• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Uncategorized

మన చుట్టూ జరుగుతున్నదేమిటి -1 వైఫల్యాలపై దృష్టి మరల్చేందుకు మరో వివాదం : మోడీపై చైనా అనుమానం !

13 Sunday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ 1 Comment

Tags

anti china, Anti China Propaganda, Indo-China trade, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా ఘర్షణ జరిగి ఏడాది గడిచింది. మనవైపు 20 మంది మరణించగా తమవారు నలుగురు చనిపోయినట్లు చైనా చెప్పింది. అది ఒక బాధాకరమైన, అవాంఛనీయ ఉదంతం. సాధారణ పరిస్ధితులను పునర్దురించాలని ఇరుదేశాలూ సంకల్పం ప్రకటించాయి, చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అయినా ఒకరి మీద ఒకరికి అనుమానాలు తొలగలేదు. అందుకే ఉభయులూ కొన్ని చోట్ల బలగాలను కొంత మేరకు ఉపసంహరించుకున్నా, పూర్తిగా వైదొలగలేదు. చైనా వైపు నుంచి బలగాలను మోహరిస్తున్నారని మన మీడియాలో, మనమూ అదే పని చేస్తున్నామని చైనా ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఏడాది గడచిన సందర్భంగా ప్రపంచ మీడియాలోనూ దాని గురించి రాశారు.

బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్‌ పత్రిక జూన్‌ ఎనిమిదవ తేదీన రాసిన వార్తలో కొత్త వివాదాలు తలెత్తుతాయనే భయంతో భారత్‌ సరిహద్దుల్లో మిలిటరీ బలగాలను పటిష్ట పరుస్తున్నదని పేర్కొన్నది. వేసవి కాలం వచ్చినందున రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగే పెద్ద ముప్పు ఉన్నట్లు రష్యా పత్రిక ఇండిపెండెంట్‌ పేర్కొన్నది. ఈ పత్రికల వార్తలను ప్రస్తావిస్తూ అనేక పత్రికలు విశ్లేషణలు రాశాయి.కరోనా వైరస్‌, ఆర్ధిక రంగంలో వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నించవచ్చని చైనా విశ్లేషకులు చెప్పిన అంశాలను చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ ప్రచురించింది. ” యుద్దం రాదు, అయితే 2020 మేనెలలో సంక్షోభం ప్రారంభమైనప్పటి కంటే ఇప్పుడు ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉంది, ఉభయపక్షాలూ పోరుకు ఎంతో సన్నద్దంగా ఉన్నాయి ” అని ఆసియా రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు అర్జన్‌ తారాపోర్‌ చెప్పినట్లు టెలిగ్రాఫ్‌ రాసింది. కరోనా మహమ్మారి, ఆర్ధిక పరిస్ధితి మరింతగా దిగజారితే సరిహద్దుల్లో భారత్‌ మరో ఘర్షణకు పాల్పడవచ్చని షాంఘైలోని సామాజిక అధ్యయనాల సంస్ధ అంతర్జాతీయ సంబంధాల విభాగపు పరిశోధకుడు హు ఝియాంగ్‌ చెప్పారు.దేశీయంగా సంక్షోభం ఉన్నపుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎప్పుడూ సరిహద్దు సమస్యలవైపు చూసే రాజకీయ సంప్రదాయం భారత్‌కు ఉందని, ఈ విషయమై చైనా చాలా జాగ్రత్తగా ఉండాలని హు చెప్పాడు.

ఎక్కువ భాగం సైన్యాలను రెండు దేశాలూ ఉపసంహరించుకున్నాయి. హాట్‌స్ప్రింగ్స్‌, డెస్పాంగ్‌ మైదానాల వంటివాటి నుంచి ఇంకా జరగాల్సి ఉందని సింఘువా విశ్వవిద్యాలయంలోని జాతీయ వ్యూహ సంస్ధ డైరెక్టర్‌ క్వియాన్‌ ఫెంగ్‌ చెప్పారు.సరిహద్దు వెంబడి చైనా మౌలిక సదుపాయాలు చక్కగా ఉన్నాయి,అయినప్పటికీ ముందు పీఠీన అక్కడ ఎక్కువ దళాలు లేవు, రెండవ వరుసలో బలాలను మోహరించాల్సి ఉందని క్వియాన్‌ చెప్పారు. వివాదం చిన్నదే అన్నారు. గత ఏడాదితో పోలిస్తే సరిహద్దులో పరిస్దితి ఎంతో మెరుగ్గా ఉంది, అయితే ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగితే రెండు దేశాల మిలిటరీ మధ్య సంబంధాలకు, పశ్చిమ సరిహద్దులో స్ధిరత్వానికి ముప్పు అని కొందరు అభిప్రాయపడ్డారు. సరిహద్దుకు సమీపంలోని టిబెట్‌లో చైనా తన దళాలం సంఖ్యను పెంచిందని కొన్ని వార్తలు సూచించాయి. భారత-చైనా నేతలు జనాలకు జవాబుదారీ కనుక సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోగలరని, ఇతర ప్రాంతాల వారు ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఉండటం ముఖ్యమని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ వ్యాఖ్యానించాడు. మే నెలలో జరిగిన కీలక ఎన్నికలలో ఓటమి తరువాత ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి వచ్చే ఎన్నికల్లో మద్దతు పొందాలని చూస్తోందని గ్లోబల్‌టైమ్స్‌ వ్యాఖ్యాత పేర్కొన్నారు.

రెండు దేశాల సైన్యాల ఉపసంహరణకు రెండు రోజుల ముందు చైనా నుంచి బెదిరింపులు ఉన్నందున ఇండో – పసిఫిక్‌ అవగాహనను మరింత పటిష్టపరుచుకోవాల్సిఉందని ఫిబ్రవరి 8న ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అంగీకరించినట్లు ప్రకటించారు.ఇరు దేశాల సంబంధాలు చౌరాస్తాలో ఉన్నాయి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం సహకారం గురించి ఆలోచించలేమని మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ మేనెలలో వ్యాఖ్యానించారు. పరిస్ధితి ఇలా ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి-మే మాసాల మధ్యకాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం డాలర్ల విలువలో చూస్తే 70.1శాతం జరిగినట్లు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. చైనా నుంచి భారత్‌కు ఎగుమతులు 64.1 పెరిగితే, భారత్‌ నుంచి చైనా దిగుమతుల 90.2శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2020 సంవత్సరంలో రెండు దేశాల మధ్య 86.4 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. తిరిగి అమెరికాను వెనక్కు నెట్టేసి మన దేశం చైనాతో అత్యధికంగా వాణిజ్యం నిర్వహించింది. ఈ ఏడాది తొలి ఐదునెలల్లో 48.16బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగినట్లు చైనా కస్టమ్స్‌శాఖ వద్ద జూన్‌ ఏడవ తేదీనాటికి నమోదైన వివరాలు వెల్లడించాయి. గతేడాది జరిగిన సరిహద్దు వివాదాలు చాలా వరకు వెనక్కు పోయినట్లు అసాధారణ వాణిజ్య లావాదేవీలు సూచిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే గతంలో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో చైనా 63 బిలియన్‌ డాలర్ల మేరకు మిగుల్లో ఉంటే 2020-21లో అది 44 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.మన ఎగుమతులు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి.


ఒక వైపు చైనాను కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పడిన చతుష్టయ బృందంలో అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా,మన దేశం ఉన్నప్పటికీ మరోవైపున వాణిజ్యంలో మన దేశం చైనాతో ప్రధమ స్దానంలో ఉంది. వాణిజ్యం గురించి చర్చిందేందుకు మేము సిద్దమే అని ఆస్ట్రేలియా ప్రకటించింది. అమెరికా వైపు నుంచి కూడా అలాంటి సంకేతాలే వెలువడుతున్నాయి. సరిహద్దు వివాదాలకు వాణిజ్యానికి లంకె పెట్టవద్దని చైనా చెబుతున్నది. అయితే చైనా వస్తువులను బహిష్కరించాలని, చైనా మన శత్రువు, ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఒకవైపున ప్రచారంతో జనాన్ని సంతృప్తి పరుస్తున్నారు. మరోవైపు అదే చైనా నుంచి వస్తువుల దిగుమతులు, లాభాలతో వాణిజ్యవేత్తలను ప్రధాని నరేంద్రమోడీ సంతుష్టులను గావిస్తున్నారు. టెలికామ్‌ రంగంలో ఐదవ తరం ఫోన్లను ప్రవేశపెట్టేందుకు చౌకగా ఉండే చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరస్కరించి అధిక ఖర్చుతో కూడిన అమెరికా, ఐరోపాల వైపు మన దేశం చూస్తున్నది. అదే జరిగితే సెల్‌ఫోన్‌ ఛార్జీలు ఇంకా పెరుగుతాయి.
బీజింగ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆసియా మౌలికసదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబి)లో మన దేశం ఒక వాటాదారు. చైనాకు దానిలో 30.34శాతం వాటాలు ఉండగా మన దేశం 8.52, రష్యా 6.66శాతంతో రెండు, మూడు స్ధానాలలో ఉన్నాయి. చైనా వద్దుగానీ దాని డబ్బు ముద్దు అన్న విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఈ బ్యాంకులో మనమూ వాటాదారులమే గనుక సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ రుణం తీసుకుంటే తప్పేముందని మన అధికారులు వ్యాఖ్యానించారు. అయితే ఈ బ్యాంకు లేదా ఆసియా అభివృద్ది బ్యాంకు(ఏడిబి), ప్రపంచబ్యాంకు వంటి సంస్దల నుంచి రుణాలు తీసుకుంటే ఆ పధకాలకు సభ్యదేశాల కంపెనీలన్నీ టెండర్లు వేసి పాల్గొనేందుకు హక్కును కలిగి ఉంటాయి. గతేడాది ఏడిబి రుణంతో చేపట్టిన రైల్వే ప్రాజక్టులలో చైనా కంపెనీలను అనుమతించవద్దని కొందరు పెద్ద వివాదం సృష్టించిన విషయం తెలిసినదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భవిష్యత్‌ కోసమే మోడీ చమురు బాదుడా – తల్లికి కూడు పెట్టని వారు పిన్నమ్మకు బంగారు గాజులేయిస్తారా !

12 Saturday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP’s trolling army, India oil bonds, India oil Tax, Narendra Modi Failures, RSS Propaganda War


ఎం కోటేశ్వరరావు


మన జనాల సహనానికి (బి పాజిటివ్‌ వైఖరి) ముందుగా శతకోటి నమస్కారాలు చెప్పక తప్పదు. భరతమాత ఆమెను పక్కకు నెట్టేసి పెత్తనం చేస్తున్న గోమాత మహత్తులో, నరేంద్రమోడీ గమ్మత్తులో గానీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్ధిరంగా ఉన్న చమురు ధరలు అదేమిటో ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచీ పెరుగుతూనే ఉన్నాయి. అనేక దేశాల్లో చమురు ధరల పెంపు ఉద్యమాలకు దారితీసి పాలకులను గడగడలాడించింది, వెనక్కు తగ్గేట్లు చేసింది. మన జనం సహనంతో ఇంతగా సహకరిస్తున్నా ఖాతరు చేయటం లేదు. జనాన్ని వెర్రివెంగళప్పలుగా భావిస్తున్నారు కొందరు, అయినా భరిస్తున్నాం, మన మీద మనకే జాలి వేస్తోంది కదా ! సామాజిక మాధ్యమాల్లో కాషాయ మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో ఊరూ పేరూ లేకుండా కొన్ని పోస్టులు తిప్పుతున్నారు. భవిష్యత్‌ కోసమే నరేంద్రమోడీ చమురు బాదుడు కొనసాగిస్తున్నారంటూ రంగుల కలను చూపుతూ జనాన్ని తప్పుదారి పట్టించే పోస్టు ఒకటి తిరుగుతోంది. దాని మంచి చెడ్డలను, ముఖ్య అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలించుదాం.


” మీ చుట్టూ జరుగుతున్న మార్పులను మీరు నిశితంగా గమనిస్తే, ఇది అందరి వల్ల కాదు. మోడీ ప్రభుత్వం మీ కోసం మరియు మీ సౌలభ్యం కోసం ఏమి మన భవిష్యత్‌ తరాల కోసం ఏమి చేస్తుందో మీకు అర్థం అవుతుంది.”
ఏ పాలకులైనా వర్తమాన, భవిష్యత్‌ తరాలకోసమే తప్ప గతించిన వారికోసం చేయరు. వర్తమానం వాస్తవం, భవిష్యత్‌ ఆశ. అందువలన ఇప్పుడు ఏమి చేస్తున్నారనేది కీలకం. జనాలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మోడీ ఇంకా కొనసాగుతున్నారు గనుక ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది, ఏమి చేస్తున్నదీ చెప్పకుండా పిట్టల దొర లేదా తుపాకీ రాముడి కబుర్ల వలన ప్రయోజనం లేదు. ఇప్పుడు తల్లికి కూడు పెట్టని వాడు రేపు పిన్నమ్మకు బంగారు గాజులేయిస్తానంటే నమ్మగలమా ? పది రూపాయల నుంచి 33 రూపాయలకు పెంచిన చమురు ఎక్సయిజు పన్ను నిర్వాకం గురించి చెప్పతరమా ? దేశమంతటికీ ఉచితంగా వాక్సిన్లు వేయించేందుకు సిద్దపడని పెద్దలు పెద్దలు మహమ్మారి నివారణ, నిరోధానికి ఉపయోగపడే పరికరాలు, వాక్సిన్లపై జిఎస్‌టి ఎత్తివేసేందుకు గీచిగీచి బేరాలాడుతున్నారు. అలాంటి వారు డబ్బుదా(దో)చి రాబోయే వారికి ఖర్చు చేస్తారంటే నమ్మాలట !

గతంలో బిజెపి పెద్దలు చేసిన హడావుడి గురించి మరిచిపోతే ఎలా !

” పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలపై మన చుట్టూ చాలా మంది హడావిడి చేస్తారు ఎందుకంటే వారికి భారత్‌ భవిష్యత్‌ ఎలా. వున్నా ఈ పుట గడిస్తే చాలు సరే ఆ విషయాలు పక్కన పెడితే…”
ఇదొక తప్పుడు ప్రచారం ఇప్పుడున్న కేంద్ర మంత్రుల్లో స్మృతి ఇరానీ సిలిండర్లు వేసుకొని చేసిన ప్రదర్శనలు, బిజెపి నేతలు చేసిన ఆర్భాటాలూ జనానికి తెలుసు. కాస్త ఓపిక తెచ్చుకొని గూగులమ్మను కోరుకుంటే వాటన్నింటినీ భక్తా ఇంద అంటూ వారి నాటకాల చిత్రాలు, వార్తలను మన ముందు ప్రత్యక్షం చేస్తుంది. మోడీ అనుచరుల బండారాన్ని బయటపెడుతుంది. గతంలో ఆందోళన చేసినపుడు ఈ పెద్దలకు భారత భవిష్యత్‌ గురించి తెలియదా లేక శ్రద్దలేదా ? పోనీ ఎందుకు ఆందోళన చేశారో అయినా చెప్పాలి. చిత్తశుది,్ద నిజాయితీ లేని రాతలు, ఆరోపణలు.

మోడీ నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న రోజుల నుంచే శుభ్రమైన చమురు !

” ప్రస్తుతం ప్రపంచంలోనే పరిశుభ్రమైన యూరో 6 గ్రేడ్‌ పెట్రోల్‌ ఈ రోజు భారతదేశంలో దొరుకుతోంది.”
ఇది ఎలా ఉందంటే అరే పాతికేండ్ల క్రితం నువ్వు పుట్టినపుడు చాలా చిన్నగా ఉన్నావు, ఇప్పుడు ఎంత ఎత్తు, బరువు పెరిగావో గ్రేట్‌ కదా అన్నట్లుంది. పుట్టినోళ్లు ఎప్పుడూ ఒకేలా ఎలా ఉంటారు ! పెట్రోలు, డీజిలు వాడకం పెరుగుతూ కాలుష్యాన్ని వెదజల్లుతున్నందున ప్రతి దేశం, ప్రతి ఖండం దాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది.ఇదేదో నరేంద్రమోడీతోనే దేశంలో ప్రారంభమైందన్నట్లుగా నమ్మబలుకుతున్నారు. ఆ పెద్దమనిషి నిక్కర్లు వేసుకొని(ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా) తిరుగుతున్న రోజుల్లోనే అంటే 1990దశకంలోనే ఇంధన శుద్ధి కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. 1994లో ఢిల్లీ, ముంబై, కొల్‌కతా, చెన్నరు నగరాల్లో తక్కువ సీసం ఉండే పెట్రోలు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సీసం, గంధకం వంటి వాటిని తగ్గించటానికి, తొలగించటానికి మన చమురు శుద్ది కర్మాగారాల్లో మార్పులు చేసుకోవాలి, దానికి అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకోవాలి. ఇప్పటికి ప్రభుత్వరంగ చమురు సంస్ధలు 95వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. అన్నింటికీ మించి అలాంటి చమురును వాడే విధంగా వాహనతయారీదారులు కూడా ఇంజన్లలో మార్పులు చేయాలి.ఇవన్నీ మంత్రదండాలతో జరిగేవి కాదు.యూరో-3కు సమానమైన భారత్‌-3 రకం చమురు 2010 నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ఆరో గ్రేడ్‌కు వచ్చాము. ఇది మనవంటి అన్ని దేశాల్లోనూ ఉంది. ఇది నరేంద్రమోడీ గొప్ప అని చెబితే జనాలకు దేనితో నవ్వాలో అర్ధం కావటం లేదు. ఏ గ్రేడ్‌ అయినా దాని ఉత్పత్తి ఖర్చు వినియోగదారుల నుంచి వసూలు చేసేదే తప్ప రాయితీలేమీ లేవు కదా. దాన్ని బట్టే ఉత్పాదక ఖర్చు నిర్ణయిస్తున్నారు. పోనీ చమురు సంస్దలకు ప్రభుత్వం 95వేల కోట్లు ఇస్తే అది మోడీగారి ఘనత అని చెప్పుకుంటే అర్ధం ఉంది. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా జనం సొమ్ముతో మోడీకి ప్రచారం అంటే ఇదే.

ముందేం మాట్లాడుతున్నారో తరువాతే చెబుతున్నారో స్పృహ ఉందా !

” పెట్రోల్‌ మరియు డీజిల్‌పై మొత్తం పన్నులో 71% రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతుంది, కేంద్రానికి 29% మాత్రమే లభిస్తుంది.”
తిమ్మిని బమ్మిని చేయటంలో కాషాయ దళాలకు మించిన మాయగాండ్లు మరొకరు లేరు. సముద్రాలున్నయన్న దగ్గర ఎడారి ఉంటుంది. ఏడు సంవత్సరాల మోడీ ఏలుబడిలో పెట్రోలు మీద లీటరుకు రు.10.38 నుంచి రు. 32.98( రెండు వందల శాతం)డీజిలు మీద రు.4.58 నుంచి రు.31.83 (600శాతం) పెంచింది. రాష్ట్రాలు పెంచిన మొత్తం ఈకాలంలోనే 60, 68శాతాలకు అటూ ఇటూగా ఉన్నాయి తప్ప ఎక్కడా వందల రెట్లు పెరగలేదు. కేంద్రం పెంచిన దానిలో ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 41శాతం తిరిగి రాష్ట్రాలకు బదలాయిస్తారు, అందువలన మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటాయే ఎక్కువ అని వాదిస్తారు. ఇక్కడే అసలు మోసం ఉంది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి ఏలుబడిలోనే ఉన్నాయి కదా ? ఎన్ని రాష్ట్రాలు, ఎంత మొత్తం పన్నుతగ్గించాయో ఎవరినైనా చెప్పమనండి. కేంద్రం ఎక్సయిజ్‌ పేరుతో విధించే పన్నులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఎక్సయిజ్‌, రెండవది సెస్‌. మొదటిదానిలో మాత్రమే రాష్ట్రాలకు వాటా వస్తుంది. సర్‌ఛార్జీలు, సెస్‌లో ఉండదు.
ఇలాంటి జిమ్మిక్కుల కారణంగా ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కేటాయింపులు పెరిగినట్లు కనిపించినా వాస్తవంలో రాష్ట్రాలకు బదలాయించిన నిధులు 2019తో పోల్చితే 2020లో 36.6 నుంచి 32.4శాతానికి పడిపోయాయి. అందువలన రాష్ట్రాలు పన్ను తగ్గించాలనే బిజెపి వాదన అసంబద్దం మోసపూరితం. తమ నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధికి నాంది పలికారని బిజెపి గొప్పగా చెప్పుకుంటుంది. నిజమే, అదే వాజ్‌పేయి ఆ రోడ్లకు నిధులను జనం నుంచి వసూలు చేసే పధకానికి , రోడ్లను ఉపయోగించినందుకు టోలు పన్ను వసూలుకూ నాంది పలికారు. మన దగ్గర నుంచి వసూలు రోడ్లు వేసి మన చేతనే పన్ను కట్టిస్తున్నారు. ఎంత మోసం ?
ప్రస్తుతం ఎక్సయిజు పన్ను పెట్రోల మీద లీటరుకు రు.32.98. దీనిలో వాస్తవానికి మౌలిక ఎక్సయిజ్‌ పన్ను(బెడ్‌) రు.2.98 మాత్రమే.మిగిలిన రూ.30లో ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ పన్ను(సీడ్‌) రూ.12, రోడ్డు మరియు మౌలిక సదుపాయాల పన్ను రు.18. తాజాగా విధించిన వ్యవసాయ సెస్‌ను సర్దుబాటు చేసేందుకు బెడ్‌ను రు.1.41కి సీడ్‌ను రూ.11కు తగ్గించారు. డీజిలు విషయానికి వస్తే వ్యవసాయ సెస్‌కోసం బెడ్‌ను రు.4.83 నుంచి రూ.1.80కి సీడ్‌ను 9నుంచి 8కి తగ్గించారు. బెడ్‌, సీడ్ల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఆమేరకు తగ్గిపోతుంది.

” మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సరఫరాను వేగవంతం చేయటానికి మొబైల్‌ రీఫిల్లింగ్‌ యూనిట్‌ నడుస్తోంది. ”
వీటితో జనానికి ఒరిగేదేమిటి ? జొమాటో, స్వీగ్గీ వంటి కంపెనీల ద్వారా తెప్పించుకొనే ఆహారానికి ఎక్కువ వెల చెల్లించాలి. అలాగే వీటికీ అదనంగా సేవా రుసుము చెల్లించాలి. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో గతంలో కిరోసిన్‌ డీలర్లు చిన్న పీపాల్లో తెచ్చి వినియోగదార్లకు అందించేవారు. ఇది అలాంటిది కాదు, కనీసం రెండు వందల లీటర్లు, అంతకు మించి ఆర్డరు పెట్టిన వారికే అందచేస్తారు, అందుకు ఛార్జీ వసూలు చేస్తారు. ఇదేమన్నా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమా ?

” ఇవే కాకుండా, కాంగ్రెస్‌ ప్రభుత్వం తన పదవీకాలంలో తీసుకున్న 2026 నాటికి చెల్లించవలసి ఉన్న 2.48 లక్షల కోట్ల ఆయిల్‌ బాండ్‌ రుణం కూడా మోడీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ”

ఇది హిమాలయమంత పచ్చి అబద్దం, జనాన్ని మోసపుచ్చే వ్యవహారం. ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. 2010వరకు అంతకు ముందున్న వాజ్‌పారుతో సహా ప్రభుత్వాలన్నీ చమురు బాండ్లను జారీ చేశాయి. వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించవచ్చు. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇలా చెప్పారు.” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి ఇంకా చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. మంత్రి చెప్పింది వక్రీకరణ. వినియోగదారుల మీద వడ్డించే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. మరో విధంగా చెప్పాలంటే గతంలో వినియోగదారులు పొందిన సబ్సిడీ మొత్తాలను ఇప్పుడు వారి నుంచి మోడీ సర్కార్‌ తిరిగి వసూలు చేస్తోంది. లేదూ మంత్రి చెప్పిందే నిజమైతే, అప్పు తీరింది కదా పన్ను ఎందుకు తగ్గించటం లేదు ? అసత్యాలను చెప్పటంలో కాషాయ దళం ఆరితేరింది. గత యుపిఏ ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లకు గాను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 1.3లక్షల కోట్ల రూపాయలను చెల్లించాల్సి వచ్చిందని గతంలో ప్రచారం చేశారు, చమురు మంత్రిగారయితే 1.5లక్షల కోట్లన్నారు. బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన దాని ప్రకారం 40వేల కోట్ల రూపాయల వడ్డీ, 1.3లక్షల కోట్ల అప్పుకు చెల్లించినట్లు ఒక బొమ్మను చూపారు. తీరా 2018లో రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇదే పాలకులు చెప్పిందేమిటి చెల్లించిన మొత్తం రూ.3,500 కోట్లు. గత ఏడు సంవత్సరాలుగా ఆ పేరుతో జనాల నుంచి వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలను ఏమి చేశారు ? కరోనా సమయంలో జనమంతా దివాలా తీస్తే బిలియనీర్లు మరింత బలిశారు, కొత్తగా 40 మంది చేరి 177కు చేరారు. జనాన్ని కొట్టి పోగేసిందంతా ఇలాంటి వారికి కట్టబెట్టకపోతే అది సాధ్యమయ్యేనా ?పన్నులు పెంచకపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుందని ఒకసారి అంటారు, సరిహద్దు రక్షణకు పన్నులేయకపోతే ఎలా అని మరోసారి సెంటిమెంట్‌ రెచ్చగొడతారు. ఇవన్నీ మోడీ పాలనలోనే కొత్తగా వచ్చిన సమస్యలా ?


” పెట్రోల్‌ లో 2025 నాటికి 20% దేశీయ ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా కొంత భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే 5 లేదా 10 సంవత్సరాల్లో, హైబ్రిడ్‌ వాహనాలు అందుబాటులో రానున్నాయి, ఇవి 100% పెట్రోల్‌, డీజిల్‌, ఇథనాల్‌, సిఎన్జి మరియు బ్యాటరీపై నడుస్తాయి.


సాధారణ పెట్రోల్‌ బుంకుల వద్ద ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశంలో తొలిసారిగా విద్యుత్‌ రహదారిని నిర్మించబోతున్నారు. కొన్ని సంవత్సరాలలో, రోడ్‌ రైల్‌ ట్రక్కులు కూడా భారతదేశ రహదారులపై పరుగులెత్తనున్నాయి. ఎల్‌పిజి గ్యాస్‌ను దేశవ్యాప్తంగా ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా అందించే పనులు వేగంగా జరుగుతున్నాయి. డీజిల్‌ ట్రాక్టర్‌ను సిఎన్‌జి ట్రాక్టర్‌గా మార్చడానికి కిట్‌ వచ్చింది. దీంతో డీజిల్‌ కోసం ఖర్చు చేసే రైతులకు వేల రూపాయల ఆదా అవుతుంది. హైడ్రోజన్‌ ఇంధన బ్యాటరీలు మరియు అల్యూమినియం ఎయిర్‌ బ్యాటరీల వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై భారతదేశంలో వేగంగా పరిశోధన మరియు అభివ ద్ధి జరుగుతోంది. ఇది కొత్త భారత్‌ యొక్క భవిష్యత్తు. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఆగమనంతో, మనము క్రమంగా పెట్రోల్‌ మరియు డీజిల్‌పై ఆధారపడవలసిన అవసరం వుండదు. రాబోయే పదేళ్లలో ఇవన్నీ జరగబోతున్నాయి.ఇవన్నీ మన సౌలభ్యం కోసం భవిష్యత్‌ కోసం మాత్రమే జరుగుతున్నాయి. ఇందనాల పై వస్తున్న కేంద్ర 29% పన్నుల ద్వారా మౌలిక సదుపాయాల అభివ ద్ధి, సైనిక దళాల ఆధునీకరణ సశక్తికరణ సాధికారత మొదలైన వాటిపై ఖర్చు జరుగుతున్నాయి. ”

ఇవన్నీ చేస్తున్నాం, చేయబోతున్నాం కనుక జనం మీద ఎంత పన్ను భారం మోపినా నోరు మూసుకొని చెల్లించాలి అని చెప్పటమే. రాజీవ్‌ గాంధీ దేశాన్ని కొత్తశతాబ్దంలోకి తీసుకు పోబోతున్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్‌ 2020 అన్నారు. కేబుల్‌ టీవీ రాక ముందు విదేశాల్లో చూసివచ్చి సెటప్‌బాక్సుల గురించి వాటి ద్వారా కొన్ని వందల ఛానళ్లు రావటం గురించి కథకథలుగా చెప్పారు. అందువలన నవీకరణ అనేది నిరంతర ప్రక్రియ. ఎవరున్నా లేకపోయినా ఆగేది కాదు. నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు అచ్చేదిన్‌ అన్నారు, గుజరాత్‌ తరహా అభివృద్ధి అన్నారు. అవన్నీ ఎక్కడా కానరావటం లేదు గనుక ఇప్పుడు కొత్త కహానీలు వినిపిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నల్లధనం కేసులో గిల గిలా కొట్టుకుంటున్న కేరళ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి !

03 Thursday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

BJP Hawala Case, Kerala BJP, Kerala RSS, Kodakara Hawala Case


ఎం కోటేశ్వరరావు


కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. నిజమే అని నమ్మిన వారు కోరినంత నల్లధనాన్ని పంపారు. దాన్ని పంచుకోవటం లేదా దొంగ డబ్బు కనుక లెక్కా పత్రం ఉండదు కనుక బొక్కేసిన వారి మధ్య వచ్చిన తేడా వంటి కారణాలతో బయట పడి పార్టీ రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో ఊహించుకోవాల్సిందే. ఆ డబ్బంతా హవాలా మార్గంలో వచ్చిన నల్లధనం అని వేరే చెప్పనవసరం లేదు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు ఇంకా ఎక్కువే అని తేలింది,మూడున్నర కోట్లుగా చెబుతున్నారు. ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. ఈ ఉదంతంలో రాష్ట్ర బిజెపి, ఆర్‌ఎస్‌ఎన్‌ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో పార్టీలోని రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు పోలీసులు కోటి రూపాయల దొంగడబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయక ముందే బిజెపి నేతలకు దొంగడబ్బు మాయం గురించి తెలుసునని వెల్లడైంది.


తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌, ఆయన అనుయాయులు మాత్రమే మాట్లాడుతుండగా మిగతావారు మౌనం దాలుస్తున్నారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది ఇప్పుడు చర్చ. చివరికి మెట్రోమాన్‌ శ్రీధరన్‌ను పాలక్కాడ్‌లో ఓడించేందుకు కొందరు బిజెపి నేతలు ప్రత్యర్ధికి ఓట్లను అమ్ముకున్న కారణంగానే అరవైవేల ఓట్లు రావాల్సింది 50వేలు వచ్చాయనే ఫిర్యాదు కూడా కేంద్రానికి పంపారు.


గిరిజన నాయకురాలిగా మీడియా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన సికె జాను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఐదు అసెంబ్లీ స్దానాల్లో పోటీ చేసేందుకు, కేంద్రంలో మంత్రిపదవికోసం బేరమాడినట్లుగా అందుకోసం పది కోట్ల రూపాయలు కావాలని డిమాండ్‌ చేయగా సురేంద్రన్‌ కేవలం పదిలక్షల రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు ఆపార్టీ కోశాధికారి ప్రసీత మీడియాకు చెప్పారు. పదిలక్షలు తీసుకొని పోటీ చేసేందుకు జాను అంగీకరించిన విషయాన్ని ప్రసీత ఫోను ద్వారా సురేంద్రన్‌కు చెప్పగా తిరువనంతపురంలో జాను బసచేసిన హౌటల్‌కు పంపినట్లు ఆమె చెబుతున్నారు. ఈ మేరకు వారి ఫోను సంభాషణ ఆడియోను స్వయంగా ప్రసీత విడుదల చేశారు. కొడక్కరలో పట్టుబడిన దొంగ డబ్బు కేసులో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసిన మొత్తం కంటే ఎక్కువ సొమ్మునే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో సురేంద్రన్‌ వంటి బడానేతలు కూడా ఉన్నారని దొరికిన వారు చెప్పటంతో వారిని కూడా ప్రశ్నిస్తారని వార్తలు వచ్చాయి. గురువారం నాడు సురేంద్రన్‌ కోజికోడ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ సికె జాను నన్ను డబ్బు అడగలేదు, ఆమెకు పైసా కూడా ఇవ్వలేదు అన్నారు. ఆమె పార్టీలో అంతర్గత తగాదాల కారణంగా ఆడియోలు బయటకు వచ్చి ఉండవచ్చన్నారు. పోలీసులు పిలిచిన వారందరూ విచారణకు వెళుతున్నారు తప్ప కోర్టును ఆశ్రయించలేదు,భయపడలేదు. కొడక్కరలో దొరికింది నల్లధనమో, తెల్లధనమో నాకు తెలియదు. ఆడియో సంభాషణ తనది కాదు అన్నారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ముస్లిం లీగ్‌, సిపిఎం మద్దతుదారులు ఉన్నారని సురేంద్రన్‌ ఆరోపించారు.


ఆడియో సంభాషణ బయటకు వచ్చిన దృష్టా పార్టీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం కనిపిస్తోందని సీనియర్‌ నేత పిపి ముకుందన్‌ చెప్పారు. లేనట్లయితే రాష్ట్రంలో పార్టీ అసంగత సంస్ధగా మారిపోతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ పరువు పోయిందని, దీనికి సురేంద్రనే కారణమని అన్నారు. నిధుల చెల్లింపులకు సంబంధించి పరస్పర విరుద్దంగా పార్టీ నేతలు చెబుతున్నారన్నారు. పార్టీలో ఏం జరుగుతోందో కేంద్ర పెద్దలకు తెలుసునని, తనను సంప్రదిస్తున్నారని, విచారణ కూడా జరుపుతున్నారని ముకుందన్‌ చెప్పారు.


ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు. సురేంద్రన్‌ చేసిన ప్రకటనను జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ కోశాధికారి ప్రసీత బహిరంగ సవాలు చేశారు. ఆడియో నిజమైనదో, నకిలీదో కావాలంటే పరీక్షలు జరపాలన్నారు. తిరువనంతపురంలోని హొరైజన్‌ హౌటల్‌లో సికె జానుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ డబ్బు అందచేశారన్నారు. అంతకు ముందు తనకు ఫోన్‌ చేశారని కావాలంటే నిర్ధారించుకోవచ్చన్నారు. రెండు నిషేధిత సంస్దలతో జానుకు సంబంధాలు ఉన్నాయని, కొంత మంది ఆమెను కలిశారని, డబ్బును వాటి కార్యకలాపాలకు వినియోగించి ఉండవచ్చు అన్నారు.


ఇదిలా ఉండగా ఎన్నికల నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాల కారణంగా జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ అధ్యక్ష పదవి నుంచి జానును తొలగించినట్లు రాష్ట్రకమిటీ ప్రకటించగా తాను పదవిలోనే ఉన్నట్లు ఆమె చెప్పారు. అవసరమైతే పార్టీ నేతలతో స్వయంగా మాట్లాడతాను తప్ప మధ్యవర్తులనెవరినీ నియమించలేదని, తన పేరుతో వారేమైనా డబ్బు తీసుకున్నారో తెలియదు కనుక విచారణ జరపాలని సికె జాను చెప్పారు. ఆమె పోటీ చేసిన సుల్తాన్‌ బాతరే నియోజకవర్గంలో ఎన్‌డిఏ ప్రచారం నిమిత్తం కోటీ 25లక్షల ఖర్చుకు సంబంధించిన వివరాలు బయటకు రావటం దొంగడబ్బు వివాదాన్ని మరో మలుపు తిప్పింది. కోజికోడ్‌ నుంచి రెండు కార్లలో కోటీ 25లక్షలు సుల్తాన్‌బాతరేకు తరలించారని, అక్కడ కొంత సొమ్ము ఇచ్చి మిగిలిన మొత్తాన్ని కొడకర పద్దతుల్లో పంపిణీ చేశారని వార్తలు వచ్చాయి.
ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు ఇప్పుడు చెబుతున్నారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా తెలుస్తోంది. అయితే అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని మరొకొ సందర్భంగా చెప్పారు. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది.పార్టీ ఆఫీసులోని వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు. మొత్తం మీద చివరకు వెల్లడయ్యే వివరాలు కేరళలో బిజెపికి తద్వారా కేంద్ర నాయకత్వానికి తలవంపులు తేవటం ఖాయం అని చెప్పవచ్చు.

మూడున్నర కాదు కేరళ బిజెపి దొంగ సొమ్ము ఇప్పటికి 9.8 కోట్లు !

పోలీసులు తవ్విన కొద్దీ బిజెపి కేరళ ఎన్నికల దొంగ సొమ్ము బయటకు వస్తోంది.కొడక్కర వంతెన వద్ద తమ కారును ఆపి సొమ్ము దోపిడీ చేశారంటూ కారు డ్రైవర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు జరుగుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు కర్ణాటక నుంచి వచ్చిన దొంగ సొమ్ముతో బిజెపి అభ్యర్ధులు విచ్చలవిడిగా ఖర్చు చేసింది కొంతైతే దాచుకున్నది ఎంతో అన్నది అంతుచిక్కటం లేదు. రోజు రోజుకూ మరింత సమాచారం వెల్లడికావటంతో దిక్కుతోచని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు నష్టనివారణతో పాటు కేరళ ప్రభుత్వంపై ఎదురుదాడికి మార్గాలు వెతుకుతున్నారు.ధర్మరాజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత త్రిస్సూర్‌కు తెచ్చిన దొంగ సొమ్ము 9.8 కోట్లని పోలీసులు చెప్పారు. దీనిలో త్రిస్సూర్‌లోని ఒక వ్యక్తికి 6.30 కోట్లు ఇచ్చిన తరువాత మిగతా సొమ్మును వేరే చోటికి తరలిస్తూ దోపిడీ కట్టుకధలు అల్లారని తేలుతోంది. ధర్మరాజన్‌ అంతకు ముందు కూడా సొమ్మును తెచ్చారని, అది ఎంత, ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాల మీద పోలీసులు కేంద్రీకరించారు. త్రిస్సూరు నియోజకవర్గంలో బిజెపి రాజ్యసభ ఎంపీ సురేష్‌ గోపి పోటీ చేసి మూడవ స్ధానంలో నిలిచారు. అక్కడ ఖర్చుల కోసం రెండు కోట్లు ఇచ్చినట్లు తేలింది.

మంజేశ్వరమ్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కేవలం 89 ఓట్ల తేడాదో ఓడిపోయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గత ఎన్నికల్లో అక్కడ కె సుంద్రా అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి 467 ఓట్లు తెచ్చుకున్నారు. ఇద్దరి పేర్లు ఒకే విధంగా ఉండటంతో తన మద్దతుదార్లు పొరపాటున సుందర్‌కు ఓటు వేసిన కారణంగా తాను ఓటమి పాలైనట్లు సురేంద్రన్‌ భావించారు.ఈ సారి కూడా అదే వ్యక్తి బిఎస్‌పి అభ్యర్ధిగా నామినేషన్‌ వేశారు. అయితే దాన్ని ఉపసంహరించుకోవాలని కోరటంతో తనకు పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని, సురేంద్రన్‌ గెలిస్తే పక్కనే ఉన్న కర్ణాటకలో ఒక మద్యం షాపు ఇప్పించాలని సుంద్రా డిమాండ్‌ చేశాడు. అయితే రెండున్నర లక్షల రూపాయలు , పదిహేను వేల రూపాయల విలువ గల ఫోను ఇచ్చారు. మిగతా కోర్కెల గురించి ఎన్నికల తరువాత చూద్దాం లెమ్మని సురేంద్రన్‌ స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారని, స్ధానిక బిజెపి నేతలు తనకు సొమ్ము ఇచ్చినట్లు ఉపసంహరణ అనంతరం అతను బిజెపిలో చేరుతున్నట్లు ఒక సభలో ప్రకటన కూడా చేశారు. నామినేషన్‌ ఉపసంహరణకు ముందు రోజు తమ అభ్యర్ధి కనిపించటం లేదంటూ బిఎస్‌పి నేతలు పోలీసు సేష్టన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కొడక్కర దొంగ సొమ్ము ఉదంతం బయటకు వచ్చిన తరువాత సదరు సుంద్రా ఈ విషయాలన్నీ స్వయంగా బయట పెట్టాడు. వాటి ఆధారంగా బిజెపి నేత సురేంద్రన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంజేశ్వరమ్‌ ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి వివి రమేషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా సురేంద్రన్‌తో పాటు స్ధానిక బిజెపి నేతల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.తాను డబ్బు ఇచ్చిన విషయాన్ని బయట పెట్టిన తరువాత బిజెపి నేతలు తమ కుటుంబం మీద వత్తిడి తెస్తూ అలాంటిదేమీ లేదని చెప్పాలని, సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని సుంద్ర చెప్పాడు. తన తల్లి మీద వత్తిడి తెచ్చారని, ఆ సొమ్మంతా ఖర్చయిపోయిందని, తాను తిరిగి ఇవ్వలేనని , ఈ విషయాలను వెల్లడించటానికి తన మీద ఎవరి వత్తిడీ లేదని సుంద్ర చెప్పాడు. ఇతను ఇప్పుడు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉంటున్నాడు.

