉన్నారు. బిజెపి మహిళానేత ఉదితా త్యాగి మరికొందరు పార్టీనేతలు కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సభలో పాల్గొన్న అనేక మందికి బిజెపి నేతలతో సంబంధాలున్నాయి.2029 నాటికి ఈ దేశానికి ఒక ముస్లిం ప్రధాని కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాకు పోటీగా హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని యోగులు, సాధ్వులు చేస్తున్న ప్రసంగాలు తెలిసిందే.


మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ 2014లో ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా అక్కడి పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.దాని మీద మరింతగా దర్యాప్దు జరపాలని ఢిల్లీలోని కరకార్‌దూమా కోర్టు 2019జనవరిలో ఉత్తరువులు జారీ చేసింది. ఈ కేసులో ఏమీ దొరకనందున కేసును మూసివేయాలని 2018లో పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేశారు.కేసు దాఖలు చేసిన అజయ గౌతమ్‌ దీన్ని సవాలు చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఏ పోలీసూ తన వివరణ కోరలేదని, విచారణా జరపలేదని, దీనికి ఉన్నత స్ధాయిలో ఉన్న రాజకీయ పలుకుబడే కారణమని కూడా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా మరింతగా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.2015లో ఇదే పోలీసులు కోర్డు ఆదేశాలతోనే ఒవైసీ మీద కేసు దాఖలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే బిజెపి నేతలు పొద్దున లేస్తే మజ్లిస్‌నేత అసదుద్దీన్‌ ఒవైసీ పారాయణం చేస్తారు. ఢిల్లీ పోలీసులు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ -అదీ అమిత్‌ షా-ఆధీనంలో పని చేస్తారు. వారి మీద రాజకీీయ పలుకుబడి లేదా వత్తిడి తేగలిగింది బిజెపి తప్ప మరొక పార్టీకి లేదు. అందుకే అనేక మంది బిజెపి-మజ్లిస్‌ పార్టీల మధ్య పరస్పర ప్రయోజనదాయకమైన మౌఖిక ఒప్పందం ఉందని అనుమానిస్తున్నారు.లేనట్లైతే నిజంగా ఢిల్లీ పోలీసులు తలచుకుంటే ఆధారాలు సంపాదించటం అసాధ్యమా ?బిజెపి బి టీమ్‌గా మజ్లిస్‌ పని చేస్తున్నట్లు వచ్చిన విమర్శల సంగతి తెలిసిందే. రెండు పార్టీలకు చెందిన వారు పరస్పరం అవగాహనతో విద్వేషాన్ని రెచ్చగొట్టి తమ ఓటు బాంకును ఏర్పాటు చేసుకుంటున్నారనే భావన నానాటికీ బలపడుతోంది.


హరిద్వార్‌ సభలో విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సాకేత్‌ గోఖలే ఉత్తరాఖండ్‌లోని జ్వాలాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు దాఖలు చేశారు. ఇరవై నాలుగు గంటల్లో కేసు నమోదు చేయని పక్షంలో జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఆ మేరకు విధిలేక కేసు దాఖలు చేశారు. హరిద్వార్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ వాటి కారణంగా ఎలాంటి హింసాకాండ జరగనందున ఉగ్రవాద చట్టం(ఉపా) కింద కేసులు నమోదు చేయలేదని ఉత్తరాఖండ్‌ డిజిపి అశోక్‌ కుమార్‌ చెప్పారు. ఇది తప్పించుకోవటం తప్ప వేరు కాదు. నరసింగానంద నాయకత్వంలో 2020 జనవరిలో ధర్మ సంసద్‌ జరిగింది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు జరగ్గా మరుసటి నెలలోనే ఈశాన్య ఢిల్లీలో మతఘర్షణలు జరిగాయి. ఇప్పుడు హరిద్వార్‌ సమావేశం ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ముందే జరిగింది. అక్కడ చేసిన ప్రతిజ్ఞలేమిటి ?


డిసెంబరు 19న సభ చివరి రోజు నరసింగానంద సభకు వచ్చిన వారితో ఒక ప్రతిజ్ఞ చేయించారు. …. అను నేను నా కుటుంబ సనాతన ధర్మం కోసం, నా సోదరీమణులు, కుమార్తెల రక్షణ కోసం గంగానది తీరాన ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా మతం, నా కుటుంబం, నా పిల్లలు, మహిళలకు ఈ ప్రపంచంలో ఏమి జరిగినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ వ్యక్తి హాని తలపెట్టినా అతన్ని ప్రాణాలతో వదలను. మా మతం కోసం మేము జీవిస్తాము. మా మతం కోసం మేము మరణిస్తాము. ఇస్లామ్‌ జీహాద్‌ను అంతం చేస్తాను. సనాతన ధర్మం చిరకాలం ఉండాలి. సనాతన శత్రువులనందరినీ నాశనం చేయాలి. ” హిందూమతానికి ముప్పు వచ్చినట్లు గోబెల్స్‌ ప్రచారం చేయటం, దేశం ముస్లిం రాజ్యంగా మారుతుందనే ప్రచారంతో జనాల బుర్రలను ఖరారు చేస్తున్నారు. వందల సంవత్సరాలు ముస్లిం పాలకులు, బ్రిటీష్‌ వారు పాలించినప్పటికీ 80శాతం మంది జనం హిందువులుగానే ఉన్నారు. ఆ పాలకులకే సాధ్యం కానిది ఇప్పుడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాల్లో హిందూత్వ బిజెపి అధికారంలో ఉండగా ఎవరో మతమార్పిడి చేసి జనాన్ని హిందూమతానికి దూరం చేస్తున్నారనే ప్రచారం చిన్న మెదడు చితికిన వారు చేసేది తప్ప మరొకటి కాదు. గత ఎనిమిది సంవత్సరాల్లో వచ్చిన మార్పేమిటో చెప్పమనండి అసలు సంగతి బయటపడుతుంది.


సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్దం అవుతున్న సమయంలో జరిపిన ఈ సమావేశంలో చేసిన విద్వేష పూరిత ప్రసంగాలు ఓట్ల రాజకీయంలో భాగం కాదని ఎవరైనా చెప్పగలరా ? మతం పేరుతో ఉన్మాదాన్ని రెచ్చగొడితే అది వెంటనే దిగదు. హిందూత్వ శక్తులుగా ఛాతీవిరుచుకొని చెప్పే బిజెపికి ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెట్టటమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ. అది నెరవేరుతుందా ? గతంలో కూడా ఇలాంటి పనులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లబ్దిపొందారు. సరిగ్గా ఎన్నికల ముందే ఉగ్రవాద చర్యలు జరగటం వాటిని ప్రచార అస్త్రాలుగా చేసుకోవటాన్ని గమనిస్తున్న జనం క్రమంగా వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొందరిని కొంతకాలం మభ్యపెట్టవచ్చు, మోసం చేయవచ్చు. అందరినీ ఎల్లకాలం అలా చేయలేరు.జనాలు వెర్రివాళ్లు కాదు, బుర్రలను వాట్సాప్‌ పండితుల ప్రచారానికి తాకట్టు పెట్టలేదు.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆడపిల్లలే తక్కువ, ముస్లింలకు బహు భార్య లు- వారి నుంచి ముప్పా ? నిజాలేమిటి ?

