• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Farmers agitations

ప్రపంచంలో అరుదైన రైతుల ప్రదర్శన

02 Tuesday Feb 2021

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Delhi farmers agitation, Farmers agitations, unique farmers tractors rally


డాక్టర్‌ కొల్లారాజమోహన్‌

రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్స్‌ పెరేడ్‌ లో లక్షకు పైగా ట్రాక్టర్లతో , అంతకుమించిన సంఖ్యలో రైతులు ప్రశాంతంగా పాల్గొని అపూర్వ ప్రదర్శన చేశారు. రైతువ్యతిరేక చట్టాలను రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులు ఢిల్లీ నగర వీధులలో కదం తొక్కారు. ఢిల్లీ నగరవాసులు ఈ అపూర్వ ప్రదర్శనకు సంఘీభావంగా పూలవర్షం కురిపించారు. మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినప్పటినుండీ పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేష్‌, రాజస్ధాన్‌, బీహార్‌ లలో తీవ్ర స్ధాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ ఉద్యమం ఏఒక్క రైతు సంఘమో లేక ఏ ఒక్కరి నాయకత్వం కాకుండా 500 రైతుసంఘాలన్నీ సమైక్యంగా పోరాడుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులలో ఎముకలు కొరికే చలి ని ఎదుర్కొంటూ, రోడ్డు పై గుడారాలలో 2 నెలలుగా చేస్తున్నఆందోళనను ప్రభుత్వం ఆలకించనందున, ప్రభుత్వం పై వత్తిడి తేవటానికి రిపబ్లిక్‌ దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రాక్టర్లతో మహా ప్రదర్శన తలపెట్టారు. ఈ మహా ప్రదర్శనను విఫలం చేయడానికి, ఉద్యమాన్ని విచ్చిన్నం చేయటానికి ప్రభుత్వం పన్నిన కుట్రలను కుతంత్రాలను రైతాంగం అడుగడుగునా తిప్పికొట్టింది. జనవరి 26 న వివిధ రాష్ట్రాల రాజధానులలో, జిల్లా కేంద్రాలలో భారీ ప్రదర్శనలు జరిగాయి.

రిపబ్లిక్‌ డే ట్రాక్టర్స్‌ పెరేడ్‌ ను అప్రతిష్టపాలు చేయటానికి ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనకు చాలా ఎక్కువ ప్రచారంచేశారు. ట్రాక్టర్లను సామూహిక విధ్వంస ఆయుధాలుగా ”టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా” పత్రిక చిత్రించింది. ట్రాక్టర్‌ లు ఎక్కడా విధ్వంసానికి పాల్పడలేదు. రోడ్లను ధ్వంసం చేయలేదు. ప్రభుత్వ సంస్ధలను, ప్రైవేటు సంస్ధలను ఎక్కడా తాకలేదు. అల్లర్లను, భయోత్పాతాన్ని స ష్టించలేదు. పౌరుల ఆస్దులను ధ్వంసం చేయలేదు. దొంగిలించలేదు. అనుమతించిన మార్గాలలో కూడా రైతులు ఢిల్లీ లోకి రాకుండా బారికేడ్డ్లను ఎందుకు పెట్టారు ?. పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్డ్లను తొలగించటానికి ట్రాక్టర్లను ఉపయోగించారు. వారు హింసాత్మకంగా వుంటే ప్రజలు పువ్వులతో స్వాగతించేవారా ?

దీప్‌ సింగ్‌ సిధ్దు ఎవరు?
రిపబ్లిక్‌ డే ట్రాక్టర్స్‌ పెరేడ్‌ ను అప్రతిష్టపాలు చేయాలని ఫ్రభుత్వం ప్రయత్నించింది. సినీ నటుడు, గాయకుడు ఐన దీప్‌ సింగ్‌ సిద్దును సాధనంగా ఎన్నుకున్నారు. బీజేపీ యమ్‌ పీ. సన్నీ డయోల్‌ కి దీపు సిద్దు సన్నిహితుడు. 2019 ఎన్నికలలో సన్నీ డయోల్‌ గెలుపు కోసం క షిచేశాడు. ప్రధానమంత్రి మోడీ గారితో ఫొటోలు దిగేటంత సాన్నిహిత్యం వుంది. ”ఆందోళనకారులను రెచ్చగొట్టి దారి తప్పించి ఎర్రకోట వైపు నడిపించాడు ” అని హర్యానా బీకేయూ నాయకుడు గుర్నామ్‌ సింగ్‌ ఛాదుని అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి సన్నిహితుడైన బీజేపీ సభ్యుడొకరు ఏజెంట్‌ ప్రొవోకేటర్‌ గా ఎర్రకోట వద్ద అల్లర్లను రెచ్చగొట్తున్న వార్తను పరిశీలించమని ఉదయం 10 గంటలకే ట్విట్టర్‌ లో రాజ్యసభసభ్యులు శ్రీ సుబ్రమణ్యస్వామి గారు పేర్కొన్నారు.

రిపబ్లిక్‌ డే పెరేడ్‌ పూర్తయిన తరువాత రైతుల ట్రాక్టర్‌ రాలీ ప్రారంభంకావాలని రైతు సంఘాలన్నీ అంగీకరించాయి. మార్గాన్ని కూడా నిర్దేశించాయి. సింఘూ సరిహద్దు వద్ద నుండి నిర్దేశించిన సమయానికన్నా ముందే, ఉదయం 8గంటలకే దీప్‌ సింగ్‌ సిద్దూనాయకత్వాన ఒక చిన్న బ ందం బయల్దేరింది. నిర్దేశించిన మార్గాన్ని వదిలేసి ఎర్రకోట వైపు దూసుకెళ్ళారు. కిసాన్‌ సంయుక్త కమిటీ వద్దని నివారించినా వారిమాటను వినలేదు.ఎర్రకోట వైపు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు ముందురాత్రే తెలుసు. అయినాపోలీసులు వారిని నివారించే ప్రయత్నాలు చేయలేదని యోగేంద్రయాదవ్‌ తెలిపారు. రైతుల ట్రాక్టర్‌ రాలీలకు అడుగడుగునా అడ్డంకులను సృష్టించిన పోలీసులు దీపు సిద్దూ బ ందానికి ఎర్రకోటకు దారి చూపారు. ట్రాఫిక్‌ అంతరాయాలు లేకుండా ఎర్రకోట వైపు దూసుకెళ్ళారు. జాతీయ జెండాకు దగ్గరలో ఒక మతానికి చెందిన నిషాన్‌ జెండాను ఎర్రకోటపై ఎగరేశారు.టీవీ ఛానల్స్‌ జెండా ఎగరవేసిన ఘటనను పదే పదే చూపించాయి. ఈ ఘటన జరిగే సమయంలో అక్కడనే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మిలిటరీ, పారామిలిటరీ దళాల నిరంతర పర్యవేక్షణ క్రింద వుండే ఎర్రకోటను ఎక్కి, ఒక జెండాను ఎగరవేయటానికి ముందే అనుమతిని పొందారా ? లేక ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇలా చేశారా? అనేది చర్చనీయాంశం. వారి తప్పు లేకపోయినా రైతుసంఘాల సమన్వయ సమితి నైతిక బాధ్యత వహించింది. ఎర్రకోట సంఘటన మినహాయించి మరెక్కడా చెప్పుకోదగ్గ ఘటనలు జరగలేదన్న సంగతి గుర్తించాలి.

మంచి నీరు, కరెంటు, ఇంటర్నెట్‌, ట్విట్టర్‌ అకౌంట్లను ఆపేశారు. కర్రలతో, రాళ్ళతో దాడులు చేసినా ఉద్యమాన్ని ఆపలేకపోయారు. రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్ల పెరేడ్‌ విజయవంతం కావటం ఒక చారిత్రాత్మక ఘటన. రైతాంగ ఆందోళనను అప్రతిష్ట పరచటానికి ఎర్రకోట ఘటనను సాకుగా ఛూపించిన మీడియా కొంతమందిని గందరగోళపరచగల్గింది. త్రివర్ణ పతాకాన్ని తొలగించారనే తప్పుడు వార్తలు కూడా ప్రచారమయ్యాయి. లక్షలాదిమంది రైతుల ప్రదర్శనను మీడియా చూపలేదు. సోషల్‌ మీడియా ద్వారా రైతులు కొన్నివార్తలనందుకున్నారు. క్రమశిక్షణ తో విజయవంతంగా చేసిన రైతుల ప్రదర్శనను చూసి కేంద్ర ప్రభుత్వ కళ్ళు తిరిగాయి. చర్చలకు స్వస్తిచెప్పి సామ దాన బేధ దండోపాయాలలో చివరి అస్త్రాన్ని ఉపయోగించ పూనుకున్నారు. దాడులు, అరెస్టులు, కేసులు మొదలుపెట్టారు. శిబిరాలలో ఉన్నవారికి కనీస సౌకర్యాలు అందకుండా చేస్తున్నారు.రైతు ఉద్యమకారుల శిబిరాలపై దాడులు చేసి గుడారాలను ధ్వంసం చేస్తున్నారు. సైనికుల కవాతులను నిర్వహిస్తున్నారు. ఆందోళనకారులను భయభ్రాంతులను చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఎర్రకోటవద్ద జరిగిన ఘటనలపై 44 మంది రైతు నాయకులపై దేశద్రోహ కేసులను బనాయించారు. రైతులు నివసిస్తున్న సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌ ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా పోలీసులు ఆపేశారు. మంచి నీటి వాహనాలను కూడాఆపేశారు. అర్ధరాత్రిలోగా ఖాళీచేయాలంటూ అల్టిమేటంను ప్రభుత్వ అధికారులు జారీ చేశారు. అక్కడినుండి వెళ్ళిపోని పక్షంలో తామే తొలగిస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రకటించాడు.ప్రజలు గుమికూడకుండా సెక్షన్‌ 144 విధించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారు. మూడు సరిహద్దుప్రాంతాలలో ఇంటర్నేట్‌ ను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఆపేసింది. రైతులు సమాచారాలను పంచుకోవటానికి వీలులేకుండా ఇంటర్నెట్‌ కట్‌ చేశారు. ప్రవాహంగా వస్తున్న రైతులు రాకుండా సింఘూ వద్ద ప్రభుత్వం బారికేడ్లతోపాటు ముళ్ళకంచె వేసి తాత్కాలికంగా గోడను నిర్మిస్తున్నారు.ప్రజలు అందోళనా ప్రాంతాలకు రాకుండా రైళ్లను దారి మళ్ళించారు. రైతులను, జర్నలిస్టులను అరెస్టు చేస్తున్నారు.

స్ధానికుల పేరున గూండాల దాడి- బీబీసీ ప్రత్యక్ష కధనం.

స్ధానికుల పేరున కొంతమంది వాహనాలలో తరలివస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. పోలీసుల కళ్ళముందే గుడారాలను పీకేస్తుంటే నివారించటానికి ప్రయత్నించలేదు. పైగా రైతులపై లాఠీఛార్జి చేశారు. స్ధానికుల పేరున వచ్చిన బీజేపీ కార్యకర్తలు రాళ్ళతోనూ కర్రలతోనూ రైతులపై దాడిచేశారు. రైతులు వారి ప్రాణాలను కాపాడుకోవటానికి ప్రతిఘటించారు. అయినా నాయకుల మాటలు విని ప్రశాంతంగా దెబ్బలు తిన్నారు. ఆందోళనను ఎట్టిపరిస్ధితులలోనూ విరమించేది లేదని తేలిó చెప్పారు.

. సింఘూ ప్రాంతాన్ని సందర్శించిన బీబీసీ ప్రతినిధి దిలీప్‌ సింగ్‌ టిక్రీ గ్రామస్ధులతో మాట్లాడాడు. ” మరి వాళ్ళు నిజంగా స్దానికులేనా? అని అడిగితే .. ఈ రోజు వచ్చిన వాళ్ళంతా బీజేపీ పంపించిన గూండాలే” అని గ్రామస్ధులు చెప్పారు. ” ఉద్యమం శాంతియుతంగా సాగుతోంది. క్రమశిక్షణతో సాగుతోంది. స్ధానికులు వ్యతిరేకిస్తున్నారనేది అబద్ధం. టిక్రీ గ్రామ పంచాయితీ ప్రజలందరూ వచ్చి మద్దతు ప్రకటించి వెళ్ళారు.ఏది అవసరమయినా మేమున్నామని టిక్రీ గ్రామంరైతులు హామీ ఇచ్చి వెళ్ళారు. ఇప్పటికి 51 వేల రూపాయలు విరాళంఇచ్చారు. ఇంకా పాలు, లస్సీ ,డబ్బులు, ఏది కావాలన్నా సేకరించి ఇస్తామన్నారు. చుట్టుపక్కలగ్రామాల ప్రజలకు ఈ ధర్నాతో ఎలాంటి సమస్యా లేదు. తాము పస్తులుండైనా సరే ,రోడ్డుపక్కన పూరిగుడెసెలలో వుండే పేదలకు మూడుపూటలా అన్నందొరికేలా చూస్తున్నారు.ఈ నల్లచట్టాలను వెనక్కి తీసుకునేంతవరకూ రైతులు వెనక్కి వెళ్ళరు. మేంకూడా వెనక్కి వెళ్ళేదిలేదు.” అని ఒక పెద్దాయన చెప్పాడు. ” నేను రైతు బిడ్డను. కొందరు జాతీయజెండాలను పట్టుకు రావటం కనిపించింది.ఇందులో మాప్రాంతం వారు ఎవరున్నారో చూద్దామని అక్కడకు వెళ్ళాను. అక్కడ బీజేపీ కార్యకర్త గజేంద్రసింగ్‌ కన్పించాడు. నీకు సిగ్గు అనిపించటంలేదా నువ్వు ఈ ప్రాంతం వాడివికూడాకాదు,ద్వారకా వాడివి, రైతువి కాదు , ప్రాపర్టీ డీలర్‌ వి కదా? చెడగొట్టటానికే వచ్చావా? అని అతనిని మందలించాను.అంతలో ఒక యువకుడు నేను గేవ్రా గ్రామంవాడినన్నాడు..అబద్ధం చెప్పకు ఈప్రాంతంలో ప్రతి ఒక్కవ్యక్తీ నాకు తెలుసు అన్నాను.ఈ ప్రాంతం వాళ్ళు ఒక్కళ్ళుకూడాలేరు. ఉంటే చూపండి అని సవాల్‌ చేశాను.ఈ మోసాలు సాగవు. మేం సహించము అని హెచ్చరించాను” అని ఒక స్థానిక రైతు చెప్పాడు. మరొక మహిళ ఇలా చెప్పింది,”ఎవరికీ ఏసమస్యాలేదు. ఉద్యమంవలన ఎవరూ ఇబ్బందిపడటంలేదు. ఇక్కడ టిక్రీ, లేకారాం పార్క్‌,మమా చౌక్‌, చోటూరామ్‌ నగర్‌,గ్రామాలన్నీ మార్కెట్‌ కోసం ఇక్కడికే వస్తురీంటారు. కానీ ఈ గ్రామాలలో ఎవరికీ ఇబ్బందిలేదు” అని ఆమెచెప్పింది

ఘాజీపూర్‌ బోర్డర్‌ -బీ బీ సీ. వార్త
ఘాజీపూర్‌ బోర్డర్‌ లో ధర్నా ఎలా కొనసాగుతోందో బీబీసీ ప్రతినిది సమీర్‌ ఆత్మ మిశ్రా ఇలా వివరించారు.
” గురువారం ఘాజీపూర్‌ బోర్డర్‌ లో రైతులను ఖాళీ చేయించటానికి అధికారయంత్రాంగం ప్రయత్నించింది. రాకేష్‌ తికాయత్‌ పైకేసు నమోదయంది. అరెస్టుకావటానికి కూడా తయారయ్యారు.” స్ధానికులపేరున కొంతమందిని తెచ్చి ఖాళీచేయించ ప్రయత్నంపై తికాయత్‌ ఆవేదన పొందారు. మంచినీటిని కూడా ఆపేశారు. దానికి స్పందనగా రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ”మావూరునుండి మంచినీరు వచ్చిందాకా మంచినీరు ముట్టనని ” శపధం చేసి, నిరాహార దీక్షకు కూర్చున్నారు. అప్పటికపుడు మహాపంచాయత్‌ నిర్వహణకు పిలుపునిచ్చారు. ముజఫర్పూర్‌ లో రైతు సంఘాల నేతలు రైతులతో మహా పంచాయతీ నిర్వహించారు. ఢిల్లీకి 150 కి మీ దూరంలో వున్న ఈ ప్రాంతం రైతాంగఉద్యమాలకు పెట్టని కోట. రైతునేత మహేంద్ర తికాయత్‌ స్వస్ధలం సిసోలీ గ్రామం. మహేంద్రతికాయత్‌ కుమారుడు నరేష్‌ తికాయత్‌ బీకేయూకి అధ్యక్షుడిగా వున్నాడు. రాకేష్‌ తికాయత్‌ మరొక కుమారుడు. ఇద్దరూ ప్రస్తుతం రైతు ఉద్యమంలో భారత్‌ కిసాన్‌ యూనియన్‌ కి నాయకత్వం వహిస్తున్నారు.ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని మహా పంచాయత్‌ నిర్ణయం తీసుకున్నది. మీరట్‌, షామ్లీ, షాహన్పూర్‌ పశ్చిమ ఉత్తర ప్రదేశ్ల లోని రైతులందరూ ఘాజీపూర్‌ సరిహద్దు లో జరుగుతున్న ధర్నా లో ఇక పై ప్రతిరోజూ పాల్గొనాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని, ప్రతి ఇంటినుంచీ ధర్నాలో పాల్గోవాలని నిర?యమైంది. ధర్నా ముగిసిపోయినట్లు కనిపించిన స్ధలం ప్రజలతో కిటకిట లాడుతోంది. నినాదాలతో హౌరెత్తిపోతోంది.ప్రధాన రోడ్డులకు అడ్డంగా బస్సులు నిలిపారు. పోలీసులకు ఇనుప లాఠీలను సరఫరా చేస్తున్నారు. అయినా పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ ల తోపాటుగా ఉత్తరప్రదేశ్‌ రైతులు తికాయత్‌ సోదరుల నాయకత్వాన ఉద్యమం లోకి ఉరుకుతున్నారు. పంజాబ్‌- హర్యానా లనుంచి ప్రయాణించే పంజాబ్‌ మెయిల్‌ తో సహా రెండు రైళ్ళను దారి మళ్ళించారు.

అధికారుల వేధింపులకు, నిర్భంధాలకు నిరసనగా , కనీస మద్దతు ధర కావాలనీ, రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ దేశవ్యాప్తంగా ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటలనుండి 3 గంటలవరకు రహదారులను దిగÄంధించాలని రైతుసంఘాల సమన్వయ సంఘం పిలిపునిచ్చింది. ప్రజలందరూ పాల్గొన ప్రార్ధన.
వ్యాసరచయిత డాక్టర్‌ కొల్లారాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం, గుంటూరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆగని చమురు ధరలు -రైతు ఉద్యమం – నరేంద్రమోడీకి ” అభినందనలు ” !

25 Monday Jan 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Farmers agitations, India oil price, Narendra Modi Failures, OPEC oil war, unabated oil prices in India


ఎం కోటేశ్వరరావు
ఒక వైపు పట్టువీడని రైతు ఉద్యమం-మరో వైపు ఎగబాకుతున్న చమురు ధరలు. గడ్డ కట్టే చలిలో కూడా కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి నేతృత్వంలోని పాలక ఎన్‌డిఏ కూటమికి చెమటలు పట్టిస్తున్నాయి. ఇవి ఏ పరిణామాలకు దారి తీస్తాయో చెప్పలేము. ఇది రాస్తున్న సమయానికి రైతులూ పట్టువిడుపు లేకుండా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా జనం భరిస్తారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఎక్కడా ప్రతిఘటన లేదు కనుక ప్రతి రోజూ పెంచుతూనే ఉంది. పన్నుల తగ్గింపు ఆలోచన చేయటం లేదు.


చిత్రం ఏమిటంటే పెరుగుతున్న చమురు ధరల గురించి గతంలో బిజెపి నేత స్మృతి ఇరానీ మాదిరి ఎవరూ గ్యాస్‌ బండల ధర్నాలు లేవు, ఎడ్ల బండ్ల మీద మోటారు సైకిళ్లను పెట్టి ప్రదర్శనలు, ఆటోలను చేత్తో లాగే విన్యాసాల దృశ్యాలు కనిపించటం లేదు. ప్రతిపక్షాలు కిమ్మనటం లేదు గానీ కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గారే మండి పడ్డారు. చమురు ధరల పెరుగుదలకు సౌదీ అరేబియా కారణమని కొద్ది రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీలను కూడా తప్పుపట్టలేము. ఎవరైనా ధర్నా చేస్తుంటే మాకు అడ్డుగా ఉన్నారంటూ విసుక్కొని పక్కదారులలో పోయే జనం ఉన్నపుడు కందకు లేని దురద కత్తిపీటలకెందుకు అన్నట్లుగా ఎవరికి మాత్రం ఎందుకు ? చమురును కొనుగోలు చేసేది మెజారిటీ బిజెపి అభిమానులే కదా ! ఎందుకంటే మెజారిటీ రాష్ట్రాల్లో వారే కదా అధికారంలో ఉంది. ఇంక ఆ పార్టీ తమది మెజారిటీ హిందువుల పార్టీ అని చెప్పుకుంటున్నది కనుక అధిక భారం పడుతున్నదీ, మోస్తున్నదీ హిందువులే, కాదంటారా ? ఇష్టమైనపుడు సుత్తితో మోదినా దెబ్బ అనిపించదు. లేనపుడు తమలపాకుతో తాటించినా భరించలేని బాధ అనిపిస్తుంది- తరతరాల మానవ సహజం !


ఇంతకీ ధర్మేంద్ర ప్రధాన్‌ గారికి సౌదీ అరేబియా మీద ఎందుకు కోపం వచ్చింది ? మౌన యోగి ప్రధాని నరేంద్రమోడీ గారి మాదిరి మాట్లాడకుండా ఉంటే నాటకం రక్తి కట్టదు కదా ! నరేంద్రమోడీ గారు అధికారానికి వచ్చిన కొత్తలో పీపా చమురు ధర 107 డాలర్లు ఉన్నది కాస్తా తరువాత గణనీయంగా పడిపోయింది. గత ఏడాది ఒక దశలో 23 డాలర్లకు తగ్గింది. ఇప్పుడు 55-56డాలర్ల మధ్య ఉంది. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజుల చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే ఇప్పుడు రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా చమురు ధరలు తగ్గినపుడు కరోనా ఉన్నా కరుణ చూపలేదు. పెరిగినపుడు మాత్రం మడమ తిప్పకుండా వాయించేస్తున్నారని పదే పదే చెప్పుకోనవసరం లేదు.

ఏడాది క్రితం గణనీయంగా ధరలు తగ్గినపుడు కేంద్ర ప్రభుత్వం మూడు రూపాయల పన్ను పెంచటంతో వినియోగదారుడికి ఎలాంటి ఉపశమనం లేకుండా పోయింది. జనాల జేబులు కొట్టి మార్కెటింగ్‌ కంపెనీలకు లబ్ది చేకూర్చారు. కేంద్ర ప్రభుత్వానికి 43వేల కోట్ల మేరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఒక రూపాయి పన్ను పెంచితే ఏడాదికి 14వేల కోట్ల రూపాయలు వస్తుంది. మరి మంత్రిగారికి కోపం ఎందుకు వచ్చిందంటే ఇప్పటికే చమురు ధరలు 73 సంవత్సరాల రికార్డులను బద్దలు కొట్టాయి, రైతుల ఉద్యమ స్ఫూర్తితో చమురు మీద కూడా ఆందోళనలు ప్రారంభమైతే అన్న గగుర్పాటు మంత్రిగారికి కలిగి ఉండాలి. భజన గోడీ మీడియా, సానుకూల కాషాయ మేథావుల కోళ్లు కూయకుండా మూసుకుంటే తెల్లవారకుండా ఆగుతుందా ? రైతుల ఉద్యమాన్ని ఆపగలిగారా ? రైతులకు భయపడి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలను రద్దు చేయగలిగారు గానీ బడ్జెట్‌ సమావేశాలను అలా చేయగలరా ? భజన చేసే తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, వైసిపి వంటి మరికొన్ని ప్రాంతీయ పార్టీలు మౌనంగా ఉన్నా ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రభుత్వాన్ని చమురు ధరల మీద నిలదీయకుండా ఉంటారా? అందుకే మంత్రిగారు నేరం మాది కాదు సౌదీది అనే చెప్పేందుకు ముందస్తుగానే వాదన సిద్దం చేసుకున్నారనిపిస్తోంది.


