• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Telangana

ఎస్‌సి,ఎస్‌టి వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పు : కేంద్ర సర్వీసులు, ఓబిసి మాటేమిటి ? ఇరకాటంలో నరేంద్రమోడీ !

03 Saturday Aug 2024

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, tdp, TDP, Telangana

≈ Leave a comment

Tags

BJP, Caste Reservation, CHANDRABABU, Narendra Modi Failures, OBC sub-categorisation, Revanth Reddy, Rohini Commission, SC/ST sub-quota, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


దళితులు, గిరిజనుల్లో సామాజిక న్యాయం జరిగేందుకు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్లలో ఆయా తరగతుల వర్గీకరణ జరిపి వాటాలను నిర్ణయించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు దశాబ్దాలుగా నడుస్తున్న ఒక అంకానికి తెరదించింది.మరో దానికి నాంది పలికింది.దీని కోసం ఎదురు చూసిన వారు ఆనందంతో ఉండగా వ్యతిరేకించిన వారు విచారంలో మునిగిపోయారు. ఈ రెండు భావనలూ వాస్తవమే అయినా తాత్కాలికమే.అంటరానితనంతో సహా మొత్తంగా జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం జరపాలని కోరుకుంటున్నవారి ప్రయత్నాలకు కాస్త ఇబ్బందే. ప్రతి అస్తిత్వ భావన ఎంతో కొంత చెరపు చేస్తుంది. రాష్ట్రాలలో వర్గీకరణ గురించి ఒక స్పష్టత వచ్చింది. మరి కేరద్ర సర్వీసులు, ప్రభుత్వరంగ సంస్థలు, బాంకులు, ఎల్‌ఐసి వంటి ఆర్థిక, విత్త సంస్థలలో దళితులు, గిరిజనులతో పాటు ఓబిసి వర్గీకరణ మాటేమిటి అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. అభివృద్ధి జరగాలంటే రెండు ఇంజన్ల పాలన ఉండాలన్న నినాదాన్ని ముందుకు తెచ్చిన పెద్దలు కేంద్రం గురించి కొన్ని రాష్ట్రాలలో వర్గీకరణ ఘనత మాదే అంటున్నారు, కొన్ని చోట్ల మౌనంగా ఉంటున్నారు, తమ ముందున్న అంశాల గురించి మాట్లాడరేం ? వర్గీకరణ సమస్యను ముందుకు తెచ్చిన వారు కూడా రాష్ట్రాల గురించి తప్ప కేంద్ర అంశాన్ని ప్రస్తావించకపోవటం వెనుక ఉన్న కారణం ఏమిటి ?


నిచ్చెన మెట్ల సమాజం మనది. అసమానతలు, దారిద్య్రం, ఉపాధి రంగాలలో నెలకొన్న దుస్థితికి ఎక్కడా లేని అంటరానితనం అనే సామాజిక వివక్ష కారణంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఉపశమనం తప్ప శాశ్వత నివారణ కాదు. వాటిని కూడా కొంత మందే పొందుతున్నారు అన్న అసంతృప్తి నుంచి ముందుకు వచ్చిందే వర్గీకరణ. అది న్యాయసమ్మతమే కనుక ఎక్కువ మంది ఆమోదం పొందింది. గతంలో సంస్థానాధీశులు, జమిందార్లు, భూస్వాములు భూమి వదులుకొనేందుకు సిద్దం కాలేదు. అలాగే రిజర్వేషన్ల వలన లబ్దిపొందిన కొన్ని తరాలు కూడా అదే కోవకు చేరి వర్గీకరణను వ్యతిరేకించిన ఫలితమే కోర్టుల జోక్యం. ఇవి చిన్నయ్య-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వివాదంలో వర్గీకరణ చెల్లదని 2004లో సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌ ఇచ్చిన తీర్పును చెల్లదని, పంజాబ్‌, హర్యానా హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సమీక్షించి వర్గీకరణ సబబే అని తాజాగా ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6-1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా సదరు వర్గీకరణ ఎలా ఉండాలో కూడా న్యాయమూర్తులు చెప్పారు. రాష్ట్రాలు వాటిని ఎలా తమ చట్టాలలో పొందుపరుస్తాయో చూడాల్సి ఉంది. అవి కోర్టుల సమీక్షకు లోబడి ఉండాలని, రాజకీయ దుర్వినియోగం చేయకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. గతంలో క్రీమీ లేయర్‌ (మెరుగైన ఆర్థిక స్థితి) ఓబిసిలకు మాత్రమే వర్తింప చేశారని ఇప్పుడు ఎస్‌సి, ఎస్‌టిలకూ అమలు చేయవచ్చని కూడా పేర్కొన్నది. దళితుల ఉపకులాలైన వాల్మీకులు, మజాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు అమలు జరపాలన్న ఆ రాష్ట్ర చట్టాన్ని 2004 సుప్రీం కోర్టు తీర్పు ప్రాతిపదికన 2010లో పంజాబ్‌-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. దళితులంటే అందరూ ఒకటే అని వారిని విడదీయ కూడదని చెప్పింది. తాజా తీర్పు ఆ వైఖరి తప్పు అని పంజాబ్‌లో చేసిన చట్టం సరైనదే అని చెప్పింది. ఇప్పటి వరకు ఈ అంశాన్ని ఉపయోగించుకొని రాజకీయ పక్షాలు లబ్ది పొందేందుకు చూసినందున పార్టీలపై కచ్చితంగా ఈ తీర్పు ప్రభావం పడనుంది, అదెలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. ప్రతిదాన్నీ రాజకీయం చేసేందుకు చూస్తున్న తరుణమిది.


దళితుల వర్గీకరణ డిమాండ్‌ అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు.కులాల పేర్లు ప్రస్తావించకూడదని అనుకున్నప్పటికీ సందర్భవశాత్తూ తప్పటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాదిగ సామాజిక తరగతి వర్గీకరణను కోరుతుండగా, పంజాబ్‌లో అదే తరగతి వ్యతిరేకిస్తున్నది. రిజర్వేషన్ల వలన లబ్దిపొందిన కొన్ని కులాల వారు తమకు అవకాశాలు తగ్గిపోయాయనే భావనతో వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు.ఇది మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు కాదు. వర్గీకరణ అనుకూల, వ్యతిరేక భావనలకు పంజాబులో నాంది పలికారు. అకాలీదళ్‌ తన పలుకుబడిని పెంచుకొనేందుకు దళితుల్లో వెనుకబడిన వాల్మీకులు, మజాబీ సిక్కులకు అన్యాయం జరిగిందంటూ వారిని సమీకరించేందుకు పూనుకుంది.దాన్ని ఎదుర్కొనేందుకు 1975 మే ఐదున కాంగ్రెస్‌ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్న జ్ఞానీ జైల్‌ సింగ్‌ రిజర్వేషన్ల తురుపుముక్కను ప్రయోగించారు.ప్రభుత్వ శాఖలలో వీలైన మేరకు ఈ రెండు సామాజిక తరగతుల వారికి 50శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని ఆదేశించారు.దీంతో అప్పటికే గణనీయంగా లబ్దిపొందిన మాదిగ సామాజిక తరగతి అవకాశాలు తగ్గిపోయాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పంజాబ్‌ జనాభాలో 32శాతం మంది దళితులు ఉన్నారు.రాష్ట్రం వర్గీకరణ అమలు చేస్తున్నప్పటికీ వాల్మీకులు, మజబీల పరిస్థితి పెద్దగా మెరుగుపడిందేమీ లేదు.వర్గీకరణ లేని కారణంగా కేంద్ర సర్వీసులలో వారు తగిన ప్రాతినిధ్యం పొందలేకపోయారు. 2004 ఆంధ్రప్రదేశ్‌ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అక్కడ కూడా సదరు అంశాన్ని సవాలు చేశారు. హైకోర్టు వర్గీకరణను రద్దు చేసింది. అక్కడి పరిస్థితి గురించి 2007లో వర్గీకరణ సమస్య మీద ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 105 మంది ఐఎఎస్‌లలో పంజాబు దళితుల్లో 42శాతం మంది ఉన్న వాల్మీకులు, మజాబీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆది ధర్మీస్‌గా పిలిచే సామాజిక తరగతి తోలు వృత్తిలో ఉన్న దళితులు ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన స్థితిలో ఉన్నారు. కారణం బ్రిటీష్‌ భారత సైన్యంలో ఉన్న వారికి అవసరమైన బూట్ల తయారీలో వారు నిమగం కావటంతో దానికి పరిమితంగానైనా చదువు సంధ్యలు అవసరం కావటం, ఆర్థిక స్థితి మెరుగై రిజర్వేషన్‌ అవకాశాలను కూడా ఎక్కువగా అందిపుచ్చుకున్నారు. వ్యవసాయ కార్మికులుగా, పట్టణాలలో పారిశుధ్య కార్మికులుగా ఉన్న దళితులకు చదువుతో అవసరం లేకపోయింది. హర్యానాలో 1994లో దళితులను ఏ-బి తరగతులుగా విభజించి తోలు వృత్తి చేసేవారికి 50శాతం ఇతరులకు మిగతా సగం రిజర్వేషన్లు కల్పించారు.తోలు వృత్తి చేసేవారు ఎక్కువగా లబ్ది పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ గురించి అధ్యయనం చేసిన ఉషా మెహ్రా కమిషన్‌ 2008 నివేదిక నాలుగు ఉపతరగతులుగా రిజర్వేషన్లు అమలు జరపాలని సిఫార్సు చేసింది. దళితుల్లో ముందున్న మాలలు ఐఎఎస్‌, ఐపిఎస్‌ ఎంపికల్లో 76, 86శాతం మంది ఉండగా మాదిగలు 23, 13శాతాల చొప్పున ఉన్నట్లు పేర్కొన్నది.దళిత జనాభాలో మాలలు 41శాతం కాగా మాదిగలు 49శాతం ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో దాదాపు ఇలాంటి పరిస్థితి ఉన్నది.


దళితులు, వెనుకబడిన తరగతులలో కొందరు అన్యాయానికి, విస్మరణకు గురౌతున్నారంటూ బిజెపి వారిని తన ఓటుబాంకుగా మార్చుకొనేందుకు పావులు కదిపింది. దానిలో భాగంగానే ఒబిసిల వర్గీకరణ పరిశీలనకు 2017లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. తన నివేదికను 2023జూలై 31న రాష్ట్రపతికి అందచేసింది. నరేంద్రమోడీ ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు.దానిలో ఉన్న అంశాలు వెల్లడైనా, కేంద్ర ప్రభుత్వం వాటి గురించి అభిప్రాయం వెల్లడించినా లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే రాజకీయ కారణంతో ఆ నివేదికను అటకెక్కించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎందుకు తెప్పించుకోలేదన్నది ప్రశ్న. రాజకీయ కారణాలతోనే కమిషన్‌ గడువును పదమూడు సార్లు పొడిగించారు. ఏడాది గడుస్తున్నా దేశ ప్రధమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఎందుకు కేంద్రానికి పంపలేదు, ఎంతకాలం తన దగ్గర ఉంచుకుంటారన్నది ఆసక్తి కలిగించే అంశం. ఆ నివేదికను కేంద్రం తిరస్కరిస్తే వేరు, ఆమోదిస్తే పార్లమెంటుకు సమర్పించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి.వేగంగా పనిచేస్తామని చెప్పుకుంటున్న నరేంద్రమోడీకి ఇది ఒక సవాలే. నివేదికలోని అంశాలపై మీడియాలో తిరుగుతున్న లీకు సమాచారం ప్రకారం ఓబిసిలలో ఐదు నుంచి ఆరువేల ఉపతరగతులు ఉన్నారని, వారి జనాభాలో కేవలం ఒకశాతంగా ఉన్న 40 కులాలవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో 50శాతం మేరకు రిజర్వేషన్‌ లబ్దిపొందుతున్నట్లు తేలిందట. ఈ నివేదికను తెరవటం అంటే వెంటనే వచ్చే అంశం వెనుకబడిన తరగుతుల జన గణన. దాన్ని రాష్ట్రాలు చేపట్టవచ్చునని బిజెపి తప్పించుకుంటున్నది, ఇంతవరకు ఆ పార్టీ పాలిత రాష్ట్రాలు బుల్డోజర్లు, మత విభజన మీద చూపుతున్న శ్రద్దలో నూరోవంతు కూడా అందుకు చొరవచూపలేదు. దాన్ని బట్టే ఆ పార్టీ చిత్తశుద్ది వెల్లడైంది, ఒక రాష్ట్రంలో బిసిగా ఉన్న వారు మరొక రాష్ట్రంలో ఓసిగానో, కొన్ని చోట్ల దళితులు, గిరిజనులుగానో ఉన్న ఉదంతాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అందువలన రాష్ట్రాలు తీసిన జనాభా లెక్కలను కేంద్రం ఆమోదిస్తుందా అన్నది ప్రశ్న. కేంద్రమే నిర్వహించినా అదే సమస్య ఎదురు కావచ్చు, రెండవది జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం నిర్ణయించాలనే డిమాండ్‌కు దారి తీసే అవకాశం కూడా ఉంది.1953లో ఏర్పాటు చేసిన కాకా కలేల్‌కర్‌ తొలి కమిషన్‌ బిసిలను వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరుగతులు అనే రెండుగా వర్గీకరించాలని సిఫార్సు చేసింది. మండల్‌ కమిషన్‌లోని సభ్యుడైన ఎల్‌ఆర్‌ నాయక్‌ అణచివేతకు గురైన బిసిలు, మధ్యస్థంగా ఉన్నవారు అనే రెండు ఉపతరగతులుగా విభజించాలని ప్రతిపాదించారు. రోహిణీ కమిషన్‌ నిర్దిష్టంగా ఏమి చెప్పిందో తెలియదు.


చరిత్ర, ఆచరణను చూసినపుడు ఒకే సామాజిక తరగతిగా భావించబడుతున్న కొన్ని కులాల గుంపులో అన్నీ ఒకటిగా లేవన్నది తెలిసిందే.సాధారణ తరగతిగా పరిగణిస్తున్న బ్రాహ్మలలో అధికార వ్యవస్థతో సంబంధాలు కలిగి ఉన్న వారికి-పూజా పునస్కారాలకు పరిమితమైన వారికి ఎంత తేడా ఉన్నదో చూస్తున్నాము. అదే విధంగా మరికొన్ని ఇతర తరగతుల్లో ఆస్తిపాస్తులు ఉన్నవారికి లేని వారికీ చివరికి ఒకే కులంలో ఉన్నవారిలో గల తేడా ఏమిటో తెలిసిందే.దళితులు, గిరిజనుల్లో కూడా అంతే.వర్గీకరణను వ్యతిరేకించేవారు, అనుకూలించే వారు గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న వాదనలు తెలిసినవే. ఇప్పుడు వాటికి తెరపడింది. వర్గీకరణ జరిపినా ఈ తరగతులకు పూర్తిగా సామాజిక న్యాయం అమలు కాదు. సుప్రీం తీర్పును అమలు జరిపేందుకు అవసరమైన సమాచారాన్ని. సాక్ష్యాలను సేకరించకుండా తొందరపడి చేస్తే కోర్టు లిటిగేషన్లో చిక్కుకోవచ్చు.జనాభా లెక్కలు, ఇతర అంశాలను నవీకరించాల్సి ఉంది. దీనికి మానవ వనరులు, నిధులు కూడా అవసరమే. అందువలన వెంటనే అమలు జరపటం సాధ్యమా కాదా అన్నది కూడా చూడాల్సి ఉంది.ఓబిసి వర్గీకరణ, కేంద్ర సర్వీసుల్లో దళితులు, గిరిజనుల వర్గీకరణను బిజెపి అమలు చేస్తుందా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల పంపుసెట్లకు మీటర్ల ఒప్పందం నిజమేనా : బిజెపి మద్దతు ! వ్యతిరేకించిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ రద్దు చేస్తాయా ?

30 Tuesday Jul 2024

Posted by raomk in AP, BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, tdp, TDP, Telangana, Ycp

≈ Leave a comment

Tags

A Revanth Reddy, BJP, BRS, CHANDRABABU, Electricity Act (2003), KCR, meters for agriculture pump sets, Narendra Modi Failures, UDAY sceam


ఎం కోటేశ్వరరావు


విద్యుత్‌ వినియోగదారులందరికీ స్మార్ట్‌ మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి చేసిన ప్రకటన, సభకు చూపిన పత్రాలు వివాదాస్పదమయ్యాయి.తాము వ్యవసాయ పంపుసెట్లకు తప్ప మిగిలిన వాటికి మాత్రమే స్మార్టు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకున్నామని, ఆ విషయాన్ని దాచి తమపై అవాస్తవాలు చెప్పారని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెడుతున్నారు. పంపిణీ ట్రాన్స్‌ఫర్లకు మీటర్లు పెడతామని అంగీకరించారని, రైతులకు కూడా అక్కడి నుంచే సరఫరా జరుగుతుంది గనుక వ్యవసాయ సరఫరాకూ మీటర్లు పెట్టేందుకు సమ్మతించినట్లే కదా అని కాంగ్రెస్‌ చెబుతోంది. ఒప్పంద పత్రాలను జనాలకు అందుబాటులో ఉంచితే నిజానిజాలేమిటో అందరికీ సుబోధకం అవుతుంది.2017లో కుదుర్చుకున్న ఒప్పందంలో ఏమి ఉంది అన్నది పక్కన పెడితే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పంపుసెట్లకు మీటర్లు పెట్టలేదన్నది వాస్తవం. అందువలన నిజంగా వ్యవసాయ పంపుసెట్లకు తప్ప అనే పదం ఒప్పందంలో ఉందా లేదా అన్నది ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది.


ఇప్పటికే విద్యుత్‌ మీటర్లు ఉన్నాయి కదా స్మార్ట్‌ మీటర్లంటే ఏమిటని ఎవరికైనా సందేహం రావచ్చు.ప్రయివేటీకరించే రంగాలలో విద్యుత్‌ పంపిణీ కూడా ఒకటి. సెల్‌ఫోన్లకు రెండు పథకాలు ఉన్నాయి. ఒకటి ముందుగానే డబ్బు చెల్లించేది, రెండవది తరువాత బిల్లు కట్టేది. విద్యుత్‌ రంగంలో స్మార్టు మీటర్లు అంటే ముందుగా సొమ్ము చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయాలి. ఆ మేరకు వినియోగించగానే సరఫరా ఆగిపోతుంది. వాడకం తరువాత బిల్లు చెల్లించే పథకాలనూ పెట్టవచ్చు. అసలు ఈ విధానం ఎందుకు, చెప్పిన కారణాలేమిటి ? వినియోగించే ప్రతి యూనిట్‌కూ లెక్కతేలాలని, మీటర్లు లేకుండా వినియోగించేవారిని నిరోధించేందుకు, ఖర్చు మొత్తం వినియోగదారుల నుంచి రాబట్టేందుకు అని చెప్పారు. ప్రయివేటీకరించిన తరువాత కొనుగోలు చేసిన కార్పొరేట్‌ సంస్థకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం ఒకటైతే, ముందుగానే చెల్లించే జనం సొమ్ముతో పెట్టుబడి పెద్దగా లేకుండా సదరు సంస్థలకు లాభాలు అప్పగించే మహత్తర ఆలోచన దీనివెనుక ఉంది. వినియోగదారులు చెల్లించే మొత్తాలనే జన్‌కోలకు చెల్లిస్తారు. ఇతర ఖర్చులకూ వినియోగిస్తారు.ప్రస్తుతం రైతాంగానికి కొన్ని రాష్ట్రాలలో ఉచితంగా అందచేస్తున్నారు, కొందరికి సబ్సిడీలు ఇస్తున్నారు. స్మార్టు మీటర్లు పెడితే అందరూ ముందుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయాలి. ఎలా అంటే గతంలో వంటగ్యాస్‌కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించి చెల్లిస్తే సిలిండర్లు ఇచ్చేవారు. ఇటీవల దాన్ని మార్చి ముందుగా మొత్తం చెల్లించేట్లు చేశారు. తరువాత సబ్సిడీ మొత్తం వారి బాంకు ఖాతాలలో జమ చేస్తున్నారు. విద్యుత్‌కూ అంతే చేయనున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తే వినియోగదారులకు బదలాయిస్తారు. చేతులేత్తేసినా చేసేదేమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు పంపిణీ సంస్థలకు సబ్సిడీ సొమ్మును నెలల తరబడి చెల్లించటం లేదు, ప్రభుత్వ శాఖలు బిల్లులు చెల్లించకుండానే వాడుతున్నాయి. దీంతో పంపిణీ సంస్థ(డిస్కామ్‌లు)లు అప్పుల పాలవుతున్నాయి.ప్రైవేటీకరిస్తే వాటిని కొనుగోలు చేసే సంస్థలు ముందుకు రావు. అందుకే రుణాలు లేకుండా చూసేందుకు విధానపరంగా ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.