26 Tuesday Oct 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Hindu Population, Hindutva groups, Muslim women, myth of Muslim population explosion, Narendra Modi, RSS

ఎం కోటేశ్వరరావు

మన వాళ్లు వొట్టి వెధవాయలోయి(తెల్లవారు) చుట్టకాల్చటం నేర్పినందుకు థాంకు చెయ్యక అన్నాడు మహాకవి గురజాడ గిరీశం. ఆ పెద్దమనిషి ఇప్పుడు ఉండి ఉంటేనా అసలు సిసలు భారతీయులం అనుకొనే మన వాట్సాప్‌ పండితుల భాష్యాలు, వక్రీకరణలు, వారి జ్ఞానాన్ని జనానికి ఉచితంగా పంచుతున్న మహాదాతృత్వం గురించి ఎలాంటి పదజాలం ఉపయోగించి ఉండేవారో కదా ! వాట్సాప్‌ పండితులు, కాషాయ దళాల ప్రచారంలో భాగంగా ముస్లింల నుంచి ముప్పు లేదా మన దేశంలో మెజారిటీగా మారేందుకు కుట్ర చేస్తున్నారనే ప్రచారం నిరంతరం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 24వ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెబ్‌సైట్‌లో ఒక వార్తకు పెట్టిన శీర్షిక ” భారత్‌లో హిందూ జనాభా వృద్ది రేటు తగ్గుదల, ముస్లింలో గర్భధారణ శక్తి (ప్రజనన) ఎక్కువ : పూ సర్వే సంస్ధ నివేదిక” అనే పేరుతో కొన్ని వివరాలు ఇచ్చారు. నిజానికి ఈ నివేదిక గురించి సెప్టెంబరు 21నే పూ సంస్ధ సర్వే వివరాలను ఇచ్చింది. ఈ శీర్షిక తప్పుదారి పట్టించేదిగా, తప్పుడు ప్రచారం చేసే వారిని సంతుష్టీకరించేదిగా ఉంది.


ఇంతకాలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం బిజెపితో సహా దాని సంస్ధలు, వారి ప్రచారదాడి మహమ్మారి సోకిన వారు చేస్తున్న ప్రచారం ఏమిటి ? 2035 నాటికి( సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి గాని సారాంశం ఒక్కటే) మన దేశంలో ముస్లిం జనాభా హిందువుల కంటే ఎక్కువ అవుతుంది. హమ్‌ పాంచ్‌, హమారే పచ్చీస్‌ (మనం ఐదుగురం మనకు ఇరవై ఐదు) దీని అర్దం ఏమిటి ? ప్రతి ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు, వారికి ఐదుగురి చొప్పున పిల్లలు పుడతారు అని చెప్పటమే.2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ” నేనేం చేయాలి ? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ? ” అనేకదా ! ఆర్‌ఎస్‌ఎస్‌ వారి ఈ వైఖరిలో మార్పు వచ్చిందా ?2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ”నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి ” అని చెప్పారు.


విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్‌ తొగాడియ గుజరాత్‌లోని బహరుచ్‌ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.” హిందూ పురుషలూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. మతమార్పిడి వద్దనండి, ఘర్‌వాపసికి అవునని చెప్పండి. లవ్‌ జీహాద్‌ వద్దు, ఉమ్మడి పౌరస్మృతి కావాలనండి, బంగ్లా ముస్లింలు వద్దనండి..హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.” ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుసంచాలక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు.” ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగ కూడదని ఏ చట్టం చెప్పింది ” అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్‌ మరోనేత దత్తాత్రేయ హౌసబలే అంతకు ముందు చెప్పిందేమిటి ?చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.” 2018లో రాజస్తాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ బన్వారీలాల్‌ సింగ్‌ సింఘాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. ముస్లింలు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు. ముస్లింలు పాలకులైతే హిందువులు రెండోతరగతి పౌరులౌతారన్నారు. ముస్లిం జనాభా పెరుగుతోందనే ప్రచారం కొనసాగింపుగా ఫలానా సామాజిక తరగతి అనే పేరు లేకుండా ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లును ముందుకు తెచ్చింది. అసోం కూడా అదే దారిలో ఉంది. రెండు చోట్లా ముస్లింల మీద తప్పుడు ప్రచారం ఎన్నికల లబ్దే అసలు కథ.


పూ సంస్ధ కనుగొన్న ముఖ్యఅంశాలంటూ ఆర్గనైజర్‌ రాసిన కొన్ని అంశాలూ, అది చేసిన వ్యాఖ్యానం ఎలా ఉన్నప్పటికీ వాటి నిజానిజాలేమిటో చూద్దాం. కాషాయ దళాలు చేస్తున్నది గోబెల్స్‌ ప్రచారం, వక్రీకరణ అని అనేక వివరాలు వెల్లడించినా ఆప్రచారం కొనసాగుతూనే ఉంది. ఒక అబద్దాన్ని వందసార్లు ప్రచారం చేస్తే 101వ సారి నిజం అవుతుందన్నది గోబెల్స్‌ సిద్దాంతం. మనకూ బ్రాహ్మణుడు, మేక, నలుగురు దొంగల కథ తెలిసిందే.మన జనాభా వివరాలు 2011లో సేకరించినవి మాత్రమే అధికారికంగా ఉన్నాయి. ఆ తరువాత పెరిగిన జనాభా సంఖ్య అంచనా మాత్రమే. 1951-2011 మధ్య మొత్తం జనాభా 36.1 కోట్ల నుంచి 120 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో హిందువులు 30.4 కోట్ల నుంచి 96.6కోట్లకు పెరిగింది. ముస్లింలు 3.5 నుంచి 17.2 కోట్లకు, క్రైస్తవులు 0.8 నుంచి 2.8 కోట్లకు, సిక్కులు 0.68 నుంచి 2.08 కోట్లకు, బౌద్దులు 0.27 నుంచి 84లక్షలకు, జైనులు 17 నుంచి 45లక్షలకు పెరిగారు. పార్సీలు 1.2లక్షల నుంచి 60వేలకు తగ్గారు.