దొంగ సొమ్ము పంపిణీదారైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ధర్మరాజన్‌ అనేక మంది బిజెపి నేతలతో ఫోన్‌ ద్వారా సంభాషించాడు. వారిలో సురేంద్రన్‌ కుమారుడితో పలుమార్లు మాట్లాడినట్లు బయటపడింది. దానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దొంగ సొమ్ము ఉదంత దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని, పట్టుబడిన సొమ్ము తీవ్ర ఆర్ధిక నేర స్వభావం కలిగినదని , అయినా పట్టించుకోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మీద చర్య తీసుకోవాలని కోరుతూ లోక్‌తాంత్రిక్‌ యువ జనతా దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సలీమ్‌ మాదవుర్‌ కేసు దాఖలు చేశారు. దీని గురించి ఇడి అధికారులకు నోటీసలు ఇవ్వగా తమకు సమయం కావాలని కోరారు, పది రోజుల్లో తీసుకున్న చర్యలను కోర్టుకు దాఖలు చేయాలని ఆదేశించారు. సీనియర్‌ బిజెపి నేత సికె పద్మనాభన్‌ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఉప్పు తిన్న వారు నీరు తాగటం ప్రకృతి ధర్మమని అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే అన్నారు.కొడకర దొంగ సొమ్ము ఉదంతంలో తవ్విన కొద్దీ కొత్త అంశాలు బయటకు వస్తున్నాయని, మరింత సమగ్ర దర్యాప్తు జరపాలసి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు కొడియరి బాలకృష్ణన్‌ అన్నారు. దొంగ సొమ్ము గురించి వార్తలు రాగానే ఇడి వెంటనే రంగంలోకి దిగుతుందని, కానీ ఈ ఉదంతంలో పట్టనట్లుగా వ్యవహరిస్తుండటాన్ని బట్టి దాని వైఖరి ఏమిటో వెల్లడైందన్నారు. భవిష్యత్‌లో తాము ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌కు పోటీగా వస్తామని భయపడుతున్నవారు తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, పధకం ప్రకారం నాశనం చేయాలని చూస్తున్నారని బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమనం రాజశేఖరన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో ఆరోపించారు. గతంలో గెలిచిన నీమమ్‌ నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్ధానంలో రాజశేఖరన్‌ నిలిచిన విషయం తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చమురు ధరల పెంపుదల- బిజెపి ద్వంద్వ ప్రమాణాలు, మోసకారి తనం !

02 Wednesday Jun 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ 1 Comment

Tags

BJP, BJP double standards, India fuel price increase, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మా పార్టీ తీరే వేరు, ఓట్ల కోసం కక్కుర్తి పడం, ఎన్నికలు వచ్చాయని అవకాశవాదంతో వ్యవహరించం, గెలుపుకోసం అడ్డదారులు తొక్కం, చేయదలచుకున్నది సూటిగా చెబుతాం అని బిజెపి చెప్పుకుందా లేదా ? కానీ చేస్తున్నదేమిటి ? సాధారణ రోజుల్లో ధరల పెరుగుదల గురించి అడిగితే వాటితో ప్రభుత్వానికి ఏమిటి సంబంధం ? చమురు కంపెనీల వ్యవహారం అది, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే పెంచుతారు, తగ్గితే తగ్గిస్తారు మధ్యలో ప్రభుత్వానిదేముంది అన్నారు. కరోనా తొలి దశలో రికార్డు స్ధాయిలో ముడిచమురు ధరలు పడిపోయినపుడు దానికి అనుగుణంగా ధరలు తగ్గించలేదు. ఎందుకయ్యా అంటే అంతర్జాతీయ ధరలు తగ్గినంత మాత్రాన మన చమురు కంపెనీల ఖర్చులు తగ్గుతాయా? చమురు బంకుల వారి నిర్వహణ వ్యయంలో మార్పు ఉంటుందా ? లాక్‌డౌన్‌ వలన వినియోగం పడిపోయింది అందుకే ధరలు తగ్గించలేదు అని సమర్ధిస్తూ సంఘపరివార్‌ దళాలు సామాజిక మాధ్యమంలో ప్రశ్నించిన వారి మీద దాడి చేశాయి.


నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత రాష్ట్ర ఎన్నికల సమయంలో జరిగిందేమిటి ? ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు చమురు ధరలు స్ధిరంగా ఉన్నాయి. ఎందుకని, ఎలా సాధ్యమైంది? లాక్‌డౌన్‌ లేదు, చమురు వినియోగమూ తగ్గినదాఖలా లేదు. జనం పట్ల నిబద్దత, శ్రద్ద ఉన్న ప్రభుత్వం అందునా ఎన్నికల కోసం అసలు ఏమాత్రం కక్కుర్తి పడం అని ప్రమాణాలు చేసిన వారు ఏ నాడైనా ధరలు స్ధిరంగా ఎందుకున్నాయి అని చమురు కంపెనీలను ఆరాతీయలేదు ? పోనీ ఎన్నికల తరువాత దాదాపు ప్రతి రోజూ లేదా రోజు మార్చి రోజు ఎందుకు పెంచుతున్నారు అని ఎవరైనా ప్రశ్నించారా ? ఎవరి కనుసైగలతో ప్రభుత్వ చమురు కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. జనం చెవుల్లో పూలు పెట్టుకున్న అమాయకులని అనుకుంటున్నారా ?


కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా చమురు ధర మార్పుల వివరాలను పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ పేరుతో ప్రకటిస్తుంది. ఆ వివరాలు, 2021 జనవరి నుంచి ముడి చమురు, ఆయా నెలల్లో హైదరాబాదులో పెట్రోలు ధరలు ఎలా ఉన్నాయో దిగువ చూడవచ్చు.


నెల ××××× ముడిచమురు (డా) ××××× పెట్రోలు ధర రు.
జనవరి ××× 54.41 ××××××× 87.02 – 89.75
ఫిబ్రవరి ×× 60.12 ××××××× 89.75 – 94.77
మార్చి ××× 64.87 ××××××× 94.77 – 94.14
ఏప్రిల్‌- ×× 63.18 ××××××× 94.14 – 93.97
మే 28 ××× 66.76 ××××××× 93.97 – 97.43

జూన్‌ రెండవ తేదీన లీటరు పెట్రోలు ధర రు.98.27కు పెరిగింది. ఈ కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులలో ఎలాంటి మార్పు లేదు. జనవరిలో 54.41 నుంచి ఫిబ్రవరిలో 60.12 డాలర్లకు అంటే 5.71 డాలర్లు పెరిగినా వినియోగదారుల ధరలో వచ్చిన మార్పు రు. 5.02 తరువాత మార్చినెలలో 4.75 డాలర్లు పెరిగినా వినియోగదారుల ధర అంతకు ముందు నెలతో పోలిస్తే మొత్తంగా 63 పైసలు తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడి చమురు ధర 1.69 డాలర్లు తగ్గితే వినియోగదారుల ధర 17పైసలు తగ్గింది. మే నెలలో ముడిచమురు ధర 3.58 డాలర్లు పెరిగితే వినియోగదారులకు జూన్‌ రెండు నాటికి పెరిగిన ధర 4.30. దీనికి అడ్డగోలు, అధికార పార్టీకి తోడ్పడే అక్రమం తప్ప మరొకటి కాదు. చమురు కంపెనీలు బిజెపికి లబ్ది చేకూర్చేందుకు ధరలను అదుపులో ఉంచి అవసరం తీరిన తరువాత ఏకంగా బాదుడు ప్రారంభించాయన్నది స్పష్టం. మరి దీని గురించి సామాజిక మాధ్యమంలో పరివార్‌ దళం మాట్లాడదేం.


బిజెపి సీరియల్‌ను ఏడు సంవత్సరాల ముందుకు తిప్పితే స్మృతి ఇరానీ వంటి వారు గ్యాస్‌ ధరల పెరుగుదల గురించి సిలిండర్లు మోసి ప్రదర్శనలు చేశారు, ధరలు పెరిగితే సరకులమ్మే నటన చేశారు. చమురు ధరలు పెరిగితే ఎడ్ల బండ్లను లాగారు. ఇప్పుడెక్కడా బిజెపి వైపు నుంచి ప్రదర్శనలు లేవేం. తాము అధికారంలో ఉంటే ఒక నీతి, వేరే పార్టీలు ఉంటే ఒక రీతా ? వీటిని ఏమని పిలవాలి ?ద్వంద్వప్రమాణాలు అందామా పక్కా మోసం గురూ అని చెప్పాలా ?


పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వధాభిరామా వినురవేమా అన్నారు మహాకవి వేమన. రాజకీయ పార్టీలలో తమ పార్టీ వేరయా అని స్వయంగా బిజెపి కితాబు ఇచ్చుకుంది. ఇక్కడే ఉంది కిటుకు. దీనికి మూలం, స్ఫూర్తి ఎవరు అంటే స్వదేశీ కాదు, పక్కా విదేశీ జర్మన్‌ నాజీ హిట్లర్‌ ప్రచార మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌. ఒక అబద్దాన్ని వందసార్లు పునశ్చరణ చేస్తే 101వ సారికి అది నిజమై కూర్చుంటుంది. బిజెపి విషయంలో కూడా అదే జరిగిందో లేదో ఎవరికి వారు గుర్తుకు తెచ్చుకోవాలి. ఏ విషయంలో కాంగ్రెస్‌కు భిన్నంగా ప్రవర్తించింది ? ఎంపీలు, ఎంఎల్‌ఏలు కాంగ్రెస్‌ అధిష్టానం మీద వత్తిడి తీసుకురాకుండా కట్టడి చేసేందుకు, తోక ఝాడిస్తే కత్తిరిస్తామని చెప్పేందుకే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారన్నది తెలిసిందే. దాని వలన విడిగా వెళ్లే వారు సామూహిక ఫిరాయింపులకు తెరతీశారు. బిజెపి ఆ చట్టాన్ని అపహాస్యం చేస్తూ కొత్తపుంతలు తొక్కి సామూహిక ఫిరాయింపులను కట్టడి చేస్తూ నిబంధనలు మార్చటంతో ఎంత మంది అవసరం అయితే అంతమందితో రాజీనామాలు చేయించి ప్రభుత్వాలను కూల్చటం, తాము గద్దెనెక్కి తరువాత వారిని పార్టీ పేరుతో గెలిపించుకొనే పర్వానికి తెరలేపింది. ఇది నిజాయితీ కలిగిన వారు చేయాల్సిందేనా ? విలువల వలువలు కప్పుకున్నవారు అంతనిస్సిగ్గుగా వాటిని విప్పి పక్కన పడేయటాన్ని ఏమనాలి ? ద్వంద్వ ప్రమాణమా, దిగజారుడా ?

అన్నట్లు గుర్తుకు తెచ్చుకోవాలి అంటే జనాలకు మతిమరుపు ఎక్కువ అన్నది కొందరి గట్టి విశ్వాసం కదా ! కాకపోతే ఏమిటి చెప్పండి. గత సంవత్సరం కరోనా ప్రారంభంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌ తబ్లిగీ సమావేశాలకు అనుమతి ఇచ్చిందెవరు ? అప్పటికే కొన్ని దేశాలలో జరిగిన తబ్లిగీ సమావేశాలలో పాల్గొన్నవారికి కరోనా వైరస్‌ సోకిందని తెలిసినప్పటికీ ఆయా దేశాలు వారికి లేదా వాటిలో పాల్గొన్నవారికి వీసాలు ఇచ్చి మరీ ఢిల్లీకి అనుమతించింది ఏ సర్కార్‌ ? విదేశాల్లో తబ్లిగీ సమావేశాలను కొన్ని చోట్ల అర్ధంతరంగా నిలిపివేసి పాల్గొన్నవారిని స్వస్ధలాలకు పంపిన విషయమూ తెలిసి కూడా అనుమతి ఇచ్చారే ! వారెవరు, బిజెపి పెద్దలే కదా కేంద్ర అధికారంలో ఉంది, ఢిల్లీ పోలీసు యంత్రాంగం అంతా కేంద్ర సర్కార్‌ ఆధీనంలోనే కదా పని చేసేది ! తీరా సంఘపరివారం, వారితో గొంతు కలిపిన మీడియా దేశంలో కరోనా విస్తరించటానికి వారే కారణం అని నానా యాగీ చేశారు. మత విద్వేషాన్ని రెచ్చగొట్టారు. సామూహిక నమాజులపై ఆంక్షలు విధించారు. వారిని అరెస్టు చేశారు. ఇవన్నీ ఇప్పుడు జనానికి గుర్తు ఉండకపోవచ్చు. కానీ ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారంలో ఉన్న పెద్దలకు ఉండవా ?


మొదటి దశకంటే తీవ్రంగా కరోనా పెరుగుతున్న దశలో కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది జనం గుమికూడటానికి అనుమతించటాన్ని ఏమనాలి ? ద్వంద్వ ప్రమాణమా, మేము మెజారిటీ మా ఇష్టం ఏమైనా చేసుకుంటాం అడగటానికి ఎవరు అనే పెత్తందారీ తనమా ? పాకిస్తానీ ముస్లిం మత పెద్దలు దేవుడు మాతో ఉన్నాడు కరోనా మమ్మల్నేమీ చేయదు, మనం నిదురపోతుంటే కరోనా కూడా నిదురపోతుంది అని చెప్పి నిబంధనలు ఉల్లంఘించి జనం ప్రాణాల మీదకు తెచ్చారు. వారి కంటే తెలివిగలవారమని అనుకునే బిజెపి పెద్దలు ఏం చెప్పారు? గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నందున కరోనా అంటదు, మునిగి పుణ్యం పొందండి అని ఉత్తరాఖండ్‌ బిజెపి ముఖ్యమంత్రి రావత్‌, ఇతర బిజెపి మంత్రులు, నేతలు జనాన్ని ప్రోత్సహిస్తుంటే దేశమంతటా కరోనా నిబంధనలు పాటించాలని ఉద్బోధలు చేస్తున్న నరేంద్రమోడీ బాబా ఏం చేశారు. నోరు మూసుకున్నారు. అఖాడాలు, కొందరు సాధువులు కరోనాతో దిక్కులేని చావు చచ్చిన తరువాత కుంభేమేళా వైరస్‌ అంటూ మీడియాలో వార్తలు వచ్చిన తరువాత నిలిపివేయాలని విధిలేక పిలుపు నిచ్చారు. దీన్నేమందాం ద్వంద్వప్రమాణాలు అని గాక ఇంకేదైనా గౌరవ ప్రదమైన వర్ణన ఉందా ?

ఇంతవరకు దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో తమకు తాముగా గొప్పల ముద్ర వేసుకున్న పార్టీ బిజెపి తప్ప మరొకటి లేదు. కొత్త బైరాగికి పంగనామాలు ఎక్కువ అన్నట్లు లేని వాటిని తగిలించుకొని ప్రచారం చేసుకుంది. దీనికి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది. హిట్లర్‌, ముస్సోలినీ వంటి నియంతలు, ఫాసిస్టులకు అనుకరణ, ఎత్తుగడల పర్యవసానమే. ఆ పార్టీ కొలిచే దేవుళ్లలో ఒకరైన వినాయక దామోదర సావర్కర్‌ ఒకరు. ఈ పెద్దమనిషినే సంఘపరివారం వీర సావర్కర్‌ అని గౌరవంగా పిలుచుకుంటుంది. ఆయనకు సదరు వీర అనే బిరుదు ఎవరిచ్చారు అని అడగండి ఎవరి దగ్గర నుంచైనా సాధికారికమైన సమాధానం వస్తుందేమో ! రాదు, మరి ఎలా వచ్చింది, ఆ పెద్దమనిషే చిత్రగుప్త అనే మారు పేరుతో తన గురించి ఒక పుస్తకం రాసుకున్నారు. దానిలో తన వీరత్వం, శూరత్వం గురించి పొగుడుతూ తానే రాసుకున్నారు. ఆ పుస్తకం పునర్ముద్రణకు ముందు దాన్ని చదివి నిజమే కామోసు అనుకొని అలా పిలిచారంటే అర్ధం ఉంది. కానీ సదరు పుస్తక పునర్ముద్రణ సందర్భంగా దానిలో సదరు చిత్రగుప్త మరెవరో కాదు సావర్కరే అని రాశారు. తరువాత కూడా అదే ప్రచారం చేస్తున్నారంటే ఏమనుకోవాలి. అనేక మంది కొన్ని సంస్దల పేరుతో ప్రాంతీయ, ప్రపంచ అవార్డులు, బిరుదులూ ప్రకటించుకుంటూ ఉంటారు. వాటి చిరునామా కోసం ప్రయత్నిస్తే మనకు ఎక్కడా దొరకవు. నకిలీ పట్టాలు ఇచ్చే వారు ఉన్నపుడు నకిలీ అవార్డులు, బిరుదులకు కొదవేముంటుంది.


రూపాయి విలువ గురించి బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పెద్ద రాజకీయం చేశారు. ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం యుపిఏ పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది. కాంగ్రెస్‌ కారణంగా రూపాయి ఐసియులో ఉంది. కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నా ఇప్పుడు మిమ్మల్ని కాపాడాలా రూపాయిని కాపాడాలా అన్నారు ? యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వస్తే 45 రూపాయల స్ధాయికి పెంచుతానని చెప్పింది.

అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.’పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని ” లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని కూడా రవిశంకర ప్రసాద్‌ చమత్కరించారు. అదేమో గానీ నరేంద్రమోడీ వయస్సును మించి పోయింది. యుపిఏ పాలనలో 2013 ఆగస్టు 2న రూపాయి 68.85కు పడిపోయి అప్పటికి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తరువాత మోడీ అధికారానికి వచ్చిన 2014లో మే 26నాటికి రు.58.42కు పెరిగింది. అప్పటి నుంచి గత ఏడు సంవత్సరాలలో పతనమే తప్ప ఆ స్ధాయికి బలపడలేదు. మధ్యలో 75 వరకు పతనం అయినా ఇప్పుడు 73 రూపాయలకు అటూ ఇటూగా ఉంటోంది. ఈ పతనం గురించి ఎందుకు మాట్లాడరు ? కారణాలేమిటో ఎప్పుడైనా వివరించారా ? ద్వంద్వ ప్రమాణాలు, ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు అన్నట్లు జనాన్ని తప్పుదారి పట్టించటం కాదా ?