గతేడాది కొన్ని దేశాల మధ్య చమురు యుద్దం కారణంగా పోటీపడి చమురు ఉత్పత్తిని పెంచిన విషయం, వద్దురా బాబు నిల్వచేసేందుకు ఖాళీలేదు, ఒప్పందం చేసుకున్నాం గనుక మీకే ఎంతో కొంత ఎదురు ఇస్తాం సరకు పంపకండి అన్న పరిస్ధితి ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మన యుద్దం మనకే నష్టం అని గమనించిన చమురు దేశాలు తమ లాభం తాము చూసుకుంటున్నాయి. డిమాండ్‌ పడిపోయింది కదా అని ఉత్పత్తిని తగ్గిస్తే చమురు ఎగుమతి దేశాల మార్కెట్‌ను అమెరికా వంటి దేశాలు ఆక్రమిస్తే పరిస్దితి ఏమిటన్న గుంజాటన మీద తర్జన భర్జనలు జరిగాయి. ముఖ్యంగా రష్యా ఈ వాదనను ముందుకు తెచ్చింది. అయితే కరోనా నుంచి కాస్త కోలుకుంటున్నందున ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి.
గతంలో చమురు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రోజుకు 97లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించాల్సి ఉంది. దానికి అదనంగా ఫిబ్రవరి, మార్చి నెలలో రోజుకు పదిలక్షల పీపాల చమురు ఉత్పత్తిని స్వచ్చందంగా తగ్గిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పడిపోతే దానికి విరుద్దంగా చైనాలో పరిస్ధితి ఉండటంతో చమురు దేశాలు కాస్త నిలబడ్డాయి. అంతర్జాతీయ చమురు సంస్ధ తాజా అంచనా ప్రకారం ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో డిమాండ్‌ తగ్గనుంది.

మన దేశం విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే దిగుమతి ఇంకా తక్కువే ఉన్నప్పటికీ గత కొద్ది నెలలుగా పెరుగుతున్నది. ఇలా ధరలు పెరిగేట్లు చేస్తే మేము ప్రత్యామ్నాయం, కొత్త వ్యాపార విధానాలను చూసుకోవాల్సి ఉంటుందని మన మంత్రి హెచ్చరించారు. దీనికీ కారణం లేకపోలేదు. ఇప్పుడున్న స్దితి నుంచి ఏమాత్రం పెరిగినా అమెరికాలోని షేల్‌ ఆయిల్‌ వెలికి తీత లాభదాయకంగా మారుతుంది. అందువలన అక్కడ ఉత్పత్తి పెరుగుతుంది, కనుక మీ దగ్గర బదులు అక్కడి నుంచే కొంటాం అన్న బెదిరింపు కూడా లేకపోలేదు. ఇప్పటికే నరేంద్రమోడీ నాయకత్వం అమెరికాతో స్నేహం పేరుతో దాని దగ్గర నుంచి చమురు కొనుగోలు ప్రారంభించింది. ఎక్కడన్నా బావే గానీ చమురు దగ్గర కాదన్నట్లుగా ఇతర దేశాల ధరకే మనకు ఇస్తున్నారు తప్ప మోడీ గారి గడ్డం పొడుగు చూసి ఒక్క సెంటు కూడా మాజీ డోనాల్డ్‌ ట్రంప్‌ తగ్గించలేదు, తాజా జో బైడెన్‌ తగ్గించేది లేదు. పశ్చిమాసియా, ఇతర దారులు మూసుకుపోతే అమెరికా కాళ్ల మీద పడాలి. పోటీదారులను పడగొట్టిన తరువాత రిలయన్స్‌ జియో ధరలు పెంచిన మాదిరే అమెరికా కూడా చేస్తే ?


ఇవన్నీ మంత్రిగారి తెలియవా ? జనానికంటే ఎక్కువ తెలుసు ! సౌదీని విమర్శించి, ప్రత్యామ్నాయం చూసుకుంటామని బెదిరిస్తే ప్రయోజనం ఉంటుందా ? చెరువు మీద అలిగితే ఏం జరుగుతుందో అదే అవుతుంది. మంత్రిగారి ప్రకటన వెనుక ప్రభుత్వ భయం కనిపిస్తోంది. ధరలు పెంచుకుంటూ పోతే భరించే జనంలో అసంతృప్తి తలెత్తుతుంది. అభిమానులు సైతం ఎంతకాలం భజన చేస్తారు, ఎంతైనా భరిస్తామని గొప్పలు చెబుతారు. మిగతా దేశాలతో ముఖ్యంగా పాకిస్ధాన్‌తో పోల్చుకుంటే పరువు తక్కువ. కేంద్ర ప్రభుత్వం పన్నులు ఎందుకు తగ్గించదు అనే సమస్య ముందుకు వస్తుంది. అదే జరిగితే తగ్గించే స్దితిలో మోడీ సర్కార్‌ ఉందా ? చమురు ధరలు పెరిగిపోతే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గారు తయారు చేస్తుున్న బడ్జెట్‌ హల్వా తినటానికి వస్తుందా ?


మార్చినెలాఖరుతో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో లోటు ఎంత ఉంటుందో, దేనికి కోత పెడతారో తెలియదు. ప్రభుత్వ రంగ సంస్దల వాటాలను అమ్మి 2.1లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్‌ లోటు నింపుకోవాలనుకున్నది కుదరలేదు. అయినా చమురు పన్నుల బాదుడుతో 1.4లక్షల కోట్ల రూపాయలను జనం నుంచి వసూలు చేసి కొంత మేర ఆ లోటును పూడ్చుకున్నారని సరిగ్గా బడ్జెట్‌ సమయంలో క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ద నివేదికలో చెప్పటం, అది మీడియాలో రావటం, కొందరైనా చదవటం కేంద్ర ప్రభుత్వానికి మింగుడు పడని విషయమే. శుద్దమైన చమురు సాకుతో పన్నుల తగ్గింపు జరిగే అవకాశాలు లేవని మరోవైపు వార్తలు.2020 జూన్‌ తొమ్మిదవ తేదీన హిందూస్దాన్‌ పెట్రోలియం వెల్లడించిన సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోలు ధర రూ.73.04 ఉంటే దానిలో డీలరుకు విక్రయించిన ధర రూ.19.63 అయితే కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్‌ పన్ను రూ.32.98, డీలర్లకు కమిషన్‌ రూ.3.57, ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌రూ.16.86 ఉంది. ఈ ఏడాది న్యూఢిల్లీలో జనవరి ఒకటవ తేదీన నీతి మార్గ్‌లోని హెచ్‌పిసిఎల్‌ బంకులో లీటరు పెట్రోలు ధరలో ఏవేవి ఎంత ఉన్నాయో దిగువ చూడవచ్చు.
డీలర్లకు ఇస్తున్న ధర ××××××× రూ.27.25
కేంద్ర ఎక్సయిజు డ్యూటీ ×××× రూ.32.98
డీలరు కమిషన్‌ ××××××××× రూ.3.67
ఢిల్లీ రాష్ట్ర వ్యాట్‌ ××××××××× రూ.19.32
వినియోగదారుడి ధర ×××××× రూ.83.71
వివిధ రాష్ట్రాలలో వ్యాట్‌ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. డీలరు కమిషన్‌ మీద కూడా ఢిల్లీలో వ్యాట్‌ 30శాతం వసూలు చేస్తున్నారు. ముంబైలో గతంలో బిజెపి సర్కార్‌ విధించిన 39.12శాతం వ్యాట్‌ను తరువాత అధికారానికి వచ్చిన శివసేన సంకీర్ణ కూటమి కూడా కొనసాగిస్తున్నది. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఈ కారణంగానే జనవరి 18న ముంబైలో రూ.91.80 ఉంటే చెన్నరులో రూ.87.85 ఉంది. జనవరి 18న కొన్ని దేశాలలో పెట్రోలు, డీజిలు లీటరు ధరలు ఇలా ఉన్నాయి. ధర డాలర్లు, సెంట్లలో(బ్రాకెట్లలోని ధరలు మన రూపాయల్లో అని గమనించాలి
దేశం××××××××××పెట్రోలు×××× ×××× డీజిలు
వెనెజులా×××××× 0.020 (1.46) ×××× 0.000 (0000)
సౌదీ అరేబియా×× 0.467 (34.07) ×××× 0.139 (10.14)
మయన్మార్‌ ×××× 0.627 (45.74) ×××× 0.556 (40.56)
భూటాన్‌ × ×××× 0.677 (49.39) ×××× 0.633 (46.17)
పాకిస్ధాన్‌× ×××× 0.682 (49.75) ×××× 0.706 (51.50)
శ్రీలంక ×××××× 0.839 (61.20) ×××× 0.542 (39.54)
నేపాల్‌ ×× ×××× 0.941 (68.64) ×××× 0.795 (57.99)
చైనా ××× ×××× 1.013 (73.89) ×××× 0.882 (64.34)
బంగ్లాదేశ్‌ ×××× 1.052 (76.74) ×××× 0.769 (56.09)
భారత్‌ ×× ×××× 1.201 (87.61) ×××× 1.083 (79.00)
అనేక దేశాల్లో మన కంటే పన్నులు తక్కువ ఉన్నాయి, మరికొన్నింటిలో ఎక్కువ ఉన్నాయి. కొన్ని చోట్ల చెల్లింపు శక్తిని బట్టి ధరలు వసూలు చేస్తున్నారు. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి ? క్రిసిల్‌ సంస్ధ అధ్యయనం ప్రకారం 2020లో ఉన్న బ్రెంట్‌ రకం ముడి చమురు ధర సగటున 42.3 డాలర్లు ఉంటే 2021లో అది 50-55 డాలర్ల మధ్య ఉంటుందని పేర్కొన్నది. దానికి అనుగుణ్యంగానే మనం కొనే చమురు ధరలు కూడా ఉంటాయి. ఈ మేరకు పెరిగినా లేక అనూహ్యంగా ఇంకా పెరిగినా మన విదేశీమారక నిల్వలు, బడ్జెట్‌ అంచనాలు తప్పుతాయి. అందుకే మంత్రిగారు ఆందోళన, ఆక్రోశం వెలిబుచ్చారు తప్ప వినియోగదారులకు మేలు చేకూర్చుదామని కాదు.

ఇది రాసిన సమయానికి మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు పీపా ధర 55-56 డాలర్ల మధ్య నడుస్తున్నది. ప్రతి పెరుగుదలనూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్‌ కంపెనీలు జనం మీద ఏ రోజుకు ఆరోజు రుద్దుతున్నాయి. ఎవరూ ఏమీ ప్రశ్నించకుండా వాటిని చెల్లించి కొనుగోలు చేస్తున్నాము. వినియోగదారులెవరూ పట్టించుకోవటం లేదు, రైతుల మాదిరి చమురు వినియోగదారులు కూడా ఉద్యమించే రోజులు వస్తాయా ? ఇప్పుడు దేశభక్తి మత్తులో ముంచారు గనుక దేశం కోసం ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడటం లేదు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా ? అనూహ్య పరిణామాలు ఏ రూపంలో ఉంటాయో తెలియదు. ఎవరి దగ్గరైనా చిత్రగుప్తుడి చిట్టా ఉంటే నరేంద్రమోడీనో జనాన్నో కాపాడేందుకు బయటపెడితే మంచిదేమో !


రైతు ఉద్యమం రానున్న రోజుల్లో ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తి నిస్తోందనటంలో ఎలాంటి సందేహం లేదు. చరిత్ర పునరావృతం అవుతుందన్నది నిజం, అయితే గతం మాదిరే అయిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఉద్యమాలు కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. గతంలో రైతులు బోట్‌ క్లబ్‌ వద్ద తిష్టవేశారు. ఆ అనుభవంతో బిజెపి సర్కార్‌ ఇప్పుడు అసలు ఢిల్లీలో ప్రవేశించకుండా శివార్లలోనే అడ్డుకుంది. రైతులు అక్కడే నిరవధిక ఆందోళన ప్రారంభిస్తారని ఊహించలేదు. దేశమంతటా ఉద్యమించే విధంగా ఒక్క రైతులనే కాదు, వివిధ తరగతుల వారిని మేల్కొలిపింది. దోపిడీ శక్తులు తమ భూమి, పరిశ్రమలు, కార్యాలయాల్లో పని చేసే వారినే కాదు, తమ దోపిడీని అంతం చేసే శ్రామిక శక్తులను కూడా తయారు చేస్తాయి. సుత్తీ, కొడవళ్లు పనిసాధానాలుగానే కాదు, అవసరమైతే దోపిడీ శక్తుల పని పట్టే సాధానాలుగా కూడా మారతాయి ! 1975లో అత్యవసర పరిస్థితిని విధించటం ద్వారా కాంగ్రెస్‌ తన వ్యతిరేకశక్తులందరినీ ప్రజాస్వామ్య పరిరక్షణ సమస్య మీద ఐక్యం చేసింది. ఇప్పుడు రైతాంగ సమస్యల మీద అదే మాదిరి ఐక్యతను ప్రదర్శించటానికి వ్యవసాయ సంస్కరణల పేరుతో మోడీ సర్కార్‌ తెచ్చిన చట్టాలు దోహదం చేశాయి. దీనికి నరేంద్రమోడీ ఆయనను నడిపిస్తున్న సంఘపరివార్‌కు ఒక విధంగా ” అభినందనలు ” చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ చట్టాలు : మోడీ గారూ రైతులు కల్మషం లేని వారు తప్ప కుయుక్తులు కాదు !

11 Monday Jan 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, STATES NEWS

≈ Leave a comment

Tags

Farmers agitations, India - 1991 Country economic memorandum, India-World Bank, indian farmers, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరూతూ ప్రారంభమైన ఆందోళన సోమవారం నాటికి 48 రోజులు పూర్తి చేసుకుంది. ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేయాలని ఉన్నత న్యాయ స్ధానం అదే రోజు సలహాయిచ్చింది, లేనట్లయితే తాము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే చేసిన చట్టాల ప్రకారం రెండువేల మంది రైతులు ఒప్పందాలు చేసుకున్నారని, వాటిని నిలిపివేస్తే వారికి నష్టం జరుగుతుంది కనుక నిలిపివేయటం కుదరదని, నిలిపివేసే అధికారం కోర్టులకు లేదని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ వాదించారు. అయితే 2018లో మహారాష్ట్ర చేసిన చట్టాన్ని నిలిపివేసిన విషయాన్ని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఉటంకించింది.


సుప్రీం కోర్టు ముందు ఉన్న ఈ కేసు ఏ విధంగా పరిష్కారం అవుతుంది, కోర్టు హితవును నరేంద్రమోడీ సర్కార్‌ పట్టించుకుంటుందా ? ఒక వేళ ఏదో ఒక కారణాన్ని పేర్కొని ఆందోళనను విరమించాలని కోర్టు గనుక తీర్పు ఇస్తే రైతులు విరమించుకుంటారా ? పరిష్కారం ఏమిటి ? ఇలా అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఏదైనా జరగవచ్చు. తమ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాల మేళ్ల గురించి చెప్పేందుకు హర్యానా బిజెపి ప్రభుత్వం కర్నాల్‌ జిల్లా కైమ్లా గ్రామంలో ఆదివారం నాడు ఒక సభను ఏర్పాటు చేసింది.కిసాన్‌ పంచాయత్‌ పేరుతో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పాల్గొనాల్సిన ఆ సభ జరగకుండా రైతులు అడ్డుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లే వారి మీద పోలీసులు నీటిఫిరంగులు, బాష్పవాయు ప్రయోగం జరిపి అడ్డుకోవాలని చూసినా రైతులు వెనక్కు తగ్గలేదు. సభా ప్రాంగణం, హెలిపాడ్‌ను స్వాధీనం చేసుకోవటంతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తాను సవరించిన చట్టాలను ఎలాగైనా అమలు జరిపేందుకు కేంద్రం- వాటిని ఎలాగైనా సరే అడ్డుకోవాలని రైతులు పట్టుదలగా ఉన్నారని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో జరుపుతున్న తతంగం ఈనెల 15వ తేదీన కూడా జరగనుంది. రైతులను రహదారుల మీద నుంచి తొలగించాలని సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి తాజాగా మరొక పిటీషన్‌ వేశాడు. ఢిల్లీలో షాహిన్‌బాగ్‌ ఆందోళన కారులను తొలగించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రైతుల విషయంలో కూడా అమలు జరపాలని కోరాడు. సుప్రీం కోర్టు ఏమి చేయనుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఇక్కడ న్యాయమూర్తులు, న్యాయవ్యవస్ధకు దురుద్ధేశ్యాలను అంటకట్టటం లేదు, ఈ రచయితకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. అయితే గతంలో వివిధ ఉద్యమాల సమయంలో ఇలాంటి పిటీషన్లే దాఖలైనపుడు వివిధ కోర్టుల న్యాయమూర్తులు విచారణ సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ తీర్పుల విషయానికి వస్తే ఆందోళన చేస్తున్నవారికి వ్యతిరేకంగానే వచ్చాయి. రైతుల విషయంలో కూడా అదే పునరావృతం అవుతుందా, రైతులు అంగీకరిస్తారా, ప్రభుత్వం బలప్రయోగానికి పూనుకుంటుందా? అన్నవి ఊహాజనిత ప్రశ్నలే.


కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అని పదే పదే ప్రశ్నలు వేస్తున్నా సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్‌ మొండి పట్టుదలను అర్ధం చేసుకోలేము. దేశానికి కాంగ్రెస్‌నుంచి విముక్తి కలిగించామని పదే పదే చెప్పుకుంటుంది బిజెపి, కానీ దాని విధానాలను మరింత పట్టుదలతో అమలు జరుపుతోందన్నది నమ్మలేని నిజం.


ప్రపంచబ్యాంకుతో ఒప్పందాలు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, గతంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా బ్యాంకు పధకాలను తమవిగానే నమ్మించేందుకు నానా పాట్లు పడ్డాయి, పడుతున్నాయి. ఆక్రమంలోనే అందుకే పలు కమిటీలను వేసి సిఫార్సులను ఆహ్వానించాయి. వాటిలో అనేకం ఉంటాయి, కానీ తమకు అనుకూలమైన వాటినే తీసుకుంటారు, మిగిలిన వాటి గురించి అసలు ఏమాత్రం తెలియనట్లు అమాయకంగా ఫోజు పెడతారు.


2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్‌ సేన్‌ కమిటీ, హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీ నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అని దానిలో అడిగారు.ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆ ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల సారాంశం ఇలా ఉంది. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, విపత్తు యాజమాన్య కార్యక్రమాలు ఎఫ్‌సిఐ పనిగా ఉండకూడదు. వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి, నిల్వపద్దతులను నవీకరించాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్‌ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.


దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్‌ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్‌లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.

గతంలో ప్రపంచ షరతులలో భాగంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి సర్కార్‌ ముందుకు తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా సాగిన పెద్ద ఉద్యమం గురించి తెలిసినదే.డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్‌ సేన్‌, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్‌ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది.


ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్‌ మెమోరాండం( రిపోర్ట్‌ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్‌ 12న బహిర్గతం చేశారు. వీటిలో ఉన్న అన్ని అంశాలను ఇక్కడ ఉటంకించటం సాధ్యం కాదు కనుక ముఖ్యమైన సిఫార్సుల గురించే చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో గతేడాది జూన్‌లో ఆర్డినెన్స్‌, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు.

1991లో అమలు ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాలు పారిశ్రామిక రంగంలో తీవ్ర సమస్యలకు దారి తీయటంతో మిగిలిన సిఫార్సుల అమలుకు తటపటాయించటం, ఒక్కొక్కదాన్ని అమలు జరుపుతున్నారు తప్ప వెనక్కు తగ్గటం లేదు. వాటిలో భాగమే ప్రయివేటీకరణ. ముందు నష్టాలు వచ్చే కంపెనీలని జనానికి చెప్పి సరే అనిపించారు. అవి పూర్తయిన తరువాత ప్రభుత్వాలు పాలనా వ్యవహారాలు చూడాలే తప్ప వ్యాపారాలు చేయకూడదు అనే సన్నాయి నొక్కులతో లాభాలు వచ్చేవాటిని ఇప్పుడు వదిలించుకోచూస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. తాజా వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు.


మన దేశీ కార్పొరేట్‌లు, విదేశీ కార్పొరేట్‌ కంపెనీలలో వివిధ రూపాలలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. వాటి అవసరాలకు అనుగుణ్యంగా ప్రభుత్వాలు మన మార్కెట్లను తెరుస్తున్నాయి. వాటి ద్వారా ఉపాధి రాదా, దేశానికి ప్రయోజనం కలగదా అనే వాదనలు ముందుకు వస్తున్నాయి. ఒకసారి అమలు జరిపి చూస్తే పోలా అంటున్నారు. కరవులు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా లబ్ది కలిగే వారు ఉన్నారు. అంతమాత్రాన వాటిని కోరుకుంటామా ? నిప్పును ముట్టుకున్నా, నీళ్లలో మునిగినా, కొండ మీద నుంచి దూకినా చస్తామని తెలిసినా ఒకసారి ఎలా ఉంటుందో చూస్తే పోలా అని ఎవరైనా అంటే ఆపని చేస్తారా ? విదేశీ పెట్టుబడులు, ద్రవ్యపెట్టుబడులు పెట్టేవారికి – వినియోగించుకొనే దేశాలకూ లబ్ది చేకూరే విధంగా ఉంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. స్ధూలంగా చెప్పాలంటే చైనాలో జరుగుతున్నది అదే. మన దేశంలో సామాన్యుల కంటే ధనికులు, కార్పొరేట్లే బాగుపడుతున్నారు. సంపదతారతమ్యాలు పెరుగుతున్నాయి. అందుకే వ్యతిరేకత.ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ?


అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్‌, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి.( అనివార్యమైన స్దితిలో కేంద్ర ప్రభుత్వం 1991లో జిడిపిలో 0.85శాతంగా ఉన్న ఎరువుల సబ్సిడీని 2008-09నాటికి 1.52శాతానికి పెంచాల్సి వచ్చింది. ఆ తరువాత చూస్తే ” రైతు బంధు ” నరేంద్రమోడీ గారి ఏలుబడి ప్రారంభంలో 2014నాటికి 0.6శాతానికి తగ్గింది.2016లో 0.5, తరువాత 2019వరకు 0.4శాతానికి పడిపోయింది. తరువాత సంవత్సరం కూడా కేటాయింపుల మొత్తం పెరగని కారణంగా జిడిపిలో శాతం ఇంకా తగ్గిపోతుంది తప్ప పెరగదు.)
బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.( తాజాగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్దలు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చింది కనుక, ఇప్పటికే ఉన్న ప్రయివేటు బ్యాంకులకు, వాటికి ప్రాధాన్యతా రంగాలు ఉండవు)
సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.
డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.
ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.
ఎఫ్‌) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్‌ ఛార్జీలను కూడా పెంచాలి.
2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.
ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.
సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు.
డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి.

పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్‌ శక్తులు గుజరాత్‌లో మారణకాండ సమయంలో నరేంద్రమోడీ వ్యవహరించిన తీరేమిటో తెలుసు గనుక మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము. ఇక్కడ మోడీగారు లేదా బిజెపి, కేంద్రప్రభుత్వ చర్యలను గుడ్డిగా బలపరుస్తున్న ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఒక్కటే. భారత రైతు ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే కల్మషం, కాపట్యం లేని వ్యక్తి కావచ్చుగానీ ఆమాయకుడు కాదు ! జిమ్మిక్కులు ప్రదర్శిస్తే చెల్లవు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీరు ఎటు వైపో తేల్చుకోండి

10 Sunday Jan 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi agitation, indian farmers

డాక్టర్ కొల్లా రాజమోహన్

మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయమని సెప్టెంబరునుండి భారత దేశ రైతులు ఆందోళన చేస్తున్నారు. భారత దేశ రైతు ఉద్యమ చరిత్రలో దేశరాజధానిని లక్షలాదిమంది రైతులు ముట్టడించటం ఇదే ప్రధమం.