1990దశకకానికి ముందు మొత్తం జనాభా పెరుగుదల రేటు 22శాతం ఉండగా 2000నాటికి 18శాతానికి తగ్గింది. ఇదే కాలంలో హిందువుల పెరుగుదల రేటు 24 నుంచి 17శాతానికి తగ్గగా ముస్లింల రేటు తగ్గుముఖం పట్టి 25శాతం వద్ద, క్రైస్తవుల రేటు 16శాతం వద్ద ఉంది. ముస్లింల రేటును చూపే కాషాయ దళాలు కుట్ర సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి.ప్రస్తుతం హిందువులు 79.8శాతం, ముస్లింలు 14.2, క్రైస్తవులు ఆరుశాతం ఉన్నారు.1951-2011కాలంలో హిందువులు నాలుగుశాతం తగ్గగా ముస్లింలు నాలుగుశాతం పెరిగారు. అలాంటపుడు 2035 నాటికి ముస్లింలు హిందువులను మించి పోతారని ఏ గణాంకాలు లేదా వాస్తవాలను బట్టి ఎలా చెబుతున్నారు ? నమ్మేవారు ఎలా చెవులప్పగిస్తున్నారు ? దేశంలో జరుగుతున్నదేమిటి ? 1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ?ప్రజనన లేదా గర్భధారణకు మహిళల్లో విద్యకు సంబంధం ఉంటుందనేది అంతర్జాతీయంగా రుజువైన అంశం.2015 సమాచారం ప్రకారం క్రైస్తవుల్లో మహిళలు సగటున ఏడున్నర సంవత్సరాలు, హిందువుల్లో 4.2, ముస్లింల్లో 3.2సంవత్సరాలు ఉంది. అందువలన ముస్లింల్లో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది. విద్యతో పాటు మత విశ్వాసాలు, పరిసరాలు, సంపద, ఆదాయం వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

2019లో ఐక్యరాజ్య సమితి వెల్లడించిన సమాచారం ప్రకారం భారత్‌లో జన్మించిన వారు విదేశాల్లో 1.75లక్షల మంది నివసిస్తుండగా విదేశీయులు 52లక్షల మంది నివసిస్తున్నారు. ఇది ఆ ఏడాది మన జనాభాలో కేవలం 0.4శాతం మాత్రమే. అందువలన వలసవలన మతపరంగా పెద్దగా ఎలాంటి మార్పు లేదని కూడా తేలింది.కొన్ని వార్తల ప్రకారం మరికొన్ని లక్షల మంది ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వచ్చి అనధికారికంగా భారత్‌లో నివసిస్తున్నారని చెబుతున్నారని అయితే దానికి తగిన రుజువులు లేవని పూ సంస్ధ పేర్కొన్నది.2012 పూ సంస్ధ అంచనా ప్రకారం భారత్‌ను వదలి వెళుతున్నవారిలో ముస్లింలు, క్రైస్తవులే ఎక్కువ ఉంటారని, భారత్‌కు వలస వచ్చే వారిలో మూడింట రెండువంతుల మంది హిందువులని పేర్కొన్నది. మతమార్పిడి ప్రచార బండారాన్ని కూడా పూ సంస్ధ వెల్లడించింది. ఇటీవల జరిపిన తమ సర్వే ప్రకారం 99శాతం హిందువులు,97శాతం ముస్లింలు, 94శాతం క్రైస్తవులు తాము పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నామని చెప్పారని, 0.7శాతం మంది హిందువులుగా పెరిగిన వారు తాము హిందువులుగా ఉండదలచుకోలేదని చెప్పగా హిందూమతానికి వెలుపల పెరిగిన 0.8శాతం మంది తాము ఇప్పుడు హిందువులుగా ఉన్నట్లు చెప్పారు.

దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి ? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదుశాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌(20లక్షలు), మిజోరం(పది లక్షలు), మేఘాలయ(30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. మరి హిందువులు ? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. కాషాయ దళాల వేదగణిత లెక్కలు కాకుండా దీనికి భిన్నమైన అధికారిక తాజా సమాచారం ఉంటే సరిచేసుకుందాం.2011లెక్కల ప్రకారం వహిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబనియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా ? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా ? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా ? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946,911గానూ జమ్మూకాశ్మీరులో 889,862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా ? అనేక మంది పేదరికం కారణంగా హైదరాబాద్‌ వంటి చోట్ల ముస్లింలు అరబ్‌ షేకులకు తమ పిల్లలను కట్టబెడుతున్నారనే అంశం పలుసార్లు వెలుగులోకి వచ్చింది.


అయితే దేశంలో బహుభార్యాత్వం లేదా ? ఘనమైనదిగా కొందరు చెప్పుకొనే మన చరిత్ర, సంస్కృతిలో ఎక్కువ మంది దేవుళ్లకు, రాజులు, రంగప్పలకు ఒకరి కంటే ఎక్కువ మంది ఉండటాన్ని లొట్టలు వేసుకుంటూ రంజుగా చెప్పుకుంటాం కదా. ఇక వర్తమానానికి వస్తే దేశమంతటా ముస్లింలకు, గోవాలో హిందువులు ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉండవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయం పేరుతో కొనసాగిస్తున్నారు. చిత్రం ఏమంటే అనుమతి ఉన్న ముస్లింల్లో బహుభార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8శాతం ఉంది. దీన్నేమంటారు ?
2035నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. అసలు ఇది ఎక్కడ పుట్టింది ? ఒకరాయి వేద్దాం మనల్ని అడగొచ్చేదెవరులే అనే ధైర్యంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. 2017ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ” 2035 నాటికి ముస్లింల పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది ” అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి ? ప్రపంచంలో 2075నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2015 -2060 మధó్య ముస్లింలు, క్రైస్తవులు ఎక్కువ మంది పిల్లలను కంటారు. ఆ రెండు మతాల మధ్య 2055-60లో తేడా 60లక్షలు. ముస్లింలు 23.2 కోట్లు, క్రైస్తవులు 22.6కోట్లు అని, 2035నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వశక్తులు హిందూమతానికి వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు. ఇదే కాలంలో మన దేశంలో హిందువుల సంఖ్య తగ్గనుందని అంచనా. 2050నాటికి ముస్లింలు ఇప్పుడున్న 14.4 నుంచి 18.4శాతానికి పెరుగుతారని అంచనా వేస్తున్నారు.ఇప్పుడున్న మాదిరి వారిలో కూడా కుటుంబనియంత్రణ వేగం పెరిగితే తగ్గనూ వచ్చు.

ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ” అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌(విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు. ” ఇది 2018లో రాజస్తాన్‌లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.


భక్తుల నీరాజనాలు, విశ్వగురువు అంటూ ప్రశంసలు అందుకుంటున్న బిజెపి నేత నరేంద్రమోడీ ఏ క్షణాన జాతీయ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారో అది ఎలాంటి ముహూర్తమో తెలియదు. మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ), మేక్‌ ఇండియా(భారత్‌ తయారీ) పేరు ఏదైతనేం గానీ ఇచ్చిన పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే మన జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దానికి అవరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయెల్‌, అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు లేదా అక్కడ నైపుణ్య శిక్షణ పొందారు. పుంఖాను పుంఖాలుగా అవివేకం, కుహనావార్తల ఉత్పత్తి జరుగుతోంది, దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమిది. ఈ నేపధ్యంలో ఇప్పుడు దేశంలో కాషాయ దళాల ప్రచారాల తీరు ఎలా ఉందో కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా అవగతం అవుతుంది.

” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు దేశంలో కాషాయ దళాల ప్రచారాల తీరు ఎలా ఉందో కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా అవగతం అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తాలిబాన్లు వద్దు – తాలిబానిజం ముద్దు ! మరోసారి ముందుకు వచ్చిన మనువాద చర్చ !!

