Tags
BJP, Caste Reservation, CHANDRABABU, Narendra Modi Failures, OBC sub-categorisation, Revanth Reddy, Rohini Commission, SC/ST sub-quota, Supreme Court of India
ఎం కోటేశ్వరరావు
దళితులు, గిరిజనుల్లో సామాజిక న్యాయం జరిగేందుకు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్లలో ఆయా తరగతుల వర్గీకరణ జరిపి వాటాలను నిర్ణయించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు దశాబ్దాలుగా నడుస్తున్న ఒక అంకానికి తెరదించింది.మరో దానికి నాంది పలికింది.దీని కోసం ఎదురు చూసిన వారు ఆనందంతో ఉండగా వ్యతిరేకించిన వారు విచారంలో మునిగిపోయారు. ఈ రెండు భావనలూ వాస్తవమే అయినా తాత్కాలికమే.అంటరానితనంతో సహా మొత్తంగా జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం జరపాలని కోరుకుంటున్నవారి ప్రయత్నాలకు కాస్త ఇబ్బందే. ప్రతి అస్తిత్వ భావన ఎంతో కొంత చెరపు చేస్తుంది. రాష్ట్రాలలో వర్గీకరణ గురించి ఒక స్పష్టత వచ్చింది. మరి కేరద్ర సర్వీసులు, ప్రభుత్వరంగ సంస్థలు, బాంకులు, ఎల్ఐసి వంటి ఆర్థిక, విత్త సంస్థలలో దళితులు, గిరిజనులతో పాటు ఓబిసి వర్గీకరణ మాటేమిటి అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. అభివృద్ధి జరగాలంటే రెండు ఇంజన్ల పాలన ఉండాలన్న నినాదాన్ని ముందుకు తెచ్చిన పెద్దలు కేంద్రం గురించి కొన్ని రాష్ట్రాలలో వర్గీకరణ ఘనత మాదే అంటున్నారు, కొన్ని చోట్ల మౌనంగా ఉంటున్నారు, తమ ముందున్న అంశాల గురించి మాట్లాడరేం ? వర్గీకరణ సమస్యను ముందుకు తెచ్చిన వారు కూడా రాష్ట్రాల గురించి తప్ప కేంద్ర అంశాన్ని ప్రస్తావించకపోవటం వెనుక ఉన్న కారణం ఏమిటి ?
నిచ్చెన మెట్ల సమాజం మనది. అసమానతలు, దారిద్య్రం, ఉపాధి రంగాలలో నెలకొన్న దుస్థితికి ఎక్కడా లేని అంటరానితనం అనే సామాజిక వివక్ష కారణంగా ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఉపశమనం తప్ప శాశ్వత నివారణ కాదు. వాటిని కూడా కొంత మందే పొందుతున్నారు అన్న అసంతృప్తి నుంచి ముందుకు వచ్చిందే వర్గీకరణ. అది న్యాయసమ్మతమే కనుక ఎక్కువ మంది ఆమోదం పొందింది. గతంలో సంస్థానాధీశులు, జమిందార్లు, భూస్వాములు భూమి వదులుకొనేందుకు సిద్దం కాలేదు. అలాగే రిజర్వేషన్ల వలన లబ్దిపొందిన కొన్ని తరాలు కూడా అదే కోవకు చేరి వర్గీకరణను వ్యతిరేకించిన ఫలితమే కోర్టుల జోక్యం. ఇవి చిన్నయ్య-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వివాదంలో వర్గీకరణ చెల్లదని 2004లో సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పును చెల్లదని, పంజాబ్, హర్యానా హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సమీక్షించి వర్గీకరణ సబబే అని తాజాగా ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6-1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా సదరు వర్గీకరణ ఎలా ఉండాలో కూడా న్యాయమూర్తులు