ఢిల్లీకి వచ్చి ధర్నాచేయాలనుకున్న రైతులను ఢిల్లీసరిహద్దులలోనే సైన్యం ఆపేసింది. ఢిల్లీలోకి ప్రవేశించకుండా పెద్ద బండరాళ్ళను రోడ్డుకి అడ్డంగా పెట్టారు. వాహనాలు ముందుకు వెళ్ళకుండా  రోడ్డ్డుకు గుంటలు తవ్వారు. ఇనుప కంచెలు వేశారు. బారికేడ్లు నిర్మించారు. బాష్పవాయువును  ప్రయోగించారు. చలిలో వణుకుతున్నప్రజలపై వాటర్ గన్స్ తో నీళ్ళను కొట్టారు. అయినా రైతులు వెనుకాడలేదు. ఎన్ని కష్టాలనైనా భరించి ఎన్నాళ్ళైనా వుండి తాడోపెడో తేల్చుకుంటామని ఏకైక దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

 దేశానికి అన్నంపెట్టే రైతులకు రోడ్డే ఇల్లయింది. ప్రభుత్వం -రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో, దశలవారీగా ఆందోళనను ఐక్యంగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా కలుస్తారేమో కానీ రైతులు మాత్రం ఐక్యం కారు అనే మాటను వమ్ము చేశారు . 500 రైతు సంఘాలు ఐక్యమయ్యాయి. లక్షలాదిమంది రైతులు రోడ్డెక్కారు. ఇదొక అపూర్వ  సంఘటన. ఈ ఉద్యమం భారత దేశ ప్రజలకు ఒక సవాలు విసిరింది. మీరు ఎటువైపో తేల్చకోమంది.

విశాల ప్రజల ప్రయోజనాలా లేక కొద్దిమంది ప్రయోజనాలా ,రైతు ప్రయోజనాలా లేక కార్పోరేటు కంపెననీల ప్రయోజనాలా తేల్చుకోమని రైతు ఉద్యమం కోరింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలన్నీ  ప్రస్తుతం అన్నదాతల నిరసనల కేంద్రాలయ్యాయి. ఢిల్లీ నగర ప్రవేశమార్గాలయిన సింఘూ. టిక్రీ,నోయిడా, పల్వల్ ప్రాంతాలలో లక్షలాదిమంది రైతాంగం భైఠాయించారు, ప్రపంచ ప్రసిధ వాల్ స్ట్రీట్ పోరాటాన్ని మించిపోయింది.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా రైతులు సాగిస్తున్న ఉద్యమం  నెలరోజులకు మించింది. కాగా, ఈ చట్టాలు రద్దును కోరుతూ ఏడో దఫాకూడా  చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతలు భేటీ అయ్యారు. కాగా, చట్టాల రద్దు చేయాలని రైతు సంఘాలన్నీ బలంగా కోరుతున్నారు. తమ ప్రతిపాదనలను అంగీకరిస్తేనే ఆందోళనలను విరమించుకుంటామని అన్నదాతలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉన్నది. చర్చలకు లాజిక్, రీజన్ తో రావాలని ప్రధాన మంత్రి చెబుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల బృందం…రైతులతో చర్చలు సాగిస్తోంది. కాగా, ఈ . 40 రైతు సంఘాల నేతలతో తోమర్‌ పాటు పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌ చర్చిస్తున్నారు. కాగా, చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు ఒకే మాటపై నిల్చున్నాయి.,ఢిల్లీ చుట్టుపక్కల గడ్డి కాల్చటం పై ఆర్డినెస్స్‌, 2020 విద్యుత్‌బిల్లు సవరణ,ఈ రెండు అంశాలపై ప్రభుత్వం సానుకూలం గా స్పందించింది. చర్చలు సాఫీగా జరుగుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రైతులు కోరుతున్న వ్యవసాయ చట్టాల రద్దు సమస్యపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగమవుదామని బయల్దేరాం.

ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి రైతు సంఘాల ప్రతినిధులు 12 మంది ఢిల్లీ బయల్దేరాము. ఢిల్లీ సరిహద్దులలో నవంబరు 26 నుండి రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగ మయి, సంఘీభావం తెలపాలని బయలుదేరిన మా ప్రతినిధి వర్గానికి కొంతమంది రైతులు వీడ్కోలు పలికారు. మరో ఇద్దరు ఢిల్లీ లో కలిశారు. చారిత్రాత్మక రైతు ఉద్యమంలో భాగమయి పోరాడుతున్న రైతులను ఆంధ్ర ప్రదేష్ కు చెందిన 12 మంది రైతుసంఘాల ప్రతినిధులు మనసారా అభినందించారు. స్ఫూర్తి పొందారు.

 డిసెంబరు 27 ఉదయం ఢిల్లీ చేరిన వెంటనే ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులైన హన్నన్ మొల్లా , ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు అశోక్ ధావలే లను, విజూ కృష్ణన్, ప్రసాద్ , వ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ ,సునీల్ చోప్రా గారిని కిసాన్ సభ కార్యాలయంలో కలిశాం. వారు ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న రైతుల పోరాటాన్ని వివరించారు. ఈ పోరాటం ఈ శతాబ్దంలో అతి ముఖ్యమైన పోరాటం అన్నారు. స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత పెద్ద పోరాటం లేదన్నారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ పోరాటం పరాజయం చెందితే రైతాంగ వ్యతిరేక శక్తులు ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు విజృంభిస్తాయి అన్నారు. ఈ రైతు ఉద్యమానికి సంఘీభావం తెలపటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులకు, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం ఉధృతం చేయటానికి అందరూ కృషి చేయాలని కోరారు.

అక్కడ నుండి ఢిల్లీ సింఘు సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాం. మాతో పాటుగావ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ గారు, ఢిల్లీలోని తెలుగు పత్రికా విలేకరులు వచ్చారు. వారి సహాయం విలువైనది. ఢిల్లీ లో ఉన్నన్ని రోజులూ మాకు బస కల్పించి వాహన సదుపాయాలు కల్పించిన ఉద్యమ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

పోరాట ప్రాంతానికి పయనం 

శోభనాద్రీశ్వరరావు గారి ఆరోగ్యం దృష్ట్యా పోరాట ప్రాంతానికి వారు వెళ్ళటం కష్టం అన్నారు. అయినా శోభనాద్రీశ్వరరావు గారు అంగీకరించకపోవడంతో వారితో పాటు అందరూ కలిసి వెళ్ళాం. పోలీసు సరిహద్దులను దాటుకొని పోరాట ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ చేరిన ప్రజల సమూహాన్ని చూస్తే మాకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం వేసింది. అక్కడున్న వేదికకు చేరడానికి చాలా కష్టమైంది. ప్రజా సమూహం మధ్య దారి చేసుకుంటూ పదండి ముందుకు అనుకుంటూనడిచాము.శోభనాద్రీశ్వరరావు గారు నడవటం చాలా కష్టమైంది. అయినా ఆయన పట్టుదలతో ముందుకు సాగాడు. అంతలో టాపు లేని చెక్క రిక్షా ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఆ రిక్షా పై వారిని కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం. ఆ రిక్షాకూడా ఇకపై ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. అంతలో కొంతమంది మిత్రులు ఒక మోటార్ సైకిల్ ని తీసుకొచ్చారు.. ఆ మోటార్ సైకిల్ పై కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం.

మోటార్ సైకిల్ ముందుకు వెళ్ళటం మరీ కష్టమైంది. ప్రజల తోపులాటలో కింద పడే పరిస్థితి వచ్చింది.

ఎలాగోలా వేదిక వద్దకు చేరుకున్నాం.  మాలో కొంతమందిని వేదిక పైకి తీసుకుని వెళ్లారు. వేదికపై నుండి కొంతమంది మహిళలు ఉపన్యాసాలు చేస్తున్నారు. వేదిక ముందు, చూపు ఆనినంతవరకుతవరకు ప్రజలు కూర్చుని ఉన్నారు. ఎక్కువ  మంది మహిళలు పాల్గొన్నారు.

వేదిక వెనుక ఉన్న గుడారంలో ప్రెస్ మీట్ లను ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కువ మంది యువకులు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. సినిమా నటులు హరిబీత్ సింఘ్, , ప్రసిద్ధ గాయకులు, ప్రసిధ క్రీడాకారులు మంగీ, జిలానీ జోహాల్ వంటివారు పత్రికా విలేకరుల సమావేశాలు జరిపి ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. 

ప్రెస్ మీట్ లో శోభనాద్రీశ్వరరావు గారు రామకృష్ణ గారు రైతు ఉద్యమం గురించి వివరంగా మాట్లాడారు. టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికా విలేఖరులు అత్యుత్సాహంతో తోపులాడుకుంటూ వార్తలు సేకరించారు.బిస్కెట్లు, రస్కులు, మంచినీటి సీసాలు , టీ, నిరంతరాయంగా సరఫరా జరుగుతుంది.  

కొన్ని వారాలుగా పోరాడుతున్నరైతు ఉద్యమానికి ,రు.10 లక్షల ఆంధ్ర ప్రజల ఆర్థిక సహాయాన్ని శ్రీ వడ్డే శోభనాద్రీశివరరావు గారి చేతుల మీదుగా ఎఐకేఎస్ సిసి నేత హన్నన్ మొల్లా, సంయుక్త కిసాన్ మోర్చానేత దర్శన్పాల్ లకు చెరొక రూ.ఐదు లక్షలనగదును అందించారు.

రోడ్ పై ఎలా బతుకుతున్నారు?

వేదిక నుండి బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం రోడ్డు మీద నడిచాం. కనిపించినంత వరకు లక్షలాదిమంది ప్రజా సమూహం కనబడుతుంది.వారిలో పిల్లల వద్ద నుండి వృద్ధుల వరకు ఉన్నారు. ఒక దృఢమైన నిశ్చయం వారి ముఖాలలో కనబడుతుంది. తీవ్రమైన చలి లో, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ గుడారాలలో నివసించుచున్న రైతుల పోరాటపటిమను భారత ప్రజలందరూ స్పూర్తిగా తీసుకోవాలని అనుకున్నాం.. ఎవరితో మాట్లాడి నా  రెండు విషయాలపై స్పష్టత కనిపిస్తున్నది. నూతన వ్యవసాయ చట్టాలు రైతులప్రయోజనాలకు వ్యతిరేకమయినవనీ, కార్పోరేటు కంపెనీలకు అనుకూలమయినవనీ  చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలందరూ చైతన్యంతో స్పషంగా కార్పోరేట్  రైతు  వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు పోరాడాలనటం వారి చైతన్యస్ధాయికి నిదర్శనం. ఇక్కడ ఎన్నాళ్ళు ఈ విధంగా ఉంటారు అని అడిగితే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు అయిందాకా అని అందరూ చెప్తున్నారు. మీరిక్కడ ఉంటే వ్యవసాయం ఎలా అని అడిగాను. నిజమే. పొలాలలో పనులున్నాయి. ఇంటివద్ద పశువులున్నాయి. నా భార్య బాధ్యతగా పని భారాన్ని భరిస్తున్నది. వ్యవసాయచట్టాలను రధ్దు చేసుకుని ఇంటికి రమ్మని భరోసా ఇచ్చిందన్నారు. ఊరిలో ఉన్న వాళ్ళు మా వ్యవసాయాన్ని కూడా చూస్తున్నారని ఆ రైతు చెప్పాడు. కార్పొరేటు అనుకూల చట్టాలు రద్దయిందాక ఇంటికి రావద్దు అని చెప్తున్నారు. ప్రభుత్వం పోలీసులను సైన్యాన్ని ఉపయోగించి ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచి వేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశాము. మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. మాకు ఆదర్శం భగత్ సింగ్ అన్నారు.

వారి జీవన విధానాన్ని పరిశీలించాము. ట్రాక్టర్లు, ట్రాలీలు వాడకం చాలా ఎక్కువగా ఉంది, ట్రాక్టర్ ట్రాలీ లో కింద గడ్డి పరిచి దానిపై పడుకుంటున్నారు. కొన్నిచోట్ల పైన ప్లాస్టిక్ షీట్లు తో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. కిందనే గడ్డి వేసుకొని దానిపై పడుకుంటున్నారు.

దాదాపు యాభై కిలోమీటర్లు  గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. ముందు వచ్చిన వారు ఢిల్లీ నగరం దగ్గరగా రోడ్డుపై వుంటే, వెనక వచ్చినవారు వారి పక్కన గుడారాలు వేసుకుని నిరసన తెలియచేస్తూ జీవిస్తున్నారు. సింఘూప్రాంతంలో ఉంటే వెనక వచ్చిన వారు 50 కిలోమీటర్ల దూరంలో టెంట్ వేసుకుని ఉంటున్నారు. దేశప్రజలంతా ఈ రైతాంగపోరాటానికి  అండగా వుంటారన్నారు.

చలిని తట్టుకోవటానికి గుడారాలముందు చలిమంటలు వేసుకుంటున్నారు .ఎముకలు కొరికే చలిలో కొంతమంది చన్నీళ్ల స్నానం చేస్తున్నారు.

వర్షం నీళ్ళు పడటం వల్ల దుప్పట్లు, బట్టలు, తడిసిపోయాయని నిరసన వ్యక్తం చేసిన రైతు వీర్‌పాల్ సింగ్ తెలిపారు.  “వర్షపు నీరుతో కట్టెలు తడిసినందున మేము ఆహారాన్ని వండడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.  మాకు ఎల్‌పిజి సిలిండర్ ఉంది, కానీ ఇక్కడ ప్రతిఒక్కరికీ అది లేదు, ”అన్నారాయన.

లంగరు సేవ

ఎక్కడికక్కడే  వంటలు చేసుకుంటున్నారు. వేలాది మంది భోజనాలు చేస్తున్నారు. లోటు లేదు.వంట చేసేవారికి కొదవ లేదు. గ్రామంలోని రైతులు కూరగాయలు,పళ్ళు , వంట సరుకులు తీసుకుని వస్తున్నారు. నెలలపాటు సరిపోయే ఆహారాన్ని వెంట తెచ్చుకున్నారు. వంట మనుషులు, వడ్డించే వారు ప్రత్యేకంగా ఎవరూ లేరు. రైతులతో పాటుగా చూడటానికి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగస్తులు అందరూ పని చేస్తున్నారు. వెల్లుల్లిపాయలు వలవటం దగ్గరనుండి, కూరగాయలు కోయటం వరకూ అన్ని పనులూ చేస్తున్నారు. పెద్దవాళ్లు కూడా నడుము వంచి వంటలు చేస్తున్నారు. వండేవారు, వడ్డించే వారు అంతా సేవకులే. సేవే పరమావధి గా భావిస్తున్న పంజాబీ ప్రజలు లంగర్ సేవ ధర్మంగా ఆచరిస్తున్నారు.లక్షలాది మంది ప్రజలకు భోజనం సరఫరా చేయడం చాలా కష్టమైన పని. లంగర్ సేవ ఆధారంగా ఈ సమస్యలు ఆందోళనకారులు పరిష్కరించారు. చూడటానికి పోయిన వారందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. సేవా దృక్పథంతో రోటి మేకర్ల ను కూడా తీసుకొచ్చి ప్రేమతో బహుమానంగా కొంతమంది ఇచ్చారు. అయినా చేతుల తోనే సులువుగా రొట్టెలు చేస్తున్నారు. రొట్టెలు పెద్ద పెద్ద పెనములపై కాలుస్తున్నారు.

కొన్ని ప్రాంతాలలో జిమ్‌లు, లైబ్రరీలు, కమ్యూనిటీ సెంటర్లు పని చేస్తున్నాయి. పుస్తకాలు ప్రముఖంగా ప్రదర్శిస్తున్నారు. భగత్సింగ్ పుస్తకాలు , ఫొటోలు అన్నిచోట్లా ప్రదర్శిస్తున్నారు.

‘ట్రాలీటైమ్‌’ అనే వార్తా పత్రిక కూడా వస్తోంది. రైతుల ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో ఆందోళనకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారు. ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో అనేకమంది రాసిన కథనాలు, వ్యాసాలు ఉన్నాయి. ఆందోళనకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఉద్యమానికి మద్దతుగా రైతులు, విద్యార్ధులు రాసిన కవితలు ప్రచురితమయ్యాయి.

మరికొంతమంది నిరశనకారులలో ఉత్సాహం నింపేందుకు సంగీత కచేరీలు నిర్వహిస్తూన్నారు.

మల మూత్ర విసర్జనకు టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన కనిపించలేదు. పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కావలసిన నీళ్లను టాంకుల ద్వారా తీసుకొచ్చి నిల్వ పెట్టుకుంటున్నారు.

ఉద్యమం ప్రారంభమైన కొద్ది సమయానికి అందరి సెల్లులకు  చార్జింగ్ అయిపోయింది.  చార్జింగ్ ఎలా అనే సమస్య ముందుకు వచ్చింది. ఎలక్ట్రిసిటీ లేదు. కరెంటు లేకుండా సెల్ ఛార్జింగ్ కాదు. వెంటనే సోలార్ ప్యానల్ తడికలను తీసుకొచ్చి బిగించారు.కరెంటు సమస్యను పరిష్కరించి వెలుగు ను ప్రసాదించారు.ఆధునిక అవసరాలలో అతి ముఖ్య అవసరమైన సెల్ చార్జింగ్ సమస్యను పరిష్కరించారు కొంతమంది టూత్ బ్రష్ లను పేస్ట్ లను అందిస్తున్నారు. 

వైద్య సహాయం చేయటానికి పంజాబ్, హర్యానా, ఢిల్లీ  నుండి డాక్టర్లు, నర్సులు స్వచ్ఛందంగా వచ్చారు. మందులను, పేస్ మాస్క్ లను ఉచితంగా ఇస్తున్నారు. 50 చోట్ల “లంగర్ మెడికల్ క్యాంపు” లను ఏర్పాటు చేశారు. పేరున్న స్పెషలిస్టులు కూడా వచ్చి మెరుగైన చికిత్సలను అంది స్తున్నారు. అందోళనకారుల లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలను, మానసిక  అందోళనను నివారించటానికి కౌన్సిలింగ్ సెంటర్ లను ఏర్పారిచారు. అత్యవసరం గా సీరియస్ కేసులను పంపటానికి అంబులెన్సులను రెడీ గా ఉంచారు.

చదువుకునేందుకు పుస్తకాలను కొన్ని స్వఛంద సంస్ధలు సరఫరా చేశాయి. 

కొందరు ఆఫీసులకు సెలవులు పెట్టి కుటుంబంతో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. “చరిత్రలో భాగం కావాలంటే రైతుల నిరసనల్లో ఒక్కసారైనా పాల్గొనాల్సిందే” అని అంటున్నారు. “మా కుటుంబం రైతు కుటుంబమని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక్కడి రైతుల డిమాండు న్యాయమైనది. ఈ వాతావరణం చూస్తుంటే వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ అయ్యేవరకు వీరు కదలకూడదు అని ప్రతిజ్ఞ చేసుకున్నట్లుగా ఉంది” అని ఒక పెద్దాయన అన్నాడు.

అన్నం పెట్టే రైతన్నలకు సేవ చేయడానికి మించింది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. సందర్శించేందుకు పెద్ద మొత్తంలో వస్తున్న జన సందోహానికి కూడా కడుపు నింపుతున్న లంగర్ కార్యకర్తలు అభినందనీయులు.

“ ఈ వ్యవసాయ చట్టాలు వయసుడిగిన మాకు పెద్ద నష్టం కలిగించకపోవచ్చు కాని మా తరువాతి తరాన్ని మాత్రం తీవ్రంగా నష్ట పరుస్తాయి. అందుకే వీటిని ఉపసంహరించేంత వరకు పోరాడతాం. మా భూమిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు “ అంటున్నాడు ఒక వయస్సు మళ్లిన రైతు. 

యూపీ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన సెలూన్‌ పెట్టుకున్న ఓ వ్యక్తి కస్టమర్లకు షేవింగ్‌, కటింగ్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు.రైతుల ఆందోళన మొదలయ్యాకే ఆయన ఇక్కడ షాప్‌ తెరిచారు. ఆయనలాంటి మరికొందరు కూడా ఉద్యమం మొదలైన వారంలోనే ఇక్కడ షాపులు పెట్టారు.మరో దుకాణదారు రైతులకు చెప్పులు అమ్మతున్నారు. కొంత దూరంలో కొందరు చలికోట్లు అమ్ముతున్నారు. ఇక్కడ నిరసన స్థిర రూపం దాల్చింది. ఈ ప్రాంతం ఆందోళన చేసే ప్రాంతంగా మారింది.

నెల  రోజులకు పైగా నిరసనలు తెలపడం చరిత్ర సృష్టించడమే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత లక్షలాది నిరసనకారులు, లక్షలాది మద్దతుదారుల సంఘీభావంతో సుదీర్ఘకాలం నడుస్తున్న పోరాటం ఇది. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులలో నిరసనలు చేస్తోంది హర్యానా, పంజాబ్‌లకు చెందిన రైతులే కాదు; ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బీహార్‌ల నుంచి తండోపతండాలుగా వచ్చి చేరుతున్నారు. 

షాజన్ పూర్ నిరశనప్రాంత సందర్శన.

చరిత్ర సృష్టించిన రైతాంగం

సోమవారం రైతు సంఘ ప్రతినిధులు హర్యానా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన షాజన్ పూర్ వద్ద జరుగుతున్నరైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపాము. అక్కడ ఉద్యమ నేతలు యోగేంద్రయాదవ్, అమ్రా రామ్, అజిత్ నవలీలను కలిసి మద్దతు తెలియజేశాం. అక్కడ చేరిన రైతులను ఉద్దేశించి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు అమలు అయితే భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి అవుతుందన్నారు. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్నారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావురావు గారి ప్రసంగాన్ని పంజాబీ భాష లోకి అనువదించారు. ప్రముఖ పంజాబీ టీవీలు డైరెక్ట్ గా రిలే చేశాయి. యోగేంద్ర యాదవ్ ఆంధ్ర ప్రజల ఈ సహకారాన్ని అభినందించారు. “లడేంగే-జీతేంగే”,  “కిసాన్ ఏక్తా-జిందాబాద్.” అని నినాదాలు చేశారు.

దూరంగా కన్పడుతున్న రైతులనందరినీ చూద్దామని కొంతదూరం నడిచాము. ఎంతదూరంనడిచినా చివరి గుడారాన్ని చేరుకోలేకపోయాం.కొన్ని మైళ్ళబారున రైతులు జీవిస్తున్నారు. కృతనిశ్చయంతో నిలబడ్డారు. మా బతుకు కోసం, మా భూమికోసం రోడ్డుమీదకు వచ్చామంటున్నారు.పెప్సీ లాంటి కార్పోరేట్ కంపెనీలతో చేసిన కాంట్రాక్టు వ్యవసాయం వలన రైతులకు లభించిన నష్ఠాలు ఆరైతులుఇంకా మరచిపోలేదంటున్నారు.ప్రభుత్వం ,ఈ పోరాటాన్ని ఖలిస్తాన్ వాదుల పోరాటం, టెర్రరిస్టుల పోరాటం,    నక్సలైట్ల పోరాటం, ప్రతిపక్ష పార్టీల పోరాటం, ఆర్ధియాస్ దళారీల పోరాటం గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నది. దేశం మొత్తంగా ప్రచార  దళాలను ఏర్పరిచారు. స్వయానా ప్రధాన మంత్రి గంగానది సాక్షిగా రైతుఉద్యమాన్ని కించపరిచారు. మన్ కీ బాత్ లో అవాస్తవాలను చిత్రీకరించారు. కానీ రైతులు వారి మాటలను నమ్మలేదు. పౌర సమాజం గమనిస్తోంది. రైతుల నిరసనలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచే దిశలో కదులుతోంది. 

రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు ప్రయోజనాలను బలిపెట్టేవేనంటూ రైతులు చేస్తున్న ఢిల్లీ ముట్టడి రెండోనెలలో ప్రవేశించింది. .అనవసర కాలయాపన చేస్తూ ప్రమాదకర ప్రతిష్టంబనను పొడిగించుతూ ప్రభుత్వం ప్రతిష్టకు పోతున్నది. ఢిల్లీలోకి రానివ్వకుండా సృషించిన అడ్డంకులను తొలగించుకుని రోడ్డులనే నివాసంగామార్చుకున్న రోజునే ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చర్చల లో పాల్గొన్న రైతునాయకులందరూ ఒకే మాటపై నిలబడి ఏకైక ఎజెండా గా నూతన చట్టాలను రద్దు చేయమని అడగటం రైతాంగ ఐక్యతకు చిహ్నం. 500 రైతు సంఘాలను , లక్షలాదిమంది రైతుల అపూర్వమైన ఐక్యత ను సాధించి  రైతులను ఏక  తాటి పై నిలబెట్టిన రైతు నాయకులందరూ  అభినందనీయులు. రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

ఒకపక్క వర్షం కురుస్తున్నా మరోపక్క ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు నిరసనను కొనసాగిస్తున్నారు. తమతో పాటుగా ఆందోళన చేస్తున్న 50 మంది సహచరులు తమ ఎదురుగా మరణించినా మౌనంగా రోదిస్తున్నారు తప్ప , తమ ఆందోళన విరమించలేదు.

కిసాన్ ఏక్తా జిందాబాద్ ; కిసాన్ మజ్దాూర్ ఏక్తా జిందాబాద్ ; లడేంగే- జీతేంగే; “జబ్ తక్  కానూన్ వాపస్ నహీ – తబ్  తక్ ఘర్ వాపసు నహీ ” , నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతున్నది.

మీడియాలోమొక్కుబడి వార్తలు.

ముఖ్యంగా పెద్ద టీవీలు, ప్రధాన  మీడియా రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తూ, రైతుల ఆత్మ స్ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ప్రజలు గ్రహించారు. కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు రైతుల పోరాటాన్ని కించపరిచాయి. రైతుల చైతన్యాన్ని ఎగతాళి చేశాయి. ప్రజలు తమ జీవిత అనుభవం నుండి జీవన పోరాటాన్ని సాగిస్తున్నారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. జీవనోపాధికి ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులను ఉద్యమకారులు ఛేదిస్తున్న తీరును ప్రజలు హర్షిస్తున్నారు. కానీ కార్పొరేట్ కబంధహస్తాల్లో బంధించబడిన మీడియాకు రైతు ఉద్యమo కనపడలేదు. ఆ లోటును సోషల్ మీడియా కొంతవరకు భర్తీ చేసింది. కిసాన్ ఏక్తా వార్తా సంస్ధను రైతులు ప్రారంభించారు. కొద్దికాలంలోనే అనన్య ప్రచారం, గుర్తింపు పొందింది.  

ఇప్పుడు, నిరసన, అసమ్మతి , సంఘీభావం తెలియజేయడానికి  ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పోరాట ప్రాంతం పుణ్యస్ధలమయింది. ఢిల్లీ నుండి వేలాదిమంది తీర్ధయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నారు. పోరాటం జయప్రదం  కావాలని మనసారా కాంక్షిస్తూ చదివింపులు చదివిస్తున్నారు. లంగర్ సేవలో పాలు పంచుకుంటున్నారు . పౌర సమాజంలో కొందరు  తమ హక్కుల గురించి పోరాడడమే కాకుండా తోటి ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా రైతుల ఉద్యమం పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నారు. రైతుల ఉద్యమం కేవలం కొద్దిమంది ఉద్యమకారుల గొంతుగా మిగిలిపోలేదు. సన్న, చిన్నకారు రైతులు,  భూమిలేని శ్రామికులు, ధనిక, మధ్య తరగతి రైతులు విశాల రైతాంగ ఉద్యమంలో భాగమయ్యారు. రోజురోజుకీ బలం పెరుగుతున్నది. గెలవగలమన్న ధైర్యం పెరుగుతున్నది. 

కార్పొరేట్ కంపెనీల పునాది కదులుతున్నది.

ఈ ఉద్యమ ప్రభావంతో అంబానీ ప్రకటన చేయక తప్పలేదు.

‘మా గ్రూప్‌ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం  వ్యవసాయ భూమిని కొనలేదు’ అని రిలయన్స్‌ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్‌ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను కొని అమ్ముతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్‌ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్‌ పేర్కొంది.

రైతుల ఆందోళనకు గల రాజకీయ ప్రాధాన్యం ఏమిటి? 

ప్రజాస్వామ్యం  అంటే ఎన్నికలు, పదవులేనని  పాలకవర్గ పార్టీలు  వ్యవహరిస్తున్నాయి. జనాభాలో సగం పైగా ఉన్న తమ జీవన విధానం అయిన వ్యవసాయ విధానం మెరుగ్గా సాగాలని, శ్రమకు ఫలితం దక్కాలని రైతులు కోరుకుంటున్నారు.

రైతులు ఆ విధముగా ఆలోచించి ప్రశ్నించటం మొదలెట్టారు. ప్రజాస్వామ్య మంటే  కార్పోరేట్ కంపెనీల సేవ కాదని స్పష్టంగా వెల్లడిస్తున్నారు. శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దులలో మకాం పెట్టి , ఒక నూతన పోరాట రూపాన్ని రూపొందించారు. కొన్ని లోపాలున్నప్పటికీ క్రియాశీలంగా వున్నారు. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మూగబోయినట్లుగా, నిష్ప్రయోజనంగా కనిపిస్తున్నాయి. అయినా ప్రజల పక్షాన మాట్లాడక తప్పటంలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నాయి. అధికారంలో లేని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు కూడా రైతుల పక్షాన నిలబడటానికి వెనకాడు తున్నాయి. వామపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయి.

ముఖ్యంగా మధ్యతరగతి వర్గం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. అయితే,  మేధావులు ఇదొక ప్రయోగంగా భావిస్తున్నారు. చారిత్రాత్మకమైన రైతుల ఆందోళన ఒక ప్రయోగంలా కాకుండా చూడాలి.పౌర సమాజం మేధావులతో కలిసి చర్చించి, చైతన్యవంతం కావాలి. ప్రజలను చైతన్య పరచవలసిన  సమయం ఆసన్నమయ్యింది. 

ఇప్పుడు, ప్రజలు అసమ్మతి తెలియజేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. 

కార్పొరేట్ శక్తులతో పోరాటం సామాన్యమైనది కాదు. రైతులు తలకు మించిన భారాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. రైతుల వైపా లేక కార్పొరేట్ శక్తుల వైపా అని అందరూ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్గత నిరాశావాదంతో పోరాటం  సులభంగా ఉండదు. పౌర సమాజం మరింత శక్తిని కూడగట్టుకుని పోరాటానికి సిద్ధం కావాలి.

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు.

  1. జనవరి 6 నుండి 20 వరకు, జన జాగరన్ అభియాన్ జరగాలి. గ్రామాలలో రైతులను చైతన్యపరచాలి. జనవరి 13 న భోగి మంటల్లో చట్టాల కాపీలను దగ్ధం చేయటం,”జనవరి 18 న, మహిళా కిసాన్ దివాస్ జరగాలి.    4)  జనవరి 23 న, నేతాజీ సుభాష్   చంద్రబోస్ జన్మదినం సందర్భంగా, ఆజాద్ హింద్ కిసాన్దివాస్ జరుపుకోవాలి.   5) జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ట్రాక్టర్ పెరేడ్ ఊరేగింపు జరపాలి..

ఢిల్లీ  వెళ్లి వచ్చిన వారు 

వడ్డే శోభనాద్రీశ్వరరావు, AIKSCC ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్ , ఎర్నేని నాగేంద్రనాధ్, రైతుసంఘాల సమన్వయ సమాఖ్య, రామక్రిష్ణ, సీపీఐ నేత, రావుల వెంకయ్య, ఎఐకేఎస్ , జాతీయ ఉపాధ్యక్షులు, వై కేశవరావు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి,శ్రీమతి సింహాద్రిఝాన్సీ, ఏపీ రైతు కూలీ సంఘం,రాష్ట్రఅద్యక్షులు, జమలయ్య, ఏ పీ కౌలు రైతు సంఘం కార్యదర్శి. హరనాధ్ ,ఎఐకేఎం, రాష్ట్రకార్యదర్శి,  తోట ఆంజనేయులు, ఎఐకేఎం,  రాష్ట్రఅద్యక్షులు, కే విద్యాధరరావు, ఎఐకేఎస్.శ్రీమతి చల్లపల్లి విజయ, స్త్రీ విముక్తి సంఘటన,  జెట్టి. గుర్నాధరావు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్,డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనవరి 26 ఢిల్లీ : ఒకవైపు రిపబ్లిక్‌ డే కవాతు మరోవైపు రైతన్నల ట్రాక్టర్ల ప్రదర్శన !

02 Saturday Jan 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi protest, India Republic Day, Indo-US trade agreement, Kisaan tractor parade


ఎం కోటేశ్వరరావు


రైతుల న్యాయమైన డిమాండ్లపై సాగుతున్న ఉద్యమాన్ని నీరు గార్చేందుకు, దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్న యత్నాలను చూస్తున్నాము. అవి ఫలించకపోతే ఉక్కు పాదంతో అణచివేస్తారా ? ఇప్పటికి ఊహాజనితమైన ప్రశ్నే కావచ్చు గానీ, ఏం జరుగుతుందో చెప్పలేము.డిసెంబరు 30న జరిగిన చర్చలలో ముసాయిదా విద్యుత్‌ సంస్కరణల బిల్లును ఎత్తివేస్తామని, పంజాబ్‌, హర్యానా, మరికొన్ని ప్రాంతాలలో పనికిరాని గడ్డిని తగులబెడుతున్న కారణంగా పర్యావరణానికి హాని పేరుతో శిక్షించే ఆర్డినెన్స్‌ నుంచి రైతులను మినహాయిస్తామని కేంద్ర ప్రభుత్వం నోటి మాటగా అంగీకరించింది. ఇతర ముఖ్యమైన డిమాండ్ల విషయంలో అదే మొండి పట్టుదల కనిపిస్తోంది. ఈ రెండు అంశాలను అంగీకరించటానికి(అమలు జరుపుతారో లేదో ఇంకా తెలియదు) ప్రభుత్వానికి నెల రోజులకు పైగా పట్టిందంటే ఎంత మొండిగా, బండగా ఉందో అర్ధం అవుతోంది.


మిగిలిన తమ డిమాండ్ల పట్ల రైతన్నలు పట్టువీడే అవకాశాలు కనిపించటం లేదు.జనవరి నాలుగవ తేదీన జరిగే చర్చలలో ఎలాంటి ఫలితం రానట్లయితే తదుపరి కార్యాచరణను రైతు సంఘాల కార్యాచరణ కమిటీ శనివారం నాడు ప్రకటించింది. జనవరి ఐదవ తేదీన సుప్రీం కోర్టు రైతుల ఆందోళన సంబంధిత కేసుల విచారణ జరపనున్నది. ఆరవ తేదీన హర్యానాలోని కుండిలి-మనేసర్‌-పాలవాల్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు మీద ట్రాక్టర్లతో ప్రదర్శన, 15 రోజుల పాటు నిరసన, జనవరి 23న సుభాష్‌ చంద్రబోస్‌ జన్మదినం సందర్భంగా హర్యానా గవర్నర్‌ నివాసం ఎదుట నిరసన, ఆందోళనకు రెండు నెలలు పూర్తయ్యే సందర్భంగా 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో ప్రదర్శన జరుపుతామని, అదే రోజు రాష్ట్రాల రాజధానులన్నింటా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని రైతుల కార్యాచరణ కమిటీ నేతలలో ఒకరైన డాక్టర్‌ ధర్నన్‌పాల్‌ విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. తమ ఆందోళన శాంతియుతంగా కొనసాగుతుందని, మేము చాలా రోజుల క్రితమే చెప్పినట్లు ప్రభుత్వం ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి మూడు చట్టాలను వెనక్కు తీసుకోవటం లేదా బల ప్రయోగంతో మమ్మల్ని ఖాళీ చేయించటం అని దర్శన్‌ పాల్‌ చెప్పారు.


ఇది రాస్తున్న సమయానికి రైతుల నిరసన 38వ రోజు నడుస్తున్నది. ఇప్పటికీ సామాన్యులకు అంతుబట్టని-బిజెపి లేదా ఆందోళనను తప్పు పడుతున్న వారు వివరించేందుకు సిద్దపడని అంశం ఏమంటే, మూడు చట్టాలకు ముందు ఆర్డినెన్స్‌ తీసుకురావాల్సిన, తెచ్చినదాని మీద పార్లమెంట్‌లో తగిన చర్చకూడా లేకుండా ఆదరాబాదరా ఆమోద ముద్ర వేయాల్సినంత అత్యవసరం ఏమి వచ్చింది అన్నది. ఇవేమీ కొత్తవి కాదు, ఎప్పటి నుంచో చర్చలో ఉన్న అంశాలని చెబుతున్నవారు ఆర్డినెన్స్‌ అవసరం గురించి మాత్రం చెప్పరు. బహుశా వారి నోటి వెంట ఆ వివరాలు రావనే చెప్పవచ్చు. మూడు చట్టాలవలన రైతాంగానికి హాని ఉందంటూ వాటిని వెనక్కు తీసుకోవాలని కొందరు మేథావులు ప్రకటనలు చేశారు. దానికి పోటీగా మేలు జరుగుతుంది, కొనసాగించాల్సిందేనంటూ అంతకంటే ఎక్కువ మంది మేథావుల సంతకాలతో ఒక ప్రకటన చేయించారు. వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనే వేగపడక అన్నట్లుగా ఎవరు చెప్పినా వినాల్సిందే, ఆలోచించాల్సిందే. క్షీరసాగర మధనం మాదిరి మధించి ఎవరు చెప్పిన దానిలో హాలాహలం ఉంది, ఎవరు చెప్పినదానిలో అమృతం ఉందన్నది తేల్చుకోవాలి.శివుడు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు కనుక విషాన్ని పక్కన పెట్టేసి దాన్ని తాగించ చూసిన మేథావులెవరైతే వారికి స్ధానం లేదని చెప్పాలి.

జరిగిన పరిణామాలను ఒక దగ్గరకు చేర్చి చూస్తే మాలల్లో బయటకు కనిపించని దారం మాదిరి సంబంధాన్ని చూడవచ్చు. అన్ని రంగాలను కార్పొరేట్లకు అప్పగించిన తరువాత మిగిలింది వ్యవసాయమే. కరోనా సమయంలో అన్ని రంగాలు కుప్పకూలిపోగా మూడుశాతంపైగా వృద్ధి రేటు నమోదు చేసింది ఇదే. అందువలన దాన్నుంచి కూడా లాభాలు పిండుకోవాలని స్వదేశీ-విదేశీ కార్పొరేట్లు ఎప్పటి నుంచో చూస్తున్నాయి. అందుకు గాను వ్యవసాయ రంగాన్ని వారికి అప్పగించటం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాల వ్యవసాయ ఉత్పత్తులను గుమ్మరించేందుకు అనుమతించటం ఒకటి. మూడు చట్టాల ద్వారా మొదటి కోరికను తీర్చారు. ఇప్పుడు రెండవ కోర్కెను తీర్చాలని విదేశాలు ముఖ్యంగా అమెరికా వత్తిడి చేస్తోంది.
అమెరికన్‌ కార్పొరేట్లు మన వ్యవసాయరంగంలో రెండు రకాలుగా ప్రయత్నించాలని చూస్తున్నాయి. ఒకటి ఉత్పత్తుల కొనుగోలు వ్యాపారంలో గణనీయమైన వాటాను దక్కించుకోవటం. రెండవది తమ ఉత్పత్తులను గుమ్మరించటం. రైతుల ప్రతిఘటన ఎలా ముగుస్తుందో తెలియదు, దాన్నిబట్టి కార్పొరేట్లు తమ పధకాలను రూపొందించుకుంటాయి. మొదటిది ఎంత సంక్లిష్ట సమస్యో రెండవది కూడా అలాంటిదే. అందుకే గతంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌-ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ కూడా గుంజాటనలో ఉన్నాయి.


అమెరికాలో నవంబరు ఎన్నికల్లోపే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నరేంద్రమోడీ-డోనాల్డ్‌ ట్రంప్‌ తెగ ప్రయత్నించారు. ఈ నేపధ్యంలోనే అమెరికాకు ఎలాంటి పాత్ర లేని, చైనా, ఇతర ఆసియా దేశాలు ప్రధాన పాత్రధారులుగా ఉన్న ఆర్‌సిఇపి ఒప్పందం నుంచి అమెరికా వత్తిడి మేరకు మన దేశం వెనక్కు తగ్గిందన్నది ఒక అభిప్రాయం. అయితే దానిలో చేరితే మన వ్యవసాయ, పాడి పరిశ్రమ, పారిశ్రామిక రంగాలకు ముప్పు కనుక ఆ రంగాల నుంచి వచ్చిన తీవ్రమైన వత్తిడి కూడా వెనక్కు తగ్గటానికి ప్రధాన కారణం గనుక అమెరికా పాత్ర కనిపించలేదని చెబుతారు.
తమతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకోకపోయినా చిన్న ఒప్పందం అయినా చేసుకోవాలని అమెరికా వత్తిడి తెచ్చింది. దానిలో భాగంగానే 2019 ఫిబ్రవరి చివరి వారంలో మన దేశ పర్యటన సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ చేసిన ప్రకటనలో కుదిరితే ఒక కప్పు కాఫీ అన్నట్లుగా ఏడాది ముగిసేలోగా మొదటి దశ ఒప్పందాన్ని చేసుకోవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చటాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. కరోనాను కూడా లెక్క చేయకుండా ట్రంప్‌ రావటానికి ఇదొక కారణం. ఎన్నికల్లోగా అనేక దేశాలతో చిన్న వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని వాటిని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్నది ట్రంప్‌ దూరాలోచన.(హౌడీమోడీ కార్యక్రమం కూడా దానిలో భాగమే). చిన్న ఒప్పందాలకు అక్కడి పార్లమెంట్‌ ఆమోదం అవసరం ఉండదు. ఎన్నికల తరువాత రాజెవరో రెడ్డెవరో అప్పుడు చూసుకోవచ్చు అన్నది ట్రంప్‌ దురాలోచన.


పది సంవత్సరాల క్రితం 2010లో అమెరికా వాణిజ్య ప్రతినిధి రాన్‌ కిర్క్‌ అమెరికా సెనెట్‌లో వచ్చిన ఒక ప్రశ్నకు స్పందించిన తీరు ఎలా ఉందో చూడండి.” మనం తీవ్ర ఆశాభంగం చెందాం. సాధారణంగా మనం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎక్కడా బయటకు చెప్పం. కానీ వ్యవసాయ అంశాలలో వారి మార్కెట్‌ను తెరిచే అంశంపై భారత్‌ మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఎన్ని అవకాశాలుంటే అన్నింటినీ పరిశీలిస్తున్నాం.” అన్నాడు. పది సంవత్సరాల తరువాత జరిగిందేమిటి ? 2019లో నరేంద్రమోడీ సెప్టెంబరులో అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు భారత్‌కు ఎగుమతులను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రంప్‌ ప్రకటించారు. నవంబరులో నరేంద్రమోడీ సర్కార్‌ ఆర్‌సిఇపి నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ప్రకటించింది.

అమెరికాతో ఒప్పందాలు చేసుకున్న దేశాలు-పర్యవసానాలను క్లుప్తంగా చూద్దాం.ఎవరో అమెరికాతో కలసి తొడ కోసుకున్నారని మనం మెడకోసుకోలేము. ఒప్పందాలు కూడా అంతే. అన్ని దేశాలకూ ఒకే సూత్రం వర్తించదు.అమెరికాతో చైనా ఒప్పందం చేసుకుంటే లేని తప్పు మనం చేసుకుంటే ఉంటుందా అని కాషాయ దళాలు వెంటనే దాడికి దిగుతాయి. త్వరలో అమెరికా జిడిపిని అధిగమించే దిశ, దశలో చైనా ఉంది, మనం ప్రస్తుతానికి పగటి కలలో కూడా ఆ పరిస్ధితిని ఊహించుకోలేమని గ్రహించాలి. ఆర్‌సిఇపి ఒప్పందం కటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం మరింత ప్రమాదకరం. ఎందుకంటే అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీలు ప్రపంచంలో మరే దేశమూ ఇవ్వటం లేదు.
మన దేశంలో ఒక కమతపు సగటు విస్తీర్ణం ఒక హెక్టారు. అదే అమెరికాలో 176 ఉంటుంది, అంటే ఆ రైతులతో మనం పోటీ పడాలి. అక్కడ మొత్తం కమతాలు 21లక్షలు, వ్యవసాయం మీద ఆధారపడే జనం కేవలం రెండుశాతం. అదే మన దేశంలో 14 కోట్ల 60లక్షలు. సగం మంది జనం వ్యవసాయం మీదే బతుకు. తొలిసారిగా నరేంద్రమోడీ సర్కార్‌ 2018లో పాడి ఉత్పత్తుల మీద ప్రమాణాలను సడలించి అమెరికా నుంచి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 30 నుంచి 60శాతం వరకు ఉన్న దిగుమతి పన్నును ఐదుశాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. వెయ్యి ఆవుల లోపు డైరీల నుంచి 45శాతం, రెండున్నరవేల ఆవులకు పైగా ఉన్న డైరీల నుంచి అమెరికాలో 35శాతం పాల ఉత్పత్తి ఉంది. పెద్ద డైరీల్లో 30వేల వరకు ఉన్నాయి. అక్కడి డైరీ యాజమాన్యాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పాడి ఉత్పత్తుల మీద 15, 20 సంవత్సరాల వ్యవధిలో 40శాతంగా ఉన్న పన్ను మొత్తాన్ని ఐదు శాతానికి తగ్గిస్తామని 2019లో జపాన్‌ ఒప్పందం చేసుకుంది. దేశంలో పాడి పరిశ్రమలో కార్పొరేట్‌ శక్తులు గుత్తాధిపత్యం వహించటం మీరెక్కడైనా చూశారా అని ఇటీవల రైతులతో సమావేశం పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్నించారు. ఇప్పుడు లేదు, రేపు విదేశీ ఉత్పత్తులను అనుమతిస్తే పరిస్ధితి ఏమిటి ?


కోడి కాళ్ల దిగుమతులకు మన దేశం మీద అమెరికా తీవ్ర వత్తిడి తెస్తోంది. అది కోరుతున్నట్లుగా పదిశాతం పన్నుతో దిగుమతులకు అనుమతిస్తే 40లక్షల మందికి ఉపాధి ఉండదు. అది ఒక్క కోళ్ల పరిశ్రమనే కాదు, కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్న, సోయాబీన్‌ పండిస్తున్న రైతులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అమెరికాలో కోళ్ల పరిశ్రమను ఐదు బడా కార్పొరేషన్లు అదుపు చేస్తున్నాయి.2016లో కోడి, గొడ్డు, పంది మాంస మార్కెట్లో సగం వాటా వాటిదే. అక్కడి రైతులతో అవి ఒప్పందాలు చేసుకుంటాయి. బ్రెజిల్‌ తరువాత కోడి మాంసాన్ని ఎగుమతి చేస్తున్న రెండవ దేశం అమెరికా. ఆ రెండు ప్రపంచంలో సగం కోడి మాంసాన్ని ఎగుమతి చేస్తున్నాయి.