22 Sunday Aug 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Women

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, BJP, Hindu Fundamentalism, Hinduism, Manu Statue, Manusmriti, RSS, saffron talibans


ఎం కోటేశ్వరరావు


అమెరికా వాడు ఆఫ్ఘనిస్తాన్నుంచి పారిపోవటాన్ని ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. మిగతా అంశాల గురించి రాబోయే రోజుల్లో ఎలాగూ చర్చించుకుంటాం. మన దేశానికి చేసిన ఒక మంచి గురించి చెప్పకతప్పదు. తమకు ఏది మంచి అయితే దాన్ని చేయటం తప్ప నమ్మిన వారిని పట్టించుకొనే అవసరం మాకు లేదు అని మన దేశంలో వారి మీద మరులు గొన్నవారికి చెంపచెళ్లు మనిపించి మరీ చెప్పాడు. మతశక్తుల మంచి చెడ్డల గురించి చర్చ, విశ్లేషణలు జరిగేందుకు దోహదం చేశాడు. ఇప్పుడు అదే జరుగుతోంది.అనేక మంది తాలిబాన్లు-ఆర్‌ఎస్‌ఎస్‌ పోలికలను ముందుకు తెస్తున్నారు. గతంలో ఏదైనా అడిగితే పాకిస్తాన్‌ వెళ్లండి అని చెప్పే బిజెపి నేతలు ఇప్పుడు బాణీ మార్చి ఆప్ఘనిస్తాన్‌ వెళ్లమని సలహా ఇస్తున్నారు. తమ ప్రత్యర్ధులను తాలిబాన్ల మాదిరి తన్నాలని పిలుపులు ఇస్తున్నారు.


మధ్య ప్రదేశ్‌లోని కట్ని జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్‌రతన్‌ పాయల్‌ను ద్రవ్యోల్బణం, పెట్రోలు ధరల గురించి ఒక విలేకరి అడిగితే దురదగొండి ఆకు పూసుకున్నట్లుగా ప్రవర్తించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్రోలు లీటరు 50రూపాయలైనా కొనేవారు లేరంట అక్కడికి వెళ్లి కొనుక్కోండి అంటూ మండిపడ్డారు. కరోనా మూడవ తరంగం వస్తుందని అందరూ అనుకుంటుంటే పెట్రోలు గురించి మాట్లాడుతున్నావు, కరోనా కనిపించటం లేదా అని ఎదురుదాడికి దిగిన వీడియో తెగ ప్రచారం అయింది. బీహార్‌లోని బిస్‌ఫీ నియోజకవర్గ బిజెపి ఎంఎల్‌ఏ హరిభూషన్‌ ఠాకూర్‌ను ఒక విలేకరి తాలిబాన్లు అధికారానికి వచ్చిన ప్రభావం భారత్‌ మీద ఎలా ఉంటుంది అని అడిగారు. ఆ పాపానికి ఇక్కడ భయపడేవారంతా అక్కడికి పోవచ్చు, పెట్రోలు, డీజిలు ధరలు చౌక అని ఎద్దేవా చేశారు. ఒకసారి అక్కడికి వెళితే ఇక్కడి ప్రత్యేకత తెలుస్తుంది అన్నారు. మతమేదైనా ఆప్ఘన్‌ శరణార్దులను అందరినీ అనుమతించాలన్న జెడియు నేత వ్యాఖ్యను గేలిచేస్తూ అప్పుడు మన దేశం కూడా తాలిబాన్లతో నిండిపోతుందన్నారు. తాలిబాన్లు మన దేశంలో స్వాతంత్య్ర సమర యోధుల వంటి వారు అని ఉత్తర ప్రదేశ్‌లోని సమాజవాది పార్టీ ఎంపీ షఫికుర్‌ రహమాన్‌ వ్యాఖ్యానించినందుకు యుపి బిజెపి ప్రభుత్వం దేశద్రోహ కేసు బనాయించింది. ఇటీవలనే కేంద్ర మంత్రిగా నియమితులైన ప్రతిమా భౌమిక్‌ గారిని సన్మానించేందుకు త్రిపురలోని బెలోనియా పట్టణంలో బిజెపి వారు ఒక సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు అడుగుపెడితే తాలిబాన్ల పద్దతుల్లో వారిని తరిమివేయాలని పార్టీ ఎంఎల్‌ఏ అరుణ్‌ చంద్ర భౌమిక్‌ బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


తాలిబాన్లను ఎవరూ సమర్ధించటం లేదు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా పారిపోయినందుకు సంతోషం తప్ప మతఛాందసులు వచ్చినందుకు కాదు. అయినా మన దేశంలో తాము తప్ప మిగిలిన వారందరూ తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నారన్నట్లుగా బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నారు. తాలిబాన్లకు అధికారాన్ని అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నది అమెరికా, దాని సంతకాల కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని వెలిబుచ్చింది నరేంద్రమోడీ సర్కార్‌. అమెరికా తప్పుకున్న తరువాత దేశం తాలిబాన్ల వశం అవుతుందన్న కనీస పరిజ్ఞానం మన ప్రభుత్వానికి లేదా ? ఎందుకు సమర్ధించినట్లు ? జనానికి బుర్రల్లేవనుకుంటున్నారా ? తాలిబాన్‌ షరియా చట్టాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న బిజెపి వారు ఇప్పటికే అమల్లో ఉన్న దేశాల్లో మహిళల గురించి ఎప్పుడైనా ఈ మాదిరి గుండెలు బాదుకున్నారా ? ముస్లింలు ఉన్న ప్రతి చోట దేశ రాజ్యాంగాలతో నిమిత్తం లేకుండా మత పెద్దలు అనధికారికంగా ఆ చట్టాలను అమలు జరుపుతున్నారు. ఇక పూర్తిగా లేదా పాక్షికంగా అధికారిక గుర్తింపు ఇచ్చిన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్‌, ఇండోనేషియా, పాకిస్తాన్‌, ఈజిప్టు, ఎమెన్‌, ఇరాన్‌, ఇరాక్‌, మలేషియా, మాల్దీవులు, మారుటేనియా, కతార్‌, సౌదీ అరేబియా,నైజీరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉన్నాయి.


ఇక మనుస్మృతి విషయానికి వస్తే ఇస్లాంలో షరియత్‌ను ముస్లింలు అందరూ ఆమోదించారని, ఆ మాదిరి మనుస్మృతిని హిందువులందరూ ఆమోదించాలనే బలవంతం ఏమీ లేదని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్నవి బలవంతంగా అమలు జరపటం తప్ప షరియత్‌ను పాటించటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకొనే స్వేచ్చ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. మన దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, సమాజాన్ని వేల సంవత్సరాల వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్న మనువాదుల లక్ష్యం నెరవేరితే జరిగితే సంభవించే పరిణామం ఏమిటి ? మరో పాకిస్తాన్‌గా మారిపోతుంది. అవకాశం లేకగానీ లేకుంటే ఈ పాటికి దేశాన్ని ఎప్పుడో మతరాజ్యంగా మార్చి ఉండేవారు. అప్పుడు రాజ్యాంగం స్దానంలో మనుస్మృతిని అమలు చేసేవారు.ఇదేమీ నిరాధార ఆరోపణ కాదు. అనేక మంది ఈ దేశంలో ఇప్పుడు భయపడుతున్నది ఇదే.