గోవధ, గొడ్డు మాంసం గురించి ఒక ప్రాంతంలో ఒక వైఖరి, మరొక చోట దానికి భిన్న వైఖరి.ఈశాన్య రాష్ట్రాలలో, గోవాలో గొడ్డు మాంసానికి అనుకూలంగా మాట్లాడతారు, వాగ్దానాలు చేస్తారు. కేరళలో నాణ్యమైన గొడ్డుమాంసం లభ్యమయ్యేట్లు చూస్తామని వాగ్దానాలు చేసిన బిజెపి అభ్యర్దులను చూశాము. బీహార్‌ ఎన్నికల సమయంలో తమకు అధికారమిస్తే అందరికీ ఉచితంగా వాక్సిన్లు వేస్తామని చెప్పారు. తొలుత దేశమంతటికీ ఉచిత వాక్సిన్లు అని చెప్పి, దానికోసం వేల కోట్ల నిధులు కూడా కేటాయించామని ప్రచారం చేసుకున్నారు. తీరా నలభై అయిదు సంవత్సరాల పైబడిన వారికే మా బాధ్యత, మిగతావారు రాష్ట్రాలు చూసుకోవాలి లేదా ప్రయివేటుగా వేయించుకోవాలని చెప్పారు. వాక్సిన్‌ ధరలు కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రానికి ఒక ధర, ప్రయివేటుకు మరొకటన్నారు. వీటిని ద్వంద్వ ప్రమాణాలు అంటారా, ఏమనాలి? ఆరోగ్యం రాష్ట్రాల బాధ్యత అని చెబుతారు, పోనీ మాకు ఎలాంటి బాధ్యత లేదు అని ప్రకటిస్తారా అంటే అదీ లేదు. అసలు ఒక విధానం ఉందా అని సర్వోన్నత న్యాయస్ధానం ప్రశ్నిస్తే జవాబు చెప్పరు. రాజ్యాంగంలో సాధారణ ఆరోగ్యం రాష్ట్రాలదే అని చెప్పారు. కాని ఇప్పుడు వచ్చింది మహమ్మారి కదా ? మహమ్మారుల గురించి చెప్పలేదు. వాటిని కలసికట్టుగా ఎదుర్కోవాలి తప్ప ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేపట్టేది కాదు. ఇది అంతర్జాతీయ సమస్య అని ప్రపంచ సంస్ధల్లో బాధ్యత వహించాల్సింది రాష్ట్రాలు కాదు, కేంద్రం అని ఇలాంటి వారికి ఏ భాషలో చెబితే అర్ధం అవుతుంది. జవాబుదారీ తనంతో వ్యవహరించే వారు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ?


తాజా ఉదంతానికి వస్తే ప్రస్తుతం మన దేశంలో వ్యాపిస్తున్న బి.1.617 వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక శాస్త్రీయ నామం పెట్టింది. ఆపేరుతోనే వ్యవహరించాలి. ఇటీవలి కాలంలో తలెత్తిన కొన్ని వైరస్‌లు వాటితో వచ్చిన వ్యాధుల పేర్లపై అభ్యంతరాలు రావటం, కొన్ని అవాంఛనీయ పరిణామాలు తలెత్తటంతో ప్రపంచ ఆరోగ్య సంస్ద వివిధ అంతర్జాతీయ సంస్దలతో చర్చించిన తరువాత వైరస్‌లు, వ్యాధులకు ఒక దేశ, ప్రాంత, నగర,జాతి, వ్యక్తులు, జంతువుల పేర్లు పెట్టకూడదనే మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉదాహరణకు గతంలో స్పానిష్‌ ఫ్లూ అనే పేరుతో పిలిచిన దానికి స్పెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదు, అది అమెరికా నుంచి వ్యాప్తి చెందినట్లు తేలింది. అలాగే స్వైన్‌(పంది) ఫ్లూ. ఈ పేరుతో ప్రచారం కాగానే ఆహారానికి వినియోగించే ఆ జంతువులను విచక్షణా రహితంగా చంపివేయటానికి దారి తీసింది. అలాగే ‘మెర్స్‌ ‘ ఇది కూడా వివాదాస్పదమైంది. మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ అని పేరు పెట్టటంతో మధ్య ప్రాచ్య దేశాల మీద మిగతా జనాలకు అనుమానాలు తలెత్తాయి. అలాగే రిప్ట్‌ వ్యాలీ ఫీవర్‌( ఒక ప్రాంతం పేరు) వంటివి, వృత్తి సంబంధమైన పేర్లు వివాదాస్పదం అయ్యాయి.

ఈ నేపధ్యంలోనే ఊహాన్‌ లేదా చైనా వైరస్‌ అని పిలవటం ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శక సూత్రాలకు విరుద్దం. ఆ పేర్లను మీడియా వినియోగించినా, సంఘపరివార్‌, ఇతరులు సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసినా తప్పిదమే. అయినా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా ట్రంప్‌ మొదలు అనేక మంది నోరు పారవేసుకున్నారు. చివరకు ఆ అలవాటు మన నరేంద్రమోడీ సర్కార్‌ యంత్రాంగానికి అంటుకొన్నది. సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో బి.1.617 వైరస్‌ను ” భారతీయ కరోనా వైరస్‌ ” అని రాసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీవాల్‌ సింగపూర్‌లో బయటపడిన వైరస్‌ను సింగపూర్‌ కరోనా రకం అని వివాదాస్పద వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. దాని మీద సింగపూర్‌ నిరసన తెలపటంతో అది కేజరీవాల్‌ వ్యాఖ్య తప్ప భారత ప్రభుత్వ వైఖరి కాదని మన దేశం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికిగానీ తప్పిదం తెలిసిరాలేదు తరువాత అలాంటి పేర్లు వాడకూడదని అదే సర్కార్‌ ఆదేశించింది. మనకు నొప్పి తగిలిన తరువాత గానీ దానిలో ఉండే తప్పిదం ఏమిటో తెలిసిరాలేదు. తరువాత కూడా మీడియాలో, సంఘపరివార్‌, ఇతరులూ కోవిడ్‌-19 గురించి గతంలో చేసిన తప్పిదాన్నే చేస్తున్నారు. దీన్నేమందాం ? ద్వంద్వప్రమాణం అందామా లేక ఇతరులు చేస్తే వ్యభిచారం- మనం చేసేది సంసారం అందామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జై శంకర్‌ వాషింగ్టన్‌ పర్యటన : పేరు వ్యాక్సిన్‌, అసలు లక్ష్యం అమెరికాకు బాసట !

30 Sunday May 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

jaishankar US visit, Narendra Modi, Narendra Modi Failures, Quad, Quadrilateral Security Dialogue, US Vaccine Diplomacy, US-India Relations, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


” జైశంకర్‌ అమెరికా పర్యటనలో వాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం ”
” అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్‌తో వాణిజ్యం, వాక్సిన్లు, చతుష్టయం, ఇండోఫసిఫిక్‌ అంశాలపై జైశంకర్‌ చర్చ ”
” చతుష్టయం, ఆఫ్ఘనిస్తాన్‌, వాక్సిన్‌ తదితరాలపై భారత్‌-అమెరికా ద్వౌపాక్షిక చర్చ ”
” ట్విటర్‌, వాట్సాప్‌ గురించి అమెరికా పర్యటనలో జైశంకర్‌ చర్చ”
” జైశంకర్‌ అమెరికా పర్యటనలో తొలి చర్చనీయాంశం చైనా ”
” చతుష్టయ కూటమికి వెన్నుదన్నుగా భారత్‌ ”


మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మే 24 నుంచి 28 వరకు జరిపిన అమెరికా పర్యటనకు ముందు, ఆ సమయంలో వచ్చిన కొన్ని వార్తల శీర్షికలు ఇవి. ఇటీవలి కాలంలో కరోనా కారణంగా అన్నీ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా జరుగుతుంటే స్వయంగా వెళ్లటం అంటే ముఖాముఖీ తేల్చుకునేవి ఉండి ఉంటాయని జనం అనుకున్నారు. ఎందుకు వెళ్లారు, ఏం మాట్లాడారు, ఏమి సాధించారు అని మన దేశం తిరిగి వచ్చిన తరువాత ఎవరైనా అడిగితే ఏం చెబుతారో తరువాత చూద్దాం.
జైశంకర్‌ పర్యటనకు ముందు వివిధ మీడియా సంస్ధలు పర్యటన లక్ష్యం, ఉద్దేశ్యాల గురించి కథనాలు రాశాయి. పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నట్లుగా పరిపరి విధాలుగా అవి ఉన్నాయి. జేమ్స్‌బాండ్‌గా మోడీ అభిమానులు వర్ణించే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అమెరికన్లతో ఫోన్లో మాట్లాడి దెబ్బకు దిగివచ్చేట్లు చేశారు చూడండి అంటూ ఏప్రిల్‌ నాలుగవ వారంలో కాషాయ దళాలు ఊదరగొట్టాయి. ఇంకేముంది ఫోను పెట్టేలోగానే వాక్సిన్‌ తయారీ ముడి పదార్ధాలతో అమెరికా విమానాలు గుంపులు గుంపులుగా ఎగురుకుంటూ బయలు దేరాయి చూడండి అన్నట్లుగా వాట్సాప్‌లో తెగ ప్రచారం చేశారు. ట్రంప్‌ బెదిరించగానే నిషేధం ఎత్తివేసి ఎందుకంత ఆగ్రహం జీహుజూర్‌ అంటూ మనం హైడ్రోక్సీక్లోరోక్విన్‌ మాత్రలు పంపిన మాదిరి మనకు వాక్సిన్‌ ముడి పదార్దాలను పంపటానికి అక్కడున్నది నరేంద్రమోడీ కాదని గత ఐదు వారాల్లో రుజువైంది.


వచ్చిన వార్తలను బట్టి అమెరికాలో వినియోగానికి అనుమతి ఇవ్వకుండానే కొనుగోలు చేసిన ఆరు కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా వాక్సిన్లను, మరో రెండు కోట్ల ఇతర కంపెనీల వాక్సిన్లను మనకు విక్రయించటానికి లేదా దానంగా ఇవ్వటానికి మాత్రమే అమెరికా సుముఖంగా ఉంది. బోలెడు సానుభూతి కబుర్లు తప్ప వాక్సిన్‌ ముడి పదార్ధాల సరఫరా గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఒక వైపు ప్రాణాలు పోతున్నా, అక్కడి వాడని వాటి మీద కూడా నెలల తరబడి అమెరికా నిర్ణయం తీసుకోలేదని గమనించాలి. అమెరికా దానం చేసే వాక్సిన్ల కోసం, ముడి పదార్దాలు విక్రయించండి మహా ప్రభో అని స్వయంగా వెళ్లి ఐదు రోజులు ఉండాల్సి అవసరం ఉందా ? కేవలం వాటికోసమే అయితే అవసరం లేదు.


మనకు కరోనా వాక్సిన్‌ ముడి పదార్దాలను అమెరికా ఇవ్వదా ? ఎందుకివ్వదు, ఇస్తుంది. ఎప్పుడు ? ఉద్రిక్తలను మరింతగా పెంచకుండా, దెబ్బలాటలకుదిగకుండా లడఖ్‌ సరిహద్దుల్లో ఉన్న సైన్యాల ఉపసంహరణ గురించి మనం చైనాతో జరుపుతున్న చర్చలు జోబైడెన్‌ సర్కార్‌కు ఆగ్రహం కలిగిస్తున్నాయా ? చైనా విషయంలో భారత్‌ రాజీపడుతున్నదనే అనుమానం అమెరికాలో తలెత్తిందా ? కరోనా కారణంగా మన దేశంలో తలెత్తిన విపత్కర పరిస్ధితిని వినియోగించుకొని మనల్ని మరింతగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టేందుకు వాక్సిన్‌ ముడిపదార్దాల సరఫరాను ఎరగా వేస్తున్నదా ? మన దేశం దానికి లొంగిపోతున్నదా ? ఇలా ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి.

హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు మలేరియా చికిత్సలో వినియోగిస్తారు. అవి కరోనా నివారణకు కూడా పనికి వస్తాయోమో అన్న ఆలోచన రాగానే మన దేశం వాటిపై నిషేధం విధించింది. తన ఎన్నికలు ముందున్నాయి, అమెరికాలో కరోనా పుచ్చిపోతోంది, భారత్‌ సదరు ఔషధం మీద నిషేధం విధించిందంటే నిజంగానే అది పని చేస్తుందేమో అన్న ఆశతో డోనాల్డ్‌ ట్రంప్‌ తనకు కౌగిలింతల సన్నిహితుడు అని కూడా చూడకుండా బహిరంగ బెదిరింపులతో నరేంద్రమోడీని అవమానించాడు. ఇప్పుడు వాక్సిన్లు తప్ప మరొక చికిత్సలేదు అని తేలిపోయింది, అవి అందుబాటులోకి వచ్చాయి గనుక వాటితో రాజకీయం చేసేందుకు అమెరికా నిర్ణయించుకుంది. ముందు చూపులేని కారణంగా మోడీ సర్కార్‌ జనాన్ని బలిచేస్తున్నది. ముతక సామెత చెప్పినట్లు మంచమిరిగినా……అన్నట్లు కరోనా మహమ్మారిని కూడా సామ్రాజ్యవాదం తన ఎత్తుగడలకు అనుగుణ్యంగా వినియోగించుకుంటుంది అన్నది తేలిపోయింది.


నిజానికి మన సర్కార్‌తో లెక్కలు తేలిఉంటే జైశంకర్‌ పర్యటన సమయంలోనే వాక్సిన్‌ ముడిపదార్దాల సరఫరా గురించి నిర్దిష్టమైన ప్రకటన అమెరికా వైపు నుంచి వెలువడి ఉండేది. జో బైడెన్‌ జనవరిలో అధికారాన్ని స్వీకరించిన తరువాత మన కేంద్ర మంత్రి ఒకరు అమెరికాలో పర్యటించటం ఇదే ప్రధమం. ప్రపంచ పరిణామాల గురించి ఎవరి దృష్టి వారికి ఉంటుంది, మన వైఖరి ఏమిటో కూడా వారు వినాలి కదా అని జైశంకర్‌ చెప్పారు. తన పర్యటనలో ప్రతి సమావేశంలోనూ కరోనా మీద పోరు, వాక్సిన్‌ సరఫరాలు, ఉత్పత్తి గురించి ప్రముఖంగా ప్రస్తావించినట్లు చెప్పారు. అయినా అమెరికా వైపు నుంచి నిర్ధిష్ట ప్రకటన లేదా సూచన లేదు. అంటే ఇంకా మన నుంచి ఏదో ఆశిస్తున్నది. ఇటీవలి అనుభవాల తరువాత అమెరికాతో పూర్తిగా అంటకాగితే లాభం కంటే నష్టమే ఎక్కువన్నది స్పష్టమైంది. బహుశా దీనికి సూచికగానే తమ దేశ ప్రయోజనాలు, ప్రాధాన్యతలకు అనుగుణ్యంగానే విదేశాంగ విధానం కొనసాగుతుందని అమెరికా పర్యటనకు ముందు ఒక సమావేశంలో జైశంకర్‌ చెప్పారు. ఇలాంటి వైఖరి అమెరికన్లకు నచ్చదు. వారు ఆడించినట్లు ఆడే కీలుబొమ్మలుగా ఉండాలి.

తాము కూడా ప్రపంచ స్ధాయి కార్పొరేట్లుగా ఎదగాలనుకుంటున్న మన దేశీయ కార్పొరేట్లకు అలాంటి లొంగుబాటు నష్టదాయకం కనుక అలాంటి వైఖరిని పూర్తిగా అంగీకరించరన్నది గత అనుభవం. ఉదాహరణకు అమెరికాకు చెందిన అమెజాన్‌ కంపెనీ యజమాని మన దేశం వచ్చినపుడు ఎక్కడ ముఖేష్‌ అంబానీకి కోపం వస్తుందో అని నరేంద్రమోడీ కనీసం దర్శనానికి అనుమతి కూడా ఇవ్వలేదు. అమెజాన్‌ వాణిజ్య విస్తరణను అడుగడుగునా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. తమకు వ్యతిరేకంగా భారత్‌ను మరింతగా ముందుకు తోసేందుకే వాక్సిన్‌ను ఆయుధంగా చేసుకొని అమెరికా ఇలా చేస్తున్నదని, సాయం చేసినా షరతులతో కూడినదే అవుతుందని చైనా పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాదు కరోనా రెండవ తరంగం విషయంలో వైఫల్యంతో తలెత్తిన జనాగ్రహాన్ని చల్లార్చేందుకు మోడీ సర్కార్‌ దౌత్యపరమైన బహిరంగ తమాషాకు పాల్పడిందని కూడా ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. అందుకే జైశంకర్‌ పర్యటన సాధించింది ఏమిటనే ప్రశ్నకు ప్రాధాన్యత ఏర్పడింది.


ఒకవైపు చైనా పెద్ద ఎత్తున వివిధ దేశాలకు వాక్సిన్‌ సరఫరా చేస్తున్న నేపధ్యం, మా వాక్సిన్‌ మాకే అన్న అమెరికా మీద ప్రపంచం అంతటి నుంచి వస్తున్న వత్తిడిని తట్టుకోలేక తమకు పనికిరాని దానిని గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు ఇతర షరతులను తగిలించి దానం పేరుతో ఆరుకోట్ల ఆస్ట్రాజెనెకా, మరో కోట్ల ఇతర వాక్సిన్లు కలిపి ఎనిమిది కోట్ల డోసులను ఇతర దేశాలకు ఇస్తామని ప్రకటించింది. దానిలో మన దేశానికి ఎన్నో ఇంతవరకు తేల్చలేదు. ఇంతవరకు మనకు వచ్చిందేమైనా ఉంటే మిగతా దేశాల మాదిరి ఆక్సిజన్‌ కానసెంట్రేటర్లు, ఇతర చిన్న చిన్న పరికరాలు తప్ప కీలకమైన వాక్సిన్‌ ముడిసరకుల సరఫరాలు లేవు. ఎప్పటిలోగా ఇచ్చేది కూడా ఇంతవరకు చెప్పలేదు.

అమెరికా ప్రతినిధులతో వ్యూహాత్మక మరియు రక్షణ భాగస్వామ్యం గురించి కూడా సమగ్రమైన సంభాషణ జరిగిందని, అభిప్రాయాల మార్పిడి జరిగిందని జైశంకర్‌ చెప్పారు. చతుష్టయం పేరుతో అమెరికా ఏర్పాటు చేసిన జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా కూటమిలో సభ్యత్వం గురించి తమకు స్పష్టత ఉందని చైనా చర్యల నేపధ్యంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఒక ముఖ్యమైన అంతరాన్ని పూడ్చిన కూటమితో నిబంధనలకు అనుగుణ్యమైన వ్యవస్ధకు తాము మద్దతు ఇస్తున్నట్లు వాషింగ్టన్‌ సమావేశాల తరువాత జైశంకర్‌ చెప్పారు. చతుష్టయ కూటమి ఆలోచన ఇప్పటిది కాదు.2007లోనే రూపుదిద్దుకుంది తప్ప ముందుకు సాగలేదు. మరుసటి ఏడాదే దేశ రాజకీయ అంతర్గత విబేధాల కారణంగా ఆస్ట్రేలియా కూటమి నుంచి తప్పుకుంది. తిరిగి 2017లో చేరింది. చైనా-భారత్‌ల మధ్య సరిహద్దు ఘర్షణల నేపధ్యం, ట్రంప్‌ అధికారాన్ని కోల్పోవటంతో చతుష్టయంలో కొనసాగినా చురుకుగా ఉండకపోవచ్చని మన దేశాన్ని అమెరికా అనుమానించింది. అలాంటిదేమీ లేదు, పూర్తి స్ధాయిలో పని చేస్తామని ఈ పర్యటన సమయంలో జైశంకర్‌ స్పష్టం చేసినట్లు ఈ పర్యటనమీద వెల్లడైన విశ్లేషణలు, వ్యాఖ్యలు వెల్లడించాయి. ” సభ్యులంగా దేనికైనా సిద్దపడాలి, దాని గురించి మాకు చాలా స్పష్టత ఉంది. లేనట్లయితే మేము సభ్యులుగా ఉండజాలము. ఇప్పటి వరకు ఈ కూటమి సముద్ర ప్రయాణ భద్రత, సంబంధాల గురించే చర్చించేదిగా ఉంది, ఇటీవలి సంవత్సరాలలో అది సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, సరఫరా వ్యవస్దలు, వాక్సిన్ల ఉత్పత్తి గురించి కూడా చర్చిస్తున్నది, అంటే అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాల గురించి ఆందోళన ఉంది. పెద్ద దేశాలు చేయగలిగింది ఎక్కువ, పెద్ద సంబంధాలు దానికి తోడౌతాయి, అయితే చివరికి ఒక బృందంగా కొన్ని దేశాలు కూర్చుని కలసి పని చేస్తేనే అనేక పనులు జరుగుతాయి. మా అందరికీ ఒకే విధమైన స్దానం, ప్రయోజనాలు ఉన్నాయి, అలాంటపుడు అందరం కూర్చొని ఎందుకు సమస్యలను చర్చించకూడదు ” అని జైశంకర్‌ విలేకర్లను ప్రశ్నించారు. కొద్ది రోజులు గడచిన తరువాత గానీ కేంద్ర మంత్రి పర్యటన వివరాలు, పర్యవసానాలు వెల్లడయ్యే అవకాశం లేదు.