అమెరికాతో త్వరలో ఒక వాణిజ్య ఒప్పందాలకు ముందే అమెరికా కార్పొరేట్లను సంతృప్తి పరచటం లేదా విశ్వాసం కలిగించటానికే కేంద్ర ప్రభుత్వం రెండు వ్యవసాయ చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణలను ఆర్డినెన్సులుగా తీసుకు వచ్చి పార్లమెంటులో ఆమోదింప చేయించుకున్నట్లుగా స్పష్టం అవుతోంది. విద్యుత్‌ సంస్కరణలకు ముసాయిదా బిల్లును రూపొందించి విడుదల చేశారు, అభిప్రాయాలను కోరారు. అదే మాదిరి ఉమ్మడి జాబితాలో అంశాల మీద రాష్ట్రాలను సంప్రదించకుండా, రైతు సంఘాలు, పార్టీలతో చర్చించకుండా అసలు పార్లమెంటుతో కూడా నిమిత్తం లేకుండా ముందే ఒక నిర్ణయం చేసి వ్యవసాయ బిల్లులకు తరువాత పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేయించటం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్దం.


అడ్డదారి, దొడ్డిదారుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవసాయ సబ్సిడీలు ఇస్తున్నది అమెరికా అన్నది స్పష్టం. 2014లో అమెరికా ఆమోదించిన వ్యవసాయ చట్టం మేరకు పది సంవత్సరాల కాలంలో 956 బిలియన్‌ డాలర్ల సబ్సిడీలు ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత 2019లో మరో పదేండ్ల పాటు(2034వరకు) 867 బిలియన్‌ డాలర్లు అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. చైనాతో వాణిజ్య యుద్దం ప్రారంభించిన అమెరికన్లు దానిలో ముందుకు పోలేక- వెనక్కు రాలేక ఇతర దేశాలకు తమ వస్తువులను అమ్ముకొనేందుకు పూనుకున్నారు.


మన దేశంలో సోయాను గణనీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాతో సాగిస్తున్న వాణిజ్య యుద్దం కారణంగా అమెరికా సోయా ఎగుమతులు పదకొండు శాతం పడిపోయాయి. దాన్ని మన దేశానికి ఎగుమతులు చేయటం ద్వారా భర్తీ చేసుకోవాలని అమెరికా ఆత్రంగా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల మేరకు 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మెక్సికోతో వాణిజ్యం ఒప్పందం చేసుకున్న అమెరికా తన సబ్సిడీ మొక్కజొన్నలను అక్కడ గుమ్మరించటంతో 20లక్షల మంది తమ జీవనాధారాన్ని కోల్పోయారు.
2016 డిసెంబరులో మోడీ పభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో గత ఏడాది ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు. మరి రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? విదేశీ గోధుమలతో మన దేశంలో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గితే పరిస్దితి ఏమిటి ? పంజాబ్‌, హర్యానా, ఇతరంగా గోధుమలు ఎక్కువగా పండే ప్రాంతాల రైతాంగం ఆందోళనలో ముందు ఉన్నదంటే ఇలాంటి అనుభవాలే కారణం.

తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ధాన్య సేకరణ వివరాల ప్రకారం డిసెంబరు 30 నాటికి 479.35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా వాటిలో 42.3శాతం పంజాబ్‌, 11.7శాతం హర్యానా నుంచే ఉన్నాయి. అక్కడి రైతాంగం ఎందుకు ముందుగా స్పందించిందో ఇవి కూడా వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశం అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య సంప్రదింపుల స్వభావం ఏమిటి ? మన దిగుమతి పన్నులను తగ్గించేందుకు బేరమాడుతోంది. బెదిరింపులకు దిగింది. మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ప్రాధాన్యత పధకం (జనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ ాజిఎస్‌పి) కింద ఇస్తున్న పన్ను రాయితీలను డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తివేశాడు. అదే విధంగా మరికొన్ని ఉత్పత్తుల మీద అదనంగా దిగుమతి పన్ను విధించాడు. ఇవన్నీ మనలను లొంగదీసుకొనేందుకు అమెరికా అనుసరిస్తున్న బెదిరింపు ఎత్తుగడల్లో భాగమే. మన ప్రధాని నరేంద్రమోడీ పదే పదే కౌగలించుకున్నప్పటికీ ట్రంప్‌ మనకు చేసిన మేలేమీ లేదు. ఇప్పుడా పెద్దమనిషి ఇంటిదారి పట్టాడు. త్వరలో అధికారం చేపట్టనున్న జో బైడెన్‌ వ్యవహారశైలి ఎలా ఉంటుందో తెలియదు. అమెరికా అధ్యక్ష పీఠం మీద ఎవరు కూర్చున్నా అమెరికాకే అగ్రస్ధానం కోసం ప్రయత్నిస్తారు. ఇప్పుడు మనలను మరింత ఇరకాటంలో పెట్టేందుకు అమెరికన్లకు అవకాశాలు పెరిగాయి. వారి వత్తిడికి లొంగి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడు వ్యవసాయ చట్టాల వలన వచ్చే ముప్పు మరింత పెరుగుతుంది. కోళ్లు, పాడి వంటి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితం కావటం అనివార్యం. మన పాడి పరిశ్రమ సమస్యలను పట్టించుకోని కారణంగానే ఆర్‌సిఇపిలో చేరలేదని మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అదే పెద్దలు ఇప్పుడు ఉద్యమిస్తున్న రైతుల ఆందోళనను పట్టించుకొనేందుకు, వద్దంటున్న చట్టాలను వెనక్కు తీసుకొనేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు ? రేపు ఏదో ఒకసాకుతో అమెరికాకు, ఇతర ధనిక దేశాలకు లొంగిపోరన్న హామీ ఏముంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డిసెంబరు 27: నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ -నిరసనగా రైతుల తాలీ బజావ్‌ !

25 Friday Dec 2020

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi agitation, Narendra Modi on Farmers


ఎం కోటేశ్వరరావు
” సానుభూతి పరులుగా దగ్గరకు చేరి రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్న వారికి భవిష్యత్‌లో జనం పాఠం చెబుతారు ” ఈ మాటలు చెప్పింది పోతులూరి వీరబ్రహ్మంగారు కాదు. మన ప్రధాని నరేంద్రమోడీ కొలువులోని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పని ఎవరు చేస్తే వారికి నిజంగానే జనం బుద్ది చెబుతారు. అది మోడీ నాయకత్వంలోని బిజెపి నేతలకూ, వారి ప్రభుత్వానికి గుడ్డిగా మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీల పెద్దలూ, ఇతర భజన బృందం ఎవరైనా కావచ్చు. డిసెంబరు 25నాటికి రైతాంగ నిరవధిక ఆందోళనకు నెల రోజులు నిండాయి. మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని ” సుపరిపాలనా రోజు ”గా పాటిస్తూ రైతులు దుష్పరిపాలనా చర్యగా పరిగణిస్తున్న వ్యవసాయ చట్టాలను సమర్ధించుకొనేందుకు నరేంద్రమోడీ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఒక విడత పంపిణీ పేరుతో ఆరు రాష్ట్రాల రైతులు కొందరిని పోగుచేసి ప్రధాని నరేంద్రమోడీ, ఆయన గణం రైతుల ఉద్యమం మీద దాడి చేశారు. ఎవరి పాత్రను వారు రక్తికట్టించారు. మరోవైపు నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌ వినిపించే సమయంలో జన్‌కీ బాత్‌ను జనం దృష్టికి తెచ్చేందుకు డిసెంబరు 27వ తేదీన తాలీ బజావ్‌ (చప్పట్లు కొట్టటం) కార్యక్రమానికి రైతులు పిలుపు నిచ్చారు. అంబానీ-అదానీ ఉత్పత్తులను బహిష్కరించటం, ఇంకా మరికొన్ని కార్యక్రమాలను రైతు సంఘాలు ప్రకటించాయి.


సంస్కరణల పేరుతో జనానికి వ్యతిరేకమైన చర్యలకు పూనుకోవటం నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు. అంతకంటే ముందు అనేక దేశాల్లో పాలకులు అదేపని చేశారు. జనం చేత పాఠాలు చెప్పించుకొని ఇంటిదారి పట్టారు. నిజానికి ఇది తెలుసుకొనేందుకు ఇతర దేశాలకు పోనవసరం లేదు. ఏ నినాదాలు ఇచ్చినా పేర్లు ఏమి పెట్టినా కాంగ్రెస్‌ పాలనలో జరిగిందంతా ప్రజావ్యతిరేకమైన చర్యలే, అనుసరించినవి దివాలాకోరు విధానాలే.దీని అర్ధం నూటికి నూరూ అవే అని కాదు. బేరీజు వేసినపుడు త్రాసు ఎటు మొగ్గిందన్నదే గీటు రాయి. కొన్ని క్రతువుల సమయంలో మేకలు, గొర్రెలు, ఇతర పశువులను బలి ఇవ్వబోయే ముందు వాటిని ఎన్నడూ లేని విధంగా మేత పెట్టి, శుభ్రం చేసి, అలంకరించి, పూజలు మరీ చేసి బలి ఇస్తారు. ఇక్కడ బలి క్రతువు ముఖ్యం. ప్రభుత్వ విధానాలూ, సంక్షేమ చర్యలు కూడా అంతే.


నరేంద్రమోడీ గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ 50ఏండ్లలో చేయలేని వాటిని తాము ఐదేండ్లలో చేశామని ప్రాసకోసం ప్రసంగాలు చేశారు. అంతవేగంగా పని చేస్తున్నవారికి జనం మరో యాభైయేండ్లు అవకాశం ఇవ్వరు. అందువలన కేంద్రమంత్రి తోమర్‌ చెప్పినట్లుగా రైతులు తమకు మద్దతు ఇచ్చిన వారికా లేదా తమను ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు, కమిషన్‌ వ్యాపారుల సొమ్ముతీసుకొని కిరాయి ఉద్యమం నడుపుతున్నారని నిందించిన బిజెపికా ఎవరికి పాఠం చెబుతారో తొందరపడనవసరం లేదు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పంపిణీని గతంలో ఎన్నడూ ఇలా ఆర్భాటంగా జరపలేదు. ఇదేదో అదనపు మొత్తం అని రైతులు భ్రమ పడేవిధంగా హడావుడి చేసి రైతులతో మాట్లాడే పేరుతో ప్రధాని, మంత్రులు రైతు ఉద్యమం మీద విరుచుకుపడ్డారు. పోనీ కొత్త విషయాలు ఏమైనా చెప్పారా ? పాడిందే పాడరా అన్నట్లుగా వేసిన నిందనలే వేశారు, పసలేని వాదనలే చేశారు. వ్యవసాయ చట్టాల మీద వెనక్కు తగ్గేది లేదని చెప్పకనే చెప్పారు. నిజానికి కేంద్రానికి, బిజెపికి చిత్తశుద్ది ఉంటే మరోసారి చర్చలకు ఆహ్వానించి ఇలా చేయటాన్ని ఏమంటారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎదుటి వారికి ఇంకా మండుతుంది అన్న విషయం తెలిసిందే.


కొన్ని పార్టీలు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తమ రాజకీయ అజెండాను ముందుకు తెస్తున్నాయని ప్రధాని చెప్పారు. నిన్నగాక మొన్న బీహార్‌ ఎన్నికల సందర్భంగా తమకు ఓటేస్తే కరోనా వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పి కరోనాను కూడా రాజకీయం చేసిన పార్టీ నేత మోడీ. ఇలా చెప్పటానికి ఆయనకు 56 అంగుళాల ఛాతీతో పాటు దానితో పాటు పెంచుకుంటున్న బారు గడ్డం, జులపాలు ఉండటమే అన్నది స్పష్టం. రైతు ఉద్యమాన్ని సమర్ధిస్తున్న ఏ పార్టీ అయినా ఆ పేరుతో ఎక్కడైనా ఓట్లడిగిందా ? కేంద్ర ప్రభుత్వం తర్కబద్దమైన పరిష్కారానికి సిద్దంగా ఉందని, ఇతర సమస్యలేవైనా ఉంటే చెప్పాలని మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి రైతు సంఘాలకు లేఖ రాశారు. తర్క వితర్కాలు జరపాల్సిన సర్వోన్నత ప్రజాప్రతినిధుల సభ పార్లమెంటులో అలాంటి అస్కారం ఇవ్వకుండా ఆమోదతతంగం జరిపిన ప్రభుత్వం, కరోనా పేరుతో ఏకంగా శీతాకాల సమావేశాలనే రద్దు చేసిన పాలకులు తర్కానికి తావిస్తారంటే నమ్మేదెలా ? అసలు దానిలో తర్కం ఏముంది. సావిత్రీ నీపతి ప్రాణంబుదక్క వరాలు కోరుకో అన్నట్లుగా చట్టాల గురించి మాట్లాడుతున్నారు.


గతంలో రైతులు అనేక సమస్యలను ముందుకు తెచ్చారు. ఇతర సమస్యలుంటే రైతులు సందర్భం వచ్చినపుడు చెబుతారు. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాడు ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్‌గా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత చేకూర్చాలని చేసిన సిఫార్సును ఇప్పుడెందుకు తిరస్కరిస్తున్నారో చెప్పేందుకు నోరెత్తరా ? కౌలు మొత్తాన్ని కూడా మద్దతు ధర నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోవాలన్న స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సు సంగతి తెలియని అమాయకుల్లా ఫోజు పెడతారా ? వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే ఎత్తుగడలో భాగంగా ఎవరికైనా విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి రాయితీ ఇవ్వకూడదన్న ప్రతిపాదన గురించి అసలేమీ ఎరగని నంగనాచిలా ప్రవర్తిస్తారా ? రైతులు ఏడుదశాబ్దాల క్రితం మట్టి పిసుక్కొనే స్ధితిలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేరు, అంత అమాయకులు కాదని తెలుసుకుంటే మంచిది.

కేంద్ర మంత్రులు ఏమి మాట్లాడుతున్నారో,ఎందుకు మాట్లాడుతున్నారో తెలియటం లేదు. ముందు ఒక ఏడాది పాటు అమలు జరగనివ్వండి, ఫలితం లేదనుకుంటే అప్పుడు సవరించుకుందాం అని రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ సెలవిచ్చారు. దీని అర్ధం ఏమిటి ? వారు చేసిన దాని మీద వారికే నమ్మకం లేకపోవటం, రైతుల ఉద్యమాన్ని నీరు కార్చే వాదన. ఈ ప్రయోగం చేసేందుకు ఆర్డినెన్స్‌, చర్చ కూడా లేకుండా పార్లమెంటులో ఆమోద ముద్రకోసం ఎందుకు తాపత్రయపడినట్లు ? ఎవరి మెప్పుకోసం ఇది ? కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అవాస్తవాలు చెబుతున్నారని, రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా చెప్పారు. అవేంటో నిజమేమిటో చెప్పకుండా మీ బావ రైతుల భూమిని ఆక్రమించుకున్నాడు, మీరు మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా ఆ మాట అంటే కేంద్ర మంత్రి సూటిగానే ఆరోపించారు. నిజంగా అదే జరిగితే చర్య తీసుకోండి-దానికి రైతుల సమస్యకు సంబంధం ఏమిటి ?


తాము అమలు జరుపుతున్న రైతు అనుకూల విధానాలను 2019 కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదా అని మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ నడుపుతున్న ఉద్యమం కాదు, అందువలన ఆ పార్టీ ఏమి చెప్పిందన్నది రైతులకు అనవసరం. ఆ పార్టీని రైతులు ఇందుకే తిరస్కరించారని, రైతులకు అనుకూలంగా ఉంటారని బిజెపిని ఎన్నుకున్నారని అనుకోవచ్చు కదా ! కాంగ్రెస్‌ సంస్కరణల గురించి చెప్పింది తప్ప చట్టాలు ఇలా ఉంటాయని నమూనాను ప్రదర్శించలేదే. పోనీ ఇలాంటి చట్టాలను తెస్తామని బిజెపి ఎన్నికల ప్రణాళికలో చెప్పి ఉంటే ఫలితాలు ఎలా ఉండేవో బిజెపి నేతలు ఆదిత్య 369 చూస్తే మంచిది.


గతంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు రైతులను వారి పాటికి వారిని వదలి వేశారని ప్రధాని చెప్పారు. నిజమే, వారు వదలివేశారు. కానీ మోడీగారు తమను తీసుకుపోయి కార్పొరేట్‌ బకాసురులకు అప్పగిస్తున్నారని కదా ఇప్పుడు రైతులు భయపడుతోంది. అసలు మార్కెట్‌ కమిటీలే లేని కేరళలో అధికారంలో ఉన్న వారు ఫొటోల కోసం పంజాబ్‌ రైతులతో చేతులు కలుపుతున్నారని మరొక విసురు. అసలు కేరళలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల వ్యవస్ధ లేదు.బీహార్‌లో ఉన్న కమిటీలను రద్దు చేయటాన్ని బిజెపి సమర్ధించింది. దేశంలో మిగతా చోట్ల ఉన్నవాటిని నామమాత్రం చేసేందుకు, పనికిరాకుండా చేసేందుకు పూనుకున్న పెద్దలు కేరళలో మార్కెట్‌ యార్డుల కోసం ఎందుకు ఆందోళన చేయటం లేదని ప్రశ్నించటమే అసలు రాజకీయం. అనేక రాష్ట్రాలలో అనేకం లేవు. కేరళ స్ధానిక సంస్ధలకు ఇచ్చిన అధికారాలు మరొక రాష్ట్రంలో లేవని అందరూ చెబుతున్నారు. ఆరు సంవత్సరాలుగా, అంతకు ముందు ఒక దఫా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం లేదా పార్టీ ఎన్నడైనా కేరళలో మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎందుకు అడగలేదో చెప్పగలవా ?


కేంద్రం సవరించిన మూడు చట్టాలు కేవలం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు సంబంధించినవే కాదు, అదొక ముఖ్య అంశం మాత్రమే, కనుక ప్రధాని ఢిల్లీ నుంచి గల్లీ స్ధాయికి దిగి విమర్శ చేశారనుకోవాలి. చట్టాలలోని అంశాలు రైతులకు హానికరం కనుక కేరళ ప్రభుత్వం ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ను కోరింది. రాష్ట్ర మంత్రివర్గం చేసిన నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్దంగా గవర్నర్‌ తిరస్కరించారు. కేరళ గురించి చెప్పే ముందు ఎవరైనా కొన్ని విషయాలు గమనంలో ఉంచుకోవాలి. గతేడాది అక్కడి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,695 రూపాయలు చెల్లించగా ఈ సంవత్సరం రూ.2,748 రూపాయలకు పెంచి రైతుల నుంచి కొనుగోలు చేసింది. కేంద్రం నిర్ణయించిన ధర రూ.1,868 కాగా అదనంగా ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ రూ.880 అదనంగా ఇస్తోంది. ఎక్కడైనా ఇంతధర ఇస్తున్నారా ?( ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలకు కొనుగోలు చేస్తే అందుకయ్యే వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని, ఎఫ్‌సిఐకి ఇవ్వాల్సిన కోటా మేరకే మద్దతు ధరకు తీసుకుంటారని, మిగతా సేకరణతో తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు 18న ఎఫ్‌సిఐ చైర్మన్‌కు పంపిన ఫైల్‌లో స్పష్టం చేసింది.) మార్కెట్‌ కమిటీలు లేవని, మాకేమీ సంబంధం లేదని, నిధుల కొరత అనిగానీ వదలివేయలేదు, రైతాంగాన్ని ఆదుకోవటం ముఖ్యం.


నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్ని రైతువ్యతిరేక చర్యలు తీసుకున్నా తమను ఆదుకొనే వామపక్ష ప్రభుత్వం ఉందన భరోసా అక్కడి రైతుల్లో ఉండవచ్చు. అయినా ఆందోళన చేస్తున్న రైతాంగానికి మద్దతు తెలపటం తప్పెలా అవుతుంది. అన్నింటికీ మించి కేరళలో ప్రధానమయిన పంటలు వరి, గోధుమలు కాదు.అక్కడి భౌగోళిక పరిస్ధితుల్లో తోట పంటలు, టీ, కాఫీ, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాల పంటలు ఎక్కువ. వాటికోసం దేశమంతటి నుంచి వ్యాపారులే రావటం లేదా తమ ఏజంట్లను ఏర్పాటు చేసుకొని కొనుగోలు చేస్తారు. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ దిగుమతి, పన్ను విధానాలు రైతాంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ వ్యవసాయ మార్కెట్‌ యార్డులు లేవు. మోడీ సర్కార్‌ చెబుతున్నదాని ప్రకారం కార్పొరేట్‌ సంస్దలు లేదా వ్యాపారులు పోటీపడి అక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. అలాంటి ప్రత్యేక లావాదేవీలేమీ అక్కడ లేవు. కేరళ లేదా యార్డులను రద్దు చేసిన బీహారుకు గానీ ప్రయివేటు పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. రబ్బరు పారిశ్రామికవేత్తల వత్తిడి కారణంగా పన్నుతగ్గింపుతో రబ్బరు దిగుమతులు రబ్బరు ధరల పతనానికి, ఖాద్య తైలాల దిగుమతులతో కొబ్బరి ధర పతనం, వేరేదేశాల నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న సుగంధ ద్రవ్యాల కారణంగా వాటి ధరలు పడిపోతున్నాయి. ఇవేవీ మార్కెట్‌ యార్డుల పరిధిలోని అంశాలు కాదు. అందుకే అక్కడి రైతులకు మార్కెట్‌ యార్డులు ఉన్నాయా లేవా అన్నదాని కంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే ముఖ్యం. కేంద్రానికి చిత్తశుద్ది, శ్రద్ద ఉంటే నరేంద్రమోడీ వాటి గురించి మాట్లాడి ఉంటే విస్వసనీయత ఉండేది.


తాను తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల ఫలితాలు రావటం ఆరంభమైందని నరేంద్రమోడీ చెబుతున్నారు. రైతుల్ని నమ్మమంటున్నారు. నెల రోజుల క్రితం క్వింటాలు బంగాళాదుంపలను రూ.3,400కు అమ్ముకున్న రైతులు ఇప్పుడు 700కు అమ్ముకుంటున్నారు. మొక్కజొన్నల కనీస మద్దతు ధర 1850 ఉండగా కొన్ని చోట్ల నాలుగైదు వందలకు తక్కువకు రైతులు అమ్ముకుంటున్నారిప్పుడు.పత్తి కూడా తక్కువకే ఆమ్ముకున్నారు. ఈ కారణంగానే కనీస మద్దతు ధరలకంటే ఎవరూ తక్కువకు కొనకూడదు, కొంటే నేరం అనే విధంగా చట్టం చేయాలని రైతులు అడుగుతున్నారు. నిజానికి ఇప్పుడు చేసిన చట్టసవరణలు నిజంగా కార్పొరేట్లు,ఇతర వ్యాపారుల మధ్య పోటీని పెంచి రైతాంగానికి కనీస మద్దతు ధరల కంటే ఎక్కువే వస్తే రైతుల కంటే ఎక్కువ లబ్ది పొందేది ప్రభుత్వాలే. పంటల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టనవసరం లేదు, వాటిని నిలువ చేసేందుకు గోదాములతో పని లేదు, సిబ్బందీ అవసరం ఉండదు. కనీస మద్దతు ధరలకంటే మార్కెట్లో ధరలు తక్కువ ఉన్నపుడే, చట్టబద్దత కల్పించిన చట్టంతో పని ఉంటుంది తప్ప ఎక్కువ ఉంటే దాని అమలు కోసం ఏ రైతూ ముట్టడి ఉద్యమాలకు పూనుకోరు కదా ? అలాంటపుడు కనీస మద్దతు ధరల చట్టం కుదరదు అని కేంద్రం అడ్డం తిరిగి ఎందుకు మాట్లాడుతోంది ? పోనీ ఆటంకం ఏమిటో చెప్పాలి కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల ఆందోళన – వెనక్కు తగ్గేది లేదంటున్న బిజెపి !