ఆర్‌ఎస్‌ఎస్‌ వాణి ఆర్గనైజర్‌ పత్రిక 1949 నవంబరు 30వ తేదీ సంచికలో రాసిందేమిటి ? ” భారత నూతన రాజ్యాంగం గురించి చెప్పాలంటే అత్యంత చెడు ఏమంటే దానిలో భారతీయం లేకపోవటమే.రాజ్యాంగాన్ని రాసిన వారు బ్రిటీష్‌, అమెరికా, కెనడా, స్విస్‌ మరియు ఇతర రాజ్యాంగాలలోని అంశాలను చేర్చారు. పురాతన భారతీయ చట్టాల ఆనవాళ్లు, వ్యవస్ధలు, నామావళి,శబ్ద-శైలీ విన్యాసాలుగానీ లేవు. పురాతన భారత్‌లో జరిగిన అపూర్వమైన రాజ్యాంగ అభివృద్ది ప్రస్తావన గానీ లేదు. పురాతన గ్రీకు, పర్షియా చట్టాల కంటే ఎంతో ముందుగా రాసినవి మను చట్టాలు.మనుస్మృతిలో ఉద్ఘోషించిన చట్టాలు ప్రపంచవ్యాపితంగా ఉద్వేగ పరిచే, ఆరాధించేవి, అనుసరణకు పురికొల్పేవి, కానీ మన రాజ్యాంగ పండితులకు అర్ధం లేనివి.” కాశ్మీరు రాష్ట్రాన్ని , రాజ్యాంగంలోని మౌలిక అంశమైన ఆర్టికల్‌ 370 ఒక్క రోజులో ఎలాంటి చర్చ లేకుండా రద్దు చేసిన పెద్దలు రాబోయే రోజుల్లో మనుస్మృతి, పురాణాలు, వేదాలతో రాజ్యాంగాన్ని నింపివేయరనేే హామీ ఏముంది ?


మనుస్మృతిలో ఏముంది ? రెండున్నరవేల శ్లోకాలు ఉంటే వాటిలో బ్రాహ్మలు, క్షత్రియుల విధులు, కర్తవ్యాలు, పాలన,హక్కులకు సంబంధించి రెండువేలకు పైగా ఉంటే, వైశ్యులు, శూద్రుల బాధ్యతలు, మహిళల కట్టుబాట్లు, పరిమితుల గురించి మిగిలినవి ఉన్నాయి. పాలక – పురోహిత పెత్తనం తప్ప సామాన్యుల హక్కుల గురించి ఉన్నదేమిటో ఎవరైనా చెబితే సంతోషం. అలాంటి దాని ప్రాతిపదికన రాజ్యాంగ రచన అంటే కాషాయ తాలిబానిజం తప్ప మరొకటి ఏముంది? మనువాదం అంత గొప్పది, పురాతనమూ, ఆదర్శమూ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంటరానితనం, పిల్లలను కనటానికి, వంట, ఇంటికి మహిళలను ఎందుకు పరిమితం చేసినట్లు ?
మనుస్మృతిలో పరస్పర విరుద్ద అంశాలు కూడా ఉన్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలమైన వాటిని తీసుకొని వాదనలను సమర్ధించుకుంటున్నారు. అయితే ఆచరణను గీటురాయిగా తీసుకుంటే వ్యతిరేకమైనవే అమల్లో ఉన్నాయి.ఉదాహరణకు మహిళల హక్కులకు సంబంధించి ఒక దగ్గర స్త్రీ పురుషులెవరూ వివాహాన్ని రద్దు చేసుకోరాదని ఉంది. మరికొన్ని చోట్ల చేసుకోవచ్చని ఉంది. కానీ హిందూకోడ్‌ బిల్లు వచ్చేంత వరకు అలాంటి హక్కులు అమలు జరుపుకున్నవారెంత మంది ? తన కులం గాని వారిని వివాహం చేసుకోవటాన్ని నిషేధించింది. ఇప్పుడు జరుగుతున్న అనేక హత్యలు, కులపంచాయతీలకు ప్రాతిపదిక అదే కదా ! బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, అవసానదశలో మగపిల్లల రక్షణలో ఉండాలని, భర్తను దేవుడిగా పూజించాలని చెప్పారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషిస్తారని ఒక చోట చెబుతారు. స్వంతంత్ర జీవనం కోరుకోరాదని మరోచోట అదేశిస్తారు. పురుషులను భ్రష్టు పట్టించటం మహిళల సహజలక్షణ మని చెబుతారు.ఇలా స్త్రీని కించపరిచే, ఆంక్షలు విధించే అంశాలు ఎన్నో ఉన్నాయి.


కొన్ని కులాల వారు ” గుట్టలు, చెట్లు, శ్మశానాల దగ్గర, కొండలు, తోపుల్లో ఉండాలి.జన్మసిద్దమైన కార్యకలాపాల జీవనంతో గుర్తు పట్టేవిధంగా ఉండాలి.” ” భరించలేని అంటరాని వారు,కుల భ్రష్ట జనితులు గ్రామాల వెలుపల ఉండాలి, పారవేసిన పాత్రలు, కుక్కలు, గాడిదలను తమ సంపదలుగా పరిగణించాలి. వారు మరణించిన వారి దుస్తులను ధరించాలి, పగిలిపోయిన పాత్రల్లో వారి ఆహారం ఉండాలి, ఆభరణాలు ఇనుముతో చేసినవిగా ఉండాలి, ఎప్పుడూ దూరంగానే తిరుగుతుండాలి. తన విధులు నిర్వర్తిస్తున్న పురుషుడు వారితో సంబంధాన్ని కోరుకోకూడదు, ఒకరి తరువాత ఒకరితో కార్యకలాపాలు నిర్వహించాలి.వారి మాదిరి ఉండేవారితోనే వివాహం చేసుకోవాలి. ఆహారం కోసం వారు ఇతరుల మీద ఆధారపడాలి.వారికి పగిలిపోయిన పాత్రల్లోనే ఆహారం పెట్టాలి. వారు పట్టణాలు,గ్రామాల్లో రాత్రుళ్లు నడవ కూడదు. పగలు తమ పనికోసం వారు తిరగవచ్చు. రాజు జారీ చేసిన ఆజ్ఞల ప్రకారం ప్రత్యేకమైన గుర్తులతో గుర్తుపట్టేవిధంగా వారు ఉండాలి. బంధువులు లేని వారి శవాలను వారు మోయాలి, ఇది తిరుగులేని నిబంధన. రాజాజ్ఞ ప్రకారం మరణశిక్షలను అమలు జరపాలి. మరణశిక్షకు గురైనవారి దుస్తులు, పక్కలు, ఆభరణాలను తమ కోసం తీసుకోవాలి.” ఈ మనుచట్టాలను రాజ్యాంగం రచనలో పరిగణనకు తీసుకోలేదనే వైఖరిని ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా ఆర్గనైజర్‌ మార్చుకున్నదా ? నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు, ఎవరైనా చెబితే అంగీకరిద్దాం ! అంతేనా ? ” పూజారి పేరు శుభప్రదమైన, సౌకర్యవంతమైన పదంతో ఉండాలి, పాలకుడి పేరు బలాన్ని, రక్షణను సూచించాలి, సాధారణ జనానికి ఆస్తి సంబంధమైనవి, సేవకుడి పేరు సేవను సూచించే, చిరాకు పుట్టించేదిగా ఉండాలి.” ఇవి కూడా మనుధర్మంలో చెప్పినవే సుమా ! సినిమాల్లో అలాంటి ఉదంతాలను ఎవరైనా గుర్తు పట్టవచ్చు.