పెరుగుతున్న చైనా ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసేందుకు అమెరికాతో కలసి పని చేస్తే మనకు ఒరిగేదేమీ లేదని గత ఏడు సంవత్సరాల అనుభవం నేర్పుతున్నా, మోడీ సర్కార్‌ వైఖరిలో పునరాలోచన ఉన్నట్లు కనపడదు. మరోవైపు చైనా నుంచి తనకు ఎదురవుతున్న సవాలును ఒంటరిగా ఎదుర్కోగలిగినప్పటికీ అర్ధికంగా లాభదాయకం కాదు గనుక మనవంటి దేశాలను అమెరికా తన వ్యూహంలోకి లాగుతున్నది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని, దాని లక్ష్యాలపట్ల ఏమాత్రం గౌరవం లేని శక్తులు నేడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్‌లో కూడా తరాలు మారి నయవుదారవాద విధానాల పట్ల మోజు పెరిగింది కనుకనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వాటిని అమలు జరిపారు. రాష్ట్రాల హక్కుల సమస్యల మీద ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు కూడా నయాఉదారవాద విధానాలకు అనుకూలమే గనుక వాటికి అధికారం తప్ప కాంగ్రెసా-బిజెపినా అనే తేడా పెద్దగా ఉండదు.


ఎండమావులను చూసి నీటి సరస్సులుగా భావించినట్లు అమెరికా, పశ్చిమ దేశాలను చూసి మన దేశం వాటితో జతకట్టి లబ్దిపొందాలని చూస్తున్నది. ఇప్పటికే అమెరికా -ఐరోపా ధనిక దేశాల మధ్య మిత్రవైరుధ్యం ఉంది. తమకు పోటీగా మనవంటి మరొక దేశాన్ని ఎదగనిస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. అనూహ్యంగా తమను సవాలు చేస్తున్న చైనాను దెబ్బతీసేందుకు పొరుగునే దానికి చికాకు కలిగించే శక్తివారికి కావాలి. గతంలో మనలను లొంగదీసుకొనేందుకు పాకిస్ధాన్‌ను అమెరికా, పశ్చిమ దేశాలు ప్రయోగించినట్లే ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా మనలను నిలబెట్టాలన్నది బహిరంగ రహస్యం. పాకిస్ధాన్‌ బావుకున్నదేమీ లేదు.మనకూ అదే మర్యాద జరగబోతున్నది.


గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ ఢకొీన్న సమయంలో పరిస్ధితి వేరు, ఇప్పుడు వేరు. సోవియట్‌ స్ధానంలో చైనాను దెబ్బతీయాలని చూస్తున్నారు. మొదటి విషయం చైనా నాటి సోవియట్‌ కాదు. నాడు సోవియట్‌కు వ్యతిరేకంగా యావత్‌ ఐరోపా ధనిక దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. తరువాత ఏం జరుగుతుందో తెలియదు గానీ ఇప్పుడు చైనాను ఉపయోగించుకొని లబ్దిపొందాలని అవి చూస్తున్నందున గతంలో మాదిరి అమెరికా ఏమి చెబితే అది నడవదు. ఈ తేడాను గమనించకుండా మన దేశం అమెరికాకు తోకగా మారితే జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐఎంఏ అధ్యక్షుడికి మత ముద్ర వేసిన కాషాయ దళం- రామ్‌దేవ్‌ బాబాకు జూన్‌ ఒకటిన వైద్యుల నిరసన !

29 Saturday May 2021

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Science, Uncategorized

≈ Leave a comment

Tags

Ayush systems, Baba Ramdev, Christianity, Dr Johnrose Austin Jayalal, Gaytri Mantra, Hindu Fundamentalism, IMA, RSS Propaganda, Yoga


ఎం కోటేశ్వరరావు


అల్లోపతి వైద్యాన్ని కించపరుస్తూ మాట్లాడిన రామ్‌దేవ్‌ బాబా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడినందున ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్‌ ఒకటవ తేదీన దేశవ్యాపితంగా నిరసన దినం పాటించాలని రెసిడెంట్‌ డాక్టర్ల ఫోరం పిలుపు నిచ్చింది. దీంతో ఇష్టవచ్చినట్లుగా బాబా మీద, మద్దతు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగట్టే ఎండగట్టే అవకాశం ఉంది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలి లేదా వెయ్యి కోట్ల జరిమానా దావాను ఎదుర్కోవాలని అందుకు పదిహేను రోజుల గడువు ఇస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఎ) ఇచ్చిన నోటీసులో పేర్కొన్నది. అందువలన ఆ గడువులోగా క్షమాపణ చెబుతారా, కేసును ఎదుర్కొంటారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శల తుపానుతో గుక్కతిప్పుకోలేని మోడీ సర్కార్‌కు అటు వైద్యులను సమర్ధించాలా లేకా విశ్వాసపాత్రుడైన రామ్‌దేవ్‌ను సమర్ధించాలా అన్న కొత్త తలనొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్‌ రామ్‌దేవ్‌ బాబా పతంజలి కరోనిల్‌ టూల్‌కిట్లను కొనుగోలు చేసి ఉచితంగా పంచాలని నిర్ణయించటాన్ని బట్టి బాబాకు మద్దతు ఇస్తున్నదెవరో స్పష్టమౌతోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఏదో ఒకసాకుతో కొనుగోలు చేస్తాయా ?


వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని కొందరు పండితులు చెప్పారు, ప్రచారం చేశారు తప్ప ప్రపంచంలో ఇంతవరకు ఏ వైద్య విధానమూ సర్వరోగ నివారిణులను కనుగొన్నాము అని ప్రకటించలేదు. అల్లోపతి కూడా చెప్పలేదు. కానీ కరోనా వైరస్‌ను సొమ్ము చేసుకోవాలని చూసిన రామ్‌దేవ్‌ బాబా వంటి వారు ఢిల్లీ పెద్దల అండచూసుకొని రెచ్చిపోతున్నారు. ప్రశ్నల పేరుతో అడ్డుసవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికీ అనేక వ్యాధులకు సరైన ఔషధాలు, చికిత్స లేదు. అలాంటపుడు రామ్‌దేవ్‌ వంటి వారు ఒక్క అల్లోపతినే ఎందుకు ప్రశ్నించాలి, మిగతా విధానాలకు ఈ ప్రశ్నలను ఎందుకు వేయటం లేదు.


ఎందుకంటే ఆయుర్వేదం పేరుతో సొమ్ము చేసుకోవటం సులభం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం అల్లోపతి ఔషధాలకు మాత్రమే పరీక్షల నిర్దారణ నిబంధనలు ఉన్నాయి. సంప్రదాయ వైద్య పద్దతులను ప్రోత్సహించే పేరుతో ఆయుర్వేద, సిద్ద, యునానీ పేరుతో తయారు చేసే ఔషధాలకు వాటి నుంచి మినహాయింపులు ఇచ్చారు. ఆనందయ్య లాంటి వారు ఊరికొకరు మందుల పేరుతో పుట్టుకు వస్తున్నారు. ఈ లోపం కారణంగానే రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలి తాము కరోనాను అరికట్టే కరోనిల్‌ అనే ఔషధాన్ని తయారు చేసినట్లు ప్రకటించుకుంది. దాన్ని విడుదల చేసిన సభలో స్వయంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ పాల్గొన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా సొమ్ము చేసుకోవటం కంటే జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నందున ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అలా చెప్పుకోవటాన్ని సవాలు చేసింది. కనుకనే బాబా గారికి అల్లోపతి వైద్యం, వైద్యుల మీద కోపం వచ్చింది. అందుకే నోటికి ఏది తోస్తే దాన్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. చివరికి అది వివాదానికి దారితీయటంతో కేంద్ర మంత్రి జోక్యం చేసుకొని అల్లోపతి వైద్యం మీద చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సలహా వంటి హెచ్చరిక చేయటంతో వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించిన బాబాగారికి ఉక్రోషం ఆగలేదు. ఐఎంఎగానీ దాని బాబు గాన్ని నన్ను అరెస్టు చేయించలేరు అని నోరుపారవేసుకున్నారు. దాని కొనసాగింపుగా వాక్సిన్‌ తీసుకున్నా పది వేల మంది వైద్యులు కరోనాతో మరణించారని అబద్దాలు ప్రచారం చేశారు. తన పాతిక ప్రశ్నలకు అల్లోపతి వైద్యవిధానాన్ని సమర్ధిస్తున్న వారు సమాధానం చెప్పాలంటూ సవాలు విసిరారు.


రామ్‌దేవ్‌ బాబా సవాలుకు తాము జవాబు చెబుతామని, తాము కూడా కొన్ని ప్రశ్నలు వేస్తామని ఆ చర్చను మీడియా సమక్షంలో నిర్వహించి ప్రత్యక్ష ప్రసారం చేయాలని, పతంజలి యోగ పీఠం నుంచి ముగ్గురు ఆయుర్వేదాచార్యులను నియమించాలని, కావాలంటే రామ్‌దేవ్‌ బాబా,ఆయన అనుచరుడు మరో భాగస్వామి బాలకృష్ణ కూడా చర్చలో ప్రేక్షకులుగా ఉండవచ్చునని ఐఎంఎ ప్రతిసవాలు విసిరింది. ఆయుర్వేదంలో వారిద్దరి అర్హతలేమిటో వెల్లడించాలని తాము గతంలోనే మూడు సార్లు కోరినప్పటికీ ఇంతవరకు జవాబు లేదని, అర్హత లేనివారితో చర్చించటం పద్దతి కాదు కనుక వారు తమ నిపుణులను నియమించాలని స్పష్టం చేసింది. అల్లోపతి వైద్య సామర్ద్యాన్ని ప్రశిస్తూ రామ్‌దేవ్‌ ప్రశ్నలు ఉన్నాయి.
ఈ వివాదంలో బిజెపి బీహార్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సంజరు జైస్వాల్‌ అల్లోపతి వైద్యులకు మద్దతు ఇచ్చారు. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో స్పందిస్తూ రామ్‌దేవ్‌ ఒక యోగా గురువు మాత్రమే, దానిలో ఆయన సమర్దతను ఎవరూ ప్రశ్నించరు. పానీయాలకు కోకా కోలా ఎంత ప్రాచుర్యం తెచ్చిందో యోగాకు ఆయన అలా చేశారు.భారతీయులు పురాతన కాలం నుంచీ షికంజీ, తండారు వంటి పానీయాలను తాగుతున్నారు. కోకా కోలా వచ్చిన తరువాత అదే జనాలు పెప్సీ, కోక్‌లను ఇండ్లలో నిలవచేసుకుంటున్నారు. రామ్‌దేవ్‌ యోగి కాదు, ఎందుకంటే యోగులు తమ మెదళ్లు, స్పృహలను అదుపులో ఉంచుకుంటారని అన్నారు. అల్లోపతి వైద్యులు పనికిమాలిన చర్చల్లో తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దని పవిత్రమైన వృత్తి మీద కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు. వ్యాధులను దూరంగా ఉంచినంత వరకు ముఖ్యమైనదే గాని యోగా వైద్యవిధానం కాదు, ప్రతి వైద్యవిధానానికి దేనికి ఉండే పరిమితులు దానికి ఉంటాయి, యోగా మనలను జాడ్యానికి దూరంగా ఉంచవచ్చు కానీ ఉన్న రోగాలకు చికిత్సగా చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి అన్నారు.


ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి డాక్టర్‌ సహజానంద కుమార్‌ సింగ్‌ ఒక ప్రకటన చేస్తూ రామ్‌దేవ్‌ తన యోగా, పతంజలి ఉత్పత్తులకు పరిమితం కావాలి, కరోనా సమయంలో అవసరమైన చికిత్స చేస్తున్న వైద్యులను నిరుత్సాహపరచ కూడదన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ పదివేల మంది వైద్యులు మరణించారంటూ పుకార్లు వ్యాపింప చేస్తున్నందుకు, కరోనా మీద ప్రభుత్వ చికిత్సా విధానాలను సవాలు చేయటం దేశద్రోహంగా పరిగణించి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానికి రాసినట్లు తెలిపారు. అలాంటి చర్యలు జనాన్ని వాక్సిన్లు తీసుకోకుండా చేసేందుకు ప్రోత్సహిస్తాయని, ఇది జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని, ఇంతకంటే దేశద్రోహం ఏముంటుందని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌ ఐఎంఎ శాఖ వెయ్యి కోట్ల పరువు నష్టం దావా నోటీసు పంపిందన్నారు.


కరోనిల్‌ గురించి పతంజలి తప్పుడు ప్రచారం చేసి రోగులను తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటంతో దాని సామర్ధ్యం గురించి ఐఎంఎ సవాలు చేసింది. అయితే తాము 46 మంది రోగుల మీద పరీక్షలు జరిపామని సమర్ధించుకొనేందుకు చూసినప్పటికీ కుదరకపోవటంతో అది చికిత్సకు సహాయకారి అని ప్రకటించాల్సి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ సంస్ధ కూడా అలాంటిదిగానే పరిగణించి అనుమతి ఇచ్చినప్పటికీ ఏకంగా కరోనా నిరోధం అని ప్రచారం చేశారు. దీంతో ఐఎంఎ మీద అక్కసుతో అల్లోపతి వైద్యం బుద్ది తక్కువ శాస్త్రం అని రామ్‌దేవ్‌ అంటే పతంజలి సంస్ధ సారధుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ సమస్యకు మతం రంగు పులిమి కుట్ర కోణాన్ని ముందుకు తెచ్చి పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారు. బిజెపి అనుకూల మీడియా కూడా దాన్ని భుజానవేసుకొని మతకోణాన్ని ముందుకు తీసుకు వచ్చిదాడి చేస్తోంది. సహజంగానే ఆ దాడికి గురైన నెటిజన్లు అదే పాటపాడుతున్నారు.


యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు అని బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. దీని వెనుక అసలు కారణంగా కరోనిల్‌ మీద అదే విధంగా అల్లోపతిని అవమానిస్తూ వ్యాఖ్యానించిన రామ్‌దేవ్‌ మీద చర్యకు డిమాండ్‌ చేసిన ఐఎంఏకు ప్రస్తుతం అధ్యక్షుడిగా డాక్టర్‌ జాన్‌ రోజ్‌ జయలాల్‌ చురుకుగా వ్యవహరించటమే. తన పదవిని ఉపయోగించుకొని జాన్‌ రోజ్‌ జనాన్ని క్రైస్తవులుగా మార్చేందుకు పూనుకున్నారని గర్హనీయ, హాస్యాస్పదమైన ఆరోపణలకు దిగారు.


ప్రతిదానికీ ఆయుర్వేదంలో చికిత్స ఉంది, ఔషధాలున్నాయని చెప్పే వారు ప్రత్యామ్నాయ చికిత్సా విధానం కోసం ఎదురు చూస్తున్న జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు దేన్నీ వదలటం లేదు.మూడు సంవత్సరాల క్రితం కేరళలో వచ్చిన నీఫా వైరస్‌ వ్యాప్తి సమయంలో కూడా ఆయుర్వేదంలో కషాయ చికిత్స ఉందంటూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకున్న సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. అప్పుడు కూడా ఐఎంఎ రంగంలోకి దిగి జనాన్ని హెచ్చరిస్తూ అలాంటి ప్రచారాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించింది.నిజానికి నీఫా వైరస్‌ 1990 దశకంలోనూ, తరువాత కూడా మన దేశంలో వ్యాపించింది, దేశంలో కేరళ ఆయుర్వేద ప్రాచుర్యం గురించి తెలిసిందే, అయినప్పటికీ ఆ వైద్య విధానం లేదా ఆరంగంలో పని చేస్తున్న వారు గానీ ఔషధాన్ని తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఎలాంటి అర్హతలు, నైపుణ్యంలేని ఆనందయ్య కరోనాకు తాను మందు తయారు చేశానని చెబితే సమర్ధించే ఆయుర్వేద వైద్యులందరూ తమ పట్టాలను పక్కన పడేసి కల్వాలు-గూటాలు తీసుకొని ఆనందయ్య అనుచరులుగా మారిపోవటం మంచిది. ఆనందయ్యను సమర్ధించే పాలకులు ఆయుర్వేద కాలేజీలు, ఆసుపత్రులను అల్లోపతికి మార్చివేయాల్సి ఉంటుంది.


తన పదవిని ఉపయోగించుకొని జనాన్ని క్రైస్తవంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న తప్పుడు వార్తలను పట్టుకొని ఢిల్లీకి చెందిన ఒక లాయర్‌ ఐఎంఎ అధ్యక్షుడు జాన్‌ రోజ్‌ జయలాల్‌ మీద ఒక క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. రామ్‌దేవ్‌పై ఐఎంఎ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఇది దాఖలు కావటం గమనించాల్సిన అంశం. సామాజిక మాధ్యమంలో ప్రకటనలు చేయటం ద్వారా మత బృందాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని లాయర్‌ ఆరోపించారు. తాను ఒక టీవీ చర్చను చూశానని, దానిలో బాబా రామ్‌దేవ్‌ను దూషిస్తూ, దుర్భాషలాడారని, బెదిరించారని, తాను యోగా గురువు భక్తుడిని కనుక మానసికంగా గాయపడ్డానని పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ” కుష్టు, కలరా, ఇతర మహమ్మారులు ప్రపంచంలో నష్టం కలిగించినపుడు వాటికి వ్యతిరేకంగా క్రైస్తవ వైద్యులు, చర్చ్‌లు పని చేశారని, క్రైస్తవ కరుణ చూపించారని ” చెప్పారని అది క్రైస్తవంలోకి మార్చే ప్రయత్నమని ఆరోపించారు.


ఒక కులం లేదా మతంలో పుట్టటం అనేది ఎంపిక ప్రకారం జరిగేది కాదు.అనేక మంది హిందూ, ముస్లిం, సిక్కు తదితర మతాల కుటుంబాలలో పుట్టినట్లుగానే డాక్టర్‌ జాన్‌ రోజ్‌ క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. అతని మీద చేస్తున్న ఆరోపణల స్వభావం ఏమిటి ? అతను హగ్గారు ఇంటర్నేషనల్‌ అనే క్రైస్తవ సంస్ద సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రతి దేశాన్ని ఏసు క్రీస్తు సువార్తతో మార్చివేయాలన్న లక్ష్యం మాది అని సదరు సంస్ధ ప్రకటించుకుంది. ఐఎంఎ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆధ్యాత్మిక జీవితంలో వైద్య వృత్తిలో సువార్త స్ఫూర్తిని నింపుకొని పని చేస్తానని, దేవుడికి సజీవ సాక్షిగా జీవించాలని గాఢంగా భావిస్తున్నాను. తమ వ్యక్తిగత రక్షకుడిగా ఏసును స్వీకరించాలని యువ వైద్య విద్యార్ధులు, వైద్యులను ప్రోత్సహిస్తాను, నేను పని చేస్తున్న ఒక లౌకిక సంస్ధలో దేవుడికోసం ఒక సాక్షిగా పని చేస్తాను అని చెప్పారు. సంఘపరివార్‌ శక్తులు ఈ మాటలను పట్టుకొని వాటికి చిలవలు పలవలు అల్లి తమ భాష్యాన్ని జోడించి నానా యాగీ చేశాయి. సదరు హగ్గీ సంస్ద ప్రకటించుకున్న లక్ష్యాలకు జాన్‌ రోజ్‌ ఎలా బాధ్యుడు అవుతారు?