10 Thursday Dec 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Farmers agitations, indian farmers


ఎం కోటేశ్వరరావు


పద్నాలుగు రోజుల పాటు ఉద్యమాన్ని అణచేందుకు, నీరుగార్చేందుకు ప్రయత్నించిన తరువాత ఇంటా బయటా వత్తిడి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రైతుల ముందు రాతపూర్వక ప్రతిపాదనలు ఉంచింది.రైతు సంఘాలు వాటిని తిరస్కరించి సవరించిన చట్టాలను పూర్తిగా ఎత్తివేయాలని, ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, దానిలో భాగంగా డిసెంబరు 12న టోల్‌ ప్లాజాల్లో, 14న ఉత్తరాది రాష్ట్రాల నుంచి చలో ఢిల్లీ, మిగిలిన చోట్ల జిల్లా కేంద్రాల్లో కొత్త ఆందోళనను ప్రకటించారు. ఎప్పుడు ఏమి జరగనుందనే ఆసక్తి పెరుగుతోంది. ముందు రైతుల పట్ల మోడీ సర్కార్‌ తీరుతెన్నులు, ప్రపంచంలో స్పందన అంశాలను చూద్దాం.

రాజనీతిజ్ఞుడి ప్రతిభ ఒక పెద్ద సమస్య వచ్చినపుడు వ్యవహరించేతీరు తెన్నుల మీద ఆధారపడి ఉంటుంది. దేశాధినేత ప్రధాని. రైతులు ఆందోళనకు దిగినపుడు దానిని పరిష్కరించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు, ఓకే. వారు దాన్ని ఏదో ఒక దరి చేర్చక ముందే ప్రధాని రైతులను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. వ్యూహకర్తలు సరిగా పని చేస్తున్నారా ? లెక్కచేయాల్సిన అవసరం లేదనే పెడసరపు ధోరణికి లోనయ్యారా అన్న అనుమానం వస్తున్నది. కొద్ది రోజుల క్రితం రైతుల ఉద్యమం వెనుక ఖలిస్తానీలు ఉన్నారన్న బిజెపి పెద్దలు ఇపుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యమం వెనుక చైనా-పాక్‌ హస్తం ఉందని కేంద్ర మంత్రి రావు సాహెబ్‌ దనవే నిందించారు. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ని తప్పించి హౌ మంత్రి అమిత్‌ షాను రంగంలోకి దించారు. ఫలితం లేదు. తిరిగి రైతులకు విజ్ఞప్తి చేసేందుకు తోమర్‌ను నియమించారు. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది.


నవంబరు 27 నుంచి రైతులను ఢిల్లీ శివార్లలో నిలిపివేశారు. వారు నగరంలోకి రాకుండా శత్రుసేనలను ఎదుర్కొనే మాదిరి రోడ్ల మీద కందకాలు తవ్వారు, ఇతర ఆటంకాలను ఏర్పాటు చేశారు, భద్రతా దళాలను మోహరించారు. అనేక దేశాల్లో జనం వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమించారు గానీ ఎక్కడా ఇలా కందకాలు తవ్వటాన్ని చూడలేదని అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల నేతల నోళ్లలో నానటం నరేంద్రమోడీ పరువును పెంచుతుందా ?


చైనా అంతర్భాగమైన హాంకాంగ్‌లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రదర్శనల గురించి మన దేశం ఐక్యరాజ్యసమితి మానవహక్కుల వేదిక మీద ఆందోళన వ్యక్తం చేసింది.ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కాదా అంటే కాదు కాదు హాంకాంగ్‌లో భారతీయ పౌరులు ఉన్నారు గనుక అని మన ప్రతినిధులు సమర్ధించుకున్నారు. హాంకాంగ్‌ చైనాకు చెందినదే అయినప్పటికీ పూర్తిగా విలీనం అయ్యేందుకు 2049వరకు గడువు ఉంది. అక్కడ విదేశీయుల మీద ఎలాంటి దాడులు జరగలేదు. సంవత్సరాల తరబడి ప్రదర్శనలు చేస్తున్నా, రెచ్చగొడుతున్నా అక్కడి పోలీసులు రెచ్చి పోలేదు.అయినా మన దేశం ” ఆందోళన ” వ్యక్తం చేసింది.


కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ గురునానక్‌ జయంతి సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని మన ప్రభుత్వం ఆ దేశరాయబారిని పిలిచి నిరసన తెలిపింది. మన దేశంలోని 543 సభ్యులుండే లోక్‌సభలో పదమూడు మంది సిక్కు సామాజిక తరగతికి చెందిన వారు ఎంపీలుగా ఉన్నారు. అదే కెనడాలోని 338 మంది సభ్యులున్న దిగువ సభలో 18 మంది సభ్యులు, ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు.కెనడా-పంజాబ్‌-భారత్‌లోని సిక్కుల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి తెలిసిందే. ప్రస్తుత ఉద్యమంలో సిక్కులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున కెనడా ప్రధాని మౌనంగా ఉండగలరా ?

లక్షలాది మంది రోజుల తరబడి ఎముకలు కొరికే చలిలో రోడ్ల మీద ఆందోళన చేస్తున్న కారణంగానే రాజకీయాలతో నిమిత్తం లేని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శాంతియుతంగా ప్రదర్శనలు చేసుకొనేందుకు జనానికి హక్కు ఉన్నదని చెప్పారు.కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌, బ్రిటన్‌, అమెరికా ఎంపీలు అనేక మంది అప్పటికే రైతుల ఆందోళన గురించి ప్రస్తావించారు. వివిధ పార్టీలకు చెందిన 36 మంది బ్రిటన్‌ ఎంపీలు అదేశ విదేశాంగమంత్రి డొమినిక్‌ రాబ్‌కు లేఖ రాస్తూ తమ ఆందోళనను భారత ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని, ఆ ఆందోళన అనేక మంది బ్రిటీష్‌ సిక్కులు, పంజాబీలను ప్రభావితం చేస్తున్నదని పేర్కొన్నారు.

ఒక్క బ్రిటీష్‌ ఎంపీలే కాదు అమెరికన్లు కూడా ఉన్నారు. మరోసారి డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ రాబోతున్నదంటూ ఎన్నికలలో నరేంద్రమోడీ మద్దతు పలికిన విషయం తెలిసిందే. సదరు ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ కాలిఫోర్నియా ఎంపీ డగ్‌ లామాలఫా, డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జోష్‌ హార్డర్‌ రైతులకు మద్దతు తెలిపారు. ఫలవంతమైన చర్చలు జరపాలని మోడీని కోరారు. మరికొందరు ఎంపీలు కూడా ఇదే హితవు చెప్పారు. ఆండీలెవిన్‌ వంటి వారు ఉద్యమం తమకు ఉత్తేజమిచ్చిందని చెప్పారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్లు రైతుల ఉద్యమం గురించి పెద్ద ఎత్తున వార్తలు, వ్యాఖ్యలు చేశాయి. ఏ దేశంలో అయినా లక్షలాది మంది ఉద్యమంలోకి దిగినపుడు మానవతా పూర్వకంగా ఆందోళన వ్యక్తం చేయటం, సమస్యలను పరిష్కరించాలని హితవు పలకటం జరుగుతున్నదే. అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో నరేంద్రమోడీ స్నేహితుడైన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి, దేశాధ్యక్షుడి మీద తిరుగుబాటు చేసేందుకు పోలీసులు, మిలిటరీని ఎలా ప్రోత్సహించిందీ తాజాగా బొలీవియాలో చూశాము. వెనెజులాలో ప్రతిపక్ష నేతను దేశాధినేతగా గుర్తించటం వంటి వ్యవహారాలకు – ఉద్యమాలకు మద్దతు ప్రకటించటానికి ఉన్న తేడాను గుర్తించాలి. రైతుల ఉద్యమం మోడీ సర్కార్‌ మీద తిరుగుబాటు కాదు, అలా మారే అవకాశాలూ లేవు.


అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదతర దేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులు రైతులకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. అమెరికాలోని ఓక్లాండ్‌ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ కాన్సులేట్‌ కార్యాలయానికి ప్రదర్శన చేశారు. న్యూయార్క్‌, చికాగో, వాషింగ్టన్‌ డిసి వంటి ఇంకా అనేక చోట్ల చిన్నా, పెద్ద ప్రదర్శనలు జరిగాయి. లండన్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయం ముందు వేలాది మంది భారత ప్రభుత్వానికి నిరసన, రైతులకు మద్దతు తెలిపారు. ఈ ప్రదర్శనను భారత వ్యతిరేక వేర్పాటు వాదులు జరిపారని హైకమిషన్‌ ఆరోపించింది. కెనడాలోని టోరొంటోలో ఉన్న భారతకాన్సులేట్‌ కార్యాలయం ముందు వందలాది మంది ప్రదర్శన జరిపారు. ఇంకా ఇతర అనేక చోట్ల ప్రదర్శనలు, వాహన ర్యాలీలు జరిగాయి.ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్‌బెన్‌, కాన్‌బెర్రా తదితర పట్టణాల్లో ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల నుంచి ఆన్‌లైన్‌లో పిటీషన్ల మీద సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.


రైతాంగం పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసన తెలుపుతూ అనేక మంది క్రీడా ప్రముఖులు డిసెంబరు ఏడున రాష్ట్రపతి భవన్‌కు ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం మొండిగా ఉంటే తాము సాధించిన అవార్డులను తిరిగి ఇచ్చివేస్తామని హెచ్చరించారు. తమతో పాటు 35 అర్జున, ద్రోణాచార్య, పద్మశ్రీ, ధ్యానచంద్‌అవార్డులను వారు తీసుకు వెళ్లారు. ఇలాంటి పరిణామాలు రావటానికి కారకులు కేంద్ర పాలకులు.ఇప్పుడు రైతులు, రాబోయే రోజుల్లో తమను దెబ్బతీసే విధానాలను ముందుకు తెచ్చినందున వాటికి వ్యతిరేకంగా కార్మికులు కూడా రంగంలోకి రాబోతున్నారు. నవంబరు 26వ తేదీ సమ్మె దానికి ఒక హెచ్చరిక.


రైతులు ఆందోళన చేయటం ఇప్పుడే ప్రారంభమైందా ? ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరటం మన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక మన ప్రభుత్వం దాన్నుంచి వైదొలగాలని రైతు సంఘాలు, వామపక్షాలు, దాదాపు అన్ని పార్టీలు కోరాయి. అయినా ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ రాలేదు. ఇదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్య వర్గాల నుంచి కూడా అనుకూలంగానూ వ్యతిరేకంగానూ తీవ్రమైన వత్తిడి వచ్చింది. ఊగిసలాటలో ఉన్న ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు 2019 నవంబరు నాలుగున రైతులు ప్రదర్శనలు కూడా చేశాయి. ఎవరి వత్తిడి ఎంత పని చేసిందీ అన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు వెనక్కు తగ్గింది, ఆమేరకు అందరూ హర్షించారు.
ఆర్‌సిఇపిలో చేరిక గురించి ఎనిమిది సంవత్సరాలు తర్జన భర్జన పడిన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రతికూల మార్పులు తెస్తాయని భయపడుతున్న వ్యవసాయ చట్టాల మార్పుల గురించి మేథోమధనం చేయకుండా ఆర్డినెన్స్‌ రూపంలో తేవాల్సినంత అత్యవసరం ఏముంది ? పోనీ తెచ్చారు, బిల్లును పార్లమెంట్‌ కమిటీకి నివేదించాలన్న ప్రజాస్వామ్యయుతమైన డిమాండ్‌ను తోసి పుచ్చి చర్చలను ఒక ప్రహసనంగా మార్చి ఆమోద ముద్ర ఎందుకు వేయించుకున్నట్లు ? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కొన్ని మార్పులు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంది? కరోనా వైరస్‌ నివారణకు పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుందని ఒక ముఖ్యమంత్రి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే చాలు అన్న మరొక ముఖ్యమంత్రి చిట్కాల మాదిరి రైతుల ముందు కేంద్రం ఉంచిన ప్రతిపాదనలు ఉన్నాయి. అందుకే రైతులు తిరస్కరించారు.


చర్చలు కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి)కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటనల మీద ప్రకటనలు చేయటం తప్ప రైతుల డిమాండ్‌ను పట్టించుకోవటం లేదు. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తూ, వాటి నిర్ణయానికి సమగ్ర వ్యవస్దను ఏర్పాటు చేయాలన్న న్యాయమైన కోర్కెను కేంద్రం ఎందుకు అంగీకరించటం లేదు అన్నది చాలా మందికి అంతుబట్టటం లేదు. అమలు జరుపుతామంటున్నారు కదా దాన్నే చట్టబద్దం చేస్తే పోయేదేమిటి అని హర్యానా బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న జననాయక్‌ జనతా పార్టీ(జెజెపి) నేతల హితవును కూడా పట్టించుకోలేదు. ఎంతసేపటికీ అమలు జరుపుతామని చెబుతున్నాం కదా అన్నదానికి మించి ఒక్క ముక్క చెప్పటం లేదు. వ్యవసాయ చట్టసవరణలకు-కనీస మద్దతు ధరలకు అసలు సంబంధం లేదని వాదిస్తున్నారు తప్ప చట్టబద్దం చేసేందుకు ఆటంకం, అభ్యంతరం ఏమిటో చెప్పరు.


డిసెంబరు తొమ్మిదిన కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ ఒక లేఖ రూపంలో పంపిన ప్రభుత్వ ప్రతిపాదనలు రైతాంగాన్ని సంతృప్తిపరచేవిగా లేవని తిరస్కరించారు. వాటిలో ఉన్న అంశాలేమిటి ?1. ప్రస్తుతం ఉన్న ఎంఎస్‌పి వ్యవస్దను అలాగే కొనసాగిస్తాము, పంటల సేకరణ కూడా కొనసాగుతుంది. రైతులు ఏమంటున్నారు ? ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలి, రైతు ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మరింత శాస్త్రీయంగా ధరల నిర్ణాయక వ్యవస్ధను ఏర్పాటు చేసి సాధికారత, చట్టబద్దత కల్పించాలన్న రైతుల డిమాండ్‌కు దీనికి అసలు పొంతనే లేదు. 2. ప్రభుత్వ (నోటిఫైడ్‌) మార్కెట్‌-స్వేచ్చా మార్కెట్‌ అన్న తేడా లేకుండా పన్నులు, సెస్‌లను అన్నింటికీ ఒకే విధంగా వర్తింప చేస్తాము. రైతుల వాదన ఏమిటి ? మార్కెట్‌ యార్డుల పరిధులను కుదించి అసలు ఆ వ్యవస్ధనే నామమాత్రం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నాం. అవి ఉపయోగం లేకుండా పోయిన తరువాత కార్పొరేట్‌ చేతుల్లో రైతులు ఇరుక్కుంటారు గనుక మార్కెట్‌ యార్డుల్లోనే ఎవరైనా కొనుగోళ్లు జరపాలి. 3.నియంత్రణలేని మార్కెట్లలో లావాదేవీలు జరిపేవారు నమోదు చేసుకొనే విధంగా సవరణలు తెస్తాము. రైతుల అభ్యంతరం ఏమిటి ? నియంత్రణలు లేని మార్కెట్లుంటేనే రైతులకు రక్షణ ఉండదు, నమోదు అన్నది నామమాత్రమే.కంటితుడుపే ! 4.నగదు బదిలీకి బదులు సబ్సిడీ వర్తించే విధంగా రైతులను విద్యుత్‌ బిల్లుల నుంచి మినహాయిస్తాము. రైతులు అంటున్నదేమిటి ? అసలు ఉచిత విద్యుత్‌ పధకాలను ఎత్తివేసే విధంగా, సబ్సిడీని గరిష్టంగా 20శాతానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదన అమలు జరిగితే ఉచిత విద్యుత్‌ పధకాలకు ఎసరు వస్తుంది. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి పారిశ్రామిక, వాణిజ్యవర్గాలకు మేలు చేకూర్చేందుకే ఈ ప్రయత్నాలు.


కనీస మద్దతు ధరల విధానాన్ని, భారత ఆహార వ్యవస్ధ కార్యకలాపాలను పరిమితం చేసి ధాన్య సేకరణ బాధ్యతను వదలించుకొనేందుకు కేంద్రం పావులు కదుపుతోందనే అనుమానాలు కూడా రైతులకు కలుగుతున్నాయి. వీటికి ఆధారాలు లేవా ? స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు జరుపుతున్నామని చెబుతున్న పాలకులు కీలకమైన వాటిని పక్కన పెట్టారు. ఉదాహరణకు మార్కెట్‌ యార్డులను మరింత పటిష్టపరచాలని చెబితే వాటిని పరిమితం చేసేందుకు చట్ట సవరణ చేశారు. కనీస మద్దతు ధరల నిర్ణాయక అంశాలలో భూమి కౌలును పరిగణనలోకి తీసుకోవటం లేదు.ఇంకా ఇలాంటివే ఉన్నాయి.

భారత ఆహార సంస్ధను నిర్వీర్యం చేస్తారా, సేకరణ మొత్తాలను తగ్గిస్తారా ? ప్రపంచ వాణిజ్య సంస్ద(డబ్ల్యుటివో) నిబంధనల ప్రకారం ఎఫ్‌సిఐ సేకరించిన బియ్యాన్ని అంతర్గత వినియోగానికి విక్రయించవచ్చు తప్ప విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు లేదు.ఈ ఏడాది సెప్టెంబరు ఒకటవ తేదీ నాటికి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎఫ్‌సిఐ వద్ద బియ్యం నిల్వలు 135లక్షల టన్నులు ఉండాలి, వాస్తవ నిల్వలు 222లక్షల టన్నులు ఉన్నాయి. తరువాత సేకరణ తరుణం ప్రారంభం అయినందున నిల్వలు పెరిగి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 2020-21లో 150లక్షల టన్నుల గోధుమలు, 50లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే 2015-16 నుంచి 2019-20 సంవత్సరాలలో గోధుమలు కనిష్టంగా 14.21లక్షల టన్నులు గరిష్టంగా 81.84 లక్షల టన్నులు, బియ్యం 4.9-17.77లక్షల టన్నులు మాత్రమే విక్రయించారు. బీహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉత్పత్తి అయ్యే కోటీ60లక్షల టన్నులలో కేవలం 30లక్షల టన్నులను మాత్రమే సేకరిస్తామని చెప్పింది. మిగిలిన ధాన్యాన్ని రైతులు కనీస మద్దతు ధరల కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఆర్టికల్‌ 13లోని సంధి నిబంధన ప్రకారం దేశీయంగా, ఎగుమతులకు సబ్సిడీలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే అది ఆయా దేశాల ఉత్పత్తి విలువలో పదిశాతం కంటే ఆ మొత్తాలు మించకూడదు. ఈ నిబంధన కూడా 2004 జనవరి ఒకటి నుంచి రద్దయింది. ఈ కారణంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీలను వర్ధమాన దేశాలు సవాలు చేసేందుకు వీలు కలిగింది. అదే ఇప్పుడు చర్చలు ప్రతిష్ఠంభనలో పడటానికి కారణం అయింది. అయితే 2013లో జరిగిన బాలి సమావేశంలో తాత్కాలిక సంధి నిబంధనను రూపొందించారు. దాని ప్రకారం అప్పటికి అమల్లో ఉన్న ఆహార భద్రత పధకాల కింద ఇస్తున్న సబ్సిడీలు నిర్ణీత పదిశాతానికి మించినా ఏ సభ్యదేశమూ సవాలు చేసేందుకు లేదు. తరువాత తెచ్చిన పధకాలకు సబ్సిడీలు ఇవ్వటానికి వీలులేదు. మన దేశం ఆహారభద్రతా చట్టాన్ని 2013లో తెచ్చారు కనుక సబ్సిడీలు కొనసాగించవచ్చు. అయితే ఈ నిబంధన ఎంతకాలం అన్నది స్పష్టత లేదు.2017నాటికి సంధి నిబంధనలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించారు. అయితే అప్పటికీ కుదరకపోతే కుదిరేంతవరకు తాత్కాలిక నిబంధన కానసాగుతుంది.2018-19లో ప్రపంచ వాణిజ్య సంస్దకు మన దేశం అందచేసిన సమాచారం ప్రకారం దేశంలో ఉత్పత్తి అయిన బియ్యం విలువ 43.67 బిలియన్‌ డాలర్లని, ఐదు బిలియన్‌ డాలర్లు సబ్సిడీగా ఇచ్చామని పేర్కొన్నది. ఈ మొత్తం పదిశాతం కంటే ఎక్కువ. సంధి నిబంధనలు ఎంతకాలం కొనసాగుతాయో తెలియదు. ఎలా రూపొందిస్తారో స్పష్టత లేదు. సబ్సిడీలను తగ్గించాలని ఒక వైపు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యుటివో వత్తిడి తెస్తున్నాయి. ఈ కారణంగానే వ్యవసాయానికి ఇచ్చే ఎరువుల సబ్సిడీ గత ఏడు సంవత్సరాలుగా 70వేల కోట్ల రూపాయలకు అటూఇటూగా ఉంది. ఇది మినహా పెరిగిన ధరలను రైతులే భరించాల్సి వస్తోంది. ఇలాంటి పరిమితులనే విద్యుత్‌, ఆహార తదితర వ్యవసాయ సంబంధ సబ్సిడీలకు అమలు జరపబోతున్నారు.
మన దేశంలో ఉత్పత్తి అవుతున్న బియ్యం, గోధుమ ఎగుమతులకు అంతర్జాతీయంగా తీవ్ర పోటీ ఎదురవుతోంది. కొన్ని దశాబ్దాలలో తొలిసారిగా మన దేశం నుంచి చైనా తాజాగా బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నది అనే వార్తలు వచ్చాయి. నిజానికి 2006లో మన బియ్యం దిగుమతికి చైనా అనుమతి ఇచ్చినప్పటికీ నామ మాత్రంగా తప్ప పెద్ద మొత్తంలో దిగుమతి లేదు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ చైనా పదివేల టన్నుల దిగుమతికి నిర్ణయించింది. దీనిలో పక్కా వాణిజ్యం తప్ప ఎలాంటి రాజకీయాలు లేవు. థారులాండ్‌, వియత్నాంల నుంచి దిగుమతి చేసుకొనే బియ్యంతో పోల్చితే మన దేశం టన్నుకు వందడాలర్ల తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకు రావటమే కారణం. ధరలు పెంచినా, చైనాలో తిరిగి ఉత్పత్తి పెరిగినా ఎగుమతులు అనుమానమే.

భారత్‌ 25శాతం బియ్యం రకం టన్ను ధర 2019 నవంబరులో 357.4 డాలర్లు ఉంటే 2020 నవంబరులో 342.8లో ఉన్నట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్ధ సమాచారం వెల్లడించింది. ఇదే రకం థారు బియ్యం ధర 415.4 నుంచి 479.5డాలర్లకు, వియత్నాం బియ్యం 323.6 నుంచి 472.5 డాలర్లకు పెరిగింది. అయితే థారులాండ్‌, వియత్నాంలో సాగు సమస్యలతో బియ్యం ఉత్పత్తి తగ్గటంతో ఎగుమతుల మీద ఆంక్షలు కూడా ఉండటంతో చైనాకు మన బియ్యం ఎగుమతులకు అవకాశం వచ్చింది. మిగతా దేశాలకూ తక్కువ ధరలకే విక్రయిస్తున్నాం.


ప్రపంచ మార్కెట్లో పోటీ తట్టుకోవాలంటే మన దేశంలో ధాన్యం ధర తక్కువగా ఉండాలని, కనీస మద్దతు ధరలను పెంచుకుంటూ పోతే తమకు గిట్టుబాటు కాదనీ ఎగుమతి వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాలు, వాటి పర్యవసానాలను చూసిన తరువాత రైతాంగానికి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పాలకుల మాటలు విశ్వసనీయత సమస్యను ముందుకు తెస్తున్నాయి. ఇప్పటి వరకు రైతాంగానికి-వినియోగదారులకు ఎదురైన అనుభవాలు చూస్తే అధికారంలో ఎవరున్నా బడా వ్యాపారులకు అనుకూలమైన విధానాలు తప్ప రైతులు-జనానికి ఉపయోగపడే చర్యలు లేవు. పాలకులు చెప్పిన అనేక మాటల నీటి మూటలయ్యాయి.మేక పిల్లల వంటి రైతాంగాన్ని తోడేళ్ల వంటి బడా సంస్దలకు అప్పగిస్తాము గానీ అవి తినకుండా రక్షణ చర్యలు తీసుకుంటామన్నట్లుగా కేంద్ర వైఖరి ఉంది. అసలు తోడేళ్లను రప్పించటం ఎందుకు అన్నది మేకల ప్రశ్న.