దానిలో భాగంగానే నరేంద్రమోడీ సర్కార్‌ అధికారంలోకి రాగానే 2015లో ఉజ్వల డిస్కామ్‌ అస్యూరెన్సు యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది.దీని పొట్టి రూపమే ”ఉదరు”. తొలుత ప్రకటించినదాని ప్రకారం 2018-19 నాటికి విద్యుత్‌ ప్రసార నష్టాలను 22 నుంచి 15శాతానికి తగ్గించాలి.విద్యుత్‌ కొనుగోలు,సరఫరా, ప్రసారానికి అయ్యే ఖర్చును పూర్తిగా వినియోగదారుల నుంచి రాబట్టాలి. ఇందుకు గాను స్మార్ట్‌ మీటర్లను విధిగా పెట్టించి నిర్వహణా సామర్ధ్యాన్ని మెరుగుపరచాలి. పొదుపు చర్యల్లో భాగంగా ఎల్‌ఇడి బల్బులను ప్రోత్సహించాలి, ఇదే మాదిరి వ్యవసాయ పంపుసెట్లు, ఫ్యాన్లు, ఎయిర్‌ కండీషనర్లను ప్రోత్సహించాలి. విద్యుత్‌ ఖర్చు, వడ్డీ భారాన్ని, నష్టాలను తగ్గించాలి.సరసమైన ధరలకు విద్యుత్‌ను అందించాలి. ఇలాంటి చర్యలను చేపట్టిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించాలి.ఇది ఘోరంగా విఫలం కావటంతో తొలుత ప్రకటించిన లక్ష్యాలను కొన్నింటిని 2021జూన్‌లో సవరించారు. వాటి ప్రకారం ప్రైవేటు రంగంలో ఉన్న పంపిణీ సంస్థలు తప్ప ప్రభుత్వ రంగంలో ఉన్నవాటి ఆర్థిక, నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచాలి.మౌలిక సదుపాయాల పటిష్టతకు ఆర్థిక సాయం చేసేందుకు కొన్ని షరతులను విధించాలి.ప్రసార నష్టాలను 2024-25నాటికి 12-15శాతానికి తగ్గించాలి. సరఫరా ఖర్చును పూర్తిగా వినియోగదారుల నుంచి వసూలు చేయాలి, ఆధునిక పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.పైన చెప్పుకున్న స్మార్ట్‌ మీటర్ల కథ ఈ పధకంలో భాగమే. ఆంధ్రప్రదేశ్‌లో అందిన కాడికి అప్పులు చేసిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సర్కార్‌ వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టేందుకు అంగీకరించి ఎఫ్‌ఆర్‌బిఎం అర్హతకు మించి అదనంగా 0.5 అప్పులు తెచ్చుకొనే ” ప్రోత్సాహాన్ని ” పొందింది. తెలంగాణాలో విద్యుత్‌ మోటార్లు ఎక్కువగా ఉన్నందున అంగీకరిస్తే రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తుంది గనుక బిఆర్‌ఎస్‌ సర్కార్‌ వాటి జోలికి పోకుండా పంపిణీ ట్రాన్సఫార్మర్లకు మీటర్లు పెట్టి లెక్క తేలుస్తామని, ఇతర వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకుంది.


రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు, పార్టీలు అధికారంలోకి వచ్చాయి. స్మార్టు మీటర్లను రెండచోట్లా బిజెపి సమర్ధించింది, ఇప్పటికీ సమర్ధిస్తున్నది. ఈ విషయంలో బిఆర్‌ఎస్‌, వైసిపి విధానాలకు మద్దతు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం వ్యతిరేకించింది. ఇప్పుడు అదే బిజెపితో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసిపి తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తామని గానీ, కొనసాగిస్తామనీ ఇంతవరకు స్పష్టం చేయలేదు.తెలంగాణాలో వ్యతిరేకించిన కాంగ్రెస్‌దీ ఇప్పుడు అదే పరిస్థితి. అమలు చేయకపోతే పంపిణీ సంస్థలపై కేంద్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతోంది తప్ప, స్మార్టు మీటర్లు పెట్టేదీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఏం చేస్తారో చూడాలి.మరోవైపు విద్యుత్‌ సంస్కరణలను అమలు జరిపి తీరుతామని బిజెపి గట్టిగా చెబుతోంది. పంపిణీ సంస్థలు అప్పుల్లో కూరుకుపోవటం గురించి రాజకీయపరమైన దాడి చేస్తున్నది. అనేక రాష్ట్రాలలో అంగీకరించినందున రెండు తెలుగు రాష్ట్రాలలో ఎందుకు వ్యతిరేకించాలని బిజెపి అంటున్నది. ఇది అసంబద్ద వాదన. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అధారిటీ (సిఇఏ) కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాని నివేదిక 2023 ప్రకారం 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక,తెలంగాణా, పంజాబ్‌ రాష్ట్రాలు మాత్రమే రైతాంగానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నాయి. మీటర్లు లేకుండా పంపుసెట్ల సామర్ధ్యాన్ని బట్టి మరో ఎనిమిది రాష్ట్రాలు రేట్లు నిర్ణయించాయి. ఒక హార్స్‌ పవర్‌కు బీహార్‌లో నెలకు రు.800, గుజరాత్‌లో రు.200, హర్యానాలో పదిహేను హెచ్‌పి వరకు రు.12, అంతకు మించితే రు.15, కాశ్మీరులో పది హెచ్‌పి వరకు రు.205, 11 నుంచి 20కి రు.222, ఇరవై మించితే రు.1,415, మహారాష్ట్రలో జోన్లు, హార్స్‌పవర్‌ ప్రాతిపదికన గరిష్టంగా రు.422 నుంచి కనిష్టంగా రు.265వరకు, పంజాబ్‌లో ప్రభుత్వ సబ్సిడీ లేని పంపుసెట్లకు రు.419, రాజస్తాన్‌లో రు.775, 955 చొప్పున రెండు తరగతులుగా, ఉత్తర ప్రదేశ్‌లో రైతాంగానికి రు.170( లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం దీన్ని రద్దు చేశారు, రు.1,500 కోట్లు సబ్సిడికి కేటాయించినట్లు ప్రకటించారు.), ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ నిర్వహణలో ఉన్న పంపుసెట్లకు 100 హెచ్‌పివరకు రు.3,300 వసూలు చేస్తున్నారు. అందువలన ఈ రాష్ట్రాలలో మీటర్లు పెట్టినందున రైతులకు జరిగే నష్టం లేదు, ఎలాగూ సొమ్ము చెల్లిస్తున్నారు. అందువలన అవి అంగీకరించాయంటే వేరు, ఉచితంగా ఇచ్చే వాటి సమస్య వేరు. అయితే మీటర్లు పెట్టి ఇప్పుడు చెల్లిస్తున్నదానికంటే అదనపు భారం మోపితే వచ్చే వ్యతిరేకతను అక్కడి పార్టీలు అనుభవించాల్సి ఉంటుంది.


ఇక పంపిణీ సంస్థల నిర్వహణ ఇతర పార్టీల ఏలుబడి ఉన్న చోట కంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏమైనా మెరుగ్గా ఉందా ?బిజెపి వారు తెలంగాణాలో తరచూ హైదరాబాదు పాత బస్తీలో విద్యుత్‌ చౌర్యం గురించి చెబుతూ ఉంటారు. అక్కడ ఉన్నవారిలో ఒక్క ముస్లింలే విద్యుత్‌ను అక్రమంగా వాడుతున్నట్లు ? హిందువులుగా ఉన్నవారు దేశం కోసం ధర్మం కోసం నిజాయితీగా ఉన్నట్లు చిత్రిస్తున్నారు.అవకాశం ఉంటే చౌర్యంలో ఎవరూ తక్కువ కాదు, వివిధ సందర్భాలలో లైన్ల మీద కొక్కేలు వేసేవారందరూ చోరులే. ఇతర చోట్ల, ఇతర రాష్ట్రాలలో ఇలాంటి ఆక్రమాలు, మీటర్లు తిరగకుండా చేస్తున్నవారు లేరా ? స్వయంగా ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌ను చూద్దాం. హైదరాబాద్‌ పాతబస్తీలో విద్యుత్‌ చౌర్యం జరుగుతోందని బిజెపి ఆరోపిస్తున్న, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న తెలంగాణాలో డిస్కామ్‌ల రుణం రు.62వేల కోట్లు దాటింది. ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడేవారి మీద ప్రయోగానికి అక్కడ యోగి బుల్డోజర్లు సిద్దంగా ఉంటాయి, రెండింజన్ల పాలన. రెండు దశల్లో ఉదరు పథకాన్ని అమలు జరిపిన తరువాత చూస్తే పంపిణీ సంస్థల నష్టాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు.జూలై నెలలో పదహారవ ఆర్థిక సంఘానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సమర్పించిన పత్రంలో 2022-23సంవత్సరం నాటికే దేశంలో అన్ని పంపిణీ సంస్థలకు పేరుకు పోయిన నష్టాల మొత్తం రు.6.77లక్షల కోట్లు, వీటిలో సమర్దవంతమైన పాలన సాగిస్తున్నట్లు చెబుతున్న యోగి ఏలుబడిలో ఉత్తర ప్రదేశ్‌ వాటా పదిహేనుశాతం అంటే లక్ష కోట్లు దాటింది, ఈ నష్టాలు సగటున ఏటా పదిశాతం పెరుగుతున్నట్లు చెబుతున్నందున మరుసటి ఏడాదిలో మరో పదివేల కోట్లు అదనం, రాజస్తాన్‌ వాటా కూడా పదిహేనుశాతం, మరోబిజెపి పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో పదిశాతం నష్టాలు ఉన్నాయి.తెలంగాణాలో కూడా పదిశాతం ఉన్నాయి. వినియోగదారుల మీద భారాలు మోపటానికి బదులు గడచిన పదేండ్లుగా విద్యుత్‌ ప్రసార నష్టాలను తగ్గించేందుకు కేంద్రం పూనుకొని ఉంటే ఎంతో మేలు జరిగేది. మోడీ సర్కార్‌ దాని మీద కేంద్రీకరించి ఉంటే ఈ పాటికి ఎంతో మేలు జరిగి ఉండేది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న 2014 వివరాల ప్రకారం మనదేశంలో ఆ నష్టాలు 19.33శాతం ఉంటే బంగ్లాదేశ్‌లో 11.4, శ్రీలంకలో 11 పాకిస్తాన్‌లో 17.14 శాతం ఉండగా చైనాలో 5.47శాతం ఉంది.ప్రపంచంలోని 138దేశాల సూచికలో మనం 25వ స్థానంలో ఉండగా చైనా 119వదిగా ఉంది. అందువలన ఈ విఫల పధకం గురించి కాంగ్రెస్‌-బిఆర్‌ఎస్‌ దెబ్బలాడుకుంటే ప్రయోజనం లేదు.వినియోగదారుల మీద భారాలు మోపటాన్ని సమర్ధిస్తున్న బిజెపిని ఎండగడుతూ విధానాన్ని వ్యతిరేకించేందుకు పూనుకోవాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెల్లెలు షర్మిల రాజకీయం : వసుదేవుడి స్థితిలో అన్న వైఎస్‌ జగన్మోహనరెడ్డి ?

01 Monday Jan 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, BRS, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, tdp, TDP, Telangana, Ycp

≈ Leave a comment

Tags

#YS Sharmila, ANDHRA PRADESH, Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


కాంగ్రెస్‌లో చేరవద్దు, అన్నతో చేతులు కలిపి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగాలని, అక్కడ ఉన్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయిస్తామని సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెల్లెలు షర్మిలకు రాయబారం పంపినట్లు, ఆమె తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమా కాదా అన్నది పెద్దగా ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. అన్నతో కలిస్తే లేదా లడాయికి దిగితే జరిగే పరిణామాలు, పర్యవసానాలు ఏమిటన్నదే చర్చ. నిజానికి షర్మిల కాంగ్రెస్‌లో చేరటం తెలంగాణా ఎన్నికలకు ముందే ఖరారైంది. ఆమె ఎక్కడ తన నూతన ప్రస్థానాన్ని ప్రారంభిస్తే పార్టీకి ప్రయోజనం అన్న తర్జనభర్జనల తరువాత చివరికి ఆంధ్రప్రదేశ్‌ను కార్యస్థానంగా ఎంచుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. ఇది వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఊహించని పరిణామేమీ కాదు. తెలంగాణాలో తిరిగి బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని వేసుకున్న లెక్కల పరీక్షలో జగన్‌ తప్పారు. అతని ధీమా గురించి ఎరిగిన వైసిపి అభిమానులు తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ విజయం మీద ధీమాతో పెద్ద మొత్తంలో పందాలు కాసి చేతులు కాల్చుకున్నారు.సోదరి కాంగ్రెస్‌ ప్రవేశం గురించి ఆ ఎన్నికలకు ముందు తరువాత అంచనాల్లో మార్పులతో జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు పూనుకున్నారని చెబుతున్నారు. తల్లీ, చెల్లిని ఇంటి నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి గెంటివేశారన్న విమర్శలకు జగన్మోహనరెడ్డి గానీ, వైసిపి నేతల వద్దగానీ సరైన, సమర్ధనీయమైన సమాధానం లేదు. షర్మిలను ఇంటికి ఆహ్వానించటం అంటే తల్లిని కూడా చేరదీయటమే అవుతుందని, తమ మీద ఉన్న విమర్శలకు సమాధానం చెప్పినట్లు అవుతుందని వైసిపి నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.తమ నేత అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారని, చిప్పకూడు తిన్నారని తెలుగుదేశం, జనసేన ఇతర పార్టీలు, మీడియా చేస్తున్న దాడిని తక్కువ చేసేందుకు, మీ నేత కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు, అదే చిప్పకూడు తిన్నారు అని తమ గణాలకు ఒక ఆయుధం ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడిని కేసులతో జైలుకు పంపారన్న విమర్శలు, ఆ ఉదంతాన్ని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. షర్మిలను దగ్గరకు తీయటం జరుగుతుందా ?


రాజకీయాల్లో ఏదీ అనూహ్యం కాదు, ఎవరు ఎప్పుడు దేనికి ఎవరితో చేతులు కలుపుతారో ఊహించలేము.నారా లోకేష్‌కు క్రిస్మస్‌ బహుమతి పంపిన షర్మిల తీరును సాధారణ అంశంగా కొట్టివేయలేము. ఊహాగానాల్లో ఉన్న అంశం ప్రకారం షర్మిల తన అన్న జగన్మోహనరెడ్డితో కలిస్తే జరిగేదేమిటి ? అన్న చేసిన అన్యాయానికి ఎంత లబ్దిపొంది చేతులు కలిపారు అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే అన్నా-చెల్లెళ్లు ఒకటైతే తెరవెనుక షర్మిలకు జరిగే లాభం ఏమిటో వెల్లడికాదు కానీ తెరముందు జగన్‌కు అది పెద్ద నష్టానికి దారి తీస్తుంది. ఓట్ల పరంగా షర్మిల తెచ్చేదేమీ ఉండదు. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందన్న లోకోక్తి తెలిసిందే. అయితే పురాణాల్లో అది ఒక మహత్తర కార్యం కోసం అలా చేశారని సమర్దిస్తారు. కానీ షర్మిల కోసం జగన్‌ తలవంచినా, ఒక అడుగువెనక్కు తగ్గినా సమర్థన జనానికి ఎక్కదు. ఓడిపోయే పరిస్థితి వచ్చింది కనుకనే అలా చేస్తున్నారని అనుకోవటం ఖాయం. అదే జరిగితే వైసిపి శ్రేణుల్లో జగన్‌ మీద ఉన్న విశ్వాసం మరింతగా సన్నగిల్లుతుంది, డొల్లతనం బయటపడుతుంది, ఓటర్ల మీద ప్రతికూల ప్రభావంతో మరింత నష్టం జరుగుతుంది. తమకు ఎవరితో పనిలేదని ఇంతకాలం చేసిన ప్రచారానికి ఎదురుదెబ్బ. అలాగాక రాయబారం లేదా బేరాన్ని షర్మిల తిరస్కరించినట్లు వచ్చిన వార్తలు నిజమే అయితే అది కూడా జగన్‌కు ఎదురుదెబ్బే. వ్రతం చెడ్డా ఫలం దక్కని స్థితి. దాన్ని కూడా జగన్‌ బలహీనతగానే ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చేస్తాయి. ఎలా జరిగినా అన్నను చెల్లెలు ఇరకాటంలోకి నెట్టినట్లే. బహుశా జగన్‌ లేదా సలహాదారులు దీన్ని ఊహించి ఉండరు.


2024 ఎలా ఉంటుందో తెలియదు గానీ 2023 వైఎస్‌ జగన్‌కు నిద్రలేని రాత్రులతో వీడ్కోలు పలికిందని చెప్పవచ్చు. మరోవైపు తెలుగుదేశ-జనసేన కూటమికి ఆశావహ సూచనలతో 2024 స్వాగతం పలికింది.అయితే బిజెపితో తెలుగుదేశం సయోధ్యకు పూనుకున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే ఆ సంతోషం తాత్కాలికమే కావచ్చు.నాలుగు లోక్‌సభ, పన్నెండు అసెంబ్లీ స్థానాల కోసం బిజెపి బేరమాడుతున్నట్లు చెబుతున్నారు. ఒప్పందం కుదురుతుందా లేదా ప్రచారమేనా, ఎన్ని సీట్లు కొనుక్కుంటారు అన్నది పక్కన పెడితే వచ్చే పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. 2004లో బిజెపితో చేతులు కలిపి చేతులు కాల్చుకున్న చంద్రబాబు నాయుడు పదేండ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.2014లో బిజెపితో ముడివేసుకొని ఐదేండ్లూ కాపురం చేయకుండానే ఎవరిదారి వారు చూసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు చేసిన విమర్శలకు ఫలితాల తరువాత మోడీ, ఇడి, ఐటి, సిబిఐలను చూసి తెలుగుదేశం నోటికి తాళం వేసుకుంది. ఇప్పుడు వైసిపిని ఓడించటమనే ఏకైక అజండా తప్ప బిజెపి- తెలుగుదేశం కలవటానికి మరొక కారణం లేదు. అధికార యావతప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని జనం భావిస్తారు. తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని కర్ణాటకలో బిజెపి నేతలు స్వయంగా ప్రకటించారు. రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల తీరుతెన్నులు చూసినపుడు మైనారిటీలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు ఓటుచేసినట్లు స్పష్టమైంది. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించింది వైఎస్‌ జగన్మోహరెడ్డి అయితే వెనుక నుంచి ప్రోత్సహించింది లేదా మీ ఇష్టం అన్నట్లు వ్యవహరించింది బిజెపి అని తెలుగుదేశం శ్రేణులు భావించాయి. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపటాన్ని ఎంతవరకు జీర్ణించుకుంటాయి ?ప్రస్తుతం తెలుగుదేశం కూటమి, వైసిపి మధ్య నువ్వానేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాంటపుడు వచ్చే-పోయే ప్రతి ఓటుకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణా, రాజస్థాన్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికార మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే.


అధికారమే పరమావధిగా ఉన్న రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులూ ఎవరూ ఉండరు.ఇప్పటి వరకు తెరవెనుక వైసిపి మద్దతుదారుగా ఉన్న బిజెపి ఒక్కసారిగా తెరముందు తెలుగుదేశంతో చేతులు కలిపితే షర్మిల చేరిన కాంగ్రెస్‌తో జగన్మోహనరెడ్డి చేతులు కలిపే అవకాశాన్ని కొట్టిపారవేయలేము. ఇప్పుడు అది ఊహాజనితమే కావచ్చు. జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదని, కేసులు బనాయించిందన్న దుగ్దతప్ప కాంగ్రెస్‌తో వైసిపికి ఇతర పంచాయితీ ఏముంది. తన సత్తాఏమిటో జగన్‌ నిరూపించుకున్నందున అతనితో కలిసేందుకు కాంగ్రెస్‌కూ ఇబ్బంది ఉండదు. దానికి పార్టీ పునరుద్దరణ ముఖ్యం తప్ప మరొకటి కాదు. పాత సంవత్సరం తెలుగుదేశానికి ఒక పీడకల అని చెప్పాలి. చంద్రబాబునే అరెస్టు చేయించిన జగన్మోహనరెడ్డి తమ మీద కేంద్రీకరిస్తే ఏమిటన్న ఆందోళన తెలుగుదేశ శ్రేణుల్లో తలెత్తిందన్నది కాదనలేని వాస్తవం. ఒక విధంగా చంద్రబాబు నాయుడి మీద బనాయించిన కేసు, రిమాండ్‌కు పంపటం తెలుగుదేశం కార్యకర్తల్లో ఇంతకంటే ఏం చేస్తారు అన్న తెగింపును కూడా తెచ్చింది. బెయిలు వచ్చిన తరువాత వారిలో చలి వదిలింది..


మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధి చేస్తామనే పేరుతో వైసిపి ఆడిన క్రీడ వికటించింది.వట్టిస్తరి మంచినీళ్లు అన్నట్లుగా అభివృద్దీ లేదు, దానికి రోడ్‌మాపూ లేదు. అమరావతిని గాలికి వదలివేశారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రకరకాల ఆందోళనలను, న్యాయపోరాటాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద, గత ఒప్పందాలను విస్మరించటం మీద కేసులు దాఖలు చేశారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని అన్న ప్రచారం అక్కడ భూ దందాలకు తెరలేపేందుకే అన్న సంగతిని ఆ ప్రాంత వాసులు ఇప్పటికే గుర్తించారు.ముహూర్తాలు ఎన్నో చెప్పారు. చివరికి 2023 నవంబరు 22న జారీచేసిన ఉత్తరువులో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పధకాల సమీక్షల నిమిత్తం ముఖ్యమంత్రి, శాఖాధిపతుల క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానిలో ఎక్కడా కార్యనిర్వాహక రాజధాని అనే పదం లేదు. చివరికి కోర్టులో కేసు దాఖలు కావటంతో అది కూడా ఆగిపోయింది. ఇది జగన్‌కు ఊహించని దెబ్బ. కోర్టు కేసు ఇప్పట్లో తేలే అవకాశాలు లేవు. ఈ లోగా ఎన్నికల షెడ్యూలు ప్రకటన రానుంది. కాళేశ్వరాన్ని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్న బిఆర్‌ఎస్‌ ఆశలను మేడిగడ్డ బారేజ్‌ పిల్లర్ల కుంగుబాటు ఎలా దెబ్బతీసిందో చూశాము. వైసిపికి మూడు రాజధానుల అంశం కూడా అలాంటిదే. ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసేందుకు మాత్రమే పనికి వస్తుంది తప్ప జనాన్ని మెప్పించేది కాదు.


జగన్మోహనరెడ్డికి 2023 మిగిల్చిన మరో ఆశాభంగం స్కిల్‌డెవలప్‌మెంట్‌, ఇతర కేసులు. తెలుగుదేశం పార్టీ నేతలను ప్రత్యేకించి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌లను వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు లేదా కనీసం ఎన్నికల తేదీ వరకు జైలుకు పంపి ప్రచారానికి దూరం చేయటం, అంతకంటే ముఖ్యంగా అగ్రనేతలకే ఏ గతి పట్టిందో చూడండి అని తెలుగుదేశం శ్రేణులను భయపెట్టేందుకు చూశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈకేసుల్లో సిఐడి వ్యవహరించిన తీరు ఊహించినదానికంటే ముందుగానే జనసేనను తెలుగుదేశానికి మరింతదగ్గర కావించింది. చంద్రబాబు నాయుడిపై బనాయించిన కేసు బలం, తమ ప్రభుత్వం గురించి గొప్పగా ఊహించుకున్న వైసిపి శ్రేణులు పైకి చెప్పుకోలేని విధంగా తీవ్ర ఆశాభంగం చెందాయి. నాలుగేండ్లు మౌనంగా ఉండి 2023 చివరిలో చంద్రబాబును ముద్దాయిగా చేర్చటం విఫల రాజకీయ వ్యూహంలో భాగమే. బెయిలు రాదు అనుకున్న చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావటమే కాదు, రాజకీయ ప్రచారం చేసుకొనేందుకు కూడా కోర్టు అనుమతించింది. మంత్రులు, ఎంఎల్‌ఏల పని తీరు మీద అటు జనంలోనూ ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉన్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వచ్చాయి. ఎంఎల్‌ఏలు, ఎంపీలను వదిలించుకొనేందుకు, వీలుగాకపోతే బదిలీలు చేసేందుకు జగన్‌ పూనుకున్నారు. పొమ్మనకుండా పొగపెట్టినట్లు ముందుగానే భారీ మొత్తంలో నిధి సమర్పించుకోవాలని చెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. వైసిపికి 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని ఇంటలిజెన్స్‌ ఇచ్చిన నివేదిక పేర్కొన్నట్లు చెబుతున్నారు. అధికారానికి కావాల్సిన సంఖ్య 88, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వైసిపి మునిగిపోయే నావ మాదిరి ఉంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రక్షించటం కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అడ్దా మీది కూలీ మాదిరి రాష్ట్ర ఆర్థిక స్థితి: భారాలు మోపితే జనానికి ఆగ్రహం ! రేవంత రెడ్డి కత్తిమీద సాము !!

23 Saturday Dec 2023

Posted by raomk in BRS, Congress, Current Affairs, Economics, NATIONAL NEWS, Politics, Telangana

≈ Leave a comment

Tags

A Revanth Reddy, Telangana CM, Telangana CM Revanth Reddy, Telangana White Papers


ఎం కోటేశ్వరరావు


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి ఎన్నికలకు ముందు, ఫలితాల తరువాత ప్రకటించిన మేరకు వివిధ అంశాల మీద శ్వేత పత్రాలను ప్రకటిస్తూ జనాలకు వాస్తవాలను వెల్లడించే ఒక మంచి పని చేస్తున్నారు. మిగిలిన వాటి మీద కూడా వెంటనే ప్రకటిస్తారని ఆశిద్దాం. వీటికి పోటీగా స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని బిఆర్‌ఎస్‌ ప్రకటించింది. మథనం జరగటం మంచిదే. దేన్నయినా మూసిపెడితే పాచిపోతుందన్నది ఒక సామెత. అధికారానికి వచ్చిన కొత్తలో గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు శ్వేత పత్రాను విడుదల చేశాయి. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ రోజుల్లో సోషల్‌ మీడియాలో వస్తున్న సమాచారం గందరగోళాన్ని సృష్టిస్తున్నది.పైకి ఎన్ని సుభాషితాలను వల్లించినా మీడియా రాజకీయ శిబిరాల వారీ చీలి నాణానికి ఒకవైపు మాత్రమే చూపుతూ తాను మద్దతు ఇచ్చే పక్ష ప్రతికూల సమాచారాన్ని తొక్కిపెడుతున్నది. చాకుతో కూరగాయలతో పాటు మెడను కూడా కోయవచ్చు. శ్వేతపత్రాలు కూడా అలాంటివే. జనానికి వాస్తవాలు చెప్పే మంచితో పాటు ఆ సమాచారాన్ని చూపే పాలకులు వాగ్దాన భంగాలకూ పాల్పడవచ్చు. గత అనుభవాన్ని బట్టి దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. ఎవరి మీదా భ్రమలు పెట్టుకోనవసరం లేదు.


తెలంగాణా ఆర్థిక స్థితి గురించి వెల్లడించిన పత్రంలోని వివరాలు, రాష్ట్ర సర్కారుకు ఎదురయ్యే సవాళ్ల గురించి చూద్దాం. గత పాలకులు చెప్పినదానికి భిన్నంగా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో అప్పులు చేసింది..2014లో రాష్ట్ర విభజన సమయంలో ఉన్న అప్పు రు.72,658 కోట్లు. 2023 డిసెంబరు నాటికి అది రు.6,12,343 కోట్లకు పెరిగింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న (ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితికి లోబడి) రుణం రు.3,89,673 కోట్లు.పదిహేడు నిర్దిష్ట అవసరాల కోసం( స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌) తీసుకున్న అప్పు రు.1,27,208 కోట్లు, ప్రభుత్వ హామీతో 14 సంస్థలు తీసుకున్న మొత్తం రు.95,462 కోట్లు ఉన్నాయి. ఇవిగాక జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి వంటి వివిధ సంస్థలు స్వంతంగా తీసుకున్న రుణాల బకాయిలు రు.59,414 కోట్లు కూడా కలుపు కుంటే మొత్తం బకాయిలు రు.6,71,757 కోట్లని శ్వేత పత్రంలో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా లోకానికి చూపించిన కాళేశ్వరం పధకానికి రుణ మంజూరు రు.97,449 కోట్లు కాగా విడుదల చేసింది రు.79,287 కోట్లు, దీని అప్పు ఇంకా రు.74,590 కోట్లు ఉంది. ఈ రుణాలకు గాను చెల్లిస్తున్న అసలు, వడ్డీలు 2015లో మొత్తం రు.7,255 కోట్లు(బడ్జెట్‌ రాబడిలో 14శాతం) ఉంటే 2023లో రు.53,978 కోట్ల(బడ్జెట్‌లో 34శాతం)కు చేరాయి. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర జిఎస్‌డిపిలో 25శాతం వరకు అప్పులు తీసుకోవచ్చు. ప్రస్తుతం 27.8శాతంగా ఉన్నాయి. ఇవిగాక ఇతరంగా తీసుకున్న అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే 36.9శాతానికి చేరాయి. దీంతో రాష్ట్ర రుణ అర్హత పరిమితి తగ్గింది.


బడ్జెట్‌ కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయటం లేదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో తేడా ఎక్కువగా ఉందని శ్వేత పత్రం పేర్కొన్నది.2004 నుంచి 2014 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో మొత్తంగా 87శాతం ఖర్చు చేశారు. తెలంగాణా ఏర్పడిన తరువాత అది 82.3శాతానికి దిగజారింది. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం 2021-22లో పద్దెనిమిది సాధారణ రాష్ట్రాలలో రాజస్థాన్‌ 116.4శాతంతో ప్రధమ స్థానంలో ఉండగా పదిహేడవదిగా ఉన్న తెలంగాణాలో 79.3శాతమే ఖర్చు చేశారు. చివరిదిగా 74.7శాతంతో పంజాబ్‌ ఉంది. కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఇతరులకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తం రు.40,155 కోట్లు ఉంది. నిధులు లేనపుడు వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌ డ్రాప్టుల రూపంలో ఆర్‌బిఐ నుంచి రుణాలు తీసుకొనే సౌకర్యం ఉంది. అడ్డామీద కూలీకి ఏరోజు పని దొరికితేనే ఆ పూట భుక్తి. రాష్ట్ర స్థితి కూడా అలాంటిదే. ఈ కారణంగానే ప్రతి నెలా ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటవ తేదీనే చెల్లించలేని స్థితి. పిఆర్‌సి, కరువు భత్యం వాయిదాల పద్దతిలో చెల్లిస్తుండగా, సకాలంలో మంజూరు చేయకుండా సంవత్సరాల తరబడి నిలిపివేస్తున్నారు.(ప్రస్తుతం రేవంత రెడ్డి రైతు బంధును కూడా దశలవారీ విడుదల చేస్తున్న కారణం అదే.) .2015-16లో కేవలం రెండు సార్లు మాత్రమే మాత్రమే వేస్‌ అండ్‌ మీన్స్‌ సౌకర్యాన్ని వినియోగించుకోగా తరువాత సంవత్సరాల్లో క్రమంగా పెరిగింది. 2022-23లో ఏడాదిలో 328 రోజులు తీసుకున్నారు. వర్తమాన సంవత్సరంలో నవంబరు 23 నాటికి 214 రోజులు తీసుకున్నారు. రేవంత రెడ్డి సర్కార్‌కు సైతం మరో మార్గం లేదు.2014-15లో గరిష్టంగా 303 రోజులు నగదు నిల్వలు ఉండగా ప్రస్తుతం అవి 30 రోజులకు పడిపోయాయి.


నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నందున ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన జరిగింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడదీసి తెలంగాణాను ఏర్పాటు చేసినపుడు ఆస్తులు-అప్పుల విభజన 58-42 దాషామాతో జరిగింది. దీనికి జనాభా ప్రాతిపదిక. ఉమ్మడి రాష్ట్రంలో 1956-57లో వాస్తవ వ్యయం రు.79 కోట్లు కాగా తెలంగాణా వాటా రు.33 కోట్లు. రాష్ట్రం విడిపోయే నాటికి మొత్తం వ్యయం రు.11,94,945 కోట్లు కాగా తెలంగాణాలో ఖర్చు రు.4,98,053 కోట్లు అంటే 41.68శాతం ఉంది.( రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు వాటిలో పెట్టుబడులను కూడా కలుపు కుంటే తెలంగాణాలో అంతకంటే ఎక్కువ మొత్తమే ఖర్చు జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చిన ప్రైవేటు పరిశ్రమల పెట్టుబడులు వీటిలో లేవు. వీటి గురించి శ్వేత పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు)


ఇక విద్యుత్‌ రంగ పరిస్థితి మీద విడుదల చేసిన పత్రంలో ఉన్న వివరాల ప్రకారం పది సంవత్సరాల నాడు పంపిణీ కంపెనీలు(డిస్కామ్స్‌) రు.12,186 కోట్ల నష్టాలతో ఉండగా ప్రస్తుతం రు.62,461 కోట్లకు చేరాయి. ప్రభుత్వ బకాయిలే రు.43,770 కోట్లు ఉన్నాయి.విద్యుత్‌ క్రమబద్దీకరణ కమిషన్‌ ముందు ప్రతిపాదించి ఆమోదం పొందిన దానికన్నా వాస్తవిక వ్యయం పెరిగితే దాన్ని ట్రూ అప్‌ ఛార్జీలు అంటారు.తాత్కాలిక అవసరాల కోసం కొనుగోలు చేసిన విద్యుత్‌ యూనిట్‌ ధర రు.5.86 నుంచి గరిష్టంగా రు.20వరకు ఉంది.ఒక్క 2022-23లోనే ట్రూఅప్‌ ఛార్జీల మొత్తం రు.12,550 కోట్లు. ఇవిగాక క్రమబద్దీకరణ కమిషన్‌ ఆమోదం పొందిన సమయంలో విద్యుత్‌ తయారీకి వినియోగించే బొగ్గు, గ్యాస్‌ వంటి ఇంథన ధరల్లో పెరుగుదల ఎంత ఉంటే అంత సర్దుబాటు చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయవచ్చు.ఇవి, ట్రూఅప్‌ ఛార్జీలను సబ్సిడీగా ప్రభుత్వం భరించాలి లేదా వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. ఇంత భారం జనాల నుంచి వసూలు చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఎన్నికలను గమనంలో ఉంచుకొని వాటిని తామే చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది తప్ప ఇంతవరకు చెల్లించలేదు. ఇవన్నీ భారాల రూపంలో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ మెడకు చుట్టుకున్నాయి.


బడ్జెట్‌ పత్రాల్లో ఈ వివరాలన్నీ పొందుపరుస్తున్నప్పటికీ వివిధ ఖాతాల్లో చూపుతారు. వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చటం సామాన్యులకు సాధ్యం కాదు గనుక వాటి జోలికి పోరు. అధికార యంత్రాంగం గారడీ చేస్తుంది. శ్వేత పత్రంలో వాటి సారాన్ని ఒక దగ్గరకు చేర్చుతారు గనుక సూటిగా అర్ధం అవుతాయి. ఈ పత్రాలపై చర్చ సందర్భంగా అసెంబ్లిలో, వెలుపలా అధికార పార్టీకి చెందిన వారు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారిందని తమకు ముందు తెలియలేదని, అధికారికంగా సమీక్షల్లో చూసిన తరువాతనే తీవ్రత అర్ధమైందని మాట్లాడుతున్నారు. వీటిని చూస్తే గతం గుర్తుకు వస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి నేత వై.ఎస్‌ .జగన్మోహనరెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు జరుపుతామని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకున్నారు. తరువాత అడ్డం తిరిగి దాని గురించి తెలియక మేము వాగ్దానం చేశాము, దాని బదులు కొత్త పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు, పార్టీ నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించి మడమ తిప్పారు.ఐదు సంవత్సరాల్లో మద్యనిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి దాని గురించి ఇప్పుడు అసలు మాట్లాడటమే మానుకున్నారు. ఎందుకంటే దాని మీద వచ్చే రాబడిని వదులుకోవటానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. ఆర్థికంగా పరిస్థితి దిగజారి నవరత్నాలకు కోతపెట్టాల్సి వస్తుందన్నదే దీని వెనుక ఉన్న అసలు కారణం. తెలంగాణా రాష్ట్ర సమితి తాము అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పింది. తీరా అడ్డం తిరిగి కొనటానికి భూమి లేదని తప్పించుకున్నది.ఇలా ఎన్ని ఉదాహరణలనైనా చెప్పుకోవచ్చు.


రేవంత రెడ్డి సర్కార్‌ ముందు తీవ్ర సవాళ్లు ఉన్నాయి. గత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులుకేటాయించి విద్యుత్‌ సంస్థలు, ఇతరులకు పెద్ద ఎత్తున బకాయి పెట్టింది. అప్పులు తెచ్చుకొనే అవకాశాలన్నింటినీ వాడుకొని కొత్తగా పుట్టకుండా చేసింది. వడ్డీ, అసలు వాయిదాలకే పరిమితంగా తీసుకొనే అప్పు సరిపోదు. రైతు బంధు పధకంలో పెద్ద రైతులకు మినహాయిస్తామని చెప్పినందున దాని వలన పెద్దగా మిగిలేదేమీ ఉండదు. ఎందుకంటే అర్హులకు గతం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పటంతో పాటు కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలకు నగదు అందిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది.లబ్దిదారుల గుర్తింపు విధి విధానాలను ఇంకా ప్రకటించలేదు.లోక్‌సభ ఎన్నికలలోపు వాటిని విడుదల చేస్తే దాని ప్రభావం ఎన్నికల మీద పడుతుంది. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్‌ వస్తుందని చెబుతున్నారు గనుక అప్పటి వరకు శ్వేత పత్రాలు, వాటి మీద చర్చ, తక్షణమే నగదుతో పనిలేని పధకాలను ప్రారంభించవచ్చు. విద్యుత్‌ సంస్థలకు బకాయిలు పెట్టినందుకు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌ అంత పెద్ద మొత్తాలను వెంటనే ఎలా తీరుస్తుందన్నది ప్రశ్న. ఉద్యోగులు వేతనాలు, పెన్షన్లు పెరిగేవే తప్ప తగ్గవు.వడ్డీల చెల్లింపు తప్పదు.ఈ కారణంగా ప్రకటించిన హామీలను తక్షణమే అమలు కాకుండా సాగదీసే అవకాశం ఉంది. తక్షణమే వాగ్దానాలను అమలు చేస్తామని చెప్పినందున సహజంగానే జనం కూడా అలాగే ఎదురు చూస్తారు.ఫిబ్రవరి లేదా మార్చినెలలో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అనుమతి తప్ప పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే అవకాశం లేదు గనుక ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో వెంటనే జనానికి తెలిసే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రేవంత రెడ్డి సర్కార్‌ రైతు బంధు నిధులను వెంటనే ఎందుకు విడుదల చేయలేదు !