లౌకిక రాజ్యాన్ని హిందూత్వ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించిన ఆర్‌ఎస్‌ఎస్‌లోని వారే నేడు దేశాన్ని ఏలుతున్నారు. నిత్యం అందుకోసమే ఎన్ని ఎత్తులు, ఎన్ని జిత్తులు,ఎంతగా ప్రచారం చేస్తున్నారో తెలుసు. అలాంటివి ఇంకా అనేక సంస్ధలు ఉన్నాయి. వాటి సమావేశాల్లో పాల్గొన్నవారు అనేక మంది వివిధ అధికారిక సంస్దలు, పదవుల్లో ఉన్నారు. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అలాంటిది కాదు, వైద్య వృత్తిదారుల సంస్ధ. దాని నిబంధనావళికి లోబడి అర్హతలు ఉన్న ఎవరైనా చేరవచ్చు, పదవులకు ఎన్నిక కావచ్చు. వివిధ మతాలకు చెందిన వైద్యులు దాని సభ్యులుగా ఉండి తమ మత సంస్ధల సమావేశాలు, ప్రార్ధనా స్ధలాలకు వెళ్లటమా లేదా అనేది వారిష్టం. అదేమీ అనర్హత కాదు కనుకనే జాన్‌ రోజ్‌ జయలాల్‌ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న అనేక మంది తమ మతవిశ్వాసాలకు అనుగుణ్యంగా గుళ్లు గోపురాలు తిరుగుతున్నారు. అంతమాత్రాన లౌకిక రాజ్యాంగం ప్రకారం పదవిని పొందిన వారిని వాటికి వెళ్లవద్దని ఎవరూ చెప్పటం లేదు. అది వారికి సంబంధించిన వ్యక్తిగత అంశం. విధి నిర్వహణలో తమ మతాన్ని, కులాన్ని తీసుకురావటం చట్టవిరుద్దం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం. జాన్‌ రోజ్‌ ఎన్నికైన తరువాత ఏ వైద్య విద్యార్ధులు లేదా వైద్యులను ఐఎంఎ అధ్యక్షుడి హౌదాలో సమావేశ పరచి క్రైస్తవాన్ని పుచ్చుకోమని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు సర్కార్‌ పుష్కర స్ధానాలు చేస్తే పుణ్యం వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బిజెపి ముఖ్యమంత్రులు, మంత్రులు కుంభమేళాలో పాల్గొని గంగలో మునగాలని ప్రోత్సహించారు, తమ అధికార పదవులను దుర్వినియోగం చేశారు.


ఇక జాన్‌ రోజ్‌ హిందూయిజాన్ని, పురాతన భారత సంస్కృతిని ద్వేషించారు అన్న ఆరోపణ. ఏ సందర్భంలో ద్వేషించారో లేదో కాషాయ దళాల రాతలను బట్టి నిర్ధారణలకు రాలేము. లేదూ ఒకవేళ ద్వేషించారే అనుకుందాం. అలాంటి అభిప్రాయాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. లేదూ మతవిద్వేషాలు రెచ్చగొట్టిన నేపధ్యం ఏమైనా ఉందా ? ఒక అభిప్రాయం కలిగి ఉండటం దేశద్రోహమా, రాజ్యాంగ విరుద్దమా ? కులము-హిందూయిజం రెండింటికీ తేడాలేదని ద్వేషించిన తరువాతనే కదా అంబేద్కర్‌ రాజ్యాంగ రచనకు అధ్యక్షత వహించలేదా, కేంద్రమంత్రిగా పని చేయలేదా.
ఒక ఇంటర్వ్యూలో ” వారు దేశాన్ని ఒకటిగా, వైద్య పద్దతిని ఒకటే ఉండాలని కోరుకుంటున్నారు, రేపు ఒకే మతం ఉండాలని కోరుకుంటారు. ఇది కూడా సంస్కృత భాష ప్రాతిపదికన, అది ఎల్లవేళలా హిందూ సిద్దాంతాలతోనే ఉంటుంది.ఇది పరోక్ష పద్దతిలో సంస్కృతం పేరుతో జనం మెదళ్లలో హిందూత్వను నింపాలని చూస్తున్నారు ” అని కూడా జాన్‌ రోజ్‌ చెప్పారట. దానిలో అభ్యంతరం ఏముంది, గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నది అదే కదా ?


ప్రాణాయామం చేయటం ద్వారా, గాయత్రీ మంత్రాన్ని పఠించి కరోనాను పోగొట్టవచ్చా అని పరీక్షలు చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ నిర్ణయించటాన్ని, రెండు వారాల పాట్లు క్లినికల్‌ ప్రయోగాలు చేయాలని ఆదేశించటాన్ని ఏమనాలి, దాన్ని చదివి, విన్న వారికి కలిగే అభిప్రాయం ఏమిటి ? హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రోత్సహించటమా కాదా ? ముస్లిం, క్రైస్తవ ఇతర మతాల ప్రార్ధనలతో కూడా కరోనాను పోగొట్టవచ్చేమో పరీక్షించాలని గాయత్రీ మంత్రంతో పాటు ఎందుకు జత చేయలేదు. దీనితో పోల్చుకుంటే చర్చిల్లోంచి పరిశుద్ద జలం తెచ్చి వాటిని తాగితే లేదా చల్లుకుంటే కరోనా పోతుందని జాన్‌ రోజ్‌ చెప్పలేదు. తాను చెప్పిన వాటిని వక్రీకరించారని డాక్టర్‌ జయలాల్‌ చెప్పారు, ఆయన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఐఎంఎం స్వయంగా ఖండించింది. తమ విధానాలు, వైఖరిని విమర్శించిన ప్రతివారి మీద మతం ముద్రవేయటం ద్వారా తమ దాడిని సమర్ధించుకొనే యత్నం తప్ప ఇది మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుల, మతశక్తులతో కేరళ కాంగ్రెస్‌ కుమ్మక్కు బట్టబయలు !

26 Wednesday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), NATIONAL NEWS, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala Congress, Kerala BJP, Kerala LDF, Kerala UDF


ఎం కోటేశ్వరరావు


అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలతో కేరళలోని ప్రతిపక్ష పార్టీలు, కుల, మత సంస్ధలు దిక్కుతోచని స్ధితిలో పడ్డాయి. తాము తటస్ధ వైఖరి అనుసరిస్తామని బహిరంగంగా ప్రకటించి నాయర్‌ సర్వీస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎన్‌) ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ ఎన్నికల రోజు ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కుమ్ములాటలు, తర్జన భర్జనల మధ్య కొత్తగా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న విడి సతీశన్‌ చేసిన వ్యాఖ్యలతో ఎన్‌ఎస్‌ఎస్‌ నేతకు ఎక్కడో కాలింది. కుల,మత సంఘాల నేతల అదుపాజ్ఞలలో పని చేసే తాబేదార్లుగా రాజకీయ నేతలు ఉండకూడదని సుద్దులు చెప్పారు. దీని మీద సుకుమారన్‌ నాయర్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రతిపక్ష నేతగా పదవి ఖరారు అయిన తరువాత మత, కుల సంఘాల నేతలపై విమర్శలు ప్రారంభించారని అన్నారు. ఎన్నికలకు ముందు తమకు సహకరించాలని కోరుతూ తమ ప్రధాన కార్యాలయంలో గంట సేపు తమతో చర్చలు జరిపి తాలూకా, కింది శాఖల స్ధాయి వరకు తమకు సహకరించాలని కోరారని ఇప్పుడు కుల, మత సంస్ధల గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీల వ్యవహారాలలో జోక్యం చేసుకొనే హక్కు కుల, మత సంస్ధలకు లేదని అయితే రాజకీయ పార్టీల గురించి సమీక్షించే, అభిప్రాయాలు వెల్లడించే హక్కు మాత్రం ఉందన్నారు. తమ సహకారం కోసం అన్ని పార్టీలు కోరాయని సుకుమారన్‌ నాయర్‌ పేర్కొన్నారు.


మీడియా మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది అన్న కాంగ్రెస్‌ నేత !


ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలోనూ, బయటా తాను చేసిన ఆరోపణలకు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినా బూత్‌ కమిటీలు దాన్ని జనం దగ్గరకు తీసుకుపోలేక పోయాయని కేరళ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల అసెంబ్లీ ఎన్నికల పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ విచారణ కమిటీ ముందు చెప్పారు. అనేక బూత్‌ కమిటీలు అసమర్ధంగా ఉండటం పాలక కూటమికి తోడ్పడిందని, పోలింగు స్లిప్పులను కూడా ఓటర్లకు అందించలేదని, అయినప్పటికీ పరాజయానికి బాధ్యత తనదే అన్నారు.కరోనా, వరదల సమయంలో పాలక పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆహారకిట్‌, పెన్షన్‌ కూడా విజయానికి తోడ్పడిందన్నారు. పాలక పార్టీ తన కార్యక ఎన్నికల సమయంలో ప్రభుత్వ లోపాలను యుడిఎఫ్‌ ఎత్తిచూపలేకపోయిందని చెన్నితల చెప్పారు. అమిత్‌ షా సిఎఎ గురించి చేసిన ప్రకటన తరువాత కేంద్రంలో కాంగ్రెస్‌ కంటే మైనారిటీల మనోభావం వామపక్షాలకు అనుకూలంగా ఉందని, ముస్లిం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయని అన్నారు.


స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌ పోటీ – బిజెపిలో నిధుల కుమ్ములాటలు !


అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌కు రెట్టింపు బలం ఉన్నప్పటికీ స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం ఎందుకు చేయాలన్న ఉక్రోషంతో ఆ పదవికోసం కాంగ్రెస్‌ పోటీ పడింది. సిపిఎం సభ్యుడు ఎంబి రాజేష్‌కు 96 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్ధి విష్ణునాధ్‌కు 46 వచ్చాయి. ఆరోగ్య సమస్యల కారణంగా ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. పది సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నప్పటికీ ఎంఎల్‌ఏగా తొలిసారి గెలిచి స్పీకర్‌ పదవి చేపట్టిన వారిలో రాజేష్‌ మూడవ వారు.
అధికారం తమదే అని గొప్పలకు పోయి ఉన్న ఒక్క సీటును, ఓట్లను పోగొట్టుకున్న బిజెపిలో ఇప్పుడు కుమ్ములాటలు సాగుతున్నాయి. ఎన్నికల కమిటీని పక్కన పెట్టి ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చుకున్నారని, ఆర్ధిక సంబంధమైన కమిటీని ఏర్పాటు చేయలేదని కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. దాని మీద స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ సారి బిజెపికి నిధులు వచ్చాయని, విజయావకాల ప్రాతిపదికగా ఏ ప్లస్‌, ఎ,బి,సి తరగతులుగా నియోజకవర్గాలను విభజించి నిధులు పంపిణీ చేసినట్లు మలయాళ మనోరమ రాసింది. ఎన్నికల్లో 35 సీట్లు గెలుస్తామని చెప్పి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని, రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌కు అనుకూలంగా ఉన్నవారికి ఎక్కువ నిధులు ఇచ్చారని, ఇష్టం లేని వారికి తక్కువ పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఏ ప్లస్‌ తరగతి నియోజకవర్గాలలో సురేంద్రన్‌ అనుకూలురకు ఒక్కొక్కరికి ఐదు కోట్లు, కాని వారికి రెండు కోట్లు, బి తరగతి నియోజక వర్గాలలో ఒకటి నుంచి ఒకటిన్నర కోట్లు ఇచ్చారని, ఇష్టంలేని వారికి 25లక్షలతో సరిపుచ్చారని అసమ్మతి నేతలుగా ఉన్న శోభాసురేంద్రన్‌, పికె కృష్ణదాస్‌ నాయకత్వంలోని అసమ్మతీయులు కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు.


కేసులు గణనీయంగా ఉన్న కేరళలో కరోనా మరణాలు తక్కువ !


కరోనా కేసులు కేరళలో గణనీయంగా నమోదు కావటానికి పెద్ద సంఖ్యలో చేస్తున్న పరీక్షలు అన్నది తెలిసిందే. అయితే మరణాల విషయంలో కేరళతో సహా 18 రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో ఉన్నాయి. జాతీయ సగటు 1.14శాతం కాగా పంజాబ్‌లో 2.46, ఉత్తరా ఖండ్‌ 1.85, సిక్కిం 1.71 ఢిల్లీ 1.64, మహారాష్ట్ర 1.59, బీహార్‌ 1.54, గుజరాత్‌ 1.21,ఉత్తర ప్రదేశ్‌ 1.15శాతం కాగా కేరళలో 0.31శాతంగా ఉంది. కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించే పరిస్ధితి లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ కాకపోతే , నీ అమ్మా మొగుడా…?

26 Wednesday May 2021

Posted by raomk in Current Affairs, Economics, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ 1 Comment

Tags

an indian open letter to pm narendra modi, narendra modi bhakts, Narendra Modi Failures


శీర్షిక చూసి అపార్ధం చేసుకోకండి. ఒక సగటు భారతీయుడి ఆవేదన అర్ధం చేసుకోండి. సుమారు ఏడేళ్ళ క్రితం దేశం చాలా క్లిష్ట పరిస్దితుల్లో ఉంది అనుకునప్పుడు అందరిలాగే ‘మోడీ హై తో ముమ్కిన్‌ హై’ అని నమ్మిన వెర్రిబాగులోళ్లలో నేనూ ఒకడిని. పదేళ్ళ కాంగ్రెస్‌ పాలనతో విసుగు చెంది మార్పు కోరుకుంటున్న భారతీయుడికి అప్పటి ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ చూపించిన హీరో నరేంద్ర మోడీ. వారు ఎరగా చూపించిన గుజరాత్‌ మోడల్ని అందరిలాగే నేనూ నోరు వెళ్ళబెట్టుకు చూశాను. శంకర్‌ సినిమాల్లో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో చక చకా అభివద్ది చెందే ఊళ్ళలాగే మన ఊర్లని, జీవితాల్ని మంత్రదండంతో మోడీ చకచకా చక్కదిద్దేస్షాడని నమ్మాను. అందుకనే… కేవలం అందుకనే, మతతత్వ సిద్దాంతాలతో నిర్మితమైన పార్టీ అయినా సరే ఖాతరు చేయకుండా భాజపాని, బలపరుస్తున్న పార్టీలకు మద్దతు తెలిపాను, ఓటు వేశాను. గెలిచాడు…నన్నే కాదు అప్పటి భారతీయ ప్రజలందరి మనసులు గెలిచాడు. ఎలక్షన్లూ గెలిచాడు. ప్రమాణ స్వీకారం రోజు చేసిన వాగ్దానాలు, పలికిన ప్రగల్బాలు ఇంకా నా చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మర్చిపోయే శపథాలా అవి. అవన్నీ నిజమై ఉంటే ఇవాళ నేను ఇలా ఒక వ్యాసం రాయాల్సిన అవసరం వచ్చి ఉండేదే కాదు.


ఓపిక పట్టా గురూ…శానా ఓపిక పట్టా. నీ చేతకానితనాన్ని అమాయకత్వం అనుకున్న. మీడియాకు దొరక్కుండా మన్‌కీ బాత్‌ అంటే మూసుకుని విన్నా. నల్లడబ్బు అంతు చూస్షా అంటే నీతో వంత పాడి ఎటిఎం బయట క్యూల్లో నిల్చున్న. ఆ క్యూల్లో చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు దేశం సరిహద్దుల్లో నిల్చున్న సైనికుడిని చూపించా. మార్పు కోసం త్యాగాలు తప్పవు అని నీతులు చెప్పా, అవి బూతులని ఆనాడు తెలియలేదే. అకౌంట్లో పదిహేను లక్షలు వేస్షా అన్నావు. నాకు రాకున్నా ఫర్లేదు …బీద, శ్రామిక వర్గాల వాళ్లకు వెళ్తే సంతోషం అనుకున్నా. డబ్బుల విషయం పక్కనెట్టు వాళ్లు అసలు నీకంటికి ఏనాడైనా కనిపిస్తేగా! ఆకలి చావులు తగ్గలా! రైతుల ఆత్మహత్యలూ, వలసలూ ఆగలా! పరువు హత్యలూ ఆగలా! అయినా సరే ఓర్పుగా నీ విమర్శకులని ఎదుర్కొన్నా. డెబ్బయి ఏళ్ళ కుళ్లుని కడగడం చిన్న విషయమా అని వారినే నిలదీశాను కానీ నిన్నుఏ రోజూ పల్లెత్షు మాట అనలా. నీ మీద పెంచుకున్న గుడిి ్డప్రేమ అచంచలంగా, స్దిరంగా ఉన్న తరుణంలో వచ్చిన అతి గొప్ప ఆర్షిక సంస్కరణ జిఎస్‌టి. మధ్యతరగతి వాడి నడుము వంచి… వెన్ను విరిచి… డొక్క చీల్చి పన్ను వసూళ్లు మొదలెట్టావ్‌. ఆ మధ్యతరగతి వాడు ఎవడో అయితే నాకు పెద్ద తెలిసేది కాదేమో కాని అందులో నేనూ ఒకడిని అవవడం వలన కాబోలు గుండే,జేబూ చివుక్కు మన్నాయి.


ఎట్టెట్టా..! ఇల్లు కట్టుకునే ఇటుక మీద పన్ను, ఇసుక మీద పన్ను, ఇనుము మీద పన్ను, మళ్లీ మొత్తంగా ఇల్లు మీద పన్నా..? పళ్లు రాల కొట్టే వాడు లేక. అయినప్పటికీ ఆలోచన మందగించిన మెదడు కదా ! బూజు సరిగ్గా వదలక ఇంకా నిను ప్రేమించా. నీ విహారయాత్రలు, నీ కాస్టిలీ కళ్ళద్దాలు, హై ఫై బట్టలు, మైనారిటీల మీద గోరక్షణ పేరుతో అఘాయిత్యాలు, విద్యార్ధుల మీద దాడులు, జర్నలిస్టు హత్యలు, ప్రభుత్వం మీద నోరెత్షిన వారి అరెస్టులూ అన్నీ..అన్నీ..చూసి చూడనట్లు ఊరుకున్నా. పుల్వామా దాడి ప్రతి స్పందనను మెచ్చా. బాలాకోట్‌ దాడులని సమర్ధించా, ఐదేళ్ళ నర్వం మరిచా, మళ్లీ నీకే అధికారం ఇచ్చా.

నీ అంతటోడు లేడన్నా , నీ యాభై ఆరు అంగుళాల ఛాతి దేశానికే కంచుకోట అనుకున్నా, మొక్కవోని నీ సంకల్పంతో ఈ దఫా భారత దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్తానాల్లో నిలబెడతావ్‌ అని నమ్మా.నా నమ్మకాన్ని నిలబెట్టావ్‌. కోరోనా కేసుల్లో దేశాన్ని అగ్రస్దానంలో నిలబెట్టావ్‌. శభాష్‌ మోడీజీ శభాష్‌. మేము ఎదురు చూసిన అచ్చే దిన్‌ ఎలాగూ రాలేదు, కానీ ప్రజలు చచ్చే దిన్‌కి మాత్రం ముందుండి బాట వేశావు.

ప్రకతికి అందరూ ఒకటే! మోడీ అనా వాళ్ళ డాడీ అయినా . నీ వల్ల కరోనా వచ్చిందని చెప్పేటంత కుంచిత మనస్వత్వం కాదు, నిన్ను ఆడిపోసుకుంటే నాకు ఒరిగేదేమీ లేదు. కానీ ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆత్మ విమర్శ అనేది అవసరం. గడిచిన ఏడాది కాలంలో సగం పైన లాక్‌డౌన్‌ జీవితం గడిపిన ప్రతి సోదరుడూ ఏదో ఒక సందర్భంలో ఆత్మవిమర్శ చేసుకునే ఉంటాడు. మరి నువ్వే చేస్తున్నావ్‌ ప్రధానీ ? ఆత్మ విమర్శ పక్కన పెట్టు. కనీసం విమర్శని హుందాగా స్వీకరించగలవా నువ్వు..? ఏం చేస్షోంది నీ యంత్రాంగం గత ఏడాది మార్చి నుంచి.? మా చేత బత్తీలు వెలిగించావ్‌. చపట్లు కొట్టింంచావ్‌. నువ్వేం చేశావు..? పక్కనే ఉన్న చైనాలో విస్తతంగా విజంభిస్తున్న కోవిడ్‌ మహమ్మారిని పట్టించుకోకపోవడం మొదటి తప్పు అయితే జనతా కర్ప్యూ అని మభ్యపెట్టి ఒకేసారి లాక్‌డౌన్‌ అమలు చేసి జనాలను భయాందోళనకు గురిచేశావ్‌. ఫలితం- కేసులు పెరుగుదల, వలస కూలీల ఇక్కట్లు,చావులూ. ప్రధానిగా నువ్వు కాకపోతే ఎవడు చెప్తాడు ఆ చావులకు సమాధానం..? ఆ క్లిష్ట సమయంలో తెగించి పని చేసిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేసిన డాక్టర్స్‌. సమాజంలో సాటి మనిషి తోడు లేకపోయి ఉంటే ఇవాళ నువ్వు భారత దేశానికి కాదు ఒక శ్మశానానికి ప్రధానిగా ఉండేవాడివి. ఆనాడు ఏమీ తెలియని సమయంలోనే తబ్లిగీ జమ్మత్‌ తప్పయితే ఈనాడు అంతా తెలిశాక కుంభమేళా ఏంటి..? దీనిని సమాధానం నువ్వు కాక ఇంకెవరు చెస్తారు మోడీ..? అమెరికా మెడలు వంచి వీసా వేయించుకున్న మొనగాడు, బాలాకోట్‌ను బెంబేలెత్తించటంలో సైన్యానికే సూచనలిచ్చిన వీరుడు, ఇస్రో శాస్త్రవేత్తలకు సలహాలు ఇవ్వగల గడుగ్గాయి. కరోనాకు మాత్రం బాధ్యత వహించట్లేిదు. ఇది కాదా ఈ దేశ దౌర్భాగ్యం?