చెప్పారు. రాష్ట్రాలు వాటిని ఎలా తమ చట్టాలలో పొందుపరుస్తాయో చూడాల్సి ఉంది. అవి కోర్టుల సమీక్షకు లోబడి ఉండాలని, రాజకీయ దుర్వినియోగం చేయకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. గతంలో క్రీమీ లేయర్ (మెరుగైన ఆర్థిక స్థితి) ఓబిసిలకు మాత్రమే వర్తింప చేశారని ఇప్పుడు ఎస్సి, ఎస్టిలకూ అమలు చేయవచ్చని కూడా పేర్కొన్నది. దళితుల ఉపకులాలైన వాల్మీకులు, మజాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు అమలు జరపాలన్న ఆ రాష్ట్ర చట్టాన్ని 2004 సుప్రీం కోర్టు తీర్పు ప్రాతిపదికన 2010లో పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. దళితులంటే అందరూ ఒకటే అని వారిని విడదీయ కూడదని చెప్పింది. తాజా తీర్పు ఆ వైఖరి తప్పు అని పంజాబ్లో చేసిన చట్టం సరైనదే అని చెప్పింది. ఇప్పటి వరకు ఈ అంశాన్ని ఉపయోగించుకొని రాజకీయ పక్షాలు లబ్ది పొందేందుకు చూసినందున పార్టీలపై కచ్చితంగా ఈ తీర్పు ప్రభావం పడనుంది, అదెలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. ప్రతిదాన్నీ రాజకీయం చేసేందుకు చూస్తున్న తరుణమిది.
దళితుల వర్గీకరణ డిమాండ్ అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు.కులాల పేర్లు ప్రస్తావించకూడదని అనుకున్నప్పటికీ సందర్భవశాత్తూ తప్పటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో మాదిగ సామాజిక తరగతి వర్గీకరణను కోరుతుండగా, పంజాబ్లో అదే తరగతి వ్యతిరేకిస్తున్నది. రిజర్వేషన్ల వలన లబ్దిపొందిన కొన్ని కులాల వారు తమకు అవకాశాలు తగ్గిపోయాయనే భావనతో వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు.ఇది మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు కాదు. వర్గీకరణ అనుకూల, వ్యతిరేక భావనలకు పంజాబులో నాంది పలికారు. అకాలీదళ్ తన పలుకుబడిని పెంచుకొనేందుకు దళితుల్లో వెనుకబడిన వాల్మీకులు, మజాబీ సిక్కులకు అన్యాయం జరిగిందంటూ వారిని సమీకరించేందుకు పూనుకుంది.దాన్ని ఎదుర్కొనేందుకు 1975 మే ఐదున కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్న జ్ఞానీ జైల్ సింగ్ రిజర్వేషన్ల తురుపుముక్కను ప్రయోగించారు.ప్రభుత్వ శాఖలలో వీలైన మేరకు ఈ రెండు సామాజిక తరగతుల వారికి 50శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని ఆదేశించారు.దీంతో అప్పటికే గణనీయంగా లబ్దిపొందిన మాదిగ సామాజిక తరగతి అవకాశాలు తగ్గిపోయాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పంజాబ్ జనాభాలో 32శాతం మంది దళితులు ఉన్నారు.రాష్ట్రం వర్గీకరణ అమలు చేస్తున్నప్పటికీ వాల్మీకులు, మజబీల పరిస్థితి పెద్దగా మెరుగుపడిందేమీ లేదు.వర్గీకరణ లేని కారణంగా కేంద్ర సర్వీసులలో వారు తగిన ప్రాతినిధ్యం పొందలేకపోయారు. 