10 Sunday Dec 2023

Posted by raomk in BJP, BRS, Congress, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, Uncategorized, Women

≈ Leave a comment

Tags

CAG Telangana, Congress' 6 poll guarantees, New Telangana CM, Revanth Reddy, rythu bandhu beneficiaries, Telangana finances


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా మూడవ శాసనసభ డిసెంబరు తొమ్మిదవ తేదీన ప్రారంభమైంది. మంత్రులకూ శాఖలు కేటాయించారు.వారింకా కొలువు తీరలేదు.శాసనసభ్యులు ప్రమాణస్వీకారాలు చేసిన తరువాత పద్నాలుగవ తేదీకి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. మూడు రోజుల పాటు సభ జరుగుతుందని, ఆ సందర్భంగా కొన్ని శ్వేత పత్రాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నట్లు చెబుతున్నారు. కాలిగోళ్లపుడే కాపురం చేసే కళ తెలుస్తుందన్నట్లు బిజెపి తనదైన మతరాజకీయాలను ప్రోటెం స్పీకర్‌ నియామకంతోనే ముందుకు తెచ్చింది. మజ్లిస్‌-కాంగ్రెస్‌ బంధానికి తెరలేచినట్లు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. భక్తులు తమదైవం రాముడి కంటే రావణుడినే ఎక్కువగా తలచుకుంటారన్నట్లుగా బిజెపినేతలకు మజ్లిస్‌ పేరు పలకకుండా నోట మాటరావటం లేదు. పాతబస్తీలో మజ్లిస్‌ పోటీ పెట్టని గోషామహల్‌ నియోజకవర్గం ఒక్కదానిలోనే బిజెపి గెలిచింది. వారి మధ్య ఉన్న తెరచాటు బాగోతాలకు ఇది నిదర్శనమని ఎన్నికలకు ముందే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.మజ్లిస్‌ పార్టీ ఎంఎల్‌ఏ అక్బరుద్దీన్‌ ప్రోటెం స్పీకర్‌గా ఉన్నందున ప్రమాణ స్వీకారం చేసేది లేదని పార్టీ నేతలతో చర్చించకుండా అక్కడ గెలిచిన రాజాసింగ్‌ ప్రకటించటంతో అంతేకదా అంతేకదా అన్నట్లుగా బిజెపి ఆమోదించింది. ప్రోటెంస్పీకర్‌గా సీనియర్‌గా ఉన్న కెసిఆర్‌ సభకు రాలేని స్థితిలో అర్హత ఉన్నవారిలో ఎవరినైనా ఎంచుకొనే స్వేచ్చ ఉందని కాంగ్రెస్‌ సమర్ధించుకుంది. ఏ ప్రయోజనమూ లేకుండా ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని భావించలేము. ఎవరు అధికారంలో ఉంటే వారికి దగ్గరగా మజ్లిస్‌ ఉంటుందన్న అభిప్రాయాల పూర్వరంగంలో ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. బిఆర్‌ఎస్‌ నేత, మాజీ సిఎం కె చంద్రశేఖరరావు తన వ్యవసాయ క్షేత్రంలోని స్నానాల గదిలో జారిపడి ఆసుపత్రిపాలయ్యారు.దీనికి కెసిఆర్‌ వయస్సు,బాత్‌ రూం స్థితి కంటే అసలు కారకులు జ్యోతిష్కులంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు. ఎందుకంటే వారిలో ఏ ఒక్కరూ ఎన్నికల తరువాత బాత్‌ రూం గండం ఉంటుందని చెప్పకపోవటమే కారణమని, చెప్పి ఉంటే కెసిఆర్‌ అసలు వెళ్లి ఉండేవారు కాదని అంటున్నారు. మూడోసారి సిఎం కావటం ఖాయమంటూ చెప్పిన వారి జోశ్యాలు తలకిందులు కావటంతో బాత్రూంలో పడకముందే బహిరంగంగా కెసిఆర్‌ నోట మాటరాలేదు.


ఎనుముల రేవంత్‌ రెడ్డి సింఎంగా ప్రమాణస్వీకారం చేయగానే తీసుకున్న చర్యలను చూసి కొందరు ఎంతదూకుడుగా ఉన్నారో చూడండని వ్యాఖ్యలు చేశారు.మహలక్ష్మి పధకంలో మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణాన్ని సాకారం చేశారు.ఆరోగ్య శ్రీ పధక మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచారు. ఆర్‌టిసి ప్రభుత్వానిదే కనుక వెంటనే అమల్లోకి వచ్చింది.గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పధకం కింద పెద్ద మొత్తంలో బకాయి పడినందున ప్రయివేటు ఆసుపత్రులు అమలు జరిపేందుకు మొరాయించిన సంగతి తెలిసిందే. బకాయిలు ఎంత ఉన్నదీ వెల్లడికావాల్సి ఉంది. ఎక్కడన్నా బావే కానీ వంగతోటదగ్గర కాదన్నట్లుగా కార్పొరేట్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం ఏదైనా ఒకటే. బకాయిలను వెంటనే చెల్లిస్తుందా లేదా అన్నదే గీటురాయి.చెల్లిస్తేనే పధకం అమలు జరుగుతుంది. ఈ రెండింటికీ వెంటనే నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉండదు. అందుకే వెంటనే ప్రకటించారన్నది స్పష్టం. ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీవీలలో చర్చలు మొదలయ్యాయి.రైతుబంధు నిధులు విడుదల నిలిచిపోవటానికి కాంగ్రెసే కారణమంటే కాదు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్‌ రావు ఎన్నికల ప్రచార నియమావళి ఉల్లంఘనే కారణమని ఎన్నికలకు ముందు ఆయా పార్టీల వారు వాదించారు. ఎన్నికల కమిషన్‌ కూడా ఉల్లంఘన కారణాన్ని చూపే నిలిపివేయించింది. ఏడవ తేదీన రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత, తొమ్మిదవ తేదీ సోనియాగాంధీ జన్మదినం వచ్చినా ఇంకా విడుదల ఎందుకు కాలేదో చెప్పాలని బిఆర్‌ఎస్‌, బిజెపి ప్రతినిధులు నిలదీస్తున్నారు. ప్రతిపక్షాలుగా వాటికి ఉన్న ప్రశ్నించే హక్కును ఎవరూ కాదనటం లేదు. ఒకటవ తేదీ నాటికి అనేక మంది ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు జరగలేదు. ప్రకటించినట్లుగా వెంటనే రైతుబంధు నిధులను ఎందుకు విడుదల చేయలేదన్న సందేహం కాంగ్రెస్‌ ప్రతినిధుల్లో ఉన్నప్పటికీ బయటకు చెప్పలేని స్థితి.అధికారానికి వచ్చి రెండు రోజులేగా తొందరేముంది అని రాకూడని మాట మంత్రి సీతక్క నోటి నుంచి వచ్చింది.రేవంత రెడ్డి దూకుడుతో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నందున దానికి సంతోషిస్తున్న మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. అనర్హులను తొలగించే కసరత్తు జరపటంలో తప్పులేదు గానీ అది పూర్తైన తరువాతే నిధులు ఇస్త్తామంటే కుదరదు.ఈ విడత గతం మాదిరే కానిచ్చి తరువాత నుంచి ఆ పని చేయవచ్చు.


ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఏడాది మొత్తానికి చేయాల్సిన అప్పులలో ముందుగానే సింహభాగం తీసుకొని గత ప్రభుత్వం ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం ప్రకటించే శ్వేత పత్రంలో వెల్లడవుతాయని ఆశిద్దాం. రెండు వాగ్దానాలను వెంటనే అమలు చేసిన రేవంతరెడ్డి రైతు బంధు నిధులు విడుదల చేయకపోవటానికి ఖజానా ఖాళీగా ఉండటం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. తాము దిగిపోయేనాటికి నగదు నిల్వ ఎంత ఉందో మాజీ మంత్రి హరీష్‌ రావు వెల్లడిస్తే అసలు రంగు బయటపడుతుంది. శ్వేత పత్రంతో నిమిత్తం లేకుండా ఈ పథకానికి నిధులు ఉన్నదీ లేనిదీ ప్రభుత్వం వెంటనే ప్రకటించి ఉంటే జనంలో అనుమానాలు తలెత్తి ఉండేవి కాదు.ప్రతిపక్షాలకు అడిగే అవకాశం వచ్చి ఉండేది కాదు. ఆరు హామీల అమలు అంత తేలిక కాదు. వర్తమాన బడ్జెట్‌ కేటాయింపులు వచ్చే ఏడాది మార్చి వరకు నూతన ప్రభుత్వానికి కాళ్లు చేతులను కట్టిపడవేశాయి. భూముల అమ్మకం, ఔటర్‌ రింగ్‌రోడ్‌ టోల్‌ కాంటాక్టు సొమ్ము వంటి వాటిని ఖర్చుచేశారు. ఒకటో తేదీకి వేతనాలు, పెన్షన్లే చెల్లించలేని స్థితిలో కొత్త వాగ్దానాల అమలు అంత తేలికకాదు. ప్రగతి భవన్‌ గేట్లు బద్దలు చేయించినంత వేగం, సులభమూ ఆర్థిక అంశాల్లో సాధ్యం కాదు. కాగ్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం 2023-24 సంవత్సరానికి ప్రభుత్వ రుణ సేకరణ లక్ష్యం రు.38,234 కోట్లలో అక్టోబరు నాటికే 87.3శాతం అంటే రు.33,378 కోట్లు తీసుకొని ఖర్చు కూడా చేశారు. మరో ఐదు నెలల కాలానికి తీసుకోగలిగింది రు.4,856 కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన నిధులు కూడా వెంటనే రావన్నది తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొన్ని రోజులు ఆలశ్యం చేసినా ఇబ్బందే. అధికారం వస్తుందనుకొని ఆశాభంగం చెందిన బిజెపి వచ్చే లోక్‌సభ ఎన్నికలను గమనంలో ఉంచుకొని వ్యవహరిస్తుందని తెలిసిందే. చెప్పినట్లుగా వాగ్దానం అమలు చేయలేదంటూ ఇప్పటికే ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ రుణాలు రాష్ట్ర జి(ఎస్‌)డిపిలో 25శాతానికి మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే అంతకు మించి అప్పులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు 23.8శాతం ఉంటాయని అంచనా కాగా కాగా వివిధ సంస్థలకు హామీగా ఇప్పించిన అప్పులు 2022-23 నాటికే రు.1,29,244 కోట్లు(11.3శాతం) కలుపు కుంటే 35.1శాతానికి చేరుకుంటాయి. బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2023నాటికి రాష్ట్రప్రభుత్వం 19 సంస్థలకు ఇచ్చిన రుణాల హామీల మొత్తం రు.1,35,282 కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రుద్దుతున్న విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా రైతులకు మీటర్లు పెట్టటం వంటి వాటిని అమలు చేస్తే రుణ అర్హతను కేంద్రం పెంచుతుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆపని చేస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. గత ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్‌ అధికారానికి వచ్చిన వెంటనే అదే చేస్తే అభాసుపాలవుతుంది. మద్యం బెల్ట్‌షాపుల కారణంగా పెద్ద ఎత్తున ఖజానాకు రాబడి వస్తున్నది. వాటిని అనుమతించబోమని చెప్పినట్లుగా వెంటనే అమలు చేస్తే దాని రాబడి కూడా తగ్గి నిధుల కటకట ఏర్పడుతుంది.


గడువు ప్రకారం నిర్వహిస్తే లోక్‌సభ ఎన్నికలకు ముందే పంచాయతీల ఎన్నికలు జరగాల్సి ఉంది.మరోవైపు నరేంద్రమోడీ, బిజెపి కోయిల కూతలను వింటే లోక్‌సభ ఎన్నికలు కూడా రెండు నెలల ముందుగానే జరగవచ్చు అంటున్నారు. ఒకవేళ అవి గడువు ప్రకారమే జరిగినా కొత్త ప్రభుత్వానికి ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌కు అనుమతి తీసుకొని ఎన్నికల తరువాత పూర్తి బడ్జెట్‌ను పెట్టటం తప్ప మరొకమార్గం లేదు. ఆర్థిక పరిస్థితి మీద శ్వేత పత్రం ప్రకటించే వరకు రైతు బంధు నిధుల విడుదల ఆపితే ప్రభుత్వం మీద వత్తిడి, రాజకీయ దాడి పెరుగుతుంది.ఉచిత బియ్యం పథకానికి కేంద్రం ఆమోదించిన కార్డుల కంటే అదనంగా ఉన్నవాటికి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తున్నది. అదనపు కార్డులు ఇస్తే అది పెరుగుతుంది కనుకనే ఏదో ఒకసాకుతో కొత్త కార్డులు ఇవ్వటం లేదు. ప్రకటించిన వివిధ పథకాలకు లబ్దిదారుల ఎంపిక విధానాన్ని కూడా వెంటనే ప్రకటించటం అవసరం. అవన్నీ లోక్‌సభ ఎన్నికల ముందునాటికి పూర్తి చేయకపోతే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తునదాడి చేస్తాయి. ఇలా అనేక సమస్యలున్నందున ఏ విధంగా చూసినప్పటికీ కత్తిమీద సాములా పరిస్థితి ఉంది. జనం కూడా ప్రభుత్వానికి ఎక్కువ సమయం ఇవ్వరు. ఎందుకంటే అధికారానికి రావటమే తరువాయి వెంటనే అమలు అన్నట్లుగా కాంగ్రెస్‌ నేతల ప్రకటనలు ఉన్నాయి. బుల్లెట్‌ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా చేసిన వాగ్దానాలు అమలు జరిపారా లేదా అన్నదానినే జనం, మీడియా వారూ చూస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడట్లుండె, నేడిట్లుండె – దేశంలో తెలంగాణా ఎక్కడుండె !

22 Wednesday Nov 2023

Posted by raomk in BJP, BRS, Congress, Current Affairs, Economics, Education, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS, Telangana, Women, Women

≈ Leave a comment

Tags

BRS, KCR, Telagana politics, Telangana BJP, Telangana CM, telangana Congress, Telengana Elections 2023


ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అంటూ మూడు ప్రధాన పార్టీలు ఓటర్ల ముందుకు ఎన్నికల ప్రణాళికలు, ఓట్లు దండుకునే ప్రచారం, పధకాలతో ముందుకు వచ్చాయి. అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ నాడెట్లుండె-నేడెట్లుండే రేపు ఎలా ఉండబోతుందో చూడండి అంటూ రంగుల కలను జనం ముందు ఉంచింది. అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీ తాను ప్రకటించిన ప్రణాళికను ఎలా అమలు జరుపుతుంది ? దానికి తగిన నిధులు అందుబాటులో ఉన్నాయా ? ఏమి చూసుకొని జనాన్ని వాగ్దానాల జడివానలో తడుపుతున్నది అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి, కేంద్రంలో ఏలుబడి సాగిస్తున్న బిజెపి ఇతర రాష్ట్రాలలో, కేంద్రంలో అమలు జరపని పధకాలను ఇక్కడ ఎందుకు జనానికి చెబుతున్నది, ఎలా అమలు చేస్తుంది ? రాష్ట్ర అధికారపక్షం బిఆర్‌ఎస్‌ గత పది సంవత్సరాలుగా అమలు జరపని వాటిని రానున్న రోజుల్లో అమలు జరుపుతామంటే నమ్మేదెలా అన్న ప్రశ్న సహజంగానే వస్తున్నది. బిఆర్‌ఎస్‌ చెబుతున్నట్లు నిజంగానే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుస్తున్నదా ? దాని పని తీరు ఎట్లుండె అన్నది బడ్జెట్లలో చూస్తే అర్ధం అవుతుంది. అందుకే దాని పని తీరును ఒక్కసారి అవలోకించాల్సిందిగా మనవి.


ఒక పెద్ద మనిషి పదేండ్ల తరువాత బంధువుల ఇంటికి వచ్చాడు. అప్పుడు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని చూశా ఇప్పుమో నడుస్తూ గంతులేస్తున్నడు, ఎంతగా ఎదిగిండో కదా అన్నడట.పిల్లవాడు పుట్టిన తరువాత పెరగకుండా ఎట్లుంటడు ? ఎలా పెరిగిండు, కడుపు నిండా తింటున్నడా, మంచిగా ఆడుకుంటున్నడా, ఆరోగ్యంగా ఉన్నడా లేడా బడికిపోతున్నడా లేదా అన్నది ముఖ్యం. రాష్ట్రమైనా అంతే పదేండ్లనాడు ఉన్న మాదిరే ఇప్పుడు ఎట్లుంటది, మార్పులు వస్తాయి. అవి ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం. రాష్ట్రం, దేశం ఏదైనా అంతే ! దిగువ చూపుతున్న వివరాలలో గత సంవత్సరాల కేటాయింపులు 2023-24 బడ్జెట్‌ ప్రతిపాదనలుగా గమనించాలి. అంకెలు రు. కోట్లు అని గమనించాలి. ఓ.మా రుణం అంటే ఓపెన్‌ మార్కెట్‌ రుణం.
అంశం×××× 2014-15 ××× 2022-23 ×× 2023-24
జిడిపి ×××× 5,05,849 ××× 12,93,000 ×× 14,00,000
అప్పులు ×× 75,577 ××× 4.50,000 ×× 5,00,000
ప్ర.రుణచెల్లింపు× 587 ××× 8,336 ×× 9,341
వడ్డీ,అసలు ×× 6,291 ××× 18.912 ×× 22,400
ఓ.మా.రుణం ×× 8,211 ××× 44, 970 ×× 40,615
లిక్కర్‌ రాబడి×× 10,883 ××× 31,077 ×× 35,000
కే.పన్నువాటా ×× 8,185 ××× 19,668 ×× 21,470
కాపిటల్‌ ఖర్చు×× 8,372 ××× 26,934 ×× 37,525
మూలధన పెట్టుబడి అన్నది రాష్ట్రం, దేశానికైనా కీలకమైనది.2014-15లో ఖర్చు బడ్జెట్‌ మొత్తం ఖర్చు రు.62,306 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.11,633 కోట్లు, 18.6శాతం ఉంది. 2022-23లో సవరించిన అంచనా ప్రకారం ఖర్చు బడ్జెట్‌ రు.2,26,010 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.26,934 కోట్లు,11.9శాతానికి దిగజారింది.2023-24 సంవత్సర ఖర్చు బడ్జెట్‌ రు.2,77,690 కోట్లు కాగా మూలధన పెట్టుబడి రు.37,525 కోట్లుగా ప్రతిపాదించారు.దీన్ని మొత్తం ఖర్చు చేస్తే 13.5శాతం అవుతుంది. బడ్జెట్‌ వివరాలను చూసినపుడు 2021-22లో రు.28,874 కోట్లు వాస్తవ ఖర్చు ఉంది. మరుసటి ఏడాది రు.29,728 కోట్లు ప్రతిపాదించి రు.26,934 కోట్లకు సవరించారు. వాస్తవ ఖర్చు ఇంకా తగ్గవచ్చు. అందువలన వర్తమాన బడ్జెట్‌లో ఎంత కోతపెడతారో తెలియదు. మొత్తం తెలంగాణా వచ్చినపుడు 18.6శాతంగా ఉన్న ఖర్చు క్రమంగా దిగజారటం ఆందోళన కలిగించే అంశం.


పెంచకపోయినా తొలి ఏడాది మూలధన పెట్టుబడి శాతం ఎంత ఉందో దాన్నయినా కొనసాగించాలి కదా ? తెలంగాణా ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో రాష్ట్ర జిడిపిలో అప్పులు16.06శాతం ఉన్నాయి.పదిహేనవ ఆర్థిక సంఘం నిబంధనల(ఎఫ్‌ఆర్‌బిఎం) ప్రకారం అప్పులు 29.5శాతం ఉండవచ్చు. కాగ్‌ నివేదిక 2020-21 ప్రకారం ఆ సంవత్సరంలో అప్పులు 28.1శాతానికి పెరిగాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు. ఇవిగాక ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసిస సంస్థలకు హామీగా ఇప్పించిన రుణాలను కూడా పరిగణనలోకి తీసుకొంటే 38.1శాతంగా ఉన్నాయి. బంగారు బదులు అప్పుల తెలంగాణాగా మార్చారు. పరిమితికి మించి రుణాలు తీసుకున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వలన రుణ అర్హత పరిమితి తగ్గింది. పేరుకు పోయిన అప్పుల మొత్తం పెరుగుతున్నట్లు అంకెలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర జిడిపి ఏటేటా పెరుగుతున్నందున దానితో పోల్చుకున్నపుడు తగ్గుదల కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ అంకెలనే తనకు అనుకూలంగా చూపుతుంది. కొత్తగా తీసుకొనే రుణాల మీద కోత విధించటం కూడా తగ్గుదలకు ఒక కారణం.2023-24 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రుణభారం జిడిపిలో 23.8శాతంగా ఉంటుందని చూపారు. రానున్న రెండు సంవత్సరాల్లో 2025,26 ఆర్థిక సంవత్సరాల్లో ఆ మొత్తం 25శాతానికి పెరుగుతుందని కూడా పేర్కొన్నారు అంతకు ముందు సంవత్సరం 24.3శాతం ఉంది. ముందే చెప్పుకున్నట్లు వీటికి ప్రభుత్వం హామీగా ఉన్న రుణాల మొత్తం 2022-23లో రు.1,29,244 కోట్లు, ఇది జిడిపిలో 11.3శాతం, దీన్ని కూడా కలుపుకుంటే అప్పుల మొత్తం 35.6శాతం ఉంది.