ముస్లిం మహిళల రక్షణకు ఎవరూ తీసుకురాని చట్టాన్ని తీసుకు వచ్చామని బిజెపి ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్నది. ఎప్పటికెయ్యది అప్పటికా అవసరాలు, అజెండాకు అనుగుణ్యంగా ఎత్తుగడలను మార్చుకోవటాన్ని చూసి ఊసరవెల్లులే సిగ్గుపడతాయి. హిందూ మహిళలకు ఆస్తి , వివాహ, విడాకుల హక్కులు ఇచ్చేందుకు, బహు భార్యాత్వాన్ని నిషేధించేందుకు ఉద్దేశించిన హిందూకోడ్‌ బిల్లు పట్ల అనుసరించిన వైఖరి ఏమిటి ? కేంద్ర మంత్రిగా అంబేద్కర్‌ ప్రతిపాదించిన బిల్లులను వ్యతిరేకిస్తూ 1949 డిసెంబరు 11న ఢిల్లీ రామలీలా మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ నిర్వహించింది. హిందూ సమాజం మీద ఆటంబాంబు వంటిది ఈ బిల్లు అని ఒక వక్త సెలవిచ్చారు. అవి పార్లమెంట్‌ ముందుకు వచ్చినపుడు బెంగాల్‌ నుంచి స్వతంత్య్ర అభ్యర్ధిగా ఎన్నికైన హిందూమహాసభ నేత నిర్మల్‌ ఛటర్జీ( సిపిఎం నేత, లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీ తండ్రి) వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంఘపరివార్‌, హిందూత్వశక్తులే కాదు, కాంగ్రెస్‌లోని మితవాదులు కూడా వాటికి వ్యతిరేకమే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ కూడా వారిలో ఒకరు. ఇలాంటి ప్రతిపాదనలను ముందు పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పెట్టి ఓటర్ల ముందు చర్చ తరువాత పార్లమెంట్‌కు తీసుకురావాలన్నారు. ఎందుకని మనుధర్మం వాటికి వ్యతిరేకం గనుక ! చివరికి నెహ్రూ అనేక రాజీలతో చట్టానికి ఆమోదం పొందారు.


మన రాజ్యాంగం ప్రకారం మనువు, మహమ్మద్‌, ఏసుక్రీస్తు మరొక మత బోధనలకు స్ధానం లేదు. అయినప్పటికీ రాజస్తాన్‌ హైకోర్టు ముందు 1989లో రాజస్తాన్‌ జుడీషియల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ మను పేరుతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా అనుకూలంగా నిరనసలు-సమర్ధనలు జరుగుతున్నాయి. అదే ఏడాది ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఒక పాలనాపరమైన ఉత్తరువు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ విశ్వహిందూపరిషత్‌ నేతలు, ఇతరులు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. దాని మీద ఆదేశాన్ని నిలుపు చేస్తూ హైకోర్టు ఆదేశించింది. ప్రదాన న్యాయమూర్తి ఆధ్వర్యాన ఏర్పడిన డివిజన్‌ బెంచ్‌ వాజ్యవిచారణ చేపట్టింది. గత మూడు దశాబ్దాలుగా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కొంత మంది దళిత సంఘకార్యకర్తలు ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. చివరి విచారణ 2015లో జరిగింది. బ్రాహ్మణ న్యాయవాదుల నిరసనల కారణంగా కేసు ముందుకు పోలేదు. ప్రతి ఏటా మను విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా జరిగాయి. కేసు తేలేవరకు విగ్రహం కనపడకుండా ముసుగు కప్పాలని అధికారులు ఆపని చేయకపోతే తామే అందుకు పూనుకుంటామని కార్యకర్తలు హెచ్చరించారు.మనుధర్మం పేరుతో అమలు చేసిన అంశాలు దళితులు, మహిళలను అణచివేశాయని కొందరు చెబుతున్నారు. వాటికీ మను ధర్మానికి సంబంధం లేదు అని మరికొందరు అంటున్నారు. మరోనోటితో మను ధర్మాలు అమలు జరిగాయంటారు. ఏది నిజం ? మరి స్వేచ్చ లేకపోవటానికి, అణచివేత, అంటరానితనం, కులాలవారీ చీలిపోవటానికి కారణాలు ఏమిటి ? మనువాదుల నుంచి సరైన సమాధానం లేదు.వారు చెప్పేవి తర్కానికి నిలిచేవి కాదు. ఇదే సూత్రం షరియ చట్టాలకూ వర్తిస్తుంది.అదీ తర్కానికి నిలవదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రాణాలు తీస్తున్న అధిక పని గంటలు -పనిలేక నిరుద్యోగుల ఆత్మహత్యలు !

18 Sunday Jul 2021

Posted by raomk in Current Affairs, Economics, employees, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, Women

≈ 1 Comment

Tags

#workers Health, extreme work weeks, ILO, Long working hours, Occupational diseases, overwork in India, WHO


ఎం కోటేశ్వరరావు


పని సందర్భంగా వడదెబ్బ సంబంధిత అత్యధిక గాయాలు, సమస్యలు పరిగణనలోకి రావటం లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక జూలై 15న ఒక విశ్లేషణ ప్రచురించింది. వడగాలులు శ్రమ జీవులను ప్రత్యేకించి పేదవారిని అనూహ్య పద్దతులలో ఎలా గాయపరుస్తాయో తాజా సమాచారం వెల్లడించిందని పేర్కొన్నది. దాని సారాంశం ఇలా ఉంది. తీవ్ర వడగాడ్పులు సంభవించినపుడు పెద్ద సంఖ్యలో వడదెబ్బలే కాదు పడిపోవటం, యంత్రాలను సరిగా పనిచేయించలేకపోవటం, వాహనాల మధ్య ఇరుక్కుపోవటం వంటివి కూడా గణనీయంగా ఉంటున్నాయి. పని స్ధలాల్లో ఇతర కారణాలతో తగిలే గాయాలకు కాలిఫోర్నియాలోనే అదనంగా ప్రతి సంవత్సరం వడదెబ్బ గాయాలు ఇరవై వేలు తోడవుతున్నాయి. వీటి వలన పని మీద కేంద్రీకరించటం కష్టం అవుతోంది. పశ్చిమ అమెరికా, బ్రిటీష్‌ కొలంబియాలో ఇటీవలి వడగాడ్పులకు 800 మంది మరణించారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు ఉత్పాదక యంత్రాలు, గోడవున్లలో పని చేసే వారికి కూడా వడగాడ్పులు ముప్పు తెస్తున్నాయి. వడగాడ్పు గాయాల వలన వేతనాలను కోల్పోవటం, వైద్య ఖర్చు పెరగటం, ఉష్ట్రోగ్రతలు పెరిగే కొద్దీ వేతన వ్యత్యాసం కూడా పెరుగుతోంది. 2001 నుంచి 2018వరకు కాలిఫోర్నియాలో గాయాలకు పరిహారం చెల్లించిన కోటీ పదిలక్షల నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. తేదీలు, పని ప్రాంతాలు, వడగాడ్పుల తీవ్రత, గాయాల సంఖ్య తీరుతెన్నులను విశ్లేషించగా వేడి ఎక్కువగా ఉన్నపుడు గాయాలు ఎక్కువగా నమోదైనట్లు తేలింది. అధికారికంగా సగటున 850 గాయాలైనట్లు నివేదికలు చూపాయి. అయితే వాస్తవ గాయాలతో పోల్చితే ఇవి చాలా తక్కువ. అరవై డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉన్నపుడు తగిలిన గాయాలతో పోల్చితే 85-90 డిగ్రీలు ఉన్నపుడు ఐదు నుంచి ఏడుశాతం, వంద డిగ్రీలకు పెరిగినపుడు పది నుంచి 15శాతం పెరిగాయి. వడ దెబ్బ గాయాలు గరిష్ట వేతనాలు పొందే వారితో పోల్చితే కనిష్ట వేతనాలు పొందే కార్మికులకు ఐదు రెట్లు ఎక్కువ ఉన్నాయి.వడదెబ్బ తగల కుండా కొన్ని చర్యలు తీసుకున్న తరువాత కేసులు సంఖ్య తగ్గింది తప్ప తీరుతెన్నులు మాత్రం అలాగే ఉన్నాయి.