2004 ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అక్కడ కూడా సదరు అంశాన్ని సవాలు చేశారు. హైకోర్టు వర్గీకరణను రద్దు చేసింది. అక్కడి పరిస్థితి గురించి 2007లో వర్గీకరణ సమస్య మీద ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 105 మంది ఐఎఎస్లలో పంజాబు దళితుల్లో 42శాతం మంది ఉన్న వాల్మీకులు, మజాబీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆది ధర్మీస్గా పిలిచే సామాజిక తరగతి తోలు వృత్తిలో ఉన్న దళితులు ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన స్థితిలో ఉన్నారు. కారణం బ్రిటీష్ భారత సైన్యంలో ఉన్న వారికి అవసరమైన బూట్ల తయారీలో వారు నిమగం కావటంతో దానికి పరిమితంగానైనా చదువు సంధ్యలు అవసరం కావటం, ఆర్థిక స్థితి మెరుగై రిజర్వేషన్ అవకాశాలను కూడా ఎక్కువగా అందిపుచ్చుకున్నారు. వ్యవసాయ కార్మికులుగా, పట్టణాలలో పారిశుధ్య కార్మికులుగా ఉన్న దళితులకు చదువుతో అవసరం లేకపోయింది. హర్యానాలో 1994లో దళితులను ఏ-బి తరగతులుగా విభజించి తోలు వృత్తి చేసేవారికి 50శాతం ఇతరులకు మిగతా సగం రిజర్వేషన్లు కల్పించారు.తోలు వృత్తి చేసేవారు ఎక్కువగా లబ్ది పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ గురించి అధ్యయనం చేసిన ఉషా మెహ్రా కమిషన్ 2008 నివేదిక నాలుగు ఉపతరగతులుగా రిజర్వేషన్లు అమలు జరపాలని సిఫార్సు చేసింది. దళితుల్లో ముందున్న మాలలు ఐఎఎస్, ఐపిఎస్ ఎంపికల్లో 76, 86శాతం మంది ఉండగా మాదిగలు 23, 13శాతాల చొప్పున ఉన్నట్లు పేర్కొన్నది.దళిత జనాభాలో మాలలు 41శాతం కాగా మాదిగలు 49శాతం ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో దాదాపు ఇలాంటి పరిస్థితి ఉన్నది.
దళితులు, వెనుకబడిన తరగతులలో కొందరు అన్యాయానికి, విస్మరణకు గురౌతున్నారంటూ బిజెపి వారిని తన ఓటుబాంకుగా మార్చుకొనేందుకు పావులు కదిపింది. దానిలో భాగంగానే ఒబిసిల వర్గీకరణ పరిశీలనకు 2017లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రోహిణీ కమిషన్ ఏర్పాటు చేసింది. తన నివేదికను 2023జూలై 31న రాష్ట్రపతికి అందచేసింది. నరేంద్రమోడీ ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు.దానిలో ఉన్న అంశాలు వెల్లడైనా, కేంద్ర ప్రభుత్వం వాటి గురించి అభిప్రాయం వెల్లడించినా లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి నాయకత్వంలోని ఎన్డిఏ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే రాజకీయ కారణంతో ఆ నివేదికను అటకెక్కించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎందుకు తెప్పించుకోలేదన్నది ప్రశ్న. రాజకీయ కారణాలతోనే కమిషన్ గడువును పదమూడు సార్లు పొడిగించారు. ఏడాది గడుస్తున్నా దేశ ప్రధమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఎందుకు కేంద్రానికి పంపలేదు, ఎంతకాలం తన దగ్గర ఉంచుకుంటారన్నది ఆసక్తి కలిగించే అంశం. ఆ నివేదికను కేంద్రం తిరస్కరిస్తే వేరు, ఆమోదిస్తే పార్లమెంటుకు సమర్పించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి.వేగంగా పనిచేస్తామని చెప్పుకుంటున్న నరేంద్రమోడీకి ఇది ఒక సవాలే. నివేదికలోని అంశాలపై మీడియాలో తిరుగుతున్న లీకు సమాచారం ప్రకారం ఓబిసిలలో ఐదు నుంచి ఆరువేల ఉపతరగతులు ఉన్నారని, వారి జనాభాలో కేవలం ఒకశాతంగా ఉన్న 40 కులాలవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో 50శాతం మేరకు రిజర్వేషన్ లబ్దిపొందుతున్నట్లు తేలిందట. ఈ నివేదికను తెరవటం అంటే వెంటనే వచ్చే అంశం వెనుకబడిన తరగుతుల జన గణన. దాన్ని రాష్ట్రాలు చేపట్టవచ్చునని బిజెపి తప్పించుకుంటున్నది, ఇంతవరకు ఆ పార్టీ పాలిత రాష్ట్రాలు బుల్డోజర్లు, మత విభజన మీద చూపుతున్న శ్రద్దలో నూరోవంతు కూడా అందుకు చొరవచూపలేదు. దాన్ని బట్టే ఆ పార్టీ చిత్తశుద్ది వెల్లడైంది, ఒక రాష్ట్రంలో బిసిగా ఉన్న వారు మరొక రాష్ట్రంలో ఓసిగానో, కొన్ని చోట్ల దళితులు, గిరిజనులుగానో ఉన్న ఉదంతాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అందువలన రాష్ట్రాలు తీసిన జనాభా లెక్కలను కేంద్రం ఆమోదిస్తుందా అన్నది ప్రశ్న. కేంద్రమే నిర్వహించినా అదే సమస్య ఎదురు కావచ్చు, రెండవది జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం నిర్ణయించాలనే డిమాండ్కు దారి తీసే అవకాశం కూడా ఉంది.1953లో ఏర్పాటు చేసిన కాకా కలేల్కర్ తొలి కమిషన్ బిసిలను వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరుగతులు అనే రెండుగా వర్గీకరించాలని సిఫార్సు చేసింది. మండల్ కమిషన్లోని సభ్యుడైన ఎల్ఆర్ నాయక్ అణచివేతకు గురైన బిసిలు, మధ్యస్థంగా ఉన్నవారు అనే రెండు ఉపతరగతులుగా విభజించాలని ప్రతిపాదించారు. రోహిణీ కమిషన్ నిర్దిష్టంగా ఏమి చెప్పిందో తెలియదు.
చరిత్ర, ఆచరణను చూసినపుడు ఒకే సామాజిక తరగతిగా భావించబడుతున్న కొన్ని కులాల గుంపులో అన్నీ ఒకటిగా లేవన్నది తెలిసిందే.సాధారణ తరగతిగా పరిగణిస్తున్న బ్రాహ్మలలో అధికార వ్యవస్థతో సంబంధాలు కలిగి ఉన్న వారికి-పూజా పునస్కారాలకు పరిమితమైన వారికి ఎంత తేడా ఉన్నదో చూస్తున్నాము. అదే విధంగా మరికొన్ని ఇతర తరగతుల్లో ఆస్తిపాస్తులు ఉన్నవారికి లేని వారికీ చివరికి ఒకే కులంలో ఉన్నవారిలో గల తేడా ఏమిటో తెలిసిందే.దళితులు, గిరిజనుల్లో కూడా అంతే.వర్గీకరణను వ్యతిరేకించేవారు, అనుకూలించే వారు గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న వాదనలు తెలిసినవే. ఇప్పుడు వాటికి తెరపడింది. వర్గీకరణ జరిపినా ఈ తరగతులకు పూర్తిగా సామాజిక న్యాయం అమలు కాదు. సుప్రీం తీర్పును అమలు జరిపేందుకు అవసరమైన సమాచారాన్ని. సాక్ష్యాలను సేకరించకుండా తొందరపడి చేస్తే కోర్టు లిటిగేషన్లో చిక్కుకోవచ్చు.జనాభా లెక్కలు, ఇతర అంశాలను నవీకరించాల్సి ఉంది. దీనికి మానవ వనరులు, నిధులు కూడా అవసరమే. అందువలన వెంటనే అమలు జరపటం సాధ్యమా కాదా అన్నది కూడా చూడాల్సి ఉంది.ఓబిసి వర్గీకరణ, కేంద్ర సర్వీసుల్లో దళితులు, గిరిజనుల వర్గీకరణను బిజెపి అమలు చేస్తుందా లేదా ?