కొన్ని సంక్షేమ పధకాలను చూపి వాటిని తెలంగాణా నమూనాగా ప్రచారం చేస్తున్నారు, అభివృద్ధిలో ముందుందని అంటున్నారు.ఇది వాస్తవమా ? రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్ల వంటి కొన్ని సంక్షేమ పధకాలు అందరికీ తెలిసినవే.ఆరు కీలక రంగాలలో తెలంగాణా దేశంలో ఎక్కడుందో తెలుపుతూ పిఆర్‌ఎస్‌ అనే స్వచ్చంద సంస్థ విశ్లేషణలను అందించింది.2022-23లో తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాల బడ్జెట్‌ కేటాయింపులను పోల్చి చూపింది.ఎంతో పురోగమించింది, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం, అందుకే టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా అవతరించాం అని చెప్పుకోవటంలో వాస్తవం ఎంతో చూద్దాం. బిఇ అంటే బడ్జెట్‌ అంచనా, ఆర్‌ఇ అంటే సవరించిన బడ్జెట్‌ అంచనా.ఆయా రంగాలకు మొత్తం ఖర్చులో తెలంగాణా కేటాయింపు శాతం, చివరి కాలంలో అన్ని రాష్ట్రాల సగటు శాతాలు దిగువ విధంగా ఉన్నాయి.ఆర్‌డి అంటే గ్రామీణాభివృద్ధి.ప.అ అంటే పట్టణ అభివృద్ధి,
రంగం×××2021-22××22-23బిఇ××22-23ఆర్‌ఇ××23-24బిఇ××అ.రా 22-23బిఇ
విద్య ××× 8.7 ×× 7.3 ×× 8.0 ×× 7.6 ××14.8
వైద్యం××× 4.2 ×× 5.0 ×× 5.5 ×× 5.0 ×× 6.3
ఆర్‌డి ××× 4.5 ×× 3.9 ×× 4.3 ×× 3.6 ×× 5.7
ప.అ ××× 1.6 ×× 3.0 ×× 3.2 ×× 2.8 ×× 3.5
పోలీస్‌ ××× 4.6 ×× 4.0 ×× 4.4 ×× 3.6 ×× 4.3
రోడ్లు ××× 1.4 ×× 3.2 ×× 3.3 ×× 3.7 ×× 4.5
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు ఆయా రంగాలలో మూడు సంవత్సరాలలో ధనిక రాష్ట్రంగా చెప్పుకొనే తెలంగాణా దేశ సగటు కంటే తక్కువే ఖర్చు చేస్తున్నది. కెజి నుంచి పిజి వరకు ఉచితం అని చెబుతున్న పాలకులు విద్యలో సగం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కార్పొరేట్లకు ఈ రంగాన్ని అప్పగించటమే అన్నది స్పష్టం. ప్రభుత్వ విద్యా సంస్థలలో తగిన సౌకర్యాలు, సిబ్బంది, చదువుకొనే వాతావరణం ఉంటే తలిదండ్రులు ప్రైవేటు సంస్థలవైపు చూడరు.


ఇక వైద్యం, తల్లీ పిల్లల ఆరోగ్యం, పోషకాహారం గురించి చూద్దాం.2015-16 సంవత్సరాలలో నాలుగవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, 2019-21లో ఐదవ సర్వే జరిగింది.ఈ రెండు సర్వేల వివరాలను చూసినపుడు దేశం మొత్తం మీద రక్తహీనత సమస్య పెరిగింది.శరీరంలో తగినంత రక్తం లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది తెలిసిందే.రక్తహీనత పెరుగుదల బడుగు, బలహీన వర్గాలలోనే ఎక్కువగా ఉంది.తాము తిన్నా తినకపోయినా పిల్లలకు పెట్టేందుకు చూసే తలితండ్రులు తమ బిడ్డలను ఆరోగ్యంగా పెంచలేకపోవటానికి ప్రధాన కారణం వారికి తగినంత కుటుంబ ఆదాయం లేక పోషకాహారం తీసుకోకపోవటమే అని వేరే చెప్పనవసరం లేదు.వివరాలు దిగువ చూడవచ్చు.1.ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లలు, 2.గర్భిణులు కాని మహిళలు 15 నుంచి 49 ఏండ్లు , 3. గర్భిణులు 15 నుంచి 49 ఏండ్లు,4.మహిళందరు 15-49 ఏండ్లు, 5.యువతులు 15-19 ఏండ్లు, 6.యువకులు 15-19 ఏండ్లు.దేశం 4 అంటే నాలుగవ సర్వే, దేశం 5 అంటే ఐదవ సర్వే శాతాలు.
ఏరియా ×× 1 × 2 × 3 × 4 × 5 × 6
దేశం 4 ××58.6 ×52.3 ×50.4×53.1 ×54.1× 29.2
దేశం 5 ××67.1 ×57.2 ×52.2×57.0 ×59.1× 31.2
తెలంగాణా4××60.7 ×56.9 ×48.2×56.6 ×57.9× 19.2
తెలంగాణా5××70.0 ×57.8 ×53.2×57.6 ×64.7× 25.1
పై పట్టిక చూసినపుడు పసిపిల్లలో రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు ఇంత అనారోగ్యంగా ఉంటే ఎలా ! ఒకే వయసు ఉన్న యువతీ యువకుల్లో రక్తహీనత తేడాలు ఎంతగా ఉన్నాయో చూస్తే ఆడపిల్లల పట్ల వివక్ష, నిర్లక్ష్యం కనిపిస్తుంది. దేశంలోని యువకుల్లో రెండు సర్వేల మధ్య తేడా రెండుశాతం కాగా తెలంగాణాలో ఆరుశాతానికి పెరగటాన్ని గమనించవచ్చు. తల్లీ, పిల్లల ఆరోగ్యం, పోషణ అంశంలో దేశం మొత్తం మీద చూపుతున్న నిర్లక్ష్యం కంటే తెలంగాణాలో ఎక్కువగా ఉన్నట్లు అంకెలు చెబుతున్నాయి.అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు కీలక రంగాలకు తగిన కేటాయింపులు జరపక, తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని పట్టించుకోక తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నట్లు ? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి దిగజారిందా మెరుగుపడిందా ? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా వివక్షకు గురైందని చెప్పిన పాలకులు దేశ సగటు కంటే తక్కువ కేటాయింపులు ఎందుకు చేసినట్లు ?


రాష్ట్ర ప్రభుత్వం రెండులక్షల రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం చేస్తామని 2016-17బడ్జెట్‌లోనే చెప్పింది. ఒక లక్ష హైదరాబాద్‌, మరోలక్ష ఇతర చోట్ల అని పేర్కొన్నది.దాని ఆచరణ ఎలా ఉందంటే 2021-22 బడ్జెట్‌లో ఇండ్ల నిర్మాణానికి రు.11,151 కోట్లు కేటాయించి ఖర్చు చేసిందెంతో తెలుసా కేవలం రు.299 కోట్లు మాత్రమే.2022-23లో రు.12,172 కోట్లు కేటాయించి రు.8,112కోట్లకు తగ్గించి సవరణ బడ్జెట్‌లో చూపారు. ఆచరణలో ఇంకా తగ్గవచ్చు.కానీ 2023-24లో రు.12,140 కోట్లుగా ప్రతిపాదించి అంతకు ముందు కంటే 50శాతం పెంచినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు కొంత మేర నిధులు కేటాయించి నామ మాత్రంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామనిపించి వాటినే గొప్పగా ప్రచారం చేస్తున్నారు.అదే విధంగా అదే ఏడాది పట్టణాభివృద్ధికి రు.10,555 కోట్లు ప్రకటించి 75శాతం కోత పెట్టి రు.2,665 కోట్లు ఖర్చు చేశారు.సగానికిపైగా జనాభా పట్టణాల్లో నివసిస్తున్న పూర్వరంగంలో ఎంత నిర్లక్ష్యం చేసిందీ వేరే చెప్పనవసరం లేదు. అదే బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమం-పోషకాహారానికి రు.18,997 కోట్లు కేటాయించి 35శాతం,రోడ్లు, వంతెనలకు రు.5,187 కోట్లు ప్రకటించి 55శాతం, వ్యవసాయం, అనుబంధ రంగాల ప్రతిపాదనల్లో 27శాతం కోత పెట్టారు.ఇలా కోతలను దాచి వర్తమాన బడ్జెట్‌లో పెంచినట్లు మాటల్లో కోతలు కోస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడవ ప్రత్యామ్నాయం-కెసిఆర్‌ ముందున్న సమస్యలు !

15 Saturday Jan 2022

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Telangana, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, CPI(M), KCR, RJD, Third front formation in India, trs


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్కాగా బిజెపి వ్యతిరేక వైఖరిని తీసుకోనున్నారా? మూడో రాజకీయ సంఘటన ఏర్పాటులో భాగస్వామి అవుతారా ? దక్షిణాది రాష్ట్రాలు ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పుతాయా ? కెసిఆర్‌ ప్రకటనలు, చర్యలు దేనికి చిహ్నం అనే చర్చ కొంత మందిలో జరుగుతోంది. గతంలో జరిగిన పరిణామాలను బట్టి అలాంటి నిర్ధారణలకు రావటం లేదా ఆ దిశగా చర్చించటం తొందరపాటవుతుంది అనే అభిప్రాయం కూడా ఉంది. మరోసారి ఎందుకీ చర్చ ? దానికి దోహదం చేసిన అంశాలేమిటి ? జనవరి నెల మొదటి పక్షంలో తెలంగాణాలో కొన్ని ముఖ్యఘటనలు జరిగాయి. సంఘపరివార్‌ భేటీ, ఆ వెంటనే సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం, ఇదే సమయంలో ఏఐవైఎఫ్‌ జాతీయ సభ, ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ కౌన్సిలు సమావేశం,బీహార్‌ ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ సిఎం కెసిఆర్‌తో భేటీ, బిజెపి నేత బండి సంజయ అరెస్టు, విడుదల దానికి నిరసనగా జరిగిన సభలు, బిజెపి జాతీయ నేతల ప్రకటనల దాడి వంటివి ఉన్నాయి.


కేరళలోని కన్నూరులో జరిగే సిపిఎం జాతీయ మహాసభలో వచ్చే మూడు సంవత్సరాలలో అనుసరించాల్సిన రాజకీయ తీర్మానం ముసాయిదా ఖరారుకు హైదరాబాదులో పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, త్రిపుర మాజీ సిఎం మాణిక్‌ సర్కార్‌ను కెసిఆర్‌ విందుకు ఆహ్వానించారు.ఏఐవైఎఫ్‌ సభలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఆ పార్టీ రాష్ట్రనేతలను విడిగా కెసిఆర్‌ ఆహ్వానించారు.అదే విధంగా ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ కలసినపుడూ మొత్తంగా మూడు పార్టీల నేతలతో రాజకీయ పరిస్ధితులపై అభిప్రాయ మార్పిడి చేసుకున్నారు. బిజెపితో సంబంధాలు సజావుగా ఉంటే సంఘపరివార్‌ సమావేశాలకు వచ్చిన నేతలకూ శాలువాల సత్కారం జరిపి ఉండేవారు. కానీ బిజెపిని గద్దెదింపాలని చెబుతున్న పార్టీల నేతలతో భేటీ ద్వారా కెసిఆర్‌ పంపదలచుకున్న సందేశం ఏమిటి ? తాను బిజెపి వ్యతిరేక కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్లు టిఆర్‌ఎస్‌ నేత జనానికి చెప్పకనే చెప్పారు.


తేజస్వి యాదవ్‌ భేటీ సందర్భంగా తండ్రి, ఆర్‌జెడినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో కెసిఆర్‌ ఫోన్లో మాట్లాడారు. మూడవ ఫ్రంట్‌కు నేతృత్వం వహించాలని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని కెసిఆర్‌ను లాలూ కోరినట్లు టిఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. బిజెపి ముక్త భారత్‌ కోసం లౌకిక పార్టీలన్నీ దగ్గరకు రావాలన్న కోరిక రెండు పార్టీల వైపు నుంచి వ్యక్తమైనట్లు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో కెసిఆర్‌ ఇంతకంటే బలమైన సూచనలే పంపారు.బిజెపి, కాంగ్రెస్‌ లేని ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంటూ బెంగళూరు వెళ్లి జెడిఎస్‌ నేతలతో చర్చలు జరిపారు. తెలుగువారంతా ఆ పార్టీకే ఓటు వేయాలని బహిరంగంగా పిలుపు ఇచ్చారు. తరువాత ఎలాంటి చొరవా చూపలేదు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ను కలసి రాజకీయాలను చర్చించినట్లు వార్తలు వచ్చాయి.తిరిగి మరోసారి అలాంటి సూచనలు ఇస్తున్నందున వివిధ పార్టీలు, జనంలో సహజంగానే సందేహాలు ఉంటాయి.కెసిఆర్‌తో భేటీ ఐన మూడు పార్టీలు కూడా బిజెపిని వ్యతిరేకించటంలో తిరుగులేని రికార్డు కలిగినవే కనుక, ఇప్పుడు కెసిఆర్‌ మీదనే చిత్తశుద్ది నిరూపణ బాధ్యత ఉందన్నది స్పష్టం.


వివిధ ప్రాంతీయ పార్టీలు అటు కాంగ్రెస్‌తోనూ, ఇటు బిజెపితోనూ జత కట్టటం-విడిపోవటం-తిరిగి కూడటం వంటి పరిణామాలను చూస్తున్నాము. ఇక ముందు కూడా అలాంటివి జరగవచ్చు. ఇప్పుడు దేశానికి ప్రధాన ముప్పుగా బిజెపి ఉందని వామపక్షాలు భావిస్తున్నాయి. అవి బిజెపికి వ్యతిరేకంగా నికార్సుగా నిలబడ్డాయి.గతంలో ఏ పార్టీ ఏవిధంగా వ్యవహరించినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా ముందుకు వస్తే ఆమేరకు ఆహ్వానిస్తామని ఆ పార్టీలు చెబుతున్నాయి.గతంలో బిజెపితో చేతులు కలినందున ఇప్పుడు వ్యతిరేకంగా ఉండే అర్హత లేదని అనలేవు కదా ! ఆ గూటికి ఈగూటికి తిరుగుతున్న అవకాశవాదుల పట్ల ఎలా ఉండాలనేది జనం నిర్ణయించుకుంటారు. ఒక వేళ నిజంగానే కొంత మంది అనుకుంటున్నట్లుగా బిజెపితో కుదరాలనుకుంటున్న రాజీ మేరకు లోక్‌సభ సీట్లను బిజెపికి వదలి, అసెంబ్లీని తమకు వదలివేయాలని టిఆర్‌ఎస్‌ కోరుతుందా ? ఆ బేరం చేసేందుకే బిజెపి మీద విమర్శలను తీవ్రం చేశారా? మరో ఫ్రంట్‌ గురించి టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారా ? అన్న అనుమాలను తీర్చాల్సిందే కెసిఆరే.


టిఆర్‌ఎస్‌ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి బిజెపిని వ్యతిరేకించింది,2009లో అదే పార్టీ బిజెపి, తెలుగుదేశం పార్టీతో కలసి ఎన్‌డిఏ కూటమిలో ఉంది.రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 ఎన్నికల నుంచే టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్నాయి. వాటి మధ్య పంచాయతీ అదే కదా ! అందుకే అవిలేని మూడవ ఫ్రంట్‌ గురించి కెసిఆర్‌ మాట్లాడుతున్నారన్నది స్పష్టం. పైన చెప్పుకున్నట్లుగా కేంద్రం ఒకరికి రాష్ట్రం ఒకరికి అనే ఒప్పందం ఏ పార్టీతో కుదిరినా ఆ రెండు పార్టీలు ఒకటిగా ముందుకు పోతాయి. విధానాల పరంగా మూడు పార్టీలకు మౌలికమైన తేడాలేమీ లేవు.


రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వ విధానాలను సిపిఎం, సిపిఐ రెండూ విమర్శిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అటువంటపుడు ఒక వేళ కెసిఆర్‌ జాతీయంగా బిజెపిని వ్యతిరేకించే శక్తులతో కలిసే వచ్చే ఎన్నికల్లో వామపక్షాల వైఖరి ఏమిటన్న ప్రశ్న వెంటనే వస్తుంది. వామపక్షాలకు ఎన్నికలే సర్వస్వం కాదు, ఓడినా గెలిచినా అవి తమ విధానాలతో ముందుకు పోతున్నాయి. ఎప్పుడో ఎన్నికలు వస్తాయని, వాటిలో బిజెపి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తామని చెబుతున్నాము గనుక ప్రభుత్వాలు చేసే తప్పిదాలను, ప్రజావ్యతిరేక విధానాలను అవి సమర్దిస్తూనో లేదా మౌనంగానో ఆ పార్టీలు ఉండవు. అలా ఉండేట్లైతే విడిగా కొనసాగాల్సిన అవసరం ఏముంది, ఏదో ఒక పార్టీలో చేరి పోవచ్చు. ఎన్నికలు వచ్చినపుడు కాంగ్రెస్‌తో సహా వివిధ పార్టీలతో అప్పుడు తమ ఎత్తుగడలు వుంటాయని, ఎన్నికలకు ముందు ఫ్రంట్‌ ఆలోచనలేదని సిపిఎం చెప్పింది. అంతిమంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది కన్నూరు మహాసభ ఖరారు చేయనుంది. కోల్పోయిన తమ ప్రజాపునాదిని తిరిగి తెచ్చుకోవాలని సిపిఎం గట్టిగా భావిస్తోంది. అలాంటి ప్రక్రియకు నష్టం కలుగుతుందని భావిస్తే ఎవరితో సర్దుబాటు లేకుండానే పరిమిత సీట్లలో బరిలోకి దిగవచ్చు. మిగిలిన చోట్ల బిజెపిని ఓడించగలిగే పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు, లేదా పరిస్ధితిని బట్టి సర్దుబాట్లకు సిద్దం కావచ్చు. ఒకసారి ఎన్నికల్లో సర్దుబాటు చేసుకున్నంత మాత్రాన ఆ పార్టీ పాలన ఎలా ఉన్నా మౌనంగా ఉండాలనే కట్టుబాటేమీ లేదు.


ఎన్నికలు వేరు, ప్రజాసమస్యలు వేరనే చైతన్యం ఓటర్లలో కూడా రావటం అవసరం. ఇటీవలి చిలీ ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలో పోటీ పడ్డాయి. వాటిలో వామపక్షం నిలిపిన అభ్యర్ధి రెండవ స్ధానంలో, పచ్చి మితవాది,నిరంకుశ శక్తులను బలపరిచే అతను మొదటి స్ధానంలో వచ్చాడు. అక్కడి నిబంధనల ప్రకారం 51శాతం ఓట్లు తెచ్చుకున్నవారే విజేత, కనుక తొలి ఇద్దరి మధ్య తిరిగి పోటీ జరిగింది. వామపక్ష అభ్యర్ధి తిరుగులేని మెజారిటీతో గెలిచాడు.తొలి విడత ఓటు వేయని లేదా వ్యతిరేకించిన ఓటర్లు రెండోసారి ఓటు చేశారు. అంటే దాని అర్ధం తరువాత కూడా వారంతా వామపక్ష అభిమానులుగా మారతారని కాదు. అక్కడి ఎన్నికల నిబంధనల ప్రకారం తొలివిడతలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లశాతాన్ని బట్టి ఆ దామాషాలో పార్లమెంటులో సీట్లు కేటాయించారు. అధ్యక్షుడిగా వామపక్ష నేత గెలిచినప్పటికీ పార్లమెంటులో మెజారిటీ లేదు. మన దగ్గర అలాంటి విధానం ఉంటే వేరు, ప్రతి పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది, దామాషా పద్దతిలో సీట్లు తెచ్చుకుంటుంది.దేశ ప్రధాని లేదా ముఖ్యమంత్రి పదవులకు ఎన్నికలు జరిగినపుడు తొలి రెండు స్ధానాల్లో ఉన్న పార్టీలలో ఏదో ఒకదానిని మిగతాపార్టీల ఓటర్లు ఎంచుకోవాల్సి వస్తుంది.


టిఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఐదేండ్ల పాటు వామపక్షాలు వ్యతిరేకించవచ్చు. ఎన్నికల సమయానికి దేశ రాజకీయాల్లో ప్రధాన శత్రువుగా భావిస్తున్న బిజెపిని ఓడించాలని నిర్ణయించుకున్నపుడు అదే ప్రధాన ఎన్నికల అంశంగా మారినపుడు, రెండు ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ రెండూ గట్టిగా బిజెపిని వ్యతిరేకిస్తున్నపుడు సమస్య వస్తుంది.ప్రస్తుతానికి దాన్ని ఊహాజనిత అంశంగానే చెప్పవచ్చు. ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము. ఉత్తర ప్రదేశ్‌, ఇతర నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలు, గుణపాఠాలను బట్టి పార్టీలు వ్యవహరిస్తాయి. ఇప్పటికి ఇప్పుడున్న స్ధితిలో టిఆర్‌ఎస్‌ను బిజెపి సవాలు చేసే స్ధితిలో లేదు. అందరూ ఊహిస్తున్నట్లుగా బిజెపి ఓడిపోతే బరిలో టిఆర్‌ఎస్‌-కాంగ్రెసే మిగులుతాయి. లేదూ దానికి భిన్నంగా గెలిస్తే బిజెపి మరింత రెచ్చిపోతే, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు అన్నీ చేతులు కలపాల్సి రావచ్చు.


అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి ఫిరాయించిన పెద్దమనిషి.శారదా చిట్‌ఫండ్‌ మొదలు అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. తాము అధికారంలోకి వస్తే హిమంతను జైలుకు పంపుతామని ప్రగల్భాలు పలికిని వారిలో అమిత్‌ షా ఒకరు. అవినీతి గురించి బుక్‌లెట్స్‌ను విడుదల చేసింది బిజెపి. అలాంటి పార్టీ అతగాడిని తమ పార్టీలోకి చేర్చుకోవటం మంత్రి పదవి, తరువాత ముఖ్యమంత్రి పదవినే కట్టబెట్టింది.


కెసిఆర్‌ మీద ప్రస్తుతం ఆరోపణల ప్రచారదాడి తప్ప ఎలాంటి కేసులు లేనప్పటికీ ప్రతి ఒక్కరూ జైలుకు పంపుతామంటూ బెదిరింపులకు పూనుకున్నారు. అవినీతిని ఎవరూ సమర్ధించాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయంగా లొంగదీసుకొనేందుకే ఇలాంటి ప్రచారం అని భావిస్తున్న తరుణంలో కెసిఆర్‌ బిజెపి మీద తన దాడిని కూడా పెంచుతున్నారు. తాజాగా పెరగనున్న ఎరువుల ధరల మీద కేంద్రానికి లేఖ రాశారు. మొత్తం మీద చెప్పాలంటే బిజెపికి వ్యతిరేకంగా ఉన్నట్లు జనానికి, ఇతర పార్టీలకు విశ్వాసం కలిగించాలంటే టిఆర్‌ఎస్‌, దాని అధినేత కెసిఆర్‌ మరింత స్పష్టంగా ముందుకు రావాల్సిన, బిజెపి వ్యతిరేక శక్తులకు విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నందున ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పి అన్యాయాన్ని సరిదిద్దాలని కొందరు చెబుతున్నారు. అనేక అంశాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలో జనభా నియంత్రణ ఎక్కువగా ఉంది. కేంద్ర నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నందున నష్టం జరుగుతున్నది వాస్తవం. దాన్ని ఎలా పరిష్కరించాలన్నది వేరు, రాజకీయ కూటమి వేరు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి, అవకాశం లేదు అని గ్రహించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ధాన్యం కొనుగోలు వ్యవహారం : తెరాస మాత్రమే కాదు, ఇతర పార్టీలూ రంగంలోకి రావాలి !

18 Thursday Nov 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Economics, Farmers, NATIONAL NEWS, Opinion, Others, Politics, Prices, STATES NEWS, Telangana

≈ Leave a comment

Tags

BJP, Fci, KCR, Telangana paddy procurement matters


ఎం కోటేశ్వరరావు


తారీఖులు, దస్తావేదులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. వడ్ల కొనుగోలు గురించి ఇప్పటి వరకు ఏ రోజున కేంద్రంతో కెసిఆర్‌ ఏం మాట్లాడారు, ఏ ఒప్పందం చేసుకున్నారు, ఏది ముందు ఏది వెనుక అన్నది గతం. ఇప్పుడు రైతులకు తక్షణం కావాల్సింది వారి పంట కొనుగోలు, వేసవిలో వరి వేసుకోవాలా లేదా అన్నది వారికి చెప్పాలి. కేంద్రం వడ్లను కొనుగోలు చేయాలని కోరుతూ ఏకంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ గురువారం నాడు ధర్నాకు దిగారు. రెండు రోజుల్లోపల కేంద్రం తేల్చని పక్షంలో ఆందోళనను ఢిల్లీకి తీసుకుపోతానని ప్రకటించారు. ఇలాంటి ఉదంతం ఇటీవలి కాలంలో ఎక్కడా జరగలేదు. ఇది కేవలం హడావుడేనా లేక పరిస్ధితి తీవ్రతకు ప్రతిబింబమా ? కేంద్ర ప్రభుత్వం-తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలంగాణా రాష్ట్ర సమితి – బిజెపి కేంద్ర నాయకత్వం మధ్య జనం అనుకుంటున్నట్లుగా ఇంతకాలం తెరవెనుక జరిగిన మంతనాలేమిటన్నది ఇప్పుడు ముఖ్యం కాదు, ఆరుబయట వానకు తడిచి ఎండకు ఎండుతున్న వడ్లను కొంటారా లేదా అన్నదే రైతులకు కావాల్సింది. గత కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మూడు వివాదాలు ఆరు రేటింగులు అన్నట్లుగా మీడియాకు రంజుగా ఉండవచ్చు. రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. చేతికొచ్చిన పంటను కొంటారా లేదా రబీ(వేసవి లేదా యాసంగి)లో వరి వేయాలా వద్దా ? అదిగాకపోతే ఏ పంటను సాగు చేయాలి అన్నది వారికి అంతుబట్టటం లేదు. వెంటనే తేల్చాల్సిన తరుణం వచ్చింది.


ప్రభుత్వం, అధికారపార్టీ వరి వేయవద్దని చెబుతోంది, ప్రతిపక్షం, కేంద్రంలో అధికారపార్టీ వరి సాగు చేయండి ఎలా కొనుగోలు చేయరో చూస్తాం అంటూ సవాలు విసిరింది. మాటలకే పరిమితం కాకుండా బిజెపి కొనుగోలు కేంద్రాల పరిశీలన పేరుతో రాజకీయ యాత్రలకు పూనుకుంది. పరిశీలించవచ్చు, తప్పుపట్టనవసరం లేదు, వందల కార్లు,జనంతో అట్టహాసం ఏమిటి ? బిజెపి నేతలు పరిశీలిస్తే టిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమిటి ? అది కూడా పోటాపోటీగా కొనుగోలు కేంద్రాల వద్దకు తన మద్దతుదార్లను దింపింది. బిజెపి నేత మీద రాళ్ల దాడి జరిగింది.ఆగ్రహించిన రైతులే ఆ దాడి చేసినట్లు టిఆర్‌ఎస్‌ చెబుతోంది. సరే రాళ్లంటే పొలాల్లో, రోడ్ల మీద దొరుకుతాయి గనుక ఆగ్రహించి రైతులే విసిరారు అనుకుందాం. మరి కోడిగుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బిజెపి వారి వెంట రౌడీషీటర్లు ఉన్నారంటూ అధికారపక్షం ఫొటోలు కూడా చూపుతోంది. అధికారం కోసం పాకులాడే రాజకీయం పార్టీల వెంట అందునా బిజెపితో రౌడీలు, గూండాలు ఉండటం ఆశ్చర్యం లేదు. ఎవరినైనా చంపినపుడు నక్సల్స్‌ ఎవరు చంపారంటే జనమే ఖతం చేశారు అని చెప్పినట్లుగా బిజెపి మీద ఆగ్రహిస్తున్న రైతులే ఆ పార్టీ నేతల మీద దాడి చేసినట్లు అధికారపార్టీ చెబుతోంది. ఎవరైనా ముందుగా పధకాన్ని రూపొందించుకోకపోతే కోడి గుడ్లను వెంట తీసుకుపోరు అన్న సామాన్యుల సందేహానికి సమాధానం ఏమిని చెబుతారు. అలాగే బిజెపి నేతల వెంట రౌడీలు, గూండాలు అనుసరించాల్సిన అవసరం ఏమిటి అన్నదానికి కూడా వారు చెప్పాలి.


ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రులు, పార్టీల నేతలు ముందుకు తెచ్చిన కొన్ని అంశాలను చూద్దాం. పంజాబ్‌ తరహాలోనే మొత్తం వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలి. ఈ డిమాండ్‌లో తప్పులేదు. ఏడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారు ఇంతకాలం దాని గురించి ఎందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అన్నది రైతులకు, ఇతర జనాలకు తెలియాలి కదా. పంజాబ్‌లో రైతులు పండించిన వడ్లలో ఒక్క గింజను కూడా అక్కడి జనం తినరు, వాటిని విక్రయించటానికే వేస్తారు. తెలంగాణా, మరికొన్ని రాష్ట్రాలు అలా కాదే, వినియోగమూ, అమ్మకమూ రెండు కలిసి ఉంటాయి.అందువలన అన్ని చోట్లా ఒకే పరిస్ధితి లేదు. కేంద్రం తన బాధ్యతను తప్పించుకోజాలదు.


ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయాలని మరోసారి అడగను అని కెసిఆర్‌ రాతపూర్వకంగా కేంద్రానికి రాసి ఇచ్చిన సంగతి రైతులకు చెప్పలేదు. అదనపు కొనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించినట్లు ప్రచారం చేసుకున్నారు.ప్రసాదాన్ని దేవుడు తినడు అనే అంశం పూజారికి మాత్రమే తెలుసు. అలాగే రాతపూర్వకంగా కూడా రాసి ఇచ్చినందున ఉప్పుడు బియ్యం కొనరనే అంశం కెసిఆర్‌కు మాత్రమే తెలుసు. అందుకనే కొద్ది నెలల క్రితం సన్నవరి రకాలు వేసుకోవాలని, ఆ రైతులకు అదనంగా ప్రోత్సాహక మొత్తాలను ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం బదులు అంత మేరకు గతం కంటే అదనంగా పచ్చి బియ్యం కొంటుందనే హామీ లేకపోవటంతో కెసిఆర్‌కు తత్వం తలకెక్కి రోడ్డెక్కారు. రైతుల కోసమే గనుక ఆందోళనకు దిగటాన్ని తప్పుపట్టనవసరం లేదు. ఈ సంగతులన్నీ రైతులకు, ఇతర జనాలకు చెప్పకుండా దాచటంలో ఆంతర్యం ఏమిటన్నదే ప్రశ్న.


రాజకీయంగా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేని బిజెపి కేంద్ర అధికారాన్ని ఉపయోగించుకొని వడ్ల సంగతి తేల్చకుండా రైతుల్లో కెసిఆర్‌ను గబ్బు పట్టించాలన్న దురా,దూరాలోచన ఉంది కనుకనే కొనుగోలు గురించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయటం లేదన్నది తేలిపోయింది. రెండు అవకాశాలున్నాయి. ఒకటి మరికొద్ది రోజులు సమస్యను ఇలాగే నానబెట్టి రైతాంగాన్ని కెసిఆర్‌, అధికారపార్టీ మీదకు రెచ్చగొట్టటం, కెసిఆర్‌ విఫలమైనట్లు చెప్పటం, తరువాత రాష్ట్ర బిజెపి పెద్దలు ఢిల్లీ పర్యటనలు జరిపి కేంద్రాన్ని ఒప్పించినట్లు తతంగం జరిపి మావల్లనే వడ్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొనేందుకూ అవకాశం ఉంది. కేంద్రం, ఎఫ్‌సిఐ నిమ్మకునీరెత్తినట్లుగా రైతుల ఆందోళనను పట్టించుకోకుండా స్పందించకుండా ఉందంటే ఏమనుకోవాలి ?
కెసిఆర్‌ రోడ్డుమీదకు రావటం వెనుక బహుశా ఇతర కారణాలు కూడా ఉండి ఉండాలి. విద్యుత్‌ సంస్కరణలను అమలు జరపాలని కేంద్రం వత్తిడి తెస్తోంది. దానికి లొంగిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు అంగీకరించి ప్రకటన చేసింది. తదుపరి తెలంగాణా వంతు రానుంది. పంపుసెట్లకు మీటర్లు అంటే తక్కువ సంఖ్య ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లోనే రైతులు గుర్రు మంటున్నారు. తెలంగాణాలో అది పెద్ద ఆందోళనకు దారితీస్తుంది. అందుకే ఇప్పుడు కెసిఆర్‌ విద్యుత్‌ సంస్కరణల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దళిత బంధు పేరుతో నిండా మునిగి ఏమి చేయాలో దిక్కుతోచని కెసిఆర్‌ కొంత కాలమైనా దాని గురించి చర్చ జరగకుండా వడ్ల సమస్యను తెచ్చారా ? కేంద్రం కూడా వెంటనే వత్తిడి తేలేదు, ఏం జరుగుతుందో చెప్పలేము.


కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే ఇప్పటికే ఆహార ధాన్యాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం చేస్తోంది. ఇది సేకరణ బాధ్యతనుంచి తప్పుకొనే ఎత్తుగడలో ఒక ప్రచారం. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత వివిధ సూచికల్లో మన దేశం మెరుగుపడకపోగా దిగజారుతోంది. సులభతర వాణిజ్య సూచికలో మెరుగుదలను ప్రకటించినపుడేమో దాన్లో ఎలాంటి లోపాలు కనిపించవు, కానీ దిగజారిన మిగతావాటి గురించి లెక్కించిన పద్దతి తప్పు, మన స్ధానం మరింత మెరుగుపడిందనే వితండవాదానికి దిగుతోంది. ఇదే బిజెపి ప్రతిపక్షంలో ఉండగా ఆ సూచికలను చూపే గత ప్రభుత్వాలను తూర్పారపట్టిందని మరచిపోరాదు. అప్పుడు లెక్కింపు పద్దతి దానికి గుర్తుకు రాలేదు. ప్రపంచ ఆకలి సూచిక 2021 వివరాలను అక్టోబరులో ప్రకటించారు. చైనాతో సహా పద్దెనిమిది దేశాలు ఒకటో స్దానంలో ఉంటే 116దేశాలకు గాను మనం 101వ స్ధానంలో ఉన్నాం.మోడీ ఏలుబడిలో 2016లో 97గా ఉన్నది ఇప్పుడు 101కి దిగజారింది.మన తరువాత 103వదిగా ఆఫ్ఘనిస్తాన్‌ ఉంది. శ్రీలంక 65, మయన్మార్‌ 71, బంగ్లాదేశ్‌, నేపాల్‌ 76, పాకిస్తాన్‌ 92వ స్ధానాల్లో ఉన్నాయి. మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలో ఉన్నప్పటికీ ఇలా జరిగింది. ఈ సూచికకు నాలుగు అంశాలు ప్రాతిపదిక. తగిన్ని కాలరీలు తీసుకోలేని ఆహారలేమి, ఐదేండ్లలోపు పిల్లల పెరుగుదల గిడసబారుతనం, తగినంత ఆహారలేమి, ఐదేండ్లలోపు మరణించేవారి రేటు ప్రాతిపదికగా తీసుకొని లెక్కిస్తారు.


ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే మెజారిటీ జనానికి ఆహారధాన్యాల కొనుగోలు శక్తి పెరగాలి. అది జరగాలంటే అందుకు సరిపడా వేతనాలు లభించే ఉపాధిని వారికి చూపాలి.దేశంలో మొత్తంగా చూసినపుడు ఆ రెండూ లేవు.మరోవైపున జనానికి సబ్సిడీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం కోత పెడుతున్నది. రోజు రోజుకూ ఆహారానికి చేసే ఖర్చును జనం తగ్గించుకొని ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారు. గోదాముల్లో గోధుమ, బియ్యాలను ఎలుకలు, పందికొక్కులకు పెట్టటాలు, ముక్కిపోయిన తరువాత పనికిరాని వాటిని పారపోసేందుకైనా కేంద్రం సిద్దపడుతోంది, లేదా సబ్సిడీలిచ్చి విదేశాలకు ఎగుమతులు చేస్తోంది గానీ మన జనానికి అందించేందుకు ముందుకు రావటం లేదు. కరోనా కారణంగా ఇరవైలక్షల కోట్లతో ఆత్మనిర్భర పాకేజ్‌లంటూ ఆర్భాటం చేసిన పాలకులు తెలంగాణాలో ఉప్పుడు బియ్యాన్ని కొనేందుకు ముందుకు రావటం లేదు. గత వేసవిలో అంగీకరించిన మేరకు ఇంకా ఐదు లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉండగా దాని గురించి ఎటూతేల్చటం లేదు. ఖరీఫ్‌లో పండిన పంటలో ఎంత మేరకు కొనుగోలు చేస్తారో అదీ చెప్పదు. ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని ముందే చెప్పిన కేంద్రం పచ్చిబియ్యాన్ని ఎంత పరిమాణంలో కొంటారో ఎందుకు చెప్పటం లేదు. ఎఫ్‌సిఐ ముందుగానే ఏ రాష్ట్రం నుంచి ఎంత కొనుగోలు చేయాలో ప్రణాళికలను రూపొందించుకోదా ? సిబిఐ, ఆదాయపన్ను, ఇడి, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్దలను తనకు లొంగని లేదా తనతో చేరని నేతల మీద ప్రయోగిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెరాసను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎఫ్‌సిఐని ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రమాదకర పోకడ.

ప్రతిపక్ష పార్టీల పట్ల కెసిఆర్‌ అనుసరిస్తున్న వైఖరి, తూలనాడుతున్న తీరు అభ్యంతరకరమే. ఎన్నికలు వచ్చినపుడు ఎవరి వైఖరిని వారు తీసుకోవచ్చు. వడ్ల కొనుగోలు లేదా బలవంతపు విద్యుత్‌ సంస్కరణల వంటి వాటి మీద పోరాడాల్సి వచ్చినపుడు వాటిని వ్యతిరేకించే పార్టీలన్నీ రోజువారీ విబేధాలను పక్కన పెట్టి పెట్టి రైతాంగం, ఇతర పీడిత జనం కోసం కేంద్రం మీద వత్తిడి తేవాల్సిన తరుణం ఆసన్నమైంది. తెరాసతో కలిసేందుకు ఇబ్బందైతే ఎవరి కార్యాచరణతో వారు ముందుకు రావాలి.కెసిఆర్‌ది కేవలం హడావుడే అయితే విశ్వసనీయత మరింత దిగజారుతుంది. రైతాంగ ఆగ్రహం, ఆవేశాలు కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ నేతల మీదకు మళ్లుతాయి.రాజకీయంగా తగిన ఫలితం అనుభవిస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కెసిఆర్‌ సారు విశ్వసనీయత ? జగనన్నకు బిజెపి సెగ !

10 Wednesday Nov 2021

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, fuel politics, K. Chandrashekar Rao, KCR, telugudesam, YS jagan


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా రాష్ట్రసమితి సారధి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏమైంది ? ఆంధ్రప్రదేశ్‌ పాలక పార్టీ వైసిపికి బిజెపి సెగ పెరిగిందా ? రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాల పర్యవసానాలేమిటి ? తెలంగాణాలో కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనల దారెటు ? రెండు చోట్లా ముందస్తు ఎన్నికలు వస్తాయా ? అనేక మందిలో ఇప్పటికిప్పుడు సమాధానం దొరకని, తలెత్తుతున్న ప్రశ్నలలో ఇవి కొన్ని మాత్రమే. కెసిఆర్‌ వరుసగా రెండు రోజులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి మీద, కేంద్ర ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామంటూ బ్యాటింగ్‌ ప్రారంభించి సిక్సర్లు కొట్టి తరువాత మంత్రులకు అప్పగించారు. కెసిఆర్‌ సారుకు ఏమైందీ అనుకుంటున్నవారికి చెప్పేదేమంటే, ఏమీ కాలేదు. హుజూరాబాద్‌లో అవమానకర ఓటమి, నాలుగువైపుల నుంచీ రాజకీయ సెగతగలటం ప్రారంభమైంది, పాత బంధులు-కొత్త బంధులు కుదురుగా కూర్చోనివ్వటం లేదు. అవే బంధనాలుగా మారతాయనే భయం కూడా తలెత్తి ఉండవచ్చు. అందువలన ఏదో ఒకటి మాట్లాడకపోతే పార్టీ శ్రేణులు మరింతగా డీలాపడతాయి.


మరి ఆంధ్రప్రదేశ్‌లో జగనన్నకు ఏమైంది. కెసిఆర్‌ మాదిరి మాటల మాంత్రికుడు కాదు. విలేకర్లతో మాట్లాడే అనుభవం సంగతేమో గానీ ఆసక్తిలేదని స్పష్టమైంది. వైసిపి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం అమలు జరుపుతున్న నవరత్నాలు ఏమౌతాయో తెలియని స్ధితి. వాటితో ఐదేండ్లూ ప్రచారం, కాలక్షేపం చేయలేమని రెండు సంవత్సరాలకే అర్ధమైంది. ఉన్నవాటినే ఎలా కొనసాగించాలో తెలియని అయోమయంలో పడి కెసిఆర్‌ మాదిరి కొత్త బంధులను తలకెత్తుకొనే సాహసం చేయటం లేదు. అప్పుల తిప్పలు గుక్కతిప్పుకోనివ్వటం లేదు. జెన్‌కో, ఏపి పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చెల్లించాల్సిన కిస్తీలను సకాలంలో చెల్లించకపోవటంతో ఆర్‌ఇసి జెన్‌కోను నిరర్దక ఆస్తిగా ప్రకటించిందంటే పరిస్ధితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో పెట్రోలు, డీజిలు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వత్తిడి తెస్తున్నాయి. దీంతో ఏకంగా ప్రభుత్వమే పత్రికలకు పూర్తి పేజీ ప్రకటన జారీ చేసి చమురుపై కేంద్రం, రాష్ట్రాల పన్నుల గురించి వివరాలు అందచేసి కేంద్ర బిజెపిని ఎండగట్టేందుకు పూనుకుంది. కెసిఆర్‌ మాదిరి జగన్‌మోహనరెడ్డి మీడియా ముందుకు రాలేదు గానీ ప్రకటనలు, పార్టీ నేతలు, మంత్రులతో ఆ పని చేయిస్తున్నారు.


హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తగిలిన తీవ్ర ఎదురుదెబ్బతో నాకు ఎదురులేదు, నా ఎత్తుగడకు తిరుగులేదు అనుకొనే వారు కెసిఆర్‌ లేదా మరొకరు ఎవరికైనా మైండ్‌ బ్లాంక్‌ కావాల్సిందే. అక్కడ గెలిచేందుకు బహుశా దేశంలో, ప్రపంచంలో కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు ఆ స్ధాయిలో డబ్బు వెదజల్లటం, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉండదంటే అతిశయోక్తి కాదు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ఘోరపరాజయంతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు డీలాపడిపోయాయి. తమనేత చాణక్యతను అనుమానించటం ప్రారంభించాయి. వారిని నిలబెట్టుకొనేందుకు కెసిఆర్‌ నడుంకట్టినట్లుగా కనిపిస్తోంది. అది జరిగేదేనా !


దుబ్బాక ఉప ఎన్నికల్లో అంతకు ముందు అక్కడ పోటీ చేసిన బిజెపినేత రఘునందనరావు మీద సానుభూతి, టిఆర్‌ఎస్‌లోని ఒక సామాజిక తరగతి సానుకూలత, దానిలో భాగంగా కెసిఆర్‌ సైతం ఉపేక్షించారన్న ప్రచార నేపధ్యం, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసి దుబ్బాకను ఉపేక్షించారన్న ప్రచారం అన్నీ కలసి టిఆర్‌ఎస్‌ ఓటమి-బిజెపి గెలుపుకు తోడ్పడ్డాయి. తరువాత జరిగిన హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో అధికార పార్టీ కార్పొరేటర్ల మీద ఉన్న అసంతృప్తికి తోడు వరదల నివారణలో వైఫల్యం, సాయంలో అవకతవకలు అన్నీ కలసి అధికార పార్టీకి తలబొప్పి కట్టించాయి.తరువాత జరిగిన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో బిజెపి బొక్కబోర్లాపడింది.అభ్యర్ధిని కూడా కాంగ్రెస్‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. బలమైన కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డిని ఓడించేందుకు టిఆర్‌ఎస్‌ పడరాని పాట్లు పడి గెలిచింది.తరువాత పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో హైదరాబాదులో బిజెపి ఉన్న సీటును కోల్పోయింది. మరొకస్ధానం వరంగల్‌లో ఊహించని ఎదురుదెబ్బతిన్నది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం టిఆర్‌ఎస్‌ ఎన్ని పాట్లు పడిందీ చూశాము.హుజూరాబాద్‌ గురించి ముందే చెప్పుకున్నాం. అక్కడ బిజెపి కంటే కెసిఆర్‌ అహం మీద ఈటెల దెబ్బకొట్టారు. మొత్తం మీద జరిగిందేమంటే టిఆర్‌ఎస్‌ సారధి కెసిఆర్‌ విశ్వసనీయత గ్రాఫ్‌ పడిపోతోందన్నది స్పష్టమైంది. హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల తరువాత వరదసాయం మిగిలిన వారికీ అందచేస్తామని ప్రకటించి మాటనిలుపుకోలేదు. ఈ కారణంగానే దళితబంధును హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తరువాత రాష్ట్రమంతటా అమలు జరుపుతామని చెప్పినప్పటికీ జనాలు విశ్వసించలేదని తేలిపోయింది. దళితబంధును అమలు చేస్తానని ఉప ఎన్నిక తరువాత కూడా ప్రకటించారు. అయినా అమలు జరుపుతారా ? అప్పు రేపు అని గోడమీద రాస్తారా ? ఏదో ఒకపేరుతో నీరుగారుస్తారా అన్నది పెద్ద ప్రశ్న. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి గురించి జనం మరచిపోగలరా ?


పోగాలము దాపురించినపుడు తాడే పామై కరుస్తుందంటారు. బంధులే టిఆర్‌ఎస్‌, కెసిఆర్‌కు బంధనాలుగా మారే దృశ్యాలు కనిపిస్తున్నాయి.ప్రపంచమంతటా ఈ ఏడాది పత్తి ధరలు పెరిగాయి, దాన్లో భాగంగా మద్దతు ధరకంటే అదనంగా లభిస్తున్నందున రైతుల్లో సంతృప్తి ఉండవచ్చు. ధాన్యం ధర, మార్కెటింగ్‌,ఎఫ్‌సిఐ కొనుగోలు తీవ్ర సమస్యగా మారనుంది. అది రైతు బంధు సంతృప్తి స్ధానంలో అసంతృప్తికి దారి తీయవచ్చు. రైతులకు కావాల్సింది తాము పండించిన వరి, ఇతర పంటలకు మద్దతుధర, మార్కెటింగ్‌ తప్ప మిగతా అంశాలు అంతగా పట్టవు. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. మన్మోహన్‌ సింగ్‌కు అమలు జరిపే ధైర్యం లేకపోయింది. నరేంద్రమోడీకి 56అంగుళాల ఛాతీ ఉందని చెబుతున్నారు గనుక ఎవరేమనుకున్నా ముందుకు పోవాలని నిర్ణయించారు. దానిలో భాగమే మూడు సాగు చట్టాలు. మద్దతు ధర అమల్లో ఉంది కనుక కాస్త భరోసా ఉందని వరి పండించటం తప్ప వడ్లను ఉప్పుడు బియ్యంగా మారుస్తారా, పచ్చి బియ్యాన్నే ఎఫ్‌సిఐకి ఇస్తారా అనేదానితో వారికి నిమిత్తం లేదు. ఎంత ధాన్యమైనా కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు ఇప్పుడు ఆకస్మికంగా వరి వద్దు అంటే కుదురుతుందా ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వద్దు అంటే కేంద్రంలో ఉన్న పార్టీ పండించమంటోంది. తెలంగాణాలో పండించిన ధాన్యం ఉప్పుడు బియ్యానికి మాత్రమే పనికి వస్తుందని పాలకులకు, విధాన నిర్ణేతలకు ముందే తెలిస్తే వేరే రకాల సాగుకు రైతులను క్రమంగా ఎందుకు ప్రోత్సహించలేదు ? శాస్త్రీయంగా అలాంటి నిర్దారణలు ఎవరు చేశారు. అసలు సాగు వద్దే వద్దంటే ఎలా కుదురుతుంది. గతేడాది కరోనా కారణంగా చమురు నిల్వలు పెరిగిపోయి, నిల్వచేసే సౌకర్యాలు లేక అమ్మకందార్లకు కొనుగోలుదారులు ఎదురు డబ్బు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే మాదిరి తెలంగాణా రైతులు వరి వేయటం తక్షణమే నిలిపివేయాలంటే ప్రతామ్నాయం చూపేంతవరకు పరిహారం ఇస్తే నిరభ్యంతరంగా సాగు నిలిపివేస్తారు. వరి పండించాల్సిందే అని బిజెపి నేతలు కూడా చెబుతున్నారు గనుక పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తారా లేక పరిహారం ఇస్తారా ? అది కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా అన్నది తేల్చాల్సింది రైతులు కాదు.


అసలేం జరుగుతోందో టిఆర్‌ఎస్‌ లేదా బిజెపి రైతాంగానికి ఎప్పుడైనా వాస్తవాలు చెప్పిన పాపాన పోయాయా ?ఇప్పుడు రెండు పార్టీలు రాజకీయానికి పాల్పడ్డాయి. గతవేసవిలో పండిన ధాన్యం నుంచి 24.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం చెప్పిన అంశాన్ని కెసిఆర్‌ రైతులకు ఎప్పుడైనా చెప్పారా ? అంతకు మించి ఉన్న మిగిలిన వాటిని తీసుకొనేది లేదని కేంద్రం చెప్పి ఉంటే అదైనా చెప్పాలి. మరిన్ని ఉప్పుడు బియ్యం తీసుకోవాలని కెసిఆర్‌ కేంద్రాన్ని కోరారు, మరో 20లక్షల టన్నులు తీసుకొనేందుకు అంగీకరించినట్లు చెప్పారు తప్ప దానికి తాను అంగీకరించిన షరతు గురించి చెప్పలేదు. ఆ ఇరవైలక్షల టన్నులు తీసుకుంటే భవిష్యతో ఇవ్వబోమనే షరతుకు అంగీకరించిన అంశాన్ని దాచిపెట్టారు. తమ చేత బలవంతంగా రాయించుకున్నారని ఇప్పుడు చెబుతున్నారు. దానిలో నిజాయితీ, విశ్వసనీయత ప్రశ్నార్దకమే. ఏవైనా కేసుల్లో దళితులు, ఇతర బలహీన తరగతుల వారిని పోలీసులు బెదిరించి బలవంతంగా తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారంటే నమ్మవచ్చు, కేంద్రం ఒక ముఖ్యమంత్రిని బలవంతం చేసిందంటే నమ్మగలమా, ఆ దారుణం గురించి జనానికి ఎందుకు చెప్పలేదు ? పంజాబ్‌లో మాదిరి తెలంగాణాలో కూడా ఎఫ్‌సిఐ నేరుగా ఎందుకు కొనుగోలు చేయదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మేమే సేకరించి ఇస్తామని తొలుత ఎందుకు అంగీకరించినట్లు ? పోనీ ఎప్పుడైనా ఈ అంశాన్ని రైతులు, కేంద్రం దృష్టికి తెచ్చారా ? తమ నుంచి కొనుగోలును తప్పించటానికే కేంద్రం సాగు చట్టాలను తెచ్చిందని పంజాబ్‌,హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ రైతులు ఏడాది కాలంగా రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న అంశం కెసిఆర్‌కు తెలియదంటే నమ్మే అమాయకులెవరూ లేరు. ఆ సాగు చట్టాలకు మద్దతు ఎందుకు ఇచ్చారు, రైతులకు ఒకసారి మద్దతు ఇచ్చి తరువాత ఎందుకు ముఖం చాటేసినట్లు ? మొత్తం వడ్లు కొనుగోలు చేయాలని ఆందోళనకు ఇప్పుడు పిలుపులు ఇస్తే రైతులు నమ్ముతారా ? బిజెపి కూడా దాగుడుమూతలాడుతోంది, రైతులకు భరోసా కల్పించటం లేదు.


ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే చమురు మీద వ్యాట్‌ తగ్గించాలని బిజెపి, తెలుగుదేశం వత్తిడి చేసిన తరువాత గానీ వైసిపికి చమురు మంట తగల్లేదా ? కేంద్రం పన్నుల పేరుతో పెంచిన సెస్‌ల నుంచి రాష్ట్రాలకు వాటాలు రావని రెండున్నర సంవత్సరాలుగా వారికి తెలియదా ? ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? వ్యాట్‌ తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌ పన్నెండు రూపాయలు తగ్గిస్తే వ్యాట్‌ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఎందుకు తగ్గించదు అంటున్నారు. బిజెపి పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో పెట్రోలు, డీజిలు మీద 26.8-17.48శాతాల చొప్పున వ్యాట్‌ వుండగా అదే బిజెపి ఏలుబడిలోని అసోంలో 32.66-23.66శాతం ఉంది. అంత ఎక్కువ వసూలు చేస్తున్న అసోం ఏడు రూపాయలు మాత్రమే ఎందుకు తగ్గించినట్లు ? ఇన్ని సంవత్సరాలుగా కేంద్రం ఎందుకు, ఎంత పెంచింది, ఇంతకాలం ససేమిరా తగ్గించేది లేదని తిరస్కరించి ఇప్పుడు ఎందుకు, ముష్టి విదిల్చినట్లుగా తగ్గించిందో, ఉత్తర ప్రదేశ్‌ మాదిరి డీజిలు, పెట్రోలు మీద కేంద్రం కూడా పన్నెండు రూపాయలు కేంద్రం ఎందుకు తగ్గించలేదో బిజెపి నేతలు చెప్పాలి. మోడీ గారు అధికారంలోకి వచ్చినపుడు 58గా ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 75కు పడిపోవటానికి కారణం మోడీ గారు అనుసరిస్తున్న విధానాలే. అందువలన ముందు దాన్ని కనీసం పూర్వపువిలువకైనా పెంచాలి, లేదా వారి అసమర్ధతకు జనాన్ని బలిచేయకుండా మరింతగా ఏడున్నర సంవత్సరాల స్ధాయికి పన్ను తగ్గించాలి. లేదా చమురును కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి, రాష్ట్రాల ఆదాయం తగ్గినంతకాలం ఇప్పుడు జిఎస్‌టి పరిహారం ఇస్తున్న మాదిరే ఎంతకాలం లోటు ఉంటే అంతకాలం చెల్లించాలి. కేంద్రం పెంచిన మాదిరి రాష్ట్రాలు వ్యాట్‌ విపరీతంగా పెంచలేదు. అందువలన కేంద్రం ముందు దారి చూపి రాష్ట్రాలను అనుసరించాలని కోరవచ్చు తప్ప డిమాండ్‌ చేసే హక్కు లేదు. కేంద్రం తగ్గిస్తే దానికి అనుగుణంగా రాష్ట్రాలు తగ్గించకుండానే భారం తగ్గుతుంది. కేంద్రం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయలు తగ్గిస్తే ఆమేరకు రాష్ట్రాల వ్యాట్‌ భారం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు మీద 31శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. కేంద్రం తగ్గించినదాని ప్రకారం పెట్రోలు మీద లీటరుకు 155పైసలు, డీజిలు మీద 22.25శాతం ఉన్నందున 2.25పైసలు రాష్ట్రవాటాగా తగ్గుతుంది. కేంద్రం తగ్గించిన మేరకు ఆ దామాషాలో రాష్ట్రానికి కూడా వాటా తగ్గుతుంది.


కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధుల గురించి కేంద్రం ఎటూ తేల్చదు, బిజెపికి పట్టదు.ప్రకటించిన విశాఖ రైల్వేజోన్‌ సంగతి మాట్లాడరు. చమురు ధరల తగ్గింపు గురించి ఆందోళనకు దిగిన తెలుగుదేశం రైల్వే జోన్‌, ఇతర అంశాల గురించి ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? రెండు తెలుగు రాష్ట్రాల్లోను అధికార పార్టీలైన తెరాస-వైసిపి కేంద్రంలోని బిజెపితో ఘర్షణకు దిగేందుకు సిద్దం కావటం లేదు. తాజా పరిణామాలు అనివార్యంగా బిజెపితో తెరాస-వైసిపి మధ్యం దూరం పెంచనున్నాయని భావిస్తున్నారు. రెండు పార్టీలను మింగివేసేందుకు లేదా తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు బిజెపి చేయాల్సిందంతా చేస్తోంది. విధానపరమైన తేడాలు లేవు, తేడా అధికారం దగ్గరే కనుక, బిజెపి బలహీనపడుతున్న కారణంగా రెండు పార్టీలు రానున్న రోజుల్లో ప్రతిఘటించేందుకే పూనుకోవచ్చు.లేదూ బిజెపికి లొంగితే అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది . సమస్యలు చుట్టుముడుతున్న నేపధ్యంలో రెండు రాష్ట్రాల సిఎంలూ ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలకు తెరలేపినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆసక్తి గొలుపుతున్న తెలంగాణా రాజకీయాలు – ఈ సారీ ముందస్తు ఎన్నికలేనా !

20 Monday Sep 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Telangana, Telugu, Uncategorized

≈ Leave a comment

Tags

Bandi Sanjay, BJP, KCR, Revanth Reddy, Telangana Left, Telangana politics, trs

ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రాజకీయాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి.ఈ నెల 27న భారత బంద్‌ను జయప్రదం చేసేందుకు, బిజెపి,టిఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కాంగ్రెస్‌, వామపక్షాలు, టిజెఎస్‌ నేత కోదండరామ్‌, ఇంటి పార్టీ నేతలు ఒక్కటిగా కదలాలని నిర్ణయించటం సరికొత్త పరిణామం. ఇది కేవలం రెండు పాలక పార్టీల విధానాల మీద ఉద్యమించటం వరకే పరిమితం అవుతుందా ? రాబోయే ఎన్నికల సర్దుబాట్లకు దారి తీస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేము. అధికార టిఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు, తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రంగంలోకి దిగిన కొత్త పార్టీ వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌ పార్టీ, మాజీ ఐపిఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజకీయ తీర్ధం పుచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌, వామపక్షాలైన సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీలు, శక్తులు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నాయి. అన్ని పార్టీలు ఒకే పద్దతిలో, ఒకే స్ధాయిలో లేవు. కాంగ్రెస్‌ తన శంఖారావాన్ని పూరించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నియోజకవర్గమైన గజ్వేల్‌ను ఎంచుకోవటం అక్కడ భారీ బహిరంగసభ నిర్వహించటం గమనార్హం. మరోవైపున కాంగ్రెస్‌ నుంచి ఎదురవుతున్న సవాలను ఎదుర్కొనేందుకు బిజెపి కూడా నడుం కట్టింది. అమిత్‌షాను రప్పించి సెప్టెంబరు 17 తెలంగాణా విమోచన పేరుతో తన మత అజెండాను నిర్మల్‌లో ప్రారంభించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ హస్తినలో తిష్టవేసి జరిపిన మంత్రాంగం గురించి ఎవరికి తోచిన ఊహాగానాలతో వారు ఉన్నారు. వాటిని పూర్తిగా కొట్టిపారవేయనవసరం లేదు అలాగని యథాతధంగా తీసుకోవాల్సిన అగత్యమూ లేదు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము.


గత అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, లేదా స్ధానిక సంస్థలకు వచ్చిన సాధారణ ఎన్నికల సమయంలో కొట్టవచ్చినట్లు కనిపించిన ఒక అంశం ఏమంటే వాగ్దానాల వరద. అది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఎన్నికైన ప్రతినిధులు రాజీనామా చేయాలి, ఉప ఎన్నికలు జరిపించాలనే డిమాండ్లు తలెత్తేందుకు దోహదం చేశాయి. చేసిన వాగ్దానాలు, చెప్పిన ఊసులు అమల్లోకి వస్తాయా లేదా అని ఎవరూ చూడటం లేదు. అన్నీ జరగవనీ తెలిసి కూడా ఎందుకు కోరుకుంటున్నారు అంటే అసల్లేనిదాని కంటే ఎంతో కొంత జరుగుతుంది కదా అన్నది అంతర్గత తర్కం.

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు జరిగిందేమిటి ? వరదల్లో మునిగిపోయిన వారికి, మునిగిపోయినట్లు నమోదైన వారికీ పదివేల రూపాయల చొప్పున చాలా మందికి ఇచ్చారు. ఎన్నికల నిబంధనల ఆటంకం కారణంగా మిగిలిన వారికి తరువాత ఇస్తామని వాగ్దానం చేశారు. ఏం జరిగింది, అధికారపక్షానికి అనుకున్న స్ధాయిలో స్ధానాలు రాలేదు. ఎన్నికలు ఐదు సంవత్సరాలు ఉన్నాయి గనుక అప్పుడు చూసుకుందాం లెమ్మని నిజమైన బాధితులకు సైతం ఎగనామం పెట్టారు. హుజూర్‌ నగర్‌, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల సమయంలో, తరువాత జరిగింది కూడా దీనికి భిన్నమేమీ కాదు.