మనది ఉష్టమండల ప్రాంతం. ఉష్ణోగ్రతలు అమెరికా కంటే ఎక్కువ నమోదౌతున్నాయి.వేసవిలో 110-115 మధ్య ఉన్న సందర్భాలు ఎన్నో. రికార్డు స్ధాయిలో రాజస్దాన్‌లో 124 కూడా నమోదైంది. అధిక ఉష్ణోగ్రత నమోదైనపుడు వడదెబ్బ తగలకుండా నివారణ చర్యలు తీసుకున్న సంస్దలు ఎన్ని ఉన్నాయన్నది ప్రశ్నార్దకం. అమెరికా మాదిరి మన దేశంలో కూడా పరిశోధన చేస్తే తప్ప తీవ్రత బయటకు రాదు. వడదెబ్బ ఒక్కటే కాదు కష్టజీవుల జీవితాలను దెబ్బతీస్తున్న వృత్తి రుగ్మత అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఓవర్‌టైమ్‌ కూడా ఒకటి.ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్‌ఓ) తొలిసారిగా అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ)తో కలసి దీర్ఘపని గంటల మీద నిర్వహించిన సర్వే ప్రకారం ఏడాదికి ఆ కారణంగా మరణిస్తున్నవారు 7,45,000 మంది(ఇది 2016 సంఖ్య) ఉన్నారట. గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులు దీనికి కారణం. ఆగేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంత దేశాలలోని కార్మికులు ఎక్కువగా ప్రభావితులౌతున్నారు.ఆసియాలో గుండెపోటు ముప్పు మామూలుగానే ఎక్కువ, దీనికి అధిక పని గంటల సమస్య మరింత పెంచుతోంది. వారానికి 35-40 గంటల పాటు పని చేసేవారితో పోల్చితే 55 గంటలు, అంతకు మించి పని చేసే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు 35శాతం, గుండె సంబంధ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయే ముప్పు 17శాతం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతులు మధ్యవయస్కులు లేదా వృద్దులు ఎక్కువగా ఉన్నారు. రోజుకు ఎక్కువ గంటలు పని చేసిన వారిలో ఇది పని మానేసిన తదుపరి జీవితంలో, కొన్ని సందర్భాలలో దశాబ్దాల తరువాత కూడా ప్రభావం చూపుతోంది. అధిక పని గంటలు అంటే భౌతిక శ్రమే చేయనవసరం లేదు, ఇతరత్రా పనిలో ఎక్కువ గంటలు ఉన్నా ముప్పు ఉంటుంది.పిల్లలతో సహా అధిక గంటలు పని చేస్తున్నవారు ప్రపంచ జనాభాలో తొమ్మిదిశాతం ఉన్నారు.2000 సంవత్సరం తరువాత వీరి సంఖ్య పెరుగుతోంది.


వృత్తిపరంగా తలెత్తే రుగ్మతలకు కారణాలు అనేక వాటిలో సింహభాగం అధిక పని గంటలే అని తేలింది. ఎక్కువ సేపు భౌతిక శ్రమ చేయటం ముప్పు కారణమైతే, అది లేకుండా ఇతరంగా ఎక్కువ గంటలు పని చేసే వారు మద్యం, పొగాకు వినియోగం, తక్కువ సేపు నిద్రపోవటం, వ్యాయామం లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వంటి అంశాలు కూడా ముప్పును పెంచుతున్నాయి. దీర్ఘకాలం పనిచేసే వారి సంఖ్య ప్రపంచ వ్యాపితంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి సమయంలో అది మరింత పెరిగింది. అధికపని చేసినందుకు ప్రతిఫలం కూడా అన్ని సందర్భాలలో ఉండటం లేదు. ఇంటి నుంచి పని చేసే వారు సగటున 3.6 గంటలు ఎక్కువ సేపు విధి నిర్వహణలో ఉంటున్నారని తేలింది. యజమానులు వృత్తి రుగ్మతలను పరిగణనలోకి తీసుకోవాలని, తక్కువ పని గంటలు ఉంటే ఉత్పత్తి ఎక్కువ వస్తుందని గ్రహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్ద పేర్కొన్నది. అప్పగించిన ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువులోగా పూర్తికావాలనే లక్ష్యాలు నిర్ణయిస్తున్నందున వాటికోసం ఇంట్లో లేదా పని స్ధలాల్లో ఎక్కువ సేపు పని చేయటంతో పాటు వత్తిడి సమస్య కూడా తలెత్తుతోంది. అధిక పని గంటల కారణంగా గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతుల మందికి గుండెకు రక్త ప్రసరణ తగ్గిన కారణంగా తలెత్తే ఇస్కీమిక్‌ హృదయ వ్యాధి మూలం అని తేలింది. దీనికి వత్తిడి, అధికరక్తపోటు కారణం.ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 15శాతం మంది కార్మికులకు మాత్రమే వృత్తిపరమైన రుగ్మతల చికిత్స ప్రత్యేక సేవలు అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులోని తిర్పూరు-కోయంబత్తూరు ప్రాంతంలోని నూలు, వస్త్ర, దుస్తుల పరిశ్రమలో వెలువడే పత్తి ధూళి కారణంగా కార్మికుల్లో బ్రోంకైటిస్‌, టీవి, బరువు తగ్గటం, వినికిడి శక్తి నష్టపోవటం వంటి రుగ్మతలు తలెత్తుతున్నాయని విశ్లేషణలో తేలింది. ఈ పరిశ్రమల్లో పని చేసే వారి జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ 2018 సర్వే ప్రకారం 83శాతం మంది కార్మికులకు ఆరోగ్య బీమా లేదు.