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శేకాదు, యావత్‌ ప్రపంచం ముక్త కంఠంతో రైతులకు మద్దతు తెలిపినా ఏమౌతుంది ? వారంతా ఢిల్లీ వచ్చి మా ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయం ముందు ధర్నా చేస్తారా ? చేయమనండి చూస్తాం ! ఇది ఒక బిజెపి మిత్రుడి ప్రయివేటు సంభాషణ సారం. నిజమే ! ఏమౌతుంది ? మహా అయితే ప్రపంచనేత అని భుజకీర్తులు తగిలించుకున్న నరేంద్రమోడీ పరువు పోతుంది, అంతకు మించి పోయేదేమీ ఉంటుంది ? ఇప్పటికే ప్రపంచ వ్యాపితంగా చర్చ జరుగుతోంది. రైతుల ఆందోళన గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పలేక అది భారత-పాక్‌ వ్యవహారం అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎంతకాలం తప్పించుకుంటారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో వంచనాపూరిత వాదనలు -వాస్తవాలూ !

08 Tuesday Dec 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ 1 Comment

Tags

Bharat Bandh 2020, Farmers agitations, India farmers' protest


ఎం కోటేశ్వరరావు
డిసెంబరు ఎనిమిదిన రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు మేరకు భారత బంద్‌ జయప్రదంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు చర్చలంటున్నది. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ గారే స్వయంగా రెచ్చగొట్టేందుకు పూనుకొని వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నారు. తాజా ఆందోళన ఎంతకాలం కొనసాగుతుంది, ఏమౌతుంది అన్నది ఒక అంశమైతే రైతుల ఆందోళనల సందర్భంగా జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. ప్రతి ఉద్యమ సమయంలో దాన్ని వ్యతిరేకించే శక్తులు తప్పుడు వాదనలూ, అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసేందుకు సామాజిక మాధ్యమాలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. పంజాబు రైతులే ఎందుకు ఆందోళనలో ముందున్నారు, మిగతా రాష్ట్రాల వారు ఎందుకు స్పందించటం లేదు వంటి కొన్నింటి తీరు తెన్నులను చూద్దాం.


1.పార్లమెంట్‌ అంగీకరించిన తరువాత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు ?
ఇది తర్కానికి నిలిచేది కాదు. పార్లమెంట్‌ ఆమోదించినంత మాత్రాన వ్యతిరేకత వ్యక్తం చేయకూడదని చెప్పటం నిరంకుశత్వలక్షణం. ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్ధితిని అప్పటి పార్లమెంట్‌, రాష్ట్రపతి ఆమోదించారు. అయినా నేటి బిజెపి పూర్వ రూపమైన జనసంఘం ఎందుకు వ్యతిరేకించింది ? ఆర్టికల్‌ 370, కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కూడా పార్లమెంటు ఆమోదించినవే అయినా బిజెపి ఎందుకు వ్యతిరేకించింది, రద్దు చేసింది ?


2.ముందే ఎందుకు అభ్యంతరం చెప్పలేదు, ఆందోళన చేయలేదు ?
ఇది తప్పుడు ప్రచారం. ఆర్డినెన్స్‌లు తెచ్చినపుడే వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కరోనా కారణంగా వీధుల్లోకి రాలేదు, అన్నింటికీ మించి వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందనే ఆశ, నమ్మకం ఉండటం. ఇవి రెండూ పోయిన తరువాత మరొక మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాజీనామా చేసిన బిజెపి మిత్రపక్షం అకాలీదళ్‌ చెప్పింది అదే. రెండు వ్యవసాయ, ఒక వినియోగదారుల చట్టాలకు సంబంధించి మార్పులను ఆర్డినెన్సుల ద్వారా అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు అంశాలూ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. చర్చలు జరపలేదు. మెజారిటీ రాష్ట్రాలు బిజెపి పాలనలో ఉన్నాయి గనుక మౌనం దాల్చాయి.


3. ప్రజాస్వామ్య బద్దంగానే జరిగింది కదా !
పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ స్దానే బిల్లులను ప్రవేశపెట్టినపుడు సెలెక్టు కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల అభిప్రాయాలను కేంద్రం తోసి పుచ్చింది. నిరసనల మధ్య ఆమోద తతంగాన్ని పూర్తి చేసింది. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం 17 బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపింది. వీటిని ఎందుకు తిరస్కరించినట్లు ? ఇది ప్రజాస్వామ్యమా ? విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు అంతర్గతంగా హామీ ఇచ్చారు కనుకనే ఆర్డినెన్సు, తరువాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఆమోద తతంగం చేశారు. అందువలన అవి రద్దయ్యేవరకు గళం విప్పుతూనే ఉండటం తప్పెలా అవుతుంది.


4. రైతులు మొండిగా ఉన్నారు, కమిటీ వేస్తామన్నారు కదా, ఎందుకు అంగీకరించరు ?
మొండిగా ఉన్నది ప్రభుత్వమే. తమ మిత్రపక్షం అకాలీదళ్‌ నిరసన వ్యక్తం చేసినా రాజకీయంగా దానితో విడగొట్టుకొనేందుకు అయినా సిద్దపడింది గానీ ఆ పార్టీ చెబుతున్నదానిని కూడా వినిపించుకోలేదు. సెప్టెంబరు 25న అఖిల భారత నిరసన దినం పాటించాలని అఖిల భారత కిసాన్‌ సంఘర్ష సమితి పిలుపు ఇచ్చింది, పాటించారు. అప్పుడు స్పందించలేదు. తరువాత నవంబరు 26న ఆందోళన పిలుపునూ పట్టించుకోలేదు. తీరా రైతులు ఢిల్లీ బయలు దేరిన తరువాత శివార్లలో కందకాలు తవ్వేందుకు, ఆటంకాలు ఏర్పాటుకు చూపిన శ్రద్ద పరిష్కారం మీద లేదు. రైతులు వచ్చిన వారం తరువాత చర్చలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. అయితే వత్తిడిని తట్టుకోలేక ముందే చర్చలకు పిలిచింది. కమిటీని వేస్తామనటం తప్ప మార్పులకు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలు కేంద్రం వైపు నుంచి లేవు. ఇది కాలయాపన, ఉద్యమాన్ని చల్లార్చే ఎత్తుగడ. అలాంటపుడు రైతులేమి చేయాలి ?


5. కేంద్రం చెబుతున్నది ఏమిటి ? రైతులు కోరుతున్నది ఏమిటి ?
ఐదుసార్లు చర్చలు జరిపారు. చట్టాలను పూర్తిగా వెనక్కు తీసుకోవాలని రైతులు ప్రతిసారీ చెప్పారు. సావిత్రీ నీ పతి ప్రాణంబుదక్క వరాలు కోరుకోమన్నట్లుగా అది మినహా ఇతర అంశాల గురించి మాట్లాడుదాం అనటం తప్ప కేంద్రం నుంచి మరొకమాటలేదు. రైతులు చెప్పాల్సింది చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలేమిటో ఇంతవరకు చెప్పలేదు.


6. కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు, కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రధాని చెప్పిన తరువాత కూడా రైతులు ఆందోళన చేయటం ఏమిటి ?
ఆ మార్పులేమిటో నిర్దిష్టంగా చెబితే రైతులు ఆలోచిస్తారు. ఎవరు చెబుతున్నది ఏమిటో జనమూ గ్రహిస్తారు. రైతులు గొంతెమ్మ కోరికలు కోరితే ఆందోళనకు మద్దతు తగ్గిపోతుంది. అయినా ప్రభుత్వం లేదా నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌లో చెప్పిందేమీ లేదు. ఎవరితో సంప్రదించకుండానే ఆర్డినెన్సు తెచ్చారు. పార్లమెంట్‌లో అభ్యంతరాలను పట్టించుకోలేదు. పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా గురించి బిజెపి ఎంత హడావుడి చేసిందో తరువాత ఎలా ప్లేటు ఫిరాయించిందో తెలిసిందే. యాభై రోజుల్లో పెద్ద నోట్ల రద్దు సమస్యను పరిష్కరించలేకపోతే శిక్షించమని మోడీ చెప్పారు. నాలుగేండ్ల తరువాత నల్లధనాన్ని తగ్గించామని బుకాయించటం తప్ప అంకెల్లో చూపారా? జిఎస్‌టి ఆదాయం తగ్గితే పరిహారం ఇస్తామని చేసుకున్న ఒప్పందానికే ఎగనామం పెడుతూ దేవుడి లీల, కేంద్రం పరిహారం ఇవ్వలేదని బుకాయించిన తీరు చూశాము. అందువలన ప్రధాని నోటి మాటలను ఎవరైనా ఎలా నమ్ముతారు ? కనీస మద్దతు ధర గురించి చెబుతున్న మాటలనే చట్టబద్దం ఎందుకు చేయరని రాజస్దాన్‌, హర్యానాలో ఉన్న బిజెపి మిత్రపక్షాలే చెబుతున్నాయి. దాన్నయినా చేస్తామని ఎందుకు చెప్పటం లేదు ?


7. రైతులకు ఉపయోగం లేకపోతే జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు కేంద్రాన్ని ఎందుకు సమర్ధిస్తున్నారు ?
జయప్రకాష్‌ నారాయణ ఒక మాజీ ఐఏఎస్‌ అధికారి. రాజకీయాల్లో ఒక విఫలనేత. ఆయన ఎందుకు సమర్ధిస్తున్నారో స్కాన్‌ చేసి చూడలేము. అయితే ఒక మేథావిగా ఆయన చెప్పిన మాటలను వినాల్సిందే. కానీ అవే ప్రమాణం కాదు. జెపి కంటే వ్యవసాయ-ఆర్ధిక రంగంలో ఎంతో పరిశోధనలు చేసిన నిపుణులు అనేక మంది వ్యతిరేకించారు. తెలుగు రాష్ట్రాల్లో జెపి ఎంత బాగా తెలిసిన వ్యక్తో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా అంతే తెలుసు. మరి నాగేశ్వర్‌ వ్యతిరేకతను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు.

7. రైతులను బిజెపి వ్యతిరేక పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయి !
రైతులు అంత అమాయకులు కాదు. ఒక వేళ ఇతర పార్టీలు తప్పుదారి పట్టిస్తే బిజెపి వారిని సరైనదారిలో పెట్టలేనంత అసమర్ధంగా ఉందా ? ఈ ఆరోపణ రైతుల అనుభవం, తెలివితేటలను అవమానించటం తప్ప మరొకటి కాదు. మన దేశంలో, ప్రపంచంలో రైతాంగ ఉద్యమాలు కొత్త కాదు,ఎన్నో చారిత్మ్రాక పోరాటాలు చేశారని మరచిపోకూడదు. పంజాబ్‌ పోరాటాల గడ్డ, పంజాబీలు అటు సైన్యంలో జైజవాన్లుగా, వ్యవసాయంలో జైకిసాన్లుగా వారి పాత్రను ఎవరూ తక్కువ చేసి చూపలేరు. సెప్టెంబరు 25న తొలి ఆందోళన ప్రారంభమైంది. అప్పటి నుంచి రైతులను సమాధాన పరిచేందుకు బిజెపి చేసింది ఏమిటి ?


8.ప్రతిపక్షాలు ప్లేటు ఫిరాయించాయి. మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ 2019 మానిఫెస్టోలో చెప్పింది.
ప్లేటు ఫిరాయించటం రాజకీయాల్లో కొత్త కాదు, అది ప్రజలకు మేలు చేసేది, తప్పిదాన్ని సరిదిద్దుకొనేది అయితే ఇబ్బంది ఏమిటి. ముఖ్యమంత్రిగా జిఎస్‌టిని వ్యతిరేకించిన నరేంద్రమోడీ తీరా తాను ప్రధాని అయిన తరువాత తగినకసరత్తు లేకుండా అమలు జరపటాన్ని , దేశాన్ని ఇబ్బందుల పాటు చేయటాన్ని ఏమనాలి. అనేక రాష్ట్రాలకు ప్రకటించిన పాకేజీలు, హామీలను తిరస్కరించటం ఏమిటి ? రెండు తెలుగు రాష్ట్రాలకు బిజెపి, కేంద్రి ఇచ్చిన హామీలకు మొండి చేయి చూపటాన్ని ఏమనాలి? బిజెపి గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తోంది.

9. పంజాబ్‌ రైతులు, జాట్‌కులస్తులు తప్ప ఉద్యమంలో ఎవరూ లేరు ?
జయప్రకాష్‌ నారాయణ వంటి మేథావులు చేస్తున్న తప్పుడు వాదన ఇది. కుల వ్యవస్ధ ఉన్న కారణంగా ప్రతి వారూ పుట్టుకతో ఏదో ఒక కులానికి చెందుతున్నారు. అనేక మంది ఐఎఎస్‌, ఐపిఎస్‌లు ఉన్నారు ? మరి జెపి ఒక్కరే లోక్‌సత్తా ఎందుకు పెట్టారు ? ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు ? ప్రజల సొమ్ముతో వైద్య విద్యను చదివి ప్రాక్టీస్‌ చేయకపోవటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, జనానికి అవసరమైన మరొక వైద్యుడు తయారు కాకుండా అడ్డుకోవటమే. అలాంటి వారిలో జెపి ఒకరు ఎందుకు అయ్యారు ? పోనీ ఐఎఎస్‌ అధికారిగా అయినా కొనసాగి జనానికి మేలు చేయలేదు.
ఎస్‌ పంజాబ్‌ రైతులు ఉద్యమంలో ముందున్నారు. సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలోని అన్ని ప్రాంతాలూ ఒకేసారి ముందుకు ఎందుకు రాలేదో జెపి వంటి వారు చెప్పాలి. హరిత విప్లవంలో పంజాబ్‌ రైతులు ముందున్నారు. వ్యవసాయ మిగులును సాధించటంలోనూ వారే ముందున్నారు. ఆ మిగులుకు మార్కెటింగ్‌ సమస్యలు వచ్చినపుడు ప్రభావితమయ్యేదీ వారే కనుక, ముందుగా మేలుకున్నారు.
2015-16 గణాంకాల ప్రకారం దేశంలో వంద ఎకరాలలో వంద కిలోల ఆహారధాన్యాలు ఉత్పత్తి అయ్యాయనుకుంటే ఉత్తర ప్రదేశ్‌లోని 15.71 ఎకరాల్లో 16.91 కిలోలు, మధ్య ప్రదేశ్‌లోని 12.7 ఎకరాల్లో 12.08 కిలోలు పంజాబ్‌లోని 5.4 ఎకరాల్లో 11.29 కిలోలు పండుతున్నాయి. మిగిలిన సంవత్సరాలలో కూడా స్వల్ప తేడాలతో ఇదే విధంగా ఉంటాయి. దీనర్దం ఏమిటి పంజాబ్‌లో అమ్ముకోవాల్సిందీ ఎక్కువే. మార్కెట్‌ కమిటీలను, సేకరణ వ్యవస్ధలను పనికిరాకుండా చేసి, కనీస మద్దతు ధరలను నీరుగారిస్తే ఎక్కువగా నష్టపోయేది పంజాబ్‌ రైతులే కనుక వారే ముందుగా మేలుకున్నారు.
2017-18 వివరాల ప్రకారం బియ్యం ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్‌ 13.26శాతంతో దేశంలో అగ్రస్దానంలో ఉంటే 11.85శాతంతో పంజాబ్‌, 11.75శాతంతో ఉత్తర ప్రదేశ్‌ రెండు, మూడు స్దానాల్లో ఉన్నాయి. ఇక బియ్యం వినియోగంలో నెలకు తలసరి వినియోగం పంజాబ్‌లో బియ్యం 0.4కిలోలు ఉంటే 14.5కిలోలతో ఒడిషా ప్రధమ స్దానంలో ఉంది. అందువలన రెండు రాష్ట్రాల రైతులకూ మార్కెటింగ్‌ సమస్యలు ఒకే విధంగా ఉంటాయా ? ఎంత పండినా వినియోగించే స్దితిలో ఒడిషా రైతు, అమ్ముకోవాల్సిన అవసరంతో పంజాబ్‌ రైతు ఉంటాడు. అందుకే ఆందోళనలో ముందుంటాడు. ఇలాంటి తేడాలే ఉంటాయి.


10.ఆందోళన చేస్తున్నది రైతులు కాదా ?
మరి ఎవరు ? సామాజిక మాధ్యమంలో మరుగుజ్జులు పంజాబ్‌ గురించి అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకదానిలో చెప్పినదాని ప్రకారం పంజాబ్‌లో వ్యవసాయం చేసే గ్రామాలు కేవలం 1,500 మాత్రమేనట. అక్కడ 30వేల మంది అడితియాస్‌(కమిషన్‌ ఏజంట్లు), వారి వద్ద పని చేసే మూడులక్షల మంది సహాయకులు కలిపి ప్రతి గ్రామానికి 220 మంది చొప్పున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారట. చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2001లో 12,729 గ్రామాలున్నాయి. తరువాత ఏవైనా కొన్నింటితో మున్సిపాలిటీలు ఏర్పాటు అయి ఉండవచ్చు. పన్నెండు వేలకు తగ్గవు.పంజాబ్‌ను వ్యవసాయ రాష్ట్రంగా చెబుతుంటే 1500 గ్రామాలతో అంత ఉత్పత్తి సాధ్యమా ? దీన్ని ప్రచారం చేస్తున్న వారు కాస్త బుర్రపెట్టి ఆలోచించాలి. ఇలాంటి లెక్కలతోనే అడితియాసే రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నట్లు బిజెపి, దాని తొత్తులు ప్రచారం చేస్తున్నారు.


11. ఇతర రాష్ట్రాలతో పోల్చటం తప్పంటారా ?
ఈ ప్రశ్నకు పంజాబ్‌ రైతుల గురించి చెప్పినదానిలోనే కొంత సమాధానం ఉంది. మార్కెట్‌ యార్డుల వెలుపల అమ్ముకొనే స్వేచ్చ ఇస్తే రైతులకు లాభం అని చెప్పేవారి దగ్గర ఆధారం లేదు. ఒక భ్రమ మాత్రమే. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం 2006లోనే వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను రద్దు చేసింది. ధాన్య సేకరణ బాధ్యతను సహకార సంస్దలకు, వ్యాపారమండళ్లకు అప్పగించింది. గత ఏడాది 30లక్షల టన్నులు సేకరణ లక్ష్యంగా చెప్పారు, 20లక్షల టన్నులకు దాట లేదు. గతేడాది క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ.1,815 ఉంటే బహిరంగ మార్కెట్లో సీజన్లో రూ.1,350కి అమ్ముకున్నారు( మే 8, 2019 డౌన్‌టు ఎర్త్‌). ఏటా బీహార్‌లో 1.6 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని అంచనా. దీనిలో 30లక్షల టన్నుల సేకరణ లక్ష్యం. ఈ ఏడాది నవంబరు 15 నుంచి డిసెంబరు ఐదువరకు కొన్నది కేవలం 793 టన్నులు మాత్రమే. కనీస మద్దతు ధర రూ.1,868 కాగా రైతులు రూ.800-1200 మధ్య అమ్ముకుంటున్నారు(డిసెంబరు ఆరు, 2020 ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌). అందుకే బీహార్‌ పరిస్ధితితో పోల్చుకొని పంజాబ్‌ రైతులు ముందే మేలుకున్నారు. పంజాబీలను చూసి బీహారీలు కూడా వీధుల్లోకి రావచ్చు.అందువలన అందరూ ఉద్యమంలోకి ఎందుకు రావటం లేదని కాదు వచ్చిన వారి డిమాండ్లలో న్యాయం ఎంత అన్నది ముఖ్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అకాలీ మంత్రి రాం రాం, 25న భారత బంద్‌ – బిజెపి భజన పార్టీల్లో భయం భయం !

19 Saturday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Farmers agitations, SAD minister quits modi cabinet, September 25th Bharat Bandh