ఇప్పుడు హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక. మిగతా రాష్ట్రాలతో పాటు దీనికి ప్రకటించలేదు. దానికి ఎవరి కారణాలను వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారే వాయిదా వేయించారన్నది ఒక కథనం. కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్నికల కమిషన్‌ దగ్గర బిజెపి కంటే కెసిఆర్‌ పలుకుబడి ఎక్కువ కాదు, ఎలాగూ గెలిచేది తామే కనుక ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేందుకు బిజెపి వారే వాయిదా వేయించారన్నది మరొక కథ. ఇక్కడ ఏ కధ వాస్తవం అయినా రాజ్యాంగ వ్యవస్దల విశ్వసనీయత ప్రశ్నార్దకం అవుతోంది. ఎన్నికను వాయిదా వేయాల్సినంతగా కరోనా తీవ్రత లేదన్నది నిజం.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఎట్టి పరిస్ధితిలో అయినా ఓడించాలన్నది అధికారపక్ష పట్టుదల, ఎలాగైనా గెలిచి తమదే టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అని ఓటర్ల ముందుకు వెళ్లాలన్నది బిజెపి తాపత్రయం. ఈ నేపధ్యంలో వచ్చిందే దళిత బంధు. ఈ పధకాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం ఉండదు. బండి గుర్రానికి కళ్ల ముందు గడ్డి కట్ట పెట్టినట్లుగా దీన్ని ఆశచూపితే దళితులందరూ తమకే ఓట్లు వేస్తారని, ఓటు బ్యాంకుగా మారతారన్నది అధికారపక్ష ఎత్తుగడ. కాంగ్రెస్‌ పార్టీ దళిత బంధుతో పాటు గిరిజన బంధు ఎందుకు అమలు జరపరంటూ ముందుకు వచ్చింది. మిగిలిన సామాజిక తరగతుల్లో కూడా నిజమే కదా మాకూ బంధు ఎందుకు అమలు జరపరు అనే ఆలోచన ప్రారంభమైంది.తమ పధకంతో ప్రతిపక్షాలను దెబ్బకొట్టటంతో పాటు దళితులను బుట్టలో వేసుకుంటామన్నంత వరకే అధికారపార్టీ ఆలోచించింది తప్ప అది అంతటితో ఆగదు అన్నది ఊహించి ఉండరు. ఎవరికైనా తట్టినా ముఖ్యమంత్రికి చెప్పే సాహసం చేసి ఉండరు. అలాంటి వాతావరణం లేదు కదా !


మొత్తం మీద ఇతర కులాల్లో కూడా దళితబంధు ప్రచారం కావటంతో అధికారపక్షానికి సెగతగిలింది. అర్హులైన దళిత కుటుంబాలు ఎన్ని ? పన్నెండు లక్షలా, పదిహేను లక్షలా ? ఆ కుటుంబాల సంఖ్య పెరగదు, స్ధిరంగా ఉంటుంది అనుకుంటే పన్నెండు అయితే లక్షా ఇరవై, పదిహేను అయితే లక్షా యాభై వేల కోట్లు కావాలి.ఒకటో తారీఖున ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలే ఇవ్వని స్ధితిలో ఉన్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెస్తుంది అన్నది ఒక ప్రశ్న. షెడ్యూలు కులాలు, గిరిజనులకు ఉప ప్రణాళికల నిధులు, వారికి అమలు జరుగుతున్న కొన్ని పధకాల నుంచి దళితుల వాటాను ఈ కొత్త పధకానికి మళ్లించే అవకాశం ఉంది. ఈ పధకంతో దళిత కుటుంబాలను ఉద్దరించినట్లే అని రికార్డుల్లో రాసి అమల్లో ఉన్న కొన్ని పధకాలకు మంగళం పాడినా, నామమాత్రం చేసినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందన్నది అప్పుడే చెప్పలేము. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసే వరకు అది బ్రహ్మదార్ధమే. దళితులకు మూడెకరాల భూమి కొందామని చూస్తున్నా భూమి, దానికి అవసరమైన నిధులు లేవని చేతులెత్తేసిన పెద్దలు ఆ ఎన్నిక తరువాత దళిత బంధుకూ అదే గతి పట్టించినా ఆశ్చర్యం లేదు.


దళిత బంధును ఇప్పుడు హుజూరాబాద్‌కే అమలు జరిపి వచ్చే బడ్జెట్‌లో ఇరవైవేల కోట్ల నిధులు కేటాయిస్తాం అని కెసిఆర్‌ చెప్పారు. అది నెరవేరినా పన్నెండు లక్షల కుటుంబాలైతే ఆరు సంవత్సరాలు, పదిహేను అయితే ఎనిమిదేండ్లు పడుతుంది. ఇతర కులాల్లో అసంతృప్తి లేదా ఆశ ప్రారంభం కావటంతో వీలైతే వారికి కూడా అమలు చేస్తాం అని బండి గుర్రపు గడ్డి కట్టలను సిఎం ప్రదర్శించారు. పులిని ఎక్కిన వారు దాన్ని అదుపు చేయాలి లేకపోతే అది ఎక్కిన వారిని మింగివేస్తుంది. సంక్షేమ, ప్రజాకర్షక పధకాలు కూడా అంతే. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు సంస్ధలను ఏర్పాటు చేసినందుకు పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీ ఇస్తున్నారు. వస్తువులను ఎగుమతులు చేసినందుకూ ప్రోత్సహకాల పేరుతో కట్టబెడుతున్నారు. అందువలన మన సమాజంలో రక్షణ లేని, అల్పాదాయ వర్గాలకు సంక్షేమ పధకాలను అమలు జరపాలనటంలో మరొక మాట ఉండనవసరం లేదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఒక పరిమితి దాటితే వాటిని అమలు జరపటం ఎలా అన్నదే సమస్య. రాష్ట్ర వ్యాపితంగా పేదలు, మధ్యతరగతి వారు ఉపయోగించే ఆర్‌టిసికి వస్తున్న నష్టాలను భర్తీ చేసేందుకు ముందుకు రాకుండా దాన్ని మూసివేసేందుకు పావులు కదుపుతున్న సర్కార్‌ మరోవైపు హైదరాబాద్‌ మెట్రోకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఆలోచిస్తామని సిఎం చెప్పారు.


రకరకాల సాకులు చూపి ఉద్యోగులకు పిఆర్‌ఎసి అమలు విషయంలో ఎంతదగా చేశారో చూశాము. ఒక ఏడాది మినహా మిగిలిన కాలానికి బకాయిలు ఇచ్చేది లేదన్నారు. ఆ ఏడాది మొత్తాలను కూడా పెన్షనర్లకు 36వాయిదాల్లో ఇస్తామన్నారు. సర్వీసులో ఉన్న వారికి వాటిని పిఎఫ్‌ ఖాతాల్లో జమచేసినా వాటి మీద నామమాత్ర వడ్డీ అయినా వచ్చేది. అలాగాక వారు ఉద్యోగవిరమణ సమయంలో ఆ మొత్తాలను ఇస్తారట.ప్రకటించిన నెలలో నూతన వేతనాలను అమలు చేయలేదు. ఆ కాలానికి నగదు వేతనాలు, పెన్షన్లతో పాటు ఇస్తామని చెప్పారు. వాటిని కూడా ఇంతవరకు చెల్లించలేదు. మూడు వాయిదాల డిఏ బకాయిలు ఉన్నాయి. జనవరి నాటికి మరోవాయిదా సిద్దం అవుతున్నది. ఇలా చేయించుకున్న పనికే చెల్లించటానికి ఎగనామం పెట్టి, ఇబ్బందులు పెడుతున్నవారు అవసరం తీరిన తరువాత సంక్షేమ పధకాలకు మంగళం పాడితే…!

ఎరువుల సబ్సిడీకి పరిమితి విధించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగంలో తలెత్తిన ఆందోళనను తగ్గించేందుకు కిసాన్‌ యోజన పేరుతో ఆరువేల రూపాయలను మూడు విడతలుగా ఇచ్చే పధకాన్ని అమలు జరుపుతోంది. పెరిగిన ఎరువుల ధరల భారంతో పోల్చితే అది నామమాత్రం. ఇప్పుడు విద్యుత్‌ రాయితీలకు మంగళం పాడేందుకు కేంద్రం పూనుకుంది. దాంతో జరిగేదేమిటి ? ఒక యూనిట్‌ విద్యుత్‌ను వినియోగదారుడికి చేర్చేందుకు అయ్యే మొత్తం ఖర్చులో ఇరవై శాతానికి మించి రాయితీలు ఉండకూడదు. ఒక యూనిట్‌ ధర ఏడు రూపాయలైతే సబ్సిడీ 140 పైసలు మాత్రమే ఇవ్వాలి.ఇప్పటి వరకు రాష్ట్రాలు వివిధ వినియోగదారులకు వేర్వేరు ధరలను నిర్ణయించి రైతులకు ఉచితంగా ఇస్తున్నాయి. నూతన విద్యుత్‌ బిల్లు చట్టమైతే కొందరి వద్ద అదనంగా వసూలు చేసేందుకు, దాన్ని ఇతరులకు సబ్సిడీగా ఇచ్చేందుకు వీలు ఉండదు. అందువలన అనివార్యంగా రాష్ట్రాలు తమ బడ్జెట్ల నుంచి కేటాయింపులు జరపాలి. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఎరువులకు నిర్ణీత మొత్తాలను కేటాయించి సరిపెట్టుకోమని చెప్పేస్తున్నాయి. విద్యుత్‌కూ అదే రాబోతున్నదని చెప్పవచ్చు. ఎరువుల ధరలు మార్కెట్లో ఎంత ధర ఉంటే అంత మొత్తం చెల్లించి రైతులు కొనుగోలు చేయాలి.ధరతో నిమిత్తం లేకుండా నిర్ణీత సబ్సిడీ మొత్తాన్ని దాన్నుంచి తగ్గిస్తారు. పెరిగితే ఆ భారాన్ని రైతులే పెట్టుకోవాలి.ఇప్పుడు వంట గ్యాస్‌కు దాన్ని వర్తింప చేశారు. టిఆర్‌ఎస్‌ విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రధాన పంటగా మారిన వరి ఆ పార్టీకి ఉరిగా మారుతుందా అన్నట్లుగా పరిస్ధితి ఉంది. రైతులకు ఉన్నంతలో మెరుగైన ఫలితాలనిచ్చే ముతక బియ్యం(ఉప్పుడు బియ్యానికి పనికి వచ్చే రకాలు) రాష్ట్ర ప్రభుత్వానికి గుది బండగా మారవచ్చు. దాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకొనే అవకాశమూ లేకపోలేదు. గతంలో అంగీకరించిన మేరకు తప్ప అదనంగా తమకు అవసరం లేదని ఎఫ్‌సిఐ ఇప్పటికే చెప్పేసింది. ఏం జరుగుతుందో తెలియదు. రైతులకు ఎంత ఆర్ధిక నష్టం జరిగితే టిఆర్‌ఎస్‌కు అంతమేరకు రాజకీయ ప్రతికూలత పెరుగుతుంది.

రాష్ట్రంలో ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల తీరు తెన్నులు చూస్తుంటే ఈ సారి కూడా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికవరకే అయితే ఇంత హడావుడి ఉంటుందా అన్నదే సందేహం. ఆ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలో ఒక చర్చనీయాంశం అవుతుంది.కేంద్రం విద్యుత్‌ సంస్కరణల బిల్లును ఆమోదించి చట్టంగా మారితే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిలే విద్యుత్‌ షాక్‌ దేనికి దారి తీస్తుందో తెలియదు. విద్యుత్‌, వరి, దళితబంధు వంటి పధకాలు-పర్యవసానాలు జనానికి తెలిసే ముందే ఏదో ఒకసాకుతో ఆకస్మికంగా ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. పోయిన సారి కాంగ్రెస్‌, బిజెపి బలహీనంగా ఉన్నపుడే తమకు లాభమని కెసిఆర్‌ భావిస్తే ఇప్పుడు తన వైఫల్యాలు మరింతగా జనం నోళ్లలో నానక ముందు, ఆ రెండు పార్టీలు పుంజుకోక ముందే అసెంబ్లీ ఎన్నికలు జరపటం మంచిదనే అంశం గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. దాని గురించి మరోసారి చెప్పుకుందాం. ఇప్పుడున్న పరిస్ధితి ఏమిటి ? కేంద్రంలోని బిజెపితో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ దోబూచులాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యవసానాలేమిటి ?


దేశంలోని వివిధ రాష్ట్రాలల్లో ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులను చూసినపుడు మొత్తంగా ఒక స్ధిరమైన వైఖరితో ఉండటం లేదు.రాష్ట్రాల హక్కుల పరిరక్షణ నేపధ్యంలో పుట్టిన పార్టీలన్నీ ఆ లక్ష్యాన్ని వదలివేశాయి. తెలంగాణా రాష్ట్ర సమితి కూడా అదే బాటలో నడుస్తున్నది. ఎప్పుడు ఏ అవకాశవాద వైఖరి తీసుకుంటుందో చెప్పలేము.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు జరపటం లేదని అమావాస్యకు పౌర్ణానికి విమర్శించటం తప్ప నిర్దిష్ట కార్యాచరణ లేదు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జనాల మనోభావాలను ఉన్నత స్ధాయికి తీసుకుపోయారు. ఏడు సంవత్సరాలుగా నియామకాల ప్రహసనం ఎలా సాగుతోందో చూస్తున్నాం. నిధుల సమస్య ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచే పరిష్కారమైంది. ఉమ్మడి ఆస్తుల పంపకం మాత్రమే మిగిలి ఉంది. ఇక నీళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో వివాదంతో మనోభావాలతో ఆడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అమల్లో ఉన్న నీటి న్యాయానికి భిన్నమైన డిమాండ్లను ముందుకు తెచ్చారు.

తమిళనాడులో గతంలో మాదిరి లోక్‌సభ సీట్లను గణనీయంగా జాతీయ పార్టీకి అప్పగించి రాష్ట్ర అధికారం నిలుపుకొనేందుకు ప్రయత్నించిన డిఎంకె, అన్నాడిఎంకె మాదిరి మీకది మాకిది అన్నట్లు బిజెపితో ఒప్పందానికి రావటానికి కేసిఆర్‌కు ఇబ్బంది లేదు. అయితే వరుసగా అన్ని రాష్ట్రాలను కబళించేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి అందుకు అంగీకరించటం లేదు. ఈ రాష్ట్రంలోని నేతలు ప్రతిఘటిస్తున్నారు. ఆ పంచాయతీ తెగేట్లు లేదు. పశ్చిమబెంగాల్‌ పరిణామాలను చూసిన తరువాత అనివార్యం అయితే టిఆర్‌ఎస్‌ బిజెపితో అమీతుమీ తేల్చుకుంటుంది. దానికి సిద్దపడగానే కేంద్రం ఇడి, సిబిఐ, ఇతర దర్యాప్తు సంస్దలను రంగంలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లతో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బల నేపధ్యంలో బిజెపి ఇప్పటికిప్పుడు టిఆర్‌ఎస్‌తో తెగేదాకా లాగకపోవచ్చు. కొన్ని తురుపు ముక్కలను అట్టి పెట్టుకుంటుంది. అదే ఎత్తుగడను టిఆర్‌ఎస్‌కూడా అనుసరిస్తుంది. ఈ లోగా బండి సంజయ-దానికి పోటీగా అధికారపార్టీ నేతల నోటిదూలతో జనానికి కిక్కు ఎక్కిస్తారు.


ఇప్పటికిప్పుడు చూస్తే టిఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా మొదటి స్ధానంలో ఉంది. దాని ధనశక్తి, మీడియా మద్దతును తక్కువ అంచనా వేయలేము. జనంలో వాగ్దానాలను విస్మరించిందన్న అసంతృప్తి ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌,బిజెపి పట్ల ప్రత్యేకమైన అభిమానం లేదు. ఏమైనా సరే టిఆర్‌ఎస్‌ను ఓడించాలనే వాతావరణం ప్రస్తుతం ఉన్నట్లు చెప్పలేము. అయితే అది శాశ్వతం కాదని టిఆర్‌ఎస్‌ నేతలకు అర్దం అయింది. కొండమీది రాయి కిందికి జారనంత వరకు స్దిరంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కదలటం ప్రారంభమైన తరువాత వేగం అందుకుంటుంది. జనంలో వ్యతిరేకత కూడా అంతే. అందుకే కొత్త కొత్త ప్రజాకర్షక నినాదాలతో, వివాదాలతో ముందుకు వస్తుంది. జనంలో అసంతృప్తి పెరిగితే వాటి కారణంగానే పతనం కూడా అవుతుంది.


దుబ్బాక ఉప ఎన్నిక, తరువాత హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వచ్చిన ఊపుతో బిజెపి తమదే రెండో స్ధానం అని చెప్పుకుంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల నేతలు బిజెపి వైపు చూశారు, లోపాయకారీ సంబంధాలను కూడా పెట్టుకొన్నారు. ఇప్పటికీ టిఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు బిజెపి పావులు కదుపుతోంది. అయితే అధికారమే పరమావధిగా ఉన్న నేతలు ఎంత వీలైతే అంత అధికార పక్షంలో ఉండి పిండుకొని ఎన్నికల ముందు వేరే పార్టీలోకి ఫిరాయించటం ఇటీవలి కాలంలో సాధారణమైంది. తెలంగాణా దానికి మినహాయింపు కాజాలదు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో తగిలిన దెబ్బ, ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటమి బిజెపి ప్రచార గాలిని తీశాయి. దీనికి తోడు కాంగ్రెస్‌ సారధిగా నోటి దురుసులో ముఖ్యమంత్రి, బిజెపి నేతలకు పోటీగా ఉండే రేవంతరెడ్డి నియామకంతో కాంగ్రెస్‌ నుంచి వలసలకు బ్రేకు పడింది. బిజెపి కంటే మెరుగైన స్ధానానికి చేరుకుంది. అయితే అది నిలుస్తుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అంతకు ముందు బీహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్ధితి పెద్దగా మెరుగుపడకపోయినా పెద్దగా దిగజారలేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఫలితాలు కూడా ఆ పార్టీ మీద ప్రభావం చూపవచ్చు. బిజెపికి తగిలే దెబ్బలు, ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు లాభించే అవకాశం ఉంది.


తెలంగాణాలో వామపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే తమ ఉనికిని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఆందోళనను బలపరిచిన సిపిఐ బావుకున్నదేమీ లేదు. వ్యతిరేకించిన సిపిఎం సహజంగానే కొంత దెబ్బతిన్నది. అయితే ప్రజాసమస్యలపై ఆ పార్టీలు, అవి పనిచేస్తున్న ప్రజాసంఘాల కార్యకలాపాలు వాటి ఉనికిని కాపాడుతున్నాయి. అన్నింటికీ మించి నయా ఉదారవాద విధానాలు పాలకపార్టీల మీద జనంలో పెద్ద ఎత్తున భ్రమలు కొల్పాయి. ఈ నేపధ్యంలో వామపక్షాలు, వాటి నినాదాలు జనానికి అంత ఆకర్షణీయంగా కనిపించటం లేదు. అయితే ప్రపంచంలో ముఖ్యంగా అమెరికా, లాటిన్‌ అమెరికా దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు వామపక్షాల వైపు తిరిగి జనం చూడకతప్పదనే భావం కలుగుతోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జనం పట్ల నిబద్దతే వాటిని కాపాడుతుంది.


ముస్లిం మైనారిటీలు గణనీయంగా ఉన్న తెలంగాణాలో మరింతగా మతతత్వాన్ని రెచ్చగొట్టి బలపడాలని బిజెపి ప్రయత్నిస్తుంటే అదే అస్త్రంతో మజ్లిస్‌ కూడా తన పట్టును పెంచుకోవాలని చూస్తోంది. టిఆర్‌ఎస్‌-మజ్లిస్‌ బంధం గురించి బిజెపి ఎంత రెచ్చగొట్టినా దానికి ఆశించిన ఫలితాలు రావటం లేదు. వచ్చే అవకాశాలు కూడ కనిపించటం లేదు. రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్‌-బిజెపి అమీతుమీ తేల్చుకునేందుకు పూనుకుంటే మైనారిటీలు సహజంగా బెంగాల్లో మాదిరి టిఆర్‌ఎస్‌వైపే మొగ్గుతారు, లేదా కాంగ్రెస్‌ బలపడితే, బిజెపిని ఓడించే పార్టీ అదే అని భావిస్తే ఆ పార్టీ వైపు మొగ్గినా ఆశ్చర్యం లేదు. రెండవ అంశం ప్రస్తుతానికి ఊహాజనితమే. వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని పార్టీ ప్రస్తుతానికి ఎవరి అవకాశాలను దెబ్బతీసే లేదా ప్రయోజనం కలిగించే పరిస్దితిలో లేదు. ఒక అధికారిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీసుకున్న చర్యలు దళితుల్లోని మధ్య తరగతిలో ఆయనపట్ల అభిమానాన్ని పెంచటం సహజం. అయితే అది ఎన్నికల్లో ఫలితాలను ఇస్తుందని చెప్పలేము. ఉత్తర ప్రదేశ్‌లో గతంలో బిఎస్‌పికి ఉన్న పట్టు ఇప్పుడు లేదు, రాబోయే ఎన్నికల్లో వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి పొందిక తెలంగాణాలో వచ్చే అవకాశం లేదు గనుక బిఎస్‌పి, దాని సారధ్యం పుచ్చుకున్న ప్రవీణ్‌ కుమార్‌ భవిత్యం ఏమిటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్దకమే. ఇక వ్యక్తులుగా ఉన్న వారు ఏ వైఖరి తీసుకున్నప్పటికీ వారు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d