అధిక గంటలు పని చేస్తున్న వారు ఆసియాలో ఎక్కువగానూ ఐరోపాలో తక్కువగానూ ఉన్నారు. తగిన ప్రతిఫలం లేదా ఆదాయం లేని కారణంగా ఆసియాలోని అనేక ప్రాంతాలలో రోజుకు ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తున్నవారెందరో. పని గంటల పరిమితులు ఉన్నప్పటికీ వాటికి వక్రభాష్యాలు, మరొక కారణమో చెప్పి ఎక్కువ పని గంటలు చేయిస్తున్నారు. అదొక లాభసాటి వ్యవహారంగా కూడా ఉంటోంది. ఒకరిని అదనంగా నియమించుకొని పని చేయించుకోవటం కంటే ఆ మేరకు ఇద్దరో ముగ్గురి చేతో ఓవర్‌ టైమ్‌ చేయించుకోవటం యజమానికి లాభం కనుకనే ఆ పని చేస్తున్నారు.


పని చేయటంలో జపనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కొంత మంది చెబుతారు. అక్కడి కార్మికులు నిరసన తెలియచేయాలంటే సమ్మెల కంటే అదనంగా ఉత్పత్తి చేసి యజమానుల మీద వత్తిడి చేస్తారనే కథలు కూడా బాగానే వినిపిస్తారు.సెలవులు తీసుకోవాలంటే సిగ్గుపడతారని ఆకాశానికి ఎత్తుతారు. 1970దశకంలో చమురు సంక్షోభం తలెత్తినపుడు అక్కడి కార్మికవర్గం మీద పెట్టుబడిదారులు 70గంటల పనిని రుద్దారు.అలా పని చేయటం గర్వకారణం, జపనీయుల దేశభక్తికి నిదర్శనం అన్నట్లు ప్రచారం చేసి సాధారణం కావించారు. ఇప్పుడు అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం అదే చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ కార్మిక సంస్ధ చేసిన సర్వే అంశాలవే. అయితే జపాన్‌లో 70గంటల పని రుద్దుడు పర్యవసానం ఏమిటి ? అక్కడి పని సంస్కృతికి మరోపేరు ” కరోషి ” అంటే అధికపనితో చావు. ఇలాంటి చావులు పెరిగిన కారణంగా పని గంటల గురించి అక్కడ పునరాలోచన ప్రారంభమైంది. అనేక మంది కార్మికులు పని వత్తిడి తట్టుకోలేక కార్యాలయాల మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారు. ఇదొక సామాజిక సమస్యగా మారింది. ప్రతి ఏటా కరోషీ బాధితులు పెరుగుతున్నారు. ఏటా పదివేల మంది మరణిస్తున్నారని అంచనా. కానీ ప్రభుత్వ లెక్కల్లో రెండు వందలు మాత్రమే ఉంటున్నాయి. మరీ ఎక్కువ వత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుందని లేదా పరిహారం చెల్లించాల్సిన కారణాల వలన గానీ ఇటీవలి కాలంలో కొందరు యజమానులు తమ సిబ్బందికి బలవంతంగా సెలవులను ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. సెలవులకు వేతనాలు పొందుతున్న కార్మికులు 2018లో 52.4శాతం మందే ఉన్నారు. సెలవు తీసుకుంటే వేతనం ఇవ్వరు గనుక అనేక మంది వాటి జోలికి పోరు. చూశారా జపాను వారు సెలవులు కూడా తీసుకోకుండా పని చేస్తారని బయటి ప్రపంచం సుద్దులు చెబుతుంది.


ఆర్ధిక సహకార మరియు అభివృద్ది సంస్ధ (ఓయిసిడి) సభ్య దేశాలలో పదకొండు చోట్ల వారానికి 50 గంటల కంటే ఎక్కువే పని చేస్తున్నారు.నాలుగు దేశాల్లో అధిక గంటలు పని చేసే వారు టర్కీలో 33, మెక్సికోలో 29, కొలంబియాలో 26.6, దక్షిణ కొరియాలో 25.2, జపాన్‌లో 17.9శాతం మంది ఉన్నారని ఓయిసిడి చెబుతోంది.పని-కుటుంబం, వ్యక్తిగత జీవితాలను సమన్యయ పరచుకోవటంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారీ వ్యవస్ధ సృష్టించిన సమస్య తప్ప మరొకటి కాదు.


తాజాగా మాన్‌పవర్‌ గ్రూప్‌ సంస్ధ జరిపిన సర్వే ప్రకారం అధిక గంటలు పని చేసే దేశాల్లో మనం ప్రధమ స్దానంలో ఉన్నాం.1981-1996 మధ్య కాలంలో పుట్టిన వారిని మిలీనియల్స్‌ అంటున్నారు.వీరు మన దేశంలో 52, చైనాలో 48, అమెరికాలో 45, బ్రిటన్‌లో 41 గంటలు పని చేస్తున్నారని సర్వేలో తేలింది. తీవ్ర పోటీ, పని చేయకపోతే ఉద్యోగం ఊడుతుందన్న భయం వంటి అంశాలు రోజుకు పది గంటల కంటే ఎక్కువ సేపు పనిలో ఉండేట్లు చేస్తున్నాయి. ఫోర్డ్‌ కంపెనీ చేసిన సర్వే ప్రకారం వారానికి 12 గంటలు ఉద్యోగులు వాహనాలు నడపటానికి వెచ్చిస్తున్నారు. అంటే పని గంటలకు ఇది అదనం. ఉదాహరణకు 52 పని గంటలైతే అందుకోసం మరోపన్నెండు గంటల పాటు ప్రయాణంలో వెచ్చించాల్సి వస్తోంది.


మన దేశంలో సంభవిస్తున్న ఆత్మహత్యలలో పదిశాతం నిరుద్యోగం, దారిద్య్రం, దివాలా వంటి కారణాలతో జరుగుతున్నాయి. ఒకవైపు అధిక గంటలు పని చేసే వారు అత్యధికులుండగా మరో వైపు అసలు పనే లేని నిరుద్యోగులు కనిపిస్తారు. అధిక గంటలు పనిచేసే దేశాలలో మనది ఐదవ స్ధానమని ఐఎల్‌ఓ తెలిపింది. 2020-21 ప్రపంచ వేతన నివేదికలో అతి తక్కువ కనీస వేతనాలు చెల్లిస్తున్న దేశాల్లో మనది ఒకటని కూడా వెల్లడించింది. 2019 మన జాతీయ గణాంక సంస్ద సర్వే ప్రకారం రోజులో పదో వంతు కూడా దేశ ప్రజలు తీరుబడి కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కార్మికశక్తిలో మహిళల శాతం తగ్గిపోతున్నదని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది, గత సంవత్సరం 20.3శాతమే ఉన్నారని, అంతకు ముందుకంటే గణనీయంగా తగ్గినట్లు తెలిపింది. మన దేశంలో వారానికి నాలుగు దినాలు, రోజుకు పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది యజమానుల లబ్ది కోసం తప్ప మరొకటి కాదు. ఓవర్‌టైమ్‌కు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయటమే ఇది. అధిక పని గంటలు, వృత్తి రుగ్మతల కారణంగా తలెత్తే పర్యవసానాల గురించి మన దేశంలో సమగ్రమైన చట్టాలు చేయాల్సి ఉంది. ఉన్న చట్టాలనే నీరుగార్చేందుకు పూనుకుంటున్న పాలకుల హయాంలో అది జరిగేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d