సెకండ్‌ వేవ్‌ ఊపందుకుంటున్న సమయంలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ అన్నీ తుంగలో తొక్కి నిర్లజ్జగా నీ యంత్రాంగాన్ని మొత్తం బెంగాలుకు తీసుకెళ్లి బహిరంగ సభలు పెట్టింది నువ్వా నేనా ? మరి నిన్ను కాక ఇంకెవడిని అడగను..? ఓ విజనరీ మోడీ! జనవరి 2021 లోనే కదా ప్రపంచ ఫార్మా కేంద్రం ఇండియా అని ప్రగల్భాలు పలికావు, మనం ఇచ్చే స్ధాయిలో ఉన్నాం కానీ తీసుకునే పరిస్దితుల్లో లేమని తొడకాట్టావ్‌. డెబ్బె దేశాలకు పంపణీ చేసిన వాక్సిన్‌, గోమూత్రం ఆవు పిడకలంత కాకపోయినా ఓ మోస్తరుగా అయినా నీ దేశ ప్రజలకు పని చేయదా..? మరి వాక్సిన్‌ ఏది..? నిన్ను కాకపోతే పాకిస్దాన్‌ ప్రధానిని అడగనా ..? అమెరికా అధ్యక్షుడిని నిలదీయనా ..? ఆ వాక్సినే ఉంటే రెమిడెసివిర్‌ కోసం బారులు తీరిన బ్లాకు లైన్లలో నుంచునే ఇక్కట్లు తప్పుతాయి కదా ? ఆ వాక్సిన్‌ పంపిణీ సరిగ్గా జరిగి ఉంటే మిత్రులని, వారి సహచరులని, వారి ఆప్ష్తులని అందరినీ పోగొట్టుకునేవాళ్ళం కాదు కదా !

ఏం మోడీజీ మాట్లాడవే..? దేశం అట్టుడిపోతుంటే మాట్లాడవే..? వాక్సిన్లు లేవు, ఆక్జిజన్‌ సిలిండర్లు దొరకటల్లేదు, హాస్నిటల్లో జాయిన్‌ అవ్వాలంటే బెడ్లు లేవు, ఒకవేళ ఉన్నా జాయిన్‌ అయ్యే స్షోమత లేదు, ఆఖరికి అయిన వాళ్లు ఛస్తే బొంద పెట్టటానికి శ్మశానాలు కూడా లేవు. నీ చేతకానితనాన్ని ప్రజల నిర్లక్ష్యంగా చిత్రీకరించే నీకూ, నీ యంత్రాంగానికీ, నిన్ను సమర్ధించే నీ భక్తులకూ శ్మశానం బయట క్యూలో నుంచుని అయిన వారికి వీడ్కోలు చెప్పటానికి ఎదురు చూస్షున్న వారిని పలకరించే దమ్ముందా..? ఆ కన్పీళ్ళని తుడవడానికి మీ కర్చీఫులు సరిపోతాయా.? ఆ ఆక్రందనలని మీ ఆత్మ నిర్భర పాకేజీలు ఆపగలవా..?


ప్రపంచ దేశాలు మనల్ని చూసి నవ్వుతున్నందుకు బాధ లేదు. నా దేశంలో నన్ను పట్టించుకోవటం లేదనే నా బాధ అంతా. పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో అని టెలిఫోన్‌ సందేశాలు చెప్పించావ్‌. కానీ ఈ సారి మాత్రం యుద్ధం వ్యాధితో కాదు…మనల్ని పాలిస్తున్న ప్రభుత్వంతో అన్న తీరుకి పరిస్దితి దిగజారిపోయింది. మరి దీనికి నిన్ను కాక ఇంకెవరిని ప్రశ్నంచాలి.? నీతో నాకేం శతృత్వం లేదు. కానీ నీ చేతకానితనమంటేనే నాకు అసహ్యం. ఎందుకంటే దానికి మూల్యం చెల్లించాల్సింది నువ్వు, నీ భక్తులు కాదు. ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రజలూ వారి కుటుంబాలూ.
ఇపుటికీ నీ చెరగని చిరునవ్వుతో ఉండే స్టిక్కర్లు అంటించిన వాక్సిన్లూ, పులి హౌర పొట్లాలూ, మందులూ మాకు అందుబాటులోకి తెస్తే కళ్ళకు అద్ఱుకుని తీసుకుంటాం. మాకు వేరే దారి లేదే. కానీ ఏం జరిగినా నిన్నే నిగ్గదీసి అడుగుతాం, నిన్నే నిలదీస్షాం. ఎందుకంటే నిన్ను మేము ఎన్నుకున్నాం. నిన్ను ఎందుకు అడుగుతున్నావని ఎవడైనా నన్ను ప్రశ్నిస్తే మళ్లీ వాడిని తిరిగి నేను ప్రశ్నస్షా….సమాధానం చెప్పాల్సింది మోడీ కాకపోతే నీ అమ్మా మొగుడా..?
ఇట్లు
సగటు భారతీయుడు
18/05/2021

గమనిక. ఇది నా రచన కాదు, వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న పోస్టు. దీనిలో అంశాలు ఆలోచించతగినవిగా ఉన్నాయని భావించి నరేంద్రమోడీ ఏడు సంవత్సరాల ఏలుబడి పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠకుల కోసం పోస్టు చేస్తున్నా.
భవదీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

వామపక్ష శక్తులకు ఉత్సాహమిచ్చే అల్బేనియా, చిలీ ఎన్నికలు !

26 Wednesday May 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Albania elections 2021, Albanian Left, Chile communists, Chile Left Victories, Edi Rama, Latin American left, Socialist Party of Albania


ఎం కోటేశ్వరరావు


అల్బేనియా, టర్కీ మాదిరే అత్యధిక ముస్లిం జనాభాతో ఉన్న ఆగేయా ఐరోపా ఖండ దేశం. జనాభా 30లక్షలకు లోపుగానే ఉన్న లౌకిక రాజ్యం. తూర్పు ఐరోపా దేశాల మాదిరే మూడు దశాబ్దాల క్రితం సోషలిస్టు వ్యవస్ధలో ఉంది.1991 తరువాత బహుళ పార్టీ రాజకీయ వ్యవస్ధ ఉనికిలోకి వచ్చింది. మూడు దశాబ్దాలు గడచినా కమ్యూనిస్టు గతాన్ని సమూలంగా వదిలించుకోవటంలో విఫలమైందని రాజధాని టిరానా కేంద్రంగా పని చేస్తున్న ఒక స్వచ్చంద సంస్ధ పరిశోధకుడు అల్టిన్‌ జెటా తాజాగా రాసిన వ్యాసంలో వాపోయాడు. తూర్పు ఐరోపా దేశాలలో అనేక చోట్ల ప్రజాస్వామ్య ఖూనీ, కమ్యూనిస్టు పార్టీలపై నిషేధం, కమ్యూనిజం బాధితుల పేరుతో వ్యతిరేక ప్రచారం చేసే శక్తులు రెచ్చిపోతున్న తరుణంలో అల్బేనియా గురించి ఇలాంటి వ్యాఖ్య వెలువడటం ఒక చిన్న దేశం ఇస్తున్న పెద్ద సందేశంగా చెప్పవచ్చు. కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఎందుకీ కడుపు మంట ?

కమ్యూనిస్టు గతం నుంచి విడగొట్టుకోని ఏకైక పూర్వపు ఐరోపా సోషలిస్టు దేశం అని సదరు రచయితే చెప్పాడు. మూడు దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపా, పూర్వపు సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు వ్యవస్ధలను వ్యతిరేకిస్తూ అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు, నాటి పోప్‌తో చేతులు కలిపిన ఉదంతాలను గుర్తుకు తెచ్చుకుంటే అలాంటి శక్తులు, వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేని ఏకైక దేశం అల్బేనియా. అయినప్పటికీ అక్కడి పాలకవర్గం అనేక చర్యలు బహుళ పార్టీ వ్యవస్ధను ప్రవేశ పెడుతూ రాజ్యాంగ పరమైన మార్పులు చేసింది. పూర్వపు సోషలిస్టు వ్యవస్ధలోని యంత్రాంగం, పార్టీ రాజకీయాలు, ఇతర అనేక అంశాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న దేశం అయినప్పటికీ దీని ప్రభావం మిగిలిన పూర్వపు సోషలిస్టు దేశాల మీద పడుతుందన్నది సామ్రాజ్యవాదులు లేదా వారి ఏజంట్ల భయం. పూర్వపు సోషలిస్టు దేశాల్లో అధికారానికి వచ్చిన శక్తులు సోషలిస్టు వ్యవస్ధలు, కమ్యూనిజం మీద విషం కక్కుతుంటే అల్బేనియాలో అలాంటి పరిస్ధితి లేదు. కమ్యూనిస్టు అల్బేనియా దేశంలో అందరికీ ఓటింగ్‌ హక్కు కల్పించటం,ఉచిత విద్య, వైద్యం, ఇతర అభివృద్ధికి ఒక పురోగామి రాజ్యంగా పని చేసిందని పాఠశాల పుస్తకాల్లో ఇప్పటికీ పిల్లలకు బోధిస్తున్నారు. దీన్ని కొనసాగిస్తున్న కారణంగా కమ్యూనిస్టు గతాన్ని పూర్తిగా తుడిచివేయటం అసాధ్యంగా మారిందని అక్కసు వెళ్లగక్కుతున్నారు.


సదరు రచయిత అక్కసుకు తక్షణ ప్రేరేపణ గతనెలాఖరులో అక్కడ జరిగిన ఎన్నికల్లో పూర్వపు అల్వేనియా లేబర్‌ పార్టీ ( కమ్యూనిస్టు పార్టీ ) వారసురాలు అల్బేనియా సోషలిస్టు పార్టీ అధికారానికి రావటమే. అనేక దేశాలలో కార్మికుల పేరుతో ఏర్పడిన అనేక పార్టీలు తరువాత కాలంలో సోషలిస్టు లక్ష్యంతో, కమ్యూనిస్టు సిద్దాంతాలను అనుసరించినప్పటికీ పూర్వపు పేర్లతోనే కొనసాగాయి. వాటిలో అల్బేనియా పార్టీ ఒకటి. ఉత్తర కొరియాలో అధికారంలో ఉన్నది కమ్యూనిస్టులని అందరికీ అందరికీ తెలుసు. పార్టీ పేరు కొరియా వర్కర్స్‌ పార్టీ అనే ఉంది. అదే విధంగా క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ 1920దశకంలోనే ఏర్పడినప్పటికీ ఎన్నికల అవసరాల కోసం 1944లో ప్రజా సోషలిస్టు పార్టీగా పేరు మార్చుకుంది. అయితే నియంత బాటిస్టాను కూలదోసిన ఉద్యమానికి నాయకత్వం వహించిన ఫైడెల్‌ కాస్ట్రో ఆ సమయంలో కమ్యూనిస్టు కాదు.1955లో జూలై 26 ఉద్యమం పేరుతో ఏర్పడిన పార్టీ నేత.1959లో అధికారానికి వచ్చారు. రెండు సంవత్సరాల తరువాత విప్లవంలో భాగస్వాములైన మూడు పార్టీలు 1961లో విప్లవ సంస్ధగా ఐక్యమయ్యాయి. మరుసటి ఏడాది క్యూబన్‌ విప్లవ ఐక్య సోషలిస్టు పార్టీగా మారింది. మరో మూడు సంవత్సరాల తరువాత క్యూబా కమ్యూనిస్టు పార్టీ అయింది. 1976లో రాజ్యాంగ సవరణ చేసి దేశానికి మార్గదర్శిగా కమ్యూనిస్టు పార్టీని గుర్తించారు.

అయితే అల్బేనియా పార్టీ అలా ఉందని చెప్పలేముగాని ఒక వామపక్ష పార్టీగా పూర్వపు వారసత్వాన్ని కొనసాగిస్తోందని భావించవచ్చు. పూర్వపుసోషలిస్టు ప్రభుత్వంలో పని చేసిన వారు ఈ పార్టీలో కొనసాగుతున్నారు.యాభై ఆరు సంవత్సరాల ఎడి రామా పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఉన్నారు. కమ్యూనిస్టు నేపధ్యం గల కుటుంబంలో జన్మించిన రామా కమ్యూనిస్టు పార్టీలో పని చేయటం లేదా ప్రభుత్వ పదవుల్లో గానీ లేరు. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా కుట్రలు జరిగిన 1990దశకంలో అల్బేనియాలో ప్రజాస్వామ్య వ్యవస్ధ కావాలని కోరిన వారిలో ఒకడు. డెమోక్రటిక్‌ పార్టీలో చేరి వెంటనే సైద్దాంతిక విబేధాలతో బయటికి వచ్చి సోషలిస్టు పార్టీలో చేరారు. టిరానా నగర మేయర్‌గా పోటీ చేసి గెలిచారు. ఆయన నాయకత్వంలో మూడు సార్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో , రెండు మున్సిపల్‌ ఎన్నికలలో పార్టీ విజయం సాధించింది. ఐరోపా సోషలిస్టు పార్టీల కూటమిలో భాగస్వామిగా ఉంది.


తాజా విషయానికి వస్తే గతనెలాఖరులో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో 140 స్ధానాలకు గాను 74 సాధించి అల్బేనియా సోషలిస్టు పార్టీ వరుసగా మూడవ సారి అధికారానికి వచ్చింది. 1992 నుంచి ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో ఒక సారి సంకీర్ణ మంత్రి వర్గానికి నాయకత్వం వహించింది, నాలుగుసార్లు స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. నాలుగు సార్లు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ధనిక దేశాలలో తలెత్తిన 2008 ఆర్ధిక సంక్షోభ సమయంలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ 2013 నుంచి వరుసగా ఎన్నిక అవుతూనే ఉంది. మిగతా ఐరోపా దేశాలలో ఒక పాలకపార్టీ ఇలా వరుస విజయాలు సాధించటం ఇటీవలి కాలంలో అరుదు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికలోనూ ఓట్లశాతాన్ని పెంచుకుంటూ వస్తుండటం కూడా ఒక విశేషమే. ప్రతిపక్ష మితవాద డెమోక్రటిక్‌ పార్టీ ఎన్నికల ఫలితాలను గుర్తించటం లేదని ప్రకటించి తరువాత మౌనం దాల్చింది. అనివార్యమైన స్ధితిలో అమెరికా, ఐరోపా దేశాలు కూడా సోషలిస్టుల విజయాన్ని జీర్ణించుకోలేకపోయినా గుర్తించక తప్పలేదు.


ఇక అంతర్గత రాజకీయాల విషయానికి వస్తే 2017లో సోషలిస్టు పార్టీ మద్దతుతో ఎన్నికైన అధ్యక్షుడు లిర్‌ మెటా తరువాత ప్రభుత్వ వ్యతిరేకిగా మారాడు. తాజా ఎన్నికలలో సోషలిస్టు పార్టీకి గనుక 71 స్ధానాలు వస్తే తాను రాజీనామా చేస్తానని ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసి ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నించాడు. సోషలిస్టు పార్టీ విజయం సాధించిన తరువాత 2022లో తన పదవీ కాలం పూర్తయ్యే వరకు కొనసాగుతానని, రాజీనామా ప్రసక్తి లేదని ప్రకటించాడు. అయితే అధికారపార్టీకి చెందిన ఎంపీలు అధ్యక్షుడిని అభిశంసించేందుకు ఒక తీర్మానాన్ని అంద చేశారు, తనను తొలగించటం చట్టవిరుద్దమని మెటా వాదిస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్యలను తీసుకొనేందుకు ప్రభుత్వం పూనుకుంది.అల్బేనియా ఎన్నికల్లో సోషలిస్టుల విజయం ఐరోపాకే కాదు, యావత్‌ ప్రపంచ పురోగామి శక్తులకు ఉత్సాహానిచ్చే పరిణామమే.

చిలీలో మితవాదులకు చావు దెబ్బ

లాటిన్‌ అమెరికాలోని చిలీ పరిణామాలు కూడా ప్రపంచ వామపక్ష శక్తులకు ఉత్సాహాన్నిచ్చేవిగా ఉన్నాయి. నూతన రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసే రాజ్యాంగపరిషత్‌కు జరిగిన ఎన్నికలలో మితవాద శక్తులకు చావు దెబ్బ తగిలింది.మాజీ నియంత పినోచెట్‌ మద్దతుదారులు, సాంప్రదాయ పార్టీలు జనాగ్రహ సునామీలో కొట్టుకుపోయాయి. మే 16వ తేదీన నూటయాభై ఐదు స్ధానాలకు జరిగిన ఎన్నికలలో 77శాతం మంది వామపక్ష భావాలు కలిగిన వారు, నియంత పినోచెట్‌ విధానాలను వ్యతిరేకించిన వారు విజయం సాధించారు. అధికారంలో ఉన్న సోషలిస్టు సాల్వెడోర్‌ అలెండీని హత్య చేసిన పినోచెట్‌ 1973లో అధికారానికి వచ్చి 1990వరకు కొనసాగాడు. రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికలలో మితవాద పార్టీల కూటమికి కేవలం 37 మాత్రమే వచ్చాయి.నిబంధనల ప్రకారం కొత్త రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్‌ ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. మితవాద శక్తులు గనుక 54 స్ధానాలు పొంది ఉంటే రాజ్యాంగ రచన చిక్కుల్లో పడి ఉండేది, అయితే ఓటర్లు అలాంటి అవకాశం లేకుండా 37 మాత్రమే ఇవ్వటంతో రాజ్యాంగ రచనలో మితవాద శక్తుల పప్పులు ఉడికే అవకాశాలు లేవు. రాజ్యాంగ సభలో 77 మంది మహిళలు, 78 మంది పురుషులు ఉన్నారు. నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ మేరకు ప్రక్రియ ప్రారంభమైంది. పెద్ద విజయాలు సాధించిన వారిలో 28 స్దానాలతో కమ్యూనిస్టులు ఉన్నారు, వామపక్షంగా ఉన్న మరొక పార్టీ 24 పొందింది.