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు మరి. గతంలో ఇందిరా గాంధీ మీద కూడా జనం ఈగవాలనిచ్చే వారు కాదు. ఈనెల 25న భారత బంద్‌కు పిలుపు ఇవ్వటం ద్వారా రైతు సంఘాలు మట్టి పిసుక్కునే రైతును మోడీ గురించి ఆలోచింప చేస్తున్నాయి. అకాలీ దళ్‌ మంత్రి హరసిమ్రత్‌ కౌర్‌ నరేంద్రమోడీ కొలువు నుంచి తప్పుకుంటూ చేసిన రాజీనామా మోడీ మీద మరులుకొన్న వారిని ఒక్క కుదుపు కుదిపింది. దీనర్ధం ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని కాదు. సంస్కరణలు, రైతాంగాన్ని ఆదుకొనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తెస్తున్న ముప్పు గురించి గ్రామీణ భారతంలో తీవ్ర మధనానికి ఈ పరిణామం తోడ్పడుతుంది. ఈ రోజు కావాల్సింది అదే. పొలాలు పదునెక్కితేనే పంటలకు అదును, సాగు సాధ్యం. రైతాంగ బుర్రలకు అదే వర్తిస్తుంది. తమ పంటలకు మిత్ర పురుగులేవో శత్రుకీటకాలేవో తెలుసుకోగలిగిన రైతాంగం తమకు మేలు-కీడు చేసే వారిని, విధానాలను గుర్తించలేరా ?
పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైతాంగం కరోనాను కూడా లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాన్ని లెక్కచేయకుండా నాకెదురేముంది అన్నట్లు పార్లమెంట్‌లో నరేంద్రమోడీ రైతాంగానికి నష్టం-కార్పొరేట్లకు ఇష్టమైన వ్యవసాయ సంబంధిత బిల్లులను ఆమోదింపచేసుకున్నారు. మేమూ సంగతేమిటో తేల్చుకుంటామని రైతులు చెబుతున్నారు. రైతువ్యతిరేకమైన చర్యలను తాము ఆమోదించలేమని చెబుతూ పంజాబ్‌ శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడి) పార్టీకి చెందిన మంత్రి హరసిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం నాడు రాజీనామా చేయటం, దాన్ని శుక్రవారం నాడు రాష్ట్రపతి ఆమోదించటం వెంటవెంటనే జరిగిపోయాయి. రాజ్యసభలో ముగ్గురు, లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్న ఈ పార్టీ మంత్రి వర్గం నుంచి తప్పుకుంది తప్ప ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినట్లు ఇది రాస్తున్న సమయానికి ప్రకటించలేదు. తాము పదవి వీడినా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తూనే రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని అకాలీదళ్‌ నేత, లోక్‌సభ ఎంపీ అయిన సుఖవీందర్‌ సింగ్‌ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడే సుఖవీర్‌, ఆయన భార్యే హరసిమ్రాత్‌ కౌర్‌. స్ధానిక వత్తిళ్ల కారణంగానే ఆమె రాజీనామా చేశారు తప్ప తమ రైతాంగ విధానాలు కాదని బిజెపి ప్రకటించి సమస్య తీవ్రతను మభ్యపెట్టేందుకు, ఆందోళన చేస్తున్న రైతాంగాన్ని అవమానించేందుకు ప్రయత్నించింది. ఈ పూర్వరంగంలో ఆ పార్టీని తమ కూటమిలో ఉంచుకొని బిజెపి బావుకొనేదేమీ ఉండదు, అలాగే కొనసాగి అవమానాల పాలుకావటం తప్ప అకాలీదళ్‌ పొందే లబ్ది ఏమీ ఉండదు. ఈ నెల 25న భారత బంద్‌కు రైతు సంఘాలు పిలుపు నిచ్చినందున ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ దాని పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయన్నది యావత్‌ ప్రజానీకం కన్పార్పకుండా చూడనుంది.
అకాలీ మంత్రి రాజీనామాకు ముందు జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా, చిత్తశుద్ధిని ప్రశ్నించేవిగా ఉన్నాయి. అకాలీదళ్‌ అగ్రనేత అయిన 92 ఏండ్ల ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ నివాసం ముందు రైతులు నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను అంతకు ముందు కేంద్రం ఆర్డినెన్స్‌ల ద్వారా తెచ్చింది. అవి రైతులకు మేలు చేకూర్చేవి అంటూ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ సెప్టెంబరు మూడవ తేదీన ఒక వీడియో ద్వారా పంజాబ్‌ పౌరులకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అవి రైతులకు హాని చేస్తాయంటూ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాదల్‌ ప్రకటనకు నిరసగా మూడు రోజులు వరుసగా రైతులు ఆయన నివాసం ఎదుట నిరసన తెలిపారు.ఈ నేపధ్యంలో తాము కేంద్రం నుంచి రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదని దళ్‌ రైతు విభాగనేత సికిందర్‌ సింగ్‌ మల్కా ప్రకటించారు. బిల్లులను వ్యతిరేకించాలని దళ్‌ విప్‌ జారీ చేసింది. చర్చలో బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సభ్యులు ప్రసంగించారు. గురువారం నాడు మంత్రి రాజీనామా ప్రకటన వెలువడింది. తాను ఒక రైతుబిడ్డ, సోదరిగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.
అంతర్గతంగా అకాలీ దళ్‌ నాయకత్వం ఏ విధంగా భావించినప్పటికీ రైతాంగంలో తలెత్తిన భయాందోళనలను రాజకీయంగా తమను మరింతగా దూరం చేస్తాయని భయపడిందన్నది స్పష్టం. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మార్కెట్‌ యార్డులకు వెలుపల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ప్రభుత్వ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఇది తమకు నష్టదాయకమని రైతులు భావిస్తున్నారు. వ్యాపారులు దేశంలో ఎక్కడైనా ఎలక్ట్రానిక్‌ పద్దతుల్లో పంటలను కొనుగోలు చేయవచ్చు.రైతులు అమ్కుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత మార్కెట్ల వెలుపల జరిగి క్రయ, విక్రయాలపై మార్కెట్‌ ఫీజు, లెవీ, సెస్‌ల వంటివి విధించేవి.కార్పొరేట్లకు అనుకూలంగా తాజా బిల్లుతో వాటిని రద్దు చేశారు.
నిత్యావసరకుల చట్టానికి చేసిన సవరణల ప్రకారం కొన్ని ఉత్పత్తులను నిత్యావసర లేదా అత్యవసర వస్తువులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. వాటి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్దీకరించటం లేదా నిషేధించవచ్చు. యుద్దం, కరవు, అసాధారణంగా ధరల పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే కొన్ని ఆహార వస్తువులు, ఉత్పత్తుల సరఫరాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ధరలు గణనీయంగా పెరిగినపుడు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమాణాలపై ఆంక్షలను ప్రకటించాల్సి ఉంది.తోటల ఉత్పత్తుల ధరలు వందశాతం, ఆహార వస్తువు ధరలు 50శాతం పెరిగినపుడు వ్యాపారుల నిల్వలపై పరిమితులు విధిస్తారు. ధరల పెరుగుదలను నిర్ధారించేందుకు గడచిన పన్నెండునెలల్లో ఉన్న ధరలు లేదా గడచిన ఐదు సంవత్సరాలలో ఉన్న ధరల సగటు తీసుకొని ఏది తక్కువైతే దాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఉదాహరణకు ఉల్లిధర ఒక నెలలో కిలో 15 నుంచి 40 రూపాయలకు పెరిగిందనుకుందాం. అప్పుడు ఆంక్షలు విధించాలంటే పన్నెండు నెలల సగటు చూసినపుడు 30, ఐదేండ్ల సగటు లెక్కించినపుడు 40 రూపాయలు ఉంటే 30 రూపాయల మీద వందశాతం అంటే 60 రూపాయలకు పెరిగినపుడు, ఇదే విధంగా ఆహార వస్తువుల ధరల పెరుగుదల కూడా అలాగే ఉంటే 30 రూపాయల మీద యాభైశాతం అంటే 45 రూపాయలకు పెరిగినపుడు మాత్రమే వ్యాపారుల నిల్వల మీద ఆంక్షలు విధిస్తారు. లేనట్లయితే అపరిమితంగా నిల్వలు చేసుకోవచ్చు. వినియోగదారుల జేబులు కొల్లగొట్టవచ్చు.
రైతుల సాధికార మరియు రక్షిత బిల్లు పేరుతో తెచ్చిన దానిలో రైతులు మరియు వ్యాపారుల మధ్య ఒప్పందం( కాంట్రాక్టు ) కుదుర్చుకోవచ్చు. దాని ప్రకారం అంగీకరించిన మేరకు రైతులకు వ్యాపారులు ధరలు చెల్లించాలి, వ్యాపారులకు రైతులు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి. ఇక్కడే మతలబు ఉంది. నాణ్యతను నిర్ణయించేది వ్యాపారులుగానే ఉంటున్నారు తప్ప రైతుల చేతుల్లో ఏమీ ఉండదు. ఆ పేరుతో ధరల్లో కోత విధిస్తే చేసేదేమీ ఉండదు. ఇప్పుడు మార్కెట్‌ యార్డుల్లోనే నాణ్యత లేదనే పేరుతో వ్యాపారులు ధరలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే. రేపు కాంట్రాక్టు వ్యవసాయంలో వ్యాపారులు అదే పని చేస్తే రైతులకు చెప్పుకొనే దిక్కు కూడా ఉండదు.
ఈ బిల్లులు చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే భవిష్యత్‌ సాగు అవసరాలకు అనువుగా ఉంటాయని వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ” బిల్లులు చట్టాలైన తరువాత పోటీ పెరుగుతుంది మరియు ప్రయివేటు పెట్టుబడులు గ్రామాలకు చేరతాయి. వ్యవసాయ ప్రాధమిక సదుపాయాలు సమకూరుతాయి, నూతన వ్యవసాయ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తాయి. ఈ సంస్కరణల ద్వారా తమ వ్యవసాయం లాభసాటిగా మారేందుకు రైతులు బడా వ్యాపారులు, ఎగుమతిదార్లతో సంబంధాలను నెలకొల్పుకోవచ్చు, ఆదాయాన్ని పెంచుకోవచ్చు ” అని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ చెప్పారు. ఇవన్నీ రైతాంగాన్ని మభ్యపెట్టేవే తప్ప మరొకటి కాదు.
పంజాబ్‌ రాజకీయాలను చూసినపుడు బిజెపి, నరేంద్రమోడీ పలుకుబడి అక్కడ పని చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచింది, అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. ఒక నాడు తిరుగులేని ప్రాంతీయ పార్టీగా ఉన్న అకాలీదళ్‌ నేడు ఒక చిన్న శక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో మూడో స్ధానానికి పడిపోయింది. రైతులు ముఖ్యంగా సిక్కు జాట్ల పార్టీగా ఉన్నది కాస్తా రైతుల్లో తన పట్టును కోల్పోయింది. కేంద్రం పైన చెప్పిన వ్యవసాయ ఆర్డినెన్స్‌లు జారీ చేసిన తరువాత గత మూడు నెలలుగా వాటిని సమర్ధించేందుకు అకాలీదళ్‌ నానా పాట్లు పడింది. దేశంలో కరోనా వైరస్‌ నిరోధంలో వైఫల్యం, ఆర్ధిక రంగంలో రికార్డు స్ధాయిలో దిగజారుడు, ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ ఆందోళనలు చూసిన తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరువు నిలవాలంటే వాటిని వ్యతిరేకించటం తప్ప మరొక మార్గం లేదనే అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది. లాభసాటిగా ఉంటుంది అనుకుంటే ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పంజాబ్‌ రైతులు వీధుల్లోకి రావటానికి కారణాలు ఏమిటన్నది అసక్తి కరం. ఒప్పంద వ్యవసాయం అన్నది గత అకాలీ-బిజెపి ప్రభుత్వ హయాంలో 2013లోనే ప్రవేశపెట్టారు తప్ప దాని అమలు గురించి రైతాంగాన్ని వత్తిడి చేయలేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులు చూసిన తరువాత ఒప్పంద వ్యవసాయాన్ని బలవంతంగా చేయిస్తారనే భయం రైతాంగంలో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ ఆగస్టు 28న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. గత రెండు వారాలుగా వివిధ రైతు సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి.వాటిని ఖాతరు చేయకుండా కేంద్రం ఆర్డినెన్స్‌ల స్ధానంలో బిల్లులను ప్రతిపాదించి పార్లమెంట్‌లో ఆమోదింపచేయించుకుంది.లోక్‌సభలో ఆమోదం పొందిన తరువాత అకాలీ మంత్రి రాజీనామా చేశారు. తాము కూడా బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేస్తామని ఆమ్‌ ఆద్మీ ప్రకటించటంతో అకాలీల మీద వత్తిడి పెరిగింది.రాజీనామాతో తాము రైతుల కోసం పదవులను త్యాగం చేశామని చెప్పుకొనేందుకు అకాలీలు వెంటనే పావులు కదిపినట్లుగా భావిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్ధానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 77, ఆమ్‌ఆద్మీకి 20, అకాలీ- బిజెపి కూటమికి 18 మాత్రమే వచ్చాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో 13 స్ధానాలకు గాను అకాలీ, బిజెపి రెండేసి సీట్లు మాత్రమే గెలిచాయి. అకాలీ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బిజెపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సగం సీట్లు కావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. బాదల్‌ కుటుంబం కారణంగానే తాము కూడా ఓటమి పాలైనట్లు భావిస్తోంది. అందువలన కూడా రాజీనామా అస్త్రం ప్రయోగించారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి అకాలీ మంత్రి రాజీనామా ఎన్‌డిఏలోని ఇతర చిన్న పార్టీలకు, విడిగా ఉంటూ బిజెపికి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలకు నిస్సందేహంగా ఒక కుదుపు వంటిదే. భారత బందుకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న పరీక్ష ఆ పార్టీల ముందుకు రానుంది. ఆర్ధిక వ్యవస్ధ, ఉపాధి గురించి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. మరోవైపు నరేంద్రమోడీ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. జిఎస్‌టి నష్టపరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకొనేందుకు దేవుడి మీద నెట్టిన తీరు తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇలాగే ఎంతకైనా తెగించే అవకాశాలున్నట్లు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు మంగళం పాడే విద్యుత్‌ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణా అసెంబ్లీ తీర్మానం చేయటం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న భయాలను వెల్లడిస్తోంది. కానీ అదే పార్టీ వ్యవసాయ సంస్కరణల గురించి ఎలాంటి తీర్మానం చేయలేదు. తీవ్రమైన అవినీతి కేసుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి సర్కార్‌ ఏ వైఖరి తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో అనే గుంజాటనలో ఉంది. జిఎస్‌టి బకాయిలపై దేవుడి లీల అన్న కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో కలిసేందుకు ముందుకు రాలేదు. మరోవైపున విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం విధించిన షరతులను అమలు చేసేందుకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. 2004 ఎన్నికల్లో బిజెపితో కలసి భంగపడిన తెలుగుదేశం2014లో లబ్ది పొందింది. వైసిపి దాడులు, కేసులను ఎదుర్కొనేందుకు బిజెపితో సఖ్యతకు ప్రయత్నించినా తాజా విద్యుత్‌, వ్యవసాయ సంస్కరణల పర్యవసానాల గురించి పునరాలోచనలో పడటం ఖాయం. ఇదే విధంగా తమిళనాడులోని అన్నాడిఎంకె, ఇతర రాష్ట్రాల్లోని బిజెపి భజన పార్టీలు కూడా ఆర్ధిక రంగంలో నరేంద్రమోడీ అనుసరించే విధానాలు, ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనే తీరు, వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణలు వాటి పర్యవసానాలు, అకాలీ పార్టీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏ గట్టునుండాలో తేల్చుకొనేందుకు పరిణామాలు తొందర పెడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎందుకు రైతులు ఆందోళనకు దిగుతున్నారు ?

18 Sunday Jun 2017

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

BJP, bjp cow politics, Farm prices, Farmers, Farmers agitations, indian farmers

ఎం కోటేశ్వరరావు

ఎందుకిలా జరుగుతోంది ? రాబోయే (ముందస్తు లేదా నిర్ణీత గడువు ప్రకారం జరిగే) ఎన్నికలలో కూడా తమదే అధికారం అని కలల పడవలో ప్రశాంత అలల మధ్య తేలి పోతున్న బిజెపి నేతలకు అనుకోని రీతిలో రైతుల ఆందోళనలనే కుదుపులు ఎందుకు తగులున్నాయి? అవీ మూడేండ్ల సంబరాల సమయంలో అని ప్రతిపక్షాల కంటే బిజెపి అభిమానులు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం వుంది.

జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలు నిలదీసి ఎందుకు అని ప్రశ్నించకుండా మనకెందుకులే అని తప్పుకోవటాన్నే మన పురాతన నాగరికత, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర నేర్పాయా ? మన వివేచనను నీరుగార్చాయా అన్న అనుమానం కలుగుతోంది. తమ ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా సమృద్ధిగా పంటలు పండాయని మూడు సంవత్సరాల విజయ గాధలలో మోడీ సర్కార్‌ పేర్కొన్నది. వ్యవసాయం వుమ్మడి జాబితాలో వుంది. ప్రధానంగా రాష్ట్రాల అంశం, అయినప్పటికీ ఘనత తనదే అని మోడీ చెప్పుకున్నారు. మరి అలాంటి ఘనత సాధించిన వారి హయాంలో రైతులు రోడ్లెక్కటం ఏమిటి? దానికి ఎవరు బాధ్యత వహించాలి. ఆకాశాన్ని అంటిన పప్పుల ధరలు తగ్గగానే సామాజిక మాధ్యమాలలోని మోడీ భక్తులు ఆ ఘనత తమ నేతదే అని ప్రచారం చేశారు. ఆ తగ్గుదలకు మూల్యం చెల్లించింది ఎవరు ? ధరలు పతనమై నష్టాలు వచ్చాయని ఒక్క వ్యాపారీ దివాళా ప్రకటించలేదు, ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు లేవు.ఆ దుర్గతి రైతులకే ఎందుకు పట్టింది. పప్పు ధాన్యాల ధర తమకు గిట్టుబాటు కాని రీతిలో పతనమైందనే కదా మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ రైతులు ఆందోళనకు దిగింది. పప్పుల ధరలు పెరగగానే వాటిని తగ్గించే పేరుతో బిజెపికి అన్ని విధాలుగా సాయపడిన పారిశ్రామిక, వాణిజ్యవేత్త అదానీ కంపెనీలకు పప్పుల దిగుమతికి, వాటిని అధిక ధరలకు అమ్ముకొని విపరీత లాభాలు సంపాదించేందుకు అవకాశం కల్పించింది ఎవరు ? రైతులకు గిట్టుబాటు కాని రీతిలో ధరలు పతనమైతే మోడీ సర్కార్‌ లేదా బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆదుకోలేదు ? ఎవరు ఆదుకోవాలి? తాజా రైతు ఆందోళన ఏమి తెలియ చేస్తున్నది? అతివృష్టి, అనావృష్టికి బలయ్యేది రైతులే, అలాగే పంటలు బాగా పండినా, పండకపోయినా ప్రభావితులవుతున్నదీ రైతులే. ఏది జరిగినా నష్టాలే వస్తున్నాయి.

ఖమ్మంలో పతనమైన ధర గురించి ఆందోళన చేసిన మిర్చి రైతులు సంఘవ్యతిరేశక్తులని మంత్రులు, వారి వంది మాగధులు ప్రకటించారు. తీరా సామాన్య రైతులకు బేడీలు వేసి వీధులలో తిప్పి జైలుకు పంపారు. మధ్య ప్రదేశ్‌ పాలకులు మరొక అడుగు ముందుకు వేసి రైతులు పోలీసులు కాల్పులలో మరణించలేదన్నారు, వారసలు రైతులే కాదు పొమ్మన్నారు, మరణించిన వారిలో గంజాయి స్మగ్లింగ్‌ కేసులున్న నేరగాళ్లున్నారని ప్రచారం చేశారు. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి తరువాత మరణించిన ప్రతి రైతు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? రైతులను కాల్చి చంపించటమే గాక ఎదురుదాడి వ్యూహంలో భాగంగా రైతులు హింసాకాండకు స్వస్ధి చెప్పాలని ఒక బిజెపి ముఖ్య మంత్రి స్వయంగా నిరాహార దీక్ష చేస్తారని పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పారో లేదో తెలియదు గానీ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆపని చేశారు. అంతకంటే విచిత్రం, విపరీతం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు విభాగం భారతీయ కిసాన్‌ సంఘ్‌ తాము కూడా రైతు సమస్యలపై ఆందోళన జరపనున్నట్లు ప్రకటించింది. అంతరించిపోగా అవశేషాలు మిగిలినట్లు ఇంకా బుర్రలు మిగిలిన వారికి ఎందుకిలా జరుగుతోంది ? అనే ప్రశ్న ఎదురవుతోంది.

2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది బిజెపి. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ కిసాన్‌ సంఘ్‌ వుపాధ్యక్షుడు ప్రభాకర్‌ కేల్కర్‌ ఫస్ట్‌ పోస్ట్‌ అనే వెబ్‌ పత్రికతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను అమలు జరపని కారణంగా రైతులలో ఆగ్రహం పేరుకుపోయినందున ఆందోళన అనివార్యమని అయితే హింసా పద్దతులకు తాము వ్యతిరేకమని చెప్పుకున్నారు. రైతులు కనీస మద్దతు ధరలను పొందటం లేదని, తదుపరి సాగునిమిత్తం పెట్టుబడుల కోసం తమ వుత్పత్తులను తెగనమ్ముకోవటం వంటి పరిణామాలు రైతుల ఆందోళనకు కారణాలని ఆ పెద్దమనిషి చెప్పాడు. అయినా బిజెపి సర్కార్‌ వాటిని పట్టించుకోలేదు. తొలుత రైతుల ఆందోళనలో భాగమైన ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు సంఘం మధ్యలో చర్చల పేరుతో శకుని పాత్ర పోషించి వైదొలిగింది. వాస్తవాలు ఇలా వుంటే కాంగ్రెస్‌ను భూస్తాపితం చేశామని, వామపక్షాలు వునికి కోల్పోయాయని ఒకవైపు ఇప్పటికే ప్రకటించేసి, అదే నోటితో రైతుల ఆందోళనల వెను వారున్నారని బిజెపినేతలు ఆరోపించారు. అవి నోళ్లా లేక మరేవైనానా ?

వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోయాయి. అవి సబ్సిడీలు కావచ్చు, మరొక సేవ రూపంలోని కావచ్చు. అదే సమయంలో నియంత్రణలు ఎత్తివేసిన కారణంగా ఎరువుల ధరలు పెరుగుతున్నాయి. రెండో వైపు మార్కెట్‌ను ప్రయివేటు వ్యాపారులు అదుపు చేస్తున్న కారణంగా రైతాంగానికి ఒక స్ధిరమైన ఆదాయాలు వుండటం లేదు. పంటలు దెబ్బతినటంతో పాటు విద్య, వైద్యం వలన కూడా అన్ని తరగతుల వారితో పాటు రైతాంగం అదనంగా అప్పులపాలవుతున్నారు.ఈ ఏడాది రైతులకు పత్తి ధరలు గతేడాది కంటే కాస్త మెరుగ్గా వున్నాయి.దాంతో నూలు, వస్త్ర మిల్లు యజమానుల లాభాలకు ఎక్కడ దెబ్బతగులుతుందో అని భయపడిన నరేంద్రమోడీ సర్కార్‌ గత కాంగ్రెస్‌ పాలకులను పక్కకు తోసి పత్తి దిగుమతులలో సరికొత్త రికార్డును సాధించింది. గత మూడు సంవత్సరాలలో(2013-14 నుంచి 2016-17) మన దేశం నుంచి జరిగిన పత్తి ఎగుమతులు 363.75 నుంచి 162.71 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఇదే సమయంలో దిగుమతులు 39.44 నుంచి 94.66 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఒక్క పత్తి విషయంలోనే కాదు ఇదే కాలంలో మొత్తం మన వ్యవసాయ, అనుబంధ వుత్పత్తుల ఎగుమతులు 4236.26 నుంచి 3382.14 కోట్ల డాలర్లకు పడిపోగా దిగుమతులు 1552.89 నుంచి 2563.64 కోట్ల డాలర్లకు పెరిగాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో రైతుల వుద్యమం తలెత్తిన ప్రాంతాలు పప్పుధాన్యాల సాగుకు ప్రసిద్ది. ఈ మూడు సంవత్సరాలలో వాటి దిగుమతి 182.81 నుంచి 424.42 కోట్ల డాలర్లకు పెరిగాయి. అంటే ప్రభుత్వ దిగుమతి విధానాలు ఈ రెండు రాష్ట్రాల పప్పుధాన్యాల రైతుల నడ్డి విరిచాయి. అందుకే గత ఎన్నికలలో బిజెపికి పూర్తి మద్దతు ఇచ్చిన రైతాంగం నేడు విధిలేక రోడ్డెక్క వలసి వచ్చింది. ఇదంతా వ్యవసాయ రంగంలో ఘనవిజయాలు సాధించామని, వుత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయంటూ కేంద్ర ప్రభుత్వ విజయగానాలు చేస్తున్న సమయంలోనే జరిగింది. ఇటువంటి విధానాలతో బిజెపి 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు మాటేమోగాని రుణభారం, ఆత్మహత్యలను రెట్టింపు చేసేదిగా కనిపిస్తోంది.

వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మొత్తం వుత్పత్తి ఖర్చుపై 50శాతం అదనంగా ఆదాయం వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రఖ్యాత వ్యవసాయశాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ 2008లోనే రైతులపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌ నివేదికలో చెప్పారు. దానికి అనుగుణంగా కనీస మద్దతు ధరల ప్రకటన లేకపోగా ఈ ఏడాది ప్రకటించిన ధరలకంటే పతనమైనా ప్రభుత్వాలు ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోలేదు. తాజా రైతుల ఆందోళన వెనుక పెద్ద నోట్ల రద్దు ప్రభావం కూడా వుందని, దాని గురించి సరైన అధ్యయనం లేదని స్వామినాధన్‌ క్వింట్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా చెప్పారు. ఇప్పుడు ఏర్పడిన పరిస్ధితుల కారణంగా రైతుల రుణాలను ప్రస్తుతానికి రద్దు చేసినప్పటికీ వ్యవసాయం గిట్టుబాటు కావటానికి దాన్నొక పద్దతిగా మార్చరాదని, రైతుల ఆదాయాలను స్ధిరపరచటానికి పద్దతులను రూపొందించాలని, రుణాల రద్దు వలన పేదల కంటే ధనిక రైతులే ఎక్కువ లబ్దిపొందుతున్నారని ఆయన చెప్పారు. సామాజిక రక్షణలు లేని కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వ్యవసాయం జీవితాన్ని ఇవ్వాలే తప్ప ప్రాణాలు తీసేదిగా వుండకూడదని ప్రస్తుతం లండన్‌లో వున్న 92 సంవత్సరాల స్వామినాధన్‌ చెప్పారు.

ఆవును వధిస్తే జీవితకాల జైలు లేదా మరణశిక్ష విధించాలన్నట్లుగా తమ పాలిత రాష్ట్రాల శాసనసభలన్నీ (ఒక పధకం ప్రకారం) తీర్మానాలు చేస్తున్నాయి తప్ప ఆ ఆవులను సాకే రైతుల గురించి ఎందుకు ఆలోచించటం లేదని బిజెపి వారు తమ తలలు తామే పట్టుకోవటం అవసరం. మాంసం కోసం ఆవులను వధిస్తున్నారంటూ జై భజరంగ ‘బలీ’ అని(ముస్లింలపై) దాడులకు తెగబడుతున్న హిందూత్వ ‘కారుణ్యమూర్తులు’ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, వారిపై కాల్పులు జరుగుతుంటే ఒక్క వీధిలో కూడా వారి జాడలేదేం? నిజానికి ఈ ప్రశ్నలు అటు బిజెపి అనుకూలురు లేదా వ్యతిరేకులే కాదు మేం ఎటు న్యాయం వుంటే అటు వుంటాం అనే తటస్ధులు కూడా తీవ్రంగా ఆలోచించాల్సినవి కాదా. వాటి గురించి తమలో తాము తర్కించుకొనేందుకు, ఎవరినైనా ప్రశ్నించేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d