2018లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన మితవాది, బిలియనీర్‌ సెబాస్టియన్‌ పినేరా విధానాలతో మరుసటి ఏడాదే దేశంలో వివిధ తరగతుల్లో ఆందోళన ప్రారంభమైంది. తరువాత అనేక ఉద్యమాలు నడిచాయి. గత మూడు సంవత్సరాలుగా పార్లమెంట్‌లోని మితవాదులు, పినేరా కూడా వైద్యరంగంలో ప్రజానుకూల సంస్కరణలకు అడ్డుతగిలారు. నయావుదారవాద విధానాలతో జనజీవితాలు అతలాకుతలం అయ్యాయి.సంపదలు దిగువ జనానికి చేరతాయని చెప్పిన ఊట సిద్దాంతం తిరగబడింది. కనీసం పదిలక్షల మంది జనం 2019లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన నేపధ్యంలో రాజ్యాంగపరిషత్‌ ఎన్నికలను చూడాలి. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం నయా ఉదారవాద విధానాలతో నియంత పినోచెట్‌ ఏర్పాటు చేశాడు. రాజ్యాంగ పరిషత్‌తో పాటు ప్రాంతీయ ప్రభుత్వాలు, స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావిస్తున్న డేనియెల్‌ జాడ్యు 66శాతం ఓట్లతో శాంటియాగోలోని రాజధాని ప్రాంత కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే విధంగా శాంటియాగో మేయర్‌గా చిలీ విశ్వవిద్యాలయ ఆర్ధికవేత్త లిరాసీ హాస్లర్‌ ఎన్నికయ్యారు. ఆమె కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. కమ్యూనిస్టు పార్టీతో సహా వామపక్ష శక్తులు ఉన్న బ్రాడ్‌ ఫ్రంట్‌ (విశాల కూటమి) తరఫున పోటీచేసిన అనేక మంది స్ధానిక సంస్ధలలోనూ, రాజ్యాంగ పరిషత్‌లోనూ విజయాలు సాధించారు. మితవాద శక్తులకు సాంప్రదాయంగా ఓటు వేసే అనేక పట్టణాల్లో వారిని మూడవ స్ధానానికి నెట్టివేశారు. చిలీ జనాభా కోటీ 90లక్షలు కాగా శాంటియాగో పరిసరాల్లో 60లక్షల మంది ఉన్నారు. ఆప్రాంతంలోని 27 మేయర్‌ స్ధానాలను కమ్యూనిస్టు, వామపక్షశక్తులు, పదకొండు స్ధానాలను స్వతంత్రులు గెలుచుకోగా మితవాదులకు 14వచ్చాయి. ఎన్నికలు ముగిసిన ఏడాది లోపు నూతన రాజ్యాంగ రచన జరగాలి. ఆ తరువాత రెండు నెలల్లో మరోసారి దాని మీద ప్రజాభిప్రాయసేకరణ జరిపి ఆమోదానికి పెట్టాలి.


ప్రపంచ వ్యాపితంగా మితవాద, నయా ఫాసిస్టు శక్తులు పెరిగేందుకు అనువైన పరిస్దితులు ఉన్నాయి. అందుకే మన దేశంతో సహా అనేక చోట్ల అవి అధికార పీఠాలపై తిష్టవేశాయి.ఈ పరిణామాలను చూసి గుండెలు బాదుకోవాల్సిన పనిలేదు. ఇదేమీ ప్రపంచానికి కొత్త కాదు, వాటి పీచమణిచే ప్రజాశక్తి మొద్దుబారలేదు. అల్బేనియా, చిలీ పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా మరణాలపై నరేంద్రమోడీ రోదన – మొసలి కన్నీరు !

23 Sunday May 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

crocodile tears, narendra modi crocodile tears, Narendra Modi Failures, Narendra Modi Tears, Rahul gandhi


ఎం కోటేశ్వరరావు


ఎంతలో ఎంత మార్పు ! రోజులు ఎలా మారిపోయాయి !! కరోనా వైరస్‌ మన జీవితాలనే మార్చివేసింది. మనలో భాగమైన ప్రధాని నరేంద్రమోడీని ప్రభావితం చేయకుండా ఉంటుందా ? కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేశారనే విమర్శల నేపధ్యంలో ఆయనను గుడ్డిగా నమ్మే జనంలో ఏదో తేడా కొడుతోంది అన్న ఆలోచన అంకురించింది. నమ్మకాన్ని తప్పు పట్టలేం – గుడ్డి నమ్మకాన్ని ఏ మాత్రం అంగీకరించకూడదు. మోడీని విమర్శించిన వారి మీద గతంలో మాదిరి దాడి చేసే స్దితిలో బిజెపి లేదా దానికి మద్దతు ఇచ్చే మీడియా ఆయుధాలు పనికి రావటం లేదు. గతంలో మాదిరి ఎవరైనా విరుచుకుపడితే సహించే రోజులకు కాలం చెల్లుతోంది అని చెప్పవచ్చు.


గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి ఢిల్లీ గద్దెనెక్కే వరకు, తరువాత కూడా నరేంద్రమోడీ బహిరంగ సభల్లో మాట్లాడే తీరు, ప్రదర్శించే హావభావాల గురించి చర్చ ఇప్పటిది కాదు. ఒక విషయాన్ని -అది ఎలాంటిది అనేది వేరే అంశం- జనం ముందుకు తేవటం, మెదళ్లకు ఎక్కించటంలో మోడీని అనుసరించాలని కార్పొరేట్‌ శక్తులే తమ సిబ్బందికి నూరిపోశాయి. వినియోగదారులకు తమ ఉత్పత్తుల మీద విశ్వాసం కలిగించేందుకు మోడీ మాదిరి మాటలు చెప్పాలని, హావభావాలు ప్రదర్శించాలని సూచనలు ఇచ్చిన అంశాల గురించి గూగుల్తల్లిని అడిగితే పుంఖాను పుంఖాలుగా -వస్త్రాల షాపులో మన ముందు చీరలు పడవేసినట్లు- పడవేసి ఎంచుకోమని చెబుతుంది. అందువలన వర్తమానంలో ఈ విషయంలో నరేంద్రమోడీని మించిన వారు లేరని అంగీకరించేందుకు ఇబ్బంది పడాల్సిందేమీ లేదు.

ఎంత కఠినాత్ముడికైనా ఒకానొక సమయంలో కంట నీరు రాకపోదని పెద్దలు చెబుతారు. మోడీ అలాంటి వారా అంటే అవునని-కాదని రెండు అభిప్రాయాలూ ఉన్నాయి. ఏనుగు గురించి ఏడుగురు అంధులను అడిగితే ఎవరు తడిమినదాన్ని బట్టి వారు ఏనుగు రూపాన్ని వర్ణించినట్లుగా అనుభవాన్ని బట్టి ఒక వ్యక్తి లేదా వ్యవస్ధ మీద అభిప్రాయాలను ఏర్పరుచుకోవచ్చు. హిట్లర్‌ ముందుకు తెచ్చిన జర్మన్‌ జాతీయవాదానికి ప్రభావితులైన వారు, జర్మన్‌ జాతిని శుద్ది చేస్తానంటే నిజమే అని భ్రమించిన వారు నెత్తికెక్కించుకున్నారు-అతగాడి మారణ కాండకు గురైన యూదులు, ఇతర దేశాలు ఎంతగా ద్వేషించాయో చూశాము.


కరోనా మరణాల గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగానికి గురైనట్లుగా కంటతడి పెట్టినట్లు కొందరికి కనిపిస్తే మొసలి కన్నీరు అని కొందరికి అనిపించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ వైద్యులతో మాట్లాడుతున్న సందర్భంగా నరేంద్రమోడీ కంటతడి పెట్టుకున్నట్లుగా వీడియో దృశ్యాలు, వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిని చూసి మోడీ అంతటి వ్యక్తే కన్నీరు పెట్టుకున్నారంటూ బాధపడిపోయి కన్నీరు పెట్టుకున్నవారు – మోడీలో జనం గోడు పట్టని దిగంబర రాజును చూసిన గుజరాతీ కవయిత్రి పారుల్‌ ఖక్కర్‌ వంటి వారు కూడా ఎందరో ఉంటారు. అయితే ఒక రాజకీయ నేత వ్యాఖ్యానిస్తే….. అదంతా వట్టిదే వాక్సిన్ల కొరత, పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు, దిగజారి పోయిన జిడిపి విషయాలను పక్కదారి పట్టించటానికి మోడీ మొసలి కన్నీరు కార్చారని కాంగ్రెస్‌ నేత రాహులు గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీ సినిమాల్లో అయితే నటనతో బాగా రాణిస్తారు అని వ్యాఖ్యానించారు. ఆర్‌జెడి కూడా మొసలి కన్నీరు అని వ్యాఖ్యానించింది. జనం చస్తుంటే నరేంద్రమోడీ ఎన్నికల సభల మీద కేంద్రీకరించి ఇప్పుడు కన్నీరు పెట్టుకోవటం మోసం కాదా అని ప్రశ్నించింది. దీని మీద బిజెపి నేతలు, మోడీ భక్తులు వెంటనే స్పందించలేకపోయారు.

నరేంద్రమోడీ నిజంగా ఏడ్చారా ? అలా నటించారా అనే చర్చ కూడా సామాజిక మాధ్యమంలో జరుగుతోంది. ఏది నిజం అని తేల్చటం ఎంతో కష్టం. మొసలి కన్నీటి గురించిన నిజా నిజాలను ఎవరైనా ఎవరైనా శాస్త్రవేత్తలు తేల్చారా అంటే కొన్ని అభిప్రాయాలు వెల్లడించటం తప్ప నిర్దిష్టంగా తెలియదు. అందుబాటులో ఉండే మొసళ్ల సంగతే తేల్చలేని వారు నరేంద్రమోడీ గారి దగ్గరకు వెళ్లి మీరు నిజంగా రోదించారా లేదా అని అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది. మీడియాకు ఎలాగూ అలాంటి అవకాశం లేదు, మీరు ఏం చెప్తే అది రాసుకుంటాం, ఏం చూపిస్తే దాన్ని చూపుతాం అనే జీ హుజూరు మీడియా అలాంటి ప్రశ్నలు ఎలాగూ అడగదు. ఇతరులెవరైనా అలా చేస్తే ఇంకేమైనా ఉందా ! మొసలి కన్నీరు గురించి సమాచారం, కొన్ని భాష్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

జాన్‌ మండవిల్లే అనే బ్రిటీష్‌ యాత్రీకుడు తన యాత్రల అనుభవాలను (1300-71) అక్షర బద్దం చేశారు. ఆ రచనలో మొసళ్ల గురించి ప్రస్తావన ఉంది. ఆ దేశంలో మొసళ్లు మనుషులను తింటూ ఏడుస్తాయి, కన్నీరు కారుస్తాయి అని రాసినట్లు ఒక ముక్క చదివాను. అప్పటికి మన దేశానికి సముద్రమార్గం కనిపెట్టలేదు, రవాణా సౌకర్యాలు లేవు గనుక మన దేశంలోని మొసళ్ల గురించైతే మాత్రం కాదని చెప్పవచ్చు. అయినా మొసళ్లు ఎక్కడైనా ఒకటే కదా ! ఏమాత్రం కనికరం లేకుండా మనుషులను మట్టుబెట్టే అనేక మంది ఎలా దొంగేడుపులు ఏడుస్తారో సినిమాల్లో చూడటం, అలాంటి చర్యలను మొసలి కన్నీరు కార్చటం అంటారని వినటం తప్ప ప్రత్యక్ష అనుభవం లేదు. మొసలి నోటితోనే కాదు తోకతో కూడా దాడి చేసి చంపివేస్తుంది. మొసళ్లకు దొరికితే ఏమాత్రం కనికరం చూపవు, వాటికి దొరికిన వాటిని తినేటపుడు కన్నీరు కారుస్త్తాయి, అయితే ఆ చర్యకు భావోద్వేగానికి సంబంధం లేదు. నీటి నుంచి బయటకు వచ్చినపుడు కండ్ల మీద పడే దుమ్ము, ధూళిని శుభ్రం చేసుకొనేందుకు ద్రవాన్ని విడుదల చేయటాన్ని చూడవచ్చని కొందరు పేర్కొన్నారు. అమెరికా ప్రాంతంలో, అదే విధంగా ఉప్పునీటిలో ఉండే మొసళ్లు తీసుకొనే ఆహారంలో అధికంగా ఉండే ఉప్పును బయటకు పంపేందుకు కండ్లద్వారా ద్రవరూపంలో విడుదల చేస్తాయని చెబుతారు. అదే విధంగా నీటి నుంచి బయటకు వచ్చేటపుడు కండ్ల నుంచి కారే నీటిని కన్నీరుగా భ్రమిస్తామని కూడా కొందరంటారు.


ప్రఖ్యాత నాటక రచయిత షేక్‌స్పియర్‌ తన రచనల్లో మొసలి కన్నీటిని చాలా సందర్భాలలో వాడుకున్నారు.తనను వంచిస్తున్న భార్య గురించి ఒథెల్లో అనే పాత్ర తనను తాను ఇలా సమాధానపరుచుకుంటుంది.” ఆ భూమి మీద మహిళల కన్నీరు పారితే, ఆమె కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక మొసలిగా రుజువు చేసుకుంటుంది.” అదే విధంగా దొంగ ఏడుపులు, సంతాపాలు ప్రకటించిన వారిని మొసలి కన్నీటితో వర్ణించాడు. అలాంటి వారి కళ్లు తడిబారితే అర్దం లేదంటాడు. ఇంకా అనేక మంది తమ రచనల్లో ఇలాంటి పోలికలను పేర్కొన్నారు. కొన్ని వందల సంవత్సరాల నాడే ఇలాంటి పోలికలను ముందుకు తెచ్చారంటే దానికి నాంది ఎక్కడో తెలుసుకోవటం నిజంగా కష్టమే. ఇది ఒక్క ప్రాంతానికో ఖండం, దేశానికో పరిమితం కాదు.

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మాల్కొం షానెర్‌, కెంట్‌ వెయిట్‌ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో 2006లో ఒక పరిశోధన చేశారు. మొసళ్లు కన్నీరు కారుస్తాయనే ప్రచారంలో నిజమెంతో తేల్చాలనుకున్నారు. మొసళ్ల జాతిలో ఉపజాతికి చెందిన భయంకర తొండలను అందుకు ఎంచుకున్నారు. సెయింట్‌ అగస్టీన్‌ మొసళ్ల పార్కులో ఏడు తొండలను ఎంచుకొని వాటికి పొడినేలపై ఆహారం అందచేశారు. వాటిలో ఐదు కన్నీరు కార్చటాన్ని చూశారు. ఆహారం తినేటపుడు వాటి గ్రంధులలో సంభవించే మార్పుల వలన కండ్లలోకి ద్రవాన్ని పంపినట్లుగా అదే రోదిస్తున్నట్లుగా కనిపిస్తుందని విశ్లేషించారు. మొసళ్లలో కూడా అదే విధంగా జరుగుతుండవచ్చని నిర్దారణకు వచ్చారు.


ఒక ఉదంతం జరిగితే దానికి చిలవలపలవలతో కువ్యాఖ్యానాలు, మార్పిడి చేసిన చిత్రాలతో ప్రత్యర్ధుల పరువు తీయటం లేదా కొందరికి లేని వాటిని ఆపాదించి మహానుభావులుగా ప్రచారం చేయటం తెలిసిందే. జవహర్‌ లాల్‌ నెహ్రూ, సోనియా గాంధీ ఇలా ఎందరో అలాంటి ప్రచారాలకు గురయ్యారు. వాటి వెనుక కాషాయ దళాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కమ్యూనిస్టు యోధుడు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన జ్యోతిబసు అమ్మాయిలతో కాబరే నృత్యాలు చేసినట్లు చిత్రాలను సృష్టించటం వెనుక నాటి కాంగ్రెస్‌ పెద్దలు ఉన్న విషయం తెలిసిందే. ఇక మన ప్రధాని నరేంద్రమోడీ గారి గొప్పతనాన్ని తెలియచెప్పే పధకంలో భాగంగా ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా జీవితం ప్రారంభించిన కొత్తలో ఆ సంస్ద సమావేశాలు జరిగినపుడు స్నానపు గదులు, మరుగుదొడ్లు కడిగిన సేవకుడిగా చిత్రిస్తూ ఫొటోలను సామాజిక మాధ్యమంలో పెట్టిన విషయం తెలిసిందే. వాటిని కించపరుస్తూ పెట్టినట్లు భావిస్తే వెంటనే తొలగించమని కోరి ఉండే వారు. అలాంటిదేమీ జరగలేదు గనుక వాటి వెనుక ఎవరున్నారో చెప్పనవసరం లేదు.

ఇక తాజా ఉదంతానికి వస్తే ఎవరి గడ్డిని వారిచేతే తినిపించినట్లుగా న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ముఖచిత్రాన్నే మార్చివేసి సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. ఆ పత్రిక సూర్యరశ్మితో సిరియాలో విద్యుత్‌ తయారీ గురించి రాసిన కథనానికి ఒక పెద్ద చిత్రాన్ని తోడు చేసింది. అయితే ఆ చిత్రం స్దానంలో కంటి నుంచి ద్రవాన్ని కారుస్తున్న ఒక మొసలి బొమ్మ పెట్టి పైన రోదించిన భారత ప్రధాని అనే శీర్షిక పెట్టారు. అంటే నరేంద్రమోడీ మొసలి కన్నీరు కార్చారు అనే అర్ధం వచ్చేట్లుగా తయారు చేసిన ఆ చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ దాన్ని ట్వీట్‌ చేసి నకిలీదని తేలటంతో వెనక్కు తీసుకున్నారు. అలాంటి హుందాతనాన్ని సంఘపరివార్‌ పెద్దలు ఎంత మంది పాటించారన్నది ప్రశ్న.


కొద్ది రోజుల క్రితం నరేంద్రమోడీని బదనామ్‌ చేయాలని సూచిస్తూ కాంగ్రెస్‌ ఒక టూల్‌కిట్‌ను తయారు చేసిందంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, సంబిత్‌ పాత్రా తదితరులు ఒక నకిలీ పత్రాన్ని పట్టుకొని సామాజిక మాధ్యమంలో పెద్ద ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తీరా అది కాంగ్రెస్‌ తయారు చేసిన డాక్యుమెంట్‌ అనేందుకు ఆధారాలు లేవని, కాషాయ దళాల పనితనం అని తేలిపోయింది. కాంగ్రెస్‌ పోలీసు కేసు దాఖలు చేయటంతో పాటు అదే విషయాన్ని ట్విటర్‌ కంపెనీకి కూడా ఫిర్యాదు చేసింది. దాంతో సదరు సంస్ద సంబిత్‌ పాత్రా టూల్‌ కిట్‌ ట్వీట్‌కు ఇది ”తిమ్మిని బమ్మిని చేసిన మాధ్యమం ” (మానిప్యులేటెడ్‌ మీడియా) అని తానే ముద్రవేసి ప్రచారంలో పెట్టింది. దీనికి మోసపూరిత మాధ్యమం అనే అర్ధం కూడా ఉంది. ఈ సమాచారాన్ని చూసిన వారు గుడ్డిగా నమ్మవద్దు అనే సందేశం దీని వెనుక ఉంది. ఇంతకంటే బిజెపి నేతలకు మరొక అవమానం అవసరం లేదు. అయితే ఇది బిజెపి పెద్దలకు కొత్తేమీ కాదు. ప్రపంచ వ్యాపితంగా ఇలాంటి తప్పుడు వార్తలు, ఫొటోలను వ్యాప్తి చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఉన్నంతలో అనుసరించే వారిని అప్రమత్తం గావించేందుకు ట్విటర్‌ తీసుకున్న చర్య ఇది. ఫిర్యాదులు వచ్చినప్పటికీ వాటిని తొలగించకుండా అనుమానం వచ్చిన వాటికి 2020 మార్చి నెల నుంచి ఇలాంటి ముద్రలు వేయటం ప్రారంభించింది. మన దేశంలో తొలిసారిగా అలాంటి ఘనతను దక్కించుకున్న వ్యక్తి బిజెపి జాతీయ ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయగారు. రైతు ఉద్యమం సందర్భంగా ప్రచారం-వాస్తవం అనే పేరుతో ఉన్న ఒక వీడియోను ఆ పెద్ద మనిషి షేర్‌ చేసి దాన్ని ఆధారం చేసుకొని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మీద అనుచిత వ్యాఖ్య చేశారు. దాంతో ఆ ట్వీట్‌కు మోసపూరిత మాధ్యమం అని ట్విటర్‌ ముద్రవేసింది.


ఒకటి మాత్రం స్పష్టం, మోడీ సర్కార్‌ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో మీడియాలో సానుకూల కథనాలు ఎక్కువ వచ్చేట్లు చూడాలని సంఘపరివార్‌ అపరిమిత సానుకూలత అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ కూడా దాని కార్యకర్తే గనుక జనంలో సానుకూలత కోసం నటించారా లేదా నిజంగానే రోదించారా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ముందే చెప్పుకున్నట్లు జనానికి దగ్గరయ్యేందుకు నరేంద్రమోడీ చేసే ఉపన్యాసాలు, ప్రదర్శించే హావభావాలే ఇప్పుడు ఆయన నిజం చెప్పినా నమ్మని స్ధితిని కల్పిస్తున్నాయా ? ఎవరైనా ఊహించారా ! ఎంతలో ఎంత మార్పు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d